మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
బాల‌సాహిత్యం

కరొనా ఎఫెక్టు

by swarnalatha February 28, 2022
written by swarnalatha

తాతగారూ! మాకు ఓ ఒక మంచి కధ చెప్పరూ!
సరేరా పిల్లలూ !మనకు మంచి అవకాశముఈ లాక్ డౌన్ సెలవులు. రండి.డిస్టెన్స్ పాటిస్తూ అందరూవచ్చి కూర్చోండి..
సరే తాతగారూ అంటూ బిల బిలా వచ్చి చేరారు పిల్లలు..
అనగా అనగా ఓ రాజు
తాతగారూ’! తాతగారూ! మాకు ఆ రాజుల కథలు వద్దు .
మీకు ఎలాంటి కథలు కావాలి?
మాకు జంతువుల కథలు కావాలి
.సరే సరే.
ఓ వీధిలో కుక్క ఎంతో ఠీవిగా చెవులను నిక్క పొడుచుకొని తోకను నిటారుగ ఎత్తి రోడ్డు అంతా తనదే
అన్నట్టుగ నడవసాగింది.
.అటుగావస్తున్న పిల్లి దాని ,పిల్లలు నవ్వుకోసాగాయి.
ఏమిమిత్రమా నవ్వు కొనుచున్నారు?
లేదుమిత్రమా మీ రాచఠీవి చూచి ముచ్చటపడుతున్నాము.
అవును మిత్రమా, మా బతుకులనుచూచి ఏమి కుక్క బతుకురా అనిఅనుకొనేదాన్ని.ఈకరోనా అనే వైరసు వల్ల మనుష్యులంతా ఇంటి కే పరిమితమైనారుమనకు మంచిగా స్వేచ్చ దొరికింది .లేచింది మొదలు స్కూళ్ళ బస్సులు ,కార్లు అనేక రకమైన వాహనాలు వాటి నుండి వచ్చేపొల్యూషన్ తో ఉక్కిరిబిక్కిరై ఎన్నో కష్టాలు పడ్డాం . ఎప్పుడుఏ ట్రక్కు వచ్చి మననుఎక్కించుకు పోయి ప్రాణాలకు హాని తలపెడతారోనని ఎక్కడెక్కడో తప్పించుక తిరగాల్స వచ్చేది .ఇప్పుడు హాయిగా ఉంది .
మిత్రమా అల్పాహారం అయినదా?
లేదుమిత్రమా !ఇదివరకు పనుల తొందరలలో మనుష్యులు చాలా తినుబండారాలను వదలివేసేవారు ప్రస్తుతం వారికి పని పాటా లేక తినడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారు
గిన్నెలు కంచాలు శుభ్రంగా నాకి పెడుతున్నారు. పాలు ,పెరుగు, పుష్కలంగా దొరికేవికాఫిలు ,టీలు పెరుగు ,అన్నాలు ఎక్కువగ తింటున్నారు మన పిల్లలు ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారు.
అటుగా వచ్చిన ఎలుక ఛీ ,ఛీ ఇక మన బ్రతుకులు మారవా ?ఎంగిలి మెతుకులు తిని బతకాల్సిందేనా? ఈ కరోనా వైరసు ఎవరెవరికి ఉందొ మన కేం తెలుసు .నేనుఇప్పుడే రైతుబజారువద్ద నుండి వస్తున్నాను .అక్కడ ఒక్క మనిషి కూడా లేడు.కుప్పలు కుప్పలు గా కూరగాయలు రకరకాలైన పండ్లు ఉన్నవి.మనమందరంకలిసి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ తినివద్దాం రండి.ఇంతలో ఓ కోతి నవ్వుతూ అక్కడికి చేరింది
ఏం కోతిబావా అలా నవ్వుతున్నావు?
ఏం లేదు కుక్కబావా !ఈ మనుష్యులు ఎంతో బిజీ బిజీ గా తిరిగేవాళ్లు కదా ఈ లాక్డవును తో ఇండ్ల లోనే ఉండి ఉండి నాలాగ గంతులు వేసుకుంటూ నీ లా భౌ భౌ అని పిల్లిలా మ్యావ్ మ్యావ్ అనిఅరుస్తారేమో న ని అలా వారిని ఊహిం చు కుంటే చాలా నవ్వువస్తుంది అనిఅదే పనిగా నవ్వసాగింది
చాలు చాలు బావా! ఊరుకో! నీ కోతి బుద్ది పోనిచ్చుకోవుకదా!
ఎలుక “నాకు ఓ సందేహము “అంది .
అడుగు అడుగు అంటూ ముక్తకంఠముతోఆతృుతగా అడిగాయి జంతువులన్ని.
ఈ మనుష్యులంతా వేల సంఖ్యలలో చనిపోతుంటే మనంఇలా స్వేచ్ఛగా తింటూ తిరుగుతుంటే వారికంటె మనవారి సంఖ్యపెరిగిపోతుందికదా ?
కరక్టేకదా !మనను ఎలా కిరాతకంగా చంపుతున్నారు ?చెట్లను ఎలా నరుకుతున్నారు.? చెరువులను ఎలాఆక్రమిస్తున్నారు ?డబ్బుకొరకు ఎన్నెన్నో అకృత్యాలకు పాల్పడుతున్నారు. పూర్వము కోడికూతలు ,ఆకాశంలో పక్షుల కిలకిలలు,కోకిలలకుహూకుహూలు ,నెమళ్ళనాట్యాలతోఎంతోహయిగా ఉండేవి.
ఆ రోజులుమచ్చుకైన కానరావు ఇప్పుడు.పాపంపెరిగిపోతుందని చెప్పసాగింది కుక్క.
మరిమనకు ఇలాంటి రోగం రాదా మామా?ముక్తఖంఠం తో అడిగారు.
“మానవులు వారిలో వారే ఒకరి. నొకరు చంపుకుంటారు మనంఅలాకాదు వేరేజాతి జంతువులను చంపుతాము. “వారికి డబ్బు పై మమకారం ఎక్కువైఎదుటివారి నాశనాన్న కోరుతారు ఎలాగంటే చైనా వారు అమెరికావారిని నాశనం చేసే ప్రయత్నం లో వారు నాశనంఅయినారుమిగతా అన్ని దేశాలనుా అపారంగా నష్టపరిచారు.
మనకు అలాంటి పరిస్తితి రాదు.
వారికి సుఖాలపై మక్కువ ఎక్కువ కారులో నుండి కాలుక్రిందపెట్టరు. ఏ సి గదులనుండి బైటకు రారు మనకుఅవి అవసరము లేదు మనము ఎంత దూరమైనా కాలి నడకతోనే వెళ్ళగలుగుతాము
ఆరు బయట నద్రిస్తాము ఆకలి అయినప్పుడు మాత్రమే దొరికిన కొంచము ఆహారం తోనేతృప్తి గా ఉండగలుగుతాము.మాంసము తింటే క రోన వస్తుందని తెలిసిందిగా మనం ఒకరినివొకరం చంపి తినటాలు మానుదాంకలసి మెలసి ఉందాం.మనకు రమ్మన్నా రాదు కరోనా.
ఇదిఅంతా విన్న చిన్న పిల్లిపిల్ల తల్లి చాటుగా దాక్కొని అమ్మా అమ్మా ఈ కుక్క మామ చెప్పినదంత నిజమేనా మనను దూరంనుండి చూస్తేనే భయంకరంగా అరుస్తూ వెంబడించేది ఎలుకలు మనను చూస్తేనే ఆమడదూరం పరిగెత్తేవి ఇలాఏలా కలుస్తాము ?
అటుగావస్తున్న ఏనుగు తన మూతికి మాస్కుధరించినది చూసి ఈ జంతువులు అన్నీ ఆశ్చర్యం గా ఏమిటి మామాఇది ?
ఏమీలేదు స్నేహితులారా!ఇప్పుడే తెలిసిన వార్త అమెరికా జూ లో ఓ పులికి కరోనాలక్షణాలుబయటపడ్డాయనట. మానవుల లాగా అశ్రద్ద చేయకుండ మనమందరం ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని మన రాజుగారైన సింహం గారి ఆజ్ఞ .జంతువుకు జంతువు దూరంగా ఉండాలని పరిశుభ్రంగా ఉండాలన్నది ఎక్కువగ తిరగరాదని వీటిని పాటించని జంతువును కఠినంగా దండిస్తారనితెలుపమన్నారు. భయంభయంగా సరే సరే అని ఎవరి దారినవారు వెళ్ళిపోయారు.
పిల్లలూ ఈ కథ వలన నీతి.ఎదుటి వారి పై అసూయ పడకూడదు .ఎవ్వరి నాశనాన్ని కోరకూడదు.కుక్క ఎంత గర్వం గా మాకు రోగము రాదు అందిచివరకు తోక ముడిచింది.
ఏపనిఐనా సరియైన సమయంలోనే చెయ్యాలి లేకుంటె మంచి ఫలితం దొరకదు.
ఇదేనీతి

February 28, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

సమాజానికి మేలుకొలుపు పాడిన శతకం

by కూకట్ల తిరుపతి February 28, 2022
written by కూకట్ల తిరుపతి

స్వేచ్ఛా కవి వేణుశ్రీగారి పద్యం కేవలం పద్యం మాత్రమే కాదు. కారు చీకట్లను చీల్చే మయూఖం. ప్రకృతిని పరవశింప జేసే మయూరం. ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. చురుక్కుమనే వాతలు. మేలుకొలుపు గీతలు. సశాస్త్రీయతను చాటే చేతలు. అశాస్త్రీయతకు తోచే కోతలు. ఆలోచనల కలల అల్లికలు. అద్భుతమైన ఆవిష్కరణ జ్యోతులతో సుదర్శనం వేణుగోపాలాచార్య గారి పద్యం ధగద్ధగాయమానంగా మెరుస్తూ ఉంటుంది. ఆయన పద్యానికి అస్థిత్వం ఉంటుంది. పల్లె సొగసును ఆరబోస్తుంది. పట్నం పోకడను పట్టి చూపుతుంది. ప్రపంచీకరణ పీడను ఎత్తి చూపుతుంది. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొడుతుంది. తాడిత పీడితుల ఎతై వలపోస్తుంది. పండిత పామర జనాన్ని పలకరిస్తుంది. ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. సమసమాజాన్ని కాంక్షిస్తుంది. నవ సమాజాన్ని నిర్మిస్తుంది. ఆయన జీవభాషా పటిమతో, భావ సంపదతో, శైలీ విన్యాసంతో పద్యాల పంటను పండించారు. వాసిలో వాటిని శతకంగా రాశి పోశారు. ఈ మట్టివాసన గలిగిన పద్యాలను ఆస్వాదిద్దాం. ఇప్పటికే వేణుశ్రీగారు వరేణ్య శతకం, ఓ ప్రచేతసా శతకంలను అందించారు. ఇందులో వరేణ్య శతకం ద్వితీయ ముద్రణ పొందింది. వేణుశ్రీగారి మనుమల పేర్లు వరేణ్య, ప్రచేత్, కైరవ్. వారిని సంబోధిస్తూ సామాజిక శతకాలు రాయడం హర్షణీయం. ఇప్పటి పిల్లలకు చాలా మంది తల్లిదండ్రులు అర్థవంతమైన పేర్లను పెట్టుకోవడం లేదు. తన కొడుకులకు, మనుమలకు వేణుశ్రీగారు చక్కటి పేర్లు పెట్టారు. స్వేచ్ఛ-1, ప్రజాభారతం, స్వేచ్ఛ-2 వచన కవితా సంపుటాలను అచ్చేశారు. విస్తృతమైన రచనానుభవంతో రాసిన కైరవ శతకంలోకి వెళదాం.
“వ్యవసాయదారుల వ్యథలింక తీరునా/ పాలకులెందరో వచ్చినారు/ స్వాతంత్ర్య మొచ్చియు చాలేండ్లు గడిచిన/ ఎవరొచ్చినా యింకా ఇడుముల బడి/ఉండుటే నూతన ఊబి చట్టాలతో/రైతుల బతుకులు రచ్చకెక్కి/చేటు కాల్గునటంచు చెప్పిన వినకుండ/కాలయాపన చేసి గడుపుటేల/కంపెనీ వస్తు ధరలను కంపెనీలె/నిర్ణయించి లాభాలకై నియమముండ/పంట పండించి రైతులె పైక మింత/యనియు చెప్పేటి చట్టాలు యవతరించ/రైతు సేద్యానికింకను రక్షణుండు/తాత మాటలు కైరవా!తరగని నిధి” అంటూ దేశానికి అన్నం పెట్టే అన్నదాత అన్నమో రామచంద్రా! అని అఘోరిస్తున్న తీరును కవి వేణుశ్రీ గారు కళ్ళకు కట్టించారు. గత డెబ్భై యేండ్లుగా ప్రభుత్వాలు ఐదేండ్ల కొకసారి మారుతూనే ఉన్నాయి. ఎవరొచ్చినా సైరికుల బతుకులు మాత్రం ఎప్పటి చిప్ప ఎనుగులో పడ్డట్టుగానే ఉన్నాయి. పరిశ్రమల్లో తయారయ్యే వస్తువులకు ఆ కంపెనీదారుడే ధరలు నిర్ణయిస్తాడు. లాభాలు ఆర్జిస్తాడు. ఇక్కడ రైతు పండించిన పంటలకు మాత్రం రైతుకు ధరలను నికరం చేసే అధికారం లేకపోవడం గమనార్హం. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడులు తిరిగిరావు. అప్పుల కుప్పలు తీరయి.  ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధరనైనా కట్టుదిట్టంగా అమలు కాదు. ధాన్యాన్ని కాజేసే దళారులే దర్జాగా బతుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య మూడు నూతన సాగు చట్టాలను తేవడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది రైతుల పరిస్థితి. చట్టాలతో కార్పొరేటులకు రెడ్ కార్పెట్ పరువడం. రైతుల బతుకులను రచ్చకీడ్చడం దారుణాతిదారుణం. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ఉత్తర ప్రదేశ్ లోని లఖీంపూర్ గ్రామంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న రైతులను కార్లతో తొక్కించి చంపడం పాలకుల నియంతృత్వ ధోరణికి నిదర్శనం. కర్షకుల మెడలకు ఊరితాళ్ళగా పరిణమించిన పెట్టుబడిదారీ పద్ధతులను ధిక్కరించిన ఉద్యమకారుల గొంతులు నొక్కుతున్నారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులను అరికట్టడంలో ప్రభుత్వం బొత్తిగా విఫలమవుతున్నది. దళారీ వ్యవస్థలో దోపిడీ యధేచ్ఛగా కొనసాగుతున్నది. అమ్మబోతే అడివి కొనబోతే కొరివిలా పరిణమించింది నేటి వ్యవసాయ రంగ పరిస్థితి. మనది వ్యవసాయిక దేశమని, అన్నపూర్ణయని సగర్వంగా చెప్పుకుంటాం. దేశ జనాభాలో సుమారు ఎనభై శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ప్రభుత్వాలు మాత్రం వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్నట్టుగా కనిపించవు. ఇటీవలి కాలంలో స్వాతంత్య్ర భారతానికి అమృతోత్సవాలను కనుల పండుగగా నిర్వహించుకోవడం సంతోషదాయకమే. కానీ అన్నదాతల ఆత్మహత్యలను ఎందుకు అరికట్టలేక పోతున్నామో పాలకులు ఆలోచించాలి. ఇకనైనా రైతు సంక్షేమ పథకాల ప్రచార పటాటోపాన్ని పక్కన పెట్టి, సంక్షోభంలో కూరుకుపోయిన సేద్యాన్ని సంక్షేమ బాట పట్టించడానికి, చిత్తశుద్ధితో పాటు పడాల్సిన అవసరముంది. దాని కోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి, వ్యవసాయాన్ని, వ్యవసాయదారులను ఆదుకోవలసిన ఆవశ్యకతను వేణుశ్రీగారు నొక్కి చెప్పారు.

“ప్రతిపార్టి కొకటైన పత్రికుండెను కదా/మీడియా మాత్రము మితము గుండి/ఒకదాని వార్తలు నొకటిగుండవు సుమా/ ఎవరి రాతలు వారె ఎచ్చులుండు/కల్పనా చాతురీ కట్టు కథల తోడ/ వరుస కథనముల వదులు చుండి/జనులయోమయములో చతికిలబడుచుండ/చేయు పత్రికలును చెడును చేయ/ఎట్టి రాజకీయములివి ఎరుగ కుండ/ప్రజల బాగోలింతయు పట్టకుండ/పార్టి వ్రాతలు వ్రాయుట పాడియగునె/చదువరాయను నేర్చిన సారమిదియ/పత్రికల వారి నీతిని పలక తరమ/తాత మాటలు కైరవా! తరగని నిధి”. పత్రికల డొల్లాతనాన్ని తెలుపుతున్న పద్యమిది. మనం పత్రికారంగాన్ని ఫోర్త్ ఎస్టేటుగా భావిస్తాము. పత్రికలు సక్రమంగా కృషి చేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పత్రికల ప్రతి అక్షరం ప్రజా పక్షం కావాలి. ప్రజల గొంతుకై ప్రశ్నించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ అవినీతిని, అధికారుల లంచగొండితనాన్ని ఎండగట్టాలి. కుంభకోణాలను బయటపెట్టాలి. ప్రజాధనపు దుర్వినియోగాన్ని అరికట్టడానికి పాటుపడాలి. అనునిత్యం జనాలను జాగృతం చేయాలి. “పత్రికొకటి యున్న పదివేల సైన్యము/పత్రికొక్కటున్న మిత్ర కోటి/ప్రజకు రక్షలేదు పత్రిక లేకున్న” అని నార్ల వేంకటేశ్వర రావు పత్రికల గురించి గొప్పగ చెప్పారు.  ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పత్రికల పాత్ర అమేయమైనది. నేటి పత్రికలు పార్టీవ్రత్యంతో పనిచేయడం అత్యంత విచారకరం. ఏదో ఒక పార్టీకి బోయిలాగా వ్యవహరిస్తున్నాయి. ఆయా పార్టీల దిన పత్రికలుగా మారాయి. వ్యాపార వ్యామోహంతో ఆస్తులను కూడగట్టుకుంటున్నాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా దొందు దొందుగానే వ్యవహరిస్తున్నాయి. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజా సంక్షేమం జరిగేలా చూడడంలో పూర్తిగా విస్మరించాయి. విష పుత్రికల్లాంటి పత్రికలు రాజకీయ పార్టీల కొమ్ము కాయడం వలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నది. అనేక రాజకీయ పార్టీలు వాటి ప్రయోజనం కోసం, ప్రచారం కోసం పత్రికలను, పబ్బం గడుపుకోవడానికి, టీవీ చానళ్లను, యూట్యూబ్ చానళ్లను స్థాపించుకుంటున్న స్వార్థపూరిత వైఖరులను మనం చూస్తున్నాము. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టు వంటింటి. ఇది నియంతృత్వ పాలనకు పాదులు వేస్తుంది. కాబట్టి పత్రికారంగం ఇప్పటికైన కను తెరువాలి. తన ప్రాధాన్యతను గుర్తెరుగాలి. నిష్పక్షపాతంగా నడుచుకోవాలని, కవిగా వేణుశ్రీగారు కోరుతున్నారు.
“గ్యాసు మొద్దు ధరయు గగనమెక్కుచు నుండె/పెట్రోలు ధరలింక పెరిగిపోయే/పేదమధ్య జనము విలవిలలాడిరి/పాలన రాబడి పక్క చేరు/పాలించు వారికి ప్రజల బాధల గాంచ/పట్టదు వాళ్లకు ప్రభుత సంస్థ/లన్నిటి ప్రైవేటు లాబీయింగులలోన/పెద్దలాప్తులకీయ పెద్దనిధుల/పెట్టి లాభాల చూపక పెరుగు సంస్థ/కార్మికోద్యోగ హక్కులు కాలరాసి/ప్రభుత జీతాల గొడవలు పడకనుండ/జనులునింక ప్రభుత్వ భజనల చేయు/తాత మాటలు కైరవా! తరగని నిధి” నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్నాయి. దినదినం పెట్రోలు,డీజిల్,గ్యాసు ధరలు అధికమవుతున్నాయి. సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పేదలు పప్పు, ఉప్పులను కొని తినలేని స్థితిలో ఉన్నారు. ఆర్ధాకలితో బతుకులు వెల్లదీస్తున్నారు. ఎల్లియెల్లక బలవంతంగా బతుకు బండి సాగుతున్నది. ఆకలి చావులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి కానీ అసలే తగ్గడం లేదు. చిరుద్యోగుల బతుకులు చిందరవందరగానే తయారయ్యాయి. బీదల చేతికి పనిచ్చి, ఆదాయాన్ని పెంచే ప్రయత్నం జరగడం లేదు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు ప్రభుత్వాలు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాయి. గరీబులకు కనీస అవసరాల కల్పన కల్పనగానే మిగిలిపోయింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ముసుగులో కొనసాగుతున్న అవకతవకలను వేణుశ్రీ గారు నిష్కర్షగా ఎండగట్టినారు.
“కూట్లోని రాయిని కూర్చొని తీయక/ఏట్లోని రాళ్ళన్ని యేరదననె/తనపిల్ల లాంగ్లపు తరగతుల్లో వేసి… ” ఇందులో మాతృభాషను పరిరక్షించుకోవాలని, వేదికలనెక్కి ఉపన్యాసాలను ఊదరగొట్టు వారి ఊసరవెల్లి నైజాన్ని బయటపెట్టారు. తాను ఆచరించక ఇతరులకు ఆచరించుమని చెప్పే వారితోనే మాతృభాష మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. “ఏమి రాజద్రోహమేరి రాజులిచట… ఎదురు చెప్పరాదంచును యిట్టిచట్ట/మింక వాడు టెవరికింక మేలు జరుగు…” ప్రభుత్వ ఆగడాలను, అరాచకాలను ప్రశ్నించేవారిపై రాజద్రోహం కేసులు పెట్టి, చెరసాలలో తోయడాన్ని ఖండించారు. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాల రాయడాన్ని కవి నిరసించారు. ఆంగ్లేయుల కాలంలో చేసిన బూజు పట్టిన చట్టాలను తొలగించవలసిన అవసరముంది. “కమ్మరి కొలిమియు కుమ్మరి సారెయు… కొత్త కొలువుల హామియు ఉత్తదాయె” ప్రపంచీకరణ పడగ నీడలో చేతి వృత్తులు కనుమరుగవుతున్న తీరుకు కలత చెందుతారు. తరతరాలుగా కులవృత్తులపై ఆధారపడిన వారికి చేతి నిండా పని లేదు. కడుపు నిండా తిండి లేదు. ప్రభుత్వం ఉపాధిని కల్పించడం లేదు. ఇలా అర్ధాంతరంగా అంతరిస్తున్న జీవితాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. “అలనాటి ఆత్మీయ అనురాగమేమాయె… మనుసు విప్పి మాట్లాడేటి మనుషులేరి” అంటూ నాటికీ నేటికీ తేడాను చెబుతారు. దినదిన ప్రవర్థమానంగా మానవులలో స్వార్థ బుద్ధి పెరుగుతున్నది. మమతానురాగాలు తగ్గుతున్నవి. ఈ ధోరణి మెరుగైన సమాజ నిర్మాణానికి అవరోధంగా నిలుస్తుంది. ఈ కపట బుద్ధిని బద్ధలు కొట్టాలంటారు కవి. “మల్లన్న పట్నాలు ఎల్లమ్మ జాతర/బీరప్ప పండగ కురుమగొల్ల… పండుగల సంబరాలన్ని బాగ జరుగు” కవి చిన్నతనంలో చూసిన జాతరలను, చేసిన కొలుపులను, ఆడిన ఆటలను చక్కగా అక్షర బద్ధం చేశారు. సిర్రగోనె, కోనేటి ఈతలు, సోపతిగాళ్లతో కలిసి తిరిగినవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతపు బాల్యంలో ప్రమాదకర ఆటలు తిష్టవేయడం శోచనీయం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవరోధం కలుగుతున్నది. నులక మంచాలు, బొంతలు, గంపలు, గుమ్ములు, కొట్టెలు, కుండలు, కూర కంచుడు, రొట్టెపెంక, చేద బొక్కెన, ఈత చీపురు మొదలుకొని ఆనాటి అనేక వస్తువులను పద్యాలలో చక్కగా పొదిగారు. “గత్తర పోయెను కలరాయు పోయెను… ” పోచమ్మ పొక్కులు, ప్లేగు, మలేరియా, అతిసార మొదలైన భయంకరమైన అసంఖ్యాక వ్యాధులను జయించాము. కరోనా, ఒమెక్రాన్లను సైతం త్వరితగతిననే గెలుస్తామనే ధీమాను వెల్లడి చేశారు. ఇలా ప్రతి పద్యం ఊటంకించదగినదే. వ్యాఖ్యానించవలసినదే. కానీ అన్నం ఉడికిందా? లేదా? అని తెసుకోవడానికి ఒకటి రెండూ మెతుకులను పిసికి చూస్తాము. అలాగే ఇక్కడ మచ్చుకు కొన్ని పద్యాలను మాత్రమే తీసుకున్నాను. వేణుశ్రీగారు తన జీవితానుభవాలనన్నింటిని మేళవించి, శతకాన్ని షడ్రసోపేతంగా, రుచికరంగా వండి వార్చినారు.
కైరవ శతకంలో 121 పద్యాలున్నాయి. అన్నీ ముక్తక లక్షణాన్ని కలిగి ఉన్నాయి. “తాత మాటలు కైరవా! తరగని నిధి” మకుటం కూడా బాగా కుదిరింది. వస్తువైవిధ్యమున్నది.
వెంట్రుకలు, ముక్కు, కనులు, చర్మం, చెవులు, నాలుక, దంతాలు, మచ్చలు, శరీరం వస్తువులుగా రాసిన పద్యాలు చమత్కారంగా ఉన్నాయి. అవినీతి తిమింగళాలు, పుట్టలోని పాముల వంటి వ్యక్తులు, పల్లె పండుగలు, కయ్యాల కాపురాలు, అంధ విశ్వాసాలు, మద్యపాన వ్యసనం, బంధాలు, బంధుత్వాలను సమర్థవంతంగా పద్యాలు చేశారు. లాక్షణికులు చెప్పిన కావ్య నాయికలు, నాయకుల లక్షణాలను పద్యాలలో ఇమిడ్చడం అద్భుతంగా ఉంది. ఇటీవల జరిగిన కోడిపుంజు కాలికి కట్టిన కత్తి గాటుకు మనిషి బలైన ఘటన పుంజు అరెస్టు, న్యాయ దంతుల నరికివేత, అసలు దయ్యాలు, ఆడపిల్లలపై దాడులు మొదలైన సంఘటనలపై పద్యాల అల్లిక ఆలోచనాత్మకంగా ఉంది. ప్రాచీన నీచ పాత్రలను నేటి దూర్తులకు ప్రతీకలుగా వాడడం బాగుంది. ఇది కవికి ప్రాచీన, అర్వాచీన సాహిత్యాలపై గల పట్టును తెలియజేస్తుంది. కవికి జీవితానుభవంతో వచ్చిన పరిణతిని, పరిపక్వతను ఈ శతకం తెలియజేస్తుంది. సాధారణ సన్నివేశాలను, ఇతివృత్తాలను సందేశాత్మక పద్యాలుగా తీర్చిదిద్దడంలో కవి కృతకృత్యుడయ్యాడని చెప్పవచ్చు.
“మాయలునేర్వని మనుషులు కావాలి/మోసము చేయని దోసమెరగ/నట్టి జనుల జీవన విధానమును రాగ/ఆధిపత్యము లేని అవని యందు/భేద భావము లేని బీద బిక్కియు లేని/నవలోకమందున నవ్య జనము/పాలన లేనట్టి పద్ధతితో నుండు/కోర్టులు పోలీస్ల గొడవ లేక/ జనులు సుఖసౌఖ్యముల కల్గి జతను కట్టె/జగము కావాలె నాకును జవము యుండి/బలము హెచ్చుతగ్గులు లేని భావజాల/పసిడి లోకమందు జనము బతుకవలెను/తాత మాటలు కైరవా! తరగని నిధి” కులమతాలకు అతీతంగా, మనుషులందరు కలిసిమెలిసి బతికే రోజులు రావాలి. ఆధిపత్య భావజాలం, అహంకార ధోరణులు అంతమవ్వాలి. హెచ్చుతగ్గులు పోవాలి. కోర్టు తగాదాలు, పోలీసు గొడవలు ఉండకూడదు. మాయలు లేని, మోసాలెరుగని, దోషరహితమైన జీవన విధానం కావాలి. సమాజంలో సుఖ, సంతోషాలు వెల్లి విరియాలి. మనుషులు మనుషులుగా మెలగాలి. ఓ కైరవా! ఈ తాత మాటలు నీకు తరగని నిధి లాంటివి. ఇవి నీ జీతమంతా పనికి వస్తాయి. నిన్ను వేలిపట్టి నడిపిస్తాయి. నీ వంటి పిల్లలందరూ అనుసరించదగినవి. నిత్య జీవితంలో ఆచరించదగినవి. సమాజానికి మేలుకొలుపులా పనికి వస్తాయి. కైరవ శతక ఫలశృతిని కాంక్షిస్తున్నట్టుగా కవి ఈ పద్యాన్ని అందించారు. నేటి సమాజానికి దర్పణం పట్టిన ఈ శతకాన్ని అందరూ చదవాలని కోరుకుంటున్నాను. దీనిని అన్ని పాఠశాల గ్రంథాలయాల్లో పెట్టి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. సమస్యాపరిష్కారాలు కలిగిన శతకాన్ని వెలువరించిన వేణుశ్రీ గారికి శుభాకాంక్షలు.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

రెండో బిడ్డ..

by Chandu Pendyala February 28, 2022
written by Chandu Pendyala

సంవత్సరానికి
ద్వితీయ సంతానం
ఇంటికి రెండో బిడ్డ
రూపుకు చిన్నది
ఇరువది ఎనిమిది
రోజుల నెల బాల ఇది
నాలుగేళ్ల కోసారి
కొసరు వడ్డిస్తది
లీప్ ఇయర్
తన సార్థక నామధేయం
బరువు బాధ్యత లేదు
పండుగల మోత లేదు
ఉరుకు పరుగు లేదు
ఉరుము మెరుపు రాదు
చలి లేదు వేడి లేదు
చక్కని వాతావరణం
ముడుచుకోదు
మూలకు ఉండదు
ఎండకు ఎండదు
వానకు తడువదు
తెలుగు హేమంత
శిశిర ఋతువుల చుట్టం
ఫాల్ ఫీల్ ఇచ్చే సీజన్
ఫీవర్ రాదు
పవర్ పోదు
పబ్లిసిటీ ఉండదు
ఉద్యోగస్తుడికి ఉపకారి
పనిదినాలు సెలవుదినాలు
సమ వాటా కలిగి వుంటది
పిల్లలకు పరీక్షలుండయి
తల్లిదండ్రులకు ఫీజుల
పరీక్షలుండయి
అందరికి ఫిదా ఇది
ఫికరు లేని ఫిబ్రవరి…

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

దేహ దాహం

by kodam Pavankumar February 28, 2022
written by kodam Pavankumar

ఉగ్రవాదం ఓ ఉప్పెన

తీవ్రవాదం తీరొక్క హింస
ఆశ నిరాశల మధ్య కొట్టుకలాడే రక్తదాహం
ఆశ చిగురిస్తూ నిరాశ అంతమవుతుంది
శాంతి వెల్లివిరుస్తూ ఆగ్రహం చప్పున చల్లారుతుంది
ఆకాశంలో ఎగురుతున్న రాబందు రెక్క తెగిపడుతుంది
సముద్రంలో ఈదులాడుతున్న సొరచేప వలకు చిక్కుతుంది
ఆకాంక్షల చుక్కానికి తీరం అందుతుంది
ఆతీయతకు లైట్ హౌజ్ దారి చూపుతుంది
రాతియుగపు పనిముట్లలో మనం ఆనవాళ్లు వెతుక్కుంటాము
ఆరుద్ర పురుగుల్లో పర్యావరణపు ఆచూకిని శోధిస్తుంటాము
వెలుగు మన ముఖం మీదకు ప్రసరిస్తుంటుంది
కళ్లు పెద్దవై చూపును సారిస్తుంది
అనేకానేక సూర్యుళ్లు దారి చూపిస్తుంటాయి
కళ్ల కింద నేల తన్మయత్వంతో ముద్దాడుతుంటుంది
రాలుతున్న నీటిబిందువుల్లా చెట్లపైని
ఆకులు ఒకటొకటి రాలుతూ జీవితాన్ని ఎరుకపరుస్తుంటుంది
దూరంగా ఓ గది మనకోసం ఎదురుచూస్తుంటుంది
సగం తెరచిన తలుపు నుంచి ఆత్మీయహస్తం చాస్తుంది
సమస్త విశ్వంలోకి మనల్ని లాక్కుంటూ
మానవ నాగరికతను మనముందు ఆవిష్కరిస్తుంది
నింగి నేల నీరు విప్పారిన దేహమవుతుంది
ఈ కవిత నా సొంతం. దేనికి అనుకరణ, అనువాదం కాదు. ఇంతవరకు ఏ పత్రికలోనూ. అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితంగానీ, పరిశీలనలోగానీ లేదు.
నాగురించి
జీవితమే కవిత్వమని విశ్వసించే నేను ఈనాడు, వార్త, మన తెలంగాణ తదితర దినపత్రికలలో వివిధ హోదాల్లో  రిపోర్టర్ గా పనిచేశాను. 2014లో ’సగం సగం కలసి‘ కవితా సంపుటిని, 2020లో ’కరోనా@లాక్ డౌన్.360 డిగ్రీస్‘ పేరుతో 59 వ్యాసాలతో కూడిన సంపుటిని వెలువరించాను. ప్రస్తుతం సాంఘిక, భౌగోళిక, రాజకీయ చరిత్రతో కూడిన శాసనసభ నియోజకవర్గాలతో కూడిన పుస్తకాలను వెలువరించడంలో నిమగ్నమయ్యాను. ఇప్పటికే హైదరాబాద్ లోని ’అంబర్ పేటః ఆకాశానికి పూసిన మందారం‘ పేరిట పస్తకం 2019లో వెలువడింది. ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి త్వరలో వెలువడనుంది. అలాగే మరో కవితా సంపుటి రానుంది.
February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వాట్-ఏ-పిటీ!

by కుడికాల వంశీధర్ February 28, 2022
written by కుడికాల వంశీధర్

ఆర్టిపీషియల్ గాలికి అలవాటుపడ్డ దేహాలు
గ్లోబల్ వార్మింగ్ వేడికి
కలుగులోని ఎలుకల్లా
బయటపడతాయి.
‘గో గ్రీన్’  అని
బోదురు కప్పలా అరిచి
సొల్యూషన్ ఏదో దొరికిందనిపించి
పొల్యూషన్ లెవెల్స్ పెంచుకుంటూ
వచ్చిన కార్లలో
తిరిగి బతుకు బావిలోకి వెళ్లిపోయాయి.
*
వైఫైతో వల్లెవాటు వేసుకున్న విశ్వైక జీవాలు
తలుపులు లేని గదికి
తాళం వేసి
ఒంటరిగా గడుపుతాయి.
ఇంటర్‌నెట్ ఇంటరప్షన్‌తో
మరో ప్రపంచం ఉన్నదని తెలుసుకొని
భయకంపితులౌతాయి.
తెలియని ఏకాకితనపు కరతాళ ధ్వనులకు
తాళలేక
ఫ్రీక్అవుట్ అవుతాయి.
*

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పూల దోసిళ్ళు

by Rama Devi Nellutla February 28, 2022
written by Rama Devi Nellutla

నిలబడ్డ నేలా తల మీది ఆకాశం నీది కానప్పుడే
స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుస్తుంది
పీలుస్తున్న గాలీ పలుకుతున్న పదమూ
నీ స్వంతం కానప్పుడే స్వతంత్ర్యం విలువ తెలుస్తుంది
ఏడు దశాబ్దాల క్రితం ఎర్ర కోట మీదే కాదు
ఎన్నో కోట్ల హృదయ మైదానాల్లో ఈ జెండా ఎగిరినపుడు
ఎన్ని దేహాలు రోమాంచితమైనాయో …ఎన్ని రక్త నాళాలు ఉప్పొంగినాయో ….
ఎన్ని యుద్ధాలు ఎన్ని త్యాగాలు ఎన్ని సమర్పణలు ఎన్ని బలిదానాలు ఈ దేశం చూసిందో –
చిన్న మూటల్తో వర్తకానికి వచ్చి మూటలకు మూటలు రత్న రాసులు దోపిడి చేసినవారు
గొంతులు నొక్కి శ్రమను దోచి రాజ్యాలు గెలిచి హక్కులు కబళించి ఆధిపత్యం చెలాయించిన వారు
మూటా ముల్లె సర్దుకుని పోవడానికి ఎన్ని ప్రాణ త్యాగాలు జరిగాయో …ఎలా మరుస్తాం ?
రాజ్య వారసుడు పోయినా ప్రజా స్వేచ్ఛ కోసం ‘ ప్రాణమిస్తా , ఝాన్సీ నివ్వను ‘ అన్న ప్రధమ స్వాతంత్ర్య పోరాట జ్వాలనీ ,
గుండె అక్కడ కాదురా ఇక్కడ కాల్చమంటూ శత్రువు కెదురు నిల్చిన మన్నెం వీరుడినీ ,
‘ఇంక్విలాబ్ జిందాబాద్ ‘ అన్న భగత్ సింహాన్నీ , ‘ స్వాతంత్ర్యం జన్మహక్కు ‘అన్న బాల గంగాధరుణ్ణీ
‘వందే మాతరం ‘ అంటూ నినదించిన వంగ భూమి పుత్రుడు బంకిం చంద్రుడినీ ..
‘రుధిరమివ్వండి. స్వరాజ్యమిస్తా ‘ నన్న ఆజాద్ ఫవుజ్ సుభాష్ బోస్ నీ ఎలా మర్చిపోతాం ?
‘నా దేశ ప్రజలు నిండా బట్టలు కట్టేదాకా నేనూ చొక్కా తొడగనన్న’ ఒక బక్క పలుచని దేహం
ఆచ్ఛాదన లేని ఛాతీ విరుచుకుని ఎముకలు కొరికే చలిలో రౌండ్ టేబుల్ సమావేశానికి
సత్యాహింసలను ఊతకర్రలుగా మార్చి ‘డూ ఆర్ డై ‘ అంటూ నడిచి వెళ్లడం ఎలా మరుస్తాం ?
ఉప్పు పిడికిలిని ఉక్కు పిడికిలిగా మార్చిన శాంతి మాంత్రికుడు
భరత భూమికి స్వేచ్చనూ ప్రపంచానికి అహింసనూ బహుమతిగా ఇచ్చిన బోసి నవ్వుల తాతనూ
‘ఆరాం హరామ్ హై ‘ అంటూ జాతి నిర్మాణానికి నడుం కట్టిన చాచానూ గుర్తు పెట్టుకోకుంటామా ?
ఎందరు త్యాగ ధనులు , చరిత్ర కెక్కని ఘనులు
కారుణ్యం లేని శత్రువుకు చిక్కి కాలాపానీ కారాగారాల్లో మగ్గారు
తమ రక్తంతో జాతి చరిత్రకు ప్రాణం పోశారు
దేశం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చటం కోసం
దేహం నుంచి చెమట చుక్కల్ని రాల్చినంత సునాయాసంగా ప్రాణాల్ని వదిలారు
సమర యోధులారా అమర వీరులారా
మీ సమాధులపై వెలుగుతున్నది ఆ కొవ్వొత్తులే కాదు మా హృదయ దీపాలు కూడా
మీ కోసం రాలుతున్నవి ఆ చెట్ల పూలగుత్తులే కాదు మా కన్నీటి చుక్కలు కూడా
మీ కోసం మా శాల్యూట్ లూ జోహార్లూ , వీరగంధాలూ పూల దోసిళ్ళు కూడా
ఏడు దశాబ్దాల క్రిందటే కాదు , జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు కూడా !!

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బొజ్జ గణపయ్య

by రంగరాజు పద్మజ February 28, 2022
written by రంగరాజు పద్మజ

పార్వతి:–
పద పదరా! ఏకదంతా! మనపొదరింటికి!
మంగళంపాడిరి నీకు – మనుషులందరు
మరు సంవత్సరమునకు- మళ్ళి రమ్మని!

విఘ్నేశ్వరుడు:-
ఇంటికి పోనమ్మా! నేనిక్కడే ఉంటానమ్మా!
ఇంటింటికి కుడుములు తింటానమ్మా !!

పార్వతి:-
కుడుములు లేవుర! కుమారా! ఇడుములుపాపుటేరా!
నడు నడు కైలాసానికి! పద పద రా ఏకదంతా!

విఘ్నేశ్వరుడు:–
నన్ను మంచిరి కోనేరులలో…
కోశము తడిసేను- కోరుదు సెలవులు!!
విరిగెను నా దంతము- చదువుట వ్రాయుట ఏలా?

పార్వతి:-
చరవాణి లోనే చక చక చదువుము చంటీ!
చదువులకే వేలుపను పదవి ఊడును తండ్రీ !
ఇల్లిల్లూ తిరుగు-తినుట మానుము నాన్నా !
అద్దంలో నీ ముద్దు మోము చూడరా కన్నా!
నడక అసలే లేక పెరగెను !నీ బొజ్జ!
బడికి పోయి చదవరా తండ్రి!
చదువురాకున్నా!గానీ సన్నగా అయ్యేవు !

విఘ్నేశ్వరుడు:–

నేను సన్నంగా అయితే! కవులకు కష్టం!
వికటకవులు హాస్యం లేక కటకట బడేరు !

ఓ బొజ్జ వెంకయ్య! నీ బంటు నేనయ్య అను
నా స్తుతులు స్తోత్రాలు మార్చి రాయాలమ్మ !!

పలుచబొజ్జ గణపయ్య- పాదాలు పట్టే మని;

నేనూ లేఖకుడినే- లేఖకులంటే నాకు ఇష్టమే అమ్మా!
కష్ట పెట్టను కవులను కనికరముతో…
నన్ను నా రీతి గుండగా నిమ్మమ్మా!
కాలు పెట్టను నేను కైలాస మందు !
కుడుములు తింటూ ఉంటానుఇక్కడే!
కర్మ భూమిన నుందు – కరమొప్పగాను !

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాలు

by డా॥ సంగనభట్ల నరసయ్య January 16, 2022
written by డా॥ సంగనభట్ల నరసయ్య

 శ్రీమతికి శ్రీనాథుని ప్రే(క్షేమ) లేఖ

ఉ. శ్రీమదసత్యమధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్

సామజయానకున్, మిగుల చక్కని ఇంతికి, మేలు కావలెన్

మేమిట క్షేమమీవరకు, మీ శుభవార్తలు వ్రాసి పంపుమా,

నామది నీదు మోహము క్షణంబును దీరదు, స్నేహబాంధవీ !

శ్రీనాథుని పద్యాలనేకం స్త్రీ అంగాంగ వర్ణనలతో కావ్యాల్లోనూ, చాటువుల్లోనూ ఉన్నాయి. చాటు పద్యాల్లో అధికంగా ఆయన శృంగారాసక్తిని, భోగ లాలసను సూచిస్తాయి. అందుకే ఆయనకు శృంగార శ్రీనాథుడని పేరు. ఆహార, ఆహార్య, విహారాల్లో ఆయన భోగజీవితేచ్ఛ అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన సంచార జీవనం, నానారాజ సందర్శనం, అంకితోత్సవాలు, వాగ్విజయ సభలు, రాజ సన్మానాలు, శృంగార జీవనం చాటువుల నిండా పరచుకొన్నాయి. స్త్రీ శృంగారాన్ని వర్ణించే ఇతర కవులవి కూడా శ్రీనాథునికి అంటగట్టినవి ఉన్నాయి. కాని శ్రీనాథుని రచనలు అతని ఒడుపు, ఎత్తుగడ, పదబంధాలు, సంస్కృత సమాసాలు ఆయన శైలితో మెరుస్తూ అతనివిగానే ఋజువు చేస్తాయి.

పై పద్యం శ్రీనాథుని ఇతర పద్యాలవలె అన్యకాంతా మోహం, పర స్త్రీ సౌందర్య వర్ణనతో గాక, సభ్యవర్ణనతో భార్యను ఉద్దేశించి రాసిన వర్ణన లేదా లేఖగా కనబడుతుంది. చూద్దాం.

శ్రీమత్ = సంపదలతో లేదా సౌభాగ్యముతో కూడినది. ఈ సంబోధన పుణ్య / గౌరవ స్త్రీలకు వేసే విశేషణం. పైగా లేఖా సంప్రదాయంలో తొలిపదం. ఈ ప్రారంభపదమే ‘లేక’ అనడానికి గుర్తు.

అసత్య మధ్యకు సన్నని నడుము కలదని, చిన్ని వయారికి = చిన్న వయసులోనిదని, ముద్దులాడికిన్ = ముద్దుమురిపాలిస్తున్న నూత్న వధువు అని ఇది పెళ్లి అయిన కొత్తలోనే రాసిన పద్యంలా ఉంది. అసత్యమధ్య అంటేనే నడుం పెరగలేదని మధ్యవయస్కు ప్రౌఢ కాదని తెలుస్తోంది. దీంట్లో (ఈ విశేషణాల్లో) సభ్యత వల్ల భార్యకు వేసిన విశేషణాలుగా భావించవచ్చు. మేలు కావలెన్ = ఆశీస్సులందిస్తున్నాడు. తొలిపదం లేఖ ప్రారంభంగా, తొలి వాక్యాంత క్రియ ఆశీస్సుగా లేఖగా ధృవీకరిస్తు లేదూ? ఇది లేఖే అనడానికి ఇంకా కింద చూడండి.

మేమిట క్షేమము = తన క్షేమం తెలుపుతున్నాడు. ‘ఇట’ అంటే తన ఊరి నుండి భార్యను వదిలి బయల్దేరి, చాలా దూరం వచ్చిన ఈ పద్యం రాసిన ఊరికి (ప్రస్తుతం ఉన్నది) వచ్చేవరకు క్షేమంగా ఉన్నానంటున్నాడు. ఇది లేఖ అనడానికి మరీ కింద చూడండి.

మీ శుభవార్తలు = మీరంటే తన భార్య ఒక్కతే ఐతే ఏకవచనం ఉండేది. భార్యతో బాటు శిశువైన తన సంతానమో లేక తన ‘మదేకపుత్ర’ తల్లి లేదా తండ్రి (జీవితులుగా ఉంటే), అంటే కుటుంబం అంతా అని బహువచనం వాడినాడు. వ్రాసి పంపుమీ = ఈ లేఖ తెస్తున్న శిష్యుడు తన వద్దకు తిరిగి వచ్చేటపుడు తిరుగులేఖ ద్వారా రాసి పంపమంటున్నాడు. అయ్యా! ఇప్పటికైనా ఈ పద్యం ఉత్తరం అని ఒప్పుకుంటారుగా!

నీదు మోహము = నీపై అనురాగం, నా మది క్షణంబును దీరదు = ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా నువ్వే గుర్తు వస్తున్నావని, స్నేహ బాంధవీ! = స్నేహం (అనురాగం)తో బాంధవ్యం (తాళి గట్టిన బంధుత్వం)తో (తాకి కట్టడం బంధనం, బంధనంతో బంధుత్వం కదా లోకంలో) – పై రెంటిలో స్నేహ బాంధవ్యాలు (అనురాగం, భార్యాత్వం) కల్గిన దానా?

ఇది శ్రీనాథుని రచనే అని చెప్పడానికి పై విశేషణాలే సాక్ష్యమిస్తున్నాయి. అసత్యమధ్య, వయారి, ముద్దులాడ, సామజయాన వంటివి ఆయన తరచూ వాడే పదాలే. ప్రతి కవికీ కొన్ని పద బంధాలు పడికట్టుగా ఉంటాయి. శ్రీనాథుడు “దూరటంకాల…” పద్యంలో రావు సింగమహీ పాటని రాచకొండ రాజ్యసభలో ఎటుల మెప్పించెదో అంటూ “సరససద్గుణ నికురుంబ శారదాంబ” అని సంబోధించినాడు. తానే తిరిగి ఫిరంగిపుర శాసనాన్ని రాస్తూ “సరస సద్గుణ నికురంబ సూరమాంబ” అని శాసనకర్తిని (దాత) పేరును అదే పదబంధాలతో సూచించినాడు. “శ్రీనాథో విద్యాధికారీ శ్రీ వీరవేమభూపతేః” అని శాసనాంతంలో తన పేరును తన ‘విద్యాధికారి’ హోదాను సూచించినాడు.

శ్రీనాథుడు భార్యకు లేఖ రాయడానికి వచనం వాడాలి, కాని పద్యం (ఛందస్సు)లో రాస్తాడా? అని మెడ మీద తలకాయ ఉన్నవాడెవడూ అడుగడు. ఆయన జీవితంలో ప్రతి సంఘటనను ఛందోబద్ధం చేసినాడు. ఆఖరుకు తన ఆత్మహత్యను కూడా “అరగుచున్నాడు శ్రీనాథుడమర పురికి”అని పద్యంలో రాసుకున్న జీవకవి. ఆయనవి దొరికినన్ని చాటువులు మరే కవివి దొరకలేదు.

భార్యకు పద్య లేఖ రాయడంలో తప్పేం లేదు. ఆవిడా కవయిత్రి కావచ్చు. లేదా పద్య సౌగంధ్యానికి పరవశించే పడతి కావచ్చు. శ్రీనాథుని శ్రీమతా? మజాకా? తెలుగు కవులు తమ భార్యల గూర్చి వారి వైదుష్యం సంగతి (వారిజ భవుడెరుగు) పేరైనా చెప్పరైరి (ఒక్క కృష్ణరాయని కావ్యాల్లో తప్ప)

-డా. సంగనభట్ల నరసయ్య

9440073124

విశ్రాంత ప్రాంశుపాలుడు, ప్రాచ్య కళాశాల, ధర్మపురి

(ఈ పద్యం డా. కోడూరి ప్రభాకరరెడ్డి సంకలనం “శ్రీనాథుని చాటువులు” నుండి స్వీకరించాను.)

January 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

తలుపు చప్పుడు

by Sudharshan Chintapatla January 6, 2022
written by Sudharshan Chintapatla

ఆంగ్లం : కె.సచ్చిదానందన్, తెలుగు : చింతపట్ల సుదర్శన్
మొట్టమొదటి తలుపు చప్పుడు
విని అడిగాను
ఎవరది
నేను మీ నాన్నను
తలుపు తెరిచాను
సూర్యుడు లోపలికి వచ్చాడు
ఉదయపు లేత సూర్యకిరణం
రెండవసారి తలుపుచప్పుడు
విని అడిగాను
ఎవరది?
నేను నీ ప్రేయసిని
తలుపు తెరిచాను
మల్లెల పరిమళం వెదజల్లుతూ
చల్లని గాలి లోపలికి వచ్చి
నన్ను కౌగలించుకుంది
మూడవసారి తలుపుచప్పుడు
విని అడిగాను
ఎవరది?
నేను నీ స్నేహితుడ్ని
తలుపు తెరిచాను
వర్షం లోపలికి వచ్చి
నన్ను పూర్తిగా తడిపేసింది
మళ్ళీ తలుపు చప్పుడు
విని అడిగాను
ఎవరది?
నీ స్నేహితుడ్ని
తలుపు తెరిచాను
బురద పూసుకున్న మేఘపు ముక్క
లోపలికి వచ్చి కూర్చోమనకుండానే
కుర్చీలో కూర్చుని
పొగలూగుతూ
ఇంద్రధనస్సును సృష్టించింది
అప్పుడొచ్చింది
అయిదవ తలుపు చప్పుడు
ఎవరది విని అడిగాను
నీ మృత్యువును
తలుపు తెరవలేదు
అడిగాను
సుదీర్ఘకాలంగా
ఒంటరిదైన ఈ భూమ్మీద ఉన్నాను
నాకేం బహుమతి ఇస్తావు
నీకు స్వేచ్ఛనిస్తాను
సారవంతమైన మట్టిగా మారుస్తాను
తమలపాకు మొక్కలన్నీ
లిల్లీ పువ్వుల్నీ నీలో పెరగనిస్తావు
నువ్వొక బిందువువై
సముద్రంలో కలుస్తావు
ముత్యానివీ, ఉప్పువీ అవుతావు
నువు మళ్ళీ మళ్ళీ
భూమి ఉన్నంత కాలమూ
మొలకెత్తుతావు
సముద్రం ఉన్నంతవరకూ
అలవై ధ్యానిస్తావు
ఈ మాటలు చివరగా
నన్ను ప్రలోభ పెట్టాయి
తలుపు తెరిచాను
ఇప్పుడు –
మీరు చూస్తున్నది
నా నీడను మాత్రమే

కె.సచ్చిదానందన్ అంతర్జాతీయ కవి. ఆంగ్లంలోనూ మళయాళంలోనూ అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. ఆయన 20 సంపుటాల కవిత్వం 119 ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. కేరళ సాహిత్య అకాడమీ అవార్డును 5 సార్లు అందుకున్న కవి. తులనాత్మక సాహిత్యంలో కె.కె.బిర్లా ఫౌండేషన్ ఫెలోషిప్ పొందిన సచ్చిదానందన్ కు N.T.R జాతీయ అవార్డు కూడా లభించింది.

January 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఇవీ మన భారతీయ భావం

by మోతుకూరి నరహరి January 5, 2022
written by మోతుకూరి నరహరి

1.”వాన కురిస్తే,మెరుపు మెరిస్తే,/ ఆకసమున హరివిల్లు విరిస్తే,/

అవి మాకే-అని ఆనందించే/ పిల్లల్లారా!” అంటాడు మహాకవి

శ్రీశ్రీ తన ‘మహాప్రస్థానం’ సంపుటిలోని ‘శైశవగీతి’ కవితలో.

2.అట్లాగే అమాయకులు, ప్రకృతి ప్రేమికులు అయిన మన ప్రాచీనులు ప్రకృతిలోని

వివిధ ఘటనలను,వింతలను చూసి ఆనందాశ్చర్యాలకు లోనై ప్రకృతిశక్తులకు దైవత్వాన్ని,తనకు లేని,తాను కోరుకొనే అనేక శక్తులను వారికి ఆపాదించి,స్తోత్రాలు,సూక్తాలు, పురాణాలు రచించారు.  ఈ క్రమంలోనే సంపదకు అధిదేవతగా లక్ష్మిని,విద్యా విజ్ఞానాలకు అధిదేవతగా సరస్వతిని,దుర్మార్గాలను నిర్మూలించే ‘శక్తి’గా కాళికను (పార్వతిని)తన ఆకారంతోనే రూపొందించుకున్నాడు.  వారికి తాను కల్పించిన, ఊహించిన శక్తులకు అవసరమైనట్టుగా ఎక్కువ తలలను,చేతులను,వివిధ ఆయుధాలనుకూడా వారికి కల్పించాడు.  మన నిష్క్రియా పరత్వానికి విదేశీయుల దండయాత్రలో, పరాయిపాలనో కారణమని సర్దిచెప్పుకోవడం సరికాదు.

2.మన దేశంలో ప్రాచీనకాలంలోనే గార్గి, మైత్రేయి వంటి బ్రహ్మవాదినులు ఉండేవారు-

అని గర్వించడం సరే. కాని అంతటితోనే సరిపెట్టుకోకూడదు కదా! ఆధునికకాలంలో సావిత్రీబాయి

ఫూలేగారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు (ఉపాధ్యాయిని)అయ్యేదాకా

మన సరస్వతీ దేవికి వారసులు లేకపోవడం బాధాకరమేకదా!

3.మనకు వైద్యాధిదేవుడుగా ధన్వంతరి,ప్రాచీనకాలంలోనే గొప్ప వైద్య శాస్త్ర వేత్తలైన చరకుడు,సుశ్రుతుడు ఉన్నా గత శతాబ్దంలో విదేశాలలో ఆధునిక వైద్యవిద్యను అభ్యసించి వచ్చిన డాక్టర్ ఆనందీబాయి జోషి గారి వరకు మనకు ఆధునిక మహిళావైద్యులు లేరు-అంటే ఆ మధ్యకాలంలో మన సమాజం ఎంత నిద్రావస్థలో, అచేతనంగా ఉందో అర్థం చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి,ఆ లోపాలు పునరావృత్తి కాకుండా చూసుకోవాలి. వీరు ఇద్దరు కూడా ఆంగ్లేయుల పాలనాకాలం లోనే తమను తాము నిరూపించుకొన్న వారు కావడం గమనార్హం, ప్రశంసార్హం.

4.మరో ప్రధానమైన అంశం- నిత్యం లక్ష్మిని, సరస్వతిని, పార్వతిని-వారి అనుగ్రహాన్ని

కోరుతూ -పూజించే మనం మనను కనిపెంచిన తల్లి, జీవితాన్ని పంచుకున్న భార్య,అక్క చెల్లెళ్ళు,కూతుళ్ళ, కోడళ్ళగురించి ఎట్లా ఆలోచిస్తున్నామో,వారిపట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నామోకూడా ఆత్మావలోకనం చేసుకొని,

వాళ్ళను గౌరవించడం,ప్రేమను పంచడం నేర్చుకోవాలి. మన కుటుంబ సభ్యులలోనే, మన చుట్టూ ఉన్న సమాజంలోనే ఆ ‘ముగ్గురు అమ్మలను” చూసుకోగలగాలి.

5.మహాకవి గురజాడ అప్పారావుగారు చెప్పిన- “మగడు వేల్పన పాతమాటది,

ప్రాణమిత్రుడ నీకు…” అనే పంక్తుల సారాంశాన్ని ఒంటబట్టించుకొని మనం కొత్తమనుషులముగా

రూపాంతరం(మెటా మార్ఫోసిస్/Metamorphosis)చెందాలి. ప్రయత్నపూర్వకంగా భూస్వామ్య,పితృస్వామ్య

భావజాలాన్ని,పురుషాహంకారాన్ని పాము కుబుసంలాగా వదులుకోవాలి.అప్పుడే మన జీవితాలకు సార్థకత.

మన స్తోత్రాలు అర్థవంతం అవుతాయి.

सरास्वती प्राथना

जय जय हे भगवति सुरभारति !

तव चरणौ प्रणमाम: ।।

नादतत्‍वमयि जय वागीश्‍वरि !

शरणं ते गच्‍छाम: ।।1।।

त्‍वमसि शरण्‍या त्रिभुवनधन्‍या

सुरमुनिवन्दितचरणा ।

नवरसमधुरा कवितामुखरा

स्मितरूचिरूचिराभरणा ।।2।।

आसीना भव मानसहंसे

कुन्‍दतुहिनशशिधवले !

हर जडतां कुरू बुद्धिविकासं

सितपंकजरूचिविमले ! ।।3।।

ललितकलामयि ज्ञानविभामयि

वीणापुस्‍तकधारिणि ! ।।

मतिरास्‍तां नो तव पदकमले

अयि कुण्‍ठाविषहारिणि ! ।।4।।

जय जय हे भगवति सुरभा‍रति !

तव चरणौ प्रणमाम: ।।

 

భారతీ వందన గీతం

జయ జయహే భగవతి సురభారతి,

తవ చరణం ప్రణమామహః|

నాద బ్రహ్మమై జయ వాగేశ్వరి,

శరణం తే గచ్చామః|

త్వమసి శరణ్య త్రిభువన ధన్య,

సురముని వందిత చరణా|

నవ రస మధురా కవితా ముఖరా,

స్మిత రుచి రుచి భరణా|                      ||జయ జయ జయహే||

ఆసినా భవ మానస హంసే,

కుంద తుహిన శశి ధవలే|

హర జడతాం కురు బోధి వికాస్|

సిత పంకజ తను విమలే|                    ||జయ జయ జయహే||

లలిత కళామయి జ్ఞానవిభామయి,

వీణాపుస్తక ధారిణీ|

మతి రాస్తామ్ నౌ తవ పద్ కమలే,

అయికుంఠా విషహరిణీ||                     ||జయ జయ జయహే||

 

పంక్తులవారీగా శ్లోక భావము

1.(భగవతి=పార్వతి,లక్ష్మి, సరస్వతి,పూజ్యురాలైన స్త్రీ).

పూజ్యురాలవైన ఓ సంస్కృత

(సుర/దేవ)భారతీ!

నీకు జయము జయము (కలుగుగాక)!

నీ చరణాలకు ప్రణామం!

2.నాదబ్రహ్మమయివి,భాగేశ్వరివి(ఒక రాగం)(వాక్కులకు

అధిదేవతవు-వాక్ ఈశ్వరివి

=వాగీశ్వరివి) అయిన నీ

పాదాలను నేను శరణు వేడుతున్నాను/చేరుకుంటున్నాను.

3.మూడు లోకాలను ధన్యము

చేయగల,మునులచే,దేవతలచే నమస్కరింపబడే పాదాలు

గల నువ్వే నాకు శరణం/దిక్కు.

4.నవ రసములతో కూడిన,

మధురమైన కవితలను ధ్వనింపజేసే,అందమైన చిరునవ్వును,కాంతిమంతమైన

ఆభరణాలను ధరించిన అమ్మా!నీకు జయము జయము (కలుగుగాక).

5.(నా)మానస హంసపై ఆసీనురాలవైన,మొల్లలు,

మంౘు,చంద్రునివంటి ధావళ్యము గల తల్లీ!

6.శ్వేతకమలం వంటి స్వచ్ఛమైన శరీరం వర్ణంగల

అమ్మా!నా జాడ్యాన్ని (జడతను,మాంద్యాన్ని,మంద

బుద్ధిని)తొలగించి,బుద్ధి

వికాసాన్ని కలిగింౘు.

నీకు జయము జయము (కలుగుగాక).

7.అమ్మా!నీవు లలితకళామయివి(లలిత కళా

స్వరూపిణివి),జ్ఞానకాంతితో

ప్రకాశిస్తున్నదానివి,వీణను,

పుస్తకాన్ని ధరించినదానివి.

8.నీ పాద పద్మాల దగ్గర నా మతిని (బుద్ధిని) సమర్పిస్తున్నాను.నా సోమరి

తనం అనే విషాన్ని తొలగించే

(హరించే)అమ్మా!నీకు జయము, జయము (కలుగుగాక).

 

నాగరలిపిని తెలుగు అక్షరాలలో రాయడంలో అక్షర దోషాలు దొర్లుతాయి.  నాగరలిపి ఆధారంగానే ఈ కింది అర్థ,తాత్పర్యాలు రాశాను. మూల కవితలోని అంత్యప్రాసలను తాత్పర్యంలోనికి తీసుకురాలేము. అవి రావాలంటే మళ్ళీ మనం దానికి కవితారూపాన్ని ఇవ్వవలసిందే.అందుకు చాలా చాలా శ్రమించాలి.

 

January 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us