మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

 ఛాంపియన్

by Giriprasad Chelamallu June 14, 2022
written by Giriprasad Chelamallu

మాది ఉత్తర తెలంగాణలో ఓ పట్టణం. బతుకు కోసం దుబాయ్ సూరత్ బొంబాయి పోయే బతుకులు మావి. చుట్టూ చెరువులే.. వానలు లేవు. పంటలు లేవు . వలస పోవుడే బతుకు బాగు కోసం..అందరి లాగే మా నాన్న వలస దుబాయ్ కి . మేము ముస్లింలం. ప్రతి రోజు నమాజు వేళలో అలికిడి. మా వీధిలో అంతా ముస్లింలమే. అందరూ పరదా చాటునే.. ప్రశ్న తలెత్తని మహిళా సమాజం. తలాక్ లకు ఎన్నో జీవితాలు బలి. ఎచ్చోటనైనా పితృస్వామ్య దురాక్రమణ యే –  ఏ మతమైనా…

 నేను పుట్టాను ఓ మధ్య తరగతి కుటుంబంలో…. పుట్టాను ఎందుకో అనుకోలే నా తల్లిదండ్రులు.  నా కంటే ముందు ఇద్దరూ అమ్మాయిలే.. ఐనా పుట్టుక ఆడో మగో తమ చేతుల్లో ఉండదనే విజ్ఞత గల తల్లి దండ్రులు. అబ్బాయినైనా అమ్మాయినైనా పెంచే తీరులో వ్యత్యాసాలు కనబరచని తల్లి దండ్రులు నా అదృష్టం.అల్లారు ముద్దుగా పెంచారు ఆడపిల్లనయినా… నాన్న జమీల్ ఫుట్ బాల్, క్రికెట్ ఆటగాడు. అమ్మ పర్వీన్ విద్యార్థి దశలో కబడ్డీ ఆడేది.   సిర్నాపల్లి కోట చుట్టూ ఎన్ని సార్లు ఉరికానో ఆలిసాగర్ కట్ట మీద ఎన్నిసార్లు అటూ ఇటూ పరిగెత్తానో మల్లారం అడవి లో పక్షి పలుకులు నా మాటలకు పదును పెట్టాయేమో.. రెక్కలొచ్చిన పక్షుల జూచి నేను నేర్చుకున్నా ఎలా ఎదగాలో…. వివక్షను ఎరుగను ఇంట్లో.. వీధిలో చూచే చూపులు.. విరిసే సూటిపోటి మాటలు.. మామూలే.. అడ్డంకులు ఈ సమాజంలో.

 అక్కలిద్దరూ పుస్తకాల పురుగులు. ప్రాథమిక విద్య నుండి చదువులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా అమ్మ నాన్న మమ్మల్ని పెంచారు. నాకు చదువుతో పాటు ఆటపాటలంటే ఇష్టం. మా ఇంటికి దగ్గరే వుండే కలెక్టరేట్ మైదానంలో పరుగు పందేల సాధన చేసే దాన్ని. అనుకోకుండా అక్కడ మగపిల్లలు ఆడే ఆటల పై నా దృష్టి పడింది. నేనెందుకు బాక్సర్ కాకూడదనే మీమాంస నాలో మొదలైంది . పట్టుమని పదేళ్లు నిండని నాకు నాడే నా లక్ష్యం కళ్ళల్లో మెదిలింది.   రోజూ పరుగు కోసం పోవటం బాక్సింగ్ వైపు చూడటం లోలోన మథన పడటం నా వంతయింది. నాన్న కి చెబితే ఏమంటాడో అమ్మకి చెబితే ఏమంటుందో అనే బెంగ లోలోన. 

నాన్న సంవత్సరాంతర సెలవులకి మా ఇంటికి వచ్చారు. ఒక రోజు నాన్న జమీల్ తో పాటు మైదానానికి వెళ్ళాను. ముందే ఒక ప్రణాళిక ప్రకారం నా మనసులో మాట చెప్పాలనే నాన్న నీ తీసుకెళ్ళాను. రన్నింగ్ ప్రాక్టీసు అయిపోగానే నేనూ నాన్న ఓ వేప చెట్టు కింద కూర్చున్నాం. ఇంతలో నాన్న స్నేహితుడు గౌస్ వచ్చాడు సలాం వా లేకూం అనుకుంటూ. ఆలింగనం చేసుకుంటూ చిన్న నాటి ముచ్చట్లు, గల్ఫ్ ముచ్చట్ల లో వారిద్దరూ. నా చూపులు మాత్రం దూరంగా జరుగు తున్న బాక్సింగ్ ప్రాక్టీసు వైపు.. నాన్న కి ఎలా చెప్పాలనే ఆలోచనల్లో నా పదకొండేళ్ల బుర్ర  అస్తవ్యస్తం. ఏదైతే అదైందని నా మనసులో మాటను అబ్బా! మై బాక్సర్ బనూంగి,! అని చెప్పేసాను. ఒక్కసారి గా నాన్న నివ్వెర పోయారు . ఏమడుగుతున్నావ్! నీకేమైనా మతి పోయిందా! ఆడపిల్లవు బాక్సింగ్ ఎలా చేస్తావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. పక్కనే కూర్చుని మా సంభాషణ చూస్తున్న గౌస్ మామ కలుగ చేసుకుని నీకు నిజంగా ఆసక్తి పట్టుదల ఉంటే నేను నిన్ను  బాక్సర్ ను చేస్తా అన్నారు. ఇదేంటి గౌస్ మామ ఇలా అంటున్నారు ఈయనకి బాక్సింగ్ కి ఏం సంబంధం అనుకుంటుంటే ఏం ఆలోచిస్తున్నావు నేను బాక్సింగ్ కోచింగ్ ఇస్తున్నాను అని తనకు తాను పరిచయం చేసుకున్నాడు. అప్పటిదాకా గౌస్ మామ బాక్సర్ అనే విషయం నాకు తెలియదు .

 నిజామాబాద్ డిచ్ పల్లి మీదుగా వెళ్లాల్సిన మన్మాడ్ రైలు మార్గం సిర్నాపల్లి మీదుగా వెళ్లినట్లు అథ్లెట్ కావాల్సిన నేను బాక్సింగ్ వైపు వెళ్ళాను. రైలు మార్గం మళ్ళింపు వెనుక సిర్నాపల్లి రాణి సీలం జానకి బాయి ప్రోద్బలం వుంటే నా వెనుక నా ఆత్మ విశ్వాసం మాత్రమే వుంది. ఆరంభంలో బాక్సింగ్ దుస్తుల ను వీధిలోని వారు  చూచి పెదవి విరిచారు. ఆడపిల్ల కి బాక్సింగ్ ఏమిటి పెళ్ళి చేసి అత్తారింటికి పంపక అని గుసగుసలు. గౌస్ మామ సలహాలు సూచనలు తుచ తప్పకుండా పాటిస్తూ బాక్సింగ్ ప్రాక్టీసు మొదలెట్టాను. మహబూబ్ గంజ్ గడియారం నాకు సమయపాలన నేర్పింది. నా విశాల దృక్పథం వ్యక్తిత్వం కోచ్ ల సలహాలు సూచనల మేళవింపు తో ముందుకు కదిలాను.

 రోజూ ఉదయాన్నే లేచి టీ షర్ట్ పొట్టి నిక్కర్ వేసుకుని బైటికి వెళ్తుంటే నా మతస్తులే నన్ను అవహేళన చేసేది. ముస్లింలలో చెడ బుట్టింది. సంప్రదాయాన్ని మంట గలుపుతుందని దాడి చేసినంత పని చేసేది. వేళకి నమాజ్ చేసుకుని పరదా మాటున వుండాల్సిన పిల్లని బాక్సింగ్ అంటూ జనాల్లో తిప్పుతున్నావని నాన్నని మసీదులో పెద్దలు హెచ్చరించే వారు. ఒక చెవిన విని మరో చెవిన వదిలి పెట్టే వారు నాన్న. అమ్మ కి చుట్టుపక్కల అమ్మలక్కల చెవి కొరుకుడు ఎక్కేది కాదు. ఇంట్లో మంచి రుచి గల వంటలు మాంసాహారం బిర్యానీ లు వండినా నా కోసం నా డైట్ యే వండి పెట్టేది. నా ముఖం పై పంచ్ లతో గాయాలయితే కన్న తల్లి మనసు తల్లడిల్లి పోయేది.. ముఖం వాస్తే అందం సన్నగిల్లితే పెళ్ళి కాదేమో ననే ఆదుర్దా అమ్మలో. ఒక్కసారి బాక్సింగ్ ఛాంపియన్ అయితే వరుసలో మగపిల్లలు స్వయంవరం ప్రకటనలా ఇంటికే వస్తారంటే అమ్మ గలగల పారుతున్న గోదావరిలా నవ్వేది. నాలో నా నేల ఆత్మ స్థైర్యం ఎక్కువని నాన్న కితాబు ఇచ్చేవారు. 

  బాక్సింగ్ లో తొలి మెళకువలు నేర్చుకున్నాక మంచి కోచింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చాము. షేక్ పేట్ లో ఇల్లు. డాబా పైకి ఎక్కితే ఎత్తైన గోల్కొండ కోట నాలో ఉత్తేజాన్ని నింపేది. నేను పుట్టిన పట్టణానికి గోల్కొండ రాజు నిజాం ఉల్ హక్ పేరు మీద పెట్టిందే. నిజామాబాద్ నుండి హైదరాబాద్ ప్రయాణం ఒక ప్రయాణం గా కాక ఓ చరిత్ర సృష్టించాలి గోల్కొండ లా అని మనసులో అనుకున్నా. పోరాడు చదువుతూ పోరాడు లక్ష్యం కోసమని తలంచి డిగ్రీ లో చేరాను.       బాక్సర్ స్లగ్గర్ స్వార్మర్ శైలులు నేర్చుకునే పనిలో నా శారీరక మానసిక లక్షణాలను బట్టి నాలో పరిపూర్ణత సాధించుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఈ శైలులు ఒక దాని పై ఒక ప్రయోజనం ప్రతికూలత వుంటుంది. అది అర్ధం చేసుకునే రీతిలో నా కోచ్ లు బాగా తర్ఫీదు ఇచ్చారు. అక్కలిద్దరూ ఫిజియో థెరపిస్టులు గా స్థిర పడ్డారు. చెల్లెలు బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకునేది. దుబాయ్ కి  తన కుటుంబాన్ని వదిలి వెళ్ళి నాన్న  సంపాదించిన సొమ్ము తో  నా శిక్షణ సజావుగానే సాగేది. పద్నాలుగు సంవత్సరాల ప్రాయంలో జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలవడంతో నాలో ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఒలింపిక్స్ కి వెళ్ళాలనే తాపత్రయం నాలో కలిగింది. భుజం గాయంతో బాధ పడినా శస్త్ర చికిత్స తో కోలుకుని సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రాక్టీసు మొదలెట్టాను. కరోనా లాక్ డౌన్  లో మా యింటి టెర్రస్ పై ప్రాక్టీస్ చేస్తుంటే తారామతి బారాదరి నృత్య కళా వేదిక స్ఫూర్తి ని కలిగించేది. గోల్కొండ టోంబ్స్ నిర్మాణ శైలి తరాలు గా నిలిచి పోయినట్లే నా ఆట తీరు మన్ననలు అందుకోవాలనే ఆరాటం నాలో తన్నుకు వచ్చేది. గోల్కొండ నలు దిక్కుల నాలుగు దర్వాజలు ఏ దర్వాజ గుండా వెళ్ళినా కోట దగ్గరి కెళ్ళినట్టే నేను ఎటునుండి వెళ్ళినా గెలుపు తీరాన్ని చేరాలనుకునే దాన్ని.

 రోజూ బాక్సింగ్ వీడియో లు చూస్తూ నాలోని తప్పొప్పులను దిద్దుకునే దాన్ని. నేను ఆత్మ రక్షణ లో వున్నా ఎదుటి వారిని అంచనా వేయటం లో వారి మానసిక లక్షణాలను పసిగట్టి వారి రిథం ను గ్రహించటం అలవాటు చేసుకున్నాను. నా స్ట్రెయిట్ పంచ్ లను బలంగా వేస్తూ కోచ్ ల ప్లాన్ ఎ బి సి డి లను తప్పక అనుసరించే దాన్ని. నేను ఎడమ వైపు నుండి బాగా దాడి చేయగలను. హుక్ లు తక్కువే అయినా స్ట్రెయిట్ షాట్ లతో గెలిచే వ్యూహాన్ని పన్నుతాను. నాలోని సాంకేతికత క్లీన్ పంచ్ లు ఫేడ్ అవే మూవ్ లు ఫుట్ వర్క్ నా బలం. ప్లాన్ సి నుండి డి కి క్షణాల్లో మారే చైతన్యం నా సొంతం. కంఫర్ట్ జోన్ లో చిక్కుకోకుండా సిల్హౌట్ లు సంధించే నేర్పరితనం నన్ను రింగ్ లో ఎదురు లేకుండా చేసేది. నా వేగవంతమైన మెదడు తీసుకునే చర్య ప్రతిచర్య ల మేళవింపు నన్ను సాన బట్టింది.

 నా లోని పోరాట పటిమ ఎవరినైనా ఎదిరించగలదనే ధృడ సంకల్పం లక్ష్యం దిశగా నడుస్తుంటే వివక్షల నెదుర్కున్నాను. ప్రాంతం కులం మతం భాష యాస రాజ్యమేలుతున్న వ్యవస్థ లో ఎదురీదాలని తెలిసే అడుగులు బలంగా వేస్తూ కదిలాను. అంచెలంచెలుగా ఎదిగి నేను నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా బంగారు పతకాన్ని సాధించాను. నేనెవరిని అని ప్రశ్నించి అవహేళన చేసిన వారికి ఈ బంగారు పతకమే జవాబు  నేనే నిఖత్ జరీన్.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

కవితా సమీక్ష

by చంద్రకళ దీకొండ June 14, 2022
written by చంద్రకళ దీకొండ

ఆడుతు పాడుతు పని చేస్తుంటే… అలుపూ సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది-మనకూ కొదవేమున్నది
అన్న సినీ గీతంలోని శ్రామిక సౌందర్యాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్న డా.కొండపల్లి నీహారిణి గారి *హాలిని కవితలోని సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం రండి!

అతను దుక్కిదున్నే నాగలి,గొర్రు దోలే శ్రమ అయితే ఆమె ఎండపూట సేదదీర్చి, కడుపు నింపే సద్దిమూటల గంప,వెనువెంటనే నాట్లు వేసే పనితనం ఆమె
అంటూ హాలికుని శ్రమను,వెంటనే ఉంటూ శ్రమలో పాలుపంచుకోవడమే కాక, శ్రమతో అలిసిన పెనిమిటిని సేదదీరుస్తూ కడుపు నింపే ఇల్లాలి మనస్తత్వాన్ని ఎండపూట సద్దిమూటల గంప అంటూ వివరించారు తన కవితలో.

ఎరువు బలం అతడు
పొలం కోస్తూ అతడు
వరికట్టలు దులిపికొట్టే బలం
చెలకలో కర్రుతో చాలుదీస్తూ అతడు

కలుపుదీసే ఒడుపు
సంచులందించే చైతన్యం
బండెడు కుప్పను ఒకచోట వేస్తూ ఆమె
ధాన్యం తూర్పారబట్టే నైపుణ్యం
వెనువెనుక విత్తనాలను జారవిడుస్తూ ఆమె

పై పదబంధాల్లో పురుషుని యొక్క సహజ శరీర ధారుడ్యాన్ని,స్త్రీ సుకుమారత్వాన్నే కాక, వెనువెంట నీడలా ఉంటూ
పని అందిపుచ్చుకునే ఆమె చైతన్యాన్ని,ఒడుపును,
చాకచక్యాన్ని,నైపుణ్యాన్ని విశదపరిచారు తన కవితలో.

కృషిరాశిని చూస్తూ గర్విస్తూ అతడు
కుటుంబానికి అన్నమై సహకరిస్తూ ఆమె
అన్న వరుసల్లో పురుషుడు తన ఇంటిపేరు నిలబెట్టే సంతానాన్ని నా సంతానం అంటూ గొప్పగా చెప్పుకునే మనస్తత్వాన్ని, ఇంటిలోనివారందరి కడుపు నింపి తృప్తి పడే ఇల్లాలి బాధ్యతను,మనస్తత్వాన్ని చక్కగా పొందుపరిచారు.

తోటవైపు నమ్మకాల అడుగులేస్తూ అతడైతే
అతని అడుగుజాడల్లో నడిచి బుట్టల్లో ప్రగతికాయలు పేరుస్తూ ఆమె…అంటూ అతని నమ్మకాన్ని నిజం చేయటానికి ప్రగతిదారులు వేసేది ఆమేననే వాస్తవాన్ని ఎంతో అందంగా చెప్పారు.

వెన్నెముకలాంటి దేశకీర్తి
అతడైతే
నీడలా వెన్నంటే భుజకీర్తి
ఆమె…
అంటూ ఆకాశంలో సగమైన అర్థభాగ ఘనతను చాటిచెప్పారు.అందరూ గుర్తించేలా స్త్రీ శ్రమశక్తికి గుర్తింపునిచ్చారు.

ఆరుగాలం చెమటను పుడమితల్లికి ధారబోసే హాలికుడు అతడైతే
అనునిత్యం పనిపాటల పథగామి శ్రమశీలిని

ఆమెనే హాలిని
అంటూ స్త్రీ శక్తిని ఒక చక్కని నామధేయంతో అలంకరించారు,కిరీటధారణ చేసారు తన కవితతో.

అందరూ హాలికుని ఆరుగాలం శ్రమ గురించే ఆలోచిస్తారు తప్ప,అతనితో సమానంగా శ్రమ చేస్తూ, వెన్నంటి ఉండే హాలిని శ్రమను గుర్తించేవారు అరుదు.ఒకవేళ గుర్తించినా,
ఆమె శ్రమ సౌందర్యం కన్నా,శరీర సౌందర్య వర్ణనపైనే దృష్టి సారిస్తారు.

తరుణి మరియు మయూఖ పత్రిక సంపాదకురాలు

డా.కొండపల్లి నీహారిణి గారు స్త్రీ కోణంనుంచి ఆలోచించేలా కవితలు వ్రాస్తూ,

అందరూ వ్రాసేలా స్ఫూర్తినిచ్చే ఈ సూక్ష్మకావ్యం కావ్యశిల్పం, ఎత్తుగడ,
ప్రాసలతో కూడిన పదబంధాలు,
భావగణాల విభజన,లోతైన అంతర్లీన భావన గొప్పగా ఉన్నాయి.

ప్రముఖ కవి బుర్రా వెంకటేశం,ఐ. ఎ.ఎస్.
గారు రూపొందించిన సూక్ష్మకావ్యం అనే ప్రక్రియలో వ్రాయబడిన ఈ కవిత శ్రామిక స్త్రీల శ్రమకు
వేసిన అభినందనల మాలిక!

విశిష్టమైన కవితను అందించినందుకు
అభినందనలు నీహారిణి గారూ

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్ర్తీత్త్వ వేదనలో ‘జ్వలిత కౌసల్య’

by Dr. Triveni June 14, 2022
written by Dr. Triveni

‘ఆధునిక రచనల్లో ప్రాచీన సాహిత్యంలో కన్నా స్త్రీ ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ విముక్తిని కోరే మహిళా చైతన్య భావాల వ్యాప్తి, పరిధి ఇటీవలి దశాబ్దాల్లో ఇంకా విస్తరించింది. స్త్రీ వాదోద్యమ ప్రభావం పురుషుల మీద, పురుషుల రచనల మీద పడడం ఆహ్వానించదగింది. స్త్రీవాదులు కోరే సాంఘిక న్యాయాన్ని ఇప్పుడిప్పుడే పురుషులు అర్థం చేసుకుంటున్నారు. అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో జరుగవలసిన అభివృద్ధి చాలా ఉన్నప్పటికీ, కనీసం ప్రథమ దశ ప్రారంభమయింది. భూమయ్య చిత్రించిన ‘జ్వలితకౌసల్య’ ను ఈ దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి. కావ్యనామమే కావ్య వస్తు స్ఫోరకంగా ఉంది. అయితే భూమయ్య కావ్యం స్త్రీవాద కావ్యం అని నేను ముద్ర వెయ్యటం లేదు. ఈ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి స్త్రీవాద పరిచయం ఉపయోగిస్తుందనే నా సూచన’ (పుట.2)

‘జ్వలిత కౌసల్య’ మొదటి ముద్రణ సందర్భంలో ‘లఘుటిప్పణి’ రచిస్తూ ఆచార్య చేకూరి రామారావు ప్రస్తావించిన అంశం ఇది. ఆచార్య అనుమాండ్ల భూమయ్య 1999 నాటికే ఈ పుస్తకాన్ని రచించి ప్రచురించారు. స్త్రీవాద భావజాలం తెలుగు సాహిత్యంలో  ప్రవేశించి విస్తృత ప్రయోజనాలు చేకూరుతున్న కాలమది. స్త్రీవాద పరివ్యాప్తిలోను, ఉద్యమ రూపంలో కార్యరూపం దాల్చడంలోను సాహిత్యం హితోధిక సాయం చేస్తున్న సమయమది. ఆ పరిమిత కాలంలోనే స్త్రీవాదం ప్రపంచ ప్రమాణాల మీద నిలబడుతూ వినూత్న భావజాలాన్ని ప్రకటించింది. స్త్రీలు వెలువరించిన సాహిత్యమే గాక, ఆచార్య చేకూరి రామారావు చెప్పినట్లు పురుషుల సాహిత్య మనోగతాలపై ప్రభావాన్ని చూపింది. సంప్రదాయక పౌరాణిక పాత్రల్లో గల స్త్రీల అభినివేశాన్ని  సాహిత్యబద్ధం చేస్తూ నూతన ఒరవడిని సృష్టించారు. ఆధునిక సాహిత్య ధోరణులకు అనుగుణంగా సావిత్రి, పురూరవ, సీత, జాబాలి, వరూధిని, ఊర్మిళ, కౌసల్య, కైకేయి, కచదేవయాని, గాంధారి, పూర్ణమ్మ, కన్యక పాత్రల భావైక స్ఫూర్తిని చిత్రించారు. స్త్రీ పౌరుష కాంక్షను, శక్తి సామర్థాలను, మనోఅభిష్టాన్ని, చింతనాత్మక వ్యధను వెలువరించారు. తద్వారా ఆధునిక సమాజానికి ఒక ఉపదేశాత్మక సందేశం అందించారు.

‘జ్వలిత కౌసల్య’ కావ్యాన్ని స్త్రీవాద కోణం నుండి అవగాహన చేసుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశం. సహృదయులు అవలోకిస్తారని ఆశిస్తున్నాను. ఆచార్య అనుమాండ్ల భూమయ్య దృక్పథం స్త్రీవాదం గాకపోయినాÑ వస్తు నిర్దేశం దృష్ట్యా ఈ అంశం నిర్ణయాత్మమైందని భావిస్తున్నాను. పూర్తి కథాంశం కౌసల్య గుండెలలో గూడు కట్టుకున్న అగ్నిజ్వాలను విచ్ఛేదం చేయడం. కౌసల్య మనోగతాన్ని ఆవిష్కరించడం. తద్వారా దీర్ఘకాలంగా ఉన్న మనోవ్యధ నుండి ఉపశమనం కోరుకోవడం. ఈ నేపథ్యంలోనే తన సంసారిక జీవితంలో తీరని కోరికలు, బహుభార్యత్వం వల్ల భర్త నుండి పొందిన ప్రేమానురాగాలు, తోటి సవతులతో పడిన అవమానాలు ఒకటేమి సగటు మహిళ పడే ఆవేదన కౌసల్యలో ఆవిష్కృతమవుతుంది. కౌసల్య మనోవేదన స్త్రీవాద లక్షణాలకు అన్వయింపదగినవే.

మరొక అంశం ‘జ్వలిత కౌసల్య’ ఒక విధంగా చేతనాత్మక కావ్యం. అంతర్గత మధనం, భావాల సంఘర్షణ, అనుభవాల సంచయం అన్ని కలిపి మనో విశ్లేషణ సూత్రాల్లోకి కౌసల్య ఇమిడిపోతుంది. మానసిక వ్యధను ప్రత్యక్షంగా ఈ కావ్యంలో చిత్రించారు కవి. ఎంతో కాలంగా మనస్సులో దాచుకున్న ఆవేశాన్ని, క్రోధాన్ని బయట పెట్టడం మనోవైజ్ఞానిక అంశాలకు అనువర్తించవచ్చు. అచేతనంలో దాగి ఉన్న మానసిక సంవేదనను చేతనత్వంలోకి తీసుకొని రావడం ఇందులోని ప్రధానాంశం. దు:ఖప్రోదిని చేధించడానికి కవి ఈ కావ్యాన్ని ఆలంబనగా చేసుకున్నారు. తనకు కలిగిన అన్యాయాన్ని మరొకరి విషయంలో కలుగకుండా ఉండడంలో కౌసల్య చేసిన ఉపదేశం సత్ప్రవర్తన దిశగా నడుస్తుంది. కథాగమనాన్ని, పాత్రల ప్రవర్తనా శైలిని కవి అత్యంత నేర్పుతో ప్రదర్శించారు.

ఉపదేశాత్మకంగా కావ్యాన్ని వెలువరిచడంలో కవి ప్రధాన శ్రద్ధ వహించారు. ఆధునిక సాహిత్యంలో ఇటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. స్వతంత్ర కథలను తీసుకొని పాత్రలపరంగా ధర్మప్రభోదం విస్తృతం చేశారు రచయితలు. అంతేగాక సంప్రదాయిక పాత కథల ప్రయోగం నేటి సమాజాన్ని సంస్కరించాయి. సందేశాత్మకమైన గాథలు వ్యవస్థ పునరుద్ధరణకు కృషిచేశాయి. సామాజిక ప్రయోజనానికి ప్రాచీన సాహిత్యంలోని గుణాత్మకమైన వస్తు నేపథ్యం కవులకు తోడ్పాటునందించాయి.

‘జ్వలిత కౌసల్య’ కావ్య స్వభావంలో స్త్రీవాద భావవ్యక్తీరణ మనోవైజ్ఞానికి విశ్లేషణ, ఉపదేశాత్మకం వంటి విభిన్నమైన మౌలికాంశాలను గుర్తించవచ్చు. కవి కావ్య నిర్మాణంలో ప్రకృష్టమైన వస్తువును సరళతరం చేశారు. పద్య రచనా సౌగంధంలో మేటి ఆచార్య అనుమాండ్ల భూమయ్య రామాయణ గాథలోని కౌసల్య మనోవేదనను వాల్మీకి రచనాపరంగా నినదించారు కవి. వాల్మీకి రామాయణంలోని ఆయోధ్య కాండలో 20వ సర్గలో కౌసల్య శ్రీరాముని ఎదుట తన వేదనను వ్యక్తపరిచిన ఘట్టం ఉంది. మొత్తం ఆరు సర్గలలో వ్యక్తపరిచిన ఆవేదన కవి కావ్యానికి ప్రధానాధారంగా నిలిచింది. ఆ ప్రేరణ వల్లనే ఈ కావ్యం రూపొందింది. శ్రీరాముడు ఈ జన్మకు ఏకపత్నీ వ్రతుడిగా ఉంటానని ప్రమాణం చేయడం ఇందులోని ముఖ్యాంశం. కథాంశాన్ని మొత్తం ఎనిమిది ఉప శీర్షికలలో విభజించారు. సంక్లిష్టమైన కథ ఉప శీర్షికలో ఒద్దికగా నిలిపారు భూమయ్య. కైకేయి వరం, జ్వలిత కౌసల్య, అనంత క్రోధం, మాతృ హృదయం, పితృ వాక్యం, పుత్ర వాత్సల్యం, ఏకపత్నీ వ్రతం, మంగళాశాసనం వంటివి ఈ కావ్యానికి ఒక క్రమణికను సూచించాయి. కథా గమనంలో కార్యోన్ముఖతను సాధించడం కవి కవితా ప్రక్రియలో ప్రదర్శించిన ప్రత్యేక నైపుణ్యం. 109 పద్యాలు కలిగిన ఈ కావ్యం నాలుగు ముద్రణలు సంతరించుకోవడం విశేషం. చేకూరి రామారావు, బేతవోలు రామబ్రహ్మం, పేర్వారం జగన్నాథం వంటి విమర్శకులు ఈ కావ్య ముద్రణలో ముందు మాటలు రాశారు. అబ్బూరి ఛాయాదేవి, మలయవాసిని, వాసా ప్రభావతి, వెంకమాంబ, గంగప్ప వంటి సాహితీవేత్తలు స్త్రీ సంవేదనా రూపంలో ‘జ్వలిత కౌసల్య’ను పరామర్శించారు.

తండ్రి ఆజ్ఞ మేరకు పినతల్లి ఇంటికి వెళ్ళిన శ్రీరాముడికి ఘోర ఉపద్రవం మీద పడుతుంది. పట్టాభిషిక్తం పొందే వేళలో అరణ్యానికి వెళ్ళాలనే కైక అనుజ్ఞను శ్రీరాముడు శిరసావహిస్తాడు. తన తల్లితో నివేదించి అనుమతి పొందడానికి కౌసల్య భవనానికి వచ్చినప్పటి నుండి కథా ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఆచార్య అనుమాండ్ల కౌసల్య మనో చింతనను ప్రత్యక్ష పెట్టడానికి ఆరంభ పద్యాన్ని ప్రయోగించారు. తల్లిదండ్రుల సాపేక్ష కైకేయి వరంలో ఉపేక్ష ప్రత్యక్ష కావ్య కథన ధారకు ఉత్కర్షగా నిలిచింది.

తల్లి కొడుకుల ఆప్యాయతా వాత్సల్యాలను అత్యంత మధురంగా భూమయ్య ప్రవేశపెట్టారు.

స్వాగతింప తన కెదురు వచ్చినట్టి

తల్లి పాదమ్ముల మ్రొక్కె ధర్మమూర్తి

రామచంద్రుండు, కౌసల్య రామునెత్తి

శిరము మూర్కొనె కౌగిట జేర్చి                            (పుట.15)

వర్తమాన కాలంలో తెలుగువారింటి వ్యవహార రూపంలో ఉన్న ఆచార సంప్రదాయాలను ప్రవేశపెట్టారు కవి. కౌసల్య రామచంద్రుల అనుబంధాన్ని చూపించారు. శ్రీరాముడు శిరస్సు వంచి గౌరవ వందనం చేయడం, కౌసల్య శ్రీరాముడిపై పుత్ర వాత్సల్యాన్ని ప్రకటించడం హృదయ మనోహరంగా భూమయ్య రచించారు.

గతంలో తన తండ్రి కైకకు ఇచ్చిన రెండు వరాలను ప్రస్తుతం తీర్చుకుంటున్నట్లు… తల్లితో నివేదిస్తాడు శ్రీరాముడు. ఒకటి భరతుడికి యువరాజ పట్టాభిషేకం, రెండవది పద్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యవాసం చేయడం. ఈ విషయాలు తెలిపి అడవులకు వెళ్ళడానికి తల్లి కౌసల్య అనుమతిని పొందడానికి వచ్చినట్లుగా తెలుపుతాడు. తండ్రి ఆజ్ఞను పాటించడం ఉత్తమ ధర్మంగా ప్రకటిస్తాడు. ఒక్కసారిగా రాముడి మాటలు విన్న కౌసల్య ‘స్వర్గమున నుండి పడిన దేవత వోలె నేల పడిపోయె’ అని కవి వర్ణిస్తాడు. శాపవశాన అప్పుడప్పుడు దేవ లోకం నుండి దేవ కన్యలు, కిన్నెరలు, గంధర్వులు, కింపురుషులు భూలోకం మీద ఉద్భవించడం చూస్తుంటాం. భూమయ్య ఈ ఉపమానం ప్రయోగించడంలో తన జన్మను కోల్పోయిన స్త్రీ ధైన్యస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కౌసల్య దు:ఖ వారధికి ఇది అనుసంధానింపబడిరది.

స్త్రీలు తమకు కలిగిన శోకానికి, విషాదానికి ప్రకృతిని ప్రమేయం చేయడం గమనిస్తుంటాం. కౌసల్య తన కుమారునికి కలిగిన విపత్తుకు చింతిస్తుంది. ‘ఇదేమి దినము కత్తులే కిరణములుగా కరకు గుండె దాల్చి సూర్యుడిదేలా ఉదయమునందె’ అంటూ తన విధికి, వ్యధకు విలపిస్తుంది. ఒక్కో దినం గడియను బట్టి శుభాలు, అశుభాలుగా పరిగణింపబడుతాయి. కాలం మీద, సూర్య చంద్రుల కాలగమనం మీద జనులకు కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు  ఉన్నాయి. ప్రకోపాలు కూడా లేకపోలేదు.

‘పుట్టినింట ఆనాడు నేపొందిన సుఖ

మేమో కాని, ఈ మీ తండ్రి ఇంట నేను

కాలు మోపిన పిదప సుఖము నెరుంగ

నిన్ను గన్నాను బ్రతుకు కన్నీరు తడిచె’

అంటూ కౌసల్య తన జీవిత గాధను వినిపిస్తున్న సందర్భంలో ఒక విషయం స్పష్టమవుతుంది. పుట్టింట్లో తానెంత సుఖం పొందిందో తెలియని తనంలోనే కౌసల్య వివాహం జరిగింది. బాల్యంలోనే దశరథ మహారాజుతో పరిణయం జరగడం కూడా ఆమె దు:ఖానికి ఒక హేతువు. బాల్య వివాహాల మీది దుష్ప్రభావాలు రామాయణ కాలం నుండి భారంగా మారాయని ‘జ్వలిత కౌసల్య’ ద్వారా ప్రత్యక్షంగా తెలుస్తుంది. చివరకు అంతపుర స్త్రీలు అయినా వైవాహిక జీవితంలో దు:ఖ సాగరాన్ని ఈదారనడానికి ఈ దృష్టాంతం తార్కాణంగా నిలుస్తుంది. తాను పుట్టి పెరిగి, ఆడి పాడి, ఆనందంగా గడిపిన రోజులు అనుభవంలో లేని పరిస్థితి ఆమెది. ఇక వివాహం అయిన తర్వాత అత్తవారింటిలో ఏనాడు సుఖం పొందినట్లు ఏ ఆనవాలు వ్యక్తపరచలేకపోవడం ఆమె విధిరాతను తలపోస్తాయి. దీనికి రెండు కారణాలను కవి భూమయ్య ప్రస్ఫుటం చేశాడు. ఒకటి కౌసల్య వివాహానంతరం భర్త నుండి సుఖం పొందలేకపోవడం. దీనికి కారణం దశరథుడి బహుభార్యత్వ ప్రాధాన్యం. కైకేయిపై మోజును పెంచుకోవడం. ఆమెకు దాసుడు కావడం. రెండవది సపత్నుల వ్యవహార ధోరణి. కౌసల్య పట్ట మహిషి అయినా ఆమెకు గౌరవాదరణలు దక్కలేకపోవడం. సపత్నుల పరుష వాక్కులు ఆమె హృదయాన్ని గాయపరచడం. అవమానాల జలధి ఉదృతంగా మారి గుండెలో సుళ్ళు తిరగడం.

న దృష్ట పూర్వం కళ్యాణం సుఖం నా పతి పౌరుషే

అపి ప్రత్యే2పి పశ్యేయ మితి రామాస్థితం మయా                              అయోధ్య : సర్గ : 20 : శ్లో : 38

అత్యంత నిగృహీతాస్మి భర్తుర్నిత్య మతంత్రితా

పరివారేణ కైకేయ్యా సమావాప్యధవా2వరా                                       అయోధ్య : సర్గ : 20 : శ్లో : 42

వాల్మీకి రామాయణంలో శ్లోకాలను అనుమాండ్ల భూమయ్య తన ముందు మాటలో ప్రస్తావించారు. భర్త వల్ల సుఖం లేకపోయిన విషయాన్ని వాల్మీకి రామాయణంలో పై శ్లోకాల్లో తెలుపబడిరది. ఈ కావ్యానికి రామాయణ శ్లోకాల్లో కౌసల్య హృదయ తప్త జ్వాలను కవి ప్రవేశపెట్టారు. ఈ శ్లోకాల ఆధారంగానే కరుణ రసాత్మక గాథగా ఈ కావ్యం రూపాంతరం చెందింది.

* వంధ్యత్వం :

కొడుకు మీద ఉన్న ప్రేమ, వాత్సల్యం కౌసల్య నోట అద్భుతంగా ప్రకటింపజేశారు భూమయ్య. శ్రీరామ చంద్రుడు రాజ్యానికి యువరాజు పట్టాభిషిక్తుడైనప్పుడే తాను సుఖపడే దశ వస్తుందని భావించింది. కౌసల్య తన కడుపు తీపి మేర రామచంద్రుని అల్లారు ముద్దుగా పెంచుతుంది. ఆ సమయంలో నిప్పులాంటి వార్త ఆమె అంతరంగాన్ని కల్లోలం చేసింది. పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో వనవాసం చేయటం అనే తండ్రి ఆజ్ఞను ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆ విషయం ముందుగా తెలిసి ఉంటే కొడుకుగా శ్రీరాముడిని కనకుండా ఉండేదానిని అని ఆమె బాధపడుతుంది. కన్నతీపిని కూడా వద్దనుకునే విషమ పరిస్థితి కౌసల్యకు ఎదురవడమనేది మాతృ హృదయం కలవరపడే విషయం.

నాడు నిన్నునే గనకున్న నష్టమేమి

కలిగెడిది? వంధ్యయను పేరొకటి యే తప్ప

సంతులేదన్న ఏకైక చింత తప్ప

వంధ్యకు మరొక్క చింత రవ్వంత లేదు                               (పుట.20)

ఏ ఇల్లాలు అయినా గొడ్రాలుగా ఉండడం అనే విషయాన్ని కలలోనైనా తలంచదు. కాని కౌసల్య తన నోటి ద్వారా ఆ పద్యాన్ని ఉచ్ఛరించడం అత్యంత వేదనాభరితమైంది. కొడుకును కని అడవుల పాలు చేయడం కంటే గొడ్రాలుగా మిగిలిపోవటమే ఉత్తమంగా భావించిన కౌసల్య కడుపుకోతను ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య పాత్రలో స్త్రీ దు:ఖ హేతువుకు పరాకాష్టగా వంధ్యత్వమనే శబ్దాన్ని ప్రయోగించడం గమనించవచ్చు.

* కడుపుకోత :

కౌసల్య పరి పరివిధాలుగా శ్రీరాముడి మీద ఉన్న తల్లి ప్రేమను వ్యక్తపరిచిన తీరు కవి తన నేర్పుతో ప్రదర్శించాడు. తన దు:ఖానికి అంతం లేదని వాపోతూ, తనకు ఇంత దు:ఖం అనుభవించే శక్తి లేదని తలపోస్తుంది కౌసల్య. తన మీద దయచూపే ఏ దైవం కనిపించడం లేదని దు:ఖిస్తుంది. ఏ దిక్కు చూసినా శూన్యమే కనిపిస్తుందని తన దురదృష్టానికి చింతిస్తుంది.

కౌసల్య బాల్యంలో తన రామచంద్రుడు ఆడిన ఆటలు, అల్లారు ముద్దుగా పెరిగిన జ్ఞాపకాలు, చిలిపి చేష్టలను కౌసల్య గుర్తుకు తెచ్చుకోవడం కథా సందర్భాన్ని బట్టి ప్రధానమైనది. వెన్నను కొంత తిని అంతకన్నా మన్నును రుచిగా తిన గోరే రాముడిని చూసి కౌసల్య ఆవేదన చెందేదట. తల్లి చేత తిట్లు తింటూ దెబ్బ తగలకుండా తిరిగేవాడట. ఆటలు ఆడి అలిసిపోయి అమ్మ ఒడిలో చేరి పాలు తాగుతూ, తన కోరిక తీరలేదని ఏడ్చే వాడట. ‘అమ్మ పిలిచె రారా! అన్నము తినిపోవవేగ’ అని కౌసల్య ఎంత పిలిచినా ఆట పాటలలో మునిగి పోయేవాడట. ఇటువంటి శ్రీరాముడి అల్లారు ముద్దు చేష్టలను మరకముందే అడవుల పాలు కావడం కౌసల్యకు తీరని దు:ఖాన్ని మిగిలించింది.

` జాలి చూప / గలుగు దైవ మొక్కరు గాని కానరారు / శూన్య గగనమే ఏ వైపు చూడనైన (పుట.21)

` దెబ్బ తగలకుండ తిరిగెడు పని చేష్ట / కనగ నింత నోచుకొననె లేదొ? (పుట.21)

` తలపు తీరుకున్న ఏడ్చు తీయని పసి ఏడ్పు / వినగనింత నోచుకొననొ నేను? (పుట.21)

` ఆడి పాడుచుండు అందాల రాశిని / కనగ వినగ నోచుకొనగ లేదొ? (పుట.21)

విధి తనతో ఆడుతున్న ఆటకు కౌసల్య ఎంతగా వ్యధ చెందిందో ఈ పద్యపాదాల్లో స్పష్టంగా కవి వ్యక్తపరిచాడు.

* సంతాన పరితాపం :

సంతానం కోసం ఎన్నో నోములు, వ్రతాలు నోచింది కౌసల్య. ఎంతో కాలంగా అవన్ని ‘ఎడారి నలికిన విత్తనములయ్యె’ నని ఒక శిలగా మారిపోయింది. ఎప్పుడైతే శ్రీరాముడు జన్మించాడో, అప్పుడు కౌసల్య పునర్జన్మ ఎత్తినట్లుగా భావించింది. ఒక తల్లిగా సార్థకం కాని స్త్రీ జన్మ ఊహించలేనిది. కౌసల్య సంతానప్రాప్తి కోసం పరితపించిన సన్నివేశాలు కవి సహజంగానే వర్ణించాడు. తాను సంతానం కోరుకుంటే తన ఇంటిలో సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే అవతరించినట్టుగా భావించింది.

పాల సంద్రమే మా ఇంట పరిమళించె

కల్పవృక్షమే నట్టింట కదలి యాడె

సత్య ధర్మమ్ములమృతమై జాలువారె

చలువ పందిళ్ళు వేసెను చందమామ                                                (పుట.22)

శ్రీరాముని పుట్టుక సందర్భాన్ని ఆనంద పరవశాన్ని కౌసల్య వదనంలో కవి అద్భుతంగా వర్ణించాడు. బాల్యం నుండి రామచంద్రుని చూచుకోవడమే తపంగా, అలంకరించడమే పూజగా కౌసల్యకు కాలం సాగింది. అంతలోనే యువరాజు పదవికి రాముడు చేరుకోవడం తల్లికి ఆశ్చర్యమే. ఇంతలోనే వనవాస ఆజ్ఞను తట్టుకోలేకపోయింది. ‘నా ఉరమ్ము పగుల ఏడ్చి ఏడ్చి శిలనైతినెపుడొ, ఇప్పుడేడ్చి ఏడ్చి నేనేమౌదు నింక తండ్రి!’ అంటూ రోదిస్తున్న తీరు కవి నైపుణ్యంలో కరుణను చిందించింది.

* భర్త ప్రేమ లేమి :

భర్తవల్ల సుఖం పొందలేకపోవడమనేవి దీర్ఘకాలంగా కౌసల్య తీరని దు:ఖానికి కారణంగా నిలిచింది. పేగుతెంచుకు పుట్టిన బిడ్డను వనవాసం పంపడం ధర్మమూర్తి అయిన మహారాజుకు తగునా అని నిలదీస్తుంది. శ్రీరామచంద్రుడు అడవులకు పయనమై వెళ్తుండగా ‘జీవముండునే? కూలీన చెట్టునైతి’ అని కౌసల్య రోదిస్తుంది. తన పెండ్లి అయినప్పటి నుండి శుభంగానీ, సుఖంగానీ అంతవరకు తాను చూడలేదంటూ శ్రీరాముడితో మొరపెట్టుకుంటుంది. తన భర్త ఒక రాజు అయి ఉండగా తాను మాత్రం కళ తప్పి ఉన్నానని బాధపడుతుంది. ఈ సందర్భంలో కవి అద్భుత పోలిక వర్ణించారు ‘సూర్యుని ముఖమొక్కింతైన చూడలేని కమలవనమట్లు’ భర్త ప్రేమనే కనలేని బ్రతుకిదేమి!’ అని తలరాతను నిందిస్తుంది.

నాణ్యమౌ ఏడువారాల నగలు కలవు

నను గొలువ దాస దాసీజనమ్ము కలదు

ఎన్ని ఉండి వీనిననుభవింపలేని

భాగ్యహీనను పతిప్రేమబడయలేక                      (పుట. 24)

సగటు స్త్రీ భర్తనుండి ఆశించేవి ప్రేమానురాగాలు మాత్రమే. కౌసల్యకు ఏడువారాల నగలు, చుట్టూ దాసదాసీ జనము ఉండి కూడా భాగ్యవిహీనురాలైన స్థితిని కవి తన కవితా ప్రతిభలో ప్రదర్శించారు.

* సపత్నుల హేళన :

ఏ ఇల్లాలు అయిన ఎంత కష్టమొచ్చినా భరిస్తుంది కాని సవితి పోరును భరింపగరాదు. కాని కౌసల్యకు అనునిత్యం సవతుల నుండి పరుష వాక్యాలు, దూషణలు ఎదురవుతూనే ఉంటాయి. సపత్నులతో సమానమైన గౌరవాన్ని పొందలేని తన చిన్నతనాన్ని శ్రీరాముడి ముందు విన్నవించుకుంటుంది. రాజుకు పెద్ద భార్య అయి ఉండి, ప్రజల దృష్టిలో మహారాణి అయి ఉండి కూడా సపత్నులతో పడుతున్న హింసను కౌసల్య విడమరిచి చెప్పింది.

సా బహూన్య మనోజ్ఞాని వాక్యాని హృదయచ్ఛిదాం

అహంత్రోప్యే సపత్నీ నామ వరాణాం వరా సతీ                   (అయోధ్య : సర్గ : 20, శ్లో : 39)

సవతులిందరిలో నాకు సాటివచ్చు

వారెవరు లేరు, నా కంటె వయసులోన

చిన్న వారయు వారు నన్నెన్ని మాట

లాడి కష్టపెట్టెదరొనే ననగరాదు                                                            (పుట.24)

వాల్మీకి రామాయణంలో కౌసల్య శ్రీరాముడితో తన సపత్నుల వల్ల పడిన పరుష వాక్కుల తీరు స్పష్టంగా చెప్పబడిరది. అనుమాండ్ల భూమయ్య ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తల్లి అనుభవించిన సపత్నుల వల్ల బాధ, తన సీతకు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఏకపత్నీ వ్రతుడిగా ప్రతిజ్ఞ చేశాడు. సపత్నుల హేవగింపు వల్ల పొందిన బాధ ఈ కావ్యానికి మూలాధారంగా నిలిచింది. తల్లి హితబోధ ద్వారా శ్రీరాముడిలో సంస్కరణ భావాన్ని పెంపొందింపజేసింది. కౌసల్య తన దు:ఖం రెట్టింపు కావడానికి రెండు కారణాలు గాక మూడిరటిని తెలుపుతుంది. ఒకటి పతి ప్రేమ లేకపోవడం, రెండు సపత్నుల పరుషవచనాలు, మూడవది శ్రీరాముడి వనగమనం.

* స్వేచ్ఛా, స్వాతంత్య్రాల లేమి :

యువరాజు పదవిని అలంకరించే కొడుకు ఉండగానే దూషణలకు గురవుతున్నానని కౌసల్య వ్యధ చెందుతుంది. ఇక శ్రీరాముడు అడవులకు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని బాధపడుతుంది. తన భర్త తనకు ఏ మాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదని రాముడితో మొరపెట్టుకుంటుంది కౌసల్య.

నేను రాణినే అయి కూడా కాను, మీ జ

నకుడు నను నిగ్రహించి ఇంతయును స్వేచ్ఛ

 నీయలేదు, ఆ తల్లి కైకేయి దాస

జనముతో సాటిగానైన సరకుగొనడు                                   (పుట.25)

అంటూ దశరథుడు ఎంతగా ఆమెను కట్టుదిట్టం చేసేవాడో తెలుపుతుంది. భార్యలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడమనేది పితృస్వామ్య వ్యవస్థలో మొదటిది. స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అవసరం లేదనే పురుషాధిపత్య సమాజం అనాదిగా కొనసాగుతూ వస్తున్న విషయం వాల్మీకి రామాయణంలోనే తెలుస్తుంది. తాను ఒక పట్టమహిషి కూడా. రాజు స్వేచ్ఛ ఇవ్వకపోవడాన్ని ధిక్కరిస్తుంది కౌసల్య. తన భర్త చులకన భావంతో చూడడం వల్ల దాసి జనంలో తన రాణితనం చెలామణి కావడం లేదని బాధ పడుతుంది. ఇప్పటికీ దాసీజనం ఈ రీతికి నడుచుకొంటున్న సందర్భంలో కైక కొడుకు రాజయిన తర్వాత భయంతో తనను చూడడానికి రారేమోనని కౌసల్య సందేహిస్తుంది. ఏకాంతాన్ని ఎలా భరించగలనని శ్రీరాముడితో నివేదిస్తుంది. ‘కాలమింక నా గళమున బడిన కాలనాగొ ఏమొ!’ అని కౌసల్య చిందిస్తుంది.

* కైకేయి పోరు :

కౌసల్య తన సవతులన్నింటిలో కైక సాధింపును తట్టుకోలేకపోతుంది. ఎల్లప్పుడు పరుష వాక్యాలతో దూషించే కైకేయి తన మీద ఎంతటి క్రోదాగ్నిని చల్లుతుందోననే కౌసల్య వాపోతుంది. కైక వ్యక్తిత్వాన్ని కౌసల్య ఆవేదనలో కవి అత్యంత సహజంగా చిత్రించారు. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన తర్వాత కౌసల్యను కైకేయి బ్రతుకనివ్వదనే మాటను కవి ప్రస్తావించడంలో ఆమె ఎంతటి నియంత స్వభావాన్ని కలిగిందో తెలుస్తుంది.

కాల సర్పమట్లు కడు వంకరగ నడుచు

నడత గల కైక కుబుసమ్ము విడిచె Ñ ఇపుడు

విషము చిమ్ముచు నను కాటు వేయునేమొ?

కన్నతండ్రి! నాయన! నిన్నె కాటువేసె.                               (పుట.26)

అంటూ కైకేయిని కాలసర్పంతో పోల్చుతూ కౌసల్య ఆక్రోశిస్తుంది. కాని తన కష్టాలను, బాధలను కౌసల్య తన ఇష్ట సఖులకు కూడా చెప్పుకోలేదట. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య స్వభావాన్ని చిత్రిస్తూ ‘నా ముఖాన మట్టి విసిరినదని నేను / నట్లె కోపించి మట్టిని ఆమె మీద  / విసరలేను. దానిని తీసివేయమేలు’ అని తెలుపుతారు. కౌసల్య వ్యక్తిత్వంలో నీతి, ధర్మం, మంచితనం ప్రదర్శింపజేశారు కవి.

* సవతుల కలత :

కైకేయి మొదలైన సవతులలో ఎదురయ్యే కలతను ఎదలోనే దాచుకొని ఇంతకాలం సగమైపోయిన కౌసల్య ఈ ముసలితనంలో ఇంకా భరింపలేకపోయింది. పట్టమహీషి అయినందు వల్ల సవతులందరూ తనను అధికంగా బాధిస్తున్నట్లుగా కౌసల్య తెలుపుతుంది. మొదటి భార్యను అయిన నేరం వల్ల నేమో తనను మరింత సవతులు అవమానిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

* మాతృ ప్రేమ :

లక్ష్మణుడు ఆవేశంగా మాట్లాడిన మాటలు న్యాయమనిపించి భావించిన కౌసల్య శ్రీరాముడి వనవాసానికి అనుమతించడు. తండ్రి లాగా తల్లి కూడా పూజ్యురాలని చెబుతూ అడవులకు వెళ్ళకూడదని శ్రీరాముడిని ఆజ్ఞాపిస్తుంది. ఈ సందర్భంలోనే కవి భూమయ్య కౌసల్యలో పుత్రుడిపై ఉన్న ప్రేమను అనేక విధాలుగా వర్ణిస్తారు. చిన్నప్పటి నుండి కౌసల్యకు కలిగిన బాధనెల్లా రాముడు తన చిట్టి వ్రేళ్ళతో తుడిచిన సన్నివేశాలను గుర్తు చేసారు. ఆ వేదనతోనే రాముడు పసితనంలో ఆడిన ఆట వస్తువులే ఆయన అడవులకు వెళ్ళిన తర్వాత ఆమెకు బ్రతుకు వస్తువులవుతాయని సూచించారు.

క్రూర మృగముల నిలయమ్ము, కోయటన్న

పలుకు దిక్కులేని అడవి పదియునాలు

గేండ్లు పగలు గడచిన రేయియె గడవదు

ఇట్లివియె నాకిరువదెన్మిదేండ్లు తండ్రి!                                (పుట.41)

అడవులలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో కౌసల్య తలచుకొని బాధపడుతుంది. ఆ రాముడి పసితనం నుండి అల్లారు ముద్దుగా పెంచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. రాముడికి మెత్తని గుడ్డ ఒత్తుకొని పోయినా బాధపడే తల్లి మనస్సు అడవుల్లో కఱకురాళ్ళ మీద నిద్రించడం దుర్భరమైందని ఆవేదన చెందుతుంది.

కడుపులో ఉండగా రాముడు తన పాదాలతో తన్నుతుండగా కౌసల్య ఆ పాదాలు ఎంత కందిపోయెనో అని కలత చెందిందట. భూమయ్య వర్ణనలో తల్లి ప్రేమకు తార్కాణంగా కౌసల్యనే నిలుస్తుందని చెప్పవచ్చు. కాని అటువంటి పాదాలు రాయిరప్పలు తాకి రక్తం చిందిస్తాయని తలచుకొని బాధపడుతుంది. ‘తండ్రీ! నీ ముద్దు పాదమందారములకు నా యెదను తొడుగుదునయ్య!’ అంటూ కౌసల్య పేర్కొంటుంది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనం ఈ పద్య పాదం. కవి మాతృ స్పర్శకు గొప్ప చమత్కృతి. తనను కూడా అడవులకు తోలుకొని పొమ్మని కౌసల్య ప్రాధేయపడుతుంది. అడవుల్లోని భయానక పరిస్థితులను రాముడికి తెలియజేస్తుంది.

* లక్ష్మణుడి సేవ :

ఈ కావ్యంలో లక్ష్మణుడి మాటలు కౌసల్య దు:ఖానికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుత్ర శోకంతో కుమిలిపోతున్న కౌసల్యను చూసి తన తండ్రిపై ఉగ్రరూపమెత్తుతాడు. రాముడు అడవులకు వెళ్ళకూడదని వారిస్తాడు. తన అన్నకోసం ఏమైనా చేస్తానంటాడు   లక్ష్మణుడు. చివరికి తండ్రిని, కైకను, భరతుడిని బంధిస్తానని శపథం చేస్తాడు. రాముడిపై అచంచల భక్తిని ప్రదర్శిస్తాడు. లక్ష్మణుడి ఆక్రోశం కౌసల్య ఆవేదనను కొంత శాంతింపజేసింది. ‘అన్నకు ఆపద సంభవింపనే నగ్నిని దూకెద ముందుగనే’ అన్న లక్ష్మణుడి మాటల్లో అగ్రజుడి పైగల సోదరప్రేమ, సేవాతత్పరత కనిపిస్తుంది. కవి ఈ పాత్ర కల్పనలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

* రాముడి ఏకపత్నీ వ్రతం :

‘జ్వలిత కౌసల్య’గా రగిలిపోతున్న తల్లి దు:ఖాన్ని నివారింపజేస్తూ శ్రీరామచంద్రుడు చల్లగా స్వచ్ఛంగా ఏకపత్నీవ్రతం ప్రతిజ్ఞ చేస్తాడు. తల్లి నిరంతర శోకానికి కారణం తండ్రి ప్రేమ లేకపోవడం, తండ్రి బహుభార్యత్వాన్ని స్వీకరించడం అని గ్రహిస్తాడు. తన తల్లి లాగా సీత దు:ఖించకూడదని నిర్ణయించుకొని మాట ఇస్తాడు.

గడిచినట్టి కాలమ్మేదో గడిచిపోయె

తండ్రి తప్పొప్పులివియని తలపలేను

ఏ పరిస్థితులెట్లు రానిమ్ము నాకు

ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య.                     (పుట. 57)

అన్న శ్రీరాముడి ప్రతిజ్ఞకు కౌసల్య దు:ఖం తొలిగిపోయినట్లుగా కవి కల్పించారు. ‘ఏదో పరిమళామృత పుష్పమింత సాగివచ్చి కౌసల్య శిరస్సుపై విచ్చుకొనియె’ అని వర్ణిస్తారు. కౌసల్య తనకు జరిగిన పరాభవం తిరిగి తీసుకొని రాలేనిది. తన కాలం చెల్లిపోయింది. తన సీతకు ఇటువంటి దుర్గతి పట్టకూడదని కౌసల్య మనోభావం. ఈ ప్రతిజ్ఞతో కవి తన కావ్యానికి సద్గతిని ఏర్పరిచారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య స్త్రీత్వంలో కౌసల్యను చిత్రించి రాముడిని ధర్మ నిరతివైపు పయనింపజేశారు. మూర్తిమత్త్వ నిర్మాణంలో ‘జ్వలిత కౌసల్య’ను అపూర్వ సృష్టిగా నిలువరింపజేశారు. సంప్రదాయ స్త్రీవాద ధోరణికి ప్రతినిధిగా ఈ కావ్యాన్ని చిత్రించారు. సమకాలీన సామాజిక వీక్షణంలో అంతర్భాగంగా పౌరాణిక ఐతిహాసిక పాత్రల మనోగతాన్ని ఆవిష్కరించారు.

:: ఆధారగ్రంథాలు ::

1. కృష్ణకుమారి, నాయని, ఆచార్య, 2013, విమర్శ విద్యా సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

2. ప్రియదర్శిని, కె.,డా॥, (సం) 2015, ప్రతిభాత్రయి, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

3. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2004, అంతర్వీక్షణం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

4. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2011, (నాల్గవ ముద్రణ), జ్వలిత కౌసల్య, మనస్వినీ దేవి ప్రచురణలు,     హైదరాబాద్‌.

5. రామారావు, చేకూరి, ఆచార్య (సం) 2003, అంతర్వీక్షణ సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

దురాక్రమణ (కథ)

by Nalimela Bhasker June 14, 2022
written by Nalimela Bhasker

కన్నడ మూలం : మధురా కర్ణమ్ తెలుగు అనువాదం : డా. నలిమెల భాస్కర్

మేఘాలు లేని నిర్మలమైన ఆకాశాన్ని మెత్తగా పత్తిలాంటి ఓ తెల్లని మబ్బు ఆక్రమించికొని వుంది. మొదట అత్యంత సుందరంగా కన్పించిన ఆ మబ్బు తునక కాస్త దగ్గరికొస్తూ కిందికి దిగుతుంటే నలుపు పెరిగి నైరూప్యమై పోయి చుట్టుపక్కల చీకట్లు ఆవరించినట్లు ఓ అనుభూతి. ఎక్కడ వర్షం వస్తుందో అనుకుంటూ పెరట్లోని నిమ్మపళ్ళు పట్టుకొని వేగంగా లోనికొచ్చాడు శేషాద్రి. ప్రశ్నార్థక దృష్టితో తనను చూసిన రమతో “మనకు సర్దుబాటు అవుతుందా బెంగుళూరు. ఇక్కడ సొంత ఇంట్లో హాయిగా వున్నాం” అని మెల్లగా అన్నాడు. రమ రెచ్చిపోయి “సర్దుబాటు కాదు అంటే ఎలా? సర్దుబాటు చేసుకోవాలి. మొదట్లో

కొన్నాడు. ‘ఇక్కడికే రండి‘ అని ఎన్నిసార్లో పిలిచాడు. మీరే అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఈసారి కోపంతో వెళ్ళిపోయాడు. అవునూ, మనమూ పిల్లలతో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండటం ఎప్పుడింక? సుఖపడటమూ, ఎంజాయ్ చేయటమూ ఎప్పుడు? ఓ అమ్మాయిని చూడాలి. వాళ్ళ పెళ్ళి గురించి ఆలోచించాలి. ఈ ఇల్లు అద్దెకు ఇచ్చి వెళదాం పదండి” అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడింది. పొయ్యి మీది వంట చిటపట చప్పుడు చేసింది. బయట మిడ్తూ చిలుక “అప్ప, అప్ప, అప్పు” అంది. ఈ నెపంతో శేషాద్రి బయటికి నడిచాడు.

తన ముద్దుల చిలక మిఠూకి పచ్చిమిరపకాయ తినిపిస్తూ శేషాద్రి ఆలోచించసాగాడు. రమ చెప్పినదాంట్లో తప్పేమీ లేదు.

పిల్లలు ‘మాతో రండి’ అని పిలవడమూ, చాలా బలవంతపెట్టడమూ నిజమే! కానీ, ఇక్కడ సర్దుకున్నట్లు అక్కడ సాధ్యమా? ఈ హళియాళ అనేది చిన్న ఊరైనా సొంతిల్లు ఉంది. ధార్వాడకు దగ్గర, ఉపాధ్యాయ వృత్తిలోంచి పదవీ విరమణ పొందినా ట్యూషన్లు చెబుతున్నాడు. ఐతే బెంగుళూరు, ముంబైల్లో ఉండే మజా మాత్రం ఇక్కడ లేదు. ఇదొక ప్రశాంతమైన నిర్మలమైన కొలను. అక్కడి దుమ్మూ, ట్రాఫిక్, కాలుష్యం, హడావుడి.. కష్టం కదా! ఇంతకుముందు అంటే వాళ్ళున్నది ఇరవై ఐదు ఏళ్ళ కిందట. యశ్వంతపురం సర్కారీ పాఠశాలలో పనిచేస్తున్న కాలం. అప్పుడప్పుడే కంప్యూటర్ కళ్ళు తెరుస్తున్న వేళ, రమ కూడా బేసిక్ కోర్సు నేర్చుకొని ఓ సంవత్సరం పాటు ఉద్యోగం కూడా చేసింది. తర్వాత మళ్ళీ ఉత్తర కర్ణాటక వైపు రావడం జరిగింది.

రమ, శేషాద్రుల చిన్న కుటుంబం గురించి తప్పక చెప్పాలి. రమ గృహిణి. శేషాద్రి ప్రారంభంలో ఎంత ఎగిరినా చివరికి భార్య చెప్పినట్లు వినే ‘జీ హుజూర్‘ భర్త. ఇద్దరు పిల్లలు… అతుల్, అమిత్. అతుల్ చక్కటి మార్కులతో ఇంజినీరింగ్ లో చేరాడు. అమిత్ కూడా మంచి మార్కుల్ని పొందినా పోటీ పరీక్షల గొడవే వద్దు అనుకుని కామర్సులో చేరాడు. ఇద్దరూ ఒకేసారి డిగ్రీ ముగించి బెంగుళూర్లో ఉద్యోగాలు దొరికించుకున్నారు.

అతుల్ పదో తరగతిలో ఉండగా థాండేలికి ఎక కర్షన్కు వెళ్ళినపుడు తెచ్చిన చిలుకే మిర్టూ.

తండ్రికి ఇష్టం లేకున్నా గొడవపడుతూ సాకాడు దాన్ని. అది కూడా “అన్న, అన్న” అంటూ అతని వెంటే తిరుగుతుంది. అతడు లేనప్పుడు మాత్రం అమిత్ వైపు చూస్తుంది. కానీ, దాని ముద్దు పలుకులకు శేషాద్రి ఇష్టపడి దాని ఆలనాపాలనా తనే చూస్తున్నాడు. ఆకలైనపుడు “అమ్మ, అమ్మ” అంటున్న చిలుక, దాని మలం బయట పారవేయాల్సి వచ్చినపుడు మాత్రం “అప్ప, అప్పు” అని పలుకుతున్నది. ఇంటి వాళ్ళకే కాదు, ఇరుగు పొరుగులకూ అది ఇష్టమై పోయి “మిడ్తూ మియా” అయ్యింది.

చివరికి రమ మాటే నెగ్గింది. ఇల్లు అద్దెకిచ్చి అవసరమైన సామాగ్రితో మిఠూ మియా పంజరాన్నీ తీసుకుని బెంగుళూర్లో దిగింది. అతుల్ రాజాజి నగరం భాష్యం సర్కిల్ దగ్గరనే ఇల్లు తీసుకున్నాడు. రెండు బెడ్రూములు, హాలు, కిచెన్లు ఉన్న చిన్న ఇంటికి పదిహేను వేల అద్దె, ఓ లక్ష డిపాజిట్ కట్టాడు. అరవై ఎనిమిదో క్రాసు మార్కెట్టుకు దగ్గరే! ఇరుగు పొరుగు పిల్లల్ని తప్పించడానికి మిఠూ పంజరాన్ని వెనకాల వేలాడదీసింది. అతుల్ పొద్దుట ఏడున్నరకు ఇల్లు వదిలితే తొమ్మిదింటికి తన కంపెనీలో ఉండేవాడు. అతనికన్నా ఓ సంవత్సరం చిన్నవాడైన అమిత్ ఎనిమిది గంటలకు బయలుదేరితే తొమ్మిదికి హ్యారిక్స్ కంపెనీకి చేరేవాడు. ఆ తర్వాత సాయంకాలం, రాత్రి దాకా ఆలుమగలదే సామ్రాజ్యం. ‘సాఫ్ట్ వేర్ ఇంజనియర్‘ అనే కారణం చేత అతుల్ మీద ప్రత్యేకమైన ప్రేమ, గర్వం రమకు. రోజూ తప్పకుండా “ఎన్ని గంటలకు వస్తావ్?” అనే అనే ప్రశ్న అతుల్ ని అడుగటమే ! “అమ్మా! సాఫ్ట్వేర్ వాళ్ళకు ఇంటినించి బయలుదేరే టైమే తెలుసు కరెక్టుగా. తిరిగి ఇంటికొచ్చే టైమ్ తెలీదు” అనేవాడు. ఆ జవాబుతో రమ నిరుత్తురురాలైంది.

కొత్త ఇంటితో సర్దుబాటు చేసుకునే ఆదుర్దాలో రోజులు గడిచిపోవడం తెలియనే లేదు. వారాంతాల్లో చుట్టుపక్కల ఉన్న విశేష స్థలాలు గొరవనపల్లి, మేలుకోటె, మేకదాటు మొదలైనవి చూడటమైంది. హోటల్ తిళ్ళు, సినిమా, షాపింగ్తో రమ ఉబ్బితబ్బిబ్బు అయ్యింది. కొత్తరకపు జీవిత పరిచయాన్ని కల్గించాయి రమకు. ఉత్తర కర్ణాటక వాళ్ళే ఎక్కువగా ఉంటున్న కాలనీలో చక్కగా ఈ ఆలుమగలిద్దరూ ఇరుగుపొరుగుతో కలిసిపోయారు. అన్నగారి సహవాసం రోజూ లభించడంతో మిడ్తూ మియా కూడా ఖుషీ ఖుషీగా ఉన్నాడు. దాన్ని మాట్లాడించనిదే అతుల్ కి ఏ రోజూ ప్రారంభం కాదు. మొబైల్ లో ఫోటో తీసి, వీడియో చేసి స్నేహితులకు చూపిస్తున్నాడు. అంతా బాగానే వున్నా విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ రమకు గాబరా కల్గిస్తున్నది. రోడ్డు దాటాలంటేనే భయంగా వుంది. చుట్టుపక్కల ఎక్కడెక్కణ్ణించో వలస వచ్చిన వివిధ భాషలు మాట్లాడే జనం. మార్వాడీల సంఖ్య ఎక్కువ. దేశంలోని అన్ని ప్రాంతాల నించి ఇతర భాషీయులు వచ్చి ఇక్కడే తిష్ఠ వేసుకొని ఇదే సొంతం అనుకునేంతవరకూ పాతుకుపోయారు. అచ్చమైన కన్నడం విన్పించడం చాలా అరుదు.

రమకు కాస్త తీరిక దొరికాక చిన్ననాటి స్నేహితురాలు సులక్షణకు ఫోన్ చేసింది. ఇద్దరూ తాము అనుకున్న దినం కలుసుకుని కౌగలించుకుని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. సులక్షణ అప్పటికే సాహిత్య రంగంలో పేరు తెచ్చుకుంది. అనేక కథాసంపుటులూ, కవిత్వం సంపుటులూ, నవలలూ ప్రచురించింది. నాలుగు అవార్డులు వచ్చాయి. తన భర్తగారి అకాల మరణంతో కల్గిన దుఃఖాన్ని కథల్లో మరచిపోవడం అబద్ధం కాదు. రమ కూడా సాహిత్య విద్యార్థినే! ఇప్పుడు తన ఫ్రెండుతో సాహిత్య వ్యవసాయం సాగించాలనే ఆశతో ఉంది. రమ ఆలోచన విన్న సులక్షణ చిన్నగా నవ్వి “ఆనాటి రోజులు కావు రమా! ఇప్పుడెక్కడ చూసినా సాఫ్ట్ వేర్ చూడు. బెంగళూరు అంటేనే సైబర్ ఊరు అన్నట్లు తయారైంది. దాంతో మంచే జరిగిందా? కులమతాల గొడవలేక మెరిట్ మీద నౌకరీ దొరికిన మధ్యతరగతి జనాలు బాగుపడ్డారు. విదేశాలు చూసారు.

డబ్బులు గడించారు. మన ఊరి పేరు ప్రపంచంలో ఫేమస్ అయ్యింది.

కానీ సాఫ్ట్ వేర్ల కథ ఎంతమందికి తెలుసు? ప్రెషర్ కుక్కర్ల గతి వాళ్ళది. పని ఒత్తిడి,

టార్గెట్ అనే వేలాడే కత్తి కిందనే బతుకులు. బయటికి హాయిగా ఉంటుంది. లోన… పొట్టవిప్పి చూస్తే అన్నీ పురుగులే! సాహిత్యంలోనూ సాఫ్ట్ వేర్ గురించి కథ రాస్తే చాలు, గరం గరం దోసెల్లా ఖర్చవుతాయి. సాఫ్ట్ వేర్ లో పనిచేసే వాళ్ళు అంటే చేతిలో ఓ బాటిల్, ఒకటి

రెండు బలహీనతలు, కొందరు అమ్మాయిలు, వాళ్ళతో అఫెయిర్సు సెటప్సు, విదేశీ ప్రయాణం… ఇవి ఉంటే చాలు… కథలూ, నవలలూ అన్నీ సక్సెస్. ఈ మధ్య మన బెంగుళూరంతా సైబర్ సాహిత్యమే ఆవరించుకుంది” అని నిట్టూర్చింది. రమ తలలో అనేకానేకమైన ఆలోచనలు. కర్ణాటకలోని మారుమూల పల్లెటూళ్ళలోనూ, పట్టణాలల్లోనూ పిల్లలు పెరిగి పెద్దవుతున్నారంటే ఇంజనీరింగ్ చదివే తమకం. డిగ్రీ రాగానే బెంగుళూరుకు వచ్చి సాఫ్ట్ వేర్ లో చేరే పరుగు. చేరగానే విదేశాలకు వెళ్ళాలనే కలలు. మిగిలిన మామూలు డిగ్రీలకు విలువే లేని పరిస్థితి. పెళ్ళి మార్కెట్టులోనూ ఈ డిగ్రీధారులను పట్టించుకోవడం తక్కువ. రమ మనస్సులో తాను ఇంతకుముందు చూసిన బెంగుళూరు బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా, బంగరు కలలాగా కనిపిస్తూ ఐస్ క్రీములా కరిగిపోతున్నది.

మూడోరోజు సీతా, ఆమె కూతురు విభా వీళ్ళకు కాస్త దగ్గరయ్యారు. వాళ్ళూ ధార్వాడ వాళ్లే!

చాలా ఇష్టమైంది. దినానికోమారు క్యారెట్టు,

జామ పండ్లు తెచ్చి దాన్ని మాట్లాడిస్తూ ఆనందిస్తున్నది. అయితే అమిత్ మాత్రం “అమ్మా! నీకు తెలీదు. ఆమె మిడ్తూ కొరకు కాదు, మిర్టూని సాకినవాడికోసం వస్తున్నది. అతుల్ ఉండే టైమ్ చూసే వస్తున్నది. కావాలంటే చూడు” అన్నాడు. రమ కూడా గమనించింది. అమిత్ చెప్పింది నిజమే! మళ్ళీ అలా రావడంలో తప్పు లేదు అనుకుంది. విభా అందగత్తె బి.కాం. చివరి సంవత్సరంలో ఉంది. మంచివాళ్ళే! కానీ అతుల్ “అమ్మా! నాకు బి.ఇ. చేసినావిడే కావాలి. ఎమ్.ఎన్.సి.లో నౌకరి చేయాలి, బెంగుళూరు ఎంత కాస్ట్లీ తెలుసు నీకు. ఆలుమగలిద్దరూ నౌకరి చేస్తేనే ఇల్లూ ముంగిలీ నడవటం సాధ్యం” అన్నాడు. ఇంతలోనే అతని ఉద్యోగం కథ చాలినంత చూసిన రమ గమ్మున తల పంకించింది. మనసులోనే “వీకెండ్ లోనే వీళ్ళ హుషారు. మిగిలిన రోజుల్లో ఒంటిమీద స్పృహ ఉండదు” అనుకుంది. ఐనా “ఇవాల్టి పిల్లలు తమకి పనికొచ్చే అమ్మాయిలనే ఎంచుకుంటున్నారు. కానివ్వండి… ఆ తర్వాత ఇబ్బందులు కావద్దు కదా” అంది. విభా సంబంధాన్ని ఇష్టపడిన శేషాద్రి “అలా మన ప్రమేయమూ, పాత్రా ఏవీ ఉండవు. మనం కేవలం నామ్ కే వాస్తే” అన్నాడు. కొడుకు పక్షం వహించిన రమ “అలా ఎందుకంటారు? ఈనాటి పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళ ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. మున్ముందు జీవితం గడపాల్సింది వాళ్ళే కదా! వాళ్ళే…..” అని వాదించింది కూడా. కానీ మనసులోని ఏదో మూలన కొడుకు తమ ఆశల్ని నేరుగా నిరాకరించినందుకు బాధా ఉంది.

సులక్షణ ఓరోజు భోజనానికి వచ్చింది. స్నేహితురాండ్రను మాట్లాడుకోవడానికి వదలి శేషాద్రి వెళ్ళి లైబ్రరీలో కూచున్నాడు. భోజనం చేసాక సులక్షణ “రమా! ఓ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఇవాళ పిలిచారు. నా నవల సీరియల్ గా తీయడం గురించి మాట్లాడుతారట! నువ్వు రా!! కలిసొద్దాం” అనడంతో రమ ఆనందాన్ని పట్ట పగ్గాల్లేవు. భర్తకు వడ్డించి బయల్దేరింది. ఇద్దరూ మల్లేశ్వరంలో ఉన్న ఆఫీసు చేరి హంసల చెక్కడపు పనితో ఉన్న తలుపులు తట్టి లోనికి వెళ్ళారు.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శిరస్త్రాణం

by Burra Vijayalaxmi Nagraj June 14, 2022
written by Burra Vijayalaxmi Nagraj

రహదారులన్నీ పచ్చి నెత్తురు పులుముకుంటున్నాయి…
పులుముకోవాల్సివస్తోందేమో
కొన్ని సార్లు బలవంతంగా కూడా!
కూడా శిరసుకు ఉండాల్సిన రక్షక శిరస్ర్తాణాలు …
శిరస్త్రాణాలే ద్విచక్ర వాహనాలకు అలంకారాలుగా మారుతుంటే
మారుతున్న తలరాతలను ఆపడం ఎవరితరం
తరం తరం నిరంతరం నిర్లక్ష్యం తలను మోస్తుంటే
మోస్తున్న బాధ్యతల భారం గుర్తుకురాదా మరి
మరి గుర్తుంచుకుని ప్రాణం పెట్టాల్సిన బంధాలకు నీవులేకపోతే భరోసా ఏది
ఏది ఆ క్షణం ఓ సారి మనసున మెదిలితే
మెదులుతున్నంత కాలం ఆ బాధ్యత నీ హృదయంలో
హృదయం శిరస్త్రాణాన్ని మరువదు
మరువదు తన తలపై ఉన్న బాధ్యతను…
బాధ్యతతో నడుచుకున్నంత కాలం నల్లటి రహదారి
రహదారే అవుతుంది నీ చిరునవ్వులకు
చిరునవ్వులతో కలకలలాడే నీ అనుబంధాలకు.

విజయలక్ష్మీనాగరాజ్
కరీంనగర్
8187010817

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సందేహ నివృత్తి

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, June 14, 2022
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

         గోపి చిన్న పిల్లాడు. అతడు తన పూల తోట లోనికి వెళ్ళాడు. అక్కడ చాలా పూల మొక్కలు  అందంగా రకరకాల రంగులతో ఉన్నాయి.ఇంతలో ఒక పూలమొక్క గాలికి అడ్డంగా అటూ,ఇటూ ఊగుతోంది.
గోపీకి ఒక సందేహం వచ్చింది.
       ఇంతలో అక్కడకు అతని తాతయ్య వచ్చాడు. అప్పుడు గోపి తాతయ్య తో” చూడు తాతయ్యా! ఈ మొక్క గాలికి  అడ్డంగా అటూ, ఇటూ ఊగుతుంది. దీని అర్థం ఏమిటి?” అని  ప్రశ్నించాడు?
       అప్పుడు తాతయ్య” ఇది  నీకు భయపడి తనను తొలగిస్తావనుకొని తొలగించవద్దని అడ్డంగా ఊగుతోంది రా! . అంతే గాకుండా నేను చాలా మంచి మొక్కను. మీకు పూలు  ఇస్తాను .నన్ను తొలగించవద్దని ప్రార్థిస్థున్నది ” అని  అన్నాడు.
       అప్పుడు గోపి “ఓహో! ఈ మొక్క ఇలా అడ్డంగా ఊగితే అర్థం ఇది  అన్న మాట “అని బిగ్గరగా అన్నాడు. ఆ తర్వాత  ” అయితే తాతయ్యా! దీనిని మనం తొలగించడం లేదు .అంతేకాదు. ఇలాంటి మొక్కలు ఇంకా కొన్ని కూడా తెచ్చి నాటుదాం” అని
అన్నాడు.గోపి అలా అనడమే కాకుండా  మరి కొన్ని మొక్కలు కూడా తెచ్చి ఆ తెల్లవారి  నాటాడు.గోపి చేసిన పనికి  తాతయ్య ఎంతో సంతోషించాడు.
       మరొక రోజు గోపి తోట లోకి వెళ్లి  తాతయ్యను పిలిచి  ” తాతయ్యా! ఈ మొక్క అడ్డంగా కాకుండా నిలువుగా ఊగుతుంది . మరి  దీని అర్థం ఏమిటి” అని ప్రశ్నించాడు? అందుకు తాతయ్య” గోపీ!  నిన్ను ఆ మొక్క  తన దగ్గరకు రమ్మని పిలుస్తోంది రా! తనను ఇక్కడనుండి తొలగించమని అది ప్రాధేయ పడుతోంది! “అని అన్నాడు.  అప్పుడు గోపి “తాతయ్యా ! మొక్కలను తొలగించవద్దని మీరే చెప్పారుగా” అని అన్నాడు. ” అవును గోపీ! నీవన్నది నిజమే! కానీ  ఇది కలుపు మొక్క. ఇతర మంచి మొక్కలకు  నీరు ,ఎరువు  అందకుండా ఇది చెరుపు  చేసేది. ఇది మంచిమొక్కలను ఎదగనీయదు.అందుకే తనను తీసేయమని ఇది  నీకు భయపడి నిన్ను ముందే  వేడుకొంటోంది .ఇలాంటి వాటిని మనం తీసేయాలి రా!” అని  అన్నాడు. ” అయితే దీనిని తొలగిద్దాం తాతయ్యా! ” అని అన్నాడు గోపి.” అవును !ఇలాంటి వాటిని తొలగిస్తే మంచి మొక్కలు ఎదిగి మన తోటలో చక్కని పూలు పూస్తాయి” అన్నాడు తాతయ్య.
        మళ్లీ గోపి “మరి పూవులను మొక్కలనుండి తెంప కూడదా తాతయ్యా! ”  అని ప్రశ్నించాడు ? “వద్దు. తెంపకూడదు. మనకు అత్యవసరమైనపుడు మాత్రమే ఒకటో, రెండో  తెంపుకోవాలి.ఆ రంగు రంగుల పూలు  మన కళ్ళకు ఎంతో అందంగా కనబడతాయి . వీటిని మనం  మొక్కల నుండి  వేరు చేయకూడదు. అవి  మనకు కమ్మని  సువాసనను, మంచి గాలిని ఇస్తాయి. మనం స్వార్ధం తో వీటి అన్నింటినీ ఒకేసారి  తెంపకూడదు “అని అన్నాడు తాతయ్య. గోపి” సరే తాతయ్యా! నా సందేహాలు నివృత్తి అయినాయి. మీకు కృతజ్ఞతలు.మీరు చెప్పినట్లే నేను చేస్తాను ” అని అన్నాడు.
     పిల్లలూ! అందుకే పూల మొక్కలను నాటి ప్రకృతి అందాలను కాపాడి పర్యావరణానికి తోడ్పడాలి.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వృథా చేయకు నీటిబొట్టు

by చంద్రకళ దీకొండ June 14, 2022
written by చంద్రకళ దీకొండ

జలము జీవులకు ప్రాణాధారం
జలమే జీవక్రియలకు ఆధారం
వృథా చేయకు నీటిబొట్టు
వర్షం నీటిని ఒడిసిపట్టు…!

నదుల వద్దనే నాగరికత
నీటితోనే మానవుల భవిత
నీరుంటేనే పంటలు పండు
నీరు లేకున్న గొంతులెండు…!

ఒకవైపు నీటి వృథా
మరోవైపు గొంతెండే వ్యధ
నీరుంటేనే మనును జీవులు
నీరుంటేనే సాగును బ్రతుకులు…!

శుద్ధిచేసిన మురికినీటితో
పంటలు పండించే
ఇజ్రాయెల్ దేశాన్ని చూడు
ఎడారిలోనూ కూరలు పండించే
శాస్త్రీయ విజ్ఞానాన్ని స్వంతం చేసుకో
ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే
ఆధునిక నైపుణ్యాన్ని అలవరచుకో
చుక్క చుక్కనూ ఒడిసిపట్టే
బిందుసేద్య పద్ధతులను ఆచరించు

ముందుతరాలకు తెలియజెప్పు
భూగోళంపై మూడు శాతం కన్నా
తక్కువున్న మంచినీటి ప్రాధాన్యతను
కన్నీటిపాలు కానీయకు
వారి సుందర భవితను…!!!


చంద్రకళ. దీకొండ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

తీపికలలు…

by ఏలూరు అశోక్ కుమార్ రావు June 14, 2022
written by ఏలూరు అశోక్ కుమార్ రావు

ఆచార్య ఆత్రేయ (కిళాంబి వేంకట నరసింహాచార్యులు)గారి ఈ గీతానికి ఎ.ఎం.రాజా మధురంగా బాణీ కూర్చితే జిక్కి మృదు మధురంగా గానం చేశారు.

పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు ||పులకించు||

సంగీతం, సాహిత్యం రెండు కూడా గానంతో మేళవిస్తే ఇక మానవ జీవితానికి కావలసింది ఏముంది? ఆ మూడు కళలకు మన మనసు పులకించి పోతుంది. మన మనసులో వుండే తీరని వ్యథలను, దుఃఖాలను మరపింప చేస్తాయి.

రాగ మందను రాగ మొలికి, రక్తి నొసగును గానం,

రేపు రేపను తీపి కలలకు, రూపమిచ్చును గానం,

చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం,

జీవమొసగును గానం, మది చింత బావును గానం    ||పులకించని||

గానంలోని రాగంలో అనురాగం నిండితే మానవ మనుగడలో రక్తి కలుగుతుంది. సంగీతం రాగాన్ని కూడా అనురాగమయం చేస్తుంది. జీవితంలో ఆసక్తిని, రక్తిని నింపుతుంది. మనకు గానం రాగాలాపనతో ఎంతో దూరాన వున్న కలలను, ఆశలను మన హృదయానికి చేరుస్తుంది. మన భావాలు చెల్లా చెదురుగ పడి వుంటే వాటినన్నింటినీ పూలను దండిగా మార్చే విధంగా ఒక దగ్గరికి చేర్చి అస్తిత్వాన్ని కలుగజేస్తుంది. మన మనసులో వుండే బాధలను తొలగించి, హాయిని కలుగజేస్తుంది.

వాడిపోయిన పైరులైనా, నీరుగని నర్తించును,

కూలిపోయిన తీగలైనా, కొమ్మనల మీ ప్రాకును,

కన్నెమనసు ఎన్నుకున్న తోడు దొరికిన మరియు

దోరవలపే మరియు, మది దోచుకొమ్మని పిలుచు ||పులకించని||

వర్షాలు లేకపోతే పైర్లు ఎండిపోతాయి. కాని వర్షం కురిసి నీరు వాటికి అందినచో, మానవ హృదయం గానానికి పరవశించినట్లు, పైర్లు కూడ, నాట్యం చేస్తాయని కవి భావన. ఆధారం లేకపోతే తీగ ప్రాకజాలదు. అలా కూలిపోయిన తీగలు కూడా వాటి ప్రక్కన గల కొమ్మలను ఆసరా చేసికొని వాటిలో పునరుజ్జీవం కలిగి మళ్ళీ ప్రాకుతాయి. అదేవిధంగా కన్నెమనసులో ఎన్నో ఆశలుంటాయి. కాని, తాను మనసులో కోరుకున్న తోడు (జీవిత భాగస్వామి) దొరకాలన్నదే ఆమె జీవితంలో పెద్ద ఆశ. ఆ తోడు దొరికిందంటే ఆమె మనసు మురుస్తుంది. ఆ తోడు దొరికిన వెంటనే ఆమె పులకించి, తన హృదయాన్ని, జీవితాన్ని ఆ భాగస్వామికి సమర్పించి, తన మనసును కూడా. దోచుకొమ్మని ఆహ్వానిస్తుంది. గానం అనే కళ మానవ జీవితాల్లో వుండే జఢత్వాన్ని తొలగింపచేసే ఒక ఔషధం లాంటిది. “శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణిః” అని ఆర్యోక్తి. పశువులను, శిశువులోనే కాకుండా, పాములను కూడా పరవశింపచేసేది గాన రసం.

పెళ్లి కానుక సినిమా 1960 సంవత్సరంలో విడుదలైనది. ఈ పాట నటి కృష్ణకుమారి పై చిత్రీకరించబడింది. 60 సం గడిచినప్పికి ఇప్పటికి మన తెలుగు నాట అందరి హృదయాలను కొల్లగొడుతూనే వుంది.

  • ఏలూరు అశోకుకుమార్ రావు
June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

సారంగ పక్షులు

by ఒద్దిరాజు మురళీధరంరావు June 14, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

మనం పిల్లలకు కథలు చెప్పేప్పుడు జంతువులు, పక్షి కథలు చెప్తుంటాము. ఉదాహరణకు ఐకమత్యమే మహాబలం అనే నీతి కథ నాల్గు ఎడ్లు, ఒక పులి, ఆపద వచ్చినపుడు ఉపాయంతో పులి నుండి రక్షించుకున్న వడ్రంగి, వలలో చిక్కుకున్న పావురాలు, ఇద్దరు కొట్లాడితే మూడవవానికి లాభం రెండు పిల్లులు, రొట్టెముక్క కోతి కథ మొదలగునవి పిల్లలు ఆసక్తిగా వింటూ నీతిమంతులు అవుతారు.

ఇదే మాదిరిగా పురాణ కథల్లో వచ్చే ప్రాణులకు పూర్వజన్మ వృత్తాంతాలు కల్పించి చూపడం పురాణాల్లో ఆచారం. ఒక జింక పూర్వజన్మలో ఒక ఋషి అనీ లేదా ఒక నక్క పూర్వజన్మలో ఒక రాజనీ, ఇలా చెప్పడం పురాణాల్లో వాడుక. అప్పుడు జింక జింకగానూ నడుచుకుంటుంది, ఋషి లాగాను మాట్లాడుతుంది. ఇలాంటి వాటివల్ల కథకు కమ్మదనం వస్తుంది. ఎన్నెన్నో గొప్ప గొప్ప సత్యాలు వెల్లడి అవుతాయి. అటువంటిదే ఒక కథ – సారంగ పక్షులు.          

  • సుధామూర్తి

పాండవులు ఖాండవవనం చేరేవరకు అది చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవిగా ఉండింది. మృగాలకు, పక్షులకూ నెలవుగా ఉంది. దొంగలు దోపిడీగాళ్ళు అక్కడ చేరి వచ్చిపోయేవారిని హింసిస్తుండేవారు. అటువంటి కీకారణ్యాన్ని తగులబెట్టి, అక్కడ ఒక చక్కని నగరం కట్టించాలని కృష్ణుడూ, అర్జునుడూ నిశ్చయించారు.

ఆ అరణ్యంలో ఒక చెట్టు మీద రెండు సారంగ పక్షులు గూడు కట్టుకొని నివసిస్తున్నాయి. అందులో ఒకటి మగపక్షి, ఇంకోటి ఆడపక్షి. వాటికి నాలుగు పిల్లలు. ఆ పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు. ఇది అలా ఉండగా మగపక్షి, తన భార్యనూ, పిల్లలనూ విడిచిపెట్టి వేరొక ఆడపక్షితో చేరి ఉల్లాసంగా తిరుగుతూ వచ్చింది. తల్లి పక్షి మటుకు తానే తంటాలు పడుతూ ఆహారం తెచ్చి పిల్లలను పోషిస్తూ ఉంది. సరిగ్గా అదే సమయానికి కృష్ణార్జునులు ఉత్తర్వు ప్రకారం అరణ్యానికి నిప్పు అంటుకుంది. క్షణాల్లో మంటలు నలుదిక్కులా వ్యాపించాయి. అడవి అంతా కాలిపోతున్నది. ఆ మంటలు సారంగపక్షుల చెట్టువైపు వస్తుండెను. అది చూసి తల్లిపక్షి తల్లడిల్లిపోయింది. కన్నీరు జలజల కారుస్తూ వాపోయింది. అడవినంతా భస్మంచేస్తూ మంటలు దగ్గరగా వస్తున్నాయి. ఇంకా కాసేపట్లో ఇక్కడికి చేరుతాయి. మనందరిని మసి చేస్తాయి. చెట్లు ఫెళఫెళ విరిగి పడుతున్న శబ్దం విని అడవి జంతువులు అల్లకల్లోలమై అల్లాడిపోతున్నాయి. నా కూనల్లారా! ఇంకా రెక్కలు, కాళ్ళు రాని మీరు మంటల్లో కాలిపోతారు! మీ నాయన మనల్ని విడిచిపెట్టి పోయాడు! అయ్యో! నేనిప్పుడు ఏం చేసేదిరా దేవుడా! ఈ పిల్లలను మోసుకొని ఎగిరిపోదమన్నా నాకు అంత శక్తి లేదాయె. ఎం చెయ్యను? అని ఇలా ఆడపక్షి అంగలారుస్తూ కూచుంది. తల్లి అవస్థ చూసి పిల్లలు ఇలా చెప్పాయి.

“అమ్మా! మా మీది ప్రేమ వలన నీవేమి అంతగా పరితపించవద్దు. మాకేం ఫరవా లేదు. ఈ నిప్పుల పాలయి మేము ఇక్కడే కాలిపోయినప్పటికి వచ్చే నష్టమేమి ఉండదమ్మా. మేము పుణ్యలోకాలకు పోతాం. మాకోసం నీవు కూడా ప్రాణం పోగొట్టుకుంటే కులం వృద్ధి అయ్యే అవకాశం లేకుండా పోతుంది. నీవు వెంటనే బయలుదేరి ఏదైనా నిప్పులేని చోటుకు పోయి క్షేమంగా ఉండమ్మా. మేమిక్కడ నిప్పుల పాలయినా నీకు మళ్ళీ పిల్లలు కలుగుతారు. నీవు బాగా ఆలోచించి మన కులానికి ఏది బాగో అది చెయ్యి.”

పిల్లలు ఇంతగా చెప్పినా తల్లిపక్షికి వాటిని విడిచిపెట్టి వెళ్లడానికి మనసు రాలేదు. “నా చిన్నారి బిడ్డలారా! మిమ్మల్ని విడిచి వెళ్ళడానికి నాకు కాళ్ళాడటం లేదు. మీతో పాటు నేను కూడా ఈ అగ్నికి ఆహుతి అయిపోతాను” అని చెప్పి అక్కడే తిష్ట వేసుకుని కూచుంది.

మందపాలుడు అనే ఒక ఋషి నియమం తప్పకుండా జీవితమంతా బ్రహ్మచర్యవ్రతం కాపాడుకుంటూ వచ్చి, చివరకు అందరిలాగానే తనువు చాలించి ఊర్ధ్వలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వారపాలకులు అతడ్ని చూసి “పుత్ర సంతానం పొందకుండా వచ్చినవారికి ఇచ్చడ చోటు లేదు, ఫో!” అని చెప్పి అతడ్ని తిప్పి పంపించారు. దానిపై ఆయన ఒక సారంగపక్షిగా పుట్టి ‘జరిత’ అనే ఆడపిట్టను కట్టుకున్నాడు. అది నాలుగు గ్రుడ్లు పెట్టగానే అతడు జరితను వదిలిపెట్టి ‘లపిత’ అనే వేరొక ఆడపిట్టతో స్నేహం చేశాడు.

కొన్నాళ్ళకు జరిత పెట్టిన నాల్గు గ్రుడ్లు పగిలి పిట్టలైనాయి. అవే ముందు చెప్పి అగ్నిప్రమాదం ముంచుకొని వచ్చిన సమయంలో, ఋషికి పుట్టిన పిల్లలమయి నందున మాకు ఏ ప్రమాదం రాదని తల్లికి ఆ విధంగా ధైర్యంగా చెప్పాయి.

తరువాత తల్లి పక్షి పిల్లలకు ఇలా చెప్పింది. “ఈ చెట్టు పక్కనే ఒక ఎలుక రంధ్రం ఉంది. మిమ్ములను దానిలో విడిచిపెడుతాను. అక్కడ అగ్నిభయం లేకుండా క్షేమంగా ఉండవచ్చు. ఆ కన్నానికి పైన మన్ను వేసి మూసేస్తాను. అప్పుడు మంటలు లోపలికి రావు. మంటలు చల్లారి పోగానే మన్ను తీసేసి మిమ్ముల్ని బయటికి తీస్తాను, సరేనా?”

తల్లి చెప్పిన మాటలు పిల్లలు ఒప్పుకోలేదు. ఆ కన్నంలో వుండే ఎలుకలు మమ్ముల చంపి తినేస్తాయి. ఎలుకల నోట్లో పడి చావడం కన్న ఈ మంటల్లో కాలిపోవడమే మేలు.

“ఆ కన్నంలోని ఎలుకను గద్ద తన్నుకపోయింది నేను చూశాను, ఇక అక్కడ మీకు ఏ అపాయం ఉండదు?” అని తల్లిపక్షి మళ్ళీ వాటిని ఒప్పించే ప్రయత్నం చేసింది.

అయినా పక్షిపిల్లలు ఒప్పుకోలేదు “ఒక్క ఎలుకను గ్రద్ద తన్నుకపోతే మాత్రం ఏం! ఇంకా కన్నంలో ఎన్ని ఎలుకలు ఉన్నాయోనమ్మా! కనుక జాగ్రత్త! ముందు నీ ప్రాణం కాపాడుకో. ఇక్కడి నుండి ఎగిరిపో, ఇక్కడికి మంటలు రాకముందే. మాపై భ్రమ పెట్టుకొని నీవు అనవసరంగా ప్రాణాలెందుకు పోగొట్టుకుంటావు? నీవెవరు? మేమెవరం? మేం నీకు ఏం సహాయం చేశాం? ఏమి లేదు, మేమే నీ కడుపున పుట్టి నీకు అష్టకష్టాలు కలిగించాం అమ్మా. అంటే! ఇక మమ్మల్ని వదిలి పెట్టిపో! నీదింకా చిన్నవయసు యవ్వనం తీరి పోలేదు. నీవు నీ భర్తతో కలిసి ఇంకా పదికాలాల పాటు సుఖించవమ్మా! మేము అగ్నిలో పడి చచ్చినా పుణ్యలోకాలకే పోతాం. మా గురించి విచారించకు! ముందు నీ ప్రాణాలు రక్షించుకో. అగ్ని చల్లారింతర్వాత ఒకవేళ మేం బ్రతికి ఉంటే మమ్ములను చూడవచ్చు” అని అవి తొందర పెట్టేవరకు, మరి లాభం లేదని తల్లి పక్షి తుర్రున ఎగిరిపోయింది.

అగ్నిజ్వాలలు వచ్చి చెట్టు చుట్టుముట్టాయి. పక్షి పిల్లలు ఏమాత్రం భయపడలేదు. చావుకు ఎదిరిచూస్తూ నిశ్చింతగా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి.

తెలిసినటువంటి వాళ్ళు ఆపదలు రానున్నపుడు ముందే తెలుసుకుంటారు, మరియు మనస్సు స్థిరపరుచుకొని ఉంటారు. అంతేకాని తీరా ఆపద ముంచుకొచ్చి నపుడు ఆందోళన చెందరు. ఆరాట పడరు! అంది, పక్షుల్లో పెద్దది.

“నీవెలాగయినా ధీరుడవు, మేధావివి. నీలా ధైర్యంగా ఉండే వాళ్ళు లోకంలో నూటికో కోటికో ఒకరుంటారు!” అన్నాయి తక్కిన పిల్లలు.

అగ్నిజ్వాలలు వచ్చి చెట్టు చుట్టుముట్టాయి. పక్షి పిల్లలన్నీ కలిసి నవ్వు ముఖాలతో అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేశాయి. “ఓ అగ్ని దేవుడా! మా తల్లి మమ్ము విడిచిపోయింది. మా తండ్రి ఎవరో మేం ఎరుగం. గ్రుడ్ల నుంచి బయట పడింతరువాత ఇంతవరకు ఆయన్ను చూడలేదు. ఓ ఆదిదేవుడా! మేమింకా రెక్కలు రాని పిల్లలం. ఇక మాకు నీవే గతి. మాకు వేరే ఆప్తులు లేరు. నిన్నే శరణు జొచ్చాం. మమ్మల్ని రక్షించు తండ్రీ!!” అంటూ వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణ బ్రహ్మచారుల్లాగా స్తోత్రం చేశాయి. దీనంగా ప్రార్థించాయి.

అప్పుడు చెట్టును చుట్టిన అగ్నిహోత్రుడు ఆ పక్షిపిల్లలను అంటలేదు. కార్చిచ్చు కారడవినంతా కాల్చి పారేసి చల్లారిపోయింది. ఆ పిల్లలు మాత్రం చావలేదు!

అగ్ని యావత్తు చల్లారిపోయింతరువాత తల్లిపక్షి వచ్చింది . తన పిల్లలు క్షేమంగా ఉండి మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యపడింది. అక్కడ తండ్రి పక్షి తన కొత్త ప్రియురాలితో “అయ్యో! నా పిల్లలు ఏమయిపోయారో కదా! అగ్నికి ఆహుతి అయిపోయారేమో!” అని కుమిలి కుమిలి దుఃఖించడం మొదలుపెట్టింది. అందుకు లపిత వెంటనే “అలాగా! నీ సమాచారం నాకు పూర్తిగా తెలిసింది. ఇప్పుడు నీకు జరిత మీదికి మనస్సు పోయినట్లుంది. నాపైన వెగటు పుట్టినట్లుంది. అందుకే అగ్నిప్రమాదమనీ, పిల్లలనీ చెప్పి, లేనిపోని వంకబెట్టి అబద్దాలాడుతున్నావు. ఎందుకీ అబద్ధాలు? నీవు ముందే చెప్పావుగా? జరిత పిల్లలను అగ్ని దహించదనీ, అగ్నిదేవుడు నీకు వరం ఇచ్చాడనీ. నీవు ఒకసారి నాతో చెప్పలేదూ? నన్ను విడిచిపెట్టి నీకు ప్రాణప్రియురాలైన జరిత వద్దకు వెళ్ళాలని నీకు ఉంటే ఆ సంగతి చెప్పి నిర్భయంగా వెళ్ళవచ్చుగా! ఎందుకీ లేనిపోని అబద్ధాలు? నమ్మకూడని మగవాళ్ళను నమ్మి మోసపోయిన ఆడవారిలో నేనూ ఒకతినయి ఆడవులు పట్టి, నా దారిన నేను పోతాను. నీవు మహారాజుగా పోవచ్చు” అని ఏడుస్తూ చెప్పింది.

 “నీ ఊహ సరికానే కాదు” అని వెంటనే అందుకుంది మందపాల పక్షి. “అసలు సంగతి విను. నేను పుత్ర సంతానం కోసమే, ఈ పక్షి జన్మ ఎత్తాను. నా బెంగంతా పిల్లల గురించే, వెళ్ళి చూసివస్తాను” అని ఎలాగైతేనేం, ఆ కొత్త ప్రియురాలిని సమాధానపరిచి తన భార్య జరిత ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు, మందపాలుడు.

జరిత తన భర్త వచ్చిన సంగతి గమనించనే లేదు. పిల్లలు గండం తప్పించుకొని బయట పడ్డారన్న ఆనందంలో ఇంకా అలాగానే మునిగి ఉంది. కాసేపటికి తిరిగి చూసింది. భర్త కనిపించాడు. ఏం? ఎందుకు వచ్చారు? అని అలక్ష్యంగా పలకరించింది.

“నా నాయినలు సుఖంగా వున్నారు కదా! ఇందులో ఎవరు పెద్దవాడు?” అంటూ ఆప్యాయంగా పక్కన వచ్చి నిలుచున్నాడు మందపాలుడు.

“ఎవరు పెద్దవారైతేనేమి? ఎవరు తరువాత వాడైతేనేం? ఏ తోడూ లేకుండా నన్ను వదిలేసి, ఎవతి కోసమైతే వెళ్ళారో దాని దగ్గరికే పోయి దానితోనే ఉండండి! వెళ్లండి” అని జరిత, కోపంగా భర్తను కసిరింది.

పిల్లలు పుట్టింతరువాత ఏ స్త్రీ అయినా పురుషుణ్ణి లెక్కపెట్టుడు. ఇది లోకంలో ఉన్నతీరే. ఏ పాపం ఎరుగని వసిష్ఠుణ్ణి కూడా అరుంధతి ఇలాగే అవమాన పరిచింది అన్నాడు, మగ పక్షి రూపంలో ఉన్న మందపాలుడు.

XXXXXX XXXX

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణకలనం – 8

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి June 14, 2022
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

ఆధారములు
^^^^^^^^^^^^

  1. లయవిన్యాసంలో ధిమి కి తోడు (2)
  2. నైజాం పాలనలో పెత్తనం చేసిన వారు (3)
  3. … టి బ్రతుకు నాటకం చాల (2)
  4. గాలి (4)
  5. ఇది కుట్టిందంటే కందిపోవటమే (4)
  6. పర్వతం చిమ్మే ఉష్ణద్రవం (2)
  7. ఆమనిని గుర్తు చేసే నాదవిహంగం (2)
  8. తిండికి సత్రం పంటకు … (2)
  9. భేదాలలో మొదటిది (2)
  10. చిన్నతనంతో మెరిసేది (3)
  11. ఉత్తీర్ణత కోరి వ్రాసేది (3)
  12. సాకు వాగు (2)
  13. ఆటకు ధ్వనుల వరుసల పాట (2)
  14. చెట్టు (2)
  15. ఏరు వైపు (2)
  16. అగ్ని వాంతి (2)
  17. వ్యాపారి లెక్కించే మొదటి అంకె (2)
  18. అసమాన (3)
  19. లాలించే తల్లి (3)
  20. కష్టం పడుట (2)
  21. వైయస్సార్ జిల్లా (3)
  22. ఉదారంగా పంచిపెట్టటం (3)
  23. వక్క రాకతోడు (2)
  24. కత్తి వైపు (2)
  25. కోటిలో నూటికి ఒకటి (2)
  26. చల్లని కిరణమాలి (4)
  27. నాయుడు కు ఎంకి (4)
  28. నిజం పోలిక (2)
  29. పాంచాలి (3)
  30. ద్రవ్యం (2)

నిలువు
**

  1. పిమ్మట (4)
  2. జంట (2)
  3. కంటిలో ఎఱ్ఱ గీత (2)
  4. వాద్యం నీది కాదు (2)
  5. ….. …. నడుమ మురారీ (4)
  6. …. ? నిజమా ? (2)
  7. బాస రూపు (2)
  8. నెమలి కిది నలుపు (2)
  9. ముళ్ళమండ (2)
  10. పొలంలో దున్నే చోటు (2)
  11. ధ్వని (2)
  12. కొప్పు (2)
  13. సతితో మరోసగం (2)
  14. అశాశ్వతం (5)
  15. నాగమాత (3)
  16. సైన్యం చేసే సాధన (3)
  17. జత (3)
  18. కంటి నొప్పులు (4)
  19. కుడివైపు దక్షిణం (4)
  20. ఆ వైపు (2)
  21. తాపసి చేసేది (2)
  22. వంటనష్టం (4)
  23. అర్జునశంఖం (4)
  24. వస్తే రానీ, పోతే …… (2)
  25. సరస్వతి మాట (2)
  26. ఓర్పు గల భూమి (2)
  27. వెలితి (2)
  28. ప్రక్క వైపు చోటు (2)
  29. గగనంలో పెద్ద దీపం (2)
June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us