మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

పోలీసు కస్టడీలో గణనాధుడు

by Madhavapeddi Usha August 15, 2022
written by Madhavapeddi Usha

అదేంటీ పోలీసు కస్టడీలో వినాయకుడా………??? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఇది కలా నిజమా లేక నేనేమైనా జోకు జోకాననుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే! ఇదస్సలు జోకు కాదు, వైష్ణవ మాయా కాదు.ఇది అక్షరాలా నూటికి నూరుపాళ్ళు నిజం. నమ్మలేరా…..?
అయితే మనస్సు ఉగ్గపట్టుకుని , నిర్భయంగా ముందుకు సాగి పొండి. చదవండి చివరిదాక!!!
అసలయినా ప్రపంచమంతా ఈ మాయదారి కరోనా…చాపక్రింద నీరులా ప్రాకి , యావత్ ప్రపంచాన్నీ ఓ కుదుపు కుదిపేస్తుంటే, కాలచక్రం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఫలితంగా రావలసిన పండగలన్నీ వస్తున్నాయి పోతున్నాయి. మనం అనుకుంటున్నట్లుగానే ఈ సారి వినాయక చవితి కూడ వచ్చేసింది.
ఇక చూసుకోండి నా సామిరంగా, దేశంలో అందరిలోనూ ఒకటే కలకలం……ఈ సందర్భంలో వినాయకుడి విగ్రహాలు తయారు చేసేసి , పెద్ద ఎత్తున ఆర్భాటంగా పండగ చేసుకోవాలా వద్దా అన్న మీమాంస అందరిలోనూ తలెత్తింది.
ప్రభుత్వాలు మాత్రం, ఈ కరోనా కారణంగా , మునుపటిలాగా పండుగ ఉత్సవాలుగా చేయవద్దనీ, ఎక్కడైనా సరే జనం గుంపులు గుంపులుగా పోగయే వ్యవహారాలేవీ పెట్టుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. అందరూ పూజలు ఇంటివరకే పరిమితం చేయాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
కానీ మన ఈ పామర జనం ఊరుకుంటారా? అసలు ఎవరి మాటైనా వినే అలవాటు మన ప్రజలకు ఉంటే , మన దేశం ఇలా ఎందుకుంటుంది? ఎప్పుడో బాగు పడి ఉండేది కదా!!!
అది సరే ముందు విషయం చెప్పండి……ఉపోద్ఘాతాలు వద్దు అంటారా…..? అదే అక్కడికే వస్తున్నా…….కాస్త ఓపిక పట్టండి మరి….!
అనగనగా ఒక మహానగరంలోని ఒకానొక గేటెడ్ కమ్యూనిటీ అయిన సొసైటీ. అందులో యదార్థంగా జరిగిన కథ ఇది. ఇంకా ఈ జాగేలనో అని మీలో మీరు హమ్ చేస్తున్నారా? ఇదిగో చెప్తున్నా…..చెప్పేస్తున్నా……కాచుకోండి! ఆ సొసైటీలో రీసెంట్గా మ్యానేజింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయండీ!
అందులో గెలిచిన వాళ్ళకు , ఉన్నమాట చెప్పొద్దూ…..ఈ సొసైటీని పరిపాలించడంలో అస్సలు అనుభవం లేదంటే నమ్మండీ! ఆ గెలుపుకూడ చాలా కుట్రలు పన్ని సంపాదించిందే కానీ, న్యాయబద్ధమైన గెలుపు కాదు.
విపక్షాలను దెబ్బకొట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న దురుద్దేశంతో చేసిందే కానీ మరోటి కాదు. ఆ సంగతి అలా ప్రక్కన పెట్టి మనం అసలు కథకి వద్దాము.
ఈ గెలిచిన కమిటీ అధికారంలోకి వచ్చి రెండు నెలలుకూడకాలేదు వినాయక చవితి రానే వచ్చింది. ఇక చూసుకోండీ వీళ్ళ ఉత్సాహానికి అంతులేదు. ఓ ప్రక్క పూర్వంలానే వినాయకుడ్ని ప్రతిష్ఠించాలి….అంటూ ఈ పాత మేనేజ్మెంట్ పుణ్యమా అని రెండేళ్ళనుంచీ ఒక పండగాలేదు….పబ్బమూ లేదు….ఎందుకని అడిగితే ఈ కరోనా ఉన్నంతవరకూ, ఈ పండుగలూ, గిండుగలూ జాన్తా నై అని చెప్తారా…..ఇప్పుడు చూడండి మా తఢాకా …….అని కొత్త కమిటీ వాళ్ళందరూ ఒకటై సొసైటీలో ఉన్న రెసిడెంట్స్ ఎవరినీ సంప్రదించకుండానే వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసేసుకుని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయసాగారు.
ఇదంతా గమనిస్తున్న ఫ్లాట్ ఓనర్స్ మండిపడి ఎవరిని అడిగి చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ అని కమిటీ వాళ్ళని నిలదీసారు! అసలే కరోనా భయంతో ఓప్రక్క వణికి చస్తుంటే మళ్ళీ ఇదో ఆపద తెచ్చి పెట్టారేంటని ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. కానీ మొండివాడు రాజుకన్నా బలవంతుడన్నట్లు , వీళ్ళు ఇలా గర్జిస్తునే ఉన్నారు…..కమిటీ మాత్రం మేం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం, కంగారు పడకండి అంటూ, గణేసుని కూడ తెచ్చి ప్రతిష్ఠించేసారు. ఇదంతా గమనిస్తున్న ప్రతి పక్షాలు గట్టిగా హెచ్చరించాయి. ఏమైనా జరగకూడనిది జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అల్టిమేటమ్ ఇచ్చారు.
దాంతో భయపడ్డ ఈ కొత్త కమిటీ వాళ్ళు వినాయకుడి దగ్గరకు ఎవరూ వెళ్ళకుండా బ్యారికేడ్స్ కట్టేసి, పిల్లలెవరూకూడ దగ్గరకు వెళ్ళకుండా ఇద్దరు సిక్యూరిటీ వాళ్ళని కాపలా ఉంచి, ఎవరూ అక్కడ గుమి గూడకుండా చూస్తూ ఉండమని ఆదేశాలు జారీ చేసారు. అది కాక ఉదయం సాయంత్రం యధావిధిగా పూజ కావించి , పూజారి వెళ్ళి పోవడానికి కుదుర్చుకున్నారు. అంతే కాదు పోలీస్ పెట్రోలింగ్ కూడ అరేంజ్ చేసారు.
ఇంతకీ మన గణనాధుడు మాత్రం, భక్తులులేక గిజ గిజలాడుతున్నట్లుగా అనిపించింది.భక్తులతో కళకళలాడే మంటపాలలో ప్రతిష్ఠించబడి , రోజూ నైవేద్యాలూ ప్రసాదాలతో , మరెన్నో సాంస్కృతిక కార్యకలాపాలతో అందరినీ అలరించాల్సిన గణపతి బిక్కు బిక్కుమంటూ గడపసాగాడు పోలీసు కస్టడీలో…….! అది చూసిన ఫ్లాట్స్లో నివసించే జనాలకు చాలా బాధ, జాలీ రెండు కలిగాయి.ఇక ఆ వినాయకుడ్ని దేవుడే కాపాడుగాక అనుకుని చేసేదేమీలేక పాపం గణేశుడు అని మనస్సులో అనుకుంటూ మౌనంగా ఉండి పోయారు.అయినా దేవతలకే తప్పటంలేదు కష్టాలు మరి మానవమాత్రులమైన మనమెంత అని అనిపించడం లేదూ ఈ కథ చదివాక!!!

అంకితం
————-
అన్ని విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడికి ఈ చిట్టి కథ అంకితం.

మాధవ పెద్ది ఉష

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మంగళ గౌరీ వ్రతం – సుమంగళకరం

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) August 15, 2022
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

శ్రావణమాసం అంటేనే పండుగలకు నోములకు వ్రతాలకు అనువైన మాసంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రావణం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. ఈ నక్షత్రం నుంచి ఈ మాసానికి ఆ పేరు వచ్చినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నక్షత్రం శ్రీమహావిష్ణువుకు కూడా ప్రీతికరమైనట. ఈ మాసములో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి దేవి వ్రతాన్ని చేసుకుంటారు నిచ్చలమైన భక్తితో మహాలక్ష్మితో పాటు సమంగా శివశక్తిని సైతం ఆరాధిస్తారు
ఈ మాసములోనే మంగళ గౌరీని కూడా ఎంతో భక్తి భావనతో పూజిస్తారు మహిళలు.

        శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైనది. శ్రావణంలో వచ్చే మంగళవారాల్లో కొత్తగా పెళ్ళయిన యువతులు మంగళవారం నాడు "మంగళగౌరీ" వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చేయాలి. వరుసగా ఐదు సంవత్సరాలు చేయలేక ఏదైనా ఇబ్బంది. వచ్చినా మరో సంవత్సరం చేయవచ్చు. అయితే ఐదు సంవత్సరాల ఈ వ్రతాన్ని తప్పకుండా పూర్తి చేయాలి... మంగళగౌరీవ్రతం ఎంతో మహిమాన్వితమైంది.

పూర్వం శౌనకాది మహర్షులకు సూతమహర్షి మంగళగౌరీ వ్రతాన్ని, ఆ మహత్యాన్ని తెలియజేసినట్లుగా పురాణాలు వివరించాయి. నారదులవారు మంగళగౌరీ దేవి మహత్యాన్ని సావిత్రీ దేవికి తెలియచేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మంగళ గౌరీ నోమును గురించి ద్రౌపదికి బోధించాడు. ఇవన్నీ పురాణాల ద్వారా తెలిసిన విషయాలు.

పరాశక్తి అయిన మంగళగౌరీ వ్రతాన్ని ఆచ రించి, ఆమెను భక్తితో పూజించినట్లయితే ఆ దేవి అను గ్రహం ఆ స్త్రీకి లభించి ఆమె సౌభాగ్యం కలకాలం. నిలుస్తుంది. వారికి వైధవ్యం ఉండదు. మంగళగౌరీదేవి. పసుపు, కుంకుమ, గంధం. పరి మళభరితమైన మంగళ ద్రవ్యాలలోనూ, పూలలోనూ కొలువై ఉంటుంది. మంగళ గౌరీని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మంగళగౌరీని పూజించిన కుజుడు మంగళవారానికిఅధిపతి అయ్యాడు. త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరిం చబోయే ముందు ఈశ్వరుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయాన్ని పొందాడు. మనువంశపు రాజైన మందుడు గౌరీ దేవి వ్రత ప్రభావం వలన చాలా కాలం భూలోకంలో సిరిసంపదలతో సుఖసంతోషాలతో రాజ్యపాలన చేసాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి మంగళగౌరీ దేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకున్న సుశీల కథను తెలియజేశాడు.

పూర్వం మహిష్మతీ నగరాన్ని జయపాల్ రెడ్డి అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్కో సంతానం కలగలేదు మహారాణి ఎన్ని మొక్కలు మొక్కిన, ఎన్ని పూజలు చేసినప్పటికీ ఫలితం లభించలేదు. ఆ రాజదంపతులకు సంతానం కలుగలేదు. పరమేశ్వరుడు ఒక సాధువు రూపంలో మహిష్మతీ నగరానికి వచ్చి జయపాలుని అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి ‘భవతీ భిక్షాం ‘దేహి’ అని శంఖాన్ని పూరించాడు. ఆ మాటలు, శంఖా నాదం విన్న మహారాణి స్వయంగా భిక్ష వెయ్యాలని ద్వారం వద్దకు వచ్చి చూస్తే ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆ సన్యాసి రావడం, ఆమె లోపల నుంచి వచ్చేలోపు భిక్షను స్వీకరించకుండా వెళ్ళి పోవడం జరిగింది. ఈ విధంగా పలుమార్లు జరగటంతో ఆ విషయాన్ని భర్తకు తెలియజేసింది మహారాణి. అప్పుడు జయపాలుడు “ఆ సన్యాసి మన ద్వారం చేరుకోవటానికి ముందుగానే నువ్వు ఆ ద్వారం వద్ద ఆ మహాత్మునికి భిక్ష వేయటానికి సిద్ధంగా ఉంటే ఆయన ఎదురుచూడవలసిన అవసరం లేకుండా నీ భిక్షను స్వీకరిస్తాడు” అని చెప్పాడు. మరునాడు సన్యాసి రావటానికి ముందుగానే ఆయనకు భిక్ష ఇవ్వటానికి కావలసిన సరంజామాతో మహారాణి ద్వారం ముందు నిలబడింది.
ప్రతి రోజూలాగానే ఆ సన్యాసి శంఖం ఊది “భవతీ భిక్షాందేహి” అన్నాడు. వెంటనే మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయటానికి సిద్ధపడింది. కానీ సన్యాసి ఆమె భిక్షను స్వీకరించకపోగా సంతానం లేని నీ చేతి భిక్షను నేను తీసుకోను” అని వెళ్ళిపోతుండగా “స్వామీ! మాకు సంతానం లేని మాట నిజమే. తమరు దయతో మాకు సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి మహాను భావా” అంటూ రెండు చేతులూ జోడించి ప్రార్థించింది. సాధువు రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడు “నీ
భర్త నీలి వర్ణపు వస్త్రాలను ధరించి నీలి రంగు అశ్వాన్నిఅధిరోహించి నగరానికి తూర్పు దిశగా వెళ్ళమని చెప్పు: అక్కడ అశ్వం అలసటతో ఎక్కడ ఆగి పోతుందో అక్కడ తవ్వమని చెప్పు. అప్పుడు అక్కడ ఒక స్వర్ణదేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో చిత్తము ద్ధితో శుచిగా పూజిస్తే ఆమె మీరు సంతానాన్ని ప్రసాది స్తుంది” అని చెప్పి ఆ సన్యాసి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు.

రాణి ద్వారా విన్న విషయాలను ఆచరించ. టానికి మహారాజు నీలి వస్త్రాలను ధరించి నీలి అశ్వం మీద అరణ్యానికి చేరుకున్నాడు. ఎక్కడైతే అశ్వం అల సటతో ముందుకు కదలకుండా ఆగిపోయిందో అక్కడ తవ్వించగా స్వర్ణమందిరం కనిపించింది.
ఆ ఆలయంలోని అమ్మవారిని నియమనిష్ఠలతో పూజించాడు జయపాలమహారాజు. ఆమెను ఎంతగానో స్తుతించాడు. అతని భక్తికి ప్రసన్నురాలైన ఆ తల్లి ఆ రాజుకు దర్శనమిచ్చి నీకు సిరిసంపదలను ప్రసాదిస్తానని చెప్పింది.

“తల్లీ నాకు ధనము కావాలన్న ఆశలేదు.. సంతానం లేని నాకు దయతో సంతానం కలిగే భాగ్యాన్ని
ప్రసాదించండి” అని కోరాడు. “నీకు వైధవ్యం కలిగి ఎక్కువ కాలం జీవించేపుత్రిక కావలెనా, అల్పాయుష్కుడై, సన్మార్గుడైన పుత్రుడు కావలెనా కోరుకో’ అని చెప్పింది ఆ అమ్మవారు.
పితృదేవతలను ఉద్దరించేందుకు సజ్జనుడైన పుత్రుడు కావాలని కోరుకున్నాడు జయపాలుడు.

“నీ కోరిక నెరవేరుతుంది. నా పార్శ్వమున
ఉన్న గణపతి నాభియందు అడుగు ఉంచి ఆ కనిపించే చూత వృక్షం నుంచి ఫలాన్ని కోసి, దాన్ని నీ భార్యకుఇవ్వు” అని చెప్పి అమ్మవారు అదృశ్యమైపోయింది. జయపాలుడు అమ్మవారు చెప్పినట్లుగా ఒక్క ఫలాన్ని మాత్రమే కోయకుండా చేతికి అందిన పండ్లన్నీ తెంపేసరికి. గణపతికి ఆగ్రహం కలిగింది. “నీకు జన్మించే పుత్రుడు అల్పాయుష్కుడు. అతను పదహారవ ఏట సర్పకాటుతో “మరణిస్తాడు” అని శపించాడు.
జయపాలుని భార్య ఒక కుమారునికి జన్మ నిచ్చింది. అతనికి పెళ్ళి జరిపిస్తే కుమారుని ఆయుర్దాయం పెరుగుతుందేమో అన్న ఆశతో, ఆ నమ్మకంతో మహారాణి తమ కుమారునికి వివాహం చేద్దామని భర్తతో చెప్పింది. తన పుత్రుడైన శివుడిని మేనమామతో కాశీకి పంపించాడు జయ పాలుడు

ఆ స్వామిని దర్శించిన తర్వాత పుత్రుని కళ్యాణం జరిపిద్దామని భార్యతో చెప్పాడు మహారాజు..

శివుడు, మేనమామ ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ ఒక సత్రంలో వారు బస చేశారు. సత్రం బయట కొంతమంది. కన్యలు కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటున్నారు. ఇంతలో ఒక కన్య మరొక కన్యతో గొడవపడింది. ఆ కన్య సుశీలను దుర్భాషలాడుతూ “ముండ రండ” అని నిందించింది.
అప్పుడు సుశీల రోషంతో “మా ఇంట్లో ముండలు, రండలు ఉండరు. నా తల్లి శ్రావణమంగళగౌరీ వ్రతం చేస్తుంది. ఆ మంగళగౌరీదేవి కృప మాకందరకూ కలుగుతుంది” అని చెప్పింది. శివుని మేనమామ ఆ మాటలు విన్నాడు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి తెలిసిన ఆయన మనసులో ఒక ఆలోచన ప్రవేశించింది. తన మేనల్లుడితో సుశీల వివాహం జరిపిస్తే మంగళగౌరీ అమ్మవారి దయ వల్ల తన మేనల్లుడు.
పూర్ణాయుష్కుడవుతాడు” అన్న నమ్మకం కలిగింది.
సుశీల తండ్రి శివాలయంలో పూజలో ఉన్నాడని.. తెలుసుకుని ఆలయానికి వెళ్ళి సుశీల తండ్రికి కనిపించ కుండా రహస్యంగా ఆలయం వెనుక దాగి ఉన్నారు. శివుడి మేనమామ
“ఈశ్వరా నా కూతురుకి పెళ్ళి చేయాలను కుంటున్నాను. తగిన వరుడు లభించేలా దీవించు దేవా అని ప్రార్ధించాడు.

“భక్తా శివుని పేరు గల యువకుడు నీ.. కుమార్తెకు వరుడవుతాడు. అతను కాశీ పట్టణానికి వెళ్తూ సత్రంలో బస చేశాడు. నీ కుమార్తెకు అతనితో కళ్యాణం జరిపించు. అంతా మంచే జరుగుతుంది” అని చెప్పారు. శివుని మేనమామ.
ఆ మాటలకు మహదానందం చెందాడు. సుశీల తండ్రి. అతని అన్వేషణలో సత్రంలో ఉన్న శివుడు అతనికి కనిపించాడు. అతనితో తన పుత్రిక వివాహం జరిపించాడు. సుశీల తండ్రి పెళ్ళయిన ఆ దంపతులు ఆ రాత్రి బ్రహ్మ చర్య ప్రతాన్ని పాటించగా మంగళగౌరీ దేవి సుశీలకు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ భర్త అల్పాయుష్కుడు ఈ రోజుతో అతని జీవితకాలం ముగిసిపోతుంది. నీ భర్తను కాటు వేయడానికి ఒక సర్పం రాబోతోంది. నీ భర్త మరణించకుండా నీ సౌభాగ్యం నిలవటానికి నేను నీకొక ఉపాయం చెప్తాను. నువ్వు కుండ నిండా పాలు పోసి, ఉంచు. నీ భర్త ప్రాణాలు హరించటానికి వచ్చే కృష్ణసర్వం ఎదురుగా ఆ కుండను ఉంచు. అప్పుడా సర్పం పాలును తాగటానికి కుండలోకి ప్రవేశిస్తుంది. వెంటనే నువ్వు ఒక వస్త్రంతో కుండ మూతను గట్టిగా కట్టేసి, ఉదయం ఆ కుండను నీ తల్లికి వాయనంగా ఇవ్వు నీకు సౌభాగ్యం తొలగిపోదు” అని చెప్పింది.
వెంటనే మెలకువ వచ్చిన సుశీల ఆ అమ్మవారు చెప్పినట్లుగానే ఒక కుండలో పాలను నింపి ఒక నూతన వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది. కృష్ణసర్పం వచ్చి పాలను చూసి త్రాగటానికి కుండలోకి వెళ్ళింది. సుశీల వెంటనే నూతన వస్త్రంతో కుండ మూతను గట్టిగా కట్టేసింది. శివుడు నిద్రలేవగానే మేనమామతో కలసి కాశీకి వెళ్లిపోయాడు. చెప్పినట్లుగా తన తల్లికి ఆ ఘటాన్ని వాయనం ఇవ్వగా వస్త్రాన్ని తొలగించి మూతను తీసి చూస్తే సర్పానికి బదులుగా ఒక ముత్యాల హారం కనిపించింది. ఆ మంగళగౌరీకి మనసులోనే నమస్క రించింది సుశీల. తన భర్త తనతో చెప్పకుండా వెళ్ళి పోయినప్పటికీ ఎప్పటికైనా తిరిగి వస్తాడని నమ్మింది. ఈలోగా పరమేశ్వరుడు సుశీల పాతివ్రత్యాన్ని పరీక్షింపకోరి శివుని వేషంతో వారింటికి వస్తే అతను తన భర్త కాడని అతని చెంతకు వెళ్ళనని వ్యతిరేకించింది సుశీల ఆ మాయా శివుడు అంతర్ధానమయ్యాడు. తన భర్త తిరిగి వస్తాడన్న దృఢనమ్మకంతో ఒక సత్రాన్ని కట్టించమని తండ్రిని కోరింది సుశీల.

సత్రంలో వచ్చిన వారందరినీ నిశితంగా పరిశీ లిస్తూ అతిథి సత్కారాలు చేయసాగింది సుశీల. తన తీర్థ యాత్ర పూర్తి చేసుకుని మేనమామతో కలసి ప్రతిష్టానపురం చేరుకున్న శివుడు సత్రంలో బస చేశాడు. శివుడిని గుర్తిం చిన సుశీల అతడే తన పతి అని తల్లితండ్రులకు చెప్పింది. శివుడు ఆమెను తన భార్యగా స్వీకరించాడు. అల్పా యుష్కుడై తన ఆయుష్షు పెరగటానికి కారణమేమిటని సుశీలను ప్రశ్నించాడు శివుడు.

సుశీల చిరునవ్వుతో ఇదంతా ఆ మంగళగౌరీదేవి అనుగ్రహం అని చెప్పింది. ఆ నూతన దంపతులిద్దరూ సుఖసంతోషాలతో సిరిసంపదలతో ప్రేమానురాగాలతో జీవితాన్ని గడిపారు. శ్రీకృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. అప్పటి నుంచీ స్త్రీలు అందరూ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించసాగారు.

‘వాజ్ఞ్మయ భూషణ’ -“కావ్యసుధ “
9247313488 : హైదరాబాద్.

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అల్లనేరేడు !!

by Ananthaacharaya K.S. June 24, 2022
written by Ananthaacharaya K.S.

కూసే పిట్ట వాలే చెట్టు
పొదల్లో గెంతే కుందేళ్లు
పిట్టలు కట్టిన గూళ్ళు
పారే నదిమీద వాలే
కొంగలు
ఇవన్నీ ఇప్పుడు స్క్రీన్ మీది
బొమ్మల సింగారమే
నిజ రూప దర్శనం కరవైన బంగారమే!

కౌసు పిట్టలు కాగితాల్లో మిగిలిన కారికేచర్స్
కోయిల అమెజాన్ లో అమ్మకానికి కూసే కూలి !

వెదురు గొంతులు బొంగురు పోయి కురచనయిన మాటలు
కీ బోర్డులో e రాత. !
మౌస్ రాక్షసి నోట చేతి రాత!

బయోడైవర్సిటీలో నడక తప్పిన గుడ్డి ఎద్దు !ఎడారి మీద పచ్చ గడ్డి మైదానపు మరీచిక!

స్వరం తప్పిన
పచ్చని జావళీలు…. ప్లాస్టిక్ హంగుతో
పాప్ మ్యూజిక్

గాలికీ ఓ లెక్కుంది
కరెన్సీ ని పీలుస్తుంది
ఊపిరితిత్తుల వ్యాపారానికి
ప్రాణవాయువే పెట్టుబడి

ప్లాస్టిక్ కవర్ల
గుట్టలు తవ్వకుండా దొరికే
కాలాంతర గుప్తులు!

కాలాలు మారినా వర్షాలు ముఖం చాటేసిన
విప్పుకొనే మల్లె
మనసు మాలిన్యాన్ని
కడుగుతుoది

అల్ల నేరేడుయే
ఆకలికి
నైవైద్యమవుతుంది

పచ్చని మొక్కయే
కాలుష్యం మీద
పచ్చ బొట్టయి మెరుస్తుంది !!

June 24, 2022 0 comment
3 FacebookTwitterPinterestEmail
కథలు

‘బెల్లం ఆవకాయ తెచ్చిన తంటా’

by Madhavapeddi Usha June 21, 2022
written by Madhavapeddi Usha

ఈ రోజు నేను ఆవకాయ గురించి వ్రాయబోతున్నాను. ఆవకాయ అంటే ఇష్టపడని తెలుగువారు ఉంటారా అసలు? ఆ మిథునం సినిమా పాట ఎంతో సమయోచితంగాను, తెలుగువారికి ఓ కితాబు ఇచ్చినట్లే ఉంటుంది. ఆ పాట విన్నప్పట్నుంచి మనందరికీ ఆవకాయమీద ప్రేమాభిమానాలు పొంగి పొర్లాయంటే ఒప్పుకుంటారా? అసలైనా తినబోతూ రుచిలెందుకు లెండి! నేను ఇప్పుడు రాయబోయే మా ఇంట్లో ప్రతి ఏడాది జరిగే ఆవకాయ ప్రహసనం చదివారంటే, మన భానుమతి అత్తగారి కథలు బలాదూర్ అనుకొని నాకు కూడా ఒక స్పెషల్ బిరుదు ఇచ్చేస్తారు తెలుసా!

సరే, అసలు విషయానికి వద్దాం. పోయిన సమ్మర్ లో మాకూ కరోనా రావడంవల్ల నేను ఊరగాయలు ఓ మాదిరిగ పెట్టాను. ఇంతకీ మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేటంటే మాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఒకళ్ళు U.S అయితే ఇంకొకరు ఎవరూ అంతగా పట్టించుకోని కానీ world అంతా మెచ్చుకొనే బుల్లి దేశం ఉందే…. అదే న్యూజిలాండ్ అండీ…. పోయి పోయి అక్కడ సెటిలైంది. పైగా అక్కడ వాతావరణం సీనిక్ బ్యూటి అంతా నాకు నచ్చాయి పో. (అంటే మా అల్లుడుగారికి కూడా లెండి) అని ఒక్క అక్షరంలో తేల్చిపారేసింది. ఇంకా ముఖ్యమైన కారణం అక్కడ  ఇండియాలో లాగా దోమలుండవట (మా అమ్మాయికి దోమల ఎలర్జీ ఉంది లెండి). అందుకని అక్కడకి వెళ్ళాక అది సుఖసంతోషాలతో వర్థిల్లుతోంది. మనకి, అంటే తల్లిదండ్రులకి కూడా కావల్సిందదేగదండి!

ఇకపోతే అప్పట్నుంచి నేను ప్రతి ఏడాది కిలోలకి కిలోలు ఊరగాయలు ఇటు అటు ఎడాపెడా పెట్టేసి, వాళ్ళకి కొరియర్లో పంపించటం అలవాటైపోయింది. (మా వాళ్ళకి, అల్లుళ్లకీ, మనవళ్లకి ఆవకాయన్నా, దానితోపాటొచ్చే రకరకాల పచ్చళ్ళన్నీ కూడా చాలా ఇష్టమండీ). పంపించాక వాళ్లకి అందడం పెద్ద process  అన్నమాట.

కానీ U.S.వాళ్లు ఏవన్నా అనండి, చాలా మంచివాళ్ళు కరెక్టుగా మూడు, నాల్గు రోజులలో చేరిపోతాయి. కానీ ఈ న్యూజిలాండ్ కస్టమ్స్ వాళ్ళేమో పరమ దుర్మార్గులండీ! మన పికిల్స్ చేరడం చేరతాయి. కాని వాళ్ళ చేతుల్లో పడ్డాయంటే చాలు. ఇక మనం రామనామ జపం చేయాల్సిందే లేక ఆ క్షణ క్షణంలో సినిమాలో లాగా ‘దేవుడా! దేవుడా!’ అంటూ కూర్చోవాల్సిందే. మొన్నైతే మేము న్యూజిలాండ్ కు పికిల్స్ పంపినపుడు ఓ వారం రోజుల ఎదురు చూపుల అనంతరం మా అమ్మాయి దగ్గరనుండి ఒక ఫన్నీ మెసేజ్ వచ్చింది. అదేంటంటే ‘అభిమన్యు హాజ్ రీచ్ డ్ కురుక్షేత్ర బాటిల్ ఫీల్డ్” అని వచ్చింది. మేము ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పింది. కష్టమ్ వాళ్ళమో కురుక్షేత్ర్ యుద్ధభూమి, పద్మవ్యూహంలో చేరిన అభిమన్యుడేమో ఆవకాయ. ఇక వాటిని పరిక్షించేందుకు కస్టమ్స్ అధికారులు మొదలుపెడతారని దాని సారాంశం. అది విని మాకు నవ్వాగలేదు. అసలు మహాభారతంలో, అభిమన్యుడు చనిపోతాడు కదూ. కానీ మా చిన్నమ్మాయి భారతంలో మాత్రం చావడు. ఏదో కొన్ని రోజులు హోరా హోరీ కష్టమ్స్ ఆఫీసర్సతో యుద్ధం చేశాక విజయుడై ఇంటికి చేరతాడన్నమాట.

ఇక ఊరగాయల పార్సెల్ దగ్గర్నుంచి ఊరగాయలన్నీ బయటికి తీసాక వాటిని బాటిల్స్లో పెట్టాక వాటిని కూడా ఫోటో తీసి మాకు వాట్సప్ లో పెట్తారన్నమాట. అవి చూసుకని మేము ఆనందంతో తబ్బిబ్బై ఇక డాన్స్ చేయడమే తరువాయి.

మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈసారి నన్ను అందరూ బెల్లం ఆవకాయ గూర్చి అడగడం, దాని రెసిపీ చెప్పడంతో నేను కూడా బెల్లం ఆవకాయ పెడదామని ఉబలాటపడ్డాను. ఒకరైతే బెల్లం పాకం పట్టాలి వగైరా – వగైరా అని చెప్పారు. ఆ సింగినాదం – జీలక్రర అదేం అక్కర్లేదండీ, మన రెగ్యులర్ ఆవకాయలోనే బెల్లం కలపండి, అదే బెల్లం ఆవకాయ అంటే అంతే ఇంకేం లేదు మరొకరూ చెప్పారు. ఇంకేం, అంతే కదా వెరీసింపుల్ అనుకుంటూ కొంచెం ఆవకాయ జాడిలోంచి విడిగా తీసి అందులో తగినంత మోతాదులో బెల్లం కలిపేసి, బెల్లం ఆవకాయ జిందాబాద్ అనుకుని నన్ను నేనే అభినందించుకున్నాను. తీరా పిల్లలకి పంపేందుకు వాళ్లనడిగితే ‘వామ్మో అదేంటి ఎప్పుడూ వినలేదే. బెల్లం మాగాయ విన్నాంగాని బెల్లం ఆవకాయ గురించి వినలేదు. తినలేదు. అయినా మేము రిస్క్ తీసుకోదల్చుకోలేదు. మా కొద్దంటే మాకొద్దని ఇద్దరూ ముక్తకంఠతో సెలవిచ్చారు. దాంతో నా గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం చేయడం అంత ఆవకాయలో బెల్లం కలిపానే అదంతా ఎవరు తింటారు? ఇంతలో నాకొక బ్రిలియంట్ ఐడియా తట్టింది. అది వినే ముందు తెనాలి రామకృష్ణులవారి కథ తెలుసుండాలి.

ఒకసారి రాయలవారు వారి తల్లిగారి ఆబ్దికమప్పుడు భోక్తలకు ఒక బంగారు మామిడిపండు తలా ఒకటి చొప్పున ఇద్దామనుకున్నారు. కారణం వారి తల్లిగారు చనిపోతూ మామిడిపండు తినాలన్న తన కోరికను వెలిబుచ్చారట. కాని ఆ కోరిక తీరకుండానే కాలం చేశారు. రాయలవారందుకు చాలా వ్యథ చెంది ఆబ్ధికం రోజున తల్లిగారి ఆత్మశాంతి కోసము అందరికీ బంగారు మామిడి పండ్లు దానమిస్తున్నారు. కాని అక్కడ కొంత మోసము జరగనారంభించింది. భోక్తలందరూ పేరాశతో రెండోసారి కూడా తీసుకొనడం మొదలుపెట్టారు. అది గమనించి రామకృష్ణులవారు ఇలాగైతే ఖజానా ఖాళీ అవుతుందని భయపడి వీరికి గుణపాఠం చెప్పాలని ఒక ట్రిక్ చేస్తారు. వెంటనే ఏమని ఎనౌన్స్ చేశారంటే, రామక్రిష్ణులవారి తల్లిగారు చనిపోయే ముందు తనకు వాతలు పెట్టమని కోరుకున్నారట. (బహుశా ఆ రోజుల్లో అదో రకం వైద్యం అయి ఉండవచ్చు). కానీ చూస్తూ చూస్తూ తల్లికి వాతలు పెట్టే బాధాకరమైన పని చేయనంటే చేయనని భీష్మించుకు కూర్చున్నారట. దాంతో ఆవిడ కోరిక తీరకనే పరమపదించారట. కానీ ఎవరూ వాతలు పెట్టించుకోవడానికి ఒప్పుకోరు కనక తన తల్లి కోరిక తీర్చుటకిదే తగిన సందర్బం అని తలచి ఒక బంగారు మామిడి పండుకి ఒక వాత తీసుకోవాల్సిందిగా ఒక నిబంధన పెట్టారు. దాంతో కొంతమంది పెట్టించుకున్నారు. కానీ అందరూ సాహసించలేకపోయారు. దాంతో ఖజానా ఖాళీ అయిపోతుందన్న రామకృష్ణులవారి భయానికి చెక్ పడింది.

సో, ఆ కథ లాగ నేను కూడా మా పిల్లలకి నేను పెట్టిన పికిల్స్ కావాలంటే బెల్లం ఆవకాయ కూడా ఒక్కో కిలో చప్పున తీసుకోవాలని ఒక కండిషన్ పెట్టాను. దాంతో పిల్లలు తప్పనిసరి ఒప్పుకోవల్సి వచ్చంది.

తరువాత ఆ రుచిలేని బెల్లం ఆవకాయ తీసుకున్నారేగాని దాన్నలాగే ఉంచి మిగతావి లాగించడం మొదలెట్టారు. కానీ నేను ఊరుకోక రోజూ బెల్లం ఆవకాయ తిన్నారా? లేదా? అని ఫోన్ లో సతాయించే దాన్ని – అది భరించలేక వారం వారం గెష్ట్లలని భోజనానికి పిల్చి ఆ బెల్లం ఆవకాయ వాళ్లకి వేసి ఖర్చు చేశారు. అప్పట్నుండి ఆ బెల్లం ఆవకాయ బాధితులెవరూ వారింటిపై కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించలేదు. నేను కూడా బెల్లం ఆవకాయ మాట కలలో కూడా తలచడం మానేసాను.

ఇంతకీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు నాకు ఏం బిరుదునిస్తున్నారు? చెప్పరూ।।

June 21, 2022 4 comments
3 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నాకు తెలిసిన ‘సి.నా.రె.’

by Kopparti Rambabu June 21, 2022
written by Kopparti Rambabu

2019 లో కీ.సే. సి.నారాయణ రెడ్డి గారి గురించి రాసినది. మరొక్కసారి వారిని స్మరించుకుంటూ……….

ఆధునిక తెలుగు సాహితీ జగత్తులో , నిలువెత్తు రూపం …..సి నా రే. ఆయనకి రోజూ కవిత రాయనిదే తెల్లవారదు, కవితకు కొత్త సొబగులు అద్దనిదే నిద్దర రాదు.

ఆయన కవి, అధ్యాపకుడు, పరిశోధకుడు. అన్నిటినీమించి మనిషి జీవితాన్ని ఒక ప్రిజమ్ లోంచి కాంతి ప్రసరించినప్పుడు వెలువడే రంగులన్నింటినీ మేళవించి, పద చిత్రణతో , రూపుకట్టించిన మేధావి.

ఆయన మాట్లాడుతుంటే మువ్వల సవ్వడి గొంతులో వినిపిస్తుంది.ఆయన బహుముఖ సాహితీ స్వరూపాన్ని దర్శించడం అంటే , గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ , గుడి గోపురం, గోడల మీద చెక్కిన శిల్పాలను చూడడం వంటిది.

ఆయన రచనల్లో అత్యంత ప్రశస్తమైనది గా భావించబడేది ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిపెట్టిన ” విశ్వంభర ” వచన కావ్యం. మానవుడు ఆ కావ్యానికి నాయకుడు. ప్రకృతి నాయిక.ఆదిమ కాలంనించీ ఆధునిక కాలం వరకూ సాగిన మనిషి జీవన ప్రస్థానం , ఐదు ప్రకరణాలుగా సాగిన సుదీర్ఘ కవిత.” నేను పుట్టక ముందే నెత్తి మీద నీలితెర.కాళ్ళ కింద ధూళి పొర.” అంటూ మొదలయ్యి “ఎంతటి కలవరమో వెదుళ్లకు ప్రతి అంగం నాదంగా పరిణమించాలని……ఎంతటి ఆరాటమో కొండరాళ్లకు ……అఖిలాణువులు మూర్తులుగా మూర్తీభవించాలని…. అనిసాగిపోయే కవితా ప్రవాహం గుక్కతిప్పుకొనివ్వదు.

నారాయణ రెడ్డి గారిని చూసి మాట్లాడిన అదృష్టం నాది.ఆయన సినిమా పాటల సంకలనం ” పగలే వెన్నెల ” ఆయన చేతులమీదుగా కాలేజీలో బహుమతిగా అందుకున్నాను.మూడు వేల పైచిలుకు పాటలు రాసిన ప్రతిభా మూర్తి. జ్ఞానపీఠ బహుమతి పొందిన విశ్వనాథ వారిని మెప్పించటంకోసం ” ఏకవీర ” సినిమాకు మాటలు రాశారు.ఆ సినిమా చూసి హాల్లోంచి బయటికి వస్తూ ఒక సామాన్య ప్రేక్షకుడు అన్నాట్ట ” ఈ సినిమాలో పాటలు అన్నీ అర్థం అయ్యాయి కానీ మాటలు ఒక్క ముక్కా అర్థం కాలేదు ” అని.

అయితే ఆ సినిమాలో ” తోటలో నారాజు ” పాట సినీ ఉద్యానవనంలో రెడ్డిగారిని రారాజుగా నిలిపిన పాట.ఆ పాటలో ఆయనే అన్నట్టు అది రస రమ్య గీతం.అదే సినిమాలో ఆయన తాను కాలేజీ రోజుల్లో రాసిన ” ప్రకృతిలో ప్రణయిని కవితని పాటగా పెట్టారు.బాలూ ఎంత నిదానంగా పాడారు అంటే , పడవలో వెళ్తూ పాట వింటే , పడవ కంటే పాట వెనకబడినట్టు అనిపిస్తుంది.

గులేబకావళి కథ (1962)నించీ మొదలైన ఆయన సినీ గీత రచనా ప్రస్థానం , ఐదు దశాబ్దాలకు పైగా సాగింది.ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉంటూ , హైద్రాబాద్ నించీ చెన్నైకి విమానంలో వచ్చేలోపు కొన్ని పాటలు రాసేసే వారుట.చెన్నైలో మేము ఉన్న టీ నగర్ , బస్ స్టాండ్ ఎదురుగా సుధార హోటల్ లో బసచేసేవారుట.

నారాయణ రెడ్డి గారిని సాహితీ మూర్తిగా , మరొక మారు దర్శించాలి అంటే, ఆయన అనేకానేక రచనలు ఆధారంగా ఆయన బహుముఖ సాహితీ రూపాన్ని సందర్శించాలి.కవిగా పద్య రచనతో శ్రీకారం చుట్టి , కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, ఋతు చక్రం వంటి పద్య కావ్యాలు రాశారు. వచన కవిగా జలపాతం, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, మంటలూ – మానవుడు, ఉదయం నా హృదయం, మార్పు నా తీర్పు, తేజస్సు నా తపస్సు, ఇంటిపేరు చైతన్యం, కవిత నా చిరునామా, కాలం అంచుమీద, నడక నా తల్లి, శిఖరాలూ లోయలూ, మట్టీ మనిషీ ఆకాశం, దూరాలను దూసుకొచ్చి, ఆరోహణ, దృక్పథం, భూగోళమంత మనిషి బొమ్మ, , వ్యక్తిత్వం, గదిలో సముద్రం.
:
👆 ఆయన కావ్యాల పేర్లు ….ఒక క్రమపద్ధతిలో పెర్చితే అది ఒక కవిత అవుతుంది. అందువల్లే భారతీయ జ్ఞానపీఠ కమిటీ, వారి సృజనాత్మక సాహితీ సేవకు మెచ్చి వారి చుట్టూ పట్టు ఉత్తరీయం కప్పినట్టు వారి సమగ్ర సాహిత్యానికి జ్ఞాన పీఠ బహుమతి ప్రకటించింది

సి నా రే ని తిరుగులేని పరిశోధకుడిగా మాత్రమే కాకుండా ఆచార్య స్థానంలో నిలబెట్టిన గ్రంధం “ఆధునిక ఆంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు.” రిఫరెన్స్ పుస్తకంగా ఆధునిక తెలుగు కవిత్వం మీద దీనిని మించిన పరిశోధనా గ్రంధం వేరొకటి ఇప్పటిదాకా రాలేదు.

సినిమా పాటల రచయితగా ఎన్ని ఉదాహరణలు చెప్పినా , ఆయన పాటలలోని మాటల సొగసు తరగదు. పాటలో ఏముంది నా మాటలో ఏముంది అంటూ ఆయన రాసిన సినిమా పాటలమీద ఆయనే రాసిన లఘు వ్యాఖ్యానాలు , పాటలలోని అందాలను వెతికి పట్టుకునేలా చేస్తాయి.

కృష్ణవేణి సినిమాలో నాయికని నది తో పోలుస్తూ రాసిన “శ్రీగిరి లోయల సాగే జాడల శతకోటి విద్యుల్లతలు వికశింపచేసినావు ” అంటారు, శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ గురించి.
సీతా కళ్యాణం సినిమాలో గంగావతరణం పాట ఆయన పాండితీ ప్రకర్షకు నిదర్శనం. “కదిలింది కదిలింది గంగ, మహోత్తుంగ తరంగ ” అంటూ గంగా నదీ ప్రవాహాన్ని , పదప్రవాహంగా, కవితా ఝరిగా పరుగులెత్తించారు.

నదులు అంటే ఆయనకు బహు మక్కువ, ఆయనకు నలుగురు కుమార్తెలు, గంగ,యమున, సరస్వతి,కృష్ణ ,….వారి పేర్లు.

ఆయనకు, జ్ఞానపీఠ బహుమతి వచ్చాక , శృతి నీవు గతి నీవు, ఈ నా కృతి నీవు భారతీ …… అంటూ రాసుకొచ్చి శరణాగతి నీవు భారతీ అంటారు.ఆ పాట ఆయన జ్ఞానపీఠం పై నిలిచిన సరస్వతీ దేవికి చేసిన గీతార్చన. ఆ పాటలో ప్రతి పదమూ , కవితాత్మ దర్శన ప్రాప్తి కలిగించే కైవల్య పథం.
:
ఒక సినిమా పాట మీద పాఠం రావడం , ఆయనకే చెల్లింది…..” వట పత్ర సాయికి ” పాట రాసిన ఆయన వెళ్లిపోయారు అని బాధ కలిగినా తాత రాసిన జోల పాట పిల్లలరూపంలో సాక్షాత్తూ ఆభగవంతుడు నిత్యం విని ఆనందిస్తూనే ఉంటాడు.

నారాయణరెడ్డి గారు , తెలంగాణాలో , హనుమాజీ పేటలో జన్మించారు.ఉర్దూ మీడియంలో చదువుకున్నారు.పారసీక భాషలో కూడా పట్టు ఉంది. ఆ పాండిత్యం ఆయన చేత తెలుగులో గజల్స్ రాయించింది.గజల్ శ్రీనివాస్ ఆయన గజల్స్ బాగా పాడి ఆయన మానస పుత్రుడిగా పేరుతెచ్చుకున్నాడు.
ఆయన కూడా తన గజల్స్ చాలా బాగా పాడి క్యాసెట్స్ రూపంలో తీసుకొచ్చారు.”అమ్మ ఒక వైపు , దేవతలంతా ఒక వైపు, సరి తూగమంటే, అమ్మవైపు ” అన్న ఆయన గజల్ మాతృవాత్సల్యాన్ని మనసుకి హత్తుకునేలా చేస్తుంది.
ఆయనకు సమకాలికుడైన ఆయన మిత్రుడు దాశరథి తో కలిసి తొలి రోజుల్లో జంట కవిత్వం రాశారు.
పోతన భాగవత పద్యాలకు మందార మకరందాలు పేరిట సరళ వ్యాఖ్య రాశారు. 85 సంవత్సరాలు పైగా జీవించి , పుట్టినప్పటినించీ లెక్క గట్టుకున్నట్టు 85 కి పైగా రచనలు ప్రచురించారు.ఏటేటా వచ్చే ఏ సంస్థ తెచ్చే కవితా సంకలనాల్లో ఐనా ఆయన కవిత ఉండ వలసిందే. అది ఆయనకు జ్ఞానపీఠం వచ్చింది కనుక వేసే పెద్ద పీట కాదు . కాలానుగుణంగా, భావజాలానికి , కవిత్వ వ్యక్తీకరణ విధానానికి పదును పెట్టుకుంటూ, పాళీకీ పదును తగ్గలేదని కొత్త కలాలకి ధీటుగా కవిత్వం రాసే ఆ నిత్య కవితా వసంత భోగ రాయుని గొప్పదనం అది.

నారాయణరెడ్డి మౌలికంగా కవి.కవిత్వం విషయంలో ఆయన నమ్మిన ఆచరించిన, అనుసరించిన రచనా సూత్రం “కవిత్వానికి మూలం భావం…..అదే కవితాత్మ……. ఆ ఆత్మకు రూపాన్నిచ్చేది భాష…… అది దేహం. ” ఈ సూత్రం ఆధారంగానే ఆయన ఏడు దశాబ్దాలు కవిగా మనగలిగాడు.

మనమధ్య, నరుడిగా , నారాయణుడి గా తన విశ్వంభర మహా కావ్యం ద్వారా కవితా విశ్వ విహారం చేశారు. ఆయన తన రచనల ద్వారా చేసిన “సదాలోచనలు అంతరంగాలను సమీక్షించి చూపుతాయి.ఆ సమీక్షలు జీవన నిర్వహణకు పురోదర్శినులవుతాయి ” కళాత్మకత, వైజ్ఞానికత, ఆధ్యాత్మికత , సాధనలోఎన్ని ఎదుదెబ్బలు తగిలినా మనిషి ఎప్పుడూ తిరోగామి కాడు, అనేది ఆయన ప్రగాఢ నమ్మకం.అదే విశ్వంభర కావ్యంలో ఆయన సృష్టించిన కవితా సారాంశం.

కవిత రాయనిదే నిదుర రాని ఆయన శాశ్వత నిధురలోకి వెళ్లి పోయారు, తన రచనల ద్వారా తెలుగు మానవాళిని నిత్య. జాగురూకులై ఉండమని నిర్దేశిస్తూ….ఆ కవితా శిఖరానికి శిరస్సు ఎత్తి నమస్కారం.ఆయన కవితా సంస్కారానికి శిరస్సు వంచి అభివాదం.నివాళి.

June 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాపు

by పొట్లపల్లి శ్రీనివాసరావు June 21, 2022
written by పొట్లపల్లి శ్రీనివాసరావు

నీవు లేని నీకోసం కవిత రాయాలని
ముప్పిరి గొన్న ఆలోచనల.. కలం చేత పెట్టాను
ఆరు పదుల పైగా నీ తో నడిచిన రోజులన్నీ
ఒకటొకటిగా మెదడు సందుగ దూకి నెట్టుకొస్తున్నాయి

నీవు లేని నీకోసం తన్నుకొస్తున్న అక్షర ప్రవాహం
కంటి సుడిగుండాల వలయాల చీల్చి వర్శిస్తూ..
మసక మసకగా కాగితం మీద వాలిన
పదాల పాదాలను నదీ జలమై అభిషేకిస్తూ..

బాపూ!నీవు లేని నీకోసం కవిత రాయాలనుకున్నా
నీ చుట్టే నేనున్నానని భుజం తడుతున్నట్టు..బాపు

ముందు రోజు మల్లెపువ్వులా నవ్వులు చల్లి
మనవడి పెళ్లి శుభలేఖ ఆసాంతం చదివి
అందులో నీ పేరు ఉందని మెరిసి
విద్యుద్దీపకాంతుల్లో ఇల్లంతా బాగుందని మురిసి
చక్రాల కుర్చీ మీద ఫోటోలకు ఫోజులిస్తివి
చూసి అబ్బురపడితివి కదా బాపూ..
పత్తి పువ్వు లా చూసుకున్నాము కదా …
అంతలోనే ఏమైంది…ఇంటి నిండా చీకట్లు
చెప్పా చెయ్యక ఎలా వెళ్ళిపోయావు బాపూ..

మేమంతా ఉన్నతంగా ఎదగాలి అన్నావు
నీవేమో ఉన్నంతలోనే బతకాలనుకున్నావు

నీ స్వప్న సాకారం కోసం మా చదువుల కోసం
మాటిమాటికి ఇరుకిరుకు ఇళ్లకు మారుతూ
కిరాయి ,కిరాణా దుకాణం ఖాతా,ఫీజులు బట్టలు పుస్తకాలు,రోగాలు..మధ్యతరగతి ఖర్చులకై..
బతుకు తెరువు కోసం చాలీచాలని
ఆనాటి అత్తెసరు జీతాల బడిపంతులు నీవైనా
నిర్మొహమాటంగా గలగల మాట్లాడే నిష్కపటి వై
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకుడివై
ఎదిగి జీవించిన ఆత్మాభిమానపు జెండా నీవు బాపు

ఉద్యోగానంతరమే అసలు జీవితమని
అరిగిపోయిన శేష జీవితం కాదని అది అశేష మని
సుప్తంగా ఉన్న అంతశ్చేతనను తట్టిలేపి
పసితనపు ఛాయతో కవిత్వమై వెలిగావు
ఒక విశాల ప్రపంచంలో ఒదిగి పోయావు

తనదైన భావన పరిధిలో తట్టిన ప్రతిదీ
కవిత్వీకరించి పిలిచిన ప్రతి చోటా
దూరాభారమనక వయసును మరిచి
వినిపించి పొంగిపోయావు కదా!బాపు

కలల కుంచెతో అక్షరీకరించి
కలల కొలిమి తో స్నేహించి
కలల సంతకం చేసిన చెలిమి నీవు
కలుపుగోలుతనం అసలు రూపం నీవు

కోపం లోనూఆర్ద్రతలోను శివుడి పేరును
సార్థకం చేసుకున్న ధరణీశ్వరుడవు నీవు
అవును భోళాశంకరుడివి నీవు నీ వని
నీవు లేని నీకోసం ఏమి రాసినా…

గుర్తొస్తే చాలు బరువెక్కి ఎక్కెక్కి ఏడిచే గుండెలు
మర్చిపోతే కదా!చాక్పీస్ చేతులతోఎందరికో
జ్ఞాన గవాక్షాలు తెరిపించిన బోధి వృక్షాన్ని…
ఆ నీడలో మమ్ము నడిపించిన జ్ఞాన సుగంధాన్ని..

అన్నీ ఉన్నా నీవు లేవు
నీవే లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏదో వెలితి
మా అందరి హృదయాల్లో ఏదో కలత

June 21, 2022 1 comment
2 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

సోమరితనం కూడదు

by Kura Chidambaram June 21, 2022
written by Kura Chidambaram

రామాపురం అనే ఊళ్ళో ఒక సంపన్నుడుండేవాడు. అతడు సంపన్నుడే కాక, మంచివాడు కూడా! తన దగ్గరకు వచ్చిన కుంటి, గ్రుడ్డి, వికలాంగులైన బీదవారిని ఆదరించేవాడు. వారికి అన్నం పెట్టి ఆదరించటమే కాకుండా అలా వచ్చినవారికి చేతనైనంత ధనసాయం చేసి వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేవాడు. కష్టపడి పనిచేయాలనీ దేవుడు మనిషికి తినటానికి ఒకే ఒక్క నోరు ఇచ్చినా, కష్టపడని పనిచేయటానికి రెండు చేతులు ఇవ్వటంలోని ఆంతర్యం, మరో చేతితో కలిగినంత ఇతరులకు పెట్టటానికేనని చెప్పేవాడు. మనం అందరం కోరుకునే ధనలక్ష్మీ మన కష్టంలో, మరియు మన చెమటలో ఉంటుంది అని చెప్పేవాడు.

ఆ సంపన్నుడి సహాయంవల్ల ఉపాధి పొందినవారు ఎందరో ఆయన చల్లగా ఉండాలని, నాలుగు కాలాలపాటు  ఇలాగే బీదసాదలకు సహాయం చేయాలని, ఆపన్నులను ఆదుకుంటూ ఉండాలని దీవించేవారు.

ఒకనాడు ఆ సంపన్నుడి ఇంటిముందు ఒక గ్రుడ్డివాడు నిలబడి సాహాయం చేయమని దీనంగా అర్థించసాగాడు.  గ్రుడ్డివాడిని, ఆయన దీనస్థితిని చూసిన సంపన్నుడి గుండె నీరయింది. లోనికి తీసుకుని రమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. లోనికి వచ్చిన గ్రుడ్డివాడి వివరాలు అడిగాడు.

అందులకు ఆ గ్రుడ్డివాడు “అయ్యా! నేను పుట్టు గ్రుడ్డిని. నా తల్లదండ్రులెవరో నాకు తెలియదు. తమ వంటి కరుణ గల ప్రభువుల చలువ వల్ల వారు చూపే దయాదాక్షిణ్యాలవల్ల ఇలా కాలం గడుపుతున్నాను. దయగల మారాజులెవరైనా నాకు ఉపాధి కల్పిస్తే బావుంటుంది” అంటాడు.

గ్రుడ్డివాడు దీనస్థితికి , ఆత్మాభిమానానికి సంపన్నుడి మనసు కరుగుతుంది.

కడుపునిండా తిండి పెట్టించి, కట్టుకోవటానికి క్రొత్త బట్టలు ఇప్పించి, ఏదైనా పనిచేసుకునేందుకు ఆసరాగా కొంత డబ్బు ఇచ్చి పంపుతాడు.

సంపన్నుడు ఇచ్చిన ధనంతో ఆ గ్రుడ్డివాడు ఒక చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుని, సహాయంగా మరో అనాథ పిల్లవాడిని నియమించుకుని, తన కాళ్లమీద తాను నిలబడడమే కాకుండా, తన శక్త్యానుసారం ఇతరులకు సహాయం చేసేవాడు.

నిన్నటివరకు చింకిపాతలతో, వీధుల్లో అడుక్కునే గ్రుడ్డివానికి ఉపాధి దొరకటమే కాకుండా, అనాథలకు తోచిన సహాయం చేస్తుండటం అదే ఊళ్ళో ఉన్న కొందరు సోమరిపోతులకు కన్నెర్ర అయింది. అసూయ కలిగింది.

వాళ్ళకు కూడా ఆ సంపన్నుడి నుండి ధనం సంపాదించాలన్న దురాశ కలిగింది.

వారిలో, తమకు తామే తెలివైన వారమనే భావించే ఇద్దరు ఒక జట్టుగా ఏర్పడి సంపన్నుడి ఇంటిముందు యాచించసాగారు. అది గమనించిన ఆ సంపన్నుడు

‘కాళ్ళూ, చేతులు, కళ్ళు, ఒళ్ళు – అన్నీ సవ్యంగా ఉన్నా ఎందుకు మీరు యాచించాల్సిన అవసరం కలిగింది’ అని అడుగుతాడు.

జవాబుగా, ఆ సోమరిపోతులు : “అయ్యా మాకు పనిచేయాలనే ఉంది, కాని మా వీపుల మీద సైతానం తిష్టవేసింది. ఏ పని చేయాలన్నా అడ్డుకుంటున్నది” అంటూ ఏడుపు నటించసాగారు.

ఆ సంపన్నుడు ధనవంతుడే కాకుండా తెలివైనవాడు కూడా! వచ్చినవారు సోమరిపోతులని, సహాయం చేసినా దుర్వినియోగం అవుతుందని, గ్రుడ్డివాడిలా సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తారని గ్రహించాడు. అలాంటివారికి  గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అలా అనుకుని వారితో ఇలా అంటాడు.

“తమ్ముళ్ళూ, మీ దీనస్థితి నాకు అర్థం అయింది. నేను తప్పక మీకు సహాయం చేస్తాను. కాని మొదట మీ వీపుల్ని ఎక్కి కూర్చున్న సైతాన్ ను నా మంత్రంతో దూరం చేయాలి. అందుకు మీకు సమ్మతమేనా?” అని అడుగుతాడు.

సహాయం అందుతుందన్న సంతోషంలో ఆ సోమరి పోతులు సరేనంటారు.

ఆయన తన సేవకులను పిలిపించి వీరిని ఒక గదిలో బంధించి ఉంచుతాడు. కొరడాలను తెప్పించి వీపుల మీద వాతలు తేలేలా కొట్టించసాగాడు. కారణం అడిగిన ఆ సోమరిపోతులకు సైతాన్ ను పార్రదోలటం అని చెబుతాడు.

దెబ్బలకు తాళలేక సోమరిపోతులు లబోదిబోమంటూ, తమకు బుద్ధి వచ్చిందనీ, ఇకముందు కష్టపడి బ్రతుకుతాము అనీ, వేడుకుని, బ్రతుకు జీవుడా అంటూ బయటపడుతారు.

ఆ సంపన్నుడు ఆ సోమరిపోతులకు బుద్ధి గరిపి పంపివేస్తాడు.

(నీతి: కష్టపడి పనిచేయాలి. ఇతరులను యాచించవద్దు.)

June 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణకలనం -7

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి June 17, 2022
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

పజిల్ నింపి పంపిన వారు – ఉమ నెల్లుట్ల

June 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ June 17, 2022
written by కొరుప్రోలు హరనాథ్

తేడా….

ఈ కులాలు

ఈ మతాలు

ఈ వరకట్నపు

దురాచారాలు

ఈ సనాతన సాంప్రదాయాలు

మానవుడు నిర్మించుకున్న

సామ్రాజ్య సౌధాలయితే

దేవుని దృష్టిలో

ఇవన్ని

పనికిరాని శిథిలాలు

పగిలిన ప్రతిబింబాలు

తెలివి

ఎదుటివాడి కంటే

నువ్వు తెలివిగా

ఉండాలనుకోవడంలో

తప్పు లేదు –

కాని

వాడి తెలివిని

దెబ్బ కొట్టాలని

అతి తెలివి

ప్రదర్శించావో

నీ అంత మూర్ఖుడు

మరొకడు లేడు

June 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథాపంచకం

by Dr. Lakshmanacharyulu M June 17, 2022
written by Dr. Lakshmanacharyulu M
  1. వైమనస్యం

సామాన్యంగా నేను చాలా తక్కువగానే మాట్లడతాను. చెడు మంచి గురించి వాటిని ఎత్తి చూపడం గురించీ మాట్లాడను. నలుగురితో కలివిడిగా కూడా ఉండను. అలా దూరం దూరంగా ఉండడంలోనే నాకానందం కలుగుతంది.

నిన్ననే జరిగిన సంఘటన. మా ఆవిడతో కలసి జమునాదాస్ గారింటికి వెళ్ళా. పలకరింపులయ్యాయి. కొద్దిసేపయ్యాక, ఆ వీధిలో ఎవరున్నారు, వారెలాంటివారు అనే విషయంపై మా చర్చ నడిచింది. ఇదిగో, ఇదే నాకు చిరాకు తెప్పించే విషయం. ఎలాగో, ముళ్ళమీద కూర్చున్నట్టుగా అలా కూర్చుని వాళ్ల మాటలు వింటున్నా.

మాటల్లో ఓ పెద్ద మనిషి బిహారీ బాబు గురించిన ప్రసక్తి వచ్చింది. జమునాదాస్ ఆయన్ని జోడింపచేస్తూ, నానా మాటలూ అన్నాడు. చివరికి…. “మర్యాద – మన్నన, సత్ప్రవర్తన లాంటివేమీ ఆయనకి తెలీవు. ఎప్పుడు పలకరించినా మేం తెలియనట్టుగానే మొహం పెడతాడు. ‘నమస్తే’కి జవాబు కూడా ఇవ్వడు. రాత్రిళ్ళైతే మనిషే కనబడదు. బహుశా ఇంట్లో ‘ముందు’ సేవిస్తూ ఉంటాడేమో మరి.”

తర్వాత నావైపు తిరిగి – “మీరేమంటారు, డాక్టరుగారూ!” అని అన్నాడు.

ఇక నాకు మాట్లాడడం తప్పనిసరై. “బిహారీబాబు ఓ పెద్ద మనిషి, మంచి మనిషి. రాత్రిళ్లు ఆయనకి సరిగ్గా కనపడదు. ఆయనకి విటమిన్ ‘ఏ’ లోపం ఉంది. నా దగ్గర వైద్యం చేయించుకుంటూ ఉన్నాడు. కొద్దిరోజుల్లో నయం అవుతుంది” అని అన్నాను. అంతే!! అక్కడివారి కబుర్లు మరొకరిని విమర్శించడంవైపుకి మళ్ళాయి.

2. ఏరుదాటాక….

ప్రొఫెసర్ మనోహర్ గారి ప్రక్క నుండి అలా వెళ్ళిపోయింది రేణు. ఓ ‘నమస్తే’ లేదు, ఓ ‘హలో’ లేదు. ప్రొఫెసర్ కి ఇది నచ్చలేదు. బాధ కూడా కలిగింది. ఆమె ఆయన విషయానికే చెందిన ఒక పరిశోధక విద్యార్థిని. ఆయన దగ్గరకు పరిశోధనకి సంబంధించి అవసరం ఏర్పడితే వస్తూ ఉండేది. బహుశా తను నన్ను గమనించలేదేమో అని అనుకున్నాడు. సరే అనుకుని లేచి ఆమె దగ్గరకు వెళ్లి – “నమస్తే! రేణూ! ఎలా ఉన్నావ్?” ప్రశ్నించాడాయన.

రేణు నమస్కరిస్తూ – “క్షమించండి! నాక్కొంచెం పని ఉంది” అని చెప్పి ఆమె జారుకుంది. అయినా ప్రొఫెసర్ గారు తన పట్టు వదల్లేదు. ఆయన రేణు వెనకే వెళ్ళాడు. అసలు ఈ రేణు, ఆ రేణేనా? “సర్! మీరు జీనియస్!” అంటూ తెగపగడుతూ ఉండేది. ఇవాళ అదే రేణు ఇలా ప్రవర్తిస్తున్నది. ఇలా అనుకుంటూ ప్రొఫెసర్ నడుస్తూ ఉంటే ఓ గది లోంచి రేణు తన స్నేహితురాల్తో – “ఆ ముసలోడు నా వెంట పడుతూ ఉన్నాడే? వదల్టంలేదు. నా మంచి ఏంకోరుకుంటున్నాడో మరి?”

“ఒకప్పుడు నువ్వాయిన్ని తెగ పొగిడేదానివి కదే!” అడిగింది స్నేహితురాలు.

“అప్పటిసంగతే వేరు.  అప్పుడు నాకు పరిశోధనలో సహాయం అవసరం. ఇప్పుడా థీసిస్ చాలావరకూ పూర్తి అయింది. ఇక ఆయనతో నాకేం పని?”

3. వ్యామోహం

ఇవ్వాళ బహుశా అన్నిటికన్నా క్రికెట్ కే చాలా పేరు, ఆకర్షణా ఉన్నాయి. ఆట అర్థం అయినా కాకపోయినా, ఆ ఆటలో ఆసక్తి చూపించటమే ఒక ఆకర్షణ, అభిరుచి. సందులు – గొందుల్లోను, ఆఫీసులోను, అంతెందుకు, స్నానం చేసేటప్పుడూ ఆ ఆటంటే చెవి కోసుకునేవాళ్ళు కామెంట్రీ వింటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే రామ్ దయాళ్ గారు వీటన్నిటికీ మినహాయింపు అనే చెప్పాలి.  ఆయనకి ఈ వ్యామోహం అంటే అస్సలు పడదు. “క్రికెట్ మన కాలాన్ని వృథా చేస్తే, ఈ కామెంట్రీ అనేది ఇంకా, ఇంకా మన సమయాన్ని నష్టపరుస్తుందని” ఆయన ఎప్పుడూ అంటూ ఉంటాడు.

ఒక రోజున ఏమైందంటే…. రామ్ దయాళ్ గారు తన ఆఫీసుకి వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఇంతలో ట్రాన్సిస్టర్ రొద వినబడింది. అంతే! ఆయనగారి ‘మోడ్’ ఖరాబైపోయింది. “ఇదేమన్నా కామెట్రి వినే టైమా? చదువూ సంధ్యా ఉండదు. రేడియో మాత్రం తప్పకుండా ఉండాలి. ఆ పిచ్చి కామెంట్రీ కట్టెయ్!”

ఆ రోజున ఆయన అందరిమీద ‘అక్షింత వేసాడు’. పిల్లల్ని కూడా ఆయన వదల్లేదు. అందరూ పాపం బిక్క మొహాలతో తమ చదువు సంధ్యల్లో మునిగిపోయారు.

దడదడా రామదయాళ్ గారు ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. తరువాత స్కూటరెక్కి బయటికి వచ్చేసి, ఎవ్వరూ లేని ఒక మారుమూల ప్రదేశంలో బండి పార్క్ చేసి, తన జేబులోంచి ప్యాకెట్ సైజ్ ట్రాన్సిస్టర్ బయటకు తీసి, స్కూటర్ పైన విశ్రాంతిగా కూర్చొని ఎంతో ఆసక్తితో క్రికెట్ కామెంట్రీ వినసాగారు.

4. మత్తు – చిత్తు

“ఎన్నోసార్లు నేను వద్దని చెప్పా, వేలసార్లు నచ్చ చెప్పా, కాని వాడి బుర్రలో ఏమన్నా ఎక్కితేగా? అసలు ఇలా చేసే వయసా వాడిది.”

దీనానాథ్ నాకో సెంటర్లో కనబడ్డారు. ‘కొత్త బజారు’ లోని ఆ సెంటరు ఇలాంటివాటికి బాగా పేరుపడింది. ఇక్కడ ఒక హెయిర్ కటింగ్ సెలూన్, హల్వా దుకాణం, పూలదుకాణం ఇలా అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. జనం తమకి కావల్సిన సామాన్లు కొనుక్కోడానికి వస్తూ ఉంటారు. అలాల వచ్చినవాళ్ళ పరస్పరం పిచ్చాపాటీ మాట్లాడుకుంటారు, కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.

దీనానాథ్ నిట్టూరుస్తూ – “ఆ దేవుడి లాంటి కొడుకుని ఎవరికీ ఇవ్వకూడదు. పట్టుమని పదిహేడేళ్ళుంటాయేమో! కాని, చేపలా మందు తాగుతూ ఉంటాడు. ఎంతగా చెప్పినా వినడం లేదు. నేను మందు త్రాగొద్దని చెప్పను. కాని ఇంత చిన్న వయసులో ఇంతలా త్రాగడం అనేది బుద్ధుండి చేసే పనేనా?”

చిట్టచివరి వాక్యం వినగానే నాకెందుకో అనుమానం వచ్చింది. నేను దీనానాథుణ్ణి పరీక్షగా చూస్తా, కొంచెం దగ్గరగా జరిగి వాసన పీల్చా. అంతే!! ఆయన మత్తులో బాగా చిత్తై ఉన్నాడు.

5. బేరం

ఈ కథ ఏ కాలానికి చెందినదైనా కావచ్చు. అంటే జరిగిపోయిన కాలానికి, జరుగుతున్న కాలానికి, అలాగే జరగబోయే కాలానికి కూడా సంబంధించినది కావచ్చు.

ప్రతిదేశానికి రక్షణ వ్యవస్థ అంటూ ఉంటుంది. ఈ కథలోని కాల్పనిక దేశానికి కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉన్నది. ప్రతి దేశంలో పెద్ద పెద్ద అధికారులున్నట్టే ఈ దేశంలో కూడా నేరాలు జరుగుతాయి.

మన కాల్పనిక దేశానికి చెందిన ఒక సజ్జనుడు నేరాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన కూతుర్ని ఎవరో అపహరించుకుపోయారు. నేరం చాలా తీవ్రమైనది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా సన్నద్ధమైంది.

ఎలాగో అలా చివరికి అమ్మాయి దొరికింది. కాని…అపహరించినవారు దొరకలేదు. చివరికి రక్షణ యంత్రాంగం ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. పోలీసు అధికారి అతణ్ణి చూస్తూ – “నీకు రోజుకి యాభై రూపాయలు దొరుకుతాయి. ఏడు రోజుల్లో ఈ వ్యవహారమంతా చల్లబడిపోయింది. నిన్ను విడిపించే బాధ్యత మాది సరేనా?” అని అన్నాడు.

ఆ వ్యక్తి పేదవాడు, నవ్వుతూ – “అయ్యా! నన్నువిడిపించొద్దు. ఈ యాభై రూపాయల రేటుమీద నేను జీవితాంతం జైల్లో ఉండగలను. నేనిలా లోపల ఉన్నా నా కుటుంబం బయట హాయిగా ఉండగలుగుతుంది” అని అన్నాడు.

June 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us