మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కొండకి కొండ నమస్కరించింది

by mayuukha January 31, 2024
written by mayuukha

తెలుగుజాతి గర్వించదగ్గ మహా కళాకారుడు
కొండపల్లి శేషగిరి రావు శత జయంతి
జనవరి 27 ఆయన్ని మరోసారి తలుచుకుంటూ
……………………………………………..

ఊళ్ళో పెళ్ళికి మా వాళ్ల హడావిడి. ఫోన్లు, సూడియోకి బండేసుకొస్తే కలిసిపోదామా? మీరు ఫలానా ఆర్టిస్టులతో కలిసి వస్తారా అని ఎంక్వయిరీలు. సర్లెండి డైరెక్టుగా సభ దగ్గరే కలిసి రాత్రికి అందరం కూచుందాం అంటూ ఎలాబరేట్ ఎరేంజ్మెంట్లు. ఎన్నడూ ఏ సన్మాన సభకూ చచ్చినా పోని మహానుభావులైన వీరంతా కాళ్లు తొక్కుకొనుట ఎలా? బాపూగారికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఎవార్డిచ్చుకుంటే వీళ్లు మధ్యాహ్నం నుంచే చంకలెగరైడమేల?
వీళ్లు సరే, ఎక్కడో కొత్తగూడెం నుంచి అజ్ఞాత కార్టూనిస్టు చిరుద్యోగానికి లాస్ ఆఫ్ పే పెట్టుకుని, బండికట్టుకొని వచ్చి స్వహస్త చమురొదిలించుకుని, అనేక వందల గజాల దూరం నుంచి మరనేక వందల మంది గుంపుల మధ్య నుంచి బాపూగార్ని చూసి కళ్లు చెమర్చి మళ్లీ మౌనంగా
కొత్తగూడెంకేసి మరలిపోవడమేంటి?
వెర్రా? సర్రియలిజమా? ఏమో.
యూనివర్సిటీ కాంపౌండ్ అంతా సాహిత్య ప్రముఖులూ, కవులూ, ఆర్టిస్టులతో సందడిగా ఉంది. ఎంట్రెన్స్లో మాత్రం పోలీస్ బందోబస్త్ జబర్దస్తీగా ఉంది. ఆడ నక్సలైట్లను కనిపెట్టడానికి రహస్య మెటల్ డిటెక్టర్. మగ నక్సలైట్ల కోసం ఓపెన్ డిటెక్టర్, అందర్నీ తడుముతున్నారు. గుచ్చి గుచ్చి చెకింగ్. అలిపిరిలో చేయని పనులన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఇదంతా బాపూగారు పీపుల్స్ వార్ హిట్ లిస్టులో ఉన్నందువల్ల కాదు. ఆఫ్ట్రాల్ చిత్రకారుడి కోసం డైరెక్షనల్ మైన్లు వేస్టుచేసుకుంటారా నక్సలైట్లు?
దేవేంద్రగౌడ్ గారు చీఫ్ గెస్ట్ గనక ఈ తతంగం. ముందుస్తుగా తోసుకొచ్చిన అనేకానేక కారణాల వల్లా, కళకి బొత్తిగా టైమ్ లేనందువల్లా గౌడ్ గారు రాలేకపోయారు. బాపూగారి యందు, మా వంటి పేదల యందూ శ్రీ వేంకటేశ్వరస్వామి దయవల్లా, దీవెనెల వల్ల గూడా గౌడ్ గారు రాలేకపోయారని మా మూఢ విశ్వాసం. నిజంగా ఆయన వచ్చి “బాపూ చిత్రకళ, పత్రికల్లో కార్టూన్లు, గ్రేహౌండ్స్ తక్షణ కర్తవ్యం” అని లెక్చరిచ్చి ఉంటే మా గుంపు కకావికలై ఉండేది.సభ ప్రారంభం అనుకోని అద్భుతం, జి.వి. సుబ్రహ్మణ్యం గారు బాపూ గురించి సుతారంగా చెప్పారు. ఏకకాలంలో కవితలాగా, సంగీతంలాగా, శాస్త్రీయ విశ్లేషణలాగా, లోతైన అంచనాలా సాగిందాయన ప్రసంగం. సందర్భోచితంగా మినిమమ్ ఓవర్ యాక్షన్ కూడా లేకపోవడం సుబ్రహ్మణ్యం గారి సూపర్ స్పెషాలిటీ . తర్వాత పరుచూరి గోపాలకృష్ణ, నూతన్ ప్రసాద్ గార్ల ప్రసంగాలు పెద్ద దుర్భరంగా ఏమీ లేవు. రవీంద్రభారతి, త్యాగరాయగాన సన్మాన సభల బ్రాండ్ ఉపన్యాసాలెంత దుర్భరంగా ఉంటాయో ఖచ్చితంగా అంతే దుర్భరంగా ఉన్నాయి. అలవాటుపడ్డ ప్రాణాలంగనక పరమ వీజీగా తట్టుకున్నాము. తదనంతర అంత్యప్రాసల కామిక్ ఇంటర్లూడ్స్ మమ్మల్ని కదిలించాయి. ప్రాణవాయువు కోసమూ సిగిరెట్ల కోసమూ ఆనందంగా హాలు నుంచి బయటపడ్డాము.
అదిగో మా ఆర్టిస్టు హీరోలు చంద్ర, గోపీ కారిడార్లో ముందే ఉన్నారు. వి. రాజారామ్మోహనరావు లెక్చర్లు. అక్కడ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, జానకీబాల, ఇటు శ్రీరమణ, ఆర్టిస్టు చిత్ర, కార్టూనిస్టులు శంకర్, అన్వర్లు, బాలి రాలేదేమో అని తలుచుకుంటున్నారు. ఇంకా బోల్డన్ని పెద్ద పేర్లు పుంజీళ్లు పుంజీళ్లుగా కబుర్లు కొడుతున్నారు. అంతలో కొండపల్లి శేషగిరిరావు గారొక్కరే శాలువా సర్దుకుంటూ గుంపుల్లోంచి దారిచేసుకుంటూ వెళ్తున్నారు. వెంట ఎవరూ లేరు. ఆయన్నీ చూసి చాలా రోజులయింది. ఆనందంగా నమస్కారం పెట్టా. పక్కనే ఉన్న కొత్తగూడెం కార్టూనిస్టుని పిలిచి ఇతను వెంకటి అని పరిచయం చేశా. మా వాళ్లంతా ఆరాధనా భావంతో చుట్టూచేరారు. లోపల సభ ఇంకా నడుస్తూనే ఉంది. ఈతి బాధల వల్ల ఈ మధ్య మీ ఇంటికి రాలేదని సంజాయిషీ చెప్పి, కొత్తగా పెయింటింగ్ లు ఏం వేస్తున్నారని అడిగితే కొద్ది రోజులుగా చూపుసరిగా లేదనీ ‘బొమ్మలకు తాత్కాలికంగా సెలవిచ్చానని చెప్పినపుడు ప్రాణం కొట్టుకుంది. అయినా తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర మీద సుదీర్ఘమయిన పానెల్స్ తయారు చేశానన్నారు. (వాటిలో కొన్ని స్కెచ్లు ముందే మేమందరం చూశాం) త్వరలో తప్పక వాటిని పూర్తి చేస్తానన్నారు. “ఈనాటి చిత్రకారులకు ఆనాటి చరిత్ర గురించి తెలీదు గనక ఆ పని ముగిస్తా”నన్నారు. ఈ పని ఆయన ఒక్కరే చేయగలరని అక్కడున్న మా అందరికీ తెలుసు. శేషగిరిరావుగారి గ్రాంధిక భాష, ఇంగ్లీషు విన ముచ్చటగా ఉంటాయి. అంతకు మించిన అమాయకత్వం ముడతలు పడ్డ తెల్లటి పొడుగాటి వేళ్లు తిప్పుతూ మాట్లాడుతుంటే ఆయన చైనా చెట్లు, కోడిపుంజుల రంగులూ కదలాడుతాయి. తటాకము వద్ద కణ్వమహర్షి వెంట ఉన్న శకుంతల పక్కన లేడి, ఒంపులు తిరిగిన స్టైలైజ్డ్ చెట్లూ కొండలూ కదిలొస్తాయి. భక్తిపరుడైన కొండపల్లిగారి దేవతామూర్తుల భంగిమలూ ఆ రంగులూ చూస్తే మొండి నాస్తికులు కూడా మోకాళ్లపై వంగి నమస్కారాలు చేయాల్సిందే.
తెలంగాణ కొండలు ఆయన దోసిట నీలపురాళ్ళై మెరుస్తాయి. వాటి మధ్య రావి నారాయణరెడ్డి గర్జించే ఆయిల్ పెయింటింగ్ కెంపుల పోవు. రామప్ప దేవాలయం నంది మెడ గంటల తాళ్ల ముడుల గ్రామర్నీ, నాగరిక సమస్యల నడుముల పట్టీల మడతల శాస్త్రాన్ని రచించి విశ్లేషించిన చేతులవి. తెలుగునాట ప్రాచ్య కళా సంప్రదాయ జ్యోతి ఆరిపోకుండా అడ్డంపెట్టే ఆఖరి చేతులివే.
హాల్లో సభ అయిపోయింది. మేడ మీద ఆర్ట్ ఎగ్జిబిషన్ను బాపూ ప్రారంభించాలి
(ఏంటో! అష్టకష్టాలూ పడి పగలూ రాత్రి బొమ్మలేయాలి. మళ్లీ వాటిని తానే ఇనాగురేట్ చేసుకోవాలి. పాపం ఎంత కష్టం) బాపూ చుట్టూ పాతికమంది నిర్వాహకులు రక్షణ వలయంలా కమ్ముకున్నారు. హాల్లోంచి కారిడార్ గుండా ఆయన్ని తీసుకెళ్తున్నారు. అడ్డంగా ఉన్న మా గుంపుల్ని చెదరగొడుతున్నారు. తప్పుకోండని అరిచి ఏ మాత్రం అక్కర్లేని హడావుడంతా చేస్తున్నారు. బాపూ గుంపు మమ్మల్ని తాకి ముందుకెళ్తుంది. తప్పుకున్నాం. ఎందుకో ఆయత్నకృతంగా (స్పాంటేనియస్ గా అన్నమాట) “బాపూ గారూ” అని అరిచాను.
ఆయన ఆగారు. ఆ గుంపూ ఆగింది.

‘కొండపల్లి శేషగిరిరావు గారు
బాపూ













ఆయన ముందుకొచ్చారు. ‘కొండపల్లి శేషగిరిరావు గారు” అని పరిచయం చేశాను. వాళ్ల చేతులు కలిశాయి. శేషగిరిరావు మరింత ముందుకెళ్లారు.
ఆ పొడుగాటి చేతులు రెండూ బాపూ భుజాలపై పడ్డాయి. “నాయనా బాపూ నీ రేఖ నిజంగా ఒక విలక్షణమైన… (ఆయన గ్రాంధికం తడబడుతోంది)మనిషి ఎక్సైట్ అయిపోతున్నాడు. అది నీవే గీసేగీత. యువార్ గ్రేట్. రియల్లీ గ్రేట్. నాట్ ఓన్లీ ఫర్ ఆవర్ స్టేట్. బట్ టు అవర్ నేషన్…చెప్తూనే ఉన్నాడాయన. ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది.
మాటలు మరీ ఇన్ కొహెరెంట్ గా వస్తున్నాయి. సన్నగా వణికి అరిచేతులు బాపూ భుజాల మీంచి దిగి మోచేతుల దగ్గరకొచ్చాయి. ఇంకా ఏదో చెప్తున్నాడు. చెప్పలేకనూ పోతున్నాడు.
హఠాత్తుగా ఆ చేతులు నేలకి వంగాయి. బాపూ పాదాలు రెండూ పట్టుకుని ఆయన నమస్కారం పెట్టాడు. చుట్టూ ఉన్న మేం ఈ షాక్ కి రెడీగా లేము. బాపూ గారి దుస్థితి వర్ణనాతీతం, బాగా ఎంబారాస్ అయిపోయి, సిగ్గుపడిపోయి, తల్లకిందులయ్యారు. శేషగిరిరావు గారిని రెండు చేతుల్తో లేవ దీశారు. ఈయన ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నాడు. “బాబూ, నేను శాంతి నికేతన్లో చదివినా, ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నా, ఎన్ని చేసినా నీ రేఖ మాత్రం“ అంటూనే ఉన్నాడు. పెద్దవారు మీరు మాకలా చెప్పాలా.. అయ్యో’ అంటూ బాపూగారు సిగ్గు భారంతో కొంచెం వంగి అంతలోనే ఆయన కాళ్ల మీద పడి పాదాలు పట్టుకుని నమస్కారం చేసేశారు. డబుల్ షాక్… అంతా సైలెన్స్.
ఈ షార్ట్ సర్క్యూట్ కి నివ్వెరపోయిన మాలో కొందరికి కన్నీళ్లే తక్కువ.ఇంతలో నిర్వాహకులు బాపూని పైకి తీసుకుపోయారు. అందరం శేషగిరిరావు గారి వెంట బయటికొచ్చాం. ఆయనింకా బాపూ హిప్నాటిక్ స్పెల్ నుంచి తేరుకోలేదు. “ఈతని వలే ఎవరూ గీయలేదు.
అదియాతని సొంతము. వాక్చమత్కృతి లేదు. సకల చమత్కృతినీ చిత్ర చమత్కృతిగా మార్చినాడు.” ఇంకా చాలా చెప్పాడాయన.
తెలుగు చిత్రకళ చరిత్రలో ఒకే ఒక భువనగిరి కోట, ఆదిలాబాద్ పచ్చల కొండ, కరీంనగర్ అడివితల్లి వంగి తెలుగు రేఖకీ రంగుకీ నమస్కారం చేసింది.
ఈ నర్సాపురం నది సిగ్గుతో మెలికలు తిరిగి
ఆ నూనె రంగుల బృహత్పాదాలను కడిగింది.
ఇలాటి దృశ్యం ఈ దెష్ఠ బతుకులో ఇంకెప్పుడేనా చూడగలమా, కెమెరాలేవి? లైట్లేవి? ఎవరక్కడ?
కాలచక్రం గిర్రున కాకుండా టిక్కు టిక్కుమంటూ రెండ్రోజులే తిరిగింది. శ్రీరమణగారి ఫోను. “బాపూగారు మీకొక్క జపనీస్ యానిమేషన్ కేసెట్, మరో లెటర్ ఇచ్చారు”.
అమాంతంగా అరడజను ఆఘమేఘాలనూ సింగిల్ ఆటోనూ బుక్చేసి ఆంధ్రజ్యోతిలో వాలాను.
స్టూడియోకి తిరిగి రాగానే కేసెట్ను మూడు సీడీలుగా మార్చి మా సిస్టమ్ లో అందరం చూశాం. మళ్ళీ చూశాం. రెండున్నర గంటల ఎండ్వెంచర్. అంతా జపాన్ భాష ఒక్క ముక్క అర్ధం కాలేదు. సినిమా మొత్తం ముక్కస్య ముక్కహా అర్ధమయింది. ఇలాంటి కేసెట్లు ఇంకా సంపాయించాలి ఎలా? సింపుల్! బాపూగారు మద్రాసు మనిషి గదా. హైదరాబాద్ లో కొండపల్లి శేషగిరిరావు గారి లాంటి వారిని పరిచయం చేస్తే కేసెట్ పంపిస్తారని అర్థమయింది గదా.
మరైతే ఇక్కడగానీ హోల్ ఇండియాలో గానీ
మరో కొండపల్లిని పట్టుకోడం ఈ జన్మకి గానీ
మరేడు జన్మలకిగాని జరిగే పనేనా?
నాకింకో కేసెట్ దొరకదా!

ఈ వ్యాసం 2002లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో అచ్చయింది.

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పోతన పద్యాలు – భావము

by Palakurti Rammurty January 31, 2024
written by Palakurti Rammurty

హరికిన్‌ పట్టపు దేవి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ దోనాడు పూబోడి తా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్! (భాగవత అవతారికలోని పద్యం)

                ఒక వ్యక్తి జీవితం సంపూర్ణం కావాలి అంటే… సంస్కారంతో కూడిన చదువు, వివేకంతో, విచక్షణతో కూడిన ఆచరణ కావాలి, మూలాలను అవగాహన చేసుకోగలిగిన బుద్ధి కుశలత కావాలి. దానినే విద్య అందాము. అలాగే సకల సౌకర్యాలతో కూడిన సమగ్రమైన సంపద కావాలి దానినే అభ్యుదయము అందాము. దానికి తోడుగా సౌభాగ్యం కావాలి.. అంటే ఉన్న దానిని సంతృప్తిగా తాను అనుభవించగలిగి, ఇతరులకు పెట్ట గలిగిన శారీరక మానసిక ఆరోగ్యంతో కూడిన త్యాగ నిరతి కావాలి. దానినే సుభగత్వం అందాము. వీటి నన్నింటినీ అనుగ్రహించేది ఏది? అంటే.. ఆ లలితా పరమేశ్వరియే. ఆమె అంశలే సరస్వతీ దేవి, లక్ష్మీదేవి పార్వతీదేవి. ఆ లక్ష్మీదేవిని స్తుతిస్తున్నాడు, పోతన గారీ పద్యంలో. విద్యలకు సరస్వతిగా, సంపదలకు లక్ష్మీదేవిగా, సౌభాగ్యానికి పార్వతిగా చెప్పారు.


                హరి అంటే విష్ణుమూర్తికి పట్టపురాణి, పున్నెములకు ప్రోవు అంటే రాశి, అర్థములకు పెన్నిక్క (పెన్– గొప్పనైన, ఇక్క స్థానము) సిరిసంపదల పెన్నిధి,  చందురునికి తోబుట్టువు, భారతీ మరియు గిరిసుతయైన పార్వతి.. వారితోన్, ఆడు, పూబోడి (పూవు వంటి శరీరం కలది), తామర పూలలో నివసించే  ముద్దరాలు, జగముల్.. ముజ్జగాలు మన్నించి పూజించే శ్రీ హరి ఇల్లాలు, భాసురతన్.. ప్రకాశవంతమైన చూపులతో తన నారాధించే వారికి లేములు (దరిద్రాలు) తొలగించే తల్లి, సిరి .. లక్ష్మీదేవి నిత్య కళ్యాణములను మాకు అనుగ్రహించుగాక, అంటున్నారు పోతన గారు.
                హరి అంటే విష్ణువు.. విష్ణువు అనగా వ్యాప్తిచెందినది.. ఏది వ్యాప్తి చెందుతుంది.. ప్రవహణశీలత ఉన్నదే వ్యాప్తి చెందుతుంది. ప్రవహణ శీలత కావాలి అంటే దానికి చంచలత్వం కావాలి. ఆ సంవ్యాప్త శక్తికి చైతన్యాన్ని ఇచ్చి, కర్తవ్యాన్ని పాలించేందుకు ప్రేరణ నిచ్చి నడిపించేది.. ఆ శక్తికి పట్టపు దేవి. కన్ను ఉన్నది అంటే ఆ ఉండడమే సరిపోదు.. దానికి చూచే శక్తి ఉండాలి. విష్ణువుకు వ్యాప్తమయ్యే శక్తి ఉన్నది కాకపోతే అది క్రియాశీలం కావాలి అంటే అవసరమైన క్రియాశీలక శక్తియే లక్ష్మీదేవి. ప్రకృతిలో రెండు విధాలైన శక్తులు ఉంటాయి.. పురుష శక్తి, స్త్రీ శక్తి. ఒకటి సృజనాత్మకమైనది.. దానినే పురుష శక్తి అంటాము.. రెండవది.. దానిని అనుమోదించేది, అంగీకరించేది. దానినే స్త్రీ శక్తి అంటాము. శ్రీహరి పురుష శక్తి కాగా లక్ష్మీదేవి స్త్రీ శక్తి. రెంటి కలయికతోనే కార్యావిష్కరణ జరుగుతుంది. ప్రతిభ ఎంత గొప్పదైనా దానికి పట్టం కడితేనే దాని ఉనికి సుస్థిరం అవుతుంది. అందుకే విష్ణువు ఎంత గొప్పవాడయినా ఆయన వెంట లక్ష్మీదేవి పట్టపు రాణిగా ఉన్నాప్పుడే ఆయన గొప్పదనం సాధికారికమౌతుంది…
                పున్నెములు… భిన్నత్వంలో సామరస్యాన్ని చూడగలగడమే పున్నెము. భిన్నత్వంలో ఏకత్వం అంటారు కాని… ఏకత్వం కాదు కావలసింది సామరస్యత కావాలి. నిజానికి ఏకత్వం అనేది రాచరికానికి, అధికారానికి ప్రతీక కాగా సామరస్యత అనేది ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకోవాలి. ఇలాంటి సమరస భావనలకు ప్రోవు.. అంటే సకల భావనల సమాఖ్యయే లేదా సమాహారమే అభ్యుదయము నిస్తుంది. ఆ అభ్యుదయానికి మరోపేరే.. లక్ష్మీదేవి. సమాజానికి ఉపకరించే కార్యాలను నిర్వహించడమే పున్నెము.

                అర్థంపు పెన్నిక్క…. మానవ జీవితంలో అర్థ కామాల ప్రాబల్యాన్ని తక్కువ చేయలేము. మానవ స్వభావంలోని గుణదోషాలకు ఈ అర్థకామాలే మూల కారణాలు. అయితే ఈ అర్థకామాలు ధర్మబద్ధాలయితేనే వ్యక్తికి శ్రేయస్సు. అర్థకామాలను ధర్మబద్ధం చేసి సరైన మార్గంలో నడిపించే మహోన్నత గుణమే సమత.. పెన్నిక్క అనడంలో అర్థాన్ని తద్వారా లభించే కామాన్ని, అధికారాన్నీ కూడా సమతా మార్గంలో నడిపించేది అని భావించాలి. దానితో సదాలోచనలు, మనోనిగ్రహం, స్థిత ప్రజ్ఞత్వం అందివస్తాయి. ఆ స్థితప్రజ్ఞతనే “దమము” అనవచ్చునేమో.. దానికి మరోపేరే లేదా దానికి ఆవాస స్థానమే లక్ష్మీదేవి.
                చందురు తోబుట్టువు.. చంద్రుడు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. “చంద్రమా మనసోజాతా” అంటుంది శ్రుతి. చంద్రునిలో ఉన్న మరియొక లక్షణం స్వయం ప్రకాశం లేకపోయినా పరోపకార పరాయణత ఆయన లక్షణం.. సూర్యుని నుండి వేడిని గ్రహించి.. అహ్లాదకరమైన వెన్నెలలను మానవులకు అందించడం చంద్ర లక్షణం… అలాగే లక్ష్మీదేవి కూడా జీవ కోటికి ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. తోబుట్టువు అనడం వల్ల చందునిలో ఉన్న అన్ని లక్షణాలూ ఆమెలో ఉన్నాయని భావించాలి.
                భారతీ గిరిసుతల్ దోనాడు… భారతి విద్యలకు అధిదేవత… గిరిసుత.. సౌభాగ్యానికి అధినాయకి. విద్య ఒక్కటే ఉంటే ఉపయోగం ఉండదు.. దానికి సౌభాగ్యం తోడుకావాలి. ఈ రెండు ఉన్నా ప్రయోజనం పరిమితమే దానికి సంపద తోడవ్వాలి. అందుకే వినయంతో కూడిన విద్యను, సౌభాగ్యాన్నీ తోడుగా ఉంచుకొని ప్రకాశించేది లక్ష్మీదేవి. అంటే ఎవరిలో నైతే సంస్కారవంతమైన విద్య, ప్రయోజనాత్మకమైన సౌభాగ్యం ఉంటుందో వారికి లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది.. లేదా అక్కడ సంపద నిలుస్తుంది. విద్య సౌభాగ్యం ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. ఎవరినీ యాచించే ఉద్దేశ్యం ఉండదు. ఆనందమే పరమావధిగా ఉంటారు. అదే విష్ణువుకు ఆవాస స్థానం. అందుకే లక్ష్మీదేవి సదా సార్వకాలాలలో వ్యగ్రత లేని విష్ణువు పాదాలను ఆశ్రయించి ఉంటుంది. అహంకారం ఉన్నచోట విద్య భాసించదు. అలాగే సౌభాగ్యమూ నిలవదు.
                అంతేకాదు… మనం ఎవరితోనైతే అనునిత్యం కలసి ఉంటామో అలాంటి వారి ఆలోచనా పరిమితులలో బంధితులమై ఉంటాము. విద్య సౌభాగ్యం ఎక్కడైతే ప్రభావవంతంగా ప్రకాశవంతంగా ఉన్నాయో.. అక్కడ లక్ష్మీదేవి ఉంటుందనేది నిరూపితమైంది.. భారతీ గిరిసుతల్ దోనాడు పూబోడి, అనడం వల్ల.
                తామరలందుండెడి ముద్దరాలు … తామరలు అందమైన పుష్పాలే కాక.. వాటిలో ప్రత్యేక లక్షణం ఉన్నది. ఇవి మట్టి నుండి పైకి లేచినా మట్టి మరకలు పడకుండా ఉంటాయి. కాబట్టి స్వఛ్చతకు చిహ్నాలుగా నిలుస్తాయి. అంతేకాదు అవి నీటిలోనే ఉన్నా తామర ఆకుల పై భాగం నీటితో తడకపోవడం విశేషం. మరొక విశేషం.. ఇవి “మంచి”నీటి చెరువులలోనే ఎక్కువగా దర్శనం ఇస్తాయి. కాడలు సున్నితంగా ఉంటాయి. అంటే వ్యక్తికి పరుల కష్టాలకు స్పందించగలిగిన సున్నితత్వం ఉండాలి. తామరలు మనిషిలోని ఒత్తిడిని తగ్గిస్తాయని చెపుతారు. తామర లందుండెడి … ఐహిక జీవితంలో మన చుట్టూ ఎన్ని మలినాలు చేరినా వాటి ప్రభావానికి లోనుకాకుండా.. ప్రలోభాలు ఎదురైనా వాటికి చిక్కకుండా వ్యక్తి జీవితాన్ని సాగించాలి అనేదే సందేశంగా.. తామరలందుండెడి ముద్దరాలు అనడం ద్వారా పోతనగారు అందిస్తున్నారు. హృదయాన్ని కూడా కమలంతోనే పోలుస్తారు. మూలాధారం నుండి ఆరంభమయిన ప్రస్థానం.. సహస్రారం చేరడంతో ముగుస్తుంది. ఆ సహస్రారమే సహస్ర దళములతో కూడిన పద్మముగా చెపుతారు, యోగులు.
                జగముల్ మన్నించు యిల్లాలు… జగము అంటే లోకము, ప్రపంచము. ప్రపంచమే పాంచభూతాత్మకము.. దీనిని చూపేది లోకము అంటే చూపు. అనగా ప్రపంచము శాశ్వతము కాదు.. అశాశ్వతమైన దానిని పట్టించుకోకుండా శాశ్వతమైన దానిని ఆరాధించండి, ఉపాసించండి.. అంటూ ప్రబోధించే దార్శనికులైన ఋషుల చేత మన్నింప బడినది… యిల్లు గలది యిల్లాలు.. ఇల్లు అంటే ప్రపంచమే ఆమె యొక్క ఇల్లుగా గలిగినది. అంటే సకల జగత్తులోనూ వ్యాప్తిచెందినది.
                భాసురతన్ లేములు వాపు తల్లి.. లేమి అనేది సంపద లేకపోవడం కాదు.. ఎదుగుదల నుండి సంతృప్తితో కూడిన బ్రహ్మానంద విభూతి వరకు జరిగే ప్రయాణంలో నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందలేకపోవడమే లేమి. ఎన్ని సంపదలు ఉన్నా ఒక్క క్షణాన్ని కూడా కొనలేము. లభించిన దానిని సమర్ధవంతంగా, ప్రకాశవంతంగా, ప్రభావవంతంగా ఉపయోగించుకోగలగడమే బ్రహ్మానంద స్థితి. దానికి వ్యతిరేకమైనది లేమి.. ఆ లేమిని దూరం చేసి జనన మరణ చక్ర బంధనాల నుండి తప్పించే తల్లి లక్ష్మీదేవి.
                సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్… కల్యాణము అంటే శుభము.. శోభనము.. కల్యాణము ఎప్పుడు కలుగుతుంది? పొందదగినది సంపూర్ణంగా పొందినప్పుడు కలిగేదే కల్యాణము. అది ఎప్పుడో ఒకసారి వచ్చేది కాకూడదు.. అనుక్షణం మనకు కావాలి. దానిని ఇవ్వగలిగిన లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు, పోతన గారు.
 *  * *           

పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయాన పాత్రంబునన్
నెట్టం గల్గను, గాళి గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ మానకు మమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ! (భాగవతము – పోతన)

                “మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో”.. నన్నయ తిక్కనాది కవులు ఈ భాగవతాన్ని ఇప్పటి వరకు తెలుగులో వ్రాయలేదు.. “దీనిం తెనింగించి నా జననంబున్ సఫలంబు సేనెద పునర్జన్మంబు లేకుండగన్” అనే విశ్వాసాన్ని ప్రకటించాడు, పోతన గారు. మరొక జన్మ లేకుండా ఉండేందుకు ఈ భాగవతాన్ని తెలుగులో వ్రాస్తాను.. అంటూ ఆరంభించారు పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం. ఆ ప్రక్రియలో భాగంగా సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ చెప్పిన పద్యమే పై “పుట్టం బుట్ట” అన్న పద్యం..
          నమ్రత, వినయ, విధేయతలను వ్యక్తీకరించే విధంగా చెప్పిన పద్యం ఇది. భాగవతాన్ని తెలిసి పలకడం తమ్మి చూలికి కాని శూలికి కాని సాధ్యం కాదని ఒకవైపు చెపుతూనే దానిని తెనిగించేందుకు సన్నద్ధమైన పోతన గారి ప్రజ్ఞాపాటవాలు ఆ సంకల్పంలోనే వ్యక్తమౌతున్నాయి.    అయినా .. “ఎట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ” అంటూ భారం ఆమెపైనే పెట్టడం ఆయనలోని సర్వ సమర్పణ భావాన్ని తెలుపుతుంది.

          పుట్టలో పుట్ట లేదు.. అంటే పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను.. వాల్మీకి తపస్సు చేస్తున్న సమయంలో ఆయన శరీరం అంతా పుట్టలు పెట్టిందట. దానిలో నుండి వెలికి వచ్చిన వాడు కాబట్టి అతను వాల్మీకిగా ప్రసిద్ధుడయ్యాడు. శరంబునన్ మొలవ.. రెల్లుగడ్డిలో జనించిన వాడు.. శరవణ భవుడు లేదా కుమారస్వామి. నేను కుమార స్వామిని కాదు.. అంభస్ అంటే నీరు.. నీటిపై చేసే ప్రయాణానికి అనువైన సాధనము (పాత్ర).. పడవలో సత్యవతికి పరాశరునికి జనించిన వాడు.. వ్యాసుడు.. ఆ వ్యాసుని నేను కాను.. కాళి గొల్వను.. కాళికా మాతను సేవించి ఆమె ప్రసాదంతో మహాకవి యైన వాడు.. కాళిదాసు.. నేనా కాళిదాసును కాను.. అయినా దొరంకొని (పూనుకొని) ఉంటిని.. ఉన్నాను… దేనికి? పురాణింపన్.. భాగవత పురాణాన్ని రచించేందుకు పూనుకొని ఉన్నాను. నిజానికి నాకా సామర్ధ్యం లేదు.. ఎవరికి ఉన్నది? వాల్మీకి, కుమారస్వామికి, వ్యాసునికి, కాళిదాసు లాంటి మాహాత్ములకు మాత్రమే ఉన్నది… అయినా నేనా పనిని సంకల్పించాను. ఎందుకని? నా జననము సఫలము చేసుకోవాలని.. సామర్ధ్యం లేదని తెలిసినా ఎందుకు ప్రయత్నిస్తున్నాను? అంటే నాకు అండగా నీవు ఉన్నావనే నమ్మకంతో…
          అమ్మా! నీ అండ చూచుకొని గొప్పనైన కార్యాన్ని తల కెత్తుకున్నాను. అంతేకాదు.. ముందు చెప్పిన మహాత్ములైన వారి వెంట నడుస్తాను.. అయితే ఆ సరణి మాత్రం నీవే నాకివ్వాలి. నిన్ను నమ్ముకున్నాను తల్లి.. “మేల్ పట్టున్ మానకు మమ్మ” మంచి పట్టుగా ఉండవమ్మా… ఓ దయకు సముద్రం లాంటి దానా.. బ్రహ్మీ మాతా అంటున్నాడు, పోతనగారు. దయ ఆలోచనకు పరిమితమైనది కాగా కరుణ ఆచరణకు సంబంధించినది.. ఆలోచన ఆరంభం కాగా.. ఆచరణ ముగింపు…
          “మేల్ పట్టున్ మానకు మమ్మ” … ఒక ఇరుకైన చేదబావి పూడిక తీస్తున్నారు.. అది ఒక ఉదాత్తమైన కార్యం.. ఒకడు లోపల ఉన్నాడు.. ఒకడు వెలుపల ఉన్నాడు. లోపల ఉన్నవ్యక్తి బావి లోపలి మట్టిని తీసి తట్టలో వేస్తాడు.. వెలుపల ఉన్న వ్యక్తి దానిని జాగ్రత్తగా పైకి చేది ఆ తట్టలోని మట్టిని బైట పారబోస్తాడు. పైన ఉన్న వ్యక్తి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోపలి వ్యక్తి ప్రమాదానికి గురవుతాడు. మట్టి తట్ట తొణికినా… జారినా.. తాడు తెగినా.. లోని వ్యక్తికి ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. అందుకే లోని వ్యక్తి అంటున్నాడు.. అరే జాగ్రత్తగా పైకి చేదుకో… అంటూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పైన ఉండే వ్యక్తికి చెపుతున్నాడు. లోపలి వ్యక్తి ప్రాణాలు పైన ఉన్న వ్యక్తి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాయి. అదే విధంగా పోతన గారు దుష్కరమైన కార్యాన్ని తలకెత్తుకున్నాడు. తన సంకల్పం ఉదాత్తమైనది.. అత్యంత గహనమైనది. తానెంత సమర్ధుడైనా.. అమ్మవారి కరుణాదృక్కులు లేకపోతే తన ప్రయత్నం అపహాస్యం పాలవుతుంది. అందుకే మేల్ పట్టున్ మానకు మమ్మ.. అంటున్నాడు.

* * *
బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజ బింబోపరి
స్థల శంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై
లలనారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను
జ్జ్వలనీలాంగుఁ గనన్నిషంగుఁ గుహనాచంగున్ రణాభంగునిన్!
(పోతన – భాగవతము – దశమ స్కంధము – ఉత్తరభాగము – 168)

                మహాబలవంతుడు, ధరా (భూదేవి) కుమారుడునైన నరకాసురుడు చూచాడు. ఎవరిని చూచాడు? ప్రకాశమానమైన చంద్రబింబం ఉపరితలంపైన మెఱపుతీగతో కూడిన మేఘమా అన్నట్లుగా గరుత్మంతుని మూపుపై, ఉత్తమ స్త్రీలలో మణివంటి సత్యభామతో గూడి యుద్ధ విశేషాలను ముచ్చటించుకుంటున్న వానిని, నీలవర్ణంతో శోభిస్తున్న వానిని, వీపుపైన అమ్ములపొదిని దాల్చిన వానిని, రణకోవిదుడైన శ్రీకృష్ణుడిని చూసాడు.
                మురాసుర సంరక్షితమైన గిరి, శస్త్ర, సలిల, దహన, పవన దుర్గమమైన దుర్గముల చేత చుట్టబడిన పట్టణంలో ఉండేవాడు నరకుడు. కృష్ణుడు ముందుగా ఆ దుర్గాలను ఛేదించి యుద్ధ సంరంభియై వచ్చిన వాడయిన కృష్ణుని చూచాడు, నరకుడు.
                ధరా సుతుడు… వరాహావతార సమయంలో విష్ణువు భూదేవిని ఉద్ధరించిన సమయంలో, ఆ ప్రకృతి పురుషుల సంగమం వలన జనించిన వాడయిన నరకాసురుడు. నరులలో అనుర లక్షణాలు కలిగినవాడు  నరకాసురుడు. ప్రతివ్యక్తిలో సుర అసుర రాక్షస లక్షణాలు ఉంటాయి. వాటిలో ఏ లక్షణాలను జాగృతం చేసుకుంటామో ఆ జీవన గతిని లేదా విధానాన్ని సంతరించుకుంటాము. నిస్వార్ధ జీవనం సుర లక్షణమని, స్వార్థం ఉన్నా హింసా ప్రవృత్తిలేనిది అసుర ప్రవృత్తి అని, స్వార్థంతో పాటుగా హింసా ప్రవృత్తిని కలిగియుండడం రాక్షస ప్రవృత్తి యని చెపుతారు.
    జీవితం పట్ల, జీవన వైఖరి పట్ల, జీవన లక్ష్యాల పట్ల, విస్పష్టమైన అవగాహన లేక జీవన ప్రయోజనాలను గుర్తించ గలిగిన వికాసం లేనట్టి జఢత్వాన్ని కలిగిన నరుడు.. నరకుడు.
ధర అనగా భూమి అనగా ప్రకృతి.. జఢత్వాన్ని కలిగింది. అంతే కాదు, భూమి పోషణ నిచ్చేది. భూమి నుండి వచ్చే ఆహారమే సమస్త జనులనూ పోషిస్తుంది.. అందుకే నరకుడు భూమి సుతుడయ్యాడు.
మొదట్లో ఇతడు “ప్రాగ్జ్యోతిష పురం” లో ఉండేవాడు.
ప్రాక్ .. సత్యము.. శాశ్వతమైనది, అనాదిగా ఉన్నది.. ఏది అనాది? అనగా ఆత్మ.. ఆత్మజ్యోతిగా ప్రకాశించేది ప్రాగ్జ్యోతిషము. సత్యము చేత ప్రకాశమానమైన పురము లేదా పట్టణము ప్రాగ్జ్యోతిషము.. అలాగే పురము అనగా శరీరము… సత్యప్రకాశమానమైన శరీరంతో వెలుగొందేవాడు.  ఆ సత్యాన్ని విస్మరించాడు. దానితో మాహిష్మతీ పట్టణానికి మారాడు. అనగా మహిష ప్రవృత్తికి మారాడు.. జ్ఞానవంతమైన, చైతన్యవంతమైన నరకుడు   పశుప్రవృత్తిని స్వీకరించి నరకాసురుడు అయ్యాడు. అక్కడ ముగ్గురు మిత్రులయ్యారు.. వారే మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు… ఈ మువ్వురూ సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలు కాగా వారికి మిత్రునిగా ఆ బంధంలో చిక్కుకున్నాడు, నరకుడు.
                ఎప్పుడైతే తనకు త్రిగుణ సంపత్తితో బంధం ఏర్పడిందో అప్పుడే అతనికి భయం, కోరికలు జనించాయి. జీవునికి బంధాలు ఉంటాయి.. పరమాత్మకు సంబంధాలు ఉంటాయి అంటుంది భాగవతం. అన్యోన్యమైత్రి కలిగి పతనావస్థకు దిగజార్చే భయం, కోరికల యొక్క బంధనాలలో చిక్కి మోక్షాన్ని కోరుకోవలసిన వాడు అమరత్వాన్ని (చిరకాలం జీవించడం) సాధించాలని తపించాడు.. మరణం లేని జీవితాన్ని పొందలేకపోయినా తన తల్లితో మాత్రమే మృత్యువు కావాలనే వరాన్ని పొందాడు. ఎందుకు? అంటే తనను పోషిస్తున్న తల్లినే మరచి తల్లి ఎవరో తెలియని అజ్ఞానానికి బద్ధుడయ్యాడు. కాబట్టి ఆమెతో తనకు మరణం ప్రాప్తించే అవకాశం లేదని భావించాడు.   
  నిజానికి మర్త్యుడు అంటే మృత్యువుకు సమీపానికి వెళ్ళేవాడని అర్థం. సృష్టిలో ఏ జీవికీ శాశ్వతంగా ఉండిపోయే అవకాశం లేదు. ఆకృతి ఉన్నదేదయినా కాలాంతరంలో ఆ ఆకృతిని కోల్పోవలసిందే. ఇతనూ నరుడే లేదా మర్త్యుడే శరీరాన్ని వదలవలసిన వాడే.. అయినా అసురలక్షణాలను సంతరించుకున్నవాడు.
  ఇక అతను వివాహం చేసుకున్నది చతుర్దశి అనే స్త్రీని. ఆమె “త్వష్ట” అనే ప్రజాపతి కుమార్తె. త్వష్ట అంటే తొలుచునది.. ఏది తొలుస్తుంది అంటే మాయ.. మాయయే మనిషి వివేకాన్ని తొలుస్తుంది. మాయయే ప్రకృతి.. ప్రకృతిలో ఉన్నవి పదునాలుగు భువనాలు.. ఆ పదునాలుగు భువనాలనే చతుర్దశి అన్నారు. ఆ కన్యను వివాహమాడాడు. అంటే పూర్తిగా మాయలో మ్రగ్గిపోయాడు. ఒకవైపు త్రిగుణ బద్ధులైన మిత్ర సంతతి, మరొకవైపు మాయాబద్ధమైన సహచరి.. అతనిలో అభిజాత్యానికి తోడుగా అహంకార మమకారాదులు, అధికార దర్పం లాంటివి వెలుగుచూచాయి. దానితో అదితియొక్క కుండలాలను హరించాడు. అదితి అంటే.. దితి కానిది. “దితి” అనగా ముక్కలు అయ్యేది లేదా ఖండములుగా అయ్యేది.. మరి “అదితి” అంటే ముక్కలు కానిది. ముక్కలు కానిది ఏది? అంటే ఆకాశమే.. ఆకాశమే ఖండములు గాకుండా అనంతంగా అంతటా వ్యాప్తమై ఉండేది.. కుండలాలు అంటే ఆ ఆకాశం ధరించిన సూర్య చంద్రులు. సూర్య చంద్రులు కాలానికి ప్రతీకలు. వాటిని హరించడం అంటే.. కాల స్పృహను కోల్పోవడం. కాలంయొక్క ప్రసరణ లేదా ప్రభావం తనపై లేదని భావించాడు. దుర్మార్గ ప్రవర్తన పెరిగిపోయింది. సకలమూ తనదిగా భావించాడు. “సకల” అనగా పదునారు లేదా షోడష కళలు అంటుంది లలితా సహస్రనామం. అన్ని సంపదలూ తనవిగా భావించి వాటిని నియంత్రించడమూ, బంధించడమూ ఆరంభించాడు. ఈ ప్రవృత్తిని నియంత్రించాలి.
                అందుకే కృష్ణుడు యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. సత్యభామా వస్తానన్నది.. ఆమెనూ తీసుకు వచ్చాడు. ఎందుకు అంటే నరకునికి తన తల్లితో మాత్రమే మరణం ఉన్నది.. రుక్మిణి లక్ష్మీదేవి అంశ  కాగా, సత్యభామ భూదేవి అంశ. అలా వచ్చిన సత్యభామ, కృష్ణుల నిరువురినీ చూచాడు.. బలవంతుడైన నరకాసురుడు. సత్యభామ అంటే ఎవరు? “సత్య”ము అనగా శాశ్వతమైనది.. ఏది శాశ్వతమైనదో అదే మారనిది. అదే ఈశ్వరుడు. దాని యొక్క “భా” కాంతిచే వచ్చే “మ” సంపద. శాశ్వత సత్యము యొక్క కాంతిచే పొందదగిన సంపద లేదా ఐశ్వర్యము. అది ఎవరి సొత్తు? ఈశ్వరుని సొత్తు. అందుకే సత్యభామ కృష్ణుని ప్రక్కన రాశీభూతమై  నిలిచింది. “కృష్” భూవాచకము.. ప్రయత్న సాధ్యమైనది కాగా “ణ” కారం మోక్షానికి ప్రతీక.


ఎప్పుడైతే సత్యమైన ప్రకాశాన్ని దర్శించాడో అప్పుడే నరకునిలో అజ్ఞాన తిమిరం విఛ్ఛిన్నం అయింది. అనంతమైన విష్ణు తేజస్సులో కలసిపోయాడు. మరొక విధంగా చెప్పుకుంటే.. “అ” కార “ఉ” కార “మ” కారాలు సృష్టి స్థితి లయాలకు ప్రతీకలు.. ఎప్పుడైతే సత్య దర్శనం అయిందో అప్పుడే నరకునిలో అజ్ఞానం లయమయిందని భావించవచ్చు. దానినే మనం అమావాస్యగా చెప్పుకుంటాము. “అమా” అనగా కూడి “వాస్య”.. వాసము.. అమావాస్య నాడు నరకునిలోని ఆసురీ ప్రవృత్తి భగవంతునిలో లయం అయింది. త్రిగుణాత్మకమైన ఆసురీశక్తులతో మైత్రిని కొనసాగించిన వేళ అతను ఉపాధిగతమైన జీవాత్మగా ఉన్నాడు. ఎప్పుడైతే భగవత్ దర్శనం జరిగిందో అప్పుడు ఉపాధిరహితమైన విశ్వచైతన్యంలో అనగా నారాయణునిలో లయమై “నరుడే నారాయణుని”గా మారాడు.


 నరకుని సంహారం అంటే.. ఉపాధిగతమైన నరుని ఉపాధిరహితమైన నారాయణుడు తనలో లయం చేసుకోవడమే.. లయం కావడం అంటే.. శాశ్వత సత్యంగా రూపాంతరం చెందడమే. కృష్ణుడు దుష్ట శిక్షణ చేసాడు.. అంటే దుష్టులను శిక్షించడంగా భావించకూడదు.. దుష్టత్వాన్ని శిక్షించినట్లుగానే భావించాలి. ఎప్పుడైతే సాధకునిలోని దుష్టత్వం లయమౌతుందో అప్పుడు సాధకుని ప్రయాణం “తమస్సు నుండి ప్రకాశం” వైపునకు సాగుతుంది.

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఇక నిశ్చింతగా…

by Aruna Dhulipala January 31, 2024
written by Aruna Dhulipala

మధ్యాహ్నం భోజనం చేసి, పుట్టింట్లో నాలుగు రోజులు గడపడానికి వచ్చిన కూతురు భావన తల్లికి అత్తవారింటి విషయాలు చెబుతోంది. సోఫాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటున్నాడు తండ్రి శ్రవణ్. భర్త మంచివాడేనని, అత్తగారు కూడా కలివిడిగానే ఉంటుందని చెబుతూనే ఏవో కంప్లైంట్స్ ఇస్తూ తను ఆమెను ఎంతగానో భరిస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తోంది. తల్లి రేఖ “అలా కాదమ్మా! మీ అత్తగారిని రెండేళ్లుగా చూస్తున్నాం. మంచి మనిషి. అలాంటి అత్తగారు దొరకడం నీ అదృష్టం” అని నచ్చచెప్పడం ఆ అమ్మాయికి నచ్చడం లేదు.
అప్పటిదాకా మౌనంగా వింటున్న శ్రవణ్ “భావనా!” అన్నాడు కొంచెం కఠినంగా. తల్లీ కూతుళ్ళిద్దరూ ఉలిక్కిపడి శ్రవణ్ వైపు చూశారు. “భావనా! ఎప్పుడూ ఇతరుల మీద నింద వేయడం సరి కాదు. అల్లుడితో సమానంగా నువ్వూ డ్యూటీకి వెళ్ళిపోతే మీరు వచ్చేవరకు అన్నీ సిద్ధం చేయడం మాట్లాడినంత సులువు అనుకుంటున్నావా? అల్లుడు భరత్ ఒక్కడే కావడం వల్ల నీకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. భర్త లేక ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ మీ సుఖం కోసం ఎప్పుడూ ఆరాటపడే మీ అత్తగారిని అనడానికి నీకు నోరెలా వస్తోంది? ఎంతో మంది ఆడవాళ్లు అత్తవారింట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. దానికి మీ అమ్మ నీ ముందు సజీవ సాక్ష్యం. ఆమె ఎదుర్కొన్నవాటిలో నీ అనుభవం ఆవగింజంత కూడా కాదు. నన్ను పెళ్లి చేసుకున్నాక మీ అమ్మ పడిన అనేకమైన కష్టాల్లో నేను ఎప్పటికీ మరచిపోలేని ఒక దుస్సంఘటన చెప్తాను. ఇప్పటివరకు నీకవేవీ తెలియవు”. అని కళ్ళు మూసుకొని దాని తాలూకు గతంలోకి జారిపోయాడు శ్రవణ్.
*****
ఆ రోజు…మేడ మీద ఒక గదిలో శ్రవణ్ అసహనంగా అటూఇటూ పచార్లు చేస్తున్నాడు. హైదరాబాద్ నుండి పరీక్షలు ముగించుకొని ఆరోజు మధ్యాహ్నమే పల్లెకు వచ్చాడు. భార్య రేఖ ఎందుకో సంతోషంగా ఉన్నట్టు అనిపించలేదు. ఆమె ముఖంలోని భావాలను చదవడానికి తనకు కళ్ళులేవుగా! రేఖ గదిలోకివస్తే అడగాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ రాత్రివేళ పనంతా ముగించుకొని కానీ ఆమె పైకిరాదు. కుటుంబ కట్టుబాట్లకు ఎక్కడా లోపం రానీయదామె. అత్త, భర్త, మరుదులు, ఆడపడుచులు అందరూ భోజనం చేశాక పనంతా ఆమే చేసుకోవాలి. ఇంటికి పెద్ద కోడలు కదా! కొంతమందికి అడగకుండానే సంప్రదాయబద్ధంగా కొన్ని బాధ్యతలు వచ్చి చేరతాయి వయసుతో నిమిత్తం లేకుండా..!
గుమ్మం దగ్గర అలికిడి అయింది. అడుగుల సవ్వడినిబట్టి రేఖ అని అర్థమయింది. రెండు నిమిషాలు మౌనం ఇద్దరి మధ్యా… మంచంమీద కూర్చున్నాడు శ్రవణ్. దగ్గరగా వచ్చిన రేఖ అమాంతం అతడిని చుట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఊహించని ఈ పరిణామం అతన్ని అయోమయంలో పడేసింది.
చదువు కోసం శ్రవణ్ హైదరాబాద్ లో హాస్టల్ లో ఉండడం, పరీక్షలు అయింతర్వాత సెలవులకు ఇంటికి రావడం పరిపాటే. ఇంట్లో అందరి మధ్యలో ఒంటరితనం అనుభవిస్తున్న రేఖ భర్త కున్న అంధత్వం వల్ల తమ భవిష్యత్తు కోసం శ్రవణ్ చదువే ఒక ఆలంబన అనే సత్యాన్ని అతని మాటల ద్వారా గ్రహించింది. అందుకే 16 ఏళ్ళ రేఖ అతనికి దూరంగా ఉండడానికి గొప్ప మనసుతో అంగీకరించింది. అత్తగారి సూటిపోటి మాటలను, తన భర్త నిస్సహాయతవల్ల సంసార బాధ్యతను భుజాల మీద మోస్తున్న మరిది పెద్దరికాన్ని భరిస్తూనే, చిన్నవారైన ఇంకొక మరిది, ఇద్దరు ఆడపడుచుల ఆలనాపాలనా చూసుకుంటోంది. ***
ఏడుస్తున్న రేఖను ఓదార్చడం అసాధ్యమైంది శ్రవణ్ కు. జరగకూడనిది ఏదో జరిగి ఉంటుందని అర్థమైంది. ఆమె దుఃఖం కొంత ఉపశమించేదాకా ఆగి “ఏమైంది రేఖా! ఎందుకేడుస్తున్నావ్? నువ్విలా ఏడవడం నేను చూడలేకపోతున్నాను. జరిగిందేమిటో చెప్పు?” లాలనగా అడిగాడు. వెక్కిళ్ళమధ్య రేఖ చెప్పిన విషయం విని శిలలా బిగుసుకుపోయాడు శ్రవణ్.
దీనికంతటికీ తన అసహాయతే కారణమా? అదే అయితే దానికి రేఖను బలి చేయడం ఎందుకు? నరాలు బిగుసుకున్నాయి.
తననుతాను తమాయించుకొని “రేఖా! మన కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ విషయమే రాగానే నీతో చెప్పాలని ఎంతో ఆశగా వచ్చాను. వచ్చినప్పటినుండీ నీ మౌనం నాలో అలజడులను రేపుతూనే ఉంది. నేను చెప్పే వార్త విని నీ మనస్సులో పొంగే సంతోష తరంగాల సవ్వడులను నా గుండెలో పొదువుకుందామనుకున్నా. ఒక్కసారిగా నా ఆశలు మొదట్లోనే పాతర వేయబడ్డాయి. నాలాంటి అంధుడిని కట్టుకున్నందుకు నాతోపాటు నువ్వూ చిత్రవధ అనుభవిస్తున్నావు. ఊరుకో! నీ ఆవేదనను అర్థం చేసుకోవడమే తప్ప ఏమీ చేయలేని వాణ్ణి. కాలం మనకు మంచిరోజులు ఇస్తుందని నా నమ్మకం అన్నాడు. కానీ రేఖ ఉన్న పరిస్థితిలో భర్త ఓదార్పు, ఆయన చెప్పాలనుకున్న శుభవార్త ఇవేవీ ఆమెకు రుచించలేదు.
పేదవారైన రేఖ తల్లిదండ్రులు గత్యంతరం లేక అంధుడైన శ్రవణ్ తో ఆమె పెళ్లి చేశారు. డబ్బున్న ఆ ఇంట్లో కూతురు సుఖపడుతుందని వారు ఆశించారు. పేదరికంతో పాటు శ్రవణ్ అంధత్వం ఆమె ఆశలకు సంకెళ్లు వేసాయి. ఆమెకు పెళ్లిలో శ్రవణ్ వాళ్ళు చేయించిన బంగారు గొలుసు ఇనప్పెట్టెలో ఉంటుంది. అప్పుడప్పుడు శుభకార్యాలకు అత్తగారే తీసి ఇస్తుంటుంది. పెట్టె తాళపుచెవులు ఆమె దగ్గరే ఉంటాయి. ఈ విషయంలో ఆమె ఎవ్వరినీ నమ్మదు. అలాంటిది ఉన్నట్టుండి ఆ గొలుసు పెట్టెలో నుండి మాయమైంది. కుటుంబమంతా తర్జనభర్జనలు జరిపి పేదింటి అమ్మాయి రేఖకు మాత్రమే తీసే అవసరం ఉందని తేల్చారు.
ఇందులో రేఖ తన గొలుసు తనే ఎందుకు దొంగతనం చేస్తుందన్న ఇంగితజ్ఞానం కూడా ఎవ్వరికీ కలుగలేదు. మన కుటుంబాల్లో చాలామందికి కోడలు పరాయిది. ఎంత ఊడిగం చేయించుకున్నా ఇలాంటి విషయాల్లో ఆమెను దోషిగా నిలబెడతారు. రేఖ నుండి విషయాన్ని రాబట్టడానికి ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష, పరోక్ష ప్రయత్నాలు ఎన్నోచేశారు. శ్రవణ్ ఊళ్ళో లేడు కాబట్టి ఇవేవీ అతనికి తెలియవు. మరో దారుణమేంటంటే అజ్ఞానం వెర్రితలలు వేసి మూఢనమ్మకంగా మారి రేపటి రోజున రేఖను దోషిగా నిరూపించడానికి అమ్మలక్కలంతా పథకం తయారుచేసారు. రేఖను శోకదేవతగా మార్చిన సంఘటన ఇదే. *****
సూర్యుడు తన కర్తవ్య పాలనకు ఉపక్రమించాడు. రేఖ ఎప్పటిలాగే చీకటితోనే లేచి యాంత్రికంగా తన పనులు చేసుకోసాగింది. మన దేశంలో చాలమంది మధ్యతరగతి మహిళల బ్రతుకులు ఇట్లాగే తెల్లవారుతాయి కారణాలు ఏవైనా. రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ కళ్ళు ఉబ్బిపోయి ఉన్నా గమనించనట్లే ఉన్నారు ఇంట్లోని వాళ్లందరూ. అదింకా రేఖ మనసును సూటిగా గుచ్చుతోంది. శ్రవణ్ ఆలోచనల నిద్ర లేమితో ఎరుపెక్కిన కళ్ళను నల్లటి కళ్ళద్దాలలో దాస్తున్నాడు. ఇదంతా అన్యాయమని గొంతెత్తి అరవాలని ఉంది. దాని పరిణామాలు తమ భవిష్యత్తు మీద ఎలాంటి ముద్రలు వేస్తాయో తనకు బాగా తెలుసు. తొందరపడటం అన్నిటికీ పరిష్కారం కాదని, తన చదువు ఒక కొలిక్కి వచ్చేంతవరకు ఎన్ని బాధలైనా అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మౌనం వహించాడు. భర్త ఆలోచనలను ఎరిగిన ఇల్లాలిగా ఎంతో సహనం వహించే రేఖ కొన్ని సందర్భాల్లో భర్త నిష్ప్రయోజకుడని నిందిస్తుంది. ఆమె భావనలో తప్పు లేదు. వ్యతిరేకులైన మనుష్యుల మధ్య ఆమెకున్న ఒకే ఒక ఆలంబన శ్రవణ్.
అంధుడని తెలిసినా ఏ నమ్మకంతో జీవన ప్రయాణంలో తోడుగా ఉంటానని వచ్చిందో ఆ మనసుకే తెలుసు.
ఇల్లంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎవరిపనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా తనవాళ్లే మొన్నటివరకు. తన కుటుంబమే. కానీ ఈరోజు అందరూ ఉన్న ఏకాకి రేఖ. చేయని నేరానికి అభియోగం మోపబడిన ముద్దాయి. ఆమె కళ్ళు నిండు తటాకాలయ్యాయి. మధ్యాహ్నం భోజనాలు ముగిశాయి. అమ్మలక్కలు ఒక్కొక్కరుగా ఇంటి వసారాలోకి వచ్చి చేరుతున్నారు. రేఖను దోషిగా నిరూపించే ప్రయత్నాల్లో మొదటి ప్రణాళికకు రంగం ఏర్పాటు చేశారు. ఇంట్లో రేఖ, శ్రవణ్ తప్ప మిగిలిన అందరిలో కుతూహలం చోటు చేసుకుంది. శ్రవణ్ కు కూడా రేఖ నిర్దోషి అని పూర్తి నమ్మకం. అందుకే ఒకచోట ఒంటరిగా కూర్చున్నాడు. విద్యాగంధం లేని ఆ పల్లె టూరులో చదువుకున్న తానొక్కడు ఇవి మూఢ నమ్మకాలని ఎలా రుజువు చేయగలడు? అభిమన్యుడై ఎట్లా పోరాడగలడు? సన్నటి కన్నీటి పొర కనిపించని ఆ కళ్ళల్లో.
మొత్తం ఐదుగురు ఆడవాళ్లు వచ్చారు. అందులో అందరికంటే వయసులో పెద్దావిడ శ్రవణ్ తల్లి రాజమ్మను బియ్యం, పసుపు తెమ్మని పురమాయించింది. వాటిని కలుపుతూ కళ్ళు మూసుకొని పెదాలతో ఏవో అర్థం కాని పదాలను వల్లించింది. అందరూ చోద్యం చూస్తున్నారు. “రేఖమ్మా! మళ్లీ అడుగుతున్నా చెప్పు. గొలుసు నువ్వే తీసినవు కదా”? అడిగింది పెద్దరికం.
“లేదు పెద్దమ్మా! మీరెన్ని సార్లు అడిగినా నేను తీయలేదు అంతే. ఆ అవసరం నాకు లేదని మీకు మళ్లీ మళ్లీ చెప్తున్నా” ఆవేదన, ఆక్రోశంతో దుఃఖాన్ని గొంతుకలో ధ్వనింపచేస్తూ రేఖ జవాబు. “ఇక ఇట్లా కాదులే రాజమ్మా! ఎంత అడిగినా నీ కోడలు నిజం చెప్తలేదు. రేపటికల్లా నిజం బట్ట బయలైతది. ఇదుగో, ఈ మంత్రించిన బియ్యాన్ని నీ కోడలును తినమని చెప్పు. పొద్దటికి కడుపుబ్బి, నిజం కక్కుతది” అన్నది పెద్దరికం పొగరుగా తల ఎగరేస్తూ తానేదో సాధించబోతున్నట్టు.
“సరే వదినా” అంటూ రాజమ్మ రేఖతో వాటిని తినమని చేతిలో పెట్టింది. ధారలుగా కారుతున్న కన్నీటిని కొంగుతో
తుడుచుకుంటూ ఉక్రోషంగా చేతిలోకి తీసుకొని వాటిని కసిదీరా నమిలి మింగేసి పరుగెత్తుకొని లోపలికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె గుండెలోని బాధతో సంబంధం లేని అమ్మలక్కలు తమవంతు పని పూర్తయిందన్న తృప్తితో కాసేపు అదే విషయాన్ని చర్చించుకుని వెనుదిరిగారు.
మరో ఉదయానికి తెర తీస్తూ చంద్రుడు మబ్బుల్లో కనుమరుగయ్యాడు. రేఖ మామూలుగానే లేచి పనుల్లో నిమగ్నమయింది. సమయం గడుస్తున్న కొద్దీ దుఃఖ తీవ్రత తగ్గడం సహజమే కదా! శ్రవణ్ కు కూడా ఏదో జరుగుతుందనే భయం లేదు. రేఖపై అత్యంత విశ్వాసం కలిగి విద్యావంతుడైన భర్త అతను. కళ్ళు లేకపోవడమనే లోపం తప్ప పరిపూర్ణ సుమనస్కుడతడు. ఇంట్లో వాళ్లంతా ఒక్కొక్కరుగా లేచి అనుమానంగా రేఖ వైపు చూడసాగారు. ఎలాంటి తేడా ఆమెలో కనిపించలేదు. గొలుసు దొంగతనం ఆమెనే చేసి ఉంటుందని, ఈ రోజు అది తేటతెల్లమవుతుందని, దాని తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చర్చించుకున్న వాళ్లకు ఆశాభంగం కలిగింది.
సూర్యుడు తన తాపాన్ని పెంచుకున్నాడు. నిన్నటి పెద్దరికం ఇంట్లోకి వచ్చింది. రాజమ్మతో గుసగుసలు కాసేపు. ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయింది. మేడ మీద ఉన్న శ్రవణ్ దగ్గరికి వచ్చి రేఖ జరిగిన విషయం చెప్పింది. ఇద్దరిలో అంతులేని ఆలోచనలు. మళ్ళీ ఏ పథకాన్ని తోడుతున్నారోనని భయం. అది తప్పు చేయడం వల్ల వచ్చింది కాదు. చేయని నేరానికి శిక్ష అనుభవించే బలం మనసులకు లేక కలిగే భయం.
సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకు అమ్మలక్కలంతా మళ్లీ సమావేశమయ్యారు. చాలాసేపు చర్చించుకున్నారు. రేఖను పిలిపించారు. రేఖతో పాటు శ్రవణ్ కూడా కిందకు వచ్చాడు అసహనంగా. రాజమ్మ చేటలో బియ్యం తెచ్చింది. పసుపుతో వాటిని కలపమని పెద్దావిడ ఆజ్ఞ జారీ చేసింది. కలిపిన పసుపు బియ్యంలో ఒక్కొక్కరిని పిలుస్తూ రెండు చేతులు పెట్టమంది. రేఖను మాత్రమే పిలిస్తే బాగుండదని ముందుగా ఇద్దరు, ముగ్గురిని పిలిచింది. ఏవో చదువుతూ వాళ్ళు పెట్టిన చేతుల మీద తన చేతులు పెట్టింది. ఒకవేళ వారు దోషులైతే ఆమె చేతి కింద ఉన్న చేతులు వాటంతట అవి కదులుతాయి. ఇదీ ఆ ప్రక్రియ సారాంశం. ఎవరి చేతులూ కదలలేదు. రేఖ వంతు వచ్చింది. రేఖ భయం భయంగా చేతులు పెట్టింది. రేఖ చేతులపై పెద్దావిడ చేతులు. “కదులుతున్నాయ్, కదులుతున్నాయ్” ఆమె కళ్ళలో మెరుపు, గొంతులో ఆనందం. బిత్తరపోయిన రేఖ.

అప్పటిదాకా అన్నిటినీ భరిస్తూ వచ్చిన శ్రవణ్ హృదయంలోని బడబానలం ఒక్కసారి విరుచుకుపడింది. “ఆపండి!” అరిచాడు గట్టిగా. పెద్దరికం ఏదో మాట్లాడబోయింది. “ఇప్పటి వరకు చేసింది చాలు. ఎవ్వరూ మాట్లాడొద్దు. ఎవరైనా ప్రయత్నిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అంత చేతకాని వాడిననుకుంటున్నారా? దోషులను నిర్ణయించే సామర్థ్యం మీకుంటే ఇక పోలీసులు, కోర్టులు ఎందుకు? అసలు రేఖను దోషిగా అనుకోవడానికి మీకు మనసెలా ఒప్పింది? మీ మూఢ నమ్మకాలతో అమాయకులను బలి పెట్టొద్దు. వెళ్లండి అందరూ ఇక్కడినుండి” అన్నాడు పెల్లుబికిన ఆవేశంతో. రాజమ్మతో సహా అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. కొడుకులో ఇంత ఆవేశం ఆమె కూడా ఎప్పుడూ ఎరగదు. ఈ చర్యను ఆమె ఊహించలేదు. సైగ చేసింది వాళ్లకు వెళ్ళిపొమ్మని. అందరూ జారుకున్నారు మెల్లగా. శ్రవణ్ తన నిస్సహాయతకు తనను తాను నిందించుకుంటూ మేడ మీదికి వెళ్ళిపోయాడు. రేఖ మనసు వీణలు మీటింది. తనకు సర్వస్వం అయిన శ్రవణ్ తనకోసం అందరినీ ఎదిరించి తన పక్షాన నిలవడం ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇక తనకు ఎలాంటి బాధ లేదు అనుకుంది తృప్తిగా. దుఃఖమంతా ఆవిరైపోయినట్టు తోచిందామెకు. మౌనంగా భర్తను అనుసరించింది సంతోషంగా.

*****
ఒక వారం రోజులు ప్రశాంతంగా గడిచాయి. మళ్లీ ఇంట్లో ప్రయత్నాలు మొదలైనట్టు రేఖ ద్వారా అర్థమైంది శ్రవణ్ కు. ఏదైనా భయం లేదనుకున్నాడు. రేఖకు ధైర్యం చెప్పాడు. గొలుసును దొంగిలించింది ఇంకా ఎవరో తేలలేదు కాబట్టి శ్రవణ్ పెద్ద బావ నాలుగూళ్ల అవతల ఎవరో “అంజనం” వేస్తారని దాంట్లో దొంగ బయటపడతాడనే వార్త మోసుకొచ్చాడు. శ్రవణ్ పెద్ద తమ్ముడు, బావ ఇద్దరూ కలిసి ఆ ఊరికి వెళ్లారు. అక్కడ కొమురయ్య అనే వ్యక్తి అంజనం వేస్తాడని తెలిసి అతని ఇంటికి వెళ్లారు. వీళ్ళు చెప్పిన విషయం అంతా విని కొమురయ్య దొంగను పట్టిస్తానని భరోసా ఇచ్చాడు. చేతికి ఏదో లేపనం పూసుకుని కాసేపు మంత్రాలు చదివి, రేఖ దోషి కాదని ఇతరుల వల్లే గొలుసు మాయమైందని తేల్చాడు. రేఖ మీద ఉన్న అభియోగం ఆ రకంగా రూపుమాపబడింది. తర్వాత ఎన్నో ప్రయత్నాలు జరిగి కొన్నాళ్ళకు ఆ ఇంటి పనివాడు తీసాడన్న వాస్తవం తెలియడం, వాడు ఏడుస్తూ రాజమ్మ కాళ్ళ మీద పడి గొలుసును తిరిగి ఇచ్చివేయడం జరిగింది.
రాజమ్మతో సహా ఇంట్లో వాళ్ళందరూ శ్రవణ్ ను తప్పించుకొని తిరుగుతున్నారు. అన్నీ అర్థమైనా ఏదీ జరగనట్టే అందరితో మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రవణ్.

****
నెల రోజులు గడిచాయి. శ్రవణ్ వేసవి సెలవులు అయిపోయాయి. ఆరోజు…..వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోలేదు ఇంకా. రేఖ చేయి పట్టుకొని శ్రవణ్ నడుస్తున్నాడు. వారికి ముందు ఆ ఇంటి నమ్మినబంటు పనివాడు ఒక చేతిలో పెట్టె ఒక చేతిలో బ్యాగు పట్టుకొని నడుస్తున్నాడు. బస్టాండులో వారిని బస్సెక్కించి చేయి ఊపాడు కన్నీళ్ల మధ్య. తన వారికి దూరమవుతున్నానన్న బెంగ కంటే కన్నఊరికి దూరమవుతున్నానన్న బాధ శ్రవణ్ ని ఎక్కువగా పీడించసాగింది. శ్రవణ్ చేతిని పట్టుకున్న రేఖ, బాధల సుడిగుండం నుండి తీరానికి చేరిన నావలా సంతృప్తిగా నిట్టూర్చింది. ఆవలి తీరపు కష్టాన్ని ఆమె ఊహించగలదు. కానీ చదువుకున్న తన భర్త మీద పూర్తి నమ్మకం. ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయారు.
పరీక్షల తర్వాత సెలవులకు ఇంటికి బయలుదేరేముందు మిత్రుడైన భాస్కర్, తానూ కలిసి తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది శ్రవణ్ కు. చదవబోయే పీజీ కోర్సుల నిమిత్తం హాస్టల్ వసతి ఇవ్వడం ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం అటువంటి విద్యార్థులకు స్కాలర్ షిప్ ప్రకటించింది. భాస్కర్ కు కూడా హాస్టల్లో బాగా ఇబ్బంది అవుతోంది. శ్రవణ్ ఇంటి విషయాలు కూడా తనకు బాగా తెలుసు. అందుకని శ్రవణ్ వచ్చేలోపు రూమ్ చూసి పెడతానని, తన చెల్లిని తీసుకువచ్చి ఇక్కడే చదివిస్తానని, రేఖకు కూడా తోడుగా ఉంటుందని చెప్పాడు భాస్కర్.
ఈ విషయమే రాగానే రేఖకు చెప్పి ఆమె ఆనందాన్ని తనదిగా చేసుకోవాలనుకున్నాడు. ఇంతలోనే జరిగిన పరిణామాలు శ్రవణ్ ను అశాంతికి గురి చేసాయి. రోజులు గడచిన కొద్దీ రూము దొరకకపోతే రేఖను వీళ్ళ మధ్య ఎలా వదిలి వెళ్ళాలో శ్రవణ్ కు అర్థం కాలేదు. రేఖకు చెప్పి ఆమె ఉన్న స్థితిలో నిరాశకు గురి చేయడం నచ్చలేదు. మనసు పొరల్లో దిగులు కమ్ముకోసాగింది. హఠాత్తుగా దేవుడు వరం కురిపించినట్టు వారం రోజుల క్రితం భాస్కర్ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. రూమ్ దొరికిందని, రేఖను తీసుకొని రమ్మని. అప్పుడే రేఖకు చెప్పాడు. ఆ సమయంలో ఆమె అతనికి ఆనందరేఖ అయింది.
అదే రోజు తల్లితో ఆ విషయం చెప్పాడు. ఆమె అవునని, కాదని చెప్పలేదు. మౌనమే ఆమె అంగీకారంగా భావించాడు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ దీన్ని వ్యతిరేకించలేదు. జరిగిన సంఘటన వల్ల వాళ్లలో కలిగిన న్యూనతా భావమా? శ్రవణ్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తిరుగుండదనే నమ్మకమా? తెలియలేదు. ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు శ్రవణ్. లేకుంటే వారిని ఒప్పించడం చాలా కష్టమయ్యేది.
*****
గతంలోకి వెళ్ళిపోయి జరిగిన ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తున్న శ్రవణ్ చెప్పడం ఆపి కళ్ళు తెరిచి చూసేసరికి భావన కళ్ళనిండా నీళ్లు. రేఖకు కూడా బాధ తాలూకు గాయం మళ్లీ సలపరించినట్లు కళ్లనుండి నీళ్లు దుమికాయి.
“భావనా! ఆ కాలంలో మూఢవిశ్వాసాలు మనుషులను ఎంతగా బాధించేవో చూడు. ఈ కాలంలో అక్షరాస్యత పెరిగి అవన్నీ దూరమవడం వల్ల మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారు. అది మీ అదృష్టం. ఆ సంఘటన తరువాత ఎన్నో కష్టాలను మీ అమ్మ సాహచర్యంలో అధిగమించాను. ఆరోజే నిర్ణయించుకున్నాను భర్తగా రేఖ జీవన రేఖను సంతోష తీరాలపై నిలబెడతానని. ఈరోజు మన ఇంటి సుఖాల వెనుక పట్టరాని దుఃఖపు అగాధాలున్నాయి. అది మర్చిపోకు. మీ తరానికి సహనం లేకపోవడం మనసుల మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే కుటుంబ బంధాలు బలపడతాయి తల్లీ!
ఆ తర్వాత నీ ఇష్టం” అన్నాడు ఆవేదనగా.
భావన మెల్లగా తండ్రి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని
“సారీ నాన్నా! నా కళ్ళు తెరిపించారు. మా అత్తగారిని అమ్మలా చూసుకుంటాను. మీ కూతురుగా ఈ తరం వారికి ఆదర్శంగా నిలుస్తాను” అన్నది భావన దృఢంగా.

January 31, 2024 51 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహోజ్వల నిప్పు కణిక డా. బన్న అయిలయ్య మేరు నగ దీపశిఖా

by Butam Mutyalu January 31, 2024
written by Butam Mutyalu

మనిషికి జీవితమే ఒక గొప్ప అనుభవం మన అనుభవంలోకి తొంగి చూస్తే తరచి చూస్తే కొందరి పరిచయాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ ప్రత్యేకత ఒక ప్రేరణ కావచ్చు మనకు దారి చూపే మార్గదర్శనం కావచ్చు అలాంటి అనుభవాలు అతి అరుదుగా మన జీవితంలో దర్శిస్తాము ఒక వ్యక్తిలో భిన్న కోణాలు బిన్నపార్శాలు విభిన్న దృక్పదాలు దర్శిస్తాం ఏక వ్యక్తిలో బహుమఖీన ప్రజ్ఞాశాలిని అతి అరుదుగా చూస్తుంటాం ముఖ్యంగా అట్టడుగు స్థాయి నుంచి అట్టడుగు వర్గం నుంచి యూనివర్సిటీ మెట్లు ఎక్కడం ఒక గొప్ప మలుపు అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అసోసియేట్ ప్రొఫెసర్ గా ప్రిన్సిపాల్ గా అంచలంచెలుగా ఎదిగి యూనివర్సిటీ ఒక విభాగానికి పాలన దక్షత నిర్వహించడం అంటే ఎంతో అనుభవం నైపుణ్యం తన చుట్టూ ఉన్న అందరినీ సమన్వయంతో అంకిత భావంతో మెలగాలి, అందరినీ గుర్తెరగాలి అంటే కత్తి మీద సాము కొందరిలో అతికొద్ది మందికి అంతటి పరిణతి ప్రతిభ మూర్తిభవించిన ఘనాపాటిలను చూస్తాం.  

    మన కాలంలో అరుదైన వ్యక్తి డా. బన్న అయిలయ్య గారు వారిని దర్శించడం నా అదృష్టం . రకరకాల భావజాలాలు కలిగిన కళాశాల విద్యార్థిని విద్యార్థుల రీసెర్చ్ స్కాలర్స్ గా పిహెచ్డి స్టూడెంట్స్ గా పరిణతి చెందే మేధావి వర్గాల కార్యశాల విశ్వవిద్యాలయం తెలంగాణలో ఎంతో పేరున తెలంగాణకే మణి మకుటం గా బాసిల్లుతున్న కాకతీయ విశ్వవిద్యాలయం లో హెచ్ ఓ డి గా ప్రిన్సిపల్ గా డీన్గా గైడ్గా రకరకాల అధికార ప్రతినిధిగా ఉపన్యాసకుడుగా రాణించి జీవితంలో సగానికి పై భాగము యూనివర్సిటీ కి అంకితమైన మహోన్నత వ్యక్తి మహోజ్వల నిప్పు కణిక మేరునగ దీపశిఖా డాక్టర్ బన్న ఐలయ్య గారు ఆకోవలో ఒకరు. వారితో గడిపిన కొన్ని క్షణాలు గొప్ప స్మృతి జ్ఞాపకాలు నా జీవితంలో చెరగని శిలాక్షరాలు.  అప్పుడప్పుడు కొందరి పేర్లు సాహితీ ప్రస్థానంలో వింటుంటాం సాహిత్య శోధనలో భాగంగా కంటుంటాం అడపాదడపా సాహితీ పఠనం కథలు కవితలు చదువుతున్న సందర్భంలో కొందరి పేర్లు మననం లోకి వస్తాయి అట్లా నేను చూసిన ఒక గొప్ప కవిత నిప్పు కణిక
” ఇప్పుడిక ఎవడికి సంజాయిషీలు ఇచ్చుకొనక్కర్లేదు
  ఏది శబ్దమో ఏది నిశ్శబ్దమో తెలిసి నటించే
నంగనాచి చెవిటి మాలోకానికి ఇది సంగీతమని…..
….  
…..
చీకటి చిత్రపటం వెనుక ఒకే ఒక రంగులోంచి…
ఒక బహుజన ప్రేమ లేక మొదలెడదామా……
……
……
ఎన్ని హరితవనాలు మావి కాకుండా పోయాయి.
ఎన్ని అడవుల మీది గాలులు మమ్మల్ని తాకకుండా వీచాయి…. ……
కవిత పాద వాక్యాల్లో బన్న అయిలయ్య దళిత వైతాళికుడుగా అవతరించాడని అనడంలో సందేహం లేదు. ఈ కవిని గూర్చి మహాకవి మద్దూరి నగేష్ బాబు అన్నట్లు ఖాదర్ మొహిద్దిన్ గారి “పుట్టుమచ్చ” కానీ జూలూరు గౌరీశంకర్ గారి”పాదముద్ర ” కానీ సతీష్ చందర్ “నాన్న సైకిలు” కానీ సుంకర రమేష్ “తల్లి కోడి హెచ్చరిక” కానీ మద్దూరి నగేష్ బాబు “రచ్చబండ” పైడి తెరేష్ బాబు “హిందూ మహాసముద్రం కానీ ఇప్పుడు “నిప్పు కణిక” అన్నట్టు అక్షర సత్యం. 


        నేను దళిత సాహిత్యాన్ని విస్తృతంగా పటిస్తున్న క్రమంలో మేదరి బాగయ్య, కూసుమ ధర్మన్న, బోయి భీమన్న ,కొలకలూరి ఇనాక్, వేముల ఎల్లయ్య, బన్న ఐలయ్య, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్ , కలేకూరి ప్రసాద్, మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్బాబు , మద్దెల శాంతయ్య , బోయ జంగయ్య , డా. జీవి రత్నాకర్, డా. దార్ల వెంకటేశ్వరరావు లాంటి వారి రచనలు చదువుతున్నప్పుడు దళిత ఆర్తితో వారు వినిపించిన గొంతుక దళితుల వెతలబతుకులకు దర్పణం పడుతుంది కొందరి రచనలు మనకు మార్గం చూపడమే కాకుండా మనకు దశ దిశను కూడా నిర్ణయిస్తుంది కొందరిని చూడలేకపోయినా మరికొందరిని స్వయంగా కలిసి కరచాలనం చేసి సహవాసిగా వారితో గడిపిన క్షణాలు నా జీవితంలో అద్భుతాలు అని చెప్పాలి.

నేను ఒక సాధారణ రచయితను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడని నాకంటే ముందు సాహితీ ఎవనికలో ఉండి దళిత దృక్పథంతో అంబేద్కర్ భావజాలంతో దళిత అస్తిత్వానికి నాంది పలికిన వారు అనక తప్పదు ఎవరైనా పుస్తక రూపేనా వేస్తుంటారు ముద్రిస్తుంటారు కానీ యు యూనివర్సిటీ మెట్లు ఎక్కించడం అంటే ఒక తపస్సు ఒక యజ్ఞం 20 ఏళ్ల కింద నేను రాసిన దళిత నవల సూర 2012 13 సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఎం ఏ తెలుగు నాలుగవ సెమిస్టర్ లో వేముల ఎల్లయ్య కక్కతోపాటు నా నవల సూర పాఠ్యాంశంగా చేర్చారు నా నవలకి ఘనతని కల్పించినవారు డాక్టర్ బన్న అయిలయ్య గారు ముఖ్యులు. విస్తృతంగా సాహిత్యం వస్తున్న నేటి తరుణంలో దళిత భాషని దళిత సంస్కృతిని దళిత జీవితాన్ని ఆవపోసన పట్టి యూనివర్సిటీలో దళిత అస్తిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేశారు వివిధ యూనివర్సిటీలలోని ప్రొఫెసర్లు వారి వారి గురించిన వాటికి ప్రాధాన్యం ఇస్తూ సాంప్రదాయ ఒరవడిని కొనసాగిస్తూ వస్తుంటారు అలాంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి ఒక కొత్త ఒరవడికి నాంది పలికి అభ్యుదయ, దళిత బహుజన పునసృష్టి చేశారు. వారు స్వయంగా రచయిత కవి డా.బన్న అయిలయ్య దళిత నేపథ్యం నుండి వచ్చిన వారు కనుకనే దళిత వాదం వైపు మొగ్గు చూపారు . అలా తన మూలాలను గుర్తించి ఉన్న కొద్దిపాటి దళిత సాహిత్యం నవల కథ కవిత్వం మరుగు కాకుండా వెలుగులోకి తీసుకవస్తున్నారు. దళిత భాష కూడా జీవభాష తెలంగాణ అంటేనే మాండలికానికి పెట్టింది పేరు అలాంటి భాష విస్మరణకు గురి అయిన మాండలిక భాష జవసత్వాలను వ్యవహారిక భాషకు భిన్నంగా సాహితీ యవనిక పై నిలిపేందుకు దళిత భాష కొత్త పుంతలు తొక్కేందుకు దారులు వేసి ఎంతో గొప్ప మేలు చేశారు.
నేను డాక్టర్ బన్న ఐలయ్య గారితో రెండు దశాబ్దాల కాలంలో ఓ నాలుగు సార్లు కలిసా. నేను వారిని రెండు దశాబ్దాలకు పైగా గా ఎరుగుదును వారి గురించి వేముల ఎల్లన్నకు నాకు మధ్య సాహిత్య చర్చ జరిగిన సార్ గురించి ప్రస్తావించేవారు అలా వారు నాకు గుర్తుండిపోయారు కొన్నిసార్లు ఫోన్లో పలకరించాను అంత పెద్దాయన తన పనులు పక్కన పెట్టి మరి నాతో మాట్లాడడానికి టైం కేటాయించేవారు నేను నన్ను గురించి తెలుపుకుంటూ సాహిత్యానికి సంబంధించి వారితో చర్చించేవాడిని.సార్ ఇచ్చిన కాసింత చనువును సద్వినియోగం చేసుకున్నాను వారితో ఫోన్లో పలకరింపు మాత్రమే అప్పటికే వారు నన్ను గురించి విన్నారు నా సాహిత్యాన్ని చదివి ఉన్నారు “సూర” దళిత నవల వారి దృష్టిని ఆకర్షించింది దాని స్థానాన్ని పదుల పరుస్తూ 2012-13లో కాకతీయ యూనివర్సిటీలో పి.జి . తెలుగు లో పాఠ్యాంశంగా చేర్చారు అంతకంటే నా జీవితంలో నేను పొందిన గొప్ప అవార్డు మరొకటి లేదు అలా వారికి నేను ఆత్మీయుడినయ్యా. 
   నేను రాసిన “మాలవారి చరిత్ర” పుస్తక ఆవిష్కరణకు నల్లగొండకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాను వారు సహృదయంతో వస్తానన్నారు అన్నమాట ప్రకారం నల్లగొండకు వచ్చారు అంబేత్కర్ జయంతి రోజున 14/4/2017 నల్లగొండ లో నా మాలవారి చరిత్ర ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమం లో సార్ తో పాటుగ నల్లగొండ జిల్లా కు చెందిన ప్రముఖ కవులు వేముల ఎల్లయ్య, వేణు సంకోజు, గాయకులు పైలం సంతోష్ పాల్గొన్నారు. “మాలవారి చరిత్ర ” పుస్తక ఆవిష్కరణ సభ లో డా. బన్న అయిలయ్య మాట్లాడుతూ ” దేశాన్ని సామాజికత వైపు నడిపించిన సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ అని, అంబేత్కర్ భావజాలంతో వారి అడుగుజాడలో భూతం ముత్యాలు మాలవారి చరిత్ర ఆవిష్కరణ చేయడం ఒక చారిత్రక సంఘటన అని చెప్పుకోవచ్చు . దళిత, గిరిజనజాతి ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉండి ఎవరైతే మేము గొప్ప సంస్కృతి కలిగిన కులాలం అని చెప్పుకుంటున్న ఆధిపత్య వర్గాలకు దీటుగా మాల మాదిగ కులాలు తమ తమ జాతి చరిత్రలను రాసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఆ క్రమంలోనే భూతం ముత్యాలు మాలవారి చరిత్ర గ్రంథం తీసుకురావడం శుభ పరిణామం వారికి శుభాకాంక్షలు అంటూ సార్ నాకు కితాభిచారు . ఆరోజు సార్ ని మా ఇంటికి సాదరంగా ఆహ్వానించు డాక్టర్ బన్న ఐలయ్య సార్ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించారు ఆ రాత్రి సార్ కోసం నేను చొరవ తీసుకొని బురద మట్ట చేపల కూర మా శ్రీమతి చే చేయించా ను సార్ సంతృప్తిగా భోంచేసి మెచ్చుకోలుగా ఆశీస్సులు ఇస్తూ రాత్రి తిరిగి వరంగల్ వెళ్లిపోయారు అప్పుడప్పుడు ఫోన్లో పలకరింపులు.        
          గత సంవత్సరం సెప్టెంబర్ 20న భూతం ముత్యాలు ఆత్మకథ ” సూరీడు ” షార్ట్ మూవీకి ప్రత్యేక ఆహ్వానితులుగా నేను ఆహ్వానించిన వారు వేముల ఎల్లన్న డాక్టర్ బన్న ఐలయ్య సార్ డాక్టర్ కొలగలూరి ఆశాజ్యోతి మేడం. నా మిత్రుడు గ్యార నరసింహ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు ఆహ్వానించా. ఆరోజు ఉదయం 11 గంటలకల్లా అతిథులుగా విచ్చేసిన వారు డాక్టర్ శ్రీ బన్న ఐలయ్య గారు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి విచ్చేయగా మరియు శ్రీమతి డాక్టర్ కొలకలూరి ఆశాజ్యోతి బెంగళూరు యూనివర్సిటీ నుండి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు విచ్చేసినారు. షూటింగ్ ప్రారంభ వేడుకలో నన్ను గురించి వేదికపై సార్ మాట్లాడుతూ కవి రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భూతం ముత్యాలు అనే కవి ని ప్రసిద్ధ దళిత కవి వేముల ఎల్లయ్య చెక్కిన శిల్పం భూతం ముత్యాలు వారి నుండి మరిన్ని రచనలు రావాలని, కాకతీయ విశ్వవిద్యాలయంలో తానే స్వయంగా చొరవ తీసుకొని భూత ముత్యాలు సూర అనే నవలను పాఠ్యాంశంలో చేర్చానని డాక్టర్ బన్న ఐలయ్య గారు పేర్కొన్నారు. అలాగే ఆశాజ్యోతి గారు బెంగళూరు యూనివర్సిటీలో తెలంగాణ నుండి తెలుగు దళిత జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ భూతం ముత్యాలు రాసిన “సూర” అనే నవలను పాఠ్యాంశంగా చేర్చినట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు అలా రచయిత ముత్యాలు ను ప్రశంసిస్తూనే అతని రచనలను వివరిస్తూనే తెలంగాణ దళిత జీవితానికి ఉన్న గొప్పతనాన్ని వివరిస్తూ అలా దళితుల భాష దైనందిన సంస్కృతి సాంప్రదాయాలను రికార్డు చేస్తూ కథలు నవలలు తీసుకొస్తున్న భూతం ముత్యాలు ఒక గొప్ప రచయితగా స్లాగిస్తూ ఇరువురు భూతం ముత్యాలకు శుభ ఆశీస్సులతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ కక్క నవల రచయిత వేముల ఎల్లయ్య సైతం పాల్గొని నాకు అభినందనలు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ లింకా బుక్ ఆఫ్ రికార్డు శ్రీకర్త డాక్టర్ పి సి ఆదిత్య గారు హిట్ చిత్రాల దర్శకులు రేలంగి నరసింహ రావు గారు ముత్యాలు పై తొలి క్లాప్ ఇవ్వగా తెలుగు ప్రసిద్ధ సినీ నటులు తారాగణం పాల్గొన్నారు ఈ సందర్భంగా నా స్వీయ జీవిత ఆత్మకథ ఒక లేశ భాగం 55 నిమిషాల నిడివి కలిగిన “సూరీడు” సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీస్సులు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్న సందర్భం నా జీవితంలో ఓ మైలురాయి అలా బన్న ఐలయ్య సార్ తో రెండోసారి అతి రధ మహా రథుల ముందు ఒక మధుర జ్ఞాపకం.
అటు పిమ్మట అదే సంవత్సరం డిసెంబర్ 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ( ఖమ్మం జిల్లా మధిర కు చెందిన ఉపాధ్యాయ మిత్రులు వేము రాములు నా సాహిత్యం మీద మక్కువతో బ్లాక్ సిగ్నేచర్ పేరున పుస్తకం తీసుకువచ్చారు ) బ్లాక్ సిగ్నేచర్ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా డాక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ బన్న ఐలయ్య గారు, డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు హెచ్డి, డాక్టర్ జివి రత్నాకర్ మౌలానా ఉర్దూ యూనివర్సిటీ హిందీ హెచ్వోడి, తెలంగాణ ప్రఖ్యాత విమర్శకులు రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రముఖ రచయిత కోట్ల వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ గంజికుంట్ల రామారావు బ్లాక్ సిగ్నేచర్ పుస్తక రచయిత వేము రాములు కుటుంబ సమేతంగా పాల్గొనగా నేను సతీసమేతంగా ఇరువురం పాల్గొన్నాము భూతం ముత్యాలు సాహిత్యాన్ని కథ నవల వ్యాసం కవిత్వం మొత్తం పది వ్యాసాలు సద్విమర్శతో కూర్చి రాసిన వేము రాములు ఈ పుస్తకాన్ని డాక్టర్ బన్న ఐలయ్య సార్ కు అంకితం ఇచ్చారు వినమ్రతతో వారు రవీంద్ర భారతి హైదరాబాద్ వేదికగా బ్లాక్ సిగ్నేచర్ వ్యాస కృతిని స్వీకరించారు వచ్చిన వారందరూ బ్లాక్ సిగ్నేచర్ రచయితను అందులోని వస్తువుకు కారణమైన భూతముత్యాలు అనే నన్ను మెచ్చుకోలుగా ఆశీర్వచనాలు శుభాశీస్సులు పలికారు వారందరినీ నేను ఎరుగుదును వారితో నా సాహితీ ప్రయాణంలో చిరపరిచితులే వారందరూ
అలా మూడవసారి డాక్టర్ బన్న అయిలయ్య సార్ తో వేదిక పంచుకున్నాను వారితో నాకున్నా అనుబంధం విడదీయలేనిది వారికి నేను స్టూడెంట్ ని కాకపోయినా శిష్యుడుగానే భావిస్తున్నారు ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం అనే పూతోటమాలి అని నా అభిప్రాయం ఆయన చల్లని చూపుల కింద ఎందరో విద్యార్థులు పేజీలు పిహెచ్డీలు చేసి పట్టభద్రులు వివిధ హోదాలలో పనిచేస్తుండడం గమనార్హం 30 ఏళ్లకు పైన కళాశాల ఆచార్య వృత్తికే వన్నెలద్దినవారు. ఆయన సేవలు చిరస్మరణీయం ఆచార్యుని గానే కాక కవి రచయితగా ఎన్నో గ్రంథాలు వెలువరించి సాహితి పిపాసిగా వినతికెక్కారు నాకు నా నవల సాహిత్యానికి మీరు ఇచ్చిన గుర్తింపు ఎన్నటికీ తీరనిది ఇంతటి ఘనాపాటి అయిన డాక్టర్ బన్న ఐలయ్య సార్ కి నేనేమీ ఇవ్వగలను చంద్రునికో నూలుపోగు చందం ఎప్పటికీ ఆరిపోని వసివాడని అజరామరా నిప్పు కణిక మీరు. మీకివే నా ఈ అక్షరాల పాదాభిషేకం సమర్పించుకుంటున్నారు.

January 31, 2024 0 comment
7 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బండారు అచ్చమాంబ

by Radhika Suri January 31, 2024
written by Radhika Suri

   తొలి తెలుగు కథా ,స్త్రీ వాద రచయిత్రి.   కృష్ణా జిల్లా నందిగామ లోని  పెనుగంచిప్రోలు  గ్రామంలో, గంగమ్మ, వెంకటప్పయ్య దంపతులకు 1874లో జన్మించారు. తమ ఆరవ యేట తండ్రి మరణానంతరం నల్గొండ జిల్లా దేవరకొండలో నివసించే తమ సవతి సోదరులు కొమర్రాజు శంకర్రావు గారి వద్ద పెరిగారు.  మొట్టమొదటి ‘తెలుగు విజ్ఞాన సర్వసం’ సృష్టికర్త కొమర్రాజు వెేంకటలక్ష్మణ రావు వీరి సోదరులు.   మేనమామ బండారు మాధవ రావుతో వివాహానంతరం ఉద్యోగరీత్యా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో నివాసం ఉన్నారు. సంప్రదాయ భావాలున్న భర్త ఆమె చదువుకు నిరాకరించిన కారణం చేత తమ్ముడికి చదువు నేర్పే గురువు వద్ద చదువు నేర్చుకున్నారు. తెలుగు ,సంస్కృతం, మరాఠీ, హిందీ, గుజరాతి ,ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించి ఎన్నో అద్భుత గ్రంథాలు చదివారు. ఓరుగంటి సుందరి రత్నమాంబతో కలిసి 1902 లో మచిలీపట్నంలో ‘బృందావన స్త్రీల సమాజం’ పేరిట మొదటి మహిళా సంఘం ఏర్పాటు చేసి రాష్ట్రమంతా పర్యటించి మహిళా చైతన్యం కలిగించారు. మంచి వక్త , తమ అద్భుత ప్రసంగాలతో మహిళల్లోఎంతో  మార్పు తీసుకుని వచ్చారు.  సంగిశెట్టి  శ్రీనివాస్ గారుసంకలన పరిచి అచ్చమాంబ’ తొలి తెలుగు కథలు ‘పదింటిని అందుబాటులోకి తెచ్చారు. స్త్రీ చైతన్యం, విద్యాభివృద్ధి, సామాజిక పరివర్తనం, అభ్యుదయంగా కథలల్లిన వీరు గురజాడ గారి కన్నా దశాబ్దం ముందుగా రచనకు శ్రీకారం చుట్టారు. వీరి 10.కథలు :-

 1.గుణవతియగు  స్త్రీ :  తెలుగు జనాన పత్రిక ,1901 మే న ప్రచురితమైంది ‘దశకుమార చరిత్ర’ లోని కథకు ఆధునిక రూపం. పొదుపుతో కూడిన సంసారం కథాంశం.

2. లలితా శారదులు:  తెలుగు జనాన  1901 లో ప్రచురితం. భిన్న మనస్తత్వాలు గల ఇద్దరు స్నేహితురాళ్ళ కథ. సద్గుణ సంపన్నురాలైన శారద, లలితలో  మార్పు కోసం ప్రయత్నించడం.

3. జానకమ్మ : తెలుగు జనాన పత్రిక 1902 లో ప్రచురితం .స్త్రీ విద్యా ప్రాముఖ్యత ,ఆర్థిక అసమానతలు, సామాజిక ఇబ్బందులు ఉండవని తెలిపే కథ .

4.దంపతుల ప్రథమ కలహం: హిందూ సుందరి 1902  లో ప్రచురితం.అన్యోన్య దాంపత్యంపై సంభాషణా ధోరణిలో సాగుతుంది.

5. సత్పాత్ర దానము  :హిందూ సుందరి 1902 లో  ప్రచురితం.అంతా తెలంగాణ యాసలో సాగే కథ .భూస్వామ్య విధానం  – కౌలుదారీవ్యవస్థ  ఇతివృత్తం.

6 .స్త్రీ విద్య:

చదువు లేని మహిళ అజ్ఞానాంధకారాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటుందని ఓ పురుష పాత్ర ద్వారా చెప్పించడం ఇతివృత్తం.

7.ధన త్రయోదశి: హిందూ సుందరి 1902 లో ప్రచురితం. శాస్త్రాల్లో  స్త్రీ విద్యానిషేధాన్ని ఖండిస్తూ రాసిన కథ. ఉదాత్త గుణాలున్న దంపతులు స్వయం కృషితో ఎదిగినద వైనం వివరణ.

8. భార్యాభర్తల సంవాదము: హిందూ సుందరి 1903లో ప్రచురితం. దంపతుల సంవాద రూపంలో సాగే కథ. ఆభరణాల కన్నా సచ్చీలతే ప్రధానమని తెలిపడం.  9.అద్దమును,సత్యవతియు :హిందూ సుందరి 1903 లో ప్రచురితం.సత్యవతి అనే మూడేండ్ల చలాకి చిన్నారి పాత్ర .తన సరస సంభాషణ ద్వారా అద్దం లో ప్రతిబింబంగా జగత్తును చూపించడం.

10. బీద కుటుంబం :సావిత్రి 1904 లో ప్రచురితం. స్వయంకృషితో దారిద్ర్యాన్ని ఎలా జయించాలో ఉత్తమ పురుషలో సాగిన కథ.

   వీరి కథల్లో గ్రాంథిక పదాలున్నా,జటిల పదాలుండవు. సామాజిక ,ఆర్థిక, వ్యక్తిత్వ వికాస ధోరణిలో, నైతికవిలువలతో కూడిన రచనలు వీరి సొంతం.

తెలంగాణలో పెరిగి మహారాష్ట్రలో జీవనయానం చేశారు . ‘అబలాసచ్చరిత్రరత్నమాల’ పుస్తకంలో 1000 సంవత్సరాల మధ్య గల స్ఫూర్తి ప్రదాతలైన స్త్రీల జీవిత చరిత్రల్ని లిఖితం చేశారు. మూడు సంపుటాలుగా వెలువరించాలనుకున్నా, మొదటిది అబలాసచ్చరిత్ర రత్నమాల రాసి వినుతికెక్కారు. వీర, ధీరవనిత లపై వ్యాస సమాహారమిది. ఈ రచనతో ఎంతమంది ప్రేరణ పొందారు.  వేద, పురాణాల్లోని మహిళాఔన్నత్యంపై రెండవ, ఇతర దేశాల్లోని మహిళపై మూడవ సంపుటి వెలువరించాలనుకుని, ఎంతో శోధన చేసి, విశ్లేషించి రాయాలని తలచినా, అనారోగ్యం కారణం చేత  కుదరలేదు. స్త్రీ జనోద్ధరణ , చైతన్యం రచనాధ్యేయాలుగా సాగిన వీరు

సామాజిక సేవలో భాగంగా ప్లేగు వ్యాధిగ్రస్తుల సేవ చేస్తూ అదే వ్యాధిబారినపడి  మధ్యప్రదేశ్లోని బిలాస్పూర్ లో 1905 జనవరి 18న స్వర్గస్తులైనారు. అచ్చమాంబ గారు ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు వరాహ మిహిరుని భార్య ‘ఖణ ‘యొక్క ప్రతిభకు సరైన గుర్తింపు  దొరకలేదని భావించి, ఆధారాల్ని

సేకరించి ఆమె జీవితాన్ని వెలుగులోనికి తెచ్చారు. తొలి తెలుగు కథా రచయిత్రిగా చరిత్ర  పుటల్లో సువర్ణాక్షరాల్తో లిఖించబడ్డ వీరిని స్మరించుకోవడం తెలుగువారి ముఖ్య కర్తవ్యం.   

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సకలజనాదర్శం – గాంధీమార్గం

by Nellutla Sandhya January 31, 2024
written by Nellutla Sandhya

యుగానికో యుగపురుషుడు ఉద్భవిస్తాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో బుద్ధుడు, యేసు. వారితో సరిసమాన స్థాయిని సంపాదించుకున్నవాడు గాంధీజీ.
గాంధీ గుజరాత్‌ లోని పోర్‌ బందర్‌ లో 1869 అక్టోబర్‌ 2న కరంచంద్‌ పుత్లీబాయిల బిడ్డగా జన్మించాడు. ప్రాథమిక విద్య రాజకోటలో పూర్తి చేసి న్యాయ శాస్త్ర విద్యనభ్యసించడానికి బ్రిటన్‌ వెళ్ళాడు. వకీలు వృత్తి కొనసాగించడానికి దక్షిణాఫ్రికా వెళ్ళాడు. దక్షిణాఫ్రికాలో అక్కడి ప్రజల చేతుల్లో భారతీయులు అనుభవించే అన్యాయాలు, అక్రమాలు, జాతి వివక్షత హీనస్థితి చూచి చలించి ఆందోళన సాగించాడు. దక్షిణాఫ్రికాకు వలస వెళ్ళినవారికి ఓటు హక్కు లేదు. వారికోసం నిర్దేశించిన స్థలాల్లో తప్ప వేరే నివసించడానికి వీలు లేదు. ఈ దారుణ పరిస్థితులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడిపాడు. గాంధీజీ 1893-94 మధ్య జాత్యహంకారాలకు అధికార మదాంధులకు వ్యతిరేకంగా అహింసాయుతంగా పోరాడాడు.
సత్యం, అహింసలే అతని ఆయుధాలు. చెడును ప్రతిఘటిస్తూనే చెడు చేసే వాణ్ణి ప్రేమించేవాడు. నిజమైన సత్యాగ్రహికి ద్వేషించడమనేది అతని నైజానికే విరుద్ధం. గాంధీజీ నిర్భయుడు. ఎన్ని కష్టాలెదురైనా చెడు ముందు తలవంచడు. ఆయన దృష్టిలో అహింస అనేది బలహీనుల, భీరువుల ఆయుధం కాదు, ధైర్యవంతులు, శక్తివంతులు మాత్రమే దాన్ని ఆచరించగలరు అని చెప్పేవాడు. 1920లో యంగ్‌ ఇండియా అనే తన వారపత్రికలో ”పిరికితనం కంటె చావు మేలు” అంటూ అహింస గురించి ఒక అద్భుతమైన వ్యాసం వ్రాశాడు. ”హింస మృగానికి ధర్మమైనట్లుగా అహింస మనిషి యొక్క ధర్మం” అంటారు గాంధీజీ. ”బలప్రయోగాలతో ఒకదాన్ని సాధించవలసి వస్తె నేను బలప్రయోగానికే అనుకూలం” అన్నారు. భారతదేశం తన అవమానాన్ని పిరికితనంతో నిస్సహాయంగా చూస్తూ కూర్చోవడం కన్నా తన గౌరవ రక్షణకు ఆయుధం పట్టడం మేలన్నాడు గాంధీజీ. ”నాకు మానవాతీత శక్తులు అక్కరలేదు, ధర్మం, సత్యం, అహింసలే నా ఆయుధాలు” అన్నారు బాపూజీ. తన సిద్ధాంతాన్ని ఆచరణ నుండి, విశ్వాసాన్ని కార్యాచరణ నుండి వేరు చేయడు. అది గాంధీజీ దృక్పథంలోని ముఖ్య లక్షణం.

1915లో తన 46వ ఏట గాంధీజీ ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయంతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. తన కార్యక్షేత్రాన్ని నిర్ణయించుకోబోయె ముందు దేశ పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. 1916 అహ్మదాబాదులో సబర్మతీ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. రాజకీయాలకు అతీతంగా విశ్వమానవ కళ్యాణానికి ప్రాముఖ్యతనిచ్చి ఈ ఆశ్రమాన్ని నడపాలని నిర్ణయించాడు. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, స్వశక్తి పైన జీవించడం అనేవి ఆశ్రమవాసులు విధిగా ఆచరించాలి. ఈ సిద్ధాంతాలు పాటించేవారు మాత్రమే ఆశ్రమంలో నివసించడానికి అర్హులు. 1917లో మొట్టమొదట తన మహత్తర సత్యాగ్రహ ఆయుధాన్ని బీహార్‌ లోని చంపారన్‌ జిల్లాలో ప్రయోగించాడు. ఆ జిల్లాలో నీలిమందు తయారు చేసే రైతాంగం యూరోపియన్‌ తోటల యాజమాన్యంతో తీవ్ర హింసా పీడనలకు గురవుతుంది. పండించిన నీలిమందును వాళ్ళు నిర్ణయించిన ధరకే అమ్మాలని రైతులపై ఒత్తిడి తెచ్చారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో నిర్వహించిన సత్యాగ్రహోద్యమాన్ని గురించి విన్న చంపారన్‌ రైతులు గాంధీజీని తమకు తోడ్పడమని అర్థించారు. బాబు రాజేంద్రప్రసాద్‌, మజర్‌-ఉల్‌-హక్‌, కృపలాని, మహదేవ్‌ దేశాయ్‌ లతో కలిసి గాంధీజీ 1917లో చంపారన్‌ చేరుకొని రైతాంగ స్థితిగతులను గురించి సంపూర్ణ సర్వేక్షణ జరిపాడు. ఆయన రాకకి ఆగ్రహించిన జిల్లా అధికారులు గాంధీజీని చంపారన్‌ ను విడిచి వెళ్ళమని ఆదేశించారు. వారి ఆదేశాన్ని ధిక్కరించి కారాగార శిక్షను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు.
దాంతో అధికార్లు ఉత్తర్వును రద్దు చేసుకొని ఒక విచారణ సంఘాన్ని నియమించారు. అందులో గాంధీజీ సభ్యుడు. అంతిమంగా రైతులు తమ బాధలనుండి బైట పడ్డారు. ఇది గాంధీజీ తన సత్యాగ్రహ సమరంలో సాధించిన తొలి విజయం.
1918లో మిల్లు కార్మికులకు యజమానులకు మధ్య ఏర్పడిన ఒక వివాదంలో గాంధీజీ జోక్యం కల్పించుకున్నాడు. ఉభయ వర్గాల మధ్య రాజీ కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు.
వాస్తవానికి సామాన్య ప్రజల జీవితంలో తన జీవితాన్ని జీవన సరళిని మమేకం చేసిన మొట్టమొదటి భారత జాతీయ నాయకుడు గాంధీజీ. అనతికాలంలోనే ఆయన దరిద్ర భారతదేశానికి, జాతీయ స్ఫూర్తివంతమైన భారతదేశానికి, ఎదురుతిరిగే భారతదేశానికి ప్రతీక అయ్యాడు. గాంధీజీకి అత్యంత ప్రియమైనవి మూడు అంశాలు. మొదటిది హిందూ ముస్లిం ఐక్యత, రెండవది అస్పృశ్యతా వ్యతిరేక పోరాటం, మూడవది భారత మహిళా సామాజిక హోదా పెంపుదల. ఆయన నిష్టాపరుడైన హిందువు. ఆయన సాంస్కృతిక మత దృక్పథం విశ్వజనీనమైందే గాని సంకుచితమైనది కాదు. భారతీయ సంస్కృతి అన్నింటి సమ్మేళనం. ”సకల దేశాల సంస్కృతి వాయువులు నా ఇంట స్వేచ్ఛగా వీచాలనే నా కోరిక అంతేగాని అవి నన్న పెకలించి తీసుకుపోవడానికి నేను వ్యతిరేకిని. ఇతరుల కడ బానిసగా బ్రతుకడానికి నేను నిరాకరిస్తాను” అంటారు గాంధీజీ. ఇతర జాతీయ వాదుల వలెనే రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకించాడు. 1919 ఫిబ్రవరిలో ఆయన సత్యాగ్రహ సభను రౌలట్‌ చట్టాన్ని ధిక్కరించడానికి స్థాపించాడు. దీంతో ఒక నూతన పోరాట పద్ధతి మొదలయింది. పెద్ద పెద్ద సభలు, ప్రదర్శనలు, ప్రభుత్వంతో సహాయ నిరాకరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ లేదా వ్యక్తిగత టెర్రరిస్టు చర్యలు మాత్రమే అప్పటివరకు జాతీయవాదులకు తెలిసిన రాజకీయ కార్యాచరణ రూపాలు. సత్యాగ్రహం వెంటనే ఉద్యమాన్ని ఒక నూతన, ఉన్నత స్థాయికి కొనిపోయింది.
1919 మార్చి ఏప్రిల్‌ ల్లో భారతదేశంలో ఒక అపూర్వ రాజకీయ జాగృతి కానవచ్చింది. ఏప్రిల్‌ 6న బ్రహ్మాండమైన హర్తాళ్‌ కు పిలుపిచ్చాడు గాంధీజీ. ఆ పిలుపుకి ప్రజలు అపూర్వ ఉత్సాహంతో కదలివచ్చారు. ప్రజలకు ప్రియతమ నాయకులైన డా|| సైఫుద్దిన్‌ కిచ్లూ, డా|| సత్యపాల్‌ అరెస్టు నిరసనగా అమృత్‌ సర్‌ జలియన్‌ వాలాబాగ్‌ లో 1919 ఏప్రిల్‌ 13న నిరాయుధులైన ఒక బ్రహ్మాండమైన జన సందోహం గుమిగూడారు. డయ్యర్‌ దురంతంతో వేలాది మంది మరణించారు, గాయపడ్డారు. 1919-22 ఖిలాఫత్‌ ఉద్యమంతో జాతీయోద్యమంతో క్రొత్త స్రవంతి వచ్చి కలిసింది. గాంధీజీ ఖిలాఫత్‌ ఆందోళనని నూరేళ్ళకైనా కలగని హిందూ ముస్లిం ఐక్యతకు అవకాశంగా భావించాడు. ఖిలాఫత్‌ ఉద్యమ నాయకుల్లో ఒకడయ్యాడు గాంధీజీ.
1920లో బాలగంగాధర తిలక్‌ మరణం కాంగ్రెస్‌ సంస్థకు ఒక దెబ్బ. ఆయన స్థానాన్ని గాంధీజీ, చిత్తరంజన్‌ దాస్‌, మోతీలాల్‌ నెహ్రూ భర్తీ చేశారు. పత్రికా స్వాతంత్య్రం మీద బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్బంధాలు సడలని పక్షంలో తాను బ్రహ్మాండమైన ప్రజా సత్యాగ్రహోద్యమాన్ని ప్రారంభించ గలనని గాంధీజీ 1922 ఫిబ్రవరి 1న ప్రకటించాడు. 1922 మార్చి 10న గాంధీజీ అరెస్టు అయ్యారు. ఆయనకు ఆరు సం||రాలు కారాగార శిక్ష పడింది. కోర్టులో గాంధీజీ ఇచ్చిన ఒక ప్రకటన చరిత్రను సృష్టించింది. ప్రాసిక్యూషన్‌ వారి అభియోగానికి సమాధానంగా దోషినని ఒప్పుకొంటూ చట్ట ప్రకారంగా వీలయినంత కఠినాతి కఠినమైన శిక్షను విధించ వలసిందిగా కోర్టు వారిని అభ్యర్థించాడు. ”చట్టం దృష్టిలో బుద్ధిపూర్వకమైన నేరం, నా దృష్టిలో ఒక పౌరుని ఉత్తమోత్తమమైన ధర్మంగా గోచరిస్తుంది” అని అన్నాడాయన. ”మంచికి సహకారం ఇవ్వటం ధర్మమైనట్లే చెడుతో సహాయ నిరాకరణ పాటించటం అంతే ధర్మం” అని గాంధీజీ కోర్టులో తన ప్రసంగాన్ని ముగించాడు.
శాసన సభల్ని ఉపయోగించుకొని ప్రజల్లో ఉత్సాహాన్ని దీపింపజేయాలని చిత్తరంజన్‌ దాస్‌, మోతీలాల్‌ నెహ్రూ కోరారు.
మార్పులు కోరని పక్షంగా అభివర్ణింపబడ్డ సర్ధార్‌ వల్లభాయి పటేల్‌, డా|| అన్సారీ, బాబు రాజేంద్రప్రసాద్‌ ప్రభృతులు శాసనసభలో పునఃప్రవేశానికి ప్రతిఘటించారు. శాసనసభ రాజకీయాలు జాతీయావేశాన్ని నిర్వీర్యపరుస్తాయని, నాయకుల మధ్య స్పర్థలు సృష్టిస్తాయని వారు హెచ్చరించారు. కాబట్టి నూలు వడకడం స్వయంపోషణ, ముస్లిం-హిందూ ఐక్యత, అస్పృశ్యతా నిర్మూలనం వగైరా నిర్మాణాత్మక కార్యక్రమాలకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. భిన్నాభిప్రాయాలు భిన్న వ్యక్తిత్వాలు వున్న వ్యక్తులతో ఏకత్వం సాధించి అందరిని ఒకే గొడుగు క్రింద నడిపించిన విశిష్ట వ్యక్తిత్వం కల నాయకుడు గాంధీజీ.
1924లో ఫిబ్రవరి 5వ ఆరోగ్య కారణాల వల్ల విడుదలైన గాంధీజీ ఉభయ పక్షాలను ఐక్యపరచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1924 సెప్టెంబర్‌లో హిందూ ముస్లిం ఐక్యతకై మళ్ళీ ఢిల్లీలోని మౌలానా మహ్మదాలీ గృహంలో 21 రోజుల పాటు ఉపవాసం చేసాడు. అయినా ఫలితం కన్పించలేదు. ఇక గాంధీజీ అన్ని చాలించుకొని ఏకాంతవాసం చేయసాగాడు.
1927లో ఉద్యమం ఊపందుకొంది. 1928లో రైతాంగంలో, కార్మికుల్లో కదలిక ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌ లో కౌల్దారి చట్టాల సవరణ గురించి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. భూమిశిస్తు పెంపుదలకు వ్యతిరేకంగా ప్రతిఘటించారు. ఈ సమయంలోనే సుప్రసిద్ధ బార్డోలి సత్యాగ్రహం జరిగింది. 1928లో అనేక సమ్మెలు జరిగాయి. సం||రం మొత్తంలో 5 లక్షల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న సైమన్‌ కమీషన్‌ బొంబాయి చేరింది. కమీషన్‌ సభ్యులు ఎక్కడికి వెళ్ళినా హర్తాళ్ళు, నల్ల జెండాల ప్రదర్శనలు ఎదురయ్యాయి. సైమన్‌ గోబ్యాక్‌ అనే నినాదాలు మిన్ను ముట్టాయి. పోలీసులు విశృంఖలంగా దాడి చేశారు. సైమన్‌ కమీషన్‌ కు వ్యతిరేక ఉద్యమం వెంటనే ఒక విస్తృత రాజకీయ పోరాటానికి దారి తీయలేదు. ఎందుకంటే జాతీయోద్యమానికి ఎదురులేని నాయకుడు గాంధీజీ ఎటూ తేల్చుకోలేదు. పోరాటానికి సమయం ఆసన్నమైందని నమ్మకం కలుగలేదు. కాని దేశంలో మరోసారి పోరాట మనస్తత్వం పెంపొందింది. ప్రజల ఉత్సాహావేశాల్ని అదిమిపెట్టి వుంచడం అసాధ్యమని తేలింది.
1928 డిసెంబర్లో మళ్ళీ క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించాడు గాంధీజీ. 1930 జనవరి 26 ప్రప్రథమంగా స్వాతంత్య్ర దినంగా నిర్ణయింపబడింది. బ్రిటిష్‌ పాలనకు ఇంకా లొంగి వుండడం మానవునికి దేవునికి అపచారం అని ప్రమాణం చేస్తూ ప్రజలంతా ఆరోజున పూర్ణ స్వరాజ్య జయంతిని జరుపుకున్నారు. ఇది నెహ్రూజీ ఆధ్వర్యాన జరిగింది.
మళ్ళీ మరోసారి గాంధీజీ నాయకత్వాన జాతీయోద్యమం ప్రభుత్వంతో తలపడింది. 1930 మార్చి 12న చరిత్ర ప్రసిద్ధమైన దండియాత్రలో రెండవ సత్యాగ్రహం సమరానికి నాంది పలికాడు. ఇదే భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధికెక్కింది. గాంధీజీ తాను ఎంపిక చేసుకున్న 72 మందితో 200 మైళ్ళు బయలుదేరి గుజరాత్‌ సముద్రతీరంలో ఉన్న దండి గ్రామానికి చేరుకున్నారు. ఉప్పు చట్టాల్ని ఉల్లంఘించి ఉప్పు తయారు చేశారు. నిరాకరణ చర్యకు ప్రతీకగా.
”భారతదేశంలో బ్రిటిష్‌ పాలన ఈ మహత్తర దేశాన్ని నైతికంగా, భౌతికంగా, సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా భ్రష్టం చేసింది. ఈ పాలనని నేను పీడగా పరిగణిస్తాను. ఈ ప్రభుత్వ వ్యవస్థను అంతం చేయడానికి నడుం కట్టాం. రాజద్రోహం ఇప్పుడు నా మతం. మాది అహింసాయుత సమరం. మేము ఎవరిని చంపం. కాని ఈ ప్రభుత్వం యొక్క పీడను తుడిచి పెట్టడం మా ధర్మం” అంటూ గాంధీజీ ప్రకటించాడు.
గాంధీజీతో పాటు ఇతర కాంగ్రెసు నాయకులను 90,000 సత్యాగ్రహుల్ని ప్రభుత్వం జైళ్ళలో నెట్టింది. గాంధీ టోపిని పెట్టిన వారిని పోలీసులు చావబాదారు. చివరకు 1931 మార్చిలో లార్డ్‌ ఇర్విన్‌ గాంధీజీలు పరస్పరం సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందం మూలంగా ప్రభుత్వం రాజకీయ ఖైదీలందర్ని విడుదల చేసింది.
1931లో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనడానికి ఇంగ్లాండ్‌ వెళ్లాడు గాంధీజీ. ఆ సమావేశం విఫలమైంది. 1942లో సర్‌ స్టాఫర్డ్స్‌ క్రిప్స్‌ ఆధ్వర్యంలో ఒక రాయబారాన్ని ఇండియాకు పంపాడు. సాధ్యమయినంత సత్వర స్వపరిపాలన ప్రసాదించడమేనని నచ్చచెప్పాడు. కాని ఆయనకు కాంగ్రెసు నాయకులకు మధ్య నడిచిన సమగ్ర సంప్రదింపులు విఫలమయ్యాయి. తిరిగి 1942 ఆగస్టు 8న బొంబాయి సమావేశంలో చరిత్ర సుప్రసిద్ధమైన క్విట్‌ ఇండియా తీర్మానం ఆమోదించ బడింది. గాంధీజీ నాయకత్వాన ఒక అహింసాయుత ప్రజా పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయం జరిగింది. ఈ తిరుగుబాటులో 10,000 మంది మరణించారు.
1946 ఆగస్టులోను, ఆ తరువాత ప్రజ్వరిల్లిన మత కలహాగ్నులలో స్వాతంత్య్రం రానున్నదన్న ఉత్సాహం కాలి బూడిదైపోయింది. దాంతో గాంధీజీ విచారంలో మునిగిపోయాడు. మత దురావేశాలకు వ్యతిరేకంగా విఫల పోరాటం జరిగింది.
1947 మార్చిలో భారత వైస్రాయిగా వచ్చిన లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ కాంగ్రెస్‌ ముస్లిం లీగ్‌ నాయకుల్తో మాట్లాడి ఒక రాజీ పథకం రూపొందించాడు. దాంతో దేశం స్వతంత్రమవుతుంది కానీ, సమైక్యంగా ఉండదు. హిందూ ముస్లిం విభజన పోరాటం వల్ల 1947 జూన్‌ 3వ తేదీన భారత్‌, పాకిస్తాన్‌ స్వతంత్ర దేశాలుగా అవతరిస్తాయని ప్రకటన వెలువడింది. దేశాలు విడిపోవడం వల్ల లక్షలాది మంది శరణార్థులై ఇక్కడి వారక్కడికి అక్కడి వారిక్కడికి వరదెత్తుతున్నారు.
1947 ఆగస్టు 15న భారతదేశం తన తొలి స్వాతంత్య్ర దినోత్సవం ఆనందోత్సాహాలతో జరుపుకున్నది. జాతీయ మహోత్సవంలో విషాదానికి ప్రతీకగా గాంధీజీ శోకమూర్తిగా మిగిలాడు. భారత ప్రజలకు సత్యం, అహింస, ప్రేమ, ధైర్యం ప్రబోధించిన మహాత్ముడు, భారతీయ సంస్కృతిలో సర్వోత్కృష్టమైన ప్రత్యంశానికి సంకేతమైన మహాత్ముడు కృంగిపోయాడు. అర్థంలేని మత మారణహోమం ద్వారా స్వాతంత్య్రానికి మూల్యం చెల్లించే అశేష బాధిత ప్రజల్ని ఓదారుస్తూ బెంగాల్‌ లో పాదయాత్ర చేశాడు. ఉత్సవ ఉత్సాహపు కేకలు, కేరింతలు ఇంకా ముగియక ముందే 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చి చంపాడు. గాంధీజీ తన యావజ్జీవితాన్ని అంకితం చేసిన హిందూ ముస్లిం ఐక్యతాదర్శ సాధనలో వీరమరణం పొందారు.
ఆయన సిద్ధాంతాలను దేశం, ప్రపంచం నలుమూలలా విస్తరింపజేసి సత్యం, అహింస, శాంతి, ధర్మమార్గాలను మనకు చూపిన ఆదర్శమూర్తి బాపూజీ. జాతికే తండ్రియైనాడు. నిర్మల నిష్కళంక నిరాడంబర మహా మనీషి బాపూజీ.

సకల జనులకు ఆదర్శం గాంధీ చూపిన మార్గం. అతడు ప్రపంచమంతటికి చిరస్మరణీయుడు. కనుకనే అతని జన్మదినాన్ని ప్రపంచమంత చిరస్మరణీయుడు. కనుకనే అతని జన్మదినాన్ని ప్రపంచమంత అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. అతడు చూపిన మార్గంలో పయనించి ప్రపంచంలో శాంతి, ధర్మం, సత్యం, అహింస సిద్ధాంతాలను నెలకొల్పడమే ఆ మహాత్మునికి మనం ఇచ్చే నివాళి.

జై హింద్‌

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అరటాకు

by Radhika Suri January 30, 2024
written by Radhika Suri

పచ్చని వన్నెలో కోమలపు
మేని మెరుపులతో
అలరించే ముచ్చటైన పత్ర విశేషం
మంచిగంధపు వాసనలతోకూడి
అన్నానికి రుచిని పెంచే
అమృత పత్రం
తెలుగు లోగిళ్ళ విందుల్లో
విరాజమానపు హరిత దళం
అందంగా అమరిన వడ్డింపుల
సమాహారపు కళాత్మక నిండువిస్తరి

సనాతన భారతావనిలో లిపిసాధనమై మెరిసి
మాలికలు తోరణాలుగా
రూపం మారుస్తూ
పండుగలు పబ్బాలలో
అలంకారమై ఒప్పే అందమైన
శుభసూచక చిత్రపర్ణిక
పర్యావరణ పరిరక్షణా
నేస్తపు పత్రిగా
మెండైనఔషధ విలువలతో
స్వస్థత నిచ్చేఆరోగ్యప్రదాయిని
భగవంతుని ప్రసాద నివేదనకై
యోగ్యత పొందిన
పళ్ళెరమై భాసిస్తున్న
ప్రత్యామ్నాయమెరుగని
విశేషపు పత్రరాజం

January 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఎలుకల  బోను

by Padmavathi Neelam Raju January 30, 2024
written by Padmavathi Neelam Raju

మూలం: The Rattrap
AUTHOR: Selma Lagerlof
స్వేచ్చాను వాదం: పద్మావతి నీలంరాజు

……………………….  

నేను నా కధ నే చెప్పుకోవాడానికి మీ ముందుకొచ్చాను. నా కేమి పేరు లేదు. ఇల్లు లేదు. నేనొక తిరుగుబోతుని. మరోలా అర్ధం చేసుకోకండి. నా పొట్టను నింపుకోవడం కోసం ఊరూరూ తిరిగే ఒక బిచ్చగాడిని. నాకీ సమాజంలో ఏ  విలువలేదు. నేను నేనే. స్విట్జార్లాండ్ లోని గనుల ప్రాంతాలలో తిరుగుతుంటాను. అడుక్కొన్నప్పుడు వచ్చిన డబ్బులతో ఎలుకల బోనులు కొన్నింటిని కొని అమ్ముతుంటాను. అలా అని నేనేమి వ్యాపారవేత్తని కాదు. ఎలుకల బోనులను అమ్ముకోవడం నా కున్న గుర్తింపు. ఆ నెపంతో ఊళ్ళు తిరుగుతూ ఉంటాను. కొన్ని సార్లు చిల్లర దొంగతనాలు కూడా చేస్తుంటాను. నన్ను చూసిన వాళ్ళెవ్వరు ఒక్క నిముషం కూడా వాళ్ళ ముందు నిలుచోనివ్వరూ. నన్ను చూస్తూనే చీదరించుకుంటారు. వారి వాకిట్లోనుండి తరిమేస్తుంటారు. ఒక్కో రోజు నాకు వీధి కొళాయి నీళ్ళే  గతి. అంత చలిలోనూ రోడ్డు పక్కనే నా మకాం.  అందుకే నన్ను నేను ఒక బిచ్చగాడిలాగా,చిల్లర దొంగ లాగ, ఎలుకల బోను లను అమ్ముతూ తిరిగే వాడి లాగ పరిచయం చేసుకున్నాను.  
 కానీ, నా గురించి ఒక నిజం మీకు చెప్పాలి. నా జీవితం నాకెన్నో పాఠాలు నేర్పుతుంది. కానీ వాటన్నిటికంటే ఎత్తున పెట్ట గలిగే ఒక “సత్యం”నా జీవితాన్నే మార్చేసింది. నేనంత చదువుకొన్న మేధావిని కాదు. నా ఈ ఎలుకల బోనులే నాకేదో  జీవిత సత్యాన్ని చెపుతున్నట్లనిపిస్తుంది.   వాటిని చూస్తుంటే ఒక విచిత్రమయిన భావన నా మదిలోమెదులుతుంటుంది.  ఈ ప్రపంచం ఒక పెద్ద ఎలకలబోనని. ఈ మడుసులంతా  ఎలుక ల్లాటి వారనీ. ఇందులో ఎలుకని  బట్టి ఎర ఈ బోనులో పెట్ట బడుతుంది. ఆ ఎర కోసం ఆశపడి  లోపలకు పోయిన ఎలుక  అక్కడే శాశ్వతంగ బందీ అయిపోతుంది. ఈ మడుసులు అంతే! ఎదో ఆశ.ఆకర్షణ . ఇలాటివేవీ  లేని నాలాటివాడికి  కూడు, గుడ్డ అనే ఆశను చూపెడుతుంది; అన్ని ఉన్న వాడికి అందం, ఆనందం,సుఖం ఐశ్వర్యం లాంటి ఆశలను రేకెత్తిస్తూ ఆకర్షిస్తుంటుంది ఈ పెపంచకం తన లోకి. పిచ్చి మనిసి!  తనెలాంటి బోనులోకి దూరుతున్నాడో తెలుసుకోలేడు. లోలోపలికి పోతూనే ఉంటాడు. అక్కడే ఇర్రుక్కు పోతాడు. బయటికి రావాలన్న ఆలోచనే కలగదు. ఆ ఆశల మాయ నుండి బయటకు రావాలనే ప్రయత్నం కూడా చేయడు. ఇదే జీవన సత్యం. నేను కూడా కూడు గుడ్డ కోసం వెతుకుతూ  ఈ బోనులోనే  తిరిగాడు తుంటాను ఒక ఎలక పిల్ల లాగ!

                                  ***********************

ఆ రోజు  సాయంత్రం అయిపొయింది. చాలా చల్లటి వాతావరణం. తిరిగి తిరిగి అలిసి పోయిన నేను ఒక మైనింగ్ గ్రామ శివార్లలోకి చేరుకున్నాను. ఆ ఊళ్లోని వాళ్లెవరు నాకు ఒక్క బ్రెడ్ ముక్క వేయలేదు. రాత్రి అవుతున్నది. చలి బాగా పెరిగింది. చివరి ప్రయత్నంగ ఆ గ్రామ శివారులో ఉన్న ఒక పెంకుటి పంచముందు నిలుచున్నాను. ధైర్యం చేసి తలుపు తట్టాను. ఒక పెద్దాయన తలుపు తెరిచాడు.
“ఎవరు?”
“అయ్యా ! నేనెవరయితే ఏముంది. ఈ రాత్రికి మీ పంచన నాకు తల దాచుకోవడానికి అనుమతిస్తారా?”ఎంతో వినయంగా అడిగాను.
“అయ్యో ! అదెంత భాగ్యం!లోపలకి రండి.”అంటూ ఎంతో ఆప్యాయంగా నన్ను లోపలకు ఆహ్వానించాడు.
ఈ సారి ఆశ్చర్యపోవడం నావంతయింది. ఎందుకంటే నన్నందరూ చీదరించుకొని తరిమేసే వాళ్లే.
“ధన్యవాదములు,”అంటూ లోపలకి ప్రవేశించాను. ఆ ఇంటికి ఒక ప్రవేశ ద్వారము , వెనక గోడకు ఊచలు లేని కిటికీ  ఉన్నాయి. మొత్తమంతా ఒకటే గది. ఒక పక్క వంట సామగ్రి తో పాటు ఒక పొయ్యి మండుతూ ఆ గది ని వెచ్చగా  ఉంచుతున్నది.
“చాలా  చలిలో వచ్చినట్లున్నారు,”అంటూ నాకు ఎంతో సాదరంగ బ్రెడ్ సూపు ఇచ్చాడు తాగడానికి.  నాకింకా నమ్మకం కలగడం లేదు. నన్నిలా ఆదరించే మనిసి ఈయనేనా అని.
“భగవంతుడా! నువ్వున్నావు. ఇంకా మానవత్వం,” అని నాలో నేనే అనుకొన్నాను.
 “చూడండి! మీ పేరేమిటో నాకు తెలియదు. మీరెవరో ఎక్కడనించి వచ్చారో నాకు తెలియదు. అయినా  ఈ ఒంటరి బతుకులో , ఈ నిడి  రాత్రి లో నాకోసం ఆ ప్రభువు పంపిన అతిధిగ భావిస్తున్నాను. నాకు కూడు గుడ్డకి   లోటు లేదు. నేనొక ఇనుప కర్మాగారంలో పని చేశాను. పెద్దవాడనవటం చేత పనిచేయలేక మానేసాను. ఆ వచ్చిన డబ్బుతో ఒక ఆవు ను కొనుక్కున్నాను. ఆ  ఆవే  నన్ను పోషిస్తుంది. నాకు ఖర్చులకు పొగా  మిగిలిన కొద్దీ నార్లను (knorr- swiss currency) ఇలా ఈ తోలు సంచీలో భద్ర పరుచుకుంటాను.” అని నాకా తోలు సంచీని తెరిచి అందులో నలిగి ఉన్న ముప్పయి నార్ల (swiss knorrs)  విలువ చేసే మూడు నోట్లను చూపించి ఆ తోలు సంచీని తిరిగి ఆ గోడ కున్న మేకుకే తగిలించాడు.
నాతో కాసేపు మజోలి  (swiss cards game)  కూడా ఆడాడు. నాకు  ఒక పొగాకు చుట్టను కూడా ఇచ్చాడు తాగడానికి. ఆ రాత్రి అంతా  అతను నాకు చాలా  కబుర్లు తన గురించి చెప్పాడు. నేను మగతగా వింటూనే ఉన్నాను.
“చూడు! తెల్లవారుఝామున నేను ఆవు పాలు పితికి అమ్ముకోవడానికి వెళతాను. నువ్వు పడుకో. ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడే లేవచ్చు. ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడే వెళ్ళవచ్చు, సరేనా!  కానీ వెళ్లేముందు ఈ  తలుపువేసి  గొళ్ళెం తగిలించి వెళ్ళు.”అని చెప్పి  ఆ పెద్దాయన కూడా నిద్దర పోయాడు.
 ఆయన ఎప్పుడు లేచాడో తెలియదు కానీ నేను లేచేసరికి మాత్రం  లేడు. నేను లేచి నా  కాళ్ళు చేతులు సాగతీసుకొని బయటకు వచ్చి తలుపుకు  గొళ్ళెం పెట్టి, కొంత దూరం నడిచాను. నా మనస్సంతా   ఆ ముప్పయి నార్ల వైపే లాగుతున్నది. “ఆ ముసలాడు లేడు  కదా! నేనే తీశానని ఎవరికీ తెలుస్తుంది!” అనుకొంటూ ఆ ఇంటివైపుకి మళ్లాను. ఈ సారి మాత్రం నేను తలుపు తీసుకొని లోపలకు వెళ్ళలేదు. వెనకవైపున్న కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించాను దొంగలాగా. ఆ ముప్పయి నార్లను తీసుకొని అలాగే బయటికి వచ్చి వేగంగా నడక సాగించాను.
అప్పుడప్పుడే సూర్యోదయం అవుతున్నది. నా మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. ఆ ముసలాయన ఇల్లు చేరుకొని తన రొఖం పోయిన విషయం తెలుసుకోనుంటాడు. అంతేకాదు వెంటనే పోలీసులకి కూడా చెప్పుంటాడు. అందుకే నేను ఇలా రహదారి లో ప్రయాణించ కూడదు.” అనుకొంటూ పక్కనున్న చిన్న  దట్టమయిన అడవి మార్గం లోకి ప్రవేశించాను. అక్కడే అసలు కధ  మొదలయింది.

 ********************  

సాయంత్రం వరకు ఇంకో పల్లె కు చేరే దారి కోసం వెతుకుతూనే ఉన్నాను. ఎంత తిరిగిన అదే చోటుకి చేరుతున్నాను. కానీ ఆ అడవి నుండి బయట పడే మార్గం మాత్రం నాకు కనిపించలేదు. తిరుగుతూనే ఉన్నాను అక్కడే బోనులో పడ్డ ఎలకలాగ. సాయంత్రమై పోయింది దట్టమయిన మంచు. చలి కోరికేస్తున్నది.
 చీకట్లు కమ్ముకొస్తున్నాయి. అలసి పోయి ఒక చెట్టునానుకొని కూలబడ్డాను. నా స్థితి చూసి నాకే జాలనిపించింది. ఈ సారి నేనే  ఆ ముప్పయి నార్ల కోసం బోనులో ఇరుక్కు పోయిన భావన కలిగింది.
అలా నా  పక్కనే ఉన్న ఎలుకల బోనులను చూస్తుంటే, ఇప్పుడు ఇలా బందీ గాఉండటం నా వంతే నెమో అని కూడా అనిపించింది. అలా ఆలోచిస్తూ చుట్టూ పరికించి చూసాను. చాలా దూరము నుండి ఒక మినుకు మినుకు మంటున్న దీపపు కాంతి కనిపించింది. కొద్దిసేపటికి సుత్తి తో ఇనుప ముక్కను కొడుతున్న శబ్దం కూడా వినిపించింది.  మళ్లి  ఆశరేకెత్తింది. అటువైపుగా  ఆ చిరుచీకట్లలోనే నడక సాగించాను. అక్కడక్కడా కాళ్ళకు రాళ్లు  కొట్టుకున్నాయి. ముళ్లకంపలు తగిలి చేతులు గీరుకు పోయాయి. అయినా ఆ దీపం వైపే ఆశగా ఒక దీపపు పురుగులాగా  దూసుకువెళ్లాను. అది ఒక ఇనుప కర్మాగారం. నిప్పుల కొలిమి దగ్గర కూర్చొని ఒక కూలి కాల్చిన ఇనప ముక్కను  సుత్తి తో కొడుతూ  సాగతీస్తున్నాడు. అంతా  చీకటిగానే ఉన్నది. ఆ కొలిమి వెలుగు తప్ప.
“అయ్యా ! నేనొక బాటసారిని. ఈ రాత్రికి ఇక్కడే ఎక్కడయినా కూర్చుని సేద తీరటానికి అనుమతినిస్తారా?” అడిగాను. అతనేమీ మాట్లాడలేదు. కళ్ళతోనే ఒక మూల చూపించాడు. బాగా మసకగా ఉన్నది. అయినా అదే చాలన్నట్లు ఆ మూలకు వెళ్లి నా దగ్గరున్న చింకి రగ్గుని నిండా కప్పుకొని, నా ఎలుకల బోనులను ఒక పక్కనే పెట్టి, మొహం కూడా కప్పుకొని ముడుచుకొని ఆ మూల కూర్చున్నాను.  

                                                    *************  

కొద్దిసేపటికల్లా  ఎవరో వచ్చినట్లనిపించింది. ఆ వ్యక్తి కర్మాగరం మొత్తం చూసిన తరువాత కొలిమి దగ్గరకు వచ్చాడు. ఆ కూలి చాలా మర్యాదగా లేచి నుంచున్నాడు. ఆయన చేత్తోనే నీ పని నువ్వు చేసుకో అన్నట్లు  సైగ చేసి వెళ్ళబోయి నేను కూర్చున్నమూల వైపు చూస్తూ దగ్గరకొచ్చి పరికించి చూసాడు. అయన వెలుగువైపుకి ఉండడంతో నేను గుర్తుపట్టగలిగాను ఆయనని, ఆ కర్మాగారం యొక్క యజమాని రాంసజో(Ramsjo Iron Factory).
“ఎవరు మీరు? ఇక్కడెందుకు కూర్చున్నారు?”
 నాకు భయమేసింది. నేను మాట్లాడితే లేక వెలుగులోకి వస్తే నన్నొక బిచ్చగాడినని గుర్తు పడతాడేమో, అప్పుడు నన్ను అక్కడి నుంచి కూడా తరిమేయొచ్చు. అందుకనే నేను చీకటి వైపే మరింతగా ఒరిగి పోతు మౌనంగా ఉన్నాను.
“మీరు!మీరు!”అంటూ ఎదో గుర్తు చేసుకుంటున్నట్లు చూసి, “మీరా! కెప్టెన్ వన్ స్టాహాలే! ఎన్నాళ్లకు నేను మీకు గుర్తొచ్చాను. నన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చారా!” అంటూ సంతోషం  ఆశ్చర్యం ముప్పిరిగొనగా, “ఇంత కాలం  ఏమైపోయారు? ఇప్పటికైనా వచ్చారు. అదే సంతోషం! ఇంటికి వెళదాం రండి. చాల మంచి రోజున వచ్చారు. ఈ రోజు క్రిస్టమస్. మనం కలిసి జరుపుకుందాము”   అంటూ ఎంతో ఆనందంతో ఆప్యాయంగా తన ఆప్తమిత్రుడిని కలుసుకున్న ఆనందంతో పిలిచాడు.
నాకు మళ్ళి  భయమేసింది. ఈ మసక చీకటిలో ఆయన నన్ను సరిగా గుర్తించలేదనుకుంటా. నన్నే తన ఆప్త మిత్రుడనుకుంటున్నాడు. ఇది ఒకందుకు మంచిదేలే. నేనేమి మాట్లాడక పోతే, నా గురించి తెలుసుకొనే అవకాశమే ఉండదు. ఎదో లాలచి నన్ను ఆవహించింది. జాలితో అయన నాకు ఇక్కడ ఉండడానికి అనుమతి నివ్వొచ్చు, అలాగే మరో రేండు నార్లు కూడా ఇవ్వచ్చు అన్న ఆశతో మళ్ళి  మౌనంగా ఉండిపోయాను. అయన ఏమనుకున్నాడో ఏమొ  కొద్దీ సేపు నన్ను బతిమాలి నేను రానేమొ  నని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

********************

రాంసజో, ఇనుప కర్మాగారం యజమాని, ఇల్లు చేరుకున్నాడు. “ఎడ్ల!ఎడ్ల !”అని ఆనందంతో తన కూతురిని పిలిచాడు. ఎడ్ల విలమన్ సన్   రాంసజో యొక్క ఏకైక  కూతురు. భర్తను పోగొట్టుకొని చాలా కాలంనుంచే ఆమె తండ్రి దగ్గరే ఉంటున్నది.
“నాన్న గారు! ఏంటి అంత  సంతొషంగా కనిపిస్తున్నారు. రేపు క్రిస్టమస్ అనా? లేక ఏదైనా విశేషం జరిగిందా మన కర్మాగారంలో?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
“నీకు తెలుసా ,ఎడ్ల? నువ్వు చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను స్విస్ సైన్యం లో పని చేశాను. అక్కడ నాకొక మిత్రుడు ఉండేవాడు. చాలా మంచి మనిషి.  ఎదో అవినీతి ఆరోపణలతో అతను పదవి పోగొట్టుకున్నాడు. అంతేకాదు కొంత కాలం అతన్ని  జైల్లో కూడా ఉంచారని వినికిడి. ఎప్పుడు విడుదల అయ్యాడో, ఎక్కడికెళ్ళి పోయాడో ఎవరికీ తెలియదు. నేను కొంత కాలం తరువాత సైన్యం వదిలేసి కర్మాగారం పెట్టుకొని ఇక్కడకు వచ్చేసాను”అని ఊపిరి సలుపుకోకుండా చెప్పాడు.
“ఓహో ! నాన్నగారు! మీరు ఈ  విషయం ఇది వరకు కూడా చాలా సార్లు చెప్పారు. ఇప్పుడేం జరిగిందో చెప్పండి?”అంటూ ఎదురు ప్రశ్న వేసింది ఎడ్ల.
“అదే చెపుతున్న! ఆ కెప్టెన్ మిత్రుడు మన కర్మాగారం లో ఒక మూలాన కూర్చొని కనిపించాడు.
 “అవునా!”  ఆశ్చర్యపోయింది ఎడ్ల.
“నేను రమ్మని ఆహ్వానించాను. రేపు క్రిస్టమస్  కదా ! అతను మన అతిధిగా వస్తే ఎంత బాగుండేది! కానీ బాగా బతికి చెడ్డ మనిషి. అందుకే నాతో రావటానికి సందేహించాడు ”అంటూ వాపోయాడు రాంసజో.
“అయ్యో! మీరంతగా బాధ పడకండి. నేను వెళ్లి అతన్ని మన ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.” అంటూ ఎడ్ల విలమన్ సన్ గుర్రపు బగ్గీ లో కర్మాగారంకు వెళ్ళింది. ఆమెను చూస్తూనే కూలి చాల సగౌరవంగా నిలుచున్నాడు. ఆమె అతన్ని గమనించకుండానే మూలన కూర్చుని ఉన్న నా దగ్గరకి వచ్చింది.
“నమస్తే! ఈ రోజు రాత్రి నుండి క్రిస్టమస్ వేడుకలు మొదలవుతాయి. మీరు అతిధిగా మా ఇంటికి రావాలి. మా నాన్న గారు చాలా సంతోషిస్తారు.ఏమంటారు?” అంటూ ఎంతో ఆదరం తో పలికింది.
ఆ మసక వెలుతురులో ఎడ్ల ఒక దేవదూత లాగా కనిపిస్తున్నది. తెల్లటి గౌను పైన ఎర్రటి యాక్ ఊలు తో చేసిన కోటు వేసుకొని చాల అందంగ,చాలా హుందాగా కనిపించింది.
అయినా నాకు నా గురించి ఆమెకు చెప్పాలనిపించలేదు. ఎందుకంటే నేను కేవలం ఎలుకల బోనులను అమ్ముకుంటూ తిరిగే ఒక బిచ్చగాడినని తెలిస్తే ఆమె నన్ను ఇక్కడ ఉండనీయదు. అలా కాకపోతే, తన తండ్రి గారి మిత్రుడిగా భావించి నాకు ఒకటో రెండో నార్లను కూడా ఆ ప్రభువు పేరిట దానం చేయొచ్చు. అందుకని నేను నా గురించి చెప్పక పోవటమే మేలు అనుకొని మౌనంగా ఉండిపోయాను.
 అతను ఏమి మాట్లాడకపోవడంతో ఎడ్ల అనుకుంది మనసులో,”ఇతను చాలా భయం లో ఉన్నాడు. ఒకవేళ ఏ దొంగతనం చేయలేదు కదా? లేక పోలీసులకు చెబుతామని భయపడుతున్నాడా?”
ఇలా ఆలోచిస్తూ “చూడండి! మీరు దేనికి భయపడవలసిన పనిలేదు. ఈ ఒక్క రోజుకే మీరు మా అతిధి గ ఉండొచ్చు. విశ్రాంతి తీసుకొని తెల్లవారగానే  మీరు వెళ్లిపోవచ్చు. మిమ్మల్ని ఎవరు నిరోధించరు. మీకే ఇబ్బంది  కలగకుండా చూసుకునే బాధ్యత నాది” అన్నది.  
నాకామె  మాటల్లో  స్వచ్ఛత కనిపించింది. మళ్ళి  ఎదో ఆశ. ఆమె పైన నమ్మకముంచి ఆమె వెనకాతలే వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
 కర్మాగారం  యజమాని ఎదురొచ్చి నన్నెంతో ఆప్యాయతతో ఇంట్లోకి ఆహ్వానించాడు. పనివాడిని పిలిచి, “ఈయనకి గడ్డం చేసి, తల జుట్టు ని కూడా సరిగా కత్తిరించి, తలారా స్నానం చేయించమని చెప్పాడు.”
 ఎడ్ల తన తండ్రి గారి ఒక మంచి బట్టల జత నాకివ్వమని కూడా పనివాడి కిచ్చింది. తెల్లటి పొడవాటి అంగి, కింద ఊలు ప్యాంటు పైన ఫర్ కోటు వేసుకున్నాను. జుట్టు కత్తిరించి, గడ్డం తీసేయడం తో నన్ను నేనే పోల్చుకోలేక పోయాను. అలా నేను నా నిజ రూపంలో రాంసజో ముందుకి వెళ్ళాను.
ఆయన అవాక్కయిపోయాడు. మొహం కోపంతో ఎర్రబడింది. “నువ్వు నా కాప్టెన్ మిత్రుడివి మాత్రం కాదు. నువ్వెవరో చెప్పు! లేదా!నేనిప్పుడే నిన్ను పోలీసులకి అప్పగిస్తాను. నిజంచెప్పు. నువ్వెవరో నాకు ముందే చెప్పాలిగదా ! మా ఇల్లు చేరటానికి ఇంత నాటకం ఆడతావా.” అంటూ ఆవేశంతో ఊగిపోయాడు.
ఎడ్ల వారిస్తున్నా వినకుండా,”తక్షణం ఇక్కడనుంచి వెళ్ళిపో “అని ఆదేశించాడు.
“అయ్యా! మీరెంత అమాయకులు. జీవిత సత్యం తెలుసుకోలేక నా మీద అభాండాలు వేస్తున్నారు. నిజం చెప్పాలంటే! నేను మంచి భోజనం, మంచి పడక దొరుకుతాయన్న ఆశలో చిక్కుకొని, మీ అమ్మాయి గారు పిలవగానే వచ్చాను. ఎలక లాగా మీ ఈ బోనులో చిక్కుకున్నాను. మీకు నా మీద కోపం రావడం సహజం. కానీ నేను నా గురించి చెప్పకపోవడానికి కారణం మీరు చూపిన ఎర. మంచి భోజనం కోసం, ఒక్క రాత్రయినా పడుకోవటానికి చోటు కోసం వెదికే నాకు, మీ అమ్మాయి గారి ఆహ్వానం నన్నీఉచ్చు లోకి లాగింది. ఎందుకంటే నేను చాలా అల్పుడిని! మీలాంటి గొప్పోళ్ళకు గొప్పగొప్ప ఆశలు ఆకర్షణలు వేచి ఉంటాయి. నాలాగే మిమ్మల్ని కూడా ఎదో ఒక రోజు ఈ ఉచ్చులోకి లాగుతాయి. నాకి ప్రపంచం అనే బోను వేసే ఎర కేవలం కూడు గుడ్డ మాత్రమే. మీకు అంత కంటే పెద్ద పెద్ద ఎరలను వేస్తుందీ ప్రపంచం,  మిమ్మల్ని కూడా ఈ బోనులోకి లాగటానికి. ఎందుకంటే మీరయినా నేనయినా ఈ ఎలుక లాంటి వాళ్ళమే. ఇలా  ఆశలతో ఈ ప్రపంచమనే బోనులో చిక్కుకు పోయి బతుకుతాము. మనకేదారి కనిపించదు.”అంటూ ఎంతో సంస్కారంగా మాట్లాడాడు. అతని మాటల్లోని సత్యం ఎడ్ల ను ఎంతో ఆకర్షించింది.
“నేను వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి. దయతో మీరు రమ్మంటే వచ్చాను. కానీ మిమ్మల్ని మోసగించాలన్న ఆలోచన మాత్రం ఈ అల్పుడిలో లేదు,” అంటూ  నేను వెళ్ళడానికి సిద్ధమయ్యాను నా ఎలుకల బోనులతో సహా.
ఎడ్ల కల్పించుకొని “మీరు మాకు అతిధి. మేము పిలిస్తేనే మీరు వచ్చారు. అందుకని  నాకు మా నాన్నగారితో మాట్లాడేందుకు కొంచం సమయం ఇవ్వండి. అప్పుడు కూడా మీకే వేళ్లాలనిపిస్తే నిరభ్యంతరంగా మీరు వెళ్లి పోవచ్చు.” అంటూ తండ్రి వైపు చూసి, “నాన్న గారు! ఈయన నిజం చెప్పలేదన్న మాటేగాని, అబద్దం కూడా చెప్పలేదు. మనమే ఆయన్ని మీ మిత్రుడిగా భావించి ఈ క్రిస్టమస్ పర్వదినం నాడు ఆహ్వానించాము. మనం నిజమయిన క్రిస్టమస్ పండుగ జరుపుకోవాలంటే ఆ ప్రభువు ఆదేశం పాటించి అన్న్నార్తులకు పట్టెడన్నం  పెట్టాలి. ఈతని రూపం లో ప్రభువు మనకొక అవకాశం ఇచ్చాడు. మనం దానిని సద్వినియోగం చేసుకుందాం.” అంటూ ఎడ్ల నన్ను,ఈ బిచ్చగాడిని, భోజనాల గది  వైపు తీసుకెళ్లింది. కూతురి యొక్క  స్వభావం తెలిసిన రాంసజో మారు మాట్లాడలేదు.
మంచి భోజనం పెట్టిన తరువాత నాకు ఆమె ఒక అతిదులుండే గదిలో పడక ఏర్పాటు చేయించి, “మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి.” అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.
రాత్రి పన్నెడు గంటలకు నాకు మేలుకు వచ్చింది. చర్చి లోని గంటలు మోగుతున్నాయి ఎక్కడ నుంచో “హల్లేలూయ హల్లేలూయ,హల్లేలూయ,”అన్న కీర్తన చాలా  లయబద్దంగ వినిపిస్తున్నది. ఆ గది నుండి బయటకు వచ్చి పరికించి చూసాను.
పెద్ద హాలు లాగ ఉన్నది. ఒక మూలన చాలా అందంగా క్రిస్మస్ చెట్టు అలంకరించబడి ఉన్నది. ఆ చెట్టు కింద ఎంతో ఖరీదయిన బహుమతులు పెట్టి  ఉన్నాయి. పక్కనే INRI ప్రభువు శిలువ , ప్రభువు చిత్రపటం ఉన్నాయి. ఆ ప్రదేశమంత కొవొత్తుల  కాంతిలో ఎంతో అందంగా ప్రశాంతంగ కనిపించింది. నేను అక్కడ కూర్చోని  ప్రభువు ని కీర్తించాను. ఆయన దయ అపారం. ఆ తరువాత ఇల్లు విడిచి అక్కడి నుండి వెళ్లి పోయాను ఆ నిడి రాత్రిలో వెలుగును వెతుక్కుంటూ.

                                          *****************

ఎడ్ల ,రాంసజో ఇద్దరు, ఆ బిచ్చగాడు నిద్రించగానే చర్చికి బయలు దేరి వెళ్లారు. ప్రార్థనలలో పాల్గొన్నారు. ప్రార్ధనలు ముగిసిన తరువాత అనుకోని విధంగా వాళ్ళ కర్మాగారం లోనే పని చేసిన ఆ పెద్దాయన వారిని కలిసాడు. క్షెమ సమాచార కబుర్లు అయినా తరువాత, ఆయన, ”అయ్యా! నిన్న రాత్రి మా ఇంటికి ఒక ఎలుకల బోనులను అమ్ముకొనే మనిషి ఆశ్రయమివ్వమని సాయంకాలం వేళ  మా ఇంటి తలుపు తట్టాడు. ఒంటరివాడిని కదా! అందుకని ఆ ఒక్క రాత్రయినా నా తోటి మరో మనిషి ఉంటాడన్న ఆశతో ఆ బిచ్చగాడిని ఎంతో ఆదరించాను.”
“ప్రభువు పేరిట మంచి పనే కదా చేసావు” అంది ఎడ్ల.
“అలా కాలేదు తల్లి! ఆ దొంగ వెధవ నేను దాచుకొన్న 30 నార్ల రోఖం పట్టుకు పోయాడు.అతన్ని నేనెంతో  విశ్వసించాను,”అంటూ గద్గద స్వరంతో చెప్పాడు.
“అయ్యో! ఎంత పనైయింది.”అంటూ ఎడ్ల జాలి చూపించింది.
“నేను చెబుతూనే ఉన్నాను. వాడు నిజంగానే దొంగ. ఈ రోజు మన దగ్గరున్న విలువయినవన్నీ  బయటనే ఉంచాము. అతన్ని ఇంట్లో ఒంటరిగా వొదిలేసి వచ్చాము. దొంగకి ఇంటి తాళాలు ఇచ్చినట్లయింది,” అంటూ “పద పద మన ఇంట్లో ఏమి దోచుకొని పోయాడో”  అంటూ ఎడ్ల చేయి పట్టుకొని బగ్గీ వైపుకి లాక్కు పోయాడు రాంసజో.
బగ్గీ ఇల్లు చేరగానే కాపలాదారుణ్ని పిలిచి ,”ఎరా! మన అతిధి వెళ్ళిపోయాడా?” అని వెటకారంగా అడిగాడు.
“యజమాని! ఆయన చర్చి గంటలు మోగిన పది నిముషాలకల్లా వెళ్ళిపోయాడు.
“అవునా ! ఎం పట్టుకెళ్ళాడేంటి?”
“చేతిలో ఒక పాత  గొంగళి, ఎలకల బోనులు. మీరిచిన్న బట్టలతోనే ఆయన వెళ్ళిపోయాడు.
“అయినా సరే! ఎడ్ల! త్వరగా పద ఇంట్లో చూడాలి ఏమి పోయాయో!”అంటూ హడావిడిగా ఇంట్లోకి పరుగుతీసాడు ఆయన.
కాపలాదారుడు వెనకనే వస్తున్నా ఎడ్ల కు ఒక చిన్న ప్యాకెట్, ఒక ఉత్తరం ఇచ్చి,”ఆ అతిధి ఇవి మీకు ఇమ్మని చెప్పి వెళ్ళాడు మేడం,” అని చెప్పాడు.
ఎడ్ల అది తీసుకొని ఇంట్లోకి నడిచింది. ఇల్లంతా అలాగే ఉన్నది. కొవొత్తుల వెలుగులో క్రిస్టమస్ చెట్టు దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఆమె సంతృప్తి గ తన గదిలోకి వెళ్లి ఆ అతిధి ఇచ్చిన ఉత్తరం తెరిచింది.
 “ప్రియా మైన మీకు ఒక బిచ్చగాడు వినయంగా రాసుకుంటున్న ఉత్తరం. మీ దయార్ధహృదయం   నన్నెంతో ఆలోచింప చేసింది. బతికినంత కాలం ఒక బిచ్చగాడి లాగానో, లేక ఒక చిరు దొంగ గానో బతకవలసిన నన్ను, నా  స్థితి ని మార్చేసింది. మీరు నా మీద చూపిన విశ్వాసం, ప్రభువుపేరిట చూపిన దయ నాకు మార్గ నిర్దేశం చేసాయి. ఈనాటి  నుండి నేను మీరు ఆతిధ్యమిచ్చిన ఒక మంచి వ్యక్తిగా జీవించటానికి ప్రయత్నిస్తాను. ఇది నేను ఆ ప్రభువు పేరిట మీ దయార్ద్ర హృదయానికి ఇస్తున్న మాట. నాయీ చిన్న బహుమతిని స్వీకరించండి. ఆ ముప్పయి నార్లలను ఆ పెద్దయన వద్దకు చేర్చండి.

కృతజ్ఞతతో
మీ
వాన్ స్టాహలే”

ఎడ్ల అతను ఇచ్చిన మరొక చిన్న ప్యాకెట్టును కూడా తెరిచింది. అందులో నలిగిపోయి ఉన్న మూడు స్విస్ నోట్లు కనిపించాయి. వాటితో పాటు ఒక చిన్న ఎలుకల బోను కూడా పెట్టి ఉంది.
“ఒక బికారి మారిపోయి ఈ ప్రపంచపు  బంధాలనుండి విముక్తుడై స్వేచ్చా జీవితాన్ని గడపబోతున్నాడు” అని మనసులోనే  ఆ ప్రభువుకు వందనాలు సమర్పించింది ఎడ్ల.                    

January 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

గ్రంథాలయం పెట్టాలనుకోవడంలో నా కష్టాలే నాకు స్ఫూర్తి.

by Aruna Dhulipala January 30, 2024
written by Aruna Dhulipala

డా. కూరెళ్ళ విఠలాచార్య

పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త కూరెళ్ళ విఠలాచార్య గారితో మయూఖ ముఖాముఖి…                                   

అభినవ పోతన, మధురకవి, ఎల్లంకి వేమన్న, నల్లగొండ కాళోజీ, అక్షర సామ్రాట్ బిరుదాంకితులు సుప్రసిద్ధ కవి, రచయిత, సామాజిక వేత్త , భారత ప్రధానమంత్రి మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి నోట “మన్ కీ బాత్” రేడియో ప్రోగ్రాంలో ప్రశంసించబడి, జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్రంథాలయ వ్యవస్థాపకులు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారి జీవిత విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. – అరుణ ధూళిపాళ

నమస్కారం సార్. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం మా భాగ్యం. మా పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయడం మహదవకాశంగా భావిస్తున్నాను.

1. మీ జననం, పుట్టిన ఊరు, తల్లిదండ్రులు, బాల్యం గురించి చెప్పండి.
జ:  అమ్మా! నమస్కారం. నేను జూలై 9, 1938 లో నీర్నేముల గ్రామంలో జన్మించాను. మా అమ్మగారి పేరు కూరెళ్ళ లక్ష్మమ్మ, నాన్నగారు కూరెళ్ళ వేంకటరాజయ్య. అప్పటి కాలంలో  అన్నీ బాల్య వివాహాలు కావడం వల్ల మా అమ్మ గారికి 15 ఏళ్ళ వయస్సు వున్నప్పుడు నేను పుట్టాను.  దురదృష్టవశాత్తు నేను అయిదు నెలల పసివానిగా ఉన్న సమయంలో మా నాన్నగారు మరణించారు. మా చిన్న పెద్దనాయన గారు నన్ను ఎత్తుకొని మా నాన్న చితిని ముట్టిస్తుంటే జనమంతా ఏడ్చారట. అప్పటినుండీ నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వెల్లంకిలో మా పెదనాన్నలెవ్వరూ మమ్మల్ని చేరదీయలేదు. మా మాతామహులు మమ్మల్ని నీర్నేములకు తీసుకుపోయినారు. మా అమ్మమ్మకు నేనంటే అమితమైన ప్రాణం. ఒక్క క్షణం నేను కనబడకపోతే ఆమె ప్రాణం విలవిలలాడేది.   దానికి ఒక ఉదాహరణ చెబుతాను. మా అమ్మగారితో పాటు నేను బంధువుల ఇంటికి ఎప్పుడైనా వెళ్లాల్సి వస్తే నా పాదాలను జాజులో ముంచి, గోడకు ముద్రించి వాటిని చూస్తూ నేను తిరిగి వచ్చేవరకు గడిపేది. అంతటి ప్రేమమూర్తి ఆమె. ఆ సందర్భాన్ని తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి నాకు ( కన్నీటి పర్యంతమవుతూ). అందుకే వీళ్ళ ఋణం తీర్చుకోవడానికి మా అమ్మమ్మ పేర , తాతయ్య గారి పేర ఏటా బేతోజు లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ పురస్కారాన్ని ఇస్తున్నాను. 7వ తరగతిలో తెలుగు భాషలో ప్రథమశ్రేణి వచ్చినవారికి మాత్రం వాళ్ళు ఫెయిల్ అయినాసరే ఈ పురస్కారాన్ని ఇస్తున్నాను.

కూరెళ్ళ విఠలాచార్య గారితో ముఖాముఖి గ్రహీత శ్రీమతి అరుణధూళిపాల

2. బాల్యమంతా ఇంత కష్టాన్ని ఎదుర్కొన్న  మీ విద్యాభ్యాసం ఎలా గడిచింది?
జ:   నేను పుట్టింది 1938లో అయినా విద్యాభ్యాసం మటుకు 1945 లో జరిగింది. ఆ కాలంలో ఊళ్ళల్లో ముస్లింలు చదువు చెప్పేవారు. మసూల్ దార్ సాహెబ్ నీర్నేములలో, వెల్లంకిలో షేక్ అహ్మద్, సిరిపురంలో గాలిబ్ సాబ్, రామన్నపేటలో గులాం రసూల్ అని టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్లకు భాష రాకపోయినా ఏదో నేర్చుకొని చెప్పేవారు. అప్పుడు పాఠశాలలు లేవు. విచిత్రం ఏమిటంటే మసూల్ దార్ సాహెబ్ నాకు పీర్ల కొట్టంలో అక్షరాభ్యాసం చేయించారు. మా అమ్మతో పాటు తిరగాల్సి రావడం వలన నాది వానాకాలం చదువయ్యింది. ఆ పరంపరలో నీర్నేముల, ముని పంపుల, వెలివర్తి, వెల్లంకి ఇలా రకరకాల ఊళ్ళల్లో నా చదువు సాగింది. ఆ తర్వాత 1950 నుండి రామన్నపేటలో నాల్గవ తరగతి నుండి ఒక క్రమపద్ధతిలో నా చదువు కొనసాగింది. అక్కడ ప్రాథమిక పాఠశాలలో కోటిచింతల పురుషోత్తమం గారని పాఠశాల హెడ్ మాస్టర్ వయసు ఎక్కువవుతుందని రికార్డులలో జననం 1940 గా రాయించారు. నీర్నేముల నుండి సద్దిగట్టుకొని రామన్నపేటకు పోయి చదువుకునేది. ఆ కాలంలో కుల వ్యవస్థ కూడా గట్టిగా ఉండేది. అంగీ తగిలినా, సద్దులున్న గోడ తగిలినా సద్దులు పారేసేవాళ్ళు. అట్లా ఏడవతరగతి వరకు అక్కడ చదివాను. ఆ తర్వాత నాకు చదువుకోవడానికి అవకాశాలు తక్కువ ఉండడంవల్ల భువనగిరిలో  విశ్వకర్మ హాస్టల్ నిర్వాహకుల పిలుపు మేరకు మా మేనమామ నన్ను అక్కడ చేర్పించాడు.  నిర్వాహకులు ఒక బజారు చూపించి అక్కడ విశ్వకర్మల ఇళ్లల్లో భిక్ష పైసలుగానీ, బియ్యం గానీ తెమ్మని ఆదేశించారు. అదే ప్రకారం వెళ్లి తెచ్చి రూములో వండుకొని తినేవాళ్ళం. చదువు కోసం వారేది చెబితే అది చేశాము. 1954 జూన్ నుండి 1957 వరకు 8,9,10 తరగతులు అక్కడే చదువుకున్నాను. ఆదిరాజు వీరభద్రరావు గారి అల్లుడు ఆంజనేయ శాస్త్రి గారు నాకు గురువు. ఆయన పాఠశాలకు రాని రోజు నన్ను పాఠం చెప్పుమనేవారు. అందువల్ల చిన్నతనం నుండే నాకు తెలుగు భాష పట్ల కొంత పట్టు ఏర్పడింది. ఆయన నేను బాగా చదువుతానని హైద్రాబాదుకు తీసుకువెళ్లి వారాల భోజనం పెట్టిస్తాను చదువుకోమన్నారు. కానీ ఇక ఇంటింటికి తిరిగి భోజనం సంపాదించడం నావల్ల కాదని పదవతరగతి పూర్తవగానే ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాను.

3. మరి అప్పుడే ఉద్యోగం సంపాదించగలిగారా? మీ ఉద్యోగ ప్రస్థానం ఎలా కొనసాగింది?
జ.  1950 ఆ ప్రాంతంలో పదవతరగతి హాల్ టికెట్ చూపిస్తే ఉద్యోగం ఇచ్చేవారు. అలా రామన్నపేట తహశీల్ ఆఫీసులో తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి ఉండేవాడు. ఆయన “కాపీయిస్ట్ పోస్ట్ ఉంది.చేస్తావా?” అని అడిగారు.  ఏదైనా చేస్తానన్నాను. ఇంగ్లీషు రాయొచ్చా అని అడిగారు. రాస్తానన్నాను. 20 రూపాయలకు రెవెన్యూలో కాపీయిస్ట్ ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో కో ఆపరేటివ్ బ్యాంకులో సూపర్ వైజర్ గా వచ్చింది. దాంట్లో చేరాను. భువనగిరి కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర రైటర్ గా చేశాను. అప్పుడే సేల్స్ టాక్స్ లో ఉద్యోగం దొరికింది. ఒక దాని తర్వాత ఒకటి ఒక్క నిముషం కూడా ఖాళీ లేకుండా చేశాను. డబ్బులు వచ్చాయి. కానీ లంచాలు తీసుకోవడం, తినడం, తాగడం ఇవన్నీ నాకు నచ్చలేదు. అందుకే ఉద్యోగం విడిచిపెట్టి టీచరు ట్రైనింగ్ చేసి, 1959లో టీచరునయ్యాను. ఉపాధ్యాయ శిక్షణా కాలం నాలో కవితా వ్యాసంగానికి బలమైన పునాది వేసింది. నేను, మా అమ్మ ఎన్నో బాధలు పడి రెండుగదుల పెంకుటిల్లు వెల్లంకిలో కట్టుకున్నాం. ఆ ఒత్తిడిలో జిల్లా విద్యాధికారి కార్యాలయానికి ఆలస్యంగా వెళ్ళాను. అప్పటి నల్లగొండ జిల్లా విద్యాధికారి రామదాసుగారు దయార్ద్ర హృదయులు. “మహానుభావా! ఇప్పుడు వచ్చావా” అని ప్రేమతో మందలించి ఉద్యోగం ఇచ్చారు. ఆగస్టు 29 1959 నాడు రామన్నపేట తాలుకాలో మునిపంపుల గ్రామంలో సహాయోపాధ్యాయునిగా జాయినయ్యాను. అప్పటినుండి మొదలుకొని నాకు ‘గ్లకోమా’ వ్యాధి వల్ల కంటిచూపు చాలావరకు కోల్పోవడంతో నా ఉద్యోగ జీవితాన్ని 1993లో జూనియర్ లెక్చరర్ గా విరమించవలసి వచ్చింది. చేసినంతకాలం విద్యాలయాల, విద్యార్థుల అభివృద్ధికి శాయా శక్తులా కృషి చేశానన్న తృప్తి ఉంది.

4. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఫిల్ , పి హెచ్ డిలు ఎలా పూర్తి చేయగలిగారు?
జ: నేను పదవతరగతి వరకే క్లాస్ రూములో కూర్చొని చదవడం తప్ప ఎక్కడా తరగతులు వినలేదు. నాకు స్ఫూర్తి బి. ఎన్. శాస్త్రి గారు. ఆయన ఎమ్. ఏ చదువుతుంటే ఎన్ని కష్టాలు పడ్డాడో చూసినవాణ్ణి. నేనూ రవ్వా శ్రీహరి బాల్య స్నేహితులం. నాకంటే చిన్నవాడు. ఆయనకు చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఇద్దరమూ ‘మునిపంపు’ లో పెరిగిన వాళ్ళం. ఇద్దరమూ కలిసి ఆడుకున్నాం. ఉద్యోగం చేస్తూనే నేను ఎమ్ ఏ దాకా ప్రయివేటుగా చదువుకున్నాను. పి హెచ్ డి చేయాలనుకుంటున్నట్లు రవ్వా శ్రీహరితో అన్నాను. ఎమ్ ఏ లో కూడా సెకండ్ క్లాస్ లో పాసయ్యాను.  పాటిబండ మాధవశర్మ గారు నన్ను బాగా అభిమానించేవారు. సీటు గురించి రామరాజు గారిని అడగాలంటే అందరికీ భయం. ఆయన చాలా సహృదయులు. కాకపోతే కొంచెం కఠినంగా ఉంటారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లాలంటే భయం. రవ్వా శ్రీహరి గారిని అడిగితే “అమ్మో! నేను వెళ్ళను” అన్నారు (నవ్వుతూ). నేనే అడుగుదామని వెళ్ళాను. అప్పటికి ఒక హైస్కూలు హెడ్ మాష్టరును నేను. పదిన్నరకు ఇంటర్వ్యూ ఉంటే ఎనిమిది గంటలకే వెళ్ళి నమస్కరించి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. “ఎందుకొచ్చావ్? నీ నమస్కారాల సంగతి నాకు తెలుసు. ఇవాళ ఎంఫిల్ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా! అప్లై చేసి ఉంటావు. ఆ సీటు కొరకే వచ్చావు . అట్లా రావచ్చునా? పోనీ ఓ పని చెయ్యి. మొత్తం 12 సీట్లు ఉన్నాయి. నీకిస్తాను పంచిపెట్టుకో ” అని కోప్పడ్డారు. ఏమీ మాట్లాడకుండా తిరిగి వస్తుంటే  “మాస్టారూ ఇలా రండి” అన్నారు. నా సంస్కారం ఆయన మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. “నువ్వు హైస్కూలు హెడ్ మాస్టర్ వి. వయసులో పెద్ద. రీసెర్చ్ చేసి ఏం సాధిస్తావు?”  అన్నారు. చేద్దామనే కోరిక ఉంది సార్! మీరు అనుగ్రహిస్తే చేస్తాను అన్నాను. ‘ఏమైనా రాశావా?’ అప్పటికే దాదాపు రకరకాల ప్రక్రియల మీద నేను వ్యాసాలు రాశాను. సూట్ కేస్ నిండా తీసుకువెళ్ళాను కూడా.  “వంద దాకా రాశాను సార్! చూస్తారా?” అన్నాను. వద్దన్నారు. ముందు ఎంత కోప్పడ్డారో అంత అనుగ్రహం చూపారు. ఆయన నాకు చాలా ఇష్టమైన గురువు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1977లో మొట్టమొదటగా ఏర్పడ్డ ఎంఫిల్ పరిశోధకుల్లో నేను ఒకడిని కావడం గర్వకారణం. రవ్వా శ్రీహరి ప్రోత్సాహం, పూజ్య గురువర్యులు బిరుదురాజు రామరాజు గారి బలమైన ఆశీస్సులు నన్ను పరిశోధనారంగంలో ప్రవేశించేటట్టు చేశాయి.

5. ఎంఫిల్ అంశంగా తీసుకున్న “తెలుగులో గొలుసు కట్టు నవలలు” నవలా ప్రక్రియను, మీ అనుభవాలను తెలపండి.
జ :  అప్పటి తెలుగు శాఖా అధ్యక్షులు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు అప్పటివరకు విమర్శకులు ఎవరూ స్పృశించని వినూత్నమైన, విచిత్రమైన నా పరిశోధనాంశం “తెలుగులో గొలుసుకట్టు నవలలు” అనే దాన్ని పరిశీలించి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో రామరాజుగారు,  నారాయణరెడ్డి గారు, నాయని కృష్ణకుమారి గారు, కులశేఖర్ రావు గారు, జి.వి. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. “అందులో సాహిత్యమే లేదు. అదెలా చేస్తావన్నారు?” అన్నారు. అందుకే చేస్తానన్నాను ( నవ్వుతూ). వారి ప్రశ్నలకు తగినరీతిలో సమాధానాలు చెప్పి వారిని సంతృప్తి పరిచాను. మామూలుగా అయితే ఒక పుస్తకాన్ని ఒకరు రాస్తారు. గొలుసు కట్టు నవల అంటే ఇందులో అనేకమంది రాస్తారు. ఒక రచయిత కథ ప్రారంభం చేస్తాడు. మరొకరు దాన్ని కొనసాగిస్తారు. కథలోని కథా నాయకుడిని ఒకరు సృష్టిస్తే, మరొకరు మిగిలిన కథను రాస్తారు. కథను అనుకూలంగా మార్చడం, ప్రతికూలంగా మార్చడం ఎవరి వారి ఇష్టం. సృష్టించిన కథానాయకుని గొప్పగా చూపించొచ్చు. లేదా చంపవచ్చు. అట్లా ఆనాడు 24 మంది రచయితలు, రచయిత్రులు రాసిన “ముద్దు దిద్దిన కాపురం” నవలను వారికి విడమరిచి చెప్పాను. ‘హాస్యప్రభ’ పత్రికలో సీరియల్ గా వస్తుండేది. రాంబాబు అనే ఆయన వేసేవాడు. మొత్తానికి ఆ టాపిక్ లో చేయడానికి నాకు అనుమతి లభించింది. కానీ దాంట్లో ఏమీ లేదని గైడుగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. మహానుభావుడు ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఒప్పుకున్నారు. ” నేను గురువును కాదు నీవు శిష్యుడవు కావు ఇద్దరం మిత్రులం” అనేవారు. ఇద్దరం చేతులు పట్టుకొని ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. పాతపుస్తకాల్లో ఏమైనా దొరుకుతుందేమోనని వెతికేవాళ్ళం. మద్రాసు, తిరుపతి, విజయవాడ, భీమవరం ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. “గొలుసుకట్టు నవల” రచయితలలో పాలగుమ్మి పద్మరాజు, శ్రీ శ్రీ , ఆనందారామం, తురగా జానకీరాణి, నాయని కృష్ణకుమారి, రావూరి భరద్వాజ, కొడవటిగంటి, ఆరుద్ర , పురాణం సుబ్రహ్మణ్య శర్మ , మధురాంతకం రాజారాం, రంగనాయకమ్మ , మాదిరెడ్డి సులోచన లాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేశాను. రంగనాయకమ్మ గారు, ఆరుద్ర గారు లేఖాముఖంగా పంపించారు. వీళ్ళందరి సమాధానాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాలతో విలక్షణమైన నా పరిశోధనలో నవలా వ్యాసంగాన్ని పూర్తిచేశాను.  250 పేజీల సాహిత్యాన్ని సృష్టించాను. ఇప్పుడు 40 మంది, 60 మంది రాసినవి కూడా వస్తున్నాయి. 1980 లో నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నాకు ఎంఫిల్ పట్టా లభించింది. తెలుగు పరిశోధనారంగంలో నా సిద్ధాంతగ్రంథం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే రవీంద్ర భారతిలో జరిగిన ‘గొలుసు కట్టు నవల’ ఆవిష్కారానికి నన్ను పిలిచి సన్మానం చేశారు.

6. పి హెచ్ డి అంశంగా “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” మీద తీసుకున్న నవలలేవి?
జ:  ఎంఫిల్ పూర్తయిన వెంటనే పిహెచ్ డి సీటు సులభంగానే దొరికింది. రామరాజు గారికి, నారాయణ రెడ్డి గారికి చేస్తాడన్న నమ్మకమూ కుదిరింది. నాకు ఎంఫిల్ పర్యవేక్షకులైన ఇరివెంటి కృష్ణమూర్తి గారు  వెంటనే పి హెచ్ డి చేయమని సలహా ఇస్తూ “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” అనే పరిశోధనాంశాన్ని సూచించారు. దాన్ని రామరాజు గారు 1947 వరకు అని సవరించారు. చారిత్రక నవలా చక్రవర్తి డా. ముదిగొండ శివప్రసాద్ పర్యవేక్షణలో నా పరిశోధన సాగింది. దీనికోసం క్షేత్ర పర్యటన చాలానే చేశాను. 1947కు పూర్వం వచ్చిన నవలలు, నవలలు కావు కావ్యాలు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి “మాలపల్లి” వేలూరి శివరామశాస్త్రి గారి ‘ఓబయ్య’, విశ్వనాథ వారి  ‘వేయి పడగలు’, అడవి బాపిరాజుగారి ‘నారాయణరావు’, ‘కోనంగి’, వాశిష్ఠ గణపతి ముని గారి   ‘పూర్ణ’, తల్లాప్రగడ సూర్యనారాయణ గారి ‘హేలావతి’, కేతవరపు వేంకటశాస్త్రి గారి ‘లక్ష్మీ ప్రసాదం’, వేంకట పార్వతీశ్వర కవుల ‘మాతృ మందిరం’, బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’.. ఈ పది నవలలు తీసుకున్నాను.  1947 వరకు ఈ నవలలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? ఈ సాహిత్యం ఉద్యమానికి, ఉద్యమం సాహిత్యానికి ఎట్లా ఉపయోగపడింది ఇందులో వివరించాను. ఈ పరిశోధన కారణంగా  జాతీయోద్యమంలో పాల్గొన్న మహనీయులను ఎంతోమందిని దర్శించుకునే భాగ్యం కలిగింది. దీనికి  “Best Informative Thesis” అని పేరు వచ్చింది. చాలా కష్టపడి వడబోసి తయారుచేసిన సిద్ధాంతగ్రంథం. సరి చేయడానికి ఏమీ లేకుండె. శివప్రసాద్ నాకంటే చిన్నవాడు. అందుకే “మొత్తం పూర్తయ్యాక సంతకం కోసమే నా దగ్గరకు రండి” అన్నాడు. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి గారిని, రావి నారాయణరెడ్డి గారిని, ఎన్. జి రంగాగారిని, గడియారం రామకృష్ణ శర్మ లాంటి ఎందరినో ఇంటర్వ్యూ చేసి సమాచారం సేకరించాను. నిజానికి చెప్పాలంటే ఆ కాలంలో వచ్చిన నవలలు చాలా తక్కువే కానీ నవలా సాహిత్యానికి అది స్వర్ణయుగం. నవలాకారులందరూ మహనీయులు. స్వాతంత్ర్యోద్యమ నుండి ప్రభావితులైనవారు. వారి హృదయం నుండి జాలువారిన ఈ రచనలు జాతిని ఉత్తేజపరిచాయి. ముందుకు నడిపించాయి.

7. సంస్కృత భాష పట్ల మీకు ఆసక్తిని కలిగించినదెవరు?
జ:  మొదటి నుండీ నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఉండేది. అయినా సరియైన పరిస్థితులు, వాతావరణం లేక సంస్కృతంలో అనుకున్నంత ప్రావీణ్యం సంపాదించుకోలేకపోయాను. అప్పుడు ఎనిమిదవ తరగతిలో సంస్కృతం ఆప్షనల్ గా ఉండేది. భువనగిరి హైస్కూలులో, సూర్యాపేటలో మొట్టమొదటగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. దానికోసమే నేను భువనగిరి హైస్కూలులో చేరాను. కోవెల సంపత్కుమారాచార్య గారు ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ. మొదటి స్టూడెంటును నేనే. అప్పలాచార్యులు గారు, సంపత్కుమారాచార్య గారు సంస్కృత గురువులు నాకు. నా విషయంలో సంస్కృతం వచ్చు అని చెప్పడం ఎంత అబద్ధమో, రాదని చెప్పడం కూడా అంతే అబద్ధం ( నవ్వుతూ ). ఆ గురువులిద్దరి మూలంగా సంస్కృతం మీద పట్టు ఏర్పడింది.

8. మీ పద్య పఠన పద్ధతికి ఉత్పల సత్యనారాయణాచారి గారి ప్రభావం ఉందంటారు. అది ఎలాగో వివరిస్తారా?
జ : 1958లో నేను మేడ్చల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఉత్పల సత్యనారాయణాచార్యగారు అతిథిగా వచ్చారు. బహుభాషా కవిసమ్మేళనం జరిగింది. తెలుగు భాషకు సంబంధించి ఆయన వచ్చారు. నేను ఆ సభలో ఆయన మీద ఆశువుగా పద్యం ఆయానలాగే చదివాను. ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటినుండీ “మరో ఉత్పల” అనే పేరు వచ్చింది. ఉత్పలగారు చనిపోయే చివరి దశలో మంచం మీద ఉన్నప్పుడు నేనొక పద్యం కార్డు మీద రాసి పంపించాను. ” కమ్మని తేట తెల్గు నుడికారము కల్గిన పద్యమొక్కటిన్, ఇమ్ముగ కోరుకున్న మనకిమ్మహనీయుడొసంగు గొప్ప భాగ్యమ్మున గల్గె ఉత్పల మహాకవి తెల్గునాడులో తమ్ములు రండి రండి కవితామూర్తిని కొలువగా వలెన్” అని పంపాను. ఆయన సంతోషపడి నా మీద మూడు పద్యాలు రాసి పంపించారు.

9. కూరెళ్ళ గ్రంథాలయ స్థాపనకు దోహదం చేసిన పరిస్థితులేవి?
జ: గ్రంథాలయం పెట్టాలనుకోవడంలో నా కష్టాలే నాకు స్ఫూర్తి. నేను చదువుకునేటప్పుడు పుస్తకాలు కొని చదువుకునేంత స్తోమత నాకు లేదు. పుస్తకాలు ఉన్నవాళ్ళ దగ్గర వారు రాత్రి చదువుకోవడం పూర్తయిన తర్వాత పుస్తకాలు అడిగి తీసుకొని రాత్రంతా చదువుకొని ఉదయం నాలుగు గంటలకే వాళ్లకు అప్పగించే ఒప్పందంతో తెచ్చుకునేవాడిని. ఇలాంటి నా కష్టాలు తరువాతి యువతరానికి రావొద్దని లైబ్రరీ పెట్టాను. అది చాలలేదు. 1954 లో వెల్లంకిలో శంభు లింగేశ్వర గ్రంథాలయం అని చిన్న లైబ్రరీ పెట్టాను. నాకు పెద్దలు ఎవరూ సహకరించలేదు. 1962 లో నేను మాఊరికి ప్రధానోపాధ్యాయునిగా వచ్చాను. మా  తల్లిదండ్రుల పేరుతో లక్ష్మీ వెంకట రాజయ్య గ్రంథాలయం పెట్టాను. ప్రముఖ నాటక రచయిత ఆకెళ్ల నర్సింహమూర్తి గారు ప్రారంభించారు. 1993లో తెలుగు ఉపన్యాసకునిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. గ్రంథాలయ స్థాపన నా మనసులోంచి పోలేదు. ఎలాగైనా ఈ మారు మూలలో మహా గ్రంథాలయం పెట్టాలని గట్టి నిర్ణయం చేసుకున్నాను. అందుకే నా ఇంటినే దీనికోసం ఇచ్చాను. పెద్దలు దీనికి “కూరెళ్ళ గ్రంథాలయం” అని నామకరణం చేశారు. నా సొంత ఐదువేల పుస్తకాలతో ఫిబ్రవరి 13, 2014 లో ప్రారంభమైంది. ఇప్పుడు సుమారు రెండు లక్షల గ్రంథాలతో పెద్ద లైబ్రరీ అయింది. మా పిల్లలు, లైబ్రేరియన్ సహకరిస్తున్నారు. శిష్యులు, స్నేహితులు చాలామంది ఉండడం వల్ల సాహితీప్రియులు ఎంతోమంది పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. ద్వానా శాస్త్రి గారు తన లైబ్రరీలోని మొత్తం పుస్తకాలను ఇచ్చారు. కోడూరు పుల్లారెడ్డి గారు కూడా వేల పుస్తకాలు ఇచ్చారు. భగవంతుని అనుగ్రహం వల్ల ఎంతోమంది ముందుకు వచ్చారు. తెలియని వాళ్ళు కూడా ఈ అడ్రెస్ తెలుసుకొని మరీ వచ్చి వందలాది పుస్తకాలు ఇవ్వడం నా అదృష్టం. వారందరి సహకారం వల్లనే ఎంతో గొప్ప సాహిత్యాన్ని ఇందులో సమకూర్చగలిగాను. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, వేదాలు, పరిశోధన, చరిత్ర, పద్య గద్య ఇలా అన్ని విభాగాల్లో ప్రక్రియల్లో పుస్తకాలున్నాయి. ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. తలచుకుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ని చేయగలిగానా అని.

10. మీ గ్రంథాలయం గురించి 2021 వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” లో ప్రశంసింపబడడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
జ : అది నా జీవితానికి గొప్ప వరం. పల్లెటూళ్ళని వదిలి చాలామంది నగరానికి వెళ్లి పోతున్నారు. అందరూ మళ్లీ పల్లెబాట పట్టాలని గ్రంథాలయం నెలకొల్పాను. నా కోరిక తీరి ఎంతోమంది సద్దులు కట్టుకొని మరీ వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు నా విషయం ప్రధానమంత్రి వరకు ఎలా వెళ్లిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయన “మన్ కీ బాత్” లో నన్ను , నా లైబ్రరీని ప్రశంసించారు.

ఈ ప్రభావం వల్ల అస్సామ్ విశ్వవిద్యాలయం నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి సందర్శకులు వచ్చారు. అమెరికా లోని ‘తానా’ వారు స్వరమీడియా వారు నాతో ఇంటర్వ్యూలు జరిపారు. అస్సాం యూనివర్శిటీ ప్రొఫెసర్ నారాయణ మూర్తి గారు ఎన్నో ఇంగ్లీషు పుస్తకాలు పంపించారు. నిన్న కూడా హయత్ నగర్ నుండి సర్వేపల్లి సుందరం అని ఒక వ్యక్తి వచ్చి ఆయన రాసిన పుస్తకాలు ఇచ్చి వెళ్లారు. అలా ఎంతోమంది సహకరిస్తున్నారు. నా శ్రమకు ప్రధానిగారు ఊపిరి పోశారు. మోదీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఆయన వల్ల నాకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. రాష్ట్రపతి నుండి పోయిన ఏప్రిల్ 2023లో ఆహ్వానం వచ్చింది. నాలుగు రోజులు అక్కడే ఉన్నాను. అక్కడ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ కర్ గారి చేత సన్మానం అందుకున్నాను. మాకు మూడు రోజులు వసతి కల్పించి అక్కడి విశేషమైన ప్రాంతాలను చూపించారు. పెద్ద సభ కూడా జరిగింది. ఈ నెలలో కూడా గణతంత్ర దినోత్సవాలకు రమ్మని ఆహ్వానం వచ్చింది. ఆరోగ్యం బాగా లేకపోవడం, అధికమైన చలి కారణంగా రాలేనని చెప్పాను.

11. దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన జనగామ రైలు ప్రమాదం గురించి మీరు రాసిన “అధికవృష్టి” పద్యాలను గూర్చి తెలపండి
జ : ఇది 1954లో జరిగింది. అప్పుడు కురిసిన అధికమైన వర్షాలకు “వసంతవాగు” పొంగుతుండడం వల్ల రైలు పట్టాలు తప్పింది. అప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నాను. ఆ దుర్ఘటనకు కదిలిపోయి నేను రాసుకున్న పద్యాలే మొట్టమొదటగా అచ్చులో చూసుకున్న పద్యాలు.
ఉరుములు మెరుపులు నొకసారె ఉద్భవించె
గాలి సుడిగాలి మేఘముల్ గప్పుకొనియె
సరవి ధారగ వర్షంబు కురియుచుండె
అల్ల తెలగాణ రఘునాథ పల్లియందు!
అధిక వర్షంబుచే నంత నయ్యె గాదె
మృత్యుదేవత ఆనాడు నృత్యమాడె
ఇట్టివెప్పుడు రాకుండ నెల్ల వేళ
మనల వేలుపు గాపాడి మనుచు గాత!
ఇలా రాశాను. ఆ పద్యాలు చూసి మా మాస్టార్లు ఆశ్చర్యపోయారు. కోవెల సంపత్కుమారాచార్య గారు “నీకు పద్యం మీద మంచి పట్టు ఉంది” అని ప్రశంసించారు.  స్కూల్ వార్షిక సంచిక  ‘ఉదయ’ లో కూడా వేశారు. ఆనాటి నుండి నా మిత్రులు తమాషాగా ‘పోతన’ అని పిలిచేవారు.

12. “వెల్లంకి వెలుగు” పేర రాసిన ఎల్లంకి గ్రామ వైభవం ఎటువంటిది?
జ: “వెల్లంకి వెలుగు” నా పల్లెతో నాకున్న అనుబంధాన్ని, గురించి రాసుకున్నది. చాలా చిన్న పుస్తకం. ఆ ఊరుకు ఆ పేరు ఎట్లా వచ్చింది మొదలుకొని నాకు తెలిసినంతవరకు ఆ గ్రామాన్ని గురించి ఆనోటా ఈ నోటా విన్న విషయాలు రాసుకున్నాను. నేను పుట్టింది పెరిగింది పల్లెటూరే. ఇప్పటికీ పల్లెటూళ్ళోనే ఉన్నాను. నా కార్యక్రమాలన్నిటికీ ప్రధాన భూమిక పల్లెటూరు. అందుకే “విఠ్ఠలేశ్వర శతకం” లో పల్లెను దేవతగా భావిస్తూ..
పల్లియలోనె పుట్టితిని పల్లియయే నను పెంచె
ఇల్లును వాకిలిన్ కలిమినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టె
పల్లియె ‘అమ్మ’ ఆవనుచు’పల్కులు పల్కగ నేరిపించె నా
పల్లియె నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠ్ఠలేశ్వరా!

13. వేమన శతకంతో సమానమని పలువురి ప్రశంసలు అందుకున్న మీ “విఠ్ఠలేశ్వర శతకము” గూర్చి చెప్పండి.
జ : 1991 ఆగస్టు 1న మా ఇంటి గేదెకు వైద్యం చేస్తుండగా అది ఎగిరి నా మీద పడడం వల్ల జరిగిన ప్రమాదంలో నా ఎడమ కాలు విరిగింది. అంతకుముందే నాకు నాలుగు ఆపరేషన్లు జరిగాయి. నేత్ర వ్యాధి ‘గ్లకోమా’ వల్ల కంటి చూపు చాలావరకు తగ్గిపోయింది. ఈ దుర్భర పరిస్థితుల్లో బాధతో అలవోకగా నా గుండె లోంచి ఒక పద్యం వచ్చింది.
“పుట్టుకతోనె కొందరికి పుట్టెడు దుఃఖము వెంటవచ్చు, ఎ
ప్పట్టున నైన కొందరికి పట్టినదెల్ల పసిండియే యగున్
తిట్టు వరంబు కొందరికి దీవెన కొందరి పట్ల తిట్టగున్
ఎట్టెట్టు స్వామి నీ నటన ఎంత విచిత్రము విఠ్ఠలేశ్వరా!”
అలా వరుసగా పద్యాలు రాసుకుంటూ పోయాను. నన్ను పలకరించడానికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, రసజ్ఞులకు వినిపించేవాణ్ణి. అందరూ అభినందించారు. మకుటం బాగుందన్నారు. మా అమ్మగారు నాకు మా నాన్నగారు విఠలేశ్వరుని భక్తులని అందుకే ఆ స్వామి పేరు మీదనే నాకు పేరు పెట్టారని చెప్పారు. అందుకే మా నాన్నగారి ఆకాంక్ష వల్లే ఇది ఉద్భవించిందేమో. నా ఆత్మ వేదనే అయినా ఆ విఠలేశ్వరుని అనుగ్రహంతోనే మంచం మీద ఉన్న మూడు నెలల్లో శతకం పూర్తి చేయగలిగాను. వివిధ సేవా కార్యక్రమాల కారణంగా పుస్తకరూపం చేయాలన్న ఆలోచన రాలేదు. ప్రింట్ కాకపోయినా జనుల నోళ్ళల్లో నానుతుండేవి. నాకు అరవై ఏళ్లు నిండిన తర్వాత 2000 సంవత్సరంలో ఇది రామరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. శతక సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సాధించుకుంది. తెలంగాణ సాహిత్య అకాడెమీ వారు దీనిలోని కొన్ని పద్యాలను హిందీ, ఇంగ్లీషు లోనికి అనువాదం చేయించారు. ఇందులో సమాజంలోని రకరకాల విషయాల పట్ల కలిగిన వేదనతో రాసిన పద్యాలున్నాయి. దీని రెండవ ముద్రణ గవర్నర్ గారిచే ఆవిష్కృతం కానుంది.

14. “శిల్పాచార్యులు” కావ్యం రాయడానికి ప్రేరణ ఎవరు?
జ : నా ఎనిమిదవ ఏట నుండి భువనగిరిలో నా  చదువు కొనసాగింది. అక్కడే నా కవిత్వం మొగ్గ తొడిగింది. ఎంతోమంది సహృదయులు మిత్రులయ్యారు. ఇక్కడ నేనొక ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ కవిగా ప్రధానాచార్యుల, ఆచార్యుల పండితుల మన్ననలు పొందాను. అందుకే భువనగిరి కోటను నా హృదయంలో ముద్రించుకున్నాను. ఆ ఋణం కొంతైనా తీర్చుకుందామన్న ఆశయంతో ఈ పట్టణానికి, పట్టణ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రఖ్యాత త్యాగమూర్తులను కొందరిని, ప్రసిద్ధ స్థలాలను కొన్నింటిని తలచుకుంటూ ఆ స్మృతులతో ఈ కావ్యం ద్వారా వారిని మనసారా స్మరించుకుంటున్నాను.
ఆరుట్ల దంపతులను ఉద్దేశించి…
“నాడు నేడైన ఏనాడు నైన/ కొలనుపాకనంగ మదిలొ గుర్తుకొచ్చె….” బి. ఎన్.శాస్త్రి గారిని ఉద్దేశించి..
“ఊళ్ళన్ని వడబోసి రాళ్ళ రాత చదివి/ వేల యేండ్ల చరిత వెలికి తీసె….”
ఇలా స్మరించుకుంటూ పద్యాలు రాశాను. ఈ ప్రాంతం శిల్ప కళకు ప్రసిద్ధి.
“శిలలపై గీత గీసె ఈ శిల్పి వాడు/ తెల్పినాడు నాటి చరిత్ర నిల్పి నేడు..” ఎక్కడో గాని చక్కని చెక్కడాల/ పనిని నేర్పితివి కద! ఓ పరమ శిల్పి!/ బుక్కెడన్నము దొరికెడి దిక్కు లేదు/ నాయనా తమ చక్కదనాల పనికి”
అంటూ శిల్పకారుల కళా నైపుణ్యాన్ని, వారి దీనావస్థను గురించి రాశాను.
“భువనగిరి తెలంగాణ సంపుటములోన / పసిడి వర్ణాలలో చెక్కబడును లెస్స” అని ఆ పట్టణాన్ని గురించి రాసి నమస్కృతులు తెలుపుకున్నాను.

డా. కూరెళ్ళగారిచే అరుణధూళిపాళకు సన్మానం

15. మీరు రాసిన ఇతర రచనలేవి?
జ :  1953 లో నేను ఏడవతరగతిలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించే మా మాతామహుడు బేతోజు లక్ష్మీ నారాయణ చనిపోయినప్పుడు ఛందస్సు ఏమీ తెలియకున్నా ఆ దుఃఖాన్ని  స్మృతి కావ్యంగా రాశాను. అలా ఎంతోమంది స్మృతులతో “స్మృత్యంజలి” పద్యాలు రాశాను. అవి ముద్రణలోనికి రాలేదు. అదీకాక “చద్దిమూటలు” అనే పేరుతో 5516 కొటేషన్లు ఒక్కచోట చేర్చాను. ఒక్కసారి ఆ పుస్తకం తిరగేస్తే చాలు ఆ ప్రభావం మన మీద పడుతుంది. అది కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.  పుష్ప విలాపం ఖండికతో ప్రేరణ పొంది “గోవిలాపం” రాశాను. కుడ్య మాసపత్రికలో ప్రచురించబడింది.
” చిక్కగున్నంత కాలం చితుక గొట్టి
చేత చేయించుకొందురు, చేరదీసి
బక్క పడగానె మమ్ముల బాహ్యపరచి
కోత కమ్ముదురయ్య మీ కులము వారు”
ఇట్లా ఉంటాయి ఆ పద్యాలు. 
ఛందో నియమాలు ఉన్న పద్య కవిత్వం రాయడానికి యువత ముందుకు రావడం లేదు. అందుకే వారికి సులువుగా ఉండడానికి “దొందూ దొందే” అనే త్రిపదుల కృతిని రాశాను. “దేవుడు లేని గుడి/ దేశికుడు లేని బడి/ దొందూ దొందే”…ఇలా అయితే ఎన్నో పద్యాలు రాశాను కానీ ఎప్పుడూ ఉద్యమాలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో తిరగడం వలన అచ్చు వేసుకోవాలనే ఆలోచన ఉండేది కాదు.

16.  తెలంగాణా ఉద్యమం వైపు మిమ్మల్ని ఉత్తేజితులను చేసిందెవరు?  ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఏమిటి?
జ:  నేనెప్పుడూ విశ్రాంతి కోరుకోనమ్మా! ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. చదువుకున్న రోజుల్లో చదువుకున్నాను. తర్వాత సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పాల్గొన్నాను. వాస్తవానికి ఆంధ్ర వ్యతిరేకోద్యమం కె సి ఆర్ పుట్టక.మునుపే 1952 లో ప్రారంభమైంది. “నాన్ ముల్కీ గో బ్యాక్” అనే నినాదంతో  ముల్కీ ఉద్యమం వచ్చింది. అప్పుడు నేను ఆరవ తరగతిలో ఉన్నాను. నాకేమీ తెలియదు. అయినా ఫ్లెక్సీ పట్టుకొని తిరిగిన వాణ్ణి. “ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్”,  “గోంగూర పచ్చడి గో బ్యాక్” అనే నినాదాలు అప్పుడు పుట్టినవే. తెలంగాణ తొలి ఉద్యమం, మలి ఉద్యమం రెండింటిలోనూ కవిగా, రచయితగా నా వంతు పాత్ర నిర్వహించాను. తెలంగాణా ఉద్యమంలో ‘ధూంధాం’ కార్యక్రమంలో పాటలతో ఎట్లా ఉర్రూతలూగించారో  సభల్లో నేను పద్యాలతో ఉర్రూతలూగించిన వాడిని.
” ఆత్మార్పణము జేసి అమరులైనట్టి మా త్యాగమూర్తుల ప్రసాదంబు గాదె,
పుట్టుకంత తెలంగాణ పోరు కంకితమయ్యె జయశంకరులవారి జయము గాదె
మాట నిలుపుకున్న మహనీయురాలు మా సోనియా ఇచ్చిన వరము గాదె” ఇలా ఎన్నో పద్యాలు..
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని దాశరథి అంటే నా తెలంగాణ కోట్ల రతనాల వీణ” అని పద్యం చెప్పాను. “తెలంగాణలో చదువుకున్న పెద్దవాళ్ళు లేర”ని అంటే “ఎవడ్రా అన్నది?”  “మందార మకరంద మాధుర్య మూర్తి మా పోతన్న పుట్టిన పుణ్యభూమి” అంటూ వంద పాదాలతో “తెలుగు కాగడాలు” రాశాను.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాజమండ్రిలో విశ్వవిద్యాలయానికి నన్నయ్య పేరు పెట్టినట్లు, కడపలో విశ్వవిద్యాలయానికి యోగి వేమన పేరు పెట్టినట్లు 2007లో నల్లగొండలో మంజూరైన విశ్వవిద్యాలయానికి పోతన పేరు పెట్టాలని ఉద్యమం మొదలుపెట్టాను. చాలామంది పెద్దలు సహకరించారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మా విన్నపాన్ని పట్టించుకోకపోగా మా నోళ్లు మూయించాలని మహాత్మాగాంధీ పేరు పెట్టారు. ఏమీ అనలేక పోయాం. తెలంగాణా మహాకవి పోతన అంటే నేను ఊరుకోను. తెలంగాణాలో పుట్టిన మహాకవి ఆయన. రాజశేఖరరెడ్డిగారు పోతన మీ వాడు కాదు అన్నాడు. అప్పుడు వరంగల్ లో సెమినార్లు జరిగాయి. “పోతన మా వాడు కాదంటే డొక్క చీలుస్తాం” అని వార్నింగ్ ఇచ్చాము. అప్పటినుండీ ఆంధ్రా ప్రాంతం వాళ్ళు రాసిన వ్యాసాలు రావడం ఆగిపోయాయి.
ఇట్లా తెలంగాణోద్యమం, మహాత్మాగాంధీ ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఉపాధ్యాయ ఉద్యమం, అక్షరాస్యత ఉద్యమం, పోతన నామ సాధక కమిటీ అధ్యక్షునిగా పోతన ఉద్యమం ఇలాంటివి చేశాను. అక్షరాస్యతా ఉద్యమం ప్రభుత్వం ప్రారంభించకముందే నేను ప్రారంభించాను. ఇంటింటికీ వెళ్లి చదువు చెప్పేవాణ్ణి. ఉడాయి గూడెం అనే చిన్న ఊళ్ళో పిల్లలు బడికి వచ్చేవారు కాదు. నేనే పలక, బలపం పట్టుకొని వెళ్లి నేర్పించేది. చచ్చేముందు సంతకం అయినా నేర్చుకోవాలని 80 ఏళ్ల పెద్దమనుషులకు కూడా సంతకం నేర్పాను.

17. మీ సంపాదకత్వంలో వెలువడిన పత్రికలేవి?
జ : పత్రికలు రచనా శక్తిని పెంపొందిస్తాయి. జ్ఞానాన్ని కలిగిస్తాయి. చైతన్య ప్రేరకాలు అవుతాయి. అందుకే నేను ఎక్కడ పని చేసినా స్కూల్లో కానీ, కాలేజీల్లో గానీ అక్కడ పత్రిక పెట్టేవాడిని. స్టాఫ్ ప్రోత్సహించేవారు కాదు. “ఈ పిల్లలకు ఏమొస్తది సార్? ఎందుకు ఈ పేపర్ ఇదంతా?” అని ఉత్సాహాన్ని నీరు కార్చేవారు. అయినా నేను వినేవాణ్ణి కాదు. మనం చేసే పని మనం చేయాలి. ఎవరో వద్దంటే ఊరుకుంటే పనులు ఎలా జరుగుతాయి?
నేను పని చేసిన విశ్వ విద్యాలయాల్లో కూడా కుడ్య పత్రికల ద్వారా విద్యార్థుల్లో రచనాసక్తి, సృజనశక్తి కలిగించడానికి ప్రయత్నం చేశాను. ఇక నడిపిన పత్రికలు…. బాపు భారతి, మన తెలుగుతల్లి, వలి వెలుగు, చిరంజీవి, ప్రియంవద, ముచుకుంద. నాకు చేతనయినంత వరకు చదువుపట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగేలా చేశాను.

18. సాహితీ సేవకై మీరు స్థాపించిన వివిధ సంస్థలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా?
జ : పల్లెటూళ్లను చైతన్య పరచడానికి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాను. దానికోసం కొన్ని సంస్థలు స్థాపించాను. అక్షర భారతి, మిత్ర భారతి, సాహితీ స్నేహితులు, భువనభారతి, ప్రజా భారతి, మల్లెల భారతి ఇలాంటి సంస్థలే కాక సాంసృతిక సంస్థలను కూడా స్థాపించాను. అందులో ఇంకా ఇప్పటికీ కొన్ని నడుస్తున్నాయి. వీటన్నిటికీ మంచి స్పందన లభించింది. మా సేవలు గుర్తించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు మా సేవలను గుర్తించి, బిరుదులతో, పురస్కారాలతో గౌరవించారు. పల్లెటూరులో పుట్టి పెరిగిన నా జీవితం ప్రస్తుతం సాహిత్య సేవలో గడిచిపోతోంది. ఆ తృప్తి చాలు. ” జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి” అన్న ఆర్యోక్తి నాకు ఆదర్శం.

19. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం మీకు ‘పద్మశ్రీ’ బిరుదును ఇవ్వడం పట్ల ఎటువంటి అనుభూతి చెందుతున్నారు?
జ:   అవార్డు ఇవ్వడం ఆనందమే. కానీ గర్వంగా భావించడం లేదు. ఎందుకంటే నాకు తోచినంతవరకు నలుగురికి ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశ్యం. నేను కీర్తి కాంక్షల కోసం ఈ పనులు చేయడం లేదు. నావల్ల ఒక్కరు బాగుపడ్డా దాన్ని నాకొచ్చిన అవార్డుగా భావిస్తాను. అవార్డు వచ్చిందని తెలిసి ఎంతోమంది స్వయంగా నా దగ్గరకు వచ్చారు. ఎంతోమంది తమ అభినందనలు తెలిపారు. నా కృషిని గుర్తించి  అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రమ్మని ఆహ్వానం వచ్చినా ఆరోగ్య పరిస్థితుల వల్ల వెళ్లలేకపోయాను.

20. ఇంతటి ఖ్యాతిని ఆర్జించిన మీరు గ్రంథాలయ విషయంలో ఇంకా చేయాలనుకుంటున్న పనులు ఏమైనా ఉన్నాయా?
జ : ఇప్పుడున్న గ్రంథాలయానికి స్థలం సరిపోవడం లేదు. ఇంతకు ముందు చెప్పాను కదా రెండు లక్షల పుస్తకాలకు పైగా ఉన్నాయని. ఇంకా ఎంతోమంది తెచ్చి ఇస్తున్నారు. అందుకే దీని పైన ఇంకో పెద్ద హాలు కట్టించాను. సాహితీ కార్యక్రమాలు కూడా జరుపుకునే లాగా చిన్న వేదిక కూడా ఏర్పాటు చేసాను. వచ్చే నెల ఫిబ్రవరిలో గవర్నర్ తమిళిసై గారి చేతుల మీదుగా అది ప్రారంభం కానున్నది. మీరు కూడా తప్పకుండా రావాలి ఆహ్వానం పంపుతాను ( నవ్వుతూ).

గవర్నర్ గారి చేత ఆవిష్కరింపబడనున్న గ్రంథాలయం

ధన్యవాదాలు సార్! తప్పకుండా వస్తాను. మీలాంటి ఆదర్శమూర్తులను కలుసుకోవడం, మా పాఠకులకు పరిచయం చేయడం మాకు గర్వకారణం. ఆరోగ్యరీత్యా ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా మీ జీవిత విశేషాలను ఇంత ఓపికగా చెప్పిన మీకు  మా తరఫున, మా పాఠకుల తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు.

January 30, 2024 3 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలుగు ప్రతిభా మూర్తులకు పట్టం గట్టిన

by Dr Radhey January 30, 2024
written by Dr Radhey

హ్యాండ్ బుక్ “సబ్బని సాహిత్య వ్యాసాలు” !

కొందరు ప్రతిభా మూర్తులు ప్రచారార్భాటాన్ని ఎంతమాత్రం ఇష్ట పడరు.

తనకు నచ్చిన పనిని ,ఇష్టం గా మార్చుకొని నిబద్దతతో చేసుకుంటూ పోతుంటారు.ఎవరి ప్రశంసల కోసమే ఎదురు చూడరు. అదీ వారి గొప్పతనం.

ఈ కోవలోకి వచ్చే అరుదైన కరీంనగర్ కవి సబ్బని లక్ష్మి నారాయణ గారు. తెలంగాణా  సాహిత్య చరిత్ర లో వీరి పాత్ర మరువలేనిది.

ఒక్క తెలంగాణా ఉద్యమ సాహిత్యం లో భాగంగా పది పుస్తకాలను వెలువరించిన ఘనత వీరిది.ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ వివక్ష లేని రచయిత గా సబ్బని గారిని పేర్కొన వచ్చు.

కేవలం కవిత్వమే కాదు,గేయాలు,వ్యాసాలు,దీర్ఘ కావ్యాలు,అనువాదాలు,నానీలు,పద్య శతకాలు మొదలైన విభిన్న సాహిత్య ప్రక్రియల్లో వీరి రచనలు వెలువడ్డాయి.

వీరు ఇటీవలే వెలువరించిన “సబ్బని సాహిత్య వ్యాసములు” ప్రత్యేకంగా పేర్కొన దగింది.

తెలుగు సాహిత్యం లో ఇరవై నాలుగు మంది సంఘ సంస్కర్తలు, రచయితలు,కవులు, నవల కారులు సాహితీ విమర్శకులు మొదలైన అత్యంత ప్రతిభా మూర్తుల సాహితీ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ రాసిన విలువైన వ్యాసాలు ఇవి.

ఇందులో నవయుగ వైతాళికుడు గా పేరుపొందిన గురజాడ అప్పారావు మొదలుకొని తెలంగాణా రుబాయిల్లో శిఖర స్థాయిని చేరుకున్న డా.ఏనుగు నరసింహారెడ్డి వరకు వివరణాత్మక వ్యాసాలు ఇందులో పొందు పరిచారు.

గురజాడ 150 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధునిక భాషా సాహిత్యాల యుగ కర్త గురజాడ పేరుతో చక్కటి వివరణాత్మక వ్యాసం రాస్తూ..

“సామాజిక ప్రయోజనం,హృదయానందం అనేవి సాహిత్య హితం కూర్చే రెండు మౌలికమైన ప్రయోజనములు.ఈ విషయాలను గుర్తెరిగి రచనలు చేసిన సాహిత్య సృజన శీలి గురజాడ” అంటారు.

విశ్వనాథ సత్యనారాయణ గురించి రాస్తూ..

వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ అనేక సాహిత్య ప్రక్రియల్లో వారి ప్రతిభ అసామాన్యమ ని , వారికలం నుండి వెలువడిన నవల “మ్రోయు తుమ్మెద” ఒక ఆణిముత్యం గా పేర్కొన్నారు.

జాషువా కవితా వైభవాన్ని కీర్తిస్తూ..

పద్యాన్ని హృద్యంగా పండించి సామాజిక చైతన్యం తో,సమాజం లోని అసమానతలు రూపు మాపడానికి కృషి చేసిన మహా కవుల్లో జాషువా అగ్రగణ్యుడనీ,సదా స్మరణీయులని ప్రశంసించారు.

గిడుగు వారిని వ్యవహార భాషోద్యమకారులుగా  అభివర్ణిస్తూ …

“వాచకాల్లో పుస్తకాల్లో సాహిత్యంలో వ్యవహారిక భాష ఉండాలని పట్టుబట్టి ఉద్యమంలా పనిచేసి దాని అమలుకు కృషిచేసిన బాధ్యుడు గిడుగు వారు. వారు సమాజ సేవలో పాల్గొంటూనే ముఖ్యంగా లిపిలేని సవర భాషకు లిపిని, భాషను, వాచకాలను, నిఘంటువులు, ఇచ్చిన ఘనుడు గిడుగు వారు. వారు తెలుగువారికి ఎంతో ప్రాతస్మరణీయులు”. అని పేర్కొన్నారు

సబ్బని లక్ష్మీనారాయణ

మహా కవి శ్రీశ్రీ ని గురించి రాస్తూ…

శ్రీశ్రీ కవిత ఒక్కొక్కటి ఒక అగ్నికణం.వాటికి వ్యాఖ్యానాలు రాయాలంటే పేజీలు చాలవు.

శ్రీశ్రీ కవితాక్షరాలు ఆవేశం తో ఊగి పోయేలా చేస్తాయి.అద్భుత వీర రస వాహిని శ్రీశ్రీ కవిత్వం అని కొనియాడారు.

తిలక్ కవితా తత్వంలో అమృతం కురిసినరాత్రి గురించి ఒక అద్భుత విశ్లేషణ చేశారు సబ్బని గారు..

“వస్తువును కవిత్వం చేయడంలో ఒక గొప్ప రసజ్ఞుడైన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. అమృతం కురిసిన రాత్రి, అందరూ ఆదమరచి నిద్ర పోతుంటే తను మాత్రం వర్షములోని అమృతపు సొనను పట్టుకొని దోసిల్లతో తాగి తిరిగి వచ్చాను అంటాడు. నిజంగా తిలక్ కవిత్వంలో అమరుడు 45 ఏళ్ల నడివయసులో కవితా రసగంగాధరుడి కవిత్వానికి ముగ్దులై అప్సరసలే తిలక్ ని స్వర్గలోకానికి తొందరగా తీసుకుపోయారేమో అనిపిస్తుంది” అంటారు

వచన కవితా పితామహుడైన స్వర్గీయ కుందుర్తి గారిని ఈ కవి బాగా ఇష్టపడతాడు ఆయన రాసిన తెలంగాణ దీర్ఘకావ్యం గురించి ఒక మంచి వ్యాసాన్ని సమర్పించారు

“నిజంగా కుందుర్తి తెలంగాణా ఒక దృశ్యమాన కావ్యం. కళ్లకు కట్టినట్లు సంఘటనలు, దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ప్రజలు పడిన కష్టాలు తెలుస్తాయి. అర్ధనాదాలు వినిపిస్తాయి.

తెలంగాణ ఒక కష్టాల కడలి, కన్నీటి కావ్యం, కాలగమనంలో, నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణా సాయుధ పోరాట క్రమాన్ని,

ఆ రోజుల్లో ప్రజలు పడిన కష్టనష్టాల్ని పోలీస్ చర్యతో అప్పటికి అవి సద్దుమణిగిన తీరును అంతవరకే టైం లిమిట్లో తన కావ్యాన్ని ముగించారు”.

తెలంగాణ సాయుధ పోరాట నేపద్యంగా ఈ కావ్యాన్ని రాసినందుకు కుందుర్తిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించాడు రచయిత.

మరో వ్యాసం లో కాళోజీ ధిక్కార స్వరం గురించి రాశారు.

“కాళోజీ రాసిన కావ్య భాష చాలా పదునైన భాష. ప్రజల భాష ,పలుకుబడుల భాష ,ఆ భాషలో ఉధృతి ఉంది ,నిరసన ఉంది, ధిక్కార స్వరం ఉంది ,ధ్వని ఉంది .కాళోజీ సాహిత్యంలో సామాజికాంశం కానిదేదీ లేదు.

 కాళోజీ తెలంగాణ అంటే తెలంగాణ భాష.  ఈ భాషకు ప్రాణమిచ్చాడు కన్నతల్లిలా ప్రేమించాడు. తెలంగాణ భాషలో రాయండి అని, తెలంగాణ భాషను బ్రతికించండి అని పసిపిల్లాడిలా కన్నీరు కారుస్తూ సెలవిచ్చాడు.”

ప్రముఖ అభ్యుదయకవి సోమ సుందర్ గారిని ప్రశంసిస్తూ ..కొన్ని రచనలు సామాజిక ప్రయోజనం ఆశించబడతాయి రాయబడతాయి. అలాంటిదే అవంత్స సోమసుందర్ “వజ్రాయుధం” ఈ కవి ధన్యుడు.

అణగారిన నేల కోసం, ప్రజల కోసం, కవిత్వము రాసిన అభ్యుదయ కవి, ఎంతో ఆలోచనతో తన ఇరువది ఐదేళ్ల వయస్సులో రాసిన కావ్యమే వజ్రాయుధం.

ప్రముఖ కవి దాశరథి గారి గురించి రాస్తూ.. “కవి వాక్కు వేద వాక్కు, కవి వాక్కు ,బాలవాక్కు, కవి వాక్కు బ్రహ్మ వాక్కు నాడైనా నీడైనా కవి కాంతి దర్శి. దూరదృష్టి గలవాడు. కవిస్పూర్తి ప్రదాత. చిత్తశుద్ధి నిజాయితీగల కవి నిత్యం సత్యాన్వేషణ చేస్తాడు. ఈ ప్రశంసలకన్నిటికి దాశరధి సత్య వాక్కులే సాక్ష్యాలు అంటారు.”

 “త్వమే వాహమ్” లో ఆరుద్ర కవిహృదయాన్ని గురించి చక్కటి ప్రస్తావన చేస్తారు.

“ఆరుద్ర “త్వమేవాహమ్” ను వివరణలు లేకుండా చదువుకోవడం కష్టం. కవి తన భావన లో ఒక వ్యవస్థను ఊహించుకొని చక్కటి ప్రతీకలతో పోలుస్తూ ఈ కవిత చెప్పారు.

ఈ కావ్యం పాఠకులకు సులభంగా అర్థం కానంత రీతిలో ఉన్నా, అది ఒక ప్రయోజనం ఆశించి రాసిన మహత్తర కావ్యం. అలా ఆరుద్ర గారు చిరస్మరణీయులుగా ఈ కావ్యంలో నిలిచిపోతారు.”

కవి శేషేంద్ర గారి పైన సబ్బని గారికి విపరీతమైన అభిమానం. వారిని వారి ప్యాలెస్ లో కలిసి స్వయంగా ఒక ఇంటర్వ్యూ నే చేశారు.

ఇందులో శేషేంద్ర గారి ఆధునిక ఇతిహాసం “నా దేశం నా ప్రజలు” గురించి ఒక గొప్ప వ్యాసాన్ని సమర్పించారు ఇందులో ఆయన గురించి వ్యాఖ్యానం చేస్తూ..

“కవి శేషేంద్ర ఒక రసైక ప్రేమ మూర్తి, పురుషుడు తనకు కావలసిన రసాత్మక భౌతిక మానసిక ఆనందాన్ని స్త్రీ నుండి పొందుతాడు. సంతృప్తిని బ్రతుకులోనింపు కుంటూ పరిపూర్ణ విజయుడై ముందుకు సాగుతాడు విజయ పథం లో.

శేషేంద్ర నా “నా దేశం నా ప్రజలు” కథా కావ్యం కాదు ఒక కవి జగత్తు, శ్రామికుడి జగత్తు, మిళితమై సాగిపోయిన భావాత్మక కావ్యం. అడుగడుగునా ప్రకృతి ఇందులో పులకించి పరవశించిపోతుంది కవి చేతిలో పడి. శేషేంద్ర కవిత్వంలోని గొప్పతనం ఒక కొత్త అభివ్యక్తి,

కొత్త డిక్షన్. కవి మాటల్లోనే చెప్పాలంటే శేషేంద్ర కవిత్వం ఒక విశిష్ట భాష అంటాడు సబ్బని.

ఇంకా ఇంకా..డా. సి.నారాయణ రెడ్డి గారి విశ్వంభర గురించి, ద్వా నా శాస్త్రిగారి సాహిత్యం గురించి,నవలా రచయిత వడ్డెర చండీ దాస్ గురించి,మినీ కవి అలిశెట్టి ప్రభాకర్ గురించి, కె.శివారెడ్డి “మోహనా ఓ మోహనా “గురించి,

డా.ఎన్.గోపిగారి జలగీతం గురించి, ఆచార్య రాచపాళెం రాసిన దీర్ఘ కావ్యం పొలి గురించి,బి.ఎస్ రాములు బతుకు పోరు నవల గురించి, కవి డా.ఏనుగు నరసింహారెడ్డి విశేష సంఖ్య లో తెలంగాణా రుబాయీలు గురించి, నేత కార్మికుల జీవన పోరాటం గురించి నేను రాసిన మగ్గం బతుకు దీర్ఘ కావ్యం విశిష్టతను గురించి.. ఎన్నో విలువైన వ్యాసాలు, వ్యాసాల్లో అర్థవంతమైన వ్యాఖ్యలు ,విశేషణలు చేశారు.

ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు ఈ పుస్తకానికి తన ముందు మాట లో

ఇందులోని సాహిత్య వ్యాసాలన్నీ తెలుగు వారి సాహిత్య సమైక్యతను,సహృదయత ను చాటేవిగా ఉన్నాయని ప్రశంసించారు.

ఈ పుస్తకాన్ని విశిష్ట సాహిత్య అభిమాని,నేటినిజం ఎడిటర్ బైస దేవదాస్ గారికి అంకితమివ్వడం రచయిత సముచిత నిర్ణయం గా నేను భావిస్తున్నాను.

ఈ పుస్తకం తెలుగు విద్యార్థులు,పరిశోధకులు,అధ్యాపకులకు హ్యాండ్ బుక్ గా,అధ్యయన గ్రంథం గా ఉపయోగ పడుతుందని నేను అభిప్రాయ పడుతున్నాను.

ఈ పుస్తకం కస్తూరి విజయం ప్రచురణల ద్వారా ప్రింట్ ఆన్ డిమాండ్ బుక్ గా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది.

సాహిత్య విలువలున్న ఒక మంచి పుస్తకాన్ని తెలుగు సాహిత్య లోకానికి అందించిన కవి మిత్రుడు సబ్బని లక్ష్మి నారాయణ గారిని మనసారా అభినందిస్తున్నాను.

‘సబ్బని సాహిత్య వ్యాసములు’ పుస్తకం లభ్యమయే చోటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్. 

https://amzn.to/3S2C6DA
https://bit.ly/3jUVp5r

సబ్బని లక్ష్మీ నారాయణ ఫోన్ నంబర్ : 8985251271

January 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us