రాత – నాటిక
వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వెలగలేరు

వారి సమర్పణలో పలువురి ప్రశంసలు అందుకున్న నాటిక ‘రాత’ తక్కువ పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా అద్భుతమైన ఇతివృత్తంతో సాగిన నాటిక రాత .
దర్శకుడు శ్రీనివాసరావు పోలుదాసు. స్వయంగా నాటక రంగం , సినీ నటుడు. టీవీ ,సినీ రంగాలలో డబ్బింగ్ కళాకారుడు. నట శిక్షణ, వాయిస్ శిక్షణ ఇస్తూ, అటు సినీ రంగం ఇటు టెలివిజన్ నాటక రంగాలలో నిరంతరం కృషి చేస్తున్న నటుడు. ఏ పాత్రకైనా న్యాయం చేసే నైపుణ్యం నాటకాల పట్ల అంకితభావం కలిగిన నటుడుగా మాత్రమే కాకుండా స్వయంగా రచించి దర్శకత్వ బాధ్యతను చేపట్టిన శ్రీనివాసరావు పోలుదాసు ప్రధాన పాత్రలో ఈనాటికలో కనిపిస్తాడు. హైదరాబాదులో మూడుసార్లు రాత నాటిక ప్రదర్శించబడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 28 ప్రదర్శనలు ఈనాటిక ప్రదర్శించబడింది. నిశి నాటిక రచన కూడా వీరిదే. భ్నీం గారు రచించిన మూల కథ ‘హరిలోరంగ హరి’ నాటకీకరణ శ్రీనివాసరావు పోలుదాసుగారు చేసి సమకాలీన పద్యనాటకంగా ప్రదర్శింపచేయగా ఈ నాటకం పలువురి మన్ననలందుకుంది.
తాను పొందాల్సినవి మంచిగా పొందుతూ తిరిగి ఇవ్వాల్సిన విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న తీరుని వివరిస్తూ ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం వెలగలేరుకు చెందిన వెలగలేరు ఆర్ట్ థియేటర్ కళాకారులు ప్రదర్శించిన ‘రాత’ నాటిక పిఠాపురంలో జనవరిలో ప్రదర్శించబడినప్పుడు పలువురి ప్రశంసలు పొందింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఈ నాటిక నిలవడమే కాక ఉత్తమ దర్శకుడిగా శ్రీనివాసరావు పోలుదాసు ఎంపికయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయం సత్కళా భారతి 29వ వార్షికోత్సవంలో కూడా ‘రాత’ నాటిక ప్రదర్శించబడింది.


రాత నాటికలో తండ్రి గోవర్ధన్. కూతురు స్వప్నిక. గోవర్ధన్ భార్య లేకుండా కూతురిని చాలా గారాబంగా పెంచుకుంటాడు. స్వప్నికను కిరణ్ మాస్టారు ఆటలలో ప్రోత్సహిస్తాడు.
అజయ్ అనే వ్యక్తి వచ్చి చక్రి ప్లాస్టిక్ ఇండస్ట్రీని ఆ ఏరియా నుండి తీసేయాలని వారించిన గోవర్ధన్ ను ఆ ఇండస్ట్రీ యజమాని చక్రవర్తి కుమారుడు అజయ్ వచ్చి బెదిరిస్తాడు . కీర్తి ఒక ఆశా వర్కర్ . చక్రి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ గురించి రిపోర్ట్ తయారుచేసింది డ్యూటీ నుంచి వస్తుండగా ఆమెకు యాక్సిడెంట్ చేయించి చంపేస్తాడు. ఆ కీర్తి గోవర్ధన్ భార్య. ఈ విషయం గుర్తు చేసిన అజయ్ తో ఆ బెదిరింపుకు బెదిరేది లేదంటాడు గోవర్ధన్. మాట వినకపోతే తన కూతురిని అలాగే చేస్తామని బెదిరించి వెళ్తాడు అజయ్.


స్వప్నిక ఆటలు ఆడుతుండగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది . ఆ పరిస్థితుల్లో డాక్టరుకి చూపించుకోగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది .ఇకపై ఆటలు ఆడకూడదని డాక్టర్ సలహా ఇస్తాడు. ఆటల పట్ల ఆసక్తి ఉన్న స్వప్నిక బాగా కృంగిపోతుంది. దేన్నైనా ఇష్టపడటమే నేను చేసే తప్పా అని సూటిగా ప్రశ్నించిన స్వప్నిక తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానికి కారణం బ్రహ్మ రాసిన రాత అని వివరిస్తాడు గోవర్ధన్. స్వప్నిక బ్రహ్మను ప్రశ్నించగా బ్రహ్మ వచ్చి స్వప్నికతో మాట్లాడే వృత్తాంతం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈనాటికలో మనుషుల గురించి మనుషుల మనస్తత్వం గురించి బ్రహ్మతో చెప్పించడం నాటికలోని వైవిధ్యం. మనిషి జీవితానికి సైన్స్ కి ఆధునికతకి సాంకేతికకి మధ్య మనిషి ఏం చేస్తున్నాడో ఆలోచింపచేస్తుంది ఈ నాటిక. స్వప్నికకు ఏం జరిగింది గోవర్ధన్ స్వప్నికకు ఏం చెప్పాడు చివరకు ఏం జరుగుతుంది తెలియాలంటే రాతనాటిక చూడాల్సిందే !
రాతను రచించిన శ్రీనివాసరావు పోలుదాసు ప్రస్తుతం మనల్ని పట్టిపీడిస్తున్న సమస్యను పరిమిత పాత్రలతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలాగా రచించారు. 28 ప్రదర్శనలు అనేక బహుమతులు అందుకున్న రాతనాటికకు తండ్రి గోవర్ధన్ పాత్రను రచయిత దర్శకుడు అయిన శ్రీనివాసరావు పోలుదాసు ముఖ్యపాత్రను పోషించారు. స్వప్నిక గా సురభి వాగ్దేవి ఎక్కడ తడుముకోకుండా డైలాగులను చెబుతూ పాత్రకు జీవం పోసింది . మాస్టారుగా కిరణ్ పాత్రలో సురభి రాఘవ , అజయ్ పాత్రలో పవన్ కళ్యాణ్, బ్రహ్మ పాత్రలో దిలీప్ …తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఏనాటిక విజయవంతంగా ప్రదర్శించబడిందని చెప్పినా విన్నా దాని వెనక సాంకేతిక నిపుణుల సహకారం ఎంతైనా ఉంటుంది. సంగీతం అందించింది సురభి నాగరాజు, ఆహార్యం సురభి రాఘవ, సెట్ మరియు లైటింగ్ సురభి ఉమాశంకర్, సహకారం బుగ్గోజు జయరాం. ఈనాటిక ప్రదర్శకులు వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ , వెలగలేరు, కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా. సామాజిక సమస్యలపై దృష్టి సారింపజేసే ఇటువంటి నాటికల ప్రదర్శన నేడు అత్యవసరం అందుకు పూనుకున్న శ్రీనివాసరావు పోలుదాసు సర్వదా అభినందనీయుడు.





