పిల్లలతో గడపడం వల్ల, సంభాషించడం వల్ల ఏ అంశాన్ని అయినా సులువుగా ఎలా అందించవచ్చో అవగతమవుతుంది. అందువల్లేనేమో చాలా మంది రచయితల నేపథ్యం పిల్లలకు విద్యా బోధన. పిల్లల వైద్యులు కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపిస్తున్నారు ప్రముఖ రచయిత ఎలనాగ. భాషలో సాధారణంగా చేసే తప్పులను అరటిపండు ఒలిచినట్టు చెప్పడంలో సిద్ధహస్తులు ఆయన. అంతేకాకుండా సాహిత్య సృజనలో, అనువాదాల్లో ఆయన రాణిస్తున్నారు. బహుముఖీనంగా సృజనాత్మక రచనారంగంలో శ్రమిస్తూ, ప్రత్యేకతను నిలుపుకుంటున్న ఎలనాగ ఇప్పటికే ఎన్నో పురస్కారాలను స్వీకరించారు. ఇప్పుడు ఉకియాటో అనే అంతర్జాతీయ ప్రచురణ సంస్థ 2023 సంవత్సరానికి ఉత్తమ కవిగా అంతర్జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ఆంగ్ల భాషలో ఆయన రాసిన ‘డాజ్లర్స్’ అనే కవితా సంపుటికి ఈ పురస్కారాన్ని శనివారం కోల్ కతాలో జరిగే కోల్ కతా సాహిత్య సమారోహం రెండవ రోజు కార్యక్రమంలో స్వీకరిస్తారు.
ఉకియోటో ప్రచురణ సంస్థ గత పదేళ్లలో ప్రచురించిన అసంఖ్యాక కవితా సంపుటాల నుండి ఎలనాగ రాసిన ‘డాజ్లర్స్’ గ్రంథాన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం తెలుగు సాహితీవేత్త ఎలనాగకు అందించడం తెలుగు సాహిత్యానికి కూడా గొప్ప గౌరవంగా భావించవచ్చు. ఈ పురస్కారాన్ని అందించడంతో పాటు ‘డాజ్లర్స్’ కవితా సంపుటిని వివిధ అంతర్జాతీయ భాషల్లోకి ఉకియోటో సంస్థ అనువదింపజేయడం మరో విశేషం. ఆ అంతర్జాతీయ భాషల్లో టర్కిష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, చైనీస్, జపనీస్ ఉన్నాయి. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ గ్రంథ ప్రదర్శనల్లో ఆయా గ్రంథాలను ప్రదర్శిస్తున్నారు. ఈ గ్రంథం తెలుగులోకి కూడా ‘మిరుమిట్లు’ పేరుతో తర్జుమా అయింది. అయితే తెలుగులో ఇంకా ప్రచురించవలసి ఉంది.
కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో 1953లో జన్మించారు ఎలనాగ. ఆయన అసలు పేరు నాగరాజు సురేంద్ర. కవిగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా, భాషావేత్తగా పేరు పొందిన ఆయన ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పడే రచనా వ్యాసంగం ప్రారంభించారు. విద్యార్థి దశలో ఆయన రాసిన కవిత మొదటిసారిగా కరీంనగర్ నుండి అప్పట్లో వెలువడుతుండిన ‘గౌతమి’ అనే పత్రికలో ప్రచురితమైంది. అప్పుడు మొదలైన రచనా వ్యాసంగం మెడిసిన్ చదువుతున్నప్పుడు మరింత విస్తరించింది. భారతి, కృష్ణాపత్రిక, స్రవంతి, ఆంధ్రప్రభ, తరుణ, పొలికేక, విపుల మొదలైన పత్రికల్లో అప్పట్లో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి.
ఇప్పటివరకు దాదాపు 40 గ్రంథాలను ఎలనాగ ప్రచురించారు. ‘ది ఏలియెన్ కార్న్’ అనే సోమర్సెట్ మామ్ నవలికకు ఎలనాగ అనువాదం ‘కలుపుమొక్క’ అనే పేరుతో మొదటి ప్రచురణగా 2005లో ప్రచురితమైంది. తొలి కవితా సంపుటి ‘వాగంకురాలు’ 2009 లో వెలువడింది. సజల నయనాల కోసం, అంతర్లయ, అంతర గాంధారం, అంతర్నాదం కవితా సంపుటా లు వెలువడ్డాయి. ‘పెన్మంటలు – కోకిలమ్మ పదాలు’ అనే గేయసంపుటిని వెలువరించారు. ‘అంతస్తాపము’ ఆయన రాసిన ఛందోబద్ధ పద్యాల సంపుటి. ‘మోర్సింగ్ మీద మాల్కౌఁస్ రాగం’, ‘కొత్తబాణి’ ఆయన ప్రయోగ పద్యాల సంపుటాలు. ఈ రెండింటిలో అచ్చం వచన కవితల్లా కనిపించే ఛందోబద్దమైన పద్యాలుండడంవిశేషం. ‘పొరుగు వెన్నెల’, ‘ఊహల వాహిని’ ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటాలు. ఎన్నో గ్రంథాలను తెలుగునుండి ఆంగ్లంలోకి కూడా ఎలనాగ అనువాదం చేశారు. ‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు. సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను కూడా ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వాటిలో వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు తదితరులు రాసిన కథా సంపుటాలు, నవలలు ఉన్నాయి. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా అయన తెలుగులోకి తెచ్చారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి. వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ కూడా ఆయన వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ – నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
తెలుగు భాషపై అనేక గ్రంథాలను తెచ్చిన ఎలనాగ భాషలో సవ్యత దిశగా కొత్త తరానికి మార్గనిర్దేశనం చేస్తారు. ‘భాషాసవ్యతకు బాటలు వేద్దాం’, ‘యుక్తవాక్యం’, ‘నుడిక్రీడ’ అనే ప్రామాణిక గళ్లనుడికట్ల పుస్తకం, ‘పన్’నీటి జల్లు, ‘మేధామథనం’ మొదలైనవి వాటిలో ఉన్నాయి. ‘పళ్లెరం’ అనే పేరుతో భాష, సాహిత్య, సంగీతాల మీద రాసిన వ్యాసాలను కూర్పుగా తెచ్చారు. శాస్త్రీయ సంగీతాన్ని వస్తువుగా చేసుకుని పెద్ద సంఖ్యలో కవితలు రాశారు. లెక్కలేనన్ని పేరాగ్రాఫ్ కవితలు రాసారు. భాషాసంగీతాల గురించిన రచనలు, ప్రయోగ పద్యాలు, ప్రామాణిక గళ్లనుడికట్లు, అనువాదాలు ఎలనాగ ప్రత్యేకతలు.
విస్తృతంగా స్వీయ రచనలు, అనువాదాలు చేస్తున్న ఎలనాగకు అంతర్జాతీయ కవిగా పురస్కారం సృజనాత్మక రంగాలన్నింటిలో మరింత కృషి చేసేందుకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ స్ఫూర్తితో తెలుగు సాహిత్యాన్ని మరింత విస్తృతంగా అంతర్జాతీయ స్థాయికి చేర్చేలా అనువాదాలు చేయాలని తెలుగు సాహిత్యాభిమానుల ఆకాంక్ష.
నాకెందుకో..!
భయమేస్తుంది?
కారుచీకట్లు లోకాన్ని
కప్పేసినందుకు….
ఒంటరినా అని!
మనసు లో
అలజడి
మొదలైనందుకు…!
లోకమంతా
కారు చీకట్లు
కమ్ముకున్నాయి
తస్మాత్ జాగ్రత్త….!
అని
మనసు
హెచ్చరిస్తున్నందుకు….!

ఒంటరితనం.
నన్ను
ఎక్కిరిస్తున్నందుకు..?
అందరూ?
ఉన్నా ఏకాకి
నువ్వు!
విధి నిర్వహణ
కోసం నీ పిల్లలు
నిన్ను
వదిలెళ్లక
తప్పలేదు….
సాయంత్రమే..!
లేకుంటే
ఎంత బాగుండో…
పగలంతా
మనుషుల
హడావుడితో
క్షణం తీరిక దొరకదు….
సాయంత్రం
సమయమే…
ఒంటరిదానివంటూ
వెక్కిరిస్తుంది…
అమావాస్య నే అసలైన గురువు
అంధకారం లోనే ఆలోచనలు వెలుగు చూస్తాయి
లోటు లోతుగా దారులు వెతుకు తుంది
చీకటి చెప్పే కథలు చిర కాలం
తడుముదామన్న తాకని బందాలు
తన వారు ఎవరో మొదటి సారి ఎరుక జెప్పుతది
లేనప్పుడు మాత్రమే లెక్కలు బోధ పడతాయి
జేబు లోపలికి చేతి వెతికి వెతికి
చిల్లి గవ్వ ను నుదుట ఆద్దు కుంటది
వెలుగు చుట్టూ వున్నప్పుడు
పొగిడే పురుగుల కోలాహలం కోకొల్లలు
మసక బారినదా నీడ కూడా కాన రాదు
వెలుగులో కనబడేది కనికట్టు మాత్రమే
చీకటి లోనే సత్యాలు చీటీ విప్పు తాయి
అర్థం అయితే చాలు అడుగు కొత్తగా వేయ వచ్చు
చీకటి వెలుగులు
జీవితానికి అసలైన పాఠoలు
సిలబస్ లో లేని గుణ పాఠoలు నేర్పుతాయి
సమీక్ష వ్యాసాలు
దుకూరి శ్రీరాములు “నన్ను గన్న నా నేల” కవిత్వం — ఓ విశ్లేషణ
ప్రముఖ కవి,కందుకూరి శ్రీరాములు కలం నుండి జాలువారిన ‘నన్ను గన్న నా నేల’ కవిత పై విశ్లేషణా వ్యాసం.నన్ను గన్న నా నేల కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.శ్రీరాములు రావురూకుల గ్రామం,సిద్దిపేట జిల్లాకు చెందినవాడు.కన్నతల్లి జన్మభూమి అయిన తెలంగాణ ప్రాంతాన్ని అంటే శ్రీరాములు ప్రాణప్రదంగా ప్రేమిస్తాడు.కవి శ్రీరాములు తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొన్న వివక్షను కష్టాలను కన్నీళ్లను చూసి హృదయం ద్రవించి కవితకు అక్షర రూపం ఇచ్చాడు.నన్ను గన్న నా నేల కవిత తెలంగాణ చరిత్ర అని తోస్తుంది.తెలంగాణ చరిత్రను కవిత రూపంలో వ్యక్తీకరించడం సామాన్యమైన విషయం కాదు.కవి శ్రీ రాములు ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రాంతం ప్రజలు ఎదుర్కొన్న వివక్షను తన పదునైన భావాల ద్వారా చక్కగా వ్యక్తీకరించారు.
“ పది చేతులు ఒక్కటైతే ఊరేగింపు
“ పది అలలు ఒక్కటైతే ఉప్పెన
“ నీటి బిందువులు చల్లబడితే
“ మంచుగడ్డ
“ కొలిమిలో బొగ్గు రాజుకుంటే
“ నిప్పు కణిక
“ ఇది తెలంగాణా.
“ పది చేతులు ఒక్కటైతే ఊరేగింపు.
ఊరేగింపును ఆంగ్లంలో Procession అని అంటారు.వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవం. ఊరేగింపు అంటే ఊరిలోని జనులకు తెలియపరుస్తూ ప్రదర్శించుట.ప్రజలు ఊరేగింపు ఎందుకు చేస్తారు? మతపరమైనవి,పెండ్లి మొదలైన వేడుకలకు,రాజకీయపరమైనవి,ప్రజలు తమ హక్కుల సాధన కోసం నినాదాలు ఇస్తూ వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవం ఊరేగింపు అని చెప్పవచ్చు.ప్రజలంతా ఏకమై పిడికిలి ఎత్తి నినదిస్తూ ఊరేగడం తెలంగాణ ప్రాంతంలో మనం చూడవచ్చు.
“ పది అలలు ఒక్కటైతే ఉప్పెన.
తెలంగాణ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు? సవాలక్ష సందేహాలు మనలో పొడసూపుతాయి. సముద్ర తీరం నుండి వచ్చిన ఉప్పెన సృష్టించిన ఆటుపోట్ల తాకిడికి తెలంగాణ ప్రాంతమునకు సంబంధం లేదు.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వాతావరణంలో వచ్చే అల్పపీడనం ప్రభావం ఉప్పెనలు ఉత్పాతాలు వంటి అలజడుల హోరు రగులుతున్న కాష్టంలాగా తెలంగాణ ప్రాంతంలో ఉంది అని చెప్పిన తీరు అద్భుతం.
“ నీటి బిందువులు చల్లబడితే మంచు గడ్డ.
హిమాలయ పర్వత సానువుల్లో మంచు కురిసి మంచు గడ్డలు ఏర్పడినట్లుగా తెలంగాణ ప్రాంతంలో నీటి బిందువులు చల్లబడితే మంచు గడ్డలు ఏర్పడినట్లు చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ కొలిమిలో బొగ్గు రాజుకుంటే నిప్పు కణిక.
కమ్మరి వాళ్లు కత్తులు,కొడవళ్ళు,నాగటి కర్రులు, గొడ్డళ్లు,గడ్డపారలు మొదలైన వాటిని కొలిమిలో బొగ్గులు వేసి బాగా ఎర్రగా కాలిన తర్వాత వాటిని పదును పెడతారు.తెలంగాణ ప్రాంతంలో కొలిమిలో బొగ్గులు రాజు కొనకుండానే నిప్పు కణికలు గాలి దుమారం చెలరేగకుండానే ఎగసి ఎగసి పడుతున్నాయి.తెలంగాణలో నివసించే జనాలు తమ హక్కుల కొరకు ఉద్యమిస్తూ ఊరేగింపులు చేస్తున్నారు.తెలంగాణలో జనాలు తుఫానులు రాకుండానే ఉప్పెనలై ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రజలు నీటి బిందువులు చల్లబడకుండానే మంచు గడ్డలు అవుతున్నారు. తెలంగాణ ప్రాంతం ప్రజలు కొలిమిలో బొగ్గు రాజు కొనకుండానే నిప్పు కణికలుగా మారి పోరు బాటలో సాగుతున్నారు.
“ శ్రమకు ప్రతిరూపం
“ శక్తికి మరో పేరు
“ ఇటు మెదక్ నుండి అటు ఖమ్మం
“ అటు ఆదిలాబాద్ నుండి ఇటు మహబూబ్ నగర్
“ చాచి ఎత్తిన రెండు అర చేతులు. కష్టపడటం వల్ల కలిగేది శ్రమ.తెలంగాణ ప్రజలు శ్రమకు ప్రతిరూపం అని చెబుతున్నాడు.మానవ నాగరికత విస్తరించడానికి శక్తి అవసరం.శక్తి అనేది నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.శక్తిని ఉపయోగించి మనిషి పనులు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు శక్తికి మరో పేరు అని చెప్తున్నాడు. తెలంగాణలో మెదక్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు ఆదిలాబాద్ నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు ఇక్కడ ప్రజలు శ్రమనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.శ్రమైక జీవన సౌందర్యానికి ఏది సాటి రాదని మహాకవి శ్రీశ్రీ చెప్పాడు.తెలంగాణ పల్లె జనాలు ఎత్తిన రెండు అర చేతులు చాచి ఉంచడం ఆత్మ విశ్వాసాన్ని ఆత్మ నిర్భరతను ఆత్మ గౌరవాన్ని తెలియ జేస్తుంది.
“ మహబూబ్ నగర్ లో ఆకలి చావులు.
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు జిల్లా అని పిలిచేవారు.ఇక్కడి ప్రజలు తీవ్రమైన పేదరికం,బానిసత్వం చెరలో మగ్గి ఉన్నప్పటికి పాలకులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపలేదు.ఇప్పటికి ఈ ప్రాంతంలో అధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు. మహబూబ్ నగర్ ప్రాంతంలో నివసించే ప్రజలు జీవనం భారమై వలసలు కొనసాగుతున్నాయి.వలస వెళ్లని జనాలు పేదరికం వల్ల ఆకలి చావులకు లోనవుతున్నారు.చాలా మంది ప్రజలు జీవనోపాధి కరువై ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పాలమూరు లేబర్లుగా అన్ని జిల్లాలలో పనిచేస్తున్నారు. మహబూబ్ నగర్ కరువు జిల్లాగా పేరుపొంది ఆకలి చావులకు కూడా నిలయంగా మారింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
“ ఆదిలాబాద్ లో అత్యాచారాలు.
ఆదిలాబాద్ జిల్లా అత్యాచారాలకు పేరుగాంచింది. ఆదిలాబాద్ లో నివసిస్తున్న మహిళలు దుండగుల దారుణమైన దురంతాల వల్ల అత్యాచారాలకు బలి అవుతున్నారు.అమాయక మహిళలు అత్యాచారాలకు బలి కావడం తీవ్రమైన వేదనకు గురిచేస్తుంది.
“ కరీంనగర్ లో చేనేత కార్మికుల హత్యలు.
కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో చేనేత కార్మికులు పేదరికంలో మగ్గుతు దీనస్థితిని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఇవి చేనేత కార్మికుల ఆత్మహత్యలు కావు.రాజ్యంలోని పాలకుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న చేనేత కార్మికుల హత్యలు అని కవి శ్రీరాములు వ్యక్తం చేయడం చక్కగా ఉంది.
“ వరంగల్ లో పత్తి రైతుల ఆత్మహత్యలు.
వరంగల్ లో తీవ్రమైన కరువు ఏర్పడ్డది.వర్షాలు లేక నీటి ఎద్దడి ఏర్పడి తాగునీరు,సాగు నీరు లేక ప్రజలు కరువు కోరల్లో చిక్కినారు.పత్తి చేలల్లో పంటలు ఎండిపోయిన దీనస్థితిలో రైతులు ఏం చేయాలో దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడడం వాస్తవం అని చెప్పవచ్చు.
“ మెదక్ లో ఎదురు కాల్పులు.
మెదక్ లో ఎదురుకాల్పులు ఎందుకు జరిగాయి. పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారన్నది బూటకపు సమాచారం అని చెప్పవచ్చు. పోలీసులు తప్పించుకున్న మావోయిస్టుల కొరకు వేట కొనసాగిస్తున్నారు అని చెప్పడం సిగ్గు చేటుగా చెప్పవచ్చు.మావోయిస్టులు ప్రజల మౌలిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. మావోయిస్టులను ప్రభుత్వం పోలీసుల ద్వారా మట్టు పెట్టుతున్నది.మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఆగాలి.బూటకపు ఎదురుకాల్పులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి.అప్పుడు ప్రజల కోసం ప్రభుత్వం అనే పేరు సంపాదించుకోవచ్చు.
“ నిజామాబాదులో ఎన్ కౌంటర్లు
నిజామాబాద్ జిల్లాలో ఎన్ కౌంటర్లు ఎందుకు జరిగాయి? ప్రజలు ఎన్నుకున్న పరిపాలకులు మానవతా దృష్టితో ఆలోచించాల్సిన తక్షణ కర్తవ్యం ఉంది.ఆత్మ రక్షణ కోసం కరుడుగట్టిన నేరస్తులను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రయత్నంలో పోలీసులు ఆత్మ రక్షణ కోసం నేరస్తులను ఎన్ కౌంటర్ చేశారు అని ప్రకటిస్తారు. కట్టుకతలు అల్లడం వల్ల పోలీసుల విశ్వసనీయతను ప్రజలు శంఖించాల్సిన పరిస్థితులకు అవకాశం కల్పించే విధంగా ఉన్నాయి. బాధను కలిగిస్తుంది.
“ నల్లగొండలో నరకటం చంపటం.
నల్లగొండ జిల్లాలో నివసిస్తున్న ప్రజలు కక్షలతో పరువు హత్యల పేరిట చేతబడి పేరిట ఒకరిని ఒకరు నరకటం చంపడం మానవతకు మచ్చలుగా చెప్పవచ్చు.ఇలాంటి అమానుష ఘటనలు సమాజానికి కీడును కలిగిస్తున్నాయి.నరకటం చంపటం అనే జాడ్యం జోలికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.కవి శ్రీరాములు వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ ఖమ్మంలో అరాచకం అన్యాయం.
ఖమ్మం జిల్లాలో ప్రజలు అరాచకానికి అన్యాయానికి బలి అవుతున్నారు.ప్రభుత్వాలు చెలరేగుతున్నా అరాచకం,అన్యాయం యొక్క మూలాలు ఎక్కడ ఉన్నా వాటిని తీవ్రంగా పరిగణిస్తూ అణచి వేయాల్సిన ఆవశ్యకత,అవసరం ఉంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రంగారెడ్డిలో కుల పోరాటాలు.
రంగారెడ్డి జిల్లాలో రగులుతున్న కుల పోరాటాలు మనస్థాపం కలిగిస్తున్నాయి.రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న ప్రజలు నా కులం గొప్ప నీ కులం తక్కువ అంటూ ఒకరినొకరు నిందించుకుంటూ హత్యలకు పాల్పడటం ఆవేదన కలిగిస్తుంది.
“ హైదరాబాదులో మత కలహాలు.
హైదరాబాదు జిల్లాలో నివసిస్తున్న ప్రజలు హిందూ ముస్లింలు తమ మతం గొప్పదని ఇతర మతాలు తక్కువ అని భావన కలిగి ఉన్నారు.మతం పేరిట హైదరాబాద్ పాతబస్తీలో హిందూ ముస్లింలు కొట్లాడుతూ ఉండడం తీవ్రమైన ఆవేదన కలిగిస్తుంది.భారతదేశం లౌకిక దేశం అని పిలుస్తారు. అన్ని మతాలను సమానంగా చూడాలి.సర్వమత సౌభాతృత్వం కొనసాగాలి.హిందూ ముస్లిం భాయి భాయి అని పరస్పరం స్నేహము,సంతోషంతో కలిసిమెలిసి ఉండాలి.మత కలహాలకు ఆజ్యం పోయకూడదు.మతకలహాలు మానుకొని సోదర భావంతో ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడం చక్కగా ఉంది.
“ పది జిల్లాల అగ్గిపుల్లల పెట్టె
“ కదిలిస్తే కందిరీగల తుట్టె – తెలంగాణ
“ మురిపాల సంస్కృతికి ఈ గడ్డ,
“ మూడు కోట్ల ప్రజల ముద్దుబిడ్డ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన పది జిల్లాలు ఉండేవి.పల్లెలు మరియు పట్టణాలలో నివసించే జనాలతో పది జిల్లాల అగ్గి పుల్లల పెట్టె తెలంగాణ ప్రాంతం మండించకుండానే రగులుతుంది.తెలంగాణ ప్రాంతం కందిరీగల తుట్టెగా ఎలా మారింది? ఎన్నో అవకతవకలు విభేదాలతో తెలంగాణ ప్రాంతం కదిలిస్తే కందిరీగల తుట్టెగా తయారైంది.తెలంగాణ సంస్కృతిలో ఆచారాలు,వ్యవహారాలు,పండుగలు, సంక్రాంతి,దసరా,బతుకమ్మ పండుగ,సమ్మక్క సారలమ్మ జాతర,బోనాల పండుగలు విశేష మైనవిగా చెప్పుకోవచ్చు.మురిపాల సంస్కృతికి తెలంగాణ గడ్డ నిలయంగా ఉందని చెప్తున్నారు.పది జిల్లాలతో కూడిన మూడు కోట్ల ముద్దుల బిడ్డ తెలంగాణ అని గర్వంగా చెబుతున్నారు.
“ బిగబట్టిన గొంతు దాని స్వరూపం
“ ఎత్తిన జెండా దాని స్వభావం
“ దాని భాష – దాని శ్వాస
“ దానివేషం – దాని పౌరుషం.
తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగం.పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమిగా పిలుస్తారు.పీఠభూమి ప్రాంతం,గోదావరి బేసిన్ ప్రాంతం,కృష్ణ పర్వత పాద ప్రాంతం,తెలంగాణ స్వరూపంగా చెప్పవచ్చు.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనాలు బిగబట్టిన గొంతు కలిగి అణుకువతో మెలగడం దాని సహజ స్వరూపంగా చెప్పవచ్చు.తెలంగాణ ప్రజలు ఎత్తిన జెండా పై గౌరవంగా మెలగడం దాని స్వభావంగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రజలు మాట్లాడే భాష,యాస, మాండలికాలు తెలంగాణ ప్రజల శ్వాసగా చెబుతున్నారు.తెలంగాణ జనాలు ధరించే కట్టు బట్ట వేషంతో అలరిస్తారు.తెలంగాణ ప్రజలు పౌరుషం కలిగిన వారు అని పేరు తెచ్చుకున్నారు.
“ గోలకొండ నవాబులు
“ కాకతీయ చక్రవర్తులు
“ శిథిలాల కోటలు – శిల్ప విన్యాసాలూ
“ తరతరాలు నైజాం నవాబులు – రాజుల పైసా రాళ్లపాలూ
“ రజాకార్ల బీభత్సాలు – రాక్షస కృత్యాలు
“ జమ – తీసివేత లెక్కల్లో
“ ఇంకా శేషంగా మిగిలే వున్నాయి.
గోలకొండ నవాబులు తెలంగాణను కొంతకాలం పరిపాలించారు.కాకతీయ చక్రవర్తులు గోల్కొండ కోటను నిర్మించారు.గోల్కొండ నగరం కోట మొత్తం ఒక 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు.16, 17 వ శతాబ్దంలో గోల్కొండ ప్రాంతంలో కుతుబ్ షాహి రాజులు పాలించారు. గోల్కొండ కోట యొక్క శిల్పకళలు అద్భుతాలు అని చెప్పవచ్చు.గోల్కొండ కోట శిల్ప విన్యాసాలు ఇప్పటికి చూపరులను ఆకర్షిస్తున్నాయి.హైదరాబాద్ ప్రాంతమును నైజాం నవాబులు పాలించారు.నైజాం రాజులు తెలంగాణ ప్రజలను దోచుకుని అద్భుతమైన కట్టడాలు నిర్మించారు.తెలంగాణ ప్రజలను దోచుకున్న సొత్తుతో నిర్మించిన కట్టడాల వల్ల సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ప్రయోజనం కలుగలేదు.తెలంగాణ ప్రజలను హాహాకారాలతో ఏడ్పించి ఆర్జించిన నిజాం రాజుల సొమ్ము రాళ్లపాలు అయిందని చెబుతున్నారు.నిజాం నవాబు తొత్తులు రజాకార్లు చేసిన అకృత్యాలకు తెలంగాణ ప్రజలు బలి అయ్యారు.తెలంగాణ ప్రాంతంలో స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.దుర్మార్గులైన రజాకారుల దుష్ట శక్తుల చేష్టల వల్ల తెలంగాణలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్త్రీలను బట్టలు విప్పించి బతుకమ్మలు ఆడించారు. శిస్తులు చెల్లించలేని అమాయక రైతుల నడుములపై బండలు ఎత్తించారు.గోళ్లను కత్తిరించారు.రజాకార్ల రాక్షస కృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతం అట్టుడికి పోయింది.రజాకార్లు చేసిన దారుణమైన ఘటనలు జమ తీసివేత లెక్కల్లో ఇంకా శేషంగా మిగిలి ఉన్నాయి అని చెబుతున్నారు.
“ తెల్లదొరల్ని వెళ్ళగొట్టామని సంబరపడ్డాం
“ స్వాతంత్ర్యం మెడకు తాళ్ళయి
“ చుడుతున్నందుకు బెంబేలెత్తుతున్నాం.
భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం కొనసాగింది.చివరకు ఆగస్టు 15,1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం.తెల్లదొరలను వాళ్ళ బ్రిటిష్ దేశానికి పంపించామని సంబరాలు జరుపుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చింది.ఇక్కడి నల్ల దొరల పాలనలో స్వాతంత్ర్యం ప్రజల మెడలకు ఉరి త్రాళ్లుగా మారింది.నల్ల దొరలు స్వాతంత్ర్యం యొక్క ఫలాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారు.నల్ల దొరల పాలనలో ప్రజల మెడలకు ఉరితాళ్లు బిగిసినాయి.ప్రజలు బెంబేలెత్తుతున్నారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ యమధర్మరాజులు అధికారులు
“ పాశం ప్రయోగించకుండానే ప్రాణాలు తీయగలరు.
యమ ధర్మరాజు నరక లోకానికి అధిపతి.
యముని పాశమును కాలపాశము అని పిలుస్తారు. యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనప్పుడు జీవుల ప్రాణాలను హరిస్తాడని చెబుతారు.యముని పాలనలో ఏ విధమైన పక్షపాతానికి,అధర్మానికి స్థానం ఉండదు.యముని నియమాలు కఠోరమైనవి. యముని నగరంను యమపురి అని అంటారు. తెలంగాణలో యమధర్మరాజులు అధికారులుగా పనిచేస్తున్నారు అని చెప్తున్నారు.యమధర్మరాజు పాపం చేసిన వారిని కాలపాశం ప్రయోగించి ప్రాణాలు తీస్తాడు.తెలంగాణలో పని చేసే అధికారులు ఎలాంటి పాశం ప్రయోగించకుండానే ఏ నేరం చేయని అమాయక జనుల ప్రాణాలను బలి గొంటున్నారు.అని చెప్పిన కవితలోని భావనలు, అధికారులు తీసుకున్న చర్యలు అమానుష ఘటనలకు అద్దం పడుతుంది.తెలంగాణ ప్రాంతంలో అధికారులు చేస్తున్న రాజ్య హింస పట్ల కవి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“బొమ్మరిల్లులా ఉన్న తెలంగాణా పల్లెల్ని
“ పుట్టమన్ను తవ్వేసినట్టు తవ్వేస్తున్నారు
“ అందుకే పాముల బుస బుస –
“ చెట్టుకూ చేమకూ జంతువులకూ జనాలకూ
“ నేల ఎంత ముఖ్యమో నీరంత ముఖ్యం.
బొమ్మలతో ఆడుకోవడానికి ఉపయోగించే ఒక చిన్న ఇల్లును బొమ్మరిల్లు అంటారు.పిల్లలు బొమ్మలు తయారు చేయడానికి పుట్టమన్ను ఉపయోగిస్తారు. పిల్లలు బొమ్మలతో ఆడుకోడానికి ఉపయోగించే బొమ్మరిల్లులా ఉన్న తెలంగాణలో ఉన్న పల్లెల్లో ఉన్న భూముల తాలూకు మట్టిని పుట్టమన్ను తవ్వేసినట్టు తవ్వుతున్నారు.అందుకే పాములు తమ నివాసములైన పుట్టల నుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి చేరి బుసలు కొడుతున్నాయి. ఏ ప్రాంతంలోనైనా చెట్టుకు చేమకు జంతువులకు జనాలకు నేల ఉంటేనే నివాసముంటుంది. జీవమున్న మనుషులకు ప్రాణి కోటిలో భాగమైన చెట్లకు జంతువులకు తాగడానికి నీరు, నివసించడానికి నేల కూడా అవసరం అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ ఇక్కడ కడలి లేదు
“ కన్నీటి సరస్సులున్నాయి
“ పేరుకు రెండు నదులు పారుతున్నా
“ ఊరూరుకు నీటికి కటకట.
కడలి అనగా సముద్రం.ఉప్పునీటితో విశాలమైన భూభాగాన్ని ఆక్రమించినవి సముద్రాలు అని చెప్పవచ్చు.తెలంగాణ ప్రాంతంలో సముద్రం లేదు. తెలంగాణ ప్రాంతంలో నివసించే జనాలు కష్టాల నావలో పయనిస్తూ బాధలు అనుభవిస్తూ ఉండడంవల్ల వారి కళ్లలో కన్నీటి సముద్రాలు వెలసినాయి.తెలంగాణ ప్రాంతంలో పేరుకు కృష్ణ గోదావరి నదులు పారుతున్నప్పటికీ ప్రతి పల్లెలో తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు విలవిలలాడుతున్నారు.
“ ఈ ప్రాంతాన
“ మేఘం అల్గిందా
“ సాగుబడి ఉండదు
“ పునాస పంటలు అమాస చీకటవుతాయి
“ పూట జరగటం కష్టమైపోతుంది.
తెలంగాణ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మరియు రుతుపవనాలు సరైన సమయానికి రాక పోవడం వల్ల మేఘం అల్గి వానలు లేకపోవడం వల్ల వ్యవసాయపు పనులు సాగుట లేదు.సమయానికి పొలాలలో నాట్లు వేయడం లేదు.వర్షాకాలంలో వానలు లేకపోవడం వల్ల పంటలు వేయకపోవడం వల్ల రైతుల బతుకులు అమావాస్యలాంటి చీకటి రోజులలా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. తెలంగాణ పల్లె ప్రజలు పూట గడవక రైతులు వారి కుటుంబ సభ్యులు పస్తులతో గడపాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ నీరు లేని నేల – ప్రాణం లేని మనిషి
“ గోడు గోడు మంటున్నాయి బీడు భూములు.
తెలంగాణ ప్రాంతంలో నీరు లేని నేలలు ఉన్నాయి.తెలంగాణ ప్రాంతంలో సరి అయిన సాగు నీరు లేక కరువు కోరల్లో చిక్కిన నేలలు నెర్రెలు బారి ఎండి పోతున్నాయి.నెర్రెలు బారిన భూమిని చూసి సాగు చేసిన రైతు ప్రాణం లేని మనిషిలా దుఃఖంతో బాధతో విలవిలలాడి పోతున్నాడు.నీరు లేని నేలను చూసి ప్రాణం లేని మనిషిని చూసి బీడు భూములు గోడు గోడు మంటున్నాయి.నేల,మనిషి బాధ పడి దుఃఖిస్తున్నాయి అని కవితలోని చరణాలు చదువుతుంటే హృదయం బాధతో విలవిలలాడి పోతుంది.ఇట్టి కవితను రాయడానికి కవి శ్రీరాములు ఎంతో వేదనను ఎదుర్కొని ఉంటాడు.
“ భూతద్దం పట్టి గాలించినా
“ మొలకలు మొలిచె గట్లు లేవు
“ చిలకలు వాలె చెట్లు లేవు.
కంటికి కనిపించని వాటిని భూతద్దం సహాయం ద్వారా చూడవచ్చు,చదవవచ్చు.తెలంగాణలో నీటి ఎద్దడి కరువు వల్ల భూతద్దం పెట్టి గాలించిన గట్లన్ని ఎండిపోయి ఉంటే మొలకలు ఎలా మొలుస్తాయి? పచ్చదనంతో కళకళలాడుతూ ఉన్న పండ్ల చెట్ల మీద,పంట చేల మీద చిలకలు వాలుతాయి.ఎండిన చెట్ల మీద చిలకలు ఎలా వాలుతాయి? చిలకలు వాలవు.భూతద్దం పెట్టి గాలించినా మొలకలు మొలిచిన గట్లు కనిపించవు.చిలుకలు వాలిన చెట్లు కూడా కనిపించవు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రహదారులూ, రైలు మార్గాలూ గుడ్డిలో మెల్ల
“ లేమి,దరిద్రం,పేదరికం,బీదరికం
“ ఇక్కడి ప్రజలు ధరించుకున్న నిలువుటద్దాలు.
తెలంగాణ ప్రాంతంలో పల్లెల్లో పట్టణాల్లో రహదారులు అభివృద్ధి జరగ లేదు.తెలంగాణలో రైలు మార్గాలు ఉన్నప్పటికీ అన్ని జిల్లాలకు, పల్లెలకు,పట్నాలకు వ్యాపించి లేవు.గుడ్డిలో మెల్లలా
అక్కడక్కడ రైలు సౌకర్యం ఉన్నవి.రైలు సౌకర్యం లేని పల్లెలు, రైలును చూడని ప్రజలు కూడా ఉన్నారు.తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైన దారిద్రంలో కునారిల్లుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో పల్లెలు,పట్టణాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.తెలంగాణ ప్రాంతంలో దరిద్రం,పేదరికంతో బాధపడుతున్న ప్రజలు ఎక్కడ చూసిన కళ్ళముందు ప్రత్యక్షం అవుతారు.
“తెలంగాణా అంటేనే ఆకలికి పుట్టిల్లు
“ అడుక్కుతినే బతుకులు కోకొల్లలు
“ నిన్న పత్తి రైతుల ఆకలి చావులు
“ నేడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు.
ఆకలి అంటే ఏదైనా తినాలి అనిపించే ఒక భావన. ఆకలి వేసిన వెంటనే ఏదైనా తినాలనే కోరిక మనసులో కలుగుట సహజం.తెలంగాణలో తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న జనాలు ఎక్కువగా ఉన్నారు.తెలంగాణలో పిల్లలు ఆకలితో పుడుతున్నారు.తెలంగాణలో తిండికి కరువై యాచకులుగా అడుక్కుతింటున్నారు. తెలంగాణలో కరువు వల్ల నిన్న పత్తి రైతుల ఆకలి చావులను చూశాం.తెలంగాణలో నేడు చేనేత కార్మికులు తిండికి లేక ఉపాధి కరువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఆకలి చావులు,ఆత్మహత్యల విషయాలు తలుచుకుంటేనే గుండె ద్రవిస్తోంది.
“ ఈ ప్రాంతమంతా
“ తృణప్రాయం చేసుకున్న దేహాల కథలే
“ అమాయకుల ఆక్రందన హహాకారాలు పాటలే
“ ఎటు చూసినా ప్రశాంతతలేని వాతావరణం
“ ఏ మూలకు వెళ్లినా రణగొణ ధ్వనులే
“ అక్కడక్కడ ఇంకా వెట్టి బతుకులు
“మట్టి కొట్టుకుపోతున్నాయి పల్లెలు.
తెలంగాణలో ప్రాంతంలో నివసిస్తున్న జనాలను గడ్డి పోచతో సమానంగా చూస్తారు,ఏ మాత్రం విలువ లేదు.బాధ మరియు దుఃఖం కూడినటువంటి ఏడుపును ఆక్రందనగా చెప్పవచ్చు.తెలంగాణ ప్రాంతంలో ఏ మూల చూసినా అమాయకుల ఆక్రందనలు రోదనలు మిన్ను ముట్టుతాయి. తెలంగాణ పల్లెల్లో ఎటు చూసినా ప్రశాంతత కొరవడిన వాతావరణం మనకు అగుపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని ఏ మారుమూల పల్లెకు వెళ్లిన శోకం,దుఃఖంతో కూడిన ఏడుపులు,పెడ బొబ్బలు,కేకలు వినిపిస్తాయి.తెలంగాణ ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న వెట్టి చాకిరి అనే సాంఘిక దురాచారం కింద నలుగుతున్న బతుకులు.వెట్టి చాకిరి అనగా అప్పు తీసుకున్న వ్యక్తి ఆ అప్పును తీర్చలేక పోయినప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర జీతం లేకుండా చాకిరీ చేయాలి.స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పేదరికంతో జీవనం కొనసాగిస్తున్న వాళ్ల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు.ఇంకా యజమాని వద్ద పేదలు వెట్టి పనులు చేస్తూ బతుకుతున్నారు.
“ మూఢాచారాలు – మూర్ఖ విన్యాసాలు
“ వంటింటికే అంటుకుపోతున్నారు స్త్రీలు
“ అంటరానితనం – ఊరువాడా తేడాలు
“ ఇంకా చిన్న చూపునకు గురవుతున్నారు దళితులు
“ మాల మాదిగ – పల్లెకు దూరం
“ శూద్రులు దరిద్రులు – ధనికుల నౌకర్లు.
తెలంగాణ ప్రాంతాల్లో మూఢాచారాలు ఎక్కువగా చదువుకోని వారిలో గ్రామాలలో కనిపిస్తాయి. మనిషిని మనిషిలాగ చూడరు.మూర్ఖంగా ప్రవర్తిస్తారు.తెలంగాణ ప్రాంతంలో ఈనాటికి మూఢనమ్మకాలు,మూర్ఖ త్వాలు ప్రదర్శిస్తూ సాంఘికంగా ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురవుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో స్త్రీలకు విద్య నేర్పించాలనే విషయంలో ప్రజలకు సరైన అవగాహన లేదు.స్త్రీలను విద్యకు దూరం చేసి కుటుంబానికి వంటింటికే పరిమితం చేస్తున్నారు. అంటరానితనం అనేది దురాచారం.తోటి మానవుని మానవునిగా చూడలేని మూఢ విశ్వాసం కొనసాగుతున్నది.అంటరానితనం అనాదిగా సమాజంలో ఈనాటికి కూడా తెలంగాణ పల్లెల్లో కొనసాగుతూ ఉంది.అంటరానితనమును అస్పృశ్యత అని కూడా అంటారు.తెలంగాణ పల్లెల్లో మాదిగవాడ,మాలవాడ అనే తేడాలు కొనసాగుతున్నాయి.అణగారిన వర్గాలను దళితులుగా పేర్కొంటారు.వారు అతి తక్కువ స్థాయి వారుగా భావించబడతారు.అంటరాని వారిని దళితులు అని పిలుస్తారు.సమాజంలో ఈ వర్గాన్ని నీచంగా చూసేవారు. దారిద్ర్యంతో పీడింపబడుతున్న వారు,తక్కువ కులానికి చెందినవారు,దళితులుగా ఇంకా చిన్న చూపునకు గురవుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో మాలవాళ్లు, మాదిగ వాళ్ళ వాడలు పల్లెకు దూరంగా వెలి వేసినట్లు ఉంటాయి.తెలంగాణ ప్రాంతాల్లో శూద్రులు,దరిద్రులు సంపన్న వర్గాల వారి వద్ద నౌకర్లుగా పనిచేస్తున్నారు.
“ ఖాళీ పొట్టలు కోట్లు
“ పట్టెడన్నం దొరకదు
“ మనుషులున్నారు
“ నడుచుకునే యంత్రాలు – మర బొమ్మలు
“ చెక్క పలకలున్నాయి
“ అక్షరాలు మొలవని విత్తనాలు – చెత్త కాగితాలు.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తినడానికి తిండి లేక ఖాళీ పొట్టలతో అర్ధాకలితో జీవనం సాగిస్తున్న వారు కోట్ల మంది ఉన్నారు అని చెబుతున్నారు.తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ఆరుగాలం కష్టించినప్పటికీ పట్టెడన్నం దొరకక పస్తులతో గడుపుతున్నారు.నడుచుకునే యంత్రాలు ఆంగ్లంలో moving machines అని అర్థం.ఒక పని చేయడానికి శక్తిని ఉపయోగించే పరికరాలను యంత్రము అంటారు.ఏ రకమైన సాధనంలోనైనా ఇలాంటి పరికరాలు ఉంటే వాటిని యంత్రాలు అంటారు.మర బొమ్మ కర్రతో తయారుచేసిన ఆటవస్తువు.తెలంగాణలో నడుచుకునే యంత్రాలు మర బొమ్మలు కూడా ఉన్నాయి.పలక అనగా చదునుగా ఉండే దృఢమైన రాయి.పిల్లలు పాఠశాలకు వెళ్లునప్పుడు మొదటిసారిగా ఉపయోగించే అలాంటి మెత్తటి రాయి మీద బలపంతో రాసుకుంటారు.మొదట మట్టి పలకలు వచ్చాయి.చెక్కపలక మీద రాసి మలుపుతు ఎన్ని సార్లు అయినా రాయవచ్చు. ఒకప్పుడు చెక్క పలకలే అభ్యాసానికి అనుకూలంగా ఉండేవి.ఇక్కడి ప్రజలు అక్షరాలు నేర్చుకోలేదు.అందుకే అక్షరాలు మొలవని విత్తనాలుగా పనికిరాని చెత్త కాగితాలు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ సొమ్ముల్ని అమ్ముకున్నట్టు పిల్లల్ని అమ్ముకోవడం
“ ఇక్కడి అమాయకత్వానికి ఆగర్భ దరిద్రానికి ప్రతీక.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు బతుకు గడవక బంగారు నగల్ని అమ్ముకున్నట్లు కన్నతల్లి పేదరికంతో పిల్లల్ని అమ్ముకోవడం జరుగుతున్నది. తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు దరిద్రాన్ని పుట్టుకతో మోస్తున్న దుస్థితిని గమనించవచ్చు.
“ ప్రజలు నిస్సహాయులు నిర్భాగ్యులు
“ చట్టాలను ఇష్టమొచ్చినట్టు మార్చి
“ రూలును తాయెత్తులా తగిలించుకోవటం
“ నిరంకుశంగా పాలించటం ఇక్కడి దక్షత.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎటువంటి సహాయం లేనివారు.అటువంటి నిస్సహాయులకు సహాయం కల్పించాల్సిన అవసరం ఉంది.తెలంగాణ ప్రాంతంలో డబ్బు లేని నిర్భాగ్యులు కోట్ల మంది ఉన్నారు.తెలంగాణలోని నిస్సహాయులకు, నిర్భాగ్యులకు సహాయం అందించవలసిన బాధ్యత పాలన చేస్తున్న పాలకులకు ఉంది.తెలంగాణలో రాజ్యం చేస్తున్న పాలకులు చట్టాలను తమ ఇష్టం వచ్చినట్లు మార్చి నీతి, నిజాయితీ,న్యాయం,ధర్మం విషయాలకు తిలోదకాలు ఇచ్చి తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన పాలకులు నిరంకుశంగా ఆధిపత్యం చెలాయించడం వలన తెలంగాణలోని సామాన్యమైన ప్రజానీకానికి తీవ్రమైన నష్టం ఏర్పడుతున్నది.పాలకులు తీరు మార్చుకోవాలని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఇక్కడ ఖనిజ సంపదకు
“ సహజ సంపదకు కొదువ లేదు
“ అడవి,నేల బొగ్గు,భూగర్భ జలాలు
“ కొండలూ,కోనలూ,వాగులూ,వంకలూ అన్నీ ఉన్నాయి
“ దేహం ఎంత అందమైతెనేం కంటిచూపు కరువయ్యాక.
భూమి లోపల సహజసిద్ధంగా లభించే రాతి సమ్మేళనాలను,ఖనిజ వనరులు అంటారు. ఖనిజాలు పునరుత్పత్తి చేయలేని వనరులు అని చెప్పవచ్చు.సహజ వాతావరణం ప్రకృతి పరిసర ప్రాంతాలు వాటి జీవన వైరుధ్యాల్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు.సహజ వనరులను ప్రకృతి వనరులు అని కూడా అంటారు.భూమి,నీరు, మత్స్య సంపద, అడవులు,ఖనిజాలు, వాతావరణం,వర్షపాతం ఇవన్ని ప్రకృతిలో భాగమే.తెలంగాణలో ఖనిజ సంపద,సహజ సంపద పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణలో అడవులు, నేల,బొగ్గు,భూగర్భ జలాలు,కొండలు,కోనలు, వాగులు వంకలు అన్ని ఉన్నాయి.ఎంత అందమైన దేహం ఉన్నప్పటికి ఆతనికి కంటి చూపు లేకపోతే ప్రయోజనం ఉండదు.తెలంగాణా ప్రాంతం కంటి చూపు కోల్పోయింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఇంద్ర సభ కాదు తెలంగాణా.
తెలంగాణ ప్రాంతం గురించి చెబుతూ స్వర్గ లోకానికి అధిపతి అయిన ఇంద్రుడు పాలించిన ఇంద్ర సభ కాదు తెలంగాణ అని అన్నాడు.ఇంద్ర సభలో రంభ,ఊర్వశి,మేనక,తిలోత్తమ,ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్ర సభలోని పరివారానికి వినోదం కలుగ చేస్తుంటారు.
“ ఇంద్రవెల్లి పోరాటం తెలంగాణా.
తేది 20 – 04 – 1981 రోజున ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి గ్రామంలో ఓ వైపు సంత అంగడి సాగుతుంది.పెద్ద సంఖ్యలో జనాలు సంత రోజు కావడం వలన సరుకులు కొనడానికి వచ్చారు.జనాలు సంతలో తమకు కావాల్సిన సరుకులు కొన్నారు.అదే రోజు ఇంద్రవెల్లిలో జరుగుతున్న గిరిజన రైతు కూలి సంఘం సమావేశానికి హాజరు అయ్యారు. పోలీసులు సభకు అనుమతి లేదని రైతు కూలి సంఘం నిర్వహిస్తున్న సమావేశాన్ని అడ్డుకున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ఆదివాసీ జనాల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. అనేకమంది జనాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.అయితే ఆ సంఖ్య ఎంతో ఎక్కువ ఉంటుందని అని జనాలు చెబుతారు.ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల ఘటనను యావద్దేశం ముక్తకంఠంతో ఖండించింది.ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి గ్రామంలో జరిగిన ఆదివాసి రైతు కూలీలు చేసిన పోరాటం గురించి తలుచుకుంటూ ఇంద్రవెల్లి పోరాటం తెలంగాణ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రంభ ఊర్వశిల నాట్యం కాదు
“ సమ్మక్క సారక్కల జాతర తెలంగాణా.
రంభ,ఊర్వశి ఇంద్ర సభలో నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగజేస్తారు.సమ్మక్క సారక్కల జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో దట్టమైన అడవులు,కొండకోనల మధ్య జరుగుతుంది. సమ్మక్క సారక్కలు యుద్ధంలో వీరోచితంగా పోరాటం చేసిన వీర వనితలు.అట్లాంటి వీర వనితలను కన్న భూమి తెలంగాణ అని చెబుతున్నారు.
“ పురాణ కథ పాతాళ లోకం కాదు తెలంగాణా
పురాణ కథలు చెప్పిన ప్రకారం పాతాళ లోకం భూమి కింది భాగంలో ఉంటుందని,ఇక్కడ రాక్షసులు,యక్షులు,నాగదేవతలు నివాసం ఉంటారని చెబుతారు.పురాణాలు చెప్పిన పాతాళ లోకం కాదు తెలంగాణ అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.
“ సింగరేణి నల్ల బంగారం తెలంగాణా.
తెలంగాణ ప్రాంతంలో సింగరేణి గనుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును నల్ల బంగారం అని పిలుస్తారు.నల్ల బంగారం తెలంగాణకే తలమానికం అని చెప్పిన భావం అద్భుతం.
“ భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం
“ సాయుధమైన దళం – తెలంగాణా
“ వీరనారి అయిలమ్మ
“ విప్లవ వీరుడు కొమురం భీము
“ జన్మనిచ్చిన మట్టి – తెలంగాణా.
సాయుధ పోరాటం అంటే ఆయుధాలు చేపట్టి పాలకులకు వ్యతిరేకంగా చేసే పోరాటం.వెట్టి చాకిరి,భావవ్యక్తీకరణపై తీవ్రమైన ఆంక్షలు, మాతృభాషలపై అణిచివేత,మతపరమైన నిరంకుశ దోరణులపై వ్యతిరేకతను ప్రకటించడం.ఇవే కాక ప్రజలపై బలవంతులైన దొరలు,ఇతర శక్తులు ప్రజలపై దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం లేదు.సాయుధ పోరాటం ద్వారా తెలుగు భాషా వ్యాప్తికి ప్రచారం చేస్తూ క్రమక్రమంగా నిజాం పాలనలో ప్రజలపై అమలవుతున్న ఆంక్షలను వ్యతిరేకించడం ప్రారంభించింది.వెట్టి చాకిరి నిర్మూలన కొరకు పోరాటం చేశారు.నిత్యం దళిత కులాలకు చెందిన వారు అధికారుల దొరల ఇళ్లల్లో వెట్టి పనిచేసి దయనీయమైన జీవితం గడపవలసి వచ్చేది. తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది.సాయిధ పోరాటంలో 4500 మంది తెలంగాణ ప్రజలు అమరులు అయ్యారు.కాశీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు,దేశముఖ్ లు జమీందారులు,దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. నిజాం ప్రభుత్వం ప్రజలపై బలవంతులైన దొరలు ఇతర శక్తులు దౌర్జన్యం చేయడాన్ని అడ్డుకోలేదు. చాకలి ఐలమ్మ తెలంగాణా ప్రాంతంకు చెందిన వీర వనిత.ఐలమ్మ 1940 – 1944 మధ్య కాలంలో విసునూరులో దేశ్ ముఖ్ దొరలు,రజాకార్ల అరాచకాలు,ఆగడాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది.ఐలమ్మ ఆంధ్ర మహాసభతో పాటు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు.ఐలమ్మ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చురుకుగా పనిచేసింది.ఐలమ్మ అనారోగ్యంతో పాలకుర్తిలో 1985 సంవత్సరం సెప్టెంబర్ 10 రోజున మరణించింది.కొమురం బీమ్ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన ఉద్యమ నాయకుడు కొమురం చిన్నూ – సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.కొమురం భీమ్ 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అటవీ శాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి కొమరం చిన్నూ మరణించాడు.తదనంతరం కొమురం భీమ్ కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది.కొమురం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు.కొమురం భీమ్ అడవిని జీవనోపాధిగా చేసుకుని అన్ని రకాల నిజాం అధికారాలను తోసిపుచ్చాడు.కొమురం భీమ్ నిజాం నవాబు సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు.కొమురం భీమ్ పశువుల కాపర్ల పై విధించిన సుంకానికి వ్యతిరేకంగా పోరాడాడు.కొమురం భీమ్ తమ భూములలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ భూమి అడవి నీరు మాదే అనే నినాదంతో ఉద్యమించి 27 – 10 – 1948 రోజున జోడేఘాట్ అడవుల్లో జన్మనిచ్చిన మట్టి తెలంగాణలో వీర మరణం పొందాడు.
“ హక్కుల సాధన కోసం
“ మృత వీరుల త్యాగాలే
“ తెలంగాణను రణభూమిని చేశాయి
“ రక్తాన్ని పొంగించాయి – నేలను ఎరుపెక్కించాయి.
తెలంగాణ సాయుధ పోరాటంలో న్యాయమైన హక్కుల సాధన కోసం జరిగిన పోరులో వేలాది మంది బలి అయ్యారు.తెలంగాణ కొరకు పోరాడిన మృతవీరుల త్యాగాల వల్లనే ఈ ప్రాంతం రణభూమిగా మారింది.తెలంగాణ కోసం జరిగిన పోరులో రక్తం ఏరులై పారింది.తెలంగాణలో రక్తంతో తడిసిన నేల ఎరుపెక్కింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ వీరులు ఎందుకు పుడతారు
“ పోరాటాన్ని అడుగు.
పోరాటంలో ముందు నిలబడి నాయకత్వం వహించేవాళ్ళను వీరులు అంటారు.వీరులు నీతి కోసం ధర్మం కోసం న్యాయంకోసం పుట్టిన నేలను పునీతం చేయడానికి పుడతారు.
“ పోరాటం ఎందుకు పుడుతుంది
“ ఉద్యమాన్ని అడుగు.
ప్రజలు కలిసి సమూహంగా ఒక విశేషమైన లక్ష్యం సాధించడం కోసం పోరాటం చేస్తారు.మనం నివసిస్తున్న సమాజంలో అధర్మం పేరుకుపోతుంటే ధర్మాన్ని కాపాడటానికి పోరాటం పుడుతుంది. పీడిత ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమంలో చేరుతారు.
“ ఉద్యమం ఎందుకు పుడుతుంది
“ సాహిత్యాన్నడుగు.
ఉద్యమం అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి సమూహం చేసే విధులుగా నిర్వహించబడే ప్రయత్నం అని చెప్పవచ్చు. అణగారిన జనాలు సమర్థవంతమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు శక్తివంతమైన ప్రయోజనకరమైన ఉన్నత వర్గాలను ప్రతిఘటించడానికి సాహిత్యం సహాయం చేయగలదు.ఉద్యమంలో జరిగిన సంఘటనలను గురించి యదార్థ చిత్రణలు సాహిత్యంలో చోటు చేసుకుంటాయి.
“ సాహిత్యమెందుకు పుడుతుంది
“ పీడితుల్ని అడుగు.
వేదన నుంచే సాహిత్యం పుడుతుంది అంటారు. సాహిత్యం మానవ వ్యక్తీకరణలకు రూపం ఇస్తుంది.సాహిత్యం అనేది రచనలు చేసే కళ.సాహిత్యం అనే పదానికి అర్థం హితముతో కూడినదని. మేలు కూర్చే సూచనలు హితబోధలతో ఇది కూడి ఉంటుంది.బాధలు అనుభవిస్తున్న వారినే పీడితులు అని చెప్పవచ్చు.సాహిత్యం పీడితుల వేదన నుంచే పుడుతుంది అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“ పీడితులు ఎందుకవుతున్నారు
“ పీడకుల్నడుగు.
సమాజంలో ఉన్నవాడు,లేనివాడు అని రెండు వర్గాలుగా చెప్పవచ్చు.సంపన్నులు,సామాన్య ప్రజల శ్రమను విచ్చలవిడిగా దోచుకుంటూ వాళ్లను బాధల్లోకి నెట్టడం వలన పీడితులు అవుతున్నారు. పీడకులు అనగా ధనవంతులు అని చెప్పవచ్చు. పేదల శ్రమను ఎందుకు దోచుకుంటున్నారు? అని పీడకుల్ని అడగమని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పీడకులెందుకు పుడుతున్నారు
“ పాలకుల్నడుగు.
సమాజంలో ధనిక,బీద తారతమ్యాలు ఇంకా ఈనాటికి కొనసాగుతున్నాయి.ధనికులు బీదవాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తూ పీడకులుగా పుడుతున్నారు.పీడకుల గురించి ప్రజలు ఎన్నుకున్న పాలకుల్ని అడుగు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పాలకులెందుకు పుడుతున్నారు
“ ప్రజల్నడుగు.
ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వాళ్లే పాలకులుగా పుడుతున్నారు.పాలకులు ప్రజా సంక్షేమం కొరకు కృషి చేయాలి.కాని పాలకులు ప్రజా సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారు. అవినీతి,అధర్మానికి పాల్పడుతున్న పాలకుల గురించి ప్రజలను అడుగు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ అదిగో ఆ ప్రజలే
“ పీడితులు – తాడితులు
“ పోట్లాట – పోరాటం
“ ఉదయం – ఉద్యమం
“ వీరులు – విప్లవం.
తెలంగాణ ప్రాంతంలో అణచివేతకు గురవుతున్న ప్రజల గురించి పేర్కొంటూ ధనికుల దౌష్ట్యానికి బలి అవుతున్న పీడితులు ఉన్నారు.అమాయకులను అకారణంగా వివాదంలోకి లాగి కొట్టబడిన తాడితులు ఉన్నారు.వ్యర్థమైన వాదనలతో ఏర్పడిన పోట్లాట.వ్యక్తుల మధ్య శత్రుత్వం వలన కలిగేది పోట్లాట.ఒక రకమైన గొడవ అందులో స్త్రీలు ఒకరినొకరు జుట్టును పట్టుకొని గొడవ పడడం పోట్లాట.ఇద్దరి మధ్య జరిగే వాదన పోట్లాట.ఇద్దరి మధ్య విరుద్ధ భావంతో చెలరేగేది పోట్లాట.ప్రజలు కలిసి సమూహంగా ఏర్పడి ఒక విశేషమైన లక్ష్యం కోసం చేసే పోరాటం. ఇక్కడ ఆందోళన చేస్తున్న ప్రజల అవసరాలను ఎవరు అర్థం చేసుకోవడం లేదు.ఉదయం వెలుతురుకు సంకేతం.సూర్యుడు ఉదయించే సమయం ఉదయం.సమస్త వర్గాల ప్రజలు సామాజిక మార్పు కొరకు హక్కుల కొరకు పోరాటం చేయడం ఉద్యమంగా చెప్పవచ్చు.వీరులు యుద్ధంలో వెన్ను చూపనివారు.నిజమైన యోధుడు సైతం యుద్ధభూమిలో పోరాడి ప్రాణాలను విడుస్తాడు.యుద్ధంలో వెనుతిరగక ధైర్యంతో సాహసంతో యుద్ధము చేయు వ్యక్తులను వీరులు అంటారు. విప్లవం ఆంగ్లంలో రెవల్యూషన్ అని అర్థం.విప్లవం అనేది ఒక దేశం యొక్క ప్రభుత్వ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ రాజ్యాంగము లేదా సామాజిక వ్యవస్థలో అసాధారణమైన మరియు ఊహించని మార్పు.సాధారణంగా రాజకీయ మార్పులని విప్లవమంటారు.కాని చరిత్రలో సామాజిక ఆర్థిక మరియు సాంస్కృతిక రంగాలలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి.విప్లవం యొక్క అర్థం విస్తృతమైనది.ఇది మానవ జీవితంలోని ఏ రంగంలోనైనా అసాధారణమైన తీవ్రమైన మార్పును సూచిస్తుంది.అణచివేత, అన్యాయమైన పాలన,లంచగొండితనం,అసమర్ధ రాజకీయ వ్యవస్థ మరియు సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న తిరుగుబాటులో నాయకుని పాత్ర చాలా ముఖ్యమైనది.విప్లవాలు ఒక భావజాలానికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఉద్యమ రూపంలో ఉంటాయి.ప్రజల మనసుల్లో భావోద్వేగాల్లో పాత ఆలోచనలకు బదులు కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం విజయవంతం అయితే అది విప్లవంగా పరిగణించబడుతుంది.
“ శ్రీకాకుళం నుండి సిరిసిల్ల దాకా
“ వైర్ లెస్ వ్యూహాలు
“ ఊహలకు ఊపిర్లు
“ గద్దరు పాట – తెలంగాణ తేజం
“ విరసం విసురు – వీరత్వానికి మెలుకువ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళం నుండి ప్రారంభమై సిరిసిల్ల వరకు తెలంగాణ ప్రాంతం అంతటా విస్తరించింది.తెలంగాణ ప్రాంతంలో దొరల దోపిడీకి దౌర్జన్యాలు, అత్యాచారాలు,శ్రమ దోపిడీకి,వెట్టి చాకిరి నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటాల వెల్లువ కొనసాగింది.గ్రామాల్లో చైతన్యంతో ప్రజలు ఉద్యమాల్లో చేరి తమ హక్కుల కొరకు పోరాటం చేశారు.వైర్ లెస్ వ్యూహాలు ఫోన్స్ రేడియో తరంగాల ద్వారా టెక్నాలజీ రోజు రోజుకు ముందుకు దూసుకుపోతుంది.టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్ది జనరేషన్ మారుతూ వస్తూ ఉంటుంది.వ్యూహం ఎందుకు అంటే లక్ష్యాలను సాధించడానికి చర్యలను నిర్ణయించడం,చర్యలను అమలు చేయడానికి వనరులు సమీకరించడం,వనరుల ద్వారా లక్ష్యాలు ఎలా సాధించబడతాయో వ్యూహం వివరిస్తుంది. వ్యూహం అనేది పనిని సాధించడానికి ముఖ్యం. వ్యూహంతో పని చేస్తే విజయాలను సాధించడానికి వీలవుతుంది.దొరలు వారి తాబేదారులు నుండి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రజలు స్వేచ్ఛగా మరియు విశ్వాసంతో తమ జీవితాలను గడపడానికి ప్రయత్నిస్తుంది.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న జనాల్లో ఊహలకు ఊపిర్లు పోసుకున్నాయి. ఊహను ఆలోచన అని కూడా అంటారు.ఊహలు సాధించడానికి శాస్త్రీయ పద్ధతులతో కొన్ని పరీక్షలు అవసరమవుతుంటాయి.
గద్దర్ 08 – 10 – 1949 రోజున మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో జన్మించారు.గుమ్మడి విట్టల్ రావును గద్దర్ అని పిలుస్తారు.తల్లిదండ్రులు లచ్చుమమ్మ,శేషయ్య.నక్సలైట్ మావోయిస్టు తిరుగుబాటుతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో గద్దర్ చురుకుగా పనిచేశారు.గద్దర్ పాటలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.గద్దర్ భౌతికంగా లేకపోయినా ఆయన రాసిన పాటలు వినిపిస్తూనే ఉంటాయి.గద్దరు పాట తెలంగాణ తేజం అని వాస్తవం తెలియజేశారు.విప్లవ రచయితల సంఘం విరసం మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనతో భారతదేశంలో జరుగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ కార్యాచరణను ఎత్తిచూపుతూ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న సంస్థ అని చెప్పవచ్చు.నక్సల్బరి శ్రీకాకుళం ఆదివాసీ విప్లవ శిశువుగా విరసం విప్లవోద్యమం వెనువెంట నడుస్తూ భారత పోరాట ప్రజల చరిత్రలో విస్తరిస్తుంది. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూ ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు.
వీరుల అమరత్వం వీరత్వానికి మెలకువగా చెప్పవచ్చు.
“ పెట్రోలొక్కటి చేత పట్టుకొని
“ ప్రపంచాన్ని శాసిస్తున్న
“ చిన్నచిన్న రాజ్యాల్ని చూస్తున్నాం కదా!
పెట్రోలు ఉత్పత్తి చేస్తున్న చిన్న చిన్న దేశాలు కూడా ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.సౌదీ అరేబియా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశంగా పేరు పొందింది.ఆయిల్ విక్రయాల మూలంగా సౌదీ అరేబియా సమాజం మీద గొప్ప ప్రభావం చూపింది.
“ యంత్రాల మీద మేడ్ ఇన్ లు అచ్చేసి
“ పొరుగు దేశాలతో
“ పోటీ పడుతున్న కృషి కంటున్నాం కదా!
పొరుగు దేశాలు తయారుచేసిన యంత్రాల మీద మేడ్ ఇన్ చైనా మేడిన్ ఇన్ జపాన్ లేబుల్స్ సెట్ చేసి తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు పోటీ పడుతూ అమ్ముతూ అత్యధికమైన లాభాలను ఆర్జిస్తున్నారు.జపాన్ దేశస్తులు తయారుచేసిన ఉత్పత్తులు నాణ్యతతో కూడి ఉంటున్నాయి. పొరుగు దేశాల కృషికి నిదర్శనంగా తయారుచేసిన ఉత్పత్తులు నిలుస్తున్నాయి.పొరుగు దేశాలు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.
“ ప్రపంచ జనాభాలో
“ ప్రథమ స్థానంలో ఉన్నా
“ పనితనంలో బేస్ అనిపించుకుంటున్న
“ విదేశీ విధానాన్ని వింటున్నాం కదా!
చైనా దేశం ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానంలో నిలిచింది.చైనా దేశం పనితనంలో నైపుణ్యం చూపిస్తూ తమ దేశంలో తయారైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ సంపన్న దేశంగా పేరు తెచ్చుకుంది.చైనా విదేశీ విధానం ద్వారా మేలైన ఫలితాలను అందుకుంటూ ప్రపంచ దేశాలలో ప్రశంసలు అందుకుంటోంది.
“ అగ్రరాజ్యాలను ఆశ్చర్యపరిచిన
“ సాహస దేశాల కథలు
“ చదువుతున్నాం కదా!
ప్రపంచ దేశాలన్నింటిలో అతి శక్తివంతమైన దేశాలను అగ్రరాజ్యాలు అంటారు.అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అమెరికా,సోవియట్ రష్యా, బ్రిటన్,ఫ్రాన్స్,చైనా ఐదు దేశాలు పేర్కొనదగ్గవి. సాహస దేశాలుగా కొరియా మరికొన్ని దేశాల కథలు చదువుతున్నాం.
“ పగవాడి ముందు జారిపడ్డట్టు
“ నవ్వేటి బతుకైంది ఏల
“ నను గన్న ఈ నా నేల?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంను ఆంధ్ర ప్రాంతమునకు చెందిన నాయకులు పరిపాలించారు.ఆంధ్ర ప్రాంతమునకు చెందిన నాయకులు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నాయకుల అసమర్ధత కారణంగా నీళ్లు,నిధులు, ఉద్యోగాలు,సమస్త సంపదను అప్పనంగా దోచుకున్నారు.తెలంగాణ ప్రాంతంలో జన్మించిన ప్రజలు తెలివి తెగువ చూపని కారణంగా ఆంధ్రా ప్రాంతం వాళ్ళ దోపిడీకి గురి అయి పగవాడి ముందు జారిపడ్డట్టు నవ్వుల పాలైంది బతుకు. నను గన్న ఈ నేల తెలంగాణ గురించి చెబుతూ కవి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“ గడ్డమీద ఆరేసిన చేప పిల్లలానో
“ చర్మం తీసిన పులిలానో చేస్తున్నదెవరు?
తెలంగాణ ప్రాంతం గురించి చెబుతూ గడ్డమీద ఆరేసిన చేప పిల్లకు ప్రాణం ఉండదు.చర్మం తీసిన పులికి ప్రాణం ఉండదు.చేప పిల్ల నీటిలో ఈదుతూ తన సహజ స్వభావంతో బతుకుతుంది.అడవిలో పులి స్వేచ్ఛగా తిరుగుతూ ఆకలి అయినప్పుడు జంతువులను వేటాడుతూ గడుపుతుంది.నీటిలో తిరుగుతున్న చేప పిల్లను గడ్డమీద ఆరేసినది ఎవరు?అడవిలో స్వేచ్ఛగా సంచరించే పులిని వేటాడి చర్మం తీసింది ఎవరు? తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను గడ్డమీద ఆరేసిన చేప పిల్ల వలె చర్మం తీసిన పులి వలె చేసి దోచుకుంటున్న ఆంధ్ర ప్రాంతం నాయకుల దమన నీతిని ఎండగట్టారు.
“ ప్రాంతాన్ని వెనుకబడేయటం నీచం
“ జాతిని వెలుగొందనీయక పోవటం నికృష్టం.
తెలంగాణ ప్రాంతం యొక్క సంపదను సులువుగా దోచుకోవడం,అభివృద్ధికి ఆమడ దూరం ఉంచుతూ వెనుకబాటుతనానికి గురి చేయడం హీనమైన భావం నీచం అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న జాతిని కాంతులు విరజిమ్మకుండా చేస్తున్నారు.ఆంధ్ర ప్రాంతం వాళ్లు పాల్పడుతున్న బాగోతాన్ని రట్టు చేస్తూ హీనమైన చర్య నికృష్టం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ కొండ్రగట్టి నాగళ్ళు దున్నిన భూమి ఉంది
“ ట్రాక్టర్లూ పంట కోసే మిషన్లూ లేవు.
తెలంగాణ ప్రాంతంలో నివసించే రైతులు సేద్యం చేయడానికి కొండ్రగట్టి నాగళ్ళకు అవసరమైన దుక్కి దున్నిన భూమి ఉంది.తెలంగాణ ప్రాంతంలో పంట పండించే రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు మరియు పంట కోసే మిషన్లు రైతుల వద్ద లేవు.ట్రాక్టర్లు పంట కోసే మిషన్లు ఎక్కడ కనిపించవు అనే వాస్తవాన్ని వ్యక్తీకరించడం చక్కగా ఉంది.
“ ఏతం వేసే వానాకాలం వాగులున్నాయి
“ మోటగొట్టిన బావులున్నాయి
“ ప్రాజెక్టులూ పంపుసెట్లు లేవు.
తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులు పండిస్తున్న పంటలకు ఏతం వేసి పారించే వానాకాలం వాగులున్నాయి.తెలంగాణ ప్రాంతంలో రైతులు పంటలు పండించడానికి రెండు కాడి ఎడ్లతో మోటగొట్టిన బావులున్నాయి.తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతాంగం సాగు చేయడానికి ఎలాంటి ప్రాజెక్టులు లేవు.వ్యవసాయం చేసే రైతులకు వాగుల వద్ద పంపు సెట్లు లేవు.తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులకు ప్రాజెక్టులు లేకపోవడం వల్ల సరి అయిన నీటి సౌకర్యం లేకపోవడం,ట్రాక్టర్లు,పంపుసెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పడుతున్న బాధలను చూసి హృదయం ద్రవించి పల్లె వాసిగా కవి శ్రీరాములు వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది. .
“ ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రమున్నా
“ అన్నీ చీకటి కూకటి బతుకులే
“ ఇక్కడ కాగితపు పరిశ్రమలున్నా
“ అంతటా నిరక్షరాస్యత నిర్భాగ్యులే. తెలంగాణ ప్రాంతంలో గొప్పగా చెప్పుకోవడానికి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్నది.తెలంగాణ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేసిన విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు సరైన విద్యుత్తు లభించక అంధకారంలో మగ్గుతున్నారు. వ్యవసాయం సాగు చేసే రైతులకు సరైన విద్యుత్ సౌకర్యం లభ్యం కావడం లేదు.తెలంగాణ ప్రాంతంలో పేరుకే కాగితపు పరిశ్రమలు ఉన్నాయి.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు చదువుకు నోచుకోకుండా నిరక్షరాస్యులుగా మిగిలినారు, దుర్భర దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ చక్కెర కర్మాగారాలున్నా
“ చేనేత పరిశ్రమలున్నా
“ పని దొరకదు – పైసా చేతిలో ఉండదు.
తెలంగాణ ప్రాంతంలో నివసించే ప్రజలకు చక్కెర కర్మాగారాలు చేనేత పరిశ్రమలు ఉన్నప్పటికీ చేయడానికి పని దొరకదు.చేతిలో పైసా ఉండదు. దుర్బర దారిద్రంతో గడుపుతున్న తెలంగాణ ప్రాంత ప్రజల దీనావస్థను వ్యక్తీకరించడం చక్కగా ఉంది.
“ కొబ్బరి చెట్లు నాటుకోలేరు
“ కూల్ డ్రింకులు కొనుక్కోలేరు
“ అంతా ఎండమావులే.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తమ భూముల్లో కొబ్బరి చెట్లు నాటుకోలేరు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు పేదరికంతో కూల్ డ్రింకులు కొనుక్కోలేరు.కాంతి కిరణాలు ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరు ఉన్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావం.ఎండ సమయాలలో తారు రోడ్డు మీద మనం నిలబడినప్పుడు కొంత దూరంలో రోడ్డుమీద నీటిమడుగు ఉన్నట్టు కనిపిస్తుంది.కాని అక్కడ నీరు ఉండదు.ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటిమావులను ఎండమావులు అంటారు.తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎండమావులే కనిపిస్తాయి అని చెప్పడం చక్కగా ఉంది.
“తునికాకులు చుట్టినట్లు
“ ఇక్కడ జీవితాల్ని చుడతారు
“ బీడీలకు దారాలు కట్టినట్లు
“ మెడకు ఉరి తాళ్లు బిగిస్తారు
“ పొగాకును అంటి పెట్టి తాగినట్టు
“ మనుషుల్ని మంటలో వేసి ఆనందిస్తారు.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న మనుషులు గడుపుతున్న జీవితాల్ని తునికాకులు చుట్టినట్లు చుడతారు.తునికాకులు చుట్టిన బీడీలకు దారాలు కట్టుతారు.అలాగే తెలంగాణలో మనిషి మెడకు బీడీలకులాగా ఉరి తాళ్లు వేసి బిగిస్తారు.పొగాకు కలిపిన బీడీని నిప్పుతో అంటించి తాగినట్లు మనుషుల్ని మంటలో వేసి వేడుకగా ఆనందిస్తారు. బీడీలు తాగడం అనే వ్యసనంలాగే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మనుషుల జీవితాలను ఆహుతి చేసే దుర్మార్గం కొనసాగుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ భయం ఇక్కడ వెన్నులా వెంటాడుతుంది
“ చీకటంటే భయం – చేతబడి అంటే భయం
“ దొంగ ఆంటే భయం – దోపిడీ అంటే భయం.
తెలంగాణ ప్రాంతంలో జీవించే మనుషులు భయంతో వణికి పోతారు.భయం ఇక్కడ మనిషి శరీరం వెనకాల ఉన్న వెన్నును కూడా వదలకుండా వెంటాడుతుంది.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనులకు చీకటి అంటే చెప్పలేని భయం అని చెబుతున్నారు.పొద్దుగూకగానే చీకటి ముసురుకుంటుంది.చీకట్లో కొందరు అసాంఘిక శక్తులు చేసే దుర్మార్గపు చర్యలు తలుచుకొని చీకటి అంటే భయం గుబులుతో గడుపుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో నివసించే జనులు మూఢవిశ్వాసాల ఊబిలో కూరుకుపోయి చేతబడి చేస్తారనే భయంతో దిగులుతో జీవనాన్ని గడుపుతున్నారు.చేతబడి అంటే గిట్టని వారిని చంపటానికో హాని చేయడానికో చేతబడి చేయించే విద్య.పలానా వ్యక్తి చేతబడి చేయడం వల్ల తమకు నష్టం జరిగిందని భావించి పగతో ప్రతీకారంతో రగిలి ఒకరినొకరు చంపుకుంటున్న దీన స్థితిని చూస్తున్నాం.ఇనుప పెట్టె తాళాలు పగల కొట్టి ఇంటిలోని నగలు సామాన్లు దోచుకునే వ్యక్తిని దొంగగా చెప్పవచ్చు.తెలంగాణలో ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఆకలితో పేదరికం వల్ల బతుకు గడపక దొంగతనాలు వృత్తిగా చేసుకొని బతుకుతున్నారు.దోపిడీకి ప్రేరణ సమాజంలోని తారతమ్యాలు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ఈ దోపిడీలు శతాబ్ద కాలం నుండి జరుగుతున్నాయి. బలవంతమైన ధనిక వర్గం ప్రజలు పేదల రక్తం పీల్చి వారి వద్దనున్న సంపదను శ్రమను దోపిడీ చేసేవారు. పేదలు ధనికులు చేస్తున్న దుర్మార్గం చర్యలను ప్రతిఘటించలేక పోయేవారు.ఈ సంఘర్షణలే బలవంతంగా నైనా తమ హక్కులను సాధించాలనే వారిని పురి గొల్పాయి.తెలంగాణ ప్రాంతాల్లో దోపిడీ భయం కొనసాగుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ తెలంగాణాను ఎడారిగా ఉంచిందెవరు
“ అన్నం లేని అక్షరాలు రాని
“ అవిటి దానిలా తయారు చేసిందెవరు?
తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉంచింది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో ఉన్న వనరులను దోచుకుని ఎడారిగా మార్చింది ఆంధ్రా పాలకులు అని చెప్పటంలో సందేహం లేదు. తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రకాలుగా మోసంతో వంచనతో ఎందుకు పనికిరాని బంజరు ప్రాంతంగా మార్చిన దుస్థితిని ఎండగట్టారు.ఎడారి అనగా ఎటువంటి వృక్ష సంపద నీరు లేకుండా కేవలం ఇసుకతో ఉన్న విశాలమైన భూభాగం అని చెప్పవచ్చు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న రైతులు పంటలు పండించి గిట్టుబాటు ధరలు రాక ఆకలితో అలమటిస్తూ దుర్భర దారిద్ర్యంతో జీవనాన్ని ఈడుస్తున్న దుస్థితిని కంటున్నాం. తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అక్షరాలు రాని నిరక్షరాస్యులుగా అవయవాలు పనిచేయని అవిటిదానిలా తయారు చేసింది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికీ ఈ ప్రాంతంలో చదువు రాని నిరక్షరాస్యులు ఎక్కువగా కనిపించడానికి కారణం చదువుకు దూరం చేసి అజ్ఞానంలో అంధకారంలో మునిగేటట్లు చేసింది,తెలంగాణను పాలించిన ఆంధ్ర పాలకుల కుటిల నీతి అని చెప్పవచ్చు.
“ ఓటు ఇచ్చింది ఎవరు
“ మోటు మనుషులుగా చేస్తుందెవరు?
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు లభించింది. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు పాలకుల దమన నీతి వల్ల దుర్వినియోగం అవుతుంది. తెలంగాణ ప్రాంతం ప్రజలు అజ్ఞానం వల్ల ఓటు వేసి గెలిపించడం వల్లనే ఆంధ్ర పాలకుల నాయకత్వం దోపిడీ కొనసాగింది.ఇక్కడ నివసిస్తున్న ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రావాళ్లు తెలంగాణ ప్రాంతం వారిని చదువురాని అనాగరికులుగా కళా,సాహిత్యం సినిమా రంగాలలో ఇక్కడి యాస,భాషను హీనంగా చూపిస్తూ హేలనగా చేస్తున్నది మోటు మనుషులుగా చూపిస్తున్నది ఆంధ్రావాళ్లు అని చెప్పుటలో సందేహం లేదు.
“ సంతకాలు రాని వేలిముద్రగాళ్ళుగా తీర్చిదిద్ది
“ గోళ్లను కత్తిరించి సింహాలను
“ బోనులో బంధించిందెవరు?
తెలంగాణ ప్రాంతంకు చెందిన ప్రజలను పేదరికం వల్ల చదువుకు స్వస్తి పలికి,చదువు రాని నిరక్షరాస్యులుగా తయారు చేశారు.ఇక్కడ ప్రజలు అజ్ఞానంతో అవిద్యతో అంధకారంలో మునిగినారు. చదువు రాని జనాలు సంతకాలు ఎలా చేయగలరు?సంతకం చేయ రాదు.చేతితో వేలిముద్ర వేసే వాళ్ళు.గోళ్లను కత్తిరించి తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను సింహాల వలె బోనులో బంధించి ఆంధ్ర ప్రాంతం వాళ్లు ఆటలు ఆడుతున్నారు.తెలంగాణ ప్రాంత ప్రజలపై ఆంధ్ర ప్రాంత పాలకుల నాయకత్వం కొనసాగుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ వృత్తాకారంలో తెలంగాణ
“ వృత్తి కళాకారులతో తెలంగాణ
“ భాష తెలంగాణ యాస తెలంగాణ
“ జనుల నాలుకల మీద ఓలలాడుతున్న జానపదం తెలంగాణ.
వృత్తము జ్యామితి అనే గణిత శాస్త్ర విభాగానికి చెందిన ఒక భావన.వృత్తాకారం రూపంలో తెలంగాణ ఉందని చెబుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో సబ్బండ వర్ణాల ప్రజలు సకల వృత్తి కళాకారులు కూడా ఉన్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనాలు మాట్లాడే భాష,మాట్లాడే యాస తెలంగాణ ప్రాంతంకు చెందినదని గర్వంగా చెప్పవచ్చు.జానపద సంగీతం యొక్క అర్థం గ్రామీణ జనుల సంగీతం.జనులకు సంబంధించింది జానపదం.ఆంగ్లంలో Music Of Folk అని అంటారు.జానపదులు అంటే పల్లె ప్రజలు అని చెప్పవచ్చు.పల్లె ప్రజలు పాడేది జానపదం. జానపదం జనుల హృదయాల్లోంచి స్వేచ్ఛగా పుట్టినది.ఆధునిక శాస్త్రీయ సాంకేతికజ్ఞానం, అభివృద్ధి చెందని రోజుల్లో వ్యవసాయం ప్రజలకు జీవనోపాధిగా ఉండేవి.జనం రకరకాల పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు.అవే జానపద గీతాలు.జానపద గీతాలు పల్లె పాటలు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ గోసి గుడ్డ గొంగడి బొంత
“ ఇవే ఇక్కడి ప్రజల ఆస్తులు – అంతస్తులు.
తెలంగాణ ప్రాంతంలో నివసించే జనాలు తరతరాలుగా గోసి గుడ్డ కట్టుతో గొంగడి బొంత భుజాన వేసుకుని జీవనం సాగిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనుల జీవితాల్లో తరాలుగా మార్పు లేదు.స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లు అయినా పేదరికంతో గోసి గుడ్డ కట్టుకుని గొంగడి బొంత భుజాన వేసుకుని తిరుగుతున్న జనులను చూసి తెలంగాణ ప్రజల వస్త్రధారణ వారి యొక్క జీవితంలో లభించిన ఆస్తులు,అంతస్తులు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఇప్పటికీ
“ ఇంకా నడుముకు జకుముక రాయి – దూది
‘ తలకు రుమాలు – నోట్లో చుట్ట – చేతిలో కట్టే
“ అర్ధ నగ్న శరీరాలతో ఆకలి కడుపుల్తో
“ ఏదో గొప్ప వేషం – అదో అద్భుత సజీవ భాష
“ నేలంతా వాకిలై – ఆకాశమంత ఇల్లయి
“ రాత్రింబవళ్లు కష్టించే
“ శ్రామికులు – కార్మికులు – కర్షకులూ ఇక్కడి ప్రజలు.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల గురించి చెబుతూ స్వాతంత్రం వచ్చినప్పటికి ఇప్పటికి వాళ్ళ బతుకుల్లో ఎలాంటి మార్పు లేదు.తెలంగాణ ప్రజలు నడుముకు జకుముకరాయి,దూది,తలకు రుమాలు చుట్టుకొని,నోట్లో చుట్ట,చేతిలో కట్టె పట్టుకొని తిరుగుతూ అర్థనగ్న శరీరాలతో సరియైన బట్టలు లేక,తినడానికి తిండి లేక,ఆకలి కడుపులతో జీవిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలది గొప్ప వేషం అని చెబుతూ అదో అద్భుతమైన సజీవమైన భాషగా పేర్కొనడం కవి శ్రీరాములుకు తెలంగాణ ప్రజల దుస్థితి పట్ల గల ఆవేదన అర్థమవుతున్నది.తెలంగాణ ప్రజలకు సరైన గూడు లేని స్థితిని తెలుపుతూ పూరి గుడిసెల్లో కొందరు చెట్ల కింద కొందరు నివసిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న గూడు లేని ప్రజలకు నేలంతా వాకిలిగా ఆకాశం అంతా వారి ఇల్లు అని దీనస్థితిని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో శ్రామికులు,కార్మికులు, కర్షకులు,ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రింబవళ్లు కష్టపడతారు అని వ్యక్తం చేయడం చక్కగా ఉంది.
“ ఇది ఇక్కడి జాతి సంస్కృతి
“ తెలంగాణ ప్రజలు – కారాదెన్నడు సవతి పిల్లలు.
ఆకృతి,ధర్మము,మొదలైన వాటిలో సమాన దృష్టితో ఆలోచించే చేసే విభాగం జాతి అని అంటారు. వంశపారంపర్యంగా వచ్చే కుల సంప్రదాయం జాతి.సంస్కృతి అనగా ఆంగ్లంలో Culture అని అర్థం.మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను ఆనగా జీవనం, ఆచారాలు,వ్యవహారాలు,ప్రమాణాలు,మతం, సంబంధాలు,పాలన వంటి వాటిని సూచించే పదం. ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు,సంస్థలు తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్ని కలిపి సంస్కృతి అంటారు.సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానం ఆ సమాజపు సంస్కృతి అని చెప్ప వచ్చు.గతించిన కాలం గురించి భవిష్యత్తు తరాలకు అందించే వారధి సంస్కృతి. తెలంగాణ ప్రాంతంలో సబ్బండ వర్ణాల ప్రజలు,సకల వృత్తి కళాకారులు కూడా ఉన్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనులు మాట్లాడే భాష మాట్లాడే యాస తెలంగాణకు చెందినదని గర్వంగా చెప్పవచ్చు.జానపదులు అంటే పల్లె ప్రజలు.పల్లె ప్రజలు పాడేది జానపదం.జనుల హృదయాల్లో నుంచి స్వేచ్ఛగా పుట్టినది జానపదం. ఆధునిక, శాస్త్రీయ,సాంకేతిక విజ్ఞానం,అభివృద్ధి చెందని రోజుల్లో వ్యవసాయం లాంటి శారీరక శ్రమ కలిగిన వృత్తులే జీవనోపాధిగా ఉండేది.జనం ఆ శారీరక శ్రమ నుండి ఉపశమనం కోసం రకరకాల పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా పనులు చేసుకునేవారు, అవే జానపద గీతాలు.నాన్న రెండో భార్యను సవతి తల్లి అని పిలుస్తారు.జీవిత భాగస్వామి యొక్క మునుపటి భార్య నుండి కలిగిన పిల్లలను ఆమె సవతి పిల్లలు అని పిలుస్తారు.తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రావాళ్ల పాలన నిరంకుశంగా కొనసాగింది. తెలంగాణ వాళ్లు ఆంధ్ర తల్లికి పుట్టిన సవతి పిల్లలు కాదు.తెలంగాణ తల్లికి జన్మించిన శిశువులను ఏమని పిలుస్తారు? తెలంగాణ పిల్లలు అని చెప్పిన తీరు చక్కగా ఉంది. శ్రీరాములు రచించిన నన్ను గన్న నా నేల కవిత, కవ్వం కవితా సంపుటిలోని మొదటి కవిత.కవ్వం కవితా సంపుటిని 2002 సంవత్సరంలో ప్రచురించారు.2002 నాటి తెలంగాణలోని సామాజిక ఆర్థిక పరిస్థితులు జనుల జీవితాలకు నన్ను గన్న నా నేల కవిత అద్దం పడుతుంది.నన్ను గన్న నా నేల కవిత తెలంగాణ ప్రాంతం యొక్క చరిత్రకు అక్షర రూపం ఇవ్వడం అద్భుతం అని చెప్పవచ్చు.కందుకూరి శ్రీరాములు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.తెలంగాణ చరిత్రను నన్ను గన్న నా నేల కవితలో నిక్షిప్తం చేసినందుకు కవి కందుకూరి శ్రీరాములును అభినందిస్తున్నాను.
రచన : నరేంద్ర సందినేని.
కందుకూరి శ్రీరాములు తేది 20 – 10 – 1954 రోజున రావురూకుల గ్రామంలో జన్మించారు.తల్లిదండ్రులు : రత్నమ్మ, వెంకటాద్రి.తండ్రి వెంకటాద్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.తాత నరసయ్య, నాయనమ్మ కమలమ్మ.తాత నరసయ్య పూజారిగా పని చేశారు.తాత తండ్రి శేషయ్య పంతులు కవిగా ప్రసిద్ధి చెందారు.శేషయ్య పంతులు రాసిన పుస్తకాలు అలభ్యం అని చెప్పవచ్చు.ముత్తాత శేషయ్య పంతులు వల్ల శ్రీరాములుకు కూడా కవిత్వం అబ్బింది.శేషయ్య పంతులు రాసిన ఒక పద్యం దొరికితే శ్రీరాములు దానిని రావురూకుల కవితా సంపుటి లో ముద్రించారు.శ్రీరాములు 1 వ తరగతి నుండి 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల రావురూకుల గ్రామంలో చదివారు. శ్రీరాములు 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు జెడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ పాఠశాల, పుల్లూరు గ్రామంలో చదివారు.శ్రీరాములు ఇంటర్మీడియట్ విద్యను,డిగ్రీ విద్యను ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల,సిద్దిపేట గ్రామంలో చదివారు.శ్రీరాములు ఎం.ఏ.(తెలుగు) ఉస్మానియా విశ్వవిద్యాలయం,హైదరాబాదులో చదివారు. శ్రీరాములు ప్రభుత్వ తెలుగు భాషా పండితులుగా పనిచేసి 2009 సంవత్సరంలో రిటైర్ అయ్యారు. శ్రీరాములు విద్యార్థి దశ నుండి సాహిత్య రచన చేయడం ఆరంభించారు.శ్రీరాములు వివాహము లక్ష్మీశ్రీ తో తేది 14 – 05 – 1984 రోజున హైదరాబాదులో జరిగింది.శ్రీరాములు భార్య లక్ష్మీశ్రీ కేంద్రీయ విద్యాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.శ్రీరాములు లక్ష్మిశ్రీ దంపతులకు ఒక్కతే సంతానం.పేరు కందుకూరి హర్షిని.హర్షిని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివింది.హర్షిని మెడిసిన్ లో పీజీ విద్యను అభ్యసించుచున్నది.
కందుకూరి శ్రీరాములు ముద్రించిన కవితా సంపుటాల వివరాలు.
1) దివిటి కవితా సంపుటి – 1974. కందుకూరి శ్రీరాములు సహ రచయితలు నందిని సిధారెడ్డి,కర్నాల బాలరాజు).
2) వయోలిన్ రాగమో వసంత మేఘమో – కవితా సంపుటి. 1993.
3) సందర్భం కవితా సంపుటి – 2001.
4) కవ్వం కవితా సంపుటి – 2002.
5) దహన కావ్యం దీర్ఘ కవిత – 2003.
6) పీఠభూమి కవితా సంపుటి – 2005.
7) వెన్నెల బలపం కవితా సంపుటి – 2008.
8) రావురూకుల కవితా సంపుటి – 2009.
9) తెలంగాణ రథం కవితా సంపుటి – 2013.
10)అలుకు పిడుచ కవితా సంపుటి – 2017.
11)Bhagiratha’s Bounty and other poems (Trans : T.S.Chandramouli) – 2020.
12). ఒక గురువుగారు నలుగురు శిష్యులు : నందిని సిధా రెడ్డి,కందుకూరి శ్రీరాములు,ఆశారాజు, నాళేశ్వరం శంకరం.
కందుకూరి శ్రీరాములు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అందుకున్న పురస్కారాలు :
1)తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాహిత్యంలో విశేష సేవలు అందించిన వారికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ లెవెల్ అవార్డు తేది 02 – 06 – 2018 రోజున రూపాయలు 1,00,116/- నగదు,ప్రశంసా పత్రం,సన్మానం అందుకున్నారు.
2) ప్రీవర్స్ ఫ్రంట్ అవార్డు సందర్భం కవితా సంపుటికి 2003.
3) తెలుగు యూనివర్సిటీ, సాహిత్య పురస్కారం సందర్భం కవితా సంపుటికి 2004.
4) సినారె కవితా పురస్కారం రావురూకుల కవితా సంపుటికి 2010.
5) ఉమ్మడిశెట్టి కవితా పురస్కారం వయోలిన్ రాగమో వసంత మేఘమో కవితా సంపుటికి 1994.
6) ఈదూరు సుబ్బయ్య సాహితీ పురస్కారం రావురూకుల కవితా సంపుటికి 2010.
7) ఆంధ్ర సారస్వత సమితి ప్రతిభా పురస్కారం వెన్నెల బలపం కవితా సంపుటికి 2009.
8) విశ్వ కళా పీఠం స్నేహ నిధి పురస్కారం. కవ్వం కవితా సంపుటికి 2003.
9) అల్లూరి సీతారామరాజు కళా పీఠం కవితా రమ పురస్కారం వెన్నెల బలపం కవితా సంపుటికి 2010.
10) శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ముదిగంటి నరసింహారెడ్డి సాహితీ పురస్కారం 2014.
11) స్వర్గీయ కర్పూరం మధుసూదన స్వామి సాహిత్య పురస్కారం 2016.
12)శ్రీ మనస్సంపన్ముడుంబై రంగ కృష్ణమాచార్యులు విరించి స్మారక పురస్కారం
13) కుందుర్తి రంజని సంస్థ కవితల పోటీలలో ఉత్తమోత్తమ కవితా పురస్కారం
14) పాలమూరు కవితా పురస్కారం
15) కాళోజీ పురస్కారం
16) ప్రజాభారతి సాహిత్య పురస్కారం
17) కవి శిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ ప్రోత్సాహక పురస్కారం
18) మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
19) జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మెదక్ 1995.
20) రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. 2008.
శ్రీరాములు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
శ్రీరాములు హైదరాబాదులోని మలక్ పేటలో నివాసం ఉంటున్నారు.శ్రీరాములువిశ్రాంత జీవితం గడుపుతున్నారు.శ్రీరాములు వివిధ సాహిత్య కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తూ వర్ధమాన కవులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
ఎన్ని ఏళ్ళు గడిచినా, ఎన్ని తరాలు మారినా సమాజంలో ఇంకా మార్పు రావాల్సి ఉంది అని చెప్పవచ్చు. మారుతున్న విద్యా,వైజ్ఞానిక, సాంకేతిక విషయాల్లో ఎంతో పరిణతి చెందినప్పటికీ కొన్ని విభాగాలలో మనిషి దృక్పథం ఇంకా మారటం లేదు. ప్రాశ్చాత్య దేశాల పోకడల ప్రభావమో…! లేకమనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో చేస్తున్న తప్పు కావచ్చు….! ఏదిఏమైనాప్పటికీ తప్పిదాలు మాత్రం జరుగుతున్నావనుకోవచ్చు..!! సామాజిక మాధ్యమాలు ఒకవైపు మనిషిని వెంటాడి నిజాన్ని, అబద్ధాన్ని ఒకే విధమైన అనుకరణలతో మనిషిని నేటి కాలంలో సందిగ్ధంలో పడవేస్తుంటే మరోవైపు ఏది సరి అయినదో తెలుసుకోక అయోమయంలో పడడం, బంధాలు అనుబంధాలు మధ్యలో ఆత్మీయతను ఎంతవరకు కాపాడుతున్నారో తెరచి చూస్తే చాలా అనుమానం కలుగుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ తరతరాలుగా అణిచివేయబడుతున్న స్త్రీ ల జీవితాలే కనిపిస్తున్నవి. ఇలా ఒకటేమిటి అనేక! ఎన్నో వైవిధ్యమైనటువంటి సంఘటనలను నేటి కాలం రచయితలు తమ కలాలను కదిలిస్తూ అనేక రచనలు చేశారు, చేస్తున్నారు. వారంతా కోరుకునే అభిప్రాయం, కాంక్ష ఒక్కటే మరి అదే ‘మార్పు’ ఆ మార్పు కోసం పరితపిస్తున్న నేటి రచయితలలోని కొందరి కావ్యాలను, వారి వారి రచనలను పరిశీలిస్తే…
ఎన్ని ఏళ్ళు గడిచినా, ఎన్ని తరాలు మారినా సమాజంలో ఇంకా మార్పు రావాల్సి ఉంది అని చెప్పవచ్చు. మారుతున్న విద్యా,వైజ్ఞానిక, సాంకేతిక విషయాల్లో ఎంతో పరిణతి చెందినప్పటికీ కొన్ని విభాగాలలో మనిషి దృక్పథం ఇంకా మారటం లేదు. ప్రాశ్చాత్య దేశాల పోకడల ప్రభావమో…! లేకమనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో చేస్తున్న తప్పు కావచ్చు….! ఏదిఏమైనాప్పటికీ తప్పిదాలు మాత్రం జరుగుతున్నావనుకోవచ్చు..!! సామాజిక మాధ్యమాలు ఒకవైపు మనిషిని వెంటాడి నిజాన్ని, అబద్ధాన్ని ఒకే విధమైన అనుకరణలతో మనిషిని నేటి కాలంలో సందిగ్ధంలో పడవేస్తుంటే మరోవైపు ఏది సరి అయినదో తెలుసుకోక అయోమయంలో పడడం, బంధాలు అనుబంధాలు మధ్యలో ఆత్మీయతను ఎంతవరకు కాపాడుతున్నారో తెరచి చూస్తే చాలా అనుమానం కలుగుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ తరతరాలుగా అణిచివేయబడుతున్న స్త్రీ ల జీవితాలే కనిపిస్తున్నవి. ఇలా ఒకటేమిటి అనేక! ఎన్నో వైవిధ్యమైనటువంటి సంఘటనలను నేటి కాలం రచయితలు తమ కలాలను కదిలిస్తూ అనేక రచనలు చేశారు, చేస్తున్నారు. వారంతా కోరుకునే అభిప్రాయం, కాంక్ష ఒక్కటే మరి అదే ‘మార్పు’ ఆ మార్పు కోసం పరితపిస్తున్న నేటి రచయితలలోని కొందరి కావ్యాలను, వారి వారి రచనలను పరిశీలిస్తే…
” అనుభూతుల అక్షరమాల ఆగిపోకు ..కష్టాలు ఎన్ని వచ్చినా వెనుదిరగక సాగిపో” అంటూ కవన ప్రత్యేకతను ‘ఆగిపోకు’ కవితా సంపుటి ద్వారా పాఠకులను ప్రభావితం చేస్తున్న కవయిత్రి అయిత అనిత. స్త్రీ సృష్టిలో అందమైన దేవుడి వరం. స్త్రీ అంటేనే ప్రేమ అనురాగం, పుట్టిన దగ్గర నుండి తన ప్రతి పాత్ర ఎంతో చక్కగా నిర్వర్తిస్తుది, నాలుగు గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది. ఏ పనిలోనైన రాణించగలిగే ధైర్యం సత్తా ఉన్నది స్త్రీ కి అని పదే పదే చెప్తోంది !
“స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం” కానీ సమాజంలో కొన్ని అరాచకాలు, చిన్నారులపై స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు పాల్పడుతున్న దుండగులను శిక్షించాలంటూ కవయిత్రి అనిత ఆవేదనగా వ్యక్తం చేశారు. ‘నేను నేనే’ …! కవితలో…. పరుల అందానికై నాలుగు ప్రియమైన మాటలు
నా జహ్వా పై ఊరుతూనే ఉంటాయి ఎల్లప్పుడు!
నా మీద వస్తే నాకు దిక్సూచి నా వ్యక్తిత్వమే నాకు రక్ష….. అంటున్నది.
నేటి తరానికి, రాబోయే తరానికి అర్థమయ్యే రీతిలో భావానికి ఎలాంటి నష్టం కలగకుండా పాఠకులకు అందించాలనే ముందుకు వచ్చిన హుస్నాబాద్ వాస్తవ్యురాలు అయిన కవయిత్రి,
ఇంజపురి వసంత తన కవనం ఒక ప్రత్యేకత తో రచించిన ” వసంత సుమాలు ” పుస్తకం తెలిచిచూస్తే చివరి పేజీ వరకు అన్ని విషయాలను స్పృశించి ” అక్షర భావ సుమాలు “గా ఆకట్టుకుంది.
‘ ఉప్పు కర్పూరం వేరు
రంగులు మాత్రం తెలుపు
ఒకటి రుచిని తెలుపు
మరొటి పవిత్రత గొలుపు “
ఉప్పు కర్పూరం రెండు కూడా కళ్ళకు సమానంగా కనిపించినా గానీ దేని లక్షణం అది అంటూ ఆనాటి ఉప్పు కప్పురంబు చూడు ఒక్క పోలికనుండును మళ్లీ తలపించింది .
హృదయాంతరాలను కదిలించే “కృష్ణా తరంగాలు ” … అలసిన మనసుకు ఓదార్పులు …. అంటూ సాహితీ లోకానికి నా అంతరంగాలు కృష్ణా తరంగాలు * తొలి కవితా సంపుటితో పరిచయమైన (పొందూరు) ఒంగోలు వాస్తవ్యురాలు కవయిత్రి కృష్ణవేణి పరాంకుశం తన కవనం ఒక ప్రత్యేకం…. *తన కవితల భావాలలో తడారిన భూమి గుండెలో కొత్త ఆశలు మొలకెత్తినట్లుగా గాయపడిన మనసుకు ఓదార్పు, యువతకు ప్రేరణ, ఆత్మవిశ్వాసాన్ని అందించే కవయిత్రి కృష్ణవేణి కవనం
సంక్రాతి కవితలో….
పాలముంతల నురుగుపొంగులతో చెరుకుగడల తీపిమధురిమలతో పిండివంటల విందులతో గంగిరెద్దుల విన్యాసాలతో కోడిపందాల కోలాహలాలతో నింగికెగిరే పతంగుల విహారాలతో రంగవల్లిలో గొబ్బెమ్మలు పెట్టి చేసే కొత్త అల్లుళ్ళ , కొంటె మరదళ్ళ సరదా రైతు ఇంటికి చేరిన ధాన్యరాసులు సంక్రాంతి లక్ష్మి పరవశిస్తుంది
తెలుగు ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకొనే సంక్రాంతి…ఆ పండుగ గురించి విశిష్టంగా తన కవితలో చెపుతూ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచింది అనేలా చిత్రించారు.
ఆధ్యాత్మిక భావాల ద్వారా పాఠకులను చైతన్యం చేసే దిశగా కలం కదుపుతూ సాహితీ ప్రపంచానికి పరిచయం అవుతున్న హైదరాబాద్ వాస్తవ్యురాలు ఎమ్. అరుణ కుమారి గారి కవనం ఒక ప్రత్యేకం. శ్రీ కృష్ణ భగవానుడి భక్తురాలిగా, ఆధ్యాత్మిక భావాల ద్వారా తనలోని అంతరంగాలను అద్భుతంగా ఆవిష్కరించి అందమైన కవిత్వాన్ని అందించారు. ఈ అక్షర దీపిక లోని కవితల్లో
“కళ్ళు మూసినా, తెరిచినా
నీ రూపమే
ఎంత చూసినా తనివితీరదేమి
ఇంత అందం ఎక్కడ దాచావు
ఆ చిలిపి కవ్వించే కళ్ళ లోనా
ఆ కొంటె నవ్వు దాచిన అధరం లోనా
ఏవో లోకాలకు తీసి కెళ్లే ఆ వేణు గానం లోనా”
సృష్టికి మూలమైన ఆ పరమాత్ముడిని స్మరించుకుంటూ, తనలోని భావాలను జతచేస్తూ అందించిన కవనం.
మమతల కోవెల రాధా కవిత్వం
కవితలోని గాంభీర్యం , అక్షర సేద్యం , వ్యవస్థలోని ప్రతి అవస్థలను స్పృశించే నేర్పు , ప్రతి అంశాన్ని పరిశీలించి తనదైన శైలిలో అక్షరీకరించాలన్న తపన రాధా కుసుమ కవిత్వం ప్రత్యేకత. వందేళ్ల క్రితం వివక్షతకు వ్యతిరేకంగా గళం విప్పి పోరాటం చేసిన కుసుమ ధర్మన్న కుటుంబానికి చెందిన -డా.రాధా కుసుమ హైదరాబాద్ వాస్తవ్యురాలు.
రాధా కుసుమాలు – కవితా సంపుటితో సాహితీ లోకంలో అక్షర సుమాలను అందించింది.
మనుష్యులంతా ఒక్కటే…
అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే గీతాలాపన చేసాను చిన్నవాడు .. కానీ నేడు కూడా నాభాష నా మతం నాకులం నా ప్రాంతం ఇదే కదా కుమ్ములాటలకు ప్రధాన సూత్రం … ! రవికిరణానికి పవన పయనానికి పారే సెలయేటికి కురిసే చినుకులకు ఈ కలదా ఈ జాడ్యం ఇంకా నయం ప్రకృతి కూడా చూపిస్తే ఈ తేడాల తతంగం మానవుల మనుగడలో మిగిలేది శూన్యం …. ! అని తెలిపారు.
అనుబంధపు లోగిలి వెలుగులే “దగ్ధ హృదయం’
సమాజంలోని ప్రతి అంశాన్ని తనదైన కోణంలో పరిశీలించి ఒక మార్పు కోసం పరితపించే కవిగా కవిత్వం అంటే నిత్య సంఘర్షణ గా భావించి కలాన్ని కదిలిస్తూ సాహితీ లోకంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన నేరోజు రమేష్ రచించిన ” దగ్ధ హృదయం ” కవిత సంపుటిని పరిశీలిస్తే… సమాజంలో పాతుకుపోయిన సమస్యలు లంచగొండితనం, యువతలో మసకబారుతున్న బాధ్యతలు, సమాజపరంగా రేపటి భావితరాలకు పరిరక్షణ కోసం కాలుష్య నియంత్రణ ఇలా పలు అంశాలపై తన కవితా సంపుటిలో ప్రధానంగా ప్రస్ఫుటించినాడు.
సమాజ హితం కోరే….
వెలుగు పూలు కవితల్లోని ఘాడత ఏ కోణంలో ఉన్నది అనే విషయంలో కవి ఎంచుకున్న వస్తువు నుండి మొదలుకొని, పదప్రయోగంలో సఫలీకృతుడై సమాజానికి వెలుగునివ్వాలనే దృఢ సంకల్పంతో చేసిన అద్భుత ప్రయత్నమే “వెలుగుపూలు కవితా సంపుటి” ప్రజల పక్షం వహిస్తూ ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ తనదైన కోణంలో సాహిత్య రంగంలో రాణిస్తున్న కవి తాటిపాముల రమేష్ రచించిన ఈ కవితా సంపుటి సాహితీ ప్రపంచంలోనే కాకుండా, సమాజపరంగా ఆరోగ్యవంతమైన కవిత్వాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి బాధ్యతలు ఒకవైపు నిర్వహిస్తూ మరోవైపు సాహిత్య ప్రయాణం చేయడం అభినందనీయం…. సామాజిక సాంఘిక అంశాలను ప్రత్యేకంగా తన కవితల్లో వస్తువులుగా తీసుకొని తనదైన కోణంలో ఒక కొత్త నిర్మాణాత్మక ఫలితాలను సమాజంలో చూడాలని ఆశిస్తూ కవి చేసిన ప్రయత్నం సఫలీకృతమవుతుందని చెప్పవచ్చు.
కనిపించే ప్రకృతి అందాలను వర్ణించడం కవి సహజ లక్షణం… అదేవిదంగా సాక్షాత్కరంగా కనిపించని సమస్యలకు పరిష్కారాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ప్రత్యేక హృదయం ఏర్పర్చుకొని తన కలం తో కృషి చేస్తున్న కవయిత్రి కరీంనగర్ వాసి ఉత్తమ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలుగా పురస్కారం అందుకున్న కాసనగొట్టు స్వప్న కృష్ణ. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గా కొనసాగుతున్నది. తను వెలువరించిన కవితా సంపుటి ” ఎందుకో ఈ వేళ” ను పరిశీలించగా విభిన్న అంశాలపై దూర దృష్టి తో, ముందస్తు సూచనలతో కవితా వస్తువులను కవయిత్రి ఎంచుకోవటంలో ప్రత్యేకతగా
మేము మనుషులమే ( హిజ్రాలు ) కవితలో…
విరించి పరధ్యానంలో పద్ధతి మరిచి సృష్టించాడో..
ఆ విధి వికటాట్టహాసంతో విరుచుకు పడిందో…
తనువులో నియమం …
మనసుదో చిత్తం …
ఆమోదయోగ్యమవని రూపం ..
ఆచరణయోగ్యమవని జీవనం ..
ఏమిటి మా పాపం ..
ఎందుకీ శాపం ..
మానవ జీవితంలో ఆడ మగ తో పాటు ఏ తప్పు ఎవరిలో లేకుండా మరో ఒక ప్రాణంగా నిలిచిన ట్రాన్సిజండర్ల విషయాలు వారు పడుకున్న కష్టాలను, వారి పక్షాన కవయిత్రి తన కవనాలను బలంగా వినిపించింది.
నిస్వార్థపు జాడ చెప్పిన కవిత్వం అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే అక్షరమే ప్రధాన ఆయుధమని భావించి అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యం పట్ల అభిలాష సహజ కవయిత్రి పోతురాజు దుర్గాదేవి.గుంటూరు వాస్తవ్యులు అయిన పోతురాజు దుర్గాదేవి తన కవనం యొక్క ప్రత్యేకతను తన మాటల్లో పరిశీలించినట్లయితే……
సాహిత్యాభిమానులకు, పాఠకులకు తొలకరి జల్లుల వంటి ఆహ్లాదాన్ని తను రచించిన మొదటి కవితా సంపుటి ” కాలం సాక్షిగా…. ” అందిస్తుందని తన భావాన్ని వ్యక్తం చేసినది. కానీ తన గురించి తనకు తెలియని మరో కోణం ఏమిటి అంటే సాహిత్యంలో తన కవనం ప్రత్యేకతతో అందవేసిన చెయ్యి తనది అని తనకు తెలియని ఒక నిగూడ మైన నిజం అని ఈరోజు తన రచనలు సాక్షం చెబుతున్నాయి. తెలుగు భాషను అమ్మ భాషగా భావించి ఎమ్..ఎ తెలుగు సాహిత్యం చదివి ఆ తదుపరి ఎం.పిల్ ఉత్తీర్ణురాలై ప్రస్తుతం కే వరలక్ష్మి కథా సాహిత్యం పై ప్రామాణిక పరిశోధన చేస్తున్నారు.
అమెరికన్ నవలా కారుడు స్కాట్ ఫిట్జ్ రాల్డ్ అంటాడు…
For what it’s worth, it’s never too late to be who ever you want to be. I hope you live a life you’re proud of and if you find that you’re not, I hope you have the strength to start over .
చేసే మంచి పని ఎప్పటికీ చిరస్థాయిలోనే నిలుస్తుంది, మంచి పని చేసేటప్పుడు ఒడిదుడుకులతో ప్రయాణం మొదలైనప్పటికీ శాశ్వత మార్పుకు నాంది పలికినట్టే లెక్క.
అందరాని చందమామ కవితలో….
అందరాని చందమామ
అందరికి మేనమామ
అందనంత దూరాన
ఆకాశం ఆటకెక్కి
నీలాల నింగి అంచున
నిలిచి గోరుముద్దలు తింటున్న
పాపాయి బోసినవ్వులు చూస్తూ
ఆరుబయట ఆడ పిల్లల
చందమామ! చందమామ!
అనే కేరింతలు వింటూ “చందమామరావే జాబిల్లి రావే” అని. .
అమ్మలు పాడే లాలి పాటలు.
తరతరాలుగా వింటున్నా..
విసుగు చెందక అందరి
ఊసులు వింటూ….
సహజంగా ప్రకృతి అందాలను వర్ణించడం కవి సహజ లక్షణం అని తెలుపుటకు ఈ కవిత నిదర్శనం, సూర్యుడు,చంద్రుడు,ఆకాశం,భూమి, పచ్చిక బయల్లు, ఇలా ప్రకృతిలోని ప్రతి అందాన్ని వర్ణించటంలో కవి యొక్క పాత్ర విభిన్న కోణంలో ఉంటుందని దుర్గాదేవి కవణంలో సూచిస్తుంది.
అంతర్జాల మానవ యాంత్రిక యుగంలో మనిషి ఊహలు, ఆలోచన విధానం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలం లో నిర్మాణాత్మక విజయతీరం కోసం మనిషి కృషి చేయకుండా తన జీవన చదరంగంలో చేస్తున్న తప్పిదాలైన…. మసకబారుతున్న మానవీయ విలువలు, యువతలో ఆత్మవిశ్వాసం లోపించటం లాంటి విషయాలకు పరిష్కార దిశగా డాక్టర్ .బుర్ర మధుసూదన్ రెడ్డి కవనం ప్రత్యేకంగా కొనసాగుతుందని చెప్పవచ్చు.
“మధుపాళీ” కలం పేరుతో రచనలు కొనసాగిస్తున్న మధుసూదన్ సాహితీ ప్రపంచానికి, పాఠక లోకానికి పత్రికా ముఖంగా తన రచనలతో సేవలు అందిస్తున్నారు..కరీంనగర్ వాస్తవ్యులైన లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డిరసాయన శాస్త్ర ఆచార్యుడుగా మూడున్నర దశాబ్దాలు, ఎన్సిసి అధికారిగా రెండు దశాబ్దాలు, పాఠ్యపుస్తక రచయితగా మూడు దశాబ్దాలు, ప్రధానాచారిగా ఐదు సంవత్సరాలు ఇలా సుదీర్ఘ అనుభవాలతో మరెన్నో కావ్యాలను రచించి సాహితీ లోకంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
పెకిలిన కలం గళం కవితలో….
అక్షరాభ్యాసంతో ఆరంభమై
అంతిమ ఘడియల దాకా
విజ్ఞాన వికాస సిరా ఊట బాయి
అంగి జేబుకే అంగమైన కలం!
కలం విలువ అందరికంటే ఎక్కువగా ముందుగా ఒక అధ్యాపకుడీకే తెలుస్తుంది. అనీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ అధ్యాపకుడే కవి అయితే విజ్ఞానం అంటే ఏమిటో చెప్పాకమానడు.అని నిరూపించాడు.
మానవ జీవన వికాసముల సమాహారంగా…
. కొంగొత్త అనుభూతులు,కొత్త కొత్త భావాల వ్యక్తీకరణతో ఎప్పటికప్పుడు సుసంపన్నం చేస్తూ మన చుట్టూ శోబిల్లుతున్న ప్రకృతిని వర్ణిస్తూనే కాకుండా సమాజ సమస్యల పరిస్థితులను పరిశీలిస్తూ పరిష్కార దిశగా… ” అమృతధారలు” కవితా సంపుటితో పాటు సాహితీ లోకాన తన రచనలతో ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తున్న హైదరాబాద్ వాస్తవ్యులు కవయిత్రి పి పద్మావతి తను వెలువరించిన కవితా సంపుటిని పరిశీలించగా
నేటి యువత… కవిత లో
‘నేటి యువత అంటే..
కన్నవారి ఆశల కుసుమాలు.
శక్తి యుక్తుల నిలయాలు
సమాజానికి మేలు కూర్చి ఆలోచనలు. నవయుగ భారత నిర్మాణానికి పునాదులు.!’..
‘విజ్ఞాన వివేకములకు దీక్షితులు
సమతా మమతలకు సారథులు
ప్రాధనా లక్ష్యాల సర్విచారములు
పరుగులు తీసే ప్రగతికి రథచక్రాలు ! ‘
యువత దేశ ప్రగతికి సోపానంగా నిలవాల్సిన బాధ్యత ఉన్నదని స్వామి వివేకానందుడు చెప్పిన సూక్తులను ఆధారితంగా ఈ కవనం విధానాన్ని పరిశీలిస్తే నేటి సమాజంలో పాతుకుపోయిన, సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని కాలానికి అపూర్వమైన అమూల్యమైన సంపద కలమే నన్నది పద్మావతి రచనల్లో పరిమళించే కవిత్వమే నిదర్శనం.
జీవితానికి,మనసు భావాలకు మధ్య ఒక అంతరం ఏర్పడినప్పుడు జరిగే సంఘర్షణాపూరితమైన లేక ఆలోచనాత్మక మైన పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.అలాంటి సందర్భం నుండి కవి తన అక్షరాన్ని సహజంగా ప్రారంభిస్తాడు. ఆ అక్షరాలు పాఠకున్ని ఆలోచింపజేస్థాయి. అలాంటి ఆలోచనాత్మకమైన, ఉత్తమమైన రచనలతో గోదావరిఖని పట్టణానికి చెందిన గౌరోజు కృపారాణి ( అనుశ్రీ కలం పేరు ) తో సాహితీ లోకం లో తను రచించిన “గగనం” కవితా సంపుటి ద్వారా ముందుకు వచ్చింది. సాహిత్యంలో కథలు కవితలు, ధారావాహికలతో పాటు (శ్రీ పదాలు లఘురూపక కవితా ప్రక్రియ రూపకల్పన ) రచనలు చేస్తూ సాహిత్యం పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంది.
చిన్నప్పటి నుండి తెలుగు భాషంటే మమకారంతో, అందరికీ అమ్మే తొలి గురువు అని తనకు కూడా అమ్మే తన తొలి గురువు.అంటూ మొదటిసారిగ అమ్మ నేర్పిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో తన సాహిత్యాభిమానాన్ని పెంచుకొన్న గుంటూరు వాస్తవ్యురాలు రచయిత్రి, గజల్ కవయిత్రి గోలి విజయ తను రచించిన “నా కల – నా స్వర్గం” విభిన్న అంశాలతో పొందుపరచబడినది. అలాగే కవయిత్రి విజయ చిన్నప్పటినుండే అమ్మ చెప్పిన కధలు వినడం, చందమామ కధలు చదవటం మొదలుగా మంచి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకొని . కాలేజి కొచ్చిన తర్వాత ప్రముఖ కవుల పుస్తకాలు చదవడం, లలిత సంగీతం వినటం చాలా ఇష్టంగా మారింది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పాటలంటే చాలా అభిమానాన్ని పెంచుకున్నది.
తను రచించిన నవ్వు కవితలో…
‘నవ్వు కు ప్రతి నవ్వు
పువ్వు లాంటి కానుక
మనసు తీర మల్లెలా
నవ్వ గలగటమే మహిలో
మనిషికి మహా యోగం’
‘ఎన్నో సమస్యలకు
అసలైన పరిష్కారం
మౌనాన్ని మైనంలా
కరిగించేది చిద్విలాసం’
నవ్వు చెప్పిన వివిధ అర్థాలను వాటిలోని మధుర భావాలను అందులో నుంచి వ్యక్తం అయ్యే అనుబంధాలను తెలియజేస్తూ ఒక ఊహ ప్రపంచాన్ని నవ్వు ప్రతి జీవి నుండి వ్యక్తం అవుతుందని తెలియ చేయటంలో సఫలీకృతం అయ్యింది.
కవిగా రచయితగా సాహిత్యకారులు చేస్తున్న కృషి కత్తి మీద సాము లాంటిది. పాఠకుడికి కవి అంతరంగంలోని భావాలను తెలియజేయాలనే సందర్భంలో ఎన్ని ఉరుములు ఉరుమినా మెరుపులు మెరిసినా తన రచనల్లో అక్షరాలతో బంధించి అందర్నీ చదివించే గొప్ప ప్రయత్నం. మానవీయ వాస్తవిక సంఘటనలను ప్రస్ఫుటిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమంలో నేటి సాహిత్యకారులు భాగస్వామ్యం అవుతున్న సందర్భాన్ని అభినందిస్తూ మరిన్ని కావ్యాలు సాహితీ లోకానికి పాఠక లోకానికి అందించి సరికొత్త నూతన అధ్యాయనానికి నాంది పలకాలని ఆశిద్దాం.
ప్రతిష్టాత్మకమైన ఎన్.టి.ఆర్ పురస్కారం, ఎ.పి.జె అబ్దుల్ కలాం అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
సాధించిన ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్ గంగాధర్ గారితో ముఖాముఖి – నరేశ్ చారి
గంగాధర్ గారు నమస్కారం. మీరు వేసిన చిత్రాలు, కార్టూన్స్ గురించి మా పాఠకులకు తెలియ చేయాలనుకుంటున్నాము.

1. మీరు పుట్టినది, విద్యాభ్యాసం, మీ బాల్యం గురించి చెప్పండి.
నేను జన్మించింది నిజామాబాద్ జిల్లాలోని బషీరాబాద్ గ్రామంలో. నా విద్యాభ్యాసం హైస్కూల్ వరకు బషీరాబాద్ లో సాగింది,ఇంటర్మీడియట్,డిగ్రీ(బి.ఎ) నిజామాబాద్ లో చదివాను.
2. మీరు ఆర్ట్ వైపు మొగ్గు చూపడానికి ప్రేరణ, ప్రోత్సాహం ఎవరు?
నేను చిన్నప్పటినుండి కార్టూన్స్ జోక్స్ ఇష్టపడేవాడిని ముఖ్యంగా ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చే మల్లిక్ గారి కార్టూన్ల ద్వారా నేను ఎక్కువగా ప్రేరణ పొందే వాడిని. ఎలాగైనా నేను కూడా కార్టూన్స్ వేయాలి అని అనుకునేవాడిని కానీ ఎలా వేయాలి ? వేటిపై వేయాలి ? ఎలాంటి పెన్నులు ఉపయోగించాలి? అని చాలా ఆలోచించేవాడిని ఆ సమయంలోనే కార్టూనిస్టులను సంప్రదించాలనుకున్నాను కానీ పత్రికల్లో వారి వివరాలు ఏవీ వచ్చేవి కావు. కార్టూన్… దానిపై వారి సిగ్నేచర్ మాత్రమే వచ్చేది.వారి వివరాలకోసం ఎంత వెతికినా లాభం లేకపోయేది. ఎందుకంటే ఇప్పట్లో లాగా అప్పుడు సెల్ ఫోన్ లు ఉండేవి కావు, ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా చాలా తక్కువ.
ఒకసారి బుక్ ఎగ్జిబిషన్లో కార్టూనిస్ట్ సత్యమూర్తి గారి ” కార్టూన్స్ ఎలా వేయాలి” అనే పుస్తకం కనిపించింది హమ్మయ్య అనుకొని వెంటనే ఆ బుక్ కొని తెచ్చుకున్నాను. అది మొత్తం చదివి కార్టూన్స్ వేయడానికి సిద్ధమయ్యాను. అప్పట్లో ఇండియన్ ఇంకును పెన్నులో పోసి ఆ పెన్నుతో కార్టూన్స్ వేసేవారు. ఆ ఇండియన్ ఇంకుతో పెద్ద తలనొప్పి డైరెక్ట్ గా ఆ ఇంకును పెన్నులో పోస్తే గడ్డ కట్టేది. గీతలు సరిగ్గా వచ్చేవి కావు. అందులో కొన్ని నీటిని కలిపి వాడాలి నీరు ఎక్కువ అయితే ఇంకు పల్చభారీ గీతలు మబ్బుగా వచ్చేవి అలా చాలా కష్టం అనిపించింది. ఎలాగోలా కొన్ని కార్టూన్స్ వేసి పత్రికలకు పంపించాను. అవి అలాగే శుభ్రంగా నాకు తిరిగి వచ్చేవి.
అలా ఎన్నోసార్లు పంపగా పంపగా అప్పట్లో బాలరంజని అని పిల్లల కథల పుస్తకం మాసపత్రికగా వస్తూ ఉండేది దానికి కొన్ని కార్టూన్లు వేసి పంపించాను. వారి వద్ద నుండి కొన్ని రోజులకు ఒక పోస్ట్ కార్డు వచ్చింది. అందులో “మీరు పంపిన కార్టూన్లలో ఒక కార్టూన్ సెలెక్ట్ అయింది దానిని వచ్చే నెలలో ప్రచురిస్తాము” అని ఉంది. ఆ వార్త చూసి చాలా సంతోషం అనిపించింది.త్వరలోనే ఎన్నో రోజుల కల తీరబోతోందని అనుకున్నాను. నెలరోజుల దాకా ఎదురు చూశాను.ఆ పత్రిక కావాలనుకుంటే నిజామాబాద్ వెళ్లి తెచ్చుకోవాల్సిందే నిజామాబాద్ వెళ్లి బుక్ షాప్ లో “బాలరంజని” బుక్ కావాలని అడిగాను.” సార్ ఈ నెల నుండి ఆ బుక్ రావడం లేదు” అని చావు కబురు చల్లగా చెప్పాడు.అంతే… నిరాశతో వచ్చేసాను. అయినా కార్టూన్లు గీసి పత్రికలకు పంపిస్తూనే ఉన్నాను. అప్పట్లో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో “హారిక”అనే వార పత్రిక వస్తుండేది. ఆ పత్రికకు కూడా కొన్ని కార్టూన్లు వేసి పంపించాను.కొన్ని రోజుల తర్వాత వారి వద్ద నుండి రిప్లై వచ్చింది.” మీరు పంపిన కార్టూన్లలో నుండి రెండు కార్టూన్లు ప్రచురణకు స్వీకరించాము” అని ఉంది. నా కార్టూన్లు పత్రికలో చూసుకోవచ్చనే కోరికతో వారం రోజులు భారంగా గడిపాను. తర్వాత మళ్లీ బుక్ షాప్ కి వెళ్లి హారిక పత్రిక కావాలని అడిగాను.”ఆ పత్రికను ఆపేశారు ఈ వారం నుండి రావడం లేదు” అని షాప్ అతను చెప్పాడు. అప్పుడు అనిపించింది ఔరా….. నా కార్టూన్ లకు ఇంత పవర్ ఉందా అని. ఉరిమిన ఉత్సాహం చల్లగా చెప్పబడింది. కొన్ని రోజుల విరామం…. అయినా ఆగేది లేదు మళ్లీ కార్టూన్లను గీయడంమొదలుపెట్టాను.

అప్పట్లో కార్టూనిస్ట్ గోపాలకృష్ణ గారు పాపులర్ అయ్యారు. ఒకసారి ఒక పత్రికలో ఆయన అడ్రస్ కనిపించింది. నేను వెంటనే గోపాలకృష్ణ గారికి రీప్లే కవర్ పెట్టి లెటర్ రాశాను. నేను వేసే కార్టూన్ ల గురించి వివరాలన్నీ రాసి “మీరు వేసిన కార్టూన్ల నుండి నాకు ఒక కార్టూన్ శాంపిల్ గా పంపించండి” అని రాశాను. ఆయన వద్దనుండి రిప్లై వచ్చింది. అతను వేసిన కార్టూన్ ఒకటి నాకు శాంపిల్ గా పంపించాడు. అతని కార్టూన్ చూస్తే నాకు మతిపోయింది. ఆయన కార్టూన్ మంచి క్వాలిటీ పేపర్ మీద చాలా నీట్ గా ఉంది. మొత్తానికి అతను వేసిన కార్టూన్ చాలా అద్భుతంగా ఉంది. ఆ ఇంకు కూడా చాలా షైనింగ్ గా ఉంది అలాగే కార్టూన్లు వేయడానికి రోటరీ ఇంక్ పెన్ను వాడమని సలహా కూడా ఇచ్చాడు. కొన్ని మెలకువలు తెలిపాడు. రోటరీఇంక్ పెన్ను మా ప్రాంతంలో దొరకదు. మళ్లీ నిజామాబాద్ వెళ్లి ఆ పెన్ను తెచ్చుకున్నాను. ఆ పెన్ను తెచ్చుకున్నాక కార్టూన్ వేయడం కాస్త సులభంగా అనిపించింది. ఇండియన్ ఇంకులాగా తలనొప్పి మాత్రం లేదు. ఆ మధ్యలో “ఆంధ్రజ్యోతి”వారపత్రిక వారు దీపావళి పండగ సందర్భంగా కార్టూన్ల పోటీ నిర్వహించారు. నేను కొన్ని కార్టూన్స్ వేసి పంపించాను. కొన్ని రోజుల తర్వాత వారి వద్ద నుండి పోస్టులో ఒక కవరు వచ్చింది.అది విప్పి చూస్తే ఆంధ్రజ్యోతి వారపత్రిక. పేజీలు తిప్పి చూస్తుండగా మధ్య పేజీ చూసి ఆశ్చర్యపోయాను .అందులో దీపావళి పండగ సందర్భంగా నిర్వహించిన కార్టూన్లు ప్రింట్ చేశారు. అందులో మొదటి బహుమతి పొందిన కార్టూన్ “డాక్టర్ శివ”బషీరాబాద్ అని ప్రింట్ చేశారు. అప్పుడు అనుకున్నాను అనుకున్నది సాధించానని. అందులో నేను వేసిన కార్టూన్లలో మొదటిసారిగా నా కార్టూన్ ప్రచురించడం మరియు మొదటిసారిగా ప్రింట్ అయిన నా కార్టూన్ కే మొదటి బహుమతి రావడం నిజంగా అద్భుతమనిపించింది.ఎంతో ఆనందం కలిగింది.
3.కార్టూన్లను వేయడం మీరు ఎవరిదగ్గరైనా నేర్చుకున్నారా? చూసి వేసేవారా?
నేను ఎవరి వద్ద నేర్చుకోలేదు కేవలం సొంతంగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నదే. కార్టూన్లు నవ్వుతెప్పిస్తూ ఆలోచన లలో పడవేస్తాయి. ఈ కారణం వల్ల నే నేను కార్టూన్స్ కు ఆకర్షతుణ్ణ య్యాను, సాధనచేసి నేర్చుకున్నాను.
4. ఆర్. ఎం. పి. డాక్టర్ గా ప్రజాసేవ చేస్తున్నారు కదా! మరి వృత్తి, ప్రవృత్తులను ఎలా సమన్వయం చేసు కుంటున్నారు?
డాక్టర్ వృత్తి నా కల! నా కలను సాకారం చేసుకున్నాను.వృత్తి సంపాదనను ఇస్తే, నా ప్రవృత్తి నాకు సంతృప్తిని ఇస్తుంది. ఎక్కువగా సొంత పనులకే సమయం కేటాయిస్తాను ఏదో హాబీగా అప్పుడప్పుడు మాత్రమే ఇవి వేస్తుంటాను. నాకు బాగా నచ్చింది అనుకున్న తరువాత నే ఎక్కడికైనా పంపిస్తాను.
5. ‘రీడింగ్ విమెన్’ చిత్రాన్ని , మనిషిలోని మూడు దశల చిత్రాన్ని ఒకే గీతను ఆధారంగా చేసుకుంటూ వేశారు. అది మీరు సొంతంగా నేర్చుకున్నదేనా? ఎవరి ప్రభావమైనా ఉందా?
మీరు అడిగిన డ్రాయింగ్ నేను సొంతంగా ఊహించుకుని వేసినదే. ఎవరి ప్రభావం లేదు. సృజనాత్మకత జోడించి నూతన రేఖాచిత్రం గీయడం లో స్పష్టం గా వచ్చేలా ప్రయత్నం చేస్తాను. నా ఊహల లోకం నుంచి వ్యంగ్య చిత్రాలు గీసాను, గీస్తాను కూడా
6. నిజామాబాద్ లో మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి స్పందన వచ్చింది?
సాధారణంగా పల్లెటూరు లలో. అంత అవకాశాలు ఉండవు. జిల్లా స్థాయిలో. ఉన్నా మనస్ఫూర్తిగా స్పందనలు తెలియజేయరు.
మామూలు స్పందన లభించింది. ఆర్ట్ గురించి వాళ్లకు పెద్దగా అవగాహన, అభిరుచి లేవనుకుంటున్నాను.
7. హైదరాబాద్ వంటి నగరాల్లో అలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకోలేదు?
అది అది ఖర్చుతో కూడుకున్న పని.తగినంత సేల్స్ కాకపోతే బూడిదలో పోసిన పన్నీరు లాగా అవుతుంది పరిస్థితి. ఇంతే కాదు చాలా విషయాలు అందుబాటులో ఉండవు. ఆర్థికంగా నే కాదు, మిగతా సౌకర్యాలు వేరే ప్రాంతం నుంచి వచ్చి. ఇలా చిత్ర ప్రదర్శన చేయడం కష్టం.
8. మీరు పొందిన అవార్డులు, సత్కారాల గురించి చెప్పండి.
ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు, ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఇలా అన్నీ కలిపి 20 అవార్డుల వరకు వచ్చాయి. అవార్డు లు , రివార్డులు కళాకారులకు ఆనందాన్ని , అలాగే బాధ్యతలనూ ఇస్తాయి .
9. ఈ అవార్డులు , సత్కారాలు మీకు సంతృప్తిని కలిగించాయా? ఇంకా ఏదైనా ఆశిస్తున్నారా?
నాకు వచ్చిన అవార్డులు,రివార్డులు సత్కారాలపరంగా చూస్తే సంతృప్తి గానే ఉంది. కానీ ఆర్థిక పరంగా చూస్తే మాత్రం అసంతృప్తిగానే ఫీలవుతున్నాను.

10. మీరు విదేశాలను కూడా సందర్శించినట్లు విన్నాం. ఆయా దేశాలలో మీ అనుభవాలను తెలియజేయండి.
ప్రమోషన్ లో భాగంగా సింగపూర్ ,థాయిలాండ్ దేశాలు సందర్శించాను. మొదటిసారిగా రెండు విదేశాలు సందర్శించడం లో జీవితంలో మర్చిపోలేని అనుభవం.
11. విదేశాల్లో మన చిత్రకళ పట్ల ఉన్న ఆసక్తి ఎటువంటిది?
ప్రాంతం ఎక్కడైనా వాళ్ళ అభిరుచి అవగాహనబట్టి ఉంటుంది.
12. ఈ కళలో ఎవరికైనా శిక్షణ ఇస్తున్నారా? వాటి గురించిన వివరాలు చెప్పండి.
లేదు. ఎవరికి శిక్షణ ఇవ్వదలుచుకోలేదు. ఆర్థిక రాబడి లేని రంగం ఇది.
13. మీరు వేసిన చిత్రాలను తెలంగాణ రాష్ట్రానికి అంకితం ఇస్తున్నట్టు చెప్పుకున్నారు. కారణం చెప్తారా?
కె.సి.ఆర్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. తెలంగాణ ప్రభుత్వం చేసే పనులు పథకాల వల్ల ఆకర్షితుడనై తెలంగాణ ప్రభుత్వానికి అంకితం ఇచ్చాను.
14. గంగాధర్ అనేది మీపేరు అయితే శివ ఆర్ట్స్ అని పెట్టుకోవడానికి ప్రత్యేక కారణం ఉందా?
నా అసలు పేరు గంగాధర్. అంటే గంగను ధరించిన వాడు. ఎవరు శివుడు. ఇది ఒక కారణమైతే అప్పట్లో సినీ హీరో నాగార్జున నటించిన “శివ” చిత్రం విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పేరు పెట్టుకోవడానికి మరో కారణం. ఇక మూడో కారణం కూడా ఉంది కార్టూనిస్టులు, ఆర్టిస్టులు, రైటర్స్ వారి అసలు పేరు కాకుండా కలం పేరు ఇష్టమైనది పెట్టుకుని ఆ పేరు మీదనే కార్టూన్స్,ఆర్ట్స్ ,రచనలు చేస్తుంటారు కాబట్టి ఈ మూడు కారణాలు కలిపి శివ అనే కలంపేరు(పెన్ నేమ్ ) పెట్టుకోవడం జరిగింది.ఆర్.ఎం.పి వైద్యునిగా పనిచేస్తాను కాబట్టి అందరికీ డాక్టర్ శివ అంటేనే తెలుసు.
15. మీకు తెలిసిన, మీరు ఇష్టపడే రాష్ట్రీయ, జాతీయ చిత్రకారులు ఎవరు?
నాకు ఇష్టమైన రాష్ట్రీయ చిత్రకారుడు బాపు, జాతీయ చిత్రకారుడు ఆంజనేయులు.
16. మీ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం ఏది? ఎందుకు?
ఇప్పటివరకు నేను వేసిన కార్టూన్స్ ఆర్ట్ చిత్రాలలో నాకు బాగా నచ్చింది కేవలం ఒక్క లైన్ తో వేసిన డ్రాయింగ్. దాని ప్రత్యేకత ఏమంటే కేవలం ఒకే ఒక్క లైన్లో మనిషి జీవితంలోని మూడు దశలను అంటే బాల్యం, యవ్వనం,వృద్ధాప్యం ఈ మూడు దశలను కేవలం ఒక్క లైన్తో వేయడం నిజంగా అద్భుతం ఈ డ్రాయింగ్ తోనే గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నాను.చివరిగా నా కోరిక కాంబోడియా దేశంలోని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రఖ్యాత హిందూ దేవాలయ “అంగ్ కోర్ వాట్”ను సందర్శించాలని. అలాగే బ్యాంకాక్ సిటీలోని “జేమ్స్ ఆర్ట్ గ్యాలరీ”(రత్నాలతో చేసిన ఆర్ట్ గ్యాలరి) దర్శించాలని ఉంది.నాలాంటి వారి ప్రతిభను ప్రోత్సహించే వారు ఎవరైనా టూర్ ను స్పాన్సర్ చేస్తారని అనుకుంటున్నాను.కచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను.
ఉపోద్ఘాతం
ప్రముఖ రచయిత నవీన్ గారి ఇంటిపేరుగా స్థిరపడ్డ అంపశయ్య నవల మొదటి ముద్రణ 1969 లో జరిగింది. 2007 లో 8వ ముద్రణ జరిగిన నవీన్ గారి ఈ నవల లో యువతీ యువకులదే ప్రధాన పాత్ర. వారి మానసిక సామాజిక జీవితాలను చాలా చక్కగా చిత్రీకరించారు.
పల్లెటూరు నుండి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ లో M.A., చదువుతున్న ఒక పేద, వెనకబడ్డ సామాజిక వర్గానికి చెందిన రవి అనే కుర్రాడి కథ ఇది.
20 ఏళ్ల వయసులో ఉండి లైంగిక వాంఛలతో ఉడికిపోతూ
వాటిని తీర్చుకునే ధైర్యం లేక సతమతమవుతూ ఉంటాడు.ఊహాలోకం లో జీవిస్తూ ఉంటాడు.
డా.అమ్మంగి వేణుగోపాల్ గారు తన ముందు మాటలో ఈ కథా నాయకుడు బాత్ రూమ్ లోని బూతు బొమ్మలు,బూతు మాటలు పదే పదేగుర్తు
చేసుకోవడం ద్వారా ఒక యువకుని ఆరంభ యవ్వన అంతరంగాన్ని
సెన్సార్ చేయకుండా
ప్రదర్శించినట్లు
ఆ యువకుని బలం- బలహీనత తెలిపినట్లు అయిందని భావించారు.
నవలా సమీక్ష
నవీన్ గారి 1969 నాటి ఈ అంపశయ్య నవల అప్పటి రాజకీయ,కాల,మాన పరిస్థితులకు అద్దం పడుతుంది. యూనివర్సిటీ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న యౌవనారంభ దశలోని
యువకుల ప్రవర్తన నాయకుడు రవి యొక్క దీనమైన ఆర్ధిక పరిస్థితి అతని మనసు లోని అంతః సంఘర్షణను రచయిత బాగా చిత్రీకరించారు.
ఈ సంఘర్షణ వర్ణన
ద్వారా ఇది మనో వైజ్ఞానిక నవలగా రూఢి అవుతుంది. ఈ నవలలో రవి స్నేహితులు వేణు, మధు, ప్రకాష్, నిధి, ఎదురు రూమ్ లో ఆచారి. తర్వాత గోపాలరావు కూడా రవి స్నేహితుడు
అయిపోతాడు.
రవి తల్లితండ్రులు ఆర్ధికంగా సామాజికంగా వెనకబడిన ఒక చితికిపోయిన రైతు కుటుంబం. చాలీ చాలని ఆదాయంతో
కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతాడని, కలెక్టర్ అవుతాడని కలలు కంటూ కొడుకును కష్టపడి
హైదరాబాద్ లో చదివిస్తున్నారు.
కొడుకు చదువు కోసం ఇంట్లో ఉన్న నగా నట్రా కూడా అమ్మేస్తారు. ఒక దశలో తమకు ఎంతో ఇష్టమైన దూడని కూడా గత్యంతరం లేక అమ్మి కొడుకు చేతిలో పోస్తే పట్నం రాగానే కొడుకు రవి వాటిని హారతి కర్పూరంలా ఖర్చు చేసేసి తెల్లారి మళ్ళీ డబ్బులు కోసం
ఆవురావురు
మంటాడు.
కథానాయకుడు రవి
మూడు నెలల మెస్ బిల్లు బాకీ ఉన్నందుకు
మెస్ లో భోజనం దొరకక ఒకరోజు తిండి లేక నక నక లాడిన తీరును బాగా వర్ణించారు రచయిత.
రవి జీవితం లో తారసపడిన ఇద్దరు యువతులు కిరణ్మయి, రత్తి. కిరణ్మయి ఆధునిక భావాలు సంతరించుకున్న అపురూప అందాల రాశి. బెంగాలీ అమ్మాయి.ఒకసారి నాగార్జున సాగర్ విహారయాత్రకు వెళ్ళినప్పుడు తన జూనియర్ అయిన కిరణ్మయి తో ప్రేమలో పడతాడు. ఒక టన్నెల్ లో వారు ఉన్నప్పుడు
కరంట్ పోతే కిరణ్మయి భయంతో రవిని కౌగిలించుకుంటుంది. ఆ సంఘటనను ఒక తీయని స్వప్నంగా రవి తన గుండెలో దాచుకుంటాడు.
ఒకరోజు కిరణ్మయి యూనివర్సిటీ లైబ్రరీ కి వెళ్తుంటే తానూ ఆమె వెనక పరుగెడతాడు.
ఆమెతో మాటలు కలుపుతాడు. అబిడ్స్ లో ఒక సినిమా హాల్ లో కాగజ్ కీ పూల్ సినిమా బాగుందనీ చూడమని చెప్తాడు. ఆమె తన స్నేహ బృందంతో వెంటనే బయలుదేరి రవిని కూడా ఆ థియేటర్ కు రమ్మని చెపుతుంది. అక్కడికి వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ లేదు. ఒక ఐదు రూపాయల కోసం అతను పడ్డ బాధ వర్ణనాతీతం.సినిమా టైం అవుతుతోంది కానీ అప్పు పుట్టదు. బస్ స్టాప్ కి వచ్చి నిలబడతాడు ఎవరన్నా దొరుకుతారేమో అప్పు దొరికితే సినిమాకు వెళ్లాలని ఆశ. ఆఖరికి తాను అసహ్యించుకునే గుర్నాధం అనే హోమో సెక్సువల్ మిత్రుడి వద్ద గతిలేక 5 రూపాయలు తీసుకుని పరుగెత్తి వేగంగా కదిలిన బస్ లోకి ఎక్కేస్తాడు.
కోటి కెళ్లి ఇంకో రిక్షా పట్టుకుని కోటి నుండి దగ్గరలోనే ఉన్న అబిడ్స్ కు వెళ్లి బలవంతంగా రూపాయి వసూలు చేసిన రిక్షా వాడిని తిట్టుకుంటూ హాల్ చేరుతాడు. సినిమా ప్రారంభం ఆలస్యం అవుతుంది. కిరణ్మయి కనిపిస్తుంది. కానీ తన కలకత్తా స్నేహితుడు సతీష్ కార్ లో వచ్చి
కిరణ్మయిని అకస్మాత్తుగా కార్ లో ఎగరేసుకు పోతాడు. రవి దిగాలు పడతాడు.
ఇక సినిమా వదిలేసి రోడ్డున పడతాడు.పొద్దుట నించి తిండి లేదు కడుపులో పేగులు గోల చేస్తున్నాయి. తన వద్ద ఉన్న నాలుగు రూపాయలతో 3.50 పెట్టి మార్లిన్ మన్రో జీవిత కథ పుస్తకం కొంటాడు. ఇంకా చేతిలో 50 పైసలు మాత్రమే ఉంటుంది. ఆకలి దంచేస్తుంటే తోచక అనవసరంగా పుస్తకం కొన్నందుకు బాధపడుతూ తిరిగి పాత పుస్తకాల షాపు లో అమ్మబోతే షాప్ వాడు బారాణా కి అడుగుతాడు.కానీ అమ్మటానికి మనసు ఒప్పదు. ఒక దశలో ఆకలికి తాళలేక మనిషి ఎవరూ కనిపించని ఒక యాపిల్ బండి దగ్గర ఒక పండు కొట్టేద్దామని అనుకుంటాడు. కానీ పండ్ల యజమాని వచ్చేసరికి ఆగిపోతాడు. అలా నడుస్తూ దారిలో హోటల్ లో రెండు సార్లు కడుపు నింపుకోవటానికి నీళ్లు తాగుతూ, దారిలో తన డిగ్రీ గురువు ఇంటికి వెళ్ళితే కాఫీ ఇస్తే ఆవురావురుమని తాగుతాడు. చివరికి మళ్ళీ కోటి చేరి 3వ నంబర్ బస్ లో కిక్కిరిసిన రష్ లో హాస్టల్ చేరుతాడు. ఎవరో స్నేహితుడు ఒక ఐదు రూపాయలు అప్పిస్తే రాత్రి మెస్ కు వెళ్లి ఒక రూపాయి ఇచ్చి కడుపునిండా తిని ఆకలి చల్లార్చుకుంటాడు.
రవి జీవితం లోకి వచ్చిన అందాల భరిణ కిరణ్మయి తనకు దక్కలేదు.తన ఊరిలో తాను ఎంతగానో ప్రేమించిన రత్తి ఊరి పెద్దల కంటబడి తన శీలాన్ని పోగుట్టుకుని
వెలయాలుగా మారి
ఒక దశలో ఒక మాదిగ యువకునితో గడుపుతూ ఊరి వారి ఆగ్రహానికి గురై కొట్టబడి చివరికి బావిలో శవమై తేలుతుంది. రత్తిని ఆమె వెలయాలుగా మారాక రవి తానూ అనుభవిస్తాడు.ఇలా
అటు కిరణ్మయికి ఇటు రత్తికి దూరం అవుతాడు రవి.
యూనివర్సిటీ లో గ్రూపు రాజకీయాలు, విద్యార్ధుల మనఃప్రవృత్తి తోటి విద్యార్థినుల పట్ల వారి విపరీత ప్రవర్తన, చదువు పట్ల నిర్లక్ష్యభావం,ఒకవేళ ఒకరు బాగా చదువుదామని ప్రయత్నించినా వేరొకరు వచ్చి చెడగొట్టడం ఆ విద్యార్థులలోనే కొందరు ధనిక యువకులు డబ్బు గర్వంతో, అహంకారంతో గ్రూపులు కట్టి రాజకీయాలు చేయడం, ఆనాటి కాలం లోని వివిధ దేశాల రాజకీయాలు, విద్యార్థి లోకాన్ని, వారి దినసరి కార్యకలాపాలను,వారి మనస్తత్వాలను చాలా చక్కగా చిత్రీకరించారు రచయిత.
1969 నాటి నవల కాబట్టి అప్పుడు 5 రూపాయలకు ఎంత విలువుందో ఇప్పటి ధరలతో పోలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
1969 లో కిలో కందిపప్పు రూపాయి ఉన్నట్లు నాకు జ్ఞాపకం.
అలాగే
మేము చిన్నతనం లో నల్లగొండ లో నివసించేవాళ్ళం.
అక్కడ ప్రేమ్ టాకీస్ అని ఉండేది. ఆ థియేటర్
లో నేల టికెట్ 35 పైసలు, బెంచి 60 పైసలు ఉండేది. మేము
రిషి కపూర్ బాబీ సినిమా నేల మీద కూచుని చూశాము.
ఆ 35పైసలు సంపాదించటమే చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో.
1969 కాలంలో
ఈ కథలోని నాయకుడు రవి 5 రూపాయలతో
బస్ లో వెళ్లి సినిమా చూసి ఏమన్నా తిని మళ్ళీ బస్ ఎక్కి తిరుగు ప్రయాణం చేసినా ఆ 5 రూపాయలు సరి పోతాయని అర్ధం అవుతోంది.
తండ్రి చమటోడ్చి సంపాదించిన డబ్బును రవి మంచినీళ్ళలా ఖర్చు చేసి,డబ్బుల్లేక, తిండి లేక ఎలా అల్లల్లాడాడో
రచయిత ఈ నవలలో
చాలా హృద్యంగా వర్ణించాడు.
ఈ నవల స్థూలంగా చూస్తే ఒక 24 గంటలలో జరిగిన సంఘటనల సమాహారం.
నవల క్లైమాక్స్ లో ప్రతి నాయకులు శ్రీశైలం,రెడ్డి, భజగోవిందంల మీద రవి
గ్యాంగ్ కాంటీన్ లో ఎలా పై చెయ్యి అయ్యిందో బాగా చెప్పారు.
చివరిగా రవి ఆ రాత్రి కాంటీన్ లో కడుపు నిండా తిని పడుకున్నా
నిద్రపట్టక పోవడం, అతని పరుపు మంచం
ముళ్ళ మంచంలా, అంపశయ్య లా అనిపించడం నవల మొదటి నుండి చివరివరకు జరిగిన సంఘటనలు అన్ని అతని మనసులో గిర్రున తిరుగుతున్నట్లుగా
మళ్ళీ అమ్మ, కిరణ్మయి,రత్తి మిగతా పాత్రలన్నీ మనసులో
అల్లకల్లోలంగా అల్లుకుపోవడం చాలా బాగా వర్ణించారు నవీన్.
:ఉపసంహారం:
ఈ నవలలో యూనివర్సిటీ హాస్టల్స్ లో విద్యార్థుల మధ్య జరిగే గొడవలు, క్యాంపస్ వాతావరణం, విద్యార్థులు తోటి విద్యార్థినుల పట్ల చేసే ఆకతాయి చేష్టలు అన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు రచయిత.
అయితే విద్యార్థులు కాంటీన్ లో గొడవ పడుతూ ఒక మతాన్ని
పట్టుకుని మాట్లాడే బూతులు, కాలేజీ అమ్మాయిల మీద బాత్ రూమ్ గోడలపై రాసిన
బూతు మాటలను
యథాతధంగా నవలలో రాయడం కొంచం ఎబ్బెట్టుగా ఉన్నా ఆ కాలానికే చెల్లిందేమో అనిపిస్తుంది.
మొత్తానికి ఈ నవల చదివితే మనం క్యాంపస్ లో చదువుకున్న రోజులు, ఆ తీయని జ్ఞాపకాలు, ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్, పక్కనే లైబ్రరీ అప్పటి ప్రొఫెసర్లు అందరూ మన ఆలోచనలలో
సినిమా రీలులా గిర్రున తిరుగుతూ గుర్తు కు రాక మానవు.
ఇంతటి ఒక చక్కటి నవల సమీక్ష కోసం ఎన్నుకున్న దృశ్యకవి చక్రవర్తి శ్రీ అమరకుల గారు అభినందనీయులు.
వారాల ఆనంద్ మౌనంగానే కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అనువాదకుడు, సినీవిమర్శకుడు, డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, విశ్రాంత లైబ్రేరియన్, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్, వారాల ఆనంద్ కలం నుండి జాలువారిన మౌనంగానే కవిత పై విశ్లేషణా వ్యాసం .మౌనంగానే కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నన్ను ఆలోచింపజేసింది. మౌనం అనగా మాట్లాడకుండా ఉండటం. ఇదొక అపురూపమైన కళ,తపస్సు. మాటలను వృధాగా వినియోగించకుండా ముక్తసరిగా అవసరం మేరకే మాట్లాడటం సర్వదా శ్రేయస్కరం. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండే క్రియ.
” ఎవరయినా ఒక మనిషి చనిపోతే
” కళ్ళు చెమ్మగిల్లుతాయి
” మౌనం గానే
నిజమే. ఎవరైనా ఒక మనిషి చనిపోతే కళ్ళు చెమ్మగిల్లుతాయి.అతడు ఎవరు అన్న విషయంతో సంబంధం లేదు.ఇప్పటిదాకా జీవించి ఉన్న వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోయాడు అంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి అనే విషయం నిజం అని చెప్పవచ్చు.మనం ఈ భూమి మీదకి వచ్చింది ఏదో ఒకనాడు అందరి వద్ద సెలవు తీసుకుని భువి నుండి దివిలోకి వెళ్ళడానికే.చనిపోయిన వ్యక్తిని చూసి అతడు చనిపోయాడు అంటాం.మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడిపోతాం అనే సంగతి మనకు తెలుసు.ఆ విషయం గురించి తెలవనట్లే నటిస్తాం.మానవ జీవితం ఒక మాయగా తోస్తుంది. అవునన్నా కాదన్నా ఇది నిజం అని ఒప్పుకొని తీరాల్సిందే.ఒక మనిషి చనిపోతే దుఃఖంతో కళ్ళల్లోకి నీళ్లు ఎగసి వస్తాయి.ఆ వ్యక్తి మనకు ఇక కనిపించడు.ఆ వ్యక్తి ఇక రాడు అనే దిగులు మనకు కలుగుతుంది.మనలో లోలోపల కలిగే దుఃఖం తాలూకు భారాన్ని మౌనంగానే మోస్తూ మన మనస్సు పొరల్లో కప్పివేస్తాం అని కవి ఆనంద్ వ్యక్తం చేసిన భావాల తీరు చక్కగా ఉంది.

” ఆ మనిషి తెలిసిన వాడో
” దగ్గరి వాడో అయితే
” కళ్ళతో పాటు గుండెలూ
” ద్రవిస్తాయి గోడుగోడుమంటాయి
” మౌనంగానే
ఆ మనిషి మనకు తెలిసిన వాడు మరియు దగ్గర వాడు రక్తసంబంధీకుడైతే కళ్ళు ఒక్కసారిగా చెమర్చుతాయి,దుఃఖ సాగరంలో మునిగిపోతాం. రక్తసంబంధీకుల కొరకు మన హృదయాలు బాధతో ద్రవిస్తాయి.మనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని గోడుగోడున దుఃఖిస్తాం.చనిపోయిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు,వాళ్ళు చూపించిన ఆప్యాయత,అనురాగం,మన కళ్ళలో మన హృదయాల్లో ప్రతిఫలిస్తాయి.మరపురాని వాళ్ళని గుర్తు చేసుకోవడం తప్ప మరేమీ చేయలేని అశక్తత మౌనంగానే మనల్ని వెంటాడుతుంది అని చెప్పిన కవి ఆనంద్ భావన వాస్తవంగా ఉంది.
” పోయినవాడు మనుషులతో తిరిగినవాడయితే
” అక్కున చేర్చుకున్న వాడయితే
” కదిలించిన వాడయితే
” కళ్ళు గుండెలే కాదు
” దేహంలోని అణువణువు
” గుండెల్లోంచి ఎగిసే ప్రతి రక్తం చుక్క
” బోరు బోరున ఏడుస్తాయి
” మౌనంగానే
చనిపోయిన వ్యక్తి సమాజ వికాసం కొరకు పాటుపడిన వ్యక్తి కావచ్చు.సమాజంలో వ్యక్తుల శ్రేయస్సు కొరకు కృషి చేసిన వ్యక్తి అయితే అందరు అతని కొరకు దుఃఖించడం సహజం అని చెప్పవచ్చు.చనిపోయిన వ్యక్తి మనలను కష్ట సమయంలో కనిపించే దేవుడిలా ఆదుకొని మన కన్నీళ్లు తుడిచి మనలను ప్రాణానికి ప్రాణంగా చూసుకొని తన చెంతకు చేర్చుకున్న వాడైతే అనంతశోకంలో మునిగిపోతాం.చనిపోయిన వ్యక్తి తన పాటలతో ఆటలతో కదిలించిన స్ఫూర్తి ప్రదాతలాంటి వ్యక్తి అయితే మన కళ్ళు వర్షిస్తాయి. మన గుండెలు బాధతో విలవిలలాడుతాయి. చనిపోయిన దిగ్గజంలాంటి వ్యక్తి కొరకు మన శరీరంలోని సమస్త నాడులు మరియు మన గుండెల్లో ప్రవహించే ప్రతి రక్తం చుక్క ఆ వ్యక్తిని మరియు అసమాన తేజో మూర్తిని తలుచుకుని బోరు బోరున విలపిస్తాము. మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అతని గళ మాధుర్యం,అనుభవాలను,వ్యక్తిత్వం తలుచుకొని మౌనంగానే మన మనసు పొరల్లో దాగిన విషాదాశ్రువులు మనకు తెలియకుండానే టపటపా రాలుతాయి.
” చీకట్లో ఒంటరిగా కూర్చుని
” దుఃఖాన్ని జ్ఞాపకాల్నీ
” ఎప్పటికో గానీ బయటపడలేదు
” మౌనంగానే
చిక్కటి చీకటి కమ్ముకున్న నిశి రాత్రి వేళ ఒంటరిగా ఒక్కడే కూర్చుని చనిపోయిన వ్యక్తి తాలూకు స్మృతుల పరంపరలను తలచుకుంటూ బావురుమని దుఃఖించాడు.వెంటాడుతున్న జ్ఞాపకాల అనుభూతులను తలుచుకుంటూ రాత్రి భారంగా గడిచింది.అది ఒడిసిపోయే దుఃఖం కాదు. కాబట్టి తొందరగా దుఃఖం నుంచి బయటపడలేదు. లోలోపల అతన్ని తలుచుకుంటూ మౌనంగానే ఆ రోజు దీర్ఘ రాత్రి కాలరాత్రిగా దిగులు మేఘాలు కమ్ముకున్నాయి.
” ఊపిరి కోల్పోయి ఆచేతనుడయిన
” వాడి దేహానికి ఎవడు పాడె కడితే ఏంది
” ఎవడు మోస్తే ఏముంది
” గాల్లో పేలిన తుపాకులు
” ఎవరిని సముదాయిస్తాయి
” పాత ఫోటోలు… కవితలు
” పాటలు…ప్రకటనలు
” బతికున్నవాడి ఉనికినే చాటుతాయి
” పోయినోడు ఎట్లాగూ వెళ్ళిపోయాడు
” మౌనంగానే
దైనందిన జీవితంలో మనిషి శ్వాస క్రియలు ఆగి ఒక్కసారిగా ఊపిరి కోల్పోతాడు.ఊపిరి లేని వ్యక్తి చేతనత్వం కోల్పోయి అచేతనుడు అవడం సహజమే. చనిపోయిన వ్యక్తి దేహానికి ఎవరో ఒకడు పాడె కడతాడు. ఎవడు పాడె కడితే ఏంది? చనిపోయిన వ్యక్తి ఇతను పాడె కట్టాడు అని వచ్చి చూస్తాడా? చూడడు అని చెప్పవచ్చు.చనిపోయిన వ్యక్తి పాడెను ఎవరో మోస్తారు.పాడెను ఎవరు మోసింది? అతను చూడడు కదా.అయినప్పటికీ చనిపోయిన వ్యక్తి యొక్క దేహాన్ని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడానికి స్మశానానికి తరలిస్తారు. చనిపోయిన వ్యక్తి పట్ల గౌరవంతో పోలీసులు గాల్లో పేల్చిన తుపాకులు అతనిని తీసుకువస్తాయా? చనిపోయిన వ్యక్తిని తీసుకురావు అని మనకు తెలుసు .చనిపోయిన వ్యక్తి కుటుంబంలో ఎవరినైనా సముదాయిస్తాయా అనేది ప్రశ్నగా తోస్తోంది.చనిపోయిన వ్యక్తి తాలూకు పాత ఫోటోలు,కవితలు పత్రికల్లో కనబడతాయి. అతని తాలూకు కవితలు,పాటలు, ప్రకటనలు బతికున్న రోజుల్లో చేసిన కార్యక్రమాల ఉనికిని వెల్లడిస్తాయి. అతను ఈ లోకం నుండి సెలవు తీసుకొని ఎలాగూ వెళ్ళిపోయాడు. చనిపోయిన వ్యక్తి గురించి జరిగిన కపట ప్రేమలు,అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, చనిపోయిన వ్యక్తి తాలూకు పాత ఫోటోలు, కవితలు,పాటల ప్రదర్శనలు ఇవన్నీ స్వార్థపూరిత చర్యలు అని మౌనంగానే లోలోపల బాధను దుఃఖాన్ని అనుభవించాడు అని కవి ఆనంద్ వ్యక్తం చేసిన భావాల్లో నిజాయితీ ఉంది.
” దుఃఖం మనిషి అంతర్యాతన
” రోదన ఓ బహిరంగ ప్రదర్శన.
మనిషి లోపల జరిగే మనసు యొక్క వేదన నుండి దుఃఖం ఉబికి వస్తుంది.అందరికీ తెలిసేటట్లుగా రోదించడం,నటన,కపట ప్రేమకు నిదర్శనం అని చెప్పవచ్చు.ఇవ్వాళ బతికున్నప్పుడు ఎలాంటి శ్రద్ధ చూపని వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చి రోధించడం,ఏడ్చిన ఏడ్పులు,పెడబొబ్బలు ఇవన్నీ బహిరంగ ప్రదర్శనలు అని చెప్పవచ్చు.కవి ఆనంద్ మౌనంగానే అనే పేరిట సమాజంలో జరుగుతున్న స్వార్థపూరిత రాజకీయాలు వ్యక్తుల చావుల పట్ల ప్రదర్శిస్తున్న కపట ప్రేమలను బహిర్గతం చేశారు. సమాజంలో జరుగుతున్న అవాంఛనీయ పెడధోరణుల పట్ల వివేకంతో మెలగాలి అనే సందేశంతో కూడిన మౌనంగానే అనే కవిత అద్భుతంగా ఉంది.కవి ఆనంద్ ను అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని
వారాల ఆనంద్ తేది 21 – 08 – 1958 రోజున కరీంనగర్ లో జన్మించారు.తల్లిదండ్రులు తల్లి రాధ,తండ్రి అంజయ్య.తండ్రి అంజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆనంద్ 5 వ తరగతి వరకు ఇంట్లోనే చదువుకున్నారు.హైస్కూల్ విద్యను కార్కానగడ్డ హైస్కూల్,గంజ్ హై స్కూల్ లో చదువుకున్నారు. ఆనంద్ ఇంటర్మీడియెట్ విద్యను సైన్స్ జూనియర్ కళాశాల,కరీంనగర్ లో చదివారు.ఆనంద్ ఎస్.ఆర్.అర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్ లో డిగ్రీ చదువుకున్నారు.ఆనంద్ లైబ్రరీ సైన్స్ విద్యను
ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్ లో అభ్యసించారు.ఆనంద్ ఎం.ఏ. ఫిలాసఫీ విద్యను ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ లో అభ్యసించారు.ఆనంద్ ఎం.ఏ. తెలుగు,
విద్యను ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ లో అభ్యసించారు. ఆనంద్ ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుతున్నప్పుడే సాహిత్య సృజన ఆరంభించారు.నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పనిచేసారు.పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ గా ఉన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడిగా పని చేశారు.ఆనంద్ తేది18 -01 – 1980,రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంథనిలో లైబ్రేరియన్ గా ఉద్యోగం లో నియమించ బడ్డారు.ఆనంద్ తేది 31 – 08 – 2016 రోజున ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్ నుండి లైబ్రేరియన్ గా రిటైర్ అయ్యారు.ఆనంద్ వివాహము ఇందిరా రాణి తో 10 డిసెంబర్,1986 రోజున వరంగల్ లో జరిగింది.
ఆనంద్,ఇందిరా రాణి దంపతులకు ఇద్దరు సంతానం.
1) ప్రథమ సంతానం:రేల భర్త వేణుమాధవ్.రేల వేణు మాధవ్ దంపతులకు ఒక్కరే సంతానం. ప్రద్యుమ్న
2) ద్వితీయ సంతానం: అన్వేష్.
ఆనంద్ ముద్రించిన రచనల వివరాలు.
1)లయ కవితా సంపుటి,1981.లయ కవితా సంపుటిలో ఆనంద్ తో పాటు నలుగురు సహ రచయితలుగా ఉన్నారు.1)అలిశెట్టి ప్రభాకర్2)జింబో 3)వజ్జల శివకుమార్ 4)పి.ఎస్. రవీంద్ర.
2)మానేరు గలగల, సాహిత్య విమర్శ,2014. 3) మనిషి లోపల కవితా సంపుటి,2014.
4) మెరుపు సాహిత్యకారుల ఇంటర్వ్యూలు, 2016.
5) అక్షరాల చెలిమె కవితా సంపుటి, 2017.
6) ఆకుపచ్చ కవితలు (గుల్జార్ కవిత్వానువాదం),2018.
7) ముక్తకాలు చిన్న కవితలు,2019.
8) సొంత వూరు కవితా సంపుటి
8)ఇరుగుపొరుగు (30 భారతీయ భాషల్లోంచి అనువాద కవిత్వం).,2023.
అర్థవంతమైన సినిమాలపై పుస్తకాలు
9)నవ్య చిత్ర వైతాళికులు,1999.
10) బాలల చిత్రాలు
11) సినీ సుమాలు,2002.
12) 24 ఫ్రేమ్స్,2004.
13) బంగారు తెలంగాణలో చలనచిత్రం,2014.
14)తెలంగాణ సినిమా దశా దిశ, 2017.
15)Signature of love (poetry),2016.
16)Children’s cinema,1999
17) పైడి జైరాజ్ ,మిద్దె రాములు,2017.
18)అన్ బిన్ కై చంద్ ,2018.
Directed documentary films
తెలంగాణ సాహితీమూర్తులు
1) ముద్దసాని రాంరెడ్డి
2) యాది సదాశివ
3) శివపార్వతులు
Long Battle with short messages
A Ray of Hope,KAFISO a saga of film lovers
ఆనంద్ అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా అందుకున్న పురస్కారాల వివరాలు.
1) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 2022..
2) తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, 2022.
3) తెలంగాణ సాహిత్య పరిషత్ వరిష్ట పురస్కారం, 2023.
4) గండ్ర హనుమంతరావు స్మారక పురస్కారం, 2017.
5) అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం, జగిత్యాల, 2018.
6) రుద్ర రవి స్మారక పురస్కారం, సిరిసిల్ల,2022.
7) ఉత్తమ ఫిల్మ్ సొసైటీ నిర్వాహకుడిగా ఐ.ఎస్.కె. దేవరాయలు పురస్కారం, విజయవాడ.
8) లాంగ్ బాటిల్ విత్ షార్ట్ మెసేజెస్ డాక్యుమెంటరీకి అంతర్జాతీయ పురస్కారం, 2012.
మాధవిపురం (మద్దికెర) లోఅక్షరాలునేర్చుకున్నమొదటిబాలిక. ఇంకాచదువుకుంటాఅన్నమాటనిగొంతుఆపేసి, 12 ఏళ్ళకేపసుపుతాడువేసేసుకుని,మంగళంపాడేసుకుంది. పుస్తకాలటకెక్కాయి. ట్రంకుపెట్టెకిందికిదిగిఅత్తారింటికినడిపించింది. అత్తారింట్లోతనకికలిసొచ్చినదేమిటంటే , తనకన్నామూడేళ్ళుపెద్దవాడైనాసవితికొడుకుతోసహఆరుమందిసంతానం. 40 ఏళ్ళమొగుడు. మరోఆరేళ్ళకుతనపంటపండిమరొముగ్గురుసంతానంవారిలోఆఖరివాడుమానాన్న. 18ఏళ్లవయసుకిమూడుపువ్వులుఆరుకాయలుగాతొమ్మిదిసంతానంఆమెతోముడిపడిపోయింది.
మాఅవ్వజీవనప్రస్థానం 1910 నుండి 1980 వరకుఅంటేశ్రీశ్రీపుట్టినప్పటినించిశంకరాభరణంసినిమావిజయోత్సవాలవరకు.అందులోచివరిపదేళ్ళభాగంలోనేనేనున్నా. అందులోప్రత్యక్ష్యంగాచూసినేనుపదిలపరుచుకున్నదిచివరిఐదేళ్ళజ్ఞాపకాలు.అప్పటికితనుసర్వస్వతంత్రురాలావడంతోతనసహజశైలిని , తనఅనుభవాలుపోతపోసుకున్నవ్యక్తిత్వపరిమాళలనుఆస్వాదించగలిగాను. ఇంట్లోమాపిల్లలకందరికితనేశ్రీరామరక్ష. మాస్నేహితులకుమాత్రంహడల్. వాళ్ళోస్తేమేంవాళ్ళతోబయటికెళ్ళితనతోఉండమనివాళ్ళనిఎక్కవగాఇంటికిరానిచ్చేదికాదు.పనిపాటలేదాఅనివాళ్ళనిపంపించేసేది.
50 ఏళ్ళువంటింటిగుమ్మానికిదిండుపెట్టుకునిపడుకుని, గడిపినా, రెండుప్రపంచయుద్థాలు, మనస్వాతంత్రపోరాటాలాగూర్చిమాకర్థమవ్వాల్సినరీతిలోబాగాచెప్పేది. రతన్టాటా , టాటాసన్స్గ్రూప్చైర్మన్గాస్వచ్చందంగావైదొలగినట్లు, తన 65 తనవంటింటిఅధికారాలన్నిమాఅమ్మకుఅప్పగించింది.మొదట్లోమాఅమ్మచేసేవంటల్లోఎవరైనాఉప్పుతక్కువైందిఅంటెతక్కువేసిమంచిపనిచేసిందికావాలంటేకలుపుకోవచ్చుకదాఅనేది. అదేఉప్పుఎక్కువైనరోజుతనతప్పేంలేదుఈసారికొన్నఉప్పులోనేఉప్పుఎక్కువైందని, రాళ్ళఉప్పుఅమ్మేబండివాడుపళ్ళికించినపుడేతనకిఅనుమానమొచ్చిందని, ఇకరేపట్నించిఈఉప్పుకితగ్గట్టువండుతుందిలేఅనిమాఅమ్మకుభలేసపోర్ట్గామాట్లాడేది.
మాఅవ్వతనజీవితంంలోచూసినవిమూడేసినిమాలుఒకటిశ్రీవెంకటేశ్వరమహాత్మ్యంరెండవదిలవకుశమూడవదిభక్తప్రహ్లద. మిగతాఏసినిమాలుచూడకపోయినఅమెభక్తప్రహ్లదకన్నాగొప్పసినిమాలేదు, ఇకరాదనేదిఆమెగట్టినమ్మకం..అమెదృష్టిలోఎన్టిఆర్కన్నారోజారమణిగొప్పనటుడు.నిఙమేనండిరోజారమణిఓనటీమణిఅనిఆమెనిఒప్పించడంకష్టం.
నేనుఇంట్లోఅందరికన్నాచిన్నఅవ్వడంతోనన్నెప్పుడుతనపక్కనేపడుకోపెట్టుకునేది, రోజూకథలు , కబుర్లుఎన్నోచెప్పేది. హోమ్వర్క్లుగట్రాలుఅన్నిసాయంత్రమేచెయ్యించేది, రాత్రిఏడింటికిభోజనం , ఎనిమిదింటివరకుమాఅవ్వతోకథాకాలక్షేపం, తరువాతముసుగెట్ట్టేయ్యడం.అప్పుడప్పుడు 10 గంటలప్రాంతంలోఘంటసాల, సుశీలపాటలురేడియోలోమంద్రస్థాయిలోవినిపించేవి.
1979 లోఓరోజు.
మానాన్నగారుతనస్నేహితులుకొందరినిభోజనాలకుపిలిచారు. ఆయనేమెనుకూడాస్వయంగారాసిచ్చారు. కొంతవరకుమాఅవ్వసలహాలమేరకువంటావార్పుతరువాతఅన్నసంతర్పణపూర్తిఅయ్యింది.వంటలన్నిఅద్భుతంగాఉన్నాయ్యన్నారు, కానికొంచెంతక్కువయ్యాయి.. చాలమందిమరిమరివడ్డించమన్నారు, కానిసర్దడంసాథ్యమవలేదు. మానాన్నగారికితలకొట్టేసినట్టయింది..అందరువెళ్ళిపోయాకఅమ్మనుఅవ్వనుబాగాచివాట్లేసారు, మాఅవ్యకిమాట్లాడేదానికిపెద్దగాఅవకాశం దొరకలేదు.
ఆనాటిరాత్రిమాఅవ్వఎక్కువగామాట్లాడలేదు, చాలదీర్ఘాలోచనలోఉండిపోయింది. ఎప్పుడోఅర్ధరాత్రినాచెంపమీదకొన్నికన్నీటిబొట్లురాలాయి.
తరువాతరోజుమాఅవ్వనాకు 1930 కాలంనాటిఆకలిరాజ్యంగురించిచెప్పింది. కొన్నినెలలతరబడిఇంట్లోడబ్బులుఉండేవికావట. వంటసామాగ్రికొనేదానికిచాలకష్టంగాఉండేదట. ఇంట్లోఉండేవాళ్ళుకాకావచ్చిపోయేబంధువులుబాగాఉండేవాళ్ళట.ఓపడి(1.3 Kg) బియ్యంరోజుకిసరిపోయేదికాస్తఓపూటకుకూడాతక్కువయ్యేది. దానితోమాఅవ్వేకష్టపడిఎలాగోఅందరికిసర్దివడ్ఢిచ్చేది, ఆలాతనకుపొదుపుగావండడంబాగాఅలవాటుఅయ్యిందట. దానివల్లతనకుమానాన్నతోమాటలుపడవలసివచ్చిందనికొంతబాధపడిఇకమానాన్నగారిసలహామేరకు, ఇంట్లోభోజనాలవిషయంలోతనింకతలదూర్చనని, తనకిష్టమైనపనులుచేసుకొంటానని, తనకునచ్చినపుస్తకాలుకొన్నితెచ్చిపెట్టమనినాకుచెప్పింది.ఆలామాఅవ్వనన్నుమొదటిసారిగాతెచ్చివ్వమనిఅడిగినపుస్తకంగురజాడవారికన్యాశుల్కం. ఓరోజురాత్రిఆపుస్తకంగురిoచిచెబుతూ. తనలాంటివాళ్ళకోసమేఈపుస్తకంరాసారనిచెప్పేది.
తరువాతచలంరాసినపువ్వుపూసింది, కన్నీటికాలువ, మునిమాణిక్యంనరసింహరావురాసినకాంతంకథలుఇలాఎన్నోపుస్తకాలుమాఇంటిదగ్గరలోఉన్నగ్రంధాలయంనుండితెచ్చిచ్చేవాళ్ళం. ఆపుస్తకాలగురించిమాఅమ్మతో, పిల్లలతోచాలగొప్పగాచెప్పేది. నాకంతఅర్థమయ్యేదికాదు.
ఆలాకొన్నాళ్లతరువాతఓరోజునన్నుదగ్గరికిపిలిచిఒరేయినీకుమీస్కూల్లోఎదోబాగాచదివావనిమొదటబహుమతివచ్చిందటగా, మీఅమ్మఅందరికిచెప్పిఆనందపడుతోంది. నీవునాకుఇంకఈకథలపుస్తకాల్నిచదివివినిపించరా, రోజుకొన్నిపేజీలు, అర్థమయ్యిందాఅనిఆజ్ఞాపించింది.ఆలాకొన్నాళ్ళకునేనుచదవాల్సివచ్చినపుస్తకంగురజాడగారువ్రాసినముత్యాలసరాలు, అందులోనుండిఓరోజుకన్యక, చదివినతరువాతమాఅవ్వకంటనీరు, నాకుకూడాఎదోతెలియనిఓబాధ
ఆరోజుపూర్ణమ్మచదవాల్సివచ్చింది. ఇంట్లోఎవరులేరుఅందరుదసరాపేరంటాలకువెళ్లారు. నేనుఅవ్వమాత్రమేవున్నాము.నేనుచదవడంమొదలుపెట్టాను..
కాసులకులోనైతల్లితండ్రి
నెనరున్యాయంవిడనాడి
పుత్తడిబొమ్మనుపూర్ణమ్మనుఒక
ముదుసలికిచ్చిముడివేసిరి
పెనిమిటికాంచిననిమిషమున
కన్నులక్రమ్మెనుకన్నీరు
చదివినవెంటనేఓసారిఅప్రయత్నంగాకన్నెత్తిఅవ్వనుచూసాను
తనముఖంప్రశాంతతకన్నాచాలనిర్వేదంగాకనిపించింది.
నాచేయిపట్టుకునికొంచెందగ్గరగాతీసుకుంది, తనుమాట్లాడలేదు
కానీనాకర్థమయ్యింది.నేనుతరువాతభాగంచదవాలని
అటపాటలోతోటికన్నియలు
మొగుడుతాతయనికేలించ
పూర్ణమ్మదుర్గనుచేరిదుఃఖించే
నాకుతెలియకుండానేఆగిపోయాను. మాఅవ్వచేయిఆలాగేనన్నుపట్టుకుంది, మాఅవ్వభావాలూఅన్నినాకుఅర్థమయ్యాయి, పూర్ణమ్మలాతనమనుసులోఆదుర్గమ్మనుచేరిరోజుఇన్నేళ్లుదుఃఖించిందిమాఅవ్వ.
ఇప్పుడునాక్కూడాఇంకాచదవాలనిపించింది. కానీమాటగొంతుపెగలిరాదనిఅక్షణంతెలియలేదు. కానీచదవసాగాను
అన్నతమ్ములకప్పుడుపలికెను
అన్నల్లారాతమ్ముళ్ళరా
అమ్మనుఅయ్యనుకాయండి
నలుగురికూచొనినవ్వేవేళ
నన్నొకపరితలవండి
మీమీకన్నబిడ్డలనొకతెకు
ప్రేమనునాపేరివ్వండి
ఇకమాటపెగల్లేదు, కంట్లోనీళ్లుయధేచ్చాగాబలబలరాలాయి.మాఅవ్వఒడిలోతలదూర్చుకున్నాను, ఆమెచేతులునాతలనిమురుతుండగా, ఆలాఎంతసమయంగడిచిందోతెలియలేనేలేదు. ఆమెకంట్లోఇంకిపోయినకన్నీరు, నాకంటప్రవహించిందేమో!
ఆతరువాతనన్నెప్పుడుఏకథకానీ, కవితకానీచదవమనలేదు.
మంచిసాహిత్యంమనసునికదిలిస్తుందని, అటువంటిసాహిత్యంపైనాఆసక్తికిబీజంవేసిందిమాత్రంమాఅవ్వే.
ముగింపు :
తనకెదురైనఅన్నిఅవాంతరాలను, తనకున్నవిచక్షణతోతనకనుకూలంగామార్చుకున్నమాఅవ్వమాకెప్పటికీస్ఫూర్తిదాయకమే. జీవితాన్నిపూర్ణమ్మలాత్యజించలేదు, మరేపోరాటాలుచెయ్యలేదు. తనతోముడిపడ్డకుటుంబాలకుఆలంబనగానిలబడింది. అదిఅప్పటికాలంలోకట్టుబాటైన, ఓరకంగామంచిబాటే.
ఓటేద్దాం ఓటేద్దాం ఓటేద్దాం!
స్వార్ధము లేనటువంటి సమర్థులకు ఆచి తూచి !ఓ !
1.ప్రజలయొక్కబాగోగులపట్టింపేధ్యేయంగా
నిజాయితీ నిబద్ధతలు లక్ష్యమైనపక్షానికి
మసిపూసీ మారేడని మాయలు మోసం చేయని
మానవత్వ విలువలున్న మంచి మనసు
కలవారికి !!ఓటేద్దాం !!
2.ప్రజాస్వామ్యవిలువమరచిబమ్మినితిమ్మినిచేయని ,అవినీతీబంధుప్రీతికాసన మేయనివారికి.చెప్పేదీఒకటైతేచేసేదీవేరొకటై
తీరందాటినవెంటనెతెప్పనుకాల్చనివారికి !!ఓటేద్దాం !!
3.ఉద్యోగుల,ఉపాధ్యాయఉన్నతులనుగౌరవించి,ఉత్సాహాన్నందించిఉరకలేసిపనిచేయగ,ప్రోత్సాహాలందించి పోషణచేసే వారికి- రైతన్నల సంక్షేమమె రామరక్షయ న్నోరికి !!ఓటేద్దాం !!
4.సంప్రదాయసంస్కృతులకుసాదరసా కారమిచ్చి,చెప్పి నట్టి ప్రమాణాలు తూ చ తప్పక చేసి ,పట్టంగట్టించినోరిప్రాణాలకుప్రాణమిచ్చి
ప్రగతిపధంలోప్రభుతనుపరుగెత్తించే వారికి !!ఓటేద్దాం !
5.మద్యానికి ఆశపడి మానవతనువిడనాడీ -డబ్బుకు దాసోహమనిధర్మాన్నీమరవకుడీ ,ప్రతిఓటు పవిత్రమనీ
భవితకిదిపునాదియనీ- యోధులమై మనమంతాయోచించీఅడుగులేసి!!ఓటేద్దాం !!
