మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

A LONG…….. JOURNEY

by Naresh Chary March 31, 2025
written by Naresh Chary

తేది:23-02-2025 ఆదివారం.
సమయం:ఉదయం 6:00 గంటలు,రంగంపేట.
ఉదయం ఆరవుతున్నా బయట ఇంకా మసక చీకటిగానే ఉంది.చలి కూడా ఉంది. బద్ధకపు సూర్యుడు త్వరగా లేస్తే కొంత చలైనా తగ్గును అనుకుంటూనే కార్లో కూర్చున్నాను. ప్రయాణం మొదలైంది.డ్రైవింగ్ మా పెద్ద సార్ (ఉపేందర్ రెడ్డిగారు) చేస్తున్నారు. పక్కనే వారి తమ్ముడు అమరేందర్ రెడ్డి గారు కూర్చున్నారు. వెనుక సీట్ లో నేను కూర్చున్నాను. కారు బయలుదేరింది చీకటిని చీల్చుకుంటూ చలిని చీల్చుకుంటూ……
సార్ 50 లో ఉన్నాడు, కార్ 70 లో ఉంది.క్షణాల్లోనే సంగాయిపేట దాటేశాం కొద్ది నిమిషాల్లోనే కారు చిన్న ఘనపూర్ దాటి పోతంశెట్టిపల్లి చేరి మెదక్ మెయిన్ రోడ్డెక్కింది. అక్కడికి వెళ్ళిందంటే కారుకు కుదుపు ఉండదు. జర్నీ సాఫీగా సాగుతుంది.ఉషోదయపు కిరణాలు మమ్మల్ని సుతిమెత్తమెత్తగా తాకుతున్నాయి. రోడ్డంతా ఖాళీగా ఉండడంతో కారు వేగం కాస్త పెరిగింది. చూస్తుండగానే మెదక్,రామాయంపేట్,దాటింది. సిద్దిపేట కాస్త దూరంగా ఉందనగా డ్రైవింగ్ అమరేందర్ సార్ తీసుకున్నాడు‌. కొద్ది సేపట్లోనే సిద్దిపేటకు చేరుకున్నాం.అక్కడే అంబేద్కర్ సర్కిల్ లో గరం గరం చాయ్ తాగి బైపాస్ నుంచి వరంగల్ బయలుదేరాం.ఈరోజు మా హెడ్మాస్టర్ సార్ వాళ్ళ బంధువుల పెళ్లిళ్లు వరంగల్, జనగాం, ఆలేరులలో ఉన్నాయి. కూడా రమ్మంటే వెళ్ళాను.
వరంగల్ అనగానే నాకు మొదటగా గుర్తొచ్చేది వేయిస్తంభాల గుడి. వీలుంటే చూద్దాం అనుకున్నాము కానీ వీలు లేకపోయింది‌. 10 గంటల వరకు వరంగల్ చేరుకున్నాము. సార్ వాళ్ళు పెళ్ళిలో గంట సేపు ఉంటామని అనడంతో నేను నా మిత్రుడి ఇంటికి వెళ్లాను. 11:30 ప్రాంతంలో అక్కడినుండి జనగాం వెళ్లాము.పెళ్లి కన్వెన్షన్ లో. ఇది జనగాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.కన్వన్షన్ చాలా పెద్దగా ఉంది. పెళ్లికి దాదాపు 3,000 మంది హాజరయ్యారు.అందరూ ఖద్దరుదారులే.MP, జిల్లా జడ్జి లాంటి ప్రముఖులు, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కొంచెం వాకబు చేస్తే తేలింది ఏమంటే పెళ్లి వాళ్ళు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళని. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనశాలకు వెళ్ళాము. విపరీతమైన రద్దీ ఉంది అయినప్పటికీ ఏదోలా చోటు దొరికించుకొని భోజనం చేశాము. పన్నీర్ బాగుంది . అదేమిటబ్బా ! నాన్ వెజ్ సెక్షన్ కంటే వెజ్ సెక్షన్ లోనే జనాలు ఎక్కువగా ఉన్నారేమిటి? అనుకున్నాను .కొంచెం నాన్ వెజ్ వైపు చూస్తే అర్థమైంది అక్కడ చిన్న పాటి యుద్ధమే జరుగుతోందని. దానికి భయపడి జనం ఇటు వైపు వచ్చారు. భోజనం ముగించుకొని కాసేపు కూర్చొని అక్కడినుండి ఆలేరు బయలుదేరాం .ఇది సార్ విలేజ్(మర్పెడ) వాళ్ళ పెళ్లి.ఇక్కడికొచ్చేసరికి పెళ్లి అయిపోయింది. చాలా వరకు జనాలు కూడా ఖాళీ చేశారు. మేము వెళ్లి వధూవరులను కలిసాము. పెళ్లి వాళ్ళు మమ్మల్ని భోజనశాలకు తీసుకెళ్ళారు. జనగాంలోనే గట్టిగా తినడం వల్ల ఇక్కడ ఫార్మాలిటీగా ఐస్ క్రీమ్ తిని అక్కడినుండి 4:00 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాము.

అబ్బురపరిచే కొలనుపాక జైనాలయం:
పెళ్లి మండపం నుండి సరాసరి ఆలేరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక లోని జైనాలయానికి వెళ్ళాం. అది 2000 సంవత్సరాల నాటిది. తెలుగు రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద జైనాలయం ఇది. ఆలయాన్ని చూడగానే నాకు క్రీ.పూ 6 వ శతాబ్దం నాటి చరిత్ర గుర్తొచ్చింది .అప్పటి సాంఘిక ,ఆర్థిక, మత రాజకీయ పరిస్థితులు గుర్తొచ్చాయి.
క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మన దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అప్పటికి వైదిక మతమే విస్తృతంగా వ్యాప్తిలో ఉంది.మోక్షం పొందాలంటే యజ్ఞ యాగాలు, కర్మకాండలు చేయాలి .అవి ఖర్చుతో కూడుకున్నవి. మంత్రాలు కూడా సంస్కృత భాషలో ఉండేవి అందువల్ల అవి సామాన్య ప్రజలకు అర్థమయ్యేవి కావు. ఇవే జైన మతం ఆవిర్భవించడానికి కారణమని చెప్పాలి.
జైనమతాన్ని స్థాపించింది వర్దమాన మహావీరుడు. కానీ దానికంటే ముందే 23 మంది తీర్థంకర్లు ఉన్నారని జైనమత గ్రంథాలు పేర్కొంటున్నాయి. వారిలో మొదటి వారు ఋషభనాథుడు తర్వాత అజిత నాథుడు, సంభవనాథుడు, అభినందన, సుమతి నాథ, పద్మ ప్రభువు, సుపార్శ్వనాథ, చంద్ర ప్రభు, పుష్పదంత, శీతలనాథ, వాసు పూజ్య, విమలనాథ,అనంతనాథ, ధర్మనాథ, శాంతి నాథ, కుంతనాథ ,అరనాథ ,మల్లనాథ, మునిసువీరనాథ, నేమినాథ, అరిష్టనేమి, పార్శ్వనాథ లాంటి 23 మంది తీర్థంకరుల తర్వాత వచ్చిన వాడే 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు. ఋషభనాథుడు మొదటి తీర్థంకరుడు అయినప్పటికీ జైనమతంలో ఈయన కొన్ని మార్పు చేర్పులు చేసి దాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రచారం చేసి విస్తృత పరిచాడు కాబట్టి వర్ధమాన మహావీరుడిని జైన మత స్థాపకుడు అన్నారు.

వర్ధమాన మహావీరుడు తన 30 ఏళ్ల వయసులో గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి సన్యాస దీక్ష స్వీకరించాడు. 13 సంవత్సరాల కఠోర దీక్ష చేసిన అనంతరం అతనికి జ్ఞానోదయమయింది. మరో 30 సంవత్సరాలు మగధ, అంగ,కోసల ప్రాంతాల్లో జైనమత తత్వాన్ని ప్రచారం చేస్తూ 72 సంవత్సరాల వయసులో పావాపురి వద్ద తనువు చాలించాడు.
జైనమతం ప్రతిదాంట్లో ఆత్మ ఉంటుందంటుంది, నిరాడంబరతకు ప్రాముఖ్యతనిస్తుంది.మానవ జీవన సాఫల్యానికి వర్ధమాన మహావీరుడు మూడు ముఖ్యాంశాలను సూచించాడు అవి1. సరైన విశ్వాసం 2.సరైన జ్ఞానం 3.సరైన నడవడి.ఇతను జైన మతంలో చెప్పిన పంచ సూత్రాలకు అంటే పార్శ్వనాథుడు చెప్పిన సత్యం,అహింస,అపరిగ్రహం అస్తేయం లకు బ్రహ్మచర్యం జోడించి వీటిని పాటించాలని చెప్పాడు.వీటిని “పంచ కళ్యాణాలు” అంటారు. ఏ విధంగా సులభ మార్గంలో మోక్షం పొందాలో ప్రజల భాషలో చెప్పాడు మహావీరుడు .దాంతో జైన మతం భారతదేశమంతా వ్యాపించి, కొంతకాలం ఆదరణకు కూడా నోచుకుంది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో చిన్న స్పర్థల వల్ల జైన మతం శ్వేతాంబర, దిగంబర శాఖలుగా విడిపోయింది. దక్షిణ భారతదేశంలో స్థూల భద్రుని నాయకత్వాన శ్వేతంబర శాఖ, ఉత్తర భారత దేశంలో భద్రబాహుని నాయకత్వంలో దిగంబర శాఖ ప్రచారం నిర్వహించుకున్నాయి.ఇందులో ఉండే కఠిన నియమాల వల్ల కాలక్రమమేనా జైన మతం క్షీణించి బౌద్ధమతం ఆవిర్భవించింది.ఏ శాఖ వారైనా తీర్థంకరులను గౌరవించారు.
జైనమత వ్యాప్తిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించారు. ఇదిగో ఈ కొలనుపాక జైనాలయం కూడా అందులో భాగంగానే నిర్మించబడింది. ఆలయాన్ని చూడగానే ఉత్సాహమేసింది. ఫోన్లో ఆలయాన్ని బందిద్దామనుకున్నాను కానీలోపలికి ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు. ఫోన్లన్నీ కారులో పెట్టి లోనికి ప్రవేశించాము.గుడి బయటి భాగానికి పెయింట్ వేస్తున్నారు.గుడి చాలా ప్రశాంతంగా ఉంది. గుడి లోపల ఇంకా ప్రశాంతంగా ఉంది.గుడి ద్వారం కోటను తలపిస్తుంది. ద్వారంవైపు అటు ఇటుగా ఉన్న నల్ల రాతితో చెక్కిన ఏనుగులు మనకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటాయి.గుడి మొత్తం చలువరాయితో నిర్మించబడింది.గుడి లోపలి భాగం మాటల్లో వర్ణింపనలవిగాకుండా వుంది. అద్భుతమైన శిల్పకళాకౌశలంతో మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. నాట్యకత్తెలు,తప్పెట వాయిస్తున్న స్త్రీ శిల్పాలు,పువ్వులు, తీగలు ఎంత అద్భుతంగా చెక్కబడ్డాయో! అణువణువునా పొదిగియున్న ఇక్కడి శిల్ప సౌందర్యం ఎవరిరైనా కట్టిపడేస్తుంది. పాలరాతిపై అంత అద్భుతమైన శిల్ప సంపదను ఆవిష్కరించినందుకు ఆ శిల్పకారులకు నమస్కరించాలనిపించింది. ఎంత ఓపిక,ఎంత ఏకాగ్రత ఉంటే అలా చెక్కగలరు. అబ్బబ్బా …. చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. బహుశా ఇలాంటి శిల్ప సంపదను మనం కేవలం మన దేశంలోని ఆలయాల్లోనే చూడగలమనిపించింది. కొంచెం టైం వెచ్చించాలి గాని మనదేశాన్ని పూర్తిగా సందర్శిస్తే ప్రపంచంలోని సగభాగాన్ని చూసినట్టే. గుడి లోపలి భాగంలో చుట్టూ జైనతీర్థంకరులు ఉన్నారు. ఆ విగ్రహాలన్నీ నల్లరాయితో మలచబడ్డాయి. ఆలయంలో ప్రధాన ఆకర్షణ వర్ధమాన మహావీరుడు, ఋషభనాథుడు,నేమినాథుడి విగ్రహాలే.
ఇక్కడి మూలవిరాట్టు ఋషభనాథుడు. మూల విరాట్టుకు కుడివైపున గల గర్భగుడిలో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం, అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉంది. వేళ్ళు పొడవుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనోహరంగా ఉంది.విజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారతదేశంలో మరెక్కడా లేదు.
ఋషభనాథుని విగ్రహం38.5 అంగుళాల వెడల్పు 34.56 అంగుళాల పొడువు కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ విగ్రహం ఆహార్యము బహుగొప్పగా మలచబడింది. అర్ధ పద్మాసన సిద్దాసనంలో ఉండి ముఖ ముద్ర గాంభీర్యంగా ఉన్నది, కాంతి మండలం గుండ్రంగా ఉన్నది, లలాటం మీద చంద్రుడు, చుబుకం మీద సూర్యుడు,అరచేతి మీద శంఖం, చక్రం ఉన్నాయి. ఇది భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం. వాటి కింద హిందీలో వారి పేర్లు కూడా ఉన్నాయి.
ఋషభనాథునికి ఎడమవైపు నేమి నాథుని విగ్రహముంది.ఇది కూడా పద్మాసనంలోనే,గొప్ప అలంకారభూయిష్టంగా ఉంది. ఆ ముగ్గురిని తనివితీరా చూసి,నమస్కరించి ముందుకు కదిలాము. ఆలయపు దక్షిణపు గోడపై జైనమహా సభలు జరిగిన వివరాలు పొదగబడిన చిత్రము ఒకటి కనిపించింది. దాన్ని చూసి ముందుకు కదిలాము. గుడిలో మమ్మల్ని ఆశ్చర్యపరచినవాటిలో గుడి డోం ఒకటి.దాన్ని చూస్తే నాకు OU ఆర్ట్స్ కాలేజీడోం గుర్తుకొచ్చింది. దానికంటే ఇది ఇంకా బాగుంది. డోంచుట్టూ అద్భుమైన శిల్ప సంపద మమ్మల్ని కన్నార్పకుండా చేసింది. డోంని ఎలా నిర్మించారని చాలాసేపు ఆలోచించాను……నిజంగా అద్భుతమది.
అలా గుడి లోపలిభాగంలో ఉన్న జైననతీర్థంకరుల విగ్రహాలను మొత్తం చూశాము.గుడి మధ్య భాగంలో కొంతమంది భక్తులు ఉన్నారు.వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. వాళ్ళ ముఖంలో లవలేశమైనా ఆతృత గానీ కోపం గానీ లేవు.ఏ భావం లేకుండ ఉండడం చాలా కష్టం,కానీ అసాధ్యం కాదు. అక్కడంతా మౌనం తాండవించింది.మేము కూడా మౌనంగా ప్రధానాలయం దాటాము.
ప్రధానాలయానికి కుడివైపున చిన్న ఆలయం ఉంది.అదికూడా చాలా బాగుంది.ప్రధానాలయానికి ఉత్తర భాగంలో ఉన్న మరో ఆలయానికి వెళ్ళాము. ఆలయం చిన్నగానే ఉంది లోపల పాలరాతితో చెక్కబడిన శాంతి నాథుని(తీర్థంరుల్లో ఒకరు) విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంది ధ్యానముద్రలో శాంతి నాథుడు అద్భుతంగా దర్శనమిచ్చాడు.
మళ్లీ ఎప్పుడైనా వస్తే ఫ్యామిలీతో రావాలనుకుని మెల్లిగా బయటకు వచ్చాము. ఫోన్ గనక అనుమతిస్తే నేను ఎన్నో ఫోటోలు వీడియోలు తీసేవాడిని. అయినా అది చూస్తే తప్ప లేని చెప్పలేని అనుభూతి. గుడి బయట కొన్ని ఫొటోలు దిగి గుడికి వీడ్కోలు చెప్పి మెల్లిగా చేర్యాల కు బయలుదేరాం అక్కడ మా బుడ్డోడితో ఒక 15 నిమిషాలు గడిపి సిద్దిపేటకు బయలుదేరాం.

అలా అలా…రంగనాయక సాగర్ జలాశయపు ఒడిలో…
సిద్దిపేటలో సందర్శించదగ్గ వాటిలో రంగనాయక సాగర్ జలాశయం ఒకటి.ఇది సిద్దిపేటకు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామానికి దగ్గరలో ఉంది. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 2300 ఎకరాల్లోదీన్ని నిర్మించారు. దీనికి కెపాసిటీ మూడు టీఎంసీలు. దీనిని 2020లో హరీష్ రావు ,కె.టి.ఆర్ గార్లు ప్రారంభించారు. ఇది సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 114,000 ఎకరాలకు నీరందిస్తుంది. ఎండాకాలంలో కూడా సిద్దిపేట పరిసర ప్రాంతంలో చెరువులు నిండుగా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం ఈ జలాశయమే.
రంగనాయక సాగర్ జలాశయం పై వరకు కార్లో వెళ్లొచ్చు. దాని చుట్టూతా హారమున్నట్టు తారు రోడ్డు ఉంది. జలాశయం,చుట్టుప్రాంతం చాలా శుభ్రంగా ఉంది. నీళ్లు కూడా బాగానే ఉన్నాయి. దీవి మధ్యలో దేశం ఉన్నట్టు రంగనాయక సాగర్ మధ్యలో గెస్ట్ హౌస్ ఉంది. అక్కడి వరకు మనం కారులో వెళ్లొచ్చు .సందర్శకులతో ఎప్పుడు కూడా ఇది కళకళలాడుతుంది. మేము గెస్ట్ హౌస్ కు దగ్గరదాకా వెళ్లి చుట్టూ చూసాం. ఎటు చూసినా జలమే. కళ్ళకు ఎంతో హాయి కలిగించేదృశ్యమది. అక్కడ వివిధ భంగిమల్లో కొన్ని ఫోటోలు దిగాము. తర్వాత ఇంకొంత దూరం వెళ్లి ఎక్కడ నుండి నీళ్లు ఇందులోకి వస్తాయో ఆ పంపుల దగ్గరికి వెళ్ళాము. అక్కడ సాగర్ లోపలికి వెళ్లడానికి కట్టబడిన బాల్కనీ కట్టడం ఉంది. అక్కడి నుంచి చూస్తే రంగనాయక సాగర్ మహా అద్భుతంగా కనిపించింది. అక్కడ కూడా కొన్ని ఫోటోలు దిగాము. అప్పుడే సూర్యుడు మెల్లిమెల్లిగా నిద్రలోకి జారుతున్నాడు.మేము తిరుగు ప్రయాణమయ్యాం.ప్రస్తుతం బోటింగ్ అవకాశం లేదుగానీ ఉంటే వెళ్లే వాళ్ళమేమో……

విజయ్ సార్ ఇంట్లో వేడివేడి పూరీ……
రంగనాయక సాగర్ నుండి తిరుగు ప్రయాణమై సరాసరి సిద్దిపేటలోని విజయ సార్ ఇంటికి వెళ్ళాం. సమయం సాయంత్రం 7:00 అయింది. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యాం. మేము వస్తున్నామన్న వార్త ముందే తెలియడంతో కావచ్చు మాకోసం సార్ స్పెషల్ గా పూరి చేయించారు.తిని చాలాసేపే అయింది కాబట్టి మాకు కూడా ఆకలైంది. పూరీలను చూడగానే ఇంకా ఆకలె క్కువైందనొచ్చు. లేత గోధుమ రంగులో పొంగిన పూరీలు, వాటి పక్కన కాబూలీ శనగలతో చేసిన కర్రీ….. కాంబినేషన్ అదిరింది. విజయ్ సర్ కొసరి కొసరి వడ్డిస్తుంటే ఆసాతం మేమాస్వాదిస్తూ తిన్నాం. అనంతరం అందమైన వైన్ గ్లాసులలో ఆపిల్ జ్యూస్ తాగడం చాలా బాగా అనిపించింది.సోంపు వేసుకొని కాసేపు సార్ వాళ్ళ స్కూల్ విషయాలు కాసేపు మా స్కూల్ విషయాలు ఇంకాసేపు విద్యార్థుల భవితవ్యం గురించి మాట్లాడుకొని ఎనిమిది గంటలకి విజయ్ సర్ నుండి సెలవు తీసుకొని రంగంపేటకు బయలుదేరాం.
కారు సాధారణ వేగంతోనే ముందుకు వెళుతోంది. ఎండాకాలం ఆరంభమైంది కదా…. కారు అద్దాలు తీస్తుంటే చల్లటి గాలి మాకు సుతిమిత్తగా తగులుతోంది. వెనకసీట్లో కూర్చున్న నేను ఎప్పటికప్పుడు క్రికెట్ స్కోర్ చూస్తున్నాను. ఈరోజు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్థాన్ చేసింది. రెండో ఇన్నింగ్స్ మొదలైంది. స్కోర్ పెద్ద గా లేకపోవడంతో పెద్ద ఒత్తిడి కూడా ఏం లేదు. అందునా చేజింగ్ కింగ్ కోహ్లీ ఉన్నాడు కదా….భయమేల అనుకున్నాను. మ్యాచ్ మొదలైంది. ఇండియా బాగానే బ్యాటింగ్ చేస్తుంది అమరేందర్ సార్ డ్రైవింగ్ కూడా బాగా చేస్తున్నాడు. అదేమిటో చల్లగాలి తగిలినాకొద్ది నాకు నిద్ర ముంచుకొస్తుంది ఓవైపు మ్యాచ్ ,మరో వైపు నిద్ర…ఎలా…. అనుకుంటుండగానే గంటలో మెదక్ చేరుకున్నాము.అక్కడ ఆగి ఛాయ్ తాగడంతో నిద్ర కాస్త పారిపోయింది. ఇక మెదక్ నుండి బయలుదేరి సరాసరి రంగంపేటకు వచ్చేసరికి సమయం 9:45 అయ్యింది.
అక్కడక్కడా ఆగుతూ, ఆతిథ్యం స్వీకరిస్తూ వచ్చినందుకేమో! 450 కిలోమీటర్లు ప్రయాణించినా మాకు అలసట కలగలేదు. చూస్తుండగానే ఇండియా పాకిస్తాన్ పై విజయం సాధించింది. ఇంకేం…..ఖేల్ ఖతం దుకాణం బంద్.

వీలైనప్పుడు మీరు కూడా కొలనుపాక జైనాలయాన్ని, రంగనాయక సాగారాన్ని తప్పకుండా సందర్శించండి.

March 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

గతం లేకపోతే వర్తమానం లేదు

by Aruna Dhulipala March 31, 2025
written by Aruna Dhulipala

చారిత్రక నవలా చక్రవర్తి బిరుదాంచితులు, ప్రముఖ రచయిత డా. ముదిగొండ శివప్రసాద్ గారితో మయూఖ ముఖాముఖి…….. ధూళిపాళ అరుణ

       వేల సంవత్సరాల చరిత్రను పరిశోధించి, ఆంధ్ర దేశంలో ఎన్నో రాజవంశాల చరిత్రలను నవలారూపంలో అనేక పుస్తకాలుగా వెలువరించినవారు, అటు చారిత్రక నవలలు, ఇటు సాంఘిక నవలలతో పాటు జ్ఞాపకాల పల్లకీ, విజ్ఞాన విపంచి, అచుంబితం, చెయ్యెత్తి జైకొట్టు వంటి ఎన్నో విభిన్న రచనలను అందించిన డా. ముదిగొండ శివప్రసాద్ గారి సాహిత్యకృషిని, నిరంతర పరిశోధనా తృష్ణను వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్

విజ్ఞానఖని అయిన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మీ విషయాలను మా మయూఖ పాఠకులకు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది మొదటగా….

1ప్ర:- మీ జననం, బాల్యం గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ వివరాలను చెప్పండి.

జ:-  అందరికీ నమస్కారం. నాపేరు ముదిగొండ శివప్రసాద్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మయూఖ నిర్వాహకులకు, పాఠకులకు నా హృదయపూర్వక శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఇవాళ ధూళిపాళ అరుణమ్మ ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది. నేను 1940 డిసెంబర్ 23 న జన్మించాను. ఒంగోలు ముఖ్యపట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం మా ఊరు. మా ఇంటిపేరు ముదిగొండ, మా తాతగారి ఊరు కొంపల్లి. చారిత్రకంగా పరిశీలించినట్లయితే క్రీ.శ. 1323 సెప్టెంబర్ తర్వాత కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. అప్పుడు ముదిగొండ వారు, కొంపల్లి వారు, ములుగు వారు వీళ్లంతా వలస వెళ్లారు. సాగరాంధ్రలో ముఖ్యంగా కృష్ణానది, గోదావరి నదీ తీరాల్లో సెటిలయ్యారు. 1940లో రజాకార్ల ఉద్యమం తర్వాత మళ్ళీ వలస వెళ్లారు. ఈ వలసలకు పెద్ద చరిత్రే ఉంది. మా అమ్మ రాజేశ్వరమ్మ, నాన్నగారు మల్లికార్జునరావు గారు. ఆరోజుల్లో ఆయన పెద్ద వక్త. ఆయన వరంగల్ లో టీచరుగా పనిచేసేవారు. ఆయన సుప్రసిద్ధ రచయిత, సనాతన ధర్మప్రచారకుడుగా ఉండేవాడు. ఇది 1930 నాటి మాట. చివుకు అప్పయ్యగారి సంపాదకత్వంలో ‘దివ్యవాణి’ అనే పత్రిక వస్తుండేది. దానికి మా నాన్నగారు పర్మినెంట్ రైటర్ గా ఉన్నాడు. నా బాల్యంలో మా ఇంట్లో ఎటుచూసినా పుస్తకాలే ఉండేవి. మా నాన్నగారు ఒక చిన్న పత్రికకు ఎడిటర్ గా కూడా ఉన్నాడు. అయితే ఆయన అకాల మరణంతో మా కుటుంబమంతా చెల్లాచెదరై పోయింది. ఆ తర్వాత స్వయంకృషితో చదువుకున్నాను. 1955 వరకు నా బాల్యంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయాలేవీ లేవు. కానీ మా నాన్నగారి ప్రభావం మాత్రం నామీద ఉంది.

2ప్ర:- అటువంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని సాహిత్యంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా మిమ్మల్ని ప్రభావితం చేసిందెవరు?

జ:-   నేను బాల్యంలోనే ఎంతోమంది సుప్రసిద్ధ రచయితలను చూశాను. కొంతమంది నాకు టీచర్లుగా ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రిగారు నాకు చాలా సన్నిహితులు. అట్లాగే వేదుల సత్యనారాయణ శాస్త్రిగారు, తల్లావజ్ఝల శివశంకరస్వామి వారి కొడుకు, శ్రీరామ భుజంగ వెంకటశర్మగారు, కాటూరి వెంకటేశ్వరరావు గారు, పింగళి లక్ష్మీకాంతం గారు, గంటి జోగిసోమయాజి గారు, ఎస్వీ జోగారావు గారు ఇలాంటి వారు టీచర్లుగా ఉండడం వల్ల నామీద వారి ప్రభావం చాలానే ఉంది. దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి వద్ద రెండేళ్లు వ్యాకరణం నేర్చుకున్నాను.

3 ప్ర:- కృష్ణాపత్రికకు, మీకు ఉన్న అనుబంధం ఎటువంటిది? అందులో చేరడానికి గల నేపథ్యం ఏమిటి?

జ:-  నేను రచనా వ్యాసంగంలో ప్రవేశించిన దశలోనే బందరులో ముట్నూరు కృష్ణారావు సంపాదకత్వంలో కృష్ణాపత్రిక వస్తుండేది. ఆ కాలంలో చాలా ప్రసిద్ధి ఉన్నటువంటి పత్రిక. ఆయన తదనంతరం కాటూరి వెంకటేశ్వర రావుగారు, కమలాకర వెంకటరావు గారు కొంతకాలం నడిపినట్టున్నారు. తర్వాత దానికి భౌతిక శరీరం మాత్రం పోయి కీర్తి శరీరం మాత్రం మిగిలింది. ఆ దశలో సుబ్రహ్మణ్య శర్మగారు ఆ పేపర్ ను కొని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఇక్కడ నేను సంపాదకవర్గంలో చేరాను. అప్పుడే నాకు జర్నలిజంతో పరిచయం ఏర్పడింది. ఆ పత్రిక నాకు, నేను ఆ పత్రికకు ఎంతో ఉపయోగపడ్డాం. ఆ పత్రికలో నేను రాసిన వ్యాసాలు సంచలనాత్మకంగా ఉండేవి. కృష్ణాపత్రిక అంటే ముదిగొండ శివప్రసాద్ అన్నంత ముద్రపడింది. సాహిత్యపరంగా అది నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రముఖుల రచనలను అందులో వేశాము. నా నవలలు కూడా రెండు మూడు కృష్ణా పత్రికలో అచ్చయినాయి. ఆ రోజుల్లో సమకాలీన పత్రికలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, జాగృతి ఇప్పటికీ వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు 77 ఏళ్ల చరిత్ర కలిగి ఇప్పటికీ బ్రతికున్న ఏకైక పత్రిక, అవిచ్ఛిన్నంగా వస్తున్న పత్రిక జాగృతి వారపత్రిక. మిగతావన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.

4 ప్ర:-  మరి మీ ఉద్యోగజీవితం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది? ఆ అనుభూతులు ఎటువంటివి?

జ:-   నేను కృష్ణాపత్రిక సంపాదకవర్గంలో ఉన్నప్పుడు దివాకర్ల వేంకటావధాని గారు “బాబూ! నువ్వెంత గొప్ప రచయిత అయినా జీవితంలో నీకొక స్థిరత్వం కావాలంటే నువ్వు అధ్యాపక వృత్తిలో ఉండడం మంచిది. పైగా నీలో బోధన కళ ఎక్కువగా ఉంది. అందువల్ల నీవు టీచరుగానే అభివృద్ధిలోకి రావాల”ని చెప్పారు. మొదట1959లో హైదరాబాద్ లో టీచరుగా జాయినయ్యాను. తర్వాత భద్రుక కాలేజీలో లెక్చరర్ గా చేరాను. ఆ తర్వాత బొగ్గులకుంట ఓరియెంటల్ కాలేజీలో పనిచేశాను. తర్వాత కొన్ని ప్రయివేటు కాలేజీలలో చేశాను. ఆ తర్వాత యూనివర్సిటీలో సెలక్షన్ వచ్చింది. అప్పటినుండి అవిచ్ఛిన్నంగా లెక్చరర్ గా, రీడర్ గా, ప్రొఫెసర్ గా పనిచేశాను. ఉద్యోగ జీవితంలో job satisfaction అంటారే అది పూర్తిగా నాకు కలిగింది. నా దగ్గర 30 మంది ఎంఫిల్, పిహెచ్ డి డిగ్రీలు తీసుకున్నారు. ఉస్మానియా, కాకతీయ, నాగార్జున, గుల్బర్గా, చెన్నై, ఆంధ్ర ఇట్లా వివిధ విశ్వవిద్యాలయాల్లో నా సాహిత్యం మీద పదిమంది పి హెచ్ డి లు చేశారు. నాకు దివాకర్ల వేంకటావధాని గారు చాలా సన్నిహితులైనారు. ఆయనను ఒక వ్యక్తిగా కాక ఒక సంస్థగా చెప్పుకోవాలి. నా జీవితంలో నేను చూసిన మహాపురుషుల్లో ఆయన అగ్రగణ్యులు. అదే విధంగా బిరుదురాజు రామరాజు గారు, ఇరివెంటి కృష్ణమూర్తి గార్ల ప్రేమకు పాత్రుడనయ్యాను. అట్లాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆనాటి రచయితలు గుంటూరు శేషేంద్రశర్మ గారు, బాపురెడ్డి గారు, డా. సి. నారాయణ రెడ్డి గారు, బోయి భీమన్న గారు, పోతుకూరి సాంబశివరావు గారు, దాశరథి కృష్ణమాచార్యులు గారు, దాశరథి రంగాచార్యులు గారు అదేవిధంగా వరంగల్ లో ఉన్నటువంటి రచయితలు కాళోజీ రామేశ్వరరావు గారు, కాళోజీ నారాయణరావు గారు, మాదిరాజు రంగారావు గారు, వె. నర్సింహారెడ్డి గారు యూనివర్సిటీ లో పనిచేసినప్పుడు వీళ్ళలో కొంతమంది నాకు కొలీగ్స్ కూడా. పేర్వారం జగన్నాథం గారు, హరి శివకుమార్ గారు, అనుముల కృష్ణమూర్తి గారు వరంగల్ లో సోమేశ్వరశర్మ గారు అని ప్రసిద్ధ రచయిత ఉండేవారు. వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

5 ప్ర:-  మీరు వెలువరించిన సమగ్ర సిద్ధాంత “కాకతీయ కళా దర్శనం” గొప్ప ప్రామాణిక గ్రంథం. దాని గురించి చెప్పండి.

జ:-  నాకు 1970లో నాకు డాక్టరేట్ వచ్చింది. నా పిహెచ్ డి టాపిక్ “ఆధునికాంధ్ర కవిత్వంపై ఉద్యమాల ప్రభావం”. డా.సి.నారాయణరెడ్డి గారు నాకు గైడు. వంద సంవత్సరాలుగా రాజకీయ, సాంఘిక, సాహిత్య ఉద్యమాలన్నీ వచ్చినప్పుడు దాని ప్రభావం వల్ల సాహిత్యం ఎట్లా మారుతూ వచ్చిందో పరిశోధించి రాశాను. అందులోని ఒక్కొక్క అధ్యాయం మీద ఒక్కొక్కరు పి హెచ్ డి చేశారు. ఆ కాపీలన్నీ అయిపోయాయి. మార్కెట్లో దొరకడం లేదు. రీ ప్రింట్ చేయాలి. అట్లాగే న్యూఢిల్లీ వారు సీనియర్ ఫెలోషిప్ పేరుతో స్కాలర్ షిప్ ఇస్తారు. దానికోసం రాసిందే “కాకతీయ కళాదర్శనం”. అందులో ఆనాటి కాకతీయుల రాజకీయ, సాహిత్య, సామాజిక, కళారంగాల వైభవాన్ని విశ్లేషిస్తూ ఒక ప్రామాణిక సిద్ధాంత గ్రంథాన్ని రాశాను. ఒకరకంగా అది Post doctoral Research అని చెప్పవచ్చు. It’s only for scholars. అది సిద్ధాంత గ్రంథం కాబట్టి పరిశోధించి రాశాను. కథలు, నవలలు చదివినట్టు వీటిని అందరూ చదవరు. చదివే పాఠకులు కొద్దిమందే ఉంటారు. కాకపోతే ప్రామాణికంగా రీసెర్చ్ ఓరియెంటెడ్ గా ఉన్నవాళ్లే చదువుతారు.

6ప్ర:-  సర్, మీరు మహోదయం, నాగపూర్ణిమ, మాలిక్ కాఫర్ వంటి చారిత్రక నవలలు ఎన్నో రాశారు. అత్యధికంగా చారిత్రక నవలలు రాయడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమైనా ఉందంటారా?

జ:-    సాహిత్యం వైపు దృష్టి సారించినప్పుడు నాకు ప్రధాన గురువులు ముగ్గురు. ఒకరు విశ్వనాథ సత్యనారాయణ గారు, రెండవవారు అడవి బాపిరాజు గారు, నోరి నరసింహ శాస్త్రిగారు మూడవవారు. ఈ ముగ్గురిలో కొన్ని విశిష్ట వ్యక్తిత్వాలున్నాయి. విశ్వనాథ వారి రచనలో ఔద్ధత్యం ఎక్కువగా ఉంటుంది. అడవి బాపిరాజు గారు సహజంగా చిత్రకారుడు. ఆయన అక్షరాలతోనే ఎక్కువ బొమ్మలు గీస్తారు. అందువల్ల లాలిత్యం ఎక్కువ. నరసింహ శాస్త్రి గారు చారిత్రక ప్రమాణాల కోసం ఎక్కువగా కృషి చేస్తారు. ఈ మూడు గుణాలను నేను వారి నుండి అధ్యయనం చేశాను. మొదటగా నేను సాంఘిక నవలలను రాశాను. ఒకదాన్ని ఆంధ్రప్రభకు ఇచ్చాను. వాళ్ళు నాది వేసుకోమన్నారు. ఎందుకని అడిగాను? “యద్ధనపూడి సులోచనా రాణిలాగా రాస్తే వేస్తాము. మా పాఠకులకు మీవంటి రచనలు చదివే ఓపిక లేదు. దానివల్ల మా సర్క్యులేషన్పె రగదు” అన్నారు. దాన్నొక ఛాలెంజ్ గా తీసుకున్నాను. నిజానికి చారిత్రక రచనల వల్ల సమాజానికి ఎంతో ఉపయోగం ఉంది. అందుకే శాతవాహనుల నుండి మొదలుపెట్టాను. శాతవాహనుల గురించి 6 నవలలు రాశాను. ఒక్కొక్క పీరియడ్ ను తీసుకున్నాను. వసంత గౌతమి, ఆచార్య నాగార్జున, శ్రీలేఖ, శ్రావణి ఇట్లా రాశాను. శ్రీలేఖ అయితే 36 నెలలు ‘విజయ’ అనే మాసపత్రికలో సీరియల్ గా వచ్చింది. ‘మాలిక్ కాఫర్’ ఆంధ్రభూమి వీక్లీలో వచ్చింది. వేయిస్తంభాల గుడి మీద ‘ఆవాహన’ నవల రాశాను. పాఠకులకు బాగా నచ్చిన నవలల్లో ఇది ముఖ్యమైంది. ఇప్పటికి కూడా ఎక్కడికైనా వెళ్తే అదిగో వేయిస్తంభాల గుడి! అంటారు (నవ్వుతూ). సమ్మక్క సారక్కల గురించి రాశాను. కాకతీయుల మీద మరో రెండు నవలలు రాశాను. ‘తంజావూరు విజయం’ పేరుతో రఘునాథ నాయకుని గురించి రాశాను. అది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా పెట్టడంతో 3 లక్షల కాపీలు అచ్చువేశారు.  అన్నమాచార్య ట్రస్ట్ వారు ‘శాండిల్య’ అనే పేరుతో ఒక సంస్థ పెట్టారు. వాళ్ళు అన్నమయ్య జీవితం మీద ఒక నవల రాసి ఇవ్వమంటే ‘శ్రీపదార్చన’ పేరుతో రాశాను. దాన్ని లక్ష కాపీలు వేశారు. ఇవన్నీ ఏ విధంగా చూసినా తెలుగు సాహిత్యంలో గొప్ప రికార్డు సృష్టించగలిగాను. దానికి స్వయంకృషితో పాటు ఈశ్వరానుగ్రహం కూడా ఉంది. ఇప్పటికి నేను 152 పుస్తకాలు రాశాను.

7 ప్ర:- చాలా గొప్ప విషయం సార్. మరి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారిది కూడా మీ ఊరే అని విన్నాం. ఆయనతో మీకున్న అనుబంధం ఎటువంటిది?

జ:-    నేను చారిత్రక నవలలతో పాటు సాంఘిక నవలలు కూడా ఎన్నో రాశాను. ‘వంశధార’ అని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నవల రాశాను. ఇది రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ పుస్తకానికి కొనసాగింపుగా ఉంటుంది. మా ఇద్దరికీ ఎంతో సాన్నిహిత్యం ఉండేది. మా ఊళ్ళో వాళ్ళ ఇల్లు తూర్పు బజారున ఉంటే మాది పడమట బజారున ఉండేది. అంత చిన్న కుగ్రామం నుండి ఆయన, నేను, మరికొంతమంది ప్రముఖ రచయితలు రావడం విశేషం. ఇంకో అంశం ఏమిటంటే నేను కృష్ణాపత్రికలో పనిచేస్తున్నప్పుడు ఆయన మాకు గొప్ప Contributor. ఆయన అప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయనకు మా నాన్న వయసు ఉండేది. నన్ను శివుడూ! అని సంబోధించేవారు. “శివుడూ! నా నవల కొంచెం మీరు సీరియల్ గా వేస్తే నాకు కొంతలాభం ఉంటుంది”  అన్నారు. నేను ‘పాకుడురాళ్లు’ నవలను సీరియలైజ్ చేశాను. ఆ నవలకే ఆయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఏడాదిన్నర పాటు పత్రికలో వరుసగా వేశాను. వారానికి ఆరు రూపాయలు ఇచ్చేవాళ్ళం (ఇది 1960 నాటి మాట). ఒక్కో నెలలో 5 వారాలు వచ్చేవి. ఆయనకు  మొత్తం 30 రూపాయలు ఇస్తే పరమానంద భరితులయ్యేవారు. అప్పట్లో అది పెద్దమొత్తమనే చెప్పొచ్చు. విశ్వనాథ వారి ఆరునదులు, బాణావతి, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు, దమయంతి స్వయంవరం ఇవన్నీ నేను సంపాదకవర్గంలో ఉన్నప్పుడే వేశాను. విశ్వనాథ వారి ఒక్కో నవలకు రెండువేల రూపాయలు ఇచ్చాము.

8 ప్ర:- మీరు రాసిన ప్రభాతగీతం, ప్రతిభ వంటి సాంఘిక నవలలు గురించి చెప్పండి.

జ:-    గ్లోబలైజేషన్, పారిశ్రామికీకరణ, అధిక జనాభా, గ్రామీణ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం లాంటి వాటివల్ల భారతీయ కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్నది. దీని గురించి, భారతీయ వ్యవస్థపై దాడులను గురించి ప్రభాతగీతంలో చెప్పాను. 1916 నుండి 2016 వరకు గల వందేళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రగా దీన్ని చెప్పొచ్చు. ఇక ప్రతిభ నవల ఒక కళాకారిణి జీవితం గురించి చెప్పినది. సమాజంలో కళను నమ్ముకొని బ్రతికేవారి వాస్తవ జీవితాన్ని వివరించాను. కేవలం కళ కోసం జీవితం అంకితం చేసిన వారికి వృత్తి, వ్యక్తిగత జీవితం ఒక్కటే ఉంటాయి. 1983 లో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా వెలువడిన మరోనవల ‘అమృతసరోవరం’. అది అనేకమంది పాఠకులను ఆకర్షించింది.

9 ప్ర:-  “నన్నయ్యభట్టు మళ్లీ పుట్టాడు” అనే పేరుతో రాసిన నవలలో చర్చించిన విషయాలేవి?

జ:-    అది సెటైరికల్ గా రాసినది. వెయ్యేళ్ళ క్రితం నాటి నన్నయ్య మళ్లీ రాజమండ్రిలో పుడితే వర్తమాన భాషా సాహిత్య సాంస్కృతిక పరిస్థితులకు ఎట్లా స్పందిస్తాడని ఊహించి రాసింది. ఇందులో దివి నుండి భువికి దిగి వచ్చిన నన్నయ్య, సూత్రధారుడైన నాంచారయ్య ఈ రెండు ప్రధాన పాత్రలుగా ఈ నవల రాశాను.

10 ప్ర:-  సనాతన హిందూ ధర్మ ప్రచారకులైన మీరు క్రైస్తవాష్టకం’ పేరుతో ఎనిమిది పుస్తకాలు రాయడానికి కారణం ఏమిటి?

జ:-    నేను చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా పెరిగాను. అందువల్ల హిందూత్వ ఇన్ ఫ్లూయెన్స్ నా మీద బలంగా ఉంది. అయితే కరోనా కాలంలో బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతంలో క్రిస్టియానిటీ ఎక్కువగా పెరిగిపోయింది. ఉదాహరణకు 1947 ప్రాంతంలో కోనసీమ వేదాలకు పుట్టినిల్లు. అక్కడ 0.5% క్రిస్టియానిటీ ఉండేది. 2020 నాటికి అది 22 శాతానికి పెరిగింది. గ్రామాలకు గ్రామాలను కన్వర్షన్ చేయించారు. అప్పుడు నేను బైబిల్ తెప్పించాను. అందులో అసలు ఉన్నదేంటి? అని ఒక పాస్టర్ అధ్యయనం చేసినట్లు చేశాను. అంతా చదివి ఇందులో ఏమీ లేదని, ఇదంతా అబద్ధమని, అసలు క్రీస్తు లేడని నిరూపించాను. దాన్ని ప్రూవ్ చేసిన పరంపరలో 8 పుస్తకాలు రాశాను. వాటినే క్రైస్తవాష్టకం అంటారు. ఈ కల్పన బాగుంది, దొంగలున్నారు జాగ్రత్త, సత్యమేవజయతే పార్ట్ 1, పార్ట్ 2, ఏసు చారిత్రక పురుషుడా?, బైబిల్ డీ కోడ్, గంగ నుండి గంగ వరకు ఇట్లాంటివి. అవి ఎంత సంచలనం సృష్టించాయంటే హిందువుల కన్నా వాటిని క్రైస్తవులే ఎక్కువగా చదివారు. ఈ విధంగా నేను చేసిన ప్రయత్నాలు ఎంతో సక్సెస్ ని సాధించాయి. యూట్యూబ్ లో కూడా వీటికి సంబంధించి, హిందూ ధర్మాన్ని గురించి నావి ఎన్నో వీడియోలు ఉన్నాయి.

ముదిగొండ శివప్రసాద్ గారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

తప్పు చేసినవాడు చేసినప్పటికీ దాన్ని చూస్తూ విజ్ఞులు తప్పు అని చెప్పకపోవడం తప్పు. We are intellectuals, is it not our basic duty to preserve, protect and propagate? సమాజంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. నాకెందుకన్న అలసత్వం పెరిగిపోయింది. ఒక గమ్మత్తు చెబుతాను. ఎవడో అంటాడు “వీరశివాజి పక్కింట్లో పుట్టాలి, పప్పన్నం తినాలి మా ఇంట్లో చిన్నారి” ( నవ్వుతూ) అంటే శివాజీ మనింట్లో పుట్టక్కరలేదా? అంటే ఎవడో వస్తాడు. ఏదో చేస్తాడు. నాకు సంబంధం లేదు. ఇది పోవాలి. ఒకప్పుడు సమాజానికి ‘ధర్మం’ కేంద్రబిందువుగా ఉండేది. ఇప్పుడు ‘అర్థం’ కేంద్రబిందువయింది. జీవితానికి సుఖమనేది శరీరధర్మం. శాంతి మనోధర్మం. కానీ ఇప్పుడు శరీరం సుఖంగా లేదు మనసు శాంతిగా లేదు. దీనికి సమాజంలో బాధ్యత గల ఆర్ష ధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజాన్ని చైతన్యం చేయాలి. ప్రతీ వ్యక్తికీ ఒక విద్యుక్త ధర్మం ఉంది. అది నిర్వర్తించకపోతే అధర్మం చేస్తున్నట్లు. అది చూస్తున్న మనం తప్పు చేస్తున్నాం. అందువల్ల మన వయసుతో నిమిత్తం లేకుండా మనం నిరంతరంగా, చిరంతనంగా, సనాతనంగా, పురాతనంగా, దివ్యంగా, భవ్యంగా సమాజాన్ని జాగృతం చేస్తూనే ఉండాలి. ఇది అందరి కర్తవ్యం.

11 ప్ర:- ‘ఋగ్వేదభాష్యం’లో మీరు ఏ విషయాలను విశదీకరించారు?

జ:-   నేను వేదాలలో మొదటిదైన ఋగ్వేదం మీద బాగా పరిశోధన చేశాను. ఋగ్వేదం కోడ్ లాంగ్వేజ్ లో ఉంటుందమ్మా! మనకు అర్థం కాకపోవడానికి అదొక కారణం. వేద పండితులు మంత్రాలను చదువుతారు కానీ వాటికి అర్థాలను చెప్పరు. చాలామందికి తెలియదు కూడా. దాన్ని డీకోడ్ చేయడం అంత సులభం కాదు. ‘విద్యారణ్యం’ అని విద్యారణ్య స్వామి రాసిన పుస్తకం ఒకటుంది. దాన్ని బేస్ గా చేసుకొని చెప్తారు. ఎంతోమంది డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు చేయకపోలేదు. అట్లా ప్రయత్నాలు చేసిన వారిలో ఒకరు అరవిందఘోష్. 1916లో ‘ఆర్య’ అని ఆయన మాసపత్రిక ఒకటుండేది. దాంట్లో ఆయన ఈ మంత్రాలను డీకోడ్ చేసి సీరియలైజ్ చేశారు. అది ‘మిస్టిక్ ఫైర్’ అనే పుస్తకంగా వచ్చింది. నేను ‘ఋగ్వేదభాష్యం’ అనే పుస్తకం రాశాను. అది ఎక్కువ పాపులర్ కాలేదు. అందులో ఋగ్వేదంలో ఉన్న మంత్రాలకు అర్థం చెప్పడానికి ప్రయత్నించాను. ఇది వేదానికి సంబంధించి నేను చేసిన కృషిలో ఒక భాగం.

12. ‘జ్యోతిర్విమర్శ’లో మీరు ప్రతిపాదించిన కొత్త సూత్రాలు ఏవి?

జ:-   నేను ఋగ్వేదంలో ఉన్న జ్యోతిష్యం గురించి చెప్పాను. ఋగ్వేదంలో చాలా రహస్యాలున్నాయి. అందులో ఉదాహరణకు… “చత్వారి శృంగా త్రయో అస్య పద ద్వే శీర్షే సప్త హస్తసో అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహో దేవో మర్త్యామ్ ఆ వివేశ” దీనికి వ్యాకరణ శాస్త్రపరంగా అందరూ అర్థం చెప్పుకుంటూ వచ్చారు. నాకిందులో గాయత్రీ మంత్ర రహస్యం స్ఫురించింది. ఇట్లాంటి రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఇంకా పబ్లిష్ చేయలేదు. నాకు స్ఫురించినవి సరియైనవో కావో నిర్ధారించడానికి పండితులకు చూపించాలి. వాళ్ళచేత కూడా ఆమోదముద్ర వేయించుకోవాలి.

13ప్ర:- ఆర్యుల నుండి ఆధునికుల వరకు మీరు రాయని అంశం లేనట్లుగా వేల సంఖ్యలో వ్యాసాలు రాశారు. నికషోపలం, శిప్రవాక్యం, వ్యాస దర్శనం వంటి సంపుటాలను వెలువరించారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన మీ వ్యాస సంకలనాలు ఎన్ని?

జ:-     మీరు అన్నది వాస్తవమే. కొన్ని వేలసంఖ్యలో వ్యాసాలు రాశాను. అవన్నీ ఎక్కడికో పోకుండా ఇప్పటికి 25 వాల్యూమ్స్ వేశాను. ఇంకా పబ్లికేషన్ కు పది వాల్యూమ్స్ కు సరిపడా వ్యాసాలున్నాయి. వేయాలని తపన ఉంది. కానీ ఈరోజుల్లో పుస్తకం వేయడం వ్యయప్రయాసలతో కూడినది. పోనీ వేయకుండా ఉంటే ఎవరు పట్టించుకుంటారు? చేసిన కృషి వ్యర్థమవుతుంది కదా! ఒక పుస్తకం వేస్తే కనీసం 100 సంవత్సరాలు నిలిచివుంటుంది. ఇట్లా సాహిత్య, కళా రంగంలో నేను చేసిన కృషికి పూర్తి సంతృప్తి పొందాను. దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నాను. వాళ్లందరికీ మయూఖ పత్రిక ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నాకు 85 ఏళ్ళు. వయోధర్మాన్ని బట్టి కొంత చూపు తగ్గింది. అయినా రాయడం ఒక్కరోజు కూడా ఆపడం లేదు.

14ప్ర:-  తప్పకుండా సర్ , మా పత్రిక ద్వారా వారిపట్ల  మీ కృతజ్ఞతాభావాన్ని తెలియచేస్తాం. అలాగే మరోప్రశ్న సాహిత్యంలోనే కాకుండా కళారంగంలో కూడా అభినివేశం కలిగిన మీరు అనేక నాటకాలు ప్రదర్శించారని, దేశవిదేశాల్లో పర్యటించారని విన్నాం. వాటి గురించి చెబుతారా?

జ:-     ప్రాచీన సాహిత్యాన్ని ఆధునికులు చదవడం తగ్గిపోయింది. ఆనాటి పద్యాలు, కనీసం ప్రాచీన కవుల పేర్లు కూడా తెలియడం లేదని, ఆ దశలో సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లు కనీసం ఒక రెండుగంటల్లో ప్రాథమిక పరిచయం వాళ్లకు కలుగజేస్తే బాగుంటుందన్న ఆలోచన దివాకర్ల వేంకటావధాని గారికి వచ్చింది. దాంతో ఆయన ‘భువనవిజయం’ రూపకల్పన చేశారు. అల్లసాని పెద్దనగా దివాకర్ల వారు, మహామంత్రి తిమ్మరుసుగా నేను వేసేవాణ్ణి. ఆనాటి సుప్రసిద్ధులు ఆయా కవుల పాత్రలను పోషించేవారు. ఇది ఎంతో జనరంజకంగా ఉండడంతో ఒక్క కాశ్మీర్ తప్ప ఆంధ్రదేశమంతటా ప్రదర్శనలిచ్చాం. దివాకర్ల వారి తదనంతరం నేను ఒక టీం ను ఏర్పాటుచేసి అమెరికా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ ఇట్లా చాలా దేశాలకు వెళ్ళాం. పదకొండు వందల సార్లు నేనే భువనవిజయం వేశాను. ఏ రకంగా చూసినా ఇది పెద్ద రికార్డు. ఒకప్పుడు శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ తులాభారం, చింతామణి ఇలాంటి పౌరాణిక, చారిత్రక నాటకాలు వేల సార్లు ప్రదర్శించబడేవి. కానీ ఒక సాహిత్య రూపకం 11, 12 వందల సార్లు ప్రదర్శించబడడం గొప్ప విషయం. ఇందులో దాశరథి కృష్ణమాచార్యులు గారు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు, పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి సుప్రసిద్ధులు వేసేవారు. ఒక దశలో పివి. నరసింహారావు గారు శ్రీకృష్ణ దేవరాయల పాత్ర వేశారు. ఆ ప్రదర్శనలో నేను లేను. 1950-55 మధ్యకాలంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, జమ్మలమడుగు మాధవశర్మ గారు వీరు గుంటూరులో ‘భువనవిజయం’ వేశారట. నేను విన్నానే గానీ చూడలేదు. ఇట్లా భువనవిజయం చరిత్ర సృష్టించింది. మా టీంలో ముదిగొండ వీరభద్రమూర్తి గారు, ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు, తిరుమల శ్రీనివాసాచార్యులు గారు, కేశవపంతుల నరసింహ శాస్త్రిగారు ఇట్లాంటి మహానుభావులు ఉండేవాళ్ళు. ప్రసిద్ధ సంగీత విద్వాంసులు నూకల చిన సత్యనారాయణ గారి చేత శ్రీకృష్ణదేవరాయలు వేయించాము. జి.వి.సుబ్రహ్మణ్యం గారు తెనాలి రామకృష్ణుడుగా వేసేవారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి పట్టణాల్లోనూ చరిత్ర సృష్టించాము. దీనివల్ల సంతృప్తితో పాటు గొప్ప సేవ చేశామన్న ఆనందం లభించింది.

15 ప్ర:- ఒక రచయితగా మీరు గర్వించిన సందర్భాలను ఏవైనా ఒకటి రెండు మా పాఠకులకు చెప్పండి.

జ:-    ఆనాటి ప్రముఖులందరితో నాకు సాన్నిహిత్యం లభించడం నేను అదృష్టంగా భావిస్తాను. మొదటినుండీ హిందూధర్మం మీద అత్యంత గౌరవం ఉన్న నాకు దివాకర్ల వారు “తెలుగు భాష – దాని యొక్క గొప్పతనం, భారతీయ సంస్కృతి దాని వైశిష్ట్యం ఈ రెండూ లేకుండా నీ ఉపన్యాసాలు ఉండొద్దని, ఈ రెండింటి చుట్టూనే అన్ని విషయాలు ఉన్నాయ”ని  చెప్పిన విషయం ఎప్పుడూ మరువలేదు. ఇప్పటికీ ఆ సూచనను అనుసరించి నడుస్తున్నాను. దేశ విదేశాలన్నీ తిరిగి నేను దాదాపు 25 వేల ఉపన్యాసాలు ఇచ్చాను. హిందూ ధర్మ ప్రచారం కోసం షార్జా, సింగపూర్, జర్మనీ, బ్రిటన్ లోని స్కాట్లాండ్, ఐర్లాండ్ మొదలగు దేశాలు పర్యటించి వారికి అనుగుణంగా ఇంగ్లీషులో తెలుగులో ఉపన్యాసాలిచ్చాను. అయితే ఒక గొప్ప అనుభూతిని మిగిల్చిన విషయం మీకు చెప్పాలి. మాంచెస్టర్ చిన్న ఊరు. అన్నీ బట్టల మిల్లులే. బ్రిటిష్ కాలం నుండి ఇండియాకు వచ్చేవి. ఇప్పటికీ గ్లాస్కో, మాంచెస్టర్ అనే బట్టలన్నీ అక్కడివే. మనదేశం నుండి చాలామంది అక్కడ స్థిరపడ్డారు. అక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినపుడు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి “నమస్కారం సార్ ! మీ హీరోయిన్ ను పిలవమంటారా”? అంది. నాకర్థం కాలేదు. ఒక అమ్మాయిని పిలిచి తన కూతురని, ఆ అమ్మాయి పేరు శ్రీలేఖ అని చెప్పింది. ఆవిడది గుడివాడ. భర్త ఇక్కడ పనిచేస్తున్నాడు. డెలివరీకి గుడివాడ వచ్చినప్పుడు నా ‘శ్రీలేఖ’ నవల చదివి అమ్మాయి పుడితే శ్రీలేఖ అని, అబ్బాయి పుడితే ఆ నవల కథానాయకుడు విజయదత్తు అని పెట్టుకోవాలనుకున్నదట. ఎక్కడి గుడివాడ? ఎక్కడి మాంచెస్టర్? ఒక రచయితకు అంతకన్నా గర్వకారణం ఏముంటుంది? అట్లాగే నేను ‘శ్రావణి’ అనే ఒక నవల రాశాను. అది ఆంధ్రభూమి పత్రికలో ధారావాహికగా వచ్చింది. అందులో కథ ఒక డైమండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ లో కొన్ని జ్యువెలరీ షాపుల వాళ్ళు పాతపేరు కొట్టేసి శ్రావణి జ్యువెలర్స్ అని పెట్టుకున్నారు. నేను అందులో శనిదోష నివారణ కోసం కొన్ని శనేశ్వరునికి సంబంధించిన మంత్రాలు పెట్టాను. ఆ డైమండ్ ఇంద్రనీలమణికి చెందినది. దాన్ని SAPPHIRE అంటారు. ఆ పత్రిక వాళ్ళు “శ్రావణి సీరియల్ వస్తున్నది. ఈ సంచికను ఒక్కసారి చేత్తో తాకండి. మీకు అన్ని అదృష్టాలు కలిసివస్తాయి” అని ప్రచారం చేశారు. దాంతో “ఆ సంచికను తాకితే సాయంత్రం వరకు అదృష్టం కలిసి వచ్చిందని ఉత్తరాలు రాసిన వాళ్ళూ ఉన్నారు (నవ్వుతూ). ఇట్లాంటివి నాకు ఎంతో సంతోషాన్ని అనుభూతిని మిగిల్చాయి.

16 ప్ర:- మీ జీవితంలో మీరు పొందిన ముఖ్యమైన గౌరవ పురస్కారాలు ఏవి?

జ:    నా రచనా వ్యాసంగంలో నాదైన శైలిలోఎక్కడా నేను కాంప్రమైజ్ కాలేదు. ఐడియలాజికల్ గా హిందూ ధర్మ సిద్ధాంతాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. పోరాటం సాగిస్తూనే వచ్చాను. దిగంబర కవులతోను, మార్క్సిస్టు కవులతోను సాహిత్య యుద్ధాలు జరిగాయి. ఇవన్నీ సిద్ధాంతపరంగా తప్పితే వ్యక్తిగతంగా కావు. ఇందులో సహకరించిన వాళ్ళు, విభేదించిన వాళ్ళూ ఉన్నారు. అయినా రచనా వ్యాసంగంలో నాకు చాలా సంతృప్తి ఉంది. నాకు కుర్తాళం పీఠాధిపతి వారు కనకాభిషేకం చేశారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు సువర్ణ గండ పెండేరం తొడిగారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వర్ణ కంకణం తొడిగారు. వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేదు. ఎన్టీరామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ‘శ్రీపదార్చన’ రచనకు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ‘ది బెస్ట్ నావెల్’ అవార్డు తీసుకున్నాను. రాజశేఖర్ రెడ్డిగారు, చెన్నారెడ్డి గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, జలగం వెంగళరావుగారు ఇట్లా అనేక దాదాపు తెలుగు ముఖ్యమంత్రులందరి చేత వివిధ సందర్భాలలో అవార్డులు అందుకున్నాను. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేయడం గొప్పగా భావిస్తాను. నా దగ్గర చదువుకున్న చాలామంది ఉన్నతదశలో ఉన్నారు. వెలుదండ నిత్యానందరావు, సూర్యా ధనుంజయ్ వీళ్ళు వైస్ ఛాన్స్ లర్స్ అయ్యారు. అధికార భాషా సంఘ అధ్యక్షులుగా ఉన్నవారు, విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారూ ఉన్నారు. కడియం శ్రీహరి ఒకసారి కలిసినప్పుడు నా స్టూడెంట్ అని చెప్పడం ఆనందాన్నిచ్చింది. ఇవన్నీ నాకు గౌరవాలే.   సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెబుతాను. నేను ఈ మధ్య పురస్కారాల గురించి ఒక ఆర్టికల్ రాశాను. ఢిల్లీకి వెళ్లి పురస్కారాలు కొంటున్నారమ్మా! దీని ద్వారా ఆ వ్యక్తులు ప్రతిపాదిస్తున్నటువంటి, వ్యక్తీకరిస్తున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దానికి పురస్కారం లభించడం ద్వారా దానికి మాన్యత కలిగించినట్టవుతున్నది. నేను వీరసావర్కర్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, స్వామి రామనంద తీర్థ వీళ్లకు భారతరత్న ఎందుకు రాలేదని అడిగాను. పివి నరసింహారావు గారికి కూడా చాలాకాలం తర్వాత వచ్చింది. కొంతమంది సాహిత్య అకాడెమీని కొన్నారమ్మా! మీ  మయూఖ పత్రిక ద్వారా ఈ విషయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. ఎంత కాలం దుర్మార్గాన్ని సహిస్తాం? సాహిత్యాన్ని గొప్పగా సృష్టించినవారికి ఇవ్వండి. మీ పత్రిక ద్వారా ఓపెన్ గా చెబుతున్నా. అందరికీ తెలియజేయండి. వీరసావర్కర్ కు, సుభాష్ చంద్రబోస్ కు భారతరత్న వచ్చేవరకు మేము ఆందోళన చేస్తూనే ఉంటాం. భారతచరిత్రలో ఈ ఇద్దరి పేర్ల తర్వాతనే మూడవపేరు చెప్పండి ఒప్పుకుంటాం. What are the priorities? Why you have neglected Subhash chandra bose and Swathantra Veera savarkar?  ఇవ్వాల్సిన సరియైన వారికి ఇవ్వండని అంటున్నాం. నిరంతర సాహితీ కృషి చేసిన వాళ్ళని వదిలిపెట్టి డబ్బుకు పురస్కారాలు ఇవ్వడం ఏమిటి?

17 ప్ర:-  అట్లాగే సర్. మా పత్రిక ద్వారా మీ ప్రతిపాదనను వెల్లడిచేస్తాం. ఇకపోతే చారిత్రక నవలలు సమకాలీన వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయంటారు?

జ:-    గతం కాదోయి నాస్తి, అది అనుభవాల ఆస్తి. గతం లేకపోతే వర్తమానం లేదు. ఇది లేకపోతే భవిష్యత్తు లేదు. అందువల్ల చారిత్రక నవలలు సమకాలీన వ్యవస్థపై తప్పనిసరిగా ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటివారికి ఆనాటి చరిత్ర గానీ, కనీసం ఆ పేర్లు గానీ తెలియవు. నేను ఇటీవల ముసునూరి నాయకుల మీద ‘అమృతోదయం’ వారి చరిత్రను ప్రామాణికంగా రాశాను. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది కదా! కాకతీయుల రాజ్యం ప్రతాపరుద్రుని అనంతరం పతనమయిన తర్వాత ముసులూరి నాయకులు వచ్చారు. దాదాపు 50 సంవత్సరాలు వాళ్ళు ముస్లింల నుండి మన ఆంధ్ర రాజ్యాన్ని కాపాడారు. ఆ చరిత్ర అంతా రాశాను. ఇలాంటివి తెలుసుకుంటేనే కదా మన అస్తిత్వం తెలిసేది. ఆ పరంపరను విస్మరించి నేనేదో స్వయంభూగా వచ్చానని అనుకుంటే ఎట్లా?  ఆనాటి చరిత్ర నుండి నేర్చుకున్న పాఠాలే మనకు దారి చూపుతాయి. అది మరువరాదు.

18 ప్ర:- ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల పట్ల మీ అభిప్రాయం, సూచన ఏమిటి?

జ:-    సమాజంలో పరిణామం సహజం. ఇది నిర్ద్వంద్వంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికపరంగా పరిణామం జరుగుతూనే ఉంటుంది. అలాగని ప్రతీదాన్ని అనుసరిస్తూ పోవడం కాదు. మన కర్తవ్యాన్ని పరిస్థితులకనుగుణంగా మనం నిర్వర్తించాలి. భారతంలో ఒక పద్యం ఉంది. శ్రీకృష్ణుడు పాండవ రాయబారిగా వెళ్ళినప్పుడు కౌరవసభలో…
“సారపు ధర్మమున్ విమల సత్యము బాపము చేత
బొంకుచే బారము బొందలేక చెడబారినదైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష సేసిరది వారల చేటగు గాని ధర్మ ని
స్తారక మయ్యు సత్య శుభ దాయకమయ్యును దైవముండెడున్” అని చెప్తాడు.
అంటే తప్పు చేసినవాడు చేసినప్పటికీ దాన్ని చూస్తూ విజ్ఞులు తప్పు అని చెప్పకపోవడం తప్పు. We are intellectuals, is it not our basic duty to preserve, protect and propagate? సమాజంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. నాకెందుకన్న అలసత్వం పెరిగిపోయింది. ఒక గమ్మత్తు చెబుతాను. ఎవడో అంటాడు “వీరశివాజి పక్కింట్లో పుట్టాలి, పప్పన్నం తినాలి మా ఇంట్లో చిన్నారి” ( నవ్వుతూ) అంటే శివాజీ మనింట్లో పుట్టక్కరలేదా? అంటే ఎవడో వస్తాడు. ఏదో చేస్తాడు. నాకు సంబంధం లేదు. ఇది పోవాలి. ఒకప్పుడు సమాజానికి ‘ధర్మం’ కేంద్రబిందువుగా ఉండేది. ఇప్పుడు ‘అర్థం’ కేంద్రబిందువయింది. జీవితానికి సుఖమనేది శరీరధర్మం. శాంతి మనోధర్మం. కానీ ఇప్పుడు శరీరం సుఖంగా లేదు మనసు శాంతిగా లేదు. దీనికి సమాజంలో బాధ్యత గల ఆర్ష ధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజాన్ని చైతన్యం చేయాలి. ప్రతీ వ్యక్తికీ ఒక విద్యుక్త ధర్మం ఉంది. అది నిర్వర్తించకపోతే అధర్మం చేస్తున్నట్లు. అది చూస్తున్న మనం తప్పు చేస్తున్నాం. అందువల్ల మన వయసుతో నిమిత్తం లేకుండా మనం నిరంతరంగా, చిరంతనంగా, సనాతనంగా, పురాతనంగా, దివ్యంగా, భవ్యంగా సమాజాన్ని జాగృతం చేస్తూనే ఉండాలి. ఇది అందరి కర్తవ్యం.

ధన్యవాదాలు సార్🙏🏼 మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం కేటాయించి మీ జీవిత విశేషాలను తెలియజేసినందుకు మా తరఫున, మా పాఠకుల తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు.

March 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఎప్పటిలెక్కనే..

by Chandu Pendyala March 30, 2025
written by Chandu Pendyala

ఎడ్లబండ్లు ఎనుకకు పట్టినయి
గా సందుల ఏడికెల్లో ఓ పెద్ద కోపు పట్టుకొని ఇమానం ల కెల్లి
ఓ యాబయి మంది దాక దిగిండ్రు. అందరు లైనుబడ నిల్సోని సప్పట్లు కొట్టుకుంట,
శిన్న పొల్లగాల్లను ముద్దు పెట్టుకున్నట్లు ఆ కోపుకు ముద్దు పెట్టుకొని
ఆల్లను కార్లల్ల ఎక్కిచ్చి ఇండ్లల్లకు సాగనంపిర్రు.

తెల్లారి నాలుగు తొవ్వల్ల వున్న శాయ బండికాడికి పోయి పొద్దుగాల పిండిన
అద్దషేరు బర్రెపాలు పోసి పైసలడిగితె కాసేపు ఆగమని కసిరిచ్చుకున్నడు .
అయ్యో గట్ల గంజిలీగను తీసేసినట్లు తీసేత్తానవేందన్నా అని అంటే …..
రేపటి సంది పాలు బంజేయి పక్కన పెద్ద మార్కెటు పడ్డది

వాల్లు నెలకోసారి పైసలియ్యమంటాండ్రు నువ్వేమో ఆగవు ,
దినాం వచ్చి కూకుంటవు అనె!
ఇంతల ఆడ అందరు మబ్బుల మొకాన సూస్తాండ్రు

ఆయనడిగె ….
ఏమన్నా తప్పుడు ఆనలు గిన పడతానయా గింతంత జివాల్లకు
తోపులల్ల నీల్లన్న వస్తయి అని !
ఏ ఊకో ఆనలు లేవు పాడు లేవు పైన మబ్బులల్ల కెల్లి కిందికి ఎవరో వస్తాన్నరట
గందుకోసం చూస్తానం నువు కూడ చూడు అనిరి! .

ఇగ ఆయన రోజు గొడ్లు గాసుకుంట , శేనుకు నీల్లు పెట్టుకుంట
పైన సప్పుడు గాంగనె మబ్బులల్ల జూత్తె ఇమానాలు కనబడుతనే వుండె ,
ఇంట్ల TV డబ్బాలల్ల గవే ముచ్చట్లాయె …
ఇప్పుడు రిచ్చాలేడున్నయి ?అన్ని అంతరిచ్చాలేనాయె !
ఇగ కొత్తగ ఇనుడేంది సూసుడేంది.?

రైలుబండ్ల సప్పుడు ముంగట ఎడ్లబండ్ల సప్పుడు ఎట్లయినా ఇనిపియ్యదు
అది ఎరుకున్న ముచ్చటేనాయె అని శెద్దరు కోసం ఎనుకులాడిండు కూర్పాట్ల పడుదామని….
కాని ఎంతకు నిర్ద పట్టి సత్తలేదట , ఇగెట్లయినా ఇయాల గాకపోతె రేపు ఎవుసం బూములు ,
ఇంటి పక్కపంట పెరట్ల జాగలన్ని ఇమానాలు దిగేటానికి , రైలు టేషన్ లకు ఇచ్చి

ఇగ పరాగతుగ నడింట్ల మోకాల్లు మలుసుకుని కూసునుడేనాయె !
తలపులల్ల దుక్కం ఎవరు కనిపెడ్తరు
కండ్లు కాయలుగాసే మనుసులేడున్నయ్ !

ఎట్లయినా పొల్లగాల్లు అందరు ఏరే దేశాల పట్క పోతనే వున్నరు,
ఈడున్న పొల్లగాల్లేమొ ఏడ వింటర్నేషనల్ బడులున్నయాని…
ఎండ్ల వాల్ల పిల్లల్ని షరీకు చెయ్యాల్నని
ఇశారించేదానికే వున్న టయామ్ అంత అయిపోతాండె !
కాలం గుప్పిటవట్టిన కొండచిలువంటి కోరికలేనాయె!
ఇగ పంటలు లేవు , పెంటలు లేవు
ఇండ్లల్ల గ్యాసు మంటలు , ఇంటి పక్కపంట గుళ్ళల్ల గంటలు…

అయినా ఇగ ఆల్ల ఇంటిపొంటనే ఇమానాలు దిగినాక మబ్బుల మొకాన జూసుడెందుకు ?
ఇగ ఎనుకట శిన్నప్పుడు జాతరలల్ల ఇమానం బొమ్మలు ,
ఎలికాప్టర్లు కొనుక్కొని ఆడుకున్నట్లేనాయె…
గుండె పండు పండిపోతాంటె
గల్మట్ల కూసోని మంచికోసం ఎదురుసూసుడేనాయె…

March 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 26, 2025
written by Narendra Sandineni

వాసి జ్యోత్స్న రచించిన నువ్వూ – నేను కవిత

కవయిత్రి,వాసి జ్యోత్స్న కలం నుండి జాలువారిన నువ్వూ – నేను కవిత పై విశ్లేషణా వ్యాసం.ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు నువ్వు – నేను అనే మాటలు సంభాషణలో తరచుగా వాడుతారు. వ్యక్తిగతంగా తన గురించి చెప్పడానికి నేను అనే పదాన్ని ఉపయోగిస్తారు.నువ్వు మరియు నేను,ఇది సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని సూచిస్తుంది.అత్యంత ఆత్మీయులు కలిసినప్పుడు ఎలా పలకరిస్తారో చూడండి.నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను?నువ్వు చెప్పు నేను వినాలని ఉంది.ఇది ఒకరికొకరు పలకరించుకునే విధానాన్ని తెలుపుతుంది.కవయిత్రి జ్యోత్స్న రాసిన నువ్వూ – నేను కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతుల లోకంలోకి వెళ్లి విహరించండి.
“నీ దగ్గరున్నంతవరకే/ఏ విషయమైనా రహస్యం/అంటున్నారు.గుప్పిట దాచి ఉంచినది రహస్యం.ఎవరికి తెలియకుండా గుప్తంగా ఉంచిన విషయం రహస్యం.ఒకరి విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా ఉండటం రహస్యం.ఎవరికీ తెలియని విషయం రహస్యం.నువ్వు – నేను ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గల సంబంధాన్ని సూచిస్తుంది.ఒకరు చెప్పిన విషయం మరొకరు గోప్యంగా ఉంచితేనే అది రహస్యంగా ఉంటుంది.
“నీ పెదవి దాటి మరో/చెవిన చేరిన తక్షణం/ప్రతి పదం హాస్యమే../అంటున్నారు.ఈ కవితా పంక్తులలో
ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి. ఒకరి పెదవి దాటి మరొకరి చెవికి వెళ్లిన వెంటనే రహస్యం రట్టు అవుతుంది.అసలు రహస్యం యొక్క గౌరవం,విలువ తగ్గిపోతుంది.ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాల్సిన విషయం బయటపడితే అది హాస్యాస్పదంగా మారిపోతుంది అనే భావన కవితలో వ్యక్తం అవుతున్నది.రహస్యం విషయం యొక్క గోప్యతను నొక్కి చెబుతుంది.మనం ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి.అట్టి విషయం వారు ఇంకొకరికి చెబితే ఆ రహస్యానికి విలువ ఉండదు.మన ఇద్దరి మధ్యన ఉండాల్సిన రహస్యం.దానిని ఇతరులు సాధారణ విషయంగా తీసుకుంటారు.ఈ కవిత రహస్యాన్ని ఇతరులకు తెలియకుండా కాపాడాలనే సందేశాన్ని ఇస్తుంది.
“నీ.. నా .. జీవితాలలో/ప్రతి క్షణం విలువైనది/ వలువల్లా చీల్చుకు తినే/బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/ అంటున్నారు.నీ జీవితం,నా జీవితం మరియు ఎవరి జీవితం అయినప్పటికీ ప్రతి క్షణం విలువైనది.మన జీవితాల్లో ప్రతి క్షణం అమూల్యమైనది.గడిచి పోయిన సమయం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు.కాబట్టి సమయం విలువను గుర్తించాలి. సమాజంలో లేదా వ్యక్తిగత జీవితంలో మనుషులు ఉత్తమమైన విలువలను కోల్పోతున్నారు. ఆత్మీయత, నమ్మకం,నైతికత వంటి విలువలు తగ్గిపోయాయి.పైకి కనిపించే మాయాజాలం వల్ల మనుషులు వలపుల ఆకర్షణలకులోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
“బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/మన గుండె భావోద్వేగాలకు స్పందించాలి.కానీ,ఇప్పుడు సున్నితంగా ఉండాల్సిన గుండె కఠినంగా బండరాయిలా మారిపోయింది. మనిషి తాను అనుభవించే బాధలు,గాయాలు తట్టుకోలేకపోతున్నాడు.జీవిత పోరాటాల వల్ల మనిషి మనసు కఠినంగా మారింది.ఇవ్వాళ మనిషి బ్రతుకు ఒక విధమైన భారంగా మారింది.మనిషి జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని కవిత ఎత్తి చూపుతుంది.విలువలు కోల్పోయిన సమాజంలో జీవిస్తున్నాం.మనుషులు బాహ్య ఆకర్షణల వలలో చిక్కినారు.మనుషులు నిజమైన అనుబంధాలను మర్చిపోయారు.సున్నితంగా ఉండాల్సిన మనిషి హృదయం బండరాయిలా మారిపోయింది.మనిషి లోపల తీవ్రమైన ఒత్తిడి,శూన్యతను ప్రతిబింబిస్తుంది.ఇందులోని భావం సమకాలీన జీవన శైలికి అద్దం పడుతుంది.మనిషి హృదయం బండబారిపోయినప్పటికీ తాను బ్రతకడానికి ప్రయత్నిస్తూ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
“నువ్వూ – నేను నవ్వుకుంటూ/నమ్మకంగా సాగిపోవాలే తప్ప/నువ్వెంతంటే నేనెంతని/నిత్యం ఘర్షణలతో ప్రాముఖ్యమైన/సమయాన్ని సామర్థ్యాన్ని/వృథా చేసుకోకూడదు/అంటున్నారు. నువ్వు నేను నవ్వుకుంటూ నమ్మకంగా సాగిపోవాలి. మన మధ్య స్నేహం,ప్రేమ,అనుబంధం కొనసాగాలి. మనం ఒకరి పట్ల ఒకరు నమ్మకంతోనే ఉండాలి. ఆత్మీయతతో మెలగాలి.ఆనందంగా ఉండాలి.మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా అవి మన బంధాన్ని ప్రభావితం చేయకూడదు.మనం ఇద్దరం నువ్వెంతంటే నువ్వెంతని నిత్యం ఘర్షణలకు తావు ఇవ్వరాదు.గర్వం వల్ల వచ్చే సమస్యలను గురించి చెబుతుంది.అహంకారం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.నువ్వు గొప్ప,నేను గొప్ప అనే భావనతో మెలగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన జీవితంలో సమయం అమూల్యమైనది.మన సామర్థ్యాన్ని,శక్తిని అనవసరమైన గొడవలకు వినియోగించ రాదు.అందు వల్ల మన విలువైన సమయం వృథా అవుతుంది.మనం ఇరువురం పరస్పరం అర్థం చేసుకుని కలిసి మెలిసి పురోగమించాలి.మనలో నెలకొన్న అనవసరమైన అహంభావాన్ని వదిలి పెట్టాలి.ఇరువురు నమ్మకంతో కలిసిమెలిసి అన్యోన్యతలతో జీవించాలని సూచిస్తుంది.మనలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే పోటీ తత్వం వద్దు.మన ఇద్దరం గర్వాన్ని విడిచి పెట్టాలి.మన ఇద్దరం గర్వంతో ఉంటే కీడు సంభవిస్తుంది.గర్వం వల్ల మేలు జరగదు.మన జీవితంలో విలువైన సమయాన్ని అప్రయోజనమైన విభేదాలతో,వివాదాలతో వృథా చేసుకోకూడదు. మనం ఒకరినొకరం అర్థం చేసుకొని కలిసి మెలిసి ఉండాలి.మనం నవ్వుతూ ఆనందంగా ముందుకు సాగాలి అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.
“వికృత చేష్టలతో/ప్రకృతి ప్రకోపించేలా/ఆకృత్యాలకు పాల్పడుతూ/అనునిత్యం నలిగిపోతూ/ఆవేదనలతో కుంగిపోతూ/మానవత్వాన్ని మింగేయొద్దు/ అంటున్నారు.వికృత చేష్టలు అంటే మనిషి చేస్తున్న అనైతిక పనులు,హింస మరియు పర్యావరణాన్ని హానికరంగా మార్చే చర్యలు.మనుషుల తప్పిదాల వల్ల ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. భూకంపాలు,వరదలు,వాతావరణ మార్పులు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మనుషులు చేస్తున్న ఆకృత్యాలకు అందరు అనునిత్యం నలిగిపోతున్నారు.మనుషులు దుష్టమైన పనులు చేసి ఇతరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.మనుషులు తప్పు దోవలో నడిచి తోటి వారిని ఆవేదనలకు గురి చేస్తున్నారు.మనిషి మనస్సు నిరాశగా మారి పోయింది.మానవులు సృష్టించిన దుష్ప్రభావాల వల్ల చివరికి మనమే బాధపడుతున్నాం.ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మానవత్వాన్ని మర్చిపోవద్దు.ప్రేమ, సహాయము,నైతికత వంటి విలువలను కోల్పోకూడదు.మనలో మానవత్వం వెల్లి విరియాలి.స్వార్థపూరితుడై మనిషి మనిషిని మింగి వేయకూడదు.సమాజంలోని అనైతికతను, ప్రకృతి వినాశనాన్ని మరియు మానవ సంబంధాల్లో పెరుగుతున్న అసహనాన్ని,అశాంతిని కవిత ఎత్తిచూపుతుంది.మనలోని అహంకారం, స్వార్థపూరిత వికృత చర్యలు చివరికి మనకే నష్టం తెచ్చిపెడతాయి.కాబట్టి మానవత్వానికి పెద్ద పీట వేసి సమాజానికి మేలు చేసే విధంగా నడుచుకోవాలి అని కవయిత్రి జ్యోత్స్న ఈ కవితలో సందేశాన్ని అందిస్తున్నారు.కవయిత్రి జ్యోత్స్న మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 26, 2025
written by Narendra Sandineni

డాక్టర్ బి.దామోదర్ రావు రచించిన నా కవిత సమత కవిత.

ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకుడు, డాక్టర్ బి. దామోదర్ రావు కలం నుండి జాలువారిన నా కవిత సమత పై విశ్లేషణా వ్యాసం.
“నా కవిత నందనవనంలో సుందర ప్రతిమ కాదు/ అంటున్నారు.నందనవనం అనగా పూలతో అలరారుతూ ఆనందాన్ని పంచే వనం.నందనవనం పిల్లలు ఆడుకునే అందమైన పూల చెట్లతో ఆహ్లాదాన్ని కలిగించు ప్రదేశం.దేవలోకంలోని వనం నందనవనం.సత్యభామ కోసం కృష్ణుడు స్వర్గమునకు పోయి నందనవనం నందలి పారిజాత వృక్షమును భూమికి తెచ్చినట్లు పురాణాల్లో ఉంది.కవి తాను రాసే కవిత అందమైన ప్రతిమను వర్ణించడం కాదు.తాను రాసే కవిత శ్రామికుని నిజమైన శ్రమ జీవిత సత్యాలపై ఆధారపడి ఉంది.నా కవిత భావ ప్రపంచానికి చెందినది కాదు అని కవి స్పష్టం చేస్తున్నాడు.కవి తాను రాసిన కవిత కేవలం అలంకారమైన సౌందర్యానికి బదులు జీవన పాఠాన్ని ప్రతిబింబించే ప్రకృతిని చూపిస్తుందని తెలుపుతున్నారు.
“శ్రమైక జీవుల కర్మజల బిందువు/అంటున్నారు.శ్రామికుల శ్రమ,కష్టం,అంకితభావం,జీవితానికి ప్రాణం అని కవితలో చెప్పబడింది.మానవ జీవితం శ్రమ పూర్వకమైనదిగా ఉండాలన్న సందేశం ఇక్కడ కనిపిస్తుంది.శ్రామికుని శ్రమతో నిండిన జీవితం మాత్రమే నిజమైన జీవిత లక్ష్యం అని ప్రతిపాదిస్తుంది.
“శాంతి,సమతల సింధువు/అంటున్నారు. న్యాయం,శాంతి,సమానత్వం అద్భుతమైన సముద్రం లాంటివి. శాంతి,న్యాయం సమాజంలో అత్యంత ముఖ్యమైనవి. శాంతి,సమానత్వం సముద్రంలా విస్తరించాలి.శాంతి,సమానత్వం అందరికీ అందుబాటులో ఉండాలి అనేది కవి ఆకాంక్షగా వ్యక్తం అవుతుంది.
“అన్యాయానికి,అవినీతికి బలిగా మారిన/దైన్య జీవాల,హృదిని హత్తుకుని ఓదార్చే/అంటున్నారు. సమాజంలో అన్యాయం, అవినీతి పెచ్చు పెరిగి పోయింది.సమాజంలో అన్యాయం,అవినీతి కారణంగా బాధపడుతున్న ప్రజల కోసం చింతిస్తూ వారి బాధలను అర్థం చేసుకుని వారికి ఓదార్పును ఇవ్వడం కవితలోని ముఖ్యమైన భావంగా తోస్తుంది.
“శాంతి మాత/న్యాయనేత/సౌమ్య చరిత/ అంటున్నారు.శాంతి,న్యాయం,దయ అనే సుగుణాలు,విలువలతో నడిచే వ్యక్తుల గొప్పతనాన్ని కొనియాడాలి.సమాజంలో గొప్ప నాయకుల విధానాలు,వ్యవహారాలు అందరికీ ఆచరణీయం.అట్లాంటి వారిని ఆదర్శంగా చూపిస్తుంది.ఈ ప్రపంచాన్ని న్యాయం,శాంతి ప్రేమతో నింపే మాతృ రూపం లాంటి నాయకత్వం అవసరం అని ప్రతిపాదించారు.శ్రామికులు,దయనీయ జీవులు,సమత మరియు శాంతి అనేవి ఈ కవితలోని ప్రధాన అంశాలు.అవి నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.ఈ కవి తన మనసులోని ఆవేదనను తెలుపుతూ సమాజంలో ఉండాల్సిన సమభావాన్ని చక్కగా వ్యక్తపరిచారు.ఈ కవితా పంక్తులలో ఆత్మ స్ఫూర్తి,న్యాయం, సమానత్వం,శాంతి వంటి అంశాలపై దృష్టిని సారించారు.ఇందులో శ్రామికుల జీవితాలు వారు పడుతున్న కష్టాలు,కన్నీళ్ళు,వేదనలు,న్యాయం, సమానత్వం వంటి అంశాలను కవి దామోదర్ రావు చాలా చక్కగా ప్రస్తావించారుఈ కవిత చదవగానే పాఠకులకు ఒక విధమైన గొప్ప భావం మరియు ఆనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. “పొగడ్తల పొగడ దండలై/పెత్తందారి గుండెల పై వాలేది కాదు/ అంటున్నారు.ఈ పంక్తిలో కవి తన కవిత పొగడ్తల పొగడ దండల కోసం నిర్దేశించింది కాదు.తన కవిత అధికారం లేదా ప్రతిష్ఠ కోసం రాయబడింది కాదని కవి తన కవిత్వం యొక్క లక్ష్యాన్ని వివరించారు.తాను రాసే కవిత కేవలం యశస్సు కోసం రాయబడినది కాదు అని,అధికారం గల వారి ప్రాపకం కొరకు మరియు వారి దృష్టిని ఆకర్షించడానికి కాదు అని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
“నిత్యం,మిత్తి సన్నిధిలో/తైలం లేని వత్తిలా వాడిన జీవితాల/అంటున్నారు.ఈ కవితా పంక్తిలో తన కవిత సాధారణ ప్రజల జీవితాలకు వారి కష్టాలకు దగ్గరగా ఉంది అని చెప్పబడింది.తన కవిత నిత్యం మృత్యువు సన్నిధిలో నూనె లేని వత్తి వలె కొడిగట్టిన జీవితాలు గల శ్రామికులతో మమేకం కావడాన్ని చూపిస్తుంది.ఇక్కడ తైలం లేని వత్తి అనేది శ్రమజీవుల అస్తిత్వానికి ప్రతీక.శ్రమజీవులు కార్మికులు,కర్షకులు రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతగానో కష్టపడుతున్నారు.అయినప్పటికీ వారికి కడుపు నిండా తిండి దొరకడం లేదు.శ్రామికులు ఆకలితో అలమటిస్తూ అభాగ్య జీవితం గడపడం మనం ఎరిగినదే.శ్రమజీవుల జీవితాల్లో ఎలాంటి మార్పు గాన రావడం లేదు.శ్రమజీవులకు సమాజంలో తగిన స్థానం అందడం లేదు. శ్రమజీవులు తమ జీవితాలలో వెలుగును పొంద లేక పోతున్నారు అని కవి అంటున్నారు.తైలం లేని వత్తి అనే ఉపమానాన్ని ఉపయోగించి కష్టాలు పడుతున్న సామాన్యుల జీవితాల కఠోర స్థితిని కళ్ళ ముందు కట్టినట్లుగా చూపించారు.తైలం లేని వత్తి వలె ఇక్కట్లు ఎదుర్కొంటున్న సామాన్యుల జీవితాలు వెలుగు లేకుండా చీకట్లలో మగ్గడం దారుణం అని గొప్ప భావాన్ని వ్యక్తం చేశారు.
“ఆదుకునేది,అందుకునేది/అంటున్నారు.కవి కవితా లక్ష్యం అణగారిన శ్రమజీవులకు ఆదరణను అందించడం,ఆశ్రయాన్ని కల్పించడం.వారి బాధలను అర్థం చేసుకొని వారికి జీవితంలో కొంత వెలుగును ప్రసాదించే విధంగా ఉంది.కవి తన భావాలను ఆవేదనతో,నిజాయితీగా వ్యక్తపరిచారు.ఇది కేవలం కవిత కాదు ఒక న్యాయం కోసం పిలుపు ఇచ్చినట్టుగా తోస్తుంది.తాను రాసే కవిత కేవలం యశస్సు కోసం రాయబడింది కాదు అని,అధికారం గల వారి ప్రాపకం కొరకు మరియు వారి దృష్టిని ఆకర్షించడానికి కాదు అని చెప్పిన తీరు బాగుంది.
“నా కవిత/తారల వయ్యారి చిందులు/తామరల సొగసు పసందులు/వర్ణించేది,వరించేది,అసలే కాదు/చెమటోడ్చి, సాధించి,శక్తిని సృజించి/చేవతో జీవించే/కార్మిక,కర్షక సోదరుల కళ్యాణం కోరేది/నా కవిత సమత/అంటున్నారు.ఈ కవితా పంక్తుల్లో కవి సమాజంపై తనకు ఉన్న గాఢమైన చైతన్యాన్ని సామాజిక సమత్వం పట్ల తన ఆరాధనను వెల్లడిస్తున్నాడు.ఇందులో రెండు ప్రధాన అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఒకటి ప్రకృతిలోని సౌందర్యం,రెండు కార్మికులు,కర్షకులు వంటి సాధారణ ప్రజల వేదనను ప్రతిబింబించిన తీరు.తన కవిత నక్షత్రాల సొగసుల నాట్యాలను వర్ణించేది కాదు.తామరల అందచందాల పసందులను చిత్రించేది కాదు.ప్రకృతిలోని సౌందర్యం నా కవితా వస్తువు అసలే కాదు.నిత్యం కష్టపడి చెమటను చిందించి సృజించిన సంపదతో బలంగా జీవించేటటువంటి కార్మిక,కర్షక సోదరుల బాగును కోరేది నా కవిత.సమాజంలోని ప్రకృతి సౌందర్యాన్ని గాక కార్మికుల,కర్షకుల శ్రమకు మాత్రమే కవి ప్రాధాన్యతను ఇస్తున్నాడు.
“చెమటోడ్చి సాధించి,శక్తిని సృజించి,చేవతో జీవించే అనే కవితా పంక్తులు కార్మికుల కర్షకుల కష్ట సాధనను కృషిని ప్రతిబింబిస్తున్నాయి.కవిత ఒక సామాజిక సందేశాన్ని అందిస్తుంది.ఇవి కేవలం ప్రకృతి అందాలను ఆరాధించమని చెప్పడం మాత్రమే కాదు.కార్మికుల,కర్షకుల సంక్షేమం కోసం పని చేయాలి అనే గొప్ప సందేశాన్ని సూచిస్తుంది. కవితలో సమతా భావం వ్యక్తమవుతుంది.కవి సమాజంలో సమానత్వం,న్యాయం మరియు ఐకమత్యం కోసం ఆకాంక్షిస్తున్నారని తెలుస్తోంది. కవిత ప్రకృతి మరియు సమాజానికి మధ్య సమతుల్యతను గురించి తెలుపుతుంది.ప్రకృతి అంశాలు ఎంత ముఖ్యమో కార్మికుల,కర్షకుల శ్రమను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. కవి సందేశం మన అందరికీ స్ఫూర్తిదాయకం.ప్రకృతిని కాపాడుకోవాలి మరియు శ్రమజీవులకు తోడ్పాటును అందించాలి అని కవి డాక్టర్ బి. దామోదర్ రావు నా కవిత సమత అనే కవిత ద్వారా ప్రబోధిస్తున్నాడు.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 26, 2025
written by Narendra Sandineni

గంటా మనోహర్ రెడ్డి రచించిన “అమ్మా నువ్వెవరు ? కవిత

ప్రముఖ కవి,విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి, గంటా మనోహర్ రెడ్డి,కలం నుండి జాలువారిన ఘంటా పథం కవితా సంపుటిలోని అమ్మా నువ్వెవరు?కవితపై విశ్లేషణా వ్యాసం.ఈ కవితా సంపుటి 1981 సంవత్సరంలో ముద్రించబడింది.ఈ కవిత భారతదేశం స్వాతంత్ర్యం పొంది ముప్ఫయి సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భాన ఆనాటి సామాజిక,సాంఘిక,రాజకీయ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. స్వాతంత్ర్యానంతరం కూడా దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది.భారత దేశానికి పట్టిన దుర్గతిని,ప్రజలు ఎదుర్కొంటున్న ఈతి బాధలను,సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని తన గాఢమైన భావాలతో వ్యక్తపరుస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ కవితలో కవి దేశమాతను నువ్వెవరివమ్మా?అని ప్రశ్నించడం దానికి భారత మాత సమాధానం చెబుతూ నేనో నష్టజాతకురాల్ని,స్వాతంత్ర్య భారతిని అని దిగులుతో చెప్పడం వేదన కలిగిస్తుంది.కవి మనోహర్ రెడ్డి రాసిన అమ్మా నువ్వెవరు?కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.”కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు/అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్లు/మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన నీ ఒళ్ళు/ఇంతకూ ఎవరమ్మా నువ్వు?అని అంటున్నారు.ఒక భావోద్వేగంతో రూపు దాల్చిన కవితను చదువుతుంటే దుర్భరమైన జీవితం గడుపుతున్న అమ్మ గురించి చెప్పినట్లు అనిపిస్తోంది.అమ్మ శరీరంలోని అవయవాలు అన్ని బాధలకు గురి అయి ఉన్నాయి.అమ్మ కళ్ళు కళ తప్పి పోయినట్లుగా ఉన్నాయి.అందంతో నిగనిగలాడే అమ్మ చెక్కిళ్ళు పేలవంగా,కాంతి విహీనంగా కనిపిస్తున్నాయి.ఆకలి,అనారోగ్యంతో అమ్మకు ఎడతెగకుండా వెక్కిళ్లు వస్తున్నాయి. జీవితంలో ఎన్నో బాధలు అనుభవించిన అమ్మకు ముప్పై ఏళ్ల వయసులోనే వృద్ధాప్యపు ఛాయలు ఆవరించాయి.కవితలోని భావాలు అమ్మ జీవితంలోని కష్టాలను,శారీరకంగా,మానసికంగా, సామాజికంగా ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి.ఎవరమ్మా నువ్వు?అని అడుగుతున్నాడు.దేశ మాత అయిన తల్లిని మాత్రమే కాదు.ఆ కష్టాలను అనుభవించే ప్రతి మహిళను ప్రతినిధిగా చూపుతున్నట్లుగా తోస్తోంది. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వాటికి కారణమైన పరిస్థితులు ఏమిటి?ఇందుకు సమాజం యొక్క పాత్ర ఏమిటి?అని తెలియజేయాలన్న లక్ష్యంతో కవిత రాయబడినట్లుగా తోస్తుంది.కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు అనేది ఆమె శారీరక,మానసిక దుస్థితిని ప్రతిబింబిస్తోంది.అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్ల ద్వారా ఆమె భావోద్వేగాలను గుండె నిండా పొంగిపొరలే బాధను వ్యక్తం చేస్తున్నారు.మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన ఒళ్ళు అంటే చిన్న వయసులోనే ఆవిడ జీవితం అనేకమైన కష్టాల సుడిగుండంలో చిక్కి కృంగి పోయిందని భావిస్తున్నారు.ఇంతకు ఎవరమ్మా నువ్వు?అని కవి ప్రశ్నించడం ద్వారా ఆమె జీవిత కథ,బాధలకు కారణాలు ఏమిటి?తెలుసుకోవాలనే ఆసక్తి గోచరమవుతుంది.ఇది కష్టాలలో ఉన్న మహిళల జీవన స్థితిగతులపై దృష్టి సారించి వారి బాధలను గుర్తించాలని హృదయగతమైన భావాలకు ప్రతీకగా నిలుస్తుంది.“వెయ్యేళ్ళ దుర్భర దారిద్ర్యాన్ని/అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు/ అంటున్నారు.ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విడివడినది.అరాచకపు పరాయి పాలన నుండి ఆగస్టు15,1947 రోజున భారతదేశం విముక్తి పొందింది.బ్రిటిష్ వారు మన దేశ సంపదను అక్రమంగా దోచుకుని వెళ్ళినారు.బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్య్రం సాధించినప్పటికీ దేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోవడం బాధను కలిగిస్తుంది. భారతదేశం ఇప్పటికీ ఆర్థికంగా,సామాజికంగా దోపిడీకి గురి అయి విలవిలలాడుతున్నది.కవి దేశ మాతను ఉద్దేశించి వెయ్యేళ్ల దుర్బర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు అని ప్రశ్నించడం చక్కగా ఉంది.”చీకట్లోంచి చీకట్లోకే పరుగులు తీస్తున్న పిచ్చిదానిలా ఉన్నావు/ అంటున్నారు.దేశం అభివృద్ధి కోసం ఎన్ని ప్రణాళికలు రచించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు.ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలలో అవినీతి చోటుచేసుకున్నది.అవి సత్ఫలితాలను అందివ్వడం లేదు.దేశం ఇంకా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి విలవిలలాడి పోతున్నది.ఇది దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న అవినీతి పాలనకు తార్కాణంగా నిలుస్తుంది.ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శను సంధించినట్టుగా తోస్తుంది.“నాడు నయాగరా జలపాతంలా కళకళలాడే నువ్వు/ నేడెందుకో సహారా ఎడారిలా వెలవెలబోతున్నావు/ అంటున్నారు.ఒకప్పుడు దేశం ఎంతో సమృద్ధిగా కళకళలాడేది.ఎంతో వైభవంగా అలరారిన దేశం మనది.ప్రకృతి అందాలకు పర్యాయపదంలా ఉండేది.మన దేశం పాడి పంటలతో విలసిల్లింది. ఒకప్పుడు రత్న గర్భగా పేరు పొందిన దేశం మనది. నేడు దేశం దుర్భర దారిద్ర్యం,పేదల ఆకలి కేకలు, అన్నార్తుల అలమటింపులు,నిరాశా నిస్పృహలు ఎల్లెడలా అలుముకున్నాయి అని కవి బాధను వ్యక్తం చేస్తున్నాడు.”గత కాలపు వైభవాల శిథిల శిల్ప సంకేతంలా ఉన్నావు/అంటున్నారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారతదేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది.నేడు మన దేశం శిథిల శిల్పాల గుర్తుల రూపంలో మాత్రమే మిగిలి ఉంది.స్వాతంత్ర్యానంతరం కూడా ప్రజలు దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు అనే వాస్తవాన్ని కవితా పంక్తి తెలియజేస్తున్నది.“కుత్సిత రాజకీయ విన్యాసాన్ని తలచుకొని/అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/అంటున్నారు.కేవలం కుత్సిత రాజకీయ గందరగోళాల మధ్య చిక్కుకొని దేశం వినాశనాన్ని ఎదుర్కొంటున్నది.ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు కాన రావడం లేదు.దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.కాని ఎందుకో దేశం అభివృద్ధి కుంటుపడింది అని కవి భావాల ద్వారా వ్యక్తం చేస్తున్న తీరు బాగుంది.“చచ్చిన శవంలా ఉన్నావు/అంటున్నారు.ప్రస్తుతం భారతదేశం శవం వలె చలనం లేని ఉద్దీపన రహిత పరిస్థితిలో ఉంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఇది ప్రజల వైపల్య భయాన్ని ప్రతిబింబిస్తుంది.”శవానికి భయం గొలిపేలా ఉన్నావు/ అంటున్నారు.శవం వలె నీ పరిస్థితి భయంకరంగా ఉంది.విపరీతంగా,అసహజంగా, భయాందోళనతో కూడిన అసహనాన్ని సూచిస్తుంది. చనిపోయిన వ్యక్తి భయానికి లోను కాడు.కానీ చనిపోయిన వ్యక్తికే భయాన్ని కలిగించేలా ఉన్నావు అని చెప్పడం బాగుంది.భయాన్ని సృష్టించడానికి చాలా తీవ్రంగా అశాంతిని కలిగించడాన్ని సూచిస్తుంది.ప్రజల చర్యలు మరియు ప్రవర్తన సహజ సిద్ధంగా ఉండక పోవడం వల్ల వారిని చూసి చనిపోయిన శవానికే భయం గొలిపేలా ఉంది అని చెప్పడం జరిగింది.వ్యంగ్యభరితమైన సమాజపు భావజాలాన్ని ప్రతిబింబించేలా ఈ కవిత ఉంది. ”భవిష్యత్తంటేనే ఎందుకో భయంతో కంపించి పోతున్నావు/అంటున్నారు.భవిష్యత్తు పట్ల ఆశ ఉంటేనే మనిషి మనుగడ కొనసాగుతుంది.మనిషి భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోతే మనుగడ ప్రమాదంలో పడుతుంది.ప్రజల్లో భవిష్యత్తు పట్ల ఎడతెగని భయం,తీవ్రమైన నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయని కవి స్పష్టంగా తెలియజేస్తున్నాడు.”ఎండిన పెదిమెలతో ఏదో చెప్పాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నావు/ అంటున్నారు.దేశంలో నివసిస్తున్న ప్రజలు నిరాశ నిస్పృహలకులోనై తమ బాధలను చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదని,వారి బాధలు చెప్పేందుకు అవకాశం లేకుండా పోయిందనే భావన వ్యక్తం అవుతున్నది.”నీ బాధలకు నిష్కృతి లేదని అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/“ఇకనైనా చెప్పు తల్లీ – నువ్వెవరివమ్మా?/అంటున్నారు.ఆవేదనతో,ఆక్రోశంతో బాధపడుతున్న ఆమెను కవి ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎవరో అనేది తెలుసుకోవడమే కాకుండా మనసులో దాగి ఉన్న బాధకు మూలాన్ని కూడా తెలుసుకోవాలనే సంకల్పం వ్యక్తమవుతున్నది. సమాజంలో ఆమె ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు వాటి మూలాలు ఏమిటో తెలుసుకొని పరిష్కారం చూపాలని కవి ఆకాంక్షిస్తున్నాడు.బాధితురాలైన ఆమె గుండెల్లో నిండి ఉన్న బాధను,ఆక్రోశాన్ని తెలియజేస్తున్నాడు.ఆమె ఎదుర్కొంటున్న బాధకు ముగింపు లేకుండా కొనసాగుతున్న పరిస్థితి ఎంతటి క్లేశాన్ని కలిగిస్తుందో గ్రహించవచ్చు.

ఆమె బాధలకు కారణమేమిటో చెప్పాలని కోరుతున్నాడు. సమాజంలో పేరుకుపోయిన అన్యాయం, అసమానతలను గూర్చి ప్రశ్నిస్తున్నాడు.ఈ ప్రశ్న దేశమాత ఆత్మను ఉద్దేశిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయని కవి ఆవేదన చెందుతున్నాడు.“కష్ట జీవుల నికృష్ట జీవితాలను కలం కుంచెతో/కాగితపు కాన్వాసు పైన కమనీయంగా చిత్రించాలని/వ్యర్థ ప్రయత్నం చేస్తున్న ఓ కవీ,నేనెవర్నో నీకు తెలీదా?/నేనొక నష్టజాతకురాల్ని నా దురదృష్ట నామధేయం/ స్వాతంత్ర్య భారతి/అంటున్నారు.దేశమాత తనను నష్టజాతకురాలిగా భావిస్తూ స్వాతంత్ర్యం తనకు కలిగించిన వాస్తవ పరిస్థితులపై బాధ పడుతున్నట్లు కవి చెబుతున్నాడు.ఈ కవితను భారతదేశంలోని సామాజిక,ఆర్థిక,రాజకీయ పరిస్థితులపై గాఢమైన ఆవేదనతో కూడిన ఆత్మ విమర్శగా భావించవచ్చు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు అని కవి తీరని ఆందోళనను వ్యక్తం చేస్తున్నాడు.ఇది కేవలం ఒక కవిత మాత్రమే కాదు.భారతదేశంలోని ప్రజల హృదయాల్లో నెలకొన్న ఆక్రోశానికి ప్రతీక.భారత దేశంలోని గడచిన సామాజిక, రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై విమర్శల సమాహారంగా నిలుస్తుంది. స్వాతంత్ర్యం సంపాదించుకుని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.అయినప్పటికీ దేశమాత పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నది.కవి 43 సంవత్సరాల కింద కవిత రాసినప్పటికీ ఇప్పటికీ దేశమాత పరిస్థితి దుర్భరంగా ఉండడం ఆవేదన కలిగిస్తుంది.ఈ కవిత దేశమాత విలాపంగా చెప్పవచ్చు.కవి మనోహర్ రెడ్డిగారు ఘంటారావం అనే శీర్షికతో వాట్స్ అప్ వేదిక ద్వారా ప్రతి రోజు ఒక కవితను అందిస్తూ తెలుగులో ఘంటారావం అనే ఒక కొత్త కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వీరు నిర్విఘ్నంగా నేటి వరకు ఘంటారావంలో -1651 కవితలు రాసినారు. వీరు రచిస్తున్న ఘంటారావం కవితలు సుజల స్రవంతిలా నిరంతరం కొనసాగుతునే ఉన్నాయి.వీరు ఘంటారావం శీర్షికన 1008 కవితలతో కవితా సంపుటిని తేది 16 – 11 – 2023 నాడు ఆవిష్కరించడం జరిగింది.వీరు ధారావాహికంగా ఘంటారావం కవితలను అందిస్తున్నందుకు అభినందిస్తున్నాను‌.కవి మనోహర్ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

హిల్దా

by ఒద్దిరాజు మురళీధరంరావు March 26, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

హిల్దా అనే యువ వయసులో ఉన్న అమ్మాయి, అంత తెలివైనది కాదు. ఇంకా దానికితోడు అత్యాశాపరురాలు. ఒకరోజు తన మేనత్త తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. తన వద్ద నీకోసం వివాహ డ్రెస్సు ఉంది. అదేగాక ఇంకో అదనపు డ్రెస్సు కూడా నీకే ఇవ్వాలనుకుంటున్నాను. నేను రెండు పెట్టెల్లో ఒక్కో వస్తువు పెట్టాను. దానిలో ఏదో ఒకటి నీవు ఎంచుకోవాలి. మొదటి పెట్టెలో ఈకలతో చేసిన బహుమతి. రెండవ దానిలో లోహంతో చేసినది. ఒకటి ఖరీదయినది, రెండవది కాదు. తూకంలో రెండూ ఒకేలా ఉంటాయి. జాగ్రత్తగా విచారించు నీకు ఏది కావాలో. అది నిర్ణయించేందుకు హిల్దాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆమెకు ఈకల కన్న లోహము విలువైనదని మరియు బరువైనదని కూడా ఆమె నిర్ణయించుకుంది. ఎక్కువ విచారించకుండా ఆమె రెండవ పెట్టెను ముట్టుకుంది. ఆమె మేనత్త రెండు పెట్టెల మూతలు తెరిచింది. ఒకదానిలో ఏ పెండ్లికొడుకైనా ఇష్టపడే మెత్తని ఈకలు ఉన్నాయి. రెండవ దానిలో ఒక పాత రంద్రాలు పడిన చారు గిన్నె ఉన్నది. హిల్దా తొందరపడ్డది మరియు అప్పటినుండి కొద్దిగా ఎక్కువగా జాగ్రత్త పడటం చేస్తుంది. ఆమె వివాహం జరిగాక ఆమె మేనత్త ఎలాగూ ఆ మెత్తని దిండు ఆమెకే ఇచ్చింది.
ఏ పనికైనా తొందరపడటం మంచిది కాదు.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక పిల్లి, ఒక ఎలుక

by ఒద్దిరాజు మురళీధరంరావు March 26, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒకరోజు ఉదయం ఒక అమాయకపు పిల్లి ఒక ఇంట్లో వంట సామాను గది ముందర ఒక ఎలుకను పట్టుకుంది. పిల్లి తన పెద్ద పంజాలో దాన్ని పట్టుకున్నప్పుడు ఎలుక అంది ”నీవు నన్ను తినే ముందు నన్ను నా తిండి తిననీయవా?” అని. ముఖ్యమైన విషయం, అమాయకపు పిల్లి తన పండ్లు చూపుతూ అదా నా తిండి అంది. నేను ఎంత అందంగా ఉన్నానో చూడలేవా? అని ఎలుక పలికింది. ఇంత అందమైన ప్రాణిని చంపేయడం దారుణం కాదా? ఆ పిల్లి తన చేజిక్కిన ఆహారాన్ని కిందా, మీదా చూచి అది చాలా అందంగా ఉందనుకుంది. ఆ ఎలుక అమాయకపు పిల్లిని ఇష్టపడుతున్నట్లు నటించింది కూడా. మోసపూరితంగా అది మనిద్దరం ఒకే సైజులో లేకపోవడం ఎంత దారుణం అంది. మనిద్దరం ఒకే సైజులో ఉంటే చాలా బాగుంటుందని ఆ ప్రయత్నం మొదలు పెట్టుమని ఎలుక, పిల్లికి సలహా ఇచ్చింది.

అప్పటి నుండి ఎలుక వెనుక గదిలో ఒక మెత్తని దిండుపై హాయిగా కూర్చుండిపోయింది. ఆ అమాయకపు పిల్లి ఎలుకకు తినేందుకు ఎన్నో మంచి మంచి తినుబండారాలు తెచ్చి ఇస్తూ పోయింది. ఆ పిల్లి సన్నబడేందుకు తిండి బాగా తగ్గించింది. చివరకు తిండి తక్కువై పిల్లి అనారోగ్యం పాలయ్యింది, బాగా బక్కచిక్కింది. అందువలన ఎలుకే స్వయంగా వెళ్ళి ఆహారం సంపాదించుకొని తింటూ బాగా లావై తినే వస్తువుల గది తలుపుకింది బొరియలో ఇరుక్కుపోయింది. అప్పుడు ఇంటి యజమానురాలు దాన్ని పట్టుకుని బోన్లో వేసింది. ఎప్పుడైతే పిల్లి కొంత బాగైందో బోన్లో ఉన్నదాన్ని చూసేందుకు వచ్చింది. పుస్సీ, నన్ను దయతో బయటికి తీయవా అని ఎలుక బ్రతిమాలింది. నువ్వు బోన్లో వున్నందుకు, అదృష్టవంతురాలివనుకో అని కోపంగా అంది పిల్లి. నీవు బాగా బలిసావు, నేను బాగా చిక్కిపోయాను. నీవు ఒకవేళ బయట ఉంటే తప్పకుండా నిన్ను మింగేసేదాన్ని.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

రాజు వాలెన్‌ టైన్‌

by ఒద్దిరాజు మురళీధరంరావు March 26, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

రాజు వాలెన్‌ టైన్‌ తన శవయాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తుండే వాడు. వాస్తవానికి అతనికి చనిపోవాలని లేదు, కానీ ప్రజలు ఎలా దుఃఖిస్తారో తెలుసుకోవాలని ఆశ పడుతున్నాడు. అతను వాస్తవంగా చనిపోయాక ఏమి జరుగుతుందో తను ఏమీ చూడలేనని గ్రహించాడు. ఒకవేళ నేను చనిపోతే ప్రజలు ఎలా దుఃఖిస్తారో తెలుసుకోవాలంటే నేను బ్రతికుండగానే నా శవయాత్రను ఏర్పాటు చేయాలి. అందుకు అతను చనిపోయినట్లు ప్రకటించాడు. సిటీ మొత్తం ప్రజలు నల్ల జెండాలు పట్టుకొని, వెయ్యి నల్ల జెండాలు దారి పొడుగునా ఏర్పాటు చేయాలని, తనకు శవపేటికలో పడుకో బెట్టాలని ఆజ్ఞాపించాడు. అది ఎవరు తెలుసుకోకుండా తను మాత్రమే ప్రజలు బాధపడటం చూడాలని అనుకున్నాడు.
అది కేవలం ముఖ్యమంత్రికే చెప్పి శవయాత్ర తీయుటకు ఆదేశించాడు. శవయాత్ర మొదలయ్యింది. కానీ ఇది ఏమిటి? వాలెన్‌ టైన్‌ చనిపోతే ఒక్క చుక్క కన్నీరు కూడా, ఏమాత్రం బాధ కూడా ప్రజల్లో చూడలేదు. ప్రజలు వారివారి దినచర్యల గురించి మాట్లాడుకుంటున్నారు. శవం వెంట నడిచేవారు, దారి ప్రక్కన నిలబడ్డవారు కూడా. ప్రజలు ఎన్నోసార్లు వీడు పోవడం మంచిదయింది, పీడ విరగడయిందని అనుకోవడం విన్నాడు రాజు. వచ్చేవాడు ఇంతకన్న చెడ్డవాడు కాకూడదని ఊహించసాగారు. ఇంతకన్న చెడ్డవాడు ఉండడు. వీరితో ఇంకా కొందరు కలిశారు. శవపేటికలో పడి వుండి తడి చెమటల్లో మునిగిపోయాడు రాజు. కాబట్టి అతను ఈ ప్రపంచాన్ని బాధలో ఉంచి మరణించ దలచలేదు. దానికి వ్యతిరేకంగా తన ప్రజలు తను చనిపోతేనే సంతోషిస్తారని ఎప్పుడైతే అతను ఇది గ్రహించాడో వాలెన్‌ టైన్‌ వాస్తవంగా చనిపోవాలని అనుకున్నాడు.
రాజు వాలెన్‌ టైన్‌ ఎంతో విచారపడినప్పటికీ శవ పేటికలో మరణించలేదు. మొదట్లో అతనికి చాలా కోపం వచ్చింది. తనను దూషించిన వారందరినీ చంపించాలనుకున్నాడు. కానీ అప్పుడు రాజ్యంలో పనులు చేసేవారు ఉండరు కదా! అతను ఆలోచించే కొద్ది అతనే చెడ్డవాడని తెలుసుకుని మారాలను కున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రితో తను మంచిగా పరిపాలించడం మొదటినుండి నేర్చుకోవాలని చెప్పాడు. కానీ ఎలా? అది చాలా సులభం, నవ్వాడు ముఖ్యమంత్రి. మీరు చేయవలసింది మారు వేషంలో ఆ ప్రజల్లోకి వెళ్ళండి, వారితో కలిసి పని చేయండి, వారు అనేది వినండి. అప్పుడు మీకు తెలుస్తుంది. వాళ్ళకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో? రాజు ఏమి తప్పు చేసేవాడో వారు చెప్పినది మరిచిపోనట్లయితే నీవు తిరిగి వచ్చాక చాలా తెలివిగా పరిపాలించగలవు. వారు నన్ను గుర్తించకపోతే ఎలా? అని రాజు అడిగాడు. మీరు విచారించకండి! వారు ఎల్లప్పుడు మీ కిరీటం, మీ మెత్తని పొడుగాటి కోటును మాత్రమే చూశారు. మీ ముఖాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోలేరు అని ముఖ్యమంత్రి నమ్మ బలికాడు. కానీ ఈ మధ్యన ఎవరు పాలిస్తారు? అని రాజు అడిగాడు. రాజు లేకుండా దేశం ఉండలేదు కదా! ఓహో, అవును అది సాధ్యమే, ముఖ్యమంత్రి హేళనగా నవ్వాడు. ఇదో సమస్యా అని. మీరు వచ్చేంతవరకు ప్రజల విచారం (దుఃఖం) ప్రకటిస్తాను. ఒకవేళ ఏమైనా నిర్ణయించవలసి వస్తే నేను ఎప్పుడూ చిన్న శబ్దం చేసి మిమ్మల్ని అడుగుతాను. అందుకు వాలెన్‌ టైన్‌ అంగీకరించి, పాలించడం నేర్చుకోవడానికి వెళ్ళాడు.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శత్రువుతో ప్రయాణం జండర్‌ స్పృహ

by Devendra March 20, 2025
written by Devendra

ఈ ఉగాది
నాకు విరోధి
షడ్రుచులు వడ్డించిన
భూమి తల్లిపై
అత్యాచారం
అంటూ స్త్రీల పక్షాన నిలబడి అక్షరగొంతుకను వినిపించిన కవి, విమర్శకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ గారు. శ్రీశ్రీ కోరినట్లుగా పీడితుల పక్షాన నిలబడి అభ్యుదయ దృక్పథంతో పయనిస్తున్నారు. ‘శత్రువుతో ప్రయాణం’ కవితా సంపుటిలో ఉన్న 36 కవితలు సమాజాన్ని అనేక కోణాల్లో ప్రశ్నిస్తాయి. మార్పుతో కూడిన మానవత్వాన్ని కోరుకుంటాయి. రాజకీయ రంగులను ఎండగడుతాయి. స్త్రీవాద ఉద్యమాన్ని సమర్థిస్తాయి.
అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా వచ్చిందే స్త్రీవాదం. స్త్రీల ఉనికిని, స్త్రీల హక్కులను, స్త్రీల సమస్యలను స్త్రీలే వ్యక్తపరిచే సాహిత్యాన్ని స్త్రీవాద సాహిత్యం అంటున్నాం. తరతరాల వ్యవస్థ నిర్మాణంలో మాతృస్వామ్యం రూపాంతరం చెంది పితృస్వామ్యంగా స్థిరపడిపోయింది. ఆనాటి నాగరిక సమాజం నుండి నేటికి ఆ మూలాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించి, ఎదిరించే క్రమంలో వచ్చిందే స్త్రీవాదం. జెండర్‌ స్పృహ, గృహహింస, మాతృత్వం, ఇంటి చాకిరి మొదలైన అంశాలెన్నో స్త్రీవాద ఉద్యమంలో వెలుగులోకి వచ్చిన అంశాలు. జండర్‌ సహజంగా ఏర్పడిరది కాదు. కుటుంబం, సమాజం, మతం ‘స్త్రీలు’ అంటే ఇలా ఉండాలి, ‘పురుషులు’ అంటే ఇలా ఉండాలి అని జీవనవిధానంలో అలవాటు చేసే క్రమపద్ధతిని జండర్‌స్పృహ అంటున్నాం. ఎంగెల్స్‌ ప్రకారం ‘‘పురుషత్వం, స్త్రీత్వం అనేవి శరీర ధర్మాల ప్రకారం ఏర్పడినవి కావు. ఒక సుదీర్ఘ చారిత్రక యుగంలోను పురుషత్వం, స్త్రీత్వం అనేవి వేరువేరుగా నిర్వచించబడ్డాయి. ఈ నిర్వచనం ఆయా యుగాలలోని ప్రధానఉత్పత్తి విధానమీద ఆధారపడి ఉంటుంది’’ అన్నారు. అంటే స్త్రీత్వ, పురుషత్వాల గురించి భావజాలాన్ని సమాజం తయారుచేసి అందిస్తోంది. ఆ భావజాలం తిరిగి సమాజక్రమాన్ని స్థిరపరచడంలో సహాయపడుతుంది. ఈ క్రమానంతటిని స్త్రీవాదం పరిశీలించింది. స్త్రీవాదం అంటే పురుషులను ద్వేషించడం కాదు. స్త్రీల సమస్యలను గుర్తించి స్త్రీలందరు ఏకమై పురుషులకు అర్థమయ్యేలా చెయ్యడం. ఈ భావజాలాన్ని అర్థంచేసుకున్న సహృదయ కవి ఆచార్య మాడభూషి కుమార్‌గారు. ‘ఆమె’ కవితలో స్త్రీల సమస్యలను కళ్ళకు కట్టినట్లు లోతైన భావుకతతో అక్షరీకరించారు.
‘‘చిన్నప్పటినుండి అంతే
చిన్నచూపుతోనే పెరిగింది’’ అంటారు
……….
ఇంకా
ఆమె నిఘంటువు నుంచి ఏ నిషేదం
అందుకే
ఎందుకు, ఏమిటి
లాంటి ప్రశ్నలు ఆమెనోట్లో రాకూడదని శాసనం’’
బాల్యంనుండే ఆడపిల్ల జండర్‌వివక్షను ఎదుర్కొంటుంది. కన్నతల్లే కొడుకును ఒకరకంగా కూతురును మరొరకంగా పెంచుతుంది. లేకపోతే తల్లిపెంపకం బాగాలేదంటారు. దుస్తులు, ఆటలు, ఆహారం, ఇలా అన్నిట్లోను ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కుటుంబంలో ఆడపిల్ల ఇట్లా ఉండాలి అని తర్ఫీదునివ్వబడుతుంది. తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో పెరిగిన ఆడపిల్లకు పెళ్ళి అనే బంధం మరిన్ని బాధ్యతలను, పరిమితులను విధిస్తుంది. అందుకే కవి ఇలా అంటారు.
‘‘అతగాడికి కావలసింది ఒక మరమనిషి
సంపాదించడానికి
వండిపెట్టడానికి
కోరికలు తీర్చడానికి
పెళ్ళిరోజున ఎ.టి.ఎం లాంటి
పెళ్ళాం దొరికిందని మరిసిపోతాడు’’
స్త్రీకి పెళ్ళిజీవితం అనేది రూపాయి బిల్లకు ఉండే బొమ్మ, బొరుసు లాగా మారిపోయింది. మంచి భర్త దొరికితే పరవాలేదు కాని, ఆమెను అర్థంచేసుకోలేని కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడు జీవితఖైదీగా మారిపోతుంది. అసలు కుటుంబమే స్త్రీని కంట్రోల్‌ చేసే బంధిఖానా అవుతుంది. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం అన్ని స్త్రీల బాధ్యతలే. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా వీటన్నింటిని బాలెన్స్‌ చేసుకోవాలి. తద్వార స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాలమీద ఒత్తిడి పెరుగుతుంది. ఎదిగే క్రమంలో అనేక సవాళ్ళను స్త్రీ ఎదుర్కోవలసి వస్తుంది. ‘ఆమె’ కవితలోనే ఈ పంక్తులు చూడండి.
‘‘ఆకాశమంత వ్యాపించి
అందీ అందని ఆ తేజోమూర్తిని చూసి
నిందలు వేసే వాళ్ళెందరో!
మబ్బుల నడుమనుంచి
అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటేనే
ఇంత అసూయగా ఉంటే
పున్నమి వెన్నెల విరిస్తే
రెక్కలు ముక్కలు చేసుకొని
ఆకాశానికి ఎగురుతున్న ఆమె రెక్కల్ని
ముక్కలు చేయడానికి ఎందరో’’
అన్న పంక్తులు బాధ్యతల దొందరలో, ఉరుకుల పరుగుల ‘ఆమె’ జీవితంలో పడగనీడలా నిందలు, ఆధిపత్యాలు, అకృత్యాలు, వివక్షలు, చిన్నచూపులు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘర్షణల మధ్య స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటు ముందుకు వెళ్ళే సాహసం చేస్తుంది. అయినప్పటికి స్త్రీలు తమను తాము నిరూపించుకుంటూ అన్నిరంగాలలో ముందుకు వెళ్ళే ప్రయత్నంచేస్తున్నారు. అయినప్పటికి అడగడుగున పరీక్షలపర్వాలను దాటక తప్పడంలేదు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లి కలలుకంటుంది. అన్నీ తానై భరిస్తుంది. అయినప్పటికి తండ్రి అంటే పిల్లలకు గౌరవం. తల్లి అంటే చిన్నచూపు. ‘ఆమె’ గురించి కవి మాటల్లో …
ఇంట్లో సెలవులేదు
పనిలో సెలవులేదు
జీవితమంతా పిల్లలకోసం పరుగెత్తి పరుగెత్తి
అలిసిపోయిన ఆమెకు
ఆసరా లేదు
………
ఆమె లేకుండా
మానవ చక్రం పరిభ్రమించదు
అందుకే ఆమెను
పరిమళించనివ్వండి
కవితా ముగింపులో స్త్రీ ఉన్నతిని ఆకాంక్షిస్తున్నారు కవి. ఈ విశ్వమానవ కాలభ్రమణంలో స్త్రీ, పురుషులిద్దరు అవసరమే. ఎవరికివారుగా బాధ్యత నిర్వహణలో పోటీపడాలి గాని ఆధిపత్యాలు, అహంకార పెత్తనాలు స్త్రీల అశాంతికి కారణమౌతున్నాయి. హింసకు దారితీస్తున్నాయి. స్త్రీల చుట్టు భయాన్ని గుర్తుచేస్తూ ‘భయం’ కవిత లో ఇలా అంటారు.
భయం
కట్నంలా రావచ్చు
పట్నంలో రావచ్చు
అత్యాచారంలా రావచ్చు
నిత్యాచారంలా ఉండవచ్చు
……………..
భయం
మగాడిలా ఉండవచ్చు
మగడి రూపంలో ఉండవచ్చు
మైరావుణుడి రూపంలో ఉండవచ్చు
రూపం ఏదైనా
భయం మాత్రం ఒక్కటే
అది భయమే
స్త్రీలకు ఉన్న భయాలు అన్ని ఇన్ని కావు. పురుషస్వామ్య ప్రపంచంలో ఎక్కడ పొంచి ఉంటుందో ఆ భయం. కవి పై కవితలో కట్నం వలన భయం అనడంలో మనం ఇప్పటికి వరకట్న వేదింపులకు బలైన స్త్రీలను మీడియా ముఖంగా చూస్తునే ఉన్నాం. స్త్రీలపై అత్యాచారం అన్నది ఈనాటికి రూపుమాపలేకపోయాం. ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు చేసిన దిశ లాంటి అమ్మాయిలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తవుతే కన్న తండ్రి కళ్ళు కామంతో కప్పబడినపుడు కూతురు పరిస్థితి అగమ్యగోచరం. ‘తండ్రి’ అన్న కవితలో
‘‘కన్న బిడ్డనే కామించే తండ్రులు
తండోపతండాలుగా పత్రికల్లో మొలుస్తూనే
టీవీలో మెరుస్తునే ఉన్నారు
వాటిని చూసిన మొహంతో
కన్నబిడ్డను చూసే శక్తిలేక
ఆత్మహత్య చేసుకుంటున్న’’
అంటారు. ఇక్కడ కవి ఈ సంఘటనకు కరుణరసభరిత కవితాక్షరాలను మనముందుంచారు. ఎవరో చేసిన పనికి తండ్రిగా కూతురు ముందు నిలబడలేని స్థితిని తండ్రులందరి పక్షాన నిలబడి బలమైన సందేశాన్ని ఇచ్చారు. ‘మగాడు’ కవిత జండర్‌ వివక్షను మరింత స్పష్టంగా చెప్తుంది.
‘‘వాడు కావాలనుకొన్నప్పుడు
నేను రావాలి
వాడు తేవాలన్నప్పుడు
నేను తేవాలి
వాడు తిరగమన్నట్టు
నేను తిరగలిగా తిరగాలి’’
స్త్రీ, పురుషులిద్దరు మనుషులే. ఇద్దరిలో ప్రవహించే రక్తం ఎర్రగానే ఉంటుంది. కాని, స్వేచ్ఛా పరిధిలోకి వచ్చేసరికి జండర్‌ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. పితృస్వామ్య వ్యవస్థ పురుషుడిని ‘మగాడు’ గా చూడాలనుకుంటుంది. మగాడు అంటే ఎలా ఉండాలని సమాజం, కుటుంబం చెప్పిందో కవి ప్రతిసందర్భంలో మగాడి రంగును తేటతెల్లం చేస్తాడు. స్త్రీ ఎల్లప్పుడు పిల్లలకోసమో, పుట్టింటి వారి కోసమనో, పరువు మర్యాదల కోసమనో తను ఉండాలనుకున్నట్టుగా ఉండలేకపోతుంది. తన అస్తిత్వాన్ని ఉనికిని పరిస్థితులకు ఫణంగాపెట్టి అన్నిటికి సర్ధుబాటుతనపు సంకెళ్ళు వేసుకుంటుంది. అందుకే ‘కవి’ స్త్రీ, పురుషుల సహవాసాన్ని శత్రువుతో పోల్చడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
‘‘నేను సహవాసం చేస్తున్నది
శత్రువుతో
నేను సహజీవనం చేస్తున్నది
శత్రువుతో
నేను పంచుకొంటున్నది
శత్రువుతో
పనిచేస్తున్నది
శత్రువుతో’’
ఈ శత్రువులు మిత్రులు అయ్యేదెప్పుడు! జండర్‌వివక్ష తగ్గినప్పుడు ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకెళ్ళినప్పుడు అంటే స్త్రీవాదాన్ని పురుషుడు అర్థంచేసుకున్నప్పుడే సమస్య పరిష్కారం దిశగా ముందుకు కదులుతుంది. ఆచార్యస్థానంలో ఉన్న మాడభూషి సంపత్‌గారు మహిళల ఆర్తిని, ఆవేదనను, వివక్షను అర్థంచేసుకున్న వ్యక్తిగా, కవిగా, ప్రగతిశీల మార్గదర్శకుడిగా స్త్రీల గొంతుకను ‘శత్రువుతో ప్రయాణం’ పేరుతో తన కవితాధారతో బలం చేకూర్చిన మానవతామూర్తి ఆచార్య సంపత్‌కుమార్‌గారు.

ªªª

March 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us