మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

హాయ్

by Dharba Shyayanam Srinivasacharyulu June 14, 2022
written by Dharba Shyayanam Srinivasacharyulu

దేశం కాని దేశంలో
ఈ శీతలోష్ణపు సాయంత్రం వేళ
అంతగా పరిచయం లేని దారిలో
విచ్చుకున్న చూపునై నడుస్తుంటే
ఎదురుపడి
‘ హాయ్ ‘
అని నన్ను పలకరిస్తూ
చిర్నవ్వై సాగిపోయిన
అతనెవరు

పూర్వ పరిచయమా ? లేదు,
మళ్లీ మరెక్కడో కలుస్తామా ?
తెలియదు
అతనొస్తూ వస్తూ నన్ను చూసాడు
అంతే, అతని పెదాలు విచ్చుకున్నాయి,
అప్పటికప్పుడు పూలు పూసాయి
గొంతులో కూడా!
హాయ్!

పలకరిస్తూంటే అతనిలో
హాయి సమీరం వీచినట్లుంది
అది అక్కడే అంతర్థానం కాక
నా దాకా వచ్చి నను తాకి
పలకవోయీ అన్నట్లుంది
అంతే! నా పెదాలూ విప్పారాయి,
పలుకూ పూసింది సుతారంగా!
హాయ్!

రెండు పిలుపుల కలయిక
ఎంత సరళం, పరిమళ భరితం!
ఏ ఒప్పందాల పత్రాల్లేవు
ప్రయోజనాల లెక్కల్లేవు
హెచ్చూ తగ్గుల యోచనల్లేవు ,
ముందూ వెనకాల వ్యూహాల్లేవు
యోగ్యతాయోగ్యతల తూకాల్లేవు
అప్రయత్నంగా హాయిగా
పెదాల తోటల తలుపులను తెరిచి
పలకరించడానికి పెద్ద కారణాలెందుకు
తోటి మానవుణ్ణి కలిసిన
ఆనంద తన్మయపు పులకరింత చాలు
తోటి మానవుడికి గుప్పెడంత
ఉల్లాస గంధాన్ని అందిస్తున్న ఆ వేళ
పొందే అగణిత తృప్తి చాలు

మనుషులే కాదు,
దేశాలూ పలకరించుకోవచ్చు మెత్తగా!
అపుడు సరిహద్దుల్లోనే కాదు,
ఆ వైపూ ఈ వైపూ
మనిషి నడిచే ప్రతీ దారిలో
పూల వనాలు పలకరిస్తాయి
హాయ్! హాయ్! హాయ్!

June 14, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు

by Bellamkonda Sampathkumar June 14, 2022
written by Bellamkonda Sampathkumar

అలకలు పట్టివులు

కక్ష సాధింపు కయ్యాలూ

పిల్లల మొండితనం లాగా

రాద్ధాంతం గానే మొదలవుతది

అర్థం కాకుండానే

వాదన పెట్టుకుంటది

దిగువ ప్రవాహానికి నీళ్లు తాగుతున్న మేక

ఎగువగానున్న పులికి ఎంగిలి పడ్డ నెపం ఒకటి

యుద్ధానికి కారణమవుతది

అంత దానికి ఇంత బల ప్రయత్నమెందుకో!

భూనభోంతరాళాల

జలజలాంతర విన్యాసాలెందుకో !

కూటములు శాంతి దౌత్యాలెందుకో !

ఈ ఎల్లల విస్తరణా

చుట్టుముట్టు ఎత్తుగడా

ఏ  సంక్షేమానికని !

అంతా మన బోటి ఆగం కానీ

పై పై కారణాలన్నీ ఉట్టుట్టి ప్రేలాపణలే !

వాడిన హరితం

వాంగ్మూలం చెబుతుంది

కప్పు సాసర్ కింద

కాలుతున్న పువ్వులను కనుగొనాలి

యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు

ఎగుమతి దిగుమతుల మీద

ఉత్పత్తి వినియోగాల మీదా

ధరల మీద తడి లేని ప్రాణాల మీదా

వికసించే మొగ్గల మీద సీతాకోక చిలుకల మీదా

వయస్సు మీద పడ్డ మడతల మీదా

పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర మవుతుంది

యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు.

యుద్ధ మన్నాక ఒక్క రీతీ ఉండదు

యుద్ధం ఒక చార్ పత్తర్ ఆట

సైనికులు పహారా ఉన్న 

అహంకారపు పూల విమానం

మృగయా వినోదం

దానికో బీజీయ సమీకరణముంటది

అంకెలూ అక్షరాలూ కలవని కూట సంబంధం

తడిసి మోపెడు పెను భారమవుతుంది

యుద్ధం ఒంటరిగా రాదు

కనిపించని వ్యూహంతో

కత్తులు నూరుతుంది  

అనాగరిక దుష్ట సంప్రదాయం

ప్రజలు వద్దంటున్నా

ఎందుకింత  పిపాస !

ఈ విశ్వ కుటుంబానికి

పాలకులు తండ్రి లాంటి వారు

పొరుగు బంధాలన్నీ లోకకళ్యాణార్ధం

ఏ పక్షం కానీ

ప్రజా పక్షం కావాలి

ఒక నాగరిక సమాజం కోసం

కొత్త సూత్రాలను

కొత్త విలువలను ఆవిష్కరించుదాంహాయ్!

June 14, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

నట్లు

by -డాక్టర్ కాసర్ల రంగారావు June 14, 2022
written by -డాక్టర్ కాసర్ల రంగారావు

పంకం నుంచి పద్మం వచ్చినట్లు

పాలనాంకం  నుండి సుంకం వచ్చినట్లు

తత్వం నుండి సత్యం వచ్చినట్లు

స్వరాజ్యం కోసం తిలక్ ఉదయించినట్లు

కాంగ్రెస్ నుండి గాంధీ వచ్చినట్లు

సంస్కరణ కోసం కందుకూరి ఉద్యమించినట్లు

ఆదర్శ మే మూడో పాదం గా గురజాడ అడుగు పడినట్లు

భాషపై వ్యవహార పిడుగు గిడుగు పడినట్లు

ఒక చాణుక్యుడి నుండి కౌటిల్యుడు వచ్చినట్లు

ఒక  సంకల్పం నుండి నెహ్రూ వచ్చినట్లు

సాహసం నుండి నేతాజీ వచ్చినట్లు

ధృఢ సంకల్పం నుంచి సర్దార్ వచ్చినట్లు

పౌరుష సందర్భం నుండి ప్రకాశం వచ్చినట్లు

విభిన్నత నుండి జిన్నా వచ్చినట్లు

ధిక్కార స్వరం నుండి అంబేడ్కర్ వచ్చినట్లు

ఛందస్సు నుంచి పద్యం వచ్చినట్లు

వికాసం కొరకు పౌరహక్కులొచ్చినట్లు

సమాజం నుండి సంక్షేమం వచ్చినట్లు

అత్యాశ  నుండి అవినీతి వచ్చినట్లు

పరిపక్వత నుండి పీవీ వచ్చినట్లు

ధిక్కార స్వరం నుండి కాళోజీ వచ్చినట్లు

ప్రపంచంలో భారత్ ఎదిగినట్లు భిన్నత్వంలో ఏకత్వం మిగిలిన

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

‘నమో! నా దేశమా!!’.

by Peddurti Venkatadasu June 14, 2022
written by Peddurti Venkatadasu

నిప్పులు చిమ్ముతూ నింగికెగిసే ఉపగ్రహ  ప్రయోగం మంచి తిథి ఎంపిక తో మనదైన నమ్మకం తో

విజ్ఞాన శాస్త్ర కేతనాన్నెగురవేస్తున్నది

ఆధ్యాత్మిక మహిమకు,మన సంఖ్యాశాస్త్ర శక్తికీ ఇది

ఎదురులేని  నిదర్శనం

ప్రపంచవ్యాప్తంగా

ప్రచండ వేగంతో

ప్రజాభిప్రాయమై వెలుగుతున్నది

ప్రాణ రక్షణ పాత్రోల్మీనమై

ఆరోగ్యానికిస్తున్న

ప్రాముఖ్యత

ఎన్ని కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నా

మన ఆధ్యాత్మికత అంటుకట్టుకున్నా

యోగా విశ్వవ్యాప్తంగా జనాదరణ పొందిన యుక్తి కి

మన భక్తికి ఇది బలమైన తార్కాణం!

అవనిని జనని గా కొలిచే దేశంలో

పారే నీరైనా

పీల్చే గాలైనా

భక్తితో

భగవంతుని ప్రసాదమని

ఇక్కడి

జనం గుండెల్లో గూడు కట్టుకున్నది నమ్మకం!

అదే మనకు అనువంశికంగా అబ్బిన గుణం

అందుకే మాది కర్మభూమి అంటున్నారు ఈ దేశజనం!

నిండైన ఈ భావనతోనే సౌభ్రాతృత్వం

పరిఢవిల్లుతుంది

ఇక్కడ అనుదినం!!!

  ——– పెద్దూరి వెంకటదాసు

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శిశిరగీతంలో వసంత రాగం!

by Ramesh June 14, 2022
written by Ramesh

మాఘమాసం
ముడివేసింది వాళ్ళిద్దరిని
శ్రీకారంచుట్టింది కలల కాపురానికి

మొట్టమొదలే
అవాంతరం జడలు విరబోసుకుని
ఆయన మనసులో  ఒక ఆలోచన పురుడుపోసుకుని
ఆమె కలికివలపుల వాకిళ్ళలో
తిష్ట వేసింది అమాస నిశీధం
ఇరువురిమధ్యఏర్పడింది పెను అగాధం
ఆ అగాధం బంగాళాఖాతంగా మారి
ఇరువురి బ్రతుకుల్ని నిండా ముంచింది
ముసలవ్వ సేవలోఆయన ఇక్కడ
ముసలి నాయనకు ఊతకర్రగా  ఆమె అక్కడ
ఏ ముద్దుముచ్టటకు ఆశలేదు
ఏ కోరికా తీర్చడానికి చెంత ఆమె లేదు
అంటార్కిటికా ఖండం దీర్ఘరాతిరిలాంటి విరహాలు వాళ్ళు
కలుసుకోలేని రైలుపట్టాల సమాంతర జీవితాలు వాళ్ళు

వృద్ధాశ్రమాల్నిగాని
తాడుతో వ్రేలాడదీసే లంచ్ బాక్సుల్ని  గాని
ఫోనులోనుండి మందులను గుర్తుచేసే మోడ్రన్ మమతల్నిగాని
నాలుగు గోడల నడుమ నలిగే శుష్కవేదనల్నిగాని
కాదనుకున్న వాళ్ళు
కన్నవాళ్ళఒంటరి ఆఖరిమజిలీని కాస్తంత హరితమయం చేస్తున్న వాళ్ళు
కళ్ళ ముందుండి మనోధైర్యాన్ని నింపి ముదిమి జీవితాల్ని ఆనందమయంగా మలుస్తున్న వాళ్ళు
ఆయనకు ఒక పాప ఉంది
ఆమెకు ఒక బాబు ఉన్నాడు
ఇది శిశిరగీతంలో  వసంత రాగం
దగ్దహృదయం మీది వెన్నెలజలపాతం
ఆ ముసలివాళ్ళు మంచానికే అంకితం
కాలు కదపలేకున్నాగాని వాళ్ళు
స్వర్గంలో తప్పక కలుసుకుంటారు
అపుడైనా వీళ్ళు కూడా కలుసుకుని జీవిస్తారేమో బహుశా జీవితాంతం
అపుడు కదా కధ సుఖాంతం.

రమేశ్  నల్లగొండ
8309452179

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నదీమతల్లులు

by Uma devi June 14, 2022
written by Uma devi

(వచన కవిత)

మేఘాల చాటుకొండకోనల్లో పుట్టినా
దాహపుగొంతుల వెతుక్కుంటూ వచ్చే గంగమ్మ
ప్రాంతీయ గాథల ఉరవడినీ కలుపుకొని…
పలుపేర్లతో అలరిస్తూ అఖిలప్రాణి సమూహాలకు
ఆదరువుగా ప్రవహిస్తుంది!

సరళంగాసాగే మైదానాల్లో పసిడివరి పంటలకు కారణం
ఇసుక ఒండ్రునేలల్లో పుచ్చ, ఖర్భుజా, గెనుసు గడ్డల పహరా హుషార్ !
వేసవిపంటలకు వాణిజ్యమై
కొబ్బరి, అరటితోటలఆర్ధిక ఆహ్లాదమే !

నది నిశ్శబ్దమిత్రుడు,తీరంలో జాలరికుటుంబాలకు
తాటిమానులతెప్ప నుండీ మరపడవవరకూ..
ఆటుపోట్లజలధికి అనుచరగణంనదులు!
ఇసుకతిన్నెల్లో కృష్ణపక్షం వెన్నెల
భావకవిత్వం అలలుగా తేలే సమయం !
పాపికొండల మధ్య గోదావరి అందం
విహారయాత్రా విషాద గీతం !!
చిన్ని చిన్ని గుడులున్న తీరాలలో జనసముద్రంగా..
తిరుణాల తీర్థం
ఎంకితో నాయుడుబావ సంకలో పిల్లాడు సంబరాలు
జానపద భవ్యదృశ్యాలు !

అవధిలేని వర్షాభావంతో,
నదీ గర్భం ఎండినా
చెలిమల్లో శ్రామిక జీవుల సంజీవని గానే !
నదిముఖం ముడుచుకొని..
ఫ్యాక్టరీ వ్యర్ధాలకూపంలో గిలగిల కొట్టుకునే పాయలు..
స్వార్థశక్తులు ముందు తరాలకు చేసే ద్రోహాన్ని,
వరదలుగా ముంచి ప్రశ్నించే నది,
లోయల్లో నాగరికతకు
నిదర్శనంగా మృణ్మయపాత్రలా
బండలపై నిలిచిన శిలాజమై
పుష్కరరేవుల్లో బురదతొక్కిసలాటల విస్మయ దుర్ఘటనలై
పాలకుల పాపపుకీర్తి తురాయిని ముంచేసింది!
ఏ బంధం అంటించుకోని నది
పల్లె జనం భక్తితో చల్లిన పసుపు కుంకుమల్లో.. దివ్యంగా !!

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహిత్యఝరి తిరునగరి

by mayuukha June 14, 2022
written by mayuukha

ఈరోజు (ఏప్రిల్ 25) ప్ర‌ముఖ సాహితీవేత్త, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ దాశ‌ర‌థి సాహిత్య పుర‌స్కార గ్ర‌హీత‌, క‌వి తిల‌క‌ డా. తిరున‌గ‌రి  ప్ర‌థ‌మ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని వారికి స్మృత్యంజ‌లి…

డా. తిరున‌గ‌రి

ప్ర‌ముఖ క‌వి, సీనియ‌ర్ సాహితీవేత్త డా. తిరున‌గ‌రి పూర్వ ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా,  ప్ర‌స్తుత యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని  రాజాపేట మండ‌లం బేగంపేట గ్రామంలో 24 సెప్టెంబ‌రు 1945న జ‌న్మించారు. పూర్తిపేరు తిరున‌గ‌రి రామానుజ‌య్య‌. తిరున‌గ‌రి పేరుతో ఐదు ద‌శాబ్దాల పాటు వివిధ తెలుగు సాహిత్య ప్ర‌క్రియ‌ల‌లో నిరంత‌రాయంగా ర‌చ‌న‌లు చేసి ప్ర‌ఖ్యాతిని పొందారు. విద్యాభ్యాసం త‌రువాత మూడు ద‌శాబ్దాల‌కు పైగా ప్ర‌థ‌మ శ్రేణి తెలుగు పండితునిగా,  ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో తెలుగు లెక్చ‌ర‌ర్‌గా ఉద్యోగాలు చేశారు. ఆలేరులో స్థిర‌ప‌డ్డారు. త‌న తండ్రి మ‌నోహ‌ర‌స్వామి ప్రోత్సాహంతో చిన్న‌నాటి నుండే ప్రాచీన‌, ఆధునిక సాహిత్యాల‌పై ఆస‌క్తిని పెంచుకొని విస్తృతాధ్య‌య‌నం చేసి విశిష్ట సాహితీవేత్త‌గా ప్ర‌స్థానం సాగించారు. బాల‌వీర‌, శ్రీ‌షిరిడిసాయి త్రిశ‌తి శ‌తకాలు, శృంగార నాయిక‌లు ఖండ కావ్యం, తిరున‌గ‌రీయం 1,2,3,4, నీరాజ‌నం, జీవ‌ధార ప‌ద్య సంపుటాల‌ను, కొవ్వొత్తి, వ‌సంతం కోసం, అక్ష‌ర ధార‌, త‌ల్లిపేగు, గుండెలోంచి, ముక్త‌కాలు, మా ప‌ల్లె, మ‌నిషి కోసం, వానా- వాడూ, ఈ భూమి, ప్ర‌వాహిని, ఉషోగీత‌, ఒకింత మాన‌వ‌త కోసం, యాత్ర‌, కొత్త లోకం వైపు, కిటికీలోంచి స‌ముద్ర మ‌థ‌నం, జ‌న‌హిత‌, చెమ‌ట నా క‌విత్వం వంటి ప‌లు వ‌చ‌న క‌వితా సంపుటాల‌ను వెలువ‌రించారు. భార‌తి, చుక్కాని, కృష్ణా ప‌త్రిక, ఆంధ్ర ప‌త్రిక‌, ఆంధ్ర‌ప్ర‌భ‌, స్ర‌వంతి, జ‌న‌ధ‌ర్మ, వ‌రంగ‌ల్‌వాణి,  భాగ్య‌న‌గ‌ర్,  ప్రజామిత్ర, తేజోప్ర‌భ‌ వంటి ఎన్నో ప్ర‌ఖ్యాత సాహిత్య ప‌త్రిక‌ల‌లో అనేక క‌విత‌లు, ప్రామాణిక‌మైన  సాహిత్య విమ‌ర్శావ్యాసాల‌ను తిరున‌గ‌రి రాశారు. ఆలోచ‌న‌, లోకాభి రామాయ‌ణం, లోకాలోక‌నం వంటి స‌మ‌కాలీన అంశాల‌తో కూడిన‌ కాల‌మ్స్‌తో పాటు వేయికి పైగా  వివిధ ప‌త్రిక‌ల‌లో ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టుగా  వ్యాసాలు  రాశారు. ఆకాశ‌వాణి, దూర‌ద‌ర్శ‌న్‌ల కోసం 100కు పైగా  ల‌లిత‌, దేశ‌భ‌క్తి, బృంద గీతాల‌ను రాసి  పేరొందారు. ప్రైవేటు ఆల్బ‌మ్‌ల కోసం భ‌క్తిగీతాలు, ప్ర‌బోధ గీతాల‌ను  ఎన్నో రాశారు. సాహిత్య సాంస్కృతిక, సామాజిక అంశాల‌పై వ‌క్త‌గా  అనేక ప్ర‌సంగాలను వివిధ వేదిక‌లపై చేశారు. ఉభ‌య తెలుగు రాష్ర్టాల‌లో జ‌రిగిన  ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌లో పాల్గొని ప్ర‌సంగించారు. క‌వితిల‌క, మ‌హావ‌క్త  వంటి బిరుదుల‌ను అందుకున్నారు.  తిరున‌గ‌రి ర‌చ‌న‌లు ఆంగ్లం, హిందీ భాష‌ల‌లోకి అనువ‌దింప‌బ‌డ‌ట‌మే కాక ఆయ‌న సాహిత్యంపై వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌లో ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. న‌ల్గొండ జిల్లా అధికార భాషా సంఘం స‌భ్యుడిగా 2002-2005, 2006 సంవ‌త్స‌రాల‌లో ప‌ని చేశారు. యాద‌గిరిగుట్ట బ్ర‌హోత్స‌వాల‌లో తిరున‌గ‌రి అధ్య‌క్షత‌న ఎన్నో క‌వి స‌మ్మేళ‌నాలు జ‌రిగాయి. త‌న నిరంత‌ర  సాహిత్య కృషి ద్వారా ఆలేరు ప్రాంతానికే కాకుండా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు గుర్తింపును తీసుకువ‌చ్చారు.  దివాక‌ర్ల, దాశ‌ర‌థి, సినారె, పేర్వారం మొద‌లుకొని  పాటు ఆధునిక సాహితీవేత్త‌ల వ‌ర‌కు తిరున‌గ‌రి అందించిన సాహిత్యం ప్ర‌శంస‌లందుకుంది. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్ర‌క్రియ‌ల‌లో ప్ర‌చురిత‌మైన ప‌లు ప్ర‌త్యేక సంచిక‌ల‌కు సంపాద‌కులుగా, సంపాద‌క‌మండ‌లి స‌భ్యులుగా తిరున‌గ‌రి వ్య‌వ‌హ‌రించారు. వివిధ విశ్వ‌విద్యాల‌యాలు, సంస్థ‌లు నిర్వ‌హించిన జాతీయ సాహిత్య స‌ద‌స్సుల‌లో ఆయ‌న‌ అనేక ప‌త్ర స‌మ‌ర్ప‌ణ‌లు చేశారు. ఉభ‌య తెలుగు రాష్ర్టాల‌తో పాటు ప‌లు ఇత‌ర రాష్ర్టాల‌లో తెలుగు సంఘాలు, సంస్థ‌లు నిర్వ‌హించిన అనేక  సాహిత్య స‌ద‌స్సులు, విశేష కార్య‌క్ర‌మాల‌కు అతిథిగా తిరున‌గ‌రి హాజ‌ర‌య్యారు. హైద్రాబాదులో 2017లో జ‌రిగిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌లో తెలంగాణ శ‌త‌క సాహిత్యంపై తిరున‌గ‌రి ప్ర‌సంగించి తెలంగాణ శ‌త‌క  వైభ‌వాన్ని అద్భుతంగా  ఆవిష్క‌రించారు. స‌మ‌కాలీన వ‌ర్త‌మాన అంశాల‌పై  తిరున‌గ‌రీయం పేరుతో తిరున‌గ‌రిది మాట తిరుగులేదు అన్న  మ‌కుటంతో డాక్ట‌ర్ తిరున‌గ‌రి రాసిన ప‌ద్యాలు తెలుగునాట ప్ర‌తినోటా ఎంతో పాపుల‌ర్ అవ్వ‌డ‌మే కాకుండా అవి సంక‌ల‌నాలుగా కూడా ప్ర‌చురితమ‌య్యాయి. తిరున‌గ‌రీయం సమాజాన్ని విశ్లేషిస్తూ వ‌చ్చిన మంచి ప‌ద్య‌కావ్యం అన్న ప్ర‌శంస‌ల‌ను సాహితీలోకంలో అందుకుంది. తిరులో సంప్ర‌దాయాన్ని, న‌గ‌రిలో నాగ‌రిక‌త‌ను దాచుకొని తేజ‌స్వంత‌ములు, ఓజ‌స్వంత‌ములైన క‌విత్వాన్ని ప‌ద్యం, గేయం, వ‌చ‌నం వంటి ప్ర‌క్రియ‌ల‌లో అందించి ప్రాచీన, ఆధునికత‌ల మేళ‌వింపుగా హృద్య ర‌చ‌న‌ల‌తో స‌హృద‌యుల‌ను అల‌రింప‌జేసిన నిష్కామ దార్శ‌నికత క‌లిగిన మ‌ధురక‌వి, సాహితీవేత్త డాక్ట‌ర్ తిరున‌గ‌రి. ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క సాహిత్య పుర‌స్కారాల‌ను ఎన్నింటినో తిరున‌గ‌రి త‌న సాహిత్య ప్ర‌యాణ ప‌రంప‌ర‌లో భాగంగా  అందుకున్నారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా అప్ప‌టి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌త్కారం (1975),  న‌ల్గొండ జిల్లా స్థాయి ఉత్త‌మ ఉపాధ్యాయుడుగా రెండు సార్లు  స‌త్కారం (1976, 1978), యాద‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహస్వామి దేవ‌స్థానం పండిత స‌త్కారం (1992), బి.ఎన్‌.రెడ్డి సాహిత్య పుర‌స్కారం (1994), ఆంధ్ర‌ప్ర‌దేశ్  ప్ర‌భుత్వ క‌ళానీరాజన పుర‌స్కారం (1995), ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ విశిష్ట (ఉగాది) పుర‌స్కారం (2001), విశ్వ‌సాహితి ఉత్త‌మ ప‌ద్య‌క‌వి పుర‌స్కారం (2003), భార‌త్ భాషాభూష‌ణ్  (డాక్ట‌రేట్) అఖిల భార‌త భాషా సాహిత్య స‌మ్మేళ‌న్, భోపాల్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ (2003), అటా (అమెరికా తెలుగు అసోసియేష‌న్) స‌త్కారం (2006), ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అధికార భాషా సంఘం స‌త్కారం (2006), రాచ‌మ‌ళ్ళ ల‌చ్చ‌మ్మ స్మార‌క మాతృమూర్తి అవార్డు, న‌ల్గొండ (2008),  పొట్టిశ్రీ‌రాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం ప్ర‌తిభా పుర‌స్కారం (2014), వేదాచంద్రయ్య తెలంగాణ రాష్ర్ట‌స్థాయి సాహిత్య  పురస్కారం (2015), ప‌ద్మ‌శ్రీ ఎస్‌.టి. జ్ఞానానంద‌క‌వి సాహిత్య పుర‌స్కారం (2016), మ‌హాక‌వి దాశ‌ర‌థి పురస్కారం  (2016) హైద్రాబాద్, శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ తెలుగు భాషా నిల‌యం వారి దాశ‌ర‌థి పుర‌స్కారం (2017), గిడుగు తెలుగు భాషా పుర‌స్కారం – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట ప్ర‌భుత్వం – అమ‌రావ‌తి (2017), తెలంగాణ ప్ర‌భుత్వ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా స్థాయి ఉత్త‌మ సాహితీవేత్త పుర‌స్కారం – (2 జూన్ 2017), సారిప‌ల్లి కొండ‌ల్‌రావు ఫౌండేషన్, యువ‌క‌ళా వాహిని సాహిత్య పుర‌స్కారం (2019), డా. దాశ‌ర‌థి – వంశీ జీవిత సాఫ‌ల్య సాహితీ పుర‌స్కారం – 2019 (డా. వాసిరెడ్డి సీతాదేవి) – వంశీ గ్రంథాల‌యం, ఆరాధ‌న సాహిత్య పుర‌స్కారం – 2019, సినారె సాహితీ పుర‌స్కారం – 2019 (అభినంద‌న సంస్థ) వంటి ప‌లు పుర‌స్కారాల‌ను తిరున‌గ‌రి పొందారు.  తిరున‌గ‌రికి 2000లో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మ‌హాక‌వి దాశ‌ర‌థి పుర‌స్కారాన్ని అంద‌జేసింది. తిరున‌గ‌రి రాసిన చివ‌రి క‌విత నా తెలంగాణ త‌ల్లీ శీర్షిక‌తో చైత‌న్య సాక్షి తెలుగు మాస ప‌త్రిక‌, ఏప్రిల్ 2021 సంచిక‌లో ప్ర‌చురిత‌మైంది. ప‌ద్యం, గేయం, వ‌చ‌నం వంటి తెలుగు సాహిత్య ప్ర‌క్రియ‌ల‌లో అందెవేసిన సాహితీవేత్త‌గా పేరొందిన తిరున‌గ‌రి 25 ఏప్రిల్ 2021న స్వ‌ర్గ‌స్తుల‌య్యారు.
https://youtu.be/5_8s5xFSAaQ

డా.తిరునగరి వర్దంతి యాదిలో…

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వేములవాడ వైభవం పద్యకావ్యం.

by సంకేపల్లి నాగేంద్ర శర్మ June 14, 2022
written by సంకేపల్లి నాగేంద్ర శర్మ

రచన: చొప్పకట్ల భాను, వేములవాడ. పుటలు:156. వెల: 116 రూపాయలు.
వేములవాడ రాజన్న క్షేత్ర వైభవాన్ని పద్యాల్లో అభిషేకించిన చొప్పకట్ల భాను!

వేములవాడ క్షేత్రేశ్వరుడైన రాజరాజేశ్వర స్వామి వారిపై ఈ వంద సంవత్సరాలలో ఎంతోమంది కవులు, పండితులు వివిధ ప్రక్రియల్లో విలువైన రచనలు చేశారు. కీ.శే. మామిడిపల్లి సాంబకవి, వేదాంతం కాశీనాథం, కేశన్నగారి రాజశర్మ, వజ్జల సాంబశివశర్మ, బ్రహ్మనగారి నరహరి శర్మ మొదలగు పద్యకవులు స్వామి వారిపై కావ్యాలు రాశారు. దండకాలు రాశారు. స్తుతులు, సంకీర్తనలు, భజన పాటలు రాశారు. 150 సంవత్సరాల క్రితం యోగులైన బ్రహ్మశ్రీ సీతారామ యోగీంద్రులు, సంకేపల్లి రామశాస్త్రులు వంటి వారు స్వామి వారి పై సంకీర్తనలు రాశారు. కర్ణాటక సంగీత విద్వాంసులైన చౌటి భాస్కర్ లాంటి సంగీత కళాకారులు కూడా శాస్త్రియ సంగీతంలో తేనీయల్లాంటి కీర్తనలు రాశారు. ఇవన్నీ చతుష్కాల పూజల్లో అర్చకులు చదువుతున్నారు. కరీంనగర్ లో 1958-60 ప్రాంతాలలో నివసించిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా వేములవాడ రాజేశున్ని దర్శించి, స్వామి వారి మహిమను కొనియాడుతూ, మధ్యాక్కరలో పద్యాలు రాసి తన మొక్కు చెల్లించుకొన్నాడు. డా. వడ్డేపల్లి కృష్ణ, మిద్దెరాములు తదితరులు జానపదాల పాటలు, ఒగ్గు కథలు రాశారు. ధర్మపురి శేషప్ప, తిరుమలలో అన్నమాచార్యుడు, తెలుగు వాజ్మయ ప్రథమాచార్యులైన శ్రీ కృష్ణమాచార్యులు సింహగిరి వచనాలు రాసి ఇలా ఎంతో మంది వారి వారి భక్తి మార్గాలలో ఆ పరమేశ్వరున్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ తరించారు. తమ రచనల్లో భక్తి తత్వాన్ని ప్రాతిపదికగా తీసుకొన్నారు. అలాంటి కోవలో హృద్యమైన శివభక్తితో వృత్తాలలో పద్యాలు రాసి తన జన్మను సార్థకం చేసుకొన్నారు, సంస్కృత, తెలుగు పండితులు చొప్పకట్ల భాను గారు. కవి చక్కటి గాయకులు, చక్కగా పాడి వీటిని వాట్సాప్ గ్రూఫుల్లో పోస్టింగ్ లు చేయడంతో ఈ పద్యాలకు ఔచిత్యమేర్పడిందని చెప్పవచ్చును. ఈ పుస్తక ప్రచురణలో వెన్నుముకగా నిలిచిన రచయిత, న్యాయవాది వాసాలమర్రి నాగరాజు గారు ధన్యులు. వేములవాడ బ్రాహ్మణ్యం లో కొత్త నీరు రావడానికి ఇలాంటి రచనలు ఉపకరిస్తాయని చెప్పవచ్చును.

దక్షిణ కాశీగా ప్రసిద్దమైన వేములవాడ క్షేత్ర్రాన్ని, విరాట్ మూర్తులను, అమ్మవారు, గణపతి, నందీశ్వరుడు, దేవాలయ అవరణలోని వివిధ ఉపాలయాలైన భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, బద్ది పోచమ్మ, కేదారేశ్వరుడు, మహలక్ష్మీదేవి ఆలయాలను చక్కగా కవి వర్ణీస్తాడు. ప్రధాన ఆలయంలో కొలువైన దేవతలు, కోటి లింగాలు, పంచాయతనాలు, ధర్మకుండ పుష్కరిణి, ఇక్కడి పండితులు, వేదమూర్తులు, సంస్కృత విద్యాలయ ఆచార్యులు, అర్చకుల పై ఆధ్యాత్మిక, తాత్విక దోరణీలో 140 పుటల్లో 124 పద్యాలతో వేములవాడ క్షేత్ర వైభవాన్ని పండించడంలో కృతకృత్యులయ్యారు. కొన్ని పద్యాలలో సామాజిక చింతనను రంగరిస్తూ దేవదేవున్ని ప్రశ్నిస్తుంటారు. లోకంలోని అనుచితమైన పోకడలపై దండెత్తుతారు. వీరు రాసిన పద్యాలు సరళంగా ఉండి, సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఇంపుగా ఉన్నాయి. ప్రతి పద్యంలో ఒక కొస మెరుపుతో శివభక్తి అక్షరమక్షరంలో తాండవిస్తూ కనబడుతుంటుంటుంది. ఈ పద్యాలకు అనుబంధంగా మరో 14పేజీల్లో ఆరు రచనలు చేసి భేషనిపించుకొన్నారు. తాను రాసిన పద్యాల కిందటే భావాన్ని కూడా జతచేసి పఠితులకు ఆహ్లాదం కల్గిస్తాడు.

రచయిత భాను గారు వేములవాడ క్షేత్ర ఆనువంశిక అర్చక సంతతికి చెందిన వారు, తెలుగు, సంస్కృతాలలో పిజీ చేసి, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, వన భూమి యైన ఆదిలాబాద్ జిల్లాలో మూడు దశాభ్దాలకు పైగా, తెలుగు పండితునిగా ఉద్యోగించి, తన శేష జీవితాన్ని సార్థకం చేసుకోవాడానికై వేములవాడ వైభవం పేరుతో పద్యకృతిని తన ఇష్టదైవమైన రాజన్నకు రాసి సమర్పించుకొన్నారు. గుడి వైభవం పై అలవోకగా పద్యాలు అల్లి తనలోని శివభక్తిని పద్య పుష్పాలుగా, బిల్వ దళాలుగా మలిచి అభిషేకిస్తూ, కైమూడ్పులర్పించుకొన్నారు. ఈ కావ్యంలోని పద్యాలు మోక్ష రసగంగై, సుబోధకమైన రీతిలో అర్థవంతమైన పద బంధాలతో అలరారి, పాటకున్ని ప్రభావితం, ప్రసన్నం చేస్తాయి. ఇందులోని పద్యాలు స్వతంత్ర ప్రతి పత్తిని కల్గి యుండి, దార్శనికునికి వేములవాడ క్షేత్ర సందర్శనను పునీతం చేస్తాయని కవే తన ముందు మాటగా చెప్పుకొన్నారు. మానవున్ని భక్తి మార్గంలో నడిపించడానికి ఇందులోని పద్యాలు మందార మకరంధాలై భాసిల్లాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో. క్షేత్రేశ్వరుడైన మహదేవున్ని పరిపరి రకాలుగా స్తుతిస్తూ, తాత్విక చింతనతో ప్రశ్నిస్తూ, పద్యాలలో కవితా సౌందర్యాన్ని ఇనుమడింపజేశాడు. శివనామ స్మరణమ్ము సేయ మదిలో సిద్దుల్ ప్రవేశించిరో, శివ భావంబు రగిల్చిరో?శివ సుధారసమ్ము త్రాగించిరో అంటూ, శివ ధామమ్ము మహాధ్బుతమ్ము జన సంసేవ్యమ్ము నీ ధాత్రిలోన్! అంటూ దేవదేవున్ని స్తుతిస్తారు. వేములవాడ వైభవము వేడుకగా రచియింప బూని నీ/ నామము నే స్మరింప కవనామృత శైక కృతుల్ జనించె నా/ కోమల పద్యబిల్వములు కోరిక శివార్పణమ్ముగా/ నామది మొక్కి నీకు నిట అంకితమిచ్చితి శీ మహేశ్వరా!!అంటూ తన పద్యాలతో వైభవోపేతంగా కావ్యాన్ని అంకితమిస్తూ శివార్చన చేశాడు.

మా ఊరే ఒక ఈశ్వరార్చన పదమ్మూ వూరు కైలాసమే/ మా వూరందలి ధర్మకుండ జలముల్ మందాకినీ తీర్థముల్/ మా వూరినంతకు గాలి వెల్గు నతడే మా ఊరి రాజన్నయే/ మా ఊరంగల గోపురాల వితతుల్ మాహేశ్వర స్థానముల్!! అంటూ వేములవాడ క్షేత్ర ప్రాధాన్యతను కళ్ళకు కడుతాడు. మా ఊరి రాజన్న గోపురాలన్నీ మహేశ్వరుని స్థానాలేనని కవిసమయాన్ని వెల్లడిస్తాడు. ధర్మకుండ పుష్కరిణి ప్రాశస్త్యాన్ని గూర్చి రాస్తూ, ఇవి మందాకినీ(పవిత్ర గంగానది) జలములని, ఆ దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొన్నాడని, మోక్షాత్ముండయి తానమాడె తమితో మోక్షార్థియై నిచ్చటన్!! అని చెబుతాడు. ధర్మకుండ జలాన్ని పవిత్రంగా దూడాలని, అపవిత్రం కాకుండా కాపాడుకోవాలని నివేదిస్తూ, ఆందోళన చెందుతాడు. అతి కాలుష్యపు భాండమయ్యే నికటా, స్థితి తప్పి కాసారమై పోయిందని అంటూ, గతి నీవే సర్వ కల్మష హరా గంగాధరా శంకరా అంటూ వేడుకొంటాడు. అరు, ఏడు పద్యాలలో దేవాలయంలోని ప్రాచీనమైన చరిత్ర కనుమరుగై పోయిందని, బౌద్ద, జైన మూర్తుల కళాఖండాలు, కోమలుల విగ్రహాలు వంటివి శిల్పవిధంసములై మాయమై పోయాయని, మౌనంగా ఉండటం నీకిది ధర్మమేనాని నిందాస్తుతిలో ప్రశ్నిస్తాడు. లేరే అర్థ నిమిలితాక్షులు శీలా లీలా కళా ఖండముల్ /వారేరయ్యా తదీయ ధర్మ నిరతుల్ వాక్సత్య సంశోధితుల్ అంటూ ఆరవ పద్యంలో ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు.

రాజన్న రాజగోపురాలను పరమేశ్వర స్థానంగా, సుమహోహరంగా వర్ణించడంలో కవి తన నేర్పరి తనాన్ని, స్థానీయతను ప్రదర్శిస్తాడు. అదిగో చూడు మహోర్ధ్వ లోక మదిగో, ఆనంద సంధాయక/మదిగో, వేదమహర్షి దర్శిత మహామంత్ర ప్రభావమ్మదే/ అధిగో బ్రహ్మ మురారి ముఖ్య సురులే యాశించు భవ్య స్థల/ మదిగో చూడుము రాజగోపుర మదే, మాహేశ్వర స్థానమిదే|| పూర్తిగా దేవాలయ వైభవాన్ని ఇలా చెబుతాడు. ఆ దేవాలయ శిల్పముల్ శిఖరముల్, కోడెమొక్కుల విధం, ధర్మకుండపు జలం, భవ్య గర్భాలయ ఆ దివ్యోజ్జ్వల రాజలింగని మదిన్ తలుతున్ అని చక్కటి దైవీభావ అనుభూతికి లోనై చెబుతాడు. ఆలయంలోని ఒక పక్కగా పేర్చి యున్న కోటిలింగాలను 19వ పద్యంలో ఇలా చెబుతాడు. ఏ రాజన్యులు పేర్చిరో, ఏ రుష్యాదుల ఊహయో నిల్పిరి దివ్య లింగ వితతిన్ అంటూ కవితాధారలో అభిషేకిస్తాడు. క్షేత్ర స్థలపురాణాన్ని, వేములవాడ చాళుక్యుల చారిత్రక పాలనను సమ్మీళితం చేస్తూ పద్యాలు భావబందురతో రాయడం కనిపించింది. తొలి చాళుక్యపు రాజరాజు ఇచటనే తోయంబునన్ స్నాతుడై గనినట్టి రాజమూర్తియని దక్షిణామూర్తి లింగ వర్ణనలో 28, 83వ పద్యాలలో చెబుతాడు. విరాన్మూర్తి రాజలింగాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలలో, పంచభూత లింగాలతో మయమైన లింగంగా పోలుస్తూ వర్ణించి చెప్పే విధానం, కవి జ్నాన సంపన్నుడై, ఎంతగా శివభక్తిలో తాదాత్యం చెందాడో అర్థమవుతుంది. కాశీనాథ విశ్వేశుడై వెలిశాడని, శివ గోకర్ణ, కాళహస్తీశ్వరుడై, భువి రామేశ్వరుడై, చిదంబర పురీ వాసుడై,హేమాద్రి పురాన వెలసిన కేదారేశ్వరుడై ఇట అమరనాథేశ్వరుడు భాసిల్లుతున్నాడని స్తుతిస్తాడు. పదమొక పద్యమయ్యె శివపాదపు పీఠిక నాశ్రయించి సొంపెదిగిన వాక్యముల్ విమల బిల్వ దళంబుల రూపమెత్తగా పదపద భావముల్ చెలగి పారినాయని 54 వ పద్యంలో కవి తన్మయుడై పోతాడు. అమ్మవారైన తల్లి శ్రీరాజరాజేశ్వరీ దేవి గూర్చి 74,75,77,79 పద్యాలలో రసరమ్యంగా స్తుతించారు. కల్లోలముల్ బాపు నట్టి భవ లోకానంద స్తోత్రముల్/ ఉల్లమ్మంతయు నిండె విశ్వజననీ, ఉద్యప్రభా రూపిణీ అని కీర్తిస్తాడు. ఇది ఒక రాజపీఠ మనే శక్తి పీఠమని, ఇందుకు గ్రంథాల్లో ఆనవాళ్ళు లేకున్నా తల్లి పాదముల వద్దే కాసేపు నిలిచినట్లయితే నిజం తెలిసి పోతుందని తన్మయుడవుతాడు. శ్రీ రాజేశ్వరి పాద పద్మ యుగమా, శ్రీ చక్ర స్థానమేనని, ఒక మణీద్వీపమని శక్తి స్వరూపాన్నిసుందరంగా ఆవిష్కరిస్తాడు. చల్లని తల్లివమ్మ హరిచందన చర్చిత చారుగాత్రివే, చల్లని చూపులున్న సిరి జల్లుల వెల్లి వరాల తల్లివే||అని ప్రార్థిస్తాడు.

లోకవిదితమైన బాధలను పేర్కొంటూ, కక్షలు శిక్షలు శివుని కాలిగోటిని తాకగలవా ప్రశ్నిస్తూ కోపతాపాల శివశివా అని 62వ పద్యంలో చెబుతాడు. సదముల భక్తి భావనయు, సంచిత పుణ్య ఫలార్ధ సంపదన్/ శైవ వైభవ రసామృత పానపరాయణత్వమున్/ధర్మ తత్పరతలు, సద్గుణ శీలతలు, సత్యనిష్టతలు శివ సన్నిధిని చేరే యోగ్యతలని 63వ పద్యంలో యదార్థత భక్తి చింతనను అరటి పండు ఒలిచి పెట్టినట్లు చెబుతాడు. బ్రాహ్మణార్చకుల గూర్చి 91వ పద్యంలో జట ఘన చెప్పగల్గెదరు, చారు మనోజ్న సువర్ణ సంపుటముల వోసినట్లే ఇక్కడి వేదభూమిలో శ్రుతులు వినిపిస్తాయని కడు రమ్యంగా చెబుతాడు. 123లో బ్రాహ్మణుల అగ్రహారంగా మహాగ్రపురమై వేములవాడ భాసిల్లిందని చెబుతాడు. దేవాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్కృత విద్యాలయం గూర్చి 116,117, 118 పద్యాలలో జిజ్నాసతో వర్ణిస్తాడు. ఘన సంస్కృతాలయము, నచ్చట నేర్చిన విశేష పూర్వ పుణ్య ఫలములేనని, ఇది ఒక శిపప్రసాదమేనని, వేద ప్రాజ్నుల బోధనల వల్ల అవధానులు, కవులు, కళాకారులెందరో తయారయ్యారని వర్ణిస్తాడు. నాదోపాసకులర్థ శాస్త్ర విభుధుల్, నాట్య ప్రవీణుల్, వాచక చతురులు వర్థిల్లినారని అంటాడు. ఒక శివ సుప్రభాత, ఒక శతక కావ్యంగా కూడా ఈ రచనా శైలి శివభక్తితో నిండిపోయిందని చెప్పవచ్చును. రాజన్న ఆలయంలో ప్రత్యేకంగా విశిష్ట శివమహా లింగార్చన గూర్చి 76లో చెబుతాడు. మన్నును సంస్కరించి పరమాధ్బుతమౌ శివలింగ విగ్రహా/లన్నియు పేర్చి నొక్కసుకళాకృతి తీర్చి మహేశ లింగమున్ అని వర్ణీస్తాడు. పర్యావరణ విహితమైన రావి చెట్టు, అశ్వత్థ వృక్షాల వర్ణనలు 8.9 పద్యాలలో కానవస్తావి. ఇవి గత కాలపు తీఫి గుర్తులని, చాళుక్యరాజుల సంపదలకు ప్రతీకలుగా నిలిచాయని అంటాడు. 16,17 పద్యాలలో దేవాలయంలోని గండాదీపాన్ని స్తుతిస్తూ, కవి తాత్విక చింతనలు అద్ది చీకటి లోకంలో ఉన్న జనజీవనులకు, ఆకలి చీకట్లు నిండిన లోకానికి, దినదిన గండంగా బతుకుతున్న ప్రజలను పవిత్ర జీవనులుగా మార్చడానికి వెలుగు రేఖలను ప్రసరింపజేయాలని కోరుతాడు. . అనుబంధ రచనల్లో రాజరాజేశ్వర కరావలంబ స్తోత్రం, దండకం, అక్షరార్చన, స్తుతి పంచకంతో సహా శ్రీరామచంద్ర కరావలంబ స్త్రోత్రాన్ని చేర్చి తన భక్తి ప్రపత్తులను వేములవాడ వైభవంలో పొదిగి పునీతుడయ్యారు. ఉపయుక్తమైన ఫోటోలు చేర్చి పద్యాలకు సొగసులు చేర్చారు.

-సంకేపల్లి నాగేంద్రశర్మ, కరీంనగర్. చరవాణి: 8074826371. 22-1-2022

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

డా. భీంపల్లి శ్రీకాంత్ గారి ప్రక్రియ “మొగ్గలు “

by Uma devi June 14, 2022
written by Uma devi

ప్రాచీనకాలం నుండీ వ్యక్తి వికాసానికి సాహిత్యం ఉపయోగం ఉందని గ్రహించిన పండితులు అట్టి సాహిత్యం కూడా వివిధ దేశకాల పరిస్థితులను బట్టి, వ్యక్తి పరమైన లింగబేధాలు, వయో పరిమితిని బట్టి వివిధ వర్గాలుగా విభజన చేశారు. మాటలు రాని వయసునుండీ, ఒకే అక్షరం పలికే రోజులవరకూ ఎదిగాక, శిశువుకి ఇంట్లో ఉన్న పెద్దలు, తల్లి చిన్ని చిన్ని పదాలు, వాక్యాలు సమాధానం ఇవన్నీ ఇంట్లోనే వారి ఆలనా పాలనా లోనే నేర్పించడం గొప్ప విషయం. ఇంకా ఇతిహాస, పురాణగ్రంథాలలోని చిన్ని పద్యాలను సూక్తులను శిశువులకి పదేపదే వల్లిoచడం ద్వారాను, పూజ లో పక్కన కూర్చొని వినేలాగాను బాలలకి సాహిత్యం అంటే కొంత రుచి చూపారు. ఉదా… ఓ బొజ్జ గణపయ్య… చేత వెన్న ముద్ద, ఏనుగమ్మా ఏనుగు వంటివి. అలాగే అక్షరాలు నేర్చుకున్న తర్వాత సుమతి, వేమన శతకాలు బట్టీ వేయించినందు వల్ల, ఆ వయసులో వాళ్ళ కి అర్ధం కాకున్నా, కొన్నేళ్ల తర్వాత వాటి సారాంశం మనసులో నిలబడే ఉండడం జరిగింది.నేటి బాలల గురించి కవుల భావనలు మొగ్గలు రూపంలో శ్రీ కాంత్ గారు వ్రాయించి సంకలనం వేశారు. ఇతర ప్రక్రియలైన కైతికాలు, ఇష్టపదులు,సమ్మోహనం,తేనియలు వంటి వాటిలో ఇలాంటి ప్రయత్నం జరిగితే బాగుంటుంది. బాలల కోసం ప్రత్యేక సాహిత్యం ఉండాలి. అది వాళ్ళ సహజత్వాన్ని అవతల పెట్టకుండా రూపుదిద్దుకోవాలి. మళ్ళీ పిల్లలకోసం వ్రాసే సాహిత్యం, పిల్లలగురించి పెద్దలు వ్రాసింది అనే రెండు విభాగాల్లో పిల్లలగురించి పెద్దలు వ్రాసిన ఈ బాలల మొగ్గలు ఒక ప్రయత్నం.

కోట్లాది బాలలతో కొలువుదీరిన నవభారతంలో బాలల మనో వికాసానికి, విద్యావకాశాలకు జరుగుతున్న కృషిలో ఉపాధ్యాయపాత్ర కీలకమైనది. అదే విధంగా వారి  చైతన్యమూ భావ వ్యక్తీరణకోసమే కొంత కవిత్వం కూడా అవసరం. భాషని అభివృద్ధి చేస్తూనే ఆహ్లాదం కలిగించే కవిత్వం గా బాలల మొగ్గలు సంకలనం డా. భీం పల్లి శ్రీకాంత్ గారి సంకల్పంగా వెలువడి అమితాదరణ పొందినది. ఈ పుస్తకం లో సీనియర్,  వర్ధమాన కవులకలంలో రూపొందిన మొగ్గలు వివిధ భావనావర్ణాలతో కవనవనంలో  విరిశాయి. నేటి నిజం పత్రిక సంపాదకులు శ్రీ బైసదేవదాసు గారు ఈ బాలల మొగ్గలను తమ పత్రిక లో ప్రచురించి ప్రోత్సహించడంతో బాటూ, బాల్యం గురించి, నేటి బాలల దుస్థితి గురించి చక్కని ముందు మాటలపరిమళం అందించి పుస్తకానికి మరింత వన్నె తెచ్చారు. డా. శ్రీకాంత్ గారి సంకల్పo నెరవేరింది. బాలల భవిష్యత్ పసిడిదారుల్లో సాగాలనే వారి కోరిక అభినందనీయం. 
శ్రీకాంత్

విరిసిన బాల్యం మొగ్గలు

“కల్మషంలేని కర్మయోగులవుతూనే
స్వార్ధమసలేలేని సాధుజీవులు వాళ్ళు !
స్వచ్ఛమనసు కలిగినవారు బాలలు !”
సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు గారి మొదటి మొగ్గలోనే పిల్లల స్వభావం ఆవిష్కరణ చేశారు.

” నీటిచుక్క ముత్యపుచిప్పలో పడినట్లు
బాలలు మంచిపెంపకంలో పెరగాలి
కల్మషంలేనివారు ఎప్పటికీ బాలలే ! “
ఆర్. చెన్నయ్య, పాలమూరు .. గారి భావన అక్షరసత్యమే !పెద్దల్లోనూ చిన్నపిల్లలతత్వం సమాజహితం !

” నిరంతరం అమ్మనీడలో మసలుతూనే
అనుభవమహోన్నతను చాటుతారు
బాలలు సత్యాన్వేషక పరిశోధకులు ! “
కపిలవాయి వెంకటేశ్వర్లు గారి కవితాభిప్రాయం సర్వజన మోదం

“బాలలు విరిసే సిరిమల్లెలవుతూనే
నింగిలో మెరిసే తారకలవుతారు
దేశభవితకు దిక్సూచి చిన్నారులు !”
విజయనగరం కవయిత్రి మానాప్రగడ సాహితీ వ్రాసిన మొగ్గలు బాలచైతన్య దృశ్యాలు చూపుతాయి.

” తెల్లకాగితమంటి తమ మనసుల్లో
గురువులు చెప్పిందే వేదంగా లిఖిస్తారు
నమ్మకపు వాకిట్లో రంగవల్లులు బాలలు ! “
అయిత అనిత, జగిత్యాల నుండి కవితాత్మకమైన మొగ్గలు మనసుని ఆకట్టుకుంటాయి.

సునీత బండారు గారి మొగ్గలు వాస్తవచిత్రాన్ని మనకు చూపుతున్నాయి.. మరి కర్తవ్య బోధననూ చేస్తూ…
” గలగలమని నవ్వాల్సిన చిన్నారులు
గల్లీ గల్లీనా చాకిరీలతో బ్రతుకీడుస్తున్నారు
బాల్యం రుచితెలియని దురదృష్టవంతులు బాలలు ! “

అలాగే, ఏడెల్లి రాములు గారూ,
” అమ్మ చంకన ఒదిగిన నెలవంకలౌతూనే
నల్లపలకలపై మెరిసే ఓంకారాలవుతారు
బాల్యానికి ఓం కారమే తొలి గురువు ! “
అని గంట కొట్టినట్టు చెప్పేసారు తమ మొగ్గలలో.

” బుడిబుడి అడుగులేసే బుజ్జాయిలు
ప్రపంచాన్ని పరికింపజేస్తారు
బాలలు ప్రగతికి రథచక్రాలు ! “
అంటారు టి. అంబుజ, పాలమూరు.

డా. భీంపల్లి అభిప్రాయం మొగ్గలుగా…
” పిల్లలు పరిమళాల్ని వెదజల్లే మొగ్గలవుతూనే
పువ్వుల్లా వికసించే మకరందాలవుతారు
పిల్లలు ఎన్నటికీ తడిఆరని గంధపుచెక్కలు ! “
అంటూ చిక్కని భావనలందించారు !

నెల్లూరు కవయిత్రి ఎం. వి. ఉమాదేవి భావనలో…,
“బాలల పొరబాట్లను ఓర్పుగా దిద్దుతూనే
భవితకు బంగారుబాటలు వేయాలి
బాల్యశిలకు కన్నవారే మంచిశిల్పులు !”
అంటూ మొగ్గలరూపునిచ్చారు.

” ఇసుకగూళ్ళు కట్టుకున్న బాల్యమే
నేడు మట్టిపాలు అవుతున్నది
కేరింతలతో అల్లరి చేసేది బాల్యం ! “
అంటారు సముద్రాల శ్రీదేవి ఆవేదన గా.

   " కల్మషం ఎరుగని మనసులతో 

కలకాలం నీతితో బ్రతుకుతారు
సహృదయం ప్రతిరూపం పిల్లలు ! “
అంటున్నారు యం. డి. సనా అర్షిన్, జోగులాంబ గద్వాల్ జిల్లా కవయిత్రి,విద్యార్థిని.

పగిడిపల్లి సురేందర్ పూసల వ్రాసిన మొగ్గలు,
” చిన్నచిన్న ఆలోచనలను మొలకెత్తించి
మహావృక్షంగా నిలిచే అవిశ్రాంత కలువలు
విజ్ఞాన సముపార్జనకి నిఘంటువు ముత్యాలు !”

ఇలా ఇంకా సత్యనీలిమ, బొమ్ము విమల, కమ్మరి శిరీష, బోల యాదయ్య, ఉప్పరి తిరుమలేష్, పులి జమున, డా. బాదేపల్లి వెంకటయ్య గౌడ్,రవి చంచల, గాండ్ల వీరమణి, రమాదేవి బాలబోయిన, అనుపటి హేమలత, బర్మ శశాంక్, తదితర కవులు మనోహరమైన మొగ్గలలో బాల్యం ఆవిష్కరణ చేసి అలరించారు. బాల సాహిత్యంలో మొగ్గలనూ ప్రవేశపెట్టిన డా భీంపల్లి గారికి అభినందనలు తెలుపుతూ, వారినుండి మరిన్ని మొగ్గలు సంకలనాలుగా రావాలని అభిలాషతో…

.. ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
3-5-2022
7842368534

ప్రతులకు
డా. భీంపల్లి శ్రీకాంత్
8- 5- 38, టీచర్స్ కాలనీ
మహబూబ్ నగర్ -509001
9032844017

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ప్రకృతి ఒడి

by Namilikonda Sunitha June 14, 2022
written by Namilikonda Sunitha

చిట్టి పొట్టి కూనల్లార
చదువులమ్మ బిడ్డల్లార
చదువులమ్మ బిడ్డల్లార
భావి భారత పౌరుల్లార చదువులెన్నొచదివేద్దామా
– భలే భలే మనదేశపు భవిత
వుదామా – హురేహురే

పర్యావరణ రక్షణలో
మనమూఒక చెయ్యేద్దాం
ప్రతి చెట్టూపోషణలో మనమూ ఒక
అమ్మవుదాం
చెట్లెన్నో నాటేద్దామా-
భలే భలే
అడవులనే పెంచేద్దామా –
హురేహురే

తులసి చెట్ల వనంలోన
తులసిమొలకమన
మవుదాం
కాలుష్యా నివారణలో
మనమూ ఒక సమిధ
వుదాం
బంతిపూల బాటవు
దామా – భలే భలే
బంగారు భవితవుదామా
-హురేహురే

మనవూరి చుట్టుముట్టు
చెరువులెన్నొ తవ్వేద్దాం
జలాలను రక్షించి
నీటి కరువు తీర్చేద్దాం
నింగిలోని మేఘమవు
దమా -భలే భలే
మేఘంలో నీరవుదామా
-హురేహురే

చిన్నాచిన్నగ మొలచిన
చిట్టిపొట్టి మొలకవుదాం
తెల్లాతెల్లగ విరిసిన
పసికూనల నవ్వవుదాం అరవిరిసిన పువ్వ
వుదామా -భలే భలే పున్నమి వెన్నెలవుదమా-
హురేహురే

మనవూరి బడిలోన తోటమాలిమనమవుదాం
కలుపు మొక్క లేరేసి
అందమైన తోటవుదాం
సీతాకోకచిలుకవుదామా
-భలే భలే ప్రకృతి అందాలు
చూద్దామా-హురేహురే

మనవూరి గుడిలోన
కోలాటం పాటవుదాం
బతుకమ్మ సిబ్బిలోని
పూల వరుస మన
మవుదాం
చెరువులోని తామర
వుదమా – భలేభలే తెలంగాణ సింగిడ
వుదమా-హురే హురే

గులాబీ తోటలోన
గుబాళింపు మన
మవుదాం
జమ్మి చెట్టు కొమ్మ పైన
పాలపిట్ట మనమవుదాం ప్రతిపౌరుడి మాట
వుదామా – భలే భలే
ప్రగతిలో పాత్రవుదామా
-హురేహురే

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us