భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరుగుతూ, ఎండలు చుర్రుమంటున్నాయి. ఎక్కండి! ఎక్కండి! ఎల్లిపోదాం అని కేకలేస్తూ ప్రయాణీకులను బస్సు లోపలికి కూరుతున్నాడు క్లీనర్ కన్నబాబు. ఈ మాటలు నువ్వు గంటసేపటి నుండీ చెపుతున్నావు తెలుసా! అసలు ఎక్కడికెళ్ళారయ్యా మీ డ్రైవరూ కండక్టరూ? అని తమ అసహనం ప్రదర్శించారు ప్రయాణీకులు.
బస్సుపైనా, లోపలా కూడా లగేజీతో నిండిపోయింది. వాటిల్లో మూటలు, కోళ్ళ గంపలున్నాయి. ఒక కుర్రాడైతే రెండు మేకల కాళ్ళకు బంధంవేసి, తాడును గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. బస్సులో సీట్ల కోసం ఆడంగుల తగాదా మొదలైయ్యింది. మగరాయుళ్ళు మటుకూ వేరుశనక్కాయలు తింటూ పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. తిన్న వేరుశెనగ తొక్కలను బస్సు లోపలే వేస్తున్నారు.
ఎవరయ్యా! దారికడ్డంగా ఇలా చేపల బుట్టలను బస్సులో ఏసింది? మరి మీరు మేకలను, కోళ్ళను ఎక్కించలేదా? బస్సు నీ ఒక్కడిదే కాదు బాబూ మరి మన అందరిదీ! అంటూ చమత్కరించాడు చేపల చిన్నయ్య.
మీ మేకలు చూడవయ్యా, ఒంటేలు, రెండు చేసి ఎలా పాడుచేశాయో అని ఒకడంటే, నీ చేపల బుట్టల్లోంచి నీచువాసన నీళ్ళు ఎలా కారతన్నాయో చూడు! అంటూ వాగ్వాదానికి దిగారు. అయినా బస్సు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు.
మొత్తానికి డ్రైవర్ వచ్చి డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. ప్రయాణీకులందరీని ఒకసారి విమానం పైలట్లా చూసి, వెంటనే సిగరెట్ వెలిగించి, సినిమా పాటలు పెట్టాడు. ఇదుగో అందరూ టికెట్ సరిపడా డబ్బులు ఇచ్చి బేగా టికెట్ తీసుకోండి. టికెట్! టికెట్! అంటూ చిటికెలేస్తూ టికెట్లు కొడుతున్నాడు కండక్టర్.
ఇంతలో ఒక ప్యాసింజర్ బీడీ వెలిగించాడు. అసలే బస్సులో ఒకటే ఉక్కపోతగా ఉంది. దానికి తోడు ఈ సిగరెట్ల బీడీల పొగతోడైంద అని తిట్టేసరికి గబగబా మూడు దమ్ములులాగి బీడీని పడేశాడు అతను.
అప్పటికే కికిరిసిన బస్సులోకి స్కూలు పిల్లలూ, కూరగాయలవాళ్లు, చిన్నా చితకా వ్యాపారులు ఇంకా ఎక్కుతున్నారు.
అందుకే సత్తిరాజు ముందుగానే బస్సెక్కి హాయిగా పేపర్ చదువుకుంటున్నాడు. సత్తిరాజు ఆ చుట్టుప్రక్కల నాలుగు గ్రామాలకి ఒకే ఒక మెడికల్ స్పెషలిస్ట్, అదే ఆర్.యం.పి. డాక్టర్, వారాని ఒకసారి టౌనుకెళ్ళి ఒక సినిమా చూసి, పేషంట్లకి ఇవ్వవలసిన మందులు, ఇంజక్షన్లు కొని తెచ్చుకుంటాడు.
ఇదుగో డబ్బులు తీసుకో! టౌనుకి ఆరు టిక్కెట్లు ఇవ్వమన్నాడు ఓ ప్యాసింజర్. మరి ఆరుగురినీ చూపించమన్నాడు కండక్టర్. మేము ముగ్గురం మగ మనసులం. ఇంకా ముగ్గురు ఆడ టికెట్లు.ఇప్పుడే బాత్రూమ్కెళ్ళారని చెపుతుండగానే వాళ్ళు ముగ్గురూ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కేశారు.
ఈ గందరగోళంలో, డాక్టర్గారూ ఒకసారి పేపరు ఇస్తారా! అని డాక్టర్ సత్తిరాజు చేతుల్లో నుండీ విసురుగా దినపత్రికను లాగేసుకున్నాడు వెనకసీటు స్కూలు మాస్టారు.
కండక్టర్ రైట్! రైట్! అని చెప్పటంతో బస్సుస్టార్ట్ అయ్యింది. బస్సు కదిలిందిగా! ఇక ఉక్కపోత ఉండదు, హాయిగా గాలేస్తోంది లే! అంటున్నారు ప్రయాణికులు. బస్సు ఒక ఫర్లాంగు దూరం వెళ్ళేలోపే బస్సులోకి నల్లని దట్టమైన పొగ కమ్ము కొచ్చింది. పొగతోపాటు కిరసనాయిల్ వాసనతో ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇంజన్ని రైజ్ చేశాడు డ్రైవర్. అంతే! బస్సు ఆగిపోయింది.
తుమ్ముతున్నవాళ్ళు కొందరైతే, మరికొందరు వాంతులు కూడా బస్సులోనే చేసుకున్నారు. ఇదేం బస్సురా నాయనా! టాపునిండా చిల్లులే! ఇక కింద నుండి రోడ్డు కన్పిస్తోంది. ఇంజను సౌండూలో ఒకరి మాటలు ఇంకొకరికి వినిపించటంలేదు. కళ్లు మండటంతో ప్రయాణీకులు బస్సు దిగిపోతున్నారు.
డ్రైవరూ, క్లీనరూ కలసి ఏదో రిపేరింగు చేస్తున్నారు. స్టార్ట్ అవుతోంది, మళ్ళీ ఆగిపోతోంది. కానీ డాక్టర్ సత్తిరాజు, స్కూలు మాష్టర్ మటుకూ బస్సులోనే కూర్చుండిపోయారు. ఒకవేళ తాము కిందకు దిగితే మళ్ళీ సీటు దొరకదేమోనని.
డాక్టర్గారూ! ఈ పేపర్లో రాసిన దినఫలాలు నిజంగా జరుగుతాయంటారా? అని అదోలా అడిగాడు స్కూలు మాష్టారు. చూడండి మాష్టారు అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ దినఫలంలో మీకు ఏం రాసుందేమిటి? అని ఉత్కంఠగా అడిగాడు డాక్టర్ సత్తిరాజు. మీరు వస్తువులు కోల్పోతారు జాగ్రత్త! ప్రయాణాలలో అటంకాలు ఎదురౌతాయి అని రాసుంది. అయినా నా దగ్గరేముండిపోవటానికి? ఈ బ్యాగు ఒక్కటేగా? ఇది నా చేతిలోనే ఉంటుందిగా! అని చెప్పి కిందకి దిగాడు. కళ్లు మండటంతో సత్తిరాజు కూడా బస్సుదిగక తప్పలేదు.
దాదాపు రెండు గంటలు రిపేరింగు చేసినా బస్సు స్టార్ట్ అవలేదు. ప్రయాణీకులు కాస్తా, ఆందోళనకారులుగా మారిపోయారు. అసలు ఇలాంటి డొక్కు ప్రయివేటు బస్సుకి లైసెన్సు ఇచ్చిందెవరు? దీన్ని కాల్చిపారేయాలి అని రెచ్చిపోతున్నారు. దాన్ని మనం కాల్చక్కర్లేదు నాయనా! అదిగో పొగ ఇంకా ఎక్కువగా వస్తోందిగా! అదే కాలిపోతుందిలే! అని అంటూ డాక్టర్ సత్తిరాజు ఇంటికి తిరుగు ముఖం పెట్టాడు. అలాగే తిట్టుకుంటూ కండక్టర్ దగ్గర టికెట్ డబ్బులు తిరిగి తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్యాసింజర్లు.
స్కూలు పిల్లలకి మాత్రం బస్సు ఇలా పాడైపోవటం ఆనందంగానే ఉంది. ఆడుతూ పాడుతూ ఇంటికెళ్ళిపోయారు. మాష్టారు స్కూలుకు ఆలస్యంగా చేరుకున్నాడు. మొఖానికి పట్టిన చెమట తుడుచుకుందామని తన చిన్న టర్కీటవల్ని బ్యాగ్లోంచి తీయబోయాడు. ‘‘అరే! ఆ టవల్ను బస్సీటుమీద వేసుకొని కూర్చున్నాను.’’ అది కాస్తా బస్సులోనే మర్చిపోయాను. అయితే పేపర్లో రాసిన దినఫలం రైట్! రైట్ అనుకున్నాడు.
‘‘కండక్టర్ రైట్! రైట్! అన్నా బస్సు మాత్రం అక్కడే ఉంది.’’
యుద్ధం ఎంత భయాంకరమో,ప్రత్యక్షంగా చూసినవారి మనఃస్థితి ఎలా ఉంటుందో,దాని వలన జనజీవనం ఎంత అతలాకుతలమౌతుందో…
ప్రభావవంతంగా తన కవితలో పొందుపరిచారు మహాకవి!
యుద్ధంలో అసువులు బాసినవారు,అయినవారిని పోగొట్టుకున్నవాళ్ళు,
కాళ్ళుచేతులు కోల్పోయి జీవచ్ఛవాలైన వాళ్ళు,క్షతగాత్రులు,చివరి క్షణం వరకూ శత్రువుతో పోరాడిన వీరసైనికులు…దయనీయమైన యుద్ధానంతర దృశ్యాలను దృశ్యమానం చేసారు తన కవితలో.
ఆ దృశ్యాలే అర్జునుణ్ణి యుద్ధరంగం నుండి పారిపోయేలా చేసినవి!
ఆ దృశ్యాలే అశోకుడిని శోకతప్తుడిగా మార్చి,తథాగతుని బాటను పట్టించినవి!
ధాత్రీ జనని గుండె మీద యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు అంటూ యుద్ధజ్వాలలకు ప్రతీకగా మండే కొరకంచులను ఎత్తుగడగా వాడారు. ఆ కొరకంచుల ఎర్రని రవ్వలు గాలికి ఎగిరి దూరంగా పడుతాయి.అంటే యుద్ధం ఒకచోట ప్రారంభమైనా, దాని ప్రభావం ప్రక్కదేశాల మీద,ప్రపంచమంతటా దాని ప్రభావముంటుందని ఈ పంక్తుల్లో తెలిపారు.
కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను
అనే పంక్తుల్లో యుద్ధం కొరకు కోట్లాది సైనికులు పడే బాధలను,కష్టాలను, స్వసుఖాన్ని విడచి,శత్రువుల చేతికి చిక్కితే చిత్రహింసల పాలై,చివరి క్షణం వరకూ పోరాడుతూ ప్రజలకై చేసే ప్రాణత్యాగాలను గుర్తించమంటున్నారు.కనీసం కన్నీరు కార్చమంటున్నారు.
దరిద్రుని నోరులేని కడుపు
తెరుచుకున్న నాలుక బూడిదలో వ్రాసుకున్న మాటలు అనే పంక్తులలో యుద్ధానికి ఎక్కువగా బలయ్యేది సామాన్య ప్రజానీకం అనే విషయాన్ని తెలుపుతూ…
ఆహారం,నీరు దొరకక తల్లడిల్లే పరిస్థితులను వర్ణిస్తూ పోల్చిన నోరులేని కడుపు అనే ప్రతీక పేదవాని కోపం పెదవికి చేటు సామెతను గుర్తుకు తెస్తుంది.ఒకవేళ తెరుచుకున్న నాలుక మాట్లాడినా…బూడిదలో వ్రాసుకున్న మాటలు అంటే ఎదురుతిరిగిన సామాన్యుడికి చావే గతి అనే సత్యాన్ని చాటిచెప్పారు.
కాలం విరిగిన బండిచక్రం అనే ప్రతీకలో యుద్ధం ఆరంభం అయ్యాక అంతమెప్పుడో తెలియని అనిశ్చితిని వివరించారు.
మొండిచేతుల మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం
అనే పంక్తులలో …ఎదురుగా వేలకొలది ప్రాణాలు గాలిలో కలుస్తున్నా, మనసున్న మానవుడు తెల్లబోయి చూడడం తప్ప,
ఏమీ చేయలేని దీనస్థితిని,
నిస్సహాయ పరిస్థితిని వెల్లడించారు.
ముగింపు పంక్తుల్లో…
ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి పోకముందే
అనే పంక్తిలో కవులు తమ భావావేశాన్ని ప్రకటించకముందే
(ప్రజాచైతన్యంలో వారి పాత్రను తెలుపుతూ)
అణచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందే
అనే పంక్తిలో ప్రజలలో అసంతృప్తి విప్లవంగా ఎగసిపడకముందే
మీరిపుడైనా మేల్కొంటారా
చీకటి తెరలను చీలుస్తారా
అంటూ ప్రభుత్వాల కర్తవ్యాన్ని, యుద్ధవిరమణ ప్రతిపాదనను తెచ్చి, సంధి కుదిర్చి,యుద్ధ చీకటి తెరలను చీల్చాలంటూ సూచించారు.
యాభై ఏళ్ళ క్రితం జూన్ 8 వ తేదీన వియత్నాం గ్రామంలో జరిగిన యుద్ధబీభత్సాన్ని నిక్ ఉడ్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించిన దృశ్యం ప్రపంచాన్ని కుదిపేసింది.ఆ ఛాయాచిత్రంలో సైనికులు,ఓ వృద్ధురాలు,
తొమ్మిదేళ్ల బాలిక,బాలుడు బాంబు దాడిలో గాయపడి ఒంటిపై స్పృహ లేకుండా పరిగెడుతుంటారు.ఆ బాలిక మంటలకు తల్లడిల్లిపోతూ దాహం తీర్చమని కోరుతుంది. ఆ బాలికతో పాటు ఇంకొందరిని
కూడా అంబులెన్స్ లో తరలిస్తాడు నిక్ ఉడ్.
ఇటువంటి మానవతా దృష్టి
ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుంది…?!
సందేహించాల్సిన విషయమే.
యుద్ధం కన్నా శాంతి,
విద్వేషాల కన్నా,మానవత్వమే
హితమని సందేశమిస్తూ,
పిలుపు అనే శీర్షిక సార్థకమయ్యేలా ప్రభావవంతమైన మేలుకొలుపు కవితను అందించిన కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారికి
వందనములు🙏🙏🙏🙏
( కవితాలయం సాహితీ సామాజిక సేవా సంస్ధ వారు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి(250 రూపాయలు నగదు బహుమతి) పొందిన నా సమీక్ష!
మయూఖ సంపాదకులకు నమస్కారం.
%%%%%%%%%%%%%%%%%%%
నాపేరు పోణంగి బాల భాస్కరరావు. నేను 1955 లో పుట్టిందీ, ఆ తర్వాత ఇరవైయేళ్లు పెరిగిందీ, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో కి మారిన, ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గౌతమీ తీరంలోని గోష్పాద క్షేత్రంలో. ఆ తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డాను.
నా గురించి నేను చెప్పుకోవాలంటే, నేను రెండు విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాను. ఒకటి వృత్తి, రెండోది ప్రవృత్తి. ఈ జోడెడ్ల బండి మీద నా జీవనయానం సమతూకంతో సాగడానికి నా అదృష్టం ఒక కారణమైతే, రెండో కారణం, నా తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో పాటు సహోద్యోగుల ప్రోత్సాహం.
నా ఉద్దేశ్యంలో ప్రతి వ్యక్తికీ జీవనాధారంగా ఆదాయాన్ని సమకూర్చే ఒక ఉపాధి తో పాటు మనలో నిబిడీకృతమై ఉండే ఒక ప్రత్యేకమైన అంశాన్ని వెలికి తీసి, మనకు అపరిమితమైన మానసిక ఆనందాన్ని కలుగజేసే, మరొక వ్యాపకం లో కూడా నిమగ్న మవ్వాలి. మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అని, ఒక సినిమాలో చెప్పిన డైలాగు లాగా అన్నమాట. దాన్ని, కొంత మంది సర్వీసు నుంచి రిటైరయ్యాక కాలక్షేపానికి ఒక వ్యాపకంగా చేపడితే నాలాంటి మరి కొంత మందికి రెండింటినీ సమాంతరంగా పోషించే అవకాశం లభించవచ్చు. నేనైతే, అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే భావిస్తున్నాను.
ఇక ముందుగా, వృత్తి విషయానికి వస్తే, ఉద్యోగాల వేటలో భాగంగా, 1974 లో హైదరాబాద్ వచ్చి, అబిడ్స్ లోని, శ్రీ బృందావన్ హోటల్ లో బిల్ రైటర్ గా, రిసెప్షనిష్టు గా, టెలిఫోన్ ఆపరేటర్ గా, సూపర్వైజర్ గా మూడున్నరేళ్ళు ఆడుతూ, పాడుతూ పనిచేశాను. సమాజంలోని రక రకాల మనుషులు వాళ్ళ మనస్తత్వాలు, భాషలు, భావావేశాలు, మౌనంగా, నిశితంగ పరిశీలించి ఆకళింపు చేసుకున్నాను.
అదే సమయంలో, అంటే, 1975 ఏప్రిల్ నెలలో, హైదరాబాద్ లో ప్రప్రథమ అంతర్జాతీయ తెలుగు మహా సభలు జరిగాయి. దానికి మా చిన్నాన్న గారు డాక్టర్ పోణంగి శ్రీరామ అప్పారావు గారు ప్రధాన కార్యదర్శి గా వ్యవహరించారు. అప్పుడు ఆయనతో కలిసి తిరగడం వల్ల, ఆ మహా సభల కార్యక్రమాలను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. అంతకు ముందు ఆ తర్వాత కూడా అయన రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ గా, తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థల వ్యవస్థాపక డైరెక్టర్ గా పనిచేసినప్పుడు, ఆయన వెనకాల, ఏదో ఒక వంకతో తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలో ఎంతో మంది కవులు, కళాకారులు, సాహిత్యాభిలాషులతో నాకు పరిచయ భాగ్యం కలిగింది. దాంతో, క్రమంగా సాంస్కృతిక కార్యక్రమాల మీద, అభిరుచి, ఆసక్తి పెరిగాయి.
అలా ఉండగా, బృందావన్ హోటల్ లో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవంతో, 1978 ఫిబ్రవరి లో హైదరాబాద్ జీడిమెట్ల లోని – హెచ్.ఎం.టి. మెషీన్ టూల్స్ సంస్థ లో టెలిఫోన్ ఆపరేటర్ గా చేరడం, నా జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో హెచ్.ఎం.టి. లో చేరిన నేను, ఆ తర్వాత నెమ్మిదిగా విద్యార్హతలు పెంచుకుంటూ, అంచెలంచెలుగా డిప్యూటీ మేనేజర్ స్థాయి కి చేరాను. సంస్థ ఒడిదుడుకులు, నా ఒడిదుడుకులు తట్టుకుని నిలబడి ఒకే ఊరులో ఒకే సంస్థలో 35 సంవత్సరాలకు పైగా సర్వీసు పూర్తిచేసుకుని, 2013 లో రిటైర్ అయ్యాను. తర్వాత కూడా ఓ ఏడాది పాటు సంస్థ అవసరాల దృష్ట్యా, తాత్కాలిక ప్రాతిపదికన హెచ్.ఎం.టి. కి నా సేవలందించే అవకాశం కలిగింది. అనంతరం బయట రెండు ప్రయివేటు సంస్థల్లో మరో రెండేళ్ళు పనిచేశాక, ప్రస్తుతం శేష జీవితాన్ని హాయిగా ఆనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తూ, నాకెంతో ఇష్టమైన ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలతో పాటు, ఇతర సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొంటూ ఎంతో సంతృప్తిగా గడుపుతున్నాను.
అవకాశం వచ్చింది కాబట్టి, పనిలో పనిగా నా వ్యక్తిగత జీవితం గురించి కూడా రెండు విషయాలు చెబుతాను.
1983 లో ఖమ్మం వాస్తవ్యులు శ్రీ కొమరగిరి సీతారామచంద్రరావుగారి అమ్మాయి గాయత్రితో నా వివాహం జరిగింది. ఇన్నాళ్లూ నావృత్తి, ప్రవృత్తులకు అనుగుణంగా ఇంటా, బయటా విజయవంతంగా తిరిగానూ అంటే, దానికి నా శ్రీమతి ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణం. ఆమె సహచర్యం నాకెంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్ని కలుగజేస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరికైనా అంతే కదా! ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటేనే, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. మాకు ఇద్దరు అమ్మాయిలు ప్రతిభ, ప్రత్యూష. పెద్దమ్మాయి ఆర్కిటెక్ట్ గా, రెండో అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరికీ నా తాహతుకు తగ్గట్టు ఘనంగా వివాహాలు చేశాను. వారి, వారి కుటుంబాలతో వారు హాయిగా జీవిస్తున్నారు. 1996 లో హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో ఓ చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాను. ప్రస్తుతం అక్కడే ఉంటున్నాను.
సరే ఇక్కడితో ఈ విషయాలకు ఫులిస్టాప్ పెట్టి, మళ్ళీ, ప్రవృత్తి విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో అందరికీ రేడియో ఎక్కువగా వినడం మా దినచర్యలో ఓ భాగం. ఆ అలవాటే అందులో పాల్గొనాలనే ఉత్సాహాన్ని రేకెత్తించింది. ప్రాధమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో వేసవి శలవుల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు సార్లు, “బాలానందం” రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్న రోజులు నేను ఎప్పటికీ మరువలేను. అదేవిధంగా హై స్కూల్లో, జూనియర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలా సార్లు ఫ్రెండ్స్ తో కలిసి స్టేజి నాటకాల్లో పాల్గొన్నాను. అప్పుడే, నా సాంస్కృతిక పిపాసకు నాందీ ప్రస్తావన జరిగి నాలోని కళాతృష్ణ కు తెరలేచింది. ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం లో పాల్గొనేవాడిని.
కట్ చేస్తే –
“ఆకాశవాణి , ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోణంగి బాల భాస్కర్” అని రేడియోలో నా పేరు చెప్పుకోవాలన్న నా కల నెరవేరిన రోజు నా జీవితంలో మరొక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ రోజు నా సంతోషానికి అవధులు లేవు. అది జరిగింది – 1988 జులై నెలలో. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళకు పైగా ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం, ప్రాంతీయ వార్తా విభాగంలో ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు అనువాదం చేయడం, చదవడంలో నిమగ్నమయ్యాను. ఇందుకు ఆ విభాగంలో అప్పుడు న్యూస్ ఎడిటర్లు గా పనిచేసిన శ్రీయుతులు ఆకిరి రామ కృష్ణారావు గారు, ఆర్.వి.వి. కృష్ణారావు గారు, ఆశయ్య గారు, సుబ్రహ్యణ్యం గారు, ఎస్.వి.ప్రసాద్ గారు, భండారు శ్రీనివాసరావు గారితో పాటు, న్యూస్ రీడర్లు గా పనిచేసిన – శ్రీ డి. వెంకట్రామయ్య గారు, శ్రీమతి జ్యోత్స్నా దేవి గారు నాకు వార్తలు సేకరించడం, రాయడం, అనువదించడం, చదవడంలో మంచి తర్ఫీదు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత కూడా ఎంతో మంది న్యూస్ ఎడిటర్లు, న్యూస్ రీడర్ల తో కలిసి ఎన్నో కొత్త విషయాలు, మెళకువలు నేర్చుకున్నాను.
రేడియోలో వార్తలు చదవడం అంటే ఎవరైనా రాసి ఇచ్చిన వార్తలను చూసి చదవడమే కదా అని, చాలా మంది రేడియో స్టేషన్ కి వచ్చేవారు. వార్తలు చదవడంతో పాటు అంతకంటే ముందు పెద్దగా ఉన్న వార్తలను తగ్గించి చిన్నగా రాసుకోవాలనీ, ఆ వార్తలను అవసరమైతే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చెయ్యాలని చెబితే, అమ్మో, అలా అయితే మా వల్ల కాదని, నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్ళిపోయేవారు. మంచి రాయగలిగినవారు స్పష్టంగా ప్రసార యోగ్యంగా చదవలేకపోయేవారు. చక్కగా చదవగలిగినవారికి మంచిగా రేడియోకి అనువుగా రాయడం వచ్చేదికాదు. అందుకే చాలా కాలం పెద్దగా కొత్తవాళ్ళెవరూ ఈ రంగంలోకి రావడానికి ధైర్యం చెయ్యలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భాష, ఉచ్చారణ తో పాటు, జర్నలిజం మీదా, అనువాదం మీదా మంచి అభిరుచి, అవగాహన, అనుభవం ఉన్న వారు వస్తున్నారు. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
అప్పట్లో, ఆకాశవాణి, ప్రాంతీయ విభాగంలో పనిచేసే వారిలో చాలా మంది జర్నలిజం విద్యార్హత, అనుభవంతో వచ్చి పనిచేసే వారే ఉండేవారు. నాలాగా వేరే ఆఫీసుల్లో, కంపెనీల్లో పనిచేస్తూ, కేవలం చదవాలనే కోరికతో, ఆసక్తి తో వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. అందువల్ల నేను దాదాపుగా ప్రతీ రోజు వేరే వాళ్ళు చదివే వార్తలు విని, వాళ్ళు ఎలా వ్రాస్తున్నారు, ఎలా చదువుతున్నారు అని జాగ్రత్తగా విని, వారి భాష, శైలి, ఉచ్చారణ పరిశీలించి, గుర్తుపెట్టుకుని, వాటిని నెమరువేసుకుంటూ, నేర్చుకోడానికి ప్రయత్నించేవాడిని. అంతే కాదు నేను చదివిన ప్రతి వార్తల్నీ ఇంట్లో రికార్డ్ చేయమని చెప్పి, ఇంటికి వచ్చాక, మళ్ళీ మళ్ళీ విని, నాకు నేనుగా మంచిగా రాయడం, చదవడం మెరుగు పరచుకోడానికి కృషి చేసే వాడిని. దాంతో నాకు పబ్లిక్ రిలేషన్స్, జర్నలిజంలో ఏదైనా విద్యార్హత సాధించాలనే కోరిక కలిగింది. అవకాశం చూసుకుని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా చేశాను. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.కామ్. చేసాను. వీటికి తోడుగా ఉంటుందని తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్ & జర్నలిజం లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాను.
ఆ తర్వాత – 2005 డిసెంబర్ 25వ తేదీన హైదరాబాద్ ఎఫ్.ఎం. రెయిన్ బో స్టేషన్ ప్రారంభం కాగా, ఆ మర్నాడు ఉదయం “ఎఫ్.ఎం.రెయిన్ బో – న్యూస్ హెడ్ లైన్స్” మొదటి బులిటెన్ చదివే అదృష్టం నాకు దక్కింది. అప్పటి నుండి 2020 వరకు దాదాపు 15 సంవత్సరాలు ”ఎఫ్.ఎం.రెయిన్ బో వార్తల ముఖ్యాంశాలు” చదవడంతో పాటు, వాటిని సేకరించి, ప్రసార యోగ్యంగా కూర్చడం కూడా నేర్చుకున్నాను.
వీటితో పాటు, ప్రాంతీయ వార్తా విభాగం ద్వారా ప్రసారమయ్యే జిల్లా సమాచార లేఖలు, వార్తా వ్యాఖ్యలు, శాసనసభ, శాశనమండలి సమీక్షలు, వార్తా వాహిని వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ విషయంలో ఆ కార్యక్రమాలను అప్పట్లో నిర్వాహించిన శ్రీ అద్దంకి శ్రీరాం కుమార్ ప్రోత్సాహం మరువలేనిది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి భౌతిక కాయానికి జరిగిన అంతిమ యాత్రకు ఆకాశవాణి నిర్వహించిన “ప్రత్యక్ష వ్యాఖ్యానం” కార్యక్రమంలో నేను కూడా ఒక వ్యాఖ్యాతగా పాలుపంచుకోవడం నా జీవితంలో మరువలేని ఒక అరుదైన సంఘటనగా నేను భావిస్తాను.
రేడియో లో ప్రాంతీయ వార్తలు చదవడానికి రెండు సంవత్సరాల ముందు నుంచే అంటే, 1986 నుంచీ, నేను ఆకాశవాణి హైదరాబాద్ మెయిన్ స్టేషన్ తో పాటు, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం, యువవాణి కేంద్రాల్లో క్యాజువల్ అనౌన్సర్ గా పనిచేసే వాడిని.
అంతకుముందు 1978 నుంచీ, యువవాణిలో నేను రాసిన ప్రసంగాలు, రూపకాలు ప్రసారమవుతూ ఉండేవి. అప్పటికి నేను డిగ్రీ పూర్తి చేయలేదు. కనీసం డిగ్రీ విద్యార్హత ఉంటే కానీ, అనౌన్సర్, లేదా న్యూస్ రీడర్ గా దరఖాస్తు చేయడానికి వీలు లేదని తెలియడంతో, మొత్తానికి కుస్తీ పట్టి, ఆఘమేఘాల మీద, ఉస్మానియా విశ్వవిద్యాలయం, దూరవిద్యా కేంద్రం నుంచి బి.కామ్ పూర్తి చేశాను.
ఆ తర్వాత, 1985 లో ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం లో క్యాజువల్ అనౌన్సర్లు కావాలన్న రేడియో లో ప్రకటన విని, వెంటనే అప్లై చేశాను. నా అదృష్టం కొద్దీ, ఎంపికయ్యాను. రేడియో చిన్నక్క గా సుప్రసిద్ధులైన శ్రీమతి రతన్ ప్రసాద్ గారు, ఏకాంబరంగా సుపరిచుతులైన సత్యనారాయణ గారు, సుప్రసిద్ధ రచయిత, వ్యాఖ్యాత శ్రీమతి ఇలాయస్ జ్యోత్స్న గారితో పాటు, శ్రీమతి శకుంతల గారు, శ్రీమతి నిర్మలా వసంత్ గారు, శ్రీ కపర్ది గారు, శ్రీ మట్టపల్లి రావు గారు, శ్రీమతి సుశీల గారు, శ్రీమతి సీతాదేవి గారు మొదలైన ఎంతో మంది సీనియర్ అనౌన్సర్లు, కళాకారులతో కలిసి పనిచేస్తూ, వారి వద్ద చక్కటి శిక్షణ పొందాను. అదేసమయంలో వివిధ భారతి, వాణిజ్య ప్రసార విభాగంలో కూడా, క్యాజువల్ అనౌన్సర్ గా పనిచేశాను. ఆ తర్వాత డ్రామా సెక్షన్ లో కూడా ఆర్టిస్టు గా ఎంపికై అనేక నాటకాలు, నాటికల్లో పాల్గొన్నాను.
దానికంటే సుమారు పదేళ్ళ ముందు నుంచీ, అంటే, 1978 లో హెచ్.ఎం.టి. లో చేరిన తర్వాత అక్కడ పరిచయమైన గురుతుల్యులు శ్రీయుతులు టి.ఆర్.జి.కె. విఠల్ గారు, కె.ఎం.కె. రావు గారు, దివాకర్ల రామ భాస్కరం గారు వంటి సాహితీ మూర్తులతో కలిసి, వారు రూపొందించే బాలల కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు అన్నింటిలో క్రమం తప్పకుండా పాల్గొనేవాడిని. అలా నాకు ఆకాశవాణితో దాదాపు నలభై ఏళ్ళకు పైగా అనుబంధం ఏర్పడింది. అందుకే నాకు ఆకాశవాణి పేరు ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా, నాకు ఆకాశమంత ఆనందం కలుగుతుంది. .
అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం- ఎస్.ఐ.ఈ.టి.- రూపొందించి, “టెలీ స్కూల్” పేరుతో హైదరాబాద్ దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసిన అనేక విద్యా కార్యక్రమాలలో కూడా అనౌన్సర్ గా, వ్యాఖ్యాత గా, నటుని గా పాల్గొన్నాను. ఇదే సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి దృశ్య శ్రవణ విద్యా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా కలిగింది.
ఇలా ఉండగా, 1987 లో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో యాంకర్ గా, అనౌన్సర్ గా, వ్యాఖ్యాత గా అర్హత, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చనే ప్రకటన వినగానే ఎగిరిగంతేసి, వెంటనే అప్లై చేశాను. అక్కడ కూడా నా అదృష్టం కొద్దీ సెలెక్టు అయ్యాను. నన్ను వ్యవసాయదారుల కార్యక్రమ నిర్వాహకులకు పరిచయం చేశారు. అప్పుడు నాకు శ్రీయుతులు బొగ్గవరపు వెంకట్రావు గారు; మండవ విజయ సారధిగారు చక్కటి శిక్షణ ఇచ్చి, లెక్కలేనన్ని కార్యక్రమాల్లో అవకాశం ఇచ్చి, ప్రోత్సహించారు. దూరదర్శన్ లో వ్యాఖ్యాతగా నాకొక గుర్తింపు రావడానికి దోహదం చేశారు. దూరదర్శన్ లో ప్రసారమైన ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం “బిజినెస్ ట్రెండ్స్” లో కూడా వ్యాఖాతగా, ప్రెజెంటర్ గా పాల్గొన్నాను.
అంతే, ఇక ఆరోజు నుంచి వెనుదిరిగి చూడలేదు అంటారు కదా! అలా నిరాఘాటంగా 2010 లో కరోనా నిబంధనల అంతరాయం వరకు, దాదాపు ముఫై మూడేళ్ళు దూరదర్శన్ లో – “వ్యవసాయదారుల కార్యక్రమం అంటే బాల భాస్కర్ – బాల భాస్కర్ అంటే వ్యవసాయదారుల కార్యక్రమం” అన్నట్లుగా, దూరదర్శన్ లో ఎంతమంది కొత్త ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చినా, నా స్థానం సుస్థిరంగా కొనసాగింది. అందుకు దూరదర్శన్ కార్యక్రమ నిర్వాహకులందరికీ నేను పేరు పేరునా ఎప్పుడూ హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఇంత సుదీర్ఘకాలం దూరదర్శన్ లో వ్యాఖాతగా నాకు తెలిసి ఎవరూ కొనసాగలేదు. నిజంగా ఇది ఒక రికార్డే అని, అందరూ అంటూ ఉంటే, నాకు గర్వంగా కూడా ఉంటుంది. అంతే కాదు గ్రామదర్శిని లో వ్యవశాయదారుల కార్యక్రమానికి లైవ్ లో కామెంటరీ ఇచ్చిన అరుదైన అవకాశం కూడా నాకు కలిగింది. ఆ విధంగా అనేక సంవత్సరాలు తెర వెనుక వ్యాఖ్యాతగా ఉన్న నాకు, తెర మీద కనబడాలనే నా ఉత్సాహాన్ని గమనించి, అప్పట్లో ప్రొడ్యూసర్ గా ఉన్న శ్రీమతి శైలజా సుమన్ గారు నాకు దూరదర్శన్ లో “ఉద్యోగ వార్తలు” చదివే అవకాశం కల్పించారు. ఆ అనుభవంతో, ఆతర్వాత, కొంత మంది ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను.
ఈనాడు టెలివిజన్ ప్రసారం చేస్తున్న “ఆంధ్రావని” కార్యక్రమంలో కూడా “వాయిస్-ఓవర్-ఆర్టిస్ట్” గా పనిచేశాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో “తేజా టీవీ” ద్వారా ప్రతీ రోజు ప్రసారమైన “రైతు మిత్ర” అనే వ్యవసాయదారుల కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా, వ్యవసాయ వార్తల ప్రెజంటర్ గా కూడా రెండు, మూడేళ్ళు పనిచేశాను. తీరిక సమయాల్లో వివిధ పాఠశాలలు, కళాశాలలు, సాంస్కృతిక సంస్థల వార్షికోత్సవాలు, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలతో పాటు, వర్ధమాన నృత్య కళాకారుల “అరంగేట్రం” కార్యక్రమాలకు యాంకర్ గా, వ్యాఖ్యాతగా వ్యవహరించాను.
రేడియో వార్తల ద్వారా నేను నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏవిషయాన్నయినా పాజిటివ్ గా చెప్పడంతో పాటు, సానుకూల దృక్ఫధం అలవాటయ్యింది. సూటిగా, స్పష్టంగా, సుత్తి లేకుండా, క్లుప్తంగా చెప్పడం. వాస్తవ విషయాలనే – మాట్లాడడం. ఏదైనా అనుమానం, అస్పష్టత ఉంటే, ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం, అవకాశం లేకుంటే, ఆ విషయాన్ని ప్రస్తావించకుండా వదిలేయడం.
అదేవిధంగా, దూరదర్శన్ లో వ్యవసాయదారుల కార్యక్రమాలపై ఎవరైనా జోక్స్ వేస్తే, నేను అసలు ఒప్పుకునే వాడిని కాను. వారితో గొడవపడి, ఆ కార్యక్రమాల ప్రత్యేకత, గొప్పదనం, ప్రయోజనం గురించి వివరించి, వారి అభిప్రాయం తప్పు అని వారిచేతే ఒప్పించేవాడిని. లేకపోతే వారిని క్షమించేవాడిని కాను.
ప్రస్తుతం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రచురణల విభాగం, యోజన పత్రిక తో పాటు, పత్రికా సమాచార కార్యాలయం లో – ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదకునిగా పనిచేస్తున్నాను. ఇందుకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతోంది.
అదేవిధంగా ఆకాశవాణి, దూరదర్శన్ లలో అనుభవంతో ప్రస్తుతం – సంప్రదాయం; ది యారో టి.వి; బట్ న్యూస్ తెలుగు; ఛానల్ 5 ఏ.ఎం. వంటి వివిధ యూట్యూబ్ ఛానెల్స్ లో “వాయిస్-ఓవర్-ఆర్టిస్ట్” గా, గాత్ర దానం చేస్తున్నాను.
“ఓ సారి చూడండి అంతే!” అనే పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ మాధ్యమాల ద్వారా ప్రతీ నెల మొదటి, మూడవ గురువారాల్లో మాత్రమే ప్రసారమౌతూ బహుళ ప్రజాదరణ పొందుతున్న “దృశ్య శ్రవ్య పఠన సమ్మిళిత ప్రసార సంచిక” లో భాగంగా, సంక్షిప్త వార్తలు అందిస్తూ “న్యూస్ ప్రజెంటర్” నా స్థానాన్ని సుస్థిరపరచుకుంటున్నాను.
ఇటీవల మరొక కొత్త అనుభవం కూడా నాకు కలిగింది. అదేంటంటే, ఆర్.జె. లు, యాంకర్ లు; వాయిస్-ఓవర్-ఆర్టిస్టుల శిక్షణ కోసం “మన వాయిస్ గ్లోబల్ రేడియో ఛానల్” నిర్వహిస్తున్న – ట్రైనింగ్ ప్రోగ్రాం లో భాగంగా, 2022 జనవరిలో రెండు రోజులు దృశ్య మాధ్యమం ద్వారా, వారికి నా అనుభవాలతో పాటు, నాకు తోచిన కొన్ని సూచనలు, మెళకువలు చెప్పే అవకాశం కలిగింది.
ఇక పురస్కారాలు, అవార్డుల విషయానికి వస్తే, హెచ్.ఎం.టి. లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ప్రతీ ఏటా వివిధ సందర్భాల్లో నిర్వహించే “స్లోగన్” పోటీలు; వ్యాస రచన పోటీల్లో అనేక బహుమతులతో పాటు, నగదు పురస్కారాలు అందుకున్నాను. ఇవి కాక, ముఖ్యంగా, మచిలీపట్నంలోని “పట్టాభికళాపీఠం” 2011 లో ఉత్తమ రేడియో న్యూస్ రీడర్ గా, 2012 లో ఉత్తమ వ్యాఖ్యాత గా అవార్డులు ఇచ్చి సత్కరించింది. 2013 ఏప్రిల్ నెలలో, హైదరాబాద్ లో పి.ఎస్. ఆర్. ఆంజనేయ శాస్త్రి స్మారక ఉత్తమ రేడియో న్యూస్ రీడర్ పురస్కారం అందుకున్నాను. 2018 లో అమెరికా లోని వివిధ తెలుగు సంస్థలు మరియు గాంధీ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో అట్లాంటా లోని గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించిన “మీట్ & గ్రీట్” కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత ,చలన చిత్ర నటులు శ్రీ తనికెళ్ళ భరణి గారితో పాటు, ముఖ్య అతిధిగా సత్కారాన్ని అందుకోవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. అదేవిధంగా, 2021 డిసెంబర్ లో “అంతర్జాతీయ మానవతా స్వచ్చంద సేవా సమితి” వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది శ్రీ ముషిణి రామ కృష్ణా రావు గారు అమెరికా, అరెగాన్ స్టేట్ లో ఉన్న తమ పోర్ట్ ల్యాండ్ కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమం ద్వారా వ్యాఖ్యాన శిరోమణి అవార్డును ప్రదానం చేశారు.
అదండీ సంగతీ . ..
చివరిగా, నేను చెప్పదలచుకున్న ఏమిటంటే, “నేను రిటైర్ అయిపోయాను. నేనేం చేయగలను. నా పని అయిపొయింది.” అని – నిరుత్సాహ పడి కృంగిపోకూడదు. అందుబాటులో ఉన్న అవకాశాలు, ఆలోచనలను అందిపుచ్చుకుని, ముందుగా మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకుంటే, ఆ తర్వాత శారీరిక ఉత్సాహం, ఓపిక దానంతట అవే సమకూరుతాయనేది నా అభిప్రాయం. నా అనుభవం.
ఈ విధంగా – నా జీవన ప్రస్తానం గురించి ఒక సారి పునశ్చరణ చేసుకునే అపూర్వ అవకాశం కలిగించిన మయూఖ పత్రిక సంపాదకులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను.
నమస్కారం.
గోపి చాలా ధనవంతుడు. అతని పుట్టినరోజు వేడుకకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆ వేడుకకు అతని మిత్రులంతా వేల రూపాయల విలువైన బహుమతులతో వారి ఇంటికి వచ్చారు. రాము మిక్కిలి పేదవాడు. అతడు కూడా ఒక బహుమతిని చాలా తక్కువ ధరకు కొని దానిని కాగితాలతో చుట్టి పెద్దగా చేసి తెచ్చాడు.
ఆ వేడుక బ్రహ్మాండంగా జరిగింది .అందరూ తాము తెచ్చిన వేల రూపాయల గొప్ప బహుమతులను గోపీకి ఇచ్చారు. అందరితోపాటు రాము కూడా తాను తెచ్చిన బహుమతిని అతనికి ఇచ్చాడు. బంధువులు, పెద్దలు గోపీని దీవించి అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన మిఠాయిలను తీసుకుని వెళ్లిపోయారు. కేవలం గోపి,అతని మిత్రులు మాత్రమే మిగిలారు.అప్పుడు ఆ మిత్రులలో ఒకడు గోపితో “ఒరేయ్! వీడు చాలా పెద్ద బహుమతిని తెచ్చినట్టున్నాడు.అది ఏమిటో ఆ కాగితాలు తీసిచూడరా” అని అన్నాడు .అందరు మిత్రులు గోపితో అది చూడాలని పట్టుపట్టారు. సహచరుల ప్రోద్బలంతో గోపి దానికి చుట్టి ఉన్న చాలా కాగితాలను తీసి చూశాడు. తీరా చూస్తే అది ఒక చిన్న చేతి గడియారం. అది చూసి అందరూ నవ్వారు. అప్పుడు గోపి” ఒరేయ్! ఎందుకురా అలా నవ్వుతారు? నా మీద ప్రేమతో తెచ్చి ఇచ్చిన ప్రతి బహుమతి గొప్పదే .చివరికి రాము బహుమతి కూడా “అని అన్నాడు. అప్పుడు అందులో ఒకరు “ఈ చిన్న చేతిగడియారం ఒక గొప్ప బహుమతియేనా!” అని వేళాకోళంగా అన్నాడు. గోపి అప్పుడు ఏమీ మాట్లాడలేదు .రాము కళ్లలో నీళ్లు నిండాయి.
ఇంతలో అతని మేనమామ వచ్చి ” గోపీ! నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్లాలి .సమయం ఎంత అయింది. నా గడియారం చెడిపోయింది.నేను సమయానికి వెళ్లకపోతే నాకు విమానం అందదు. కాస్తా తొందరగా చెప్పు “అని అన్నాడు. అప్పుడు గోపి రాము తనకు బహుమతిగా ఇచ్చిన చేతి గడియారం లో సమయం చూసి ఎనమిది గంటలైందని చెప్పాడు. మేడ పైకి వెళ్లిన మామయ్య తాను ఢిల్లీకి పట్టుకుని పోయే చాలా వస్తువులను తన సంచీలో పెట్టుకోవడం ప్రారంభించాడు.
ఆ తర్వాత గోపి” చూశారా! ఆ చేతి గడియారం ఇప్పుడు ఎంత అవసరమైనదో! ఇప్పుడు అవసరానికి ఉపయోగపడిన అది గొప్పబహుమతి కాదా! మీరే చెప్పండి! అంతేగాకుండా సమయం చాలా విలువైనది.అది మన కొరకు ఆగదు.ముఖ్యంగా విద్యార్థులకు సమయం గడచిపోతే మళ్లీ రాదు.సమయ పాలన జీవితంలో చాలా ముఖ్యమైనది. పరీక్షల సమయంలో మనం ఎన్ని జవాబులు వ్రాయాలో సమయాన్ని బట్టే నిర్ణయం తీసుకొంటాం. లేకపోతే మనం ఎక్కువ మార్కులను సాధించలేం.అతడు పేదవాడని మీరు గేలిచేసినప్పటికినీ రాము చాలా ఆలోచించి మీ అందరి కన్నా గొప్ప బహుమతిని తెచ్చాడు.ఇది చూడటానికి చిన్నగా ఉన్నా,ధర తక్కువైనా చాలా గొప్పది. అంతేకాదు. ఇది నాకు ఇష్టమైనది కూడా” అని అన్నాడు.
ఇంతలో అతని మిత్రుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పాఠశాలలో మన తరగతిలో మొదటి రెండు స్థానాలు రాము, గోపివేనట. ఇప్పుడే పరీక్షా ఫలితాలు వచ్చాయనీ నా మిత్రుడు చెప్పగా విన్నాను” అని అన్నాడు. అప్పుడు గోపి ” నేను చెప్పలేదా!రాము నాకు చదువులో చక్కని సలహాలు ఇచ్చి సమయ పాలన పాటించమని చెప్పాడు. అంతేకాకుండా నాకు ఈ చేతి గడియారాన్ని ఎప్పుడు తాను గుర్తుండేలాగా మంచి బహుమతిగా ఇచ్చిన నా ప్రియ మిత్రుడు రాముకు ధన్యవాదాలు మరియు అభినందనలు ” అని అన్నాడు. అతని మాటలకు తోటి మిత్రులంతా రాము బహుమతిని గేలి చేసినందుకు తాము సిగ్గుపడి కరతాళధ్వనులను చేశారు.తర్వాత వారు రాముకు క్షమాపణలు చెప్పి తాము కూడా ఇకనుంచి సమయ పాలనను పాటిస్తామనీ,ఇకముందు ఎవ్వరినీ గేలి చేయమని అన్నారు. రామును, గోపిని వారు అభినందించారు.వారిలో తాము ఆశించిన మార్పు వచ్చినందుకు రాము, గోపి ఎంతో సంతోషించారు.
[తెలంగాణ సిద్ధాంతకర్త కీ౹౹శే౹౹ కొత్తపల్లి జయశంకర్ గారి స్మృత్యర్ధం]
పల్లవి: జయ జయహే జననాయక జయశంకర జోహారులు
జనని తెలంగాణ కంట కురిసె అశ్రుధారలు ౹౹ జయ ౹౹
చరణం 1౹౹ తెలంగాణ కష్టాలకు కారణాలు వెదికావు
దాయాదుల దోపిడీల గుట్టురట్టు చేసినావు ౹౹ తెలంగాణ ౹౹
ఊరూరా ఉద్య్మాల సెగలు రగులజేసినావు
ఉవ్వెత్తున ఎగిసిపడే ఉప్పెనగా మార్చినావు ౹౹ జయ ౹౹
చరణం 2౹౹ ఉద్యమానికూతము రాజకీయ మార్గమని నీవు
భావజాల జ్వాలను రాజేసిన మేధావివీ ౹౹ ఉద్యమా ౹౹
తెలంగాణ పోరు నావ తెరచాపవు నీవు 2
దిశను నిర్దేశించిన ఉద్యమ దిక్సూచి నీవు ౹౹ జయ ౹౹
చరణం 3౹౹ నీ వాదనలో తెలంగాణ, నీ రచనల్లో తెలంగాణ
నీ గమనంలో తెలంగాణ, నీ గమ్యంలో తెలంగాణ ౹౹ నీ ౹౹
ఓ జయశంకర వాదమా! సాధించే తెలంగాణ
ఈ తెలంగాణ రాష్ట్రమే ఇక బంగారు తెలంగాణ!! ౹౹ జయ ౹
కాకతీయ వైభవం సప్తాహం లో ప్రశంసలు పొందిన తెలంగాణ సామాజిక రచయితల సంఘం బాధ్యులు

కాకతీయ వైభవం సప్తాహం లో భాగంగా హన్మకొండలోని అంబేద్కర్ భవనంలో ఈరోజు జరిగిన కవి సమ్మేళనంలో కవులు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తొర్రూరు పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ,తెలంగాణ ఆణిముత్యం పుడమి రత్న సాహిత్య విక్రమార్క జాతీయ సేవ రత్న పురస్కార గ్రహీత ఇమ్మడి రాంబాబు మహబూబాబాద్ జిల్లాకు చెందిన మా ర సం మాజీ అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ పాల్గొని కాకతీయ అంశంపై కవి సమ్మేళనం లో పాల్గొని తమ కవితా గానం వినిపించినందుకు వరంగల్ మహానగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి చేతుల మీదుగా సన్మానం ప్రశంసా పత్రం జ్ఞాపిక స్వీకారం జరిగింది.ఉదయం నుండి రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది కాకతీయుల అదృష్టసంఖ్య 7 అని చరిత్ర చెబుతోంది అని అందుకు అనుగుణంగా జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న 110 మంది ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి కవులను అభినందిస్తూ శాలువ, మెమొంటో లతో ఘనంగా సత్కరించి ప్రశంసలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సాహిత్యం రంగానికి కవులకు పెద్దపీట వేస్తుందని అన్ని రంగాల వారిని గుర్తించడం జరుగుతుందని గత కాలం చరిత్రలో రాబోయే తరానికి అందించే కవులు రచయితలు వారధి అని సమాజంలో పాత్ర గణనీయమైనది అని అన్నారు కాకతీయ పాలన ఆదర్శాలను పాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆలయాలను చెరువులను అభివృద్ధి చేస్తుందని అన్నారు సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెద్దపీట వేస్తుందని అన్నారు రాబోయే రోజుల్లో కవి సమ్మేళనాన్ని కాలేజీ కళాక్షేత్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఏడి జి లక్ష్మణ్ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మున్సిపల్ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ కుమార్ ఇంజనీర్ భూపాల్ ప్రముఖ కవులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ వి ఆర్ విద్యార్థి పొట్లపల్లి శ్రీనివాస రావు సిరాజుద్దీన్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య బిల్ల మహేందర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు
రోజుకో నిజం
రాత్రికి నాకు తగాదా పెట్టి
పక్కరోజుకి వెళ్లి దాక్కుంటుంది.
ఒళ్ళు విరుచుకుని
కాలమెంత జాగానిచ్చినా
చీకటిలో నానిన మాటలలో
ఒక అర్థం తెల్లగా మెరుస్తూ పారుతుంటే
మరోవైపు అదే అర్థం నల్లగా తునకలై…
కళ్లెదుటే పల్టీ కొట్టి
ప్రశ్నలుగా పుట్ట పగిలి
పాయలు పాయలుగా పాకే
ప్రతి పన్నెండు గంటల ప్రయాణంలో
మనసుకు నిద్రనప్పజెప్పి
కన్నార్పని భయంతో
కటిక చీకటిలో శరీరం ఎన్నో అనుభవాలకు చేసేది దాస్యమే .
ఇంతలో వేకువ వెన్నును గుచ్చగానే
నిన్న నిజం నేడెక్కడోనని వెతికే కళ్ళకు
పగటి నటనే ఓ వింతసమస్యగా
విస్మయించలేనిదే యుద్దానందం.
దారిపొడవునా ముళ్ల కాట్లకు
కళ్ళ వెంట మాటలు
చురుకు చురుకుమని జారి
తడిసే జాము జాములో
బొట్లు బొట్లుగా కదిలిన భావప్రవాహానికి
రాత్రికో నిజంలా
పగటికో అబద్దం కొత్త అవతారం.
క్షణం తీరికలేని మనసు ఆకలికి
ఆవిరయ్యే అందాలన్నీ
రుచిగల ఇష్టాలుగా
రాత్రి వేదిక కావడం అనివార్యం.
మనసును చంపుకోలేని శరీరం
శరీరాన్ని తెంపుకోలేని మనసు
పెనవేసుకుని ముడులేసుకుని
రోజుకోసారి కొత్తగా పుట్టడం
రోజుకోసారి వింతగా గిట్టడమనే
వింతానుభవాల నేపధ్యమే సాంగత్యం.
పగటి ప్రతిధ్వనిగా రాత్రిని
రాత్రి ప్రతిరూపంగా పగటిని
మనిషిని శాశ్వతంగా లిఖించి
మనసును నటింపచేయడమే సత్యం.
రోజుకో నిజం ఓ వైపు
పగటికో అబద్దం మరోవైపు
మద్య మనిషి పాదం
మనసు పథం వేరువేరుగా
మనిషి తనకు తానే భిన్నంగా
మనసును నగ్నంగా
బయట నిలబెట్టటమే
సత్యమైనది….స్వార్థమైనది …
స్వర్గమైనది….సొంతమైనది….
….చందలూరి నారాయణరావు
9704437247
తెలుగుజాతిని ఓ కుదుపు కుదిపి పేరుకున్న తరతరాల జడత్వాన్నుంచి వెన్నుతట్టి మేల్కొల్పిన అసాధారణ వ్యక్తి చలం.
20 శతాబ్దిలో తెలుగువారిలో ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన చలం ఎవరితోనూ పోల్చడానికి వీల్లేని వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు.రమణాశ్రమం వెళ్లకముందు చలం ఆలోచనలు,జీవితం ఒక విధంగా ఉన్నాయి.రమణాశ్రమం వెళ్ళాక ఆయన అభిప్రాయాల్లో ఎంతో మార్పు కనిస్తుంది.
వ్యక్తిగతాభిప్రాయాలు,జీవన విధానం,తత్కాలీన సాంఘిక సమస్యలు,ఉద్యమాలు, రచనా వివరాలు, అనుభవాలు,సాహిత్య విమర్శలు,ఆధ్యాత్మిక సాధనలు మొదలైనవెన్నో విషయాలు చలం ఉత్తరాల్లో దర్శనమిస్తాయి.చలం సాంఘిక,వైవాహిక వ్యవస్థలో చిచ్చు రగిల్చి సంప్రదాయగుండెల్లో జ్వాలలురేపిన కాలమది.ఆస్తిక నాస్తికుల విచికిత్సతతో దేవునికోసం దేవుళ్లాడిన కాలం కూడా అదే. చలం ఆలోచనలకు,ఆశయాలకు రూపకల్పనే చలం మిత్రులకు రాసిన ఉత్తరాలు.
” ఉత్తరాలు వ్రాయడం,వ్రాయించుకోవడం ఒక గొప్ప సృజనాత్మక కళ. ఈ కళ తెలుగు రచయితల్లో చలం గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అని సాహసం చేయలేము గానీ,ఈ కళ కళాత్మకంగా తెలిసిన వారిలో చలం గారు ప్రముఖులు అని మాత్రం అనొచ్చు.” అని సంజీవదేవ్ పేర్కొన్నాడు.

చలం జీవిత పరిణామక్రమం లేఖల్లో స్పష్టంగా గోచరిస్తుంది.దీక్షితులకు రాసిన లేఖలో చలం ఇలా చెప్పుకుంటాడు.” నేను చాలా Sensitive. ముఖ్యంగా స్నేహితుల విషయమై కొన్ని సమయాల్లో వాళ్ళని సరిగా అర్థం చేసుకోను.మిమ్మల్ని ఎప్పుడూ ఘనంగా ఎంచుకున్నాను— నా ఉపయోగం కోసం కాదు.నేను చూసిన వాళ్లలో Generally as one of the Thoroughly nice gurllness persons ( Few they are) కానీ యీ మధ్య మీకు తెలీకుండా నేనేమో,మీరు మీ ఉత్తరాల్లో నన్ను దెప్పుతున్నట్లు కనపడ్డది.నేనేమన్నా చేశానా?” చలంది సున్నితహృదయం.తన మనస్తత్వం తెలిసిన వారితోనే పరిచయాలు పెంచుకుని మనసులోని విషయాలు పంచుకున్నాడు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
చలం దీక్షితులు గారికి వ్రాసిన ఉత్తరాలు చాలా విలువగలవి. “ఈ ఉత్తరాలు చదివితే వేంకట చలం గారి హృదయానికి సమీపముగా పోవచ్చు.దానిలోతు, వైశాల్యము తెలుసుకోవచ్చు.వారి సారస్వత కృషిని,పురిగొల్పిన భావోద్వేగం ఇందు గమనింపవచ్చు.
అరమరిక లేకుండా నిర్భయంగా మనుష్యుల్ని గురించీ సంస్థల్ని గురించీ చర్చించుకునేందుకు ఉత్తరాల్లోనే సావకాశముంది అట్టి చర్చలూ– అభిప్రాయాలూ– ఈ ఉత్తరాల్లో ఉన్నవి.కొన్ని ఘాటుగా కూడా ఉన్నవి.” అన్నాడు దీక్షితులు.
” జీవితమంటే ప్రేమ నాకు,దేవుళ్ళో కానీ,బతుకు తరువాత బతుకులో గానీ,దేశంలో గానీ నాకు విశ్వాసం లేదు.” అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాడు చలం.

అరుణాచలం వెళ్ళాక వీరేశలింగంకు రాసిన లేఖలో కూడా ఇలా తెల్పాడు.” ఇదివరకైనా నేనేదో అందరితో కలిసే వాణ్ణనుకున్నారా? ఏ నలుగురు మిత్రులో తప్ప( వాళ్ళు నా అభిప్రాయాలు ఒప్పుకునేవాళ్లే) ఎవరితోనూ నాకెప్పుడూ సంబంధం లేదు.బతికిపోయినాను.అట్లాంటి వాళ్ళు నా కిప్పుడూ వున్నారు.” ఆయనకు పరిమిత సంఖ్యలోనే మిత్రులుండేవారని,ఈయన అభిప్రాయాలనర్థం జేసికొనే వారితోనే సాన్నిహిత్యం పెంచుకునేవారని తెలుస్తుంది.
చలం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో మనసువిప్పి తన కుటుంబ విషయాలు,వైయక్తిక విషయాలను వెల్లడించాడు. ప్రజలు తన జోలికెప్పుడు రారని అంటూ ” లోకాన్ని తన్నేవాణ్ణి చూచి లోకం అవసరమైన దూరానికి తానే జరుగుతుంది”. అంటూ తను స్థాపించిన బడిలో పిల్లల్ని పంపించనందుకు ప్రజల మీద కోపంగా ఉందని తెలిపాడు. తనను హెడ్మాస్టరుగా బెజవాడలో వేశారని,మీతో ఎంతో చెప్పాలని ఉందని తన మనసులోని మాట దాపరికం లేకుండా దీక్షితులకు తెలియచేసే ఉద్దేశ్యం గల చలం ఆనాడు ప్రభుత్వ ఉద్యోగం చేసే చలం ఇలా రాశాడు.” మీ స్నేహితుడు మన ఆఫీసులో నా మీద చాలా విషం పోశాడు. నేను నడవడిలో, డ్రెస్ లో,మాటల్లో ,నడకలో చాలా కేర్ లెస్ గా వుంటానని వెళ్లి స్వయంగా పనిపట్టి చెప్పాడు.అతను నేనడిగినప్పుడు, ఈశ్వరుని ఎదుట తానేమీ యెరుగనన్నాడు.
పొద్దస్తమానం మానవ జంతుసేవ మాట్లాడతాడు మళ్లీ” అని మాలతీబాయికి తప్ప తన మంచితనం ఎవరికీ తెలియదని రాశాడు. ఇలా ఆనాటి సమాజ పరిస్థితి, చలంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చాటుగా చలం గురించి
నీచమైన అభిప్రాయాలు కలవారని,చలం ఎదుట కనిపిస్తే భయపడి అబద్ధాలాడేవారని,చలం గురించి ప్రజలు రకరకాల వ్యాఖ్యానాలు చేసికొనేవారని దాన్ని బట్టి అప్పట్లో సంఘంలో చలంకు గల విలువ తెలుస్తుంది.ఆనాటి విద్యా విధానానికి తిరగబడి,విద్యావిధానం నచ్చక తన పిల్లలు చదువు మానేసినట్లు చలం దీక్షితులకు రాసిన ఉత్తరంలో తెలిపాడు.తన జీవిత యత్నాన్ని,తన స్ట్రగుల్ ను అర్థం చేసుకో గలిగిన వాళ్ళు లేరని,కొత్తవాళ్ళు స్నేహం చేయడం లేదని,తన జీవన పోరాటంలో,జీవన యత్నంలో చివరికి తనొక్కడే మిగిలి పోతాడని తెలిపాడు.చలంలో తిరుగుబాటు ధోరణి కన్పిస్తుంది.సంఘాన్ని ఎదిరించైనా సరే పోరాటంలో ఒక్కడే మిగిలిపోయి తుదివరకు జీవిత లక్ష్యాన్ని సాధించేవరకు పోరాడుతూనే వుంటానని స్పష్టంగా తెలియచేశాడు. పట్టుదల కలిగిన వాడుగా,ఎవరికి భయపడని వాడుగా తన నిర్ణయం పట్ల శ్రద్ధ కలవాడుగా,ఈశ్వరుని పట్ల విశ్వాసం కలవాడుగా కనిపిస్తాడు.

చలం భవిష్యద్దర్శనం కలవాడుగా కనిపిస్తాడు.తను రచించిన సెక్స్ పుస్తకం పేరు ‘ స్త్రీ’ ని ఒక్క నిమిషం నాకు విశ్రాంతినివ్వక — అగాధ వియోగభారం కిందనో చీల్చి,నలిపి ఊపిరాడక నా జీవితాన్ని పాలించే స్త్రీ లోకానికి నివేదతము చేస్తున్నానని రాస్తూ ” ఇది స్త్రీ లోకానికి నా Farewell ఏమో ,చివరికి నేనూ మారబోతున్నానేమో! ఎవరికి తెలుసు? ” అని దీక్షితులకు రాశాడు.గొప్పవాళ్ళు,
మహాత్ముల మాటలు అనాలోచితంగా,ఆయాచితంగా వెలువడుతాయి. భవిష్యత్తులో ఆ మాటలకర్థం ఎంతో ఉంటుంది.నేను మారబోతున్నానేమో అని చెప్పిన చలం దార్శనికుడు,మహాత్ముడు,ఋషితుల్యుడు,మనీషి, భవిష్యత్తును దర్శించిన కాలజ్ఞానవేత్త అని ఘంటాపథంగా చెప్పవచ్చును.ఆయన మారిన విషయం ఆయన చెప్పినట్లుగానే అరుణాచలం జీవితంలో స్పష్టమవుతుంది.చలం ఆలోచనా వైఖరి,జీవన విధానం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో వ్యక్తమౌతుంది.
తన కాలం మధురంగా గడిపేందుకు ‘ ఒక యూరేషియన్ అమ్మాయి’ ఉన్నట్లు తెలుపుతూ ” జరగడానికి వీలు దివ్య సన్నివేశాలు నా జీవితంలో జరుగుతాయని ఇంకా కలలు కంటున్నాను.” అని చెప్పిన ఆశాజీవి.తన సూక్ష్మ శరీరంలో ఆధ్యాత్మిక జ్ఞానత్వం పొందుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశాడు దీక్షితులకు రాసిన లేఖలో.చలం ఆలోచనల్లో మధ్యమధ్య మార్పును గమనించవచ్చు.దేవునిపట్ల విశ్వాసం లేదని గట్టిగా చెప్పాడు ఒకసారి.వెంటనే మరోసారి ఈశ్వరునిపట్ల విశ్వాసముంది అంటాడు.ఆస్తినాస్తిక విచికిత్స,ద్వైధీ భావన చలంలో కనిపిస్తుంది.చలంకు స్నేహితురాండ్రు వున్నట్లుగా లేఖల ద్వారా తెలుస్తుంది.

” యూరేషియన్ స్నేహితురాలు” ఒక మోటారు కారు తీసుకొని రమ్మంటుందని తెలిపాడు ఒక లేఖలో. లీల పరిచయం మొదలైనవి లేఖల్లో రాశాడు. దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో కిటికీ కింద ఓ అమ్మాయి వెడుతుందని, ఆ అమ్మాయిని తనూ, తనను ఆ అమ్మాయి పరస్పరం ఇష్టపడుతున్నారని,కానీ వారి మధ్య పది గజాల దూరముండేదని తెలిపాడు.
ఆ మాత్రం దూరం కూడా సహించలేని మనస్తత్వం చలందని స్పష్టంగా వ్యక్తమవుతుంది.
తన ఉద్దేశ్యాన్ని ఒక లేఖలో ఇలా తెల్పాడు.” యవ్వనంలో ఉన్న భార్యలకు పిల్లలు లేకపోతే సంతానమివ్వడం,బాల వితంతువులకు కూడా” అనడం వల్ల స్త్రీలపై చలంకున్న వ్యామోహం తెలుస్తుంది.ఇదే సందర్భంలో ఇంకో మాట అంటాడు.అన్ని ఆశయాలను వదులుకొని ” గొప్ప యోగినౌతాను.నా అద్భుతమదిమల కీర్తి దిగంతంగా వ్యాప్తిస్తుంది.స్త్రీ పురుషులు నా పాదాలముందు నమస్కరిస్తారు”.అని గొప్ప యోగి అవుతున్నట్లుగా తను కొన్ని మహిమలు చూపించేవాడుగా తెలియజేశాడు.వ్యతిరేక భావ ధోరణి స్పష్టంగా గోచరిస్తున్నది. ఎన్నో చేయాలనుకుంటున్నట్లు కలలు కన్నాడు.
చలం తన జీవితంపై ఖచ్చితమైన అభిప్రాయాన్ని దీక్షితులకు రాసిన లేఖలో ఇలా తెల్పాడు.” నాకు జీవితమంటే ప్రేమ,కన్నీళ్లలో,నవ్వులతో,నీచత్వంతో,త్యాగాలతో, స్వార్థంతో,ఔదార్యంతో,విషాదంతో,ఆనందంతో ఈ జీవితమే మంచిది.మళ్లీ మళ్లీ అనంతంగా పుడుతో పెళ్లి చేసుకుని సంపాయించి,పిల్లల్ని కని, పాపాలు చేసి,ప్రేమించి,ద్వేషించి,నవ్వి,మూలిగి కాని ఏ మోక్షం అక్కర్లేదంటాను నిశ్చయంగా” అని సూటిగా చెప్పాడు.లోకంలో తనను గృహచ్చేదకుడంటారని తెల్పడం వల్ల సమాజంలో చలంపై ఎటువంటి నీచాభిప్రాయముండేదో తెలుస్తుంది.అందుకనే ఆ కాలంలో చలంకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి భయపడేవారు.

రామజోగారావుకు రాసిన ఉత్తరంలో ” మూడు నెలల నుంచి స్త్రీ స్నేహమయింది కానీ సంపర్కం కాదు.ముందు కూడా తటస్థించదు” అని వాస్తవాన్ని చెప్పాడు.దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం గారికి ఒక తమాషా అనుభవం జరిగిందని రాశాడు. కనిగిరిలో తనకపరిచితురాలైన ఒక హైస్కూల్ అమ్మాయి అర్ధరాత్రి చలం ఇంటికి వచ్చి చలాన్ని లేపి తనను మోహించమని,ప్రేమించమని అర్థించిందట.తాగుతున్నట్లు ( మద్యం)గా కూడా లేఖల్లో తెలియపరిచాడు.చలం ఆలోచనలు స్త్రీ చుట్టే తిరుగుతుండేవి అనడానికి చలం రాసిన ఉత్తరాలే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిపోతాయి.
” స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు” అని కుండబద్ధలు కొట్టినట్లు పచ్చినిజాన్ని నిర్మొహమాటంగా వ్రాస్తూనే దీక్షితులకు రాసిన ఉత్తరంలో ” స్త్రీ కొరకు జీవితాన్ని ధ్వంసం చేసుకున్నవాళ్ళని,అంటే కీర్తి,డబ్బూ కాదు- అంతకన్నా శ్రేష్ఠమయినవి- జీవితం మీద ఆసక్తిని-శక్తిని- బతకడంలో ఆనందాన్ని పోగొట్టుకున్న వాళ్ళని చూస్తే- నేను చాలా వివేకవంతుణ్ణిగా తోస్తాను.” అని లోకంలో తనకంటే కూడా బలహీన మనస్తత్వాలు కలవారున్నారని వారికంటే కూడా తను తెలివిగలవాడుగా చెప్పుకొన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు.స్త్రీ మూర్తి పట్ల ప్రేమను చూపించాడు కానీ దిగజారుడుతనం లేదని తెలుస్తోంది.స్త్రీలే తనను ఆప్యాయతతో చూశారని అనుకోవచ్చు.
తన ఉద్దేశ్యాన్ని ఇంకా ఇలా తెల్పాడు.” నా పిల్లల్ని చదివించాలని, వాళ్ళకి పెళ్లిళ్లు చెయ్యాలని ఏమీ వ్యామోహం లేదు.మా అబ్బాయి రౌడీ అయినా,అమ్మాయిలు వేశ్యలైనా నాకు సంతోషం,నమ్మకం- నేను స్వతంత్రుణ్ణి.నా ఆత్మ నాది.” అని అంటూ స్వేచ్ఛా ప్రియత్వాన్ని చాటాడు. సమాజాన్ని,సంసారాన్ని పట్టించుకోని స్వేచ్ఛాజీవిగా కనిపిస్తాడు చలం.మూఢాచారాన్ని నిరసిస్తూ, దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో “ఏమి నమ్మినా నాకు వచ్చే నష్టాలేవీ లేవు.ఆ విధంగానే నాకే విశ్వాసం కుదిరితే అదే నిజమని తోస్తే రేపు సంపూర్ణమైన నిరీశ్వరవాదిని గానీ లేక మూఢాచారవంతుణ్ణి సనాతనుణ్ణి కానీ- కావడానికి నాకేమీ అభ్యంతరం లేదు.
ఏ పల్టీ కొట్టడానికో నేను సిగ్గుపడను.నాకు వాస్తవమని నిశ్చయంగా తోచాలి.మీరు- నా జీవితంలో కొన్ని పల్టీలకు కారణం మీరు” అంటూ తను నమ్మిన సిద్ధాంతంలో చర్చించే వాడుగా( శృంగారి కానీ,ఆధ్యాత్మిక మార్గంలో కానీ) తన మనసుకు నచ్చినపుడే,సత్యమని నిశ్చయంగా తెలిసినప్పుడు ఏ మార్గంలోనైనా వాస్తవానికి దగ్గరగా నడుస్తూ తృప్తిగా చరించే మనస్తత్వం చలందని తెలుస్తుంది.చలం పరిపూర్ణ విశ్వాసానికి పట్టం కట్టాడు.

అంత స్వేచ్ఛను కోరి,సంఘాన్ని ఎదిరించి ఇష్టానుసారం చరించి శృంగారంలో మునిగితేలిన చలం స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన చలం ” పశ్చిమ భౌతిక శాస్త్రమూ, ఠాగూరు గారి బ్రహ్మసమాజపు వేదాంతప్రభావం వల్ల చలంలో మత విజ్ఞానం ఏర్పడి ఆధ్యాత్మికతవైపు దారి తీశాయి.” స్త్రీ కాముకుడు,కథకుడు చలం చచ్చిపోబోతున్నాడు.ఈశ్వర సందేహంలో శృంగార తత్వంలో మునిగి బీరుతాగే, మాంసం తినే,ఆడవాళ్ళని ముద్దు పెట్టుకునే జి.వి.జీవిలో ఆత్మవుందని గుర్తించకలిగింది– మీరు,అవును మీరు” అని దీక్షితులకు రాసిన ఉత్తరంలో వివరించాడు.చలంలో పరివర్తన వచ్చిన విషయం లేఖల్లో స్పష్టమవుతుంది.నిరీశ్వరవాది ఈశ్వర వాదిగా మారాడు.భగవాన్ పై విశ్వాసం కుదిరింది.వాస్తవాన్ని నమ్మేవరకు విశ్వసించని చలం ఆత్మానుభవం వాస్తవమని తాను నమ్మిన వాస్తవ ప్రపంచం నుండి మానసిక మార్పుకులోనై వాస్తవమనే నమ్మిన ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించాడు. తనను చీదరించుకున్న ఆంధ్ర దేశాన్ని,ప్రజలను వదలి సత్యాన్వేషణలో అరుణాచలానికి దారితీశాడు. శృంగారంలో ఆనందాన్ని అనుభవించి వైరాగ్యంతో ఆధ్యాత్మిక చింతనతో ఆనందాన్ని అనుభవించడానికి పయనమయ్యాడు.
” సంఘసంస్కార విషయంలో,స్త్రీల బాధల విషయంలో బాధననుభవించి ” నా ఆత్మ ఏ కొంచెం,సాక్షాత్కారమైనా నాకు ఆడపిల్లల అవసరం లేదు అంటాను” అంటూ దీక్షితులకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు. స్త్రీ సౌందర్యం కోసం కలలు కనే చలం ఈశ్వర సౌందర్యం కోసం పరితపించడం మొదలు పెట్టాడు.
చలం లేఖల్లో సాహిత్య విషయాలు చోటుచేసుకున్నాయి.
చిత్తశాంతి లేదు.ఎప్పుడూ మానసిక ఒంటరితనం,బాధతోనే ఎక్కువ కాలం గడిపాడు చలం.తను రచన చేయడానికి కారణాన్ని వివరిస్తూ చలం జోగారావుకు రాసిన లేఖలో ” బాధ అనేది ప్రపంచంలో ఉన్నన్నాళ్లు పుట్టడమనేది విషాదం నాలుగు మణుగుల ఆనందం వున్నాసరే రెండు తులాల బాధ దాన్నంతా చెరుపుతుంది.” అని రచనా హేతువును వివరించాడు.చలం బాధాతప్తజీవి.బాధలోంచే కవిత్వముద్భవించిదని తేల్చి చెప్పాడు నిజమే ప్రథమ కావ్యం రామాయణం శోకంతోనే శ్లోకం ఉద్భవించిన వాల్మీకి మహర్షి నోటిద్వారానే వెలువడింది.
పత్రికలలో తననెవరేం తిట్టినా పట్టించుకోలేదని ” నా వైపు కొందరున్నారనే ఇట్లాంటివి సహించరనే తెలిసి వొస్తే కొంత భయపడతారు విమర్శకులు” అని జోగారావుకు రాసిన లేఖలో తెలిపాడు.సినిమా స్టార్ల ఆరాధకులైన పత్రికలవాళ్ళు ( స్వతంత్ర) చలాన్ని వ్రాయమని,అచ్చువేసుకుంటామని బతిమాలి,బలవంతం చేసి వ్రాయించుకుని అచ్చువేయకుండా తనపై ఆవిధంగా కసిని తీర్చుకున్నారని,మోసం చేశారని, ‘ లోకం తీరే అంత- మోసం,దొంగతనం ఉంటేనే గాని మనిషిని ఏ ఫీల్డ్ లోనైనా సరే సక్సెస్ వరించదు” అంటూ జోగారావుకు రాసిన లేఖలో విశదం చేశాడు. లోకంలో అంతా మోసం,దగాయే అని నిక్కచ్చిగా చెప్పాడు.అవును ఇప్పటికైనా పత్రికలవాళ్ళు పేరున్న వాళ్లవి,తెలిసిన వాళ్లవే అచ్చువేస్తారు.బాగా రాసినాసరే వాళ్లకు పరిచయం లేకుంటే,సిఫార్సు లేకుంటే అచ్చు వేసుకోరు ప్రముఖ పత్రికల వాళ్ళు.
బెజవాడ ప్రజలు తనను తరిమేసినట్లుగా, సామాన్లు అన్నిటిని అమ్మేసి,బతికివున్నామనే సంతోషం కూడా లేదని,దేశం ఒదిలితేనే బాగు పడ్తామని జోగారావుకు రాసిన లేఖలో తన మానసికవ్యధను వ్యక్తం చేశాడు.
చలం రచనల్లో వాస్తవికత ఉంటుందని తను నమ్మిన సిద్ధాంతమే రచనలో ప్రతిబింబిస్తుందని చలం దీక్షితులకు రాసిన ఉత్తరం వల్ల తెలుస్తుంది.చలం నిండా ‘సెక్స్’ ఉంటుందని అంటారు.’సెక్స్’ నేరం కింద ఒప్పుకుంటున్నానని కాదు. ఏ విషయంలోనైనా పూర్తిగా మునిగి కాని తార్కిక,మానసిక పర్యవసానాల దాకా తరచిచూచే వాడు త్వరలో సత్యమార్గం అందుకుంటాడని నా నమ్మకం.” సెక్స్ నా ముక్తి మార్గం” అని రాస్తూ దేశంలో ఇంతవరకు లేని కొత్తదనం నాలో ఏమీ లేదని,ఏది ఫీల్ అవుతామో అదే రాస్తామని చెప్తాడు.అయితే తన రచనలో ఫోర్స్ లేదని తానే ఒప్పుకుంటాడు.మంచి సారస్వతం రెండు రకాలని, ఒకటి గోడమీది పటంలాగా మనసుని అందాలతో నింపేదని,రెండవది ఉరిమి ఉరిమి చించి చెండాడి మంచికో చెడ్డకో జీవితాన్ని ఇన్ఫ్లుఎన్స్ చేసేదని చెప్తూ మొదటి రకం సాహిత్యం బళ్ల కొద్ది వస్తుందని,రెండో రకం సారస్వతాన్ని దేశానికి అందించేది నేను ఒక్కణ్ణేనని దీక్షితులకు రాసిన లేఖలో చెప్పుకున్నాడు. అంటే చలం రచనలు జీవితాలపై ప్రభావాన్ని చూపించేవిగా వుంటాయని తెలుస్తుంది.
ఆ విషయం చలమే ఒప్పుకున్నాడు.చలంకు తన రచనల పట్ల అమిత విశ్వాసం,ప్రజలను మార్చగలననే నమ్మకం బలంగా ఉండేదని తెలుస్తుంది. ఉత్తరాలు ఆయన మనసును అద్దం పడుతున్నాయి.
దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం అభిప్రాయం స్పష్టంగా గోచరిస్తుంది.1900వ సంవత్సరం తర్వాత ప్రచురించిన పుస్తకాలలో ఒకటి కూడా కొంతకాలం నిలవదని,” మన సారస్వతంలో, అభిప్రాయాలలో కొత్త కాలువలూ,కళలో కొత్తమార్గాలూ ప్రారంభించిన వాళ్ళు కొద్దిమంది వున్నారు.వాళ్ళల్లో నేనొకణ్ణి”. అని తన టెక్నిక్,ఆలోచనలు పాశ్చాత్య వాతావరణానికి సంబంధించేట్లుగా వుంటాయి కాబట్టే ఈ దేశంలో అట్లాంటి సాహిత్యం అభివృద్ధి చెందిందని ఘంటాపథంగా చెప్పాడు. దీన్నిబట్టి చలం ఎంత ఆత్మవిశ్వాసం గలవాడో తెలుస్తుంది.
రాజకీయంగా,సాంఘికంగా ముందు ఏ దేశం మారబోతుందో దాన్నిబట్టే తన పుస్తకాలకు విలువుంటుందని ” ఈనాడు వాస్తవజీవితంలో,మాటల్లో చాలామంది చూపుతున్న పోకడలనే నేను కళారూపంలో వ్యక్తం చేశాను” కానీ భాష నాకు ఆటంకమని,ఉద్రేకానికి తగ్గ శైలి లేదని చెప్పాడు.
ఆధునిక రచయితలు వారి కావ్యాలపై స్థాలీపులాక న్యాయంగా విమర్శించాడు. దీక్షితుల రచనపై ( వరూధినీ,చెంచురాణి) పై నిష్పాక్షికంగా విమర్శ చేశాడు.” మీ రచనల్లో ఉప్పు కారం తక్కువగా తోస్తుంది. ఈ అభిప్రాయం నా స్వంతం.కానీ మీ సూనృతమూ, మెత్తని హాస్యం చాలా మంది ఎంత ఇష్టపడతారో ఊహించుకోగలను.కొంచెం కట్లు వొదిలించుకుని,ప్రయత్నిస్తుంటేబహు గొప్పవి రాస్తారని నా నమ్మకం.” అని సూచనలతో కూడిన విమర్శ,,తియ్యని చురకలు వేశాడు.
“మునిమాణిక్యం”వి కులాసాగా చదువుకోవడానికే పనికి వస్తాయని,” విశ్వనాథ” కవిత్వం అర్థం కాదని,” కృష్ణశాస్త్రి” తను నిజంగా ఏమి ఎట్లా అనుభవించాడో అదే రాస్తే అద్భుతమైన గీతాలు వ్రాయగలడని అభిప్రాయాన్ని తెలుపుతూనే హృదయం మీద అతనిచ్చే నాజూకు నొక్కులు అని మెచ్చుకుంటాడు.” వేదం” కలంలో శక్తి వున్నా కవిత్వం కోసమే బతుకుతాడని,” నోరి” కవికింద నాకు తెలీదు అనీ,” నాయని” కవిత్వం నచ్చదు.” బసవరాజు అప్పారావు” ఒక గొప్ప కవిత్వపు పంక్తికోసం నూరుడబ్బాల చత్త రాస్తాడనీ,” రాయప్రోలు” శైలి బాగునప్పటికీ కొత్త అభిప్రాయాలు సున్న అని నిర్మొహమాటంగాను,కుండ బద్దలు కొట్టినట్లుగానూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఈ విధంగా చలం మిత్రులకు రాసిన లేఖలను పరిశీలించి నట్లయితే చలం హృదయం విప్పి తను అనుభవించిన ప్రతి విషయాన్ని మిత్రులతో దాపరికం లేకుండా వ్యక్తీకరించినట్లు గమనించవచ్చు.సాంఘిక,
వేదాంత,సాహిత్య విషయాలు,ఆరోగ్య విషయాలు,కుటుంబ విషయాలు ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో విషయాలు చలం లేఖల్లో చోటు చేసుకున్నాయి.చలం అనుభూతులు,అనుభవాలు,
కష్టసుఖాలు మిత్రులతో లేఖలద్వారా పంచుకున్నాడు.చలం ఔద్యోగిక జీవితంలో తటస్థపడిన వ్యక్తుల మనస్తత్వాలు, జీవిత సిద్ధాంతం, జీవన విధానం మొదలగునవి ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.
రమణాశ్రమ జీవితంలో చలం భావనా దృక్పథం
(ఉత్తరారుణాచలం)
అరుణాచలం వెళ్ళాక చలం మనస్తత్వంలో మార్పు వచ్చినట్లుగా లేఖలవల్ల స్పష్టంగా తెలుస్తుంది.
బంకుపల్లి రామజోగారావుకు, వీరేశలింగంకు రాసిన లేఖల్లో ఇన్నేళ్లు ప్రపంచానికి సృష్టికి సరైన అర్థం కనబడక,ఏమీ తెలీకపోవడం చేతనే,ఎవ్వరు చెప్పినా నమ్మక అరుణాచలానికి రాక జీవితాన్ని వృధా చేసుకున్నాననే బాధను వ్యక్తం చేశాడు.జీవితంలో ఎంత పోగొట్టుకున్నాడో వెనక్కి తిరిగి చూస్తే తన చేసిన తప్పేంటో తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు.
” ఎక్కడి చలం ఎక్కడి అరుణాచలం దేవుణ్ణికాదు,ఋషిని కాదు,ఓ సమాధిని సేవించుకుని నమ్ముకొనిపడి వున్నాను.” అంటూనే మోక్షం కావాలని లేదు.వస్తుందన్న ఆశలేదు అని చెప్తూనే అంతలోనే అయోమయావస్థలో పడిపోతాడు చలం. పేరుకున్న ఈ సంస్కారాన్ని కాల్చే శక్తి భగవాన్ కి ఉంది.ఎవరు చెప్పినా అర్థం కాదు.ఏదో బాధ చలంను కలచివేసేది.బాధను భగవాన్ కు వదిలేసి బాధపడకుండా ఉండడం నేర్చుకున్నాడు.అప్పటికి భక్తిపై నమ్మకం కుదరలేదు”.అని దీక్షితులుకు రాసిన లేఖలో అంటాడు.
చలం రామజోగారావుకు రాసిన లేఖలో ” పాత జీవితమంతా ఓ కల లాగా అయిపోయింది. ఇట్లా కాలం గడచిపోవడమే ఆశయం.ఇంకా చలం అనే పేరు కూడా మనసులోంచి గుర్తులేకుండా పోవాలని ప్రయత్నం.ఏదో ఎవరో ఆకాశం నించి ఎప్పుడు దిగివస్తారో అన్నట్లు వుంది మనసు.చివరికి అన్ని బాధలూ పడి స్వర్గధామము చేరుకున్నాను.” అనే సంతృప్తిని మానసిక మార్పును వ్యక్తం చేశాడు.
వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం తన ఆవేదనను,ఆంధ్రలో తనను ఎంత నీచంగా చూశారో,ఆంధ్ర జనులపై విరక్తి భావం,రమణాశ్రమంలో చలం పొందుతున్న అనుభూతిని కళ్ళకు కట్టినట్లు వివరించాడు. నేను కష్టాల్లో వున్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? కుక్కల్లాగు నన్నన్నివిధాలా క్షోభిల్లచేస్తూవుంటే ఎవరు సహాయానికి వొచ్చారు.ఈ ముప్ఫయి ఏళ్ళు డబ్బు తీసుకోకుండా ఇన్నేళ్లు రాసిన నాకు, డబ్బు లేని రోజున ఎవరిచ్చారు ఒక్క రూపాయి? తీరా నేనొచ్చిన తర్వాత అందరూ అడిగేవాళ్లే ఎందుకు వెళ్ళావని? ఎందుకు? నా బాధ ఇంక వుండదని రూఢి గనుక” అంటూ తన మానసిక వేదనను వెళ్లబోసుకున్నాడు.ఆనాడు ఆంధ్రదేశంలో తనపట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని కూడా చెప్పుకున్నాడు.తాను అరుణాచలం రావడానికి కారణం చెప్తూ ” యువతీ యువకులు దొంగ మొహాలు చూసి” వచ్చేశానన్నాడు. చలం మానసిక చిత్రీకరణ ఈ లేఖలో కనిపిస్తుంది బెజవాడ ప్రజలు తనను ఏ విధంగా,ఎంత నీచంగా చూసేవారో వివరించాడు. వీరేశలింగంకు రాసిన లేఖలో ” ఇదివరకు పురుషులు భయపడేవారు,నేను నా పుస్తకాలూ వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళ అధీనంలోంచి యెక్కడ తిరుగుబాటు చేయిస్తానేమోనని. ఇప్పుడు స్త్రీలు భయపడుతున్నారు,( ఇంకా భయపడతారు కూడా ఎక్కువగా ముందు ముందు) తమ పురుషుల్ని ఎక్కడ సన్యాసుల్ని చేస్తానోనని—- నాతో స్నేహమన్నా,మా ఇంటికి రావడమన్నా అంత ఘోరం క్రింద ప్రచారం చేస్తారు బెజవాడ ప్రజలు” అని వాపోయాడు చలం.
అరుణాచలం వచ్చాక చలం మానసికంగా ఎంతో ఎదిగాడు.గత జీవితాన్ని మరచిపోయి తర్వాత జీవితాన్ని,మనసును రమణాశ్రమంలో భగవాన్ కే అర్పించడానికి ప్రయత్నం చేశాడు ఇదే సందర్బంలో చలం మాటలు ” ప్రస్తుతం నా మనసులోకి అట్లాంటివి తీసుకోవడం బాధ సాధనలో వున్నాను ” అన్నాడు.
” నా కోసమే కాదు,నా నుండి ఏదో తెలుసుకోగలమనే వారందరికోసమూ చేస్తున్నాను ఈ తపస్సు ,ఇది కష్టతరమైనమార్గం ,కానీ నన్ను నడిపేది ఈశ్వరుడైన భగవాన్ రమణ ” అంటూ ధైర్యంగా చెప్పుకుని ఎంతో విశాల హృదయాన్ని ప్రకటించి తన మిత్రులకు ఆధ్యాత్మిక సందేశాలను,సత్యాలను,
జ్ఞానాన్ని లేఖలద్వారా పంచి ప్రచారం చేశాడు వేమన వలె చలం భోగిగా వుండి తర్వాత యోగిగా మారాడు.
చలంలో వచ్చిన మార్పు,జీవితంలో రెండు పార్శ్వాలను లేఖల ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చును.
జీవితంలో శృంగారమే గొప్పదని భావించిన చలం మెల్లమెల్లగా సత్యమేమిటో తెలుసుకొని, అన్ని బాధలూ పడి చివరికి స్వర్గధామం చేరుకొని,హృదయపరిపక్వత చెంది ఇలా అంటాడు రామజోగారావుకు రాసిన లేఖలో. “శృంగారానికి,ఆధ్యాత్మికానికీ చాలా సన్నిహితమని,జీవితంలో ఎన్ని నిరాశలున్నా లొంగిపోక,నిరాశ పడక బలంతో జయించి ముందుకు సాగాలని హితబోధ చేస్తూ ” క్రమంగా మన చేతులకి విధి నిరాకరించిన సౌందర్యం మన హృదయంలో ప్రజ్వలిస్తుంది వొదలకండి అన్వేషణ. శృంగారాన్ని అన్వేషిస్తో ప్రయాణమై, పోయి పోయి చివరికి ఆ శృంగారం కాంతిగా మారిన సంకేతస్థలానికి చేరుకుంటాము.భగవాన్ ఆనందమయం సర్వశక్తి ” అని తాను తెలుసుకున్న నగ్న సత్యాన్ని ఎంతో చక్కగా వక్కాణించాడు.తాను భగవానుని పూర్తిగా విశ్వసించినట్లు తెలిపాడు మండువ జగ్గారావుకి రాసిన లేఖలో ” శృంగారంలో కన్న మరి దేంట్లోనూ ఎక్కువ ఆనందాన్ని అనుభవించలేదు.మనసుని మించిన ఆనందం ఆధ్యాత్మికం, కామి కాక మోక్షగామి కాడు ఒకటి అసహ్యం,రెండోది మూర్ఖం ” అని వ్రాస్తూనే సాధనమంటే జీవితాన్ని ఈశ్వరునికి అర్పణ చేయడమంటాడు.
ఒక సినిమాకు కథ రాయడానికి మద్రాసుకు వెళ్లినా కూడా చలం ఆలోచనలు భగవాన్ చుట్టూనే తిరుగుతుండేవి.దీక్షితులకు రాసిన లేఖలో ‘ అరుణాచలం పోవాలని ఒకటే పీకుతోంది మనసు. భగవాన్ నాకిట్లా శిక్ష వేశాడు. ఇక్కడ ఈ వాతావరణంలో ఎక్కడా వినపడరు. ఆయన నవ్వుతున్నారు నా బాధల్ని చూసి.ఈ సినిమా కోసం బతకడం కన్నా చచ్చిపోవడం నయం.ఎంతెంత మోసాలు!అసహ్యాలు, డబ్బు…..ఇట్లాంటి మురుగునించి తప్పించారు మీరు నన్ను భగవాన్ని నాకు చూపించి”.అనడం వల్ల చలంలో వచ్చిన మార్పు ,స్త్రీ వ్యామోహం నుండి మనసు భగవాన్ వైపుకు మళ్ళి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడం ,ఇంతకాలం ఎంతో మురుగులో కొట్టుకుపోతున్న చలం తనను రక్షించినందుకు దీక్షితులకు కృతజ్ఞతలు తెలిపాడు.
రమణ మహర్షి దగ్గర చేరడానికి కావాల్సింది మనలో పట్లు పోయి ” బంధువుల్నీ,మర్యాదల్నీ వొదిలేయడానికి ఓ గొప్ప అర్హత ” అని వీరేశలింగం గారికి సలహా ఇస్తాడు.
చలం దీక్షితులను,వీరేశలింగం గారిని రమణ మహర్షి ఆశ్రమానికి రమ్మని పదేపదే కోరుతూ ఎన్నో ఉత్తరాలు రాశాడు.
చలం మండువ జగ్గారావుకు రాసిన లేఖలో నిత్య సత్యాలను, ఆధ్యాత్మిక భావాలను,తన రచనా వైఖరిని ఎంతో చక్కగా వెల్లడించాడు.” ఆధ్యాత్మిక సాధన అంతా ఏకాగ్రతను కుదుర్చడానికే అంటూ” కాలాన్ని,దేశాన్ని బట్టి మారడమేమిటి? మనిషి మనిషికీ మారుతుంది.నీతి మారదు. నీతికి సంబంధించిన పాపపుణ్యాలనే ఆ ఆచారాలు మారతాయి.
ఆ సంగతి అంగీకరించదు సంఘం.అందరికీ ఒకటే నీతిని రుద్దుతుంది.అదే చలం తగాయిదా సంఘంతో.” అని సంఘానికి చలం ఎందుకు వ్యతిరేకమో,చలం భావాలను ప్రజలు ఎందుకు అసహ్యించుకుంటారో వివరిస్తాడు.
చలం ప్రత్యేకత అతను నమ్మినదాన్ని ఆచరించడం,ఇతరుల కోసం త్యాగం చెయ్యడం,కష్టాలలోకి పోవడం కనుక అతనికి ప్రతిష్ట రాలేదు.
ఒక స్త్రీ విషయమో కాదు వీళ్ళ బతుకుల్లోని నీచత్వాన్ని,దొంగతనాన్ని,
బూతుని,మోసాల్ని బైటపెట్టడానికి ప్రజలకి చాలా కసి,ఎన్నడూ అతన్ని క్షమించలేదు.
అందుకే చలం రాతలకి అంత బలం” .అంటూ ఉన్న వాస్తవాన్ని తెలుతుపుతూనే చలాన్ని పట్టిన రొష్టు ఠాగూరుకు పట్టలేదని జగ్గరావుకు రాసిన ఉత్తరంలో పేర్కొంటాడు.
చలం తన కవిత్వంలో గల ప్రత్యేక లక్షణాన్ని ఇంకా ఇలా వివరించాడు జగ్గారావుకు రాసిన ఇంకో లేఖలో.” మన అనుభవానికి మారిన సంగతుల్ని మనం ఒప్పుకోకపోవడం పొరపాటు.ముఖ్యంగా స్త్రీ మనస్తత్వ విషయంలో కానీ,మన అనుభవాల్ని అటుంచి కథలో ఇది అసంభవం అనిపిస్తే చదువరికి, అది రచనలో లోటు.మామూలు తెలుగువాళ్లు అసంభవమనుకునేవి సంభవమనిపించేట్లు రచించడం చలం ప్రత్యేకత” అని తన రచనా వైఖరిని తెల్పాడు.నిజాన్ని నిర్భయంగా చెప్పే చలంను వాస్తవికతవాది అనవచ్చు.
” ఏమైనా ఈశ్వరుడిలో భక్తి విశ్వాసాలు వుంటే ఎటువంటి ఆపదల్లోంచీ బైటికి రాగలడు.” అంటూ భక్తిపట్ల తనకు గల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు చలం జగ్గారావుకు రాసిన లేఖలో.ఆ విశ్వాసమనేది హృదయంలోంచి రావాలి .మనం ఏ పని చేసినా సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో చేస్తేనే సఫలమవుతుంది అనేది వాస్తవం.
అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? సాధనెందుకు చేయాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో కనిపిస్తాయి.” అనుభవానికి అతీతమైన అనుభవానికి పోతారు.అదే ఆధ్యాత్మికం ఇంద్రియాల నుంచి తప్పించి దృష్టిని ఏ ఆధారమూలేని ఆనందంలో లయం చేయడానికేగా” సాధన అని అంటారు.మనసు ఏకాగ్రతను ఎలా సాధించాలి అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా వివరించాడు.
” ప్రపంచంలో నలిగి,కాగి,దిక్కులేని వాళ్ళకే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం” అంటూ చక్కని నిర్వచనాన్ని వీరేశలింగం గారికి రాస్తూ శాంతి,కాంతి ఇచ్చేవాడు ఒక్క ఈశ్వరుడే అని కుండబద్దలు కొట్టినట్లు తను నమ్మిన సత్యాన్ని ధైర్యంగా చెప్పాడు.” ఎవరి కర్మకి వారే కారణం.ఈ కర్మ పరంపర అనే ఎడతెగని వలనుంచి బైటపడడానికి ఈశ్వరుడొక్కడే సాధ్యం.” అని పచ్చి నిజాన్ని చెప్తూ తన అనుభవాన్ని తేల్చి చెప్పాడు. ఎంత శత్రువునైనా ప్రేమ వల్ల జయించవచ్చునన్న ఆత్మవిశ్వాసం కలవాడు చలం.
ఒకప్పుడు భావోద్రేకంతో ఉండడం వల్ల జీవితంలో ఉపద్రవాలు వచ్చాయన్న సత్యాన్ని తెలుసుకుని వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం ఇలా వివరించాడు. ” మనకి అందమైన స్త్రీని చూడగానే కలిగే భావోద్రేకం వల్ల మన జీవితాన్ని ఆమె జీవితాన్ని నడపలేము. బాధనే వాంఛాగ్ని మీలో ఇముడ్చుకోగల లోతును సంపాయించండి… ఆ లోతును ఎంత ప్రయత్నించీ సంపాయించుకోలేకే చాలా ఉపద్రవాలు తెచ్చుకున్నాను…అంత కన్న విషాదం నన్ను నమ్మిన వారికి తెచ్చాను.ఇట్లాంటివి మనలో చాలా వరకు సమసిపోతేనేగాని అరుణాచలానికి పిలుచుకోరు ఈశ్వరుడు.” అంటూ అనుభవాన్ని వివరిస్తూ పశ్చాత్తాపాన్ని తెలుపుతూ వీరేశలింగానికి మార్గాన్ని సూచించాడు.అనుభవంలో చేదును చవిచూసి నలుగురికి ఆ చేదు నిజాన్ని తెలిపి సత్యాన్ని ప్రచారం చేశాడు చలం.ముందు మానసికంగా మార్పు రావాలని సలహా ఇచ్చాడు.
జీవన్ముక్తిని కోరి తన ఆశయం జీవించాను,జీవిస్తున్నాను అనే మరుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటమేనంటాడు చలం.
శివంకు రాసిన లేఖలో అరుణాచలం వచ్చాక ఇదివరకు లేని హాయి ఇప్పుడున్నదంటాడు.
” శాంతి,ఆనందం ఇట్లాంటి పదాలకి అర్థం అనుభవిస్తేనే గాని తెలీదు” అంటూ బంకుపల్లి రామజోగారావుకు రాసిన ఉత్తరంలో రాస్తూ సంతోషం,ఉత్సాహం ఏమీ లేకుండా పూర్తిగా అంధకారంలో పడితేనేగాని కాంతి దొరకదంటాడు చలం.
ఎంతో మందికి తన జ్ఞానామృతాన్ని పంచిపెట్టిన చలం ఆధ్యాత్మికతలోను తీవ్రవాదే. ఉన్నతమైన స్వేచ్చకోసం కలలుకని, తపించి,బాధపడి,ఆధ్యాత్మికంలోకి దిగి ఎదిగాక తను నమ్మిన సత్యాన్ని నలుగురికీ లేఖలద్వారా ప్రచారం చేసి అందరూ అసహ్యించుకున్న చలం, ఎవరికి ఏమీ కాని చలం తన జీవితంలోనూ,సాహిత్యం తోనూ అందరికీ తానే అయి ఎంతో గొప్పవాడుగా గోచరిస్తాడు. ఆనాటి సమాజ పరిస్థితుల్లో చలం ఎదుర్కొన్న సమస్యలు,చలం సాధించిన విజయాలు,మానసిక విశ్లేషణ,ఆయన అనుభవాలు ఒకటేమిటి ఎన్నో విషయాలు లేఖల ద్వారా వెల్లడించాడు.చలం మానసిక మార్పుకు అద్దం పడతాయి ఈ లేఖలు.అరమరికలేకుండా చేదు నిజాల్ని అందరికి పంచిపెట్టిన ధీశాలి చలం.
సమకాలికులకు మిత్రులకు రాసిన లేఖల్లో ఈయన ఆలోచనా సరళి,సాహిత్య విమర్శ,సునిశిత పరిశీలన,కష్టసుఖాలు మొదలగునవి తెలుసుకోవచ్చు.ఆవకాయ పచ్చడి మొదలు బుజ్జిగాడి కబుర్లు అన్ని విషయాలు లేఖల్లో చోటు చేసుకున్నాయి.
గురజాడపై చలం అభిప్రాయాన్ని జగ్గారావు తన లేఖల ద్వారా ఇలా తెలియచేశాడు. ” గురజాడ తిరుగుబాటంతా రచనల్లోనే కానీ జీవితంలో ఏమీ కనబడదు.ఆనాడు ఎవరూ చేయని సాహసం చేసి ఇరుకున పెట్టి సంకెళ్ళ నుండి భాషా, భావాల్ని ఒక్క దెబ్బతో ముక్కలు చేశాడంటాడు చలం”.
శరత్ రచనలను గూర్చి చెపుతూ చలం ” శరత్ నాయికా నాయకులకు వెన్నెముక లేదు.వాళ్ళ వొళ్ళంతా మెత్తని హృదయమే. ఎముకలు లేవు విధికి వెన్నవలె లొంగిపోతారు” అని విమర్శించాడు.
శ్రీ శ్రీ కోరింది ఆర్థిక విధానాన్నే గాక సామాజికంగా మార్పు కోరితే చలం హృదయంలో మార్పు కోరాడు అని జగ్గారావుకు రాసిన లేఖలో అంటాడు.శ్రీ శ్రీ” కవిత్వానికి గొప్పతనం పట్టింది.చలం లోకవిరోధిగానే వుండిపోతాడు” అని రాశాడు.
చలం మనసును అర్థం చేసుకోవడానికి లేఖలెంతో పనికివస్తాయి.సాహిత్యంలో చలం లేఖలకు చాలా ప్రాధాన్యముంది.ఆయన జీవన విధానానికి అక్షర సత్యాలైన లేఖలు అందించిన
చలం జీవన పరిణామక్రమం,ఆలోచనా వైవిధ్యం,ఆలోచనావిధానం,
సమకాలీనాధునిక కవులపై దృక్పథం,ఆధ్యాత్మిక భావసంపద ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.
లేఖలన్నింటిని పరిశీలించినట్లయితే చలం రమణాశ్రమానికి వెళ్లక ముందు,వెళ్లిన తర్వాత రెండు జీవితాలను,రెండు ఆలోచనా రీతుల్లో మార్పులను రెండు కోణాల్లో గమనించవచ్చు.జీవితంలో నన్ను కదిలించే శక్తి ఒక స్త్రీకి తప్ప ఎవ్వరికి లేదన్న చలం తర్వాత జీవితాన్ని,మనసును రమణ భగవాన్ కే అంకితం చేసి సాధన చేయడమే కాక జీవితంలో ఇప్పుడు ఎంతో హాయిని పొందుతున్నానని తాను నమ్మిన నగ్న సత్యాన్ని,సిద్ధాంతాన్ని ఎంతో ఘాటుగా,ఉన్నదున్నట్లు తన మిత్రులకు రాసిన ఉత్తరాలే నిదర్శనం.
సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గుడిపాటి వెంకటచలం మే నెల 19 వ తేదీ 1894 వ సంవత్సరంలో మద్రాసులో కొమ్మూరి సాంబశివరావు కొమ్మూరి వెంకట సుబ్బమ్మలకు జన్మించాడు.తాత గుడిపాటి వెంకట రామయ్య తనను దత్తత తీసుకున్నందుకు గాను ఇంటిపేరు గుడిపాటిగా మారింది.చిన్నప్పటి నుండే అభ్యుదయ భావాలు కలిగి స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలని ఆశించి స్త్రీ వాదిగా ఎన్నో రచనలు చేసి తెలుగు సాహిత్యంలో తనదంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న చలం మే నెల 4 వ తేదీ 1979వ సంవత్సరం అరుణాచలంలో కన్నుమూశాడు.
చిన్నప్పుడే తండ్రి తన తల్లిని వేధించే తీరును చూసి చలించిన బాల చలం హృదయం మీద తీవ్ర ముద్రపడి స్త్రీ ఔన్నత్యం,స్త్రీ స్వాతంత్య్రం కోసం రచనలు చేసి స్త్రీ పక్షపాతిగా పేరు పొంది జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించి తాను నమ్మిన సిద్ధాంతం కోసం పరితపించిన ఆదర్శవంతుడు చలం తెలుగు సాహిత్యంలో ఉత్తమోత్తముడు,ఉన్నత మహాకవి.
సకల జీవుల బతుకు
చీకటి వెలుగుల అతుకు’బొతుకు
చీకటి విశ్రాంతి కోసమే !
వెలుగుతో మేల్కొని
వెలుగులో మేల్ కని
చీకటినీ గెల్వవచ్చు
చీకటిని గెల్వటమంటే
బుద్ధి పదునెక్కటమే
చీకటిని వెలిగించు’కోకుంటే
మనుషులు గెలువ’లేరు
ఎవరూ గుర్తించలేరు
పారతంత్య్రం మానవాళికి
మహాంధకార సదృశం
* * *
మున్ముందే ఝాన్సీ కీ రాణీ
పసిబిడ్డను ఒడి’నిడుకొని
అశ్వారూఢయై ఖడ్గం ఝళిపించింది.
ధిక్కార స్వరాలను అచటానికి
పరాయి రాయ్ రాయి ప్రభుత్వం
చట్టాలను మరింత బిగించింది.
ఉద్రేకం మిట్టమధ్యాహ్నమయింది.
* * *
“స్వాతంత్ర్యం నా జన్మ’హక్కు” అనే వాక్కు
‘లోకమాన్య’ తిలక మహామంత్రం.
“వందేమాతరం” బంకించంద్ర నినాదం.
ఈ వాక్యద్వయి ప్రతిపౌరుని
నోటిగూటిలో రెక్కలల్లార్చింది.
- * *
చెఱసాలలు చంద్రశాల’లైనాయి
ఉరితాళ్లు కంఠహారాలైనాయి
ఉప్పు చేయటమే సత్యాగ్రహమైంది
“వందేమాతరం”అంటూ ఆ తరమంతా
హర్ ఏక్ కదమ్ కదమ్ పర్ కదమ్
ముందడుగే వేసింది వీరావేశంతో
ప్రతి కరాన మూడు రంగుల జెండా
ప్రతి గళాన వందేమాతరం నిండా
దేశం దేశమే పోరాడింది
దేశం వేషమే మారిపోయింది
* * *
అది ఆగష్టు 15 , 1947 సుప్రభాత వేళ
భారత స్వాతంత్ర్య భానూదయ వేళ
స్వతంత్ర భారత సుస్వర పరిమళ హేల
* * *
యుగయుగాల పర్యంతం
స్వతంత్ర భారతం ఆద్యంతం
సమైక్య జీవన సంకేతం
శ్రేయోరాజ్య సంగీతం
అమర వీరులకు జోహార్లర్పిస్తూ
స్వాతంత్ర్య గీతం ఆలాపిస్తూ
రోజు రోజూ ఎదుగుతూ
సగర్వంగా బతుకుతూ
మనం భారతీయులమని
“సత్యం శివం సుందరం” గీతం మనదని
సంతోషంగా గొంతెత్తి పాడుతూ
జీవిద్దాం జీవిద్దాం శోభిద్దాం శోభిద్దాం!!!
మేరా భారత్ మహాన్
మేరా భారత్ మహాన్
మనం నివసించే భూమి గురించి , అవసరాలు తీర్చే నీటిని గురించి సామాన్యంగా అందరికీ తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది . ఈ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసే ప్రయత్నమే ఇది.
మనకు ఉన్నది తక్కువ “ఉర్వి”. 29% , నీరు 71% ఉన్నది . కొత్త కొత్త పరిశోధనలు చేస్తూ భూగోళ శాస్త్రజ్ఞులు భూమి పల్లంగా ఉందని అంటున్నారు . విషయం ఏది ఎలా ఉన్నా ,మనకు 7 ఖండాలు ఆసియా ,యూరోప్ ,ఆఫ్రికా , అంటార్కిటికా, ఆస్ట్రేలియా నార్త్ అమెరికా మరియూ సౌత్ అమెరికా.
అన్ని ఖండాలు కూడా వేటికవి ఎంతో సుందరమైన ప్రదేశాలు . ప్రతి ఖండానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను సంతరించుకున్న ఖండం ఆఫ్రికా .”ఆఫ్రికా” అంటే “మదర్ ఆఫ్ ఆల్ కాంటినెంట్స్”అని అర్థం. తూర్పున రెడ్ సి మరియు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తరాన మెడిటరేరియన్ సీ. దక్షిణాన హిందూ మహా సాగరం మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు కలిసి ఉన్నాయి.
ఆఫ్రికా ఖండం ఎడారులు పర్వతాలు అడవులు గడ్డి భూములు నదులు ప్రాంతాలుగా విభజింపబడింది ఆఫ్రికా పేరు వినగానే గుర్తుకొచ్చే సహారా ఎడారి బహు గొప్పది ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి ఎడారిలో ఏముంది చూడడానికి అని ఎడారి వంటి జీవితం అనే మాటలను సర్వసాధారణంగా వింటూ ఉంటాం .కానీ బ్యూటిఫుల్ సాండ్ డ్యూన్స్ అంటే” అందమైన ఇసుక తిన్నెలు” అని అర్థం.
అగ్నిపర్వతాలు కొన్ని ప్రాంతాలలో సాల్ట్ వాటర్ లేక్స్ ఫ్రెష్ వాటర్ లేక్స్ చాలా అందంగా ఉంటాయి
ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది.
విస్తీర్ణంలో అల్జీరియా పెద్ద దేశం చిన్న దేశం గాంబియా.
అల్జీరియా క్యాపిటల్ ఆల్జీయర్స్.
అల్జీరియా స్వతంత్ర దేశం కాకమునుపు ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండేది.అల్జీరియా 1962 లో స్వతంత్ర దేశం అయింది.
అల్జీరియా_ ఆల్జీయర్స్
ఆఫ్రికాలో అతిపెద్ద దేశమైన అల్జీరియా 1962లో స్వతంత్ర దేశం అయింది అల్జీరియా రాజధాని ఆల్జీయర్స్.
పూర్వం నుండి కూడా నాగరికత నదుల వడ్డులలోనే ఉద్భవించి పరిఢవిల్లింది. అదేవిధంగా అల్జీరియాలో కూడా షలిఫ్ నది ఒడ్డున నాగరికత విలసిల్లింది.
“షలిఫ్” నదికి ఉపనది “సెబ్ గాగ్”. సెబ్ గాగ్ నది “అమోర్” పర్వత శ్రేణుల్లో పుట్టింది.
ఇక ఆఫ్రికా అనగానే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సహారా ఎడారి గుర్తొస్తుంది. అంబరెల్లా లాగా అలరించే అకేషియా చెట్లు చూడముచ్చటగా ఉంటాయి. క్యాట్ వాక్ చేస్తున్నవా అన్నట్లు ఉంటాయి.
ఇక్కడి రాక్ మౌంటైన్స్ చిత్రకారుని చిత్రంలా చాలా చక్కగా ఉంటాయి. అట్లాస్ పర్వతాలు మెడిటెరేనియన్ సముద్రానికి మరియు సహారా ఎడారి మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన సరిహద్దులు.
చాలా క్యూట్ గా ఉండే ఫెన్నెక్ ఫాక్స్ అనే జంతువు ఆఫ్రికా నేషనల్ ఎనిమల్.
మనిషి ఆకాశంలో విహరించేందుకు విమానం తయారీ కి ప్రేరణ కలిగించింది పక్షులు. వివిధ రకాల పక్షులకు ఇది నిలయం. అలా పక్షులు జంతువులు, వృక్షాలు, పర్వతాలతో గల అందమైన ప్రకృతిని ఆస్వాదించే ప్రకృతి ప్రేమికులకు కన్నుల పండుగగా ఉంటుంది.
అన్నాబా మరియు ఓరన్ ఇక్కడ నేచురల్ పోర్ట్ సిటీస్. ఐరోపా నుండి ఎక్కువగా టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. స్కూబా డైవింగ్, స్నార్కిలింగ్ మొదలైన యాక్టివిటీస్ తో ఈ పోర్ట్స్ అన్ని కళకళలాడుతూ ఉంటాయి. తూర్పున ఉన్న రెడ్ సీ లోని బ్లూ వాటర్ చాలా అందంగా ఉంటాయి. ఈ పట్టణాలు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కలయికతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ఇలా ఆఫ్రికా ఖండం అందమైన ఖండం. ఇటువంటివి మరిన్ని వచ్చే సంచికలో తెలుసుకుందాం
