మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

రెడ్ వెల్వెట్ మైట్స్

by జయంతి వాసరచెట్ల September 15, 2023
written by జయంతి వాసరచెట్ల

నేలను కరుచుకుని అర అంగుళం దేహం
తలకు రెండు యాంటినా కళ్ళు
ఆరుకాళ్ళతో చలాకీగా కదులుతూ
కత్తిరించిన ఎర్రటి మక్మల్ బట్ట ముక్కలు
చల్లినట్లు నేలపై ఆరుద్రలు!

ఆరుద్ర కార్తె ఆరంభం తో
చినుకులతో పాటే
ఎర్రటి మొగ్గలు పూసినట్లు
పచ్చటి గడ్డిపై అవి…

బీడు వారిన భూమిపై
తొలకరి జల్లు చేరంగానే…
బడిగంట శబ్దానికి
పిల్లలు బిలబిలా పరుగుతీసినట్లు
కుప్పలుతెప్పలుగా చందమామ పురుగులు!

కొంత ఇసుక నేల
మరికొంత పచ్చ గడ్డి నేల ఉంటే చాలు
పట్టుకుచ్చుపూలలా అలరిస్తాయి!

పిల్లలను పెద్దలను ఆకర్షిస్తూ
ముట్టుకుంటే ముడుచుకు పోయే
అత్తిపత్తి మొక్క లా మక్మల్ పురుగులు!

ఇసుకనేల బొరియల్లో జీవనం సాగిస్తూ ….
నేలను గుల్ల బార్చి పంటకుపోషకాలు
అందించడంలో సహాయకారులు!

ఆ రుద్రుడికి ప్రీతికరమైన నామాలతో
మన మధ్యే మనకోసం బ్రతికే జీవులు !
వరుణదేవుడి కి ప్రతిరూపాలు
రైతన్నలకు నేస్తాలు ఆరుద్ర పురుగులు!

పక్షవాతం మరెన్నో రుగ్మతలకు
తమ ప్రాణాలను అర్పించి
సాంప్రదాయ ఔషధ ప్రధాతలు రెడ్ వెల్వెట్ మైట్స్!

ఇప్పుడు
దళారుల చేతుల్లో కాసులు కురిపించేందుకు
వాటి దేహాలను చాలించి
రేపటి తరానికి ఆన్లైన్ లో
బొమ్మలుగా కనిపించబోతున్నాయి!

September 15, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఇంటి పేరు

by ఆచార్య మస‌న‌ September 15, 2023
written by ఆచార్య మస‌న‌

యాదగిరిగుట్టకు ఒకరోజు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. కార్యక్రమం రచ్చ యాదగిరి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటైంది.

సభలో ఎంతోమంది పాల్గొన్నారు. కవి కాబట్టి రచ్చ యాదగిరి కూడా పాల్గొన్నాడు. కార్యక్రమం బాగా జరిగింది. భోజనాలు కూడా చేశాం మధ్యాహ్నం కాబట్టి.

రచ్చ యాదగిరి గారు నాదగ్గరకి వచ్చి ”మీ ప్రసంగం బాగుంది. మీరెక్కడుంటారు హైదరాబాద్‌లో” అని అడిగాడు. ”బోడుప్పల్‌” అని సమాధానమిచ్చాను. వెంటనే నాకు నా అర్ధాంగి ప్రమీల పేరు స్ఫురించింది. కారణమేమంటే ఆమె తల్లిగారి ఇంటిపేరు ‘రచ్చ’ కావడమే.

”నా భార్య రచ్చవాళ్ల ఇంటి ఆడపిల్ల. మీరు రచ్చ వాళ్లు కావడం ఆనందంగా ఉంద”న్నాను.

యాదగిరి గారికి నాతో కొంతసేపు మాట్లాడాలనిపించింది. ”మీ అత్తగారి ఊరేది? మీ మామ ఏ పని చేసేవారు. మీ అర్ధాంగి గృహిణియేనా?” వినయంగా ప్రశ్నించాడు. ”మా మామగారు హైదరాబాదు వాస్తవ్యులు. మెడికల్‌ డిపార్టుమెంటులో పని చేశారు. ఇప్పుడు నా భార్య లేదు” అన్నాను కళ్లు తుడుచుకుంటూ. యాదగిరి గారు నా స్థితిని అర్థం చేసుకున్నారు. ”మీరు మా ఇంటికి వస్తారా? దగ్గరనే” అని కోరారు. నేను కాదనలేకపోయాను. మా ప్రమీల పుట్టినింటికి వెళ్లినంత ఆనందమైంది నాకు. యాదగిరి ఇంటి వాళ్లంతా పరిచయమయ్యారు. మా ప్రమీల ఏ లోకంలో ఉందోగాని, ఆమె పుట్టిన ఇంటిపేరు ఎంత మహిమగలదో తెలిసింది.

నేను హైదరాబాదుకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాను. ”మీరు రావడంవల్ల మా ఇల్లు పావనమైంది” అంటూ ఇంట్లోంచి ఒక శాలువా తెచ్చి కప్పినారు.

యాదగిరి గారి సౌజన్యానికి ఎంతో మురిసిపోయాను. వారిని చూచినప్పుడు మా మామగారే గుర్తుకు వచ్చారు. మా మామ కూడా నన్నెంతో ఆదరించేవారు. ప్రేమతో పలకరించేవారు.

పుస్తకావిష్కరణ తర్వాత నేను యాదగిరిగుట్టకు ఎన్నిసార్లు వెళ్లానో నాకే తెలియదు. వెళ్లినప్పుడల్లా యాదగిరి గారింటిలో ఆతిథ్యం తీసుకోకుండా రాను. యాదగిరి గారి కుటుంబ సభ్యుల్లో నేనొకడినయ్యాను. యాదగిరి గారు ఆర్‌.ఎమ్‌.పి. డాక్టర్‌ కనుక అప్పుడప్పుడు ఆరోగ్య సంబంధమైన సూచనలు కూడా ఇచ్చినారు. నాకే చిన్న బాధ కల్గినా యాదగిరి గారితో చెప్పుకోవడం పరిపాటి అయ్యింది. వారు నా రచనలు కూడా చదివినారు. అప్పుడప్పుడు పద్యాలు రాసి నా చేత దిద్దించుకున్నారు.

ఒకమాటలో చెప్పాలంటే యాదగిరి గారు ఆత్మబంధువు లయ్యారు. హైదరాబాదుకు వచ్చినప్పుడల్లా నన్ను చూసి వెళ్తారు. ప్రతిరోజు ఫోన్లో తప్పక మాట్లాడుతారు.

యాదగిరి గారికి నాకు ఏమిటో విడదీయరాని సంబంధం కల్గింది. బహుశా మా ప్రమీల ఇంటిపేరు, వారి ఇంటి పేరు ఒకటి కావడమేనా? ఇంటి పేర్లొకటైనంత మాత్రాన ఇంత అనుబంధం ఏర్పడుతుందా?

ఇదంత ప్రమీల ప్రభావమేనని నా మనస్సు పదేపదే గుర్తు చేస్తుంది.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఒక రాకుమారుడు

by ఒద్దిరాజు మురళీధరంరావు September 15, 2023
written by ఒద్దిరాజు మురళీధరంరావు

పూర్వం సిద్ధార్థుడు అనే ఒక రాకుమారుడు ఉండేవాడు. అతడు దయగలవాడు. అతడు వయసులో చిన్నవాడైనప్పటికీ ఎవరు బాధపడుతున్నా ఇష్టపడేవాడు కాదు. అతను జంతువులను కూడా ప్రేమించేవాడు. అతను ఎప్పుడూ అందరినీ దయగా చూసేవాడు కాబట్టి అందరు అతన్ని ఇష్టపడేవారు.

ఒకరోజు రాజుగారి తోటలో సిద్ధార్థ నడుస్తుండగా, ఏదో బాధతో ఏడుస్తున్న శబ్దం విన్నాడు. వెంటనే తనముందు ఏదో పడింది. అతను అక్కడికి వెళ్ళి చూస్తే, ఒక అందమైన తెల్లని హంస ఉంది. అది నొప్పితో మూల్గుతున్నది. ఒక బాణం ఆ పక్షి శరీరంలో గుచ్చుకుని రక్తం కారుతుంది.

దాని అవస్థ చూసి బాధపడి రాకుమారుడు సిద్ధార్థ చాలా జాగ్రత్తగా ఆ పక్షిని లేపి తన చేతులపై పెట్టుకొన్నాడు. ”దాన్ని ముట్టుకోకు, అది నాది” అనే అరుపు విన్నాడు. సిద్ధార్థ అటు చూసేవరకు అతని మేనమామ కొడుకు దేవదత్‌ తనవైపు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని ఒక చేతిలో ఒక బాణం ఉంది. రెండవ చేతిలో బాణాల పొదిలో నిండా బాణాలు ఉన్నాయి.

”ఆ పక్షి నాది, నాకు తిరిగి ఇచ్చేయి” అని అన్నాడు.

”ఈ పక్షి నాకు దొరికింది. నేను పాపం ఈ పక్షిని జాగ్రత్తగా చూసుకుంటాను” అన్నాడు సిద్ధార్థ.

”నేను ఆ పక్షిని బాణంతో కొట్టి పడేశాను, కాబట్టి అది నాది” అన్నాడు దేవదత్‌.

ఇద్దరు వాదులాడుకొంటున్నారు. చివరకు వారు తీర్పు కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. రాజు శుద్ధోదనుడు దర్భారు నడిపిస్తున్నాడు. ఇద్దరు బాలురు లోనికి వెళ్ళి వారికి తీర్పు కావాలని కోరారు.

”చెప్పండి మాకు, మీ సమస్య ఏమిటి, మేము వింటున్నాము”, రాజు శుద్ధోధనుడు అన్నాడు.

దేవదత్‌ ”మహారాజా! సిద్ధార్థ నా పక్షిని తీసుకున్నాడు. నేను బాణంతో ఆ పక్షిని పడేశాను, కాబట్టి అది నాదే. దయచేసి నా పక్షిని నాకు ఇప్పించండి” అన్నాడు.

”రాకుమార సిద్ధార్థ ఇది నిజమేనా?” అడిగాడు శుద్ధోధనుడు.

”మహారాజా, ఈ పక్షి ఘోరంగా గాయపడి తోటలో పడి ఉంది. నేను దాన్ని పైకి లేవదీశాను” అన్నాడు సిద్ధార్థ.

”తరువాత” సిద్ధార్థ చెప్పసాగాడు, ”నేను దాని గాయాన్ని శుభ్రపరిచాను. ఇప్పుడు అది కోలుకుంటున్నది. నేను దాన్ని చంపనీయను. ఎవరికి కూడా ఇతరుల ప్రాణం తీసే హక్కు లేదు. నేను దాన్ని అతనికి ఇవ్వను” అన్నాడు.

రాజ దర్భారు (కోర్ట్‌)లో ఉన్న ప్రజలందరు రాకుమారుడు సిద్ధార్థ చూపిన దయకు ముగ్ధులైనారు. వారు రాజు గారి తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు.

రాజు సమస్యపై విచారణ చేసి, అతని నిర్ణయం వెలిబుచ్చాడు.

కేవలం సృష్టికర్తకే ప్రాణాన్ని తీసుకునే హక్కు ఉంటుంది. ఒకరు చేసిన సృష్టిని వేరే వారు నాశనం చేసే హక్కు ఉండదు. ఈ కేసులో దేవదత్‌ పక్షిని చంపే ప్రయత్నం చేశాడు. కాని సిద్ధార్థ దాన్ని రక్షించాడు.

కాబట్టి ప్రాణం తీసే వ్యక్తి కన్నా, ప్రాణాన్ని కాపాడిన వారికి ఎక్కువ హక్కు ఉంటుంది. కనుక ఆ పక్షి సిద్ధార్థకు చెందుతుంది కానీ దేవదత్‌ కు చెందదు.

రాకుమారుడు సిద్ధార్థ ఇది విని చాలా సంతోషించాడు. దర్భారులో ఉన్న ప్రజలు కూడా అంత తెలివైన, దయగల రాజు పాలనలో ఉన్నందుకు చాలా ఆనందించారు.

”ఆ యువ రాకుమారుడు ఎవరో మీకు తెలుసా?” కథ చెప్పిన తరువాత తాతగారు అడిగారు. ”అతను ఇంచా చాలా నెమ్మదస్తుడు మరియు దయగల వాడిగా ఎదిగాడు. అతను కేవలం దయగల వాడేగాక తన చుట్టు ఉన్నవారికి కూడా బోధించేవాడు. అతను గౌతమ బుద్ధుడు”.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సూర్య నమస్కారాలు

by Bandi Usha September 15, 2023
written by Bandi Usha

యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, ధ్యానంతో కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. ఇది 12 రకాల భంగిమలతో కూడి ఉంటుంది. ఏ ఆసనాలు అయినా బ్రహ్మముహూర్త సమయంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది.

సూర్యనమస్కారాలు బ్రహ్మముహూర్త సమయం లేదా సూర్యోదయ వేళలో సూర్యునికి అభిముఖంగా ఒక్కో భంగిమకు ఒక్కో మంత్రం జపిస్తూ చేయాలి.

1. ప్రణమాసనము :

చేయు విధానం : తివాచీపై సమస్థితిలో నిల్చొని కనురెప్పలు మూయాలి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రను ఛాతిపై ఉంచాలి. ఈ స్థితిలో బొటనవేళ్ళు మాత్రమే ఛాతీని తాకాలి. మిగిలిన వేళ్ళను బొటన వేళ్ళతో కలిపి ఉంచి, కొద్దిసేపు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చేయాలి.

ఈ ఆసనాన్ని సూర్య మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం మిత్రాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – ఏకాగ్రత, ప్రశాంతత, మానసిక స్థిరత్వం కలుగుతుంది.

                        – వెన్నెముక నిటారుగా ఉంటుంది.

2. హస్త ఉత్తానాసనము :

చేయు విధానం : శ్వాస లోపలికి పీలుస్తూ, రెండు చేతులు పైకి చాచి, మోకాళ్ళు వంచకుండా చేతులను చూస్తూ, నడుము నుండి పైభాగం వెనుకకు వంచాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం రవయే నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – జీర్ణక్రియ, ఉదర కండరాల పనితీరు మెరుగవుతుంది.

                        – అధిక బరువు, కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

3. పాదహస్తాసనము :

చేయు విధానం : శ్వాస విడుస్తూ ముందుకు వంగి రెండు చేతులను పాదాల పక్కగా ఉంచాలి. చేతులు, పాదాల జతలో ఉంటాయి కాబట్టి దీనికి పాదహస్తాసనము అని పేరు.

ఈ స్థితిలో తలను క్రింది వంచే ఉంచాలి. లేదంటే మెడ పట్టే అవకాశం ఉంది. మోకాళ్ళు వంచరాదు.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం సూర్యాయ నమః” అని జపించాలి.

గమనిక : అధికంగా రక్తపోటు ఉన్నవారు, నడుమునొప్పి మరియు మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.

ప్రయోజనాలు : – జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.

                        – వెన్నెముక శక్తివంతం అవుతుంది.

                        – మలబద్ధకం, పొట్ట తగ్గుతుంది.

                        – స్త్రీలకు కలిగే పొత్తికడుపు సమస్యలు తగ్గుతాయి.

4. అశ్వ సంచలనాసనము :

చేయు విధానం : ఎడమ మోకాలును వంచుతూ పాదాన్ని నేలపై ఉంచి, కుడికాలును బాగా వెనుకకు చాచి వేళ్ళపై పాదాన్ని ఉంచాలి. రెండు చేతుల్ని పైకెత్తి నడుము నుండి పైభాగమంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

ఈ భంగిమ దౌడు తీయటానికి సిద్ధమైన గుర్రము వలె ఉంటుంది కావున దీనికి అశ్వ సంచలనాసనము అని పేరు.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం భావనే నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – కండరాలు, నాడీ మండలం శక్తివంతం అవుతుంది.

                        – పొట్ట తగ్గుతుంది.

                        – రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

5. దండాసనము :

చేయు విధానం : శ్వాస విడుస్తూ కటి భాగము పైకెత్తి రెండు చేతులను బాగా చాచి నేలపై ఆన్చాలి. నడుమును ఎత్తరాదు, దించరాదు. వెనుకనుండి చూస్తే ఒక సరళరేఖలా ఉండాలి. కాలి మడమలు నేలపై ఆన్చి ఉంచాలి. ఈ స్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం ఖగాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – శరీరమంతా నూతన శక్తి వస్తుంది.

                        – వెన్నెముక, నరాలు ఉత్తేజం చెంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

6. అష్టాంగ నమస్కారాసనము :

ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారాసనము అనే పేరు వచ్చింది.

చేయు విధానం : చేతులు, పాదాలు కదల్చకుండా నడుమును కొంచెం పైకెత్తి, శ్వాసను విడుస్తూ, ఛాతీ, గడ్డంను రెండు చేతుల మధ్యలో నేలపై ఆన్చాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, ఛాతీ, గడ్డము నేలపై ఉంటాయి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం వూష్ణే నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – కాళ్ళు, చేతులు, కండరాలు శక్తివంతం అవుతాయి.

                        – వెన్నెముక, ఛాతీ భాగానికి ప్రయోజనం చేకూరుతుంది.

                        – తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

7. భుజంగాసనము :

ఈ భంగిమ పడగ విప్పిన పాములా ఉంటుంది కావున దీనికి భుజంగాసనము అని పేరు.

చేయు విధానం : శ్వాస తీసుకుంటూ అష్టాంగ నమస్కార ఆసనము నుండి భుజంగాసనములోకి రావాలి.

పాదాలను వెనుక జతలో ఉంచి, చేతులను నేలపై ఆన్చి తల, నడుము వీలైనంత పైకెత్తాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం హిరణ్యగర్భాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – పొత్తికడుపు, కాలేయం, మూత్రపిండాలకు చక్కటి వ్యాయామం.

                        – మలబద్ధకం పోతుంది.

                        – ఛాతీకి, భుజాలకు ప్రయోజనం చేకూరుతుంది.

8. పర్వతాసనము :

ఈ భంగిమ పర్వతం ఆకారంలో ఉంటుంది కావున దీనికి పర్వతాసనము అని పేరు వచ్చింది.

చేయు విధానం : ఐదవ స్థితి వలనే చేతులు, పాదాలు నేలపై ఉంచి నడుమును పైకెత్తి తలను క్రిందికి దించుతూ శ్వాస విడవాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం మరీచాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – కాళ్ళు, చేతులకు ప్రయోజనం

                        – నరాలు శక్తివంతం అవుతాయి.

9. అశ్వ సంచలనాసనము :

చేయు విధానం : నాలుగవ స్థితిలో చెప్పిన విధానమే కానీ కాలు మార్చాలి. నాలుగవ స్థితిలో కుడికాలును వెనుకకు చాచితే ఇక్కడ ఎడమ కాలును వెనుకకు చాచి, కుడికాలును ముందుంచి శ్వాస పీలుస్తూ నడుము నుండి పై భాగం వెనుకకు వంచాలి. చేతులు వంకర ఉండరాదు.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం ఆదిత్యాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – నాలుగవ స్థితిలో వలనే ప్రయోజనాలు చేకూరుతాయి.

10. పాద హస్తాసనము :

చేయు విధానం : మూడవ స్థితిలో చేసినట్లుగానే అశ్వ సంచలనాసనం నుండి పాద హస్తాసనంలోకి శ్వాస విడుస్తూ రావాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం సవిత్రే నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – మూడవ స్థితి వలనే ప్రయోజనాలు చేకూరుతాయి.

11. హస్త ఉత్తానాసనము :

చేయు విధానం : శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తి నడుము నుండి పైభాగం వెనుకకు వంచుతూ రెండు కాళ్ళను వంపు లేకుండా జతలో ఉంచాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం ఆర్కాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – రెండవ స్థితిలో వలనే ప్రయోజనాలు చేకూరుతాయి.

12. ప్రణమాసనము :

చేయు విధానం : శ్వాస తీసుకుంటూ నడుమును యథాస్థితికి తీసుకుని వచ్చి మొదటి స్థితి వలనే నమస్కారముద్ర ఛాతీపై ఉంచాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం భాస్కరాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – మొదటి స్థితిలో ప్రయోజనాలు చేకూరుతాయి.

గమనిక : ఈ 12 భంగిమలు ఒక ఆసనములోనుండి మరో ఆసనములోకి మారాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేయరాదు.

మొదటి ఆరు భంగిమలే మరలా తిరిగి చేస్తాము. 5వ, 7వ భంగిమలో కొద్దిపాటి మార్పు ఉంటుంది.

ఒక్కో భంగిమ చేసినపుడు కలిగే ప్రయోజనంతో పాటు మొత్తం చేయటం ద్వారా శరీరంలోని విషపదార్థాలను తొలగించుకోవటమే కాక….

1. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

2. మెటబాలిజం పెరుగుతుంది.

3. ఋతు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి.

4. నడుము సన్నగా అవుతుంది.

5. వత్తిడి తగ్గి, నిద్ర బాగా పడుతుంది.

6. చర్మం కాంతివంతమవుతుంది.

7. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.

8. అనహత, విశుద్ధి, స్వాధిష్టాన, మణిపూర, ఆజ్ఞాచక్రాలు శుద్ధి అవుతాయి.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

దృఢసంకల్పం, దీక్ష ఉంటే దేన్నైనా సాధించగలం

by Aruna Dhulipala September 15, 2023
written by Aruna Dhulipala

-పాములపర్తి వేంకట మనోహరరావు

ధార్మిక జీవనులు, పరోపకార పరాయణులు, ఆధ్యాత్మిక చింతనా పరులు అయినటువంటి  శ్రీమాన్ పాములపర్తి వేంకట మనోహరరావు గారితో మయూఖ ముఖాముఖి…

పరోపకారాయ ఫలన్తి వృక్షాః  పరోపకారాయ వహన్తి నద్యః

పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్…

        అని భర్తృహరి చెప్పినట్లు కొంతమంది తమ జీవితాలను ఇతరులకు ఉపకరించడానికే అన్నట్లు గడుపుతూ పరుల సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకుంటారు. అలాంటి వాళ్ళలో ప్రథమ గణ్యతలో లిఖించదగినవారు అయిన శ్రీ పాములపర్తి వేంకట మనోహరరావు గారి జీవితాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్.. మిమ్మల్ని మా పాఠకులకు పరిచయం చేయడం నిజంగా మా అదృష్టం. మీ ద్వారా మీ జీవిత విశేషాలను తెలుసుకోవాలనే ఆసక్తితో మీ ముందుకు వచ్చాము.

పాములపర్తి వేంకట మనోహరరావు

మీ పుట్టు పూర్వోత్తరాలు, మీ బాల్యం గడిచిన విధానాన్ని గురించి చెప్పండి.

నమస్కారం అమ్మా! నేను నవంబర్ 18, 1935 వ సంవత్సరంలో పూర్వపు కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించాను. అది ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది. మా అమ్మగారి పేరు రుక్మిణి, మా నాయన గారు పాములపర్తి సీతారామారావు గారు. మా గ్రామం విఖ్యాతమైనటువంటి గ్రామం. ఎందుకంటే మా అన్నయ్యగారు ప్రధానమంత్రి అయినారు కాబట్టి దేశ విదేశాల్లో ఆ ఊరు ప్రసిద్ధమైంది. మా బాల్యంలో పరిశుభ్రమైన వాతావరణం, ఆహారం, చేదబావుల్లోని మంచినీరు, మా చేలో పండించిన కూరగాయలు, పప్పు దినుసులు, గానుగ ఆడించిన నూనెలు, ఈతలు, పలురకాల ఆటలు..వీటితో పెరిగాము కాబట్టి ఇప్పటికీ దృఢంగా ఉన్నాం. ఒక ప్రత్యేకమైన ఆట ఉండేది. గుండు, గొనే అనేది. జామపండంత చెక్కబంతి(గుండు) రెండడుగుల పొడవుతో, చేతి కర్రంత కర్ర(గోనె) తో దృష్టి మరల్చకుండా కొడితే 100 అడుగులు పైబడి (నేటి క్రికెట్) పోయిపడేది. గుండు వేసినవారు దమ్ము ఆపకుండా రాం, రాం లాంటి కూతతో ఆ బంతిని పట్టుకోవాలి. ఇవికాక రకరకాల ఆటలు గ్రామ మైదానాల్లో ఆడినాము. ఇప్పటి పిల్లలకు అలాంటి అవకాశమేది? మా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడిని కాబట్టి బాల్యంలో నేను చేసిన తుంటరి పనులు ఎవరూ చేయలేదని మా అన్నలు, అక్కయ్య నిన్న, మొన్నటివరకు గుర్తుచేసేవారు  (నవ్వుతూ).

మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందో తెలపండి.

మా ఊళ్ళో విద్యాభ్యాసానికి సరయిన బడులు లేకుండెను.  వెంకయ్య పంతులని సాతాని పంతులు వుండెను.  ఆయన దగ్గర మేము అ, ఆలు చదువుకున్నాము. ఆ రోజుల్లో చదువుకోవాలని ఎవరికుండె? అందుకని నాటి సర్కారు పట్టించుకోలేదు? ఆ తర్వాత నరహరి పంతులు అనే ఆయన దగ్గర క, ఖ ల గుణితాలు, పాత లెక్కలు, పాత కొలతలు ఇవన్నీ నేర్చుకున్నా. మా ఊరుకు 10 మైళ్ళ దూరంలో వేలేరులో శ్రీధర రావు గారికి (వరంగల్ జిల్లా) మా అక్క నిచ్చినం. ఆమెకు నాకన్నా 17 సంవత్సరాలు పెద్ద. ఆమె వివాహం, మా అన్నయ్య వివాహం కూడా నాకు తెలియదు. మా ఊళ్ళో చదువు తర్వాత మా అన్నయ్య గారు, నేను కూడా అక్కడే చదువుకున్నాం. వేలేరులో నాల్గవ తరగతి వరకు చదివి ఆ తర్వాత అన్నయ్య హనుమకొండలో 10 వ తరగతి వరకు చదువుకొని పై చదువు కోసం నాగ్ పూర్ వెళ్ళాడు. నేను కూడా మూడవ తరగతి వరకు అక్కడ చదువుకొని, హుజురాబాద్ పోవలసి వచ్చింది. ఆ తర్వాత మా అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేక హనుమకొండలో 2,3 నెలలు చికిత్సకై ఉండవలసి వచ్చింది. నా చదువు ఆగిపోయింది. మళ్ళీ వంగరకు వచ్చేటప్పటికి అదే సంవత్సరం నాల్గవతరగతి గవర్నమెంటుది వచ్చింది. వంగరలో 4వ తరగతి పూర్తి చేసి మళ్లీ 5వ తరగతి కోసం హుజురాబాద్ వెళ్ళాను. 1947 లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ సమయంలోనే (1948 ) నిజాం గవర్నమెంట్ ఇండియన్ యూనియన్ లో కలవక పోయినందున గొడవలు మొదలైనాయి. ఇంకా నా పరీక్షలు కాకముందే ఉధృతంగా అల్లరులు జరిగినాయి. అప్పుడు అన్నయ్య కాంగ్రెస్ లో పనిచేస్తుండెను. వందేమాతరంలో పార్టిసిపేట్ చేసినాడు. కాంగ్రెస్ నాయకులంతా కాందిశీకులుగా వేరే చోటుకి పోవల్సిన పరిస్థితి దాపురించింది (అటు చాందా, బలార్ షా, షోలాపూర్ మహారాష్ట్ర ప్రాంతాలు, ఇటు విజయవాడ, కర్నూలు).ఇక్కడ పగటిపూట రజాకార్లు, రాత్రిపూట కమ్యూనిస్టులు. ఇవి రెండూ చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. అప్పుడు అన్నయ్య ఇక్కడ మా కుటుంబంలో ఎవరు ఉన్నా అన్నయ్య గురించి అడుగుతారని, బాధిస్తారని మా నాల్గు ఫ్యామిలీలను చాందాకు తీసుకుపోయినారు. అక్కడ 7 మాసాలు నానా ఇబ్బందీ పడ్డాం. చాందాలో ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాను.  కాందిశీకుల జీవితం ఎట్లుంటదో తెల్సుకదమ్మా! పోలీసు యాక్షన్ అయిపోయిన తర్వాత ఊరికి చేరినాము.

ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో మీ చదువును ఎలా కొనసాగించగలిగారు?

మేము ఊరికి వచ్చి రెండు, మూడు నెలలు సెటిల్ అయింతర్వాత అన్నయ్య, నేను వరంగల్ కు పోయి పాములపర్తి సదాశివరావు గారి ఇంట్లో ఉన్నాం. ఆయన అన్నయ్య క్లాస్ మేట్. మాకు కొంచెం దూరపు బంధువు కూడా. అక్కడ మెహబూబియా స్కూల్లో ఆయన టీచరుగా కూడా ఉండేవాడు. అక్కడ నేను 6,7 తరగతులు చదువుకున్నాను. మళ్లీ ఆ తర్వాత హుజురాబాద్ కు పోయినాను. అక్కడ ఉంటే బియ్యమో, పప్పో మా ఊరినుండి తీసుకుపోవచ్చు. 3వ తరగతి నుండే వంట వండుకోవడం అలవాటు అయింది మాకు. ఇక అక్కణ్ణే 8,9,10 తరగతులు చదువుకున్నాను. దోమకొండలో జనతా కాలేజి అనే పేరుతో కళాశాల నడిపారు(బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) 3,4 నెలలు అక్కడ ఉన్నాను. దాంట్లో మొత్తం కమ్యూనిటీ లైఫ్ ఉండేది. 40మంది దాకా ఒక్కో బ్యాచ్ లో ఉండేవారు. ఆ కాలేజీకి వి.పి. రాఘవాచారి గారు ప్రిన్సిపాల్ గా ఉండెను. దొరలు ఉన్నటువంటి పాత బిల్డింగ్ ఖాళీగా ఉంటే దాంట్లో పెట్టినారు. అదొక పెద్ద బిల్డింగ్. అక్కడ హాస్టల్ లో ఉన్నట్టుగానే ఉండేది. వానమామలై వరదాచార్యులు కల్చరల్ టీచరుగా ఉండేవారు.  మాకు పెద్ద గురువు ఆయన. మాకు భాగవతం, రామాయణం, భారతం భగవద్గీతలపై రోజూ గంటసేపు చెప్పేవారు. దాని ప్రభావం నామీద చాలా  పడింది. 4 నెలల ట్రైనింగ్ నా జీవితాన్ని మొత్తం మార్చింది. అక్కడ మేము బుర్రకథలు చెప్పడం, పక్క ఊళ్ళోకి వెళ్ళడం, కాలువలు బాగు చేయడం, పరిశుభ్రతను గురించి చెప్పడం చేసేవాళ్ళం. వాళ్ళను ఎడ్యుకేట్ చేయడమే కర్తవ్యంగా భావించేవాళ్ళం.

           ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువు. నానక్ రాం కాలేజీలో అప్లై చేసుకుంటే మొదటిలిస్టులో నాపేరు లేదు. అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామానంద తీర్థ. ఆయన దగ్గర అన్నయ్య జనరల్ సెక్రటరీగా ఉండెను. మేమంతా నాందేడుకు పోయినాము. నాతోటి కెప్టెన్ లక్ష్మీ కాంతరావు గారు కూడా ఉన్నారు. నాందేడు లోని రామానంద తీర్థ కాలేజీలో సీట్లు దొరికినవి. అది సైన్సు కాలేజీ.  ఇంటికి వచ్చి అన్నీ సర్దుకొని ప్రయాణం అయి హైదరాబాద్ చేరేసరికి నానక్ రామ్ కాలేజీలో సెకండ్ లిస్టులో ఇరువురికి సీట్లు వచ్చాయి. ఇక అక్కడే రెండేళ్లు చదివిన తర్వాత అన్నయ్య బలవంతంగా ఆయుర్వేద కాలేజీలో చేర్పించాడు. ఆకారం నర్సింగం అని పెద్ద షావుకారు. ఆయనకు ఒక తోట ఉండేది. ఆ కాలేజీ కోసం ఫ్రీగా ఇచ్చాడు ఆయన. ఆ కాలేజీలో మొదటి, రెండు సంవత్సరాలు పూర్తి చేసినాను. నాకస్సలు ఇష్టం లేకుండింది. ఆ డెడ్ బాడీల దగ్గరకు పోవడం, డిసెక్షన్ చేయడం అసహ్యంగా ఉండేవి. “నువ్వు ముట్టుకోకపోతే ఎట్లొస్తదయ్యా” అనేవాళ్ళు మా లెక్చరర్లు(నవ్వుతూ). ఇష్టం లేని పని చేయడం ఇబ్బంది కదా! అందుకే చదువుకు స్వస్తి చెప్పి, వంగర చేరినాను (బహుశా 1960).

 గ్రామ సర్పంచ్ నుండి అనేక పదవులు నిర్వహించిన మీ అనుభవాలు ఎటువంటివి?

నేను ఆయుర్వేద కాలేజీలో చదువుతున్న మొదటి సంవత్సరంలోనే పెళ్ళి అయింది. నాకు చదువు ఇష్టం లేక ఒకటి, ఇప్పుడు సంసారం కూడా ఉంటుంది కాబట్టి  వంగరకు వచ్చి వ్యవసాయం మీద దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధి చేయనారంభించాను. మొట్టమొదటగా మేము తోటలు పెంచడం, ఆయిల్ ఇంజన్లు పెట్టడం, కరెంటు మోటార్లు పెట్టడం చూసి గ్రామస్తులు అనుసరించారు. 1980 వరకు వంగరలో ఉన్నాము. 1964లో సర్పంచ్ పదవికి నా ఎన్నిక యూనానిమస్ గా జరిగింది. వెంకట్రావని ఒక సమితి ప్రెసిడెంటు కావలసిన నాయకుడు ఉండేవాడు. ఆయన వ్యవసాయం, గ్రామాల అభివృద్ధి వీటిపట్ల ఆలోచన కలిగి ఉండేవాడు. గ్రామస్తులలో అక్షరం ముక్క రానివారే ఎక్కువ. అలాంటి వాళ్ళు ఊరికి ఏం చేస్తారు? అని ” మనోహరరావు గారు ఉంటే మీకు అన్ని విధాలా గ్రామాభివృద్ధి, ఇతర సాయం ఉంటుంది. ఆయన అన్నయ్య కూడా పదవిలోఉన్నాడు. ఆయన ఉంటే గ్రామం అభివృద్ధి జరుగుతుంది” అని గ్రామస్తులకు చెప్పారు. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇక నా పిల్లలు, వాళ్ళ చదువు వీటి మీద దృష్టి పెట్టకుండా కేవలం గ్రామ అభివృద్ధి మీదే దృష్టి సారించాను. మొదటగా వీధిలైట్లు పెట్టించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, వసతి గృహాల నిర్మాణానికి పునాది వేసాను. ముల్కనూరు చెరువు నుండి వంగర వరకు కంకర రోడ్డు, వంగర నుండి సైదాపురం వరకు రోడ్డు సాంక్షన్ చేయించి, గ్రామంలో జడ్.పి. మాధ్యమిక పాఠశాల మాత్రమే ఉండేది. దాన్ని ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుతూ ఉన్నత పాఠశాలగా మంజూరు చేయించాను. ఉపాధ్యాయులు తక్కువ ఉంటే మూడు మాసాలు ఇంగ్లీష్, లెక్కలు ఉన్నత తరగతులకు నేను చెప్పినాను. రెండు కొత్త ట్రాన్స్ ఫారాలు మంజూరు చేయించి, 40 మంది రైతుల మోటార్లకు కరెంట్ సాంక్షన్ చేయించి, నా చేతనైనంత వరకు గ్రామాభివృద్ధి సాధించాను. అయితే “ఊరికి చేసిన ఉపకారం, శవానికి చేసిన శృంగారం” అని సామెత కదా! సరిగ్గా అలాగే జరిగింది(బాధగా). ఎందుకంటే నేను స్వయంగా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ సాంక్షన్ చేయించి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఊళ్ళో మొట్టమొదటగా ప్రొటెక్టర్ వాటర్ సప్లై (మంచినీరు) వచ్చేలాగా చేసి,  వాడ వాడలా చాలా ఇండ్లకు కుళాయిలు ఏర్పాటు చేయించాను. ఈ స్కీము కరీంనగర్ జిల్లాలోనే ప్రథమం. అయితే బావి తవ్వించడం, పెద్ద విద్యుత్తు మోటారు పెట్టడం, పెద్ద పెద్ద సిమెంటు పైపు లైన్లు వేయడం వీటన్నింటికీ 60 వేల  రూపాయలు ఖర్చు అయినాయి. రెండవసారి ఎన్నికలు వచ్చేసరికి ఈ 60 వేలు ఈయన తిన్నాడని ప్రచారం చేసినారు నాటి కొందరు ధూర్తులు. అమాయకులు నమ్మినారు. ఇక నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఈ లోపు మా అమ్మాయి పెళ్ళి జరిగింది. పిల్లల చదువులు… అందుకే మేము వరంగల్లుకు సంసారం మారినాము. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ఛైర్మన్ గా ఆలయాన్ని 4లక్షల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేశాను. వంగరలోని శ్రీ కైలాస కల్యాణి క్షేత్ర ఛైర్మన్ గా ఆలయాన్ని పునరుద్ధరింప చేసి, ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు.

వరంగల్లు నుండి  హైదరాబాదుకు రావడానికి కారణం ఏమైనా ఉందా?

కారణం ఉందమ్మా!  హన్మకొండలో 12 ఏళ్ళు ఉన్నాం. అన్నయ్య ముఖ్యమంత్రి అయింతర్వాత పిల్లల కొరకు ఇప్పుడైనా ఏమైనా చేసుకుందాం. వ్యవసాయం చేస్తూ మనమేం సంపాదించగలం? అని హైదరాబాదుకు వచ్చి రెండేళ్లు ప్రయత్నం సాగించాను. వంగరకు పోయి కాంట్రాక్టులు అవి చూసుకొని, నాలుగు రాళ్లు సంపాదించుకొని హైదరాబాదుకు పోయి ఖర్చు పెట్టుడు (నవ్వుకుంటూ). ఎంతోమంది నా దగ్గరికి ఈ పని చేద్దాం, ఆ పని చేద్దామంటూ వచ్చేటోళ్లు. తర్వాత మా తల్లిదండ్రుల పేర్ల మీద వరంగల్లులో ఒక స్కూల్ పెట్టినాను. అది కూడా సరిగ్గా నడవలేదు. 2010 దాకా చేతి నుండి డబ్బు పెట్టుకుంటూ నడిపించాను. జీతాలు కూడా వెళ్లకపోయేది. 1991 లో అన్నయ్య ప్రైమ్ మినిస్టర్ అయినాడు. ఇక అంతే. మీకేం తక్కువ అని ఊళ్ళో వ్యవసాయం చేయనివ్వలేదు. భూమిని మాకు దానం చేయండి అని జెండాలు పాతినారు. నా దగ్గర 50,60 గేదెలు, ఆవులు ఉండేవి. 4,5 నాగళ్ళు ఉండేవి. పెద్ద వ్యవసాయం మాది. పశువులకు నీళ్లు కూడా పట్టేవాళ్ళు లేకపోతే ఎట్లా? అందుకే వంగర నుండి వరంగల్లు, అక్కడి నుండి హైదరాబాదుకు మారాల్సి వచ్చింది.  మరి ఇక్కడ ఉండాలంటే నిలదొక్కుకోవాలి కదా! ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాను. తర్వాత నేను “సర్వార్థ సంక్షేమ సమితి ” స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధారాళంగా సలిపినాను.

మీరు ఊళ్ళో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించిన విశేషాలు చెప్పండి.

మా మూడు కుటుంబాల ఇళ్ళకు పోలీసుల బందోబస్తు ఉండేది. అందులో ఒక జవానుకు కల వచ్చింది. అదేంటంటే గ్రామం పక్కన ఉన్న చెరువు మధ్యలో ఒక మట్టి దిబ్బ ఉండేది. అయితే  చిన్నపిల్లలు చనిపోతే ఆ గడ్డ పక్కన పాతి పెట్టేవారు. ఆ భయంతో అటువైపు మేము వెళ్ళక పోయేది. ఆ మట్టి దిబ్బ పైన చెట్లు, పుట్టలతో ఉన్న శిథిలమైన ఆలయంలో శివలింగం ఉన్నట్టు ఆయనకు వచ్చిన కల. గ్రామస్తులు పోలీసుల సహాయంతో ఆ చెట్లు, పుట్టలను తొలగించగా  అందులో పెద్ద శివలింగం, పెద్ద పుట్ట, ఆ లింగానికి చుట్టుకున్న శ్వేతనాగు కూడా కనిపించినవట. మేము దీపావళి వ్రతం కోసం ఊరికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు మాకు తెలిసాయి. ఆ శివాలయ నిర్మాణ బాధ్యత నాపై పడింది. మా ఫ్యామిలీలో ఇంతమంది ఉండగా అది నాకే చుట్టుకోవడం పరమేశ్వరుని అనుగ్రహం. అన్నయ్యకు, అప్పటి ముఖ్యమంత్రి కోట్ల

విజయభాస్కర్ రెడ్డి గార్లకు ఈ విషయం వివరించి 14 లక్షల  నిధులు మంజూరు చేయించి పని ఆరంభించాను. 2010 లో కూడా 17 లక్షలు సాంక్షను చేయించి మిగతా పనులు కూడా పూర్తి చేయించాను. నేను కైలాస మానసరోవరం పోయి వచ్చినందుకే నాకు ఈ మహద్భాగ్యం కలిగిందని అర్థం చేసుకొని, అమ్మవారి పేరు కూడా కలిపి “శ్రీ కైలాస కళ్యాణి క్షేత్రం” అని నామకరణం చేశాను. ఏది చేసినా ఊళ్ళో రాజకీయాల మీద, తాగుడు తందనాల మీద ఉన్న ఆసక్తి దేవుడి మీద ఉండదు కదా! నలుగురు కూడా గుడికి పోయేటోళ్ళు లేరు. రామకళ్యాణం, శివకళ్యాణం, శివరాత్రి ఇలాంటి సందర్భాల్లో పక్క ఊళ్ళ నుండి కూడా జనాలు చాలామంది వస్తారు. ధూపదీప నైవేద్యాలకు కూడా డబ్బు ఏర్పాటు చేశాను. ఎన్ని చేసినా నేను ఇక్కడినుండి చేయడం కష్టం. ఊరివాళ్లను ఎవరినైనా బాధ్యత తీసుకోమంటే ముందుకు రావడం లేదు. వయసు రీత్యా నేను చేయలేక పోతున్నా. అందుకే భద్రకాళి ఆలయ ట్రస్టుకి అప్పగించేవిధంగా మొన్ననే కమిషనర్ గారి నుండి అనుమతి తీసుకున్నాను.

భారత ప్రధానిగా అనన్య సేవలందించిన పీవీ నరసింహారావు గారి ప్రభావం మీమీద ఎలా ఉంది?

నాకు కుటుంబపరంగా వచ్చిన ఆత్మీయత అన్నయ్య. సర్పంచ్ అయిన తర్వాత నాకు ఈ రాజకీయాలు వద్దు అనిపించింది. ఇక అన్నయ్య మార్గం మొత్తం అదే. మీకు తెలిసిందే. ఆయన నిరాడంబరుడు. నిష్కల్మషుడు. నిరంతర దేశసేవా పరాయణుడు. రోజు రోజుకు మారే రాజకీయాలలో కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలబెట్టుకున్న ఘనత అన్నయ్యది. ఆయన నాకే కాదు అందరికీ ఆదర్శవంతుడు. రాజకీయం నచ్చకపోయినా అన్నయ్య ఎం.పి గా నాల్గుసార్లు పోటీ చేసినప్పుడు, ఎమ్మెల్యేగా నాల్గు సార్లు పోటీ చేసినప్పుడు ఆయనతో పాటే తిరిగిన. ప్రచారం చేశాను. మోడీ లాంటి వాళ్ళు దేశం దేశం అని వేలాడుతుంటారు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొంతమంది మాత్రమే ఉంటారు? దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వ్యతిరేకించే వాళ్లే ఎక్కువ. దేశాన్ని కాంగ్రెస్ వాళ్లు ఏ పరిస్థితికి తీసుకుపోయారో అందరికీ తెలుసు. అందుకే బీజేపీనా, కమ్యూనిస్టా, కాంగ్రెసా అని కాదు. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసేవాళ్లకు సపోర్ట్ చేయాలి. అన్నయ్య తదనంతరం ఆయన జయంతి సందర్భంగా గోల్డ్ మెడల్స్ ఇవ్వడం లాంటివి చేసి, శత జయంతి సందర్భంగా సభల్లో మాట్లాడటం, పెద్దలచే చెప్పించడం లాంటివి చేశాను. “సర్వార్థ సంక్షేమ సమితి” తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అన్నయ్యకు ‘స్థితప్రజ్ఞ’ బిరుదునిచ్చి సత్కరించుకున్నాను. ఆనాడు ఆయన అమోఘ ప్రసంగం ఇచ్చారు. అన్నయ్యకు ఊళ్ళో ఏ పని వున్నా, పిల్లలకు సంబంధించిన పెళ్ళిళ్ళు, వ్యవసాయం మొదలైన కార్యాలకు నాతో మాట్లాడేవాడు. ఇద్దరమూ చర్చించుకుని నిర్ణయించేవాళ్ళం.

 సాక్షాత్తు రామలక్ష్మణులు అన్నట్టుగా కొనసాగిన మీ ఇరువురి అనుబంధాన్ని వివరించండి.

మా ముఖాలు అచ్చుపోసినట్లు జన్మించాము. బ్రహ్మ సృష్టి (నవ్వుతూ). నన్ను చూసి అన్నయ్య అనుకొని పొరబడిన సందర్భాలు కూడా అనేకం. రాముడు ఏం చేశాడో మనకు తెల్సు. లక్ష్మణుడు ఏం చేశాడో కూడా తెల్సు. అలాగే అన్నయ్య ఏ పనిలోనైనా నేను వెనకాల ఉండేవాణ్ణి. ఇంతకుముందు చెప్పాను కదా! రాజకీయం ఇష్టం లేకపోయినా అన్నయ్యతో రాజకీయపరంగా అన్నిచోట్లకు తిరిగాను. నా ఏడేళ్ళ వయస్సులో మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుండీ అన్నయ్యే నాన్న లాగా ఆదరించారు. మాకు తండ్రి ఆయన. ఎవరికి వాళ్ళకు కుటుంబాలు ఏర్పడ్డాక కూడా ఇండ్లు మాత్రం పక్క పక్కనే నేటికీ ఉన్నాయి. వ్యవసాయం ఉంది. భగవంతుడు ఇచ్చిన దాంట్లో తక్కువేమీ లేదు. ఆయన చివరి క్షణం వరకు ఇది అది అని కాకుండా అన్ని విషయాలు దాపరికం లేకుండా మాట్లాడుకునేవాళ్ళం.

పాములపర్తి వేంకట మనోహరరావుగారితో ముఖాముఖి గ్రహిత అరుణధూళిపాళ

మీలో ఇంతటి పాండిత్యానికి, ధార్మిక చింతనకు పూర్వీకుల నుండి సంక్రమించినదని భావించవచ్చా?

వారసత్వం కొంతవరకు. వానమామలై వరదాచార్యులు గారి ఇంప్రెషన్ ఉండింది నాకు. మా ఇంటి లైబ్రరీలో రామాయణాలు, భాగవత, భారతాలు, ఇతర సాహిత్య గ్రంథాలు చాలా ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒకటి చదవడం అలవాటుండేది. ఇప్పటికీ అలాగే చదువుతాను. పుస్తకపఠనం నా జ్ఞానాన్ని పెంచింది. అలాగే ‘జన్మగత సంస్కారం’ కూడా. నేను 5,6 ఏండ్ల వయస్సున్నప్పుడు మా నాన్నగారు పండరీపూర్ నుంచి ఎవరో వస్తే వాళ్ళతోటి 21 రోజులు రామాయణం చెప్పించారు. ఏ హరిదాసులు వచ్చినా మా ఇంటి ముందు హరికథా కాలక్షేపం జరుగవల్సిందే. వాళ్లకు భోజనాలు, వసతి అంతా మా ఇంట్లోనే. అది మా చిన్నన్నకు, నాకూ ఇద్దరికీ వచ్చింది. మా చిన్నన్నయ్య పేరు మాధవరావు. ఆయనకు చిన్నతనంలో స్ఫోటకం వల్ల రెండు కళ్ళు పోయాయి. కానీ అద్భుతమైన జ్ఞాపకశక్తి ఆయనది. అంతేకాక భాగవతం లోని, శతకాలలోని ఎన్నో పద్యాలు, పౌరాణిక గాథలు, మంగళహారతులు కంఠపాఠంగా వచ్చేవి.  వ్యవసాయం, గ్రామ రాజకీయాల్లో ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించేవాడు. మాకు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. ఆర్గనైజేషన్ అంతా మళ్ళా నేనే. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న హరిదాసుల్లో “మేం వంగరకు పోలేదన్న” హరిదాసును ఒక్కణ్ణి చూపించండి (పూర్తి నమ్మకంగా చెప్తూ). ఆ కాలంలో ప్రజలు మనం చెప్తే వినేవాళ్ళు. వానమామలై వరదాచార్యులు గారు మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయనతో ప్రవచనం పెట్టించాము. భద్రాచలం నుంచి నర్సింహమూర్తి అనే వైష్ణవుడు మా ఇంట్లో ఉండి 40 రోజులు భారతం హరికథ చెప్పించాము. బాగా నల్లగా, లావుగా ఉండేవాడు. ఆయన హరికథ చెప్తూ బల్లమీద కథకు అనుగుణంగా అడుగులు వేస్తుంటే బల్లలు విరిగిపోతాయా అన్నట్టుండేది(గట్టిగా నవ్వుతూ). పైన లైటు ఫిట్ చేయిస్తే చుట్టుపక్కల 4,5 గ్రామాలనుండి ప్రజలు వచ్చి 40 రోజులూ కథ విన్నారు. అట్లా నాకు వాటి మీద ఆసక్తి పెరిగింది. చదువుతో పాటు వినడంతో సాహిత్య సముపార్జన పెరిగింది. ఇప్పుడు కూడా పుస్తకాలకు ముందు మాటలో, సమీక్షో చేయాలంటే దానిలోని మంచి, చెడు నిర్ణయించాలి కదా! అందుకోసం చదవాలి. కాబట్టి ఇప్పటికీ చదువుతుంటా. నాకు డైరీ రాసే అలవాటుంది. రాయనిదే నిద్రపోను. ఇప్పటికీ రాస్తుంటా. మేము మానస సరోవర యాత్రకు పోయినప్పుడు నెలరోజులు ఎక్కుడు, దిగుడు, తిన్నది, పడుకున్నది మొదలగునవన్నీ రాసుకున్నాను. వచ్చిన తర్వాత ఇవే విషయాలు పదే పదే అందరికీ చెప్తుంటే మా అమ్మానాన్నల పేరుమీద ఉన్న స్కూల్ లోని హెడ్మాస్టర్ ” సార్! ఇలా ఎంతమందికి చెప్పుకుంటూ పోతారు? ఒక పుస్తకం రాయండి” అని సలహా ఇచ్చాడు. దాంతో ‘కైలాస దర్శనం’ అనే పుస్తకం రాశాను. అది నా మొదటిపుస్తకం. డైరీలో రాసుకున్నదే సరిపోదు కదా..అందుకోసం 22 గ్రంథాలు చదివి, విషయాలు తెలుసుకున్నాను. అక్కడికి పోయి దర్శనం చేసుకునేలా చేసిందీ, ఆ పుస్తకం రాయించుకున్నదీ ఆ పరమేశ్వరుడే. మన చేతుల్లో ఏముందమ్మా..??

మీరు చేసిన బ్రహ్మ మానస సరోవర యాత్ర అనుభవాలను బట్టి యాత్రలు మనిషి పైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయని చెప్పొచ్చు?

యాత్రలు ఇప్పుడు చేస్తున్నవి కాదు. పురాణ కాలం నుండీ ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి కాశీకో, మరో రాష్ట్రానికో పోతే. ఇక్కడి వాతావరణం అక్కడ ఉంటుందా? మనలాంటి మనుషులు దొరుకుతారా? లేదు కదా! అక్కడి వాతావరణానికి  అలవాటు పడాలి. ఇక్కడ దొరికే భోజనం అక్కడ దొరకదు కాబట్టి సర్దుకోవాలి. ఇంకోటి ఏంటంటే వారి సాంఘిక ఆచారాలు, పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు అవగాహన కావాలి. వెనకట బద్రీనాథ్, కేదారినాథ్ లకు నడిచి పోయేవాళ్ళు. నా చిన్నతనంలో జనకమ్మ అని ఒక షావుకారు. వాళ్ళు కొంతమంది బద్రీనాథ్, కేదార్ నాథ్ లకు వెళ్లారు. కుంపట్లలో నిప్పులు వేసుకొని పొట్టకు కట్టుకొని, మీద నుంచి గొంగళ్ళు కప్పుకొని పోయి, మంచిగా దర్శనం చేసుకొని వచ్చినారు. దానికి ఎంతో మనోధైర్యం కావాలి. కార్యదీక్ష వుండాలి. అందుకే ఆ కాలంలో “కాశీకి పోతే కాటికి పోయినట్లు” అనే నానుడి వచ్చింది. మేము నెల రోజులు యాత్రకు పోయినప్పుడు కూడా ఎక్కుడు, దిగుడు, చలి, పలు ఆటంకాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ నాల్గు రోజుల్లోనే చారధామ్ చూడగలిగేంత సౌకర్యాలు ఉన్నాయి. కానీ నా అనుభవం మీద చెప్తున్నా. భగవద్దర్శనం చేసుకోవాలని ఆత్రుత ఉంటుంది కదా! అప్పుడు కష్టపడి ఆ తపనతో దర్శనం చేసుకుంటే కలిగే ఆనందం గంటలో పోయి వచ్చేవారలకు ఏమి తెలుస్తుంది? ఆ ప్రకృతి సౌందర్యాలు, ఆ అనుభూతి, ఆ అనుభవాలు ఇవేం పొందగలుగుతారు? కోవెల సుప్రసన్నాచార్యులు గారు, డా. మృత్యుంజయ శర్మ, భార్గవ రామశర్మ, డా. శ్రీ భాష్యం విజయసారథి వీళ్లంతా నా కైలాస యాత్రా దర్శనంపై ప్రత్యేకమైన మంచి ఆర్టికల్స్ ఇచ్చారు. యాత్రలు మనిషి మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న అలజడుల నుండి కొంత మానసిక ఉపశమనం లభిస్తుంది. మన దేశ స్థితిగతులు, వివిధ ప్రాంతాలలోని సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపుటలవాట్లు,వేష భాషలు, జీవన విధానం అవగతమవుతుంది. ప్రతీ ఒక్కరు మనమెంతో కష్టపడుతున్నాం అనుకుంటారు కదా! పోయి చూస్తే మనకంటే ఎంతో బాధాకరంగా జీవితాలను గడిపేవాళ్లను కూడా మనం చూస్తాం. ప్రతీచోట సౌభాగ్య, దౌర్భాగ్యాలు పక్కపక్కనే మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనా మనిషి అప్పుడప్పుడు తనున్న వాతావరణం నుండి కొంత బయటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కలిగే ఆనందం, అనుభవం మరువరానిది.

శివపూజా విధానాన్ని ఒక క్రమబద్ధంగా ఉండేలా ‘రుద్రాభిషేకం’ పేరుతో పుస్తకంగా అందరికీ అందుబాటులో తేవాలనుకున్న ఆలోచనకు ప్రేరణ ఏంటి?

దానికి కారణం ఒకటున్నది. 1970-75 ప్రాంతంలో అనేక యాత్రలకు పోయి దర్శించాము. పక్కనే ఎనిమిది మైళ్ళలో మోనయ్యగారు అనే పురోహితుడు ఉండేవాడు. మనం ఎక్కడికి పోయినా ఆలయాల్లో అభిషేకాలు అవి పురోహితులే చేస్తారు కదా! మనం రోజూ చేసుకోవాలంటే ఎట్లా? అని నేనొక చిన్న పుస్తకం తీసుకొని 1970 నుండి అభిషేకం చేసుకోవడం మొదలుపెట్టాను.  చేస్తున్నప్పుడు మనకు అర్థాలు కూడా తెలవాలి కదా! నేను వాటికి సంబంధించిన వ్యాఖ్యానాల పుస్తకాలు అన్నీ చదివి భస్మధారణ అంటే ఏంటి? సంధ్యావందనం ఏంటి? గంధమెందుకు, అక్షంతలెందుకు? ఇట్లా మొత్తం తెలుసుకున్నా.  అభిషేకం చేయాలంటే ముందు గణపతి పూజ చేయాలి. అక్కణ్ణించి మొదలుపెట్టి నా సొంతంగా కాదు. పండితులు రాసినవి సేకరించి వాటి సారాంశాన్ని మొత్తం ఈ పుస్తకంలో కూర్చిన. సంధ్యావందనం గురించి అంటే ఒక పుస్తకం కావాలి. నమక చమకాలకు ఒక పుస్తకం కావాలి. ఇట్లా కాకుండ మొదటి నుండి ఆసాంతం వరకు శ్రీసూక్త, పురుష సూక్తాలతో సహా వివరణలతో తయారుచేశాను. అది తయారుకావడానికి 7 సంవత్సరాలు పట్టింది. అంగన్యాస, కరన్యాసాలకు ఎక్కడా నాకు వివరణ దొరకలేదు. విఠల్ సిద్ధాంతి, నేను ఇద్దరం కలిసి ఒక పండితుని దగ్గరకు వెళ్లి ఆయన చెప్పిన వివరణతో ఆ పుస్తకం ముద్రించ బడింది(2003).

478 పేజీలున్న ఈ పుస్తకం చేతిలో పట్టుకోగలిగే సైజులో వయస్సు పైబడిన వారు కూడా చదువుకునే అక్షరాల సైజులో రూపొందించాను. ఈ పుస్తకం చేతిలో ఉంటే అభిషేకం గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా సులభంగా తమంతట తాము చేసుకోవచ్చు.

నేటితరం విద్యార్థులకే కాక మానవుడు తనను తాను ఉద్ధరించుకునే దిశగా “సద్విద్య-సత్పథం” అనే గ్రంథాన్ని రాశారు..దానిలో ప్రస్తావించబడిన విషయాలు ఏవి?

ఈరోజుల్లో చదువు ఎట్లా ఉందో మీకు చెప్పవలసిన పనిలేదు. తెల్సు కదా!  విద్య అనేది వినయాన్ని, సంస్కారాన్ని, క్రమశిక్షణను ఇవ్వకుండా నైతిక విలువలు పతనమయ్యే దిశలో సాగుతున్నది. నా ఉద్దేశ్యంలో “ధర్మ మూల మిదం జగత్తు” ఆ ధర్మాన్ని తెలియచెప్పాలనుకున్నా. అందుకే శీలం విలువను గురించి, మతాల భావాల గురించి,సంస్కృతి గురించి, మాతృభాషను గురించి, తల్లిదండ్రులు,గురువుల స్థానం గురించి, అష్టకష్టాల గురించి, నవవిధ భక్తుల గురించి, చతుర్వేదాలు, ఉపనిషత్తులు, షడంగాలు, పురాణాలు. వాటిలో వుండే ధర్మాలు..ఇవన్నీ పుస్తకంలో చేర్చాను. .మనిషి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండ కూడదు? వీటన్నింటినీ దీంట్లో వివరించి,  ఊరికే చెప్పడమే కాక 70 పేజీల ఈ పుస్తకాన్ని కొన్ని ఉన్నత పాఠశాలలకు స్వయంగా పోయి పంచి, ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులతో మాట్లాడి పరీక్షలు నిర్వహింప చేశాను. పుస్తకంలోని విషయాలపై 100 ప్రశ్నలు తయారుచేసి, వాటిని అటు ఇటుగా మారుస్తూ 10 సంవత్సరాలు పరీక్షలు ఏర్పాటు చేసి, వాటికి ప్రథమ బహుమతిగా 5000 రూ. ద్వితీయ బహుమతిగా 3000 రూ. తృతీయ బహుమతిగా 2000 రూ. ఇవ్వడం జరిగింది. రాను రాను ఫోనులో కూడా పరీక్షలు నిర్వహించి బహుమతులు ఇచ్చాను. ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పుస్తకాన్ని చూసి, చాలా బాగుందని మెచ్చుకొని పరీక్షలకు పిల్లల్ని సిద్ధం చేస్తామన్నారు. క్రమంగా పాల్గొనేవారి సంఖ్య తగ్గడం మొదలైంది. కారణం తెలిసిందే. నేటి విద్యావిధానం, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల అనాసక్తత.

పుట్టుకనుండి ధర్మార్థకామమోక్షాలు. మొట్టమొదట ధర్మం. దాన్ని అనుసరించి మిగతావి ఉండాలి. కానీ ఈరోజు దాన్నే విడిచిపెట్టి, మధ్యలోని రెండింటి మధ్య  (అర్థం, కామం) ప్రపంచం నడుస్తున్నది. పాపం పెరిగిపోతున్నది. “యథా రాజా తథా ప్రజా” అన్నట్లు ఉన్నది. పాలకులు ఉన్న దాన్ని బట్టే ప్రజలు నడుస్తారు. అన్నయ్య పదవిలో ఉన్నప్పుడు తన వాళ్లకు పదవులు ఇచ్చుకున్నడా? కరప్షన్ ఏమైనా జరిగిందా? ఇపుడు మోడీ తన వారికి పదవులు ఏమైనా ఇచ్చాడా? మరి కుటుంబాలకే పదవులు ఇస్తున్నవారు ఉన్నారు కదా!  ప్రధానమంత్రులలో గుల్జారీ లాల్ నందాకి సొంత ఇల్లు లేదు. కనీసం ఉన్న ఇంటికి కిరాయి కట్టే పరిస్థితి కూడా నాడు లేదు. మరి వాళ్ళు వారి జీవితాలను ఎట్లా గడిపినారు? దేశం మీద మమకారం, ప్రజల పట్ల ఉన్న ఆదరణ మాత్రమే. ఇప్పుడు నాయకులు తమ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు. ప్రజలూ అంతే. ఒక్కటే అమ్మా! మనిషికి తాను చేస్తున్నపనిలో ధర్మ బద్ధత ఉంటే ఎవరూ పాపం చేయరు. అది వాళ్ళ మనసు ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒకరు చెప్పాల్సిన పనిలేదు. దేనికైనా దృఢ సంకల్పం, దీక్ష ఉండాలి. అప్పుడే దేన్ని అయినా సాధించగలుగుతాం.

     ఈ పుస్తకాన్ని కేవలం 15 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రాసినా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కూడా ఉపయుక్తంగా ఉండాలని భావించాను. దీనికి ఇంకొక కారణం ఉంది. అన్నయ్య నిర్వహించిన అనేక పదవుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో విద్యాశాఖ మంత్రి పదవి.

నూతన విద్యావిధానాల రూపకల్పన, నవోదయ పాఠశాలలు ఆయనవే. ఎందరో మహానుభావులు విద్యార్థి దశ నుండే అంకురించిన కారణంగా సనాతన సంస్కృతిని, దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసే విద్య రూపొందాలనే ఆయన కాంక్ష నాకు ఆదర్శం. వారి స్మృతి చిహ్నంగా నాల్గు కాలాల పాటు నలుగురికీ లాభించాలన్న చిన్ని ప్రయత్నం ఈ పుస్తకం. అన్నయ్యకు అనుజుడు అనే పారితోషికంతో నన్ను ఆ భగవంతుడు పుట్టించి, వారిలోని ఛాయలను కూడా నాకు అనుగ్రహించాడు. అంతకన్నా కావల్సింది ఏముంది? అందుకే ఈ చిన్న కృతిని కీ.శే. అన్నయ్యకు అంకితమిచ్చాను. ఇకముందు అయినా ఈ పుస్తకం విద్యార్థులకు ఉపయోగ పడేటట్లు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుందన్న ఆకాంక్ష. వందమందిలో ఒక్కరైనా ఇందులోని విషయాలను గ్రహిస్తే నా ధ్యేయం నెరవేరినట్లు భావిస్తా.

“సర్వేజనాః సుఖినోభవంతు” అన్న సదాశయంతో మీరు స్థాపించిన “సర్వార్థ సంక్షేమ సమితి” కి మీకు లభించిన సహకారం ఎటువంటిది? ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు ఏవి?

వేరే వాళ్ళు ఎవరూ నాకు సహకారం లేరు. హైదరాబాదుకు వచ్చిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టుకోవాలనే ఆలోచనతో పెట్టుకున్నదే. పేరుకు ” సర్వార్థ సంక్షేమ సమితి.” కానీ మనోహరరావు ఒక్కడే. 30 ఏండ్లలో ఎవ్వరినీ ఒక్క పైస అడగలేదు. 1992లో ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక సమితిగా దీన్ని ప్రారంభం చేసి, శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు గౌరవ అధ్యక్షులుగా, సభ్యులుగా పి.వి. మదన్ మోహనరావు గారు, పి.వి.రాజమోహన్ గారు, పి. రాజిరెడ్డి గారు, బుడి సత్యనారాయణ సిద్ధాంతి గార్లతో స్థాపించాను.  పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినాము. ఒక సందర్భంలో 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యాగ త్రయం చేసినపుడు మాత్రం టిటిడి వారి సహాయం కోరాను. రమణాచారి గారు ఈవో గా ఉన్నప్పుడు రెండు, మూడు లక్షలు ఇచ్చినారు. తర్వాత సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత ఆయన 5 లక్షలు ఇచ్చారు. అప్పుడు 22 లక్షలతో  350 మంది ఋత్వికులను పెట్టి వైష్ణవం, శైవం, శాక్తేయాలకు సంబంధించిన 3 యజ్ఞాలు చేశాము. అయితే ఈ యజ్ఞ యాగాదులన్నీ దేవాదాయ శాఖవారు చేయించాల్సినవి. మనం చేయాల్సినవి కాదు కదా!  చేసిన వాటిని కొంతమంది ప్రోత్సహించారు. అందరూ ఒప్పుకోరు కదా!

           దీనిద్వారా ఎందరో మహానుభావులకు, పండితులకు సన్మాన సత్కారాలు చేయడం, బిరుదులు ఇవ్వడం చేశాము. ఆధ్యాత్మిక వేత్తల చేత సప్తాహలు, ప్రసంగాలు చేయించి, వారిని ఉచితరీతిలో సత్కరించుకున్నాము. లోక కళ్యాణం కోసం వందకు పైగా యజ్ఞ యాగాదులు నిర్వహించాము. అనేక సాహిత్య , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాము. ఉచిత హోమియో, ఉచిత మందులతో దవాఖాన, తుపాను, భూకంప బాధితులకు సహాయం చేయడం, వృద్ధాశ్రమాలకు, సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వడం లాంటివి చేస్తూనే ఉన్నాం.  మన సనాతన ధర్మ రక్షణకు 3000 దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు 3000 మంది పేద బ్రాహ్మణులకు కనీస పోషణ నిమిత్తం మా సంస్థ చేసిన కృషి వల్ల పూజారుల నియామకం జరిగింది. మొన్ననే కాశీలో పుష్కర సందర్భంగా 10 అన్న సత్రాలకు 30 వేల రూపాయల చొప్పున స్వంతంగా సహకరించాను. ఇది నీటి బిందువు మాత్రమే. మనం చేసే మంచి పనుల వల్ల కలిగే పుణ్యమే మనతో వచ్చేది. ఏదీ రాదు మన వెంట. అంతే కదా!

మీ దాంపత్య జీవితంలో మీతో ప్రయాణం కొనసాగిస్తూ, మీ ఆదర్శాలకు చేయూతనందిస్తున్న మీ సతీమణి శ్రీమతి సరస్వతమ్మ గారి గురించి వివరించండి…

నాకు 1958 లో వివాహం జరిగింది. అప్పటినుండి ఆమె నాకు అనుకూలవతిగా నా అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే ఉంది ఇప్పటివరకూ.. ఆమెకు యజ్ఞయాగాదులు అంటే చాలా ఇష్టం. అతిథి సత్కారం మాఇంట్లో ఆనవాయితీగా పూర్వం నుండి వస్తూనే ఉంది. ఈనాటికీ మా ఇల్లు ఒక సత్రం లాగానే ఉంటుంది. ఎవ్వరు ఏ సమయానికి వచ్చినా ఆతిథ్యం ఈయవల్సిందే. రోజు విడిచి రోజైనా మూడవ వ్యక్తి లేకుండా మా ఇంట్లో భోజనం చేయడం జరుగదు. ఈ విషయంలో నాకంటే ఎక్కువగానే ఆమె వారిని బలవంత పెడుతుంది. ఏ సమయం లోనూ చీకాకును ప్రదర్శించకపోవడం, చిరునవ్వుతో ఆదరించడం ఆమె ప్రత్యేకత.  వంగరలో అదే నడిచింది. హన్మకొండలో అదే నడిచింది. ఇక్కడ కూడా అదే నడుస్తున్నది. ఎందుకంటే వచ్చినవారిని మనం ఆదరించబట్టే వాళ్ళు మన దగ్గరకు వస్తారు కదా! అది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. 

మీరు నిర్మాతగా టీవీ సీరియళ్ళు చేశారని విన్నాం. వాటి గురించి చెప్పండి.

భాగవతం వంటి భక్తి రసాత్మకమైన కావ్యాన్ని మనకు అందించిన పోతన జీవితం గురించి అందరికీ తెలియాలని  “భక్తకవి పోతన” అనే పేరుతో 13 భాగాలుగా చేసి హైదరాబాద్ దూరదర్శన్ ఛానల్ ద్వారా ప్రసారం చేశాము.  పోతన భాగవత పద్యాలు, ఆయన జీవితం ఇందులో ఉండడం వల్ల మంచి ప్రజాదరణ పొందింది. అందులో ఒకటి, రెండు వేషాలు కూడా నేను వేశాను. నేను తిరిగిన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు వీటిలో ఒక 13 ప్రముఖ ఆలయాలను తీసుకొని ( సింహాచలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, తిరుపతి, రామేశ్వరం, శబరిమల అయ్యప్ప మొ..) వాటి చరిత్ర అంతా “సంస్కృతీ శిఖరాలు” పేరిట టీవీ సీరియల్ గా చిత్రీకరించి, 1998, 99 లలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చాయి. షూటింగ్ తీస్తున్నప్పుడు బృందంతో నేను కూడా రామేశ్వరం, శబరిమలకు వెళ్ళాను.

రాబోతున్న సినిమా ‘ప్రజాకవి’ కాళోజీ బయోపిక్ లో మీ సోదరులు నరసింహారావు గారి పాత్రలో మీరు అలరించబోతున్నారని తెలిసింది. ఆ వివరాలు చెప్పండి. ఇంకా వేటిలోనైనా నటించారా?

అవును. నిజమే. సెప్టెంబరులో  కాళోజీ జయంతి సందర్భంగా ఆయన బయోపిక్ సినిమాగా రాబోతున్నది. అందులో ప్రధానిగా అన్నయ్య ఆయనతో ఫోన్లో మాట్లాడిన సన్నివేశం, ఆయనకు పౌర సన్మానం చేసే సన్నివేశంలో అన్నయ్య పాత్రను నేను పోషించాను. “Sand Storm” అని ఒక హిందీ సినిమా 2016 లో వచ్చింది. రాజస్థాన్ లో జరిగిన ఒక యదార్థ గాధ ఆధారంగా తీసిందది. ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరుగుతుంది. ఆ అమ్మాయి ధైర్యంగా అందరినీ ఎదిరించి కోర్టులో కేసు వేసి నిందితులందరినీ జైల్లో పెట్టిస్తుంది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ బహుమతి ఇచ్చే సందర్భంలో ఆ పాత్ర చేశాను.

 ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులను గురించి మీ అభిప్రాయం చెప్పండి.

అమ్మా! మీకైనా, నాకైనా మనిషికి కావల్సింది పుట్టుకనుండి ధర్మార్థకామమోక్షాలు. మొట్టమొదట ధర్మం. దాన్ని అనుసరించి మిగతావి ఉండాలి. కానీ ఈరోజు దాన్నే విడిచిపెట్టి, మధ్యలోని రెండింటి మధ్య  (అర్థం, కామం) ప్రపంచం నడుస్తున్నది. పాపం పెరిగిపోతున్నది. “యథా రాజా తథా ప్రజా” అన్నట్లు ఉన్నది. పాలకులు ఉన్న దాన్ని బట్టే ప్రజలు నడుస్తారు. అన్నయ్య పదవిలో ఉన్నప్పుడు తన వాళ్లకు పదవులు ఇచ్చుకున్నడా? కరప్షన్ ఏమైనా జరిగిందా? ఇపుడు మోడీ తన వారికి పదవులు ఏమైనా ఇచ్చాడా? మరి కుటుంబాలకే పదవులు ఇస్తున్నవారు ఉన్నారు కదా!  ప్రధానమంత్రులలో గుల్జారీ లాల్ నందాకి సొంత ఇల్లు లేదు. కనీసం ఉన్న ఇంటికి కిరాయి కట్టే పరిస్థితి కూడా నాడు లేదు. మరి వాళ్ళు వారి జీవితాలను ఎట్లా గడిపినారు? దేశం మీద మమకారం, ప్రజల పట్ల ఉన్న ఆదరణ మాత్రమే. ఇప్పుడు నాయకులు తమ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు. ప్రజలూ అంతే. ఒక్కటే అమ్మా! మనిషికి తాను చేస్తున్నపనిలో ధర్మ బద్ధత ఉంటే ఎవరూ పాపం చేయరు. అది వాళ్ళ మనసు ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒకరు చెప్పాల్సిన పనిలేదు. దేనికైనా దృఢ సంకల్పం, దీక్ష ఉండాలి. అప్పుడే దేన్ని అయినా సాధించగలుగుతాం.

ధన్యవాదాలు సార్ …మీ గురించిన అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చిన మీకు మా తరఫున, మా పాఠకుల తరఫున కోటి వందనాలు…

September 15, 2023 148 comments
3 FacebookTwitterPinterestEmail
కవితలు

ఊష్మకం

by Laxmareddy September 15, 2023
written by Laxmareddy

విరామమెరుగక వీస్తున్నది
విద్యుత్ వీవన
ఊష్మకంలో వెట్టిచాకిరిచేస్తూ
వీవనలెన్ని వీచినా
తరగని వేసవితాపం
తనువంతా స్వేదం
నిదాఘమ నిద్ర కోసం
కృత్రిమకృత్యాలెన్నయినా
ఆ సూరీడి ఎదుట
వెలవెలబోయే దివిటేలేగా
మదిలోన ఎదలోన
భానుడి భగభగల ఊష్ణసంవహనం
రహదారులన్నీ
నిర్మానుష్య నిస్సవ్వడి క్షేత్రాలు
సవ్వడి పెరిగి
శీతలత్వాన్ని స్పృశిస్తూ ప్రశ్నిస్తూ
చినబోయిన శీతల యంత్రాలు

పర్యావరణ మిత్రకు
పరిపరి ప్రశ్నలు
పెను సవాళ్లు
పెచ్చుమీరుతున్న
సంబంధ బాంధవ్యాల నిష్పత్తుల క్షీణత
జలచక్రంలో
తరిగిన తరువులు
కొండలు గుట్టలు చెరువుల
అదృశ్యదృశ్యం
నీరింకని సిమెంటు రోడ్లు
అడుగడుగున
వర్షాగమనంలో
మట్టి వాసనలకు దూరమైన బతుకులు
నీరింకని చెమ్మలేని చేతల చైతన్యం
నవనాగరికత పేరున
పన్నీరు తన్నీరు
కాలుష్యపు కాసారంలో
కన్నీరై కడగండ్లు
వాతావరణంలో నీటితేమ లేని
పొడిబారిన తడిలేని వడగాడ్పులు
ఉష్ణోగ్రతల ఉక్కిరి బిక్కిరిలో
జీవజాలం
శీతల పవనపుంజాల వేటలో
అతలాకుతలం!

బొగ్గుబావుల్లో
వేసవి నిప్పుల కొలిమికి
స్నేహం స్వేదంతో
మలయసమీరాల వీవనలు
కర్బన ఉద్గారాలతో
కర్పరాలను దాటేస్తూ
వేడి చెలిమెల గ్రీష్మతాపం
బాష్పోత్సేకానికి
బహుదూరపు బాటసారిలా
విశృంఖలంగా వృక్ష హననం
ఎడారుల్లా మారుతున్న
కారడవులు కార్చిచ్చు
కదనోత్సాహాంతో!

శిక్షణలు క్రమశిక్షణలు
మరచిన మనిషి అవసరానికి
ప్రకృతి బలిపశువు
ప్రకృతి విశృంఖల విధ్వంసం
లయకారకం వినాశకరం
విరించి విరచితం
వాతావరణ సమతుల్యత
అసమగ్రం అసమంజసం
డబ్బుమైకంలో మద్యం మత్తులో
ఆడంబరాల ఆలంబనలో గ్రీష్మం
వీవనలెన్ని విరామమెరుగక ఊగినా
తగ్గని శరీర తాపం
మనిషి మనసు మారితేనే
ఆదర్శ వాతావరణం
ఆదర్శ సమాజం
లేదంటే నరక కూపంగా
నవసమాజం ప్రగతిని ప్రశ్నిస్తూ!

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

డా. శ్రీ పెరుంబూదూరు శ్రీరంగాచార్య గారి ఆత్మకథ “జీవనపర్వం” ……

by Aruna Dhulipala September 15, 2023
written by Aruna Dhulipala

సాహిత్యమే నా జీవన గమనమంటూ, సాహిత్య సేవా నిరతునిగా ఇప్పటికీ సాహిత్యం పట్ల ఎనలేని మమకారంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న డా. శ్రీరంగాచార్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పడమంటే మల్లెపువ్వుకు పరిమళాలు అద్దడమే. ఆయన రాసుకున్న ఆత్మకథ ” జీవనపర్వం ” వారి గురించిన ఎన్నో విషయాలను పాఠకులతో లోతైన అధ్యయనం చేయిస్తుంది.
మొట్టమొదటగా ప్రస్తావనలోనే ” సారం పర్వణి పర్వణి ” అనే శ్రీమహాభారత కథకు సంబంధించిన పర్వం అనేది మానవ జీవితానికి అన్వయించుకుంటే జీవితం కూడా పర్వ (సంతోషం) మయమే. బాధలు గుర్తున్నంత సంతోషాలు గుర్తుండవు. చీకటి వెలుగులు, ఎత్తుపల్లాలతో కూడినదే జీవితం. కాబట్టే ఇది జీవన పర్వంగా రాశానని అని ఆయన చెప్పుకున్నారు. ఆయన గురించి ఆత్మీయ మాటలు పంచుకున్న తోటపల్లి రామేశ్వర శర్మ గారు ” ఈ పుస్తకంలో పాలెంలో మీరు చేసిన ఎన్నో విషయాలను వివరించకపోవడం మీరు కర్తవ్యం అనుకున్నారే గాని – వేరు కాదు” అని ప్రస్తావించడం శ్రీరంగాచార్య గారి ఉదాత్త వ్యక్తిత్వానికి దర్పణం.
శ్రీరంగాచార్య గారి పూర్వీకులు శ్రీ పెరుంబూదూరు వాస్తవ్యులు. శిష్యసంచారం చేత మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నప్పుడు ‘పానుగంటి’ ఇంటిపేరు కల వెలమదొరలు వారి ప్రతిభా పాటవాలను గుర్తించి రమ్మని కోరిన ఆహ్వానం మేరకు కొంతమంది మారేపల్లి, సల్కునూరు ప్రాంతంలో స్థిరపడగా, ఇంకొంతమంది చందుపట్ల గ్రామంలో నివాసయోగ్యంగా మలచుకున్నారు. అక్కడ నృసింహాలయంలో అర్చకత్వం వహిస్తూ, పౌరోహిత్యం నెరపుతూ జీవితాన్ని గడిపారు. ఆ వారసులే శ్రీరంగాచార్య గారు. ఈ పుస్తకంలో ఆయన చందుపట్ల గ్రామంలోని ఆనాటి ప్రజల జీవన స్థితి గతులను విస్తారంగా వివరించారు. దేవాలయాల నిర్మాణం, ఆకృతులు, శిల్పాలు, ఉత్సవాలు, వ్యవసాయభూములు, సేద్యం చేసే విధానాలు, ధాన్యపు నిల్వలు, ఆహారపదార్థాలు, వేషధారణలు, ఆచార వ్యవహారాలు, అలవాట్లు,క్రయ విక్రయాలు, పాడిపంటలు, కులవృత్తులు, వృక్షజాతులు, జంతు వాహనాలు, విద్యా వైద్య సదుపాయాలు…సంతతాభివృద్ధి చెందుతున్న చందుపట్ల గ్రామంలోని ఎన్నో విషయాలను కూలంకషంగా వర్ణించారు. ప్రతీ చిన్న అంశాన్ని ఆయన వివరించిన తీరు ఆయన సునిశిత పరిశీలనకు, మేధాశక్తికి, అపారమైన జ్ఞాపకశక్తికి తార్కాణం. కానీ ఈనాడు అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో నిత్యార్చనలు లేని విధానానికి ” ఎండిన వూళ్ళ గోడెరిగింపడెవ్వడు పండిన వూళ్లకే ప్రభువులంత” అనే రీతి ప్రదర్శిస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఎంతో ఆవేదన చెందుతారు. పూర్వ వైభవం రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తారు.

వీరి తండ్రి శ్రీ రాఘవాచార్యులు గారు బాల్యం నుండి స్వయంకృషితో సంస్కృతాంధ్రాలను , వైద్య, జ్యోతిష, పాంచారాత్రాగమ విద్యలనభ్యసించి ఆయా విభాగాల్లో గ్రంథ రచన చేసిన విద్యాతపస్వి. ఈయన రచించిన పాంచరాత్ర విధాన ‘మహోత్సవ విధిః’, ‘భగవత్ ప్రతిష్ఠావిధానం’ అనే దేవయాజ్ఞీక విధాన రచనలు ఆయన శతజయంతి సందర్భంగా శ్రీరంగాచార్య గారి సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఈ రెండు పుస్తకాలు వైష్ణవ సాంప్రదాయ దేవకార్యాలన్నింటికీ, పాంచారాత్రాగమ పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయంటే వారి కృషి ఎంత గొప్పదో తెలుస్తుంది. శ్రీరంగాచార్యులు గారు, వారి సోదరులలో లక్ష్మణమూర్తి గారిని గూర్చి ఈ పుస్తకంలో ప్రస్తావిస్తూ “గొప్ప పండితులు. గోపికా వల్లభం, సమర్పణం పద్యకృతులు, మరియు ఇతర రచనలు చేసి, బహుభాషా పారంగతులైన మా అన్నగారు నిరాఘాట కవితా ధురీణులు, మహావక్త అని, ఇంకా అముద్రిత రచనలు కూడా ఉన్నాయని” పేర్కొంటారు. మరొక సోదరులు నరసింహాచార్యులు గారిని గురించి వివరిస్తూ “వారు కూడా చక్కని పద్యకవి అని” వారి అనుజుల పాండిత్యాన్ని అభివర్ణిస్తారు. అంతేకాక బాల్యం నుండీ తాత, తండ్రి దగ్గరుండి నేర్పించిన అధ్యయనం మాకు ఈ విధమైన జ్ఞానాన్ని నేర్పించిందని చెప్తారు. వీరి మేనత్త అయిన వెంకట నర్సమ్మగారు కూడా గొప్ప జ్ఞాపకశక్తి కలవారని, తిరుప్పావై, స్తోత్రాలు, మంగళహారతులను కంఠపాఠంగా, నిర్దోషంగా చదివేదని చెప్తారు. ఇలా పాండితీ ప్రతిభ గల వారి వారసత్వాన్ని పొందిన వీరు ధన్యులు.
కళాశాల విద్యాభ్యాసాన్ని వివరిస్తూ “నిరంతర పఠనం ఒక వ్యసనంగా మార్చుకున్నందున- గురువులు చెప్పిన శబ్దాలు, ధాతువులు, చంపూ రామాయణం, రఘువంశ కిరాతార్జునీయ కుమార సంభవాల్లో కొన్ని సర్గలు, తర్కసంగ్రహం, హితోపదేశం, విక్రమార్క చరిత్ర, వేదంలో పంచసూక్తాలు, ఉపనిషత్తులో కొన్ని కంఠపాఠంగా నిలిచి ఈనాటికీ జ్ఞాపకంలో ఉండడం ఆనాటి విద్యావిశేషంగా” చెప్తారు. అంతేకాక విద్యాబోధన సమయంలో గురువుల క్రమశిక్షణతో కూడిన నియమాలను చదువుతుంటే నేటి స్థితిని పోల్చుకుంటే విద్యావ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మనకు తేట తెల్లమవుతుంది. “మొదటినుండీ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెనుగుశాఖ ఆచార్య వర్గంతో ఉన్న పరిచయం లోకాన్ని చదివించింది” అంటారాయన. గురుశిష్యులకుండాల్సిన సత్సంబంధం అలాంటిది. తన మిత్రులు, కాలేజీ విద్యార్థులు కొంతమంది తెనుగుశాఖలో ఆచార్యులుగా, శాఖాధిపతులుగా ఉండడం ఆనందమని…
“విబుధలోకంబు కవితైవ విద్యయనుచు
చదువు వచనార్థమునను సంశయము గలదె
విద్యలకు నెల్ల నుత్తమ విద్యకవిత
దాని తెలియుట విశ్వమంతయునుగనుట”
ఇంకా అటువంటివాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటారు. తెలంగాణ ఉద్యమ పరిస్థితులు కూడా ఇందులో ప్రస్తావించబడ్డాయి.
‘జీవనపర్వం’ ఆయన ఉద్యోగ జీవనాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఎందుకంటే పాలెం కళాశాలలో 1966 లో ఆయన ఉద్యోగంలో చేరిన మొదటిరోజు నుండీ 2002 లో రిటైర్మెంట్ అయ్యేవరకు అక్కడే పనిచేయడం. ఇక్కడ ఆయన పొందిన అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. గురుశిష్యులు స్నేహితులవలె మెలిగేవారని ” వృద్ధాః శిష్యాః గురోర్యువా” అన్నట్టు ఉండేదని, ప్రతి విద్యార్థి ” స్పర్థయా వర్థతే విద్యా” సూక్తిని సార్థకం చేసినారని ఆనాటి సంగతులను గుర్తుతెచ్చుకుంటారు. ఇక ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తోటపల్లి సుబ్రహ్మణ్యం గారు ( సుబ్బయ్య గారు ). ఎన్నో విద్యాసంస్థలను, మరి కొన్ని ఇతర సంస్థలను స్థాపించి, దీపం, నీరు, బాట లేని గుడిశెల గ్రామాన్ని సమైక్య రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా నిల్పిన మహనీయులు. ఈయనను ప్రస్తావిస్తూ ” పాలెం గ్రామాభివృద్ధికి మానవ రూప అవతార వైభవ మూర్తి” అని శ్లాఘిస్తారు. అంతటి గొప్ప వ్యక్తి ఆర్థిక బాధలను అనుభవించడాన్ని “కమలములు నీట బాసిన’… ‘ఎప్పుడు సంపద కల్గిన’…లాంటి పద్యాలకు ప్రత్యక్షసాక్ష్యంగా పేర్కొంటారు. రజ్జువే సర్పంగా మారిన సన్నివేశాలు ఏర్పడ్డాయని వాపోతారు. పాలెంలో శ్రీరంగాచార్యుల వారు కూడా నిస్వార్థంగా కళాశాల అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు.

1980 ఫిబ్రవరి 16 వ తేదీన సంభవించిన ప్రపంచ ప్రసిద్ధ సూర్యగ్రహణానికి పాలెం చరిత్రకెక్కింది. 40 దేశాల శాస్త్రవేత్తలు (అందులో 5 గురు నోబెల్ బహుమతి గ్రహీతలు) 40 రోజుల ముందే పాలెం చేరి ప్రయోగశాల ఏర్పాటు చేయడం, ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించడం లాంటి గ్రహణ సమయంలో జరిగిన విశేషాలన్నింటినీ మన కళ్ళకు కట్టినట్లుగా ఈ పుస్తకంలో రంగాచార్య గారు చూపుతారు. “చందుపట్ల నా జన్మభూమి. పాలెం ఉద్యోగ కీర్తిభూమి “అని గర్వంగా చెప్పుకుంటారు.
తమ సాహితీరంగ ప్రస్థానంలో “మావూరు చందుపట్ల” అనే పుస్తకాన్ని గ్రామచరిత్రగా రాసిన తీరు, తాము రచించిన పీఠికలు, సంపాదకత్వం వహించిన పుస్తకాలు, పరిష్కార గ్రంథాలు, పత్రికల్లో వచ్చిన వ్యాసాలు మొదలగు విషయాలను సవివరంగా తెలిపారు.
చివరగా …ఉద్యోగ జీవితంలో రాజకీయాలు ఎన్ని జరిగినా వీలైనంతవరకు ‘పద్మపత్ర మివాంభసి’ లా ప్రవర్తించానంటారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే తెలుగు సాహిత్యానికి మేలు జరుగుతుందనుకున్నాం. కానీ ప్రాచ్య విద్యలనే కాక అన్నింటినీ అశ్రద్ధ చేస్తున్నదన్న ఆవేదన వ్యక్తం చేస్తారు. “యదార్థ వాది లోక విరోధి” అన్నట్టు ‘జీవనపర్వం’ గ్రంథాన్ని మొత్తం జీవితం కాక అనుభవాలు మాత్రమే రాశానని ఆయన చెప్పుకుంటారు. “ఎన్నో గ్రంథాలను ప్రచురించి, ఎన్నో వ్యాసాలు రచించి, ఎన్నో ప్రసంగాలు చేసిన నేను ఇప్పటికీ ఒక సాహిత్య యాత్రికుడనే కావడం పెద్దల ఆశీర్బలం, నా యొక్క పురాకృత జనుర్విశేషం” అని భావిస్తాననడం వారి వినమ్ర వ్యక్తిత్వ నిలువెత్తు రూపానికి సాక్ష్యం. నిరాడంబరులు, నిస్వార్థులు అయిన వారి జీవితం అందరికీ ఆదర్శప్రాయం.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

అభిరామ్ చిత్రాలు

by Abhiram Emani July 31, 2023
written by Abhiram Emani
July 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

చిత్రలేఖనం

by B. Naga Shashidhar July 31, 2023
written by B. Naga Shashidhar
July 31, 2023 134 comments
2 FacebookTwitterPinterestEmail
కథలు

ఆమె నవ్వు

by -  బి ఎస్ రాములు July 31, 2023
written by -  బి ఎస్ రాములు

ఆధునిక కథ:

” ఎంత సేపు అలా ఏడుస్తూ కూర్చుంటావు? లే.. లే .! లేచి ముఖం కడుక్కో .వంట మొదలు పెట్టు. సాన్వి .ఎలా బెంగటీలుతున్నదో చూడు. దీని కోసమైనా నువు ధైర్యం తెచ్చుకో! ” డైనింగ్గ్ టేబుల్ వద్ద కూతురు సాన్విని ఒడిలోకి తీసుకొని ఏడుస్తున్న శారదను సముదాయిస్తూ అంది నీహారిక.
రాత్రి ఎనిమిదవుతున్నది. ఇల్లు బోసి పోయింది. ఇంట్లో ఏడుపు తప్ప ఏ అలికిడి లేదు. సాన్వి అమ్మను అతుక్కొని బిక్కుమంటూ చూస్తోంది.
కళ్లు తుడుకుంది శాగద.
” వారం రోజులైంది. అద్వైత్ జాడలేడు. ఎవరికి చెప్పుకోను?”
నీహారిక అర్థం చేసుకుంది. అర్థం చేసుకుంది కాబట్టే పలకరిద్దామని , ధైర్యం చెపుదామని వచ్చింది.
” నేనున్న గదనే! మేమంత లేమా ? లోకం గొడ్డు పోయిందా? ఎన్నో మహిళా సంఘాలున్నాయి. కలుద్దాము.” అనునయంగా అంది నీహారిక.
నీహారికకు అసలు విషయం తెలుసు. అది గుర్తు చేయకుండా కర్తవ్యం గుర్తు చేసింది.
అందరు ఉండీ శారద ఒంటరిదైపోయింది. కుల పట్టింపులు వదిలి, కుటుంబాలు వదిలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తల్లి దండ్రులు దూరమయ్యారు. అత్తమామలు దూరమయ్యారు. అద్వైతే సర్వస్వం అనుకుంది. ఇపుడతడు తన జీవితంలోంచి తప్పుకున్నాడు. ఇపుడు తనకు ఎవరి ఆసరా లేని ఒంటరి. ఈ పాప , ఆ చిరుద్యోగం తప్ప తనకంటూ ఇపుడెవరూ లేరు. ఏవేనో గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది శారద.
” ఇపుడవన్నీ అనుకోవడం దేనికే? జరిగిందేదో జరిగి పోయింది. అందరు అట్లనే ఉంటరా? కులాలు వేరైనా ప్రేమించుకున్నాం అంటే తల్లిదండ్రులే పెళ్లి చేసిస్తున్నారు.
పెళ్లికి వెల్లినవాళ్లకు కూడా వాల్లవి వేర్వేరు కులాలని … ఇష్టపడితే తల్లి దండ్రులే పెళ్లి చేసారని తెలియదు. ఇరు వైపులా రాకపోకలు సాగుతున్నాయి. అందరు కలిసి పోతున్నారు. ఇపుడు కులాల పట్టింపులెక్కడున్నాయి? మీ అమ్మా నాన్నలు , అత్తమామలు గట్లాంటోల్లు.. గట్ల ఎవరుండరు? ఒక్కతే బిడ్డ అని ఒక్కడే కొడుకనివద్దంటే ఏమై పోతరో అని వాల్లే సంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తున్నరు. అద్వైత్ ఇట్ల చేస్తడని ఎవరం ఊహించ లేదు.” సముదాయిస్తూ అంది నీహారిక.
నీహారిక సాన్విని తీసుకుంది. వెచ్చని నీళ్లతో స్నానం చేయించింది.
” ముందు ఈమెకు స్నాక్సు పాలు వేడి చేసివ్వు ” అధి నీహారిక.
శారద తేరుకొంది. మరో మనిషి తోడుంటే ఎంతో ధైర్యం.
నీహారికకు చూచాయగా తెలిసింది. అద్వైత్ మరొకరితో తిరుగుతున్నాడని! ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని! ఇలాంటివి అడిగి తెలుకోవలసినవి కావు. తెలిసినా తెలియనట్టు ఉండి పోవడమే ఉత్తమం.
అలా వీలైనపుడల్లా నీహారిక శారదకు సాన్వికి తోడై నిలుస్తున్నది. ఇపుడు
సాన్వికి మూడేళ్లు. ఇంకా బడికి అలాటు కాలేదు. డే కేర్ సెంటర్లో వదిలి డ్యూటీకి వెళ్తున్నది శారద.

*. *. *. *

రోజులు గడుస్తున్నాయి.
అద్వైత్ ఇంటికి రావడం లేదు. ఇంటి కిరాయ ఎలాగోలా శారద తానే కడ్తున్నది. తన ఏటి యం కార్డు తన చేతిలో ఉంది. ఇపుడు తన సంపాదనపై తనకే పూర్తి హక్కు. సాన్విపై కూడా పూర్తిగా తనకే హక్కు. తనను ఇలా వుండు, ఇలా వండు… అంటూ అలసిపోయి వచ్చిన తనకు పనులు పురమాయించే వారెవరూ లేరు.
శారదకు కొద్ది కొద్దిగా ఒంటరి జీవితం అలవాటవుతున్నది. ఒంటరిగా ఉండడంలోని స్వేచ్చ ఆనందం, సాన్వి అల్లరి ఆనందం తన తీరిక అంతా తనకే సొంతం.
శారదలో పెరుగుతున్న ఆత్మ విశ్వాసం చూసి నీహారిక చాలా సంతోషపడింది. నీహారిక తన భర్త విజయ్ తో శారద భవిశ్యత్ గురించి చర్చించుకున్నారు. ఆమెజీవితంలో కలుగ జేసుకోకూడదు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా నిలబడాలనుకున్నారు. ముందుగా ఆమె తల్లిదండ్రులను,
అత్తమామలను కదిలించాలను కున్నారు. మూడేళ్ల ఎడబాటుతో కన్న పేగు కొ్టుకుంది. మనవరాలు సాన్వి అందరిని కలిపింది. వాల్లు వస్తూ పోతున్నారు.

శారదకు తన జీవితంలో కోల్పోయిన అనుబంధాలు మారాకు తొడిగి కుదుట పడ్డాయి. ప్రేమ మైకం తొలగిపోయి శారదకు జీవితం అంటే ఏమిటో తెలుస్తున్నది. . ఈ కొత్త జీవితంలో శారద ఎన్నో విషయాలు నేర్చుకుంది. రెండేళ్లు గడిచాయి. ఆమె ఇప్పుడు తన స్వంత వ్యక్తిత్వం పై నిలడింది. సాన్విది ఇపుడు బడికి వెళ్లే వయసు .
అద్వైత్ ఎక్కడున్నాడో తెలిసింది. శారద , నీహారిక కలిసి మహిళా సంఘాలను కలిసారు. మహిళా కమిషన్ ను కలిసారు.
” ఆమె ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆమెకు నాకు పెళ్లి కాలేదు ” అన్నాడు.
అంత నీచంగా మాట్లాడుతాడని శారద ఊహించలేకపోయింది.
వెంటబడి ప్రేమించానని చెప్పిన డైలాగులు గుర్తుకు వచ్చాయి. అలాంటి మాటలతో శారద ఆత్మగౌరవం దెబ్బ తిన్నప్పటికీ బలంగా నిలబడింది. అందరి మద్దతుతో కోర్టులో కేసు వేసింది.
మళ్లీ అవే డైలాగులు చెప్పాడు అద్వైత్. శారద మనస్సు పూర్తిగా విరిగి పోయింది. విరక్తి కలిగింది. తనకు పెళ్లే కాకపోతే సాన్వికి నాన్న ఎవరు? ఆలోచించి తాడో పేడో తేల్చుకోవాల్సిందే అనుకుంది శారద.
శారద తమ సమావేశాల ఫోటోటోలను వెతికింది. ప్రారంభ పరస్పర చర్యలు వెచ్చదనం, కనెక్షన్ భావనతో నిండి ఉన్న ఆ ఫోటోలను ఇంత వరకు ఎవరికి చూప లేదు. ఇపుడా రహస్య ఆలింగనాలు , సాన్వి కడుపులో ఉన్నపుడు తన పొట్టమీద పెట్టిన ముద్దులు చిగురిస్తున్న శృంగారాన్ని, వారి కలలను వారు కలిసి జీవితాన్ని బతకాలనుకున్న నిర్ణయించుకున్న క్షణాలను ఆ ఫోటోలు గుర్తు చేసాయి.
ఆనాటి అతని సంభాషణలు గుర్తుకు వచ్చాయి.
” మనది నిర్మలమైన ప్రేమ. నీ కళ్ళలోకి చూస్తుంటే, నేను వెతుకుతున్నది నువ్వేనని నేను నమ్ముతున్నాను. నీవు నాకోసమే పుట్టావు అనిపిస్తోంది. నీవు లేని ఈ జీవితం వ్యర్థం…. ” అలా సాగి పోయేది వరద.
తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఎలా వుండాలో ఏం చేయాలో… ఎన్నో చెప్పాడు.
శారద తద్వారా తలెత్తే సమస్యలనుగుర్తు చేసింది. అతడే ధైర్యం చెప్పాడు.
సాన్వి పుట్టిన మూడేళకే తన యవ్వనం సడలి పోయిందా? అతని మనసు అట్లా ఎలా మారింది ? అంత పెద్ద మాటలు ఎలా అనగలిగాడు?

” శారదా! నేనేం కోరుకుంటున్నానో నాకే తెలియదు. బహుశా మన పెళ్ళికి బయట నన్ను నేను వెతక్కోవాలి! “
“అలాంటి మాటలు ఎలా చెప్పగలిగాడు? మన ప్రేమ చిరస్థాయిగా ఉంటుందనుకున్నాం. మీ నుండి ఇలాంటి మాటలు నేనెప్పుడూ ఊహించలేదు.”
జ్ఞాపకాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫోటోలు తీసుకొని నీహారికను వెంట తీసుకుని అడ్వకేట్ వద్దకు నడిచింది.

*. *. *.

అలా వారి బంధం చెడిపోయిన నేపథ్యంలో, శారద ఆత్మశోధన. ఒంటరిగా కానీ కృతనిశ్చయంతో, ఆమెకు తెలియని మార్గాల్లో ప్రయాణించింది, దారిలో అనేక అనుభవాలు, సూటి పోటి మాటలు, వంకర చూపులు ఎన్నో ఎదుర్కొంది. దయగల అపరిచితులు ఆమెకు మిత్రులుగా మా
మారడంతో, ఆమె తన స్వంత బలం బలగం పొందగలిగింది. సాన్వితో , భావోద్వేగ ఆలింగనంలో వారి బంధం బలపడింది, ప్రేమ యొక్క శాశ్వత శక్తికి సాన్వి చిహ్నంగా మారింది. శారద అచంచలమైన విశ్వాసం ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవాలనే ఆమె సంకల్పానికి తోడై నిలిచింది.
కొత్తగా వచ్చిన స్వాతంత్ర్యంలో, శారద స్వంత గుర్తింపు పెరిగింది.
తన కొత్త మిత్రుల మద్దతుతో, ఆమె న్యాయ పోరాటాలను చేపట్టింది, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నిలిచింది.

ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి శారదను చూసి నీహారిక “శారదా, నువ్వు అనుకున్నదానికంటే బలంగా ఉన్నావు. నిన్ను నువ్వు నమ్ముకో! ఈ పోరాటం. నీలో ని నిజమైన సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తుంది.”

“నువ్వు చెప్పింది నిజమే. నేను ఈ కష్టాలను అధిగమించి లక్ష్యంతో నిండిన జీవితాన్ని సృష్టిస్తాను. నాకు సాన్వికి అదే ఆనందం.” అంది ారద.

అద్వైత్ ఆత్మ విశాసం గర్వం ఎగిరి పోయింది.
అతని అంతర్గత గందరగోళాన్ని గ్రహించిన , అతని న్యాయవాది రెండు సూచనలు చేసాడు. సంధికోరుకొని తిరిగి కాపురం చేస్తానని అర్థించడం. అది. ీలుకాని ఎడల కేసు విత్ డ్రా చేసుకొమ్మని క్షమాపన కోరడం.
“అద్వైత్ ! సత్యాన్ని ఎదుర్కోవడానికి, క్షమాపణ కోరడానికి ధైర్యం కావాలి. విరిగిపోయిన బంధాలను చక్కదిద్దడానికి, ప్రేమలో మరోసారి సాంత్వన పొందేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?”
” నా తప్పును గ్రహించాను. పోగొట్టుకున్న వాటిని తిరిగి నిర్మించుకోవాలనిపిస్తున్నది. ” అన్నాడు అద్వైత్.
-అతను ఒకసారి ప్రేమించిన స్త్రీతో రాజీపడాలని ఆశించాడు. అయితే శారద అనుభవాలు వేరు. అద్వైత్ ఊహించని విధంగా శారద రూపాంతరం చెందింది, ఆమె జీవిత ప్రయాణం ఆమెను బలమైన మహిళగా మార్చింది. తనకు తెలిసిన శారద వేరు. ఇపుడు పోరాడుతున్న శారద వేరు.
శారద గతకాలపు కలలకు వీడ్కోలు పలికి, వర్తమానాన్ని స్వీకరించింది. ఒకప్పుడు తను ప్రేమించిన అద్వైత్, తన ఆనందానికి తనదైన వెర్షన్‌ను కనుగొందని తెలిసి అద్వైత్ గుండె వేదన చల్లబడింది.
దృఢత్వానికి ప్రతిరూపమైన శారద తన జీవితాన్ని పునర్నిర్వచించింది. ఆమె పక్కన తన కుమార్తెతో, అత్త మామలతో, అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నది. ఇపుడామె ఒంటరి కాదు. ఆమె జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. వారి గత ప్రేమ యొక్క ప్రతిధ్వనులు విన దల్చుకోలేదు. భవిష్యత్తు వాగ్దానం వేరైధి.
ఆమె తల్లిగా , కూతురుగా, కోడలిగా తన పాత్రను మలుచుకుంది.
ఓదార్పుని పొందింది. ముందున్న సవాళ్లను స్వీకరించింది.
అద్వైత్ ఉద్యోగం ఊడిపోయింది. జైలు శిక్షపడింది. ఉద్యోగం చేస్తున్న భార్యపై మేన్ టేనెన్సు కేసు వేశాడు అద్వైత్.
శారద నవ్వుకుంది. ఆ రెండో భార్య ఏమైందో తెలియదు. అద్వైత్ గర్వం అణిగి పోయిన దుకు విజయగర్వంతో నీహారికను బిగ్గరగా హత్తుకుంది.
అలా శారద ఒంటరి ప్రయాణంలో మరో మూడేళ్లు గడిచాయి. ఎన్నో అనుభవాలు పోరాటాలు. ఎందరో మద్దతు నిలిచారు.
ఒంటరి పోరాటంలో కన్నీరు కార్చింది. ఏకైక కూతురు శారద కంట కన్నీరు చూడ లేకపోయారు… కన్న పేగు కదిలింది. కడుపులో దాచుకున్నారు. అత్తామామలకు మనవరాలంటే ప్రేమ. ఎన్నాళ్లకు తమ ఇంట్లో మళ్లీ పసిపిల్ల కేరింతలు. ఆ పసి నవ్వులకు మురిసిపోయారు. కొడుకే చెడిపోయాడు. కోడలు మంచిది అని తెలుస్తూనే ఉంది. మాకు పెళ్లే కాలేదన్న కొడుకు వాదన విన్నాక వీడు తమ కడుపున చెడ పుట్టాడని బాధ పడ్డారు. కోడలు మనవరాలు తమ తో ఉంటే ఎంత సౌఖ్యంగా ఆనందంగా వుండేదో అనుకున్నారు. అలా కలిసి పోయారు. ఇపుడు వాల్లందరికి గారాల మనవరాలంటే ప్రాణం. మనవరాలు ఆటపాటలతో అన్ని మరిచి పోయారు. బయట సంఘర్శన. ఇంట్లో ఆనందం.
ఈ కొత్త జీవితం లో అనేక విషయాలు తెల్సుకుంది శారద.. ఇపుడు జైల్లో వున్న అద్వైత్ ఉద్యోగం పోయి శారద మీద మీద వేసిన మనోవర్తి కేసు
కేసు వాసుతీసుకుంటానన్నాడని అతని అడ్వకేటు తో కబురు పెట్టింది గుర్తుకు వచ్చి నవ్వుకుంది శారద. ఇపుడు తనకేమైందని అతనిని ఆహ్వానించడం?
అతని లోని మార్పుతో తనకేమీ సంబంధం లేదు.
ఇపుడీ సింగిల్ పేరెంట్ జీవితమే బాగుంది. అపుడు కులాంతరాల పేరిట దూరమైన అమ్మా నాన్నా అత్తమ్మా మామయ్యా అంతా నాతోనే వున్నారు.
ఈ ఉమ్మడి కుటుంబమే బాగుంది. అతడు మల్లీ తన జీవితంలోకి ప్రవేశించడం దేనికి? తన అడ్వకేటుకు అదేమాట చెప్పింది. ఆ మాట చెప్పాక తనకెంతో బరువు దిగిపోయినట్టు ఉత్సాహం.. శారద మునుపటి శారద కాదు.
ఎన్నో అనుభవాలతో ఎదిగిపోయింది. వదిలేసిన వాడి జీవితమే వాడిపోయింది.
శారద తన జీవితాన్ని తిరగ రాసుకుంది.
స్కూటర్ పై సాన్వి స్కూల్‌లో దింపి నవ్వుతూ టాటా చెప్పి యధావిధిగా డ్యూటీకి స్కూటర్ స్టార్ట్ చేసి బయల్దేరింది శారద.

July 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us