మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

మన తెలుగు నాటకాలు

by Sammeta Vijaya May 29, 2026
written by Sammeta Vijaya


వన్ ప్లస్ వన్ నాటిక

రచన మాడభూషి దివాకర్ బాబు గారు . దర్శకత్వం డా. శ్రీజ సాదినేని. నటీ నటులు శ్రీజ సాదినేని, శశిధర్‌ ఘణపురం
వన్ ప్లస్ వన్ సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో రసరంజని , శ్రీ చాట్ల శ్రీ రాములు థియేటర్ ట్రస్ట్ నిర్వహణలో ప్రతిభా పురస్కారం 2025 శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి (సీనియర్ రంగస్థల నటులు ) ప్రదానం చేసిన సభలో శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి ప్రతిభా పురస్కారం అందించి ఘనంగా సత్కరించిన తరువాత నాటిక ప్రదర్శన జరిగింది. ఇది డా. శ్రీజ సాదినేని దర్శకత్వం వహించిన 38 వ నాటిక.


డా. శ్రీజ సాదినేని ప్రముఖ రంగస్థల, టీవీ, చలనచిత్ర నటి, రచయిత్రి, దర్శకురాలు, వ్యాఖ్యాత, యాక్టింగ్ ఫ్యాకల్టీ, డబ్బింగ్ ఆర్టిస్ట్. చిన్నతనంలోనే హరికథలు చెప్పడం ప్రారంభించిన శ్రీజ అనేక హరికథలను చెప్పడమేకాఉండా కథా వాచస్పతి, అభినేత్రి వంటి బిరుదులు కూడా అందుకుంది. 1994, ఏప్రిల్ 14న తొర్రూరు పరిషత్ లో నిర్వహించిన నాటికల పోటీలలో జన చైతన్య ఒంగోలు వారి మేడిపండు నాటికలో అమ్ములు పాత్ర ద్వారా బాల నటిగా నాటకరంగంలో అడుగుపెట్టిన శ్రీజ అనేక ఇప్పటివరకు అనేక ప్రదర్శనల్లో పాల్గొని, మూడువేలకు పైగా బహుమతులను అందుకున్నది. 150 కి పైగా సాంఘిక నాటికలు/ నాటకాలలో, 15 కు పైగా పద్య నాటకాలు, 40 నాటికలు దర్శకత్వం వహించారు . కొన్ని నాటికలు, ఏక పాత్రలు స్వయంగా రచించారు. జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ‘వన్ ప్లస్ వన్‘ నాటిక ప్రదర్శించారు.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ గారు ప్రముఖ సినీ రచయిత యమలీల, శుభలగ్నం, మావి చిగురు , చూడాలని ఉంది , టాప్ హీరో, నెంబర్ వన్ ,ఆహ్వానం, వినోదం ,సర్దుకుపోదాం రండి ,ఇద్దరు మిత్రులు మొదలైన వంద సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. కథలు కవితలు రేడియో నాటకాలు అనేకం రచించారు .నాటక రచయితగా ప్రతి నాటికకు నాటకానికి అనేక పరిషత్తులలో ఉత్తమ రచన తదితర బహుమతులు అందుకున్నారు. యువ వాహిని డి.వి. నరసరాజు స్మారక పురస్కారం , అక్కినేని నాటక కళా సమితి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, బాపు రమణ వారి ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ పురస్కారం ,సంస్కృతి సాంస్కృతిక సంస్థ గుంటూరు వారిచే ‘ఆచార్య’ బిరుదులు అందుకున్నారు. మంచి రచనా శిల్పం కలిగిన రచయిత. వైవిధ్యమైన నాటికలు నాటకాలు రచించి ప్రదర్శింపచేసారు.దివాకరబాబు నాటకములు , నాటికలు రెండు వాల్యూములుగా వచ్చాయి. వీటిలో రెండవ వాల్యూమ్ లో వన ప్లస్ వన్ ప్రచురితమై ఉంది .


వన్ ప్లస్ వన్ నాటిక నేపథ్యం :
ఈ నాటికకు ఓ ప్రత్యేకత. నాటకం లో రెండు పాత్రలు. సరిగ్గా రెండు పాత్రలే. జీవితాన్ని ఒంటరిగా గడపడం తప్ప వేరే దారి లేదని భావించే అతను , జీవితాన్ని ఇష్టం లేని వృత్తిలో కొనసాగుతున్న ఆమె ఒకానొక పరిస్థితి లో ఎలా కలిశారు వాళ్ళ మధ్య జరిగిన హృద్యమైన సన్నివేశాల సమాహారం ఈ నాటిక . మనసు విప్పి ఒకరి భావాలు మరొకరు తెలియజేసుకున్న వైనం , ఎలాంటి పరిణామానికి దారి తీసిందో రచయిత సున్నితంగా ఆవిష్కరించారు.
కేవలం రెండు పాత్రలతో కథ నడపడం నాటిక ఎక్కడా విసుగు రాకుండా సాగించిన విధానంలో దర్శకత్వ ప్రతిభ కనబడింది. నాటకం ఆద్యంతం తమ నటనతో ఎప్పటికప్పుడు తగిన హావ భావాలు పలికిస్తూ విరామం లేకుండా నటించడం కష్టసాధ్యమైనప్పటికీ తమ నటనతో ఆకట్టుకున్నారు శశిధర్‌ , శ్రీజ. నాటిక ను సహజ నటనతో శశిధర్‌ సొంతం చేసుకుని ఆ పాత్రకు తగిన న్యాయం చేసాడు. శ్రీజ ఎక్కడా ఏ మాత్రం తడబాటు లేకుండా హుషారుగా పాత్రకు ప్రాణం పోసింది. ఇద్దరి మధ్య సున్నితమైన బంధం ఎక్కడా ఇబ్బందికరంగా లేకుండా కొనసాగింది. వారి మధ్య ఒకరిపై ఒకరికి ఏర్పడిన అనుబంధాన్ని
చూపించే ప్రయత్నంలో సంభాషణలు “మాటి మాటికి నిన్ను పిలిపించుకునే ఆర్థిక స్థోమత నాకు లేదు” అన్న అతను “నీ దగ్గర నేనీ ఇంటి ఇల్లాలిననిపించేది” అన్న ఆమె సమాజంలోని స్థితిగతులను ప్రశ్నిస్తాయి.
నాటికకు సహకారం సాంకేతిక నిపుణులు మేకప్ అవినాష్, సంగీతం రాజశేఖర్, సెట్& లైటింగ్ సురభి ఉమా శంకర్ అందించారు.
జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ప్రదర్శించిన ‘వన్ ప్లస్ వన్‘ నాటికకు దర్శకత్వం వహించిన శ్రీజను రసరంజని వారు సత్కరించారు. నగదు బహుమానం అందించారు . కార్యక్రమ అతిథి శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు శ్రీజకు , శశిధర్‌కు , రచయితకు , సాంకేతిక నిపుణులు అవినాష్, రాజశేఖర్, ఉమా శంకర్ లకు నగదు బహుమానం అందజేసారు.
రెండు పాత్రలు అనగానే భూమిక థియేటర్ గ్రూప్ లో ఝాన్సీ రచించి వంశీ చాగంటి తో కలిసి ఇదే విధమైన రెండు పాత్రలతో నటించిన నాటకం రవీంద్ర భారతిలో ప్రదర్శించిన విషయం గుర్తు రాక మానదు. ఇటువంటి వైవిధ్య భరితమైన రచనలు తెలుసుకొని నాటకసాహిత్యంలో వాటి వైశిష్ట్యాన్ని తెలియజేయాలి. ప్రదర్శనలు జరిగినప్పుడు ఎంతో శ్రమకోర్చి సాధన చేసి ప్రదర్శించిన నాటిక చూడటం మన సాంస్కృతిక శోభను ఇనుమడింప చేసుకున్నట్లు అవుతుంది.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు , దర్శకురాలు డా. శ్రీజ సాదినేని, నటుడు శశిధర్‌ , సాంకేతిక నిపుణులు సర్వదా అభినందనీయులు.

May 29, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అనుబంధం

by Namani Sujanadevi May 29, 2026
written by Namani Sujanadevi

‘హలో…..హలో….దిస్ ఈజ్ తేజ….హూ ఈజ్ దిస్ ..’             

‘హలో……బుచ్చన్నా …..’  అటు నుండి ఆదుర్దాతో నిండిన అక్క  కంఠం….

అమ్మావాళ్ళకి తప్ప ఎవరికీ తెలియని తన అసలు పేరు …. ఇండియా నుండి …. దెబ్బకు నిద్రమత్తు వదిలింది…. బెడ్ పై నుండే కాల్ లిఫ్ట్ చేసినవాడినల్లా  దిగ్గున లేచాను …. ఇంత అర్ద రాత్రి .

‘అక్కా…. ఏమైంది …..’ వద్దనుకున్నా ఎదో భయం తొంగి చూసింది  నా కంఠం లో .

‘…. నాన్న కు కొంచెం ఆరోగ్యం బాలేక పొతే హాస్పిటల్ లో జాయిన్ చేసాను… నిన్నే కలవరిస్తున్నాడు …అమ్మ,  నాన్న దగ్గర హాస్పిటల్ లో ఉంది … తొందరగా రా…..’  అక్క అంది.

‘నాన్న …నాన్నకు ….ఇప్పుడెలా ఉందక్కా .. ప్రాబ్లం ఏమీ లేదు కదా….అమ్మతో నైనా మాట్లాడించ కూడదూ … నేను వెంటనే బయల్దేరుతాగాని …’

‘బానే ఉంది …హాస్పిటల్ లో సిగ్నల్స్ లేవు గాని …నువ్వు రారా ……’పెట్టేసింది ..

   ఇక నిద్ర పట్టలేదు…. ఎంతో అత్యవసర మైతే తప్ప అక్క రమ్మనదు . ఏమైంది నాన్న కి…

మనసెందుకో కీడు శంకించింది.

పక్కన సునీల, పిల్లలిద్దరూ  హాయిగా నిద్ర పోతున్నారు. తను ఒక్కడే వెళ్ళాలా …అందరు వెళ్ళాలా… ఇంత హడావుడిగా అంటే…. అయినా ఫర్లేదు… అందరు వెళ్ళడమే మంచిది.. అమ్మ ఎన్నో సార్లు అడిగింది అందరూ రమ్మని… దాదాపు ఆరేళ్ళవుతోంది పిల్లలతో వెళ్లి … పిల్లలతో ఏంటి… చిన్న పాప పుట్టిన దగ్గర నుండి కూడా అమ్మ,నాన్న  చూళ్ళేదు…స్కైప్  లో చూడడమే తప్ప ….  అందరితో కల్సే వెలితే  సరి ..

అర్జెంట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను ….  ఆఫీస్ కి లీవ్  అరేంజ్ మెంట్స్ చేసుకున్నాను .

      విషయం చెప్పి అర్జెంట్ గా సునీలని పిల్లలని బయల్దేరదీసాను … ప్రతీ చోట సమయానికే తప్ప డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా , ఫ్లైట్ తర్వాత కూడా టాక్సీ , కాబ్ బుక్ చేసుకుని ఫోన్ లో అక్క, బావ లతో టచ్ లో ఉంటూ తమ ఊరిలోకి అడుగు పెట్టాడు. 

      మట్టి రోడ్డు పోయి సిమెంట్ రోడ్డు వచ్చింది. గుడిసె లలాంటి ఇంటి ముందర ఉండే ఆవులు, గడ్డి వాములు పోయి చిన్న చిన్న డాబా ఇళ్లయ్యాయి… పెంకుటింటి ముందు, డాబా ఇళ్ళ ముందు ఇంతక ముందు అందరూ కూర్చుని  మాట్లాడుకునే అరుగులు పోయి , గోడలు గేట్లు వెలిసాయి.  గడప పై పసుపు పూసి బొట్లు పెట్టి, గడప చుట్టూ ఎర్రమట్టి తో అలికి , వాకిట్లో పచ్చని పేడతో కల్లాపి చల్లి , తెల్లని ముగ్గు వేసే  సంస్కృతి  పోయి  సిమెంట్ వాకిళ్ళ పై కలర్లతో ముగ్గువేసే సంస్కృతి  వచ్చింది.  ఇపుడిపుడే నాగరికత సంతరించుకుంటున్న ఊరు … అప్పటి పాత ఆనవాళ్ళు లేకుండా చేసుకోవడానికి వ్యర్ద ప్రయత్నాలు చేస్తోంది.

     కారు నెమ్మదిగా పోతోంది… సునీల పిల్లలు దూర ప్రయాణం వల్ల అలసిపోయి నిద్రపోతున్నారు.. పక్కనున్న పచ్చని పోలాలనుంది చాలా స్వచ్చమైన పైరగాలి వస్తోంది. అది ఎంత ఆహ్లాద పరుస్తున్నా, తెలియని ఆందోళన మనస్సును మెలిపెడుతోంది. రాత్రి నుండి నిద్ర లేదు. విమానం లో కూడా ఎంత కళ్ళు మూసుకున్నా ఆలోచనలే తప్ప నిద్ర రాలేదు.. ఎన్నెన్నో  జ్ఞాపకాలు, మధుర స్మృతులు …

. నాన్న ఆజంజాహి మిల్ లో కార్మికుడు. ముగ్గురు  అన్నయ్యలు , ఒక అక్క  తర్వాత  తను పుట్టాడు. తను పుట్టక ముందు అనారోగ్యం చేసి అన్నయ్య లిద్దరూ పొద్దున్న ఒకరు,  సాయంత్రం ఒకరు చనిపోయారట.  అంతకు ముందే ఒక అన్నయ్య చనిపోయాడట. అమ్మ గుండెలవిసేలా ఏడ్చిందట.  అందుకే తను బతకాలని  పుట్టగానే ముక్కు కుట్టించి బిక్షపతి అని పేరు పెట్టారట. చిన్నప్పటి నుండి ఇంట్లో అమ్మ, నాన్న,అక్క అందరూ బుచ్చన్నా అనే పిలుస్తారు. వాళ్ళు , మేనమామ  తప్ప ఎవరైనా ఆ  పేరు పెట్టి పిలవరు. తన పెళ్ళికి ముందు ఎంగేజ్ మెంట్ లో  సునీల ముందు వాళ్ళు బుచ్చాన్నా అని పిలుస్తుంటే , ఆమె ఎవర్నో అనుకుందట. నాన్న కూడా స్కూల్లో చేర్పించేప్పుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ,తన ఇంటికి దేవుడిలా పుట్టాడని సూర్య తేజ అని పేరు పెట్టాడు…

      మిల్లు సైరన్ పొద్దున్న నాలుగు గంటలకే మోగేది. అప్పుడు నిద్ర లేసి  , అరగంట లో

తయారై వెళ్ళిపోయేవాడునాన్న. అమ్మ నాన్నకు టిఫిన్ ఇచ్చి రమ్మని తనను,  అక్కను పంపేది. అప్పుడు మూడు నాలుగు గిన్నెలతో ఇంత పొడుగు టిఫిన్ బాక్స్ ఉండేది. అందులో  ఒక దాంట్లో గడక (జొన్నన్నం), ఒక దాంట్లో పెరుగు, ఒకదాంట్లో మామిడి కాయ పచ్చడి లేదా కూర , ఒక దాంట్లో పెరుగు ఉండేవి… ఆ టిఫిన్  బాక్స్, చెంబులో నీళ్ళు పట్టుకుని తను ,అక్క  అడ్డదారి గుండా మిల్లు లో ఉన్న నాన్నకు సద్ది తీసుకెళ్ళే వాళ్ళు. నీళ్ళు తాగడానికి కాదు. చెప్పులు లేని తమ కాళ్ళకు ఎండలో బొబ్బలు రాకుండా . అక్కా, తనూ పరుగెడుతూ కాళ్ళపై నీళ్ళు పోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. స్కూల్ కి కూడా అక్క, తను  చెప్పుల్లేని కాళ్ళ తోనే వెళ్ళేవాళ్ళు.  మిల్లు లోని కాంటిన్ లో  గళ్ళ లకు గళ్ళ ల్లా ఉండే బూంది నాన్నకు పది పైసలకే వచ్చేది. రోజూ నాన్న రాగానే లోపలనుండి పరుగెత్తుకుని వెళ్ళేవాళ్ళు  తను, అక్క… నాన్న ఇద్దరికీ బూంది ఇస్తూ చెరో ముద్దు ఇచ్చేవాడు.

 నాన్నకు ఆయుర్వేద వైద్యం తో పాటు , ఆధ్యాత్మికత, భజనలు ,పాటలు చాలా ఇష్టం. దాశరధిశతకం లోని ‘ముప్పున కాల కింకరులు ముంగిట నిల్చిన వేళ…. కఫము కుత్తుక జొచ్చిన వేళ..రామా… నీ నామ స్మరణ కలుగునో కలగదో …నాటి కిప్పుడే నేను జేసెద నీ నామ స్మరణ   దాశరధీ దయాపయోనిదీ ….’ పద్యం ,  ‘శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ ….  కంజ నేత్ర హిరణ్య కశ్య నాశక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ….ప్రహ్లాద వరద పాపద్వంస సర్వేశ కృష్ణ సాగర శయన కృష్ణ వర్ణా …పక్షి వాహన లసత్బ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మ యుగళా… చారుశ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మల వైకుంట ధామ భూషణ వికాస శ్రీ ధర్మ పుర నివాస …దుష్ట సంహార నరసింహ దురిత దూరా….’ అంటూ నరసింహ శతకం లోని పద్యాలు రాగ యుక్తంగా ఎంత చక్కగా పాడేవారో… తనకూ అందుకే కంఠతా అయిపోయాయి. ఇవి మాత్రమేనా …. ‘జై జై మహాత్మా గాంధీ …. నీదే స్వాతంత్రా దీక్షా ….’ అంటూ గాంధీ గురించిన దేశ భక్తీ గేయాలు, పక్కనే ముస్లిం వాళ్ళు ఉండటాన ఉర్దూ లో గేయాలు పాడేవాడు. దూదేకుల వాళ్ళ ఇల్లు, దర్జీ పని చేసే ఖాజుద్దిన్ వాళ్ళిల్లు అన్నీ పక్క పక్కనే ఉండటం వల్ల హిందీ కూడా తెలుగంత స్పష్టం గా మాట్లాడే వాడు. తనూ వహీదక్క, జునీదన్న అని గోడ పక్కనే ఉన్న  వాళ్ళింట్లో ఎప్పటికీ ఆడుకుంటూ ఉండేవాడు. ఇక సాయంత్రం అయితే చాలు ఏడు గంటల వరకే అంతా భోజనాలు చేసి తమ ఇంటి ముందున్న అరుగు మీదకు చేరేవారు..సరిగ్గా వీధి లైట్  తమ ఇంటి ముందే ఉండేసరికి అంతా అక్కడికే చేరే వారు.  ఇక అక్కడ నాటకాలు, పద్యాలు, భజనలు, జోకులు, కష్ట సుఖాలు సకలం పంచుకునే వారు. మగవాళ్ళు నాటకాలు వేస్తూ , పద్యాలు పాడుతుంటే ఆడవాళ్ళు అంతా ఒక పక్కన మిగతా అరుగుల పైన కూర్చుని చూసేవారు. పిల్లలు అమ్మా నాన్నలతో పాటు చిరతలు, తబలా లాంటివి వాయిస్తూ తమ తోటి పిల్లలతో ఆడుతూ ఎంజాయ్ చేసేవారు.  అసలు ఆ సమావేశం ఎంత  లైవ్ లీ గా ఉండేదంటే అందరూ  రోజూ పోద్దటి నుండి చేసిన శ్రమ నంతా అక్కడ మర్చి పోయేవారు. ఆ సాయంత్రం కోసం ఎదురు చూసేవారు.

     అలా పది వరకు ఆడుతూ పాడుతూ చదివిన తను ఇంటర్ లో తప్పని సరై దగ్గరలోని పట్టణం లో హాస్టల్ లో చేరాడు. అమ్మానాన్నలను వదిలి అలా ఉండడం అదే మొదటి సారి కావడంతో చాలా కష్టమయ్యేది. అమ్మానాన్న లకు కూడా అంతే… వారానికి ఒక్క రోజు ఇంటికి వచ్చే తన కోసం కళ్ళు కాయలు కాస్తూ ఎదురు చూసేవారు.

     నాన్నకు తానంటే చాలా ప్రాణం. ఒక సారి అమ్మ ఇంట్లో బోడ కాకరకాయ కూర వండింది.

నాన్న తో పాటు అందరూ శాఖాహారులే.  అదే చాలా మంచిది అనేవాడు.   తనకు బోడ కాకరకాయ కూరంటే చాలా ఇష్టం. కాబట్టి నాన్న ఆరోజు, ‘ ఆకూర నా కొడుక్కు ఇచ్చి వస్తాను ….బాక్స్ లో పెట్టి ఇవ్వు’ అన్నాట్ట…. దానికి అమ్మ, ‘ బస్ లో వెళితే రాను పోనూ డబ్బులు ఖర్చు అవుతాయి…ఎలాగూ వాడు మరో రెండు రోజుల్లో ఆదివారానికి వస్తాడు కదా… ఏమొద్దు’ అందిట. దానికి నాన్న, ‘ ఈ కూర వాడికి బాగా ఇష్టం ..ఇవ్వాళ ఎలాగైనా వాడిని చూడాల్సిందే … నా చేత్తో వాడికి ఈ కూర పెట్టాల్సిందే….  బస్ కి డబ్బులు అంటున్నావు కాబట్టి నా సైకిల్ పై వెళతాను…’ అన్నాట్ట. అమ్మ , ‘ రాను పోను నలభై కిలో మీటర్లు ఎలా తోక్కుతావయ్యా … వద్దులే..’ అన్నా వినకుండా  బాక్స్ లో పెట్టమన్నా డ ట. కొంచెం కూర ఇంట్లో ఉంచి మిగతాది వేసిస్తే, ‘  వద్దు..మనకు లేకున్నా ఫర్వాలేదు…వాడి ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా… నీ చేయివంట అందరికీ ఇష్టమే.. మొత్తం వేయి ..అంటూ గిన్నె మొత్తం ఊర్పించి బాక్స్ లో పెట్టి సైకిల్ పై బయల్దేరాడట… అయితే అదే రోజు తనకు నాన్నను చూడాలని పించడం తో , కాలేజీ హాస్టల్ లో పర్మిషన్ తీసుకుని బయల్దేరాడు. అప్పుడు ఫోన్ లు లేవు కాబట్టి నాన్న సైకిల్ పై అటు, తాను  బస్ పై  ఇటు వచ్చామట… నాన్న తన ఫ్రెండ్స్ కి ఆ కూర ఇచ్చి , ఉసూరు మంటూ మళ్ళీ సైకిల్ పై వచ్చేసరికి చాలా రాత్రయి పోయింది. నాన్న రాగానే తనను దగ్గరకు తీసుకుని ఈ విషయం చెబుతుంటే, అమ్మ, ‘ ఇంట్లో కొంచెం కూడా వాడికి దక్కనియ్యక మొత్తం కూర తీసుకుని, వాడిని తినకుండా చేస్తివి’ అంటూ ముద్దుగా విసుక్కున్నా..అందరం తెగ నవ్వుకున్నాం.   ఆ రోజు తన కిష్టమైన కూర తినకున్నా నాన్న కోసం తాము ఎప్పటిలా  తినకుండా ఎదురు చూసి వచ్చాక పచ్చడి మెతుకులు తిన్నా , ఆ ఆనందమే వేరు…

  అలాగే నాన్నకు చలి అస్సలు పడేది కాదు . చిన్న చిరు చలి కైనా వణికి పోతూ రగ్గు కప్పుకునే వాడు . తల చుట్టూ నల్లని మఫ్లర్  కట్టుకునేవాడు. అమ్మ, అక్క వెక్కిరిస్తుంటే తను నాన్న జట్టుండి నాన్నకు ఇంకా వెచ్చగా కప్పేవాడు. మిల్లుకు చలికాలం  చలి లో నాన్న వెళ్ళడానికి చాలా కష్ట పడేవాడు. ఒక్కోసారి షిఫ్ట్ మార్చుకునేవాడు. అయినా అలా అయితే మధ్యాన్నం వెళ్ళినా రాత్రి పది గంటలకు చలి ఉండేది. కాబట్టి తను నాన్నకు తెలీకుండా తమ ఇంటికి వచ్చిన మామయ్యలు , చుట్టాలు ఇచ్చిన డబ్బులు,  తన పుట్టిన రోజుకు బట్టలు వద్దు …గల్లాలో దాచుకుంటా అంటే అమ్మానాన్న ఇచ్చిన డబ్బులతో ఒక స్వెట్టర్,   మంకీ కాప్ కొన్నాడు నాన్నకి. దానికి నాన్న ఎంత సంతోష పడ్డాడో… ఎంత మందికి చూపించి , నా కొడుకు ఇచ్చాడని గర్వంగా చెప్పాడో…. ఇప్పటికీ తను అమెరికా నుండి పంపించిన మంచి మంచి స్వెట్టర్ లు ఉన్నా నాన్న దాన్నే ఇష్టపడతాడు. అలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్ని జ్ఞాపకాలో….

        మొన్న నాన్న మాట్లాడేప్పుడు, ‘ తమ ఇంటికి ముందున్న ఖాళీ స్థలం లో ఒక వేదిక,  హాల్ కట్టిస్తే , నాట్యం, సంగీతం , నాటిక ,పెళ్లి, సంబరాలు అలా ఆ ఊరిలోని ఎ వేడుక కైనా అది వేదిక అవుతుంది, కళలను పోషించినట్లు, పేదవాళ్ళని ఆదు కున్నట్లు అవుతుంది రా… అలాగే అమ్మ కి గుడి అంటే ఇష్టం. ఎప్పటికి నేను అన్నివేళలా ఉండను కదా తనను తీసుకెళ్ళడానికి, అందుకే చిన్న గుడి కట్టిస్తే బావుండు… ఖాళీ సమయాల్లో అక్కడ అమ్మ , నేను చిన్న పిల్లలకి, భగవత్గీత , సుమతి, వేమన, నరసింహ శతకాల లోని పద్యాలు చెప్పొచ్చు.’ అన్నాడు. ‘సరే…చూద్దాం నాన్నా.’ అన్నాడు.ఆ విషయం కూడా మాట్లాడాలి.

     చిన్న కుదుపుతో కారు ఆగేసరికి  ఆలోచనల నుండి బయటకు వచ్చాను. ఆ కుదుపు తో సునీల కూడా లేచి చుట్టూ చూస్తోంది. బయటకు చూసాను. టెంట్ వేసిన ఎదో ఇంటి ముందు కారు ఆగింది. ఇది మా ఇల్లు కాదంటూ కార్ డ్రైవర్ కి చెప్పబోతూ ఆగిపోయా…. ఎందుకంటే ఆ అరుగుల మీద ఉన్న బావ, మామయ్యా, ఇతర బంధువులు కారు ను చూసి లేచి కారు దగ్గరకు వస్తున్నారు. ఉలిక్కి పడి  తీక్షణంగా చూసా… మా ఇల్లే… ఇంటి ముందు కాలుతున్న కట్టెలు … 

 అంటే….. మస్తిష్కం మొద్దు బారింది.. రెండు రోజుల ముందు,’కన్నా…  మన ఊళ్ళో గుడో, బడో కట్టించాలని ఉందిరా ….దేశం గాని దేశం లో ఉన్నావ్..జాగ్రత్త .. ‘ అంటూ తనకు జాగ్రత్తలు చెప్పిన నాన్న  తన జాగ్రత్త చూసుకోలేక పోయాడు… తను ఇంకా తన కోసం తన కిష్టమైన కూర నాన్న వండించి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నాడు… ఇంత హటాత్తుగా…కారు దిగిన తనను బావ, మామయ్య హత్తుకున్నారు  విలపిస్తూ…  మానసికంగా నిర్వీర్య మైన తన దేహాన్ని  ఇద్దరూ  అతి కష్టం పైన నడిపిస్తూ లోనకు తీసుకెళ్ళారు. లోపల హాల్లో నాన్న  వాలు కుర్చీ పక్కన మంచు ముక్కల పైన నాన్న దేహం నిర్జీవంగా …పూలదండలతో ….

    చలికి వణికి పోయే నాన్న దేహం ఇప్పుడు మంచు ముక్కలపై…అన్ని గంటలు… నా కోసం…

ఆ దేహం పై చిన్నప్పుడు నేను కొనిచ్చిన స్వెట్టర్… భరించ లేక పోయా…. నాన్న పాదాల పక్కన రేగిన జుట్టు , ఉబ్బిన కళ్ళతో  శోక దేవత లా అమ్మ, పక్కనే  నిలువెల్లా నీరైన అక్క.

   నన్ను, సునీలను, పిల్లలను చూడగానే ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి…  అమ్మ ఒళ్లో వాలుతూ  చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాను.  నాన్న పాదాలను కన్నీటి తో కడిగాను..

     ఇక తర్వాత తతంగం అంతా కలలోలా జరిగి పోయింది. చిన్ననాటి నేస్తాలంతా ఎంతో ఆప్యాయంగా హత్తుకుని ఓదార్చారు.  చిన్ననాటి ఊసులెన్నో మాట్లాడు కున్నాం..నాన్న  బూడిద, అస్తికలు అన్నీ కాశీ, కాళేశ్వరం  అన్ని పుణ్య క్షేత్రాలలో కలిపాం.

అయిదవ రోజు అక్క, బావ , ‘అమ్మ ఇక పై ఎక్కడ ఉంటుంది’  అన్న విషయం లేవదీసారు .

‘నాన్న లేని ఈ ఇంట్లో ఇక అమ్మ ఉండదు.ఉంటె పదే పదే నాన్న జ్ఞాపకాలతో ఆరోగ్యం ఖరాబవుతుంది… కాబట్టి నేను తీసుకెలతాను… లేదంటే నేను అక్కడ రిజైన్ చేసి ఇక్కడికే వచ్చేయమన్నా వస్తాను…  అమ్మకు ఏది ఇష్టమైతే అలాగే చేద్దాం..’  అన్నాను.

‘అమ్మ గురించి నువ్వు నీ సెటిల్ అయిన జీవితాన్ని ఈ వయసులో వదిలి ఎందుకు బాధ పడటం.. అమ్మ నే తీసుకెళ్ళు.. అమ్మకీ స్థల మార్పిడి అయి కొంచెం ఆరోగ్యం కుదుట పడుతుంది’ అన్నారు బావ.

  ‘అలా  అయితే ఈ ఇళ్లెం  చేసేది… తాళం వేస్తె వట్టిగా బూజులతో పాడు పడి పోతుంది….

ఆ తర్వాత అయినా నువ్వేమయినా ఇక్కడికి వచ్చి ఉండేది ఉందా….. ఈ ఊరు సర్పంచ్,  ఇల్లు అమ్మితే కొంటా నంటున్నాడు… ఈ సమయం లో ఇది అడగడం తప్పే అయినా నువ్వు మళ్ళీ అమెరికా వెళితే కష్టం కాబట్టి అడగమన్నాడు ‘ అన్నాడు మామయ్యా…

‘మీ ఇష్టం మీరెలా అంటే అలాగే…..’ అన్నాను.

  ఆ సాయంత్రం మల్లె చెట్టు పందిరి కింద మంచం లో అమ్మ  పక్కనే కూర్చున్నా…. జాజి, మల్లె , మరువం,లిల్లి రకరకాల పూల చెట్ల నుండి పరిమళం హాయిగా ఉన్నా మనస్సంతా ఎదో ఆందోళన… ఇదమిద్దంగా ఇది అని చెప్పలేని బాధ…. అమ్మానాన్న ఈ ఇంటి కోసంఎన్నో కష్టాలు పడ్డారు … నాన్నకు చలి పడదని , తను గోడలకు నీళ్ళు పట్టేవాడు.పుస్తకాల అర, బట్టలు పెట్టుకునే అరలు అక్క, తను కొట్లాడి తమ కిలా ఉండాలని ఎదో రారాజుల్లా తమ కిష్ట మైనట్లు కట్టించు కున్నారు. వాటిలో పుస్తకాలే కాదు ,,వాటి మధ్యలో వెలుతురు  చూడని నెమలీకలు, అమ్మ రాత్రితన వంతుకు  ఇచ్చే సర్వ పిండి చెక్కలను, చింతగింజలను , డబ్బులు దాచుకునే గల్లాను ఇలా  సకలం పెట్టుకునేవాడు. ఆ అర పక్క గోడ పై దేవుడి బొమ్మలు, రోజు వారి టైం టేబుల్ అంటించు కునేవాడు. అమ్మ కూడా స్టౌ పెట్టడానికి గట్టు, పక్క గిన్నెలు పెట్టడానికి, అటక పైన తమకు అందకుండా పిండి వంటలు పెట్టడానికి అరలు అలా చేయించింది. ఇక దేవుడి గది అయితే దీపావళికి నోము కుండ లకు అమ్మ పెట్టె బొట్లతో, దీపాలతో వెలిగి పోయేది . ఆ ఇంట్లోని ప్రతీ వస్తువుతో, ప్రతీ చోటుతో తనకెంతో మధురమైన మరపురాని అనుబంధం ఉంది. తనకే ఇలా ఉంటె తన కన్నా ఎక్కువ ఏళ్ళు నాన్నతో ఇదే ఇంట్లో గడిపిన అమ్మకెన్ని ఉండాలి. అసలు అమ్మను ఒక్క మాట అడక్కుండా అమ్మేద్దాం అనేసాడు…

  ‘అమ్మా… ఇల్లు అమ్మేయడం నీకు ఇష్టమేనా….’ అన్నాను… మాటివ్వడం, ఒప్పందం అన్నీ అయిపోయాక అడుగుతున్నందుకు గిల్టీగా ఫీలవుతూ… అమ్మ మాట్లాడ లేదు. కాని అమ్మ కంటి నుండి వచ్చిన నీళ్ళు ఎన్నో అర్దాలు చెప్పాయి.

    తెల్లవారి పదవ రోజు .. ‘ఇప్పటి వరకేప్పుడూ ఎ పక్షీ తొందరగా ముట్టడం లేదు… నాన్న కోరికేదైనా  ఉందేమో … సరిగ్గా మొక్కుకో రా బుచ్చన్నా..’ అక్క గద్గద కంఠం తో అంది. ఇవన్నీ నమ్మక పోయినా నాన్నను తల్చుకుని , ఒక కోరిక చెప్పుకున్నా… అంతే….

‘అరె..ఏమనుకున్నావురా, ఇప్పటివరకూ లేనిది ..అదిగో రకరకాల పక్షులన్నీ ఎలా గుంపుగా వచ్చి ముడుతున్నాయో’ సంభామాశ్చర్యాలతో అక్క, బావ అంటున్నారు. కళ్ళు తెరిచాను. నిజమే…

  ఇంటి కొచ్చాక  అందరి ముందు ,’ అక్కా… అమ్మా…. అందరికీ చెబుతున్నాను… నేను ఇంతకూ ముందు కోరుకున్న కోరిక, నాన్నకు నచ్చిన కోరిక చెబుతున్నాను. ఈ ఇల్లు అమ్మ బోవడం లేదు. ఇక్కడి మనుషులతో, ఈ నేలతో నాకున్న అనుబంధం మరపురానిది, మరవలేనిది. ఏనాటికైనా  ఇక్కడికి వచ్చినప్పుడు నాకూ ఈ ఊరితో గానీ, ఈ ఇంటి తోగాని, ఇక్కడి ఆత్మీయులతో గాని  ఎ సంబంధం లేదన్నది నేను ఊహామాత్రంగా నైనా భరించలేను. అందుకే ఇంటి ముందున్న విశాలమైన ఖాళీ ప్రదేశం లో చిన్న గుడి, దాని పక్కనే లైబ్రరీ ని, సకల కళలు ప్రదర్శించడానికి వేదిక, హాలు  ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అలాగే అమ్మ నుదుటి సింధూరం లో నాన్న కనపడతాడు. గాజుల గలగలల్లో నాన్న వినపడతాడు. చిన్నప్పటి నుండే  వచ్చిన కుంకుమ,పసుపు, పూలు తీసే హక్కు ఎవరికీ లేదు .  ఒక్క అమ్మ విషయం లోనే కాదు , మహిళలను ఏంతో  మానసిక వేదనలకు గురి చేసే ఆ తంతు,  భర్త పోయిన ఎ మహిళ కూ జరగకుండా చూస్తానన్నది ’  నాన్న కిచ్చిన మాట …’ నామాటలింకా ముగిసాయో లేదో, అందరి చప్పట్ల మధ్య అమ్మ నుదుటి పై ముద్దిచ్చి , అమాంతం  నన్ను అక్కున చేర్చుకుంది. అది నాన్న భరోసాలా, అమ్మ అనురాగంలా హాయిగా ఉంది .

May 29, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహిళా సమస్యలపై నవ’తరాన’ -మిస్సెస్ ఫలాన

by Ainampudi Laxmi May 29, 2026
written by Ainampudi Laxmi

50 కవితల ఈ సంపుటిని పలకరిద్దామని చేతుల్లోకి తీసుకున్నాను .కవితా గంధం జారిపడింది .హృదయం గొప్ప అనుభూతితో పరవశించింది. నామని సుజనాదేవి నాకు 25 ఏళ్ళ క్రితం పత్రికల ద్వారా, పరోక్షంగా…ఫోను ద్వారా స్వర పరిచయంగా … తర్వాత ఆకాశవాణి ద్వారా ప్రత్యక్ష పరిచయంగా ..అక్షరయాన్ ద్వారా వ్యక్తిగత పరిచయం గా దఫ దఫాలుగా నా మనసుకు దగ్గరయ్యింది .
తెలుగులో ఏ ప్రక్రియలో పోటీ జరిగినా తన పేరు ఉండడాన్ని గత రెండు దశాబ్దాలుగా నేను చూస్తూనే ఉన్నాను. ఆగని సాహిత్య కర్మగారాన్ని వృద్ధి చేస్తుందా? లేక అక్షర సేద్యం చేస్తుందా? అన్నది నాకు ఒక ప్రశ్నగానే ఉండి
పోయింది. తన సాహితీయానాన్ని రెండు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వస్తున్న నాకు తనని తానే అధిగమిస్తూ, తనని తానే గెలుచుకుంటూ ముందుకు సాగుతున్న తన జీవన ప్రయాణం ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే నామని నా సాహితీ యానం మీద పరిశోధన చేయాలనుకున్న విద్యార్థి. తన సాహిత్యం మీద అప్పటికే ఒక పీహెచ్డీ జరిగినప్పటికీ ఎందుకో తాను నన్ను బాగా అభిమానించేది.
నేను చేసే వైవిధ్యభరిత కార్యక్రమాలంటే తనకి ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా ప్రసారమైన నా ‘కొత్త ప్రేమలేఖలు’ విని మొదట ఫోన్ చేసేది సుజనా, వారి భర్త సంపత్ గారే! మా ఇంటికి కూడా వచ్చారు. ఆ ఆటైంలో నా ఇంటర్వ్యూ, నా రచనల మీద సమీక్షలు రాసారు కూడా .
తాను తన తోటి రచయిత్రుల పట్ల ఎంతో గౌరవం చూపిస్తుంది. అది నాకు బాగా ఇష్టం. ఓపిక, వినయం , నేర్చుకోవాలన్న తపన తన వ్యక్తిత్వాన్ని సాన పడితే … నిరంతరం సమకాలీన సాహిత్యాన్ని చదవటం వల్ల తన రచనా వ్యాసంగం మరింత పదును తేలింది అని నాకు అనిపించేది . అందుకే తాను మా అందరికీ ఇష్టురాలు కాగలిగింది అనిపిస్తుంది .
నామని సుజన కథలు ఎన్నో మార్లు ఎన్నో చోట్ల పరిశీలనకు రావటం .. అందులో నేను న్యాయ నిర్ణేతగా ఉండటం అప్పుడు మిగతా వాళ్ళు సుజన కథల పట్ల ఎలా స్పందిస్తుంటారో చూస్తూ వచ్చాను. ఎంచుకునే అంశంపట్ల .. రాసే కథనం పట్ల ..వస్తూ పోయే పాత్రల పట్ల తనకి గొప్ప క్లారిటీ ఉంటుంది. అదే తన విజయ రహస్యం నిజానికి.
కవిత్వంలోకి ఒదగని సంఘటన, సన్నివేశం ఉన్నప్పుడే నా కలం కథని ఎంచుకుంటుంది. కానీ సుజనకి కథ అంటే చాలా సులువు. తన కథల్లో ఒక స్పార్క్ ఉంటుంది. మనింటి కథే కదా అనిపిస్తుంది. లేదా మన ఎదిరింట్లో జరిగిందో లేక, ఎక్కడో వినిందో అనిపిస్తుండటం తన ప్రత్యేకత. కథ నేపథ్యాలు అందరూ చెప్పలేరు. కానీ సుజన రాసే ప్రతి కథ నేపథ్యం బాగా చెప్పగలదు. నిజానికి తనంతటి స్పీడ్ రచయిత్రిని నేను ఇంతవరకు చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తి పుస్తకానికి …అందునా ఒక కవితా సంపుటికి నేను ముందుమాట రాయగలగటం అంటే కత్తి మీద సాము చేయడమే కదా అనిపించింది. కానీ నాకెంతో ఇష్టమైన కవిత్వం… నా ప్రాణమైన కవిత్వం .. నా అస్తిత్వమైన కవిత్వంతో అందునా మరొక సమవుజ్జి కవిత్వాన్ని తూచడం అంటే భలే మజాగా ఉంటుంది కదా !దాన్ని ఆస్పాదిస్తూ ముందుకెళుతుంటే ఎన్నెన్ని రవ్వలు దొరికాయో! ఎన్నెన్ని రత్నాలు కవిత్వపు పంక్తుల్లో ఒలికాయో ..చెప్పలేను. కవిత్వాన్ని ఆస్వాదిస్తూ ఒకసారి… ఆలోచిస్తూ ఒకసారి… పరిశీలిస్తూ ఒకసారి… పరిశోధిస్తూ ఒకసారి… ఇలా నాలుగు, ఐదు సార్లు ఈ సంపుటిని చదివాక నాకు ఒక స్పష్టత ఏర్పడింది. నిస్సందేహంగా ఇది మహిళ సమస్యలపై నవ’తరాన’ మిస్సెస్ ఫలానా అని….

‘తరాన’ అనేది పర్షియన్ పదం… అంటే ఒక రాగాన్ని అల్లటం… స్త్రీల సమస్యల మీద తాను సరికొత్త స్వరాల్లో… విభిన్న బాణీల్లో, చిక్కటి కవిత్వాన్ని మనకి వినిపించే ప్రయత్నంలో తాను మొదటి స్థానంలో నిలిచిందనే నిస్సందేహంగా నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఏ బేషజాలూ ఉండవు. మంచిని మంచిగా, గొప్ప కవితని గొప్పగా ఎప్పుడు చెప్పుతూనే ఉంటాను. నాకు గొప్పగా అనిపిస్తే సత్కరించటం… ఎక్కడ విన్నా పిలిచి సన్మానించడం… నిరంతరం అక్షరయాన్ ద్వారా చేస్తూనే ఉన్నాం. ఇక్కడ అక్షరయాన్ ప్రసక్తి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అక్షరయాన్ అనేది ఒక నిశ్శబ్ద విప్లవం. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 1508 మంది రచయిత్రుల్ని ఒక వేదిక మీద కి తీసుకొచ్చిన తెలుగు సంస్థ అక్షర యాన్. తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్. దీంట్లో నిరంతరం చాలా ఉత్సాహంగా… ఉత్తేజంగా పనిచేస్తూనే ఉంటుంది నామని సుజన. అక్షరయాన్ లో కూడా తనకి బహుమతులు రావటం జరిగింది. ఎన్నో సందర్భాల్లో తన కథల ఫలితాన్ని, తన ఇంటర్వ్యూని కూడా మేమందరం కూడా కలిసి పంచుకొని, అభినందించిన సందర్భాలు కూడా లేకపోలేదు. అందుకే తాను బహుముఖీన ప్రజ్ఞావంతురాలు అంటారు అందరు. నేను మాత్రం తన రచనంత గొప్ప మనసు తనది అంటూ ‘మానవి ‘గా చూస్తాను .
నామని సుజనాదేవి సమకాలిన కవిత్వంలో తనదైన ముద్రని వేసుకుంటున్నమంచి కవయిత్రి. సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ,సవాళ్లను ఆకలింపు చేసుకుని వాటి వెనక ఉండే సామాజిక ,ఆర్థిక, రాజకీయ పరమైన కారణాల విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం ఉన్న మంచి కవయిత్రి. ఒక కవికి

సమకాలీనత, సామాజికత, సార్వత్రిక అనే లక్షణాలు ఎంత అవసరమో ఆమె కవిత్వాన్ని చదివితే మనకు అర్ధమవుతాయి.
అనాదికాలం నుంచి స్త్రీలకు వేరువేరు రూపాలలో సమస్యలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు సామాజికంగా కుటుంబపరంగా ఎదుర్కొన్నప్పటికీ, ప్రతి యుగంలో, ప్రతి దశలో ఆమె ఆ సమస్యలను అధిగమించిన తీరు ఎప్పటికప్పుడు ఆశ్చర్యమే అనిపిస్తుంది. అలాంటి అసమానతలను తన కవితల్లో, తన అక్షరాలలో, తన వాక్యాలలో పొదిగి స్త్రీ తాలూకు హృదయ వేదనని అందంగా అక్షరీకరించిన కవయిత్రి సుజనాదేవి.
సున్నితత్వం, సృజనాత్మకత, సార్వత్రిక అనే అంశాల ప్రాతిపదికగా ఆమె రాసిన ఈ కవిత్వం అందరినీ ఆలోచింపజేస్తుంది. అయితే ప్రతి కవికి తనకంటూ ఒక జీవన తాత్వికత ఉంటుంది. తన పూర్వకవుల ప్రభావమో, చూసిన ప్రపంచమో, సన్నివేశాలు… సందర్భాలు… వ్యక్తులు… వాటి ప్రభావం …. మరొకవైపున తన అంతరంగం …హృదయంలో… మస్తిష్కంలో జరిగే సంఘర్షణల తాలూకు సంఘర్షణ కూడా తోడవుతాయి. అలాంటి సంఘటనే మనకు నామని కవితల్లో స్పష్టంగా… ప్రస్ఫుటంగా కనిపిస్తుంది .
ఇలా తనదైన ఒక స్త్రీవాద కోణాన్ని, స్త్రీ హృదయం ఆవిష్కరణ చేస్తున్న క్రమంలో ఆమెని ఒడిసిపట్టే గల కవిత గా నాకు అర్థమైన కవిత ‘ఆమె ‘అనే శీర్షిక గల కవిత.

తను ‘ఫలానా’ గా మిగిలి పోవడానికి కారణం అవుతున్న సామాజిక, కుటుంబ, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను… దాని వెనక ఉన్న కుట్రలను కూడా చాలా ఆలోచనాత్మకంగా మనకు అందిస్తూ వచ్చింది ఈ కవిత. అందుకే ఈ కవిత నా మనసుకు నచ్చిందేమో? భారతీయ చింతనకి.. తాత్వికతకి కొలమానంగా సాగే క్రమంలో …

పల్లేరు కాయలు ఆమె దారివెంట ఉన్నాయని అవి సహజంగా పెరిగినవి కాకుండా పరిచినవి గా ఉండటం అనే మాట చెప్పడం వల్ల ఇది సమాజము పురుషుల్లో లేదా వ్యవస్థలో స్త్రీ ప్రగతికి ఆటంకాలని …కుట్రతో చేసినఅంశంగా ఉన్నాయని అంతర్లీనంగా ఆమె తొలి వాక్యాల లోనే మనకు చక్కగా చెబుతుంది. అలాగే చాలా సమాజాలలో ఆడపిల్లని భారంగా… బరువుగా భావిస్తూ ఆమె పుట్టగానే వడ్లగింజ వేసి చంపారనే ఉదంతాలన్నీ, సంఘటనలన్నీ మనం నిత్యజీవితంలో చూస్తూ వస్తున్నాం. అలాంటి ఒక దయనీయమైన అమానవీయ జ్ఞాపకాలతో, పుట్టినప్పుడే వడ్లగింజతో తీయాలనుకున్న ప్రాణాన్ని నిలబెట్టుకున్న దాన్ని అందుకేనేమో తలవంచుకొని వెళ్ళడం అలవాటయ్యింది అన్న వాక్యాల్లో ఆమె చాలా ఆలోచనాత్మకంగా తన ఆవేదనని వ్యక్తీకరిస్తుంది .అంతేకాకుండా ప్రతి చోటా జరుగుతున్న వివక్షను ..పక్షపాతాన్ని కూడా ఎండకడుతుంది .
కూలి పని లో వంట పనిలో అన్నిటిలో అసమానతల్ని ఆమోదిస్తూ, తన జీవితంలో అంతర్భాగంగా జీర్ణించుకున్న విషయాన్ని కూడా ఇక్కడ వ్యక్తీకరిస్తుంది
మరొకవైపున వంట పాత్రల పైన తన పేరు లేనితనాన్ని
ఎంతో హృద్యంగా… మరెంతో వేదనతో ఈ కవితలో ఆమె వ్యక్తీకరించిన తీరు చదివి తీరాల్సిందే!

స్త్రీత్వం ..స్త్రీ తత్వం ..
తనదైన అస్తిత్వాన్ని పోగొట్టుకొని కుటుంబం కోసం పిల్లల కోసం సమాజం కోసం బ్రతుకుతూ

మానవీయ తత్వాన్నికొనసాగిస్తూ సాగే మానవి నైజాన్ని ఆమె ఎంతో చక్కగా ప్రస్తావిస్తుంది .ఇలాంటి తత్వాన్ని కలిగి ఉండటం ఉదాత్త భావనగా కనిపించినప్పటికీ ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర పరిమాణం లోకి మారిపోయే స్థితికి రావడం తన ఆత్మగౌరవాన్ని… తన వునికిని పోగొట్టుకోవడంగా ఆమె కొత్త కోణంలో మనకు పరిచయం చేస్తుంది .ఇలా ఈ కవిత మొత్తం స్త్రీ తాలూకు అస్తిత్వ వేదనగా… అంతర్గత పరివేదన గా సామాజిక అణచివేత నుంచి ఏర్పడ్డ దుఃఖం గా నకు ప్రతి పదంలో కనిపిస్తుంది .
మన హృదయాల్ని కన్నీటితో తడుపుతుంది .అయినప్పటికీ ఒక ఆశావహ దృక్పథం, మరొక అచంచలమైన విశ్వాసం ఇంకొంచెం జీవనో త్సాహం ఈ కవితలో కనిపించకుండా ఉండదు .ఆమెలో ఉప్పెన ఎగిసే ఉత్సాహం ఉంది .మెరిసే మేఘ లాంటి పట్టుదల ఉంది .ఆగ్రహిస్తే అగ్నిలా దహించే ఆవేశం ఉంది .అన్నిటినీ భరించే ధైర్యం ఉంది .అన్నిటిని మించి క్షమించే సహనం ఉంది .అన్నిటిని కలుపుకుపోయే గొప్పతనం ఉంది అంటూ ఒక గొప్ప ఆశావహ దృక్పథాన్ని చూపుతుంది నామని సుజనాదేవి.
వేదన, పరివేదన, సంవేదన, సంక్షోభం, సందిగ్ధత, సందేహం, సంఘర్షణ, పోరాటం ,విప్లవం ,తిరుగుబాటు ,చైతన్యం ,మార్పు ,ఆశ అనే అంశాల ని మనకు మరొక్కసారి సరికొత్తగా ఇంకొంచెం హృదయానికి హత్తుకునేలా
పరిచయం చేసి పాఠకులఅందరిలో ఒక నవ్య ఉత్సాహాన్ని నింపుతాయి తన కవితలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నామని సుజనమంచి కథకురాలే కాక మంచి కవయిత్రి గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది ఈ కవితా సంపుటితో అని చెప్పొచ్చు. ఇలాగే మరిన్ని మంచి రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ…

ప్రతులకు సంప్రదించవలసిన చరవాణి…7799305575&
9247577004


May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పచ్చని ఆకులు

by dr. Lakkraju Nirmala May 29, 2026
written by dr. Lakkraju Nirmala

పచ్చని ఆకులు
తళ తళ మెరుస్తాయి
మరి ఎండుటాకులు
గలగల అరుస్తాయి.

నా భావాలన్నీ
మౌనంగా డైరీలు అయ్యాయి
నన్ను ఖైదీని
చేశాయి

ఎదుటి మనిషి ఆనందంగా
ఉన్నాడు అనుకుంటున్నావు
అతను నోరు విప్పితే
నీ గుండె చె రువుఅవుతుంది

పేరు ప్రతిష్టలు
ఎన్నో త్యాగాల ఫలాలు
ఎంత అప్రతిష్ట
ఒక్క మాట వల్ల

కోపాన్ని
క్షణం ఆపు
మార్పునిలో
ఎంతో గమనించు

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

జీవితంలో ఢక్కా మొక్కీలు తిని ఆవేదనను కవిత రూపంలో వెలువరించిన శ్రీదుబ్బాకుల కృష్ణ స్వామి!

by Achyutuni Rajasri May 28, 2026
written by Achyutuni Rajasri

ఆయన లో వేదన మానసిక అశాంతిని సంఘర్షణను “స్మృతిపధంలో పద్మ” అని తన భార్య పేరుతో అచ్చేసిన పుస్తకంలో చూడవచ్చు.దానికికారణం కృష్ణ స్వామి నామాట లో నేటి కార్పొరేట్ హాస్పిటల్ వల్ల తన భార్య మరణించారని స్పష్టంగా ఢంకా బజాయించి చెప్పారు.బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ వారి ధనదాహానికి ఆమె బలైనారు అని ఐదులక్షలుగుంజి ఆపరేషన్ చేశారని ఆయన నిజాయితీగా నిప్పులు చెరిగారు.ఆమె భౌతిక కాయంని ఇంటిముందు ఉంచాక కన్నీటి ధారలో భావాలు పద్యాలుగా వచ్చాయి.బ్యాంకులో నామినీలేకపోతే పడే ఇబ్బందులు,తహశీల్ ఆఫీసుచుట్టూ ప్రదక్షిణాలను దుయ్యబట్టారు.ఆఖరున” కష్టంలేని మరణాన్ని, పరుల యాచించకూడని మరణాన్ని ఇవ్వమని శివుని వేడుకోటం నిజంగా ఆఖరి చరమదశలో అందరం కోరుకోవలసిందే సుమా!
24.6.1954 లోరంగారెడ్డి జిల్లాలోని తల్లారం గ్రామంలో పుట్టారు.తల్లిదండ్రులు రుక్కమ్మ, కొమరయ్యగౌడ్.తాత ఎల్లాగౌడ్ సమాజసేవకుడు,పల్లెవారికి పట్టుగొమ్మ ఆయన.

కృష్ణ స్వామి గారి మాటల్లోనే ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం-
నాకు 1972 లో ఇంటరు రెండవ సంవత్సరం చదువుతుండగా వివాహం జరిగింది. 1973 లో ఇంటరు రెంవసంవత్సరం చదువుతుండగా తీవ్రమైన కరువు వచ్చింది.పశువులకు మేకకరువయింది.మనుషులకుధాన్యం కారు వొచ్చింది.మానసికంగా ఆందోళన ఎక్కవైంది.చదువు మానుకున్నాను.అప్పుడు నాకు చిత్రకళ పై ఆసక్తి పెరిగింది. వ్యవసాయం చేస్తు చిత్రకళ సాధన చేశాను.నాగలి దున్నుతున్నప్పుడు ఎడ్లకు కొందసేపు విశ్రాంతినిచ్చేవాము ( దానని దమ్మకు నిలబెట్టుట ) అంటారు అప్పుడు నానాగలికి కట్టిన ఎడ్లను చిత్రిస్తుండే వాడిని.ఆబొమ్మను చూడగానే అది ఏ ఎద్దు అనేది అందరు వెంటనే గుర్తుపట్టేవారు.అప్పుడు మాతమ్ముడు ఆలూరు హైస్కూలలులో చదువుకునేవాడు.తెలుగుపండిత్ కృష్ణయ్యగౌడు సారు బాగా డ్రాయింగ్ ఏస్తాడని నాకు పరిచయం చేశాడు .ఆయన నాకు వాటర్ కలర్స్ ట్యఃబులు,బ్రష్ ఇచ్చాడు.నాకు అంతవరకు వాటర్ కలర్స్ బ్రష్ లు చూడలేదు వాటితో నేను వ్యవసాయం చేస్తు సమయం దొరికినప్పుడు సాధన చేస్తుండేవాడిని.కొన్నిరోజులు ఉద్యోగానికని హైదరాబాద్ లో మా బంధువుల ఇంట్లో ఉండగా ఫైన్ ఆర్ట్స్ కాలేజ లో ఇంటర్వూ ఇచ్చాను సెలెక్ట్ అయినాను.కాని ఖర్చులకు భయపడి మానుకున్నాను.అప్పుడే ఉద్యోగవేటలో నాకు హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో పుస్తకాలు చదివే అలవాటు అయినది. అదికూడ నాజీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుపు తిప్పింది.మళ్ళీ ఊరికి పోయి వ్యవసాయం చిత్రకళ సాధన మొదలు పెట్టాను. 1976 మార్చిలో షాద్ నగర్లో నారాయణ శంభు డ్రాయింగ్ టీచర్ వద్ద డ్రాయింగు పరిక్ష నిమిత్తం పదిలహరోజులు ట్యూషన్ వెళ్ళాను. అదే సంవత్సరం లో ఆగస్టులో మా ప్రక్క ఊరి ఒక పెద్దభనిషి తన మిత్రునికి ఉత్తరం వ్రాసి నన్ను IZRA లో పెయింటర్ గా చేర్పించాడు.ఇక అప్పటి నుండి 2006వ సంవత్సరం వరకు పెయింటర్ గా పనిచేశాను.డిజిటల్ ప్రింటింగ్ వచ్చిన కారణంగా మా పెయింటర్ల ఉపాది ఊడిపోయి రోడ్లపాలైనాము .అప్పుడు మళ్ళీ వ్యవసాయంలో కే వెళ్ళిపోయాను.2024 మే 8 వె తేదిన నాభార్య మరణంతో ఊరునుండి హైదరాబాదు మాకొడుకులవద్దకు వచ్చాను..

1 కవిత్వం నాకు రావడానికి కారణం వాజిపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో 13 రోజుల్లో పడిపోవడం ఒక కారణం .
2 యన్ టి రామారావు గారిపై వైస్రాయి హోటల్ ఆవరణలో చెప్పులు విసరడం ఆయనను పదవీచ్యుతుని చేయడం బాధ కలిగించింది .
3 నేను మాకు తెలిసిన వారికి బ్యానర్లు వ్రాసిఇచ్చి డబ్బులడిగితే తిట్టడం మూడవ కారణం అప్పుడు నాలో బాధ ఏక్కవై వారిపై ఆశువుగా ఆటవెలదులలో పద్యాలలో నాభావాన్ని వ్యక్తపరుచు కున్నాను.కాని అనుకోకుండా ఎనభై శాతం ఛందస్సు కలిసిందని నాకు తెలిసిన టీచర్ కు చూపిస్తే చెప్పాడు.అప్పటికి నాకు ఛందస్సు రాదు.ఆయన ఛందస్సు పుస్తకం తెచ్చుకోమని సూచించారు.అది తీసుకొని ఒక్కొక్క ఛందస్సు నేర్చుకొని వ్రాయడం ప్రారంబించాను.అది 2001 వె సంవ్తసరం.అప్పుడు నేను శాకాహారం పై పద్యాలు వ్రాయడం ప్రారంబించి తొలిపుస్తకం విడుదల చేశాను. దానికి మంచి స్పందన రావడంలో ఇక వరుసగా వ్రాయడం మానలేదు.

మీరు నాచిత్రలనుఇచూడాలంటే ఫేస్ బుక్ లో ,లేదా నా వాట్సప్ స్టేటస్ లో, లేదా నా పర్సనల్ గ్రూపు ఉంది దుబ్బాకుల కళాసాహితి అందులో నాచిత్రాలు.మా పెద్దకుమారుడు వేసిన చిత్రాలు,నా సాహిత్యం,చూడవచ్చు అందులో చూసినా చూడకున్నా 24 గంటలలో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి.అందులో వేరేవారు పోస్టులు పెట్టరు.మీరు దేనినైన ఎన్నుకోవచ్చు.

పెద్దకుమారుడు చిత్రకారుడు జే యన్ టి యు లో డిప్లొమా చేశాడు.కాని దానిక సంబంధం లేని రాజేంద్రనగర్ మున్సిపల్ లో పనిచేస్తున్నాడు.చిన్నకుమారుడు ఆబిడ్స్ చెర్మాస్ లో చేస్తున్నాడు . ఇద్దరి కుమార్తెల వివాహాలు అయిపోయాయి.ఇద్దరు కుమారుల వివాహాలు అయిపోయాయి.అందరికి పిల్లలు అయినారు.

ఇక కృష్ణ స్వామిగారికి టైలరింగ్,మట్టి సిమెంట్ విగ్రహాల తయారీ,లాంగ్ సర్వే లో ప్రవేశం ఉంది.ఇక సమాజసేవకునిగా గ్రామంలో శివాలయనిర్మాణం, 1983,1984,1985లో శివరాత్రి మరునాడు కట్నంలేని పెళ్లిళ్లు చేశారు.
ఇక ఈయనకొచ్చిన పురస్కారాలు కోకొల్లలు.కృష్ణ సందేశం ని రాజారామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ వారుఎన్నుకొనితెలుగురాష్ట్రాల గ్రంథాలయాలకు పంపిణీ చేశారు.2012లో ప్రపంచ తెలుగుమహాసభల్లో ఉత్తమ కవిగా సన్మానం, స్వర్గీయ వెంకట్రావు పంతులుగారి ధార్మిక సాహితీ పురస్కారం ,హంపీపీఠాధిపతులు విద్యారణ్యభారతీస్వామివారు పీఠంతరుఫున భక్తిమందారాలు అచ్చేయించి ఆవిష్కరించారు.చిన్న జీయర్ స్వామి తిరుప్పావై విద్యాసంపుటికి మంగళాశాసనాలు వ్రాశారు.2014లోతెలంగాణ ఆవిర్భావ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సన్మానించారు.చేవెళ్ల మండల ఎం.ఎల్.ఎ. లాలె యాదయ్య గారు 10,116 నగదుతో సత్కరించారు.2016లోరవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి పద్యకవుల సమ్మేళనంలో పాల్గొన్నారు.పటేల్ శాంతమ్మ సాహిత్య పురస్కారం,డా.కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళాపీఠంవారి సన్మానం…ఇలా ఎన్నో,ఎన్నెన్నో!

ముద్రిత రచనలు _ శాకాహార శతకం కృష్ణ గీత, కృష్ణ సందేశం,శ్రీశివానందలహరి సౌందర్య లహరి తిరుప్పావై మొదలైనవి.

ఇటు సాహిత్యం కవితారచన అటు చిత్ర లేఖనంలో అందెవేసిన చెయ్యి ఓ అపురూప మణిదీపం

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నిష్కామ కర్మ

by Maji Bharathi May 28, 2026
written by Maji Bharathi

మా మేనత్త చావుని దగ్గరనుండి చూశాను. మంచం మీద తీసుకొని, తీసుకొని ఈ మధ్యనే చనిపోయింది. చనిపోయేముందు చాలా బాధపడింది. ఒక రకంగా చెప్పాలంటే, చుట్టూ ఉన్నవాళ్లు, ఆమె ఎప్పుడు చనిపోతుందోనని ఎదురు చూశారు. భగవంతుడా! అలాంటి మరణం మా అమ్మకు రాకుండా చూడు దేవుడా! అని నేనెప్పుడూ మనసులో కోరుకునే వాడిని.
అమ్మ చాలా తేలిగ్గా “యిన్నాళ్లూ అత్త వాళ్లకు చేసింది కదా! మరి వాళ్ళు ఆ రుణం తీర్చుకోవాలి కదా! అందుకే మీ అత్త మంచాన పడితే వాళ్ళందరూ మీ అత్త కింద చేశారు.” అని అంది. కానీ నాకు అర్థం కాని ప్రశ్న… “మనం వాళ్ళందరికీ సాయం చేస్తే, మరలా వాళ్లు మన రుణం తీర్చుకునే లాగ… మనకి చేసేలాగా…. మనం మంచానపడి చనిపోతామా అనేది?” నాకు పెద్ద ప్రశ్న.
“అలాంటి చావు ఎవరికీ రాకూడదు” అనే వాడిని అమ్మతో. దానికి బదులుగా “మరి వాళ్ళు మీ అత్త రుణం తీర్చుకోవాలి కదా నాయనా! లేకపోతే ఆ రుణం కోసం మరో జన్మ ఎత్తవలసి ఉంటుంది. ఈ జన్మలో ఆ భవబంధాలన్నీ తీర్చుకుని వెళ్లి పోయింది మీ అత్త. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, తెలిసో, తెలియకో మనం చేసిన తప్పులు కొన్ని ఉంటాయి. వాటి కర్మను ఈ జన్మలోనే అనుభవించేస్తే, అంత్య సమయంలో నిష్పూచీగా ఈ కట్టెను వదిలేయవచ్చు. లేకపోతే ఈ పాప కర్మను వచ్చే జన్మలో కూడా మోయాల్సి వస్తుంది.” అనేది అమ్మ చాలా ప్రశాంతంగా.
మా అమ్మ కూడా అందరి క్రింద చేసింది కదా! వాళ్ళు అమ్మ రుణం తీర్చుకోవాలంటే, అమ్మ కూడా అత్తలాగే మంచాన పడి, అందరి చేత సేవలు చేయించుకుంటూ, మరణం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తూ…. ఇంకా ఎక్కువ కాలం మంచం మీద ఉంటే ఈవిడ ఎప్పుడు పైకి వెళ్లిపోతుందా అని అందరి చేత అనిపించుకుంటూ…. అమ్మ కూడా అత్తలాగే బాధపడి, బాధపడి ప్రాణం ఒదులుతుందా అనేది నాకెప్పుడూ విపరీతమైన భయాన్ని కలిగించేది. అందుకే అమ్మ ఆఖరి ఘడియలు ఎలా ఉంటాయోనని నాకెప్పుడూ బెంగగా ఉండేది.
ఎందుకంటే అమ్మ అందరి కిందా చేసింది. మరుదులు, ఆడపడుచులు, అత్తమామలు…. అందరినీ, తను పెద్దకోడలుగా బాధ్యతలు నెత్తిన వేసుకొని వాళ్ళందరి పెళ్లిళ్లు, పురుళ్లు అన్నీ అమ్మే చూసింది. ముందు, అంటే మా చిన్నప్పుడు అమ్మను వాళ్ళందరూ ఎలా చూసేవారో తెలియదుగానీ, ఇప్పుడు మాత్రం అందరు కూడా “వదిన లేకపోతే మేమిప్పుడు యిలా ఉండేవాళ్ళం కాదు. మా అమ్మకన్నా మా వదినే మాకు ఎక్కువ చేసింది” అని నా మేనత్తలందరూ అనేవారు. నా వదినల విషయానికొస్తే నేనే దగ్గరుండి చూసేవాడిని అమ్మ వాళ్లకు ఎంత బాగా అన్నీ చేసిపెట్టేదో! ఏ రోజు కూడా వాళ్ళనొక్క మాట కూడా అనకుండా అమ్మలాగే లాలించేది. వాళ్ళు మా అమ్మని వాళ్ళ అమ్మలాగ చూసుకున్నారా అంటే లేదనే చెప్పొచ్చు. అమ్మకా విషయం మీద ఏ రోజూ కంప్లైంట్ అనేదే లేదు. వాళ్లు మా అమ్మని ఎలా చూస్తున్నారనే విషయం, అమ్మ ఎప్పుడూ పట్టించుకునేది కాదు.
ఇంటికి నేను చిన్న కొడుకునవడం చేత అమ్మ దగ్గర చనువెక్కువ. నా పెళ్లి అయ్యేటప్పటికి అన్నీ తానే దగ్గరుండి అందరికీ చేసి పెట్టేది. కానీ నా పెళ్లి అవ్వగానే వదినలందరూ, ఇంతవరకు మేమే చూసాము కదా! ఇంకా ఎన్నాళ్ళు మేము చూస్తాము అని అమ్మ బాధ్యత నాకు అప్పచెప్పారు. నా భార్య ప్రేమగా కాకపోయినా బాధ్యతగా చూస్తుంది. కానీ నా భయాలను అబద్ధాలు చేస్తూ, అమ్మ తులసి మొక్కకు పూజ చేస్తూ, అలా కూర్చొని ప్రాణాలు వదిలేసింది.
“ఎవరి రుణమూ ఉంచుకోకూడదు నాయనా! ఉంచుకుంటే అది తీరేవరకూ మనం ఈ లోకంలోనే ఉండాల్సి వస్తుంది.” అనేది అమ్మ. అమ్మ ఎవరి రుణమూ ఉంచుకోలేదు. కానీ అమ్మకు చాలామంది రుణపడి ఉన్నారు. మరి వాళ్ళందరూ అమ్మ రుణం తీర్చుకోకుండా అమ్మ ఈ లోకం నుండి ఎలా వెళ్ళిపోయింది? తన మరణం తాను కోరుకున్నట్లు ఎలా జరిగిందనేది, నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న? ఈ పన్నెండు రోజుల కార్యక్రమాలు అన్నీ అయిపోయాక, అమ్మ ఎంతో గౌరవించే రామాలయం పూజారిగారి ముందు నా ప్రశ్నను ఉంచాను.
“ఏమీ లేదు నాయనా! మీ అమ్మ నిష్కామకర్మురాలు. ఏ రోజూ ఎవరికీ సహాయం చేశానని అనుకోలేదు. అది తన బాధ్యత కాబట్టే, ఇతరులకు సాయం చేయడానికి భగవంతుడు తనకా అవకాశం ఇచ్చాడు అనుకునేది. ఇంకా కాకపోతే ఏ జన్మలో వారికి రుణపడి ఉన్నానో? ఈ రకంగా వాళ్లకి సాయం చేసి ఆ రుణం యిప్పుడు తీర్చుకుంటున్నాను, అనుకునేదే తప్ప, తనేదో వాళ్లకు ఉపకారం చేశానని ఏ రోజూ అనుకోలేదు. ఎవరికి ఏ పనిచేసినా, అది భగవంతునికి చేశాను అనుకునే చేసేది. దేవుడు తనకా శక్తి ఇచ్చాడు, కాబట్టి చేయగలిగానని భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకునేది మీ అమ్మ. అందుకని ఆమెకు ఎవరూ రుణపడి లేరు. అందుకే మీ అమ్మ చాలా సులువుగా ఈ భవబంధాలను తెంచుకుని వెళ్ళిపోగలిగింది.”
“ఇంకొకరికి చేసాము, చేసాము అనుకుంటే, వాళ్లు మన రుణం తీర్చుకునే దాకా మనమిక్కడ బాధలు పడాలి. ఎవరికీ మనమేమీ చెయ్యలేదనుకుంటే, మనకు ఎవరి రుణమూ ఉండదు. నాటకంలో తమ పాత్ర అయిపోగానే నిష్క్రమించిన పాత్రధారిలా, ఆమెకు ఈ లోకంలో భగవంతుడు చెప్పిన పని చేసి, ఈ లోకం నుండి నిష్క్రమించింది. ఆమె నిష్కామకర్మురాలు. ఇలాంటి మరణం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని రాదు. మీ అమ్మ అదృష్టవంతురాలు నాయనా! అదీ విషయం” అని చాలా తేలిగ్గా తేల్చి చెప్పేశారు పూజారిగారు.
ఆయన చెప్పిన మాటలు విన్నాక నా అనుమానం తీరిపోయింది. అమ్మ ఎప్పుడూ చెప్పే నిష్కామకర్మ అంటే ఏమిటో యిప్పుడు నాకు అర్థమైంది. “మనం ఎవరి రుణమూ ఉంచుకోకూడదు నాయనా! అనేది అమ్మ. మనకు సాయం చేసిన వాళ్ళను మర్చిపోకుండా, వాళ్లు మనకు చేసిన సహాయం మనమెప్పుడూ మర్చిపోకుండా కృతజ్ఞులమై ఉండాలి. మనం ఎవరికైనా చేసిన సాయం, చేసిన వెంటనే మర్చిపోవాలి. వాళ్లకు సాయం చేసాం అనే భావం మనసులో ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి చేయగలిగాం అనే భావం ఉండాలి. ఇది అమ్మ చెప్పిన నిష్కామ కర్మ అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అమ్మలా ఆలోచించే శక్తిని నాకు ప్రసాదించు భగవంతుడా! అనుకుంటూ, నా భయాలేవీ నిజాలు కానందుకు మనసులోనే అమ్మకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అమెరికాలోఒక అనుభవం

by Chandu Pendyala May 28, 2026
written by Chandu Pendyala

Imitation బహుశా తెలుగులో దీనర్ధం అనుకరణ అనుకుంటా. దేశాలు మారినా సంస్కృతి మారదు. పిల్లలు అల్లరి చేస్తుంటే రకరకాల Cartoon shows పెట్టి కాసేపు వాళ్ళ అల్లరి నుండి ఉపశమనం పొందడానికి కొత్త Shows వెదుకుటలో భాగంగా ఈ మధ్య TV లో రామాయణం సంబంధించిన Animation Movie పెడితే గత నాలుగు రోజులుగా ఆ Show చూస్తున్న పిలగాడు దానిలో మొత్తం లీనమయి ఇంట్లో రకరకాల యుద్ధవిద్యలు ప్రదర్శిస్తున్నడు. ఇంగ్లీష్ లో ఏవేవో యుద్ధానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతుంటే ఆ యుద్ధానికి ముందటి కవ్వింపులు అర్ధం కాలేదు గానీ పిలగాడు డైలాగ్ కొట్టే తీరుని బట్టి ఇది తప్పకుండా ఈ Animation Movie ప్రభావమే అని అర్ధమయింది.
ఎనుకటికి బాలమిత్ర , చందమామ పుస్తకాల్లో కవర్ పేజీపై వేసిన విక్రమార్కుని బొమ్మలు , రామాయణ , మహాభారత పాత్రల చిత్రాలు అలాగే వివిధ దేవుళ్ల బొమ్మలు పిల్లలనే గాక పెద్దలను సైతం బాగా ఆకర్షించేవి. లోపలి పేజీల్లో కూడా ఒక్కో కథకు ఒక్కో చిత్రం బహు ముచ్చటగా ఉండేవి. కాగా ఆ రామాయణం షో చూసిన పిలగాడు ఆంజనేయుడు సంజీవనీ పర్వతాన్ని ఎత్తుకొచ్చే సీన్ ను అనుకరణ చేస్తూ ఇంట్లో వున్న బరువైన వస్తువులను పైకి ఎత్తి హావభావాలతో హంగామా చేస్తున్నడు. రామరావణ యుద్ధం దృశ్యాలు, ఒకరిపై ఒకరు వాళ్ళు వేసుకునే వ్యంగ్యాస్త్రాలు, బాణాల ప్రదర్శనలు ముమ్మరంగా నడుస్తున్నయి.

ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు బడికి పొయొచ్చినాక స్కూల్లో టీచర్స్ చేసినట్లుగా ఆక్షన్స్ చేయడం , వాళ్ళు స్టూడెంట్స్ ను ప్రశ్నలు అడిగే విధానం , వాళ్ళ ను కట్టె పట్టుకుని కొట్టినట్లు Action చేయడం లాంటివన్నీ గుర్తుకొచ్చినయి. దాదాపు ఈ ఆటలన్నీ అందరూ వాళ్ళ వాళ్ళ చిన్నతనంలో ఆడినవే.

చివరకు ఈ Imitation అనేది ఎక్కడిదాకా పోయిందంటే Jewellery ని కూడా వదల్లేదు…

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

by Rasheed May 28, 2026
written by Rasheed

అమ్మ
ఎంతో కమ్మని పిలుపు మమతల పిలుపు
వినగానే ఆ పిలుపు ఉవ్వెత్తున లేస్తుంటాయి నాలో కోట్లాది ప్రేమ తరంగాలు
అమ్మ
తన రక్తంతో మూడేసి
పొరల మాటున
నవ మాసాలు నిలుపుకుంది కడుపులో నేను భారమైనా కొద్దీ సంబరపడేది
అమ్మ
నన్ను కనేటప్పుడు వేసిన కేకకు
జీవితాంతం సేవ చేసిన తీరని రుణకేక అది
అమ్మ
రెండు సంవత్సరాలు తన రక్తాన్ని పాలుగా చేసి తాపింది ఆ పాలబలమే ఈనాటికి నన్ను నడుపుతోంది
అమ్మ
నా బోసి నవ్వులు
నా తప్పటడుగులు
తన గుండెల్లో నిలుపుకున్న దృశ్యాలు
అమ్మలో ప్రేమ లేకపోతే నాన్నలో దయ లేకపోతే
ఏ చెత్తా కుండీలోనో
విసిరి వేయబడే వాణ్ణి
అమ్మ
అమ్మ హృదయం అమృతం ఆమె తినకుండా తినిపించింది
ఆమె నిద్రపోకుండా
నిద్దుర పుచ్చింది
నేను కష్టాల్లో ఉంటే ఓదార్చేది నేను నష్టాల్లో ఉంటే పూడ్చేది

నాకు ఏడు పదులు దాటినా ఏడేళ్ల వానిగానే తలుస్తుంది తన కోడలు తన మనుమలను చూసి ఉప్పొంగుతుంది
కానీ
నేనే…
నేనే…
ఆమెను ఓల్డ్ ఏజ్ హౌస్ లో విడిచి వచ్చాను
ఓ మనిషీ!
తల్లి పాదాల కింద స్వర్గం ఉందన్న ప్రవక్తను మార్చావా పో నరకానికి పో

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

జ్వలిత చేతనం : బాలలత మల్లవరపు

by Radhika Suri May 28, 2026
written by Radhika Suri

అదృష్టానికి దురదృష్టానికి వెంట్రుక వాసి దూరం మాత్రమే! రెప్పపాటు కాలం అందలమైనా ఎక్కించగలదు లేదా అధఃపాతాళానికైనా తొక్కేయగలదు. వైద్యం కొత్త పుంతలు తొక్కి, ఔషధం ఎల్లలు దాటి సేదదీరుస్తున్నా ! ఎక్కడో ఒకచోట అపశృతి విలయతాండవం చేస్తూనే ఉంటుంది. అందమైన జీవితాల్లో కల్లోలం సృష్టిస్తూనే ఉంటుంది. అలా ఓ భావి జీవితాన్ని నిర్దయగా కబళించి, నిస్తేజంలోకి నెట్టిన సంఘటన.వివరాల్లోకి వెళ్తే… వైకల్యాన్ని తన మనోబలమనే ఉక్కు పాదంతో తొక్కి పెట్టి, పడి లేచిన కడలితరంగమై, నింగి కెగసిన తారాజువ్వలా దూసుకుపోతున్న ఈ ఆత్మవిశ్వాసం పేరే బాలలత మల్లవరపు.

సివిల్ సర్వీస్ అభ్యర్థుల ఆరాధ్య దైవం, ఆమె మార్గ నిర్దేశం కోసం ఎంతోమంది తహతహలాడుతూ ఉంటారు. తనకు ప్రాంతీయ భేదాలు లేవని తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన
వ్యక్తినంటూ చెప్పే వీరు గుంటూరు వాస్తవ్యులైన శ్రీ శౌరయ్య, విజయ దంపతుల కుమార్తె. ఈమెకు సంవత్సరంలోపే పోలియో చుక్కలు వికటించి రెండు కాళ్లు పని చేయకపోవడంతో డాక్టర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించలేదట. ఆటపాటలతో, చదువుసంధ్యలతో హాయిగా సాగాల్సిన బాల్యంలో
ఆ చిన్ని మనసు ఎన్ని అలజడలకు లోనై ఉంటుందో కదా! ‘వైకల్యం అపహాస్యం చేసినా చివరికి సంకల్పబలం ముందు తలవాల్చింది’ .ఆత్మస్థైర్యంతో చదువు కొనసాగిస్తూ న్యాయ శాస్త్రంలో పట్టా పొందినా, సమాజం వికలాంగురాలిగా గుర్తించడం బాధించిందంటారు. డాక్టర్ల చుట్టూ తిరిగినప్పుడు లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి వ్యక్తుల్లో అని వారు అన్నప్పుడు, నేను ఎక్కువ రోజులు బతికి చూపెట్టాలని దృఢంగా నిర్ణయించుకున్నానని కానీ ఎన్ని రోజులు బతికామన్నది కాదు, ఎంత సాధించాం ,సమాజానికి ఏం చేశామన్నది మాత్రమే ముఖ్యం అంటారామె .

బాల్యం నుండి అవహేళనలతో బాధకు గురైన సందర్భాలెన్నో గుర్తొస్తాయంటారు. నన్ను నేను నిరూపించుకోవాలనుకుని , డిగ్రీ సెకండ్ ఇయర్లో ఐ.ఏ.ఎస్ . కోచింగ్ కోసం ఒక కోచింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ ‘ఆసి రెడ్డి ‘గారు మాట్లాడుతూ గ్రూపు 2. లాంటి పరీక్షలు రాయమ్మా, రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రయత్నించు కావాలంటే స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తానంటూ అనునయించి పంపారని గుర్తు చేసుకుంటారు. వారికి తాను ‘ఏకలవ్య శిష్యురాలి’నని పేర్కొంటారు.

ఎంతసేపు చదివామన్న దానికంటే ఎంత మనసు పెట్టి చదివామన్నదే ముఖ్యం. గడచిన క్షణాలు తిరిగి రావు కాబట్టి జీవితాన్ని ‘పాషన్’తో ఉత్సాహంగా గడపాలంటారు. సివిల్స్ పై దృష్టి పెట్టి ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే 2004లో ,399 ర్యాంక్ సాధించి, రక్షణ మంత్రిత్వ శాఖలో అకౌంట్స్ సర్వీసెస్ కు ఎంపిక కావడం తనలో ఆత్మవిశ్వాసాన్ని అధికం చేసిందంటారు. తన విజయం వెనుక నాన్న కృషి వెలకట్టలేనిదని , విలేకరిగా వారి అనుభవాలు సమాజాన్ని చూపించిన తీరు తనకు ఎంతో కలిసి వచ్చిన అంశాలుగా పేర్కొంటారు. నాన్న బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చినప్పుడు పుస్తకాలు కావాలంటూ తెప్పించుకుని చదివేదాన్నని రెండు సంవత్సరాలు ఇంటికే పరిమితమయ్యానంటారు. ఐ.ఏ.యస్.గా పేపర్లో ఫోటో చూసుకోవడమే తన ధ్యేయంగా దాదాపు 12 – 15 గంటలు చేసిన కృషికి దక్కిన ఫలితంగా పేర్కొంటారు.
సివిల్స్ ఆస్పిరెంట్స్ యన్.సి.ఇ.ఆర్.టి. పుస్తకాలు 6 నుండి 12వ తరగతి వరకు చదివి జ్ఞానం సంపాదించాలంటారు .

ఉద్యోగరీత్యా చెన్నైలో ఉన్నప్పుడు ఎంతోమంది సివిల్స్ అభ్యర్థులు తన సలహాల కోసం రావడం మొదలుపెట్టారని మెంటార్ గా ఎంతోమందికి ర్యాంకులు రావడంలో సహాయసహకారాలు అందించానంటారు .అప్పుడే తనలో ‘నేర్పాలనే’ ఆలోచనకు బీజం పడిందంటారు. ఆరు సంవత్సరాల క్రితం సి .యస్.బి.
ఐఏఎస్ అకాడమీ. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ పెట్టాలని నిర్ణయించుకున్నపుడు ముందుగా తనపై తానే ప్రయోగం చేసుకోవాలనుకుని తిరిగి 2016లో సివిల్ సర్వీసెస్ కు అప్లై చేసి 167వ ర్యాంకు పొందినపుడు తన నిర్ణయం సరైనదేనని భావించారట.

మెంటర్ గా ఎంతోమంది కి శిక్షణ ఇస్తూ , వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా విద్యార్థుల్లో మనోధైర్యం నింపుతూ సమాజానికి చక్కటి యువతను, అధికారులను అందిస్తూ ప్రభంజనమై సాగుతున్న వీరి జీవిత భాగస్వామి శ్రీ సురేష్ బాబు ‘ గ్రూప్ వన్’ ఆఫీసర్ కాగా, పదేళ్ల కుమారుడు కూడా ఉన్నారు.

తల్లిదండ్రులు తమ ఆశయాలకు అనుగుణంగా కాకుండా నిర్ణయాధికారం పిల్లలకే వదిలేసి వారికి నచ్చిన రంగాల వైపు నడిపించాలంటారు.

ఒక ఐఏఎస్ అధికారిణిగా ఉండడంలోని తృప్తి కంటే ఎంతో మందికి శిక్షణనిస్తూ మార్గదర్శిగా, స్ఫూర్తిదాయకంగా ఉండటంలోనే తనకు ఆత్మసంతృప్తి లభించిందంటారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిస్తున్న వీరు భారతదేశంలో స్త్రీలు మరియు దివ్యాంగులపై ఉన్న అభిప్రాయాన్ని మార్చాలన్నదే తన తపన అంటారు. దాంట్లో విజయం సాధిస్తేనే తన లక్ష్యం నెరవేరినట్లు అంటారామె.

జీవితం ప్రశాంతంగా ఉండాలంటే తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాలనే వీరు, సివిల్స్అభ్యర్థులు ప్రారంభం నుండే టెస్టులు రాస్తూ ఉండాలని ,సిలబస్ అయ్యాక రాయడం మంచిది కాదంటారు. రివర్స్’ ఇంజనీరింగ్ మెథడ్ ‘ఫాలో అవ్వాలని సూచిస్తారు.

జనం ఎవరేమన్నా పట్టించుకోకు శత్రువుల్ని గెలవాలంటే లక్ష్యం మాత్రమే మన మనసులో మెదులుతూ ఉండాలని, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే విజయం నీకు దాసోహం ఔతుందంటారు . మన ఆలోచనలే మనల్ని డిసైడ్ చేస్తాయి థాట్స్ ని సీరియస్గా తీసుకోకూడదంటారు “ఐయామ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్” అన్న భావన బలీయంగా ఉండాలంటారు. మన జీవితం మనకు మాత్రమే సొంతం. గతాన్ని తలుచుకుంటూ కూర్చోకుండా అనుభవాలనే జీవిత పాఠాలుగా మలుచుకోవాలని ,ప్రతి విషయానికి టెన్షన్ పడుతూ, నిర్ణయాల్ని వాయిదా వేసి, ఆలోచనాశక్తిని కోల్పోకుండా తట్టుకుంటూ ముందుకు సాగా లంటారు. సమాజంలో అందరూ మంచివాళ్లే ఉంటారనుకుని భ్రమ పడక, జాగ్రత్తగా అడుగులు వెయ మంటూ దారి చూపుతారు. నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడే సమాజం నిన్ను గౌరవిస్తుందనే
వీరి దృష్టిలో,’ మనోబలమే నిజమైన శక్తి ‘.

జీవితం రైలుబండి లాంటిది ఎంతోమంది తారసపడుతుంటారు. బంధాలు బాంధవ్యాలు దూరం అయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తుంటారు .అశాశ్వతమైన బంధాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం సరికాదు అంటూ యువతకు హితోపదేశం చేస్తారు .మన అనుభవాల్ని జీవిత పాఠాలుగా మలుచుకొని ముందుకు సాగాలంటూ ధైర్య వచనాల్ని స్వానుభవంతో చెప్పారు .గతాన్ని వదిలేసి భవిష్యత్తును ఊహిస్తూ ఆలోచనల్లో ఊగిసలాడడం సరికాదంటూ సలహా ఇస్తారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని వెన్ను తట్టి చెబుతారు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమార్గం
ఎంతో అనుకూలమైందంటూ సూచిస్తారు.

సమయం ఎవరికోసం ఆగదు తెలివిగా సమయాన్ని ఒడిసిపడితేనే విజయం నీదౌతుందంటూ
వెన్ను తడతారు.మన కోసం మనం జీవించాలి. అనునిత్యం ఆత్మ పరిశీలన అవసరం , కలల్ని కంటూ సాకారం చేసుకోవాలనే వీరు నిర్ణయాన్ని వాయిదా వేయడం ఎంత మాత్రం సరికాదంటారు.

సామాజికాంశాల్ని ఎప్పటి కప్పుడు తెలియజేసే వీరు, కీర్తిశేషులు. శ్రీమతి సుష్మా స్వరాజ్ గారిని తన స్ఫూర్తి ప్రదాతగా పేర్కొంటారు.

వ్యవస్థ ,మనుషుల్లో అంత త్వరగా మార్పు కనిపించిందని, యువతను మార్చడమే తన ఆశయమని.’ వేచి చూస్తేనే విజయం వరిస్తుంది ‘పోరాడి గెలిచిన వాడే రియల్ హీరో ‘అంటూ, సవాలును స్వీకరిస్తూ మంచి ఆశయాలతో ముందుకు సాగాలంటారు. మనిషి కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేసే రోజులు రావాలంటూ ఆకాంక్షిస్తారు . ఆత్మ న్యూనతకు లోనైతే ఏది సాధించలేరంటూ , ‘భయపడడం తప్పు కాదు, భయాన్ని జయించలేకపోవడమే పెద్ద తప్పు’ అంటారు. భయాన్ని వీడితే నిన్ను ఏ శక్తి ఆపలేదంటూ ధైర్యం నూరిపోస్తారు.ఎంచుకున్న మార్గం స్పష్టంగా ఉన్నప్పుడు ప్రయత్నం నల్లేరుపై నడకలా సాగిపోతుందని, ప్రతి నిమిషం చాలా విలువైనదని, గెలుపోటములు పక్కన పెట్టి వర్తమానంలో జీవిస్తేనే ప్రశాంతత దొరుకుతుందంటారు.

ఓపిక ,పట్టుదల గెలుపుకు రెండు మెట్లలాంటివని మనల్ని మనం అభిమానించుకుంటేనే ఎన్నో విజయాలను అందుకోగలం ఇతరుల గురించి ఆలోచించడం, అసూయాద్వేషాల మధ్య కొట్టు మిట్టాడితే నీ లక్ష్యాన్ని మరిచిపోతావంటారీమె .

‘లాయిడ్ గ్రూప్ ‘సంస్థల అధిపతి శ్రీ విక్రమ్ నారాయణ గారి ఉదారత, సేవానిరతి తననెంతో ప్రభావితం చేశాయని వారు’ ధనిక్ భారత్ మిషన్ ‘విద్యా సంస్థలను ప్రారంభించడానికి ముందు నన్ను సంప్రదించినప్పుడు ‘ సర్ , మీరు నా స్పీడును అందుకోగలరా !అంటూ ప్రశ్నించిన ఆమె ఆత్మ స్థైర్యానికి ఆశ్చర్యపోకుండా ఉండడం అసాధ్యమని నా భావన. దాదాపు ఒక లక్షా యాభైవేల మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినప్పుడు వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఆ పదహారేళ్ల వయసు పిల్లల్లో తప్పకుండా మార్పు తీసుకు రాగల సత్తా నాకుందనిపించి ఈ విద్యాసంస్థల డైరెక్టర్ గా ఉండడానికి నిశ్చయించుకున్నానని ,
‘ధనిక్ భారత్’ విద్యాసంస్థల పేరిట 16 బ్రాంచీలతో ‘ఇంటర్ మీడియట్’ కాలేజీ’లు ప్రారంభించబోతున్నామంటూ, తమ కళాశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం ఉండదంటూ స్పష్టం చేశారు. యువతకు సరైన దిశా నిర్దేశం చేస్తూ జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సరైన మార్గం చూపించగలమని గట్టిగా చెప్పగలనన్నారు. సాధారణ విద్యార్థినినైన నేను ,నాపై నాకు నమ్మకం లేకున్నా మొండి ధైర్యంతో ముందుకు నడిచి గెలుపు సాధించాను ,అలాగే అంగవైకల్యం ఉన్న పిల్లలకి కోచింగ్ ఇస్తున్నప్పుడు వారిలో నన్ను నేను చూసుకుంటాను అంటూ చెప్పే వీరు గెలుపు కోసం ఐదు సూత్రాలను పాటించాలంటారు .
ఒకటి . డిసిప్లిన్ ,
రెండు . క్లారిటీ అఫ్ థాట్
మూడు. ప్లానింగ్
నాలుగు. డిజైన్
ఐదు. పర్పస్ ఆఫ్ లైఫ్

సరైన ప్రణాళిక ,అవగాహన ఉత్సాహం ఉంటే రెండు సంవత్సరాల్లో సులభంగా సివిల్స్ లో విజయం సాధించవచ్చు అంటూనే ,ఒకవేళ ఓటమి ఎదురైనా ఆ అనుభవంతో జీవితంలో ఏదో ఒక రకంగా ఉన్నతంగా జీవించగలరని ధీమాగా చెప్తారు. భావోద్వేగంతో కూడిన జీవనశైలి అంటే తనకు ఎంతో ఇష్టమని, ” తన జీవిత పుస్తకంలో ప్రతి పేజీ కొట్టివేతలు లేకుండా అందంగా మలుచుకోవాలనే తపన ఆరాటం తనలో అనుక్షణం ఉంటుందంటూ ‘ చెప్పే వీరు,
చిన్ననాడు ‘వడ్డాణం ‘కొని పెడతానన్న తాతయ్య మురిపెపు మాటలకు బంధువులు చేసిన అవహేళనలు తనను ఇప్పటికీ బాధించే సంఘటనైననా “నా పేరే నాకు ఆభరణం”లా మారిందంటూ ఆత్మవిశ్వాసంతో ,ఒకింత ఆనందంతో చెప్తారు . విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో తన జీవితాన్ని అంకితం చేస్తానంటూ దానికోసం కుటుంబానికి కూడా దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు, వారి భాగస్వామి మమ్మల్ని వదిలేసావన్నమాట అంటూ నవ్వుతూ అన్న మాటల్ని గుర్తు చేస్తూ, మంచి భర్తకు సరైన నిర్వచనం మావారంటూ కితాబిస్తారు.

తొణకని ఆత్మవిశ్వాసం, ప్రవాహం లాంటి మాట తీరు ,ఎంతోమంది పిల్లల్ని ఐ.య్యే.యస్ .లుగా చేయాలన్న మీ తపన అభినందనీయం . విద్యార్థుల్ని గైడ్ చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న మీరు మరెందరికో రోల్ మోడల్ గా మారి మునుముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ.

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తేట తెనుగు

by Radhika Suri May 28, 2026
written by Radhika Suri

సొగసైన అక్షర శిల్పాలను కలబోసి ఒడుపుగా కూర్చిన తేటతెనుగు అక్షరకాంతను నేను

శివుని పంపున ఇలకు దిగిన పుష్పగంధను నేను

వసివాడిన శబ్దకుసుమాలలో
జీవకళ నింపే అంగీరసను నేను

ముద్దుగారే చిన్నారుల నోటి
మాటల జుంటి తేనియను నేను

ఒడుపైన దోసిట అక్షరమై ఒదిగిపోయే అమృతభాండాన్ని నేను

కళతప్పిన తెలుగుదనానికి రంగులు కలబోసిన హరివిల్లును నేను

అలసిన వేళ వర్ణరాగ రంజితమై హాయిని గొలిపే మలయ సమీరాన్ని నేను

క్షరమైపోతున్న పద సౌందర్యానికి వన్నెచిన్నెలద్దే కవి కోకిలలు చేతబట్టిన అక్షర తూలికను నేను

ఉనికి ప్రశ్నార్థకమైన ఊగిసలాటలో భావితరానికి ఊతమయ్యే
శబ్ద క్రాంతిని నేను

హంసవాహిని చేతిలో ఆభరణమై వెలుగులీనుతున్న జ్ఞాన
జ్యోతిని నేను

అంతిమంగా అమ్మ భాషలోని కమ్మదనపు తేనెలొలుకు
తేట తెనుగును నేను.

May 28, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us