మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

అదృశ్యం

by Dr. Varigonda Satya Surekha July 30, 2023
written by Dr. Varigonda Satya Surekha

పడక్కుర్చీలో దీర్ఘాలోచనలో మునిగిఉన్న నరసింహమూర్తికి భార్య అడుగులు చేతిలో మజ్జిగ గ్లాసుని, గడియారంలో తొమ్మిది గంటలని గుర్తు చేశాయి. ఇరవై ఏళ్ళుగా ఏ ఒక్క రోజు తప్పని దినచర్య. నర్సింహమూర్తి, తన నలభైవ ఏట నుండి రెండోపూట భోజనం మానేశారు. సాయం వేళల్లో ఏదైనా అల్పాహారం. రాత్రిపూట సరిగ్గా తొమ్మిదింటింకి గ్లాసుడు మజ్జిగ. ఇంట్లో ఉన్నంతసేపు గడియారం చూసుకునే అవసరం నర్సింహమూర్తికి ఏనాడు కలగలేదు.

సాయంత్రం ఐదున్నరకి ఇంటికి రాగానే బట్టలు మార్చుకుని ముందు గదిలో పడక్కుర్చీలో కూర్చుంటారు. అలా కూర్చున్న మూడు నిమిషాలలో చేతిలో పొగలుగక్కే కాఫీని పెడతారు జానకమ్మ. ఏడు గంటలకు స్నానం. ఏడున్నర కి అల్పాహారం తొమ్మిదింటికి గ్లాసుడు మజ్జిగ తాగి సరిగ్గా రాత్రి పది గంటలకి తమ పూర్వీకుల నుండి సంక్రమించిన పట్టె మంచంపై నడుం వాలుస్తారు. తిరిగి ఉదయం ఐదు గంటలకి నిద్ర లేస్తారు. కాఫీ, తర్వాత ఎనిమిది గంటలకి ఉపాహారం. తొమ్మిదింటికి క్యారెజ్ తీసుకొని బడికి బయలుదేరడం. తనకి అవసరాలు తీర్చబడడమే తప్ప ఏ రోజూ ఎలా తీరుతున్నాయి అన్న ఆలోచనే రాలేదు.

ఇవాళ ఉదయం తన మిత్రుడు సహాధ్యాయి సుధాకరం సహచరిని కోల్పోయిన వార్త విన్నప్పటి నుండి మజ్జిగగ్లాసు అందుకునే పడక్కుర్చీ ఖాళీ అయినా,మజ్జిగ అందించే మట్టి గాజులు నిష్క్రమించినా ఆవరించే శూన్యాన్ని అధిగమించి జీవితాన్ని కొత్తగా ఆరంభించటం సాధ్యమా అన్న ఆలోచన తనని ఉదయం నుండి ఆందోళనకి, ఆవేదనకి గురి చేస్తోంది.

“ఏవిటండీ! ఇంకా ఉదయం విచారంలోంచి బయటపడలేదా?” గ్లాసు చేతికందిస్తూ అడిగింది జానకమ్మ. సమాధానానికై ఎదురు చూడకుండా . “ఏవిటండీ! పంపిన దేవుడు తిరిగి పిలిస్తే పోకుండా ఉంటామా!? ముందు వెనక అంతే. పోయిన వారు ధన్యులు. ఉన్నవారు భగవంతుడి ఆరాధనలో కాలం గడుపుతూ ఆయన ఆజ్ఞ కోసం వేచిచూడాలి. జంట జీవితం ఒంటరిదైతే భగవంతుడి తోడు కోరాలే కాని ఈ వయసులో అలవాట్లు అవసరాలు ఎలా అనికాదు. అనవసరంగా ఆరోగ్యంపాడు చేసుకోక నేను ఇచ్చినన్నాళ్ళు మజ్జిగ తాగండి. ఇవ్వలేని రోజున మీరే కలుపుకుతాగడం అలవాటు చేసుకోండి.” అని చిరునవ్వుతో వెడుతున్న ఆవిడని “మరి తాగేవారు లేకపోతే…” అని అడగాలి అనుకొని దొరికి దొరకని సమాధానం మనసుని చేరగా మజ్జిగ మరింత రుచిగా అనిపించింది నర్సింహమూర్తికి.

July 30, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

తరంగిణి

by Dr. Gillipalli Brahmam July 30, 2023
written by Dr. Gillipalli Brahmam


అలా…..అలా..
అలరించే అలలతో
పాడుతూ సాగిపోతావు

చల్లని నీమనసు
సుతిమెత్తని నీ హృదయం
నీ ఒడి చేరినపుడే నాకర్థమైంది౹

గర్భంలో ఎన్ని విపత్తులు దాచుకుంటావు౹
బాహ్యంలో ఎందరి రసపిపాసకుల హృదయం దోచుకుంటావు౹

కవి కలంలోని సిరలో రసమైంది నీవే కదా౹
నీ రసమైన మాహృదయంలో ఉత్సాహం నింపింది నీ పరుగే కదా౹
నీకు ఒరిగేదేముంది అనుకోవు౹
అడుగడుగునా
పుడమికి పచ్ఛదనాన్నద్దుతావు౹
ఆర్తుల ఆకలి తీర్చడంకోసం
వారి నోటిలో అన్నపు ముద్దౌతావు౹

నీలో అడుగిడగానే
నాకు నేనే పొంగి పోయేటట్లు
నాగరికతను బోధిస్తావు౹
సంస్కృతీ సంప్రదాయాలను కథలు కథలుగా చెప్తావు౹

ఓ తరంగిణి
గమ్యాన్ని మరువని గమనం నీది౹
నన్ను మరువకు
నీతో కలసిన పలుగు రాళ్ళకు మృదుత్వాన్ని అలదినావు
నేనూ రాయినే
రాస్తూనే ఉంటాను
నిను చూస్తూనే ఉంటాను..
నీవు పాడుతూనే ఉండాలి
పుడమిని కాపాడుతూనే ఉండాలి౹

★★★★★★★★★★★

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణ యశోధరులు- ఒక పరిశీలన

by Sunkepally Nagender Sharma July 30, 2023
written by Sunkepally Nagender Sharma

పుస్తక సమీక్ష: తెలంగానా యశోధరులు (వ్యాస సంకలనం),
రచయిత్రి: డా.నమీలకొండ సునీత, కామారెడ్డి, చరవాణి: 9908468171.

పేజీలు:180.

డా. నమిలకొంద సునీత పరిశోధక వ్యాస సంకలనం,
తెలంగాణ యశోధరులు- ఒక పరిశీలన
——+++++———
సమాజ హితాన్ని కోరేది సాహిత్యం. సాహిత్య సృజనకు లోతైన సామాజిక, సాహిత్య, తాత్విక అధ్యయనం మిళితమైతే బంగారానికి పరిమళం అబ్బినట్లుగా ఉంటుంది. మానవ జీవితంలోని వివిధ రంగాలు , సాహిత్యంలోని వైవిధ్య పరిణామాలను, వివిధ ప్రక్రియలను సునిశితంగా పరిశీలించి, తగిన వ్యాఖనాలతో ఎప్పటికప్పుడు రచయితలు వర్తమాన సాహితీ ప్రపంచానికి అందించాలి . నాటినుండీ నేటి వరకూ సమాజంలోని మార్పులను, లోటుపాట్లను ఎత్తి చూపి సంస్కరించడానికి ఎందరో మహానుభావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు, నాటి కాలపు రాజులు, ఈ నాటి ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయ మహిళలు, ప్రజా ప్రతినిధులంతా కృషి చేశారు. చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని వివిధ పార్శ్వాలలో రాణించిన మహామహులెందరో ఉన్నారు. నిస్వార్థ సేవాపరాయణుల జీవితాలను, ప్రతిభా సామర్థ్యాలను తెలుసు కోవడానికి, భావి తరాలకు అందించడానికి సాహిత్యం ఒక ఉపకరణంలా పని చేస్తుంది. అందులో భాగంగా అలాంటి ప్రతిభా సంపన్నుల గొప్ప కృషిని, వారి జీవిత అనుభవాలను, వారి రచనలను విశ్లేషణ చేయడంలో ఆరితేరిన వారిలో డా.నమిలకొండ సునీత గారు ఒకరు. తెలంగాణ సాహిత్య పునర్నిర్మాణాన్ని చేయాల్సిన బాధ్యత డా.సునీత లాంటి వర్తమాన రచయితలపై ఉంది. సమాజము-సాహిత్యము రెండూ పెన వేసుకొని పోయి సమాజాన్ని సంస్కరించడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నది. ఎంతోమంది ప్రాచీన సాహిత్య కారులు వర్తమాన సాహిత్యకారులు, భక్త శిఖామణులు, సమాజ హితం కోసం రచనలు చేస్తూ ఉద్యమాలు సాగిస్తూ తమవంతు పాత్రను పోషించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ వాస్తవ్యురాలైన సాహితీవేత్త డాక్టర్ నమిలకొండ సునీత గారు ఇటీవల పరిశోధించి రాసిన తెలంగాణ యశోధరులు వ్యాస సంకలనం ఇందులకు ప్రతీకగా నిలుస్తుంది. ఇందులో ఎందరో మహానుభావులను, పాలకులుగా రాణించిన మహిళా మణుల ప్రతిభా సామర్థ్యాలను, అవధానులపాండిత్య ప్రకర్షను,పద్యకవుల కవన సౌరభాలను, విద్యావేత్తలు, ఆర్షధర్మ, సాహిత్య సామాజిక రంగాలకు చెందిన వరిష్టుల ప్రత్యేకతలను లోతుగా తవ్వి, పరిశోధించి 15 వ్యాసాలుగా రాశారు. ఈ వ్యాసాలు మేలిమి బంగారంలా తయారవడానికి రచయిత్రి చేసిన నేపథ్య కృషి, లోతైన అధ్యయనం అపారమైనది. శ్రీ విద్యో పాసకులు సద్గురు శివానందనాథ, ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య ఎస్వీ. రామారావు, డా. టి .శ్రీరంగ స్వామి, డా. అయాచితం నటేశ్వర శర్మ లు.ముందు మాటలు రాసి, రచయిత్రిని అభినందించారు.

డా.సునీత ఈ వ్యాసాలకు సాహిత్య, సామాజిక వ్యాసాలుగా పేర్కొని తన కలాన్ని పదునెక్కించారు. రచయిత్రి తొలుతగా 2016లో ప్రభాత కిరణాలు అనే వ్యాస సంపుటితో సాహిత్య వ్యాసాలు వెలుగులోకి తెచ్చారు. నిత్య పరిశోధనలతో తన రచనా వ్యాసంగాలను కొనసాగిస్తూ, పత్రికలకు, ప్రత్యేక సంచికలు రాస్తూ తన సాహితీ ప్రావీణ్యాన్ని చాటు కొంటున్నారు. వీరు తెలుగు. ఎం. ఎ చేసి, ఎంఫిల్, పి. హెచ్. డి పట్టాలను పొందారు. వృత్తి రీత్యా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రభుత్వ తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు.తన సిద్ధాంత అంశమైన వరంగల్ జిల్లా పత్రికలు- సాహితీ సేవ గ్రంథాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ద్వారా పరిశోధించి, సుమారు 300 పేజీలతో అచ్చు వేసి పాఠ కాదరణను పొందారు. రచయిత్రి ఎం. ఫిల్ పరిశోధన గ్రంథం “మూక పంచశతి వ్యాఖ్యానాలు ఒక పరిశీలన” అచ్చులోకి రావాల్సి ఉంది. మూడవ గ్రంథంగా 2022 సంవత్సరంలో తెలంగాణా యశోధరులు పేరిట వ్యాస సంకలనాన్ని అచ్చులోకి తెచ్చారు.

ఇహ వీరి వ్యాసాలు ప్రత్యేకమైన శైలితో, తెలుగుదనంతో అలలారుతాయి. పలు సామెతలు, సంస్కృత శ్లోకాల ఉదాహరణలు, ఉపమాన, ఉపమేయాలు, అలంకారాలు, మాత్రా ఛందస్సు మొదలగు అంశాలతో వ్యాస నడవడిక హృద్యంగా సాగుతుంది. ఈ వ్యాస సంకలనం ప్రచురణకు హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కొంతమేరకు ఆర్థిక సాయాన్ని అందించారు.

ఇక వీరి వ్యాసాలలోకి వెళ్తే తెలంగాణ సంస్థానాల్లో మహిళల పాత్ర, గద్వాల సంస్థానంలో సాహిత్య సేవ వీరి నిశిత పరిశోధనలకు అద్దం పడతాయి. తెలంగాణ ప్రాంతంలో 14వ శతాబ్దం నుండి 19 శతాబ్దం ఉత్తరార్థం వరకు కుతుబ్ షాహీల నుండి మొగలులు, నైజాం రాజుల పాలనా కింద 14 సంస్థానాలు పాలించాయని ఆమె పేర్కొన్నారు. ఈ సంస్థానాల రాణుల పాలనలో జరిగిన సామాజిక, సాహిత్య రంగాల గూర్చి అధ్యయనం చేసి చక్కటి పరిశోధక వ్యాసాన్ని అందించారు. ఇందులో గద్వాల, వనపర్తి , అమర చింత (ఆత్మకూరు), జటప్రోలు(కొల్లాపూర్), పాపన్నపేట , పాల్వంచ, బొరవెల్లీ , సిర్నా పల్లి, గోపాల పేట, తదితర సంస్థానాల గూర్చి రచయిత్రి చక్కగా చర్చించారు. గద్వాల సంస్థాన మూల పురుషుడు కాకతీయ ప్రతాప రుద్రుని కాలం నాటి గొన బుద్ధారెడ్డి యనిపెద్ద సోమ భూపాలుడని, ఇతనే శోభనాద్రి, సోమనాద్రి గా. పిలువ బడ్డాడని, క్రీ.శ.1663-1735 పేర్కొంటూ,ఇతనే గద్వాల కోట నిర్మాతలని అన్నారు. గద్వాల పాలకులలో శ్రీరామ భూపాలుడు, సీతారామ భూపాలుడు, తర్వాత ఆది లక్ష్మీ దేవమ్మ.దత్త పుత్రుడు కృష్ణ రాం భూపాలుడు ముఖ్యులను. పేర్కొన్నారు. ఇందులో భాగంగా అనేకమంది సాహిత్యకారులు ఈ సంస్థానాలలో కవులుగా రాణించి పలు గ్రంథాలు రాసినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ సంస్థానాలలో కవులకు, పండితులకు ముఖ్యంగా పద్య కవులకు, సాహిత్యకారులకు చక్కటి ఆదరణ లభించిందనట్లు తెలిపారు.గద్వాల ప్రభువు పెద్ద సోమ భూపాలుడు స్వయంగా కవి, జయ దేవుని గీత గోవిందాన్ని తెలుగు సేత చేశారని రాశారు. గద్వాల ప్రభువుల కాలంలోనే కవి, పండితులు , అవధానులైన తిరుపతి వెంకట కవులు, మరియు రామ భూపాలుడు కాలంలో, శ్రీపాద కృష్ణమూర్తి వంటి ఉద్దండులైన కవులు ఈ సంస్థానాలకు విచ్చేసి సన్మానింపబడ్డారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వివిధ సంస్థానాధీ శులైన మహిళలు అందించిన చక్కటి పరిపాలనను, సాహిత్య సేవలను ఈ వ్యాసంలో రచయిత్రి సోదాహరణంగా వివరించారు. తెలంగాణ సంస్థానాలలో మహిళలు రాచరికం చేశారని చక్కటి పరిపాలనను అందించారని ఎంతోమంది కవులను ఆదరించారని ఆమె విపులంగా పేర్కొన్నారు. వివిధ సంస్థానాలలోని రాణుల గూర్చి రాశారు . అమ్మక్కమ్మ లింగమ్మ, మంగమ్మ, చొక్కమ్మ , వెంకట లక్ష్మమ్మ, ఆది లక్ష్మీదేవి, సరళాదేవి, భాగ్యలక్ష్మమ్మ వెంకటరత్నమాంబ, రాణి శంకరమ్మ, మల్లమ్మ , ఎల్లమ్మ లచ్చవ్వ దొరసాని, లక్ష్మీనరసాయమ్మ , గిరియమ్మ , చీలం జానకి బాయి మొదలైన మహిళామణులు సంస్థానాలను చక్కగా పరిపాలించారని ఉదాహరించారు.

ప్రముఖ పద్య కవులైన వేముగంటి నరసింహచార్యులు, వారి రచనలపై 26 పేజీలలో సుదీర్ఘ వ్యాసము రాసి, హైలైట్ నిలిచిపోయారు. వేముగంటి వారు మహాభారతంలోని తిక్కన వంటి ఉద్ధoడ పండితులని ఆమె పేర్కొన్నారు. సంస్కృతాంధ్ర భాషలతో పాటు ఉర్దూ భాషలో చక్కటి పాండిత్యాన్ని సంపాదించుకొని అనేక పద్య కృతులను రాసి పండితలోకం మెప్పు పొందారని, మెదక్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేసేసమయంలో ఎంతోమంది యువ కవులకు ఆదరువుగా నిలిచి, వారిని ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఆధునిక ప్రాచీన కవిత్వాల వారధిగా వేముగంటి వారు రాణించారని పేర్కొన్నారు. వేముగంటి వారి రచనల్లో ఆధ్యాత్మికత ఆత్మీయత, జాతీయత, సామాజిక అంశాలు పుష్కలంగా ఉన్నాయని అందుకే వీరి రచనలు సుప్రసిద్ధమయ్యాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాలల్లో , విశ్వవిద్యాలయాల్లో వీరి రచనలు పాఠ్యాంశాలుగా తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. వేముగంటి వారు బెజవాడ గోపాలరెడ్డి , డా.బోయి భీమన్న, దాశరథి కృష్ణమాచార్యులు, దేవులపల్లి రామానుజారావు, డాక్టర్ సినారె, పేర్వారం జగన్నాథం గడియారం రామకృష్ణ శర్మ వంటి ప్రముఖులు సమకాలీనలుగా ఉన్నారని, వారి సహచర్యంతో విశిష్టమైన రచనలు చేసి వాసికెక్కి నట్లు తెలిపారు . వేముగంటి కృతులు ప్రబోధము, భాష్పాంజలి, అమరజీవి, బాపూజీ, కవితాంజలి, తిక్కన, వీర పూజ, మంజీర నాదాలు, శ్రీ వెంకటేశ్వర ఉదాహరణము , గణేశ ఉదాహరణము, ఆంధ్ర విష్ణువు, భక్త రామదాసు, శ్రీ వాసవీ సరస్వతి వైభవము భావాంజలి, వ్యాసకలాపము, అక్షర దీపాలు, పురుషకారము, మేలుకొలుపు, శ్రీ వివేక విజయము, అమృత వర్షిని, ప్రియదర్శిని, సువర్ణ సుమాంజలి, శ్రీహరి చరణస్మరణ గీతి, శ్రీకృష్ణ లీలామృతం , శ్రీరామ పద్యమాలికా స్తోత్రము,పంచాష్టకములు, తదితర కృతులపై విశ్లేషించారు. ఒకరకంగా చెప్పాలంటే వేముగంటి పద్య కృతులన్నిటిని సాకల్యంగా పరిశీలించి చక్కటి వ్యాసాన్ని పరిశోధకులకు కరదీపికగా, పాఠకాదరణకు పాత్ర మయ్యేలా అందించారు. వేముగంటి జీవితము, సాహిత్యం పై ఒకటి రెండు పరిశోధనలు విశ్వవిద్యాలయాలలో జరిగాయని, అవి సరిపోవని ఆమె పేర్కొన్నారు. వీరి రచనలపై రచనలపై విడివిడిగా విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెబుతూ చర్చించారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆస్థాన కవి, పద్యకవి అయిన స్వర్గీయ మామిడిపల్లి సాంబ కవి గారు మరుగున పడిన మహాకవుల జాబితాలో చేరినా, వీరి రచనలను వెలికి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వీరి రచనలు ముఖ్యంగా వారి సామాజిక కృతులపై వివరంగా విశ్లేషించారు. 19వ శతాబ్దంలో పద్య కవిగా ద్విపద రామాయణం , రాజేశ్వర సుప్రభాతం వంటి రచనలతో పాటు బుర్రకథలు యక్షగానాలు, నాటకాలు హరికథలు రాసిన కవిగా వీరు సుప్రసిద్ధులని ఆమె తెలియజేశారు . సాంబకవి గారిని డాక్టర్ సినారె వంటి మహాకవి గురుతుల్యులుగా భావించారని పేర్కొన్నారు. భక్తి ప్రధానమైన రచనలతో పాటు దేశభక్తి జాతీయత మానవతావాదం సమాజ శ్రేయస్సు వీరి రచనల్లో నిండుగా కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. వీరు పద్య కృతులైన లోభ సంహారము,ముక్తాహారము, మహాదేవరశతకము, జయశ్రీ, మధురఝంకా కరములు, రాజేశ్వర తారావళి వంటి వాటితో పాటు నదులపేరిట వెలువరించిన ఖండకావ్యాలు వీరి రచనా వైదుష్యానికి ప్రతీకలుగా నిలిచాయనీ, ప్రాచీన ఆధునిక సాంప్రదాయాలతో వీరి రచనలు భాషించాయని ఆమె పేర్కొన్నారు. ముక్తాహారము, కుంజ విహారం, లోభ సంహారము, జయశ్రీ పద్య కృతులను విపులంగా చర్చించారు. కుంజవిహారము పద్య కృతి కి నామౌచిత్యము పాటించారని, రాధా మాధవుల ప్రణయ వృత్తాంతాన్ని ప్రధానంగా తీసుకొని 40 పద్యాలతో కావ్యంగా మలిచారని ఆమె పేర్కొన్నారు. సాంబకవి అవధానాలతో తిగుళ్ళ శ్రీహరిశర్మ వంటి అవధానులు వెలుగులోకి రావడానికి స్ఫూర్తినిచ్చారని ఆమె పేర్కొన్నారు. సాంబకవి సాహిత్యం, పద్య కృతులపై చక్కటి పరిశోధన చేసిన శ్రీమతి డా.ఇట్టేడు విష్ణు వందనా దేవి అభినందనీయురాలన్నారు. ఆర్ష కవి దోర్బల విశ్వనాథ శర్మ పద్య కవిత్వం గురించి, వివిధ దైవతాలపై ఆయన రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలను చక్కగా విశ్లేషిస్తూ పరిచయం గావించారు.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి సాహిత్యము, వారి ఉన్నత వ్యక్తిత్వం గూర్చి పరిపాలన దక్షతల గూర్చి రాసిన వ్యాసంలో పలు విషయాలు చర్చించారు. పీవీ గారు శ్రీ రామానంద తీర్థ , బూర్గుల రామకృష్ణారావు తదితరుల స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో చైతన్య శీలిగా వ్యవహరించారని, రాజకీయ పదవుల్లో రాణిస్తూనే, మరో పక్కన సాహితీ రచనా వ్యాసంగాలను, సాహితీ గ్రంథాధ్యయనాలను కొనసాగించారని పేర్కొన్నారు. వీరు నైజాం విముక్తి కాలంలో రాసిన గొల్ల రామవ్వ కథ లో అప్పటి తెలంగాణ జీవభాష పదాలను ప్రయోగించారని ,వరంగల్ లో సదాశివరావు గారితో కలసి కాకతీయ పత్రికకు సారథ్యము వహించి, పాత్రికేయునిగా వ్యవహరిస్తూనే వీరు వివిధ పేర్లతో నాలుగు కథలను రాసినట్లుగా పేర్కొన్నారు. విశ్వనాథ రాసిన వేయి పడగలను సహస్ర ఫణి భూషణ్ పేరున హిందీలో అనువదించి బహు భాషావేత్తగా ప్రసిద్ధిగాంచారని పేర్కొన్నారు. వీరు “లోపలి మనిషి” పేరిట ఆత్మకథను రాసుకున్నారని ఇందులో తన స్వీయ అనుభవాలను ఆనంద్ పాత్ర ద్వారా వ్యక్తీకరించారని అన్నారు.

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన వివిధ రచనలు ముఖ్యంగా ఏకవీర, వేయి పడగలు నవలలను విశ్లేషణాత్మకంగా చర్చించారు.ఏకవీర నవలా నేపథ్యాన్ని చక్కగా వివరించారు. తెలుస్తుంది ఈవ్యాసం రచయిత్రి రచనా కౌశలానికి దృష్టంతంగా నిలుస్తుంది. తెలంగాణలోని పద్య కవిత్వ వైభవంతోపాటు అవధాన రంగంలో ప్రముఖులైన కవుల మూర్తీభవించిన అవధాన వైభవాన్ని తెలంగాణ అవధాన వైభవము అన్న శీర్షికన చర్చించారు. వేములవాడకు చెందిన ప్రముఖ కవి వేదాంతం కాశీనాథం గారి పద్య రచనల గూర్చి, వారి గొడగూచి పద్య కృతి విశిష్టత గూర్చి కాశీనాథుని కావ్యానుశీలనము అనే శీర్షికన విపులంగా విశ్లేషించారు . వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర పురా వైభవం, ప్రాశస్త్యం గూర్చి చక్కగా పరిశోధించి రాశారు. మహాభారతంలోని వివిధ జానపద పాత్రలు, జానపద గేయాలు, జానపదుల నోళ్ళల్లో నానిన పాటల గూర్చి రసవత్తరంగా రాశారు. ‘మహాభారత పాత్రలు జానపద ప్రతీకలు’ అనే శీర్షికన రాసినఈ వ్యాసం పురాణేతిహాసాల పట్ల వారికి గల అవగాహనను వ్యక్తం చేస్తుంది. జానపద సాహిత్యంలో మహాభారత పాత్రలు ఏ రకంగా ప్రచారంలో ఉన్నాయో ఆమె ఈ వ్యాసం ద్వారా విప్పి చెప్పారు. రైతులు వ్యవసాయంలో ఉన్నప్పుడు వర్షాల వల్ల పిడుగుపాటుకు గురికాకుండా ఉండటానికి పాండవ మధ్యముడైన అర్జునుని తలుచుకుంటారు. ఆంధ్ర తమిళ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఐదు రాళ్ళను పెట్టి గుడులుగా భావించి పంచపాండవులని పూజిస్తారనే పలు విశేషాలను రచయిత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గిరిజనుల్లో ఒక తెగ అయిన గోండులు పొలాల్లో విత్తనాలు చల్లే ముందు భీమసేనుని అర్చిస్తారని ఆమె పేర్కొన్నారు. మహాభారతంలోని ఏకలవ్యుడు సూతుడు విశ్వరూపుడు, ఘటోత్కచుడు, ఇరావంతుడు పాత్రల గూర్చి, సుభద్ర సారె, ధర్మరాజు జూదము, ద్రౌపది మాటలు.. తదితర అంశాలపై వచ్చిన జానపద గేయాలు గూర్చి చక్కగా చర్చించారు. తాళ్లపాక తిమ్మక్క రాసిన సుభద్ర కళ్యాణము ఆధారంగా వచ్చిన జానపద గేయాల గూర్చి చక్కగా చర్చించారు.

అవిభక్త నిజామాబాద్ జిల్లా నవలా సాహిత్యం పై చక్కటి సుదీర్ఘ వ్యాసము రాశారు. ఈ ఉమ్మడి జిల్లా తొలినాళ్ల నుండే నవలా సాహిత్యంలో కీలకపాత్రను పోషించి మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. తాను నివసిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కాక, పొరుగున ఉన్న మెదక్ జిల్లా సాహిత్య రచనలు, అక్కడి కవుల సృజనలపై ఆమెకు చక్కటి పట్టు ఉంది. ప్రజల మనిషి నవల రాసిన వట్టికోట ఆల్వార్ స్వామి నిజామాబాద్ జిల్లాలో జైలు జీవితం గడిపారని ఇక్కడి నుండే వచ్చిన ప్రసిద్ధ నవలా రచయిత లోకమలహరిగారు, డా. కేశవరెడ్డి, 40 నవలలు రాసిన బొమ్మ హేమా దేవి, మరియు కేవీనాథం, తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్, డాక్టర్ అమృతలత, కంఠo నేని రాధాకృష్ణ, యాటకర్ల మల్లేష్ ,వి.శాంతి, మేడిచర్ల ప్రభాకర్ రావు ,మల్లవరపు చిన్నయ్య, కస్తూరి మురళీకృష్ణ, సిరిగాద శంకర్ ,డాక్టర్ వి. ఆర్ శర్మ ,దారం గంగాధర్, ఎనిశెట్టి శంకర్, శ్రీమతి అయాచితం స్పందన తదితరులు నవలా సాహిత్యంలో వాసిగాంచారని ఆమె పే ర్కొన్నారు. సుమారుగా ఆరేడు దశాబ్దాల నుండి ఇక్కడ నవలా సాహిత్యం వర్ధిల్లుతుందని ఆమె పేర్కొన్నారు. రచయిత్రి తెలంగాణ యశోదరులు పేరిట తెలంగాణలో ప్రసిద్ధులైన వారితో పాటు, వెలుగులోకి రాని మహనీయమనిందరినో వెలుగులోకి తెచ్చే ప్రయత్నం సఫలీకృతమైనది. ఈ పుస్తకం పరిశోధకులకు ఎందరికో దారి దీపంగా నిలుస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఆ బాలగోపాలం చదివి భద్రపరచుకున్నదగిన పుస్తకం మిది. డా.సునీత సాహిత్య వికాసం అధ్యయనం, రచనా వ్యాసంగం తో ముడిపడి తన రచనలను పత్రికలకు పంపుతూ.అచ్చులోకి తేవడం.అభినందనీయం.

-సంకేపల్లి నాగేంద్రశర్మ, రైటర్, కరీంనగర్ .dt 26.6.2023

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నిత్యనూతన—–చైతన్యం.!!

by Kandakatla Janardhan July 30, 2023
written by Kandakatla Janardhan

ఈ రోజంతా మనమందరం
కొత్తదనంతో-నవతనువుతో
హృదయమంతా ఉదయించిన
ఉత్తేజ ఉద్వేగభరిత
హుషారుగా ఉషానిషా కిరణాలవుతున్నాం..!

మనమంతా
ఉల్లాసంగా ఉత్సాహంగా
తొలి యవ్వన కాంతులమై
అన్ని పండుగలన్నీ ఒకేసారి
కాళ్ల ముందుకు వచ్చినట్లుగా…

విందుల వినోదాలు
సరదాలసరాగాలన్నింటిలో
సత్వర ద్వార సందర్శనమై
సంలీన విలీనమై
సౌకర్యాల సౌరభాల మధ్యఓ విజయంగా విజృంభిస్తున్నాం…!

కలకలం – కలతలు లేకుండా
కలకాలం కలిసి ఉండాలనీ
కలలన్నీ నిజం కావాలనీ
సంకల్ప సంక్రాంతికి
నిర్ణయాలు నిర్భయంగా
తోడూ నీడైన నిమిషాన
ప్రతీ వాగ్దానంతో
ఒళ్లు విరుచుకుంటున్నాం..!!

ఇక…. ఇప్పటి నుండి
రేపటి – భావి జీవితం కోసం
క్రమం తప్పని..కసరత్తుని
కంకణంగా కట్టుకుని…………….

కలం కదిలించి- కదం కదిపి
గళం విప్పి- గతం మరిపించి
సవరించుకుని సరిదిద్దుకుని
సర్దుబాటు చేసుకుని

అప్పటి వరకు
ముడుచుకున్న ముఖాలు
వికసితమైన వీక్షణంతో
వైరాగ్యంలో మహాభాగ్యాన్ని
వేకువ మెళకువల్లో మెలికలు తిరిగి
మేలిమిని వెతుక్కుంటున్నాయి..!!

అనుదినమూ ఆనందంగా
శ్వాసించిన..ఆశించిన..ఆచరించిన
తరుణం తర్వాత…

నిన్నటి కన్నా మిన్నగా
ఏ తీరమైనా- ఏ తరమైనా
మహాత్తరమవుతుందనీ…..

అటు ఆరంభశూరత్వ లేమిని
ఇటు నూతనతన్మయత్వ కలిమిని
నిత్యం నిఖిలం
చలించని చెలిమిని
అభిలషిస్తూనే
ఇపుడు ఇక………
గమనం-గమ్యం పురోగమించేలా
అందరం…..ఒక్కటవుదాం…..!!!

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

బాలల అనువాద కథలు

by ఒద్దిరాజు మురళీధరంరావు July 30, 2023
written by ఒద్దిరాజు మురళీధరంరావు

మూలం:- డా॥ బి.జి రమేష్ గారు.
అనువాదకులు:- ఒద్దిరాజు మురళీధర్ రావు గారు.

పాశ్చాత్య దేశాలతో పోల్చుకున్నప్పుడు మన తెలుగు భాషలో బాలలసాహిత్యం తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా ఉన్న ఆ కొద్ది రచనలు పిల్లలకు చేరువ కావడం లేదు.. దానికి కారణం
” తిలాపాపం తలా పిడికెడు” అన్నట్టు సృజనాత్మక త అంతగా లేని మూస విద్యావిధానంలో విద్యార్థులు “హోం వర్కు” తోనే అధిక సమయం మరియు అధిక భారంతో గడపడంతో సమయం లేక పోవడం, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే ఇల్లు చేరే సరికే పిల్లలు నిద్రలోనూ…. నిద్రావస్థలో ను ఉండడం, ముఖ్యంగా కొందరు తల్లులకు పిల్లల చేత ఎలాంటి పుస్తకాలు చదివించాలనే ఎంపికలో అవకాశాలు లేకపోవడమనే నాకనిపిస్తుంది… ఆ లోటు పూడ్చడానికా? అన్నట్టుగా డా.బి.జి రమేష్ గారి ఆంగ్లంలో రాసిన పిల్లల కథలు విలువలు నేర్పే దిశగా సాగాయి.

మూల రచయిత రమేష్ గారు కన్నడ ప్రాంతానికి చెందిన రచయిత, మైసూరు జిల్లా లోని హోనాసోగే గ్రామానికి చెందిన వారు. వీరు ఎన్నో గ్రంథాలను రచించారు. అందులో ఈ ” Bed time stories ” అనే కథల పుస్తకాన్ని గౌరవనీయులు ఒద్దిరాజు మురళీధర్ రావు గారు తేలిక తెలుగు భాషలో పిల్లలకు ఎవరి సహాయం లేకుండానే అర్థమయ్యేటట్టు గా అనువదించారు.
అనువాదం చేయడం అంత సులువేమీ కాదు. ఒక భాష వస్తే సరిపోదు! అక్కడి కథను ఇక్కడ అన్వయిస్తూ చెప్పాలి. ఎందుకంటే మూలంలోని పరిసరాలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలువేరు. అయినా వాటికి లోటు లేకుండా… మూల రచయిత భావం, సహజత్వం చెడకుండా తనదైన భాషా శైలి లో బాల బాలికలకు అందించడం కష్టమే అయినా మురళీధర్ రావు గారికి ఇదివరలో రవీంద్రనాథ్ ఠాగూర్, లియో టాల్స్టాయ్ వంటి రచనలను అనువదించిన అనుభవం ఉంది. అంతేకాదు మూల భాష మరియు లక్ష్య భాష రెండూ చక్కగా తెలుసుకాబట్టి మూలంలోని విషయం చెడకుండా కథలంటే ఇష్టపడే చిన్నారులకుచక్కగా అనువదించ�

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మనిషి కోసం తపన

by A, Gajender Reddy July 20, 2023
written by A, Gajender Reddy

వారాల ఆనంద్ రచనల్లో ‘మానేరు తీరం’ విలక్షణమైంది. ‘ప్రవాహం పయనమై సముద్రాన్ని చేరుతుంది. అవును. పరుగులెత్తడం తెలిసిన ప్రవాహం నేలతల్లిని ఆర్తిగా తడుముతూ గమ్యం వైపు సాగిపోతుంది” అంటూ ప్రారంభమౌతుంది. మరి మనుషుల్లో – ప్రవాహం తెలీని బతుకుల్లో మాటలు కోటలు దాటుతాయి, చేతలు సాగిలబడతాయి, గమ్యం గాభరా పడుతుంది.
నేడు మనుషుల్లో సహజత్వం క్షీణిస్తున్నది. నటన పెరుగుతున్నది. మనసుల్ని భూస్థాపితం చేసి లోకం వేదికపై దర్జాగా నటించేస్తూ బతికేస్తున్నామని, మానవీయ విలువల కంటే ఎక్కువగా కుహనా అవసరాలపై మక్కువను పెంచుకున్నామని అంటాడు. మనం ఎంత ఉదాసీనులమై పోయాం! “యథాలాపంగా ఊపిరి తీసుకుంటున్నట్లుగానే మనం లోకం కేసి చూడ్డం అలవాటు చేసుకుంటున్నాం. తూర్పు పడమరై పోయినా, ఆకాశం విరిగి మీద పడ్డా, ప్రవాహం ఎదురు తిరిగి దిశ మార్చుకున్నా, మనుషులు మమతానురాగాల్ని పోగొట్టుకున్నా, మానవతా విలువలన్నీ కట్టగట్టుకు కొట్టుకుపోయినా, స్నేహం నిర్దయగా స్వార్థమయి పోయినా, అవసరం మనిషిని ఆటవికున్ని చేస్తున్నా, మనిషి విలువ వినియోగ వస్తువై పోయినా మనం ప్రేక్షకునిలా అలా గంభీరంగా చూస్తూ మన బతుకు మనం బతికేస్తున్నాం”.
ఇప్పుడంతా లౌక్యం యాంత్రికత్వం కృత్రిమత్వం. మనిషన్న మాటకి అర్థం మారి యంత్రాలకు పర్యాయపదాలుగా మారుతున్నాం. మనల్ని మనం వదిలేసుకొని పరుగులు తీస్తున్నాం. ఎవరి కోసమో దేనికోసమో తెలీకుండానే చేస్తున్న పనిలో ఎవరికి ఆనందముంది? మనది కాని మనకోసం కాని బతుకు వేరేవారి నియంత్రణలో వేరెవరి లాభం కోసమో ఉక్కుచట్రంలో బిగించ బడి పరుగు తీస్తున్న బతుకు దేనికి? చరిత్రగతిలో ధూళిలా రాలిపోవడం తప్ప, అనంతయాత్రలో ఆనవాలు మిగల్చకుండా సాగిపోవడం తప్ప ప్రయోజనమేముంది? అని ప్రశ్నిస్తాడు ఆనంద్.

సమాజం దాకా ఎందుకు? ఇద్దరు కలిస్తే ప్రేమగా అభిమానంగా పలకరించుకుంటున్నారా? ఎన్ని దూరాలు, ఎన్ని అనుమానాలు? ఇద్దరు మనుషుల మధ్య రెండు మనసుల మధ్య రెండు ఆలోచనల మధ్య ఎడం నిజంగా ఎంత ఘోరం? అంటూ ఒకే మనిషిలోని అంతర్ బహిర్ తత్వాల మధ్య ఎడాన్ని కూడా ఉటంకిస్తాడు. ఆనాటి ఆ స్నేహాలు ఏవి? సెలవులకి ఊరికి పోయి వచ్చిన అనుభవాల ముచ్చట్లు అందరం కలిసి పంచుకోకుండా కాలు నిలిచేదా! కాలం నడిచేదా? అని గుర్తు చేస్తాడు. నేడు ప్రతిక్షణం అవిశ్వాసాన్ని మోస్తూ చివరి అంచుకు ఎలా చేరగలం? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉందో కూడ చెప్తాడు. ఆనంద్. “మనం ఒకరికి ఒకరంగా సాటి మనిషిగా స్నేహం పంచుకోవాల్సి ఉంది. అభిమానాన్ని పెంచుకోవాల్సి ఉంది. ప్రేమను నింపుకోవాల్సి ఉంది. మనల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. శ్వాసలో విశ్వాసాన్ని నింపుకోవాల్సి ఉంది.” ఇద్దరి మనుషుల కరచాలనంలోంచి స్నేహం ఉరకలెత్తాలని, రెండు చూపుల ఆరాధనల్లోంచి ఆప్యాయతలు వెల్లివిరియాలని కోరుకుంటాడు. మమేకత్వం మనల్ని మనుషుల్ని చేస్తుందని భావిస్తాడు. ఎక్కడ మనిషిని తూచకుండా మనిషిలా చూస్తారో అక్కడిదాకా ఏకబిగిన నడిచిపోవాలనీ, పరుగులు

తీయాలనీ ఆనంద్ మనసు మానేరులా ఉరకలు వేస్తుంది. సాగిపోతున్న కాలంలో ప్రతిక్షణం ఓ నూతన శకానికి నాంది పలకాలి. ఓ సరికొత్త ఆలోచనకి అనుభూతికి తొలిమెట్టు కావాలి. మనిషిని చిగురింపజేసే, మనసుని పురివిప్పదీసే నూతనోదయం కావాల్సిందే, మనిషి మనిషిగా మిగలాల్సిందేనని ఆకాంక్షిస్తాడు.

మౌనం, మాట, మరుపు, మనసుల గురించి ఆనంద్ చెప్పిన వాక్యాలు ఆణిముత్యాలు. వినగలిగితే మౌనంలో కోటి గొంతుకల రవాన్ని పెదాలు వినిపిస్తాయి… నిశ్శబ్దాన్ని నిక్షిప్తం చేసుకొని భావ తరంగాల్ని మోస్తూ సాగే మౌనం ఖచ్చితంగా అర్థవంతమయిన సంభాషణమే. మాట ఎగసిపడే భావనా తరంగం. జాలువారే ఆత్మీయతా ప్రవాహం. మాట మనసులో ముంచితీసిన అనుభూతి ప్రతిబింబం. మాట పలికితే గుండెల్నినట్టుంటుంది. మనిషికి మరపు వరం. మనిషి కదలికకే మూలం. గతంలోని బాధామయ అనుభవాల్ని మరువకుంటే వర్తమానం భయంకరమవుతుంది. అట్లాగే గతకాలపు సంతోషంలో కొట్టుకుపోతూ ఉంటే భవిష్యత్తు బాధామయమవుతుంది. మనిషి మనస్సు అనురాగపు ఆర్ద్రతను ఆశిస్తుంది. తనను తానుగా గుర్తించే తోడును కోరుకుంటుంది. ఎవరి ఊహయితే ఉరకలు పెట్టిస్తుందో ఎవరి స్నేహమయితే ఆనంద తీరాన్ని చేరుస్తుందో ఎవరి తోడయితే సంతోషపు సముద్రాల్లో ఈదులాడిస్తుందో ఆ తోడు కోసం స్నేహం కోసం ఆ ఆలంబన కోసం మనసు తహతహ లాడుతుంది.

ఇంకా “శిశువు కెవ్వుమన్న పిలుపులో జీవన పోరాటపు ప్రతిధ్వని వినిపిస్తుంది” “ఆకాశం వేయి వెలుగుల సూర్యునికి మాతృమూర్తి… ఆకాశం మనకు నేస్తం… మొత్తంగా శూన్యం తాత్కాలికం.. చేతనే శాశ్వతం” వంటి చైతన్యం వైపు మనిషిని నడిపించే మహా పంక్తులు మనల్ని వెన్నాడుతాయి.

ఈ పుస్తకానికి విశ్వేందర్ రెడ్డి అందించిన ముఖచిత్రం, లోపలి పేజీలలో కల్యాణం శ్రీనివాస్ గీసిన భావగర్భితమైన బొమ్మలూ మనల్ని ఆకర్షిస్తాయి. ‘మానేరు తీరం’ వారాల ఆనంద్ హృదయం ద్రవించి, మేధస్సును మధించి, మనిషి కోసం తపించి రాసిన గ్రంథం.

ప్రతులకు : వారాల ఆనంద్

9440501281

July 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఆటా కార్యక్రమం – యు.ఎస్.ఏ

by A. Venugopal July 20, 2023
written by A. Venugopal
July 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

తరుణి యూట్యూబ్

by mayuukha July 20, 2023
written by mayuukha

తరుణి యూట్యూబ్ చానెల్ ను చూడండి, మీరు తప్పకుండా నచ్చుతారు. తొలి ప్రయత్నం ఇది . మీ సహకారం అందించండి. ఈ చానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . లైక్ చేయండి, షేర్ చేయండి !థాంక్యూ – డాక్టర్ కొండపల్లి నీహారిణి, కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకులు, మయూఖ అంతర్జాల పత్రిక,
తరుణి పత్రిక ల వ్యవస్థాపకులు, సంపాదకులు .

https://youtube.com/@Tharuni-women

July 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

తెలివిగల చాప

by కూకట్ల తిరుపతి July 20, 2023
written by కూకట్ల తిరుపతి
July 20, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఉదయించే కవుల వారం ‘కవివారం’

by Aruna Dhulipala July 19, 2023
written by Aruna Dhulipala

కవివారం” – ముప్ఫయి ముగ్గురు కవులు, కవయిత్రులు రచించిన కవితా సంకలనంపై సమీక్ష – అరుణ ధూళిపాళ

కవిత్వం అంటే ఉబుసుపోక రాసుకునే ఏవో నాలుగు ముక్కల పదాల కూర్పు కాదు. ఏదో ఒక సమయంలో చలించిన మనసు అంతర్గతపొరల్లో నుంచి బయటకు పెల్లుబికే భావ స్పందన. అలా పుట్టినదే “కవివారం” కవితా పుస్తక మాలిక. ఇందులో ముప్పది ముగ్గురు కవులు రాసిన కవితలన్నీ చేర్చబడ్డాయి.. కరోనా మహమ్మారి కోరలు చాపక ముందు ఈ కవులంతా ప్రతీ సోమవారం ఏదో ఒక చోట చేరి, వారి వారి కవితలను చదువుతూ విశ్లేషించుకుంటూ ఆత్మీయ ముచ్చట్లను పంచుకునేవారు. కరోనాలో ఏమీ చేయలేని స్థితిలో ప్రతీవారం కలుసుకునే తపనను విడువలేక ప్రత్యామ్నాయంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని యధావిధిగా వారి కవితా ప్రవాహాన్ని కొనసాగించారు. చదివే కవితలకు పుస్తకరూపం ఇస్తే అది ఉపయుక్తంగా ఉంటుందని భావించి దానికోసం అనేకానేక శ్రమలకోర్చి మన ముందుంచారు. ఈ విషయంలో సంపాదకులు కందుకూరి శ్రీరాములు గారు, బెల్లంకొండ సంపత్ కుమార్ గార్ల కృషి శ్లాఘనీయం.
‘కవివారం’ అనే పేరు వింటే ప్రతీ ఒక్కరికీ ఆశ్చర్యం కలుగక మానదు. సోమవారం నాడు ప్రత్యేకంగా ఉదయించే కవుల వారం అది. ఎక్కడ ఉన్నవారైనా, ఎటువంటి పనుల్లో వున్నా ఆ చోటునుంచే
అందరూ ఒక సుహృద్భావ వాతావరణంలో జూమ్ లో సమావేశమై వారి వారి కవిత్వ ధారలను ఒలికిస్తారు. అలా రూపొందించబడిన ‘కవివారం’ పుస్తకాన్ని తెలంగాణా కోసం అక్షరాల్ని, జీవితాల్ని త్యాగం చేసిన అమర సాహితీ వేత్తలకు అంకితం ఇవ్వడం వారి ఉదాత్త భావనను, కవిత్వం పట్ల వారికున్న అంతులేని అనురాగాన్ని తెలియచేస్తోంది. అందులోని అక్షర ఆణిముత్యాలను కొన్నింటిని చూద్దాం.
“పూలయినా కాయలైనా పండ్లయినా / రాల్చగలిగే నిబ్బరం చెట్టు” “కలలు కూల్చడానికి / కాలం సిద్ధంగా ఉంటుంది” డా. నందిని సిధారెడ్డి రచించిన ‘దూరభారాలు’ అనే కవితలో పంక్తులివి. కాదు జీవిత వాస్తవాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఋతుధర్మాన్ని పాటిస్తుంది చెట్టు నిబ్బరంగా. మనిషి కనే కలలు ఎప్పుడూ కాలానికి లోబడి కూలుతాయి. స్వీకరించక తప్పదు. మనమంతా కాలచక్రంలో తిరుగాడే బొమ్మలమే..అంటూ జీవన సత్యాలను చెప్పారు. అలాగే ‘వేడుక’ కవితలో “ఒప్పుకోరు గానీ/

పువ్వెనక పువ్వు తాంబాలంలో శిఖరం పేర్చే/ జానపద స్త్రీల చేతుల్లో ఏమికళ” అంటూ బతుకమ్మను పేర్చే కళానైపుణ్యాన్ని మెచ్చుకుంటారు.
‘గ్లోబల్ ఖడ్గం’ కవితలో “బొట్టు కాటుకలతో పాటు / ఏ రాష్ట్రపు ఐదో తనాన్నయినా డాలరే అమ్మగలదు. “గ్లోబల్ మూడవ హస్తం/ మానవ గోళం మీదే మార్కెట్ వలను విసిరింది “నాళేశ్వరం శంకరం రచించిన ఈ వాక్యాలు గ్లోబల్ వ్యవస్థ వల్ల వచ్చిన మార్పులు, ప్రపంచాన్ని డాలర్ శాసిస్తున్న తీరును కళ్ళకు కడతాయి. ఆ ఆవేదనతో “అనుక్షణం నేల కంట్లోంచి/ జారుతున్న జల పాత సవ్వడి/ నా బాహ్యాంతర మనో లోయంతా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది” అంటూ వాపోతారు.
“పదం ఒక ముడి పదార్థం/ అదే ఒరిగిపోతుందో/ అదెట్లా ఒనగూరుతుందో” …”నీవు కవివి/ నీవు సృష్టికర్తవు ” ప్రతీ దాన్ని పసిగట్టిన మనసు/ జ్ఞాన గ్రంథమై రూపుదిద్దుకుంటుంది” ..అని ‘కవనభూమి’ కవితలో కవులు మనసుతో ఆలోచించాలంటూ భావంతో ఓడించాలని, కలంతో జయించాలని చెబుతూ కవి బాధ్యతను గుర్తు చేస్తూ పదమనే ముడి పదార్థాన్ని తన అంతరంగంలోంచి ఒక గొప్ప శిల్పంగా చెక్కాలని కందుకూరి శ్రీరాములు సూచిస్తారు. మామూలు పదాలు కవిత్వమవటమంటే/ ఒక అవయవం పనిని ఇంకో అవయవం చేయటమే/ అని కవిత్వం ఉండాల్సిన రీతిని చెప్తారు. ‘కళ్ళతో విను’ అనే కవితలో.
“గాయానికి సిద్ధపడ్డన్నాళ్ళు/ గాయం గాయ పరుస్తూనే ఉంటది/ బుద్ధికి జీవమిచ్చినాంక/ గాయం నీరు కారిపోతది”/ అంటూ ‘నేను’ కవితలో మనిషికి ఉద్బోధ చేస్తున్నారు డా. బెల్లంకొండ సంపత్ కుమార్. అడుగులు ముందుకు వేస్తూ నడవాలే కానీ గాయాలు అవుతున్నాయని వెనక్కు తగ్గకూడదు. బుద్ధి బలంతో ఆలోచిస్తే గాయం ఏమీ చేయలేదని మనలను ప్రోత్సహిస్తారు. ప్రపంచంలో మానవ సమాజం శాంతికి దర్పణంగా ఉండాలని ” ఏ పక్షం కానీ/ బతుకు పక్షం అయేదాక/ శాంతిని ప్రతిక్షేపిద్దాం”/ అని ” యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు” అనే కవితలో కొత్త విలువల ఆవిష్కరణలను ఆకాంక్షిస్తారు.
కందాళై రాఘవాచార్యులు ‘చిప్పల బువ్వ’ కవితలో “బతుకంటే అర్థం పరమార్థం/ చిప్పకూడు తినేటోల్లకే సమజైతది” పూట గడవడం కోసం ఎన్నో తిప్పలు పడే పేదవాళ్లకు జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది కానీ పండితులకేం తెలుస్తుంది అంటారు. ‘తొమ్మిది గజాల చీర’ కవితలో ” అమ్మ ఇప్పుడు లేదుగని/ చెక్క పెట్టెల తొమ్మిది గజాల చీర/ మడతలు మడతలుగా/ అమ్మనే యాది సేస్తది”/ అంటూ ఆర్ద్రంగా అమ్మను గుర్తుచేసుకుంటారు.
కర్షకుడు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి, చివరకు ఓడిపోయి కన్నీరుగా కరిగిపోతున్నప్పుడు రూప్ కుమార్ హృదయం ద్రవిస్తుంది. దాంట్లో నుండి వెలువడిన కవిత్వం మన హృదయాలను తడిగా మారుస్తుంది. ‘ఒంటరీదైన పొలం’ అన్న కవితలో “తండ్లాడుతున్న ఆత్మను పంజరంలో పట్టుకొని/ ఏ చెట్టు కొమ్మకో వేలాడదీయడానికి”/…”కట్టె పొగలా తేలిపోతూ/ అతను వెళ్ళిపోతున్నాడు”/ అలాగే ‘ తెర తొలగిన దృశ్యాలు’ కవితలో దేహాన్ని వదిలిన ఆత్మ చీకటికి భయపడుతూ, కొడుకు చితికి నిప్పంటించగానే వెలుగులోకి పయనించినట్టు ఊహిస్తూ “బిడ్డా! తల కొరివిగా చితికి నిప్పంటించి/ నా మరో ప్రపంచాన్ని వెలుతురుమయం చేసావు/ ఇక భయం మరచి కాంతి మార్గం గుండా/ మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాను”/ అన్న మాటలు మనిషి జీవన సహజ స్వభావాలకు దర్పణాలు.
ఇక డా. కొండపల్లి నీహారిణి ‘నీళ్ళాట’ కవితను చూస్తే ప్రసవవేదనను అనుభవించి పిల్లలకోసం సమస్తం త్యాగం చేసే స్త్రీని వృద్ధాప్యంలో తన పిల్లలే తనను దూరం చేస్తున్న నేటి సమాజ స్థితికి ఆవేదన వ్యక్తం చేస్తూ “అప్పటి నీళ్లాట ఇప్పటి కన్నీళ్ళాట ఒక్కటైనట్టు/ ఇంత కనా కష్టంగయ్యిందా జీవన చక్రం”/ అంటారు. అంతేకాక ‘రినోవేట్ చేసుకుందాం’ అనే కవితలో “కాలం ఓ సమ్మోహనాస్త్రం/ ఋతుచక్రం మహా నియంత/ జీవితాన్ని/ మార్చగలదు – పూడ్చగలదు”/ జీవితం- కాల నియమాలకు, ఋతువులకు లోబడి ఉండక తప్పదంటారు. “రేపటి దేవులాటలో పల్లె/ ఒక పట్టలేని చరిత్ర/ చిత్రమవుతుంది”/ అకాలమైన వాతావరణ మార్పులకు పల్లెలు కన్నీటి ప్రవాహాలవుతాయని, రేపటి కోసం వెతుక్కునే పల్లె వేదన పట్టలేని చరిత్ర చిత్రంగా మారుతుందని అక్షరమై రోదిస్తారు.

జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనా కొన్ని చిన్న చిన్న సంతోషాలు జీవితాన్ని చిగురింప చేస్తాయని చెప్తూ దాసరి మోహన్ ‘ఆనందాల పొట్లం’ అన్న కవిత” ద్వారా “జీవితం చిలిపిది/ చిన్ని చిన్ని ఆనందాలను/ పొట్లం కట్టుకొని పదిలపరచు కుంటది” అని ఆశావహ దృక్పథాన్ని అందిస్తారు. ‘నువ్వు మరణించలేదు’ అనే కవితలో “నువ్వు మరణించలేదు/ ఎక్కడో నోట వాక్యమై/ నిప్పును రాజేస్తూనే ఉంటావు”/ మరణం దేహానికే కానీ ఆత్మకు కాదన్నట్టు, కవి మరణించినా “నిండు సభలో చప్పట్ల సాక్షిగా/ చెంపలపై దొర్లిపోయే కన్నీటి కవనంగా”/ …మిగిలిపోతాడంటూ…”సుకవి జీవించు ప్రజల నాలుకలయందు”….అనే వాక్యాన్ని గుర్తుకుతెస్తారు.
“చెప్పలేదంటనక పోయేరు ఓ మిత్రులారా” అనే కవితా పంక్తుల్లో ” నీ బతుకు మారదు బరువు మారదు/ తలరాత మారదు జీవితపు నీ నడక మారదు/ అంటున్న వేణు నక్షత్రం. తేదీలు, కాలాలు మారినంత మాత్రాన జీవితం మారనప్పుడు కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఏమని చెప్పాలంటూ మిత్రులతో వాపోతారు. ‘పరుగు పరుగు’ అనే కవితలో “జీవిత ముఖాన్ని చూసుకోవడానికి తీరికే లేదు” అని అవిశ్రాంత మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరిస్తారు.
‘అమ్మ అంటే’ అనే కవితలో ” అనివార్య పరిస్థితుల్లో/ కన్న పేగును సైతం పేలిక కింద/ చెత్త కుప్పల పైన పారుతున్న మురికి కాలువలలో/ వదిలివేస్తున్నారన్న విషయాన్ని దృశ్యమానం చేస్తూ అలాంటి స్థితిలో ఆడవారి నిస్సహాయత పేగు బంధాన్ని కూడా తెంచుతుందని ఆవేదన చెందుతారు వేణుశ్రీ. ‘నేనిపుడెవరిని’ అన్న కవితలో “నరనరాలలోని నారక్తం /
నాది కాకుండా పోతుంది”/ అని ప్రయివేటీకరణను మరణ సముద్రంగా పేర్కొంటారు.
‘తరుగుతో మెరుగు’ అనే కవితలో “రుతువుల సత్యం నిండిన పాఠం/ నాలో గుణపాఠం ఎప్పుడు మొదలైంది/ కాటేసినప్పుడేనా ఈ పాట్లన్నీ/ చలించుట ప్రకృతి ఎప్పుడు నేర్చుకుంది”/ ఇలాంటి వాక్యాలతో సహజసిద్ధంగా జరుగుతున్న వాటన్నింటికీ కారణం ఏది? మంచి చెడులు అన్నింటినీ ఆస్వాదిస్తూ ఉండాలని చెబుతూ, రాలిన ‘మామిడి పండు మధురం/ రాలి పడే మరణంలో ఎందుకు ఉండొద్దని ప్రశ్నిస్తారు అహోబిలం ప్రభాకర్. ‘బరువు ముల్లె’ అన్న కవితలో “ఈడికి పంపినోడవు/ ఇన్ని కొట్టివేతల/ వెతలెందుకు/ ఈ డొక్క నింపనీకి/ ఎంత దద్దరిల్లుదు”/ అంటూ పొట్టకూటికి పేదలు పడే పాట్లను గురించి ఆవేదన వ్యక్తం చేస్తారు.
‘విలువ’ కవితలో “ప్రతి పనికి/మానవీయతను జోడిస్తే/ మహాత్ముడి వవుతావు”…మనం చేసే పనిలో మానవీయ విలువలు ఉండాలని, ‘స్మార్ట్ ఫోన్’ కవితలో “నేను వీడుతానన్నా/ నన్ను వీడనంటున్నది”/ అంటూ స్మార్ట్ ఫోన్ మోజు ఈరోజు మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పిన గజేందర్ రెడ్డి అనేకమందికి జ్ఞాపకాల ముల్లె అయిన ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెబుతూ “ఆకలితో ఉన్నప్పుడు కడుపు నింపింది/ ఉద్యమాలకు అది ఊపిరి అయ్యింది”/ అని తన అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు ‘జ్ఞాపకాలు’ కవితలో
‘ఆలంబన’ కవిత ద్వారా “సముద్రాలు దాటి వచ్చిన ఆలోచన/ నమ్మించి మోసం చేసింది”… “గాలి, నీరు, వెన్నెలను విభజించి పాలించి” బ్రిటీష్ వారి దుర్మార్గపు పాలనను వివరించి, అటువంటి దాన్నుండి విముక్తి పొందిన మనకు ఆ స్వాతంత్ర్య పోరు ఊపిరి కావాలంటారు ఒద్దిరాజు ప్రవీణ్. అంతేకాక ‘ తల్లి సిగలో తంగేడు’ కవితలో “చెరువులు అలుగులు దుంకిన జీవకళ/ పల్లెలు దరువేసిన జానపదం/ ఉపాధి దొరికి మనాది మరచిన జీవితం”…ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణా ప్రజలు హాయిగా జీవితాలను గడుపుతారని చెప్తారు. ‘నది ఎండిపోయాక’
కవితలో “దుఃఖం నుండి దుఃఖం లోకి సుడులు తిరుగుతుంటే/ నాలోకి నేను ఇంకిపోయి/ నీలోకి ఒంపుకోలేకపోయాను”. అంటారు మరోచోట. బాధయొక్క పరాకాష్ఠ ఇది..అద్భుతమైన భావుకత.
‘బతుకమ్మ పండుగ’ కవితలో “మనసు నిండిన పండుగ/ బతుకమ్మ నిండుగ/ నువ్వే లేకుంటే/ ఎన్ని బంధాలు/ నిరర్థకమో”/ తెలంగాణా సంబురం. ఆబాలగోపాలాన్ని అలరించే పండుగ. దాన్ని వర్ణిస్తూ కె. నరసింగం బతుకమ్మ పండుగ మనుషుల కల్మషాలు తొలగిపోయి కలిసిపోతారని, అది లేకుంటే బంధాలన్నీ అర్థం లేనివిగా మారతాయని అంటారు. ‘కళ’ అనే ఇంకో కవితలో “దుర్గమమైన ప్రాసాదంలో/ సైనికులు లేని రక్షణ/ ఆ పక్షి/ కళాత్మక నిర్మాణం” అసామాన్యమైన అల్లికతో గూడు నిర్మించి, తన పిల్లలకు రక్షణ కల్పించే పక్షి కళా నైపుణ్యాన్ని విశ్లేషిస్తారు. ఇది చదివినప్పుడు గుఱ్ఱం జాషువా గారి ‘గిజిగాడు’ గుర్తుకు రాక మానదు.
‘ఊరు’ అనే కవితలో తన ఊరి గొప్పతనాన్ని వర్ణించే గజవెల్లి “ఋషిలా జీవిస్తుంది నా ఊరు/ కృషితో పయనిస్తుంది నా ఊరు/ అనంత చరిత్ర పుటలపై నా ఊరు/ అడుగులు తిరిగి చూసుకుంటుంది”/ అంటూ ఊరు యొక్క అభివృద్ధిని కాంక్షిస్తారు. భారత పౌరులను ఉత్సాహపరుస్తూ ‘మలినం లేని’ అనే కవితలో “మతం గోడలను కూల్చే/ చైతన్య కణాలను నిద్రలేపండి/ కుల మతాలకు అతీతంగా గౌరవించే/ మలినం లేని మరో భారతాన్ని నిర్మించండి” అని కుల మతాల విద్వేషాలను నిరసిస్తారు.
స్త్రీ – సమాజం’ అనే కవితలో “నీవే ఒక శక్తివై/ యుక్తివై/ సుదర్శన చక్రానివై/ నిన్ను నీవు /రక్షించుకో తల్లి”/.. గుండెల్లి ఇస్తారి రాసిన కవితా వాక్యాలివి. ప్రస్తుత సమాజంలో ఎక్కడా రక్షణ లేని స్త్రీ తనను తాను రక్షించుకునే ఆయుధం కావాలని ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తారు. ‘ఎన్నికల పండుగ’ అన్న కవితలో “మిమ్ము ఎదిరించే / ధైర్యాన్ని అమ్ముకున్నాం/ మిమ్ము ప్రశ్నించే / తత్వాన్ని తాకట్టు పెట్టాం”/ ఎన్నికల పండుగ వస్తుంది. పోతుంది. ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. చివరకు ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని మీకోసం కోల్పోయామని నాయకులను నిలదీస్తారు.
స్ఫూర్తిదాత అమ్మ’ అనే కవితను చూస్తే “పురిటి నొప్పులు ఒంటినిండా/ అయినా సంతోషమే కంటినిండా/ ….”ఎన్ని మత్తు మందులు సరిపోవు/ నొప్పులు ఓర్చాలంటే/ మాతృత్వపు మనసు చాలు/ మవునంగా భరించాలంటే”/ అని చెప్తున్న జగ్గయ్య అమ్మతనపు అనురాగాన్ని అందంగా మలిచారు. ఆ మాధుర్యానికి కొలమానం లేదు కదా! “కదులుతేనే కాలమని/ కొనసాగేదే జీవనమని” కాల ప్రవాహంతో కలిసిపోక తప్పదంటారు.
‘ఆమె…చిరునవ్వుల చిరునామా’ అన్న తన కవిత ద్వారా దుగ్గి గాయత్రి “తానిప్పుడు వంటింటి కుందేలు కాదు/ ఆకసమే హద్దుగా ఎదిగిన చిరునవ్వుల చిరునామా ఆమె”/ అంటూ స్త్రీ ఎదుగుతున్న క్రమాన్ని, అవసరమైతే భద్రకాళి అవతరమెత్తి అన్యాయాన్ని ఎదిరించే స్త్రీ సబలత్వాన్ని వివరిస్తారు.
యాదికచ్చిన బాల్యం’ అనే కవితలో ఒకప్పటి బాల్యస్మృతులను నెమరేసుకుంటూ దుర్గ రాములు “చీకు చింత లేని చిరుతల్లా ఊరంతా తిరిగి తిరిగి/ అలసి అరుగులమీద సేద/ అణా పైసా ఖర్చు కాలే సోపతి తేనె తెట్టలా/ సుట్టూ తిరిగె/ అని ఆ కాలాన్ని యాది చేసుకుంటారు. అదే క్రమంలో ‘యువ’తర’మా’ అనే కవితలో ఇంకెన్నాళ్ళు నువ్వొదిలిన పొగలో నీ పొగరును కప్పేస్తావు/ సరిపోదా సరదాల బండి, ఇకనైనా దిగి/ గమ్యంవైపు అడుగువేయి”/ అని నేటి యువతరాన్ని హెచ్చరిస్తారు.
‘గుడ్డముక్క’ కవిత ద్వారా అనుభవాలతో పండిపోయిన జీవితం గుడ్డముక్క లాంటిది. అది శాశ్వతం కాదు. నచ్చినా నచ్చకున్నా పైకి ప్రదర్శించకుండా, గుడ్డముక్క చిరిగితే అతుకులు వేసినట్టు అతుకులు వేసుకోవాలనే భావాన్ని ఎంతో వేదనా భరితంగా చిత్రిస్తారు దేవనపల్లి వీణావాణి. ‘టెర్మినేటర్ సీడ్’ అనే మరో కవితలో పంటలు పండక ఆకలికి అలమటించే రైతుల వెతను “శత్రువు శపథం చేసి టెర్మినేటర్ బీజాల్ని/ దేశం మీదకు వదిలినట్టున్నాడు/ కత్తుల్లేని యుద్ధంలో మారకపు సొమ్ము మింగి/ ఖాళీ డొక్కల్ని వెక్కిరిస్తున్నాడు. అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తారు.

“తవ్విన గతం కుప్పనంతా/ తొవ్వ కోసం/ చూపు దిక్కు మెట్లుగా పేర్చాను/ …’దీప పుంజం’ కవితలో నక్క హరికృష్ణ కలం నుండి వెలువడిన వాక్యాలివి.గతమంతా ఎంత తవ్వినా మళ్లీ మళ్ళీ అవే కనిపిస్తున్నాయని, అందుకే దాన్నంతా ఒక కుప్పగా పోసి భవిష్యత్తు కోసం చూపు ప్రసరించానంటారు. “చావు పుట్టుకలు/ పుట్టి చచ్చేందుకే కాదని /జీవిత చక్రానికి మర్మ గర్భ ప్రతిబింబమైంది”/ అని “ఎండుటాకు తను రాలిపోతూ కొత్త ఆత్మను నింపుకొని నేలను మెత్తగా స్పర్శిస్తుందని” ‘ఎండుటాకు’ కవితలో తాత్వికతను దర్శిస్తారు.
‘ఆరోజొకటి రావాలి’ కవితలో చెట్టు,మనిషికి అనేకరకాలుగా ఉపయోగపడుతూ మరణించిన తర్వాత దేహాన్ని కాల్చడానికి కూడా తన దేహాన్ని త్యాగం చేస్తుందని చెప్తూ నరేశ్ చారి “నీకోసం నువ్వు బ్రతికేరోజు రావాలి/ నిన్ను నేలపై కాకుండా/ మనిషి తన గుండెల్లో నాటుకునే రోజు రావాలి”/ అంటూ మనిషిలోని మార్పును ఆకాంక్షిస్తారు. ‘రమ్మంటుందనే’ కవితలో మనిషి తనకు తెలియకుండానే సమయాన్ని వృధా చేస్తున్నాడంటూ ” వేళ్ళ సందుల్లోంచి ఇసుక జారిపోయినట్టు/ కాలం నీ చేతి నుండి జారిపోతుంది/ అప్పుడు నీ కన్నీళ్ళు కాలువలై/ ఉప్పు నీటి సముద్రాలను తయారుచేస్తాయి”/ అందుకే ఇకనైనా జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తారు.
నల్లగొండ రమేష్ రాసిన ‘సముద్రమంత దుఃఖం’ కవితలో అతివృష్టికి పొలమంతా నిండిన నీళ్లే కాదు, రైతు కన్నీటి ప్రవాహం కూడా కలిసిపోతుంది. అప్పటిదాకా తొలకరి కోసం కాపు గాచిన రైతు గుండెల్లో దిగులు మబ్బులు కమ్ముకుంటాయి. ఆ బాధను మనసులకు హత్తుకునేటట్టు “పొలమంతా నిండింది వాననీరు/ కర్షకుడి కంట కట్టతెగింది కంటినీరు”/ అంటారు. అలాగే అందరికీ అన్నం పెట్టే అన్నదాత/ దుక్కి దున్నిన పొలంలో/ దుఃఖం పాడుకుంటున్న ఏకాకి ఇపుడు”/ ఆ ఒంటరి బాటసారికి తోడు ఎవ్వరూ లేరంటూ వాపోతారు.
ఇక బక్కారెడ్డి తన ‘కవి’ అనే కవితలో “కాలాన్ని సిరగా నింపుకొని/ ఒడువని కాలాన్ని ఒడుపుగా/ మనోఫలకాలపై ఒంపుతాడు/ ఒక కవి రాసే కవిత్వాన్ని వ్యక్తీకరిస్తూ కవి తాను కాలాన్నే సిరాగా మార్చుకొని, చక్రంలా తిరిగే కాలాన్ని కూడా ఒడుపుగా పట్టుకొని మనసుల్లోకి ఒంపే ప్రయత్నం చేస్తాడని కవితావిష్కరణ చేస్తారు. ఎన్నికల్లో ఓటరులను ఆకట్టుకోవడానికి పాదయాత్రలు చేయడం, వాగ్దానాలు చేయటాన్ని విమర్శిస్తూ ‘పాదయాత్రలు’ అనే కవితతో ” అధికార అందలమెక్కిస్తారే గాని/ శాపాలు పెట్టలేని అమాయక దేవుళ్ళు” అని ప్రజలు ఓట్లు వేసి నమ్మకంతో వారిని గెలిపిస్తారు కానీ నచ్చకుంటే ఏమీ చేయలేని అమాయకులు అని ఆవేదన చెందుతారు.
బండారు పుష్పలత ‘బాల్యాన్ని వెతకాలి’ కవితలో ఆనాటికీ, ఈనాటికి వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల పిల్లలకు బాల్యం కరువైతున్నదని, పిల్లలు రోజంతా ఆటా పాటా లేక ఇరుకైన మనసులుగా మారుతున్నారని చెప్తూ “పోయిన బాల్యాన్ని వెతకాలంటూ “ఆహ్లాదం ఎరుగక మానసికంగా కుంగిన జీవితాలు”/ ఎంతో బాధగా బాల్యాన్ని తిరిగి రమ్మంటూ కోరుతారు.
తన బిడ్డ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే ఆనందానుభూతుల్ని పొందిన కన్నతల్లి కొడుకుతో పాటుగా ఎగరాలనుకుంటే “కన్నకొడుకే ఎగరలేవని/ వదిలేస్తూ ఉంటే/ ఆశాపాశం వదిలి/ ఆ తల్లికి ఎగరాలనివుంది”/ అన్న భానుజ కవిత్వంలో ఇంటింటి తల్లి కథ, కన్నీటి వెత మనసును కరిగిస్తుంది. కరోనా తీరని కష్టనష్టాలను మిగిల్చినా ” మమతల ప్రపంచంతో నిండిన కుటుంబంతో/ మమతను పంచుకునే సమయం”/ అని మానవ సంబంధాల విలువను మనుషులు తెలుసుకోవాలన్న ఆశను వ్యక్తం చేస్తారు.
“నీ కోసం ఒక్క కవితను ప్రసవించలేకపోయానే అని/ మసక మసకగా ఉన్న గుండె అద్దాన్ని తుడిచి/ నన్ను నాకు కొత్తగా చూపించావు”/ అంటారు ముదిగొండ సంతోష్ తన ‘ కవితావాక్యం’ కవితలో. అక్షరాలను అందంగా అల్లాలన్న కోరికను వ్యక్తం చేస్తున్న కవితా హృదయం అతనిది. రాత్రి అనేది ఒక చీకటి ప్రపంచం. అందులో ఏదైనా జరగొచ్చు. అందుకే రాత్రిని వర్ణిస్తూ “ఈ నల్లని రాత్రి/ గుండెల్ని పిండేస్తూ/ రోదనగా వేదన గుమ్మరిస్తున్న ఈ రాత్రి”/..”నక్షత్రాలను నేల రాలుస్తూ/ ఇంకా విరగబడి నవ్వుతుంది”/ చీకటి మాటున జరిగే ఎన్నో కఠోర సత్యాలకు ఆవేదన చెందుతూ” ఈ రాత్రిని తగలబెట్టాలి. కొత్త కాగడాను వెలిగించాలి”/ ఉద్యమించమని ‘దీర్ఘరాత్రి’ కవితలో ప్రేరేపిస్తారు.
‘మనసుతోనే గెలవాలి’ కవితలో ఎం.రామదాసు “నా తల్లి గర్భంలో నేను పెరుగుతున్నప్పుడు/ నా చుట్టూ ఉమ్మనీరు సముద్రం/ అవనిపై నేను అడుగేసినప్పుడు/ నా చుట్టూ ఉప్పునీటి సంద్రం”/ తల్లి గర్భంలో ఈదులాడిన మనిషి కుల మత వ్యవస్థ, అవస్థల్లో జీవన సముద్రంలో ఈదుతుంటాడు. దాని నుండి బయటపడి ఐకమత్యంగా మెలగమని సూచిస్తారు. ‘నిండుదనం’ కవితలో “నిన్నటి అబద్ధం/ నేడు సత్యం/ మరి రేపటిది ఊహ”/ ఇవన్నీ సహజం. కానీ అందరూ కలిసి మెలిసి ఉండడమే జీవితం అని సందేశాన్ని అందిస్తారు.
రుక్సానా రాసిన “మా మతం వారి అభిమతం ఒకటి కాదు” అన్న కవితలో “మతం కన్నా మాతృభూమికి విలువ ఇచ్చి, బ్రతుకుతున్న వాళ్ళం/ మానవత్వం లేని వాడికి మతం ఆపాదించి, మాతో కలపొద్దు”/ అంటూ మతాల మధ్య చిచ్చు పెరిగి ఏదో ఒక మతాన్ని తప్పు పట్టేవాళ్ళను నిరసించే గొంతుక వినిపిస్తుంది.
“కాలుతున్న కాలం సాక్షిగా’ కవితలో డా.వి.శంకర్ “నువ్వు నువ్వుగా నిలబడడం ఎంత కష్టమో/ ఒక్కొక్కటే అనుభవంలోకి వస్తుంది/ చీకటిని అలంకరించుకున్న మూఢత్వం/ అడుగడుగునా నిన్ను శీల పరీక్షకు గురి చేస్తుంది/ అంటూ సమాజంలో మనిషి ఎలా బతకాలనుకున్నా చుట్టూ వున్నవాళ్లు ఏవిధంగా ఉంటారన్న సత్యాన్ని విప్పి చెబుతారు.
డా. సరోజ వింజామర కవిత ‘ ప్రశ్నించే గొంతుక’ లో ” ఎందుకు అన్నీ భరించే భూదేవినే అవాలి/ ఎత్తి పడేసే ప్రళయం ఎందుకు కాకూడదు/ అంటూ అలనాటి నుండి స్త్రీ మాత్రమే అన్నింటినీ భరించి సహనశీలిలా ఎందుకుండాలని? సమాజాన్ని ప్రశ్నిస్తారు. ఒకవైపు ఇలా రాస్తూనే మరోవైపు పురుషుల పక్షం వహించి ‘ప్రతిస్పందన’ కవితలో వారికీ సమన్యాయం కావాలంటారు.
డా. సాలగ్రామగిరి ‘అలసిపోని పాదాలు’ కవితలో ఆడవారి పాదాలు జీవితమనే బాటలో ఎంత నడక సాగిస్తాయో తెలుపుతూ ఎవరి వెనకో ఆ పాదాలు ఉండకూడదని, ” నాతో సమానంగానో నాకు ముందు గానో/ నడవమని అంటాడేమోనని ఎదురుచూస్తున్నా/ అని స్త్రీ ఆవేదనకు అద్దం పడతారు. “మెరుగైన సమాజం కోసం” కవితలో “చట్టసభల్లో నిద్దరోతున్న సార్ల

గురకనడుగు/ సంక్షేమపథకాల అమలు ఏపాటో చెబుతోంది” అని నేటి చట్టసభల తీరును ఎండగడతారు.
‘ఆగమైపాయె’ కవితలో రైతు వ్యధల్ని వినిపిస్తున్న సోమశిల తిరుపాల్ “వరి పంట ఇంకెవ్వరేస్తారు చెప్పూ/ అన్నదాతలు కాడి కిందకు దింపితే/ అంటూ రైతు పండించడం మానేస్తే మనగతి ఏమవుతుందని ప్రభుత్వం రైతులను పట్టించుకోని విధానాన్ని నిరసిస్తారు. ‘మారలే’ కవితలో ” కదిలే సాధనం మారింది కానీ నలిగే బతుకులు మారలే” అని
ప్రగతి ఎంత సాధించినా ఆకలి బతుకులు మారలేదని
ఆవేదన వ్యక్తం చేస్తారు.
ఈవిధంగా తమ కవితా పాటవాలతో అందరి మనసులను రంజింపజేస్తున్న ఈ కవులు, కవయిత్రుల కలాల నుండి ఇంకా ఎన్నో కవితా మకరందాలు వెలు వడాలని ఆకాంక్షిస్తున్నాను.

July 19, 2023 229 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us