మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

సహన ధాత్రి

by Aruna Dhulipala September 29, 2024
written by Aruna Dhulipala

తడి చుక్కలు ఇగిరిపోయి
హృదయం భళ్ళున పగిలి
పొక్కిలి పొక్కిలిగా నేలతల్లి
విడిపోతోంది మట్టి కణాలుగా

తనలో చొచ్చుకుపోయిన
మూలాలకు గొంతు తడపలేక
వేడి కిరణాలకు చిక్కి
నిట్టూర్పు సెగలు కక్కుతోంది

పెకిలించ బడిన మానులు
నిర్జీవ శకలాలుగా
అమ్మ ఒడిలో ఒరిగాయి
పచ్చని యవ్వన పాలధారలను
అడుగంటా పీల్చిన
మానవ రక్కసులు

జీవితాన్ని ఇచ్చిన తల్లిపై
బిడ్డలు చేసిన ద్రోహచింతన
చేసిన పాపాన్ని కడుగుకోలేక
కృత్రిమ అధునాతనంలో
పరిహారం అనుభవిస్తున్న జాతి

జరిగిన అన్యాయానికి
తాను ఘోషిస్తున్నా
శాపాలు పెట్టలేని కరుణమూర్తి
గాయాలెన్నైనా భరిస్తూ
పేరు మోస్తూనే ఉంటుంది
‘సహన ధరిత్రి’గా శాశ్వతంగా..!

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గూటి పక్షులు – గులాబి ముళ్లు

by Padmasri Chennojwala September 29, 2024
written by Padmasri Chennojwala

అందమైన లోకమనీ రంగురంగు లుంటాయని అందరూ అంటుంటారు రామరామ అంత అందమైన కానే కాదు చెల్లెమ్మా….. చెల్లెమ్మ

ఈరోజు ఉదయం ఈ విషయం విన్నప్పటి నుండి ఈ పాట నా మదిలో మెదులుతూనే ఉంది. పాట చిత్రీకరణకు, నేను విన్న విషయానికి ఏ విధమైన సంబంధం లేకపోయినా అందులోని భావం ఈ సంఘటనకు చక్కగా సరిపోలడమే అందుకు కారణం.
నేను ఈ పాటపై విశ్లేషణ రాయడం లేదనీ, సంఘటనను విశ్లేషించడానికి ఈ పాటను ఒక ఉదాహరణగా స్వీకరించాననే విషయాన్ని పాఠకులు గమనించవలసిందిగా మనవి.
ఒక పాటను గేయ రచయిత ఒక సంఘటనకు ఆధారంగాగానీ, స్పందించి గానీ రచించి ఉండవచ్చు. దానిని ఒక దర్శకుడు తెరకెక్కించి ఉండవచ్చు కానీ ఆ చిత్రం విడుదలై జనంలోకి వెళ్లిన తర్వాత, శ్రోతలు దానిని విన్నప్పుడు కొన్నికొన్ని సార్లు అది తమను చూసే, తమ గురించే వ్రాసారా అన్నంతగా భావానికి లోనవుతారు. అందులోని సాహిత్యం వారి అనుభవాలకు , పరిస్థితులకు అద్దం పట్టడంతో ఆ విధమైన అనుభూతికి లోనవుతూ ఉంటారు. ఇంతకీ ఈ వ్యాసానికి కేంద్ర బిందువైన విషయం కొత్తదేమీ కాదు. పత్రికలు, బుల్లితెర, వెండి తెరలపై కెక్కడమే కాకుండా, జనాల నాలుకలపై నాట్యమాడిన సాధారణ విషయమే. కాకపోతే ఇది నిత్యనూతనం. పాత సీసాలోని కొత్త సారాయి.
జీవనోపాధిని వెతుక్కుంటూ పల్లె నుండి పట్నానికి వలస వచ్చిన ఓ కొత్తజంట,ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి , జోడెడ్లై బతుకు బండిని లాగుతూ ఉంటారు. భార్యాభర్తలిద్దరూ నిరక్షరాస్యులు కావడంవల్ల వారు పొందిన అవమానాలు, చేదు అనుభవాలే పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలనే గట్టి సంకల్పానికి కారణమై రాజీలేని పోరు సలుపుతూ ఉంటారు.
అతను ఒక చక్కటి మేస్త్రి. భవన నిర్మాణంలో అతని అనుభవం, మెళకువలు చూసి కాంట్రాక్టర్లు ముచ్చట పడేవారు. పదిమంది పని వాళ్ళను బృందంగా సంఘటిత పరిచి , వారితో కలిసి పనులు కుదుర్చుకునేవాడు. చెప్పిన సమయానికి పని పూర్తి చేసి అప్పగించడంతో అందరి మెప్పును పొందగలిగేవాడు. అయినప్పటికీ కేవలం ఆ పని మీదే ఆధారపడకుండా, ఎంత చిన్న పనైనా చేయడానికి వెనుకాడేవాడు కాదు.
కాలచక్రం తన దారిన తాను వెళుతూ ఉండగానే , నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి పడినట్లుగా ఒకరోజు ఒక బహుళ అంతస్తుల భవనాన్ని కట్టే సమయంలో అతను పైనుండి కింద పడటంతో తలకు, కాళ్లకు,చేతులకు బలమైన గాయాలయ్యాయి. అసలు పనులు చేయగలుగుతాడా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది. కానీ అతను ధైర్యాన్ని కోల్పోకుండా కాస్త కోలుకోగానే, శక్తిని కూడదీసుకుని పనులకు వెళుతూ, జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునే దిశగా తల్లిదండ్రుల ద్వారా సంక్ర మించిన కొద్దిపాటి ఆస్తిని అత్యంత నేర్పుతో విక్రయించి, పరిస్థితిని ఒక దారిలోకి తీసుకు రాగలిగాడు.
మరో సందర్భంలో ఆమె ఆరోగ్యం కూడా బాగా దెబ్బ తినడంతో, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భర్త, దానికి తోడు క్షీణించిన తన ఆరోగ్యం ఎక్కడ పిల్లల చదువులకు ఆటంకంగా మారుతుందోననే బాధ బాగా కృంగదీయడంతో, అతను ఆమెకు అన్ని రకాలుగా భరోసానందించి కుటుంబాన్ని ముందుకు నడిపించాడు.
ఆమె నాలుగిళ్లలో పని చేసేది. గర్భం ధరించిన సమయంలో కానీ, చంటి పిల్లల్ని సాకే సమయంలో గానీ ఎన్ని ఇబ్బందులెదురైనప్పటికీ , అన్నిటినీ చక్కగా సమన్వయపరచుకునేది. ఇద్దరు పిల్లల్ని స్కూలుకు పంపించి, చిన్న వాణ్ణి సెల్లార్ లో పడుకోబెట్టి, ఒక సీసాలో పాలు, మరో సీసాలో నీళ్లు పెట్టి, అపార్ట్మెంట్ వాచ్మెన్ ని కొడుకు లేస్తే కాస్త తనను పిలవమనీ, అదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్న మరో పని మనిషి చేతికి ఒక పాల సీసానిచ్చి పిల్లాడు లేచి ఏడిస్తే కాస్త పట్టించమనీ, ఫలానా ఇంట్లో పని చేస్తూ ఉంటాననీ, మరీ అవసరమైతే తనను పిలవమనీ, తొందరగానే తిరిగి వచ్చేస్తానని వారిని బతిమాలి, పనికి వెళ్లి మధ్య మధ్యలో వచ్చి పిల్లాడిని చూసుకుంటూ ఉండేది.
ఒకానొక సందర్భంలో ప్రభుత్వ కళాశాలల్లో చదవడానికి పిల్లలు వ్యతిరేకించడంతో, మరో నాలుగు చోట్ల పని వెతుక్కుని ఆమె, అప్పటికే నిర్మాణంలో ఉన్న మరో రెండు భవనాలను మాట్లాడుకుని, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, వాటిని చెల్లించడానికి నానా తిప్పలు పడుతూ అతను , మొత్తానికి భార్యాభర్తలిద్దరూ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పిల్లలను కార్పోరేట్ కళాశాలలో చదివించారు.
వారికి తెలిసిన విషయం ఒక్కటే. తమకు మల్లే తమ పిల్లలు కష్టపడ కూడదని. వాళ్ల ముందున్న లక్ష్యం ఒక్కటే. ఎన్ని ఇబ్బందులు పడైనా సరే తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని.
దానికి తగ్గట్టుగానే వారి శ్రమ,కల రెండూ కూడా అత్యద్భుతంగా ఫలించాయి. పిల్లలిద్దరికీ ఒకరికి ఇంజినీరింగ్ సీటు , మరొకరికి మెడికల్ సీటు దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేవు.
“ఒక మెరుపు వెంట పిడుగూ… ఒక మంచి లోన చెడుగూ……..చెల్లెమ్మ అన్నట్టుగా వారి సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు.
ఇంక విషయాన్ని ఎక్కువగా సాగదీయకుండా పాయింట్ లోకి వచ్చేస్తాను.
పెద్దవాడి స్నేహితులు ఓ 10 మంది దాకా షాపింగ్ మాల్ లో ఎంజాయ్ చేసి, పక్కనే ఉన్న వీళ్ళ ఇంటికి రావడంతో (వాళ్ల ఇల్లు ఎలా ఉంటుందన్న వివరణ నేను ఇవ్వడం అనవసరమనుకుంటాను) సదరు పుత్రరత్నం వాళ్లతో మాట్లాడటానికి బయటికి వెళుతూ, వాళ్ళమ్మను బయటకు రావద్దనీ, వాళ్ళు వెళ్ళేంత వరకూ లోపలే ఉండమని చెప్పాడు.
“గడ్డి మేసి ఆవు పాలిస్తుంది. పాలు తాగి మనిషి విషమవుతాడు. అది గడ్డి గొప్పతనమా ఇది పాల దోష గుణమా”
ఎంతో అపురూపంగా పెంచుకున్న ఆ తల్లి మనసు కకావికలమై పోయింది.
కాళ్ళ కింద నేల కదిలినట్లు, తానందులో కూరుకుపోతున్నట్లు అనిపించింది.
అలసిపోయి ఇంటికి వచ్చిన ఆమె భర్త ఈ విషయం తెలిసి నిశ్శబ్దంగా పడుకుని, తెల్లవారాక ఏమీ తినకుండానే పనికి వెళ్లాడు. అతని మౌనంలో ఇరవయ్యేళ్ళ శ్రమ ఉంది. అతని కంటి తడిలో దుర్భర దారిద్రంతో తాను చేసిన పోరాటం ఉంది. కష్టకాలంలో కుటుంబాన్ని ఒక కొలిక్కి తేవడానికి తన కెదురైన అనుభవాల సెగ ఉంది.
కార్పొరేట్ కాలేజీలో సీటు వచ్చేసరికి, ఆధునిక వస్త్ర ధారణ లో, అనర్గళంగా పలు భాషలు మాట్లాడుతూ, సెల్ఫ్ డ్రైవింగ్ లో అధునాతన కార్లు నడుపుతూ వచ్చే తల్లులను చూసేసరికి అంట్లు తోముకునే అమ్మను, తాపీ పట్టిన తండ్రిని తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి వాడికి నామోషి అనిపించింది.
ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదని నేనననుగానీ(ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఒకదాని కంటే ఒకటి ఎంత దారుణంగా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం) . అత్యంత బాధాకరమైన పలు సంఘటనలలో ఇది ఒకటి.

“ముద్దు గులాబీకీ ముళ్లుంటాయి మొగిలి పువ్వు లోనా నాగుంటాది………చెల్లెమ్మ

గులాబి పువ్వును చూసుకున్నంత అపురూపంగా పెంచారు. కానీ ఇప్పుడు దాని రంగుల సోయగం గానీ, దాని సౌకుమార్యం గానీ వారిని మురిపించడం లేదు సరి కదా , దానికున్న కంటకాలే వారి గుండెను గుచ్చుతున్నాయి. ఇరవయ్యేళ్ళ తమ కల ఫలించినందుకు ఆనందించాలో, తమ ఉనికే ప్రశ్నార్థకమైనందుకు బాధపడాలో అర్థం కాని స్థితి.

ఇటువంటి పిల్లలకు తెలియాల్సిన కొన్ని విషయాలు: ఉన్నత స్థాయిలో ఉన్న తల్లిదండ్రులను చూసి,నీ తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి నువ్వు అవమానంగా భావించడం కాదు.

  1. పాతికేళ్లు వాళ్ళ కండలు కరిగితే గానీ నువ్వు ఈ స్థాయికి రాలేదన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.
  2. నిన్ను ప్రయోజకుడిని చేయాలననే ఆలోచనే వారి శ్రమ శక్తికి అంకురమై, నీకు చక్కని జీవితాన్ని అందించాలనే ఆశయమే వారి సంకల్ప బలానికి ఊతమైందనే విషయాన్ని నువ్వెన్నడూ విస్మరించకూడదు.
  3. వారి పరిస్థితులు సాన అయితే వారిద్దరూ గంధపు చెక్కలై ఆ సాన మీద అరిగితేనే నువ్వు ఈ స్థాయికి రాగలిగావు.
  4. సానకు,చెక్కకు నడుమ లభించిన పరిమళ ద్రవ్యానివే నువ్వు.
  5. వీరు నా తల్లిదండ్రులు అని గర్వంగా వారిని ప్రపంచానికి పరిచయం చేసి చక్కని పుత్రునిగా, ఉత్తమ పౌరుడిగా నిన్ను నువ్వు నిలబెట్టుకుంటావో, సంకుచితత్వంతో నీ స్థాయిని దిగజార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది.
  6. నీ ప్రజ్ఞాపాటవాలను అద్భుతంగా నిరూపించుకున్నావు. సంతోషమే. కానీ నీ వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
  7. వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసికవేత్తలు ఎంతోమంది కేవలం సమాజ శ్రేయస్సు కోసమే చక్కని పుస్తకాలు రచించారు.
  8. ఆ పుస్తకాలు చదివి సమాజానికి ఒక చక్కని నమూనాగా నిన్ను నువ్వు మలుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మేడిపండు జీవితాలు. తెలివైన పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా, కుటుంబాన్ని అత్యంత నేర్పుతో నడిపిన కార్యశూరులుగా ఈరోజు సమాజం ముందు వారు నిలబడి ఉండవచ్చు. కానీ అంతరంగంలో మొదలైన కల్లోలం, రేపు ఇంకెంత తీవ్రరూపం దాలుస్తుందో అనే అభద్రతలో ఉన్న వారి పరిస్థితి ఎంత మందికి తెలుస్తుంది. బయటకు చెప్పుకోనూ లేక, లోపల దాచుకోనూ లేక సతమతమయ్యే మేడిపండు జీవితాలు మన చుట్టూ కోకొల్లలు.
September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నా ఇల్లు

by Laxmi Madan September 29, 2024
written by Laxmi Madan

అలాగే నిలబడ్డ సుదీపని చూసి వాళ్ళ అత్తగారు,

“నీకుఈ ఇంటి పద్ధతులను చెప్తాను. రేపటినుండి అన్నిటిని ఫాలో కావాలి”అని చెప్పి వంటింట్లోకి తీసుకెళ్లింది.

చేయాల్సిన పనుల జాబితాను చూపించింది.

“ఎలాగూ నువ్వు ఇప్పుడు జాబ్ చేయడం లేదు. కాబట్టి పనులన్నీ నేర్చుకొని చేయాలి”అని చెప్పి తన పడక గదిలోకి వెళ్ళిపోయింది సుదీప అత్తగారు వరలక్ష్మి.

అసలే కొత్తగా ఇంట్లోకి వచ్చిన సుదీపకు ఏమి అర్థం కాలేదు. పనులు అయితే ఏం చేయాలో చెప్పింది. కానీ, ఎక్కడ ఏం సర్దాలి? ఏం వండాలి? అవేవి అర్థం కాలేదు. ముందు స్నానం చేసి లోపలికి వచ్చింది. చక్కని చీర కట్టుకొని, జడ వేసుకొని, బొట్టు, కాటుక దిద్దుకుంది. పూజగది దగ్గరికి వచ్చింది. అసలు అది పూజా మందిరమేనా? అనిపించింది. ఎక్కడికక్కడ దుమ్ము పేరుకొని ఉంది. దీపాలు వెలిగించిన కుందులు జిడ్డు కారిపోతున్నాయి. అసలు గదిని శుభ్రపరచిన దాఖలాలే కనిపించలేదు. ముందుగా దేవుడి గదిని శుభ్రపరిచింది. తనకు కూడా పెద్దగా పనులేమీ అలవాటు లేదు. కానీ తన తల్లి చేసేవి గుర్తుకు చేసుకొని ఒక్కొక్కటి శుభ్రపరిచింది.

పూజ పూర్తి చేసుకుని, చెంబులో నీళ్లు తీసుకొని తులసి కోట దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో తులసి కోట ఎక్కడా కనిపించలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది సుదీపకు.

మళ్లీ నిద్రపోయి లేచి వస్తున్న అత్తగారు వరలక్ష్మిని అడిగింది.
“అత్తయ్యా! తులసి చెట్టు ఎక్కడ ఉంది పూజ చేసుకుంటాను”అని అడిగింది.

“తులసి చెట్టు లేదు అప్పుడు ఎప్పుడో ఉండేది” అంటూ బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు.

కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనిపించింది సుదీపకి.

ఊపిరి సలపని పని చేయడం అలవాటు చేసుకుంది. భర్త సపోర్ట్ దొరకదని అర్థం అయిపోయింది. ఆయన ఎంతసేపు తల్లి ,చెల్లె భజన చేయడమే సరిపోయేది. మామ గారి గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. భార్య ఎంత అంటే అంత .అంతేగా అంతేగా అనే టైపు.

అంత పని చేయాలి. కానీ సొంత నిర్ణయం ఏది తీసుకోకూడదు. చివరికి టిఫిన్ చేయాలన్నా, రెండవసారి టీ పెట్టాలన్న, అత్తగారిని పర్మిషన్ అడగాలి. ఒక వస్తువు పక్కకు జరపాలన్న ఆడపడుచు ఆజ్ఞ కావాలి.

చూచాయిగా భర్తతో తన బాధను పంచుకోవాలని ప్రయత్నించింది. అసలు చెప్పక ముందే లేచి కొడతాడా అన్నంత దూకుడును చూసింది. అంతే తన మనసులోని భావాలకు కళ్లెం వేసింది.

మెల్లిగా జాబ్ కు అప్లై చేసింది. ఒకరోజు ఇంటర్వ్యూ కోసం వెళ్లాలని త్వరగా లేచి వంటింటి పని మొత్తం పూర్తి చేసి తయారై బయటకు వచ్చింది. అప్పుడే లేచి బయటకు వచ్చిన వసుంధర

“ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? పొద్దున్నే తయారయ్యావు? అని అడిగింది.

“ఇంటర్వ్యూ ఉంది అత్తయ్య నేను ఇంటికి వచ్చేవరకు మూడు గంటలు అవుతుంది. వంట మొత్తం చేసి పెట్టాను” అని చెప్పింది.

“ఇప్పుడు నువ్వు జాబ్ చేయకుంటే గడవదా?మా అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు. ఇంకా మీ మామగారు కూడా రిటైర్ అవ్వలేదు. నువ్వు వెళ్లిపోతే ఇంట్లో పని అంతా ఎలా? “అని అన్నది.

ఆమె ఉద్దేశం సుదీపకు అర్థం కాలేదు. పెళ్లి కుదిరిన తర్వాత తాను తన పుట్టిన ఊళ్లో ఉండడం కుదరదు. కాబట్టి అక్కడ ఉద్యోగం చేయలేక భర్తతోపాటు అత్తవారింటికి వచ్చింది .ముందు అనుకున్న ప్రకారం వేరే ఉద్యోగం చూసుకోమని ఇంట్లో అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్న వైనం చూస్తే బాధ కలిగింది సుదీపకి.

కానీ మనసులో ఒక స్థిరమైన నిశ్చయానికి వచ్చి”నేను జాబ్ చేస్తానండి. నా తల్లిదండ్రులు ఇంత చదివించింది ఉద్యోగం చేయాలని కదా? స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. వాళ్లు సంపాదిస్తున్నారు కదా అని నేను ఊరికే ఉండలేనండి”అని మెల్లిగా జవాబు ఇచ్చింది.

ఆ జవాబు ఊహించని వరలక్ష్మి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. అక్కడికి వచ్చిన శ్రీకర్

“కొన్నాళ్ల తర్వాత చేదువులే ఇప్పుడు ఏముంత తొందర వచ్చిందని?”అన్నాడు సుదీప తో.

కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకున్న సుదీప

“తొందర ఏం లేదండి దాదాపు ఆరు నెలలుగా నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు నేను జాబ్ చేస్తాను .కాబట్టి మీరు కొన్ని రోజులు ఇంట్లో ఉండి చూడండి”అన్నది ముఖంలో భావం ఏమీ కనిపించకుండా.

కోపంతో శ్రీకర్ కూడా అరిచాడు.

కానీ ఒక నిర్ణయానికి వచ్చిన సుదీప తన ఫైల్ మరియు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని దేవుడికి నమస్కారం చేసి చిరునవ్వుతో వెళ్ళొస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయింది.

సుదీప వెళ్ళిన అరగంట దాకా ఇంట్లో యుద్ధం నడుస్తూనే ఉంది.

ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని వచ్చిన సుదీపకి అత్తగారి మొహం మాడిపోయి ఉండటం ,భర్త ముఖంలో కోపం తాండవ మాడటం కనిపించింది.

మౌనంగా లోపలికి వెళ్లి బట్టలు మార్చుకొని వంటింట్లోకి వెళ్ళింది. అసలు అది ఇల్లేనా అనిపించింది. నెమ్మదిగా అన్ని సర్దేసి భోజనం చేసి తన గదిలోకి వచ్చి పడుకుంది.
ఉద్యోగంలో జాయిన్ అయిన సుదీపకు ఇంకా పనులు ఎక్కువైపోయాయి.
ఇంట్లో ఊరికే ఉండే అత్తగారు చిన్న చిన్న పనులకు కూడా సహాయం చేయదు. ఉద్యోగానికి వెళుతూ కూడా తను అన్ని పనులు చేసి వెళ్ళాలి. రాను రాను యంత్రంలా అనిపించింది బ్రతుకు. అసలు ఉద్యోగం ఎందుకు చేస్తున్నానని ఒక దశలో భావించింది .కానీ అదే “ఇంట్లో ఇలా రోజంతా గానుగెద్దులా చాకిరి చేస్తుంటే మనస్సు కూడా పంజరంలో చిక్కినట్లు అయిపోతుంది. కనీసం ఈ ఎనిమిది గంటలైనా మనసుకి స్వేచ్ఛగా ఉంటుంది” అని తలచింది.

ఆఫీసులో సుదీప పని మెచ్చుకొని చాలా తొందరగా ప్రమోషన్ ఇచ్చారు .

ఆఫీసర్ గదిలోకి వెళ్లిన సుదీపకి ప్రమోషన్ ఆర్డర్ చేతిలో పెట్టింది వాళ్ళ బాస్ సౌందర్య.

“కంగ్రాట్యులేషన్స్ సుదీప, ఇంత త్వరగా ప్రమోషన్ సంపాదించుకున్నావు. నీ పనిని నచ్చిన మన కంపెనీ వాళ్ళు నీకు శాలరీ పెంచడంతోపాటు ప్రమోషన్ ఇచ్చి, నీకు వెహికల్ కూడా ఇచ్చారు. కాకపోతే నీ జాబ్ ఇక్కడికి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట ఉంటుంది.”అని చెప్పింది సౌందర్య.

అంతా బాగానే అనిపించినా” వేరే ఊర్లో అంటే ఇంట్లో ఒప్పుకుంటారా?” అని భయమేసింది.. సౌందర్య తో ఉన్న చదువుతో తనకి విషయం చెప్పింది.

“ఏ కాలంలో ఉన్నావు సుదీపా? నిన్ను ఇంట్లో పనులు చేయొద్దని నేను చెప్పడం లేదు. కానీ నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా! వాళ్లతో పాటు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు .మరి ఇంత చాకిరీ చేసి బయటకి రావాలంటే కష్టం కదా! నీ భర్త అర్థం చేసుకోవడం లేదు. అయినప్పుడు ఎందుకు నెత్తిన బాధ్యతలు వేసుకుంటావు. చిన్న చిన్న పనులని ఆడపడుచు కూడా సహాయం చేయవచ్చు. నీ భర్త సహకారం అసలే లేదు. ఎవరికోసం ఈ త్యాగం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు కచ్చితంగా చెప్తున్నాను. నువ్వు వేరే చోట జాబ్ చేయాల్సిందే. అప్పుడైనా వాళ్లకు నువ్వంటే ఏంటో అర్థమై నిన్ను ఒక మనిషిలా చూస్తారేమో? అయితే ఒక చిన్న లిటిగేషన్ పెడతాను నువ్వు ఇంట్లో చెప్పు’ నాకు ప్రమోషన్ వచ్చింది ఒకవేళ ఆ ప్రమోషన్ యాక్సెప్ట్ చేయకుంటే జాబ్ రిజైన్ చేయమంటున్నారు. శాలరీ కూడా పెరిగింది’ అనే విషయం చెప్పు అది కూడా వేరే ఊళ్లో చేయాలని నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్. ఒప్పుకోకుంటే కామ్ గా వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వు. మరొక విషయం ఏమిటంటే నన్ను కూడా అదే బ్రాంచ్ కి పంపిస్తున్నారు. కాబట్టి నువ్వు నాతో ఉండొచ్చు”అని చెప్పింది.

ఇంటికి వచ్చిన సుదీప ఈ విషయం ఇంట్లో చెప్పింది అందరూ పెద్ద రాద్ధాంతమే చేశారు.

కానీ స్థిరమైన నిర్ణయం తీసుకున్న సుదీప

“జాబ్ రిజైన్ చేస్తే నాకు వచ్చే ఇంత శాలరీ పోతుంది. రేపు మనందరం బాగుండాలంటే నా శాలరీ కూడా అవసరమే కదా! రేపు మన అవసరాలు కూడా పెరుగుతాయి”అని చెప్పింది. డబ్బు గురించి అలోచించి ఒప్పుకున్నారు.

తొందరలోనే వేరే ఊర్లో ఉద్యోగానికి వెళ్ళసాగింది సుదీప. శని, ఆదివారాలు మాత్రమే ఇంటికి వచ్చేది.

మెల్లిమెల్లిగా వరలక్ష్మికి అర్థం కాసాగింది. ఉద్యోగానికి వెళితే కూడా ఇల్లును అందంగా ఉంచేది సుదీప. ఇప్పుడు ఆ కోపాన్ని కూతురు, కొడుకు మీద తీర్చుకో సాగింది.

“సుదీప అన్ని పనులు చేస్తూ ఉద్యోగానికి వెళ్ళేది. ఇప్పుడు పెద్దదాన్ని నేను ఇన్ని పనులు చేస్తుంటే, మీరు ఒక్క పని సహాయం చేయడం లేదు”అని అరిచింది.

మెల్లమెల్లగా అందరూ తలాఒక పనిచేయడం నేర్చుకున్నారు. శని ఆదివారాలు మాత్రం భారం అంతా సుదీప మీద పడేది.

రోజులు గడుస్తున్నాయి సుదీపకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక కొత్త ఇల్లు కట్టుకున్నారు. అప్పటికే సుదీప కొడుకు పెళ్ళీడుకు వచ్చాడు.

ఒక మంచి శుభ ముహూర్తంలో సుదీప కొడుకుకు పెళ్లి చేసింది.

ఎంతో సంతోషంగా పెళ్లి వేడుకను జరిపించిన సుదీపకి ఇక కొడుకు కోడలితో హాయిగా ఉండాలని అనుకుంది.

కోడకు వచ్చిన వారం రోజులకి ఇంట్లో మార్పులు మొదలయ్యాయి.

ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన సుదీపకి, తన అభిరుచులకు అనుగుణంగా పెట్టుకున్న వస్తువులు ఏవి కనిపించలేదు. వాటి స్థానంలో కొత్త బొమ్మలు కొత్త పెయింటింగ్స్ వచ్చి ఉన్నాయి.

“ఇదేంటి? ఎవరు ఇవన్నీ తీసేసారు?”అని అడిగింది సుదీప.

లోపల ఉండి బయటకు వచ్చిన కొడుకు కోడలు ,

“అవన్నీ ఓల్డ్ మోడల్ అత్తయ్య !అందుకని నేను ఇవన్నీ నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ లను ఇలా అరేంజ్ చేసుకున్నాను”అన్నది కోడలు ప్రియ.

“ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మ, ఇవన్నీ నేను ఎంతో ఇష్టంతో అలంకరించుకున్నాను. వీటిని ఒక వైపు ఉంచి, నువ్వు తెచ్చినవి మరోవైపు సర్దుకోవాల్సింది”అన్నది సుదీప నెమ్మదిగా

“ఏంటమ్మా అన్ని నీఇష్టా లేనా? పెళ్లయి అత్తగారింటికి వచ్చిన అమ్మాయికి, తన ఇష్టం వచ్చినట్లు సర్దుకోవాలని ఉండదా? ఇంకా నీ అథారిటీనేనా ? ఆ పాత బొమ్మలు ఏం చేసుకుంటాములే”అంటూ వెళ్లిపోయాడు.

సుదీప కు భూమిలోకి కృంగిపోతున్నట్లు అనిపించింది.

తనకు ఏ ఇంట్లో స్థానం లేదు అనేది అర్థమైపోయింది అలాగే నిస్సత్తుగా కూర్చుండిపోయింది.

తర్వాత స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి కృష్ణుడి కళ్ళలోకి చూసింది.

ప్రశాంతంగా అనిపించింది.గీత బోధించినట్లు అనిపించింది.

“ఇల్లంతా ఎవరి అభిరుచికి తగ్గట్లు ఉన్నా, దేవుడి గదిలోకి మాత్రం ఓపికగా ఎవరూ రారు. కాబట్టి ఇది మాత్రమే నాకు సొంతం.” అని కళ్ళు మూసుకొని కృష్ణ భజన చేసుకో సాగింది తన్మయత్వంగా.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

“ మే ఓర్ మేరా ఆంగన్”

by Vijaya Ranganatham September 29, 2024
written by Vijaya Ranganatham

మూలం : వారాల ఆనంద్

న దహలీజ్ ఘర్కె సామ్నే
న పీఛే పిచ్వాడే మే

న చార్ దివారోంకో నీవ్
దేఖాతో న ఊపర్ ఛత్ మేరా

కిసీకో న బరోసా

ఘర్ మే న హవా

హైతో సిర్ఫ్ వైఫై

సబ్ అపనే అపనే కమ్రేమే

ఘూమ్ రహీహై ఆశాయే

భడక్ రహీ హై ఇఛ్ఛాయేఁ

సన్నాట ఛా జాతా హై సబ్ మే

శబ్దోఁ నే ఫాంసీ కర్లియా హై దివారోంపే

బజ్ రహే హై అలార్మ్ కి తరహ్ సెల్ ఫోనేఁ

అభివాదన్ వాట్స్ప్ మే

చమక్ రహే హై పోస్టే ఇన్టాగ్రామ్ మే

నాచ్ తే రహతే హై యూ ట్యూబ్ ఓర్ ఓటిటి

గుసా ఆయా హై షహర్ మేరే ఘర్ మే

ఆతే ఆతే దునియాఁకో అపనీ ముట్టీమే జకడ్ కర్ లాకే ఘర్ కే ఆంగన్ మే డేర్ దాలే హై

మైనే డర్తే హువే మేరేహి ఘర్ మే పరాయా పన్ క ఛఠాయి బిచాకే ఛుప్ కర్ హాత్ పాఁవ్ బాంద్ కే బైఠా హూఁ ఏక్ కోనే మే

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

విశ్వకవి : రవీంద్రనాథ్ ఠాగూర్

by Radhika Suri September 29, 2024
written by Radhika Suri

కవి ,రచయిత,ఆధ్యాత్మికవేత్త ,
తత్వజ్ఞాని. బహుముఖ ప్రజ్ఞాశాలి యైన వీరు కలకత్తాలో మే 7 ,1861న జన్మించారు . దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవిల 14వ సంతానమైన వీరు, ప్రముఖ బెంగాలీ రచయిత. నాలుగు గోడలకే పరిమితమైన బాల్యంతో బయట ప్రపంచం వింతగా తోచేది వీరికి. బాల్యంలో పాఠశాల చదువు ఇష్టపడక ఇంటి వద్దే చదువుకొనసాగించినా చక్కని క్రమశిక్షణతో వ్యాయామం, లెక్కలు, భూగోళం ,సంస్కృతాంగ్లాలను అభ్యసించారు. లలిత కళలపై ఆసక్తితో చిత్రలేఖనం ,సంగీతం నేర్చుకున్నారు. కాళిదాసు, షేక్స్పియర్ రచనలు బాగా చదివారు. రవీంద్రుడు తన16వ యేటనుండే రచనలు చేయడం మొదలు పెట్టారు.వీరు సాంప్రదాయ, సంస్కృత భూయిష్టపు రచనాపద్ధతిని వీడి వ్యావహారిక భాషలో రచనలు చేసి సాహిత్యాభిమానులకు చేరువయ్యారు వీరి మొదటి నాటకం ‘వాల్మీకి ప్రతిభ’.

బెంగాలీ గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టపడే ఈయనకు కవిత్వం ప్రియవస్తువైనా పద్యాలు ,నవలలు,నృత్యనాటికలుచిన్న కథలు, కాల్పనిక రచనలు, వ్యాసాలు ,విమర్శలుఇలా ఎన్నో ప్రక్రియల్ని సృజించారు. వీరికి సంగీతమంటే ఎంతో మక్కువ సుమారు 2,230 గీతాలు రచించారు.’సంధ్యా గీతం ‘కావ్యాన్ని కవులంతా ప్రశంసించారు. తండ్రి వీరి రచనలు విని,ప్రచురణకు అవసరమయ్యే డబ్బును సమకూర్చేవారట. విర్గరేర్ స్వప్న భంగ , సంగీత ప్రభాత కావ్యాల్ని రచించారు. రవీంద్రుడు ఇంగ్లాండు లోని ఓ పబ్లిక్ స్కూల్లో చేరి ,ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలకు ఆకర్షితులై , ఆంగ్ల నాటకాలకు, కచేరీలకు వెళ్లడంతో భాష పై పట్టు ఏర్పడింది. 1883 డిసెంబర్ 9న మృణాళినీ దేవిని వివాహమాడారు. భగ్న హృదయం కావ్యాన్ని ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే
రాశారు

వీరి’ గీతాంజలి ‘చాలా గొప్ప రచన. బెంగాలీలో రచించిన కొన్ని భక్తి గీతాలను ఆంగ్లంలోకి అనువదించి ‘గీతాంజలి ‘అని పేరు పెట్టారు .103 బెంగాలీ పద్యాల సంకలనం. ఎన్నో భాషల్లోకి అందించబడిందీరచన .శ్రమైక జీవన సౌందర్యాన్ని, సార్వజనీన ప్రేమమయ జీవనంలోని మాధుర్యాన్ని సూచించే సందేశాత్మక సమాహారమే గీతాంజలి. 1913లో ‘గీతాంజలి’ కి సాహిత్యాంశంలో ‘నోబెల్ ‘బహుమతి లభించింది. ఆసియా ఖండంలో ఈ బహుమతి పొందిన తొలి వ్యక్తిగా కీర్తించబడ్డారు.వీరు ప్రేమ, శాంతి,సామర్థ్యాలే ప్రధానాంశంగా తీసుకుని చేసిన రచనలకు ఎంతోమంది స్ఫూర్తి పొందారు.
అప్పటినుండి వారు ‘విశ్వకవి’ గా కీర్తిగాంచారు.అందరూ’ గురుదేవ్’అంటూ ఆప్యాయంగా పిలుచుకునేవారట. సనాతన పద్ధతిలో బాలల మనోవికాసానికి ‘గురుకులం’ తరహాలో ‘శాంతినికేతన్’ గా ప్రసిద్ధిగాంచిన ‘విశ్వ భారతి ‘విశ్వవిద్యాలయాన్ని 1921 డిసెంబర్లో స్థాపించారు. మొదట అయిదుగురితో ప్రారంభమై క్రమంగా విస్తరించబడింది. చిన్నపిల్లలకు ఉపాధ్యాయుల ఇళ్ళల్లోనే వసతి కల్పించి , భోజన సదుపాయాలన్నీ అక్కడే జరిగేవి. క్రమశిక్షణతో కూడిన దినచర్యలో భాగంగా సత్యాన్ని పలకడం , మితమైన నిద్ర, పరిశుభ్రత, గురువుల్ని, పెద్దల్ని గౌరవించడం, నడక యొక్క ప్రాధాన్యత నేర్పేవారు. 1919లో కళాభవన్ స్థాపించారు, ఇందులో వివిధ కళల్ని నేర్పించేవారు. గ్రామాభ్యుదయంతోనే దేశ పురోగతి సాధ్యం అనేది వీరి భావన. దానికోసం’ శ్రీనికేతా’న్ని ఏర్పాటు చేసి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. ‘వాల్మీకి ప్రతిభ’ వీరి మొదటి నాటకం కాగా, పోస్ట్ ఆఫీస్ చిత్రాంగద, ప్రకృతి – ప్రతీక ఇలా ఎన్నో నాటకాల్ని రాశారు. సాంఘిక ప్రయోజనం ,సందేశాత్మక మైన నవలగా ‘గోరా ‘ వీరికి ఎంతో పేరు తెచ్చి పెట్టింది.
రవీంద్రులు తమ 70వ యేట చిత్రకళను సాధన చేసి, వేసిన చిత్రాలు లండన్ ,పారిస్, న్యూయార్క్ మొదలైన నగరాలలో ప్రదర్శించబడ్డాయి. దాదాపు 2,000ల చిత్రాలు గీశారు. విశ్వ కవికి సంగీతం అంటే వల్లమాలిన ప్రేమ ,ఆయన బెంగాల్ జానపద గీతాల్ని, బాపుల్ కీర్తనల్ని విని పరవశించేవారు. స్వయంగా గాయకులైన వీరు’ రవీంద్ర సంగీత్’ అనే ప్రక్రియ ప్రవేశపెట్టారు.

దేశభక్తి మెండుగా గల వీరు
దేశభక్తి గీతాలు పాడుతూ ,ప్రబోధాత్మకమైన పద్య గేయం రచించారు. బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ ను నిర్బంధించినప్పుడు తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ విభజన ప్రతిఘటన ఉద్యమంలో వీరిది ప్రముఖపాత్ర. జాతీయ నిధికి విరాళాలు కూడా సేకరించారు. ఠాగూర్ 1896 కలకత్తా కాంగ్రెస్ సదస్సులో బంకించంద్ర ఛటర్జీ రాసిన’ వందేమాతర’ గీతాన్ని ఆలపించారు .జాతీయ గీతాన్ని ప్రకటించే ముందు ‘వందేమాతరం’, ‘జనగణమన’ రెండింటిలో దేన్ని ‘జాతీయగీతం’ గా తీసుకోవాలనే తర్జనభర్జనల నడుమ’ రాజ్యాంగ కమిటీ’ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ గారు 1950 జనవరి 24న రవీంద్రుని జనగణమనను’ జాతీయగీతం’ గా ‘వందేమాతరా’న్ని జాతీయగేయంగా ప్రకటించారు. రెండింటికీ సమాన ప్రతిపత్తి (హోదా) కలిగిఉంటుందని పేర్కొన్నారు .రవీంద్రుని రచనల్లోని కొన్ని ప్రభావిత పంక్తులు: ‘ గీతాంజలి’ — ఈ మంత్రములు, జపమాలలు విడిచిపెట్టు, తలుపులన్నీ బంధించి ఈ చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావు? కళ్ళు తెరిచి చూడు నీవు ఆరాధించే దేవుడు నీ ఎదుట లేడు ఎచట రైతు నేలను దున్నుతున్నాడో, ఎచట శ్రామికుడు రాళ్లు పగలగొడుతున్నాడో అచట ఆ పరమాత్ముడు ఉన్నాడు .వారితో ఎండలో వానలో ధూళీ దూపరితములైన వస్త్రములలో ఉన్నాడు. నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి ఆ నేల మీదికి పద . అంటూ ..ఉపదేశిస్తూనే
2.ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అక్కడ దేశాన్ని నిలుపు అనడంలో వారిలోని దార్శనికులు మన కళ్ళముందు కదలాడుతారు. ఈ వాక్యాలు మహాత్మాగాంధీకి చాలా ప్రియమైనవి . జవహర్లాల్ నెహ్రూ ఒక సందర్భంలో రవీంద్రుని ప్రభావం తనపై ఎంతో ఉందని పేర్కొన్నారు. అలాగే గాంధీజీని మొదట ‘మహాత్మా ‘అని పిలిచింది కూడా ఠాగూర్ గారే.
1915 లో బ్రిటిష్ వారు ‘నైట్ హుడ్ ‘బిరుదు ప్రధానం చేయగా జలియన్ వాలాబాగ్ దురాగతానికి నిరసనగా 1919లో దానిని తిరస్కరించారు. బంగ్లాదేశ్ జాతీయ గీతం ‘అమర్ సోనార్ బంగ్లా ‘కూడా వీరు రచించిందే.

ఠాగూర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ,ఇద్దరు కుమారులు తమ 70వ పుట్టినరోజున 1918లో తాను స్థాపించిన విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఠాగూర్ ఇలా అన్నారు: నేను అనేక కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాను, నిజమేకానీ నా అంతరంగం వీటిలో దేనిలోనూ కనిపించదు. నా ప్రయాణం ముగింపులో నా జీవిత గోళాన్ని కొంచెం స్పష్టంగా చూడగలుగుతున్నాను .వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కవిని (అమీ కవి) మాత్రమే అని నాకు కచ్చితమైన అభిప్రాయం అంటారు.

జీవితంలో ప్రతిరోజు ,క్రితం రోజు కన్నా కాస్తోకూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలంటారు. ‘కళ్ళకు రెప్పలు ఉన్నట్లే ‘మనిషి కి విశ్రాంతి ఉండాలని వీరి అభిప్రాయం.
‘ కాగితపు పడవ’లోని జ్ఞాపకాల దొంతరలోని పంక్తులు కొన్ని : రోజురోజుకు నేను నా కాగితపు పడవలను ఒక్కొక్కటిగా నడుస్తున్న ప్రవాహంలోకి తేలేను. పెద్ద నల్లని అక్షరాలతో వాటిపై నాపేరు ఊరు రాస్తానంటారు.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రవీంద్రుడు మానసికంగా కృంగిపోయి అనారోగ్యం పాలయ్యారు .వ్యాధి తీవ్రతతో 1946 ఆగస్టు 7న స్వర్గస్తులైనారు. ‘మై రెమినిసెన్సెస్’ పేరుతో ఆత్మ కథను రాసుకున్నారు.

కొంగర జగ్గయ్య గారు ‘రవీంద్ర గీత’ పేరిట గీతాంజలిని అనువదించారు. తెలుగులో అనువదించబడిన తొలి రచన అందులోని కొన్ని పంక్తులు :
మూడు ప్రొద్దున చిమ్మట లోదిగిల్ల
పదము పాడుచు నేల దున్నే దము మేము
మా కరంములు లోహ సలాక లయ్యు
మా మనమ్మలు మవ్వపు మండసములు అంటూ అనువదించగా,

రామస్వామి నాగరాజు గారు అనువదించిన గీతాంజలిలో తమకు ఇష్టమైన 53వ కవిత:
“ఎంత అందంగా ఉంది
రవ్వలతో రంగురంగుల రత్నాలతో నైపుణ్య యుక్తియుక్తంగా చెక్కబడిన
నీ నక్షత్ర కర కంకణం”అంటూ హృద్యంగా తెనిగించారు.

ఇలా ఎంతోమంది గురుదేవునిపై అభిమానంతో తమ భాషా నైపుణ్యానికి పదునుపెడుతూ చక్కని అనువాదాలతో సాహితీసుధను మనకందించారు.

రచయితగా, సంగీతజ్ఞునిగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవీయవిలువలున్న మహాశక్తి గా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయారు ఠాగూర్.
రవీంద్ర జయంతిని బెంగాలీలు ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు. వేకువ ఝాము నుండే తమ తమ గృహ సముదాయాల్లో రవీంద్రసంగీతాన్ని వింటూ నివాళులర్పిస్తారు. విద్యా సంస్థలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి . విదేశీ విద్యార్థులు సైతం ఈ వేడుకలలో భాగస్వాములౌతారు. ఇంత గొప్ప గౌరవాన్ని పొందిన ఆ సాహితీవేల్పుకు అక్షర ప్రణతులర్పిస్తూ.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కల్తీయుగం

by Rudrakhala Matam Prabhu linga Shastri September 29, 2024
written by Rudrakhala Matam Prabhu linga Shastri

శ్రీకృష్ణుడి నిర్యాణముతో
తదుపరిది “కల్తీ” యుగమే.
అది ‘కల్తీ’ కావున దీనిని
“కలి” అని అంటున్నారేమో!

ఈ యుగమందే అవైదిక
మతాలు ఆవిర్భవించాయి.
‘కల్తీ’ కావున “ఆత్మ” కు
వేరే అర్థాన్ని చెప్పినాయి.
దేవుడు లేడు అంటూనే
ఆలయాలే కట్టకున్నాయి.

భారతీయ ఆధ్యాత్మిక
చింతన అంటే “కర్మ”యే
ఈ ‘కర్మ’ను కూడా వేరే
విధంగావాడుకొని “కర్మ”
సిద్ధాంతం తప్పంటున్నాయి.

కొంతమంది పండితులేమో
అజ్ఞానంతో పురాణాలను
ఆత్మరక్షణకు ఆధ్యాత్మికాన్ని
ఆశ్రయిస్తూ ప్రతినిత్యం
భారతీయ “సనాతనం”ను
యథేచ్ఛగా’కల్తీ’చేస్తున్నారు

మన తెలుగు భాషంతా ‘కల్తీ’యే
అచ్చ తెలుగు అనవాలే కరువు.
వివాహాది శుభకార్యాలలో “కేక్”
కటింగ్ లతో ‘కల్తీ’దే రాజ్యం.
అర్చనాది క్రతువులలో ‘మడి’
కూడా పట్టు దుస్తులతో ‘కల్తీ’.

అంతర్జాతీయ ‘కల్తీ’లతో సినిమా.
పొసగని వార్తల మీడియా ‘కల్తీ’!
‘కల్తీ’లతో కులాచారాలన్ని అంతం.

మాగపెడుతున్న పండ్లు ‘కల్తీ’యే.
మినరల్ వాటర్, డ్రింక్స్ ‘కల్తీ’యే.
హోటల్ తిండి ‘కల్తీ’కి మారుపేరే!

‘కల్తీ’యుగ దేవుడి “లడ్డు”
కూడా ‘కల్తీ’ యని ఆ దేవుడే
అందరి కళ్ళు తెరిపించాడేమో?

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆత్మ సౌందర్యం

by Radhika Suri September 29, 2024
written by Radhika Suri

కళ్ళు మాత్రమే చెప్తాయి నిజమైన అందానికి సరైన చిరునామా
చూసే కళ్ళను బట్టే కదా అందాన్ని బేరీజు వేసేది
మాటల మాటున దాగిన సంస్కారానికి
ఆత్మ సౌందర్యం ఆభరణమై భాసిస్తే
మురిసిన మనసు మయూరమై నాట్యమాడుతుంది
హంగులు ఆర్భాటాల వెంట పరుగులు పెడుతూ
నిజమైన సౌందర్యాన్ని చేజార్చుకోకు
సౌశీల్యానికి మించిన సౌందర్యం లేదు
రంగుటద్దాల మాటును దాగిన సొగసులన్నీ పై పూతలే
నీ మనసును కమ్మిన మాయపొర తీసి చూడు
అసలు సిసలైన అందం నీ కంటబడుతుంది
ప్రకృతి సోయగ మెంతో సహజమైనది
గడ్డి పూలలో దాగిన చక్కదనాన్ని మనసు పెట్టి చూడు
కష్టించే చేతుల్లోని శ్రమ సౌందర్యాన్ని చూడు
అమ్మ ప్రేమలోని చెలువమెంత కమ్మనైనదో చూడు
దేహ సౌందర్యాన్ని చూసి మిడిసి పాటెందుకు
ఎంతో కాలం నిలువని ఆ బాహ్య సౌందర్యంపై మక్కువేల
తలపుల్లో సొగసు తావులు
విరజిమ్మాలి
మనోహరమైన హరివిల్లులా
వర్ణ రంజితం కావాలి
ఇన్ని ప్రయాసలెందుకు ఒక్క క్షణం కండ్లుమూసి చూడు
రెప్పల మాటున దాగిన చిత్త సౌందర్యం ఎంత గొప్పదో!

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

జీవనమాధుర్యం

by Laxmi Madan September 29, 2024
written by Laxmi Madan

రెండవ భాగం
🌹🌹🌹🌹🌹🌹🌹

అలా ఎన్నో ఊహలతో ఉన్న అ దాపర్ణకి తను దిగాల్సిన ఊరు ఎప్పుడు వచ్చిందో చూసుకో లేదు. అప్పటికే బస్సు అంత ఖాళీ అయిపోయింది. కండక్టర్ అన్నాడు” మేడం ఇదే లాస్ట్ స్టేజ్ దిగండి”

” ఒక్కసారిగా ఊహా ప్రపంచం నుంచి బయటకు వచ్చి కిటికీలో నుండి బయటకు చూసింది. బస్టాండ్ అంతా కోలాహలంగా ఉంది .తను ఎక్కిన బస్సు ఖాళీగా ఉంది ,వెంటనే తన సూట్ కేసు బ్యాగు తీసుకుని కిందకు దిగింది.

ఎదురుగా కనబడిన మనుషులు చూసి ఆశ్చర్యపడింది. అతను ఎవరో కాదు రామాలయంలో పూజ చేసే పూజారి. వయసు పైబడి నడవలేక నడుస్తూ బసు కోసం అనుకుంటా ముందుకు వస్తున్నాడు.

అపర్ణ వెళ్లి పలకరించింది.

“పెద్దనాన్న బాగున్నారా”అన్నది అపర్ణ.

“ఎవరు తల్లి, నాకు చూపు అనడం లేదు గుర్తుపట్టలేకపోతున్నాను” అన్నాడు వణుకుతున్న శరీరంతో.

“నేను దక్షిణామూర్తి గారి అమ్మాయిని. నా పేరు అపర్ణ .చిన్నప్పుడు మీ అమ్మాయి, నేను ఇద్దరం కలిసి స్కూలుకు వెళ్లే వాళ్ళం గుర్తొచ్చిందా? పెదనాన్న”అని చెప్పింది అపర్ణ.

గుర్తుపట్టినట్లు తలాడించాడు పూజారి గారు. బ్యాగ్ లో నుంచి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టి

“ఇది ఉంచండి” అన్నది అపర్ణ.

“ఎందుకు బిడ్డ, నాకు డబ్బులు అవసరం ఉన్నవని నీకు అర్థం అయ్యిందా”అన్నాడు నవ్వుతూ.

“బస్సు వచ్చింది నేను వెళ్తాను బిడ్డ. వెళ్లే లోపల మా ఇంటికి రా?”అని చెప్పి కర్ర సహాయంతో ముందుకు వెళ్లిపోయారు పూజారి గారు.

ఒక్క నిట్టూర్పు వదిలింది అపర్ణ .”రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో అర్థం కావడం లేదు. పూజారి పెద్దనాన్న గుడిలో అలంకరించిన తీరు చూస్తే ఎంతో బాగుండేది. ఏంటో ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నారు” అని బాధపడింది.

తన స్నేహితురాలు వసంతకు ఫోన్ చేసింది..

” వసంతా! నేను మన ఊర్లో బస్సు దిగాను. మీ ఇల్లు ఎటువైపు ?చెబితే నేను వచ్చేస్తాను” అని చెప్పింది.

” వచ్చేసావా?కాస్త ముందే ఫోన్ చేయకూడదా? కార్ పంపిస్తాను, ఐదు నిమిషాలు వెయిట్ చెయ్.. మన ఊరు నువ్వు చూసినప్పటిలా లేదులే. చాలా మారిపోయింది. నువ్వు మా ఇల్లును గుర్తుపట్టలేవు.అక్కడే ఉండు ” అని చెప్పింది వసంత.

” సరే” అని అక్కడ బెంచ్ మీద కూర్చుంది అపర్ణ.

బెంచ్ మీద తన పక్కనే ఒకతను కూర్చుని ఉన్నాడు.తెల్ల పంచె ,లాల్చీ వేసుకుని ఉన్నాడు. మనిషి బాగా ఎత్తుగా తెల్లగా ఉన్నాడు. వయసు దాదాపు 75 ఏళ్లు ఉంటుందేమో!

“ఎక్కడో చూశాను ఇతన్ని అని అనుకొని

“అయ్యో ఈయన డ్రాయింగ్ మాస్టారు ఆనందం సార్ కదా” అని అనుకొని,

” నమస్తే సార్ బాగున్నారా!” అని అడిగింది అపర్ణ.

” బాగున్ననమ్మా ! కానీ, నువ్వు ఎవరో నేను గుర్తు పట్టలేదమ్మ! ఏమీ అనుకోవద్దు .వృద్ధాప్యం కదా! కళ్ళు కాస్త మసకబారాయి” అని అన్నాడు అతను.

” నేను మీస్టూడెంట్ ను సార్, నాపేరు అపర్ణ.నేను క్లాస్ లో ఎప్పుడైనా మీరు ఇచ్చిన చిత్రాన్ని అచ్చంగా అలాగే వేస్తే, ఎన్నోసార్లు నన్ను మెచ్చుకున్నారు. ఆడ్రాయింగ్ పైన మీరు పెట్టే సంతకంతో పాటు ‘ గుడ్ ‘ అని పెట్టించుకోవాలని క్లాస్ అంతా ప్రయత్నించేవాళ్ళు. అందులో నేను ఒక దాన్ని.ఎన్నోసార్లు నన్ను మెచ్చు కున్నారు .” అని చెప్పింది అపర్ణ.

ఆనందం సారు కొంచెం ఆలోచిస్తున్నట్లుగా తలపైకెత్తి,

” ఆ !గుర్తొచ్చింది. తరగతిలో అల్లరి కూడా బాగా చేసే దానివి. చాలా సంతోషం తల్లి, నన్ను గుర్తుపట్టి మాట్లాడించినందుకు. ఎక్కడ ఉంటున్నావ్ ?ఏం చేస్తున్నావు? భర్త పిల్లలు అందరూ కులాసానా?” అని అడిగాడు సార్.

” అన్ని వివరంగా చెప్తాను సార్ .మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? మీఇంటి అడ్రస్ చేప్తే వస్తాను. నేను ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటాను. మీఇంటికి వచ్చి కాసేపు కూర్చొని అన్ని వివరాలు చెప్తాను” అని అన్నది అపర్ణ.

ఆనందం సార్ తన ఇంటి అడ్రస్ చెప్పి ,తను వెళ్లాల్సిన బస్సు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు.

అపర్ణ తన స్నేహితురాలు పంపించిన కారులో వాళ్ళ ఇంటికి చేరుకుంది. దారిలో ఊరంతా చూస్తుంది. తన పుట్టి పెరిగిన ఊరుకు, ఇప్పటి ఊరుకు పోలికే లేదు. అంతా పట్టణ వాతావరణం లాగే ఉంది.

” వసంత చెప్పినట్లు నేను ఒక్కదాన్ని వెళ్లడం కష్టమే” అని అనుకున్నది. ఇంతలో కారు ఇంటి ముందు ఆగింది .

కారు దిగి దిగగానే ఎదురుగా స్నేహితురాలు వచ్చేసింది.ఇద్దరూ ఒకరి ఫోటోలు ఒకరు వాట్సాప్ లో పంపించుకోవడం వల్ల గుర్తుపట్టుకోగలిగారు. లేకపోతే పూర్తిగా మారిపోయిన వాళ్ళ రూపాలను గుర్తుపట్టుకునే వాళ్ళు కాదు.ఎంతో లావుగా అయిన వసంతను చూసి,

” ఏంటే ఇంత మారిపోయావు,?” అని దగ్గరకు తీసుకుంది అపర్ణ.

” అవునే చాలా మారిపోయాను. బాగా ఒళ్లు వచ్చేసింది. ఇంట్లో అందరూ కూడా తిడుతున్నారు. ఆరోగ్యం పాడవుతుంది కాస్త డైట్ చూ సుకో అని ” అని నవ్వుతూ అపర్ణను చేతులతో పట్టుకుంది.

” కానీ, నువ్వు మాత్రం ఏమీ మారలేదు అప్పూ! అలాగే ఉన్నావ్. ఈ చీర కట్టులో బాగున్నావు. అందమైన జడ ఏమాత్రం చెక్కుచెదరలేదు సుమా! ” అన్నది వసంత.

” ఇంట్లోకి రానిస్తావా? లేక ఈ ముచ్చట్లతోనే కడుపు నింపుతావా? నిన్నటి నుండి ప్రయాణం చేసీ చాలా అలసిపోయాను” అన్నది అపర్ణ.

” అయ్యో! నిన్ను చూసిన సంతోషంలో ఆవిషయమే మర్చిపోయానే! పద పద లోపలికి వెళదాము. నీకు గది ఏర్పాటు చేశాను. స్నానం చేసి టిఫిన్ చేసి అలసట తీరేవరకు పడుకో” అని చెప్పి స్నేహితురాలిని లోపలికి తీసుకెళ్ళింది వసంత.

ఇల్లంతా పెళ్లి సందడిగా ఉంది. పూల తోరణాలు, మామిడి ఆకుల తోరణాలు కట్టి ఎంతో అందంగా ఉంది. చక్కని పరిమళాలు వెదజల్లుతుంది . ఒక్కసారి అలసట అంతా మాయమైపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న కొంతమంది తెలిసిన బంధువులను పలకరిస్తూ గదిలోకి వెళ్లిపోయింది అపర్ణ.

తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిన అపర్ణకు, ఆగదిలోని అమరిక ఎంతగానో నచ్చింది. ఆ గది వసంత వాళ్ళ తల్లి తండ్రులదట. వసంత అత్తగారు కూడా ఒకటే ఊరు కావడం వల్ల ఇంచుమించు అందరూ కలిసే ఉంటారు. అందులో వసంత అత్తగారు వాళ్ళు మేనరికం. వసంత ఒకతే అమ్మాయి. అందుకని తల్లిదండ్రులు తన దగ్గరే ఉంటారు. ఆ గదిలోని సామాను చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. పాత కాలపు పందిరి మంచం , డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా కొన్ని చెక్క బొమ్మలు. ఇలా ఎంతో బాగుంది.మరో పక్క చిన్న దివాన్.అది తనకోసం కావొచ్చు అనుకున్నది.ఇల్లంతా మార్పులు చేసినా, ఈ గది అలాగే ఉండాలని వాళ్ళ కోరికట.గదిలో గంధపు పరిమళం వస్తుంది. దేవుడి పటానికి గంధపు పూమాల వేశారు.

అపర్ణ తన సూట్ కేస్ తెరచి, అందులో నుండి టవల్, సబ్బు,షాంపూ ,కట్టుకునే చీర బయటకు తీసి,సూట్ కేస్ మూసి, ఒక పక్కగా పెట్టింది.బాత్రూమ్
లోకి వెళ్లి హాయిగా నీళ్లు ఒంటి మీద పోసుకుంటే, బడలిక తీరినట్లు అనిపించింది. ఇంతలో బయట నుండి వసంత పిలుపు వినిపించింది.

” అప్పూ! కుంకుడు కాయ రసం బాత్ రూం లో పెట్టించాను.నీకు నచ్చితే చెయ్యి,లేదా షాంపూ కూడా అక్కడే ఉంది ” అని చెప్పింది .

” ఓహ్! అవునా! ఎన్నాళ్ళయింది కుంకుడుకాయ రసంతో స్నానం చేసి.సరెనే ! ” అని చెప్పి చక్కగా కుంకుడు రసంతో తలస్నానం చేసి ,సున్నిపిండితో స్నానం చేసి బయటకు వచ్చి,తలకి చిన్న పంచె కట్టుకుని ,తనకి ఎంతో ఇష్టమైన పింక్ చీర కట్టుకుంది.లైట్ గా మేకప్ చేసుకుని, కొంచెం పెద్ద బొట్టుపెట్టుకుని,ముత్యాల దండ మెడలో వేసుకుని తనని తాను చూసుకుంది.వెంటనే భర్త గుర్తొచ్చి ఒక సెల్ఫి తీసుకుని పంపించింది.
తర్వాత తలని తుడుచుకుని, జుట్టు వదిలేసి ఒక క్లిప్ పెట్టుకుని బయటకు వచ్చింది.అపర్ణని చూసిన వసంత
” భలే అందంగా ఉన్నావే” అని పిలిచి అందరికీ పరిచయం చేసింది.

అపర్ణ కూడా అదే ఊరు కావడం వల్ల తనకు చాలామంది తెలిసినవాళ్లే.
అలా అందరితో మాట్లాడుతూ కూర్చుంది. ఇంతలో అందరిని టిఫిన్ చేయడానికి రమ్మని పిలుపులు వచ్చాయి. పెళ్ళంతా సాంప్రదాయంగానే ఉండాలని ఏర్పాటు చేసింది వసంత. ఆకాలపు ఉపహారాలు, భోజనాలు ఇంటి వెనక పెరట్లో తడికల పందిళ్లు, పచ్చని విస్తారాకులలో భోజనాలు. కింద కూర్చొని తినగలిగే వాళ్ళకి చాపలు పరిచారు. కింద తినలేని వాళ్ళకి వరుసగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ తడికల పందిరిలోకి వెళ్ళగానే ఎంతో సంతోషం అనిపించింది అపర్ణకు . తన పెళ్లి జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఇంకా అదే విధంగా ప్లాన్ చేసుకున్న వసంతను మనసులోనే అభినందించింది.

” వసూ! ఎంత బాగా ఏర్పాట్లు చేసావే, ఇంతకీ ఆలోచన నీదా ?మీ ఆయనదా?” అని అడిగింది.

“ఏం? నాకు అలాంటి ఆలోచనలు రావు అనుకున్నావా?. నిజం చెప్పాలంటే మా ఆయనదే” అని చెప్పి పక్కకు తిరిగినంతలో వసంత వాళ్ళ ఆయన శ్రీనివాసరావు వస్తూ కనిపించాడు.

“అదిగో మాటల్లో వచ్చారు మాశ్రీవారు” అని అపర్ణ వైపు చూసి,

“మాఆయన శ్రీనివాస రావు, ఇదేమో నా ఫ్రెండ్ అపర్ణ” అని పరిచయం చేసింది.

పరస్పర పరిచయాలు అయ్యాక..

“రండి అపర్ణ గారూ!టిఫిన్ చెయ్యండి ” అన్నాడు శ్రీనివాస రావు.

” అందరం కలిసి తిందాం మీరూ రండి ” అని వసంత వైపు చూసింది అపర్ణ.

“మేము ఇప్పుడు ఏమీ తినకూడదు.ఈ రోజు అమ్మాయిని పెళ్లి కూతురును చేస్తున్నారు కదా!అంకురార్పణ,ఇంకా కొట్నం ఉంటుంది “అని చెప్పింది.

“అవును మరచే పోయాను.సరే, నేను వెళ్లి టిఫిన్ చేసి వస్తాను. ఏదైనా సహాయం చేస్తాను తిన్నాక ” అని చెప్పి అపర్ణ పందిట్లో కి వెళ్ళింది .

పందిట్లోకి వెక్కిన అపర్ణ ఆ వాతావరణం చూసి మై మరచి పోయింది.

సశేషం

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అంగూరు గుత్తులు

by Ramesh September 29, 2024
written by Ramesh

అంగూరుతోటలో
అంగూరు నేలమీద అంగూరు తీగలు తీగలు
అందాల అంగూరుగుత్తుల ఆకాశం
ఆ ఆకాశం కింద అంతా అంగూరు తియ్యని గాలే
అన్ని పండ్లు కండ్లైచూచే అద్భుతఅంగూరులోకం
అది అంగూరురైతు కలలుగన్న స్వప్నదేశం
పండ్లవ్యాపారం బండీలెక్కి
అంగూరు గుత్తులు ఆసిఫాబాద్ అంగట్లోకి చేరాక
అగ్గువగా, అంగూరంగూరని తియతియ్యగా పిలుస్తాయ్
తోపుడు బండ్ల పై లేతఆకుపచ్చగా,పసిడిపచ్చగా అమాయక పసిపాపల కండ్ల అంగూరుగుత్తులు
మార్కెట్టులో ఆపిల్స్ ధర ఆకాశాన్నంటినా
తమ రేటు
అరకిలో యాభైయే అని అంగూర్లంటవి
గిరిజన గ్రామాలకు,లంబాడి తండాలకు,గుట్ట మీది పల్లెలకు, గ్రామగ్రామానికి, ఆసిఫాబాద్ పట్టణం ప్రతీవాడకు
యాబై కరెన్సీ నోటుకు ముస్తాబై ఉషారుగా బయలుదేరుతవి
ఆస్తులున్నవారని,పస్తులున్నవారనిభేదంలేకుండా
కడుపులోకింత అంగూరు మధుర రసం భేషరతుగా దుంకుతది
అంగూరపండ్లవానికి
ఉసురు మన్న రోజులు కొన్ని అతనిగుండెలను గాయంచేస్తాయ్
ఊహకందని రోజులు కొన్ని ఆ గుండెలకే మలాం రాస్తాయ్
కలవారి కలల ముందు
శపించిన జీవితం వేస్తున్న ప్రశ్నలముందు
నీరసించి నీల్గుతూతోపుడు బండిని ఈడ్చుకెళ్లిన రోజులుకొన్ని
అతని జీవితానికి పాఠమవుతాయి

ద్రాక్షా గుత్తుల్లో కొన్నిపండ్లు కుళ్లి పోయి పండ్లమ్మేవాడిగుండెను బరువెక్కించినా
ఆధునిక సంఘం ముందు అవంతగా కుళ్ళినవేం కావు బహుశా
ఉస్సురుమంటున్న చీకట్లు తొలగి గిరాకీ సూర్యుడుదయించినపుడు అతడు ఆనందుడవుతాడు

మమకారంగామాట్లాడి అరకిలోపండ్లకి ముత్యమంత ప్రేమను,చిరునవ్వునూ మొగ్గుగా ఇస్తాడు పండ్లవాడు
మరలా రావాలంటది

అతడికండ్లనిండా తొంగిచూసే గిరాకీఆశ
గంపెడు బరువు గల నాలుగుటైర్లతోపుడు బండి
పండ్లవానికి ఎంతఅమ్ముడు పోతే అతనిగుండె అంత అల్కగవుతది కదా
పండ్లను బాగమ్మినరోజు అతడి కండ్లల్లో నియాను వెలుగులు నిండుతాయ్
పండ్లఅమ్మకాలరాబడి ఆగిఆగి పడే వానలు
ఐనా గానీ,రాతిరివేళ ఇల్లు మురుస్తుంది
ఒక కుటుంబం పచ్చవడ్తది
తాజాదనం,సరసమైనధరలనీ ధనవంతులసూపర్ మార్కెట్లు కాకుండా
తోపుడు బండ్ల పై అంగూరుగుత్తుల
బేల చూపుల్ని చూడండి
వేల చూపుల్ని చూడండి
ఆ చూపుల్లో దాగున్న రోజువారి జీవితాల పిలుపులు వినబడతాయ్
అంగూర్ అంగూర్
అరకిలో యాభై అరకిలో యాభై….

మనం బజారుకెల్దాం పదండి, అరకిలోఅంగూర్లకోసం.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

వచన కవిత

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు September 29, 2024
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

There is a pleasure in the pathless woods,
There is a rapture on the lonely shore,
There is society, where none intrudes,
By the deep Sea, and music in its roar:
I love not Man the less, but Nature more.
– Lord Byron

దట్టమైన అడవిలో సంతోషముంది
నిర్జనతీరం మీద తన్మయత్వముంది
అగాధమైన అంబుధి దగ్గరికి ఎవరూ రాకపోయినా
అక్కడ సాంగత్యం తాలూకు శాంతి ఉంది
సముద్రపు హోరులో సంగీతం కూడా ఉంది
మనుషుల పట్ల నాకున్న ప్రేమ స్వల్పమైంది కాదు
కానీ, ప్రకృతిమీద మరింతగా మరులుగొన్నాను నేను

ఛందోబద్ధమైన పద్యాలు (తేటగీతులు) గా…
సాంద్ర విపినములోనుండు సంతసమ్ము
పారవశ్యము గలదొంటి తీరమునను
జనులు లేనట్టి లోతైన జలధి చెంత
సాహచర్యము యొసగెడి శాంతి గలదు

అంతియే కాదు ఆమూలమరసి చూడ
దాని హోరులో నున్నది గానలహరి
నరులపై నాదు ప్రేమలో కొరత లేదు
కాని ప్రకృతిపై నున్నది గాఢరక్తి

(Lord Byron రాసిన Childe Harold’s Pilgrimage అనే కవితలోని ఒక స్టాంజాకు అనువాదం)

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us