మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

వచన కవితాకన్య రూప లావణ్యం – దాస్యం సేనాధిపతి ‘దిక్సూచి’

by Aruna Dhulipala July 29, 2024
written by Aruna Dhulipala

          కాలక్రమానుగతంగా అన్ని రంగాల్లోనూ మార్పు అనివార్యం. అందులో దేనికీ మినహాయింపు ఉండదు. అలాగే సాహిత్యంలోనూ ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు సామాజిక పరిస్థితులకు, మనుష్యుల భావాలకు అనుగుణంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఛందో బద్ధమైన పద్యకవిత్వం నుండి, మాత్రా ఛందస్సులతో కూడిన గేయకవిత్వంతో పాటు అనేక కవితాప్రక్రియలు సాహిత్య పూదోటలో వికసించి లతలుగా పెనవేసుకున్నాయి. అటువంటి వాటిలో వచనకవిత్వానికి నేటికాలంలో ఎంతోమంది కవులు తమ హస్తాక్షరాలతో అలంకారాలు తొడిగి ప్రకాశింప జేస్తున్నారు.

        కవుల భావనా తరంగమై ప్రవహించి కవిత్వం ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. అలాగని అది ఎటువంటి నియమాలకు లోబడి ఉండక పూర్తి స్వేచ్ఛా కాంక్షతో రూపు దిద్దుకున్నప్పుడు కొంత లోప భూయిష్టంగాను, మరికొంత పొరపాట్లతోను, ఇంకొంత పాఠకులకు అనాసక్తిగా పరిణమించే అవకాశం లేకపోలేదు. జీవన మనుగడ నియంత్రణ అవసరమైనట్లే దేనికైనా ఒక నియమం, ఒక నియంత్రణ అత్యవసరం.

        ‘వచన కవితా పితామహుడు’ గా కుందుర్తి ఆంజనేయులు గారు ఆధునిక కాలంలో వచన కవిత్వ ఆవశ్యకతను గుర్తించి 1958 లో ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ ను స్థాపించారు. వచన కవిత్వ లక్షణాలతో ‘నగరంలో వాన’ కావ్యాన్ని రచించారు. ‘ఫ్రీవర్స్’ అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా తెలుగులో వచనకవిత చెప్పబడుతోంది. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్యులు, డా. సి.నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ మొదలైన వారు వచన కవిత్వాన్ని ఆదరించారు. రచించారు. తరువాతి తరాలకు మార్గదర్శకులయ్యారు.

         ప్రజలకు సన్నిహితంగా ఉండేందుకు, వాడుక భాషలో, అలతి పదాలతో, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వచన కవితకు ప్రధాన లక్షణం. దీన్ని రాసేటప్పుడు కవులు ఏ విధమైన నియమాలను, లక్షణాలను పాటించాలో, సమాజంలో ఏ విధంగా చైతన్యాన్ని వికసింపజేయాలో తెలుపుతూ దాస్యం సేనాధిపతి గారు ‘దిక్సూచి’ అనే పుస్తకాన్ని వెలువరించారు. దీనిని వచన కవితకు కరదీపికగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి ఈ పేరు పెట్టడం లోనే ఆయన అంతరార్థం ప్రస్ఫుటమవుతోంది. శక్తివంతమైన రచనా నైపుణ్యతను సాధించే దిశగా ప్రస్తుత కవులకు సుబోధకంగా, సులభసాధ్యంగా ఆయన ఈ పుస్తకాన్ని వెలువరించారు.
           ‘కవిత్వమంటే’ …అని ప్రారంభిస్తూ, అనేకమైన మౌలిక లక్షణాలను క్రోడీకరిస్తూ ‘కవిత్వంలో మానవతావాదం’ వరకు ఉన్న విభాగాలు  వచనకవిత్వ ప్రాధాన్యత, దాని నియమావళిని తెలుపుతాయి.

ఈ భాగాలలో దాదాపు 320 మందికి పైగా ప్రాచీన కవుల నుండి నేటి కవులవరకు వారి రచనలలోని పాదాలను దశలవారీగా ఉటంకించడం, స్వరూప సామ్యాలను తెలపడం సేనాధిపతి గారి తులనాత్మక పరిశీలనను ప్రతిబింబిస్తుంది.

          “కవిత్వమంటే హృదయాలను కదిలించే అనుభూతినివ్వాలి. వస్తువును దాచడం కాదు. పొరలు పొరలుగా విప్పుతూ పద బంధాలతో, భావచిత్రాలతో పాఠకుడిని తన్మయుడిని చేసేది కవిత్వం, కవిత్వం హృదయాన్ని మీట గలగాలి” ఈ మాటలు చాలు కవిత్వం రాసే కవుల కర్తవ్యాన్ని బోధించడానికి. దీనికి ఉపపత్తిగా ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ గారు రచించిన ‘కవిత్వం కావాలి కవిత్వం’ అనే కవితను మనముందు నిలుపుతారు.

         అలంకారాల గుబాళింపు, పద చిత్రాలు, ప్రతీకలు, విరుపులు, మెరుపులు, ఎత్తుగడ, ముగింపు ఎంతవరకు అమరాలో, ఒదగాలో అది మంచి కవిత్వమని నందిని సిధారెడ్డి గారు చెప్పిన భావాల విశ్లేషణతో సేనాధిపతి గారు ఉత్తమ కవిత్వానికి ఉండాల్సిన ఎన్నో లక్షణాలను విశదీకరిస్తారు.

డా. సి నారాయణ రెడ్డిగారు రాసిన ‘మనోదృశ్యం’ కవిత

ఎత్తుగడ….

“ఆ దృశ్యాన్ని ఎన్నాళ్లుగా చూస్తూ ఉన్నానో/
దాని అందాలను ఎన్నిసార్లు తాగి చూస్తున్నానో/
దాహం తీరలేదు”….ఇలా మొదలవుతుంది. అది పాఠకుని అవ్యక్తభావనలో ముంచుతుంది. అందుకే కవిత్వ నిర్మాణానికి ఎత్తుగడ చాలా ముఖ్యమైనది.
           అలాగే కవితా వస్తువును విశ్లేషించడానికి వినియోగించబడే భాష, పదబంధ ప్రయోగంలో ఔచిత్యం, శైలి, శిల్పం ఇవి ప్రధాన భూమికను పోషించడంతో పాటు నర్మ గర్భత, సంక్షిప్తీకరణలు, కవితా నిర్మాణంలో శబ్ద, అర్థాలంకార ప్రయోగాలు కవిత్వాన్ని పరిపుష్టం చేస్తాయంటారు సేనాధిపతి గారు.

ప్రముఖ కవి యాకూబ్ గారు…

“నిన్ను కలిసాకే
నా మనో ఉద్యానవనంలో పూలు పూచాయి
అక్షరాల కలువలు విప్పారాయి…..” అన్నప్పుడు

మరో ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి…

“ముక్కారు
పచ్చని వరెన్నుల్ని ప్రసాదించే
బంగారు బాతు మా వాగు..” అని చెప్పినప్పుడు
ఆ అలంకార ప్రయోగాలు ఎదలను హత్తుకుంటాయి.

            కవిత్వాన్ని నిర్వహించేటప్పుడు భావాలను గణాలుగా, భావవ్యక్తీకరణకు అనువుగా విభజించుకోవడం ఒక పద్ధతి. కవి ప్రతిభను వెల్లడించడానికి, కవిత్వ సౌందర్యానికి, పాఠకులలో ఆసక్తిని పెంచి, క్రమంగా కవిత్వంతో నడవడానికి, సులభంగా అవగాహన చేసుకోవడానికి ఈ గణాలు ఉపయోగపడతాయి.

‘కాలం కాలం చేసింది’ కవితలో సినారె గారు…

మొదటి పేరాలో మూడు పంక్తులు, రెండవ పేరాలో నాలుగు పంక్తులు, మూడవ పేరాలో మూడు, నాలుగవ పేరాలో రెండు…ఇట్లా స్వేచ్ఛా భావనకనుగుణంగా కవితను రూపొందించారు.

అదే విధంగా దాశరథి గారు ‘తమ పునర్నవం’ లో కావ్యంలో ‘రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందట’

అన్న శీర్షికతో రాసిన కవిత నిన్న, ఇవాళ, రేపు పేరాలుగా క్రాంత దర్శనం చేయిస్తుంది. ఈ భావగణాల్లో అక్షరాలు, పాదాల విషయంలో ఎటువంటి నియతి ఉండదు. భావమే ప్రధానం.

           ‘వక్రోక్తి’ వచన కవిత్వానికి ఉండే ప్రధాన లక్షణాల్లో మరొకటి. పాఠకుల హృదయంలో ఆలోచన రేకెత్తించి, స్తబ్ద మనస్తత్వాన్ని నిరసించడం కోసం వక్రోక్తి కొంతవరకు ఉపయోగపడుతుంది. వ్యంగ్యం, చమత్కారం వక్రోక్తికి ఆభరణాలు. కానీ అది వస్తువు యొక్క పరిధి దాటకూడదు. పదబంధ ఔచిత్యానికి భంగం వాటిల్లకూడదు.

శ్రీశ్రీ నిరసన గళంలో…
“మనదీ ఒక బ్రతుకేనా?
కుక్కలవలె నక్కల వలె
సందులలో పందుల వలె…..” అనే వక్రోక్తులు తమను
తాము ప్రశ్నించుకునేలా చేస్తాయి.

కవి డా. ఎన్. గోపి ‘ఫ్రీడం ఫైటర్’ కవితలో…
“అతడు నాకు రోజూ కనిపిస్తాడు
లక్షల్తో త్యాగాన్ని వెలిగించి
ఇంట్లో ఎండిన డొక్కల కోసం
ఇల్లిల్లూ తిరుగుతుంటాడు…” లాంటి పాదాలు ఆకలి పేగులను దృశ్యమానం చేస్తాయి.

          కవిత్వ నిర్మాణంలో ‘భావచిత్రాలు’ ఒక ప్రత్యేక లక్షణం. వీటిని ఇంగ్లీషులో ‘ఇమేజరీ’ అంటారు. భావచిత్రాలు కవి భావావేశాన్ని, భావధారను స్పష్టీకరిస్తాయి. భావచిత్రం కంటికి కనిపించేది కాదు. అనుభూతి ప్రధానమైనది.

దాశరథి గారి ‘అగ్నిధార’ లో
“లోకపు చీకటి చీరకు/ ఆకాశం రైక మీది/ చిన్ని చుక్కల పువ్వులు/ తళుక్కుబెట్ట గలిగేనా/ జరి అంచు మెరిసేనా?…..” లాంటి పాదాల భావ చిత్రాలు దృశ్యాలను కట్టెదుట నిలుపుతాయి.

అహ్మద్ ఫైజ్ రాసిన కవిత్వాన్ని వి.జి. కిర్నన్ ఆంగ్లంలోకి అనువదిస్తే దానిని జం జం సత్యనారాయణ అనే మహబూబ్ నగర్ కు చెందిన కవి తెలుగులోకి అనువాదం చేసారు. అందులో ‘నేటి రాత్రి’ కవితలో “ఈ రాత్రి వీణపై విషాద రాగాలకు/ గతం బాధలన్నీ దూరమైనాయి…..” వంటి పాదాలు కవిత్వ సౌందర్యాన్ని ఇనుమడింపజేసాయి.
సినారె గారు ‘రెక్కలు’ కవితా సంపుటిలో కొవ్వొత్తులు తాగుతాయి/తనమీద దాడి చేసిన/ పురుగుల రెక్కలను….. ” అంటూ అద్భుత భావచిత్ర పద మాధుర్యాన్ని అందించారు.

         కవిత్వంలో వస్తువు ప్రధానమన్నది అందరికీ తెలిసినదే. దాన్ని అందంగా, పొందికగా నిర్మించడంలోనే కవి సృజనాత్మకత ఆవిష్కారమవుతుంది. అయితే కవిత్వంలో విరుపులు, పాదాంతాలు వీటి దగ్గర ఉపయోగించే విరామచిహ్నాలు కూడా కవిత్వంలో ప్రాధాన్యతను సంతరించుకున్న అంశమే. వీటిని కూడా సందర్భోచితంగా, అవసరమైనంత మేరకే ఉపయోగించుకోవాలి.

       కవిత్వంలో ‘ఔచిత్య పద బంధ ప్రయోగం’ చాలా ముఖ్యమైనది. కవిత్వం మనిషి అంతరాత్మతో సంభాషణవంటిదంటారు సేనాధిపతి గారు. కవి తన భావావేశాన్ని కొన్నిసార్లు అగ్నిపర్వతంలా వెడల గక్కుతాడు. ఒక్కోసారి ఆర్ద్రతతో నల్లని మబ్బులా వర్షిస్తాడు. అయితే సంయమనం కోల్పోయే పరిస్థితుల్లో పద ఔచిత్య విస్మరణకు గురయ్యే ప్రమాదం ఉంది. పాఠకులలో అన్ని రకాల వాళ్ళుంటారు కాబట్టి సభ్యత, సంస్కారయుతమైన పదాలు కవికి గౌరవాన్ని ఆపాదిస్తాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరమని సేనాధిపతిగారు చెప్పిన విషయాలు కవులు తప్పక పాటించి తీరాలి.

        చాలా సందర్భాల్లో కవి ‘స్వగతం’ కవితారూపాన్ని పొందుతుంది. ఆనందం, విషాదం రకరకాల పాత్రలుగా దృగ్గోచరమవుతుంది. ఈ స్వగతాన్ని బహిర్గతం చేసేటప్పుడు చమక్కులు, వ్యంగ్యం, మెరుపులు, చురకలు చోటు చేసుకోవచ్చు. వస్తువు స్వగత రూపంలో అంతర్వేదన వాహిని అవుతుంది.

        కవిత్వ నిర్మాణంలో భాష చాలా కీలకమైనది. కవి తన హృదయంతో కవిత్వం రాస్తాడు. ఏ భాషలో నైనా కవులు విశ్వజనీన భాషకే పట్టం కడతారు. వస్తు రూపాలు, శిల్పం, అభివ్యక్తి వీటన్నింటికీ మూలాధారం భాష. కవిని కవిగా నిలబెట్టేది భాష. భాషకు కావలసింది పాండిత్యం కాదు వస్తువును ప్రతిభావంతంగా,

సందర్భోచితంగా, ఔచితీవంతంగా ప్రకటించడానికి మామూలు పదాలు అయినా ఉండవచ్చు అని తమ అభిప్రాయ ప్రకటన చేస్తారు సేనాధిపతి గారు. మాండలికంలో కవిత రాసేటప్పుడు మొదటి నుండి చివరిదాకా ఆ పదాలనే ఉపయోగించాలి. కవిత్వ పదాల్లో సంక్లిష్టత, సందిగ్ధతలకు తావు ఉండకుండా జాగ్రత్త పడాలి. అక్షరదోషాలు ఉండకుండా చూసుకోవాలి.

         ఇక ‘ముగింపు’ అనేది కవితను మొత్తంగా ఆలోచింపజేస్తుంది. ఇది కవి రచనా నైపుణ్యాన్ని వ్యక్తీకరిస్తుంది. కవి శైలి,ముద్ర ఇందులో కనిపించాలి. ఇది ఆలోచనాత్మకంగా, సందేశాత్మకంగా ఒక వ్యంగ్యం, ఒక మెరుపు, ఒక చురుకు, ఒక చరుపులతో ఉండాలి. కొత్త ఆలోచనకు తెరతీయాలి. కవితాత్మకమైన స్పష్టత కనిపించాలి. ఇవన్నీ రావాలంటే కవికి అధ్యయన శీలత్వం, ప్రముఖుల రచనల పరిశీలన, వాటి తీరుతెన్నులను గ్రహించే నేర్పు ఉండాలని కవులకు పథ నిర్దేశం చేస్తారు దాస్యం సేనాధిపతి గారు. ఇంకా ఇలాంటి అనేకమైన విషయాలు ఈ పుస్తకంలో పొందు పరచబడ్డాయి.

         నేటి కాలంలో కవులు, కవయిత్రులు అనేక మాధ్యమాల ద్వారా వారి కలాలను, గళాలను కదిలిస్తున్నారు. కొంతవరకు వాటిని పరిశీలిస్తే  ఆత్మవిమర్శకు తావు లేకుండా, రాయడమే ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాంటి వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం దిక్సూచి. రాయడం ప్రారంభించాలనుకున్నవారికైనా, రాస్తున్న వారికైనా ఆత్మ పరిశీలన చేసుకొని మంచి కవిత్వాన్ని రాయగలిగే మెళకువలను బోధించే ఉత్తమ గ్రంథమిది. దీనికోసం ఆయన చేసిన కృషి అనితరసాధ్యం. ఎవ్వరైనా చేతి ఊతంగా దీన్ని పట్టుకొని వచన కవితా సాగరతీరాన్ని సులభంగా చేరుకోవచ్చు.  తరతరాలు నిలిచివుండేలా ప్రామాణికమైన కవిత్వ లక్షణాలతో ఒక గొప్ప పుస్తకాన్ని అందించిన సేనాధిపతిగారు అభినందనీయులు.

July 29, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

పిచ్చుక

by Gaddam sulochana July 29, 2024
written by Gaddam sulochana

ఊర పిచ్చుక ఊరు వదిలిందా? ఊరు పొమ్మందా?
చేలల్లో ,చేలకల్లో, వాకిళ్లలో నీ సందడి లేక చిన్న పోతుంది.

వాడదాటి, ఊరు వదిలి, చూరు విడిచి పోయావెక్కడికి?
నీ కిచ కిచల పాటలు
ఓర చూపులు
చిలిపి గంతులు
నీటి ఆటల చిందులు చూస్తుంటే మాకెంత ఆనందమో! తెలుసా?
చిన్ని రెక్కలతో తుర్రుమని ఎత్తులకు ఎగిరిపోతావు.

చూరులో నీవు గూడు కడితే మురిసిపోయాము.
ఇప్పుడేమో
కనపడవు
వినపడవు..
బుర్రుపిట్ట పాటలు
పిట్ట కథలు
పిచ్చుక గుళ్ళు
ఇక కట్టు కథలు అంటే తట్టుకోలేము.

బుజ్జి పిట్ట బాధ ఎవరికి
పట్టదు..
మనిషి మారిపోయాడు..
స్వార్థంతో ప్రకృతి
వినాశనం..
ఎండవేడి భూతాపం కాలుష్యాలు..
తాళలేని చిన్ని ప్రాణి..
తిండి లేక,నీరు లేక, తలదాచుకోలేక తల్లడిల్లుతున్నది. రెక్కలు ఉడిగి పిట్టలు పిట్టల్లా రాలిపోతున్నాయి..
పిల్లల బంగారు
బాల్యంలో బంగారు
పిచ్చుక సందడే
లేదు.

చిన్ని ప్రాణులను
చరిత్రలోకి తోయొద్దు
నిలుపుకుందాం..

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శవ యాత్ర “పాఠం !”

by రాఘవాచార్య‌ July 29, 2024
written by రాఘవాచార్య‌

పటాటోపంగా ప్రచారంగా
పైన కాషాయం గుర్తులు లేకుంటేనేం
శవం నిజంగా త్రికరణ శుద్దిగా సన్యాసి !
కండ్లు మూసుకుని జపంలోనే ఉంటుంది
దొంగజపం కాదు సుమా!
గిచ్చినా లేవదు

ఆశగా వెంట దాచుకుని ఏమీ తెచ్చుకోదు !
బహిరంగంగా ఊరందరి ముందే నిష్క్రమణ !
చివరకు తన పైన చల్లిన రుచికర కరకర పేలాలను
కాకులకే వదిలేస్తుంది !

వెంట వచ్చిన వారిని తనను మరిచి పొమ్మంటుంది 
ఉన్నవన్నీ వదిలేసిన
వఠ్ఠి వఠ్ఠి చేతులు !
కనీసం కాళ్లకు చెప్పులైనా లేవు

ఖాళీ ఖాళీ చేతులుగా
శవం ఎంతో విశ్వాసంగా విశ్వజనీన సత్యం !
 ఎవరైనా శవ యాత్రలో పాల్గొంటే పరిణతి చెందుడే !!
శవం బతికున్న వారికి మార్గదర్శనంగా లెజెండ్ !
“ప్రజా నాయకులై ఎంత దోచుకు తిన్నా
చివరకు ప్రజలకు వదిలేసి పోవాల్సిందేనని !!”
ఎంత గొప్పది  “శవం పాఠం”

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

The Learned

by Rudrakhala Matam Prabhu linga Shastri July 29, 2024
written by Rudrakhala Matam Prabhu linga Shastri

“I” could be understood
No doubt be in this regard.

He could understand “I”
As same “I” in any context?

If He could go on doing So
Chance would be there surely.

Is certainty possible there?
When Sincerity is in going on.

“I” would be understood means?
“HE” merges into “I” forevermore.

Without merging, Couldn’t He?
Understanding means Learning “I”
Who would be The Learned in Each.

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనసు – మాట

by Aruna Dhulipala July 29, 2024
written by Aruna Dhulipala

వాళ్లిద్దరూ….
ఎంతో ఆత్మీయులు
అప్పుడప్పుడు
విడదీయలేని శత్రువులు

అంతరంగ జగత్తుకు
ఒకరు సాధికారులు
శబ్దాశ్రయంగా
బహిరంగ స్వరాధికారులు
వేరొకరు

లోతుల్లోని భావాల
మర్మం ఒకరైతే
భావ వినిమయ ప్రసారాల
చతురులు మరొకరు

ఆలోచనల సూక్ష్మత
ఒకరిదైతే
పెదవుల వాహకంగా
పరుగులు తీసే
ధ్వని తరంగాలు ఇంకొకరివి

మనసు చెప్పినా
మాట పలుకదు ఒక్కోసారి
వద్దంటున్నా
పలుకక ఉండదు మరోసారి
వీటి మధ్య మౌనం
మింగుతుంది కాలాన్ని
అనేకసార్లు

మనసు, మాటకు నడుమ
కావాలి మేలనం
అదే కరువైతే
వ్యక్తిత్వపు చిరునామాకు
తప్పవు అవమానాలు
అనుభవం ఎంతటిదైనా-!!

దాచుకోవాల్సినవి కొన్ని
దాపరికం ఉండకూడనివి మరిన్ని
ఏది తగునో?
ఏది తగువో?
పెదవి దాటడమంటే
మనసు స్వచ్ఛమై వికసించడమే !!

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆషాఢం – విశిష్ఠత

by Vijaya Goli July 29, 2024
written by Vijaya Goli

భారతీయ హిందూ సంస్కృతి లో ప్రతి పురాతన సాంప్రదాయానికి శాస్త్రీయ కారణం ఉంటుంది . అలాగే మన తెలుగు నెలలు ఛైత్రము నుండి ఫాల్గుణం వరకు ప్రతి మాసం ప్రత్యేకమైనదే.ప్రతి మాసానికి ఆ సమయపు వాతావరణాన్ని బట్టి ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ,శాస్త్రీయ బద్ధంగా ఉంటాయి.ఇపుడు మనం ఆషాఢ మాసం గురించి విశ్లేషించుకుందాము.
ఈ సంవత్సరం జూన్ 24ఆదివారము నుండి మొదలుగా జులై 21 వరకు ఆషాఢ మాసం వుంది .
ఆషాఢమాసం అనగానే అందరికీ ముందుగా గుర్తు కొచ్చేది వానలు .
తెలుగు నెలలలో ఛైత్రం తర్వాత ఆషాఢం నాల్గవ నెలగా వస్తుంది .ఆషాఢ పౌర్ణమి ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ కానీ నక్షత్రాలతో కలిసి వస్తుంది కాబట్టి ఆషాఢ మాసంగా పరిగణించారు .
ఈ నెల నుండే వర్షాకాలం మొదలవుతుంది. అప్పటి వరకు వున్న వేసవి తాపాన్ని చల్ల బరుస్తూ ..చిరు జల్లులతో వాతావరణం చాలా ఆహ్లాద కరంగామారుతుంది .
ప్రకృతి ఆకుపచ్చని చీర కట్టిన పెద్ద ముత్తైదువలా ఉంటుంది . వర్షంలో తడిచి …పచ్చగా కొత్త చిగురులతో నిగారింపు తేలుతుంది .ఆకాశమంతా ఒక్క సారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చి …ఆమబ్బుల మధ్య మెరుపు తీగల నాట్యం కనుల విందుగాకనిపిస్తుంది .అదేసమయంలో ఒక్కోసారి దేవ దానవ యుద్ధాన్ని స్పురణకు తెస్తూ భయపెడుతూ ఉరుములు ..ఒక్కోసారి శుభకార్యాలను గుర్తు చేస్తూ మంగళ వాద్యాలుగా వీనుల విందు చేస్తాయి .నదులు ,చెరువులు పొంగి పొర్లుతూ వుంటాయి. అంతలోనె మబ్బులన్నీ చెదిరిపోయి వెండి వెలుగులతో సూర్యుడు వేడుక చేస్తాడు. అప్పడప్పుడు హరివిల్లులు దాగుడు మూతలాడుతూ అల్లరి చేస్తాయి.వ్యవసాయానికి కూడా చాలా అనువైన సమయం .
శుభకార్యాలు చేయక పోయినా ఆధ్యాత్మికతను అంతరించుకున్న మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం అంతా విష్ణు చింతన మంచిదంటారు .
ఏకాదశి నుండి విష్ణుమూర్తి క్షీర సముద్రంలో యోగ నిద్రలో శయనిస్తాడని ,ఆరోజును శయన ఏకాదశిగా ,తొలి ఏకాదశిగా ఉపవాస వ్రతాలు ,సముద్ర స్నానాలు చేస్తారు . దక్షిణాయనం ప్రారంభ దినంగా కూడా శాస్త్రం చెపుతుంది .సాధు సన్యాసులు చేసే చాతుర్మాస దీక్షలు కూడా ఈ రోజు నుండే మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి తో ముగుస్తాయి .అలాగే భాను సప్తమి ఆ రోజు పగలు ,రాత్రి సమంగా ఉంటాయి.
ఈ మాసం లోనే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతాయి .ఆడవారికి విశిష్ఠమైన బోనాల పండుగ కూడా ఆషాఢం లోనే ఆరంభ మవుతుంది. ప్రకృతి ప్రసాదించే పచ్చని కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ఆరాధిస్తారు.మొదటి పంటగా అమ్మ వారికి నైవేద్యం పెడతారు.
ఆషాఢమంతా కూడా ఆధ్యాత్మిక పరిమళాలతో భక్తులు పరవశం చెందుతారు .ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి గురు పూర్ణిమగా ,వ్యాసపూర్ణిమగా పిలువబడుతుంది . గురుపూజ ఉత్సవాలు జరుగుతాయి .పితృ తర్పణాలకు ప్రత్యేకమైన మాసంగా కూడా పరిగణిస్తారు .
ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా చెప్పారు .వేసవి వల్ల వేడెక్కిన భూమి ఒక్క సారిగా వర్షాలతో చల్ల పడటం వలన వాతావరణం లో వచ్చే మార్పులతో
ప్రజల్లో రుగ్మతలు పెరుగుతాయి . అధిక వర్షాల వలన కాలువలు నదులలో కాలుష్యం చేరటం వలన అంటు రోగాలు ప్రబలుతాయి . చిత్తడి నేలల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందుతాయి .ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతారు . ఆషాఢం ఆడవారు గోరింట తప్పక పెట్టు కోవాలని వారి ఐదోతనానికి ముడి పెడతారు .అసలు శాస్త్రీయ కారణం …వర్షం వలన తడి ఆరక గోళ్ళు ,కాలి వేళ్ళు పుండ్లుగా మారుతాయి .గోరింట ఔషధ గుణాలు ఉన్న
మొక్క . చర్మ రక్షణగా పనిచేస్తుంది. అందువలన ఆడవారిని తప్పక గోరింటపెట్టుకోవాలని చెపుతారు .
కొత్తగా వివాహమైన జంటలు కలిసి ఉండ కూడదనే ఒక సాంప్రదాయం కూడా ఉంది .ఆషాఢ మాసం నెల రోజులు ఆడపిల్లను పుట్టింటికి పంపి.ఆషాఢం వెళ్ళగానే ఆషాఢ పట్టీ అనే వేడుకతో అల్లుడిని స్వాగతిస్తారు .వారి ప్రాంతీయ సాంప్రదాయాలను బట్టి వేడుకలు చేసుకుంటారు .కానీ..
నిజానికి శాస్త్రీయంగా …ఆషాఢంలో ఆడపిల్ల గర్భం దాలిస్తే …ప్రసవం నిండు వేసవిలో అంటే ఏప్రిల్ మే నెలల్లో వస్తుంది .ఆ సమయం ప్రసవానికి అనువైనది కాదు కాబట్టి ఈ నియమాన్ని పెట్టి ఉండవచ్చు .
ఇలా ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని శాస్త్రీయ కోణం లో ఆలోచిస్తే మన పండుగలు ,వేడుకల్లో ఎంత విలువైన సందేశాలున్నాయో అర్ధ మవుతుంది .ఆషాఢ మాసం ప్రతి రోజూ కూడ ఆధ్యాత్మికతను సంతరించుకుని వుంటుందనటానికి ఎలాంటి సందేహం లేదు .

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

లక్ష్మయ్య గారి కవిత్వంతో కరచాలనం…

by Senathipathi Dasyam July 29, 2024
written by Senathipathi Dasyam

ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు శ్రీదాస్యం లక్ష్మయ్యగారు 1979లోనే మంచిర్యాల నుండి వెలువడిన ‘మంచిరాల వెలుగు’ పత్రికలో తమ మొదటి కవితను అచ్చులో చూసుకున్నారు. అదే సంవత్సరం మంచిర్యాల కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న సందర్భంలో కళాశాల వార్షికోత్సవ కవితల పోటీలో ప్రథమ బహుమతిని పొందడం విశేషం! అలా మొదలైంది లక్ష్మయ్యగారి కవితాయానం.. తొలినాళ్ళలో.. డిగ్రీ చదివే రోజుల్లో జమ్మికుంట నుండి వెలువడే ”రచ్చబండ” వారపత్రికలో ఆయన తన రెండో కవితను అచ్చులో చూసుకుని.. మురిసిపోవడమే గాక వివిధ పత్రికలకు తమ రచనలను కవితల రూపంలో పంపడం, అవి ప్రచురింపబడటం.. కవిగా కొనసాగాలన్న కాంక్ష బలపడి.. ఇక వెనుదిరిగి చూసుకోకుండా నిరంతరం కవిత్వ సృజన చేస్తూ.. ముందుకు సాగడం ముదావహం.. ‘ప్రసారిక’ మాసపత్రిక సంపాదకులు నమిలికొండ బాలకిషన్‌ రావు, సాహితీవేత్త డా|| టి.శ్రీరంగస్వామి గారల ప్రోత్సాహంతో లక్ష్మయ్యగారు తమ కలానికి పదును పెట్టుకుంటూ.. క్రమబద్ధంగా కవిత్వరచనలో పరిణతి సాధిస్తూ.. ఉదయసాహితి సాహిత్య సంస్థను ప్రారంభించి.. తాను కవిత్వం రాయడంతో పాటు అనేకమంది వర్ధమాన, ప్రవర్ధమాన కవుల రచనలను ఏర్చికూర్చి కవితా సంకలనాలను వెలువరించి.. సాహితీ వికాసానికై కృషి చేయడం అభినందనీయం. ఉదయ సాహితీ ఆధ్వర్యంలో ‘నేటికవిత’ అంతర్జాల సమూహాన్ని ఏర్పాటుచేసి వందలాది మంది రెండు తెలుగు రాష్ట్రాలలోని కవులు, రచయితలకు అండగా నిలిచి, పలు వైవిధ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సాహితీ సేవలో తరిస్తున్నారు. చిన్ననాటి నుండే సామాజిక అంశాల పట్ల స్పందించడం.. అభ్యుదయ భావాలను పుణికి పుచ్చుకోవడం వల్ల కవిత్వ సృజన పట్ల లక్ష్మయ్యగారు ఆకర్షితులై.. నిరాటంకంగా తమ సాహితీయానం కొనసాగిస్తూ.. నేడు ఓ కవిగా, రచయితగా, విమర్శకునిగా అందరి మన్ననలు పొందడం అభినందనీయం.. పాత్రికేయునిగా పనిచేసిన కాలంలోనూ.. లక్ష్మయ్య గారు వార్తా రచనతో పాటు కవిత్వ సృజన పట్ల మక్కువను పెంచుకోవడం విశేషం.. ఇక ఆయన నాలుగు థాబ్దాలుగా రాస్తున్న కవిత్వం గురించి పరిశీలిస్తే.. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ రెండో సం|| చదువుతున్నప్పుడే 1982లో తమ తొలి కవితా సంపుటి ”భావచిత్రాలు” పేరుతో వెలువరించి అందరి దృష్టిని ఆకర్షించారు.. సమాజం గురించి ఇంకా పూర్తి అవగాహన పొందకముందే.. సమాజంలోని లోపాలను ఎత్తి చూపిన ఘనత ఆయనకు ఉంది.

మినీ కవితల సమాహారంగా రూపుదిద్దుకున్న ‘భావచిత్రాలు’ కవితా సంపుటిలోని కవితల్లో లక్ష్మయ్యగారి కవితా పటిమను చూసి అందరు ఆశ్చర్యపోయేవారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన మినీ కవితల రూపంలో ప్రకటించిన భావాలు.. సామాజిక చైతన్యానికి దోహద పడేలా కొలువుదీరాయి.. ప్రభువుల పాలనను ఎండగడుతూ.. లోకంలోని అసమానతలపై ధ్వజమెత్తుతూ.. సూటిగా.. ఘాటుగా.. పదునుగా ఆయన రాసిన మినీ కవితలు కవిగా సాహితీలోకంలో నిలదొక్కుకోవడానికి మార్గాన్ని సుగమం చేశాయి. ‘భావచిత్రాలు’లోని కవితల్లో భావతీవ్రతను, చక్కని భాషతో భావాలకు మెరుగులద్దడం.. వంటి అంశాలను చూస్తాం.. ‘బ్రహ్మరాక్షసి’ శీర్షికతో రాసిన మినీ కవితలో లక్ష్మయ్యగారు నిరుద్యోగంపై రాసిన భావాలు ఇలా ఉన్నాయి.

నిరుద్యోగం ఒక పీడ
దేశ ప్రగతికిది అడ్డుగోడ
అరాచకాలకు జాడ
పడకూడదు సుమా ఈ నీడ! అంటూ దేశప్రగతికి అడ్డుగోడైన నిరుద్యోగ నిర్మూలనకై పాలకులు శ్రద్ధ చూపాలన్న అర్థం ధ్వనించే విధంగా రాయడం విశేషం !
”భావచిత్రాలు” పుస్తకంలోనే ”కలికాలం” శీర్షికతో రాసిన కవితలో మనిషి స్వభావంపై ధ్వజమెత్తారు.
మనిషిని
సాటి మనిషే
నమ్మని ఈ కాలంలో
ఇక…
ఈ మనిషి బతికుంటేనేం?
చస్తేనేం? అని వ్యాఖ్యానించారు.
మానవత్వం చూడని మనిషి మనుగడ నిరర్థకమని చెప్పకనే చెప్పారు. ”అసలు విషయం” కవితలోనూ లక్ష్మయ్యగారు ఆలోచనాత్మక భావాలకు చోటు కల్పించారు.
పచ్చని ఆకు
రాలి పోతుంటేనే
‘అయ్యో’ అనని జనం
పండుటాకు
రాలిపోతుంటే మాత్రం
‘పాపం’ అంటుందా? అని ప్రశ్నించారు.
‘నిజం’ మినీ కవితలో ఉద్యోగం లేక.. నిరుద్యోగి పడే వ్యథలను మూడు ముక్కల్లో చెప్పారు. అంత్య ప్రాసలతో సాగే ఈ కవిత అందరినీ ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంది.
నిరుద్యోగి
ప్రారంభిస్తే ఉద్యోగాల వేట
ఖాళీగా
లేవంటారడిగిన చోట
టిది
ప్రతి ఆఫీసులో పాడే పాట
నిజం కాదంటారా ఈ మాట అంటూ రాయడం బాగుంది.
”భావచిత్రాలు” కవితా సంపుటి తర్వాత లక్ష్మయ్యగారు చాలాకాలం పాత్రికేయ వృత్తిలో బిజీగా ఉండటం వల్ల తమ రచనలను గ్రంథరూపంలో తీసుకరావడానికి సమయం చిక్కలేదు.. 2002లో ఆయన ”తండ్లాట” పేరుతో తమ రెండో కవితా సంపుటిని సాహితీలోకానికి అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో వెలువరించిన గ్రంథమిది! ఈ సంపుటిని వరంగల్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక రెండో రాష్ట్ర మహాసభల్లో.. పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావుగారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడటం విశేషం. ఇందులోని కవితల్లో పేగుబంధం విలువనే కాదు, బతుకు బందీఖానాలో బలిపీఠమెక్కి కూర్చున్న దగాపడ్డ జీవితపు జ్ఞాపకాలు, నీవెన్ని గుసగుసలు చేసినా.. మా రుసరుసల్ని చల్లార్చలేవంటూ చేసే ధిక్కార స్వరాలు.. అడుగడుగునా కానవస్తాయి. ఇంకా చిరునవ్వుల బేరాలను.. మాతృభాషా సుగంధ పరిమళాలను, బద్ధలైన బంగారు కలలను ”తండ్లాట” కవితల్లో మనం గమనిస్తాం.. ఇంకా..

”మనస్సులో ఆలోచన తళుక్కుమన్నప్పుడు
భావం భళ్ళున కక్కేస్తుందంటూ”
”ఆనవాళ్ళు” కవితను రూపుదిద్దారు.
”బంగారు పంటల పల్లెసీమల్లో
మేడల మిద్దెల నగర వీధిలో
హుషారు మత్తుకు, నిషా జగత్తుకు
వృథాగా కాలం విడవకండి” అంటూ
”నీతికి ప్రాణం పోయండి” కవిత ద్వారా హితవు పలికారు.
”పేగుబంధం” కవిత ఆద్యంతం ఆర్ద్రంగా మలచబడింది.
ఉసిల్ల పుట్టలా సమస్యలదండు తరుముకొస్తుంటే..
అవస్థలతో ఆపసోపాలు పడుతూ ప్రాణం సగం చచ్చిపోయింది.
అంటూ ఈ కవితను ఎత్తుకున్న తీరు బాగుంది. బాధల సుడిగుండంలో నుండి బయటపడే మార్గంలేక విలవిలలాడుతోందని వాపోయారు. సత్తువలేని ఎముకలగూడు.. కాడెక్కెందుకు కళ్లింతలు చేసుకొని చూస్తోందనీ.. పేగు పంచిన జీవాలు- పేదరికమే నీ కర్మ అని.. అన్ని బంధాలు తెంచుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాయని అంటూ కొనసాగించి అందరి హృదయాలను కదిలించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తూ.. ”తొవ్వ జూసుకోండ్రి!” కవితను రూపుదిద్దారు.

మేం తలుసుకుంటే
మీకంటే మా దండిగనే మాట్లాడుతం
మాకు శాని రాదు గాని సక్కటిభాషే మాది
అంటూ స్వాభిమానాన్ని చాటారు.
దాచుకోవడం మా తెలంగాణలో లేదనీ దోచుకోవడం తెల్వనే తెల్వదని తేల్చిచెప్పారు.
చెప్పాలనుకున్నవి సూటిగానే జెప్పుతం..
ఎవ్వలకు తలొగ్గాల్లో- ఎక్కడ తగులాన్నో
గక్కడనే తగిలేటట్లు జేస్తం..
మా నాల్కలు తాడిమట్టలు కావు
మనుషుల్లెక్క మసలుతాం
మనసుపెట్టి మాట్లాడుతాం అంటూ కొనసాగించారు.
మాకెవ్వల సొమ్ము అక్కర్లేదు
మాయి మాకు దక్కితే సాలు…
అణగి మణిగి పడ్డది సాలు
మాకు సోయి లేదనుకోకుండ్రి
అనుభవాలు మాకు అన్ని నేర్పినయి
లొల్లిని షురువు జేత్తాన్నం..
తొవ్వ జూసుకోండ్రి
తోక ముడుసుకోండ్రి అంటూ నినదించారు.
తెలంగాణ ఉద్యమానికి ఉడుతాభక్తిగా లక్ష్మయ్యగారు తమ భావాలను అక్షరాల్లో నిక్షిప్తం చేసి.. ఈ కవితకు జీవం పోశారు. ”తండ్లాట” కవితా సంపుటి తర్వాత కొంత విరామం తో మళ్ళీ 2006లో ”బుర్కపిట్టలు” పేరుతో నానీల సంపుటిని వెలువరించారు. డాక్టర్‌ ఎన్‌.గోపిగారు సృష్టించిన నాలుగు పాదాల నానీల కవితా రూపాన్ని సుసంపన్నం చేస్తూ కవిగా తమ భావాలను నానీల్లో ప్రకటించి సామాజిక చైతన్యానికి కృషి చేశారు.

మట్టి లోపల గింజ
గింజుకుంటేనే కదా
మట్టిపై
పొట్టకొచ్చేది అంటూ లక్ష్మయ్యగారు బలమైన నానీకి జీవం పోశారు. విత్తనం గురించి పైకి చెప్పినప్పటికీ మనిషికీ వర్తించేలా నర్మగర్భంగా చక్కని సందేశాన్ని అందజేశారు.
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని గుర్తు చేశారు. దేన్నైనా సాధించాలంటే పట్టుదల, కృషి అవసరమని తెలియజేశారు.
లక్ష్మయ్యగారు స్వయాన ఉపాధ్యాయుడు కనుక.. ప్రతినిత్యం తాను ఉపయోగించే సుద్దముక్కను సైతం కవితామయం చేసి అర్థవంతమైన నానీని సృష్టించారు.

వేళ్ళ మధ్య
చాక్‌పీస్‌ అరిగింది
పిల్లల మెదళ్ళలో
విజ్ఞానం పెరిగింది అంటారు. నిజమే కదా!
మరో నానీలో…
వలసలు
ఆకలి చావులు
తెగిన పోగులు
నేతన్నల బతుకులు .. అంటూ నేతన్నల వ్యథాభరిత జీవితానికి అద్దం పట్టారు.

ధిక్కారమే
నీ స్వరం
కాళన్నా
నువ్వు తెలంగాణకే వరం అంటూ కాళోజీ పట్ల కవిగా తమ గౌరవాన్ని చాటుకున్నారు.

ఇలా నాలుగు పాదాల్లో ఇరవై నుండి ఇరవై ఐదు అక్షరాల్లో కవితాత్మకంగా నానీలను రాసి అందరినీ మెప్పించారు.

ఆ తర్వాత 2017లో ‘గునుక పువ్వు’ కవితా సంపుటిని వెలువరించారు. ఈ సంపుటిలో 75 కవితలు వైవిధ్యమైన కవితా వస్తువులతో కొలువుదీరాయి. అభివ్యక్తిలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ లక్ష్మయ్యగారు రాసిన కవితలన్నీ బాగున్నాయి..

ఆటలలో ఆటనై
కోలాటపు పాటనై
అమ్మలక్కల గొంతులోన
స్తుతియించెడి గీతీనై అంటూ
‘గునుక పువ్వు’ అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించారు.

అమ్మ ఒడిని మించింది
అవనిలోనే లేదు…
అమ్మ ఋణం తీర్చువారు
భువిలోనే లేరంటూ…

”అమ్మంటే” కవిత ద్వారా అమ్మ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పారు.
కవిత్వానికి కాదేదీ అనర్హం అని శ్రీశ్రీ నుడివినట్లు.. లక్ష్మయ్యగారు చీపురుపై కవితరాసి మెప్పించారు.

చిందర వందర చేసిన
చెత్తనంత పోగు చేసి
చీదరించుకోకుండా
చికాకు పడకుండా
చక్కని శోభను కూర్చే
చీపురూ.. నీకు వందనం అంటూ రాసిన తీరు బాగుంది.

అలాగే ”చిలుక్కొయ్య”, ”అలుకు పిడచ”పై కూడా కవితలను రాయడం విశేషం.

మనిషితనమంటే మనిషిని మనిషిగా చూడటమే.. మనిషితనమంటే మనిషి మంచితనంగా మసలుకోవడమే. మనిషి మనిషిగా, మనిషి మనీషిగా మారకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకమే అంటూ ”మంచితనం-మనిషితనం” కవితను రాశారు.

”వేకువ” కవితలో వేకువ కువకువలు విశాల ప్రపంచానికి.. వెచ్చని ఊపిరిని ఊదుతూ, కొత్త యుగానికి, యుగాదికి.. కొంగ్రొత్త స్వాగత గీతికను పాడుతూ… నవ పల్లవాలకు నాందీ పలుకుతున్నాయంటూ దుర్ముఖి నామ సంవత్సరానికి స్వాగతం పలికారు.

”రైతు ఎతలు పోవాలి” కవితలో ఓదార్పుమాటలు కాదు.. ఓట్ల రాజకీయాలసలే కాదు.. రైతు బతుకులు ఆగం కాకముందే రైతు జీవితాలలో వెలుగులు నింపే నిఖార్సయిన ఆలోచనలతో పాలకులు ముందుకు రావాలని కాంక్షించారు.

‘సర్వం సహచరిమయం’లో కవి లక్ష్మయ్యగారు తమ జీవిత భాగస్వామి గోదాదేవి గారి గురించి రాసిన పంక్తులు వారి అన్యోన్య దాంపత్యానికి అద్దం పట్టాయి.
సహచర్యం సంకలనమై
సమధర్మం సమ్మిళితమై
సమన్యాయం సంసేవితమై
సమదృష్టి సంవీక్షణమైతే
సర్వం సహచరి మయమే… అంటూ ప్రారంభించి
అక్షరించలేని ఆప్యాయత
విపులీకరించలేని వినయం
సంప్రదింపుల సలహా మణిహారం
సంతృప్త జీవనచిత్రం
అది సహచరి సమాదరత్వం అంటూ తమ శ్రీమతితో పెనవేసుకున్న బంధాన్ని తెలియజేశారు.

ఇల్లు ఇల్లాలుకు భాష్యం పలికి
కంటికి వెలుగైన నేస్తం
గోదాదేవి నా ప్రియనేస్తం
నా సర్వం నా సహచరి మయం అంటూ ముగించారు.

”ఆలోచన” కవితలో… ఆలోచన.. మనసుకో సులోచనమవ్వాలనీ.. మంచికి మార్గదర్శనం చేయాలని మనోనేత్రానికి ప్రతీక కావాలనీ కాంక్షించడం బాగుంది.
‘కవిత్వం-ఒక జీవన స్పర్శ’ కవితలో కవి లక్ష్మయ్యగారికి కవిత్వం పట్ల ఉన్న భావనలను చక్కగా విశ్లేషించారు. మనసు పొరల్లో చిక్కిన.. మర్మ భావనలను తొలగించేది.. తరిగిపోని అనుభూతుల స్మరణీయం చేసేదని వివరించారు. కవిత్వం- జీవధార కవిత్వం- ఒక హృదయ శ్వాస అంటూ కొనసాగించారు. కవిత్వం- ఒక ఆలాపన, కవిత్వం – ఒక జీవన స్పర్శ అని తేల్చిచెప్పారు. కవిత్వం ఒక వాహిని అనీ.. అదే నా ఊపిరి అని మంచి ముగింపునిచ్చారు. మరో కవితలోనూ.. కవిత్వం అమృతధారలను రుచి చూపిస్తుందనీ.. అమ్మలాలనను మరిపిస్తుందని ఆత్మీయతను అందిస్తుందని తెలియజేశారు.

2020లో ‘కనురెప్పల సవ్వడి’ కవితా సంపుటిలో 65 కవితలను పొందుపరిచారు. కవిత్వం మనిషి అంతరాత్మతతో సంభాషణ వంటిది.. ఈ సంభాషణ కవిలోనే ఉన్న కవితాత్మక ధ్యానంలో కొనసాగుతుంది. ఈ సంభాషణం ఫలితమే కవితగా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే లక్ష్మయ్యగారు ”కనురెప్ప సవ్వడి”లో చోటు కల్పించిన కవితల్లో ఆయన ఉత్తమ వ్యక్తిత్వాన్ని.. సున్నిత మనస్తత్వాన్ని.. సామాజిక దృక్పథాన్ని అడుగడుగునా గమనిస్తాం.

ప్రకృతి యొక్క ప్రాశస్త్యాన్ని ప్రస్తావిస్తూ… ”సంతృప్తగానం” కవితను రాశారు. సంతృప్తి.. మనిషి స్వరమైతే.. సంతోషాలు వెన్నంటే ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రకృతి మించిన పరిపూర్ణతకై పరుగు ఎండమావి వంటిదని పేర్కొన్నారు. మమతల మాధుర్యమే నీ సొంతం.. అదే కదా జీవిత మకరందం అంటూ కవితను ముగించడం బాగుంది.
భార్యాభర్తల బంధాన్ని ప్రతిఫలింపజేస్తూ ”సంసార గీతం” కవితను రమణీయ భావాలతో తీర్చిదిద్దారు.

సప్తపదుల సరిగమలు
సరాగాల మాధుర్యంలో
సరససల్లాపాల క్రీడాంగనం
అలుపేలేని జీవన యానానికి
ఆదరువయ్యే ఇంధనమంటూ
కవితను చక్కగా ఎత్తుకున్నారు.
ఆలుమగల యుగళగీతం అనురాగార్ణవాలకు ఆనంద హేతువులనీ.. మనసులు కలబోసుకొని.. మమతలు ముడి వేసుకుని.. కలిమిలేముల కాలాన్ని.. అనువుగా మలచుకునే ఇష్టపదుల గీతం అని తేల్చి చెప్పారు.

పెద్దలెన్ని సుద్దులు చెప్పినా
ఆలుమగలు అణకువతో
ఒద్దికగా దిద్దుకునే కాపురమే
అనురాగ గోపురం

అంటూ చక్కని భావాలకు అక్షరాకృతినిచ్చారు.

మంచు కురిసే వేళలో
మదిని దోచే భావ సమీరాలు
హేమంత గీతికల కచేరీలో
రాగ రంజితమౌ ఖజానాలు అంటూ ”భావవీచికలు” కవితను రూపుదిద్దారు.

”మనోహర దృశ్యం” కవితలో లక్ష్మయ్యగారు చక్కని భావుకతతో చిక్కని కవిత్వాన్ని రాశారు. అరుణ కిరణాల నులివెచ్చని స్పర్శకు అమలిన ఆహార్యపు తుషార బిందువులు.. ముగ్ధమనోహర ప్రకృతి వీడి.. నీరుగారి పోతున్న తీరు

ధరిత్రి ఒడిలో
తుషార బిందువులను జల్లి
తడి తడి తమకంతో తళుకులీని
శ్వేతవర్ణపు యవనికలను
తెరలు తెరలుగా పంపిస్తూ
మంచు దుప్పటిలా
మనోహర దృశ్యాన్ని ఆవిష్కరించింది అని రాయడం ఆయన కలం బలాన్ని సూచిస్తుంది.

లక్ష్మయ్యగారు తాను స్థాపించి నిర్వహిస్తున్న ‘నేటికవిత’ సమూహంపై రాసిన ‘500 సుమగంధాలు’ కవిత అందరినీ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

నేటి కవితతో
సహజీవనం చేస్తూ పరిమళాలు
సాహితీ సౌరభాలు పంచుతున్న
సమస్త సాహితీ దురంధరులు అంటూ కవితను ప్రారంభించిన తీరు బాగుంది.
నేటి కవితే శ్వాసగా
సమూహమే బాసటగా
అక్షర నైవేద్యాలతో
అయిదు వందల రోజులుగా
నన్ను నడిపిస్తున్న
నాతో నడిచివస్తున్న
నేస్తాలందరితో
అల్లుకున్న పరిమళాలను
ఆనందంతో ఆస్వాదిస్తున్నానంటూ చక్కగా ముగించారు.

”ఆలుమగల ఆల్బం” కవితలో…
కంటికి ఇంపైన కానుక
ఒంటరితనపు నిగళానన్ని చెరిపేసి
జంటగా వెంటవచ్చిన నేస్తం
మనసుతో పలికే మౌనగీతమే
మనోహర దృశ్యకావ్యం అని వ్యాఖ్యానించారు.

చెట్టాపట్టాలేసుకుంటూ
అలుపూ సొలుపూ ఎరుగక కడకు
అన్యోన్యతనే నిలుపుకు సాగే
మధుర భావనల మంజుల సర్వమే
ఆవిష్కృతమౌ ఇలలోనా… అంటూ రాసి ఆలుమగల బంధాన్ని అక్షరాల్లో నిక్షిప్తం చేశారు.

‘కనుపాపకే తెలిసేది’ కవితలో…
కాటుక చాటున దాగిన
కమనీయ కెమెరాలకు
చలువదనం చెమరించే
సుతిమెత్తని పార్శ్వం
చెప్పే ఊసులు, బహిర్గతం చేసే రహస్యాలు
మరో కంటికి కనబడనీయని
కనురెప్పల సవ్వడి.. కంటి పాపకే కదా తెలిసేది అంటూ రాయడం బాగుంది.

2021లో ”హృదయనది” పేరుతో తమ ఆరో కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకంలో 96 కవితలు భిన్నమైన కవితా వస్తువులతో ముస్తాబై రావడం విశేషం.

కలకు ఇలకు సౌమ్యం కుదరని
అందీ అందని అందలాలనూ గుర్తించని
అసమర్థుని ఆవేదనా సవ్వడి
అపరిపక్వ చేష్టల గారడి అంటూ
‘హెచ్చరిక’ కవితను తీర్చిదిద్దారు.

బతుకెంత విచిత్రం…
నింగినీ నేలనూ ఎదురెదురు దిక్కులని
దిక్కుతోచని సమాధానాల సుడిలో నేలరాలిన వసంతం..
అసంతృప్తిలోనే ముగిసిన జీవనయాత్ర..
గతి తప్పని సూరీడు గమనాన్ని
మననం చేసుకోని మసలు తీరు
చరిత్రలో ఒక పేజీగా
గుణపాఠం మూటవుతుంది
చక్రభ్రమణమై గోచరిస్తుంది
మనిషి మనిషికీ హెచ్చరికవుతుంది

అంటూ గొప్ప సందేశాన్ని అందించారు.
”పసిడి మనసు” కవితలో అన్నెం పున్నెం.. కల్లాకపటం.. ఈర్ష్యా ద్వేషం.. అహంభావం.. దరి చేరనీయని బాల్యం గురించి చక్కగా ఆవిష్కరించారు.

బోసినవ్వుల ఆరాటం
చెలిమి కలిమికై ఉబలాటం
ఆనంద డోలికలో సహవాసం
పసిడి పాపల సర్వస్వం అంటూ నవ్వుల పువ్వులు పంచే చిన్నారులను అందంగా ఆవిష్కరించారు.
”ఎంత హాయి” కవితలో రమణీయ భావాలకు చోటు కల్పించారు.

తెల్లని పిండార బోసిన
వెండి వెలుగుల జిలుగుల్లో
ఇంటి డాబాపై మల్లెల సౌరభాలను
మోసుకొస్తూ వీచిన గాలులు
మేనును తాకినపుడు
మనసు పరవశంతో
మధురగానం పాడదా? అంటూ లక్ష్మయ్యగారు చక్కని భావుకతను ప్రదర్శించారు.

ప్రవహించే నదిలా
రుధిర సంగమాల వేణిలా
మలినాల మాటల్ని తేటపరిచి
వర్ణాలు వేరైనా రక్తవర్ణమొక్కటనే
సందేశాన్ని సమాజానికి ప్రసరింపజేద్దాం
అంటూ ”హృదయ నది” కవిత ద్వారా పిలుపునిచ్చారు.

ఒక నీవు – ఒక నేను
తీరాలు – దేహాలు వేరైనా
వెన్నుదన్నుగా నిలిచిన మనోస్థైర్యంతో
చిత్రంగా మన ఇరువురి గుండెలయ
ఒకే గీతం ఆలపిస్తున్నాయంటూ నువ్వు నేనూ ఒక్కటేనన్న సమైక్య వాదాన్ని ప్రకటించడం ప్రశంసనీయం.
”స్వప్న జగత్తుకు నీరాజనాలు” కవితలో.. అస్తిత్వ భావనలు.. అంకురించి.. థాబ్దాల కలగా ప్రత్యేక రాష్ట్రం.. సాకారమై ఆవిర్భవించిన సందర్భం.. కలలకు హారతి పట్టిన నేపథ్యం.. చేతనత్వ ప్రతిబింబాలుగా ప్రతిఫలించి – స్వప్న జగత్తుకు నీరాజనాలు పలుకుదాం అంటూ పిలుపునిచ్చారు.
”కమనీయ చిత్రం” కవిత ద్వారా ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
అనురాగ బంధాలతో… ఆత్మీయతల కలబోతతో.. ఆప్యాయతా పలకరింపులతో.. వరసైన పిలుపులతో అలరారే ఆనందాల హరివిల్లు ఉమ్మడి కుటుంబాల లోగిళ్ళు సమాజంలో మళ్లీ చిగురు తొడగాలని కాంక్షించారు. వృద్ధాశ్రమాలను దృశ్యమానం చేస్తూ ”మమతల కూడలి” కవితను రూపుదిద్దారు.

ఆ నేలనేలంతా అనుభవాల సారవంతం
మమతల మాధుర్యాలు కురిపించి
బ్రతుకు పండించుకున్న పండుటాకులు
ముదిమి తోడై మురిపాలకు దూరమై
వృద్ధాశ్రమాలకు చేరువైన ఊడలు
ఆప్యాయతానురాగాలు కరువై
ఆశగా నిత్యం గేటువైపు చూసే కళ్ళు అంటూ
కవి లక్ష్మయ్యగారు ఆర్ద్రమైన భావాలకు చోటు కల్పించారు.

జీవన్నాటక ప్రయాణంలో
ఆత్మీయ బంధాల మైలురాళ్ళను దాటి
అనుబంధ సుగంధాల రాదారిలో
మజిలీలన్నీ మమతల కూడలులేనని
వ్యాఖ్యానించారు. నిజమే కదా!

”అద్దం’ కవితలో.. అద్దం.. నా అందచందాలకు చెలికత్తె.. వీలు చిక్కినప్పుడల్లా.. చూస్తూ.. మురిసి పోయే సమయాలు.. నేను యాది మరువని క్షణాలు అని కవితను ఎత్తుకున్న తీరు బాగుంది.
”మా ఇంటి వాలు కుర్చీ” కవితలో చిన్నప్పుడు మడత కుర్చీతో తమ నాన్నకున్న అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించారు.

మా ఇంటి మడత కుర్చీ
అదే తట్టు కుర్చీ
పేరేదైనా మా యింటి దర్పం మా వాలు కుర్చీ…
మా నాన్నకది సుఖాసనం
వాలుకుర్చీకి జనుపవస్త్రం తొడుగు
పొడవాటి చేతులు
పక్కనే ముక్కాలు పీట
దానిపైన పాన్‌ దానా అంటూ
వాలుకుర్చీతో ముడిపడి ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
పై ఆరు కవితా సంబంధ గ్రంథాలే కాక.. లక్ష్మయ్యగారు ఉదయసాహితి పక్షాన.. తమ సంపాదకత్వంలో బ్యాలెట్‌ బ్యాలెట్‌, బాల్యం-బతుకమ్మా, ఉదయకిరణాలు, తెలుగు వెలుగు, ఆకాశంలో సగం, చెలిమి, వసంత రాగాలు, గురువు, సహచరి, ముదిమి, వివాహబంధం వంటి కవితా సంకలనాలను వెలువరించారు. ”నేటి కవిత” అంతర్జాతీయ సమూహానికి సారథ్యం వహిస్తూ లక్ష్మయ్యగారు తమ సంపాదకత్వంలో కవిత్వం, కథలు, గేయాలు, చిత్రకవితలు వంటి అంశాలకు సంబంధించిన గ్రంథాలనూ ప్రకటించడం ప్రశంసనీయం – ఇలా శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్యగారు తమ కవితాయానం కొనసాగిస్తున్నారు. సామాజిక చైతన్యం కోసం అనేక సందేశాత్మక, కవితాత్మక కవిత్వాన్ని సృజన చేసి సాహితీ క్షేత్రాన కవిగా తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకోవడం ప్రశంసనీయం.
లక్ష్మయ్యగారి జీవితం, వ్యక్తిత్వం, వ్యవస్థా ప్రియత్వం అందరికీ ఆదర్శప్రాయం – జూలై 31, 2024న ఉపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

July 29, 2024 2 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.

by Narendra Sandineni July 29, 2024
written by Narendra Sandineni

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (1).
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
గుల్జార్ రాసిన షాయరీ కవితల్లో దాగిన అంతర్లీనమైన భావాలు ఒక్క సారిగా పాఠకుల హృదంతరాలను తట్టి లేపుతుంది.ఏదో తెలియని లోకంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది.కవి గుల్జార్ కు సమాజంలోని సాటి మనుషుల పట్ల అనన్య సామాన్యమైన ప్రేమ ఉంది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు హృదయాన్ని కదిలిస్తాయి. గుల్జార్ షాయరీ కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? షాయరీ కవితాచరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.సరి కొత్త అనుభూతులను సొంతం చేసుకోండి.
“నిన్ను చందమామతో పోల్చడం
“నాకెందుకు ఇష్టం కాదు కానీ …
“ఈ జనం ఉన్నారే … రేయంతా నిన్ను
“చూడడమే నాకు అభ్యంతరం మరి !
చందమామను ఆంగ్లంలో Moon అని అంటారు. రాత్రి పూట ఆకాశంలో నక్షత్రాలతో పాటు కనిపించేది చందమామ.ఒక గ్రహానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఉపగ్రహం చందమామ.భూమి చుట్టూ తిరిగే ఒక గ్రహం చందమామ.చంద్రుడు సూర్యుని ప్రకాశం వల్ల వెలుగుని ఇస్తున్నాడు.చిన్నతనంలో అమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ చందమామ రావె,జాబిల్లి రావె,కొండెక్కి రావె,గోగి పూలు తేవె అని పాడుతూ చందమామను చూపించడం మనం ఎరిగిన కథ. ప్రేయసిని నీవు అందంగా ఆకాశంలోని చంద్రబింబంలా ముగ్ధ మనోహరంగా మెరిసిపోతున్నావు అని అలనాటి ప్రబంధ కావ్యాల్లో చదివాం.జనం అనే పదం సాధారణ ప్రజానీకాన్ని, జాతీయ సమూహం,సమిష్టి లేదా సంఘాన్ని సూచిస్తున్నది.ఒకరి కన్నా ఎక్కువ మంది గల సమూహమును జనం అని కూడా అంటారు. సమాజంలో నివసించే వారిని జనం అంటారు. సూర్యుడు అస్తమించిన సమయం రేయి అంటారు. రేయి అనగా ఒక దినంలో విభాగం,సాయం సంధ్య వేళ నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలం. అతను తన ప్రేయసితో మాట్లాడుతూ ఆప్యాయతతో అనురాగం పల్లవించి దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు.నీవు ఎంతో అందంగా, అపురూపంగా కనిపిస్తున్నావు.అసలు దివి నుండి భువికి దిగి వచ్చిన మేలిమి బంగారు రంగు ఛాయతో అప్సరస వలె అగుపిస్తున్నావు.నిన్ను ఆకాశంలోని జాబిలితో పోల్చడం సరైనదిగా అనిపిస్తుంది.ఎందుకో తెలియదు కాని నీవంటే నాకు మరీ మరీ ఇష్టం.నీ అందచందాలకు సొగసు, సౌందర్యానికి దాసోహం అయ్యాను.ప్రేయసీ నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నాకు గడవదు.నిన్ను విడిచి ఉండ లేని మోహం కమ్ముకుంది.అది నీ పట్ల గల గాడమైన బంధం అంటారో,కామం అంటారో, అనిర్వచనీయమైన ప్రేమ అంటారో నాకైతే తెలియదు.కానీ ఈ లోకంలోని జనులు స్వార్థపరులు,విశాల దృక్పథం కొరవడిన చాలా చెడ్డ వారు.రేయంతా జనులు ఆకాశంలోని చందమామను చూస్తారు.అలాగే చందమామను చూసినట్లు నా ప్రేయసివి అయిన నిన్ను జనులు కామంతో కళ్ళు మూసుకుపోయి అదే పనిగా చూడడం నాకు అసలు ఇష్టం ఉండదు.నాకు అభ్యంతరంగా తోస్తుంది.ఇంద్ర సభలోని దేవ కన్యలను తలపించే అందంతో అలరిస్తున్నావు. నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దానివి.నీవు నన్ను గాఢంగా ప్రేమించే అందమైన ప్రేయసివి. ప్రేయసిగా నా గుండెలో నీకు మాత్రమే చోటు ఉంది. నా గుండెలో నివాసం ఏర్పరచుకొన్నావు.నా హృదయం విప్పి చూస్తే అందులో నీవే రూప లావణ్యాలతో మెరుస్తూ కనిపిస్తావు.నిన్ను చందమామతో పోలుద్దామని ఉంది కానీ ఈ చెడ్డ జనులు ఆకాశంలోని చందమామను అదో రకమైన కామ భావనతో చూడడం నాకు నచ్చలేదు.అందుకే నిన్ను చందమామతో పోల్చడం నాకు నచ్చడం లేదు.ఈనాటి జనులు పర స్త్రీల జోలికి వెళ్ళకూడదు.పర స్త్రీలను కన్నతల్లి వలె భావించాలి అనే సుగుణాలను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఏది సత్యం,ఏది అసత్యం,ఏది చేయాలి,ఏది చేయ కూడదు అనే ఇంగిత జ్ఞానంను జనులు ఎందుకో మర్చిపోయినారు.ఈనాటి జనులకు ఏ క్షణంలో ఎలా ప్రవర్తించాలి అనే వివేకం కొరవడింది.తల్లి పిల్లలకు సుగుణాలను ఉగ్గుపాలతో రంగరించి నేర్పిస్తుంది.తల్లి నేర్పిన సుగుణాలను మర్చిపోవడం వల్లనే లేని పోని అనర్థాలు,ఘోరాలు సంభవిస్తున్నాయి.గుల్జార్ కు జనుల విపరీత వింత స్వభావం మరియు అనైతిక చర్యల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది.జనుల అసభ్య ప్రవర్తన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం తగినది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావం అద్భుతంగా ఉంది. గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (2).
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి).

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ గొప్ప కవి,షాయరీ కవితల ద్వారా అద్భుతమైన భావాలను పండించాడు.గుల్జార్ షాయరీ కవితల్లోని పద సంపద,శిల్పం,పాఠకుల హృదయాలను అలరిస్తుంది.కవి గుల్జార్ కు హిందీ మరియు ఉర్దూ భాషలపై అద్భుతమైన అధికారం ఉన్నట్లుగా తోస్తోంది.గుల్జార్ రాసిన షాయరీ కవితల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? గుల్జార్ షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. సహజత్వం ఉట్టి పడే షాయరీ కవిత్వం యొక్క అనుభూతిని సొంతం చేసుకోండి.
“నా కన్నీళ్ళకి నువు లెక్క
“కట్టైతే చూడు !
“కొన్ని కోట్లు ఉండకపోతే చెప్పు !
కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి వాటిని తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని కన్నీరు అంటారు.కన్నీరు స్రవించే ప్రక్రియను ఏడవటం అనే చర్యను సూచిస్తుంది.దుఃఖం,సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినప్పుడు కన్నీరు ఉబికి వస్తుంది.ఏడవటం వలన కన్నీరు వస్తుంది.బలమైన భావోద్వేగాలు,నొప్పి,తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు స్రవిస్తుంది.కన్నీరు వ్యక్తుల మధ్య మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది. మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి.ఏడుపు మనిషిలోని ఒత్తిడిని తగ్గిస్తుంది.ఏదైనా బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు కార్చుతూ కుమిలిపోతూ చేసే క్రియ దుఃఖం.దుఃఖం వల్ల ఏదైనా పనిలో మనసు నిమగ్నం చేయ లేక పోవటం జరుగుతుంది. అనుకున్నది జరగనప్పుడు మనకు కలిగేది దుఃఖం. మనసు కలత చెందడం వల్ల దుఃఖం వస్తుంది.బాధ కలిగినప్పుడు దుఃఖం పొర్లుకు వస్తుంది.దుఃఖం వల్ల మనిషి హృదయం విలవిలలాడుతుంది.కంటి నుండి వచ్చేవి కన్నీళ్లు అంటారు.ఆమె కన్నీళ్ళతో తన గుండెలోని బాధను తెలియజేస్తున్నది.ఒక్క సారిగా మనసులో కలిగిన బాధను తల్చుకుని దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది.అనంత లోకాలకు వెళ్లిన అతను లేడు అనే విషయం తలుచుకొని గుర్తుకు వచ్చి ఆమెకు కన్నీళ్ల ధారలు ఆగవు.మనిషి దుఃఖముతో కన్నీళ్లు కార్చడం అనేది బాధల నుండి కోలుకునే ప్రక్రియలో ఒక భాగం.ఆత్మీయులను కోల్పోయిన ఆమె కళ్ళనుండి కన్నీళ్లు కాలువలై ప్రవహిస్తున్నాయి.కన్నుకు దెబ్బ తగిలి బాధకు గురి అయినచో వెంటనే కన్నీళ్లు వస్తాయి.మనిషి భావోద్రేకమైన కన్నీళ్లతో విలపించుట మనం ఎరిగినదే.కన్నీళ్లు ఎందుకు వస్తాయో అనే భావన అంతగా తెలియదు.ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు దుఃఖముతో కన్నీళ్లు కారుస్తాం. కన్నీళ్లు మన కన్నులని తేమగా ఉంచి కంటికి కనురెప్పలకు నడుమ రాపిడి లేకుండా చేస్తాయి. కన్నీళ్లు కూడా సహజమని దుఃఖించడం ద్వారా మనిషి యొక్క మనసు స్వాంతన పొందుతుంది. విచారం,దుఃఖం,కలతలతో కన్నీరుకు సంబంధం ఉంది.ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కన్నీళ్లు కాలువలై పారిన సంగతులు చూసిన దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి.ప్రజల గుండెలను పిండి చేస్తున్న సంఘటనలతో కన్నీళ్లు కార్చడం,హృదయాన్ని ద్రవింప జేస్తుంది.దుఃఖం ఒక సహజమైన మరియు సంక్లిష్టమైన ప్రక్రియ.ఇది ప్రియమైన వ్యక్తి మరణము సంభవించినప్పుడు వ్యక్తుల జీవితంలో మార్పులు ఏర్పడతాయి.మనిషి జీవితంలో దుఃఖం విడదీయ లేని ఒక భాగంగా మారింది.దుఃఖంతో విలపించడం కూడా ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటుంది.దుఃఖం బాధాకరమైనదిగా చెబుతారు.జననం దుఃఖం. వృద్ధాప్యం దుఃఖం.అనారోగ్యం దుఃఖం.మరణం దుఃఖం.ముఖ్యంగా ఎవరినైనా ఆత్మీయుని కోల్పోయినప్పుడు విచారం,దుఃఖం మనిషిని నీడలా వెంటాడుతాయి.యుద్ధం వలన దుఃఖం కలుగుతుంది.యుద్ధం మొత్తం మానవాళిని ప్రభావితం చేస్తుంది.మనం ఇష్టపడే వ్యక్తి చనిపోయినప్పుడు కలిగే దుఃఖం ఉంటుంది. వైఫల్యం వల్ల నిరాశ వల్ల కూడా దుఃఖం కలుగుతుంది.తీవ్రమైన దుఃఖముతో నా కళ్ళ నుండి ప్రవాహంలా కారుతున్న నీటి ధారలు మామూలుగా వచ్చే కన్నీళ్లు కావు.అవి బతుకు వేదన నుండి వచ్చిన కన్నీళ్లు.ఎంతో విలువైనవి.నేను కార్చిన కన్నీళ్లు హృదయపు లోతుల్లో నుండి వచ్చినవి.నా జీవితంలో నేను కార్చిన కన్నీళ్ళకు నువ్వు లెక్క కట్టి చూడు.మనిషి జీవితం అనేకమైన కష్టాలతో కూడుకుని ఉన్నది.జీవితంలో తాను అనుభవించిన కష్టాలతో పాటు లెక్కలేనన్నీ కన్నీళ్లు కూడా ప్రవాహమై పారినాయి.కన్నీళ్ళ విలువ లెక్క కట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.కన్నీళ్ల విలువ అసాధారణమైనదిగా చెప్పవచ్చు.కన్నీళ్లను లెక్క కట్టడానికి ఇంత వరకు ఏ తూకం కనిపెట్టబడ లేదు. కన్నీళ్లు మనిషి జీవితంలో ఎంతో విలువైనవి.మనిషి జీవితంలో కన్నీళ్లు అమూల్యమైనవి.అనంతమైన ఆకాశంలోని చుక్కలను లెక్క పెట్టడం సాధ్యం అయ్యే పని కాదు.అదే విధంగా మనిషి జీవితంలో కార్చిన కన్నీళ్ల విలువ కోటాను కోట్లు ఉంటుంది అనేది వాస్తవమని తోస్తోంది.నా కన్నీళ్ళు కొన్ని కోట్లు ఉండక పోతే చెప్పు అని కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి అను సృజన చేసిన కవయిత్రి డాక్టర్ గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(3)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలుగులోకి గీతాంజలి (డాక్టర్ భారతి) అను సృజన చేశారు.గుల్జార్ సమాజాన్ని ఔపోషణ పట్టిన వాడు.షాయరీ కవితలోని భావాలు ఒక్క సారిగా మనసును తట్టి లేపుతాయి.షాయరీ కవిత చదవగానే ఒళ్ళు పులకరిస్తుంది.మనలను ఆలోచింపజేస్తుంది. గొప్ప అనుభూతిని కలిగింపజేస్తుంది.గుల్జార్ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతుల సౌందర్యాన్ని ఆస్వాదించండి.
“బతకడానికి ముక్తసరిగా ఉండడం
“కూడా అవసరమే దోస్త్ … అది నీ
“పొగరనుకుంటే అనుకోనీ !
“ఎక్కువ వొంగి
“నడుచుకున్నావనుకో … ఈ లోకం నీ
“వీపుని కూడా ముక్కాలి పీట వేసి
“ఎక్కి తొక్కుతుంది !
ముక్తసరిగా అంటే టూకీగా అని ఆంగ్లంలో Briefly అని అర్థం.ఈ లోకంలో మనిషి ఎలా జీవిస్తున్నాడు? అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు.కొందరు బతకడం కొరకు జీవిస్తున్నాడు అంటారు.మరి కొందరు మరో రకంగా చెబుతారు.
ఎవరు ఎలా చెప్పినా కూటి కొరకు కోటి విద్యలు అనే సామెత నిజం అనిపిస్తుంది.మనిషి తన ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నెన్నో పనులు చేయవలసి ఉంటుంది.మనిషి కుటుంబ పోషణ కొరకు కష్టపడి పని చేయాలి.మనిషి బ్రతకడం కొరకు ఎక్కువగా కష్టపడి పనులు చేయనవసరం లేదు. మనిషి మితిమీరి కష్ట పడితే అనారోగ్యం పాలవుతాడు.మనిషి తనకు ఉన్న దానిలో తృప్తిగా బతకాలి.ఇతరులతో తన బ్రతుకును పోల్చడం వల్ల నిరాశ కలుగుతుంది.ఈ నిరాశ వల్ల మనిషి జీవితం వెతల పాలవుతుంది.ఈ లోకంలో ఎవరి బ్రతుకు వారిదే.ఈ లోకంలో ఎవరి జీవితం వారిదే.మనిషి ఇతరులు బ్రతకడానికి చేతనైనంత సహాయం చేయాలి.మనిషి ధర్మం ప్రకారం నడుచుకోవాలి. మనిషి తాను చేయవలసిన పని చేయడం ధర్మం అంటారు.ప్రతిరోజు మనిషి తాను చేయవలసిన విద్యుక్త కర్మలు నిర్వర్తించాలి.జీవితమంటే తమాషా కాదు. మనిషి జీవితంలో అది చేయాలి,ఇది చేయాలి అని అనుకుంటూ కాలాన్ని వృధా చేయ కూడదు.జీవితంలో మనిషి అనుకున్నది అనుకున్నట్లు అన్ని పనులు అప్పుడే జరగవు.మనిషి జీవితం గురించి గొప్పగా ఊహించుకోవడం వద్దు.మనిషి జీవితాన్ని సాధారణంగా భావించాలి.మనిషి తామరాకు మీది నీటి బొట్టులా జీవించాలి.మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు సహనం వహించడం నేర్చుకోవాలి.మనిషి జీవితంలో మంచి రోజులు తప్పకుండా వస్తాయి అనే ఆశాభావ దృక్పథంతో జీవించాలి.మనిషి జీవితంలోని కష్టాలు ఆకాశంలోని మబ్బుల వలె తేలిపోతాయి అనే భావన కలిగి ఉండాలి.మనిషికి జీవితంలో ఎందరో తారసపడతారు.ఎందరో తనకు తారసపడ్డారని మనిషి బెంబేలు పడి పోకూడదు.మనిషి అందరితో సౌమ్యంగా సంభాషించాలి.ఇతరులు మనిషి ఓపికను పరీక్షించాలని చూస్తారు.ఏవేవో మనకు సంబంధం లేని విషయాల గురించి అడుగుతూ చిక్కుల్లోకిలాగాలని చూస్తారు.ఇతరులు అడిగిన ఏవేవో విషయాలు వాటి అన్నిటికి విపులంగా జవాబు చెప్పవలసిన అవసరమైతే లేదు.ఇతరులు అడిగిన వాటికి ముక్తసరిగా సమాధానం చెప్పాలి.మనం జీవిస్తున్న సమాజంలో మనిషి మనుగడ సాగించడానికి ముక్తసరిగా మాట్లాడాలి. ముక్తసరిగా సమాధానం ఇవ్వడం అవసరం స్నేహితుడా అని చెబుతున్నాడు.నీవు ఇతరులు అడుగుతున్న విషయాల గురించి వాటి అన్నిటికీ సరే చూద్దాం అంటూ ముక్తసరిగా సమాధానం ఇవ్వడం సరైనదే స్నేహితుడా.నీవు ఇతరులకు ముక్తసరిగా సమాధానం ఇవ్వడం చూసి ఇతరులు నిన్ను పొగరు గల వాడు అనుకుంటారు.ఇతరులు పొగరు కల వాడు అనుకుంటే అది వారి తప్పు. ఇతరులు పొగరు కల వాడు అన్నంత మాత్రాన వారి ప్రవర్తన గురించి పట్టించుకోవద్దు.నిన్ను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో అలా మాట్లాడి ఉండవచ్చు.వాక్కుని నియంత్రించడం,మాట్లాడడం తగ్గించడం వల్ల మౌనం వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవడం జరగదు.వాక్కు అపూర్వమైన కళ,తపస్సు.వాక్కుని దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా సంభాషించడం సర్వదా శ్రేయస్కరం. అహంకారంతో కూడుకున్నది పొగరు.నేనే గొప్ప వాడిని అనే భావం పొగరు.అహంకారం కలిగి ఉన్నందుకు చూపించే వైఖరి పొగరు.జీవరాశులకు సహాయం చేసేవాడు స్నేహితుడు.మైత్రి కలవాడు స్నేహితుడు.ఎవరైనా మనలో భాగం అయ్యే వాడు స్నేహితుడు.స్నేహితులు స్నేహంతో కలిసిమెలిసి ఉంటారు.ఆపద సమయంలో స్నేహితులు సహాయం చేస్తారు.నీవు ఎక్కువగా వంగి ఉంటే నీ వీపుపై కూర్చుండి సవారు చేస్తారు.లోకం అంటే ప్రపంచం.లోకం విశాల విశ్వంలో ఒక భాగం.జీవులు నివసించే ప్రదేశం లోకం.ముక్కాలి పీట అంటే మూడు కాళ్ళ పీట.మనిషి ఎలా జీవించాలి? మనిషి జీవితంలో ఎలా ఉండకూడదు? అనే విషయాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి.మనిషి నిటారుగా నిలిచి ఉన్నట్లుగా నడుచుకోవాలి.మనిషి ఇతరులు చెప్పినట్లు విని ఎక్కువగా వంగి నడుచుకొనకూడదు.మనిషి ఇతరులు చెప్పిన దానిలో నిజం ఏమిటో గుర్తించి నడుచుకోవాలి. మనిషి ఇతరులకు భయపడి వారు చెప్పినట్లుగా నడుచుకుంటే లోకంలోని జనులు అతనిని ముక్కాలి పీటగా చేసి ఎక్కి తొక్కుతారు అనే జీవన సత్యాన్ని కవి గుల్జార్ తెలియజేసిన తీరు చక్కగా ఉంది. చక్కటి అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (4)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి గీతాంజలి (డాక్టర్ భారతి) అను సృజన చేసింది. షాయరీ కవితలోని భావాలు నాకు నచ్చాయి. షాయరీ కవిత నన్ను ఆలోచింపజేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలను గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“ఓస్ …ఖుదా !
“ఈ మెహబ్బత్ ని ఎంత వింతైన
“పదార్థంతో తయారు చేశావు ?
“నువ్వు సృష్టించిన మనిషి నీ ముందు
“నిలబడి ఇంకెవరి కోసమో విల
“విలల్లాడుతూ దుఃఖిస్తుంటాడు !
ఖుదా ఉర్దూ భాషకు సంబంధించిన పదం.ఖుదాను తెలుగులో దేవుడు అని అంటారు.ఖుదా అనే పదం అరబిక్ మరియు పర్షియన్ భాషకు సంబంధించిన మూల పదం.ఉర్దూ మరియు హిందీలో కూడా సర్వాంతర్యామి అయిన దేవుని ఖుదా అని అంటారు.తెలుగులో ఖుదాను దేవుడు, భగవంతుడు,పరమేశ్వరుడు అని అంటారు.దేవుడు అనగా సృష్టికర్త.సృష్టికర్త ఎవరు అంటే సృష్టిని సృష్టించిన వాడు.దేవుడు సర్వాంతర్యామి.దేవుడు నిష్కలంకుడు.దేవుడు మానవుల పాపాలను క్షమించే వాడు.దేవుడు నిజమైన మార్గాన్ని చూపించే వాడు.దేవుడు పాపాలను క్షమించి స్వర్గాన్ని ఇచ్చే వాడు.దేవుడు జగతిని నడిపే వాడు.దేవుడు ఒక్కడే.దేవుడు ఆది అంతము లేని వాడు.దేవుడు పవిత్రుడు.దేవుడు ఎటు వంటి పాపము చేయని వాడు.దేవుడు సృష్టి కర్త.దేవుడు జగమంతా వ్యాపించి ఉన్న వాడు.మొహబ్బత్ అనే ఉర్దూ పదం తెలుగులో ప్రేమ,అభిమానమును తెలియజేస్తుంది. మొహబ్బత్ అనే పదానికి తెలుగులో ప్రేమ, గాఢమైన అభిమానం,ఆదరణ,వాత్సల్యం అను అర్థాలు ఉన్నాయి.ఓ దేవుడా ! సృష్టిలోని వింత వింత అద్భుతాలను చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.ప్రభూ సృష్టి రచనను చేసినది నీవే కదా ! ప్రభూ నీవు చేసిన అద్భుతాలలో మొహబ్బత్ ప్రేమ కూడా ఉంది. ప్రభూ ఈ ప్రేమని ఎంత వింతైన పదార్థంతో తయారు చేసావు? అని ప్రశ్నిస్తున్నాడు.ప్రభూ‌ నీవు సృష్టించిన వాటిలో మనిషి కూడా ఉన్నాడు.ప్రభూ నీవు సృష్టించిన మనిషి మీ ముందు చేతులు కట్టుకొని నిలబడి వినయంగా మోకరిల్లినప్పటికి కూడా ఇంకా అతని మదిలో వేరే ఎవరి కోసమో మనసు నిలిపి ఆమె కొరకు విలవిలలాడుతూ దుఃఖిస్తుంటాడు.వేరే ఎవరి పైనో గాఢమైన ప్రేమ, అభిమానం ఉన్నట్లుగా తోస్తుంది.మనిషిలో పేరుకు పోయిన ద్వంద నీతి ప్రభూ నీకు అర్థం అయి ఉండాలి.ప్రభూ మీ ముందు నిలబడి మనిషి చేస్తున్నది ఏమిటి?లోకంలోని మనుషుల రీతి రివాజు ఎలా ఉంది?మనిషి చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటిగా ఉంటున్నది.మనిషి ఆచరణలో
తేడా కొట్ట వచ్చినట్లు కనిపిస్తున్నది.మనిషి లోకంలోని పద్ధతిని మీరి నడకలు సాగిస్తున్నాడు. మనిషి తనలోని విలువలని మరిచిపోయినాడు. మనిషి పద్ధతి ప్రకారం నడుచుకోవడం లేదు.మనిషి నీతి నియమాలు,పరంపరగా వస్తున్న ధర్మాన్ని ఏ నాడో వదిలి వేసినాడు.ప్రభూ నీవు రాత రాసి లిఖించిన మనిషి చేస్తున్నది ఏమిటి? ప్రభూ నిజంగా అతను నీ ముందు నిలబడి ఉన్నాడు.అతని దృష్టి ఎవరి పైన ఉండాలి? సృష్టి చేసిన బ్రహ్మ ముందే నిలబడి కూడా మనిషి మనసులో నిలకడ లేదు. మనిషి ఎందుకిలా ఇంతగా మారి పోయాడు? మనిషి వింతగా విపరీతంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.సృష్టి కర్తవైన నీ మీద అతను దృష్టిని సారించాలి.అతని దృష్టి నీ మీద ఉన్నట్లు కనిపించడం లేదు.ప్రభూ నీ ముందు నిలబడి కూడా నీ మీద దృష్టిని సారిస్తున్నట్లు నటిస్తున్నాడు.ఇంకా ఎవరి కోసమో ఆరాటంతో మనసు పెట్టి విలవిల్లాడుతూ దుఃఖిస్తుంటాడు అనేది సత్యంగా తోస్తుంది.గుల్జార్ సమాజంలో గల మనుషుల నడవడిని మానసిక స్థితిని అవగాహన చేసుకుని లోకంలోని మనుషుల తీరును సరిగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తున్నది.గుల్జార్ షాయరీ కవిత లోకంలోని మనుషుల తీరుతెన్నుల గురించి తెలియజేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి. షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (5)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన
చేసింది.గుల్జార్ కు లోకానుభవం మెండుగా ఉన్నట్లు షాయరీ కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి. గుల్జార్ షాయరీ కవితలోని భావాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే మనసు పెట్టి ఒక్క సారి గుల్జార్ షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల
లోకంలో విహరించండి.
“నా హృదయంపై
“సంతకం చేయడానికి ఎవరు
“బయలుదేరారు ?
“ఈ ఎడారిలో …. ఎవరో నడిచిన
“అడుగుల సవ్వడి వినిపిస్తోంది !
గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం.గుండెలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పని చేసి మనిషిని బతికిస్తున్నాయి.గుండె చాతి మధ్యలో కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది.హృదయం అనేది ప్రేమకు గుర్తుగా చెబుతుంటారు.హనుమంతుడి హృదయం చీల్చితే అందులో రాముడు కనిపిస్తాడు అంటారు.హనుమంతుడు నిరంతరం రామ నామ స్మరణం చేసే వాడు అంటారు.ప్రేమికులు తమ హృదయంలో ప్రియురాలు నిండి ఉంటుందని చెబుతారు.ప్రేమికుల ధ్యాస ఎప్పుడు ప్రియురాలు పైనే నిలిచి ఉంటుంది.అతను తన మనసులో కలుగుతున్న సంఘర్షణల గురించి చెబుతు నా హృదయం పై సంతకం చేయడానికి ఎవరు బయలుదేరారు? అని ప్రశ్నిస్తున్నాడు.అతని హృదయం పై సంతకం చేయ గల అధికారం ఎవరికి ఉంటుంది? అనే సందేహాలు మనలో పొడసూప వచ్చు.అతని హృదయానికి ఆమె నచ్చిన వ్యక్తి అయి ఉంటుంది.హృదయానికి నచ్చిన వ్యక్తిని గురించి ఎవరు బయలుదేరారు? అని ప్రశ్నించడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.అతని హృదయాన్ని ఆకర్షించిన వ్యక్తి ఆమెనే అయి ఉండవచ్చు అని మనకు తోస్తుంది.హృదయం యొక్క ఆలోచనను దాని రూపక లేదా సంకేత అర్థంలో ఉపయోగించే ఒక హృదయ చిహ్నం.ప్రేమ ముఖ్యంగా శృంగార ప్రేమతో సహా భావోద్వేగ కేంద్రాన్ని సూచించడానికి హృదయ చిహ్నం తరచుగా ఉపయోగపడుతుంది.గాయపడిన గుండె,విరిగిన హృదయం,బాణముతో గుచ్చబడిన హృదయ చిహ్నం.ఇది ప్రేమకు వేదనను సూచిస్తుంది.తెలుపు రంగు హృదయం అంతులేని ప్రేమను సూచిస్తుంది.ఎరుపు రంగు హృదయం నిజమైన ప్రేమను సూచిస్తుంది.నలుపు రంగు హృదయం దుఃఖానికి ప్రతీకగా ఉపయోగించబడుతుంది.పసుపు రంగు హృదయం స్నేహం ఆనందం కోసం ఉపయోగిస్తారు.ఆకుపచ్చ హృదయం ఆరోగ్యకరమైన జీవనం కోసం ఉపయోగిస్తారు.పర్పుల్ కలర్ హృదయం సున్నితమైన ప్రేమకు,సంపద కోసం ఉపయోగించబడుతుంది.ప్రేమ అంటే ఇద్దరి హృదయాల కలయిక.ఇద్దరి ఆలోచనల కలయిక. స్నేహం,చెలిమి అని అర్థాల్లో వాడుతారు.ప్రేమ అనేది అత్యంత ఉత్కృష్టమైన సద్గుణము లేదా మంచి అలవాటు.ప్రేమ లోతైన వ్యక్తుల మధ్య అనురాగం,సరళమైన ఆనందం,బలమైన మరియు సానుకూల భావోద్వేగం,మానసిక స్థితిని కలిగి ఉంటుంది.సర్వ సాధారణంగా ప్రేమ బలమైన ఆకర్షణ,భావోద్వేగ సంబంధాన్ని సూచిస్తుంది.ఇద్దరి మధ్య గల అనుబంధం,ఇద్దరి మనసుల మధ్య గల పరస్పర ప్రేమను సూచిస్తుంది.ఎడారి అనగా ఎటువంటి వృక్ష సంపద నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం. భూమిపై ⅓ వంతు వైశాల్యాన్ని ఎడారులు ఆక్రమించి ఉన్నాయి.ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఒయాసిస్సు ప్రాంతం సారవంతమై నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది.ఎడారులు అంటే ఇసుకతో నిండి ఉన్న ప్రాంతాలు అంటారు.మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు ఉన్నాయి.ఎడారి అనేది ప్రకృతి దృశ్యం.వాతావరణ ప్రక్రియల ద్వారా ఎడారులు ఏర్పడతాయి.ఎందుకంటే పగలు మరియు రాత్రి మధ్య ఉష్ణోగ్రతలు పెద్ద వ్యత్యాసాలు కలిగి ఎడారులపై ఒత్తిడిని కలిగిస్తాయి.ఫలితంగా రాళ్లు ముక్కలుగా విరిగిపోతాయి.ఎడారులలో వర్షాలు అరుదుగా కురుస్తాయి.ఈ ఎడారిలో అతనికి ఎవరో నడిచిన అడుగుల సవ్వడి వినిపిస్తుంది.ఈ ఎడారిలో అతనికి ఆమె ఎవరో తెలియదు.కాని అతనికి ఎడారిలో ఆమె నడిచిన అడుగుల సవ్వడి వినిపిస్తుంది అంటే అతనికి ఆమె పట్ల అనురాగంతో కూడిన ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది.అతనికి ఆమె ఎవరో తెలియనప్పటికీ ఆమె నడిచిన అడుగుల సవ్వడి వినిపించడం ఆమె పట్ల గల ప్రేమ,అనురాగం ఉన్నట్లు తోస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.గుల్జార్ కు మనుషుల హృదయాలను ఇట్టే పసిగట్ట గల నేర్పు ఉంది.గుల్జార్ లో మానవత్వం పొంగి పొరలుతుంది మరియు మనుషుల హృదయాలను అర్థం చేసుకునే సహృదయం ఉంది అని షాయరీ కవితలోని భావాలు వెల్లడి చేస్తున్నాయి.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గీతాంజలి (డాాక్టర్ భారతి)

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(6)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి ( డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.గుల్జార్ రచించిన షాయరీ కవితను తెలుగులోకి గీతాంజలి (డాక్టర్ భారతి) అను సృజన చేసింది.గుల్జార్ లోకానుభవంతో వైవిధ్యమైన షాయరీ కవితలు పండించారు.గుల్జార్ షాయరీ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.షాయరీ కవిత నన్ను ఆలోచింపజేసింది.గుల్జార్ షాయరీ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? షాయరీ కవితా చరణాలపై దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“కన్నీరు కార్చేటప్పుడు …ఎవరూ
“తోడు ఉండరని కాబోలు ….
“కన్నీళ్ళకి ఏ రంగు ఉండదు !
కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి వాటిని తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని ఆశ్రువులు లేదా
కన్నీరు అంటారు.సాధారణ పదజాలంగా కన్నీరు ఏడవటం అనే చర్యను సూచిస్తుంది.దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినప్పుడు కన్నీరు ఉబికి వస్తుంది.భావోద్వేగాల కారణంగా కన్నీరు కార్చే వ్యక్తి మానవుడు అని భావిస్తున్నారు.కంటిని శుభ్రం చేసే కన్నీరు కార్నియాను తడిగా శుభ్రంగా ఉంచుతుంది.కంటిలో దుమ్ము ఉండకుండా నివారించుతుంది.కంటికి పోషక పదార్థాలు అందించడానికి కళ్ళు నిరంతరం స్రవిస్తాయి.కలక లేదా ఏదైనా ధూళి వంటివి కంటికి
తగిలినప్పుడు కన్నీరు స్రవిస్తుంది.ఏడవడం వలన
కన్నీరు వస్తుంది.బలమైన భావోద్వేగాలు,నొప్పి తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు వెలువడుతుంది.మనుషులలో దుఃఖం వలన ముఖం ఎర్రబడడం,గొంతులో గద్గదత,శరీరం కంపించడం కూడా జరుగుతుంది.ఏడిస్తే అనారోగ్యం వల్ల కలిగే బాధ కొంత దూరం అవుతుంది మరియు ప్రశాంతత చేకూరుతుంది.ఉద్వేగాలను అణచుకొని బాధపడటం కంటే వెక్కి వెక్కి ఏడవడం మంచిది అంటారు.కన్నీళ్ళలో ప్రోటీన్,మాంగనీస్, పొటాషియం,హార్మోన్లు,ప్రోలాక్టిన్ ఉంటాయి. ఏడవడం వల్ల శరీరంలో నొప్పి,ఒత్తిడి తగ్గుతాయి. కన్నీరు మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది కన్నీరు శారీరకమైన కుంగుబాటును సూచించే సంకేతం.మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.బాధ,దుఃఖం, కన్నీరు ఎదుటివారిని తృప్తి పరుస్తుంది.కన్నీరు శత్రువుల నుంచి సానుభూతిని సంపాదిస్తుంది. కన్నీరు బంధాన్ని,స్నేహాన్ని పెంచుతుంది.ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి.ఏడుపు ఒత్తిడిని తగ్గిస్తుంది.కన్నీరు కార్చడం వలన ఇరువురి మధ్య విభేదాలు తొలగి బంధం మరింత బలపడే అవకాశం ఉంది.ఏడుపు అనేది చెంపల మీదుగా కారుతున్న కన్నీళ్ళతో ముడిపడి ఉంటుంది.కన్నీరు విలక్షణమైన ఏడుపు శబ్దాలతో కూడి ఉంటుంది.చాలా తరచుగా విచారం మరియు దుఃఖం,ఏడుపు,కోపం,నవ్వు లేదా హాస్యం,నిరాశ,పశ్చాత్తాపం లేదా తీవ్రమైన భావోద్వేగాల ద్వారా కన్నీళ్లు ప్రేరేపించబడతాయి. నిజాయితీ లేని పశ్చాత్తాపం యొక్క కపటమైన ప్రదర్శనను మొసలి కన్నీరు అని పిలుస్తారు.మనిషి మనసులో తీవ్రమైన బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీరు కార్చడం జరుగుతుంది. దుఃఖంతో కళ్ళ నుండి కన్నీరు కార్చేటప్పుడు అతను ఒక్కడే ఉంటాడు.కన్నీరు కార్చిన సమయంలో అతని వెంట ఎవరూ లేరు.అతని లోపల కలిగే దుఃఖాన్ని దిగమింగుకొని ఒక్కడే అనుభవిస్తాడు.అతని దుఃఖంలో తోడుగా ఎవరు ఉండరు అనే వాస్తవం తెలియజేయడం,కళ్ళనుండి కురిసే కన్నీళ్ళకు ఏ రంగు ఉండదు కాబోలు అని ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.నిజంగానే కళ్ళ
నుండి కార్చే కన్నీళ్లకు ఏ రంగు ఉండదు.మనిషి
ఎందుకు కన్నీళ్లు కారుస్తాడు? మనిషి దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు అతనితో పాటు తోడుగా ఎవరు ఉండరు.కన్నీళ్ళకు ఏ రంగు ఉండదు అని
భావోద్వేగంతో కూడిన కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.తెలుగులోకి షాయరీ కవితను చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(7)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి.గుల్జార్ షాయరీ కవితను గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“నేను తన వాడిని … ఈ రహస్యం
“ఆమెకి తెలిసిపోయింది !
“కానీ …ఆమె ఎవరిదో ….
“ఈ సవాలు నన్ను నిద్ర
“పొనివ్వట్లేదు !
నేను అనేది తెలుగు భాషలో ఒక మూల పదం.నేను అనే పదం సర్వ నామంగా వాడుతారు.ఒక మనిషి తన గురించి తాను చెప్పే సందర్భంలో నేను అనే పదాన్ని ఉపయోగిస్తాడు.తన వాడిని అనగా తనకు స్వంతం అనే అర్థం వస్తుంది.అతను తనకు సంబంధించిన వాడు అని అర్థం.ఎవరికి తెలియకుండా దాచబడినది రహస్యం.మనకు తెలిసిన ఒక విషయాన్ని ఎవరితోను చెప్పకుండా ఉంచటం రహస్యం.ఇతరులు ఎవరికి తెలియని విషయం రహస్యం.గుప్తంగా ఉండిన విషయం రహస్యం.ఆమె అనే తెలుగు పదం ఒక ఆడ మనిషిని గురించి వేరొకరికి చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు.ఆమె ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామం.జవాబుకు వ్యతిరేకమైనది సవాలు.ప్రత్యుత్తరాన్ని కోరే వాక్యం సవాలు. ప్రశ్నకు జవాబు ఇవ్వ లేక పోవడం సవాలు.శత్రువు యొక్క సవాలును తోసి పుచ్చి వెళ్ళడం సవాలు.నిద్ర లేదా నిదుర ఆంగ్లంలో Sleep అని అర్థం.శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి నిద్ర.మనుషుల దైనందిన జీవితంలో నిద్రకు ముఖ్య భాగం ఉంది.మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం. శారీరకపరంగా నిద్ర అత్యంత ముఖ్యమైనది.నిద్ర పౌరుల ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో రాయబడి ఉంది. ఆరోగ్యకరమైన జీవనానికి నిద్ర చాలా అవసరమైనది.నిద్ర, విశ్రాంతి,ఆరోగ్యరీత్యా మానవులకు తప్పనిసరి అవసరం ఉంది.నేను తన వాడిని అని ఆమె మనసులో అనుకుంటున్నది. అతను తనకే స్వంతం అని మరియు అతను తనకు సంబంధించిన వాడు అని ఆమె మనసులోనే ఆరాధిస్తున్నది. ఆమె నన్ను అమితంగా ప్రేమిస్తున్నది.ఆమె నాపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నది.ఆమె అనురాగంతో చూపుల బాణాలు వేస్తున్నది. ఆమెను చూడగానే నా మనసు వశం తప్పినది.ఆమెకు నా మనసు అంకితం అయిపోయినది.ఆమె తెలివైనది.నేను నా మనసులో దాచి పెట్టిన రహస్యం ఆమెకు తెలిసిపోయింది. ఆందాలు చిందే రూప లావణ్యాలతో ఆమె మెరిసిపోతున్నది. సౌందర్యవతి అయిన ఆమె ఎవరిదో అనే విషయం నాకు నా జీవితంలో ఒక సవాలుగా మారింది.జీవితంలో సవాలు వేయడం అనేది మామూలు విషయం కాదు.అలనాడు శ్రీరామచంద్రుడు జనక మహారాజు పెట్టిన పరీక్షలో శివధనస్సును అవలీలగా విరిచినాడు.శ్రీరాముడు ఆ పరీక్షలో నెగ్గాడు. సీతమ్మను వివాహం ఆడినాడు.నా ఆలోచనల్లో ఆమె నిండి ఉన్నది.ఆమె గురించిన ఆలోచనలు తనను నీడలా వెంటాడుతున్నాయి.అందాలరాశి అయిన ఆమె తనకి చెందాలని మనసులో తీరని కోరికగా ఉంది.కానీ ఆమె తనకు దక్కుతుందా? ఎవరికి దక్కుతుంది? ఎవరిదో ఈ సవాలు ? ఎవరు నెగ్గుతారు ? అనే విషయంలో నిద్ర కూడా పోవటం లేదు అని కవి గుల్జార్ వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.షాయరీ కవితలోని భావాలు పాఠకులను ఆలోచింప జేస్తాయి.షాయరీ కవిత పాఠకులను ఏదో తెలియని లోకంలోకి విహరింప చేస్తుంది.గుల్జార్ షాయరీ కవితను చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(8).
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి).

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.మానవ జీవితంలోని సంఘర్షణలను భావస్ఫోరకంగా కవితాత్మకం చేయడంలో కవి గుల్జార్ దిట్ట అని చెప్పవచ్చు.గుల్జార్ షాయరీ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“ నేనెంత వెర్రి వాడినో చూడు !
“ఎక్కడైతే …. కనీసం ప్రేమ అన్న పదం కూడా
“అలవాటుగా లేదో … అలాంటి నగరంలో
“కూడా ప్రియా నీ కోసం నిరీక్షించాను !
ఒక మనిషి తన గురించి తాను చెప్పే సందర్భంలో
నేను అనే పదాన్ని ఉపయోగిస్తాడు.ఎంత అనేది పరిమాణాన్ని తెలిపే పదం.వెర్రి వాడు అంటే మానసిక అనారోగ్యం కలవాడిగా,మూర్ఖుడిగా ఉన్న వాడు.అసహజమైన వింత కోరికలు కోరడం వెర్రివాని చేష్టగా అనిపిస్తుంది.ఎక్కడ అనేది ఒక ప్రదేశాన్ని సూచించడానికి ఉపయోగించే పదం.
కనీసం ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం పొందవలసి ఉంటుంది.ప్రేమ అనేది ఉన్నతమైన ప్రేమ స్థాయిని సూచిస్తుంది.ప్రేమ అంగట్లో దొరికే వస్తువు కాదు.అది స్వతహాగా మనసులో నుండి పుట్టుకు రావాలి. ప్రేమించడానికి హృదయం ఉండాలి. ప్రేమించబడడానికి వ్యక్తిత్వం ఉండాలి.జీవితం పువ్వు లాంటిది.పువ్వులోని మకరందమే ప్రేమ. శరీరంలో చోటు చేసుకునే రసాయనిక మార్పుల ప్రభావమే ప్రేమ.ఒక వ్యక్తిని క్షణం కూడా విడిచి ఉండ లేక పోవటం ప్రేమ.ఎంత చూసినా,ఎంత మాట్లాడినా,తనివి తీరకపోవడం ప్రేమ.పదే పదే ఆ వ్యక్తి గురించి ఆలోచించడం,గుండె వేగంతో కొట్టుకోవడం,ఇలా ఒక్కో చర్యకు ఒక్కో హార్మోన్ ప్రభావం ఉంటుంది.వ్యామోహం అంటే కామం. కామం శారీరక వాంఛలు తీర్చుకునే వరకు మాత్రమే ఉంటుంది.అమ్మాయి అందంగా ఉంటే ప్రేమించడం అన్నది ఒక రకంగా ఆకర్షణ కిందకు వస్తుంది. అనుబంధం ఉన్నప్పుడు ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ ఎక్కువ కాలం నిలుస్తుంది.ఎన్నో రకాల ప్రేమలు ప్రకృతిలో అగుపిస్తాయి.కాలానికి కరగని కొవ్వొత్తి ప్రేమ.మనసుకు నచ్చిన మధురానుభూతి ప్రేమ. ప్రేమంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం.స్త్రీ పురుషుల మధ్య ఉండే అభిమానం ప్రేమ.ప్రేమికుల మధ్య నడిచే వ్యవహారం ప్రేమ.ప్రేమ ఏదేని వస్తువు కొరకు లేదా మాట కోసం పడిగాపులుగాయడం నిరీక్షణ.ఆమె కొరకు ఆతను ఎదురు చూడటం నిరీక్షణ అని చెప్పవచ్చు.నేను ఎంత వెర్రి వాడిని చూడు అని తన గురించి తాను చెప్పుకోవడంలో ఆశ్చర్యంతో కూడిన ప్రేమ,అనురాగం అతనిలో దాగి ఉందేమో అనిపిస్తుంది.అతను తనలో తానే మధన పడడం బాధను కలిగించే విషయంగా పరిగణించాలి.అతను ఎందుకు అలా మాట్లాడ వలసి వచ్చింది? అనేది ఆలోచించాల్సిన విషయంగా తోస్తుంది.ఇందులో ఏదో మతలబు ఉంటుంది.ఏదో అతని హృదయానికి తగిలిన బాధ అయి ఉంటుంది.అందుకే అలా అతను తనకు తానే వెర్రివాడిగా చెప్పుకోవడం జరిగింది.ఎక్కడ అయితే? అని ఆ ప్రదేశం గురించి తెలుపక పోవడం,ఖాళీని పూరించక పోవడం,ఎవరికైనా సందేహాలు పొడ చూపుతాయి.ఎక్కడ? ఏ ప్రదేశం? అనేది ఉంటుంది.అది ఇక్కడ కనిపించడం లేదు.అతడు ఆమెను ప్రేమిస్తున్నాడు అనే భావన ఎదుటి వారికి కలుగుతుంది.కనీసం ప్రేమ అనే పదం కూడా ఉచ్చరించని చోటు ఉంటుందా? ప్రేమ కోసం పరితపించని చోటు ఉంటుందా? అని సందేహాలు ముప్పిరిగొంటాయి.ఏదైనా మళ్లీ మళ్లీ చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన ప్రేమికునిలో అలవాటుగా కనబడుతుంది.అతను ప్రేమికుడిగా ఆమె గురించి మనసులో ఆవేదన చెందుతున్నాడు.అలాంటి ప్రేమ తెలియని నగరంలో కూడా ఆమె రాక కోసం, మృదువైన మాట కోసం,చల్లని పిలుపు కోసం పడిగాపులు పడ్డాడు.తాను ప్రేమించిన ఆమె కొరకు నిరీక్షించడం ఎంత బాధాకరమో,అనుభవించిన వ్యక్తికే తెలుస్తుంది. ఆమె కొరకు నిరీక్షించిన తనకు అది ఒక స్వీయ శిక్షలా ఉంది.నిన్ను ప్రేమించినందుకు ప్రేమ లేని నగరంలో నీ రాక కొరకు నా సమయం వెచ్చించి వెర్రివాడిలా నిరీక్షించాను అని వ్యక్తం చేసిన కవి గుల్జార్ భావం అద్భుతంగా ఉంది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకులను ఆలోచింపజేస్తుంది.షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(9)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవిత జీవంతో తొణికిసలాడుతుంది.గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? మనసు పెట్టి షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అపారమైన అనుభూతులను ఆస్వాదించండి.
“ఈ కళ్ళున్నాయే అవి చెరువులో … కొలనులో
“కావు.కానీ నీళ్ళతో నిండిపోతాయి !
“హృదయం కూడా గాజు ముక్క కాదు
“అయినా విరిగి ముక్కలై పోతుంది
“కానీ ఈ మనిషున్నాడు చూడండి … తాను
“ఋతువు కానే కాడు
“కానీ అన్ని కాలాల్లో మారిపోతూనే ఉంటాడు !
కన్ను కాంతిని కంటి నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం.కన్ను మానవులలో ముఖ్యమైన జ్ఞానేంద్రియం.కండ్లు మానవుని ముఖానికి రెండు వైపులా అమర్చబడి ఉంటాయి.కళ్ళు మనుషులకు కెమెరా వలె పని చేసి బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నవి ఉన్నట్టుగా మెదడుకు పంపుతాయి.కళ్ళు మనిషికి చాలా ప్రధానమైనవి.కళ్ళు లేని జీవితాన్ని ఊహించడానికి కూడా ఎవ్వరు సాహసించరు. మనిషి కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.నదుల నుండి వచ్చే వరదల ద్వారా చెరువులు నీటితో నిండుకుంటాయి. చెరువులు సాధారణంగా మంచి నీటితో కళకళలాడుతుంటాయి.చెరువులు తరచుగా మానవ నిర్మితములైనవిగా ఉంటాయి.చెరువులు అత్యంత జీవవైవిధ్యం కలిగి ఉంటాయి.చెరువులు వ్యవసాయానికి,పశువులకు మరియు మానవులకు నీరు అందించడంలో అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి.చాలా వరకు చెరువులు వర్షం మీద ఆధారపడి ఉంటాయి.అనేక గ్రామాలలో చెరువు నీటిని త్రాగడానికి ఉపయోగిస్తారు. కొలనులు కూడా నీటికీ నిలయాలుగా ఉంటాయి. గుల్జార్ లోకంలోని మనుషుల కళ్ళ గురించి చెబుతున్నాడు.మనుషుల కళ్ళున్నాయే అవి నీటితో కళకళలాడే జలాశయాల వంటి చెరువులు, కొలనులు కావు అని చెబుతున్నాడు.కానీ మనుషుల కళ్ళు నీళ్లతో నిండిపోతాయి అని వ్యక్తం చేసినాడు.మనుషుల కళ్ళు నీళ్లతో నిండిపోవడం ఏమిటి?అని మనలో సవాలక్ష సందేహాలు పొడ చూప వచ్చు.ఏదైనా బాధ కలిగినప్పుడు మనుషుల కళ్ళు కన్నీళ్ళతో నిండిపోతాయి అనేది ఎవ్వరు కాదనలేని వాస్తవం.గుండె లేదా హృదయం మానవ శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం.హృదయంలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరాయంగా పని చేసి మనిషిని బతికిస్తున్నాయి.హృదయం చాతీకి ఎడమ వైపు ఉంటుంది.గాజు అనేది స్పటికాకారం కాని ఘనం. గాజు పారదర్శకంగా మరియు రసాయనికంగా జడత్వంతో ఉంటుంది.మనిషిలో నిండి ఉన్న హృదయం కూడా గాజు ముక్క కాదు.అయినా విరిగి ముక్కలు అయిపోతుంది అన్నాడు.మనిషి హృదయానికి గాయం అయ్యేంత వరకు తెలియదు. నిజంగానే మనిషి హృదయం గాజు వస్తువు కానప్పటికీ ఏదో తెలియని బాధకు గురి అయి మనసు గాజు వస్తువు వలె విరిగి ముక్కలై పోతుంది అనేది వాస్తవం.తెలుగు సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి ఆరు ఋతువులుగా పేర్కొన్నారు.1) వసంత ఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం.ఈ కాలంలో చెట్లు చిగురించి పువ్వులు పూస్తాయి.2) గ్రీస్మ ఋతువు :జ్యేష్ఠ మాసం,ఆషాడ మాసం.ఈ కాలంలో ఎండలు మెండుగా ఉంటాయి.3) వర్ష ఋతువు : శ్రావణ మాసం,భాద్రపద మాసం.ఈ కాలంలో విరివిగా వర్షాలు కురుస్తాయి.4) శరదృతువు : ఆశ్వయుజ మాసం,కార్తీక మాసం.ఈ కాలంలో వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.5) హేమంత ఋతువు: మార్గశిర మాసం,పుష్యమాసం.ఈ కాలంలో మంచు కురుస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది.6) శిశిర ఋతువు : మాఘమాసం,ఫాల్గుణ మాసం.ఈ కాలంలో చెట్లు ఆకులు రాల్చుతాయి.భూగోళంపై నున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మానవులు చాలా పురోగతిని సాధించారు అని చెప్పడంలో సందేహం లేదు.మానవునిలో వివేకం,ఆలోచన,భాష వంటి విషయాలు మెదడు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడినాయి.కానీ ఈ మనిషున్నాడు చూడండి… తాను ఋతువు కానే కాడు.కానీ అన్ని కాలాలలో మారిపోతూనే ఉంటాడు అని చెబుతున్నాడు.మనుషులలో పేరుకొని పోయిన విచ్చలవిడితనం,విశృంఖలత్వం,వింత ప్రవర్తనను పరిశీలించి కవి గుల్జార్ చెప్పినట్లుగా తోస్తోంది.మనిషి అన్ని కాలాలలో ఒకే రీతిగా ఉండక మారిపోవడం ఏమిటి?అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.మనుషుల ప్రవర్తన ఋతువుల కాలాలకు కూడా అందకుండా మార్పు పొందడం సహజం అనిపిస్తుంది. మనుషులకు ఏమైంది? మనుషుల్లో మానవత్వం మృగ్యం అయి పోయింది.మానవత్వం లేని స్వార్థంతో కూడిన మనుషుల ప్రవర్తనను చూసి కలిగిన ఆవేదన షాయరీ కవితగా రూపు దిద్దుకొన్నట్లుగా తోస్తోంది.మనుషులలోని విశాల భావాలు మానవతకు దోహదం చేస్తాయి.మనుషుల్లో విశాల భావాలు కొరవడడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది.గుల్జార్ మనుషుల వింత ప్రవర్తనను నిశితంగా పరిశీలించి చెప్పినట్లుగా ఉంది.మనిషి ఎందుకు విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు.మనిషిలో కలిగిన మార్పుకు కారణం ఏమిటి? అనేది అంతు పట్టకుండా ఉంది.మనిషిలో కలిగిన వినూతన మార్పు ఋతువులకు కూడా అందకుండా ఉంది అని వ్యక్తం చేసిన భావం పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తుంది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది

by Ananthaacharaya K.S. July 29, 2024
written by Ananthaacharaya K.S.

వారాల ఆనంద్

వెన్నెల వెళ్ళిపోతున్నదని రోదిస్తూ కూర్చుంటే ప్రభాతాన్ని కోల్పోతావు….
కోల్పోయిన దాని గురించి కాదు,రాబోయే భవిష్యత్తు కొరకు, చైతన్య దీపం పట్టుకొని అడుగు వేయి అని చేయి పట్టుకుని నడిపించే కవిత్వం శ్రీ వారాల ఆనంద్ గారిది. ఒక కవి సాయంకాల వేళ పొంగుతున్న వెలుతురు ధారలను తీసుకొని కవితలు అల్లుతూ కూర్చుంటాడు,  కవి సమయాలను ఉదయము సాయంకాలంలో, ప్రకృతిలోని పక్షుల ధ్వనులను, చెట్టు… వెతుకులాటలు తాను తిరిగి, కదిలే దృశ్యాలను తన సొంత ఊరి జ్ఞాపకాలను దారం చేసిన పల్లె రాగం వారాల ఆనంద్. మాట మైకు నుంచి రాలిపడే ఉపన్యాసపరంపర కాదు… మాట రెండు మనుషులను కలిపే ఆత్మీయ బంధంగా ఉండాలి. మానవ సంబంధాలు మరింత మెరుగుపడి ఆరోగ్య సమాజ నికి దోహదపడాలి, అని కోరుకునే ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా  కవిత్వంతోనే కౌన్సిలింగ్ చేస్తారు,  వారాల ఆనంద్ సర్
 నేను సైతం అంటూ… మానేరు తీరాన నడిచి అందరికీ గుక్కెడు అనురాగ జలాన్ని అందించిన సున్నితత్వం ఆనంద్ సార్ ది.
గుల్జార్ ప్రముఖ సాహితీకారుడు, గీత రచయిత, కవితల్ని ఆకుపచ్చని కవితలుగా ఆనంద్ సార్ అనువదించి అనువాదకుడిగా అక్షరమక్షరం పచ్చదనంలో  ముంచి, ఆత్మీయతా పూల పరిమళాలను పంచి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకున్న కవి రచయిత. భారతీయ కవిత్వపు నాడిని పట్టుకున్న సాహితీ వైద్యులు సర్. యాదోoకి బారాత్…. పేరిట వాట్సాప్ లో వారం, వారం గా ఆదివారం పూట రాస్తూ రాస్తూ…… స్వీయ అనుభవాలు, నేర్చిన, తాను నేర్పిన పాఠాలు ప్రముఖులతో ములాఖత్, ఉద్యోగ జీవనం, విద్యార్థులతో తాను పెంచుకున్న బంధం, ఆరోగ్యం, మిత్రుల పరస్పర ఆదాన ప్రదానాలు, కాలేజీలో డిజైన్ చేసి నడిపించిన కోర్సులు, సినిమా మీద, కెమెరా, షూటింగ్,  జర్నలిజం, ఒకటేమిటి పలు రకాలుగా పాఠాలు బోధించి… మార్గదర్శకత్వం చేసిన అంశాల మన ముందు ఉంచుతున్నారు.
తెలంగాణ పునర్నిర్మాణ వేళ…. మన సినిమా మన సాహిత్యం గొప్పతనాన్ని తెలుపుతూ… మానేరు గల గలలు, బంగారు తెలంగాణలో చలనచిత్రం
మనిషి లోపల, సొంతూరు, మెరుపు, నవ్య చిత్ర వైతాళికులు,
బాలల చిత్రాలు, తెలంగాణ దశ దిశ,  పుస్తకాలను ప్రకటించి అచ్చుతెలంగాణ మనిషినని నిరూపించుకున్నారు  వారాల ఆనంద్ సర్ అలాగే ఉద్యమానికి ఊపిరి పోసారు.
మృదుభాషీ స్మితభాషి హితైషి, సౌమ్యలు అయిన ఆనంద్ సర్, జీవితంలో ఆరోగ్యం దెబ్బతిని మూత్రపిండాలు రెండు పాడైన సందర్భంలో ఆందోళన నుండి ఉద్వేగం విచారణ నుండి కవిత్వాన్ని రాశారు. అది మనిషి లోపల… నా కలలు నీ కలలు ప్రోది చేసుకొని విశ్వంలోకి దూసుకెళ్ళు అంటూ… పునర్జన్మ పొందిన వారి కవిత్వం నిండా ఆత్మవిశ్వాసం, ఆశయే శ్వాసగా పునరుజీవనం పొందింది.
ఊహల రెక్కలు కట్టుకొని బాల్యం ఉదయం మీద వాలి చిన్నోడి ఇంగితాలను అక్షర రూపంలోపలకి మార్చి, ఆటలను భావచిత్రాలుగా రూపొందించి, చిన్నారి చిలిపితనాన్ని ముక్తకాలలో బంధించి, బాల సాహిత్యపు వెలుగులను దశ దశలా వ్యాపించేలా చేశారు వారాల సర్.
ఇరుగుపొరుగు పేరిట అనేక భాషల నుండి కవిత్వాన్ని తెలుగులోకి అనుసృజన చేసి అందిస్తూనే ఉన్నారు.
ఫిలిం సొసైటీలు యువత మూర్తిమత్వ వికసిత కేంద్రాలుగా భావించి, వాటి విస్తరణకు నడుము కట్టి విజయం సాధించినారు. దక్షిణ భారతదేశంలో బెంగుళూరు తర్వాత, కరీంనగర్లో ఫిలిం భవన్ నిర్మాణాన్ని పూర్తిచేసి జిల్లా కళారంగా అభిమానుల కలల్ని నెరవేర్చినారు. ఇప్పుడు కళా సాహిత్య కార్యక్రమాలకు అడ్డగా ఇది నిలిచింది.
సినీ విమర్శకులుగా, నంది అవార్డుల జూరి మెంబర్ గా, ఇండియన్ పనోరమా చిత్రాల ప్రదర్శనలో న్యాయ నిర్ణేతగా, కేరళ జాతీయ ఫిలిం ఫెస్టివల్ తో పాటు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు  కూడా జూరీ మెంబర్ గా వ్యవహరించిన ఘనత వారిది. ఒక సాధికారికంగా సినిమాపై 24 ఫ్రేమ్స్ ను రాసిన వారాల ఆనంద్ సార్ మంచి సినీ విశ్లేషకులు.
సెన్సార్ బోర్డు మెంబరుగా, సినీసుమాలను పూజించి భారతీయ మహిళల మేధోసంపత్తి ఆలోచన ధోరణిలను ఆవిష్కరించిన సినీ సాహితీ విరించి.
వేములవాడ ఆలయ సంస్కృతి అక్కడ సాంబ కవిలాంటి వారి సాహిత్యాన్ని విని అధ్యయనం చేసి తెలంగాణ భాషకు మారుపేరైన సామల సదాశివ, సంస్కృత సాహిత్యానికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీ భాష్యం విజయసారథి పై మూడు భాషల సాధికారికత కలిగిన ముద్దసాని రామిరెడ్డి లపై డాక్యుమెంటరీలను నిర్మించినారు.  వేములవాడలో …. వ్యవస్థను చూపిస్తూ మరొక డాక్యుమెంటరీ, పైడి జయరాజ్, మిద్దె రాములు పైన ( మోనోగ్రాఫ్ ) నిర్మించినారు. రచయితగా దర్శకునిగా, దార్శనికతతో బాధ్యతాయుతంగా పనిచేసిన సృజన కారులు.
ఒక పాత్రికేయునిగా మొదలై టోరి రేడియో….. లో అనుసంధానకర్తగా ఎంతోమంది లబ్ద ప్రతిష్టులైన కవులు రచయితల నుండి వర్ధమానుల దాకా పరిచయం చేసి ప్రోత్సహించిన ఘనత వారికి దక్కుతుంది. గ్రంధపాలకునిగా, అభ్యుదయ భావాలతో, క్రమశిక్షణతో, అధ్యయనం నుండి రచనలు దాకా అదే కొనసాగింపు కనపడుతుంది.
ఇంకా గడపాల్సిన కాలము నడవాల్సిన దూరము చాలా ఉంది అంటారు ఆనంద్ సార్, మనము అనుకుంటున్నాం ఇంకా రాయాల్సింది, తీయాల్సింది, దర్శకత్వం వహించాల్సింది, విమర్శల్లో విప్పాల్సింది…. వారి చేతికి చాలా పని ఉంది.
కవి రచయిత సినీ విమర్శకులు డాక్యుమెంటరీల నిర్మాత పాత్రికేయులు ,సెన్సార్ బోర్డ్ మెంబర్ గా ఫిలిం సొసైటీల వ్యవస్థాపకులు గా, అనువాదకులు ఉద్యోగ నివృత్త గ్రంథపాలకులుగా, ఆత్మీయులుగా ఉన్న ఆనంద్ సార్ ని, కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్న తదుపరి శ్రీ కే.ఎస్.అనంతా చార్య చేసిన ఇంటర్వ్యూ.


నమస్తే ఆనంద్ సార్.

మయూఖ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యు చేద్దామని, కొన్ని ప్రశ్నలు అడుగుతాను.

తప్పకుండా సర్.

ప్రశ్న : కవిత్వం, కథలు, పిల్లల కథలు, సినిమా విమర్శ, డాక్యుమెంటరీల రూపకల్పన, ‘త్మ కథ’ ఇట్లా అనేక ప్రక్రియల్లో కృషి చేస్తున్నారు. ప్రభావంతమయిన రచనలు చేసారు. ఇన్ని ప్రక్రియల్లో రాయడం ఎందుకు, ఎట్లా మొదలయింది, ప్రేరణ ఏమిటి?

మీరన్న అన్నిప్రక్రియాల్లో వున్నవి రూప బేధాలే తప్ప మౌలికంగా అన్నీ కళాత్మక సృజన రూపాలే.  
సృజనకారుడనేవాడు తనను తాను వ్యక్తం చేసుకోవాలనుకున్నప్పుడు ఇదిమిద్దంగా ప్రత్యేకంగా ఒక ప్రక్రియలోనే రాయాలని అనుకోడు. ఆయా సందర్భంలో పెల్లుబికిన భావ పరంపరకు అనుగుణంగా వ్యక్తీకరణ రూపాన్ని ఎంచుకుంటాడు. తాను అనుకున్న, తాను చెప్పదలుచుకున్న భావం ఏమేరకు పాఠకుడుకి అందిచగలిగానా అన్నది మాత్రమే చూస్తాడు. నిజానికి నేను కవిత్వంలో దృశ్యాన్ని, దృశ్యం లో కవిత్వాన్ని చూస్తాను. కవిత్వంలో భావ లయ, దృశ్య మాధ్యమంలో దృశ్య లయ నన్ను ప్రధానంగా ఆకర్శిస్తాయి. ఆ దిశలోనే నా రచనలూ సాగాయి. ఏదీ ప్రణాలికా బద్దంగా ఆ రూపంలో రాయాలని రాయలేదు. ఇన్ని ప్రక్రియలలో రాయాలని కూడా అనుకోలేదు. మంచి సినిమాకు మంచి కవిత్వానికి నడుమ పెద్ద తేడా వుందని నేనుకోను. పథేర్ పాంచాలి, దాసి, రాషోమాన్ లాంటి ఓ మంచి సినిమా చూసినప్పుడు మంచి కవిత్వం చదివినట్టే వుంటుంది. అట్లే మంచి కవిత చదివినప్పుడు గొప్ప దృశ్య భావన కలుగుతుంది. కేవలం సినిమా, కవిత్వాలే కాదు పెయింటింగ్ సంగీతం ఇట్లా అన్ని కళల్లో రూపాలు మాత్రమే  భిన్నమయినవి. కానీ మనసున్న మనుషులపై వాటి ప్రభావం ఒకేలా వుంటుంది. నేను సమాంతర సినిమా ఉద్యమంలో ప్రధానంగా వున్నప్పుడు వివిధ భారతీయ భాషల్లో వస్తున్న సినిమాల్ని చూడడం సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్ లు ఏం తీసారు, అదూర్ , అరవిందన్ సినిమాలు ఎట్లా వున్నాయి అని చూసేవాన్ని. అంతేకాదు అకిర కురుసువా, ఇజెన్ స్టీన్ లాంటి అనేక మంది విదేశీ దర్శకుల సినిమాలూ చూశాను వాటినన్నింటినీ  ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూస్తూ అనువదించుకుని సంభాషణల్నీ అర్థం చేసుకునే వాణ్ని. అట్లే కవిత్వం పై ప్రధానంగా దృష్టి పెట్టినప్పుడు వివిధ భారతీయ భాషల్లో వస్తున్న కవిత్వం చదవడం ఆరంభించాను. నిజానికి నా చిన్నప్పుడు నేనో  పెద్ద అంతర్ముఖున్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీంనగర్ లో మా నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. ముఖ్యంగా వ్యాపార నేపధ్యంవున్న కుటుంబం. మా ఇంట్లో సాహిత్య వాతావరణం అసలు లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్న ఉర్దూలో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి క్లాక్ టవర్ దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్ స్టాల్ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్ట్ బుక్స్ కు అదనంగా ఇతర పుస్తకాలు చదివే అలవాటయింది. తర్వాత యద్దనపూడి, అరికెపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలూ చదివాను. డిగ్రీ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటికథ ‘చిత్రిక’ వార పత్రికలో అచ్చయింది. కవిత్వంలో మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో, పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘‘లయ”’ మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. 1981 లోనే వేములవాడ ఫిలిం సొసైటీ ప్రారంభించాను. అప్పుడే సత్యజిత్ రె మృణాల్ సేన్, శ్యాం బెనెగల్, సత్యు, చార్లీ చాప్లిన్ ఇట్లా అనేక మంది గొప్ప దర్శకులు రూపొందించిన సినిమాలని మేము చూడడంతో పాటు సభ్యులకు చూపించాము. దృశ్య శ్రవణ మాధ్యమంయిన సినిమా చాలా ప్రభావ  వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని  చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. ఆట్లా అర్థవంతమయిన సమాంతర సినిమాల్ని ప్రదర్శించడమే కాకుండా వాటి పైన రాయడమూ అప్పుడే ఆరంభమయింది. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’ లాగా తిరుగుతూ వచ్చాను. ఎదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది. ప్రభావాల విషయానికి వస్తే ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రభావితం చేసారు. కవిత్వం లో శ్రీ శ్రీ, తిలక్, వీవీ, వచనంలో బుచ్చిబాబు, రావి శాస్త్రి, అంపశయ్య నవీన్ ఇట్లా ఒకరేమిటి అనేకమందిని విస్తృతంగా చదివాను. వారి రచనలతో ప్రభావితున్ని అయ్యాను. కానీ ఎవరినీ అనుకరించాలని వారిలా రాయాలని అనుకోలేదు. ఆ గొప్ప వారందిరి రచనల వాతావరణంలో నా స్వీయ గొంతుక కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాను..

కవిత్వం అనువాదాలతో పాటు “ యాదొంకి బారాత్” పేర మీ ఆత్మకథ రాస్తున్నారు. ఎందుకు రాయాలనిపించింది?  యాదొంకి బారాత్ కి ప్రేరణ దాని ప్రణాళిక ఏమిటి? ఎంతవరకు వచ్చింది?


మూడేళ్ళ క్రితం మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన తవ్వకాల్లో బయట పడ్డ ఒక చిన్న ఫోటో ఓ నాలుగు వాక్యాలు రాసేందుకు కారణమయింది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాల్ని పంచుకున్నాను. అదిచూసి  నా సహచరి ఇందిర చాలా బాగున్నాయి అప్పటి విషయాల్ని రాయకూడదూ అంది అంతే కాదు. ఒక రకంగా ఒత్తిడి తెచ్చింది. చిన్నప్పటినుండీ విషయాల్ని రాస్తే అది ఆత్మకథ అవుతుంది, మనం అంత పెద్ద వాళ్ళం కాదులే అన్నాను. కాని తను ఊరుకోలేదు. అన్ని వివరాల్ని రాయండి చదివేవాళ్ళు చదువుతారు. ఏముంది అన్నది తను. ఇంకేముంది నాలో కూడా రాయాలనే కోరిక పెరిగింది. ఎప్పుడో ఇంటర్ లో వున్నప్పుడు చూసిన హిందీ సినిమా పేరు ‘యాదొంకీ బారాత్’ గుర్తొచ్చింది. ఆ పేరు మీదే వరం వారం రాయడం మొదలు పెట్టాను. సామాజిక మాధ్యమాలయిన ఫేస్బుక్,వాట్స్ అప్, నా word press పేజీల్లో రాయడం మొదలు పెట్టాను.  మిత్రులు బాగుంది కొనసాగిన్చామన్నారు. అట్లా సాగుతూ వచ్చింది.  ఎవరయినా డైరీ రాయడం వేరు జ్ఞాపకాల్ని రాయడం వేరు. తేదీల వారిగా రాయడం కష్టమే అయినా మొత్తానికి క్రమంగా రాయడం మొదలు పెట్టాను.
‘లోపల జ్ఞాపకాల జాతర నేనేమో వర్తమాన జెండా పట్టుకుని ముందు నడుస్తున్నా’  అనుకుంటూ రాస్తూ వచ్చాను. “ఆత్మకథలు ఎప్పుడయితే భేషజాలు లేకుండా నిజాయితీగా శ్వేత పత్రాలుగా రాస్తారో అవి గొప్ప ప్రేరణ నిస్తాయి”. అందుకే యాదొంకీ బారాత్ లో నా విజయాలే కాదు నా ఓటములు, నేను ఎదుర్కొన్న అవమానాలు అన్నీ రాసాను. చీకటి వెల్తురు అన్నింటినీ చిత్రించాను.ఇప్పటి వరకు 113 వారాలు రాసాను. 1958 లో నేను పుట్టినప్పటి నుండి 2014 లో తీవ్రమయిన అనారోగ్యానికి గురయి విజయవంతంగా పునర్జన్మ పొందిన కాలం దాకా రాసిన యాదొంకి బారాత్ ను పుస్తకంగా తెస్తున్నాను. మిగతా కాలాన్ని కూడా క్రమం తప్పకుండా రాసే ప్రయత్నం చేస్తున్నాను.

లయ’ కవితా సంకలనం నుండి నేటి వరకు గత నాలుగు దశాబ్దాలుగా సాహితీ ప్రస్థానాన్ని విడువకుండా విస్తరించుకుంటూ కొనసాగడంలో మీ అంతర్యం ఏమిటి? ఆ ప్రయాణాన్ని వివరిస్తారా?  

ఇంతకు ముందే  నేను చెప్పినట్టు నా చిన్నప్పుడు నేను పెద్ద అంతర్ముఖున్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక ఇబ్బందికి గురయ్యేవాన్ని. చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీమంగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో డిగ్రీ చదువు అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. రాయాలనే తపనా పెరిగింది. శ్రీశ్రీ కవిత్వంతో పాటు, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. తప్పకుండా రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో,పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ” మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. సినిమా చాలా ప్రభావ వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’ లాగా తిరుగుతూ వచ్చాను. ఎదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది.    

‘మానేరు తీరం’. ‘మనిషిలోపల’, ‘అక్షరాల చెలిమే’, ‘సొంత వూరు’ తో సహా మీ మొత్తం కవిత్వంలో ప్రధానంగా మనిషి ప్రకృతి సంబంధిత అంశాలు కనిపిస్తాయి వీటి గురించి తెలపండి ?

“ నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు
సగం శబ్దం సగం నిశబ్దం
శబ్దమేమో బతుకు ఏడుపులోంచి ఎగిసిపడుతున్నఎక్కిళ్ళు
 నిశబ్దమేమో బతుకు చేతగానితనం లోంచి వ్యక్తమవుతున్న మౌనం.”.  
అంతే కాదు
“కవిత్వం సంక్షోభ కాల ప్రవాహంలో నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప
బతుకు సమరంలో నిలబెట్టే లంగరు” అని కూడా రాసుకున్నాను. కవిత్వాన్ని ఎప్పుడూ నేను కారీర్ గా తీసుకోలేదు. అది నా ‘లైఫ్ లైన్’.
సాహిత్య పరంగా నాపైన మొదట ప్రభావం కలిగించిన సంస్థలు వేములవాడలోని నటరాజ కళానికేతన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉస్మానియా రైటర్స్ సర్కిల్. ఈ రెండు సంస్థలూ నా అధ్యయనాన్ని ఆలోచన రీతినీ మార్చాయి. వేములవాడలో శ్రీ చొప్పకట్ల చంద్రమౌళి సలహాదారుగా ఏర్పడ్డ సంస్థ నటరాజ కళానికేతన్ సమయంలోనే ప్రముఖ కవులు కే.శివారెడ్డి, దేవి ప్రియ, జ్వాలాముఖి, కుందుర్తి లాంటి ఎందరినో దగ్గరినుంచి చూసే అవకాశం కలిగింది. అప్పుడు వజ్జల శివకుమార్, పీ.ఎస్.రవీంద్ర, జింబో లాంటి కవి మిత్రుల సహచర్యం సాహిత్యం వైపునకు నన్ను నడిపించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నందిని సిద్దారెడ్డి, సుంకి రెడ్డి నారాయణ రెడ్డి, మర్రి విజయ రావు, నందిగం కృష్ణారావు లతో సన్నిహితంగా వున్నాను. ఈ అందరి మిత్రుల స్నేహం సాహిత్యం రచనల వైపునకు దారి తీసింది. తర్వాత జూకంటి జగన్నాదం, అలిశెట్టి ప్రభాకర్ ల కవిత్వమూ ఆకట్టుకుంది. వాళ్ళతో స్నేహాన్నీ కలిపింది.అట్లా రాయాలనే కోరికా శురూ అయి రాయడం మొదలు పెట్టాను. ఆ క్రమంలో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అది ముందుకు సాగి మొదటి పుస్తక ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో,పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ” మినీ కవితా సంకలనం తెచ్చాం.

సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ మీ యవ్వనంలో ప్రభావవంతమైన ప్రాంతాలు వాటి ప్రభావం మీ సాహిత్యం పైన ఎలా ఉండేది.

డిగ్రీ చదువులు పూర్తి అయి ఒస్మానియాలో చేరే సమయానికి సిరిసిల్లా జగిత్యాల అంటేనే ఒక గొప్ప ఉద్వేగం, ఉత్సాహం. అప్పుడు మేమే కాదు యవ్వనంలో వున్న వాళ్ళందరి పైనా ఆ ఉద్యమాల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమితంగా వుండేది. రగులుతున్న పల్లెలు ఒక పక్క, మరోపక్క అణచివేత ఎన్కౌంటర్లు అంతా ఒక సంఘర్షనాత్మక స్థితి. ఎప్పుడే భీభత్సం జరుగుతుందో నన్న స్థితి నెలకొని వుండేది. ఆ నేపధ్యంలో ఆ ఉద్యమ ప్రభావం నాపైనా, నా మిత్రుల పైనా స్పష్టంగా వుండేది. ఆనాటి  మా రచనల్లో ప్రతిభింబించేది, ప్రతిధ్వనించేది. అయితే కవితల్లో కవిత్వంతో పాటు అంతర్లయగా ఉద్యమం ధ్వనించేది. ఆ కాలంలోనే చాలా సాహిత్యం చదివాము. సామాజిక రాజకీయ దృక్పధాన్ని ఏర్పరుచుకున్నాం. సాటి మనిషిని ప్రేమించడం, వారి జీవితాల్ని మా సృజనలో ప్రతిఫలించడం అప్పుడే మొదలయింది. మధ్యతరగతి కుటుంబాల్లోంచి వచ్చాను కనుక ఆ నాటి ఉద్యమ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాని ప్రతి సంఘటననీ సందర్భాన్నీ దగ్గరగా చూసాను వాటిని  లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను. సృజనాత్మక జీవితంతో పాటు సమాంతర సినిమాను కూడా కళా చైతన్య రంగంలో ప్రధానంగా తీసుకున్నాను. అందుకే ఫిలిం సొసైటీ ఉద్యమంలో దశాబ్దాల పాటు పనిచేసాను.

మీ స్వీయ కవిత్వం వివరాలు చెప్పండి?

‘మానేరు తీరం”, ‘మనిషి లోపల’, ‘అక్షరాల చెలిమె’,’సొంతవూరు’, ’ముక్తకాలు’, చిన్నోడి ముక్తకాలు’ వెలువడ్డాయి. ‘మనిషి లోపల’ సంకలనాన్ని అనురాధ బొడ్ల ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’  పేర ఇంగ్లీషులోకి, మనోహరన్ తమిళం లోకి, ఎస్డీ కుమార్ కన్నడంలోకి అనువదించారు. ఇక అనువాదం లో గుల్జార్ GREEN POEMS ని ‘ఆకుపచ్చ కవితలు’ పేర అనువదించాను. కే.సచ్చిదానందన్ ‘వైల్ ఐ రైట్’, జావేద్ అఖ్తర్ ‘ ఇన్ ఆదర్ వర్డ్స్’ కు అనువాదాలు చేసాను. ఇంకా 29 భారతీయ భాషల్లోంచి 90 మంది కవులు రాసిన 152 కవితల్ని తెలుగులోకి అనువదించి ‘ ఇరుగు పొరుగు’ పేరా సంకలనం తెచ్చాను. ప్రస్తుతం ఇరుగు పొరుగు రెండవ సంపుటికోసం అనువాదాలు చేస్తున్నాను.

అభ్యుదయం నుండి అనేక వాదాలు చెలరేగినా అన్నివాదాలు దాటుకుంటూ కవితా వాదాన్ని మానవతా వాదాన్ని నిలబెడుతూ సాగడం లోని మీ నిష్ఠ-నిశ్చయం?

ఆయాకాలాల్లో పెళ్ళుబికిన సామాజిక సంఘర్షణ, సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది. ప్రతిస్పందన మాత్రం ఆ సృజనకారుడి మానసిక స్థితి, స్వీకరించి ప్రతిస్పందించే లక్షణం మీద ఆధారపడి వుంటుంది. నా మట్టుకు నేను అన్నివాదాలనీ దగ్గరి నుంచి చూసాను. కలిసి నడిచాను. జీవితమూ రాజకీయమూ వేర్వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. జీవీతంలో రాజకీయం ఒక భాగమే అయినప్పటికీ ఆ భాగమే మిగతా మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మాను. అది నిజం కూడా. అయితే కళాత్మకం కాని ఏ సృజన అయినా అది సాహిత్యమయినా సినిమా అయినా పొడి పొడిగానే వుంటుంది అన్నది నా అభిప్రాయం. అందుకే సమాజంలో వున్న మనిషి వాడి మనసుతో పాటు సమాజంలో వున్న అనేక పొరల్ని నా రచనల్లో ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నాను. వివిధ భాషల కవిత్వాన్ని మనవాళ్ళకు అందించడం వివిధ సినిమాల్ని పరిచయం చేయడం అందులో భాగమే.v
నేనెప్పుడో రాసుకున్నట్టు
“ ఈ సమాజం అచ్చుతప్పులున్న గొప్ప పుస్తకం, ఇప్పుడు కావలసింది తప్పొప్పుల పట్టిక తయారు చేయడం కాదు, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలి” అన్న భావనలోనే వున్నాను.

సాహిత్య సృజన అట్లా వుంటే పలు డాక్యుమెంటరీలు రూపొందించారు ఆ వివరాలు చెప్పండి? ఏమేరకు వ్యాజ్యం సాధించారు.

నేనిందాకే చెప్పినట్టు సినిమా కవిత్వం రెండూ కళాత్మక వ్యక్తీకరణలే. కానీ కవిత్వం వ్యక్తిగత వ్యక్తీకరణ, సినిమా సమిష్టి కళల వ్యక్తీకరణ. అర్థవంతమయిన భావయుక్తమయిన ఆ రెంటినీ ఇష్టపడతాను. మనిషినీ సమాజాన్నీ పట్టించుకునే ఆ రెండూ నాకు వూపిరుల్లాంటివి. అందుకే  తెలంగాణ సాహితీమూర్తుల సృజన జీవితాల పైన దృశ్య మాధ్యమంలో ఫిలిమ్స్ చేద్దామని సంకల్పించాను. వాటికోసం ‘ముద్దసాని రామిరెడ్డి’,యాది సదాశివ’ ల  పైన ఫిలిమ్స్ చేసాను. తర్వాత తెలంగాణ జీవన సంస్కృతిలో భాగమయిన ‘శివ పార్వతులపైన’ ఫిలిం చేసాను. ఇంకా పలు ప్రయత్నాలు చేసాను. సాహితీ మూర్తుల డాక్యుమెంటరీలు మరిన్ని చేయలేకపోయాను. ప్రభుత్వాలూ సంస్థలూ సహకరించలేదు. చేసినకాడికి శక్తి మేరకు చేసాను అని అనుకున్నాను.

ఫిలిం సొసైటీల ఏర్పాటు నిర్వహణ లలో కృషి చేసారు. ఆ వివరాలు చెప్పండి.

వేములవాడ లాంటి మామూలు గ్రామంతో పాటు సిరిసిల్ల, జగిత్యాల,గోదావరిఖని, కోరుట్ల తాడిత ప్రాంతాల్లో సొసైటీల ఏర్పాటులో నిర్వహనల్లో పాలు పంచుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి, ఒంగోల్ దాకా వైజాగ్,టెక్కలి లాంటి చోట్ల కాంపస్ ఫిలిం క్లబ్స్ ఏర్పాటు చేయడంలో ప్రహాన భూమికను పోషించాను. ఇక కరీంనగర్ ఫిలిం సొసైటీ నా ప్రధాన వేదిక. కరీంనగర్ లో ‘ఫిలిం భవన్’ ఆలోచనలో నిర్మాణంలో మున్డున్నాను. అప్పటి కలెక్టర్ పాతసారధి గారి ప్రోత్సాహంతో ఫిలిం బవన్ రూపుదిద్దుకుంది. 2010 దాకా జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాము. నేను పనిచేసిన ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ పేజీ కాలేజీలో ఫిలిం క్లబ్ తో పాటు ఫిలిం మేకింగ్ కోర్సు నిర్వహించాను. పలు వార్క్షాప్స్ నిర్వహించాము.

జర్నలిస్టుగా మీ ప్రస్తానం, ‘జర్నలిజం’ కోర్సు నిర్వహణ వివరాలు చెప్పండి?

ముఖ్యంగా ఈనాడులో సాంస్కృతిక విలెఖరిగానూ, సుప్రభాతం మగజైన్ లో ఉత్తర తెలంగాణ ప్రతినిదిగాను, మాభూమిలో కూడా ప్రతినిధిగా పని చేసాను. మా కాలేజీలో జర్నలిజం లో ఆర్నెల్ల కోర్సును 13  బాచులు నిర్వహించాను. ఉత్తమ శిక్షణ నిచ్చాము.v ఇక కరీంనగర్ నుంచి కీ.శే.v.విజయకుమార్ సంపాదకత్వంలో వచ్చిన “జీవగడ్డ” లో కే.ఎన్.చారి, అల్లం నారాయణ ళ సహచర్యం తో “వారానందం” కాలం రాసాను, ఇంకా పొన్నం రవిచంద్ర సంపాదకత్వంలో వచ్చిన మానేర్ టైమ్స్ లో ‘మానేరు తీరం’రాసాను,

గ్లోబైజేషన్ నేపథ్యం లో తెలుగు భాష పరిస్థితి ఏమిటి? అనువాద ప్రభావం ఏమేరకు వుంటుంది?

ప్రపంచీకరణ మొత్తంగా ప్రపంచంలోని దేశాల మధ్య మనుషుల మధ్య హద్దుల్నీ సరిహద్దుల్నీ చెరిపేసిందనే చెప్పాలి. పెరుగుతున్న సాంకేతికత దూరాల్ని చెరిపేస్తున్నది. అనేక సంస్కృతులు వేలాది భాషలు వున్న ప్రపంచంలో సమాచారప్రసారం ముఖ్యమయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో అనేక చిన్న భాషలు ప్రభావితమవుతున్నాయి. కొన్ని భాషలు అంతరించిపోయే స్థితి ఏర్పడుతున్నది. ఈ నేపధ్యంలో తెలుగు కూడా ఎంతోకొంత ప్రభావితం అవుతుంది. తప్పదు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కాలేజీల ప్రభావం తెలుగుపై కనిపిస్తూనే వున్నది. కంప్యూటర్ నేర్చుకోవడానికి, అమెరికా వెళ్లడానికి ఇంగ్లీష్ కావాలి కనుక రానున్న తరాల్లో తెలుగు ఉపయోగం తగ్గిపోయే అవకాశం వుంది. మాతృభాషా పరిరక్షణ ఉద్యమం రావాల్సిన అవసరం కూడా వుంది. ఇక ప్రపంచీకరణ నేపధ్యంలో అనువాదం ఒక పరిశ్రమగా అభివృద్ది చెందే అవాకాశం కనిపిస్తున్నది. సాహిత్య అనువాదం మాత్రమే కాకుండా విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాలు, మీడియా, వ్యాపార రంగాల్లో అనువాద అవకాశాలు పెరిగే అవకాశం వుంది పెరుగుతున్నాయి కూడా. సాహిత్యానువాదమప్పుడూ ఇప్పుడూ అత్యంత ప్రధానమయింది అని నేననుకుంటాను.

ఈ నాటి యువతకు మీరేం చెబుతారు?

ఇవ్వాల్టి యువత చాలా ప్రతిభావంతులు. పెరిగిన శాస్త్ర సాంకేతికాభివ్రుద్ది వారిని కోత్హ పుంతలు తొక్కిస్తోంది. అయితే నేల విడిచి సాము చేయొద్దని మాత్రం  నేను చెబుతాను. పుట్టిన ఇల్లు వూరు దేశాలను మరువవోద్దంటాను. సాటి మనుషులపట్ల ప్రేమతో స్నేహంతో మెలగాలని కోరుకుంటాను. యువతీ యువకులు తమకు ఇష్టమయినవి బాగా చదవండి అధ్యయనం చేయండి అని మనసారా కోరుకుంటాను.    
++++

అనంతా చార్య: చాల సమయమిచ్చి వివరంగా సమాధానాలిచ్చారు. థాంక్స్ ఆనంద్ సార్.
ఆనంద్: మీక్కూడా ధన్యవాదాలు. మయూఖ సంపాదకులక్కూడా ధన్యవాదాలు.

July 29, 2024 2 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

“పరిశోధన కెత్తిన జయకేతనం”-

by B. Anjaneyulu July 29, 2024
written by B. Anjaneyulu

ఆచార్య వెలుదండ  నిత్యానందరావు

   “ లోకంలో ఎంతో మంచితనం ఉంది. ఎందరెందరో ఎన్నో తీరులుగా వారి వారి స్థాయిలో మంచి పనులు చేస్తున్నారు. ఎదుటివారి పట్ల ప్రేమాభిమానాలు పంచడం మంచిని పెంచడం కృతజ్ఞతా శీలాన్ని, పరోపకార స్వభావాన్ని కలిగి ఉండడం లాంటి సల్లక్షణాలను అనుభవంలోకి తెస్తున్న పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను”…అని షష్టిపూర్తివేళ నిత్యానందరావుసారు చెప్పు(రాసు)కొన్న ఈ వాక్యాలను  గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయంలో పెద్దగా టైప్ చేసి అతికించారు. ఇది నిత్యానందరావుకు లభించిన ఘన సత్కారమే అని చెప్పవచ్చు.

సాహిత్య రంగంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని ఆరాటపడతారు . రచనా పాటవం చేత, కవితాసృజనం చేత, వక్తృత్వకళచేత, పరిశోధనతత్పరతచేత, సంస్థాగతగత నిర్వహణంచేత, భావజాలాలచేత, ఆకర్షణీయపాఠ ప్రవచనం చేత, సహాయ సహకారాల నందించడంచేత  ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులైన ఆనాటి రాయప్రోలు నుంచి ఈనాటి ఎస్.రఘు దాక ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథా, ఒక్కో విలక్షణశైలి .   

గత 40 సంవత్సరాలుగా నిత్యసాహిత్య కృషీవలుడనీ, నిత్యవిద్యార్థిఅనీ, నిత్యపరిశోధకుడనీ, పరిశోధకరాక్షసుడనీ, పరిశోధకపరమేశ్వరుడనీ సర్వుల చేత కీర్తింపబడుతూ పరిశోధకరంగంలో  తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకొన్నవారు   ఆచార్య వెలుదండ నిత్యానంద రావు.

“సాధుసంగంబు సకలార్ధ సాధనంబు” అంటాడు భర్తృహరి. నిరంతరం సజ్జన సాంగత్యం చేత వివేకం ఉదయిస్తుంది. నిత్యానందరావు గారి జీవితంలో అది అక్షర సత్యం. డిగ్రీ చదివే రోజుల్లో శ్రీ రంగాచార్యులు కపిలవాయి లింగమూర్తి, మామిడన్న సత్యనారాయణ మూర్తి ; విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించిన తర్వాత బిరుదు రాజు రామరాజు, నాయని కృష్ణకుమారి, సినారె వంటి ఉద్దండ పండితుల వద్ద శిష్యరికం కొనసాగింది.  ఇలా వారి ప్రయాణమంతా తెలుగు సాహిత్యం చుట్టే పరిభ్రమించింది. అందుచేతనే సాహిత్యంలోని అనేక విషయాలను పరిశోధనాత్మక కోణంలో శోధించి గొప్ప సాహిత్య రాశిని పోగు చేసి పరిశోధనా రంగానికి దివిటీగా నిలిచారు. సాహిత్య చరిత్ర ఒక్కటి సూటిగా రాయలేదు గాని, అంతకుమించి చర్చ, సమీక్ష చేశారు.

పాండిత్య వారసత్వం గల శ్రీ వెలుదండ రామేశ్వరరావు లక్ష్మమ్మ దంపతులకు 1962 ఆగస్టు 9వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా మంగనూరులో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మంగనూరులోనూ తదుపరి  డిగ్రీ విద్యాభ్యాసం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల పాలెంలో జరిగినది. ఉన్నత విద్య ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో కొనసాగినది. పీజీ చదివే రోజుల్లోనే యుజిసి వారు నిర్వహించే NET పరీక్షలో JRF అర్హతసాధించారు.” చంద్రరేఖా విలాపం -తొలి వికట ప్రబంధం” అను అంశంపై ఎంఫిల్,“తెలుగు సాహిత్యంలో పేరడీ”అను అంశాల మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1988 లో తెలుగు శాఖలో పార్ట్ టైం లెక్చరర్ గా మొదలుపెట్టి  అదే శాఖలో ఆచార్యులుగాను పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షులుగా, తెలుగు శాఖ అధ్యక్షునిగా. వివిధ హోదాల్లో పేరు ప్రఖ్యాతులు పొందారు.  పదవీ విరమణ పొందే వరకు గొప్ప పరిశోధకుడిగా, సమీక్షకుడిగా, విమర్శకునిగా, కథకునిగా, సంపాదకుడిగా విశేషమైన సేవ చేశారు. ఎంతటి వివాదాస్పదాంశం పట్లనైన నొప్పించక తానొవ్వక అను చందంబున విమర్శించగలిగే ప్రతిభాశాలి.

చిన్నతనంలోనే పుస్తక పఠనం అలవడి, పాఠశాల స్థాయిలోనే రచన వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు.  18 వ ఏటనుంచి వివిధ పత్రికల్లో వారి రచనలు రావడం ప్రారంభమైంది.  “వాగ్దేవి” శీర్షికన మొదటి పద్య రచన 1979 లో సమాలోచన పత్రిక ప్రచురించినది. 1982లో డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోనే “పరిశీలన” పత్రికలో వారి అష్టవిధ శృంగార నాయికలను గూర్చి రాసిన పద్యం ఎంతో విశిష్టమైనది. విద్యార్థులకు ఉపయోగకరమైనది. ఆ వయసులోనే ఛందో వ్యాకరణ అలంకారాది విషయాలను ఒంట పట్టించుకొన్నారు.  

“భర్తను స్వాధీనపరచుక సుఖియించు

పద్మాక్షి స్వాధీనపతిక యగును

పతివచ్చుసమయాన వాసమ్ము సరిజేయు

జలజాక్షి వాసకసజ్జిక యగు

విభుడు జాగు సలుప విరహార్త యగునట్టి

తరళేక్షణ విరహోత్కంఠిత యగు

విభుడు రాకుంటచే విరహమే మిగిలిన

లలితలోచన విప్రలబ్ద యగును

పరకాంతతో గూడి పతిరాగ దూషించు

కంజాయతేక్షణ ఖండిత యగు

పతితోడ పోట్లాడి పరితాపమును చెందు

నళిననేత్ర కలహాంతరిత యగును

భర్త దూరదేశమ్మున బరుగునట్టి

వనజలోచన ప్రోషితభర్తృక యగు

విరహమును సైపజాలక విభుని కడకు

చనెడు చారులోచన యభిసారిక యగు”

  1980 లో తన పాఠ్యభాగంగా ఉన్న “కుమార సంభవ పంచమసర్గ” లో కొంత భాగాన్ని సంస్కృతం నుండి తెలుగు చేశారు. మొదట పద్యం, వచనకవిత్వం, సమస్య పూరణలు, నాటికలు, అనువాదాలు చేసినా  తర్వాతి కాలాల్లో పరిశోధన వ్యాసరచనల్లో రాటుదేలారు. 20 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాలపై అవగాహనతో ప్రజా సమస్యల పై పత్రికల్లో వ్యాసాలు రాయడం, పేరడీ పద్యాలు రాయడం రాజకీయ విశ్లేషణ చేయడం కనిపిస్తాయి.

 పదవీ విరమణ చేసే నాటికే వారి  సాహిత్యాన్నంతా దాదాపు నాలుగువేల పుటల్లో   7 సంపుటాలుగా తీసుకువచ్చారు. ఈ సంపుటాల్లోనే కొన్ని రచనలు అంతకు పూర్వమే ముద్రణ పొంది  ఉన్నాయి. వారి ఏడు సంపుటాలు వరుసగా

  1. అనుభూతి– అన్వేషణ    2. అక్షరమాల         3. వాగ్దేవి వరివస్య                   4. పరిశోధక ప్రభ

         5. వ్యాస శేముషి            6. సృజనానందం     7. ఆదర్శ పథం

  1. అనుభూతి–అన్వేషణ:

సమగ్ర సాహిత్యం ప్రచురణ పరంగా మొదటి సంపుటం. 9-8-2022  మూసి సాహిత్య ధార ఆధ్వర్యంలో 60 పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కృతమైనది. నిత్యానందరావు గారు1982 లో మొట్టమొదట రాసిన గ్రంథ సమీక్ష మోపిదేవి కృష్ణస్వామి గారి అన్వేషణ–అనుభూతి. ఈ సంపుటానికి కూడా ఆ గ్రంథ సమీక్ష పేరే పెట్టారు. కాకపోతే అన్వేషణ–అనుభూతి కాస్త అనుభూతి–అన్వేషణగా మార్చారు. 147 గ్రంథ సమీక్షలు,  82 పీఠికలు గల గొప్ప పుస్తకం ఇది. ఏ పుస్తకాన్ని సమీక్షించినా దాన్ని నిశితంగా విశ్లేషిస్తూ , గ్రంథ సారం, శైలి, గుణదోష చర్చ చేశారు.“ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి సిద్ధాంత గ్రంథాన్ని చూస్తే వచన రామాయణాల వివరాలు తెలుస్తాయి, వాటి ఆధారంగా వచన రామాయణాలపై డాక్టరేటు చేయవచ్చు” అని చెప్పారు. పుస్తక ప్రాముఖ్యతను, దాని పీఠికను చూసి తెలుసుకోవచ్చు.  పీఠిక రాసే వ్యక్తి కూడా సాహిత్యం పైన అంతే సాధికారత కలిగిన వాడై ఉండాలి. వ్యక్తిపూజ కన్నా విషయ నిష్ఠంగాను, రచయిత శక్తిని సామర్ధ్యాన్ని కచ్చితంగా అంచనా వేయగలగాలి. పుస్తకం ఏ ప్రక్రియలో ఉంటే ఆ ప్రక్రియలో లీనమై, విషయ వైవిధ్యాన్ని, రచయిత హృదయాన్ని, భావుకతను, బేరీజు వేయగల సమర్థులు నిత్యానందరావు. జంగాహనుమంతరాయచౌదరి, తూమురామదాసు లాంటివారి రచనల మీద,  మిత్రుల, విద్యార్థుల రచనల మీద ఆత్మీయమైన విషయనిర్భరమైన, సాధికారికమైన పీఠికలు రాశారు నిత్యానందరావు.

  • అక్షరమాల:

 ఇందులో చాలా వ్యాసాలు వారి చిన్నతనంలోనే రాసినవి. దీనిలో వ్యక్తిత్వ సౌరభం, సాహిత్య సౌరభం అనే రెండు విభాగాలుగా చేశారు. వ్యాసాల్లో రాసే ప్రతి అంశం విషయ ప్రాధాన్యత,  పరిశోధనతత్పరతతో కూడుకున్నవై ఉంటాయి. చదివిన పనిచేసిన కళాశాలకు లేదా సంస్థకు ఏ రూపంగా నైనా రుణం తీర్చుకోవాలి అంటారు వారు.ఈ సంపుటిలో ఎక్కువ వ్యాసాలు ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యుల సాహిత్య సేవకు సంబంధించినవి. తెలుగు శాఖ మీద వారికున్న అపార అభిమానం, గురువుల మీద అచంచలమైన  అనురాగాన్ని రెండు వ్యాసాల్లో వివరించారు. పనిచేసిన మూడు కళాశాలలకు సంబంధించి ఎవరు ఇంతవరకు చెప్పనటువంటి కొత్త విషయాలను వారు వెలుగులోకి తీసుకువచ్చారు. విశ్వనాథసత్యనారాయణగురించి రాస్తూ ఆయన చదివిన ఆంగ్లగ్రంథాలను పేర్కొన్నారు. ఆంధ్ర యునివర్సిటీ బి.ఏ మొదటి బ్యాచ్ విద్యార్థి  ఆండ్రశేషగిరిరావు నిర్వహించిన ఆంధ్రభూమి మాసపత్రిక విశేషాలను సోదాహరణంగా వివరించారు. భారతదేశంలో తొలి ఎం.ఎ పట్టభద్రురాలు  బెంగాల్ కు చెందిన చంద్రముఖిబోస్, బంకించంద్రచటర్జి, శరత్ బాబు లాంటి బంగాలీయుల గురించి; దుబ్బాక రాజశేఖరశతావధాని, పుట్టపర్తి నారాయణాచార్య, కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై, భూతపురి సుబ్రహ్మణ్యశాస్త్రి, విద్వాన్ విశ్వం లాంటి రాయలసీమకవులగురించి. కోవెల సంపత్కుమార, సుప్రసన్నాచార్య, చేకూరిరామారావు, . ఆదిరాజు వీరభద్రరావు, జే. బాపురెడ్డి, కాళోజి, దాశరథి లాంటివారిమీద, బోయిభీమన్న, జి. వి.సుబ్రహ్మణ్యం మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, గరిమెళ్ళసత్యనారాయణ లాంటి దిగ్దంతులమీద విలక్షణమైన వ్యాసాలున్నాయి

3.వాగ్దేవి వరివస్య:

ఈ సంపుటిని గూర్చిడాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి “వెలుదండ వారి వెలుగుదండ” అని ముందుమాటలో అభివర్ణించారు. నిజంగానే ఈ సంపుటి వారికి వెలుగులదండే. అన్నింటినీ మించి ఈ పుస్తకానికి ఒక విశేషం ఉన్నది. ఇందులో చాలా వ్యాసాలు వారి డిగ్రీ కాలానికి మునుపే వచ్చాయి. ఇంటర్మీడియెట్(నిత్యానందరావు చదివింది ఇంటర్మీడియెట్ అనకుండా డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ అంటారు.  ) విద్యార్థిగా ఉన్నప్పుడే “తెలుగు రాజులు సంస్కృత భాషా సేవ” అనే వ్యాసం “సమాలోచన” సాహిత్య పత్రికలో 1979లో ప్రచురితమైనది. ఆనాటికి  సరిగ్గా వారికి 17 సంవత్సరాల వయసు. బి ఏ చదువుతున్న కాలానికే ఈ పుస్తకం లోని ఆరు వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి అంటే ఆశ్చర్యకరమే. తెలుగువారు ప్రాకృత, హిందీ, తమిళ, ఉర్దూ, ఒరియా, కన్నడ, భాషలకు చేసిన సేవను, మరాఠీ తెలుగు భాషల బాంధవ్యాలను వివరించారు. ఇవన్నీ పెంచుకొని రాసుకొంటే ప్రత్యేక పరిశోధనాంశాలవుతాయి. కానీ ఇంతవరకు అలా ఎన్ని జరిగాయో ఆలోచించాలి.   తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు చేసిన భాషా సేవను, శాతవాహన కాలం నాటి ప్రాకృత భాషా ప్రక్రియ అయిన గాథను, గాథలోని రకాలను, గాథల్లో చిత్రించబడిన సాంఘిక జీవిత విశేషాలను, గాథాసప్తశతికి వచ్చిన అనువాదాలను సమగ్రంగా వివరించారు. 11 భారతీయ భాషా సాహిత్యాల ప్రగతికి పాశ్చాత్యుల దోహదాన్ని సమగ్రంగా వివరించారు. వీటిల్లో ఏనాడు మనకు వినడానికి అవకాశం లేని ఎన్నో కొత్త అంశాలు ప్రస్తావింపబడి ఆశ్చర్యం కొలుపుతాయి.   అనువాదాలను ప్రత్యేకించి పరిశీలిస్తూ “అనువాద కృషికి ప్రత్యేకంగా ఒక అకాడమీ ఉండాలని ప్రతిపాదించారు, తెలుగు కవిత్వం ఆంగ్లంలోకి అనువాదం చేయబడ్డ విధానాన్ని “ఆంగ్లంలో ఆంధ్ర కవిత” అనే వ్యాసంలో వివరించారు. వి.వి.బి.రామారావు అనువాద కృషిని, తిక్కన భారతాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన గుర్రం వెంకట సుబ్బరామయ్య ప్రతిభను తెలుగు పాఠకలోకంలోకి తీసుకువచ్చారు.“మంగనూరు ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థుల తెలుగు భాష—మాండలిక ధోరణి–పరిశీలన” భాషాశాస్త్ర విద్యార్థిగా పీ.జీ డిప్లొమా చేస్తున్నపుడు  రాసిన వ్యాసం. కొందరు బెంగాలీ కవులు రచయితలు పరిచయం కింద 65 మంది బెంగాలీ కవుల సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఇంటర్నెట్ ఇంకా అందుబాటులోకి రాని ఆ కాలంలోనే ఇంత సమాచారం సేకరించారంటే దానికి వారు ఎంత పరిశోధన చేశారో గమనించవచ్చు. సాహిత్య వరివస్య అను విభాగం కింద 27 వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ ప్రక్రియల పైన రాసినవే. ఇందులోని “విశ్వనాథ- తెలుగు సినిమా” వ్యాసంలో విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేయవలసినంత విషయం ఉన్నది. “కృష్ణా కవిత్వ తరంగ శీకరాలు”,“గోదావరి గలగలలు”ఆ నదుల నేపథ్యంగా వచ్చిన కవిత్వాన్నంతా క్రోడీకరించాయి. అభ్యుదయ, దేశభక్తి, జాతీయోద్యమ కవిత్వాన్ని మూడు వ్యాసాల్లో సమగ్రంగా రాశారు. “తెలంగాణ కథానికా క్రమం బెట్టిదనిన”, “నిజాం పాలనలో వెలవెలబోయిన తెలుగు వెలుగు”, “తెలంగాణలో విజ్ఞాన సర్వస్వాలు -సూచీ గ్రంథాలు- నిఘంటువులు” అన్నవి తెలంగాణ సాహిత్య కేంద్రంగా సాగినవి. “కల్వకుర్తి కవుల కవన కుతూహలరాగం” అను వ్యాసం  ఆ ప్రాంత కవుల సాహితీ సేవను ప్రకటించినది. ఏ విషయాన్ని తీసుకున్న సమగ్రంగా ఉంటుందని చెప్పడానికి ఇదో నిదర్శనం.“తెలుగు పరిశోధన వర్తమాన స్థితిగతులు” అన్న వ్యాసంలో నేడు పరిశోధనలు సాగుతున్న తీరును, ప్రభుత్వ విధానాలను, యూనివర్సిటీల పనితీరును, ఆవేదనాత్మకంగా చెప్పారు. ఏ సందర్భం వచ్చినా, ఏ వ్యాసం రాసినా ప్రతిచోట పరిశోధన దృక్పథం తొంగి చూడడం వారికే దక్కినది.

4. పరిశోధక ప్రభ:

విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన:

సాధారణంగా పీజీ విద్యానంతరం ప్రతివిద్యార్థి లక్ష్యం ఎంఫిల్ చేయడం,  పిహెచ్డి చేయడం. దానికి సంబంధించిన పరిశోధనాంశం గూర్చి తర్జనభర్జన పడి చివరికి ఓ విషయాన్ని నిశ్చయించుకొని, ఆ అంశం పైపూర్వ పరిశోధనలు సమాచారం తెలియక చాలాసార్లు పరిశోధనాంశాన్నే మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. కానీ దానికి వెలుదండ నిత్యానందరావు గారు విరుద్ధం. ఆ సమస్యను గమనించి ఒక సంస్థ, ఒక యూనివర్సిటీ, ఒక పరిశోధనా స్థానం చేయవలసిన పనినంతా అన్నీ తానై మోసి మూడు ముద్రణలు పొందిన “విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన” అనే గ్రంథానికి రూపశిల్పి అయ్యారు. కవిత్రయం నుండి ప్రారంభిస్తే సాహిత్య రంగంలో పరిశోధన సాగిన అనేక విషయాలను సమగ్రంగా వర్గీకరించి 5225 పరిశోధనాంశాలను 61 శీర్షికలతో విభజించి ఆయా విభాగాల క్రింద జరిగిన పరిశోధనలన్నింటినీ ఒకచోట చేర్చారు. పరిశోధనాంతరంగం అనే పేరుతో రాసిన పీఠికలో పరిశోధనాంశ నిర్ణయం నుండి పట్టా పొందు వరకు గల సమస్యలను,  చూపవలసిన జాగరుకతను, వదులుకోవలసిన జాడ్యాలు, పరీక్షకుల పరిశోధకులకు సంబంధించిన సూచనలు చేస్తూ అనేక అపూర్వ విషయాలను చర్చించారు. జరుగవలసిన ఎన్నో పరిశోధనాంశాలను సూచించారు.  ఈనాడు తెలుగులో పరిశోధన చేయాలనుకుంటున్న ప్రతి విద్యార్థి మొట్టమొదట చూసే పుస్తకం ఇదేనంటే ఆ పుస్తక ప్రామాణికత ఏమిటో చెప్పనవసరం లేదు. ఎంఫిల్ చేయక మునుపే అనధికారికంగా ప్రకటించుకున్న పీహెచ్డీ గ్రంథం ఇది.

చంద్ర రేఖ విలాపం-తొలి వికటప్రబంధం:

నిత్యానంద రావు గారి M.Phil సిద్ధాంత వ్యాసం చంద్ర రేఖ విలాపం. పేరుకు M.Phil పరిశోధనా గ్రంథం అయిన పీహెచ్డీకి తక్కువేమీ కాదు. కూచిమంచి జగ్గకవి రచించిన చంద్రరేఖ విలాపం ఆనాటి సమాజంలో బూతుల బుంగగా, నీచకావ్యంగా నిందను మూట కట్టుకుని, ఆనాటి సాహిత్యకారులు ఈ కావ్యం గూర్చి నోరు మెదపకుండా ఉండి, సాహిత్య చరిత్రలో దానికి స్థానం కల్పించలేదు. ప్రభుత్వమే ఆ కావ్యాన్ని నిషేధించిందంటే మామూలు విషయం కాదు. అట్లాంటి కావ్యం పైన ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటారా? ఒకవేళ చేద్దామనుకొన్నా ఆచార్యులు ఒప్పుకుంటారా? కానీ నిత్యానందరావు గారు అందరినీ ఒప్పించి  ఆ పని చేసి విజయవంతంగా పూర్తి చేశారు. “గైనకాలజిస్టు తన కళ్ళ ముందు ఉన్న సుందరిని రోగిగానే చూస్తాడు మరో విధంగా చూడడు. అలాగే చంద్రరేఖా విలాపం పైన చేసే పరిశోధన ఆ పరిశోధకుని సంస్కార రాహిత్యానికి గాని, మూర్ఖత్వానికి గాని నిదర్శనంగా తలపోయనవసరం లేదు. ఈ పరిశోధనలో విజయం పొందకపోతే క్షమించవలసిన అవసరం అంతకంటే లేదు” అంటూ అందరిని మెప్పించగలగడం పరిశోధన పట్ల ఆయన ధైర్యప్రపత్తు లెలాంటివో   నిరూపిస్తాయి. బ్రౌన్ రాయించిన మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో ఉన్నటువంటి చంద్రరేఖావిలాపం అముద్రిత వ్యాఖ్యానాన్ని వెలుగులోకి తెచ్చి ఒక అధ్యాయంగా ఈ పుస్తకంలో రాశారు. విజయనగర సంస్థాన రాజకీయాల్లో నీలాద్రి రాజు పోషించిన పాత్రను- సాహిత్య పరిశోధకులు ఆయనను విస్మరించిన విధానాన్ని ,  జగ్గకవి కావ్యరచన మూలాన కలిగిన అవమానంతో మరణించలేదు అని, ఆయన పద్మనాభ యుద్ధం లో చనిపోయాడని చారిత్రక ఆధారాలతో నిరూపించాడు.

తెలుగు సాహిత్యంలో పేరడీ:

            పీహెచ్డీ పరిశోధనా గ్రంథం తెలుగు సాహిత్యంలో పేరడీ. ఇది1990 లో పట్టా పొంది 1994లో ముద్రితమైనది.  ప్రాచీన తెలుగు కావ్యాల నుండి మొదలుకుంటే ఆధునిక కావ్యాలు , నవల కథానికాది ప్రక్రియలు, జానపద సాహిత్య గేయాలు, వివిధపుస్తకాలపై రాసిన పేరడీసాహిత్యాన్నంతా తవ్విపోసిన పరిశోధన గ్రంథమిది. ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో పేరడీ పై వచ్చిన సమగ్రమైన పరిశోధన. మొదటి అధ్యాయంలో పేరడీ స్వరూప స్వభావాల లక్షణ చర్చ చేస్తూ” ఒక మాతృకకు అధిక్షేపాత్మకమైన హేళనాత్మకమైన హాస్యాత్మకమైన విషయాంతరంతో కూడిన అనుకరణే పేరడీ అని నిర్వచించారు. పేరడీ సాహిత్యం పైన పరిశోధన తపన డిగ్రీ స్థాయిలోనే ఉదయించినది. 1983లో ఆంధ్రప్రభ పత్రికలో “రాజకీయ భాగోతం”అన్న పేర భాగవత పద్యాలకు రాసిన కార్టూన్ పేరడీలు ఎందరో ప్రశంసలను పొంది ఈ పరిశోధనకు మరింత ఉద్దీపనను చేకూర్చింది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పేరడీకవిగా తెనాలి రామకృష్ణుని నిరూపించి, క్రీడాభిరామకర్త వినుకొండ వల్లభ రాయుడు, కూచిమంచి జగ్గకవి ఆధునికుల్లో జలసూత్రం రుక్మిణీ నాథశాస్త్రి, మాచిరాజు దేవి ప్రసాద్, శ్రీ శ్రీ , జొన్నవిత్తుల వంటి వారి పేరడీ విన్యాసాన్ని సముచితంగా వివరించి ఎట్లాంటి అనుకరణలు పేరడీలు కావో నిస్సంకోచంగా తూచిన గ్రంథం ఇది. జర్మన్ విశ్వవిద్యాలయంలో వచ్చిన  “పేరడీ-ఎ మెటఫిక్షన్” అనే సిద్ధాంతగ్రంథాన్ని సైతం  చదివి  తెలుగు పేరడీలకు అన్వయిస్తూ  పేరడీ లక్షణ చర్చ చేయడం గమనిస్తే నిత్యానందరావు ఎంత మారుమూలల్లో ఉన్న సమాచారాన్నయినా ఎంత ఒడుపుగా సేకరించి వాడుకొంటారో అర్థమవుతుంది.

5. వ్యాస శేముషి.

 వ్యాసశేముషి అనే ఐదవసంపుటంలో  సాంప్రదాయ సాహిత్యానుశీలనం, హాసవిలాసం అను రెండు విభాగాలుగా చేయబడినది. వివిధ సాహిత్య సదస్సులలో సమర్పించిన పరిశోధనాత్మక వ్యాస సంపుటి ఈ గ్రంథం. ఏ కార్యం చేసినా గణపతి స్తుతితో ప్రారంభించడం అనాది సంప్రదాయం. మంగళకరం. ఇందులోని మొదటి వ్యాసం కూడా గణపతి స్తుతితోనే ప్రారంభమైనది. కర్త ఎవరో తెలియని ఒక పద్యాన్ని   విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించిన వ్యాసం అది. అందునా ఆ పద్యాన్ని వారికి ఎరుకపరచిన గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ కోదండరామ శర్మగారికి కృతజ్ఞతలు తెలిపిన విధం వారి ఔన్నత్యానికి తార్కాణం. ప్రతి వ్యాసంలోను తనకు తోడ్పడినవారిని స్మరించుకొని, కృతజ్ఞతలు తెలుపుకోవడం నిత్యానందరావు నిజాయితీ (Academic Honesty)కి నిదర్శనం.    కవిసార్వభౌముడు శ్రీనాథుని పై చేసిన సాహితీ చర్చ రెండు వ్యాసాలలో కనిపిస్తుంది. శ్రీనాథునిపై వెలువడిన పూర్వపు పరిశోధనలన్నింటినీ సమీక్షిస్తూ అదనపు సమాచారాన్ని పొందుపరచారు. పాల్కురికి సోమన, పోతన, రామదాసు అన్నమయ్య, కృష్ణదేవరాయలు మొదలగు కవులు, తెలంగాణ ప్రాచీన సాహిత్యం పైన చేసిన సవిస్తరమైన చర్చ వారి వ్యాసాలలో కనబడుతుంది.

హాసవిలాసం:

హాసవిలాసం  హాస్య విశ్లేషణాత్మక వ్యాసావళి.  హాస్యపు తీరుతెన్నులు హాస్య ప్రత్యేకతను వివరిస్తూ వేరువేరు సందర్భాలలో ప్రచురించబడిన 14వ్యాసాలు ఉన్నవి. హాస్యాన్నిగూర్చి చర్చించే రచయితకు సహజంగా చమత్కారశీలియై, హాస్యకారియై, హాస్యాన్ని పండించే జిజ్ఞాస, మనస్తత్వం ఉండాలి. నిత్యానందరావు ఎంత సీరియస్ గా వ్యాసాలు రాస్తారో మిత్రులవద్ద, విద్యార్థులవద్ద చమత్కారభరితంగా నవ్విస్తూ సంభాషిస్తూ అంత సరదాగా గడుపుతారు.   వారిలో దాగి ఉన్న  ఈ హాస్యపార్శ్వమే హాసవిలాసం లోని వ్యాసాల రచనకు, రాజకీయభాగోతం పేరడీ కార్టూన్లకు, పేరడీ పై పరిశోధనకు ప్రేరేపించాయేమో! తెలుగువారి హాస్యం, హాస్య తత్వ విచారం అనే వ్యాసాలలో హాస్యాన్ని గూర్చిన చర్చ, కందుకూరి గురజాడ, చిలకమర్తి, పానుగంటి, ముణిమాణిక్యం,  శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి వంటి వారి సాహిత్యంలోని హాస్యాన్ని గూర్చి చర్చించారు. కవన శర్మ, శ్రీరమణల వంటి ఆధునికులను గూర్చి కూడా పేర్కొన్నారు. కవనశర్మ రచించిన వ్యంగ్య కవనాలుఅన్న కథా సంకలనం గురించి చెబుతూ “మనలో జీర్ణించుకుని పోయిన హిపోక్రసీని దగుల్బాజీ తనాలను వేలెత్తి చూపుతూ భుజాలు తడుముకునేలా చేస్తాయి ఈ కథలు” అంటారు. విశ్వనాథహాస్యం మీద ప్రణాళికాబద్ధంగా అధ్యాయవిభజనతో  రాసిన వ్యాసం నిత్యానందరావు విషయసేకరణ కోసం పడే తపన, ఓపిక, శ్రమశీలానికి నిదర్శనం.  విశ్వనాథసాహిత్యసాగరాన్ని ఈది ఎన్నెన్నో అపూర్వ హాస్య, చమత్కార రత్నాలను వెలుగులోకి తెచ్చి పాఠకులను, పండితులను ఆశ్చర్యానందమగ్నులను చేశారు.     

6. సృజనానందం:

నిత్యానందరావు సాహిత్యంలో పదును దేలుతున్న క్రమంలో అక్షరబద్ధం చేసిన అనేక లఘు రచనలు, అనుభవాలసమ్మేళనం ఈ సంపుటి. కృతిస్వీకృతి, జంబుమాలి, మార్గదర్శి వివేకానందుడు, వంశాంకురం వంటి నాటికలు, చమత్కారభరితమైన “చెవిలో పువ్వు” వంటి కథలు, సన్మాన పత్రాలు, రాజకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతికఅంశాలకు సంబంధించిన కొన్ని లేఖలు, నివేదికలు, పీఠికలు, సాహిత్య వ్యాసాలు, కళాశాల, పాఠశాలజీవితానికి సంబంధించిన కొన్ని వ్యాసాలు ఉన్నాయి.

7. ఆదర్శపథం:

భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర

ఈ గ్రంథాన్ని వందేమాతరం శతజయంతి ఉత్సవాల కానుకగా ప్రచురించారు. బంకించంద్రుని గురించి మునుపు ప్రసాద రాయకులపతి, దేవులపల్లి రామానుజరావు వంటి వారు రచనలు చేసినా తెలుగులో సమగ్రమైన విస్తృతమైన బహుముఖీనమైన పుస్తకం వెలుదండవారు రచించినదే. “నాకు విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన తో చాలా పేరు వచ్చిన మాట నిజమే, ఆ రచన వల్ల అవతలి వ్యక్తి పొందిన ప్రయోజనం, ఉపకారం రీత్యా వచ్చిందే తప్ప, నా ప్రతిభా సామర్థ్యాలకు, ఆలోచనల తీరుతెన్నలకు వచ్చిన పేరు కాదు, శ్రీనాథుని జీవిత పర్యంతం నైషధ కావ్య స్మరణం చేశాడు. అలాగే నా చిరకాల రచన బంకించంద్ర నా కృతుల్లో శిఖరప్రాయమైనది, సంతృప్తి దాయకమైంది. భాషా భావనల జోడు గుర్రాల మీద స్వారీ చేసినట్లైంది”. ఆ పుస్తకం ప్రాధాన్యం గురించి వారు రాసుకున్న మాటలు ఇవి. శ్రీ నాథునికి నైషధకావ్యం ఎంతటి గౌరవాన్ని, కీర్తిని కలిగించాయో వారికిని బంకించంద్ర కావ్యం అంతే కీర్తిని సముపార్జించాయి. ముదిగొండ శివప్రసాద్, ద్వానాశాస్త్రి, వకుళాభరణం శివరామకృష్ణ వంటి సాహితీ ఉద్దండులు ఈ పుస్తకంపై వివిధ పత్రికల్లో సుమారు 11 పైచిలుకు సమీక్షలు ప్రచురించారు. తెలుగులో సాహితీ సామాగ్రి అంతగా దొరకని మహాత్ముని చరిత్రను పాటక లోకంలోకి తీసుకురావడం అంత ఆషామాషి విషయం కాదు. బంకించంద్రుడు జన్మించేనాటికి  నాటి భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ “సాంఘిక ఆర్థిక రాజకీయ వైజ్ఞానికపరంగా వినూత్నకాంతులు ప్రసరింపజేస్తూ సంచలనభరితమైన కాలంలో బంకించంద్రుడు జన్మించారు” అంటారు. అట్లాంటి వాక్యం రాయాలంటే ఆనాటి కాలంలోకి ప్రయాణం చేసి, ఆ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటే తప్ప రాయలేరు. అలాంటి భావుకత వందేమాతర గీత వైశిష్ఠ్యాన్ని, బంకించంద్రుని దేశభక్తిని వర్ణించే సందర్భంలో ఉద్వేగపూరిత వాక్యాలు రాశారు. సార్ధకజీవుడు అన్న శీర్షికతో రెండవ అధ్యాయాన్ని ప్రారంభించి బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ పరిస్థితులు, సమకాలికులు, ఉద్యోగ జీవితం ఇత్యాది విషయాలు చెప్పారు. భారతదేశంలో మొదటి నవలాకారునిగా ఆయనను సప్రమాణంగా నిరూపించారు. ఆనందమఠం లాంటి లక్ష్యాత్మక నవలలను, కపాలకుండల లాంటి కాల్పనిక నవలలను, కవితలను, కథలను, హాస్య వ్యంగ్య రచనలను, ధార్మిక రచనలను కూలంకషంగా విశ్లేషించారు.  బంకించంద్ర చటర్జీ పైన వచ్చిన తెలుగు రచనలను, ఆయన సాహిత్య ప్రభావంతో వచ్చిన రచనలను,   ఇతర భాషల్లోని విషయాలను, అరుదైన ఛాయాచిత్రాలను, చేతిరాతను, వందేమాతరగీతం చుట్టూ అల్లుకొన్న చారిత్రక రాజకీయకోణాలను పలు ఆంగ్ల గ్రంథాలు, కన్నడ గ్రంథం నుండి సేకరించి సమగ్రపుస్తకం గా తీసుకువచ్చి కొత్తతరానికి అందించారు.

రాజనీతిజ్ఞుడు బూర్గుల రామకృష్ణారావు:

బంకించంద్రుని గురించి రాసిన పుస్తకం ఆనాటి వందేమాతరోద్యమ కాలం నాటి భారతదేశ సామాజిక పరిస్థితులను రాజకీయ వాతావరణాన్ని కళ్ళకు కడితే బూర్గుల రామకృష్ణారావు పైన రాసిన ఈ పుస్తకం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, సమైక్య ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులకు దర్పణం  పడతుంది. “ఈ పుస్తకం జీవిత చరిత్ర రచనల్లో  సాంప్రదాయ రచన పద్ధతికి విరుద్ధంగా ఆరంభం అవుతుంది” అని రాశారు. అన్నట్టుగానే ఈ పుస్తకం ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన పరిస్థితుల నుండి మొదలవుతుంది. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను, విద్యావ్యవస్థ స్థితిని చక్క పెట్టడానికి, ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమంలో విద్యాబోధన చేసే ఖాన్గీ పాఠశాలలను తెరిపించడానికి ఆంధ్ర మహాసభ ద్వారా బూర్గుల చేసిన కృషిని సమగ్రంగా వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు, నాటకీయ పరిణామాల మధ్య బూర్గుల ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన విధం, తదనంతర కాలంలో విశాలాంధ్ర ఏర్పాటు ఆ ఏర్పాటులో భాగంగా బూర్గుల తొలి సమిధగా తనను తాను అర్పించుకున్న విషయాలు ఎన్నింటినో చర్చించారు. ఆదర్శ ముఖ్యమంత్రిగా, విశాలాంధ్ర నిర్మాతగా, ప్రజల న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సాహిత్య బంధువుగా, విశిష్ట వ్యక్తిత్వ సంపన్నునిగా, వారి జీవితవిశేషాలను వ్యక్తిత్వాన్ని, రాజకీయనీతిజ్ఞతను, అకుంఠితదీక్షను స్ఫూర్తిప్రదంగా విశ్లేషించారు.   “రాజకీయవేత్తలు ఎందరో ఉంటారు. రాజకీయవేత్తల్లో దార్శనికులు తక్కువమంది, పాలన రహస్యాలు తెలిసిన దార్శనికుడు బూర్గుల” అన్న ఒక్క వాక్యంతో వారి చరిత్రను సార్ధకం చేశారు.

“విశాలాంధ్ర ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి  స్థానంలో ఉన్న బూర్గుల నిర్మమత్వంతో తాము చేయవలసిన పని తాము చేశారు. ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో ఆదర్శంతో ఆనాటి పెద్ద మనుషులు చేసిన ప్రయోగం స్వార్థ రాజకీయ నాయకుల వికృతచేష్టకు బలి అయిపోయింది. విద్య, ఉపాధి, సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలలో, వనరులు- అవకాశాల పంపిణీలో సమ భాగస్వామ్యం లేకుండా దగాపడడానికి రాజకీయ నాయకుల దూరదృష్టి లేమి, నిజాయితీలేమి, స్వార్థం కారణమే తప్ప ఆనాటి పెద్దల చిత్తశుద్ధి, ఆదర్శాలలో లోపం కాదు. అడ్డుగోడలు కూలిపోవచ్చు. కొత్త గోడలు మొలవవచ్చు. రాజ్యాల భౌగోళిక సరిహద్దులు ఎన్నోసార్లు మారుతుంటాయి. ప్రాంతాలు విడిపోవడం కలవడం- అనేది చారిత్రక పరిణామంలో భాగమే. ఈ విశ్లేషణాత్మక ప్రవృత్తి, విజ్ఞత సమకాలీన ఆవేశకావేశాలకు బలి కాకూడదు. మంచితనం, మనిషితనం ఎప్పటికీ వసివాడనివన్న సంగతి విస్మరించకూడదు” అన్న భావనతో నిత్యానందరావు గారు ఈ రచన చేశారు.

ఆటుపోట్ల కావేరి:

ఈ పుస్తకం ద్వారా వారు అనువాదకుడిగా మారారు. కావేరి చటోపాధ్యాయ అనే బెంగాలీ రచయిత్రి రచించిన “Peeping through my window”  ఆంగ్ల జీవిత చరిత్రకు తెలుగు రూపమే “ఆటుపోట్ల కావేరి”. ఆ పుస్తకాన్ని చదివి ఆమె జీవితంలోని విషాదానుభవాలకు హృదయం ద్రవించి,   తెలుగువారికి  పరిచయం చేశారు. అంతటితో ఆగలేదు.   కావేరి చటోపాధ్యాయ గారిని తన తోబుట్టువుగా భావించి హైదరాబాదుకు రప్పించి పుస్తకావిష్కరణ చేయించి ఇంట్లో పండుగలా ఘనసన్మానం చేయడం విశేషం. అందులో మాకందరికీ భాగస్వామ్యం కల్పించడం ఆనందదాయకం.

తెలుగు శాఖకు చేసిన సేవ:

నిత్యానందరావు రాసిన ఎన్నో వ్యాసాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, -తెలుగుశాఖకు సంబంధించినవాటిని ప్రత్యేకంగా వర్గీకరించుకోవచ్చు. తాను పని చేసిన మహిళాకళాశాల, నిజాంకళాశాల, ఆర్ట్స్ కాలేజ్   మూడింటిపట్ల మూడు వినూతన చారిత్రకవ్యాసాలు రాసి ఋణం తీర్చుకున్నానని నిత్యానందరావు సంతోషంగా చెప్తారు.   అందులో ఆర్ట్స్ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ సర్ సయ్యద్ రాస్ మసూద్, (ఆయన నియమించిన మొదటి తరం అధ్యాపకుల వివరాలు) ;   కోఠీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ అమీనాపోప్, నిజాం కళాశాల మొదటి సంస్కృతాంధ్ర అధ్యాపకులు రాయప్రోలు వెంకట సోమయాజులు, పాలనాదక్షుడైన విద్యావేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం  ఉపాధ్యక్షులు  ఎం.ఎస్ దొరై స్వామి జీవనవివరాలు –వారి వైశిష్ట్యం గూర్చి తొలిసారిగా అధికార పత్రాల ఆలంబనగా పరిశోధనాత్మకంగా రాసే అవకాశం భగవంతుడు నాకు ప్రసాదించాడంటారు నిత్యానందరావు..

బిరుదురాజు రామరాజుగారు ఒక వ్యాసంలో  “రాయప్రోలు వెంకట రామ సోమయాజులు అని నిజాంకళాశాలలో పనిచేశారు.  1947 నాటికే వారు లేరు. వారి గురించి చెప్పేవారెవ్వరూ ఇప్పుడు లేరు”– అని రాశారు.   వారు  గురించి నిత్యానందరావు సేకరించిన సమాచారం ఎంతో విలువైనది. పాఠక లోకానికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని వారు నిజాం రాష్ట్రంలో తొలి సంస్కృతాంధ్ర ఆచార్యునిగా పనిచేశారని,  1910 లోనే అంటే రాయప్రోలు సుబ్బారావు తెలుగుశాఖలో చేరక ముందే వారు  నిజాం కళాశాలలో చేరి ఉన్నారనీ, ఫస్లీ తేదీలతోఉన్న సమాచారాన్ని ఆంగ్లశకంలోకి మార్చి నిరూపించడమే కాకుండా, వారి రచనలను సైతం సేకరించి ఎవరయినా డాక్టరేట్ పరిశోధనకు పూనుకోవాలని ప్రబోధించారు.  1976లో కాకతీయ విశ్వవిద్యాలయం స్వయంప్రతిపత్తి పొందే వరకు అక్కడ తెలుగుశాఖకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారానే నియామకాలు జరిగాయి. కావున కాకతీయ విశ్వవిద్యాలయం తొలితరం ఆచార్యుల నుండి 2017 వరకు ఉస్మానియా తెలుగుశాఖకు సేవలందించిన 62 మంది ఆచార్యుల సమగ్ర సమాచారాన్ని వారు అందించారు. 1919 తెలుగు శాఖ ఆవిర్భావ వసంతం నుండి ఆ శాఖలో జరిగిన అభివృద్ధిని, అధ్యక్షులుగా సేవలందించిన పండితుల సాహిత్య కృషిని సమగ్రంగా అక్షరబద్ధం చేశారు. తెలుగుశాఖ మొదటి విద్యార్థి పల్లా దుర్గయ్య, రెండవ విద్యార్థి ఈటూరి లక్ష్మణరావు,  తొలి విద్యార్థిని ఇల్లిందల సుజాత, తొలి దివ్యాంగ పట్టభద్రుడు డి.వి కృష్ణారావు, మూడవ విద్యార్థి కే గోపాలకృష్ణారావు, బి.రామరాజు, ఎం.కులశేఖరరావు, సి.నారాయణరెడ్డి   గారి సమాచారాన్ని సేకరించారు. రెండేళ్ళే తెలుగుశాఖలో పని చేసిన వెల్లలూరి వెంకటరాఘవశర్మ, కుమారి ఇందిరావందనం గార్ల వివరాలు నిత్యానందరావు తొలిసారిగా బయటపెట్టారు.  ఎన్నో వ్యయప్రయాసలకు నోర్చి  ఎం.ఎ తెలుగు శాఖ విద్యార్థుల పూర్తి సమాచారాన్ని, వారు ఉత్తీర్ణులైన సంవత్సరాలను, మార్కులను సైతం సేకరించారు.

 ఆధునిక కవిత్వ సంబంధమైన మొదటిరచన డా. పాటిబండ మాధవ శర్మగారి  “ఆధునికాంధ్ర భావ కవిత్వం”. (2012, పొ.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం.), జనగామజిల్లా బచ్చన్నపేటకు చెందిన చెన్నమాధవుని వెంకటరామరాజ కవి రచించిన “రామకృష్ణ యుధిష్టర చరితమ్”  (మూడర్థాల సంస్కృత చంపూ కావ్యం 2020, తెలంగాణ సాహిత్య అకాడమీ) లను ప్రప్రథమంగావెలుగు లోకి తెచ్చారు   తూము రామదాస కవి రచించిన నిఘంటుకావ్యం “ఆంధ్ర పద నిధానము”  (2019, తెలంగాణ సాహిత్య అకాడమీ)నకు సంపాదకత్వం వహించారు.  సిద్ధాంత గ్రంథాల సార సంగ్రహాల సంకలనం “పరిశోధన వ్యాసమంజరి” రెండు సంపుటాలను వీరి సంపాదకత్వంలో బ్రౌన్ అకాడమీ (2009,2010) వెలువరించింది.  

ఓయూ నూరేళ్ల పండగ చేసుకున్న సందర్భంలో వచ్చిన “శతవాసంతిక” అను సంచిక వెలువడడంలో విశేషమైన కృషి చేశారు. తెలుగు శాఖకు సంబంధించిన మరింత సమాచారాన్ని శతవాసంతికలో పొందుపరిచారు. ఇటువంటి కృషి ఇప్పటివరకు ఏ తెలుగు శాఖలోనూ, మరే ఇతరశాఖల్లోనూ  జరగ లేదు. ఉస్మానియా, ఆంధ్ర , తెలుగు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు పాఠ్యభాగరచయితగా వ్యవహరించారు.

పురస్కారాలు:

ఎం ఏ తెలుగులో సర్వోత్తమ స్థానం పొందినందుకు గురజాడ అప్పారావు స్వర్ణ పతక పురస్కారం-1985  .  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంచే ఉత్తమ సాహితీవేత్త పురస్కారం-2017

బోయి భీమన్న సాహితీ నిధివారి  భీమన్నపురస్కారం–2019; తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య విమర్శలో ధర్మనిధి పురస్కారం(2007);- ప్రతిభా పురస్కారం -2021; సాహితీ పురస్కారం-2023 . లభించాయి. ఇంకా

 తెలంగాణ సారస్వత పరిషత్ వారి సాహిత్య విమర్శ రంగంలో ఉత్తమ గ్రంథ పురస్కారం -2022; ఆచార్య జి చెన్నకేశవరెడ్డి పురస్కారం–2022;  పీచరసునీతారావు స్మారకపురస్కారం- 2023; మొదలైనవి నిత్యానందరావును వరించాయి.  మరింత ఉన్నతమైన, జాతీయస్థాయి పురస్కారాలకు అన్నవిధాలా అర్హులు మాగురువుగారు.

ముగింపు:

ఆచార్య వెలుదండ నిత్యానందరావు  “భగవంతుడు ఈ జన్మకు రాతపనే నా నొసట రాశా”డని బలంగా విశ్వసించి సుమారు 45 సంవత్సరాలుగా సాహిత్యమే జీవితంగా, జీవితమే సాహిత్యంగా నడుస్తున్నవారు. ఏదైనా రాయడానికి పూనుకుంటే ఆ పనికి అలాగే అతుక్కుపోతారు, వారి దృష్టి అంతా అది పూర్తయ్యే వరకు దాని చుట్టే తిరుగుతుంది. అగ్రశ్రేణి ఆచార్యుల వద్ద శిష్యునిగా, సమకాలికులలో ఉన్నతంగా, ఎందరో విద్యార్థులకు ప్రియమైన గురువుగా మెలిగారు. ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో అవసరమైన చోట ఔచితీమంతంగా ఎంతటి వారినైనా మరొక్కసారి పరిశీలించండి అని సున్నితంగా చురకలు అంటించారే తప్ప, ఏనాడు వ్యక్తిగతంగా విమర్శించినది లేదు. విషయార్థియై వచ్చిన ఏ విద్యార్థిని వట్టి చేతులతో పంపలేదు, భోజనపు వేళ వచ్చినవాడు ఆకలితో వెళ్లలేదు. పలానా పుస్తకం అని వెళితే, అది వారి వద్ద లేకుంటే, దానికి సంబంధించి ఎక్కడ దొరుకుతుంది, ఎవరి వద్ద దొరుకుతుంది, ఎలా సేకరించాలో పూర్తి సమాచారాన్ని ఇచ్చి పంపిస్తారు. ఏది రాసినా, ఏది చదివినా ఓ కొత్త కోణంలో చూడడం వారి అలవాటు. చదివిన, చూసిన విషయాన్ని అలాగే గుర్తుంచుకొనే ఏకసంథాగ్రాహిత్వం, అలసట లేకుండా భిన్నభిన్న అంశాలమీద రచనలు చేసే ఉత్సాహశీలం,  రాసిన ప్రతి అక్షరాన్ని భద్రపరచుకునే తత్వం అన్నీ కలిసి సప్తగిరులలాగా సప్త బృహత్సంపుటాల ప్రచురణతో నిత్యానందరావుకు సాహిత్యలోకంలో శాశ్వతస్థానం సముపార్జించి పెట్టాయి.    

ఏనాడూ వ్యక్తిగత గుర్తింపు హంగులు ఆర్భాటాల జోలికి పోలేదు. అందరిలో ఒకరిగా నవ్వుతూ, నవ్విస్తూ కలిసిపోతారు. కుట్రకు, కూహకాలకు, ముఠా రాజకీయాలకు, ఆమడ దూరంలో ఉన్నారు. చేయగలిగితే మేలు చేయాలి  లేకపోతే నోరు మూసికొని కూర్చోవాలంటారు. చైతన్యమహాప్రభు సాంప్రదాయం చేత ప్రభావితుడైన వారి తండ్రి తన కుమారునకు “నిత్యానందరావు” అని పేరు పెట్టారు. ఆ మహానుభావుడు ఏమి ఆశించి ఆ పేరు పెట్టారోగాని, ఎప్పుడూ నిష్కల్మషంగా, చిరునవ్వు నలంకరించుకొని కనిపిస్తారు. తండ్రిగారి చివరి అంకంలో వారి సేవ చేసి పునీతులయ్యారు. గృహస్థ ధర్మాన్ని, అటు ఉద్యోగ ధర్మాన్ని సమానంగా పోషించారు.

“అహంకార ద్వేషాలు, ఈర్ష్య అసూయలు స్వాభావిక ప్రకృతులే అయినా వాటి ప్రవాహంలో కొట్టుకొని పోయే స్థితి రాలేదు. ప్రశాంతంగా హాయిగా సంతృప్తిగా జీవితాన్ని గడిపాను. సంతృప్తిని మించిన సంపద మరేముంటుంది” అని జీవిత పరమార్ధాన్ని దర్శించిన సార్ధక జీవి.

“ ఇంత సాహిత్య వ్యాసంగాన్ని నేను జరిపానని ఆనందంగా చెప్పుకోవడానికి మూలం నా నిరంతర సాధన ఒకటైతే, సజ్జనులతో సద్గురువులతో నా సహవాసం మరో ప్రధాన అంశం.  ఓ పది, ఇరవై దొరకకపోయినా అన్నీ భద్రంగా ఉండడం మరో ముఖ్య విశేషం. నా ఉన్నత పాఠశాల, నా ప్రాచ్య కళాశాల అధ్యాపకుల గురించి రాయడంలో, నా విశ్వవిద్యాలయ అధ్యాపకుల గురించి (అక్షరమాల రెండవ సంపుటంలో) రాయడంలో నాకు ఉన్నది  వినయం, కృతజ్ఞతాభావం, అభిమానం, ఆర్ద్రత. నా జీవితాన్ని ఇంతవరకు ముందుకు నడిపించినవి ఈ నాలుగు అంశాలే……… ఎందరెందరో ఎన్నో విధాలుగా తమ సహాయ సహకారాలను అందించి తోడ్పడ్డారు. ఇది ఎవరి కోసమో, దేనికోసమో, ఏదో ఆశించి కాక, నాకోసం, నా ఆనందం కోసం ప్రచురిస్తున్నది ‘నాలోన గల వెల్గు నా పరిసరముల వారి రూపమున కన్పట్టుగాక’ అన్న ఎక్కిరాల కృష్ణమాచార్యుల వాక్కులకు అనుగుణంగా ఒక చారిత్రకమైన బాధ్యతగా భావించి నిర్వహిస్తున్నది. ఉపదేశాలు, బోధలు చేయడం కోసం కాదు. పుస్తక పఠనం పూర్తిగా పోయింది. తెలుగు భాష మాట్లాడడమే తప్ప రాయలేని తరం తయారయింది. వైయక్తికమైన క్షణికానందాల కోసం వాట్సాప్ లో తలదూర్చి బతుకుతున్న ఉష్ట్ర పక్షుల సంఖ్య  పెరిగిపోతుంది. సాధికారికంగా ప్రసంగించే వక్తలు, రాసే రచయితలు తగ్గుతున్నారు. క్రమేపి పాలన విద్యాది వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఇవన్నీ నిజమే కావచ్చు గాక! సమాజానికి నా రచనలు హితకరమైనవి, ప్రామాణికమైనవి అని నమ్ముతున్నాను. అందుకే సాహసంతో, శ్రమతో, ఆర్థికభారాన్ని లెక్కచేయకుండా నూతనతరం మీద విశ్వాసంతో సంపుటాలు తెస్తున్నాను….. ఇన్నాళ్లు “ప్రవృత్తి” మార్గంలో రచనావ్యసనిగా జీవించాను. చాలా కొత్త విషయాలు చెప్పాను. ఎన్నెన్నో సేకరించాను -అని ప్రశంసలు పొందాను. ఇకముందు “నివృత్తి” మార్గంలో ముందుకు సాగుతాను.  ప్రదర్శన కళ అయిన రచన కన్నా దర్శన కళ అయిన అంతర్దృష్టి కి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాను.

అధ్యాపకునిగా, పరిశోధకునిగా, పర్యవేక్షకునిగా, రచయితగా, గృహస్థుగా, లౌకికమైన నా పాత్ర సక్రమంగా నిర్వహించానన్న సంతృప్తి ఉంది. ఇది చాలు అందరికీ మరోసారి వినయంగా, ప్రేమ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను”  ఆరవసంపుటమైన సృజనానందం పీఠిక ముగిస్తూ అంటారు.  ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి జీవనసారాన్ని, దృక్పథాన్ని ఈ మాటలు వెల్లడిస్తున్నాయనడం నిర్వివాదాంశం.

నిత్యానందరావుగారివద్ద నేను నేరుగా చదువుకోకపోయినా వారు నాకు గురువులే.  నా పరిశోధనాంశ విషయమై వారిని మొదటిసారి కలిశాను. అనుకోకుండా వారి ఇంటికి దగ్గరలోనే నేను ఉండటం వల్ల వారితో సాన్నిహిత్యం పెరిగింది.  నా పరిశోధనకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను, ఇతర సాహిత్యసమాచారాన్ని అందించి ప్రోత్సహిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన మాలాంటి  శిష్యులను  ఇంటికి  ఆహ్వానించి సత్కరించి ఆశీర్వదించారు.  జీవితంలో నేను మర్చిపోలేని అనుభూతి. ఇది నాకు కలిగిన తొలి సత్కారం. తండ్రి బిడ్డల మీద చూపే మమకారాన్ని మా మీద కురిపిస్తారు. వారితో మాట్లాడుతున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు  వివిధ సాహిత్య అంశాలను బోధిస్తూనే ఉంటారు. సరదాగా నవ్విస్తూనే ఉంటారు. ఛలోక్తులు విసురుతారు. పదాలతో ఆడుకుంటారు. అవి కూడా సాహిత్య సంబంధం కావడం విశేషం.  విస్తార సాహిత్య కృషి సల్పిన ఆచార్య వెలుదండ నిత్యానందరావు గురించి ఈ వ్యాసం రాసే అవకాశాన్ని నాకు ప్రసాదించిన మా గురువుగారు తెలుగు శాఖ అద్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ  ముగిస్తున్నాను.

-****-

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us