మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

స్వరాంజలి-7

by Krishna Kumari Yagnambhatt April 9, 2022
written by Krishna Kumari Yagnambhatt

స్వరాంజలి-7
డా. కృష్ణ కుమారి
9885451014

ఈ వ్యాసంలో రామదాసు గురించి తెలుసుకుందాం. రామదాసు సహజ కవి. ఈతని కీర్తనలు సహజ భక్తి భావవేశంతో, తన్మయత్వంతో ,సుకుమార భావనలతో రచింపబడ్డాయి. అందుకే రక్తి కట్టించే రామదాసు కీర్తనలు భజన గోష్టులలో స్థానం సంపాయించుకున్నాయి. ఆనంద భైరవి రాగాన్ని సంగీత చరిత్రలో మొదటిసారి ఉపయోగించిన వాగ్గేయకారుడు రామదాసే. ఈతని సంగీత రచనలను బట్టి రామదాసు ఆశయం పాండిత్య ప్రకర్ష కాదని, సంగీతం ఆతని భక్తి సాధనకు ఉపకరణ మాత్రమే అని అర్థమవుతుంది. అయితే కీర్తనలలోని వివిధ ఛందో రీతులను గమనిస్తే ,దేశీయ గేయ రీతుల పట్ల ఈతనికి గల అవగాహన అర్థమవుతుంది. అన్నమాచార్యుల వారి తర్వాత రచన ద్వారా నవవిధ భక్తిని ప్రదర్శించిన వాగ్గేయకారుడు రామదాసే.
తర్వాతికాలంలో భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి కెక్కిన ఈతని అసలు పేరు కంచర్ల గోపన్న. ఈతను 17 వ శతాబ్దికి చెందిన వాడు. సంస్కృతాంధ్ర భాషలలొ ప్రావీణ్యం కలవాడు. అంతే కాకుండా గోల్కొండ రాజ్యంలోఉద్యోగం చేసిన కారణంగా ఉర్దూ పారశీక భాషలలొ కూడా ప్రవేశం ఉంది. ప్రహ్లాద, పరాశర,నారద,పుండరీకాదులతో రామదాసు సమానుడని త్యాగరాజ స్వామి ప్రశంసించారంటే స్వామి వారి కాలానికే రామదాసుకు గల కీర్తి ప్రతిష్టలు అర్థం చేసుకోవచ్చును. ప్రసిద్ధమైన సప్త తాళా లలోనూ, సుమారు 25,30 రాగాలలో రచింపబడ్డ వీరి రచనలలోని పాండిత్యం లోక విదితమైనప్పటికీ రామదాసు మనసు మాత్రం భక్తి కే పెద్ద పేట వేసింది అనడంలో సందేహం లేదు.సహజ భక్తి భావనతో అప్రయత్నంగా పెల్లుబికిన రచనలు ఇవి. అందుకే ఎంతమంది కలిసి పాడిన ఒకే గొంతులాగా ,శ్రావ్యంగా వినిపిస్తాయి. ఆ లక్షణమే భజనలలో రామదాసు కీర్తనలు భజనలలో ఎక్కువగా వినిపించడానికి కారణం। చెరిగిపోని కీర్తితో,తరగని భక్తితో అమరజీవి అయ్యాడు రామదాసు. అయితే జీవితపు తొలి నాళ్లలో ఈతను ఏ రచన చేసినట్లు అన్పించదు. తర్వాతి కాలంలో ఉద్యోగం లో వచ్చిన కష్టాల వలన కల్గిన ఆవేదనతో ,అప్రయత్నంగా , ఆశువుగా వచ్చిన రచనలు ఇవి. మనలాంటి వారికి కూడా బాధలో ఈ కీర్తనలే నోటివెంట పలుకుతాయి కదా!ఆ కీర్తనలలో గల ఆర్తి అటువంటిది మరి. రామదాసు భక్తి భరిత రచనలలో కొన్ని ఉదాహరణలను గమనించండి.
శరణాగతి:
పల్లవి:రామదైవ శిఖామణి
సుర రాజ మహోజ్వల భూమణి ||
చరణం:నాడే మిమ్ము వేడుకోంటి గా
శరణా గత బిరుదని వింటిగా
వేడుకై మిము పొగడ గంటిగా
నన్ను దిగవిడ నాడ వద్దంటి గా||

శరణా గత వత్సలుడని పేరు పొందిన రామ చంద్రుని కరుణ తనపై ప్రసరింప చేయమని వేడుకుంటున్న ఈ కీర్తనలో శరణాగత భావం కన్పిస్తుంది.
స్మరణం:
పల్లవి:హరిహర రామ నన్నరమర జూడకు
నిరతము నీ నామ స్మరణ మేమరను||
చరణం:దశరథ నందన దశముఖ మర్ధన
పశుపతి రంజన పాప విమోచన||
దాసత్వం :
పల్లవి:రామ చంద్రులు నాపై చలము చేసినారు
సీతమ్మ చెప్పవమ్మా||
చరణం:కటకట వినడేమి సేయుదు
కఠిన చిత్తుని మనసు కరుగదు
కర్మము లెటులుండునో కద
ధర్మమే నీకుండు నమ్మా||
యజమానుడైన భగవంతుని కరుణ లేకపోతే దాసుడైన తనను ఎవరు రక్షిస్తారు అన్న దాసత్వ భావన ఈ కీర్తనలో కన్పిస్తుంది.
చింతనం:
పల్లవి:నారాయణ అనరాదా
మీ నాలికపై ముల్లు నాటి ఉన్నదా||
చరణం:కలుష వారధికి నావ నిన్ను
గలిసే టందుకు చక్కని బాట త్రోవ
ఇలలో తెలివికి దేవదేవ
నరహరి నామ కీర్తనములే లేవా||
ఆత్మలో ఎరుక:
పల్లవి:తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓ రన్నా ||
చరణం:ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన
ఈ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము
సత్యం బిక పుట్టుట సున్నా||
భగవంతుని గురించిన జ్ఞానమే మోక్ష ప్రదాయిని అని భావం.
సఖ్యత:
పల్లవి: తక్కువేమీ మనకు
రాముడు ఒక్కరుండు వరకు|
చరణం:భూమి స్వర్గమును పొందుగా గొలిచిన
వామనుండు మనవాడై యుండగ|
భగవంతుని స్నేహితునిగా భావించి , ఆ స్నేహం వలన తన జీవితం ధన్య మైందని తలచడం.
సంకీర్తనం:
పల్లవి: ఏ తీరుగా నను దయ జూచెదవో
ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను
నళిన దళేక్షణ రామా |
చరణం:శ్రీ రఘు నందన సీతా రమణా
శ్రిత జన పోషక రామా
కారుణ్య లయ భక్త వరద
నిను కన్నది కానుపు రామా|
ఈ భవ సాగరాన్ని దాటాలంటే భగవంతుని సంకీర్తనమే సరైన దారి అని చెప్పడం.
అర్చనం:
పల్లవి:అమ్మా !నను బ్రోవవే రఘురాముని
కొమ్మా నను బ్రోవవే !
చరణం:అమ్మా !నను బ్రోవవే సమ్మతి తోడ మా
యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద |
అక్షరాల మాలతో దైవాన్ని అర్చించడం ఇందులో కన్పిస్తుంది.
పాదసేవనం:
పల్లవి:రామ నీదయ రాదుగా పతిత పావన
నామమే నీ బిరుదుగా శ్రీ రామా |
చరణం:ఈవులడగ జాలగా శ్రీ పాద
సేవ మాకు పదివేలుగా రామ
భావజనక నీ భావము తెలిసియు
నీవు దైవమనుచు నీ నమ్ముతున్నాను|
రామచంద్రుని పాదసేవకు మించిన పూజ ఇంకొకటి లేదని భావం.
వాత్సల్య భక్తి:
పల్లవి:బూచివాని పిలువ బోదునా ఓ గోపాల కృష్ణా!
చరణం:బూచివాని పిలువ బోతే వద్దు వద్దు వద్దనేవు
ఆ చిచ్చి జోల పాడి అయి ఉంచిన నిదుర పోవు |
భగవంతుని శిశువుగా భావించుట.
వందనము:
పల్లవి:వందనము రఘునాయక
ఆనందము శ్రీ రఘునాయకా
పొందుగ పాదారవిందము
కనుగొందునా రఘు నాయకా|
చరణం:ఎవరేమన్నారు రఘు నాయకా
నే వెరువ జాల రఘు నాయకా
నవనీత చోర నీ నామమే గతి యని
నమ్మితి రఘు నాయకా|
ఈ విధంగా అనేక రకాలైన భక్తి మార్గాలలో తన భక్తి ప్రపత్తులను రామదాసు ప్రదర్శించాడు. ఆహ్లాదకరమైన భక్తి రచనలకు ప్రసిద్ధి గాంచిన ఉత్తమ వాగ్గేయ కారుడు రామదాసు అనడంలో సందేహం లేదు.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

SONG OF COLOURFUL MOONLIGHT @ DAYTIME

by Palakurti Dinakar April 9, 2022
written by Palakurti Dinakar

Poet – Gurijala Rama Seshaiah,

O, Citizens of the world!!
Don’t forget the flowers, colours and birds
Live forever happily
Invite spring and moonlight
every moment into your life
Forget the wars and warfare!
We take the journey of the world
With all our colourful wings
In order to remind you of
Your cheerful mood and laughter
Our rainbows try to suggest you
With our curved colourfullines
To effervesce the sea of heart
Please preserve the rainbow
In your soulful sky
The soul speaks colourful language
The affection has a humane conversation
I’m a butterfly
I’m a colourful sapling of Telugu letters of the alphabet
(Translated from Original Telugu Poem PagaleRangulaVennelaPaata  by Dr. PalakurthyDinakar)

ఓ ప్రపంచ జనులారా !!
పూవులనూ రంగులనూ పక్షులను మరచిపోకుండా జీవించండి
అనునిత్యం బతుకులోకి వసంతాన్నీ వెన్నెలలనూ ఆహ్వౕనించండి
యుద్ధాలను మరచిపోండి !!
మా రంగురంగుల రెక్కలన్నీ
మీ ఆనంద దరహౕసాల
రంగు’హొరంగుల ముచ్చట్లేనని’చెప్పటానికే
మా నిరంతర ప్రపంచ ఉద్యాన విహౕరయాత్ర !
వక్రతాసుందర రేఖతో
రంగులను ఎంచి వంచి చూపేందుకే
మా-మీ కోసమే ఇంద్రధనుసు యత్నమంతా
హృదయ సముద్రాన్ని పొంగించుకోండి
మనో ‘ఆకాశంలో ఇంద్రధనుసు ను పదిలపరచుకోండి !
మనసుదంతా రంగులభాషే !
మమతదంతా మానవత్వ సంభాషణే !
నేను సీతాకోకచిలుక ను
తెలుగుపలుకుల రంగులమొలక ను.
—– గురిజాల రామశేషయ్య
సుకుమార వినికిడి ఫోన్📲 70326 79471

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అన్నింటిని మించింది బ్రహ్మమే

by ఆచార్య మస‌న‌ April 9, 2022
written by ఆచార్య మస‌న‌

నారద సనత్కుమారుల సంవాదం
(ఛాందోగ్యోపనిషత్తులోనిది)
నారదుడు ఋషులలో అగ్రేసరుడు. అతడొకనాడు సనత్కుమారుని దగ్గరికి వచ్చి తనకు ‘బ్రహ్మం’ అంటే ఎవరో తెలియజేయవలసిందిగా కోరినాడు.
“మొదటి బ్రహ్మం గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు” అని సనత్కుమారుడు అడిగాడు.
దానికి బదులుగా నారదుడు ఇచ్చిన సమాధానం మన కాశ్చర్యాన్ని కల్గిస్తుంది. “ఓ మహాత్మా! నేను చదవని విద్యలు లేవు. నాల్గువేదాలను గురు ముఖంగా చదివాను. ఇతిహాసాల మర్మం తెలుసుకున్నాను. పురాణాల్లోని రహస్యాలను గ్రహించాను. విజ్ఞాన గ్రంథాలను తిరిగేశాను. గణితవిద్య, తర్కవిద్య, నీతిశాస్త్రం, నిరుక్తం చదివాను. జీవశాస్త్రాన్ని అధ్యయనం చేశాను. భౌతిక రసాయనిక శాస్త్రాలను ఆమూలాగ్రం పరిశీలించాను. ధనుర్విద్యను, జ్యోతిష్య విద్యను, సర్పవిద్యను నేర్చుకున్నాను. లలిత కళలను అవలోకించాను. ఇన్ని విద్యలు గడించినప్పటికీ నాకు ‘బ్రహ్మం’ అంటే ఎవరో తెలియకుండా ఉంది. నేను మంత్ర విదుడను అయ్యానుగాని, బ్రహ్మవేత్తను కాలేకపోయాను. పరబ్రహ్మ తత్త్వం తెలిస్తేనే దుఃఖం నుండి నేను బయటపడగలను. నాకు బ్రహ్మ మెవరో తెలియజేసి మోక్షాన్ని ప్రసాదించండి” అని వేడుకున్నాడు.
అప్పుడు సనత్కుమారుడు నారదునితో “నువ్వు నేర్చినదంతా శబ్ద విద్యనే. ఆత్మను తెలుసుకోవడానికి శబ్దోపాసన అవసరమేగాని, సాధకుడు అక్కడే ఆగిపోరాదు. ఎవరు నామాన్ని బ్రహ్మం అంటూ ఉపాసిస్తారో, వారు శబ్దార్థ జ్ఞానంలో చక్కగా విహరించగలుగుతారు. అంతేగాని వారికి బ్రహ్మం ఎవరో తెలియదు” అని సమాధానమిచ్చాడు.
నారదుడు వెంటనే ‘నామానికంటె మించింది ఉన్నదా?’ అని ప్రశ్నించాడు. ‘నామం కంటె వాక్కు గొప్పది’ అని సనత్కుమారుని సమాధానం. విశ్వవిజ్ఞానమంతా వాక్కు చేతనే తెలుస్తుంది కాని, వాక్కునే బ్రహ్మమని ఉపాసిస్తే అతనికి బ్రహ్మం దొరకడు అని సనత్కుమారుడు చెప్పినాడు. ‘వాక్కునకు మించింది ఉన్నదా అని నారదుని ప్రశ్న. ‘మనసే వాక్కు కంటే గొప్పది’ అని సనత్కుమారుని సమాధానం. మనస్సు కంటే మించింది ఉన్నదా? అని నారదుని ప్రశ్న. దానికి సనత్కుమారుడు “మనస్సుకంటే మించింది సంకల్పం. సంకల్పం చేతనే మనం కర్మలు చేస్తున్నాం. ప్రతిది సంకల్పం వల్లనే సాధ్యమవుతుంది. వాయురాకాశాల్లో, నీరగ్నులలో ఉన్నది సంకల్పమే. అది చక్కగా పనిచేయడంవల్లనే వర్షం కురుస్తుంది. వర్ష సంకల్పంవల్లనే అన్నం లభిస్తుంది. అన్నంవల్లనే ప్రాణం, ప్రాణసంకల్పంవల్లనే మంత్రశక్తి, మంత్రసంకల్పంవల్లనే అన్ని పనులు సాధ్యమవుతాయి. ఎవరిలో సత్ సంకల్పం ఉదయిస్తుందో వారే ఫలసిద్ధికి అర్హులు” అని వివరించగా నారదుడు సంకల్పాన్ని మించింది ఉందా? అని అడిగాడు. అందుకు ‘సనత్కుమారుడు సంకల్పాన్ని మించింది చిత్తమని, చిత్తశుద్ధివల్లనే మనిషి బ్రహ్మవిదుడవుతా”డని చెప్పగా దానికంటే మించినదున్నదా? అని నారదుడడిగాడు. “చిత్తం కంటె ధ్యానం మించింది. సమస్త ప్రపంచం ధ్యానంలో మునిగి ఉన్నట్లు చూడవచ్చు. ఎవరి పనులు వారు చక్కగా చేస్తున్నారంటే దానికి ధ్యానమే కారణం. అధికులుగాని, అల్పులుగాని, రాజులుగాని, సేవకులుగాని ధ్యానంవల్లనే తమ తమ పన్ను చక్కబరుచుకుంటా”రని సనత్కుమారుడు చెప్పగా నారదుడు ధ్యానాన్ని మించినదున్నదా? అని ప్రశ్నించాడు. ‘ధ్యానాన్ని మించినది విజ్ఞానం ఒక్కటే’ అయితే విజ్ఞానం లోకానికి సంబంధించింది. దానివల్ల బ్రహ్మం దొరకదు. విజ్ఞానం ఐహిక సుఖాలను మాత్రమే ఇవ్వగలదు, మోక్షానికది ప్రత్యక్షంగా కారణం కాజల’దని సనత్కుమారుడు సమాధాన మిచ్చాడు. అప్పుడు నారదుడు దాన్ని మించినదున్నదా అని అడుగగా సనత్కుమారుడు కేవలం విజ్ఞానం ఉంటే చాలదు. దానికి తగిన దేహబహలం అవసరం. దేహబలమే ఆయా జన్మలను సార్థకం చేస్తున్నది. కాని దేహబలమొక్కటే బ్రహ్మంకాదని సనత్కుమారుడు చెప్పగా నారదుడు దాన్నిమించింది ఉన్నదా అని అడిగాడు. దానికి సమాధానంగా సనత్కుమారుడు బలం కంటె అన్నం గొప్పది. అన్నంవల్లనే బలం కల్గుతుంది కాని అన్నమే అన్నింటికంటే గొప్పది కాదు.
ఎవరు అన్నాన్ని బ్రహ్మంగా భావించి ఉపాసిస్తారో వారికి అన్నమే లభిస్తుంది కాని బ్రహ్మం లభించదు” అని చెప్పగా దాన్ని మించింది ఉన్నదా? అని నారదుడడిగాడు. “జలంవల్లనే అన్నం లభిస్తుంది కనుక, అన్నంకంటే జలమే గొప్ప’ అని సనత్కుమారుడు సమాధానం ఇచ్చాడు. దాన్ని మించిందున్నదా అని నారదుడడుగగా’ అగ్ని జలం కంటే గొప్పది’ అని సనత్కుమారుడు చెప్పాడు.
ఇంకా క్రింది విధంగా వారి సంవాదం కొనసాగింది.
నారదుడు : అగ్నికంటె గొప్పదేది
సనత్కుమారుడు : ఆకాశం
నారదుడు : ఆకాశాన్ని మించిందేది?
సనత్కుమారుడు : ‘స్మృతి’ స్మృతి లేకపోతే ఎవ్వరినెవ్వరూ గుర్తుపట్టలేరు.
నారదుడు : స్మృతికంటే గొప్పదేది?
సనత్కుమారుడు : ‘ఆశ’. ఆశ ఉంటేనే స్మృతి ఏర్పడుతుంది కదా?
నారదుడు : ఆశ కంటే మించినదున్నదా?
సనత్కుమారుడు : ప్రాణం ఆశకంటే మించినది. ప్రాణాన్ని బ్రహ్మంగా భావించేవాడు. నామం మొదలు ప్రాణంవరకు
అభ్యుదయం పొందగలడు. కీర్తికెక్కగలడు. కాని ప్రాణం కంటే బ్రహ్మం (పరమాత్మ) మించినవాడు.
బ్రహ్మం తన మహిమలోనే ప్రతిష్ఠితుడౌతాడు. అతడే సర్వవ్యాపకుడు. అతడు అన్ని ప్రాణుల్లో, అన్ని
జడపదార్థాల్లో ఉన్నాడు. అన్ని దిశల్లో ఉన్నాడు. అతడు లేని చోటులేదు. ఎవరు బ్రహ్మంను తెలిసి ధ్యానిస్తారో వారికి, ప్రాణం, ఆశ, స్మృతి, ఆకాశం, అగ్ని, నీరు, అన్నం, బలం, కోరిక, మనస్సు అన్ని సిద్ధిస్తాయి. కనుక బ్రహ్మం (పరమాత్మ)ను అన్నింటికంటే మించిందిగా భావించి, ధ్యానించవలెను” అని సనత్కుమారుడు నారదునికి బ్రహ్మోపదేశం చేశాడు.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

చిలుక కథలు (కథా గుచ్ఛము)

by Arutla Sridevi April 9, 2022
written by Arutla Sridevi

1. గూడు చేరిన చిలుక
ఒక రోజు చిలుకమ్మకు బాగా ఆకలివేసి పండ్లు, గింజలేమన్నా దొరుకుతాయేమోనని అడవిలో చెట్లనీ గాలించింది.
దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. ఇంతలో ఒక చోట చిలుకలగ్నీ చాతుర్మాస దీక్ష చేస్తూ ఒక దగ్గర సమావేశమైనాయి. అవి భజన చేసి భగవంతుడి శిల్పం ముందు రకరకాల పండ్లను నైవేద్యంగా పెట్టినవి. ఇంతలో చిలుకమ్మ ఎగురుతూ ఆ నైవేద్యాన్ని చూసింది. ఆకలికి ఆగలేని చిలుకమ్మ ఎవ్వరినీ అడగకుండా అందులోని కొన్ని పండ్లు తిన్నది. అది చూసిన మిగతా చిలుకలకు బాగా కోపమొచ్చింది. అవి వెళ్లి చిలుకమ్మ అమ్మా నాన్నకు చిలుక ఈ విధంగా చేసిందని చెప్పినాయి. చిలుకమ్మ అమ్మా నాన్నకు చిలుకపైన కోపం వచ్చింది. అవి దాన్ని గట్టిగా కసురుకున్నాయి. చిలుకమ్మ చిన్నబోయింది. అది దాని అమ్మానాన్న మీద అలిగి వాటికి చెప్పకుండా గూటిలోనుండి వెళ్లిపోయింది. చిలుకకు దేవుడి మీద కూడా బాగా కోపం వచింది. అది దేవుడులేనే లేడు, నేను ఇకనుండి దేవుని నమ్మనే నమ్మను అని తీర్మానించుకుంది.
అదట్లా ఆలోచిస్తూ ఓ చెట్టు కొమ్మపై కూచుంది. ఇంతలో అక్కడికి ఒక గద్ద వచ్చి వాలింది. ఒంటరిగా ఉన్న చిలకమ్మతో “గద్ద” మాట కలిపింది. అసలే ఒంటరితనంతో దిగాలు పడ్డ చిలుకమ్మకు గట్టి తనతో మాట్లాడడం ఎర్రటి ఎండలో చల్లటి పిల్లగాలి వీస్తే ఎంతహాయిగా ఉ ంటుందో అంత హాయిగా అనిపించింది. చిలుకమ్మ ఎగిరి గంతేసి గద్దతో స్నేహం చేసింది.
ఒక రోజు “గద్ద” చిలుకతో ఏమే చిలుకమ్మా ఎంత సేపని ఒంటరిగా ఉంటావు. ఎలాగూ మనిద్దరం దోస్తులం గదా నా గూటికే వచ్చేస్తే ఎంత మంచిగ ఇద్దరం కలిసుందాం అని గద్ద చెప్పింది సబబయినదే అనిపించింది. అది గద్దతో సరే నీతో వస్తాను అని పయనమయ్యింది. రెండూ సాయంత్రానికల్లా గద్ద గూటికి చేరుకున్నాయి. చిలుకా, గద్దా హాయిగా కలిసిమెలిసి ఉ న్నాయి.
గద్ద కుటుంబ సభ్యులు గద్దను పిలిచి ఇట్లన్నాయి “గద్ద పెద్దడా, గద్ద పెద్దగా మనందరం నల్ల ఈకలతో ఉంటే చిలుక పచ్చ ఈకలతో ఉంది. ఇది మన గూటిలో ఇముడదు” అన్నాయి.
చిలుకను వెళ్లగొట్టడం గద్దకిష్టం లేదు. ఎందుకంటే చిలుక రోజుకో రకపు పండ్లను ఎక్కడ నుంచైనా సేకరించి తేగలదు. ఆ శక్తి గడ్డలకు లేదు. అందుకే చిలుకను వదులుకోవడం గడకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. అట్లని చెప్పి కుటుంబ సభ్యుల మనస్సు కష్టపెట్టడం కూడా గద్దకు ఇష్టం లేదు. అందుకని అది చిలుకతో “చిలుకమ్మా నువ్వొక్కదానివి వేరే రంగులో ఉ న్నావు నువ్వు కూడా మాలాగా మారితే మాలో ఒకదానివిగా ఉంటావు ఏమంటావ్ అనడిగింది. అందుకు చిలుక ఉన్నట్టుండి నల్లగా నేనెట్లా మారేది? అనడిగింది. ఏం పరవాలేదు. అందుకు నేనొక ఉపాయం ఆలోచించిన నువ్వు నాతో వస్తే చాలు అన్నది గద్ద. సరే పదా అని గద్ద, చిలుక ఎగురుతూ ఎగురుతూ ఒక బొగ్గుగని దగ్గరకు చేరినవి. అక్కడ బొగ్గుపొడి ఒక కుప్పగా పోసి ఉన్నది. “నువ్వెళ్లి ఆ బొగ్గు పొడిలో బాగా పొర్లిరావే చిలుకా” అని గద్ద చెప్పింది. చిలుక అట్లే చేసింది. చిలుక నల్లగా మారిపోయింది.
ఇప్పుడు గద్దకు బాగా సంతోషమయింది. చిలుక కూడా మా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయిందని, కానీ గద్ద కుటుంబ సభ్యులకు ఎటువంటి తృప్తి కలగలేదు. “చిలుక పండ్లు తినడం మాకిష్టం లేదు. అది కూడా మన మాదిరి శవాలను పొడుచుకు తింటే బాగుంటుందిరా గద్ద పెద్దాడా” అన్నాయి. “గద్ద” అట్లాగే చిలుకమ్మకు శవాలపై కూచుండి పొడుచుకు తినమని చెప్పింది. ఈ షరతు చిలుకమ్మకు నచ్చలేదు. అది ‘గద్ద’ తో చెప్పకుండా చాలా దూరంగా ప్రయాణించి ఒక చెట్టుకొమ్మపై వాలింది.
ఆ చెట్టు నాశ్రయించి కొన్ని కోతులు జీవిస్తున్నాయి. అవి చిన్నబోయిన చిలుకమ్మను పలుకరించాయి. ,చిలుకమ్మ కష్టాలు విని జాలి చూపించాయి. ఇక నుండీ ఇక్కడనే ఉండు నీకేం బాధలేదు అన్నాయి. చిలుకమ్మ ఆరోజు నుండి అక్కడనే ఉండసాగింది. చిలుకమ్మకు బాగా నిద్రపట్టింది. కానీ కోతులు ఒక కొమ్మ మీద నుండి మరొక కొమ్మకు దూకుతూ ఉంటే చెట్టంతా భూకంపమొచ్చి అదిలినట్టుగా అనిపించింది. మంచి నిద్ర కాస్త చెడిపోయింది. ఇట్లాగే ప్రతిరోజు జరగడంతో చిలుకమ్మకు నిద్రాభంగమై ఆరోగ్యం కాస్తా దెబ్బతిన్నది. దానికి తలనొప్పి రోగం వచ్చింది. దేవుడా అనుకుంటు అది ఆ చోటు నుండి కూడా ఎగిరిపోయింది. పోయి పోయి చిలుక ఒక తంగేడు చెట్టుపై వాలింది. దానిమీద కొన్ని గురుక పిట్టలు ఉన్నాయి. ఒక వేటగాడు గురుక పిట్టలను వేటాడడానికి వచ్చాడు. అతడు పిట్టలను గులేరుకు బండలను పెట్టి కొట్టసాగాడు. అట్లా రాళ్ల దెబ్బలకు కొన్ని పిట్టలు కింద పడిపోయినవి. వాటిని పట్టుకుని వేటగాడు బుట్టలో వేసుకుని పోయినాడు. ఆ రాళ్ల దెబ్బలు అక్కడే ఉన్న చిలుక కాలికి తగిలింది. అది నొప్పితో బాధ పడుతుంది. సరిగ్గా ఎగుర లేకపోతుంది. అది కుంటుకుంటు, కుంటు కుంటూ ఒక దగ్గరలో ఉన్న ఒక పోచమ్మ గుడిలోని దీపపు గూటిలో కూచుంది. ఆ గుడి ముందే జ్యోతిష్యం చెప్పి పొట్ట పోసుకుంటున్న ఒక జ్యోతిష్యుడు కాలు విరిగిన చిలుకను చూసి జాలిపడ్డాడు. అతడు దానికి వైద్యం చేసి నొప్పి తగ్గించి కాలును బాగుచేశాడు. అందుకుగాను చిలుక అతనికి కళ్ల చూపులతోనే కృతజ్ఞతలు తెలుపుకుంది.
వెంటనే జ్యోతిష్కుడు దాన్ని పట్టి పంజరంలో ఉంచాడు. “నేను నీకు ఇంత సహాయం చేసినందుకు నువ్వు నాకు జీవితాంతం సేవ చేయాలి. నా జ్యోతిష్య వృత్తిలో నువ్వు సహకరించాలి” అన్నాడు. జ్యోతిషుని కుటిలత్వానికి చిలుక చాలా బాధ పడ్డది. దానికి రాత్రికి లాలిపాడుతూ నిద్రపుచ్చే అమ్మ, బతిమాలి బతిమాలి జామపండ్లు తినిపించే నాన్న గుర్తుకు వచ్చారు. చిలుకకు దుఃఖం ముంచుకొచ్చింది. అది ఏడ్చి ఏడ్చి పంజరంలో అట్లాగే నిద్రపోయింది.
తమ బిడ్డను వెదకడానికి వచ్చిన చిలుక తల్లి దండ్రులు జ్యోతిష్యుడు కూచున్న చెట్టుపై వాలాయి. అవి పంజరంలో నిద్రపోతున్న చిలుకను చూశాయి. అది తమ బిడ్డే అని గుర్తు పట్టాయి. అవి వెంటనే జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లి వివిధ రకాలుగా బ్రతిమాలి తమ బిడ్డ చిలుకను తమకిచ్చేయమని దీనంగా ప్రార్థించాయి. ఎంతోసేపటికి గాని జ్యోతిష్యుడి మనసు కరగలేదు. చివరికు అతడు ఆ చిలుకను విడిచిపెట్టేశాడు. తల్లి చిలుక తన బిడ్డను ఒడిలోకి తీసుకొని లాలించింది. తండ్రి చిలుక ముద్దులు పెట్టుకున్నాడు.
ఎంత కోపమొచ్చినా తన వారిమీద అలిగి ఎక్కడికీ వెళ్ళిపోకూడదని చిలుక పశ్చాతాప పడింది. అది ఇంకెప్పుడూ అట్లా వెళ్ళిపోనని తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. తాను సురక్షితంగా బయటపడ్డందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నది.

April 9, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

షట్చక్రవర్తి చరిత్రము- డా. నందవరం మృదుల

by డా|| మృదుల నందవరం April 9, 2022
written by డా|| మృదుల నందవరం

ప్రబంధ వ్యాసాలు

గురజాల రామశేషయ్య

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి


ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.

ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.

మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .

వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్దమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.

పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.

కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.

ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .

కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .

తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471

 

డా. నందవరం మృదుల :
డా. నందవరం మృదుల గారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో తెలుగు సహాయ ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న విదుషి. సంస్కృతాంధ్ర భాషా సాహిత్య మర్యాదలు తెలిసిన మహిళ. కవిత్వ ఆదర్శ లక్షణాలతో పాటు నాట్య శాస్త్ర విశేషాలు సైతం పరిశీలించిన ప్రజ్ఞామూర్తి. తనదైన ముద్రలో సాహిత్య పాఠం చెప్పగల సలక్షణ అధ్యాపకురాలు.
ఎన్నదగిన క్రమశిక్షణలో తెలుగు సాహిత్యాధ్యయనం చేసి ఎం.ఫిల్‌ మరియు పిహెచ్‌.డి. పట్టాలను స్వీకరించినది. అంతేనా! అంతకు ముందే డిగ్రీ స్థాయిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘‘స్వర్ణపతకాన్ని’’ కైవసం చేసుకున్నది. ఇంతేనా! కాదు. డిగ్రీ స్థాయి సంస్కృతం చదువుకు సైతం ‘‘స్వర్ణ పతకం’’ జతగా చేర్చుకున్నది. మరింకా చెప్పాలంటే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి పి.జి. స్థాయి తెలుగు అధ్యయన అభ్యసనానికి కూడా ‘‘స్వర్ణ పతకం’’ సాధించుకున్నది. ముచ్చటగా మూడు స్వర్ణపతకాలను పొందినది. వినయసంపన్న. సరస్వతి దయను చవిచూసిన ‘‘మృదుల’’ ఆమె పేరుకు తగ్గట్టు నామ మద్రాలంకార రీత్యా మృదు స్వభావి. ప్రతిపద సమప్రాధాన్య స్పష్టంగా వాక్యాలను పలుకుతూ సాహిత్య ప్రసంగం చేయటం ఈమె శైలి.
తిక్కన గారి సాహిత్యంపై విరాటోద్యోగ పర్వాల పరిధిలో ‘‘తిక్కన కవిత` నాట్యశాస్త్ర మర్యాదలు ’’ అనే ఎం.ఫిల్‌. గ్రంథం; తిక్కన సీస పద్యాలు ` పరిశీలన ’’ అనే పిహెచ్‌. డి. సిద్ధాంత గ్రంథం ఈమె వైదుష్యానాకి తార్కాణాలు. మొత్తం మహాభారతం గురించి, తిక్కనగారి ఇతరేతర సాహిత్య లక్షణాంశాలను గురించి విద్వాంసులు మెచ్చే వ్యాసాలు విశ్లేషణ వ్యాసాలు కూడా ప్రసిద్థ పత్రికలలో ప్రచురించింది. అంబటి పూటి వెంకటరత్నం గారు తెలుగు సంస్కృతం బాగా నేర్చిన వారు. మహా విద్వాంసుడు. రసజ్ఞ కవితామూర్తి. భక్తి తనువునిండా మనసు నిండా నింపుకున్న శిష్యవాత్సల్య మూర్తి. ఆయన శిష్యులలో నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీసిరిప్రగడ భార్గవరావు పద్యరచనలో నన్నయాది కవుల పంక్తిలో అవిస్మృతికరమైన పద్య శిల్పము నందుకున్న మేటి. విశ్వనాథ, శేషేంద్రల మనసుకెక్కి ప్రశంసింపబడిన ధన్యకవి. అయితే ఇక్కడ నేను ప్రస్తావించవలసిన ముఖ్యాంశమేమిటంటే వెంకట రత్నకవి అనేక ఛందస్సులతో తమ ‘‘కృష్ణ భక్తి’’ తత్పర భావం లో భాగంగా ‘‘గోపీకావ్యం’’ అనేకానేక ఛందస్సులతో కూడినది రచించినారు. ఆ కావ్యం గురించి ప్రస్తుత వ్యాసరచయిత్రి డా. ఎన్‌. మృదుల ‘‘గోపీ కావ్యం ` లక్ష్య సంగ్రహం’’ శీర్షికతో వ్యాసం రచించింది. ఈమె వ్యాసాలు ఎక్కువభాగం భారతం గురించి, తిక్కన గురించి వ్రాసినవే. అయినా కథానికల గురించి తదితర ప్రక్రియల గురించి కొన్ని వ్యాసాలు రచించి తన సాహిత్యఅభినివేశాన్ని తెలుపుకున్నారు. జాతీయ, ఆంతర్జాతీయన సెమినార్లలో ప్రసంగించిన వక్తగా గుర్తింపును పొందిందీమె.
ప్రస్తుతం ఉద్యోగ ధర్మంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యురాలుగా, తెలంగాణ రాష్ట్ర ‘‘ ఉన్నత విద్యాశాఖ ` కళాశాల విద్య ’’ పక్షాన ప్రత్యేకంగా రూపొందిస్తున్న ‘‘భాషా పత్రిక’’ సంపాదక సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు.
నా ‘‘ తెలంగాణ ప్రబంధాలు’’ ప్రాజెక్ట్‌లో తొలివిడత ఐదు ప్రబంధాలలో కామినేని మల్లారెడ్డి రచించిన ‘‘షట్చక్రవర్తి చరిత్ర’’ ఒకటి. ఈ ప్రబంధంలో తెలుగు కమ్మని పలుకుతో పాటు సంస్కృతచ్ఛాయా శైలి అధికము. పావనోదార చరితులైన ‘‘ షట్చక్రవర్తుల కథలు ’’ ప్రబంధీకరింపబడిన రసప్లావిత మనోహర పద్య శైలీ కావ్యం ‘‘ షట్చక్రవర్తి చరిత్ర’’.
నేను కోరగానే వ్యాసరచనకు అంగీకరించి వ్యాసాన్ని అందజేసిన మృదులకు పురోభివృద్థి శుభాకాంక్షలతో శుభాశీస్సులు అందిస్తున్నాను.
ఈ సందర్భంలో ధారావాహికంగా నా ‘‘తెలంగాణ ప్రబంధాలు’’ తొలి విడత ఐదు వ్యాసాలను తమ ‘‘ మయూఖ’’ అంతర్జాల ద్వైమాసిక పత్రికలో ప్రచురించి వెలుగులోకి తెచ్చిన ప్రసిద్ధ కవయిత్రి, కథారచయిత్రి, పరిశోధకురాలు, మంచి వక్త, సంపాదకులు డా. కొండపల్లి నీహారిణి గారికి కృతజ్ఞతా పూర్వకంగా శుభాశీస్సులు తెలుపుకుంటున్నాను.
జయంతే సకృతినో ! రససిద్ధాః కవీశ్వరాః
కావ్యం నిలబడితేనే జాతి బలపడుతుండి. (రాశేకలం)
గురిజాల రామశేషయ్య
రిటైర్డ్‌ అసోసియేయట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ తెలుగు

షట్చక్రవర్తి చరిత్రము
‘తెలంగాణములో కవులు లేరు’ అన్నమాటకు సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ కవుల సంచిక ద్వారా సమాధానం చెప్పారు. ఈ సంచిక- ఈ నేలలో ఎందరు కవులు విలసిల్లారో, ఎంత సాహిత్యం విస్తరించిందో తెలియజేసింది. తెలంగాణమలో ప్రాచీనకాలము నుండి వచ్చిన రచనలు తెలిపి, ఈ మట్టి ప్రాభవాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది – ఈ పత్రిక. అంతేకాదు, ప్రభువులకు ధీటుగా సంస్థానాలు ఏ విధమైన సాహిత్య కృషి చేసాయో వివరించింది.
1. కవిస్థల కాలాదులు : సాహితీ పోషణలో ప్రధానపాత్ర వహించింది – నిజాం ప్రభువుల పాలనలో ఉన్న మెదక్ మండలములోని బిక్కనవోలు సంస్థానము. ఈ సంస్థానాధిపతి అయిన కాచ భూపతి యొక్క నాల్గవ పుత్రుడు రాజా మల్లారెడ్డి రచించిన షట్చక్రవర్తి చరిత్ర తొలి మహాప్రబంధంగా గుర్తింపు పొందింది.
రాజామల్లారెడ్డి శివధర్మోత్తరము, పద్మపురాణము అనే గ్రంథాలు కూడా రచించారు. ఇంకా ఇతర రచనలు చేసినట్లు ప్రతీతి. కాని అలభ్యములు. షట్చక్రవర్తి చరిత్రకు పీఠిక రాసిన పెద్దమందడి వేంకట కృష్ణకవి గారు మల్లారెడ్డి గారి సోదరుల గురించి, వారి కాలంలో వచ్చిన గ్రంథాల గురించి తెలిపారు.

సీ. రమణీయ బాలభారత కిరాతార్జునీ
యాది ప్రబంధములందినాడు
దేవమందిర మహీదేవ గృహా రామ
నిధితటాకంబుల నిలిపినాడు
దాన కంకణము జేబూని యర్థులనెల్ల
ధనధాన్య రాసులందనిపినాడు
శౌర్య హర్యక్షుడైన సంగరాంగణము నం
దరి నృపాలు గర్వమడచినాడు

గీ. నిఖిల దేశావనీశులు నిచ్చ మెచ్చ
గర్తలతికల దిశల బ్రాకించినాడు
ధరచతుర్థక మాత్రుడే ధరణి సురల
కిలను వేలుపు గిడ్డియా యెల్లరెడ్డి (పద్మ. పుట. 10)
ఈ పద్యం మల్లారెడ్డి గారి మూడవ అన్న అయిన ఎల్లారెడ్డిగారు ఎటువంటి గ్రంథాలు అందుకున్నారో తెలియజేస్తుంది. అంతేకాదు ఆనాడు ఎటువంటి గ్రంథాలు వెలువడ్డాయో, ఆనాటి సంస్థానాధీశులు సాహిత్య సృజనకు ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో కూడా మనకు అవగతం అవుతుంది.
పైగా ఆ రచనల్లోని వైవిధ్యాన్ని కూడా మనం గుర్తించవచ్చు. సంస్థానాధీశుల సేవానిరతిని గ్రహించవచ్చు. అది ప్రబంధాలు పరిఢవిల్లే కాలం అని భావించవచ్చు.
ఇటువంటి కాలంలో వెలువడిన ఏ గ్రంథమైనా సర్వసమగ్రంగానే నిలుస్తుంది. అందులో మేటి మన తొలి తెలంగాణ ప్రబంధం – ‘షట్చక్రవర్తి చరిత్ర’. ఈ గ్రంథము ఆరుగురు మహారాజుల చరిత్రను తెలిపే మహాప్రబంధము.
2. కథల సంగ్రహం : షట్చక్రవర్తి చరిత్ర ఎనిమిది ఆశ్వాసముల ప్రబంధము.
ప్రథమ, ద్వితీయ, తృతీయాశ్వాసములలో హరిశ్చంద్ర మహారాజు కథ, చతుర్ధ, పంచమా శ్వాసములలో నలమహారాజు కథ, షష్ఠాశ్వాసములో పురుకుత్స, పురూరవ మహారాజుల కథ, సప్తమా
శ్వాసములో సగర చక్రవర్తి కథ, అష్టమాశ్వాసములో కార్తవీర్యుని కథ చెప్పబడింది. ఈ కథలను పరిశీలించినట్లయితే
2.1 హరిశ్చంద్ర మహారాజు కథ
2.2 నలమహారాజు కథ
2.3 – పురుకుత్స మహారాజు కథ
2.4 – పురూరవ మహారాజు కథ
2.5 – సగర చక్రవర్తి కథ
2.6 – కార్తవీర్యుని కథ
(కథలు టైప్ చేయబడినవి)
ఈ కథలు వేటికవే ప్రబంధం కాగలిగిన లక్షణాలు కలిగినవి. కాని కవి వీటిని ఒక సమాహారంగా చేసి ఒకే గ్రంథంగా ఇవ్వడంలోని ఆంతర్యం – ‘రాజు’ అయినవాడు ఈ ఆరుగురిని ఆదర్శంగా తీసుకొని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధర్మానికి కట్టుబడి నిలిచి పోరాడాలని తెలియజేయడం. అప్పుడే చరిత్రలో నిలబడగలిగే చక్రవర్తులవుతారని అంతర్లీన బోధన. ఈ కథలను నేటి ప్రజాస్వామ్య పాలన కొరకు కూడా అన్వయం చేయవచ్చు.
3. ప్రబంధ సాధారణ లక్షణాలు : డా. జి.నాగయ్య గారు ‘తెలుగు సాహిత్య సమీక్ష’ మొదటి సంపుటంలో ప్రబంధ ప్రక్రియ గురించి చర్చించి నిర్ణయించిన అంశాలు ఈ సందర్భంలో పరిశీలించదగినవి.
“స్థూల దృష్టికి కావ్య ప్రబంధ శబ్దములు రెండును సమానార్థకములే. రెండిటియందును అష్టాదశ వర్ణనాదులు సామాన్యములే. కనుక సామాన్యములకు వీటి భేదము గుర్తింపరానిది.
సంస్కృతాలంకారికులు, కవులు, వ్యాఖ్యాతలు ప్రబంధ శబ్దమును ‘కావ్య సామాన్య వాచి’గా ప్రయోగించినారు. కాని ఒక సారస్వత ప్రక్రియా విశేషముగ మాత్రముపయోగింపలేదు.. ప్రబంధ పద ప్రయోగ విషయమున తెలుగు లాక్షణికులు సంస్కృతాలంకారికులనే అనుసరించినట్లున్నది. నన్నెచోడునితో పాటు తిక్కన, కేతన, మంచన, ఎర్రన, శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు, నంది మల్లయ్య, ఘంటసింగనలు మొదలగువారు ప్రబంధ కావ్యపరముగానే ప్రయోగించినారు. తిక్కన తాను రచించిన పదునేను పర్వముల భారతమును “ప్రబంధ మండలి” అని పేర్కొనెను. పురాణమగు హరివంశమును కూడ ఎర్రన ప్రబంధమనియే వ్యవహరించినాడు. వీధి నాటకమగు క్రీడాభిరామము, వీరగాథా కావ్యమగు పల్నాటి వీర చరిత్రలు కూడ ప్రబంధములుగానే వ్యవహరింప బడినవి. అల్లసారి పెద్దనాది కవులును తమ ప్రబంధములను కావ్యములుగానే పేర్కొనియున్నారు….తెలుగు సాహిత్య చరిత్రకారులు కావ్య ప్రబంధ శబ్దములకు అర్థభేదము కల్పించి…. కృష్ణదేవరాయల యుగము – క్రీ.శ. 16వ శతాబ్దమును ప్రబంధ యుగమని ప్రత్యేకముగా పేర్కొన్నారు. క్రీ.శ. 16వ
శతాబ్దము నందు వెలువడిన కావ్యములకు మాత్రమే ప్రబంధమను పేరు రూఢమైనది… ‘రచనా విధానములో కథావస్తువులో పాత్ర చిత్రణములో రసపోషణలో అలంకార వర్ణనాధికములో ప్రబంధములో కొత్తరీతులను సంతరించుకొన్న కావ్య ప్రక్రియ…. ప్రకృష్టమైన బంధము కలది ప్రబంధము. బంధ శబ్దమునకు ‘కూర్పు’, ‘నిర్మాణము’ అను నర్థములు కలవు. సంఘటనలు, వర్ణనలు మొదలగు కావ్యగత విషయములన్నియు ప్రధాన ప్రయోజనాభిముఖముగా అనుసంధింపబడిన కావ్యమే ప్రబంధమని చెప్పవచ్చును” పుటలు 594-596. “ప్రబంధ కవులు కేవలము కథావస్తువు కొరకు మాత్రము పురాణములపై ఆధారపడి ఆ కథావస్తువును గ్రహించి దానికి స్వకపోల కల్పితములైన వర్ణనాదుల గూర్చి వన్నెచిన్నెలు కల్పించి ఒక మనోహరతను, ఒక నవ్యతను సృష్టించినారు… పూర్వ కవులు ఉపమాలంకారము, రూపకము, స్వభావోక్తి వీనిని తమ రచనలలో ఎక్కువగా వాడుచుండిరి. ప్రబంధ కవులు ఈ అలంకారములకు తోడు ఉత్ప్రేక్ష, అతిశయోక్తి వీనిని విరివిగా మార్చిరి. పూర్వకవులు మొత్తము మీద సులభ సామాన్యశైలికి నలవడినవారు. ప్రబంధయుగము నాటి నుండియు కవులు పండిత ప్రీతికై ప్రౌఢ శైలిలో రచించెడివారు. వీరు కూడ మృదువైన రచన అక్కడక్కడ చేయకపోలేదు.
4.వర్ణనా చాతుర్యం : ఈ షట్చక్రవర్తి చరిత్రములో కవి వర్ణనా నైపుణ్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
4.1. విశ్వామిత్రుని వర్ణన : విశ్వామిత్రుడిని హరిశ్చంద్రుడు సాక్షాత్తు శివునిగా భావిస్తున్నట్లు కవి రచన చేస్తారు.
సీ.కరుణారసము వెలికురికెనోయనమౌళి
బల్లవస్ఫుటజటాపటలమమర
జాబిల్లిపూదేనె జిరెనోయన మేన
నతనుభూతి ప్రభావితతి మెఱయ
రహిగంటిలో వహ్ని రాజుచున్నదియన
నొసల మేలిమి బొట్టు పసలమసల
దొలికినగాంగబిందు పరంపరోయన
నటుతను స్ఫటికహారాళి బెళుక

గీ.గలికివన్నియ పులితోట కటిని గట్టి
యీశ్వరుడు బోలి గాధేయుడేగువేర
నెదురుగానే భయభక్తులెనగ నృపతి
యర్ధదండ ప్రణామంబు లాచరించె (2-21)
శివునిరూపును విశ్వామిత్రునిలో ఉపమించి చెప్పడం-కవిలోని వర్ణనావైచిత్రి తెలుస్తుంది. పద్యపాదాలలోని మొదటి పదాలు ఉపమానాలుగాను, మధ్యపదాలు ఉపమేయాలుగాను, చివరిపదాలు క్రియావాచకాలుగాను ఉండటం మనం గమనించవచ్చు. ఇటువంటి పద్యరచన తిక్కన సీసపద్య రచనకు దగ్గరగా ఉన్నదని కూడా చెప్పవచ్చు.
4.2. బోయవారల వేట వర్ణన :
అడవిలోని బోయలు ఏవిధంగా వేటకు సిద్ధపడ్డారో కవి-
సీ. బలుకెంపులగు మీసముల గుంపులను మధ్య
ములకంపు పాలపెంపు దొలకరింప
వడదోళ్ళు గురివెద మెడనూళ్ళునుడు గని
వెడవేళ్ళు తలముళ్ళు వెడదనోళ్ళు
సెలవిళ్ళు తగు వన్యముల తిళ్ళును మెకాల
గుడికాళ్ళు మిడిపళ్ళు కురుకుదోళ్ళు
కనుకట్లు పరియాచ కపుదిట్లు కనువట్లు
నెద పెట్లు తలచుట్లు నెఱ్ఱబాట్లు.

గీ. చిల్లకోలలు చలికూళ్ళ చిక్కములను
గలిగియత్యత భీకరాకార పటిమ
రాకచేచాయపతిహజారంబు చాయ
బోయ దొరమూక వీకతోడాయనిలిచి (2-53)
అని అచ్చతెలుగు పదాలతో బోయ దొర, బోయ దొర మూకలు ఎలా వేటకు బయలుదేరాయో చక్కగా వర్ణించారు. ఇటువంటి వర్ణనే హరిశ్చంద్రుని వద్ద –
సీ. మురువుగారవగంధములు మేనుల నలంది
కస్తురిబొట్లలికముల దీర్చి
పసిడిపూలరుముళ్ళు పలుదెఱంగులగట్టి
సందిళ్ళ గడియముల్పొందు పఱచి
మొలబట్టుదట్టీలు మొనయవంకలు చెక్కి
కీలుకత్తులుకేలగీలు కొలిపి
పొదుపుగానమ్ముల పొదలువీపున జేర్చి
యెగవారు చెప్పులు బిగియదొడిగి

గీ. వెండి బంగారములకట్లు వెలయుజల్లి
విండ్లు త్రిప్పుచు గడును విడినివీర
భటులు చనుదెంచి యతులితార్భటులు వాలయ
మ్రొక్కి నిలిచిరి యవనీశు చక్కినెలమి (2-52)
రాజుగారి భటుల అలంకారములలో తత్సమాలను బోయ దొర మూకల అలంకారములలో గ్రామ్యాలను ప్రయోగించడం కవిలోని ఔచితీవైచిత్రిని మనం గుర్తించవచ్చు.
4.3. వశిష్ఠుని ఆశ్రమ వర్ణన : కవి రెండవ ఆశ్వాసంలో వశిష్ఠుని ఆశ్రమాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. తనివితీర 119వ పద్యం నుండి 128 వచనం వరకు ఆశ్రమాన్ని వర్ణించి పఠితలకు వశిష్ఠుని ఆశ్రమ రమణీయతను కళ్ళ ముందుంచుతారు. ఉదాహరణకు
సీ. విలసిత కపిలగవి విరాజిరాజిత
సౌష్ఠవంబై సాంఖ్యశాస్త్రమగుచు
రమణీయ కృష్ణసారథమాంకితలీల
బొగడొంది ద్వారకానగరమగుచు
సలిలితరాజహంస విహార భాసురా
భోగమై యాకాశ భాగమగుచు
జారుకేసరిజాలశరభముఖ్యాన్యోన్య
సఖ్యమైసుగ్రీవ సైన్యమగుచు (2-119)

గీ. గువలయోల్లాసకరబహుసవనవిభవ
గౌరవంబున వెలయు కాసారమగుచు
ఘనతబెంపొందునెప్పుడగణ్య పుణ్య
విశ్రమంబు వసిష్ఠమౌన్యాశ్రమంబు (2-119)

సీ. నియత ఫలాహార నియమంబు వాటించు
విలసిల్లు శుకసంతతులను మెఱసి
కమనీయ కిసలభక్షణ వృత్తి బచరించు
బహువనీప్రియకదంబములదనరి
సుమనః ప్రసంగతి యమరవర్తించుమా
ధుకర కులమ్ముల తోడనెనపి
భువన స్థలంబుల బొలుపొంద జరియించు
బరమహంసవతంస పటలినలరి

గీ. మఱియు సకలాగమములకు మనికి యగుచు
భవ్యమాధవవిస్ఫూర్తి ప్రణుతికెక్కి
నైమిశారణ్యమని పోల్పనైజమైన
యొక్క యుద్యానమధిపతి యొప్పగా చె (2-126)
ఈ విధంగా కవి, వశిష్ఠుని ఆశ్రమము, అనేకరకాల పుష్ప, ఫలములతో కూడినదని, వన్యప్రాణులు, పర్వతములు, జలపాతములు, పక్ష్యాదులతో కూడి వేదధ్వనులతో నైమిశారణ్యమును పోలి ఉన్నదని రమణీయంగా వర్ణిస్తారు. ఆనాటి ఆశ్రమాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు రచన చేసారు. నాలుగు సీసపద్యాలు, గీత, వచనాలలో ముని ఆశ్రమాన్ని వర్ణించి, తమ రచనా చాతురిని చాటుకున్నారు.
4.4. మాతంగకామినుల వర్ణన :
ఎటువంటి మాతంగ కామినులు రాజైన హరిశ్చంద్రుని చూచిరో కవి అద్భుతంగా వర్ణిస్తారు.
సీ. వీరికొప్పులు కప్పు మీరుఘనంబులు
శృంగారరసమువర్షించుటరుదె
వీరిగుబ్బలు చూడ విద్రుమమంజరు
ల్గురురాగవిస్ఫూర్తి గూర్చుటరుదె
వీరివాల్గన్నులు విస్ఫుట తారకల్
శ్రవణ సంగతి గాంచి ప్రబలుటరుదె
వీరినితంబుల్ విశ్రుత చక్రంబు
లంబరమణిదీప్తి నలరుటరుదె

గీ. యనంగ నింపుసొంపుహావంబు భావంబు
గలిగి పూర్ణచంద్రకళలనంగ
మౌనియను మతమున మాతంగ కామిను
లవనినాథుగాంచి యభినుతించి (2-129)
అని మాతంగ కామినులు ఏవిధంగా అలంకారము చేసుకున్నారో, వారి సౌందర్యం ఏవిధంగా ఉన్నదో కవి నిసర్గ సుందరంగా వర్ణిస్తారు.
4.5. సూర్యోదయ వర్ణన : తృతీయాశ్వాసంలో 67వ పద్యం నుండి 75వ పద్యం వరకు సూర్యోదయ వర్ణన సాగడం కవి ప్రతిభకు గొప్ప తార్కాణం.
సీ. జగము గైసే యునిశాప్రసాధిక చేతి
మురవైనలత్తుక ముద్దయనగ
మకరాంక విజయసిద్ధికి బ్రాగ్భరంబుపై
నిలిపిన సౌవర్ణ కలశమనగ
బూర్వాదిక్కాంతవిస్ఫుటకుంకుమారుణి
తాయిరస్తనమండలంబనంగ
నాకాశరమనవిహారార్భమై పట్టిన
కొమరొప్పుకింశుక గుచ్ఛమనగ

గీ. సూనబాణుండు విరహుల మానధనము
కుప్పగావించి యందుపై నొప్పనిడిన
హారికాశ్మీరము ద్రాంకమనగ బూర్ణ
సూర్యుడుదయించె గాంతిని స్తంద్రుడగుచు (3-67)

సీ. ప్రార్దిశాభామిని ఫాలభాగంబుపై
బాలుచుసింధూరంపు బొట్టనంగ
గైసేయుతఱి వజ్రకాంతకుబట్టిన
పద్మరాగంపు దర్పణమనంగ
బ్రకటనక్తంచర ప్రతతుల ఖండించి
చనుదెంచు హరిదివ్యచక్రమనగ
బురుహూతపురము గోపురముపై నిలిపిన
పటుశాతకుంభంబనగ

గీ. బద్మములు నిక్కగైరవపటలి స్రుక్క
జక్రములుపొంగదారకాచయమడంగ
దిమిరములు బాటు దిక్కులు తెలివిమీర
ధరణి యుదయించె నఘనదీ తరణియగుచు (3-75)
టూ రమణీయ సూర్యోదయ వర్ణన చేస్తారు కవి. ఏ రచనలోనైనా కవి సూర్యోదయ, సూరాస్తమయాలకు సంబంధించి ఒక పద్యాన్ని రచించడం సాధారణంగా కనిపిస్తుంది. కాని అందుకు భిన్నంగా రాజమల్లారెడ్డి గారు ఒక ఘట్టాన్ని అనేక పద్యాలలో రచించడం మనం గమనించవచ్చు. సూర్యాస్తమయ వర్ణన పరిశీలిస్తే – తృతీయాశ్వాసంలో 41వ పద్యం నుండి 48వరకు కవి సూర్యుడు అస్తమించిన సమయంలో ఆకాశం ఏవిధంగా ఉంటుందో పరమ అద్భుతంగా చేస్తారు కవి.
సీ. సారతరాకాసార తీరంబున
బొందైనరక్తబ్జా బృందమనగ
వస్తాచలంబుపై నావిర్భవించిన
భూజాళి పల్లన పుంజమనగ
ద్రిజగజ్జయార్థమై తేరుపై నిలిపిన
పంచేషుమంజిష్ఠ పడగయనగ
నప్పతిసన్యాసి యారంగ గట్టిన
వలనొప్పు కాషాయ వస్త్రమనగ
గీ. జరమదికృతిలాస్యావసరము నందు
బయలుగాకుండు నిడుతోపు బచ్చడంపు
తెఱయొకోయనబశ్చిమ దిశను మిగుల
ఘనతర స్ఫూర్తి సాంధ్యరాగంబు దోచె (3-43)
సీ. వలరాజు లోకముల్లెలువ బోవగదిశా
లలనలు చల్చిన లాజలనగ
నభ్రకాసారంబు నందంబుగాడంబు
మీటిన కుముదం మీలనంగ
శివతాండవోద్వృత్తి జెదరి మిన్నంటన
సురనదీవారిశీకరములనగ
జదలనియెడి నీలిచందువాగుట్టిన
పొలుపైన వెలిపట్టు పూవులనగ
గీ. నక్షరాభ్యాస మొనరించు నట్టివేళ
బంకరుహసూతినభమను పలకమీద
సుద్దచేబట్టి వ్రాసిన సున్నలనగ
సలలిత స్ఫూర్తి నక్షత్రములు వెలింగె (3-48)
ఈ విధంగా కవి సూర్యాస్తమయం మొదలుకొని రాత్రివేళ వరకు ఆకాశములో కలిగే మార్పులను రమణీయంగా వర్ణిస్తారు. ఈ రచనలో వారు ఎంత ప్రకృతి ప్రేమికులో తెలుస్తున్నది.
అగ్నివర్ణన (3-77), గంగావర్ణన (3-95), కాశీపట్టణ వర్ణన (3-100,101,103) చంద్రమతి వర్ణన (3-121-125), స్మశాన వర్ణన (3-167, 183-197), ఈశ్వర వర్ణన (7-104) మొదలైన వాటిని పరిశీలించినప్పుడు కవిలోని వర్ణనాచాతురి మనకు అవగతమవుతుంది.
5. రచనా శిల్పం : కవి రచనా శిల్పాన్ని, గ్రంథానికి పీఠిక రాసిన పెద్దమందటి వేంకట కృష్ణ కవి గారి మాటల్లో పరిశీలిద్దాము.
“యీ కవి పుంగవుని కవిత మృదుమధుర పదపూరితమై నిర్దుష్టమైన నవరసాలంకార భూయిష్టమై ద్వావింశద్వర్ణనాకరమై నానావిధ బంధ శ్లేష యమకాదులకు స్థానమై నిరర్గళ గంగా ప్రవాహము వలె ననవద్య హృద్య ధారాశుద్ధితో నలరారుచున్నదను విషయము పండితులెల్లరేకీభవింతురని నా నమ్మిక” (పీఠిక || -1926) ఈ వాక్యాలు గ్రంథం చదువుతున్నవారికి సత్యములని ఋజువవుతాయి. ‘షట్చక్రవర్తి చరిత్రమను యిమ్మహా ప్రబంధమును రచించిన కవిశిఖామణి రాజామల్లారెడ్డిగారు…” అనే పీఠిక తొలి వాక్యం – ఈ గ్రంథం ప్రబంధమని, అందునా మహాప్రబంధమనీ తెలుస్తుంది. అనేక (ఆరు) ప్రబంధాలతో కలిసి మహాప్రబంధంగా వెలుగొందినదని బోధపడుతున్నది.
5.1. పద్యశిల్పం : రచనాశిల్పంలో మొదటగా పఠితలను ఆకర్షించే అంశం – పద్యశిల్పం కవి తన శైలి ఎలా ఉంటుందో షష్యంతాలలో నిక్షిప్తం చేశారు. అంతేకాక,
‘సహసా పాహియే దేవి త్రిలోకీజనసన్నుతే
ఆరోగ్యమభయం దత్వాయుష్మదంఫ్రి యుగార్చనం (ప్ర. 1)
అనే శ్లోకంతో కవి కావ్యాన్ని ప్రారంభించారు. మొదటగా సంస్కృత శ్లోకంతో ప్రారంభించడం, కవి – రాజా మల్లారెడ్డి గారి సంస్కృత భాషాభిమానం వ్యక్తమవుతుంది.
షష్ఠ్యంతాలు :
క. శ్రీ మద్భూమీధరపు
త్రీమణి కుచకుంభికుంభ మృగమదవిదిత
శ్యామలకోమల వక్షో
ధామున కభిరామభూమిధర ధామునకున్ (ప్ర.2)
క.శరణాగత శరణాంతః
కరణావరణునకు నిత్యకరుణాభరణ
స్మరణ స్ఫురణాదరణా
చరణునకును నిగమకటకచణ చరణునకున్ (ప్ర.3)
క. జూటీతట కోటీరట
దాటీకధునీ ఘమంఘమార్భట పేటీ
కోటీరునకును ధాతృక
కోటీయుత మదన తను గురుపటీరునకున్ (ప్ర.4)
క. కుండల మణి కుండల ఘృణి
మండల మండిత కపోల మండలునకును
ద్ధండ భవషండకుధరా
ఖండలునకు భూరివైరిగణ ఖండలుకున్ (ప్ర.5)
క. దక్షాధ్వర శిక్షాపర
కౌక్షే యాక్షుద్ర రౌద్ర కరబాహునకున్
రూక్షణ వీక్షణ భక్షణ
రక్షదేహునకు నుక్షరాడ్వాహునకున్ (ప్ర.6)
క.జంఖాసురరిపు బాహా
దంభోళిస్తంభ దంభ దనుజారంభో
జృంభత్పయోధి కుంభజ
శుంభచ్ఛార్యునకు భక్త శుభాకార్యునకున్ (ప్ర.7)
క. వారాకరభవ గరళా
హారునకు నుదారహర హారపటీర
క్షీరసుధారస శారదా
శారదరుచిపూర చారు శరీరనకున్ (ప్ర.8)
క. బుద్ధ్యంచద్ద్యానధ్యే
యాధ్యవసాయునకు మహాదహంకృతి మధ్యా
సాధ్యస్వమాయునకుభ
క్తద్వాత్మసుధాయునకు సదాదాయునకున్ (ప్ర.9)
క. రంగద్భుజంభోగా
భంగురమణికిరిణ వీరణ బాలాతపస
త్యాంగత్యారుణిత విభా
లింగిత తను సిద్ధరామలింగంబునకున్ (ప్ర.10)
వ. సమర్పితంబుగా నా యొనర్పంబూనిన షట్చక్రవర్తి చరిత్రంబను
మహా ప్రబంధమునకుం కథా సూత్రంబెట్టిదనిన (ప్ర.11)
అని షష్యంతాలతో కథను ప్రారంభిస్తారు కవి. అంతే కాదు తన రచనాశైలిని కూడా నిక్షిప్తం చేశారు. మొదటి శ్లోకంలో సంస్కృత భాషాభిమానం, రెండవ పద్యంలో సిద్ధరామేశ్వర స్మరణ, సంస్కృత పదభూయిష్ఠ రచన, మూడవ పద్యం నుండి పదవ పద్యం వరకు వృత్త్యనుప్రాస, యమకాలంకారాలు, మణి ప్రవాళ శైలి తదితర ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి.
5.2. ఛందస్సుల పేర్లతో పద్యరచన :
ద్వితీయాశ్వాసంలోని హరిశ్చంద్రుని కథలో
సీ. విలసిత మత్తేభ విక్రోడిత స్ఫూర్తి
మహిత ప్రపంచ చామర నిరూఢి
విస్ఫుట శార్దూల విక్రీడిత ప్రొథి
తత భుజంగ ప్రయాతక్రమంబు
మానితసింహరే ఖానేక సంస్థితి
పటుతరహరిణీ ప్రభావ సరణి
నిరుపమ విస్మయాకర శరభక్రీడ
రమణీయ వనమయూర ప్రదీప్తి
గీ. మఱియు దక్కిన యుపజాతి మహిమ బెక్కు
చందముల మీటి గణనకాశ్చర్యమొ
బ్రబల గురులఘు వర్ణనిర్ణయముగాగ
సత్కవియుబోలి నిర్మించి జగతినించె (68)
అనే పద్యంలో కవి అనేక ఛందస్సులతో పేర్లతో పద్యాన్ని కూర్చాడు. ఛందస్సు మీది ప్రీతితో, ఆ పేర్లతోనే పద్యాన్ని రచించడం పద్యశిల్పంపై ఉన్న ప్రత్యేకాభిమానం వ్యక్తమవుతుంది.
సంస్కృత పద్యాలతో పద్యాన్ని కూర్చి పూర్తి సంస్కృత వృత్తమా! అనిపించేట్లుగా రచన చేయడం ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది.
చ. ఘన, ఘనలీల విస్ఫురిత కంఠలున్నృకరోటమాల్యబం
ధన,ధనదాదిశత్రుగజ దానవదర్ప పయోధరప్రభం
జన జన లోక భక్తజన సంతత పోషణ భూషణాత్మఖా
వన వనజాప్త చంద్రశిఖి వర్ణిత తోచ నబంధ మోహనా. (ద్వి. ఆ. 156)
అనే పద్యం, తెలుగు విభక్తి ప్రత్యయాలు లేకుండా సంస్కృత పదాలతో కూర్చి తెలుగు ప్రబంధంలో రాశారు కవి. అంతేగాక ఈ పద్యం పాదాలలో ముక్తపదగ్రస్తాలంకారం అనిపిస్తుంది.
ఇటువంటి పద్యరచనకు మరొక ఉదాహరణ.
క.నానాదిశాధినాయక
మానసదర్పాపహృత్య మంజస శౌర్యా
ధీనమదోత్కట తనుగజ
దానవసంహార కరణ తాశీలమతీ (ద్వి. ఆ. 157)
ఈ విధమైన పద్యరచన మనకు కావ్యమంతా విస్తరించిన తీరు మనం గమనించవచ్చు. ఉదాహరణకు
సీ. విష్ణవేపోషిత జిష్ణవే కృష్ణాయ
శ్రేయోగుణాయనా రాయణాయ
శాంతాయమునిజన స్వాంత నిశాంతాయ
మధుసూదనాయర మాధవాయ
హరయేముకుందాయ గరుడాధివాహాయ
వేదవేద్యాయదా మోదరాయ |
వందారుసురబృంద మందార భూజాయ
కంబుధరాయ పీతాంబరాయ
తే. శేషశయనాయ కౌస్తుభ భూషణాయ
దోషహరణాయ దానవ భీషణాయ
దోషరహితాయసూనృత భాషణాయ
భానుకోటి ప్రభాయతుభ్యం నమోస్తు (6-31)
సంస్కృత విభక్తి ప్రత్యయాలతో తెలుగు పద్యం రచించడం ఒక్క రాజామల్లారెడ్డి గారికే చెందినదని చెప్పడం అతిశయోక్తి కాదు.
సీ. కంజాతదళనేత్ర ఘనాఘనాఘనగాత్ర
కమలాకళత్రరంగచ్చరిత్ర
కౌస్తుభమణిభూష కమనీయ బహువేష
విలసిత సంతోష విగత రోష
భక్తరక్షోల్లాసభర్మ నిర్మిత వాస
కోమలహాస వైకుంఠవాస
నిఖిల లోకాధార నిర్జితాసురవార
నిబిడ కల్మషదూరనిగమహార
గీ. పక్షిరాజతురంగ కృపాంతరంగ
సత్యసంకల్ప పన్నగ స్వామి తల్ప
పద్మభవపాక శాసనపారికాంక్షి
శరణశరణాగతవన శరణు శరణు (6-32)
కథానుగతంగా విష్ణుమూర్తి స్తుతిని సీసపద్యంలో సంస్కృత విభక్తి ప్రత్యయాలతో రచించడం పై పద్యంలో గమనించవచ్చు.
5.3. దేవతాస్తుతులు : ఇతర గ్రంథాలతో పోలిస్తే షట్చక్రవర్తి చరిత్రలో దేవతాస్తుతులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. పద్యరచనలో దేవతాస్తుతులు చాలా సహజంగా ఒదిగిపోవడాన్ని బట్టి, కవి ఎంతగా ఛందస్సు తిరిగినవారో తెలుస్తుంది.
5.3.1. ప్రథమాశ్వాసములో – సిద్ధరామలింగస్తుతి చేస్తూ
శా. గౌరీ సంచిత భోగభోగ ధరభోగస్నిగ్ధరత్నచ్చటా
స్ఫారాలంకృతి యోగయోగ జన హృత్పర్మద్విరేఫాయితో
దారాంఘిద్వయ భాగభాగణ సముద్య చ్చూలవిధ్వస్తద
క్షారాతిస్ఫుటయాగయాగ భుగజాద్యాశాస్తుత ప్రక్రియా (1-47)
క. గంధపటు ఖడ్గదారిత
బంధురతర కంధరాబ్జ బహుపూజాధౌ
రంధర్య భక్తి చణదశ
కంధరవరదాన దీక్ష కారుణ్య నిధీ! (1-48)
పంచచామరం
భవాభవాభవానుభావ భావజారిభూరిగో
భవాభవాహనేహగేహ బాహవాహవాధికా
నవాహవంజ వాహనోదనాదమేదురాధరా
శివాశివాంతరంగసంగ సిద్ధరామలింగయా ! (1-49)
పద్యాలలో సంస్కృత రచనాశైలి, ముక్తపదగ్రస్తాలంకారం సమ్మిళితమై కనిపిస్తుంది.
5.3.2. శివస్తుతి
సీ. పశ్యల్లలాట శుంభత్ఫణీశకిరీట
చంద్రకళాజూట శరణు శరణు
రాజితాచలగే హరమ్య గోపతివాహ
శారదాంబుదదేహ శరణు శరణు
కాలకూటాహర గజద్వైత్య సంహార
సర్వలోకాధార శరణు శరణు
సద్భక్తసురభూజసంయమికృత పూజ
శతకోటి రవితేజ శరణు శరణు
గీ. శైలకన్బామనోనాథ శరణు శరణు
శైలరాజశరాసన శరణు శరణు
శైలధరి దివ్యసాయక శరణు శరణు
శైలభేదన గురువంద్య శరణు శరణు (3-117)
అని శరణుఘోషలతో పద్యరచన చేశారు కవి. కథను మూలం చేసుకొని తనివితీరా భగవంతుని స్తుతి చేయటం ఈ గ్రంథంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
5.3.3. బ్రహ్మస్తుతి
సీ. చతురాననాయ ధీచతురాయ శాంతాయ
శతధృతయే కృపా సాగరాయ
పరమాత్మనే పరబ్రహ్మణే పరమేష్ఠి
నే హేమగర్భాయ నిర్భరాయ
విశ్వసృజే జగద్వీశ్వ సద్వ్యాపినే
ధాత్రేబ్జజాయ పితామహాయ
వందారుసురబృంద మందార భూజాయ
సత్వగుణాయ విచక్షణాయ
తే.హంసవాహాయ కోటిసూర్య ప్రభాయ
సకల భువనైక కర్రేవశంవదాయ
వేదవేదాంతవేద్యాయ విభవదాయ
భారతీవల్లభాయతుభ్యం నమోస్తు (7-42)
సగరుని పాత్ర ద్వారా కవి ఈ విధంగా బ్రహ్మస్తుతి చేస్తారు. సంస్కృత విభక్తి ప్రత్యయాలతో సీసపద్య రచన చేయడం అలవోకగా సాగిపోతుంది.
5.3.4. గరుడ స్తుతి :
సీ. ప్రాతర్భవంతంస్మరామి శక్రాదిగ
ర్వాణ సంచయగేయ వైనతేయ
భవదీయ దివ్యరూపంద్రష్టుమిచ్ఛామి
వరపుణ్య సముదాయ వైనతేయ
త్వద్వచళోతుం ప్రవక్ష్యామి సంహృత
వనరాశి బహుతోయ వైనతేయ
త్వాంభజేహం సర్వదాముదానుతచిత్ర
వర్ణనిర్నయకాయ వైనతేయ

తే. మయికృపాందేహిభో హిరణ్మయపతత్ర
తాళవృంత విధూన నోత్తాలశమిత
జలధికన్యాధి నాయక శ్రమనికాయ
దీనజనరక్షణాపాయ వైనతేయ (7-69)
ఈ పద్యంలో సంస్కృత క్రియావాచకాలు ఉండటం ప్రత్యేకంగా కనిపిస్తాయి. సంస్కృత వాక్య మర్యాదతో పద్యనిర్మాణం చేయడం, కవి ప్రతిభాపాటవాలను తెలియజేస్తుంది.
పై పద్యం వెనువెంటే కవి
సీ. గాడాంధకారంబు గప్పియుండిన వాని
కపుడు సూర్యోదయంబైనయట్ల
దుష్టవరజ్యరారుతండైనట్టి వానికి
దొడరి ధన్వంతరి దొరికినట్ల
యాజన్మ దారిద్ర్యుడైనట్టి వానికి
నరుదైన నిక్షేప మబ్బినట్ల
గహనంబులో త్రోవ కానని వానికి
దొడరి చక్కని తోడు దొరికినట్ల

గీ. యతుల దుఃఖాన్వితుండనైనట్టి నాకు
జూపడితివిందునెనరైన చుట్టమవయి
యెఱుగనిడమిద్ధమని యానతియ్యవయ్య
దీనజనపోషణోపాయ వైనతేయ (7-70)
అని తెలుగు వాక్యనిర్మాణ శైలిని పరిపుష్టం చేస్తూ ఉపమాలంకారంతో గరుడ ప్రార్థన చేస్తారు. రెండు పద్యాలు వెంటవెంటనే ఉండటం సంస్కృత, తెలుగు భాషలపై వారికున్న అభినివేశం తెలియజేస్తుంది.
ఇటువంటి దేవతాస్తుతులు కథాగతంగా మరెన్నో మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు 1-98; 3-95, 183 నుండి 189; 5-5; 6-42, 7-96, 114; 8-14 పద్యాలను పేర్కొనవచ్చు.
6. అలంకార నిర్వహణ : కవి రచనాశైలిని ప్రకటింపజేసే ప్రధానమైన అంశం అలంకార నిర్వహణ. ఆయనలోని కవితాత్మకత అలంకారం ద్వారానే వ్యక్తమవుతుంది.
6.1. ఉపమాలంకారము
సీ. కైలాసగిరికిని గాశికాపురి సాటి
గగనస్రవంతికి గంగసాటి
విఘ్నేశునకు దుండి విఘ్నేశ్వరుడు సాటి
రహిగుమారునకు భైరవుడు సాటి
ప్రమథ వర్ణములకు బాశుపతుల్సాటి
సురలకు నిచటి భూసురులు సాటి
యద్రిరాట్పుత్రికి నన్నపూర్ణయె సాటి
హరునకు విశ్వనాయకుడు సాటి

తే. యందు వృషభేశ్వరునకిందు నంది సాటి
రుద్రకన్యలకీ సుందరులును సాటి
చాటుచున్నవి శ్రుతులు ముజ్జగములందు
నిందులకు సంశయము వలదిందు వదన (3-100)
కాశీపట్టణాన్ని కైలాస పర్వతముతోనూ, గంగానదిని అమరగంగతోనూ, దుండి వినాయకుడిని, విఘ్నేశ్వరునితోనూ, భైరవుడిని కుమారస్వామితోనూ, పట్టణంలో సంచరించే పాశుపతులను ప్రమథ గణాలతోనూ, అక్కడి బ్రాహ్మణులను దేవతలతోనూ, అన్నపూర్ణను పార్వతీదేవితోనూ, విశ్వేశ్వరుని సాక్షాత్తు శివునిగానూ, నందిని వృషభేశ్వరునితోనూ, అక్కడి స్త్రీలు రుద్రకన్యలతోనూ పోలుస్తూ కైలాసగిరి కాశీ సమానమని, మూడు లోకాలలోనూ శ్రుతులు చాటుచున్నాయని, ఇందులో సంశయం లేదని హరిశ్చంద్రుడు చంద్రమతీదేవితో చెబుతాడు. ఉపమాన ఉపమేయాలను ప్రస్తావిస్తూ ఉపమాలంకారాలను ప్రతిపాదంలోనూ చొప్పిస్తూ రచన చేయడం ఒక ప్రత్యేకాంశంగా చెప్పొచ్చు.
6.2. ముక్తపదగ్రస్తం
చ ఘన, ఘనలీల విస్ఫురిత కంఠలున్నృకరోటమాల్యబం
ధన, ధనదాదిశత్రుగజ దానవదర్ప పయోధరప్రభం
జన జన లోక భక్తజన సంతత పోషణ భూషణాత్మఖా
వన వనజాప్త చంద్రశిఖి వర్ణిత తోచ నబంధ మోహనా. (2- 156)
6.3. యమకం
కం. ఈ నేల నెందటేలిరి
యీనేలయనంగ నేలయేరీ వారల్
భూనాయక వినవెయని
త్వానిశరీరాణి యనుచు నార్యులు పల్కన్ (2-152)

6.4. వృత్త్యనుప్రాస :
కం. నానాదిశాధినాయక, మానసదర్పాపహృత్సమంజసశౌర్యా
ధీనమదోత్కట తనుగజ, దానవసంహార కరణతాశీలమతీ (2-157)

పు. తారహారదారశేష తారశారశారదా
కారగౌర సారమూర్తి కాంతశాంత సం
త్సారితారి భూరిసేన ధర్మకర్మ శర్మదా
శ్రీరశూర ధీర సిద్ధలింగసాంగమంగళాతతో (2-158)

సీ. ఉబ్బులైయపరంజి లిబ్బులై తళుకులా గుబ్బలై తగుగబ్బి గుబ్బిలమర
నేపులై వలరాజు తూపులై మోహంపురూపులై క్రొవ్వాడి చూపులమర
గప్పులైనీలాల చొప్పులై మేఘంపు నిప్పులై జిగిమీజు కొప్పులమీర
ఠీవులై తేనెల బావులై చివురుల ప్రోవులై దొమ్మంచు మోవులమర (2- 156)

తే. సళధళని చెక్కులమృతంబు లొలుకు పలుకు
లలననగు మొగములనంట్లు గెలుచు తొడలు
నిగనిగని మేనులును గల్గిజిగిదాలంక
జెలువలూర్వశిదండనసించి రెలమి (6-48)
ఇటువంటి పద్యాలలో ఒక్కొక్క పాదంలో ఒక్కోరీతిగ వృత్త్యనుప్రాస ప్రయోగింపబడటం గుర్తించవచ్చు. ఈ విధంగా పేర్కొనబడిన అలంకార ప్రయోగాలు కేవలం ఉదాహరణ ప్రాయములే. చేయి తిరిగిన కవి కలము నుండి దాదాపుగా ప్రతిపద్యమూ అలంకారయుక్తంగానే వెలువడుతుందన్నది పండితులు గుర్తించిన విషయమే.
6.5. అలంకార ప్రీతి : ఛందోనామములతో పద్యరచన చేయడం పూర్వ కవుల గ్రంథాల్లో గమనించవచ్చు. రాజామల్లారెడ్డి గారు ఒకడుగు ముందుకేసి అలంకారాల పేర్లతో పద్యరచన చేసి తన రచనా శక్తిని పరోక్షంగా తెలుపుకున్నారు.
సీ. ఒకచోటగరహాట శకలాటనృపతుల
యతుల పర్యాయోక్తి గతులు మెఱయ
నాకచాయ సదుపాయ యుతీ మంత్రివర్యుల
తత విశేషోక్తి యుత్సవములలర
నొకచెంత హరిచింత మెనం విద్వాంసుల
ధీస్వభావోక్తి సంస్థితులు చెలగ
నొకవంక నకలంక సుకవీశ్వర శ్రేణి
యతిశయోక్తి విశేషమమర జేయ

గీ. దద్గుణ విభావనములు దాత్తములుగాగ
నధిక దృష్టాంతములనపహ్నవము చేసి
లసదలంకార మహిమ చెలంగుచుండు
నిండు గొలువుండెనల మేదినీ విభుండు (4-20)
7. భాషా విశేషాలు : రాజామల్లారెడ్డి గారు సంస్కృత, తెలుగు భాషలలో విశేషమైన పాండిత్యాన్ని అందుకున్న వారు. రెండు భాషలలోనూ రచన చేయగల ధీశాలి అని ఇంతకు పూర్వం ఛందోవిభాగంలో మనం పరిశీలించాము. అచ్చతెనుగులోనూ సందర్భానుగుణంగా రచన చేయగల దిట్ట, ఈ కవి.
హరిశ్చంద్రుని కథలో రాజు వేటకు బయలుదేరిన సందర్భంలో వేటగాళ్ళు రాజుతో మాట్లాడిన తీరును కవి సహజ సుందరంగా రచించారు.
క. సామీ యేమని సెప్పెద
మాము కానన్మందమందలో సొద్దెముగా
బూములను మెకములెగసిన
వేమివగంబోవు నిచ్చ నెఱుగముజియ్యా (2-55)

ఆ సామి దరమరాజ సంపన్న బూవుల
మాసిగాడు కట్టి మస్సిగోడు
పోసిగాడు గూడిపోయిరి రేతిరి
సూసి వచ్చినారు సోదెమయ్య (2-56)

ఇది కవిగారి అచ్చతెనుగు రచనాశైలికి ఉదాహరణ మాత్రమే. దాదాపుగా 2-41 నుండి 2-77 వరకు ఏకధాటిగా మనము ఇటువంటి శైలిని గమనించవచ్చు.
7.1. జంతువుల పేర్లు : వేటగాళ్ళు తమ కుక్కల పేర్లను తెలియజేస్తూ –
సీ.దీని పేరు తుపాకి దేవసింగమునైన
బోనీకయడుగిటిలోన బట్టు
సుడిగాలియిది జియ్యకెడసి యాకలిగొన్న
గబ్బిబెబ్బులినైన గతిచి విడుచు
జలిపిడుగది సామి చెలగియా యేనుగు
నైన మళ్ళించి యిట్టట్టు సేయు
నిది వెండిగుండుమయీ పాలపసి సూపి
యేయే కలమునైన నెత్తివేసు

గీ. గడమ వానిని నెదురెంచగలమె జగతి
మేమె యుసికొల్పినను జందమామలోని
మృగమునైనను జంగున నెగసిబిట్టు
పట్టి విదళించివచ్చు నీ పొదమాన (2-66)
అచ్చతెలుగు పదాలతో వేటకుక్కల పేర్లు కవి రచించడం భాషాప్రౌఢిమనే కాక, వారిలోని సాంఘిక దృష్టి కూడా మనకు అవగతం అవుతుంది.
7.2. దేవతాస్తుతులు : బోయలు తమ యిష్టదేవతల కోసం చేసే ప్రార్థనల్లో అచ్చతెనుగు పదాలు ప్రయోగించడం కవిలోని ఔచితీదృష్టిని తెలియజేస్తుంది.
సీ. వేటసాగింపుమీ వేగంబెదుతను
గానుక పెట్టేము కాట తేడ
మాకు దోడైరమ్ము నీకెక్కదెచ్చేము
గరుడాలమంతుని గంబమయ్య
మెకములలో జేయు మీ సింగమును నీకు
దొలుతగానిచ్చేము దుర్గదేవి
జయమిమ్ము పోతానె జాతరయేసేము
మా పొటేలును గొట్టి మలలతల్లి

గీ. యనుచు దమ వేల్పులకు మ్రొక్కి యధిపుచక్కి
బలిమివాసి చెలంగ దర్పంబు మిగుల
గానరాబంతముల్ హెచ్చి కానజాచ్చి
బోయమూకలు వేటాడబోయె నెలమి (2-98)
7.3. జనవ్యవహారము : ప్రజలు పలికే భాషతో పద్యరచన చేయడం మరొక చమతృతి.
సీ. ఏమకూటము కాడ నెదురించు శరబము
ల్వేనవేలకు మించు మానవేశ
మలయాసలము కాడ మలయు సింగంబులు
లచ్చల కొలదులిలాతలేశ
విందెశైలముకాడ వియరించు బెబ్బులుల్
కోటానుకోటులు కువలయేశ
సిత్రకూటము కాడ సెరలాడు పందులు
నరుబుదంబుల సంకె నరవరేశ
గీ.కడమ మెకములకును లెక్క గలవె యైన
సామిపాతలు వాటెడు సారెనేరి
యేటులోననద్రుంచేము మాటలోన
నయ్య సెలవిమ్ముమ కంబమయ్య తోడు
ఏమకూటము (హేమకూటము), మలయాసలము (మలయాచలము), విందెశైలము (వింధ్య శైలము), సిత్రకూటము (చిత్రకూటము), వేనకువేలు, కాడ, లచ్చలు, వియరించు, కోటానుకోటులు, కాడ సెరలాడు, కడమ, వాఱు, యేటు మొదలైనవన్నీ మాటలను స్వీకరించి సందర్భోచితముగా రచించడం ప్రజల కవులకే చెల్లుతుంది. అది రాజా మల్లారెడ్డి గారు సాధించారు. పదాలు, పలుకుబడులు అన్నీ చొప్పించి రచించడం పద్యరచన పై ఆయన సాధించిన పట్టును తెలియజేస్తుంది.
ఈ విధంగా ‘షట్చక్రవర్తి చరిత్రము’ అనే గ్రంథం ద్వారా కవి రాజామల్లారెడ్డి గారు రాజులకు ఉండవలసిన ఉన్నత గుణాలను తెలియజేస్తూ ‘మార్గదర్శి’ని రూపొందించారు.
ఒక్కొక్క రాజుచరిత్రను ఒక్కొక్క ప్రబంధంగా తీర్చిదిద్ది ‘మహాప్రబంధం’గా పాఠకుల ముందు ఉంచారు. అత్యుత్తమ ప్రతిభతో ‘రచనాశైలి’కి ఉదాహరణగా ఈ గ్రంథాన్ని ఆనాటి, ఈనాటి పఠితలకు అందించారు.
ఆయా రాజుల జీవితాలలో ఎదురైన ఘట్టాలను చదువుతున్నప్పుడు పాలకులకు, పాలితులకు ఒక ప్రేరణ గ్రంథంగా నిలవడమే కాక – ఛందో ప్రియులకు లక్ష్య గ్రంథంగా, పురాణ ప్రియులకు పౌరాణిక గ్రంథంగా, భాషా ప్రియులకు బహుభాషల సమాహారంగా రసప్రియులకు కావ్యరస సమాయుక్త ప్రబంధంగా మలచబడి ఆనాటి ఆలయాలలోని పురాణ ప్రవచనంలో ముఖ్యపాత్ర వహించి నవగ్రహ దోష పరిహార తంత్ర గ్రంథంగానూ నిలిచే ఇహపర సాధనమని చెప్పడం అక్షర సత్యం.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ March 7, 2022
written by కొరుప్రోలు హరనాథ్

వ్యక్తిత్వం

నిధి నిక్షేపాలు

ధన కనకాదులు

స్థిరమైన పాలరాతి

సౌధాల కంటే

సుస్థిరమైన ధనం

దృఢమైన సౌధం

తనకు తాను

నిర్మించుకున్న

వ్యక్తిత్వం

 

సజెషన్

ఆకులు రాలేకాలంలో

ఆమని వచ్చిందని అరవకు

కాకుల అరుపులు విని

కోయిల కూసిందని రాయకు-

ఎండమావులను చూసి

గలగల గోదారి

సెలయేరులా పారిందని

ఊహల్లో విహరించకు-

వేదికలపై నాయకుల

వాగా్దనాలు విని

చైతన్యం వచ్చిందని

చెత్త సాహిత్యాన్ని

గుప్పించకు

March 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

స్వచ్ఛమైన నీటి మనసు

by Dr. Saroja Vinjamura February 28, 2022
written by Dr. Saroja Vinjamura

కవిత్వం ఒక వ్యక్తిత్వం. ఒక భావం. ఒక భావన. సంతృప్తి, తపనల వెల్లడి. రసానందం పొందడంతోనే ఆగిపోదది. ఒక మార్పును, చైతన్యాన్ని, తెగింపును,
విప్లవాన్ని, ఆవేశాన్ని ఆలోచనకు మళ్ళించి చేతలో నిరూపించేట్లు వాస్తవిక పని జరిగేట్లు చూస్తుంది. ఉద్యమాలకు పిడికిలి ఎత్తిస్తుంది. అనుకున్న సాధింపజేస్తుంది. కవిత్వానికి ఉన్న బలమది. సాహిత్యంలో ఉండే గొప్పతనమేమిటంటే కవి మన ఎదురుంగ కూర్చు ని తన అంతరంగాన్ని ఎదుటి పాఠకునిముందు ఆవిష్కరిస్తాడు. ఆడుతాడు, ఆడిస్తాడు. పాడుతాడు. నవ్విస్తాడు. ఏడిపిస్తాడు. ఎంత పెద్దా, చిన్నా ఐనా దోస్తవుతడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, రాష్ట్ర సాధన తరువాత ఎంతోమంది కవులు కనిపిస్తున్నారు. వీరిలో చాలామంది అప్పటివరకూ తమలో కవిత్వశక్తి ఉన్నా పరిస్థితుల
ప్రభావంవలన బయటపడనివారైతే కొంతమంది కొత్తగా కలం పట్టినవారు. కవిత్వం గురుముఖంగా నేర్చుకునేది కాదు. తనలో ఉన్న భావాల్ని అక్షరీకరించడం. ఐతే ఇది గురువులద్వారా నేర్చుకోకున్నా సవరింపులు, సరైన పంథాల ఎంపికవంటి మార్గదర్శన సూత్రా
లు కొన్ని అవసరం. ఇది అసలు సిసలు కవిత్వం రావడానికి ఉపకరిస్తుంది. ముఖ్యంగా నాణ్యమైన కవిత్వం సరైన అధ్యయనం ద్వారా సాధ్యం. అటువంటి నాణ్యత, మేలిమిగ ల కవి, కవిత్వ సిద్ధహస్తుడు డా. నందిని సిధారెడ్డిగారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఉండి ఎన్నో సాహిత్య కార్యక్రమా
లు, పనులు, సృజనలతో విరామం లేకుండా ఉండి కూడా సిధారెడ్డిగారు తనకిష్టమైన క విత్వాన్ని వీడలేదు. మన కాలంలో ఉన్న కవి అని సగర్వంగా ప్రకటించుకోగలిగిన కవివర్యులు సిధారెడ్డి సర్. ఆత్మీయ పలకరింపుతో అందరినీ దగ్గర చేసుకోగలిగిన ఆయన వ ్యక్తిత్వమే ఆయన కవిత్వం.

“ఎన్ని ప్రక్రియల్లో రాసినా ఇష్టమైన ప్రక్రియ కవిత్వమే. నను అన్నిటికన్నా ముందుగా కవిగా గుర్తించడానికే ఇష్టపడతాను” అంటారాయన.
కదిలించే ఏ విషయాన్ని, సంఘటనను చూసినా కవి కలం తక్షణం స్పందిస్తుంది. కవిత వెల్లివిరుస్తుంది. అలా సిధారెడ్డిగారి కవితామాలికలు ఎన్నో సంపుటాలుగా తెలుగు పాఠకులను అలరించాయి. ఆ పరంపరలోనే వచ్చిన మరొక సంపుటి ‘నీటి మనసు’. ఏ ఆడంబరాలు, ఏ హడావిడి లేకుండా కేవలం కవితలతో వచ్చి ధాటిగల పుస్తకం నీటి వ ఎనసు. కవిత్వం మీద ప్రేమతో వెలువరిస్తున్న నా ఎనిమిదో సంపుటి ఇది అంటూ కవిత వంపట్ల ప్రేమను ప్రకటిస్తాడు. అక్షరం పట్ల ప్రేమ ఉన్న ప్రతీ మనిషికీ నచ్చే పుస్తకమిది.
పుస్తకంలోని ప్రతి మాట, ప్రతి అక్షరం శరీరాన్ని, మనసును కదిలిస్తుంది. ఏ వయసువారినైనా అలరిస్తుంది, సునాయసంగా మనసుకు ఎక్కుతుంది. ఇందులోని కవితలలో భావాల ధారతప్ప చిన్నవీ, పెద్దవి అనే తేడా కనిపించదు. మంజీరా రచయితల సంఘంద్వారా వెలువరించిన నీటి మనసును “ఉద్యమాలను ప్రేమించి, అక్షరాలను ప్రేమించి, జీవితాన్ని ప్రేమించలేక లోకం విడిచి వెళ్లిన చైతన్య ప్రకాశ్ కు, ఆ జ్ఞాపకాలకు అంకితమిస్తున్నట్లు” ఈ పుస్తకంలో పేర్కొన్నారు సిధారెడ్డిగారు ఇక కవితా పేటికను తెరిస్తే మొదటి కవితే కలను ప్రేమించే మనిషిగా కనిపిస్తాడు కవి. నిలబడని, కూలబడనీ కల ఎలానైనా ఉండనీ ఫత్వాలు వర్తించని, పేటెంట్స్ రైట్స్ లేని కలలతోనే కవి సగం జీవితమని నా కలలు నావని చెబుతాడు. అలవాటయిన భాష అంతర్జాతీయం మాట్లాడితే ఇక్కడి ప్రజలేం కావాలని ప్రశ్నిస్తాడు. మోకాలి నెత్తురులో లోకాలు పాకుతున్న పసిపాప గోస మాట్లాడొద్దా? అని అడుగుతాడు. వాండ్ర
మట్టి ముట్టినవాడు లేడు, పెళ్ళ తీసినవాడు లేడు, అటు తొవ్వ తొక్కినవాడు లేడు యత్రమే మహానుభావా…. అంటాడు. కవి ఎటుంటడు? కన్నీళ్ళు తుడుచుకుంటున్న, గాయాలు తడుముకుంటున్న ఊరివైపే ఉంటడు. నగరంలో ఊరినెత్తురు అల్లుకుపోయే ఉంటాడు.

భూమినైతే కోస్తవు, కొండయితే పక్కకు తిరుగుతవు అంటే ఏంచెప్తది…. అది నది. కొండను చూస్తూ ఇంత ఎత్తా! అంటే ఏం చెప్తది అది దాని రూపం. భూమిని పట్టు కుని ఎంత విశాలం! ఎంత సహనం! అంటే ఏం చెప్తది అదే భూమి అని వాటి సహజాతి కాల్ని చెబుతూ ఔనుకదా! అని అనేట్టు విస్మయపరుస్తాడు.
పాడుచూపుల మధ్య, ముళ్ళతోవల నడుమ చెరువొడ్డు గుర్తించారా? గుండెకు తడి లేదు మరి మాట తడి ఏమైంది? అంటాడు. రక్తాన్నేమి, రాజకీయాన్నేమి…. నీరు దేన్నయినా కడుగుతుంది నీటి భాష నాది గర్వంగా ప్రకటిస్తాడు.
సిధారెడ్డి కవిత్వాన్ని అందుకోవడం ఎంత కష్టమో అంత సులభం. ఎంత సులభమో అంత కష్టం. ఊరే జలలో సౌందర్యం, పారే నదిలో గాంభీర్యం, చిన్నపిల్లాడి
లా వాక్రవాహం, పెద్దవారి తెలిసినతనం ప్రతీదీ స్పష్టంగా దొరికే కవిత్వం తనది. ముం దుతరం, ఈ తరం, నాతో ఉన్న నావారు అందరికీ కృతజ్ఞతలు అని తెలిపే కృతజ్ఞతావా త్యాలు సిధారెడ్డికి మనిషి అంటే ఎంతిష్టమో చెప్తుంది. ఈత తెలిసినవాడు కొలను కనబడితే ఆగలేడు. ఆలోచన వచ్చిందే తడవుగా కవి
త్వంలోకి జారక సిద్ధుడు అగలేడు. తనువెల్లా నాదమైన కవికి తాళాలు, తబలాలు కావాలా సహజగానమే అతని బాణి అంటాడు. నీ పాటలు ఆకాశంలో ఎగురుతుంటే పడగొట్టేవాళ్ళుంటారు. తడిగుణం విడువకు అక్షరాలను వెదజల్లడం మరువకు. శత్రువులు మింగుడుపడని మిత్రులూ తప్పరు. ఏడ్చేవాళ్ళు ఏడువనీ, నవ్వేవాళ్ళు నవ్వనీ, నీకేం పని! అని ఆశావాదాన్ని నూరిపోస్తాడు. పట్టుదలకు పర్వతాలెంత ప్రయాణానికి సముద్రా
లెంత ఊహాశాలి ఒళ్ళు విరిస్తే ఆకాశం పసిపాపలా అంబాడదా అని వెన్ను తట్టుతాడు.
భాగ్యనగరంగురించి రాస్తూ నువు గుర్తించవు లాలనగా నీ భుజంమీద ప్రేమలు వాలుతాయి. కంటిమీద ఒంటిమీద ఇన్ని సొగసులు కురుస్తుంటే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు అని ఈ నగరం యొక్క గొప్పతనాన్ని కవిత్వీకరిస్తాడు. మనసులేనా మీనార్లు పలకరిస్తాయి. కవులేనా విగ్రహాలూ రోజుల తరబడి కవిత్వం చెబుతాయి. అలలు ఆలకిసాయి. అలలు అలుగా స్పందిస్తాయి. పండితులేనా ఇరానీ టేబుళ్ళు ప్రసంగిస్తాయి కప్పుల
ు చప్పట్లు కొడతాయని అద్భుతంగా నగరం గొప్పతనాన్ని కట్టెదుట నిల్పుతాడు. తలకు
ఆదర్శాలు చుట్టుకొని తలపడడానికి సిద్ధంగా ఉన్నట్లుంటుంది. కార్తెల మెడలో ఇన్ని స్వ ప్నాలు వేసి నిన్ను నన్ను తయారుచేసిన ఈ తోట చదువుల ఖజానా. ప్రపంచం మనిషికిచ్చిన నజరానా. చరిత్ర తెరిచిన పెద్దర్వాజా అంటాడు ఓయూ ను గురించి. 100 సంవత్సరాల పురాతన చదువుల ఆలయంగురించి ఎంత బాగా వర్ణించారో అధునాతనమైన రాహగిరి గురించి కూడా అంతే వర్ణన. రాహగిరిలో కేరింతలు, దోరవయసు దొరసానులు,
హాఫ్ పాంట్ల హాటుబాబులు అని వారి ఉత్సాహాన్ని వివరిస్తూనే ప్రపంచానికి హామీపడవలసిన తరం నెట్లో చిక్కిపోతున్న చిన్నతనానికి విచారపడతాడు. ఎవరెంత ఆత్రపడినా ఏ లైటు ఎప్పుడు వెలగాలో అప్పుడే వెలుగుతుందనే తత్వబోధను చేస్తాడు సిగ్నల్ కవితద్వాం జంటనగరాల జనాభాను దవడకు పెట్టుకుని ఆడిపోసే ఆటోవాలా, నగర కంపు నషాలానికెక్కినా నవ్వలేక నవ్వుతున్న మున్సిపల్ బండి, మెట్లమీద అలసటను, ఆలస్యాన్ని
నిట్టూర్చే కండక్టర్, ముందుకు ముందుకు బైకు నిలిపే గడుసు మనస్తత్వాలు ఇలా మ
నం రోజూ చూసేవే ఐనా సిద్ధుని కలంనుండి జాలువారినపుడు అవి కొత్తగా ముచ్చటగొల్పుతాయి. ఎదుటివారి బ్రతుకు సుఖం, నాదెంత అల్పమని భావించే జీవి జీవికను ఊరకుక్క, పెంపుడుకుక్కల స్వగతాలలో తెల్పుతాడు. బంధువయేదీ, బాటయేది, నడిచే కాళ్ళలో కట్టె అయేదీ, పిడుగులు పడేది, వసంతం పూసేది మాటలోనే ఉందంటూ మాట మహత్తును కాపాడుకోమంటాడు. రానిదానిగురించి ఎక్కిరిస్తవ్, ఒచ్చిందేంటో చెవి
– ఇనుకోమంటూ, మైకు పట్టరాదు మాటలు పేర్చరాదు. నాగలి పెట్టొస్తది బువ్వ పెట్టాస్తది. కుర్చీలెక్కరాదు పైస లెక్కరాదు. అయితేం కుర్చి దించొస్తది భూమికి జానెడెత్తు నడిస్తె భూమ్మీదికి దించొస్తది అంటూ అహానికి పోయే మనిషికి ఇగురం చెబుతడు. బలపీనుల పక్షాన నిలబడి వారి బలమేందో ఋజువుజెప్తడు. వారి వారి స్థానాల గొప్పతనాన్ని పంతంగా సపోర్ట్ చేసుకునే తూనీగలాంటి పిల్లలు, ఏమీ లేకున్నా ఎంతో సంతోషంతో దీపంలా వెలిగే పిల్లలగురించి చెప్తారు. పేలని పటాకులను దివాళి పొద్దున్నే దీనంగా వెతికే దోస్తులు అంటాడు వారిని. రాజకీయాలకు, పదవులకు అతీతమైనది కలం అంటాడు. అధికారం ఎన్నుకొన్నంతకాలమే నువ్వు. అక్షరం ప్రపంచం బతికున్నంతకాలం కవి బతుక
లతాడని, పడి ఉండడానికి కాసులు, పెంకాసులు కావివి, అక్షరాలు అంటూ సాహిత్యాని ్న శిఖరాన నిలబెడ్తాడు. సహజత్వాలు, స్వభావాలు కోల్పోయిన నగర జీవితానికి కృతకవే పతాకమంటూ ఋతువులు తెలియని నగరంలో ఋతుధర్మం పాడుతున్న కోయిలను
చూసి నవ్వుకుంటాడు. ఈ మందిమాట పట్టుకుని వచ్చినవుగానీ ఉన్న ఊరు కన్నతల్లిని విడిచి పెట్టి వచ్చినవుగానీ ఎవల ఊరిది? నువు ఎంత వెతికినా తెలిసిన మొఖం, మనిషి ముఖం కనిపించదురా నాయనా! అని తాను గమనించింది చెప్తడు. ఓదారుస్తడు.
కడలి అటు ఖండానికి ఇటు ఖండానికి తాడు కట్టి ఊయలూగుతుంది అంటాడు. ఆకాశయానంలో కూడా ఈ కవి కైత కల్టాడు. అక్షరానికి మువ్వల పట్టీలు తొడ
ఎగుతడు. ఆస్టిన్లో బందారం, బూరుగు వొర్రెనూ చూడొచ్చు, అమెరికాలో ఉండి నల్లవ ఎలా చూడొచ్చు కని లోపల దుంకుతున్న నయగరా చూడటానికి లోతు కావాలి ఎత్తుకు ఎదగాలి అంటాడు. రోనొక్ విమానంలో పాతబస్సు పల్లె వెలుగులను దర్శిస్తడు. రోనొక్ సారస్వతంలో సిద్దిపేట గ్రంథాలయం తలుపులు తెరుస్తడు. హైదరాబాద్ కొచ్చినా, ఆస్టిన్కు వెళ్ళినా కవి బందారపు దారాన్ని అంటి పెట్టుకునే ఉంటాడు. మాతృభూమిని మదిలో
దాచుకున్న వైనం తేటతెల్లమౌతునే ఉంటది. ఖండాలు దాటినా ఊరి పరిమళాల్ని ఆసా ్వదిస్తనే ఉంటది. మరమనుషులనుకుంటాం కానీ మనిషిని చూడగానే మనిషి తడిసిపోతడు. కొత్త చిగురుతో కళకళలాడుతుంటడు. డల్లాస్ ఉల్లాసం డబీలుర గడబిడ ఏదైనా
మనిషే అన్నప్పుడు స్వచ్ఛమైన సిదారెడ్డి నవ్వు ఎదురుగా నవ్వుతూ కనిపిస్తది. ఇలా ఒకో ్క కవితనూ ఒలుస్తూ ఉంటే రసధార కురుస్తూ ఉంటది. అతని కలంలో కొండ ఆకుపచ్చని అంగరఖా వేసుకుని ధ్యానిస్తుంది. చెట్లు ఎన్నో ఋతువులను ముడిచి ఆత్మవిస్వాసాన్ని వీస్తాయి. ప్రాసతో పసందునిస్తాయి. చదువుకుని మిడిసిపడే, సంపాదించి ఎగిరిపడి నీరసపడే వారికి తన కవితల ద్వారా నాట్లు, రోడ్లు, కంకరేసే కార్మికుల జీవనోత్సాహాన్ని జీ
వన సంబురాన్ని చూపిస్తాడు. ఐజాల్ లో మిజోల ఎర్రని, సన్నని యవ్వనం రంగు లుంగీల్లో సోయగం వెదజల్లుతుంది. పసిపిల్లలు ముసి ముసినవ్వులు విసురుతారు అంటూ నగరాల్లో కార్లు, భవనాలు ఎన్నైనా ఉంటాయ్. కానీ శిఖరాలను అధిరోహించిన నిస్సర్గ న
గరం ఐజాల్. ఎక్కడైనా సూర్యుడు ఉదయిస్తడు. ఐజాల్ ను చూడడానికి గంటముందే ఉరికొస్తడు అనే అత్యద్భుతమైన వర్ణన ఐజాల్ సౌందర్యాన్ని కళ్ళముందు నిలుపుతది. ఐజాలను త్వరగా చూడాలని కోరుకుంటది. పుష్ప సమయాల కాలం చెబుతూ ప్రపంచంలో పూలదొక ప్రపంచమని సహజ లక్షణాల నిర్భయత్వాన్నీ, సహజత్వాన్ని చెబుతాడు. సిధారెడ్డి సొంతూరుని, మనిషిని ఎంతగా ప్రేమిస్తాడో! గుండె గాయపడితే, కన్నీరొలికితే సెల్ ఫోన్ తుడవలేదు. జ్వరంతో కాలే శరీరాన్ని సాఫ్ట్ వేర్ నిమరలేదు. గుర్తించు నీ బంధం మనిషే, నీ అస్థిత్వం ఊరే అంటాడు.
తగ్గిపోతున్న సీతాకోకచిలుక, తూనీగలు, తేనెటీగల సంతతి పై చింతపడుతూ రాసిన అందం విషాదం కంటనీరొలికిస్తుంది. ఎవర్నో దించి, ఎవర్నో ఎక్కించుకుని, ఎవం పిలిచినట్టే వెళ్ళే రైలు, అక్కడి స్టేషన్ లో వాకింగ్ చేస్తున్న మనిషి తన శరీర బరువును దించుకోవడానికి సతమతమౌతాడని నవ్వుకుంటూ, ఆమెమాత్రం తట్ట మూట సంచి సంసారం బరువు మోస్తు సాగిపోతుంటే నివ్వెరపోతాడు. చిన్నప్పుడు కనిపించినంత దూరం
తరచిచూసిన విమానం, నేడు అందులో కూర్చున్నా, మేఘాలు తాకుతున్నా చిన్నప్పటి ఆ స్థితి, అందులో ఆనందం ఇందులో ఉండదని చెప్పే స్థితిలో వైరాగ్యం కనిపిస్తుంది. గాయపడినా బతుకునే ప్రేమిస్తా, సుడిగాడ్పు చుట్టినా బతుకంతా నడుస్తా, నా తొవ్వ నడుస్తా అని తన విజయ యాత్రను ప్రకటిస్తాడు కవి. జీవికి జీవనానికి జలం అవసరాన్ని చేప్పె నీటిమనసు కవిత నీటి గొప్పతనాన్ని కొత్తగా ఆవిష్కరిస్తుంది. మరింత గౌరవాన్ని పెంచి నీటిముందు మోకరిల్లేలా చేస్తుంది. ఒక కవితలో విశాలమైన ఇంట్లో ఇరుకు మనసుల గుట్టు చెప్తాడు. ఇంకో కవితలో పనిరాదనుకుని హృదయాన్ని ఆ గోడదగ్గర వదిలివెళారు. పనికిరాకుండా పోతుందా అని అతడు తీసుకున్నాడంటారు.

‘గుండె పలిగే దుఃఖం’ వాక్యంలో ‘పగిలే’ అనవచ్చు కానీ రాసింది సిధారెడ్డి, భాషపట్ల మస్తు పాణమున్న మనిషి. తను, తనవారు మాట్లాడే ‘పలి?’
అనే అంటడు. నీరు ఇంట్లోకి, చేన్లోకి ‘ఇరాం’ లేకుంట ప్రవహిస్తది. ‘మాటాడుతనే ఉన
‘ ఇలాంటి మాటలు చదువుతుంటే సిధారెడ్డిగారే ఎదురుంగ వచ్చి మనతో మాట్లాడుతు న్నట్టు, కవిత చదువుతున్నట్టు దృశ్యం సాక్షాత్కరిస్తుంది. ఇలా ఈ పుస్తకంలోని భాష గురించి చెప్పేదేముంది! తెలంగాణమే ఆయన, ఆయనే తెలంగాణం. సిధారెడ్డిగారి కవిత్వం చదువుతుంటే కవి ఐనవారికే కాదు, సామాన్యునికి సైతం కలం పట్టాలనిపిస్తుంది. కవితను ప్రవహింపజేయాలనిపిస్తుంది. అతని కవిత చదలవుతున్నప్పుడు ఆ స్ఫూర్తి కలుగుతుంది. అంతటి ఉద్వేగం ఊపేస్తుంది. సహజాతం కవితలో తనను తాను ఆవిష్కరించుకుంటూ సిధారెడ్డి అందరికీ అందుతాడు. ఎవరికీ అందడు. ఒక కోపం…. ఒక ఓపిక… ఒక ఆర్తి… ఒకింత సాహసం… ఒకింత రాజీ… సిధారెడ్డి మారాడు.  సిధారెడ్డి మారడు. ‘వాక్యం శాశ్వతం’ కవితలో ఒకరో
జు దేశం విడిచిపోతాను మరొక రోజు లోకం విడిచిపోతాను అయితేమి? అక్షరాల సాక్షిగా
జీవించే పుస్తకం నేను. వర్ధిల్లే వాక్యం నేను అంటారు.
సలలిత భావాలు, అభివ్యక్తులు, అంతరంగ మహాసంద్రాలు, అంతే తెలియ
ని లోతులు ఎన్నో మరెన్నో నిక్షిప్తమైన చిన్ని పుస్తకం “నీటి మనసు’. ఇందులోని ఒక్కో అక్ష
రబింధువూ సింధువై అగుపిస్తుంది. బిందెలో పట్టక సిద్ధుని జటలలో నిలిచిన గంగ సాక్షాత్కరిస్తుంది. నీటిమనసు
నందినీ సిధారెడ్డి
పబ్లికేషన్స్ : మంజీర రచయితల సంఘం
ప్రతులకు : అన్ని పుస్తక దుకాణాలు

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఏనుగు- చీమ స్నేహం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, February 28, 2022
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

ఒక చీమ వెళ్లి ఏనుగుతో స్నేహం చేస్తానంది. అప్పుడు ఏనుగు నవ్వి” నీవెక్కడా!  నేనెక్కడా! మన ఇద్దరికీ స్నేహం  ఎలా  కుదురుతుంది చీమా” అని అంది. ఇంతలోనే ఏనుగుకు ఒక పాము చుట్టుకుంది. వెంటనే ఏనుగు అరచింది. చీమ వెంటనే తన దండునంతా పిలిచింది .ఆ చీమలన్నీ ఒక్కసారిగా పామును చుట్టుకున్నాయి. పాము ఆ చీమల దాడికి ఏనుగు కాలు విడచి కిందకి వెళ్ళింది .అయినా దానిని చీమలు కుట్టాయి. పాము చీమల దండు నుండి తప్పించుకొని ఎట్టకేలకు వెళ్ళిపోయింది. అప్పుడు ఏనుగు ఆ చీమ  తనకు చేసిన ఉపకారానికి ఎంతో సంతోషించింది. అంతేకాదు. ఏనుగు ఆ చీమతో స్నేహానికి సంతోషంగా ఒప్పుకుంది .
అప్పటినుండి ఏనుగు చీమ సంతోషంగా కలిసి ఉన్నాయి. ఒకసారి చీమ ఒక ప్రవహించే వాగు పైభాగాన ఒడ్డున ఉన్న చెట్టు పైకి పాకి పొరపాటున జారి ఆ వాగు నీటిలో పడి కొట్టుకొని పోసాగింది. అది
” రక్షించండి !రక్షించండి” అని అరవ సాగింది. ఆ వాగు క్రింది భాగాన ఉన్న ఏనుగు ఇది గమనించి ఒక చెట్టు కొమ్మను తన తొండంతో విరిచి చీమ కొట్టుకుపోతూ తన దగ్గరకు రాగానే దానిని ఆ నీటిలో పడవేసింది. చీమ ఆ చెట్టు కొమ్మను అందుకొని ఒడ్డు పైకి వచ్చి ఏనుగుకు కృతజ్ఞతలు తెలిపింది .
ఆ తర్వాత మరొక సారి ఏనుగు పొరపాటుగా ఒక పెద్ద గుంతలో పడి పోయింది. అది తనను కాపాడమని బిగ్గరగా అరిచింది . దానికి దగ్గర్లోనే ఉన్న చీమ పరుగుపరుగున వచ్చి ఏనుగుకు ధైర్యం చెప్పి అలాగే ఉండమని తన స్నేహితుడైన గాడిదను కలసి కలప దుంగలను  దాని వీపుపై మోయమని  వేడుకుంది. అందుకు గాడిద ఒప్పుకొని వాటిని తన మీద ఎత్తి ఎవరైనా వేయడానికి పిలుచుకొని రమ్మని  చెప్పింది. అప్పుడు  చీమ పరుగెత్తి  తన మిత్రులైన ఎలుగుబంటి, కోతులను పిలుచుకొని వచ్చింది. వాటి  సాయంతో ఆ దుంగలను  గాడిద పైన వేసి ఏనుగు ఉన్న గుంత వద్దకు అవి వెళ్లాయి. ఆ గుంతలో ఏనుగును ప్రక్కకు జరగమని చెప్పి ఆ కలప దుంగలను అందులో వేశాయి.అంతే కాకుండా అవి కొంత మట్టి ,ఇసుక కూడా ఆ గుంతలో పోశాయి. ఏనుగు మెల్లగా ఆ దుంగలపై నున్న ఇసుక  పైకి ఎక్కి  మీదకు వచ్చి చీమను సంతోషంగా కౌగలించుకుంది .చీమ తన మిత్రులైన గాడిద, ఎలుగు ,కోతులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఆ తర్వాత మరొక సారి ఏనుగు వేటగాడు  పన్నిన వలలో చిక్కుబడిపోయింది .చీమ దాని దగ్గరకు వచ్చి ఏనుగుకు ధైర్యం చెప్పింది .ఆ సమయంలో వేటగాడు లేడు. చీమ వెంటనే తన మిత్రురాలైన ఒక ఎలుకను  తీసుకొని వచ్చింది . ఆ ఎలుక ఏనుగు యొక్క  వలత్రాళ్లను  కొరికింది .  ఏనుగు బయటకు వచ్చి ఎలుకకు ,చీమకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత అవి అక్కడనుండి దూరంగా వెళ్లాయి. తర్వాత వచ్చిన వేటగాడు వలంతా కొరికి ఉండడం చూసి నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. ఆ వేటగాడు వెళ్లి పోవడం చూసి ఎలుక  ఆ చీమ, ఏనుగుల స్నేహాన్ని  చూసి  చాలా అభినందించింది . ఎలుక  అప్పటి నుండి ఏనుగుకు కూడా  మిత్రురాలైంది. అలాగే చీమ మిత్రులైన గాడిద, కోతి, ఎలుగు కూడా ఏనుగుకు మిత్రులైనాయి. అప్పటి నుండి అవి అన్ని కలిసి ఎంతో అన్యోన్యంగా ఉండ సాగాయి. ఎవరికి ఏ ఆపద వచ్చినా అవి కలిసి  ఉపాయంతో తప్పించుకో సాగాయి.
ఇలా ఉండగా ఒకసారి చీమ ఒక మట్టిగుంటలో పడింది .దానికి పైకి ఎక్క రావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా జారుతూ పైకి ఎక్కలేక పోయింది .తిరిగి ఆ గుంటలోనే  పడిపోతున్నది. అప్పుడు ఇది చూసిన ఏనుగు చీమకు  ధైర్యం చెప్పి ఒక కర్రను తెచ్చి ఆ గుంటలో నిలువుగా  వేసింది.  దానిని పట్టుకున్న చీమ పైకి ఎక్కి సునాయాసంగా మీదకు వచ్చింది. అది సంతోషంతో ఏనుగుపైకి ఎక్కి  నృత్యం చేయసాగింది. అదే కాకుండా దానితోటి చీమలను కూడా  ఏనుగు పైకి ఎక్కమని పిలచింది. అవి అన్నీ ఏనుగు పైకెక్కి నృత్యం చేయసాగాయి. ఏనుగు కూడా  సంతోషంతో తొండాన్ని ఊపి అదికూడా నృత్యం చేసింది .
అప్పటినుండి మిగతా చిన్న ప్రాణులు చీమకు ఏనుగు అండ  ఉన్నదని గ్రహించి దాని జోలికి పోవడం మానేశాయి. ఏనుగు, చీమల మైత్రి చిరకాలం వర్ధిల్లింది.   తమ స్నేహానికి ఆకారాలు అడ్డురావని, చిన్న పెద్ద తేడా లేదని అవి రెండూ నిరూపించాయి. అంతేకాకుండా ఆపద సమయంలో అవి ఒకదానికొకటి చేదోడువాదోడుగా నిలిచి మిగతావాటికి ఆదర్శంగా నిలిచాయి.

రచన: సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.
మొబైల్: 9908554535.
———————————————————————

February 28, 2022 2 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

 ధర్మ సందేహం

by తడక మళ్ళ మురళీధర్ February 28, 2022
written by తడక మళ్ళ మురళీధర్

రేఖ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో పేరున్న కార్పొరేట్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా బాగానే  సంపాదిస్తుంది.  రేఖ తండ్రి సూర్య ప్రకాశ్ సిండికేట్ బ్యాంకు చీఫ్ మేనేజర్ కాగా తల్లి సరిత గృహిణి.  రేఖ ఇద్దరు తమ్ములు కాలేజి చదువు కొనసాగిస్తున్నారు. సూర్య ప్రకాశ్, సరితలు ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిర నివాసం.  ముగ్గురు పిల్లల చదువు  హైదరాబాదులోనే జరిగింది.  గత రెండు సంవత్సరాలుగా సూర్య ప్రకాశ్, సరితలు రేఖ వివాహ విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు మాట్రిమొనీలో కూడా రేఖ వివరాలు పొందు పరిచారు.  కాకపోతే రెండు నెలలుగా సూర్య ప్రకాశ్ తల్లి ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల ప్రయత్నాలకు  కొంత విరామం ఏర్పడింది.  వృద్ధాప్యరీత్యా వచ్చిన జబ్బుల మూలంగా సూర్య ప్రకాశ్ తల్లిని ఆసుపత్రిలో చేర్పించ వలసి వచ్చింది.  ఆవిడ వయస్సు తొంభై కి దగ్గరగా ఉంది.  పదిహేను రోజుల పాటు వైద్యం చేసి,  దాదాపు రెండు లక్షల రూపాయలు పిండుకొని తమతో కాదని ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కార్పొరేటు ఆసుపత్రి వారు సలహా ఇచ్చారు. ఒకటి రెండు రోజులు మించి బ్రతకడం కష్టమేనంటూ డాక్టర్లు వెల్లడించి ఇప్పటికీ నెల పదిహేను రోజులైంది.  ఆవిడ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. కోమా నుండి తేరుకోలేదు. తల్లి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి సూర్యప్రకాశ్ బాగా కుంగిపోయాడు.  తండ్రి చిన్నప్పుడే  చని పోవటంతో అన్నీ తానై సూర్య ప్రకాశ్ ను తల్లి బాగా చదివించింది.
********

       భరణి నాలుగేళ్లుగా కాలిఫోర్నియాలో సాఫ్టువేర్ ఉద్యోగిగా ఐదంకెల  జీతం సంపాదిస్తున్నాడు. హెచ్ వన్ బి వీసా ఉంది.  అతడి  చెల్లెలు స్మిత  పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని ఇంగ్లాండులో స్థిర పడింది.  తండ్రి కృపాకర్  పోలీసు శాఖలో గెజిటెడ్ హోదా ఉద్యోగం, తల్లి రవళి హైదరాబాదు రేడియో కేంద్రంలో మంచి పదవిలో ఉంది. తల్లిదండ్రుల పోరు భరించలేక   పెళ్ళి చేసుకోవడానికి అమెరికా నుండి  వారం రోజుల క్రితం హైదరాబాదు వచ్చాడు భరణి.
*******

        మాట్రిమొనీలో  రేఖ వివరాలు తెలుసుకొని సూర్యప్రకాశ్ కు  ఫోను చేశాడు కృపాకర్.  తనను తాను పరిచయం చేసుకొని భరణి వివరాలు,  తమ కుటుంబ నేపథ్యం వివరించి, “అమ్మాయికి, అబ్బాయికి జాతక రీత్యా   తగినన్ని పాయింట్లు కలిశాయని సిద్ధాంతి గారు చెప్పారు ,  అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపుల కార్యక్రమం  ఏర్పాటు చేయగలరా” అంటూ కృపాకర్   అడిగాడు.  సూర్య ప్రకాశ్ కి ఏమి చెప్పాలో తోచక కాసేపు సందిగ్ధంలో పడ్డాడు.  తన తల్లి  కోమాలో ఉండి కొన ఊపిరితో ఉందనే విషయం, తాము కొంత కాలం పాటు అమ్మాయి వివాహం వాయిదా వేసుకున్నట్టు చెప్పకుండా  “ప్రస్తుతానికి మేము  ఊళ్ళో లేమండి, రావటానికి వారం రోజులు పడుతుంది” అని దాట వేశాడు.

“వారం రోజుల తర్వాత మళ్లీ  కాల్ చేస్తానండి” అంటూ ఫోను కట్ చేశాడు కృపాకర్. ఇదే విషయం కృపాకర్ తన భార్య రవళికి చెప్పాడు.
“నెల రోజుల్లో పెళ్లి చేసుకొని భరణి అమెరికాకు వెళ్లాలి కాబట్టి మనకు ఉండే తొందర వారికెందుకు ఉంటుంది” అంటూ నిట్టూర్చింది రవళి.
******

     వారం రోజుల  పిదప కృపాకర్  సూర్య ప్రకాశ్ కి ఫోను చేశాడు. “నేను కృపాకర్ ను మాట్లాడు తున్నాను.  పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేయగలరా” అని అడిగాడు. మరో సారి అబద్దం చెప్పలేక ఏమైతే అయిందిలే అనే ధీమాతో “మంచిరోజు చూసి పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేస్తాను” అంటూ అయిష్టంగానే సంసిద్ధత తెలిపాడు  సూర్య ప్రకాశ్.

        “ఆ విషయంలో మీకు శ్రమ అక్కర్లేదు. నేను సిద్ధాంతి గారిని విచారించాను.  ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది, వర్జ్యం కూడా లేదు .  అదే రోజు ఖాయం చేయండి.  ఎందుకంటే మా వాడికి ఎక్కువ సమయం కూడా లేదండి” బ్రతిమిలాడే ధోరణి లో అంటూ సూర్య ప్రకాశ్ కి   మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా  పెళ్లి చూపుల తేదీ నిర్ణయం చేశాడు కృపాకర్.   పెళ్ళి చూపుల కార్య క్రమం యదావిధిగా అనుకున్న సమయానికి సూర్య ప్రకాశ్ ఇంట్లో జరిగింది.  రెండో రోజు కల్లా  అమ్మాయి, అబ్బాయి తమ అంగీకారం పెద్దలకు తెలియ జేశారు.   ఇక మిగిలింది పెళ్ళి ముహూర్తం నిర్ణయించటమే.  ఓ ప్రక్క సూర్య ప్రకాశ్ తల్లి చావు బతుకుల్లో ఉంది. మరో వైపు భరణి పెళ్లి చేసుకొని  కొద్ది రోజుల్లో  కాలిఫోర్నియా వెళ్లాల్సి ఉంది.  కృపాకర్ సిద్ధాంతి గారిని సంప్రదించి వివాహ ముహూర్తం తేదీ  నిర్ణయించి సూర్య ప్రకాశ్ కు ఫోను చేశాడు.  ” సూర్య ప్రకాశ్ గారూ, అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్ట పడ్డారు. వచ్చే ఆదివారం ఉదయం 10.32 నిమిషాలకు మంచి ముహూర్తం ఉన్నట్టు సిద్ధాంతి గారు చెప్పారు.  ఆ ముహూర్తానికి పెళ్లి కానిద్దామా” ప్రశ్నించాడు కృపాకర్.

       “సుముహూర్తానికి  కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో ఈ మహా నగరంలో కన్వెన్షన్ హాలు, ఇతర పెళ్లి ఏర్పాట్లు అసాధ్యమేమో” సందేహం వెలిబుచ్చాడు సూర్య ప్రకాశ్.

      “మీకు నచ్చిన కన్వెన్షన్ హాలు  చూడండి. నేనున్నాను కదా బావ గారూ.   అవసరమనిపిస్తే నిర్మొహమాటంగా నా సహాయం తీసుకోండి” ధైర్యం చెప్తున్నట్లుగా సమాధాన మిచ్చాడు కృపాకర్.

వీటన్నిటి కంటే ముఖ్యంగా తన తల్లి ఆరోగ్యం విషమించి మరణిస్తే పెళ్లి ఆగి పోతుందేమో అనే శంక సూర్య ప్రకాశ్ కి  ఎక్కువగా ఉంది.   భార్య సరిత, కూతురు రేఖను సంప్రదించి పెళ్లి సింహాచల క్షేత్రంలో జరపాలని నిర్ణయించుకున్నాడు.  మంచానికే పరిమితమైన తల్లిని హైదరాబాదులోనే పని మనుషుల సంరక్షణలో ఉంచి మిగతా బంధువులతో సింహాచలం వెళ్తే ఎటువంటి టెన్షన్ ఉండదని తన ఆలోచన. అనుకున్నదే తడవుగా ఆలోచన అమలు పెట్టాలను కున్నాడు.    కృపాకర్ కు ఫోను కలిపాడు .

“బావ గారూ, మీకో విషయం చెప్పడం మరిచాను. మా ఆవిడ గుర్తు చేసేంత దాకా నాకు ఆలోచన రాలేదు.  మా  అమ్మాయి సంబంధం నిశ్చయమైతే  వివాహం  సింహాచల క్షేత్రంలో చేయాలని ఎప్పుడో   మొక్కు కున్నాం. మరి ఈ ప్రతిపాదన మీకు సమ్మతమేనా నిదానంగా ఆలోచించి తెలపండి”  అంటూ ఫోను పెట్టేశాడు  సూర్య ప్రకాశ్.

భరణికి ఈ ప్రతిపాదన  నచ్చలేదు.   కృపాకర్, రవళి కూడ ఈ విషయంలో ఆసక్తి కనపరచలేదు. అయినా సరే దేవుడి సన్నిధిలో లగ్నం అనేటప్పటికి  వ్యతిరేకించ లేని పరిస్థితి  వారిది.   కేవలం దేవుడి సన్నిధిలో పెళ్లి చేస్తారనే నెపం చేత ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవడం సుతరామూ వారికి ఇష్టం లేదు. పైగా భరణి మరో పదిహేను రోజుల పాటు మాత్రమే ఇండియాలో ఉండేది, ఇప్పుడు కాలిఫోర్నియా వెళ్తే మరో రెండేళ్ల దాకా తను ఇండియా వచ్చే అవకాశం  లేదు.  పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా వేసే ప్రసక్తి లేదు. సూర్య ప్రకాశ్ ప్రతిపాదనకు కృపాకర్ కుటుంబ సభ్యులు కాదనలేక పోయారు. “బావ గారూ మీరు దేవుడి సన్నిధిలో పెళ్లి చేయాలని తీసుకున్న నిర్ణయం మాకు సమ్మతమే.  త్వరగా ఏర్పాట్లు చేయండి”  చెప్పాడు కృపాకర్.
*****
సింహాచలం లోని తన బంధువుకు ముహూర్తం తేదీ తెలియజేసి కావలసిన ఏర్పాట్లు చేయించుకున్నాడు సూర్య ప్రకాశ్. ముహూర్తం తేదీకి మూడు రోజులు ముందుగానే  బంధు మిత్ర బృందంతో బయలు దేరడానికి  ప్రైవేటు టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడుకున్నాడు.  ముహూర్తం సమయానికి చేరుకునే విధంగా పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు మరో టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడి ఆ వివరాలు కృపాకర్ కు   అంద జేశాడు. రెండు కుటుంబాల వారు వాయువేగంతో అన్ని పనులు పూర్తి చేసుకున్నారు.  సూర్య ప్రకాశ్ తల్లిని తన ఇంట్లో   కొన్నేళ్ల నుండి నమ్మకంగా పని చేస్తున్న శాంతమ్మ, ఆమె భర్త రాగయ్య సంరక్షణలో ఉండే విధంగా శాంతమ్మకు అన్ని జాగ్రత్తలు తెలిపారు.  తల్లి ఆరోగ్యం విషమించి కన్ను మూస్తే ఆ విషయం తొందరపడి ఎవరికీ తెలియజేయ వద్దని, కేవలం సూర్య ప్రకాశ్ కు మాత్రమే ఫోను ద్వారా చెప్పాలని శాంతమ్మకు  హితవు పలికారు.  తమ ఫ్యామిలీ డాక్టరుకు కూడా ముందు జాగ్రత్త గా తల్లిని తన ఇంట్లోనే ఉంచి తాము సింహాచలం వెళ్తున్నట్లు తెలిపాడు.  “ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకో సారి ఆవిడ ఆరోగ్యం చూసుకుంటాను. మీరు అధైర్య పడవద్దు.  నిశ్చింతగా మీ పనులు పూర్తి చేసుకోండి” అంటూ  హామీ ఇచ్చాడు డాక్టరు.

తల్లికి చెప్పకుండా  ఎన్నడూ  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదు సూర్య ప్రకాశ్.  ఇప్పుడు తల్లి కోమాలో ఉంది.  అనుకోని  పరిస్థితుల్లో తల్లికి తెలియకుండానే రేఖ వివాహ ముహూర్తం  నిర్ణయమైంది. బయలుదేరే ముందు బరువెక్కిన గుండెతో తల్లి కాళ్ళకు మొక్కిన సూర్య ప్రకాశ్ కుటుంబ సభ్యులను, బంధువులను హడావిడి చేసి ముహూర్తానికి మూడు రోజుల ముందుగానే సాయంత్రం నాలుగు గంటలకు సింహాచల క్షేత్రానికి టూరిస్ట్ బస్సులో బయలుదేర దీశాడు.

                 *****
సూర్య ప్రకాశ్ తల్లిని తన పర్యవేక్షణలో ఉంచడంతో శాంతమ్మది ఎటూ కదలలేని పరిస్థితి.  శాంతమ్మ, రాగయ్యలు మొదటి నుండి సూర్య ప్రకాశ్ కుటుంబానికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్నారు.
“మేము  తిరిగి వచ్చే దాకా ఇక్కడే ఉండి వంట చేసుకొని తినండి ” వెళ్ళే ముందు  సరిత తన ఇంటిని శాంతమ్మకు  అప్పజెప్తూ సలహా ఇచ్చింది.

          అదేమిటో గాని  గత రెండు నెలలుగా  నోటి మాట లేని సూర్య ప్రకాశ్ తల్లిలో పెళ్లివారి బృందం బయలు దేరిన మరుసటి రోజే కదలిక వచ్చింది. “ఒసేయ్ శాంతా ” అంటూ  పిలిచింది. అదే గదిలో అమర్చిన టీవీ చూస్తున్న శాంతమ్మ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. “ఎవరబ్బా నన్ను పిలిచింది” అని స్వగతం లోనే అనుకుంటూ  కూర్చున్నదల్లా లేచి బయటికొచ్చి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని గదిలోకి తిరిగి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంది.

     “ఏమే శాంతా, నేనేనే  నిన్ను పిలిచింది” అంది మరోసారి సూర్య ప్రకాశ్ తల్లి. టీవీ లోకం నుండి బయట పడిన శాంతమ్మ మంచం దగ్గరికి వెళ్ళి సూర్య ప్రకాశ్ తల్లిని నివ్వెరపోయి చూస్తూ నిలుచుంది.
“అమ్మా ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు మాట్లాడే శక్తి వచ్చిందమ్మా మీకు” అంది శాంతమ్మ.
“అబ్బాయి ప్రకాశాన్ని పిలువు” అంటూ హుకుం జారీ చేసింది సూర్య ప్రకాశ్ తల్లి.
“అయ్యగారు వాళ్లు సింహాచలం ఎళ్లారమ్మా, మన రేఖమ్మది  లగ్నం ఆడే చేస్తున్నారు, ఇంకో మూడు దినాలే ఉందమ్మా” జవాబిచ్చింది శాంతమ్మ.

“అదేమిటి ప్రకాశం నాకు ఈ విషయం చెప్పలేదే.  ఒక సారి ప్రకాశానికి ఫోను కలుపు నేను మాట్లాడతా” అంటూ మంచం మీద నుండి లేవటానికి ప్రయత్నం చేసింది.  సూర్య ప్రకాశ్ తల్లి  శాంతమ్మ సహాయంతో లేచి కూర్చుంది.  శాంతమ్మ సూర్య ప్రకాశ్ కి ఫోను కలిపింది.
“అయ్యా, పెద్దమ్మ మాట్లాడుతున్నారు, లేచి కూర్సున్నారు. మీతో మాట్లాడుతరంట” అంటూ ఫోను సూర్య ప్రకాశ్ తల్లికి ఇచ్చింది.
సూర్య ప్రకాశ్ తన తల్లి మాట్లాడు తుందన్న విషయం తెలియగానే కొద్ది క్షణాలు నివ్వెర పోయి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. “హలో” అన్నాడు.
“అరేయ్ ప్రకాశం, నాకు చెప్పకుండానే మనవరాలి కళ్యాణం చేస్తున్నావా, నాకు దాని కళ్యాణం చూసే యోగం లేదా” అంటూ ప్రశ్నించింది.
“అమ్మా, సింహాద్రి అప్పన్న చలవ వల్ల  కోలుకున్నావు.  చాలా సంతోషం. ఇన్నాళ్లు నీవు కోమాలో ఉండటం మూలాన రేఖ పెళ్లి విషయం నీకు చెప్పలేక పోయాను. అంతా అనుకోని పరిస్థితుల్లో జరిగింది.  ఎక్కువగా మాట్లాడకు నీరసించి పోతావు,  అన్ని విషయాలు మేము తిరిగి వచ్చినాక  మాట్లాడుకుందాం. నీ ఆరోగ్యం జాగ్రత్త” అంటూ ఫోను కట్ చేశాడు.  అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఆయనే కరుణించి చావుకు దగ్గరగా వెళ్లిన తల్లికి ఎవరూ ఊహించని విధంగా మాట్లాడే శక్తి నిచ్చాడని సూర్య ప్రకాశ్, సరితలు తమ సంతోషాన్ని తమతో పాటు ఉన్న బంధువర్గంతో  పంచుకున్నారు.
*****
కృపాకర్ దంపతులు కుటుంబ సభ్యుల సహితంగా ముహూర్తం  రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా చేరుకునే విధంగా  హైదరాబాదు నుండి సూర్య ప్రకాశ్ నియమించిన టూరిస్ట్ బస్సులో బయలు దేరారు.  పెళ్లికొడుకు తరపు వారికి బస్సు సరిపోనందున అప్పటి కప్పుడు ఒక కారు ఎంగేజ్ చేసుకున్నారు. కారులో కృపాకర్ ఇద్దరు బాబాయిలు, మేనమామ టూరిస్ట్ బస్సు వెనకాలే  బయలుదేరారు. కృపాకర్ తల్లిదండ్రులు పది సంవత్సరాల క్రితమే కాలం చేశారు.

      “బావ గారూ, ఇక్కడ అన్ని పనులు పూర్తయినాయి.  ముహూర్తానికి అన్ని సిద్ధం చేశాము” అంటూ  సింహాచలం నుండి సూర్యప్రకాశ్ కృపాకర్ కు ఫోను ద్వారా తెలియ జేశాడు. “థాంక్యూ బావ గారూ, ముహూర్త సమయానికి రెండు మూడు  గంటలు ముందుగానే మేము అక్కడికి చేరుకుంటాము” అంటూ కృపాకర్ బదులిచ్చాడు.

          పెళ్లికొడుకు బృందం బస్సు  కేరింతలతో, అంత్యాక్షరి ఆటలతో సాగుతుంది.  టూరిస్ట్ వెనకాల కారు భారంగా వెళ్తుంది. విజయవాడ కు పదిహేను కిలో మీటర్ల దూరంలో ఉండగా  బహుశా నిద్ర లేనందువల్ల నేమో అలసిపోయిన  కారు డ్రైవర్ కళ్ళు ఒక్క క్షణం మూసుకోవటంతో కారు గతి తప్పి రోడ్డు డివైడర్ కు గుద్దుకుని ఎగిరి రోడ్డుకు మరో వైపు బోల్తా పడింది. కొద్ది దూరంలో వెళ్తున్న టూరిస్ట్ బస్సు డ్రైవర్ వ్యూ మిర్రర్ లో ఘటన చూసి బస్సును రోడ్డు ప్రక్కన  ఆపాడు.  డ్రైవరు, కొంత మంది పెళ్ళి వారు పరిగెత్తు కుంటూ ఘటనా స్థలికి చేరుకున్నారు. సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో చూడగా అప్పటికే వెనుక సీట్లో కూర్చున్న కృపాకర్ ఇద్దరు  బాబాయిలు తీవ్ర రక్త గాయాలతో మరణించారు. సీటు బెల్టులు ధరించిన  కారు డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న కృపాకర్ మేన మామ ఎయిర్ బలూన్లు విచ్చుకోవటంతో రక్త గాయాలతో బయటపడ్డారు. పెళ్లి బృందంలోని ఒక సభ్యుడు 108 కి డయల్ చేసి ఘటన విషయం తెలియజేశాడు.   పోలీసు వారు కొద్ది సేపట్లో అక్కడకు చేరుకొని వారు చేయ వలసిన విధులను నిర్వర్తించారు.  ఘటనాస్థలి పెళ్లి వారి ఏడుపులతో నిండిపోయింది.
కృపాకర్ కాసేపటికి తేరుకొని  సూర్య ప్రకాశ్ కు ఫోను కలిపాడు. “బావ గారూ అనుకోని దురదృష్ట కర మైన సంఘటన జరిగింది. మా బస్సు వెనకాలే వస్తున్న కారు ఆక్సిడెంట్ కు గురైంది.  అందులో కూర్చున్న మా ఇద్దరు బాబాయిలు మరణించారు. కారు  డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న మా మేన మామ  గాయాలతో బయట పడ్డారు. ఈ పరిస్థితుల్లో మనం పెళ్లి కార్య క్రమం పెట్టుకోలేము కదా. పైగా మాకు  సూతకం ఉంటుంది. సూతకం తర్వాత మిగతా విషయాలు మాట్లాడు కుందాం” అంటూ ఫోను కట్ చేశాడు.
పోలీసు శాఖలో అధికారి కావటం మూలాన కృపాకర్ తన పరపతిని ఉపయోగించి  మరణించిన వారి మృత దేహాలు, గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపజేశాడు.
సూర్య ప్రకాశ్ ప్రక్కనే ఉన్న సరిత భర్త ఆందోళన గమనించి “ఏం జరిగింది” అని అడిగింది.  విషయం చెప్పిన సూర్య ప్రకాశ్ “సరితా, మా అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి మనం ఆందోళనలో ఉంటే ఇప్పుడేమో  ఇలా జరిగింది”.
*****
కర్మ కాండలు సంజీవరెడ్డి నగర్ లోని కృపాకర్ ఇంట్లో జరిగాయి. బాబాయిలకు వారసులు లేనందున తానే ముందుండి వారి  కర్మ కాండలు జరిపించాడు.  మాశికం కార్య క్రమంతో కృపాకర్ కుటుంబానికి మైల తొలగిపోయింది. ద్వాదశ దిన కర్మ రోజు  బంధుమిత్రులు బాగానే తరలి వచ్చారు.  బంధుత్వం కలిసింది కాబట్టి సూర్య ప్రకాశ్, సరితలు కూడా  హాజరయ్యారు. అనుకోని సంఘటన వల్ల భరణి తన అమెరికా ప్రయాణాన్ని మరో నెల  రోజుల పాటు వాయిదా వేసు కున్నాడు.  సాయంత్రానికి దూరపు బంధువులంతా వెళ్ళిపోయారు.  సూర్య ప్రకాశ్ అవకాశం కల్పించు కొని  పెళ్లి విషయం కృపాకర్ తో ప్రస్తావించాడు. అయితే ఒకే ఇంటి పేరు గల వారు మరణించారు కాబట్టి  సంవత్సరం లోపు భరణి  పెళ్లి చేయవచ్చునా అనే విషయం ప్రస్తావనకు వచ్చింది.  అదే విషయం అక్కడే ఉన్న సిద్ధాంతి గారిని అడిగాడు కృపాకర్.

“అయ్యా, మన సందేహాలు తీర్చటానికేమో  సమయానికి ధర్మ సందేహాలు కార్య క్రమం టివి లో ప్రసార మవుతుంది.  సర్వదమనశాస్త్రి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు చెప్తున్నారు. మీ సందేహానికి కూడా సమాధానం దొరక వచ్చు. వినండి.” అన్నాడు సిద్ధాంతి గారు.

       “శాస్త్రి గారూ, నల్గొండ నుండి సురేష్ అనే శ్రోత ఈ విధంగా అడిగాడు, తాత  చనిపోతే మనవడికి సూతకం ఎంత కాలం ఉంటుంది,  వివాహం ఎంత కాలం దాకా చేసుకోగూడదు” ప్రశ్న సంధించింది సంధాన కర్త .

“ఇంటి పేరు గల వారు మరణిస్తే సూతకం లేదా మైల 12 రోజులు, 13 రోజులు,15 రోజులు ఇలా ఒక్కొక్కరి ఇంట్లో వారి వారి ఆచారం  ప్రకారం ఒక్కో రకంగా ఉంటుంది.  తండ్రి మరణిస్తే సంవత్సరం పాటు, తల్లి మరణిస్తే ఆరు నెలల పాటు కుమారుడు వివాహం చేసుకోగూడదు.  నిత్య పూజలు మాత్రం సూతకం అయిపోయిన తర్వాత నిర్విఘ్నంగా చేసుకోవచ్చు.  కాకపోతే వ్రతాలు, పండుగలు ఏడాది పాటు ఉండవు.  అయితే తాత లేదా ఒకే ఇంటి పేరు గల వారు చనిపోతే సూతకం ముగిసిన అనంతరం మనవడి పెళ్లికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు. నిరభ్యంతరంగా చేసుకోవచ్చు” అంటూ సమాధాన మిచ్చాడు శాస్త్రి గారు.

“కృపాకర్ గారూ, సర్వదమన శాస్త్రి గారు అంత పెద్ద వారు చెప్పింది విన్నారు కదా, ఇంక మీరు నిరభ్యంతరంగా ప్రొసీడ్ అవ్వండి” అంటూ శలవిచ్చాడు పంతులుగారు.

సూర్య ప్రకాశ్, కృపాకర్ లు తమ రెండు కుటుంబాల  సంబంధం బలపరచుకోవడానికి సిద్ధాంతి గారు నిర్ణయించిన పెళ్లి సుముహుర్తానికి ఓకే చెప్పారు.

                      ******
తడకమళ్ళ మురళీధర్,
విశ్రాంత జిల్లా జడ్జి,
F306 HNo 13-10-95,
Vaishnavi Dvivedi Apartments,
Gaddiannaram,
Hyderabad-500060
Ph.9848545970.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వంశం

by vijayakanthi February 28, 2022
written by vijayakanthi

మొక్క
వంశవృక్షం
పువ్వు
రాసింది సంక్షిప్తం

తరతరాల పరంపర
రూపురేఖల చరితం!

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us