మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

నేననుకున్నా…

by B. Krishna September 15, 2023
written by B. Krishna

నేననుకున్నా…

ఒక్క విత్తు నాటితే

ఎన్నో విత్తనాలొచ్చే రైతుకి

ఎందుకు లాభం రాదని!

కానీ…

తర్వాత తెలిసింది

దానికోసం పడే శ్రమ ముందు

అది చాలా తక్కువ అని.

నేననుకున్నా…

మంచి నాయకులొస్తే

పేదల జీవితాలు మారుతాయని

కానీ..

తర్వాత తెలిసింది

వాళ్ళు అధికారం కోసం

మంచిగా నటించారని

నేననుకున్నా…

అభివృద్ధి అంటే

అందరూ ఉన్నతితో

సంతోషంగా ఉంటారని

కానీ

తర్వాత తెలిసింది

ఉన్నతి కోసం పడే పోటీలో

ప్రక్కవాళ్లను కూడా పట్టించుకోనంత

అభివృద్ధి చెందామని

నేననుకున్నా…

అందరూ మనవాళ్లేనని

కానీ

తర్వాత తెలిసింది

అందరూ ‘మనీ’వాళ్లేనని

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వర్తమానపు చూపు

by C.S. Rambabu September 15, 2023
written by C.S. Rambabu

ఠీవిగా నిల్చున్న ఆ జ్ఞానదీపం
అజ్ఞానతిమిరంతో సమరం చేస్తూ
ధిక్కార స్వరమై దారి చూపుతుంది
సాధికారత వరమై శ్వాసనిస్తుంది
అధికారాపు నిషాకు ఆనకట్ట వేస్తుంది

కలలను కాలంతో ముడేసే
చుక్కాని అవుతుంది
అవసరమైతే నిలదీసే వజ్రసంకల్పమూ కాగలదు
అది మనకాలపు కోహినూర్

పాలకులు మారినా తను సత్యమై
మెరుస్తుంటుంది
మేలైన మనుషులకై నీడను పరుస్తుంది
కళల సమాహారాన్ని కరవాలం చేస్తుంది

తరానికో జ్ఞాపకం తను
యువతరానికో తారాతీరం తను
పారవశ్యమై తనువు బరువు కోల్పోతుంటుంది
తను మాత్రం బరువైన తన చరిత్రను చేతిలో పెడుతుంది

అక్కడ ఏ రాయిను మీటినా
అక్కడి రహస్య మీటింగ్ లను రాయమంటుంది
నిర్మోహత్వాన్ని నిస్తంత్రి వీణ చేస్తుంది
అందుకే నిన్న,రేపుల మధ్య
వర్తమానపు చూపైన ఉస్మానియా
నను విడవని మేనియా

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పాటల తూటా – గద్దర్

by vanaparti padma September 15, 2023
written by vanaparti padma


బాంచన్ బతుకుల బంధుకి పోరాట బాటలో పాటల తూటా వెలివాడల్లో పొడిచే పొద్దు కార్మిక కర్షక విప్లవ జ్వాల ఆకలి కేకల పోరుగానం దోపిడీ వర్గాలపై యుద్ధ గీతము అణగారిన ప్రజల ఆయుధం నల్ల నేలలో ఉదయించిన సూర్యుడు తెలంగాణ సాంస్కృతిక విప్లవ సేన త్యాగాల తొవ్వే మరువలేని మట్టి మనిషి అలుపెరగని పోరాట కెరటం గద్దర్.
ప్రజల పాటకు ప్రతిరూపం జీవితాంతం ప్రజా ఉద్యమాల గీతం ఆయన దేహం పాటల మయం ప్రజలు మాట్లాడుకునే సులభ పదాలతోనే ;పాట కట్టగల మేధావి. అలనాటి అన్నమయ్య,త్యాగయ్య పాటలా గద్దర్ సాహిత్యం కూడా నిలిచే ఉంటుంది. ఉద్యమం కోసం పాట కోసం సమాజం కోసం జీవితాన్ని ధారపోసిన గద్దర్ ఈ దేశ సాంస్కృతిక యుగ కర్త గద్దర్ అను పేరును స్వాతంత్య్రo రాక ముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీ కి గుర్తుగా తీసుకోవడం జరిగింది
ప్రముఖ విప్లవ కవిగాను దళిత రచయితగా అందరికి సుపరిచితమైన గద్దర్ గారి అసలు పేరు గుమ్మడి విఠల్ రావు తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలకపాత్ర పోషించి ప్రజా యుద్ధ నౌకగా తుది శ్వాస విడిచారు వీరు 1949లో లచ్చమ్మ శేషయ్య దంపతులకు జన్మించారు వీరిది మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం గద్దర్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యశించారు 1969లో తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను అందరికి తెలియ జెప్పడానికి గద్దర్ గారు బుర్రకథను ఎంచుకున్నారు వీరు ప్రతి ఆదివారం ప్రదర్శనలు ఇస్తూ వాడ వాడలా ప్రజలను చైతన్య వంతులుగా చేస్తున్న క్రమంలో 1971వ సంవత్సరంలో బి.నర్సింగరావు సినిమా దర్శకులు ప్రోత్సాహంతో మొదటి పాట “అపరరిక్ష” పాట రాశాడు. వీరి మొదటి పాటల ఆల్బమ్ పేరు ‘గద్దర్’ ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్ష రాసి కెనరా బ్యాంకులో క్లర్క్ గా చేరాడు. తర్వాత విమలను వివాహం చేసుకుని సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అనే ముగ్గురు పిల్లలకు తండ్రిగా భాద్యత నిర్వహించారు.

1972వ సంవత్సరంలో జన నాట్య మండలి ఏర్పడింది ఇది పల్లెల్లో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ఎదురించేందుకు, దళితులను మేల్కొల్పేందుకు వారిని చైతన్య పరిచే దిశగా పనిచేసింది. ఆ ప్రభావం కూడా క్రమక్రమంగా గద్దర్ పై పడింధీ. మా భువి సినిమాలో సాయుధ పోరాట యోధుడుగా యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన “బండెనక బండికట్టి ” అనే పాటను పాడి ఆడారు. 1984లో సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పిమ్మట జన నాట్యమండలిలో చేరి 1985వ సంవత్సరంలో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఒగ్గు కథ, బుర్రకథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలలో కుడా ప్ర్రదర్శనలు ఇచ్చారు. కింద గోచి, ధోతి, పైన గొంగళి ధరించి పాడిన పాటలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి. గద్దర్ పాటలు కొన్ని వందల, వేల క్యాసెట్లు గాను సిడీలు గాను రికార్డ్ అయి అత్యధికంగా అమ్ముడు పోయాయి. ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానం వాళ్ళ ప్రజాయుద్ధ నౌక అనే పేరు వచ్చింది. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో దాదాపు 2 లక్షల మంది ప్రజలతో హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ భారీ భహిరంగ సభను నిర్వహించారు. 1997 ఏప్రిల్ 6వ తేదీన పోలీసులు గద్దర్ పై విరుచుకు పడ్డారు ఆయన శరీరంలో అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్నింటిని తొలగించారు కానీ ఒక్క బులెట్ మాత్రం ప్రాణహాని ఉన్నందున తొలగించలేదు. నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు పెట్టారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. 2002లో ప్రభుత్వం తో చర్చల కు సమయంలో నక్సలైట్స్ , గద్దర్, వరవర రావును తమ ధూతలుగా పంపారు ప్రత్యేక తెలంగాణ కోరుకున్న నాయకుల్లో గద్దర్ కుడా ఒకరు. గద్దర్ మొదటి నుంచి తెలంగాణ వాడిగానే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్దరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతును తెలపటం ప్రారంభించారు.
గద్దర్ రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా ” అనే పాట ఎంతో ప్రజాధారణ పొందినది. తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది. “నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా ‘నంది ‘ అవార్డు వచ్చింది. “జైబోలో తెలంగాణ” సినిమాలో తెరపై కనిపినిచ్చారు. “పాడుస్తున్న పొద్దు ” మీద పాట రాసి ఆయనే పాడి అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. “అమ్మ తెలంగాణమా ఆకలి కేకలగా నమా ” అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది, ఎన్నో ఉద్యమ గీతాలను రాసి ఆడి,పాడి ప్రజల్లో జ్వాలలను రగిలించిన అమర వీరుడు మన గద్దర్. భౌతికంగా మన మధ్య లేకున్నా వారి సదాశయాలు పాడిన పాటలు జన గుండెల్లో చిరస్మరణీయం.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తెల్లారిన బతుకులు

by Rasheed September 15, 2023
written by Rasheed

అమ్మా!
ఏమిటి బాబు.

నేను చిన్నప్పటినుండి చూస్తున్నాను. నాన్న మా కోసం ఎంతో కష్టపడు తున్నారు. ఒక పనికి పోతే ఆ పనికి వచ్చే డబ్బులు సరిపోయే పరిస్థితి లేకపోతే ఇంకో పని చేసి ఏరాత్రికో వస్తుంటారు అన్నాడు 20 ఏళ్ల అబ్దుల్ రహీం తన తల్లితో ఎంతో బాధపడుతూ.

అవును బాబు, అప్పో సప్పోచేసి మనందరినీ సాకుతూ ఈ ఇల్లుకూడా కట్టారు. అంటూ ఎంతో సంతృప్తితో సమాధానమిచ్చింది తల్లి సారాబి.

అవును ఇల్లు కట్టడం. మా ముగ్గురికి చదువులు చెప్పిస్తూ ఉన్నారు ఇదంతా ఎలా సాధ్యమైందమ్మ అంటూ ఆశ్చర్యంగా అడుగాడు అబ్దుల్ రహీం.

ఇదంతా సేవా బ్యాంకు వల్ల సాధ్యమైంది నాన్న, లేకపోతే ఈ ఇల్లు కట్టే వాళ్ళమో కాదో! అంటూ సేవా బ్యాంకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ చెప్పింది తల్లి సారాబి.

అవునమ్మా సేవా బ్యాంకు వారికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా తక్కువేనమ్మ. వడ్డీ లేకుండా వారు మనకు అప్పు ఇవ్వడం, సమయానుకూలంగా నాన్నగారు కష్టపడి ప్రతి వారం వారం సేవా బ్యాంకు అప్పు తీర్చడం నిజంగా గ్రేట్ అమ్మ. అన్నాడు తన తండ్రి పై గర్వపడుతూ అబ్దుల్ రహీం.

ఇంకా తన మాటను కొనసాగిస్తూ రమేష్ అంకుల్ గారికి కూడా సేవా బ్యాంకులబ్యాంకులో చేర్పించి తను జమానత్ గా ఉండి డబ్బులు ఇప్పించడం వల్ల రమేష్ అంకుల్ గారు కూడా ఇల్లు కట్టుకున్నారు కదమ్మా ! నాన్న కులమతాలు చూడకుండా సహాయం చేయడం సేవా బ్యాంకు వారు కూడా కులమతాలు పట్టించుకోకుండా బీదవారికి సహాయం చేస్తూ వడ్డీ లేని రుణం మంజూరు చేస్తూ సేవా చేస్తున్న బ్యాంకు వారికి నేను కూడా నా తరఫునుండి కృతజ్ఞతలు తెలుపుతున్నమ్మా అన్నాడు సంతృప్తి చెందిన మనసుతో అబ్దుల్ రహీం.

నిజమే నాన్న, మీ ముగ్గురి చదువులకు కూడా ఆయన డబ్బులు సంపాదిస్తూ సమకూరుస్తున్నారు. ఎంతో కష్టపడతారు. ఎంతో నిజాయితీతో, ధర్మసమ్మతంగా సంపాదిస్తారు. సత్యం మాట్లాడుతారు. న్యాయంగా మసులుకుంటారు. ఈ మంచి గుణాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని అంది తల్లి సారాబి నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి తన భర్త క్షేమంగా ఉండాలని అల్లాహ్ ను ప్రార్థిస్తూ.

ఒకరోజు అందరూ కలిసి బంధువుల ఇంటికి దావత్ కోసం వెళ్లారు. రాత్రి అక్కడే ఉండిపోవలసి వచ్చింది.

ఉదయం 10 కావస్తుండగా పొరుగువారు ఫోన్ చేసి మీ ఇల్లు బుల్డోజర్ తో కూల్చి వేస్తున్నారు అని ఎంతో బాధతో చెప్పారు.

ఆ వార్త వినగానే నాన్నకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కూలిపోయి అనంత లోకాలకు వెళ్లిపోయారు. మేము మా బంధువులంతా శోక సముద్రంలో మునిగిపోయాము. అటు ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయింది.

భూమి కొన్న కాగితాలు ఉన్నాయి. ఇల్లు కట్టిన ఖర్చుల వివరాలు రాసిపెట్టి ఉన్నాయి. అయినా కూల్చివేశారు.

సారాబి తన భర్తను తలుచుకుంటూ పిల్లల భవిష్యత్తు ను గురించి ఆలోచిస్తూ కన్నీరు మున్నీరవుతోంది.

ఇటు అబ్దుల్ రహీం తన చదువు గురించి, తన చెల్లెళ్ళ చదువు గురించి, ఇల్లు గురించి ఎంతో బాధపడుతూ, నిరాశ నిస్సృహలకు లోనయి ఇవి మా తెల్లారి నా బతుకులు అనుకుంటూ చదువు మానేసి సంపాదనకై బయలుదేరాడు అబ్దుల్ రహీం.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తరగని ప్రశ్న!

by Ramesh September 15, 2023
written by Ramesh

వర్షాన్ని,భూతల్లిని నమ్ముకుంటాడు రైతు
సాలుసాలంతా స్వేదం చిందించి కష్టించి
పంటను గిట్టుబాటుధరకుఅమ్ముకున్నప్పుడు
కళ్లల్లో ఆనందాల అరోరాకాంతులు
భూమంతా సంతోషమే గుండెల్నిండా
మనసు దూదిపింజంలా తేలిపోతుంది ఆ క్షణం

అక్కడ ప్రాజెక్టు మంజూరు కాకముందు
ఏలోటులేని మహారాజు అతడు
మాలకు దారం
మమతలకు మనిషే ఆధారం
ఆరుగాలం దుక్కిదున్నే హాలికుడికి
మరిభూమేకదా బంగారం
ప్రాజెక్ట్ పనుల ప్రకటన
సర్వేలు,నిర్థారణలు
నష్టపరిహారాల వెల్లువ
ఏండ్లకేండ్లు వ్యవసాయం చేస్తున్నా
పట్టాపాసుబుక్కుల్లేని రైతే
ఏ హక్కుల్లేని నేరస్తుడు ఇప్పుడు?
జవాబులు లేని ప్రశ్న అతడు?
కుటుంబానికి ఏమని చేస్తాడతడు వాగ్దానం ?
పట్టాకాగీతాలులేని రైతులంటే శీతకన్నే

వాస్తవాలకు దూరమైన జి.వోలు
దయలేని అధికారులు
కంటితుడుపుగా కొంతమొత్తం విదిలిస్తే ఏంలాభం?
అతడు కన్నకలలన్నీ
తటాకంలో గాలిగీసేఅలలై తీరంలోకనుమరగయ్యాయి
పట్టాభూమిగల రైతు నగదుకునగదు,భూమికిభూమి పొంది
నాగలిపట్టి దర్జగా దున్ని ఏటికేడుప్రగతిపల్లవందుకోవడం
ఆవశ్యకమైన దేశాభివృద్ధి దేశప్రజలందరికీ శుభసూకమే
పట్టాదస్తావేజులులేని నిర్వాసితుడు మాత్రం
భూమితోబాటుప్రాజెక్టు నీళ్లల్ల నిండామునిగి
ఏకాకి బాధాజీవి కావడమే విషాదగీతం
ఉన్నట్టు ఉండి అతను దున్నే భూమి ఎలా అదృశ్యం అవుతుందో?
ఎందుకు అంతర్థానం అవుతుందో?
అర్థంకాదు…ఎటూ పాలుపోదు… అతనికి
భూమిలేనితనం
కర్షకుడికి భరించరాని విలువల్లేని ఒంటరితనపు బతుకువేదనే ఈ లోకంలో
ఆశలన్నీ పక్షులై తిరిగిరాని దూరాలకుఎగిసిపోయిన ఆకాశం అతడు
ఎంతగా ఎదురుచూసినా ఏమి ప్రయోజనం?అంతా శూన్యం?
చివరికి అప్పులు అతని ఆస్తులు
బతుకు తిప్పలైన జీవితం అతడు
ఒక్కోసారి ప్రాజెక్ట్ అంటే
లోతట్టుభూముల్ని
పట్టాలేని భూరైతుల్ని
గల్లంతుచేస్తున్న సముద్రజలం
జీవితాలు జీవితాలే తలక్రిందులు చేస్తున్నభూస్థలం బహుశా
వంశపారంపర్యమైన భూమికి
పట్టాచేసుకోకపోవడం అజ్ఞానమో,పేదరికమో, నిర్లక్ష్యమో,జడత్వధర్మమో
దేశంలోవెసులుబాటు చట్టాలు ఇంకనూ లేకపోవడం తలపోసే అంశం
అదిగో నైరుతిఋతుపవనాల ఆగమనం
ఆగని కుండపోతవానల ఏకశృతి గానం
జలాశయాలు అన్నీ నిండుకుండలే!.
భూమిని,భుక్తిని కోల్పోయిన రైతులకేది న్యాయం?.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చెరగని గురుతు

by Aruna Dhulipala September 15, 2023
written by Aruna Dhulipala

ఉక్కిరిబిక్కిరి ఆలోచనలు
సంబంధం లేని గజిబిజి వలగా
మనసును చిందరవందర చేస్తూ…..
మొదలెక్కడో? కొన ఏమిటో..?
వాటన్నింటిని అప్పగించా
కలానికి కళ్ళుగా….

భావాలన్నీ రూపాలుగా
చిత్రవిన్యాస చేతనలుగా
హరివిల్లు రంగుల పొదలై
అక్షరాలుగా సాగుతూ
ముడులన్నీ విడిపోతూ
ఒదుగుతున్నాయి పేజీలపై..

మట్టిని తాకుతూనో
గాలిని వేలితో చుడుతూనో
మబ్బులో చినుకులా కరుగుతూనో
పక్షములు కట్టుకొని
ఆకాశనావలో తిరుగుతూనో
ముత్యపు చిప్పలా
కడలి లోతులు చూస్తూనో
ప్రవహిస్తుంటా అక్షరంగా..

అంతేనా……..
ప్రశ్నించే తత్వానికి
ఎలుగెత్తే గళానికి
పోరాటానికి, ఆరాటానికి మధ్య
జీవించే వర్తమానంలో
సిరాగా వర్షిస్తుంటా…
చరితకు మిగిలే గురుతుగా..

September 15, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

బిడ్డా…. గిట్లుంటది..!

by Madarapu Vanisri September 15, 2023
written by Madarapu Vanisri

ఏంది బిడ్డా../
నీకు ఇంకా తెల్వదా
మన తెలుగు భాష/
తెలంగాణ యాస/
ఎంత కమ్మగుంటదో../

నేనిదివరకే సెప్పిన ఎట్లుంటదో/
ఐనా మల్ల ఒకసారి చెప్తా../
ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా /
మన భాష..యాస కమ్మగనే ఉంటది.. /

మన భాషలో రాత్తాంటే
చద్దన్నం లో పచ్చడేసుకొని/
నంజుకున్నట్టు రంజుగుంటది../

జర్రున పారే యేరు లాగా/
సొగసుగుంటది..

యింటాంటే..
ఉగ్గు పాలకన్న కమ్మగుంటది../

బతుకమ్మ పాటలా/
యినసొంపుగుంటది../

అమ్మ జోల పాట లా/
హాయిగుంటది../

పసిబిడ్డ నవ్వులా/
స్వచ్ఛంగుంటది../

ఆడబిడ్డల ప్రేమ లా/
ఆప్యాయంగా ఉంటది../

ఏడికి పోయినా మన భాషకు/
దండం పెట్టేటట్టు గొప్పగా ఉంటది../

భారతీయ సంస్కృతి లా/
ఆదర్శంగా ఉంటది../

ఇంతకన్న సంబరంగా /
ఇంకేం ఉంటది../

దండాలు .. తెలుగుతల్లీ/
తెలంగాణ తల్లీ/
నీకు దండాలు../

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గోమఠేశ్వరుని మహామస్తకాభిషేకం

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) September 15, 2023
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

చారిత్రాత్మకమైన పరిశోధనా వ్యాసం :
చారిత్రాత్మకమైన బాహుబలి : చాముండరాయుని చరిత్ర : హసన్పర్తి జిల్లా : కర్ణాటక రాష్ట్రం :

పన్నెండు సంవత్సరాల కొక పర్యాయం ఒక నిర్ణీతమైన రోజున, మంగళప్రదమైన శుభసమయంలో బాహుబలి (గోమఠేశ్వరుని) మహామస్తకాభిషేకం దక్షిణ భారతంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శ్రావణబెళగోళలో జరుగుతుంది. బాహుబలి యొక్క బూడిదరంగు నల్లరాతి విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద నిలువెత్తు విగ్రహం. భయభక్తులను ప్రేరేపించే ఈ 1012. ఏళ్ళ విగ్రహం దిగంబర జైనులకు ప్రధాన యాత్రా కేంద్రమైన ఇంద్రగిరి కొండపై ఎండకు, వానకూ తల వొగ్గి నిల్చి ఉన్నది. తొలి మహామస్తకాభిషేకం 1398 ఏ.డి. లో జరిగినట్లు నమోదయింది.

శ్రావణబెళగొళ బెంగుళూరుకు దాదాపు 160 కి.మీ.ల దూరంలోనూ, మైసూరుకు 100 కి.మీ.ల దూరంలోనూ ఉన్నది. చక్కని కంకర రాతి రోడ్లపై ప్రయాణించి పర్యాటకులు కార్లు, బస్సుల ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.

కన్నడ భాషలో ‘బెళగుళం’ అంటే ‘తెల్లని కొలను’ అని అర్ధం. పట్టణం మధ్యలో ఉన్న పవిత్ర సరస్సును ఇది సూచిస్తుంది. గొప్ప యోగిపుంగవుడైన శ్రావణుడు ఇక్కడ నివసించేవాడు. కనుక ఈ రెండు పేర్లు కలిసి ఈ ప్రదేశం ‘శ్రావణబెళగుళం’ అయింది.

సమమైన మైదాన భూమిపై ప్రభవించిన రెండు పర్వతాలు ఇంద్రగిరి, చంద్రగిరి ఈ పట్టణంలో ఉన్నాయి. కటాక్షించే పొడుగైన బాహుబలి విగ్రహం ఇంద్రగిరి పర్వత శిఖరంపైన నిల్చి ఉంటుంది. ఈ కొండ యొక్క రాతి ఉపరి భాగాన్ని 500 మెట్లుగా చెక్కి, అనేక కమానుల ద్వారా 470 అడుగుల ఎత్తుగల శిఖర భాగానికి చేరి విగ్రహ పాద స్పర్శ చేసేందుకు వీలు కల్పించారు.

1962 ఎ.డి.లో ఈ విగ్రహస్థాపన జరిగినట్లు విశ్వసించబడుతున్నది. స్థానిక గాంగ ప్రధాన నాయకుడు, రాచమళ్ళ ముఖమంత్రి అయిన చాముండే, రాయని ఆజ్ఞప్రకారం ఒక ఏకశిల దీన్ని కొండపై చెక్కారు. తాజా కొలతల ప్రకారం బాహుబలి ఎత్తు 58.6 అడుగులు. బ్రహ్మాండమైన పాదాలు పొడవు 8 అడుగుల అంగుళాలు కాలివ్రేళ్ళు 2 అడుగుల 9 అంగుళాలు. బాహుబలి వదన మండలంలో ప్రసరిస్తున్న కరుణ, దయావైఖరి ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

అయోధ్య పాలకుడైన రిషభుని కుమారులలో బాహుబలి ఒకడు. అతడు, అతని అగ్రజుడు భరతుడు రాజ్యాధికారం కోసం పోరాటం జరుపుకున్నారు. ఈ యుద్ధంలో గెలుపు సాధించిన ‘బాహుబలి రాజ్యాన్ని సోదరుడు భరతునికి అప్పగించి, తపస్సు చేసుకునేందుకు అరణ్యాలకు వెళ్ళాడు.
బాహుబలి మహత్తరమైన నైతిక శక్తి మరియు సదాచారం కల వ్యక్తి అతని సోదరుడు భరతుడు అతని విగ్రహం నెలకొల్పాడు. కాని అది కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరువాతి సంవత్సరాలలో చాముండరాయడనే వ్యక్తి ఈ కథ విని ఆ స్థలాన్ని గుర్తించలేకపోయాడు. అప్పుడు అతడు చంద్రగిరి కొండ పైనుండి ఒక బాణాన్ని విడిచిపెట్టాడు. అది ఇంద్రగిరి కొండపైన బాహుబలిని ప్రతిబింబిస్తున్న ఒక రాతికి తగిలింది.

ఆ రాతిని చెక్కి తక్షణం బాహుబలి విగ్రహాన్ని తయారు చేయమని అతడు తన శిల్పులను, ఆజ్ఞాపించాడు. వారు కొండపై నుండి పని ప్రారంభించారు. మోకాళ్ళ వరకు వచ్చేసరికి విగ్రహం పూర్తిచేసేందుకు శిల (రాయి) చాలలేదు. లభ్యమైనంతలోనే విగ్రహం పూర్తిచేసేందుకు — కాళ్ళను చెక్కవలసి వచ్చింది. అందువల్లనే మోకాళ్ళ క్రింద నుండి విగ్రహం సరైన పాళ్ళు నిష్పత్తిలో ఉండదు.

మహామస్తకాభిషేక ఉత్సవ సమయంలో బ్రహ్మాండమైన సరంజాలు విగ్రహం చుట్టూ ఒక వేదికపై 108 మంది పూజారులు నిలబడి వివిధ లోహాలతో చేసిన 1008 పవిత్ర జలాన్ని బాహుబలి మస్తకంపై ప్రోక్షించి అభిషేకిస్తారు. దీని తరువాత పాలు, పుష్పాలు, బంగారం, వెండి, దళాలు, సింధూరం, చందనం మరియు నవరత్నాలతో విగ్రహన్ని మంత్రోచ్చారణల మధ్య మత నియమానుసారం అభిషేకిస్తారు

జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైన మతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాతి కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు.

బాహుబలి జననం:

కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సునందాదేవి, యశస్వతీ దేవి (సుమంగళీదేవి అని కొందరు ఉదహరిస్తున్నారు) అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు.విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది. భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు. బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో ‘బ్రాహ్మీ’ లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మీ లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు.

ఒకరోజు రాజ నర్తకి అయిన ‘ నీరాంజన ‘ నిండుకొలువులో ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణిస్తుంది. ఈ మృతితో ‘జీవితం క్షణభంగురం’ అని అర్థమైన ఋషభనాథుడు విరక్తుడవుతాడు. తన రాజ్యంలోని అయోధ్యకు భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి, పోదనపురానికి రాజుగా బాహుబలిని ప్రకటించి- తాను సర్వసంగపరిత్యాగిగా మారి జనారణ్యంలోకి వెళ్లిపోతాడు. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే ‘జినత్వం’ పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.

బాహుబలి జైనులలో చాలా గౌరవనీయమైన వ్యక్తి, రిషబదేవ (జైనమతం యొక్క మొదటి తీర్థంకరుడు) కుమారుడు మరియు భరత చక్రవర్తిన్ సోదరుడు. అతను నిలబడి ఉన్న భంగిమలో కయోత్సర్గ , 12 సంవత్సరాలు కదలకుండా ధ్యానం చేశాడని మరియు ఈ సమయంలో, అతని కాళ్ళ చుట్టూ ఎక్కే మొక్కలు పెరిగాయని చెబుతారు. తన 12 సంవత్సరాల ధ్యానం తరువాత, బాహుబలి సర్వజ్ఞతను (కేవల జ్ఞాన) పొందాడని చెబుతారు.

భరతుడు బాహుబలి ల యుద్ధం :

భరతుడు బాహుబలి ఇద్దరూ బలశాలురే, ఇద్దరి బలబలాలు బలమైనవే కాబట్టి, ఈ యుద్ధంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు ఒక ఒప్పందం చేశారు. యుద్ధ రంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తమ ఒక ప్రతిపాదన వారి ముందుంచారు. ఇరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి సైన్యాలను యుద్ధములో దించకుండా అన్నదమ్ములు ఇద్దరే యుద్ధము చేయాలని ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచిన వారికి ఇచ్చివెయ్యాలనేది మంత్రుల ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ సమ్మతించారు. వీరిద్దరి మధ్య దృష్టి యుద్ధం,జల యుద్ధం, మల్ల యుద్ధం, అనే మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు. అయితే ఎవ్వరూ ఆయుధాలు ప్రయోగించరాదని షరతు విధించారు. ఆయుధాలు లేకుండా పోరాడి విజయం సాధించిన సమరం మానవ చరిత్రలో ఇదే మొదటిది. అందుకే దీన్ని “నిశస్త్రీయేకరణ” అన్నారు. దీన్నే ఈరోజుల్లో మనం నిరాయుధీకరణగా అంటున్నాం.

ముందుగా యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం నియమం ప్రకారం ఒకరి కళ్ళల్లోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి కల్లార్పకూడదు ఎవరు ముందు కళ్ళు ఆర్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క, బాహుబలి తన అన్న భరతుని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళ్ళలోకి క్రోధగ్నులని ఎలా విరజిమ్మడం… అనుకుంటూ ప్రసన్న వదనంతో అన్నగారి కళ్ళల్లోకి చూస్తున్నాడు బాహుబలి. భరతుని పరిస్థితి అలాగే ఉంది. తమ్ముడు ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలకు తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంత చిత్తుడై కళ్ళు మూసుకున్నాడు. అయితే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తులు ప్రకటించారు. కళ్ళు మూసి తెరిచే లోపల ఓటమి పాలవ్వడంతో భరతుడు నివ్వెర పోయాడు. రెండవ జల యుద్ధం ప్రారంభమైంది నదిలో దిగి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకోవడం మీ యుద్ధం ప్రత్యేకత. యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలసిపోయాడు ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలి నే విజయం వరించింది. రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా గెలవాలని గట్టిగానిశ్చయించుకున్నాడు ఆ యుద్ధమూ ప్రారంభమైంది. ముందుగా భరతుడు బాహుబలి పై పిడిగుద్దులు కురిపించాడు. రెండో గుద్దుకే బాహుబలి కింద పడిపోయాడు. తమ్ముడు కింద పడిపోవడంతో కంగారుపడ్డాడు భరతుడు. తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు. ఇంతలో ఎప్పరెల్లి పైకి లేచాడు బాహుబలి ఇప్పుడు గుద్దే వంతు అతడిదే. అన్నను రెండు చేతులతో పైకి లేపి గిరగిరా తిప్పి జాగ్రత్తగా కిందికి దించాడు. గట్టిగా గుద్దడానికి చెయ్యి పైకి లేపాడు ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడ చేరిన వారందరూ అహంకారాలు చేశారు. భరతుడు కూడా ప్రాణభయంతో పనికి పోయాడు ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడ రాదని నియమాన్ని పక్కనపెట్టి తన చక్ర రత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు కానీ అది పనిచేయలేదని జైనా గ్రంథాలు చెబుతున్నాయి నియమా విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడని కోపముతో బాహుబలి అన్నను గుద్దడానికి పిడికిలి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి నేనేం చేస్తున్నాను నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యధించిన రాజ్యాధికారం కోసమా ? తోబుట్టువులను చంపబోతున్నాను. తుచ్చమైన ఈ రాజ్య భోగభాగ్యాలు వద్దు తండ్రిగారు , తమ్ముళ్ళలాగే నేను సన్యాసం స్వీకరించి శాశ్వతానందాన్ని విశ్వప్రేమను పొందుతాను… ఇలా సాగింది బాహుబలి ఆలోచన అంతే తనను క్షమించమని అన్న భరతుని కోరాడు. తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు దుస్తులను తొలగించుకొని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు. జైనా మతంలో దీక్ష తీసుకున్న వారు వెంట్రుకలను పీకడం ద్వారా తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు. భరతుడు ఎంత వారిస్తున్న వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు.

జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైన మతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాతి కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు.

బాహుబలి జైనులలో చాలా గౌరవనీయమైన వ్యక్తి, రిషబదేవ (జైనమతం యొక్క మొదటి తీర్థంకరుడు) కుమారుడు మరియు భరత చక్రవర్తిన్ సోదరుడు. అతను నిలబడి ఉన్న భంగిమలో కయోత్సర్గ , 12 సంవత్సరాలు కదలకుండా ధ్యానం చేశాడని మరియు ఈ సమయంలో, అతని కాళ్ళ చుట్టూ ఎక్కే మొక్కలు పెరిగాయని చెబుతారు. తన 12 సంవత్సరాల ధ్యానం తరువాత, బాహుబలి సర్వజ్ఞతను (కేవల జ్ఞాన) పొందాడని చెబుతారు.

కర్కల

కర్కాలా దాని 42 అడుగుల (13 మీ) ఏకశిలా గోమటేశ్వర బాహుబలి విగ్రహానికి ప్రసిద్ధి చెందింది, ఇది దాదాపు 1432లో నిర్మించబడిందని మరియు రాష్ట్రంలో రెండవ ఎత్తైన విగ్రహం అని నమ్ముతారు.ఈ విగ్రహం రాతి కొండపై ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఇది 1432 ఫిబ్రవరి 13న విజయనగర పాలకుని సామంతుడైన భైర అరసా వంశానికి చెందిన వీర పాం భైర అరస వడయార్ చేత ప్రతిష్ఠించబడింది.

బెంగళూరు నుండి 158 కి.మీ. అంటే 98 మైళ్ళు దూరంలో ఉన్న శ్రావణబెళగొళలో బాహుబలి యొక్క ఏకశిలా

విగ్రహం ఒక గ్రానైట్ బ్లాక్ నుండి చెక్కబడింది. ఈ విగ్రహాన్ని గంగా రాజవంశ మంత్రి మరియు సేనాధిపతి చావుందరాయలు నియమించారు; ఇది 574001 (17 m) పొడవు మరియు కర్ణాటకలోని హసన్ జిల్లాలో శ్రావణబెళగొళలో ఒక కొండ పైన ఉంది. ఇది 981 CE లో మరియు దాని చుట్టూ నిర్మించబడింది మరియు ఇది ప్రపంచంలోని అతిపెద్ద స్వేచ్ఛా విగ్రహాలలో ఒకటి. విగ్రహం 25 కిలోమీటర్ల అంటే 16 మైళ్ళు దూరం నుండి కనిపిస్తుంది. శ్రావణబెళగోళ జైనులకు తీర్థయాత్ర ( తీర్థం) కేంద్రంగా ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహానికి స్నానం చేస్తారు మరియు ఈ కార్యక్రమం ఇలా జరుపుకుంటారు మహామస్తకాభిషేకం.

శ్రావణబెళగొళ ఊరిపేరు వెనకున్న కథ

‘శ్రావణ బెళగొళకు’ ఆ పేరు రావటానికి వెనుక ఓ చక్కటి కథ ప్రచారంలో ఉంది. ‘బెజ్’ అనే కన్నడ పదానికి ‘తెల్ల తామరలు’ అని అర్థం. ‘గౌళ’ అంటే కొలను. ‘తెల్లని’ తామరపువ్వులతో నిండిన చక్కని కొలను’ ఆ ఊళ్లో ఉంది కాబట్టి దానిని ‘బెళగొళ అన్నారు. ఈ ఊరు చుట్టుప్రక్కల ‘హళె బెళగొళ’, ‘వీడి బెళగొళ’ అనే ఊళ్లు ఉండటం వల్ల కూడా దీనికి ‘బెళగొళ అనే పేరు స్థిరపడిపోయింది. జైన భక్తులైన ‘శ్రవణులు’ ఈ ఊళ్లో ఎక్కువగా ఉండటంవల్ల ‘శ్రవణ’ అనే పదాన్ని ముందు చేర్చుకుని ఈ ఊరు ‘శ్రావణ బెళగొళ అయ్యింది అంటారు. తెల్లతామరలతో నిండిన చక్కని పుష్కరిణే కాక- ‘ఇంద్రగిరి, చంద్రగిరి’ అనే రెండు అందమైన కొండలు కూడా ఈ ఊళ్లో ఉన్నాయి. ఇంద్రగిరినే ‘పెద్దమల’ అనీ, చంద్రగిరిని ‘చిన్నమల’ అనికూడా అంటారు.

శ్రావణ బెళగొళకు వాయవ్య దిక్కున ఉన్న చంద్రగిరి కొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండమీదకు వెళ్లాలంటే 240 మెట్లెక్కి వెళ్లాలి. అశోక చక్రవర్తి తాతగారైన ‘చంద్రగుప్త మౌర్యుడు’ తన గురువు అయిన ‘భద్రబాహు ముని’తోనూ, ఇతర శిష్యగణంతోనూ ఈ చంద్రగిరికి
ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్థలం. సంస్కృతమే కాక, కన్నడ, తమిళ, మరాఠీ భాషలలో చెక్కిన అనేక శిలాశాసనాలు ఈ కొండపై ఉన్నాయి. ‘గుళ్ళకాయి అజ్జి’గా పేరొందిన ‘బిందెవ్వ’ విగ్రహం, త్యాగస్తంభం యాత్రికులు, పర్యాటకులు తప్పకుండా చూడవలసినవి. ఇవన్నీ ఒక ఎత్తయితే- సౌందర్యం మూర్తీభవించిన ‘బాహుబలి విగ్రహం’ ఒక్కటీ ఒక ఎత్తు. ఇంద్రగిరి శిఖరాన నిర్మితమైన బాహుబలి కారణంగానే శ్రావణ బెళగొళ ప్రముఖ యాత్రాస్థలంగా రూపుదిద్దుకుంది.

విగ్రహాన్నంతటినీ అభిషేకించే కార్యక్రమాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. దీనినే ‘మహామస్తకాభిషేకమ్’ అంటారు.12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరిగే ఈ ‘బాహుబలి మహామస్తకాభిషేకమ్’ ప్రాధాన్యత గురించీ కొన్ని విషయాలు. బాహుబలి మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషేకం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే. అభిషేకించగలరు. గోమఠేశ్వరునికి బిందెల కొద్దీ పాలు, తేనె, పెరుగు, అన్నం, కొబ్బరి పాలు, నెయ్యి, చక్కెర, బాదం పప్పు, కుంకుమ పువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూట్స్, పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్ కడతారు. దీని మీదకు వెళ్ళి అభిషేకం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభిషేకం సమయంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆలయం కొండమీద ఉంటుంది. ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయినా ఎక్కడం కష్టమే.

మహా మస్తకాభిషేకాన్ని ‘గ్రాండ్ ఫెస్టివల్ ఆఫ్ శ్రావణ బెళగొళ ‘ ‘గా వ్యవహరిస్తూ ఉంటారు. శోడషోపచారాలలో అభిషేకానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. బాహుబలికి జరిగే మహామస్తకాభిషేకం 1,008 కలశాల జలంతో జరుగుతుంది. బంగారునాణాలు, జలం నిండిన కలశాలను. బాహుబలి తలపై గుమ్మరించనప్పుడు- అవి విగ్రహం మీదుగా రంగులీనుతూ పాదాల దగ్గరికి జాలువారుతాయి. పాదాల దగ్గరకు చేరిన పదార్థాలను భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ ప్రసాదం లభిస్తే భక్తులు తమ జన్మ చరితార్థమైనట్లేనని భావిస్తారు. మంగళవాద్యాల హోరులో, జైనసాధువుల మంత్రోచ్ఛారణ నేపథ్యంలో, భక్తుల జయజయ నినాదాల ధ్వనితో ‘మహా మస్తకాభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటగా బాహుబలి విగ్రహం. వెనుక నిర్మించిన వేదిక మీద నుంచి పవిత్ర ముహూర్త సమయంలో జైనగురువులు బాహుబలికి శుద్ధోదకంతోనూ, క్షీరంతోనూ, ఖాృతంతోనూ అభ్యంగన స్నానం చేయిస్తారు. పంచామృత స్నానం తరువాత మహామస్తకాభిషేకం ప్రారంభమై 1008 పవిత్ర కలశాలతో అభిషేక కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ప్రతి కలశాన్నీ మామిడి ఆకులతోనూ, నారికేళ ఫలంతోనూ అలంకరిస్తారు. అభిషేకానికి సువర్ణ, రజిత, ఇత్తడి వగైరా కలశాలను ఉపయోగిస్తారు. చతుష్కోణ కుంభాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఆకాశంలో నుంచి హెలికాప్టర్ ద్వారా పుష్పాలను చల్లే పుష్పవృష్టి- ఈ కార్యక్రమంలో ముఖ్యాకర్షణగా కొద్ది సంవత్సరాల నుంచీ భాసిస్తోంది. కార్యక్రమం ఇక కొద్దిసేపటికి ప్రారంభమౌతుంది అనగానే జైనసాధువులు వేదిక పైకి చేరి, కలశాలతో సిద్ధంగా ఉంటారు. ప్రతీ జైనగురువు చేతిలోనూ ఒక కలశం, పాలతో నిండిన ఒక పాలపాత్ర, ఒక నేతిపాత్ర సిద్ధంగా ఉంటాయి. సరిగ్గా ముహూర్తం వేళకు అభిషేకం ప్రారంభమవుతుంది. మొదటగా పాలతోనూ, తరువాత నేతితోనూ మూర్తిని అభిషేకిస్తారు. ఆ తరువాత శతాధిక కలశాలతో యధావిధిగా ‘మహామస్తకాభిషేక మహోత్సవం’ కొనసాగుతుంది. మొట్టమొదటి ‘మహామస్తకాభిషేకాన్ని’ బాహుబలి విగ్రహ నిర్మాత అయిన చాముండరాయడు జరిపినట్లు చెబుతారు. తరువాత 1398 వ సంవత్సరం. నుంచీ ‘పండితాచార్య’ అనే ఆచార్యుడు 12ఏళ్లకి ఒకసారి వరుసగా ఏడుసార్లు మహామస్తకాభిషేకాన్ని నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 1659 వ సంవత్సరం నుంచి మైసూరు మహారాజులు బాహుబలికి మహామస్తకాభిషేకాన్ని నిర్వహించడం ప్రారంభించారు. 1910వ సంవత్సరంలో అప్పటి మైసూరు ప్రభువైన ‘కృష్ణరాజేంద్ర వొడయార్’ మహామస్తకాభిషేకాన్నీ చేశారు.

చాముండరాయడి కథ

పెద్దమల లేక ‘పెర్కళ్ళప్పు’ అనికూడా పిలిచే ఇంద్రగిరి పర్వతం శ్రావణ బెళగొళకు జీవనాడి వంటిది అని చెప్పవచ్చు. 470 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండమీద 8 జైన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అమ్మదేవ, చిన్నణ్ణ, భరతబాహు, సిద్ధర బసదులు’ ముఖ్యమైనవి. కొండపై ‘గొమ్మఠేశ్వరాలయం’ కూడా ఉంది. నాలుగు మంటపాలు, ఐదు మహాద్వారాలు, మూడు స్తంభాలతో అనేక ప్రాచీన శిల్పాలతో, శిలాశాసనాలతో విలసిల్లుతున్న ఇంద్రగిరి ఎంతో చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్థలం. ‘ఇంద్రగిరి’ శిఖరంపై ఉన్న బాహుబలి విగ్రహాన్ని నిర్మించింది. ‘చాముండరాయడు అనే మంత్రి 2 వ మారసింహుడికి, 4వ రాచమల్లుడుకీ మంత్రి అయిన చాముండరాయడు జైన మతస్తుడు. బాహుబలి స్వర్ణప్రతిమ గురించి విన్న చాముండరాయని తల్లి ఆ మూర్తిని దర్శించేదాకా ఏదీ ముట్టనని నిరాహారదీక్ష ప్రారంభిస్తుంది. ఆ బంగారు విగ్రహం అగోచరమైపోయిందని చెప్పినా ఆమె వినిపించుకోదు. ఇక చేసేదిలేక చాముండరాయడు తల్లితో సహా బాహుబలి విగ్రహాన్ని అన్వేషిస్తూ రాజ్యం నుంచి బయలుదేరతాడు. ఆ ప్రయత్నంలోనే ‘శ్రావణ ‘బెళగోళ’లోని ‘చంద్రగిరి’కి చేరి ఓ రాత్రి అక్కడ నిదురిస్తాడు. ఆ రాత్రి కలలో చాముండరాయనికి
‘కూష్మాండిని, పద్మావతి’ అనే యక్షిణులు ప్రత్యక్షమై ‘బాహుబలి స్వర్ణప్రతిమ దర్శనం అలభ్యం’ అనిచెప్పి, భక్తిశ్రద్ధలతో వెతికితే ఎదురుగా ఉన్న ఇంద్రగిరిపై బాహుబలి ప్రత్యక్షమౌతాడు అని చెప్పి అదృశ్యమవుతారు. యక్షిణులు చెప్పినట్లుగా చాముండరాయడు ‘ఇంద్రగిరి’ చేరుకోగా… బాహుబలి శిరస్సు ప్రత్యక్షమౌతుంది. ఆ ముఖ సౌందర్యానికి ముగ్ధుడైన చాముండరాయడు బాహుబలిని ‘గుమ్మటేశ్వరుడు’ అని కీర్తించాడంటారు. ‘గుమ్మటుడు’ అంటే ‘మన్మథుడు’ అనికూడా అర్ధం. గుమ్మటేశ్వరుడే రానురాను ‘గోమఠేశ్వరుడు’గా మారిందంటారు. తర్వాత చాముండరాయడు గుమ్మటేశ్వరుడిని శిరస్సు పరిమాణానికి తగినట్లుగా 59 అడుగుల ఎత్తుగల ఏకశిలా విగ్రహాన్ని నిర్మింపజేశాడు. విగ్రహ ప్రతిష్ఠ క్రీ.శ.982 ప్రాంతాలలో జరిగినట్లు భావిస్తున్నారు.

చాముండరాయనికి గర్వభంగం

విగ్రహ ప్రతిష్ఠాపన అయితే జరిగింది కాని, అంతటి భారీ విగ్రహానికి అభిషేకాలు, పూజ, వగైరా కార్యక్రమాలు నిర్వహించడం ఒక పెద్ద సమస్యగా మారింది. అప్పటికే అంత పెద్ద విగ్రహ నిర్మాణానికి కారకుడైనందుకు గాను. చాముండరాయని మనస్సులో గర్వం చోటుచేసుకొంది. ఆ గర్వంతోనే చాముండరాయడు ‘బాహుబలి మహామస్తకాభిషేకానికి ,తల నుంచి పాదాల వరకు అభిషేకం చేయడానికి పూనుకున్నాడు
కానీ, ఎన్ని బిందెల పవిత్రజలాన్ని విగ్రహం తలపై గుమ్మరించినా… గోమఠేశ్వరుడు పూర్తిగా తడవటం లేదు. ఆ జలం ఆయన భుజాల వరకే సరిపోతోంది తప్ప కిందికి జారటం లేదు. ఈ పరిస్థితి చూసి చాముండరాయడు దిగులుతో ఉండగా.. ‘కూపొండిని: అనే యక్షిణి ఓ ముసలమ్మ వేషంలో చేతిలో చిన్నబిందెతో వచ్చి బాహుబలికి ‘పంచామృత స్నానం చేయిస్తానంటుంది. ఆమె కోరిక విని చాముండరాయుడు. నవ్వుకుంటాడు. నేను వేలకొద్దీ బిందెలతో అభిషేకిస్తున్నా తడవని దేవుడు నీ దగ్గరున్న చిన్నబిందెలోని పంచామృతాలతో తడుస్తాడా?
అంటాడు. ఆ తర్వాత అయిష్టంగానే ఆమె బాహుబలికి అభిషేకం చేయటానికి ఒప్పుకుంటాడు. ముసలమ్మ బాహుబలికి నమస్కరించి, తన చేతిలో వున్న చిన్నబిందెలోని పంచామృతాలను దేవుని శిరస్సుపై పోస్తుంది. చిత్రంగా అంతటి దేవుడూ ఆ కొద్దిపాటి ధారతోనే పూర్తిగా తడిసిపోతాడు. ఈ విచిత్రానికి చాముండరాయడు మొదట్లో ఆశ్చర్యపోయినా… తర్వాత తన అహంకారానికి పశ్చాత్తాపపడి, తనను క్షమించమని భగవంతుడిని వేడుకుంటాడు. ఆత్మశోధన, పశ్చాత్తాపాల అనంతరం చాముండరాయుడు చేసిన అభిషేక జలం బాహుబలి కాళ్లవరకూ జారి సంపూర్ణ అభిషేకం చేసినట్లే అవుతుంది. ఈ కథకు సాక్ష్యంగా చేతిలో చిన్నబిందెను పట్టుకొనివున్న ఓ ముసలావిడ విగ్రహాన్ని ఈనాటికీ బాహుబలి విగ్రహం దగ్గరగా చూడవచ్చు, స్థానికులు ఈమెను బిందెవ్వ అని అంటూ ఉంటారు. సంపద వైభవం, అధికారం లాంటివేవీ నిర్మలమైన భక్తికి సాటిరావు అని బిండెవ్వ ఉదాహరణ ఋజువు చేస్తూవుంటుంది. ఏదిఏమైనా బిందెవ్వ కరుణ వల్ల బాహుబలికి తొలి ‘మహామస్తకాభిషేకం’ చేసినవాడుగా చాముండరాయడు ప్రసిద్ధి కెక్కాడు. అప్పటినుంచీ ఈ విరాట్ స్వరూపానికి ‘మహామస్తకాభిషేకం’ ప్రతి పుష్కరానికి (పన్నెండేళ్లకి) ఒకసారి ఎంతో వైభవోపేతంగా జరుగుతూనేవుంది.

ఊరు సరస్సు పేర్ల వెనక మరో జానపద ఐతిహ్యం:

వింధ్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండిరాయ ఎన్నో ప్రయాసలు పడి గోమఠేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ విగ్రహానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగేలా ఏర్పాటుచేశాడు. తొలినాళ్ళలో అభిషేకోత్సవం జరిపించాలని చాముండిరాయ నిర్ణయించాడు. గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తనకు తప్ప వేరే ఎవరికి ఆ అభిషేకోత్సవంలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు. బాహుబలి అభిషేకానికి అన్ని ద్రవ్యాలు తెప్పించాడు చాముండిరాయ. అభిషేకోత్సవం మొదలైంది. చాముండి తెప్పించిన అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అన్నీ ఐపోయాయి. కాని అభిషేక ద్రవ్యాలు బాహుబలి పాదాలకు కూడా చేరలేదు. చాముండిరాయకు యేమిచేయాలో పాలుపోలేదు. చివరికి ఒక అజ్జి (ముసలవ్వ) గుల్లెకాయ (కొబ్బరికాయ) లో కొన్ని పాలు తీసుకొని వచ్చిందట. తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట. భటులు ముందు అంగీకరించకపోయినా, చాముండిరాయ ఆజ్ఞతో అనుమతించారట. అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోని పాలను బాహుబలి మస్తకంపై పోయగా, ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా బాహుబలి శిరస్సు నుండి పాదాలకు చేరి మొత్తం తడిపివేశాయట. అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ మీదికి, ఆ వింధ్యగిరి మీద నుండి కిందికి ధారాపాతగా ప్రవహించాయట. అలా పారిన ఆ పాలతో ఏర్పడినదే ఈ సరస్సు అని, అందుకే ఇది తెల్లగా ఉన్నదని, దానికి శ్వేతకొలను లేదా దవళసరోవరమని పేరొచ్చిందని చెబుతారు. చాముండిరాయ అవ్వ మహాత్యానికి అబ్బురపడి, క్షమించమని కోరాడట. ఆ అవ్వ ఎవరో కాదని జైన జాతి రక్షక దేవత అని, భగవంతుడి సేవాభాగ్యాన్ని అందరికి కలిపించాలని చాటి చెప్పి, చాముండిరాయ కళ్ళు తెర్పించడానికి వచ్చిందని జైనులు విశ్వసిస్తారు. ఆ అవ్వకు ఒక ఆలయాన్ని నిర్మిచారు. ఆ ఆలయాన్ని గుల్లెకాయ అజ్జి ఆలయంగా పిలుస్తారు.

ఈ పట్టణంలో చంద్రగిరి, వింధ్యగిరి అను రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య బద్రబాహు, అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్లు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దిలో అశోకడు ఇక్కడ చంద్రగుప్తుని పేరుతో మఠాన్ని ఏర్పాటు చేశాడు. చంద్రగిరిపై గొప్ప ఆలయం ఉంది. దీనిని గంగ రాజు రాజమల్ల మంత్రి, నేమిచంద్రుని శిష్యుడిగా చెప్పబడే చాముండిరాయ నిర్మించాడు.

పట్టణంలోని వింధ్యగిరిపై 58 అడుగుల ఎత్తైన ఆకర్షణీయమైన గోమఠెశ్వరరుని
ఏకశిలా విగ్రహం ఉంది. దీనికి ప్రపంచంలో అతి పొడవైన ఏకశిలా విగ్రహంగా గుర్తింపు ఉంది. ఈ విగ్రహం యొక్క పీఠంపై కన్నడ,ప్రాచీన కొంకణి, సంస్కృత సమ్మిళితమైన లిపిలో ఒక శాసనం ఉంది.ఈ శాసనం శక సంవత్సరం 981 నాటిదిగా చెప్పబడింది. ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు గోమఠెశ్వరునిగా పిలుస్తే జైనులు బాహుబలి గా కొలుస్తారు.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చందమామయ్య

by Tungaturti Madhusudana Rao September 15, 2023
written by Tungaturti Madhusudana Rao

నాడు మా అమ్మ అవని నుండి నీవు విడిపోయి గగనతలంలో విహరిస్తున్నావని మా అమ్మ
” చందమామ రావే జాబిల్లి రావే” అని నిన్ను పిలుస్తూ బుజ్జగిస్తూ పాటలు పాడుతూ ఆడిస్తున్నది…
నీ వెన్నెల చల్లదనంలో రాత్రి వేళ , హాయిగా తీయగా పాడుతూ ఆడుకుంటున్నాము…
నీవు మా చెంతకి తిరిగి రాలేకపోయినా
మేమే మేనమామ ఇంటికి , ఆశించి ప్రయత్నించి వచ్చాము మామయ్య…
ఎలాగైతేనేం నీ నివాసం చూడగలిగాం నేడు.
నీ ముందు భాగం పండు వెన్నెల ప్రసరిస్తే ,
నీ వెనుక భాగం చిమ్ము చేకటెందుకు?
నీ తిమిర భాగంలో నిక్షిప్తంగావున్న సంపదను చూడాలని ఉంది మామ !
ఈ ఖనిజ, మూలకౌల సంపదంతా ఇక్కడ నిరుపయోగంగా పడివున్నాయి….
ఒంటరివాడివి ఎందుకు నీకివన్నీ !
ఎవరైనా ఆస్తులు సమకూర్చి కూడబెట్టినా రాబోవు తరానికి అందిస్తారు…
నీవు వదలివచ్చిన నీ సోదరి , మా భూమాత సంతతే కదా మేమంతా!
అమ్మ తరువాత ఆమె తోబుట్టువు నీవు , మాకు మా మేనమామవే కదా….
ఎన్నో శ్రమలకోర్చి నీ ఇంటికి వచ్చాము.
మా జగతి జనం పురోగతికి తోడ్పడి ,
నీ నిక్షిప్త నిధులను భువికి తరలించి , ఆదుకోవాలని ఆశించివచ్చాం !
ఈ రాఖీ పండుగ సందర్భంగా , మాకు రాఖీకట్టి
” అంతా శుభమే జరుగుతుందని, క్షేమంగా వెళ్లి లాభంగా రండని ” మా అమ్మ అవని పంపించింది.
మీకు ఈ సందర్భంగా భువిపై జనావళి అందరి శుభాకాంక్షలు అందిస్తున్నాం.
ఇక నుండి మేమిలానే వస్తూ పోతుంటాం .
ఇక సెలవు

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

*”&_

by Ramesh September 15, 2023
written by Ramesh

వర్షాన్ని,భూతల్లిని నమ్ముకుంటాడు రైతు
సాలుసాలంతా స్వేదం చిందించి కష్టించి
పంటను గిట్టుబాటుధరకుఅమ్ముకున్నప్పుడు
కళ్లల్లో ఆనందాల అరోరాకాంతులు
భూమంతా సంతోషం గుండెల్నిండా
మనసు దూదిపింజంలా తేలిపోతుంది ఆ క్షణం

అక్కడ ప్రాజెక్టు మంజూరు కాకముందు
ఏలోటులేని మహారాజు అతడు
మాలకు దారం
మమతలకు మనిషే ఆధారం
ఆరుగాలం దుక్కిదున్నే హాలికుడికి
మరిభూమేకదా బంగారం
ప్రాజెక్ట్ పనుల ప్రకటన
సర్వేలు,నిర్థారణలు
నష్టపరిహారాల వెల్లువ
ఏండ్లకేండ్లు వ్యవసాయం చేస్తున్నా
పట్టాపాసుబుక్కుల్లేని రైతే
ఏ హక్కుల్లేని నేరస్తుడు ఇప్పుడు?
జవాబులు లేని ప్రశ్న అతడు?
కుటుంబానికి ఏమని చేస్తాడతడు వాగ్దానం ?
పట్టాకాగీతాలులేని రైతులంటే శీతకన్నే

వాస్తవాలకు దూరమైన జి.వోలు
దయలేని అధికారులు
కంటితుడుపుగా కొంతమొత్తం విదిలిస్తే ఏంలాభం?
అతడు కన్నకలలన్నీ
తటాకంలో గాలిగీసేఅలలై తీరంలోకనుమరగయ్యాయి
పట్టాభూమిగల రైతు నగదుకునగదు,భూమికిభూమి పొంది
నాగలిపట్టి దర్జగా దున్ని ఏటికేడుప్రగతిపల్లవందుకోవడమే
ఆవశ్యమైన దేశాభివృద్ధి దేశప్రజలందరికీ శుభసూకమే
పట్టాదస్తావేజులులేని నిర్వాసితుడు మాత్రం
భూమితోబాటుప్రాజెక్టు నీళ్లల్ల నిండామునిగి
ఏకాకి బాధాజీవి కావడమే విషాదగీతం
ఉన్నట్టు ఉండి అతను దున్నే భూమి ఎలా అదృశ్యం అవుతుందో?
ఎందుకు అంతర్థానం అవుతుందో?
అర్థంకాదు…ఎటూ పాలుపోదు… అతనికి
భూమిలేనితనం
కర్షకుడికి భరించరాని విలువల్లేని ఒంటరితనపు బతుకువేదనే ఈ లోకంలో
ఆశలన్నీ పక్షులై తిరిగిరాని దూరాలకుఎగిసిపోయిన ఆకాశం అతడు
ఎంతగా ఎదురుచూసినా ఏమి ప్రయోజనం?అంతా శూన్యం?
చివరికి అప్పులు అతని ఆస్తులు
బతుకు తిప్పలైన జీవితం అతడు
ఒక్కోసారి ప్రాజెక్ట్ అంటే
లోతట్టుభూముల్ని
పట్టాలేని భూరైతుల్ని
గల్లంతుచేస్తున్న సముద్రజలం
జీవితాలు జీవితాలే తలక్రిందులు చేస్తున్నభూస్థలం బహుశా
వంశపారంపర్యమైన భూమికి
పట్టాచేసుకోకపోవడం అజ్ఞానమో,పేదరికమో, నిర్లక్ష్యమో,జడత్వధర్మమో
దేశంలోవెసులుబాటు చట్టాలు ఇంకనూ లేకపోవడం తలపోసే అంశం
అదిగో నైరుతిఋతుపవనాల ఆగమనం
ఆగని కుండపోతవానల ఏకశృతి గానం
జలాశయాలు అన్నీ నిండుకుండలే!.
భూమిని,భుక్తిని కోల్పోయిన రైతులకేది న్యాయం?.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us