మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

అంగూరు గుత్తులు

by Ramesh September 29, 2024
written by Ramesh

అంగూరుతోటలో
అంగూరు నేలమీద అంగూరు తీగలు తీగలు
అందాల అంగూరుగుత్తుల ఆకాశం
ఆ ఆకాశం కింద అంతా అంగూరు తియ్యని గాలే
అన్ని పండ్లు కండ్లైచూచే అద్భుతఅంగూరులోకం
అది అంగూరురైతు కలలుగన్న స్వప్నదేశం
పండ్లవ్యాపారం బండీలెక్కి
అంగూరు గుత్తులు ఆసిఫాబాద్ అంగట్లోకి చేరాక
అగ్గువగా, అంగూరంగూరని తియతియ్యగా పిలుస్తాయ్
తోపుడు బండ్ల పై లేతఆకుపచ్చగా,పసిడిపచ్చగా అమాయక పసిపాపల కండ్ల అంగూరుగుత్తులు
మార్కెట్టులో ఆపిల్స్ ధర ఆకాశాన్నంటినా
తమ రేటు
అరకిలో యాభైయే అని అంగూర్లంటవి
గిరిజన గ్రామాలకు,లంబాడి తండాలకు,గుట్ట మీది పల్లెలకు, గ్రామగ్రామానికి, ఆసిఫాబాద్ పట్టణం ప్రతీవాడకు
యాబై కరెన్సీ నోటుకు ముస్తాబై ఉషారుగా బయలుదేరుతవి
ఆస్తులున్నవారని,పస్తులున్నవారనిభేదంలేకుండా
కడుపులోకింత అంగూరు మధుర రసం భేషరతుగా దుంకుతది
అంగూరపండ్లవానికి
ఉసురు మన్న రోజులు కొన్ని అతనిగుండెలను గాయంచేస్తాయ్
ఊహకందని రోజులు కొన్ని ఆ గుండెలకే మలాం రాస్తాయ్
కలవారి కలల ముందు
శపించిన జీవితం వేస్తున్న ప్రశ్నలముందు
నీరసించి నీల్గుతూతోపుడు బండిని ఈడ్చుకెళ్లిన రోజులుకొన్ని
అతని జీవితానికి పాఠమవుతాయి

ద్రాక్షా గుత్తుల్లో కొన్నిపండ్లు కుళ్లి పోయి పండ్లమ్మేవాడిగుండెను బరువెక్కించినా
ఆధునిక సంఘం ముందు అవంతగా కుళ్ళినవేం కావు బహుశా
ఉస్సురుమంటున్న చీకట్లు తొలగి గిరాకీ సూర్యుడుదయించినపుడు అతడు ఆనందుడవుతాడు

మమకారంగామాట్లాడి అరకిలోపండ్లకి ముత్యమంత ప్రేమను,చిరునవ్వునూ మొగ్గుగా ఇస్తాడు పండ్లవాడు
మరలా రావాలంటది

అతడికండ్లనిండా తొంగిచూసే గిరాకీఆశ
గంపెడు బరువు గల నాలుగుటైర్లతోపుడు బండి
పండ్లవానికి ఎంతఅమ్ముడు పోతే అతనిగుండె అంత అల్కగవుతది కదా
పండ్లను బాగమ్మినరోజు అతడి కండ్లల్లో నియాను వెలుగులు నిండుతాయ్
పండ్లఅమ్మకాలరాబడి ఆగిఆగి పడే వానలు
ఐనా గానీ,రాతిరివేళ ఇల్లు మురుస్తుంది
ఒక కుటుంబం పచ్చవడ్తది
తాజాదనం,సరసమైనధరలనీ ధనవంతులసూపర్ మార్కెట్లు కాకుండా
తోపుడు బండ్ల పై అంగూరుగుత్తుల
బేల చూపుల్ని చూడండి
వేల చూపుల్ని చూడండి
ఆ చూపుల్లో దాగున్న రోజువారి జీవితాల పిలుపులు వినబడతాయ్
అంగూర్ అంగూర్
అరకిలో యాభై అరకిలో యాభై….

మనం బజారుకెల్దాం పదండి, అరకిలోఅంగూర్లకోసం.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

వచన కవిత

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు September 29, 2024
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

There is a pleasure in the pathless woods,
There is a rapture on the lonely shore,
There is society, where none intrudes,
By the deep Sea, and music in its roar:
I love not Man the less, but Nature more.
– Lord Byron

దట్టమైన అడవిలో సంతోషముంది
నిర్జనతీరం మీద తన్మయత్వముంది
అగాధమైన అంబుధి దగ్గరికి ఎవరూ రాకపోయినా
అక్కడ సాంగత్యం తాలూకు శాంతి ఉంది
సముద్రపు హోరులో సంగీతం కూడా ఉంది
మనుషుల పట్ల నాకున్న ప్రేమ స్వల్పమైంది కాదు
కానీ, ప్రకృతిమీద మరింతగా మరులుగొన్నాను నేను

ఛందోబద్ధమైన పద్యాలు (తేటగీతులు) గా…
సాంద్ర విపినములోనుండు సంతసమ్ము
పారవశ్యము గలదొంటి తీరమునను
జనులు లేనట్టి లోతైన జలధి చెంత
సాహచర్యము యొసగెడి శాంతి గలదు

అంతియే కాదు ఆమూలమరసి చూడ
దాని హోరులో నున్నది గానలహరి
నరులపై నాదు ప్రేమలో కొరత లేదు
కాని ప్రకృతిపై నున్నది గాఢరక్తి

(Lord Byron రాసిన Childe Harold’s Pilgrimage అనే కవితలోని ఒక స్టాంజాకు అనువాదం)

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

విజ్ఞానం కలిగించే ఆయుధంఆనంద లహరి

by Dr. Nannapuraju Vijayasri September 29, 2024
written by Dr. Nannapuraju Vijayasri

రచన: సుతారపు వెంకట నారాయణ
హృదయంలో నుంచిఉదయించే భావనాతరంగాల అక్షర శిల్పం కవిత్వం బాలలగేయాలు, త్యాగం, భృూణహత్య, బాలకార్మికులు, బడి బాలలు, పక్షులు, వానాకాలం, చందమామ, సూర్యుడు, నక్షత్రాలు, గాలిపటం, రైలు, పూలు, జెండా, చేనేత పరిశ్రమ, శీర్షికల నామకరణం అలతి మాటలతో అందంగావిద్యార్థుల హృదయాన్ని ఆకట్టుకునే విధంగా సుదీర్ఘంగా కాకుండా కవితలు సరళంగా సుందరంగా సుతారంగారుబావ వ్యక్తీకరణ చేయడం మీభావానికి పూసిన తొలి మొగ్గ ఈ శంఖారావం అయినఇది నిజంగా కవితా శంఖారావమేరాజ్యాంగ నిర్మాత గురించి,భూస్వామ్య వ్యవస్థ కై పాటుబడిన వట్టి కోట అళ్వారుస్వామి గురించితెలియజేయడం గమనార్హం 57 వ కవితలో అక్టర్ మాధుర్య కవితాస్రవంతిలో చిత్రించారుఅక్షర్ఓంకార్ విలాస్ ,,అక్షర్ ప్రగతీ కీ ప్రతీక్, 60వ కవితమేరా భారత్ మహాన్ లోవిశ్వ్ బర్మే విలక్షణ్ దిఖాతే హై అనివిద్యార్థులకు అందరం ఒకటిగా ఉండాలన్నారు.హమారే జెండాలో పింగళి వెంకయ్యా కీశ్రమకీ సాధనాహమారేయాహి థిరంగ్ జెండా అని వారి ఫలితంగా మూడు రంగుల జెండా వచ్చిందని వివరించారు. 67వఆంగ్ల కవిత వరల్డ్ పీస్ కవితలోమోరల్ వ్యాల్యూస్అండ్ డెవలప్ ద హ్యుమానిటీ విద్యార్థులలో నైతిక విలువలుపెంపొందాలని అప్పుడే మానవులంతా కలిసి మెలిసి ఉంటారని ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందన్నారు.

ఈశ భక్తినిమించిన దేశభక్తి అంటారు జెండా నినాదాలు స్వాతంత్ర్య సమర0దేశభక్తుల ప్రబోధాలు జాతీయ వీరుల భక్తి త్యాగాలు వీరులు ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోవడంఆ ప్రయత్నం కవి సుతారం వెంకటనారాయణ గారు చేశారు. త్రిభాషాసూత్రాన్ని పాటించారు.నేటితరం,ముందు తరాల వారి మార్గంలో నడవడానికి ఈ రచనలు దోహదం చేస్తాయి.భావితరాలకుస్ఫూర్తిని నింపడానికి పూనుకున్నా ఈ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ ఇటువంటి ప్రేరణాత్మకమైన మరెన్నో రచనలు వారి లేఖిని జాలువారించగలదనిఆశిద్దాం.
స్వేచ్ఛ మనిషికి ప్రాణవాయువు లాంటిది మనం అనుభవించుచున్న ఈ స్వేచ్ఛ వెనుక ఎందరో వీరుల తమ ధన, మాన, ప్రాణాలుఅర్పించి సాధించిన స్వాతంత్ర ఫలం విద్యార్థులకు అందించిన కవివర్యులు.
వేరేవర్ లిజన్ కరోనా కరోనాఅని అంతటా అన్ని ఖండాలలో వ్యాపించింది అని వివరించారు.కవి తెలంగాణ భూగోళ పరిస్థితులను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు.విద్యాసాగర్ రావు జన్మ వృత్తాంతంనీళ్ల గురించి వారు చేసిన సేవను రమ్యంగా విద్యార్థులమనసుకు హత్తుకునే విధంగా రచించారు.జయశంకర్, వట్టికోట, సి.నా.రే,అంబేద్కర్,అక్షర్ విశ్వస్వరూప్ బోణగిరిశతాబ్దాల చరిత్రగలచైతన్య గిరి
నవ చైతన్యపు కాంతుల నవ్య గిరి
కాకతీయ శిల్పకళా వైభవము ఇక్కడే
సర్వాయి పాపన్న సాహసం ఇక్కడే
భువనగిరి చారిత్రక అంశాలు సామాజిక స్థితిగతులు గురించి అద్భుతంగా వివరించారు.
ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలలో ఆనందలహరి కవితా సంపుటిని అన్ని పాఠశాలలో మరియు గ్రంథాలయంలో అంగన్ వాడి కేంద్రాలలోఉంచదగిన పుస్తకం’
ఉపాధ్యాయుడిగా,సామాజిక కర్తగా,విద్యార్థి సంఘ నాయకుడిగా,ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర బీసీ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా,తెలంగాణ రాష్ట్రం కవుల సంఘంఅధ్యక్షునిగా సేవలు అమోఘం సమస్యలను క్షణంలో తీర్చే వ్యక్తిత్వం ముక్కుసూటి మనిషి కల్లాకపటం లేనివాడు అందరూ తనవారే అని ఆదరించే వ్యక్తిత్వం చిన్నచిన్న కావ్యాలతో జన చైతన్యంసుజన సౌజన్యంఇనుమడింపజేస్తున్న త్రి భాష కవీంద్రులు ఎక్కడ సాహిత్య,ధార్మిక,ఆధ్యాత్మిక,సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యక్షం కావడం వీరి జిజ్ఞాసకు నిదర్శనం.
కరోనా కదలికలు,అక్షర లహరి,ఆనందలహరి అనే గేయ సంపుటాలు రచించారు.తెలంగాణ రాష్ట్ర కవుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్న సుతారపు వెంకటనారాయణ గారు దేశభక్తికి నిదర్శనం ఆనందలహరి కవిత్వం

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ

by mayuukha September 29, 2024
written by mayuukha

ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళాశాసనాలతో ప్రజ్ఞవికాస్ వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అన్ని పాఠశాలల్లో వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈపోటీలలో రాష్ట్రం లోని అన్ని పాఠశాలలలో దాదాపు 6000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఇందులో మేడ్చల్ జిల్లా ఉప్పల్ లోని ప్రజ్ఞాన్ ది స్కూల్ లో 10వ,తరగతి చదువుతున్న చిరంజీవి వలిపే రామ్ చేతన్ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందడం జరిగింది. ముచ్చింతల లోని స్వామి వారి ఆశ్రమంలో జిల్లాస్థాయిలో గెలుపొందిన వారికందరికీ మళ్ళీ రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీ శనివారం నాడు నిర్వహించారు. దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో కూడా చిరంజీవి వలిపే రామ్ చేతన్ ద్వితీయ బహుమతి గెలుపొందారు. విజేతగా నిలిచిన చిరంజీవి వలిపే రామ్ చేతన్ ను శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు ప్రశంసాపత్రంతో సత్కరించి చిరంజీవిని ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో చిరంజీవి తల్లిదండ్రులైన శ్రీమతి వలిపే సత్యనీలిమ, శ్రీ వలిపే లక్ష్మీ నరసింహ రావు గార్లు కూడా పాల్గొన్నారు.పాఠశాల యొక్క పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టిన చిరంజీవి రామ్ చేతన్ ను పాఠశాల యాజమాన్యం అరుణ్ సూర్య, శకుంతల, నళిని గార్లు మరియు ఇతర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందించారు.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సాహిత్యాన్ని ప్రేమించిన గొడవర్తి సంధ్యగారికి అక్షర నీరాజనం:-

by Kondapally Neeharini September 29, 2024
written by Kondapally Neeharini

⁠సాహిత్యం జీవితాన్ని ప్రజ్వలనం చేస్తుంది.వ్యక్తిత్వ వికాసం కలిగిస్తుంది. చదువు సంస్కారాల విలువను తెలియజేస్తుంది. గొడవర్తి సంధ్య గారి పరిచయం ప్రథమం గా ఉపాధ్యాయినిగానే ! హైదరాబాద్ రామ్ కోటి , కింగ్ కోటి ల దగ్గర ఉన్న సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో మేం కొలీగ్స్ మి. తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా కూడా వారు విధులు నిర్వహించారు.


కానీ నాకు పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే తెలిసింది ఆమె కవయిత్రి రచయిత్రి అని.
ఆమె సాధన నరసింహాచార్యులు గారి అర్ధాంగి అని. ” సాధన ” అనగానే సాహిత్య సంస్థగా నరసింహాచార్యులు గారికి పేరు. వీరి అర్థాంగి గా అడుగడుగున ఆయన కి సంపూర్ణ సహకారాలు అందిస్తూ సాహిత్య సభలలో వెన్నుదన్నుగా నిలిచారు సంధ్య గారు. కవిత్వం లో అందెవేసిన చేయి సంధ్య గారి ది అని వారి కవిత్వం వింటే తెలుస్తుంది. కొన్ని సభా వేదిక ల మీద కవి సమ్మేళనం లో కవిత చదవగానే నేను దగ్గర గా వెళ్లి అభినందనలు తెలిపేదాన్ని. ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ దంపతులు. హైదరాబాద్ లోని చాలా పాఠశాల లో పద్య పఠన పోటీ, వ్యాస రచన పోటీలు వంటివి పెట్టి తెలుగు భాష కోసం పాటుపడిన జంట.
సంధ్య గారి తల్లిదండ్రులుకీ.శే.భాగ్యలక్ష్మి తెలికిచర్ల కృష్ణ మూర్తి గారు.
సంధ్య గారి ఆడపడుచు వైదేహి నేను ఒకే సంవత్సరంలో తెలుగు ఉపాధ్యాయులుగా చేరాం. మాకన్నా సంధ్య గారు సీనియర్. తర్వాత కాలంలో
సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు.
పుస్తకపఠనం ఎంత ఇష్టపడేవారో రచనాసేద్యం అంతే ఇష్టపడేవారు. స్కూల్ లో పిల్లలతో నాటకాలు వేయించేవారు. అవసరార్థం నాటకాలు కూడా అప్పుడే రాసేవారు. “పోతన చరిత్ర “, “కథా భారతం ” సంధ్య గారి ప్రసిద్ధ ముద్రితగ్రంథాలు.
దూరదర్శన్ ఆకాశవాణి ల లో ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలతిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ లో ప్రవచనాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. త్యాగరాయ గాన సభ లో ఎన్నో కవి సమ్మేళనాలలో కవితా పఠనం చేశారు. ఎన్నో అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు, కార్యక్రమాలు నిర్వహించారు. సాహితీ సమీక్షకురాలిగా మన్ననలందారు. సంధ్య గారి కి ప్రాచీన సాహిత్యం అంటే ఎంత ఇష్టమో ఆధునిక సాహిత్య మంటే కూడా అంతే ఇష్టం. తాము చదివిన సాహిత్యం అందరికీ పంచటంలోనే ఆనందం అనేవారు.
ప్రతి ఏటా పాఠశాల వార్షికోత్సవం లో సంధ్య గారు, మరో సీనియర్ తెలుగు ఉపాధ్యాయుని రచయిత్రి కొమండూరి అరుంధతి గారు కలిసి నాటకాలు వేయించేవాళ్ళు . తోటి తెలుగు ఉపాధ్యాయులుగా మేమందరం సహాయపడేవాళ్ళం. ఒక సంవత్సరం ” పుష్ప విలాపం” టాబ్లో ను అద్భుతంగా వేయించారు.
వానమామలై వరదాచార్యులు గారు రచించిన
“పోతనచరిత్ర” ను తేట తెలుగు వచనం లో సంధ్య గారు రాసిన పుస్తకం ప్రశంసలు అందుకుంది. పోతనపై తనకు ప్రత్యేక అభిమానం కల్గటానికి కారణం కీ.శే.బ్రహ్మశ్రీ మల్లంపల్లి పరమేశ్వర శర్మగారు అనీ, రాజమండ్రిలో స్థానం ప్రాచ్య కళాశాల లో ఆయన చెప్పిన పాఠాలు “పోతన చరిత్ర” ను రాయడానికి కారణం అని అనేవారు.
శ్రీవానమామలై వరదాచార్యులు గారి కావ్యంలోని అందాలను సులభశైలిలో తేట తెలుగులో రాసి భర్త ప్రోత్సాహంతో వచనంగా ” పోతన చరిత్ర” తో రాసారు. కవయిత్రి గా రచయిత్రి గా ప్రసిద్ధి కెక్కిన సంధ్యగారు ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరి కవితలను ఒక కవితా సంపుటి గా ప్రచురించారు కూడా. గొడవర్తి సంధ్య గారు గా సాహితీ లోకంలో పేరు పొందినా, మాకు నర్సమాంబ గారు గానే చాలా దగ్గర. నర్సమాంబగారు మంచి స్నేహశీలి.
ఈ మధ్య కాలంలో నేను నడుపుతున్న అంతర్జాల పత్రిక” మయూఖ” లోనూ సంధ్య గారి వ్యాసం ప్రచురించాను.

దాదాపు 25 ఏళ్ల క్రితం సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో సంధ్య గారి తో పరిచయం. అప్పటి నుండి ఆ సాధన నర్సింహా చార్యులు గారి తో మాకు అంటే నా భర్త కొండపల్లి వేణుగోపాల్ రావు గారి కీ నాకూ పరిచయం. ఒక కవయిత్రి గా, ఒక కవిగా ఈ దంపతులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే ఉండేవాళ్ళు. కూకట్ పల్లిలో లో వారి ఇల్లు సాహితీ వేత్తలనిలయం.వీళ్ళ ఏకైక కుమారుడు చిరంజీవి సాయిమానస్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు.
గొడవర్తి సంధ్య గారు నువ్వు ముఖం తో , మంచి మాట లతో స్నేహశీలి గా మా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
వారి కిదే తరుణి పత్రిక సంపాదకురాలిగా, స్నేహితురాలిగా నా శ్రద్ధాంజలి.*

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వలసకూలి (కధాకవిత)

by Devulapalli Vijayalaxmi September 28, 2024
written by Devulapalli Vijayalaxmi

కడుపు సేతెట్టుకుని,కూలి సేసుకుని
కుసింతగ గెంజి నీళ్ళు తాయి,
పది పరక మిగిల్సి
అమ్మ అయ్య బువ్వకి పంపిస్తూ
సల్లంగ ఉందేమని
పొరుగు రాష్టానికి బోయిన మమ్మలీని
మాయదారి రోగాలొచ్చి ముంచినాది
దేవుడో ! దేవుడా!

కూలి బందాయెనని ఓళ్ళూ.. చెరువు పూడ్చినామని ఓళ్ళూ… గుడిసెలెక్కబీకినారు,
కూలి లేక,గుడిసే లేక తిన మెదుకు లేదాయె పో!
తాగ బుక్కెడు గెంజి లేగపాయె!
సొంతూరు బోవ సేతీలో పైసాలు లేక
రైలుకు పైసలు లేక,బొస్సు కూ లేక,బండీ లేక
మా బతుగులు బండలాయె గదరా
దేవుడో ! దేవుడా!

సావో బదుగో ఉన్నూరు బోవాల
అమ్మని నాయన్ని సూడాలని
మూట ముల్లె సరదుకొని నెత్తినెట్టుకొని
కడుపున్న ఆలిని,ఒక సేతట్టుకొని,
సంటిదాన్ని సంకనెట్టుకొని,
సెప్పుల్లేని కాళ్ళతో ఎండలో,ఆనలో
జఱ్ఱి గొడ్డులాటి తారు రోడ్డు మీద
నడుత్తుంటే ఎంతకీ దూరం తరగకబాయె,
రోజులు వారాలాయె వా‌రాలు నెలలాయె,
కాళ్ళు బండలాయె
సంటిది శోసొచ్చి
ఎండకొట్టి,ఆనకి తడిసి సచ్చిపోనాది
ఏడుద్దామంటే గొంతు బెగలక బాయె
ఆనాటి రోజులే కన్నులకు కట్టె…
కల్ల నీల్లు రావాయె
దేవుడో! దేవుడా!

ఒక బరువు తగ్గినాదని సంతోషమాయె
గందా మరి మోయతాలికి నాకేడకట్టం?
బండలు పిండి సేసిన కండలాయె నాయి,
గాని బిడ్డ ఆకలంటే. నాతావేంటుంది?
మట్టి బీడులో కట్టెతో గుంత తవ్వి
గుండె రాయి సేసుకొని బిడ్డను పూడ్సా!!!
ఆనాటి రోజులే మళ్ళీ మళ్ళీ వత్తాండె ..
దేవుడో!ఓ‌రి దేవుడో!
మా బదుకులిట్టా బుగ్గి సేయబోకు
దేవుడో!ఓ‌రి దేవుడో!

పోయిన బిడ్డను సూసి మాట మరిసి
కడుపులో బిడ్డతో నా యాడది
కష్టపడతాంటె ఆదుకోడానికి
సేతకాని మొగోన్ని నేను.
” ఏమయ్యా! కడుపునొస్తోంది ఇంకెట్లనయ్యా అన్న దాని మాటకి తలెత్తిసూసినా!
నా వల్ల కాదని ఆడనే సతికీలా బడినాది నా యాడది.నేనేటి సేతునో
దేవుడో ! ఓ‌రి దేవుడో!

మూటలోని పాతసీర తీస్తి,
బుజాలంట జోలె కట్తి,
నాయాలిని కూకుండెట్టి
నా పయానం సాగించా!
పగోనికీ ఆ కష్టాలు రావద్దు
నా పేరు శి య్య,
ఆ శివయ్య గంగనెత్తి నెత్తుకున్నాడంట
సగం పార్వతిఅయ్యాడంట.
మా ఊరి పంతులు సెప్పిండు.
నాకు సానా సానా. తుప్తిగాఉంది
నేను ఆ శివయ్యకి తీసిపోనని.
నా ఆలిని నా జోలె లో కూకుండెట్టి మోస్తున్నా!
కట్టాలు నీవే ఇత్తావు ఉపాయమూ నీవే సెప్తావు
దేవుడో ! ఓరి దేవుడో!
సితరాల దేవుడో!
.* * *

అడుగులు పరుగులాయె
అల్లంత దూరానఊరాయె!
ఆనాటి కథలన్నీ ఏకరువులేనాయె…
* * *

అదిగయే బవానీ ఊరొచ్చేసినాది
అమ్మతావుకి బోయ
ఏడి ఏడి నీళ్ళోసుకొని
ఉడుకుడుకు బువ్వతిందామె! నులకమంచంలో పెసాంతంగా తొంగుందాం!
దిగయే! పల్లకీలా అమ్మోరు లెక్క కూసున్నావు.
* * *
అంటూ జోలేదింపిన శీవయ్య కి ఉలుకు పలుకు
లేని కట్టె జారిపడింది
నాలుగు నెలల కడుపుతో మొదలు పెట్టిన ప్రయాణం ముగిసింది.
ఎడపిల్ల చావు,సరి అయిన ఆహారమే లేక బిడ్డ కడుపు లో
అడ్డం తిరిగింది కూడా తెలియని స్థితిలో భవాని శివయ్యను వదిలి శివ సాన్నిహిత్యం
చేరింది.
* * *
భోరు భోరుమంటూ గుడిసె దగ్గిరకెళ్ళి తల్లిని
పిలువబోవ పందుల గుంపు గుర్రు గుర్రు మంటూ
మీద పడ్డాయి.
దూరాన గుడిసె లోంచి గవరయ్య,
“శివయ్యా! వచ్చినా వా! శివయ్యా!
ఊ‌రు శశానం అయి పోయినాదిరా!
ఊరిలో సగానికి సగంమందిని ఆనాడు కరోనామహమ్మారి పొట్టనెట్టుకున్నాది ఎవ్వురీకీ ఒక్క అగ్గిపుల్ల ఖర్చెట్టలేదురా శివయ్యా!
ఊరి శివార్లలో ని శివయ్య ఊరుని మరిసాడు
ఆనాటి ఏడుపు మళ్ళ మళ్ళ వచ్చేత్తాంది
* * *

దేవుడో !ఓరి దేవుడో! ఏమి మాయ సేసావురా?
బంగారు తల్లి ని బిడ్డని పోగొట్టుకొని,నా ప్రాణమైన నా బవాని ని పోగొట్టు కొని అమ్మ వడి కని వడి వడిగా వచ్చిన నాకు అమ్మ అయ్య ని అట్టుకెళ్ళినావే
దేవుడో! ఓ‌రి దేవుడో ! నువ్వుండావా? అసలుండావా?

పొట్టకూటికోసం సొంత ఊళ్లకు దూరం అవుతున్న ఎందరో … ఎన్నెన్నో …లెక్కలేనంతమందికి అంకితం.

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వేగుచుక్క లకే వేగుచుక్క-ఒద్ది రాజు రంగనాయకమ్మ

by రంగరాజు పద్మజ September 28, 2024
written by రంగరాజు పద్మజ

మేఖల:–నానమ్మా! ఇనుగుర్తి లో ఒద్దిరాజు సోదరులు గా ప్రఖ్యాతి చెందిన ఒద్దిరాజు సీతారామచందర్ రావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్లైన మా తాతయ్య లే కాకుండా కవి పండితులు ఎవరైనా ఆడవాళ్ళ లో ఉన్నారా?

మణి:– మంచి ప్రశ్న వేశావు మేఖలా!!
చెప్తాను చెప్తాను! మా ఊరిలో మహిళా మణుల నైపుణ్యాలకు కొదవేలేదు .
వంద సంవత్సరాల క్రితమే తెనుగు పత్రిక ఇనుగుర్తి లో స్థాపించి, స్వాతంత్ర ఉద్యమం తమపత్రిక ద్వారా, నడిపి ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ఊపిరిలూదిన సోదరులిద్దరికీ వేగుచుక్క సోదరుల మాతృమూర్తి రంగనాయకమ్మ గారు. స్వయంగా స్వాతంత్రం గురించి బోధలు చేసిన మహనీయురాలు రంగనాయకమ్మ గారు.
గ్రంథాలయ ఉద్యమం “తెనుగు” పత్రిక ద్వారా పాఠకులకు -పాలకులకు ఎన్నో విషయాలు తెలియజేసిన పత్రికాధిపతులకు ప్రేరణ వారి తల్లి గారే! అందుకే మొట్టమొదటి తెలంగాణ నవల” అనురాగవిపాకం” రచయిత్రి చాట్రాతి లక్ష్మీ నరసమ్మగారిని రచయిత్రిగా ప్రోత్సహిస్తూ ఆమె రచనలను తమ పత్రిక ద్వారా ధారవాహికగా ప్రచురించి మహిళలకు ఉత్తేజం కలిగించడానికి సోదరుల తల్లి రంగనాయకమ్మ గారు స్వయంగా రచయిత్రి కావడం బహుశా కారణం కావచ్చు.
చేయొత్తు మనిషి, దబ్బపండు రంగు మేనిఛాయ. మెడలో తులసి మాల, తొమ్మిది గజాల తెల్లని చీర ను గోచీ పోసి కట్టుకొని, తెల్లగా నెరిసిన జుట్టు తో ఒక వర్చస్సుతో వెలిగిపోతూ కనపడే రంగనాయకమ్మగారు కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామ వాసి. ఆ కారణానికి తగ్గట్టు మంచి విద్య ఆమె సొంతం. నలుగురికి దానం చేసేదేగాని ఎవరినీ ఆశించని తత్వం ఆమెది.

అందరినీ ఆకట్టుకునే మాటతీరు, మంచితనం ఆమెకు పెట్టని ఆభరణాలు. అన్నిటికన్నా మించి దైవభక్తి కలవారు ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం అంటే తెల్లవారు ఝామునే లేచి శ్రీరంగాపూర్ భగవానుల కు మేలుకొలుపులు ఎంతో శ్రావ్యంగా గానం చేసేవారట.
రంగనాయకమ్మగారు దేవులపల్లి వారి ఇంటి ఆడబిడ్డ. వీరి తండ్రి కృష్ణారావు గారు. తాతగారు రాఘవయ్య గారు. పండిత కవులు గా ప్రసిద్ధి చెందిన వారు “యతిరాజ వింశతి”,”ముకుందమాల” వంటి సంస్కృత కావ్యాలను తెలుగులో అనువదించారు . ఎన్నో రచనలు చేశారు. వారి ఇంట పుట్టిన
రంగనాయకమ్మ గారికి సంస్కృతం లోనూ, తెలుగులోనూ చక్కని పాండిత్యం ఉండేది. ఆమెకు ద్రావిడ సంప్రదాయ ప్రబంధాలు , సంస్కృత స్తోత్రాలు కంఠోపాఠం గా వచ్చేవి. వేదాల్లోని కొన్ని భాగాలు నేర్చుకున్నారు. ద్రావిడ ప్రబంధాలను చక్కగా విశ్లేషించే వారు.
అంతేకాదు 12 గ్రామాల కరణీకం ఆమె ఆధ్వర్యంలో జరిగేది. అందుకే తమ పుత్రరత్నాలు, తెలంగాణ వైతాళికులు గా పేరు తెచ్చుకున్న జంటకవులు వద్దిరాజు సీతా రామచంద్ర రావు వద్దిరాజు రాఘవ రంగారావు గార్లకు 5 సంవత్సరాలు వచ్చే సరికి ఐదు వందల పద్యాలు నేర్పించింది .
సోదరులకుగురువైన గోపాల కృష్ణ శాస్త్రి గారు జటాంతము , వేదం లోని కొన్ని భాగాలు పాఠాలు నేర్పించి వెడితే… అవి చక్కగా కుమారుల చేత వల్లె వేయించేదిట!
రంగనాయకమ్మ గారు భగవద్ విషయమూ, నాలాయిర ప్రబంధం కుమారులకు నేర్పించారు అట. ఆమె తీరిక సమయాలలోనే కాదు… మడి కట్టుకునివంట చేస్తూనే ఎన్నో విషయాలు సోదరులలో శిక్షణ ఇచ్చేవారట. పట్టు బట్టలు కట్టి, పీటలు వేసి కూర్చోబెట్టి తాను పనిచేస్తూ నేర్పించే వారట.
కుమారులకు ఏది నేర్చుకోవడానికిఇష్టమో? దానిని ప్రోత్సహిస్తూ కావలసిన గురువులను ఏర్పాటు చేసేవారట. గురువులు లేని సమయంలో సోదరులకు ఏవైనా అర్ధాలు తెలియకపోతే నిఘంటువును చూసి తెలుసుకోవడం ఎలానో నేర్పించారు అట.
తన కుమారులకు చిన్న వయస్సులోనే కరణీకం నేర్పించి ప్రభుత్వానికి పంపవలసిన జమాబంది లెక్కలు,పహాణీలు రాయడం నేర్పించారట. తమ ఖర్చులకు తామే సంపాదించుకునేలా ప్రోత్సహించే వారట.
ఆకాలంలో ఇనుగుర్తి చుట్టూ దట్టమైన అడవి ఉండేదట.ఆమె ఇంటి వెనుక రోట్లో పచ్చడి దంచుతుంటే చిరుత పులి వస్తే…భయపడకుండా ఆ రోకలి బండ మరోవైపు ఇనుప పొన్ను ఉంటే దాంతో ఒక్కటేసిందట…ఆ చిరుత మూర్ఛ పోయిందట.
మా పెద్ద నాయన అయ్యో! ఇలా అయిందేమిటని తాళ్ళతో కట్టించి, మొద్దుబండిలోకి ఎక్కించి అడవిలో వదిలి పెట్టించారట. ఆమె
అంత ధైర్యవంతురాలు.
అలాగే ఆమె కమ్యూనిష్టులకు కూడా తన కుటుంబ సభ్యులెవరూ ఎవరినీ బాధించలేదనీ, వంచించలేదనీ, ఎవరినీ వధించ లేదనీ కావాలంటే ఊరిలో ఎవరినైనా అడిగి, మీరు చేయదలుచుకున్నది చేయమని చెప్పిందట.
వాళ్ళకు ఈ విషయం తెలిసినా భూస్వాములని … హాని తలపెట్టాలనుకుని వచ్చారట కానీ నాయనమ్మ మాటలతో ఎవరినీ ఏమీచేయకుండా , సోదరుల ఇంట్లోని గ్రంథాలయాన్ని తగలబెట్టారట. అది మూడు రోజులు మండిందట బీరువాలతో సహా…! కమ్యూనిస్టు లని భయపడకుండా ఎదురు నిలిచి వాదించిందట! అలా ధైర్యంగా ప్రతీ సమస్యనూ ఎదుర్కొని, భర్త లేని లోటు కనపడనిచ్చేది కాదట!
రంగనాయకమ్మ గారు వైష్ణవ స్వాములతో సమానంగా ప్రబంధ పారాయణం, సేవాకాలం చేసేవారట. శ్లోకాల అర్థాలు వివరించే వారట.
రంగనాయకమ్మ గారు ఆదర్శ మహిళ ఆమె తన చుట్టూ ఉన్న వారిని విద్యావంతులుగా చేయాలన్నదే ఆమె తహతహ. తన ఇంటిని తీర్చిదిద్దుకోవడం అందరూ చేసే పనే కానీ తన చుట్టూ ఉన్న సమాజాన్ని జాగృత పరచడం , ఆరోగ్య సలహాలు ఇవ్వడం దానం చేయడం సంస్కృతిని తూచా తప్పకుండా పాటించాలి సంప్రదాయాన్ని తరువాతి తరాలకు అందించడం రంగ నాయకమ్మగారికే సాధ్యం.
మేఖల:- చాలా గొప్ప విషయం నాయనమ్మా ! వేగుచుక్కల వంటి వాళ్లకే వేగుచుక్క అని మీరు చెప్పడం చాలా బాగుంది నాయనమ్మా. మరి రంగనాయకమ్మ గారు వ్రాసిన పుస్తకాలు ఏవైనా ఉన్నాయా?
మణి:- ఆమె రచనలు అలభ్యం.

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఇప్పటికీ అర్థం కాలేదు…….

by dr. Lakkraju Nirmala September 28, 2024
written by dr. Lakkraju Nirmala

పోల్చడం ఎందుకు?
చిన్నప్పటి నుంచి చూస్తున్న
వాళ్లను చూసి నేర్చుకో
వీళ్లను చూసి నేర్చుకో
వీళ్ళలా ఉండు
వాళ్ళలా చదువు
వాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగారు
మనం ఎక్కడ ఉన్నాము
వాళ్ల పిల్లల పెళ్లి అయ్యాయి
మన పిల్లల పెళ్లి ఎప్పుడు
వాళ్ల పిల్లలకు పిల్లలు పుట్టారు
మన పిల్లలకు పురుళ్ళు ఎప్పుడు

వాళ్ల పిల్లలు యూఎస్ వెళ్లారు
మన పిల్లలు ఎప్పుడు వెళ్తారు
వాళ్ళ అమ్మానాన్నను చూడు
వీళ్ళ నానమ్మలను చూడు
వాళ్లు ఎంత సంపాదించారో చూడు
వీళ్ళు ఇల్లు కట్టుకున్నారో చూడు

జీవితమంతా ఒకళ్ళతో పోల్చుకోవడమేనా
మనం మనలా పుట్టాము
మనం మనలా పెరుగుతాము
మనలో ఉండే తెలివితేటలు మనకు ఉంటాయి
మనకుండే ప్రజ్ఞ మనలో ఉంటుంది
కానీ ….
పోల్చడం ఎందుకు
ఇప్పటికీ అర్థం కాలేదు నాకు
చేతి ఐదు వేళ్ళే సరిగ్గా లేవు
ఒకదానికొకటి పొంతన లేదు
ఒక తల్లి పిల్లలము
ఎవరమూ ఒకలా లేము
మరి ఎందుకు పోల్చడము
వారిలానే నీవు ఉండు
వారిని చూసి నేర్చుకో
మన బుద్ధులు ఒకరిని చూసి నేర్చుకుంటే వచ్చేవా
పుట్టుకతో వచ్చిన బుద్ధులు
పుడకలతోటే పోతాయి అంటారు అయినా…
పోలుస్తూనే ఉంటారు
వాళ్ళు తొంభై ఏళ్ళు బ్రతికారు
వీళ్ళు వంద ఏళ్ళు బ్రతికారు
పోల్చడం ఎందుకు?
మనం మనది రాసుకొని పుట్టాం
మనం ఎన్నాళ్ళు ఉండాలో
అంతవరకు మనం ఉంటాము
కొన్ని తెలివితేటలు మనకు ప్రత్యేకంగా వచ్చాయి
అయినా ప్రతిసారి పోలుస్తుంటారు ఎందుకు

నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ….
పోల్చడం ఎందుకో మనిషికి ?
ఎప్పటికీ నీవు నీవే
నీ ప్రజ్ఞ నీదే
ఎప్పుడూ నీకు నీవు
రాజు తోనో రాణి తోనో పోల్చుకోకు
నీ ప్రజ్ఞను నీవు కోల్పోకు
నీకు నీవే అధికారివి
నీకు నీవే ప్రజ్ఞా కారివి.

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఆర్మీ- వీరుడు

by Dara Preethika September 28, 2024
written by Dara Preethika

(ఆర్మీ లో సైనికుడిగా పని చేస్తూ దేశానికి సేవ చేస్తున్న ఒక తండ్రి కూతురు కథ ఇది.సైనికుడికి ప్రియా అనే ముద్దుల కూతురు ఉంది.దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు తల్లి కూతుర్లు. స్కూల్ కి వెళ్ళినపుడు తనకి కూడా మిగతా పిల్లల లాగా వాళ్ళ నాన్న స్కూల్ లో దింపాలని , అందరిలా వాళ్ళ నాన్న భుజం పైన ఎక్కి ఈ ప్రపంచాన్ని చుట్టేయాలని ఉండేది.కానీ నాకు ఆ అదృష్టం లేదు అని ప్రియా బాధపడుతూ వాళ్ళ నాన్న ప్రేమ గురించి ఇలా వర్ణించింది.)
తండ్రి అంటే కూతురిని కంటికి రెప్పలా కాపాడే వాడు,ఎల్లపుడు తనకి ప్రేమని పంచివాడు,కష్టం వచ్చినపుడు నేనున్నా అంటూ దైర్యం ఇచ్చేవాడు,నేను ఏడ్చినప్పుడు నన్ను నవ్వించడానికి జోక్స్ చేసేవాడు.మా నాన్న నాకు దూరంగా ఉన్న ఎపుడూ నా చుట్టే నీడలా ఉన్నట్టు ఉంటుంది.మా నాన్న ఆర్మీ లో ఉండడం నా జీవితం లో చాల గర్వాంగా అనిపిస్తుంది.నేను మా అమ్మ ఇద్దరం కలిసి నాన్న ఎప్పుడు మాతో కలిసి ఉండే రోజులు రావాలని కోరుకుంటాము.మా నాన్న పుట్టిన రోజు అంటే నాకు చాల ఇష్టం.
చూస్తుండగానే మా నాన్న పుట్టిన రోజు రానే వచ్చింది. ఎవరో తలుపు కొడుతున్నారని వెళ్లి చుస్తే ఒక్కసారిగా నేను నివ్వెరపోయాను, వచ్చింది ఎవరో కాదు మా నాన్న.నేను పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నని బిగ్గరగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తాను. “ఎన్ని రోజులైంది నాన్న నిన్ను చూసి నాకు చాల సంతోషంగా ఉంది ఐ లవ్ యు నాన్న ” అని చెప్పి , “అమ్మ నాన్న వచ్చాడు ” అని గట్టిగ అరిచి పుట్టిన రోజు కోసం నేను తయారు చేసిన గ్రీటింగ్ కార్డు ఇస్తుండగా ఎదో శబ్దం విన్పించింది.కళ్ళు తెరిచి చుస్తే నేను ఎంతో ఇష్టంగా మా నాన్న కోసం కొన్న బొమ్మ , గ్రీటింగ్ కార్డు కింద పడి ఉన్నాయి.ఇదేంటి అని చూసేసరికి నాన్న రాలేదు . ఇదంతా నేను కన్న కలలో జరిగింది అని అర్ధం అయింది. నాన్న వచ్చారని సంతోష పడిన నా మనసు ఒక్కసారిగా ముక్కలైంది,ఏడ్చాను,చాల బాధపడ్డాను.అందరి పిల్లల లాగ నాకు మా నాన్న పుట్టిన రోజు చేయాలనీ ఉంది కానీ నాకు అదృష్టం లేదు అనుకున్నాను.
మా నాన్న గుర్తుకు వచ్చినపుడల్లా రాలేదు కాబట్టి నేను మా నాన్న గుర్తొచ్చినపుడు అయన ఫోటో తీసుకోని చూసుకుంటూ సంతోషపడతాను.నాకు బాధనిపించింది కానీ, మా నాన్న దేశానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఒకవైపు గర్వాంగానే ఉంది.ఐ లవ్ యు నాన్న.
(తండ్రి తో కలిసి తండ్రి ప్రేమను ప్రతి రోజు పొందాలని ఆరాటపడ్తున్న ఈ చిన్నారి కోరిక తీరుతుందా అందరి లాగా ప్రియా కూడా వాళ్ళ నాన్న బుజం పైన ఎక్కి పరపంచాన్ని చుట్టేస్తుందా చూడాలి..)
**_

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వృక్షమాత

by Padmasri Chennojwala September 28, 2024
written by Padmasri Chennojwala

మట్టిలోని సారమో సాగునీటి సదుపాయమో
పెరటి మొక్క లిప్తపాటులో కొమ్మలు రెమ్మలతో పచ్చని పందిరై కనువిందు చేసింది
రెప్పపాటులోనే రెమ్మరెమ్మకో పంచవన్నెల రామచిలుక పువ్వై విరిసింది
ఆకు – పసరై బెరడు – కషాయమై వేరు – చూర్ణమైన ఆమూలాగ్ర ఆరోగ్యప్రదాయిని
మానవాళికి ప్రాణవాయువు నందించే ఊపిరియంత్రం
సాధుజంతుల పాలిటి కల్పవల్లి
నీకు నీడనిచ్చి నిన్ను సేదతీర్చే అమ్మ ఒడి
నీ గుండెకు బలమై నీ శ్వాసకు ఆయువుపట్టైన అపర ధన్వంతరి
ఏ పాడు గాలి సోకిందో
ఏ చీడపీడ తగిలిందో
అడవికి పచ్చని పరదాలు వేసి
నేలకు తివాచీలు పరిచి ఆహ్లాద పరిచిన పత్రహరితం
ఎందుకో వడలిపోతోంది
నేల కొరిగిన వృక్షమాత
అనావృష్టికి సూచిక
రేపటి క్షామానికి హెచ్చరిక
వృక్షో రక్షతి రక్షితః

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us