మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

నా బాల్యం గల్లంతైంది

by Banda Saroja July 25, 2024
written by Banda Saroja

నా బాల్యం గల్లంతైంది

డా|| సరోజన బండ

‘బొమ్మరిల్లు’లో బొమ్మలాటలు

బొమ్మలాటలో కమ్మని వంటలు

పప్పు బెల్లం నువ్వులు చక్కెర

ఏకుడు పేలాలు వేరుశనక్కాయలు

మక్కజొన్న పేలాలు, పాలకంకుల

‘పిసికిల్లు’

పుట్నాలు, అటుకులు, చిట్టిలువలు

కుడుకలు, బత్తిసపేర్లు, చక్కెర గోళీలు

అప్పుడప్పుడు అమ్మ చేసిపెట్టే

చెగోడీలు, సకినాలు, గరిజెలు

అరిసెలు, గారెలు, సత్తుపిండి, సర్వపిండి

పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి

‘బెల్లం పాశం’

ఒక్కోసారి మా మల్లయ్య పిసికి యిచ్చిన

‘గసిపిండి ముద్దలు’

బుడ్డగిన్నెల్లో భద్రంగా తీసుకుపోయి

వెన్నలాంటి మనసుతో నా చిన్ని చెలికాండ్రకు

పేదరికం లేని నా పెద్దబుద్ధితో

పెళ్ళిభోజనమంటూ ‘మోదుగాకు’లల్లో

ప్రసాదంగా పంచి పరమానందం చెందేదాన్ని

పనికిరాని పాతరాతెండి తలె మాకు

‘పెళ్ళిడప్పు’

చొప్పకర్రలే ‘డప్పుకోలలు’

పీకెలే సన్నాయిలు బాజా భజంత్రీలు

చొప్పకోలలు, పుల్లలు, బెండ్లతో చేసిన ‘బండ్లు’

పల్లకీలో పిల్ల, పిల్లగాని ఊరేగింపు

మేరెసాంబయ్య పారేసిన తుక్కులోని

రంగురంగుల బట్ట పీలికలతో కుట్టిన

చిట్టి బొమ్మల సింగారంతో ‘పెళ్ళితంతు’

ఇవన్నీ మాకు ఆచరణయోగ్యాలు

అనుకరణ సాధ్యాలు ఆటపాటల సంరంభాల

ఆనందానుభూతులు

అగ్గిపెట్టెల టెలిఫోన్లు, తాటికమ్మల గాలిమోటార్లు

కుమ్మరి నర్సయ్య తాత గురుగులు

కమ్మరి రామయ్య తాత కడాయి, జల్లిగంటె

వడ్ల వెంకటయ్య మామ తెడ్లు

బుడ్డ సర్వలు బొడ్డు చెంబులు

గద్దె గిన్నెలు తపేలా పావులు

ఎరుకల ఎల్లమ్మ మొంటె- బిచ్చపు సాలమ్మ ‘సదిరె’

పూసల మల్లయ్య పూసపేర్లు, తరగని అందాల తాటాకు బుట్టలు

అన్నీ అపురూపమైన ఆటవస్తువులు నాకు

చెబ్బీసాబ్‌ గాజుల మలారంలో

పర్రెవట్టిన ఎర్రగాజులు

పచ్చగాజులు పూలగాజులు

సుతిలితో అల్లిన తుమ్మకాయల గజ్జెలు

సన్నటి సిబ్బి తీగలకు సుతారంగా గుచ్చిన

తుమ్మిపువ్వు ముక్కుపోగులు

నత్తులు, చెవికమ్మలు

మాకు అపూర్వ ఆభరణాలు

మా చేనులో ఏరుకొచ్చిన జిట్టరేగు పండ్లు

మా పెరట్లో కాసిన జామపండ్లు, దానిమ్మపండ్లు

సీతాఫలాలు వనచింతకాయలు, మామిడికాయలు

కాకెంగిలి అంటూ అంగీలోవెట్టి కొరికి

అన్నిటిని అందరం పంచుకొని తినేవాళ్లం

అన్నీకూడా ‘ఇందుల్లో’ మాకు విందుభోజనాలే

అమోఘ ఫలరుచులే!

గిల్లికయ్యాలు పెట్టుకున్నా ‘సోపతి గాల్లందరం’

తెల్లారి మళ్లీ కలిసేవాల్లం

లద్దునూరి తోవలు మావి మద్దూరిబాటలు మావి

కొడవటూరి గుట్ట, కొమిరెల్లి మల్లన్న జాతర

బెక్కల్లు రామలింగేశ్వరస్వామి ఆలయదర్శనం

ముచ్చటగా మూడురోజుల జాతర

ఆషాఢమాసం వనభోజనాలు

అన్నీ మాకు ఆనందస్మృతులే!

చేన్లు చెలకలు మావి – చెట్లు గట్లు మావి

ఎర్రమన్ను పుట్టలు మావి ఒర్రెలు వాగులు మావి

ఇసుకతెప్పలు మావి పిట్టగూళ్లు మావి

చింతచెట్లు మావి మామిడి తోపులు మావి

ఎనుగులు మావి గునుగులు మావి

‘తూరుపు తోట’ మాది తురకోని బావిమాది

జమ్మికుంట మాది

ఎల్లంబావి మాది ఎల్లమ్మ చెరువు మాది

హనుమాండ్ల గుడి మాది చెన్నకేశవ ఆలయం మాది

పాత కచ్చేరిమాది పాడువడ్డ బురుజుమాది

దొరవారి ఇంటి దొడ్డి కన్నాలు మావి

బంజరు దొడ్డిమాది బడి ‘శిథిలాల ఆవరణ’ మాది

నొగలు విరిగిన బండ్లు మావి పొణకలు, బోరాలు మావి

‘ఖాజా’ మామయ్య కాలిపోయిన ఇల్లు మాది

కూలిపోయిన గోడలు మావి

ఇల్లిల్లు మాది ఇంట్లోని ముంతగూళ్లు మావి

ఊరంతా మాది ఊల్లోని వాళ్ళంతా నావాళ్ళే

వరుసలతో పిలిచేవాల్లు మురిపెంగా చూసుకునే వాల్లు

కులాల కుటిలత్వంలేని స్నేహ బంధాలు మావి

ఉన్నోల్లు లేనోల్లు అనే తేడాలేని ఉనికి మాది

ప్రేమాప్యాయతలతో పెనవేసుకున్న

ప్రేమబంధం మాది

మమతానురాగాల మరుల విరులు పూయించిన

మనసు పూదోట మాది

తరాలు మారిన నా ఊరు తనరూపం మార్చుకుంది

అరువదేండ్ల కాలంలో అంతా తారుమారయింది

మహోన్నతమైన మానవ సంబంధాలు

మటుమాయమయ్యాయి

అధునాతన పోకడల్లో ఆధునికీకరణంలో

నా బాల్యం గల్లంతైంది

అలముకొంటున్న సంధ్యారాగంలో

అరుణ కిరణాల నా బాల్యాన్ని

జ్ఞాపకాల తెరల మరుగుల్లో

మళ్లీ వెతుక్కుంటున్నాను

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఉచితం

by Laxmi Madan July 25, 2024
written by Laxmi Madan

“వొదినే! ఓ ఒదినే! ఏం సగ వెడ్తున్నవ్! అన్న డూటీకి వొయ్యి శాన సేపాయే! ఇంకేం పనమ్మా!” అనుకుంటూ వచ్చింది మాధవి.

” యే! పనయ్యింది వొదినే! పొద్దు గాల్ల చాయ్ ఉడుకు జేస్తుంటే గిన్నె మాడింది.. గీపీసు వెట్టి రుద్దుతున్న, ఏమో గిట్లోచ్చినవ్ పొద్దు గాల్ల..అన్న ముచ్చట జెప్పనీకా” అన్నది వసంత నవ్వుకుంటూ.

” నీకు ఊకే గాముచ్చటనే! గట్ల గాదు గనీ, ఆషాఢ మాసం గదా, మస్త్ ఆఫర్ లు నడుస్తున్నయి, పోదామా! బట్టల దుకాణంకి ” అన్నది మాధవి.

“అమ్మో! మీయన్న తిడ్తడు, అయినా పైసలు యాడియి”? అన్నది వసంత.

” గట్ల మాట్లాడ్తవ్ వోదినే, నేను లేనా? నిన్ననే శిట్టి ఎత్తిన. ఇస్తపా” అన్నది మాధవి.

” జల్దీ చీర కట్కోని వొస్త.. కూసో. గా కోపుల శాయ్ వట్టు ఉన్నది ఉడుకు జేస్కొని తాగు”అని లోపలికి పోయింది వసంత.

” సరే దబ్బున రా” అంటూ వంటింట్లోకి పోయి చాయ్ వేడి చేసుకుని కుర్చీలో కూర్చొని తాగుతుంది మాధవి.

ఇద్దరు తొందరగా బయటకు వచ్చి షేర్ ఆటో మాట్లాడుకుని వందన బ్రదర్స్ కి వెళ్లారు..

షాప్ నిండా రకరకాల ఆఫర్స్ రెండు కొంటే ఒక చీర ఉచితం, నాలుగు కొంటే మిక్సీ ఉచితం, ఇలా రకరకాల ఉచితాల ప్రదర్శన జరుగుతుంది.

మాధవి మరియు వసంతలకు కళ్ళు తిరిగిపోయాయి. ఇక చీరలు వెతకడం మొదలుపెట్టారు.

వేటి మీద అయితే ఉచితాలు ఉన్నాయో వాటిని వెతికి వెతికి బాగుల నిండా నింపుకున్నారు…

” మంచి గున్నయి కదా వొదినే!” అన్నది మాధవి.

“మంచిగనే ఉన్నాయ్ గాని ఈ చీరలన్ని చూసి మీయన్న ఏమంటడో?” అన్నది వసంత.

“ఏమనడు తీ, ఊకె బుగులు వట్టకు, జెర్ర గట్టిగుండాలే” అన్నది మాధవి.

బ్యాగుల నిండా కొన్ని చీరలు, ఉచితాలుగా వచ్చిన కొన్ని చీరలు, ఆఫర్లుగా వచ్చిన మిక్సీలు, గోడ గడియారాలు అన్నిటిని బ్యాగుల నిండా నింపుకొని చాంతాడంత ఉన్న కౌంటర్లో నిలబడ్డారు.

ఓరెండు గంటల తర్వాత బిల్లు చెల్లించి ఇద్దరు బయటపడ్డారు..

“వొదినే! పోల్లగాండ్లు వచ్చేవరకు మస్త్ టైముంది. కొమురెల్లి దాకా పొయ్యోత్తాం. మీ పిల్లలు మా పిల్లలు పెద్దోల్లే, ఆల్షం అయిన ఏంగాదు” అన్నది వసంత.

“అబ్బో! నువ్వేనా? గట్లనేది. పోదాం పా. గీ సంచులు గీడ మా దొస్తింట్ల వెట్టి పోదాం” అన్నది మాధవి.

ఇద్దరూ ఆ సంచులను మాధవి స్నేహితురాలు ఇంట్లో పెట్టి బస్ స్టాప్ లో నిలబడ్డారు.

“బస్సు కిరాయ ఎక్వనా?” అన్నది వసంత.

“బస్సు ఫ్రీ నే కదా యాది మర్షినవా”? అన్నది మాధవి.

“అవుగదా! నేను ఈ నడుమ ఏ ఊరికి వోలే. గందికే మర్షి పోయిన” అన్నది వసంత.

ఇద్దరూ బస్సు ఎక్కి కూర్చున్నారు. విపరీతమైన జనం ఉన్నారు. అందరూ ఆడవాళ్లు ఉచిత బస్సు కాబట్టి పని ఉన్నా లేకున్నా తిరుగుతూనే ఉన్నారు.

ఒక్క సీటులో ఐదు, ఆరు మంది కుక్కుకొని కూర్చుంటున్నారు. నిలబడ్డ వాళ్ళు లెక్కకేలేరు..

పక్కకు చిన్న అమ్మాయిని పలకరించింది మాధవి.

“ఏడికి వోతున్నవ్ శెల్లే” అన్నది మాధవి.

“ఏడికి లేదు అక్క ఇంట్లో కరెంట్ పోయింది. రిపేర్ చేసేదానికి రెండు రోజులు పడతదట. టీవీ వస్తలేదు పొద్దు పోతలేదు.. ఊకెనే గా ప్రజ్ఞాపురం కాడ మక్క బుట్టలు కొనుక్కొని వేరే బస్సు ఎక్కొస్త” అన్నది ఆ అమ్మాయి.

“మనకన్నా జరంత ఎక్కువనే ఉన్నది” అన్నది మాధవి పక్కన ఉన్న వసంతతో.

అటుపక్కన మరో మహిళను పలకరించింది వసంత.

“నువ్వు ఏడికీ వోతున్నవ్ అక్కా” అన్నది వసంత.

“గీడు నామన్మడు. ఇంట్ల ఉంటే గాయి గాయి జేస్తున్నడు. అన్నం దింటలేడు. గాశామీర్ పేట కాడి దాకా వొయ్యే వరకు బుక్కెడు దింటడు. ఆడ దిగి మా శెల్లే ఇంటికాడ గింత శావట్టు దాగి మల్ల బస్సెక్కుత. గింతట్ల నా బిడ్డ కొలువు నించి వొస్తది” అన్నది ఆ మహిళ.

ఇదంతా వింటున్న కండక్టర్ కి బుర్ర తిరిగి పోయింది. “ఉచితాలు జెయ్యంగ మాకు తల్కాయ నొప్పి. పనున్నోడు, లేనొడు బస్సుల ఉర్కుడే. గిప్పుడే దేవుడు, సుట్టాలు యాదికొస్తరు” అనుకుంటూ ముందుకు వెళ్లాడు.

ఇంటికి వచ్చిన మాధవికి హాల్లో 10 కిలోల గోధుమపిండి కనిపించింది.

“ఏందయ్యా! గిది. గింత పిండి ఏడిది” అన్నది మాధవి.

“ఐదు కిలలు కొంటే ఐదు ఫ్రీ. అట గందికే తెచ్చిన” అన్నాడు మాధవి భర్త సుందర్.

“నీఅగడు పాడు గాను. ఫ్రీ వచ్చిందని గింత కొంటవా?” అన్నది మాధవి కోపంగా.

“నువ్వు ఫ్రీ వస్తున్నది అని గన్ని చీరలు కొన్నావ్ నేను గిద్దేస్తే గట్ల అంటవు” అన్నాడు సుందర్..

కుయ్యమనకుండా లోపలికి వెళ్ళిపోయింది మాధవి.

తెల్లవారి ఉదయమే పిండి సంచులు తెరిచి చూసింది. అంతా పురుగే ఉంది. భర్తను ఏమైనా అందామంటే తాను అలాంటి పనే చేసింది కదా!

చీరలు బ్యాగు మిక్సీ రెండు తెరిచి ముందుగా చీరలను విప్పి చూసింది… చూడడానికి బాగానే ఉన్నాయని ఒక చీర కట్టుకుంది .తర్వాత ఆరోజు ఇడ్లీ కోసం నానబెట్టిన మినప్పప్పును మిక్సీలో వేసుకుంది. మిక్సీ ఏమాత్రం నాణ్యత లేకుండా కనిపించింది…

“గిట్ల ఫ్రీ వస్తుందని కొంటే గిట్లే ఉంటది .ఇప్పుడు ఏమనుకొని ఏం లాభం” అని అనుకొని వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాధవి.

“వొదినే! మోసం జరిగింది మన మిక్సీ మంచిగ పనే చేస్తలేదు” అన్నది వసంతతో.

“సప్పుడు జెయ్యకు. మీ అన్న ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికే ఇవి కొన్న అని తిడతా ఉన్నాడు. నా చీరలు నీళ్లలో పెట్టిన పొద్దుగాల. మొత్తం రంగు ఎలిసిపోయింది” అన్నది మెల్లగా వసంత.

“ఓయమ్మనే! మొత్తం మునిగినమే. ఈసారి గిట్ల చేయద్దు, అంత నాదే తప్పు .అన్న లేనప్పుడు వస్తతీ వొదినే” అన్నది మాధవి.

“యే, జర్ర నిలవడు. గా పెరంట్ల దిక్కువా”. అనుకుంటూ పెరట్లోకి తీసుకెళ్ళింది వసంత మాధవిని.

“గిట్ల ఫ్రీ అని తీసుకుంటే గిట్లాయే” వొదినే అన్నది వసంత.

“గిప్పుడు సమజాయే, ఆల్లు మన కోసం గా ఉచితం పెడ్తరా? ఆల్ల లాభాలు జూసు కుంట
రు” అన్నది మాధవి.

“మీ యన్న వొద్దు అంటడు గిసొంటివి. మనమే సోచాయించి పోయ్యేది ఉండే. అయితేవాయే తీ, ఈపారీ గిట్ల చెయ్యొద్దు. ఇగ వోత వొదినే, పని గాలే” అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది మాధవి.

ఇద్దరు జరిగిన పొరపాటున గుర్తించుకుని, మళ్ళీ ఈసారి అలాంటివి చేయొద్దు అనుకున్నారు.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ——- ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు.

by Narendra Sandineni July 25, 2024
written by Narendra Sandineni

గుండు రమణయ్య హృదయ రోదన కవిత. హృదయం పై కవిత్వం ఓ విశ్లేషణ.
కవి,చిత్ర కళా ఉపాధ్యాయుడు.వాణీ నికేతన్ బాల విహార్ పాఠశాల,తెలుగు మీడియం,కరీంనగర్, గుండు రమణయ్య కలం నుండి జాలువారిన తొలి మెట్టు కవితా సంపుటిలోని హృదయ రోదన కవిత పై విశ్లేషణా వ్యాసం.హృదయ రోదన కవితను ఆసక్తితో చదివాను.కవితలోని భావాలు నాకు నచ్చాయి.నన్ను ఆలోచింపజేసింది.రమణయ్య తాను రాసిన కవితలకు తానే చిత్రం గీసినాడు. డాక్టర్ కాలువ మల్లయ్య ముందు మాటలో ముందొచ్చే కవితా సంపుటుల్లో రచనల్లో కవిత్వం పాలు మరింత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను అని అన్నాడు.కవిత శీర్షిక హృదయ రోదన ఏమిటి?హృదయం రోదిస్తుందా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.హృదయము లేదా గుండె మన శరీరానికి రక్తాన్ని పంపిణి చేసే ముఖ్యమైన అవయవం.గుండెలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరాయంగా పని చేసి మనిషిని బ్రతికిస్తున్నాయి.గుండె ఛాతి మధ్యలో కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది.రక్తాన్ని సరఫరా చేసేది గుండె.ప్రాణులకు ముఖ్యమైన భాగం గుండె. గుండెకు మనసు,ప్రేమ,జాలి,ఆత్మసారం,రహస్యం అని అర్థాలు.రోదన అనగా విలాపము,ఏడుపు అని అర్థాలు.మనసునకు బాధ కలిగినప్పుడు ఏడుపు వస్తుంది.మన శరీరంలో హృదయం సున్నితమైనది. ఎట్టి పరిస్థితిలోను హృదయానికి బాధ కలిగించకూడదు.హృదయానికి బాధ కలిగితే వచ్చేది రోదన.హృదయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం,ఆవశ్యకత ఎంతైనా ఉంది.హృదయ రోదన కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవి రమణయ్య హృదయ రోదన కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“నా పవిత్ర దేశపు గడ్డ పై
“సమస్యల కాన్వాసు పై
“పదిలంగా చిత్రించిన రూపం !
నా స్వచ్ఛమైన దేశం గడ్డ పై సమస్యల చిక్కు ముళ్ళు చుట్టు ముట్టి కలవరం కలిగిస్తున్నాయి. హృదయాన్ని ఆవరించిన సమస్యలు మబ్బుల వలె ఆకాశంలోని దూదిపింజలా తేలిపోవడం లేదు. సమస్యలు ఒక్కొక్కటిగా సుందరమైన కాన్వాసు మీద చిత్రించినట్లు హృదయం కళ్ళకు స్పష్టంగా ఆగుపిస్తున్నాయి.పవిత్రమైన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు జటిలమై హృదయంలో కదలాడుతున్నాయి.గుండెలో చెలరేగుతున్న సమస్యలు అన్నింటిని కాన్వాస్ పై స్థిరంగా గీయగానే అద్భుతమైన చిత్రం రూపు దాల్చింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆనంద రోదనలో
“ఆవేదనా కోలాహలం
“తరచి చూస్తే తెలుస్తుంది
“నిలిచి చూస్తే కనిపిస్తుంది !
ఒకరి సంతోషం గురించి ఆలోచించడం ఆనందం.ఆలోచించడం లేదా తెలుసుకోవడం ఆనందం.మనిషి ఆనందంగా ఉన్నప్పుడు కళ్ళ నుండి బాష్పాలు రావడం సహజం.ఆనందం అనే పదాన్ని నిర్వచించడం సాధ్యం కాదు.ప్రజలకు ఆనందం అనుభవించాలనే ప్రాథమిక భావన హృదయంలో కలుగుతుంది.సంతోషకరమైన సంతృప్తి,ఆనందానికి మూలం.ఒక కల్పిత ప్రదేశం ఆనందం.అద్భుత లోకంలో వింతలు జరగడం ఆనందం.మనుషుల జీవితంలో క్షోభ,దుఃఖం లేకుండా వచ్చేది ఆనందం.మనసు ఉత్సాహంగా ఉండేటప్పుడు కలిగే భావన ఆనందం.ఎటు వంటి బాధలు లేకుండా హాయిగా ఉండటం ఆనందం. రోదన అనగా విలాపము,ఏడుపు అని అర్థాలు. మనసులోని బాధ వల్ల కళ్ల వెంట ధారగా వచ్చేది రోదన.ఆవేదన అనగా తీవ్రమైన బాధ, తెలియచేయుట అని అర్థాలు.ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు గంతులు వేయడం కోలాహలంను సూచిస్తుంది.ఎక్కువ శబ్దం లేదా గట్టిగా అరవడం కోలాహలం.ఉత్సవాలలో శుభకార్యాలలో ఉండే జన సమూహం చేసే సందడి కోలాహలం.వీధిలో జరుగుతున్న కోలాహలంను చూసి ఏదో పండుగలా అనిపించింది.ఆనంద రోదనలు,ఆవేదన కోలాహలం సంగతుల గురించి ఒక్కసారి మనస్సు పెట్టి హృదయపు లోతులను తరచి చూస్తే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. హృదయానికి ఏం జరిగింది? ఒక్కసారి హృదయం పట్ల దృష్టి సారించి చూస్తే కళ్ళకు కట్టినట్లుగా రోదన కనిపిస్తుంది అనే భావం వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

“కళాకారుల మెదడుల్లో
“కదులుతున్న నిజాన్ని చూడు
“మేధావులు దూషణల్లో
“నలుగుతున్న న్యాయాన్ని చూడు !
ఒక కళను సృష్టించేది కళాకారుడు.కళలను అభ్యసించినది కళాకారుడు.కళాకారుడు కళను సాధన ద్వారా సృష్టించగలడు మరియు ప్రదర్శించ గలడు.కళాకారునికి కళ పట్ల నేర్పు మరియు కళా నైపుణ్యం ఉంటుంది.లలిత కళలు,డ్రాయింగ్, పెయింటింగ్,శిల్పం,నటన,నృత్యం,రచన,చిత్ర నిర్మాణం,కొత్త మీడియా,ఫొటోగ్రఫీ,సంగీతం వంటి కార్యకలాపాలను ఉపయోగిస్తు కళాకారుడు కళను నిర్వహిస్తాడు.కళాకారుడు చురుకుగా తన నైపుణ్యాన్ని సాధిస్తాడు.మెదడు మానవుని తల భాగంలో కపాలంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలు అన్నింటికీ మెదడు ఒక ముఖ్యమైన కేంద్రం.మెదడు తనకు తానే మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది.మెదడుకి ఏం చెయ్యాలో ఆలోచించడం,నిర్ణయాలు తీసుకోవడం,గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి గుణం ఉంటుంది.మెదడు మానవ నాడీ వ్యవస్థ యొక్క కేంద్ర అవయవం.వెన్నుపాముతో కేంద్ర నాడి వ్యవస్థ ఏర్పడుతుంది.మెదడులో సెరెబ్రమ్,బ్రెయిన్ స్టెమ్ మరియు సెరిబెల్లమ్ ఉంటాయి.మెదడు శరీరం యొక్క చాలా కార్యకలాపాలను నియంత్రిస్తుంది.నిజం లేదా సత్యం ఆంగ్లంలో Truth అని అర్థం.నిజం అనగా సత్యమైన,పరమ ప్రమాణం,నిజమని తెలియ జేయుట.నిజం అంటే నిజాయితీ,త్యాగం మనం పాటించవలసిన విధిగా చెప్పవచ్చు.సత్యం వద అంటే సత్యమును చెప్పుము.నిజం మాట్లాడటానికి మించిన దైవత్వం లేదు.నిజం పలకడానికి ధైర్యం కావాలి.ఏదైనా నిజం అయితే అది కనిపెట్టబడడం లేదా ఊహించిన విషయం కాకుండా వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది.నిజం ఖచ్చితమైనది మరియు నమ్మ దగినది.మేధావులు అంటే సమాజం యొక్క వాస్తవికత గురించి విమర్శనాత్మక ఆలోచన, పరిశోధన,సాధారణ సమస్యలకు పరిష్కారాలను ప్రతిపాదించే వ్యక్తులు.సంస్కృతి ప్రపంచం నుండి వచ్చిన సృష్టికర్తగా లేదా మధ్యవర్తిగా మేధావి రాజకీయాల్లో పాల్గొంటారు.ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనను సమర్పించడం లేదా అన్యాయాన్ని ఖండించడం,సాధారణంగా ఒక భావజాలాన్ని తిరస్కరించడం,విలువల వ్యవస్థను ఖండించడం ద్వారా మేధావులు సమాజంలో ముందు ఉంటారు. తప్పు ఒప్పులలోని నిజాలను నిర్ధారించేది న్యాయం.న్యాయం జరిగే ప్రదేశాలు న్యాయస్థానాలు.న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది.నీతి,సత్యం,హేతువులు,చట్టం,ప్రకృతి నియమాలు,సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడినది.వ్యక్తులు సమానమైన న్యాయ పద్ధతిలో వ్యవహరించాలి.న్యాయం అనేది నైతిక మరియు చట్టపరమైనది.న్యాయం సమానంగా మరియు సమతుల్యంగా వ్యవహరించే వ్యక్తులను సూచిస్తుంది.సమాజం యొక్క అత్యంత ముఖ్యమైనది,చర్చించబడేది న్యాయం.న్యాయం మానవ జీవనానికి పునాది.ప్రజలు అందరికీ న్యాయమైన పంపిణి మరియు సమానత్వం న్యాయమైన ప్రయోజనాలను అందించాలి.ప్రజలు చేస్తున్న స్వార్థపూరిత కార్యకలాపాలను నియంత్రించడానికి న్యాయం అవసరం ఉంటుంది. కులం,మతం,రంగు,ధనిక,పేద అని ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలోని వ్యక్తులందరికీ సామాజిక న్యాయం అందించాలి.దూషణలు అనగా అపవిత్రమైన మాటలు,అసందర్భమైన ప్రేలాపనలు, అశ్లీల మాటలు వల్ల మనిషికి శారీరక గాయాల కంటే ఎక్కువ బాధను కలిగిస్తాయి.దేశంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలు పేద,ధనిక తేడాలు, కులం,మతం పేరిట మారణ హోమం జరుగుతున్నది.పసి పిల్లల నుండి పండు ముదుసలి వరకు స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. సమాజంలో జరుగుతున్న దారుణ ఆకృత్యాలు చూసి కళాకారుల హృదయం కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతున్నవి.ఇలాంటి దారుణ దృశ్యాలు చూసిన తర్వాత కళాకారులు చైతన్యంతో అన్యాయాలకు వ్యతిరేకంగా గజ్జె కట్టి పాటను ఆయుధంగా చేసుకుని పాడుతూ వీధుల్లో బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లి నిరసనలు, ప్రదర్శనలు చేస్తూ పోరుబాటలో ముందుకు సాగుతున్నారు. సమాజంలో జరుగుతున్న దారుణమైన ఘోరాలను చూసి మేధావులు స్పందనతో గొంతు ఎత్తి ప్రశ్నిస్తున్నారు.మేధావులు అన్యాయాలు, అక్రమాలను ఖండిస్తూ దూషణలు చేస్తున్నప్పటికీ న్యాయం జరగకపోవడం కలవరపెడుతున్నది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“బడా రాజుల సంపాదనలో
“ధర్మం దాచుకుంటున్నదెంత ?
“నిరుపేదల గుండెల్లో
“దరిద్ర దేవత దోచుకుంటున్నదెంత?
ధర్మం అనగా చేయవలసిన పని ఆంగ్లంలో Duty అని అర్థం.మనకు కేటాయించిన పనిని చేయడాన్ని ధర్మం అంటారు.మనిషి ప్రతి రోజు చేయ వలసిన విద్యుక్త ధర్మం నిర్వర్తించాలి.ధర్మం అంటే మానవత్వాన్ని రక్షించే గుణం.సకల ప్రాణి కోటిలో మానవ జన్మ ఉత్తమమైనది.మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో సాటి మానవుల పట్ల ప్రేమ, ధర్మంతో మెలిగితే సాధ్యమవుతుంది.ఇతర ప్రాణులలో లేని బుద్ధి విశేషంగా మానవులకు ఉంది. మానవులకు యుక్తాయుక్త విచక్షణా శక్తితో పాటు జ్ఞానం ఉంది.ఆలోచనకు రూపం ఇవ్వగల తెలివితేటలు ఉన్నాయి.మానవులు బుద్ధి ద్వారా ఉత్తమ గుణం అయిన ధర్మాన్ని సాధించవచ్చు.ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది.కవి బడా రాజుల సంపాదనలో ధర్మం దాచుకుంటున్నదెంత అని ప్రశ్నించారు.బడా రాజులు అంటూ ఇప్పుడు ఎవ్వరు లేరు.బడా రాజుల గురించి చరిత్ర పుస్తకాల్లో రాయబడి ఉంది.బడా రాజులు కాల గర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు కొత్తగా నయా బడా బాబులు పుట్టుకు వచ్చారు.బడా బాబులు ప్రజాస్వామ్య దేశంలో పాలనాధికారం చేపట్టి రాజ్యాన్ని ఏలుతున్నారు. బడా బాబులు అంటే ఈనాటి రాజకీయ నాయకులు అనే విషయం అందరికీ తెలుసు.రాజకీయ నాయకులు పారదర్శకంగా పరిపాలిస్తున్నాం అని చెబుతు ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుంటున్నారు.రాజకీయ నాయకులు ఏది చెబితే అది ధర్మంగా కొనసాగుతుంది.బడా బాబులు అధికారం చేపట్టినారు మరియు రాజకీయంగా ఎదిగినారు.బడా బాబుల పాలనలో వంచనతో అధర్మం రాజ్యమేలుతుంది.బడాబాబులు ధర్మం సంగతి ఏనాడో మర్చిపోయారు.ధర్మం అంటే ఏమిటి?అని ముందు ముందు అడిగే రోజులు రానున్నాయా? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.రాజకీయ నాయకులు విదేశీ బ్యాంకుల్లో అవినీతి సొమ్ములు దాచుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజలచే పరిపాలింపబడిన పాలన అని మనకు తెలుసు. ప్రజాస్వామ్యం ఇప్పుడు అపహాస్యం పాలైంది. ప్రజాస్వామ్యాన్ని ఈనాటి నాయకులు,అధికారులు భ్రష్టు పట్టించారు.ఆనాటి నేతలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు సుఖ శాంతులతో ఉంటారు అని కాంక్షించారు.ప్రజలందరు సౌఖ్యంతో జీవనం సాగిస్తారు అని ఆశించారు.ఆనాటి నేతలు ప్రజల సంక్షేమం కొరకు పోరాటం సాగించారు.పరాయి దేశపు పాలన నుండి దేశానికి విముక్తి కలిగించారు. ఆనాటి నేతలు ఇప్పుడు పర లోక గతులు అయ్యారు.ప్రజలకు చేరాల్సిన అభివృద్ధి ఫలాలు పరిపాలకులైన రాజకీయ నాయకులు,అధికారులు కాజేసి దండుకుంటున్నారు.బడా బాబులకు ఇహలోక చింతన పట్ల వ్యామోహం పెరిగింది. ఇప్పుడు సంపాదించినదే డబ్బు అని సంపన్నులు అక్రమార్జనతో ప్రజలను దోచుకుంటున్నారు. సంపన్నులు సక్రమంగా సంపాదించుకుంటున్నారా? అంటే? లేదు అని సమాధానం వస్తుంది.ఇప్పుడు ఎటు చూసినా అధర్మం రాజ్యమేలుతుంది. అన్యాయాలు,అక్రమాలు మితిమీరి పోయినాయి.రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించే వారిని తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి తోస్తున్నారు.రాజకీయ నాయకుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతుంది. ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.ప్రజలకు అది చేస్తాం,ఇది చేస్తాం అని శుష్క వాగ్దానాలు గుప్పిస్తున్నారు.ప్రజలను మభ్యపెడుతున్నారు.రాజకీయ నాయకులు సంపన్నులకు దోచిపెడుతున్నారు.రాజకీయ నాయకులకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కొరవడింది.రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమం కొరకు ఏమీ చేయరు? అని ప్రజలకు తెలిసిపోయింది.ఇవ్వాళ దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి.ఇందు గల డందు లేడంటూ అవినీతి సర్వత్రా రాజ్యమేలుతుంది.నిరుపేదలు చాలా సాధారణ వ్యక్తులు.నిరుపేదలు డబ్బు లేని వారు. నిరుపేదలు ఎప్పుడు సమస్యలతో ఎందుకు బాధపడతారు. నిరుపేదలు ఎల్లప్పుడు బాధలలో ఎందుకు ఉంటారు.నిరుపేదలు ఎందుకు అశాంతితో జీవితాన్ని గడుపుతున్నారు. కవి నిరుపేదల గుండెల్లో దరిద్ర దేవత దోచుకుంటున్నదెంత అని ప్రశ్నించాడు.నిరుపేదల శ్రమను దోచుకుంటున్నది దరిద్ర దేవత కాదు.నిరుపేదల శ్రమను సంపన్నులు దోచుకుంటున్నారు. నిరుపేదలు పేదరికంలో మగ్గుతున్నారు.నిరుపేదల గుండెల్లో పేదరికం వల్ల బతుకు పట్ల ఆందోళన ఉంటుంది.నిరుపేదలు రేపటి రోజున బతుకును ఎలా గడపాలి? అనే ఆందోళన ఉంటుంది. నిరుపేదలు ఆకాశం పందిరి కింద చెట్ల నీడన నివసిస్తున్నారు.నిరుపేదలు తినడానికి తిండి లేదు.నిరుపేదలు కట్టుకోవడానికి బట్టలు లేవు. నిరుపేదలు నివసించడానికి ఇల్లు లేదు.సంపన్నుల దేవత అని నిరుపేదల దేవత అని ఎక్కడ రాసి లేదు.మనం కల్పించుకున్నవే దేవతా రూపాలు.మన హృదయంలోనే నిండి నిబిడీకృతమై దేవుడు ఉన్నాడు.మన హృదయంలోని దేవుడిని మర్చిపోయినాము.మనం ఆ దేవత,ఈ దేవత అంటూ గుడుల వెంట పరుగులు తీస్తున్నాము.మన హృదయంలోనే దేవుడు కొలువై ఉన్నాడు.ఏ దేవత అయినా సమస్త మానవాళి సుఖ సంతోషాలను, సౌఖ్యాన్ని కోరుకుంటుంది.ఆ విషయం మర్చిపోయి నిరుపేదల ఇంట దరిద్ర దేవత దోచుకుంటున్నది ఎంత అని తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. జనాలను తప్పుడు మార్గంలో పయనింప జేస్తున్నారు.జనాలు అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ దోపిడీ విధానం కొనసాగుతుంది.

గుండు రమణయ్య

“ఐనా – నా భారతం కన్నులకింపైన “చిత్రం’
“ఎందుకనగా నాది ‘హిమముల నేత్రం’
“అదొక ‘రసార్డ్ర సాగర గాత్రం’.
భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు,దక్షిణాన హిందూ మహా సముద్రం,పశ్చిమాన అరేబియా సముద్రం,తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి.భారతదేశం సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు.హిందూ,బౌద్ధ,జైన,సిక్కు మతములకు జన్మనిచ్చింది.బహు భాషలు మాట్లాడే జనం ఉన్నారు.బహుళ జాతుల సంఘం ఉంది.వివిధ వన్య ప్రాణులకు నిలయమైన దేశం.భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.ఇరవై తొమ్మిది రాష్ట్రాలు,ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉంది.అతి పెద్ద పార్లమెంట్ వ్యవస్థ ఉన్న ఒక సమైక్య దేశం. చిత్రం అనేది చదునైన ఉపరితలంపై రంగుల బిందువుల సమూహం.అది వేరొక దాని వలె కనిపిస్తుంది.చిత్రాలు, డ్రాయింగులు,పెయింటింగ్ లు లేదా ఛాయాచిత్రాలు కూడా కావచ్చు.అలాంటి చిత్రాలను రూపొందించే వ్యక్తులను కళాకారులు, చిత్రకారులు అంటారు.విశాల భారతదేశం మనది. హిమాలయాలకు నిలయం ఇది అని చిన్నప్పుడు పాఠశాలలో చదివి ఉన్నాం.అయినప్పటికీ నేను నివసించే భారతదేశం కన్నులకు కట్టినట్లు చిత్రం వలె కనిపిస్తుంది.చిత్రం గురించి చెబుతూ రసములతో తడిసిన సముద్ర రూపాన్ని దాల్చిన శరీరం వలె కనిపిస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అందుకే
“నా ‘సహనం’ ‘సద్యోఘృతం’
“నా విశ్వాసం’ ‘విద్యుద్ఘాతం’
“నా ‘నిర్ణయం’ ‘నిశ్చల దృఢం’.
సహనం క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి.మనకు అగౌరవం కలిగినప్పుడు కోపంతో ప్రతి స్పందించకుండా రెచ్చగొట్టడాన్ని సహించగల ఓర్పు ఉండాలి.ఒత్తిడికి గురైనప్పుడు సహనంతో వ్యవహరించాలి.ఇబ్బందులు ఎదురైనప్పుడు సహనంతో ఉండాలి.చిరాకు కలిగినప్పుడు విసుగు చెందకుండా సహనంతో వేచి ఉండాలి.క్షీరసాగర మధనంలో దేవతలను రక్షించుటకు గరళం మింగిన పరమ శివుని వలె సహనంతో మెలగాలి.విశ్వాసం అనగా వ్యక్తి వస్తువు లేదా భావనపై విశ్వాసము లేదా నమ్మకం కలిగి ఉండాలి.విశ్వాసం మనకు నమ్మకం మరియు నిశ్చయత యొక్క భావాన్ని ఇస్తుంది.విద్యుత్తు ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్తు ప్రవహించినప్పుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతం అంటారు.కరెంట్ షాక్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ షాక్ ను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది.మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు.విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాల పాలవుతాడు.నా విశ్వాసం విద్యుద్ఘాతం అని హృదయం బాధకు లోనైంది అని తెలియజేయడం చక్కగా ఉంది.మనిషి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు.మనిషి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.మనిషి అనేక అవకాశాలు మరియు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి.నిర్ణయం నిశ్చలమైనది మరియు దృఢమైనది అయి ఉండాలి.ఒకసారి తీసుకున్న నిర్ణయం మార్చడానికి వీలు కాదు. నా నిర్ణయం నిశ్చలమైనది దృఢమైనది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.కవి రమణయ్య చిత్రకారుడు మరియు తాను రాసే కవిత్వం పట్ల శ్రద్ధ చూపాలి.ప్రాచీన కవులు మరియు ఆధునిక కవులు రాసిన కవిత్వంను అధ్యయనం చేయాలి.గట్టి కృషి చేస్తే గొప్ప కవిగా రమణయ్య రాణించే అవకాశం ఉంది.కవి రమణయ్య మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

July 25, 2024 2 comments
5 FacebookTwitterPinterestEmail
కవితలు

జీవితమంతా గడిపేశా

by Vijaya Ranganatham July 25, 2024
written by Vijaya Ranganatham

జీవితమంతా గడిపేశా, కానీ నాకు తీరికే దొరక లేదు

ఆత్మీయులు ఆహ్వానిస్తే, నాకు తీరికే దొరకలేదు

ఆప్తుల బాధల్ని పంచుకుందామంటే నాకు తీరికే దొరకలేదు

మనసు పొరల భావాల్ని లిఖిద్దా మంటే, నాకు తీరికే దొరకలేదు

శరీరం విశ్రాంతిని కోరినా, నాకు తీరికే దొరకలేదు

కని పెంచిన వారిని పలకరిద్దామంటే, నాకు తీరకే దొరకలేదు

వడలిన వయసు జారుతున్నప్పుడు, సమయంతీసుకుని వైద్యుడ్ని కలవమని స్నేహితులు సలహా ఇచ్చినా నాకు ఆ తీరికే దొరకలేదు

నా మదిలోని తీరని కొండంత పనుల భారాన్ని దించే లోపే , కొత్త సమస్యలు ఎదురైతే ఏం చేయను నాకు తీరికే దొరకలేదు

జీవితం కాలం వృధా చేసాను ఎలా పరిష్కరించను నాకు తీరికే దొరకలేదు

మరి ఈ సమయ మేమయిందని చూద్దామంటే, నాకు ఆ తీరికే దొరకలేదు.

సమయం కోసం వెతకటం తోనే నా సమయమంతా కడతేరింది, మృత్యువు దరిచేరనుంది అయినా నాకు తీరికే దొరకలేదు

ఎవరో ఉర్దూ కవి గారి వీడియో ఆధారంగా నేను తెలుగులో అనువదించాను. విన్న వెంటనే నన్ను కదిలించిందా ముషాయిరా. రాయకుండా ఉండలేక పోయాను. చివరి నాలుగు పంక్తులు మాత్రం కొత్తగా చేర్చాను. ఆ కవి మహానుభావుడికి నమఃసుమాంజలులు.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“అరుణ” కలం అంతరంగం

by Dr. chitikena Kirankumar July 25, 2024
written by Dr. chitikena Kirankumar

ఏదేని మనిషి అంతరంగంలో దాగి ఉన్న మంచి – చెడు లక్షణాలను సహజంగా కొందరు గమనించ గలుగుతారు. కానీ వారిలో ఉన్న తప్పులను వేలెత్తి చూపి అనుకోకుండా ఒకరికి ఒకరు మధ్యలో అభిప్రాయ బేధాలను సృష్టించుకుని మరి ఏది మంచి మార్గం! మరి ఇంకేది చెడు మార్గం!! అనే విషయాలను పూర్తిగా గ్రహించక ముందే కొందరి మధ్య అంతరాలు ఏర్పడతాయి. అలాంటి వాస్తవిక కోణాలను కొన్ని సంఘటనలను దగ్గర నుంచి చూసి వాటికి పరిష్కారం తమకు తామే తెలుసుకొనే మార్గదర్శిగా నిలుస్తున్న కథల పుస్తకం ” మిగిలేవి … గురుతులే “.
తల్లిదండ్రులు గౌరీభట్ల వెంకటేశ్వరశర్మ , అన్నపూర్ణల సంతానంగా ధూళిపాళ అరుణ జన్మించారు. భువనగిరి జిల్లా వాస్తవ్యురాలైన తను ఎంఏ తెలుగు, ఇంగ్లీషు, తెలుగు పండిట్, టి .పి.టి విద్యనభ్యసించి ఉపాధ్యాయురాలిగా, ఉపన్యాసకురాలిగా,వైస్ ప్రిన్సిపాల్ గా 25 సంవత్సరాల బోధనానుభవం కలిగి ప్రస్తుతం సాహిత్య సేవలో కొనసాగుతున్నారు. కవిత్వం,కథా, విమర్షా సాహిత్యంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ మాటలతో కాకుండా చేతల {రచనల)తో నిరూపించుకుంటున్న రచయిత్రి, ధూళిపాళ అరుణ. ఇంటర్ చదువుతున్నప్పుడే సాహిత్యం పై తన అభిమానాన్ని పెంచుకొని రచనలు చేయగలిగారు.

తన పుట్టుక ఒకచోట – తన మరణం మరోచోట గా స్త్రీ యొక్క మనుగడ మన భారతదేశంలో బంధాలు అనుబంధాలను ఉద్దేశించి కొనసాగుతున్న క్రమంలో మన సమాజం స్త్రీకి పెద్దపీట వేసింది. కానీ ఒక మనిషి యొక్క అంతరంగంలో ఉన్న పూర్తి తత్వాన్ని తెలుసుకోకముందే పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఏకమై స్త్రీ తన చివరి గమనం వరకు నడుస్తున్న క్రమంలో తల్లిగా, సోదరిగా, భార్యగా ఇలా పలు బాధ్యతలను నిర్వహిస్తూ కష్టాలను, నష్టాలను ఎదుర్కొని తన జీవితాన్ని పుట్టినింటి నుండి మొదలుకొని మెట్టినింటి వరకు ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. కుటుంబం పరువు, గౌరవం, తన సంతానానికి రేపటికిభవిష్యత్తు, స్త్రీ అందిస్తున్నటువంటి వైవిధ్యమైన పాత్రలలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని రచయిత్రి ధూళిపాళ అరుణ ఈ కథా సంపుటి నందు సమాజంలో కొన్ని సంఘటనలు తన కళ్ళ ముందు చూసినవి, స్నేహబంధాలలో తను స్వయంగా ఎదుర్కొన్నవి సూటిగా చెప్పగలిగారు. తన కదా సంపుటి “మిగిలేవి … గురుతులే” అందలి రచనలను ఒకసారి పరిశీలిస్తే….

మిగిలేవి… గురుతులే కథలో వెంకటేశ్వర్లు జ్ఞాపకం గా మిగిలిపోయిన ఇల్లును పిల్లలు పడగొట్టాలని, అమ్మకానికి సిద్ధమవుతున్న సందర్భంగా వెంకటేశ్వర్లు మనసులో ఉన్న తన భార్య స్మృతులను , మనసు ఆవేదనను తెలుసుకొని కథాంశంగా రచయిత్రి కథలో చెబుతూ…ఆగకుండా వస్తున్న కన్నీళ్ళు ఆయన గుండెల మీదకి జారుతున్నాయి. ద్రవించిపోయాను. నిస్సహాయంగా అలాగే చూస్తూ ఉండిపోయాను. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. అంతటా నిశ్శబ్దం. చాలా సేపటికి కూర్చున్న ఆయన వీపు నాకు చల్లగా తగిలింది. ఆయన తన జ్ఞాపకాలను ఎక్కడికో తీసుకుపోలేక ఇక్కడే
వదిలేశారని గ్రహించాను. ఆ దంపతులతో పాటు వారితో నా జ్ఞాపకాలు కూడా రేపటి రోజున ఇక్కడే సమాధి అవుతాయని అర్థమై భారంగా కళ్ళు మూసుకున్నాను. అంటూ ఒక కన్నీటి పర్వంతమైన భావోద్వేగ సన్నివేశాన్ని ఈ కథలో రచయిత్రి అరుణ చెప్పారు.
జెర జెప్పండి సారూ…. కథలో… వివాహేతర సంబంధాల కారణంగా చిదిలమవుతున్నటువంటి దాంపత్య జీవితాలు నేటి కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. దైవసాక్షిగా వేదమంత్రాల మధ్యన, మూడుముళ్ల బంధంతో వివాహ అనుబంధం ద్వారా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని దేవతలు దేవుళ్ళ దీవెనలతో పాటుగా, బంధుమిత్రుల ఆశీస్సులు అందుకుని కొనసాగుతున్న జీవితంలో వివాహేతర సంబంధాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా కొందరు చేస్తున్న అసాంఘిక పనుల ద్వారా నిండు జీవితాలు బలి కావడం, మనస్పర్దలతో కూడుకున్న అసంతృప్తి జీవితాల పరిణామక్రమం ఇతివృత్తంగా ఈ కథలో రాజయ్య మనసు బాధ ఎవరు తీర్చలేనిది.
మరో కథలో అంగవైకల్యం శరీరానికే కానీ మనిషి మనసుకు కాదు అని తీర్పు చెప్పుతూ త్రివేణికి సరియైన జోడు దొరికింది. నీ స్నేహమే కథలో…. తొందరపడి మనుషుల మధ్య బావ వైరుధ్యం కారణంగా స్నేహాలు దూరమవుతున్న విషయాలను తెలియజేస్తూ అరణ్య వినోదల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెలిపారు.
నీకు నేనుగా కథలో… భార్గవ్ చేసిన గొప్ప పని మానవతా కోణాన్ని మరోసారి గుర్తు చేసింది. కవితా వాహిని కథలో… చప్పట్లు హోరులో కృతజ్ఞతా పూర్వకంగా కవిత అందరికీ నమస్కరిస్తూ వెళుతున్న సందర్భంలో కొడుకు కోడలు ఇద్దరు కళ్ళ ముందు కనిపించి వారి సంతోషాన్ని చూసి మురిసిపోయిన కవిత మాటలు చెప్ప రానివి.


తీర్పు కథలో… రాక్షసంగా ప్రవర్తించిన తండ్రి వీరేష్ చేసిన నీచపు పనికి అభం శుభం తెలవని చిన్నారి జీవితాన్ని కాపాడటానికి ఆ భగవంతుడు ప్రయత్నం చేయకపోయినా… వీరేష్ కు సరైన శిక్ష పడింది. ధైర్యంతో ముందుకు సాగాలి అనే కథాంశం తో ముందుకు వచ్చిన కథ “తీర్పు “.
మార్పు దిశగా కథలో… మోహన్ సాధారణంగా కొన్ని వినాయక చవితి కార్యక్రమాలలో కొన్ని మండపాల వద్ద జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక లేని ఆశను తనలో కల్పించుకుని ఏదో చేయాలనుకున్న తన స్వార్థపు ఆలోచనకు నిజంగా భగవంతుడే తన హృదయంలోకి వచ్చి ఒక మార్పును తీసుకువచ్చినట్లుగా కథ నడిపించిన తీరు చాలా బాగుంది. మోహన్ ఉద్యోగ వేటలో పడి మంచి ఉద్యోగం సాధిస్తాడని ఆశాజనకంగా చదివించినది. మానవత కథలో… ఇంటి యజమాని శ్రీ వాణి మానవత్వంతో కూడిన సందేశాన్నిస్తూ కథ సాగిన తీరు చివరివరకు పాఠకున్ని చదివించింది.

పుస్తక రచయిత్రి

ఒక కథలో స్త్రీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. మరో కథలో పురుషుడికి జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. సమాజంలో అన్ని సంఘటనలు ఉంటాయి. అనే వాస్తవిక కోణంగా కథల్లో ఉన్న విషయాలు చదువుతుంటే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి.
ఏదో ఊహ లోకంలో వ్యవహరించకుండా తన చుట్టూ ఉన్న సమాజంలోని కుటుంబాల వాస్తవిక జీవన చిత్రాలను, అక్కడక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలను, తన హృదయాన్ని కదిలించిన మరెన్నో సమాధానాలు లేని ప్రశ్నలకు అక్షర రూపంగా “మిగిలేవి…గురుతులే” కథల సంపుటిలో కవితా వాహిని,తీర్పు, మార్పు దిశగా,మానవత, నీ స్నేహమే నీకు నేనుగా, చైత్రరాగం, జెర జెప్పండి సారూ…!, ఇక నిశ్చింతగా, మిగిలేవి… గురుతులే, ఐక్యతాసూత్రం, అలాంటి తల్లులుండబట్టే, తప్పెవరిది, ఇదేనా న్యాయం!, తోడు. ఇలా 15 కథలతో ప్రత్యేకమైన కథాంశాలతో కథ చెప్పే ఓర్పు,నేర్పు,సహనంతో పాటుగా పాత్రలను సమాజ కోణంలో సందర్భానుసారంగా కొనసాగించడం చేయి తిరిగిన రచయిత్రిగా అరుణ చెప్పగలిగారు. తన రచనలు మిగిలేవి…గురుతులే (కథా సంపుటి) జ్ఞాపకాల సంతకం (కవితా సంపుటి) ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం (పరిచయ గ్రంథం) మరియు తన గురువర్యులైన గోపాల్ రెడ్డి బ్రెయిల్ లిపిలో రాసుకున్న జీవిత చరిత్రను తెలుగులోకి లిప్యంతరీకరణ చేయడం జరిగింది.(ఇట్టి నవల యూట్యూబ్ ద్వారా తన గళంలో అప్లోడ్ చేయడమైనది)లు ముద్రించబడినవి. మరియు ప్రస్తుతం హరిహర త్రిశక్తి శతకం ముద్రణలో యున్నది. ప్రముఖుల సాహిత్య రచనలపై విశ్లేషణా వ్యాసాలు, ముఖాముఖీలు చేసి తన ప్రత్యేకతను చాటుకుంటున్న సోదరి ధూళిపాళ అరుణ గారికి శుభాకాంక్షలు

పరిచయం
-డా. చిటికెన కిరణ్ కుమార్
రచయిత, విమర్శకుల
సభ్యులు: ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్,
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ : మానేరు రచయితల సంఘం,

ఓ తండ్రి తీర్పు లఘు చిత్ర కథకులు
చైతన్య స్ఫూర్తి -చిటికెన వ్యాసాలు

సెల్ : 9490841284
రాజన్న సిరిసిల్ల.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

వ్యక్తి స్వానుభవాన్ని చెబుతున్నప్పుడు అది ఉత్తమ పురుషలో రావాలి – విహారి

by Aruna Dhulipala July 25, 2024
written by Aruna Dhulipala

ప్రసిద్ధ కథకులు, కవి, రచయిత, విమర్శకులు, వక్త, నాటకకర్త విహారి గారితో మయూఖ ప్రతినిధి అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి

*******************************************

నమస్కారం సార్. మా మయూఖ పాఠకులకు మీ సాహితీ ప్రస్థానాన్ని పరిచయం చేయడం నాకెంతో సంతోషంగా ఉంది.

మీ జననం, బాల్యం,  కుటుంబాన్ని, విద్యాభ్యాసాన్ని గురించి చెప్పండి.

జ: నమస్కారం అమ్మా! నేను అక్టోబర్ 15, 1941వ సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాను. మా అమ్మగారు జొన్నలగడ్డ శ్రీదేవి, మా నాన్నగారు జొన్నలగడ్డ మేధా దక్షిణామూర్తిగారు. ఆయన ఆ రోజుల్లో గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ఉన్న ఒకే ఒక్క ఇంగ్లీష్ అకౌంటెంట్. నాకు ఒక అన్నయ్య, ఒక అక్కయ్య, నలుగురు చెల్లెళ్ళు.  ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మా అన్నయ్యను ప్రభల రామబ్రహ్మం గారికి దత్తత ఇచ్చారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తమ ‘ఏకవీర’ నవలను అంకితం ఇచ్చింది ఆ రామబ్రహ్మం గారికే. మా నాన్నగారు మాటకు బాగా విలువ ఇచ్చేవారు. ఆయనకున్న వృత్తి పట్ల ఉన్ననిబద్ధత, ముక్కుసూటిదనంతో ఉన్న పళాన ఉద్యోగం వదిలేశారు. అంతటి ఆత్మాభిమానం కలవారు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు, నాన్న అనారోగ్యంతో చిన్నతనంలోనే కష్టాలను అనుభవించాను. 1955 లో నా ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయింది. చదువు కొనసాగలేదు. ఈలోపు మా నాన్నగారి మరణంతో కుటుంబ బాధ్యత మీద పడింది. అందువల్ల ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేస్తూ సమయాన్ని బట్టి, ఎమ్.ఎ., ఇన్సూరెన్స్ ఫెలోషిప్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్, జర్నలిజం వంటి వాటిల్లో డిప్లొమాలు చేశాను.

ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఇంతటి సాహిత్యానురక్తులు కావడానికి నేపథ్యం ఏమిటి?

జ: నేను చిన్నప్పటి నుండీ పద్యాలు, శతకాలు, పాటలు, భగవద్గీత శ్లోక పఠనం, వక్తృత్వం, వంటి అనేక పోటీ పరీక్షల్లో ముందుండే వాడిని. ఎస్.ఎస్.ఎల్.సి పాసయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. దానివల్ల పుస్తకాల పురుగునైపోయాను. పఠనాసక్తి కలిగిన వాడిని కావడం వల్ల అక్కడ ఉన్న శాఖా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను. లైబ్రేరియన్ గా ఉన్న వెలగం వెంకట్రామయ్య గారు “ఏమయ్యా! ఇంకో గ్రంథాలయం చూసుకోరాదూ!” అన్నారు నవ్వుతూ.ఆవిధంగా ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో ఉన్న పుస్తకాలన్నీ చదివాను. ప్రాచీన కావ్యాలన్నీ భారతీ గ్రంథకర్తలు కీ.శే. హరిసాంబశివరావు శాస్త్రి గారి వద్ద, మా పెద్దమ్మ  కొడుకు ఉభయ భాషా ప్రవీణ చల్లా శంకరయ్య గారి వద్ద చదువుకున్నాను. మా గోఖలే ( మాధవపెద్ది గోపాలకృష్ణ ), చా.సో, కరుణశ్రీ వంటి సాహితీ దిగ్గజాలెందరూ నాకు స్ఫూర్తి దాతలు. ఉద్యోగరీత్యా మచిలీపట్నం చేరిన తర్వాత నా సాహిత్యాభినివేశం రెట్టింపు అయింది.

మీ ఉద్యోగ జీవితాన్ని ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించారు?


జ:  నేను మీకు ముందు చెప్పినట్లు మా నాన్నగారు పరమపదించిన తర్వాత నేను కుటుంబ పోషణ బాధ్యత మోయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  చదువు మానేసి ఉద్యోగానికి వెళ్ళాను. ఆ ఉద్యోగం ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే పంచవర్ష ప్రణాళికల కింద ప్రారంభించారు. మాలకొండయ్య గారని IAS ప్లానింగ్ ఆఫీసర్. ఆయనను ఒకరి ద్వారా కలుసుకున్నాను. ఆయన కూడా నావంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారవడం వల్ల నన్ను ఆదరించి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. ఆ కాలంలో సివిల్ ఇంజినీర్ టెస్టులు ఉండేవి. ఇప్పుడు తీసేశారు. అవి పాసయితే డిప్లొమా, డిప్లొమా పాసయితే డ్రాఫ్టింగ్, సూపర్ వైజర్ గా వెళ్ళొచ్చు. అలాగే డిగ్రీ చేసుకోవచ్చు. నేను దాన్ని అతితక్కువ సమయంలో, అత్యుత్తమ స్థాయిలో పూర్తి చేశాను. LDC క్యాడర్ రూ.67/- ఉండేది. నాకు రూ.84/- ఫిక్స్ చేసి ప్రమోషన్ ఇచ్చారు. పదహారు పేపర్లు పూర్తి చేయాల్సి ఉంటే నేను ఎనిమిది పేపర్లు పూర్తి చేయగానే ప్రమోషన్ ఇవ్వడం గొప్ప విషయం ఆ రోజుల్లో.

LIC లో మీ ప్రవేశం ఎలా జరిగింది? తర్వాత మీ ఉద్యోగ ప్రస్థానం ఎలా కొనసాగింది?

నేను ఎల్.ఐ.సి లో ప్రవేశించడం యాదృచ్చికంగా జరిగింది. బాపట్లలో మాకు దూరపు బంధువు కొండయ్యగారు అందులో పని చేస్తుండేవారు. కొండయ్య గారి తండ్రి గురు గోవింద స్వామి శిష్యుడు. ఆయన ‘కపిల గోసంవాదం’ అని భారతంలోని కథాంశాన్ని తీసుకొని ఆధ్యాత్మిక కావ్యం రాశారు. నా జాబుకి సంబంధించిన అప్లికేషను పంపించారు. అప్పట్లో 55% మార్కులు ఉంటే ఎల్.ఐ. సి. అసిస్టెంట్ అర్హత ఉండేది. నాలుగు సౌత్ స్టేట్స్ కలిపి కాంపిటేషన్ టెస్ట్ నిర్వహించేవారు. ఒక్క మచిలీపట్నంలోనే దాదాపు 2వేల 3 వందల మంది రాశారు. అట్లా పరీక్ష రాసిన లక్షా 28 వేల మందిలో ఎస్.ఎస్.ఎల్.సి.వాడిని నేనొక్కణ్ణే. అటువంటిది ఆ పరీక్ష పాసవడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడం కూడా జరిగింది. ఆ విధంగా నా ఉద్యోగ ప్రస్థానం 1961 మచిలీపట్నం నుండి ప్రారంభమైంది. కుటుంబాన్ని తీసుకొనివెళ్ళాను. ఆ తర్వాత పి.యు.సి. పాసయినాను. ఎల్.ఐ.సి లో ప్రొఫెషనల్ పరీక్షలుండేవి. నేను లైసెన్సుయేట్ నుండి అసోసియేట్ స్థాయికి వచ్చాను. అక్కడ ఆరు పేపర్లు రాయవలసి ఉంటుంది. అది ఒక్కసారి అయినా రెండుసార్లు అయినా పూర్తి చేసుకునే అవకాశం ఉండేది. నేను ఒకేసారి 6 పేపర్లకు కట్టాను. అందులో  Actuarial science అని మేథమేటిక్స్ బేసిస్ పేపర్ ఉంటుంది. ప్రపంచంలో రెండే రెండు ప్రొఫెషన్స్ ఈనాటికీ గొప్పవిగా భావించబడుతున్నాయి. అందులో ఒకటి ఆర్చురీ, రెండవది చార్టెడ్ అకౌంట్. ఆర్చురీ లండన్ లో ఉంటుంది. చాలా కష్టమైనది. మేథమేటిక్స్ బేసిక్ లేనివాళ్ళకు మరీ కష్టం. నేను ఆరు పేపర్లు ఒకేసారి పాసయ్యాను. మా ఫెడరేషన్ లో ఒక రికార్డు అది. 150 మంది ఉన్న మా డిపార్టుమెంటులో సీనియర్ గా ఉన్న వ్యక్తి రిజల్ట్ తీసుకొచ్చి నన్ను పిలిచి అందరి ముందు నన్ను బెంచీపై నిలబడమని నిలబెట్టి ఆ విషయాన్ని గొప్పగా చెప్పడం మర్చిపోలేను. తర్వాత బి.ఏ, ఎమ్.ఏ లు, ఫెలోషిప్ కూడా పాసయ్యాను. ఆరు పేపర్లు ఒకేసారి పాసయినందుకు సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది. నా తర్వాతి నుండి ఎస్.ఎస్.ఎల్.సి తో అర్హత తీసేసి కనీస అర్హతగా డిగ్రీ ఉండాలని నిర్ణయించారు (పెద్దగా నవ్వుతూ). ఆ తర్వాత HGA (Higher grade assistant) గా చేశాను. 15 సంవత్సరాలు చేశాను కానీ ప్రమోషన్ల విధానం కోర్టు కేసులతో నడిచి చివరకు 1979 లో ధార్వాడకు సూపరింటెండెంట్ గా వేశారు. తర్వాత కడపలో తొమ్మిదన్నర ఏళ్ళు చేశాను. బొంబాయిలో సంవత్సరం, అటునుండి 1990- 94 వరకు హైదరాబాద్ లో మొదటిసారి చేశాను. మళ్ళీ బెంగుళూరు రెండేళ్ళు, తిరిగి బొంబాయిలో చివరగా హౌసింగ్ ఫైనాన్స్ కి డిప్యూటీగా వేశారు. ఆలిండియా క్యాడర్ లో 101 ఆఫీసులకు హెడ్ గా ఉన్నాను. ఏడేళ్ళు పనిచేసి 2001 వ సంవత్సరం చివర్లో రిటైర్ అయ్యాను. తీసుకోగలిగే పదవి అయినా నేను నా జీవితంలో అవినీతి పనులకు పాల్పడింది ఎప్పుడూ లేదు. “నా బ్యాంక్ పాస్ బుక్, నా జీవితం పాస్ బుక్ ఎప్పుడూ ఓపెన్” అనేది నా స్టేట్ మెంట్. అందులో ఎలాంటి సీక్రెట్ లేదు ( నవ్వుతూ ). నా పిల్లల్ని కూడా అలాగే పెంచాను.

‘ఆంధ్ర సారస్వత సమితి’ స్థాపనకు దారి తీసిన పరిస్థితులేవి?

ఇంతకుముందే మచిలీపట్నంలో ఉద్యోగం ప్రారంభించానని చెప్పాను కదా! అక్కడికి వెళ్ళగానే నేనొక భావోద్వేగానికి గురయ్యాను. కారణం విశ్వనాథ సత్యనారాయణ గారు, పింగళి కాటూరి కవులు, ముట్నూరు కృష్ణారావు గారు, పట్టాభి సీతారామయ్య గారు వంటి వాళ్ళ పేర్లు వింటేనే ఒడలు పులకరిస్తుంది. అటువంటి వాళ్ళు ఉన్న నేల అది. “ఇచట పుట్టిన చివురు కొమ్మయిన చేవ” అని గుర్తుకు వచ్చింది. ఎంత గొప్ప ప్రదేశం? ఆ మట్టి ఆ గాలి కూడా అంతే. ఆ పరిస్థితుల్లో సాయంత్రం పూట పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్లు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, ఆదివిష్ణు, రావూరి సత్యనారాయణ గారు వంటి ప్రముఖులు ఇలా చాలామంది కలుస్తుండేవారు. అద్దేపల్లి రామ్మోహన్ రావుగారు ఒకసారి “ఏమయ్యా విహారీ! మనం ఎలాగూ అందరం కలుస్తున్నాం కదా! ఒక సంస్థ పెడితే బాగుంటుంది కదా!” అన్నారు. నేను సరేనన్నాను. ఏడుగురం కలిసి రిజిస్ట్రేషన్ చేయించాం. అందులో తొలి సంతకం అద్దేపల్లి వారిదైతే రెండవది నాది. మొట్టమొదటి సభ 11 మందితో టౌన్ హాల్లో పెట్టాము. వేదాల తిరు వెంగళాచార్యులు గారని, అలంకారశాస్త్రంలో దిట్ట. ఆయనను ప్రసంగానికి పిలిచాం. పదకొండు మందిలో కూడా ఏడుగురే వచ్చారు. అదీ పరిస్థితి. కానీ నేను దాన్నుండి బయటకు వచ్చేనాటికి చివరి సభకు లోపలే కాకుండా బయట 300 కుర్చీలు వేయిస్తే ఆ మూడువందల కుర్చీలలో మొత్తం ఆడవాళ్ళు కూర్చోవడం విశేషం. ప్రహరీ గోడ మీద కూర్చొని, నిలుచొని కూడా కొంతమంది విన్నారు. ఆ స్థాయికి దాన్ని తీసుకొచ్చాం.

ఆ సంస్థ ద్వారా మీరు చేసిన కార్యక్రమాలు ఏవి?

ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు. ఒకటి మా మెంబర్స్ ప్రతీనెలలో పదిహేను రోజులకు ఒకసారి ఒక తేదీన గోష్ఠి నిర్వహించుకునేవారం. రెండవది సభ ఏర్పాటు చేయడం. అందువల్ల ఊళ్ళో ఒక విధమైన చైతన్యం వచ్చింది. దాదాపు తెలుగునాట ఉన్న ప్రముఖులందరినీ ప్రసంగాలకు పిలిచాము. ఎంతోమంది ఆర్థిక సహకారం అందించారు. త్రివేణి వక్కపొడి ఓనర్ వెంకట సుబ్బారావు అయితే “మీరు ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తర్వాత మీకు ఇంకా కావాల్సిన మొత్తాన్ని నేను ఇస్తాను” అని అనేవారు. నేను గొప్ప సమన్వయ వాదిని అని పేరు నాకు. ఎందుకంటే అన్ని విధాలైన భావ జాలాలను కలుపుకు పోతాను. ప్రాచీన సాహిత్యం లో శ్రీశ్రీ సాహిత్యాన్ని అభిమానించే extrimists ఉండేవారు. అద్దేపల్లి రామ్మోహన్ రావుగారు శ్రీశ్రీ మీద మొట్టమొదటి విమర్శ పుస్తకం రాశారు. ఆ కారణంగా ఆ ఊళ్ళో మా సంస్థ ద్వారా ఎంతో చైతన్యం వచ్చింది.
       ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చివరి సభకు సినారె గారు ప్రధాన వక్త. ఎమ్. వి. ఎల్., కావిలిపాటి విజయలక్ష్మి, మధురాంతకం రాజారావు వీళ్లంతా వేదిక మీద ఉన్నారు. ఎస్.పి గారిని అధ్యక్షునిగా పిలిచాము. అది ఎమర్జెన్సీ పూర్తయిన కాలం. సమయానికి ఎస్.పి.గారికి అర్జెంట్ పని ఉండడం వల్ల రావడం లేదని చెప్పాడు. రామచంద్ర రాజు గారు జిల్లా జడ్జి. ఆయనను పిలిచాము. గతంలో బుచ్చిబాబు నవల మీద లైబ్రరీలో నేను ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఈయనే అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ ఆత్మీయతతో అంగీకరించారు. అప్పుడు  నారాయణరెడ్డి గారు మాట్లాడిన మొదటి వాక్యం “చట్టం గద్దె దిగింది న్యాయం గద్దె నెక్కింది” అని ఎమర్జెన్సీని ఉద్దేశించి అనడంతో జనమంతా చప్పట్ల హోరు. అదే సభలో కొడాలి ఆంజనేయులు గారూ ఉన్నారు ముందు వరుసలోనే. రెండు నిమిషాలు మాట్లాడతానని వేదిక మీదకు వచ్చారు0 (విశ్వనాథ వారు ఈయన కలిసి సత్యాంజనేయులు అనే పేరుతో అవధానాలు నిర్వహించారు). “నేను పుట్టిన ఈ బందరులో మూడే మూడు సభల్లో ఇంతమంది జనం ఉండడం చూశాను. ఒకటి నీలం సంజీవరెడ్డి గారు వచ్చినప్పుడు, రెండవది అతుల్య ఘోష్, సుచేతా కృపలానీ వచ్చినప్పుడు, మూడవది ఇదే సభ. మొదటి రెండూ రాజకీయ సభలు కాబట్టి జనం రావచ్చు. కానీ ఒక సాహితీసభను గోడలెక్కి చూడడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మేము చేస్తున్న కృషిని అభినందించారు.

అదేవిధంగా ‘స్పందన’ సాహితీ సమాఖ్యను గురించి తెలపండి.

నేను ఆంధ్ర సారస్వత సమితి తరఫున 1972 లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీకి ఎన్నుకోబడ్డాను. అక్కడ అందరికంటే నేను వయసులో చిన్నవాడిని. పావలా సభ్యత్వంతో 300 మంది సభ్యులున్నారు దాంట్లో. రూపాయి సభ్యత్వం కోసం మీటింగులలో ప్రయత్నాలు మొదలయ్యాయి. పావలా ఇవ్వడానికే వెనుకాడేవారు రూపాయి ఎలా ఇవ్వగలరు? అప్పటికే సభలకు చందాలు వసూలు చేస్తున్నారు. ఉన్న సభ్యులు కూడా పోతే ఎలా? అందుకే అది అమలు కాలేదు. 11 ఏళ్ళు నేను సంస్థకు అధ్యక్షునిగా చేశాను. ఇక్కడ శివారెడ్డి, కుందుర్తి, శీలా వీర్రాజు గార్లతో పనిచేసిన గుత్తికొండ సుబ్బారావు సంస్థలోకి వచ్చి చేరాడు. ఎప్పుడు సభలు చేయాలంటే మా ఇద్దరి పేర్లే వచ్చేవి. నాకు ఎంతోమంది పరిచయం ఉండడం వల్ల నేను పిలిస్తే వచ్చేవాళ్ళు. ఒకసారి సినారె గారు సభలో “విహారి పిలవడం వల్ల వచ్చాను. కానీ మద్రాసు నుండి ఊరికే ఎవరైనా వస్తారా?” అన్నారు. అలాగే ఎమ్.వి.ఎల్. కూడా. ఎవ్వరైనా సభల్లో ఆ విషయం చెప్పేవారు. దానిని ‘వ్యక్తి పూజ’ అనుకోవడానికి లేదు కదా! వ్యక్తి లేకుండా సంస్థ ఏముంది? అయితే ఈ కారణంగా ఒక పదిహేను మంది అసంతృప్తి వర్గం తయారయింది. అందులో బోయి వెంకటేశ్వర్లు అనే ఆయన అధ్యక్షునిగా కాదలచుకున్నాడు. నాతో పోటీలో గెలవలేనని తెలుసు కాబట్టి ఉపాధ్యక్షునిగా ఉంటానన్నాడు. అప్పటివరకు ఎన్నికలు లేవు. ఆయన మాట మాత్రంగా చెప్పాడే కానీ నామినేషన్ వేయలేదు. ఈలోగా సరస్వతి అనే ఆవిడ నామినేషన్ వేసింది. ఆయన వచ్చి గొడవ చేశాడు. కనీసం వేస్తానని ఆయన మాకెవ్వరికీ చెప్పలేదు. విత్ డ్రా చేసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. పెద్ద గొడవే జరిగింది. ఆ సమయంలో మేము ఒక ఏడుగురం బయటకు వచ్చి ‘స్పందన సమాఖ్య’ కు రిజిస్ట్రేషన్ చేయించాము.

         ఇందులో మేము పుస్తక ప్రచురణను కూడా ఒక భాగంగా చేసుకున్నాం. దాని తరఫున నేను ధార్వాడ వెళ్ళే లోపు 120 పుస్తకాలు వేశాము. అందులో చాలా పుస్తకాలు యూనివర్సిటీలో రెఫరెన్సు పుస్తకాలుగా ఉన్నాయి. కుందుర్తి పీఠికలు లాంటి స్టాండర్డ్ పుస్తకాలు వేశాము. కథలు, నవలలు వేశాము. దాశరథి దగ్గర నుండి తెలుగుదేశంలో ఉన్న కవులందరినీ కలిపి ‘కవిత’ అనే పుస్తకం వేశాము. ఇదేకాక ‘స్పందన’ అనే మ్యాగజైన్ వేశాము. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్ హసన్ శ్రీశ్రీ ముఖచిత్రం ఉన్న ఆ మ్యాగజైన్ పట్టుకొని తిరుగుతుంటాడు ( నవ్వుతూ ). నేను ధార్వాడకు వెళ్ళడం ఆ సంస్థకు తీరని లోటు. ఎంత ప్రయత్నించినా దాన్ని కొనసాగించడం ఎవరివల్లా కాలేదు. అప్పులు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ సంస్థ ఉంది. అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకుంటూ ఉంటాం.

మీ రచనల్లో కథా సాహిత్యం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమైనా ఉందా?

ఉంది. ఎస్.ఎస్.ఎల్.సి పాసయిన తరువాత గ్రంథాలయంలో పుస్తకాలు చదివేవాణ్ణి అని చెప్పాను కదా! అందులో నన్ను చాలా ప్రభావితం చేసినవి మధురాంతకం రాజారావు, గోపీచంద్ పుస్తకాలు. దాంతో మిగిలిన వాటికంటే కథా సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. అసలు నేను ప్రాథమికంగా పద్య సాహిత్యం, ప్రాచీన సాహిత్యాల పట్ల గట్టి పట్టున్నవాణ్ణి. హరి సాంబశివరావు గారు మా గురువు గారు. నేను ఆయన దగ్గర కావ్యాలన్నీ చదువుకున్నాను. అంతకుముందే తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి అని ఆయన మా అమ్మకు కజిన్ అవుతారు. శాస్త్రిగారికున్న ఏకైక చెల్లెలు మా మేనమామకు భార్య. అందుకే పట్టు సాధించగలిగాను. అలాంటివాణ్ణి ఆధునిక సాహిత్యంలోకి వచ్చి ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో కథలు, నవలలు, విమర్శలు చదివాను. ఇదిలా ఉండగా బందరు ఉద్యోగం లోకి వచ్చిన తరువాత నాతో పాటు శాలివాహన ( త్రిపురారి భొట్ల నారాయణ మూర్తి ), నేను కలిసి పనిచేశాము. మా ఇంటి వెనుక పిట్ట గోడ ఉండేది. ఆయన ఇల్లు అటువైపు ఉండేది. అప్పుడేదో సందర్భంలో కథల ప్రస్తావన వచ్చింది. ఆయన అప్పటికే కథలు రాస్తున్నాడు. అయితే నేను కూడా రాద్దామనుకున్నాను. ఇద్దరం కలిసి రాయాలనుకున్నాము.  అప్పటికే ఆయన శాలివాహన పేరుతో రాస్తున్నాడు. నేను విహారి అనే పేరుతో ఏవో పద్యాలు, వ్యాసాలు సందర్భోచితంగా రాస్తుండేవాడిని. ఆంధ్రజ్యోతి సాహిత్యానుబంధంలో కూడా రాసేవాడిని. ఇక ఆయన నేను ఇద్దరమూ కలిసి 1977 వరకు ముమ్మరంగా కథలు రాశాము. 1977 లో నేను ధార్వాడ వెళ్ళాను. అప్పటినుండీ సెపరేట్ గా రాయడం ప్రారంభించాము. 1977 – 79  మధ్య ధార్వాడలో ఒక్క రచన కూడా చేయలేదు. 1979లో కడపకు వచ్చాను. అక్కడినుండి మళ్ళీ నా రచనా వ్యాసంగం మొదలైంది. ఒక రకంగా రెండవ సాహితీ జీవనమని చెప్పవచ్చు.

మీరు రాసిన ‘చలనం’ అనే కథ ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నదని విన్నాం. అదేంటో చెప్తారా?


మంచి ప్రశ్న. ‘చలనం’ కథలో ఉన్నది ఏంటంటే Existentialism. మనం అస్తిత్వవాదం అని అంటుంటాం కదా! మన తెలంగాణ, ఆంధ్ర అలాంటి అస్తిత్వ వాదం కాదు. సాహిత్యంలో Existentialism అనే దానికి అస్తిత్వవాదం అని పేరు పెట్టిన వారు మొదట గోపీచంద్ అయితే దాన్ని తెలుగు సాహిత్యలోకానికి పరిచయం చేసింది బుచ్చిబాబు. గోపీచందుని ‘అసమర్థుని జీవయాత్ర’లో, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లో దాన్ని వాళ్ళు అప్లై చేశారు. నా కథల్లో Existentialism అనేది ఆకుచాటు పిందె లాగా కనబడుతుంది. అంటే అంతర్లీనంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఈ ‘చలనం’ కథలో శ్రీనివాస్ అనే పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అతను సంప్రదాయ కుటుంబీకుడు. అయినా ఒక్కోసారి వరుసగా 3 రోజులు స్నానం చేయకుండా ఉండడం, ఒక్కోసారి 4 రోజులు నదీ స్నానం చేయడం, బూట్లు, చెప్పులు వేసుకొని పడుకోవడం ఇట్లా. అంటే Chaotic (అస్తవ్యస్తమైన ) person అంటాము. Existentialism ఏం చెబుతుందంటే “A man is a useless person” అనేది అందులో ఒక థియరీ. ఉదా:- ఒక వ్యక్తి మీద అభిమానం కలుగుతుందనుకోండి. అవసరాన్ని బట్టి మారొచ్చు. అతని మీద ద్వేషమూ కలగొచ్చు. రెండవ సూత్రం ఏంటంటే “Exist because you think”. అంటే నేనున్నాను అంటే ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తున్నానంటే నేనున్నాను. నువ్వు చేస్తున్నవన్నీ నీ ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. నువ్వు సాధిస్తున్నది కాదు. దానంతట అదే జరుగుతున్నది. దీన్ని ఆధారంగా చేసుకొని రాశాను. ఆ పాత్ర లైఫ్ చిన్నగా, విభిన్నంగా సాగుతుంది. ఆ అస్తవ్యస్తపు వ్యక్తి మతాంతర వివాహం చేసుకుంటాడు. తల్లి, చెల్లి బాధపడతారు. ఇతరుల దృష్టిలో పనికిరాని జీవితాన్ని గడుపుతాడు. పెళ్ళి చేసుకున్న అమ్మాయి మరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఇందులో నువ్వు దేన్ని ఆపగలిగావు? కాబట్టి మనచేతుల్లో ఏదీ లేదు. చివరకు ఒక సినిమా పాటలో “ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే ఆట” అన్నట్లు పశ్చాత్తాప పడతాడు. ఆంధ్ర పత్రిక వాళ్ళు ఆ అంతరార్థాన్ని పట్టుకొని పత్రికలో వేశారు.

మీ ‘కథాకృతి’ సంకలనాల ఉద్దేశ్యం ఏమిటి?

కథ రాసేవాళ్ళకి సాహితీ సహృదయత ఉండాలి. సాహితీ సంస్కారం ఉండాలి. నేను 350 మంది కవుల కథలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాశాను. అవన్నీ ‘కథాకృతి’ పేర నాలుగు సంపుటాలుగా వచ్చాయి. అందులో చిన్న, పెద్ద, ప్రాంతీయత లాంటి భేదాలు లేకుండా కథ బాగుంటే రాశాను. అందులో దాదాపు 200 మంది ఇవ్వాళ్ళటికీ నాకు తెలియదు. అల్లూరి గౌరీలక్ష్మి అనే ఆవిడ ‘డబ్బింగ్’ అని అద్భుతమైన కథ రాసింది. ఆ కథతోనే మొదలుపెట్టాను. ఒక మీటింగులో ‘నేనేనండీ ఆ కథ రాసింది’ అని పరిచయం చేసుకొంది. “ఎందుకయ్యా వాళ్ళందరికీ కిరీటాలు పెడతావు” అని ఒక పెద్దాయన అన్నారు. కిరీటాలు పెట్టడం కాదు. ఇప్పటివాళ్ళు కూడా రాస్తున్నారు, రాయగలుగుతున్నారని పదిమందికీ తెలియాలి కదా! ఆంధ్రభూమి ఎడిటర్ నేను ఒకావిడ కథను గురించి రాస్తే “అలాంటావిడ కథ ఎలా రాస్తారు?”అన్నారు. “మీరాకథ చదవండి ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుస్తుంది” అన్నాను. ఆయనే నా ‘మహావిజేత’ నవలను అడిగి తీసుకొని ఆంధ్రభూమిలో వేశాడు. “బాలగంగాధర్ తిలక్ రాసిన ‘దొంగ’ అనే కథను ఎవరో కాపీ చేసి టైటిల్ కూడా మార్చకుండా పంపితే ఈయన చూసుకోకుండా పత్రికలో వేశాడు. అది పెద్ద సంచలనం అయింది. అందుకే సూటిగా ఆయనతో ఎడిటర్ అన్నాక అన్నీ చూసుకోవాలని చెప్పాను. ఆయనే ఒక సందర్భంలో  పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన’ లాంటి కథ వస్తే కనుక నేను వేసేవాడిని కాను అన్నాడు. భారతీయ సాహిత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చినవి రెండే రచనలు. అందులో మొదటిది రవీంద్రుని ‘గీతాంజలి’. రెండవది పద్మరాజు గారి ‘గాలివాన’ కథానిక. అలాంటి కథను వేసేవాడిని కాను అనడంతో “అది మీ స్థాయిని తెలియజేస్తుంది” అన్నాను (నవ్వుతూ ). అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే దాంట్లోని విలువలు తెలుసుకోవాలని. అందుకే అటువంటి వాటిని తీసుకొని సంకలనంగా వేశాను.

ఆధునిక పంచకావ్యాల్లో ఒకటిగా పేరొందిన ‘శ్రీ శివభారతం’ రచించిన గడియారం వేంకట శేషశాస్త్రి  గారి పేరు మీద మీరిచ్చే అవార్డు గురించి చెప్పండి.

1981లో గడియారం వేంకట శేషశాస్త్రి గారు మరణించారు. అప్పుడు నేను కడపలో ఉన్నానమ్మా! ఆయన రాసిన ‘శివభారతం’ ఎంతో ఆత్మీయంగా అనేక సందర్భాల్లో చదివాను. మా పెద్దమ్మ కొడుకు, నా రెండవ గురువు గారు చల్లా శంకరయ్య గారని చెప్పాను కదా! ఆయన, నేను కలిసి చదివేవాళ్ళం. అందుకే గడియారం వారంటే నాకు ఎంతో అభిమానం. నాతో పాటు నా ముగ్గురు మిత్రులు మేము ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు కలుసుకునేవాళ్ళం. ఎన్నో సాహితీ చర్చలు చేసేవాళ్ళం. గడియారం వారి మరణవార్త విని ఆయన పేరు మీద ఒక అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపించింది. అది వాళ్లకు చెప్పగానే వెంటనే అంగీకరించారు. కేవలం దానికోసమే సంస్థ పెట్టాము. పద్యకవికి మాత్రమే ఇచ్చే నియమం పెట్టుకున్నాము. భూతపురి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారని ఆయన రచించిన ‘శ్రీ మదాంధ్ర చరిత్ర’ శ్రీకృష్ణ దేవరాయల కావ్యానికి ఇచ్చాము. అప్పటినుండీ మొన్ననే 42 వ అవార్డు ఇచ్చాము. ఆంధ్ర, తెలంగాణాల్లో ఉన్న ప్రసిద్ధులైన కవులందరికీ ఇచ్చాము. ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి గారు, కరుణశ్రీ గారు, ఉత్పల సత్యనారాయణ శాస్త్రి గారు, వేముగంటి నరసింహాచార్యులు గారు, రావికంటి విశ్వనాథం గారు, అనుమాండ్ల భూమయ్య గారు మొదలైన వాళ్ళందరికీ ఇచ్చాము. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. నేను కడప నుండి వచ్చేటప్పుడు 15 వేల రూపాయలు ఖర్చుల కోసం బ్యాంకులో పెట్టి వచ్చాను. మొదట రెండువేలు, తర్వాత అయిదు వేలు, ఆ తర్వాత పదివేలు ఇలా ఆ అవార్డుకు నగదు బహుమతి ఇచ్చాము. మేము పెట్టిన నలుగురిలో ఇద్దరు చనిపోయారు. నేనే ఇస్తున్నాను. శేషశాస్త్రి గారి మనుమలు పొద్దుటూరులో ఉన్నారు. “40 ఏళ్ళుగా ఇస్తున్నారు కదా! మేము కూడా ఇప్పటినుండి భాగస్వాములం అవుతాం” అన్నారు. ఈ రెండు మూడు సంవత్సరాల నుండి వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడికి వాళ్ళకు వస్తే నేనే వాళ్ళను పొద్దుటూరుకు తీసుకువెళ్తాను. అట్లా పద్యకవులకు గడియారం వారి అవార్డు ఇస్తున్నాము.

ఎంతోమంది ప్రముఖుల ప్రశంసాపాత్రమైన మీ ‘శ్రీ పదచిత్ర రామాయణం’ గురించి చెప్పండి.

మానవాళికి అనుసరణీయము, ఆచరణీయము, ఆవశ్యకము అయిన మానవ సంబంధాలను వివరించే మహాకావ్యం రామాయణం. వ్యక్తిని ఉన్నతంగా నిలిపే సార్వజనీన సూత్రాలు, వ్యక్తుల ద్వారా సమాజాన్ని సమతుల్యతతో నిలిపే విశిష్టమైన, శాశ్వతమైన విలువలు కలిగినది. అందుకే సర్వ కాలాల్లో పఠనీయమైన కావ్యమని నా అభిప్రాయం. అందుకే దానిని 6500 పద్యాలతో “శ్రీపద చిత్ర రామాయణం” అనే పేరుతో రాశాను. రామాయణం వంటి మహత్తర కావ్యాన్ని పద్యాల్లో రాయడం వల్ల ఒక ఔన్నత్యం, ఔచిత్యం కలుగుతాయన్న భావనతో పద్యాల్లో రాయడం జరిగింది. పద్యాల మీద నాకున్న పట్టు ‘తీరని దాహం’ కావచ్చు (గట్టిగా నవ్వుతూ).

ప్రసిద్ధ ఆలంకారికుడు జగన్నాథ పండితరాయల మీద నవల రాయాలనుకోవడానికి కారణం ఏమైనా ఉందా?

ఉంది. నేను సినారె గారు రచించిన కర్పూర వసంతరాయలు కావ్యాన్ని నా చిన్నప్పుడు గుంటూరులో ఆయన చెబుతుండగా విన్నాను. అంతకుముందు నేను ప్రాచీన కావ్యాలు గురుముఖత విని ఉన్నాను. దానితో పద్యం మక్కువ ఏర్పడింది. ఈ కావ్యం విన్న తరువాత గేయకావ్యంలో ఇంత  మాధుర్యం ఉందా అనిపించింది. కర్పూర వసంత రాయలు ఎవరో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. నాకు చరిత్ర అంటే ఇష్టం. కర్పూర వసంతరాయల  (కుమారగిరి) చిన్నాన్న అనవేమారెడ్డి. ఆయన అసలు వసంతరాయలు. ఆయన పేరు మీదనే ఉత్సవాలు జరిగేవి. వసంతరాయల గురించి నవల రాద్దామనిపించింది. పరిశోధన చేశాను. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వద్దకు వెళ్ళి ఆయన రాసిన పుస్తకాలతో పాటు మరికొన్ని రెడ్డిరాజుల చరిత్ర పుస్తకాలు మొత్తం వంద పుస్తకాలు చదివాను. ఆ ప్రభావంతో అనవేమారెడ్డి నవల రాశాను. అచ్చులో 170 పేజీల పుస్తకం వచ్చింది (1972). దాన్ని చూసి నోరి నరసింహ శాస్త్రి గారు సాహిత్య అకాడెమీకి ఈ పుస్తకానికి నేను ఓటు వేస్తాను అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం రెకమండ్ చేస్తానని. అప్పటినుండి గేయకావ్యం ఒకటి రాయాలని కోరిక కలిగింది. దాంతో స్పందన సాహితీ సమాఖ్యలో ‘రాబోవు ప్రచురణలు’ అని మొదటిది ఎమ్.వి.ఎల్ గారి సినిమా పాటల్లో సాహిత్యం, రెండవది విహారి గారి జగన్నాథ పండితరాయలు (గేయకావ్యం) అని ప్రకటించాము. 1972 నుండి అది అలాగే ఉంది. ఉద్యోగరీత్యా నాకు రాయడం కుదరలేదు. దాని మీద మనసు పోయింది. ఆ తర్వాత ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా జగన్నాథుని రసగంగాధరం మొదలగు కావ్యాలను చదువుతూ నోట్స్ రాసుకునేవాడిని. గేయకావ్యంగా 40 పేజీలు రాశాను కానీ సంఘటనలు, పాత్రల మధ్య అనుసంధానం చేయడం కష్టమవుతున్నదని నవల రాశాను. అలా రాయాలని కోరిక కలగడానికి కారణం ‘లవంగి’ తో ఆయనకు కలిగిన అపప్రథ. దాన్ని రూఢి చేస్తూ కొంతమంది రచనలు చేశారు. అందులో ప్రధానంగా  కె. రామలక్ష్మి గారు ‘లవంగి’ పేరుతో రాసిన నవల ‘యువ’ పత్రికలో దీపావళి సంచికలో అనుబంధ నవలగా వచ్చింది. అందులో లవంగికి, ఆయనకున్న సంబంధాన్ని చెబుతూ కొన్ని శ్లోకాలను కూడా కోడ్ చేస్తూ రాసింది. అది చదివిన తరువాత దాన్ని ఎలాగైనా కాదని నిరూపించాలి అనుకున్నాను. అంతేకాదు జగన్నాథ పండితరాయల గేయకావ్యం రాయడానికి కూడా ప్రధానమైన భావన అదే. అంతటి గొప్ప పండితుడు, తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన ఆయనపై ఇలాంటి నిందలు వేయడం నాకు నచ్చలేదు. అందుకే ఆధారసహితంగా దాన్ని తప్పు అని నిరూపించడానికి ఈ నవల రాశాను.

మీ పద్యకృతులను గురించి చెప్పండి.

మొట్టమొదటిది రామాయణమే. నేను అంతకుముందు రెండు చిన్నకావ్యాలు రాశాను చిన్నప్పుడు. ఒకటి సోరాబ్ రుస్తుం 50, 60 పద్యాలు ఉంటాయి దాంట్లో.  రెండవది పన్నా అని ఒక కథను రాశాను. విడివిడిగా కాశీని గురించి వ్యాసకాశి అని. అవేవీ ఇప్పుడు లేవు. మొదటగా వెలుగులోకి వచ్చింది శ్రీ పద చిత్ర రామాయణమే. ‘యోగ వాసిష్ఠ సారం’ అని 400 పద్యాలతో తర్వాత రాశాను. సుమంత్రుని గురించి రాశాను. భూమయ్య గారు నవ్వుతుంటారు “రామాయణాన్ని విడిచిపెట్టరా!” అని. సుమంత్రుడు విశ్వాసపాత్రుడైన మంత్రి. మరియు ఆంతరంగికుడు. ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎటువంటి చిత్తక్షోభను అనుభవించాల్సి వస్తుందో సామాజిక పరిస్థితిని అప్లై చేసి రాశాను. ఇది కాక రామాయణంలోని పాత్రల గురించి ‘భక్తి’ పత్రిక వాళ్ళు 16 వ్యాసాలు రాయించారు. అవి, ఇంకో రెండు వ్యాసాలు కలిపి ‘అంతా రామమయం’ అనే వ్యాస సంకలనాన్ని తెచ్చాను. తర్వాత మా బావగారు (ఇప్పుడు లేరు) మాకు పద్యాలు అర్థం కావు గానీ ఒక్క సుందరకాండ అయినా వచనంలో రాసిపెట్టు అన్నారు. ఆయన కోసం 100 పేజీల పుస్తకం రాశాను. భూమయ్య గారన్నట్టు నా మనస్సులోంచి రామాయణం పోవడం లేదు( గట్టిగా నవ్వుతూ ). అందుకే ఇటీవల ‘రామాయణ సూక్తి సుధ’ అని 200 పద్యాలు కేవలం రామాయణంలోని సూక్తులను తీసుకొని రాశాను. అది అచ్చులో ఉంది. ఇంకో విషయం చెప్పాలి. విజయవాడలో ఒకాయన రామాయణంలో 100 బొమ్మలను వేయించాడు. ఆయన పబ్లిషర్ కూడా. అందుకే ఆ బొమ్మలకు అర్థం వచ్చేటట్లు వచనం రాయించాలనుకొని ఒకరిద్దరితో రాయించాడు కానీ ఆయనకు నచ్చలేదు. ఒకసారి ఏదో సందర్భంలో జి. వి. పూర్ణచందర్ రావు దగ్గరికి వెళ్ళినపుడు ఆయన కూడా కలిసి ఈ విషయం చెప్పాడు. అప్పుడు పూర్ణ చందర్ “మా గురువు గారు రాస్తారు” అన్నాడు. వెంటనే ఆయన మొత్తం పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళాడు. నేను కేవలం ఆ బొమ్మ అర్థం కాకుండా దాని ముందు వెనుక ఉన్న కథాంశాన్ని కూడా కూర్చి మొత్తం రామాయణం వచ్చేటట్లుగా రాశాను. ఆయనకు బాగా నచ్చి తీసుకువెళ్ళారు. మీ గురువుగారికి 5 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పండి అన్నాడట. డబ్బు విషయం పక్కకు పెడితే దురదృష్టం ఏంటంటే ఆయన చనిపోయారు. ఆ పుస్తకం అచ్చు వేయడం కోసం కుటుంబ సభ్యులను అడిగితే తెలియదన్నారు. ఇది జరిగి 8 సంవత్సరాలు అయింది. వెతుకులాటలో మొన్న కొన్ని దొరికాయి. అన్నీ కలిపి వేస్తున్నాము.

మీ రచనలు మొత్తం ఎన్ని పుస్తకాలుగా వచ్చాయి? ఆంగ్ల భాషలో ఏవైనా రచనలు చేశారా?

జ:   ఇప్పటివరకు నా రచనలలో కథా సంపుటాలు 19, వ్యాస సంపుటాలు 17, రామాయణాలు 11, నవలలు 7, మోనోగ్రాఫులు 2, పద్య సంకలనాలు 4, దీర్ఘ కవితలు 2, రచయితల సమీక్షలు 5, నవీన 1, సప్తపదులు 1, అచ్చులో ఇంకా ఉన్నవి 3…మొత్తం 72 పుస్తకాలు. ఆంగ్లభాషలో రచనలు ఏవీ చేయలేదు. అన్నీ అనువాదాలే. అంతా లిటరేచర్ సంబంధించినవి. ప్రొఫెషనల్ కి సంబంధించిన షేర్ మార్కెట్లు మొదలైనవి మాత్రమే.

‘అజో విభో కందాళం’ ఫౌండేషన్ వారి జీవన సాఫల్య పురస్కారం పొందిన అనుభూతి ఎటువంటిది?

అప్పా జోస్యుల వారు ఇచ్చే ఈ పురస్కారం చాలా గొప్పది. తెలుగులో జ్ఞానపీఠ అని ప్రసిద్ధి దానికి. నాకు వచ్చిన పురస్కారాల్లో ఎంతో సంతృప్తిని కలిగించిన పురస్కారం అది. డబ్బు దృష్ట్యా కాదు. ఆయన ఎవరిని ఎలా ఎన్నుకుంటారో, ఆయన దృష్టికి ఎవరు ఎలా వస్తారో తెలియదు. ఈ అవార్డు ఇవ్వడానికి ముందు ఆయన నన్ను ఒకసారి చీరాలకు పిలిచారు. ‘శ్రీరామతత్త్వం’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వమన్నారు. రెండురోజులు వాళ్ళింట్లోనే ఆతిధ్యం ఇచ్చారు. రామాయణంలో మీకు నచ్చిన కొన్ని ఘట్టాలను చదవండి అన్నారు. అహల్య ఘట్టంలో చాలామంది ఆమె ఇంద్రునికి కొంగు పరచినట్లుగా రాశారు. అది నాకు మనస్కరించలేదు. ఆధ్యాత్మిక పరంగా వేరే అర్థాలున్నాయి. అదే చదువుతూ వివరించబోయాను. ఆయన నవ్వి వివరణ వద్దు చదవండి అన్నారు. అంటే అంత పట్టు ఉంది ఆయనకి. ఆయన రాసిన పంచభూతాత్మక తారావళుల్లో ‘అంతరిక్ష తారావళి’ ఇటీవలే వచ్చింది. దానికి ముందుమాట నా చేత రాయించారు. 24 పేజీలు వచ్చిందది. గొప్ప పండితులు, సహృదయులు ఆయన.

మీకు వచ్చిన ఇతర పురస్కారాలేవి?

నాకు వచ్చిన పురస్కారాలు అన్నీ కూడా నాకు తెలియకుండా నన్ను వరించి వచ్చినవి. ఏ ఒక్కటి కూడా ఇది వస్తే బాగుండునని అనుకోలేదు. ఒక మరపురాని సంఘటన చెప్పాలి. 1977 లో నా కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం వచ్చింది. 50 సంవత్సరాల తర్వాత దాని బ్యాక్ గ్రౌండ్ తెలిసింది. సిటీ సెంట్రల్ లైబ్రరీలో దాశరథి రంగాచార్యుల వారి సభకు ప్రేక్షకునిగా వెళ్ళాను. ఆయన కారెక్కబోతుంటే బి.ఎస్.రాములు అనుకుంటా నన్ను ‘విహారి’ అని ఆయనకు పరిచయం చేశాడు. ” ఓయ్ నువ్వా విహారి అంటే! నీ సంగతి నాకు తెలుసునయ్యా!” అంటూ ఆగి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డుకు నీ పుస్తకం వచ్చినప్పుడు జడ్జీల మధ్య నిర్ణయం వాయిదా పడింది. బెజవాడ గోపాలరెడ్డి గారు నాకు నీపుస్తకం ఇచ్చి చూడమన్నారు. నీ పుస్తకానికే ఇవ్వమని చెప్పాను. ఆయన “ఇతను చిన్నవాడు కదా! ముందు అవకాశం ఉంది కదా!” అన్నాడు. అప్పుడు నేను నువ్వు మనిషిని చూసి అవార్డు ఇస్తావా? పుస్తకం చూసి ఇస్తావా? అని అడిగాను. అప్పుడది నీకు ఇచ్చారు” అన్నారు. ఇన్ని ఏళ్ళ తర్వాత రంగాచార్యుల నోట ఈ విషయాన్ని విని ఎంతో ఆశ్చర్యపోయాను.  విజయవాడలో ఒకసారి రామాయణం చెబుతుంటే ఇద్దరు వ్యక్తులు మధ్యలో లేచి వెళ్ళిపోయారు. సభ పూర్తయ్యే ముందు ఒక బుట్టతో వచ్చారు.  అయిపోయాక నాకు ఒక ధోవతి, ఉత్తరీయం ఇచ్చి, శాలువా కప్పి గులాబీపూల గజమాలతో సత్కరించారు. ఆ ఇద్దరిలో ఒకవ్యక్తి జానపద బ్రహ్మ లాంటి ఎన్నో పేర్లు కలిగి, వివిధ జానపద కళల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన కర్ణాట లక్ష్మీ నర్సయ్యగారు. మరో వ్యక్తి నాగేశ్వరరావు గారు అని మంగళగిరిలో గొప్ప సంపన్నుడట. ఆ విషయం తర్వాత తెలిసింది. ఆ తరువాత నాగేశ్వరరావు గారికి అప్పటికి భార్య చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆమె పేరు మీద ఆయన నాటకరంగంలో ప్రతిభ కలిగినవారికి  అవార్డు ఇస్తున్నారు. ఇప్పటి నుండీ నాటకాలకు కాకుండా సాహితీ వేత్తలకు ఇస్తానని చెప్పి నాకు ఇచ్చారు. ఆ అవార్డు సభను విజయవాడ నుండి గుంటూరుకు వెళ్ళే రహదారిలో ఓపెన్ థియేటర్ లో ఏర్పాటు చేశారు. నా ఫొటోతో పెద్ద ఫ్లెక్సీ వేయించి, స్వాగతించి గొప్ప సన్మానం చేశారు. మరోసారి కడపలో పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్న సభలో నేను మాట్లాడుతుండగా ఒకాయన మధ్యలో లేచి వెళ్ళిపోయి పట్టుబట్టలు తీసుకువచ్చి సన్మానం చేశాడు. నేను వీటికోసమే వెళ్ళాను. ఏమీ అనుకోవద్దని సంజాయిషీ చెప్పుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన ప్రమేయం లేకుండా జరిగేవి మనకు ఎక్కువ ఆనందాన్నిస్తాయి. అమృతలత గారు ఇచ్చే పురస్కారాలు ఎప్పుడూ మగవాళ్ళకు ఇవ్వలేదు. రచయితలకు ఇవ్వలేదు. మీతోనే మొదలు పెడుతున్నాను అని అమృతలత జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. ఆమెవరో అప్పటికి నాకు తెలియదు. అవార్డులు ఎప్పుడైనానమ్మా! వాటంతట అవే రావాలి. అదే సంతృప్తి. నాకు దాదాపుగా 40 అవార్డుల దాకా వచ్చాయి.

మీరు రాసిన కథల్లో మీకు నచ్చిన కథ ఏది?

నేను రాసిన కథల్లో నాకు నచ్చిన కథ ‘స్పృహ’. ఎవరడిగినా అదే చెప్తాను. ‘నవ్య నీరాజనం’ అని నవ్య పత్రికలో వచ్చింది. ఇంటర్వ్యూ కూడా వేశారు. ఈ కథ దాదాపు అనేక పత్రికల్లోనూ, సంకలనాల్లోనూ 8 సార్లు రీ ప్రింట్ అయింది. దాంట్లో నా లైఫ్ ఫిలాసఫీలో అత్యంత ముఖ్యమైన వాక్యాలున్నాయి. “అవి రాలేదని, ఇది కాలేదని జుట్టు పీక్కోకు. నీకు ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది” ఇలాంటివి. ఇది లైఫ్ బేస్ డ్ కథ. నా కథలన్నింటిలో తాత్త్వికత ఉంటుంది. ఏలె విజయలక్ష్మి గారు నా రామాయణం మీద నాగార్జున యూనివర్సిటీ లో పి హెచ్ డి చేసింది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ యూనివర్సిటీలో. మద్రాసు యూనివర్సిటీలో ఒకతను కథల మీద చేశాడు. ఆంధ్రా యూనివర్సిటీలో కథల మీద విజయేశ్వరావు పి హెచ్ డి చేశాడు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఎమ్.ఫిల్ చేసినవారున్నారు.

మీ అసలు పేరుతో కాకుండా విహారి పేరుతో రచనలు చేయడానికి కారణం?

నేను చిన్నప్పుడు భాగవతం చదివేవాడిని. మా పెద్దమ్మ కొడుకు గొప్ప పండితుడని చెప్పాను కదా! మా ఇంట్లో ఆ వాతావరణం ఉండింది. కాబట్టి శ్లోకాలు అవన్నీ చిన్నప్పుడే బాగా వచ్చేవి. అయితే భాగవతం చదువుతున్నప్పుడు షష్ఠ్యంత్యాల్లో ” హారికి నంద గోకుల విహారికి…” అనే పద్యం ఉంది కదా! అది రోజూ చదువుతూ ఉంటే విహారి అనే పేరు బాగా నచ్చింది. అందుకే నేను పద్యాలు రాసే మొదట్లోనే ఆ పేరుతో ప్రారంభించాను. నా అసలు పేరు జొన్నలగడ్డ సత్యనారాయణ. జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి పేరుతో గొప్ప పండితుడున్నాడు. జకార త్రయంగా తెలుగుదేశంలో జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, జమ్మలమడుగు మాధవశర్మ , జటావల్లభుల పురుషోత్తం అని ముగ్గురు గొప్ప వక్తలు ఉండేవారు. వాళ్ళని మించిన వాళ్ళు కవులలో కూడా ఎవరూ లేరు. సత్యనారాయణ మూర్తి గారు ఆంధ్రా యూనివర్సిటీలో మొదటి ప్రొఫెసర్. ఆంధ్రదేశం నుండి రష్యా వెళ్ళిన మొదటివాడు. అంతటి గొప్పవాడు అని నాకు తెలుసు. ఆ పేరుతో రాస్తే అపభ్రంశంగా ఉంటుందనిపించింది (నవ్వేస్తూ). నా పేరు అదే అయినా ఆయన పేరు చెడగొట్టడం ఎందుకని విహారిగా రాయడం మొదలుపెట్టాను.

సుధామ గారి సృజన ‘సప్తపదుల’ పై కూడా పుస్తకం రాశారు. మీ ఇరువురి అనుబంధాన్ని వివరించండి.

సుధామ గారు మలక్ పేటలో ఉన్నప్పుడు నేను మా అమ్మాయి వాళ్ళింట్లో ఉండేవాడిని. అక్కడే 16 ఏళ్ళు ఉన్నాము. ఆయనతో అక్కడే అనుబంధం ఏర్పడింది. అంతకుముందు విజయవాడ రేడియో స్టేషన్లో పనిచేసినప్పుడు రెండుసార్లు చూశాను. మలక్ పేట నుండి ఆయన ఇక్కడికి షిఫ్ట్ అయిన తరువాత మేమూ ఇక్కడికి షిఫ్ట్ అయినాము. వాళ్ళ అబ్బాయి ఇక్కడికి రావడం, అలాగే మమ్మల్ని ఇక్కడికే రమ్మని కోరడం వల్ల అనుకోకుండా మళ్ళీ ఒక్కదగ్గరికి చేరాము. మా ఇద్దరికీ అట్లా సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆయన సృష్టించిన ‘సప్తపదులు’ ప్రక్రియ చాలా వేగంగా విస్తరించింది. అది మొదలైన కొద్దిరోజులకే నేను పుస్తకం రాశాను.

ప్రాంతీయ భాషా అందాలను ప్రస్ఫుటం చేసే మాండలికాలను రచనల్లో వాడితే ఎలా ఉంటుంది? ఈ విషయంలో మీ అనుభవాలను చెప్పండి.

చాలా బాగుంటుంది. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. మాండలికాలను మెచ్చుకునే వాళ్ళల్లో నేను మొట్టమొదటి వాడిని. మాండలికం అనే కాదు. ఏ భాషలోనైనా ఒక జవం, జీవం అక్కడి మాట మాట్లాడితేనే వస్తుంది. అది ప్రజల భాష కదా! కథల్లో మాండలికం వాడిన వాళ్లలో మా గోఖలే మొట్టమొదటి వాడు. నేను చదివిన ఆయన కథల్లో మొత్తం మాండలికమే ఉంటుంది. తెలంగాణా వాళ్ళు ఆ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. ఏదో న్యూనతా భావం ఉండింది కానీ ఇప్పుడు బాగానే రాస్తున్నారు. నేను కూడా గుంటూరులో పుట్టి కృష్ణాలో 16 ఏళ్ళు ఉన్నవాడిని. మా ఆవిడది బందరు. అయితే నా పలుకుబడి నా రచనల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. చిల్లర భవానీ దేవిగారు ‘నా విగతం’ అనే కథా సంపుటిలో ఒక కథలో ఆ ప్రాంతపు పలుకుబడులు, సామెతలను ఉటంకిస్తూ రాసింది. అందువల్ల మాండలికాలు జీవద్భాష కాబట్టి అవి ఉండాలి. ఉన్నచోట ప్రోత్సహించాలి. నేనెప్పుడో చిన్నప్పటినుండి రాస్తున్నాను. మరి మా గోఖలే ఇంకా ముందు తరం వాడు కదా! ఆయనే ఆ కాలంలో మాండలికాలు ఉపయోగించాడు. కాబట్టి రచయితలు వాటి సౌందర్యాన్ని తరువాతి తరాలకు తెలియజేయాలి.

కథలు రాయడంలో ఏ విధానం పాఠకులను ఆకర్షింపజేస్తుంది?

కథలో ఏది చెప్పాడనేది వస్తువు. ఎలా చెప్పాడన్నది శిల్పం. మూడవది శైలి. శైలిలో మీరన్న మాండలికాలు అన్నీ వస్తాయి. కొంతమంది శిల్పాన్ని ఉత్తమ, ప్రథమ పురుషల్లో రాస్తారు. అయితే ఇవి కథలో ఏది కేంద్రమో దాన్ని ఆధారంగా చేసుకొని వస్తాయి. వస్తువును బట్టి శిల్పం. ఉదా:- ఒక వ్యక్తి స్వానుభవాన్ని చెబుతున్నప్పుడు అది ఉత్తమ పురుషలో రావాలి. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఏ భాషైనా ఉత్తమ పురుషలో రాసిన వాటికి ప్రాధాన్యత ఉంటుంది.

ఇప్పుడొస్తున్న సాహిత్యం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? 

ఇప్పుడు అన్ని ప్రక్రియల్లో వస్తున్నటువంటి సాహిత్యం గత కాలం వచ్చిన సాహిత్యాల కంటే మెరుగ్గా ఉందనే చెబుతాను. రచయితలు కొత్త జీవితానికి అలవాటు పడడం, జీవితంలో సంక్లిష్టతలను, సంకీర్ణమైన మానవ సంబంధాల విశేషాలను కూడా సాహిత్యంలో ప్రతిఫలింప జేయగలుగుతున్నారు. దీనివల్ల సాహిత్యంలో కృషి చేస్తున్న వారందరూ కూడా వివిధ వర్గాలకు, కులాలకు , వృత్తులకు చెందినవారు, వివిధ జీవన నేపథ్యం కలిగినవారు. దానివల్ల వారి స్వానుభవాలు గాఢంగాను, సాంద్రంగాను ప్రతిఫలిస్తున్నాయి. ఇది ప్రత్యేకమైన అంశం. ఈనాటి సాహిత్యం ఉన్నతమైన స్థానంలో ఉందనే నేను చెబుతాను.

నేటి రచయితలకు మీరిచ్చే సూచనలు ఏవి?

నేటి రచయితలకు నేనిచ్చే సూచనలు ఏమీ లేవు. వాళ్ళంతా కూడా ‘సెల్ఫ్ మేడ్’ సాహితీపరులు. ఆ కారణంగా ఇతరులు సూచనలు ఇవ్వాల్సిన స్థితిలో లేరు. కాకపోతే ముఖ్యమైన విషయం. ఈనాటి రచయితలకు అనుభవం ఉన్నది కానీ అధ్యయన పటిమ లేదు. మన వారసత్వం గానీ, సాహిత్యంలో గతం జరిగినటువంటి ప్రాధాన్యతలు గానీ ఏవీ తెలియవు. అది గనుక తెలుసుకున్నట్లయితే వారు ఆ పునాది మీద లేవ గలిగితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయని నా సూచన.

చాలా సంతోషం సార్. మీ వంటి వారి పరిచయం మా పాఠకులకు ఒక చైతన్యదీపం. మీకున్న సమయంలో ఇంత ఓపికగా చాలా సేపటినుండి అడిగిన విధంగా మీ జీవితంలోని సాహితీ సుగంధాన్ని మాకు కూడా పంచినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున ధన్యవాదాలు. సెలవు

July 25, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అబ్బూరి ఛాయాదేవి

by Radhika Suri July 24, 2024
written by Radhika Suri

ప్రేమ ,ఆప్యాయత, చతురభాషణం సింప్లిసిటీ కలగలిపిన స్త్రీ మూర్తి అబ్బూరి ఛాయాదేవి గారు. అక్టోబర్ 13న , 1933 లో రాజమహేంద్రవరంలో జన్మించారు. తల్లిదండ్రులు మద్దాలి వెంకటాచలం, మద్దాలి రమణమ్మ గార్లు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమె ఉన్నత చదువు కోసం నిజాం కళాశాలలో యం. ఏ. పొలిటికల్ సైన్సు లో చేరారు. 1953లో ప్రచురితమైన ‘అనుభూతి’ కథ వీరి మొదటి రచన. మద్దాలి ఛాయాదేవి పేరుతో ఈ కథను వెలువరించించిన వీరు ప్రముఖ స్త్రీవాద రచయిత్రి.

1953 లో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారితో వివాహం జరిగింది. వీరు ప్రముఖ రచయిత, విమర్శకులు, అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ .వీరిది చాలా అనుకూలమైన దాంపత్యం.

మహిళల జీవితాలే ఇతివృతంగా చేసుకొని వారిని చైతన్య పరిచేలా రచనలు చేశారు. స్త్రీల సమస్యలు, పురుషాధిక్యంలో నలిగే స్త్రీల వెతల్ని కథలుగా కూర్చారు. వీరి రచనలు ఇతర భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి (మరాఠీ,హిందీ, తమిళం, కన్నడ స్పానిష్, ఆంగ్ల భాషలలోకి) . ప్రతిష్ఠాత్మకంగా వెలువడిన’ కవిత’ పత్రికకు సంపదకురాలిగా వ్యవహరించారు.

1972లో ‘సుఖాంతం’ కథను ‘నేషనల్ బుక్ ట్రస్ట్ ‘వారు ‘కథాభారతి’ సంకలనంలో ప్రచురించారు .
జె.యన్.టి.యు ఢిల్లీలో డిప్యూటీ లైబ్రేరియన్ గా సేవలందించిన వీరు1982లో ‘స్వచ్ఛంద పదవీవిరమణ ‘పొందారు.

‘బోన్సాయి బ్రతుకు ‘ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్ రోజ్ కథలు ప్రసిద్ధిగాంచాయి. వీరు లింగ వివక్షతో పిల్లల్ని పెంచడం, ఆడ మగ అంటూ తేడా చూపిస్తూ పెంచి స్త్రీ ల జీవితాల్ని బోన్సాయ్ చెట్లలా ఎదగనివ్వడం లేదంటూ రాసిన కథ ‘బోన్సాయ్ బతుకు’ 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖవారు ‘పదవ తరగతి’ తెలుగు వాచకంలో చేర్చారు.

ఛాయాదేవి గారు అతిథులకు చక్కటి విందు భోజనం పెట్టడంలో ఆత్మ సంతృప్తి పొందేవారు. .

జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని తనదైన శైలిలో తెలుగు వారికి పరిచయం చేశారు. సాహిత్య అకాడమీకి రచయిత్రుల రచనల్ని సంకలనపరిచారు.వీరి ‘బోన్సాయ్ బతుకు’ కథ కర్ణాటకలో కూడా పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చారు. ప్రయాణాలు అంటే ఆసక్తి వీరికి. రచయిత్రుల గ్రూప్ ఏర్పాటు చేసి, సారథ్యం వహిస్తూ, అన్ని తరాలతో మమేకమౌతూ చైతన్యపరిచారు. దాదాపు 20 సంవత్సరాలు హైదరాబాదులో
ప్రతి సాహితీసమావేశంలో పాల్గొన్నారు .

” వేదికల్ని పంచుకోవడంలో పెద్దగా ఆసక్తి లేని వీరు, మనిషి
జీవితంలో ప్రతి క్షణం ఎంతో విలువైనదంటారారు”.

పిల్లల కోసం ప్రపంచ దేశాల కథల్ని సేకరించి, అనువదించి ప్రచురించారు. “తమ జీవితంలోని అనుభవాలు, సంఘటనల్ని కథలుగా చెప్పాలనే తపన ఉండేదట” వారికి. ‘ప్రయాణం’ కథతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

1989 -90 లో ‘ఉదయం’ పత్రికలో స్త్రీల కోసం శీర్షిక నిర్వహించారు. ‘భూమిక’ స్త్రీవాద పత్రికలో ‘ఆలోకనం’ పేరుతో ‘కాలమ్స్’ రాశారు. సాహితీ విమర్శలు కూడా చేసిన వీరు, ‘మృత్యుంజయ’ అనే దీర్ఘ కవిత రాశారు .వారికి జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధానికి గుర్తుగా ‘వరదోక్తులు’ పేరిట వరదరాజేశ్వరరావు గారి హాస్యోక్తులను కార్టూన్లతో సంకలన పరిచారు .అవిశ్రాంతంగా రచనా వ్యాసంగం చేసినా,1991 వరకు ఒక్క పుస్తకం కూడా వెలువరించలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.

వీరిని వరించిన అవార్డులు ఎన్నో! 1993 లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం
1996లో ‘మృత్యుంజయ’ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ‘ఉత్తమ రచయిత్రి ‘అవార్డు
2000 సంవత్సరంలో” కళా సాగర్ పందిరి ‘సాహితి పురస్కారాలు అందుకున్నారు.
2005 లో ‘తన మార్గం’ కథా సంకలనానికి కేంద్రం సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 2011లో ‘అజోవిభో కందాళం ఫౌండేషన్’ సంస్థ వారు ‘జీవితకాల ‘పురస్కారంతో సత్కరించారు.

2012 నుండి ఏ సాహితీ సదస్సుకు హాజరు కాలేదు. కళాత్మక దృష్టి గల వీరు తమ పరిసరాలను చక్కగా అలంకరించుకునేవారట. పనికిరాని వస్తువులకు అందమైన ఆకృతి నిచ్చే కళా నైపుణ్యం వీరి సొత్తు. తమ చరమాంకంలో చైతన్యవంతంగా ఉంటూ, అందరిలో ఉత్సాహం నింపుతూ, నవ్విస్తూ ఉండేవారట.తమ అక్షర యాత్రకు స్వస్తి చెప్తూ జూన్ 28 , 2019 న కొండాపూర్ లో శాశ్వత నిద్రలోకిజారుకున్నారు.

” జీవన్మరణాలు అందరికీ సహజమే ఐనప్పటికీ కొందరే మరణించినా తమ వ్యక్తిత్వ శోభలతే కాంతులీనుతారు”. ఆ కోవలోనివారే మన’ఛాయా’దేవిగారు.తమ ‘వీలునామా’ లోని విషయాలను తమ ‘ఆత్మజ ‘లాంటి కొండవీటి సత్యవతి గారికి వివరంగా రాసిన లేఖతో వారి వ్యక్తిత్వం మనకు
సుస్పష్టమౌతుంది .”మరణాన్ని స్వాగతిస్తూ ,మరణానంతరం నిత్య వసంతం”గా ఉండాలని కోరుకున్న వారి అభిమతం సాకారమైందనే నా నమ్మకం. ఇంతటి ఉన్నత విలువలు కలిగిన సాహితీ మూర్తికి ‘అక్షర మాల’తో అభివాదం తెలుపడం ఎంతో సముచితం.

July 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni July 24, 2024
written by Narendra Sandineni

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) *ఊహా సుందరి కవిత..
*ఏకతకు పరిష్కారం కవిత.
*ఏదీ కొత్తదనం కవిత.
కవిత్వం ఓ విశ్లేషణ. ‌. ప్రముఖ కవి,ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ఊహా సుందరి కవిత పై విశ్లేషణా వ్యాసం.ఊహా సుందరి కవితను ఆసక్తితో చదివాను.చదవగానే కవితలోని భావం నన్ను కదిలించింది.నాలో ఆలోచనలను రేకెత్తించింది.వ్యక్తి మనసుకి గోచరించే దృశ్యాలు ఊహలు.వ్యక్తి కల్పనలు చేయడం,చూడని వాటిని చూచినట్టు వినని మాటలను వినినట్టు మనసులో అనుకోవడం,భావించడం ఊహ. వాస్తవమైనదిగా గుర్తింపబడని,ఇంద్రియాలకు గోచరించని దాని యొక్క చిత్రం మనసులో ఏర్పడటం ఊహ లేక కల్పనగా చెప్పవచ్చు.ఊహా సుందరి ఉంటుందా? అని మనకు ఆశ్చర్యం కలుగవచ్చు.నిద్రలో మనం కలలు కంటాం.కలలో కనిపించిన అతిలోక సుందరినే పెళ్లి చేసుకుంటాను అని ఎవరైనా చెబితే అది సాధ్యమయ్యే పనేనా?అనిపిస్తుంది.కవి నారాయణ రెడ్డి (మానారె) 1968 సంవత్సరంలో రాసిన కవిత ఇది.అట్టి ఊహా సుందరి కవిత గురించిన కథా కమామీషు ఏమిటి? అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?అయితే ఊహా సుందరి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“విరిగిన హృదయం చెదిరిన మనస్సు
“కదిలే కుంచె చిత్రిస్తున్నా
“వర్ణాలను మేళవించి సోయగాల నెన్నో నించి
“రేఖామయ సౌందర్యం రేకులు విచ్చిన చందం
“రాసేస్తున్నా !
మనిషి హృదయం లోతులో ఏం జరిగింది? అనేది ఎవ్వరికీ కాన రాదు.అసలు ఎవరికి తెలియదు. అతనేంటి అలా దిగులుగా ఉన్నాడు అనుకుంటారే కాని అతని గురించి అంతగా ఎవరు పట్టించుకోరు. అసలు విషయం ఏమిటి? అని అతనిని అడిగే ప్రయత్నం ఎవ్వరు చేయరు.అతని గురించి సంగతి ఏమిటో అతను చెబితేనే తెలుస్తుంది.కాని అతడు ఎందుకో నోరు విప్పడు,చెప్పడు.అతని హృదయం ఎందుకు విరిగింది? హృదయం విరగడం ఏమిటి? అని మనలో సందేహాలు పొడ చూప వచ్చు.విరిగిన హృదయం అనగా అస్తవ్యస్తమైన హృదయం అని చెప్పవచ్చు.హృదయం బాధకు గురి అయినట్లుగా తోస్తుంది.అతని మనస్సు ఎందుకు చెదిరింది? ఏదో చిత్రం అతని కళ్ళకు గోచరమైనట్టుగా తోస్తుంది. ఏదేని ప్రాణి,జీవి యొక్క మనసు కింపైన సౌందర్యాన్ని అందం అంటారు.శరీర అవయవ సౌందర్యాన్ని మనసుతో చూస్తాము.కావున ఒక మనిషి యొక్క అందం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటుంది.ఈ విశ్వంలో ఎన్నెన్నో జీవులు ఎన్నో వస్తువులు ఉన్నాయి.దేని అందం దానికే ప్రత్యేకం.పువ్వుల అందం అందరిని ఆనందపరుస్తుంది.చిత్రకారుడు తన కుంచెతో రేఖామయ సౌందర్యం గీస్తాడు.రేఖా చిత్రం వివిధ రకాల చిత్ర కళకి సంబంధించిన పరికరాలను ఉపయోగించి చిత్రించే ఒక దృశ్య కళ.కాన్వాసు పై చిత్రాలను గీయడం,ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులను అద్దడమే చిత్రలేఖనం.దృశ్యపరమైన కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ భావాలను,ఆలోచనలను చిత్రము ద్వారా వ్యక్తపరచడమే చిత్రలేఖనం.కాన్వాస్ పై సాధారణంగా కుంచెలను ఉపయోగించి చిత్రలేఖనం చేస్తారు.చిత్రాలను గీసే వారిని చిత్రకారులు అంటారు.చిత్రకారుని చేతిలో కుంచె కదులుతుంది. మనసులో ఏదో తెలియని అలజడి చెలరేగింది. మనసు ఎందుకో స్పష్టత లేకుండా అస్పష్టత కొనసాగుతుంది.అటు ఇటు చంచల స్వభావంతో తిరుగుతున్న మనసును ఒక్కసారిగా అదుపులోకి తెచ్చుకొన్నాడు.కదులుతున్న కుంచెతో ఒకానొక ఊహా చిత్రాన్ని చిత్రిస్తున్నాను అని కవి అంటున్నాడు.రంగులను కలిపి సోయగాలను,సరి కొత్త అందచందాలను ఎన్నింటినో ఆ రంగులతో నింపి రేఖలతో రూపుదిద్దుకున్న అపూర్వమైన సుందర రూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు.మొగ్గలుగా ఉన్న సుమాలు క్రమక్రమంగా విచ్చుకొని సౌరభాలను వెదజల్లినట్లుగా కుంచెతో నగిషిలు చెక్కినట్లుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నానని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఎర్ర రంగు తన రాగాన్ని చిత్రానికి అందిస్తున్నది
“అనురాగము క్షాళితమై ఆ కాలిమ నంటిస్తున్నది
“అధరాలు నఖాంకురాలు ఆ రాగమునే పొందెను
“చెక్కిలిపై ఆరాగమె అనురాగము పొంగించెను.
రక్తం ఎరుపుగా ఉంటుంది.ఎరుపు రంగు చారిత్రాత్మకంగా త్యాగం,ప్రమాదం,ధైర్యంతో ముడిపడి ఉంటుంది.ఎరుపు రంగు సాధారణంగా వేడి,కార్యాచరణ,అభిరుచి,లైంగికత,కోపం,ప్రేమ, ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.భారత దేశంలో ఎరుపు రంగును ఆనందాన్ని,అదృష్టాన్ని సూచించే రంగుగా చెబుతారు.ఎరుపు విప్లవపు రంగుగా మారింది. ఎరుపు రంగు ఉత్తేజాన్నిస్తుంది.ఎరుపు రంగు ఉత్సాహభరితమైనది.ఎరుపు రంగు ప్రేమ యొక్క రంగుగా పరిగణించబడుతుంది.సంధ్యా సమయం ఎరుపు రంగును తెలుపుతుంది.రోడ్డుపై సిగ్నల్ పడగానే ఎరుపు రంగుతో అప్రమత్తంగా ఉంటారు. ఎరుపు రంగు ధైర్యాన్ని ఇస్తుంది.ఎరుపు రంగు బలాన్ని శక్తిని సమకూరుస్తుంది.ఎరుపు రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.ఎరుపు రంగు నిశ్చింతగా నిబ్బరంగా ఉండేలా చేస్తుంది.ఎరుపు రంగు తేజస్సుకు ప్రతీక.ఎరుపు రంగు ప్రేమకు,దయకు సంకేతం.ఈ ప్రపంచమంతా అనేకమైన రంగులతో కూడి ఉంటుంది.రంగులు లేని లోకం మన ఊహలకు అందదు.మనిషి దేన్ని తలుచుకున్నా ఏదో ఒక రంగు కళ్ళ ముందు నిలుస్తుంది.కుంచె ఎరుపు రంగును తీసుకుని ఆ ఎర్ర దనాన్ని చిత్రానికి అందిస్తున్నది.కుంచెకు గల ఎర్ర రంగు కడిగి వేయబడి నల్ల రంగును చేర్చుకొని చిత్రాన్ని సరి కొత్తగా రంగులతో అద్దుతున్నది.కుంచెకు గల ఎరుపు రంగుతో పెదవులు,గోళ్లు ఎర్రగా మెరుస్తూ సహజత్వాన్ని పొందినాయి.చెంపలపైని ఎర్రని నిగారింపు తనలోని ప్రేమను పొంగింపజేసింది. ఎరుపు రంగు బుగ్గలకు నిండుదనాన్ని చేకూర్చినట్లు తోస్తోంది.

“జడ లోపల కనుపాపల లోతులలో పాతుకొనియె
“కారు నలుపు కాగిన కాలపు క్రీడలు
“కుంచె మీద క్షణికములవి చంచలాక్షి కవె నిత్యము.
వాలు జడ లోపల గడచిన కాలపు విలాసవంతమైన నలుపు రంగు శోభిస్తున్నది.కనుపాపల లోలోపల పూర్తిగా నిండిన నలుపు రంగు కాంతులు కనిపిస్తున్నాయి.జడ,కనుపాపలు నల్ల రంగుతో తీర్చబడి ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి.
గడిచిన కాలపు విలాసాలైన మిక్కిలి నల్లని ఛాయలు శోభతో మెరుస్తూ వైభవాన్ని చాటుతున్నాయి.ఎరుపు రంగు గాని,నలుపు రంగు గాని ఎందుకో ఏమిటో కుంచె మీద నిలవడం లేదు. ఆ రంగులు కుంచె మీద తాత్కాలికంగా ఉంటున్నాయి.కుంచె మీద నిలవని రంగులు క్షణికములవుతున్నాయి.చంచలాక్షి చిత్రానికి అవి చెదరకుండా శాశ్వతములై ఉన్నట్లు శోభిస్తున్నాయి.
“సుఖ దుఃఖాల ప్రతీకలు సుందరతరమీ రేఖలు.
జీవితంలోని ఈ రంగుల వెలుగులు సుఖదుఃఖాలతో కూడినవి.సుఖాలకు దుఃఖాలకు ఈ రేఖల గుర్తులు చెరిగిపోనివిగా కనిపిస్తున్నాయి.ఉదయించే సూర్యుని లేలేత కిరణాలు ఎరుపు రంగులను పోలి సుఖాలకు గుర్తులుగా ఉన్నాయి.నలుపు రంగు జీవన గమ్యంలో ఎదురైన కష్టాలను,దుఃఖాలను తలపింపజేస్తున్నది.చిత్రకారుడు గీసిన రేఖలు ఎంతో సుందరతరంగా ఉన్నాయి.చిత్ర సౌందర్యపు రేఖలు మరీ మరీ చూడాలనేంత తహతహను కోరికను కలిగించేవిగా ఉన్నాయి.
“పసిపాపను చూచు తల్లి పరవశత్వమే యబ్బెను
“నా సృష్టి యలౌకికమై నా కన్నుల ముందు నిల్చె.
కాన్వాసు పై గీచిన సుందర చిత్రాన్ని చూడగానే పసిపాపను గారాబంగా అపురూపంగా చూసుకునే తల్లి పొందే పారవశ్యం,తెలియని మైమరుపు కలిగింది.సృష్టి కర్త వలె కలలో తాను గీసిన వర్ణ చిత్రం.స్వప్నంలో చిత్రించిన ఆ చిత్రం లోకంలో గాలించి వెతికినా కనిపించదు.చిత్రకారుడు గీసిన చిత్రం అలౌకికం,అపురూప కళాఖండంగా ఒక్కసారిగా నా కళ్ళ ముందు సాక్షాత్కరించింది.
“అదిగదుగో ! ఆ సుందరి కదలినట్లు,పెదవి విప్పి
“పదములనే పాడినట్లు భ్రమ చెందితి.
అదిగో కళ్ళు బాగా తెరిచి చూడు.ఆ సుందరి చైతన్యంతో కదలాడినట్లు పెదవి విప్పి మధురమైన పాటలను పాడినట్లుగా ఒక రకమైన తీయని అనుభూతి కలిగింది.
“ఎవడా పోకిరి ? ఓహో ! నాగరికత నడుమంత్రపు
“ముద్దుబిడ్డ ; గడుసరియై భారతీయ భావనకే
“గోరి” కట్టు గొప్పవాడు పర సంస్కృతి తొత్తువాడు.
ఎవడా పోకిరి ?ఎవడా దుష్టుడు ?ఓహో ! అతడా! విశృంఖలంగా వెఱ్ఱి తలలు వేసిన నేటి నడు మంత్రపు నాగరికత యొక్క ముద్దు బిడ్డ.అనాదిగా మన దేశస్తులు అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలు,సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన అవసరము,ఆవశ్యకత ఎంతైనా ఉంది.సమాజంలో నాగరికత పేరున వెర్రి తలలు వేస్తున్న దుష్ట సంస్కృతిని అనుసరిస్తున్న ప్రియాతి ప్రియమైన పుత్రుడు వీడు.గడుసరిగా పెడసరిగా మారి బండ బారిన మనసుతో మొండితనంతో భారతీయ సంస్కృతికి ముగింపు పలికే వాడు.గొప్పదైన భారతీయ ధర్మానికి సమాధి కట్టే గొప్ప వాడు.పాశ్చాత్య సంస్కృతికి బానిసగా మారినాడు.తరతరాలుగా వస్తున్న మన సంస్కృతిని మర్చిపోయినాడు.పరాయి దేశస్తుల విష సంస్కృతి వ్యామోహానికి లోను అయినాడు. పరాయి దేశస్తుల కట్టు,బొట్టు,ఆలోచనా సరళి,మాట తీరు,సంస్కృతి,ఆహార్యాలను అనుసరించి విలువలు లేని జీవన విధానాన్ని అనుసరిస్తున్న వాడు ఈ పోకిరి.
“చిత్రమునే చూచె వాడు,చిత్రముగా చూచినాడు
“సకిలించెను,ఇకిలించెను వెకిలి చూపు మకిలి చూపు
“చూపుల తూపులు రువ్వెను లేని మీసములు దువ్వెను
“ప్రేయసియని పిల్చినాడు సభ్యతనే కాల్చినాడు
“కనుల మేఘములు చేరెను అశ్రుధారలై జారెను
“సుందరి వదనాంబుజమున శోకార్తియై “స్ఫురియించెను. చిత్రించిన ఆ చిత్రాన్ని చూచి అట్టి సంస్కారహీనుడు పర స్త్రీలను తల్లుల వలె చూడక అశ్లీల భావనతో చూసే ఒక నీచుడు.ఆ మాతృత్వం ఉట్టిపడే చిత్రాన్ని చూసిన తర్వాత అతని చూపులు చిత్రాతి చిత్రములుగా కనిపిస్తున్నాయి.చిత్రం చూసిన తర్వాత అతడు గుర్రంలాగా సకిలించినాడు.నోరు తెరచి పండ్లు కనిపించే విధంగా ఇకిలించినాడు. వెకిలి చూపులతో అపవిత్రమైన చూపులతో చూపులనే బాణములను రువ్వినాడు.అతను మీసాలు లేనప్పటికీ మీసాలు ఉన్నట్లుగా లేని మీసాలు దువ్వినాడు.మీసాలు మనిషి ప్రతాపానికి పరాక్రమానికి గుర్తులు.బలహీనుడు అయిన ఆ వ్యక్తి మీసాల పై చేయి వేసి దువ్వినాడు మరియు లేని వీరత్వాన్ని చూపడానికి ప్రయత్నించాడు.ఆ చిత్రంలోని స్త్రీ మూర్తిని ప్రేయసీ అని పిలిచి మన జాతి సంస్కారానికి కళంకం తెచ్చాడు.ప్రేయసీ అనే పిలుపుతో ఆమె నయనాల్లో మేఘం వర్షించింది.ఆ స్త్రీ మూర్తి కళ్ళల్లో వేదనాభరితమైన కన్నీళ్లు కాలువలై పారినాయి.చిత్రములోని ఆ సుందరి ముఖ కమలంలో దుఃఖభరితమైన ఆవేదన కొట్టవచ్చినట్లు కనిపించింది.
“భరత భూమి పతనానికి పరులెత్తు పతాకవీడు
“కామముతో కనుగానని నేటి యువత రూపు వీడు
“భరతమాత భవితవ్యం దుష్టాన్వయమయ కావ్యం
“త్రుళ్ళిపడితి ఏదీ సుందరి?పోకిరి యువకుండెక్కడ? భ్రమయేనా ? “మనసులోని రేఖా మాత్రపు చిత్రమో !
“చిత్రమైన చాంచల్యమో ! ఏమో మరి !
భారతదేశం సరిహద్దు ఆక్రమణ కొరకు తచ్చాడుతు పొరుగు దేశపు విరోధులు ఎగరేసిన జెండా వీడు. భారతదేశం ధార్మికతకు కరుణ,దయ,జాలి,ప్రేమ, సహకారము,సోదర భావన మొదలగునవి భగ్నం చేయడానికి శత్రు దేశస్థులు మన దేశానికి పంపిన ఆటంకవాది.భారతదేశంలోని శాంతి భద్రతలకు ముప్పు కలిగించే నీచుడు వీడు.కామంతో కళ్ళు మూసుకుని పోయి వావి వరసలు మరిచిన మానవ మృగం వీడు.దయా దాక్షిణ్యం లేని నరరూప రాక్షసుడు.నేటి దుర్మార్గులైన యువత మొండి స్వరూపం వీడు.భరతమాత భవితవ్యం గురించి ఆలోచన చేయగా భారత మాత భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్నది.దుష్ట వంశ చరిత్ర గల మహాకావ్యంగా గోచరిస్తున్నది.ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి అకస్మాత్తుగా తుళ్ళిపడ్డాను.ఊహా లోకం నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను.ఆ పూర్ణిమ నాటి చంద్రుని వలె శోభించిన ఆ సుందరి ఏది ?ఆ ఊహా సుందరి ఎక్కడుంది ? ఆ పోకిరి యువకుడు ఎక్కడ ఉన్నాడు? మనసులో రూపొందిన రేఖలతో కూడిన ఊహా చిత్రమేనా ? తాను కల కన్నాడా ? కలా ఇది వాస్తవం కాదా? చిత్రమైన మనసు యొక్క చంచలమైన ఆలోచనా విధానమా? ఇది నిజమా ? ఇది బ్రాంతియా ? ఎటు తేల్చుకోలేని సందిగ్ధ స్థితి డోలాయమానంగా కొనసాగుతుంది.దేశ సంస్కృతిని వదిలి పెడత్రోవ పట్టిన సమాజంలోని యువత సన్మార్గంతో నడుచుకోవాలి.అప్పుడే దేశంలోని యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని ఊహా సుందరి కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఊహా సుందరి కవితలోని భావాలు పఠితులను ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.స్వప్నంలో కూడా ఊహా సుందరి పట్ల నిజాయితీతో కూడిన భావనలు వ్యక్తం చేయడం మనలను తెలియని ఊహా లోకంలోకి తీసుకెళ్ళిన తీరు అబ్బురపరుస్తాయి.కవి నారాయణ రెడ్డి (మానారె) ప్రతిభకు ఊహ సుందరి కవిత నిదర్శనంగా నిలుస్తుంది.కవి మాదాడి నారాయణ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) “ ఏకతకు పరిష్కారం “ గేయం పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ఏకతకు పరిష్కారం గేయం పై విశ్లేషణా వ్యాసం.ఏకతకు పరిష్కారం అనే గేయంను ఆసక్తితో చదివాను.ఇది నాకు నచ్చిన గేయం.గేయం చదవగానే నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఏకతకు పరిష్కారం ఉంటుందా? అని మనలో సందేహాలు పొడచూపవచ్చు.ఏకత అంటే ఐక్యత,కలిసి ఉండటం.దీనికి ఆంగ్లంలో Unity అని అర్థం.దేశం బలంగా ఉండాలంటే ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో ఐక్యత ఉండాలి.దేశం బాగు కోరి ఏమైనా చేయాలి అంటే దాని అంతిమ ఫలితం ఐక్యత వలన సాధ్యపడుతుంది.సంఘీభావం,ఏకత మనిషిని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి.ఇవాళ దేశంలో లేనిది ఐకమత్యం అని చెప్పవచ్చు.దేశంలో కులం పేరిట,మతం పేరిట మారణహోమం కొనసాగుతుంది.ప్రపంచంలో కూడా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై దాడులు చేస్తూ బాంబులు ప్రయోగిస్తూ ఆధిపత్యం కొరకు పోటీ పడుతున్నాయి.ప్రపంచంలో శాంతిని స్థాపించుట కొరకు ఐక్య రాజ్య సమితి అనే సంస్థ ఉన్నప్పటికీ నామమాత్రంగానే విధులు కొనసాగిస్తూ ఉంది.అగ్ర రాజ్యాల యుద్ధకాంక్షలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నది.మానారెకు దేశం పట్ల అపారమైన ప్రేమ ఉంది.మానారె ఏ రాజకీయ పార్టీకి చెందని వారు. మానారె విద్యార్థిగా ఎం.ఏ. (తెలుగు) ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో చదివారు.చదువు పూర్తి కాగానే ప్రభుత్వ కళాశాలలో ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.మానారె వివిధ హోదాలలో పని చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు.ఏ సమస్యకు అయినా పరిష్కారం ఉన్నట్లుగా ఏకతకు పరిష్కారం ఉంటుంది అని మానారె తన గేయంలో పేర్కొనడం ఆనందంగా ఉంది.దేశంలో కులం పేరిట మతం పేరిట జరుగుతున్న మారణకాండ ఆవేదన కలిగిస్తుంది.దీనికి పరిష్కారం ఏమిటో తెలియదు. ఏకత సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఏకత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.పరిష్కారం అంటే సమస్య చిక్కుల నుండి విముక్తి చెందే మార్గం తీర్పు అని చెప్పవచ్చు.పరిష్కారం అనేది సులువుగా దొరకని విషయం‌.సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా దేశంలో నలుగుతున్న ఏకత సమస్యను పరిష్కరించడం కొరకు దేశ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.సమస్యకు పరిష్కారం అనేది అడ్డంకులను అధిగమించడం ద్వారా లక్ష్యాన్ని సాధించే ప్రక్రియ.దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్య ఏకత.దానిని ఎంతో సులభంగా పరిష్కరించవచ్చు అని మానారె తెలియజేయడం ఆశ్చర్యం కలుగుతుంది.మానారె రాసిన ఏకతకు పరిష్కారం చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.దేశ భవితకు మూలమైన ఏకతకు పరిష్కారం తెలుసుకొని దానిని సాధించే ప్రయత్నం చేద్దాం.
“ భేద భావం పురులు విచ్చిన
“ స్వార్థ శక్తులు నడుము కట్టిన
“ వాని వ్యాప్తిని అణచి పెట్టిన
“ జాతి బలమును పుంజుకొనును.
ఇవ్వాళ దేశంలో పురులు విచ్చిన భేద భావం కోరలు సాచి ఎల్లెడలా విస్తరించి ఉంది.పౌరులు భేదభావంతో జీవనం సాగిస్తున్నారు.పౌరులు భేదభావం విడిచిపెట్టి సఖ్యతతో మెలిగితే విభేదాలు తొలగిపోతాయి.ఎవరికీ అందకుండా నాకే చెందాలనుకోవడం స్వార్థం.మనిషి తోటి మనిషికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహకారం అందించడం నిస్వార్ధం అని చెప్పవచ్చు.జంతువుల సమూహంలో కూడా జంతువులకు పరస్పర సహకారం ఉంటుంది. పర్వాలేదు మనం సుఖంగా ఉంటే చాలు.నాది అనుకున్నది నాకే దక్కాలి.పరులది కూడా నాకే కావాలి.మరెవరికి దక్కకూడదు అనే మనస్తత్వంతో ఉండే మనుషులు మనకు సమాజంలో తారసపడుతూనే ఉంటారు.అలాంటి వారిని చూస్తే ఉద్వేగం కలుగుతుంది.అలాంటివారు స్వార్థ శక్తులకు ప్రతిరూపం అని చెప్పవచ్చు.స్వార్థం అనేది ఇతరులతో సంబంధం లేకుండా తన కోసం లేదా ఒకరి సొంత ప్రయోజనం ఆనందం లేదా సంక్షేమం కోసం అధికంగా లేదా ప్రత్యేకంగా ఆందోళన చెందడంగా చెప్పవచ్చు.ఇవ్వాళ దేశంలో స్వార్థ శక్తులు విశృంఖల విహారం చేస్తున్నాయి.స్వార్ధ శక్తులు అలజడులకు అల్లరులకు ప్రాణం పోస్తున్నాయి.స్వార్థ శక్తుల వల్ల దేశం విచ్ఛిన్నమైపోతుంది.స్వార్థ చింతన లేని పౌరులు నడుము కట్టి పూనుకొని అలాంటి వారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి.స్వార్థ శక్తులపై ఉక్కు పాదం మోపి వాటిని అడ్డుకోవాలని మానారె అంటున్నారు. నిజమైన ఆనందం సాటి మనిషికి స్వార్థం లేకుండా సాయం చేయడంలో మాత్రమే ఉంటుంది.స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ పెరుగుతుంది.భేదభావంతో మెలుగుతున్న స్వార్థపరులైన ప్రజల దురాగతాలను అణిచివేయాలి అని మానారె పిలుపు ఇస్తున్నారు.భేద భావంతో ప్రవర్తించే జనుల,స్వార్థ శక్తుల ఆగడాలు అరికట్టి వేసినచో జాతి బలాన్ని పుంజుకుంటుంది అని మానారె భావిస్తున్నారు.
“ సర్వమానవ సౌభ్రాతృత్వం
“ సర్వ మతాల సమానత్వం
“ అన్ని కులాల అభేద (భావం) తత్వం
“ వెల్లి విరియాలి మన జాతిలో నిత్యం.
కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు.వృత్తి, ఆచారాలు,సామాజిక స్థాయి వంటి అనేక అంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి.ఇవి వంశ పారంపర్యంగా పాటించబడతాయి.సాధారణంగా కులవృత్తులు, కులవివాహాలు,సంస్కృతి,సామాజిక స్థాయి రాజకీయాలపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది.దేశంలో ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతున్నది.కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి.భారత దేశంలో కులం అనే పదం జాతి లేక సామాజిక వర్గాన్ని సూచిస్తుంది.ఆకృతి,ధర్మము మొదలైన వాటిలో సమాన దృష్టితో ఆలోచించి చేసే విభాగం జాతి. వంశపారంపర్యంగా వచ్చే కుల సంప్రదాయం జాతి. పూర్వీకుల నుండి వచ్చు వర్గం లేక సమూహం జాతి.అనేక ఉపజాతులు గల వర్గం జాతి. సౌభ్రాతృత్వం అనునది సోదరత్వం.సాధారణంగా ఈ పదం సమాజంలో గల విభిన్న మతాలకు వర్గాలకు భాషలకు సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ,గౌరవాల భావనలనే సౌభ్రాతృత్వం అని నిర్వచిస్తారు.సర్వ మానవ ప్రేమ,మానవ కల్యాణం,విశ్వమానవ సమానత్వం, వసుధైక కుటుంబం మున్నగు ఉన్నత భావనలు,సత్ – నీతి,ప్రకృతి నియమాలు,విశ్వజననీయ మానవ సూత్రాలు,సమ్మిళిత సామాజిక స్పృహలు మూల వస్తువులు కలిగిన ఓ విశాల దృక్పథమే సౌభ్రాతృత్వంగా చెప్పవచ్చు.విద్య,వృత్తి నైపుణ్యాలు,నీతి,జాతి,మతాలు,రాజకీయాలు, దానధర్మాలు,వ్యక్తిగత ఆదర్శాలు,సేవారంగం, కళలు,కుటుంబ అధికారాలు మున్నగు అనేక రంగాలలో పెంపొందించవచ్చు.సౌభ్రాతృత్వం వలన పరస్పర అవగాహన,సహకారం,ఉత్పాదకతల అభివృద్ధిని శాంతియుత జీవనాన్ని సాధించవచ్చు. సౌభ్రాతృత్వం వలన ధర్మబద్ధమైన జన జీవనం అనే కొత్త వరవడిని సృష్టించవచ్చును.సౌభ్రాతృత్వానికి ప్రపంచంలో ఏ విషయాన్ని అయినా సాధించగలిగే శక్తి ఉంది.సౌభ్రాతృత్వం మాటల్లో వర్ణించడానికి సాధ్యం కాని ఉన్నతమైన భావన.మనసు నుండి జనించే ఓ విశాల దృక్పథం.దానిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కొలవనువచ్చు.సౌభ్రాతృత్వం వలన మానవునికి అనేక రంగాలలో దూసుకుని వెళ్లే అద్భుతమైన నైతిక స్థితి ఏర్పడుతుంది. భారతీయులం మనం అందరం ఒకటే అనే భావనతో మెలగాలి.మనం అందరం భారతమాత బిడ్డలం.కష్టసుఖాలలో అందరం కలిసి మెలిసి ఉండాలి.మనం అందరం ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనం అందరం అన్నదమ్ముల వలె ఐక్యతతో మెలగాలి.తల్లి బిడ్డలు ఎలా కలిసిమెలిసి ఉంటారో, సుఖదుఃఖాలను ఏ రీతిగా కలిసి పంచుకుంటారో, అదే విధంగా సర్వమానవులు సౌభ్రాతృత్వంతో సోదర సోదరీ భావంతో ప్రవర్తిల్లాలి.ఎదుటి వారికి కష్టం వస్తే వారి కష్టాలలో పాలు పంచుకొని వారి దుఃఖాన్ని దూరం చేసి సహాయపడాలి.మన భారతదేశంలో హిందూ, ఇస్లాం,క్రిస్టియన్ మొదలైన ఎన్నో మతాలు వ్యాపించి ఉన్నాయి.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన మతాన్ని అవలంబిస్తారు. భారతదేశం లౌకిక దేశంగా ప్రసిద్ధి పొందింది.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన దైవాలను పూజించుకుంటారు.భారతదేశంలోని పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా మత స్వేచ్ఛ కల్పించబడింది. భారతదేశంలో నివసించే ప్రజలు నా మతమే గొప్పది,నా మతమే శ్రేష్టమైన మతం,నా దేవుడు గొప్పవాడు అంటే, లేదు.నా దేవుడే గొప్పవాడు అని కలహించుకోకుండా ఉండాలి.అన్ని మతాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయి.అన్ని మతాల పూజా విధానాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి.అన్ని మతాలు సమానం అనే ఆలోచన భారతదేశంలో నివసిస్తున్న ప్రజల్లో నెలకొంటే శాంతియుతమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. మనదేశంలో అనాదిగా అనేక రకాల కులాలు ఉన్నాయి.విభిన్న కులాలుగా శాఖోపశాఖలుగా కుల వ్యవస్థ వేళ్ళూని ఉంది.భారతదేశంలోని ప్రజలు కుల విద్వేషాలు,కుల వైష మ్యాలు తొలగి సోదర భావంతో సఖ్యతగా మెలగాలి.మా కులమే గొప్ప అనే ఆలోచనలు జనుల మనస్సులలో నాటుకుపోయినాయి.అంతే కాక ప్రతి కులంలో మరిన్ని ఉప కులాలు ఏర్పడి మనుషుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.మానవులందరిది ఒకే కులం.అన్ని కులాలు సమానం అనే భావనతో మానవ కులంగా రూపుదిద్దుకోవాలి.కులాల మధ్య చెలరేగే కులాల కుంపట్లు అనే భేద భావం తొలగిపోవాలి.మంచి అన్నది మాల అయితే మాలనే అగుదును అని మహాకవి గురజాడ అప్పారావు తన గేయంలో పేర్కొన్నారు.గురజాడ అందించిన స్ఫూర్తిని ప్రజలు అనుసరిస్తే అన్ని కులాల రూపురేఖలు మారిపోతాయి.మన అందరిది ఒకే కులం అనే భావన వస్తే గొప్ప సమాజం రూపు దాల్చుతుంది అనుటలో సందేహం లేదు. భారతదేశంలో నివసిస్తున్న పౌరులు అందరు తమది భారత కులంగా తలంచాలి.మన దేశ ప్రజలంతా ఇటు వంటి గొప్ప ఆలోచనలతో మెలగాలి.మన దేశంలోని ప్రజల్లో మార్పు వస్తే గొప్ప జాతిగా ఖ్యాతిని పొంది ప్రపంచమంతటా విస్తరిస్తుంది.మన దేశంలోని ప్రజల్లో సర్వ మానవ సౌభ్రాతృత్వం అనే భావన ఆచరణలోకి రావాలి.మన దేశ ప్రజల్లో సర్వ మతాల సమానత్వం అనే భావన ప్రోది చేసుకోవాలి. మన దేశ ప్రజల్లో నెలకొన్న భేద భావాలు తొలగిపోయి అన్ని కులాలు కలిసి మెలిసి ఉండాలి. విశాల భావాలతో నిండిన మన దేశ ప్రజల్లో సుఖసంతోషాలు వెల్లి విరిసి జాతి ఖ్యాతి ఇనుమడిస్తుంది అని కవి మానారె చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రక్త పిపాసి రాక్షస మూకల
“ అడ్డు కొనాలి శౌర్యపు వాకల
“ లంచం కోరే నీచుల చేతుల
“ బంధించాలి నీతుల గొలుసుల.
స్వార్థపరులుగా మారి హింసా మార్గంలో పయనిస్తూ రక్త దాహానికి అలవాటు పడ్డ కనికరం లేని రాక్షసుల సముదాయాన్ని అడ్డుకోవాలి.మనిషిలోని రాక్షస ప్రవృత్తిని మానిపించాలి.స్వార్థపరులను దయాపరులుగా,పరోపకారులుగా,గొప్ప మనసున్న మనుషులుగా మార్చాలి.సరియైన చదువు, సంస్కారం లేక రాక్షసులుగా తయారయ్యారు. పెద్దలు,గురువుల శిక్షణ లేక సరైన మార్గదర్శనం లేక స్వార్థపరులుగా,అసాంఘిక శక్తులుగా తయారై సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నారు. మనుషులుగా జన్మించినప్పటికి కఠిన చిత్తులుగా, కర్కోటకులుగా,కాముకులుగా,హంతకులుగా,రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు.సమాజానికి చేటు చేస్తున్న నరహంతక రాక్షసులను శౌర్యవంతులై ఎదుర్కోవాలి.ధైర్యవంతుల శౌర్యపు ప్రవాహాలే ఇలాంటి దుర్మార్గుల పాపపు పనులకు అడ్డుకట్టగా నిలుస్తాయి.రాక్షస ప్రవృత్తి గల మనుషుల మనస్సులను మార్చడం శౌర్యవంతుల వల్లనే సాధ్యమవుతుంది.సమాజంలో విచ్చలవిడిగా లంచగొండితనం పెరిగిపోయింది.ఏ పని కావాలన్నా లంచం ఇవ్వనిదే జరగని దుస్థితి ఏర్పడింది.మంచి పూల తోటలోనికి ఒక్క గుడ్లగూబ చొరబడితే చాలు, ఆ పూల తోట అంతా నాశనం అవుతుంది. అటువంటిది కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మకు గుడ్లగూబలు ఉంటే ఆ పూల తోట పూర్తిగా విధ్వంసం కాకుండా ఉండగలదా? పూల తోట లాంటి సమాజంలోకి కలుపు మొక్కలాంటి దుర్మార్గులు ప్రవేశిస్తే ఏమవుతుంది? పూల తోటలోకి దుర్మార్గులు ప్రవేశిస్తే తోటను విధ్వంసం చేస్తారు. పూల తోటలోనుండి కలుపు మొక్కలను ఏరివేయాలి.పూల తోటలోకి గుడ్లగూబ వచ్చి చేరినట్లయితే దానిని తరిమి వేయాలి.పూల తోట లాంటి సమాజాన్ని కాపాడుకోవాలనే సందేశం చక్కగా ఉంది.అన్నిచోట్ల సర్వత్రా ఇందు గలడు అందు లేడు అని చెప్పినట్లు అంతటా లంచగొండితనం వ్యాపించి ఉంది.సమాజంలో నెలకొన్న లంచగొండితనంను పూర్తిగా అరికట్టాలి. లంచగొండితనం ఏ రూపంలో ఉన్నా దానిని పారదోలితేనే సమాజం పూర్తిగా అభ్యుదయ పథంలో కొనసాగుతుంది.లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిని అవినీతి నిరోధక శాఖ నామమాత్రంగా కేసులు పెట్టి వదిలివేస్తున్నారు. లంచం తీసుకున్న అవినీతిపరులకు ఎలాంటి శిక్షలు పడటం లేదు.అవినీతి నిరోధక శాఖ లంచగొండులపై కేసులు పెట్టినప్పటికీ సరియైన సాక్ష్యాలు చూపించకపోవడం వల్ల కేసులు వీగిపోతున్నాయి. అవినీతి నిరోధక శాఖ లంచగొండులను ఏమీ చేయదు అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అవినీతి నిరోధక శాఖ గుట్టు ప్రజలకు తెలిసిపోయింది.లంచగొండులను నీతిపరులుగా, ధర్మపరులుగా మార్చాలి.లంచగొండుల చేతులకు ఇనుప సంకెళ్లు వేయడం ద్వారా కాకుండా నీతులు అనే గొలుసులతో బంధించాలి.సమాజంలోని ప్రతి ఇంటిలోని వారిని నీతిపరులుగా మార్చాలి.అప్పుడు సమాజంలో లంచగొండులనే వారు ఉండరు.
“ జాతి జీవం దాని సంస్కృతి
“ జాతి చేతన దాని విస్తృతి
“ జాతి వేదన కేది నిష్కృతి
“ జాతి ఏకతయే పరిష్కృతి.
జాతి చక్కగా మనుగడ సాగించడానికి సనాతన కాలం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు,ధార్మిక అంశాలతో కూడిన ప్రవర్తన ప్రధానం.జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాలే జాతిని సజీవంగా నిలుపగలుగుతాయి.జాతి చేతన జాగృతమయితే జాతి చేతనత్వాన్ని పొందితే తమదైన సంస్కృతిని తిరిగి ఆచరణలోకి పెడితే ఆ జాతి వ్యాప్తిని పొందుతుంది.ఇటువంటి లోపాల చేత మానవ జాతి అంతా ఆపదలకు కష్టాలకు లోనవుతున్నది.జాతి ఎదుర్కొంటున్న బాధలకు నిస్కృతి ఏది? భారతదేశం ఎదుర్కొంటున్న భేద భావన, కులమతాల చిచ్చు,మానవ మృగాల రాక్షస కృత్యాలు,అవినీతి కరాళ నృత్యం మొదలైన వాటి వల్ల సమాజం అనుభవిస్తున్న బాధలు అన్ని తొలగిపోవాలి.ప్రజల మేలుకోరే నీతివంతమైన సుపరిపాలన అందించే రాజ్యం రావాలి.ప్రజా శ్రేయస్సు కోరే నీతి గల,ధర్మం గల రాజ్యం రావాలి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే దివ్యమైన మార్గానికి దేశ ప్రజల సమైక్యతే దారి చూపాలి.ప్రజలందరు కుల మత భేదాలను మరచి పోయి తాము అందరం ఒకటే.ఈ దేశం మనది.మనం అందరం మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుతూ కుల మతాలకు అతీతులమై ఐక్యమత్యంతో మెలగాలి అనే ఏకాభిప్రాయానికి రావాలి.భారతదేశ ప్రజలకు కలిగే బాధలన్ని క్రమ క్రమంగా తొలగి పోతాయి. ప్రజలందరు సుఖసంతోషాలతో అలరారుతూ ప్రశాంతమైన జీవనం సాగిస్తారు.ఏకతకు పరిష్కారం అనే చక్కటి గేయం ద్వారా సమాజానికి స్ఫూర్తిని అందిస్తున్న కవి మాదాడి నారాయణరెడ్డిని (మానారెని) అభినందిస్తున్నాను.మానారె మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
మాదాడి నారాయణ రెడ్డి ” ఏదీ కొత్తదనం?”
కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన: నరేంద్ర సందినేని
ప్రముఖ కవి, ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన “ఏది కొత్తదనం? కవిత పై విశ్లేషణా వ్యాసం.కవిత
ఏమిటని ఆసక్తితో చదివాను.నాలో ఆలోచనలు
రేకెత్తించింది.కొత్తదనం యొక్క అర్థం కొత్తగా ఉండే స్థితి లేక భావము.The quality of being new and original not derived from something else.కొత్తదనం అంటే నూతనత్వం.
“తమ్ముడూ! పాత రోతగా ఉంది కదూ!
సామెత: కొత్త ఒక వింత… పాత ఒక రోత అనేది నిజం. ఎందుకంటే కొంత మందికి పరిచయం అయిన కొత్తలో మన మీద ఉన్నంత గౌరవం తర్వాత ఉండదు.కొత్తగా ఏదైనా వచ్చాక పాత దాని విలువ మర్యాద పోతుంది.అదే వస్తువు అయినా,ప్రేమ అయినా,మనిషి అయినా,కొత్త వింత…పాత ఒక రోత.ఇది నిజం.కొత్త బంధువులకు,కొత్త స్నేహితులకు,ఇచ్చే విలువ పాత బంధువులకు, పాత స్నేహితులకు,ఇవ్వరు.పాత రోత అనిపిస్తుంది. ఇది లోక నైజం.ఈనాటి నవీన మానవుడు నిత్య నూతనంగా జీవిస్తాడు.ఏదైనా కొత్త అనుకోకుండా ఆశ్చర్యపరిచేలా జరిగితే అదో వింత విడ్డూరం? కానీ ఇదంతా సహజమేగా అనిపిస్తే అది సర్వసాధారణం!!
“నీవీ క్షణంలో కొత్త అనుకుంటున్నది “మరు క్షణంలో పాత కాదా మరి
మనం ఒకసారి మనసుపెట్టి ఆలోచిస్తే ఈ క్షణంలో కొత్త అనుకుంటున్నది మరు క్షణంలో పాత అవుతుంది.నిజమే.ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది.నారాయణరెడ్డి (మానారె) కవి భావన అద్భుతం…
“సూర్యుడూ చంద్రుడూ “గ్రహాలు తారలూ “వెలుగులు చీకట్లూ “ఆ ఆకాశం ఈ భూమి. “అన్నీ పాతవే గదా.
సూర్యుడు సౌర వ్యవస్థలో మధ్యలో ఉన్న నక్షత్రం. పగటిపూట వెలుగులు ఇచ్చే గ్రహం.తూర్పు నుండి సూర్యుడు ఉదయించిన వెంటనే చీకట్లు పారిపోతాయి.చంద్రుడు రాత్రి పూట నక్షత్రాలతో పాటు కనిపించేది.భూమి చుట్టూ తిరిగే ఒక గ్రహం. చంద్రుడు సూర్యుడి ప్రకాశం వలన వెలుగుని ఇస్తున్నాడు.గ్రహం అంటే అంతరిక్షంలో ఒక ఆకృతి. ఇది తన కేంద్రకమైన సూర్యుడు లేక నక్షత్రం చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటుంది. బరువును గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. గ్రహాలు తొమ్మిది.ఖగోళ శాస్త్రంలో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు.బుధుడు,శుక్రుడు,భూమి, కుజుడు (అంగారకుడు),బృహస్పతి (గురువు), శని,యురేనస్ (వరుణుడు),నెప్ట్యూన్. (ఇంద్రుడు), ఫ్లూటో (యముడు). తారలు అంటే ఆకాశంలో రాత్రిపూట ప్రకాశించేవి అని అర్థం.భూమి నుంచి చాలా దూరంగా ఉన్న కారణంగా చుక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.వెలుగులు అంటే కాంతులు. వెలుగు కిరణాలు పరిసరాలను కనిపించకుండా ఆవరించిన చీకట్లను పారద్రోలి వాటిని సుస్పష్టంగా కనిపింప చేస్తాయి.వెలుగు ప్రసరించడం చేత ప్రకృతి శోభాయమానంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.వెలుగు ప్రశాంతమైన సుఖమయమైన జీవితానికి ప్రతీక. చీకటి అర్థం వెలుతురు లేని స్థితి.సూర్యుడు అస్తమించడంతో అంతట అంధకారం అలుముకుంటుంది.ఈ చీకటి మనం చేసే పనులకు ఆటంకం కలిగిస్తుంది.చీకటి అర్థం ఖాళీగా ఉండడం.ఉదాహరణకు భార్య మరణించిన తర్వాత అతని జీవితంలో శూన్యం ఏర్పడింది. దుఃఖమయమైన అతని బ్రతుకు అందకార బంధురమైందని చీకటిమయమైందని చెప్పుకుంటాం.అంటే సుఖాలకు వెలుగు ప్రతీక అయినట్లుగా,కష్టాలకు చీకటి ప్రతీక అని చెప్పవచ్చు.ఆకాశం ఆరు బయట నుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం. ఆకాశం వికృతి పదం ఆకసము.భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు నీటి ఆవిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలి రంగులో కనబడుతోంది.కానీ నిజానికి ఆకాశం ఏ రంగును కలిగి ఉండదు.అందుకే మనకు రాత్రి సమయంలో ఆకాశంలో సూర్యకాంతి లేకపోవడం వలన చీకటిగా కనిపిస్తుంది.ఆ చీకటిలో అనంత దూరంలో ఉన్న నక్షత్రాలు,గ్రహాలు,చిన్న చిన్న చుక్కలుగాకనిపిస్తాయి.ఆకాశం భూమి ఇతర గ్రహాలు మరియు నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం. నక్షత్రాలు,చంద్రుడు,సూర్యుడు మొదలైనవి ఉండే శూన్య ప్రదేశం.వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.పంచ భూతాలలో ఆకాశం ఒకటి. అంతు తెలియజాలనిది ఆకాశం.భూమి సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి.మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే.భూమి 450 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడిందని తెలుస్తోంది.భూమి గురుత్వ శక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై ముఖ్యంగా సూర్య చంద్రులపై ప్రభావం చూపిస్తుంది.భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకి ఒక్కోసారి పరిభ్రమిస్తుంది.దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది.దీన్ని భూ భ్రమణం అంటారు. భూమి నీరు లేకుండా ఉండే ప్రదేశం. భూమండలంలో మూడవ వంతు భాగం భూమి. ప్రాణులు ఉన్న ఒకే ఒక గ్రహం.చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం.భూమి మనం నివసించు ప్రదేశం.అది మనకు తల్లి వంటిది.భూమిలో పండే పంటలే జీవులకు జీవనాధారం.అవును సూర్యుడు, చంద్రుడు,గ్రహాలు,తారలు,వెలుగులు,చీకట్లు,ఆ ఆకాశం,ఈ భూమి,అన్నీ పాతవే కదా అని కవి నారాయణరెడ్డి (మానారె) భావాల్లో ఎంతో బలం ఉంది.మనం ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది.
“నిన్ను కన్న తల్లీదండ్రీ
“హితులూ సన్నిహితులూ
“పాత వారు కారూ?
అని నారాయణ రెడ్డి (మానారె) మనల్ని ప్రశ్నిస్తున్నారు.తల్లిదండ్రి కుటుంబంలోని సంతానానికి కారకులు తల్లిదండ్రులు.సృష్టిలో ప్రాణికి మూల కారణం అమ్మ.కన్నతల్లి బిడ్డను నవ మాసాలు గర్భాశయంలో పెంచి తర్వాత జన్మనిచ్చిన స్త్రీ మూర్తి.ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. నిజమే.కన్న తల్లిదండ్రులు,మన హితం కోరే హితులు,మన మేలు కోరే సన్నిహితులు,పాత వారే అని ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది. అయినప్పటికీ కన్న తల్లిదండ్రులను,హితులను, సన్నిహితులను,పాతవారని తీసిపారేయాల్సిన వ్యక్తులు కాదని మనలను ఆలోచన తరంగాలలో తేలియాడ జేస్తున్నారు.
“ఎంతగానో నీవభిమానించే
“నిత్యం కొత్తగా ఊహించే
“నీ శరీరం పాతది కాదూ?
మనని మనం ప్రేమించుకుంటాం.మనని మనం అభిమానించుకుంటాం.మనల్ని మనం కొత్తగా ఊహించుకుంటున్న మన శరీరం పాతది కాదు అని ప్రశ్నిస్తున్నారు.అవును మన శరీరం పాతదే.మనం
అభిమానించుకుంటున్నది నిజమే.కాదనలేని సత్యం నారాయణరెడ్డి (మానారె) కవి భావన వాహ్…
” నీవు ఆడే ఆట పాడే పాట
“తినే తిండి చదివే చదువు
“ప్రియాతిప్రియంగా నీవు భావించే
“ఇల్లాలు మరి పిల్లలు
“కొత్తవారేనంటావా? మనం నిత్యం ఏదో ఒక ఆట ఆడుతుంటాం.మనం ప్రతి రోజు ఏదో ఒక పాట మనకి ఇష్టమైనది పాడుతుంటాం.మన ఇష్టంగా తినే తిండి,మనం ఇష్టంగా చదువుతున్న చదువు,మనకు ప్రియాతిప్రియంగా మనలో బాగమని భావించే ఇల్లాలు హృదయేశ్వరి,మన సంతానమైన పిల్లలు కొత్త వారేనంటావా అని కవి నారాయణ రెడ్డి (మానారె) ప్రశ్నిస్తున్నారు.కొత్త వారు కాదని మనం తెలుసుకోవాల్సిన విషయంగా తోస్తుంది.కవి భావనలో సత్యం ఉంది.
“కొత్త మాటల్లో లేదు
“మాటలకు మూలమైన భావనలో ఉంది
కొత్త అనేది మనం మాట్లాడే మాటల్లో లేదు మాటలకు మూలమైన భావనలో ఉంది అని మనకు గుర్తు చేస్తున్నారు.కవి నారాయణరెడ్డి (మానారె) చక్కటి భావం వ్యక్తం చేసిన తీరు అబ్బురపరుస్తుంది.
“ఈర్ష్యా – ద్వేషం – కసి
“నిరాశ- నిస్పృహ- నిరీహల్ని
“దూరంగా సుదూరంగా త్రోలి
“అందరికీ ఆనందం పంచు
“అందరితో కలిసి బ్రతుకు
ఓర్వలేనితనం మరియు శత్రుత్వం,పగ,కోపం,ఆశ లేనితనం,స్పృహ లేకపోవడం,తనకు తాను మరిచిపోవడం,కోరికలు లేకుండా ఉండటం, వీటినన్నిటిని దూరంగా,సుదూరంగా పంపించి మంచి మనసుతో అందరికీ ఆనందం పంచుతూ అందరితో కలిసి బ్రతుకు అని కవి ప్రబోధిస్తున్నాడు.
“అప్పుడు నీవు కోరే కొత్త
“అంతటా అన్నిటా లభిస్తుంది
నీవు ఒక మంచి మనిషిగా మారతావు.అప్పుడు నీవు కోరే కొత్తదనం అంతటా అన్నిటా లభిస్తుంది.నీ జీవితంలో వెలుగులు విరజిమ్ముతాయి.నీవు కోరుకునే కొత్తదనం నీకు లభిస్తుంది.ఏది కొత్తదనం కవిత ద్వారా చక్కని సందేశం అందించారు.కవి మాదాడి నారాయణరెడ్డి (మానారె) కలానికి వందనాలు చేస్తున్నాను.మానారె కలం నుండి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయాలని మనసారా కోరుకుంటున్నాను.

July 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

భారతదేశం మనకు ఏం నేర్పిస్తుంది

by Devanapalli Veenavani July 24, 2024
written by Devanapalli Veenavani

(What can India Teach us – Max Muller)

గొప్పమాట !భారతదేశం ప్రపంచానికి  ఏం  నేర్పుతుంది? భారతీయులకు ఏం నేర్పుతుంది?ఎక్కడైనా  సగటు పౌరునికి దేశంనుంచి నేర్చుకొనే అవసరం ఏముంది?  దేశం నుంచి నేర్చుకోవడం అంటే  చరిత్రనా, మనుషులా, పాలకుల ప్రస్థానమా?అసలు నీగురించి నీవు ఏమిచెప్పగలవు? నీదేశం గురించి ఏమి తెలుసుకున్నావు? నిన్ను,నీ  స్వభావాన్ని దేశానికి జతచేసే ప్రభావితాంశాలు ఏవై  ఉండవచ్చు? ఇలా  ప్రశ్నించుకున్న సంధర్భాలలో అంతిమంగా, ప్రతి జాతిలోనూ “ విశ్వాసం” అనే మూలమొకటి ఏర్పడి,సంఘీభావంతో స్థిరపడి, ఆచార వ్యవహారమై మనగలిగి, సంస్కృతిగా పరిణమించి దేశఅస్థిత్వమై నిలబడి ఒక ప్రవహంగా కొనసాగడం కనిపిస్తుంది. ఇక్కడ విశ్వాసమే మూలం. విశ్వాసం ఏర్పడడానికి తత్వం ఎరిగి ఉండడం ప్రధానం,ఈ ఎరుకను అనేక కోణాల్లో  పరిశీలించి పరికల్పన చేయడానికి  దోహదపడే వారే తాత్వికులు. అంటే ప్రతిజాతి,దేశం మూలాల వెనుక బలమైన తాత్విక భూమిక ఉండే తీరాలి. అదే ఆ జాతి చోదక శక్తి.అది తెలుసుకున్నప్పుడే ఆ జాతిని  అర్థం చేసుకోగలం, సంబందబాంధవ్యాలను నెరపగలం. భారతదేశంమాటకువస్తే ఆ  చోదక శక్తి నిన్ను నీవు తెలుసుకో ( Know thy self ) మూలంగా అన్ని వాదభేధాలను గౌరవిస్తూ  ఏకం సత్ బహుధా వదంతి గా కర్మానుసారంగా జీవించడమే కనిపిస్తుంది.  ఇది మన గురించి మనం అర్థంచేసుకున్నది,మరి విదేశీయులు మనల్ని ఎలా అర్థం చేసుకున్నారు,ఎలా అన్వయించుకున్నారు, మనగురించి ఏం మాట్లాడుకున్నారు అని తెలుసుకోవాలనుకున్నపుడు  ఈ దేశాన్ని సందర్శించి  ఇక్కడి విషయాలను తమ దేశానికి పరిచయం చేస్తూ ఎంతో విలువైన చారిత్రకసేవచేసిన  హుయాన్త్సంగ్, మార్క్ పోలో వంటి ఎంతోమంది   విదేశీ యాత్రీకులు కనిపిస్తారు. వారెవరూ ఇక్కడ పరిపాలనా లక్ష్యాలతో రాలేదు, కేవలం పరిశీలనకోసం  మాత్రమే వచ్చారు.అయితే మరికొంతమంది విదేశీయులు పరిపాలనకోసమే ఈదేశానికి వచ్చారు, వారికి పరిశీలనతోపాటు పాలనకు అనువైన వాతావరణం సృష్టించడం,తమతరఫున పాలకులను తయారు చేయాల్సిన అవసరం రెండూ ఏర్పడ్డాయి.అలాటి పరిస్థితుల్లో  మనదేశ చారిత్రక, పరిపాలక  అంశాలతో వెలువడిన అనేక గ్రంథాలలో జర్మనీ దేశస్థుడు, ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ రాసిన భారతదేశం మనకు ఏం నేర్పుతుంది (What can India Teach us) ఒకటి.

ముల్లర్ (1823-1900) జర్మనీకి చెందిన భాషాశాస్త్రవేత్త, భాషల అధ్యయనాన్ని ఫిలాలజీ అంటారు కనుక ఫిలాలజిస్టు అని పిలవబడ్డాడు. ముల్లర్ తండ్రి విల్హెల్మ్ ముల్లర్ ఒక కవి.ముల్లర్ నాలుగేళ్ల చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు.ముల్లర్ తన దేశభాష జర్మనీలోనూ,మనదేశపు అనాదిభాష సంస్కృతంలోనూ ఇంగ్లీష్లోనూ ప్రావీణ్యం సంపాదించాడు.నారాయణ పండితుడు రాసిన గ్రంథం హితోపదేశని ముల్లర్ 1844లోఅనువదించి ప్రచురించాడు. 1845లో పారిస్ వెళ్ళి అక్కడ యూజిన్ బరనోఫ్(Eugeneburnouf)  యొక్క ప్రభావంతో అప్పటికే ఫ్రెంచ్ భాషలో వెలువడిన ఋగ్వేదభాష్యం edito princepsని సేకరించడం మొదలు పెట్టాడు. మనగ్రంథాలు పారిస్ ఎలా చేరాయంటే అప్పటి ఈస్ట్  ఇండియా కంపనీ  సంస్కృత భాషలో ప్రావీణ్యం ఉన్న వారిని ప్రోత్సహించిన కారణం చేత అనేక  మూల గ్రంథాలను సేకరించి సంస్కృత భాష పరిశోధకులకు పంపించేది.అలాగా పారిస్లోఉన్న యూజిన్ బరనోఫ్కు అందినవి. ముల్లర్ పారిస్నుంచి 1846లో  ఆక్సఫోర్డ్ యూనివర్సిటీ గడపలో కాలుమోపి  రెండేళ్లలో ఆధునిక యూరోపియన్ భాషావిభాగంలో డిప్యూటీ ప్రొఫెసర్ అయ్యాడు. అక్కడ 1868 నుంచి కంపారిటివ్ ఫిలాలోజీ ఆచార్యులుగా పనిచేసి 1875 లో పదవీవిరమణ చేశాడు.  ముల్లర్ ఇంగ్లాండ్ వచ్చిన సమయంలో ఈస్ట్ ఇండియా కంపనీ తన  ఖర్చుతో సాయణాచార్యుల ఋగ్వేదభాష్యాన్ని పూర్తిగా ఇంగ్లీష్లో తేవాలని పురమాయించారు. 1859 లో అప్పటికి అందుబాటులో ఉన్న  మానుస్క్రిప్ట్స్ ఆధారంగాHistory of ancient Sanskrit Literatureఅనే పుస్తకాన్ని రాశాడు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషాచార్యులు హెచ్ హెచ్ విల్సన్ మరణించినప్పుడు సంస్కృత భాషా ఆచార్యులు కావాలని  ఆశపడి లండన్కు  విదేశీయుడైనందువల్ల  భంగపడ్డాడు.అయితే   అతని సేవలు విశ్వ విద్యాలయనికి , ఈస్ట్ ఇండియా కంపనీకి  మరోరకంగా వినియోగించబడ్డాయి.   ముల్లర్   సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ థాట్  పేరుతో ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు. ముల్లర్ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న పుస్తకం What can India Teach us కాకుండా Chips from German Workshop, జర్మనీ భాషలో Auld Lang Syne,Deutsche Liebe అనే పుస్తకాలను రాశాడు. పదవీ విరమణ చెందాక అప్పటికి తానెంతో గ్రహించినహిందూ,బౌద్ద,జైనతత్వ సాహిత్యాన్ని,చైనీయులతావో, కన్ఫ్యూసియస్  తత్వాల్ని,జొరాస్ట్రీయానిన్ తత్వాన్నిSacred Books of Eastగా తేవాలని సంకల్పించి ఆ బృహత్తర కార్యక్రమానికి సంపాదకునిగా ఉన్నాడు.ఈ  Sacred బుక్స్ ఆఫ్ ఈస్ట్ అనేది  చాలా విలువైన కృషి. మొత్తం 51 విలువైన గ్రంథాలు ఈ సిరీస్ పేరుతో వెలువడ్డాయి. ఇందులో భాగంగా ముల్లర్ హిందూగ్రంథాలు ఖండోద్యోగ ఉపనిషద్, కేనోపనిషద్,ఐతరేయ అరణ్యక,కౌశితకి బ్రహ్మణ,వాజసనేయిసంహిత ఇంకా ముండక,కఠ,తైత్తరీయ,బృహదారణ్యక, శ్వేతాస్వాతార,ప్రశ్న , మైత్రేయని ఉపనిషత్తులు ,అలాగే  బౌద్దానికి చెందిన దమ్మపాద, సుత్తనిపాతలు   ఉన్నాయి. ఇవేకాక  వాయు,రుద్ర,మారుత శ్లోకాలు,ఋగ్వేద సమాచారంవంటివి ఈయన అనువదించినవాటిలో ఉన్నాయి. ముల్లర్ ఇంగ్లీష్లో కూడా  అనేక పుస్తకాలు రాశారు.అందులో Six Systems of Phylosophy,Ramakrishna:His life and sayings, The Vedanth Phylosophy వంటివి ప్రాచుర్యం పొందాయి.

ప్రస్తుత పుస్తకంభారతదేశం మనకు ఏం నేర్పుతుంది  విషయానికివస్తే 1882లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చేత  ప్రచురించబడిన ఈ పుస్తకం ముల్లర్ భారతదేశంలో నియమించబడిన ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారుల అవగాహనకోసం కేంబ్రిడ్జ్  విశ్వ విద్యాలయంలో  వెలువరించినఏడు ఉపన్యాసాల సమాహారం.భారతదేశంలో 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం తర్వాత పరిపాలన అంతా ఈస్ట్ ఇండియా కంపనీనుంచి ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలనకు వెళ్ళిన తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేయడానికి నియమించబడిన అధికారులను ఇంపీరియల్ సివిల్ సర్వీస్ అధికారులుగా ఎంపిక చేసేవారు. 1886నుంచి  ఈ  సర్వీస్లోకి భారతీయులను అనుమతించారు. అయితే అప్పట్లో లండన్ వెళ్ళి పరీక్షలు వ్రాసే పరిస్థితి ఉండేది. 1922 నుంచి మాత్రమే  ఢిల్లీలో పరీక్షకు అనుమతించడం జరిగింది. మొదట లండన్లో ఎంపికైన ఇంపీరియల్ సర్విస్ అధికారులకు కావలసిన శిక్షణనిచ్చేక్రమంలో ముల్లర్ భారతదేశంగురించి ఇచ్చిన ఉపన్యాసాలు ఇవి. స్వతంత్రానంతరంఇంపీరియల్ సివిల్ సర్వీస్ని ఇండియన్ సివిల్ సర్వీస్గా మార్చి ప్రస్తుతం  ఉత్తరాఖండ్ ముసొరిలో  శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ముల్లర్ ఈ ఉపన్యాసాలు వెలువరించే కాలానికి సంస్కృతంనుంచి అప్పటికే ఎన్నో మూలగ్రంథాలను  ఇంగ్లీష్లోకి అనువదించి ఉన్నాడు.మరెన్నో గ్రంధాలను అధ్యయనం చేశాడు.సంస్కృతంతోపాటు గ్రీకు,లాటిన్ భాషలలోని తాత్విక గ్రంథాలను తులనాత్మకంగా అధ్యయనం చేశాడు,విశ్లేషించాడు,అర్థం చేసుకునేందుకు  ప్రయత్నంచేశాడు.కేంబ్రిడ్జ్  విశ్వవిధ్యాలయంలో సంస్కృత ఆచార్యులుగాఉన్న  Edward Byles Cowellకి అంకితం ఇస్తూ ఇప్పటివరకు సంస్కృత భాషలో చేసిన పరిశోధనలు తురుపుముక్కఅనీ ఇంకా చేయవల్సింది ఎంతో ఉందని చెప్పాడు.ముల్లర్ తన ముందుమాటలో  ప్రతీ యేటా  ఎంతోమంది యువ అధికారులు  భారతదేశానికి  వెళ్తున్నారని,వారు మరెంతో కృషిచేయాల్సి ఉందని,ఉపన్యాసం ఇవ్వడం తనకు ఇష్టమని,ఉపన్యాసంలో ఎంతో విషయాన్ని క్లుప్తంగా అవసరానికి అనుగుణంగా చెప్పేవీలుంటుందని  చెప్తూ ఋగ్వేదాన్ని,దాని  భాష్యాన్ని రాయడం  తన జీవిత కాలస్వప్నమని అందుకు సహకరించిన  నా దత్తదేశానికి (భారతదేశం), అక్కడి గొప్ప  రాజనీతిజ్ఞులకు ఋణపడి ఉంటానని రాశాడు.

ఆక్స్ఫర్డ్  విశ్వవిద్యాలయం ముల్లర్ ఉపన్యాసాలను 1882లో  సంకలనంగా తెచ్చినప్పుడు 442 పేజీల గ్రంథంగా ఉంది. ప్రతి ఉపన్యాసానికి తగిన పాద సూచికలు,అర్థవివరణలు చేరుస్తూ పోవడంవల్ల గ్రంధవిస్తారం జరిగింది.ప్రతీవ్యాసం లోలోపలికి వెళ్ళినప్పుడు ఆ వివరణలు ఎంతో ముఖ్యమయినవిగానూ, అర్థవంతమైనవిగానూ ఉన్నాయి.ప్రస్తుతం అందుబాటులోఉన్న ఆంగ్లపుస్తకం ఈవివరణలను పరిహరించి రెండువందల పేజీలకు కుదించి కేవలం ఉపన్యాసానికి పరిమితంఅవడం  ఒకరకంగా మనఓపికలేనితనానికి నిదర్శనం. అయినప్పటికీ ప్రతీభారతీయుడు తప్పనిసరిగా చదువుకోవాల్సిన పుస్తకం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పుస్తకం వచ్చిన నూటానలభై ఏళ్ళకు కూడా ఇది తెలుగు భాషలోకి అందుబాటులో లేకపోవడం, రాకపోవడం. అయితే.ప్రస్తుతం కొన్ని విశ్వవిధ్యాలయల్లో మొదటి ఉపన్యాసాన్ని చరిత్ర  పాఠ్యాంశంగా చేర్చారు.

            ముల్లర్ వెలువరించిన ఈ ఉపన్యాసాలలో మొదటిది   భారతదేశం మనకు ఏం నేర్పుతుంది, తదుపరి హిందువుల స్వభావం,సంస్కృత సాహిత్యంపై మానవాభిలాష ,వేదసంస్కృతి ప్రత్యేకమైనదా,వేద మతం, వేద ఆరాధన, వేదము మరియు వేదాంతంశీర్షికలుగా వేద కాలమూ,సంస్కృత సాహిత్యం నిబిడీకృతం చేసుకున్న చరిత్ర చుట్టూతా కొనసాగుతాయి. ముల్లర్ ఉపన్యాసాలు చదివేటప్పుడు  అతని లోతైన పరిశీలన దృష్టి ,తనదికాని  దేశంయొక్క సంస్కృతిలోని పలుకుబడులను కూడా పట్టుకొనేంత సహనం, తానెనుకున్న భాషా విశేషాలను ప్రపంచ సమకాలీన భాషాసాహిత్యాలతో  పోల్చి విశ్లేషించగల నేర్పు  చదువరిని ఒప్పించగల సామర్థ్యం ఉన్నట్లు తెలుసుకుంటాం. ముల్లర్ తన ఉపన్యాసాలలో వేదకాలాన్ని ఆదిమమైందని, పురాతనమైనదనీ  అయినా మానవ మేధాశక్తిని అపూర్వంగా ప్రదర్శించిందని చెప్తూ తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 

          ముల్లర్ , యువ అధికారులను  ఉద్ధేశించి మాట్లాడుతూ భారతీయులకు మానవస్వభావంపట్ల లోతైన అవగాహన ఉన్నదని యూదుల జడ్జిమెంట్ ఆఫ్ సోలోమన్ కథను ఉదాహరించిచెప్తాడు. మనం చిన్నప్పుడు బాగా విన్న కథనే అది. ఇద్దరు తల్లులు ఒక పసిపిల్లవాన్ని తన కొడుకంటే తన కొడుకని పోట్లాడుతూ న్యాయంకోసం వచ్చినప్పుడు  పసిపిల్లవాన్ని రెండు ముక్కలు చేసిచెరో ముక్క ఇవ్వాలని తీర్పు చెప్తాడు సోలోమన్. అయితే పిల్లవాన్ని ముక్కలు చేయడం ఇష్టం లేని ఆమెనే తల్లి అని గుర్తించడం ఆ కథలో ఉంటుంది.  అదే కథ బౌద్ధుల త్రి పీటకాల్లోనూ ఉంటుంది.  ఇక్కడి కథలో రాజు, తనవద్దకి తీర్పు కోసం వచ్చిన ఇద్దరు స్త్రీలకు ఎలాగా ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచించి దానిని ఆ ఇద్దరు తల్లులకే వదిలేస్తాడు.  ఆ ఇద్దరు తల్లులు ఆ పిల్లవాడిని చెరోవైపు లాగడంతో పిల్లవాని శరీరానికి గాయాలై ఏడుస్తుంటాడు. ఒక స్త్రీ  దాన్ని చూసి తట్టుకోలేక రెండో స్త్రీకే ఆ పిల్లవాణ్ణిఇచ్చిచేయమని కోరుతుంది ఎందుకంటే తల్లి గనుక పిల్లవాడి శరీరం యొక్క గాయాలని, దానివల్ల వస్తున్న దుఃఖాన్ని ఓర్వలేదు కనుక. ఆమెనే అసలు తల్లని ఆ స్త్రీకే  పిల్లవాణ్ణి ఇవ్వాలని తీర్పు చెప్తాడు. ఇలామానవ సహజస్వభావం పట్లభారతీయులకు   జ్ఞానం ఉందనిఅలాగే భారతదేశంలో ఉన్న న్యాయ సూత్రాల చరిత్ర గ్రీకు,రోమన్, జర్మనీతో  పోలిస్తే భిన్నంగా ఉన్నా ప్రతి ఏటా కొత్త న్యాయసూత్రాలు బయటికి వస్తున్నాయని,  మను స్మృతి కనీసం క్రీస్తుపూర్వం ఐదువందలసంవత్సరాలనుంచి ఉండవచ్చునని మీరు భారతదేశంలోపనిచేసే అవకాశం వచ్చినప్పుడు వీటి గురించి తెలుసుకుంటారని,సంస్కృతం మీకు మొదట చాలా కష్టంగానూ ఇబ్బందిగాను అనిపించవచ్చు కానీ సంస్కృతం ఎన్నో లోతైన అంశాలని కలిగి ఉందనీ,  మీకు తీరిక  దొరికినప్పుడల్లా మీరు పనిచేయడానికి కావలసినంత విషయం అక్కడ ఉందని అంటాడు.

ప్రపంచంలోని  ఏ సమస్యతీసుకున్నా,  అది ఉన్నతవిద్యైనా,,ప్రజాస్వామ్యవ్యవస్థైనా,, న్యాయసూత్రాలైనా,ఆర్థికశాస్త్రమైనాఇలా ఏ అంశాన్ని తీసుకున్నా  ఎక్కడా లేనివిధంగా భారతదేశం మీకు ఒక ప్రయోగశాలకు కావాల్సిన అన్ని అంశాలని సరఫరా చేస్తుంది. బయటప్రపంచం వివిధ సాంకేతికఅంశాలమీద పనిచేస్తూ ఉన్నప్పుడు మానవమేధయొక్క చరిత్ర, తనగురించి తాను అధ్యయనం చేసుకోవడం విషయాల్లో భారతదేశం ముందుంది. మానవమేధకు సంబంధించినటువంటి అంశాల్లో మీరు ఏ కోణంనుంచైనాఅంటే అది భాషకావచ్చు,మతంకావచ్చు,పురాణాలుకావచ్చు,తత్వంకావచ్చు,న్యాయసూత్రాలుకావచ్చు,ఆచారాలువ్యవహారాలుకావచ్చు, కళాకౌశlలాలు కావచ్చు,శాస్త్రీయమైన అంశాలు కావచ్చు వాటినితెలుసుకోవాలనుకుంటే  మీరు భారతదేశానికి  వెళ్ళండి,  మీకు అక్కడ చాలా ముఖ్యమైన అంశాలు, అవీ  కేవలం భారతదేశంలోమాత్రమే  లభిస్తాయని సూచిస్తాడు.అలాగే గ్రీకు, లాటిన్,జర్మన్,సంస్కృతంనుంచి అనేక ఉదాహరణలు చూపిస్తూ  భాషలన్నిటికీ ఒకే మూలంఉండే అవకాశం ఉందని ప్రోటో లాంగ్వేజ్ ఒకటి ఉండి ఉండవచ్చని, అది తన మూలంనుంచి వివిధ భాషలుగా రూపాంతరం చెందిందని నమ్మకంతో ఉంటాడు.భారతీయూలలో ఆర్యులు వేరుఅనే సిద్ధాంతాన్ని నమ్మినవాడు కనక భారతదేశంలోని సంస్కృతంకూడా అలాగా ప్రోటో ఆర్యన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందని ఊహ చేస్తాడు. గ్రీక్ శిల్పాన్ని,ఈజిప్షియన్  స్పింక్స్ని,బాబిలోనియన్ ఎద్దులవంటి వాటిని ప్రతీదేశం పురాజ్ఞాపకాలుగా చూపిస్తారుగానీ అంతకన్నా ముఖ్యమైనది మనభాష, మిగిలిన వాటికన్నా ఎన్నో అద్భుతమైనవిలువైన విషయాలను భాష నుంచి గ్రహించే అవకాశం ఉందని , భాషల యొక్క శాస్త్రీయతనిఅర్థం చేసుకోవడం  సంస్కృతం లేకుండా  చేయలేమని అంటాడు.

రెండవ ఉపన్యాసంలో  హిందువుల స్వభావం గురించి  విశ్లేషణ  చేస్తాడు. ముల్లర్ దృష్టిలో హిందువులు అంటే భారతదేశంలోనివసించే  అందరూ.ముల్లర్ ఉపన్యాసకాలంనాటికి స్వతంత్ర భారతావనిస్పూర్తి మొదలై విస్తరిస్తున్నది.  క్రిమినల్ ట్రైబ్స్ చట్టం -1871 అమలులోకి వచ్చింది. విలియంజోన్స్  స్థాపించిన ఆసియాటిక్ సొసైటి వివిధ అంశాలమీద శాస్త్రీయ అధ్యయనం మొదలుపెట్టింది. జేమ్స్ మిల్ రాసిన హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా విస్తృతంగా ప్రచారంలో ఉంది.అంతేకాక భారతీయులు అందరూ ఒకే మూలనికి చెందిన వారు కాదని, ఆర్యుల జాతి ఏనాటి కాలంలోనో ఇక్కడకి వచ్చి స్థానీయులను జయించి స్థిరపడ్డారనే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంవల్ల భారతీయల స్వభావంపట్ల యురోపియన్లలో అనుమానం ఉందనీ మనం అర్థం చేసుకోవచ్చు. ముల్లర్ తనరెండవ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ భారతీయుల స్వభావం పట్ల  సంశయం అవరసం లేదనీ హిందువులు ముక్కుసూటి స్వభావులని  ప్రొఫెసర్ విల్సన్ చెప్పిన మాటల్ని ఉటంకిస్తాడు. అలాగే ఇండియన్ సివిల్ సర్వెంట్స్ కి చదవమని చెప్పే జేమ్స్ మిల్స్ రాసిన హిస్టీరి ఆఫ్ బ్రిటిష్ ఇండియా పుస్తకం  అనేక విధాలుగా వినాశకరంగా ఉందనీ,జేమ్స్ మిల్  అది హిందువుల స్వభావాన్ని ఫ్రెంచ్ మిషనరీల భావనతో కూర్చాడు తప్ప నిజంగా హిందువుల స్వభావాన్ని అంచనా వేయలేకపోయాడని చెప్తూ ఆ పుస్తకంలోని  అభ్యంతరకరమైన అంశాలను ప్రస్తావిస్తాడు.   జేమ్స్ మిల్ చేసిన కొన్ని వాఖ్యలు ఉదాహరణకు  బ్రాహ్మణుడు అబద్ధాల చీమలపుట్ట అని పేర్కొనడం. ఇంకా భారతీయులు తగువులమారులని (Litigant) పేర్కొనడం సరికాదని చెప్తూ  ముల్లర్  అప్పటి మద్రాస్ గవర్నర్ గా ఉండి రైత్వారీ విధానం ప్రవేశపెట్టి  ఎన్నో ఏళ్లు  భారతదేశంలో ఉన్న థామస్ మన్రో, హిందువులు వ్యాజ్యస్వభావులుకారని వెలిబుచ్చిన మాటల్నిగుర్తుచేస్తాడు. జేమ్స్ మిల్ చేసిన మరో ఆరోపణ  బ్రాహ్మణుడు  తలుచుకుంటే తాను  అనుకున్న వారిని చచ్చేదాకా వదిలిపెట్టడు అని.దాని గురించి మాట్లాడుతూ గడిచిన కాలంలో ఇంగ్లాండులో పదివేల ఉరిశిక్షలు విధిస్తే బెంగాల్లో కేవలం ఒకే ఒక ఉరిశిక్ష విధించబడిందని గుర్తు చేసి ఆ ఆరోపణ సత్యదూరమైందని తెలియజేస్తాడు.

          భారతీయులనిజమైన  స్వభావం ప్రతిఫలించేది గ్రామాలలోని ఒక సాధారణ పౌరుడు. అతని గ్రామమే అతని ప్రపంచం,ఎంతో అరుదుగా అతను ఇతరులతో సంబంధాలు కలిగి ఉంటాడని చెప్తూ , పురుషుడు తన భార్య బిడ్డలతో తన గ్రామాన్ని ప్రపంచంగా భావిస్తూ ఉంటాడు,  ఒకే గ్రామంలో ఉన్న వారి మధ్య అసత్యం అనేది అసలు లేదు, రచ్చబండవద్ద రావి చెట్టువద్దనో, గంగాజలం మీదనో  ప్రమాణం చేయడం వాళ్లకిఅలవాటు. భారతీయుల ముక్కుసూటితనం,  నిజాయితీగా  ఎదగడంకోసం న్యాయసమ్మతం కాని సంపాదనను తిరస్కరించడం, న్యాయంకోసం పాకులాడ్డం అనేది ముఖ్యంగా కనిపిస్తాయి. మార్కుపోలోఅన్నట్లు భారతీయులు దేనికోసమైనా సరే అసత్యం చెప్పరని, అనేకమందివిదేశీయాత్రికులు, పాలకులు, సందర్శకులు భారతీయుల సత్యవాదత్వం గురించి చేసినటువంటి వివరాల్ని ముల్లర్ వివరిస్తాడు.సత్యనిరూపణకు నాటి కాలంలో పాటించిన అంశాలను, రామాయణంలో రాముడు తన తండ్రికి  ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పధ్నాలుగేళ్లు ఏళ్ళు వనవాసం చేయడం,రాముడు,జాబాలీకి మధ్య జరిగిన సంభాషణ, కఠోపనిషదులోని యమ నచీకేతుల  సంభాషణలను వివరిస్తూ  ఇవన్నీ భారతీయులకు  సత్యంమీద ఉన్నటువంటి పట్టుదల తెలియజేస్తుందంటాడు.అలాగే సత్యం  పలకడంలోని  ఔచిత్యాన్ని మహాభారతంలోని కౌశిక కథని ఉదహిరిస్తూ  వేయి అశ్వమేధయా యాగాలుచేసినా  సత్యమే వాటన్నిటి పైన నిలబడుతుందిఅని భారతం  చెప్పిన మాట,  ఏదైతే నిన్ను బాధిస్తుందో అది నువ్వు ఇతరులకు ఎప్పుడూ చేయకు అని  యాజ్ఞవల్క్యుడుచెప్పిన మాట, ప్రతి మనిషిలోనే అంతరాత్మ అంటూ ఉంటుందని అంతరాత్మనేఆ మనిషి యొక్క మంచి చెడుల్ని గమనిస్తూ సాక్షిగా ఉంటుందన్నభారతీయుల నమ్మకాన్ని తెలియజేస్తాడు. సత్యం పట్ల భారతీయులకు ఉన్న భావనల్ని జేమ్స్  మిల్ పుస్తకంలో అభ్యంతరకరంగా పేర్కొన్నదనీ అటువంటి అభిప్రాయాలతో  మీరు అక్కడ ఉన్నప్పుడు పని చేయలేరని భోధిస్తాడు. ఇలాహిందువుల స్వభావం, నైతికత గురించి చెప్పే క్రమంలో ముల్లర్ సునిశితమైన అధ్యయనాన్ని చూపించే ఒక వాక్యాన్ని వాడడం ఆశ్చర్యం అనిపించింది,అన్నం  ఉడికినదని చెప్పడానికి కొన్ని మెతుకుల్ని పరీక్షిస్తే సరిపోతుంది అనిమనం  అంటాం కదా ఆ మాటనే వాడుతాడుముల్లర్. 

మూడవ ఉపన్యాసం సంస్కృతభాష,సాహిత్యంపట్ల మానవాభిలాష. కేవలం సామాన్యజనులతో వ్యవహార నడపడానికి హిందుస్తానీ,తమిళ్లాంటి భాషలు నేర్చుకుంటే సరిపోతుంది కానీ భారతీయుల మతము,పురాణాలు,తత్వం అర్థం చేసుకోవడానికి సంస్కృత భాషనేర్చవకోవడం అవసరం అనీ,  ప్రతి సివిల్ సర్వెంట్ సంస్కృత భాష నేర్చుకోవడంనే నేను ప్రోత్సహిస్తానని చెప్పుకున్నాడు.సంస్కృతం నేర్చుకుంటే ఏమొస్తుంది, భారతీయులే తమ పురాతన భాష,సాహిత్యాల నేర్చుకోవడానికి సిగ్గుపడుతుంటే మనమెందుకు నేర్చుకోవాలి అని అనుమానం మీకు వస్తుంది. సంస్కృతం మృత భాషగా ఉన్నది నిజమే,బౌద్ధం విస్తరించిన  అశోకుని కాలంలో అనేక శాసనాలు,  ఆ తదనంతరం అన్ని ప్రాంతీయ రాజ్యాలు స్థానిక భాషలో తమ పరిపాలన కొనసాగించాయనేది నిజం.కనుక బౌద్ధ కాలం నుంచే సంస్కృతంప్రభావం తగ్గిందని  చెప్పవచ్చు.  అయితే గ్రీకు,లాటిన్ భాషలను  వారి వారి దేశాల్లో అర్థం చేసుకోవడంకన్నా భారతీయులు సంస్కృతాన్నిబాగా  అర్థం చేసుకోగలుగుతారు. కలకత్తాలో విద్యోదయ, బాంబే నుంచి షడ్ దర్శన చింతనిక వంటివి సంస్కృత భాషలో వెలువడే మ్యాగజైన్స్, ప్రయాగ నుంచి దయానంద సరస్వతి సంస్కృత  పుస్తకాలను హిందీలోకి అనువదించే ప్రయత్నం చేశారు.  భారతదేశంలో బెంగాలీ, మరాఠీ, హిందీవంటి భాషలలో వెలువడే వివిధ మాగజైన్స్లో సంస్కృత వ్యాసాలూ  వెలువడుతున్నాయి. బుద్ధుని కాలంలో ప్రజల భాషలో వ్యవహారాలు కొనసాగించినప్పటికీ అధికారిక పత్రాలు, శాసనాలు సంస్కృతంలోనే వెలువడ్డాయి. ఈ అంశాలను మీరు గమనించాలని యువ అధికారులకు ఉద్భోద చేస్తాడు.

నాటి ఈస్ట్ఇండియా కంపెనీ, బ్రిటీష్ భారతప్రభుత్వం, భారతదేశంలో కొంతమంది స్థానిక మరియు ఇతర యూరోపియన్కుచెందిన సంస్కృత పరిశోధకులను, సంస్కృత మూలగ్రంథలను సేకరించి వాటిని పరిష్కరించాలని కోరినప్పుడుఅవి దాదాపు పదివేలవరకు దొరికాయి. యూరోప్లో సాంస్కృతిక పునరుజ్జీవనకాలంలో చర్చించబడిన భారతీయ సంస్కృత గ్రంథాలు, నాటకాలు,  చరిత్రలవంటివి  సంస్కృతం అందించే జ్ఞానంఎంత గొప్పదో గుర్తించాయనీ చెప్తూ జనసామాన్యంలోసంస్కృతానికి  సంబంధించిన కొన్ని ముఖ్యమైన పలుకుబడులనుపరిచయం చేస్తాడు.అవి,  అందరూ ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే ఎందుకు మూర్ఖులు ఒకరు ఒకరు గాయపరచుకుంటారు, బీదవాడే ఆకలి రుచి ఎరిగిన వాడు,  మన శరీరము సముద్రం మీద నురగ వంటిది మన జీవితం పక్షి,  మనం ఎవరినైతే ప్రేమించామో  వారు ఎప్పుడు శాశ్వతంగా ఉండరు, ఇల్లు భార్య పిల్లలు సంపద ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది , అవి మనకు చెందినవి కావు,  మనకు చెందినవి  మనం చేసుకున్న పాపపుణ్యాలే, మనిషి పాతవస్రం విడిచి కొత్త వస్త్రం వేసుకున్నట్టు మన ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరానికి వెళ్తుంది, ఆత్మను నిప్పు కాల్చలేదు నీరు ముంచలేదు గాలి ఆర్పలేదు, తన గురించి తాను తెలుసుకోవడం కన్నా గొప్ప జ్ఞానం ఏదీ లేదు, జ్ఞాని అంటే తన గురించి తాను తెలుసుకునే వాడే వంటి  ఎన్నో పలుకుబడులని పేర్కొంటాడు.మానవ వికాసం భాషలో ప్రతిఫలిస్తుందని ముల్లర్ భావన. 

నాలుగవ  ఉపన్యాసం వేద సంస్కృతి ప్రత్యేకమైనదాఅనే ప్రశ్నతో మొదలౌతుంది. కవితాత్మకంగావెల్లడించబడిన వేదం, వేదసంస్కృతి కేవలం పరిశోధకుల కోసమే కాకుండా అందరికోసం  పరిరక్షించవలసినటువంటి గొప్పవిషయమని,  ఒకవైపుఆదిమంగానూ, సహజంగానూ, సాధారణంగానే ఉన్నట్టు అనిపించినా ఎంతో ఆధునికమైనసమస్యలని కూడా వేదం  చర్చిస్తుందనీ, వేదాలను కనుగొనకముందు మానవభావనకు  చరిత్రలేదని చెప్పడం అతిశయోక్తి కాదనీ, గ్రీకు,  ఇటలీ పర్షియా, బాబిలోనియావంటి సంస్కృతులను  వేదసంస్కృతితో  పోల్చి వేదసంస్కృతిప్రత్యేకతలను తెలియజేస్తాడు.

ఐదవఉపన్యాసం వేదంలో పేర్కొన్న ఆరాధనలగురించి ఉంటుంది. భారతీయుల బహుదేవతారాధన ఏ విధంగా ఇతర సంస్కృతుల బహుదేవతారాధన విధానాలకు భిన్నమైనదో అర్థమయ్యేలాగా వివరిస్తాడు.ముల్లర్ దృష్టిలో భారతీయులు నిజమైన బహుదేవతారాధకులు కాదు, ఒకే శక్తిని  అనేక రూపాలలో కొలిచేవారు. ప్రకృతిలో కనిపించిన ఒక్కో శక్తికి ఒక్కో పేరు పెడుతూ వెళ్లారుతప్పఅదినిజమైన బహుదేవతారాధన కాదు.ముల్లర్ ఇక్కడ హేనోథీసం అనే  సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వివరిస్తాడు.  ముల్లర్ మాటల్లో చెప్పాలంటే “monotheism in principle and polytheism in fact”,అంటే మూలంలో ఒకే ఈశ్వరుడే  ఉన్నా పరిస్థితులకు,ఆకాంక్షలకు తగిన రూపంలో ఆరాధించడం. ఈవివరణ ఎంతో సహేతుకంగా ఉంటుంది. వేదాలలో క్రమంగా భౌతికంనించి ఆధ్యాత్మికానికి,మానవుడినుంచి దివ్యత్వానికి చేసే ప్రయాణం ఉంటుంది. ముల్లర్ దృష్టిలో వేద కాలం యొక్క మతముప్రకృతి ఆరాధననే. వేదం పేర్కొన్న నదుల ప్రస్తావననుబట్టి వేదకాలంనాటికి భారతదేశం భౌగోళికంగా ఎంత విశాలమైందో తెలియజేయబడుతుంది.

ఆరో ఉపన్యాసంలో వేదకాలంనాటి దేవతమూర్తులకు సంబంధించి వివరాలను వివరిస్తాడు.వేద దేవతలను భూమికి, ఆకాశానికి, స్వర్గానికి చెందిన  మూడుస్తరాల్లో విభజిస్తాడు. అగ్ని,వాయు,వరుణ ఎందుకు పూజించబడినాయొ , అవి ఏవిధంగా భూమిమీద జీవించడానికి కారణం అవుతాయో చెప్తాడు. ముల్లర్ ఇంద్ర పేరుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ  ఇంద్ర అనేపేరు గ్రీకులోగాని, లాటిన్లోగాని,జర్మన్లోగానీ మరిఇంకెక్కడా కానీ కనిపించదనీ, అది కేవలం వేదంలో మాత్రమే కనిపిస్తుందని బహుశా అది ఆర్యన్ కుటుంబంనుంచి పూర్తిగా విడిపోయిన తర్వాత ఏర్పడి ఉండొచ్చును అనే భావన చెప్తాడు. ఇంద్ర ఆకాశానికి దేవుడు అలాగే పిడుగుకి పర్జన్య అన్న పేరు గురించి విస్తారంగా చర్చిస్తాడు. భూమికి ఆకాశానికి చెందిన దేవతలు కాకుండా స్వర్గ దేవతల గురించి మాట్లాడుతాడు. పర్జన్యం, వరుణ శబ్ధాలమీద ముల్లర్ చేసిన వివరణలు ఆయన  అవగాహనను, అందుకోసం చేసిన ప్రయత్నాన్ని పట్టిస్తాయి.

          ఏడవది మరియు చివరి ఉపన్యాసంలో వేదము- వేదాంతం గురించి ఉంటుంది. భాష గురించిన చర్చ వచ్చినప్పుడు భారతీయులు లిపిని ఎప్పటినుంచి వాడడం అలవాటుగా చేసుకున్నారు,  ఒకవేళ చేసుకుంటేకాలనిర్ధారణ ఏది, ఎందుకోసం  చేశారు, అసలు ఏవిధంగా ఈసంస్కృతం  ఒక పరిపూర్ణమైన భాషగా రూపొందింది తేల్చడం క్లిష్టమైన పని అని, ఇప్పటివరకుసంస్కృత భాషకు సంబంధించినటువంటి వివరాలు ఏవి దొరకలేదనీ,  క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దానికి భారతీయులకి లిపిలేదనీ మెగాస్తనిస్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావన చేస్తాడు.  అయితే భారతీయులు ప్రత్తిమీద వాణిజ్య ఒప్పందాలను రాసినవిషయాన్ని గుర్తుచేస్తాడు.అత్యధికంగా జ్ఞాపకశక్తి ఆధారంగానేవేదకాలం భాషాసాహిత్యాలు  కూర్చబడ్డాయని,  పరిరక్షించబడ్డాయని,  ఋగ్వేదం ఒక్కదాంట్లోనే దాదాపు లక్ష యాభై మూడు వేలు ఎనిమిది వందల ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయని పదివేల ఐదు వందల శ్లోకాలున్నాయని, అయితే  దీనికి ముందు యే విధంగా భాషాపరిజ్ఞానం అభివృద్ధి చెందిందని తెలుసుకోవడం చాలాకష్టమైన పని చెప్తాడు. భారతీయులువేదపరిజ్ఞానాన్ని ఏ విధంగా నేర్చుకుంటారు అన్న దానిమీద ఐ – త్సింగ్  అనే చైనా యాత్రికుడురాసి పెట్టినవివరణ ప్రకారం భారతీయులు  వ్యాకరణాన్ని ఇతర అంశాలను నేర్చుకోవడానికి చాలా పరిశ్రమ చేస్తారన్నమాట ఉటంకిస్తాడు.ఐ – త్సింగ్  చైనా నుంచి నలందాకువచ్చి ఇక్కడ మూడు ఏళ్లు ఉండి తన అనుభవాలను రాసి పెట్టాడు. విధ్యార్థులు గురువు ముఖతా నేర్చుకోవడం, అర్థాలను, వ్యాకరణాన్ని నేర్చుకోవడం వంటివి ముఖ్యమయిన అంశాలనీ, పరిపూర్ణ వేదవిద్యకు యేళ్ళ తరబడి అధ్యయనంచేయాల్సి ఉంటుందనీ ప్రతీ దశకూ  వెచ్చించే కాలాన్ని సూచిస్తూ వివరిస్తాడు.ముల్లర్ ప్రకారం వేదంలోని శ్లోకాలను గమనిస్తే అది  వారిని కవులుగాను, ఆరాధకులుగాను తత్వవేత్తలుగాను విడగొడుతుంది. ఇవన్నీ ఎంతో క్షుణ్ణంగా పరిశీలన చేస్తేగానీ భోదపడని విషయాలు. ముల్లర్ వాటిని కాబోయే అధికారులకు సహేతుకంగా వివరించే ప్రయత్నం చేస్తాడు.

ముల్లర్ ఇలా తన ఉపన్యాసాలలో నాటి భారతదేశపు పరిస్థితులలో అందుబాటులో ఉన్నమూలగ్రంథాలు  సేకరించి వాటినితాను అర్థంచేసుకున్నవిధంగా వెలువరించాడు. ఆనాటికి  భారతపరిపాలకులుగాఉన్న విదేశీయులఅపోహలను దూరంచేసి సానుకూలమైన అవగాహనను పెంపొందించి తగిన కృషి చేసేందుకు తగిన ప్రేరణను కలిగిస్తాడు. అన్నిఉపన్యాసాలలోభారతీయులసంస్కృతిపట్ల గౌరవంతోనూ,వివేచనతోనూ వివరణలు ఇస్తాడు. ఇవ్వన్నీ  తెలుసుకున్నప్పుడు ఇదివరకు తెలిసినవే అనిపించిన విషయాలు కూడా  మరింతగా స్పష్టంగా అర్థమైనట్టు  అనిపిస్తుంది.

 ముల్లర్ వేదఅనువాదాలమీద  అభిప్రాయాలమీద ఎన్నో విమర్శలుకూడా ఉన్నాయి.దానికిగల కారణాలు చూస్తే మొదటిది ఆయన ఎన్నడూ భారతదేశంలో అడుగుపెట్టలేదు, యే వేద అధ్యయన సంస్థతో సంబంధం  కలిగిలేడు.  రెండవది ముల్లర్ తన ఉపన్యాసంలోనే భారతీయులు  వేదాన్ని అభ్యసించడానికి ఎంతో కష్ట పడతారని పేర్కొన్నప్పటికీ తాను అలాటి అభ్యసన ఏదీ లేకపోయినా వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించే సాహసం చేయడం , దానిలోని వక్రీకరణ దోషాలకు వెరవకపోవడం , మూడవది అప్పటికి సరైనా చారిత్రక ఆధారాలు లేకుండా  విలియంజోన్స్ వంటివారు ప్రతిపాదించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంత  ప్రతిపాదికగా సంస్కృతభాషా సాహిత్యాలను వినియోగించుకోవడం, ఆ భావజాలన్ని వ్యాప్తి చేయడం , నాలుగవది మూలగ్రంథాలకన్నాఅదివరకే ఇతర భాషలలొ వెలువడిన సాహిత్యాలను ఆధారంగా చేసుకొని వాటిద్వారా అనువాదం చేయడం, అయిదవది తాను వెలువరించిన గ్రంథాల అర్థతాత్పర్యాలను కనీసంగానైనా యే పండితునితోనూ     సమీక్షించుకోకపోవడం వంటివి ఆయన చేసిన విలువైన కృషికి మాయని మచ్చలుగా మిగిలిపోయాయి.

ముల్లర్  వేదానువాదాలను అధ్యయనం చేశాక  ఆయా శ్లోకాలకు సరైన న్యాయం జరగలేదు అన్న విషయాన్ని పండితులు గుర్తించారు.  ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం విస్తృతంగా తన రచనల్లో వాడడం వల్ల భారతీయులను భిన్నజాతులుగా  విడగొడుతూ జాతిబేధాలకు మూలకంగా వాడుకున్నారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం నిజానికి ముల్లర్తో మొదలవలేదు ఇంతకుముందే జేమ్స్ మిల్  రాసిన హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, అలాగే నాటి న్యాయపాలన అధికారి విలియంజోన్స్, పాశ్చాత్యభాషలకి సంస్కృతానికి ఉన్న సారూప్యతలనుపోల్చి  భారతీయుల సంస్కృతానికి పాశ్చాత్యమూలాలు ఉన్నట్టు ప్రకటించడం జరిగింది.  దానిని  ముల్లరు విస్తృతంగా ప్రచారం చేశాడు అనడానికి ఆయన రచనల్లో పేర్కొన్న అంశాలే కారణం.ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పుస్తకంలోకూడా అనేకచోట్ల ఆర్యులప్రస్థావన వస్తుంది.అదికూడా ఆర్యులు అనేవారు ఒకజాతిగా వేరేచోటనుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడున్న స్థానికుల మీద దాడి చేసి వారిని జయించి స్థిరపడ్డారని అందుచేత పాశ్చాత్యభాషలకి ఇక్కడ ఉన్న సంస్కృతానికి సంబంధం ఉందని చెప్పడం..అయితే ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం మహంజదారో హరప్పాలాంటి ప్రాంతాల్లో దొరికిన చారిత్రక విశేషాలను బట్టి ఇది దండయాత్ర అయ్యే అవకాశం  లేదని తేలింది కనుక ముల్లర్ కాలంలోనే ఈ సిద్ధాంతంకాస్తా ఆర్యుల వలస సిద్ధాంతంగా మార్చబడింది. ప్రస్తుతం దాదాపు వందేళ్ళ తర్వాత  అనేక రకాలుగా ఆర్యులదండయాత్ర, ఆర్యులవలస సిద్ధాంతాలను పరిశోధించిన మీదటఆర్యులు ఎక్కడి నుంచో రాలేదనిఆర్యులమూలవాసులసిద్ధాంతం ప్రతిపాదించబడుతున్నది.

ముల్లర్ వల్ల విస్తృతంగా ప్రచారమైన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం భారతీయ సమాజంమీద ఎంతో ప్రభావం చూపించింది.  ఇది పాశ్చాత్య పాలకుల దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని నాటి భారతీయులు గుర్తించలేకపోయారు. ప్రసిద్ధ జాతీయవాది బాలగంగాధర్ తిలక్ ఆర్యుల యురేషియా సిద్ధాంతాన్ని సమర్థించాడు,  అలాగే భారతీయ మూలాల పట్ల విశ్వాసం ఉన్న ప్రజల్ని అనుమానం కలిగే విధంగా రాహుల్ సాంకృతాయన్ ఓల్గా  టు గంగ పుస్తకాన్ని వేశాడు.  ఒక వారే కాదు ఎంతోమంది ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అస్థిత్వవాద ఉద్యమాలకు  ప్రధానభూమికగా మలుచుకున్నారు. అయితే అంబేద్కర్ ఈ ఆర్యులదండయాత్ర సిద్ధాంతాన్ని అంగీకరించలేదు,ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చే అవకాశం లేదని ఇది తప్పని ఆయన ఆనాడే ప్రగాడంగా  విశ్వసించారు అంతే కాదు క్రైస్తవ మిషనరీల దురుద్దేశ స్వభావాన్ని కనిపెట్టినట్టుగా తన శవం కూడా క్రైస్తవంలో చేరదని ప్రకటించాడు. నాటి అంబేద్కర్ అంచనా వేసినట్లుగానేప్రస్తుతం  జరిపిన అన్వేషణలు పురాతత్వ పరిశోధనలు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి తగిన ఆధారాలు లేవని ఇది కట్టుకథని భారతీయులనుపరిపాలించడంకోసం చేసిన ప్రయత్నం అని తేల్చాయి. ఈ అంశాలను బలపరచిన ఆధారాల్లో  ముల్లర్  స్నేహితులకు, భార్యకు రాసిన లేఖల్లో ఆయన పేర్కొన్న అంశాలే. ఇక్కడ మరొక అంశంవిదేశీయుల్లో  సంస్కృతం భాషను ఎక్కువగా నేర్చుకున్నది జర్మన్లు మాత్రమే ఇతర దేశాలతో పోలిస్తే జర్మన్లు, బ్రిటిష్ వారు దీని కోసం ఎక్కువ పని చేశారు. జర్మన్ యొక్క అస్థిత్వ మూలాలను స్థిరపరచడానికే బ్రిటిష్వారు  జర్మన్లనుసంస్కృత అధ్యయనానికి ప్రోత్సహించారనితెలుస్తుంది. అదెలా ఉన్నా ఈ సిద్ధాంతం మిగిల్చిన  భారతీయ జన విభజన అవశేషాలు ఇంకా యుద్దం చేస్తూనే ఉన్నాయి.

వేదాన్ని అభ్యసించడానికి నాటికాలంలో ఉన్న పరిమితుల దృష్ట్యా అది కొంతమందివద్దనే ఉండిపోయిందనేది సత్యం. కాలక్రమేణావచ్చిన మార్పులవల్ల చాలావరకు వేదసాహిత్యం అందుబాటులో లేకుండా పోయింది. భారతదేశంలో విదేశీపాలన తెచ్చిన మత సంకటాలు మన అస్తిత్వాన్ని మేల్కొలిపినప్పుడు మాత్రమే వేదం, వేద సంస్కృతిఅంశాలు జనసామాన్యంలోకి వచ్చాయి. వేదం నాటి నుంచి నేటివరకు సంస్కృతంలోనే ఉంది, దాన్ని స్థానికభాషలలోకి తెచ్చి అందరికీ అర్థం అయ్యేలా చేయడంలో మన ప్రయత్నం  ఇప్పటికీ అంతంత మాత్రమే. వేదాన్ని అలా ఉంచడం  వేదానికి ఇచ్చిన  గౌరవం అయి ఉండవచ్చును కానీ ఈ రోజున యే శ్లోకంలోని యే పదానికి యే అర్థం స్పురిస్తుందో చెప్పలేని పరిస్థితి రావడం వెనుక కేవలం మన పరిమిత ప్రయత్నమే చేశామన్న విషయమూ గుర్తుంచుకోవాలి. మరొక విషయం ఏమిటంటే జీవనం, వృత్తుల ఆధారంగా విభజించి  ఉన్న మనసమాజంలో యే వృత్తికి  కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఆయా కుటుంబాల ద్వారానే  వచ్చింది గానీ నేటిలాగా అందరూ ఒకే తరహా విధ్యాభ్యాసం చేయడమన్నది లేదు కనుక  వేద జ్ఞానం పొందడంలో ఈ సామాజిక పరిమితి ఉండడం వల్లకూడా వేదానురక్తి పరిధి కుదించుకుపోయింది.తెలుగుభాష విషయానికివస్తే నన్నయ్యకాలానికి మహాభారతం తెలుగుచేయడం మొదలయింది కానీ నిన్నమొన్నటి దాశరథి రంగాచార్యుల  వేదాల సరళఅనువాదంవరకు యే ప్రయత్నం జరగలేదన్నది వాస్తవం. హిందీలో ఈ ప్రయత్నం స్వామీ దయానంద సరస్వతి చేశారు. ఈ మధ్య కాలంలో వివిధ భాష్యకారుల సాహిత్యాన్ని వేదపరిరక్షణ సంఘాలు, గీతాప్రెస్ వంటి ధర్మప్రచారకసంస్థలు ప్రచురించడం వినా వేదం మన పురాసాహిత్యమని దాన్ని కాపాడుకోవడం మన విధ్యుక్త ధర్మం అని  జనసామాన్యం భావించలేదు, విశ్వ విద్యాలయాలు పూనుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలావరకు మూలగ్రంథాలను సేకరించినదుకు, దాన్ని పరిరక్షించినందుకు  తమ జీవితాలను ధారపోసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేయవల్సిందే. లేకపోతే నలందా గ్రంథభాండాగారం భస్మమైనట్లు ఇవన్నీ చెల్లాచెదురయ్యే ప్రమాదమూలేకపోలేదు. ముల్లర్ ద్వారా  ఇంగ్లీష్ భాషలోకి అనువాదం పొందిన వేదాలు ప్రపంచవ్యాప్తంగా తాత్వికులకు కొత్త భావనలిచ్చాయనడంలో సందేహం లేదు. మొన్నటికిమొన్న యునెస్కో ఋగ్వేదాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇలాటి సందర్భంలో పాశ్చాత్యుల అనువాదంలోని తప్పుడు అర్థాలను సవరించి సరైన భాష్యాన్ని నిర్వచించి అందరికీ మన పురావారసత్వ సంపదను అందించవల్సిన బాధ్యత మనమీద ఉంది. 

   ప్రజలున్న చోట ప్రభుత్వం ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ఉన్నచోట దానికో తత్వమూ ఉండాల్సి  ఉంటుంది. ప్రజలూ ప్రభుత్వం ఒకే మూలానికి చెందిన వారైతే శ్రమ  విభజన (division of labour) ఒక అవసరం, ప్రజలూ ప్రభుత్వం  వేరు వేరు మూలాలకు చెందిన వారైతే విభజించి పాలించు (divideandrule)ఒక ఎత్తుగడ.మొదటి వాక్యం అనాదిగా మన  గ్రామవ్యవస్థ పునాది, రెండో వాక్యం గత మూడు  వందల ఏళ్ల  దేశచరిత్ర నేర్పిన  గుణపాఠం.  విభజించి పాలించడానికి హేతువు కావాలి.  అటువంటి  హేతువుల అన్వేషణలో జీవితాల్ని ధారపోసిన  ఎంతోమంది  విదేశీయుల్లో ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ ఒకరు.  ముల్లర్ చరిత్రను ఎందుకు అధ్యయనం చేయాలో చెప్తూ ప్రతితరము తన ప్రయాణాన్ని ఒకే బిందువు దగ్గర మొదలు పెట్టకూడదని ఒకే చోటతవ్వుతూ ఉండకుండా ముందున్న తరాలనుంచిప్రయోజనం  పొందుతూ ఇంకా ముందు బిందువులనికలుపుతూ సామూహికలక్ష్యాలనిచేరుకోవడానికి చరిత్రచదవాలని సూచిస్తాడు. ముల్లర్చెప్పినట్లుగా మన ముందుతరాలుమన చరిత్రను  మొదలుపెట్టినచోటనుంచే  మొదలుపెట్టకుండాసహేతుక అధ్యయనంతో అవసరమున్న చోట సరిచేసుకొని మన అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలసిన చారిత్రక సందర్భం ఇది. అది గుర్తుచేయడమే ఈ దర్శనోధ్యేశ్యం.

July 24, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆడియో విజువల్ హెరిటేజ్

by రంగరాజు పద్మజ July 20, 2024
written by రంగరాజు పద్మజ

యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్

       మన సంస్కృతీ పరంపరను దృశ్య శ్రవణ మాధ్యమాల్లో భద్రపరిచి వాటిని ప్రదర్శించడం ద్వారా రాబోయే తరాలకు మన వారసత్వ సంపదను అందజేయ చేయవచ్చు. దీనిలో పూర్వ సాహిత్యమే కావచ్చును, చారిత్రక కట్టడాలు కావచ్చును, మంచి శిల్పకళా నైపుణ్యం ఉన్న దేవాలయాలు కావచ్చును, వ్యవహారాలు ప్రతిబింబించే పండుగలూ కూడా కావచ్చును, రాజులు నిర్మించిన కోటలు, బురుజులు వాటిద్వారా చరిత్రను రాబోయే తరానికి తెలుపవచ్చు! వాటి యొక్క పూర్వ వైభవాన్ని తెలుసుకోవడమే కాకుండా, వాటిని ప్రచారంలోనికి తీసుకొని రావాలని ,ప్రచార మాధ్యమాల ద్వారా తెలియజేయాలని దాని కొరకు శబ్ద( ఆడియో) చిత్రీకరణ(విజువల్) ఉపయోగించుకోవాలనేది ముఖ్య ఉద్దేశం.
   దీనిలో భాగంగా మన పూర్వ సంస్కృతి పరంపరలో భాగంగా ఈరోజు రామప్పదేవాలయం యొక్క అపూర్వతను, అద్భుతాలను రాబోయే తరాలకు దృశ్య- శ్రవణ మాధ్యమాన్ని ఉపయోగించినట్లయితే చాలా చక్కగా తరతరాలకు అందించగలము. ఎలా అంటే? విదేశాలలో నివసించే వారు కానీ దూర ప్రాంతాల్లో ఉన్న వారు కానీ తమ తమ కంప్యూటర్ ద్వారా వారికి రామప్ప ఆలయం తాము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేలా చేయవచ్చును.
1. కాల్పనిక వాస్తవికత్వము( Virtual realing).
2. అనుబంధ వాస్తవికత ( Augmented realty).
       ఈ రెంటి ద్వారా ఉపయోగం ఏ విధంగా ఉంటుంది అంటే ఉదాహరణకు రామప్ప దేవాలయంలోని ఒక స్తంభం దగ్గర నిలిచి మనం ఆ స్థంభం మీద చిత్రకళా నైపుణ్యాన్ని చూస్తున్నప్పుడు మనకు ఆడియో ప్రీ రికార్డెడ్ మెసేజ్ లతో వాటి ప్రతేకత ఆ శిల్ప కళా యొక్క ప్రత్యేకత, ఆ శిల్పాల చరిత్ర, ఆ శిల్పకారుడి ఉద్దేశ్యం, దానికి ఆ కాలంనాటి సాహిత్యానికి ఉన్న సంబంధం, అది ఏ శతాబ్దానికి చెందిన కట్టడం, అది ఎవరిచే నిర్మించబడింది ఇలా అన్ని వివరాలు ఈ వీడియో ఆడియో ల ద్వారా తెలుసుకొనవచ్చు.
   ఇందులో ఎవరికీ అర్థమయ్యే భాష ద్వారా వారు వినే సదుపాయం కూడా కల్పించవచ్చు. ఈ ఆడియోలు నిపుణులచే తయారు చేస్తారు కాబట్టి తప్పుడు సమాచారం అందే అవకాశం ఉండదు.
ఉదాహరణకు రామప్ప దేవాలయం చూడాలని ఎవరైనా అంతర్జాతీయ యాత్రికుడు వచ్చినప్పుడు శిక్షణ పొందిన గైడు లేనట్లయితే, ఉపాధి దృష్ట్యా వృత్తి గా తీసుకున్న ఎవరైనా గైడ్ వారికి చరిత్ర అంశాలు కానీ, కట్టడం యొక్క ప్రశస్తి కానీ, ఆయా కట్టడాలు నిర్మించిన కాలం అవగాహన లేకపోవడం గానీ, ఆగైడుకు శిల్పకళా రీతులు తెలియకపోతే… యాత్రీకులకు తప్పుడు సమాచారం అందుతుంది. అలా కాకుండా ముందే సమాచారం రికార్డు చేసి ఉండడం వల్ల సరియైన సమాచారం యాత్రికులకు అందడమే కాకుండా, ప్రతి చిన్న అంశాన్ని ప్రతి ఒక్కరు కూలంకషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది… ఇది శాశ్వతంగా కూడా ఉంటుంది. అంతే కాదు సమయము కూడా వృధా కాకుండా ఉంటుంది. కాబట్టి రాబోయే తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను చరిత్ర పరంపరగా అందించ వచ్చును.
అనుబంధ వాస్తవికత ( Augmented realty)
కాల్పనిక వాస్తవికతత్వం ( Virtual realing) వీటికి .ధ్వని తోడ్పాటు( sound effects) ను జత చేస్తే, అనగా వీడియోను చిత్రీకరించిన అప్పుడు సన్నివేశంలో ధ్వనితో మరింత ఆసక్తికరంగా విశేషాలను తెలుపవచ్చు. ప్రత్యేక ధ్వనులతో పాత కాలం నాటి పరిస్థితులు దేవాలయం కానీ ఇతర యాత్రా విశేషాలును కానీ సహజ స్థితిని అంటే పవిత్ర భావం కలిగించే అనుభూతిని ఇవ్వవచ్చు. మాటలు లేదా కామెంటరీకి ధ్వని తోడ్పాటు బాగా రక్తి కట్టిస్తుంది.

రేడియో;- మన పరంపరలో దృశ్య శ్రవణకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొలినాళ్ళనుండి సామాన్యజనానికి అందుబాటులో ఉండి శ్రోతలు ఎక్కువ కలిగి ఉన్నది రేడియో. దూరదర్శన్ లు వచ్చిన కూడా ప్రయాణంలోనూ కార్లలో బస్సులలో,, చరవాణి లోనూ ట్రాన్సిస్టర్లు ద్వారా మొబిలిటీ ఉన్నది రేడియో కావడం వల్ల దీని ద్వారా సంస్కృతీ పరంపరను రాబోయే తరాలకు అందించేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. ఇది వరకే ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించిందని చెప్పాలి.
టెలివిజన్:– టెలివిజన్ ద్వారా కూడా మన పరంపరాగతమైన అనేక విషయాలు భద్రపరచడంలోనూ , తెలియ చెప్పడంలోనూ ఆడియో వీడియో హెరిటేజ్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నది… పడుతుంది కూడా! ఇందులో Virtual reality ( కాల్పనిక వాస్తవికత్వం, Augmented realty ( అనుబంధ వాస్తవికత అను సాంకేతికత ఉపయోగించి ప్రతి చిన్న అంశాన్ని విస్తృతంగా చూపెట్ట వచ్చు. సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను ఆడియో ద్వారా వినిపించవచ్చు. దీనికి సరి అయిన నిపుణులే (టెక్నీషియన్లు) కాకుండా చరిత్రను పరిశోధన చేసిన వారితో స్క్రిప్ట్ వ్రాయించి చాలా బాగా విశ్లేషణ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆ ప్రదేశం సందర్శించాలని కోరిక కలిగేటట్టు చేయడంతో యాత్రికులు (Tourists) పెరగడంతో టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుంది.
అట్లాగే మన సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కూడా చేసిన వాళ్లం అవుతాము. అనుబంధ వాస్తవికత ద్వారా వీడియోలు నెటిజన్లు వారి వారి లాప్ టాప్ లోనూ చూస్తూ కూడా ఏదైతే చూస్తున్నారు ఆ ప్రదేశాన్ని దగ్గర నుండి చూసిన అనుభూతిని పొందుతారు. మనం పరంపరలో భాగంగా ఈరోజు రామప్ప దేవాలయం దర్శిద్దాం! అంతకన్నా ముందు ఈ రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయుల గురించి విహంగవీక్షణంగా తెలుసుకుందాం!           కాకతీయులు:- 350 సంవత్సరాల పాటు ఓరుగల్లు లేదా నేటివరంగల్ ను రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాకతీయుల చాలా ప్రసిద్ధి పొందిన వంశం. అనగా క్రీ.శ. 1083- 1323 వరకు వీరి సేనానులు రాష్ట్రకూటులు శాతవాహనుల తర్వాత తెలుగు జాతినిసమైక్యంగా చేసి ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన హిందూ వంశీయులు కాకతీయులు.
కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరిసంపదలతో తులతూగుతున్నట్టు అమీర్ ఖుస్రూ , మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తున్నది. తెలుగువారికి ముఖ్య వృత్తి వ్యవసాయం అయితే అప్పటి వరకు వర్షాధారం గానే వ్యవసాయం చేసేవారు. కానీ కాకతీయ రాజులు, రాణులు, సామంతులు పెద్ద పెద్ద చెరువులు కాల్వలు తవ్వించి నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. అందులో” రామప్ప చెరువు” కేసరి సముద్రం”, “పాకాల చెరువు”, “కాట సముద్రం”” చౌడ సముద్రం”, జగత్ కేసరి సముద్రం మొదలైనవి నీటి వనరులు.
  కాకతీయ చక్రవర్తులు లలితకళలు సాహిత్యం ఈ పెంచి పోషించారు. వీరికాలంలో నాట్యకళ ఎంతో ప్రసిద్ధి పొందింది. నాట్యం చేసే నర్తకీమణులకు, మృదంగ విద్వాంసులులకు ఇండ్లు కట్టించి ఇచ్చారట. చేబ్రోలు శాసనంలో కాకతి గణపతి దేవుడు నృత్తరత్నావళి రచయిత జాయపసేనాని 16 మందిని గృహ దానాలు చేసినట్లు రాశాడు.
       శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాల్లో నాట్య సంప్రదాయాలను పోలిన చాలా నాట్యశిల్పాలు ఉన్నాయి. చాలా దేవాలయాలు తురుష్కుల దండయాత్రలతో ధ్వంసమై పోయాయి. వారసత్వానికి అనగా హెరిటేజ్ కు నిదర్శనంగా సాహిత్యం, నాట్యం, శిల్పకళ, చిత్రకళ మొదలైన అన్ని రంగాలలోనూ కాకతీయులు తమదైన శైలిని చాటి చెప్పారు. సంస్కృతి సాహితీ సంపద శిల్ప కళారీతులు లలితకళలు ఈ రోజుకు కూడా చెక్కుచెదరకుండాఉన్నాయి. భారతదేశంలో ఉన్న అద్భుత శిల్ప రీతుల్లో కాకతీయ శిల్పరీతికి ఒకటి. దేవాలయాలలోని స్తంభాల నిర్మాణ పద్ధతి, వాటిని నిలబెట్టిన విధానం, గర్భాలయ ముఖద్వారాలు బట్టి అవి కాకతీయులు కట్టించారో లేదో చెప్పవచ్చు! కాకతీయుల శిల్పరీతి హోయసల శిల్పరీతి వలేఉంటుంది. ఈ రామప్ప దేవాలయం నిర్మాణానికి ముందే బేలూరు, హలేబీడు, సోమనాథపురాలలో దేవాలయాలు దాదాపు రెండు వందల సంవత్సరాలకు ముందే నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. ఈ దేవాలయం మీద కనిపించే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటి శిల్పాలు కాకతీయ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే హోయసల  శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కనిపిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటవైపునే తమ నేర్పరితనాన్ని చూపెట్టారు. కానీ కాకతీయుల శిల్పులు లోపలి భాగాలలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. హోయసల ఆలయాలపై కన్పించేవి దేవతామూర్తులు కాగా…. కాకతీయుల ఆలయాలపై కనిపించేవి ఆ నాటి సామాన్య స్త్రీ పురుషులవి. ఆనాటి సామాన్యుల వేషధారణ, హావభావాలను చెప్పించడం ఒక కాకతీయ రాజులు చేశారు.
రుద్రేశ్వరాలయాన్ని రుద్రసేనాని శ్రీముఖ నామ సంవత్సరం 1135 క్రీస్తుశకం 30-3 -1213లో నిర్మించినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.
రామప్ప ఆలయ విశేషాలు:- శ్రీ రుద్రేశ్వర ఆలయంలోనికి ప్రవేశించగానే ఈశాన్యభాగంలో రుద్రసేనాని వేయించిన శాసనం కనిపిస్తుంది. అందులో రుద్రసేనాని వంశవర్ణనం, అతనిపూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి, పరాక్రమాలు, ఆనాటి ఓరుగల్లు పూర్వవైభవం వర్ణింప బడి ఉన్నాయి. ఆలయానికి తూర్పు ,దక్షిణ, ఉత్తర దిశలో మూడు ద్వారాలున్నాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా నందివిగ్రహం అత్యంత నేర్పరితనంతో చెక్కిన విగ్రహం. అంటే ఏ దిక్కు నుండి ఆ నందిని చూసిన ఆ నంది మన వైపే చూస్తున్నట్టు కనపడుతుంది. మంచి చెక్కడాలతో ఉంది.
మదనిక శిల్పాలు:– ఆలయంలో బయట వైపున స్తంభాలను పైకప్పులను కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహర శిల్పాలే మదనికలు. ఇవి ఆనాటి సామాన్య స్త్రీలవి. మదనిక శిల్పాలను వస్త్రాల కంటే ఆభరణాలతోనే అందంగా రూపొందించారు. అందులోనూ అప్పటి స్త్రీలు ధరించే హారాలు శిరోభూషణాలను పొందుపరచారు. ఒక్కో శిల్పం ఒక్కో విశేషంగా కనిపిస్తుంది. ఆనాటి జీవన సౌభాగ్యానికి ఆ శిల్పాలు నిదర్శనాలు. ఒక మదనిక చీరను ఒక కోతిలాగి వేస్తుంటే… మరొక చేత్తో మానసంరక్షణ చేసుకుంటూ… రెండవచేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్టు ఉన్నా శిల్పంలో ముఖ కవళికలు పరమాద్భుతంగా ఉంటుంది. మరొక మదనిక పాదంలో ముల్లు గుచ్చుకోగా ఆ పాదం మీద ఏర్పడిన వాపును కూడా చక్కగా చెక్కిన చూపెట్టిన నేర్పరితనం ఆనాటి శిల్పులది.
రంగమంటపం;-
గర్భాలయానికి ముందున్న రంగమంటపం నిర్మించిన తీరు అద్భుతంగా ఉంది. నాలుగు స్తంభాల మీద చెక్కిన శిల్పాలు చాలా అందంగా కనిపిస్తాయి. స్తంభం పైభాగాన్ని సంగడి పట్టినట్లు చెక్కారు. స్తంభాల మధ్యలో చతురస్రాకార ఫలకాల మీద గుండ్రంగా ఉన్న భాగాల పైన వాటికి తగినట్లుగా శిల్పాలను చెక్కారు శిల్పులు.
  ఒకదానిమీద సముద్ర మధనం, మారో దాని మీద ముగ్గురు స్త్రీలకు నాలుగు కాళ్లు ఉన్న శిల్పం, మరొక స్తంభం మీద పేరిణి నాట్యం, ఇంకో స్తంభం మీద దండ లాస్యం, కుండలాకార నృత్యం, ఇంకొక స్తంభం మీద స్త్రీలే మధ్యలో వాయిస్తుండగా మరొక స్త్రీ నాట్యం చేస్తున్నట్టు చెక్కినట్టున్న అద్భుత చిత్రాలున్న స్తంభాలు బాగుంటాయి.
గర్భాలయ ముఖ ద్వారం:-
ఆలయంలో ప్రధాన ద్వారం మీద చెరుకుగడలు, అరటి బోదలు, మధ్య బాణాలు ధరించి రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళ ఉట్టిపడుతూ ఉన్నట్టుగా చెక్కారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయి నుండి లోహపు శబ్దం రావడం మరొక విశేషం. వాటి పైభాగాన సింహాల వరసలు లతలు వాద్యకారుల చిత్రాలు అందంగా చెక్కారు.
       శ్రీ రుద్రేశ్వర మహాలింగం:- గర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీ రుద్రేశ్వర మహాలింగం చాలా పెద్దది. పానవట్టంలోనే కాకుండా కింది భాగంలోనూ చెక్కిన సన్నని గీతలు శిల్పుల పుణ్యాన్ని తెలియజేస్తుంది.
దశ భుజ రుద్రుడు:-
రంగ మండపం మధ్యభాగంలో ఉన్న పైకప్పులో దశభుజుడైన నాట్యరుద్రుడు అందంగా చెక్కబడి ఉన్నాడు. ఇలాంటి శిల్పమే హన్మకొండలోని రుద్రేశ్వర ఆలయంలోని ( వేయిస్తంభాల గుడి) లోనూ ఉన్నది.
  శైవమతాన్ని బాగా పాటించిన కాకతీయులు వైదిక రుద్రుని ఆరాధించారు అనడానికి రుద్రదేవ మహారాజు, రుద్రమదేవి, ప్రతాప కుమార రుద్రదేవ మహారాజు అన్న వారి పేర్లలో కనిపించే రుద్ర శబ్దమే తార్కాణం. ఆ దశభుజ రుద్రునికి కుడివైపున ఉన్న ఐదు చేతులలోనూ శూలం, వజ్రాయుధం, ఖడ్గం, పరుశువు, అభయముద్రలున్నాయి. అలాగే ఎడమ వైపు ఉన్న ఐదు చేతులలోనూ నాగం, పాశం,గంట, అగ్ని, అంకుశాలున్నాయి.
‌      కావ్యాలలోని ప్రకరణాల వర్ణనల ఆధారంగా శిల్పులు తమ శిల్పాలను చెక్కారని అనిపిస్తుంది. ప్రతాపరుద్రుని సమకాలికుడైన పాల్కుర్కి సోమనాథుని” పండితారాధ్య చరిత్ర” వాద ప్రకరణంలో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కనిపిస్తుంది. ఆ దశభుజరుద్రునికి చుట్టూ అష్ట దిక్పాలకులు భార్యాసమేతులై, తమతమ వాహనాల మీద కొలువుతీరి ఉన్నారు. ఆ రంగమంటపం చుట్టూ ఉన్న నాలుగు అడ్డ దూలాల మీద సముద్ర మధనం, త్రిపురాసుర, గజాసుర సంహారం, వరాహ మూర్తి, నాట్య గణపతి, కృత్య మొదలైన రూపాలను శిల్పులు ఎంతో అందంగా చెక్కారు. ముఖ్యంగా గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మహాద్భుతం!రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పు లో రకరకాల పద్మాలు, రాతి చక్రాలను చెక్కారు.
ప్రదక్షిణ పథం:-
ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షణ పథం ఉన్నది. దాని మీద నడుస్తుంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కనిపిస్తాయి. వాటిలో శృంగార క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవ మూర్తులు మొదలైన శిల్పవిశేషాలు కనిపిస్తాయి. అవేకాక మహిషాసురమర్దని, వీరభద్రుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రుద్రేశ్వరాలయంలో పైభాగాన పెద్ద గోపురం కనిపిస్తుంది. అది వేసర శిల్ప విధానంలో నిర్మింపబడింది. ఆలయ శిఖరానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్ళలో తేలుతాయి. ప్రస్తుతం అవి దొరకడం లేదు కానీ అవి కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.
    ఇటువంటి అనేక శిల్పకళా విశేషాలతో అతి రమ్యంగా ఉన్న ఆలయం శ్రీ రుద్రేశ్వరాలయం. భారతదేశంలో గొప్ప పర్యాటక కేంద్రంగా వెలుగుతున్నది. అందరూ తప్పక దర్శించుకోవలసిన క్షేత్రం రామప్ప.
   ఈ చారిత్రక వారసత్వ సంపదను నేను ముందే మనవి చేసినట్లు ఆడియో విజువల్ హెరిటేజ్ లో భాగంగా చిత్రించి భావితరాలకు అందజేయడం అందరి కర్తవ్యం. మన సంస్కృతి పరంపరలో రామప్పను ఆ విధంగా రూపొందించాలి. కావ్యాలకు సంబంధించినవిశేషాలు జోడించాలి. అట్లాగే ఇంతకు ముందు చెప్పినట్టు స్తంభాలమీద చిత్రం చిన్నప్పుడు పేరిణీనృత్యం, పేరిణి తాండవ నృత్యం వంటి వాటిపై పునరుద్ధరించిన నటరాజరామకృష్ణగారి గురించి చెప్తూ అలాగే దేవదాసీల ప్రదర్శనలో ఎంతో పేరు పొందిన నృత్యరీతులను దేవాలయాల్లోని ప్రతిమల నాట్యభంగిమలను లక్షణం గ్రంథాలతో కలిపి అధ్యయనం చేసిన ఆంధ్ర నాట్యం గురించి వివరించాలి. దీనికోసం కృషి చేసిన వారి గురించి తెలియజేయాలి.
  విషయ వ్యక్తీకరణ చేయడానికి దృశ్య శ్రవణ మాధ్యమాలు చాలా ఉపయోగపడతాయి. వీడియోల వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఈ దేవాలయం మీద ఉన్న కొన్ని శిల్ప కళాకృతులు శిధిలావస్థకు చేరుకోబోతున్నాయి. చారిత్రక నేపథ్యమున్న ఆలయాలను ప్రభుత్వం రక్షించుకోవాలి. వీటిని గురించి ప్రచారం చేసేందుకు లఘు చిత్రాలు నిర్మించి సినిమా హాల్లో సైడ్ షో ( స్వాతంత్ర పోరాటం గురించి మొదలైనవి డాక్యుమెంటరీలు సినిమాకు ముందు ప్రదర్శించేవారు )ఆ విధంగా డాక్యుమెంటరీలు తయారుచేసి సినిమా హాల్లోనూ, యూట్యూబ్ లలో లఘు చిత్రాల ద్వారా ఆడియో రికార్డ్ ద్వారా దేవాలయం యొక్క చరిత్రను, కట్టడాల విశేషాలను శిల్పకళా నైపుణ్యం గురించి సంస్కృతి పరంపరను విస్తృతంగా ప్రచారం చేసినట్టయితే పరోక్షంగా నెటిజన్లకు అక్కడికి వెళ్లి చూడలేని యాత్రికులకు చాలా ఉపయోగపడుతుంది.

July 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us