మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

సరిగంచు చీర

by రంగరాజు పద్మజ May 11, 2023
written by రంగరాజు పద్మజ

చీరలూ వాటి ప్రశస్తి ని వివరిస్తూ రంగరాజు పద్మజ గారు రచించిన ‘ సరిగంచు చీర’ కథ ను చదివి ఆనందించండి. కాకతీయుల పరిపాలన కాలం నుండి ఆడవాళ్ళు కట్టుకున్న చీరల విషయాలు కథాత్మకంగా తీసుకొచ్చారు. ఆనాటి కవయిత్రులైన గంగాదేవి, కుప్పాంబ వంటి స్త్రీ మూర్తుల నుండి మన కాలం మహా నటి సావిత్రి గారి వరకు వాళ్ళంతా ముచ్చట్లు పెట్టుకున్నట్టు కథ ని అల్లారు ! చదవండి…
                                                                                                                         – సం. పా.

ఆ ప్రాంగణమంతా చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టినారు. ఆ ముగ్గులలో రంగులు నింపారు. ఆ ముగ్గులు సిరిసంపదకు ఆహ్వానం పలికినట్టు అతిధులను ఆహ్వానిస్తున్నట్టుగా… ముగ్గులలో స్త్రీల అద్భుతకళకు అద్దం పట్టినట్టుగా ఉన్నాయి. దానికి తోడు పచ్చని మామిడాకు తోరణాలు సంప్రదాయ సిద్ధంగా కట్టబడి అక్కడి కార్యక్రమం సంబరంగా జరగబోతున్నట్టుగా అవగతం అవుతున్నది.

ఓరుగల్లు కోటలో ఎప్పుడూ… ఏవేవో.. కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే… ఈ రోజు అన్ని రాష్ట్రాలలో తయారైన వస్త్రాలతో వస్త్ర ప్రదర్శనం ఏర్పాటు చేసి ప్రముఖులను ఆహ్వానించారు.

మధురవిజయ రచయిత్రి గంగాదేవి వివిధ రంగాలలోని ప్రముఖులైన మహిళా మణులను ఆహ్వానించగా… కుప్పాంబిక, కామసాని, మొల్ల, మధురవాణి, మదన మంజరి, మహానటి సావిత్రి , ఒద్దిరాజు కమలాదేవి మొదలైన వారంతా వచ్చారు.
ఆ సభలో రచయిత్రులు, కవయిత్రులు, గాయనీమణులు, చిత్రకారిణిలు, సామాజిక వేత్తలు అందరూ వేదికకు ఎదురుగా కూర్చున్నారు. ఆహ్వానించబడిన వారంతా వచ్చారని నిర్ధారణ చేసుకొని గంగాదేవి ఆసనం నుండి లేచి అందర్నీ ఉద్దేశించి “మాట్లాడుతూ మహిళలమని, అబలలమని మనమేమీ వెనుకకు పోనక్కరలేదు. మనమందరం చక్కని రచనలు చేద్దాం! ” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే… సభలో గుసగుసలు హోరులా వినపడడంతో… తన కంఠాన్ని కాస్త పెద్దదిగా చేసి, “ఏమిటీ? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నేను చెప్పే విషయం వినడమే లేదే?” అనగానే అందరూ ఒక్కసారిగా… మీరు కట్టుకున్న చీర చాలా అందంగా.. అద్భుతంగా ఉంది! మీరు ధరించిన హార భూషణాలు, పద్మరాగాలు గుచ్చిన మొలనూలు, పచ్చల కడియాలు, మొరవంక కడియం, గోమేధికాల అందెలు,బన్నసరాలు , చిరుత చౌకము, పుష్యరాగాల ఉంగరాలు, రవ్వల దుద్దులు, మీ చీరకు ఎంతగానో నప్పి మా కండ్లు మీమీదనుండి మరలడమే లేదు. ఎక్కడ ఈ చీరను తయారు చేయించారు? అని ముసిముసి నవ్వులు నవ్వుతూ… అడగడంతో సరే ముందు నా చీరగురించి మాట్లాడుకున్నాకే మిగతా కార్యక్రమాలు జరపనిచ్చేటట్టున్నారు! ఔనా? అని నవ్వుతూ ఇలా చెప్పడం మొదలు పెట్టింది.
నా భర్త కంపరాయల వారు దండయాత్ర చేసి అందులో విజయం పొందడతో ఆ దండయాత్ర విశేషాలతో మధుర విజయం అనే కావ్యం రాసాను. వారికి ఆ గ్రంథం ఎంతగానో నచ్చి విదేశాల నుండి ఈ పట్టు చీర తెప్పించి బహుమతిగా ఇచ్చారని చెప్పింది.

హాలుడు తన భార్య మలయవతి సంస్కృత పండితురాలు కాబట్టి, ఆమెను సంతోషపెట్టేందుకు ఇటీవల పండిత గోష్టులు జరిపించి, కవయిత్రులను సన్మానించాడు. అక్కడికి వచ్చిన వారంతా గొప్ప గొప్ప చీరలు కట్టుకొని వచ్చారు. వారి అందచందాలు ఆ బట్టలలో చెప్పనలవికానంత అందంగా ఉన్నాయి. అదొక దేవతల యాత్రనా? లేక ఏదైనా పండగనా అన్నట్టున్నది అని గంగాదేవి చెప్పగానే చీర మనదేశ సాంప్రదాయం కదా? విదేశాలలో చీరలు కడతారా? అని సదస్యులెవరో అడిగారు.

మలయవతి సింహళ రాజ కుమార్తె ఐనా అక్కడ కూడా భారతీయుల కట్టూ- బొట్టూ పాటించేవారున్నారు. అక్కడ పేరు పొందిన పట్టువస్త్రాలెన్నో రకాలుగా ఉన్నాయి. మీరనుకుంటున్నట్టు ! మన చీరకట్టులోనే భారతీయ సంప్రదాయం ఉట్టిపడడమే కాకుండా… ఎన్నోరకాల చీరలు అందుబాటులో ఈనాడే కాదు ఆనాడూ ఉన్నట్టు విన్నాము కదా!
రామాయణంలో సీతారాములు వనవాసానికి బయలుదేరమని కైకేయి నార వస్త్రాలు ఇచ్చిందని చదివాంకదా? ఈనాడు ఆ నార చీరలను కాస్త ఆధునీకరించి జూట్ చీరలని తయారు చేస్తున్నారు.
అలానే మరో సన్నివేశంలో సీతమ్మ అరణ్యవాసం బయలుదేరే ముందు అనసూయకు నమస్కరించి ఆశీస్సులందుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఎప్పుడూ మాయని- ముడతలు పడని చీర , వాడని పూలదండ ఇస్తుంది… ఇచ్చి నీకు వన సంచారంలో పనికివస్తుందని అంటుంది… అంటే ఇప్పుడు రింకిల్ ఫ్రీ బట్ట (Rinkel free) (nano ) నానో చీరలు అనుకోవచ్చు ……

అలాగే పురాణాలలో పతీవ్రతామ తల్లులను భగవంతుడు పరీక్ష పెట్టడం మనం చదివే ఉంటాము. అలాంటి ఒక సంఘటన త్రిమూర్తులు అనసూయను పరీక్షించడానికి నగ్నంగా భోజనం వడ్డించమని అడుగుతారనీ ఆమె అలాగేనని, వారిని పసిపాపలను చేసి వడ్డించిందని కథ చదివినప్పుడు … ఆ కథను నాదగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు ఎలా చెప్పాలని మా అక్కయ్య మల్ల్యేల దయామతీ దేవిగారిని అడిగాను. త్రిమూర్తులను పసివారిగా చేసినా కూడా ఆమె వివస్త్రగా ఎలా మారగలిగిందని అడిగాను. మా అక్కయ్య ఏమన్నారంటే
మార్కండేయ మహా ముని సంతతికి చెందిన వారు కమలా పుష్పాల నారతో లేదా దారంతో పట్టు వస్త్రం నేసేవారట. అది వంటి రంగులో కలసిపోయి, చూపరులకు చీర కనిపించకుండా ఉండేదట! అటువంటి చీరనే కట్టి ఉండవచ్చు అన్నది. ఆమె చీరకట్టినా కనపడని చీరలుండేవి ఆనాడని అన్నారు. ఆ మాట మాకోడలు విని సినిమా తారలుకూడా శరీరరంగులో ఉన్న చర్మానికి అతుక్కొని పోయే బట్టలుంటాయని, ఆయా సన్నివేశాలలో కట్టుకుంటారని వివరించింది. అంటే వస్త్రాల పరంగా మన వారు సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందారో కదా ఆనాడే?
అప్పుడు గంగాదేవి ద్రౌపదిని చూసి ఆ మారు పమిట ఎందుకు వేసుకున్నావు అని అడిగితే ద్రౌపది ” నా వస్త్రాలను పుట్టింటివారు ప్రత్యేక లక్షణాలతో నేసేయించేవారు. దాదాపు 10 గజాల చీరైనా తేలికగానూ, పిడికిటిలో అమరేటట్టుగా ఉండేది.

ఇప్పుడు సిరిసిల్ల చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేస్తారు చూడూ అలాగే ఉండేది నా చీర. నా వక్షస్థలం ఘనంగా ఉండడం చేత పమిట జారకుండి పొత్తి చీర నడుముకు కట్టే దాన్ని. దీన్నే మారు పైట అనేవారు. నేను ఎక్కువగా చీనీ చీనాంబరములే ధరించేదానిని. చీరకు తగినట్లుగా సింధూర తిలకం పెట్టుకోని, పాపిటలో సింధూరం ధరించి, బంగారు రవిక తొడిగే దానిని.
నా వలె సత్యభామ కూడ నరకాసురవధ సమయంలో చీరను మగవారి యుద్ధ వస్త్రాలవలె జంగాళం అంటే నిడుపాటి లేదా పొడగాటి చీర కుచ్చెళ్ళుపోసి కట్టుకునేది. ఈమె ఎక్కువ జాళువాలు ధరించేది. కృష్ణుడు తన దగ్గరకు వచ్చేరోజు కుసుమ రవిక అంటే పూలతో అల్లిన రవికను ధరించేది. శకుంతల కూడా ఈ విధంగానే పూల రవికెలు ధరించేది. సత్యభామ జడ చాలా ప్రశస్తమైనది.

అలంకారం చేసేవారు ఎక్కువ శ్రద్ధతో ఆమె జడను అల్లేవారు. వారంలో రోజుకొక్క తీరున మొగిలిరేకుల జడ, మల్లె-మొల్లల జడ, ముత్యాల జడ, జడకు ముత్యాల కుచ్చులు, జడకుప్పెలు, నాగరం, ఇంకా చాలా రకాలుగా సొమ్ములు పెట్టి జడలు వేసేవారు !
ఇంతలో మధురవాణి లేచి ఈ విధంగానే రాణీ రుద్రమ కూడా యాదవరాజు కుట్ర నుండి బయట పడేందుకు తాను కట్టిన చీరనే గుఱ్ఱపు స్వారీకి అనుగుణంగా మార్చింది. ఇలా బహుళార్ధ సాధకంగా చీరలను తయారు చేయడంలో భారతీయ నేత పనివారు దిట్టలు. ఈమె చాలా కాలం మగవేషంలో ఉండడం వల్ల మగవారు ధరించేటటు వంటి సొమ్ములే ధరించేది.
ఉదాహరణకు పులిగోరు గొలుసు, సింహ తలాటాలు, ముత్యాలసరాలు, పగడపు ఉంగరాలు, పెట్టుకుని, ఈమె నుదుట ఆమె గురువు , మంత్రి శివదేవయ్య మంత్రించి ఇచ్చిన పసుపు సున్నంతో నూరిన పోకరంగు బొట్టు అర్ధచంద్రాకారంలో పెట్టుకొంటుంది. మెడ కిందు భాగం విబూది రేకలు తెల్లగా మెరుస్తూ ఉండేవి! రుద్రమదేవికి చీనీ చీనాంబరాలు విదేశాల నుండి వస్తాయి. పట్టు కంచుకాలు తొడుగుతుంది. దర్బారుకు వచ్చినప్పుడు జలతారు మారు పమిట వేసుకుంటుంది, నగర పర్యటన చేసేటప్పుడు తోలుతో తయారు చేసిన ప్రత్యేక దుస్తులు ధరిస్తుంది.
మన భారత దేశంలో ఐదవ శతాబ్దంనుండే నూలును అల్లి దానికి రంగులద్దింది ఎప్పుడో కాదు సింధులోయ నాగరికత నుండే ఉంది. కాకపోతే అప్పుడు బట్ట తయారు చేసే విధానం వేరుగా ఉండేది. అల్లే సూదులు ఎముకలతో తయారు చేసుకునేవారు. నూలు వడికేందుకు చెక్కతో ఒక పరికరం ఉండేది. ఆ కాలంలోనే నూలువస్త్ర తయారి ఎంతో పేరు పొందింది ఇప్పటికీ కొన్ని పద్ధతులు ఆ కాలంలోనివే వాడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ వేడి గల ప్రదేశాలలోని ప్రజలకు వేసవికాలంలో పత్తితో నేసిన బట్టలు సౌకర్యంగా ఉండడమే కారణం. చేనేత కళాకారులు ఎక్కువగా గుహలలోని రాతి శిల్పాలు, చిత్రాలలో దేవతలు, నాట్యకత్తెలు కట్టిన చక్కని చీరలను చూసి, తమదైన శైలి జోడించి బట్ట తయారు చేసేవారు.
పూర్వం రాజుల కాలంలోనూ వస్త్ర భాండారాలు ఉండేవి. నేను ముందే చెప్పిట్టు వారు ఇతర ప్రాంతాల నుండి తయారైన వస్త్రాలను కూడా తెప్పించేవారు. అవి రకరకాల రంగులతో అందంగా ఉండేవి.
త్రిలింగ దేశమనే ఈ ప్రాంతం అటు ఉత్తర భారతదేశం ఇటు దక్షిణ భారతదేశనికి మధ్యలో ఉండడంవల్ల ముఖ్యంగా ఎందరో రాజులు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని, ఏలడం వల్ల వస్త్రధారణలో ఉత్తర దక్షిణ ప్రాంతాల సంప్రదాయ కట్టు బొట్టు ఇక్కడ ఈ రాజధాని నగరంలో ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది… నాగరికతకు చిహ్నంగా వస్త్రధారణ ఎన్నో కొత్త ప్రయోగాలు చేసిందనే చెప్పాలి!
అంతేకాకుండా ఈ ప్రాంతం పత్తి పంటకు అనువుగా ఉండి, అధిక దిగుబడి ఇవ్వడంతో నాణ్యమైన నూలు లభ్యమవ్వడంతో, అందమైన బట్టలు తయారు చేయడానికి ప్రసిద్ధి చెందిందీ ప్రాంతం!
మచిలీ బందర్ లో దొరికే మసూల అనే సన్నటి బట్ట దీన్నే ఇంగ్లీషులో మస్లీన్ అంటారు. ఇలా చెబుతూ ఉండగానే….
ఇంతలో మొల్ల అన్నది కదా! నేను రామాయణం పవిత్రంగా రాయాలని, శుచితో మడితో రాయడానికి వీలుగా యోలగంధపు బొట్టు పెట్టుకొని, పట్టుకంచుకం తొడుగుకొని, ముత్యాల శంఖువులు, గుండ్లపేరులు, హారికంకణాలు వేసుకుని నిద్దెంపు వెలిపట్టు, ఒంటిపొర పట్టు మడుగు కట్టుకుంటాను. ఇవి 6 గజాలు; 9 గజాలలోనూ దొరుకుతాయి. రోజంతా గోచీపోసి, కుచ్చిళ్ళు పోసి కిందకు జారవిడిచి కట్టుకుంటాను. దివ్యాంబరములనే చీరలు ఎక్కువ ఆదరణ పొందే చీరలు. ఇవి అన్ని రంగులలో ఉంటాయి. భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు జరిగే సమయంలో ధరిస్తారని మొల్ల చెప్పడం ముగించగానే…
కుప్పాంబిక అన్నది కదా! మా అంతఃపురానికి సాలెవారు ఎన్నోరకాల చీరలు తెస్తారు. అందులో వెంజావళి పట్టు, భూ తిలకంబు పట్టు, శ్రీవన్నియ పట్టు; మహా చీని పట్టులని రకరకాలుగా ఉండేవి. కొంగు- అంచు బంగారు తీగతో నేసేవారు. మా రాచవారు వారి అభిలాషను తెలిపితే వారికనుగుణంగా నమూనాలు చేసి ఇచ్చేవారు…
మమ్ములను కస్తూరి బొట్టుతో, కాటుక లేదా అంజనంతో చెలికత్తెలు సింగారిస్తారు. మాకు ఈ చీరల మీద తగిన రవికలు కుట్రపు వాడు కుట్టి ఇస్తాడు. కుట్రపువాడు అంటే దర్జీ. చీరకు తగినట్టు బంగారు త్రిసరాలు అంటఘ మూడు అంతస్తులుగా ఉంటుంది, చంద్రహారాలు, నవరత్న మాలలు, మెడకు బిగుతుగా ఉండే పతకాలు, పాపటబొట్టు, సూర్య-చంద్ర బిళ్ళలు, మొరవంక కడియం, విచ్చుటాకుల దుద్దుకమ్మలు, కంకణాలు, కాంచీ నూపుర కంకణాలు, భుజాలకు సందిదండలు ఇలా ఎన్నోరకాల ఆభరణాలను ఆయా పండగలు, పెండ్లిండ్లకు, వేరువేరుగా, రాచరికపు కూటములకు వేరుగా సందర్భాన్ని బట్టి అలంకరించే వాళ్ళు.

మధుర వాణి అన్నది కదా నేను ప్రత్యేకంగా బంగారు నీరు తాపడం చేసిన చీరలు, అంటే చీర నిండా బంగారు జరీ ఉంటుంది. చిత్ర వన్నెల పట్టుచీరలు, కంబళి చీరలు; చెంగావి వన్నె చీరలు; చలువ పావడాలు; దుకూలముల చీరలు కట్టేదాన్ని‌. ఈ చీరలు కొంగుకు నేతపరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నేసేవారు. జిగురు బొమ్మంచు చీరలు.

ఈమధ్య తెలంగాణ గవర్నర్ తమిళ సెల్వి గారికి సిరిసిల్ల చేనేత కార్మికుడు చీరలో వారి చిత్రం నేసిన తెచ్చి బహుకరించాడు అలాగ నేయించుకుని కట్టుకునే దాన్ని. చందన లేపనం చేసి,కస్తూరి తిలకం, బంగారు బొట్టు, పెడుతుంది నా సైరంధ్రి.
నేను జడకుచ్చులు వేసుకుని, జడకు కుప్పెలు, బంగరు మొగ్గలు, చెవులనుండి కొప్పుకు బంగారు పూచేర్లు, నాసాగ్రం, ముక్కరి, ముత్తెపు సత్తు, బులాకీలు, తాటంకాలు, మకరకుండలాలు, కంఠహారాలు, కాలి అందెలు, పట్టాగొలుసులు, మెట్టెలు, పిల్లెండ్లు మొదలైన సొమ్ములు వేసుకుంటాను అని అంటుండగానే …
మహానటి సావిత్రి చెప్పడం మొదలుపెట్టింది. నేను ప్రత్యేక పూజలు; వ్రతాలు చేసుకొనేటప్పుడు తిలకం పెట్టుకుని కింద తిరుమణి రావిరేక పెట్టుకుంటాను. కాటుక , రకరకాల పౌడర్ లు స్నోలు, సెంటు వాడుతాను. తెల్లనిపట్టు చీరలు, పాల నురుగులాంటి పొన్ను పట్టుచీరలు కట్టేదాన్ని. పట్టురవికలు వేసుకుంటాను. వెండి జరీతో నేసిన గళ్ళ చీరలు కుచ్చులు పోసి, పెద్ద కొంగు నడుముకు చుట్టి,
నా మేకప్ మ్యాన్ నాకు కడితే సినిమాలను చూసిన వారు అలాంటి చీరలే కావాలని అడిగి మరీ కొనేవారు… నా సొమ్ములు నాను పట్టెడ, కంఠహారాలు, నెక్లెస్, నల్లపూసలు, అడ్డకిలు, మణులు, కెంపులతో చేసిన మెడకు దగ్గరకుండె గొలుసులు, సంది దండలు వేసుకునేదాన్ని.
ఇంతలో మదన మంజరి అన్నది కదా! మావంటి సామాన్యులు నూలు వస్త్రాలను నూలు రవికెలను కట్టుకుంటాము. వాటిని మడుగులు అంటాము. కొందరు రవిక తొడుగరు.
ముంజేతులకు పలక కంకణాలు, కాళ్లకు దండ గడియాలు, వంకీల గాజులు, రత్నాలతో చేసిన జంట కడియాలు, జంట తాయెత్తులు, నీలాల గాజులు, పచ్చల కంకణాలు, చామలకడియాలు, మురుగులు, గజ వడ్డాణం, గంటల మొలనూలు, మువ్వల అందెలు, కాళ్ల కడియాలు, గజ్జెలు ధరించేవాళ్ళం!

హోంబట్టు సరిగ రవిక రవ్వల ఒడ్డాణము,రవ్వల బేసరి,రవ్వల అడ్డబాస, రవ్వల పతకము,
రత్నాలతో శిరోభూషణాలు, రాగిడి, చంద్రవంక,తమలపాకు,మొగిలిరేకు,బంగర చామంతి పూవు,చెంపసరులు ఇట్లా కలవారి ఆభరణాలు ఎన్నో!

సామాన్యుల సొమ్ములు రాగికుండలాలు, రాగి కుందులు, దొడ్డ రాగి కంటెలు ,రాగి ఉంగరాలు, రాగి దండలు, వలుద కొక్కెరలు, పోలెలు, సరిపెణ, నేకళంబులు, కీలు గొలుసులు, కీర్తిముఖాలు, కాలి అందెలు, రాగి కటక వంకీలు, రాగి పధకంబులు, రాగి వడ్డాణాలు, కటి సూత్రాలు, తగరపు కడియాలు, కంచు మట్టెలు, వల్దయూరాలు, నల్ల గాజులు, పచ్చగాజులు, పూసలు, సంకుపూసలు, నల్లపూసలు వేసుకుంటారు.
కాటుక, అగరు బొట్టు, తిలకాలను వాడుతారు.

నూలులో చందనపురంగు, నీలపురంగు, ఎర్ర రంగువి, కడిమిరంగువి, కరకంచులు , బొమ్మంచులు, ముడుగు బొమ్మంచులు, ముయ్యంచులు ,చిలుక చాళ్ళు, పేటచాళ్ళు, ముదురు రంగు నిండు వన్నెలు, ఉఱుత చారలు ,గంటకి వన్నెలు, పుప్పొడి వన్నెలు, రుద్రాక్ష వన్నెలు, నాగ బంధాలు, పూజా బంధాలు, జలపంజరాలు ఇలా 45 రకాల నూలు చీరలు నేస్తారు… కానీ చీరకు కొంగు- అంచు లేకుండా కట్టేవారు కాదు…

ఒద్దిరాజు కమలమ్మ అన్నది కదా!, సాదా చీరలు, సన్నని బట్టతో 120 నెంబరు కలనేత చీరలు నేయించుకొని రోజూవారీ కట్టుకుంటాను.

బతుకమ్మపండగ రోజు తలంటు స్నానం చేసి, నాగరం , కొప్పుబిళ్ళ, కొప్పుమొగ్గలు బంగారు రాళ్ళ పిన్నులు, చంద్రహారం, కంటె, కాసులపేరు, రవ్వల దిద్దులు, రవ్వల కంఠహారం, సూర్య హారం, చేతులకు గాజులు, పులిసేరు కడియాలు, సింహంమూతి కడియాలు,
కాళ్ళకు పట్టా గొలుసులు, పాంజేబులు, తోడాలు , కడియాలు, మట్టెలు , వేళ్ళకు వంకీ ఉంగరం , గోమేధికం తో చేసిన ఉంగరం ,రూబీ ఉంగరాలు, బొడ్లో వెండి తాళంచెవుల గుత్తితో బతుకమ్మ ఆటకు చెరువుకట్ట కిందకు వెళ్ళి ఆడుకొని వస్తాము. కంచిపట్టు, ఆరణి, ధర్మవరం, బనారసు మొదలైన పట్టుచీరలు వాటికి తగిన రవికలు ఎన్నోతీర్ల కుట్లు, అల్లికలతో మేర వాడు కుట్టేవాడు. దేశ ముఖ్ ,దేశపాండ్యాలైన ఒద్దిరాజు వారింటి కోడలుకదా! ఆ మాత్రం బాబు దర్పం ఉండదా?
మడికి దిండిగల్ పట్టు , నారపట్టు చీరలు మడిచారు పోసి కట్టుకుంటాను. గద్వాల, కోట, వెంకటగిరి, ఉప్పాడ, దారుకోసు, నారాయణ పేట చీరలు, మధుర , మిరియాల చీరలు హుందాగా ఉంటాయి.
రోజవారీ కట్టుకోవడానికి మా ఊరు చీరలకు ప్రసిద్ధి! 9 గజాల చీర మూడు మూరల ఎత్తుతో పిండినాకొద్దీ మెరుస్తూ మెత్తగా కడితే ఒంటికి హాయిగా ఉండేవి. మా చాకలి తమాషాగా ఓ మాటనేది .. ఉతికేటప్పుడు గుండి చెరువులో చీర పరిస్తే చెరువు నిండా నీ చీరనే నిండుతుంది.. “అమ్మా మడతబెట్టి తెస్తే పుస్తకమంత అవుతుంది చీర దొరసానీ! మేం సదువుకోనోళ్ళం! జర గొప్పగా సెప్ప రాదు కానీ ఈ చీరకడితే నువ్వు అందంగా కనిపిస్తావు? అనుకొన్న కానీ చీర చెరువులో వేసి ఉతికినప్పుడనిపించింది…
నువ్వు కట్టుకుంటేనే ఈ చీరకు అందమని… “అనిపించిందమ్మా! అని చాకలి బుంగి అనగానే చాలు! సంబడం! నీకేమో కవిత్వం వస్తున్నది ఇవాళ అని రుసరుసలాడి అప్పాలు ఆమె ఒడి నింపి! పిల్లలకు తీసుకుపో అన్నది.
రంగు రంగుల చీరలు ముతక చీరలు సామాన్యులు ధరించేవారు. వారి వారి స్తోమతను బట్టి లేత రంగుల చీరలకు ముదురు రంగులు పూల డిజైన్ అద్దేవారు. కొంగులకు లేత బొమ్మంచు చీరలు కూడా ఉన్నాయి…

వీరి సొమ్ములు ఇలా ఉండేవి. రాగిడి తిరుగుడు పువ్వు, చంద్రవంక, పాపిట బొట్టు, పసిడిపోక, సూసకంకి ,పల్లేరు పువ్వు, నెరతమ్మి రేకు ,అపరంజి కమ్మలు, బనిరెలు, కుప్పె, కుతికంఠ మెడసూలు, గుండ్లపేరు, నాను పట్టెడ, దండ పలుక కడియాలు, పరిగెలు, కడియాలు, గంటల మొలనూలు, గజ్జలు అందెలు (కంచువి) గిల్కుసిరి ( గోల్డ్ ప్లేటెడ్) మట్టెలు, ముక్కుకు ముక్కెర, ముత్తెపు పూస, ముత్తెపు నత్తు, ఈ సొమ్ములు పెట్టుకొని తలలో తంగేడు పూలు, రవికెలేని నునుపైన భుజాలతో అందమంతా తమదే అని ఒకరి భుజాల మిద మరొకరు చెయ్యేసి నాట్యం చేస్తుంటే రెండు కళ్ళూచాలవు!
ఆకాశం ఆ కొసన వాలిన సూర్యుడిని చూసి,చంద్రుడు సన్నని రేక వలె సాగి, మెల్లిగా ఆకాశాన్ని ఆక్రమించుకుంటున్నాడు. మల్లెపూల గుబాళింపులు చల్లగాలితో కలసి గుప్పుమంటూ .. ఉదయం నుండి పనిచేసిన వారికి హాయికలిగిస్తున్నవి. అడవికి పోయిన పశువుల మందలు ఇళ్ళకు చేరుకుంటున్నాయి. ఆ దుమ్ములో క్రమంగా చిరు చీకటి అలముకుంటున్నది. మన కోసం మన వారంతా ఎదురుచూస్తుంటారు. ఈ నాటికి మనం ఇంతటితో చాలించి మరొక రోజు మరిన్ని విషయాలు ముచ్చటించుకుందాం!
ఓ కవితామాలికతో ఈ సభను ముగించుకుందాం..

నేతన్నలకు జోతలు
“నూలు పోగుతో నాగరికతకు
నాందిపలికినారు నవనవోన్మేషంగా!

మేలైన నూలు వడికి నేత నేసిన నేతన్న !
అతడు నేత విరించి!

నేతలందు కొత్త కొత్త రీతులు చిత్రముగ అల్లినారీ విరించులు

నేతలందు ఏర్చి కూర్చి పొందుపరిచి,
పోగు పోగులందు పొసగినారు

విలువలనెల్ల వలువలందు తీర్చి,
మగ్గములపై పరిమళించినట్టి
పనితనముతో పట్టు చీరలందు
చేర్చినారు.

చేడియల మానరక్షణే చేసి,
నలు మూలల ఖ్యాతి చెంది
జగము నిండా- జోతలందుకున్నారు!

నిపుణులైన వారి సాటిలేని కళకు
పొగడగ మాటలేదు! చేతులెత్తి మొక్కేము!!

తరతరాల నేతన్నల స్వేదము
జాతిపేరు నిలుపు నేతన్న హస్తము

సుగుణమణులకు సుందరముగ
వస్త్ర దానమేచేసి,డాసిన చుట్టమాయె!!
—-
—-
కరతాళ ధ్వనులు మ్రోగినాయి!!

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

వివేక వాసంతం **

by V. Kameshwari May 10, 2023
written by V. Kameshwari

ఆరోజు ఉదయం ఐదు గంటల సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే నిద్ర లేచిన వాసంతి అరచేతులు చూసుకొని మంగళ సూత్రాలు కళ్ళకు అద్దుకొని హాలు లోకి రాబోయింది. అప్పుడే తన గదిలోంచి రాబోయిన అత్తగారు కనిపించింది . వాసంతి కి ఎక్కడ లేని కోపం వచ్చి ” ఏమిటి అత్తయ్య గారు… ప్రొద్దుటే ఎవరికీ ఎదురుపడకూడదని తెలియదా.ఈరోజు ఏమి దాపరించబోతుందో ఏమో ” అని అనుకుంటూ వంటింట్లోకి దారితీసింది. అప్పటికే అత్తగారు పాలు కాచి డికాషన్ తీసి రెడీగా పెట్టారు. కోడలు లేవగానే కాఫీ కి ఇబ్బంది ఉండొద్దని! వాసంతి తయారయి ఆఫీసుకు వెళ్లబోతుంటే గడప కొ ట్టుకొని పడబోయి , ఆపుకుంది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని మంచినీళ్లు ఇమ్మని అడిగి ” ఇవాళ ఉదయం లేవగానే మీ ముఖ దర్శనం అయింది కదా, మొదలయ్యాయి అశుభాలు. మీకు ఆ మాత్రం ఇం గి త జ్ఞానం లేదా ” అంటూ అరచింది. “రోజు నీవు లేచేటప్పటికి పొద్దుపోతుందని, ఆఫీసుకు లేట్ అవుతుందని ఏదో సహాయం చేద్దామని అలా వచ్చానమ్మా, క్షమించమ్మా ” అంది దీనంగా అత్తగారు. ఇది రోజు జరిగే తతంగమే కదా అని వాసంతి విసుక్కుంటూ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళింది.

“ఏమిటో కొడుకుకేమో వేరే ఊర్లో ఉద్యోగం, నా బ్రతుకు ఇలా ఉంది” అని మనసులో బాధపడ్డారు. చాలా మంది అత్తగార్ల లాగానే ఈ అత్తగారు కూడా!కాలంఎప్పుడూ ఒకలా ఉండదు. ఒకరోజు వాసంతి తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తల్లి ఎందుకో ఏడుస్తోంది. వాసంతి కంగారుగా ” అమ్మ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ బాగున్నారా? విషయం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ” గట్టిగా కోపంగా అరిచింది. దానికి ఆవిడ ” వసు ఏమని చెప్పను! మీ అక్క వనజ ఆత్మహత్యకు పాల్పడిందట ఉరి వేసుకుని. ఇప్పుడే కబురు తెలిసింది. నేను మీ నాన్న తట్టుకోలేకపోతున్నాం. నువ్వు వస్తే ఒకసారి మనం కలిసి అక్కడికి వెళ్దాం. దాని పిల్లలు ఎలా ఉన్నారో అని మీ నాన్న తెగ ఇది అయిపోతున్నారు అంది. దానికి వాసంతి ” అక్క ఎందుకు అంత అగత్యానికి పాలు పడింది. అసలే బావ లేరు. పిల్లల ముఖమైనా చూసి ఉండాలి కదా” అని అంది. దానికి వాసంతి తల్లి ” ఏమి చెప్పనమ్మా మీ బావ పోయిన తర్వాత అక్కడ మీ అక్క అగచాట్లు చెప్పలేము. కూర్చుంటే తప్పునుంచుంటే తప్పు.దాని అత్తగారట,”నీ దురదృష్టం వల్లే నా కొడుకు పోయాడు, ఈ పాడు ముఖాన్ని చూడలేక మేము చస్తున్నాం. తెల్లారి నీ మొహం చూడకపోతే మాకు గడవటం లేదు. మా మనుమలను చూచి నిన్ను భరిస్తున్నాను కానీ నీ మొహం చూసి కాదు” అంటూ నిత్యం దానిని సూటి పోటి మాటలతో దెప్పి పొడిచేది. దానికి విసిగి వేసారి ప్రాణాలు తీసుకోవడానికి ఒడిగట్టింది.” అని చెప్పి బాధపడింది.
తల్లి మాటలు విన్న వాసంతి లో వివేకం ఒక్కసారి మేల్కొది. తను అత్తగారిని చూసే పద్ధతి కి పశ్చాత్తాపం కూడా కలిగింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన అత్తగారు ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటూనే ఉంది . పిదపకాలపు మనిషి కనక ఎంతో ఓరిమి తో ఉంది. అక్క విద్యావంతురాలు . కానీ ఆవేశపరురాలు. ఆత్మాభిమానం ఉండాలే కాని మితిమీరకూడదు అక్క లాగా. అంత దాకా ఎందుకు! నేను ఒక ఆడదాన్నే కదా! విద్యావంతురాలని కూడా. ఎందుకు నాలో ఈ ఆలోచన రాహిత్యం ఏర్పడింది?”” ఆడదే ఆడదానికి శత్రువు” అన్న మాటను ఖండిస్తాను ఈ రోజు నుండి. ఆడదానికి ఆడదే ఆసరా అని చాటి చెబుతాను. చేసి చూపెడతాను ” అని అనుకుంది వాసంతి.
అత్తగారి గదిలోకి వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పి, “ఇప్పటిదాకా జరిగినదానికి చింతిస్తున్నాను. నన్ను మీ కూతురుగా భావించండి ” అని అం ది.జరిగినదంతా అత్తగారికి వివరించి నేను ఇప్పుడు అమ్మ గారి ఇంటికి వెళ్తున్నా నని, మీరు టైం కి ముందు లేసుకొని జాగ్రత్తగా ఉండండి, పనిమనిషి తో కూడా చెప్పి ఉంచుతాను, మీ అబ్బాయికి కూడా ఫోన్ చేసి చెప్తాను” అంటూ ఆటో ఎక్కింది. తల నిండా అక్క ఆలోచనలే ” వీలైతే అక్క పిల్లల్ని తెచ్చుకుంటే బావుంటుందేమో ” అనే చిరు ఆశ కూడ మొలకెత్తింది.

May 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఒక ఊరి కథ

by Pratyusha May 10, 2023
written by Pratyusha

పేరుకి పుట్టింది, చదివింది హైదరాబాదులోనే అయినా నాకు సంబంధించినంతవరకు నా బాల్యపు జ్ఞాపకాలు అన్నీ మా ఊరివే. ఇక్కడ ఉంటే ఇల్లు దాటితే బడి, బడి దాటితే ఇల్లు. అంతే. అందుకే ప్రతి సెలవుల్లో ఎండాకాలం, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, అన్నీ మా ఊళ్లోనే. అక్కడే ఎన్నెన్నో ఆటలు. వా(మ)న గుంటలు, అచ్చన్నలు/కచ్చకాయలు, ఉప్పు గేరలు, తొక్కుడు బిళ్ళలు. తాటాకు బొమ్మలు. నేను మొదట అక్షరాలు దిద్దింది కూడా మా ఊళ్ళో మా ఇంటి ముందు అరుగు మీదనే.

ఇన్ని ఇచ్చిన మా ఊరు తెలంగాణలో మరో పల్లె. అన్నిటి లాగానే ఎవరికి పట్టని ఒక కుగ్రామం. అదీ వెనుకబడిన పాలమూరు ప్రాంతంలో. నల్లోరిపెల్లి.

వెయ్యి గడపలు ఉన్నది అని చెప్పుకునే పెద్ద ఊరు కాదు.

రోడ్డు ఉన్నదా అంటే ఉన్నది. రోజుకి ఒక బస్సు తెల్లారుఝామున రావడానికి.

రైలు దరిదాపులో ఎక్కడా లేదు. అసలది ఉంటుందని ఊళ్ళో ఎవరికీ తెలియదు.

ఏరు, నది, వాగు ఇవేవీ లేవు. ఉన్నదల్లా చిన్న చిన్న కుంటలు. వ్యవసాయానికి.

పాత కోవెల, ఆధునిక బంగాళా, చరిత్ర అసలే లేవు. ఒక్క రాతి హనుమాన్ల గుడి, పాత ఎల్లమ్మ గుడి.

దగ్గర్లో చెప్పుకోదగ్గ అడవి కూడా లేదు. పొలాల్ని అడిమి అంటారు కానీ.

వందల ఏళ్ల చరిత్ర కూడా లేదు. మా ముత్తాతగారి నాన్నగారి కాలంలో ఊరికి ముగ్గు పోశారు అట.

సినిమాల్లో చూపే ప్రకృతి అందాలు అసలే లేవు. మనసుతో చూస్తే ప్రతి చేను చెలక అందంగానే ఉంటాయి.

ఉన్నదల్లా వంద కుటుంబాలు. వందల ఎకరాల పంట పొలాలు, బావులు, చెలకలు. చుట్టూ గుట్టలు.

తుమ్మ చెట్లు. తాటి చెట్లు. చింత చెట్లు. ఇవీ మా ఊరి వృక్ష సంపద.

కానీ అక్కడే రూపుదిద్దుకున్న తమదైన సంస్కృతి మా ఊరి సొంతం.

అలాంటి ఊళ్ళో కాస్త ఆర్థికంగా సామాజికంగా కూడా కలిసివచ్చిన కుటుంబం. అటు వ్యవసాయం. ఆవులు బర్రెల సహవాసం. దాదాపు ప్రతి కులం వాళ్ళవి పది పరక కుటుంబాలు ఉండేవి. దసరా బతుకమ్మ వచ్చిందంటే మా ఊరి ఆడవాళ్లు ఒక్కచోట చేరి సిగలలో బంతిపూలతో మా వాకిట్లో బతుకమ్మ ఆడుతుంటే, విరబూసిన బంతి తోట నడిచి వచ్చి నాట్యమాడుతూ ఉన్నట్టే ఉండేది.. ఆ బతుకమ్మ ఆటలకు ఏ గుడిలోనో జరగాల్సిన తిరునాళ్ళు మా వాకిట్లో జరుగుతున్నట్టు సంబరంగా ఉండేది.. బుట్టల నిండా తంగేడు పూలు తెచ్చి, గుత్తులు గుత్తులుగా చేసి ఈత చాప చుట్టూ పేర్చి ఒక్కో గుత్తి అందిస్తూ, అందంగా బతుకమ్మను చేస్తున్న నానమ్మ చిట్టి చేతులు కళ్ళింత చేసుకుని చూసేవాళ్ళం.

దసరా రోజు పొద్దున్నే యేట కూరను కోసి పోగులేసి నలుగురు తాతయ్యలు పంచుకుని మళ్ళీ ఒక్కో పూట ఒక్కో తాతయ్య ఇంటిలో బంతి భోజనాలు చేసి సాయంత్రం బాయికాడకి నడుచుకొని పోయి జమ్మి ఆకు చెట్టు మీదనే తెంపుకుని, దారిలో పాలపిట్ట దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఇల్లంతా సందడే సందడి. వాకిట్లో మళ్ళీ కోలాటాలు, బతుకమ్మ ఆటలు. ఈసారి భక్తితో కాదు. సరదాకోసం.

నూనూగు మీసాల యువకుల వీధి కోలాటంలో ఉన్న ఉత్సాహం ఇంకో ఎత్తు. మద్దెల దరువుకు పోటీ పడి కంచు స్వరంలో నిమ్మాఆ చెట్టుకు నిచ్చన్లేసి అని పాడుతూ గాల్లో ఎగిరినప్పుడు కోలాటం కట్టెలు తలపడితే ఆకాశం ఉరిమిందా అనిపించేది.

చీకటి అయితే తాగిన మైకంలో మళ్ళీ మళ్ళీ కాళ్ళకు దండాలు పడి పడి పెట్టే సరదా రాయుళ్లు. ఇంటి వెనకాల చాటుగా ఒక చోట చేరి తాగే అమ్మలక్కలు.

ఎలాంటి ప్రకృతి వింతలు కాలువలు లేకుండా కూడా వరి బాగా పండే భూములు మా ఊరి సొంతం. వర్షాలు, పెద్ద పెద్ద మోట బావులు, ఆ తరువాత మామూలు మోటారుతో నీళ్ళు తోడే బావులు. అయినా రకరకాల పంటలు.

ఎండాకాలం వచ్చిందంటే అందరూ ఎవరి వాకిట్లో వాళ్ళు పడుకోవడం ఇప్పటికీ గుర్తు. మెల్లి మెల్లిగా అన్నల భయం ఎక్కువై ఆ అలవాట్లు పోయాయి. ఇంట్లో ఫ్యానులు వచ్చాయి. కానీ కరెంటు అలా ఒకేసారి కొనలేముకదా.

చుట్టూ కొండలు కదా. సీతాఫలాలు విరివిగా దొరికేవి. కొండెంగలు ఎలా వెంటపడి తరిమినవీ కథలు చెప్తూ పళ్ళు తెచ్చి ఇంట్లో పోసే వాళ్ళు. ఎక్కువ ఉంటే దోరగా ఉన్న సితపోల కాయల కట్టెలతో మంట వేసి కాల్చి తినేవాళ్ళు.

ఇది మా పొలం పక్కన ఉన్న రోకలి గుట్ట.

ఎండాకాలం అయితే మామిడి పళ్లు. తాటి కల్లు. తాటి ముంజలు. తీపి జ్ఞాపకాలు. తాటి ముంజలు తాటికాయలో మూడు కళ్ళు కనిపిస్తూ ఉంటే వేలితో గుచ్చి ముందు అందులోని తియ్యటి రసం తాగి, తరువాత బొటన వేలితో బయటికి తీసి తినడం భలే సరదా.

పాల మోటర్ ఒకరోజు రాకపోతే. ఆరోజు లీటర్ల కొద్దీ పాలు కోవా చేసి పెద్ద స్తాంబాలంలో పోసి ఆరబెట్టి దేవునింట్లో దాచి పెట్టేటోల్లు అమ్మ నానమ్మ. చెల్లి చాటుగా వెళ్ళి పావుకిలో అమాంతం లాగించేసి బయట పడేది.

కంది గుగ్గిల్లు. కల్లులోకి తాగే వాళ్ళ కోసం చేసినా పేరు వాళ్ళది సరదా మాది. మేమే ఎక్కువ తినే వాళ్ళం. మిగిలిన అన్నం ఆరబెట్టి వేపుడు బియ్యం చేసి, వేపిన చిట్టి ఉలవలు కలిపి డబ్బాలో పోస్తే రోజు పిడికెడు తిని అవి అరక్క రోజంతా ఆడుకోవడం తప్పేది కాదు. జొన్న, సజ్జ, మక్క చేలల్లో కంకులు తెచ్చి పొద్దున్నే వంట అయ్యేలోపు నిప్పుల మీద కాల్చుకుని తింటే. లోపల పాలుగారుతూ ఎంత రుచిగా ఉండేవో. చేలో నడుస్తూ లటుకున్న ఒక దోసకాయ తెంపి, అక్కడే ఒక మడి నుండి ఇంకో మడికి పారే తేట నీళ్లలో కడిగి కొరికి తినేస్తే. కడుపులో చల్లగా ఉండేది ఇంటికి పోయే దాకా. ఇంటికి పోయి నానమ్మ పక్కన అరుగు మీద కూచుని సాసర్ లో పోసిచ్చిన చాయ తాగుతూ ఉంటే, నానమ్మ “ఏం తల్లి” అని అలా దగ్గర తీసుకునేది.

ఎన్నని చెప్పను.

అయినా ఊరంటే మనుషులు. మట్టి కాదు. ఆ మనుషులు కొందరు లేరు. మిగతా వాళ్ళు ఇప్పుడు దగ్గరే ఉన్నారు హైదరాబాద్లో. కాబట్టి అందరం కలిస్తే అప్పటి ఆప్యాయతలు అలాగే ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ ఎన్ని ఉన్నా మా ఊరంటే దసరా పండగ. దసరా అంటే మా ఊరు. అది మాత్రం ఇప్పుడు లేదు.

చూడడానికి ఏముంది అనిపించినా, అందరినీ అక్కున చేర్చుకుంటూ, వలస పోయినవాళ్ళు తిరిగి వస్తారా అని ఆశతో ఎదురు చూస్తూ క్రమంగా వయసైపోతున్న గ్రామం. బావులు ఎండి, చెట్లు నేలకొరిగి జవసత్వాలుడుగుతున్నాయి. ఊళ్ళో ఉండిపోయి అలాగే మిగిలిపోయిన వాళ్లను చూసి ఇంకా ఎందుకు పట్నం పోలేదు అనిపిస్తుంది. బహుశా జీవితం, లక్ష్యాలు అంటూ సాగిపోయే నా లాంటి వాళ్ళు చూడలేనిదేదో చూసే ఆత్మజ్ఞానం అయినా వాళ్లకు ఉండి ఉండాలి లేదా పట్నంలో దొరికే అవకాశాలు పట్టని అజ్ఞానం అయినా. ఈ వలసలు కూడా ఏదో ఒక కోరిక, బలం, అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే మెరుగైన జీవితం ఇచ్చే జీవితపు నాటకం ఏమో.

May 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పదకవితాపితామహుడు – తాళ్ళ పాక అన్నమాచార్యులు

by Padmasri Chennojwala May 10, 2023
written by Padmasri Chennojwala

అన్నమయ్య క్రీస్తుశకం 1408 వ సంవత్సరము మే తొమ్మిదవ తేదీన ,కడప జిల్లాలోని    రాజంపేట మండలం, తాళ్లపాక గ్రామంలో, వైశాఖ పౌర్ణమి దినమున నారాయణ సూరి లక్కమాంబ అను దంపతులకు జన్మించిరి. వీరు నందవరీక వంశానికి ,భరద్వాజస గోత్రానికి చెందినవారు .  నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు చాలా కాలం వరకు సంతానం లేక బాధపడుతూ ఒకసారి తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకుని , ధ్వజస్తంభం వద్ద ప్రణామాలు సమర్పించుకుంటూ ఉండగా ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని , శ్రీనివాసుడు తాను ధరించే బిరుదు గజ్జియల  ముప్పిడి కటారాన్ని వారికి అందజేశాడని, అలా పుట్టిన శిశువే అన్నమయ్య అని చాలామంది నమ్మకం . సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా ఇదే నమ్మకం.

“ఇందరికి నభయంబు లిచ్చు చేయి ”  అంటూ వేదములను అందించడానన్ని గురించి తెలియజేసినా,  “వలనైన కొనగోళ్ళ వాడి చేయి ” అంటూ కొనగోట హిరణ్యకాశిపుని చీల్చిన విధానాన్ని , అటు స్వామి అభయహస్తాన్ని ఇటు దుష్ట సంహారాన్ని చేయగలిగిన  చేతి వైభవాన్ని వర్ణించినా,  “అరసి నన్ను గాచిన ఆతనికి శరణు ”  అంటూ  బ్రహ్మాండాలన్నిటా చైతన్య స్వరూపమై నిండిన స్వామిని శరణు వేడినా ,  “అమ్మమ్మ ఏమమ్మా అలమేలుమంగా నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మా ”  అంటూ అలివేలు మంగమ్మను అలుక వీడి స్వామిని మురిపించమని వేడుకున్నా ,  “ఈడగు పెండ్లి ఇద్దరి జేసేము చెడేలాల ఇది చెప్పరుగా”  అంటూ అమ్మవారి సౌందర్యానికి మోహితుడై శ్రీనివాసుడు ఆమెను పరిణయమాడిన వైనాన్ని వర్ణించినా అది అన్నమయ్యకే చెల్లింది.

అన్నమయ్య తల్లికి సంగీతంలో మంచి నైపుణ్యం ఉంది .తండ్రి గొప్ప పండితుడు . ఎనిమిదవ ఏట ఘనవిష్ణువు వద్ద వైష్ణవ దీక్ష స్వీకరించిన అనంతరం వీరి విద్యాభ్యాసం తల్లిదండ్రుల పర్యవేక్షణలోని జరిగిందని తెలిస్తోంది. అన్నమయ్యకు 16వ ఏట శ్రీవేంకటేశ్వరుని దర్శనభాగ్యం     కలుగడంతో అప్పటినుండి అద్భుతమైన కీర్తనలు రచించడం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఏక సంతాగ్రాహి అవడంవల్ల చాలా చిన్న వయసులోనే సంగీత సాహిత్యాలపై అపార పాండిత్యాన్ని గడించారు . అన్నమయ్య మనవడైన తాళ్లపాక చిన్నన్న రచించిన ‘అన్నమాచార్య చరితము ‘ అనే ద్విపద కావ్యంలో అన్నమయ్య జీవిత చరిత్రను వ్రాశాడు.   1948 లో లభ్యమైన ఈ గ్రంథమే అన్నమయ్య జీవితం గురించిన వివరాలు ప్రజలకు తెలియడానికి ఆధారం అయింది .

ఒకనాడు పశువుల మేతకై గడ్డి కోసేటప్పుడు చిటికెన వేలుకు గాయమవుతుంది. అప్పటినుండి అన్నిటిపై విరక్తి చెంది స్వామి సేవే పరమావధిగా శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థియై తిరుమలకు బయలుదేరి యాత్రలో భాగంగా పలు దైవాలను దర్శిస్తూ , మోకాళ్ల పర్వతానికిచేరి అలసటతో ఒక వెదురు పొదలో నిద్రించగా అలివేలు మంగమ్మ కలలో దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదంగా పెట్టి, పాదరక్షలు లేకుండా పర్వతాన్ని ఎక్కితే అలసట తెలియదని చెప్పడంతో మెలకువ వచ్చి పరమానందంతో కలలో కనిపించినది సాక్షాత్తు అలివేలు మంగమ్మ అని తెలుసుకొని ఆశువుగా ఒక శతకాన్ని చెప్పిరి . తరువాత సునాయాసంగా కొండనెక్కి తిరుమల గిరులపై ఉన్న అన్ని దేవాలయాలు,పుష్కరిణి,  ఆకాశగంగ, కుమారధార,  పాపవినాశం,  విరజానది , యా గశాల,  ఆనంద నిలయం ,కళ్యాణ మండపం , బంగారు గరుడ శేషవాహనం, శ్రీభండారం, బంగారు      హుండీని దర్శించి తన పంచె చెంగున ముడి వేసుకున్న బంగారు కాసును సమర్పించాడు.  వంట ఇంటిలో వకుళాదేవికి నమస్కరించి , బంగారు వాకిలి చెంతకు చేరి దివ్యపాదాలతో, కటి వరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళమూర్తిని దర్శించి ,తీర్థప్రసాదాలు స్వీకరించి ,  స్వామి ఆశీర్వచనం పొంది ఆ రాత్రి ఒక మండపంలో నిద్రించాడు. ఆదివరాహ స్వామిని దర్శించి , పుష్కరిణిపై ,గరుడకదంబంపై ,విశ్వక్సేనునిపై పలు సంకీర్తనలను ఆశువుగా చెప్పిరి.

 శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళగా గుడి ద్వారము యొక్క తలుపులకు తాళం వేసి ఉండుటవలన చింతిస్తూ భక్తితో శ్రీ వేంకటేశ్వరుని స్తుతించగా వాటంతటావే తాళములు , తలుపులు తెరుచుకొనబడినవి . శంఖ చక్రములతో వైభవముగా వెలుగొందే ఆ స్వామిని చూసిన అన్నమయ్య పరమానందముతో ఒక శతకమును చెప్పెను . అంతలో స్వామి మెడలో ఉన్న ముత్యాల హారము పాదములపై పడిందట. ఘన విష్ణువు  అని పేరు గల ముని శ్రీ వేంకటేశ్వరుని ఆజ్ఞానుసారంగా అన్నమయ్యను పిలిచి పంచ ముద్రలు వేసి వైష్ణవ దీక్షను ఇచ్చిరి .అప్పటినుండి అన్నమయ్య అన్నమాచార్యుడు అని పిలవబడి , సర్వ విద్యలను , అనగా వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ ,  ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే జీవితం గడపసాగారు .

వెంకటాచలానికి సమీపంలో ఉన్న ‘మరలుంకు ‘ అనే అగ్రహారంలో నివసించేవారు. ఆ సమయంలో రాజ్యంలో చెలరేగిన కల్లోలాలతో విరక్తి చెందిన అతను హరి సంకీర్తనలే సర్వస్వంగా  జీవితం గడపసాగారు .అతని కీర్తనలలోని ఆశీర్వచనానికి ఆకర్షితులైన జనులు తండోపతండాలుగా వచ్చేవారు .

అన్నమయ్య పదకవితాపితామహుడు , సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు అని బిరుదులు పొందిరి .

శ్రీనివాసుని నాయకునిగా తనను తాను నాయికగా భావించుకొని మధుర భక్తితో కూడిన  శృంగార కీర్తనలు రచించిరి.అన్నమయ్య కీర్తనలలో విష్ణుభక్తి మాత్రమే కాకుండా సమాజ సంక్షేమానికి , చైతన్యానికి సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి .

అన్నమయ్యకు యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి తిమ్మక్క అక్కమ్మ అనే ఇరువురు స్త్రీలతో వివాహం జరిపించిరి. వీరికి ఇద్దరు కుమారులు కూడా కలిగారు . ఒకసారి అన్నమయ్య తన భార్యలతో తిరుమల సందర్శించి ఆ సమయంలోనే శ్రీ వేంకటేశ్వరునిపై రోజుకు ఒక్క కీర్తన వినిపించాలని సంకల్పించింరి. అప్పటినుండి పుంఖానుపుంఖాలుగా కీర్తనలు రచించడం మొదలుపెట్టారు . అతని శిష్యులు వీటిని గానం చేస్తూ, తాళపత్రాలలో లిఖించడం ప్రారంభించారు . తర్వాత అన్నమయ్య మనవడైన చిన తిరుమలాచార్యుడు వీటిని రాగిరేకులపై చెక్కించడంతో అవి నేడు తిరుమల భాషకారుల సన్నిధిలో భద్రపరచబడి ఉన్నవి.

సాల్వ నరసింహారాయలు అనే రాజు తనపై కీర్తన రచించమని ఆజ్ఞాపించగా , “నరహరి నుతించిన జిహ్వ పరుల నుతింపగా నొప్పదు “అని నిరాకరించిరి. అందులకు కోపించిన రాజు అన్నమయ్యను చెరసాలలో బంధించమని ఆజ్ఞాపించగా , అన్నమయ్య “సంకెలలిడు వేళ” అను కీర్తనను గానం చేయుటతో వెంటనే ఆ సంకెళ్లు విడిపోయినవట. అప్పుడు రాజు ఆశ్చర్యపడి అన్నమయ్యను శరణు వేడుకొనిరట.

వీరి కీర్తనలలో ఆ కాలము నాటి సాంఘిక , సామాజిక ఆచారములు ,సామెతలు ,అలంకారములు అన్నియు గోచరిస్తాయి.  వీరి రచనలు ఆధ్యాత్మిక సంకీర్తనలు ,శృంగార సంకీర్తనలు అని రెండు రకములుగా విభజింపబడినవి.

తెలుగు భాషలో మొట్టమొదటగా రచనలు చేసిన వాగ్గేయకారుడు అన్నమయ్య. కీర్తన అను ప్రక్రియను ప్రారంభించినది కూడా అన్నమాచార్యులే. పల్లవి ,అనుపల్లవి ,చరణములు మొదలగు వానికి రూపకర్త కూడా అన్నమాచార్యులే. వీరి రచనలలో ‘శృంగార మంజరి ‘ , ‘వెంకటాచల మహత్యము’ ,’సంకీర్తన లక్షణము’ , ‘ద్విపద రామాయణము’  12 శతకములు మొదలైనవి. ఇవి వీరు శ్రీవేంకటేశ్వరుని చరణాలకు అంకితమిచ్చిరి .

వీరు సంస్కృతంలో రచించిన ‘సంకీర్తన లక్షణము ‘ ను వీరి  మనవడైన చినతిరు మలాచార్యుడు తెలుగులోనికి అనువదించిరి .

15వ శతాబ్దానికి చెందిన కాలంలోనే వీరిలో పలు అభ్యుదయ భావాలు ఉన్నట్లుగా వీరి రచనల ద్వారా మనము   కనుగొనవచ్చు .కులమత భేదాలను తూలనాడడం , అంటరానితనాన్ని నిరసించడం , కులవృత్తులను గౌరవించడం వీరి రచనల్లో ఉన్న  వైభవం .

“ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి  చాంగుభళా “అంటూ అలివేలు మంగమ్మ శ్రీనివాసుల అనురాగాన్ని వర్ణించినా , పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభపేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు “అంటూ అలివేలు మంగమ్మను పెళ్లికూతురుగా , ఆమెలోని బిడియాని అందంగా వర్ణించినా, “మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరిభూమి ఒకటే ”  అంటూ కులమతాల అడ్డుగోడలని ఛేదించినా, ” ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టనిండా పాలు పోయరే ” అంటూ బాలకృష్ణుడిని ముద్దుగా ముద్దుమాటలాడినా అది ఆయన కీర్తనలలోని భక్తి  భావపు పలు కోణాలగా మనము గమనించవచ్చు .

సంగీత సాహిత్యాలలో ఈతని కుటుంబ సభ్యులు ఆరితేరినట్లుగా  మనము గమనించవచ్చు .ఇతని తల్లి చక్కని సంగీతవేత్త .తండ్రి పండితుడు . భార్య అయిన తిమ్మక్క తొలి తెలుగు కవయిత్రి. ఈమె’  సుభద్రా కళ్యాణం ‘ ,  ‘మంజరి  ‘ అనే ద్విపద కావ్యం రచించింది . తిమ్మక్క కుమారుడైన చిన్నన్న సంగీత సాహిత్యాలలో పండితుడు .

 శ్రీ వేంకటేశ్వరున్ని  కీర్తనల ద్వారా స్తుతించడంలోనే జీవితానందాన్ని పొందిన అన్నమయ్య   క్రీస్తు శకము 1503 వ సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీన దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి దినమున స్వామిలో ఐక్యం అయ్యారు.

” కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు ” అంటూ ఇరుదేవేరుల నడుమ అలరారే స్వామి రూపాన్ని వర్ణించినా , “కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ తెట్టేలాయె మహిమలే తిరుమల కొండ “అంటూ తిరుమలగిరి శిఖరాల సోయగాలను వర్ణించినా,  “సకల లోకేశ్వరులు సరస చేకొ నువాడు అకలంకముగ పుష్పయాగంబు ” అంటూ స్వామి పుష్పయాగ సుగంధా లను (వైభవాన్ని) వర్ణించినా, ఉన్నతి  పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు బలా” అంటూ అమ్మవారికి స్వామివారిపై ఉన్న అనురాగాన్ని వర్ణించినా ” జో అచ్యుతానంద జోజో ముకుందా ” అంటూ స్వామిని నిద్రపుచ్చినా అది అన్నమయ్య  కీర్తనలలోని  మాధుర్యంగా మనం గమనించాలి . ఒకవైపు శ్రీనివాసునిపై భక్తి ప్రధాన కీర్తనలు అల్లుతూ , మరోవైపు సమాజంలోని దురాచారాలను నిరసిస్తూ రచించిన వీరి కీర్తనలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆబాల గోపాలాన్ని అలరిస్తూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు .        

May 10, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పెద్దల మాట చద్ది మూట

by జయంతి వాసరచెట్ల May 9, 2023
written by జయంతి వాసరచెట్ల

నీతి కథ

ఒక అడవి లో ఒక  జామతోట నోరూరించే చక్కని ఫలాలతో ఎప్పుడూ రకరకాల పక్షులతో సందడిగా ఉండేది. ఆతోటలో అన్ని పక్షులతో పాటు రామచిలుక లు కూడా ఉండేవి. ఆకలి వేసినప్పుడు చెట్టు పండ్లు తింటూ ఏ చీకూచింతా లేకుండా ఉండేవి. తోటలో పండ్లు కోయడానికి వచ్చే తోటపని  వాళ్ళు జామ పండ్లను దగ్గరలో ఉన్న నగరం లో అమ్మితే చాలా గిట్టుబాటు అవుతుంది అంటూ” నగరాన్ని అక్కడి వాతావరణాన్ని గొప్పగా చెప్పుకునే వారు. “

ఆ పక్షుల గుంపు లో ఉన్న సోమూ ,భీమూ అనే రెండు రామచిలుక లు వారి మాటలు విన్నాయి.

వాటికి నగరాన్ని చూడాలని ఆశ కలిగింది.

ఒక రోజు ఆపక్షుల తల్లిదండ్రి పక్షులు మేము అలా బయటకువెళ్ళొస్తాము అని సోము,భీమూ లను “జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండండి తోట దాటి బయటకు వెళ్ళొద్దని  చెప్పి విహారానికని వెళ్ళాయి.”

వాటికి ఇదే మంచి సమయం అనుకున్నాయి.

“మనం ఈ పనివాళ్ళు వెళ్ళే దిశగా మనమూ వెళ్ళి నగరమంతా చుట్టి వద్దామనుకుని

జామకాయలు తీసుకుని వెళ్ళే వాహనంపై కూర్చుని వెళ్ళాయి.”

*

పెద్దపెద్ద మేడలు, క్షణం తీరిక లేకుండా తిరిగే వాహనాలు, పెద్దపెద్ద సెల్ఫోన్ టవర్లు, ఎక్సిబిషన్ లో తిరిగే చక్రాల వాహనాలు,అన్నీ చిత్రవిచిత్రంగా కనిపించాయివాటికీ.

ఎగురుతూ వెళ్ళి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని అన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ మైమరచిపోయాయి. కాస్తా చీకటి పడేసమయానికి

సోము, భీముతో ” నాకు ఆకలేస్తుంది భీము …” అంది. నాకు కూడా ఆకలేస్తుంది సోము అని భీమూ అంది, చుట్టూ చూసాయి.

అప్పుడు కానీ వాటికి గుర్తుకు రాలేదు. అవి ప్రయాణం చేసి వచ్చిన వాహనం దరిదాపుల్లో కూడా లేదని …. వాటికి ఏం చేయాలో పాలుపోలేదు.

కిందికి చూసాయి.

ఆ రెండు పక్షులు కూర్చున్న చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.అతని ముందు ఒక  పంజరం దాని ముందు కొన్ని కార్డు లు వేసి ఉంచాడు.

పక్కనే రెండు జామపండ్లు ఉన్నాయి. ఎవరో కొందరు వ్యక్తులు ముందు కూర్చుని ఏవో అడుగుతుంటే పంజరం లోని చిలుక బయటకు వచ్చి కార్డు తీసి లోపలికి వెళ్తుంది. చిలుక తీసిన కార్డులోని విషయం ఆ వ్యక్తి చదివి వాళ్ళకు చెప్తున్నాడు. పరిహారాలు కూడా చెప్పి పాటించమని సలహా ఇస్తున్నాడు.

భీమూ,సోము లు  మాత్రం ఏమీ ఆలోచించకుండా పక్కనున్న జామకాయలు చూసి అవి మనవాళ్ళవే కాబోలు వెళ్ళి తిందాం అని ఎగురుతూ కిందికి వాలాయి.

****

జామకాయ ను కొరుకబోతున్న సోము ను జ్యోతిష్యుడు  ఒడుపుగా పట్టి తన పంజరం లోని ఒక అరలోకి నెట్టాడు.

“ఒక్కసారి గా అతని చేతికి చిక్కిన సోము భయపడిపోయి వణకసాగింది.

బయట ఉన్న భీము ” రక్షించండీ రక్షించండీ” అని అరుస్తుంది.

“దాని భాష అర్థం కావడానికి ఎవరైనా వచ్చి రక్షించడానికి అది తన నివాసం దగ్గర ఉందా…?”మానవారణ్యంలో ఉంది.

ఇక్కడున్నవారందరూ మనుషులు.

లోపలున్న సోము మాత్రం” మిత్రమా ఇతను చిలుక లను బందించి పంజరం లో పెట్టిన జోస్యం చెప్పుకుని బ్రతికేవాడు మనం మోసపోయాం.

నేను వీడికి బందీగా చిక్కి ఇలాగే ఉండవలసిందే అన్నది  ఏడుస్తూ…!!

మనం అమ్మానాన్నలకు చెప్పకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. అని భీమూ ఏడవసాగింది ఏంచేయాలో పాలుపోలేదు వాటికి.

***

పంజరం లోని మరో చిలుక కల్పించుకుని ” నాపేరు రాము ” నేనుకూడా మీలాగే నామిత్రునితో కలిసి అడవిలో తిరుగుతుంటే ఇతనికి దొరికి పోయాను.

అప్పటినుండి ఈ పంజరం లో నన్ను బంధించి రోజుకు రెండు జామపండ్లు పెట్టి నాతో జాతకం చెప్పిస్తూ  రెండు వేలు సంపాదిస్తున్నాడు.

ఇంట్లో చెప్పకుండా వచ్చి వీడి చెరలో చిక్కాను అంటూ బోరున ఏడ్చింది.

ఇప్పుడు ఏం అనుకున్నా ఏం లాభం ఇంకా మన గతి ఇంతేనా ..!!

అనుకున్నాయి.

వాటికి ఆలోచన రావడం లేదు.

మిత్రమా నీవు భయపడకు నీకు నేనున్నాను ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను అంటూ భీము ధైర్యం చెప్పింది.

దానికి ఒక ఆలోచన తట్టింది.

హా ఐడియా…. నీవు ఇలా చేయి అని దూరం నుంచే తన భాషలో చెప్పింది.

లోపలున్న రాము నన్నుకూడా మీతో తీసుకుని వెళ్ళండి .అని బతిమలాడింది. మరి మాకు మా  ఇంటికి వెళ్ళే దారే తెలియదు కదా …?

అంది సోము.

ఈ జ్యోతిష్యుడు రోజూ ఊరిబయట ఉండే ఒక జామతోటమీదుగా వస్తాడు.

అది మీరుండే ప్రాంతమో కాదో నాకు తెలియదు… కానీ అక్కడ చాలా పక్షులు ఉన్నాయి.

 ఆదారి నాకు బాగా తెలుసు అంది.

సరే మరి  నీవు చెప్పినట్లే చేద్దాం అనుకున్నాయన్నీ…!!

***

జ్యోతిషం చెప్పించుకోవడానికి వచ్చిన వారికి చిలుక తో కార్డులు తీయిస్తున్నాడు జ్యోతిష్యుడు.

అది మెల్లిగా కార్డులు కిందిది ఒకసారి పైది ఒకసారి తీస్తూ కన్ఫ్యూజ్ అయినట్లు పరిశీలించసాగింది.

ఎదుటి వారితో జ్యోతిష్యుడు “మీకు ఎంతో కష్టం వచ్చేటట్లు ఉంది” అందుకే మా చిలుక ఏంతీయాలో అర్థం కానట్లు చూస్తుంది అన్నాడు.

బాబ్బాబు ఎంత డెబ్బై నా సరే మంచిగా తీయించండి పరిహారాలు చెప్పండి అన్నారు వాళ్ళు ….!

అంతలోనే సోము గిలగిలా కొట్టుకోసాగింది.

అరరే కొత్త రామచిలుక కు ఏమయ్యింది…?

ఆలా పడిపోయి కొట్టుకుంటుంది… అనుకుంటూ పంజరం సందులోంచి వేలితో కదిపాడు.

అది కదలలేదు. పంజరం తెరిచి చేతితో బయటకు తీసి అంటూ ఇటూ కదిపాడు.

ఇంక లాభం లేదు దాన్ని పక్కనే ఉంచి. నీళ్ళు చల్లి చూద్దామని

తన బస్తాలోని నీళ్ళ సీసా బయటకు తీయడానికి వొంగాడు అంతే ఇదే అదను అనుకుని రాము సోము బుర్రున లేచి తుర్రున ఎగిరిపోయాయి.

****

ఇది మేముండే తోటనే రా రాము అంటూ సోమూ, భీము రాము ను తీసుకుని వెళ్ళి తోటి పక్షులకు పరిచయం చేసి జరిగిందంతా చెప్పాయి.

అక్కడున్న పెద్ద పక్షులు “పెద్దలమాట చద్ది మూట అన్నారు” పెద్దలు మీకింకా లోక జ్ఞానం రాలేదు

ఇప్పటికి తప్పించుకుని బయటపడ్డారు ఎప్పుడూ ఇలాగే ఉండదు.ఇలాంటి పనులు మరెప్పుడూ చేయకండి అని కోప్పడ్డాయి.

దూరపు కొండలు నునుపు అనుకుని అపోహ పడకూడదు అన్నాయి.

తప్పైందమ్మా మరోసారి ఇలా చేయుము మీకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళము మమ్మల్ని క్షమించండి అన్నాయి మూడు చిలుకలు

మరో కొత్త స్నేహితుడిని పరిచయం చేస్తూ……!!

(నీతి:- చెప్పుడు మాటలు విని మోసపోకూడదు , దూరపు కొండలు నునుపు అని గుర్తుంచుకోవాలి.)

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సరళ శతకం

by చంద్రకళ దీకొండ May 9, 2023
written by చంద్రకళ దీకొండ

నీ హృదయ స్పందనకు కారణమై
నీ గుండె లయతాళాలే జీవనగానమై
నవమాసాలు నిను గర్భాన మోయు
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

శారీరక మానసిక ఒత్తిడులెన్నో అనుభవించి
రోయక ఎన్నో సేవలొనర్చి
పెంచి పెద్ద చేసి విద్యాబుద్దులెన్నో నేర్పు
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

ఆమె హృదయమొక మమతల కోవెల
క్షమ ప్రేమలే ఆమె గుండె
లబ్ డబ్ లు
ప్రేమ త్యాగాల ప్రతిరూపమైన
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

చెప్పకుండానే నీ ఆకలి తెలుసుకుంటుంది
అడగకుండానే అవసరాలు తీరుస్తుంది
పెదవి విప్పకుండానే నీ మనసు తెలుసుకునే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

నీ బాధకు తాను తల్లడిల్లుతుంది
నీవే లోకంగా భావిస్తుంది
ఎల్లవేళలా నీ క్షేమాన్నే కాంక్షించు
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

విసుక్కున్నా సహిస్తుంది
ఎదురుతిరిగినా భరిస్తుంది
నీవు ఒడి చేరితే అమితంగా మురిసే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

నీ ఆశలకు తాను పల్లకై
నీ ఆనందాలకు వారధై
నీ ఆలోచనలకు సారథి అయిన
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

చెడు పనులను వారిస్తుంది
నీతులను ప్రథమగురువై బోధిస్తుంది
నీ పొరపాట్లను వెనకేసుకొచ్చే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

ఎవరు నిన్ను తూలనాడినా తాళలేదు
విమర్శలతో గేలిచేస్తే ఊరుకోదు
ప్రపంచాన నీవే మిన్న ఎన్ని
లోపాలు నీకున్నా అనే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

ఎవరికీ ఏ లోటూ రానీయక
ఇంటిలోని వారందరి
శ్రేయస్సుకై పాటుపడుతూ
తన గురించి తాను ఆలోచించుకునే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!!!

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరిణీత

by Padmasri Chennojwala May 9, 2023
written by Padmasri Chennojwala

పూరిగుడిసె ముంగిటి పుష్పగుఛ్చం
అద్దాలమేడకు అలంకారమైంది

ఆకాశాన విహరించే అందాల చిలుక

బంగారు పంజరాన బందీ అయింది
కొమ్మ వేదికపైని మధుర గాయని కోయిలమ్మ

గొంతుకు పసుపు తాడేదో బిగుసుకున్నట్టుంది

గడప దాటిన కౌమార్యం గంపెడు బరువును తలకెత్తింది

కొంగుముడిలో కొత్త జీవితం కత్తుల బోనులో కాలు మోపింది

విరిసీవిరియని కుసుమం నిప్పుల కుంపటి పాలయింది

ఏటిలోని చేపపిల్ల ఒడ్డున పడి విలవిల్లాడింది

గాండ్రించే పులుల నడుమ లేడికూన గిలగిల్లాడింది

కాలచక్రం కఠిన వేగంతో గిర్రున తిరిగింది

అంతలోనే తలుపు తట్టిన అమ్మతనం
అదనపు బాధ్యతల్ని అప్పగించింది

అగ్ని కీలలకు అంతరంగం ఆహుతి అయింది

నిరసన జ్వాలలకు ఆత్మగౌరవం మాడి మసయింది

దిక్కుతోచని దీనావస్థ సారస్వత సాగరాన సేద తీరింది అనుభవాలే

పాఠాలు అయినవి పరిస్థితులు పాండిత్యాన్ని అలదినవి

తల్లి ప్రేమ అగ్ర పీఠాన నిలిచింది ఆణిముత్యాలని జాతికి అంకిత మిచ్చింది

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ సాహిత్యం – ఒకప్పటి జిల్లాల పాలనా చరిత్ర

by kvtk Prashanth May 9, 2023
written by kvtk Prashanth

వ్యాసం ఉద్దేశ్యం:
సాహిత్య చరిత్రలో ప్రాంతీయ చరిత్ర మిళితమై ఉండాలి. అప్పుడే సామాజిక కోణం కూడా కొంత అవగాహనకు వస్తుంది. కానీ సాధారణంగా అలా జరగదు. జిల్లాల, ప్రాంతాల చరిత్ర ఎక్కడా కూడా సమగ్రంగా ఉండదు. సేకరించిన సమాచారం ఆధారంగా కొన్ని సమగ్ర వివరాలు ఈ వ్యాసం అందిస్తుంది.

తెలంగాణ సాహిత్యములో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చారిత్రక అంశాల మీద పరిశోధన జరిగింది. అయితే, తెలంగాణ చారిత్రక వీర గాథలు, సామాజిక సాంస్కృతిక సాహిత్యం గురించి విశ్లేషణ చేసేటపుడు స్థానిక భౌగోళిక , పాలనా వ్యవస్థ చరిత్ర కూడా కొంత దోహద పడుతుంది. ఉదాహరణకు, తెలంగాణ జానపద సాహిత్యంలో ప్రముఖంగా ప్రస్తావించబడే మావురాల ఎల్లమ్మ కథలో మావూరు అంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు దగ్గరిలోని మహారాష్ట్రలోని శక్తి పీఠం అయిన మాహూరు. తెలంగాణ చరిత్రకు మాహూరు ప్రాంతానికి దగ్గరి సంబంధం ఉంది అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. పైగా నేటి అదిలాబాద్ జిల్లాలోని కొంత భాగం మాహూరు జిల్లాలోనే ఉండేది. మరాఠీ ప్రజలతో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, మెట్పల్లి తదితర ప్రాంతాల తెలుగు వారు సైతం మాహూరులో రేణుకా , ఏకవీరిక ఆలయాలను సందర్శిస్తుంటారు. స్థానిక స్థల పురాణం ప్రకారం మాహూరు లో రేణుకా దేవి శరీర భాగాలు మూడు చోట్ల పడ్తాయి. ఒకటి మాహూరు కాగా మిగతా రెండు తెలంగాణలో ఉన్నవి. అందులో ఒకటి నిర్మల్ జిల్లాలోని దిలావార్పుర్, మరోది నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ తాలూకాలోని కుదావందపూర్ గ్రామం. ఈ విధంగా కూడా మాహూరుకు తెలంగాణకు చాలా దగ్గరి సంబంధం ఉన్నది. కొందరు చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము మాహూరులోని ఏకవీరికా దేవి, రేణుకా ఎల్లమ్మ ఓరుగల్లులోని ఏకవీరికా దేవికి సంబంధం ఉంది. కాకతీయులు మాహూరు నుంచి వచ్చి ఉండవచ్చు అని, మాహూరే తొలినాటి కాకతీయ శాసనాల్లో పేర్కొన్న కాకతీపురమని ప్రముఖ చరిత్రకారులు పీవి పరబ్రహ్మ శాస్త్రి గారి సిద్ధాంతం. మాహూరు జిల్లాలో ఆదిలాబాదులోని కొన్ని భాగాలు ఉండేవి అన్న జిల్లా పాలనా వ్యవస్థీకరణ చరిత్ర ద్వారా మాహూరుకు తెలంగాణకు ఉన్న సంబంధం గురించి మరింత సమాచారం లభ్యమవుతున్నది.

తెలంగాణాలో ప్రముఖమయిన బతుకమ్మ పాటల్లో ఒకటయిన రామ రామ ఉయ్యాలో, రామన్ శ్రీరామ ఉయ్యాలో అనే పాటలో 20 వ శతాబ్ధాపు తెలంగాణ జిల్లాల ప్రస్తావన ఉండడం గమనించవచ్చు. తెలంగాణ సంస్థానాలలో వనపర్తి, గద్వాల, ఆత్మకూరు సంస్థానాలు కొంత ప్రతిపత్తిని కలిగి తెలుగు సాహితీ పోషణ చాలా బాగా చేసారు. పానగల్లు కోటలో రెండోవ నిజామ్ కొన్ని ఏండ్లు ఆ జిల్లా కోటలో నివసించినాడు అని పానుగల్లు కోట చరిత్ర గురించి ప్రస్తావించినపుడు సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పారు. అయితే, మరాఠా రాజులతో యుద్ధంలో, మరాఠా సేనల ఒత్తిడి నుంచి ఈ సంస్థానాలు రెండవ నిజాం రాజును రక్షించినట్టు ఒక లోకోక్తి ప్రబలంగా ఉంది అని కూడా సురవరం గారు చెప్పారు. బహుశా అందుకే కావొచ్చు తరువాతి కాలంలో కూడా ఈ సంస్థానాలకు మంచి ఆదరణ తరువాతి తరం నైజాం రాజులనుంచి లభిస్తూ ఉండేది. పాలనా అంశాలు సాహిత్య సామాజిక చరిత్రలకు ముఖ్యం కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి గారు 20వ శతాబ్దంలో నిజాం రాజ్య పరిపాలన వ్యవస్థ , యంత్రాంగం మీద “నిజాం రాష్ట్రపరిపాలనము” అనే ఒక చిన్న గ్రంథం కూడా రాసి నాటి నిజాం ప్రభుత్వ వ్యవస్థ గురించి తరువాతి తరాలకు కొంత అవగాహన కల్పించే గొప్ప పని చేసారు. మరో ఉదాహరణ చూస్తే, స్థానిక వీరుల విజయగాథలు చూసినపుడు ఆ వీరుల గాథల్లో ఆయా ప్రాంతాల, కోటల ప్రాముఖ్యతను నాటి జిల్లాల పాలనా చరిత్ర కొంత సమాచారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు సర్దార్ పాపన్న చరిత్ర లో భువనగిరి, వరంగల్లు కోటల నాటి పాలనా వ్యవస్థ కీలకం. నాడు ఓరుగల్లు కోట లో హనుమకొండలో లాగానే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి. భువనగిరి జిల్లా కేంద్రము, ముఖ్య పట్టణాలలో ఒకటి.

తెలంగాణలో జిల్లాలకు ఉండే పర్షియన్/ ఉర్దూ పేర్ల వెనుక దాగి ఉన్న సామాజిక రాజకీయ అంశాలు కూడా స్పష్టంగా జిల్లాల చరిత్ర వల్ల తెలుస్తాయి. మచ్చుకు, నిజాం రాజుల పాలనలో ఉన్న భూస్వామ్య విధానం, దాని ప్రభావం పైన ఎంతో తెలుగు సాహిత్యం వచ్చింది. అయితే, నిజాముల పైన వచ్చిన విమర్శలలోనూ అందుకు భిన్నంగా ఆరవ నిజాం మహబూబ్ ఆలీఖాన్ గురించి ప్రశంసలే మన తెలంగాణ సాహిత్యం లో కనబడతాయి. ఉదాహరణకు జగిత్యాలలో ప్రముఖ కవి అయిన జైశెట్టి రాజయ్య గారు ఆరవ నిజాం రాజు మూసీ వరదల సమయంలో చూపిన ఔదార్యాన్ని గుర్తిస్తూ అతడిని మనసున్న మహారాజు అని కీర్తించారు. ఆరవ నిజాం రాజు హైదరాబాదు పురాని హవేలీ ప్రాంతంలో బతుకమ్మ పండుగ జరుపుకునే ఆడ బిడ్డలను గౌరవించినట్టు కూడా కథనం ఒకటి ప్రచారంలో ఉంది. అయితే తెలంగాణలోని మూడు జిల్లాలకు (మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్) మంచి మనసున్న ఆరవ నిజాం రాజు పేరు మీదనే జిల్లా పేర్లు పెట్టారు. ఇటువంటి చారిత్రక విషయాలు ఆరవ నైజాం రాజుకు తెలంగాణ కవి ఇచ్చిన మనసున్న మహారాజు అనే ప్రశంసను కొంత బలపరుస్తాయి. పైగా ఆరవ నైజాం ఎన్నో పరిపాలనా సంస్కరణలు చేపట్టి ఆధునిక హైదరాబాదు సర్వతో ముఖాభివృద్ధికి పునాదులు వేసారు. ఇట్లా జిల్లాల చరిత్ర , పేర్లు మొదలయిన చారిత్రక అంశాల సమాచారం వల్ల సాహిత్యంలో ఉన్న అంశాలను మరింత లోతుగా పరిశీలించే విధంగా అదనపు సమాచారాన్ని అందిస్తాయి.

ఈ విధంగా తెలుగు సాహిత్యంలో చారిత్రక సాంస్కృతిక అంశాలు అర్థం జేసుకోవడనికి జిల్లాల పాలనా వ్యవస్థ చరిత్ర దోహద పడుతుంది. అయితే, ఆధునిక చారిత్రక కాలంలో తెలంగాణలోని జిల్లాల గురించి, వాటి పేర్ల గురించి, ముఖ్య పట్టణాలు గురించి , భౌగోళిక హద్దులు వగైరా అంశాల గురించి మనకు తెలుగులో సమాచారం తక్కువ. తెలంగాణ ప్రాంతాన జిల్లాలు ఏ పేర్లతో ఉండేవో ఒకసారి చూద్దాం. అసలు పాత తెలంగాణ జిల్లాల తెలుగు పేర్లు ఏమిటి అన్న విషయం కూడా తెలుస్తుంది.

తెలంగాణలో ఉర్దూ పేర్లు పెట్టక మునుపు పాత జిల్లాల పేర్లు ఏమిటి అన్న ప్రశ్న వచ్చినపుడు ఒక సమగ్రమైన వ్యాసం మనకు లభ్యం కాదు. ఆ విషయం అర్థం చేసుకోవటానికి కుతుబ్షాహీల నాటి కాలం నుండి మనకు లభ్యమవుతున్న చారిత్రక గ్రంధాల సమాచారం బట్టి పరిశీలించవచ్చు. ఇక అంతకు ముందు రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య, కాకతీయ , రాచకొండ రాజులు, బహమనీ సుల్తానులు, మొదలగు రాజ్యాలు అన్ని కుతుబ్షాహీల పూర్వపు కాలానికి చెందినవి. ఆయా రాజ్యాల్లో జిల్లాలు, విషయాల పై ఉన్న సమాచారం కొంత తక్కువే. పైగా కుతుబ్షాహీల కాలం నాటి పర్షియన్ రికార్డుల ద్వారా మనకు జిల్లాల గురించి విస్తృతమయిన సమాచారం ఉంది. కాబట్టి, మొదలు కుతుబ్షాహీల కాలంలో ఆనాటి రాజ్యంలో ఉన్న జిల్లాలను చూద్దాము. 16వ శతాబ్దంలో సుల్తాన్ కులీ కుతుబ్షా గోల్కొండ సుబాకి బహమానీల ప్రతినిధిగా వచ్చినపుడు, తర్వాత స్వాతంత్య్రం ప్రకటించుకున్నాక తాను తెలింగాణా ప్రాంతంలో గెలిచిన కోటల వివరాలు మధ్య యుగ చరిత్రకారుడు ఫరిష్టా రచనల ఆధారంగా ఈ విధంగా ఉన్నాయి – రాచకొండ , దేవరకొండ, భువనగిరి, ఘనపురం, కోయిలకొండ, మెదక్, ఎలగందుల, కమ్మముమెట్టు , ఓరుగల్లు, రామగిరి , కౌలాస్, పానగల్లు, మొదలయినవి. ప్రస్తుత తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిపి సుమారు 66 కోటలు గెలిచాడు. అందులో సింహభాగం నేటి తెలంగాణలోనివే.

ఈ నక్ష సా. శ. 1699లో ముఘల్ సామ్రాజ్య కాలంలో తెలంగాణ, ఉత్తర సర్కార్ల ప్రాంతాలలో ఉన్న జిల్లాలు, వాటిలోని గ్రామాల సంఖ్య చూపిస్తుంది. (గోల్కొండ సామ్రాజ్యం నాటి జిల్లాలు ముఘల్ పాలనా కాలంలో కూడా కొనసాగుతూ ఉండేవి)
Reference: Mughal Administration of Golkonda, J F Richards

కుతుబ్షాహిల కాలం నుండి సామాన్య శకం (సా.శ.) 1800 వరకు ఉన్న తెలంగాణ జిల్లాలు:

కుతుబ్ షాహీల కాలంలోని విశేషాలు ప్రస్తుతం లభ్యమవుతున్న ఆధారలనుబట్టి అప్పటి రాజ్యాన్ని తరఫ్ లు లేదా సుబాలు, సర్కార్లు లేదా జిల్లాలుగా విభజించినారు అని ప్రముఖ చరిత్రకారులు బీ ఎన్ శాస్త్రి గారు పరిశోధించి రచించిన “ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి” మూడవ భాగంలో గమనించవచ్చు. సా.శ. 1670 నాటికి 21 జిల్లాలుగా సుబాలు , అందులోని జిల్లాలు ఈ విధంగా ఉన్నవి

తెలంగాణలో :
మెదక్ (మెతుకు దుర్గము/ మెతుకు సీమ), మొహమ్మద్ నగర్ (గోల్కొండ), కౌలాస్ , మొలంగూర్ , ఎల్గందల , వరంగల్, ఖమ్మంమెట్టు , దేవరకొండ , పానగల్లు, భోన్గిర్ (భువనగిరి) , ఆకర్ కర (నల్లగొండ) , కోయల్ కొండ , ఘన్ పూర్,
ఆంధ్ర లోముస్తఫానగర్ ( కొండపల్లి), ముర్తాజానగర్ (కొండవీడు), మచిలీపట్నం , నిజాం పట్నం, ఏలూరు , రాజమండ్రి, సికాకోల్ ,
వీటిని సుబాల వారీగా ఇట్లా పరిగణించారు:
సూబ 1 : మెదక్ (మెతుకు దుర్గము/ మెతుకు సీమ), మొహమ్మద్ నగర్ (గోల్కొండ), కౌలాస్ , మొలంగూర్
సూబ 2 : ఎల్గందల , వరంగల్, ఖమ్మంమెట్టు , దేవరకొండ
సూబ 3 :పానగల్లు, ముస్తఫానగర్ ( కొండపల్లి), భోన్గిర్ (భువనగిరి) , ఆకర్ కర (నల్లగొండ)
సూబ 4 : కోయల్ కొండ , ఘన్ పూర్, ముర్తాజానగర్ (కొండవీడు), మచిలీపట్నం
సూబ 5 : నిజాం పట్నం, ఏలూరు , రాజమండ్రి, సికాకోల్ , వజ్రపు గనులు
సూబ 6 : కర్ణాటక్ (ఇది ఎన్నో జిల్లాలు కల పెద్ద ప్రాంతం అయితే ),
ఇందులో వజ్రపు గనులను కూడా ఒక జిల్లా లెక్క వాళ్ళు పరిగణిచడమూ గమనార్హమయిన విషయం.

1656 లో రామగిరి సర్కారును( జిల్లాను ) ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు కొడుకుకు కుతుబ్ షాహీ యువరాణిని ఇచ్చి పెండ్లి చేసిన సందర్భంగా కట్నంగా రాసి ఇచ్చినారు, కాబట్టి 1655 లో గోల్కొండ రాయాజ్యంలో ఉన్న జిల్లాల్లో పైన చూపిన వాటితో పాటు రామగిరి జిల్లా కూడా ఉండింది అని స్పష్టము. ఈ జిల్లా ప్రస్తుత పెద్దపల్లి, మంచిర్యాల, జిల్లాలలు & గడ్చిరోలి లోని సిరివంచ (సిరొంచ) తాలూకా కలిపారు. తత్ఫలితంగా కరీంనగర్ లోని కొన్ని ప్రాంతాలకు నాగపూర్ తోని సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే, ప్రాచీన కాలంలో కూడా గోదావరికి పరిసర ప్రాంతాలు విదర్భ రాజ్యంలో ఉండేవి అని సంగనభట్ల నరసయ్య గారి ధర్మపురి క్షేత్ర చరిత్ర ద్వారా తెలియవస్తున్నది. ఇక 1656లో ముఘల్ సామ్రాజ్యధినేత కొడుకుకు కట్నం లాగ విదర్భ(బేరార్) రాజ్యంలో కలిసిన పిదప తెలంగాణలోని గోదావరి పరిసర ప్రాంతాలకు , విదర్భకు ఉన్న ప్రాచీన సంబంధాలు మళ్ళీ ధృడపడ్డాయి. ఈ చరిత్ర మనకు విదర్భ ప్రాంతంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామిపై ఉన్న అపార భక్తి విశ్వాసాలకు కొంత చారిత్రిక కోణాన్ని కూడా తెలుపుతాయి. ఈ విషయాల ద్వారా విదర్భ ప్రాంతానికి తెలంగాణాకు ఉన్న సాంస్కృతిక బంధం అర్థం చేసుకోవడానికి పాలనా చరిత్ర సాయపడుతుంది. విదర్భ తెలంగాణ బంధానికి ఇంకో మచ్చుతునక భాష- విదర్భ ప్రాంతంలో, అసిఫాబాదు, మంచిర్యాల ప్రాంతాలలో మరాఠీ భాష పైన విపరీతమయిన తెలుగు ప్రభావం ఉంది అని స్థానిక మరాఠీలు చెప్పుకుంటారు. ఆ తెలుగు ప్రభావం ఉన్న మరాఠీ భాషను “మాలె భాష/ మాలె మరాఠీ” అనే పేరుతో విదర్భలో, అసిఫాబాదు , మంచిర్యాలలో మరాఠీలు పిలుచుకుంటారు అట. ఈ విషయాలు భాష శాస్త్ర, చారిత్రక, సామాజిక కోణాల్లో తెలుగు భాషా పండితులు, చరిత్రకారులు మరింత పరిశోధన చేయాలి.

మరొక సాంస్కృతిక సంబంధం చూస్తే – నేటి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని చాలా భాగాలు నాటి రామగిరి జిల్లాలో ఉండేవి, అదంగంగా సిరొంచా, చెర్ల తాలూకాలు ఉండేవి. పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామంలోని ఆలయాన్ని నాగపూర్ రాజులూ నిర్మించారని చెప్తారు. ఈ జిల్లాకు బేరార్లోని నాగపూర్ కు ప్రాచీన కాలం నుంచి ఉన్న సంబంధాలతో పాటు 1656నుంచి బేరార్ లో భాగంగా ఏర్పడిన పాలనా సంబంధం కూడా ఇందుకు కారణం కావచ్చు. మంథని పండితులు విదర్భ నాగపూర్ రాజా సభలలో ఉండే వారని ప్రతీతి. మైకా గనుల వ్యాపారంలో మేటిగా నిల్చి, నాగపూర్లో గొప్ప పారిశ్రామికవేత్త, దానగుణం సంపన్నుడు అయినా దహగం లక్ష్మీ నారాయణ గారి కుటుంబం కూడా మంథని నుండి నాగపూర్ కు 19వ శతాబ్దంలో వలస వెళ్ళిన తెలుగు కుటుంబమే. అందుకే, తెలుగు అభిమానంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తన గ్రంథాలయములోని ఉన్న వేలకొలది పుస్తకాలను దానం చేసిన దానశీలి దాహాగం లక్ష్మీ నారాయణ గారు.

ఆసక్తికరమయిన విషయం ఒకటి గమనిస్తే గోల్కొండ రాజ్యంలోని తెలంగాణ జిల్లాలను “ఇంటీరియర్” జిల్లాలుగా , తీరాంధ్ర జిల్లాలను “కోస్తా” జిల్లాలుగా ప్రత్యేకంగా ఆర్థిక లెక్కలు కట్టేవారు. ఇందుకు కొంత చారిత్రక నేపథ్యం ఉంది. సా .శ. 1517 నాటి తిరుమల ఆలయంలో శ్రీ కృష్ణ దేవరాయల శాసనంలో కూడా నల్లగొండ ఖమ్మం జిల్లాల కోటలను గెలిచినప్పుడు వాటిని “తెలుంగాణ్యపు దుర్గాలు” అనే శాసనంలో చెప్పినారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చారిత్రిక నామమయిన “కళింగ” తోనే ఆ శాసనంలో కూడా సంబోధించారు. మిగితా తీరాంధ్ర కోటలను మాత్రం అట్లా ఒక ప్రాంతం లో భాగంగా చెప్పలేదు. ఇక సాహిత్య ఆధారాలు చుస్తే 15వ శతాబ్ధంలో (సా . శ 1470-1480) తెలుగులో వెన్నెలకంటి సూరన కవి రచించిన విష్ణుపురాణంలో ప్రస్తుత తెలంగాణ ప్రాంతానికి “తెలుఁగాణ” సంబోధన ఉన్నది. సా.శ. 1417 నాటి తెల్లాపూర్ శాసనంలో తెలంగాణపురం అనే మాట గమనించవచ్చు. పైగా సా.శ 1510 నాటి ఓడ్ర గజపతుల వెలిచెర్ల (నెల్లూరు జిల్లా) సంస్కృత శాసనంలో కూడా ప్రస్తుత తెలంగాణాలోని దుర్గాలను “త్యెలంగాణ దుర్గాత్” అని ప్రస్తావిస్తారు. 12 వ శతాబ్దంలో తెలంగాణా ప్రాంతాన్ని ఏకం చేసి ఏలిన తొలి స్వతంత్ర కాకతీయ ప్రభువు రుద్రా దేవుడిని కూడా తెలుంగరాయ అని యాదవ రాజులు సంబోధించే వాఋ అని నాటి శాసనాలు, సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. అంటే ప్రస్తుత తెలంగాణా ప్రాంతం చాలా శతాబ్దాల నుంచే చారిత్రకంగా, పాలనా పరంగా తన ప్రత్యేక ఉనికి కలిగి ఉంది అనేది సుస్పష్టం. ఈ పద్ధతినే తరువాతి తరం రాజ్యాలు కూడా కోసాగించాయి. అందుకే నాటి పర్షియన్ రికార్డులను అధ్యయనం చేసిన అబ్దుల్ మజీద్ సిదిఖ్ఖి, రిచర్డ్స్ , నయీమ్ మొదలయిన చరిత్రకారుల ప్రకారం ఇంటీరియర్ (తెలంగాణా), కోస్తా ( తీరాంధ్ర ) ప్రాంతాలు ఆనాటి నుంచే ఆర్థిక, పాలానా అంశాల్లో కొంత విభిన్నంగా చూడబడేవి అనేది అవగతమవుతుంది. అయితే, కుతుబ్షాహీ రాజ్యం సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతము గోల్కొండలో భాగంగా ఉండేది కాదు, ఇంకా నిజామాబాదు జిల్లాలోని ఉత్తర సగభాగం కూడా గోల్కొండ రాజ్యంలో భాగం కాకుండా ఉండింది (ఇందూరు పట్టణంతో సహా ), ఇక పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు రామగిరి సర్కారు కింద ఉన్నాయి, రామగిరి జిల్లాను 1656లో మొఘలులకు ఇచ్చినారు (కౌలాస్ జిల్లా మనకు తెలిసిన నిజామాబాదు జిల్లాలోని కౌలాస్ కోట మరియు దక్షిణ భాగం ఇంకా సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతాలు ఉంటూ ఉండేవి). ఇందూరు (నిజామాబాదు) జిల్లాలోని ఉత్తర భాగంతో పాటు నిర్మల్ జిల్లా ప్రాంతాలు బీదర్ సుల్తానుల రాజ్యంలోని నాందేడ్ జిల్లాలో భాగంగా ఉంటూ ఉండేవి. ఇందూరు , నిర్మల్ ఆనాడు ఇనుము, ఉక్కు పరిశ్రమకు ఎంతో ప్రఖ్యాతి చెందినవి. అక్కడ తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతాలు. నిర్మల్ జిల్లాలోని కోన సముద్రం, ఇందూరులోని ఇందల్వాయి , ఇందూరు ఇనుము ఉత్పత్తికి ప్రసిద్ధి . ఇనుము ఉక్కు పరిశ్రమ వలన, సముద్ర /నది ద్వారా జరిగే వ్యాపార సంబంధాల వలన ఈ ప్రాంతం గోలకొండ రాజ్యంతోనే చాలా సన్నిహితంగా ఉండేది. విచిత్రంగా గోలకొండ రాజ్య సమయాన గోలకొండను కాక బీదరు సుల్తాను రాజ్యాన్ని “తెలెంగాణ” అని సంబోధిస్తూ ఉండేవారు ఆనాటి కాలాన వివిధ యాత్రికుల రచనల్లో తెలియ వస్తున్నది (బహుశా ఈ రెండు ప్రముఖ తెలుగు వ్యాపార కేంద్రాలు ఉండటం వలన కావొచ్చునేమో అని ఈ రచయిత ఆలోచన).

1865 నాటి జిల్లాలు

ఇంకా ఆసక్తికర విషయం ఒకటి మనకు చరిత్రకారులు ఇర్ఫాన్ హబీబ్ గారి ముఘల్ సామ్రాజ్య రచనల్లో తెలియ వస్తున్నది – అది ఏమిటి అంటే, ఎలగందుల సర్కారుకు సంబంధించిన మరొక చిన్న ఎంక్లేవ్ (చుట్టుపక్కల వారి నుండి భిన్నంగా ఉండే స్థలం లేదా సమూహం లేదా సరిహద్దు భూభాగం) కౌలాస్ జిల్లాలో భాగమయి ఆ జిల్లా పశ్చిమ సరిహద్దులో ఉండేది. ఈ ఎంక్లేవ్కు ఎలగందుల జిల్లాకు మధ్య కౌలాస్ జిల్లా భూభాగం ఉండేది. ఈ ఎంక్లేవ్ బీదర్ సుల్తాను రాజ్యంలోని నాందేడ్ జిల్లాలోని కోటగిరికి, గోల్కొండ రాజ్యంలోని కౌలాస్ సర్కారుకి మధ్య ఉండింది. ఈ కోటగిరి ప్రాంతం ప్రస్తుతం నిజామాబాదు జిల్లాలోనిది. అక్కడ కాకతి రుద్రమదేవికి సంబంధించి ముఖ్య తామ్ర పత్రాలు వెలుగు చూసినవి. కాకతీయ చరిత్రలో రుద్రమ దేవికి గణపతి దేవ చక్రవర్తి తండ్రి అన్న విషయం రూఢీ చేసిన ముఖ్య ఆధారాలు. అయితే బీదరులో ఉన్న ఇందూరు జిల్లాలోని ప్రాంతాల పైన బీదర్ మరియు గోల్కొండ రాజ్యాల మధ్య తరచూ అధికార మార్పిడి జరుగుతూ ఉండేది, అవి ఒక బఫర్ ప్రాంతం లాగా ఉంటూ ఉండేది.

ఇక పేర్ల పరంగా ఆసక్తికర చరిత్ర తెలిపేది మెతుకుదుర్గం లేదా మెతుకుసీమ జిల్లా. పర్ష్యన రెక్నాఆర్డుదుల ఆధారంగా మెతుకు జిల్లా తెలుగు నాట అత్యధిక వ్యవసాయ అభివృద్ధి కలిగిన జిల్లాగా, తద్వారా కుతుబ్ షాహీలనాటికి అధిక భూ, వ్యవసాయ ఆదాయం కల జిల్లాగా పేరు పొందింది. మెతుకుసీమ ఒకప్పటి తెలుగు వారి కొనాసీమ అని చెప్పవచ్చు. రిచర్డ్స్ గారు చేసిన పరిశోధన వలన ముఘల్ పాలనా సమయంలో లో కూడా మెతుకు సీమ జిల్లా ఆదాయం , మహమ్మద్ నగర్ లేదా గోల్కొండ జిల్లా ఆదాయం తరువాత రెండో స్థానం అని తెలియ వస్తున్నది. ఆదాయం ఎక్కువగా ఉన్న కౌలాసు, మెతుకు సీమ, పానుగల్లు, గోల్కొండ, రాయచూరు, నల్లగొండ జిల్లాలలో అక్కడి సంస్థానాధీశుల ద్వారా అంతే ఘనంగా తెలుగు సాహిత్య పోషణ జరిగింది.

ఈ విధంగా నాటి ఆర్థిక సామాజిక స్థితులు కూడా జిల్లా చరిత్రల వల్ల తెలుసుకోవచ్చు.

గోలకొండ కంటే ముందు దక్కన్ ప్రాంతంలోని బీజాపుర్, అహ్మద్నగర్, బీదర్ రాజ్యాలు మొఘలుల హస్తగతం అయ్యాయి. బీదరులోని నాందేడ్ జిల్లా ప్రాంతం (రెండు ముఖ్య తెలుగు వ్యాపార కేంద్రాలు ఉన్న ప్రాంతం) ముఘల్ రాజ్యంలో కలిసినపుడు ఒక నాందేడ్ జిల్లాను “తెలింగానా సుబా” అంటూ ఉండేవారు ! గోలకొండ రాజ్యం సా. శ. 1687లో మొఘలుల హస్తగతం అయింది. అపుడు వారు కొంత మేరకు కుతుబ్షాహీల జిల్లాలను, పన్ను విధానాలను కొనసాగించారు. అపుడు దక్కన్ ప్రాంతాన్ని పలు సుబాలుగా విభజించారు : ఖండేష్ , అహ్మద్నగర్ , బీజాపూర్, బీదర్, హైదరాబాద్, బేరార్ . హైదరాబాద్ ( గోలకొండ) సుబా కింద ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తో పాటు, తమిళ నాడు కూడా ఉండది. అపుడు దక్కన్ సుబాకి రాజధానిగా ఔరంగాబాదును ఎంపిక చేసి, ప్రతి సుబా యందు , పూర్వ రాజధానులను , ఆ సుబా ముఖ్య పట్టణాలుగా చేసారు. ముఘల్ పాలనా కాలంలో కూడా తెలంగాణలోని జిల్లాలుగా నాటి గోలకొండ జిల్లాలే కొనసాగింది. కాకపోతే సా. శ. 1687 నుంచి ఆకర్ కర అని ఉన్న జిల్లా పేరును నల్లగొండ అని వాడడం మొదలయింది. ఇక ఆధునిక యుగంలో ముఖ్యంగా నిజాం స్వతంత్రం ప్రకటించుకున్న సా. శ.1724 తరువాత కూడా ఇంచుమించు ఇవే జిల్లాలు కొనసాగినాయి. అట్లా బహమనీ కుతుబ్షాహీల కాలంలో జిల్లాలను సర్కారులు అని పిలిచేవారు. ఈ వాడకం నాడు తెలంగాణలో తో పాటు కోస్తాలో కూడా ఉండింది.

సా. శ. 1752 లో ఉత్తర కోస్తా జిల్లాలను (సర్కార్లను) ఫ్రెంచికి ఒప్పందంలో భాగంగా ఇచ్చారు. తర్వాత సా. శ. 1766 లో బ్రిటిష్ కి నిజాం రాజుకి జరిగిన ఒప్పందంలో భాగంగా ముఘల్ చక్రవర్తి బాహుదార్ షాహ్ ధారాదత్తం చేసారు (సా. శ. 1788 లో గుంటూరు ఇచ్చినారు) . అవి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం అయ్యాయి. మద్రాసు ప్రెసిడెన్సీలో ఉత్తరంగా ఉన్న సర్కార్ల కాబట్టి వాటికి ఉత్తర సర్కార్లు అనే పేరు వచ్చింది. ఈ మధ్య కాలంలో టిప్పు సుల్తాన్ విజృంభించి రాయలసీమ ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆంగ్లో మైసూర్ యుద్ధాల తరువాత మరల సీమ జిల్లాలు నిజాం రాజ్యంలో కలిసాయి. ఆ తరువాత రాయలసీమలోని మూడు జిల్లాలను 1800 నిజామ్ రాజుకు బ్రిటిష్ తో జరిగిన ఒప్పందంలో భాగంగా అవి బ్రిటిష్ వారి మద్రాస్ ప్రెసిడినేసీలో దత్త మదనాళాలుగా కలిసినాయి. ఇక మిగిలింది ఇప్పటి తెలంగాణా జిల్లాలు, అవి ఆనాటి గోలకొండ సమయపు పేర్లతోనే సా.శ. 1865 వరకు కొనసాగాయి.

సా. శ. 1800 నుంచి 1865 వరకు ఉన్న తెలంగాణ జిల్లాలు:

సా.శ. 1800 తర్వాత నిజామ్ వారి హయంలోని జిల్లాల గురించి మనకు లిఖిత ఆధారాలు సా.శ. 1816 నుంచి స్పష్టంగా లభ్యమవుతున్నాయి. 19వ శతాబ్దపు బ్రిటీషు వారి సర్వే రికార్డుల వల్ల మనకు నిజాం రాజ్యంలో 40 సర్కార్లు (జిల్లాలు) ఉండేవి అని తెలుస్తున్నది. నిజాం రాజ్యంలో తెలుగు, మరాఠీ & కన్నడ ప్రాంతాలు ఉన్నప్పటికీ, భాషా సంధి ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికన జిల్లాలు అప్పుడు ఉండేవి కావు. భాషా ప్రాతిపదికన జిల్లాలు & విభాగాలు సా.శ. 1865లో ఏర్పడ్డాయి.

1816 నాటికి సర్కార్లు అయిదు సుబాలుగా (divisions) ఏర్పాటు జేయబడ్డాయి . నాటి సుబాలు – హైదరాబాద్ , బీదర్, నాందేడ్ , ఔరంగాబాద్, బేరార్ . ప్రతి సుబా లో ఉన్న జిల్లాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

హైదరాబాద్ సుబా/ప్రావిన్స్ కింద ఉండిన సర్కార్లు (జిల్లాలు) – పానగల్లు, యాదగిరి (ప్రస్తుత కర్ణాటకలోనిది), గణపురం (ఖిల్లా ఘనపురం), గోల్కొండ , కోయిలకొండ , దేవరకొండ, అమరాబాదు, షాబాదు, భువనగిరి, నల్లగొండ, ఎలగందుల , మెతుకు (మెదక్), రామగిరి, మొలంగూరు, వరంగల్లు, ఖమ్మంమెట్టు, గోదావరి, కౌలాస్, మలఖేడ్. గమనార్హమయిన విషయం – తెలుగు నాట తొలి గోదావరి పేరు గల జిల్లా తెలంగాణలో ఉండది (సా. శ. 1816 నాటికి మధ్య కోస్తాలో రాజముండ్రి , మచిలీపట్టణం, ఏలూరు, కొండపల్లి జిల్లాలు ఉండేవి) .

బీదరు సుబా/ప్రావిన్స్ కింద ఉండిన తెలుగు సర్కార్లు (జిల్లాలు) – రాయచూరు లోని అలంపురం, గద్వాల ప్రాంతాలు, గుల్బర్గా లోని తాండూరు ప్రాంతం & బీదరు పట్టణములో కూడా తెలుగు ప్రజలు ఉండేవారు.

నాందేడ్ సుబాలో: నాందేడ్ సర్కా రు (జిల్లా)లో దాదాపు సగం తెలుగు ప్రాంతము. నాడు ఎంతో ముఖ్యమయిన తెలుగు వాణిజ్య ప్రాంతాలు ఇందూరు, నిర్మల్ ప్రాంతాలు నాందేడ్ జిల్లాలో ఉండేవి (ఇంచుమించు నేటి కొత్త నిజామాబాద్ & నిర్మల్ జిల్లాలు) .

బేరార్ సుబాలో: చందా జిల్లాలో కూడా తెలుగు ప్రాంతాలు ఉండేవి.

ఇందులో హైదరాబాద్ సుబాలోని మాల్ఖేడ్ & యాదగిరి జిల్లాల్లో కన్నడ మరియు తెలుగు వారి జనాభా ఉండేది (ప్రస్తుత నారాయణపేట జిల్లాలోని చాలా భాగం మలఖేడ్ జిల్లాలో ఉండేది). ఇక రామగిరి జిల్లా ముఖ్య పట్టణం మాత్రం చెన్నూరు ఉండేది. మిగితా జిల్లాల ముఖ్య పట్టణాలు ఆ జిల్లా పేరుగల పట్టణాలే !

బేరారు సుబాలో ముఖ్యంగా నేటి కొత్త ఆదిలాబాద్ ప్రాంతం మాహూరు జిల్లాలో భాగంగా ఉండేది. ముందుగా చెప్పినట్టు మాహూరులోని శక్తి పీఠం మరాఠీవారితో పాటు తెలంగాణలోని తెలుగువారికి కూడా ముఖ్యమయిన ప్రాంతం. తెలంగాణలో మావురాల ఎల్లమ్మ కథలో మావూరు అంటే మాహూరు పట్టణమే అని ప్రసిద్ధ పరిశోధకులు బిరుదురాజు గారు చెప్పారు.

1820 దశకంలో అమరాబాదు, షాబాదు జిల్లాలు రద్దు జేయబడ్డయి. అవి ఇదివరకు కూడా పూర్తి స్థాయి జిల్లాలుగా ఉండకపోవడమే కారణం. అమరాబాదు జిల్లాను గణపురం జిల్లాలో కలిపారు. షాబాదు జిలాలను దేవరకొండ జిల్లాలో కలిపారు. ఇక అపుడు 1820 దశకంలో తెలంగాణలో ఉన్న జిల్లాలు , హైదరాబాద్ సుబా/ప్రావిన్స్ కింద ఉండిన జిల్లాలు – పానగల్లు, యాదగిరి , గణపురం, గోల్కొండ , కోయిలకొండ , దేవరకొండ, భువనగిరి, నల్లగొండ, ఎలగందుల , మెతుకు (మెదక్), రామగిరి, మొలంగూరు, వరంగల్లు, ఖమ్మంమెట్టు, గోదావరి, కౌలాస్, మలఖేడ్. అపుడు ఏ జిల్లాకు కూడా పర్షియన్ పేరు లేదు. ఇక బీదరు, నాందేడు, బేరార్ సుబాలలోని తెలుగు ప్రాంతాలలో పెద్ద మార్పు ఏమి రాలేదు.

కొన్ని ఆసక్తికర విషయములు:- చాలా వరకు నాడు కోస్తా , సీమ జిల్లాలతో పోలిస్తే, తెలంగాణ జిల్లాలు విస్తీర్ణం తక్కువ ( జిల్లాలు ఎక్కువ ఉన్నవి కాబట్టి). నాటి జిల్లాలు గోదావరి నదికి ఇరువైపులా పరుచుకుని ఉండేవి ఇంకో ఆసక్తి కరమయిన విషయమేమిటి అంటే ఈ జిల్లాల ముఖ్య పట్టణాలలో కొన్ని కాకతీయుల నాటి, రేచెర్ల పద్మనాయకుల నాటి కోటలే. మచ్చుకు – గణపురం (ఖిల్లా ఘనపురం), గోల్కొండ , కోయిలకొండ , దేవరకొండ, భువనగిరి, నల్లగొండ, ఎలగందుల , మెతుకు (మెదక్), రామగిరి, మొలంగూరు, వరంగల్లు, ఖమ్మంమెట్టు, కౌలాస్ , మాహూర్ , రాయచూరు , బీదరు. ఇవన్నీ నాటి కాకతీయుల నుంచి ముఖ్య కోటలే. ఆ కోటలలోనే నాటి సర్కార్ల (జిల్లాల) పాలన కేంద్రాలు ఉంటూ ఉండేవి.

1853-1860 మధ్య స్వల్పకాలం పాటు రాయచూరు జిల్లా బ్రిటీషు వారి పాలనలో ఉండేది, ఆ తర్వాత, నైజాం రాజు బ్రిటీషు వారికి యుద్ధాల్లో సాయం చేసినందుకు, తిరిగి సారవంతమైన రాయచూరు జిల్లా(సర్కారు) నిజాము రాజ్యములో కలిపివేయబడింది.

సా. శ. 1860 సంవత్సరంలో రామగిరి జిల్లా రద్దు జేయబడ్డాయి. రామగిరి జిల్లాలోని గోదావరి, ప్రాణహిత నదుల కుడిగట్టుకున్న ప్రాంతాలను నిజాము రాజ్యములో ఉంచి, ఎడమ గట్టుకు ఉన్న ప్రాంతాలను బ్రిటీషు వారికి అప్పగించబడ్డాయి. ఇదే సమయంలో నిజాం రాజ్యంలోని గోదావరి సర్కారులో ఒక భద్రాచలం ఆలయం తప్ప మిగితా ప్రాంతాన్ని బ్రిటీషు ప్రభుత్వానికి ఇవ్వబడింది. బ్రిటిషు వారు రామగిరి జిల్లాలోని ఎడమగట్టు ప్రాంతాన్ని గోదావరి జిల్లాలలోని ప్రాంతాన్ని కలిపి “ఎగువ గోదావరి జిల్లా” (upper godavari district ) అని పేరుతో మధ్య రాష్ట్రం, సెంట్రల్ ప్రావిన్సెస్ లో కలిపారు. అయితే, గోదావరి జిల్లాలోని ప్రాంతాన్ని బ్రిటీషు ప్రభుత్వానికి పాక్షికంగా ఇవ్వబడింది, ఎందుకనగా, ఈ ప్రాంతములో బ్రిటిషు ప్రభుత్వ హయాములో కూడా కొంత భాగం, ముఖ్యంగా భద్రాచలం & చుట్టుపక్కల గ్రామాలలో పన్ను వసూలు చేసే హక్కు పాల్వంచ సంస్ధనిదీశులకే ఇవ్వబడింది. అవి పాల్వంచ సంస్థానంలో భాగంగానే పరిగణించే వారు.

సా. శ. 1860లో మొదలు పెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు అదే దశకంలో ఆపివేయడం జరిగింది. సా. శ. 1874 లో అప్పర్ గోదావరి జిల్లాలోని దక్షిణ భాగాన్ని మద్రాస్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాలో కలిపారు. అట్లా 1874లో భద్రాచలం మద్రాసు రాష్ట్రంలో భౌగోళికంగా చేరింది. అయినప్పటికీ గుడి పాలన నైజాం ప్రభుత్వ పరిధిలోనే ఉండేది.

సా. శ. 1865 నుంచి 1905 మధ్య తెలంగాణ జిల్లాలు:

సా. శ. 1865 ప్రాంతంలో ప్రధానమంత్రి సాలార్జంగ్ గారి పాలనలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పెద్ద స్థాయిలో జరిగింది. 1865 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి నాటి బ్రిటీషు, నిజాము రాష్ట్ర అధికారుల రచనల ద్వారా తెలియ వస్తున్నది. ఇది వరకు చెప్పుకున్నట్టు 1865లో పూర్తిగా కాకపోయినా చాలా వరకు భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ జరపబడింది. అపుడు నిజామ్ రాజ్యములో నాలుగు పరిపాలనా విభాగాలు (divisions) ఏర్పాటు జేయబడ్డాయి. ఉత్తర, తూర్పు, దక్షిణ , పశ్చిమ విభాగాలు, ఇవికాక రాజధాని ప్రాంతం అయిన అత్రాఫ్ బాల్దా . ఉత్తర, తూర్పు విభాగాలు తెలుగు వారివి కాగా, పశ్చిమ విభాగం మరాఠాలది. దక్షిణ విభాగం కన్నడిగులది. తెలుగు వారు, ఉత్తర, తూర్పు విభాగాల్లో కాకుండా తర్వాత దక్షిణ విభాగంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే వారు. సా.శ. 1865 నాటికి తెలంగాణ జిల్లాల విస్తీర్ణం అమాంతం పెరిగింది.

ఆయా విభాగాల్లో ఉండే జిల్లాలు, విభాగాల యొక్క ముఖ్య కేంద్రముల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

ఉత్తర విభాగం (Northern division) – ముఖ్య కేంద్రము : బీదర్ జిల్లాలు : బీదర్, మెదక్, ఎలగందుల , ఇందూరు

తూర్పు విభాగం (Eastern division) – ముఖ్య కేంద్రము : భువనగిరి జిల్లాలు : నాగర్ కర్నూల్, నల్లగొండ, ఖమ్మం మెట్టు.

దక్షిణ విభాగం (Southern division) – ముఖ్య కేంద్రము : గుల్బర్గా జిల్లాలు : నల్దుర్గ్ , గుల్బర్గా , రాయచూరు , లింగ్సుగూర్ .

పశ్చిమ విభాగం (Western division) – ముఖ్య కేంద్రము : ఔరంగాబాద్ జిల్లాలు : ఔరంగాబాద్ , బీడ్ , పర్భనీ , నాందేడ్ , సిర్పూర్ తాండూర్.

అత్రాఫ్ బాల్దా – పాత గోల్కొండ జిల్లా తో పాటు కొన్ని చుట్టూ పక్కల ప్రాంతాలు. ముఖ్య కేంద్రము : హైదరాబాదు

అయితే కొన్ని సంవత్సరాలకే సా.శ. 1870 జిల్లాలు , విభాగాలు మరలా మారినాయి. ఉత్తర, దక్షిణ, పశ్చిమ విభాగాలలో కొంత మార్పుతో ఇంకో వాయువ్య విభాగం కూడా ఏర్పాటు చేయబడింది. అపుడు తెలుగు జిల్లా అయిన సిర్పూర్ తాండూర్ తెలుగు జిల్లాలు ఉన్న ఉత్తర విభాగంలో కలపబడింది. సా. శ.1875 లో ఆయా విభాగాల్లో ఉండేటి జిల్లాలు, విభాగం యొక్క ముఖ్య కేంద్రం గురించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

ఉత్తర విభాగం division – ముఖ్య కేంద్రము : పఠాన్ చెరువుజిల్లాలు : మెదక్, ఎలగందుల , ఇందూరు, సిర్పూర్ తాండూర్

తూర్పు విభాగం division – ముఖ్య కేంద్రము : భువనగిరిజిల్లాలు : నాగర్ కర్నూల్, నల్లగొండ, ఖమ్మంమెట్టు

పశ్చిమ విభాగం division – ముఖ్య కేంద్రము : బీదర్జిల్లాలు : బీదర్, నల్దుర్గ్ , నాందేడ్

దక్షిణ విభాగం division – ముఖ్య కేంద్రము : గుల్బర్గా జిల్లాలు : గుల్బర్గా , రాయచూరు , లింగ్సుగూర్

వాయువ్య విభాగం : విభాగం division – ముఖ్య కేంద్రము : ఔరంగాబాద్జిల్లాలు: ఔరంగాబాద్ , బీడ్ , పర్భనీ

అత్రాఫ్ బాల్దా – పాత గోల్కొండ జిల్లా తో పాటు కొన్ని చుట్టూ పక్కల ప్రాంతాలు. ముఖ్య కేంద్రము : హైదరాబాదు

సా. శ. 1865 నుంచి ఉన్న ఖమ్మం జిల్లా అనేది ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్లు జిల్లాలు కలిపి ఉన్న పెద్ద జిల్లా, ఆ పెద్ద ఖమ్మం జిల్లా ముఖ్య పట్టణం హనుమకొండ -వరంగల్ పట్టణమే. పేరు మాత్రం ఖమ్మం. అయితే, 1883 నుంచి కొన్ని పేర్ల మార్పులు జరిగినవి అని 1890, 1908 సంవత్సరాల్లోని హైదరాబాదు రాష్ట్ర గేజిటర్ల ద్వారా, జనాభా గణన రికార్డుల ద్వారా తెలియ వస్తున్నది. వాటి వివరాలు ఇట్లా ఉన్నాయి – సా. శ. 1883లో ఖమ్మం జిల్లా పేరు కూడా వరంగల్ అని మార్చడం జరిగింది, ఆ జిల్లా ముఖ్యపట్టణం పేరుకు అనుగుణంగా . అదే 1883లో నాగర్ కర్నూల్ జిల్లాలో జిల్లా ముఖ్య పట్టణం నాగర్కర్నూల్ నుంచి పాలమూరుకి మార్చబడింది. అపుడు 1883 లోనే పాలమూరు పట్టణముతో పాటు జిల్లా పేరును మహబూబ్ నగర్ అని పెట్టడం జరిగింది (ఆరవ నిజాము మహబూబ్ ఆలీ ఖాన్ పేరు మీద, ఆయన పాలమూరు జిల్లా సందర్శనను పురస్కరించుకొని ఈ పేరు పెట్టారు )! ఇక్కడ ముఖ్య విషయం ఏమిటి అంటే ఇందూరు జిల్లాలో ప్రస్తుత నిజామాబాదు, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలు ఉండవి. ఎలగందుల జిల్లాలో ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నేటి మంచిర్యాల జిల్లా కలిసి ఉండేవి. అంటే గోదావరి గంగమ్మకు ఇరువైపులా ఒకటే జిల్లాగా ఉండేది అప్పట్లో ! ఇంకో ముఖ్య విషయం తెలుగు జిల్లాలు ఉండే విభాగాలు పెద్దవి అయినా కూడా, ఆయా విభాగాల ముఖ్య కేంద్రాలు (పఠాన్ చెరువు, భువనగిరి) హైదరాబాదు నగరానికి దగ్గరగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని బట్టి ఆ సమయంలో హైదారాబాద్ కేంద్రంగానే పూర్తి పాలన సాగుతూ ఉండేది అని చెప్పవచ్చు.

ఈ పరిపాలనా విభాగాలతో పాటు భాషాపరమయిన 3 విభాగాలు కూడా సా. శ. 1865 లో ఏర్పాటు చేసారు. అవి – తెలింగాణ , మరాట్వాడ , కర్నాటిక్. అయితే కర్నాటిక్ జిల్లాల్లో తెలుగు ప్రధానంగా మాట్లాడేటి అలంపురం, గద్వాల రాయచూరులో ఉండేవి , తాండూరు గుల్బర్గా జిల్లాలో ఉండేది. కన్నడ ప్రధానమయిన బీదర్ జిల్లా కొన్ని సార్లు తెలుగు జిల్లాల విభాగంలో ఉండేది.

సా. శ. 1905 నుంచి 2014 వరకు తెలంగాణ జిల్లాలు:

1954 హైదరాబాద్ రాష్ట్ర మాప్

ఇక సా. శ. 1905-1913 మధ్య కాలంలో మరలా పరిపాలనా విభాగాలు మరియు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అపుడే మనకు బాగా తెలిసిన జిల్లాలు ఏర్పడినాయి. ఈ కాలంలోనే చాలా జిల్లాల కు పర్షియన్ పేర్లు పెట్టబడ్డాయి. ఈ 20వ శతాబ్ది తొలి భాగంలో ఉన్న జిల్లాలు , సుబాలు పరిపాలన గురించి సురవరం గారి “నిజాం రాష్ట్ర పరిపాలనము” అనే గ్రంథంలో ఉన్న వివరాలను బట్టి ఆ సమయంలో కూడా నాలుగు విభాగాలుగా నిజాం రాజ్య పాలన ఉండేది అని తెలుస్తున్నది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి-

మెదక్ గుల్షానాబాద్ డివిజన్ – ముఖ్య కేంద్రము: పఠాన్ చెరువుజిల్లాలు : మెదక్, అత్రాఫ్ బాల్దా(హైదరాబాదు) , నల్లగొండ, మహబూబ్నగర్ , నిజామాబాద్.

వరంగల్ డివిజన్ – ముఖ్య కేంద్రము : హన్మకొండ (వరంగల్)జిల్లాలు : వరంగల్లు , కరీంనగర్ , ఆసిఫాబాద్ (గమనిక : ఖమ్మం జిల్లా వరంగల్లు లోనే ఉండెను).

గుల్బర్గా డివిజన్ – ముఖ్య కేంద్రము : గుల్బర్గాజిల్లాలు : ఉస్మానాబాదు, బీదరు , గుల్బర్గా, రాయచూరు

ఔరంగాబాదు డివిజన్ – ముఖ్య కేంద్రము : ఔరంగాబాద్జిల్లాలు : ఔరంగాబాదు, బీడ్, నాందేడ్ , పర్భనీ

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏమిటంటే అదిలాబాదు కు ఆ పేరు అదిల్ షా అనే సుల్తాను పేరు మీద పెట్టారు. అదే వాడుతూ రావడం జరిగింది. ఇందూరు పట్టణానికి జిల్లాకు 1905-1911 మధ్య సిర్నాపల్లి దొరసాని పేరు మార్చారు అని స్థానికంగా చెప్పుకుంటారు. నాటి ఆరవ నిజాం రాజును తన పట్టుదలతో సిర్నాపల్లి దొరసాని శీలం జానకీబాయి గారు ఒప్పించి ఇందూరు కు రైల్వే సదుపాయం కల్పించారు. అందుకు కృతజ్ఞతగా ఇందూరు పేరును నిజామాబాద్ అని ఆరవ నిజాము రాజును గుర్తు చేస్తూ పెట్టారు.

ఇక కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే, 1905 తరువాత ఎలగందుల జిల్లా కేంద్రాన్ని ఎలగందుల కోట నుండి 12 కీ. మీ దూరం లో ఉన్న అప్పటికే ఉన్న కరీంనగర్ పట్టణానికి మార్చి, జిల్లా పేరు కూడా కరీంనగర్ అని పెట్టారు. అయితే, కరీంనగర్ అని పేరు కల పట్టణం 19వ శతాబ్దంలోనే మానెరు నది ఒడ్డున ఏర్పాటు అయింది, కరీముద్దీన్ పేరిట . 19వ శతాబ్దంలోనే ఎలగందుల ముఖ్య పట్టణంగా కొనసాగుతున్న సమయంలోనే కరీంనగర్ పట్టణం ధాన్యాల వ్యాపార కేంద్రంగా ఉండేది. హైదరాబాద్ నగరం కు కావాల్సిన ప్రత్యేక బియ్యం ఇక్కడ పండించే వారు. అయితే, చారిత్రకంగా ఈ కరీంనగర్ పట్టణం అరిపిరాల లేదా అర్పనపల్లియ అనే పేరుతో ఉండేది అని, అది కరీంనగర్ పట్టణంలోని పాత బజారులో ఉన్న కాకతీయుల కాలపు శివాలయం పక్క వీధి అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ గారి “మ్రోయు తుమ్మెద” నవల కరీంనగర్ పట్టణంలో ఉండే గొప్ప హిందుస్థానీ సంగీత కళాకారుడు అయిన పొరండ్ల నారాయణ రావు గారి జీవితం ఆధారంగా రాయబడింది. అందులో హిందుస్థానీ సంగీత విషయాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాచీన చరిత్ర సాంస్కృతిక అంశాలు స్పృశించారు. అందులో కరీంనగర్ పట్టణాన్ని విశ్వనాథ గారు అరిపిరాల అనే సంబోధిస్తారు.

వీటిలో రాయచూరు జిల్లాలో ఉన్న ఆలంపురం, గద్వాల ప్రాంతాలు తెలుగు వారివి. గుల్బర్గా జిల్లాలో ఉన్న కొడంగల్, తాండూరు తెలుగు ప్రాంతాలు. నాటి నుంచి ఆసిఫాబాద్ జిల్లాకు నిజామాబాదు , కరీంనగర్ జిల్లాలకు మధ్య గోదావరి నది సరిహద్దుగా మారడం జరిగింది ! మెదక్ సుబా పేరు మొదట గుల్షానాబాద్ అని ఉంటూ ఉండేది. 1905 సమయంలో మెదక్ జిల్లా ముఖ్య పట్టణముగా సంగారెడ్డిపేటని జేయడం జరిగింది.

సా. శ.1913 నుంచి 1941 వరకు ఆసిఫాబాదు ముఖ్య పట్టణముగా నేటి ఆదిలాబాద్ ఆసిఫాబాద్, చెన్నూరు , నిర్మల్, కిన్వట్ తాలూకాలతో ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు జరిగింది. 1941లో ఈ జిల్లా ముఖ్య కేంద్రాన్ని ఆదిలాబాదుకు మార్చడం జరిగింది. స్వాతంత్య్రం తరువాత 1953లో వరంగల్ జిల్లా పెద్దగా ఉండడం వలన, వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం ముఖ్య పట్టణంగా ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేసారు. ఖమ్మంమెట్టు పట్టణం, ఖమ్మంమెట్టు జిల్లాను కాస్తా ఖమ్మం అని రాయడం మొదలయింది.

1956 లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు జరిగినపుడు, తెలుగు వారుండే ఆలంపురము , గద్వాల & కొడంగల్ ప్రాంతాలు మహబూబ్నగర్లో కలిపారు. తాండూరు ప్రాంతము రంగారెడ్డిలో కలిపారు. ఆదిలాబాదులోని కిన్వట్ను నాందేడ్లో విలీనం చేసారు! 1959లో 1860 నాటి తెలంగాణలోని గోదావరి జిల్లా ప్రాంతాలు మరల ఖమ్మంలో విలీనం చేసారు. అయితే, సిరోంచా తాలూకాను మాత్రం మధ్య ప్రదేశ్, తరువాత మహారాష్ట్రలోనే కొనసాగించారు. 1978లో మొత్తం హైదరాబాద్ రూరల్ తాలూకాను , కొంత హైదరాబాద్ అర్బన్ ప్రాంతాన్ని కలిపి రంగా రెడ్డి జిల్లా చేయడం జరిగింది.

నవ్య తెలంగాణ రాష్ట్రంలో 2014 తరువాత జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ:

తెలంగాణ రాష్ట్రం అవతరించినాక 2014లో భద్రాచలం డివిజన్ లోని ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. భద్రాచలం ఆలయం ఎప్పటిలాగే తెలంగాణ లోనే కొనసాగుతూ వస్తున్నది. చిన్న జిల్లాల వలన చేకూరే పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, 2016లో మళ్ళీ చాలా పెద్ద స్థాయిలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. 2016లో తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు ఉండే విధంగా ఏర్పాటయ్యాయి. ఆ జిల్లాలు ఈ విధంగా ఉన్నాయి –

ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కొత్త జిల్లాలు : ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల.

ఉమ్మడి మెదక్ నుండి కొత్త జిల్లాలు : మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి.

ఉమ్మడి పాలమూరు నుంచి: జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్.

ఉమ్మడి రంగారెడ్డి నుంచి : వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి.

హైదరాబాదు జిల్లాలో ఏ మార్పు లేకుండా పాత హైదరాబాదు జిల్లానే కొనసాగించారు.

ఉమ్మడి నల్లగొండ నుంచి :
యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట.

ఉమ్మడి ఖమ్మం నుంచి : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం.

ఉమ్మడి కరీంనగర్ నుంచి : రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి: నిజామాబాద్, కామారెడ్డి.

ఉమ్మడి వరంగల్ నుంచి:
వరంగల్ పట్టణ (అర్బన్), వరంగల్ గ్రామీణ (రూరల్) , జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ (మానుకోట).

ఈ పునర్వ్యవస్థకరణ వల్ల మళ్ళీ సా. శ. 1865 సంవత్సరానికి ముందు ఉన్నట్టు తెలంగాణ విస్తీర్ణంలో చిన్నవయిన జిల్లాలు ఏర్పాటు అయినాయి. 2019లో కొత్తగా జయశంకర్ జిల్లా నుంచి ములుగు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా నుంచి నారాయణపేట జిల్లాలు ఏర్పాటు జేయడం జరిగింది. 2021లో ఉన్న వరంగల్ అర్బన్ , రూరల్ జిల్లాల హద్దులు మార్చి హనుమకొండ, వరంగల్ జిల్లాలు అని వరుసగా నామకరణం చేసారు !

ముగింపు:

ఈ విధంగా కుతుబ్షాహీల నాటి జిల్లాలు కొన్ని మార్పులతో 19వ శతాబ్దపు మధ్యకాలం వరకు కొనసాగాయి. 1816 నుంచి గ్రంథస్థమయిన ఆధారాలు చూసినపుడు 1816 నుంచి మొదలు పెడితే 1820 వ దశకం, 1860, 1865, 1874, 1883, 1901, 1905-1913, 1941, 1953, 1956, 1959, 1978, 2014, 2016, 2019, 2021 సంవత్సరాల్లో తెలంగాణలో జిల్లాలలో మార్పులు, పునర్వ్యవస్థీకరణలు జరిగినాయి.

ఇట్లా తెలంగాణ జిల్లాల ప్రయాణం కుతుబ్షాహీ కాలం నుండి నేటి వరకు ఎన్నో మార్పులతో , ఎంతో ఆసక్తికర చారిత్రక సాంస్కృతిక వారసత్వం ఇముడ్చుకుని నేడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో , వారి ఆశయాలను నెరవేర్చే విధంగా పాలన సౌలభ్యం కొరకు చిన్న జిల్లాల ఏర్పాటు జరిగింది. ఈ జిల్లాల పాలన వ్యవస్థ చరిత్ర కూడా సామాజిక , రాజకీయ , సాంస్కృతిక చరిత్ర, సాహిత్యాన్ని మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి దోహద పడుతుంది.**

రచన, పరిశోధన, సేకరణ – ప్రశాంతం

May 9, 2023 0 comment
5 FacebookTwitterPinterestEmail
కవితలు

ఈ సృష్టి ఉంటుందా..?

by Charu Sri May 9, 2023
written by Charu Sri

ఆడ కూతురుగా పుట్టానని
అమ్మే నన్ను చిదిమేస్తుంది

ప్రేమ పెళ్లి చేసుకున్నానని
కన్నవాళ్లే పరువు పేరుతో
నా ఉసురు తీస్తున్నారు

కాముకులు నా జీవితాన్ని
కుక్కలు చించిన విస్తరిచేస్తున్నారు

అత్తింటిలో కట్నదాహం
నన్ను అగ్గికి ఆహుతిచేస్తుంది

మేథావుల్లారా మౌనం వీడండి
మనుషుల్లారా సమాధానం చెప్పండి
ప్రజాస్వామ్య భారతంలో నాకు..
బ్రతికే అర్హతలేదా..?

నేను లేకుంటే..
ఈ సృష్టి ఉంటుందా..?

May 9, 2023 0 comment
3 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మధురా విజయము

by రంగరాజు పద్మజ May 9, 2023
written by రంగరాజు పద్మజ

గంగాదేవి ప్రతిభా వైచిత్రి

తెలుగువారి సాహితీ సంపద చాలా గొప్పది. పురాణాలు, ఇతిహాసాలు, శతకాలు వంటిఎన్నో ప్రక్రియలతో నిండి ఉంటుంది.
తెలంగాణా చరిత్రలో కాకతీయుల పరిపాలనాకాలం ఎంతో వైభవంగా సాగి పేరు పొందింది.
ఓరుగల్లును రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని దాదాపు 200 సంవత్సరాలు పాలించి చరిత్రకే తలమానికంగా నిలిచారు కాకతీయులు.

స్త్రీలకు విద్య నిషేధం అన్నప్పుడు కూడా స్త్రీలు చక్కని సాహిత్యాన్ని సృష్టించారని పరబ్రహ్మ శాస్త్రి గారు ‘కాకతీయచరిత్ర‘ లో చెప్పారు. కాకతీయ వంశస్థులలో ఎందరో మహిళా రచయిత్రులున్నారని వారిలో కామసాని రాసిన చంపకమాల ఉత్పలమాల పద్యాలు గొప్పగా ఉన్నాయనీ, మిర్యాల వంశాల విశేషాలు రాసిందని చెప్పారు.
ఈవంశానికి చెందిన మహిళనే కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రని ఒద్దిరాజు రాఘవ రంగారావు గారు ఒక చారిత్రక వ్యాసంలో రాశారు.
అలాగే కాకతీయ వంశంలో ఎందరో ఎన్నోరంగాలలో నేర్పరులైన మహిళలు ఉన్నారు. వారే కామసాని, ఎరుకసాని, అయితసాని మొదలైన వారు.
సాని అంటే సంగీతంలో నిష్ణాతురాలని అర్థం.
స నుండి ని వరకు సంపూర్ణ సంగీత పాండిత్యాన్ని సాధించిన గంధర్వాంగన వంటి ప్రతిభ కలవారికి ‘సాని ‘అని బిరుదు ఇచ్చేవారు. ఆనాటి మహిళలు ఎంతో కష్టపడి ‘సాని ‘బిరుదును సాధించి దాన్ని గొప్పగా గౌరవంగా భావించేవారు. ఈ ‘సాని ‘బిరుదు కల వారంతా సమాజ నిర్మాణంలో వారు ఎంతో తోడ్పాటు అందించారు. వారంతా మేధావినులు కాబట్టే ఎన్నో రచనలు చేశారు. అభినందించే విషయం ఏమిటంటే అంతఃపురంలో నివసించే రాణీ వాసపు స్త్రీలు బయట ప్రపంచంలో కాలు పెట్టకుండా రచనలు చేయడం కష్టమే.. ఎలా చేయగలిగారో! ఎంతటి ఊహా శాలిత్యమో కదా! ఎందుకంటే స్త్రీలు ప్రబంధాలో, రుక్కులో, రాసిన వారు ఉన్నారు…. వారిగురించి విన్నాము.. కానీ చరిత్ర రాయడం కష్టతరమే కావ్యాలైతే ఊహించి కల్పనలు చేసి,రాయవచ్చు. కానీ చరిత్ర ను ఆధారాలతో రాయాల్సి ఉంటుంది. అటువంటి నైపుణ్యం ఉన్న గంగాదేవి అసమాన్యురాలు. ఈ రచయిత్రి వల్ల కాకతీయుల పాలన రాజ్య విస్తీర్ణం వలననే మహిళల ఖ్యాతి విస్తరణ జరిగింది. లేకపోతే ఇవాళ గంగాదేవి గురించి మాట్లాడుకోలేకపోదుము.
పురుషులే కాకుండా స్త్రీలు కూడా గొప్ప కవులు అవుతారు!కావచ్చు ! ప్రతిభ ఆధారంగా వారి వారి ప్రజ్ఞ పాటవాలను విచారించాలి కానీ లింగ వివక్షత చూపకూడదు కదా!
‘మధురా విజయం ‘లేక ‘విక్రమ పరాజయ చరితం ‘ అనే కావ్యాన్ని మహిళా కవయిత్రి శ్రీమతి గంగాదేవి గారు రచించినట్లు మధుర విజయంలోని మొదటి, రెండవ సర్గలో తెలిపారు. ఈ కావ్యంలో 39– 42 సర్గలలో ఈ విషయం స్పష్టంగా రాయబడింది.

తతోయధావత్ కృతిచేల సంస్క్రియో
నరేంద్ర సూను స్వత ఏవ లబ్దివాన్
కలాసు శశ్వత్ సకలాసు కౌశలం
గురూపదేశస్త్యపదేశ తామగాత్ ॥

భావం:–అనంతరం (తన సోదరులతో దినదినాభివృద్ధి చెందిన) రాజకుమారుడు కంపరాజు యధావిధిగా చూడాకర్మ, ఉపనయనాది సంస్కారములు ముగించుకొని సకల కళల యందు నైపుణ్యం సంపాదించుకొని,గురువు దగ్గరకు శిక్షణను పొందుటకు వెళ్ళెను.

సతీర్థ లబ్ధాయుధ శస్త్ర సంపదా
గుణాభిరామో గురుణైవ శిక్షితః ౹
శరాసనాసి ప్రముఖేషు శాత ధీ
ర గచ్ఛదస్త్రేష్వభిరేషు పాటవమ్ ॥

భావం:- శౌర్య ఔదార్యాది గుణములతో ఆహ్లాదమైన సూక్ష్మ బుద్ధి గల ఆ రాజకుమారుడు (కంపరాజు) గురువు నుండి ఆయుధాలను మంచి శాస్త్రాల జ్ఞానాన్ని పొంది గురువు ద్వారా శిక్షణ పొంది శర( బాణము) ఖడ్గము (పొడవైన కత్తి) మొదలైన అస్త్రముల ఉపయోగ సామర్థ్యం పొందెను.

సత్య వాగ్ భూరిబలో ధనుర్ధర
స్తురంగ మారోహణ కర్మ మర్మవిత్ ౹
కృపాణ విద్యా నిపుణః పృథాభువా
మదర్శి సంఘాత యివైకతాం గతః ॥

భావం:- ఆ రాజకుమారుడు (కంపరాజు) సత్యభాషణలో ధర్మరాజు వలె బలసంపన్నతలో భీముడి వలె, ధనుర్దారులలో అర్జునుడి వలె, అశ్వ (గుర్రం ) విద్యలో నకులుడి వలె, కత్తి సాములో సహదేవుడి వలె.. పాండవులందరిని ఒక చోటు చేర్చినట్టు ఆ రాజకుమారుడు కనిపించ సాగాడు.

ఇంత గొప్పగా వర్ణన చేస్తూ కావ్య రచన సాగింది. ఈ కావ్యానికి ఇతివృత్తం ఇతిహాసాల నుండి కాకుండా భర్త యొక్క పరిపాలన విధానం, దండయాత్రలో గెలుపు అనే అంశాలను తీసుకొని శాస్త్రీయంగా మధురా విజయం అనే కావ్యాన్ని గంగాదేవి రచించింది. ఐతే తాళపత్రాలమీద రాయడం వల్లకొన్ని తాటాకు కమ్మలు ఎక్కడో పోయాయట! కొన్నిచోట్ల పురుగులు తినడం వల్ల ఆయా పదాలు కనపడడంలేదు. అలాగే గంగాదేవి కన్నుక్కొన్న పదాలకర్ధాలు కాలక్రమంలో మారడంతో తాళపత్రాలను పరిష్కరించిన భాషావేత్తలు అక్కడ చుక్క గుర్తు పెట్టి , సమానార్థ పదాలను చేర్చారు.

ఒక మహిళ చరిత్ర తాను రాసిన కావ్యం వైధర్భీ శైలిలో రాసి, సంస్కృత భాషలో తనకనుగుణంగా కొన్ని పదాలు వ్యాకరణానికి తగినట్టుగా సృష్టించి, దోషాలు లేకుండా, శాస్త్రీయ కావ్య నియమాలతో, సంప్రదాయబద్ధంగా చక్కని వాక్య నిర్మాణం, పద గుంఫనలతో మధురా విజయం లేదా కంపరాయ చరిత్ర అనే పేరుతో తన భర్త కంపరాయని సాహస గాధను రాసింది.
అది కూడా సంప్రదాయంగా!ఇలా…

దాస్తా కాళీదాసస్య కవయః కేన విభ్రాతి
ఇదానీమాపి తస్యార్ధానుపజీవస్య భీయతః ॥

అని కాళిదాసుకు నమస్కరించి,

వాణీపాణీ పరామృష్టవీణా నిక్కంపహారిణీం
భావయంతి బ్రహ్మశ్రీ వాన్యే భట్ట బాణస్య భారతీమ్

ఇలా భారవి, ఆచార్య దండి,భవభూతి,కర్ణామృత కవీశ్వరులను , తిక్కన్నను,తన గురువైన అగస్త్యుడిని, నాటక రచయిత గంగాధర మహాకవిని, విద్యానాధులను మొదలైన కవులనెందరినో స్మరిస్తూ… నమస్కరిస్తూ మధురావిజయ కావ్య రచన ప్రారంభించింది రచయిత్రి గంగాదేవి.
క్రీ.శ.16 శతాబ్దం ప్రాంభంలో విజయనగర మహారాజు అచ్చుతదేవరాయల ఆస్థానంలో మహిళా గ్రంథ కర్తలుండే వారని చరిత్ర స్పష్టం చేసింది.
విజయనగరవైభవాన్ని గొప్పగా వర్ణిస్తూ రాసిన చారిత్రక విశేషాలతో రాసింది. కంపరాయ చరిత్ర రాయడానికి గంగాదేవికి (రచయిత్రికి) పెద్దకారణమే ఉన్నది.. అది ఏమిటి అంటే?యువరాజుగా ఉన్న కంపరాయుడు గొప్ప వీరుడు… తన భర్త పరాక్రమాన్ని గ్రంథస్తం చేయాలని రాసిన కావ్యమిది. ఈయన బుక్కరాయల కుమారుడు కనుక అతనిని పరిచయంచేసి, తరువాత కంపరాయల విజయయాత్రను రాయాలనుకుని, విజయనగర రాజైన హరిహర రాయలు సోదరుడు బుక్కరాయలుతో కథను ప్రారంభించింది రచయిత్రి. ఈయనకు ఎంతోమంది భార్యలున్నా దేవయాని అంటే చాలా ప్రేమ ఉండేదట. ఈ దేవయానికి కంపన, చినకంపన,సంగమ అనే కుమారులు పుట్టారని, కంపన గర్భంలో ఉండగా తామ్రపర్ణీ నదిలో స్నానం చేయాలనే కోరిక కలిగిందట దేవయానికి…తన ఇష్టమైన భార్యకోరిక కోరడం రాజు తీర్చకుండా ఉంటాడా? అలా నదిలో స్నానం చేయడం వల్ల కొడుకు అందంగా పుట్టాడని ఆమె నమ్మకం.
ఈ బుక్కరాయలుకు ఎందరో సామంత రాజులు ఉండేవారని వారంతా ఎంతో విధేయులై ఉన్నారని రాస్తూనే… విజయనగర నగరవర్ణన ఎంతో గొప్పగా చేసింది. అందమైన భవనాలు, సుందరమైన ఉద్యానవనాలు ఉండేవనీ, తుంగభద్రానది నుండి నీళ్లు కాలవల ద్వారా తెప్పించి కృత్రిమ స్నాన కొలనులు ఏర్పాటు చేసుకున్నారనీ, తుంగభద్రా నది కోటకు ఒక కందకం వలే రక్షణ కల్పించిందనీ, అటు దక్షిణం వైపు మలయ పర్వతాలు, ఉత్తరంలో వింధ్య పర్వతాలు ఉండేవనీ, తూర్పున ఉదయాచలం, పడమటివైపున ఆశాచలం పర్వతాలు సరిహద్దుగా ఉండి, మంచి శిక్షణతో ఉన్న సైన్యాలతో రక్షణకు లోటు లేకుండా ఉండేదనీ, నగర శివారులలో విరూపాక్ష దేవాలయం ఉండి ఆధ్యాత్మికతతో సంపన్నమై, బుక్కరాయల పరిపాలన రామ రాజ్యం వలె సాగిందని, రాజులకుండాల్సిన చతుర్విధ పురుషోర్ధాలు పుష్కలంగా ఉన్నాయని, విజయనగర వైభవంతో పాటు, కుమారుడు కంపన పుట్టుక,గంగా దేవితోవివాహం, అతని జీవితం, దండయాత్రలో శంభువరాయల నుండి తుండీర మండలాన్ని ఎలాగెలిచి, చేజిక్కించుకున్నారో, ఆ కథను, సుల్తాన్ తో కంపన చేసిన యుద్ధరీతి చదివేవారికి కూడా పౌరుషం ఉప్పొంగేలా రచించింది. అంతేకాకుండా దండయాత్ర సాగిస్తున్నప్పుడు తోవలో ఆయన శృంగార సన్నివేశాలను, కంపన వీరత్వం, అతని అందం, సాహసం, యుద్ధ వివరాలను మొదటి రెండు సర్గలలో… కొన్నిచోట్ల రాఘవేంద్ర విజయం రచయిత నారాయణ కవివర్ణన వలె, కొన్నిచోట్ల కామసాని రచనా శైలివలె రాసింది.
” ఒక స్త్రీ గర్భధారణ ” గురించి రాసిన ద్విపదలలో తను కనుగొన్న కొత్త పదాలనే ఉపయోగించింది. అవి కూడా సహజంగా ఉండేలా పాఠకులు చదువుతున్నట్టుగా కాకుండా ఆ సంఘటనలు వారి కళ్ళ ఎదుట దృశ్యాల వలె కదలాడుతుంటాయి.
ఈ కావ్యంలో ఆనాటి సైనికుల సాహసాలు, యుద్ధ నైపుణ్యాలు, విజయనగర విస్తరణ కోసం చేసిన దండయాత్ర కొనసాగుతున్నప్పుడు ఉదయాస్తమానాల వర్ణనలనూ, ఋతువుల వర్ణనలనూ తన ప్రతిభతో చక్కగా రచించి, కావ్యాన్ని భర్త పుట్టినరోజున బహుమతిగా ఇచ్చింది గంగాదేవి.

ముస్లిం సైన్యాలను హతమార్చిన కంపన పేరు చెబితే చాలు ఎదుటి శత్రు సేనలు కంపించిపోయేవారట అలా పేరుకు తగిన వీరత్వం, అతని అందం అన్నీ వర్ణించింది. కంపన రకరకాల ఆయుధాలు, ఉపయోగించి యుద్ధం చేసిన సాహసం గురించి రాసింది.

ఇందులో రాసిన ఓ గొప్ప విశేషం …. సుల్తాన్ తో యుద్ధం చేస్తుండగా తల తెగిపోయినా ఒక సామంతుడు గుఱ్ఱం యొక్క పగ్గం పట్టుకున్న అతని చేతి పట్టుతప్పలేదనీ, కుడిచేయి కంపనునితో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నదని రాయడం ఔరా! అనిపించింది.

గంగాదేవి రచనా చమత్కారం బాగుంటూనే… మనసును ఒక్కోచోట కలుక్కుమనిపిస్తుంది….

తురుష్కుల దౌర్జన్యానికి శ్రీరంగ పట్టణం నాశనమైందనీ, చక్కని పచ్చని కొబ్బరి తోటలను నాశనం చేసారనీ, కోవెలలో ఆరాధనలు చేయకుండా బ్రాహ్మణులను బంధించారనీ, కోవెలలో వేద మంత్రాలకు బదులు గుడ్లగూబల కేకలు వినలేకపోయేవారమనీ, చిలుక పలుకులకు బదులు పారశీక పలుకులు చెవిలో ముల్లులవలె గుచ్చాయనీ, రాజుతో చెప్పి దండయాత్ర కు ఉసిగొల్పిందట! మహ్మదీయుల పరాజయం వరకూ రచన కొనసాగింది.
దిగ్విజయంగా విజయ యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత విషయాలెన్నో రచించింది గంగాదేవి. శ్రీరంగంలోని విమాన గోపురం శిధిలమై పోవడం, రంగనాథుని కోవెల మండపాలు చెట్లు మొలిచి ఉండడం, దేవాలయ ప్రధాన ద్వారం తలుపులు చెదపురుగులు తిని పాడుచేయడం వంటివన్నీ ఈ వర్ణన లలో ఉన్నాయి. ఇతర సన్నిధులలోని ఆలయాల గర్భగుడులన్నీ శిధిలమైనాయి… వాటి నుండి సంగీత మృదంగ ధ్వనులు ఎంతో మధురంగా వినిపించేవి. అంత గొప్ప దేవాలయంలో నక్కల అరుపులు వినిపిస్తుంటే కంపన సహించలేకపోయాడు.

కావేరీ నది ఉప్పొంగి, ఎన్నో నష్టాలు జరిగాయి. అగ్రహారాలలో తురుష్కులు మద్యమాంసాలను తిని- తాగుతూ యజ్ఞాలు చేయనివ్వకుండా యజ్ఞ కుండాలు చల్లారిపోయి, హోమపు సువాసనలు రావడంలేదు. మాంసం కాల్చిన వాసనలు రావడం , దుర్వాసన రావడం, వేదగానాలు మోగి వీనులవిందైన దేవాలయం శోకాలతో నిండిపోయింది.

ఇనుప శూలాలతో యువకుల తలలను గుచ్చేవారు. తామ్రపర్ణి నదిలో యువతులు స్నానం చేస్తుంటే వారి రొమ్ములను కోయగా వారి నెత్తురుతో తామ్రపర్ణీ నది నీళ్లన్నీ రక్తసిక్తమైపోయి ఎర్ర రంగుతో పారాయట. ఆవులను చంపి ఆ నదిలో వేసారట.ఈ విషయం కంపనకు చెప్పి, దక్షిణ దిక్కు గెలిచేలా ఉపాయం చెప్పింది. తనను పంపించిన విషయం గుర్తుకు వచ్చి, ఆమె వైపు సానుకూలంగా చూసి అవన్నీ బాగు చేయించాడు… గంగాదేవి నడికట్టుకు ఒక తళతళ లాడే ఖడ్గంఉంది. దాన్ని తీసి చక్రవర్తీ! పూర్వ కాలంలో విశ్వకర్మ దేవతల ఆయుధాల నుండి కొసలను సేకరించి వాటిని కరిగించి, ఈ ఖడ్గం తయారు చేసి, రాక్షసులపైన గెలవడానికి పరమేశ్వరుడికి ఇచ్చాడు. ఆ ఖడ్గం కోసం తపస్సుచేసి, పాండవ మధ్యముడు వరంగా పొందాడు . దాంతో యుద్ధంచేసి, ధర్మ రక్షణ చేసాడు. అలాగే మీరు కూడా ముష్కర మూకలను తరిమి వేయండి అని అతనికిచ్చింది.

మెట్టినింటి- పుట్టినింటి దేశభక్తి కల గంగాదేవి వంటి భార్య ప్రోత్సాహం వల్లనే విజయం సాధించగలిగానని, ఆమెను మనస్పూర్తిగా అభినందించాడట.
ఇలా దేశ పౌరురాలిగానూ , భార్యగానూ, రచయిత్రిగాను ఎందరి మెప్పులో పొందిన గంగాదేవి మహిళలకెంతో ప్రేరణ! మార్గదర్శి! స్పూర్తి!

[ ఈ రచయిత్రి గురించి రాజశేఖరుడనే కవి గొప్ప నాటక కర్త చెప్పాడు ]

సేకరణ:- మల్యాల దయామతీదేవి* ఈయన గుఱ్ఱం చాలా పేరుపొందిన గుఱ్ఱం! ఎలా అంటే ఆ గుఱ్ఱమెక్కి బయలుదేరితే చోళ, కేరళ, పాండ్య రాజులు ఆ గుఱ్ఱానికి దారి ఇస్తూ… చేత ఖడ్గాలు పట్టుకొని ముందు నడిచే వారట! అంతటి వీరుడు కంపన. అతను గుఱ్ఱం మీద వీధుల్లో వెడుతుంటే అతనే గెలవాలని ముత్తైదువలు, కన్యలు బంగాళాల మీద నుండి ఆశీర్వదిస్తూ పూలు చల్లేవారట! అలా ప్రయాణించి ఐదారు రోజులకు కర్ణాటకను దాటి కంటకానన అనే ప్రదేశం చేరాడు. ఆ రాజును వశపరచుకోవడానికి ఎప్పటినుండో అతను ఎదురుచూస్తూ కొంతకాలం అక్కడే ఉన్నాడు. ఎవరూ తనపై దండెత్తిరాకుండా.. విరించిపురంలో తన మకాం ఏర్పాటు చేసుకున్నాడు. సైన్యాన్ని కాపలా పెట్టుకున్నాడు.
కంపన ద్రవిడరాజుతో యుద్ధం చేసి అతన్ని భయపెట్టాడు. అతను భయపడి పారిపోయాడు.
అయితే ఈ కావ్యంలో అతిశయోక్తులున్నాయని ఆంగ్ల కవి [ Long for affair] రచయిత విజయనగరం నుండి 150 మైళ్ళ దూరం 5 రోజూలలో ఎలా చేరగలరు? ఇది అతిశయోక్తి వలె ఉన్నదని విమర్శించడంతో ఈ కావ్య స్థాయి తగ్గిందని భాషావేత్తలు అభిప్రాయ పడ్డారు… ఎలా అంటే 21 పేజీలో 47 శ్లోకంలో కంపన పెద్దసైన్యంతో ఉత్తర ఆర్కాటు జిల్లా నుండి కంటకానన చేరుకున్నడని ఉంది … ఐతే ఆకాలంలో ఎంతటి కారడవియైనా , బాటలు సరిగా లేకపోయినా సైన్యం 30 మైళ్ళ వేగంతో నడిచే సత్తాగల సైన్యం కంపన దగ్గిర ఉండేదని చారిత్రక విశ్లేషకులు వ్రాశారు.
ఈ కావ్యం రాసిన గంగాదేవి స్వయంగా కంపన భార్య కనుక ఆమె ప్రత్యక్ష సాక్షిగా అలా రాసి ఉండవచ్చు.
మద్రాసు యూనివర్శిటీ సంస్కృత పండితుల ఆదరణ, కావ్యానికి రచనా పరంగా వారిచ్చిన గౌరవం, ఆమోదం వల్ల వారు డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ‘ మధురా విజయం‘ కావ్యాన్ని నిర్ణయించినందువల్ల పాఠకుల సంఖ్య ఎక్కువై రెండవ ముద్రణ కూడా చేసారు.

మధురావిజయ కావ్యం చదవి, ఒక స్త్రీ రాసిందని కొట్టిపడేయక … సంస్కృత సాహిత్యంలో పురుషులతో పాటు స్త్రీలు సమాన స్థాయిలో రాయగల విదుషీమణులున్నారని అంగీకరించి… ఈ కావ్యం తమ స్వంత గ్రంథాలయంలో దాచుకోతగిన గ్రంథం!
ఒక మహిళగా గర్వ పడుతూ…

ఈ గ్రంథానికి ముందుమాట రాసిన G.హరిహర శాస్త్రిగారి మరియు T.A గోపీనాథ రావు సూపరండెంట్ ఆర్కియాలజీ ( ట్రావెన్కూర్) వారి సౌజన్యంతో…

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us