మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఒకరి ఆకలికిమరోకరి ఇష్టమే ఆహారంగా

by Chandaluri Narayana Rao May 24, 2024
written by Chandaluri Narayana Rao

రాత్రయింది అంటే
ఓ రోజు బతుకు ఖాతాలో
జమైనట్లే…

రెండు జతల
గాజుకళ్ళు, ఓటికాళ్ళు
వయసును భుజానవేసుకుని

మంచం కొండనెక్కుతూ
రేపు ఉదయం ఇద్దరిదో?
ఇద్దరిలో ఏ ఒక్కరిదో?

అన్న నడుము వంగిన ప్రశ్న
దిగులు భయంతో
బిక్కు బిక్కుమంటూ

అవకాశం దొరికనప్పుడల్లా
దేహాన్ని తట్టే బాధకు
చులకనయ్యే ఓపికతో

పండిన అనుభవంలో
ఒకరి ఆకలికి
మరోకరి ఇష్టమే ఆహారంగా

బతుకులో
ఒంటరితనం లేకుండా
ఏకాంతానందం సొంతమైనా

వృద్దాప్యంలో ఏదో ఒక రోజు
ఒకరి మరణం
మరొకరికి నరకమనే

సత్యానికి రెపరెపలాడే జీవులు
ఆఖరిరోజుకూ
ప్రేమతో ప్రాణంపోసే ధన్యులు.

( తొంభై ఏళ్లకు దగ్గరౌతున్న ప్రేమ అనే ఔషధంతో ఉత్తమదంపతులైన
నా వృద్ధ తల్లిదండ్రుల జీవితాన్ని చూస్తూ, వారి  పాదాలకు కవితను అంకితం చేస్తూ…..)

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నొసటి మీద గీతలు 

by Jyothi Muvvala May 24, 2024
written by Jyothi Muvvala

ఆ బ్రహ్మ పోసినా ప్రాణమా 
విధి వెక్కిరింపుకు సాక్ష్యమా
లేక….
సమాజంలోని కుటిలత్వానికి 
శాపంగా మిగిలిన దేహమా 

నీ తలరాతను మార్చేస్తున్న ఆ గీతలు 
చావుపుట్టుకులే చెప్పలేని రాతలు
బతుకు భారాలను తెలిపే ఒట్టి శరీరపు ముడతలు 
శాస్త్రనికి సైన్స్కి మధ్య ఊగిసలాడే విధిలిఖితాలు

తప్పొప్పులు తేల్చలేని ధర్మసందేహాలు
నిగూఢంగా  నిలిచిపోయిన వాస్తవ రేఖలు 
మనిషి విజ్ఞానానికి అంతుపట్టని రహస్యాలు
సృష్టికి ప్రతిసృష్టి చేయాలనే ఆలోచనలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మేధావులు 

సహజ గుణాన్ని కోల్పోతున్నా దేహాలు 
ప్రాణం పోయటానికి పనికిరాని విజ్ఞతలు 
ప్రాణాలను తీసేందుకు మాత్రం ఎన్నో తంత్రాలు
మనిషికి మనిషే శత్రువై మార్చేస్తున్నారు
 నోసటి మీద గీతలు… మీ తలరాతలు…!!

May 24, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

సీ “రియల్”

by Shamir Janakidevi May 24, 2024
written by Shamir Janakidevi

కొత్తగా పెళ్ళిచేసుకుని వచ్చిన మాధురికి అత్తగారిల్లు చూడగానే అయోమయంగా అనిపించింది… ఏదో తిన్నాము అన్నట్లు ఉంటారు… లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకోవడం…మామగారు రిటైర్ అయ్యారు… ఆయనకి ఒక రూమ్ అందులో టి వి… అత్తగారు, ఆమె తల్లి మధ్య హాల్లో ఉంటారు…  అత్తగారి తల్లి మంచంలోనే ఉంటుంది… అన్నీ చేతికి ఇవ్వాలి…ఇద్దరూ తెలుగు హిందీ సీరియల్స్ కలిపి రాత్రి పది గంటల వరకు చూస్తూనే ఉంటారు…

తమది పెద్దలు కుదిర్చిన వివాహమే.. ప్రశాంత్ ది ఒక మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం… పెళ్ళిచూపుల్లోనే చెప్పాడు ఆమె ఉద్యోగం చెయ్యటం తనకు ఇష్టం లేదని…తన ఇంటి పరిస్థితి తెలిసిన ప్రశాంత్  ఆవిషయం చెప్పకుండా తనకే ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదని చెప్పాడు…తనకు ఎప్పుడూ ఒక మంచి గృహిణిగా ఉండాలని కోరిక… అదే మాట ఇలా వినడం నెత్తిన పాలు పోసి నట్లుగా అనిపించి ఒప్పుకుంది…మొదటి రాత్రి తన ఇంటి వ్యవహారం చెప్పాడు… ఈ ఇల్లు అమ్మమ్మది  అనీ, అమ్మ ఒక్కతే కూతురనీ, అన్నిటికీ తను సర్దుకు పోవాలని… నీకు వీలైతే ఇంటి వాతావరణం మార్చు అంటూ హింట్ ఇచ్చాడు… బలాదూరుగా తిరిగే మరిది శ్రీకాంత్… ఉద్యోగం లేదు… బి టెక్ చదివినా ఉద్యోగం చెయ్యడు… బయటి వ్యాపకాలు ఎక్కువ…

డిగ్రీ చదివి ఎమ్ బి ఎ పూర్తి చేసిన మాధురి, ఒక గృహిణిగా ఆ ఇంట్లో కాలు పెట్టింది… బ్రేక్ ఫాస్ట్, కూరలు బయటి నుంచి వస్తాయి… అన్నం మాత్రం వండుకుంటారు… టి వి సీరియల్లో వంట చెయ్యని అత్తగారిని మాత్రం, ఇద్దరూ తిట్టుకుంటూ కూర్చుంటారు… వింతగా అనిపించింది తనకు…

ఇలా పనీ పాటా లేకుండా  కూర్చోవడం, తనకు నచ్చటం లేదు… ఒక రోజు భర్తని అడిగింది…”ఇక నుంచి రోజూ నేను వంట చేస్తాను..” 

“అందరూ పని చెయ్యకుండా సినిమాలూ, షికార్లూ,పార్లర్ల  చుట్టూ తిరగడం చేస్తారు… నువ్వేంటి ఇలా ?” అంటూ నవ్వాడు…

“అయినా నీది ఒంటరి పోరాటం అవుతుంది… ఇక్కడ ఎవరూ అంతగా పాటించరు జాగ్రత్త సుమా” అని హెచ్చరించాడు…

“మీరు అవసరం అయిన సహాయం చెయ్యండి చాలు…” అంటూ తన నిర్ణయం చెప్పింది…

“ఓకె “అంటూ తంబ్ చూపించాడు ప్రశాంత్…

మరుసటి రోజు అత్తగారితో చెప్పింది…”ఈ కూరలు ఇలా బయట నుండి వద్దు అత్తయ్యా! నేను వంట చేస్తాను ఈ రోజు నుంచి” 

సీరియల్లో మునిగి ఉన్న అత్తగారు మొహం పక్కకి తిప్పి, “ ఇదుగో అమ్మాయ్! నీ ఇష్టం… నాకు మాత్రం పని చెప్పకు…” అని అన్నది…

ఏమనాలో తెలియక, తల ఊపి లోపలికి వెళ్ళింది మాధురి…పనిమనిషిని పిలిచి వంట గది శుభ్రం చేయించింది… రోజూ చేసే పనులు కాకుండా ముందుగా కూరగాయలు  తరిగి ఇవ్వాలని చెప్పింది…

అది డూప్లెక్స్ విల్లా… క్రింద ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్… ఫస్ట్ ఫ్లోరులో మూడు బెడ్ రూములు ఉన్నాయి… అందులో ఒక రూమ్ తమది, ఒకటి మామగారిది, ఇంకొకటి ఊర్లో ఉన్న ఆడపడుచు పద్మది… ఆడపడుచు ప్రతి వారం వస్తూనే ఉంటుంది…సెకండ్ ఫ్లోరులో పెంట్ హౌసులా, ఒకే రూమ్ వేసారు… అది మరిది రూము… అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ, ఎవరి లోకం వారిదే అన్నట్టుగా వుంటారు… మామగారికి రాజకీయాలు, అత్తగారు, ఆమె తల్లిగారలకు సీరియల్స్, మరిదికి సినిమాలు… వింత ప్రపంచంలో వున్నట్టుగా వుంది… తను పెరిగిన వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకంగా వుంది ఈ ఇంట్లో పరిస్థితి… పాత సినిమాల్లో సావిత్రి బతుకులా ఉంది అనుకుని ప్రక్షాళన మొదలు పెట్టింది మాధురి…

కిచెన్ లో ఒక ప్రక్కన ఉన్న దేవుడి బొమ్మలు అన్నీ శుభ్రం చేసి పూలతో అలంకరించి దీపారాధన చేసింది… మామగారు రోజూ కాసేపు తోట పని చేస్తారు… ఆ కాస్త జాగాలోనే ఎన్నో పూలు… అవి కోసి పూజ చేసింది… రోజూ అందరూ పాలల్లో బ్రూ కలుపుకుని త్రాగుతారు…. అలా కాదని ఫిల్టర్ వేసి అందరికీ కప్పుల్లో కాఫీ పోసి ట్రేలో  పెట్టుకుని, తీసుకు వెళ్ళి ముందు మామ గారికి ఇచ్చి, తరువాత అత్తగారికి, మామ్మగారికి ఇచ్చింది…

“కాఫీ సూపర్” అంటూ అత్తగారు ఈమోజీలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది… “ అమ్మాయి! అచ్చం కొంగు ముడి సీరియల్లోలా తెచ్చావు… బాగుంది…” ఆమె మెచ్చుకున్నది సీరియల్నా, నన్నా, ఒకింత ఆశ్చర్యపడుతూ, ఒక పిచ్చి నవ్వు నవ్వి లోపలికి వెళ్ళింది…

ఇంకా పిండి అదీ రుబ్బుకోలేదని, గోధుమరవ్వ ఉప్మా అన్ని కూరగాయలు, జీడిపప్పు, బఠాణీలు వేసి చేసింది…ఆ రోజు ప్రశాంత్, శ్రీకాంత్, మామగారు వెంకట్రావు చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తిన్నారు… టేబుల్ పైన ఒక గాజు గ్లాసులో నీళ్ళుపోసి రెండు గులాబీలు పెట్టింది… మామగారు ఆ పూలని చూసి ఆమె అభిరుచికి మెచ్చుకున్నారు…

రోజూ ఆఫీసులో తినే ప్రశాంత్ కు ఆనందంగా ఉంది…ఒక ఇంటిని స్వర్గం చేసినా, నరకంగా మార్చినా స్త్రీ చేతిలోనే ఉంటుంది అని అనుకున్నాడు… “ఏమండీ! రేపటి నుండి మీకు లంచ్ బాక్స్ కూడా ఇస్తాను…” అన్నది…

“మాధురీ ఏమైనా కొనాలంటే తీసుకో…” అంటూ కొంత డబ్బు ఇచ్చాడు…

అత్తగారికి, మామ్మ గారికి టిఫిన్ పెట్టి, తరువాత పనిమనిషికి పెట్టి, తను కూడా తిన్నది…

మధ్యాహ్నం వంటలో మామిడికాయ పప్పు, కంది పచ్చడి, బెండకాయ కూర, చారు చేసింది… అత్తగారితో ఆమె సీరియల్స్ భాషలో మాట్లాడుతూ, డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది…

మామ్మగారికి అన్నం పెట్టి, కాసేపు టి వి ఆఫ్ చేసింది… సీరియల్ తరువాత హాట్ స్టార్ లో చూడవచ్చు ప్రశాంతంగా తినమని చెప్పింది…

“అమ్మాయి! నీ కోడలు వంట బాగా చేసింది… ఉదయ రాగం సీరియల్లోలా పనంతా ఒక్కతే చేస్తోంది… కంది పచ్చడి పేరు కూడా మరచి పోయాను…”  అని కూతురుతో చెపుతూ, తన వైపు తిరిగి “వంట బాగా చేసావు  మాధురీ…” అంటూ మెచ్చుకుంది మామ్మగారు… 

సీరియల్స్ చూస్తూ బద్దకంతో కదలని శరీరాలు వాళ్ళని అశక్తులుగా మార్చాయి… అందుకే పని చెయ్యకుండా ఇలా తయారయ్యారు…

అత్తగారికి, మామగారికి, వెండి కంచాలు పెట్టి వడ్డించింది… కొంగుముడి సీరియల్లో కొత్త కోడలులా ఉంటుంది అనుకున్న తనకు ఇంత మంచి కోడలు వచ్చినందుకు మనసులో సంతోషిస్తూ, తృప్తిగా భోజనం చేసింది విజయ…

వాళ్ళలో మార్పు చూసి తను ఇంటిని మార్చగలను అనుకుంది మాధురి…

ఈ రచన నా స్వంతం… ఎక్కడా ప్రచురించలేదు..

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni May 24, 2024
written by Narendra Sandineni

మంగారి రాజేందర్ జింబో కవిత్వం సామాజిక సమస్యలకు అద్దం పడుతుంది. మంగారి రాజేందర్ జింబో అనగనగా … కవిత

ప్రముఖ కవి,రిటైర్డ్ జిల్లా జడ్జి,ప్రస్తుతం తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మంగారి రాజేందర్ జింబో కలం నుండి జాలువారిన చూస్తుండగానే … కవితా సంపుటిలోని అనగనగా…కవిత పై విశ్లేషణా వ్యాసం.అనగనగా కథ ఒకప్పుడుతో మొదలవుతుంది.అనగనగా అనే తెలుగు పదానికి నిర్దిష్టమైన,ప్రత్యక్షమైన అర్థం లేదు.అనగనగా సమాజంలో జరిగిన సంఘటనల సరళిలో ప్రారంభమయ్యే కథలను కవిత రూపంలో వ్యక్తం చేయడం కొత్తగా వింతగా ఉంది.అనగనగా ఇది కచ్చితంగా అని కాకుండా భావాన్ని లేదా భావోద్వేగాన్ని తెలియజేయడానికి ఉపయోగించబడుతుంది.అనగనగా సాధారణంగా తెలుగులో ఒక నిర్దిష్ట అర్థాన్ని తెలియజేయడానికి కాకుండా లయను సృష్టించడానికి ఉపయోగిస్తారు. అనగనగా అని కథను ప్రారంభించడానికి మొదట ఉపయోగిస్తారు.కథను ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా తరతరాలుగా సమాజంలో వ్యాప్తిలో ఉన్నాయి.అనగనగా ఎప్పుడో ఒక కాలంలో జరిగాయి.అవి జనంలో వాడుకలో ఉన్నాయి.చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి పెద్ద వాళ్ళు అనగనగా ఒక రాజు ఉండే వాడు అని కథ చెప్పి పిల్లవాడిని నిద్రపుచ్చడం లోకం ఎరిగినదే.ఇప్పుడు మనం నివసిస్తున్న వర్తమాన సమాజంలో లోకంలో జరుగుతున్న రీతి రివాజులను బట్టబయలు చేస్తూ కవి జింబో పిల్లలకు కథ చెప్పినట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.సమాజంలో ఏం జరుగుతుంది? సమాజంలోని జనాలను జాగృత పరచడం కోసం అనగనగా కవిత రాసినట్లుగా తోస్తుంది.జింబో రాసిన అనగనగా కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అపారమైన అనుభూతిని సొంతం చేసుకుందాం.
“అనగనగా …
“ఓ వాగుండేది
“ఏ నగరం దాని మీద దాడి చేసిందో
“ఏమో –
“నీళ్ళే కాదు
“ఇసుక కూడా లేకుండా పోయింది.

వాగు అంటే కొండల మీది నుండి ప్రవహించే చిన్న నీటి ప్రవాహం.ఇది మంచి నీటి సెలయేరు.నగరం విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం.నగరం జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. నగరాలు చారిత్రక ప్రాధాన్యత,ప్రత్యేక అధికారం కలిగి స్వయం పరిపాలన అనేక చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి.నగరాలు వసతులు కల్పించడంలోను,మురుగునీటి కాలువల నిర్వహణ,విస్తృతంగా రవాణా సౌకర్యాలు,నివాస గృహ సముదాయాలు కలిగి ఉండటం వలన ప్రజలను ఆకర్షించి అధిక జనాభా నివాస పట్టణాలు నగరాలుగా వృద్ధి చెందుతూ ఉంటాయి.ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులు ఉద్యోగాలు లభించడం వలన పరిశ్రమలు పరస్పరం లబ్ధి పొందుతూ ఉండటం వలన నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి.ప్రజలు అధికంగా ఉండటం, వ్యాపార అభివృద్ధికి,కళా,వినోదం,పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయి.ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలు,విద్యను అభ్యసించడానికి విద్యాసంస్థలు,ఇలా ఒక దాని కొకటి అనుబంధంగా వృద్ధి చెందాయి.ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి.నీళ్ళు ఘన రూపం,మంచు గడ్డల రూపంలో మరియు ద్రవ రూపంలో సముద్రాలు,నదులు,తటాకములు ఉన్నాయి.భూతలంపై ఆవిరితో వాయు రూపంలో మేఘాలు ఉన్నాయి.మహా సముద్రాలు,నదులు, తటాకాలు ఉపరితల జలాలతో నిండి ఉంటాయి. ఇసుక అనేది విచ్ఛిన్నమైన రాతి ఖనిజ కణాలతో ఏర్పడిన మిశ్రమం.ఇది ప్రకృతిలో లభించే విలువైన పదార్థం.ఇది పరిమాణం ద్వారా నిర్వచింపబడింది. కంకర కంటే చిన్నదిగా,మెరుగ్గా,ఓండ్రు మట్టి కంటే గరుకుగా ఉంటుంది.కాంక్రీట్ తయారీకి అనువైన ఇసుకకు అధిక డిమాండ్ ఉంది.నదులలో వాగులలో ఇసుక ఎక్కువగా ఉంటుంది.సిమెంటు, నీటిలో కలిపి తడపటం వలన అది గట్టి బండలాగా తయారవుతుంది.నిర్మాణ రంగంలో ఇసుకను ఎక్కువగా వాడుతారు.పునాదులలో మొదటగా ఇసుకను ఒక పొరగా వేసి కూరుతారు.దీని వల్ల నిర్మాణాలలో పగుళ్లు రాకుండా ఉంటాయి. చిన్న వాగులు,వంకలు మొదలుకొని నదుల్లోని పెద్ద రీచ్ ల వరకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతుంది.అక్రమార్కులు రాత్రి,పగలు తేడా లేకుండా వేల కొద్ది లారీల్లో,ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.పేరుకు ఏదో ప్రభుత్వ పథకానికి అని అనుమతులు తీసుకోవడం,లారీలు,ట్రాక్టర్లతో పరిమితికి మించి ఇసుకను తీసుకెళ్లి బహిరంగ మార్కెట్లో అడ్డగోలు ధరకు అమ్ముకోవడం పరిపాటి అయింది.ఇసుక విధానంలో ఉన్న లోపాలను ఆధారం చేసుకుని ఇసుక మాఫియా చెలరేగుతుంది. ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి.డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రభుత్వాధికారులు చూసి చూడనట్టు వదిలి వేయడంతో అక్రమాలకు అడ్డు లేకుండా పోతున్నది. ఇసుక దందా అంతా రాజకీయ నాయకుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.కవి జింబో చిన్న పిల్లలకు కథలు చెప్పినట్లుగా అనగనగా ఒక వాగు ఉండేది.అలాంటి వాగుపై ఏ నగరం దాడి చేసింది ఏమో అని అంటున్నాడు.నగరం విస్తరణలో భాగంగా వాగులోని నీళ్లు అన్ని తోడేశారు.వాగులోని ఇసుకను కూడా తరలించారు అని కవి జింబో తీవ్రమైన ఆవేదనకు గురి అయినట్లుగా తోస్తుంది. వాగు కింద వేల ఎకరాల పొలాలకు నీళ్లు పారేవి. అట్టి వాగు ఎన్నో గ్రామాలకు త్రాగు నీరుగా ఉపయోగపడేది.వాగు ఇసుకతో ఎంతో మంది గ్రామాల జనాలు ఇల్లు కట్టుకున్నారు.అక్కడి జనాల బాగోగుల కొరకు తాగు నీరు మరియు సాగు నీరు కోసం ఉన్న వాగును నగరం వాళ్ళు వచ్చి నీళ్లను, ఇసుకను దోపిడీ చేయడం వల్ల వాగులో నీళ్లు లేవు. వాగులోని ఇసుకను తరలించి వాగు లేకుండా చేసిన స్థితిని,దుర్మార్గాన్ని,దోపిడిని ఎండగడుతూ కవి జింబో వ్యక్తీకరించిన భావం అద్భుతంగా ఉంది.
“అనగనగా
“ఓ చెరువుండేది
“ఎవరి కాంక్షకి బలయ్యిందో
“ఏమో –
“దాన్నిండా సర్కారు తుమ్మల్లా
“ఇండ్లు మొలిచాయి.
చెరువు అనేది నిశ్చలమైన మంచి నీటితో కూడిన చిన్న ప్రాంతం.ఇది ఒక నది లేదా ప్రవాహానికి భిన్నంగా ఉంటుంది.చెరువు సంస్కృతికి అనుకూలం.ప్రతి ఊరిలో చెరువులు ఉన్నాయి. చెరువు వద్ద బతుకమ్మ ఆటను ఆడుతారు.ఆట పూర్తి కాగానే ఊరి జనాలు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు.చెరువులో వినాయకులను నిమజ్జనం చేస్తారు.పల్లెటూరి కల్పవల్లి చెరువు. పల్లెలో చెరువు మీదుగా పక్షులు ఒక వరుసలో ఆకాశంలోకి ఎగురుతాయి.చెరువును జలాశయం అని అంటారు.చెరువు మంచి నీరు నిలువ చేయు ప్రదేశం.చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరి కొన్ని చెరువులు అడుగున ఊట బావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి.చాలా గ్రామములలో చెరువు నీరు త్రాగడానికి ఉపయోగిస్తారు.కొన్ని పెద్ద చెరువులు పంట పొలాలకు నీరు అందిస్తున్నాయి.పూర్వ కాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి చెరువులు త్రవ్వించారు.ఊర చెరువులు పశువులు కడిగేందుకు చాకలి వాళ్లు బట్టలను ఉతికేందుకు వినియోగిస్తారు.చెరువులు చేపల పెంపకానికి ఉపయోగిస్తారు.చెరువు మట్టిలో ఉండే సేంద్రియ పదార్థం,సూక్ష్మ ఇతర పోషక పదార్థాలను సమతూకంగా మొక్కలకు అందిస్తుంది.చెరువు మట్టి ఎర్ర చల్క,దుబ్బ నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి,నేలల్లో సమపాళ్లలో గాలి,నీరు ఉండేట్లు చేస్తుంది.చెరువులు అనేక రకాల జీవులను సంరక్షిస్తాయి.చెరువుల వల్ల వ్యవసాయానికి నీరు దొరుకుతుంది.కొన్ని గ్రామాలకు చెరువు నీరే మంచి నీరు.చెరువు నీరును ఊరి జనాలు త్రాగుతారు. కొన్ని చెరువులలో ఊరి ప్రజలందరు స్నానం చేస్తారు.చెరువులోని నీరు పక్షులకు,పశువులకు తాగడానికి స్నానం చేయడానికి,శరీరం చల్లబడడానికి ఉపయోగపడతాయి.వేసవికాలంలో పిల్లలు చెరువులో ఈత నేర్చుకుంటారు.చెరువుల దగ్గర భూమి సారవంతంగా ఉంటుంది.అనగనగా ప్రతి గ్రామంలో ఓ చెరువు ఉండేది.అన్ని గ్రామాల్లో చెరువులు మాయమై పోయినాయి.చెరువు మీద చెరువు కట్ట చక్కగా చూపరులకు కనువిందు చేసేలా ట్యాంక్ బండ్ లాగా అగుపిస్తుంది.చెరువు నిండా నీటితో పక్షులతో కళకళలాడుతుండేది.చెరువు నీరు రైతులు తమ పొలాలకు పారించి అద్భుతమైన పంటలు పండించే వారు.ప్రతి గ్రామంలో చెరువు ఉండేది.వర్షాలు లేక కరువు కాటకాలతో గ్రామాల్లో చెరువులు ఎండి పోయాయి.పాడి పంటలతో కళకళలాడాల్సిన చెరువు కింద భూములు బీడుపోయాయి.పశువులు మేత లేక కబేళాకి వెళ్ళి పోయాయి.చెరువు ఎండిపోవడం వలన కొందరు కబ్జాదారులు చెరువు కింద ఉన్న గ్రామస్తుల భూమిని స్వార్థంతో కబ్జా చేసి ప్లాట్లు చేసి ఇళ్ల స్థలాలకు అమ్మేశారు.కబ్జాదారులకు స్వార్థపర రాజకీయ నాయకులు మరియు అధికారుల అండదండలు ఉన్నాయి.కబ్జాదారులు పెట్రేగి పోయి చెరువు స్థలాలను స్వాధీనం చేసుకొని అక్రమంగా అమ్మడం వల్ల చెరువు స్థలంలో ఇండ్లు ఏర్పడ్డాయి. చెరువు ఎండి పోతే ఏం జరుగుతుంది?చెరువు స్థలంలో సర్కారు తుమ్మలు మొలవడం ఆనవాయితిగా జరుగుతుంది.కాని ఇప్పుడు కబ్జాదారుల కాంక్ష వల్ల చెరువులు బలి అయిపోవడం జరిగింది.చెరువులో ఉండాల్సిన సర్కారు తుమ్మల స్థానంలో ఇల్లు మొలిచాయి. సమాజంలో కబ్జాదారుల కుట్రలకు అనుగుణంగా వారికి గల రాజకీయ నాయకుల,రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో చెరువులు మాయమై పోవడం వింతైన విషయం ఏమీ కాదు.ఈనాటి సమాజంలో గ్రామస్తుల జీవన ఆధారమైన చెరువు మాయమైపోవడం చూసి ఆవేదనతో కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

రాజేందర్ జింబో

“అనగనగా
“ఓ ఇల్లుండేది
“ఎందరి స్పేస్ ప్రాబ్లమో
“ఏమో –
“దాని గుండె బరువుకు మించి
“ప్లాట్లు కట్టారు.
ఒక ఇల్లు మానవుల నివాసానికి ఉపయోగించే నిర్మాణం.ఇల్లుని గృహం అని కూడా అంటారు.ఇల్లు మనం నివసించే ప్రదేశం.ఇల్లు అనేది ప్రజలు నివసించే భవనం.ఒకే కుటుంబమునకు చెందిన వ్యక్తులు కాపురము ఉండిన దానిని ఇల్లు అని అంటారు.ఇల్లు గాలి,వెలుతురు చక్కగా ప్రసరించగలిగేలా ఇంటి నిర్మాణం ఉంటుంది.కవి అనగనగా అని చెబుతూ ఓ ఇల్లు ఉండేది.రోజులు గడుస్తున్నాయి.కుటుంబం పెరిగింది.ఆ ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులకు నివాసం ఉండటానికి ఆ ఇల్లు ఇరుకుగా ఉండి సరిపోవటం లేదు.ఆ ఇంటిలోని వ్యక్తులు ఆ జాగలో అపార్ట్మెంట్ కట్టి అగ్గిపెట్టెలాగా ఒక దాని మీద ఒకటి బహుళ అంతస్తుల నిర్మాణం చేసి ప్లాట్లు కట్టారు.ఎప్పుడో కట్టిన ఆ పాత ఇంటికి కూడా గుండె ఉంటుంది అని ఆ ఇల్లుకు గుండెకు బరువు మించిన ప్లాట్లు కట్టారని ఆ ఇల్లు తన స్వగతం చెప్పినట్లుగా కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ఓ వూరుండేది
“ఎవరి కండ్లు పడ్డాయో
“ఏమో –
“ఊరు మాయమైపోయింది.
ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అని అంటారు.ఊరు అంటే పల్లె కన్నా పెద్దది,పట్టణం కన్నా చిన్నది.ఊరు అనగా కొద్దిమంది జనావాసాలు ఉన్న ప్రాంతం.కవి జింబో అనగనగా అని చెబుతూ ఓ ఊరు ఉండేది అని అంటున్నాడు.మరి ఆ ఊరి సంగతులు కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.ఇవ్వాళ పట్టణాల్లో నివసించే వాళ్లంతా ఏదో ఒక ఊరికి చెందిన వారే.పాడి పంటలతో కళకళలాడుతున్న ఊరు కరువు బారిన పడింది.ఆరుగాలం కష్టం చేసి పంట పండించిన రైతులు సంవత్సరాల తరబడి కరువు రాజ్యం ఏలుతుంటే బతుకు గడవక ఊరిని విడిచి వలస బాట పట్టారు.ఊరి జనాలు తిండి లేక పస్తులతో ప్రాణాలు తీసుకోరు కదా! ఊరి జనాలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడో ఒక చోట బతుకు సాగుతుందనే ఉద్దేశంతో వలసలకు పాల్పడ్డారు.అన్నమో రామచంద్ర అని జనాలు ‌కడుపు చేత పట్టుకొని ఊరు విడిచి వలస బాట పట్టినారు.కరువు కాటకాలు ఒక వైపు,స్వార్థపూరిత రాజకీయ నాయకుల అనైతిక చర్యల వల్ల ఊరిలో ఉండాల్సిన జనం ఊరు విడిచి వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.కవి జింబో అనగనగా ఓ ఊరు ఉండేది అని చెప్పిన భావంతో కవితకు ప్రాణం పోశారు.ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వ నేతల నిర్లక్ష్యం వల్ల మరియు ప్రకృతి ప్రకోపం వల్ల మానవాళికి శాపంగా మారి ఊరి జనాలు గ్రామం విడిచి వెళ్లారు.పాడువడిన ఊరు దుస్థితిని తలుచుకుంటే కళ్ళనుండి కన్నీరు ఊబికి వస్తుంది. ఎవరి కన్నులు పడ్డాయో ఏమో ఊరు మాయమైపోయింది అని కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా ….
“ఓ కోడి వుండేది
“అది ఉదయాన్నే నిద్ర లేపడం
“ఎవరికి నచ్చలేదో
“ఏమో –
“దాని గొంతు నొక్కేశారు.
కోడి ఒక పెంపుడు పక్షి.కోడిని ఆహారం కోసం ఇళ్లలో పెంచుకుంటారు.కోడి గుడ్లు,కోడి మాంసం ఆహారంగా తీసుకుంటారు.మగ కోడిని కోడిపుంజు అని ఆడ కోడిని కోడిపెట్ట అని అంటారు.కోడి ఉదయాన్నే లేచి తన గూటి నుండి కొక్కరోకో అని కూస్తుంది.కోడి కూయగానే ఊరిలోని జనాలు తెల్లవారుతుందని నిద్ర నుండి లేస్తారు.పట్టణాల్లో అయితే కోడి ఇళ్లలో ఉండదు.కోడి కూత విన రాదు.చదువుకునే పిల్లలు మరియు ఉద్యోగానికి వెళ్లే పెద్దలు అలారం పెట్టుకుంటారు.అలారం మోగ గానే నిద్ర నుండి లేస్తారు.ఊరిలో కూడా పట్టణ సంస్కృతి వచ్చింది. బాయిలర్ కోళ్ల పెంపకం పెరిగింది.చికెన్ సెంటర్ కి వెళ్లి చికెన్ కొంటున్నారు.పూర్వకాలంలో అలారం వలె పని చేసి ఉదయాన్నే నిద్ర లేపే కోడిని ఎవరికి ఇష్టం లేదో ఏమో దాని గొంతు కూడా నొక్కేశారు అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది.నిజం చెబితే నిష్ఠురంగా ఉంది అంటారు.కోడి కూతతో నిద్ర లేచి రైతులు తమ వ్యవసాయ పనులకు వెళుతారు. రైతులు పొలానికి మరియు పెరట్లో చేనుకు నీళ్లు పారిస్తారు.పొద్దున నిద్ర లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.కోడి కూస్తే నిద్ర చెదిరిపోతుందని కోడిని లేకుండా చేసే దుర్మార్గపు సంస్కృతి మనకు ఎల్లెడలా కనిపిస్తుంది.కోడి గొంతు నొక్కేశారు అని కవి జింబో కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా ….
“ఓ సంస్కృతి వుండేది
“ఏ పడమటి గాలి కాటేసిందో
“ఏమో –
“అది శిల్పారామంలో అవశేషమై పోయింది.
ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు,వ్యవస్థలు,ఆచారాలు,వ్యవహారాలు సంస్కృతిలోకి వస్తాయి.ఈ సంస్కృతికి హద్దులు లేవు.అవి నిరంతరాయంగా మారుతుంటాయి.ఒక దానితో ఒకటి కలుస్తూ విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.ఒక సమాజ జీవనంలో మిళితమైన కళలు,నమ్మకాలు,సంస్థలు,తరాలలో జరిగే మార్పులు,తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానం అన్ని కలిపి సంస్కృతి అంటారు. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు,వస్త్రధారణ,ఆటలు,విశ్వాసాలు, కళలు అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి.గతించిన కాలం గురించి,భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి.ఒక సమాజం చేసిన,వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు,వారి సంగీతం,కళ,జీవన విధానం,ఆహారం,శిల్పం,చిత్రం,నాటకం,నాట్యం, సినిమా ఇవన్ని ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం,సంపన్నత,జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావించబడతాయి. తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న వినాయక చవితి, ఉగాది,ఏరువాక,అట్లతద్ది,భోగి, సంక్రాంతి,కనుమ, బోనాలు,బతుకమ్మ,దీపావళి,గ్రామదేవతల పూజలు.తెలంగాణ భాషలోని యాస సొగసులు, కట్టు బొట్టులలో సంస్కృతి విలువలు ఉన్నాయి. ఊరి వారి పిలుపులో బంధుత్వాలు,అనుబంధాలు ఉన్నాయి.ఇక్కడి రైతులు,వృత్తి కార్మికులు చాలా ప్రతిభావంతులు.మానవతా విలువలకు దర్పణాలు. తెలంగాణ పల్లెలు సంస్కృతికి పట్టుకొమ్మలు.ఇక్కడ నివసించే ప్రజలు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఊరి కింద చెరువులో నీళ్ళు ఊరి వాగులో నీళ్లు తాగి జీవించే వారు.కుమ్మరి కుండలు తయారు చేస్తాడు.కమ్మరి ఇనుప వస్తువులు తయారు చేస్తాడు.వడ్రంగి కర్ర పని చేస్తాడు.బతుకమ్మ పండుగలో ఆట పాట ఉంది.ఊరి వారంతా చెరువు దగ్గరకు చేరి బతుకమ్మ ఆడుకునే వారు.కుండను దేవుడుగా పూజించే సంస్కారంతో కూరాడును ఇంటిలో నిలుపుకుంటారు.గిర్నీలు లేని కాలంలో వడ్లను దంచి బియ్యం తీసేవారు.రోట్లో వడ్లను పోసి కుందెన పెట్టి రోకలితో దంచే వారు.రైతు వ్యవసాయ పనులు మొదలు పెట్టే రోజును సాగువాటు అంటారు. రైతులు జీవితంలో భాగంగా నాగలి కట్టి మొక్కుకుంటారు.ఎద్దుల్ని బాగా కడిగి కొమ్ములకు నూనె రాస్తారు.దేవుడిని మొక్కుకుంటారు. సాగువాటును రైతులు శుభకార్యంగా చేసే వారు. చెరువు పంటలకు నీరు అందించేది.ఊరిలోని బర్రెలు ఒకసారి చెరువులో మునిగేవి.ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యక్తిగత కుటుంబాలు వచ్చాయి.మంచి చెడ్డలు పంచుకునే సంస్కృతి అంతరించి పోతుంది.ఊరి జనాలు రాత్రంతా మెలకువగా ఉండి నాటకాలు చూసే వారు. రాత్రంతా ఆడే ఆటలతో పాటలతో విలసిల్లిన పల్లె సంస్కృతి మాయమైపోతుంది.కుటుంబ సభ్యులు ఎవరికి వారే విడిపోతున్నారు.శిల్పారామం హైదరాబాదులోని మాదాపూర్ గ్రామంలో తెలంగాణలో ఉంది.సాంప్రదాయ భారతీయ చేతి పనుల పరిరక్షణకు వాతావరణం సృష్టించాలనే ఆలోచనతో ఈ గ్రామాన్ని రూపొందించారు.ఏడాది పొడవునా రోజు ఉత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ హైటెక్ హబ్ నగరంలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శిల్పారామం సంప్రదాయం సాంస్కృతిక వారసత్వం యొక్క సుందరమైన వాతావరణాన్ని ఇస్తుంది.భారతీయ కళలు చేతి పనుల ప్రోత్సాహం సంరక్షణ కోసం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1992 సంవత్సరంలో ఈ వేదికను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో మినీ శిల్పారామం ఏర్పాటు చేయబడింది.అనగనగా అని చెబుతూ ఓ సంస్కృతి ఉండేది.ఆ సంస్కృతి ఏమైంది? ఇప్పుడు ఆ సంస్కృతికి సంబంధించిన వాతావరణం మరియు రూపురేఖలు ఎక్కడ కనబడడం లేదు.అట్టి ఘనమైన సంస్కృతి ఎక్కడినుండో తుఫాను వలె దూసుకు వచ్చిన పడమటి గాలి కాటుకు గురై పోయింది ఏమో అని అంటున్నాడు.మన ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయం యొక్క వారసత్వం శిల్పారామం లోకి చేరిపోయింది అని ఆవేదనతో కవి జింబో వ్యక్తీకరించిన తీరు అద్భుతంగా ఉంది.
“అనగనగా …
“ఓ మనిషి ఉండేవాడు
“అతని మీద అతనికే కోపమొచ్చి
“తలని తీసి మానిటర్ ని
“తగిలించుకున్నాడు.
క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం.మన మనసుకి నచ్చక పోయినా లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారి పై మనకు కలిగే వ్యతిరేకతానుభూతిని,ఉద్రేకం లేదా కోపం అనవచ్చు.కోపం పర్యవసానంగా ఎదుటి వారిపై దాడి చేయటం,ఎదుటివారిని దూషించటం వంటి వికారాలు కలుగుతాయి.కోపం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపరచుకోవడం ఎంతైనా అవసరం.కోపం ప్రకృతి పరమైన సహజ ఉద్వేగం.ఇది జీవుల శరీర భౌతిక ధర్మం.నేల మీద మనుగడ సాగించే ప్రతి జీవి కోప లక్షణాన్ని తనలో ఇముడ్చకునే పుడుతుంది. జీవులు మనుగడ సాగించడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ ఆయుధం కోపం.కోపం వచ్చినప్పుడు మనుషులు అరవటం,తిట్టడం,అవమానపర్చటం, చేయి చేసుకోవటం,దాడి చేయడం, పగులగొట్టటంతో పాటు మౌన పోరాటం,నిరాహార దీక్ష, అలగటం,సహాయ నిరాకరణ అలాంటి రూపాలతో కోపాన్ని చూపుతారు.కోపాన్ని ప్రదర్శించడంలో వ్యక్తిగత వైవిధ్యాలే కాకుండా ఒక సమిష్టి ప్రయోజనం కోసం సామూహికంగా కోపాన్ని ప్రదర్శించే రూపాలు బందులు,దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు,మానవహారాలు కూడా ఉంటాయి. అనగనగా అని చెబుతూ ఓ మనిషి ఉండే వాడు.మనిషి అంటే ఎవరు?మనిషి అంటే ఒక వ్యక్తి.ఎందుకో తెలియదు? కొన్ని సమయాల్లో మనిషికి తన మీద తనకే కోపం వస్తుంది.అలాంటి కోపంలో మనిషి తన తలను తీసి కంప్యూటర్లో గల మానిటర్ కు తగిలించుకున్నాడు.అప్పటి నుండి మనిషి మెదడు ఉన్నప్పటికీ ఆలోచించడం లేదు. మనిషి తయారు చేసిన కంప్యూటర్ లోని మానిటర్ చెప్పినట్టల్లా పని చేస్తున్నాడు.మానిటర్ అనగా కంప్యూటర్ స్క్రీన్ లేదా పదాలను చిత్రాలను చూపగలిగే పరికరం.అనంతమైన జ్ఞానం ఉన్నప్పటికీ మనిషి తన మెదడుతో ఆలోచించడం మానేశాడు. కంప్యూటర్లోని మానిటర్ కు తన తలను తగిలించుకున్నాడు అని కవి జింబో కవితలో వ్యక్తపరిచిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ ఓ కల వుండేది
“ఏ పీడ కల దాన్ని కాటేసిందో
“ఏమో –
“కంప్యూటరే కలగంటుంది నేడు.
చాలా కలలు దృశ్యమానంగా ఉంటాయి.అంటే వాసన లేదా స్పర్శ వంటి ఇతర ఇంద్రియాలు, చిత్రాలు కలలలో ముందంజలో ఉంటాయి.నిద్రకు చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల,భావావేశాల,ఇంద్రియ సంవేదనల సందోహాలని స్వప్నాలు లేదా కలలు అంటారు. కలలు యొక్క అంతరార్థం ఏమిటో వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకు పూర్తిగా అర్థం కాదు.కల నిజం కావాలని కోరుకుంటాం.కాని ఆ కల జరిగే అవకాశం ఎక్కువ లేదు.మనలో చాలా మంది కునుకు తీయడం ప్రారంభమైన కొద్ది సేపటికే ఏవేవో కలలు వస్తుంటాయి.ఈ కలలో కొన్ని అద్భుతమైన విషయాలు,వింతలు,విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. కలలు కనడం రాత్రంతా జరుగుతుంది.మనం నిద్ర పోయే ముందు ఏమి ఆలోచిస్తామో లేదా మేల్కొన్న సమయంలో మనం చేసిన పనుల ద్వారా కల ప్రభావితం అవుతాయి.మరి కొందరికి పీడ కలలు వస్తుంటాయి.పీడ కల రాగానే నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంటారు.పీడ కలలు భయానకంగా లేదా కలవర పెట్టే కలలు.దాదాపు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక సారి పీడ కలను కని ఉంటారు.పీడ కలలు రావడానికి కారణం అంటూ ఉండదు.భయానకంగా ఏదో చూడటం లేదా చదవడం,నిద్రలేమి,అనారోగ్యంతో ఉండటం, మరణం,శారీరక హింస,వెంబడించడం,వేటాడటం వంటి కారణాలు ఈ పీడకలలకు మూలం.కలలు కనడం ఆరోగ్యకరమైన నిద్రలోని భాగం ఈ కలలు సాధారణంగా నిద్రపై ఎటు వంటి ప్రతికూల ప్రభావాలను చూపవు.అనగనగా అని చెబుతూ ఓ కల ఉండేది అని అంటున్నాడు.మనిషి నిద్రలో కల కనడం సహజమే.మనిషి నిద్రలో ఉండగా కలను ఏ పీడ కల వచ్చి కాటేసిందో ఏమో అని అంటున్నాడు. కలపై పీడ కల దాడి చేయడం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.రోజులు మారాయి.కాని మనిషి ఇప్పుడు కల కనడం మానేశాడు.మనిషి ఎందుకు కల కనడం మానేశాడు అనే ప్రశ్నలు మనకు తలెత్తవచ్చు.ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషి తయారు చేసిన కంప్యూటర్ కల గంటుంది.కంప్యూటరే మనిషిలా పని చేస్తుంది. మనిషి మాత్రం కంప్యూటర్ వచ్చినంక కలలు కనడం మానేశాడు అనే వాస్తవాన్ని లోకంలో జరుగుతున్న తీరును తెలియజేయడం అద్భుతంగా ఉంది.నేటి ఆధునిక కాలంలో కంప్యూటరే కల గంటుంది అని కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ఓ కథ వుంది
“వినే నాథుడే లేడు.
కథ లేదా కత తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ.కథ అనగా కల్పిత గద్య గ్రంధం.మన రాష్ట్రంలో చిన్న పిల్లలు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్న కథలు చెప్పడం బాగా అలవాటు.కథ ప్రకృతి అయితే కత వికృతి.జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్ప నైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లు చూపించి హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతిలో నింపి పదే పదే వినాలనిపించేది, చదవాలనిపించేది గొప్ప కథ.ఎవరైనా లేనిది కల్పించి మాట్లాడితే కతలు చెప్పకు అంటాం.కల్పిత వృత్తాంతం కలిగినది కథ.అనగనగా అని చెబుతూ ఓ కథ ఉంది అని అంటున్నాడు.మనిషి జీవితంలో వేగం పెరిగింది.ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైనాయి.వ్యక్తిగత కుటుంబాలు వచ్చాయి. ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు.ఎవరి సెల్ ఫోన్ వారిదే.ఎవరిని ఎవరు పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత కుటుంబాల్లో పెద్ద వాళ్ళు ఉండరు. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు గా ఉంటున్నారు. వాళ్లు తమ పిల్లలతో గడిపే సమయం తక్కువ. తక్కువ సమయంలో కథలు చెప్పే ఓపిక వాళ్లకు లేదు.కథలు చదివే వాళ్ళు కూడా తగ్గిపోయారు.ఒక రచయిత ఇంకో రచయిత రాసిన కథలు చదవడం లేదు.ఎవరి కథలు వారే రాసుకుంటున్నారు.కథ చెబితే వినే నాథుడే లేడు.కుటుంబంలో కూడా ఒకరి మాట ఒకరు వినడం లేదు.ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ వారు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటారు.ఒకరి గదిలోకి ఇంకొకరు వెళ్ళరు.ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ మాట్లాడుకోవడం అరుదు.సెల్ ఫోన్ తో జీవితాలు గడుపుతున్నారు. పిల్లలు సెల్ ఫోన్ లో గేములు ఆడుతున్నారు. పెద్దలు సెల్ ఫోన్ ద్వారా కాలక్షేపం చేస్తున్నారు బంధువులు,ఇరుగు పొరుగు వారితో కలవడం కూడా తగ్గిపోయింది.అనగనగా ఒక కథ ఉంది.కథ వినే నాథుడే లేడు అని కవి జింబో కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.కవి జింబో మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఇంటిదేవత

by Pothula Umadevi May 24, 2024
written by Pothula Umadevi

గంపకింద కోడి కొక్కొరొక్కో కొక్కొరక్కో అనికూస్తుంది పందిరి కింద గడెoచెల పoడుకున్న సిరిలచ్చిమికి మేల్కొచ్చింది కానీ లేవబుద్దికాలేదు మళ్లోసారి కొక్కరొకో కొక్కరొకో అన్నదికోడి. ఇగ లేసి శిఖ ముడుసుకొని బొట్టు సరిజేసుకొని చీపురుకట్ట పట్టింది. ఊడువoగ ఊడువoగ యాప చెట్టుకింద నాలుగు తట్టల కసువుఎల్లిoది నిన్న పొద్దుగూకి ఊడ్చిన కుప్పతోటి. ఎత్తి పెoట మీదపోసొచ్చి రోటి మీద కూసున్నది సిరిలచ్చిమి.

అంతలోనే బర్రెనుగొట్టొచ్చిన భర్త మల్రెడ్డి
ఏoదే చిన్నబోయికూసున్నవు లచ్చిమి అన్నడు.
నాతోటైతలేదయ్య ఊడిసిఊడిసీ నా రెక్కలుబోతానయి అన్నది లచ్చిమి
మొన్న యాకన్నకిద్ధామంటే నువ్వే వద్దంటివి ” మొదలు మంచిగా ముదిరింది కోస్తే తలుపు చెక్కలెల్తయ్ నాకీయమని ఒక్క తీరుగా బతిలాడితె నువ్వే వద్దంటివానాడు”… ఇచ్చేయనామరి ? అన్నడు మల్రెడ్డి. “ఇగ ఇయ్యిమరి నాతోటైతలేదు నీడ ఉంటదిగదా అనుకున్నగని” ఇగ ఇయ్యిమరి అని లేసి ఇంట్లోకి బోయింది
సిరిలచ్చిమి.

పన్నెండుగొట్టంగా సిరిలచ్చిమి చిన్న బిడ్డ లలిత ఉరికొచ్చి అమ్మా….. యాకన్న మామ మన యాపచెట్టు కొడ్తాండు వద్దని చెప్పవే…. నా బొమ్మరిల్లుoదాడ… అన్నది
అవును బిడ్డా “మీ బాపూ…చెట్టు అమ్మిoడు ఆ మావకు.” ఆళ్లదే… కొట్టుక పోనీ అన్నది. తల్లి మాటలకు గుడ్లల్ల నీళ్ళు చెంపల మీదికిగారతాoటే లలిత ఇంటిముందుకిపోయి కూసున్నది ఆసాంతం చెట్టు నరికి తీసుకు పోయే దాకా పానమంటి నేస్తాన్ని తీసుకో పోయినట్లు చూస్తూ….

ఓ నాలుగు రోజులు గడిచినంక ఒక నాడు పొద్దుగూకి దిగులుతో కూర్చున్నది లక్ష్మి
అంతలోకే మల్రెడ్డి వచ్చి ఏమైంది లచ్చిమి అట్లున్నావ్? అన్నాడు ఇయాల పక్కూరి పార్వతమ్మ వచ్చి పోయింది నిరుడెండాకాలమంతా మన యాప కాయలు ఏరుకపోయింది మొన్న ఎన్నడో చేనుకు పురుగు పట్టకుండా వేయడానికి యాప గింజలు కావాలని ఎవరో వచ్చి 4000 రూపాయలు ఇచ్చి తీసుక పోయింరట. వద్దంటాంటె నా చేతుల 500 పెట్టి పోయింది ” మీ చెట్టు కాయలే కదా “అనుకుంటా… అన్నది సిరి లచ్చిమి బాధగా నిట్టూర్పుతో… దానికి మనకు రుణం తీరిపోయింది మనసు నిమ్మలం చేసుకో అన్నాడు మల్రెడ్డి.

చెట్టు పోయినా ఆ బొమ్మరిoట్లనే ఆడుతున్నది లలిత రోజూ.
వారం రోజులకు ఓనాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అడ్డం పడ్డది లలిత.
సిరిలచ్చిమి గాబరపడి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే అన్ని పరీక్షలు చేసి ,”పాపను ఎండలు తిప్పింరా వడ దెబ్బ కొట్టింది…ఎండల ఆడిందా? అని చెప్పి మందులు రాసిచ్చిoడు. పార్వతమ్మ ఇచ్చిన 500 పెట్టి మందులు తెచ్చిన… కసాయిదాన్నై చెట్టుకొట్టిచ్చినా కూడా ఇంటి దేవతై నా బిడ్డను ఆదుకున్నది పది రోజులకు గానీ లేవలేదు బిడ్డ.
అప్పుడు లచ్చిమి బాధతో తoడ్లాడుతూ కన్నతల్లిలాంటి చెట్టును పోగుట్టుకుంటినే…. అని వెంటనే ఒక యాపచెట్టు తెచ్చి మళ్లీ నాటిoది…. అప్పుడే వచ్చిన
లలిత అమ్మ కొంగు పట్టుకొని అమ్మా… ఈ చెట్టు ఎప్పుడు పెద్దగయితదే అని అడిగింది అమాయకంగా…పోయిందేదైనా తొoదరగారాదు బిడ్డా అన్నది తాను చేసిన తప్పుపనికి బాధపడుతూ…

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మేడే పండగ

by Y. Chandra Kala May 24, 2024
written by Y. Chandra Kala

వారు నాడు రాణి వాసపు స్త్రీల పల్లకీల మోసిన బోయిలు
ప్రపంచ వింత అయిన తాజ్ మహాల్ కి రాళ్ళు మోసిన కూలీలు

గుళ్ళు, గోపురాలు, ఇళ్ళు, వాకిళ్ళు బహుళ అంతస్తులు
కట్టే శ్రామికులు

నిత్యం గనుల్లో, కర్మాగారాల్లో కష్టించి పనిచేసే కార్మికులు
రక్తాన్ని చెమట చుక్కలుగా కార్చే
బడుగు జీవులు

నవ్య భవంతుల నిర్మాణం కోసం రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమ జీవులు

తాము మాత్రం రహదారి ప్రక్క
తడికల్లోనే కాపురముండే
అభాగ్యులు

ఎన్నడు రానున్నదో క్రాంతి
సమసమాజ స్థాపన తోనే శాంతి

అప్పుడే అందగా నిండుగా నిజంగా సందడిగ
జరుపుకుందాం మెండుగా మేడే పండగ**

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

చిన్న కుటుంబం,చింత లేని కుటుంబం

by Pratyusha Itikyala May 24, 2024
written by Pratyusha Itikyala

నేను గజిని లెక్క. ఒకసారి చూసిన మొహం, విన్న పేరు అంత బాగా గుర్తుండవు. నాతో కాసేపు మాట్లాడి, మీ పేరు మీరే చెప్తే అప్పుడు మీ గొంతులో మీ పేరు, ఆ పేరుకి ఒక మొహం నా బుర్రలో ఫీడ్ అవుతాయి.

అలాంటి నాకు నా పెళ్ళికి ముందు పెద్దగా పెళ్లిళ్లకు వెళ్ళే అలవాటు అవసరం, అవకాశం కూడా లేవు. ఇంటరు వరకు చదువు చదువు అని హోం అరెస్ట్. ఆ తరువాత చదువు ఉద్యోగం కోసం రాష్ట్రం బహిష్కరణ.

కట్ చేస్తే నా పెళ్లికి పదిహేను వందల మంది అతిథులు. అందులో నాకు తెలిసింది తిప్పి తిప్పి కొడితే వంద మంది. ఏదో ప్లాస్టిక్ నవ్వుతో పెళ్లి అయిపోయింది.

ఆ తరువాత చూస్కోండి ఇంటికి ఏ పెళ్లి శుభలేఖ వచ్చినా ఇదే తంతు.

“వీళ్లు నాకు తెలియదు. నేను పెళ్లికి వచ్చి ఏం చేస్తాను అత్తమ్మా? పైగా సెలవు కూడా లేదు.”

“దగ్గరి వాళ్ళేనే. మా చిన్నమ్మ ఆడిబిడ్డ మేనల్లుడికి మరదలు. ఆళ్ళ మొగుడు మా మారక్క మనుమరాలు అత్త ఏరాలి తమ్ముడే. రెండు దిక్కుల దగ్గరే కదా. సెలవు పెట్టు. వెళ్లక పోతే బాగుండదు.”

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ఆట మొదలు. ఆ చిన్నమ్మ ఆడిబిడ్డ దగ్గరే నా బుర్ర వాళ్ళ మొహాలు, పేర్లు వెతుక్కుంటూ “Error 404 Not Found” అని తెల్ల మొహం వేస్తుంది.

అలా హాజరు అయిన పెళ్లిళ్ల సాక్షిగా ఆ పెళ్ళిళ్ళలో మరో సీన్ రిపీట్

“ఈమెను గుర్తు పట్టినవా?

ఆరోజు చెప్పిన గదా. మా పెద్దాడిబిడ్డ వాళ్ళ అత్త తల్లిగారు వీళ్ళ ఊరే. చిన్నప్పుడు ఒకసారి వెళ్లి వాళ్ళ ఇంట్లో తిన్నం. మంచి మనుషులు.”

ఈలోపు నా బుర్ర మీ పేరెంత.. సారీ..పేరేంటి, మాకు ఏమవుతారు అని అడగాలని ప్రయత్నిస్తూ ఆ వరసల పురాణం ఎప్పుడు తెగేను అని స్విచ్ ఆఫ్ అయిపోతుంది.

ఇహ ఎంతో పరిచయం ఉన్నవాళ్ళ లాగా వాళ్ళే దగ్గరికి వచ్చి మనం నమస్కారం చేశాక “హే నన్ను గుర్తు పట్టావా, నా పేరేంటి చెప్పుకో చూద్దాం” అన్నప్పుడు వెయ్యి ఓల్టుల కరెంటు షాక్ కొట్టి మెదడు మొత్తం కొయ్యబారిపోయినట్టు ఉంటుంది..

అదండీ నా అశక్తతకు అంచనాలకు మధ్య యుధ్ధాలు నా సహనాన్ని అలా పరీక్షిస్తూ ఉంటాయి. ఎవరైనా పూనుకుని ఎదుటి వాళ్ళ మొహం స్కాన్ చేసి మన ఫోన్ మీద వాళ్ల పేరు, ఊరు, మనకు ఏమవుతారు లాంటి వివరాలు వచ్చేలా ఒక యాప్ చేస్తే బాగుండు.

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఒక క్రూరమైన మారుతల్లి మరియు పన్నెండు మంది యువకులు

by ఒద్దిరాజు మురళీధరంరావు May 22, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

పూర్వం ఒక క్రూరమైన మారుతల్లి. ఆమె భర్తపేరు మ్యాలెట్‌. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రోజీ ఆమె స్వంత కూతురు. జానీ ఆమె చనిపోయిన సవతి కూతురు. పొద్దున్నే ఆమె కూతురు రోజీకి కడుపు నిండా రుచికరమైన కోడి కూర, మాంసముతో నింపబడిన పావురము తినడానికి ఇచ్చింది. ఏదో మిగిలింది చాలీ చాలనిది జానీకి ఇస్తుండేది.
రోజీ ఏ చిన్న పని కూడా ముట్టుకోకపోయేది. మొత్తం ఇంటిపని ఉదయం నుండి సాయంత్రం వరకు జానీతో చేయించేది మారుతల్లి. అయినా మెచ్చుకోకపోయేది.
రోజీ ఎప్పుడు మంచి సిల్కు మరియు ఖరీదైన వులన్‌ దుస్తులు ధరించేది. జానీకి మాత్రం మామూలు కాటన్‌ దుస్తులు ఉండేవి.
అది జనవరి మాసం. బయట మొత్తం మంచు, విపరీతమైన చలి. చాలా మటుకు అందరు చలికి తాళలేక మంటల దగ్గర కూర్చునేది. ఒకసారి మారుతల్లి బయటికి తొంగి చూసేవరకు చలికి ముక్కు ఎర్రబడింది.
ఎంతో ప్రేమ నటిస్తూ నోట్లో పంచదార ఉన్నట్లు ఓ నా ముద్దుల జానీ అని పిలిచి నాకు మన ఇంట్లో టేబుల్‌పై గాజు వేజులో లిల్లీ పూల సువాసన ఆనందించాలని ఉంది. నీవు వెళ్ళి అడవి లోయలో పూసే లిల్లీ పూలు తీసుకరా అని అంది. అందుకు జానీ అమ్మా ఇది జనవరి మాసం, ఇప్పుడు లిల్లీలు వుండవు కదా. ఆ మాట పట్టించుకోకుండా జానీని డోర్‌ తీసి బయటికి నెట్టి వెనుక నుండి డోరు ఢబీల్న మూసేసింది. విధిలేక జానీ ఆ చలిలో అడుగుపెడితే జారే మంచుపై, అతి కష్టంగా నడుస్తూ అడవిలోకి చేరింది. ఆ అడవిలో ఆమె పన్నెండు మంది యువకులను చూసింది. వారు వేసవికాల దుస్తుల్లో వున్నారు. ఒకడు మాత్రం మేకతోలు కోటు వేసుకొని ఉన్నాడు. అతనే వారి లీడరు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి జాలితో ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. ఆమె కథంతా వాళ్ళకు చెప్పింది. అప్పుడు వారిలో ఒకతని జేబు నుండి లిల్లీ పూలు తీసి ఇచ్చాడు. అవి పట్టుకొని ఇల్లు చేరింది. మారుతల్లికి ఈమె తిరిగి వచ్చినందుకు కోపమే కాని లిల్లీలు తెచ్చిందని లోనికి రానిచ్చింది.
మరుసటి రోజు ఎంతో ప్రేమను నటిస్తూ నా ప్రియమైన జానీ, నాకు బాస్కెటు నిండా స్ట్రాబెర్రీసు అడవి నుండి తీసుకురా అంది మారుతల్లి. దాదాపు కన్నీరు పెట్టుకుని జానీ అంది, అమ్మా అవి జనవరిలో అవి పండవు కదా. నోరు ముయ్యి అని గద్దించింది మారుతల్లి. నీవు లిల్లీసు తెచ్చినవు గదా. అదే మాదిరిగ స్ట్రాబెర్రీసు తే అని జానీని బయటికి నెట్టి తలుపు మూసేసింది. పాపం అమ్మాయి  మోకాళ్ళ మటుకు మంచులో, చలి గాలిలో మామూలు దుస్తుల్లో అడివికి చేరింది. అక్కడ ఆ పన్నెండు మంది యువకులు కలిశారు. వారితో ఆమె తన మారుతల్లి చెప్పిన విషయం చెప్పింది. ఆ యువకులకు కోపం వచ్చింది. మేకతోలు కోటు వేసుకున్నతను సరే నీకు స్ట్రాబెర్రీసు ఇస్తాను, కాని నీ మారుతల్లి జాగ్రత్త పడాలి. అతను తనవారిలో ఒకతనితో అమ్మాయి బ్యాగ్‌ నిండా రుచికరమైన స్ట్రాబెర్రీసు నింపమన్నాడు. నింపినాక వాటిపై అతను ఊదాడో, అదేంటో తెలియదు కానీ ఇది నీ మారుతల్లిని బాగు చేస్తుందన్నాడు. జానీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది. ఆమె దారిలో వెచ్చదనం అనుభవించింది. మారుతల్లికి జానీ తిరిగి రావడం ఇష్టంలేక కోపించింది, కానీ స్ట్రాబెర్రీసు బాగా ఇష్టమైనవి. వాటిని తీసుకుని ఆమె, ఆమె కూతురు రోజీ గబగబా ఒక్క పండు మిగలకుండా తినేశారు. జానీకి పాపం ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కానీ తల్లి బిడ్డ ఆ రాత్రి వానరాళ్ళు తిన్నట్లు చాలా కడుపునొప్పితో బాధపడ్డారు.
మరునాడు ఉదయం రోజీ మరియు ఆమె తల్లికి కొంత ఆరోగ్యం బాగయ్యింది. మారుతల్లి  జానీని బయటకు పంపేందుకు ఏదో ఉపాయం ఆలోచించసాగింది. ప్రేమ ఒలకపోస్తూ ఓ నా ప్రియమైన జానీ, నువ్వు గోనెసంచీ తీసుకొని అడవికి అవతలివైపు వెళ్ళి అక్కడ పండే మంచి వెరైటీ వోర్‌ సిస్టర్‌ పియర్‌ మేన్స్‌ ఆపిల్సు సంచీ నిండ తెంపుక రా. జానీ ఈసారి ఏ అడ్డూ చెప్పకుండా ఒక నిట్టూర్పు తీసి బయటికి వెళ్ళింది. మంచులో మూడుసార్లు జారిపడింది. కాళ్ళకు దెబ్బలు తగిలి గాయాలయినాయి. ఎలాగో అడవి చేరింది. అక్కడ ఆ 12 మంది యువకులు కలిశారు. ఈమె చెప్పినట్లు సంచి నిండా ఆపీల్సు పెట్టించాడు మేకతోలు కోటులో ఉన్నతడు. ఓహో ఆమె గార్కి మంచి వెరైటీ ఆపిల్సు కావలసి వచ్చిందా అన్నాడు. సంచిలో పండ్లు నింపిన తరువాత వాటి మీద మూడుసార్లు చల్లని ఆవిరి వచ్చేట్లు ఊదాడు. ఇప్పుడు మారుతల్లి వీటిని అంతగా ఆనందించకపోవచ్చు అన్నాడు అతడు. ఆ బరువైన సంచి జానీకి ఒక ఈకవలె తేలికగా ఉండి ఆమె మంచు మీద మెత్తటి దారి మీద నడిచినట్లు నడిచి ఇల్లు చేరింది. అతను మీ చెల్లెలును వీటిని తినవద్దని చెప్పమన్నారు. ఆమె ఆ విషయం చెప్పినందుకు చెల్లెలు ఆమెను నెట్టివేసి తామే తినేశారు గబగబా. వారికి కడుపులో బాగా నొప్పి లేచింది. ఈ విశ్వాసం లేని అమ్మాయి దయ్యంతో కలిసి మనమీద కుట్ర చేసిందని మారుతల్లి అంది. వారి కడుపులో పేగులకు ఏమీ తెలీదు. కానీ వారు దూదిపింజల లాగ ఇంటి పొగ గొట్టం నుండి బయటపడి ఎంతో దూరం తేలిపోయారు. ఇంటిదారి ఎప్పటికీ దొరకలేదు. ఇంటి వద్ద తండ్రి, కూతురు వివాహమై తన మంచి భర్తతో కలిసి ముగ్గురు ఎప్పటికన్నా ఎక్కువ సంతోషంగా వుండిపోయారు. మారు తల్లికి తగిన శాస్తి జరిగింది.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అద్భుత యుద్ధం

by Chandaluri Narayana Rao May 22, 2024
written by Chandaluri Narayana Rao

అప్పటి దాకా
నీ మంచితనం నీవు చెప్పుకోవడం అనేది
తెలివితక్కువగా అవసరమనుకోవడం
ఓ పెద్ద లోపం.
కాలం ఖచ్చితంగా నీ కోసం
కొన్ని రోజులని దాచే ఉంటుంది

అందాకా ఆగితేనే
నీకు క్షమాపణ చెప్పుకుంటూ
నీ పేరు మీద గడిపే మిగిలిన రోజులన్నీ
మౌనంగా నిన్ను బలపరస్తూ
బహిరంగంగా  శ్రమిస్తాయి..

నీ తరుపున దేవుడు వాదించి
తానే సాక్షిగా రుజువు చూపుకుని
నీలో నిజానికి  ప్రేమతో
గెలుపును బహుమతి చేస్తాడు

సమస్యల్లా
సహనం అనే పరీక్ష  శిక్ష కాదు,
అద్భుత యుద్దమని మరువకుంటే  చాలు…

ఒకరేవరూ
తప్పును మోసం చేసి నటిస్తూ
తప్పించుకు పోలేరెక్కడికో…

దేవుడికి ఎన్ని పేర్లుతో  రూపాలున్నా
నిజం మాత్రం  ఒకే ఒక రూపంలో
తిరుగులేని తీర్పు చెబుతుంది…
కొద్దిగా ఆలస్యం అనిపించినా
మరింత పటిష్టంగా….

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఆద్యవధాన సరస్వతి, తొలితెలుగు మహిళావధాని శ్రీమతి ఎం.కె. ప్రభావతి

by Dr. Lakshmanacharyulu M May 22, 2024
written by Dr. Lakshmanacharyulu M

                                సత్యమె మనజాతి, నీతి / సత్యాచరణే
                                సత్య హరిశ్చంద్రు కథయే
                                సత్యము గాంధిని మహాత్ము సలిపెన్‌ భక్తా !
                                ఆంధ్ర భాగవతపు / టందాల వెన్నుచు
                                జన్మ ముగియులోన / చదువవలెను
                                ధన్యుడైతి వోయి / ‘తన’ పోవ(గ) పోతనం
                                ”పోత” ”నా భవాబ్ధి” / నే తరింతు.                                      – ఎం.కె. ప్రభావతి

అది కర్నాటక రాష్ట్రంలోని మధురగిరి తాలూకాలోని తుంకూరు జిల్లాలో ఉన్న దొడ్డధలి గ్రామం. ఆ గ్రామంలో 78-79 సం|| క్రితం జన్మించిన ఒక ‘పాప’, ఎక్కడో తెలుగు రాష్ట్రంలో వృత్తిరీత్యా సైన్సు ఉపాధ్యాయురాలుగా ఆ తర్వాత రైల్వే విద్యాలయం, జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ గా పనిచేసి, మంచిపేరు సంపాదించి, జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలు దాటి, శ్రీ పొత్తపి శ్రీనివాసరావు గారి అర్ధాంగియై, ముగ్గురు పిల్లలకు తల్లై ఆ తర్వాత, వాగ్ధేవి అద్భుత, అనూహ్య, అఖండ దివ్య కరుణకు పాత్రురాలై, తెలుగు సాహిత్యాన్ని మధించి, తొలి తెలుగు మహిళావధానిగా,  దేశ విదేశాలలో తెలుగు కీర్తి చంద్రికలు వ్యాప్తి చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
తనను ప్రేమించిన వ్యక్తికి 2 షరతులు పెట్టి, ఇంటి పెద్దకుమార్తెగా, తల్లిని పోషిస్తూ, సోదర, సోదరీమణుల జీవితాలు సరిదిద్దాల్సి ఉంటుందని, వారికి స్వావలంబన వచ్చేవరకు మనమే వారికి అన్నీ చూడాలని పెట్టిన అమ్మాయి, ఆ షరతులను తు.చ. తప్పక పాటించి తీరుతుందని, తనకూ భార్యగా ఏ లోటు రానీయక, ఉద్యోగ ధర్మాలు నెరవేరుస్తూనే,  తెలుగు అవధాన గగనంలో సముజ్వల తారగా వెలుగొందుతుందని, ఆ భర్తగాని, వివాహానికి హాజరయిన వారుగాని అస్సలు అనుకోలేదు.
తమకు సైన్సు పాఠాలు చెప్పిన ‘పంతులమ్మ’ తెలుగు అవధానంలో ఒక చరిత్ర సృష్టిస్తుందని 1966 నుండి 2006 వరకూ ఆమె దగ్గర చదువు నేర్చిన ఏ విద్యార్థి భావించలేదు.
అమ్మ తమకు ఏ లోటూ రానీయకుండా పెంచి పెద్దచేస్తూనే తెలుగు ప్రాచీన, ఆధునిక కావ్యాలను ఆపోశన పడుతూ, ఆశువుగా పద్యాలు చెప్పగలిగే స్థాయికి వెళ్ళి అన్ని ఛందస్సులలోనూ రచనలు చేసినదని, ”శ్రీనరసింహ శతకము”, ”రామా! నీ కథ వినుమా!”, ”భవాబ్ది పోతము”, ”భక్తి అంటే?”, ”శ్రీ విద్యాస్తుతి”, ”చదువు”, ”నవ్వు నవ్వించు”, ”చాటువులు”, ”వ్యాస కదంబం”, ”దేవుడొక్కడే” వంటి అద్భుత, అనితర సాధ్య రచనలు చేసి, కన్నవూరికి, తాను ఉద్యోగాలు చేసిన ఊళ్ళకు, నివసించిన  ఊరికి ఘనకీర్తి తెచ్చి, ”తాము ఆమె సంతానం” అన్న గౌరవం తమకు దక్కేస్తుందని వారూ అనుకోలేదు.
తానా సభలు (అమెరికా) ఆమెను ఘనంగా సన్మానించి, తద్వారా తాము గౌరవం పొందుతామని ప్రత్యేకంగా ఆలోచించలేదు. తోటి అవధానుల అవధానంతో పృచ్ఛకురాలిగా, ఎన్నో సాహిత్య ఆధ్యాత్మిక సమావేశాలకు, సభలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీమతి ప్రభావతి స్నేహశీలి, నిగర్వి, జిజ్ఞాసువు, హాస్యచతురత, సంభాషణా కుశలత, సహృదయ స్పందనతో ఎందరినో ప్రోత్సహించిన మృదుభాషిణి, మధురభాషిణి. ఎందరో వర్ధమాన కవుల, రచయితల రచనలకు (ఈ వ్యాసం వ్రాస్తున్న నాతో సహా) చక్కని, చిక్కని, ప్రోత్సాహకమైన, నిర్మాణాత్మక ‘మున్నుడి’ వ్రాసి, అర్థవంతమైన, నొప్పించని శైలిలో, ఆ రచనలను విమర్శ చేసిన విధుషీమణి. మచ్చుకి –
”పద్యంలో ఏ పాదానికా పాదంలో సంపూర్ణమై, అర్థాన్ని ఇవ్వగలిగితే అది సుందరంగా ఉండటమేకాక పాఠకునికి అర్థాన్వయంలో కాఠిన్యమనిపించదు. ఈ లక్షణాన్ని మీరు పట్టుకున్నారు. ఎటువచ్చీ దాన్ని నాలుగు పాదాలలో ఉపయోగించడం వలన ‘చెవికింపు’ మాత్రమే పొందారుగాని పద్యానికి రాదగిన రావలసిన ”చైతన్యం” కొన్ని పద్యాలలో మీరు అందించలేకపోయారు. (మీరు = డా.లక్ష్మణాచార్యులు)
”నేను వ్రాసిన విమర్శలో మొగమాటానికి, ముఖస్తుతికి తావు లేదు. వ్రాసిన ప్రతి మాటకు విలువ అందులోని సత్యమే సుమా!”

”ఈ కవి మంచి భావుకుడు” (అభినందనలు- (దృశ్యాదృశ్యాలు- (ఈ వ్యాసరచయిత పుస్తకం) ఎం.కె. ప్రభావతి)

అమలాపురంలోని ‘త్రివేణి’ సంస్థ ‘అవధాన భారతి’ అని బిరుదును ఇచ్చింది. ‘తానా’ (అమెరికా) రెండుసార్లు (2002 & 2004) ప్రథమ మహిళా అవధానిగా సన్మానించింది. పో.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.
భారతీయ సంస్కృతిని, హిందూ సంప్రదాయాన్ని, మానవ విలువల్ని, తెలుగు భాష సాహిత్యాలను ఎంతగానో ప్రేమించిన ప్రభావతి భౌతికంగా లేకున్నా, ఆమె యశస్సనే కాయానికి జరా మరణములు ఉండవు. ఆమె సాహిత్య సేవలు అవిస్మరణీయాలు, అనుస్మరణీయాలు.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us