మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ

by Y. Sujatha July 31, 2023
written by Y. Sujatha


           నా ఒడిలో పెరిగి చక్కని విద్యాబుద్ధులు నేర్చుకుని నన్ను నిర్దాక్షిణ్యంగా వదలి పై చదువులకనీ వలసవెళ్ళిపోతున్నారు పిల్లలు. విదేశీ వ్యామోహంతో స్టేటస్ కోసమని ఉద్యోగాల పేరుతో మరెంతో మంది వెళ్ళిపోతున్నారు. రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయినట్లు వెళ్ళిపోతున్నారులే అనుకుని సరిపెట్టుకున్నాను. కానీ ఈ తల్లిని విడిచి వార్ధక్యం మీద పడి ముక్కుతూ మూలుగుతూ కాలక్షేపం చేస్తున్న వృద్ధమాతవు, నువ్వు ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు… ఏం బావుకుందామని! పిల్లలని వదిలి ఉండలేక అంటావా! వట్టిపోయిన గోమాత లాగ మరి ఈ తల్లిని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా, బేలగా అడుగుతోంది భారతమాత.
        తూలి ముందుకు పడబోయి నిలదొక్కుకుంది శాంతమ్మ. “పలుగు, పార పట్టుకుని తవ్వే పురుషుడు పడ్డప్పుడు, ‘ఆ బాగా పడ్డావులే’ అంటుందట… అదే ఆలికి ముగ్గువేసే ఆడది పడితే, ‘అయ్యో బిడ్డ పడ్డవా’ అంటుందట ఆ భూమాత”. అత్తగారు కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి శాంతమ్మకు. లేస్తూనే మంచం దిగుతూ భూమి మీద పాదం మోపుతూ, ‘తల్లీ భూమాత నన్ను క్షమించు తల్లీ’ అని భూమాతకు నమస్కరించాలట. అలా చేస్తే ఆ భూమాతనే కాపాడుతుందట. తను ఎన్నిసార్లు పడిందో, ఆ తల్లి కాపాడుతోంది. మెల్లగా కూర్చుండిపోయింది. అలసిన ప్రాణం సేద తీర్చుకోవాలనుకుంటే ఇక్కడ నీకు నేను ఉన్నాను. మరి ఆ పరాయి దేశంలో… భూమాత ప్రశ్నిస్తున్నట్లు ఉంది.
      శాంతమ్మ కళ్ళు వర్షిస్తున్నాయి. ‘నిజంగా భూమాత నిన్ను పలకరించిందా… అంతా నీ ఊహ’ అని, తల్లి వంగి నమస్కరిస్తుంటే చూసి పెద్దకూతురు పారిజాతం వెక్కిరించింది చాలాసార్లు తల్లిని.
      పుట్టిన ఊరుని కన్నతల్లిని, పెట్టిన చేతిని, చేసిన మేలుని మరిచిపోకూడదట. కాని ఇప్పుడు అందరూ చేసేది అదే. చివరికి తను అదే చేస్తుంది. కన్నీళ్ళు ఆగనంటున్నాయి. “అంబవైనా నీవేనమ్మా భారతాంబ… జగదాంబవైనా నీవేనమ్మా భారతాంబ… రత్నగర్భీనానీ పేరు గాంచితివమ్మా. నేడు రాళ్ళను కన్నావమ్మా భారతాంబ..”. అన్న పాటని నిజం చేస్తుంది ఇప్పటి యువతరం పోకడ.
     ‘అమ్మా… అలా దిగులుగా కూర్చున్నావెందుకమ్మా! నేను నీ కన్న కొడుకునే కదమ్మా… వచ్చేది నా దగ్గరికేగా… అలా దిగులుపడకమ్మా! ఏదైనా మొదట్లో అదోలా అనిపిస్తుంది. తర్వాత అదే అలవాటవుతుంది. నాన్న పోయాక ఒంటరిగా నీవు ఎలా ఉంటున్నావో అని నాకు బెంగగా ఉందమ్మా! నాన్న పోయి సంవత్సరం అయినాక వస్తానన్నావు కదమ్మా. అన్ని తంతులు జరిగిపోయినాక కూడా ఎందుకమ్మా… నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళితే నలుగురు నానారకాలుగా అనుకోవటం ఏమోగాని నిన్ను విడిచి వెళ్ళి ఏదో అపరాధభావంతో నేను బ్రతకలేనమ్మా… నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామమ్మా! నన్ను నమ్మమ్మా…’ అన్నాడు వినయ్, తల్లి భుజం మీద చేయి వేస్తూ అనునయంగా.
       ‘దిగులు ఎందుకు ఉండదు! అన్నీ వదిలి దేశంగాని దేశంలో నీవు ఎంత మంచిగా చూసుకున్నా బంగారు పంజరంలో చిలుక బ్రతుకులాగే ఉంటుందిరా ఈ వయస్సులో… రావడం అవసరం అంటావా! ఈ జీవిత చరమాంకం ఇక్కడే గడిపేయాలని ఉందిరా’ గొంతు పెగలక గుండెల్ని దాటిన ఆ మాటలు పెగుల్చుకుని వచ్చాయి.
       ‘సరేలే సంతోషంగా ఉండు, ఇంకా టైం సరిపోదు. అన్నీ సర్దుకోవాలి. నీ మెడికల్ ఫైలుతో సహా ఏది మరిచిపోయినా కష్టమే. నీ గురించి అందరూ వస్తుంటారు, ఆ హడావుడితో సరిపోతుంది. కొన్నికొన్ని మనసుకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాలంతో పరుగు తీయక తప్పదమ్మా… ఇప్పుడే వస్తాను’ అంటూ బయటకు వెళ్ళిపోయాడు వినయ్.
       మౌనంగా లేచి వాకిలి తుడిచి, తులసికోట కడిగి, ముగ్గు పెట్టుతుంటే చెయ్యి ఒణికింది శాంతమ్మకు. రేపటి నుండి నా ఆలనా పాలనా ఎవరు చూస్తారు! నన్ను వదిలి నువ్వు వెళ్ళినా, నిన్ను నేను ఎలా మరిచిపోతాను! ఆలనాపాలనా లేక నీమీద బెంగతో వాడి కృశించి పోతాను సుమా! అంటూ పుష్పవిలాపంలోని పూలమొక్కలా దీనంగా అంటోంది తులసికోటలోని తులసి మొక్క ‘ఈ అశక్తురాలిని క్షమించు తల్లి’ అంటూ కన్నీళ్ళతో చేతులు జోడించింది శాంతమ్మ.
      ‘వసుధ భర్త పోయాడట. మన ఇంట్లో పెరిగిన పిల్ల ఒక్కసారి చూసి వస్తాను రా’ దు:ఖం ఆగలేదు శాంతమ్మకు.
    ‘సరే, త్వరగా వచ్చేయమ్మా… నాకు మాత్రం పంపాలని లేదు. ఈ సమయంలో… సరే వెళ్ళిరా…’ విసుగ్గానే అనేసి వెళ్ళిపోయాడు వినయ్.  జనం ఏడుస్తున్నారు. వసుధ భర్త మంచితనాన్ని చెప్పుకుంటూ కంటతడి పెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. ‘అమెరికాకు వెళ్తున్నావటగదా! నీకెందుకమ్మా, ‘కృష్ణా రామా’ అని కాలక్షేపం చేసుకోక మరీ చోద్యం కాకపోతే’ బుగ్గలు నొక్కుకుంటూ అడుగుతోంది పక్కింటి పార్వతమ్మ.
 
        ‘భారతదేశం పుణ్యభూమి అంటారు. ఈ పుణ్యభూమిలో కలిసిపోతే పునర్జన్మ ఉండదని విదేశీయులు సైతం మన కాశిలో కలిసిపోవడానికి వస్తారు. నువ్వేమిటమ్మా అక్కడ తనువు చాలించాలంటూ వెళ్తున్నావు. అక్కడ నీకు ఏమన్నా అయితే, దిక్కు దివాణం ఉండదు. నీకోసం ఏడ్చేవాళ్ళు కూడా ఉండరు, నీ పిల్లలు తప్ప. అక్కడ ఏదో కరెంటు కుర్చీలో కూర్చోబెడతారట. క్షణంలో బూడిదేనట. ఇన్ని ఏళ్ళు ఇక్కడ బతికి ఏం లాభం… ఇంత బతుకు బతికి ఇంటెనుక చచ్చినట్లు ఏం కర్మ! చెప్పు తప్పుగా తీసుకోకమ్మా, నాకు తోచింది చెప్పానమ్మా!’ లెంపలు వేసుకుంటూ మరొకరు.
      ‘అంటే ఇదేనా నిన్ను ఆఖరిసారిగా చూడటం, ఇంకా నిన్ను చూడమా…’. అక్క అంది. అలివేలు ఆ కళ్ళలో సన్నటి నీటిపొరా, అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా పెదాలని నవ్వుని అతికించుకుని చెప్పింది శాంతమ్మ. శాంతమ్మ మనసు ఎంత వర్తమాన కాలాల్లో ఆలోచించుకున్నా గతంలోకే పరుగుతీస్తుంది. ఉన్న బంగారం అంతా అమ్మి లోను పెట్టి, పార్ట్ టైం చేసి రాత్రి పగళ్ళు కష్టపడి ఈ ఇంటిని కొన్నాడు రఘురామయ్య. తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిముందు కొబ్బరి, అరటి ఎన్నో రకాల పూలచెట్లు, ఇంటివెనక పనస, మామిడి, జామ, సపోటా, నారింజ చెట్లను పెంచాడు. ఏ కాస్త తీరిక దొరికినా వారికి ఆ చెట్ల మధ్య కాలక్షేపం, వెలుగురేకులు విచ్చుకోక ముందే లేచి ఆ చెట్ల కింద నులక మంచం వేసుకుని కూర్చునేవాడు.
    ‘ఇంత పొద్దున్నే ఎందుకండీ లేవడం, మంచు పడుతుంది.. అలా చెట్ల కింద కూర్చోకండి…’ విసుక్కునేది శాంతమ్మ.
    ‘ఆ పక్షుల కువకువలు, మామిడి చెట్ల మీదుగా వచ్చే సువాసనలు… ఆ గాలి కొబ్బరి చెట్ల ఆకుల నుండి జాలువారే మంచు బిందువులు… నీకు ఎలా చెబితే అర్థం అవుతుంది!’ అనేవాడు.
     ‘నిజమే నాకు అర్థం కాదు. ఈ పిల్లలతో ఈ చాకిరీ నాకు సరిపోతుంది.నాకు అంత తీరిక లేదు’ విసురుగా వెళ్ళిపోయేది శాంతమ్మ.
    ‘శాంతా… నేను లేని ఈ రెండురోజులు మొక్కలకి నీళ్ళు పోయలేవు… చూడు ఈ మొక్కలు ఎంత అల్లాడిపోతున్నాయో… మొక్కలని పెంచడం కష్టం కాదు. వాటి గొంతులో గుక్కెడు నీళ్ళు పోస్తూ వాటి ఆలనాపాలన చూస్తే అవి రేపు నీకు ఎంతటి ఫలితాన్నిస్తాయో తెలుసా… కన్నపిల్లలైనా రేపు మనల్ని సరిగ్గా చూస్తారో చూడరో కాని ఈ మొక్క అలా కాదు. నీడ నిచ్చి సేద తీరుస్తాయి. ఆకలిని తీరుస్తాయి. వాటిపట్ల ఇక ముందైనా శ్రద్ధ చూపు’… మొక్కలకి నీళ్ళు పోస్తూ మందలించాడు. నొచ్చుకుంది. భర్త మందలించినందుకు కాదు. గుక్కెడు నీళ్ళు పోయనందుకు, ఎంతో అపరాధభావంతో, మామిడి, పనస ఏపుగా పెరిగాయి. ఫలవంతమైన ఆ చెట్లని చూస్తుంటే ఆ కళ్ళల్లో ఎంత ఆనందం. కొబ్బరి కూడా విరగ కాచేది. అలా ఏళ్ళు గడిచాయి. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి. వాస్తు బాగ లేదు వెనకాలా మెట్లు మార్చాలంటే పనస చెట్లని, మామిడి చెట్లని కొట్టేయాలని పట్టుబట్టారు ఇద్దరు మగపిల్లలు శ్రీను, వేణు.
    ‘శాంతా ఈ పిల్లలని చూడు ఇవాళ మనకే ఎదురు తిరిగారు. నా ప్రాణంలో ప్రాణమైనది కొట్టేస్తే నేను… నేను బతుకలేను… రఘురామయ్య కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
     ‘ముగ్గురు పిల్లలు చాలంటే’ భర్త ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది ఆనాడు.
      ‘శాంతా నారు పోసినవాడు… నీరు పోయకమానడు. పిల్లపిల్లకే ఆదాయం పెరుగుతుంది. ఆ మాట ఇంకా అనకు’ అన్నాడు. ఫలభరితమైన చెట్లని చూపిస్తూ నవ్వుతూ ‘చూడు అవి నీలా ఆలోచించాయా’ అని.
        కాని తన ఆలోచనా విధానమే తప్పని ఆలస్యంగా తెలుసుకున్నాడు. అధిక సంతానం దుఃఖానికి హేతువు. శ్రీను, వేణు, వినయ్ ముగ్గురు మగపిల్లల తర్వాత పారిజాత, సరిత, శోభ ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఉన్నదంతా ఖర్చుపెట్టి ఆడపిల్లల, మగపిల్లల చదువులు, పెళ్ళిళ్ళు చేశాడు. ఆరుగురు ఆరు తరహాలు. గతం చెదిరింది. భర్తని ఎలా అనునయించాలో తెలియక మౌనంగా అతడి తల నిమురుతూనే ఉండిపోయింది. తను మాత్రం ఏమి చేయగలదు. తండ్రిని కాదన్న పిల్లలు తల్లి మాట వింటారా! తనకీ బాధగానే ఉంది. ఫలభరితమైన ఆ చెట్లు లేనిచోటు ఊహించుకోలేకపోయింది.ఏడాది తిరగకుండానే రఘురామయ్య కన్ను మూశాడు. ఆ మామిడి చెట్టు, ఆ పనస చెట్టు లేదు. ఆ యజనమాని లేడు. కాని, ఆ జ్ఞాపకాలు నీడలా వెంటాడుతూనే ఉంటాయి.
     ‘అమ్మా’ అనగానే గతంలోంచి ఈ లోకంలోకి వచ్చి చేరింది శాంతమ్మ. చివరి ప్రయత్నంగా ‘నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటానురా… ఆడపిల్లలు వచ్చి చూసి వెళ్తారు అప్పుడప్పుడు. నేను నీతో రాలేనురా… పెదవి దాటనీ ఆ మాటలని కంఠం నొక్కేసింది. ‘అమ్మా నువ్వు నాతోనే ఉంటావు. ఇంకేదో చెప్పాలని చూడకు నిన్ను నేను ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇంకేమీ ఆలోచించకు మరోసారి చెప్పాడు వినయ్. శ్రీను ఎప్పుడో వెళ్ళిపోయాడు. విదేశాలకి. వేణు వెళ్లేది మరో దేశమట. చాలా దూరమట. మనుష్యులకి కాని, దూరభారాలు మనసులకు కాదుగా. అలాంటప్పుడు మమతానురాగాలు పంచుకోవడానికేం… ఎందుకింత పట్టుదలలు, పంతాలు… ఒకరి వెనుక ఒకరు విమర్శలు, వేళాకోలాలు. రక్తసంబంధీకులేనా వీళ్లు?… అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు అని పిలుపులు లేవు. అదిగో పెద్దాడి నుండి వచ్చింది. పెద్దవాడు వచ్చాడు. చిన్నది, చిన్నోడు వచ్చారు. ఇదేనా రక్త సంబంధం. అనుబంధం ఆత్మీయతా ఏవి లేవా…
       నా భర్త, నా భార్య, నా పిల్లలు ఇంతేనా కుటుంబం అంటే. ఎవరింటికీ ఎవరు వెళ్ళరు. పిల్లల్ని కదలనివ్వరు. ఎంతసేపు చదువు, పరీక్షలు, ఇతర వ్యాపారాలు ఇదేనా వీళ్ళనుండి ఆశించేది. ఆయన ఉన్నప్పుడు దీపావళి వస్తే ఎంతో సందడిగా ఉండేది. అందరూ ఎక్కడున్నా రావలసిందే… అందరికీ సరిపడా అరిసెలు దగ్గరుండి మరీ చేయించేవారు. నవ్వులతో, కేరింతలతో ఎలా ఉండేది ఇల్లు. ఇప్పుడు… ఈ పిల్లల కోసమా తను బాధపడేది… గుండె బరువెక్కింది.
    ‘అమ్మా… ఏం చేస్తున్నావు?’ హడావుడిగా వచ్చారు పిల్లలు.
     ‘ఇండియా ఈజ్ మై కంట్రీ… ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ మూడేళ్ళు నిండని మనవరాలు త్రైలోక్య ముద్దుముద్దుగా చెపుతుంది. అందరూ నవ్వుతున్నారు దాని ముద్దుమాటలకు. తల్లి వనజ బంగారు కన్నమ్మ అని ఎత్తుకుని ముద్దులాడింది. ఆ పదం అర్థం తెలియదు ఆ తల్లిదండ్రులకి. ఒక కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళల్లో వాళ్ళకే బ్రదర్స్, సిస్టర్స్ అనే మమతానురాగాలు లేవు. ఇంకా దేశంలోని ఆల్ ఇండియన్స్ అంతా బ్రదర్స్, సిస్టర్స్ ఆహా… శాంతమ్మ పెదాల మీద నవ్వు వచ్చింది. ఆడపిల్లలు అమ్మను పట్టుకుని ‘అమ్మా… బెంగగా ఉందే’ అని కంట తడిపెట్టారు.
        ‘జాగ్రత్తగా ఉండండీ. డబ్బుతో కొనలేనిది ప్రేమ ఆప్యాయతలు. రక్తసంబంధాన్ని మించింది ఏదీ లేదు. ప్రేమానురాగాలను మరిచి ఏదో కావాలని, లేని దేనికోసమో పరిగెట్టాలని ప్రయత్నించకండి. పట్టుదలలు, పంతాలు మాని అహంకారాన్ని వదిలి ఆరుగురూ ఒకటిగా బ్రతకండి. ఇదే తల్లిగా నేను మీ నుండి కోరే కోరిక.. పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త… అంటూ మెల్లిగా లేచి తులసి కోట దగ్గరికి వెళ్ళి మెల్లిగా చెట్లని నిమిరింది. తులసి చెట్టు వాడింది ఎందుకో… వెళ్ళొస్తా తల్లీ… కాదు నేను వెడుతున్నానమ్మా… కన్నీరు ఇప్పుడు వచ్చింది. కొబ్బరి, సన్నజాజి, పారిజాతాలు, గులాబీలు మౌనంగా తమ విషాదాన్ని తెలుపుతూ వీడ్కోలు చెబుతున్నాయి. ఇన్నేళ్ళు మీతో కలిసి బతికాను, మీకు చేసిన సేవ తక్కువే, ప్రతిఫలం మాత్రం ఎక్కువే పొందాను. మీ ఆలనా, పాలనా రేపటి నుండి ఆ దేవుడు చూడాలి. ఆ వానదేవుడే కరుణించాలి. కన్నీటి మధ్య ఆకాశం వైపు చూస్తూ నమస్కరించింది.
 
        ఎంతోమంది వచ్చారు. ఇదే ఆఖరి వీడ్కోలు అన్నట్టుగా ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. తల్లిగా ఒదిలి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇలా వృద్ధాప్యంలో కూడా మీరు వెళ్ళిపోయి నన్ను బాధప్టెటం ఏం న్యాయం.. నేను భరించగలనా! కసాయివాడిని నమ్మి తన లేగదూడను విడిచి పోతున్నట్లుగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. భారతమాత. తన లేగదూడతో పాటు తాను కూడా బ్రిటిష్ వాడికి బానిసలా ఊడిగం చేయడానికి పోతున్నట్లు మనసులో మూగగా రోదిస్తుంది. శాంతమ్మ భూదేవికి వంగి నమస్కరించి ‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అని మనస్సులో పదే పదే వల్లిస్తూ కారు ఎక్కింది బరువైన గుండెతో, అయిపోయింది. ఈ ఇంటికీ, ఈ ఊరికీ, ఈ దేశానికీ, తనకీ ఋణం తీరిపోయింది. ఆ ఊహ గుండెల్ని పిండేస్తుంది. రేపటి రోజు గురించి ఆలోచించలేక కళ్ళు మూసుకుంది.
     ఎయిర్పోర్ట్ చేరారు అంతా. అంతా ఏడుస్తున్నారు. శాంతమ్మ వాళ్ళనెవరినీ చూడడం లేదు. ఆకాశంవైపు, భూమివైపు మార్చిమార్చి చూసి లోపలికి వెళ్ళిపోయింది కొడుకును అనుసరిస్తూ. అంతా హడావుడిగా ఉంది. ఆవును వదిలిన లేగదూడలాగా ఇంకొద్దిసేపు అంటే ఈ దేశాన్ని ఒదిలి తను వెళ్ళిపోతుంది. మళ్ళీ తను తన మాతృభూమిని చూస్తుందో లేదో… అక్కడే కళ్ళు మూస్తుంది. తన కోసం కన్నీరు కార్చేవారుండరు. ఎవరు నాకు అన్నీ యధావిధిగా చేయరా… కరెంటు కుర్చీలో కూర్చోబెట్టి బూడిద… వద్దు… వద్దు… అరిచాననుకుంది.
           ‘అబ్బా…’ గుండెల్లో గునపంతో పొడిచినట్లు కలుక్కుమంది.
      ‘నాన్న నాన్నా నానమ్మ…’ త్రైలోక్య అరిచింది. వినయ్ తన సీటు వదిలి తల్లి దగ్గరికి వచ్చాడు కంగారుగా. పరిస్థితి అర్థమైనది తనెంత తప్పు చేసాడో…
      ఉరుకులతో, పరుగులతో శాంతమ్మను ఎయిర్పోర్టు లోకి తెచ్చారు. పిల్లలూ, వచ్చిన బంధువులూ ఎవరూ ఇంకా వెళ్ళలేదు. అందరూ శాంతమ్మని చుట్టుముట్టారు ఏడుస్తూ. అంత బాధలోనూ శాంతమ్మ “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి” అంటూ తేరిపారా తృప్తిగా చూసింది. ఆమె నవ్వుతున్నట్లు పెదవులపై నవ్వు మెరిసింది. తన తల్లి ఒడిలోనే తనువూ చాలిస్తున్నానన్నట్లుగా తృప్తిగా ఆ చూపులు చుట్టూ పరికించాయి. ఆకాశం వైపు, భూమి వైపు చూసింది.
        ‘ఎలా ఉందమ్మా, చెప్పు. నీకేం ఫర్వాలేదు!’ వినయ్ కన్నీటి మధ్య అన్నాడు.
 
 
       శాంతమ్మ పెదవుల మీద అదే చెరగని చిరునవ్వు. ప్రపంచాన్ని జయించినంత సంతోషం. తను తన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. భారతదేశము నా మాతృభూమి… ఆ పెదాలు కదులుతున్నాయి అతికష్టం మీద. ఇది చాలు నాకు. ఇంకేం అక్కర్లేదు అన్నట్లుగా తృప్తిగా చూసింది. అంతే… శ్వాస ఆగిపోయింది. ఎంత అదృష్టవంతురాలు శాంతమ్మ అనుకుంటున్నారు అంతా.
                           ………………………….

July 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అందమైన చిత్రాలు

by Nachiketa July 31, 2023
written by Nachiketa

చిత్రకారుడు – నచికేత

July 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జ్యో అచ్యుతానంద

by Suma Rangachari July 31, 2023
written by Suma Rangachari

వెంకటేశ్వర స్వామిని జోలపాడి నిదుర బుచ్చుతున్న అన్నమయ్య.

సీసమాలిక :-
భక్తుల తరియింప భగవంతుడేతాను
బాలుడై దిగివచ్చె బంటు జేర
కోనేటి రాయునిగోముగా ముద్దాడి
ఆర్తిగా లాలించె అన్నమయ్య
యేడుకొండలవాని యెత్తుకొనిమురియ
తన్మయత్వముపొందె తనివి తీర
బాలాజి రూపాన భక్తుడే కీర్తించ
ఆనందభరితుడై అవతరించె
శంకుచక్రములెల్ల శరములోలెనుగాక
ఆటబొమ్మగమారె అయ్యచేత
జోఅచ్యుతానంద జోతలే పాడగా
అలసటనుమరిచి ఆద మరిచె…

ఆటవెలది :-
ఆపదలనుబాపుఅలమేలు పతియేను
ఆడుకొనగవచ్చె నవనియందు
భాగవతములోని బాలకృష్ణునిరూపు
కన్నులారగాంచకనులునిండె

July 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రుబాయీలు

by Acharya Phanindra July 31, 2023
written by Acharya Phanindra

రుబాయీ అన్నది నాలుగు పంక్తులు గల కవిత. రుబ్ అంటే రసం లేక సారం అని అర్ధం. రుబాయీ అంటే రసవంతమైన కవిత అని భావించవచ్చు. ఈ రుబాయీ అన్నది ముందుగా “పర్షియన్” భాషా సాహిత్య ప్రక్రియ. “రుబాయీ” అనేది అరబిక్ పదం. ఈ రుబాయీలను సాధారణంగా, దేని కదే సంపూర్ణ భావంతో, “ముక్తక కవితలు”గా వ్రాస్తుంటారు. ఇది మాత్రా ఛందస్సులో సాగే ప్రక్రియ. ఇందులో – 1,2,4 పాదాల చివరి పదాన్ని “రదీఫ్” అంటారు. రదీఫ్ కంటే ముందు ఉండే పదాన్ని “కాఫీయా” అంటారు. మొదటి పాదంలో ఏ పదం రధీఫ్ గా ఉంటే రెండవ, నాల్గవ పాదాలలో అదే పదం రదీఫ్ గా వస్తుంది. కాఫీయా అంటే అంత్యప్రాస లాంటిది. మూడవ పాదానికి రదీఫ్, కాఫియాలు ఉండనవసరం లేదు. తెలుగులో కొందరు రదీఫ్ అంటే అదే పదాన్ని వాడకుండా, అదే రకమైన ప్రాసతో కూడిన పదాలు వేస్తూ రుబాయీలను రచించారు. ఇక అక్కడ కొందరు వేరుగా కాఫియాను ప్రయోగించని సందర్భాలు కూడ ఉన్నాయి.

ఈ రుబాయీలలో అన్ని పాదాలకు సమమైన మాత్రలు ఉండాలె. ఏదో ఒక లయలో కొనసాగడం అవసరం. ప్రతి పాదానికి ఒక స్వతంత్ర అస్తిత్వం చూపుతూ, నాలుగు పాదాలకు కలిపి ఒక విశిష్టమైన అస్తిత్వాన్ని సాధించాలె. మొదటి రెండు పాదాలు రుబాయీ కవితలో భూమికగా నిలుస్తాయి. మూడవ పాదం ఆ కవితా వేదికను సుస్థిరం చేసి, నాల్గవ పాదంలో ఒక తుది మెరుపును మెరిపించడం ద్వారా ఆ రుబాయీ శ్రోతల గుండెలకు హత్తుకొంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రుబాయీ అన్నది క్లుప్తీకరించిన “గజల్” ప్రక్రియ లాంటిది.

పార్సీ భాషలో ఈ రుబాయీలకు ఆద్యుడు ఉమర్ ఖయాం. ఆ తరువాత పార్సీ, ఉరుదూ భాషలలో ఎందరో కవులు అసంఖ్యాకమైన రుబాయీలను రచించి ఈ ప్రక్రియకు ప్రఖ్యాతిని కొని తెచ్చారు. 

తెలుగు భాషలో ఈ ప్రక్రియను మనకు పరిచయం చేసింది మహాకవి డా. దాశరథి గారు. ఆయన రచించిన కొన్ని రుబాయీలను పరిశీలిద్దాం …

పడవ నడపలేని వాడు నావికుడు –
పాట పాడలేనివాడు గాయకుడు –
అందుకనే వేదనతో నేనంటాను …
ప్రజల నడపలేనివాడు నాయకుడు!

డా. దాశరథి

నింగిని కితాబుగా చేశాను –
చుక్కల హిసాబులు వేశాను –
ప్రేయసి కోసం వేచీవేచీ,
మంచం కన్నీటితో తడిపేశాను!

డా. దాశరథి

నవ బాష్ప ధారలో నవ్వు కాగలవు!
ముళ్ళ తీగెలలోన పువ్వు కాగలవు!
యత్నించి చూడమని అంటాను నేను –
రాళ్ళ రాసులలోన రవ్వ కాగలవు!

డా. దాశరథి

నిన్నటి ధర రెండింతలు పెరిగింది నేటి ఉదయం!
మొన్నటి ధర మూడింతలు పెరిగింది సాయంత్రం!
అన్నింటి ధర పెరిగినా నేనంటాను …
ధర పెరుగని సరుకొకటే – మానవ ప్రాణం!!      

డా. దాశరథి

కోటి నదులు పోలలేవు ఒక్క సింధువుని!
కోటి తారలు పోలలేవు లోక బాంధవుని!
అందుకనే గళం విప్పి నేనంటాను –
కోటి నేతలు పోలలేరు ఒక్క గాంధీని!

డా. దాశరథి

ఉత్తరాన గల హిమాచలం
దక్షిణాన గల జలధి జలం
మన అందరిదీ అని నేనంటాను!
ఐకమత్యమే గద మనకు బలం!

డా. దాశరథి

రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్?
బుర్రలు బుర్రలు పగులక లేదా సమస్యకు సొల్యూషన్?
హింసా యుద్ధం ఔట్ డేటెడ్ అని నేనంటాను –
శాంతి ఒక్కటే మానవజాతికి సాల్వేషన్!

డా. దాశరథి

ఈ విధంగా తొలితరంలో .. తెలుగు రుబాయీలలో … దాశరథి గారు గానీ, తరువాతి తెలుగు కవులు కూడ కొందరు భావానికి, మౌలిక రూపానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, అంత్య ప్రాసలను మాత్రం పాటిస్తూ, రదీఫ్, కాఫియా విషయంలో కొంత సడలింపులను చేసి, అక్కడక్కడా కొంత స్వతంత్రతను చాటారు. 

ఇప్పుడు .. మరి కొందరు ప్రముఖులు తెలుగులో వ్రాసిన రుబాయీలను చూద్దాం.
……..

చిత్రశాల చూశారా చిందులేయు మనసు
మధుశాల చూశారా మత్తెక్కును మనసు
భావి పౌరులకు జ్ఞానామృతాన్ని పోసేటి
పాఠశాల చూశారా పారిపోవు మనసు!!   
   – డా.తిరుమల శ్రీనివాసాచార్యులు

ఆకాశం ఎత్తెంతో కనుక్కో!
భూగోళం వ్యాసమెంతో కనుక్కో!
పాతాళం లోతెంతో కనుక్కో!
తెలియదా? పుస్తకాలు కొనుక్కో!
    – డా.తిరుమల శ్రీనివాసాచార్యులు

ఎవరి తోట అయితేనేం – పూలింట్లో పడితే సరి!
ఎవరి గ్రంథమైతేనేం – మన గూట్లో పడితే సరి!
బడి ఎవ్వడు కడితేనేం – గుడి ఎవ్వడు కడితేనేం –
మన బుడుతని తెలివి పెంచి, చదివి బాగుపడితే సరి!
      – డా.తిరుమల శ్రీనివాసాచార్యులు

…….//……….//……

వాకపల్లి ఘోరానికి సిగ్గే లేదు
దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు
జాతికింత అవమానం జరుగుతు ఉన్నా
జనంలో రగులుతున్న అగ్గే లేదు!!
   – శ్రీ ఎండ్లూరి సుధాకర్

ఆడవాళ్ళ చట్టాలను కాపాడాలి!
ఇరుగు పొరుగు వారికొరకు పోరాడాలి!
దెబ్బతినే దేశమాత దేహం చూసి –
దేవుడైన ఆమె వైపు నిలబడాలి!
     – శ్రీ ఎండ్లూరి సుధాకర్

రాతి దేవుళ్ళకు నమస్కరిస్తాడు!
బాబాలను బహుగా సత్కరిస్తాడు!
యాచకులెవరైనా ‘అయ్యా’ అంటే –
ఛీ పొమ్మని ఆ భక్తుడు ఛీత్కరిస్తాడు!
      – శ్రీ ఎండ్లూరి సుధాకర్

ఆమె మొదట్లో ఒక పువ్వనుకున్నాను!
ఏమీ తెలియని గూటి గువ్వనుకున్నాను!
మైకు ముందు నిలబడ్డాకే తెలిసింది –
ఆమె నిజంగా ఒక నిప్పు రవ్వనుకున్నాను!
       – శ్రీ ఎండ్లూరి సుధాకర్

……//…………..//………//…….

శిలలు ఒరుసుకుంటే అగ్నికణం పుడుతుంది!
చెట్లు ఒరుసుకుంటే దావానలం పుడుతుంది!
రాపిడి లేకుండా ఏ చైతన్యం ఉండదు కద –
గుండె పగిలితే, వెంటాడే వాక్యం పుడుతుంది!
        – పెన్నా శివరామ కృష్ణ

కనిపించే గాయమైతె తడమకనే తెలిసేది!
లోలోపలి వేదన ఒక తలగడకే తెలిసేది!
అవ్యక్తపు ఆర్తులన్ని కడదాకా అనాథలే!
సాంధ్యఘోష అంతా ఒక పడమరకే తెలిసేది!
        – శ్రీ పెన్నా శివరామ కృష్ణ

………//………….//……….//………..

మాటల్లో మాధుర్యం గుర్తు పట్టవచ్చు
రాతల్లో సుకుమారం గుర్తు పట్టవచ్చు
మనసులోని అందాలకు కొలమానం లేదు
సహజమైన సౌందర్యం గుర్తుపట్టవచ్చు

   – శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి

వచనం ఎక్కువైతే కవితా తగ్గుతుంది!
భాష్యం ఎక్కువైతే భావనా తగ్గుతుంది! మొక్కకు నీరుండాలి; ముంచేట్టుగా కాదు – సంపదలెక్కువైతే ప్రేమా తగ్గుతుంది!
    – శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి

రుబాయీలు రాయడమొక మజాకు కాదు! రదీఫూను కాఫియాను అల్లుడు కాదు! పట్టరాని చేపపిల్లలంటి ఊహలు  
మాత్రల్లో పరుగు తీయ సడాకు కాదు!
       – శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి
 
ఇక నేను రచించిన కొన్ని రుబాయీలను కూడ మీ ముందుంచి, ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

         రుబాయి రసోయి
        ~~~~
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
“””””””””””””””””””””””””””””””

కవితా హృదయం ఒక రసోయి –
కమ్మని కవితలు వండేందుకు కదోయి!
రకరకాల కవితల వంటకాలలో
మరో మధుర వంటకం – రుబాయి! 1

ఉమర్ ఖయాం, మహ్మద్ ఇక్బాల్ ఉరుదూలో –
ప్రసిద్ధులే కదా “రుబాయి” ఘనతలో!
ఆద్యుడైన రుబాయిల “దాశరథి” –
మార్గదర్శి మా కెపుడు తెలుగులో! 2

భావంలో తలపించు గోవర్ధనం!
పలుకులలో పరిమళించు సరళ గుణం!
వినిపిస్తే కమ్మని ఆ రుబాయి –
తలలూపేరు కద మహాజనం! 3

తెలుగున నీ జనకుడై, రుబాయి!
కదిలించెను “దాశరథి”యె తన చేయి!
ఆ పై పోషించి, పెంచి నీ కాయె –
“తిరుమల శ్రీనివాసాచార్య” బాబాయి! 4

పాలు, తేనె మిశ్రమం రుచి చూడు –
పూలలోని మకరందం రుచి చూడు –
ఇవి అన్నీ తోడైన రుబాయిలో ..
తెలుగు భాష మాధుర్యం రుచి చూడు! 5 #

July 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఓ తండ్రి తీర్పు

by mayuukha July 30, 2023
written by mayuukha

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే తనను తాను నిర్లక్ష్యం చేసుకున్నట్టే ఈ సత్యాన్ని గ్రహించక చాలా మంది విచిత్రం గా ప్రవర్తిస్తారు. కాల చక్రం గిర్రున తిరిగి మళ్లీ వీళ్ళ దగ్గరికే వస్తుందని గ్రహించరా? కాదు అన్నీ తెలుసు అయినా తెలివితక్కువ ఆలోచనలతో అట్లాగే చేస్తారు. ఏదైనా కోల్పోయిన తర్వాత విలువ తెలుస్తుంది. కన్నతండ్రి ని వదిలించుకున్నానుకున్న ఓ కొడుకు కు అతడు చేసిన అన్యాయం అతని వెంట పడ్తుందని అద్భుతంగా చిత్రీకరించారు చిటికెన కిరణ్ కుమార్. ఈ దుర్మార్గాన్ని తండ్రి సహించక ఛీ కొట్టినట్టు ఇచ్చిన తీర్పు పాఠకులను, ప్రేక్షకుల ను తప్పకుండా ఆలోచనలలో పడవేస్తుంది. ఎన్ని బాధలు పెట్టినా కన్నపాశం అంటూ తన సంతానానికే సేవలు చేయడం కన్నా అనాథలు అన్నార్తుల కు చేయూతనివ్వడం మంచిదని ఈ ” ఓ తండ్రి తీర్పు” చిటికెన కిరణ్ కుమార్ రచించిన కథ చెబుతుంది. ఈ కథను లఘు చిత్రం గా నిర్మించి బహుమతి ని కైవసం చేసుకున్న చిత్ర బృందానికి, చిటికెన కిరణ్ కుమార్ కూ అభినందనలు తెలియజేస్తున్నాను

-డాక్టర్ కొండపల్లి నీహారిణి, కవయిత్రి, రచయిత్రి
మయూఖ, తరుణి అంతర్జాల పత్రిక ల సంపాదకురాలు.

https://m.facebook.com/story.php?story_fbid=2499168466923796&id=100004920000278&mibextid=Nif5oz

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

విలువల మూట

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ July 30, 2023
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్

అడిగి అడిగి అలసిపోయాను

కాశీపుర వీధుల్లో తిరిగినట్లు

కాగితపు భిక్షా పాత్రతో

గడప గడపను గంగలా తాకి తీర్థమయ్యాను

ఐనా –

నా గొంతు తడారే వుంది

గుండె ఎడారై ఇసుక నదుల్ని

సాగనంపడానికి సిద్ధంగా ఉంది

భుజాన వేళ్లాడుతున్న ఖాళీ జోలె

బరువు విలువ ఏమిటో బోధిస్తోంది

కొన్ని యోజనాల పొడవు నా గమ్యం

తెలియని దారుల్లో అడుక్కుంటూ, వెతుక్కుంటూ-

ప్రతి సింహద్వారం ఎదురగా నిలుచొని

గడప మీద విసుగ్గా విసిరేసిన అనుభవాలను ఏరుకుంటూ –

దారి మధ్యలో –

గడ్డకట్టిన మాటల చిత్తు కాగితాలను పోగేసుకుంటూ

ఛీత్కారాల గ్రీష్మంలో కాలిపోతున్న

మంచులో తడిసి ముద్దయిన ‘గొబ్బెమ్మ’ పొడపైన

విరిసే వసంతాలను ఎదపైకి ఎత్తుకుంటూ

నడచి నడచి అలసిపోయాను

ఫడేల్ మని మూసుకుంటున్న ద్వారాల వెనుక

కనబడిన ఖండిత దృశ్యాలను

మూగబోయిన ముఖ ద్వారాల గొంతుల్లోంచి

జారిపడుతున్న కొన్ని మాటల రేణువులను

రిక్తమైన హృదయ కళశంలోకి వొంపుకున్నాను

బరువెక్కిన జోలెతో వెనక్కి తిరిగితె

ఈ ప్రపంచం వదిలి వెళ్లిన చోటే

నేనొక

విలువల మూటనయ్యాను.

July 30, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మేలుకో

by Rasheed July 30, 2023
written by Rasheed

పచ్చని నేలపై పశుత్వం
పెల్లుబికిన వేళ

భూగర్భ ఖనిజాలపై
దృష్టి పడిన వేళ

కన్నూ మిన్నూ కానకుండా,
స్త్రీలు పిల్లలు అని చూడకుండా,
దాడులు అత్యాచారాలు
జరిపిన వేళ

దుకాణాలు,
వాహనాలు,
ఇళ్ళు,కాల్చివేసి,
బూడిద చేసిన వేళ

దిగంబర స్త్రీపై
దాష్టీకం చేస్తున్నాడు క్రూరుడొకడు
బెల్టుతో బాదుతున్నాడు
నిర్దయతో వాడొకడు
నవ్విపోదురుగాక నాకేంటన్నట్టు
నడిబజార్ లో సిగ్గు లేని జనాలు
చోద్యం చూస్తున్నవేళ

కాళ్లొకచోట
చేతులొకచోట
తలొకచోట
మొండెమెుక చోట
తెగిపడిన వేళ
మణిపూర్ మాయలో పడిన వేళ

ప్రపంచంలో జరుగనటువంటి
హింస జరిగిన వేళ
ఈ కిరాతకానికి
హిట్లర్ సైతం సిగ్గుపడేవేళ

రెండు నెలలుగా
సోషల్ మీడియాను
చీకట్లో ఉంచిన వేళ

ఎంతోమంది తల్లుల
అక్కల చెల్లెళ్ళ
కూతుళ్ళ హాహాకారాలకు
ఆకాశం దద్దరిల్లిందేమో

దేవుని వద్ద దేర్ ఉంది
ఆయన వద్ద
అధేంర్ లేదు
దేవుడికి భయపడాలి మరి
అది మణిపూర్ కానీ
మరోటి కానీ
తప్పు చేసారంటే తలవంచాల్సిందే!

పిల్లి కళ్ళు మూసుకొని
పాలు తాగినంత మాత్రాన
ప్రపంచం చూడకుండా ఉంటుందా?

ఓ ప్రపంచమా మేలుకో
ఓభారతీయుడా మేలుకో

శాంతిని
సోదర భావాన్ని
ప్రేమాభిమానాలు
గల వాతావరణాన్ని
ఈ నేల కోరుతున్నది
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మన పూర్వీకుల చరిత్ర తప్పక తెలుసుకోవాలి

by రంగరాజు పద్మజ July 30, 2023
written by రంగరాజు పద్మజ

తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి ఉన్న స్థానం గురించి, పొన్ని దొర, కులమతాల ముద్దుపట్టి మలయప్ప సంస్కృత విద్వాంసుని గురించి, శివానందలహరి ప్రస్తావన మొదలైనవి చక్కగా తెలియజేశారు. మన తెలుగునాట శాస్త్ర సంబంధ పరిశోధనలు జరిగాయి అని చెప్పడం బాగుంది. జ్యోతిష్యం, వైద్యశాస్త్రం తెలుగు నేలపై ఎలా ఉండేది అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు రచించారు కరణం బాల సుబ్రమణ్యంపిళ్ళైగారు.
ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏనుగులను పట్టే విధానం, వాటికి శిక్షణ ఎలా ఇస్తారని, విలు విద్యా ప్రదర్శనం, యుద్ధతంత్రాలు, శిక్ష విధానాలు, సాతులూ,సంతలు, పన్నులు ,నాటక ప్రదర్శనలు, తోలు బొమ్మలాటలు, ఆలయనిర్మాణం, కోటల కట్టడం, ఊర్లో ఎట్లా ఏర్పడ్డాయి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు ఈ నవలలో…
ఈ నవలలో ఒక చోట వీరన్న బోయెడు వారసుడు ప్రయోజకుడు కాకపోవడంతో ఆయన మరణించిన తరువాత బోయ దొరసాని మంగసాని బోయలకు ఎలా నాయకత్వం వహించిందో? చక్కటి రాజనీతితో జయసింహడిని ఎలా ఎదుర్కొన్నదో ఆ సన్నివేశాన్ని చాలా చక్కగా వర్ణించి చిత్రీకరించారు. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది.

ఇందులో తిరుమల తిరుపతి గురించి చక్కగా వివరిస్తారు ఈ రచయిత. ఇందులో వకుళమాత ను అపరశక్తిగా చూపించారు. పరమ భక్తురాలు గాను చూపించారు.
మనం తెలుగు వాళ్ళం అయినందుకు మన పూర్వీకుల చరిత్ర తప్పక తెలుసుకోవాలి. మనం ఎంతో ఇష్టపడే పద్యం పుట్టుక కథాకమామిషు ఈ నవలలో చక్కగా వివరించారు. ఈ బోయ కొట్టం పండ్రెండు చారిత్రక నవల తప్పక చదవ తగిన పుస్తకం.
చాళుక్యరాజుల నాటి కథ కాబట్టి ఆనాటి సామాజిక విధానాన్ని, వారి అలవాట్లు, ఆనాటి వస్తువులు ఎలా ఉండేవని? ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి… విశదీకరిస్తే ఇంకా బాగుండేది.
నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటి అంటే? చాళుక్య, పల్లవ రాజుల కాలక్రమంతో పాటు క్రమణికను పోలుస్తూ రాయడం ఎంతో కష్టమైన విషయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు రచయిత.
గ్రాంధికభాషలో రచించిన ఈ బోయకొట్టములు పండ్రెండులో భాష, కల్పనలు, శైలి ఎంతో బాగున్నాయి.
ఇతిహాసంలో చీకటి కోణములోని అట్టడుగున పడి కాన్పింపని కథలు రాయగలిగే వాళ్ళు రావాలి. దానికి ప్రేరణగా రచయిత పిళ్ళైగారు నిలిచారు. అప్పుడే చరిత్రలో మరిన్ని అంశాలు రాబోయే తెలుసుకునే వీలు ఉంటుంది.
ఒక మంచి చారిత్రక నవల చదవడం మన పూర్వీకుల గురించి తెలుసుకోవడం, మన తెలుగు వీరుల వీరత్వాన్ని రచయిత కళ్ల ద్వారా మనం చూడగలగడం మహద్భాగ్యంగా భావిస్తూ…

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అదృశ్యం

by Dr. Varigonda Satya Surekha July 30, 2023
written by Dr. Varigonda Satya Surekha

పడక్కుర్చీలో దీర్ఘాలోచనలో మునిగిఉన్న నరసింహమూర్తికి భార్య అడుగులు చేతిలో మజ్జిగ గ్లాసుని, గడియారంలో తొమ్మిది గంటలని గుర్తు చేశాయి. ఇరవై ఏళ్ళుగా ఏ ఒక్క రోజు తప్పని దినచర్య. నర్సింహమూర్తి, తన నలభైవ ఏట నుండి రెండోపూట భోజనం మానేశారు. సాయం వేళల్లో ఏదైనా అల్పాహారం. రాత్రిపూట సరిగ్గా తొమ్మిదింటింకి గ్లాసుడు మజ్జిగ. ఇంట్లో ఉన్నంతసేపు గడియారం చూసుకునే అవసరం నర్సింహమూర్తికి ఏనాడు కలగలేదు.

సాయంత్రం ఐదున్నరకి ఇంటికి రాగానే బట్టలు మార్చుకుని ముందు గదిలో పడక్కుర్చీలో కూర్చుంటారు. అలా కూర్చున్న మూడు నిమిషాలలో చేతిలో పొగలుగక్కే కాఫీని పెడతారు జానకమ్మ. ఏడు గంటలకు స్నానం. ఏడున్నర కి అల్పాహారం తొమ్మిదింటికి గ్లాసుడు మజ్జిగ తాగి సరిగ్గా రాత్రి పది గంటలకి తమ పూర్వీకుల నుండి సంక్రమించిన పట్టె మంచంపై నడుం వాలుస్తారు. తిరిగి ఉదయం ఐదు గంటలకి నిద్ర లేస్తారు. కాఫీ, తర్వాత ఎనిమిది గంటలకి ఉపాహారం. తొమ్మిదింటికి క్యారెజ్ తీసుకొని బడికి బయలుదేరడం. తనకి అవసరాలు తీర్చబడడమే తప్ప ఏ రోజూ ఎలా తీరుతున్నాయి అన్న ఆలోచనే రాలేదు.

ఇవాళ ఉదయం తన మిత్రుడు సహాధ్యాయి సుధాకరం సహచరిని కోల్పోయిన వార్త విన్నప్పటి నుండి మజ్జిగగ్లాసు అందుకునే పడక్కుర్చీ ఖాళీ అయినా,మజ్జిగ అందించే మట్టి గాజులు నిష్క్రమించినా ఆవరించే శూన్యాన్ని అధిగమించి జీవితాన్ని కొత్తగా ఆరంభించటం సాధ్యమా అన్న ఆలోచన తనని ఉదయం నుండి ఆందోళనకి, ఆవేదనకి గురి చేస్తోంది.

“ఏవిటండీ! ఇంకా ఉదయం విచారంలోంచి బయటపడలేదా?” గ్లాసు చేతికందిస్తూ అడిగింది జానకమ్మ. సమాధానానికై ఎదురు చూడకుండా . “ఏవిటండీ! పంపిన దేవుడు తిరిగి పిలిస్తే పోకుండా ఉంటామా!? ముందు వెనక అంతే. పోయిన వారు ధన్యులు. ఉన్నవారు భగవంతుడి ఆరాధనలో కాలం గడుపుతూ ఆయన ఆజ్ఞ కోసం వేచిచూడాలి. జంట జీవితం ఒంటరిదైతే భగవంతుడి తోడు కోరాలే కాని ఈ వయసులో అలవాట్లు అవసరాలు ఎలా అనికాదు. అనవసరంగా ఆరోగ్యంపాడు చేసుకోక నేను ఇచ్చినన్నాళ్ళు మజ్జిగ తాగండి. ఇవ్వలేని రోజున మీరే కలుపుకుతాగడం అలవాటు చేసుకోండి.” అని చిరునవ్వుతో వెడుతున్న ఆవిడని “మరి తాగేవారు లేకపోతే…” అని అడగాలి అనుకొని దొరికి దొరకని సమాధానం మనసుని చేరగా మజ్జిగ మరింత రుచిగా అనిపించింది నర్సింహమూర్తికి.

July 30, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

తరంగిణి

by Dr. Gillipalli Brahmam July 30, 2023
written by Dr. Gillipalli Brahmam


అలా…..అలా..
అలరించే అలలతో
పాడుతూ సాగిపోతావు

చల్లని నీమనసు
సుతిమెత్తని నీ హృదయం
నీ ఒడి చేరినపుడే నాకర్థమైంది౹

గర్భంలో ఎన్ని విపత్తులు దాచుకుంటావు౹
బాహ్యంలో ఎందరి రసపిపాసకుల హృదయం దోచుకుంటావు౹

కవి కలంలోని సిరలో రసమైంది నీవే కదా౹
నీ రసమైన మాహృదయంలో ఉత్సాహం నింపింది నీ పరుగే కదా౹
నీకు ఒరిగేదేముంది అనుకోవు౹
అడుగడుగునా
పుడమికి పచ్ఛదనాన్నద్దుతావు౹
ఆర్తుల ఆకలి తీర్చడంకోసం
వారి నోటిలో అన్నపు ముద్దౌతావు౹

నీలో అడుగిడగానే
నాకు నేనే పొంగి పోయేటట్లు
నాగరికతను బోధిస్తావు౹
సంస్కృతీ సంప్రదాయాలను కథలు కథలుగా చెప్తావు౹

ఓ తరంగిణి
గమ్యాన్ని మరువని గమనం నీది౹
నన్ను మరువకు
నీతో కలసిన పలుగు రాళ్ళకు మృదుత్వాన్ని అలదినావు
నేనూ రాయినే
రాస్తూనే ఉంటాను
నిను చూస్తూనే ఉంటాను..
నీవు పాడుతూనే ఉండాలి
పుడమిని కాపాడుతూనే ఉండాలి౹

★★★★★★★★★★★

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us