మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

మా నాన్న పెండ్యాల రాఘవరావు నిజమైన స్వాతంత్ర్య సమర యోధుడు

by Kondapally Neeharini October 3, 2022
written by Kondapally Neeharini


“పెండ్యాల రాఘవరావు అంటే ఆ మాదిగల కలిసినాయన “అని పేరు ను, తీర్మానాన్ని చేసి అదేదో తప్పు పని అన్నట్టు మాట్లాడేవారికి ఎదురు నిలిచి
మా బాపు సమానత్వ భావనల సమరశంఖం పూరించి ,సహపంక్తి భోజనాలు నిర్వహించారు.
1935 ప్రాంతం రోజులవి. మహా గడ్డు కాలం,గుడ్డి లోకం. ఆనాడు దళితులను హరిజనులు, మాదిగలు అనే వాళ్ళు. దూరం పెట్టేవాళ్ళు. ఈ అంటరానితనం నిర్మూలనకు కృషి చేయాలని మా బాపు నడుకట్టారు. మేము నాన్న ను బాపు అని అంటాం . మా బాపు చాలా మంచి వారు.
పెండ్యాల రాఘవరావు గారు ( 15. 3.1917 _ 10. 9 . 1987)
వరంగల్ జిల్లా చిన్న పెండ్యాల గ్రామ వాస్తవ్యులు. పెండ్యాల పిరాట్యమ్మ , రామంచందర్ రావు వీరి తల్లిదండ్రులు. భూస్వామ్య, గ్రామ కరణం కుటుంబం. చిన్ననాటి నుండి చదువులో చురుగ్గా ఉండటం తో హన్మకొండ లో చదువు కొరకు పంపించారు. ప్రపంచం, రాజకీయాలు పరిచయమయ్యాయి. గాంధీ స్వాతంత్ర్య పోరాటాలు తెలిసాయి.

నిజాం నిరంకుశ రాజ్యంలో తొలి స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహి గా ఎన్నో పోరాటాలు చేసారు.
హైదరాబాద్ రాజ్యం లో చైతన్యాన్ని రాజేసిన ఆనాటి ఆంధ్ర మహాసభ లో జాతీయపక్ష కార్యకర్తగా పనిచేస్తున్న కాలంలో తనకు తానే స్వతంత్ర వీరునిగా మలుచుకున్నారు. గ్రామాల్లో విద్య అనేదే లేక అంధకారంలో ఉన్న సమాజానికి తామే స్వయంగా సిలబస్ తయారు చేయించి బళ్ళు పెట్టి చైతన్యవంతులను చేసారు. హాస్టల్ పెట్టారు.
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి ఎదిరించినందుకు జైలు పాలయ్యారు. సాంఘిక కట్టుబాట్లను ఖండిస్తూ స్త్రీ ల పక్షాన గొంతెత్తారు. వెట్టిచాకిరి నిర్మూలన కోసం పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి తమ జీవితాన్నే బలి ఇచ్చేందుకు సిద్ధపడిన విశాల హృదయుడు పెండ్యాల రాఘవరావు. దళ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసాడీ అజ్ఞాత వీరుడు . శాసనోల్లంఘనం చేసి నిజాం ప్రభుత్వానికి నిద్ర పట్టకుండా చేసిన సాయుధ పోరాట యోధుడు. రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పాటుపడిన ఘనుడు. ఎన్నో ఏళ్ళు అడవుల్లో క్యాంపులు నిర్వహించి స్వాతంత్ర్య సమరం చేసిన విప్లవ వీరుడు.కమ్యూనిస్ట్ నాయకుడు.
క్రమశిక్షణ ,సత్ప్రవర్తన,మంచితనం , ఉన్నత భావాలు పోతపోసిన రూపు మా బాపు ధృఢకాయానికి మరింత వన్నె తెచ్చినవని ఆనాటి పెద్దల అభిప్రాయం.
ఔను! అనర్ఘళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారనీ, బాపు మీటింగ్ ఎక్కడున్నా ప్రజల సద్దులు గట్టుకొని బండ్లల్లో వచ్చేవారు అని ఎందరో గుర్తుచేసుకున్న మాటలు నాకు స్ఫూర్తినిస్తాయి . మా బాపు జీవిత చరిత్ర రాయాలని చుట్టుపక్కల గ్రామాల్లో బాపుతో పనిచేసిన కొందరు దళ సభ్యుల్ని,ఇతర ప్రముఖ లీడర్ల ఇంటర్వ్యూచేస్తే ఇలాంటి విషయాలెన్నో చెప్పారు- “ఆయన మాటలే తూటాలు”,”ప్రజలను చూరగొనే వాగ్ధాటి”, ” ఉత్తమ నిర్మాత”,”ప్రజల మనిషి”, “రాఘవ రావే మూమెంట్”, “ప్రజలను అంటిపెట్టుకున్న వీరుడు “, “పట్టుదలగల మనిషి “,” హృదయంలో సాయుధ పోరాటం”, “ధన్యమైన జీవితం “,” మంచి స్నేహితుడు “,”ఆయనే పోరాటం “,”మడమతిప్పని మరో స్వాతంత్ర్య సమరసేనాని”,”ఆదర్శప్రాయమైన జీవితం “,”ఆయన త్యాగధనుడు”,”మెస్మరైజ్ చేసే ఉపన్యాసం”,”సామాజిక విప్లవ వైతాళికుడు””ఆత్మీయుడు”, “సైన్యాధిపతి” అంటూ వారి వారి అభిప్రాయాలను వ్యాసాలలో రాసిచ్చినవీ మా బాపు రాసుకున్న ” నా ప్రజా జీవితం” పుస్తక రూపంలోకి తెచ్చినప్పుడు అవన్నీ వేసి ముద్రించాము. అదొక గొప్ప అనుభూతి. అవును మరి మా బాపు నూనూగు మీసాల నూత్న యవ్వనం లో ఊళ్ళో ‘ఓం జెండా ‘ఎగురవేసి సర్కార్ ను, త్రివర్ణ పతాకాన్ని వరంగల్ కోటపై ఎగురవేసి నైజాం రాజుకు ఎదురొడ్డిన పోరాటాలన్నీ కథలు కథలుగా విన్నదాన్ని ఎలా ఊరుకుంటాను? ” మావి రికార్డు లు లేవు, ఉన్న రికార్డులను తగులబెట్టడమే మా కార్యక్రమాలాయె” అనీ
“మేము ఏదో ఆశించి చేయలేదు ఆ పోరాటాలు . అసలు మేం బతుకుతామని అనుకున్నామా?”అని ప్రముఖ వారు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతుంటాయి.ఇప్పుడు ఈ స్వాతంత్ర్య వజ్రోత్సవ సందర్భంగా ఇలా తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆనాటి వీరుల గురించి అక్షరాలలో నిక్షిప్తం చేస్తుంటే ఎంత సముచితమైన కార్యం తలపెట్టారని అభినందనలు చెప్పడం తప్ప ఏం చేస్తాం? స్వాతంత్ర్యం వడ్డించిన విస్తరి అయింది నేటి విచ్చలవిడి సమాజానికి. నిర్లక్ష్యం వహిస్తే గ్రద్ద లా తన్నుకుపోతారీ స్వాతంత్ర్య శాంతి కపోతాన్ని. అప్రమత్తం చేయాలనే నిర్వాహకులు భుజాన వేసుకున్నారనకతప్పదు. ఈ మహా కార్యక్రమం లో ఓ అక్షర మౌతున్నందుకు నాకైతే సంతోషంగా ఉంది. ఈ వీరుని బిడ్డ ను అని చెప్పుకోవడం గర్వం గా నూ ఉంది.
భారత భూమి మనదే కానీ ఫలితము మనకేది ॥2॥
భారతదేశము భాగ్యమదేశం
పై గనగా మనదే
ఆకలితోడ మలమల మాడి
అలమటించుట మనదేగా
పరదేశీయుల్ పాలన చేయగా స్వరాజ్యంబదియేది
ఫలితము మనకేది॥2॥

రత్నగర్భయని నామమొంది
దేశ దేశముల కీర్తి పొంది
ఘనవిఖ్యాత ఖ్యాతి నొందె ఘనతర స్వాతంత్ర్యము లేక ఫలితము మనకేది ॥భారత॥
అంటూ పాటలు రాసి పాడిన మా బాపు ఆనాటి ఆర్య సమాజం లో పనిచేసారు.
“తల్లిని మించిన దైవము వేరే
ధారుణి లేదోయూ ॥2॥
స్వారాజ్యంబె స్వరాజ్యమాయే
మా సేవా బలమాయే
ఈ ధరణీ మాతోయీ ॥ 2॥
అని గేయాన్ని రాసిన మాబాపు ఎంత గొప్ప కవి కదా!
“భారతమాత వందనం
కన్నా తల్లి వందనం
మా కన్నా తల్లీ వందనం ॥భారత॥
మన భూమి హితమే కోరి
మానరా మధుపానమూ
మాని సుఖియించరా॥భారత॥
అని సామాజిక గేయాలు రాసినా,
“త్యాగశీలురకు దేశ సేవకులకు జోహారులిడగా కదలిరారే దేశభక్తులకు దీన బంధువులకు జోహార్లీడగా కదలిరారే ॥ జోహారు॥సత్యమహింసా సర్వభూత దయ మూర్తిభవించి సాక్షాత్కరించిన దేశభక్తులకు దీనబంధువులకు జోహారులిడగా ॥
ధరా సుతులను వర్జించి
ధన ధాన్యంబులు త్యజియించి మాతృభూమిని సేవించుటయే పరమార్ధమని యెంచి
పాటుపడిన భవ్యమూర్తులకు జోహారులిడగా కదలిరారే”
అంటూ ఉత్తేజకరమైన గేయాలు ప్రజలముందు పాడినా మా బాపు స్వాతంత్ర్య కాంక్ష , సాహిత్య అభిలాష తెలిసిపోతుంది.
ఏడవ తరగతి వరకే చదువుకున్నా తెలుగు,ఉర్దూ,హిందీ, ఇంగ్లీష్ భాష లలో పటుత్వాన్ని సాధించుకున్నారు .
అందుకేనేమో ఎం.పి. పదవి తీసుకొమ్మని కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి చేసి శాసనసభ సీట్లు వదులుకొమ్మని ఉంటుంది. పార్లమెంట్ లో గళాన్ని వినిపించాలంటే హిందీ బాగా మాట్లాడగలగాలనే , భాషా నైపుణ్యం ఉన్నవారు కావాలనే కావచ్చు. మా బాపు ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పోలీసు ఆక్షన్ సమయం లో మూడు ఏళ్లు జైలు జీవితం గడిపారు. 1952 లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల లో పోటీ కి జైలు నుండే నామినేషన్ వేసి, పి.డి.ఎఫ్ తరపున పోటీ చేసారు. రెండు ఎం .ఎల్.ఏ. సీట్లు ఒక ఎంపీ సీటు కైవసం చేసుకున్నారు. అత్యధిక సీట్లు ఏక కాలంలో గెలుచుకున్నందుకు మా బాపును , అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రావి నారాయణరెడ్డి గారిని నెహ్రూ గారు పార్లమెంట్ లో అభినందించారు.
1952 నుంచి 57 దాకా తొలి లోక్ సభ లో ఎన్నో సమస్యలపై ప్రజాగళం వినిపించిన వక్త మా బాపు.
“ఆయన ఎవరనుకున్నావ్? ” ,”హి ఈజ్ అవర్ మాన్” అని హృదయపూర్వకంగా తోటి పోరాట వీరులతో ఆనాటి నాయకులతో అనిపించుకున్న పెండ్యాల రాఘవరావు గారు వారు జైలు లో ఉన్నప్పుడు 1949-50 లలో కంట్రోళ్ళ పై
‘‘ నా దేశం- నా భారత దేశం
నా దేశం నా భారత దేశం
మన్ను బంగరౌ మాన్యాలున్నా
సాలెల్ల పారే సెలయేరులున్నా
మడిలో మొక్కకు తడిలేదన్నా”॥ నా దేశం రా॥
అంటూ రాసిన గేయం లో పేద బ్రతుకులను స్పృశిస్తూ, దళారుల మోసాలను , రాజకీయాలను ఎండగట్టారు. ” వలస విధానపు వరమేరయిది/ తెల్లోడు పెట్టిన తెగులేరయిది/
నల్లోడు నేడు నడుపుతున్నాడు/ దోపిడి వర్గాల దాపునున్నాడు” ॥ నా దేశం నా భారత దేశం”
అని రాసినారు.
మా బాపు ధైర్యసాహసాల గురించి ఎన్నైనా చెప్పవచ్చు.ఆయన జీవిత చరిత్ర అంటే ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాట చరిత్ర, సాయుధ పోరాట చరిత్ర

October 3, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ZPHS శివరాంపల్లి చిత్రకారులు

by రూపాదేవి October 3, 2022
written by రూపాదేవి

ప్రత్యేక తెలంగాణ కు ప్రత్యేక పండగ బతుకమ్మ, రాష్ట్ర అవతరణ తరవాత రాష్ట్రం లోని ఊరు ఊరు వాడ వాడా చేరింది బతుకమ్మ, రాష్ట్ర హద్దులు దాటి, దేశ ఎల్లలు దాటి వెళ్లింది బతుకమ్మ. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పూల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. మా బడి పిల్లలు బతుకమ్మ సంబరాలను బొమ్మగా గీశారు. చిన్నారుల చిట్టి ప్రయత్నం మెచ్చుకోదగినది.

-రూప

చిన్నారి చిత్రకారులు

D.హర్ష
ఆదిత్య కుమార్,
M రమేష్,

8th ‘డి’ సెక్షన్
ZPHS శివరాంపల్లి
రాజేంద్ర నగర్ మండలం
రంగారెడ్డి జిల్లా

October 3, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
Uncategorized

రంగుటద్దాల వెనుక

by mayuukha October 3, 2022
written by mayuukha

మయూఖ ఆశ్వయుజ మాస, అక్టోబర్ 2022 సంపాదకీయం

ఎవరు ఏ ఉక్కు పాదాన్ని మోపినా నీదైన ధైర్యం నీదైన చైతన్యం అనే స్పృహ ఉండాలి . పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి ,పోతుంటాయి . హోరుగాలికి , గాలి వానకు స్థిరంగా నిలబడిన పర్వతమంతటి మనోనిబ్బరం ఉంటే తొట్రుపాటులు ,తొందరపాటులూ ఉండవు . జీవితం నిలకడగా ఉంటుంది. దారుణ ప్రభావాలు చూపే అతి అనుకరణాల దుష్పరిణామాలు ఆలోచనల ను ఎండి పోయేలా చేసినా వాటికి లొంగిపోకుండా జీవనది ప్రవాహం లానూ సాగేలా జాగ్రత్త వహించాలి.

వ్యక్తులు ఉంటారు .వ్యవస్థలు ఉంటాయి .ఈ రెంటిలో ఏది ముఖ్యం అనేది తెలుసుకునే సమర్థత కావాలి .ఈ సమర్థత ఎలా వస్తుంది ?ఇది ఒక గొప్ప ప్రశ్న !ప్రశ్నించుకుంటేనే ఆత్మ ప్రబోధం అవుతుంది .అనంతమైన సారస్వతం మనకు ఉన్నది .అద్భుతమైన సాహిత్యం మనకున్నది .చేతిలో పుస్తకం పట్టుకొని ప్రశాంత చిత్తం తో చదివే రోజులు దరిదాపుల్లో లేనట్టు ఉన్నా , ఒక తెలివిడి తనం కోసం వర్తమానంలో గతాన్ని తోవ్వుకోవడమే ఇప్పుడు అవసరం. అంతర్జాలంలో మంచిని మాత్రమే కంటికి కట్టుకుంటే , మనస్సుకు చుట్టుకుంటే ప్రమాదాలకు తావుండదు. కాని , అలా చేయడం లేదు. సమయమున్నప్పుడు సమయాన్ని చేజిక్కించుకున్నప్పుడు పుస్తకం చేతబట్టి చదివాలి. అప్పుడే అలసట తగ్గుతుంది , ఆసక్తి పెరుగుతుంది. అవగాన వస్తుంది.

రంగులు ..రంగులు .. ఎక్కడ చూసినా రంగులే ! ఈస్ట్ మెన్ కలర్ చిత్రాల పరిజ్ఞానం బెస్ట్ అయి కూర్చున్నది . నలుపు తెలుపు భావాలు వీగిపోతున్న అతిపెద్ద లైఫ్ కాన్వాస్ పైన మనదైన తలకాయ ఎక్కడున్నదో వెతుక్కోవలసిన వర్తమానమిది.భావి జీవితం చిరునామాను ఏ కుంచె చెప్పగలదు? ప్రశ్న ! ప్రశ్నించకుంటే ఆత్మ జ్ఞానం ఎట్లా అందుతుంది ?

స్పీడ్ .. స్పీడ్ .. అంతా స్పీడ్ మయమే ! ఈ వేగం నిత్యజీవితంలో కలిసిపోయింది . ఎన్ని ఆంక్షలు ఎన్ని నియంత్రణలు పరిపాలనలో ఉన్నా , దాటిపోవాలి దూరిపోవాలి చేరుకోవాలి అనే ఆతృతతోనే హృదయం అనే సాటిలైట్ ఆర్బిట్ లో మనసనే గ్రావిటేషనల్ ఫోర్స్ తిరుగుతూ తిరుగుతూ ఆలోచన అనే ఇంధనాన్ని ఖర్చు చేస్తూనే కక్ష్యలను దాటుతున్న వైనం! రహదారులపై వేగ నియమాన్ని తీసుకుంటే, స్పీడ్ తో పరిమితులను దాటామనే పరమానందం వాహన చోదకునిలో కలిగిస్తూ పోతున్నప్పుడు సంభవించేది యాక్సిడెంట్సే! ఇంటికి జరిమానాలు వస్తే ఏంటి , జరగవలసిన నష్టాలు జరిగిపోతూనే ఉంటాయి. అతి వేగం ప్రమాదకరం అనేది రాతలకే పరిమితమైపోతున్నది.
ప్రాపంచిక విషయాలన్నీ అశాశ్వతమైనవని యోగిపుంగవులుగా ఎందరో చెప్తున్నా పరుగులకాలంతో పోటీపడుతున్నారు సామాజికులు.

ఆహార నియమాలు ఎన్ని పాటించినా , శని ఆదివారాలలో సరదాలకు వినియోగిస్తున్న సమాజం ఇది . ఒకరోజు పెట్టే ఖర్చు పేద కుటుంబానికి నెల గ్రాసమవుతుంది . ఇవన్నీ తెలియకనా ! తెలుసు ! తెలిసి చేసే వే! జాగ్రదావస్థనుండి స్వప్నావస్థలనుండి జనులు నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. జ్ఞాన , విజ్ఞాన శక్తులకు ఆకర్షితం కావాలంటే మనవైన మూలాలను మర్చిపోవద్దు.

ఓవైపున ప్రపంచంలో పేరు మోసిన దేశాలు సుస్థిరమైన మన భారతదేశం కౌటుంబిక జీవన విధానం వైపే ఆశ్చర్యం గా చూస్తున్నాయి. వేల వేల సంవత్సరాల క్రితం పుట్టిన మన సంస్కృతిని వాళ్లు అద్భుతంగా భావిస్తూ నేర్చుకుంటున్నారు ఇప్పుడు. పాశ్చాత్య దేశాలు మన దేశాన్ని ఎంతో గౌరవిస్తున్నాయి చాలా ఉదాహరణలు ఇందుకు చెప్పవచ్చును . స్విట్జర్లాండ్ లో ఎన్నో ఏళ్ళ క్రితమే వారే నిర్మించిన ఆరున్నర అడుగుల ఎత్తులో ఉన్న ‘నటరాజ విగ్రహం ‘ వాళ్లకు స్ఫూర్తిగా ఉన్నది.
చికాగోలో వివేకానందుని విగ్రహము , వివేకానందుని వీధి వాళ్లకు ప్రేరణగా ఉన్నది. అయితే ఇదే సమయంలో భారతీయ వ్యవస్థను దెబ్బ కొట్టే వ్యూహాలతో పనిచేస్తున్న కుట్రలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలలో సెమినార్లు నిర్వహిస్తూ కేవలం మత పరంగా చూసి, సర్వ మత సౌభ్రాతృత్వ దృక్పథంతో ఉన్న మనదేశంపై అబద్ధాల బురదచల్లుతున్న వైనమూ ఉన్నది. ఇది అందరూ తెలుసుకోవాలి . అంటే ఆనాడు ఎప్పుడో ఆయా దేశాల్లో మన సంస్కృతిని చాటే విగ్రహాలు , వీధులు స్థాపించినప్పటికీ ఇప్పుడు మన దేశంలో పెరిగిపోతున్న ఇంత అనైక్యతకి మధ్యన చాలా చాలా భేదం ఉన్నది. మారుతున్న కాలం ఏం నేర్పిస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరమున్నది.
దేశ సౌభాగ్యాన్ని రక్షించుకునే ఆశయంతో ఆనాడు మన సమాజం ఉండేది. మరి ఇప్పుడో?ఇదే ఆలోచించాలి.

ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ వృత్తులతో పాటు వచ్చినవాటి రాజకీయ కారణాల తో కొత్త రంగులు పులిమిన విచిత్ర చిత్రాలను గమనించవచ్చు. అతి ఎక్కడైనా అనర్థాలు తెస్తుంది. వేల ఏళ్ల చరిత్ర ను తిరగేస్తే ఉన్న పరిస్థితులు వందేళ్ల చరిత్రలో లేవు. ఉండవు. మార్పులు సంభవిస్తాయి. మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదే చేటు తెచ్చింది , వీటికి బాధ్యులెవరో తెలుసుకోవాలి. ” తెల్లోడు తెచ్చిన తెగులేర యిది , నల్లోడు నేడు నడుపుతున్నాడు” ఈ వాక్యాలు అక్షర సత్యం.

అనైక్యత ..అనైక్యత ..అనైక్యత .. ఇది ప్రస్తుతం ఎక్కువైన వైనం! ఈ కాలుష్యం నుంచి తట్టుకోవాలి ఈ కాలుష్యాన్ని పోగొట్టాలి. అప్పుడే దేశ సమగ్రత ను కాపాడుకున్న వాళ్ళం అవుతాం .

పైన చెప్పుకున్న అన్ని కాలుష్యాలను దిగుమతి చేసుకున్నప్పటి నుండే ఇలా దిగజారి పోతున్న నేటి పరిస్థితులకు కారణం. లక్ష్యాన్ని గురి చేసుకోవడం అన్నదే లేదు ఇదంతా సామూహిక ఖననం అనవచ్చు . ఈ ఒంటెద్దు పోకడలలో దేశ ఔన్నత్యాన్ని కోల్పోతున్నామనే ధ్యాస లేకుండా పోతున్నది. ఆం .. ఏమైతే నాకేంటి అనో, ఆం .. నా ఒక్క అడుగుతో పోయేదేముందనో తెలివి తక్కువగా ఉంటున్నారు దేశీయులు. ఈ అనాసక్తత ఈ ఆడంబర హేల ఈ అనాలోచిత ఇవన్నీ దేశ సమగ్రతకు చేటు చేస్తాయి. ఇది చాలా చాలా ప్రమాదకరం. రేపటి తరానికి చెడును చేసే చర్యలు ఇవి! రంగుటద్దాలనుండి చూడక కళ్ళు తెరిచి చూడాలి.

October 3, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi October 3, 2022
written by Chillara Bhavanidevi

4
శ్రీకృష్ణదేవరాయలవారు చాలాకాలం తర్వాత భువనవిజయ సభా మండపాన్ని అలంకరించబోతున్నారన్న వార్తతోబాటు ఆహ్వానాలు అందుకున్న కవి పండితులంతా ఆనందాతిరేకంతో విచ్చేశారు.
అప్పాజీ అత్యున్నతంగా ఏర్పాట్లు చేయించాడు. కవులతో పాటు సామంతులు, దండనాయకులు, నగర ప్రముఖులు ఆసీనులైనారు. అంతఃపుర స్త్రీలు ఆ ప్రతిష్టాత్మక దృశ్యాన్ని చూడటానికి ఏర్పాట్లు చేశారు.
శ్రీకృష్ణదేవరాయ ప్రభువు అప్పాజీతో కలిసి సభాప్రాంగణానికి విచ్చేశారు. వారిరువురు కృష్ణార్జునుల్లా తేజరిల్లుతున్నారు.
సభయావత్తూ లేచి నిలబడి వారికి స్వాగత వచనాలు, జయజయధ్వానాలు పలికింది.
కృష్ణరాయలు అందరికీ ముకుళితహస్తాలతో వందనమాచరించి సింహాసనమలంకరించారు. రాయలవారి వామపక్షాన కూర్చున్న తిమ్మరుసు మంత్రివర్యులు నిలబడి సభనుద్దేశించారు.
‘‘ఈ విజయనగర సామ్రాజ్యం వైభవోపేతమైన హిందూరాజ్యంగా మీ అందరి ఆదరాభిమానాలను చూరగొని విలసిల్లుతున్నది. పరస్పర కలహాల కారణంగా కల్లోలపడిన హిందూజాతి విద్యారణ్యులవారి ఆశీస్సులతో సామ్రాజ్యరూపంలో స్థిరపడిరది.
శ్రీ కృష్ణదేవరాయలవారి బాహుపరాక్రమంతో అవిచ్ఛిన్నంగా దక్షిణాపథానికి కూడా విస్తరించిన విజయనగర సామ్రాజ్యం నేడు కటకం దాకా ఏలుబడి సాధించింది. గజపతుల కుమార్తె విజయనగర ప్రభువుకు రాణిగా ఆహ్వానించ బడిరది. ఈ శుభసందర్భంగా ప్రభువులు తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళ్ళి స్వామిదర్శనం చేసుకుని రాజ్యక్షేమానికి ప్రార్ధించి వచ్చారు. తిరుమలేశుని కృపవలన విజయనగర రాజ్యం సుస్థిరమైంది. అవకాశం కోసం పొంచివున్న శత్రువులెందరున్నా మసి చేయగల శక్తిని సముపార్జించింది.
ఈ సభలో ఆసీనులైన అందరికీ స్వాగతిస్తున్నాను. మన భువన విజయంలో కొలువుదీరిన అష్టదిగ్గజ కవుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
‘‘స్తవ్యాంధ్ర కవితాపితామహ బిరుదాంకు
డలసాని వంశ పెద్దన మనీషి
మంజులశయ్యా సమంచిత కవితాభి
వినుతుండు నందితిమ్మన విభుండు
అతులిత మధురవాగ్‌ వ్యాపార ధీరతా
కలితుండు ధూర్జటి కవివరుండు
నవభావ కల్పన స్తవనీయ పింగళి
సూరనాభిఖ్య యశోధరుండు
అంత మాదయగారి మల్లనయు రామ
రాజభూషణు డయ్యలరాజు రామ
భద్రుడున్‌ రామకృష్ణ ధీవరుడునైరి
రాయలకు నష్టదిగ్గజ ప్రథితకవులు’’
ఈ సరస్వతీసభలో రాయలవారిని ఆశీర్వదించి ఆనందింపచేస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ముగించారు తిమ్మరుసు మంత్రి.
‘‘శ్రీ విద్యారణ్యస్వామి ఆశీఃప్రభావంతో తేజరిల్లుతున్న విజయనగర సామ్రాజ్యం ధర్మరక్షణకు, హిందూధర్మ పరిరక్షణకు సాహితీ, సాంస్కృతిక వికాసానికి, సకల కళాభివృద్ధికి కంకణం కట్టుకుంది. మమ్మల్ని పరిరక్షకులుగా ఎంచుకుంది. నిరంతర యుద్ధ వ్యూహాలతో అలసి వేసారిన మాకు నేడీ భువనవిజయ సభ ప్రసన్నతను ప్రసాదించగలదని నమ్ముతున్నాను.’’
సభలోని పండితులు హర్షాన్ని కరతాళధ్వనులతో ప్రకటించారు. మంజరి రసరమ్యంగా నాట్యప్రదర్శన చేసింది. ఆమె ఆలపించిన వీరగీతం రాయలనుత్తేజితుడ్ని చేసింది.
శ్రీ విజయ నగర పరిపాలకా
దివిజన దివ్యార్జిత ఏలికా
శ్రీకృష్ణరాయ నృపా! నరాధిపా
జయీభవ! విజయీభవ!
కుందేళ్ళు శునకాల తరిమికొట్టిన నేల
ఎదురులేని పోతుగడ్డకు ప్రభువా
తెలుగు భాషకు తేనెల్లు పూసి
తెలుగు లెస్సని బల్కు మా తెలుగురాయా!
జయీభవ! విజయీభవ!
పసిడి రూకలు కవులకిచ్చేటి రేడా
భువన విజయాలతో మురిసేటి వాడా
కననమ్మునందైన కదనమ్ములోనైనా
నీకు నీవే సాటి మా దైవరాయా!
జయీభవ! విజయీభవ!
ఆంధ్ర మహావిష్ణువే ఆనతియ్యంగ
ఆముక్తమాల్యద నందించినావూ
బంగారు కాలమని అందరూ మెచ్చంగ
తుంగాతరంగాలు నీ చరితపాడంగ
జయీభవ! విజయీభవ!
శ్రీ విజయనగర పరిపాలకా!
దివిజన దివ్యార్చిత ఏలికా!
జయీభవా! విజయీభవా!
నాట్యం ముగిసింది. అవనతశిరస్కురాలై నమస్కరించింది మంజరి.
ఆమె నాట్యానికి విజయనగర వైభవ ప్రశంసకు ప్రభువు ప్రసన్నుడయ్యారు.
‘‘బాగు బాగు! నర్తకీమణీ! నీ నాట్యం, గానం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. అందుకో ఈ సత్కారం’’ అంటూ అంగుళీయాన్ని బహుకరిస్తున్న ప్రభువుకేసి కృతజ్ఞతతో చూసింది మంజరి.
తిమ్మరుసు మహామంత్రి సాలోచనగా చూశాడు.
కంటకుడు పళ్ళు నూరుకుంటున్నాడు.
మంజరి వినయంగా ప్రభువుకు నమస్కరించి తిమ్మరుసు మంత్రికేసి ఓసారి అర్థవంతంగా చూసి నిష్క్రమించింది.
శ్రీకృష్ణదేవరాయలు కవులనుద్దేశించి ఇలా ప్రశంసించాడు.
‘‘మా అభ్యుదయం ధ్యేయంగా విజయ నిధులుగా భాసించే కవికదంబం మేము జైత్రయాత్ర సాగించినప్పుడు కూడా మాకు స్ఫూర్తినందించి వెంట నడిచారు’’ అంటూ అప్పాజీ కేసి చిరునవ్వుతో చూశాడు.
సేవకులు బంగారు పళ్ళెంతో గండపెండేరం తెచ్చి సభలో ఉంచారు.
‘‘సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పినవారి పాదానికి ఈ గండపెండేరాన్ని స్వయంగా నేనే తొడుగుతాను. వారే దీనికి అర్హులు’’ అన్నాడు రాయలు.
ఎవ్వరూ ముందుకు రాలేదు. రాయలు విచారించాడు.
‘‘ముద్దుగ గండ పెండియరమున్‌
గొనుడంచు బహుకరింప
నొద్దిక నాకొసంగుమని
యొక్కరు గోరగ లేరు లేరొకో’’ అని ప్రశ్నించారు. ఇంతలో పెద్దన కవీంద్రుడు తన ఆసనముపైనుండి లేచి
‘‘పెద్దన బోలు పండితులు
పృధ్విని లేరని నీ వెరుంగవే
పెద్దన కీదలంచినను పేరిమి
నాకిడు కృష్ణరానృపా’’అన్నాడు... ‘‘ఆంధ్ర కవితాపితామహా! మీరు అంతటి ఘనులే! పూర్వతరాల సంస్కృతాంధ్ర కవుల స్ఫూర్తిని గ్రహించి తెలుగు సంస్కృత సాహితీ మాలికను విన్పించండి కవిశేఖరా’’ కోరారు శ్రీకృష్ణదేవరాయ ప్రభువు. పెద్దన అపర సరస్వతి రూపుదాల్చినట్లు గళం విప్పాడు. ‘‘పూతమెఱుంగులుం బసరు పూపబెడంగులు జూపునట్టి వా కైతలు జగ్గునిగ్గు నెన గావలె గమ్మున గమ్మనన్‌ వలెన్‌ రాతిరియుం బవల్‌ మఱపు రాని హోయల్‌ చెలి, యార జంపుని ద్దాతరితీపులంబలెను దారసిలన్‌వలె లో దలంచించిన్‌ బాతిగ బైకొనన్‌ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ కూత లనన్వలెన్‌ సొగసు కోర్కులు రావలె నాలకించినన్‌ డాతొడ నున్న మిన్నుల మిటారపు ముద్దుల గమ్మకమ్మనౌ వా తెఱదొండ పండువలె వాచవి గావలె పంట నూదినన్‌ గాతల దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు న్మే తెలియబ్బురంపు జిగి నిబ్బరపుబ్బగు గబ్బిగుబ్బపొం బూతల నున్న కాయసరి పోడిమి కిన్నెరమెట్ల బంతి సం గాత పుసన్నతంతిబయ కారపుగన్నడి గౌళపంతు కా సాతతతాన తానలపసందివుటాడెడు గోట మీటుబల్‌ మ్రోతలునుంబలెన్‌ హరుపు మొల్లముగావలె నచ్చతెన్గు లీ రీతిగ సంస్కృతంబు పచరించిన పట్టున భారతీవధూ టి తపనీయ గర్భ నికటీభవదాననపర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా శీతనగాత్మజాగిరీశ శేఖర శీతమయూఖ రేఖికా పాత సుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమఘుంఘుమార్భటీ జాతక తాళ యుగ్మలయ సంచిత చుంచు విపంచికా మృదం గాతతదేహితత్తహిత హాదితదంధణుధాణుదింధిమి వ్రాత నయనానుకూల పద వారకుహూద్వహహారికింకిణీ నూతన ఘల్గలాచరణ నూపుర రaూళరaళీమరంద సం ఘాత వియద్ధునీచకచకచద్వికచోత్పలసారసంగ్రహా యాతకుమారగంధవహ హారి సుగంధవిలాసయుక్తమై చేతము చల్లజేయవలె జిల్లున జల్లవలెన్‌ మనోహర ద్యోతక గోస్తనీఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసా రాతిరస ప్రసార రుచిర ప్రతిమంబుగ సారెసారెకున్‌’’ భువనవిజయ సభాప్రాంగణం రసహృదయుల కరతాళధ్వనులతో మారు మ్రోగింది. రాయలు పులకాంకితుడయ్యారు. ‘‘సంస్కృతాంధ్ర కవితా విశారదా! మీరు నిజంగా పెద్దనే! ఈ గౌరవాసనం అలంకరించండి. ఇదిగో! ఈ గండపెండేరాన్ని స్వయంగా మేమే మీ పాదానికి అలంకరిస్తాము. నేటినుండి మీరు ‘ఆంధ్ర కవితా పితామహు’లన్న కీర్తిని గడిరచారు’’ అన్నారు రాయలు. ‘‘ఈ గౌరవం సంస్కృతాంధ్ర సరస్వతికి ప్రభూ!’’ పెద్దన కవీంద్రుడు ప్రభువుకు నమస్కరించాడు. ఈ సందర్భంగా ఒక కృతిని రచించి అంకితమిస్తానని పెద్దన సభాముఖంగా రాయలకు వాగ్దానం చేశారు. సింహాసనాసీనులైన రాయలు ఆ విద్వత్సభలో తన సాహిత్యాభిమానాన్ని నిరూపిస్తూ తాను పూనుకున్న కావ్యరచన గురించి ఇలా వెల్లడి చేశారు. ‘‘మేము కళింగ దండయాత్రకు వెడలినప్పుడు కృష్ణాతీరంలో ఇంద్రకీలాద్రిని దర్శించి కానుకలర్పించి ముందుకుసాగాము. కృష్ణాతీరంలోనే శ్రీకాకుళంలో ఆ రాత్రి సైన్యంతో విడిదిచేశాము. ఆనాడు వైకుంఠ ఏకాదశి. మేము నిర్జలోపవాసంలో ఉన్నాము. సమీపంలో ఏదైనా వైష్ణవదేవాలయం ఉందా అని అన్వేషించగా ఆంధ్రనాయకుడైన శ్రీకాకుళాంధ్ర దేవుని ఆలయం ఉందని తెలిసింది. ఆ రాత్రి ఆలయంలో విడిదిచేసి కవిగోష్ఠి జరిపాము. మన ఆస్థానంలోని మహాకవులు తమ కావ్యాల నుండి రసగుళికల వంటి పద్యాలు వినిపించారు. రాత్రి అక్కడే నిద్రించాము. జాగరణరాత్రి నిద్రలో అపూర్వ దివ్యస్వప్నంలో ఆంధ్రనాయకుడు సాక్షాత్కరించాడు’’ రాయల వాక్కు వింటూ సభ ఆశ్చర్యపడిరది. రాయలు ఉద్వేగంగా వెల్లడిస్తున్నాడు. ‘‘ఆ కలలో ఆంధ్రమహావిష్ణువు విష్ణుభక్తుల చరిత్రను తెలుగులో కావ్యంగా రాసి వేంకటేశునికి అంకితమీయమని నన్ను ఆదేశించాడు’’ రాయలు చెప్పాడు. ‘‘సాధు సాధు’’ అని సభ ఆమోదం ప్రకటించింది. ‘‘తెలుగులోనే కావ్యరచన ఎందుకంటే... ‘‘తెలుగదేల యన్న దేశంబు దెలుగేను తెలుగు వల్లభుండ, తెలుగొకండ ఎల్ల నృఫులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స’’
అన్న రాయల భావానికి మంత్రముగ్ధులైనారంతా!
‘‘మేము రచిస్తున్న ‘ఆముక్త మాల్యద’ ప్రబంధంనుండి ఒకటి రెండు పద్యాలు విన్పించగలము. అవధరించండి’ విష్ణుచిత్తుని భక్తితత్పరత ఎట్టిదనగా`
‘‘అం దుండుం ద్వయపద్మపద్మవదనుం డద్వంద్వు డశ్రాంతయో
గాందూబద్ధ మధుద్విషద్ద్విరదు డన్వర్ధాభిధానుండురు
చ్ఛందోబృంద తదంతవాగపఠనా సంజాతతజ్జన్యని
ష్బందద్వైత సుసంవిదాలయుడు నిష్ట న్విష్ణుచుత్తుం డనన్‌’’
రాయల కవితాప్రవాహంలో నాటిసభ సరస్వతీనదిలా ప్రవహించింది.
పెద్దన ఆముక్తమాల్యద కథాంశాన్ని మిగుల శ్లాఘించారు.
అష్టదిగ్గజ కవుల కావ్యాలనుండి రసబంధురమైన కొన్ని పద్యాలనువిని సభ సాహితీ డోలికల్లో ఓలలాడిరది.
భువనవిజయం సాహితీవిజయంగా భాసించింది. అప్పాజీ వదనంలో రాయలపట్ల అవ్యాజ్యమైన ప్రేమ, తృప్తి తొణికిసలాడిరది.
‘‘శ్రీకృష్ణదేవరాయలవారికి జయము జయము’’ అనే హర్వధ్వానాలతో నాటిసభ ముగిసింది.
‘‘ప్రభూ! మేముకూడా మీ వెంట తిరుమలకు వస్తాము. వేంకటేశుని కనులారా దర్శించి తరిస్తాము’’ తిరుమలాంబ మాటలకు రాయలు ఆమోదించాడు. ముచ్చటపడిన రాయలు ముగ్గురు దేవేరుల కోరిక ప్రకారం వారితో కాలినడకన సకలసన్నాహాలతో తిరుమలయాత్ర చేశాడు. పండితులు, కవులు,గురువులతో గోవిందనామ స్మరణతో శ్రీవేంకటాచలం చేరాడు రాయలు.
రాయలు తిరుమలక్షేత్ర మహాత్మ్యమును దేవేరులకు వివరించాడు.
‘‘ఇది మేరుపర్వతభాగం. వేంకట అంటే ‘ఇహపరాలు ఇచ్చేవాడని’ అర్థం. ఏడుకొండల వేంకటనాయకుడు కలియుగంలో భక్తులపాలిట కొంగుబంగారమై వెలిశాడు.’’
సకలతీర్థములున్న స్వామిపుష్కరిణిలో దేవేరులతో స్నానంచేసి వరాహ స్వామిని దర్శించి, శ్రీవేంకటేశుని దర్శించి ఆముక్తమాల్యద అంకిత పద్యాన్ని స్వామికి విన్పించాడు రాయలు. తిరుమల దేవాలయ శిల్పసంపద అందరినీ అబ్బురపరిచింది. రాయలు దేవేరులతో శిల్పరూపంలో వేంకటేశుని ముంగిట కొలువుతీరటం చూసి అందరూ ఆనందపడ్డారు.
విజయనగర సామ్రాజ్య రక్షణ చేయమని స్వామినికోరి రాయలు తిరిగి ప్రయాణమయ్యాడు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
విజయనగరంలోని కారాగార ప్రధాన అధికారికి రాజాంగుళీకాన్ని చూపించింది మంజరి.
‘‘ఏమి ఆజ్ఞ?’’
‘‘చంద్రప్పను చూడాలి’’
భటులు ఆమెను చంద్రప్ప ఉన్న కారాగార విభాగానికి తీసుకెళ్ళారు. ఆమెని చూసి చంద్రప్పకు ఆశ్చర్యం, ఆనందం, భయం కలిగాయి.
‘‘మంజూ! ఎందుకింత దుస్సాహసం? ప్రభువుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని తెలియదా?’’
‘‘ప్రభువులు అనుగ్రహించారు చంద్రా! అందుకే ఇలా రాగలిగాను. దేవేరులతో రాయలవారు శ్రీ వేంకటాచలానికి వెళ్ళారు. ఆ తిరుమలేశ్వరుని దయవలన నీపై వచ్చిన నిందకూడా త్వరలోనే తొలగిపోతుంది. నేను తిమ్మరుసు మహామాత్యునికి అన్నీ విన్నవిస్తాను.’’
‘‘వారు నమ్ముతారా!’’ చంద్రప్ప నిరాశగా అన్నాడు.
‘‘వారు విజ్ఞులు. నువ్వు ధైర్యంగా ఉండు. నాడు ఏంజరిగిందీ చెప్పటానికి సాక్షి ఉన్నాడు.’’
‘‘సాక్షా!’’ ఆశ్చర్యపోయాడు చంద్రప్ప.
‘‘అవును. నేనిక వెళ్ళివస్తాను’’ కన్నీరు దాచుకుంటూ వెళ్ళిపోయింది మంజరి.
మంజరి మర్నాడు తిమ్మరుసును కలిసి చంద్రప్ప తన ఇంటిలో రహస్య పత్రాలను దాచిన విషయం, అవి దొంగిలింపబడిన తీరు వివరించింది. తన కుమారుడే సాక్ష్యం చెప్పటం తిమ్మరుసును ఆశ్చర్యానికి లోను చేసింది.
గండమనాయకుడు విశ్వాసపాత్రుడే! అయితే అతని కుమారుడు కంటకుడు వీరేంద్రుడితో కలిసి రాజ్యానికే ముప్పుతెచ్చే పనిలోఉన్నాడని తిమ్మరుసు గ్రహించాడు. వెంటనే గండమనాయకుని పిలిపించాడు.
‘‘అమాత్యవర్యా! ఏమిటి ఆజ్ఞ!’’ గండమనాయకుడు తిమ్మరుసు ఎదుట వినయంగా నిలిచాడు.
‘‘గండమనాయకా! రాజు కొలువులో విధినిర్వాహణ కత్తిమీద సాము గదా!’’
సేనానాయకుడు ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘నీ స్వామిభక్తి నిరూపించుకొనే సమయం ఆసన్నమైంది’’ తిమ్మరుసు మళ్ళీ అన్నాడు.
‘‘చెప్పండి అమాత్యా! నా శిరస్సు ఒక్క వేటుతో తెగవేసుకోనా?’’
‘‘అంతకంటే కఠినమైన త్యాగం. నీ కుమారుడు కంటకుడు రహస్య రాజపత్రాలను శత్రువుకు చేరవేశాడని మనకి విశ్వసనీయ సమాచారం అందింది. అతను స్త్రీ లోలత్వంతో కాముకుడై మంజరిని చెరపడుతున్నాడని అభియోగాలున్నాయి’’ తీవ్రంగా ఉంది తిమ్మరుసు స్వరం.
గండమనాయకుడు అవమానభారంతో తలదించుకున్నాడు. అతనికి తెలుసు కుమారుని నిర్వాకాలు.
‘‘మన శిక్ష్మాస్మృతి ప్రకారం కంటకుడ్ని ముందు బందీని చేయండి. తర్వాత విచారణ జరిపిద్దాం. చంద్రప్పను విడుదల చేయండి. రాయచూర్‌ను ఆదిల్‌ఖాన్‌ వశం చేసుకొన్నాడు. మనం వెంటనే రాయచూర్‌ ముట్టడికి సిద్ధంకావాలి.’’
‘‘అలాగే మంత్రివర్యా! కంటకుడు నా కుమారుడని అనుకోవటానికే అవమానంగా ఉంది. అతన్ని బందీ చేయకపోతే విజయనగరానికే చాలా ప్రమాదం. నాకిక సెలవు.’’
గండమనాయకుడి నాయకత్వంలో రాయచూర్‌ ముట్టడికి ఏర్పాట్లు తీవ్రస్థాయిలో మొదలైనాయి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చంద్రప్ప కారాగారం నుండి విముక్తుడైనాడన్న వార్త తెలిసి మంజరి సంతోషంతో ఆంజనేయుని గుడికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పింది. రామాయణ కాలంలో సీతారాముల్ని కలిపిన ఆంజనేయుడే తమని కలిపాడని ఆమె విశ్వాసం. చంద్రప్ప ఆమె చెంత వాలాడు సంతోషంగా.
‘‘మంజూ! నీ తెలివితేటలవల్ల బతికి బయటపడ్డాను’’ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు.
‘‘మన అదృష్టంతో బాటు తిమ్మరుసుగారి ఔదార్యం’’ మంజరి ప్రశంసగా అంది.
‘‘ఈరోజు కృష్ణరాయలవారు తిరుమలనుంచి విచ్చేస్తారు. వెంటనే రాయచూర్‌ ముట్టడికి బయలుదేరుతారట’’ చంద్రప్ప చెప్పాడు.
‘‘నువ్వు కూడానా’’ దిగులుగా అంది.
‘‘రాయచూర్‌లో ఇస్మాయిల్‌ ఆదిల్‌ఖాన్‌ కార్యకలాపాలు కనిపెట్టి రమ్మని మంత్రివర్యుల ఆజ్ఞ’’
‘‘బాగుంది. ఇక మన పెళ్ళెప్పుడు?’’ మంజరి అలిగినట్లు అంది.
‘‘ఈ యుద్ధం పూర్తికానీ చేసుకొందాం. సరేనా!’’ బతిమాలాడు.
చంద్రప్ప మాటలకు మంజరి మొహం వికసించింది.
ఇద్దరూ యోగనరసింహస్వామికి కూడా వందనాలు సమర్పించి తిమ్మరుసు భవనంవైపు సాగిపోయారు.
అస్తమిస్తున్న సూర్యకిరణాలు తిమ్మరుసు సౌధం మీద రుధిరవర్ణంతో ప్రతిఫలిస్తున్నాయి.
హిందూసామ్రాజ్య శత్రువులపై తిమ్మరుసు ఆగ్రహాన్ని ప్రకటిస్తున్నట్లుందా సౌధం.
‘‘చంద్రప్పా! నువ్వు కారాగారం నుండి బయటికి వచ్చిన వార్త రహస్యం సుమా! మనమధ్యనే ఉండాలి. ఇకపై మారువేషంలో సంచరించి శత్రురాజుల వ్యూహాలను తెలుసుకోవాలి.’’
‘‘అలాగే మంత్రివర్యా!’’
‘‘మంజరీ! ఈ రాయచూర్‌ ముట్టడి అయ్యేదాకా నువ్వు కూడా జాగ్రత్త. మనం పోగొట్టుకున్న రహస్యపత్రాలు రాయచూర్‌ వారికి అందాయి. అయినా మరేం భయంలేదు. ఎత్తుకు పైఎత్తు మన దగ్గర సిద్ధంగానే ఉంది. మీరిక వెళ్ళిరండి’’ తిమ్మరుసు అనుజ్ఞ ఇచ్చాడు.
ఇద్దరూ సంతృప్తిగా ఆ భవనం నుండి బయటకు వచ్చారు.

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్వరాంజలి-10

by Krishna Kumari Yagnambhatt October 3, 2022
written by Krishna Kumari Yagnambhatt

               సంగీత త్రయంలో శ్రీ ముత్తు  స్వామి దీక్షితుల వారు రెండవవారు .వీరి కీర్తనలు అత్యంత ప్రౌఢమైనవి.1775 వ సంవత్సరంలో తిరువారూర్ లో జన్మించిన దీక్షితుల వారు సకల శాస్త్ర పారంగతులు. మనాలీ జమీందారు ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళిన వీరు అక్కడ వినిపిస్తున్న పాశ్చాత్య సంగీతం విన్నారు. ఆ సంగీతపు వర్ణ మెట్టు  మీద ఆసక్తి పెరిగి,అక్కడే కొన్నాళ్ళు ఉంది ఆ సంగీతపు సంప్రదాయాలను నేర్చుకొని అందులో ప్రావీణ్యత సంపాయించారు. వీరు తర్వాతి కాలంలో రచించిన కొన్ని కీర్తనలలో పాశ్చాత్య సంగీతపు ఛాయలు కనిపిస్తాయి. ఉదాహరణకు ‘సంతతం పాహిమాం సంగీత శ్యామలే’ అన్న కీర్తన ‘god save the king’ అన్న పాశ్చాత్య గేయపు వర్ణ మెట్టు ఆధారంగా చేసినదే. దాదాపుగా 50 వరకు కీర్తనలలో ఈ ప్రభావం కన్పిస్తుంది.

         చిదంబర నాథ యోగి శిష్యులైన వీరు గురువుతో కలిసి కాశీ నగరానికి వెళ్ళి అక్కడ 6 సంవత్సరాలు సంగీత విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఒకసారి గురువు ఆజ్ఞ మేరకు గంగా నదిలో దిగి కళ్ళుమూసి ధ్యానం చేస్తుండగా విచిత్రంగా వారి చేతిలోకి ఒక వీణ వచ్చింది. దాని పై  శ్రీ రామ అని రాసి ఉంది. భగవంతుని అనుగ్రహంగా భావించి ఆ వీణను వారు తీసుకొన్నారు. అంతేకాదు ,జీవితాంతం వారు దాని సహాయంతోనే గానం చేశారు.

       తర్వాత దీక్షితుల వారికి గురువు అనుగ్రహం వలన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కల్గింది. ఆ క్షణమే వారి నోటి నుండి మొదటి కీర్తన వెల్వడింది. వీరి కీర్తనలు మంత్ర పూరితాలు. సంగీతానికి తగిన సాహిత్యం, సాహిత్యానికి అనువైన దేవ భాష , ఈ రెండింటికీ తగిన రాగ తాళాదులు –ఇది వారి కీర్తన స్వరూపం. వీరి కృతులలో వేదాలు, వేదాంగాలు,శాస్త్రాలు,ఇతిహాస పురాణాలు,ఆగమాలు,మంత్ర శాస్త్ర రహస్యాలు మొదలైనవి ఎన్నో కన్పిస్తాయి. అంతేకాదు , వీరి జటిలమైన సమాస రచన అద్బుతం. ఎన్నో సార్లు తన వాక్శుద్ది తో మహిమలు చూపించారు కూడా. సాహిత్యానికి తగిన రాగం ఎన్నుకోవడమే కాకుండా రాగం పేరు సాహిత్యంలో ఇమిడ్చి రచనలు చేశారు. నిజానికి ఈ లక్షణమే వారిని ఒక ప్రత్యేక వాగ్గేయకారునిగా నిలబెట్టింది.

       ప్రపంచంలో అన్ని రకాల సంగీతాల కంటే భారతీయ సంగీతం రాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కన్పిస్తుంది. ఒక్కొక్క రాగం, దాని స్వర సమూహాలు, స్వర ప్రస్తారం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది భారతీయ సంగీతంలో. అటువంటి ప్రత్యేకత కల్గిన ‘రాగం”  పట్ల దీక్షితుల వారికి గల అవగాహన అద్భుతం. అందువల్లనే వారి కీర్తనలకు ఒక ప్రత్యేక స్థానం కల్గింది.  అందుకే ఎంత ప్రౌఢ రచన అయినా, మంత్ర పూరితమైనా వారి రచనలు ప్రాచుర్యాన్ని పొందడానికి కారణమైంది వారి రాగ పద్ధతి.

       దీక్షితుల వారు తమ భక్తిని అనేక రకాలుగా ప్రదర్శించారు తమ రచనలలో. ఏ దైవం మీద వారు రచనలు చేసినా సమర్పణ భావంతోనే రచించారు. ఒక ఉదాహరణ చూడండి.

గౌళ రాగం. త్రిపుట తాళం.

పల్లవి-

శ్రీ మహా గణపతి రవతుమాం

అనుపల్లవి-

కామజనక విధీంద్ర సన్నుత, కమలాలయ తట నివాసో

కోమల ధర పల్లవ పద ఖర ,గురుగుహోగ్రజ శివాత్మజః !  

చరణం-

  సువర్ణాకర్షణ విఘ్న రాజో ,పాదాంబుజో గౌర వర్ణ వాసన ధరో

   బాలచంద్రో నరాది వినుత లంబో దరో ,కువలయ స్వవిషాణ పాశంకుశ

  మోదక ప్రకాశ కరో భవ జలధి నావో ,మూల ప్రకృతి స్వభావస్సూకతరో

  రవి సహస్ర సన్నిప దేహో ,కవి జన నుత  మూషిక వాహో

  అవనత దేవతా సమూహో ,ఆవినాశ కైవల్య గేహో !

వీరిది గురుగుహ ముద్ర.   

            

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

బతుకమ్మ పండుగ

by mayuukha October 3, 2022
written by mayuukha


బతుకమ్మ పండుగను కొన్ని ప్రాంతాల్లో బ్రతుకు నిచ్చే పండుగ అని బతుకమ్మని అంటారు కానీ మా మహబూబ్నగర్లో బతుకమ్మలు ఆడరు బతుకమ్మ పాటలు పాడుతారు బొడ్డెమ్మ అని రజాకర్ల కాలంలో ఆడవాళ్ళను చాలా హింసించేవారు వారిని వివస్త్రను చేసి ఆటలు ఆడేమని వారట అందుకని స్త్రీని బతకమ్మ అని అక్కడ కొలుస్తారు ఆనాటికి ఈనాటికి స్త్రీల పరిస్థితి అలాగే లేకున్నా కొన్ని మార్పులతో ఈరోజు కూడా కడుపులో ఉండే ఆడపిల్లని చంపేస్తున్నారు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆడబిడ్డ బతుకమ్మ అని బతుకమ్మ పాటలకి కొత్త ఊపిరి వచ్చి మన తెలంగాణ అంతా కుటుంబ సమేతంగా చిన్నా పెద్ద తారతమ్యము లేక చక్కగా జరుపుకుంటున్నటువంటి ఒక మంచి పండుగ బతుకమ్మ పండుగ అందరూ ఆటలాడుతూ పాటలు పాడుతూ పువ్వులను దేవతలుగా భావిస్తూ జరుపుకుంటున్నటువంటి పండగ బతుకమ్మ పండుగ అదే కాక తెలంగాణలో ప్రజలు రాయిని రప్పను కూడా దేవుడిగా భావిస్తారు చెట్టును కూడా కానీ కొన్ని రకాలైనటువంటి రోగాలకు చేతికి గడ్డలు అయితే ఒక ఆకు రసం పూస్తారు పాము తేలు కాటుకు ఒక రకం ఆకు రసం పూస్తారు అప్పటినుండి కూడా చెట్లకు పువ్వులకి తెలంగాణ వారు చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాంటి పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి పూల అన్ని రకాలైన పూలను పూజించే అపురూపమైన పండుగ తలలో పెట్టుకొని పూలను తలపైన ఎత్తుకొని గౌరీగా భావించి సమర్పించే పండగ బతుకమ్మ పండుగ

ఎంగిలి బతకమ్మలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై,
రచయిత డా.లక్కరాజు నిర్మల
October 3, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సామాజిక మహ పాపాలు

by రూపాదేవి October 3, 2022
written by రూపాదేవి

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారత జాతీయోద్యమంలో ప్రముఖ రాజకీయ, ఆధ్యాత్మిక నాయకుడు. సత్య అహింస విలువలు సార్థకతను
దశాబ్దాల క్రితమే తెలియపరచారు సత్యాగ్రహం, అహింస ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నత ఆశయాలుగా స్వీకరించ బడినాయి. కావుననే ఐక్యరాజ్యసమితి కూడా ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబరు 2 వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా గుర్తించింది.
మహాత్మా గాంధీ గారు నాటి ప్రజల పరిస్థితుల్లో మార్పును ఆశించి సత్యాగ్రహం చేశారు. అందరికీ విద్య, మహిళాసాధకారత, పేదరిక నిర్మూలన, ఖాదీ వస్త్రాల ఉపయోగం వంటి వాటి స్థితిగతుల్లో సామజిక న్యాయం తేవాలని నిరంతరం శ్రమిస్తూ నే వచ్చారు.
సామజిక న్యాయమనే మార్గంలో వచ్చే అనైతిక అడ్డంకులైన ఏడు అంశాలను మహాత్మా గాంధీ గారు ‘ఏడు సామాజిక పాపాలు’ గా తెలియజేశారు. *ఆ ఏడు పాపాలు ఇలా….

  1. నియమ నిష్టలు లేని రాజకీయాలు
  2. మానవత లేని శాస్త్ర విజ్ఞానం
  3. అంతఃణ లేని ఆనందం
  4. త్యాగం లేని పూజ
  5. నీతిలేని వాణిజ్యం
  6. పని లేని సంపద
  7. శీలము లేని విద్య

గాంధీ గారి అనుసారం నైతికత, అర్థశాస్త్రం, రాజకీయం, ఆధ్యాత్మికత వేరు వేరు శాఖలు. కానీ అన్నిటి ఉద్దేశ్యం మాత్రం ఒకటే అదే సర్వోదయం. అయితే ఇవి సత్య అహింసలనే పునాదుల పై నిలిచినపుడే స్వీకార యోగ్యాలుగా ఉంటాయి.

రాజకీయం లక్ష్య రహితమై, ఆదర్శ రహితమైతే అది పవిత్రమైనది కాదనాలి. పొలిటికల్ పవర్ యొక్క లక్ష్యం ప్రజా శ్రేయస్సు. నాయకుడు సత్యాన్వేషణ, నిస్వార్థ, నిజాయితీ నిష్పక్షపాతం గుణాలు కలిగి ఉండాలి. స్వచ్ఛందంగా సాధారణ సగటు మనిషి జీవనం గడపడం తప్పనిసరి కర్తవ్యం.

అలాగే శ్రమలేని సంపాదన ఆమోదయోగ్యం కాదు. ఆశించరాదు. అది దొంగ సొమ్ము అవుతుంది. ఆత్మ సాక్షి లేకుండా ఇతరులను బాధించి, మోసం చేసి పొందే ధన సుఖం పాపం అవుతుంది. అలా పొందే ఆనందం అశాశ్వతం. నిత్యమైన ఆనందం కావాలంటె సగటు అవసరాలు తీరని వారికి సహాయం చేయడం వలన నిజమైన ఆనందం కలుగుతుంది.
మనిషి లక్ష్యం పవిత్రమైనప్పటికీ నీ సరియైన జ్ఞానం లేకపోతే చెడు దారుల్లో నడిచే ప్రమాదమూ ఉన్నది. అది చరిత్రకు మచ్చ తెస్తుంది. మంచి చరిత్ర లేదా మంచి వ్యక్తిత్వం లేనపుడు జ్ఞాని కూడా పాపుల కోవలోకే వస్తాడు.

రామభక్తుడైన గాంధీ ప్రతి మనిషిలో రాముని చూడాలనుకునే వాడు. వ్యాపారం లో అప్పుడప్పుడూ నిజాయితీ చంపబడుతూ ఉంటుంది. అవసరానికి మించి లాభం తీసుకునే వ్యాపారి తన దుకాణం లో మరిచిపోయిన వస్తువును కొన్నవాడికి అప్పజెప్పినా అతడు నీతిమంతుడు అనబడడు. దురాశా పరుడు ఒక దోపిడీ దొంగ లాంటి వాడు.

త్యాగం లేని పూజ కర్మకాండ జరిపించడం లాంటిది.
జీవితంలోని అన్ని విషయాల్లో భక్తి ముఖ్యమని నమ్ముతారు గాంధీ గారు. భక్తి ఆత్మజ్ఞానానికి సాధనం. చిన్న చిన్న స్వార్థాల ఆసక్తుల త్యాగం పరి పూర్ణత్వం వైపూ నడిపిస్తుంది. పరమత సహనమంటే సత్య అహింసలు పాటించడమే. ఇతర మతాల విషయంలో జోక్యం చేసుకోవడం, ఇతర మతాల ను విమర్శించడానికి ఘర్షణ పడటానికి సాకులు వెతకడం అనేది పూజ యెక్క పరమార్థాన్ని ప్రశ్నిస్తుంది.

ఈ విధంగా గాంధీ గారు చెప్పిన ఏడు సామాజిక పాపాలను తెలుసుకొని మసలుకోవడమే జాతిపిత వర్ధంతికి ప్రజలు పాలకులు అర్పించే నిజమైన నివాళి.

  • రూప
October 3, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కృషివలుని కృషి లేఖల్లో

by Cheedella Seetha Lakshmi October 2, 2022
written by Cheedella Seetha Lakshmi

కవికోకిల బిరుదాంకితుడు,వనకుమారి,జలదాంగన,కృషీవలుడు మొదలగు కావ్యాలను రచించిన ఉత్తమ కవి.
” కవిత్వతత్త్వ నిరూపణము” అను ఆలంకారిక కావ్యాన్ని రచించిన లాక్షణికుడు.తన ఖండకావ్యాలలో కొన్నింటిని ఇంగ్లీష్ లో ” వాయిస్ ఆఫ్ ది రీడ్” గా ప్రకటించి ఆంగ్లంలో కూడా ఘనతను వహించిన కవిపుంగవుడు దువ్వూరి రామిరెడ్డి.

తెలుగు సాహిత్య నందనోద్యానం లో ఆవిర్భవించిన కవితా కుసుమం రామిరెడ్డి గారు 9-11-1895 సంవత్సరంలో గూడూరులో జన్మించారు.పాఠశాలలో చదువుకోవడం తక్కువే అయినప్పటికీ స్వయం కృషితో ఇంగ్లీష్, ఫ్రెంచ్ ,లాటిన్, జర్మన్,బెంగాలీ,పర్షియన్,ఉర్దూ,తమిళం,సంస్కృతం నేర్చుకున్న బహుభాషావేత్త.చిత్రలేఖనం,శిల్పం,ఫోటోగ్రఫీ,రేడియో ఇంజనీరింగ్ అన్నింటిలో తన ప్రతిభను చాటుకున్నారు.తెలుగు సాహిత్యంలో పద్యాలు రాయడమే కాక వచనంలో కూడా లయబద్దత ఉంటుందని నమ్మేవారు. అభ్యుదయ,భావ,మాతృ దాస్య విముక్తి,దేశభక్తి గీతాలు,,కర్షక సాహిత్యం,నాటకాలు,అనువాదం అనేక ప్రక్రియల్లో రచనలు చేసి అందరిని మెప్పించిన కవి రామిరెడ్డి. 1929 సంవత్సరంలో బెజవాడ ఆంధ్ర మహాసభలో “కవికోకిల” గా బిరుదు ప్రదానం ,నెల్లూరు రెడ్డి జనసంఘం వారి “స్వర్ణ పతకం”,విజయనగరం మహారాజా స్థానంలో వనకుమారి కావ్యానికి అందుకున్న నగదు పురస్కారం రామిరెడ్డి గారి సాహిత్య ప్రతిభకు తార్కాణం.
ఇంత ప్రముఖ కవి సాహిత్య కృషీవలుడు 11-9-1947 సంవత్సరం అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాకే స్వేచ్చా భారతాన్ని చూసి కన్నుమూశారు.

రామిరెడ్డి గారికి మిత్రులు,సమకాలికులు వ్రాసిన లేఖల్లో, మిత్రులకు రామిరెడ్డి గారు వ్రాసిన లేఖల వల్ల విశేషాలు తెలుసుకోవడానికి వీలుంది.

తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గారికి రామిరెడ్డి వ్రాసిన లేఖ వల్ల రామిరెడ్డి జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.పందొమ్మిది సంవత్సరాల వయసులో బ్రతుకులో జరిగిన ఒక సంఘటన వల్ల కవి అయ్యాడని,ఏ క్షణంలో కవిత్వం హెచ్చరిక చేయకుండా వదిలి పోతుందేమోనని భయం కలుగుతుందని వ్రాశాడు.

వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్, విజ్ఞాన శాస్త్రాల్లో శ్రద్ధ చూపించే వాడినని చెప్పుకున్నాడు.

1911 సంవత్సరంలో విజయనగరం మహారాజా వారు నడిపిన కావ్య రచనా స్పర్థలో నా ” వనకుమారి” సాధించిన ప్రథమ స్థానమునకు చిహ్నముగా ఐదు వందల రూపాయలు బహూకరించిరి”. అని వ్రాయడం వలన ఆ కాలం కవుల్లో రామిరెడ్డికి గల స్థానాన్ని ఊహించవచ్చు.

తెలుగులో కవిత్వం వ్రాయడమే కాక ఆయన కవిత్వాన్ని ఇంగిలీషులో అనువాదం చేయడం వల్ల రామిరెడ్డికున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం,అంతర్జాతీయ స్థాయిలో రామిరెడ్డి పొందిన గౌరవస్తానం ఈ లేఖ ద్వారా విదితమౌతుంది. ^బ్రిటిష్ ఎంపైర్ ఎడిషన్ ఆఫ్ ఇంగ్లీష్ పోయెట్రీ” ( బ్రిటిష్ సామ్రాజ్య దేశాలందు రచింపబడిన ఇంగ్లిష్ కవిత్వ సంపుటము) లో నా పద్యములు మూడు ప్రకటింపబడినవి.విదేశీయులైన కవిత్వ సంకలన కర్తలు తెలుగుకవి నొకనిని గౌరవించుట యిదే ప్రథమమేమో! డా.జేమ్స్ కజీన్సు గారు’ సమదర్శన’ యను తమ గ్రంథమందు ” భారతీయ భాషా కవిత్రయము” అను భాగమున మహమ్మద్ ఇక్బాల్ ను,పురాణ సింగ్ ను,మరి నన్ను గురించి వ్రాసిరి.ఇంగ్లీష్ కవిత్వ ఛందోరీతులలో కాక,సేవ కల్పించుకొనిన స్వచ్ఛంద కవిత్వ రచనా నిర్మాణ కౌశలమును,నా స్వతంత్ర భావనాశక్తిని వారు మెచ్చుకొనుచు ” అమెరికాలో వుత్పత్తి చేయబడుచున్న దానికంటె ఎన్నో మడుగులు యిది హెచ్చయినది.” అని వ్రాసారు. శివశంకరశాస్త్రి గారికి లేఖ వ్రాయడం వల్ల వ్యక్తిగత విషయాలు,ఆయన గడించిన అంతర్జాతీయ ఖ్యాతి మొదలగు విషయాలు తెలుస్తున్నాయి.తెలుగు కవుల్లోనే కాక భారతీయ భాషా కవిత్రయం లో ఒకడుగా రాణించి తెలుగు సాహిత్యానికే వన్నె చేకూర్చాడు రామిరెడ్డి.

తెలుగు భాష పట్ల గౌరవం,అనురాగం రామిరెడ్డికి ఎక్కువ అనే విషయం’ జగత్పతి’ గారికి వ్రాసిన లేఖ ద్వారా విదితమౌతుంది.పరాయిపాలనలో తెలుగుభాషకు గౌరవం లేదని బాధపడాల్సిన అవసరం లేదని” ఆంధ్ర్స్ కావ్యము చేత బట్టుట అవమానకరమనుకొన్న దుర్దినాలు గడిచిపోయినవి.” అని అంటూనే
” మన పోతన,తిక్కన, శ్రీనాథాఫై మహాకవుల కంటె మిల్టన్,షెల్లీ,కీట్స్ చాలా గొప్పవారను అజ్ఞాన విలసితమైన అపోహ అంతరించినది.మాతృభాషపై మమత హెచ్చినది. “సత్కవి యద్యప్తి రాజైన కిమ్’ అన్న కవితా సామ్రాజ్యము పునః ప్రతిష్ఠితమైనది.తెలుగు తేజము,తెలుగు కత్తి, తెలుగు నుడికారము,తెలుగు నేల అను మాటలు ప్రతి విద్యార్థి నాలుక కొనన నృత్యము చేయుచున్నది.” అనడం వల్ల ఆ కాలంలో తెలుగుభాష తెలుగుదేశంపై గల అభిమానం వ్యక్తమౌతుంది.

రామిరెడ్డి గారి కావ్యాలను చదివి ప్రముఖ సాహితీవేత్తలు,మిత్రులు తమ అభిప్రాయాలను లేఖాముఖంగా తెలిపారు. వేదం వేంకటరాయ శాస్త్రి గారు వనకుమారి,జలదాంగన, కృషీవలుడు గ్రంథాలను చదివి
“కవితా బీజమయిన ప్రతిభ నాకు గోచరించినది.శబ్ద సౌష్టవ ప్రణవత్వము గూడ నగపడుచున్నది.అనియు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ” చక్కని భావములు,శైలియును నిగ్గుదీరియున్నవి.” అనియు గిడుగు రామమూర్తి గారు ” గ్రంథ కర్త సంప్రదాయ సిద్ధములగు పద్ధతులనుండి స్వతంత్రించి కాలమునకు తగిన మార్గమున పద్యములు వ్రాయ ప్రయత్నిస్తున్నారని విని చాలా సంతోషించినాను.” అనియు రాజమన్నారు గారు కవిత్వ తత్త్వ నిరూపణము అను కావ్యంపై ” మీ యీ కృతి ఆంధ్రభాషకు వన్నె పెట్టగల పువ్వు.కేవలము ప్రత్యేక కవులపై విమర్శలు దక్క మన భాషయందు కావ్య స్వరూప నిర్ణయము గాని ,రసతత్త్వ విచారము గాని లెనేలేవని చెప్పవచ్చును.అట్టి పనికి మీరే పూనుకొని నిర్వర్తించినది ఆంధ్రభాష భాగ్యము.” అనియు కీర్తించారు.కాలంతో పాటు కవితా రీతుల్లోను మార్పును ఆశించి నూతన ఫక్కీలో కావ్యాలను రచించి పలువురి ప్రశంసలను పొందిన గొప్పకవి దువ్వూరి.ప్రత్యేకంగా వ్యావహారిక భాషా ఉద్యమాన్ని చేప్పట్టిన గిడుగు వారు కూడా కాలానికి తగ్గట్టు స్వతంత్రగా వ్రాసే పద్ధతిని ప్రయత్నం చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

వ్యావహారిక భాషా వాదులు గిడుగు రామమూర్తి పంతులు తన పత్రికలో ” కృషీవలుడు, జలదాంగన కావ్యాలను సమీక్ష చేయడానికి అభ్యంతరం లేదని,వాటిలో నిజమైన కవిత్వమున్నదని అంటూనే ” వ్యక్తంగానో,అవ్యక్తంగానో కవి వాడుకలో లేక గ్రంథములందే నిలిచిన పదాలను ప్రయోగించడం చూచి నాకు విచారము కలిగింది. వీటిలో కొన్నిటిని యిటీవల డాంబిక పండితులే సృష్టించినారు”. అని లేఖ ద్వారా వెల్లడించారు.కొత్తదనంతో రాయడానికి ప్రయత్నించినప్పటికీ గ్రాంథిక పదాల వాడకంపై కొద్దిగా మనసు నొచ్చుకొన్నట్లు తెలుస్తుంది.

దువ్వూరి తెలుగు వారి చేతనే కాక పాశ్చాత్యుల చేత కూడా ప్రశంసింపబడ్డాడు.జె.హెచ్.కజిన్స్ గారు రామిరెడ్డికి రాసిన ఉత్తరాల్లో రామిరెడ్డి ఆంగ్లంలో రాసిన పద్యాలను మెచ్చుకుంటూ భారతీయులు రాసిన ఇంగ్లీషు కవిత్వమునకు ఉపోద్ఘాతములు వ్రాయకూడదను నా నియమమును మీ పుస్తక విషయమున ఉల్లంఘించుటకు సంతోషించుచున్నాను.మీది యీ పద్దున పడదు.మహోత్తమమైన దేశభాషా కవిత్వమునకు ఇది ఆహ్లాదకరమైన అనువాదము.తొలిపలుకులలో దానిని పరిచయముచేయ సంతోషింతును.” అనడం వల్ల రామిరెడ్డి కవితా వైశిష్ట్యం వెల్లడవుతుంది. కజిన్స్ గారే రామిరెడ్డికి రాసిన ఇంకో లేఖలో ” నేనొక ఉపోద్ఘాతమును గూడ చెప్పితిని గాని యిది ముందుగా వెల్లడి చేయగూడదు.మీ కావ్యము తన గుణముల మీదనే ఆధారపడి నిలువవలెను .నిలువగలదు ” అని స్తుతించారు.ఉపోద్ఘాతము కానీ,ముందుమాట కానీ రాసి పాఠకులకు ప్రోత్సాహాన్ని కల్గించాల్సిన అవసరం లేక సహజంగా కావ్యం గుణవంతమైనప్పుడు పాఠకులు మనస్సులో తనదంటూ ఒక ముద్రవేసుకొని గౌరవాన్ని పొందుతుందని పరోక్షంగా కావ్యగుణాన్ని పొగిడారు.

సమాజాభ్యుదయంలో నాటక రంగానికి చాలా ప్రాధాన్యమివ్వబడింది.బళ్ళారి రాఘవ గారు రామిరెడ్డికి రాసిన లేఖలో ” ప్రేక్షకుల దృష్టిని బట్టి నాటకానికి విలువ” వుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రేక్షకులను ఆనందింపజేసేదే ఉత్తమ నాటకం.సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగా నాటక రచనలో వైవిధ్యము ఉండాలని
” రాజమన్నారు గారు రచనల్లో ఎక్కువశాతం ” జమీందారీ భూములకు సంబంధించిన అంశాలు ఏకాంక నాటకాలతోనే తృప్తి పడ్డారని విమర్శించారు రాఘవ.

కవిత్వం తెలిసినవారికంటే ఏవో టెక్నిక్ లు చూపించి,పలుకుబడి కోసం తాపత్రయపడే కవులు ఎక్కువ వున్నారనే విషయం జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి లేఖ వల్ల విదితమౌతుంది. ప్రజ్ఞ ఉన్నవారు మూలబడుతున్నారు.ప్రజ్ఞ లేని వారు ఉన్నత పీఠాన్ని అధిరోహిస్తున్నారు.ఇటువంటివి అంతరిస్తేనే ” ఆంధ్ర ప్రతిభ వెలిగిపోతుందని ఆకాంక్షించారు.ప్రతిభ వున్నా అండదండలు లేకపోతే రాణించడం కష్టమని సమాజ వ్యవస్థను తెలియచేశారు.ఆనాటి సమాజంలోను ఇదే దుస్థితి.మస్కాకొట్టే వారికి ఎప్పుడైనా పెద్దపీటే నాడైన, నేడైనా.

వేణుగోపాల్ రాసిన లేఖలో ఆనాటి సామాజిక పరిస్థితి విదితమవుతుంది.” చదువురాని తెలుగు ప్రొఫెసర్లు విశేషము సకల కళాకోవిదులనిపించుకొనుట సంప్రాప్తిఞ్చి గర్వమెక్కిపోవుట చేత బ్రిటిషు ఆంధ్ర రాష్ట్రములో నుండి పెద్దవారలను పిలిపించి యిక్కడ వారి గర్వమణచవలయుననియు,వారికేమి రాదని ప్రజలలో అభిప్రాయము కలుగ జేయవలయునని యెంచి అనేక మందిని పిలిచి పెద్ద పెద్ద సభలు చేయవలెనని ఆలోచన ఉండడం వలన ఒకరిమీద ఒకరికి పడకపోవడం,దానివల్ల ఏదో నిందవేసి గర్వమణచే ప్రయత్నాలు చేయడం, ద్వేషభావ వాతావరణం కనిపిస్తుంది.

రాజకీయ నాయకుల మనస్తత్వం,వారు వ్యక్తిత్వాన్ని కాపాడుకొన్న విధానం,అసలు ప్రజాప్రతినిధి అనేవాడు ఎలా వుండాలో నిరూపిస్తుంది బి.గోపాల్ రెడ్డి గారి లేఖ. మంత్రి పదవి పొందిన గోపాల్ రెడ్డి గారు
” గౌరవాదికములుగల హోదాయనికాక,బాధ్యాతాయుతమైనది…లాఠీకి ఎదురొగ్గి చెఱసాలలో మ్రగ్గిన అజ్ఞాతుడూ,అనామధేయుడూనయిన స్వచ్ఛంద సేవకుని ప్రతినిధిగా నేనిక్కడ వున్నాననే విషయమెప్పుడూ మరువను.” అని రాశారు.నిస్వార్థంతో ప్రజలకు స్వచ్చందమైన సేవ చేసేవారని,పదవి రాగానే ఉబ్బిపోక బాధ్యతాయుతంగా భావించేవారని తెలుస్తుంది.ఈ కాలంలో వలె ఓటు కోసం మాయమాటలు చెప్పి అధికారం రాగానే ఓటు వేసిన ప్రజలనే మరచి,ప్రజాప్రతినిధినన్న విషయాన్ని మరచి,స్వార్థంతో ధనాకాంక్షచూపే ప్రజా ప్రతినిధులు ఆకాలంలో తక్కువన్న నిజం వ్యక్తమౌతుంది. నిష్కల్మషమైన రాజాకీయా వాతావరణం ఉండేది అని భావించవచ్చు.

రామిరెడ్డి ఆవంత్స రంగారావు గారికి రాసిన లేఖలో అనువాద ప్రక్రియ గురించి తెలిపారు.
” ఒక్క విషయము మీరు చక్కగ జ్ఞప్తికి పెట్టుకొనవలయును.మనకు సంప్రదాయ సిద్ధములైన కొన్ని యుత్ప్రేక్షలు,ఉపమానము ఇంగిలీషులోకి తర్జుమా చేయబడినప్పుడు ఆ భాష ప్రతిభననుసరించి చాలా నీరసములుగను, మెకానికల్ గను అగుపడును.ఇంగిలీషు భాషలోకి
తర్జుమా కాబడవలసిన కవిత్వమునందు యూనివర్సల్ అప్పీల్ వుండవలయును.అట్టివే ఏరుకొనిన బాగుగనుండును.ఇంగ్లీషులోని భావములు తర్జుమా చేయగలమేగాని మన సంప్రదాయము ననుసరించి ఆ భావముల నావరించిన ‘అట్మాస్ఫియర్ ను’ తర్జుమా చేయలేము.అందువలన పద్యములు కొన్ని తర్జుమాలో మూలములో నుండినంత ఆహ్లాదకరముగ నుండుటలేదు.నేనీ రహస్యముతో టాగూరు తర్జుమా చేయబడినది. చేయబడినది అందువలన అది చాల విచిత్రమైన రమ్యమైన భావానువాదముగా ఏర్పడినది.ఇట్లు చేయుట… లో కనిపెట్టితిని మూలములో మూడు పేజీలు ద్విపద ” ఫిలాసఫర్స్ స్టోన్’ అని తర్జుమా చేయబడినది. ఇట్లు చేయుట ఇంగ్లీష్ చదుకున్నవారి మనస్తత్వమున కనుకూలముగ కొంత కన్ సెషన్ చూపినట్లగును.తెలుగువారికి ఇంగిలీషు అనువాదములు అవసరము లేదు ఎవరికి అవసరమో వారికి యూనివర్సల్ అప్పీల్ వుండిన పద్యములు ఏర్పరుచవలెను ” ఒక భాషలో నుండి వేరే భాషలోకి అనువాదం చేయడం ఎంత కష్టమో అనువాదం చేయాల్సినపుడు చూసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాడు. అనువాదం చేయవలసి వచ్చినప్పుడు ఎటువంటి విషయాన్ని ఎన్నిక చేసుకోవాలో,ఇంగిలీష్ భాషలోకి అనువాదం చేసిన కవిత్వంలో సార్వజనీన దృష్టి వుండాలంటారు. ఆ భాషా సంప్రదాయాన్నానుసరించి ఆ భాషా భావాలనావరించి ఉన్న వాతావరణాన్ని తర్జుమా చేయలేము.ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి అనువాదం చేసేప్పుడు ,భావాన్ని మాత్రమే చెప్పగలరు.తన తెలుగు కావ్యాలను ” వాయిస్ ఆఫ్ ది రీడ్” గా ఇంగిలీషులోనికి అనువాదం చేసినవారు కావడం వల్ల అనువాదం చేయడంలో గల కష్ట నిష్ఠూరాలను వ్యక్తం చేశారు.అనువాదం చేయదం కూడా ఒక కళే. భావం దెబ్బతినకుండా అనువాదం చేస్తే అనువదింపబడిన భాషలో కవిత్వాన్ని చదివినవారు స్వభాష వలె కవిత్వం ఆనందాన్ని అనుభవించగలుగుతారు.అనువాద ప్రక్రియ ఎంత కష్టతరమైందో అనుభవపూర్వకంగా వివరించారు.

దువ్వూరి రామిరెడ్డి లేఖలవల్ల ఆయన కవితా ప్రతిభ,అనువాద విధానం, నాటకాల సార్థకత అనే విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి.

తెలుగు సాహిత్యంలో అందరిమన్ననలు పొందిన బముముఖ ప్రజ్ఞాశాలి,బహు భాషా కోవిదుడు దువ్వూరి రామిరెడ్డి సాహిత్య ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని స్థిరపరచుకున్నారు.

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

October 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ప్రకృతి పూలవరం : సద్దుల బతుకమ్మ

by రసస్రవంతి& కావ్యసుధ October 2, 2022
written by రసస్రవంతి& కావ్యసుధ

          తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ ఒక గొప్ప వేడుక. వర్షాకాలపు చివరలో, శీతాకాలపు తొలి రోజుల్లో వచ్చే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రకృతి వివిధ వర్ణ శోభితమై అలరిస్తూ ఉంటుంది. రకరకాల పూలతో తయారు చేసే బతుకమ్మలు లక్ష్మీదేవి పార్వతీదేవి అంశం గారు ప్రకృతికి ప్రతిరూపం గానూ భావిస్తారు. కాలం స్త్రీ పురుషరూపాత్మకమై చైత్రం మొదలు భాద్రపదం వరకు సగభాగం పురుష రూపాత్మకంగా మరో సగభాగం అశ్వయుజ మాసం మొదలు పాల్గొన మాసం వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.  స్త్రీ రూపాత్మకమైన ఆశ్వీయుజ పార్టీ మీ నుండి తొమ్మిది రోజులు శక్తి ఆరాధన జరుగుతుంది. శరదృతువులో బంతి చామంతి గునుగు పూలు తంగేడు గోరింటా మొదలైన పూలు విరబూస్తాయి ఆడపిల్లలు ఈ పువ్వులను సేకరించి అందమైన రూపం ఇచ్చి ‘ ‘బతుకుఅమ్మా’ అని అమ్మవారిని కీర్తిస్తూ ఆడి పాడుతారు.

                   సద్దుల బతుకమ్మ రోజున ప్రొద్దున్నే మగవారు తంగేడు, గునుగు,గోరింటా గన్నేరు,కట్టెపువ్వు,బంతి, చామంతి మొదలైన పువ్వులు తీసుకొస్తారు. ఇత్తడి పళ్లెం లేదా తాంబాలములో గుమ్మడి లేదా బాదాం ఆకులను పరిచి, వాటిపై గుండ్రంగా తంగేడు పూల వరస చుట్టి తరువాత గుమ్మడి, గునుగు,కట్ల, రుద్రాక్ష,  మంకెన,మల్లె,బంతి,చామంతి మందార, పోకబంతి పూలతో వరుసలు పేర్చి బతుకమ్మను అందంగా గుడి గోపురంలా పేర్చుతారు గునుగు పూలకు రంగులు అద్ది దొంతరలుగా పేర్చడం  మధ్యలో ఏర్పడిన ఖాళీ స్థలంలో తంగేడు ఆకుల్ని నింపుతారు. బతుకమ్మ శిఖర భాగంలో తంగేడు పూలు పరచి అందులో పసుపు గౌరమ్మను తమలపాకులో ఉంచి దేవుడి ముందు ఉంచుతారు. వత్తి పత్తిని బతుకమ్మకు నాలుగు వైపులా అలంకరిస్తారు. బతుకమ్మను జంటగా పేర్చడం ఆచారం వాటిలో పెద్దది తల్లి బతుకమ్మ చిన్నది పిల్ల బతుకమ్మ అంటారు. తర్వాత పులిహోర దద్దోజనం రొట్టెలు బెల్లంతో చేసిన మలేదా అనే లడ్డూలు మొదలైన సభ్యులు తయారుచేసి బతకమ్మ ముందు పెట్టి దీపం పెడతారు. సాయంత్రం కొత్త బట్టలు కట్టుకొని ఇంటిముందు ముగ్గుపెట్టి ఈ బతుకమ్మను మధ్యలో ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడుతూ చుట్టూ తిరుగుతూ ఆడుతారు ఇరుగుపొరుగు మహిళలు కూడా తమ బతుకమ్మలను తీసుకొచ్చి కలుపుతారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒక్కటే ఐక్యత ప్రేమతో కలిసి దైవదంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడతారు.

        చీకటి పడుతుండగా తమ ఆటలను ఆపి బతుకమ్మలను చేతిలో కానీ తలమీద కానీ పెట్టుకుని అందరూ కలసి ఊరేగింపుగా వెళ్లి ఊరి చెరువులో గాని బావిలో గాని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పైన పెట్టిన గౌరమ్మను తీసుకుని ముత్తయిదువలు తమ ఐదోతనాన్ని కాపాడమని మంగళ సూత్రాలకు రాసుకుంటారు ఆ తర్వాత సద్దులను తిన్నాక ఇంటి దారి పడుతూ,తిరుగు ప్రయాణంలో మళ్లీ పాటల సందడి మొదలవుతుంది. బతుకమ్మ పండుగ కొత్త జీవన స్ఫూర్తిని నింపుతుంది.

October 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కన్నెపిల్లల పండుగ : బొడ్డెమ్మ

by రసస్రవంతి& కావ్యసుధ October 2, 2022
written by రసస్రవంతి& కావ్యసుధ

బతుకమ్మ పండుగ కన్నా ముందు బొడ్డెమ్మల పండుగ వస్తుంది.తొమ్మిదిరోజుల పాటు కన్నెపిల్లలు మాత్రమే చేసేపండుగ ఇది బొడ్డెమ్మ అంటే “చిన్నది” అని అర్థం. అలాగే, ‘బొడ్డు’ అంటే ‘అత్తి చెట్టు’ అనే అర్థం ఉంది. దీన్నే మేడి చెట్టు, ఉదంబర చెట్టు అని కూడా పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలో అడపిల్లల్ని చిన్నప్పుడు బొడ్డెమ్మ అని పిలుస్తుంటారు. మేడిపండ్లని శ్రీమంతం రోజున తప్పనిసరిగా గర్భిణి ఒడిలో నింపుతారు. అందువల్ల, మేడిచెట్టును, మేడిపండును పూజించే క్రమంలో ఈ పదం పుట్టి ఉండవచ్చని కూడా కొందరి అభిప్రాయం. జానపదులకు తెలిసిందల్లా వారి మాటల ప్రకారం బొడ్డు, ‘అమ్మ కలిసి ‘బొడ్డెమ్మ’ అయింది. ‘బొడ్డు’ అంటే ఆధార భూతమైంది. తల్లికి, బిడ్డకి అనుసంధానమైంది. రేపటి బతుకుకు మూలమైంది కన్నెపిల్ల. కన్నెపిల్లనే బొడ్డెమ్మ. అందుకే సల్లుడు బొడ్డెమ్మల ఐదు పూలకుప్పలలో ఐదో పూలకుప్పని ఇంటి కన్నె పిల్లని కూర్చోబెట్టి చల్లుతారు. కన్నెపిల్లకి ముత్తయిదువులంతా పసుపు, కుంకుమ లిస్తారు. బొడ్డెమ్మను చెక్కపీటపై పుట్టమన్నుతో చతురస్రాకారంగా ఐదు దొంతరలు చేసి ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. తంగేడు, బంతి వంటి పూలతో అలంకరించి శిఖరాన బియ్యంతో నిండిన కలశాన్ని ఉంచి, దానిపైన కొత్త రవికె బట్టనుంచి దానిపై తమలపాకు, పసుపుముద్ద ఉంచి ఆ ముద్దను గౌరమ్మగా భావించి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. చెక్కతో కూడా ఈ బొడ్డెమ్మను చేసి, దానిపై నాలుగు వైపులా నాలుగు మట్టిముద్దలు పెట్టి పూలతో, అలంకరిస్తారు. బొడ్డెమ్మ పండుగ అంటే కన్నెపిల్లల ఆట, పాట మాత్రమేకాదు. ఆడపిల్లల్ని పూజించే పండుగ, గౌరవించే పండుగ. ఆడపిల్ల ప్రాముఖ్యాన్ని జగతికి చాటే పండుగ. తెలంగాణ అడపిల్లని ‘ఆడిపిల్ల’ అంటారు, అడిపిల్ల పుట్టిందంటేనే ప్రాంతమంతా ‘లక్ష్మీదేవి పుట్టింది’ అంటారు, ఎంతో ముద్దు ముచ్చట, కానీ అన్నింటికీ మించి కట్టడి, క్రమశిక్షణ, ఆడపిల్లంటే అణిగి, మణిగి ఉండాలి. నలుగురిలో నవ్వొద్దు, ఎగరడం, దూకడం చేయకూడదు. ఇలా అనే ఆంక్షలు నేర్చిన మన తెలంగాణ సంస్కృతే బొడ్డెమ్మ పండుగ ద్వారా పెద్దల సమక్షంలో నలుగురిలో ఆటపాట నేర్పింది. సిగ్గును పక్కకు పెట్టి నలుగురిలో మెలగడం నేర్పింది. ఎదుటివారితో మాటామంతీ కలుపుకోవడం నేర్చింది. కుటుంబం చక్కబెట్టుకోవడమే కాదు, సమాజ భావన అవసరమనీ చెప్పింది. బొడ్డెమ్మ తయారీ మొదలు చివరి వరకు ఇంటి పెద్ద నాయనమ్మ సమక్షంలోనో, ఆప్రాంతంలో ఎవరైనా పెద్దలు సమక్షంలోనే జరుగుతుంది. పెద్దలు చెప్పిన పాటల్ని అంటూ పిల్లలంతా ఆడతారు, పాడతారు. చప్పట్లు ఎలా కొట్టాలి, చేతులు ఎలా కలపాలి అనేది పెద్దలు నేర్పుతారు. ఎన్నో పాటలు, పిల్లల్ని ఆకర్షింపజేసి బతుకమ్మ ఆటను నేర్పుతాయి. ఈ పండుగరోజుల్లో కన్నెపిల్లలు ప్రతిరోజు ఇంటి నుంచి బియ్యం తీసుకుని వచ్చి కలశంలో పోస్తారు. బొడ్డెమ్మును సాయంత్రం మొదలుకొని చీకటిపడేవరకు పిల్లలు, పిల్లలతోపాటుగా ఆసక్తి ఉన్న పెద్దలు పాటలు పాడుతూ ఆమెను పూజించి, పప్పుబెల్లాలతో కూడిన పలహారాలను పెంచి పెట్టి బొడ్డెమ్మను పూజాగృహంలో దాచిపెడతారు. ఆ విధంగా తొమ్మిది రోజులు వివిధ రకాలైన ప్రసాదాలు చేసి బొడ్డెమ్మను కొలిచి ఆఖరిరోజున దగ్గరలో ఉన్న బావిలో జారవిడుస్తారు. ఈవిధంగా చేయటాన్ని నిద్రపుచ్చుట అంటారు. తొమ్మిదవ రోజున బొడ్డెమ్మపై కలశంతో నిండిన బియ్యాన్ని పరమాన్నంగా వండి బాలికలు, కలిసికట్టుగా ఆరగిస్తారు.

October 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us