మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

నమిలికొండ బాలకిషనరావు గారికి నివాళి

by పొట్లపల్లి శ్రీనివాసరావు April 2, 2023
written by పొట్లపల్లి శ్రీనివాసరావు

.ఐదు దశాబ్దాల సాహితీ శిఖరం … కవి న్యాయవాది నమిలికొండ బాలకిషన్ రావు (జననం 6-9-50చివరి శ్వాస 30-3-2023) మధ్యాహ్నం హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికి పరిమితమయ్యారు
హనుమకొండలో నమలికొండ సాహితీపరుల కొండంత అండదండగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం.చైతన్య సాహితి ,సాంస్కృతిక సమాఖ్య,సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం,కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులుగా,రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం క్రియాశీల సభ్యుడిగా విశేష సేవలు అందించారు.ప్రసారిక మాసపత్రిక ద్వారా నూతనతరానికి వేదిక కల్పించాడు.

06 సెప్టెంబరు కరీంనగర్ జిల్లా పూడూరులో నమలికొండ నారాయణరావు రత్నబాయి దంపతులకు జన్మించారు,
ఎం. ఏ, ఎల్ .ఎల్. బి, పట్టభద్రుడైన బాలకిషన్ హనుమకొండ లో న్యాయవాద వృత్తి చేపట్టారు, వర్ధమాన రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1982లో ప్రసారిక అనే మాసపత్రికను స్థాపించారు,

నమలికొండ బాలకిషన్ ప్రసారిక పత్రికతో పాటు తన స్వీయ రచనలైన యువస్వరం (1981) అక్షర చిత్రాలు (1986) శాంతి సమత (1989) అక్షరాల్లో అనంతం (1990) అక్షర ప్రతిబింబం (2006) ప్రసారకీయ కుసుమాలు(2010), మొదలైనవి వెలువరించారు,
షష్టిపూర్తి సందర్భంగా
శ్రీరంగస్వామి సంపాదకత్వంలో “బాల గోకులం అక్షర వసంతం” అనే ప్రత్యేక సంచిక వెలువడింది… మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్బం లో సుక్కపొడుపు సంకలనం సాహితిసమితి ద్వారా ప్రకటించారు.
బహుశా మలిదశ ఉద్యమానికి ఇదే తొలి సంకలనం అనుకుంటాను.
సాహితీ సమితి వేదిక ద్వారా నమలికొండ అధ్యక్షులుగా నేను (పొట్లపల్లిశ్రీనివాసరావు) కార్యదర్శిగా మరికొందరం కలిసిఅనేక సభలు సమావేశాలు కవి సమ్మేళనాలు నిర్వహించి పుస్తక ప్రచురణలు కావించాము.రాష్ర్ట వ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాహితీ ప్రయాణం చేసాము.
ప్రముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన ఇక్కడి కవులకు చాలామందికి సాహితీ సమితి ఒక వేదికగా నిలిచింది.ఇందుకు బాలకిషన్ రావు గారి కృషి, ప్రోత్సాహము ,ప్రేరణ,వితరణ మాటలతో చెప్పలేనిది.
దేవులపల్లి రామానుజ రావు,చేతన వార్త కవులు,కాళోజి సోదరులతో,ప్రత్యక్ష పరిచయం ,విడదీయరాని అనుబంధం నమలికొండ గారిది.సాహితీ సభలకు నభారా ఒక ఎస్సెట్ గా ఉండేవాడు.వివాదరహితుడు సాహితీపోషకుడు నమిలికొండ ఇక లేరు అన్న వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.నమిలికొండ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ…ఇలాంటి విపత్కర పరిస్థితి నుండి త్వరగా వారంతా కోలుకోవాలనికోరుకుంటూ…నభారాకు నివాళి.

April 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

పులిస్వారీ

by Gannavarapu Narsimha Murty March 31, 2023
written by Gannavarapu Narsimha Murty

ఆ రోజు మాధ‌వ్ ఆఫీసుకొచ్చేస‌రికి “స‌ర్కిల్ ఇన‌స్పెక్ట‌ర్  గౌతమ్ ని ఎవరో దారుణంగా హత్యచేసారన్న పిడుగు లాంటి వార్త తెలిసింది. మాధ‌వ్‌, గౌత‌మ్ ఇద్ద‌రూ పోలీసు శాఖ‌లో ఒకేసారి ఎస్సైలుగా చేరారు. ఇద్ద‌రూ ఒకే కాలేజీలో డిగ్రీ చ‌దివారు. గౌత‌మ్‌కు పోలీసు శాఖ‌లో చాలా స్ట్రిక్ట్   పోలీసు ఆఫీస‌ర్ అన్న పేరుంది…

మాధ‌వ్ వెంట‌నే  డీయ‌స్పీ రఘుని  క‌లిశాడు.

“చాలా ఘోరం జ‌రిగిపోయింది మాధ‌వ్‌… ఇలా జ‌రుగుతుంద‌నీ మేమెవ్వ‌రం అనుకోలేదు“ అన్నాడు రఘు.

“ సార్ ! మీరెవ్వ‌రూ అనుకోలేదు గానీ మా బేచ్‌లోని వాళ్ళంతా అత‌ని ప్రాణానికి ముప్పు ఉంద‌నీ  అనుకుంటునే  ఉన్నాము“ అన్నాడు మాధ‌వ్‌.

“మీ కెందుకొచ్చిందా అనుమానం…? అలాంట‌ప్పుడు ఎస్పీ గారికి గాని, నాకు గానీ ఆ విష‌యం ఎందుకు చెప్ప‌లేదు“ అన్నాడు  రఘు.

“సార్‌! మీరు 20 సంవ‌త్స‌రాల నుంచి పోలీసు శాఖ‌లో పనిచేస్తునారు. ఇక్క‌డ స‌మ‌స్య‌ల‌న్ని మీకు తెలుసు. మొన్న‌టి దాకా గౌత‌మ్ ఎన్నో సెన్సిటివ్ పోస్ట్‌ల‌లో ప‌నిచేసాడు. కొన్నాళ్ళు ఏంటీ న‌క్స‌ల్ స్వాడ్‌లో, కొన్నాళ్ళు సీఐడీలో, మరి  కొన్నాళ్ళు టౌన్ సీఐగా, కొన్నాళ్ళు లా అండ్ ఆర్డ‌ర్లో  ప‌నిచేసాడు. అత‌ని ముక్కు సూటిత‌నం ,ఎవ‌రికీ త‌ల‌వంచ‌ని మనస్తత్వాలవల్ల   ఎందరికో శత్రువయ్యాడు; ఏసీబీలో  ఉన్నప్పుడు  అవినీతి ప‌రుల గుండెల్లో నిద్ర‌పోయాడు. టౌన్ సీఐగా ఉన్న‌ప్పుడు రౌడీలు, ఎమ్మెల్యేల అనుచ‌రుల ఆగ‌డాల‌ను అణిచివేసి క‌ట‌క‌టాల్లోకి  నెట్టాడు. అంత‌ర్రాష్ట దొంగ‌ల భ‌ర‌తం ప‌ట్టాడు. కాలేజీ అమ్మాయిల‌ను ఏడిపించే  వాళ్ళ‌ను న‌గ‌ర బహిష్కరణ  చేయించాడు. స్మ‌గ్ల‌ర్ల‌ను ఉక్కుపాదంతో అణిచివేసాడు. ఈ చ‌ర్య‌ల వల్ల ఎంద‌రో శత్రువుల‌ను మూట‌కట్టుకున్నాడు. అటువంటి వాడిని ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా ఆఫీసులో వేసి అత‌ని అధికారమ‌నే కోర‌ల్ని పీకేసింది.. దాంతో    శత్రువులు కక్ష గట్టి  అతన్ని హత్య చేశారు;“ అన్నాడు మాధ‌వ్‌.

“నువ్వు చెబుతున్న‌ది ఆశ్చ‌ర్యంగా ఉంది.  అత‌న్ని ఆఫీసులో వెయ్య‌డానికీ, హ‌త్య‌కూ  సంబంధం ఏంటి? నువ్వు బోడిగుండుకీ,  మోకాలికీ ముడిపెడుతున్నావు“ అన్నాడు ర‌ఘు ;

“సార్‌! నేను స‌రిగ్గానే చెప్పాను. మీకు అర్ధం కాలేదో లేక  అర్థంకాన‌ట్లు   న‌టిస్తున్నారో తెలియ‌టం లేదు.. అత‌ను 10 సంవ‌త్స‌రాలుగా ఎంద‌రో సంఘ విద్రోక శ‌క్తులు, రౌడీల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు తీసుకొనీ వాళ్ళ‌కి కొర‌క‌రాని కొయ్యిగా త‌యార‌య్యాడు;ఇన్నాళ్లూ  ఫీల్డ్ పోస్ట్‌లో వున్న  రక్షణ వల్ల  వాడిని ఎవ్వ‌రూ ముట్టుకునే సాహ‌సం చెయ్యలేదు… ఎప్పుడైతే వాడిని ఆఫీసులో వేసారో వాడికి ర‌క్ష‌ణ క‌రువైంది. ఒక్క‌సారిగా  అడ‌విలోంచి బ‌య‌ట‌కొచ్చిన పులిలా త‌యారైంది వాడి ప‌రిస్థితి. అందుకే ఈజీ టార్గెట్ అయ్యాడు“ అన్నాడు మాధ‌వ్‌. 

“నీ ఉద్దేశ్యంలో ఆఫీసుకి ఎవ్వ‌ర్ని బ‌దిలీ చెయ్య‌కూడ‌దా? ఇదెక్క‌డి న్యాయం“ అన్నాడు ర‌ఘు ‌.

“సార్‌… చెయ్యొచ్చు. మాధ‌వ్ లాంటి స్టిక్ట్ ఆఫీస‌ర్ల‌ను మన పోలీస్ శాఖ సంవ‌త్స‌రాల‌కు సంవ‌త్స‌రాలు రౌడీలు, స్మ‌గ్ల‌ర్లు లాంటి సంఘ‌విద్రోహ శ‌క్తుల ఆట క‌ట్టించ‌డానికి బాగా వాడుకుని ఆ త‌రువాత వాళ్ళ క‌ర్మ‌కు వాళ్ళ‌ని వదిలేస్తుంది. అలా కాకుండా ప్ర‌తీ రెండేళ్ళ‌కు ట్రాఫిక్‌లోనో, ఆఫీసులోనే పోస్ట్ చేస్తే అప్పుడీ స‌మ‌స్య ఉండ‌దు. నేను  చెప్పిన విష‌యం అర్థం అయింద‌నుకుంటాను“ అన్నాడు మాధ‌వ్‌.

“అర్థం అయింది మాధ‌వ్‌… నువ్వు చెప్పింది వింటే నిజ‌మే న‌నిపిస్తోంది. బ‌దిలీ చేసే ముందు ఇవ‌న్నీ ఆలోచించాలి లేక‌పోతే మ‌నం మ‌రింత మంది మంచి ఆఫీస‌ర్ల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది“ అన్నాడు ర‌ఘు ‌.

“సార్‌! చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఏమిటి ఉప‌యోగం…? ఇప్పుడ‌త‌నికి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు.. ఇద్ద‌రూ డిగ్రీ చ‌దువుతునారు. అత‌ను నిజాయితీ అన్న పేరు త‌ప్పా ఇంకేమి సంపాదించుకోలేదు.. ఇప్పుడా కుటుంబం అత‌ని మ‌ర‌ణంతో వీధిన ప‌డుతుంది. అలా జ‌ర‌గ‌కుండా మ‌న శాఖ ఆదుకోవాలి… అత‌ని భార్య డిగ్రీ చ‌దువుకుంది. ఆమెకు వుద్యోగం ఇ‌చ్చి, ఆ పిల్ల‌ల్ని మ‌న డిపార్ట్‌మెంట్ చ‌దివిస్తే అత‌ని ‌ ఆత్మ శాంతిస్తుంది“ అనీ చెప్పాడు మాధ‌వ్‌.

“త‌ప్ప‌కుండా మాధ‌వ్… ఎస్పీ గారికి నేనీ విష‌యాల‌న్నీ చెబుతాను. మీరంద‌రూ కూడా అత‌న్ని క‌లిసి చెప్పండి. అత‌ని కుటుంబాన్ని త‌ప్ప‌కుండా ఆదుకుందాం“ అన్నాడు ర‌ఘు ‌;

ఆ త‌రువాత మాధ‌వ్ వెళ్ళిపోయాడు.

… … … … …                         … … … … …                        … … …

వారం త‌రువాత ఎస్పీ స‌క్సేనా గారి ద‌గ్గ‌ర్నుంచీ మాధ‌వ్‌కి త‌న‌ని క‌ల‌వాల‌నీ క‌బురొచ్చింది. ఆ సాయంత్రం అత‌ని ఛాంబ‌ర్‌కి వెళ్ళి క‌లిసాడు మాధ‌వ్‌;

ఎస్పీ  అప్పుడు ఛాంబ‌ర్లో వంట‌రిగా ఉన్నారు  .

 అతను  చిన్న‌వాడు. ఆరేళ్ళ క్రితం సివిల్స్ రాసి ఐపీయ‌స్ అయ్యాడు. ఎవ‌రికీ త‌ల‌వంచ‌ని వాడ‌న్న పేరుంది. ఇంత‌లో ఎటెండెంట్ వ‌చ్చి టీలు తెచ్చాడు. మాధ‌వ్ టీ తాగుతూ ఎందుకు త‌న‌ని ఎస్పీగారు పిలిచారోన‌ని ఆలోచించ సాగాడు.

ఇంత‌లో ఎస్పీగారు టీ క‌ప్పుని టేబుల్ పై పెట్టి “మాధ‌వ్‌! నిన్నెందుకు పిలిచానో తెలుసా?“ అనీ అడిగాడు.

మాధ‌వ్ త‌లఎత్తి అత‌ని వైపు ఆశ్చ‌ర్యంగా చూసాడు.

“మ‌న‌ది ఒడిషాకి బోర్డ‌ర్‌ జిల్లా కాబట్టి  ఈ మ‌ధ్య‌న గంజాయి స్మ‌గ్లింగ్ బాగా పెరిగిపోయింది. మొన్న ముఖ్య‌మంత్రి గారు డిజీపీ గారిని పిలిచి దాన్ని ఎట్టి ప‌రిస్థులుల్లోనూ అరికట్ట‌మనీ చెప్పారు. ఇప్ప‌టికే మ‌న రాష్ట ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్షాల‌తో పాటు మీడియా వాళ్ళంతా గంజాయిని అరిక‌ట్ట‌లేద‌నీ ఆరోపిస్తున్నారు… అది రాష్ట ప్ర‌భుత్వానికి లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంది. అందుకే డీజీపీ గారు ఆ గంజాయి స్మ‌గ్లింగ్‌ని అరిక‌ట్ట‌డానికి మంచి డైన‌మిక్ స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను పోస్ట్ చెయ్య‌మ‌న్నారు. మ‌న జిల్లాలో అటువంటి వాళ్ళు  న‌లుగురే ఉన్నారు. అందులో నువ్వొక‌డ‌వి  కాబ‌ట్టి నిన్ను అక్క‌డికి పోస్ట్ చేస్తున్నాను. నువ్వు వెంట‌నే ఛార్జి తీసుకొని దాన్ని అరిక‌ట్టే ప‌ని మొద‌లెట్టు“ అనీ చెప్పాడు…

అత‌ను చెప్పింది వినీ ఏం చెప్పాలో తెలియ‌క మాధ‌వ్ కొద్దిసేపు మౌనం దాల్చేడు. ఆ త‌రువాత తేరుకొని “ సార్‌! ద‌య‌చేసి న‌న్ను ఆ పోస్ట్‌లో వెయ్యొద్దు. నేను దానికి న్యాయం చెయ్య లేను…“అనీ అన్నాడు.

అత‌ని మాట‌ల‌కు ఎస్పీ సక్సేనా ఆశ్చ‌ర్య‌పోయి ముందుకు వంగి “ పోస్టు చెయ్య‌వ‌ద్దా? ఆశ్చ‌ర్యంగా ఉందే! ఇది నీ లాంటి మంచి ఆఫీస‌ర్లు అన‌వ‌ల‌సిన మాట‌ కాదు.. నువ్వు వ‌ద్ద‌న‌టానికి కార‌ణం?” అనీ అడిగాడు.

“సార్‌! వారం క్రితం నా కొలీగ్ గౌత‌మ్ హ‌త్య‌కు గుర‌య్యాడు. అత‌న్ని గంజాయి స్మ‌గ్ల‌ర్లో, రౌడీ షీట‌ర్లో చంపి ఉండొచ్చు. ఇంకా కేసు ప‌రిశోధ‌న‌లో ఉంది కాబట్టి వాస్తవాలు తెలియవలసి వుంది;. ఏదైనా అత‌ని వ‌ల్ల జైలు కెళ్ళిన నేర‌స్తులే హ‌త్య‌ చేసి ఉంటార‌న్న‌ది నిష్టుర స‌త్యం. అత‌న్ని మ‌న పోలీసు శాఖ అవ‌స‌ర‌మైనన్నాళ్లూ  బాగా వాడుకొని త‌రువాత వ‌దిలేసింది. ప‌ది సంవ‌త్స‌రాలు అత‌ను స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్‌గా, స‌ర్కిల్ ఇన‌స్పెక్ట‌ర్‌గా వివిధ శాఖ‌ల్లో ప‌నిచేసి నేర‌స్థుల‌కు చుక్క‌లు చూపించాడు… నేర‌స్తుల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు తీసుకునే పోలీసు ఉద్యోగం అంటే పులి మీద స్వారీ లాంటిది. ఆ పోలీసు ఆ పులి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఎప్పుడూ దానిమీద  స్వారీ చేస్తుండాలి… స్వారీ చేస్తున్నంత‌కాలం ఆ పులి అత‌న్ని ఏమి చేయ్య‌లేదు. కానీ పొర‌పాటున అత‌ను ఆ పులి మీద నుంచి కింద‌కు దిగాడో దానికి ఆహారం అవ‌క తప్ప‌దు..  గౌత‌మ్ మ‌న డిపార్టుమెంటు చేసిన బదిలీ వల్ల ఆ విధంగా కిందకు దిగీ నేర‌స్థుల‌న‌బ‌డే పులికి ఆహారం అయ్యాడు. పులి మీద అంటే అధికారం ఉన్న పోస్ట్‌లో ఉన్నంత‌కాలం అత‌న్నెవ్వ‌రూ ఏమి చెయ్య‌లేక పోయారు. ఆ విధంగా ఆ పులి  మీద అత‌ను స్వారీ చేస్తూ ఇన్నాళ్ళూ గ‌డిపాడు కానీ మ‌న‌వాళ్ళు అత‌న్ని ఆఫీసులో పోస్ట్ చేసారు. దాంతో అత‌ని అధికారం అనే రెక్క‌లు తెగిపోయిన జ‌టాయువులా మారిపోయి నేర‌స్తుల‌నే రావ‌ణుల బారిన ప‌డి చ‌నిపోయాడు.“ అనీ చెబూతూ ఆగాడు మాధ‌వ్‌.

అత‌ను చెబుతుంటే ఎస్పీ స‌క్సేనా శ్ర‌ద్ద‌గా  వింటున్నాడు.

“రేపు మీరు చెప్పిన‌ట్లు నేనా ఉద్యోగంలోకి చేరితే నా ప‌రిస్థితీ అంతే… నేను ప‌ద‌వీ విర‌మ‌ణ దాకా బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే న‌న్ను రక్షణ  ఉండే ప‌ద‌వుల్లో కొన‌సాగించాలి. అలా కాకుండా ఏరు దాట‌గానే తెప్ప త‌గ‌లేసిన‌ట్లు న‌న్ను ఆఫీసులో ప‌డేస్తే గౌత‌మ్ లాగే ఆ పులుల‌కి ఆహారం అయ్యే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి మీరు అలాంటి హామీ ఇస్తే నేను ఆ ఉద్యోగంలో చేర‌తాను. లేక‌పోతే నేను ట్రాఫిక్‌ లోనే కొన‌సాగుతాను. ద‌య‌చేసి ఇది అధికార ధిక్కారంగా భావించ‌కుండా నా వైపు నుంచి ఆలోచించ‌వ‌ల‌సిందిగా కోరుతునాను“ అనీ చెప్పి బ‌య‌ట‌కొచ్చేసాడు మాధవ్ ;        

                                                                       … … …

రెండు రోజుల త‌రువాత ఎస్పీ స‌క్సేనా మాధ‌వ్‌కి  ఫోన్‌చేసి పాత ప‌ద‌విలోనే కొన‌సాగ‌మ‌ని చెప్ప‌డంతో మాధ‌వ్ ఆనంద‌ప‌డ్డాడు.

(స‌మాప్తం)

March 31, 2023 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

తెలంగాణ కావ్య ప్రతిభ

by గురిజాల రామశేషయ్య March 18, 2023
written by గురిజాల రామశేషయ్య

గురిజాల రామశేషయ్యగారు కవిపండితులు. రాశేకలం గా తెలుగు సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. తెలుగు భాషాభిమానులు. ముఖ్యం గా మాతృభాష తెలుగు లోనే కాదు సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిష్ణాతులు.తెలుగు భాషాసాహిత్యాల బోధన లో నలభై ఏళ్ల పైబడిన అనుభవం కలిగినవారు. ముఖ్యంగా భాషా విషయికంగా వాక్య భేదాలు, సంధులు , సమాసాలు‌ , అలంకారాలు , ఛందస్సు వంటి వ్యాకరణ విశేషాలు అన్నీ ఔపోసన పట్టిన వారు. గేయ సాహిత్యం , ఆధునిక వచన కవితా వ్యూహనిర్మాణాలు తెలిసినవారు.
ఇవన్నీ ఉండగానే సరిపోదు. ఇటువంటి వారికి తమ సహాయాన్ని అడిగిన వారికి , సమాజం కోసం సాహిత్య పరంగా ఏదైనా సేవ చేయాలనే ఆలోచన తపన కూడా ఉండాలి… ఈ అంశాలు కూడా కలిగి ఉన్నవారు రామశేషయ్య గారు. కాబట్టే వీరు పాత తరం కొత్తతరం అనే భేద భావన లేకుండా అందరి రచనలూ బాగా అధ్యయనం చేస్తుంటారు .ప్రత్యేకంగా తమ ఇష్టానుసారం సమకాలీన సామాజిక కోణంలో విశ్లేషణ చేస్తూ స్పందిస్తూ ఉంటారు . ఇందులో భాగంగానే ఈ తెలంగాణ కావ్య ప్రతిభ శీర్షిక ద్వారా తెలుగు పద్యాలను , వచన కవితలను , సంస్కృత శ్లోకాలను పఠించి సంక్షిప్తంగా సమీక్ష చేస్తున్నారు . విని ఆనందించండి. సంపాదకులు మయూఖ

ఒద్దిరాజు సోదరుల పద్యం
దాశరథి రాజునందన చరిత్ర
గంగాదేవి
పాల్కురికి సోమనాథుడు
March 18, 2023 3 comments
1 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

ప్రముఖ పేరిణీ నాట్య కళాకారులు చేగొమ్మ పవన్ కుమార్ తో ముఖాముఖి

by Aruna Dhulipala March 18, 2023
written by Aruna Dhulipala

పవన్ కుమార్ గారు..నమస్తే…ఈరోజు మిమ్మల్ని ఇలా

కలుసుకొని మా పాఠకులకు పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను…

చెప్పండి….

1. మీరు ఎక్కడ జన్మించారు? మీ విద్యాభ్యాసం ఎక్కడ  జరిగింది? మీ తల్లిదండ్రుల వివరాలు చెప్పండి..

జ: అందరికీ నమస్కారాలు. ముందుగా పాఠకులందరికీ కళాభివందనాలు. నేను పుట్టింది హైదరాబాద్ లో కానీ మా నాన్నగారి స్వస్థలం ప్రస్తుత యాదాద్రి జిల్లా రామన్నపేట గ్రామం. నేను 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు అక్కడే చదివాను. తర్వాత నాట్యం నేర్చుకోవడానికి హైదరాబాద్ కి వచ్చాను.ఇక మిగిలిన విద్యాభ్యాసం అంతా ఇక్కడే కొనసాగింది.మా నాన్నగారి పేరు చేగొమ్మ రమేశ్ శర్మ. మా అమ్మగారి పేరు సుభద్ర. మా నాన్నగారు రామన్నపేట మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులుగా పని చేసారు. సుమారు 4,5 గ్రామాల్లో పౌరోహిత్యం చేసేవారు.

2. అసలు మీరు ఈ నాట్య రంగాన్ని ఎంచుకోవడానికి మీ పూర్వీకుల సంస్కారం ఏమైనా ఉందా? నాట్యం నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది?

జ: మా ఇంట్లో ఎవరు కూడా నాట్యం నేర్చుకున్నవాళ్ళు

లేరు. పూర్వీకుల నుండి వచ్చింది కూడా కాదు. కానీ మా కుటుంబమంతా కళాభిమానులు. ముఖ్యంగా నేను ఈ నాట్యరంగానికి రావడానికి కారణం సాగర సంగమం చిత్రం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సాగర సంగమం చిత్రం లోని కమలహాసన్ డాన్స్ చూసి ప్రభావితుడినై నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టాను. నా మూడవ ఏటనే ఆ చిత్రంలోని ఓం నమశ్శివాయ పాటకు అనుగుణంగా అడుగులు వేస్తుంటే మా తాతగారు (మా అమ్మగారి నాన్నగారు) మధ్వాచారి శ్యామ్ సుందరశాస్త్రి గారు, ధర్మపురి వాస్తవ్యులు, ఆయన ధర్మపురి సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసారు. ఆయన నన్ను ఎలాగైనా కళాకారునిగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో నన్ను హైదరాబాద్ తీసుకువచ్చారు. నాట్య శిక్షణ ఇప్పించారు.

3. మీరే కాకుండా మీ కుటుంబంలో ఇంకెవరైనా ఈ కళను నేర్చుకున్నారా?

జ: నేను కాకుండా మా ఇంట్లో మా పెదనాన్నగారి కూతురు కూడా కూచిపూడి నృత్యంలో డిప్లొమా చేసింది. కాకపోతే తనద్వారా అని చెప్పలేను. ఎవరి తోవ వారిదే. నేను నేర్చుకున్న పద్ధతికి, తన పద్ధతికి వ్యత్యాసం ఉంటుంది. ఇంక ఎవరూ లేరు.

4. ప్రముఖ నాట్యకారులు, భరత నాట్యానికే మకుటాయమానమైన నటరాజ రామకృష్ణ గారు మీ గురువులని విన్నాం…ఆ దిశగా మీ ప్రయాణం ఎలా జరిగింది?

జ : ముందు చెప్పినట్టుగా మా తాతగారు శ్యామ్ సుందర్   గారు 15, 20 రోజులు కారణ రీత్యా మా ఊరిలో ఉండవలసి వచ్చింది. అదే సమయంలో గ్రామస్తులు నా ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని చూసిన మా తాతగారు ఏ శిక్షణ లేకుండానే నా మనవడు ఇంత బాగా

చేయగలుగుతున్నాడు. ఇక శిక్షణ ఇప్పిస్తే ఒక మంచి కళాకారుడిగా ఉన్నత స్థానాన్ని పొందుతాడని, ఎలాగైనా నాట్యకళను అభ్యసింప చేయాలనే ఉద్దేశ్యంతో తన స్నేహితులైనటువంటి ప్రముఖ నటి జమున గారిని సంప్రదించడం, ఆమె సలహా మేరకు, ఆమె సహకారంతో వారి కుతురైన స్రవంతి, నేను ఒకేసారి నటరాజ రామకృష్ణ గారి వద్ద నాట్య శిక్షణ ప్రారంభించడం జరిగింది. 1986 లో ఆ మహనీయుని వద్ద తొలిపూజ జరిపించుకొని ప్రదర్శన ఆరంభించాను.

5. మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? విదేశాల్లో కూడా ఏమైనా ప్రదర్శించారా?

జ: ఇప్పటి వరకు సుమారుగా దేశ విదేశాల్లో కలిపి ఆంధ్రనాట్యం, పేరిణి, అర్ధనారీశ్వర రూపాలలో 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. విదేశాలలో అయితే అమెరికా, మలేషియా, దుబాయ్, శ్రీలంక, జపాన్ లలో అనేక ప్రదర్శనలు ఇచ్చాను. ఇక జపాన్ లో 15రోజులు కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడెమీ ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.

6.మీ నాట్య కళాభిమానాన్ని మీ భార్య, కూతురు కూడా వారసత్వంగా తీసుకున్నారని తెలిసింది…ఆ ఆసక్తి వాళ్ళల్లో ఎలా కలిగింది?

జ: నా వారసత్వంగా నా కూతురు నాట్యం నేర్చుకుంది. నా శ్రీమతి కాదు. ఆమె తన చిన్నప్పటి నుంచీ అంటే మూడేళ్ళ వయసు నుండే నాట్యాన్ని నేర్చుకుంది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నేను డాన్సర్ ని కావడం, తను కూడా అప్పటికే ప్రముఖ నర్తకి అయి ఉండడం వల్ల జీవిత భాగస్వామి డాన్సర్ అయితే బాగుంటుందనే ఇద్దరి అభిప్రాయాలతో మాకు పెళ్లి నిశ్చయం జరిగింది. మా వారసత్వంగా మా అమ్మాయి కూడా నాట్యం నేర్చుకొని మాతో పాటు ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తోంది.

7. పేరిణి శివతాండవంతో పాటు అర్ధనారీశ్వర రూపాన్ని అభినయించడం మీ ప్రత్యేకత. దీన్ని గురించి పూర్తిగా అర్థమయ్యేట్లు చెప్పండి…అది మీకు ఎలా సాధ్యమైంది?

జ: నేను ఆంధ్ర, పేరిణి ఈ రెండు నృత్యాలు నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే కళాకృష్ణ గారి శిక్షణ కూడా పొందాను. ఇవే కాకుండా కొంతకాలం కథక్, కూచిపూడి నేర్చుకున్నాను. అంతగా కాదు కానీ అవగాహన కోసం కొంత కొంత నేర్చుకున్నా. అయితే కళాకృష్ణ గారు ‘సప్త తాండవాలు’ అని తన ఆధ్వర్యంలో కొత్తగా ప్రదర్శించాలి అనుకొని ఆ కాన్సెప్ట్   డిజైన్ చేశారు. అందులో ఈ అర్ధనారీశ్వరం ఒకటి. దీన్ని ప్రదర్శించడానికి నన్ను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటినుండీ నాట్యం – లాస్యం, పేరిణి- తాండవం రెండూ చేయడం అలవాటు నాకు. అంటే అటు నవ జనార్దన పారిజాతం, ఇటు భామా కలాపం రెండింటిలో ఆడవేషం వేసేవాన్ని. రెండూ సమానంగా ప్రదర్శిస్తూ ఉండడం, నాకు ఆయన అర్ధనారీశ్వర నృత్యం నేర్పించడానికి ముఖ్య కారణం. ఆయన నన్ను ఎంచుకున్నందుకు, ఇప్పుడు నేను దాన్ని ప్రచారం చేస్తూ ప్రదర్శిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

అందరికీ తెలిసిన అర్ధనారీశ్వర ప్రదర్శన అంత సులువైంది కాదు. ఒకవైపు లాస్యం, మరోవైపు తాండవం రెండింటినీ ఏక కాలంలో, క్షణాల వ్యవధిలో అభినయం మారుస్తూ, ఇటు పార్వతి, అటు శివుని అనుకరిస్తూ వారి తత్వాన్ని చూపిస్తుండాలి.  మొదటి నుండీ స్త్రీలను గౌరవించడం నా లక్షణం. ముఖ్యంగా ప్రేరణ కలిగించింది ఏంటంటే శివుని తత్వం. ఎందుకంటే స్త్రీ సమానత్వాన్ని చాటుతూ తన శరీరంలోని అర్ధ భాగాన్ని భార్యకిచ్చి ఋజువు చేయడం జరిగింది. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి అద్భుతమైన తత్వాన్ని ప్రదర్శించడం నాకు ఎంతో ఇష్టం. అదే దిశగా వీలైనంత ఎక్కువగా దీన్ని ప్రదర్శించ డానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాను. భగవంతుని దయ వలన నా ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి అంతటి స్పందన రావడం, ఆప్రదర్శనలకే ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒక అర్ధనారీశ్వర కళాకారునిగా  గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది.

8. మీరు కాక ఈ నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా?

జ: అర్ధనారీశ్వర  నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు వున్నారు. లేరని కాదు. కానీ వేళ్లల్లో లెక్క బెట్టగలిగేంత మంది మాత్రమే వున్నారు. అందులో నాకు బాగా తెలిసినంతవరకు అర్ధనారీశ్వరం వెంకట్ మరియు వెంపటి చినసత్యం గారి అబ్బాయి వాళ్ళిద్దరి అర్ధ నారీశ్వర నృత్యం చూడడం జరిగింది. అయితే వారిద్దరూ కూచిపూడి సాంప్రదాయంలో ప్రదర్శిస్తారు. నాది నటరాజ రామకృష్ణ గారి పద్ధతి. అలా ఎందుకంటున్నానంటే ఇందులో సాహిత్యం గానీ జతులు గానీ ఆయన రూపకల్పన చేసినటువంటిది. ఆయన రచించిన ‘ పేరిణి శివతాండవం’ లో ఈ జతులు, సాహిత్యం మనం చూడొచ్చు. ఆయన శిష్యుడిగా ఇదే నేను చేసేది. కాబట్టి ఈ పద్ధతిలో  చేసే వాణ్ణి నేనొక్కడినే అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా ఉన్నారా అంటే ఉండొచ్చు. కానీ మంచి గుర్తింపు తెచ్చుకున్న వాణ్ణి మాత్రం నేనే. కళాకృష్ణ గారు 20 సంవత్సరాల క్రింద ఈ అర్ధ నారీశ్వర నృత్యాన్ని (ఇప్పుడు నేను ప్రదర్శిస్తున్న పద్ధతిలో) లండన్ టెలివిజన్ కోసం రికార్డింగ్ చేయించడం జరిగింది. దాన్నిఆయన లండన్ టెలివిజన్ కోసం ప్రదర్శించి, ఆ రికార్డింగ్ ని, ఆ కాస్ట్యూమ్స్ ని నాకు ఇవ్వడం జరిగింది.అప్పటినుండీ దాన్ని కొనసాగిస్తూ వాటిని ఆయన వారసత్వంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాను.

9. నాట్య శాస్త్రాన్ని అభ్యసించేటప్పుడు మీకు కలిగిన అనుభవాలు ఎలాంటివి?

జ: నాట్యం నేర్చుకోవడంతో అనుభవమంటే అదొక ప్రత్యేకమైన మార్గం. మిగిలిన విద్యలు అంటే ఉ:- సంగీతం. దీనికి గొంతు బాగా ఉండి, రాగాలు, తాళాలు, శ్రుతుల పైన పట్టు ఉంటే అద్భుతమైన కళాకారులు అవ్వొచ్చు. కాకపోతే నాట్యానికి అవన్నీ ఉండడంతో పాటుగా ఇటు శరీరాన్ని కూడా సరియైన పద్ధతిలో కదిలిస్తూ ఉండగలగడం, ముద్రలు, అభినయాలు ప్రదర్శించడం చాలా అవసరం. చతుర్విధ అభినయాల్లో ఏ ఒక్కటీ సరిగ్గా లేకున్నా ఆ ప్రదర్శన రక్తి కట్టదు. అందువల్ల ఆ చతుర్విధ అభినయాలు నేర్చుకోవడం వల్ల నాట్యం రాణించడమే కాక మన జీవితంలో ఎన్నింటికో కూడా అది ఉపయోగపడుతుంది. సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుంది. మనం వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. ముఖ్యంగా నాట్యంలో ఆహార్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల మనం ఎక్కడ ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎక్కడ, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా తయారవ్వాలి అన్నది తెలుస్తుంది. ఇంకొకటి సంస్కారం మెరుగు పడుతుంది. ఒక నాట్యమే కాదు. భారతీయ శాస్త్ర కళలు ఏవైనా అవి సంస్కారాన్ని పెంచుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.లలితకళలే కావొచ్చు, వాయిద్య పరికరాలే కావొచ్చు..ఏదైనా భారతీయ శాస్త్ర కళలు నేర్చుకున్నవారిలో అద్భుతమైన సంస్కారం కనిపిస్తుంది. అది మన భారత శాస్త్రీయ కళల గొప్పదనం. ఇది అభ్యసించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులను నేను కూడా ఎదుర్కొన్నాను. ప్రతీ రంగంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాగే నేనూ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. శరీరం ఒక్కొక్కసారి అనుకూలించకపోవడం అంటే నాట్యంలో తల నుండి పాదాలదాకా అనుకూలంగా ఉండాలి. అయితేనే మనం ఈ నాట్యాన్ని చక్కగా ప్రదర్శించగలుగుతాం. ఒక్కొక్కసారి కాళ్లు గాని, చేతులు గాని సరిగా పనిచేయకపోవటం ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు. అన్నింటినీ తట్టుకోగలగాలి. మన బాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మర్చిపోయి వేదిక మీద ప్రదర్శించే ముందు ప్రేక్షకుల ముందు వాళ్ళని మెప్పించగలిగేలా, వాళ్లకు సంతోషం కలిగించేలాగా మనం మారి ప్రదర్శించాలని నా ఉద్దేశం. మన వ్యక్తిగత సమస్యలు వేదిక మీద చూపించకూడదు. ఒక్కసారి వేదిక మీదకు ఎక్కామంటే కళాకారునిగా మారిపోవాలి. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలగాలి. అప్పుడే ప్రేక్షకులను రక్తి కట్టించగలుగుతాము. అలా చేయడం కోసం ఎన్నోసార్లు చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. కాకపోతే అన్నింటిని అధిగమించి ప్రదర్శిస్తూ వస్తున్నాను. ఇంకా అధిగమించాల్సింది చాలా ఉంది ప్రస్తుతం ఈ స్థాయికి రావడం ఆ భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నాను.

 10. సహజంగా ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో నాట్యం నేర్చుకోవాలంటే ఎలాంటి సాధన అవసరం? పరిపూర్ణ నాట్య కళాకారులు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

జ: పరిపూర్ణమైన నృత్యకారుడవడం అనడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. వాళ్ళు నేర్చుకునే నృత్యాన్ని బట్టి, వాళ్ళ గురువులను బట్టి, వారి శరీర అనుకూలతలను బట్టి అంటే అన్నింటిని ఆధారంగా చేసుకుని ఉంటుంది. కొందరు రెండేళ్లలోనే మంచి కళాకారులుగా ప్రదర్శనలు ఇస్తుంటారు. మరి కొంతమంది అయిదు, పదిహేను సంవత్సరాలు నేర్చుకున్నా  కూడా ఏదో ప్రదర్శిస్తారు.  కానీ వాళ్ళ ప్రదర్శన అంత రక్తి కట్టించేలాగా ఉండదు. మరి కొంతమంది నేర్చుకోకుండా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చే వాళ్లయి ఉంటారు. అంటే ఇది ఒక సమయం అంటూ చెప్పలేము. కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా.  ఇప్పుడు విద్యారంగంలో మన ఈ కళలు కూడా చేర్చడం వల్ల ఏదైతే మనకు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలలో కోర్సులు పెట్టడం జరిగిందో, ఆ కోర్సుల్లో సర్టిఫికెట్ కోర్సు చేయడానికి నాలుగు సంవత్సరాలు, డిప్లొమా కోర్సుకి మరి రెండు సంవత్సరాలు కలిపి మొత్తం ఆరు సంవత్సరాలు సర్టిఫికెట్ మరియు డిప్లొమా కోర్సులు సాధించడానికి టైం పడుతుంది. కనుక ఆ ఆరు సంవత్సరాలు శ్రద్ధగా నేర్చుకున్నట్టయితే ఒక మంచి కళాకారుడు అవడంలో ఎలాంటి ఆశ్చర్యం ఉండదు.

 10. వాగ్దేవి ఆర్ట్స్ అకాడెమీ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎలా రూపుదిద్దుకొంది?

జ: నేను సుమారుగా 10 ఏళ్లకు పైగా నాట్యం నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న స్కూల్స్ లో,  ఊర్లో కొంతమందికి నాట్యం నేర్పించడం ప్రారంభించాను. నాకు వచ్చినటువంటి విద్యను వాళ్లకు నేర్పించేవాడిని. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ‘కళాపరిచయం’ అని అప్పట్లో ప్రభుత్వం ప్రారంభించినప్పుడు నేను ప్రతీ సంవత్సరం అందులో ఎంతో మంది విద్యార్థులకు నృత్యాన్ని పరిచయం చేయడం జరిగింది. అలా అలా స్కూల్స్ లో వార్షికోత్సవాలకు పిల్లల చేత నాట్య ప్రదర్శనలు చేయించేవాడిని. పెళ్లయిన తర్వాత ఆ భగవంతుని దయవలన నా జీవితంలో ప్రవేశించిన నా భార్య కూడా నర్తకి అవ్వడం వలన ఇద్దరము కలిసి వాగ్దేవి అకాడమీ స్థాపించాము. దీని ద్వారా మాకు తెలిసిన ఈ నృత్య కళను పదిమందికీ పంచాలని, అలా ఈ కళను తర్వాతి తరాల వారికి నిలబెట్టాలనే సదాశయంతో దీన్ని స్థాపించి సంతృప్తులమయ్యాము. వాగ్దేవి అని ఎందుకు పెట్టుకున్నాను అంటే ఆ పేరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కావడం, విద్యా దేవత అయిన సరస్వతి పేరు పెట్టుకోవడం వలన ఆ తల్లి అనుగ్రహం మామీద పరిపూర్ణంగా ఉండాలని అకాడె మీకి ఆ పేరు పెట్టడం జరిగింది.

 11. ప్రస్తుతం ఈ అకాడెమీలో ఎంతమంది నాట్యకళను  అభ్యసిస్తున్నారు? తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ రకంగా ఉంది? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు?

 జ:  ఈ అకాడెమీ ద్వారా సుమారుగా 200 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనందరికీ తెలుసు కరోనా మహమ్మారి  అన్ని రంగాలతో పాటు కళా రంగంలో ఉన్న వారిని కూడా చాలా దెబ్బతీసింది.  ప్రదర్శనలకు సరైన అవకాశాలు రాకపోవడం, విద్యార్థులు భయపడి క్లాసులకు రాకపోవడం… ఇప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించడానికి భయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే అటువంటి పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. కరోనాకి ముందు సుమారు మా దగ్గర 30 నుండి 40 మంది విద్యార్థులు నిరంతరం నేర్చుకుంటూ ఉండేవారు. కరోనా తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. పదుల సంఖ్యలో ఇప్పుడు విద్యార్థులు రావడం జరుగుతుంది. అది కూడా అతి కష్టం మీద. ఎందుకంటే కరోనా పరిస్థితులు మెరుగైన తర్వాత విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అకడమిక్స్ లో ఇంతకుముందు విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదు. రెండు సంవత్సరాల అకడమిక్స్ దెబ్బ తినడం వలన చిన్న చిన్న స్కూల్స్ నుంచి పేరుపొందిన స్కూల్స్ వరకు చదువు పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయించడం, దాని కోసం పిల్లలను ఎక్కువ సమయం స్కూల్స్ లో ఉండేలా చేయడం, హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం, ఇలాంటి వాటివల్ల ఆక్టివిటీస్ కి సమయం ఎక్కువ కేటాయించలేకపోవడం వల్ల ఇలాంటి అకాడెమీలకు రావడం తగ్గింది. రాను రాను పరిస్థితులు  మెరుగు పడతాయని అనుకుంటున్నాం. కాకపోతే ఇంకా మార్పు రావాలి. ఎవరికైతే వీటిపట్ల అవగాహన ఉందో వారే తమ పిల్లల్ని శిక్షణ కోసం పంపిస్తున్నారు.మేము  ప్రైవేట్ గా కూడా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను ఆంధ్రనాట్యం, పేరిణి, కూచిపూడి ఈ మూడు నృత్యాలలో చేయించడం జరుగుతోంది. నేను ప్రస్తుతం శ్రీ భక్త రామదాస ప్రభుత్వ నృత్య కళాశాలలో గత ఆరు సంవత్సరాలుగా పేరిణి అధ్యాపకునిగా పని చేస్తున్నాను. అక్కడ పేరిణి నృత్యానికి సంబంధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి శిక్షణ ఇస్తున్నాను. కళాశాల విద్యార్థులే కావచ్చు అకాడెమీ విద్యార్థులే కావచ్చు. అందరూ కూడా నా ప్రతి ప్రదర్శనలో పాల్గొంటూ మా అకాడెమీ ద్వారా ఇచ్చే ప్రదర్శనలన్నింటిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే వాగ్దేవి ఆర్ట్స్ కేవలం నాట్యం నేర్పించడమే కాక కళా రంగంలో మన సంస్కృతి సంప్రదాయాన్ని ముందు తరాల వారికి నేర్పించే ఉద్దేశంతో స్థాపించినటువంటిది కాబట్టి మా వంతుగా మా శక్తికి మించి ఒక చిత్రాన్ని నిర్మించడం జరిగింది.2019వ సంవత్సరంలో మా సంస్థ తరఫున ‘నర్తన’ అనే చిత్రాన్ని నిర్మించాము. ఆ చిత్రంలో..ఒక నాట్యమే ఆధారంగా జీవిస్తున్న కుటుంబంలో ఉండే ఎమోషన్స్ అంటే ఒక గురువుకి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడనివి ఏమిటి? నాట్యం నేర్చుకోవాలనుకునే విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?  అనే ముఖ్యమైన అంశాలే కాకుండా ఒక కుటుంబంలో ఉండే సంబంధ బాంధవ్యాలను చూపిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాం. దీనికి ఎంతో గొప్ప గుర్తింపు వచ్చింది ఎవరైతే కొంతమంది గొప్ప పేరు గడించిన నాట్య కళాకారులు ఉన్నారో వారు ఈ చిత్రాన్ని చూసి విశ్వనాథ గారి జోనల్లో చేయడం జరిగిందని మెచ్చుకున్నారు. మీరు అందరూ కూడా తప్పకుండా ఈ చిత్రాన్ని చూసి మీ యొక్క అభిమానాన్ని తెలుపుతారని అనుకుంటున్నాను. ఇది యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంది. మా శక్తికి మించి ఈ చిత్రాన్ని నిర్మించాము. ‘నర్తన ఇండిపెండెంట్’ అనే చిత్రం మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. నేను, నా భార్య, నా కూతురు నటించిన ఈ చిత్రంలో నా కూతురుకు తాతగా కళా కృష్ణ గారు నటించడం గొప్ప విషయం.

12. భవిష్యత్తులో ఈ అకాడెమీని ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాప్తిలోకి తేవాలనుకుంటున్నారా?

జ: మా అకాడెమీ ఒక ప్రాంతానికి పరిమితం కాదు. అలా పరిమితం చేయాలని కూడా అనుకోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మేము కొత్తపేటలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ, అలాగే అంబర్ పేటలో నా శ్రీమతి సంధ్య వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ బ్రాంచ్ లో క్లాసులు తీసుకుంటుంది. అలాగే నా శిష్యురాలు ఒకరు అమెరికాలో కూడా ఈ అకాడెమీ పేరు మీద నృత్య శిక్షణ ఇస్తున్నారు. ఇంకా మా శక్తిని బట్టి వీలైనంత మేరకు బ్రాంచ్ లు ఓపెన్ చేసి విస్తృత పరచాలని అనుకుంటున్నాము.

 13. నాట్య కళా ప్రావీణ్యత పొందిన మీకు ఎటువంటి సత్కారాలు లభించాయి? పొందిన పురస్కారాలు ఏవి?

 జ: నాకు ఇప్పటివరకు మంచి గుర్తింపు, గౌరవం నాట్యకుల ద్వారా లభించింది. ‘నాట్య కుమార’ అనే బిరుదు ‘పేరిణి నాట్య రత్నాకర’, ‘యువ కళా రత్న’ మరియు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిభా పురస్కారం నేను పొందడం జరిగింది. ఇంకా అనేక ఇతర సంస్థల నుండి ప్రశంసలు, సన్మానాలు పొందడం జరిగింది. అలాగే నా శ్రీమతి కూడా ‘నాట్య శిరోమణి’, ‘యువ కళారత్న’ వంటి అనేక అవార్డులను సన్మానాలను పొందడం జరిగింది. నా కూతురు శ్రీ నర్తన సి.సి.ఆర్.టి స్కాలర్ షిప్ ను పొందింది. ప్రస్తుతం తాను ఇంటర్మీడియట్ చదువుతోంది.

14.రామప్ప దేవాలయం ముందు 1985 ,86 లలో అనుకుంటా… వందమంది కళాకారులు ఒకే వేదికపై ఒక్కసారి పెద్ద నాట్య ప్రదర్శన చేసారు. అప్పుడు మీరు పాల్గొన్నారా? ఆ విశేషాలు ఈనాటి తరానికి తెలియచెప్పండి.

జ. అవును జరిగింది. అప్పుడప్పుడే నేను నటరాజ రామకృష్ణ గారి దగ్గర నృత్య శిక్షణ ప్రారంభించి ఉన్నాను. అప్పుడు కేవలం నా వయసు ఐదు సంవత్సరాలు ఉండడం వలన వారు నన్ను రామప్పలో జరిగిన ఆ కార్యక్రమానికి తీసుకెళ్లారు. ఆ ప్రదర్శన చూడడం మాత్రమే జరిగింది. అలాగని అవగాహన లేదు అనలేను.  కాకపోతే లీలగా కాస్త గుర్తుంది. ఒక జాతర లాగా వేల మంది ప్రజలు అక్కడికి రావడం, ఆ వేదిక పైన 100 మంది ఒకేసారిగా అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడం, ఒక ముగ్గురు, నలుగురు మార్దంగీకులు మృదంగాన్ని వాయిస్తూ ఉంటే అద్భుతమైన ధ్వని రావడం.. ప్రజలందరిలో ఒక వైబ్రేషన్ కలిగించడం.. ఆ కళాకారులు ప్రదర్శిస్తూ ఉంటే ప్రకృతి అంతా పులకించి పోవడం.నిజంగా ఆ వయసులో  అంతకుమించి అనుభవం కూడా ఉండదు.  కానీ ఇవన్నీ లీలగా నాకు గుర్తున్న విషయాలు. అప్పటికే ప్రసిద్ధి పొందిన పేరిణి నాట్యకళాకారులు విఠల్ గారు ఆ ప్రదర్శనలో పాల్గొనడం గుర్తుంది. అప్పుడు నటరాజ రామకృష్ణ గారి వద్ద ఉన్న శిష్యుల్లో నేను చిన్నవాడిని కనుక అందరూ నన్ను ఆత్మీయంగా చూసేవారు.

15. భరత నాట్య రీతుల్లో ఏవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి?

జ: భారత శాస్త్రీయ నృత్యాల్లో అంటే క్లాసికల్ డాన్స్ అనగానే మన భారత దేశంలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సి, కథాకళి, మోహినీ ఆట్టం ముందుగా గుర్తొస్తాయి. అయితే ఇవే కాకుండా ఇంకా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఇంకా గుర్తింపు లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. వాటిలో పేరిణి ఒకటి, ఆంధ్రనాట్యం కూడా ఒకటి. గుర్తింపు ఉన్నప్పటికీ సంగీత నాటక అకాడెమీ గుర్తింపు కోసం మేము మా శాయ శక్తులా కృషి చేస్తున్నాము. అలాగే పేరిణి నాట్యానికి కూడా మంచి గుర్తింపు వచ్చి సంగీత నాటక అకాడెమీల ద్వారా గుర్తింపు పొంది భావితరాల వారికి భారత శాస్త్రీయ నృత్యాల్లో ఇవి కూడా చేర్పించి మంచి స్థానాన్ని పొందే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఒక శుభకరమైన విషయం ఏంటంటే ఇటీవల సంగీత నాటక అకాడమీ ఇచ్చేటువంటి యువపురస్కారాలు ఏవైతే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు మీద ఇస్తున్నారో, తొలిసారిగా పేరిణి నాట్యానికి గాను రాజ్ కుమార్ గారికి ఆ పురస్కారం రావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఒకసారి ఇచ్చారంటే దానిని గుర్తించారనే కదా!  అలాగే ఇంకా  ఎన్నో పురస్కారాలు పేరిణి కళాకారులకు రావాలని ఆశిస్తూ అలాగే కళాకారులతో పాటుగా నాట్యానికి మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను.

16. మీరు ప్రదర్శించే నాట్యంలో కొత్త విధానాలను ఏమైనా ప్రవేశపెట్టాలనుకుంటున్నారా ?

జ: పేరిణి నృత్యం లో మూడు నూతన అంశాలను గురువు కళా కృష్ణ గారి నేతృత్వంలో నేను, నా శ్రీమతి కలిసి రూపకల్పన చేయడం జరిగింది. వాటిలో సప్త తాళ రాగ స్వర నర్తన ఒకటి. అలాగే హంసగతి రెండవది. మూడవది సూర్య నమస్కారాలు. ఈ మూడు అంశాలని మేము కొత్త రీతులుగా మా విద్యార్థులకు నేర్పించి, ప్రదర్శిస్తున్నాం. ఇవి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి అంటే పిల్లలకు ఇతరములైన వాటి పట్ల సమయం చాలా తక్కువ అయింది. అకడమిక్స్ వైపు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల వేరే శిక్షణకు సమయం లేకుండా పోయింది. కాబట్టి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పొందే విధంగా, యోగాభ్యాసం ముందు తరాలకు తెలిసే విధంగా, నాట్య రూపంలో మేము యోగాలో ఉపయోగించే సూర్యనమస్కారాలను నృత్య సంప్రదాయాల్లో చేయాలనుకున్నాం. సహజంగా యోగాలో సూర్య నమస్కారాలకి రాగం,తాళం,లయ ఉపయోగించరు. మేము అలా కాకుండా ఐదు గతులలో,జతులతో సహితంగా ఈ సూర్య నమస్కారాలను మిళితం చేసి ఈ అంశాన్ని రూపకల్పన చేశాము. అలాగే సంగీతంలో గాని, నాట్యంలో గాని ఒకే అంశంలో లేదా ఒక కీర్తనలో లేదా ఒక జావళిలో గాని ఏడు తాళాలను ఉపయోగించడం చాలా అరుదు. అలా మేము ఒకే అంశంలో సప్తతాళాలని ఉపయోగించి, వాటికి అనుకూలమైన ఏడు రాగాలని తీసుకొని వాటికి సంబంధించిన స్వరాలు, ఆ తాళాలకు సంబంధించిన జతులను రూపకల్పన చేసి దానిని ప్రదర్శించడం జరిగింది. ఇక మూడవ అంశం హంసగతి .దీనిలో పేరిణి పంచాంగాలుగా ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో భావాశ్రయమంటే అనుకరణ. మనుషుల లాగా కాకుండా జంతువులుగా పక్షులుగా అనుకరించడం అనేది భావాశ్రయం ప్రత్యేకత. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక హంస బ్రహ్మ లోకంలో సరస్వతి అమ్మవారు అద్భుతంగా వీణను వాయిస్తూ ఉంటే ఆ వచ్చే నాదాన్ని విని మైమరచి ఒక నర్తకి గా మారి ఆ వీణా నాదానికి అనుగుణంగా నృత్యం చేస్తే ఎలా ఉంటుందన్న  ఒక కాన్సెప్ట్ తీసుకొని హంసగతి అన్న అంశాన్ని రూపొందించడం జరిగింది. ఈ మూడు నృత్యంశాలు కూడా మాకు మంచి గుర్తింపును తెచ్చాయి. దీనిని తిలకించిన కళాకారులందరూ ఎంతగానో మెచ్చుకోవడం జరిగింది ఇంకా దీన్ని ప్రాచుర్యంలోకి  తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం.

17. ఆరోగ్య పరమైన విధానంలో ఈ నాట్యకళ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ వయసు నుండి ఈ కళను అభ్యసిస్తే బాగుంటుందో చెప్పండి.?

జ: మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆరోగ్యం కోసమని జిమ్ అని, యోగా అని, మెడిటేషన్ అని రకరకాల వ్యాయామ శాలలకు, ధ్యాన కేంద్రాలకు వెళ్తున్నారు. అంటే మనం మన ఆరోగ్యం కోసం మనకు మనం చేసుకునే వాటిని కాకుండా ఇతరులపై ఆధారపడుతున్నాం. ఇక నాట్యం విషయానికొస్తే అది ఏదో చూసి ఆనందించే కళ కాదు. దీని ద్వారా శరీరమే కాకుండా మానసిక దృఢత్వం కలుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అన్నిరకాల వయస్సుల వారికి మానసిక ఒత్తిడులు దూరమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఎలాగంటే క్షణాల్లో హావభావాలను ఒలికించడానికి, కళ్ళు, చేతులు, తిప్పడం, అనుగుణంగా అడుగులను వేయడం.. వీటివల్ల ధ్యాస అంతా అక్కడే ఉంచాల్సి ఉంటుంది. ఇది వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక కళను నేర్చుకున్నవారికి,

లేనివారికి జీవన విధాన శైలిలో చాలా తేడా మనం గమనించవచ్చు. సభ్యత, సంస్కారం, వినయం, మాటతీరు, అణకువ ఇవన్నీ కళతోటే కళాకారునికిఅబ్బుతాయి. అది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇక వయసు అంటారా! ఐదేళ్ళ వయసు నుండి నేర్పడం మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే

ఆ వయసులో మనం చెప్పే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే వీలు ఉంటుంది.

18.  ప్రస్తుత సమాజంలో లలితకళల పట్ల ఉన్న ఆదరణ ఎలాంటిది?

జ: ప్రస్తుత సమాజంలో లలిత కళల పట్ల ఆదరణ బాగానే ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక కాలచక్రం అంతే. కొంతకాలం కొన్ని నడుస్తాయి. అవి పోయి మళ్ళీ పాతవి ముందుకు వస్తాయి. తిరుగుతూనే ఉంటుంది కాలచక్రం. మొన్నటిదాకా మనం చూసాము విదేశీ సంస్కృతికి బాగా అలవాటు పడి మళ్ళీ మన శాస్త్రీయ కళల పట్ల ,మొగ్గు చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే శాస్త్రీయ కళా ప్రదర్శనలు పెరుగుతూ వస్తున్నాయి. పిల్లలకి తల్లిదండ్రులు వాటిలో శిక్షణ ఇప్పించడానికి ముందుకు వస్తూనే ఉన్నారు. పిల్లలు కూడా శాస్త్రీయ నృత్యాలలో శాస్త్రీయ సంగీతాన్ని, శాస్త్రీయ కళలను నేర్చుకునే దిశగా ముందుకు వస్తున్నారు మనదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా భారత దేశ శాస్త్రీయ నృత్య సంగీత సంప్రదాయాలకి ఆదరణ చాలా ఉంది. మనం దాని నిలబెట్టుకొని ఇంకా ముందుకు వెళ్లాలి. నేను తల్లిదండ్రులందరినీ కోరుకునేది ఒక్కటే. మీ ఇంట్లో ఉన్న  ప్రతి చిన్నారికి ఏదో ఒకటి.. సంగీతమైనా, నృత్యమైనా ఏదో ఒక భారత శాస్త్రీయ కళని నేర్పించి, ముందు తరాల వారు ప్రపంచవ్యాప్తంగా  ప్రచారం చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తారు అని ఆశిస్తున్నాను

19. ఇప్పుడున్న పరిస్థితుల్లో కళలు నేర్చుకునేవారికి భవిష్యత్తు వుందంటారా?

జ: తప్పకుండా ఉందని చెప్పగలను. ప్రభుత్వం కూడా శాస్త్రీయ కళల అభివృద్ధికి దోహదం చేస్తోంది. కాకపోతే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. ఇటు స్వచ్ఛంద సంస్థలు కూడా కళాకారులను ప్రోత్సహిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇప్పించడం, అవార్డులను ఇప్పించడం, గుర్తింపు తేవడం,  ఆర్థికంగా సహాయం చేయడం,  తెలుగు యూనివర్సిటీ నుండి కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అనేక సంస్థల నుండి కావచ్చు,కళాశాలల్లో కోర్సుల రూపంలో పి. హెచ్.డి ల వరకు పరీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతున్నాయి. వీటి ద్వారా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీటిని నేర్చుకుంటున్న ప్రతి విద్యార్థి దానిని నమ్ముకుని ముందుకు వెళ్తే గనుక భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్తారని ఆశిస్తున్నాను. అవకాశాలు కచ్చితంగా లభిస్తాయి. ఎంతోమంది కళాకారులు అదే ఉపాధిగా మంచి స్థాయిలో జీవితాలను గడుపుతున్నారు. దానికి నేను కూడా ఒక సరియైన ఉదాహరణగా చెప్పవచ్చు. నేను నా శ్రీమతి కేవలం నాట్యాన్నే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళం. నేను ఆంధ్ర నాట్యంలో డిప్లొమా పూర్తి చేయడం జరిగింది. అలాగే నా శ్రీమతి కూడా కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం శ్రీ సత్య సాయి విద్యా విహార్ డి.డి కాలనీలో ఉన్న స్కూల్లో గత 15 సంవత్సరాలుగా నాట్యం నేర్పిస్తూ డాన్స్ టీచరుగా ఉద్యోగం చేస్తోంది. ఇప్పుడు ఒక మంచి స్థానాన్నిచ్చి పర్మినెంట్ చేయడం జరిగింది. స్కూల్లో మంచి గుర్తింపు లభించింది. నేను కూడా ఒక నర్తకుడిగా, గురువుగా మంచి గుర్తింపు పొందాను మా కుటుంబం అంతా ఆ కళామతల్లి సేవలో ముందుకెళ్తున్నాం. ఆ తల్లి అనుగ్రహంతో ఇక ముందు కళాకారులు, కళాభిమానులు కూడా మమ్మల్ని ఇంకా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

20. మీరు ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు మీ కాస్ట్యూమ్స్ మీరే తయారుచేసుకుంటారని, మేకప్ కూడా మీరే వేసుకుంటారని విన్నాం… నిజమేనా? దానికి సమయం కుదురుతుందా?

జ: (నవ్వుతూ) అవునండీ.. మీరు విన్నది నిజమే.. నేను నాట్యంలోనే కాక, ఫ్యాషన్ డిజైనింగ్ లో లకోటియా సంస్థ నుండి పి.జి.డిప్లొమా చేసాను. అందువల్ల నా ప్రదర్శనలకు మొత్తం నేనే డిజైన్ చేసి,  తయారుచేసుకుంటా..ప్రస్తుతం దుస్తుల మీద వేసే అనేకరకాల డిజైన్ లను నేను వేయగలుగుతాను. సమయం అంటారా…తప్పదు..వీలు చేసుకుంటా.. మేకప్ కూడా మా టీమ్ లో నాతో సహా దాదాపుగా అందరికీ నేనే వేస్తా..ఇతరులతో చేయించడం ఎప్పుడో తప్పనిసరి అయినప్పుడు అంతే…

21. చివరగా మీరు సమాజానికి చెప్పదలచుకొన్న సందేశం ఏమిటి?

జ: సమాజానికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ప్రపంచమంతా ఎంతో గౌరవించే మన భారత శాస్త్రీయ కళలని మనం చిన్న చూపు చూడకుండా మన చిన్నారులందరికీ నేర్పిస్తూ, దాన్ని గౌరవిస్తూ మనం ఎంత గొప్ప స్థానానికి తీసుకెళ్తే ప్రపంచంలో అంత గొప్ప స్థాయిలో ఉండగలుగుతాం. దయచేసి దీనిని అందరూ గమనించి కళల యొక్క అభివృద్ధికి మీరందరూ దోహదపడతారని, కళాకారులను ఆదరిస్తారని, అభిమానిస్తారని ఆశిస్తున్నాను. ప్రభుత్వం నుండే కావచ్చు ప్రైవేట్ సంస్థల నుండి కావచ్చు. అటు అభిమానులు, కళా పోషకులు,కళారాధకులు ఇటువంటి నృత్య ప్రదర్శనలను, కళాకారులను ప్రోత్సహించడానికి ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు..

ధన్యవాదాలు పవన్ కుమార్ గారు..మీ నాట్యప్రస్థానం గురించి, మీ గురించి ఎన్నో విషయాలను ఓపికగా మాతో పంచుకున్నందుకు మా తరఫున, మా పాఠకుల తరఫున మీకు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాము…నమస్కారాలు.

March 18, 2023 1 comment
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

The Two Boys

by Rishi March 17, 2023
written by Rishi

Once there lived a boy named James. He was good at Football . But one day there came a new boy to their street

named John . James and his friends tried to be friends with
him but he was not good at sports so
they were teaseing him but John did not
Care about them. One day they were challengeing him about Football match
he agreed he was opposite team of James team and in the match James
kicked the ball so hard and John was the

goalkeeper he was not able to stop the ball that James kicked and John team lost the match.John’s team were teaseing
him .One day there was a singing competition in their street John sang better than all of them in tha street he won the prize
everyone was amazed by his song and everyone said sorry to him and became
his friends.

Moral of the story is don’t tease anyone that they are not good at something everyone has there own talent .

March 17, 2023 2 comments
3 FacebookTwitterPinterestEmail
కవితలు

పోటుగా నిలిచిన నాటు

by Cheedella Seetha Lakshmi March 17, 2023
written by Cheedella Seetha Lakshmi

పోటుగా నిలిచిన నాటు

గీతం సంగీతం గానం
ఆట పాట నాటు నాటు
అందరి నోటా నాటు నాటు!!

చంద్రబోస్ వాణి
కీరవాణి బాణీ
RRR త్రీణీ
ఆస్కార్ బోణీ
విశ్వంలో దక్కిన ఖ్యాతి
భారతానికే భాతి
తెలుగు నాటుకు విశ్వకీర్తి
భారతదేశానికి దివ్య దీప్తి!!

రాజమౌళి రామారావు రామచరణ్
రణం రౌద్రం రుధిరం
చంద్రబోస్ కీరవాణి
రాహుల్ సిప్లిగం,కాలభైరవ గాయకులు
ప్రేమరక్షిత్ కొరియోగ్రఫీ
అదరగొట్టింది
అందరి ఎద దోచింది
ఆస్కార్ తెచ్చింది
విశ్వవిజేతగా నిలిచింది!!

భారత మాత పెదవిపై చిరునవ్వై విరబూసింది
విజయదుందుభిలు మ్రోగించింది
కీర్తిపతాక ఎగిరేసింది
ప్రపంచచిత్రరంగంలో మెరిసింది
తెలుగు భాషకు గౌరవం దక్కింది
నాటు నాటు అంటూ బెట్టుచేయక
ఓవర్ టెక్ చేసింది
ప్రపంచమాత పారాణిగా రాగరంజితమైది
పాట చూడు పాట చూడు
పాటకు పట్టాభిషేకం చూడు!!

March 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కళ’ను ‘కల’ను కలిపిన తపస్వి విశ్వనాథ్ 

by C.S. Rambabu March 17, 2023
written by C.S. Rambabu

విధి ఎవరి రాతను ఎలా లిఖిస్తుందో ఎవరూ ఊహించలేరు.బాల్యంలో సినిమా చూడటం కోసం రెండేండ్ల బండిలో ప్రయాణించిన బాలుడు పెద్దయ్యాక తెలుగు చలన చిత్ర సీమ గర్వించదగ్గ దర్శకుడవుతాడని ఎవరూహించారు.ఆ బాలుడే విధాత తలపున ప్రభవించిన విశ్వనాథుడు.అనతికాలంలోనే

కళాతపస్విగా వాసికెక్కాడు.ఆనతినిచ్చిన విధాతకు తన చిత్రమాలిక కానుకగా సమర్పించాడు. ఆయనే ఒకచోటంటారు.నేనేదీ ప్లాన్ చేసుకోలేదు.అన్నీ అలా జరిగి పోయాయని.

విచిత్రమేమిటంటే కె.విశ్వనాథ్ గారి తండ్రిగారికి జాతకాలు చూస్తారని మంచి పేరుండేది.

తన కుమారుడు ఇంత ఎత్తుకు ఎదుగుతాడని ఆ తండ్రి ఊహించారో లేదో మరి.విశ్వనాథ్ తండ్రి చాటు బిడ్డ.గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ పూర్తికాగానే వారి బంధువొకరు వాహిని స్టూడియోలో చేరితే బావుంటుంది, అక్కడ చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందని చెప్పగానే తండ్రి ఆజ్ఞ మేరకు వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్మెంట్ లో చేరారాయన.తండ్రి వాహిని డిస్ట్రిబ్యూషన్ లో ఉండేవారు.

ఆయనక్కడ పనిచేస్తుండగానే ఆదుర్తి సుబ్బారావు గారి దృష్టిలో పడ్డారు.ఏపని చేసినా అందులో నిమగ్నమై పనిచేయటం విశ్వనాథ్ లో ఉందని ఆయన గమనించారు.అప్రెంటిస్ గా ఆహ్వానించారు.దర్శకత్వ మెళకువలు నేర్పారు.మూగమనసులు సెకండ్ యూనిట్ దర్శకుడు విశ్వనాథే.ఇంకో పక్క వాహిని స్టూడియోలో ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి.ఆదుర్తి సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక టీంలా ఉండేవారని తెలిసిందేకదా.విశ్వనాథ్ కి పనిపట్ల ఉన్న శ్రద్ద. 

అక్కినేని వారిని ఆకట్టుకుంది.ఓ శుభ ముహూర్తాన తమతో కలిసి తమ కంపెనీలో (అన్నపూర్ణ ప్రొడక్షన్స్)

దర్శకత్వ శాఖలో చేరమని ఆహ్వానించారు.చేరాలా వద్దా అని విశ్వనాథ్ చాలామంది సలహా అడిగారు.వారందరి అభిప్రాయాలు మరింత సందిగ్ధంలోకి నెట్టాయి వారిని.

గురువైన ఆదుర్తి కూడా నిర్ణయం నీదే అనేశారు.

విశ్వనాథ్ గారి సందేహానికి కారణం,ఆయన త్వరలో వాహిని సౌండ్ చీఫ్ కాబోతున్నారు.అది వదులుకోవటం సబబేనా అని.అప్పుడు ఆయన వెన్నుతట్టి వెళ్ళమని చెప్పిన వారు చక్రపాణి గారు.అలా సౌండ్ రికార్డిస్ట్ విశ్వనాథ్, దర్శకుడిగా మారటానికి వారధి అయ్యారు విజయా ప్రొడక్షన్స్ సారధి చక్రపాణి.

దర్శకుడిగా ఆయనకు బ్రేక్ నిచ్చింది అన్నపూర్ణ సంస్థ.

ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరవం.1965 లో విడుదలైన ఆ చిత్రం ఉత్తమ కథకు నంది పురస్కారం పొందింది.

కె.విశ్వనాథ్ గారికి పాటల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండేదన్న మాట జగద్విదితం.ఆయన పాటెప్పుడూ కథను ముందుకు తీసుకెళ్ళాలి గానీ, కథా గమనానికి అడ్డుపడకూడదనేవారు.పాట ప్రేక్షకుడు టీ తాగడానికో,సిగిరెట్ తాగడానికో రిలీఫ్ కాకూడదనేది వారి స్థిర అభిప్రాయం.స్క్రిప్ట్ రాసుకునే సమయంలోనే పాట అక్కడెందుకుండాలి,ఎలా ఉండాలో రాసుకునేవారుట.

చాలా పాటలకు పల్లవులు ఆయనే సమకూర్చేవారని

ఈమధ్య తెలిసిన నిజం.ఆత్మగౌరవం లోని “అందెను నేడే అందని జాబిల్లి” పాట పల్లవి ఆయనదే.చరణాలు ఆత్రేయ రాశారు.ఆత్రేయ ఆ పాట పారితోషికం లో

నీ వాటా కుడా ఉందని కొంత ముట్టజెప్పారని విశ్వనాథే స్వయంగా పేర్కొన్నారు.దాదాపు ప్రతి చిత్రంలోనూ ఆయన పల్లవులు ఉండేవి.అది తన ప్రతిభ కన్నా గీతరచయితల ఔదార్యం అని వినయంగా అంటుండేవారు కళాతపస్వి.ఒక సభలో డా.సి.నారాయణరెడ్డి తను, విశ్వనాథ్ జంటకవుల వంటివారమని ముసిముసి నవ్వుల మధ్య చెప్పారు.

జీవన జ్యోతి చిత్రం లోని “ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు,సద్దు చేశాడంటే ఉలుకులికి పడతాడు”

పాట పల్లవి విశ్వనాథ్ ఇస్తే, నారాయణ రెడ్డి గారు పూర్తి చేశారు.

తను లయలో పలుకుతానో తెలియదని, సంగీత దర్శకులు తన పల్లవికి లయ కల్పిస్తారని ఓసారన్నారు విశ్వనాథ్.

పాటల పల్లవులు గురించి ఇంకొన్ని తర్వాత.సినిమాల్లో పాట అవసరం లేదంటారు విశ్వనాథ్.కానీ వారి సినిమాల్లో పాటలూ ఎక్కువే.వాటి నిడివీ ఎక్కువే.పాట అవసరం గురించి మాట్లాడుతూ ప్రేక్షకులు పాట ఎప్పుడొస్తోందో వూహించగలుగుతున్నాడు.అలాకాకుండా పాటను ప్రేక్షకుడు ఉహించని చొప్పించటం నాకు నేను పెట్టుకున్న నియమం.దానితోపాటు పాట కథను ముందుకు తీసుకెళ్ళాలి అని బలంగా నమ్మాను అనేవారు.వారు చెప్పినట్టు వారి చిత్రాలలోని పాటలు కథలో భాగంగా కనిపిస్తాయి.

శంకరాభరణం సినిమా విశ్వనాథ్ ని శిఖరారోహణం చేయించింది.అంతకుముందు చేసిన సినిమాలొకెత్తు.ఆతర్వాత చేసిన సినిమాలొకెత్తు.అంతకుముందు చిత్రాలన్నీ కుటుంబ కథా చిత్రాలయితే, శంకరాభరణం తరువాత ఆయన చిత్రాలన్నీ సంగీత, నృత్యాల ప్రతిబింబాలయ్యాయి.ఆవిధంగా శంకరాభరణం వారినో చట్రంలో బిగించిందా అనిపిస్తుంది.విశ్వనాథ్ చిత్రాలను గుర్తు తెచ్చుకోండి. నిండు హృదయాలు,ఉండమ్మా బొట్టు పెడతా,జీవిత నౌక, నేరము-శిక్ష,శారద,కాలం మారింది,

చెల్లెలి కాపురం,జీవనజ్యోతి, సీతామాలక్ష్మి, చిన్ననాటి స్నేహితులు,అమ్మమనసు, ప్రేమబంధం, సిరిసిరిమువ్వ..ఇలా ఎన్నో చిత్రాలు.. ఇవన్నీ శంకరాభరణం ముందు కాలం నాటివి.ఆ తరువాత వచ్చినవి శుభలేఖ,సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం,స్వయం కృషి, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు,శ్రుతిలయలు,స్వాతి కిరణం,సూత్రధారులు ,శుభసంకల్పం మొదలైనవి.

ప్రతి చిత్రం కూడా ఏదో ఒక ఉద్వేగాన్ని పట్టి చూపేదే.

కథలు ఎంపిక గురించి మాట్లాడుతూ విశ్వనాథ్ ఒక మాటంటారు.తన నిర్మాత అనుకున్న కథనే తీస్తానని

చెబుతానని 

చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే తన కథతో తీస్తానని అంటారు.కానీ నిర్మాత చివరికి విశ్వనాథ్ కథనే తీయటం అనేక సందర్భాల్లో జరిగింది.

విశ్వనాథ్ సినిమాలలో హాస్యం చవకబారుగా ఉండదు.

పాత్రలు నేలవిడిచి సాము చేయవు.నా పాత్రలన్నీ జనజీవనంలోంచి పుట్టినవే.ఒక బాబయ్యో,ఒక మామయ్యో అల్లు రామలింగయ్య గానో, సాక్షి రంగారావు గానో పలకరిస్తారని ఒకసారన్నారు.హీరో నేరేటివ్ అలవాటు అయిన మనకు గా విశ్వనాథ్ చిత్రాలలో పాత్రలు సినిమాను నడిపిస్తాయి.సన్నివేశ కల్పనా చాతుర్యం ఆశ్చర్యపరుస్తుంది.

శంకరాభరణం లో శంకరశాస్త్రి, స్వర్ణ కమలంలో మీనాక్షి,

సిరిసిరిమువ్వ లోని హేమ,జీవన జ్యోతి లోని శోభ,శారద లోని శారద..ఇలా ఆయన చిత్రాలలోని పాత్రలను పరిశీలిస్తే నటులు కనిపించరు.హీరోలు కూడా పాత్రల్లో ఒదిగిపోవటం చూస్తాం.అదే స్వయంకృషి చిత్రంలో మెగాస్టార్ పక్కకు వెళ్ళిపోయి నటుడు చిరంజీవి తన పాత్రతో శ్రమలోని ఔన్నత్యాన్ని చూపుతాడు.

ప్రతి సినిమా దర్శకుడు సందేశాన్నిచ్చే ప్రయత్నమే చేస్తాడు కదా.ఇందులో ప్రత్యేకత ఏముందని అన్న ప్రశ్న రావొచ్చు.

సినిమా కళగా కన్నా వ్యాపారంగానే అభివృద్ధి చెందింది. ప్రేక్షకులకు వినోదమే ప్రధానమని నిర్మాత,దర్శకులు భావించి కథను తెరకెక్కించటంలో

అసలు కథను మరిచి, కమర్షియల్ ధోరణులతో సినిమాను నిర్మించి కుటుంబమంతా కలిసి చూడాలంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నవేళ విశ్వనాథ్ చిత్రాలు కొంత హాయిని కొంత కాంతిని పంచుతాయి విసుగుతెప్పించే విన్యాసాలు, పోరాటాలు,ద్వంద్వార్థాల సంభాషణలు,ఐటం సాంగ్స్,డ్రిల్లు లాంటి డాన్సులు ఉండేవి కావు.

అలాగే విశ్వనాథ్ చిత్రాలకు ఎవరు సంభాషణలు రాసినా వాటిలో చమత్కారం ఉంటుంది.చిలిపిదనముంటుందే తప్ప జుగుప్స ఉండదు.మాటలు రాసిన జంధ్యాల,ఆకెళ్ళ,సాయినాథ్,

ఎమ్.వి.యస్.హరినాథరావు మొదలైన వారంతా తమ పెన్నుకు వెన్ను,దన్ను దొరికాయని సంబరపడినవారే.

పాత్రల మధ్య చిక్కని అనుబంధం వారి చిత్రాల్లో మనం గమనించవచ్చు.

విశ్వనాథ్ చిత్రాలలో సామాజిక సందేశాలు ఉన్నాయి.

శుభలేఖ చిత్రం వరకట్నాన్ని ప్రశ్నిస్తుంది.శుభోదయం మనలో ఉండే సోమరిపోతుతనాన్ని బాధ్యతారాహిత్యాన్ని చూపుతుంది.శ్రుతిలయలు విజయం తలకెక్కిన మనిషి పతనాన్ని, స్వాతి కిరణం

గురువు కూడా అసూయకు అతీతుడు కాదని చెబుతుంది.ఇక సప్తపది ప్రేమెప్పుడూ కులం గోడలు ఛేదించేదే అంటుంది.సాగరసంగమం మాత్రం జీవితంలో వైఫల్యాన్ని కథగా చెబుతుంది.స్వర్ణకమలం

నాట్యకళలోని ఉదాత్తతను చూపుతుంది.

ఎనభై,తొంభై దశకాల్లో విశ్వనాథ్,బాపు,దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులు అగ్రదర్శకులు.

విశ్వనాథ్ చిత్రాలు వారితో పోటీపడావా అంటే లేదనే చెప్పాలి.ఎవరి ధోరణి వారిదే అయినా విశ్వనాథ్ కి ప్రత్యేక స్థానాన్నిచ్చారు ప్రేక్షకులు.

శంకరాభరణం చిత్రం తెలుగు సినిమాకు అంతకుమించి

భారతీయ చిత్రానికో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.ప్రతి ఫ్రేములోనూ 

శాస్త్రీయసంగీతాన్ని నింపుకుని కొత్త నటుడిని, ప్రధాన పాత్రలో పరిచయం చేయాలంటే ఎంత దమ్ము ,ధైర్యం కావాలి.రిస్కు తీసుకునే నిర్మాత ఎక్కడ దొరకాలి.అలా

ధైర్యం చేశారు ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు.శంకరశాస్త్రి పాత్రకు కేవలం రంగస్థల అనుభవమున్న జె.వి.సోమయాజులు ని ఎంచుకున్నారు. మసకబారుతున్న శాస్త్రీయ సంగీత వెలుగులని పరిరక్షించే ప్రయత్నం విశ్వనాథ్ ది.

తనకు బ్రేక్ నిచ్చిన అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్ర పోషించాలని ఉబలాటపడ్డారని అప్పట్లో ఓ వార్త వ్యాప్తిలో ఉండేది.అదేవిధంగా బాలమురళీకృష్ణ నటించి, సంగీతాన్ని సమకూర్చాలని ఆరాటపడినట్లు మరోకధనం.ఆ స్క్రిప్ట్ కొత్త నటుడితోనే పండుతుందనుకున్న విశ్వనాథ్ అలాగే సాగారు.ఒక సంగీత కళాకారుడికి కళతోపాటు మానవత్వం ఉండాలని సూచిస్తారు.

అదే స్వాతి కిరణం లో కళాకారుడి అహం అసూయలు

ఎలా దెబ్బతీస్తాయో చెప్పే ప్రయత్నం చేశారు.శంకరాభరణాన్ని తలపై మోసిన ప్రేక్షకులే స్వాతి కిరణం చిత్రాన్ని తిరస్కరించారు.రెండింటిలోను గొప్ప పాటలున్నాయి.వేటూరి విశ్వరూపం శంకరాభరణం చూపితే, సిరివెన్నెల సౌకుమార్యం స్వాతి కిరణం చూపిస్తుంది.

మళ్ళీ శంకరాభరణం విషయానికొస్తే, అలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఊహించని పంపిణీదారులు ఆ తర్వాత లెంపలేసుకున్నారు.

సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని లీనమయేలా చేయటం అన్నిసార్లు జరగదు.మాయాబజార్ గురించో, లవకుశ గురించో ఎంత గొప్పగా చెప్పుకుంటామో

ఆతర్వాత అంతటి గౌరవాన్ని పొందింది శంకరాభరణం.

చెప్పులు బయటే ఉంచి థియేటర్ లో సినిమా చూశానని ఒక కార్పొరేట్ సిఇఒ చెప్పారని విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.96 ‌సార్లు చూశానని

ఒక టాక్సీ డ్రైవర్ చెప్పాడుట విశ్వనాథ్ గారికి.ఆయన దగ్గర డబ్బులు కూడా పుచ్చుకోలేదుట.తమిళనాట కూడా తెలుగు శంకరాభరణం నడిచింది ఆరోజుల్లో.ముప్ఫైఏళ్ళ తర్వాత కానీ అనువాదం చేయలేదు.సినిమాని అంతగా హర్షించని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారు ఈ సినిమాని చూసి రాసిన సమీక్ష మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

“శంకరశాస్త్రి పాత్రలో ప్రత్యేకత ,ఆయన సంగీత విద్వాంసుడు కావటం కాదు.సంగీతవిద్వాంసులు చాలామంది ఉంటారు.చిత్తశుద్థీ,ఆత్మగౌరవం,కష్టాలలో ఉన్న వారిని ఆదుకునే కరుణ స్వభావం ,సమాజపు సంకుచిత్వాన్ని లక్ష్య పెట్టని ధీరత్వం,నమ్మిన లక్ష్యాన్ని నుంచి చలించని పట్టుదలా,సహజ గంభీరమైన ప్రవర్తనా లక్షణాలే ఆయన ప్రత్యేకత.

ఈ చిత్రాన్ని నిజ జీవితంలా చిత్రించిన దర్శకుడు, సంభాషణల రచయిత, పాత్రధారులు కలిసి ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చారు.”

బలమైన పాత్రను సృష్టించడం దర్శకుడికి ఎప్పుడూ సవాలే.ఆ సవాలును స్వీకరించి తన చిత్రాల్లో బలమైన పాత్రలు,వాటి ప్రవర్తనా తీరును నిర్దేశించగలగటం కేవలం కె.విశ్వనాధ్ కే సాధ్యం.

సినిమా మాధ్యమం తనకో దేవాలయం లాంటిదని విశ్వనాథ్ అంటుండేవారు.అందుకే తన ప్రతిచిత్రాన్ని అత్యంత శ్రద్ధతో రూపొందించేవారు.ఆయన సినిమాలన్నీ కనక వర్షం కురిపించేవి కావు.కానీ ప్రేక్షకుడికి చక్కటి విలువలను, విలువైన పాటలను

బిగువైన కధనాన్ని అందించటంలో వెనకబడుండేవి కావు.నిర్మాతకు మాట రానిచ్చేవికావు.విశ్వనాథ్ లేకపోతే వేటూరి, సిరివెన్నెలల పాటల వెన్నెల మనకు దొరికేది కాదు.చాలా పాటలకు పల్లవులు విశ్వనాధ్ సూచించేవారని ప్రారంభంలో చెప్పుకున్నాం కదా.

“రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా” అని మాటసాయం చేస్తే ఉండమ్మా బొట్టు పెడతాలోని ఆ గొప్ప పాటను నారాయణ రెడ్డి గారందించారు.అలాగే సిరివెన్నెల లోని చందమామ రావే,జాబిల్లిరావే అన్ని అన్నమయ్య పల్లవిని సూచిస్తే అది పాటై ప్రకంపించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిలో.నా సూచనను అంగీకరించిన తన గీతరచయితలెంతో గొప్పవారని విశ్వనాథ్ అంటుండేవారు.

ఏ సన్నివేశాన్నయినా నటించి చూపడం విశ్వనాథ్ కి అలవాటు.అదే అనంతరకాలంలో వారిని నటుడిని చేసింది.లేటు వయసులో ఎంత ఘాటు నటనయో అని అనిపించేలా చేసింది.దర్శకత్వం చేసినంత సేపు వారు ఖాకీ డ్రెస్ ధరించేవారు.దానికి వారేవో కారణాలు చెప్పినా అది సాంకేతిక నిపుణులకు కర్తవ్యాన్ని, క్రమశిక్షణను, నటీనటులకు ఏకాగ్రతను బోధించింది.

 అభ్యుదయవాదులు గా చెలామణీ అయ్యేవారు విశ్వనాథ్ చిత్రాలను విమర్శించే ప్రయత్నం చేశారు.వాటిని ప్రేక్షకులూ పట్టించుకోలేదు.సినీపరిశ్రమా పట్టించుకోలేదు.

2017లో విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన వేళ ఆకాశవాణి తరఫున ఈ వ్యాసకర్త ఓ ప్రశ్న వేశారు.మీ జ్ఞాపకాలను అక్షరబద్ధం చేస్తే రాబోయే తరాలకు ఉపయోగం కదా అని.దానికి సమాధానంగా వారో ప్రశ్న వేశారు.ఎవరైనా నా చిత్రాలను పరిశీలించి

నా పాత్రలను విశ్లేషిస్తే అది చాలు,నా జీవిత చరిత్ర అక్కర్లేదని నవ్వుల మధ్య అన్నారు ఆరోజున.

కానీ వారారోజున అన్నమాటను నిజం చేస్తూ 2021లో “అనామకుడు” కలం పేరుతో అనేక కథలు రాసిన డా.ఏ.యస్.రామశాస్త్రి “విశ్వనాథ విశ్వరూపం” పేరుతో విశ్వనాథ్ చిత్రాలను విశ్లేషించారు.

“విశ్వనాథ్ గారి చిత్రాలు అమ్మ ఆప్యాయంగా వండి వడ్డించే భోజనాలు.కుటుంబమంతా హాయిగా కూచుని తినే ఇంటి భోజనాలు.అందుకే ఎన్నిసార్లు తిన్నా రుచిగా తృప్తిగా అనిపిస్తాయే కానీ విసుగు పుట్టదు.వెగటు కలగదు” అంటూ విశ్వనాథ్ సినిమాలను అమ్మ వంటతో పోల్చారు.

తెలుగు సినిమా 

రొటీన్ రొచ్చులో కూరుకుపోయిన ప్రతిసారీ కాస్త ఊపిరిపోశారు విశ్వనాథ్.తనో కళాఖండం తీశానన్న అతిశయమెన్నడూ లేనివాడు ఆయన.తన పరిధిలో,తన అభిరుచి మేరకు భారతీయ సంగీతానికీ,నృత్యానికి వెండితెరపై వెలుగులు పంచాడు.సగటు ప్రేక్షకుడి గుండె తలుపు తట్టాడు.

అతని హృదయాన్ని గెలుచుకున్నాడు.సినిమా దేవతని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన అసలు సిసలు భక్తుడు.

అందుకే విశ్వనాథ్ తన చిత్రాలతో మనందరిలో శాశ్వతంగా నిలిచిపోయారు.

సి.యస్.రాంబాబు

March 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

“ఆస్కార్ కు ఆద్యుడు” చంద్రబోస్!

by Kondapally Neeharini March 17, 2023
written by Kondapally Neeharini

‘  ఆస్కార్ ‘ ప్రపంచ  సినీ  పరిశ్రమ జగత్తులో అందరూ అందుకోవాలని కలలు కనే అవార్డ్.

ప్రపంచంలో సినిమాలను నిర్మించే అన్ని దేశాలు ఆస్కార్ అవార్డు  కోసం ప్రయత్నించి ప్రయత్నించి విఫలమైన వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా విడుదల కావాలంటే ఏ ఏ రంగాలు పనిచేయాలో ఏ విభాగాలు పని చేయాలో ఆయా ప్రముఖమైన విభాగాలకు అవార్డును ఇస్తూ ఉంటారు. దర్శకత్వం, నిర్మాణం, కథ ఫోటోగ్రఫీ,ఎడిటింగ్, మేకప్, పాట ఇలా అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తారో వారికి ఆస్కార్ అవార్డు గత 95 ఏళ్ళు గా ప్రదానం చేస్తున్నారు. Oscar Awards- Academy ఇచ్చే ఈ అవార్డు కోసం హాలీవుడ్ మొత్తం తమ యావత్  ప్రతిభను వెచ్చించి మరీ సినిమా లను నిర్మిస్తూ ఉంటారు.

యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డు ప్రధాన ఉత్సవం జరుగుతుంది.

నిన్న , మార్చ్ 12 ఆదివారం నాడు 2023 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డు వేడుకలు జరిగాయి.

  ఇవన్నీ తెలియని వారు ఎవరున్నారు? అందరికీ అన్ని తెలుసు !కానీ , మన చంద్రబోస్ గారి గురించి కదా ఇక్కడ  చెప్పుకోవాలి. తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం సామాన్య విషయం కాదు. పాట రాసిన రచయిత చంద్రబోస్ గారు.

పాటకు వాద్య  సహకారాలు అందించిన ,గాత్ర సాకారాలందిచిన ,తెరపైన నృత్య సహకారాలు అందించిన ,నృత్యం చేసిన నటీనటులు ఇవన్నీ లెక్కలోకి వచ్చేవే! వస్తాయి కూడా!ఇంతకన్నా మించి ఈ పాటను ఆర్ ఆర్ ఆర్ సినిమాలో పెట్టడం వలన గుర్తింపు లోకి వచ్చింది. అన్నింటికన్నా మించి అంత భారీ ఖర్చుతో అంత  నిబద్ధతతో అంత అత్యద్భుతంగా చిత్రీకరణ చేసి దర్శకత్వం వహించిన వారి వలన ఈ సినిమాకు ఇంత పేరు వచ్చింది. కాబట్టి పాట రైటర్,సింగర్స్,మ్యూజిక్ డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్, డైరెక్టర్ ఇన్ని కలిస్తే ,వీటన్నింటి కన్నా ప్రచార హోదా కల్పించడం గొప్పగా  అయినందుకు ఇవాళ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి ఆస్కార్ అవార్డు” నాటు …..నాటు……” పాట సొంతం చేసుకుంది. ప్రపంచమంతా ఆన్లైన్ మీడియాతో నడుస్తోంది అనడానికి ఒక పెద్ద ఉదాహరణ ఇటువంటి పోటీలు, ఫలితాలు . సమాచార వేగం కూడా  కారణం. ఒక వంటకం కుదరాలంటే వస్తువులు, పదార్థాలు ,చేసే వ్యక్తి , చేసే తీరు, వంటవండేవారి శ్రద్ధ ఇన్ని కూడాలి! ఇన్ని సరిపడ్డాక వంటకాన్ని వడ్డించబోయే ముందే ఎవరైనా అది బాగాలేదు రుచి సరిగా లేదు అన్నారంటే గిన్నెడు పదార్థం వృధా అయిపోతుంది. ముందు తిన్న వాళ్ళు పదార్థం చాలా  రుచికరంగా ఉంది అంటే ,ఇక తర్వాత తినేవాళ్ళు అదే అభిప్రాయంతో తింటారు. అందులో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తారు. ఇక్కడ ప్రచారమే ఉపయోగపడుతుంది.ఒక మంచి నవల వచ్చింది అంటే నవల పేరు ,అంశము, రాసిన శైలి,అభూత  కల్పన కాని సత్య నిరూపణము, అద్భుతమైన సందేశం. ఇవన్నీ కావాలి.వీటన్నింటిని మించి ఆ నవల ముద్రితమై అందరూ చదవడం, ఇతర భాషల్లోకి అనువాదం కావడం ప్రపంచానికి అందడం ముఖ్యం. ఇటువంటి ప్రచారం నలుగురు బాగుంది అన్నారంటే అప్పుడు కదా ఇలా సింహాసనం పైన దిష్టింప చేసేది! అయినా కానీ…..ఈ పాట విషయానికి వస్తే, పాటను ఒక్కటే విశ్లేషణ చేస్తే, పాటలోని మాటలు …మాటల్లోని భావము ….పలుకుబడులు ….ప్రజల భాష , పల్లెపదాల పరిమళం ,జానపద పదగుంఫనం  ….!ఇవి ఆకట్టుకునేలా ఉండడం ఈ పాటకు ప్రాణం అయింది.  అవేంటో తెలియాలంటే అట్లా  దుమ్మురేగే పొలం గట్టుకోసారి పోవాల్సిందే!!పోతరాజు ఆడినట్టు ఎవరాడగలరేంది?, దుమ్ము దులుపుతుంటె చూడాల్సిందే! జాతర ..పోలేరమ్మ జాతర! ఇవన్నీ వాటి  వాటి ప్రత్యేకతలను కళ్ళముందు కదలాడేలా చేసాయి కదా!పొలం గట్టు ,మిరప తొక్కుల  యవ్వారం  మొత్తం ఎర్ర జొన్న రొట్టె చెప్పదూ!! కుర్ర గుంపు లొల్లి లొల్లంతా మర్రి సెట్టు నీడలు తెలియజేశాయి కదా! అంతే కాదు కిర్రు సెప్పులు ఊరుకుంటాయా? ఊం..హూ…. కర్ర సాము చేసేందుకు పోవూ!!

ఇంత సహజ సిద్ధంగా  మాటలు అలా అలా అలా స్వరప్రవాహమై రాలే!!

మనసు మళ్ళీ మళ్ళీ నవ్వుకోలె!!

‘నాటు’లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని పెట్టేసాడు కవి చంద్రబోస్! అసలు’ నాటు’ అనే పదానికి అర్థం ఆస్కార్ వాళ్ళకు అర్థమైందో కాలేదో కానీ, అక్కడ వేదిక మీద చ ‘నాటు ‘కి  చెప్పిన అర్థమైతే వేరే! మనకు తెలుసిన నాటు కాదు!ఇవే కదా పలుకుబళ్ళు! వ్యవహారిక భాష ,యాస, ప్రాంతీయ  భాష,భావము! ఓసారి పలకరించుకొని పులకించి పోదామా?

 ఒంటి లోని రగతం!

రంకెలేసి ఎగరదూ!!

ఎకా ఎకీ!

లోపలున్న పానమంతా!!

డుముకు డుముకులాడేయదూ!!

ఎక్కడి పదాలు ఇవి?   మా చినపెండ్యాలలో, మా హన్మకొండ, మా వరంగల్ లలో తిరిగేసి వచ్చి ఉప్పస చెందినట్టు, ఊరట పొందినట్టు,నా చిన్నప్పుడు మా అన్నయ్య లు, తమ్ముడు, అక్కయ్య లతో ఆడుకున్నట్టున్నది, మేము మా దోస్తులందరం మాట్లాడుకున్నట్టున్నది.

ఈ ఒక్క పాటను నేనైతే ఎన్ని సార్లు చూసిన్నో!

 మా పిల్లలే కాదు,మా  మనవరాళ్ళు, మనవడూ ఎన్ని సార్లు డాన్సులు చేస్తారో, ఎంతగా పాడ్తారో! ఇవాళ ఈ సందర్భం వచ్చిందని చెప్పడం కాదు, చెప్పేఅవకాశం వచ్చింది కనుక చెప్పడం.

డింకిచక,

డింకనకర,

డిక్కనకర!!

ఏందిది?కవి పల్లె బుట్టలో మాటలు పోసుకొచ్చాడు. ఈ జానపద సాహిత్యాన్ని ఎన్ని దోసిళ్ళకు ఎత్తు కోవాలీ ఏందీ?

వీటి అందం తెలుసుకోగలిగితే మరింత ఆనందం! పోనీలెండి ఆస్కార్ వాళ్లకి ఎంత అర్థమైందో ఎంత అర్థం కాలేదు బేరీజు  వేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు కానీ, పాటలో ఉన్న ఏదో అందం వాళ్ళనాకర్షించింది! మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది! ఆస్కార్ వచ్చి పడింది. ఆస్కార్ తెలంగాణ యాసకు మోకరిల్లింది. ఆస్కార్ తెలుగు సినిమాకు జోహార్లు అన్నది. ఆస్కార్ తెలుగు పాట లోని వైభవాన్ని గుర్తించింది! ఇది చాలదు మనం ఇలా అనుకోవడానికి చెప్పుకోవడానికి! ఇది చాలు! ఇట్ ఈజ్ ఎ రికార్డ్! దట్సిట్!!

 హాట్సాఫ్ టు చంద్రబోస్ గారు!!

మానుకోట బిడ్డడు, వరంగల్ గడ్డ ప్రతాపం చూపించి, ఆస్కార్ అవార్డు ను పడ కొట్టిండు! తెలుగు ప్రజలకు  ఆస్కార్ చేరేలా చేసిన చంద్రబోస్ గారి కి శుభాకాంక్షలు!

“ఆస్కారన్న చంద్రబోసన్న ” అనే పేరు తెచ్చుకున్న చంద్రబోస్ గారి కి అభినందనలు!!

March 17, 2023 9 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఫిక్షన్ కాని పరిశోధన

by డా॥ వెలుదండ నిత్యానంద రావు March 17, 2023
written by డా॥ వెలుదండ నిత్యానంద రావు

“సైన్స్”ను విశ్లేషణాత్మకంగా ప్రయోగాత్మకంగా వివరిస్తే శాస్త్ర వ్యాసాలు/ శాస్త్ర గ్రంథాలు. లోకం పోకడను, మనసు సవ్వడిని పాత్రల ముఖతః సంఘటనా శ్రయంగా వివరిస్తే కథలు, నవలలు. ఈ రెండు భిన్నమైన రంగాలు. సైన్స్ విషయాలను ఆధారభూమికగా చేసుకొని కొన్ని సామాజిక సంఘటనలకు సైన్సును అనువర్తించి పాత్రల ముఖతః సృజనాత్మకంగా వర్ణిస్తే ‘సైన్స్ ఫిక్షన్’. అంటే శాస్త్రబద్ధమైన, ఆలోచనాత్మకమైన ‘సైన్స్’కు ఊహాత్మకమైన సృజనాత్మకమైన సాహిత్యానికి పెళ్ళి చేస్తే పుట్టే బిడ్డ సైన్స్ ఫిక్షన్ అన్నమాట.

ఈ ‘సైన్స్ ఫిక్షన్’ మీద డా. ఎన్. సుధాకర్ నాయుడు చేసిన పరిశోధన గ్రంథం ఇది. ఈ రోజుల్లో మంచి పరిశోధనాంశం దొరకడం పరిశోధకులకు అదృష్టమే. సరిగ్గా చేయగలిగిన మంచి పరిశోధకుడు దొరకడం మంచి పరిశోధనాంశానికి అదృష్టమే. ఈ రెండు ఒకే చోట కలవడం పాఠకుల అదృష్టం. సుధాకర్ నాయుడు చేతిలో ఈ పరిశోధనాంశం సమాచార పౌష్కల్యంతో విషయ నిర్భరంగా రూపుదాల్చడం ఆనందాన్ని కలిగించే అంశం. ఈ విషయంలో ఇదే ఏకైక ఆకర (reference) గ్రంథం.

సుధాకర్నాయుడు తెలుగు విశ్వవిద్యాలయంలో ముగ్గురు వైస్ ఛాన్స్లర్స్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా ఎంతో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. పని పట్ల నిబద్ధత, వ్యక్తుల పట్ల ఆత్మీయత సుధాకర్నాయుడు నైజగుణం.

 ఈ సిద్ధాంత గ్రంథం ఒక ప్రక్రియా వికాస చరిత్ర. ప్రక్రియా వికాసం చరిత్రలన్నింటికి ప్రధానంగా కావలసింది విస్తృత సమాచార సేకరణ. ప్రాథమ్యాల, వైవిధ్యాల, ప్రయోగాల పరిశీలనం. (అవకాశం ఉంటే) అన్యభాషల్లో ఆ ప్రక్రియా వికాస స్థూల పరిచయం. ఆ తర్వాత ఆ ప్రక్రియలోని రచనల విశ్లేషణ. ఇలాగే వెనుకటి పెద్దలు తమ డాక్టరేటు గ్రంథాలలో పరిశోధించి ఒక ఒరవడి నిర్దేశించారు. సి. నారాయణరెడ్డి (ఆధునికాంధ్ర కవిత్వం బి.వి. కుటుంబరావు (ఆంధ్ర నవలా పరిణామం), పోరంకి దక్షిణామూర్తి (తెలుగుకథ), సంప్రదాయాలు, ప్రయోగాలు), మద్దూరి సుబ్బారెడ్డి (దేశభక్తి కవిత్వం), జి.వి. సుబ్రహ్మణ్యం (ప్రథమాంధ్ర పురాణం). ఎస్.వి. రామారావు (సాహిత్య విమర్శ) లాంటి సిద్ధాంత గ్రంథాల ధోరణిలో సుధాకర్ నాయుడు సిద్ధాంత గ్రంథ రచన సాగడం అభినందనీయమైన అంశం.

చారిత్రక వైజ్ఞానిక నేపథ్యం పేరిట కూర్చిన ప్రథమాధ్యాయంలో పరిశోధకులు పాలిటి గని అంతే గాక పరిశోధకుని దృష్టి కోణాన్ని శ్రమశీలాన్ని తెల్పుతుంది. ఆచంట సాంఖ్యాయన శర్మ భూతత్త్వ శాస్త్ర, ఖనిజశాస్త్ర, క్రిమికీటక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించినవారు. వారు నిర్వహించిన కల్పలత పత్రికలో ‘విజ్ఞాన వల్లిక’ అనే శీర్షిక కింద ఎన్నో ఆధునిక భౌతిక శాస్త్రాంశాలు రాసే వారట. శ్రీ శర్మగారు రహస్య దర్పణం పేరుతో 1892లో రాసిన గ్రంథంలో మనుష్యేతర జీవాల జీవన రహస్యాల గురించి చర్చించారట. భూతత్త్వశాస్త్రం అని ఓ గ్రంథాన్ని రాశారు. డార్విన్ సిద్ధాంతాన్ని తెలుగులో చెప్పారు. కొమర్రాజు లక్ష్మణరావు లాంటివారు సాంఖ్యాయన శర్మను విజ్ఞాన సర్వస్వంగా ప్రశంసించారు. మరి అలాంటి ఆచంట సాంఖ్యాయన శర్మ జీవన, రచనల వివరాల మీద ఎవరైనా డాక్టరేటుకు పూనుకొంటే ఎంత బాగుంటుందోనని నాలాంటివాడికి అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అట్లాగే టేకుమళ్ళ అచ్యుతరావు, టేకుమళ్ళ రాజగోపాలరావు ప్రభృతుల వైజ్ఞానిక రచనలను సుధాకర్నాయుడు ప్రస్తావించారు. వీరిని గురించి మన పరిశోధకులకు తట్టడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే స్వాతంత్య్ర పూర్వం భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న కాంక్ష ఉవ్వెత్తున చెలరేగింది. ఆ ప్రభావంతో సైన్స్ రచనలు కూడా ఎన్నో వచ్చాయి. ఆ తర్వాత సైన్స్ రచనలు బాల సాహిత్య విభాగంలో, లేదా

సైన్స్ ఫిక్షన్గానో, పాపులర్ మార్గంలో వచ్చాయేమోననిపిస్తుంది. ‘సీరియస్’ శాస్త్ర వాఙ్మయ రచనం – పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి నానాటికీ విస్తరిస్తున్న ఆంగ్ల భాషా ప్రభావం కావచ్చు.

స్వయంకృషితో బహుభాషలు నేర్చుకొన్న ఒద్దిరాజు సోదరులు తెలంగాణాలో మారుమూల వైజ్ఞానిక శాస్త్ర వ్యాసంగం నెరపిన వివరాలు ఈ గ్రంథంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఆయుర్వేద గ్రంథాలు, చరకం, శుశ్రుతం, బాహాటం, మాధవ నిదానం, బసవరాజీయం లాంటి గ్రంథాలను క్షుణ్ణంగా అభ్యసించిన ఒద్దిరాజు సోదరులు (ఒద్దిరాజు సీతారామచంద్రరావు (2.4.1887; 28.1.1956) ఒద్దిరాజు రాఘవ రంగారావు (4.4, 1894 – 17.5.1973) మలేరియా నివారణకు ‘తిక్త’ అనే ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేసి వేలాది మందిని కాపాడారట. హోమియో వైద్య గ్రంథాలు కలకత్తా నుండి తెప్పించుకొని అధ్యయనం చేసి హోమియోలో ఎం.డి. పట్టా పొందారట. ‘విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల’ను స్థాపించినవారు. ఫోటోగ్రఫీ నేర్చుకొని ‘ఛాయాగ్రహణ తంత్రం’ చేతి పనులు, బాల విజ్ఞాన మంజూష విద్యుద్విజ్ఞానం లాంటి గ్రంథాలు రాశారు. సాహిత్య సంబంధ రచనలు సరేసరి. వైజ్ఞానిక సంబంధమైన వ్యాసాలను, పుస్తకాలను, విజ్ఞాన సర్వస్వాలను ప్రచురణ సంస్థలను, సంస్థానాలను, విశ్వవిద్యాలయాలు చేసిన కృషిని పత్రికలను, పత్రికల్లోని సైన్స్ కాలమ్స్న కొండ అద్దమందు చూపినట్లుగా సుధాకర్నాయుడు ఈ ప్రథమాధ్యాయంలో ప్రదర్శించారు. దీని ఆధారంగా మరికొన్ని పరిశోధనాంశాలను దొరికించుకోవచ్చు.

సైన్స్ ఫిక్షన్కు వివిధ పండితులు, విజ్ఞాన సర్వస్వాలు, నిఘంటువులు ఇచ్చిన నిర్వచనాలను, లక్షణాలను రెండవ అధ్యాయంలో పేర్కొన్నారు. రేడియో టెలివిజన్ ఛానల్స్లోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ కార్యక్రమాల, సినిమాల వివరాలు సాధారణంగా లభించవు. వాటిని పేర్కొనడం సుధాకర్నాయుడు శ్రమశీలానికి, వెచ్చించిన సమయానికి దర్పణం పడుతోంది. వర్తమాన పరిశోధక విద్యార్థులు ప్రత్యేకించి గుర్తించాల్సిన ఆధునిక సాహిత్యంలో మొదటి సైన్స్ ఫిక్షన్ గ్రంథం మేరీ షేల్లి 1818లో రాసిన ప్రాంపెయిన్ స్టయిన్ అనే పేరున్నది మొడరన్ ప్రొమిధస్. సుధాకర్ నాయుడు దానితో మొదలుపెట్టి అడ్గర్ ఆలెన్పో, ఆల్డస్ హక్స్ లీ, జార్జి ఆర్వెల్, సి.యస్. లెవిన్లను మొదలుకొని అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాల రచనల వివిధ భారతీయ భాషల్లోని సైన్స్ ఫిక్షన్ రచనలను ఆంగ్లాది ఇతర భాషల నుండి చేసిన ఈ అనువాదాలను సుధాకర్ నాయుడు పేర్కొనడం గమనించినపుడు నాకు పాతకాలం సిద్ధాంత గ్రంథాలు (పైన పేర్లు పేర్కొన్నాను) మదిలో మెదిలాయి.

సుధాకర్నాయుడు తొలి తెలుగు సైన్స్ కథలు తెలంగాణా నుండి వచ్చాయని నిర్ధారించడం గమనార్హం. సింగూరి జయరావు (పరమాణువులో మేజువాణి, డిసెంబర్, 1927) ఎల్. శంకరనారాయణ (చంద్రమండలపు చోద్యములు – మార్చి, ఏప్రిల్ 1928), ఒద్దిరాజు సీతారామచంద్రరావు (అదృశ్యవ్యక్తి, అక్టోబర్ 1928 గారలు రాసిన ఈ మూడు కథలు తెలంగాణా నుండి వచ్చిన సుజాత పత్రికలో వచ్చాయి. కొడవటిగంటి, కె.ఆర్.కె. మోహన్, ఎన్.ఆర్. నంది, పురాణపండ రంగనాథ్, మైనంపాటి భాస్కర్ లాంటి వారి సైన్స్ ఫిక్షన్ కథలన్నింటినీ సుధాకర్నాయుడు చర్చించారు.

టేకుమళ్ళ రాజగోపాలరావు 1934లో రాసిన ‘విహంగయానం’ తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ నవల. అప్పటికి సైన్స్ ఫిక్షన్ అనే పదబంధం వాడుకలోకి రానందున ‘ప్రకృతి శాస్త్ర సంబంధ నవల’ గా పిలిచారు. 22.1.1934 తేదీతో పీఠిక రాస్తూ రచయితనే స్వయంగా ‘విహంగ యానము తెలుగులోని ప్రకృతి శాస్త్ర సంబంధమైన నవలలో మొట్టమొదటిది. స్వతంత్రముగా రచింపబడినది. కాని ఇందలి ప్రకృతి శాస్త్ర విషయాలు జనసామాన్యమున కందుబాటులో నుండు రీతిని కూర్చబడినది. వాయు, విమాన నిర్మాణ పద్ధతులు 18,20 ప్రకరణములలో దెలుపబడినది. శాస్త్ర నవలారచనకు, మన భాషకు నాకును గూడ నిదియే ప్రధమము’ అని స్వయంగా పేర్కొన్నారు. ‘ఇది మనకు కొత్తది. మన భాషకు కొత్తది. ప్రకృతి శాస్త్ర సంబంధమగు మొట్టమొదటి నవల. స్వతంత్రంగా వ్రాయబడినది. ప్రకృతి శాస్త్ర జ్ఞానమును సామాన్య జనుల హృదయమున కెక్కించునుత్తమ నవలలు ఫ్రెంచి, జర్మను భాషలలో మాత్రమే కలవు అంటూ కపిస్థలం శ్రీరంగాచారి భారతి డిసెంబర్ 1934 సంచికలో విహంగయానాన్ని సమీక్షిస్తూ అభిప్రాయపడ్డారు. ప్రక్రియ వికాసాల మీద పరిశోధించే ప్రతి పరిశోధకుడు ముందుగా నిర్ధారించవలసింది ఏది తొలి రచన ఎప్పుడు తొలి రచన వచ్చింది. సుధాకర్ నాయుడు తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ లేదా తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ నవల అన్న విషయంలో ఆధార సమన్వితం పరిశోధన తత్పరతతో చూశారు. భవిష్యత్తులో దీనిని ఎవరైనా కాదంటే సుధాకర్నాయుడు పేర్కొన్న కాలాలకు చెందిన కథ / నవలలకన్నా ముందువి దొరికి వాటి చరిత్ర, మరికాస్త వెనక్కి వెళ్ళిందని సంతోషించవచ్చు.

సైన్స్ఫక్షన్కు కుహనా సైన్స్ ఫిక్షన్కు అంతరం ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం ద్వారా సంభవమయ్యే అవకాశమున్న మేరకు రక్తి కట్టించే కల్పనను జోడించి రాయడం సైన్స్ ఫిక్షన్ అవుతుంది. అంతేగాని సైన్స్ ఏమాత్రం అంగీకరించని దాన్ని ఏదో వింత పేర్లు కల్పించి రాసేవి కుహనా సైన్స్ ఫిక్షన్ (సోషియో ఫాంటసీ) కథలు / నవలలు అవుతాయి. సుధాకర్నాయుడు ఏది సైన్స్ ఫిక్షన్? ఏది సోషియో ఫాంటసీ అని గుర్తించి పేర్కొనడం పరిశోధకునిగా ఆయన అప్రమత్తతను తెలుపుతుంది. 1934 నుంచి 1970 వరకు 37 ఏళ్ళ కాలంలో సైన్స్ ఫిక్షన్ నవలలు పదికి మించి లేవని పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. (పుట. ) సోషియోఫాంటసీ, సైన్స్ ఫిక్షన్కు రెండు విభాగాలుగా చెప్పుకొన్నా ఎక్కడో ఒకచోట ఈ రెండు కొంతమేరకు కలగలిసిపోతాయేమో! కాకుంటే పాళ్ళల్లో ఎక్కువ తక్కువ లను బట్టి వర్గీకరించుకోవలసి రావచ్చు.

మొత్తమీద తెలుగులో ఇప్పటిదాకా 89 డైరెక్ట్ కథలు, 17 అనువాద కథలు 503 పైగా నవలలు సైన్స్ ఫిక్షన్కు సంబంధించి వచ్చాయని పరిశోధకుడు అంచనాకు వచ్చారు. ఒకటి రెండు జారిపోయినా నష్టం లేదు. 1987 జూన్ నుంచి 1996 సెప్టెంబర్ 67 సిద్ధాంత గ్రంథాలు ఆంగ్లంలో సైన్స్ ఫిక్షన్ మీద వచ్చాయని సుధాకర్నాయుడు ఉపసంహారంలో పేర్కొన్నారు. తెలుగులో మాత్రం ఇంతదాకా ఇదొకటే. సాహిత్యం విస్తృతంగా వస్తే పరిశోధనలు విస్తృతంగా జరుగుతాయి. సైన్స్ ఫిక్షన్ రాయడమే తక్కువ. పాఠకుల్లో విపరీతాసక్తి ఉంటే రచయితలు బాగా రాస్తారు. రచయితలు బాగా రాస్తే పరిశోధకులు ఆకర్షిస్తారు. రచయితలు బాగా రాస్తే పరిశోధకులు ఆకర్షితులు – ఇదంతా ఒకదానికి ఒకటి సంబంధించిన (Interlinked) వ్యవహారం.

తెలుగు సాహిత్యంలో ‘సైన్స్ ఫిక్షన్’పై విషయ నిర్భరమైన సమాచార పౌష్కల్యంతో కూడిన ఏకైక ఆకర (రిఫరెన్స్) గ్రంథంగా మలచిన సన్మిత్రులు డా. ఎన్. సుధాకర్ నాయుడు గారికి మనసారా అభినందనలు. నాకీ నాలుగు మాటలు రాసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.

March 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మహిమ గలది మహిళ

by kudikala Janardhan March 17, 2023
written by kudikala Janardhan

మహిమ గలది మహిళ ఈ జగతిలోన
ఆ మధుర చరిత వినిపించెద జనములోన
అంగన అంచయాన అంబుజనయన
అంబుజాక్షి అబ్జముఖి అంబుజవదన
ఏ పేరున పిలిచినా అందచందమే
ఏ తీరుగ చూసినా అనురాగబంధమే
“అమ్మ”అనే పిలుపుకై ఆరాటపడుతుంది
అందుకు ప్రాణాలే పణంగా పెడుతుంది
మగనితో జత కూడితే మగనాలి తానే
అతనిలో సగమైతే అర్థాంగియు తానే
పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే అత్తమ్మ తానే
ఆ పిల్లల పిల్లలకు అమ్మమ్మ నానమ్మ తానే

కూతురై పుట్టుతుంది ఒక ఇంట
కోడలై అడుగు పెట్టు ఒక ఇంట
ఇంటికి దీపం ఇల్లాలే నంట
ఇలనైన కలనైన నిజమే నంట
వింటికి నారి అనివార్యం
కంటికి నారి సౌందర్యం
మగనికి నారి మాధుర్యం
వెంటనడిస్తే ధైర్యం స్థైర్యం

March 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us