మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

అమృత బిందువు

by mayuukha May 11, 2023
written by mayuukha

 దట్టమైన మబ్బులు పరుచుకున్నాయి. చిరుజల్లు వానకురుస్తుంది చిరుజల్లుల్లో తడిసిన నేలతల్లి తన పరిమాళన్ని గాలి ద్వారా లోకంలో వెదజల్లుతుంది. వర్షం నీటిలో తడిసిన చెట్లు, ఆకులు పువ్వులు ఆనందంలో ఒకకొమ్మ పై మరోకొమ్మ వంగి గుసగుసలాడుతుంటే పుష్పాలు తమ మకరందమును పంచుతూ ఆనందడోలికల్లో తెలియాడుతున్నాయి. అంతలోనే పెద్ద ఉరుము ఆ వెంటనే మెరుపులు ఒక్కసారి వాతవరణమును భయకపితులను చేసింది. వీది దీపాలు వస్తూ పోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటోరిక్షా కిర్రుమంటు శబ్ధం చేసుకుంటు గాంధీ బొమ్మ వద్దకు వచ్చి ఆగింది. ఆటు, ఇటు చూసి అందులోని మనుష్యులు వెనుదిరిగిపోయారు. వారు వెళ్ళి తరువాత జల్లువాన కాస్త జడివానగా మారింది. ఆమసక వెలుతురులో ఎదో నీడ కన్పిపించింది. మూడుకాళ్ళ (చేతికర్ర)ను అసరచేసుకొని అడుగులో అడుగువేసుకుంటు నెమ్మదిగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంది. పైన కాస్త కప్పు ఉండటము వల్ల తడిసిన చీర చెంగును పర్చుకొని తన చేతులనే తలగడగా చేసుకొని, కాళ్ళు కడుపులోకి ముడ్చుకొని గాంధీ తాత వైపుచూడసాగింది. మహత్మ ఏమిటి ఈ కాలం? నీవు కోరుకున్న ఆహింస సమాజం? ఎక్కడ? ధర్మ నమసిపోతుంది. “ఏది జీవితం, ఏది మృత్యువు, ఏది నరకం”. అని ఆనాడు శ్రీశ్రీమహకవి అన్నారు “మాయమవుతున్నాడమ్మ మనిషన్నవాడు” అని నేటికాలంలో అందెశ్రీ గారు పాట రాశాడు. ఈనాటి నాస్థితి మరణమా! నరకమా, మృత్యువా తెలియకుంది బాపు నీవు మళ్లీ జన్మిస్తావా! మాలాంటి వాళ్ళు ఎందరో వున్నారు. వారికి జీవన విముక్తినైన ఇవ్వు, లేదా జీవనరక్షణనైనా ఇవ్వు కానీ ‘అంపశమ్య బ్రతుకులు బ్రతకలేకున్నాము. మానవుడు రాకెట్ ప్రయోగము చేస్తున్నాడు. ఖగోళ పరిశోధనలు చేస్తున్నారు. కాని కన్నవారి ఆత్మఘోష పరిశోధన చేయడం లేదు. నీవు ఎవరిలోనైన పరకాయ ప్రవేశం చేసి మాలాంటి వారికి ఆత్మశాంతి కల్గించు అంటు మౌనంగా కళ్ళ నుండి నీరు ధారపాతంగా ప్రవాహిస్తు ఉండగా మగతగా కళ్ళు మూతలు పడిపోయాయి.

బళ్ళున తెల్లవారింది గాంధి బొమ్మ దగ్గర పిల్ల పెద్ద, ముసలి అందరు గుమిగూడరు ఎదో అలజడిగా, అందోళనగా వుంది. నాకు మెలకువ వచ్చింది. రాత్రి కలలోని నుండి బయటకు రాలేదు. కాని ఎదురుగా గుంపు దగ్గరకు పోయి చూశాను నేను రాత్రి కలలో చూచిన హృదయ విచారకర దృశ్యం సాక్షాత్తుగా నాఎదుట ఉంది. అందరు తలో మాట అంటున్నారు అసలు ‘ఉపిరి’ వుందా! లేదా? అనే ‘సందేహం’ నేను దగ్గరికి వెళ్ళెలోపే వేరే వారు నాడీ పరిక్ష, శ్వాస చూసి బ్రతికె ఉందని ఋజువు చేశారు. అక్కడ చేరిన వారిలో సగం మంది వెళ్ళిపోయారు. మిగతవారు తమ ఇళ్ళల్లోకి వెళ్ళి ఒకరు నీళ్ళు తెచ్చి ముఖం పై చల్లీ త్రాగించారు. నేను వేడిగా పాలు తీసుకునిపోయి త్రాగించాను. అవ్వ కాస్త కోలుకున్నది. కానీ ఆమె బట్టలు అన్ని తడిసి పోయి ఉన్నాయి. మరో తల్లి పొడి బట్టలు తెచ్చింది. కట్టించాము. మాకు సూర్యకిరణాల నులివెచ్చధనము తోడునిల్చింది దాంతో అవ్వది మంచి జుట్టు ఆ జుట్టుకాస్త సరిచేసి పైకి ముడిచి పెట్టాము. పర్వాలేదు అసరా ఇస్తే కూర్చుంది. నీ పేరు ఏంటి? అవ్వ అని అడిగాము చెప్పటానికి కాస్త తటపటాయించింది. కాసేపటికి “రాజమ్మ” అని చెప్పింది. ఇంక వివరాలు అడిగితె చెప్పటానికి నిరాకరించింది. మేము బలవంతం చేయ చేయలేదు. నా ఫ్రెండ్ డా|| రామిరెడ్డి గారికి ఫోన్ చేసింది. డాక్టరు గారు వచ్చి ‘ఉలన్ కంబలి కప్పి’ బలానికి టానిక్ ఇచ్చి వెళ్ళారు. కాసేపటికి అవ్వకు బోజనం పెట్టి టానిక్ ఇచ్చి పడుకోబెట్టాము. రాత్రికి పగలుకు ఎంత తేడానో అవ్వకూడ అదే తేడాతో మనస్సులో మదనపడ్తునే వుంది. గతం తాలుకు వైభవం తన సంతానం, వారి వృద్ధి ఆనంద, తన భాగస్వామి సహచర్యం అన్ని కళ్ళముందు కదలాడుతున్నట్లున్నాయి. కళ్ళు మూసుకొనే వున్నాయి కాని కంటి కొనలనుండి నీరు కారిపోతుంది. అది గమనించి మేము అవ్వను కాసేపు ఒంటరిగానే ఒదిలేశాము.

సాయంకాలం వేళ పిల్లలు అందరు స్కూల్ వదలగానే గాంధీ బొమ్మ దగ్గర చేరి ఆడుకుంటారు కాని ఆరోజు వారు అవ్వనుచూసి కాస్త బెరుకుగానే వున్నారు. ఇంతలో చింటూ గాడు దగ్గరకు పోయి అవ్వ మాతో ఆడుకుంటావా. చాక్లెట్ ఇస్తాను అన్నాడు. అవ్వ మోహంలో ఎదో తెలియని వెలుగు కన్పిపించింది. చాక్లెట్ తీసుకొని చింటూగాడి నోట్లోపెడ్తూ నాకు పళ్ళులేవు నాయన నీవే తిను అంది. అయితే ఐస్క్రీమ్ తింటావా అంటు నానిగాడు వచ్చాడు. అవ్వనవ్వుతు వారించింది. అలా కాసేపు పిల్లలు అవ్వతో గడిపి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళి పోయారు. ‘టీగ్లాస్’ తీసుకొని నేను అవ్వ దగ్గరకు పోయి గ్లాసు నోటికి అందించా ఎంతో కృతఘ్నత భావంతో నావైపు చూస్తు ‘టీ’ తాగింది అవ్వ. అవ్వతాత పేరు చెప్పు అన్నాను. అవ్వ సిగ్గుపడి పోయి కాసేపు ఆగి “రామచంద్రయ్య” అని చెప్పింది. ఇంక నెమ్మదిగా వివరాల్లోకి వెళ్లాను. ఎక్కడినుండి వచ్చావు నీవు నీకు ఎవరు లేరా! అని అడిగినాను. ఓక్షణం మౌనం రాజ్యమేలింది. నెమ్మదిగా తనకు ఓకొడుకు, కూతురు ఉన్నారని, ఈ మధ్యనే తనకొడుకు చనిపోయాడని అతనికి నల్గురు కూతుళ్లు అని, తన కూతురు మరో ఊరిలో స్థిరపడిందని చెప్పింది కళ్ళ నీళ్ళతో. ఇంక వివరాలు అడిగితే రెండు చేతులు జోడించి దండం పెడ్తూ అడగవద్దని వారికి చెడ్డ పేరు వద్దని వారించింది. దాదాపు 90సంవత్సరాల వయస్సులో వున్న ఆతల్లి మనసా, వాంచ తన వారి కుటుంబ క్షేమంనే కోరుతుంది. తప్ప మరో ఆలోచనలేదు. అదేకాబోలు తల్లిప్రేమ భూమాతలా ఎన్నితప్పులు చేసిన క్షమిస్తుంది. ఇక్కడికి ఎలా వచ్చావంటే దాదాపు 40కీ, లో మీటర్లు నడిచి వచ్చానని చెప్పింది. ఆమాట విన్న ప్రతి హృదయం చలించిపోయింది. ఒకరి మెహలు ఒకరు చూసుకుంటు అవ్వ ద్గర ఉన్న వాకింగ్ స్టాండ్ అది కూడ చాలపాతది దాంతో ఇంత దూరం తలుచుకుంటేనేమైండ్ ఓక్షణం పనిచేయడం మానేసింది. అవ్వకు రాత్రి బోజనం ఏర్పాటు చేసినాము. ఎవరింట్లోనైనా వుండు రమ్మని అడిగాము అవ్వ ఓప్పుకోలేదు. దాంతో పడకకు కావలసి ఏర్పాట్లు కూడా చేశాము.

ఇంటికొచ్చి పడుకున్నాను పైనా ఫ్యాన్ తిరుగుతుంది. నాలో ఆలోచనలు కూడ అంతే స్వీడ్గా తిరుగుతున్నాయి. స్త్రీ జన్మఇంతేనా లేక మానవజన్మనే ఇంతనా. ముసలి తనం వరమా! శాపమా! యవ్వనము బాధ్యతలతో గడిచిపోతుంది. బాల్యము చదువుతో, నడివయస్సు నల్లేరు మీద బండి అయితే ముసలి తన అంపశయ్య మీద ఎదురు చూపులా! ఎంటి ఈసృష్టి దీనికి పరిష్కరము లేదా లాంటి ఎన్నో ఆలోచనలు మనస్సు నిండా తేనేటిగల్లా ముసురుకున్నాయి. ఆలోచనల్తో ఎపుడు నిద్రపోయానో నాకే తెలియదు. ఫోన్ మ్రోగుతుంది ఎక్కడో లీలాగా విన్పిస్తుంది నిద్రమత్తు వీడలేదు అదే పనిగా సెల్ఫోన్ మోగుతూనె వుంది దాంతో మెలకువలోకి వచ్చి ఫోన్ ఆన్ చేసి మాట్లాడిన రాత్రి ఎవరో ఇద్దరు మనుష్యులు వచ్చి అవ్వను కొట్టపోయారంట దారిన పోతున్న వారు చూసి వాళ్లను పట్టుకొని పోలీసులకు అప్పగింస్తానంటే అవ్వ ఓప్పుకోలేదట ఇంతలో వారు పారిపోయారంటా నా ఫ్రెండ్ చెప్పిన విషయం. అప్పుడు అర్థం అయింది అవ్వను ఎవరో కాదు తన కుటుంబ సభ్యులే ఇలా చేస్తున్నరని అయిన అవ్వ వారిని క్షమిస్తుంది. ఎందుకు తన మనవారాళ్ళ కోసమా! తన కన్నపేగు దూరం అయిన తన వారసులైన క్షేమంగా వుండలని కాబోలు ఏదిఏమైన అవ్వగతం తెలుసుకోవాలని దాన్ని గూర్చి ఆలోచన చేశాను.

అవ్వ పుట్టింటివాళ్ల ఓరకంగా ధనవంతులే అమెకు పసుపుకుంకువ కింద కాస్తపొలం ఇచ్చారు. ఒకతె కూతురు కావడం వల్ల ఓ బంగళా కూడ ఇచ్చారు. దాంతో ఆ ఇంట్లోనే తను తన భర్తతో కల్సి కాపురం చేశారు. పిల్లలు లేకపోవడంతో ఒక అబ్బాయిని తెచ్చుకొని పెంచుకుంది. అతనికి రాఘవ అని పేరుపెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సమయంలోనే రాజవ్వకు ఓ కూతురు జన్మినించింది. ఇద్దరిని రెండు కళ్ళగా భావించి వారి బావితరానికి చక్కటి బాటలు వేయాలని రాజవ్వ, రామచంద్రయ్య దంపతులు ఎన్నో కలలు కనడమే కాకుండా వాటిని అచరణలో పెట్టడానికి సాయశక్తులు కృషి చేశారు. వారి ఆశలకు తగ్గట్టుగానే రాఘవ, రమ్య ఇద్దరు చక్కని రూపం, తెలివితో చదువులోను ముందుండేవారు. ఒకసారి రాఘవకు విపరీతమైన జ్వరం వచ్చింది. పరిస్థితి ఆందోళనకరంగా మారగ డాక్టర్ గారు భగవంతునిపై భారం వేశారు. ఆసమయంలో రాజమ్వ తనకులదైవం అయిన అమ్మవార్ని పూజిస్తూ మోకాలిపైనా 108 ప్రదక్షణాలు చేసింది. మోకాళ్ల నుండి రక్తం కారుతున్న లెక్క చేయలేదు. ఉపవాసాలు, దీక్షలుచేసింది. ఇలా ఓవారం రోజుల పూజలానంతరం, డాక్టర్లు వైద్య ఫలితంమో రాఘవ కళ్ళుతెరచి అమ్మ! ఆకలి అన్నాడు. పట్టరాని సంతోషంతో రాజవ్వ వేడి వేడి అన్నం తినిపించింది. అలా కొడుకు కడుపు నిండా తిటుంటే రాజవ్వ పడిన కష్టం, తన ఆకలి మర్చిపోయింది. రాజవ్వ కొడుకును ఒళ్ళో పడుకో పెట్టుకొని దేవుని కథలు, చందమామకథలు చెప్పసాగింది. వాడికి ఇష్టమైన అన్ని వండి పెడుతుంది. ప్రతిరోజు ఒక్కోరకంగా వారం పది రోజుల్లో వాడుమాములు మనిషైయ్యాడు. ఎవరు కన్నబిడ్డ అయినప్పటికి రాఘవ తనబిడ్డ అనుకుంది. ఎందుకంటే రాఘవ మూసినకన్ను తెరవకుండ జ్వరంతో పడివున్న రోజుల్లో డాక్టరు గారు రక్తం కావాలి రాఘవకు రక్తంలేదు అన్నారు. ముందు వెనుక ఆలోచిచంకుండ రాజవ్వ తన రక్తం ఎంత కావలన్న తీసుకొండి కాని నా రాఘవ బ్రతకాలి వాడు లేకుంటే నేను బ్రతకలేను అని బోరున ఏడ్చింది. అలాంటి సందర్భంలో రాజవ్వ తన రక్తం రాఘవకు పంచి నిజంగానే కన్నతల్లి అయింది. ఇపుడు రాఘవ సంపూర్ణంగా రాజవ్వ కొడుకు ఆనాటి నుండి రాఘవకు కూడ ఎలాంటి అనారోగ్యం కల్గులేదు. తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూస్తూ జీవనం సాగిస్తున్న రాజవ్వ భర్త పొరుగు వూళ్లో వ్యాపారం బాగా సాగితే కొన్నాళ్ళ వరకు ఇంటికే రారు. వ్యాపారం తక్కువ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి రాజవ్వతోను, పిల్లలతోను సంతోషంగా ఉండేవాడు. రాజవ్వ ఏరంగుచీర కట్టుకుంటే ఎంత అందంగా ఆనందంగా వుంటుందో రామచంద్రయ్యకు బాగా తెల్సు. దానికి తోడు మెడలో కాసుల పేరు, తలలో మల్లెపూవ్వులు, చేతి నిండా గాజులు, పెద్ద కుంకుమబొట్టు, కళ్లకు కాటుకతో చూడగానే చేతెలెత్తిమెక్కెలానే వినయంగల రూపం రాజవ్వది. చుట్టు ప్రక్కల వారికి ఎంతో గౌరవం అభిమానం కూడ, గిట్టనివారికి రాజవ్వ ఆత్మాభిమానం గర్వంగా కన్పిస్తుంది. కాని సున్నితమైన మనస్సు తన కోసం తాను ఏనాడు ఆలోచించుకోదు. అడిగిన వారికి లేదనకుంటా తన చేతనైన సహాయం చేస్తూ తనపని తాను చేసుకుంటూ జీవనం గడిపేది. ఇలా కొంత కాలానికి రాఘవకు యుక్త వయస్సుతో పాటు ఉద్యోగము వచ్చింది. రమ్యకు కూడా పెండ్లి చేయాల్సిన సమయం వచ్చింది. అందమైన చదువకున్న రమ్యకు తగిన వరుడ్ని చూసి కాస్త ధనవంతుల ఇంటికోడలిగా చేసింది. ఇంక మిగిలింది రాఘవ.

ఓరోజు రామచంద్రయ్య రాఘవ పెండ్లి ప్రస్తవం తెచ్చారు. రాఘవ! చెల్లి పెండ్లి అయింది. ఇంక నీకు కూడ పెండ్లిచేస్తే మా బాధ్యత తీరుతుంది. మాకు కూడ వయస్సు మీదపడ్తుంది అన్నారు. అప్పటి వరకు అమాయకంగా అమ్మచాటు పిల్లాడిలా వుండే రాఘవ పెండ్లిమాటలు వచ్చే సరికి ఎలాంటి సంకోచము లేకుండ, నాన్న నేను క్లాస్ ఎపుడు ఫస్ట్ గా వుండేవాన్ని మీకు తెస్సు కదా. నాతోపాటు టాప్ ర్యాంకర్గా ఓ అమ్మాయి అదే ధరణి నాన్న మేము ఇద్దరము పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అన్నారు. ఆమాటలు విన్న శ్రీమతిశ్రీ రామచంద్రయ్య గార్లు విస్తుపోయారు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అన్నారు. సందర్భం రాలేదు కదా నాన్నగారు. ఇప్పుడు మీరు పెండ్లి విషయాలు మాట్లాడుతుంటే చెప్పలనిపించింది అన్నాడు. ఈ దంపతులు ఒకరిమోహలు ఒకరు చూసుకుంటు చేసేది ఏమి లేదు అనుకున్నారు కాబోలు రాఘవ ఇష్టప్రకారమే ధరణితో వివాహం జరిపారు. అంత సవ్యంగానే జరుగుతుంది. రాఘవ, ధరణి మంచిజీతం గల ఉద్యోగస్తులు అయ్యి ఇద్దరు సంపాదన పరులైయ్యారు.

రమ్యకు ఇద్దరు పిల్లలు వారు తమ సంసారంలో సుఖంగానే వున్నారు. రాఘవకు ఇద్దరు అమ్మాయిలు మూడో కాన్పు దగ్గరకు వస్తుంది. ఇసారైన ఫ్యామిలి ఫ్లానింగ్ చేసుకోమని రామచంద్రయ్య తనకొడుకుకు సలహా ఇచ్చారు కాని ధరణి తల్లి అందుకు ససేమిరా ఓప్పుకోలేదు “పున్నమనరకము” నుండి కాపాడె కొడుకు లేకుండ ఎలామరో సారి చూద్దాము అంటు రామచంద్రయ్య మాటలను త్రోసి పుచ్చింది. నల్గువ సారి కూడ అమ్మాయే ఇలా నల్గురు అమ్మాయిలకు తండ్రిగా రాఘవ. అమ్మ వార్లు అందరు తమ ఇంట్లోనే వున్నారని రాజవ్వ సంబరపడిపోతు వారి కోసం పొదుపు చేయటం మొదలు పెట్టింది. తన పుట్టింటి వారు ఇచ్చిన పొలం, ఇల్లు చాలా ఖరీదైన ఆస్తులుగా ఎదిగినాయి.

ఆకస్మాతుగా రామచంద్రయ్య గారి ఆరోగ్యము క్షీణించసాగింది వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య కుదుట పడ్తునే వుంది. అంతలోనే మళ్ళి వ్యాదీ తిరగపడ్తుంది. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. రామచంద్రయ్య వ్యాపారం బాగా సాగిన రోజుల్లో చాల డబ్బు రాజవ్వ పేరున వుంచారు. కొంత రామచంద్రయ్య వైద్యానికి ఖర్చు అయిన చాలా సొమ్ము రాజవ్వ పేరునే వుంది. ఇంట్లో ధరణి పెత్తనం మితిమీరటం ఆసొమ్ము తన పిల్లలకు తనకు కావలని ఇంట్లో గొడవలు మొదలైనాయి. రాఘవ కూడ భార్యకు తోడుగానే వున్నాడు.

ఈ ఇలాంటి సందర్భాలు అందరికి సహజమే కాబట్టి రామచంద్రయ్య దంపతులు కూతురు అల్లుడిని పిలిచి పాత ఇల్లు కూతురికి, పొలం తాలుకుహక్కును మాత్రం రాఘవకు ఇచ్చారు. రాజవ్వ పేరున ఆస్తులు మాత్రం అమె బతికి ఉన్నంత కాలం ఆమెకు చెందాలని వీలునామా రాయించారు. అప్పటికి గొడవ సద్దుమణిగినప్పటికీ మానసికంగా రామచంద్రయ్య చాల కృంగిపొసాగాడు. రాజవ్వ ఎంత దైర్యం చెప్పిన అతని మానసిక రోగం తగ్గుముఖం పట్టలేదు. కొంత కాలానికి రాజవ్వను ఒంటరిదాన్ని చేసి రామాచంద్రయ్య పై లోకానికి వెళ్ళిపోయాడు. తాత చనిపోయిన సంవత్సరంలో ఆడ పిల్ల పెళ్ళి చేసి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే నమ్మకంతో రాఘవ ఇద్దరు అమ్మాయిల పెండ్లి ఒకేసారి చేశారు. పొలంలో కొంత భాగం అమ్మివేసి మరికొంత వారి ఆదాయంతో అప్పటికే రాజవ్వ వంటి మీది నగలు మాయమైనాయి. భార్య పిల్లలు ఖర్చులు భరించలేక లంచం తీసుకోవడం వల్ల అనుకొని పరిస్థితుల్లో రాఘవ ఉద్యోగం నుండి తీసివేయబడ్డాడు. దాంతో ఇంక ఇద్దరు అమ్మాయిల పెండ్లిళ్ళు చేయ్యాలి. ఎలా అని మానసికంగా మధనపడ్తూ అనారోగ్యం కొని తెచ్చుకున్నాడు. భార్య ధరణి మాత్రం తనకు ఇంక ఎదురులేదని తనదే పెత్తానం అన్నట్లు ఆమె ప్రవర్తన రోజురోజుకు శృతి మించి పోతుంది. రాజవ్వ పై ఒత్తిడి తీసుకరాసాగింది. డబ్బు మిగిలిన నగలు ఇస్తే తన కూతుళ్ళ పెండ్లి చేస్తానని నిస్సహాయ స్థితిలో రాఘవ ఉన్నాడు.

అనుకున్నట్లుగానే మిగిలిన పొలం రాజవ్వ నగలతో మరో ఇద్దరు అమ్మాయిల పెండ్లి ఘనంగా జరిపారు. కొంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది. అప్పు చేశారు కాని ఎలా తీర్చాలో అనే ఆలోచన లేదు. కొంత కాలానికి అప్పుల వాళ్ళ అగడాలు ఎక్కువైనాయి. రాఘవ ఏమి తోచ్చని స్థితిలో తన నాన్న గారి వ్యాపారం చేయసాగారు. కుటుంబానికి దూరంగా వుంటూ అలవాటులేని వ్యాపారం కాబట్టి లాభల కన్న నష్టలే ఎక్కువైనాయి ఉన్న అప్పులు తీర్చలేదు సరికదా కొత్త అప్పులు చేయడం జరిగింది. రాజవ్వకు వయస్సు మీదపడి కంటిచూపు మందగించింది. నడవలేని స్థితిలోకి వచ్చింది. కాని తన భర్త రామచంద్రయ్య మాట ప్రకారం తన వద్దనున్న డబ్బును తన మనవారళ్ళ పిల్లలకు ఇవ్వాలని భద్రపర్చసాగింది. కాని వాటికై కోడలు, కొడుకు ప్రతిరోజు హింసించడం మొదలుపెట్టారు.

ఓరోజు ఇంట్లో అందరు గొల్లుమని ఎడ్చుస్తున్నారు. రాజవ్వ అప్పుడే నిద్రలో నుండి మెల్కొని కళ్ళజోడు సవరించుకుంటూ కిందకు వచ్చి చూసింది. తనబిడ్డ రాఘవ చలనం లేకుండ పడివున్నాడు. తన రక్తం ధారపోసి బ్రతికిచుకున్న వాడు ఈనాడు వాడి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరు కలిసి నన్ను ఒంటరి దాన్ని చేశారు అనుకుంటు ఆచేతనంగా కూలబడింది. కళ్లవెంట నీళ్ళురావడం లేదు ఎందుకంటే రాఘవకువ తను ఎడిస్తే చూడలేదు. మౌనగంగలా తనలో తానే వేదన తరంగాలను అదుపు చేసుకుంటుంది. జరగాల్సిన కార్యక్రమాలు జరిపించారు.

కొడుకు తనప్రాణం దూరం అయ్యాడు. తట్టుకొనిలేని హృదయం రాత్రి పగళ్ళు విలపిస్తునే వుంది. అలా చీకటి గదిలో ఎన్ని రోజులు వుందో తనకే తెలియదు. ఓ రోజు గదిలో లైటు వెలిగింది. రాఘవ పెద్ద కూతురు వచ్చింది. తన భుజం పైనచేయి వేసింది. రాఘవ స్పర్శలా అన్పించి మనస్సుకు కాస్త ఊరట కల్గింది. చేతిలో బాబు వున్నాడు ఒళ్లోకి తీసుకుంది. మా నాయన మళ్ళీ నా ఒళ్ళోలోకి వచ్చాడు అంటూ సంబరంగా గదిదాటి బయటికి వచ్చింది. కోడలు తినడానికి అన్ని పెట్టింది. ఎన్నాళ్ళు అయిందో రాజవ్వ అన్నం తినక కడుపునిండా తిన్నది తనగదిలో నిద్రపోతుంది. అప్పుడే చల్లటిగాలి చిన్నుకులు మొదలైనాయి. కరెంట్ పోయింది. ఎవరో తన గదిలోకి వస్తున్న అలికిడి గాజుల శబ్దం వినబడుతుంది. తనను (రాజవ్వ) నలుగురు పైకి ఎత్తుకున్నారు. నిద్రలో ఉన్నదని భయపడినారు. కాని రాజవ్వ మెలకువతోనే గమనించసాగింది. ఆనలుగురు కలిసి రాజవ్వను ఓ ఆటోలో వేసుకుని వెళ్ళి వూరిచివరన ఒదిలేసి వెళ్ళారు. ఇంక ముసలిదాని పీడ విరగడైంది. ఈ వర్షంలో తడిసి చచ్చిపోతుంది. ఆ డబ్బు మొత్తం తీసుకోవచ్చని ప్లాన్ వేసి రాజవ్వను చీకటిలో ఆనాధగా వదిలి వెళ్ళారు. ఇది రాజన్య గతం గురించి మేము తెలుసుకున్న విషయాలు. చాలా బాధ

కలిగింది.

మరునాడు ప్రొద్దున్నే కాలింగ్ బెల్ మోగుతుంది పాలవాడు పాలు తెచ్చాడు. దాంతో పాటు రాజవ్వ పరిస్థితి బాగా లేదని చెప్పాడు. రాజవ్వకు పాలగ్లాసు తీసుకొని వెళ్ళాను మేము తెలుసుకున్న విషయాన్ని నా కలగా రాజవ్వకు చెప్పాను. రాజవ్వ నన్ను గట్టిగా పట్టుకుని ఎడ్వసాగింది.

–

అదే బిడ్డ నాగతం నీకలగా వచ్చింది. అని తల ఊపింది. రేడియో వారు అప్పుడే మానవ సంబంధాలు – విలువలను గూర్చి చెప్తు పాటలు వేస్తున్నారు. నాకో ఐడియా వచ్చింది. దాన్నితోటి వారితో పంచుకున్న. మా ప్రయత్నం ఫలించి, ఓ 10 సంవత్సరాల అబ్బాయి, 8 సంవత్సరాల అమ్మాయి రాజవ్వ దగ్గరకు పూలు పట్టుకుని వచ్చారు. రాజవ్వ వారిని తన తొడమీద కూర్చోపెట్టుకొని ముద్దులు పెట్టుకుంది. తన సంచిలో భద్రంగా దాచుకున్న కొన్ని కాగితాలను వారికి ఇచ్చింది. ఆ పిల్లలు వారి ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో రాజవ్వ విషయం చెప్పారు. అవ్వను మన ఇంటికి తీసుకు రండి, లేకపోతే మేము కూడ ఇంట్లోకి రామని మొండికేశారు. రాజవ్వ ఇచ్చిన ఆస్తి కాగితాలు వారిపైకి విసిరి బయటకి వచ్చారు వారి స్నేహితులతో కలిసి గాంధి తాత బొమ్మ వద్దకు వచ్చారు. రాజవ్వలో ఎదో తెలియని శక్తి కాస్త వచ్చినట్లు అయింది. కాని మాట్లాడలేకపోతుంది. ఎదో సైగలు చేస్తుంది. కానీ అర్థం కావడం లేదు. గాంధి తాత బొమ్మపై చూపులు నిల్పి అలాగే పడుకుంది. ఇంతలో రాఘవ భార్య ఆమె కూతుళ్ళు వచ్చారు పశ్చాతాపంతో. అప్పటికే రాజవ్వ ప్రాణజ్యోతి గాంధీ తాత విగ్రహం దాటి రామచంద్రయ్యను కలిసింది. మానవత్వమును తిరిగి మెల్కోలిపిన పిల్లలు రాఘవ మనవడు, రమ్య మనరాలు. మరో తరం, మధ్య తరానికి మార్గదర్శనమై నిల్చింది.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తొలి అడుగు

by Bandi Usha May 11, 2023
written by Bandi Usha

‘‘నారాయణ రాలేదు.. ఎక్కడికి వెళ్ళాడు?’’ పక్కనే ఉన్న పొలంలో కలుపు తీస్తూ అడిగింది మంగమ్మ.

‘‘మిరప తోటకు మందులు తెస్తానని పొద్దన్నే పట్నం వెళ్ళాడు పిన్ని’’ బెండకాయలు కోస్తూ చెప్పింది ఆదిలక్ష్మి.

‘‘ఒక్క దానివే అన్ని బెండకాయలు కోయాలంటే చాలా కష్టం’’

‘‘అవును పిన్నీ. చేతులు బాగా దురద పెడుతున్నాయి. ఒక్కరోజు ఆగితే ముదిరిపోతున్నాయి’’.

‘‘నిజమే. ఇక అన్నం తిని కాసేపు కూర్చుందాం పద’’

‘‘వస్తున్నా’’ అంటూ బెండకాయలు కోయటం ఆపింది ఆదిలక్ష్మి.

కాళ్ళు చేతులు కడుక్కొని ఇద్దరూ చెట్టు క్రిందికి చేరారు.

‘‘ఏం కూర తెచ్చావు?’’ అడిగింది మంగమ్మ.

‘‘ఆయన పొద్దున్నే వెళ్ళాడు. నేను ఊళ్ళో పాలు పోసి వచ్చేసరికి పొద్దెక్కింది. కూర చేయలేదు. నిన్న నూరిన గోంగూర పచ్చడే తెచ్చాను’’

‘‘నేను నువ్విచ్చిన బెండకాయలే వండాను వేసుకో’’

అన్నం తింటూ కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. నారాయణ రాలేదు. మళ్ళీ పనికి లేచారు.

తోటలోనే బేరగాళ్ళకు బెండకాయలు అమ్మి గేదెల్ని తోలుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంది ఆదిలక్ష్మి.

నారాయణ జాడలేదు. పాలు తీసి అందరికీ పోసేసరికి బాగా చీకటి పడిరది. అన్నం కూడా వండి ఇంట్లో పనయ్యేసరికి ఎనిమిది అయ్యింది.

పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంకా రాకపోవడంతో పక్కనే ఉన్న మరిదికి చెపుదామని బయటకొస్తుండగా అప్పుడు నారాయణ తూలుకుంటూ వచ్చాడు.

ఎప్పుడో చుట్టం వచ్చినప్పుడు కొద్దిగా తాగే మనిషి ఇట్లా తాగాడు ఏమైంది నీకు’’ అని అడిగింది ఆదిలక్ష్మి.

‘‘ఏమీ కాలేదు. మన బతుకులు బాగుపడుతున్నాయి’’

‘‘ఏం మాట్లాడుతున్నావు’’

‘‘మందులు తెద్దామని పట్నం బయలు దేరానా.. దారిలో సర్పంచ్‌గారు కలిసి మంత్రి గారి దగ్గరకు తీసుకెళ్ళారు’’

‘‘ఎందుకు’’

‘‘ఓట్లు వస్తున్నాయి కదా. నన్ను మన కాలనీ చూసుకోమన్నారు. ఇదితో నాకు ఫోన్‌ కూడా ఇచ్చారు’’.

‘‘కష్టపడి బతికేటోళ్ళం. మనకెందుకు ఇలాంటివన్నీ?’’

‘‘పాతికేళ్ళ నుంచి కష్టపడుతున్నాం. ఈ గుడిసె తప్ప ఇల్లయినా కట్టుకోగలిగామా?’’

‘‘బాగానే బతుకున్నాం కదా. పిల్ల పెళ్ళి జేసినం. పిలగాడు చదువకుంటున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వెనకేసుకున్నాము. మంచిరోజులు చూసి మొదలుపెడదాం అనుకున్నాముగా’’

‘‘ఓట్ల పండగ కానివ్వు. పెద్ద భవంతే కడదాం’’

‘‘నీ మాటలు ఏమీ అర్ధం కావడంలేదు. ఈ సంసారాన్ని ఏం చేస్తావో. ఇక అన్నం తిందువు రా’’

‘‘నాకొద్దు. సర్పంచ్‌గారు బిరియానీ పెట్టించారు’’

‘‘పెద్దోళ్ళతో నీకెందుకు?’’

‘‘చెప్పింది చాల్లే. నువ్వు తిని పడుకో’’ అని మంచి మీదకి ఒరిగాడు.

ఆదిలక్ష్మి కాసేపు ఆలోచనలో పడినా పగలంతా కష్టపడడంతో కాసేపట్లో వొళ్ళెరగకుండా నిద్రపోయింది.

*      *     *

రోజూ తెల్లవారురaామునే లేచే నారాయణ లేవలేదు. ఆదిలక్ష్మే లేచి పాలు తీసింది. పాలు పోయడానికి నారాయణను లేపింది.

‘‘నేనలాంటి పనులు ఇక చెయ్యను’’ కరాఖండిగా చెప్పాడు నారాయణ.

ఆదిలక్ష్మి పాలు పోయడానికి వెళ్తూ ‘‘ఈరోజైనా పురుగుమందులు తీసుకొని రా. తోట పాడువుంది’’.

‘‘తెస్తాలే’’

‘‘త్వరగా రా. వెంటనే మొదలు పెడదాం’’

‘‘వీలవదు. సర్పంచ్‌గారు ఇవాళ మీటింగ్‌కు వెళ్ళాలన్నారు’’

‘‘నీకేదో పిచ్చి పట్టింది’’

‘‘అవునే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలన్న పిచ్చి పట్టింది’’

‘‘ఏదీ వట్టిగా రావాలి అనుకోవద్దు. ఒకసారి అటువైపు అడుగువేస్తే ఆ బురద కడిగినా పోదు’’

‘‘నీకే తెలవదులే. ఇక ఆపు వెర్రిమొహమా’’ అంటూ బయటకెళ్ళి పోయాడు నారాయణ.

*      *     *

‘‘నారాయణ ఇవాళ కూడా రాలేదేంటే ఆదిలక్ష్మీ..’’ మధ్యాహ్నం అన్నం తింటూ అడిగింది మంగమ్మ.

‘‘నాకు ఆయన ఎవ్వారం చూస్తుంటే భయమేస్తుంది పిన్నీ’’ అని జరిగినదంతా చెప్పింది ఆదిలక్ష్మి.

ఈ వోట్లేమో గానీ మన సంసారాలు పాడవుతున్నాయి. మీ బాబాయి కూడా వోట్లప్పుడే కదా నాటుసారాకు అలవాటయి చనిపోయింది.

ఆ మాటలో మరింత దిగులు పట్టుకుంది ఆదిలక్ష్మికి.

‘‘భయపడకు అన్నిటికి భగవంతుడే ఉన్నాడు. బెండకాయలు కోయటానికి నేనూ సాయం వస్తాను పద’’ అంటూ ఆదిలక్ష్మిని లేపింది.

*      *     *

సాయంత్రం ఇంటికెళ్ళే సరికి నారాయణ జాడలేదు. పాలుతీసి కాలనీలో పోయడానికి వెళితే అక్కడ నారాయణ కనిపించాడు.

‘‘ఇక్కడేం చేస్తున్నావు’’

‘‘మగాడన్నాక సవాలక్ష పనులుంటాయి. నీకెందుకు? ఇంటికెళ్ళు’’ కోపంగా అన్నాడు నారాయణ.

ఎంతో నెమ్మదిగా మాట్లాడే నారాయణ రెండు రోజుల్లోనే మారిపోయాడు. ఆదిలక్ష్మి ఏమీ అనలేక ఇంటికొచ్చి అన్నం, కూర వండిరది. బాగా పొద్దుపోయాక నారాయణ తూలుకుంటూ వచ్చాడు. మాట్లాడే పరిస్థితిలో లేడు.

ఆదిలక్ష్మికి బాగా భయం పట్టుకుంది. ఏదో ఇంత తిని పడుకుంది.

*      *     *

నారాయణ పక్కమీద నుండి లేవకముందే ‘‘సర్పంచ్‌గారు రమ్మంటున్నారు’’ అని వచ్చాడు పాలేరు రంగడు.

దిగ్గున లేచి తయారవుతుంటే ‘‘పెద్దోళ్ళతో మనకెందుకు?’’ అంది ఆదిలక్ష్మి.

‘‘మనమూ పెద్దోళ్ళమవుతాం’’

‘‘ఆకాశానికి నిచ్చెనలు వేయక భూమి మీద నడువు’’

‘‘ఆడపెత్తనం ఆపు’’ అంటూ వెళ్ళిపోయాడు.

*      *     *

‘‘తోటనిండా పురుగులు ఎక్కువవుతుంటే ఎన్ని రోజులు అలా ఉంచుతారే’’ మంగమ్మ తోటలో తిరుగుతూ అడిగింది.

‘‘ఆయన నా మాట వినేలా లేడు పిన్నీ’’

‘‘పెద్దోళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళతో తిరిగితే మనమే నష్టపోతాము’’

‘‘ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు’’

‘‘పిలగాడితో అయినా తెప్పించరాదు’’

‘‘వాడికిలాంటి పనులు చెపితే చదువు ఆగమవుతుంది’’

‘‘ఏదో ఒకటి చెయ్యి. చేతికొచ్చిన తోట పాడవుతుంది’’

‘‘రేపు మా అన్నను పిలిపించి మందుకొట్టిస్తా’’

‘‘సరే ఇక పని మొదలు పెడదాం’’ అంటూ లేచింది మంగమ్మ.

*      *     *

సాయంత్రం ఇంటికెళ్ళేసరికి కొడుకు శ్రీకాంత్‌ బ్యాగ్‌ ఉంది.

వీడు ఇప్పుడెందుకు వచ్చాడు. ఇప్పుడేమీ సెలవులు లేవుగా అనుకుంటూ ‘‘శ్రీకాంత్‌..’’ అని పిలిచింది.

‘‘అన్న బయటకెళ్ళాడు’’ బజార్లో ఆడుకుంటున్న ఎదురింటి అబ్బాయి వంశీ చెప్పాడు.

స్నేహితుల దగ్గరకు వెళ్ళాడేమో అనుకొని కొడుక్కి ఇష్టమయిన పప్పు చేసింది. ఎంతకీ రాకపోయే సరికి వాకిట్లోకి వెళ్ళింది.

‘‘ఏమిటి వదినా తీరిగ్గా ఉన్నావు’’ అడిగాడు మరిది రాంబాబు.

‘‘శ్రీకాంత్‌ వచ్చాడు. ఎటు వెళ్ళాడా అని చూస్తున్నాను’’

‘‘అన్నయ్యా, శ్రీకాంత్‌.. సర్పంచ్‌ ఇంట్లో ఉన్నారు’’

ఏదో తెలియని నిస్సత్తువ ఆవహించింది ఆదిలక్ష్మికి. రాత్రి పదకొండు గంటలకు తండ్రీ, కొడుకులు వచ్చారు.

అన్నం తినమంటే సర్పంచ్‌ గారింట్లో తిన్నామని చెప్పారు.

‘‘నువ్వు కాలేజీ వదిలి ఎందుకొచ్చావురా?’’

‘‘నాన్న రమ్మన్నాడు’’

‘‘ఎందుకు’’

‘‘ఎలక్షన్లు కదా. యూత్‌ కోసం ప్రచారం చేయాలన్నాడు. డబ్బులు కూడా ఇస్తారన్నాడు’’

‘‘నీ చదువు ఏమవుద్ధి?’’

‘‘నాలుగు రోజులకు ఏమీ కాదులే’’

ఎంతచెప్పినా వినిపించుకోకుండా తండ్రి బాటే పట్టాడు శ్రీకాంత్‌.

*      *     *

పొద్దున్నే వెళ్ళి తండ్రితోపాటే రాత్రి బాగా పొద్దపోయాక వచ్చేవాడు శ్రీకాంత్‌. ప్రచారాల జోరు బాగా ఊపందుకుంది. తండ్రీకొడుకులను సర్పంచ్‌ మెచ్చుకోవడంతో వీళ్ళు ఎక్కడా ఆగడం లేదు.

ఆదిలక్ష్మి వాళ్ళ అన్నయ్యను పిలిపించి తోటకు మందు కొట్టించింది. కొడుకు ఎక్కడ పాడవుతాడో అన్న బెంగ రోజురోజుకూ ఎక్కువవుతోంది.

ఓట్ల ముందు రోజు రాత్రి తండ్రీకొడుకులు ఇంటికే రాలేదు. మద్యం ఏరులా ప్రవహింపచేశారు. ఎన్నడూ లేనిది ఓట్ల రోజు నారాయణ ఖద్దరు బట్టలు వేశాడు. సర్పంచ్‌ పక్కనే తిరిగాడు.

ఓటు వేయడానికి ఆదిలక్ష్మి వెళితే ‘‘మీ ఆయన గొప్పోడు అవుతున్నాడే’’ అంది సుబ్బలక్ష్మి.

‘‘అసలుకు మోసం రాకపోతే చాల్లే అక్కా’’ అంది ఆదిలక్ష్మి.

‘‘వాళ్ళ ఆయనే కాదు, కొడుకును కూడా రాజకీయాల్లో దించింది’’ అన్నాడు కోటయ్య.

‘‘నాకేం తెలుసు బాబాయ్‌.. చదువుకోమంటే నాలుగు రోజుల నుండి ఇక్కడే తిరుగుతున్నాడు’’

‘‘సర్పంచ్‌ సంగతి తెలుసుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి’’

‘‘అదే బాబాయ్‌ నా బాధ’’

*      *     *

ఓట్లు ముగిశాయి. లెక్కింపుకు నాలుగు రోజులు ఉంది. తండ్రీ కొడుకులిద్దరూ లెక్కలు చూసుకోవాలి అంటూ సర్పంచ్‌ ఇంటికి వెళ్తుంటే.. ‘‘ఎల్లుండి మంచి ముహూర్తం ఉందట. సామానంతా తెప్పించుకొని ఇల్లు మొదలుపెడదాం. అది కాగానే శ్రీకాంత్‌ను కాలేజీకి పంపిద్దాం’’ అంది ఆదిలక్ష్మి.

‘‘ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయి’’

‘‘ఏందయ్యా కొత్తగా మాట్లాడుతున్నావు. ఇల్లు కడదామని బ్యాంకులో ఐదు లక్షలు దాచాము కదా’’

‘‘ఓట్ల కోసం పెట్టాను’’

‘‘ఓట్ల కోసం నువ్వు పెట్టడమేంటి?’’ వణుకుతున్న స్వరంతో అడిగింది ఆదిలక్ష్మి.

‘‘ఓట్లయ్యాక డబుల్‌ ఇస్తాను అని సర్పంచ్‌గారు పెట్టమంటే పెట్టాను’’

‘‘ప్రపంచంలో ఇలా ఎవరయినా నమ్మి పెడతారా? అయినా అంత ఆశ ఎందుకు?’’

‘‘ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ఇంకా ఎన్నాళ్లు కష్టపడతాం’’ అంటూ బయటకు విసురుగా వెళ్ళిపోయాడు నారాయణ.

*      *     *

ఆదిలక్ష్మికి ముద్ద సహించడం లేదు. నిద్రలేదు. ఆ ఐదు లక్షలు ఏమవుతాయో అన్న భయం పట్టుకుంది.

పాతిఏళ్ళ కల నెరవేరే సమయంలో ఇలా జరిగింది. ఆ డబ్బు వెనకేయడానికి పగలనకా, రాత్రనకా ఎంత కష్టపడిరది గుర్తొస్తుంటే దుఃఖం ఆగడం లేదు.

ఓట్ల లెక్కింపు రోజు రానే వచ్చింది. నారాయణ తిరిగిన పార్టీ ఓడిపోయింది. నారాయణకు ఏదో తెలియని భయం పట్టుకుంది. తెల్లవారి ఉదయం సర్పంచ్‌ ఇంటికి వెళ్ళాడు.

‘‘ఏంటి ఇలా వచ్చావు?’’

మాటలో తేడాను గ్రహించాడు నారాయణ.

‘‘డబ్బులు ఇచ్చేస్తే ఇల్లు మొదలు పెట్టుకుంటాను’’

‘‘పార్టీ ఓడిపోయింది. ఏ మొహం పెట్టుకొని మంత్రి గారిని డబ్బులు అడుగుతాము’’

‘‘మరి నా డబ్బులు’’

‘‘నీవి ఐదు లక్షలే. నావి పాతిక లక్షలు’’

‘‘మేం ఇంటిల్లిపాది రెక్కలుముక్కలు చేసుకొని ఇంటిల్లిపాది కష్టపడి సంపాదించుకన్న డబ్బు. అలా అంటే ఎలా?’’

‘‘ఏం చేయమంటావు నన్ను’’

‘‘మీరే ఇవ్వాలి నాకు. గట్టిగా అన్నాడు’’

‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకిచ్చావా. ముందు బయటకు నడువు’’

‘‘నీవిచ్చేంతవరకు వెళ్ళను’’

‘‘వీడిని బయటకు నెట్టండిరా’’ అనుచరులకు చెప్పాడు.

ఆ తోపులాటలో నారాయణ తలకు గోడ గట్టిగా తగిలి రక్తం బాగా కారడంతో ‘‘లేనిపోని సమస్య మనకెందుకు’’ వాడిని ఇంటికి పంపించండి అన్నాడు సర్పంచ్‌.

*      *     *

నారాయణ తలకు దెబ్బ చూసి ఏడవడం మొదలు పెట్టింది ఆదిలక్ష్మి. శ్రీకాంత్‌ డాక్టర్‌ను పిలవడానికి వెళ్లాడు.

‘‘నీ మాట విన్నట్లయితే ఇట్లా జరిగేది కాదదు ఆదిలక్ష్మి’’ ఎగపోసుకుంటూ అన్నాడు నారాయణ.

‘‘బాధపడకు. బతకడానికి ఏదో ఒక దారి ఉంది కదా’’

‘‘మోసపోయాను. పాతికేళ్ళ కష్టం వృథా అయింది’’

నారాయణ తల నిమురుతూ ‘‘ఏం కాలేదులే కాసేపు మాట్లాడకు’’

డాక్టర్‌ వచ్చేసరికి ఎగపోత ఎక్కువయి ప్రాణం విడిచాడు నారాయణ.

ఆదిలక్ష్మి కుప్పకూలిపోయింది.

*      *     *

నారాయణ చనిపోయిన పదిరోజులకు ఆదిలక్ష్మి స్పృహలోకి వచ్చింది. తల్లి పరిస్థితి చూసి సర్పంచ్‌ దగ్గరకు వెళ్ళి తాడోపేడో తేల్చుకోవాలి అనుకున్నాడు శ్రీకాంత్‌.

‘‘మీ నాన్నలాగే అవుతావు’’ అని మేనమామలు, బాబాయి పోనివ్వలేదు.

నాన్న చదువకోక, నేను చదువుకున్నా అనుభవం లేక ఇద్దరం రాజకీయ ఉచ్చులో చిక్కాం. మేమే కాదు ఇలా ఎంతమంది చిక్కారో. దీనికి ముగింపు ఉంటుందా?

పూర్తిగా ఉండదేమో కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళనైనా చైతన్య పరచాలి. చదువు పూర్తిచేసి నాకాళ్ళ మీద నేను నిలబడ్డాక సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడూ ఇలాంటి ఊబిలో దిగకూడదు.

జరిగినదంతా పీడకల అనుకోలేను గానీ గుణపాఠంగా తీసుకోవాలి. ఇదో మేల్కొలుపు. ఆలస్యం చేయకుండా చదువులో నిమగ్నమవ్వాలి. వెంటనే తల్లి దగ్గరకు వెళ్లి పక్కన కూర్చున్నాడు. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని ‘‘అమ్మా.. నేను కాలేజీకి వెళ్ళాళి’’ అన్నాడు.

‘‘వెళ్ళు నాన్నా’’ కొడుకు తల నిమిరింది.

‘‘ఇక ఎప్పుడూ నిన్ను కష్టపెట్టను. నువ్వు గర్వపడేలా తయారవుతాను. నన్ను నమ్ము అమ్మా’’

ఆదిలక్ష్మికి దుఃఖం పొంగుకొచ్చింది.

శ్రీకాంత్‌ కొద్దిసేపు కూర్చున్నాడు. తర్వాత తల్లి బాధ్యతలను మేనమాలకు అప్పగించి బ్యాగు తీసుకొని మరో నూతన ఉషస్సు వైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళాడు.

కాదు కాదు మార్పుకు శ్రీకారం చుట్టే బాటలో అడుగువేశాడు.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సారస్వత క్షేత్రంలో విరిసిన తెలుగు మహిళారత్నాలు

by Radhika Suri May 11, 2023
written by Radhika Suri

       భాషా వికాసానికి    సాహిత్యం ఒక వేదిక లాంటిది . మానవునిలోని సృజనాత్మకతను, కవితా శక్తిని సమర్థవంతంగా వెలికి తీసే ఒక గొప్ప సాధనం . భాషాభివృద్ధి సంస్కృతి – సంప్రదాయాల పరిరక్షణ కవిత్వంతోనే సాధ్యమవుతుందనేది నిర్వివాదాంశం . భావవ్యక్తీకరణకు  కవిత్వం ఒక దర్పణంలాంటిది . ప్రతి దేశ చరిత్రలో సాహిత్య ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుంది .  ఆయా దేశకాల పరిస్థితులను ప్రతిబింబించేటట్టుగా సమాజ శ్రేయస్సులో కవి పోషించిన పాత్ర అవగతం అవుతూనే ఉంటుంది .

     మన దేశం కళలు , సాహిత్యాల కాణాచి . 11వ శతాబ్దికి ముందునుండే ఎంతో మంది సాహితీప్రియులైన రాజులు , చక్రవర్తులు      సాహితీఅభినివేశులై కవులను , కళాకారులను ప్రోత్సహించి , ఆదరించిన నిదర్శనాలు కోకొల్లలు . (ఇతర దేశాలలో 18వ శతాబ్దికి ముందు వరకు ఇలాంటి సంస్కృతి మనకు ఎక్కడా కనిపించదు ) తెలుగు భాష 2000 ల  సంవత్సరానికి ముందునుండే వాడుకలో ఉందనడానికి లభించిన సాక్ష్యం’ గాధా సప్తశతి ‘ . తొలి తెలుగు కావ్య ప్రక్రియ రాసిన నన్నయకు ముందు నుండే తెలుగు సాహిత్యం ఉందనడానికి ప్రధాన ఆధారం ,

క్రీస్తు శకము .1000 నాటి విరియాల కామసాని ‘గూడూరు శాసనం’. ఇందులో మూడు చంపకమాల రెండు ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి . ప్రాచీన సాహిత్యం  భక్తిరస ప్రధానమని పేర్కొనవచ్చును.  తమ రచనలతో వెలుగొందిన కొందరు ప్రముఖ రచయిత్రులు :-

 కుప్పాంబిక : తొలి తెలుగు కవయిత్రి గా భావించవచ్చు.  13వ శతాబ్దికి చెందినవారు . వనజా తాంబకుడేయు సా యకములన్  వర్ణింపగారాదు నూ … ఈపద్యం ఆమె తన ‘బూదపుర’ శాసనం లో వేయించారు. ఈ పద్యం అయ్యల రాజు తన ‘సంకలన గ్రంథం’లో ప్రస్తావించారు . ఇంతకు మించిన ఆధారాలు అలభ్యం.

  తాళ్లపాక తిమ్మక్క :15వ శతాబ్దికి చెందినవారు .అన్నమయ్య భార్య అయిన వీరు ‘సుభద్రా కళ్యాణం ‘ , ‘ ద్విపద ‘ లో రచించారు.

  ఆతుకూరి మొల్ల : ‘ మొల్ల రామాయణం ‘ రచించారు . కవయిత్రి మొల్లగా ప్రసిద్ధులు, 16వ శతాబ్దికి చెందినవారు.

  రంగాజమ్మ : 17వ శతాబ్దికి చెందినవారు . ‘ మన్నారు దాస విలాసం ‘ ప్రబంధం రచించారు.

  తరిగొండ వెంగమాంబ : 19వ శతాబ్దం వారు . ‘ వేంకటాచల మహాత్మ్యం ‘  రచించారు.

   ఈ నారీమణులు తమ రచనలతో ప్రాచీన సాహిత్యాన్ని సుసంపన్నం చేసి చరిత్రలో తమ స్థానాన్నిపదిలపరుచుకున్నారు.

          ఇక ఆధునిక సాహిత్య ప్రస్థానం విభిన్న రీతులతో వేగాన్ని పెంచుకుని వివిధ రూపాలుగా విస్తరించింది . ముఖ్యంగా వచన కవితలు ఊపందుకున్నాయి . ఛందోబద్ధం కాని పదాడంబరత లేని వచన కవిత్వాన్ని ఆధునిక సమాజం ఆదరిస్తోంది . సామాజిక చైతన్యమే కవిత్వం ప్రధాన లక్షణం .  అలతి పదాలతో అందంగా విస్పష్టంగా చెప్పడం ‘ ఓ గొప్ప కళ ‘ . కవిత్వం ‘ అనుభూతి పరిమళాల ‘ను వెదజల్లాలి . ఆధునిక సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వెలువడ్డాయి. తెలుగులో సాహితీమణులు ఎందరో తమ తమ రచనలతో సమాజ పురోగతిలో కీలకపాత్ర పోషించి సాహిత్యాన్ని పరిపుష్టం చేసి కీర్తి గడించారు. వారిలో కొందరి ముఖ్యరచనలు కొన్ని :-

  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ‘ కిరీటం’ గా దాల్చిన నలుగురు మహిళా మణులు :-

 1. ఇల్లిందల సరస్వతీదేవి : వీరు తమ రచనలతో ఎంతో ప్రభావితం చేశారు . ‘ కృష్ణా ‘ పత్రిక లో వీరి  ‘ఇయం గేహే లక్ష్మి’ శీర్షిక ఎంతో ఆదరణ పొందింది . ‘ స్వర్ణ కమలాలు’ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు . ఈ అవార్డు పొందిన  తొలి తెలుగు మహిళ కావడం విశేషం .

 2. మాలతి చందూర్ : ఆంధ్రప్రభ లో వీరి  ‘   ప్రమదావనం ‘ శీర్షిక విశ్వవిఖ్యాతినొంది’ గిన్నిస్ రికార్డు’ సాధించింది  . ఎన్నో రచనలు చేసిన వీరికి ‘హృదయనేత్రి’ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

3.   అబ్బూరి ఛాయదేవి : స్త్రీవాద రచయిత్రి . పిల్లల పెంపకంలోని లింగ వివక్ష పై వీరు రాసిన కథ ‘బోన్సాయి బతుకు’ అత్యంత ఆదరణ పొందింది. ‘ తన మార్గం ‘ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.

4.  కాత్యాయనీ విద్మహే: అభ్యుదయ స్త్రీవాద రచయిత్రి . ‘  సాహిత్యా కాశంలో సగం ‘వ్యాస సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు .

     ఇంకా సాహిత్యాకాశంలో  మెరిసిన ధృవ తారలు వారి మేటి రచనలు కొన్ని :

    బసవరాజు రాజ్యలక్ష్మి : ‘సౌదామిని ‘ కలం పేరుతో కవితలు అల్లారు.’ అప్పారావు గారు – నేను’ ఆత్మకథ రచించారు.

  సత్యవాడ సోదరీమణులు : సత్యవాడ రఘునాథమ్మ , సత్యవాడ సూర్యకుమారి. సంగీత సాహిత్యాలలో అభినివే శమున్న వీరు’ సరస్వతీ నమస్తుభ్యం’ ,’హరిప్రియ’రచించారు.

  జొన్నవాడ రాఘవమ్మ : ‘భావతరంగాలు’  ‘ రాధికా గీతాలు’ రాశారు.

  భానుమతి రామకృష్ణ : సినీ నటి , రచయిత్రి ‘అత్తగారి కథ లు ‘  వీరు రచించిన వాటిలో ముఖ్యమైనవి.

    మల్లు స్వరాజ్యం : సాయుధ పోరాటంలో వీరిది క్రియాశీల పాత్ర . జానపద బాణీల్లో రాసి , పాడి గిరిజనులకు స్ఫూర్తి కలిగించారు . సిపిఐ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు.

  ముప్పాళ్ళ రంగనాయకమ్మ : సమాజంలోని అసమానతలపై కలం ఝలిపించి ఎన్నోరచనలు చేశారు. ‘ స్వీట్ హోమ్.’ ‘రామాయణ విషవృక్షం’  వీరి ముఖ్య రచనలు .

     వాసిరెడ్డి సీతాదేవి : ‘వైతరిణి ‘, ‘మట్టి మనిషి’ నవలలు ముఖ్యమైనవి . మట్టి మనిషి నవల 14 భాషల్లోకి అనువదించబడింది .

  డి కామేశ్వరి : మానవీయ దృక్పథం వీరి రచనాశైలి .  ‘ఆకలి ‘ ,   ‘ కొత్తనీరు’ ముఖ్యరచనలు.

  వింజమూరి సోదరీమణులు : వింజమూరి అనసూయ , వింజమూరి సీతాదేవి . వీరు జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేసి ప్రాచుర్యం పొందారు. అనసూయ గారు ‘భావ గీతాలు,’  ‘ జానపద గేయం’  రచించారు . సీతాదేవి గారు  ‘ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ‘ రచించారు.

  పాకాల యశోద : ప్రముఖ రచయిత్రి  ‘ఉగాదికి ఉయ్యాల’ , ‘ భావిక ‘ సంకలనాలు వెలువరించారు.

  ముదిగంటి సుజాత రెడ్డి :   ప్రముఖ రచయిత్రి. ‘తెలంగాణ తొలి తరం కథలు ‘ చాలా ప్రా చుర్యం పొందింది.

  డాక్టర్ మృణాళిని : ప్రముఖ రచయిత్రి . అధిక్షేపహాస్యం వీరి ప్రియమైన శైలి . ‘ కోమలి గాంధారం , ‘తాంబూలం’ వీరి ముఖ్య రచనలు.

 డాక్టర్. పి. లక్ష్మి: కవయిత్రి , విమర్శకురాలు. ‘శిలాలోలిత’ కలం పేరుతో రచనలు చేస్తారు. ‘పంజరాన్ని నేనే – పక్షిని నేనే’ వీరి ముఖ్య రచన.

     లలిత కుమారి : స్త్రీవాద రచయిత్రి . ‘ ఓల్గా’ కలం పేరుతో రచనలు చేస్తారు . వీరి ముఖ్య రచన ‘ స్వేచ్ఛ’ నవల. ఇది వివిధ భాషల్లోకి అనువదించబడింది.

  మల్లంపల్లి జలంధర : ప్రముఖ రచయిత్రి అయిన ఈమె  రచనలలో ‘ఆటోగ్రాఫ్’  , ‘పున్నాగ పూలు’ ముఖ్యమైనవి.

  కొండేపూడి నిర్మల : వీరు ప్రముఖ రచయిత్రి , కవయిత్రి , జర్నలిస్టు . వీరి ‘ లేబర్ రూమ్ ‘ కవిత అత్యంత ప్రాచుర్యం పొందింది.

   పాటిబండ్ల రజని : ‘అబార్షన్ స్టేట్మెంట్ ‘ కవిత అత్యంత ఆదరణ పొందింది.

      సమాజ హితవు కోరి స్ఫూర్తి ప్రదాతలై భావావేశపు ‘సిరా చుక్కల ఉలి’తో అక్షర శిల్పాలను అందంగా మలచి ‘జీవకళ ‘ నిచ్చిన సాహితీస్ర ష్టలైన మహిళా మణులు ఎందరో !  సమయాభావంతో పేర్కొనని తేజోవిరాజమానులైన ‘మహిళా మణులు ‘ ఇంకెందరో కదా ! అందరికీ అక్షరాభివాదములు .        

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆకాశ మంత హనుమన్న

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) May 11, 2023
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

“అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ ” హనుమంతుని మనసార స్మరిస్తే చాలట బుద్ధి, శరీరబలం, యశస్సు, చెదరని ధైర్యం, ఎవ్వరి వలన భయపడకపోవటమూ, ఆరోగ్యము కలుగుట, పనిలో చురుకుదనం, వాక్కు యొక్క సామర్థ్యం కలుగుతాయని ప్రమాణం. మన భారతీయ సంప్రదాయాలను మనకెన్నో పండుగలున్నా విశేషమైన భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీ హనుమజ్జయంతి వొకటి.

“వైశాఖే మాసి కృష్ణాయాం దశమి మంద సంయుతా\

పూర్తప్రోష పదాయుక్తా అధనైదృత సంయుతా తసాం మధ్యాహ్ననే వాయాం జనయా మాస వైసుతమ్”\
అంటే ఆంజనేయస్వామి వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమి శనివారం, పూర్వాబాధ్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో నైదృతీ నామయోగం గ్రహాలన్నియు శుభ స్థానాలలో సంచరిస్తున్న మధ్యాహ్న సమయంలో కేసరి ఆంజనాదేవి
ముక్తాఫల గర్భమున జన్మించాడు. ఆనాటి నుండి వైశాఖ బహుళ దశమినాడు “హనుమజ్జయంతి”ని జరుపుకుంటున్నారు. వాల్మీకి రామాయణ కథలో హనుమంతుడు ప్రధాన భూమిక వహించాడు. త్రేతాయుగంలో అవతరించినా ద్వాపరం, కలియుగంలో కూడా హనుమం తుని ప్రభావం కనబడుతుంది. ఈయన కల్పాంతము జీవించే చిరంజీవి అంటారు. “అశ్వత్థామా బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్లైతే చిరంజీవినః అని అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసులవారు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు వీరంతా కల్పాంతము వరకు నడిచే చిరంజీవులని చెబుతారు.

లోకములను బాధిస్తున్న రావణుడిని వధించి లోక కళ్యాణం కొరకు నారాయణుడు శ్రీరామావతారం ధరించబోగ, రామకార్య సహాయం కోసం హనుమంతుడు జన్మించాడు. ఏకాదశ రుద్రులలో పదకొండవ వాడు నందీశ్వరుడు. ఆ నంది రావణున్ని కోతి రూపములో వచ్చి లంకను, నిన్ను నాశనం చేస్తామని శపిస్తాడు. మహా దేవుని అష్టమూర్తి అంటారు అట్టి ఎనిమిదవ వాయు రూపంలో నందీశ్వ రుని అంశ కేసరి అనే వానర వీరుడి యొక్క భార్యయైన అంజనయందు ప్రవేశించింది. ఆ స్వరూపమే ఆంజనే యుడుగా అవతరించింది. అంజన గర్భాన జన్మించుట వలన ‘ఆంజనేయుడు’ అయినాడు. ఇంద్రుడు కోపించినవాడై తన వజ్రాయుధంతో హనుమంతుని కొట్టగా, ఆ దెబ్బతో హనుమంతుని దవడ దెబ్బతిన్నది. దవడను ‘హనువు’ అంటారు. హనువు సొట్టబడినవాడు కాబట్టి ‘హనుమంతుడు’ అనే పేరు వచ్చిందట. హనుమంతుడు దీనులను కాపాడటానికి ఎనిమిదవ వాయు రూపంలో నందీశ్వ రుని అంశ కేసరి అనే వానర వీరుడి యొక్క భార్యయైన అంజనయందు ప్రవేశించింది. ఆ స్వరూపమే ఆంజనే యుడుగా అవతరించింది. అంజన గర్భాన జన్మించుట వలన ‘ఆంజనేయుడు’ అయినాడు. ఇంద్రుడు కోపించినవాడై తన వజ్రాయుధంతో హనుమంతుని కొట్టగా, ఆ దెబ్బతో హనుమంతుని దవడ దెబ్బతిన్నది. దవడను ‘హనువు’ అంటారు. హనువు సొట్టబడినవాడు కాబట్టి ‘హనుమంతుడు’ అనే పేరు వచ్చిందట. హనుమంతుడు దీనులను కాపాడటానికి నిరంతరం సంసిద్ధుడై వుంటాడు. ఎటువంటి బాధలైనా, కష్టాలైనా, పీడలై నా ఆంజనేయుని కొలుస్తే చాలు తొలగి పోతాయి. హనుమంతుని శక్తి ముందు ఎంతటి పిశాచాలైనా నీరసపడి పోతాయి. భయాన్ని, గ్రహ పీడలను, భూతప్రేత పిశాచాది భయాలను పోగొట్టు కొనేందుకు శ్రీ ఆంజనేయస్వామిని పూజించుట అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. స్వామిని కొలచినవారికి మానసిక దౌర్భల్యం నశించి, మనోబలం సిద్ధించి, గర్వం, అహంకారం నశిస్తుందని, బుద్ధిబలం శక్తి ప్రాప్తిస్తుందని, పల్నాటి శని దోషం ఉన్నవారు స్వామి ఆరాధన వల్ల శని దేవుడు జాతకులను మనిస్తాడని, అవివాహితులకు వివాహం జరుగుతుందని, వ్యాధుల నుండి విముక్తి కలిగి పారలౌకిక అనుభవాలు లభిస్తాయని, విపరీత గ్రహాలు. శాంతిస్తాయని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది.

శ్రీరాముని సర్వాత్తమ దాసభక్తుడైన హనుమంతుడు మహాదీశాలి. సర్వ సమర్ధుడు, నిరంతరం శ్రీరామ పాదారవిందములు కొలుస్తూ, శ్రీరామనామ జప మాధుర్యాన్ని గ్రోలుతూ, స్వామి భక్తి పారాయణుడై, నీతి శాస్త్రం, తత్త్వ, వాస్తు శాస్త్ర కోవిదుడిగా, శ్రీరామ పాదసేవతో మనకు దర్శనమిస్తాడు. భగవంతుని కంటే భక్తుడు గొప్ప వాడన్న విషయం ఆంజనేయుడు నిరూపిం చాడు. మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. రామాలయం లేని గ్రామముండదు. అందు కే శ్రీరామ చంద్రుణ్ణి, భక్తులు ఎంతటి భక్తి భావనలతో కొలుస్తారో హనుమంతుని
అంతే భక్తి భావనతో స్మరిస్తారు. ఆంజనేయుడికి సింధూరం లంకా విజయం తర్వాత శ్రీరాముడు సుగ్రీవాదులకు అనేక బహుమానాల
నిచ్చాడట. అయితే సీతాదేవి హనుమం తునికి మణిహారాన్ని ఇవ్వడం అందులో రామనామం లేదని స్వామి భక్తుడు నిరాశ చెందగా సీతాదేవి తన పాపిటలోని సింధూరం ఇచ్చి “ఇది నా ముఖ్య సౌభాగ్య చిహ్నం నీకు ప్రసాదిస్తున్నాను” అనగా ఆంజనేయుడు ఆనందభరితుడై స్వీకరించాడట. అందుకే ఆంజనేయుడికి సింధూరానికి అంతటి ప్రాముఖ్య త ఏర్పడింది. ఆంజనేయుడికి సింధూరం సమర్పించి ప్ర సన్నం చేసుకోవడంలో అంతరార్థం ఇదేమరి.

హనుమజ్జయంతినాడు ఆంజనేయ పూజ వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఎక్కడెక్కడ శ్రీరామనామ కీర్తనం జరుగుతుందో, రామాయణ సంకీర్తనం జరిగే చోట్ల ఆనంద బాష్పముతో నిండిన నేత్రములతో ఆంజనేయుడు తప్పక వచ్చి తీరుతాడని ప్రమాణం. ఎవ్వరు భక్తితో హనుమాన్ చాలీసా గానం చేస్తారో వారికి అనుగ్రహం

ఇవ్వగలనని వరం ఇచ్చాడు. హనుమజ్జయంతినాడు. హనుమాన్ చాలీసా పఠించి, హనుమచ్చరిత్ర, తమలపాకు పూజలు నిర్వహించి, సింధూరం సమర్పించి ఆంజనేయుని కృపకు పాత్రులవుదాం

శయనాంజనేయుడు

ఆంజనేయుడు అనగానే అభయమూర్తిగానో, భక్తపరమాళువుగానో, వీరాంజనేయుడిగానో, సంజీవనీ పర్వతధారిగానో కనబడతాడు. ఈ మూర్తులు కూడా విగ్రహాల రూపంలోనో, రాతిరూపంలోనో ఉండి సింధురం నింపుకుని ఉంటాయి. ఆకాశాన్ని తాకేంతగా ఉండే ఆంజనేయులు మనకు కనబడుతుంటారు. కానీ ఎంత వెతికినా శయనమూర్తిగా పడుకుని ఉన్న ఆంజనేయుడు మనకు కనబడదు. అలాంటి మూర్తిని చూడాలంటే అటు ఔరంగాబాద్, ఇటు అర్హనాద్క వెళ్ళాలి. మహారాష్ట్రలో చారిత్రక స్థలమైన ఔరంగాబాద్ చూడడానికి వెళ్ళే వారికి తప్పకుండా కనిపించే వాడు భద్రమారుతి ఆలయం. 1967లో ఆలయం కుదురుకున్న ఈ మారుతి మూర్తికి అంతకు ముందు ఒక షెడ్ మాత్రమే ఉండేది. ఔరంగజేబు దాడుల నుంచి స్వామివారిని కాపాడుకోడానికి ఈ స్వామికి ఆలయం నిర్మించలేదు. ఈ కుల్జాబాద్ పట్టణంలో ఉంది. ఈ ఊరిని గతంలో భద్రావతినగర్ అని పిలిచేవారు. ఈ పురాన్ని భద్రసేన మహారాజు పరిపాలించేవాడు. అపారమైన అంజనేయ భక్తితో పులకించిపోయేవాడు. ఆ పట్టణంలో భద్రకుంద్ చెరువు ఉంది. ఆ చెరువు గట్టున కూచుని భక్తిగీతాలు ఆలపించే వాడు. ఆయన మధురగీతాలను అలకించడానికి ఆంజనేయుడు స్వయంగా విచ్చేసేవారు. ఆ గాన మాధుర్యానికి మైమరచిపోయిన అంజనేయుడు కటిక నేలపై అలానే పడి నిద్రపోయాడట. భద్రసేన మహారాజు పాట పూర్తయ్యాక లేచిన ఆంజనేయుడు అలా పడుకుంటే ఎంతో బాగుందని ఇక్కడ ఇలాగే పడుకుంటానని రాజుగారితో అంటారు. ఇక్కడ శయనరూపుడిగా ఉన్నా భక్తుల కోరికలు మన్నించి కటాక్షించాలని రాజుగారు ఆంజనేయుడిని కోరుకుంటాడు. అందుకు ఆయన సమ్మతిస్తాడు. ఈ భద్రపురమే తరువాతి కాలంలో రాంపూర్ మారింది. ఔరంగజేబు పాలనలో ఇది కుర్దాబాద్ గా మారింది.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అస్తమించిన అగ్రశ్రేణి పండితులు

by Acharya Phanindra May 11, 2023
written by Acharya Phanindra

ఆచార్య రవ్వా శ్రీహరి గారిని నేను తొలుత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వారు తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నప్పుడు, కలుసుకొని నా తొలి గ్రంథం “ముకుంద శతకం” ప్రతిని అందజేసాను. రవ్వా శ్రీహరి గారు, మా మాతామహులు శ్రీమాన్ ఆచి వేంకట నృసింహాచార్యులు గారు దాదాపు 90 ఏళ్ళ క్రితం చదువుకొన్న సీతారాంబాగ్ సంస్కృత కళాశాలలోనే – 60 ఏళ్ళ క్రితం చదువుకొన్నారు. ఆ తరువాత పూర్వ విద్యార్థులైన ఈ ఇరువురే సీతారాంబాగ్ స్వామి వారైన శఠకోప రామానుజాచార్యులు గారి షష్టిపూర్తి మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఇది శ్రీహరి గారు నాకు స్వయంగా చెప్పిన విషయం.

రవ్వా శ్రీహరి గారు 1943 సెప్టెంబరు 12 వ తేదీ నాడు ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా (ఇప్పటి
యాదాద్రి భువనగిరి జిల్లా) లోని వలిగొండ మండలం, వెల్వర్తి గ్రామంలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో జన్మించారు. చిన్న నాడే తల్లి మరణించడంతో, ఆ వయసులోనే ఆయన కుటుంబ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. వారు తొలుత 1967 లో
ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా  పనిచేసారు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగు రెండూ బోధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 1973 లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించారు.
సంస్కృతాంధ్ర భాషలలో అగ్రశ్రేణి పండితులైన శ్రీహరి గారితో తరువాతి కాలంలో .. చాల సభలలో కలిసిన సౌభాగ్యం నాది. మా యువభారతి సభలలో కూడ వారు చాల ప్రసంగాలు చేసారు.
అసమగ్రంగా మిగిలిన మన తెలుగు నిఘంటువులను సమగ్రం చేసే ప్రయత్నంగా నిర్మించిన “శ్రీహరి నిఘంటువు” వారు తెలుగు భాషకు చేసిన ఉత్కృష్టమైన సేవ.
ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కూడ బాధ్యతలను నిర్వహించిన శ్రీహరి గారు ఆచార్య సి. నారాయణరెడ్డి గారి “ప్రపంచ పదులు” కృతిని సంస్కృతంలోకి అనువదించి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. గుర్రం జాషువా గారి “గబ్బిలం”, “ఫిరదౌసి” కావ్యాలను కూడ సంస్కృతంలోకి అనువదించారు. వారు ఎంతటి సంస్కృత పండితులో, అంతగా .. అనేక తెలుగు మాండలికాలలో విశిష్టమైన కృషి చేసిన మహా భాషా శాస్త్రవేత్త. ఐదారేళ్ళ క్రితం తెలుగు అకాడమీలో నేను తెలంగాణ భాషా సాహిత్యాలపై చేసిన ప్రసంగాన్ని వారు ప్రశంసించడం నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలుగజేచేసింది.
ఆచార్య శ్రీహరి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి “మహామహోపాధ్యాయ” బిరుదాన్ని స్వీకరించిన ఘనులు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశారు.
ఉభయ భారతి, అన్నమయ్య సూక్తి వైభవం, అన్నమయ్య భాషా వైభవం, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, సాహితీ నీరాజనం, తెలుగు కవుల సంస్కృతానుకరణలు, వాడుకలో తెలుగులో అప్రయోగాలు, తెలంగాణ మాండలికాలు – కావ్యప్రయోగాలు,
నల్లగొండ జిల్లా ప్రజలభాష వంటి విమర్శ గ్రంథాలు మరియు సిద్ధాన్త కౌముది, అష్టాధ్యాయీ వ్యాఖ్యానం వంటి వ్యాకరణ గ్రంథాలు వీరి ఇతర ప్రధాన రచనలు.
ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఎంతటి పండితులో, అంతకు మించిన సహృదయులు. నన్ను పుత్ర సమానునిగా ఆదరించేవారు.
79 ఏళ్ల వయస్సులో రవ్వా శ్రీహరి గారు గుండెపోటుతో హైదరాబాదులో 2023, ఏప్రిల్ 21నాడు పరమపదించారు.
ఆ మహనీయుని మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తొడిమ వేదన

by chittiprolu Subbarao May 11, 2023
written by chittiprolu Subbarao

పూశిశువుకు పాలపీకనై 

జీవరసాలను కుడిపికుడిపి
తల్లి కాని తల్లినవుతాను

కష్టసుఖాల సంవేదనలను
అటుయిటు మోసుకుపోతూ
చెట్టుకూ పూవుకూ నడుమ
పచ్చటి చిరువంతెననవుతాను

పూవును చెట్టునుండి విడదీసే
కఠినమైన బాధ్యతను నాపై పెట్టింది ప్రకృతి

ప్రేగుతో బిడ్డ తల్లిని వీడినట్లు
ఒకనాటికి నాతోపాటు పూవూ 
చెట్టును వీడి నేలరాలుతుంది

నన్నే తల్లిగా తలపోస్తూ
గట్టిగా హత్తుకునుండే పూవు
గాలికీ ఎండకూ కమలిపోయి
మట్టిలో కలిసిపోతూ కంటతడిపెట్టుకుంటూ
చివరివరకూ కనిపెట్టుకునున్న నన్ను
ఓరిమికవచంగా కొనియాడుతుంది

జీవితాంతం నన్నంటిపెట్టుకున్న పూవు

తుదిశ్వాస విడిచాక
నా బాధ్యత తీరిపోయినట్లే
ఇక నా పాత్రా చివరి అంకానికి చేరినట్లే

రంగూ రూపం తేనే తావీ

కలగలిసిన భువనైకసౌందర్యం పువ్వు

విత్తుకూ వేరుకూ ఆకుకూ రెమ్మకూ

కొమ్మకూ మానుకూ లేని విలువ

నేను సాకిన పువ్వుకే

చెట్టుకిరీటంలో

మెరిసే అనర్ఘరత్నం పువ్వే


ఆ పూవుకు జీవితాంతం సేవలు చేసిన నన్ను 
కనీసం ఆయాగా గుర్తిస్తారా ఎవరైనా
మనసారా ఒక పద్యం రాస్తారా ఎపుడైనా

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

యువ తరంగాలు

by Kondapally Neeharini May 11, 2023
written by Kondapally Neeharini

(మే నెల 2023 మయూఖ సంపాదకీయం)

సామాజిక వ్యవస్థ కొత్త పోకడలతో రూపుదిద్దుకుంటున్న కాలంలో వర్తమానానికే అధిక ప్రాధాన్యత ఉంటున్నది. ఈరోజు ఈ క్షణం ఇదే ప్రాథమిక అవసరమైంది. వెనుకబడిన దేశాలను జయించి తమ సామ్రాజ్యాలను స్థాపించుకోవాలనుకున్న ఒకప్పటి చరిత్ర మరపు పొరలలో పడిపోయింది. ఇది మరచిపోకుండా ఉంటేనే ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలిసేది.
ఆర్థిక సమస్యలు,రాజకీయ చాతుర్యాలు మనిషిని అతలాకుతలం చేసిన పరిస్థితులు అన్నీ బోధించని పాఠాలు అయ్యాయి.

మూఢనమ్మకాలు పూర్తిగా తొలిగిపోలేదు సంపూర్ణ అక్షరాస్యత సాధించలేదు. శాస్త్ర పరిజ్ఞానంలో ముందంజ వేస్తున్నాం అనుకునే వరకే కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి.
సామాజిక నైతిక తాత్విక సత్యాలను గుర్తించకుండానే యువత పరుగులు తీస్తున్నది.ఏ గమ్యం లేకుండా ,ఏ ఆశయాలు లేకుండా.

అయితే సోషల్ మీడియా అనే ఒక మాట ప్రస్తుతం ప్రతి నోట వినిపిస్తున్నది. ఇది ఎంతలా ప్రభావితం చేస్తున్నదంటే మనుషుల మధ్య మకారాలు అనురాగాలు ఆత్మీయతలు వంటి మంచి పదాలు పూర్తిగా కనుమరుగైపోయినాయి.

భారతదేశంలో 22 షెడ్యూల్ భాషలు, హిందీ, ప్రపంచాన్ని ఏలుతున్న భాష ఇంగ్లీష్ లతో కలిపి ఇరువై నాలుగు అధికార హోదా ఉన్నవి. దాదాపు 19 వేల పైచిలుకు భాషలు మన దేశంలో ప్రజలు మాట్లాడే భాషలున్నవి. ఈ అన్ని భాషలు ఉనికిని కోల్పోతూ ఇంగ్లీష్ భాష కే మొగ్గు చూపుతున్నారు.
ఇదే పరిస్థితి దాదాపు ప్రపంచం మొత్తంలోనే ఉంది. వాళ్ల వాళ్ల మాతృభాషను మర్చిపోతున్న వాళ్ళు వాళ్ళ భాషలో వచ్చిన సాహిత్యాన్ని ఏం చదవగలుగుతారు? దినపత్రికలు కూడా చదవడానికి కష్టపడుతున్న దీ యువత.ఎన్నో ఆధునిక సౌకర్యాలతో వచ్చిన యంత్రాల ముందు కూర్చుని సమయాన్ని ఆలోచనలని తెలివిని నిర్వీర్యం చేసుకుంటున్న యువతరమే ఎక్కువ కనిపిస్తున్నది. అలా అని అందరూ అదే దారిలో లేరు. ఇదే సాంకేతిక పరిజ్ఞానం తో యంత్రాల ముందు కూర్చుని వాటిలో నిక్షిప్తమై ఉన్న అద్భుతమైన విజ్ఞాన శాస్త్రాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానంలోకి పయనిస్తున్న వారు ఉన్నారు.

” జర్నలిజం సాహిత్యం కాదు, సాహిత్యం అన్నదానిని ఎవరూ చదవరు” అని ఆస్కార్ వైల్డ్ అన్నాడు. ఇదేనాటి మాట! ఇక ఇప్పుడు పోల్చుకోగలమా అసలు?

కవులు రచయితలు అద్భుతమైన సాహిత్యాన్ని పండిస్తున్నారు. ఈ ఫలితాలు యువతకు చేరుతున్నవా లేదా అనే ప్రశ్నలు ఉదయించి తీరుతాయి!
ప్రకృతి ప్రేమ మనుషుల మీద గౌరవం తగ్గిపోయి విపరీతమైన హింస ను ప్రేరేపించే తీరులో తీస్తున్న ప్రపంచ చలనచిత్రాలు చెడు ప్రభావాలు చూపిస్తున్న వి. ఇటు పత్రికలు అటు సోషల్ మీడియా రెండు ఈ సినిమా ల ప్రస్తావనతోనే రేటింగులు తెచ్చుకుంటున్నవి. అసలు జీవితంలోని సారాన్ని మాత్రం కోల్పోవడానికి ఇవే పెద్ద ప్రతిబంధకాలు అవుతున్నాయి. జీవితంలో ఏం కోల్పోతున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో నేటి యువతరం కొట్టుమిట్టాడుతున్నది. మానవ స్వభావాలను ఆవిష్కరిస్తూ జీవితాలకు అన్వయించుకునే శక్తి సామర్థ్యాలు కోల్పోతున్నది. ప్రకృతితో పర్యావరణంతో కాకుండా ఆయా విష సంస్కృతిని వదిలి ఇటువంటి సహజీవనాన్ని కలిగి ఉంటున్నారు . యువత ఇవ్వేవీ పరిశీలించడం లేదు. ఒక భావి ప్రణాళిక లేదు, ఓ చిత్త శాంతి లేదు. విరుద్ధంశాలతోటి వేరువేరు గొంతులతోటి అనుభూతి రహిత జీవితాలను వెళ్లిదీస్తన్నది యువత!

అందుకే రాజకీయాలు ప్రామాణికత లేకుండా అయిపోయాయి, కుటుంబాలు విలువలు తగ్గిపోయి వెలవెలబోతున్నాయి. ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా నిలిచి పోరాడే చిత్తస్థైర్యాన్ని పొందగలిగే భూమికను ఏర్పరుచుకోవాలి. ఇవి విద్యార్థి దశ నుండే నేర్పించగలిగే విద్యా బోధన వ్యవస్థ ఉండి ఉంటే బాగుండేది.కళాసాహిత్యం రెండు కళ్ళుగా ఉండవలసిన స్థితి నుండి చాలా దూరం తొలగిపోయింది హింసాత్మక ప్రవృత్తి పెట్రేగిపోయి సహజతను కోల్పోతున్న యువత రాజకీయాల్లోకి రావాలి అంటే , చదువు మీద శ్రద్ధ పెట్టాలి, మాతృభాష ను పొదవుకోని, ముందడుగు వేయాలి.

అప్పుడే స్వయం ప్రకాశ వంతంగా వెలుగుతారు

_ డాక్టర్ కొండపల్లి నీహారిణి
మయూఖ సంపాదకులు

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఇది మన మంత్రం

by SriRekha Bakaraju May 11, 2023
written by SriRekha Bakaraju

సర్వే  భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయా
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఇది ప్రముఖమైన శాంతి మంత్రము. వేదాలలో ఉపనిషత్తులలో చెప్పబడినది.  అందరికీ శాంతి సౌభ్రాతృత్వాలుండాలనే ఆశయంతో ఈ మంత్రము చదువబడుతుంది.  భారతదేశ సంస్కృతిలో ఇది ఒక భాగం. ఈ మతం ఆ మతమని లేకుండా విశ్వ జనులందరికీ శాంతి  చేకూరాలని  ఆకాంక్ష  గలిగిన గొప్ప సంస్కృతీ భారతదేశానిది. మునులు ఋషులచే విరచితమై శాంతి మంత్రాలు గొప్ప ఆదరణ పొందినవి. యజ్ఞ యాగాదులలో పూజలలో ఈ మంత్రాలను చదువుతారు.
 
పై మంత్రం భావార్ధం ‘సర్వే ‘అంటే అందరికీ, ‘భవంతు సుఖినః ‘సుఖంగా ఉండాలని కోరుతున్నాము. ‘సర్వే సంతు నిరామయా ‘అంటే అందరూ నిరోగులవ్వాలని,  సర్వే భద్రాణి పశ్యన్తు‘అంటే అందరూ మంచి చూడవలెనని, మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్ ‘అంటే ఎవరికీ ఏ విధమైన బాధలు కష్టాలు ఉండకూడదని ఆశయం. ఇది ఏ ఒక్క సమూహానికి సంబంధించినది కాదు. ఇది అందరి గురించి ఆశించినది. పై మంత్రం శాంతి మంత్రాలలో ఒకటి. అందరికీ శాంతి చేకూరాలని ముమ్మారులు జపించబడినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః అంటే అన్ని  లోకాలలోను శాంతి కలగాలని కోరుతున్నారు.
మనుష్యులకు కాకుండా జంతువులకు పశు పక్ష్యాదులు కూడా ఇది వర్తిస్తుంది. సర్వత్రా అందరికీ మంచి జరగాలనే భావన ఈ మంత్రం వలన తెలుస్తున్నది.
 
ప్రాచీన కాలంలో సంస్కృతం వాడుకలో ఉండేది. కాబట్టి చాలా వేద మంత్రాలు సంస్కృతంలో రచింపబడినవి. ఈనాటి కాలంలో సంస్కృత భాష వాడుకలో లేదు కాబట్టి చాలా మందికి మంత్రాల అర్థ తాత్పర్యాలు తెలియకపోవడంతో వాటి ప్రభావం కానీ, విలువ కానీ తెలుసుకోలేకపోతున్నారు. మంత్రాల భావార్థాలు తెలుస్తే వాటిని తప్పక ఆచరిస్తారు. వాటిని పూజలలో హృదయపూర్వకంగా చదువుతారు. మంత్రం అంటే మననాటి  త్రాయతే ఇతి మంతః అంటే  మంత్రాలను మననము చేస్తూ చదివితే జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది. మంత్రం అంటే మరొక అర్థం మనసునకు లభించే ఒక గొప్ప శక్తి. మంత్రాలను ఉచ్చ్చరించడం  వలన జీవితానికి గొప్ప పరమార్థముూ సత్యమైన మహత్తు లభిస్తుంది. అన్ని మంత్రాలలో  శాంతి మంత్రం ఇంకా గొప్పది. ఎందుకంటే శాంతి మంత్రాలు విశ్వ శాంతిని కోరతాయి. ఈ మంత్రాన్ని ఎప్పుడైనా  ఎక్కడైనా చదువవచ్చు,. ధ్యానం  లో కూడా. మంత్రాలు సాధారణంగా గురువుల నుండి నేర్పబడతాయి. ఉచ్చ్చారణ దోషాలు లేకుండా చదవడం చాలా ముఖ్యం.  అర్థాలను తెలుసుకొని మంత్రాలను మననం చేస్తే వాటి ప్రభావం, లాభం మనసుపై సరియైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ మంత్రం భావార్థాన్ని ఆశయాన్ని తెలుసుకొని దీనిని జపించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారని ఆశిద్దాం.

అయితే ఈ మంత్రం పూర్వకాలంలో యజ్ఞ యాగాలలో నే కాదు ఈ ఆధునిక కాలంలో నూ చాలా మంది చాలా చోట్ల చదువుతున్నారు. దీనికి ప్రధాన కారణం సామాజికం గా ఆలోచించి అందరూ బాగుండాలి అనేదే ఈనాటి యజ్ఞం. కాబట్టి మనమూ ప్రతి రోజూ చదువుకుందాం!

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తీర్చుకోలేని రుణం

by V. Kameshwari May 11, 2023
written by V. Kameshwari

ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను తల్లి

నేనే ప్రపంచమై బ్రతికిన ఓ అనురాగమయీ
ఇది
నవమాసాలు మోసి.
పుట్టు నొప్పులు భరించి
నాకు జన్మనిచ్చిన మాతృ మూ ర్తీ…
లాలీ లాలీ అనే జోల పాటలు పాడి
చందమామను చూపి గోరుముద్దలు పెట్టి
ఒకటి రెండు అంటూ….అంకెలు నేర్పి

చిట్టి పద్యాలు పలికించి

తొలి అడుగులలో తడబాట్లనూ
బతుకు బాటలో పొరపాట్లను
సరిదిద్ది
మమ్ము పరిపూర్ణులుగ చేసే
ఆది గురువయ్యావు
ఓ అమృత వల్లి
నీ మనసు ఆకాశమంత
ఓర్పు భూదేవిని మించి
త్యాగంలో తరువుకు సరిసాటి

అమ్మ!
నీవు నిత్యం శ్రమించే గుప్త కార్మికురాలివి

నేను నీకు ఇవ్వ గలిగేది మనసారా
“పాదాభివందనం”మాత్రమే.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఎందుకో….

by Rama Devi Nellutla May 11, 2023
written by Rama Devi Nellutla


ఎందుకో ఈరోజు కొత్తగా వుంది
పూల గాలి ఒకింత మత్తుగా ఉంది
పుడమి అంతా బంగారు తాపడం చేసినట్టు
నవ కాంతులతో గమ్మత్తుగా ఉంది

కొమ్మలు వింత రంగుల లతాంతాలను ప్రసవించాయి
సూర్యుని లేత కిరణాలు పూలపై ప్రసరించాయి
జగతిలోని సహజ అందాలు నవ్వుతున్నాయి
ధరణిపై దివ్య దీప్తులు ప్రకాశించాయి

చెట్లు కొత్త చిగుళ్ళకు జన్మనిచ్చాయి
ఆకులకు తీగలు ప్రాణమిచ్చాయి
తోట పరిమళపు విరులకు క్రొంగొత్త ఊపునిచ్చాయి
తేటి పాటలకు ఆతిథ్యం ఇచ్చాయి

అగ్నిపూలు అడవంతా ఎర్రని హంగులనద్దాయి
దిరిసెన పూలు పసుపుపచ్చని వింత శోభలు దిద్దాయి
ముందే వచ్చిన వసంతోత్సవ సంబరాలు
వనాలన్నింటికీ ఆకుపచ్చని రంగులు రుద్దాయి

వేపకొమ్మ తెల్లని పువ్వులను సింగారించింది
మామిడి వృక్షం పిందెల హారాలు సవరించింది
చింత చెట్టు వోనగాయల లోలకులు ధరించింది
పొలం చెరుకుగడల వరుసలను అలంకరించింది

పండి వంగిన వరి చేలు పచ్చని శోభలీనాయి
నింగిలోని నక్షత్రాలు మిల మిలలాడాయి
కొమ్మ కొమ్మన కోయిలమ్మలు
కొత్త రాగాలు ఆలపించాయి
మల్లె పూలు మత్తిల్లే సువాసనలు వెదజల్లాయి

ప్రకృతి కాంత వింత శోభతో ఒప్పింది
మావి చెట్టుపై మాధవీలతను
మంచుతెర కప్పేసింది
ఉగాది వచ్చిందని నా మది
పదేపదే చెప్పింది!!!

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us