మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

కొకతట్టి చాంద్ బీ

by Veera valli July 19, 2023
written by Veera valli

ఇది నిజంగా జరిగిన 1960 ప్రాంతంలోని కథ. నా చిన్నప్పుడు, సీతారాం బాగ్ లో ఉన్న మా ఇంటికి ఈ ముస్లిం ఆవిడ, మంగళ్ ఘాట్ లో ఉన్న గోడే ఖబర్ నుండి వచ్చేది. మా అమ్మ లక్ష్మి నరసమ్మగారు ఆవిడకు నరసింహ స్వామి పూజ చేసి తీర్థ ప్రసాదాలు ఇస్తే, ఆవిడ ఎంతో భక్తితో పూజ చేయించి వాటిని స్వీకరించే ది. మొహర్రం పీర్ల పండగ రోజు మా అమ్మ ఆమెకి దట్టి, బట్టలు పంపేది. ఆమె మాకు ఊదు ప్రసాదంగా తెచ్చి ఇచ్చేది. మాకు ఏ జబ్బు చేసిన దర్గాలకు తీసుకెళ్ళి ప్రార్థనలు చేసేది మా అమ్మ.

చుట్టు పక్కల వారు, కులం వారు ఆక్షేపిస్తున్నా ఎదురించి ముస్లిం మహిళకు నరసింహ జయంతి రోజు ఆమె తరపున మా అమ్మ పూజ చేయటం అయితే,

వాళ్ళ బంధువులు అభ్యంతర పెట్టినా, మోహల్లా (వీధి) వాళ్ళు గర్హించినా, ముస్లిం వనిత ధైర్యంగా పూజ చేయించటమే కాక మా అమ్మ ఇచ్చిన దట్టిని పీర్ల కు సమర్పించి మొక్కులు మొక్కి మా కుటుంబం కోసం ప్రార్థనలు చేయటం గొప్ప కదా. ఆరోజుల్లో నిజంగా అభినందనీయమే.

ఆ రోజుల్లో మడి ఆచారాలు సంప్రదాయాలు ఎక్కువగా ఆచరించే మా కుటుంబాలు ఈ విధమైన సఖ్యత చూపడం నిజంగా నాకు అద్భుతమే అనిపిస్తిస్తుంది ఇప్పటికీ. ఏమీ చదువుకొని మా అమ్మ, పేదరికానికి మతంఉంటుందా? అని అడిగిన ప్రశ్న గొప్పది.

అందుకే మనసు లో ముద్ర వేసుకుని పోయిన ఈ సంఘటనని కథగా రాయాలని పించింది. ఈ ఇద్దరి స్త్రీ లను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

మా అమ్మ లక్ష్మి నరసమ్మ

‘అమ్మా‘ అంటూ పరుగున అమ్మ దగ్గరికి వెళ్ళాను.

మడి చీరలో ఉన్న లక్ష్మమ్మ, అదేమా అమ్మ.. ‘ఏమిటే ఆ ఉరుకులు. దగ్గరికి రాకు, ముట్టుకోకు, దూరం దూరం.. మడిలో ఉన్నా..‘ అని దూరంగా జరిగింది.

‘సరేలే ముట్టుకోను గానీ, ఆవిడ వొచ్చింది. అదే బురఖా ఆవిడ‘ అప్పటిదాకా తాడాట ఆడుతూ, చాంద్ బీ రావటం వల్ల అమ్మకి చెబుతామని అలాగే వచ్చేసాను.

‘మళ్లీ తాడట ఆడుతున్నావా, ఎలా దమ్ము తీస్తున్నావో చూడు. ఎన్ని సార్లు చెప్పినా వినవు. ఆ తాడు అవతల పడేయి. ఆవిడని కూచోమని చెప్పి, మంచినీళ్ళివ్వు వచేస్తున్నా‘ అంటూ అమ్మ హడావిడిగా వంట పూర్తి చేయటానికి వెళ్ళింది.

‘సరే కానీ, ఆవిడ ఎండలో వచ్చింది. నువ్వే అంటావు కదా ఎండలో నుంచి వచ్చి నీళ్ళు తాగొద్దని. మరి ఇవ్వమంటావా నీళ్ళు.‘ అంటూ నా సందేహాన్ని అడిగాను. ‘సరేలే, ప్రశ్నలు మొదలుపెట్టావా… చెప్పింది చేయి. ఎవరొచ్చినా ముందు వారిని కూచో పెట్టీ మంచి నీళ్ళు ఇవ్వటం పద్దతని ఎన్ని సార్లు చెప్పాను. ఆమె ఇష్టం, తాగాలను కుంటే తాగుతుంది.‘ విసుక్కుంటూ తనపనిలో పడింది.

ఏమిటో అమ్మ ఒక్కోసారి ఒక్కొలాగా మాట్లాడుతుంది. ఆడే స్కిప్పింగ్ రోప్ పక్కన పెట్టి, వంటింటి లోకి వెళ్ళాను. చల్లటి మంచినీళ్ళు రాగి చెంబుతో తీసుకెళ్ళి, గ్లాసులో పోసి ఆవిడ ముందు పెట్టాను. మోసుకొచ్చిన సంచిని అరుగు మీద పెట్టి బరువును మోసిన చేతిని మరో చేత్తో నొక్కుకుంటూ అరుగు మీద నీరసంగా కూచుని ఉంది చాంద్ బీ. ఎండలో నడిచి వచ్చిందేమో ఎక్కడలేని అలసట కనిపిస్తోంది ఆమె ముఖంలో. నేను చెంబుతో నీళ్ళు తేవటం చూసి తల మించి బురఖా తీసి, ఇంటి ముందున్న చింత చెట్టు మొదట్లో కెళ్ళి అక్కడున్న బకెట్ లోని నీళ్ళతో మొహం కడుగుకుంది. ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుని లోపలికిరావాలి. అందుకే నీళ్ళబకెట్ ని ఇంటి ఎదురుగా పెట్టడం మా ఇండ్లలో పద్దతి.

కాస్త ప్రాణం కుదుట పడి, ఇంటి వాకిట్లోని అరుగు మీద కూచుని బురఖాతో ముఖం తుడుచుకుంది. మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని గట గట మని తాగి, ఇంకా నీళ్ళు పొయ్యమని గ్లాస్ చూపింది. ఆమెకి చాలా దాహంగా ఉంది కాబోలు మాట్లాడలేక పోతోంది. రెండో గ్లాసు కూడా తాగేసింది. ప్రతి సారి పూజ కోసం తల స్నానం చేసి వస్తుంది. ఇంకా జుట్టు ఆరలేదులా ఉంది, ఆమె వోత్తైన తడి జుట్టుతో వెనకాల బురఖా అంతా తడిసి పోయింది. ఆమెనే చూస్తూ నిలుచుండి పోయాను.

నీళ్ళ చెంబు లోపల పెట్టటానికి వెళ్లి అమ్మ హడావిడి పడటం చూశాను. ఆవిడ ఇవాళ వస్తుందని వంట తొందరగా చెయ్యాలని పొద్దుట్నుంచి అంటూనే ఉంది అమ్మ. దాదాపుగా వంట పూర్తి అయింది.

వంట అవటమే ఆలస్యం కట్టెలు ఆర్పీ, కాలినంత భాగం తీసేసి మిగిలిన కట్టెలని, ఆర్పిన కట్టె ముక్కలను ఎండలో పెట్టీ బొగ్గులుగా తెల్లారి మళ్లీ వంటకు ఉపయోగిస్తుంది. ఎందుకమ్మా అలాగ అంటే. మొత్తం కట్టెలు కాలిపోతే బూడిద అవుతుంది. అందుకే అర్పేయాలి. అప్పుడు కాలిన కట్టే బొగ్గు అవుతుంది. అవి మళ్లీ వంటకు పనికొస్తాయి కదా‘ అనేది అమ్మ. ఏంటో తను చేసేవి అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ అది ఆమెకి పేదరికం నేర్పిన కొన్ని పాఠాలలో ఇదొకటని తరువాత రోజుల్లో అర్థమయింది. పాపం ఆవిడ ఎంతో పొదుపుగా సంసారాన్ని లాక్కొ చ్చింది కదా అనిపిస్తుంది.

పొయ్యిపైన చట్టిలోని పప్పుచారుని స్టీలు గిన్నెలోకి వోమ్పేసి మూత పెట్టింది. మట్టిచట్టిలో పప్పుచారు చేయటం ఆమె అలవాటు. పక్క పొయ్యి పై ఉడుకుతున్న అన్నం ఒకసారి గరిటతో తిప్పి, అన్నం గంజి వార్చటానికి తప్పాలామూతికి తట్టు (అదే బియ్యం సంచి) ముక్కని కట్టి పక్కనే ఉన్న అరుగు మీద వొంపింది. ఆ గోనె పట్టాకి రంద్రాలు ఉంటాయి కదా అన్నం పడిపోకుండా గంజి మాత్రమే బయటకు పోతుందన్నమాట. పొయ్యిలోని మంటతీసేసింది కానీ పూర్తిగా అర్పలేదు. మళ్లీ పులిహోర తాలింపు పెట్టాలికదా. ఈలోపు గిన్నెలో నీళ్ళుపోసి శక్కర, టీ పొడివేసి పోయి మీద పెట్టింది. పక్క పొయ్యి లోని నిప్పుని ఆర్పేసి, పొయ్యిదగ్గర అంతా సర్దేసింది. గంజి వార్చిన అన్నం గిన్నెకి మూత పెట్టీ మళ్లీ ఆర్పిన పొయ్యి మీద పెట్టేసింది. ఆ వేడికి అన్నం పొడి పొడిగా అవుతుందన్న మాట.

అప్పటికి గ్యాస్ పొయ్యి రాలేదు మా వరకు. వచ్చినా భరించలేని మధ్యతరగతి శ్రీవైష్ణవ కుటుంభం మాది. మట్టి పొయ్యి మీదే వంట చేయాలి. ఆ పొయ్యిని ఆమే తయారు చేస్తుంది. ఒక మంచి రోజు చూసుకుని, తానే వెళ్లి పుట్టమన్ను తవ్వుకొచ్చి నీళ్ళతో తడిపి, బాగా పిసికి, ఆ మట్టితో గుండ్రటి పొయ్యి తయారు చేస్తుంది. మధ్యలో ఇనుప చువ్వ లు పెడుతుంది. దాని వల్ల బొగ్గులు వేయటానికి వీలవుతుంది. ఇంపచువ్వల కిందిభాగంలోకి చేయిదూరెంతగా కన్నంచేస్తుంది. అక్కడ పిడకపై కిరోసినేసి వెలిగించటానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే రెండు కట్టెలని కుడా పెట్టి కట్టెల పొయ్యిలగా కుడా వాడుకోవచ్చు. కొన్ని సార్లు అక్కడే ఆలుగడ్డలని, మొగరం గడ్డల్నిఅదేనండి చిలగడదుంపలు, ఇంకా లేత బెండకాయలను, లేత బీరకాయలను కాల్చి మాకుఅన్నం లోకి ఇచ్చేది. కూరల బదులుగా వాటితో భోజనం కానిచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు అమ్మ పక్కన కూచుని చిన్న పోయ్యిని చేసేదాన్ని. ఏంటో మరి ఎండగానేవిరిగిపోయేది.

అలాగే మరో చిన్న పొయ్యి చేస్తుంది. దాన్ని కట్టెలు మాత్రమే పెట్టీ వాడుకోవచ్చు. వాటిని నీడలో ఆరాక వంటింట్లో ఓపక్కన గట్టులాగ చేసి పెర్మినేంట్ గా దానిపై పెట్టేస్తుంది. రోజు వంట అయ్యాక ఎర్రమట్టి, పేడ కలిపి పోయ్యిలని అలికి వాటిపై ముగ్గు వేయటంతో అవి శుద్ధి అయి తిరిగి మరునాడు మడి వంటకి పనికి వస్తుందన్నమాట. ఆమెకి ప్రతిరోజూ సంధ్యవేళ పొయ్యిలు అలకడం తప్పనిసరి పని. వంటంత ఒకపూటే చేసేస్తుంది. రాత్రికి రొట్తెల్ని, తక్కువపడే అన్నాన్ని కిరోసిన్ పంపు స్టవ్ పై వండేస్తుంది. మళ్లీ ఈ స్టౌ పొద్దుట వంటకి పనికి రాదుట. ఆ వంటలతో దేవుడికి ఆరగింపు చేసేది కాదు అమ్మ.

మా నాన్న దేశికాచార్యులు గుళ్ళో పూజలు చేసి తెచ్చే చాలీచాలని సంపాదనతో ఇల్లు వెళ్ళదీస్తోంది. నలుగురు సంతానoలో మా పెద్దన్నయ్య ఉద్యోగంలో చేరి కాస్త సంపాదిస్తున్నాడు.. అక్క చూడామణికి చిన్నప్పుడే పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. పెద్దకుటుంబంలోకి వెళ్ళటంతో పుట్టింటిని ఆమె పూర్తిగా మరిచి పోయేలా చేసింది. అమ్మ, అన్నయ్య అప్పుడప్పుడు వెళ్లి పండ్లో పూలో, వీలైతే ఎవైన పిండివంటలు చేస్తే అవి ఇచ్చి బాగోగులు అడిగి వస్తుంటారు. ఒకందుకు అమ్మాయి ఒకతి ఉందని కుడా గమనించే స్థితిలో లేని పేద కుటుంభం మాది. రెండు గదుల చిన్న పెంకుటిల్లు. ఆ గుడిప్రక్కవీధి అంతా అలాంటి వారే నివసిస్తున్నారు. అన్నయ్య స్కూలు ఫైనల్ పాసవంగానే చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. చిన్నన్నయ్య పదవ తరగతిలో ఉన్నాడు. నాన్న, గుడికి జీయంగార్ వచ్చినప్పుడు సామూహిక ఉపనయన కార్యక్రమాల్లో అన్నయ్యలిద్దరికి చిన్నప్పుడే ఉపనయనం చేయించాడు. అప్పుడప్పుడు ఇద్దరూ ఆయనతో పాటు పూజలకు వెళుతుంటారు. తరువాత నేను.. విజయ లక్ష్మి ..సెవెంత్క్లాస్ అండి. అమ్మ మాత్రం ఆడపిల్లకి చదువు వద్దని మొత్తుకున్నా అన్నయ్యలు వినకుండా నన్ను చదివిస్తున్నారు. గవర్నమెంటు స్కూల్లో ఫీజు లేదు కాబట్టి చదువు సాగుతుంది. పదమూడు నిండకుండానే నాపెళ్లి చేయాలని మానాన్న వెంట పడుతుంది మా అమ్మ.

అమ్మ పని అయినట్టుంది. రెండు గ్లాసుల్లో చాయి తీసుకుని వాకిట్లో కొచ్చింది. “బాగున్నావా చాంద్ బీ. అమ్మాయి నీళ్ళిచ్చిందా? ఎండ మండి పోతుంది. మొహం చూడు ఎలా అయిందో. పొద్దున్నుంచి నీవేమి తినవు కదా, కాస్త చాయి తాగు నీరసం తగ్గుతుంది.” అంటూ ఒక గ్లాస్ ను ఆమె ముందు పెట్టీ, తాను ఓ గ్లాస్ తీసుకుని కడప లోపల కూచుంది. అయ్యో వద్దులేమ్మ, మీకే పని ఎక్కువ అయింది.” అని మొహమాట పడింది. “కష్టమేముంది నీ పేరుచెప్పుకుని నేనూ తాగుతాలే. నా మడి వంట ఇప్పుడే అయింది. నీకోసమే ఎదురుచూస్తున్న, ఇద్దరం కలిసి తాగుదామని నేనూ చాయ్ తాగలేదు‘. అంది.

చాయి తాగటం అంటే పెద్ద ఇత్తడి గిలసులో సగానికి పైగా పోసుకుని చీరచెంగుతో పట్టుకుని తాపీగా ‘ఉఫ్ ఉఫ్’ అని ఊదుకుంటూ తాగటం ఎంతో ఇష్టం. అంతా పనయ్యాక టీ తాగి అలసట తీర్చుకుని మడి వదలడం ఆమె రోజువారీ అలవాటు.

“తాగు, కాస్త నీరసం తగ్గుతుంది. పులిహోరకి అన్నంచేశాను. తాలింపు పెట్టేస్తే అయిపోతుందిలే”

“షుక్రియ అమ్మా ఇంత పనిలో కూడా ఎప్పుడూ నాకోసం చాయి ఇస్తావు” అంటూ వేడి గ్లాస్ని బురఖాతో పట్టుకుని ఊదుకుంటూ తాగుతూ “మీ అందరు ఎలా ఉన్నారు అమ్మా” అంది. “ఏదో కాలం వెళ్ళ దీస్తున్నాము” అంటూ తమ తమ కుటుంబాల విషయాలు మాట్లాడు కున్నారు. చాంద్ బీ ప్రొద్దున్నే తలరా స్నానం చేసి ఏమి తినకుండా నరసింహ స్వామి పూజ కోసం ఇక్కడికి సాయిత్యం (ప్రసాదానికి కావలసిన సరుకులు) తీసుకుని వస్తుంది. ఈ ప్రసాదమే తింటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే.

‘పూజ సామాన్లు తెచ్చిన‘ అంటూ చేతిలోని సంచిని ముందుకు జరిపింది. “మీ ఆయన, పిల్లలు ఎట్లా ఉన్నారు?”. టీ తాగుతూ అడిగింది అమ్మ. “ఏం బాగమ్మ, పిలగాడు జిద్ చేస్తే పాన్షాప్ పెట్టించినం. పిల్లేమో ఈడు కొచ్చింది. దానికి

షాది చెయాల కదమ్మ. ఆయన కమాయించిన దాన్లో ఇల్లు గడవడమే ముష్కిల్ అవుతుంది” అంటూ తనగోడు వెళ్ళ బోసుకుంది.

అమ్మ వెనకాలే వచ్చిన నేను, లోని కెళ్లి చేట తీసుకుని వచ్చి ఆవిడ ముందుపెట్టాను. ప్రతి సంవత్సరం ఆవిడ రావడం, సంచిలో వంట సాయిత్యం తేవటం నాకు తెలుసు. మళ్లీ అమ్మ చెప్పాల్సిన పని లేకుండానే లోనుంచి చేట తెచ్చేసాను. “అమ్మో బాగానే తెలిసిపోయిందే బేటీకీ “చాంద్ బీ నవ్వుతూ సంచీలోని బియ్యం, పప్పు, బెల్లం, చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మొదలైన సాయిత్య సామాన్లు చేటలో ఉంచింది. కొబ్బరికాయ, పూలు, అగర్బత్తులున్న కవరును వేరుగా చేట పక్కన పెట్టింది.

“చాంద్ బీ, అందరికీ ఏదో ఒకరకంగా ఈ కష్టాలన్ని ఉంటూనే ఉంటాయి. ఏంచేస్తాం మన కర్మ, నుదుట రాసింది అనుభవించక తప్పుతుందా. ధైర్యంగా సంసారాన్ని ఈదటమే మన పని. అన్ని బాగవుతాయి. బాధపడకు.‘ అంది అమ్మలేస్తూ. ” ఉండు నిముషంలో వస్తా. భోగం వంట చేయాలిగా త్వరగానే అయిపోతుందిలే” అంటూ చాయి తాగటం ముగించి సామాన్లున్న చేట, పూజ కవరుని తీసుకుని లోపలికెళ్ళి పనిలో పడింది. గూట్లోని గచ్చకాయల్ని తీసుకుని ఆడుకోవటానికి బయటకొచ్చాను. అప్పుడు నాతో ఆడటానికి ఎవరూలేరు. ఒక్కదాన్నే ఆడుకుంటూ తలెత్తి చాంద్ బీ వైపు చూసాను. బకేట్లోని నీళ్ళ తో టీ గ్లాస్ కడిగి తాను కూచున్న అరుగు మీద బోర్లిచ్చింది. కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం మొదలెట్టింది.

ప్రతి నరసింహజయంతి నాడు తప్పకుండా గోడేఖబర్, కోకతట్టి నుండి వచ్చి, అమ్మతో పూజ చేయించుకుని వెళ్ళటం ఆమె ఎన్నో ఏళ్లుగా నిష్టగా చేస్తున్న పని. వీళ్ళిద్దరి స్నేహితం ఆవీధిలోని వారికి వింతగా ఉంటుంది. పక్క వాళ్ళు, చాల సార్లు అమ్మతో నిష్టూరంగా మాట్లాడేవారుకుడా. ‘భక్తి, శ్రద్ధతో చేసే పూజని ఎవరినైనా ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. మతమేదైన ఆయన కే పక్ష్టపాతం లేదు. ఆదేవుడికేలేని అభ్యంతరం పూజ చేసే నాకేమిటి’’ అని ఘాటుగానే జవాబు చెప్పేది.

అమ్మ మడి, ఆచారాలతో మధ్యాహ్నం రెండైన మడిచీర విప్పదు. వంట, పూజ దేవుడి ఆరగింపు అయి ఆవిడ భోజనం చేసేసరికి ముడైనావుతుంది.

చాంద్ బీ ముస్లిం, బురఖా వేసుకునిగాని బయటకి వెళ్ళదు. ఇక్కడికి వచ్చినప్పుడు ముఖం మించి బురఖా తొలగిస్తుంది. వచ్చిరాని తెలుగులో మాట్లాడుతుంది. అమ్మ ఆవిడని అందరిలా లోపలి పిలవదు బయట అరుగు మీదే కూచోమంటుంది. మంచినీళ్ళు గ్లాసులో ఇస్తే ఆవిడ తాగాక కడిగి బోర్లిస్తుంది. దానిపై నీళ్ళుచల్లి లోపలి తీసుకెళ్ల మంటుంది. కాని ఆమెని మాత్రం చాల ఆప్యాయంగా ఆదరించేది. కుటుంబ విషయాలు అడిగి మరి తెలుసుకొని సలహాలిచ్చేది. అదే ఆవిడని అడిగాను చాలాసార్లు. ‘నీకు అర్థంకాదులే మన మడిఆచారాలు మనవి. ఆమె మత ఆచారాలు ఆమెవి. తరతరాలుగా వచ్చే వాళ్ళ ఆచారలని పాటిస్తుంది. మనమూ అంతే. కాని నాకు తెలిసిందంతా ఒకటే ఇద్దరం మా కష్ట సుఖాలను చెప్పుకుంటాం. ఆమెదోరకం నాదోరకం. కానీ మా మతాలేవైనా ఇద్దరమూ బీదవాళ్ళమే.

పేద తనానికి మతం లేదు కదా ఏమిటో…ఎంచేయగలం, ఒకరికొకరం నాలుగు ఓదార్పుమాటలు చెప్పుకోవటం తప్పా.’ అని చెప్పేది. కొంత ఆకళింపు చేసుకునే దాన్ని కొంత అర్థం కాకపోయేది.

ఎప్పట్నుంచో పొల్లుపోకుండా ఇలాగే జరుగుతున్నా నాకు మాత్రం కొత్తగానే ఉంటుంది. ఆవిడ బురఖా వేసుకునే వస్తుంది. అలా ఎందుకు వేసుకుంటారని ఓ సారి అడిగాను. “బిడ్డా ఇది మా ఆచారం మా ఇండ్లల్లో గిట్లనే వేసుకోవాలి.” ఆమె రెండు చెవులకి కనీసం ఆరేసి దుద్దులైన ఉన్నాయి. చెవి చుట్టుతా కుట్టించుకుంది. నాకు విచిత్రంగా అనిపించి. ‘ఎందుకలా అన్నీ కుట్టిన్చుకున్నావు నొప్పి వేయలేదా‘ అని అడిగింది. ‘‘మాకిలా చిన్నప్పుడే కుట్టిస్తరు. మా అమ్మిజాన్ నాకు మూడు ఎండ్లకే కుట్టించింది. నొప్పి గిప్పి ఎంతెలుస్తది అప్పుడు ‘‘ అంది.

అమ్మ బయటికి వచ్చి కూచుంటూ “అయిపోవచ్చింది. ఆరగింపు చేసి ప్రసాదం కట్టిస్తాను. అన్నట్టు మీ పాన్ షాప్ ఎలా ఉంది. మా అబ్బాయి చూసాడట మీ వాడ్ని. కొత్తగా పెట్టామని చప్పాడట బాగా నడుస్తుందా”అడిగింది.

“ఏం దుక్నమో అమ్మా. మా ఆయన సైకిల్ షాప్ లో పంచేజేయమంటే ఆడ చేయ నన్నాడు.వాళ్ళ దోస్తుల మాటలు విని పాన్ దుక్నం పెట్పిచ్చిన్డు. ఆడ బాగా పైసలు వస్తయని చెబుతుండు. అది పెట్టటానికి మల్ల అప్పు అయింది. ఇప్పటికైతే బాగానే షాప్లో కూచుంటున్నాడు. రెండునెలలు అయింది. అప్పుకూడా కొంచం కొంచం వాపసు చేసిండు. సామి దయవల్ల గిట్లనే కమాయిస్తే చాలు. ఈయన, సైకిల్ దుక్నంల దినమంతా కష్టం చేసినా ఆమ్దని గంతనే. ఇయ్యాల రేపు అందరూ కార్లు, స్కూటర్ కొంటున్రు కదా సైకిల్ ఎవ్వరు తొక్తలేరు. వచ్చిన పైసల్ దాదాగాల్లకి, దుక్నం కిరాయి ఇయ్యంగ తిండికి సరిపోదు.” తన బాధ చెప్పుకుంది చాంద్ బీ.

“అవును చాంద్ బీ, అన్నీపిర్యమై పోయినై. మనం ఎంత సంపాదించినా తిండికే సరిపోవటం లేదు. మీ పిల్ల కూడా పెండ్లికి వచ్చిందిగా సంబంధాలు చూస్తున్నారా?” “అవునమ్మా గదే పరిశాన్ గుంది మొన్న దుబాయ్ నుంచి ఒక సంబంధం వచ్చింది కాని పిల్లగాడి ఈడు పెద్దగుంది. పిల్లేమో 17 ఏడ్లు, వచ్చే రిస్తలేమో 30, 40 ఎడ్లవాళ్ళు వస్తున్నై. నాకేమో ఇష్టం లే. మా ఇంటాయనేమో వాళ్ళు పైసల్ అడగరని గసొంటి రిస్తలే చూస్తుండు. ఏమో అమ్మా రాత్రికి కంటికి నిద్ర రాదు పరిషాన్ అవుతున్న.” అంటూ కళ్ళు తుడుచు కుంది. “ఊరుకో చాంద్ ఆ భగవంతుడున్నాడు నీ కష్టాలన్నీ గట్టేక్కిస్తాడులే. చూడు పిల్లగాడు బాగుపడుతున్నాడు కదా. అలాగే పిల్లకి కూడా మంచి రిస్త వొస్తది లే దిగులు పడకు. మీ ఆయనకి చెప్పు పిల్ల గొంతు కొయొద్దని. అంత ఈడు ఉన్నోడికి కట్టబెట్టకండి. అసలే రోజులు బాగాలేవు ఆ దుబాయ్ తీసుకపోయి ఎలా చూస్తాడో మనకి తెలియదుకదా. మళ్ళీ మనం చూడగలమా. ఇక్కడి పిలగాడైతే, పిల్ల మన కండ్ల ముందుంటది. మంచీ చెడు చూడవచ్చు. మా వాడు మొన్న పేపర్ల చదివి చెప్పిండు పెళ్లి చేసుకొని దుబాయ్ తీసుకుపోయి అమ్మేస్తరట. మీ పాత బస్తీలో ఇవన్నీ బాగా జరుగు తున్నాయని అన్నాడు. జాగర్త ఒకటికి రెండుసార్లు వాళ్ళగురించి అందరిని అడిగి తెలుసుకొని పెళ్లి చేయండి.” తనకు తెలిసిన విషయం చెప్పింది.

“అవునమ్మా నేనూ అదే అని బయట రిస్తలని హర్కిస్ వద్దంటున్న. మా బస్తీల చాల పిల్లలకి గట్లనే అయ్యింది. ఒకసారి పిల్ల పెండ్లి అయి ఆడకి పోయిందంటే ఇక అన్తనే, మళ్ళి మనకి కనబడదు. ఏ ఖబర్ ఉండదు. ఆడ అమ్మేస్తరో, ఇంట్లనే

ఉంచు తరో తెల్వదాయే. అందుకనే నేను ఈడనే చూస్తున్న. మొన్న మా తోడికోడలు చిన్నమ్మ ఒక రిస్త తెచ్చింది. పిల్లగాడు ఎక్కువ సదువ లేదు. కూరగాయల దుక్నం పెట్టుకున్నడు. కాని చాల పైసల్ అడుగుతున్నరు. మనకాడ అంత లేదు. ఇప్పుడున్న ఇల్లు అమ్మితే గిరివి పైసల్ పోను పెళ్లి చేసి పంపొచ్చు కాని గిరివి పెట్టిన సేటు అమ్మనిస్త లేడు. వాడికే అమ్మాలంట. అట్లైతే ఇల్లు అగ్వకు పోయి పైసల్ సరిపోవు. అన్ని తెల్సినంక కూడా సోనా ఏం పెడతవ్ అంటుంది మా తోడికోడలు. మా అమ్మిజాన్ పెట్టిన గీ చెవి కమ్మలు ఇస్తనన్న. గవి సాలవంట. ఏమ్చేయాలో సంజవుతలేదు.”

“చాంద్ బీ, బాధ పడకు, ఆ అల్లా మీద, నరసింహస్వామి మీద భరోస పెట్టు అంతా బాగైతది. ఉండు ఆరగింపు చేసి ప్రసాదం తెస్తా” అంటూ లేచి లోని కెళ్ళింది. దేవుడికి ఆరగింపు చేసి ఇస్తరాకులో పులిహోర ప్యాక్ చేసి. వడపప్పు శీతలం, కొబ్బరికాయ చిప్పలు, అరటిపళ్ళు వేరు వేరుగా కట్టి సంచిలో పెట్టి. పళ్ళెంలో హారతి, తీర్థ ప్రసాదలతో బయటికి వచ్చింది. “చాంద్ ఇదో తీర్థం తీసుకో” అంది. ఆమె లేచి బయటనించే దేవుడికి దండం పెట్టి, హారతి కళ్ళకద్దుకుని తీర్థం తీసుకుంది. అరటి పళ్ళు ఆమె ముందుంచి “ఇదిగో సంచిలో అన్నీ పెట్టాను. నీవు ఈ పళ్ళు తిను ఇదిగో మంచినీళ్ళు తాగు. ఇంటిదాకా వెళ్ళటానికి కాస్త ఊపిరి వొస్తుంది. ఇంటికెళ్ళి అందరు కలిసి ఈ ప్రసాదం తినండి.” అలాగే నమ్మా నరసిమ్హసామికి మామీద ఎప్పుడు దయ వస్తదో ఏమో. సామి నా బిడ్డా పెండ్లి మంచిగా అయ్యేట్టు చూడు సామీ.” అంటూ. పళ్ళు తిని నీళ్ళు తాగి సంచి తీసుకుని లేచింది. “వస్తానమ్మా పనికి పోవాలె… వస్తాను విజయమ్మ చల్లన్గుండు ” అంటూ మరో సారి దేముడికి దండం పెట్టి బయలు దేరింది. “మంచిది చాంద్ బీ అంతా బాగైతది దిగులు పడకు. ఆ.. అలాగే మరచి పోకు పీర్ల పండక్కి రా దట్టి తీస్క పోదుగాని” అంటూ సాగనంపింది. ఆడుతున్న ఆట ఆపి “మంచిది అంటీ”అన్నాను ఆమె వెళుతున్న వైపు చూస్తూ.

కోకతట్టి నుంచి వచ్చే ముస్లిం చాంద్ బీ, నరసింహ స్వామి కి భోగం చేయిస్తే … గుడి పూజారి భార్య అయిన మా అమ్మేమో ప్రతీ మొహర్రం పీర్ల పండక్కి దట్టి, చాదర్, వస్త్రాలు పంపుతుంది. ఆవిడ ఊదు ప్రసాదంగా తెచ్చి ఇస్తుంది. నాకు బుద్ది తెలిసినప్పటినుంచీ ఇలాగే సాగుతోంది. మొదట్లో అర్థం అవక అమ్మని అడిగి అడిగి విసిగించేదాన్ని. తరువాత అలవాటయి పోయింది.

సాంప్రదాయ కుటుంభం లోని అమ్మ పీర్ల పండగ మానలేదు

ముస్లిం అయిన చాంద్ బీ నరసింహ జయంతికి భోగం చేయించటంమూ మానలేదు.

తమ వాడకట్టు అగ్రహారం మాత్రమే తెలిసిన అమ్మ,

ఆమె మోహల్లానే తెలిసిన చాంద్ బీ వాళ్ళ ప్రపంచమే వాళ్ళది.

ఇద్దరికి ఎలాంటి చదువు సంధ్యలు లేవు, ప్రపంచ జ్ఞానమూ లేదు.

వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటిస్తూ, ఇతర దేవుళ్ళనీ, వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించి, నమ్మి పూజలు చేసేవీళ్ళకి హిందూ ముస్లిం మత కలహాలు అసలు తెలీదు. కొన్ని శతాబ్దాల క్రితం ముస్లింలు ఎక్కడనుంచి వచ్చారో తెలియదు. తెలిసిం దంతా ఒక్కటే అంతా పేదరిక బాధితులమని. వీళ్ళ సంస్కారం ముందు, ఎంతో చదువుకుని, సో

కాల్డ్ సంస్కారాన్ని పులుముకొని సంఘంలో తిరిగే మహానుభావులు తమ మతమే గొప్పదని రొమ్ము విరుచుకుని ప్రచారాలు చేస్తున్నారు. మరి వాళ్ళు చదివిన చదువు విజ్ఞత నేర్పలేదా! వాళ్ళు గుడ్డిగా పాటిస్తున్నదంతా రాజకీయ మత్రాంగమని తెలుసుకోలేక పోతున్నారా. దేశంలో తలెత్తుతున్న సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు స్వార్థ రాజకీయాల కోసం మత వైషమ్యాలను పెంచుతూ, మనుషుల మధ్య అడ్డుగొడల్ని నిలిపి, మనల్ని పావుల్లా వాడుకుంటున్నారని ఈ స్కాలర్స్ కి తెలియదా?

ఆ రోజుల్లోనే, అంటే 1960 ప్రాంతం లోనే మతసామరస్యానికి ప్రతీకలుగా ఉండే వాళ్ళు వీళ్ళిద్దరూ.

ఇప్పుడే ఇలాగుంది. రానున్న కాలంలో మన దేశం ఇంకెంత మారుతుందో కులాలు మతాలు లేకుండా అందరూ బాగుంట రెమో నని అనుకునే దాన్ని. కానీ మారుతున్న కాలంతో మనుషులు వింత పోకడలు తప్ప విచక్షణ కనబడటం లేదు. తమ తమ మతాలే గొప్ప వని అనడం కంటే ఇతర మతాల వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ప్రచారాలు చేస్తున్న వారిని చూస్తే మన సంస్కృతి ఏమై పోతుందో అనిపిస్తుంది.

July 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఇద్దరమ్మాయిలు- ఒక పడవ

by Shanti July 19, 2023
written by Shanti

ఆ ఇద్దరమ్మాయిలు పడవలో అలా వెళ్ళిపోతున్నారు. పూడుకుపోయిన గొంతులో పగిలిన పాట లాగ, చేజారిన గుండెలో చిక్కుకున్న మాటలాగ.. ఉలుకు లేదు..పలుకు లేదు.

చుట్టూతా నీళ్లు, సగం పైగా పడవలో పూలు, పూల చివరన పొడుచుకొచ్చిన ముళ్ళలాగా వీళ్ళు.. నీటి మీద నిటారుగా పరుచుకున్న వారి మిసిమి మిలమిల ల మధ్య చొరబడ్డ నిశ్శబ్దాలు ప్రతిఫలిస్తుంటే.. తేలి ములిగిపోతున్న చేపల్ని తేటగా తేరిపార చూస్తూ తెడ్లు వేస్తున్నారు.

అప్పుడప్పుడూ తోటలో తొంగిచూసిన కలుపు మొక్క లాగ,శూన్యాకాశపు చిరిగిన పొట్లం నుంచీ ఒక మేఘం నీడ ముసిరినప్పుడు మాత్రం తొలి రజస్వల తొందరపాటు లాంటి మానవమానాలు తోడిన తొక్కిసలాంటి, రగడి రాపాడిన రక్తపు చార లాంటి, బహుశా ఒక భయద భూకంపం లాంటి భూస్థాపితమైన జ్ఞాపకం బాధించినట్టుంది. క్షణం సేపే… కొంచెం మ్లానమైన ముఖాలతో కసురుకున్నట్టు, కలవరబడ్డట్టు కాస్త కటువుగా కనుబొమ్మలను కదిపారు.

వాళ్లు యుద్ధంలో శాంతి సందేశాలు పంపుతూ పట్టుబడిపోయిన పావురాల లాగా ఉన్నారు. అలాగని బంధనాలు వేసిలేవు.. వాళ్ళ సాచిన రెక్కలను ఎవరో సావకాశంగా కత్తిరించిన సార్ధకతతో సంతోష సరాగాలు ముద్దాడిన మౌనరాగాలలో ముద్దలు ముద్దలుగా మొలకలెత్తే ఒక మట్టి వాసన, ముకుళించుకుని మురిసిపోతోంది.

అయినా వాళ్ళు తేలు కుట్టిన దొంగల్లా లేరు. తేరు మీద తీక్షణంగా వెలుగుతూ తేలిపోయే దీపాల్లాగ, లేత గులాబీ జెండాల్లాగా రెపరెపలాడుతున్నారు. జోడి గా కోరికోరి ఎవరో జగజ్జేతే వస్తాడని గవ్వలని గట్టుమీద గబగబావేసి ఎవరో జోస్యం గబుక్కున చెప్పినట్లున్నారు. అది వాళ్ళు ఎంత మాత్రమూ నమ్మ లేదు.అయినా ఎవరితో జెట్టీలు పెట్టుకోకుండా, జతకూడడానికే జాగ్రత్తగా జాజిపూలు గుట్టగా పోసుకుని గుడి పండుగలో మాలలుగా గుది గుచ్చడానికి, నిస్త్రాణగా తెల్లబోయిన నింగిని నీటిలో తొలగతోస్తూ, గాటంపు గాయాల గాఢత దాస్తూ, అంత గాడ్పు లోనూ గడుసుతనంతో గమిస్తున్నారు.

వాళ్ల గురించిన స్పష్టత వాళ్లకు సాంతం ఉందన్పిస్తోంది. అంతలోనే… వాళ్ళ ఉదంతం ఒక అంతం లేని కథన్పిస్తోంది. వాళ్లు శాంతంగా ఉన్నారు… స్త్రీత్వపు గరిమ గురించి చాలాసార్లు సుదీర్ఘంగా విన్నారు. పడవ చుట్టూ తిరుగుతున్న చేప పిల్లల్ని నీటి పలక మీద తెల్లటి అక్షరాల్లా చూశారు. కన్యలైనా, కుంతి అనే ఇంతి గురించి అంతో ఇంతో తెలుసుకున్న వాళ్ళు కదా… పసిబిడ్డల ఆలోచనతో వాళ్ళ పరువం కొంచెం పలకరించింది. ఫలదీకరణ ప్రక్రియ పరాకుగా గుర్తుకొచ్చి కాబోలు.. సిగ్గు చెందిన ఆలోచనలతో శిరస్సు వంచుకున్నారు. వాళ్ళ హృదయాలు వద్దన్నా ఉప్పొంగాయి. ఇంకా వాళ్ళు చెట్టు, పుట్ట, చేపబుట్ట లలో పుట్టిన విచిత్ర శిశువుల భాగోతాలు, అనంతరాయుడు, అగంతక వాయువు స్త్రీలను ఆనందంగా ఆశీర్వదించి ఉచితంగా పునిస్త్రీలు గా చేసిన పురాణ కథలు బోలెడు పూర్తిగా పుక్కిట పట్టి ఉన్నారు. అందుకే ఎడతెరిపి లేకుండా తెడ్లు వేస్తూ, అలసటతో వచ్చిన చెమట చుక్కల్ని చూపుడు వేలుతో గబుక్కున తాకి కాస్త కలవరపడ్డారు. చేపలు, కప్పలు చెమట చుక్కల్ని మింగి గర్భవతులవడం గుర్తుకొచ్చి కాస్త గాబరా పడ్డారు.

వాళ్లకు స్త్రీత్వపు ఔన్నత్యం గురించి కూడా బాగా తెలుసు. ఓ నారీ! సుకుమారి! కుసుమ కుమారి..!! అనే అనవసరపు పొగడ్తలు, ‘సురారులమ్మ..కడుపారగబుచ్చిన యుద్ధభేరీ’ లాంటి అమోఘమైన స్తోత్రాలు సైతం శృతం చేసి ఉన్నారు. వాళ్ళ జీవిత పథాన్ని నిర్దేశించే మదాలస, యశోద ల లాంటి ఆదర్శమాతల అద్భుతమైన గాథల్ని ఔపాసన పట్టేశారు. అడవి వాసన తగలని అతివ ఊర్మిళ నిదుర వద్దని ఆ రొద ని ఉదయాన్నే ఎర్రబడ్డ కళ్ళతో ఏటివాలుగా ఎటో ఎగరగొట్టేశారు. సావిత్రి సుధను మధువు లా ఆ మధ్యాహ్నమే పుచ్చుకున్నారు. సత్యవతి కథనం సంపూర్ణంగా సాయంత్రం సుగంధం పూసుకు విన్నారు. ఐదుగురి అలవి కాని అనురాగం పొందిన ఆ పాంచాలి వ్యథను అసహ్యం కలగని అనురక్తితో ఆ రాత్రి పూట అప్పటికప్పుడు పడవకు అటూ ఇటూ, లోపటా- బైటా తమ చుట్టూతా పట్టు పావడాల్లా కట్టారు.

వాళ్ళిద్దరి పడవ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తడవ తడవకూ తప్పటడుగులు వేయని పడవ అది. తన పనిలో తాను నిమగ్నమైన భగ్న నౌక. అది చైత్రమాసంలో రెండు కొండల నడుమ లోయలో చిక్కుకున్న చిన్న మబ్బు ముక్కలాగుంది. కానీ అది యజ్ఞవాటిక లోంచో, నాగలి చాలు లోంచో ఒక్క పెట్టున ఆవిర్భవించిన ఆశ్చర్యం కాదు. ఏళ్ళు పూళ్ళు అడవిలో అజ్ఞాతంగా మొలచి ఋతుమతి ఐన దగ్గర నుంచీ అలవి కాని ఆరు ఋతువులకు ఆలవాలమై, చేవదీరిన చెట్టు కొమ్మలతో చేసిందది. అడ్డుగా అక్కడక్కడా అమావాస్య గీతలు, పైపూతగా పున్నమి చారలు గీసుకుంది. పలు ప్రమాదాలు దాటి వచ్చిందది. అందుకే చేవదీరినా ఇంకా పచ్చి ఆకులు కాలిన వాసన చెక్కల్లో ఇంకిపోయే ఉంది. అదొక సాదాసీదా పడవ. ఏ వాదప్రతివాదాలు చేయకుండా ఆ ఇద్దరమ్మాయిలను మోసుకుంటూ, తోసుకుంటూ వెళ్తోంది. జలస్పర్శతోనే తన జావళీలను జప్తు చేసుకుంది. నీళ్లు తాకినా నిర్మోహంగానే ఉంది. ‘జాగ్రత్త’ మాత్రమే దాని ఇప్పటి ఆచారం. ఏ తీరపు తొందర లేనిది దాని సంచారం. తేనె పిట్ట ల్లాంటి తరుణులను తీసుకువెళ్తున్నా వాళ్ల మనసులోని మసక చేదు చూడగలగడం దాని గ్రహచారం. నాచు పట్టిన క్రింది భాగంలో నానాజాతి సమితుల ఛాయలు ప్రతిఫలిస్తున్నా దానికంటూ ప్రత్యేకంగా ఏ చిహ్నమూ లేకపోవడం దాని అసంశయాత్మక సమాచారం.

వాళ్ళిద్దరి గురించి ఎంతో వివరించాలి… అసలు వాళ్లు ఎక్కడివాళ్లు.. ఈ పడవలో కెలా వచ్చారు… కానీ ఎందుకో మనస్కరించట్లేదు. విచారము, వినోదమూ కాకుండా ఏ వ్యగ్రతా లేకుండా, నిర్వికారంగా ఉన్నారనిపిస్తున్నారు. అయితే వాళ్లు నిజాయితీగా ఉన్నారని మాత్రం నిస్సంకోచంగా, నిష్కర్షగా చెప్పొచ్చు. అది నిజానికి తేలికగా చెప్పడం చాలా సులువైన పని…అలా ఉండటం అనితరసాధ్యం.

విభా-ప్రభాతాలలో ఏ విభ్రమము, విస్మయము లేకుండా ఉన్న వాళ్ళిద్దరూ ఒకరు తెలుపు ఒకరు నలుపు కాదు. రౌద్రమైన రక్త వర్ణంలో కాస్త తెల్లటి శాంతి పూల రంగు చిలకరించి చుట్లు చుట్టిన గులాబీ రంగు తీగలా ఉంది వాళ్ళ దేహం. తెల్లమద్ది వృక్షాల పూచిన తోపులా ఉంది వాళ్ళ మొహం. నది నడుమన పెదాల మధ్య నాలుక నొక్కి పట్టి వాళ్ళ హృదయాలు అమలినాలని గుర్రపు డెక్క ఆకులు గోల పెడ్తున్నా, పడవ అడుగుకు తోసేసిన పసితనపు నిసి రాత్రి నిజాలు నిటారుగా ఉండుండి నీటిపాముల్లా లేచి నిలదీస్తున్నట్లు ఈల వేస్తున్నా, కాలం కొయ్యకు ఉరితీసిన ఉదయపు ఉత్పాతాల హేల ఉద్రేక పరుస్తున్నా, రాత్రి రంగేళీల రంగవల్లి రక్తి కట్టిస్తానంటున్నా… అవేవీ పట్టించుకోకుండా అమ్మాయిలిద్దరూ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అసహనంతో దేన్నో అందుకోవాలనుకుంటున్నట్టున్నారు. సర్దుకుపోవడం, సహన గీతం సదా పాడడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాగనే సూర్యుణ్ణి, చంద్రుడ్ని రెండు సున్నాల లాగా, సరి సమానంగా శిశు స్థాయిలోనే దిద్దుకున్నారు.. గుండెలకు గట్టిగా అదుముకున్నారు.

వాళ్ళు ఏ తీరం గురించీ ఇంకా ఆనుపానులు, ఆరాలు తీయట్లేదు. తేరగా దొరికే తీరం కూడా వాళ్ళ గమ్యం కాదనుకుంటా. కనుకునే తొలి జామైనా మలి జామైనా ఏదీ తూచకుండా ,తూగకుండా అనుభూతిస్తూ తాపీగా తెడ్లు వేస్తున్నారు. గుడి దగ్గర జరిగే ఉత్సవంలో గరగల్ని కచ్చితంగా మోయాలని మాత్రం వాళ్లకు తెలుసు. నీటి నురగ లని అందుకే గభాలున తోసేస్తున్నారు. స్థిమితంగా కూర్చోలేకపోవడం, శీఘ్రగతిన చెదరడం , చీమ చిట్టుక్కు మన్నా బెదిరిపోవడం… అంతలోనే మళ్లీ సర్దుకు కూర్చోవడం.అంతే. ఇంకే చిలిపి ఆలోచన వాళ్లకు లేదు.

ఆ ఇద్దరమ్మాయిలు ఆ పడవలో అలా అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎందుకో మాత్రం ఒకే ఒక్కసారి ఇద్దరూ కలిసి నవ్వారు. కాటుక కొండల కారడవిలో కబళించాలని చూసే కార్చిచ్చును అదాట్టున కురిసిన ఒక స్వప్న జలపాతం అనాయాసంగా చల్లార్చిందని…ఆ నీరు ఆ ఇద్దరి కన్నీరే నని… గట్టుమీద చెట్టులా పాతుకుపోయిన ఎవరో పురుష పుంగవడు కొంచెం గొంతు తగ్గించి అసహనంగానో, అర్థవంతంగానో అన్నట్టున్నాడు. సుదూరంగా ఉన్నందువల్ల కాబోలు లేదా ఆత్రంగా నేత్రాలలో శుభ్రజ్యోత్స్నలు నింపుకొని వెలిగిపోతున్నందు వల్లనో ఎందుకో ఆ ఇద్దరి కీ ఆ సూత్రం వినబడలేదు, కనబడలేదు.

సర్వస్వతంత్రురాలు కాని, హద్దులు, పొద్దులూ ఎరుగని పడవ మాత్రం ఒక్కసారి హృదయం సర్దుకుని..అటూ ఇటూ ఒరిగి నిట్టూర్చింది. పాము పడగల్లా తలెత్తిన రెండు బుడగలు తెడ్లు వేసిన తాకిడికి తలక్రిందులయ్యాయి.

July 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

చిలుక కథలు (కథాగుచ్ఛము)

by Arutla Sridevi July 18, 2023
written by Arutla Sridevi

3. చిలుకమ్మ అందం

ఒక అడవిలో మేడిచెట్టు కొమ్మపై క చిలుక గోరింక కాపురమున్నాయి. అనుకోకుండా చిలుక అనారోగ్యానికి గురైంది. చిలుక మేతకు వెళ్ళలేకపోయింది. గోరింకనే బయటకు వెళ్లి చిలుకకు తగినంత మేత తెచ్చేది. ఇంకా గోరింక చిలుకకు ఎన్నో సపర్యలు చేసింది. కొన్ని రోజులకు చిలుక కోలుకుంది.

ఒకరోజు చిలుక గోరింక తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నాయి.  మాటల మధ్యలో గోరింక చిలుకమ్మ నేను నీకు ఎంతో సేవ చేశాను కదా నాకొక బహుమతి ఇవ్వరాదూ అంది. అదేమిటో అడుగు అంది చిలుక. ఏం లేదు నువ్వు పచ్చని రంగులో చాలా అందంగా ఉంటావు కదా. ఒక ఈక ఇవ్వవా అంది గోరింక. అమ్మో ఒక ఈక ఇస్తే నా అందం చెడిపోతుంది.  నేనివ్వను అని చిలుకమ్మ కోపంతో గోరింక మీదకు గయ్యుమని లేచింది. అంతేకాకుండా ఈక అడిగినందుకు నేను నీ దగ్గరుండనని గూటిని విడిచి చిలుక ఎటో ఎగిరిపోయింది. గోరింక ఎంత బ్రతిమాలినా చిలుక వినిపించుకోలేదు.

అట్లా వెళ్తూ వెళ్తూ ఉన్న చిలుకకు ఒక జోష్యం చెప్పుకనేవాడు కనిపించాడు. చిలుక అతని దగ్గరకు వెళ్లి నేను నీకేమైనా ఉపయోగపడాతానేమో నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అనడగింది. అందుకు ఆ జ్యోతిష్కుడు కొంచెం ఆలోచించి సరే నిన్ను నా దగ్గర ఉండనిస్తాను కాని అందుకు పర్యవసానంగా నీ అందమైన ఈక ఒకటి ఇవ్వాలి అన్నాడు. ఆ మాటతో చిర్రెత్తుకొచ్చిన చిలుక కోపంతో అక్కడ నుండి వెళ్లిపోయింది.

అట్లా వెళ్తూ వెళ్తూ ఉన్న చిలుక బాగా అలసిపోయి ఒక చెట్టు కొమ్మపై వాలింది. అదే చెట్టు కొమ్మపై ఒక కోతి కాపురముంటున్నది. ఏం చిలుక గారు ఎటు నుండి ఎటు ప్రయాణిస్తున్నారు? అనడిగింది. చిలుక జరిగిన సంగతంతా చెప్పి ఈక ఇమ్మన్నందుకు తాను అలిగి వచ్చేశానని చెప్పింది. విషయమంతా విన్న కోతి చిలుకను ఓదార్చింది. సరే నువ్వు ఇక నుండి నా దగ్గరే ఉందువుగాని నేను నిన్నేమీ అడగనులే అంది కోతి. ఆ రోజు నుండి చిలుక కోతి హాయిగా కలిసి ఉంటున్నాయి.

ఒకసారి చిలుక ఒక స్వచ్ఛమైన , నిర్మలమైన చెఱువుగట్టుపై ఉన్న వేప చెట్టుకొమ్మపై వాలింది.  అదే చెటు కొమ్మపై ఒక కోతి కాపురముంటున్నది. ఏం చిలుకగారు ఎటు నుండి ఎటు ప్రయాణిస్తున్నారు? అనడగింది. చిలుక జరిగిన సంగతంతా చెప్పి ఈక ఇమ్మన్నందుకు తాను అలిగి వచ్చేశానని చెప్పింది. విషయమంతా విన్న కోతి చిలుకను ఓదార్చింది, సరే నువ్వు ఇక నుండి నా దగ్గరే ఉందువుగాని నేను నిన్నేమీ అడగనులే అంది కోతి. ఆ రోజు నుండి చిలుక కోతి హాయిగా కలిసి ఉంటున్నాయి.

ఒకసారి చిలుక ఒక స్వచ్ఛమైన, నిర్మలమైన చెఱువు గట్టుపై ఉన్న వేప చెట్టుకొమ్మపై వాలింది. చిలుక నీళ్లవైపు చూసి ఆహా నీళ్లు ఎంత నిర్మలంగా ఉన్నాయి అనుకుంటున్నత లోపే ఆ నీళ్లలో వికృతంగా, అసహ్యంగా ఉన్న పక్షి ఒకటి చిలుకకు కనిపించింది. చిలుక ఆశ్చర్యంగానూ, భయంగానూ ఆ పక్షిని తదేకంగా చూడసాగింది. చిలుక రెక్కలు టపటప లాడించింది. ఆ నీళ్లలోని వికృత పక్షి కూడా రెక్కలు టపటప లాడించింది. చిలుక ముక్కును ఇటూ అటూ అంది. ఆ వికృత పక్షి కూడా అట్లాగే ముక్కును ఇటూ అటూ అంది. ఆ వికృత పక్షి చిలుక ఎట్లా చేస్తే అట్లాగే చేస్తుంది.  ఏమీఅర్థంకాని చిలుక కొంచెంసేపు ఆలోచించింది. ఓ! ఇది వేరే పక్షి కాదు తన ప్రతిరూపమే అని అనుకున్న చిలుక నా అందమైన రూపం ఇంకా వికృతఁగా ఎట్లయింది అని బాధపడుతూనే కోతి దగ్గరకు వెళ్లింది. ఆ సమయానికి ఆ చెట్టుపై కోతి లేదు. అక్కడే కోకిలమ్మ, ఒకటి ఉంది. చిలుక ఎంతో మర్యాదతో కోకిలగారు కోతిగారు ఎక్కిడికి వెళ్ళారు? అనడిగింది. ఏమో అలా బయటకు వెళ్లినట్టున్నారు అంది కోకిల.  చిలుక ఏడుస్తూ కొమ్మపై కూచుంది. ఏమైంది, చిలుకగారు విచారంగా ఉన్నారు అంది కోకిల, చిలుకు ఆప్యాయంగా పలుకరిస్తూ. ఏం లేదు, కోకిలగారూ నా అందమైన ఈకలన్నీ ఎలా ఊడిపోయినాయి, నను ఇంత వికృతంగా ఎట్లయినాను అంది చిలుక ఏడుస్తూ. ఓ అదా! చిలుకగారు, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు రోజూ నిద్రబోయే సమయానికి మీకేమాత్రం నొప్పి కలుగకుండా రోజుకో ఈక పీక్కుంది కోతి. ఆ ఈకలన్నీ జమజేసి అదిగో పిల్లలు అడుకుంటున్నారో వాళ్ళకమ్మడానికి వెళ్లింది, అని చెప్పింది కోకిల. కోతి చేసిన మోసానికి చిలుకకు కోపం ముంచుకొచ్చింది. కానీ ఏం చేయగలదు. కోతి తనకన్నా బలవంతుడాయే, ఏమీ చేయలేని చిలుక ఎగురుతూ ఎటో వెళ్లిపోయింది.

ఎగురుతూ ఎగురుతూ అలా వెళ్లిన ఒక జంతు ప్రదర్శన శాలకు వెళ్లి అక్కడే ఉన్న యజమాని దగ్గరకు వెళ్లింది. అయ్యా మీ జంతు ప్రదర్శన శాలలో నాకు స్థానమిస్తారా? అనడిగింది. ఏం మొహం పెట్టుకుని అడుగుతున్నావే చిలుకా! నీకు ఈకలే లేవు అందమే లేదు. నిన్ను చూస్తే ఇతర చిలుకలు పొడచి చంపినా చంపుతాయి, వెళ్లు, ఇక్కడి నుంచి అని తరిమికొట్టాడు ఆ జూ యజమాని.  చిలుకకు కళ్లలో నీళ్లు తిరిగాయి. చిలుకకు తన మొదటి నేస్తమయిన గోరువంక గుర్తొచ్చింది. నన్ను గోరువంక ఎంతగా ఆదరించింది, ఎంత సేవలు చేసింది అయినా నేను మూర్ఖంగా ఒక్క ఈక ఇవ్వలేకపోయాను. ఇప్పడు చూడు ఈకల్నీ పోగొట్టుకుని నా గతేమయ్యిందో అని వెక్కి వెక్కి ఏడ్చింది. చిలుక పశ్చత్తాపముతో తిరిగి గోరింక వద్దకు వెళ్లింది. అక్కడ గోరింక మరో అందమైన చిలుకతో స్నేహం చేసింది. ఆ రెండు చిలకా గోరింకలు ఎంతో హాయిగా ఉన్నాయి. చిలుకమ్మ గోరింకతో నేను ఇక నుండి నీ దగ్గర ఉండవచ్చా అనడిగింది. క్షమించు చిలుకమ్మా గూటిలో మా ఇద్దరికే చోటుంది, నువ్వేటైనా వెళ్లు అంది గోరింక. చేసేదేమి లేని చిలుక శివుని ధ్యానించుటకై హిమాలయాలకు ఎగిరిపోయింది.

July 18, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
కథలు

‘తిమిరపు వెలుగు’

by Sunka Dharani July 18, 2023
written by Sunka Dharani

‘నేను త్వరగా వచ్చేస్తా అమ్మ! ఒట్టు..’
‘ఇలాగే చెప్పి మొన్న ఆ ప్రీతి వాళ్లింటి కాడికి పోయావ్. నేను మళ్లీ నీ కోసం బెత్తం పట్టుకుని వచ్చేలా చేశావ్. గుర్తులేదా’
‘మొన్నంటే అరిసెలకు ఆశ పడి అక్కడే ఇచ్చేవరకు ఉండాల్సి వచ్చింది. అందుకే లేటైంది లేవే, అయినా ఎందుకు నేనేదో చిన్నపిల్ల అన్నట్లు కర్ర పట్టుకొని….’ అని చెప్తుండగానే
‘చూడు జహీ! బయట పరిస్థితులు అస్సలు బాలేవు. మీ నాన్న వచ్చే వేళకి నువ్వు ఇంట్లో లేవనుకో ఈ సారి బెత్తం కాదు, కొరడా పట్టుకొస్తా’ కొంచెం గట్టిగానే అనింది అమ్మ.
‘నీకా ఛాన్స్ ఇవ్వను లే!’ అంటూ నాలో నేనే నవ్వుకుని మన్విత వాళ్లింటికి బయల్దేరా. ఈ రోజు తనకి పెళ్లిచూపులు.

నా కోసం ఎదురుచూస్తుంటుందేమో అనుకుంటు ఉండేసరికి ఆటో మన్విత వాళ్ల ఇల్లు దాటేసింది. ఆటో అతన్ని ‘హ్హ.. ఇక్కడే ఆపండి.’ అని డబ్బులిచ్చేసి మన్వి వాళ్లింటికి అడుగులేసా. ఎందుకో ఈ రోజు మన్వి వాళ్ల వీధంతా హడావుడిగా ఉంది. ఆటో చప్పుడు వినిపించి మన్వి బయటకొచ్చింది.
‘ఎప్పుడు రమ్మంటే ఎప్పుడొస్తున్నావమ్మా!?’
‘అబ్బా అమ్మ గురించి తెలిసిందేగా. త్వరగా వస్తానని నాతో చెప్పించుకోవాలని ఇంత లేట్ చేసింది.’
‘సర్లే పదా!’ అంటూ మన్వి తన రూంకి తీసుకెళ్లింది.
ఇంతలో మన్వి వాళ్ల అమ్మ వచ్చి ‘పెళ్లికొడుకు వాళ్లు ఇంకో అరగంటలో వచ్చేస్తారట ఏవైనా ఉంటే తొందరగా తయారై రండి’ అని చెప్పి వెళ్లింది. నెమ్మదిగా మన్వి మొహం వాడిపోతూ, కళ్లలో నీటి ఛాయలు అలుముకున్నాయి.

నిజానికి మన్వి నేను ఒకే స్కూల్. మాది చాలా బలమైన ఫ్రెండ్ షిప్. తనకి ఈ పెళ్లంటే ఇష్టం లేదు. ఎందుకంటే తనకింకా పదహారెళ్లే. వీళ్ల కుటుంబం బలవంతం మీదుగా ఈ పెళ్లి జరగబోతుంది.
‘నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మళ్లీ చెప్పొచ్చుగా మన్వి’
‘చెప్పి చూసా! చిన్నపిల్లవి నీకేం తెలీదు. మేం చెప్పినట్లు విను అన్నారు’
‘నీకు పెళ్ళైపోతే నాకు దూరంగా వెళ్లిపోతావు కదా!’
‘ఔను జహీరా! నాకు మీ అందర్నీ వదిలి వెళ్లాలని లేదు’ అంటూ ఇద్దరం ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటున్నాం.

పెళ్లికొడుకు వాళ్లు వచ్చారని మన్వి వాళ్ల చుట్టాలు,ఇంట్లో వాళ్లు ఇంటి గేట్ వరకు వెళ్ళారు. నేనేమో మన్వి రూం నుండి బయటకు వచ్చి కిటికీలోంచి అబ్బాయి వాళ్లని చూస్తున్నా. ఇంతలో టెలిఫోన్ మోగుతుంది. పట్టించుకోకుండా కిటికీ మీదే ధ్యాస పెట్టా. మళ్లీ ఇంకో సారి మోగింది. ఈసారి మన్వి రూం నుండి బయటకొచ్చి టెలిఫోన్ ఎత్తి మాట్లాడింది.
‘హాలో! ఎవరు?’
‘హా.. మన్వి నేను జహీరా వాళ్ల అమ్మని’
‘ఆంటీ చెప్పండి’
‘జహీరా లేదా?’
‘ఉంది ఇస్తున్నా ఆంటీ’ జహీ మీ అమ్మ ఫోన్ చేసింది.
అని చెప్పగానే అమ్మెందుకు ఫోన్ చేసింది అనుకుంటూ, ఫోన్ తీసుకున్నా

‘హలో జహీ..’
‘నేనే అమ్మ ఏవైంది ఫోన్ చేశావ్’
‘జహీ నువ్వక్కడి నుండి వెంటనే దగ్గర్లో ఉన్న మావయ్య వాళ్లింటికి వెళ్లు. చాలా ప్రమాదంలో ఉన్నాం మనం’ అనగానే నా వెన్ను అదిరింది
‘ఏవైంది అమ్మ ఎందుకిలా మాట్లాడుతున్నావు’
‘అవన్నీ ఇప్పుడు చెప్పలేను. నేను నాన్న దర్బార్ మందిరంలో ఉన్నాం’
‘నువ్వు అక్కడ్నుండి ఖాదీర్ మావయ్య వాళ్లింటికి వెళ్లు. మావయ్య నిన్ను మా దగ్గరకి తీసుకొస్తాడు.
జహీ.. నిన్నెవరైనా నువ్ సిక్కు పిల్లవా అని అడిగితే కాదు అని చెప్పు’ అంటూ అమ్మ ఏడుస్తూ చెప్తుండగానే ఫోన్ సిగ్నల్ పోయింది.

ఇంతలో బయటున్న పెళ్లి కొడుకు వాళ్లు లోపలికి వచ్చారు. అమ్మ నాకు దేని గురించి చెప్పలేదు అసలేమైంది అనుకుని మన్వి నేను రూంలోకి వెళ్లి గడియ పెట్టాం. మన్వికి అమ్మ చెప్పిందంతా చెప్పా.
‘కానీ అసలేం జరుగుతుందో అర్థం కాట్లేదు మన్వి’ ఎండిపోయిన గొంతుతో నిస్సహాయంగా చెప్పా.
మన్వి ఆలోచిస్తూ ‘మీ అమ్మ చివర్లో నిన్ను సిక్కు అమ్మాయివని ఎందుకు చెప్పకంది?’
‘నన్ను ఇంకా భయపెట్టకు మన్వి’
ఇంతలో గడియ తీయమని మన్వి వాళ్ల నాన్న పిలుపు, నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి.
సంశయిస్తూనే మన్వి తలుపు తీసింది.

వాళ్ల నాన్న నేరుగా నా దగ్గరకొచ్చి
‘జహీరా బయట దారుణంగా అల్లర్లు జరుగుతున్నాయి. నువ్వెందుకమ్మా ఇక్కడికొచ్చావు’
ఇంతలో మన్వి ‘నేనే రమ్మని బలవంత పెట్టా నాన్న’ అంది చిన్న గొంతుతో
అందరూ ఆలోచనలో పడ్డారు
ప్రతి ఒక్కరి మొహంలో కంగారు, భయం.
అప్పుడు అర్థమైంది నేను వీళ్లకేదో అపాయం తలపెట్టా అని.
‘నాన్న ఇందాక జహీ వాళ్ల అమ్మ కూడా ఫోన్ చేసింది’ అంటూ మా అమ్మ చెప్పిన మాటలు మన్వి వాళ్ల నాన్నకి చెప్పింది.

ఆయన ఆలోచించి అమ్మ చెప్పినట్లుగానే నన్ను ఖాదీర్ మామయ్య వాళ్లింట్లో దింపేస్తా అన్నాడు. అప్పుడు మన్వి వాళ్ల నానమ్మ కలుగజేసుకుని
‘నీకెందుకు వచ్చిన సంతరా! ఈ పిల్ల వెళ్లగలదులే’ అంది విసుగ్గానే
‘నీకేం తేలీదమ్మా నువ్వూరుకో, జహీరా మన్వి హే కాదు వాళ్ల నాన్న నేను కూడా చిన్నప్పటి స్నేహితులం. ఇలాంటి ఆపద సమయంలో వీళ్లని చేరదీసుకోవాల్సిన బాధ్యత మనకుండదా’
‘బాధ్యత సరే లేరా! ఈ పిల్ల మన్వి కోసం మనింటికి వస్తుందని అందరికీ తెలుసు, ఇప్పుడు ఈమె ఇక్కడుందని తెలిస్తే మన ఇంటి మీదకి వచ్చేయరు’
‘నువ్వు కాసేపు ఆగమ్మా!’ అని మన్వి వాళ్ల అమ్మకి, వాళ్ల నాన్న సైగ చేస్తాడు.
దానికి వాళ్లమ్మ తలూపి..

నన్ను మన్విని వేరే గదిలోకి తీసుకెళ్లి మన్వి బట్టలు ఇచ్చి మార్చుకోమంది. నన్ను మన్వి లానే తయారుచేస్తోంది. ఇదంతా చూస్తున్న మన్వి వాళ్లమ్మని అడిగింది
‘ఎందుకమ్మా జహీకి ఇప్పుడేం ప్రమాదముంది’
‘జహీకి కాదు! మన ఊర్లోని సిక్కు వాళ్లందరికీ ప్రమాదం.’
‘సిక్కువాళ్లేంటీ ఎందుకలా’ అంటూ జహీ మన్వి వాళ్ల అమ్మ మొహం చూసింది దీనంగా..
వాళ్ల అమ్మ కళ్లలో నీళ్లు తుడుచుకుని
‘మొన్న రేడియోలో చెప్పారుగా తల్లీ నువ్వు విన్లేదా ఇవన్నీ పెద్ద కుళ్లు కుతంత్రాల యవ్వరాలు నీకెలా చెప్పేది’
‘హ్హ.. మొన్న మన ప్రధానమంత్రి చనిపోయారని దీని గురించి గొడవలు జరుగుతున్నాయని అమ్మ చెప్పింది’
ఇంతలో మన్వి వాళ్ల నాన్న పిలుపు.

‘పెరడు వెనకాల నుండి వెళ్లండి ఎవరికంటా పడరు’ అంది మన్వి వాళ్ల అమ్మ.
నాలో చెప్పలేని భయం ఉబికోస్తుంది. వెంటనే మన్వి నన్ను గట్టిగా కౌగలించుకొని జాగ్రత్త జహీ అంటూ ఏడుస్తుండగానే మన్వి వాళ్ల నాన్న నా చేయి పట్టుకుని నా తలపై వోని కప్పి బయటకు తీసుకెళ్లారు కంగారు పడుతూనే. మామయ్య వాళ్ల ఇళ్లు కాస్త దూరంలోనే ఉంది.
మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఢిల్లీ అంత ఎరుపు పులుముకున్నట్టు ఎక్కడ చూడు రక్తం, మంటలు..
‘అసలేవైంది అంకుల్.. సిక్కుల్ని మాత్రమే ఎందుకు చంపుతున్నారు, ఎవరు చంపుతున్నారు నాకు చాలా భయంగా ఉంది’
‘ఎవరో చేసిన పనికి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి కల్లోలాలు సృష్టించి ఏ పాపం తెలీని అమాయక జనాల్ని కూడా పొట్టన పెట్టుకుంటున్నారు తల్లీ’ అంటూ కన్నీళ్లు తెచ్చుకున్నారు.

మేం నడిచే వీధుల్లో ఉన్న సిక్కు ఇళ్లన్నీ అగ్నితో దగ్ధమవుతున్నాయి. కొన్ని శరీరాలు రోడ్ల గుండా పడున్నాయి. ఆ దృశ్యాలు చూస్తున్నంతసేపు నరకంలో నడుస్తున్న ఆలోచన. ఆ వాసన ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. తీరా రోడ్ నం. 23 కి రాగానే  అటువైపుగా ఆయుధాలు పట్టుకుని వెళ్తున్న ఓ ముఠా
మన్వి వాళ్ల నాన్నను చూసి..
‘మధుశాస్త్రి అటువైపు ఎక్కడికి ఈ టైంలో.. అక్కడ మంటలు అంటించాం’
మన్వి వాళ్ల నాన్నకి, నాకు గుండె ఆగినంత పనైంది.
వాళ్ల మాటలకు తడబడుతూనే
‘మ..మన్వితకి ఆరోగ్యం పాడైంది. ఇటువైపుగా హస్పిటల్ కి వెళ్దామని’ అంటూ వాళ్ల దృష్టి పడకముందే అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయాం.
ఖదీర్ మామయ్య వాళ్ల ఇళ్లంతా తగలబడిపోయింది. మేం మామయ్య కోసం చుట్టుతా వెతికాం. అలా రోడ్ నం. 24 వరకు వెళ్లగానే మమ్మల్ని గమనించి ఖదీర్ మామయ్య మమ్మల్ని ఓ పరదాలోకి లాగారు. నన్ను దగ్గరకు తీసుకొని ఏడుస్తూ ‘జహీరాను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు మీకేలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీట్లేదు’ అంటూ మన్వి వాళ్ల నాన్నకి రెండు చేతులతో దండం పెట్టాడు.
‘మీరు ఇంకా ఇక్కడుండడం మంచిది కాదు. త్వరగా మందిరానికి వెళ్ళండి’ అని మధుశాస్త్రి గారు చెప్పి మమ్మల్ని జాగ్రత్తగా పంపారు.
మామయ్యతో కలిసి ఎలాగోలా దర్బార్ మందిరానికి చేరుకున్నాం. కానీ అక్కడి పరిస్థితి చూసి నా మనసు, మెదడు మొద్దుబారిపోయింది.
మందిరమంతా కూడా నిప్పుల వరదలు. అందులో అమ్మనాన్న కూడా ఉన్నారు. గట్టిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేదు. మామయ్య కూడా అక్కడే కుప్పకూలాడు మమ్మల్ని ఓదార్చే వారే లేని పరిస్థితి. ఏడ్చి ఏడ్చి శరీరం అదుపు తప్పింది. అలా ఆ రోజు అక్కడే ప్రాణాలతో ఉండగలిగాం. ఆ రోజు ఖదీర్ మామయ్య తన పగ్రి తీసేసి పొడవైన జుత్తును కత్తిరించాడు, తన కుడి చేయి కడియాన్ని కూడా తీసేసాడు. మరుసటిరోజు ఢిల్లీ నుండి ఎక్కడికైనా పారిపోవాలని ఓ రైలెక్కాం. అలా మా ఇంటిని కుటుంబాన్ని కోల్పోయి బిక్కుబిక్కుమంటూ బయలుదేరి చివరికి హైదరాబాద్ వచ్చేసాం. ఆరోజు రైల్లో మా పక్కన కూర్చున్న ఓ హిందూ కుటుంబం అచ్చు మన్వి వాళ్లలాగానే! వాళ్లు సరదాగా మమ్మల్ని చూస్తూ ఎక్కడి వరకండి ప్రయాణం అని మామయ్యని అడిగారు. దానికి మామయ్య అనుమానంగానే ‘హైదరాబాద్ వరకు’ అని చెప్పాడు.
అందులో ఒకావిడ ‘నీ పేరెంటమ్మా’ అని అడిగేసరికి
‘జహీరా సింగ్…’ అని చెప్పబోతుంటే
మామయ్య నా నోటిని అదిమిన
‘జాహ్నవి…’ అని చెప్పాడు
‘హో.. మంచి పేరు’
అప్పుడర్థం కాలేదు నా చుట్టూ జరిగిన మారణహోమం గురించి. జహీరా సింగ్ నుండి జాహ్నవి గుప్తాగా మారిన నా కథ గురించి. ఇప్పుడు నాకు ఇరవై మూడేళ్లు.

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

స్వప్నం

by Sumalatha Deshpande July 18, 2023
written by Sumalatha Deshpande

అది నిండు పౌర్ణమి రాత్రి… ఆరుబయట మంచంపై పడుకున్న..పంకజానికి… మబ్బుల మాటున.. దోబూచు లాడుతూ… చల్లని వెన్నెల వెదజల్లుతున్న…
చందమామ కానీ… కొబ్బరి చెట్టు ఆకుల సందుల్లోంచి… తళుక్కున మెరిసే.. తారలు కానీ..కనిపించడం లేదు…

తనకు రోజు వచ్చే.. ఆ భయంకరమైన స్వప్నం గురించే… ఆలోచిస్తుంది…ప్రతి రోజు..అర్ద రాత్రి ఒంటిగంటకి …భయంతో.. ఒక్కసారిగా… ఉలిక్కిపడి లేచే.. తన కల.. గురించి…గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ… లేచి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లో… నీళ్ళు తాగి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది…

మరుసటి రోజు రాత్రి కూడా అదే కల వచ్చి.. మళ్లీ లేచి కూర్చుంది.. ఆమెకు… రోజూ ఈ కలలు రావడం… ప్రారంభమయ్యాయి…

ఏదో.. పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా…ఉంటున్న పంకజాన్ని..చూస్తూ..ఏమైందని అడిగాడు.. భర్త పరంధామం…

ప్రతిరోజు వచ్చే.. తన స్వప్నం.. గురించి.. భయపడుతూ…భాధపడుతూ… పూసగుచ్చినట్టుగా…చెప్పింది…పంకజం…

అతనికి..ఆమె అవస్థ… చూడలేక… హృదయం.. భాధతో.. విల, విల లాడింది…
చివరకు ఒకరోజు ఆమెను… ఆ పట్టణంలోని… ప్రముఖ.. సైకియాట్రిస్ట్..వద్దకు తీసుకెళ్లి సమస్యను.. పరిష్కరించాలని.. నిర్ణయించుకున్నాడు…

మరునాడు…. అపాయిట్మెంట్ తీసుకొని…భార్యను వెంటపెట్టుకుని..మానసిక వైద్యుడి వద్దకు.. వెళ్లాడు..

డాక్టర్ గారు.. నా అరవై కేజీల బంగారం.. ఈ ఇరవై రోజుల్లో… యాభై కేజీలు..
అయింది… అర్ద రాత్రి.. ఉలిక్కి పడి లేస్తుంది….వొళ్ళంతా..ఒణికి పోతుంది…ఏదో.. పీడ కల వచ్చింది.. అంటుంది… ఒక కల ఇంతలా…
భయపెడుతుందా????
అసలు ఏం అంతుచిక్కకుండా…ఉంది.. ఎలాగైనా… నా భార్యను..మీరే కాపాడాలి… అని కన్నీళ్ల..
పర్యంతం అయిన.. పరంధామాన్ని…జాలిగా చూస్తూ….

మీ కల గురించి వివరంగా చెప్పండి…అన్నాడు..డాక్టర్…పంకజాన్ని.. చూస్తూ…

” నిగనిగలాడే గుండుతో… ఒకతను.. ఊరికే రావు… ఊరికే రావు… ఫోటో తీసుకో… నాలుగు చోట్ల.. చూపించు…
మా వద్దకు రా…మా వద్దకు రా అంటూ ప్రతి రోజు.. పిలుస్తున్నాడండి…
నాకు చాలా.. భయంగా.. ఉంది…ఆ కల.. కాసేపైనా.. మర్చిపోదామని…టీవీ
ఆంచేస్తే… ప్రతి ఛానల్లో… అతనే కన్పించి… ఇంకా.. భయమేస్తోంది… ఇదంతా.. నాకు భ్రమ..
అని సరిపెట్టుకుందామన్నా… సాధ్యం కాకుండా ఉంది అంటూ… కన్నీళ్లు పెట్టుకుంది…
పంకజం…

సమస్య ఏంటో.. ఇట్టే.. అర్ధం అయిన… డాక్టర్.. “చూడండి సర్ “మీ భార్యకు…
“రోజు కలలో.. కనిపించేది…మరేంటో కాదు… ” అది ప్రముఖ గోల్డ్ షాప్ అడ్వర్టైజ్మెంట్ !
మీరు వెంటనే.. తల తాకట్టు పెట్టి…అయినా.. సరే… ఆ షాప్కీ తీసికెళ్లి… మీ భార్యకు.. బంగారు నగలు కొని పెట్టండి…
అప్పుడే… ఇలాంటి కలలు.. రాకుండా.. ఉంటాయి… వీలైనంత త్వరగా.. వెళ్ళండి…” అన్న డాక్టర్ గారి మాటలకి…
అవాక్కయిన పరంధామం….
“కలలు”ఊరికే రావు..అనుకుని… తెల్లమొఖం వేసాడు….

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నిజం చెప్తే….

by Rapolu Sridevi July 18, 2023
written by Rapolu Sridevi

కొన్ని, చిన్న అక్క తమ్ములు. ఓ రోజు వాళ్ళమ్మ పని మీద బయటకు వెళ్ళింది. ఇంట్లో ఇద్దరే ఉన్నారు కన్న కు ఏమన్నా తినాలని అనిపించింది .ఆగలేక వంటింట్లోకి వెళ్లి అన్నీ కలియ చూసింది .ఉప్పు ,కారం ,పప్పులు ఏవేవో కనిపించాయి .కానీ …అది అందుకోవడం ఎలా ?అని అనుకుని, చిన్న ను రా అని పిలిచి పై అరలో చక్కర ఉంది ఇద్దరం తిందాం ,ఎలాగైనా తీయరా !అన్నది వాడితో! వాడికి చక్కర చూడగానే నోరూరింది. అంతే !ఆ మూలన ఉన్న స్టూల్ లాక్కు వచ్చి, దానిపైకి ఎక్కి, నిక్కి నిక్కి చివరకు అందుకున్నాడు .ఇద్దరూ పిడికిళ్లతో చక్కెర తీసుకొని బుక్కారు .ఏమి ఎరగనట్టే ఆ డబ్బాను అలాగే అక్కడే పెట్టి, అమ్మ వచ్చేసరికి బుద్ధిగా కూర్చుని చదువుకుంటున్నారు.
అమ్మ కూరగాయలు వంటింట్లో పెట్టడానికి వెళ్లేసరికి చీమలు నేల మీద కనబడ్డాయి. చూస్తే, కింద చక్కెర కనిపించింది. డబ్బా చూస్తే అందులో చక్కర కొంచెం తగ్గినట్టు అనిపించింది.
“కన్నా !చక్కర తిన్నారా ?”అంటూ దగ్గరగా వచ్చేసరికి భయంతో “నేను తినలేదు” అన్నది కన్న.
“చిన్న !చక్కెర తిన్నారా?” అని చిన్న అని అడిగితే కాస్త తటపటాయించి” తిన్నాం” అన్నాడు .అంతే !”అబద్ధం చెప్తావా ?”అంటూ కన్నా ను చెంపపై కొట్టింది .”చిన్నా”అని పిలిచి ,”నా చిట్టి తండ్రీ” అంటూ దగ్గరగా తీసుకొని బుగ్గపై ముద్దు ఇచ్చి ,చేతిలో ఓ చాక్లెట్ పెట్టింది.

నిజం చెప్పి కొట్టించినందుకు కోపంగా ఉన్నా, సగం చాక్లెట్ కన్నాకు ఇవ్వగానే అది నోట్లో పెట్టుకుని “నిజం ఇంత తీయగా ఉంటుందా!” అని మనసులో అనుకోవడమే కాదు ,”నిజం నిర్భయంగా చెప్పాలి”మనసులో నిర్ణయించుకుంది కన్న!
*-నిజం వినడానికే చేదుగాని దాని ఫలితం మాత్రం తీయగా మధురంగానే ఉంటుంది

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరాయీకరణ

by C.S. Rambabu July 18, 2023
written by C.S. Rambabu

చెమటను చిందించిన చేతులు
భవనాన్ని నిర్మిస్తే బతుకుపోరంటావు
నువు మాత్రం అవుటర్ రింగ్ రోడ్డో
అందమైన గెస్ట్ హౌసో రూపకల్పన చేసి 
ఇది మేధోమధనమంటావు
అనాదిగా కష్టించే కార్మికులు
ఈ దేశంలో రెండవ తరగతి పౌరులే 
ఆశ్చర్యం పడాల్సిందేమీలేదు
సామూహికంగా అలవాటుచేసుకున్న 
సానుభూతి చాటున 
నీ విసుగు వినయాన్ని ప్రదర్శిస్తోంది
వారిని తలుచుకో ఒక్కసారి…
పునాదులు తీస్తారు
ఇటుకపై ఇటుక పేరుస్తారు
అంతస్తుపై అంతస్తుకట్టి
తథాస్తు దేవతల్లా దీవిస్తారు
ఓటుబ్యాంకు కాదుకాబట్టి
మరోమజిలీకి మారిపోతుంటారు
అద్దె గర్భాన్ని మోసిన తల్లుల్లా
కన్నీటితో వీడ్కోలు పలుకుతారా
పోనీ జ్ఞాపకాలను కన్నీటిని చేస్తారా అనుకుంటే 
వారి గాంభీర్యం అన్నింటిని కప్పేస్తుంది ఆకలితోసహా…!
కట్టినవాడు హక్కుదారుడు కాదు
హుష్ కాకి అంటే ఎగిరిపోయినట్టు
మరో చోటును
వెతుక్కుంటూ అలుపెరగని బాటసారుల్లా సాగిపోతారు అన్న నిజం తెలిసిన ధనికస్వామ్యవర్గం 
విలాసంగా నవ్వుకుంటుంటుంది !
భారంమోసే భూమిలా బలహీనులెప్పుడూ 
బాధ్యతతో సాగే నిశ్శబ్ద యాత్రికులే
వారు పరాయికరణ చెందలేదు
శతాబ్దాలుగా వారు పరాయివారిగానే
మిగిలిపోయారు.. కాదు కాదు
పరాయివాళ్ళని చేసేశాం
మనమే పరాయికరణ చెందాం

(ఏహక్కూలేని కొంతమంది వలస కార్మికులను చూసినప్పుడు)

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లాలుదర్వాజ బోనాలు

by రూపాదేవి July 18, 2023
written by రూపాదేవి

ఉత్సవాలు అంటే ఇష్టపడని మనుషులు ఉంటారా..?! అందులోనూ హైదరాబాదీలు ?! అందులోనూ పాతబస్తీ వాసులు ?! అందులోనూ బోనాల ఉత్సవాలు?! బోనాల పేరు తలవంగానే పాతబస్తీ ప్రజల మొహాల్లో వెలుగు నిండి పోతుంది. ఇక్కడ బోనాలు భలే వైభవంగా జరుగుతాయి.

పండగలు ఆ ప్రాంతపు సంస్కృతికి అద్దం వంటివి. పండగలు జరుపుకునే తంతు (విధివిధానం) ఆయా సమాజపు సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. తెలంగాణాలో హైదరాబాదు సంస్కృతి ప్రత్యేకమైనదైతే హైదరాబాద్ మొత్తంలో పాతబస్తీ రీతి రివాజు ప్రత్యేకమైనవి. అందువల్ల ఇక్కడ జరుపుకునే బోనాల పండగ కూడా ప్రత్యేకమైనది.

ఆషాఢమాసం తొలి ఆదివారం గోల్కొండ లోని జగదంబికా ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమై , అటునుంచి లష్కర్ బోనాలుగా బయలుదేరి రెండో ఆది వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం మీదుగా మూడో వారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం మీదుగా చివరి ఆదివారానికి లాలుదర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం చేరుకుంటుంది బొనాల పండగ.

పాతబస్తీలో ఆషాఢ నవరాత్రులుగా బోనాల పండుగ జరుపుకుంటారు. చివరి ఆదివారానికి ముందు మూడో శుక్రవారం నుంచే నవరాత్రుల సందడి మొదలౌతుంది.

పాతబస్తీలోని లాలుదర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, ఉప్పుగుడ మహంకాళీ ఆలయం, గౌలిపురా భరతమాత మాతేశ్వరీ మహంకాళీ దేవాలయం, సుల్తాన్ షాహి రేణుకా ఎల్లమ్మ ఆలయం. ఆలియాబాద్ దర్బార్ బంగారు మైసమ్మ ఆలయం, బేలా మాతేశ్వరీ ముత్యాలమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, మేకలబండ నల్లపోచమ్మ ఆలయం, మీర్ ఏ ఆలం మండి మహాకాలేశ్వర స్వామి ఆలయాలు రంగులు, విద్యుత్ దీపాలు, పూల తోరణాలతో అందంగా ముస్తాబు చెయ్యబడతాయి.

నవరాత్రులు మొదటి రోజైన మూడవ శుక్రవారం ఉదయం ఆలయంలో గణపతి హోమం, సప్తశతి పారాయణము, దేవీ అభిషేకం, ద్వాజారోహన , శిఖర పూజ నిర్వహించి సాయంత్రము ఘట స్థాపన (కలశ స్థాపన) తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఘట స్థాపన కోసం సాయంత్రం శాలిబండ కాశీ విశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి రూపాల్లో అలంకరించబడిన ఘటాలు అంగరంగ వైభవంగా, బజంత్రీలు, డప్పు మోతలనడుమ సాగిన జూలుస్ గా సాగి ఆయా గుడులకు చేరుతాయి. గుడిలో ఉత్సవ విగ్రహాలుగా ప్రతిష్ట చేస్తారు.
తరవాతి రోజు నుంచి అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి తొమ్మిదవ రోజు మహ తొట్టెలను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. పదవ రోజైన చివరి ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ చేసి, రాత్రికి గుడిలో శాంతి కళ్యాణం నిర్వహిస్తారు.

చేసే విధానం
బోనానికి రెండు రోజుల ముందునుంచే బంధు మిత్రులు రాకతో ఇళ్ళల్లో సందడి మొదలౌతుంది.
ఈ రెండురోజులు బోనంతయారీ, బోనం బైలెల్లడం, తొట్టెలు సమర్పణ బోనం సమర్పణ, పడి, విందు భోజనం, మరునాడు రంగం, ఘటం నిమర్జనం వంటి వివిధ క్రతువులతో పండగ జరుగుతుంది.
బోనాల మొదటి రోజు ఉదయం జానపదులు ఇంటి మధ్యభాగంలో బోనం స్థాపన చేస్తారు. గతంలో కండ్ల కుండ(రంధ్రాలు కుండ) లో బోనం సమర్పించేవారు. కానీ ఈ రోజుల్లో కొత్త కుండను సున్నము పసుపు కుంకుమతో అలంకరించి, వేప రెమ్మలు కట్టి అందులో తెల్ల అన్నం లేదా బెల్లం అన్నం ఉంచి దానిపై చిన్న కుండలో పచ్చి పులుసు లేదా పెరుగు లేదా ఉల్లిపాయ ఉంచి కంచుక పెట్టి దానిమీద దీపాన్ని వెలిగిస్తారు.
ఇంటి ఆడపడుచులు, స్త్రీలు, చిన్నారుల పట్టువస్త్రాలు, పువ్వులు గాజుల అలంకారాలతో ముస్తాబై బోనాన్ని నెత్తిన పెట్టుకొని, విడిగా ఓ కుండలో వేపాకులు వేసిన నీళ్ళు లేదా కల్లు, లేదా బెల్లం నీళ్లు తీసుకుని, మరో కుండలో పసుపు నీళ్ళను తీసుకొని, సంతాన మొక్కు చేసుకునే వారు తొట్టెల మోస్తూ డప్పు మోతలతో, పోతరాజు దరువులు (ఎర్ర వస్త్రం మొలకు కట్టుకొని, ఒళ్ళంతా పసుపు, మొహానికి కుంకుమ రాసుకొని, జులపాలు విరబోసుకుని, నిమ్మకాయల దండ ధరించి, శర్లకోల(కొరడా) కొట్టుకుంటూ మహా భీకరంగా కనిపించే పోతరాజు గజ్జె కట్టి వేసే చిందులు) చేస్తూ, గుగ్గిలం మైసాచి పొగల నడుమ బంధుమిత్ర సమేతంగా ఇంటింటి నుంచీ వచ్చిన బోనం జులుస్(ఊరేగింపు)గా అమ్మవారి ఆలయం చేరుకుంటారు. బోనం కుండ ఆలయంలోకి ప్రవేశించే ముందు బోనం ఎత్తిన వాళ్ళను అమ్మవారు ఆవహించినట్టుగా భావించి తమతో తెచ్చుకున్న పసుపు నీళ్ళను వాళ్ళ పాదాలపై గుమ్మరించి మొక్కుతారు. ఆలయ లోకి ప్రవేశించాక వెంట తెచ్చిన వేపాకు నీళ్లు లేదా కల్లు లేదా బెల్లం నీళ్లు అమ్మవారి ముందు సాకం పొస్తారు, బోనంకుండ అన్నంలో కొంత తీసి ‘పడి’ (బలిఅన్నం కుప్పగా పోయడం) తీసి పాకం సమర్పిస్తారు.
తొట్టేల గుడి వద్ద ఉండే చెట్టుకు లేదా గుడి పక్కన పాతిన గుంజకు కడతారు. అమ్మవారికి నివేదన తరవాత మిగిలిన బోనంతో బంధుజన పరివారంతో కలిసి విందుభోజనంతో మహా ప్రసాదంగా ఆరగిస్తారు.
ఆ రాత్రి జనాలు నిద్రపోయాక 12 గంటల తరవాత బలి అన్నాన్ని(పడి) వీధి వీధిలో చల్లుతారు. దీనివల్ల దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతారు.
రెండోరోజు ఆలయం వద్ద రంగం కార్యక్రమంలో పెళ్ళికాని ఓ స్త్రీ అమ్మవారిని ఆవాహన చేసుకుని పచ్చికుండపై ఎక్కి భవిష్యవాణి చెబుతుంది. (పూర్వం గావు పెట్టడం వంటి క్రతువులు జరిగేవి. నిషేధించడం జరిగింది)
ఆ తరవాత ఘటాన్ని పలహార బండ్లు, డప్పు, పోతరాజు సందడిలో జులూస్ తీసి నాయాపుల్ దగ్గర ముసిలో ఘటాల నిమర్జనం చేస్తారు. దీనితో పండగ తంతు పూర్తి అవుతుంది.

నమ్మకాలు: తెలంగాణ ప్రాంతంలో ఇక్ష్వాకుల కాలం నుంచీ కూడా శక్తిని వివిధ స్త్రీరూపాలలో ఎల్లలు కాపాడే ఎల్లమ్మ, పొలిమేరను రక్షించే పోచమ్మ, ఈత చెట్లల్లో ఈదమ్మ, బాలాత్రిపురసుందరిని బాలమ్మ, మహిషాసుర మర్ధిని మైసమ్మగా అనేక పేర్లతో పిలుచుకుని గ్రామ దేవతలుగా ఆరాధిస్తారు. ఆషాఢ మాసంలో దేవి పుట్టింటికి వస్తుందని, దేవిని తమ ఇంటి ఆడపడుచగా భావించి తాము ఇష్టంగా తినే పదార్థాలను బోనం వండి సకలఅర్యదలతో నైవేద్యం సమర్పించి ఆతిత్యం ఇస్తారు. చీర గాజులు పువ్వులు పెట్టీ మురిసి పోతారు. పిల్లలు లేని వారు తొట్టెలు సమర్పిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. ఊరేగింపును నడిపించే అమ్మవారి సోదరుడుగా భావించే పోతరాజు భక్త బృందానికి రక్షకుడుగా నమ్ముతారు. బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడతారని విశ్వసిస్తారు.

హిందువులు జరుపుకునే ప్రతీ పండగకూ ఓ చారిత్రక నేపధ్యం, ఓ శాస్త్రీయత, ఓ సమాజ హితము తప్పకుండా వుంటుంది. అలాగే తెలంగాణ పండగ హైదరాబాద్ ప్రతిష్టాత్మక పండగ ఆయిన బోనాల పండుగ వెనుక కూడా చారిత్రక నేపధ్యం, శాస్త్రీయత, లోక హితం దాగి ఉన్నది
చారిత్రక నేపథ్యం:
బోనాల పండుగను దాదాపు వెయ్యి నుంచీ జరుపుకుంటున్నారు. గోల్కొండ కోట నిర్మించక మునుపు గొల్లలు పశువుకు మేపుకునే కొండ గొల్లకొండ గా పేరున్న కాలములో గొల్లలు అక్కడున్న ఎల్లమ్మ కు బోనం సమర్పించేవారట. ఆ సంప్రదాయం అలాగే కొనసాగి కాకతీయ రాజు రెండో ప్రతాప రుద్రుడు బోనాల సమయంలో గోల్కొండ ఎల్లమ్మ ఆలయంలో బోనం సమర్పించినట్లు పెద్దలు చెబుతారు. గొల్ల కొండ ముస్లిం రాజుల పాలనకు గోల్కొండ కోట నిర్మాణం తర్వాత అక్కన్న మాదన్న లు ఈ ఉత్సవం జరిపినట్టు తెలుస్తోంది. అంటే ఐదు వందల ఏళ్ళుగా అక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతూనే వున్నాయి.
ఓ కథనం ప్రకారం 1908లో మూసీ పోంగి దిక్కు తోచని పరిస్థితిలో అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజా అమ్మవారికి బంగారు చాటలో పట్టుచీర గాజులు, ముత్యాలు, పసుపు కుంకుమలు సమర్పించి నది ఉదృతి తగ్గించమని కోరుకున్నాడట. నది ఉదృతి తగ్గిపోయిందట. నిజాం నవాబు ప్రార్థనతో ప్రాశస్త్యం పొందిన లాలూదర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వందేళ్లు గా బోనం చేస్తూ శతాబ్ది ఉత్సవాల జరుపుకుంటున్నది. అలా చారిత్రక ప్రాశస్త్యం వరుసలోనే తొలి బోనం గోల్కొండలో ఎత్తగా, చివరి బోనం లాల్ దర్వాజాలో ఎత్తుతారు.


శాస్త్రీయత:
ఆషాఢ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి. నిలిచి ఉండే వాన నీరు, నీటి తెమ్మ వల్ల క్రిమికీటకాలు, ఈగలు,దోమలు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వృద్ది చెందుతాయి. వానాకాలంలో కలరా, మశూచి, మలేరియా వంటి అంటు వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి.
అందువల్ల బోనాల పండగలో క్రిమి నాశని అయిన సున్నము. యాంటీ సెప్టిక్ , ఔషద గుణాలు కలిగిన వేపాకు, యాంటీ బయోటిక్స్ అయిన పసుపు, కుంకుమలు వాడతారు.
బోనం కుండకు క్రిమి కీటకాలు దరిచేరకుండా సున్నము రుద్దడం, పసుపు కుంకుమ అద్దడం చేస్తారు. కుండకు వేపాకు కడతారు,
అలాగే వాన నీళ్ళల్లో నాని నాని పాదాల వేళ్ళు చెడకుండాబోనం ఎత్తే స్త్రీలు, మిగతా మహిళల కాళ్ళకు పసుపు రాసినా, భవిష్యవాణి చెప్పే స్త్రీలు మొహమంతా పసుపుతో నింపినా, పోతరాజు ఒళ్లంతా పసుపు పులుముకున్నా అందుకోసమే. ఇంటి దర్వాజలకు, గల్లీలో తోరణాలుగా వేపాకు మండలు కట్టడం వెనక అదే కారణం. బోనం కుండ పై దీపం వెలిగించడం దారి వెంట వెలుగు కనిపించడానికి.
ఆలయ ప్రవేశానికి ముందు బోనం ఎత్తిన స్త్రీ పాదాలపై నీటిని గుమ్మరుంచడం అంటే వానాకాలం బురద దారిలో నడచి రావడం వల్ల బురదతో అపరిశుభ్రంగా మారిన కాళ్ళను శుభ్రపరచడం అన్నమాట.

సమాజ హితము:
పండగ క్రతువుల నిర్వహణతో మనిషిలో ఆధ్యాత్మిక భావన పెంపొందించి శాంతి మార్గములో నడిచేలా చేస్తాయి. పండగ పేరుతో బంధు బలగంతో బంధాలు బాంధవ్యాలు, ఇరుగు పొరుగుతో సత్సబందాలు, మానవ సంబంధాలను పటిష్టంగా ఉంచబడతాయి.
ఎండాకాలం ఎండదెబ్బలకు విసిగి వేసారి నిర్లిప్తమైన జనాలలో ఉత్సవాలు నూతనోత్సాహాన్ని తీసుకు వస్తాయి. పండగ తంతులో ముఖ్య పాత్ర వహించే పసుపు కుంకుమ,
వేపాకుల అవసరం అంతర్లీనంగానే అవగాహణ ఏర్పడుతుంది.

తెలంగాణా ప్రాంతంలో మాత్రమే జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకత రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వము దీనికి రాష్ట్ర పండగగా హోదా కల్పించి బోనాల సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టుచీర కానుకగా సమర్పించే ఆనవాయితీ ప్రారంభించింది. ఇప్పుడు తెలంగాణకే ప్రత్యేకమైన బోనాలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

115 వ వార్షిక బ్ర్మోత్సవాలు జరుపుకుంటున్న లలుదర్వాజ బోనాల జాతర ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు జూలై 7 న ప్రారంభమైనాయి. జూలై 16 బోనాలు, 17 న ఘట నిమర్జనం తో ఉత్సవాలు ముగియనున్నాయి.
లాల్ దర్వాజా బోనాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం కమిటీ ఆద్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 19′ 20, 21 తేదీలలో బోనాలు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
ఈ బోనాలపండుగను తిలకించడానికి వివిధ జిల్లాలనుంచి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఒద్దిక

by Devanapalli Veenavani July 13, 2023
written by Devanapalli Veenavani

మన నుంచి దేన్నో తీసుకెళ్లి పోతారు
బహుశా నమ్మకం కావచ్చు..
ఇంకెప్పుడు ఎవరిపట్లా కుదరనంతగా
పెకిలించి వేయబడేది
నమ్మకమనే చిన్న వేరు కావచ్చు

సంఖ్యలు కనబడవు..
దృష్టి దోషం కాదది
దిమ్మతిరిగిన తలలో తిరుగుతున్న భూమి
ఏటవాలు కళ్ళకింద నది ఊట

తెల్ల వారుతున్నపప్పుడో
పొద్దుమలుగుతున్నప్పుడో
రేకలు రేకలుగా విచ్చుకునే ఊహల చిత్తుప్రతి
చెత్త బుట్టలో ముడుచుకుపోవడం
మాటల కత్తెరలతోనే కదా

వారి ప్రపంచం చాలా చిన్నదని
తెలుసుకున్నాక
వాదించడం మానేయడమే విరుగుడు

పలక మీద తనను తాను అరగదీసుకున్న బలపంలా
మనకిచ్చిన గడువు తీరుతున్నది
తుడిపేసి రాసినప్పుడల్లా నేర్చుకోవాల్సింది
ఒద్దికగా నిలబడడమే

July 13, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

తెలుగు సాహిత్యంలో తొలి అంధ నవలాకారుడు

by Naresh Chary July 13, 2023
written by Naresh Chary

శ్రీ.టేకులపల్లి. గోపాల్ రెడ్డి గారి ఇంటర్వ్యూ

నమస్కారం సార్
మీ నవల(జీవన స్రవంతి) విస్తృత ప్రజాదరణ పొందినందుకు ముందుగా మీకు అభినందనలు. ఒక అంధుడు నవల రాయడం బహుశా తెలుగు సాహిత్యంలో మీతోనే మొదలైందని చెప్పవచ్చు.అది చదువుతున్నంతసేపు ఒక చారిత్రక డాక్యుమెంటరీని చూసిన అనుభూతి కలిగింది.అందులో ఎన్నో చారిత్రక,రాజకీయ,ఆర్థిక,సాంఘిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.ఈ నవల మొదటిభాగమే దాదాపుగా 500 పేజీల ఉద్గ్రంథంగా తయారయింది. ఇది భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథంగా విరాజిల్లుతుందని నా ప్రగాఢ విశ్వాసం. నేను మీ శిష్యుడనయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.

గోపాల్ రెడ్డి సర్ గారు: నాకు ధూళిపాల అరుణ,మహేందర్ ఇంకా మీలాంటి శిష్యులు లభించడం నా అదృష్టంగా భావిస్తాను. నా నవల విస్తృతంగా ప్రచారం కావడానికి దోహదం చేసిన మీకు, ఈ ఇంటర్వ్యూను ప్రచురించి నా నవలకి విస్తృత ప్రచారం కల్పిస్తున్నందుకు మయూఖ ఆన్లైన్ ద్వైమాసిక పత్రిక నిర్వాహకురాలు శ్రీమతి కొండపల్లి నిహారిణి గారికి మరియు నా నవల చదివి మంచి ఫీడ్ బ్యాక్ అందిస్తున్న పాఠకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్రశ్న:1 సర్ మీజననం మరియు కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?

“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అనే వాక్యం రాముని నోట వెలువడింది.ఇది ఉత్తమోత్తమమైన వాక్యం. ప్రతి వ్యక్తి జీవితంలో జనని ఎంత ముఖ్యమో జన్మభూమి కూడా అంతే ముఖ్యం. జనని కుటుంబానికి పరిమితమైతే జన్మభూమి పూర్తి సమాజానికి సంబంధించినది. జననిని ప్రేమించినట్టే జన్మభూమిని కూడా ప్రేమిస్తారు,ఆరాధిస్తారు, అవసరమైతే ప్రాణమైనా ఇస్తారు. నాకు కూడా నా జన్మభూమైన పోచారం చాలా ఇష్టం. ఇది తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా,నాగిరెడ్డిపేట మండలంలో ఒక అందమైన పల్లెటూరు. నేను నా తల్లిదండ్రులైన రామకృష్ణారెడ్డి,సత్యమ్మలకు ఏప్రిల్ 1,1954 న జన్మించాను. ఒకవైపు ప్రాజెక్టు నీళ్ళు మరోవైపు పచ్చని పంట పొలాలు కలిసి మా ఊరును సుందరమయం చేశాయి. మా అందమైన పల్లెటూర్లోనే నా ఊహా శక్తి మొగ్గ తొడిగింది. ఊరు చుట్టూ నా పాదముద్రలు లేకపోయినా ఊహాశక్తితో నా పల్లె అందాన్ని దర్శించగలిగాను. అదే నా నవలలో చేర్చగలిగాను. నాకు ఇద్దరు సోదరీమణులు ముగ్గురు సోదరులున్నారు. నాకు ఇద్దరు పిల్లలు .కూతురు చైతన్య ప్రియదర్శిని,అల్లుడు విజయ్ భాస్కర్ రెడ్డి. కుమారుడు కృష్ణ కిషోర్ రెడ్డి,కోడలు సంగీత.శశాంక్ అన్వేష్ రెడ్డి,చతుర్వేద,సమీక్ష,మేఘవర్షిణి నా మనవడు మనవరాళ్లు. మాది పెద్ద కుటుంబమే.

ప్రశ్న:2 సర్ మీకు అంధత్వం పుట్టుకతో వచ్చిందా? లేక మధ్యలో వచ్చిందా?

దివ్యాంగులలో అంధత్వం చాలా బాధాకరమైనది. చూపు లేకపోతే ప్రపంచాన్ని దర్శించలేరు, ఇతరుల సహాయం లేనిదే ఎక్కువగా పనులు చేసుకోలేరు. ఇది బాధాకరమైన విషయమే. ఈ అంధత్వం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి పుట్టుకతో వచ్చేది, రెండవది ప్రమాదవశాత్తు పోయేది. మూడవది ఏదైనా జబ్బు చేసి నాటు వైద్యం వికటించినప్పుడు పోయేది. నాకు మూడవది సంభవించింది. నాకు నాలుగు సంవత్సరాల వయసు వరకు అందరిలాగే కళ్లు బాగా కనిపించేవి. ఒకరోజు నాకు కళ్లకలక వచ్చింది దాంతో కంటిపై పొరలు ఏర్పడ్డాయి.అప్పుడు నాటు వైద్యుడి వద్దకు తీసుకెళితే అతను నా కంటిలో బీరాకు పసరు వేయడంతో అది వికటించడంవల్ల,మెదక్ చర్చ్ఆసుపత్రిలోని నర్స్ నాకు ప్రాథమిక చికిత్స సరిగ్గా చేయకపోవడం వలన నా చూపు పోయింది. తర్వాత చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తే డాక్టర్లు ఎడమకంటికి కొంత చూపు తీసుకు రాగలిగారు. అందువల్లనే కొంతకాలంపాటు రంగులను గుర్తించగలిగాను, రాత్రింబగళ్ళను గుర్తించగలిగాను.

ప్రశ్న 3. మీ బాల్యం,విద్యాభ్యాసం గురించి చెప్పండి .

నిజానికి బాల్యం ఎవరికైనా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అందమైన జీవితమది.కల్మషం లేని మనసులు, కావలసినంత స్వేచ్ఛ ఈ సమయంలో దొరుకుతుంది. కాబట్టి ఎవరికైనా ఇది చాలా మధురమైందిగానే అనిపిస్తుంది. ఈ బాల్యం గురించి పెద్ద పెద్ద కవులు కూడా కవితలు రాశారు. శ్రీశ్రీ గారు శైశవగీతిలో బాల్యం గురించి అద్భుతంగా చెప్పారు. నా జీవితంలో నా బాల్యం కూడా మధురంగా గడపాలనుకున్నాను.. నేను మా ఇంటి బయట కూర్చుండి పిల్లలు ఆడుతుంటే గమనించేవాడిని.కొన్ని రోజులు నాకు పాక్షిక చూపు ఉండడం వల్ల వాళ్లతో ఆడుకోగలిగాను. తర్వాత తర్వాత నా వయసు రీత్యా ఆటలని తగ్గించుకున్నాను.నేను ఆ సమయంలో మా అక్కయ్య వాళ్ళతో పాఠశాలకు వెళ్లే వాడిని ,పరిసరాలు గమనించేవాడిని, మాటలు వినే వాడిని ,కానీ నాకు బాహ్య ప్రపంచం గురించి తెలిసింది మాత్రం రేడియో తోనే. 1959లో మా నాన్నగారు ఒక రేడియో కొన్నారు.దాని ద్వారా నాకు ప్రపంచంలోని చాలా విషయాలు అవగతమయ్యాయి. నిజానికి నా జీవితంలో రేడియో అనేది అత్యంత ప్రముఖ పాత్ర వహించింది. అందులో ముఖ్యంగా శారద శ్రీనివాసన్ అనే రేడియో ఆర్టిస్టు నన్ను విశేషంగా ఆకర్షించింది. ఆమె మాటలతో ఊహల్లో తేలిపోయేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే నా ఊహ ప్రేయసి ఆమెనే…రేడియోలో వచ్చే కథానికలు,నాటకాలు,నవలలు నన్ను ఉత్తేజపరిచేవి,కార్యోన్ముఖుడిని చేసేవి.నా లక్ష్యాన్ని సాధించేలా ప్రేరేపించేవి. ఎప్పుడైనా ఇంట్లో గొడవ జరిగినప్పుడు నా మనసు బాధపడి నేను ఇంటి పై గదిలోకి వెళ్లి ఈ కార్యక్రమాలను,శారదాశ్రీనివాసన్ మాటలు విని సాంత్వనపొందేవాడిని. ఈ విధంగా మా నాన్నగారు రేడియో తెచ్చి నాకు ఎంతో మేలు చేశారు. రేడియోతో నా బాల్యం బాగా గడిచిపోయింది.

విద్యాభ్యాసం: నేను మొదటిసారిగా 1965లో మలక్పేటలోని అంధుల పాఠశాలలో చేరాను. నేను పాఠశాలలో లేటుగా జాయిన్ కావడానికి కారణం మా నాన్నగారి భయం. నా చూపు కోసం మా నాన్నగారు మద్రాస్ అపోలో హాస్పిటల్ కి రాయవెల్లూరు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్ళు చూపు వస్తుందని చెప్పారు.అయితే వాళ్ళు ఇచ్చిన మరో సలహా ఏంటంటే నన్ను స్కూల్లో జాయిన్ చేయమని అయితే మా నాన్నగారు నేను ఎలా ఉండగలుగుతానని అనుకున్నారో ఏమో నన్ను వెంటనే పాఠశాలలో జాయిన్ చేయలేదు. రెండోసారి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మరోసారి డాక్టర్లు నన్ను అంధుల పాఠశాలలో చేర్పించమన్నారు అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. అప్పుడు మా నాన్నగారు నన్ను పాఠశాలకు తీసుకెళ్లారు కానీ వాళ్ళు జాయిన్ చేసుకోమన్నారు. అయితే మా నాన్నగారు కొన్ని రికమండేషన్లతో నన్ను జాయిన్ చేశారు.అలా నా విద్యాభ్యాసం 1965లో ప్రారంభమైంది నేను జాయిన్ అయిన రెండు సంవత్సరాలకి మా నాన్నగారు క్యాన్సర్ తో చనిపోయారు. అది నన్ను బాగా కలచివేసింది.మా నాన్నగారు లేకపోవడం నాకు తీరనిలోటు.ఆ సమయంలో నేను ఇంటికి వచ్చాను. చదువులో కూడా కొంత గ్యాప్ వచ్చింది.నేను 1968లో ప్రైవేటుగా 8వ తరగతి పాసయ్యాను.1971లో ఉస్మానియా మెట్రిక్ పాసయ్యాను. 1972లో పియుసి పూర్తయింది.1972-74 వరకుDOL ఆంధ్ర సారస్వత పరిషత్తు కళాశాలలో విద్యాభ్యాసం చేశాను ,1975 లో తెలుగు విశారద,పండిట్ శిక్షణ పూర్తిచేశాను,1973-76 లో సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను, 1976-78లో ఉస్మానియా యూనివర్సిటీలో M.A.తెలుగు పూర్తి చేసి చదువులో నా స్నేహితులను అందుకోగలిగాను. తరువాత జూనియర్ లెక్చరర్(1978-98) గా, డిగ్రీ లెక్చరర్(1998-2012) గా విధులు నిర్వర్తించాను.

ప్రశ్న 4.చదువులో మీకు మిత్రుల సహాయం ఎలా వుండేది?

ఒక సందర్భంలో నందిని సిధారెడ్డి గారు ఏమంటారంటే “కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు కానీ ఒక మంచి మిత్రుడిని సంపాదించుకోవడం కష్టమని”. అది కష్టాలలో ఆదుకునే స్నేహితుడు కావాలి,మనోధైర్యాన్నిచ్చే స్నేహితుడు కావాలి అంటాడు. నిజమే స్నేహితుడనే పదానికి అర్థం అదే కదా! నాకు కూడా నా జీవితంలో మంచి స్నేహితులు తారసపడ్డారు నేను అంధుల పాఠశాలలో ఉన్నప్పుడు ఆదినారాయణతో నా స్నేహం కుదిరింది.ఇతనిది ఆంధ్రా ప్రాంతం. మేము సన్నిహితంగా ఉండేవాళ్లం. మా స్నేహాన్నిచూసి హాస్టల్లో మా ఇద్దరిని జంటకవులు అనేవాళ్ళు. నిజానికి నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది ఆయనే. కర్ర పట్టి ఏ విధంగా నడవాలో నేర్పింది ఆయనే. కర్రపట్టి నడుస్తున్నప్పుడు గోడ దగ్గర కొడితే ఒక రకంగా శబ్దం వస్తుంది. తారు రోడ్డుపైన కొడితే ఒక రకమైన శబ్దం వస్తుంది. బస్ పక్కన కొడితే ఇంకొక రకమైన శబ్దం వస్తుంది,బైక్ పక్కన కొడితే మరొక రకమైన శబ్దం వస్తుంది. ఇలా కర్రతో కొట్టినప్పుడు వచ్చే శబ్దాలను ఎలా ఉంటాయి, నడిచేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను, అదేవిధంగా ఎత్తుపల్లాలలో ఏ విధంగా నడవాలో కూడా చెప్పేవాడు .నేనెప్పుడైనా పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వారం రోజులు వుండవలసిన వచ్చేది. ఆ సమయంలో తను నాకు భోజనసదుపాయం కల్పించి,పుస్తకాలిచ్చి ఎంతో సహాయం చేసేవాడు. ఎగ్జామ్ కు ఏ విధంగా ప్రిపేర్ కావాలో,ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయో ఇలాంటి విషయాలను చెప్తుండేవాడు. నాకు దొరికిన మంచి మిత్రుడు తను. ఇదే తరగతిలో మోహన్ రావు అనే స్నేహితుడు వుండేవాడు.అతను కూడా నాకు సహాయపడ్డాడు.అదే విధంగా పీజీలో ఉన్నప్పుడు తుపాకుల సిద్ధారెడ్డి (కర్నూల్)అని మరో మిత్రుడు పరిచయమయ్యాడు.ఇతను పీజీ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలో చక్కని సూచనలు చేసేవాడు. ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు పరిచయమై నా గమ్యం చేరుకోవడానికి ఎంతో సహాయపడ్డారు.వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్రశ్న 5 మీరు జీవితంలో ఎన్నోసార్లు ఒంటరి ప్రయాణం చేశారు. మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఎప్పుడూ భయం వేయలేదా?
నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నెలకోసారైనా ఇంటికి ప్రయాణించాల్సి వచ్చేది.ఆ సమయంలో నన్ను ఆర్థిక సమస్యలు వెంటాడేవి. అందుకే నేను ఎక్కువగా రైలు ప్రయాణం చేసేవాడిని.ఎందుకంటే మాకు టికెట్టు కన్సెషన్ ఉండేది. రైలు ప్రయాణంలో ఇంటికి వెళ్ళాలంటే అక్కన్నపేటలో దిగాలి.అక్కడ దిగేసరికి ఒక్కోసారి అర్ద రాత్రి 12 గంటలయ్యేది. ఆ సమయంలో రైలు పట్టాలు దాటేటప్పుడు విపరీతమైన భయంవేసేది.అయినా ఆర్థిక సమస్యల ముందు అవేం పెద్ద సమస్యలు కావని ముందుకు వెళ్లే వాడిని. అంతేకాకుండా నాకు కష్టం వచ్చినప్పుడల్లా నా గమ్యం గుర్తొచ్చేది.గమ్యాన్ని చేరుకోవాలనే తీవ్రమైన కోరికే నా లోపల భయాన్ని పోగొట్టేది. నిజానికి ఆ సమయంలో మాకు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది,డబ్బు కూడా ఉండేది కానీ నా ఆత్మాభిమానం మా వాళ్ళని అడగనిచ్చేది కాదు,వాళ్లూ అర్థం చేసుకొని తగినంత మొత్తం ఇచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో డబ్బుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాను. ఆ ఇబ్బందులే నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పాయి.ఎన్ని కష్టాలు ఉన్నా ముందడుగే వేశాను.అందుకే నన్నందరూ మొండివాడనేవారు.
ప్రశ్న:6 మీరు భూస్వామ్య కుటుంబం నుంచే వచ్చారు.మీరున్న పరిస్థితిలో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ చదువుని గాఢంగా నమ్ముకొని దానివైపే అడుగులు వేశారు దానికి కారణం ఏమిటి?

వ్యవసాయం చేద్దామంటే తప్పకుండా నేను రోజు పొలానికి వెళ్ళాలి,జీతగాళ్ళ జీతాల వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాలి.అది నాకు సాధ్యపడదు. నిజానికి నాకు మొదట్లో పాఠశాలకు వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. నాకు రేడియో ద్వారా చాలా విషయాలు తెలిసేవి. అందువల్ల పాఠశాల అవసరం లేదనుకున్నాను. అంతేకాకుండా చదువుకున్న చాలామంది నా దగ్గరికి వచ్చి వార్తలు అడిగి తెలుసుకునేవారు. నాకు అప్పుడు కొంచెం గర్వంగా ఉండేది.అందువల్ల విద్య అనేది కేవలం పాఠశాలకు వెళ్తే మాత్రమే వచ్చేది కాదని, అది రేడియో ద్వారా కూడా నేర్చుకోవచ్చని అనిపించింది .కానీ మా నాన్నగారు మలక్ పేట అంధుల స్కూల్లో నన్ను జాయిన్ చేసినప్పుడు రేడియో కంటే కూడా చాలా విషయాలు స్కూల్లో తెలుస్తాయనే విషయం అవగతం అయింది నాకు. నన్ను హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మా నాన్నగారికి నన్ను స్కూల్లో జాయిన్ చేయమని అక్కడి డాక్టర్లు చెప్పేవారు.అలాగే వెంకటరెడ్డి సార్ గారు మా నాన్న గారితో చదువు ప్రాముఖ్యం చెప్పి నన్ను చదువులో ప్రోత్సహించమనేవారు. అందువల్ల మా నాన్నగారు ఇక నన్ను చదివించాలనే నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నారు . నీ అన్ని సమస్యలకు చదివే పరిష్కారం చూపెడుతుందని చదువే నువ్వు ఎదగడానికి దోహదపడుతుందని అందువల్ల నువ్వు తప్పకుండా చదవాలని మా నాన్నగారు నన్ను ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను చదువుకోగలిగాను. నాకు ఎప్పుడైనా నిరాశ ఎదురైనప్పుడు మా నాన్నగారి మాటలని గుర్తు చేసుకొని పునరుత్తేజితున్నయ్యే వాడిని. మా నాన్నగారి మాటలతో ఎప్పటికైనా చదువులోనే విజయం సాధించాలని నేను దృఢంగా నిర్ణయించుకున్నాను. నా సమస్యలన్నింటికీ చదువే పరిష్కారం చూపెడుతుందని,చదువే సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది అర్థమైంది.అందుకే నేనెప్పుడూ చదువును వదలలేదు.నాకు చదువులో మా చెల్లెలు, మిత్రులు జగన్మోహన్ రెడ్డి, లెక్కలు చేయడానికి షాప్ లోని మిత్రుడు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మా ఊర్లో నిజాం చేత బహిష్కరణ గురైన స్వామీజీ, శివరాం సార్ గార్లు సహాయపడ్డారు. అలాగే స్క్రైబర్స్ కూడా ఎంతో సహాయపడ్డారు. ప్రధానంగా లెక్కల పరీక్షల్లో స్క్రైబర్స్ చేసిన సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను వారికి నా ధన్యవాదాలు.

ప్రశ్న:7 ప్రస్తుతం అంధుల పాఠశాలల్లో ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?

నిజాం రాజు ఒకరకంగా అంధులకు ఎంతో మేలు చేశాడని చెప్పవచ్చు. అతను ముందుగా స్వచ్ఛంద సంస్థల ద్వారా అంధుల పాఠశాలను స్థాపించాడు. మొదట్లో డఫ్ అండ్ డం పాఠశాలలుండేటివి అందులో వికలాంగులు,అంధులు అందరూ కలిసి ఉండేవాళ్ళు .తర్వాత కాలంలో వేరు వేరుగా అంటే అంధుల పాఠశాలలుగా,డఫ్ అండ్ డం పాఠశాలలుగా వేరు చేసి నడపబడ్డాయి. ఇవి ఎంతోమందికి మేలును చేకూర్చాయి.ఎంతోమంది జీవితాలను నిలబెట్టాయి. అంధుల పాఠశాలల్లో నిజానికి అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అంధులకు జంతువులు ఏ విధంగా ఉంటాయో తెలిసేలా, వాటి మోడల్ బొమ్మలను ఆ పాఠశాలలో ఏర్పాటు చేస్తే వాళ్లు స్పర్శ జ్ఞానం ద్వారా తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా విజ్ఞాన విషయాలను అందించే ఇప్పుడున్న పరికరాలను వాళ్ళకి అందుబాటులోకి తేవాలి. అప్పుడు వారు కూడా మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు వెళ్ళగలుగుతారు.

ప్రశ్న:8 మీరు సాహిత్యం వైపు మళ్ళడానికి కారకులు ఎవరు? మీ పూర్వీకులలో ఎవరైనా సాహిత్యకారులు ఉన్నారా?
పూర్వీకులలో సాహిత్య కారులు ఉంటేనే మనకు సాహిత్యం అలవడుతుందనేది సరైనది కాదు. ఉదాహరణకు సి.నారాయణ రెడ్డి గారు,నందిని సిద్ధారెడ్డి గార్ల కుటుంబాలలో వీళ్ళకంటే ముందు ఎవరు సాహిత్య కారులు లేరు.మా కుటుంబంలో కూడా సాహిత్య కారులు ఎవరూ లేరు. అయితే మా నాన్నకి మాత్రం చదువంటే చాలా ఇష్టం ఉండేది. మా నాన్నగారు కాంగ్రెస్ నాయకులు,పుస్తకాలు బాగా చదివేవారు. అందులో ప్రధానంగా స్వామి దయానంద సరస్వతి రాసిన “సత్యార్థ ప్రకాశిక”గ్రంథాన్ని రోజు ఆరు పేజీల చొప్పున చదివేవారు అలాగే మా ఇంట్లో పెట్టె నిండా ఉర్దూ పుస్తకాలు ఉండేవి. వాటిని కూడా చదివేవారు. అలా మా నాన్నగారు చదివేవారు ,నేనేమో రాస్తున్నాను మా నాన్నగారి చదివే అలవాటే నేను చదువుకోవడానికి, రాయడానికి కారణం అనుకుంటున్నాను‌.మనకి ఒక్క బ్రాహ్మణులలో లో తప్ప ఇంకా మిగతా ఏ కులాలలో కూడా వాళ్ల పూర్వీకులు ఎక్కువగా చదువుకున్నట్టు సాహిత్య కారులైనట్టు నాకైతే కనిపించలేదు.

ప్రశ్న:9 మీ జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు?

నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు ప్రభావితం చేస్తే వ్యక్తులు కనిపిస్తారు. నన్ను కూడా ప్రభా చేసిన వారున్నారు.అందులో మొదటగా మా నాన్నగారు. మా నాన్నగారి వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. మా నాన్నగారు 10 సంవత్సరాలు మా ఊరికి సర్పంచ్ గా ఉన్నారు.ఆ సమయంలో అతను ఎన్నో సంస్కరణలు చేపట్టాడు.ఉదాహరణకి లేబర్స్ కి హాలిడే ప్రకటించడం,అంతేకాకుండా ఎవరైనా పంచాయతీ చెప్పమని వచ్చినప్పుడు వారికి జరిమానా విధించేవాడు కాదు.ఎందుకంటే వారివి అప్పటికే చితికిపోయిన బతుకులు. కష్ట సమయంలో ఏ విధంగా ఉండాలి,గమ్యం చేరడం కోసం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి మొదలైనవన్నీ మా నాన్నగారి నుంచే నేర్చుకున్నాను. ఇక రెండవది రేడియో నా జీవితంలో రేడియో చాలా ప్రముఖ పాత్ర వహించింది. రేడియోలో వచ్చే నాటకాలు ఆ నాటకాలలోని మంచి విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నాకు అది విజ్ఞానాన్ని అందివ్వడమే కాకుండా నా గమ్యం వైపు ముందుకెళ్లేలా ప్రేరేపించింది. నాకెప్పుడూ నిరాశ కలిగిన నేను రేడియో వినేవాడిని. ఈ విధంగా నేను మా నాన్నగారు మరియు రేడియో నాటకాలద్వారా ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యాను.

ప్రశ్న:10 సాహిత్యంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు?

నేను మలక్ పేటలో చదువుతున్నప్పుడు నాకు తెలుగు సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు,తర్వాత కాలంలో అంటే PUC లో తెలుగు ఆప్షనల్ సబ్జెక్టు కావడంతో చదివేవాడిని. ఆంధ్ర సారస్వత పరిషత్తులో DOL చదవడం ద్వారా,M.A తెలుగు చదవడం ద్వారా నాకు సాహిత్యం పై కొంత అవగాహన కలిగింది. అంతకంటే ముందే నాకు రేడియో పరిచయమైంది కాబట్టి నాకు చాలావరకు దాని ద్వారానే సాహిత్యం పరిచయమైంది.నాకు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యం రామాయణ,మహాభారతాలకంటే కంటే ఆధునిక సాహిత్యం అంటే ఎక్కువగా ఇష్టం.ఎందుకంటే ఆధునిక సాహిత్యంలో అభ్యుదయపథం వుంటుంది. అభ్యుదయ భావాలతో సాహిత్యం సృజించిన గురజాడ గారు కన్యాశుల్కం నాటకంలో, ముత్యాల సరాలలో బాల్యవివాహాలను ఖండించాడు.శ్రీశ్రీ కార్మికుల,కర్షకుల పక్షాన కవిత్వం రాశాడు,దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార, రుద్రవీణ ద్వారా ఉద్యమ స్ఫూర్తి రగిలించాడు అప్పటి పరిస్థితులలో నిజాం వ్యతిరేకంగా కవిత్వం రాయడం సాహసమనే చెప్పాలి. ఆయన తిరుగుబాటు తత్వం నన్ను ఆకర్షించింది‌. జాషువా తన “గబ్బిలం” కావ్యంలో కుల వ్యవస్థను ఖండించాడు. ఆయన ఎప్పుడూ నిమ్న వర్గాల గురించే కవిత్వం రాసేవాడు. నాకది బాగా నచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వంలో ఓలలాడించాడు. తన ఊహ ప్రేయసి ఊర్వశి పై ఎంతో అద్భుతమైన కవిత్వాన్ని రాశాడు. అది చదువుతున్నంతసేపు మనం కూడా అతనితోనే ప్రయాణిస్తాం. సినారె గారి కవిత్వంలో ప్రణయతత్వం ఉంటుంది.నాగార్జున సాగరంలో దాన్ని చూడవచ్చు. అదేవిధంగా కర్పూర వసంత రాయలు కావ్యం లో లకుమ పాత్ర చిత్రణ అద్భుతంగా ఉంటుంది.ఆయన రచనలు మోటివేషనల్ గా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నాపై ప్రభావం చూపారు.

ప్రశ్న:11. మీ జీవితాన్ని నవలగా రాయాలని ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది?
నేను చిన్నతనం నుండి ఎక్కువగా ఒంటరిగా ఉండడం వల్ల బాగా ఆలోచించే వాడిని, స్పందించడమంటే ఇష్టపడేవాడిని, చర్చించడం అంటే ఇష్టపడేవాడిని. నేను చిన్నప్పటినుండి ఎక్కువగా నాటకాలు వినేవాడిని కాబట్టి అందులోని పాత్రలను బాగా గమనించేవాడిని, మాటలను కథలను వినేవాడిని. అంతేకానీ రాసేవాడినికాదు. అసలు నాకు 12 సంవత్సరాల వయసు వచ్చేవరకు చదువు అనేది ఒకటి ఉంటుందని తెలియదు. అంధుల పాఠశాలలోచేరిన తర్వాత బ్రెయిలీ లిపి నేర్చుకున్నాను. ఆ తర్వాతే చిన్న చిన్న కథలను రాయడం సాధన చేశాను. నేను లెక్చరర్ అయిన(1978) తర్వాత నా జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను,పరిస్థితులకు అనుగుణంగా మారే మనుషులను, అవకాశవాదులను, కొందరు అధికార దర్పంతో జీవితాలను ఎలా శాసిస్తారో మొదలైన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి డైరీలో రాసేవాన్ని. నాకు డిగ్రీ లెక్చరర్ గా ప్రమోషన్ వచ్చాక(1998) నందిని సిధారెడ్డి గారితో సాన్నిహిత్యం పెరిగింది. అతను ఒక రోజు “నువ్వు నీ జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలను డైరీలో రాస్తున్నావు కదా!వాటి ఆధారంగా నీ జీతాన్ని నవలగా రాస్తే బాగుంటుంది”అని సలహా ఇచ్చాడు.ఆ ఆలోచన నాకు నచ్చింది.నేను నా జీవితాన్ని కథలుగా చెప్పడం సాధ్యం కాదు,నాటకంగా చెప్పలేను ,కాబట్టి నవలగానే రాయాలనుకున్నాను. దీని కారణమేంటంటే నవల విస్తృతి పెద్దది.నేను అప్పటికే ఉన్నవ లక్ష్మీనారాయణ గారి”మాలపల్లి”వట్టి కోట ఆళ్వారు స్వామి గారి” ప్రజల మనిషి”వాసిరెడ్డి సీతాదేవి గారి “మట్టి మనుషులు”,బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది” మొదలైన నవలలు చదివాను కాబట్టి నవల రాయగలననిపించింది. అయితే అయితే మరి నా నవల కేవలం నా జీవితాన్నిమాత్రమే కాకుండా అప్పటి చారిత్రక, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించాలనుకున్నాను. దాదాపు 2000 సంవత్సరం నుండి 2012 వరకు నా యొక్క డైరీ ఆధారంగా నవలను బ్రెయిలీ లిపిలో రాసుకున్నాను.మామూలు పేజీలలో 500 పేజీలు అయితే బ్రెయిలీ స్క్రిప్ట్ లో 3000 పేజీలలో పూర్తయ్యింది‌.

ప్రశ్న:12, ఈ నవల రాయడంలో మీకు సహాయపడింది ఎవరు ?

ముందుగా నవలను నేను బ్రెయిలీ స్క్రిప్ట్ లో రాసుకున్నాను.అప్పుడు ఎవరు సహాయపడలేదు.అది నా జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. అయితే అది చూపు ఉన్న వాళ్లకు చదవడం సాధ్యం కాదు గనక దానిని వాళ్ళకు కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో పుస్తకంగా బయటకు తీసుకురావాలనుకున్నాను. ఈ క్రమంలో నా శిష్యుడు మహేందర్ రెడ్డి ఒక మూడు అధ్యాయాల వరకు రాశాడు. తర్వాత ఎందుకో అది పూర్తి కాలేదు. ఇక నా నవల బయటకు రాదేమోనని అనుకున్నాను. దీనికి పరిష్కారం ఎట్లా అని ఆలోచించే క్రమంలో నేను ఒక వాయిస్ రికార్డర్ కొన్నాను.అందులో నా బ్రెయిలీ స్క్రిప్ట్ లో రాసుకున్నదాన్ని పూర్తిగా రికార్డు చేసుకున్నాను. ఎప్పుడైనా నా మనవడో మనవరాలో ఇది విని వాళ్లైనా పుస్తకంగా బయట తీసుకొస్తారని చిన్న ఆశ ఉండేది. ఎందుకంటే అన్నమయ్య కూడా తను పాటలు పాడుకుంటూ పోయేవాడు వాటిని లిఖితబద్దం చేసింది మాత్రం తన వారసులే.. అలాగే నా వాళ్ళు కూడా బయటకు తీసుకొస్తారని అనుకున్నాను. కరోనా సమయంలో ఒకసారి నా శిష్యురాలు ధూళిపాల అరుణ నాకు ఫోన్ చేసినప్పుడు మాటల మధ్యలో నా నవల విషయం ప్రస్తావనకు వచ్చింది అప్పుడు ఆమె ఈ నవలను నేను రాస్తాను సార్ అని ముందుకు వచ్చింది. అయితే నేను వాయిస్ రికార్డర్ లో భద్రపరచిన ఈ నవలను ఆమెకి పెన్ డ్రైవ్ ద్వారా పంపించాను. దాని ద్వారా వినుకుంటూ రాయడం ఆమెకు కొంత ఇబ్బందిగానే అనిపించింది. తర్వాత అలా కాదని నేను ప్రతిరోజూ కొంత డిక్టేట్ చేస్తుంటే ఆమె రాసేది. ఇట్లా 2019 నుండి 2021 వరకు ఆమె నవల రాయడం పూర్తి చేసింది. దీనిని టిడిపి చేసే బాధ్యతను తన మిత్రురాలు వల్లి తీసుకుంది.నిజంగా వీళ్ళు లేకపోతే నా నవల బయటకు వచ్చేది కాదు. వీరికి ఈ ఇంటర్వ్యూ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఈ నవల ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేదు. నందిని సిధారెడ్డి గారు ఈ నవలను డెని సైజులో ప్రింట్ చేయమన్నారు అలా చేస్తే 600 పేజీల వరకే అవుతుందన్నారు. రోమ్ సైజులో చేస్తే 500 పేజీల్లో పూర్తవుతుందన్నారు అందువల్ల దీన్ని రోమ్ సైజులోనే ప్రింట్ చేయమన్నాను. దానికి ముఖచిత్రం నుండి పూర్తయ్యే వరకు నా శిష్యురాలు ధూళిపాల అరుణనే పూర్తి బాధ్యత తీసుకుంది. ఆమెకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.నాకు శిష్యులు ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో ఎంతో సహాయం చేశారు. ఉదాహరణకు ఢిల్లీలో మహాభారతంపై సదస్సు జరుగుతున్నప్పుడు నన్ను ప్రసంగించమని నా శిష్యురాలు ఊర్మిళ కోరింది. నాకు సాధ్యం కాదు అనుకున్నాను. అయితే ఆమెనే కోఆర్డినేటర్ తో మాట్లాడి నేను ప్రసంగించడానికి అవకాశం కల్పించింది. నేను ఢిల్లీలో ఉన్న మూడు రోజులు నాకు ఎంతో సహాయం చేసింది. ఆ రోజు నేను మహాభారతంలోని స్త్రీ పాత్రలపై మాట్లాడాను. అది నా జీవితంలో గొప్ప అచీవ్ మెంట్ గా భావిస్తాను. అంతే కాకుండా నేను కాలేజీ వెళ్తున్నప్పుడు నన్ను కాలేజీ వరకు తీసుకురావడానికి ఒక్కొక్క దశలో ఒక్కో విద్యార్థి ఇలా ఎందరో నాకు నా శిష్యులు సహాయం చేశారు వారికి ధన్యవాదాలు.

ప్రశ్న:13, మీ నవల ఒక చారిత్రక డాక్యుమెంట్ లా అనిపిస్తుంది అలా రాయడానికి కారణం ఏమయ్యుంటుంది.?
నేను నవల రాసేముందు కొన్ని నవలలు చదివాను అందులో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి “మాలపల్లి” నవల బుచ్చిబాబు గారి “చివరికి మిగిలేది” నవల వాసిరెడ్డి సీతాదేవి గారి “మట్టి మనుషులు” చాలా బాగా అనిపించాయి. ఈ నవలలు చదివిన తర్వాత నవలకి ఒక లక్ష్యం అంటూ ఉండాలని అర్థం అయింది. అంతేకాకుండా అప్పటి పరిస్థితులను కూడా వివరిస్తే ఇంకా బాగా అర్థమవుతుందని తెలిసింది.
నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకుంటూ వచ్చాను. నా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి వాటిని ఎదుర్కొన్నాను. నవల రాసేటప్పుడు అందులోని సమస్యలను చర్చించేటప్పుడు దాని వెనుకున్న నేపథ్యం చెప్తే ఆ సమస్యగురించి పూర్తిగా పాఠకులకు అర్థమవుతుందని, అలాగే ఆ కాలంనాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కూడా ముందుతరాలకు తెలియాలనే ఉద్దేశంతో అలాంటి అంశాలను ప్రస్తావించాను. బతుకమ్మ పండుగ గురించి చెప్పేటప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాల గురించి వివరించాను, నేత పనివారీ మగ్గం గురించి వివరించాను.అలాగే బెల్లం ఏ విధంగా తయారవుతుంది దానికుపయోగించే పరికరాలు ఏమిటి అనే విషయాలను,కులం ప్రస్తావన వచ్చినప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాలు-సమాజంపై దాని ప్రభావాన్ని వివరించాను. ఇవే కాకుండా అవసరమైన సందర్భాల్లో చాలా చారిత్రక అంశాలను ప్రస్తావించాను. ఇదంతా ముందు తరాల వారికి తెలియడం కోసమే.

ప్రశ్న: 14. మీకు ఈ నవల రాయడంలో ప్రతిబంధకాలు ఏమైనా ఏర్పడ్డాయా?

నేను నా జీవితంలోని ముఖ్య సంఘటనలన్నింటినీ డైరీలో రాసుకున్నాను కాబట్టి వాటి ప్రకారం నేను నవలను మొదట బ్రెయిలీ స్క్రిప్టులో రాసుకున్నాను. అప్పుడు నాకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాలేదు. కానీ అది చూపు ఉన్నవారు చదివేలా బయటికి రావాలంటే మాత్రం ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు. ఎందుకంటే నేను చెప్పిన దాన్ని రాయాలి,టిడిపి చేయించాలి,దాంట్లోని తప్పొప్పులను చూడాలి,ముఖచిత్రాన్ని వేయాలి ఇంత తతంగం ఉంటుంది. మరి ఇవన్నీ ఎలా చేస్తానో అని అనుకున్నాను. కానీ ఈ సమస్యలన్నింటినీ దాటుకొని నవల బయటకు వచ్చిందంటే దానికి పూర్తి కారణం ధూళిపాల అరుణ. ఆమె పడ్డ శ్రమ అంతా అంతా కాదు నేను చెప్పడం వరకే ఆపై పూర్తి బాధ్యత ఆమెనే తీసుకుంది. ముఖచిత్రం పైన ఉండే ఆ డిజైన్ రూపకల్పన చేసింది అరుణ మేనల్లుడు ప్రవీణ్. చాలా చక్కగా వేయించింది. నవల వెలువడడంలో పూర్తి బాధ్యత అరుణనే తీసుకుంది కాబట్టి ఆమెకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.అందుకే ఈ నవలను ఆమెకే అంకితం ఇచ్చాను.

ప్రశ్న:15. నవల చదువుతున్నంత సేపు మీరు స్త్రీ పక్షపాతి లాగా కనిపిస్తారు. దాని కారణాలు ఏమైనా ఉన్నాయా?
ఎంత పెద్ద వాళ్ళయినా వాళ్ళ చిన్నతనంలో తల్లి దగ్గరే పెరుగుతారు తల్లి చూపే ప్రేమను ఆస్వాదిస్తారు.ఇది సాధారణ విషయమే కానీ నా జీవితంలో నేను అందరికంటే కొంచెం ఎక్కువగా తల్లి దగ్గరే గడిపాను. ఎందుకంటే నాకు చూపు లేదు కాబట్టి బయట ఆడుకోలేను. అందువల్ల ఇంట్లోనే ఎక్కువ ఉండేవాణ్ణి. మా అమ్మనే నన్ను జాగ్రత్తగా చూసుకునేది.అమ్మలోని తియ్యదనం అర్థమైందప్పుడు. నా జీవితంలో రేడియో ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది.ఆమె రేడియోలో మాట్లాడిన మాటల ద్వారా నేను ఎంతో ఉత్తేజం పొందేవాన్ని. ఎప్పుడు బాధ కలిగినా ఆమె మాటలు వింటూ సాంత్వన పొందేవాన్ని. నాలోని చాలా ఊహలకి కారణం ఆమె తీయనైన మాటలే. బహుశా ఇది కూడా ఇంకొక కారణం అయి ఉంటుంది.ఇక నాకు చిన్నతనంలో ఎక్కువగా అక్కయ్యలతో గడపడం వలన స్త్రీల మనస్తత్వాన్ని దగ్గరగా చూసి అవకాశం కలిగింది. నిజానికి స్త్రీ మన జీవితాల్లో అక్కగా, చెల్లిగా,అమ్మగా,భార్యగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తుంది.మనం ఏ విషయమైనా ముందు అమ్మతో చెప్తాము. నేను ఇంకెక్కువ ఎందుకంటే నాకు మా నాన్నంటే భయం. నేను ప్రతి విషయాన్ని అమ్మతో పంచుకునేవాన్ని. మా అమ్మ నా సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేసేది అప్పుడు అమ్మ మీద మంచి అభిప్రాయం కలిగింది. నా చిన్నతనంలో మా ఇంటికి చుట్టుపక్కల ఉండే స్త్రీలు వచ్చి తమ బాధలన్నింటిని మా అమ్మతో పంచుకునేవారు. నేను ఇంటి పై గదిలోనుండి వినేవాడిని.అదేవిధంగా పంచాయతీ కోసం మా నాన్నగారి దగ్గర ఎప్పుడూ జనాలు ఉండేవారు అందులో ఎక్కువ మంది తమ భర్తల చేత బాధింపబడ్డ స్త్రీలే….వాళ్ల గోడు విన్నప్పుడు నా మనసు చివుక్కుమనేది. ఆడవాళ్లు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటారా? ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా వాళ్లు మళ్లీ భర్త కోసం,పిల్లల కోసం ఆలోచిస్తారు. వాళ్ళది ఎంతో గొప్ప మనసు అని అనుకునేవాన్ని. అలా స్త్రీల పట్ల నాకు జాలి వేసేది,తర్వాత గౌరవం పెరిగింది. సాధారణంగా మగవాళ్ళు బయట పని చేసి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ స్త్రీలు బయట కూలి పనికి వెళ్లి వచ్చి మళ్లీ ఇంటికి రాగానే ఇంటి పనులు చూసుకుంటారు. నిజానికి వాళ్లు కుటుంబంకోసం యంత్రంలాగ పనిచేస్తారు. వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.వారి ఓపికకు జోహార్లు. నాకు స్త్రీల జీవితం ఎంతో ప్రేరణనిచ్చేది. ఎందుకంటే వాళ్లు గృహబంధీలుగానే ఉంటారు, నేనూ గృహబంధీనే . వాళ్లకి లేని బాధలు నాకెందుకు అనుకునేవాన్ని నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు వాళ్ళతో పోల్చుకొని కొంత సంతృప్తి పడేవాడిని. నా జీవితంలో అడుగడుగునా నాకు ఎక్కువగా సహాయపడింది స్త్రీలే.అంతెందుకు ఈ నవల బయటకు రావడానికి కారణం కూడా ధూళిపాల అరుణ మరియు వల్లిలే కారణం కదా ! అందువలన నేను స్త్రీపక్షపాతిలాగా కనిపిస్తాను.

ప్రశ్న:16. ఈ నవలలో మీరు భగ్న ప్రేమికులుగా కనిపిస్తారు. మరి మీ ప్రేమ విఫలం కావడంలో కులం పాత్ర ఏమిటి? అసలు కులం పైన మీ అభిప్రాయం ఏమిటి?
ఆర్యుల రాకపూర్వం కుల వ్యవస్థ ఇంత ఉండేది కాదు.వాళ్ళువాళ్ళ మనుగడ కోసం ఈ కుల వ్యవస్థను సృష్టించారు. వాళ్ళు మనుస్ర్మతిలో అన్ని అంశాలను వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు.విభజించి పాలించడానికి పునాదులు వేసింది వాళ్లే.ఇది నేడు శాఖోపశాఖలుగా విస్తరించి కూలకుండా తయారైంది. నా ప్రేమ విఫలంకావడంలో కూడా కులం ముఖ్యమైన పాత్ర వహించింది. నేను చదువుకుంటున్న రోజుల్లో నా వద్దకు మా వాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నేను మొదట వద్దన్నాను. ఎందుకంటే నాకు నా ఊహ సుందరి రేడియో ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్ వుండనే ఉంది. ఆమె మాటలే నాకు ఎప్పుడు స్ఫూర్తినిచ్చేవి. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే అలా బాగా మాట్లాడే అమ్మాయిని చేసుకోవాలని కోరిక ఉండేది, అమ్మాయిల్లో అలాంటి ధైర్యం,అలాంటి మంచి స్వభావం,ఉండాలన్నదే నా కోరిక. ఆ స్వభావాలు ఆంధ్ర అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తాయని నా భావన. అలాంటి అమ్మాయిలు తెలంగాణలో దొరకదనేది నా నమ్మకం.నేను పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో నాకు కొంత స్పష్టత ఉంది. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి నాకు పుస్తకాలు చదివి పెట్టాలని,నాకు ధైర్యం చెప్పాలని,నా అంధత్వాన్ని అంగీకరించాలని అనుకున్నాను. అలాంటి అమ్మాయి దొరికితే మాత్రమే పెళ్లి చేసుకుంటాను అన్నాను.అప్పుడు మా గుమాస్తా హనుమంతయ్య మా ఇంటి పక్కన సంబంధం గురించి చెప్పాడు ఆ అమ్మాయి పేరు సాధన. వాళ్ళ నాన్న నర్సింగరావు, వెలమ కులస్తుడు.మా నాన్నగారితో చాలా స్నేహంగా ఉండేవాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది మా అమ్మతో చాలాసేపు మాట్లాడేది. అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు కానీ పెళ్లి ప్రస్తావన రాగానే కొంచెం ఆమె మాటల మీద ఆసక్తి పెరిగింది . ఆ అమ్మాయిలో నేను అనుకున్న లక్షణాలు పూర్తిగా ఉన్నాయని తెలిసింది. బాగా గమనించి రెండున్నర సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒప్పుకున్నాను.ఆ సమయంలో ఆమెతో జీవితం ఎలా ఉంటుందో ఊహించుకున్నాను, ఊహల్లో బతికాను,ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను,ఇక సాధనే నా సరస్వము అనుకున్నాను. ఇక తీరా పెళ్లి పీటలెక్కే సమయంలో ఒక రెడ్డి కుల సంబంధం వచ్చింది,వాళ్ళు పేదవాళ్లు వెంటనే మా పెద్దవాళ్లు ప్రధానంగా మా బావ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు .రెండున్నర సంవత్సరాల నా ప్రేమని ముక్కలు చేసి తలవంచుకుని వేరొక అమ్మాయి మెడలో తాళి కట్టమంటున్నాడు. అంటే నా అభిప్రాయాలపై వాళ్లకి గౌరవం లేదు అనుకున్నాను. వాళ్లకు కావాల్సింది కులమే. నేను ప్రేమించిన సాధన వాళ్ళ నాన్నకు రెండవ భార్య కూతురు,మొదటిభార్య చనిపోతే రెండవ భార్యగా బలిజకులస్తురాలిని పెళ్లి చేసుకున్నాడు. నాన్నమో వెలమ కులస్తుడు అమ్మేమో బలిజ కులస్తురాలు. కాబట్టి సాధనను కులం తక్కువ అన్నారు. అప్పుడు నేను మొదట్లో ఈ కులం గుర్తుకు రాలేదా ? అని ప్రశ్నించాను.వాళ్లు సమాధానం చెప్పలేదు. ఎవరు నా ప్రేమను అర్థం చేసుకోలేదు. పంచాయతీ పెద్ద చేత కూడా చెప్పి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు.అప్పుడు నేను మహాభారతంలో కూడా కులాంతర వివాహాలు చాలా ఉన్నాయని శూద్ర కులస్తురాలైన అరుంధతిని వశిష్ఠుడు పెళ్లి చేసుకోలేదా? అని ఎదురు ప్రశ్నించాను. ఆయన ఏమీ సమాధానం చెప్పలేక వెళ్లిపోయాడు. అదే సమయంలో నాకు ఉస్మానియా మెట్రిక్ పరీక్ష ఫీజు డేటు దగ్గర పడుతుంది ,ఫీజు కట్టాలి నేను పెళ్లికొప్పుకుంటే మా బావ డబ్బులిస్తాడు, మా కుటుంబ సభ్యులు నాకు సహాయంగా ఉంటారు. లేకుంటే లేదు. మరేం చేయాలి అని నేను ఒక మూడు రోజులు విపరీతంగా మదనపడ్డాను. నిద్ర సరిగ్గా పట్టలేదు. భూమి బద్దలవుతున్నట్టు అనిపించింది.మనసు పడ్డ అమ్మాయిని వదిలి కులం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా…ఊహించుకోలేకపోయాను. కానీ చివరికి మా పెద్దవాళ్ల అధికార దర్పమనే ఖడ్గానికి నా ప్రేమ ముక్కలైపోయింది. చివరికి రెడ్డి కులస్తుల అమ్మాయి తోనే నా పెళ్లి జరిగింది.జూదంలో ధర్మరాజు ద్రౌపదిని బలి చేసినట్టు నేను కూడా ఈ కులభూతానికి నేను ప్రేమించిన అమ్మాయిని బలి చేశాననిపించింది. నాకు మొదటి నుంచి కులం మీద మంచి అభిప్రాయం లేదు.ఎందుకంటే అది మనుషులను వేరు చేస్తుంది. నిజానికి నేను ఒక హరిజన అమ్మాయిని లేదా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను .ఎందుకంటే వాళ్ళ లోపల జాలి,దయ ఎక్కువగా ఉంటాయి.రెడ్డి కులస్తులకు అధికార దర్పం ఉంటుంది, అహంకారం ఉంటుంది. నేను లెక్చరర్ గా పని చేస్తున్నప్పుడు కూడా నన్ను క్లాస్ రూమ్ కి ఎక్కువగా తీసుకెళ్లింది నిమ్నకుల అమ్మాయిలే. కాబట్టి వాళ్ల మీద నాకు మంచి అభిప్రాయం ఉండేది. ఈ విధంగా కులం వేసిన కాటుకు నేను బలైపోయాను. ఈ కులం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే మనిషి మనిషిగా నిలబడతాడు.

ప్రశ్న:17 మీ నవల చదువుతుంటే “అల్పజీవి,అంపశయ్య” నవలలు గుర్తొచ్చాయి,వాటిలో ఉండే చైతన్య స్రవంతి శిల్పమే కొంతవరకు మీ నవలలోపల కనిపించింది.అది అనుకొని ఆ పద్దతిలో రాశారా ? లేక అనుకోకుండా మీ నవలలో చేరిందా?

సాధారణంగా చాలా నవలల్లో అధ్యాయాలు ఎక్కువగా ఉంటాయి‌. ఉదాహరణకి “ప్రజల మనిషి” నవలలో 20 అధ్యాయాలు ఉంటాయి. ఆ నవల మొత్తం 150 పేజీల్లో ముగుస్తుంది. నా నవలకు వచ్చేసరికి ఇది దాదాపుగా 500 పేజీలు ఉంటుంది కానీ అందులో 11 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. అంటే ఒక్కో అధ్యాయంలో 50 పేజీల వరకు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక అంశాన్ని వివరించేటప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పాల్సి వచ్చింది. ఉదాహరణకి బెల్లం గురించి చెప్పేటప్పుడు ఆ బట్టిల గురించి ప్రస్తావించడం,తయారు చేసే విధానాన్ని కూలంకషంగా చెప్పడం, అలాగే పద్మశాలీల మగ్గం గురించి వివరంగా చెప్పడం,పండగల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పండుగ నేపథ్యం ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు ?ఎలా జరుపుకుంటారు? అనే విషయాలను వివరంగా చర్చించడం వల్ల అంత పెద్దగా అయింది.అయితే నా మానసిక సంఘర్షణ గురించి చెప్పేటప్పుడు మాత్రం చైతన్య స్రవంతి శిల్పంలో చెపితే బాగుంటుందని అదే శిల్పాన్ని ఆశ్రయించాను. ఎందుకంటే ఆ శిల్పం పాఠకుల్ని తనతో పాటు తీసుకెళ్తుంది. రచయిత అనుభవించిన అనుభూతిని పాఠకులూ అనుభవిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాలలో నేను అనుకొని ఆ శిల్పాన్ని ఆశ్రయించాను.

ప్రశ్న:18 మీకు నచ్చిన ప్రాచీన కవులు మరియు ఆధునిక కవులు ఎవరు?వాళ్లు ఎందుకు నచ్చారు?

నాకు చిన్నతనంలో చదివే అలవాటు ఎక్కువ లేదు. ఎందుకంటే చదవడానికి మనిషి కావాలి కాబట్టి రేడియో ద్వారానే నాటకాలు,కథలు,నవలలు వినేవాడిని పెళ్లయిన తర్వాత నా భార్య జ్యోతి ఎన్నో పుస్తకాలను చదివి వినిపించేది.నాకు ప్రాచీన సాహిత్యంకంటే ఆధునిక సాహిత్యమన్నా,సాహిత్యకారులన్నా చాలా ఇష్టం. రాసిన రామాయణ,మహాభారతాల్లో స్త్రీని తక్కువ చేసినట్టనిపించింది. ఉదాహరణకు: సీతను రాముడు అగ్ని ప్రవేశం చేయమనడం,భారతంలో ద్రౌపదిని ధర్మరాజు జూదంలో పెట్టడం లాంటివి బాధ కలిగించే విషయాలు. ఆధునిక కాలంలో గురజాడ అప్పారావు గారు సంఘంలోని లోపాలను ఎత్తిచూపాడు,సంస్కరణలకు బాటలు వేశాడు ,కన్యాశుల్కంలో,ముత్యాల సరాలలో బాల్య వివాహాలను తప్పని ఎత్తి చూపాడు. దేశభక్తి గేయంలో అద్భుతంగా దేశభక్తిని ప్రతిబింబించాడు,అది ఏ దేశానికైనా వర్తించే దేశభక్తి గేయం. ఇలా గురజాడ తన అభ్యుదయభావాలతో తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశాడు. అలాగే రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం ద్వారా అద్భుతమైన సాహిత్యాన్ని సృజించాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వంతో ఓలలాడించాడు. సి నారాయణ రెడ్డి గారి కవిత్వంలో ప్రణయతత్వం ఉంటుంది,అతని నాగార్జున సాగరం చాలా బాగుంటుంది. అలాగే కర్పూరవసంతరాయలు కావ్యంలో లకుమ త్యాగాన్ని గొప్పగా చిత్రించాడు. అదేవిధంగా దాశరధి లోని ఉద్యమ తత్వం నన్ను బాగా ఆకర్షించింది.అతను రాసిన అగ్నిధార, రుద్రవీణ నాపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. ఆ కాలంలో నిజాముకు వ్యతిరేకంగా కవిత్వాన్ని అలా రాయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. దాశరథిలోని ఉద్యమ తత్వం నాకు చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు రాస్తున్నవాళ్ళలో నందిని సిధారెడ్డి గారి కథలంటే నాకు చాలా ఇష్టం.అతని బందారం కథలలో స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది, అంతరించిపోతున్న కులవృత్తులు కనిపిస్తాయి, కథ సూటిగా స్పష్టంగా చెప్తాడు.అలాగే కందుకూరి శ్రీరాములు గారి కవిత్వం అంటే కూడా ఇష్టమే.

ప్రశ్న:19 మీరు భవిష్యత్తులో కూడా ఈ నవల ప్రక్రియనే కొనసాగిస్తారా లేదా మరేదైనా ప్రక్రియలో రచనలు చేపడతారా?

నేను ప్రస్తుతం అయితే ఈ నవల ట్రయాలజీని పూర్తి చేయాలనుకున్నాను. నా నవల మూడు భాగాలుగా వస్తుంది. ప్రస్తుత భాగం ఒకటవది. ఇది పుట్టినప్పటి నుండి కాలేజీ చదువు పూర్తి అయ్యేంతవరకు వుంటుంది. ఇక రెండవ భాగం ఉద్యోగ జీవితం. మూడవ భాగం రిటైర్మెంట్ తర్వాత జీవితం వీటిని పూర్తి చేయడంకోసం కసరత్తు జరుగుతుంది. ఇవి పూర్తయ్యాకే వేరే ప్రక్రియ లో రాయడానికి ఆలోచిస్తాను. నా నవల చదువుతున్నప్పుడు నందిని సిధారెడ్డి గారు ఏమన్నారంటే ఈ నవలలో కొన్ని “కథా లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు కథలు కూడా రాయగలవు వీలైతే రాయి” అని సలహా ఇచ్చాడు. అలాగే కందుకూరి శ్రీరాములు గారు కూడా నన్ను కథలు రాయమని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నవలల్ని పత్రికలు ప్రచురించడం తక్కువైంది కథలైతే ప్రచురించే ఆస్కారం ఎక్కువ అన్నారు. నేను కూడా ఆలోచిస్తున్నాను కవిత్వం రాద్దామంటే కొంత దృశ్యం చూడగలగాలి అది అసాధ్యం. కవిత్వం మెరుపు వంటిది అది క్షణకాలం ఉండి వెళ్ళిపోతుంది కథనైతే వెన్నెల లాంటిది చాలాసేపు నిలవగలుగుతుంది. కథ అయితే బాగా రాయొచ్చు అనే నమ్మకం నాకు వచ్చింది.కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కథలు రాస్తాను.

ప్రశ్న:20 ఈ నవల రాయడంలో,మీ సాహిత్య అధ్యయనంలో,మీ జీవితంలో,మీ సహచరి యొక్క పాత్ర ఏమిటి ?

నా జీవితంలో నా సహచరి జ్యోతిప్రభ పాత్ర ఎంతో ముఖ్యమైనది. నేను చదువుకునేటప్పుడు సబ్జెక్టు పుస్తకాలను చదివిపెట్టేది. నవలలు కూడా చదివి పెట్టేది.అలాగే నోట్స్ కూడా డిటెక్ట్ చేస్తే రాసేది, పరీక్షలు రాస్తున్న సమయంలో కూడా బాగా సహకరించేది.నా ఉద్యోగ ధర్మంలో ఆమె సహకారం మరువలేనిది. నేను ఈ నవలను ముందుగా బ్రెయిలీ స్క్రిప్టులో రాసుకున్నాను, నేనే వాయిస్ రికార్డ్ చేశాను కాబట్టి ఈ నవల రచనలో ఆమె పాత్ర అంతగా లేదు కానీ మిగతా జీవితంలో అన్నీ తానే అయింది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం చిన్నమాటే అవుతుంది.

ప్రశ్న:21 ఇప్పుడొస్తున్న కొత్త రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
ఇప్పుడు చాలామంది యువకులు తమ కలాలను కదుపుతున్నారు.అయితే వాళ్లు ముందుగా గుర్తుంచుకోవాల్సింది అధ్యయన,దర్శనం,వర్ణనం.వాళ్లు ప్రథమంగా చేయాల్సింది తమ సీనియర్ రచయితల రచనల్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి కనిపిస్తుంది ఉదాహరణకి వాసిరెడ్డి సీతాదేవి గారి “మట్టి మనుషులు” నవలలో వాస్తవికత ఎక్కువగా ఉంటుంది.యుద్దనపూడి సులోచనారాణి గారి నవలల్లో కూడా వాస్తవికత ఉంటుంది కానీ దానికంటే ఎక్కువగా కల్పనలు ఉంటాయి. ఈ వాస్తవికతే పాఠకులకు త్వరగా చేరువౌతుంది. కాబట్టి కొత్త రచయితలు ఎక్కువగా వాస్తవిక చిత్రణ కోసం ప్రయత్నించాలి. ఆధునిక సాహిత్యమే కాకుండా ప్రాచీన సాహిత్యాన్ని కూడా విస్తృతంగా చదవాలి. ప్రాచీన కవులలో నన్నయది కథనాత్మకశైలి, తిక్కనది నాటకీయ శైలి,ఎర్రనది వర్ణణాత్మకశైలి. ఇలా ప్రతివారి శైలిని గమనించి వస్తువుకు ఏది బాగుంటుందో దాన్ని ఎన్నుకోవాలి.మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం వ్యవసాయం చేసేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. పొలం దున్నేటప్పుడు, నాట్లువేసేటప్పుడు, పంట కోసేటప్పుడు, వడ్లు ఎత్తేటప్పుడు, ఇలా అడుగడుగునా కాయ కష్టం ఉంటుంది.ఎక్కువగా శ్రామికులు వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసినట్లయితే ఎన్నో కథా వస్తువులు దొరుకుతాయి. వాటిని అక్షరబద్ధం చేయగలిగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాంటి కథలల్లో మట్టి వాసన వుంటుంది.అందువల్ల అవి అందరికీ చేరువౌతాయి. అలాగే అంతరించిపోయిన కులవృత్తుల గురించి కూడా అద్భుతంగా కథలు రాయొచ్చు.అవి వాస్తవ జీవితాలు కాబట్టి అందరూ త్వరగా అక్కున చేర్చుకుంటారు .కాబట్టి యువరచయితలు ఆ దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

ప్రశ్న:22 ఈ నవల మూడు భాగాలుగా వస్తుందన్నారు మరి రెండవ,మూడవ భాగాలు ఎప్పుడు వస్తాయి,వాటిని గురించిన విశేషాలు చెప్పండి.
ఈ నవలలోని మొదటి భాగం నా చదువు పూర్తయ్యే వరకు ఉంటుంది. రెండో భాగం నా ఉద్యోగ జీవితం గురించి ఉంటుంది .నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే ఉద్యోగం వచ్చింది కదా ఇక జీవితం హాయిగా ఉంటుందనుకుంటారు, కానీ అందరి జీవితం ఒకేలా ఉండదు కదా! నా 34 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎన్నో మలుపులు,ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో మధుర స్మృతులు ఉన్నాయి.నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భీమా రెడ్డి అనే విద్యార్థి నేను బాగా చెప్పడంలేదని నా పైన ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేశాడు. అప్పుడు ప్రిన్సిపాల్ నన్ను పిలిచి సబ్జెక్టు పైన ఇంకా పట్టు సంపాదించుకోవాలని చెప్పాడు. అది సరైన కారణం కాదు అని నా అంతరాత్మకు తెలుసు.ఆ సమయంలో నేను విపరీతంగా బాధపడ్డాను. నేను నమ్ముకున్నది అధ్యాపక వృత్తిని. ఇంకా నేర్చుకోవాలనుకున్నాను. ఇంకా బాగా చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత ఒక ప్రశ్న ఎదురయింది నేను సరిగా చెప్పకపోతే సెకండ్ ఇయర్ వాళ్లు కూడా కంప్లైంట్ చేయాలి కదా! మరి వాళ్ళు ఎందుకు చేయలేదు. తర్వాత కాలంలో నా పైన ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ అబ్బాయి నాతో సన్నిహితంగా మెలిగాడు అప్పుడు నేను అతడిని అడిగాను. ఎందుకు కంప్లైంట్ చేసావని అప్పుడు అతను ఏమన్నాడంటే “మిమ్మల్ని రోజు తీసుకురావడం ఇబ్బంది అనిపించింది” అని. నా టీచింగ్ లో లోపం లేకపోయినందుకు నాకు సంతోషమేసింది. అయినప్పటికీ నేను పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు మొత్తం పాఠమే కాకుండా చివరి 15 నిమిషాలు నేను విపులలో చదివిన కొత్తకొత్త కథలు చెప్పే వాడిని,వాళ్ళని చర్చలోకి తీసుకొచ్చేవాడిని అప్పుడు పిల్లల లోపల ఆసక్తి బాగా కలిగింది. నా క్లాసును ఆసక్తిగా వినడం వాళ్ళ అలవాటయింది. ఇలాంటి మధురస్మృతులు, సమస్యలు ఉద్యోగ జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి కాబట్టి వాటి గురించి ఒక భాగంగా రాయాలనుకున్నాను. నేను 2012లో రిటైర్ అయ్యాను ఆ తరువాత సమస్యలు ఏముంటాయని మీరు అడగవచ్చు, కానీ ఆ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను రిటైర్ అయ్యాక సొంతూరికి వెళ్లిపోయాను అక్కడ పొలం వ్యవహారాలు చూసుకున్నాను కొత్త విషయాలను చేరవేసే పరికరాలు, అవకాశాలు విపరితంగా పెరగడంతో కొత్త విషయాలు నేర్చుకోవడంలో నిమగ్నమయ్యాను ఆ విషయాలన్నింటినీ మూడో భాగంగా (రిటైర్మెంట్ తరువాతి జీవితం 2012- 2022 వరకు)తీసుకు వస్తున్నాను. దాంతో ఈ నవల సమాప్తం అవుతుంది. నా నవల రెండవ భాగం ఈ సంవత్సరం (2023)చివర్లో రావచ్చు. మూడో భాగం తర్వాత సంవత్సరంలో(2024) వస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి పనులను కూడా ధూళిపాల అరుణనే చూసుకుంటుంది.

ప్రశ్న:23 మీరు మీ జీవితం ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటి?
జీవితం పూల పాన్పు కాదు. అందులో అంధుల జీవితం అసలే కాదు. ఎవరికైనా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. ప్రతి ఒక్కరూ ఒక గమ్యాన్ని ఏర్పరుచుకోవాలి. నిరంతరం ఆ గమ్యాన్ని చేరుకోవడం గురించి ఆలోచించాలి. అప్పుడే గమ్యాన్ని చేరుకోగలం. గమ్యం చేరడం కోసం చేసే ప్రయత్నం లోనే జీవితం విలువ తెలుస్తుంది. అవి ఇతరులకు పాఠాలుగా నిలుస్తాయి. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో చేయాలి. నిరంతరం జ్ఞాన సంపాదన కోసం కృషి చేయాలి. జ్ఞానవంతులని ఈ సమాజం గౌరవిస్తుంది.ఆదరపుర్వకకమైన మాటలే మనకు సన్నిహితుల్ని పెంచుతుంది. నేను డిగ్రీ లెక్చరర్ గా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో రీప్రెషరీ కోర్సు చేయడం కోసం 25 రోజులు అక్కడే ఉన్నాను. కొత్త వాతావరణం కాబట్టి నేను కొంత ఇబ్బంది పడ్డాను.అప్పుడు అప్పటివరకు పరిచయం లేని సహాధ్యాయినిలు ఝాన్సీ,మోహన శ్రీ గార్లు నన్ను చేతి పట్టుకొని సెమినార్ హాల్ కి తీసుకువెళ్లేవారు. నేను చాలా ఆశ్చర్యపోయాను నాలో వారు ఏం గమనించారో ఏమో కానీ వాళ్లు నాపైన ఎంతో అభిమానం చూపించారు.తర్వాత వాళ్ళు నాకు మంచి మిత్రులుగా మారిపోయారు.ఆ సమయంలో ఎంతో సహాయం చేసిన వారిద్దకి ధన్యవాదాలు.
ఈ సందర్భంగా చెప్పే మరొక విషయం ఏమిటంటే అంధుల సాహిత్యం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి.మొన్న నందిని సిద్ధారెడ్డి గారు ఉత్తర భారతదేశంలో జరిగిన సాహిత్య సభలకు వెళ్లి వచ్చారు. అక్కడ చాలామంది సాహితీ కారులను కలుసుకున్నారు.అక్కడ భిన్నమైన సాహిత్యం చర్చకు వచ్చిందట. అక్కడ అంధుల సాహిత్యం లేదని అన్నప్పుడు నాకు బాధ కలిగింది .అంధులు కూడా అద్భుతమైన సాహిత్యం సృజిస్తారు. వాళ్లను ఆదరించాలి,గౌరవించాలి. వాళ్లకు చూపు లేకపోయినా వాళ్లు సాహిత్యంతో సమాజానికి దారి చూపగలరు. వాళ్లను, వాళ్ల సాహిత్యాన్ని ఇకనైనా ఆదరిస్తారని నమ్ముతున్నాను.ఇక సెలవు.

July 13, 2023 144 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us