మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

ఒకే తాను ముక్కలు

by Sheela Subhadra devi March 22, 2026
written by Sheela Subhadra devi

”టీచర్‌ టీచర్‌! ఇందాకటిసంది యాదగిరి క్లాసుల ఒర్రుతుండు టీచర్‌” అయిదో క్లాసు పిల్లలిద్దరు పరుగుపరుగున అరుంధతి దగ్గరికి వచ్చారు.

అప్పుడే అదే క్లాసునుండి బెల్‌ అయిందని స్టాఫ్‌ రూముకి వచ్చిన అరుంధతి గుండె దడ దడ లాడుతుండగా పరుగున మళ్ళీ ఆ క్లాసుకి వెళ్ళింది. టీచర్‌ రాగానే క్లాసంతా గప్‌ చిప్‌ అయిపోయారు. అరుంధతి క్లాసంతా కలయచూసింది. మామూలుగానే ఉంది. తనని పిల్చుకొచ్చిన పిల్లల్ని ”యాదగిరి ఎవరు?” అని అడిగింది అరుంధతి.

వాళ్లు చూపిన వైపు చూస్తే ఒక పిల్లాడు లేచి నిల్చుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

అంతలో ఆ పీరియడు టీచరు సావిత్రి గుమ్మం దగ్గర నిలబడి ”ఇంకా క్లాసులో పాఠం కాలేదా అరుంధతీ?” అంటూ వచ్చింది.

తానెందుకు పరుగున మళ్ళీ రావాల్సివచ్చిందో చెపుతూ ”యాదగిరి ఒర్రుతుండని పిల్లలు పిలుస్తే వచ్చాను” అని చెప్పి గుమ్మం బైటికి వచ్చి ‘ఒర్రటం అంటే?’ రహస్యంగా మెల్లగా అడిగింది అరుంధతి.

సావిత్రి నవ్వి ”అరవటం…” అంది.

”హమ్మయ్య, ఇంకేమిటో అనుకున్నాను” అరుంధతి కూడా నవ్వుతూ వెళ్ళిపోయింది.

వివాహం అయ్యాక హైదరాబాదులో అడుగుపెట్టిన అరుంధతి ఇంకా అక్కడి తెలుగు నుడికారానికి అలవాటుపడలేదు.

స్టాఫ్‌ రూముకి వచ్చి పుస్తకాలు దిద్దటానికి తీసి ఆలోచనలో పడింది.

అరుంధతికి అకస్మాత్తుగా చిన్నప్పటి స్కూల్లోని హిందీ టీచరు గుర్తుకొచ్చారు. మిగతా సబ్జెక్టుల మీదున్న శ్రద్ధ రెండో భాషగా ఉన్న హిందీ భాష మీద పెట్టటం లేదని విద్యార్థులని కోప్పడుతూ ఉండేవారు.

ఒకరోజు ఆమె కోపం తారాస్థాయికి చేరి ”మీరు పెద్దయ్యాకో, పెళ్ళయ్యాకో ఏ బొంబాయో, ఢిల్లీయో వెళ్తే అక్కడ భాష రాక యిబ్బంది పడతారు, కాస్త శ్రద్ధ పెట్టి నేర్చుకోండి” అని క్లాసులోని అందర్నీ తిట్టారు.

దానికి ఆడపిల్లలందరూ ‘అంతదూరం వెళ్ళే అవకాశం కానీ, అవసరం కానీ మాకురాదు’ అని చిన్నగా అనుకుంటూ నవ్వుకున్నారు.

అది గుర్తొచ్చిన అరుంధతి, స్టాఫ్‌ రూములోని టీచర్లతో చెపుతూ ”ఆవిడ అన్నట్లే నేనొచ్చి హైదరాబాదులో పడడమే కాకుండా, ఈ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు తధాస్తు దేవతలు ”తథాస్తు తథాస్తు’ అన్నట్లున్నారు” అంటూ నవ్వింది. అక్కడున్న టీచర్లు కూడా అరుంధతి మాటలకు పడీ పడి నవ్వారు.

ఉపాధ్యాయ శిక్షణ అనంతరం మొట్టమొదట చేరిన స్కూలు ఇది. అందులో ఎక్కువమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా మైనారిటీ వర్గానికి చెందినవారు. అంతేకాక విద్యార్థులు చాలావరకూ శ్రామిక, కార్మిక వర్గానికి చెందినవారు. దాంతో అరుంధతికి భాష ప్రధాన సమస్య అయిపోయింది.

కొత్తగా చేరటంవలన అన్నీ ప్రాథమిక తరగతులు కేటాయించటం మూలాన క్లాసులో తాను చెప్తున్న పాఠం పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో అని బెంగ పట్టుకునేది.

అరుంధతితోబాటే ఉద్యోగంలో చేరిన సావిత్రి ఆమెకు కొంత సహాయకారిగా ఉంటూ ఉండేది.

ఒకరోజు అరుంధతి మూడో తరగతి క్లాసుకి వెళ్ళింది. క్లాసుకి క్రమం తప్పకుండా వచ్చే రాజు ఆ రోజు రాకపోవటం చూసి క్లాసులో పిల్లల్ని ప్రశ్నించింది ”రాజు రాలేదెందుకని”.

అంతలో మెల్లగా నడుచుకొంటూ, చొక్కా అంచుతో కళ్ళు తుడుచుకొంటూ వచ్చాడు రాజు.

”ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు?” అని గద్దించింది అరుంధతి.

రాజు తలదించుకొని ”మా నాయన పన్లో పోయిండని అమ్మ నన్ను ఇంట్లనే ఉండి చెల్లిని జర చూస్తుండమని, ఇస్కూలుకి ఎళ్లొద్దని అంది టీచర్‌. నేనే ఇస్కూలు పోతానని వచ్చేసిన” అన్నాడు మధ్యమధ్యలో వెక్కిళ్ళు పెడుతూనే.

”అయ్యో, ఎందుకు వచ్చావు. ఇంట్లో ఉండకపోయావా” కంగారుగా అంటూ ఏంచేయాలో తోచక పక్క క్లాసులోనే ఉన్న సావిత్రిని పిలిచింది ”సావిత్రీ! రాజు వాళ్ళ నాన్న పోయాడని, వాళ్ళమ్మ ఇంట్లో ఉండమంటే వచ్చేసానని చెపుతున్నాడు రాజు. ఏం చెయ్యాలి” అంది.

సావిత్రి కూడా వచ్చి రాజుని ప్రశ్నించింది ”ఏందిరా మీ నాన్నకేమయింది?” అని.

”ఏంకాలే టీచర్‌. మా నాయన పన్లోకి పోయిండు. మాయమ్మ ఏడకో పోవాల్నంట. ఇస్కూలు మాని చెల్లిని చూసుకోమనె. ఇస్కూలుకి పోతనంటే మాయమ్మ తిట్టింది” అన్నాడు రాజు.

సావిత్రి నవ్వుతూ ”ఇలా ప్రతీదానికీ కంగారు పడ్తావేంటి అరుంధతీ! రాజు నాన్న పనిచేయడానికి వెళ్ళాడట” అంది.

”అంతేనా! ఇంకా నేను ఇక్కడి యాసకు అలవాటుపడలేదు. అందుకే కంగారుపడ్డాను” అంటూ సిగ్గుపడింది అరుంధతి.

అప్పటినుండి విద్యార్థులు మాట్లాడుతున్నంతసేపూ ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించసాగింది అరుంధతి.

పాఠం చెపుతున్నపుడుకూడా వాళ్ళని పదే పదే పాఠానికి చెందిన ప్రశ్నలు వేసి, వాళ్లు తన మాటల్ని అర్థం చేసుకొనేవరకూ ఆగి జవాబుల్ని వినేది.

వింటున్నకొద్దీ తెలుగులోని ఆ ప్రాంతీయ యాస సొబగు అరుంధతికి అర్థం కాసాగింది. అంతేకాదు తానుకూడా విద్యార్థులతో వాళ్ళ యాసలోనే మాట్లాడడానికి ప్రయత్నించేది. అంతేకాక విద్యార్థులతో మాట్లాడుతూనే హిందీ ఉర్దూ పదాలు కూడా మెల్లమెల్లగా నేర్చుకోవటం మొదలుపెట్టింది.

విద్యార్థులుకూడా తన ప్రాంత యాస పదాలు వారికి కొత్తగా అనిపించి పదే పదే అర్థంకాక ప్రశ్నించేవారు. మొదట్లో ఎంత స్పష్టంగా వివరించి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోకపోవటం చికాకై విసుక్కొనే అరుంధతి, రాను రాను స్వీయ అనుభవంతో తనను తాను మెరుగుపరచుకొంది.

వాళ్ళ ప్రాంతీయతను తాను మరోలా అర్థం చేసుకొన్నట్లే తన ప్రాంత యాసా వారికీ వింతగా తోస్తుందనేది అనుభవ పూర్వకంగా అర్థమైంది అరుంధతికి.

ఆ నెల జీతం అందుకుని తన సహ ఉపాధ్యాయినిలు ఫాతీమా, సావిత్రిలతో కలిసి షాపింగుకు వెళ్ళింది అరుంధతి.

కొత్తగా వెలసిన ఆ పెద్ద షాపు ఆశ్చర్యంగా అనిపించింది అరుంధతికి. అందులో తానులు తానులుగా ఉన్న వివిధ డిజైన్లను చూసి వాటిని చీరలుగా తీసుకుంటే ఎలా ఉంటుందని స్నేహితురాళ్ళు ముగ్గురూ అనుకున్నారు.

అది విని సేల్స్‌ గర్ల్‌ అవే తానులతో కుట్టిన డిజైనర్‌ డ్రస్సులను తీసి చూపించింది. దాంతో లంగా వోణీలు, చీరలు, చుడీదార్లు కూడా డిజైన్‌ చేసుకోవచ్చు అనే అంశం ఆ ముగ్గురికీ చాలా నచ్చింది.

వెంటనే సావిత్రి తనకోసం చీరకి సరిపడినంత కొలిపించి తీసుకుంది. అరుంధతి తమ ఊరులో ఉన్న చెల్లెలికి లంగా వోణీకోసం కత్తిరింపించి తన చెల్లెలు కూడా తనంత పొడుగు ఉంటుందని చెప్పి అక్కడే ఉన్న టైలరుకి కొలతలు ఇచ్చింది. ఆ రంగు డిజైను నచ్చిన ఫాతీమా తనకికూడా అదే తానునుండి పంజాబీ డ్రస్సుకి సరిపడా ఇవ్వమని కొని అదే టైలరుకి కుట్టించటానికి యిచ్చింది.

అందరం ఒక తాను నుండే విభిన్న దుస్తులుగా రూపొందించటానికై అనుకోకుండా తీసుకోవడం గమనించి ప్రాంతాలు, భాషలు, యాసలు వేరైనా అందరం ఒక తాను ముక్కలమే అనుకుంది అరుంధతి. ఈ ఏకతా సూత్రాన్ని విద్యార్థులకు నేర్పవలసిన వారమూ మేమే అని మనసారా తలంచుకొంది.

ఆ అనుభూతిని దాచుకోలేక స్నేహితురాళ్ళ ముందు బయటపెట్టింది అరుంధతి. ‘అవును నేనూ అదే అనుకున్నాను’ అని ఫాతీమా, సావిత్రీ అనేసరికి ఆత్మీయంగా ఒకరి చేతులు ఒకరు కలుపుకుని నిండుగా నవ్వుకున్నారు.

March 22, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

దివ్య క్షణంలో నిలిచిన విశ్వం

by రంగరాజు పద్మజ March 22, 2026
written by రంగరాజు పద్మజ

మాధవ మాధుర్యం -రచన – పల్లె సీను.
మాధవ మాధుర్యం అనే కృష్ణ తత్త్వ ప్రధానమైన కృతి శ్రీ పల్లె సీను రాసారు.
క్షణంలో ఏదో మార్పు…ఏదో మెరుపు అంటూ… భగవానుని స్వరూపం దివ్య తేజస్సును పరుస్తోంది. విశ్వమంతా స్వామి ఎదుట ప్రత్యక్ష మైనట్లుంది.

జగన్నుతుని వెదకడానికి అందరికళ్ళూ ప్రయత్నిస్తున్నట్లుంది. జోడించిన చేతులు శివదేవుడు విదిలించలేదు. ఏదో అడగబోయిన అనిలుడు నోరుమూయలేదు. సుచరుణుడు ఎత్తిన తల దించనే లేదు. చూస్తుండగానే అక్కడి జనమంతా మ్రాన్పడిపోయారు. భూదేవి మొదలు ఆకాశం చివరంటా ప్రశాంతం అలుముకొని ఉందా! అనిపిస్తున్నది. ప్రాణికోటి సంచరించినట్లు కూడా లేదు. దిక్పాలకులు స్థావరములు మరచి మూగపోయారు. పంచభూతాల సవ్వడి ఎంత మాత్రమూ లేదు. అక్రూరుడు సాష్టాంగ పడి అరవలేకుండా ఉన్నాడు. రోదించడానికి నోరురాని భక్తులంతా స్తుతించడానికి సిద్ధంగా ఉన్నట్లున్నారు. గోపికల భావాలు కళ్ళల్లోనే కనిపిస్తున్నాయి.
అణువాదిగా బ్రహ్మాండంబులన్నీ నిండి వెలుగుతున్న శక్తి
ఎన్ని ఘడియలు అలా స్తంభింపచేసిందో ఊహకందని విషయం.. ఇలా సాగింది. “మాధవ మాధుర్యం” – దివ్యానుభూతి కవిత్వం :
శ్రీ పల్లె సీను గారు రచించిన “మాధవ మాధుర్యం” కృష్ణతత్త్వాన్ని ఆధారంగా చేసుకొని రచించబడిన ఒక భావరసపూరిత కృతి. ఇందులో కవి కేవలం కృష్ణుని కథను చెప్పడం మాత్రమే చేయలేదు; ఆయన దివ్యస్వరూపం అనుభూతి చెందినప్పుడు భక్తుని హృదయంలో కలిగే ఆధ్యాత్మిక స్పందనను కవిత్వంగా మలిచారు. ఈ కృతిలో కనిపించే భావ స్రవంతి భక్తి, ఆహ్లాదం, ఆశ్చర్యం, విస్మయం అనే అనేక రసాల కలయికగా నిలుస్తుంది.
దివ్యస్వరూప దర్శనానుభూతి
కవి “క్షణంలో ఏదో మార్పు… ఏదో మెరుపు” అనే పాదంతో ఆరంభించే దృశ్యం, సాధారణ దృశ్యం కాదు. అది ఒక దివ్య క్షణం — పరమాత్మ స్వరూపం ప్రత్యక్షమైన క్షణం. భగవానుని తేజస్సు విరాజిల్లినప్పుడు: విశ్వం అంతా ఒక్కసారిగా నిశ్చలమవుతుంది… దిక్కులు మాటలేని సాక్షులవుతాయి… పంచభూతాల సవ్వడీ ఆగిపోతుంది…. ఈ వర్ణనలో కవి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని సూచిస్తున్నారు….
పరబ్రహ్మ తత్త్వం ప్రత్యక్షమైనప్పుడు ప్రకృతి కూడా క్షణకాలం మౌనమవుతుంది అనే భావనను కవితాత్మకంగా ఆవిష్కరించారు. భక్తి విస్మయానికి ప్రతీకలుగాకవి చూపించిన పాత్రలు భక్తి యొక్క రకరకాల స్థితులను ప్రతిబింబించాయి. శివదేవుడు జోడించిన చేతులను విడవలేకపోవడం అనేది పరమభక్తికి పరాకాష్ఠ!
అనిలుడు అడగబోయి మాట ఆగిపోవడమనేది ఆశ్చర్యంతో విస్మయం; సుచరుణుడు తల వంచకపోవడం అనేది దర్శనానందంలో మునిగిపోవడం; అక్రూరుడు సాష్టాంగంగా పడిపోవడం అంటే పరిపూర్ణ సమర్పణ.
ఈ ప్రతీ రూపకంలో ఒక గొప్ప భావం దాగి ఉంది:
భగవద్దర్శనం ముందు వాక్కు, మనస్సు, శరీరం అన్నీ స్థంభించిపోతాయి. సృష్టి నిశ్శబ్దం అవడం… కవిత్వంలోని గొప్ప దృశ్యం. కవి వర్ణించిన దృశ్యంలో ఒక విశిష్టమైన లక్షణం ఉంది. అది సర్వసృష్టి నిశ్శబ్దం… భూదేవి నుంచి ఆకాశం వరకు ప్రశాంతత… ప్రాణికోటికి సంచారం లేకపోవడం… దిక్పాలకులు స్థావరాలు మరచి నిలబడిపోవడం… పంచభూతాల శబ్దం కూడా లేకపోవడం… ఇది కేవలం కవిత్వ అలంకారం కాదు. ఇది భగవంతుని సాక్షాత్కారాన్ని సూచించే విశ్వరూప భావన. ఈ సందర్భంలో శ్రీ సీను గారు చెప్పిన భావం చాలా గంభీరమైనది:
“అణువాదిగా బ్రహ్మాండంబులన్నీ నిండి వెలుగుతున్న శక్తి” ఈ ఒక్క వాక్యం కృష్ణతత్త్వాన్ని తాత్త్వికంగా నిర్వచిస్తుంది. అణువులోనూ బ్రహ్మాండంలోనూ వ్యాపించి ఉన్న పరమశక్తి — అదే మాధవుడు…గోపికాభక్తి…హృదయ భాష – కవి గోపికల భావాలను మాటల్లో చెప్పలేదు. “కళ్ళల్లోనే కనిపిస్తున్నాయి” అని చెప్పారు. ఇది కవిత్వంలోని ఒక సున్నితమైన లక్షణం. భక్తి అత్యున్నత స్థాయికి చేరినప్పుడు మాటలు అవసరం ఉండవు.భావమే భాషగా మారుతుంది.
ఈ మాధవ మాధుర్యం రచనలో కనిపించే ముఖ్య లక్షణాలేమిటంటే? సజీవ దృశ్య నిర్మాణం; భక్తిరస ప్రధానత; విశ్వరూప భావన; తాత్త్విక అంతరార్థం. కవి పదప్రయోగం సాదాసీదాగా కనిపించినా, భావం అత్యంత లోతైనది. పాఠకుడు చదువుతుంటే తానే ఆ దివ్య దర్శనంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది.
“పల్లె సీను గారి ‘మాధవ మాధుర్యం’లో దర్శనమిచ్చేది కృష్ణుడే కాదు; భక్తి మౌనంలో వికసించే విశ్వచైతన్యమే.”
పాఠకుడు చదివే ఈ భాగం మనసులో అనుభవించే మాధవమాధుర్యమే!
“మాధవ మాధుర్యం” కేవలం కృష్ణుని గానమో, స్తుతో కాదు!ఇది భగవద్భక్తి అనుభూతి యొక్క కవితాత్మక రూపం. ఈ కృతి మనకు చెప్పే సందేశం ఏమిటంటే? భగవంతుని తత్త్వం అణువులోనూ ఉంది… బ్రహ్మాండంలోనూ ఉంది… భక్తుడి హృదయంలోనూ ఉంది… అని అందుకే కవి చెప్పిన ఆ దివ్య క్షణం చివరికి మనమూ అనుభూతి చెందుతాము!
మాధవుడు ఎక్కడో దూరంలో కాదు; విశ్వమంతా నింపిన మాధుర్యమే.
రసస్వరూపుడైన శ్రీకృష్ణుడి అతిమానుషములైన చేష్టితములు, సుందర సుకుమారమైన దివ్యమంగళ విగ్రహాన్ని – చూస్తేనే మనసు ఇతర విషయముల మీదికి పోకుండా నిశ్చలంగా ఉంటుంది.
ఈ ప్రపంచానికి, మనకు- భగవంతునితో ఉన్న సంబంధం స్వామి లీలా కథల వల్లనే తెలుస్తుంది. మధురమైన మాధవ మాధుర్యంలో పల్లె సీను గారు శ్రీకృష్ణునిలోని అంతులేని తృప్తిని -అసంతృప్తుల వల్ల కలిగే స్వరూప కాంతిని అనంతమంటూ మాయలో పడిన చదువరులకు ఆ సన్నని పొర తొలగించి, రాధను పూజారిణిగా దర్శింపజేసిన కవి యోగులు.
యమునా తీరానికి మననూ నడిపించారు. ఆశరదృతువులో చక్కని పూల పరిమళముతో కూడిన గాలి బృందావనమంతా వీస్తూ.. ఆ సమయంలో గోపాలకులతో మమేకమై, వేణువు ఊదాడు!
ఆ వేణు నాదమే నందవ్రజంలో ఉన్న గోపికల మనసులో శ్రీకృష్ణ ప్రేమను ఇనుమడింపచేసింది. కృష్ణుడు ఎదురుగా లేకున్నా ఆ వేణునాదం వారి మనసుల్లో ఏవో భావాలను కలిగించింది.
ఎందుకంటే వేణువే ఓంకారం! (ప్రణవం) ఆ ప్రణవ నాదం వినగానే మనసులలో ఆ భగవంతుడే స్మరణకు వస్తాడు. ఆయనను తలుచుకోవడం మొదలవుతుంది. వేణునాద మహిమను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు. అది ఆ గాన మధురిమ.
ఇక్కడ అక్రూరుని భక్తి-తాదాత్మ్యం వర్ణించవీలుకాని విధంగా రాసారు కవి. శ్రేష్టమైన జ్ఞానంపొందడమంటే… సాధనలో ఏమరుపాటు ఉండకూడదనే చక్కని సందేశం ఉన్న ఈ రచనలో మరెన్నో ఆచరించవలసిన విషయాలున్నాయి… ఆలోచించవలసిన విషయాలున్నాయి. భక్తి సాధకులకు కొంగుబంగారమీ భావనా కావ్యం…
కవి మాన్యులు శ్రీ పల్లె సీను గారికి శుభాభినందనలతో..

March 22, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

పరాన్న భుక్కులు

by mayuukha March 20, 2026
written by mayuukha

”ఎవరావిడ?” హెచ్చెమ్‌ రూములోకి వెళ్తున్న ఆమెని చూసి కొత్త మొహంలా కనిపించేసరికి రెండు వారాల ట్రైనింగుకి వెళ్ళివచ్చిన అరుంధతి అటుగా వస్తున్న క్లర్కు సరితని అడిగింది.

”అనాధాశ్రమం నడుపుతోందట. ఆ పిల్లల్ని మన స్కూల్లో చేర్చింది. ఫీజు కట్టటానికి వచ్చిందేమో” అంది సరిత.

నల్లపూసల దండ తెల్లని మెడని చుట్టుకొని ప్రత్యేకంగా కన్పిస్తోంది. కనీ కన్పించని సన్నటి చైను కూడా ఉన్నట్లుంది. చేతులనిండా ఎర్రని మట్టి గాజులు. చూడగానే మధ్యతరగతి శోత్రీయ కుటుంబానికి చెందినట్లుగా ఉంది. ఆ స్కూల్లో అగ్రవర్ణాలకు చెందిన పిల్లలు అతి తక్కువ. తొంభై అయిదు శాతం దళిత, మైనారిటీ, వెనుకబడిన కులాలకు చెందిన కార్మిక శ్రామిక పిల్లలే. అందుకే అరుంధతికి ఆమెని చూస్తే సందేహం కలిగింది.

కొత్తగా చేరిన గంగా, శ్యామలా చకచకా లెక్కలు చేస్తూ అరుంధతి మెప్పును పొందుతున్నారు. వాళ్ళు ఆశ్రమం పిల్లలని తెలిసి వారి తెలివితేటలకూ, వారి జీవనస్థితికీ గల వైరుధ్యాన్ని తలచుకొని వారిద్దరి మీద ప్రత్యేకమైన ఆదరణ కలుగుతూ ఉండేది ఆమెకి.

ఆశ్రమానికి చెందిన ఒక పాతికమంది వరకూ పిల్లలు వివిధ తరగతులలో ఉన్నారు. అందరూ బాగా చదువుతారు. బహుశా స్కూలునుండి వెళ్ళాక శ్రద్ధగా చదివిస్తారేమో అనుకునేవారు టీచర్లు.

”గంగా! హాస్టల్లో రోజూ ఎంతసేపు చదివిస్తారు?” అడిగింది ఒకసారి అరుంధతి.

”చదవటానికి ఒక్కొక్కరోజు టైమే ఉండదు టీచర్‌, అందరికీ పనులు ఉంటాయి. అక్కలు వంట చేస్తారు. గిన్నెలు తోమటం, బట్టలు ఉతుక్కోవటం, రూములు శుభ్రం చేయటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కోపని ఉంటుంది. అన్నీ అయ్యాక రాత్రికి హోమ్‌ వర్కు చేసుకుంటాం. పరీక్ష ఉన్నరోజు తెల్లవారు జామున లేచి చదువుకుంటాం” అంది గంగ.

”ఆ పనులకి పనివాళ్ళెవ్వరూ లేరా?” అంది ఆశ్చర్యపోతూ.

”వార్డెను మేడం, ఆయా ఉంటారు. వాళ్ళు కూరలు, సరుకులు తెస్తుంటారు” అని శ్యామల అందుకొని చెప్పింది.

”అంత పని చేస్తూకూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారే” మెచ్చుకుంది అరుంధతి.

”పరీక్ష పెట్టి మంచి మార్కులు వస్తేనే మమ్మల్ని హాస్టల్‌ లో చేర్చుకుంటారు” అమాయకంగా చెప్పింది గంగ.

అరుంధతికి మరింత ఆశ్చర్యం కల్గింది. ‘అనాధాశ్రమంలో చేర్చుకోవటానికి కూడా ఎంట్రన్సు పరీక్ష లేమిటి చెప్మా!’ అని తోటి ఉపాధ్యాయినితో ఈ విషయాలన్నీ చెప్తూ అంది అరుంధతి.

”మరి తెలివైన పిల్లల్ని చేరిస్తేనే కదా వాళ్ళు మంచి మార్కులతో పాసై వీరి సమాజసేవకి గుర్తింపునిస్తారు” అంది వ్యంగ్యంగా మరో ఉపాధ్యాయిని. అరుంధతికి అది కూడా నిజమే అనిపించింది.

ఆశ్రమం పిల్లలంతా వారి వారి తరగతులలో ప్రథమ శ్రేణిలోనే ఉంటున్నారు. పోటీలలో బహుమతులూ సాధిస్తున్నారు.

మరో రెండు మూడేళ్ళకి – రయ్యిమంటూ పెద్ద శబ్దంతో ఖరీదైన స్కూటర్ని గేటుదాటి స్కూలు ఆవరణలోపలివరకూ నడుపుకుంటూ వచ్చిన ఆమెనీ, ఆమె అమర్యాదకరమైన తీరునీ విసుగుకుంటూనే ఆమె కట్టూ బొట్టూ తీరులో మార్పుని గుర్తించి ఆశ్చర్యపోవటం టీచర్ల వంతు అయింది. అక్కడున్న వారెవ్వర్నీ పట్టించుకోకుండా తిన్నగా ఆఫీసు రూములోకి వెళ్ళిపోయింది ఆమె.

ఒకరోజు ఆశ్రమం విద్యార్థి మధ్యాహ్నానికల్లా తీవ్ర జ్వరంతో సోలిపోతుంటే వాణ్ణి ఆశ్రమంలో దింపిరమ్మని ఒక టీచర్ని పంపించారు హెడ్‌ మిస్ట్రెస్‌. వెళ్ళి వచ్చిన తర్వాత టీచరు చెప్పిన మాట విని నివ్వెరపోయారు అందరూ.

”జ్వరంతో వున్న పిల్లాడిని తీసుకెళ్తే చాప, దుప్పటి పరిచి పడుకోబెట్టమన్నారు అక్కడి వార్డెన్‌. ‘జ్వరంతో ఉన్న పిల్లాడిని క్రింద ఎందుకండీ. అక్కడ పరుపులు ఉన్నాయి కదా!’ అన్నాను. ఒక మూల ఫోం పరుపులు ఒక దానిపై ఒక్కటి ఓ ముప్పయి వరకూ ఉండటం గమనించి అన్నాను.

‘తర్వాత వేస్తాం’ అంటూ ఓ మాత్ర తీసుకొచ్చి వాడిచేత మింగించి మీరిక వెళ్ళొచ్చు అన్నట్లు చూసింది.

మరిక ఏమీ అనలేక ‘డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళండి’ అని చెప్పి వచ్చేసాను. ఇంతకు ముందే పదోక్లాసులోని పద్మని అడిగితే ఎవరైనా విఐపీ విజిటర్లు వచ్చినప్పుడే ఆ పరుపులూ, కొత్త దుప్పట్లు వేస్తారని చెప్పింది. ”ఇది చాలా అన్యాయం కదా” అంది ఆ టీచర్‌.

అందరూ బాధపడ్డారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు.

ఒకసారి ఆ ఆశ్రమం నడిపే సరోజిని ఏర్పాటుచేసిన రాజకీయవేత్త సన్మాన సమావేశం కార్డు చూపించి ”ఎవరికైనా వీలుంటే వెళ్ళి రండమ్మా” అన్నారు హెడ్‌ మిస్ట్రెస్‌.

కుతూహలంతో వెళ్ళింది అరుంధతి. సభ యింకా ప్రారంభంకాలేదు. ఆశ్రమం పిల్లలంతా మంచి బట్టలు ధరించి గుంపుగా వచ్చారు. అరుంధతిని చూసి నమస్కారం పెట్టి ఆ పక్క సీట్లలోనే కూచున్నారు.

సభ ప్రారంభమైంది. నగరంలోని ఆర్థికంగా, అధికారికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా గుర్తింపు వున్న పెద్దలెందరో వేదిక మీదికి ఆహ్వానింపబడ్డారు. ఆశ్రమ నిర్వాహకురాలు సరోజిని వివిధ రంగాలలో ప్రసిద్ధులకు సత్కారాలు చేసింది.

ఆ కార్యక్రమం జరిగాక ఆశ్రమ పిల్లలందర్నీ వేదిక మీదికి రమ్మని ఆహ్వానించింది. వీళ్ళందరినీ చూసి వేదికమీది పెద్దలందరూ సరోజినికి అనాథలపట్ల గల ఆదరణనీ, అంకిత భావాన్నీ పలు విధాల ప్రస్తుతించారు.

ఆశ్రమం నిర్వహించుతున్న యింటి స్వంత దారుడైన ప్రముఖుడు సరోజిని సేవా నిరతికి ముగ్ధుడై ఆ యింటిని వారికి శాశ్వతంగా ఇవ్వదలుచుకొన్నట్లు వేదికమీదే ప్రకటించాడు.

మరొక అధికారి తన శాఖ తరుపున ఇరవై వేల చెక్కుని బహుమతిగా ఇచ్చాడు.

రాజకీయ వేత్త ఒకడు ప్రభుత్వం తరుపున సామాజిక సేవకు అవార్డును ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నాడు. ఈ విధంగా సత్కారాలందుకొన్న ప్రముఖులు అందరూ ప్రశంసలతో బాటూ తమ దాతృత్వాన్నీ ప్రకటించుకున్నారు.

పిల్లలందరూ వేదిక దిగి తిరిగి తమతమ స్థానాల్లోకి వచ్చి కూర్చున్నారు.

ఇక అక్కడ ఉండలేక అరుంధతి లేచి బయటికి నడిచింది. బస్టాపులో నిలుచున్నంతసేపూ మనసంతా పచ్చిగా అయిపోయింది. బస్సెంతకూ రాలేదు కానీ అరుంధతి తన ముందునుంచే వెళ్ళిన కారులో సరోజిని ఉండటం గమనించింది.

ఆ ఏడాది చివర్లో ఫీజులు కట్టని వాళ్ళ జాబితాని అరుంధతికి యిచ్చి, ప్రతీ తరగతిలోనూ ప్రకటించి, వసూలుచేసే బాధ్యత అప్పగించారు మేడమ్‌. చాలావరకూ ఆశ్రమ విద్యార్థులే ఉన్నారు ఆ జాబితాలో. తప్పదు కనుక అన్ని తరగతులలో చెప్పి వచ్చింది.

మరి రెండు రోజుల తర్వాత ఆశ్రమ వార్డెను ఒక చెక్కు తీసుకొని వచ్చి అరుంధతికి యిచ్చి అందరి ఫీజులు కట్టి రసీదులు రాయించమంది. ఆ చెక్కు ఒక కులసంఘం వాళ్ళు యిచ్చినది. ఆ కులానికి చెందినవాళ్ళు కొందరే వున్నారు. మొత్తం ఆశ్రమ విద్యార్థుల ఫీజుకన్నా అందులో సొమ్ము తక్కువగా ఉంది. అదే విషయం ఆమెకి తెలియజేసింది అరుంధతి.

”ఆశ్రమం పిల్లలకి కన్సెషను ఉంటుంది కదా! హెచ్చెమ్ని అడగండి” అంది వార్డెను.

”ఇది ఎయిడెడ్‌ స్కూలు కనుక ఫీజులు అతి తక్కువగా ఉంటాయి. అందులో యింకా కన్సెషన్‌ ఏమిటి?” ఖచ్చితంగా చెప్పింది. సభకి వెళ్ళివచ్చాక వాళ్ళమీద కోపం అనుకోకుండానే అరుంధతి గొంతులో ధ్వనించింది.

చెక్కు తీసుకొని హెచ్చెమ్‌ రూము వైపు నడిచింది అరుంధతి. ఆమెతోపాటే వార్డెను కూడా వస్తోంటే ”ఈ మధ్య సరోజనిగారు రావటం లేదేమి?” ఆరాగా ప్రశ్నించింది అరుంధతి.

”సరోజినిగారు మాదాపూర్‌ లో యిల్లు కట్టుకుంటున్నారు. ఆ పనిలో బిజీగా వున్నారు. అదీగాక గృహప్రవేశం అయ్యాక కూతురి పురిటికి స్టేట్సు వెళ్ళబోతున్నారు. వీసా పనుల్లో తిరుగుతున్నారు.” అంది ఆమె.

”మరైతే ఆశ్రమాన్ని యిక్కడే ఉంచుతారా? షిఫ్టు చేస్తారా?” అంది అరుంధతి.

”లేదు. మేము చూసుకుంటున్నాం కదా” అంది వార్డెను.

హెచ్చెమ్‌ తో విషయం చెప్పి చెక్కు ఆవిడకి యిచ్చి అరుంధతి రూము నుండి బయటకి వచ్చింది. అంతలో లాంగ్‌ బెల్‌ అయ్యేసరికి స్టాఫ్‌ రూములో బేగు సర్దుకొని స్కూలు గేటులోంచి బయటకు దారితీసింది.

బస్టాపుకు వెళ్ళే దారిలో ఒక శవయాత్ర ఎదురైంది అరుంధతికి. శవంమీద పేలాలతో పాటు చిల్లర పైసలుకూడా విసుర్తుండగా శవయాత్ర సాగుతోంది. రోడ్డుమీద పేదపిల్లలు నేలమీద పడిన చిల్లర పైసల్ని ఎగబడి ఏరుకుంటున్నారు.

ఆ దృశ్యాన్ని చూస్తూ నడుస్తున్న అరుంధతికి అకస్మాత్తుగా సరోజిని గుర్తుకు వచ్చింది.

(మే, 2015)

March 20, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహాభారతం

by Uma devi March 20, 2026
written by Uma devi

కుక్కతో మొదలై కుక్కతో ముగిసిన

మహాభారత గ్రంథం !!

ఔనా!!?? అలా ఎలా? అనుకుంటారు సోదరీమణులు కొందరు.

ఔను. అలానే మేము ఇదివరకే చదివాము అంటారు. మరికొందరు తెలియని వారి కోసమే ఈ సేకరణ.

ప్రపంచం గుర్తించిన మహాకావ్యం. కులమతాలకు కాలమానాలకు అతీతమైన ఆదర్శ గ్రంథం. వేదవ్యాసుడు 18 పర్వాలలో రాసిన ఈ మహాగ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, కవులు మహా కావ్యమని, ఐతిహాసికులు ‘ఇతిహాసం’ అనీ, పౌరాణికులు ‘పురాణం’ అని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని కొనియాడుతారు. ఈ గ్రంథం వ్యాసమహర్షి చెప్పగా వినాయకుడు తాళపత్రాలపై ‘లక్ష’ శ్లోకాలుగా రచించాడు. దేవతలూ, దేవర్షులూ రాసిన ఈ మహాగ్రంథం (కావ్యం) కుక్కతో మొదలై కుక్కతో ముగుస్తుంది. ఔను ఇది నిజం !! నమ్మశక్యం కాని నిజం.

మహాభారత కథ కుక్కకు జరిగిన అవమానంతో మొదలయి కుక్కకు జరిగిన సన్మానంతో ముగుస్తుంది. వ్యాసుడు ఎందుకు కుక్కకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు? అందులోని దేవరహస్యం ఏమిటి? అందులోని అర్థాన్ని పరమార్థాన్ని నిక్షిప్తంగా దాగి వున్న నిజాన్ని నేను విని మీకు అందిస్తున్నాను.

కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు కొంతకాలం హస్తినాపురాన్ని పరిపాలించిన తర్వాత అర్జునుని మనవడు, అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు తర్వాత అతని కుమారుడు జనమేజయుడు చక్రవర్తి అవుతాడు. జనమేజయుడు ఒక ‘మహాయజ్ఞం’ చేస్తున్నాడు. ఆ యజ్ఞ ప్రాంగణంలోనికి దేవతల కుక్క ఐన ‘సరమ’ బిడ్డ ‘సారమేయ’ ప్రవేశిస్తుంది.

సారమేయను చితకబాది జనమేజయుని కుమారులు, బావమరుదులు వెళ్ళగొడతారు. సారమేయ తన తల్లి సరమ దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి జరిగిన సంగతి చెపుతుంది.

వెంటనే సరమ బిడ్డను తీసుకుని యజ్ఞ ప్రాంగణంలోనికి వచ్చి జనమేజయునితో రాజా నీ కుమారులు నా బిడ్డను అకారణంగా హింసించారు. నా బిడ్డ అంత అన్యాయమేం చేసిందని జరిగింది. జనమేజయుడు తన కొడుకులను పిలిచి విచారించగా యజ్ఞం జరిగే ప్రాంగణంలో కుక్క వస్తే కొట్టక సన్మానిస్తామా? అని పొగరుగా జవాబు చెప్పారు. దానికి తల్లికుక్క సరమ తీవ్రంగా వ్యతిరేకించి రాజా మేము కుక్కలం ఆహారాన్ని ఆశించడం, తిండి ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెదకడం మా స్వభావం. అదిలిస్తే వెళ్ళిపోతాం. ఇంతగా కొట్టడం తప్పుకాదా అని నిలదీసింది. రాజా తప్పు నువ్వు చేసినా నీ బంధువులు చేసినా నువ్వు చేసినట్టే. నువ్వు ఈ దేశానికి చక్రవర్తివి. ప్రజలనే కాదు, సమస్త జీవరాసుల బాగోగులు నువ్వే చూడాలి. ధర్మజ్ఞుడైన ధర్మరాజు మనవడివి. నీ వాళ్ళు అహంకారంతో విచక్షణ కోల్పోయి మూగజీవిని హింసించారు. నా మనసు శోకించింది. నువ్వు అకారణంగా బాధల పాలైతావని సరమ తన బిడ్డ సారమేయను తీసుకుని వెళ్ళిపోయింది.

ఆది పర్వం ప్రథమాశ్వాసంలోని ఘట్టం ఇది.

వ్యాసుడు – రాజులు ఎలా పరిపాలన చేయించాలో కుక్కతో చెప్పించాడు.

ఇక వ్యాసుడు కుక్కకు జరిగిన సన్మానంతో ఎలా ముగించాడో చూద్దాం.

ఈ భూమండలంతో మీ ఋణానుబంధం తీరిపోయింది. మహాప్రస్థానానికి సిద్ధం కండి అని వ్యాసుడు పంచ పాండవులకు ద్రౌపదికి ఆదేశించాడు. నార చీరలు, జింక చర్మాలు ధరించి               అంతఃపురాన్ని దాటి పురవీధుల వెంట నడుస్తున్నారు. ఒక ‘కుక్క’ వారిని అనుసరిస్తోంది. ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. రాజ్యాధికారంలో వున్న పరీక్షిత్తు మిగతా మంత్రులు నగర పొలిమేరల వరకు వచ్చి సాగనంపారు. భారతదేశ ఉత్తరం దిక్కుగా వారి మహాప్రస్థానం సాగుతోంది. హిమాలయాలు దాటి మేరుపర్వతం చేరుకున్నారు. వారిని కుక్క అనుసరిస్తున్నది. మొదట ద్రౌపది తర్వాత వరుసగా నలుగురు తమ్ములూ తనువు చాలించారు. చివరగా ధర్మరాజు అతనితో కుక్క మేరు పర్వతం చేరుకున్నారు. దేవేంద్రుడు రథంతో వచ్చి ధర్మరాజును స్వర్గానికి ఆహ్వానించాడు.

ధర్మరాజు మొదట కుక్కను రథం ఎక్కించమన్నాడు. అప్పుడు ఇంద్రుడు ప్రాణాలతో స్వర్గం చేరాలంటే ఎంతో పుణ్యం చేసివుండాలి. కుక్కలకు స్వర్గలోక ప్రవేశం లేదంటాడు. అప్పుడు ధర్మరాజు మేము హస్తినలో బయలుదేరినప్పుడు ప్రజలు, రాజులు, మంత్రులు, చివరకు నా భార్య తమ్ములు ఒక్కొక్కరుగా నన్ను వదిలేసినా ఈ కుక్క నాతోనే ఇంతవరకూ వచ్చింది. ఏమీ ఆశించకుండా రేయింబవళ్లు నాతోనే వున్నది. ఇంత విశ్వాసం వున్న కుక్క స్వర్గ ప్రవేవానికి అర్హురాలే కదా! నమ్మిన వారిని ద్రోహం చేస్తే ఏ పాపం వస్తుందో, నన్ను నమ్మి ఇంతదూరం వచ్చిన ఈ కుక్కను వదిలి నేను స్వర్గానికి వస్తే అదే పాపం నాకు వస్తుంది కదా ఇంద్రా, అందుకే నేను రాను అంటాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు ధర్మనిరతికి సంతోషించాడు. కుక్క యమధర్మరాజుగా మారినాడు.

ధర్మరాజా ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న వేదోక్తిని కాపాడిన నువ్వు రక్షించినావు. అదే ధర్మం క్కు రూపంలో వచ్చి నిన్ను ఇంతదూరం వచ్చి రక్షించింది అని దేవేంద్రుడు ధర్మరాజును ఇంద్రలోకానికి తీసుకెళ్ళాడు. ధర్మరక్షకుడైన యమధర్మరాజు శునకంగా మారి ధర్మరాజును కాపాడుతూ చివరివరకూ అతని వ్యక్తిత్వాన్ని పరీక్షించాడు. మహాభారత గ్రంథకర్త వేదవ్యాసుడు కథ ప్రారంభంలో కుక్కకు అవమానం జరిగినప్పుడు కుక్కతో ధర్మరక్షణ ధర్మనిరతిని చెప్పించాడు.

కథ ముగింపులో కుక్కకు ఎనలేని గౌరవాన్ని ఆపాదించి కుక్కను శరీరంతో స్వర్గానికి ధర్మరాజు తీసుకెళ్తానన్నాడని ముగించాడు.

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఉరుకురుకి వస్తుంది ఉగాది పండగ!

by Akkinepalli Venugopal Rao March 20, 2026
written by Akkinepalli Venugopal Rao

ఉరకలువేసే ఉప్పెనలాగా ఉగాదివస్తుందుత్సాహంగా

గడపగడపలో మంగళకరమౌ మామిడాకులు పూలమాలలతొ
వత్సరానికే మొదటి పర్వమై
సత్సంపదలతొ చాల కాన్కలతొ !ఉరకలు ।

కొత్తబట్టలు కుట్టించుకుని
చెత్తభావాలు నట్టే ట కలిపి
ఆరు రుచులిచ్చు పచ్చడి తోడ
అంతులేని ఆనందాలివ్వగ !ఉరకలు !

మూఢనమ్మకం మూలన వేస్తూ
చీడపీడలను ఛేదన చేస్తూ
ఐకమత్యమే మన నినాదమై
లోకహితాలే ఘన నివాళులై
మంచి విద్యలే మనలక్ష్యాలని
మన సంస్కృతులే మహి విజయాలని !ఉరకలు!

పరాభవలోన ప్రపంచ మందున
అరాచకాలే అసలు వద్దనుచు
దురహంకారము దూరమవ్వగా
నరసంహారము నాపగోరెడు
మేధావులను మేల్కొన జేయుచు
సుధా లహరులను వసుధన నింపుచు!! !ఉరకలు !

March 20, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

మౌనలోకం

by Dr. Varigonda Satya Surekha March 20, 2026
written by Dr. Varigonda Satya Surekha

 సుహృత్ కన్నా సుచరిత ప్రవర్తన ఎక్కువ బాధని కలిగిస్తోంది. వాస్తవం అంగీకరించడానికి తన మనసు ఎందుకు సిద్దం కావట్లేదో అర్థంకాదు. ఇవాళ  మళ్ళీ స్కూల్ కి వెళ్ళింది. అక్కడేం జరుగుతుందో తెలిసిందే. ఇంటికొచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది. రెండు రోజులవరకు మాములు మనిషి కాదు. నిద్రాహారాలు ఉండవు. తన వైఖరి సుహృత్ కి ఎంత చేటు చేస్తుందో గ్రహించదు.
ఊరికి వెళ్ళక రెండు  సoవత్సారాలు అయింది. అమ్మ నాన్న ముఖ్యంగా నాన్నమ్మ ఎలా ఉందో. చిన్నప్పటి నుండి పనికైనా పరిష్కారానికైన తను చేరేది నాన్నమ్మ ఒడికే. అటువంటిది ఇప్పుడు తన జీవితంలో ఇంత పెద్ద తూఫాను చెలరేగింది. నాన్నమ్మ దగ్గర ఎపుడు ఏది దాచని తాను ఇవాళ సుచరిత వల్ల సుహృత్ విషయం దాచాల్సి వస్తోంది. “నాన్నమ్మ నాకు మార్గం చూపవు.” మనసులోనే అర్థించాను.
                                      *
“నాన్నమ్మ నువ్వు నిజంగా వచ్చావా?” ఆనందo ఉక్కిరిబిక్కిరి చేయగా ఆటో దిగిన నాన్నమ్మని వాటేసుకున్నాను.
“బడుద్దాయి! వదలరా , ముందు ఆటో అబ్బాయ్ కి డబ్బులు ఇచ్చి పంపు.” ప్రేమపూర్వకమైన నవ్వుతో ఇంట్లోకి దారితీసింది. సామానుతో ఆ వెనుకే ఆవిడని అనుసరించాను.
అవ్వడానికి డెబ్బై ఏళ్ళ వృద్ధురాలుఅయినా పడుచు వారికి ధీటుగా ఇప్పటికి ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంది. ఒక్కసారి చూసిందో , ఇక అంతే , జన్మలో మర్చిపోదు. అందుకే ఆవిడ ఇక్కడికి వచ్చిమూడేళ్ళు పైన అయినా “ఎలా రాగలిగావు” అన్న ప్రశ్న వేయలేదు.
మంచి నీళ్ళు అందిస్తూ అడిగా “ కాఫీ పెట్టనా? తాగి స్నానం చేస్తావా” .
“అదేంటి నువ్వు పెట్టడం .సుచరిత ఏది”
“సుహృత్ స్కూల్ కి వెళ్ళిందిలే” చెప్పి కాఫీ పెట్టడానికి వంటిట్లోకి వెళ్ళా.
                       “ఏరా ఇంత విషయం ఉంటే మాకెవరికి చెప్పావు కాదే” “సుచరిత ఇష్టపడలేదు నాన్నమ్మ. అందరు పిల్లాడిని గేలి చేస్తారేమోనని భయపడింది. అలాగే మీ నుండి ఏమ్మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని కూడా కొంత భయపడింది. అందుకే రెండేళ్ళ బట్టి రావడానికి ఒప్పుకోలేదు..” సంజాయిషీ ఇచ్చాను. “అందులో తన తప్పేమీ లేదు లేరా. నూటికి నూరుపాళ్ళు ఏ తల్లి అయినా అలాంటి పరిస్థితుల్లో అలాగే చేస్తుంది.” మనుషులని మనసులని అర్థం చేసుకోవడం లో నాన్నమ్మ తర్వాతే ఎవరైనా అనిపించింది.                    
సుహృత్ కి Intellectual disability ( ఇంటెలెక్చువల్ డిసబిలిటి)ఉందన్న విషయం  వాడికి ఐదేళ్ళు వచ్చేవరకు మాకు అర్థం కాలేదు. వాడు పాకడం , నడక , మాటలు అన్నీ ఆలస్యమే. తరగతి గదిలో ఓ చోట కుదురుగా కూర్చోలేకపోవడo, టీచర్ చెప్తోంది అర్థం చేసుకోలేకపోవడo, మిగిలిన పిల్లల మాదిరిగా కాక విషయాలని మర్చిపోతూ ఉండడం, పుస్తకంలో అక్షరాలని కుదురుగా కాక విసిరేసినట్లుగా రాయడం , ఏదైనా చెప్పడంలో , మాట్లాడటంలో పదే పదే తడబడ్డం…… వేటేనీ కూడా Intellectual disability (ఇంటెలెక్చువల్ డిసబిలిటి ) లక్షణాలుగా గుర్తిచడంలో విఫలం అయ్యాం.
“మీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వేరే పిల్లల లంచ్ బాక్స్ల్లో వారు తింటుండగా తీసుకుని తింటున్నాడు. కోప్పడ్డా ప్రయోజనం లేదు. కొడితే భయపడాలన్న విషయం కూడా తెలియట్లేదు. ఒకసారి డాక్టర్ ని కలవండి…..” అని వాడి క్లాస్ టీచర్ చెప్పేవరకు , మా పిల్లాడి ప్రవర్తన మిగిలిన పిల్లలకి భిన్నంగా ఉంటోందన్న విషయం అర్థం కాలేదు.
అర్థమయినా సుచరిత అంగీకరించడానికి సిద్దపడలేదు. టీచర్ల సాకులంది. స్కూల్ మార్చాలంది. మార్చిన స్కూల్లోనూ అవే కంప్లైంట్స్ . ఇంక లాభం లేదనుకొని సుచరిత ని బలవంతం గా ఒప్పించి సుహృత్ ని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళా.
ఏ విషయం అయితే సుచరిత మనసు స్వీకరిoచట్లేదో అదే సుహృత్ జీవితo యొక్క కఠ‌‍‌‍న వాస్తవమైంది. ఆ క్షణాన ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కంపించినట్లైంది. తండ్రిగా నా పరిస్థితే దుర్భరం . ఇక తల్లిగా సుచరిత……. అర్థం చేసుకోగలిగాను. ఓపిక పట్టాను. మెల్లిగా తనకి తాను సర్దుకుంటుందని , వాస్తవాన్ని జీర్నిoచుకుంటుందని ఆశిoచాను. కాని అలా జరగట్లేదు.
లోకమంతటినీ తప్పు పడుతోంది కాని తన బిద్దలోని లోపాన్ని మాత్రం ఒప్పుకోదు. ఎవరైనా పిల్లాడి గురించి సలహానో సానుభూతో ప్రకటిస్తే వారితో ఎదురు దాడికి దిగుతుంది. రాను రాను వైద్యం వారిద్దరిలో ఎవరికి ఎక్కువ అవసరమో తనకి అర్థం కావట్లేదు. డాక్టర్ , ఇలాంటి పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిద్దరూ శిక్షణ పొందాలి అంటారు. ముఖ్యం గా తల్లి .
వాడితో ఓపిగ్గానే ఉంటుంది. వాడిని కొట్టడం కాదుకదా కనీసం విసుక్కోగా కూడా తనెప్పుడూ చూడలేదు.విరాం లేకుండా వాడి వెంటే తిరుగుతూ, వాడి ప్రతీ చర్యను సర్దుకుంటూ , సమర్థించుకుంటూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా బిడ్డకి బుద్దిమాoధ్యత ఉంది అని ఒప్పుకోదు. చర్చ కి తావులేదు. “మీ బిడ్డని మీరే వెర్రివాడని అనుకుంటున్నారా ….” అని ఆవేదన చెందుతుంది. తన దుఖాన్ని చూసి మౌనం వహించడం మినహా చేయగలిగింది లేదు.
                     
***
“ ఏంటి! నాన్నమ్మ సుహృత్ ని ఆడిస్తున్నావా…”  వెనక వైపు  వసారా లో నాన్నమ్మ సుహృత్ లని అలా చూస్తుంటే తనకి తన బాల్యం గుర్తోచ్చిoది.  
“సుహృత్ ! తాతమ్మ ని ఆట పట్టిస్తున్నావా …” అంటూ నా వెనుకే వచ్చిన సుచరిత వెళ్ళి వాళ్ళిద్దరి ప్రక్కగా కూర్చుంది. ఆ ముగ్ద చిత్రంలో నా స్థానానికై నేనూ వెళ్ళి కూర్చున్నాను.
నాన్నమ్మ మమ్మల్ని చూసి చిరునవ్వు తో “ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి “ అని “అక్కడెక్కడో బౌద్ధ గురువట, యేవో పరీక్షలు జరిపి ప్రపంచంలోనే అందరికన్నా సంతోషవంతుడు అని తేల్చారట. వారి పరిశీలనలు ఏమోగాని , నాకు తెలిసి ఆయన సంతోషం గా ఉండటానికి కారణం తనదైన ప్రపంచంలో హాయిగా ఆనందంగా  జీవించడం , రాగద్వేషాలు కలిగి ఉండకపోవడం, ప్రకృతిని ప్రేమించడం, వస్తువులకి విలువ్వివక పోవడం, ముఖ్యంగా ఎవరితోటి దేన్నీ పోల్చుకోకపోవడం… అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మీరు గొప్పవారిగా  ఒప్పికుంటారా?” నాన్నమ్మ ప్రశ్న కి సమాధానంగా ఇద్దరం తలూపాం.
“మరి మీ బిడ్డ ఎదుగుదల పట్ల ఎందుకు అనుమానపడుతున్నారు.” నానమ్మ తర్కం అర్థంకాలేదు. నాన్నమ్మే మళ్ళీ “నా  మనవడు ఎండగా ఉన్నప్పుడు వాన కావాలి అంటాడు.  కుదిరిన ప్రతిమబ్బు కురవలంటాడు. అలా జరగనందుకు నిరుత్సాహ పడతాడు . ఒక్కోసారి విసుగు చెందుతాడు.  ఆ ఆలోచనలో నీకు లోపం కనిపిస్తే నీ భార్యకి అది ఆందోళని కలిగిస్తుంది. అసలు ప్రకృతే గమనించడం మానివేసిన మీలాంటి వారికి అదో మానసిక రుగ్మత లా కనిపిస్తుంది.”
నాన్నమ్మ మాట్లాడుతోంది. నాకు అర్థమై కానట్లుగా ఉంది. కాని ఎక్కడో ఏదో నా ఆలోచనల్లోనే లోపం ఉందని అర్థమైంది. వికాసమైన వికలత అయినా మనిషి ఆలోచనల్లోనే ఉందని అర్థమైంది. వాడి గురించి నేనలా ఆలోచించడం నా మనో వైకల్యoలా ఇపుడు అనిపిస్తోంది.
“మనిషి ఎదిగేకొద్దీ  వాడిలోని పసిమనసు కనుమరుగవుతుంది. మేధ పెరగడమే దానిక్కారణం అనుకుంటారు మీలాంటి మేథోవంతులు కాని అసలు సిసలు మేథ జిజ్ఞాసని ఎల్లప్పుడు జీవింపచేసి ఉంచటమే. ఆ మేధ వాడిలో ఉంది. మీ అజ్ఞానo వాడి మేధని అడ్డుకుంటోందని ఏనాడైనా ఆలోచించారా..?” సూటిగా ప్రశ్నించింది నాన్నమ్మ.
“నిజమే! అమ్మమ్మగారు. నలుగురిలోనూ ఆఖరికి నా భర్త సమక్షంలో కూడా నేనేనాడు నా బిడ్డకి మనో వైకల్యత ఉందని ఒప్పుకోలేదు. కాని నాకేతెలియకుండా నా అంతరంగాలలో ఎక్కడో ఎప్పుడో అదే అభిప్రాయం స్థిరపడినట్లుంది. అందువల్ల నిత్యం నేను , నాతో ఇతరులతో కూడా ఘర్షణ పడుతూ ఉండేదాన్ని. మీరు స్థిరంగా నా బిడ్డ ఆరోగ్యవంతుడు అని చెప్తున్నారు.  నా మనస్సు , వాక్కు , చేత దేనికి పొంతన లేని కారణాన నా బిడ్డ జ్ఞానాన్ని జిజ్ఞాసని గుర్తించలేకపోయాను. సంఘంలో నా బిడ్డ స్థానం గురించిన ఆందోళనే తప్ప నా ఈ రకమైన ప్రవర్తన వాడి ఎదుగుదలకి అవరోధం అవుతోందని తెలుసుకోలేకపోయాను. ఇతరులకి భిన్నంగా ఉండడo ప్రత్యకమే తప్ప పొరపాటు కాదు అని ఆలోచించలేకపోయాను.” కళ్ళు వర్షిస్తుండగా మనసు విప్పి మాట్లాడుతోంది సుచరిత.
ఇన్నాళ్ళూ సుచరిత లో తప్పులు వెదకడమే తానూ చేసాడు  తప్ప తన ఆలోచనల్లో దాగి ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సుహృత్ కూడా ఆ బౌద్ధ గురువులాగే రాగద్వేషాలు లేనివాడు. దేనితోనూ ఏది పోల్చనివాడు. ప్రకృతి ని ప్రేమించేవాడు. అమ్మ అంటే విపరీతమైన అనురాగం, నిష్కల్మషమైన చిరునవ్వుతో అందరిని పలకరించే వాడి అమాయకత్వం… ఆలోచిస్తుంటే తెలుస్తోంది వాడి వ్యక్తిత్వపు పరిమళం.
నాన్నమ్మ పాదాలనoటి చెప్పాను “ఇంకెప్పుడు ఎవరితోనూ పోల్చను. వాడి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. వాడి మేధ ఎందులో ఉందో వెలికితీస్తాను.”
“ఈయన తిప్పని psychriyatist లేరు. కాని మీలా అర్థం చేయించిన వారెవరూ లేరు. చాలా థాంక్స్ అమ్మమ్మగారు…” ఆనందాశ్రువులు రాలుతుండగా రెండు చేతులూ జోడిచింది సుచరిత. మునుపెన్నడూ లేని సంతోషం సంతృప్తి కనిపించాయ్ ఆ కళ్ళల్లో.
“చాల్లెండర్రా ! మీరు మీ పొగడ్తలూ. వీడు నా మనవడు. వాడు నా మునిమనవాడు. నా కుటుంబంలోని పిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుస్తుంది కాని మీరు చెప్పే ఆ నాలుగు మాటలు వినే ఆ డాక్టర్ కి ఏం తెలుస్తుంది. యెంత తెలుస్తుంది. సరే!ఇంక మమ్మల్ని విసిగించక వెళ్లండి. మేమిద్దరం ఆడుకోవాలి….” అని నవ్వుతూ నా జీవితంలోని ఉప్పెనని ప్రశాంత నదీ ప్రవహంలా మార్చిన నాన్నమ్మ ఋణo ఏమిచ్చి తీర్చుకోగలను….. 

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరాభవకు స్వాగత ప్రణతులు

by Akkinepalli Venugopal Rao March 20, 2026
written by Akkinepalli Venugopal Rao

1.ఉత్పల మాల:
స్వాగతమో పరాభవ దివాకర తేజుడ వౌచు రమ్మికన్
మాగత మంత మార్చుచును మంచిని పెంచుచు వాంఛితమ్ములన్
వేగమె తీర్చుమయ్య మది వీణలు మీటుచు నాట్యమాడ,నీ
వేగతి దేశ శాంతి నిలబెట్టి ఉషస్సుల నందజేయాగా !!

2.ఆటవెలది:(ఉగాది గూర్చి)
ఆరు రుచులు గల్గి యారోగ్య మొసగేటి
పచ్చ డార గించు పర్వ దినము
కొత్త ధాన్య మొచ్చు కోర్కెల దీర్చుచు
మొదటి పండు విదియు ముదము గూర్చు !!

3.శార్దూలం:(పరాభవ గూర్చి)

నీపేరున్ వినభీతిగల్గును సదా నిక్కంబిదీ వత్సరా
మాపన్ జూడుము మాదు భావనలలో మాలిన్యముల్ నీవికన్
కాపాడుమ్మిక మమ్ములన్ కరుణతో కన్నెర్ర జేబోకుమా
ఆపన్ జూడుమ ఆగడమ్ములభువిన్ అన్యోన్యతన్ బెంచుమా !!

4.చంపక మాల:(ప్రణతులు)
అమెరికలోప్రవాసులకు నాపద లేవియు రాని రీతిగా
సమతయు శాంతి సౌఖ్యములసారధిగా నడిపించు వాడవై
భ్రమలను త్రుంచివేయుచును భారత బిడ్డల కీర్తి బెంచుచున్
తమ తమ కొల్వులందునను ధన్యత గూర్చు మయా పరాభవా !!

5.ఆటవెలది:
తెలుగు సంఘములకు తేజమ్ము పెంచుచు
వెలుగునింపు మింక వేగిరముగ
మాతృ భాష మీద మమకారమున్ పంచు
దేశ సేవ పట్ల దీక్ష పెంచు !!

4,5 పద్యములు NRI లకు మరియు US లోని తెలుగుసంఘాలకు అంకితం

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరాభవ నామ సంవత్సరం

by Kesharaju Venkata Prabhakar rao March 20, 2026
written by Kesharaju Venkata Prabhakar rao

స్వీయ రచన

పరాభవ నామ సంవత్సరం
ప్రభవించిన ప్రభాత కిరణం
ప్రపంచానికి ప్రశాంతాభరణం
ప్రసిద్ధమై వెలిగే కనకపుష్యరాగం!!

పరాభవనామ సంవత్సరం
పరుగున వచ్చిందని పరభృతం
పట్టలేని ఉత్సాహంతో, గూడెం, నగరం
ప్రజల శ్రమైక జీవన సౌందర్య గీతం
పరవశంతో చేస్తోంది సుమధుర గానం!!

ప్రకృతి రమణీయంగా పచ్చల హారంతో
సుదృక్కులా వలపుల కలశంతో
అమృత భాండంతో అరుదెంచింది
వికృత భావాలను విరిచి విసిరేసి!!

పరాభవమంటే, పరాభవాల పంకం కాదని
సరాగాలు సంరంభమని, వరాల వరదుడని
బరువులు బాధ్యతల కారాగారం కాదని
వరబడి దరిచేరకుండా వర్షం ప్రసాదిస్తుందని

సమస్త ప్రజానీకంలో ఆపాదమస్తకం
సుమ సమానమైనట్టి సౌకుమార్యం
తలిరి టాకుల ముగ్ధ మనోహర సౌందర్యం
కలిగించి,కలిమిచెలియై కష్టనష్టాల హననం !!

కావించి, కాల నియమాలననుసరించి
త్రికాలాల త్రిగుణాల సంసేవితయై
ఆరు రుతువులు ఆరు రుచులతో సంభావించి
హరిహరాదుల దయను ప్రసాదించి!!

కలివిడిగా తలలు నిమిరి ఊరడించి
తల్లి లా సాకె ఆ పేరును, పెద్దలు పూర్వీకులు
పరాభవ నామ సంవత్సరం అని ఎందుకు పెట్టారో?
తెలియదు కానీ తనను స్మరించిన చాలు
ఈప్సితాలను ఈడేర్చు ఈశ్వరుడు ఈకాలం !!

మిత్రులు హితులు శ్రేయోభిలాషులకు
పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మనిషికి ఒక మాట

by Lingamneni Sujatha March 20, 2026
written by Lingamneni Sujatha

అమ్మా! అమ్మా! అన్న ఆర్తనాదం విని, వంటగదిలో పోపు పెడుతున్న శారద స్టవ్ ఆఫ్ చేసి పరుగెత్తుకుంటూ వచ్చింది.
హాలులో కూర్చుని పూజ చేసుకుంటున్న పార్వతమ్మ కంగారుగా బయటకు వచ్చింది.
వరండాలో కూర్చుని స్నేహితులతో కబుర్లు చెబుతున్న రాము పరుగు పరుగున వెనక దొడ్లోకి వచ్చాడు. ట్రాక్టర్ కింద రక్తపు మడుగులో చిన్నారి కిశోర్ పడి ఉన్నాడు.
డ్రైవర్ ట్రాక్టర్ దిగి, నేను కిశోర్ ను చూసి బాబూ! బాబూ! అంటూ అరుస్తూ, ట్రాక్టర్ కు బ్రేక్ వేసాను. బ్రేక్ పడేలోపు కిశోరే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి, ట్రాక్టర్ కింద పడి పోయాడు. నా తప్పేమీ లేదు బాబుగారూ! కావాలంటే పాలేరు సుబ్బయ్యను అడగండి అన్నాడు.
ట్రాక్టర్ ను చూసిన హుషారులో కిశోర్ ఎదురుగా పరుగెత్తుకు వచ్చాడు బాబుగారూ! అన్నాడు సుబ్బయ్య.
ఈ అరుపులు కేకలకు ఇరుగు పొరుగు వారు కూడా ఏమైందంటూ పరుగు పరుగున వచ్చారు.

అప్పటివరకు ఇల్లంతా తిరుగుతూ, తన ముద్దు మాటలతో మురిపిస్తూ, కిశోర్ ఆడుకుంటున్నాడు. మరుక్షణంలో ట్రాక్టర్ కింద పడి తల పగిలి రక్తంతో తడిసిపోయిన కిశోర్ ను చూసి, అక్కడ ఉన్న అందరి హృదయాలు ద్రవించి కన్నీరుగా కారాయి.
ఇప్పుడే కదరా నాన్నా! అమ్మా!
చాక్లెట్ పెత్తవా? అంటే పెట్టాను. ఇంతలోనే నీకు ఈ కర్మ వచ్చిందేమిటిరా? అంటూ తల్లి చూసే వారి హృదయాలు ద్రవించేలా ఏడుస్తోంది.
ఇప్పుడే కదరా నాన్నా! అమ్మ చాక్లెట్ ఇచ్చింది అని ఆనందంగా చెప్పావు? ఇంతలో నీకీ గతి వచ్చిందేమిటి? అంటూ తండ్రి కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పటివరకూ నాముందే ఆడుకుంటున్నావు కదా! ఇంతలోనే ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అని నాయనమ్మ బాధపడుతోంది.

డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలేమో చూడండి అన్నారు ఒకరు.
రక్తపు మడుగులో పడి ఉన్న కిశోర్ ను డ్రైవరు, పాలేరు తీసుకు వచ్చి, వరండాలో ఉన్న మంచం మీద పడుకోబెట్టారు. పెద్దవాళ్ళు ఒకరిద్దరు వచ్చి, కిశోర్ ముక్కు దగ్గర వేలుపెట్టి చూసి శ్వాస ఆడడంలేదు. పిల్లవాడు పోయాడు అన్నారు.

“శారద కిశోర్ దగ్గర కూర్చుని బాబూ! అంటూ భోరున ఏడవడం మొదలు పెట్టింది.”
శారదను వంగదీసి వీపు మీద గుద్దుతూ ఒసే పాపిష్టిదానా! బిడ్డను పట్టించుకోకుండా ఏం చేస్తున్నావే? మా వంశనాశనానికి వచ్చావా? బంగారం లాంటి బిడ్డను ట్రాక్టర్ పాలు చేసావు కదే! అంటూ కోడలిని తిట్టడం మొదలు పెట్టింది పార్వతమ్మ.
శారద తలెత్తి అత్తగారి మాటలకు వణికిపోతూ, కిశోర్ మీ దగ్గర ఆడుకోవడం చూసి వంటగదిలోకి వెళ్ళాను. కూరకు పోపు పెడుతున్నా ను. అమ్మా! అన్న కేక విని స్టవ్ ఆఫ్ చేసి పరుగెత్తుకుంటూ వచ్చాను. కావాలంటే వంట గదిలోకి వెళ్ళి చూడండి అని శారద అంది.
శారద మాటలు పట్టించుకోకుండా, “ఓసి దరిద్రపు మొహమా! బిడ్డను పట్టించుకోకుండా వాడిని గాలికి వదిలేసి, నా మాటకు మాట సమాధానం చెప్తావా?” అంటూ కోడలిని, పార్వతమ్మ కొడుతూనే ఉంది.

అప్పటి వరకు ఈ వింతను చూస్తున్న ఎదురింటి సూరయ్య,
“పార్వతమ్మా! ఆగవమ్మా! కోడలిని కొడతావేంటి? అమ్మాయి ప్రొద్దున లేచిన దగ్గరనుండి పని చేస్తూనే ఉంటుంది.
మేము ఎదురింట్లో ఉండి అంతా చూస్తూనే ఉన్నాము. నీవు ఏపని చేయకుండా మహారాణిలా కూర్చుని కోడలితో చేయించుకుని బాగా తింటున్నావు. పసిబిడ్డతో ముద్దు ముచ్చట్లతో ఆడుకోకుండా బిడ్డను గాలికి వదిలేసి, పైగా కోడలిని కొడతావా? నీ రాక్షసత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది” అని అరిచాడు.

నేను పూజ చేసుకుంటున్నాను అన్నయ్యా! అంది పార్వతమ్మ.
“మనము రైతులం. రైతులకు రోజంతా పని ఉంటుంది. మనకు పూజలు
చేసుకుంటూ కూర్చోవడానికి కుదరదు.
కోడలితో ఇంటి పని అంతా చేయిస్తూ, కూచుని తింటూ కోడలిని తిడుతూ, పైగా కొడతావా? నీ లాంటి అత్తగారు ఈ ఊరిలో ఎవరైనా ఉన్నారా? మళ్ళీ కోడలి మీద చేయి ఎత్తావంటే, పక్క ఇళ్లలో ఉన్న మేమందరం కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్ళి నీమీద కంప్లైంట్ ఇస్తాం.”
ఆ తర్వాత పోలీసులే నీకు బుద్ధి చెపుతారు జాగ్రత్త! అంటూ హెచ్చరించాడు.
అప్పటి వరకు తనమాటకు ఎదురే లేదని విర్రవీగుతున్న పార్వతమ్మ
ఏడుస్తూ నేల మీద కూలబడింది.

అప్పుడే అక్కడకు వచ్చిన మధ్య వయసు మగవాళ్ళు పార్వతమ్మతో, పెద్దమ్మా! కిశోర్ కి చేయవలసినవి చేయండి.ఎంత సేపని ఏడుస్తూ కూర్చుంటారు? పోయిన ప్రాణం తిరిగి రాదు కదా! అన్నారు.
పార్వతమ్మ మనుమడికి స్నానం చేయించింది. శారద పార్వతమ్మలు
ఏడుస్తూ ఉంటే, శ్మశానానికి రాము ఇరుగు పొరుగు పెద్దలతో కలిసి కిశోర్ శవాన్ని తీసుకుని వెళ్లాడు.

పార్వతమ్మ సన్న గొంతుతో శారదను ఇంకా తిడుతూనే ఉంది.
పక్కింటి కమలమ్మ వంట గదిలోకి వెళ్లి కూర వండి, రాముకు పార్వతమ్మకు భోజనం పెట్టింది. ఆ పూట శారద ఎవరెంత బ్రతిమాలినా, ఏమీ తినలేదు, సరికదా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. శిలా ప్రతిమలాగా కూర్చుండిపోయింది.

రాత్రికి కమలమ్మ వాళ్లింటిలోనే వండి, భోజనం తీసుకుని వచ్చింది. రాముకు, పార్వతమ్మకుపెట్టింది. శారదను అన్నము తిందువు రామ్మా! అని పిలిస్తే ఉలుకూ పలుకూ లేదు. కళ్ళు మూసుకుని పడుకున్న శారద కనీసం కళ్ళుకూడా తెరిచి చూడలేదు.

బాబూ! రామూ! “నీవే నీ భార్యను బ్రతిమాలి అన్నం తినమని చెప్పు. శారద కుమిలి కుమిలి ఏడుస్తోంది.
రామూ! మీ అమ్మ పద్ధతి బాగా లేదు. మీ అమ్మకు నచ్చ చెప్పి ఆమెను మంచి మార్గం లోనికి వచ్చేటట్లు చూడు. నీ భార్యను సముదాయించి ఆమెకు ధైర్యం చెప్పు. నీవు మగాడివి. తల్లిని, పెళ్ళాన్ని ఇద్దరినీ నీ మాటలతో, అదుపులో పెట్టుకోవాలి.” నేను నీ మంచికే చెపుతున్నాను. వస్తా నాయనా! అంటూ వెళ్ళిపోయింది.

రాము శారద దగ్గరకు వెళ్ళాడు. “శారదా లే! అంటూ ఆమెను లేపి కూర్చోబెట్టాడు. శారదా! పొద్దుటినుండి నీవు ఏమి తినలేదు. మన దురదృష్టం. కిశోర్ మనకు లేకుండా మాయమయ్యాడు. అలాగని ఏడుస్తూ ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉంటాం? మా అమ్మ మనుమడు పోయాడు అన్న బాధతో అమాయకురాలైన నిన్ను తిట్టింది. అంతే గాని నీవంటే ప్రేమ లేక కాదు. ఆమెకు మాత్రం ఎవరున్నారు? ఆమెను మనమే అర్ధం చేసుకుంటూ, ముందుకు పోవాలి.”
లేచి రా! అన్నం తిను.
ఈ రోజు మన ఊరిలో అందరూ నాతో
“నీ భార్య బంగారపు బొమ్మలా ఉండడమే కాదు. ఆమె మనసు కూడా బంగారమే. అత్తగారు తిట్టినా, కొట్టినా నోరెత్తకుండా పడి ఉంది. అట్లాంటి స్త్రీ ఈ ఊరిలో ఎవరూ లేరు. ఆమెను జాగ్రత్తగా కాపాడు. మీ అమ్మను అదుపులో పెట్టు” అని కూడా చెప్పారు.

ఇంతటి మంచి భార్య నాకు దొరకడం, నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యమని చెప్పాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గరనుండి నీవు పని చేస్తూనే ఉన్నావు. మా అమ్మ పూజ అంటూ పని తప్పించుకుంటూ కూర్చుంటుంది. పెద్దది. మా అమ్మను ఏమన్నా అంటే ఏడుస్తూ కూర్చుంటుందని నాకు భయం. ఆమె మనస్తత్వం తెలిసినవాడిని కాబట్టి నేను ఏమీ అనలేక పోతున్నాను. నువ్వు కూడా నా మొహం చూసి, నా బాధ తెలుసుకుని, ఆమెను క్షమించు. నా బంగారం కదూ! లేచి అన్నం తిందువు రా! అంటూ భార్య కన్నీరు తుడిచి, ప్రేమగా భార్యను వంట గదిలోకి తీసుకెళ్లాడు.
పళ్ళెంలో అన్నం,కూర నెయ్యి వేసి కలిపి, జీవితంలో మొదటి సారి భార్య నోట్లో ముద్ద పెట్టి తినమన్నాడు. భర్త ప్రేమకుకరిగిపోయిన శారద అన్నం తినడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వంటగది సర్దారు. ఇల్లంతా సర్ది, తమ గదిలోకి వెళ్లిపోయారు. శారదా! నీవు పడుకో! నేను అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మను చూసి వస్తానంటూ రాము వెళ్ళాడు.

అమ్మా! నిద్రపోతున్నావా? అన్నాడు రాము.
లేదు రామూ! నిద్ర రావడం లేదు. కిశోర్ ట్రాక్టర్ కింద పడి చనిపోవడం గుర్తుకు వస్తూనే ఉంది. వాడిని పట్టించుకోవడంలేదని, కోపం ఆపుకోలేక కోడలి మీద చేయి చేసుకున్నాను. దానికి మన ఇంటి చుట్టుపక్కలవాళ్లు పోలీసు కంప్లైంట్ ఇస్తాం అన్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నా కోడలిని నేను ఏమీ అనకూడదా? అంది.

అది కాదమ్మా! నీకు తెలియదు గాని గవర్నమెంట్ “గృహహింస” చట్టం అమలులోకి తెచ్చింది. “నీ కోడలిని నీవు తిట్టినా, కొట్టినా…
నీ కోడలుగాని ఇరుగు పొరుగు వారు కానీ పోలీసు కంప్లైంట్ ఇస్తే, పోలీసులు వచ్చి, అత్త మామలను, భర్తను, ఆడబిడ్డలుంటే వారిని, తీసుకువెళ్ళి జైలులో పెడతారట. ఆ తర్వాత కోర్టులో విచారించి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారట.” రోజూ మన ఇంటి చుట్టుపక్కల వాళ్లు వార్తాపత్రికలు తెప్పిస్తారు. వారు ఆ పత్రికలు చదివి చెపుతున్నారు. మనం విని మన జాగ్రత్తలో మనం ఉండాలి అని రాము అన్నాడు.

సరే రామూ! ఇక మీద నేను కోడలిని ఏమీ అనను. నా జాగ్రత్తలో నేను ఉంటాను అంది పార్వతమ్మ.
అలాగే అమ్మా! అంటూ రాము తన గదిలోకి వెళ్లిపోయాడు.

శారదా! అంటూ రాము శారదను దగ్గరకు తీసుకుని, కిశోర్ ఆయువు తీరి వెళ్లిపోయాడు. భగవంతుడు చల్లగా చూస్తే మళ్ళీ ఇంకొక బాబు పుడతాడులే. ఆ బాబును మనం జాగ్రత్తగా కాపాడుకుందాము. ధైర్యంగా ఉండు అని భార్యకు నచ్చ చెప్పాడు.

మరునాడు ఉదయం పార్వతమ్మ వంట గదిలో ఉన్న శారద దగ్గరకు వెళ్లి, అమ్మా శారదా! ఈ రోజు నుండి నేను కాఫీ పెడతాను. నీకు వంట పనుల్లో సాయం చేస్తాను. మిగతా ఇంటి పనులన్నీ నీవు చూసుకో! అంటూ ఎంతో ప్రేమగా చెప్పింది. నివ్వెరపోయిన శారద అత్తగారినే చూస్తూ ఉండిపోయింది. దూరం నుండి వీళ్ళిద్దరినే చూస్తున్న రాము మొహంలో చిరునవ్వు విరిసింది.
ఇరుగు పొరుగు వారు అత్తా కోడళ్లను చూసి ఆశ్చర్యపోయారు.
“మనిషికి ఒక మాట. పశువుకు ఒక దెబ్బ” అనే సామెత ఇరుగు పొరుగు వారికి గుర్తుకు వచ్చింది.
నిజంగా జరిగినదానికి ఒక రూపం ఈ కథ.

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్రీరామనవమి సందర్భంగా రామ తత్వం

by V. Kameshwari March 20, 2026
written by V. Kameshwari

రాముడు సామాన్యులకు ఆరాధ్యుడు
తాపసులకు పరబ్రహ్మ
జ్ఞానులకు తత్వవేత్త,
గృహస్తులకు ఆదర్శమూర్తి.
ఇలా అనేక వర్గాలలో అనేక రకాలుగా కీర్తింపబడే రాముడు లోకాభిరాముడు. రామ చరితం తెలియని భారతీయుడు ఉండడు. రామాలయం లేని ఊరే ఉండదు. రామస్మరణ చేయని మానవుడే ఉండడు. ఈ రామాయణాన్ని మనకు పరిచయం చేసిన కవిపుంగవుడు వాల్మీకి . రామ నామ మహిమ వల్లనే అటవీకుడగు వాల్మీకి రామాయణ గ్రంధాన్ని జగతికి అందించాడు. మనం నిత్య జీవితంలో కష్టాల్లో రామచంద్ర అంటాం సుఖాలలో రామభద్ర అంటాం, చివరికి కాటికి పోయేటప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై అంటాం. రామస్మరణ చేయని తావే లేదు. ధర్మంలో నడిచి చూపించిన ఆది గురువు మన శ్రీరాముడు. ఏ ఏ సందర్భాల్లో ఎలా నేర్చుకోవాలో మానవాళికి చేసి చూపించిన దివ్య ఆదర్శమూర్తి.
అయోధ్యలో నిర్మల మైన రఘువంశంలో జన్మించాడు, కౌసల్య నందనుడయ్యాడు, విశ్వామిత్ర యాగాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు. అహల్యకు శాప విముక్తి కలిగించాడు. జనక సభలో శివధనస్సు నెత్తి పెళ పెళమని విరిచాడు. సీతను పరిణయ మాడాడు. పరశురాముని గర్వాన్ని అణిచాడు అయోధ్యలో 12 సంవత్సరాలు సీతతో సుఖంగా జీవించాడు పినతల్లి కోరికపై, తండ్రి ఆజ్ఞతో దండకారణ్యం వెళ్ళాడు అక్కడ విరాధ వధ జరిగింది. మాయా లేడి రూపంలో వచ్చిన మారీచుని హతమార్చాడు రావణుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతా అన్వేషణలో జటాయు, కబంధులకు మోక్షం ఇచ్చాడు. శబరి పూజలు అందుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం, తరువాత వాలి వధ, సీత అన్వేషణం వానరులతో, సేతు బంధనం, లంక నగర్ ముట్టడి, యుద్ధంలో దురాత్ముడైన రావణుని బంధుమిత్రు సమేతంగా హతమార్చి విభీషణుకు పట్టం కట్టి సీతా సమేతముగా అయోధ్యగా చేరుకున్నాడు. భారతదేశంలో భాషలు వేరైనా రామాయణము తెలియని మనిషి ఉండడు.
మన దేశంలో పిల్లలకు చిన్నతనము నుండి రామాయణం గురించి కథలుగా చెబుతారు పెద్దలు. రాముడు సర్వ లక్షణ సంపన్నుడని ఆయన గుణ గ ణాలను వర్ణిస్తూ ఆయనలా నడుచుకోమని చెబుతారు. ఆఖరికి నిద్రపుచ్చేటప్పుడు కూడా ” రామాలాలి మేఘశ్యామా లాలీ ” అనే జోల పాట పాడి నిద్ర పుచ్చుతారు . వయసు మళ్ళినవారు రామకోటి రాయడం, నిత్యం రామ నామ స్మరణ చేయడం వలన మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. అంతలా రాముడు మన జీవితాలతో ముడివేసుకుపోయాడు. ఎంతో కష్టపడి అయోధ్యలో రామ మందిరం కట్టుకోవడం మన హిందువుల రామ భక్తికి నిదర్శనం. సీతమ్మ నడవడిక కూడా ఎంతో ఆదర్శ దాయకం మహిళలకు. రామ, లక్ష్మణ భరత,శత్రుఘ్నుల సోదర భావము ఎంతో ఆదర్శనీయమైనది. ఇద్దరు అన్నదమ్ములు కలివిడిగా ఉంటే రామలక్ష్మణుల్లా ఉన్నారు రా అంటారు. రాముడు ఎంత గొప్పవాడైనా’ సీతాపతి “అని పిలవబడటం ఆ రోజుల్లోనే ఆడవారికి ఎంత గౌరవం ఇచ్చారో తెలుస్తుంది
అందుకే రామాయణం ఆపాల గోపాలానికి ఆదర్శం.

March 20, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us