మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

హోలి జీవన కేళి

by Jyostna Prabha March 31, 2024
written by Jyostna Prabha

ఒక వేకువ ఉదా రంగు కిరణమై

హృదయంలో నాదం మోగిస్తుంది

ఒక నీలిమ అనంత ఆకాశమై

మనసులో ప్రశాంత భావాన్ని మీటుతుంది

ఒక గాఢ నీలం విశాల సంద్రమై

వేయి కెరటాలుగా సంచలిస్తుంది

ఆకుపచ్చదనం అవనిపై పరిచిన వృక్షజాలమై

ఆహ్లాదాన్ని పెంచుతుంది

ఒక పసిమివర్ణం తీయని ఆమ్రమై

మాధుర్యం పంచుతుంది

ఒక నారింజ రంగు సాయం సంధ్యా కిరణమై

వేయి రాగాలు దిద్దుతుంది.

ఒక రక్త వర్ణం అనురాగమై

అంత రంగాలను స్పృశిస్తుంది

ప్రపంచమంతా సప్త వర్ణమయం

ఇది హోలీ ఇది వసంతోత్సవం.

ఇది ఆమని పలకరింత.

ఒక్కో వర్ణం జీవితాన్ని రంగులమయం చేస్తుంది

విషాద ని శీధాలను వదలి వేస్తూ ఉల్లాస ఉదయాలకు ఊపిరి పోస్తూ

ప్రతి ఏటా ఉత్సాహం పంచుతుంది హోలీ బ్రతుకులు రాగరంజితం చేసుకోమంటుంది ఈ రంగుల కేళి.

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi March 31, 2024
written by Chillara Bhavanidevi

ధారావాహికం – 11వ భాగం

అన్నపూర్ణాదేవి మందిరం సుందర మనోహరంగా ఉంది. అత్తరు గుబాళింపులు, పూలగుచ్ఛాల స్వాగతాలు రాయల మనసుకు మరింత ఆహ్లాదాన్ని సమకూరుస్తున్నాయి.
ఎక్కడనుంచో శ్రావ్యమైన వీణావాదన విన్పిస్తున్నది. సర్వాంగ సుందరంగా శయ్యామందిరం అలంకరించి ఉంది. రాయల మనసు అన్నపుర్ణాదేవి పట్ల విరహంతో వేగిపోతున్నది. ఆమె సౌందర్యంలోని రాజసానికి రాయలు ఏనాడో ఆకర్షితులయ్యారు. గజపతులతో రాయల వైరాన్ని అన్నపూర్ణాదేవి ప్రేమానురాగాలతో మరపించింది.
రాయలు శయ్యామందిరం చేరేసమయానికి అన్నపూర్ణాదేవి సౌందర్య దేవతలా అలంకరించుకుని ఉంది. ప్రియ సమాగమానికి ఎదురుచూస్తున్నది. రాయలామె వెనుకగా వచ్చి నిలిచారు. పరిచితమైన గాఢస్పర్శ… ఆపై ఆమె నడుము చుట్టూ ప్రభువు చేతులు. ఆమె వెనుదిరిగేలోపు రెండు అరచేతులతో వెనుకనుంచి ఆమె కన్నులు సుకుమారంగా మూసేశారు. ఆమె పరవశించి పోయింది.
‘‘ప్రభూ!’’ అనగలిగింది.
‘‘ఉహూ. పేరు చెప్పాలి’’ శృంగార రాయలు కవ్వించారు. ఆమె సిగ్గుపడిరది. రాయల హృదయంలో మొహం దాచుకుంది. ఆమె శరీరం అణువణువు ప్రభువు కోసం నిరీక్షిస్తున్నదని అర్థమయింది.
రాయలు ఆమె చుబుకాన్ని పట్టి కళ్ళల్లోకి చూశారు. ఆమె కళ్ళలో తన ప్రతిబింబం మరింత అందంగా కన్పిస్తోంది. ఆమె కళ్ళు వాల్చేసింది. దూరంగా జరిగింది.
‘‘దేవిగార్కి కోపమా’’ చమత్కరించారు.
‘‘లేదు ప్రభూ! కృష్ణచంద్రుని కోసం చకోరంలా ఎదురుచూపులు’’
‘‘మాటలు నేర్చారు దేవిగారు’’
‘‘మీ చేతల ముందు మా మాటలేం పనిచెయ్యవులెండి’’ అలుక నటించింది.
‘‘మా చేతలు మీకంగీకారమైనవే కదా’’
‘‘మా అంగీకారాలతో ప్రభువులకు నిమిత్తమేముంటుంది’’ నిష్ఠూరం ధ్వనించింది.
‘‘ఇన్నాళ్ళూ రాలేదని అలుకా! ఏవేవో అవాంతరాలు… ఓప్‌ా… ఇంకా ఎడబాటా దేవీ!’’ ఆమెను బలవంతంగా తనవైపు తిప్పుకున్నారు రాయలు. ఆమె మొహం ముడుచుకున్న పద్మంలా ఉంది.
‘‘మీ మనసులోని మాట సెలవీయండి దేవీ! మేము దాసులం’’ చేతులు కట్టుకొని వినయం నటించారు.
‘‘మాట తప్పరుగా’’ ఆమె ఆ అవకాశం కోసమే వేచి ఉంది.
‘‘ఉహు..’’ చేతిలో చేయివేసి దగ్గరికి లాక్కున్నారు.
ప్రభువు కౌగిలి నుండి విడివడుతూ…
‘‘తీరా కోరాక కాదనకూడదు మరి’’ మరింతగా నొక్కి చెప్పింది ఆమె.
‘‘అంత అనుమానమా దేవీ! మన కులదైవం విరూపాక్షస్వామి పాదాల మీద ఆన. సరేనా!’’ ఆమెను దగ్గరికి తీసుకున్నారు.
‘‘మన కుమారుడు తిరుమల రాయలు’’ సంకోచంతో ఆగింది.
‘‘ఊఁ! తిరుమల రాయలు’’ రెట్టించారు మురిపెంగా.
‘‘తిరుమల రాయలకు పట్టాభిషేకం చేయండి ప్రభూ! ఇదే నా విన్నపం’’ తీరా చెప్పేశాక రాయలేమంటాడోననే భయాందోనలు ఆమెను చుట్టుముట్టినై.
రాయలు మందహాసం చేశారు. ఆమె హృదయం తేలికపడి వికసించిన పద్మమయింది.
‘‘ఇంతేనా! దీనికా ఇంత గుబులు! తిరుమలరాయలు గాక మరెవరికి పట్టాభిషేకం చేస్తాం? యువరాజు మాకు వారసుడని మీరెరుగరా!’’ ఆదరంగా ఆమెను సందిట చేర్చుకున్నారు.
‘‘అదికాదు ప్రభూ! కొన్నాళ్ళుగా నాకెందుకో కొన్ని ఉత్పాతాలు గోచరిస్తున్నాయి. పీడకలలొస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యానికి భావి సామ్రాట్‌ మన చిరంజీవి కావాలనే నా కోరిక ప్రభూ!’’ అభ్యర్థించింది. ఆమె మీద వీరేంద్రుని నీడ పూర్తిగా కమ్ముకొంది.
‘‘కాదనం. తొందర ఎందుకు? యువరాజుకింకా ఆ వయస్సు రాలేదుగా!’’ అనునయించాడు.
‘‘తొందరపడక తప్పదు ప్రభూ!మీరు విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన విధానాన్ని గుర్తుచేయక తప్పటం లేదు. మన్నించండి ప్రభూ! తరతాలుగా ఈ సింహాసనం తండ్రి బిడ్డల వారసత్వంగా రావటం లేదు. అదే నా బాధ. మన యువరాజు తండ్రికి వారసుడిగా రాజు కావాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత త్వరగా తిరుమలరాయలకు పట్టాభిషేకం చేస్తే నా మనసు అంత కుదుటపడుతుంది ప్రభూ!’’ అన్నపూర్ణాదేవి తల్లిమనసు ఆర్థ్రమైంది.
‘‘సరే దేవీ! రేపే అప్పాజీవారితో సంప్రదించి నిర్ణయిస్తాం’’ అన్నాడు మెత్తగా.
‘‘అప్పాజీవారిని అడిగితే ఈ పని జరుగుతుందనే ఆశ నాకు లేదు ప్రభూ!’’ మెల్లగా అంది.
రాయలు ఉలిక్కిపడ్డారు. వినకూడనిదేదో విన్నట్లు దిగ్గున లేచారు.
‘‘ఏమిటిది దేవీ! అప్పాజీవారినే అనుమానిస్తున్నారా! వారు మీకు పితృసమానులు’’ కఠినంగా అన్నారు.
‘‘పితృసమానులే గానీ పితృదేవులు కారుగా! వారు ఈ పట్టాభిషేకాన్ని అంగీకరిస్తారని నేననుకోను. వారి ఆలోచన వేరువిధంగా ఉంది ప్రభూ!’’ అన్నపూర్ణాదేవి కంఠం మృదువుగా ఉన్నా స్పష్టంగా ఉంది.
‘‘ఏమిటది?’’
‘‘తమ కుమారుడు గోవిందరాయలను విజయనగర సింహాసనంపై…’’
ఆమె మాట పూర్తికాకముందే రాయలు అసహనంగా కదిలాడు. రెండు చేతులతో చెవులు మూసుకుంటూ ‘‘ఆపు అన్నపూర్ణాదేవీ! మీ అభియోగానికి ఋజువులున్నాయా?’’ ప్రశ్నించాడు.
ఆమె మాట్లాడలేదు.
‘‘సరే! ఈ పట్టాభిషేకానికి అప్పాజీవారు అంగీకరిస్తారనే నమ్మకం నాకుంది. ఇలాగైనా వారిమీద మీకున్న అనుమానం తొలగిపోతుంది’’ అంటూ వేగంగా వెళ్ళిపోతున్న రాయలను వెనుకనుంచి చూస్తూండిపోయింది అన్నపూర్ణాదేవి. ఆమె కనుకొలకుల్లోంచి అశ్రుబిందువులు ధారగా చెక్కిళ్ళను తడుపుతున్నాయి.
తనకేమైంది?తనేం చేసింది?ఏంమాట్లాడిరది?ప్రేమమూర్తిని నొప్పించింది. ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత ప్రణయ సంగమాన్ని నిరాకరించి కైకలా వరం కోరింది. కైకలాగానా? అంటే వంశనాశనం కోరిందా? అలా జరగటానికి వీల్లేదు. పితృసమానులైన అప్పాజీవారు ప్రోద్భలం చేయనిదే రాయలతో తన వివాహం జరిగేదేనా? ఆయనకే అలాంటి దురాలోచన ఉంటే రాయలను ఏనాడో మట్టుబెట్టగల శక్తిమంతుడు గదా! తననెంత ఆదరంగా చూస్తాడు! తను ఎందుకింత కఠినంగా మారిపోయింది? ఎన్నడూ లేనిది రాయల మనసునెంత నొప్పించింది! తీవ్రంగా పరితాపం చెందింది అన్నపూర్ణాదేవి.
‘‘జగన్నాథ! జగన్నాథ! మంచిపని చేశావు. నీ కుమారుని భవిష్యత్‌ నీకు ముఖ్యంకదా! అదే నిరూపించి వీరమాతవనిపించుకుంటున్నావు’’ అంతదాకా చాటున ఉండి అన్నీ విన్న వీరేంద్రుడు కపట ప్రశంస చేశాడు.
‘‘ఛీ! ఆలుమగల మాటలు కూడా చాటుగా వింటున్న నీదేం సంస్కారం’’ ఆమె వ్యథగా ఛీత్కరించింది.
‘‘నాకు ఆ తేడాలేం లేవులేమ్మా! నేననుకుంటున్నట్లు జరిగితే అది చాలు. రాయల మాటలను ఆ కుటిల తిమ్మరుసు అంగీకరిస్తాడన్న నమ్మకం మాత్రం నాకు లేదు’’ వ్యంగ్యబాణం విసిరి వెళ్ళిపోయాడు వీరేంద్రుడు.
అన్నపూర్ణాదేవి ఆవేదనగా శయ్యాగతురాలై రోదిస్తున్నది. మంజరి కొంత సంకోచిస్తూనే ఆమె దగ్గరికి వెళ్ళింది.
‘‘దేవిగార్కి ఉపచారాలేమైనా చేయమంటారా’’ మెత్తగా అడిగింది.
‘‘వద్దు మంజరీ! నా మనసేం బాగాలేదు’’ బేలగా అంది.
‘‘పానీయం ఇవ్వమంటారా దేవీ’’ అనునయంగా అడిగింది మంజరి.
‘‘వద్దు. ప్రభువు మనసు నొప్పించాను. వీరేంద్రుని మాటకి లోనయ్యాను’’ రోదించింది రాణి.
‘‘వారి మాటలకేముంది దేవీ! ఏది యుక్తమో మహారాజుగారికి తెలుసు. తిమ్మరుసులవారున్నారుగా! మీరు కలతపడకండి’’ ఆమెను ఓదార్చుతున్నదే గానీ మంజరి మనసు మనసులో లేదు. అన్నపూర్ణాదేవి కోరిక ఎటువంటి దుష్ఫలితాల్ని కల్గిస్తుందోనని ఆమెకూ భయంగా ఉంది. వీరేంద్రుని నీడ ఇంతింతై అన్నపూర్ణాదేవి మందిరంమీదే కాదు యావత్‌ విజయనగర సామ్రాజ్యమంతటా పరుచుకుంటున్నట్లనిపిస్తున్నది.
* * *
చంద్రప్ప తెచ్చిన సమాచారం విని తిమ్మరుసు ఆశ్చర్యపోయారు. బాధపడ్డారు. రాయలు మంత్రిమండలి సమావేశం ఏర్పాటుచేశారనీ, తిరుమల రాయల పట్టాభిషేకం గురించి ప్రకటించారనీ,తనతో మాటమాత్రం సంప్రదించ కుండా రాయలీ నిర్ణయం తీసుకోవటం తిమ్మరుసు మంత్రిని కలవరపెడుతోంది.
రాయలు తనను శంకిస్తున్నారా? రాయలలో ఎందుకీ మార్పు? ఇది దేనికి నాంది?
ఆలోచిస్తుండగానే రాయలు తిమ్మరుసు మందిరంలోకి ప్రవేశించారు.
సాధారణంగా మహారాజు దగ్గరికి మంత్రి వెళ్ళటం ఉంటుంది గానీ మంత్రి దగ్గరికి రాజు వెళ్ళటం ఉండదు. రాయలు, తిమ్మరుసుల బంధం ఇటువంటి సూత్రాలకు అతీతమైంది. రాయల్ని చూస్తూనే తిమ్మరుసు మనసులోని ఆలోచనలు, అనుమానాలన్నీ మాయమైనాయి.
‘‘రాయా! రండి. ప్రభువులవారి రాకకు కారణం’’ ఆదరించారు.
తిమ్మరుసును చూస్తూనే రాయలు తాను వచ్చిన పని ఎలా చెప్పాలా అని కొంచెం సందిగ్ధపడ్డారు.
‘‘అప్పాజీ! మిమ్మల్ని సంప్రదించకుండానే ఒక నిర్ణయం తీసుకున్నాం. అది చెప్పాలని ఇలా వచ్చాం.’’
‘‘ఏమిటది రాయా! నా దగ్గర దాపరికం దేనికి’’ తిమ్మరుసు ప్రోత్సాహంగా మాట్లాడారు.
‘‘మా కుమారుడు తిరుమలరాయలకు పట్టాభిషేకం చేస్తామని అన్నపూర్ణాదేవికి వాగ్ధానం చేశాం. ఆ ప్రకారం యువరాజు పట్టాభిషేకానికి నిర్ణయించాం. ఏర్పాట్లు మొదలయ్యాయి.’’
తిమ్మరుసు ఊహించిందే గదా! ఆయన కళ్ళల్లో రాయలపట్ల పితృప్రేమ తొణికిసలాడుతోంది.
‘‘చాలా సంతోషం రాయా! కానీ యువరాజు ఇంకా పసివారు గదా! అయినా మీరు దక్షిణ జైత్రయాత్రకు వెళ్ళేముందు ఈ పట్టాభిషేకం శుభంగా అన్పించదు.’’
తిమ్మరుసు మాటలకు రాయల మొహంలో రంగులు మారినై.
‘‘శుభంగా ఉన్నా లేకున్నా మేమిచ్చిన మాట అమలు జరిగి తీరాల్సిందే’’ పట్టుదలగా అంటూ వెళ్ళిపోతున్న రాయలకేసి నిస్సహాయంగా చూశారు తిమ్మరుసు. ఆ మేధోనాయకునికేదో స్ఫురించింది. వెంటనే రామలింగ నాయకునికి కబురు చేశారు.
* * *
‘‘అంతా మనం అనుకున్నట్లుగానే జరుగుతున్నది’’ వీరేంద్రుడు
ఉద్యానవనంలో కంటకుడితో ఆనందం పంచుకున్నాడు.
‘‘తిమ్మరుసు ఈ పట్టాభిషేకానికి ఒప్పుకోడనే అనుకున్నాను. ఆశ్చర్యంగా
ఉందే’’ కంటకుడు ఆశ్చర్యపోయాడు.
‘‘అదే తిమ్మరుసు తెలివి. ఒప్పుకోకపోతే రాయలకు అనుమానం రాదూ! తిమ్మరుసు ఒప్పుకోకపోతే మన పని మరింత సులువయ్యేది’’ వీరేంద్రుడి గొంతులో కోపం ధ్వనిస్తున్నది.
‘‘ఎలా?’’ కంటకుడు అడిగాడు.
‘‘ఎలాగంటే తిమ్మరుసు తిరుమలరాయల పట్టాభిషేకాన్ని తిరస్కరిస్తే రాయలకి తిమ్మరుసుకు మధ్య వైరం పెరిగేది. ఇప్పుడలా కాదే! ఇద్దరూ ఒకటిగా ఉన్నంతకాలం మనకి అగచాట్లే’’ వీరేంద్రుడు చేతులు నులుముకుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
హఠాత్తుగా కంటకుడు హుషారుగా చిటికేశాడు.
‘‘ఆఁ! నాకో ఉపాయం తట్టింది.’’
వీరేంద్రుడు కంటకుడి దగ్గర ఆతృతగా చేరాడు.
‘‘ఏమిటది చెప్పు’’
‘‘తిమ్మరుసు అయిష్టంగా ఒప్పుకున్నట్లు రాజుకు తెలుసు. తిమ్మరుసు ఒప్పుకున్నట్లే నటించి కుతంత్రంతో పట్టాభిషేకాన్ని ఆపేసినట్లు సృష్టిస్తే!’’
‘‘అవును. ఆ ముసలి మంత్రి అలాంటివాడే! జనం నమ్ముతారు కూడా! కానీ ఎలా? ఆ! యువరాజుని హత్యచేసి ఆ నేరం తిమ్మరుసు మీద వేస్తే ఒక దెబ్బకి రెండు పిట్టలు’’ వీరేంద్రుడు ఉత్సాహంగా చెప్పాడు. కంటకుడు నివ్వెరపోయాడు. అతనెంత దుర్మార్గుడైనా హత్యచేసే ఆలోచన లేదు. అందునా యువరాజుని.
‘‘అలా వద్దు. ఏదో ఒకటి చేసి పట్టాభిషేకం ఆపేద్దాం’’ కంటకుడు వారించాడు.
‘‘అవును. ఏదో ఒకటి చేయాలి. అవును…’’ అంటూ దగ్గరిగా వస్తూనే ఛురికతో కంటకుడ్ని ఓ పోటు పొడిచాడు.
‘‘ఇదే చేసేది. నాకే సలహాలు చెప్పేవాళ్ళు నాకెందుకు జగన్నాథ!’’ పెద్దగా నవ్వి, వీరేంద్రుడు భృత్యుల్ని పిలిచాడు.
‘‘ఈ శవాన్ని తుంగభద్రలోకి విసిరేయండి’’ హూంకరించాడు.
* * *
పుత్రశోకాన్ని తప్పించటమెవ్వరితరం! గండమనాయకుడు విషణ్ణ వదనంతో తిమ్మరుసు ఎదురుగా ఆసీనుడై ఉన్నాడు.
‘‘విచారించకండి గండమనాయకా! మీ కుమారుడు కంటకుడు మాయం కావటం గురించి నాకు వీరేంద్రుని మీద అనుమానంగా ఉంది’’ తిమ్మరుసు గండమనాయకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
‘‘ఆ వీరేంద్రుని సాంగత్యం వద్దని ఎన్నోమార్లు చెప్పి చూశాను మహామంత్రీ! అతను ఎప్పుడూ పగబట్టిన తాచులా కన్పిస్తాడు. చివరకు నా కుమారుడినే బలితీసుకున్నాడు’’ గండమనాయకుని కంఠం రుద్దమైంది.
‘‘మీ శోకానికి కొంతవరకూ మేమూ బాధ్యులమే!వీరేంద్రుని ఆనాడే పంపేసి ఉంటే ఈనాడు విజయనగరానికీ కలత వచ్చేదికాదు’’పశ్చాత్తాపపడ్డారు తిమ్మరుసు.
‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ దుర్మార్గుడ్ని కత్తికో కండగా…’’ గండమనాయకుడి ఆవేశాన్ని వారించారు మంత్రి.
‘‘అందుకు తగినవాడే! ఇప్పుడు మన కర్తవ్యం యువరాజుని రక్షించుకోవటం’’ ఉపదేశించారు.
‘‘యువరాజునా?’’ ఆశ్చర్యపోయాడు గండమనాయకుడు.
‘‘యువరాజుకు పట్టాభిషేకం అంటే మేము కాదంటామనీ, తద్వారా మాకూ, రాయలవారికీ మధ్య చిచ్చుపెట్టాలనీ వీరేంద్రుని పన్నాగం. పట్టాభిషేకానికి మేము సమ్మతి తెలపటంతో ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు వీరేంద్రుడు మమ్ములను రాయలవారి దృష్టిలో ఎలా నీచునిగా చూపించాలా అని ఆలోచిస్తాడు. అది నెరవేరటానికి వాడికున్న ఆయుధం యువరాజు. ఆ పసివాడి ప్రాణానికి వీరేంద్రుడు ముప్పు తలపెడతాడని నాకు తోస్తున్నది. మీరు కాపలా కట్టుదిట్టం చేయండి. అహర్నిశలు యువరాజు భద్రత మీద దృష్టి పెట్టండి. వీరేంద్రుని సంగతి ఇంక అటో ఇటో తేల్చేసే సమయం వచ్చేసింది. శత్రుశేషం ఉంచటమే మేము చేసిన పొరపాటు’’ తిమ్మరుసు మాటలతో గండమనాయకుడు కార్యోన్ముఖుడయ్యాడు.
* * *
అన్నపూర్ణాదేవి చాలా ఆందోళన పడుతోంది. మూడురోజులుగా తిరుమలరాయలు మూసినకన్ను తెరవటం లేదు. రాజవైద్యులు వైద్యం చేస్తున్నారు. రోగనిర్థారణ కాలేదు. మందులు పనిచేస్తున్నట్లు కన్పించవు.
‘‘జగన్నాథ స్వామీ! నా బిడ్డని కాపాడు. నీ దర్శనం చేసుకుంటాను.’’ ఆమె ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంది.
‘‘జగన్నాథ! జగన్నాథ!జగన్నాథుడేం చేస్తాడమ్మా!అసలువారు వేరే ఉన్నారు.’’
‘‘వీరేంద్రా! ఆపు నీ వాచాలత. నీ మాటలే నాకు చేటుతెచ్చాయి.’’ ఆవేదనతో అంది రాణి.
‘‘ఉన్నమాటంటే ఎందుకమ్మా అంత కోపం? ఇది మామూలు జ్వరం కాదు. విషజ్వరం. ఎవరో కావాలని తెప్పించింది.’’
‘‘ఎవరికా అవసరం ఉంది? నాలుగునాళ్ళలో పట్టాభిషేకం చేసుకుంటున్న నా చిట్టితండ్రికి కీడు చేయతలపెట్టిన కఠినచిత్తులెవరుంటారు’’ ఆమె కంఠం రుద్దమైంది.
‘‘ఇంకెవరు ఆ…తి… జగన్నాథ!’’ ఇంతలో శ్రీకృష్ణదేవరాయలవారు వేం చేస్తున్నారనే వార్త రావటంతో వీరేంద్రుడు తప్పుకున్నాడు.
అతనేం చెప్పదలిచాడో ఆమెకు అవగతమయింది.
కళ్ళనీళ్ళతో మ్రాన్పడి యువరాజు దగ్గర కూర్చుండిపోయింది. కృష్ణదేవరాయలు విచ్చేశారు. కుమారుని అపస్మారక స్థితి ఆయన మనసును కలచివేస్తుంది.
‘‘ఇదేమి విధిలీల దేవీ! కుమారునికి పట్టాభిషేకమని అనుకున్నామో లేదో! ఇటువంటి అనారోగ్యం. రాజవైద్యులకు అంతుబట్టని వింతరోగం’’ రాయలు వ్యాకులపడ్డాడు.
‘‘నాకు అంతా అగమ్యంగా ఉంది ప్రభూ! మన నీడను కూడా మనం నమ్మలేని పరిస్థితి. మా మందిరంలో మాకు తెలీకుండా ఏదో కుట్ర రాజవైద్యులను మార్పు చేస్తే మంచిదేమో’’ తల్లి హృదయంతో అన్నది.
‘‘మీ అనుమానం ఎవరిమీద?’’ రాయలు కుమారుని శయ్యచెంత చేరాడు.
‘‘లేదు… లేదు…’’ తడబడిరది.
‘‘నాయనా తిరుమలరాయా! మాకేసి ఓసారి చూడు తండ్రీ’’ కృష్ణదేవరాయలు కుమారుని స్పృశిస్తూ పదేపదే పిలిచారు. కుమారుడు
కళ్ళు తెరువనే లేదు. అన్నపూర్ణాదేవి రోదిస్తున్నది.
‘‘ఎవరక్కడ? రాజవైద్యుల్ని వెంటనే రమ్మనండి’’ బిగ్గరగా ఆదేశించిన రాయలు తలపట్టుకొని అక్కడే కూలబడిపోయారు. కుమారుని చల్లబడ్డ శరీరం ఆయన గుండెల్ని బద్దలుచేసింది. భావి విజయనగర సామ్రాట్టు మరణంతో కృష్ణరాయల తేజం మందగిస్తున్నట్లు మందిరంలో దీపాలు మలుగుతున్నాయి.
* * *
తిరుమలరాయల మరణవార్తతో విజయనగర సామ్రాజ్యం శోకసంద్రంలో మునిగిపోయింది. కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకున్నప్పటికీ, చికిత్స జరుగుతుండగానే యువరాజు రాజమందిరంలోనే జబ్బుపడి మరణించటం కృష్ణరాయల్ని అమితంగా కుంగదీసింది. తిమ్మరుసు మొదలునరికిన అరటిచెట్టులా కూలబడిపోయాడు. అన్నపూర్ణాదేవి దుఃఖానికి అంతేలేదు.
‘‘నేను మొదట్నుంచీ అనుమానిస్తూనే ఉన్నా’’ వీరేంద్రుడు సమయం చూసి మరో పాచిక విసిరాడు.
శోకసముద్రంలో మునిగిఉన్న కృష్ణదేవరాయ దంపతులు ఏమిటన్నట్లు తలెత్తిచూశారు.
‘‘జగన్నాథ! ఇదంతా ఆ తిమ్మరుసు మంత్రి కుట్రే. అవును!మన యువరాజుకు పట్టాభిషేకం చేయటం ఆయనకు సుతరామూ ఇష్టంలేదు. కానీ మెప్పుకోసం పైకి ఒప్పుకున్నట్లు నటించాడు. ఆపై ఆటంకం తొలగించుకోవటానికి ఇలా పసివాడని కూడా చూడకుండా రాజవైద్యులని లోబరుచుకుని విషప్రయోగం చేయించాడు’’ తీవ్రంగా ఆరోపించాడు వీరేంద్రుడు.
‘‘ఎవరక్కడ?’’ కృష్ణరాయని కళ్ళు అగ్నికణికల్లా ఉన్నాయి.
‘‘రాజవైద్యుల్ని తక్షణం ప్రవేశపెట్టండి’’ నిప్పు కురుస్తున్నదా స్వరంలో.
రాజాజ్ఞ ప్రకారం రాజవైద్యులు వచ్చారు. వారు నివేదించిన ప్రకారం యువరాజు మరణం విషప్రయోగం వల్లనే జరిగిందని నిర్థారణ అయింది.
కృష్ణరాయని కోపానికి అంతులేదు. కోపంలో మనిషికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం నశిస్తుంది. అదే జరిగింది.
‘‘సాళ్వ తిమ్మరుసు మంత్రిని బంధించండి’’ కృష్ణరాయని శోకతప్త హృదయం చీకట్లో కూరుకుపోయింది. విజయనగర జ్యోతిని చెరసాలలో బంధించి ఆర్పేసే ప్రయత్నం బలంగా ప్రారంభమయింది.
అన్నపూర్ణాదేవికేం పాలుపోవటం లేదు. వీరేంద్రుడెన్ని విధాల చెప్పినా తమ కుమారుని మరణానికి తిమ్మరుసు కారకుడంటే ఆమె అంగీకరించలేక పోతుంది. తిరుమలాంబతో మొరపెట్టుకుంది. పట్టపురాణి కూడా రాయలవారికి ఎంతో చెప్పిచూసింది. కాల్చి ఎర్రబడిన ఇనుము మీద సమ్మెట దెబ్బల్లా పుత్రశోకంతో అడలుతున్న రాయల హృదయంపై వీరేంద్రుని మాటల ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. ఎవరేం చెప్పినా వినేస్థితిలో రాయలు లేరు. పుత్రశోకంతో బాటు విజయనగర సామ్రాజ్య రక్షకుడు తిమ్మరుసుకు వాటిల్లిన ఆపద గురించి అన్నపూర్ణాదేవి పలువిధాల విలపించింది. ఆమేకాదు, యావత్‌ సామ్రాజ్య ప్రజలు కంటతడి పెట్టారు. రాజరికంలో అనుగ్రహ ఆగ్రహాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అనుభవంలో చూస్తున్నారంతా. మంజరి, చంద్రప్పలతో సహా, రాజప్రముఖులంతా తిమ్మరుసును రక్షించే మార్గాల కోసం అన్వేసిస్తున్నారు.
* * *
శ్రీకృష్ణదేవరాయలు కొలువుతీరారు. కానీ అది మునుపటిలా రసవంతంగా లేదు. విషాద నిర్వేదంగా కఠిన శిలలు ఆసీనులైన వంచనా వేదికగా ఉంది. రాయలకత్యంత సమీపంలో ఆసీనుడైన వీరేంద్రుని చూసి అంతా కోపంతో ఊగిపోతున్నారు. పైకి ఏమీ అనలేకున్నా అందరికీ తెలుసు ఈ కుట్రలో ప్రధాన పాత్రధారి వీరేంద్రుడేనని.
తిమ్మరుసు మంత్రి ఇప్పుడు మంత్రి కాదు. ఆయన్ని బందీగా సభకు తీసుకొచ్చారు. సభ యావత్తూ తిమ్మరుసునా స్థితిలో చూసి విచారంతో తల దించుకుంది. తిమ్మరుసు రాయలు తనను శంకిస్తున్నాడన్న నిజాన్ని జీర్ణించుకోలేని వేదనతో కుంగిపోతూ కన్పిస్తున్నారు. కృష్ణరాయలు తిమ్మరుసు నేరాన్ని విచారించమని న్యాయపరిషత్తును ఆదేశించారు.
ప్రధాన న్యాయాధికారి రాజాజ్ఞను శిరసావహిస్తూ తిమ్మరుసు మంత్రి పట్ల గౌరవాభిమానాలను బయటికి కనపరచకుండా కఠినత్వాన్ని కప్పుకుంటూ విచారణ చేశాడు.
‘‘మీ పేరు’’
‘‘సాళ్వ తిమ్మరుసు’’
‘‘శ్రీశ్రీశ్రీ మహారాజుగారి కుమారుడు తిరుమలరాయలకు విషప్రయోగం చేయించి చంపించారని మీమీద అభియోగం. దీనికి మీ సమాధానం?’’
తిమ్మరుసు నిర్వేదం నిండిన కళ్ళతో కృష్ణరాయలకేసి ఓసారి చూశారు. శ్రీకృష్ణదేవరాయలు అధోవదనుడై ఉన్నారు. దేవేరులంతా ఖిన్నులై ఉన్నారు. తాను జీవితమంతా శ్రమించి నిర్మించిన విజయనగర మహాసామ్రాజ్య సభాపరిషత్తును పరికించారు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. తిమ్మరుసులవారేం చెప్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు.
‘‘నాపై మోపబడిన అభియోగాన్ని ప్రభువువిశ్వసిస్తే నేను చెప్పవలసినదేమీ లేదు.’’
తిమ్మరుసు గొంతులో రాయలపైన ప్రేమాభిమానాలు చెక్కుచెదరలేదు. రాయలు తలెత్తి తిమ్మరుకేసి ఓసారి చూసిఉంటే విజయనగర సామ్రాజ్య భవిష్యత్తు మరోలా ఉండేది.
‘‘రాజవైద్యులను ప్రవేశపెట్టండి’’ న్యాయాధికారి ఆజ్ఞతో రాజవైద్యులు వచ్చారు. గడగడ వణుకుతున్నారు. వీరేంద్రుని వైపు చూశారు. అతని బెదిరింపు కనుసైగతోనే!
‘‘ఏమీ భయం లేదు.జరిగింది చెప్పండి. ఈ సాళువ తిమ్మరుసు రాకుమారునికి విషప్రయోగం చేయమని మీకు చెప్పాడా?’’ ప్రధాన న్యాయాధికారి ప్రశ్న.
‘‘అవును. వైద్యం పేరిట రాకుమారునికి విషప్రయోగాన్ని చేయమన్నారు.’’
‘‘ఎవరు?’’ గద్దించాడు న్యాయాధికారి.
‘‘మ…మ… మహామంత్రిగారే!’’ తిమ్మరుసు వైపు చూపించారు.
సభయావత్తూ శిలలా అయిపోయింది. తిమ్మరుసు మ్రాన్పడిపోయాడు. వీరేంద్రుడు పైకి ఆశ్చర్యం నటిస్తున్నా లోలోపల ఎంతో సంతోషిస్తున్నాడు.
అన్నపూర్ణాదేవి స్పృహ తప్పి పడిపోయింది. తిమ్మరుసు చూపు రాజవైద్యుల నుంచి వీరేంద్రుని మీదికి మరలి ఆగిపోయిందో క్షణం. ఆ తర్వాత ఆయన చూపు శ్రీకృష్ణ దేవరాయల మీద నిలిచింది.
ఈ చక్రవర్తి తన రాయలేనా? విధి ఎంత విచిత్రమైనది! ఆనాడు ఈ రాయలను మహారాజు చంపమంటే చంపలేదు. రక్షించి సింహాసనమెక్కించి విశాల సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. రాజ్యమే కావాలనుకుంటే ఆనాడు తనను అడ్డుకునేవారెవరు? ఆరేళ్ళ పసివాడిని బలిగొనేంత కసాయివాడా తిమ్మరుసు? ఈ నింద పడటంకన్నా దీనిని రాయలు అంగీకరించటమే నరకంగా ఉంది. వీరేంద్రా! నీ పన్నాగం సఫలమయిందని సంతోషిస్తున్నావా! విజయనగర సామ్రాజ్యలక్ష్మి వైభవం మసకబారుతోందా! ఇంతకాలం తాను వేయికళ్ళతో కాపాడుకుంటూ వస్తున్న తన రాయల చుట్టూ ఏదైనా ముళ్ళకంచె పడిరదా!
ఆవేదన, ఆందోళనలతో ఆ వృద్ధమంత్రి పరితపిస్తున్నాడు. తనమీద మోపబడిన నిందకన్నా సామ్రాజ్య రక్షణకు సంబంధించిన ఆవేదనే ఆయనలో ఎక్కువగా ఉప్పొంగుతున్నది.
ప్రధాన న్యాయమూర్తి తిమ్మరుసు మంత్రికి ఇలా వివరించాడు`
‘‘విజయనగర సామ్రాజ్య నిర్మాతగా ఈ రాజ్యం మిమ్ములను ఆప్తుడిగా భావించింది. ప్రభువులు తండ్రిసమంగా ఆదరించారు. నలభై ఏళ్ళు ఈ రాజ్యానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. అయినా ప్రభువులు ఈ సందర్భంలో మీకు కృతజ్ఞత చూపించనవసరం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యంలో గతంలో మీరు మీ బాధ్యతను పూర్తిగా నెరవేర్చలేదు. ఆనాడు మహారాజుగా
ఉన్న ప్రభువు సోదరుడు మహారాజుగారి కళ్ళు పీకించమని మీకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను మీరు నెరవేర్చక వారిని మోసగించి మేక కన్నులు చూపి ద్రోహం చేశారు. ఇప్పుడు రాకుమారుని విషప్రయోగం చేసి చంపించటం వల్ల మళ్ళా రాజద్రోహిగా నిలిచారు.’’
మళ్ళీ సభనుద్దేశించి ‘‘ఈ సాళువ తిమ్మరుసు బ్రాహ్మణుడు కాబట్టి మరణశిక్ష విధించలేము. ఈ నేరానికి శిక్ష వీరి రెండు కళ్ళు పొడిచేయటమే!’’ తీర్పు ముగించి ప్రధాన న్యాయమూర్తి మహారాజుకేసి నిస్సహాయంగా చూశాడు.
శ్రీకృష్ణదేవరాయలు తలదించుకుని కనుకొలకుల్లో ఊరుతున్న చెమ్మని కొనగోటితో విదిలించారు. తన కళ్ళు పీకకుండా కాపాడి చక్రవర్తిని చేసిన అప్పాజీకి తానిచ్చే బహుమానం ఆయన కళ్ళు పొడిపించటమా! హా దైవమా! నాకెందుకీ శిక్ష విధించావు?
రాయలు మూగవ్యధతో తీర్పును ఆమోదిస్తున్న సూచన ఇచ్చారు.
‘‘మరో రెండునాళ్ళకు సూర్యోదయానికి ఈ సాళువ తిమ్మరుసు కళ్ళు పొడిచే శిక్ష అమలు చేయమని ప్రభువుల ఆజ్ఞ’’ ప్రధాన న్యాయాధికారి చివరిగా వినిపించాడు.
తిమ్మరుసు హతాశుడైపోయారు. గోవిందరాయల కళ్ళు ఎరుపెక్కినై అతనేనాడో తిరుగుబాటు ప్రకటించేవాడు. కానీ తిమ్మరుసు వల్లే ఆగిపోయాడు.
శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం మీద అద్భుత వైభవంగా విరాజిల్లుతున్న ఆ దృశ్యాన్ని, ఆపాదమస్తకం రాయలమూర్తిని కళ్ళారా, మనసారా నిండుగా చూసుకున్నారు అప్పాజీ. కన్నీటి తెర కమ్ముకుంది. రాయల రూపం మసకబారింది. ఇంతలో రాజభటులు వచ్చి తిమ్మరుసును కారాగారానికి తీసుకెళ్తుండగా ప్రభువు పరితాపంతో దిగ్గున లేచి సౌధాంతరాళంలోకి నిష్క్రమించారు.
సభ అంతటా కలకలం.
‘‘ద్రోహం…అన్యాయం’’అరిచారెవరో! అంతటాఅదే నినాదాలు. వెళ్తున్న తిమ్మరుసు ఆగి వెనుదిరిగాడు. చేతులు జోడిరచి సభకు వందనం చేసి ఇలా అన్నారు.
‘‘అయ్యా! మీ అందరికీ శతాధిóక వందనాలు. విధి బలీయం. విజయనగర సామ్రాజ్య పరిరక్షణకు ఇంతకాలం మీరందించిన సేవలు, త్యాగాలు అనుపమానాలు. దయచేసి ఇకమీదట కూడా ఇదేవిధంగా మహాసామ్రాజ్య భారాన్ని వహించండి. ఇదే నా కడసారి ప్రార్థన’’ తిమ్మరుసు భటుల వెంట వెళ్ళిపోతుంటే సభ యావత్తూ కన్నీరు మున్నీరుగా అయింది.
రాజరికం ఇచ్చిన ఫలం ఇదా! అంతటి మహామంత్రికే ఈ గతిపడితే తమలాంటివారి గతి ఏమిటి? ఏ విషకీటకం ప్రభువు మెదడులో జొరబడిరది? తమలో తాము గుసగుసలాడుకుంటున్న ఆ సభలో వీరేంద్రుడు మీసం మెలేయటం చంద్రప్పకు అసహనీయంగా ఉంది.

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నీవెక్కడ నేనెక్కడ!!

by ChittiProlu Venkata Ratnam March 31, 2024
written by ChittiProlu Venkata Ratnam

నా జీవన మాధుర్యం నీవు
నీ మనుగడ లోని చేదు నేను

నా అశాంతి కుపశాంతివి నీవు
నీ హృదయాని కశాంతిని నేను

నా అలపున విశ్రాంతివి నీవు
నీకొక తీరని అలసట నేను

నను నిమిరే అతిమృదులత నీవు
నేను కసిరే మతికఠినత నేను

తల్లివి, చెల్లివి, మల్లివి నీవు
కల్లను, పొల్లును, డొల్లను నేను

నా స్వేచ్ఛకు చలనానివి నీవు
నిను కట్టే శృంఖలాన్ని నేను

దీనమైన ధీరురాలు నీవు
ధీమాగల దీనుణ్ణి నేను

నా కాలంబన బలిమివి నీవు
నీ కాలంబన భంగిమ నేను

నను నిలిపిన మహాకరుణ నీవు
నిను నలిపిన మృషాచరిత నేను

కాలం ప్రేమకు పాత్రవు నీవు
కాల క్రుద్ధనేత్రాన్ని నేను

మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా

ప్రథితోన్నత హిమశైలం నీవు
వట్టిరాళ్ల చిరుగుట్టను నేను

తలెత్తి చూసేందుకసలు తరం గాని ఎత్తు నీవు
చూడలేక నీ తల వేలాడించే జిత్తు నేను

మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా
 

March 31, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నాకుకవిత్వం ఆసరాఎందుకు అయిందంటే..

by Y. Sujatha March 31, 2024
written by Y. Sujatha

కష్టాల్ని కళ్ళారా చూసి
నష్టాల్ని నిలువెల్లా భరించాను!
ఆకల్ని తనివితీరా రుచిచూసి
కన్నీళ్ళను
గుండె నిండా దిగమింగాను !
మోసాలకు అడుగడుగునా గురై
నిట్టూర్పుల్ని
శ్వాస నిండా విడిచాను !
జీవితంలోపూర్తిగా విఫలమై
మనసు వికలమై నిలువెల్లా
ఆహుతైయ్యాను!
అణచివేతకు
అణువణువునా గురై
వివక్షతను అనుక్షణం
ఎదుర్కొన్నాను !
మిత్ర ద్రోహాలకు
నిష్కారణంగా బలై
శతృ కుట్రలకు కుప్పకూలాను !
స్నేహితులకన్నా
శత్రువులెక్కువయ్యారు
హితులకన్నా హింసించేవారెక్కువయ్యారు!
విజయాలకన్నా
అపజయాలెక్కువయ్యాయి
అభిమానాలకన్నా
అవమానాలెక్కువయ్యాయి!

ఆకర్షణ, వికర్షణ
ఘర్షణ, సంఘర్షణ
అనుభూతులు, అనుభవాలు
ఎదలో గూడు కట్టాయి
ప్రభవించిన అక్షరాలు
కలంలో సిరా అయ్యాయి!

ప్రాణమై కదిలింది కవిత్వం
ఊపిరై ఎగిసింది అనునిత్యం!

ఈ కవితే సత్యం
సజీవ సాక్ష్యం !

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఎలనాగ : ఓ సాహితీప్రభంజనం

by Radhika Suri March 31, 2024
written by Radhika Suri

ఎలనాగ సాహితీ ప్రియులకు చిరపరిచితమైన పేరు .పుట్టిన ఊరు లోని సగం, ఇంటి పేరులోని సగాన్ని తీసుకొని ‘ఎలనాగ’ కలం పేరుగా చేసుకుని సాహితీ వినీలాకాశంలో ధ్రువతారలా ప్రకాశిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. వృత్తి ధన్వంతరీతత్వం, ప్రవృత్తి సాహితీ సేద్యం, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన అక్షర కృషీవలుడు.

      కరీంనగర్ కు కూతవేటు దూరంలోని ఎలగందుల వీరి జన్మస్థానం .తల్లిదండ్రులు నాగరాజు తిరుమలయ్య ,రంగమ్మ గార్లు. వీరి అన్నయ్య శ్రీ నాగరాజు రామస్వామి ప్రముఖ సాహితీవేత్త కాగా తమ్ముడు డాక్టర్ నాగరాజు రవీందర్ సంస్కృతం, పద్య రచనల్లో దిట్ట.

        ఎలనాగ గారు వైద్య విద్యను అభ్యసించి, కొంతకాలం నైజీరియా లో ఉద్యోగం చేసి, ఇండియా  తిరిగి వచ్చి వైద్య విధానపరిషత్తు లో వివిధ స్థాయిల లో బాధ్యతలు నిర్వర్తించి రాష్ట్ర స్థాయి అధికారిగా పదవీవిరమణ చేసారు.

            పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుడి అక్షరసత్యం అంటూ బాల్యంలోనే అబ్బిన  కవన సురభిళానికి ప్రతీకగా కరీంనగర్ నుండి వెలువడ్డ ‘గౌతమి’ పత్రికలో వీరి తొలి కవిత ప్రచురితమైంది. మెడిసిన్ అభ్యసించే సమయంలో భారతి, కృష్ణా పత్రిక ,స్రవంతి, ఆంధ్ర ప్రభ,తరుణ  పొలికేక, విపుల మొదలైన పత్రికల్లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి.   అప్పటినుండి వెనుతిరిగిచూడకుండా సాహిత్యంలో కృషి చేస్తూనే ఉన్నారు. నైజీరియాలో వైద్యుడిగా సేవలు అందిస్తూనే తీరిక వేళల్లో ఆంగ్ల సాహిత్యాన్ని ఎక్కువగా చదివి పట్టు సాధించారు. ఆంగ్ల పదాలకు అర్ధాలు వెతికే పనిలో  డిక్షనరీకి ఎంతో సమయాన్ని కేటాయించి  మరీ చదివేవారు. సోమర్సెట్ మామ్ రచనలను చదివి ప్రభావితమయ్యానని చెప్పే వీరు  ‘The Alien Corn ‘ నవలికను తెలుగులో ‘కలుపుమొక్క’ గా అనువదించారు. ఇది 2005లో అచ్చయింది. అప్పటివరకు చేసిన రచనలన్నీ నాగరాజు సురేంద్ర పేరుతో చేసినవి కాగా 2009 నుండి’ ఎలనాగ’ కలం పేరుతో రాయడం మొదలెట్టారు.    

         ఎన్నో ప్రక్రియల్ని సృజించినా కవిత్వం, అనువాదాలను ఎక్కువగా ఇష్టపడతానంటారు. వచనం రాయడంలో నైపుణ్యం ,ఆకర్షణీయత రెండు ప్రధానమంటారు. అనువాదం ఓ ‘గొప్ప కళ’ దాన్ని తపస్సులా భావించి సాధన చేయాలి. మూల భాష ,లక్ష్య భాషలపై సరైన పట్టుండాలని, పొందికైన పదాలకు భావ సౌందర్యం తోడైతే రచన అందమైన ఆకృతిదాలుస్తుందని వీరి అభిప్రాయం .తెలుగు ఇంగ్లీష్ భాషల్లో సమానమైన పట్టు ఉండడంతో తెలుగు నుండి ఆంగ్లంలోకి ఆంగ్లం నుండి తెలుగులోకి ఎన్నో పుస్తకాలు అనువదించారు .

        వచనాన్ని అనువదించడం సులభమని కొందరి అభిప్రాయం, నాకైతే కవిత్వానువాదమే సులభతరమని అనిపిస్తుంది. బహుశా కవిని కావడమే కారణమేమో అంటారు. అనువాద రచనల్లో స్వేచ్ఛ తక్కువే కానీ ఇరు ప్రాంతాల సంస్కృతీసాంప్రదాయాలు  ఒకరివొకరికి చేరు వౌతాయనేది వీరి భావన .ఆ ప్రాంత ప్రజల శైలి ,నైపుణ్యాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందంటారు. అనువాద రచనలు చాలా తక్కువ. తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువాదాలు చాలా తక్కువ జరిగాయి. ప్రోత్సాహలేమి ప్రధాన కారణమని పేర్కొన్నారు. జాతీయాలకు ఆంగ్ల పదాలు దొరకవు ,అటువంటి సందర్భాల్లో ఆ పరదాలను ఆంగ్లంలో పెట్టి,  క్రింద ఫుట్ నోట్స్ లో వివరిస్తానంటారు. ఉదాహరణ : బొడ్రాయి బతుకమ్మ మొదలైనవి.

  కాళోజీ ,దాశరథి ,వట్టికోట ఆళ్వారు స్వామి ,అమ్మంగి వేణుగోపాల్ గార్ల రచనల్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. వీరు తమ పుస్తకాలకు పెట్టే శీర్షికల్లో ఎంతో భావ సౌందర్యం కనిపిస్తుంది.

‘నుడి క్రీడ ‘గళ్ళ నుడికట్టుకు ఎంతోమంది ప్రభావితులయ్యారు. ఒక ప్రముఖ పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థుల కోసం కొన్ని పుస్తకాలను తెప్పించి వారి తెలివికి పదునుపెట్టించారు అనడంలో అతిశయం లేదు.     శాస్త్రీయ సంగీతం పై మక్కువ, అవగాహనలతో శాస్త్రీయ సంగీతంపై 28 కవితలు,

సంగీతజ్ఞులపై 33 వ్యాసాలతో Memorable Melody Makers and Other Poems on Music అనే గ్రంథాన్ని రాశారు. ఇది కాకుండా అదనంగా సంగీతం మీద సంగీత విద్వాంసుల మీద తెలుగులో ఎన్నో కవితలు, వ్యాసాలు రాశారు.

    వీరి మొదటి ప్రచురణాసంకలనం ‘వాగంకురాలు’ . తెలుగులో 16 స్వతంత్ర రచనలు, ఆంగ్లంలో 2 స్వతంత్ర రచనలు,ఇంగ్లీషు -తెలుగు అనువాదాలు -10, తెలుగు-ఇంగ్లీషు అనువాదాలు- 9 చేశారు, మొత్తం 37 పుస్తకాలు వెలువరించారు.

 ఆంగ్లంలో రచించిన ‘Dazzlers’ కవితా సంపుటిని ,Kolkata Literary Carnival లో ‘ఉకియోటో’ సంస్థ ప్రచురించి ‘,poet of the year 2023 ‘అంతర్జాతీయ పురస్కారం  అందించడమే కాకుండా ఏడు ప్రపంచ భాషల్లోకి  అనువదించారు.

( ఫ్రెంచ్  ,చైనీస్, జర్మన్,టర్కిష్ ,రష్యన్, స్పానిష్,జాపనీస్ ) వీరి పుస్తకాన్ని 70 దేశాలకు పంపుతుందీసంస్థ.

       సరైన  పదాల అన్వేషణ ఓ తపస్సు లాంటిది .ఒక్కోసారి పదాల పొందిక ,అర్థాలకై నెలల తరబడి వెతుకులాడిన సందర్భాలు ఉన్నాయంటారు.  కేంద్ర సాహిత్య అకాడమీ కి చేసిన అనువాదాలు రెండే , మొదటిది పవన్. కె. వర్మ రాసిన Galib : The Man, The Times.గాలిబ్ : నాటి కాలం, కాగా రెండవది సైరన్ మిస్త్రి  రాసిన ‘Chronicle of corps bearer ‘ ‘శవాలు మోసే వాడి కథ’ . మూడవది ప్రచురణ దిశగా సాగుతోంది . గాలిబ్ – నాటి కాలం పుస్తకానికి (అనువాదంలో) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆ కాలపు సామాజిక ,రాజకీయాంశాలు గాలిబ్ ఆయన రాజకీయ, జీవిత విశేషాలు ,రచనా వ్యాసంగాల ఒడిదొడుకుల నేపథ్యంతో సాగే రచన ఇది. దీనిని పవన్ కె. వర్మ .ఆంగ్లంలో రచించారు.

    ‘మోర్సింగ్ మీద మాల్కౌస్ రాగం ‘ ఇది కొత్త రకం ప్రక్రియ. అచ్చం వచన కవితలా కనిపించే ఛందోబద్ధ పద్యాలుంటాయి.

పన్ ( pun) నీటి జల్లు :  శ్లేషాత్మక వాక్యాలు.

మేధామథనం : ప్రామాణిక గళ్ళ నుడికట్టు ,ఆధారాలు (వాక్యాలు) గ్రిడ్  (గడులు) లేకుండా రూపొందించారు.

19 శతాబ్దంలో పుట్టి ఫ్రాన్స్ లో ప్రాచుర్యం పొందిన’ పేరాగ్రాఫ్’ కవితా ప్రక్రియ, తెలుగులో రాసేవాళ్ళు అంతగా లేరని ఈ కవితారూపాన్ని ఎక్కువగా రాసి పాపులర్ చేశానంటారు . ‘Tempest Of Time ‘ పేరుతో కొండపల్లి నీహారిణి గారి

‘కాల ప్రభంజనం’ కవితా సంపుటిని 2022 లో ఆంగ్లంలోకి అనువదించారు.

       పాశ్చాత్తా సాహిత్యంలో శిల్ప సౌందర్యం అద్భుతం అంటూ ,లాటిన్ అమెరికా కథలు చదివేటప్పుడు నిజమనే భ్రాంతికి లోనవుతామన్నారు.

    వారి రచనల్లో కొన్ని పంక్తులు: పద్యపు మొక్కను పెంచుతుంటే విశేషణాల మిడతలు

గుంపులుగా వచ్చి వాలుతాయి వాటిని పారద్రోలకలపోతే

 పద్యపు మొక్కకు పచ్చదనం చేకూరదు –  అని చెప్పే వారిలో, చదువరులకు ఓ అక్షర హాలికుడు మనసులో మెదలక మానడు. సేద్యం చేసే రైతు ఎంత ఎరుకలో ఉండి సాగు చేస్తాడో అలాగే ఈయన కవన సేద్యం కూడా అంతే జాగరూకతతో చేస్తాడు.

ఇక వీరి జ్ఞాపకాలదొంతర  తిరిగేసినప్పుడు:

 పదవ తరగతిలో తెలుగు మాస్టారు రాజ శర్మ గారు శ్రీనాథునిపై వ్యాసం రాయమనగా పుస్తకంలోని కొన్ని పేరాల్లోని విషయాల్ని తీసుకుని సమాస భూయిష్టంగా రాయగా వారు మెచ్చుకొని ,అన్ని తరగతులు తిరిగి చదివి విద్యార్థులకు వినిపించారని చెప్తారు.

          ఇంకో సందర్భంలో సినారె అధ్యక్షతన వేములవాడలో జరిగిన కవి సమ్మేళనంలో ప్రౌఢభాషలో రాసిన ‘తారావిలాసం’ కవితను సమయాభావం వల్ల గబగబా  చదవడంతో చివరగా సినారె మెచ్చుకుంటూ , ఇదే కవిత నేను గాని చదివి ఉంటే సభ కరతాళ ధ్వనులతో మార్మోగేదని కితాబిచ్చారు అని అంటారు.    

        1975లో ఆకాశవాణి కవి సమ్మేళనంలో చదివిన కవిత విని భుజం తట్టి ,బాబూ ఇలాగే రాస్తూ ఉండండి అంటూ సీనియర్ దాశరథి గారు మెచ్చుకోవడం గుర్తు చేస్తారు.

       ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు సామల సదాశివ మాస్టారు గారి సాంగత్యం ఎంతో స్ఫూర్తిదాయకమని  అప్పుడే సంగీతంపై మరింత ఆసక్తి కలిగిందని ఇలా ఎన్నో మధుర  జ్ఞాపకాలని   గుర్తు చేసుకుంటారు. 

     గాలిబ్  – నాటి కాలం  లోని కొన్ని పంక్తులు:

‘ నేను సలిపే సమరం పంజరంలో కూడా పుల్లలతో గూడుకట్టుకునే పక్షుల పోరాటం లాంటిది’ అంటాడు ‘ఓ నా హృదయమా దుఃఖ గీతాన్ని సైతం ఉపశమనముగా భావించు లేని పక్షంలో ఈ శరీరం ఎక్కడో ఒకనాడు ఇంద్రియ జ్ఞానం లేకుండా మొద్దుబారిపోతుంది ‘ అంటూ – సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించమంటూ చేసే హితబోధ కనిపిస్తుంది .

కాశీలోని ధూళి స్వర్గపు కనుబొమల నడుమ కమనీయంగా మెరిసే సిందూరపు బొట్టు.. అంటూ

 కాశి క్షేత్ర వైభవాన్ని హృద్యంగా వర్ణించారు.

“ఈ ధనస్సులో బాణం లేదు

ఏ వేటగాడు వేట పనిలో లేడు

ఈ బంది ఖానా బతుకులో అంతటి సౌకర్యం ఉంది “

“ఓ గాలిబ్ నావ తీరానికి చేరినప్పుడు

నావికుని అధర్మం గురించి ఫిర్యాదు ఎందుకు

అంటూ తన శారీరక రుగ్మతలతో విసిగి అసంతృప్తిలో హృదయ వేదనను వెల్లడించే క్రమంలోని హృదయ ఘోష.

      ఇలా ఓ కవి హృదయాన్ని సరైన రీతిలో ఆవిష్కరించడం మరోకవికే  సాధ్యమౌతుందనేది అక్షరసత్యం.

  స్థానికంగా తగిన ప్రోత్సాహం లభించలేదనేవీరు, ఆంధ్రప్రదేశ్ నుండివచ్చిన పురస్కారాలే ఎక్కువంటారు.

 వీరిని వరించిన పురస్కారాలు :

     1. Ukiyoto’s Poet of the year Award – 2023

      2. సోమ సుందరం పురస్కారం

       3. అద్దేపల్లి పురస్కారం

        4. జింక నాగరాజు పురస్కారం 

        (  అనువాదాలకు)

         5. తెలుగు విశ్వవిద్యాలయం

            వారి కీర్తి పురస్కారం   

              (అనువాదాలకు )

       6. విశ్వ సాహితీ వారి

      పురస్కారం       

      7.  గిడుగు రామ్మూర్తి పంతులు

           పురస్కారం

       8.నెలవంక – నెమలీక  వారి              

 కలహంస పురస్కారం   ( రెండేండ్లు వరుసగా)

 9. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం వారి పురస్కారం.

భావోద్వేగం ఎక్కువైనప్పుడే మంచి కవితలు తన్నుకువస్తాయంటారు .తెలుగులో కవిత్వం రాయడం తగ్గించి ఆంగ్ల సాహిత్యం లోనే రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పిన వీరు, మరీ భావోద్వేగం ఎక్కువైనప్పుడు తెలుగులో తప్పకుండా రాస్తానని చెప్పారు .వాసి గల కవిత్వం రాసే కొద్ది మంది కవుల కోసం ఫేస్బుక్ చూస్తానంటూ చెప్తారు.

     కవిగా, రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ఇన్ని ప్రక్రియల్లో చేసిన నిరంతర సాధనే వారిని కేంద్ర సాహిత్య అకాడమీ పీఠంపై ఆసీనుడిని చేసిందనడంలో అతిశయోక్తి లేదు .వారు మరిన్ని మంచి రచనలు చేస్తూ, మరెన్నో పురస్కారాలు అందుకుంటూ, సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేయాలని ఆకాంక్షిస్తూ …

        అక్షరాభివాదం

విరించి కలానికి భారతి

పాళీని కూర్చగా

సారస్వత క్షేత్రంలో ఉదయించిన తెలుగు తేజం

సృజన పర్వతపు అధిరోహణ మెళకువల్ని ఆపోశన  పట్టి

అక్షర శిల్పాలకు మెరుగులద్ది  సుందరాకృతినిచ్చిన సాహితీశిల్పి

 స్వర ఝరులలోని సారాన్ని గ్రోలి నేర్పుతో సాహితీ సుసేద్యంలో అంకురార్పణ చేసిన అక్షర కృషీవలుడు

స్పృశించే అంశానికి

సృజనాత్మకత చేర్చి

 అందంగా మలచిన  శిల్పాలెన్నో !

పద కవిత మొదలు పద్య

 కవిత వరకు

ప్రక్రియలు ఎన్నింటనో

పరకాయ ప్రవేశం చేసిన

 భాషా సాహసికుడు

అనువాద కళకు

అక్షర సొబగులద్ది

 భాషాభిమానాన్ని విశ్వవ్యాప్తం చేసిన సాహితీ వైతాళికుడు

 వృత్తి ధన్వంతరీతత్వం

ప్రవృత్తి సాహితీమూర్తిమత్వం

సాహిత్య ‘గురుకులం’లో నిత్య పరిశోధకుడు

 వాగాడంబరమెరుగని

నిరాడంబర భాష్యకారుడు

( పితృసమానులైన ఎలనాగ గారికి                                

        చిరు కవితాసుమగుచ్ఛం)

March 31, 2024 1 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అవిశ్రాంత సాహిత్య సృజనశీలి పెన్నా

by Dr. T Shyamala devi March 30, 2024
written by Dr. T Shyamala devi

(తెలంగాణా ప్రభుత్వం చేత ”కాళోజీ అవార్డు (2021)” అందుకున్న డా. పెన్నా శివరామకృష్ణ)

అతి సాధారణమైన వేషధారణ, చురుకైన చూపు, నిత్యచైతన్యశీలి, అలుపెరుగని సాహిత్య సృజనకారులు, తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో ప్రయోగాలు చేసిన నిజమైన ప్రయోక్త. అతడే పెన్నా శివరామకృష్ణశర్మ. సాహితీ సృజనకారులకు, విమర్శకులకు తెలుగు సాహిత్యలోకంలో సుపరిచితమైన పేరు. వారు నల్గొండలో సహాధ్యాయి కావడం వలన, కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, వచన కవిత్వం, (తెలుగు) గజళ్ళు, రుబాయీలు, హైకూలు, విమర్శ గ్రంథాలు సమాంతరంగా సృష్టించి తెలుగు సాహిత్యంలో తనదైన స్థానాన్ని పరచుకున్న తెలంగాణా కవి శ్రీ పెన్నాగారు. నిరంతర చదువరి, సమసమాజాన్ని చాలా లోతుగా పరిశీలించి, వాచ్యంగా కాకుండా వ్యంగ్యంగా, ధ్వనిపూర్వకంగా విషయాలను వచన కవిత్వం ద్వారా తెలిపిన కవి. ఛంథ్శాస్త్రంలో, ఆలంకారిక శాస్త్రంలో నిష్ణాతులు, ఆంగ్ల, ఉర్దు సాహిత్య పరిచయం ఉన్నవారు.

అలల పడవలమీద, నిశ్శబ్దం నా మాతృక మొబబన కవితా సంపుటాలు వచన కవిత్వానికి గీటురాళ్ళుగా నిలుస్తాయి. దీపఖడ్గం కవితా సంపుటి వారి కవితా మాధుర్యానికి నిదర్శనాలు. రహస్య ద్వారం, దేశదేశాల హైకు – అన్న హైకూ ప్రక్రియా సామర్థ్యానికి ప్రతీకలు. ఆ తరువాత ఈనాడు హైకూలు రాస్తున్న కవులకు మార్గదర్శకులయ్యారు.

సాహిత్య విమర్శ ఎంతో ఇష్టంగా వారు ఎంచుకునే ప్రక్రియ. డిగ్రీ చదివే నాటికే ప్రాచీన సాహిత్యంతో పాటు, ఆధునిక సాహిత్యాన్ని ఆసాంతం చదివారు. శేషేంద్ర, ఆరుద్ర, శ్రీశ్రీ, సినారే, శివారెడ్డిల కవిత్వాలను, వ్యక్తిత్వాలను చదివినవారు. వారు శేషేంద్ర కవిత్వానుశీలనం’ పేరుతో పరిశోధన గ్రంథాన్ని వెలువరించారు. రచనలద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. సినారే కవిత్వాన్ని, శివారెడ్డి కవిత్వాన్ని తన ఆలోచనాలోచనలతో పరిశీలించారు.

ఈ మధ్య 2017, 2020లలో గోరటి వెంకన్న కవితా పరామర్శ, ఎన్‌. గోపీ తత్త్వవివేచన అనే సాహిత్య విమర్శను వెలయించారు. వచన కవిత – ఆలంకారికలు (2018లో) వచన కవిత్వంలో పదచిత్రాలు, భావచిత్రాలు సాధారణంగా చెప్తారు. కానీ ఆలంకారికత గురించి విశ్లేషించడం పెన్నా పెన్ను విశేషం.

అలాగే సినారే విశ్వంభరలో ఆర్థయుక్తిని విశ్లేషించారు. గోరటి వెంకన్న గేయాల్లో సాహిత్యాన్ని లోకానికి చూపించారు.

వీటన్నింటికీ వేరవుతూ, కొన్ని ప్రక్రియలు విలక్షణంగా చేపట్టి కృతకృత్యులయ్యారు పెన్నా. వాటిలో ఉర్దూ మూలంగా తెలుగు భాషలోకి దాశరథి, సినారే వలన తెలుగులో కాలూనిన గజల్‌, రుబాయీ. వీటిని ఉర్దూ భాషా మాధుర్యాన్ని ఛందస్సు రీత్యా పూర్తిగా తెలుగులోకి తీసుకొచ్చిన కవి పెన్నా. గజళ్ళలో సల్లాపం, శిశిరవల్లకి కవిత్వం మనసుకు హత్తుకుంటాయి.

గజల్‌ కి ఒక ప్రత్యేకమైన ఛందస్సు, భావం, పదజాలం ఉంటాయి. ఇవన్నీ బాగా అవగాహన చేసుకుని, గజల్‌ ప్రక్రియని ఫలవంతం చేశారు. గజళ్ళు, రుబాయీలు విషయంలో ఏమైనా సందేహాలున్నప్పుడు వారి గురువులైన నోముల సత్యనారాయణ, సామల సదాశివ గార్లతో సంప్రదించి, రచనలు చేశారు.

ఈ షేర్‌ చూడండి-

ఎపుడూ కొనగోటనైన మీటబోకు నాతనువు,

అణువణువున నీపేరే మారుమోగిపోతుంది.         (29) ”సల్లాపం”

ప్రియుడు ఏకపక్షంగా ప్రియురాలి గురించి విరహంతో, తన ప్రేమను అద్భుతంగా తెలియచేయడమే.

గజల్‌. అదే మార్గంలోనే వారి గజల్‌ రచన సాగుతుంది.

‘నవ్వబోకు నా చెలియా’ నా వయసు ఆగిపోతుంది.

నీ నవ్వు ననుకరించాలని ఏరు ఆగిపోతుంది’.   అని అద్భుతంగా షేర్‌ రాసారు.

”శిశిర పల్లకి” నుండి మరొక షేర్‌

‘నిన్ను మరచిన నన్ను మరచుటె అనుచు తానే పలికెను

నను మరచిపొమ్మని తేలికగ’నే చెప్పివెళ్ళెను ప్రేమతో

నిను మరచిన నన్ను మరచినట్లే అన్న ప్రేయసి, మరచిపొమ్మని తనను తేలికగా చెప్పి వెళ్ళిందట. గజల్‌ కి చమత్కారం ప్రధానం, ఇలాంటి చమత్కారాలు వారి ఎన్నో షేర్లలో కన్పిస్తాయి.

‘ఆశ్రువంటే ఆణిముత్యమె, విలువ ఎరిగిన మంచిది.

ఒక్క బిందువు కూడ రెప్పను దాటనీయకు మిత్రమా!’

కన్నీటి కుండను గుండెలోనే దాచుకోమంటున్నాడు కవి. గజళ్ళలో అశ్రువు అనే పదం పలుమార్లు వస్తుంది.

ఇక రుబాయీల విషయానికి వస్తే, తెలంగాణా రుబాయీలు, అశ్రుధార రెండు ఉన్నాయి. తెలంగాణా ఉద్యమం ఊపందుకున్న సమయంలో రాసినది తెలంగాణా రుబాయీలు, అవి ఆ కాలానికి సరిపోయేవే. ”ఆశ్రుధార” 2021లో వచ్చిన రుబాయీల కవిత్వ పుస్తకం. ఇది కవిత్వపరంగా, రుబాయీ, లక్షణ పరంగా, భావపరంగా అద్భుతమైనది. ఇవి కాక గజళ్ళు, రుబాయీల పై లక్షణ గ్రంథాలనదగిన ”తెలుగు గజళ్ళు-రుబాయీలు, గజల్‌ సౌందర్యదర్శనం” కూడా గజళ్ళు, రుబాయీలు నేర్చుకునే వారికి మార్గదర్శక గ్రంథాలు, అశ్రుధార నుండి ఒక రుబాయీ.

”కనిపించే గాయమైతే తడమకనే తెలిసేది!

లోలోపల వేదన ఒక తలగడకే తెలిసేది!

అవ్యక్తపు ఆర్తులన్ని చితిదాకా అనాథలే!

సాంధ్య ఘోష అంతా ఒక పడమరకే తెలిసేది!”

మరొక రుబాయిలో చివరి రెండు పాదాలు

”కడదాకా అశ్రు అగ్ని గర్భ అక్షరమే!

భగ్నహృదయ శకలాలకు కడతీరం అయినది”

ఇలా విషాద మాధుర్యాన్ని రుబాయీల్లో ఒలకబోసారు.

ఇక ఎన్‌ గోపి కవితా తత్త్వవివేచన విమర్శ గ్రంథంవైపు చూస్తే. ప్రతి ఒక్క కవి మీదా పెన్నాగారికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కనిపిస్తుంది. ఇది దానికి నిదర్శనం.

‘పాఠకుడు భావుకుడు.

కాలటం తెలిసిన కట్టెలాంటివాడు.

కరగడం తెలిసిన వెన్నలాంటి వాడు!

నేను రాసిన కవిత సగమే!

అతనికి అందినపుడే అది సంపూర్ణ కవిత!” – అంటారు గోపీ గారు.

దానికి పెన్నాగారి విమర్శ – ”కాలటం తెలిసిన కట్టెలాంటివాడు పాఠకుడు అని చెప్పడం భరతుని నిర్వచనాన్ని గుర్తుచేస్తాయి. ”యో ఆర్థో హృదయ సంవాదీ తస్య భావో రసోద్భవః| శరీరం వ్యాప్యతే తేన శుష్యం కాష్ట మివాగ్నినా” భరతుడు రసానుభవాన్ని ఎండుకటైకు అగ్ని వ్యాపించడంతో పోల్చాడు. ”కాలటం తెలియడం” లోనే భావుకత్వమూ, కావ్యానుశీలనానుభవమూ ఇమిడి ఉన్నాయి. అని తీర్మానిస్తారు పెన్నా నవ్యంగా చెప్పారు.

గోపీ అంటారు –

”కవి కావడంలో సుఖం లేదు.

అది నిత్యారుణమైన గుండెకోత” – అంటారు గోపి. దీనిని సాదరంగా ఆహ్వానిస్తారు పెన్నా, ఏదైనా గోపీ ఆశావాది అని, ప్రగతిశీల మానవతావాది, వచన కవిత్వాన్ని కొత్తదారుల్లో నడిపించినవాడు గోపీ యని పెన్నా సద్విమర్శ చేస్తారు.

ఇవే కాకుండా, కవితా సంకలనాలకు సంపాదకులుగా ఉన్నారు. తెలుగువారికే కాకుండా అందరికీ పనికొచ్చేట్లుగా ”రోజు రోజుకో చరిత్ర” ”జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు”, ”తారీఖుల్లో తెలంగాణ” వంటి సాధారణ ప్రజ్ఞకు సంబంధించిన విషయాలతో పుస్తకాలు రాసారు.

కవిత్వం – 12. సాహిత్య విమర్శ – 9. ఇతర రచనలు – 6. సహసంపాదకత్వం – 8. ఇలా వారి సాహిత్య ప్రస్థానం కొనసాగింది. ఇంకా కొనసాగుతుంది.

సాహిత్యంపై నిజమైన ప్రేమతో, నిజాయితీగా, నిబద్ధతతో రచనలు చేసే కొద్దిమంది రచయితల్లో, కవుల్లో డా. పెన్నా శివరామకృష్ణ గారు ఒకరు. ఎన్నో పురస్కారాలు వీరిని వరించాయి. ఇలా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని, ముఖ్యంగా ఆధునిక ప్రక్రియలలో తనదంటూ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ”పెన్నా” తెలంగాణా కవిగా, తెలంగాణా భాషాదినోత్సవం, కాళోజీ జయంతి సందర్భంగా కాళోజీ అవార్డును తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందడం అభినందనీయం.

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నువ్వొక్కడివే ఉంటావు

by ఆచార్య మస‌న‌ March 30, 2024
written by ఆచార్య మస‌న‌

హైదరాబాదులో చదువంటే ఎంతో కష్టం. అద్దె ఇంట్లో ఉండి స్వయంగా వంట చేసుకోవాలి. నేనైతే పది రూపాయలు సంపాదించుకోవాలి. నా అవసరాలు తీర్చుకోవాలి. అద్దె ఇంట్లోను ఒకరిద్దరు మిత్రులతో కలిసుంటే నావంతు అద్దె కూడా తగ్గుతుంది.

ఏదేమైన సిటీలో డిగ్రీ పూర్తి అయ్యేవరుకు ఒక ఇరవై ఇండ్లైనా మార్చి ఉంటాను. ఇంటివారికి కోపం వచ్చినా, మనకు కోపం వచ్చినా ఇల్లు మారవలసిందే కదా!

బొగ్గులకుంట, హనుమాన్‌ టేక్డీ, నారాయణగూడా, గౌలిగూడా, హుస్సేన్‌ ఆలం, గౌపురం, షాలిబండా మొదలైన ప్రాంతాల్లో నీ విద్యార్థి థలో అద్దెకుండడం జరిగింది. వివాహం తర్వాత లాల్‌ దర్వాజలో కొంతకాలం ఉండి 1977లో వారాశిగూడాకు రావడం జరిగింది. అక్కడుండగానే బౌద్ధ నగర్‌ లో ఎనభై గజాల్లో చిన్న ఇల్లు నిర్మించుకొని అందులో ఇరవై ఐదేండ్లున్నాను.

ఇస్లామియా బాయిస్‌ హైస్కూలులో ఆరేండ్ల అధ్యాపక వృత్తికి ఫుల్‌ స్టాప్‌ పెట్టి ప్రగతి మహా విద్యాలయంలో లెక్చరర్‌ గా చేశాను. అక్కడ ఎనిమిదేండ్లు పనిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రవేశించాను.

ప్రగతి మహావిద్యాలయం నుండి నిష్క్రమించినప్పుడు వచ్చిన పి.ఎఫ్‌. డబ్బుతో బోడుప్పల్‌ లో ఒక ప్లాటు తీసుకున్నాను.

పిల్లలు పెద్ద వాళ్లయ్యారు. కనుక ఇల్లు సరిపోక బోడుప్పల్‌ ప్లాట్‌ లో ఇల్లు కొత్తగా నిర్మించు కోవాలన్న కోరిక కల్గింది. తదనుగుణంగా లోన్‌ తీసుకొని ప్రమీల పేరుతో ఉన్న ప్లాటులో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశాను. ఐతే నా ఇద్దరు పిల్లలకు బోడుప్పల్‌ పల్లెటూరుగా కనిపించింది. అందుకే వాళ్ళు నాతో ”ఫ్యూచర్‌ లో అమ్మా, నీవు మాత్రమే ఇక్కడ ఉండవలసి వస్తుంది” అని పదే పదే చెప్పడం నాకు గుర్తుంది.

ఎట్లాగైతేనేమి ఇల్లు కట్టుకొని కొత్తగా నివసించడం మొదలుపెట్టిన తర్వాత పల్లె రూపంలో ఉన్న బోడుప్పల్‌ పట్నమైంది. ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగులు, షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, స్కూళ్లు, కాలేజీలు వచ్చాయి. 2004 నాటికి 2022 నాటికీ కాలనీల రూపురేఖలే మారిపోయాయి.

నేను ఏది చేసినా ప్రమీలతో ఆలోచించి మాత్రమే చేస్తాను. బోడుప్పల్‌ లో ఇల్లు ఆమె పేరు మీదనే కట్టాను. విచిత్రమేమిటంటే మా ఉదయనగర్‌ కాలనీలో ఎవరి ఇంట్లోను బోర్లున్నా పని చేయవు. కాని ప్రమీలచే కొబ్బరికాయ కొట్టించిన పుణ్యవిశేషం కావచ్చు, మా ఇంట్లో ఇప్పటికీ దేవుని అనుగ్రహం వల్ల బోర్లో నీళ్లున్నాయి.

వారాశిగూడా నుండి బోడుప్పల్‌ కు వచ్చి అప్పటికి పదకొండు సంవత్సరాలవుతుంది. ఈ కాలంలో మగ పిల్లల పెళ్లిళ్లు చేశాం కట్నాలు ఏమీ తీసుకోకుండానే. ప్రమీలకు కట్నాలు తీసుకోవడమంటే ఇష్టం ఉండేది కాదు. పిల్లల కోరిక మేరకు ప్రమీల, నేను ఇద్దరమే బోడుప్పల్‌ ఇంట్లో మిగిలాం. కొత్తింట్లో మీరిద్దరే ఉంటారన్న పిల్లల మాట నిజమైంది.

తోడుగా ప్రమీల ఉందనే ధైర్యంతో, విశ్వవిద్యాలయానికి దూరంగా ఉన్నా క్రమం తప్పకుండా డ్యూటీ చేశాను. వేళకు ఇంటికి రావడం, భోజనం చేయడం విద్యార్థులు వస్తే మాట్లాడడం, బంధు మిత్రులకు ఆతిథ్యమివ్వడం – ఇవన్నీ సజావుగానే జరిగేవి.

మేం ఇద్దరం ఉల్లాసంగానే ఉండేవాళ్లం. ప్రమీల అనారోగ్యం అనే మాట ఎఱుగదు. ఆమెను ఎన్నడూ పిల్లలు పుట్టినప్పుడు తప్ప హాస్పిటల్స్‌ కు తీసుకొని పోలేదు. ఆమెనే ఇంటిపనులన్నీ చూసుకునేది. కాని అప్పుడప్పుడు నేనేమైనా అంటే బాధపడేది. ”నేను పోయిన తర్వాత నువ్వొక్కడవే ఈ ఇంట్లో ఉండవలసి వస్తుంది” అని హెచ్చరించేది. కని ఎన్నడూ ఆమె నాకంటే ముందుగా ఈలోకాన్ని విడుస్తుందని భావించలేదు.

ఇద్దరే ఉంటారని పిల్లలనడం, నువ్వొక్కడవే ఉంటావని ప్రమీల అనడం పదేపదే గుర్తుకు వస్తాయి. కాని కళ్ల నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇప్పుడు నేనేమి చేయగలను?

——————–

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మా తిరుపతి ప్రయాణం

by ఆచార్య మస‌న‌ March 30, 2024
written by ఆచార్య మస‌న‌

అది వేసవి కాలం, ఎండలు మండుతున్నవి. ఏ.సీ. గదుల్లో ఉన్నవారిక బయటికి వెళ్లాలంటే భయం. మా ఇంట్లో ఏ.సి ఉన్నా దాన్ని వాడం. చిన్నప్పటి నుంచి శీతోష్ణాలను సహించే శక్తి భగవంతుడు నాకే కాదు, నా అర్ధాంగి ప్రమీలకు ఇచ్చాడు.

మా ఇద్దరిదీ ఇకే మనస్తత్వం. చిన్న కుమారుని పెద్ద కూతురికి పుట్టు వెంట్రుకలు తీయిద్దామని తిరుపతికి బయలుదేరాం. రిజర్వేషన్‌ సౌకర్యం ఉండడం వల్ల రైళ్లో చక్కగా ప్రయాణం చేసి తిరుపతి చేరుకున్నాం. మాది ఎనిమిది మంది గ్రూప్‌. నేనూ, మా ప్రమీల, మా చిన్నక్క, చిన్న కుమారుడు ప్రణవ్‌, వాడి భార్య అఖిల, అమ్మాయి శ్రీవిష్ఠ, మా పెద్ద కుమారుడు క్రాంతి, ప్రణవ్‌ బావమరిది సుమన్‌.

అందరం దిగువ తిరుపతికి చేరుకున్న తర్వాత తిరుమలకు మా ప్రణవ్‌, అతని భార్య, బావమరిది క్రాంతి కుమార్‌ అందరూ కాలినడకన బయల్దేరారు. నేనూ ప్రమీల, మా అక్కగారు ముగ్గురం బస్సులో కొండ పైకి చేరుకున్నాం. కాలినడకన రావడం వల్ల వారికి దర్శనం సులభంగా లభించింది. కాని మా ముగ్గురం మూడువందల టికెట్‌ లైన్లో నిలబడ్డాం. లైన్‌ పెద్దగా ఉంది. లోపల కంపార్ట్‌ మెంట్లలోనూ జనం నిండుగా ఉన్నట్లు ఎవరో చెప్పగా విన్నాను. టికెట్టు తీసుకున్నా, తీసుకోకున్నా దైవ దర్శనం మర్నాడే జరుగుతుందని ఊహించాను ఆ స్థితిలో.

దైవదర్శనం కోసం వచ్చినప్పుడు అంతా దైవమే చూసుకోవాలి కదా! అందుకే దైవం మీద భారం వేసి కంపార్ట్‌ మెంట్ల వైపు నా భార్యతో, అక్కతో వెళ్లాను. గేటు దగ్గరున్న అతడు మమ్మల్ని చూసి ”మా మనుమరాలు, వాళ్ల తల్లిదండ్రులు కాలినడకన వచ్చి, దైవదర్శనానికి వచ్చారు. మమ్మల్ని లోపలికి పంపవా పుణ్యముంటది” అని ప్రమీల వినయంగా గేటు దగ్గరున్నవాణ్ణి అడిగింది. అంతే అతడేమనుకున్నాడో ఏమో మమ్మల్ని లోపలికి పంపించాడు. మేం బ్రతుకుజీవుడా అని లోపల పడ్డాం కాని, అప్పటికే జనం ఆ కంపార్ట్‌ మెంటులో నిండుగా ఉంది. నిలబడడానికి కూడా స్థలం లేదు. కూర్చోవడం దేవుడెరుగు. నాకు ఎక్కువగా నిలబడడం చేతగాదు. ప్రమీల, అక్కగారు ఇద్దరూ కష్టంగా నిలబడ్డారు.

ఆ కంపార్టుమెంటులో ఉన్నవాళ్ల చేతుల్లో టికెట్లున్నాయి. కొందరు బయటికి వెళ్లి రావడానికి పాసులు కూడా తీసుకున్నారు. మా దగ్గరవేం లేవు. మేం నేరుగా 10వ కంపార్టుమెంటులో ప్రవేవించాం. మమ్మల్ని ఎవరూ ఏమీ అడగలేదు. ప్రవేశించనైతే ప్రవేశించాం గాని, నిలబడడానికి చోటు లేదు. కంపార్టుమెంటు నుంచి కంపార్టుమెంటులోకి మారేటప్పుడప్పుడు గేటు ఇట్లా తీసారో లేదో జనం ఒకరి మీద ఒకరు పడిపోయారు. కొందరు ఊపిరాడక నిశ్చేష్టులయ్యారు. నాలో ఆందోళన పెరుగుతుంది. కూర్చోలేం. నిలబడలేం. ప్రక్కకు కదలలేం. ముందుకు నడవలేం. బయటకు కూడా వెళ్లే అవకాశం లేదు. ‘ఏమిట్రా ఈ దైవ దర్శనం? కాకుండే బాగుండేది” అనుకున్నాను నా మనస్సులో.

ప్రమీలకు చాలా ఇబ్బంది కల్గింది. చాలాసేపు నిలబడడం వల్ల కదలలేకపోయింది. నిజానికి ఆ జనం కదలనిస్తే కదా! గేటు తెరిచి తెరవకముందే వెనుకున్నవాళ్లు ముందున్న వాళ్లను నెట్టేస్తూ గేటు దాకా రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేనెట్లాగో కదిలినా ప్రమీలకు, మా అక్కకకూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఒక విచిత్రం జరిగింది.

ఆశ్చర్యంగా ఇద్దరు యువకులు మా దగ్గరకు వచ్చి ”సార్‌ మీరేమి భయపడకండి. మేడం గారికి మేం రక్షణగా ఉంటాం. మీకు దర్శనం సులభంగా జరుగుతుంది” అని మాట్లాడేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది.

”సార్‌ మీరు ఆచార్యులు గదా! మిమ్మల్ని టీవీలో చూశాం. అందుకే మిమ్మల్ని గుర్తు పట్టాం. మీరే వచ్చారా? ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగారు ఆ యువకులు. మా పిల్లలు బహుశా ఇప్పటికే స్వామి దర్శనం చేసుకొని ఉంటారు. మేం ఇలా రావలసి వచ్చింది” అని వాళ్ల డౌట్‌ క్లియర్‌ చేశాను. నిజంగా వారిద్దరూ ప్రమీలకు అక్కకూ బాడీ గార్డ్స్‌ లాగా ఉండి దైవదర్శనం చేయించారు.

నాకాశ్చర్యం కల్గింది. వారు మమ్మల్ని మా పిల్లలు లోపల ఉండగానే మాతో కలిపారు. మేం మా పిల్లలతో కలిసిన మరుక్షణంలో వాళ్లు మాయమయ్యారు. వారికోసం అక్కడా ఇక్కడా ఎంత చూసినా కనిపించలేదు. ఇదొక అద్భుత సంఘటనగా నా స్మృతిలో నిలిచిపోయింది.

నా ప్రమీల గురించి గొప్పగా చెప్పవలసిన పనిలేదు గాని, ఇక్కడ కొన్ని మాటలు చెప్పక తప్పదు. మూడువందల రూపాయల టికెట్‌ తీసుకోకుండానే కంపార్టుమెంటులో ప్రవేశించడానికి ఆమే కారణమైంది. అట్లే ఆమె రక్షణకు ఇద్దరు యువకులు రావడం విశేషం. వారు మమ్మల్ని మా పిల్లలతో కలిపి మాయం కావడం చిత్రమనిపించింది.

ప్రమీల కొంచెం బొద్దుగా ఉన్నా, ఆమె దేహకాంతి ఎరుపు. ముఖం గుండ్రంగా ఉండి, కుంకుమ తిలకం దానికి మరింత అందాన్ని కల్గించేది. ఆమె చీరకట్టు, స్ఫురద్రూపం ఎవరినైనా ఆకర్షిస్తుంది. సాధుస్వభావుల్ని చేస్తుంది. మొదటినుంచి ఆమెతో నేనెక్కడికి వెళ్లినా నాకు గంటలో అయ్యే పని క్షణంలో అయ్యేది. ఆమెను చూసినవారు, నన్నదృష్టవంతునిగా వర్ణించేవారు. నా నలభై ఏండ్ల కాపురంలో నా సహధర్మచారిణిగా ప్రమీల మంచి మార్కులు సంపాదించింది. ఒక్క తిరుపతే కాదు, దేశంలోనూ, విదేశంలోనూ ఎక్కడికి వెళ్లినా ఆమె సహధర్మచారిత్వం ఆమెకు శ్రీరామరక్షగా ఉండిందని చెప్పక తప్పదు.

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తమ్ముని పెళ్లి

by ఆచార్య మస‌న‌ March 30, 2024
written by ఆచార్య మస‌న‌

ఆనంద్‌ మా ప్రమీలకు పెద్దమ్మ కొడుకు. చిన్నప్పుడు మా ఆవిడ అతణ్ణి ఎత్తుకొని ఆడించేదట. అందుకేనేమో ఆనంద్‌ తన పెళ్లి అయిన తర్వాత కూడా మా ఇంటికి వచ్చేవాడు. మా పెళ్లి సమయంలో అతడు మా వూరికి వచ్చినట్లు జ్ఞాపకం ! ”బావా మీ ఇల్లు నాకు నచ్చలేదు. ఇంట్లో ఫ్యాన్లు లేవు. లైట్లు లేవు. ఇక్కడ నువ్వెట్లా చదువుకున్నావు బావా?” అని ప్రశ్నిస్తే, ”మాది వూరు కదా! పట్నంలోలాగా అవేవీ ఉండవు. ఐనా అన్నీ సజావుగానే జరుగుతాయి” అని సమాధానపరచడం నా వంతయ్యింది.

”అక్కా! ఎట్లుంటవు ఈ వూర్లో?” అని నా ముందరే ప్రమీలనడిగాడు. ఆమె నెమ్మదిగా ”బావ ఉద్యోగం హైదరాబాదులో కదా!” అని సమాధానపరిచింది. తానుండేది పట్నంలోనే కదా అని ఆమె ఆంతర్యం.

ఆనంద్‌ కు ఒక ఉపాధ్యాయురాలి కూతురుతో పెళ్లైంది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏవో పొరపొచ్చాలు వచ్చి భార్య నుండి విడాకులు కూడా తీసుకున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఒక జడ్జి గారి దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు.

అక్కమీది ప్రేమతో తరుచుగా వారాసిగూడాలోని ఇంటికి వస్తుండేవాడు. ప్రతి సంవత్సరం శబరిమలైకి వెళ్లి ప్రసాదం తెచ్చేవాడు. ఆ సంవత్సరం కూడా వెళ్లి వచ్చాడు.

”బావా! ఒంటరిగా ఉన్నాను. ఆ అయ్యప్ప కూడా కరుణ చూపడంలేదు. నాకు చెన్నప్ప బావే దిక్కు” అని కాళ్ల మీద పడ్డాడు. వాడి ఉద్దేశం అర్థమైంది. వాడికో పిల్లను చూసి పెళ్లి చేయాలని వాని కోరిక.

‘సరే చూద్దాంలే’ అని అప్పటికి తప్పించుకున్నాను.

ఒకరోజు మా ఇంటికి సమీపంలో ఉన్న రామాలయానికి వెళ్లి అప్పుడే వచ్చాను. ఆనంద్‌ ప్రత్యక్షమయ్యాడు. నాకు వెంటనే ఒక ఆలోచన మనస్సులో తళుక్కున మెరిసింది. రామాలయంలో నాకు తెలిసిన వాళ్లే అర్చన చేస్తున్నారు. కొండబత్తిని కుటుంబం అని మంచిపేరే ఉంది. హనుమంత రావుకున్న ఏడుగురు సంతానంలో చివరి ఐదుగురు ఆడపిల్లలే. ఒక అమ్మాయి పెళ్లి అయింది. రెండవ అమ్మాయిని సోలాపూర్‌ ఇస్తే ఏవో తగవులొచ్చి, ఇంటి పట్టుననే ఉంది. బి.ఏ. చదివింది. హెచ్‌.ఎమ్‌.టీ వాచ్‌ కంపెనీలో ఉద్యోగం. ఇంకా ముగ్గురి పెళ్లిళ్లు కావలసి ఉంది. రెండవ అమ్మాయి ఎంతో భారమైంది. హనుమంతరావు మా బస్తీలో పెద్దమనిషి. తరుచుగా మా ఇంటికి వచ్చి ప్రమీలతో మాట్లాడేవాడు. ప్రమీలకు వారి కుటుంబం గురించి బాగా తెలుసు.

హనుమంతరావు 2వ అమ్మాయిని ఆనందుకు ఇప్పిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏమనుకున్నా సరే అనుకొని ప్రమీలకు ఈ విషయం చెప్పాను లోగడ ఒకసారి.

ఆనంద్‌ ఆ సంవత్సరం శబరిమలైకి వెళ్లి మాకోసం ప్రసాదం తెచ్చాడు. నేను ఒకరోజు రామాలయం నుంచి వచ్చి రాగానే ప్రమీల హనుమంతరావు కుటుంబం అక్కడికి వచ్చిందా అని అడిగింది. వచ్చిందని చెప్పాను. వెంటనే ప్రమీల ఆ 2వ అమ్మాయి ఎట్లనిపించింది? అని నన్నడిగింది. ఫరవాలేదన్నాను. ప్రమీల ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఆనంద్‌ తో ”మీ బావ నీకో అమ్మాయిని చూశాడు- రామాలయంలో. చూస్తే ఇప్పుడే పోయి చూడు” అని పురమాయించింది.

ఆనంద్‌ ఆనందంతో ఎగిరి గంతేశాడు. అక్కా బావలు చెప్పిన తర్వాత ఇంకా ఆగవలసిన పని లేదనుకొని అడ్రస్సు పట్టుకొని రామాలయానికి వెళ్లాడు. ”మా బావగారు పంపించారు నన్ను” అని హనుమంతరావుతో పరిచయమయ్యాడు. హనుమంతరావు తన పరివారాన్ని అతనికి పరిచయం చేశాడు. ఆ 2వ అమ్మాయిని గుర్తించాడు. అక్కడేమీ మాట్లాడకుండా, ప్రసాదం తీసుకొని మా ఇంటికి వచ్చాడు.

హఠాత్తుగా అక్క కాళ్ల మీదపడి ”ఆ అమ్మాయితో నా పెళ్లి నువ్వే చేయాలి. మా అన్న పెళ్లి కూడా నువ్వే చేశావు ఆలేరు నుంచి పిల్లను తెచ్చి” అని ప్రాధేయపడ్డాడు.

ఆనంద్‌ కు ఆరుగురు అన్నలు. పెళ్లి కావాలంటే అన్నలనందరిని ఒప్పించాలి. ఇరువైపుల మాట్లాడి సంబంధం కుదిరించాలి. పెళ్లి చేసుకోవడం సులభం కాని, పెళ్లి చేయడం కష్టం.

పెద్దమ్మ కొడుకైనా ఆనంద్‌ బాధ్యతను ప్రమీల తన భుజానికెత్తుకుంది. పెళ్లి కాని అమ్మాయితో ఆనంద్‌ పెళ్లి చెయ్యాలనే ఆలోచన అన్నలకు లేకపోలేదు. ఐనప్పటికీ ప్రమీల వారినందరినీ ఒప్పించింది. ”ఆనంద్‌ కు భార్యలేదు. హనుమంతరావు కూతురికి భర్తతో తెగదెంపులయ్యాయి. ఇద్దరూ సమానమే. న్యాయం ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది” అని తెలివిగా అందరిని తన వాదానికి అనుకూలంగా మార్చింది.

ఎట్లాగైతేనేమి ప్రమీల ముందుండి ఆనంద్‌ పెళ్లి చేసింది. ఇప్పుడానంద్‌ ఇద్దరు పిల్లల తండ్రి. ఒక బాబు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి డిగ్రీ చదువుతుంది. చిత్రమేమిటంటే హనుమంతరావు ముగ్గురు ఆడపిల్లలకు చకచకా పెళ్లిళ్లయిపోయాయి.

ఆనంద్‌ ఎప్పుడైనా కలిస్తే ప్రమీలను గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ”బావా! అక్క లేకపోతే నా పెళ్లి అయ్యేది కాదు” అనే మాటలు ఆనంద్‌ హృదయంలోంచి వచ్చినవిగా భావిస్తాను. ప్రమీలను గూర్చి నేను ”ఘటనా ఘటన ధురీణురాలు” అని సంతృప్తి చెందుతుంటాను.

——————-

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పక్షుల విశేషాలు

by డా.కందేపి రాణీప్రసాద్ March 30, 2024
written by డా.కందేపి రాణీప్రసాద్

‘చిట్టి చిలకమ్మా! అమ్మ కొట్టిందా’ అనీ, ‘బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది’ అనీ, ‘కాకీ కాకీ కడవల కాకి’ అనీ మనం చిన్నతనంలో పాటలు పాడుకుంటూ పెరిగాం. నెమలీకలు పుస్తకాల్లో పెట్టుకొని మేతపెట్టడం, తూనీగ రెక్కలకు దారాలు కట్టి ఆడడం బాల్యపు తీపి గురుతులు. తన పిల్లలను తినేస్తున్న పాము పని బట్టడానికి రాణిగారి గొలుసుతెచ్చి పాము పుట్టలో పడేసిన కాకి కథ, గాలి వానకు పిచ్చుక కట్టుకున్న పిడకలిల్లు పడిపోయిందని చెప్పే కథ, వేటగాళ్ళ ఉచ్చులో ఎన్నో పక్షులకు సంబంధించిన కథలు చదువుకుంటూ పెరిగాం. ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు’, ‘ఎంగిలి చేత్తో కాకిని విసరడు’ వంటి సామెతలూ మన జీవితంలో భాగమే. ఇంటి ముందు వసారాలో పిచ్చుకల కోసం వరి కంకులు కట్టడం, ఇంటి చూరులో పిచ్చుకలు, పావురాలు పిల్లల కోసం గూళ్ళు కట్టుకుంటే వాటిని జాగ్రత్తగా చూడటం వంటివి మనకు పక్షులపై ఉన్న ప్రేమను తెలుపుతుంది. మన జీవితాలతో ఇంతగా మమేకమైన పక్షులు ఆధునిక ప్రపంచంలో అనేకానేక కారణాల వల్ల మనల్ని వీడి మాయమై పోతున్నాయి. పక్షుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
పక్షుల వర్గీకరణను మొదటగా ‘ఫ్రాన్సిస్ విల్లగ్టీ’ మరియు ‘జాన్ రే’ అనే శాస్త్రవేత్తలు చేపట్టారు. 1676వ సంవత్సరంలో ఈ శాస్త్రవేత్తలు ‘ఆర్వితోలాగే’ అనే పుస్తకంలో పక్షుల గురించి వివరించారు. ఈ తర్వాత వచ్చిన ‘కారల్ లిన్నేయస్’ అనే శాస్త్రవేత్త 1758వ సంవత్సరంలో పక్షుల వర్గీకరణను ఆధునీకరించాడు. ఈ పక్షులు సరీసృపాల వారసులు. సరీసృపాలకు పక్షులకు చాలా దగ్గరి పోలికలుంటాయి. శిలాజాల చరిత్రను గమనిస్తే అతిపెద్ద సరీసృపాలైన డైనోసార్లు ఆహారం దొరకక విలుప్తమైపోయాయి. పాకే జీవులైన సరీసృపాల నుంచి రెక్కలున్న పక్షులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. క్రస్టేషియన్ యుగంలో మొట్టమొదటగా పక్షులు అవతరించాయని తెలుస్తున్నది. క్రస్టేషియస్ యుగమంటే దాదాపు వంద మిలియన్ల సంవత్సరాలకు పూర్వమన్న మాట.
పక్షులు ‘ఏవ్స్’ విభాగానికి చెందినవి. రెక్కలు ఉండడం, ఆకాశంలో ఎగరగలగడం ప్రధాన లక్షణాలు. ఇవి నాలుగు గదుల గుండెను కలిగి ఉంటాయి. పళ్ళులేని ముక్కులున్న దవడలు గలిగిన జంతువులు ఇంకా ఇవి ఎండోదెర్మిక్ వర్టిబ్రేట్స్. వీటికి చాలా తేలికైన శరీరం, బలమైన అస్థిపంజరం ఉంటాయి. ఇవి గట్టి పెంకు గలిగిన గుడ్లను పెడతాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ కూడా వీటిలో ఎగరడానికి అనుకూలంగా పరిణామం చెంది ఉన్నాయి. ముందున్న రెండు కాళ్ళూ రెక్కలుగా పరిణామం చెందటం వలన, రెక్కలకున్న ఈకల్లో గాలి గదులుండటం వలన ఇవి ఎగర గలుగుతున్నాయి. సరీసృపాల నుంచి పక్షులు ఏర్పడ్డాయని అనుకున్నాం కదా! ఇవి అంతా ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో జరగదు కదా! పరిసరాలు, పరిస్థితులను బట్టి కొన్ని అంగాలను కోల్పోవటం, కొత్తగా కొన్నింటిని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. సరీసృపాలకు, పక్షులకు మధ్య వారధిలా ‘ఆర్కియాప్టెరిక్స్’ అనే జంతువు ఉండేది. దీనికి సరీసృపాల లక్షణాలు, పక్షుల లక్షణాలు రెండూ ఉంటాయి. ఇది పూర్తిగా ఆకాశంలో ఎగరలేదు. పళ్ళున్న దవడలు, పొడవైన ఎముకలున్న తోకలు కలిగి ఉంటాయి. ఇది సరీసృపాల లక్షణం.
పక్షులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. సుమారు ఎనిమిది వేల జాతులన్నాయని తెలుస్తున్నది. వీటిలో 5 సెం.మీ పొడవున్న అతి చిన్న హమ్మింగ్ బర్డ్ నుంచి 9 ఫీట్ల పొడుగున్న అతి పెద్ద ఆస్ట్రిచ్ వరకు అన్ని రకాల పక్షులున్నాయి. కొన్ని పక్షులు చాలా తెలివి కలవి. అందులో చిలకలు, కొర్విడ్లు మొదలైనవి తెలివైన వాటికి ఉదాహరణగా నిలుస్తాయి. చాలా జాతుల పక్షులు సంవత్సరానికొకసారి చాలా చాలా దూరాలు వలస పోతుంటాయి. పక్షులు సంఘజీవులు. ఇవి సైగల ద్వారా, అరుపుల ద్వారా, పాటల ద్వారా తోటి పక్షులకు కావలసిన విషయాన్ని చేరవేస్తాయి. పక్షులు ఎంతో శ్రమకోర్చి పుల్లా పుడకా ఏరుకొచ్చి రకరకాల గూళ్ళను అల్లుకుంటాయి. అలా అల్లుకున్న గూళ్ళలో తమ పిల్లలను పెట్టుకుంటాయి. గుడ్లు పొదిగి పిల్లలైన తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి పిల్ల పక్షుల్ని తల్లి పక్షులు. పక్షులు మనుష్యులతో కలసి బతుకుతాయి. మానవులకు ఆహారంగా ఉప యోగపడతాయి. వాటిని వేటాడే పిల్లులు, కుక్కల కన్నా పక్షులు మానవుల వల్లే ఎక్కువగా చనిపోతున్నాయి. 17వ శతాబ్దం నుంచి దాదాపు 120 నుండి 130 జాతుల పక్షులు అంతరించిపోయాయి. అంటే మానవుడు అభివృద్ధి బాట పట్టి నాగరికత వైపు అడుగులు వేస్తున్న సమయం నుండీ పక్షులు అంతరించి పోవటం మొదలయిందన్నమాట.
కొన్ని పక్షులు ఆర్థిక ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. కోడి, బాతు వంటి వాటి గుడ్లు, మాంసం మానవులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాక పక్షుల ఈకలు కూడా టోపీలు, ఆభరణాల తయారీలో ఉపయోగపడతాయి. చిలకలు, పావురాలు వంటి పక్షులు పెంపుడు జంతువులుగా మానవుడితో సహజీవనం చేస్తాయి. పక్షుల పెంటను పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు.

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us