మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

విజ్ఞానం కలిగించే ఆయుధంఆనంద లహరి

by Dr. Nannapuraju Vijayasri September 29, 2024
written by Dr. Nannapuraju Vijayasri

రచన: సుతారపు వెంకట నారాయణ
హృదయంలో నుంచిఉదయించే భావనాతరంగాల అక్షర శిల్పం కవిత్వం బాలలగేయాలు, త్యాగం, భృూణహత్య, బాలకార్మికులు, బడి బాలలు, పక్షులు, వానాకాలం, చందమామ, సూర్యుడు, నక్షత్రాలు, గాలిపటం, రైలు, పూలు, జెండా, చేనేత పరిశ్రమ, శీర్షికల నామకరణం అలతి మాటలతో అందంగావిద్యార్థుల హృదయాన్ని ఆకట్టుకునే విధంగా సుదీర్ఘంగా కాకుండా కవితలు సరళంగా సుందరంగా సుతారంగారుబావ వ్యక్తీకరణ చేయడం మీభావానికి పూసిన తొలి మొగ్గ ఈ శంఖారావం అయినఇది నిజంగా కవితా శంఖారావమేరాజ్యాంగ నిర్మాత గురించి,భూస్వామ్య వ్యవస్థ కై పాటుబడిన వట్టి కోట అళ్వారుస్వామి గురించితెలియజేయడం గమనార్హం 57 వ కవితలో అక్టర్ మాధుర్య కవితాస్రవంతిలో చిత్రించారుఅక్షర్ఓంకార్ విలాస్ ,,అక్షర్ ప్రగతీ కీ ప్రతీక్, 60వ కవితమేరా భారత్ మహాన్ లోవిశ్వ్ బర్మే విలక్షణ్ దిఖాతే హై అనివిద్యార్థులకు అందరం ఒకటిగా ఉండాలన్నారు.హమారే జెండాలో పింగళి వెంకయ్యా కీశ్రమకీ సాధనాహమారేయాహి థిరంగ్ జెండా అని వారి ఫలితంగా మూడు రంగుల జెండా వచ్చిందని వివరించారు. 67వఆంగ్ల కవిత వరల్డ్ పీస్ కవితలోమోరల్ వ్యాల్యూస్అండ్ డెవలప్ ద హ్యుమానిటీ విద్యార్థులలో నైతిక విలువలుపెంపొందాలని అప్పుడే మానవులంతా కలిసి మెలిసి ఉంటారని ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందన్నారు.

ఈశ భక్తినిమించిన దేశభక్తి అంటారు జెండా నినాదాలు స్వాతంత్ర్య సమర0దేశభక్తుల ప్రబోధాలు జాతీయ వీరుల భక్తి త్యాగాలు వీరులు ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోవడంఆ ప్రయత్నం కవి సుతారం వెంకటనారాయణ గారు చేశారు. త్రిభాషాసూత్రాన్ని పాటించారు.నేటితరం,ముందు తరాల వారి మార్గంలో నడవడానికి ఈ రచనలు దోహదం చేస్తాయి.భావితరాలకుస్ఫూర్తిని నింపడానికి పూనుకున్నా ఈ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ ఇటువంటి ప్రేరణాత్మకమైన మరెన్నో రచనలు వారి లేఖిని జాలువారించగలదనిఆశిద్దాం.
స్వేచ్ఛ మనిషికి ప్రాణవాయువు లాంటిది మనం అనుభవించుచున్న ఈ స్వేచ్ఛ వెనుక ఎందరో వీరుల తమ ధన, మాన, ప్రాణాలుఅర్పించి సాధించిన స్వాతంత్ర ఫలం విద్యార్థులకు అందించిన కవివర్యులు.
వేరేవర్ లిజన్ కరోనా కరోనాఅని అంతటా అన్ని ఖండాలలో వ్యాపించింది అని వివరించారు.కవి తెలంగాణ భూగోళ పరిస్థితులను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు.విద్యాసాగర్ రావు జన్మ వృత్తాంతంనీళ్ల గురించి వారు చేసిన సేవను రమ్యంగా విద్యార్థులమనసుకు హత్తుకునే విధంగా రచించారు.జయశంకర్, వట్టికోట, సి.నా.రే,అంబేద్కర్,అక్షర్ విశ్వస్వరూప్ బోణగిరిశతాబ్దాల చరిత్రగలచైతన్య గిరి
నవ చైతన్యపు కాంతుల నవ్య గిరి
కాకతీయ శిల్పకళా వైభవము ఇక్కడే
సర్వాయి పాపన్న సాహసం ఇక్కడే
భువనగిరి చారిత్రక అంశాలు సామాజిక స్థితిగతులు గురించి అద్భుతంగా వివరించారు.
ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలలో ఆనందలహరి కవితా సంపుటిని అన్ని పాఠశాలలో మరియు గ్రంథాలయంలో అంగన్ వాడి కేంద్రాలలోఉంచదగిన పుస్తకం’
ఉపాధ్యాయుడిగా,సామాజిక కర్తగా,విద్యార్థి సంఘ నాయకుడిగా,ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర బీసీ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా,తెలంగాణ రాష్ట్రం కవుల సంఘంఅధ్యక్షునిగా సేవలు అమోఘం సమస్యలను క్షణంలో తీర్చే వ్యక్తిత్వం ముక్కుసూటి మనిషి కల్లాకపటం లేనివాడు అందరూ తనవారే అని ఆదరించే వ్యక్తిత్వం చిన్నచిన్న కావ్యాలతో జన చైతన్యంసుజన సౌజన్యంఇనుమడింపజేస్తున్న త్రి భాష కవీంద్రులు ఎక్కడ సాహిత్య,ధార్మిక,ఆధ్యాత్మిక,సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యక్షం కావడం వీరి జిజ్ఞాసకు నిదర్శనం.
కరోనా కదలికలు,అక్షర లహరి,ఆనందలహరి అనే గేయ సంపుటాలు రచించారు.తెలంగాణ రాష్ట్ర కవుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్న సుతారపు వెంకటనారాయణ గారు దేశభక్తికి నిదర్శనం ఆనందలహరి కవిత్వం

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ

by mayuukha September 29, 2024
written by mayuukha

ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళాశాసనాలతో ప్రజ్ఞవికాస్ వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అన్ని పాఠశాలల్లో వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈపోటీలలో రాష్ట్రం లోని అన్ని పాఠశాలలలో దాదాపు 6000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఇందులో మేడ్చల్ జిల్లా ఉప్పల్ లోని ప్రజ్ఞాన్ ది స్కూల్ లో 10వ,తరగతి చదువుతున్న చిరంజీవి వలిపే రామ్ చేతన్ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందడం జరిగింది. ముచ్చింతల లోని స్వామి వారి ఆశ్రమంలో జిల్లాస్థాయిలో గెలుపొందిన వారికందరికీ మళ్ళీ రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీ శనివారం నాడు నిర్వహించారు. దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో కూడా చిరంజీవి వలిపే రామ్ చేతన్ ద్వితీయ బహుమతి గెలుపొందారు. విజేతగా నిలిచిన చిరంజీవి వలిపే రామ్ చేతన్ ను శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు ప్రశంసాపత్రంతో సత్కరించి చిరంజీవిని ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో చిరంజీవి తల్లిదండ్రులైన శ్రీమతి వలిపే సత్యనీలిమ, శ్రీ వలిపే లక్ష్మీ నరసింహ రావు గార్లు కూడా పాల్గొన్నారు.పాఠశాల యొక్క పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టిన చిరంజీవి రామ్ చేతన్ ను పాఠశాల యాజమాన్యం అరుణ్ సూర్య, శకుంతల, నళిని గార్లు మరియు ఇతర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందించారు.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సాహిత్యాన్ని ప్రేమించిన గొడవర్తి సంధ్యగారికి అక్షర నీరాజనం:-

by Kondapally Neeharini September 29, 2024
written by Kondapally Neeharini

⁠సాహిత్యం జీవితాన్ని ప్రజ్వలనం చేస్తుంది.వ్యక్తిత్వ వికాసం కలిగిస్తుంది. చదువు సంస్కారాల విలువను తెలియజేస్తుంది. గొడవర్తి సంధ్య గారి పరిచయం ప్రథమం గా ఉపాధ్యాయినిగానే ! హైదరాబాద్ రామ్ కోటి , కింగ్ కోటి ల దగ్గర ఉన్న సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో మేం కొలీగ్స్ మి. తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా కూడా వారు విధులు నిర్వహించారు.


కానీ నాకు పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే తెలిసింది ఆమె కవయిత్రి రచయిత్రి అని.
ఆమె సాధన నరసింహాచార్యులు గారి అర్ధాంగి అని. ” సాధన ” అనగానే సాహిత్య సంస్థగా నరసింహాచార్యులు గారికి పేరు. వీరి అర్థాంగి గా అడుగడుగున ఆయన కి సంపూర్ణ సహకారాలు అందిస్తూ సాహిత్య సభలలో వెన్నుదన్నుగా నిలిచారు సంధ్య గారు. కవిత్వం లో అందెవేసిన చేయి సంధ్య గారి ది అని వారి కవిత్వం వింటే తెలుస్తుంది. కొన్ని సభా వేదిక ల మీద కవి సమ్మేళనం లో కవిత చదవగానే నేను దగ్గర గా వెళ్లి అభినందనలు తెలిపేదాన్ని. ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ దంపతులు. హైదరాబాద్ లోని చాలా పాఠశాల లో పద్య పఠన పోటీ, వ్యాస రచన పోటీలు వంటివి పెట్టి తెలుగు భాష కోసం పాటుపడిన జంట.
సంధ్య గారి తల్లిదండ్రులుకీ.శే.భాగ్యలక్ష్మి తెలికిచర్ల కృష్ణ మూర్తి గారు.
సంధ్య గారి ఆడపడుచు వైదేహి నేను ఒకే సంవత్సరంలో తెలుగు ఉపాధ్యాయులుగా చేరాం. మాకన్నా సంధ్య గారు సీనియర్. తర్వాత కాలంలో
సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు.
పుస్తకపఠనం ఎంత ఇష్టపడేవారో రచనాసేద్యం అంతే ఇష్టపడేవారు. స్కూల్ లో పిల్లలతో నాటకాలు వేయించేవారు. అవసరార్థం నాటకాలు కూడా అప్పుడే రాసేవారు. “పోతన చరిత్ర “, “కథా భారతం ” సంధ్య గారి ప్రసిద్ధ ముద్రితగ్రంథాలు.
దూరదర్శన్ ఆకాశవాణి ల లో ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలతిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ లో ప్రవచనాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. త్యాగరాయ గాన సభ లో ఎన్నో కవి సమ్మేళనాలలో కవితా పఠనం చేశారు. ఎన్నో అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు, కార్యక్రమాలు నిర్వహించారు. సాహితీ సమీక్షకురాలిగా మన్ననలందారు. సంధ్య గారి కి ప్రాచీన సాహిత్యం అంటే ఎంత ఇష్టమో ఆధునిక సాహిత్య మంటే కూడా అంతే ఇష్టం. తాము చదివిన సాహిత్యం అందరికీ పంచటంలోనే ఆనందం అనేవారు.
ప్రతి ఏటా పాఠశాల వార్షికోత్సవం లో సంధ్య గారు, మరో సీనియర్ తెలుగు ఉపాధ్యాయుని రచయిత్రి కొమండూరి అరుంధతి గారు కలిసి నాటకాలు వేయించేవాళ్ళు . తోటి తెలుగు ఉపాధ్యాయులుగా మేమందరం సహాయపడేవాళ్ళం. ఒక సంవత్సరం ” పుష్ప విలాపం” టాబ్లో ను అద్భుతంగా వేయించారు.
వానమామలై వరదాచార్యులు గారు రచించిన
“పోతనచరిత్ర” ను తేట తెలుగు వచనం లో సంధ్య గారు రాసిన పుస్తకం ప్రశంసలు అందుకుంది. పోతనపై తనకు ప్రత్యేక అభిమానం కల్గటానికి కారణం కీ.శే.బ్రహ్మశ్రీ మల్లంపల్లి పరమేశ్వర శర్మగారు అనీ, రాజమండ్రిలో స్థానం ప్రాచ్య కళాశాల లో ఆయన చెప్పిన పాఠాలు “పోతన చరిత్ర” ను రాయడానికి కారణం అని అనేవారు.
శ్రీవానమామలై వరదాచార్యులు గారి కావ్యంలోని అందాలను సులభశైలిలో తేట తెలుగులో రాసి భర్త ప్రోత్సాహంతో వచనంగా ” పోతన చరిత్ర” తో రాసారు. కవయిత్రి గా రచయిత్రి గా ప్రసిద్ధి కెక్కిన సంధ్యగారు ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరి కవితలను ఒక కవితా సంపుటి గా ప్రచురించారు కూడా. గొడవర్తి సంధ్య గారు గా సాహితీ లోకంలో పేరు పొందినా, మాకు నర్సమాంబ గారు గానే చాలా దగ్గర. నర్సమాంబగారు మంచి స్నేహశీలి.
ఈ మధ్య కాలంలో నేను నడుపుతున్న అంతర్జాల పత్రిక” మయూఖ” లోనూ సంధ్య గారి వ్యాసం ప్రచురించాను.

దాదాపు 25 ఏళ్ల క్రితం సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో సంధ్య గారి తో పరిచయం. అప్పటి నుండి ఆ సాధన నర్సింహా చార్యులు గారి తో మాకు అంటే నా భర్త కొండపల్లి వేణుగోపాల్ రావు గారి కీ నాకూ పరిచయం. ఒక కవయిత్రి గా, ఒక కవిగా ఈ దంపతులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే ఉండేవాళ్ళు. కూకట్ పల్లిలో లో వారి ఇల్లు సాహితీ వేత్తలనిలయం.వీళ్ళ ఏకైక కుమారుడు చిరంజీవి సాయిమానస్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు.
గొడవర్తి సంధ్య గారు నువ్వు ముఖం తో , మంచి మాట లతో స్నేహశీలి గా మా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
వారి కిదే తరుణి పత్రిక సంపాదకురాలిగా, స్నేహితురాలిగా నా శ్రద్ధాంజలి.*

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వలసకూలి (కధాకవిత)

by Devulapalli Vijayalaxmi September 28, 2024
written by Devulapalli Vijayalaxmi

కడుపు సేతెట్టుకుని,కూలి సేసుకుని
కుసింతగ గెంజి నీళ్ళు తాయి,
పది పరక మిగిల్సి
అమ్మ అయ్య బువ్వకి పంపిస్తూ
సల్లంగ ఉందేమని
పొరుగు రాష్టానికి బోయిన మమ్మలీని
మాయదారి రోగాలొచ్చి ముంచినాది
దేవుడో ! దేవుడా!

కూలి బందాయెనని ఓళ్ళూ.. చెరువు పూడ్చినామని ఓళ్ళూ… గుడిసెలెక్కబీకినారు,
కూలి లేక,గుడిసే లేక తిన మెదుకు లేదాయె పో!
తాగ బుక్కెడు గెంజి లేగపాయె!
సొంతూరు బోవ సేతీలో పైసాలు లేక
రైలుకు పైసలు లేక,బొస్సు కూ లేక,బండీ లేక
మా బతుగులు బండలాయె గదరా
దేవుడో ! దేవుడా!

సావో బదుగో ఉన్నూరు బోవాల
అమ్మని నాయన్ని సూడాలని
మూట ముల్లె సరదుకొని నెత్తినెట్టుకొని
కడుపున్న ఆలిని,ఒక సేతట్టుకొని,
సంటిదాన్ని సంకనెట్టుకొని,
సెప్పుల్లేని కాళ్ళతో ఎండలో,ఆనలో
జఱ్ఱి గొడ్డులాటి తారు రోడ్డు మీద
నడుత్తుంటే ఎంతకీ దూరం తరగకబాయె,
రోజులు వారాలాయె వా‌రాలు నెలలాయె,
కాళ్ళు బండలాయె
సంటిది శోసొచ్చి
ఎండకొట్టి,ఆనకి తడిసి సచ్చిపోనాది
ఏడుద్దామంటే గొంతు బెగలక బాయె
ఆనాటి రోజులే కన్నులకు కట్టె…
కల్ల నీల్లు రావాయె
దేవుడో! దేవుడా!

ఒక బరువు తగ్గినాదని సంతోషమాయె
గందా మరి మోయతాలికి నాకేడకట్టం?
బండలు పిండి సేసిన కండలాయె నాయి,
గాని బిడ్డ ఆకలంటే. నాతావేంటుంది?
మట్టి బీడులో కట్టెతో గుంత తవ్వి
గుండె రాయి సేసుకొని బిడ్డను పూడ్సా!!!
ఆనాటి రోజులే మళ్ళీ మళ్ళీ వత్తాండె ..
దేవుడో!ఓ‌రి దేవుడో!
మా బదుకులిట్టా బుగ్గి సేయబోకు
దేవుడో!ఓ‌రి దేవుడో!

పోయిన బిడ్డను సూసి మాట మరిసి
కడుపులో బిడ్డతో నా యాడది
కష్టపడతాంటె ఆదుకోడానికి
సేతకాని మొగోన్ని నేను.
” ఏమయ్యా! కడుపునొస్తోంది ఇంకెట్లనయ్యా అన్న దాని మాటకి తలెత్తిసూసినా!
నా వల్ల కాదని ఆడనే సతికీలా బడినాది నా యాడది.నేనేటి సేతునో
దేవుడో ! ఓ‌రి దేవుడో!

మూటలోని పాతసీర తీస్తి,
బుజాలంట జోలె కట్తి,
నాయాలిని కూకుండెట్టి
నా పయానం సాగించా!
పగోనికీ ఆ కష్టాలు రావద్దు
నా పేరు శి య్య,
ఆ శివయ్య గంగనెత్తి నెత్తుకున్నాడంట
సగం పార్వతిఅయ్యాడంట.
మా ఊరి పంతులు సెప్పిండు.
నాకు సానా సానా. తుప్తిగాఉంది
నేను ఆ శివయ్యకి తీసిపోనని.
నా ఆలిని నా జోలె లో కూకుండెట్టి మోస్తున్నా!
కట్టాలు నీవే ఇత్తావు ఉపాయమూ నీవే సెప్తావు
దేవుడో ! ఓరి దేవుడో!
సితరాల దేవుడో!
.* * *

అడుగులు పరుగులాయె
అల్లంత దూరానఊరాయె!
ఆనాటి కథలన్నీ ఏకరువులేనాయె…
* * *

అదిగయే బవానీ ఊరొచ్చేసినాది
అమ్మతావుకి బోయ
ఏడి ఏడి నీళ్ళోసుకొని
ఉడుకుడుకు బువ్వతిందామె! నులకమంచంలో పెసాంతంగా తొంగుందాం!
దిగయే! పల్లకీలా అమ్మోరు లెక్క కూసున్నావు.
* * *
అంటూ జోలేదింపిన శీవయ్య కి ఉలుకు పలుకు
లేని కట్టె జారిపడింది
నాలుగు నెలల కడుపుతో మొదలు పెట్టిన ప్రయాణం ముగిసింది.
ఎడపిల్ల చావు,సరి అయిన ఆహారమే లేక బిడ్డ కడుపు లో
అడ్డం తిరిగింది కూడా తెలియని స్థితిలో భవాని శివయ్యను వదిలి శివ సాన్నిహిత్యం
చేరింది.
* * *
భోరు భోరుమంటూ గుడిసె దగ్గిరకెళ్ళి తల్లిని
పిలువబోవ పందుల గుంపు గుర్రు గుర్రు మంటూ
మీద పడ్డాయి.
దూరాన గుడిసె లోంచి గవరయ్య,
“శివయ్యా! వచ్చినా వా! శివయ్యా!
ఊ‌రు శశానం అయి పోయినాదిరా!
ఊరిలో సగానికి సగంమందిని ఆనాడు కరోనామహమ్మారి పొట్టనెట్టుకున్నాది ఎవ్వురీకీ ఒక్క అగ్గిపుల్ల ఖర్చెట్టలేదురా శివయ్యా!
ఊరి శివార్లలో ని శివయ్య ఊరుని మరిసాడు
ఆనాటి ఏడుపు మళ్ళ మళ్ళ వచ్చేత్తాంది
* * *

దేవుడో !ఓరి దేవుడో! ఏమి మాయ సేసావురా?
బంగారు తల్లి ని బిడ్డని పోగొట్టుకొని,నా ప్రాణమైన నా బవాని ని పోగొట్టు కొని అమ్మ వడి కని వడి వడిగా వచ్చిన నాకు అమ్మ అయ్య ని అట్టుకెళ్ళినావే
దేవుడో! ఓ‌రి దేవుడో ! నువ్వుండావా? అసలుండావా?

పొట్టకూటికోసం సొంత ఊళ్లకు దూరం అవుతున్న ఎందరో … ఎన్నెన్నో …లెక్కలేనంతమందికి అంకితం.

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వేగుచుక్క లకే వేగుచుక్క-ఒద్ది రాజు రంగనాయకమ్మ

by రంగరాజు పద్మజ September 28, 2024
written by రంగరాజు పద్మజ

మేఖల:–నానమ్మా! ఇనుగుర్తి లో ఒద్దిరాజు సోదరులు గా ప్రఖ్యాతి చెందిన ఒద్దిరాజు సీతారామచందర్ రావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్లైన మా తాతయ్య లే కాకుండా కవి పండితులు ఎవరైనా ఆడవాళ్ళ లో ఉన్నారా?

మణి:– మంచి ప్రశ్న వేశావు మేఖలా!!
చెప్తాను చెప్తాను! మా ఊరిలో మహిళా మణుల నైపుణ్యాలకు కొదవేలేదు .
వంద సంవత్సరాల క్రితమే తెనుగు పత్రిక ఇనుగుర్తి లో స్థాపించి, స్వాతంత్ర ఉద్యమం తమపత్రిక ద్వారా, నడిపి ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ఊపిరిలూదిన సోదరులిద్దరికీ వేగుచుక్క సోదరుల మాతృమూర్తి రంగనాయకమ్మ గారు. స్వయంగా స్వాతంత్రం గురించి బోధలు చేసిన మహనీయురాలు రంగనాయకమ్మ గారు.
గ్రంథాలయ ఉద్యమం “తెనుగు” పత్రిక ద్వారా పాఠకులకు -పాలకులకు ఎన్నో విషయాలు తెలియజేసిన పత్రికాధిపతులకు ప్రేరణ వారి తల్లి గారే! అందుకే మొట్టమొదటి తెలంగాణ నవల” అనురాగవిపాకం” రచయిత్రి చాట్రాతి లక్ష్మీ నరసమ్మగారిని రచయిత్రిగా ప్రోత్సహిస్తూ ఆమె రచనలను తమ పత్రిక ద్వారా ధారవాహికగా ప్రచురించి మహిళలకు ఉత్తేజం కలిగించడానికి సోదరుల తల్లి రంగనాయకమ్మ గారు స్వయంగా రచయిత్రి కావడం బహుశా కారణం కావచ్చు.
చేయొత్తు మనిషి, దబ్బపండు రంగు మేనిఛాయ. మెడలో తులసి మాల, తొమ్మిది గజాల తెల్లని చీర ను గోచీ పోసి కట్టుకొని, తెల్లగా నెరిసిన జుట్టు తో ఒక వర్చస్సుతో వెలిగిపోతూ కనపడే రంగనాయకమ్మగారు కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామ వాసి. ఆ కారణానికి తగ్గట్టు మంచి విద్య ఆమె సొంతం. నలుగురికి దానం చేసేదేగాని ఎవరినీ ఆశించని తత్వం ఆమెది.

అందరినీ ఆకట్టుకునే మాటతీరు, మంచితనం ఆమెకు పెట్టని ఆభరణాలు. అన్నిటికన్నా మించి దైవభక్తి కలవారు ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం అంటే తెల్లవారు ఝామునే లేచి శ్రీరంగాపూర్ భగవానుల కు మేలుకొలుపులు ఎంతో శ్రావ్యంగా గానం చేసేవారట.
రంగనాయకమ్మగారు దేవులపల్లి వారి ఇంటి ఆడబిడ్డ. వీరి తండ్రి కృష్ణారావు గారు. తాతగారు రాఘవయ్య గారు. పండిత కవులు గా ప్రసిద్ధి చెందిన వారు “యతిరాజ వింశతి”,”ముకుందమాల” వంటి సంస్కృత కావ్యాలను తెలుగులో అనువదించారు . ఎన్నో రచనలు చేశారు. వారి ఇంట పుట్టిన
రంగనాయకమ్మ గారికి సంస్కృతం లోనూ, తెలుగులోనూ చక్కని పాండిత్యం ఉండేది. ఆమెకు ద్రావిడ సంప్రదాయ ప్రబంధాలు , సంస్కృత స్తోత్రాలు కంఠోపాఠం గా వచ్చేవి. వేదాల్లోని కొన్ని భాగాలు నేర్చుకున్నారు. ద్రావిడ ప్రబంధాలను చక్కగా విశ్లేషించే వారు.
అంతేకాదు 12 గ్రామాల కరణీకం ఆమె ఆధ్వర్యంలో జరిగేది. అందుకే తమ పుత్రరత్నాలు, తెలంగాణ వైతాళికులు గా పేరు తెచ్చుకున్న జంటకవులు వద్దిరాజు సీతా రామచంద్ర రావు వద్దిరాజు రాఘవ రంగారావు గార్లకు 5 సంవత్సరాలు వచ్చే సరికి ఐదు వందల పద్యాలు నేర్పించింది .
సోదరులకుగురువైన గోపాల కృష్ణ శాస్త్రి గారు జటాంతము , వేదం లోని కొన్ని భాగాలు పాఠాలు నేర్పించి వెడితే… అవి చక్కగా కుమారుల చేత వల్లె వేయించేదిట!
రంగనాయకమ్మ గారు భగవద్ విషయమూ, నాలాయిర ప్రబంధం కుమారులకు నేర్పించారు అట. ఆమె తీరిక సమయాలలోనే కాదు… మడి కట్టుకునివంట చేస్తూనే ఎన్నో విషయాలు సోదరులలో శిక్షణ ఇచ్చేవారట. పట్టు బట్టలు కట్టి, పీటలు వేసి కూర్చోబెట్టి తాను పనిచేస్తూ నేర్పించే వారట.
కుమారులకు ఏది నేర్చుకోవడానికిఇష్టమో? దానిని ప్రోత్సహిస్తూ కావలసిన గురువులను ఏర్పాటు చేసేవారట. గురువులు లేని సమయంలో సోదరులకు ఏవైనా అర్ధాలు తెలియకపోతే నిఘంటువును చూసి తెలుసుకోవడం ఎలానో నేర్పించారు అట.
తన కుమారులకు చిన్న వయస్సులోనే కరణీకం నేర్పించి ప్రభుత్వానికి పంపవలసిన జమాబంది లెక్కలు,పహాణీలు రాయడం నేర్పించారట. తమ ఖర్చులకు తామే సంపాదించుకునేలా ప్రోత్సహించే వారట.
ఆకాలంలో ఇనుగుర్తి చుట్టూ దట్టమైన అడవి ఉండేదట.ఆమె ఇంటి వెనుక రోట్లో పచ్చడి దంచుతుంటే చిరుత పులి వస్తే…భయపడకుండా ఆ రోకలి బండ మరోవైపు ఇనుప పొన్ను ఉంటే దాంతో ఒక్కటేసిందట…ఆ చిరుత మూర్ఛ పోయిందట.
మా పెద్ద నాయన అయ్యో! ఇలా అయిందేమిటని తాళ్ళతో కట్టించి, మొద్దుబండిలోకి ఎక్కించి అడవిలో వదిలి పెట్టించారట. ఆమె
అంత ధైర్యవంతురాలు.
అలాగే ఆమె కమ్యూనిష్టులకు కూడా తన కుటుంబ సభ్యులెవరూ ఎవరినీ బాధించలేదనీ, వంచించలేదనీ, ఎవరినీ వధించ లేదనీ కావాలంటే ఊరిలో ఎవరినైనా అడిగి, మీరు చేయదలుచుకున్నది చేయమని చెప్పిందట.
వాళ్ళకు ఈ విషయం తెలిసినా భూస్వాములని … హాని తలపెట్టాలనుకుని వచ్చారట కానీ నాయనమ్మ మాటలతో ఎవరినీ ఏమీచేయకుండా , సోదరుల ఇంట్లోని గ్రంథాలయాన్ని తగలబెట్టారట. అది మూడు రోజులు మండిందట బీరువాలతో సహా…! కమ్యూనిస్టు లని భయపడకుండా ఎదురు నిలిచి వాదించిందట! అలా ధైర్యంగా ప్రతీ సమస్యనూ ఎదుర్కొని, భర్త లేని లోటు కనపడనిచ్చేది కాదట!
రంగనాయకమ్మ గారు వైష్ణవ స్వాములతో సమానంగా ప్రబంధ పారాయణం, సేవాకాలం చేసేవారట. శ్లోకాల అర్థాలు వివరించే వారట.
రంగనాయకమ్మ గారు ఆదర్శ మహిళ ఆమె తన చుట్టూ ఉన్న వారిని విద్యావంతులుగా చేయాలన్నదే ఆమె తహతహ. తన ఇంటిని తీర్చిదిద్దుకోవడం అందరూ చేసే పనే కానీ తన చుట్టూ ఉన్న సమాజాన్ని జాగృత పరచడం , ఆరోగ్య సలహాలు ఇవ్వడం దానం చేయడం సంస్కృతిని తూచా తప్పకుండా పాటించాలి సంప్రదాయాన్ని తరువాతి తరాలకు అందించడం రంగ నాయకమ్మగారికే సాధ్యం.
మేఖల:- చాలా గొప్ప విషయం నాయనమ్మా ! వేగుచుక్కల వంటి వాళ్లకే వేగుచుక్క అని మీరు చెప్పడం చాలా బాగుంది నాయనమ్మా. మరి రంగనాయకమ్మ గారు వ్రాసిన పుస్తకాలు ఏవైనా ఉన్నాయా?
మణి:- ఆమె రచనలు అలభ్యం.

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఇప్పటికీ అర్థం కాలేదు…….

by dr. Lakkraju Nirmala September 28, 2024
written by dr. Lakkraju Nirmala

పోల్చడం ఎందుకు?
చిన్నప్పటి నుంచి చూస్తున్న
వాళ్లను చూసి నేర్చుకో
వీళ్లను చూసి నేర్చుకో
వీళ్ళలా ఉండు
వాళ్ళలా చదువు
వాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగారు
మనం ఎక్కడ ఉన్నాము
వాళ్ల పిల్లల పెళ్లి అయ్యాయి
మన పిల్లల పెళ్లి ఎప్పుడు
వాళ్ల పిల్లలకు పిల్లలు పుట్టారు
మన పిల్లలకు పురుళ్ళు ఎప్పుడు

వాళ్ల పిల్లలు యూఎస్ వెళ్లారు
మన పిల్లలు ఎప్పుడు వెళ్తారు
వాళ్ళ అమ్మానాన్నను చూడు
వీళ్ళ నానమ్మలను చూడు
వాళ్లు ఎంత సంపాదించారో చూడు
వీళ్ళు ఇల్లు కట్టుకున్నారో చూడు

జీవితమంతా ఒకళ్ళతో పోల్చుకోవడమేనా
మనం మనలా పుట్టాము
మనం మనలా పెరుగుతాము
మనలో ఉండే తెలివితేటలు మనకు ఉంటాయి
మనకుండే ప్రజ్ఞ మనలో ఉంటుంది
కానీ ….
పోల్చడం ఎందుకు
ఇప్పటికీ అర్థం కాలేదు నాకు
చేతి ఐదు వేళ్ళే సరిగ్గా లేవు
ఒకదానికొకటి పొంతన లేదు
ఒక తల్లి పిల్లలము
ఎవరమూ ఒకలా లేము
మరి ఎందుకు పోల్చడము
వారిలానే నీవు ఉండు
వారిని చూసి నేర్చుకో
మన బుద్ధులు ఒకరిని చూసి నేర్చుకుంటే వచ్చేవా
పుట్టుకతో వచ్చిన బుద్ధులు
పుడకలతోటే పోతాయి అంటారు అయినా…
పోలుస్తూనే ఉంటారు
వాళ్ళు తొంభై ఏళ్ళు బ్రతికారు
వీళ్ళు వంద ఏళ్ళు బ్రతికారు
పోల్చడం ఎందుకు?
మనం మనది రాసుకొని పుట్టాం
మనం ఎన్నాళ్ళు ఉండాలో
అంతవరకు మనం ఉంటాము
కొన్ని తెలివితేటలు మనకు ప్రత్యేకంగా వచ్చాయి
అయినా ప్రతిసారి పోలుస్తుంటారు ఎందుకు

నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ….
పోల్చడం ఎందుకో మనిషికి ?
ఎప్పటికీ నీవు నీవే
నీ ప్రజ్ఞ నీదే
ఎప్పుడూ నీకు నీవు
రాజు తోనో రాణి తోనో పోల్చుకోకు
నీ ప్రజ్ఞను నీవు కోల్పోకు
నీకు నీవే అధికారివి
నీకు నీవే ప్రజ్ఞా కారివి.

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఆర్మీ- వీరుడు

by Dara Preethika September 28, 2024
written by Dara Preethika

(ఆర్మీ లో సైనికుడిగా పని చేస్తూ దేశానికి సేవ చేస్తున్న ఒక తండ్రి కూతురు కథ ఇది.సైనికుడికి ప్రియా అనే ముద్దుల కూతురు ఉంది.దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు తల్లి కూతుర్లు. స్కూల్ కి వెళ్ళినపుడు తనకి కూడా మిగతా పిల్లల లాగా వాళ్ళ నాన్న స్కూల్ లో దింపాలని , అందరిలా వాళ్ళ నాన్న భుజం పైన ఎక్కి ఈ ప్రపంచాన్ని చుట్టేయాలని ఉండేది.కానీ నాకు ఆ అదృష్టం లేదు అని ప్రియా బాధపడుతూ వాళ్ళ నాన్న ప్రేమ గురించి ఇలా వర్ణించింది.)
తండ్రి అంటే కూతురిని కంటికి రెప్పలా కాపాడే వాడు,ఎల్లపుడు తనకి ప్రేమని పంచివాడు,కష్టం వచ్చినపుడు నేనున్నా అంటూ దైర్యం ఇచ్చేవాడు,నేను ఏడ్చినప్పుడు నన్ను నవ్వించడానికి జోక్స్ చేసేవాడు.మా నాన్న నాకు దూరంగా ఉన్న ఎపుడూ నా చుట్టే నీడలా ఉన్నట్టు ఉంటుంది.మా నాన్న ఆర్మీ లో ఉండడం నా జీవితం లో చాల గర్వాంగా అనిపిస్తుంది.నేను మా అమ్మ ఇద్దరం కలిసి నాన్న ఎప్పుడు మాతో కలిసి ఉండే రోజులు రావాలని కోరుకుంటాము.మా నాన్న పుట్టిన రోజు అంటే నాకు చాల ఇష్టం.
చూస్తుండగానే మా నాన్న పుట్టిన రోజు రానే వచ్చింది. ఎవరో తలుపు కొడుతున్నారని వెళ్లి చుస్తే ఒక్కసారిగా నేను నివ్వెరపోయాను, వచ్చింది ఎవరో కాదు మా నాన్న.నేను పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నని బిగ్గరగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తాను. “ఎన్ని రోజులైంది నాన్న నిన్ను చూసి నాకు చాల సంతోషంగా ఉంది ఐ లవ్ యు నాన్న ” అని చెప్పి , “అమ్మ నాన్న వచ్చాడు ” అని గట్టిగ అరిచి పుట్టిన రోజు కోసం నేను తయారు చేసిన గ్రీటింగ్ కార్డు ఇస్తుండగా ఎదో శబ్దం విన్పించింది.కళ్ళు తెరిచి చుస్తే నేను ఎంతో ఇష్టంగా మా నాన్న కోసం కొన్న బొమ్మ , గ్రీటింగ్ కార్డు కింద పడి ఉన్నాయి.ఇదేంటి అని చూసేసరికి నాన్న రాలేదు . ఇదంతా నేను కన్న కలలో జరిగింది అని అర్ధం అయింది. నాన్న వచ్చారని సంతోష పడిన నా మనసు ఒక్కసారిగా ముక్కలైంది,ఏడ్చాను,చాల బాధపడ్డాను.అందరి పిల్లల లాగ నాకు మా నాన్న పుట్టిన రోజు చేయాలనీ ఉంది కానీ నాకు అదృష్టం లేదు అనుకున్నాను.
మా నాన్న గుర్తుకు వచ్చినపుడల్లా రాలేదు కాబట్టి నేను మా నాన్న గుర్తొచ్చినపుడు అయన ఫోటో తీసుకోని చూసుకుంటూ సంతోషపడతాను.నాకు బాధనిపించింది కానీ, మా నాన్న దేశానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఒకవైపు గర్వాంగానే ఉంది.ఐ లవ్ యు నాన్న.
(తండ్రి తో కలిసి తండ్రి ప్రేమను ప్రతి రోజు పొందాలని ఆరాటపడ్తున్న ఈ చిన్నారి కోరిక తీరుతుందా అందరి లాగా ప్రియా కూడా వాళ్ళ నాన్న బుజం పైన ఎక్కి పరపంచాన్ని చుట్టేస్తుందా చూడాలి..)
**_

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వృక్షమాత

by Padmasri Chennojwala September 28, 2024
written by Padmasri Chennojwala

మట్టిలోని సారమో సాగునీటి సదుపాయమో
పెరటి మొక్క లిప్తపాటులో కొమ్మలు రెమ్మలతో పచ్చని పందిరై కనువిందు చేసింది
రెప్పపాటులోనే రెమ్మరెమ్మకో పంచవన్నెల రామచిలుక పువ్వై విరిసింది
ఆకు – పసరై బెరడు – కషాయమై వేరు – చూర్ణమైన ఆమూలాగ్ర ఆరోగ్యప్రదాయిని
మానవాళికి ప్రాణవాయువు నందించే ఊపిరియంత్రం
సాధుజంతుల పాలిటి కల్పవల్లి
నీకు నీడనిచ్చి నిన్ను సేదతీర్చే అమ్మ ఒడి
నీ గుండెకు బలమై నీ శ్వాసకు ఆయువుపట్టైన అపర ధన్వంతరి
ఏ పాడు గాలి సోకిందో
ఏ చీడపీడ తగిలిందో
అడవికి పచ్చని పరదాలు వేసి
నేలకు తివాచీలు పరిచి ఆహ్లాద పరిచిన పత్రహరితం
ఎందుకో వడలిపోతోంది
నేల కొరిగిన వృక్షమాత
అనావృష్టికి సూచిక
రేపటి క్షామానికి హెచ్చరిక
వృక్షో రక్షతి రక్షితః

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మంచి కవితా సుమాలు – ‘పిడికిలి’

by Narendra Sandineni September 23, 2024
written by Narendra Sandineni

కవి,చిత్రకారుడు,కళ్యాణం శ్రీనివాస్ కలం నుండి జాలువారిన పిడికిలి కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.ఈ కవితా సంపుటిని మే 1998 సంవత్సరంలో ప్రచురించారు.కవి శ్రీనివాస్ తాను స్వయంగా చిత్రకారుడు కాబట్టి పుస్తకానికి తానే ముఖ చిత్రాన్ని చేకూర్చుకున్నారు.ఈ కవితా సంపుటిని తనకు కళాశాలలో తెలుగు బోధించిన ఎ. గజేందర్ రెడ్డికి అంకితం ఇచ్చి గురువు ఋణం తీర్చుకున్నాడు.ఈ పిడికిలి శ్రీనివాస్ రచించిన రెండవ కవితా సంపుటి.డాక్టర్ సి.నారాయణ రెడ్డి ముందు మాటలో ఎత్తిన పిడికిలి ప్రతిఘటన చైతన్యానికి చిహ్నం అని. కళ్యాణం శ్రీనివాస్ కవితా సంపుటి పేరు “పిడికిలి’.ముఖ చిత్రంలో ఉన్నది పిడికిలే.పిడికిలి ఎలా రూపొందుతుందో “చర్య” అనే కవితలో శ్రీనివాస్ సునిశితంగా చెప్పాడు.”నమ్మొద్దు” అనే శీర్షికతో రాజకీయులకు సంబంధించిన నిష్టుర సత్యాన్ని చెప్పాడు.శ్రీనివాస్ కవితల్లో ఆవేదన ఉంది.అంతకు మించిన ఆందోళన ఉంది.సామాజిక చిత్రాన్ని ఏ రంగుల పులుముడు లేకుండా నలుపు తెలుపుల్లో గీసి చూపాడు.శ్రీనివాస్ కవితలకు తగ్గ బొమ్మలు తానే చిత్రించాడు.శ్రీనివాస్ కవితల్లోని పదునుకు నా ఆశీరాభినందన అని సి నారాయణ రెడ్డి అన్నారు.ఎ.గజేందర్ రెడ్డి ముందు మాటలో కళ్యాణం శ్రీనివాస్ కొద్ది కాలం క్రితం నా విద్యార్థి. అచిర కాలంలోనే ఆత్మీయుడైనాడు.ఈ కావ్యాన్ని అంకితమిస్తానన్నప్పుడు ఆశ్చర్యం,ఆనందం కలిగాయి.ఊహించని సంఘటన ఇది.విద్యార్థులకు సత్సంబంధాలు విలుప్తమవుతున్న ఈ రోజుల్లో సహృదయుడైన ఒక విద్యార్థి రాసిన కావ్యాన్ని అంకితం గైకొనడం మరిచిపోలేని మనోహర దృశ్యం.సామాజిక దృక్పధం గల కావ్యాన్ని అంత సమర్థవంతంగా రాయగలడని ఈ పిడికిలి నిరూపించింది.అతనికి నా ఆశీస్సులు అని అన్నారు.డాక్టర్ జి.లక్ష్మణ్ రావు ముందు మాటలో శ్రీనివాస్ కవీ,చిత్రకారుడు,ఒక బాపు,ఒక అలిశెట్టి ప్రభాకర్ ల ఒరవడిలో స్వీయ కవితలకు స్వీయ రేఖా చిత్రాలు గీసి అత్యాధునిక వైఖరిలో పిడికిలి బిగించాడు శ్రీనివాస్ అన్నారు.ఆ పై అభినందిస్తూ, ఆశీస్సులు అంద జేశారు.చేతి వేళ్ళను బొటన వేలితో సహా ముడుచుకొని ఉన్న ముష్టిని పిడికిలి అంటారు.సాధారణంగా రాజకీయ రంగంలో నాయకులు పదవుల కోసం పోట్లాడే సమయంలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు,ముష్టి యుద్ధాలు జరుగుతాయి.పిడికిలి అనేది తిరుగుబాటు,ప్రతిఘటన మరియు ఐక్యతకు చిహ్నం.పిడికిలి కవితా సంపుటి యాభై ఒక్క కవితలతో అలరారుతూ ఉంది.పిడికిలి కవితా సంపుటిలో నలుబది ఆరు మినీ కవితలతో పాటు మిగతా ఐదు కవితలు కాస్త పెద్దవిగా ఉన్నాయి. కవితలన్ని భావస్ఫోరకంగా,పాఠకుల హృదయాలను కదిలించేలా ఉన్నాయి.

కవితలను ఆసక్తితో చదివాను.కవితలలోని భావాలు నా మనస్సుకు నచ్చాయి.నన్ను ఆలోచింపజేసాయి. శ్రీనివాస్ నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్నప్పుడు ఉత్సాహం ఉరకలెత్తి పొంగి పొరలే భావాలతో రాసిన ఈ మినీ కవితలు పాఠకుల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి.ఆల్ఫాక్షరాల్లో అనల్పమైన భావాన్ని పలికించాడు.ఆ కవితలకు తానే చిత్రం గీశాడు.ఈ కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి.కవి శ్రీనివాస్ కవితల్లోని భావాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్న సాంఘిక దురాచారాలు, సామాజిక సమస్యలు,స్త్రీలపై జరుగుతున్న కుటుంబ హింస,వరకట్న దురాచారాలు,స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు,అణచివేత,దోపిడీ విధానం,అవినీతి,ఆశ్రిత పక్ష పాతం,యంత్రాలు వచ్చిన తర్వాత కులవృత్తులు విధ్వంసం కావడం, కరువు కాటకాలతో పల్లె ప్రజలు ఉపాధి కరువై వలస బాట పట్టడం,ఇవన్నీ చూస్తుంటే హృదయం ఉన్న మనిషికి బాధను కలిగిస్తాయి.పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు.పల్లెలో అతివృష్టి,అనావృష్టి ఏర్పడి కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తున్నది.పల్లె ప్రజలు ఉపాధి అవకాశాలు కరువై పట్టణాలకు వలస బాట పట్టినారు.ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకే తిండి కరువై సబ్సిడీ బియ్యం కొనుక్కుని తింటున్నాడు.రైతులు మరియు చేనేత కార్మికులు కుటుంబ భారం మోయలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి కొనసాగుతున్నది.ఈ దేశంలో సామాన్యుల జీవితాలు కునారిల్లి పోతున్నాయి.పల్లె వాసుల పట్ల సరైన అవగాహనతో సమస్యలకు పరిష్కారాలను కూడా అందించాడు.కవి శ్రీనివాస్ చుట్టూ ఉన్న సమాజాన్ని దగ్గర నుండి చూసి పొందిన స్పందనకు ప్రతిరూపమే పిడికిలి.శ్రీనివాస్ ఉబుసుపోక కోసం మరియు కాలక్షేపం కొరకు ఆషామాషీగా రాసిన కవితలు కావు ఇవి.కవి,చిత్రకారుడిగా సమాజం పట్ల తన బాధ్యతను కవితల ద్వారా చక్కగా నెరవేర్చినాడు.కవి శ్రీనివాస్ పిడికిలి కవితలో ఆకలి/అరుణమైతే/అది కొందరికే ఎరుపు/ అరుపు/ ఉరుమైతే/అది కొందరినే కుదుపు/పిడికిలి/ఓ దుముకైతే/అది అంతటినీ కదుపు/అని అంటున్నారు.ఇవ్వాళ సమాజంలో ప్రజలు తినడానికి తిండి కరువై పేదరికంలో మగ్గుతున్నారు. పేద వాడి ఆకలి కాంతి అయితే ఆ కాంతి కొందరికే ఎరుపు అని చురుకు అంటిస్తున్నారు.పేదవాడి అరుపు ఉరుములా గర్జిస్తే దోపిడీదారులను కదిలిస్తుంది.పేద వాడు పిడికిలి బిగిస్తే పెట్టుబడిదారుల దోపిడీ వ్యవస్థ అంతమవుతుంది అని వ్యక్తం చేసిన భావం విప్లవానికి నాంది పలికింది.నగ – పగ కవితలో పొగ/తాగే వాడికి/ సిగరెట్టు ఒక నగ/రక్తాన్ని/శుద్ధి చేసే/గుండె కది పగ /అని చెప్పారు.సిగరెట్టు తాగే వాడు సిగరెట్టును నగలా భావిస్తాడు.సిగరెట్టు తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే గుండెకు పగ అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.సిగరెట్టు తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటనలు చేస్తారు.సిగరెట్ తయారు చేస్తున్న కంపనీలను నిషేధించకపోవడం,ప్రభుత్వం యొక్క ద్వంద నీతిని వెల్లడిస్తుంది.సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడి పోతాయి.ప్రాణాంతక వ్యాధుల బారిన పడి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.ఆకలి కవితలో వికటించేది/ విస్ఫోటించేది/ప్రపంచంలో/ఎప్పుడో ఒక నాడు/విశ్వాన్ని శాసించేది/ఒకే ఒక్కటి/అదే ఆకలి/అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.ఆకలి అంటే ఏదైనా తినాలి అనిపించే ఒక భావన.ఆహారం లేకపోవడం వల్ల కలిగే బాధ లేదా మరణం.
పేదలు ఆకలి మంటలు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక ఆకలితో మలమల మాడి చస్తున్నారు.ఈ దేశంలో పేదల ఆకలి చావులు మనసుని కలత పెడుతున్నాయి.దోపిడి కవితలో ఒక/రక్తపు చుక్క/కోట్ల/చెమట చుక్కల్ని/సృష్టిస్తుంది -/ఒక దోపిడీ చెయ్యి/కోట్ల/రూపాయలుగా/పరివర్తింప చేసుకుంటుంది/అని అంటున్నారు.పేదవాడి రక్తం చిందించి చెమట చుక్కలు కారుస్తాడు.చెమటను దోచి పెట్టుబడుదారు కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. పెట్టుబడిదారుని దోపిడీ స్వభావం గురించి తెలిపిన తీరు చక్కగా ఉంది.పవిత్రులు కవితలో బ్రహ్మ రాసిన రాత వల్ల కర్మచేసి బతుకులు సాగిస్తున్నాం. అందుకే మేము దరిద్రులం,ఈ ధరిత్రి పై మేమే పవిత్రులం.ఎన్నాళ్లు కష్టపడినప్పటికీ ఫలితం లేదు.దోపిడీ చేసిన వారే సుఖాలు అనుభవిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నటన కవితలో అంతా కృత్రిమత్వం/ అనంతమవుతున్న నాటకత్వం/ప్రగతైనా… ప్రతిభైనా…/ కుత్రిమత్వమే/మనిషికీ/సర్వాంగానాం నయనం ప్రధానం/ నేటి బతుక్కి/సర్వానందానికి నటనం ప్రధానం/అంటున్నారు.మనిషి జీవితంలో ఉదయం లేచిన వేళ నుండి రాత్రి పడుకునే వరకు నటన కొనసాగుతుంది.మనిషి జీవితం నటన అయింది అని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.తేల్చుకో కవితలో పేద వాడి ఆకలి కేక ధనికుడి అధికారపు కేక పోల్చుకో అంటూ కలుషిత హృదయమెవ్వరిదో కఠిన పాషాణమెవ్వరిదో తేల్చుకో తెల్సుకో అంటూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు.పర్యవసానం కవితలో బుక్కెడు బువ్వ దొరకక/డొక్కలు ఎండుతేనే/ఆకలి నిప్పులు కక్కేది/రెక్కలు ముక్కలైనా/చేతికి రొక్కం రాక పోతేనే//వేళ్లు పిడీకిలిని బిగించేది…/మబ్బు తర్వాతే …/ఉరుము/ఆ తర్వాతే/పిడుగు/ అంటున్నారు.ఏదైనా పని చెయ్యడం ద్వారా చివరకు లభించు ప్రయోజనం పర్యవసానం అంటారు.ఏం జరిగింది?దాని పర్యవసానం ఏమిటి?అని మాట్లాడుతూ ఉంటాం.కాలే కడుపులు ఎందుకు మాట్లాడతాయి?తినడానికి బుక్కెడు బువ్వ దొరకక పోతే డొక్కలు ఎండుతాయి. కడుపులో ఆకలి మంటలు చెలరేగుతాయి.రెక్కలు ముక్కలు చేసుకుని కష్టించినా చేతికి కూలి డబ్బులు ఇవ్వక పోతేనే కోపంతో శ్రామికుని వేళ్లు పిడికిలి
బిగుసుకుంటుంది.ఆకాశంలో మబ్బు తర్వాతే ఉరుము ఉరుముతుంది.ఉరుము తర్వాతే ఫెళ ఫెళమంటూ పిడుగు విరుచుకుపడుతుంది అనే భావంలో ఉద్యమాలు ఎలా రూపు దాలుస్తాయో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.సూచిక కవితలో మనిషి జీవితంలో కాల చక్రం ప్రభావం ఎంతో ఉంటుంది.కాలాన్ని అనుసరించి సాగితేనే జీవితానికి ఆధారం లభిస్తుంది అని కాలం విలువను తెలియజేసిన తీరు చక్కగా ఉంది.అద్దంలో నువ్వు
కవితలో నిశ్చలత్వంలో/బురద గుంట కూడా/ ప్రతిబింబాన్నిస్తుంది/అనిశ్చలత్వంలో/మంచి నీరైనా/ ప్రతిబింబాన్నివ్వదు/హృదయం శుద్ధయితేనే/ పరిణతి ఉంటుంది/ఆకారమెలా చెప్తుంది/అంతర్గత వికృతాన్ని? అంటూ అద్దంలో నువ్వు కవిత ద్వారా పాఠకులను ప్రశ్నిస్తున్నాడు.ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది.ధీరుడు కవితలో ఈ సృష్టి/ చీకటి రేకులు/కప్పుకున్నంత వరకు/చీకటి పురుగులు/ నిష్క్రమించవు/పేద డొక్క/ఆకలి కేకలు/ వినిపిస్తున్నంత వరకు/విప్లవ వీరుడు/ విశ్రమించడు/అంటున్నారు.ధీరుని యొక్క గొప్ప గుణాలను చక్కగా వ్యక్తికరించారు.కార్మికుడు కవితలో రాయి కొట్టినా/రత్నం పండించినా/కూలి వాడే చేయాలి/కండ కరిగించినా/ఇంకోడి కండ పెంచాల్సినా/కార్మికుడే చేయాలి/ఓట్లు ఒదిగినా/ పదవి తూట్లో ఇమిడినా/శ్రామికుడే కావాలి/ అంటున్నారు.కార్మికుని యొక్క ప్రాధాన్యతను చెప్పిన తీరు బాగుంది.నమ్మొద్దు కవితలో రాయి/ శిల్పమయ్యిందంటే నమ్మొచ్చు/కానీ/రాజకీయుడు/ రంతీ దేవుడయ్యాడంటే నమ్మొద్దు/రాళ్ళు/రాగాలు పలుకొచ్చు/కానీ/రాజకీయుడు/నిజాయితీని మాత్రం కక్క లేడు/అని అంటున్నారు.ఇవ్వాళ రాజకీయుడు రంగుల ఊసరవెల్లిలా మారి సమాజాన్ని దోపిడీ చేస్తున్నాడు.రాజకీయుడిని నమ్మొద్దు అనే నిష్ఠుర సత్యాన్ని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.ఆకలి రాజ్యం కవితలో అధికారుల చేతుల్లో/ఆ బతుకులు/అంధకారపు ఛాయల్లో/ఈ మెతుకులు/ఆ బతుకుల చెరవీడదు!/ఈ మెతుకులు దొరికి చావవు!/ అందుకే వాడికెప్పుడూ/ఆయుధమే గుర్తొస్తుంది/ ఆకలి రాజ్యంలో/ వాడినెపుడూ/ తిరుగుబాటు దారునిగానే గుర్తిస్తారు/అంటున్నారు. ఇందులో ఆకలి రాజ్యం ఎలా ఉంటుందో గొప్పగా వ్యక్తీకరించారు.వ్యధ! కవితలో లచ్చిగా…/ రాష్ట్రం లచ్చలు/కేంద్రం కోట్లు/పలు పథకాలకు/విడుదల చేస్తే…/చారెడు సద్వినియోగం/బారెడు దుర్వినియోగం/నీ యవ్వ!/ ఇంకెక్కడ్రా…/మన బతుకులు/మారేది ?/మెతుకుల వ్యధ/ తీరేది?! అంటున్నారు.ప్రజా సంక్షేమం కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు.రాజకీయ నాయకులు మరియు అవినీతి అధికారులు ప్రభుత్వ పథకాల నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.సామాన్య ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నిధులు అందడం లేదు అని తెలంగాణ మాండలికంలో వ్యధ కవిత రాసి ప్రభుత్వ పథకాల గుట్టు విప్పిన తీరు చక్కగా ఉంది.గుండె గాయాలు కవితలో ఒక/ కన్నీటి పొరను/విశ్లేషించు/వేదనా ప్రపంచమంత/ గోచరిస్తుంది/ఒక/ఆకలి కేకను/ పరీక్షించు/దరిద్రం ఎంత వైశాల్యం/విస్తరించిందో/అర్థమవుతుంది/ఒక సారి/బాధాతప్త హృదయాన్ని తట్టి పరిశీలించు/ గుండె గాయాలెన్నో/ ప్రతిబింబిస్తాయి/ అంటున్నారు. పేదల కన్నీటి పొరను,ఆకలి కేకను,దరిద్రాన్ని, బాధపడుతున్న హృదయాన్ని పరిశీలిస్తే గుండెకు తగిలిన గాయాలు కనబడతాయి అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.చర్య కవితలో భాస్వరానికి/ రాపిడి జరిగితే/ అగ్గిపుల్ల భగ్గుమంటుంది/ గుండెకు/ దెబ్బ తగిలితేనే/ఐదేళ్లు పిడికిలిగా బిగుసుకుంటాయి/అంటున్నారు.చర్య అనగా క్రియా పదం.చర్య ద్వారా భాస్పరానికి రాపిడి జరిగి అగ్గిపుల్ల భగ్గున మండుతుంది.చర్య ద్వారా గుండెకు దెబ్బ తగిలి మనిషి ఐదు వేళ్లు పిడికిలిగా బిగుసుకుంటాయి అని చెప్పిన తీరు బాగుంది. పెన్ను – గన్ను కవితలో శక్తి,యుక్తే /కాదు/విలువ గలవి/విధ్వంసం చేయగలవి/సమాజంలో ఉన్నవి/రెండే రెండు/ఒకటి పెన్ను/రెండోది గన్నూ/ మిత్రమా!/మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా!/మలినం కాకుండా/మీరైనా నిలవండి/సమాజ ప్రక్షాళనకు/సన్నద్ధం కండి/ అంటున్నారు. నిజాయితీగా పెన్ను పట్టి వార్తలు రాస్తున్న జర్నలిస్టులను తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు.గన్ను పట్టి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల కొమ్ము కాస్తున్నారు.రక్షక భటులు భక్షక భటులుగా తయారయ్యారు.అంతం వరకు కవితలో ఐదు వేళ్ల ఐక్యత/ఒక పిడికిలని మర్చిపోకు/ఆరంభం అంతం వరకు/విడిపోవన్నది విస్మరించకు/ దరిద్రుడి/ అరచేతిలోనే ‘నీ’అదృష్టం/ఇమిడి ఉందని గుర్తించు/ప్రతి ఆకలి కేకకు/అంతర్మధనాన్ని గమనించు/ నేడో,రేపో…/నీ ఉనికి/ పరిసమాప్తమన్న/వాస్తవాన్ని గ్రహించు/ అంటున్నారు.ఐక్యతతో పేదవాడు పిడికిలి బిగిస్తే పెట్టుబడుదారుడు ఉనికి లేకుండా పోతాడు అన్న వాస్తవం తెలియజేయడం చక్కగా ఉంది.పిశాచం కవితలో ఎన్ని నక్కలు/ఏ పార్టీ రంగు పులుముకుని/ఎన్నికల్లో నిలబడ్డా!/ప్రజని గొర్రెను చేసి/పుర్రెలు ఊపేస్తూనే ఉన్నాయి/ఎన్నికల బొక్కలు/ఎన్నిసార్లు ఎంత కొరికినా/ఏలికలోని అరాచకత్వంలో/ఇసుమంత కూడా మార్పుండదు/ ఓట్ల తూటాలను/ఎంత జాగ్రత్తగా/బ్యాలెట్ పెట్టెలో పేల్చినా!/ప్రసవించిన ప్రతి నాయకుడు/పిశాచ గుణాలతోనే పుడుతున్నాడు/అంటున్నారు.ఇవ్వాళ సమాజంలో రాజకీయ నాయకులు పిశాచాల రూపు దాల్చి ప్రజలను పట్టి పీడిస్తున్నారు అని గొప్ప భావాన్ని కవితలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. అర్ధ నగ్నం కవితలో చీర కట్టుకే/చొంగ కార్చే/చీమలు వేలుండగా/చెరిచే సెక్సు బిట్టుకి/ప్రేక్షకులు/వేన వేలు తగలడరా/వంద రోజుల పండుగను/అర్ధ నగ్నంగా ప్రదర్శించరా!/అంటున్నారు.సినిమాల్లో స్త్రీలను చెరిచే దృశ్యాలను ప్రదర్శించడాన్ని,అర్ధ నగ్నంగా ప్రదర్శించిన సినిమాలు వంద రోజుల పండుగను జరుపుకోవడాన్ని నేటి సినిమాల తీరుతెన్నులను గురించి వ్యంగ్యంగా వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నిరుద్యోగం కవితలో లేలేత/పచ్చని విద్యార్థి/ హృదయాల్ని/పుస్తకాల పురుగులు/పత్ర హరితం తినేసి వదిలేస్తే/విద్యాలయాలు/ఉద్యోగాలయాలు/ నిరాకరించి నెట్టేసిన/బజారు బాటసారులే నేటి/ నిరుద్యోగులు/అంటున్నారు.మన దేశంలో నిరుద్యోగం ఎంతగానో పేరుకుపోయింది.చదివిన చదువులకు ఉద్యోగాలు లేక బజారు బాటసారిగా తిరుగుతున్నారు అనే వాస్తవాన్ని నిరుద్యోగం కవిత ద్వారా వ్యక్తం చేయడం చక్కగా ఉంది.పెళ్లి కవితలో ముగ్ధ మోము/ముద్దు మాట/మాకెందుకు/ మంచి మనసు/మెచ్చే నడత/అసలెందుకూ/ఇచ్చే కట్నమెంత?వచ్చే కానుకలెన్ని?కరెక్ట్ గా చెప్పు/ మావోడికి పెళ్లి చేస్తాం/మీ కూతుర్ని/మేం కోడలిగా స్వీకరిస్తాం!/అంటున్నారు.పెళ్లి చేసుకుని తమ ఇంటికి వచ్చే కోడలు ఎంత కట్నం కానుకలు తీసుకువస్తున్నారు అనే విషయాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు.అమ్మాయి చక్కగా ఉందా?మంచి మనసు,మంచి నడత,మంచి అలవాటు,చక్కగా కుందన బొమ్మలా ఉండాలి అని ఆలోచించడం లేదు.పెళ్లిని ఒక తంతుగా భావిస్తున్నారు.పెళ్లి కవితలోని భావాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. సమాజంలో వచ్చిన ఈ మార్పు ఆడపిల్లల తల్లిదండ్రులకు శాపంగా మారింది.విప్లవం కవితలో గుండె గదుల నిండా/బాధా తంత్రులు మోగుతున్నప్పుడు/గొంతు ద్వారాలందు/దగా పడిన పదాలు పచార్లు చేస్తున్నప్పుడు/హృదయ పొరలందు/కన్నీటి తెరలు నిండుకొన్నప్పుడు/ కనుపాప ఎర్ర జీరను పుంజుకుంటుంది/ అణువణువూ తూలుతూ/ఆవేశాన్ని రాజుకుంటుంది/అపుడే/ఒక ఆలోచన విప్లవరూపం దాల్చుతుంది/ఒక ఆశయమై రూపొందుతుంది/ లక్ష్యసిద్ధికి ఉపక్రమిస్తుంది/అంటున్నారు.విప్లవం కవిత విప్లవానికి నిర్వచనంలా ఉంది.మూలం కవితలో మనం కలిపిన/మట్టి పెళ్లే/వాడికి మేడై నిలిచింది/మనం పిసికిన/పిండి ముద్దే/వాడి పొట్టను పెంచింది/మనం ఉతికిన/బట్ట ముక్కే/వాడికి అందాన్ని తెచ్చింది/అంటున్నారు.ధనికుని సుఖ సంతోషాలకు మూలం ఏమిటి?శ్రామికుని శ్రమ మూలాల వల్లనే ధనికుడు సుఖాలు అనుభవిస్తున్నాడు అని కవితలో వివరించిన తీరు అద్భుతంగా ఉంది.సమైక్యం కవితలో సాటి మనిషి కష్టాల్లో ఉండి కన్నీళ్లు కార్చితే చూసే వాళ్ళ కళ్ళకు కూడా కన్నీళ్లు ఉబికి వస్తాయి.కానీ కొందరు మాత్రం సాటి వాడు కష్టాల్లో ఉంటే చూసి మొసలి కన్నీరు కారుస్తారు.ఎలాంటి సాయం అందించక కన్నీరు కార్చే వాళ్లంటే నాకు అసహ్యం అంటున్నారు. కాకులు చూడు తోటి కాకులతో కూడి కమ్మగా కలిసి తింటాయి.పక్షి అయిన కాకులంటేనే నాకు ఇష్టం అని చెప్పిన తీరు అద్భుతం.సాటి వాడికి సహాయం చేసే స్థితిలో ఉండి కూడా మనిషి ఎలాంటి సాయం చేయకుండా మొసలి కన్నీరు కార్చడం వింతగా అనిపిస్తుంది.సాటి మనిషికి సాయం చేసి ఓదార్చాలి.పక్షుల్లో ఉన్న సమైక్యత మనుషుల్లో శూన్యమై మానవత్వం కొరవడడం బాధను కలిగిస్తుంది.అగ్గి పోరు కవితలో సమాజంలో వరకట్నం దురాచారం ఇంకా కొనసాగుతున్నది. వరకట్నం సంతలో వధువు వరుణ్ణి కొనుక్కోవడం జరుగుతున్నది.కోడలు తెచ్చిన కట్నం ఎంత?కొడుకు తూగే బరువెంత?బేరీజులో తేడా వస్తే మనం సృష్టించిన బ్రహ్మ అయినా ఆప లేడు.వరకట్నం కొరకు అత్తమామలు,ఆడపడుచుల వేధింపులు కొనసాగడం నిత్య సత్యం కూడా.రాజుకున్న అగ్గి పోరు ఆగదు.వధువు ప్రాణాలు మంటలకు ఆహుతి అయి గాలిలో కలిసిపోతున్నాయి అనడం చక్కగా ఉంది.అనుమానం కవితలో ఏ వస్తువైనా/దగ్ధం చేయడానికి/ఒక అగ్గిపుల్ల చాలు/ఏ క్షణమైనా/సంసారం విచ్ఛిన్నమవడానికి/ఒక/ అనుమానం చాలు/అది ఒకసారి దహించి వేస్తే/ఇది క్షణక్షణం దహించి వేస్తుంది.అనుమానం కవిత సంసారంలో అనుమానానికి తావివ్వకూడదు అనే సందేశాన్ని అందిస్తుంది.అరాచకం కవితలో క్షీణిస్తున్న/వివాహ వ్యవస్థ/పూజిస్తున్న/వరకట్నపు సిస్టం/అబలనెపుడూ/అవస్థకు గురిచేస్తున్న/ ఆచారాలే/వ్యవస్థను పట్టిపీడిస్తున్న/అరాచకమే ఇది!/అంటున్నారు.వరకట్నం వ్యవస్థను పట్టిపీడిస్తున్న అరాచకం అని వ్యక్తం చేయడం చక్కగా ఉంది.బూజు కవితలో నేటి/మేటి పేపరు ప్రకటన!/ఒక ‘తార’/తెరపై వెలగటానికి/ఒక ప్రేక్షకుడి/ మతిపోగొడితే/చాలట!?/అయితేనే/హీరోయిన్ గా అవకాశమట!/ సినీ పరిశ్రమకు పట్టిన/ బూజును/ భూతద్దంలో ప్రకటించారట!/అంటున్నారు. సినిమాలో హీరోయిన్ అందాలు ప్రదర్శించి ప్రేక్షకుల మతి పోగొట్టి డబ్బులు సంపాదిస్తున్నట్టి సినీ పరిశ్రమకు పట్టిన బూజును వదిలించాలని వ్యంగ్యంగా వ్యక్తీకరించిన తీరు బాగుంది.’రాత’ కవితలో ఈ పూట గడిస్తే/అంతే చాలు/ఈ ఆకలి తీరితే/ఎంతో మేలు/ఏం రాసావురా/బ్రహ్మ/ఇలా ఎందుకురా/మా కర్మ!/చాటుకు ఉండి ఇలాగే రాస్తే/ నిలదీసేందుకు/సన్నద్ధమవుతారు/నిగ్గు తేల్చుకునేందుకు/సంసిద్ధమవుతారు/జాగ్రత్త!! అంటున్నారు.ఈ కవితలో రాత రాసిన బ్రహ్మనే ప్రశ్నిస్తున్నారు.బ్రహ్మను ప్రశ్నించడం మరియు జాగ్రత్త అని హెచ్చరించడం అద్భుతంగా ఉంది.అవస్థ కవితలో ఇద్దరిదీ/ఒకే అవస్థ/కాలు తీసి కాలు/ వేయలేని పరిస్థితి/కాకుంటే/వాడు/బలిసి/వీడు/ చితికి/అంటున్నారు.ఇది ఎంత అద్భుతమైన పోలిక.మధనం అంచున కవితలో మధనం నుంచే ఆలోచన ఉద్భవిస్తుంది/ఆ ఆలోచన పరిపక్వమే పోరాటమవుతుంది/అంటున్నారు.పరిణామం కవితలో అభాగ్యుల్లో/ఆలోచనా స్రవంతులు సాగుతున్నాయ్/అందని నింగిని సైతం/ అందుకోవడానికి ఎగసిపడుతున్నాయ్/ అంటున్నారు.శంఖారావం కవితలో ఇప్పుడు/ఒక శరీరంలోని అణువులు మాత్రమే/అజ్ఞానం మత్తు వదిలి మేల్కొన్నాయ్/వర్తమానం వంచన పైకి/ విచ్చుకత్తులై లేస్తున్నాయ్/ అంటున్నారు.సూర్యుని బావుటాలు కవితలో పీడితులారా!తాడితులారా!! ఏకంకండి/ఈ తరుణం మళ్ళిక రాదు/గుంపులు, గుంపులు,గుంపులుగా కదలండి/నింగిన సూర్యుడు మనతో కలిసి/ఎర్రబావుటాన్ని ఎగురేశాడు/ అంటున్నారు.ఎవరమ్మా!నువ్వు కవితలో ఎవరమ్మా నువ్వు!/కన్నీటి సముద్రానికి/కేంద్ర స్థానం/నీ గుండె అయినట్లు…/నీ బుగ్గలపై కన్నీటి చారికలేంటమ్మా!/ నీ సహనాన్ని/అవకాశంగా తీసుకుని/చలనం లేకుండా చేయకముందే/నీలో కదలిక రావాలి…/మౌనంగా భరించే/బాధలు… బాధ్యతలూ…/ బాకులా దూకాలి/అంటున్నారు. సమాజంలో స్త్రీల స్థితి ఆకాశంలో సగం అవకాశంలో శూన్యం అన్నట్లుగా ఉంది.కవి శ్రీనివాస్ స్త్రీల పట్ల గల ప్రేమతో ఎవరమ్మా నువ్వు అంటూ ఓదారుస్తున్నారు మరియు వారిలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు. సమాజ అభ్యుదయాన్ని కాంక్షించి చక్కటి మినీ కవితలు రాసిన కవి శ్రీనివాస్ ను అభినందిస్తున్నాను.కవి శ్రీనివాస్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

కళ్యాణం శ్రీనివాస్ తేది 02 – 06 – 1971 రోజున కరీంనగర్ జిల్లాలోని ఆర్నకొండ గ్రామంలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు రాజవ్వ, రాజయ్య. తండ్రి రాజయ్య చేనేత మగ్గంపై చీరలు నేసేవాడు. వీరి తండ్రి రాజయ్య 1994 సంవత్సరంలో అనారోగ్యంతో ఈ లోకం వీడిపోయారు.శ్రీనివాస్ కు ఒక అన్నయ్య.పేరు వాసుదేవ్.వీరు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో పని చేసి రిటైర్ అయ్యారు.వీరి అన్నయ్య ఆర్నకొండ గ్రామంలో నివాసం ఉంటున్నారు.శ్రీనివాస్ కు ఒక అక్క ఉంది.పేరు భారతి.వీరు చొప్పదండి గ్రామానికి చెందిన వారు. శ్రీనివాస్ 1 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు ఆర్నకొండ గ్రామంలో చదివారు.వీరు 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చొప్పదండి జడ్.పి.ఎస్.ఎస్.ప్రభుత్వ పాఠశాలలో చదివారు. వీరు ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాల,చొప్పదండి గ్రామంలో చదివారు.వీరు ఐ.టీ.ఐ. ఫిట్టర్ కోర్సును ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ,(ఐటిఐ)మంచిర్యాలలో చదివారు.వీరు బి.ఏ. తెలుగు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివారు.వీరు ఎం.ఏ.తెలుగు నాగార్జున యూనివర్సిటీలో చదివారు.వీరు యానిమేషన్ కోర్సును హార్ట్ యానిమేషన్ అకాడమీ,హైదరాబాదులో చదివారు.వీరికి చిన్నప్పటినుండి సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది.వీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి కవితలు రాయడం ప్రారంభించారు.వీరు చిన్నతనం నుండి బొమ్మలు గీయడం, కార్టూన్లు వేయడం చేస్తున్నారు. వీరు ఈనాడు పత్రికలో జర్నలిస్టుగా పని చేసారు. వీరు అందులో పొలిటికల్ కార్టూన్లు వేసేవారు.వీరు ప్రస్తుతం రెండు యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. ‌. శ్రీనివాస్ ప్రచురించిన పుస్తకాల వివరాలు:
1) హృదయం గేయ సంపుటి,ఆగస్టు,1996.
2) పిడికిలి కవితా సంపుటి,మే 1998.
వీరు పలు సాహితీ పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు.వీరు తెలంగాణ కార్టూనిస్టుల వెల్ఫేర్ సంఘానికి ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు.వీరు అంతర్జాతీయ స్థాయిలో పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ నరసింహారావు పై క్యారికేచర్ పోటీ నిర్వహించడం జరిగింది.అందులో 20 దేశాల కళాకారులు పాల్గొన్నారు.వీరు యానిమేషన్ డైరెక్టర్ గా రాణించారు మరియు పలు అవార్డులు కూడా అందుకున్నారు.వీరు ప్రస్తుతం హైదరాబాదు నగరంలో ఉంటున్నారు.

September 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆదర్శ ఉపాధ్యాయుడు -ముదుగంటి ప్రతాప్ రెడ్డి

by Narendra Sandineni September 23, 2024
written by Narendra Sandineni


ముదుగంటి ప్రతాప్ రెడ్డి తేది 15 – 09 – 1939 రోజున సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించాడు.ప్రతాప్ రెడ్డి ఆసంపెల్లి గ్రామం, గంగాధర మండలం,కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు.తల్లి లచ్చమ్మ,తండ్రి మాధవరెడ్డి.తండ్రి మాధవరెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు.తాత లక్ష్మారెడ్డి,నాయనమ్మ రాధమ్మ.తాత లక్ష్మారెడ్డి వ్యవసాయికుడే.
లచ్చమ్మ మాధవరెడ్డి దంపతులకు ఐదుగురు సంతానం.
1) పెద్ద కూతురు నరసమ్మ. 2) రెండో కూతురు మందల సూర్యమ్మ భర్త హనుమంత రెడ్డి.హనుమంత రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు.
3)మూడో కూతురు చందుపట్ల కమలమ్మ భర్త పాపిరెడ్డి.పాపిరెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు.వీరు పోతిరెడ్డిపల్లి గ్రామమునకు చెందిన వారు. 4)కొడుకు ముదుగంటి ప్రతాప్ రెడ్డి భార్య కమలమ్మ.ప్రతాప్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు. 5)నాలుగో కూతురు గుజ్జుల విమల భర్త లక్ష్మారెడ్డి.లక్ష్మారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు.విమల,లక్ష్మారెడ్డి,నల్లవెల్లి గ్రామం,నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు. ప్రతాప్ రెడ్డి1 వ తరగతి నుండి 4 వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విలాసాగరం గ్రామంలో చదివాడు.ఆసంపెల్లి గ్రామం నుండి విలాసాగరం గ్రామమునకు మూడు కిలోమీటర్ల దూరం ఉండేది. ప్రతాప్ రెడ్డి రోజు ఆసంపెల్లి గ్రామం నుండి విలాసాగరం పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరం నడిచి పోయి వచ్చే వాడు.విలాసాగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లక్ష్మీ నరసయ్య సారు,రుద్ర నరసయ్య సారు చక్కగా బోధించే వారు.ప్రతాప్ రెడ్డి 5 వ తరగతి నుండి 7 వతరగతి వరకు ఎలగందల్ మిడిల్ స్కూల్ లో చదివాడు.

ఆ రోజుల్లో పాఠశాలకు ఆర్.చంద్ర ప్రభాకర్ హెడ్ మాస్టర్ గా ఉండే వాడు. ఎలగందల్ మిడిల్ స్కూల్లో 30 మంది ఉపాధ్యాయులు పని చేసే వారు.ఎలగందల్ పెద్ద గ్రామం.చుట్టుపక్కల పది గ్రామాల పిల్లలు ఎలగందల్ గ్రామంలో రూములు కిరాయికి తీసుకుని ఉండి స్కూల్లో చదువుకునే వారు.ఎలగందల్ గ్రామంలో రూమ్ కిరాయి మనిషికి ఒక రూపాయి ఉండేది.ఇంటి నుండి బియ్యం,పప్పులు మొదలైనవి తెచ్చుకునే వారు.కట్టెల పొయ్యి మీద వండుకునే వారు.ఆసంపెల్లి గ్రామం ఎలగందల్ గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండేది.ఎలగందల్ ఖిల (కోట) కరీంనగర్ జిల్లాలోని ఎలగందల్ గ్రామంలో ఉంది.కరీంనగర్ కు పది కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీ తీరంలో తాటి చెట్ల మధ్య సుందర ప్రకృతి నేపథ్యంలో ఉన్న ఎలగందుల కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ వంశం, మొగల్ సామ్రాజ్యం,హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది.నిజాం పాలనలో ఎలగందల్ కోట కరీంనగర్ కు ప్రధాన కార్యాలయంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా ఈ ప్రదేశం ఐదు సామ్రాజ్యాల చేత పాలించబడింది.పురాతన జ్ఞాపక చిహ్నాలతో కొండ శిఖరాన ఉన్న కోట,తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరస్సు 1774 ఎ.డి.లో ఫాఫర్ – ఉద్ – దౌలా చేత నిర్మించబడినవి. ఎలగందల్ కోటలోని మీనార్లు ముస్లిం సన్యాసులైన సయ్యద్ షాహ్ మున్నార్ క్వాద్రి సాహెబ్,దూలా షాహ్ సాహెబ్,సయ్యద్ మరూఫ్ సాహెబ్,షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్,వాలి హైదర్ సాహెబ్, సమాధులను కదిలిస్తే అక్కడ కోటలో ఉన్న మీనార్లు ఊగుతాయట.ఎలగందల్ గ్రామంలోని ఇంకో చివర దో మీనార్ అనే కట్టడం ఉంది.ఇది ముస్లిం పండుగ రోజుల్లో ప్రార్థన చేసే ఈద్గా.ఎలగందల్ గ్రామంలో ఈద్గాను బహమని సుల్తానులు నిర్మించారు.మీనార్ పైకి వెళ్ళడానికి లోపల నుండి మెట్లు ఉన్నాయి. ఎలగందల్ గ్రామం స్కూల్ వెనకాల ఈద్గా ఉంది. ప్రతాప్ రెడ్డి పాఠశాలలో చదువుతున్నప్పుడు మీనార్ ఎక్కే వాడు.ఎలగందల్ పాఠశాల పిల్లలు మీనార్ మెట్ల ద్వారా మీనార్ ఎక్కి అక్కడ కూర్చుండి చదువుకునే వారట.హైదరాబాద్ చార్మినార్ లో నాలుగు మీనార్లు ఉన్నాయి. ఎలగందల్ పాఠశాల వెనుక రెండు మీనార్లు ఉండేవి.మీనార్ ఎక్కి అక్కడ ఖాళీ ప్రదేశంలో విద్యార్థులు కూర్చుండి చదువుకునే వారు.ప్రతాప్ రెడ్డికి మీనార్ ఎక్కితే ఎంతో సంతోషంగా ఉండేదట.ప్రతాప్ రెడ్డి 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గవర్నమెంట్ హైస్కూల్ కరీంనగర్ లో చదువుకున్నాడు.మంకమ్మ తోటలో గల పొన్నం వాళ్ల క్వార్టర్స్ లో కిరాయికి ఉండి చదువుకున్నాడు. ఆసంపెల్లి గ్రామం నుండి కరీంనగర్ ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంది. ప్రతాప్ రెడ్డి 10 వ తరగతి 1962 సంవత్సరంలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రతాప్ రెడ్డి 1962 – 1964 సంవత్సరం వరకు ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ,జగిత్యాల తాలూకాలో టీచర్ ట్రైనింగ్ చేసి ఉత్తీర్ణత సాధించాడు.జగిత్యాలలో టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక సంవత్సరం హాస్టల్లో ఉన్నాడు. రెండవ సంవత్సరం రూమ్ కిరాయికి తీసుకొని ఉన్నాడు.ప్రతాప్ రెడ్డి తేది 27-09 -1965 రోజున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పొట్యాల దగ్గర గల బామండ్లపల్లి గ్రామంలో ఉపాధ్యాయుడుగా నియమించబడ్డాడు.బామండ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉండేది.ఇద్దరు టీచర్లు ఉండేవారు. ప్రతాప్ రెడ్డి అన్ని సబ్జెక్టులు బోధించేవాడు.పిల్లలకు రోజు పాఠ్యాంశాలు బోధిస్తూ ఉంటే అవి కంఠస్థం అయ్యేవి.పిల్లలు కూడా పాఠశాలలో చక్కగా చదువుకునే వారు.ప్రతాప్ రెడ్డి వివాహం కమలతో 1966 సంవత్సరంలో ఆర్నకొండ గ్రామంలో జరిగింది. వారి మామయ్య దామెర రామ్ నర్సింహారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు.ప్రతాప్ రెడ్డి బామండ్లపల్లి గ్రామ పాఠశాలలో పని చేస్తున్న రోజుల్లో ఒక రెడ్డి ఇంట్లో ఉచితంగా ఉండే వాడు. కిరాయి లేదు ఏమీ లేదు.బామండ్ల పల్లి గ్రామ ప్రజల ఆప్యాయత మరువ రానిదిగా ఉండేది.1969 సంవత్సరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అందరు ఉద్యోగులు అరువది నాలుగు రోజులు సమ్మె చేయడం జరిగింది.చదువుకున్న వాళ్లకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉండేది.పల్లెటూరు వాళ్లకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి అంతగా తెలియదు.ప్రతాప్ రెడ్డి ఎక్కడికి బదిలీ అయితే అక్కడికే పోయి భార్యా పిల్లలతో ఉండి పాఠశాలలో పని చేశాడు.ప్రతాప్ రెడ్డి కమల దంపతులకు ఇద్దరు సంతానం.
ప్రథమ సంతానం ముదిగంటి శ్రీనివాసరెడ్డి భార్య కవిత.శ్రీనివాస్ రెడ్డి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.వీరికి ఇద్దరు సంతానం – రాజేశ్వర్ రెడ్డి,సంజయ్ రెడ్డి.
2) ద్వితీయ సంతానం : పిన్రెడ్డి మమత భర్త రమణారెడ్డి.వీరికి ఇద్దరు పిల్లలు.ఒకరు సంజన. రెండవ వారు మేఘన.రమణారెడ్డి సీనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతాప్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడ పని చేయ లేదు.2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తనకు చాలా సంతోషంగా కలిగిందట.1998 సంవత్సరంలో కరీంనగర్ లో రెండు గుంటల జాగ కొని సొంత ఇంటిని నిర్మించుకున్నాడు.ప్రతాప్ రెడ్డి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు జీతం 100 రూపాయలు ఉండేది.పల్లెటూర్లో ఐదు రూపాయలు కూడా ఖర్చు అయ్యేవి కావట.స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు చదువుకోవడానికి ప్రతాప్ రెడ్డి ఇంటికి వచ్చే వారు.తాను ఉచితంగా పిల్లలకు చదువు చెప్పే వాడు.గ్రామాల్లో టీచర్ అంటే అపారమైన గౌరవం ఉండేది.ప్రతాప్ రెడ్డికి పిల్లలకు చదువు చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇచ్చేది.ప్రతాప్ రెడ్డి గుంపుల గ్రామంలో ఎనిమిది సంవత్సరాలు పని చేశాడు.అప్పుడు గుంపుల గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఉండేది.ఇప్పుడు ఈ గ్రామంలో హై స్కూల్ ఏర్పాటు అయింది.గుంపుల గ్రామస్తులు 2010 సంవత్సరంలో టీచర్ ప్రతాప్ రెడ్డిని సన్మానించారు. ఈ సన్మానం తనకు జీవితంలో మరిచిపోలేనిది అని చెప్పినాడు.ప్రతాప్ రెడ్డి పిల్లలను శ్రద్ధగా చదువుకోవాలని ఉత్సాహపరిచే వాడు.ప్రతాపరెడ్డి పని చేస్తున్న ప్రైమరీ పాఠశాలలో ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండేవారు.ప్రతాప్ రెడ్డి తన శిష్యుడు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నాడని సగర్వంగా చెప్పుకున్నాడు.వీరు తేది 27 -09 – 1997 రోజున బోయినిపల్లి మండలం,రత్నం పేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుండి రిటైర్ అయ్యారు.వీరు ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారు.వీరి శిష్యులు ఎందరో ఉన్నత స్థానానికి ఎదిగారు.నిరాడంబరుడైన ప్రతాప్ రెడ్డి ఉపాధ్యాయునిగా సమాజానికి చేసిన సేవ అమూల్యమైనటువంటిది.వారికి వారు పనిచేసిన గ్రామాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా విశేషమైన గుర్తింపు లభించిండం వల్ల తన జన్మ సార్థకమైందని ప్రతాప్ రెడ్డి తెలియజేశారు.సాయం సమయాలలో శివాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక భావనతో అక్కడ కొంత సమయాన్ని గడుపడం వారి నిత్య కృత్యం.

September 23, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us