మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

విద్యార్థుల్లో సమగ్ర వికాసానికి మాతృభాషలో-విద్యా బోధన

by Namilikonda Sunitha April 9, 2022
written by Namilikonda Sunitha

“ప్రతి ఒక్కరు తమ మాతృభూమిని,సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలి. ఎందుకంటే అవి మనకు ఆనందాన్ని కలిగించేవి” – ఋగ్వేదం
భారతదేశంలో వాడుకలోకి వచ్చిన భాషలు 380. వీటిలో కొన్ని భాషల్లో వ్యాకరణం,సాహితీ సంపద ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, లిపిలేని మౌఖిక రూపంలో ఉన్నా, ప్రతి భాష దాన్ని మాట్లాడే జాతికి అంతరాత్మ అవుతుంది. సమాజ భౌతిక వికాసానికి అనుమేయంగా భాషా సంపద అభివృద్ధి చెందుతుంది. ప్రతి భాష తానున్న పరిస్థితుల రీత్యా ప్రామాణికమైనది గాను, ప్రపంచభాషా సంపదలో తనదైన ముద్రతోనూ ఉంటుంది. ప్రపంచీకరణ పేరుతో కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు పరిమితమైన అభివృద్ధి వ్యూహంతో సాగే ప్రభుత్వాలు, పాలకవర్గాలు మాతృభాషల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాయనేది వాస్తవ విషయం. స్థానిక భాషలు అంతరించి పోతున్నాయి. జ్ఞానం ఎప్పుడూ స్థానికం నుంచి ప్రారంభమై విశ్వజనీన మ వుతుంది. ఆ ప్రయాణానికి అతి ముఖ్యమైనది భాష.
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. ప్రపంచంలో మాట్లాడే భాషలన్నిటికంటే మనం మన వ్యక్తిగత ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడుతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో పాఠశాల్లో తోటి విద్యార్థులతో మాట్లాడుతామో అదే మన మాతృభాష. ఆ భాషే మన భావోద్వేగాల అభివృద్ధికీ, జ్ఞానాభివృద్ధికీ ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది.
” నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది” అన్న డబ్ల్యూ.బి.ఈట్స్ మాటల్ని బట్టి మనది నాగరిక జాతి అవునోకాదో మనమే నిర్ణయించుకోవాలి. మాతృ భాష అనేది జాతి మనుగడకు జీవగర్ర వంటిది. మాతృ భాషను కాపాడుకోవడం అంటే వారసత్వాన్ని నిలుపు కోవడం వంటిదేనని చెప్పవచ్చు.
మనం మన మాతృభాష తెలుగుకు సంబంధించి సంధి దశలో ఉన్నాం. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే పరిస్థితి చేయి దాటిపోక తప్పదు. పద సంపదను, సాహితీ సొబగులను, వ్యాకరణ పారిజాతాలను, పలుకుబడులను పట్టించుకోకపోతే వాటి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ప్రామాణికీకరణ విషయాన్ని పక్కన బెడితే తక్షణం భాష స్థిరీకరణ చేసుకోవాలి. ఉన్నదున్నట్లు కాపాడుకోవడం పై శ్రద్ధ వహించాలి. వారసత్వ సంపదగా వస్తున్న వ్యాకరణం, ఉచ్చారణ,సాహిత్య సంపద ఒకచోట చేర్చి సంస్కృతిని పరిరక్షించాలన్నది మనందరి కనీసకర్తవ్యం. దీనిగూర్చి ఇప్పటివరకూ జరిగిన కృషి అంతంతమాత్రమే అని చెప్పవచ్చు. రాతప్రతుల్లో అక్కడక్కడా గ్రంథాలయాల్లో మాత్రమే ఈ సంపద నిక్షిప్తమై ఉంది. యావత్ తెలుగు భాషాసంపదను కంప్యూటరీకరిస్తే భాషను స్థిరీకరించు కోవచ్చు. ప్రపంచీకరణ పేరుతో పాలక వర్గాలు శరవేగంగా పరాయి భాషలను రథమెక్కించి ఊరేగిస్తుండగా ఆ రథచక్రాల కింద నలిపి వేయ బడుతున్న భాష,సాహిత్య,సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే.మహోన్నతమైన తెలుగు భాష గత వైభవాన్ని విస్మరించరాదు.
ఘన చరిత్రను కలిగిన మన తెలుగు భాష క్రీస్తు పూర్వము నాలుగు వందల నుండి వాడుకలో ఉంది.
తెలుగు భాషను మాట్లాడుతున్నప్పుడు మన శరీరంలో 72,000 న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కన్నా ఇదే ఎక్కువ అని సైన్స్ నిర్ధారించింది. అదేవిధంగా 2012లో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ వారిచే తెలుగు భాష ప్రపంచంలో రెండవ బెస్ట్ స్క్రిప్ట్ గా ఎన్నికయింది.
కానీ విచారకరమైన విషయమేమంటే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాషా అభివృద్ధిలో కీలకమైన విద్యా రంగంలో మాత్రం పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది. విద్యారంగంలో తెలుగు వినియోగం బాగా పడిపోవడానికి కారణం ప్రపంచీకరణం అనే సాంఘిక ప్రక్రియగా మనకు తెలుస్తుంది.

ఒక జాతి నాగరికతను, సంస్కృతిని, ప్రజా జీవనాన్ని భాష ప్రతిబింబిస్తుంది. భాష కేవలం భావ వ్యక్తీకరణ,భావప్రకటన సాధనంగానేకాక, భావాలను సమైక్యపరచి భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి దోహదపడుతుంది. పరిపాలన నిర్వహణలో ప్రపంచంలో ఏ దేశంలోనైనా,ఏ ప్రాంతంలోనైనా అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష అధికార భాష అవుతుంది. అటువంటి అధికార భాషగా మాతృభాష ఉంటే మరింత మేలు జరుగుతుంది.
మనం మొట్టమొదటగా నేర్చుకునేదీ , ఎక్కువగా మాట్లాడేదీ, భావావేశ లేదా హృదయానుగత సంబంధం కలిగినదీ, ప్రతీచర్యలో ఉపయోగించేది మాతృభాష. ప్రపంచవ్యాప్తంగా జరిపి న పరిశోధనల ద్వారా విద్యార్థులు ఏశాస్త్రమైనా, ఏ ఇతర భాషలు నేర్చుకోవడానికైనా మాతృభాష మాధ్యమమే సరి అయినదని తేల్చారు. జపాన్, ఐర్లాండ్, ఐలాండ్, చైనా వంటి దేశాలు మాతృభాషలో విద్యాబోధన అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ‘బహుళ భాషల సమాజాల మనుగడ నేడు వాస్తవమైనా మాతృభాష పరిరక్షణ తప్పనిసరి అవుతుంది. ‘ అని ప్రకటించారు 2012 ఫిబ్రవరి 21న అప్పటి యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరీనా బొకోవా. ‘నేను నా అభిమాన భాషలోనే మాట్లాడుతాను. ఎందుకంటే నా ఉనికికి నా భాషే కారణం గనుక. మా అభిమాన మాతృభాషనే మాబిడ్డలకు నేర్పుతాం వారెవరో వారికి తెలియడం అవసరంగనుక.’ ఇవన్నీ యునెస్కో నినాదాలు మానవునిలో సృజనాత్మక శక్తికి ఆధారం భాష. మాతృభాష స్వేచ్ఛను ప్రతిఫలిస్తుంది. అంతరంగాన్ని వెల్లడిస్తుంది.ప్రజాస్వామ్య పునాది పైనే అది వికసిస్తుంది. అయితే మన విషయానికివస్తే నేటి కాలంలో మానవ సంస్కృతిలో యాంత్రికత ప్రబలి పోతున్న కారణంగా మనిషిలోని మానవత్వానికి ప్రతీకలుగా నిలిచే భాష, సాహిత్యం, కళలు వంటివి ప్రగతి పేరుతో ప్రపంచీకరణ మోజులో పడిపోతూ సాంస్కృతికతను కోల్పతుండటం శోచనీయమైనది.
ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృ భాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం (అధికరణం 350 ఎ), 1964 -66 నాటి కొఠారీ కమిషన్ మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను తెలియజేశాయి.2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29 (2 ) లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంత వరకు మాతృభాష మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్దేశించింది. నూతన జాతీయ విద్యా విధానం (2020)కూడా ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని సూచించింది. అంతర్జాతీయ సంస్థలైన యునెస్కో, వరల్డ్ బ్యాంక్ ,వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషనల్ ఫరా ల్ (ఎఫ్. ఎఫ్.ఏ), జనరల్ అసెంబ్లీ వంటి సంస్థలన్నీ పిల్లలకు ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్చుకునే హక్కుందని నిర్ధారించాయి. జ్ఞానార్జనకు మాతృభాష పునాది వంటిది. పిల్లల్లో విద్యాభ్యాస సమయంలో ఆసక్తి, అవగాహన పెంపొందించడానికి మాతృభాషలో బోధన అత్యంతావశ్యకం. విద్యార్థుల మనోభావాలను సాకల్యంగా తేటతెల్లం చేయడానికి, క్రొత్త విషయాలను ఆకళింపు చేసుకోవడంలో మాతృభాష భూమికగా నిలుస్తుంది. మాతృభాషలో బోధన ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసంతో పాటు దేశాభిమానం, దేశభక్తి వెల్లివిరుస్తాయి. మాతృభాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధన,అభ్యసన వంటి ప్రక్రియలు సులభతరం అవుతాయి. అలాగే వ్యక్తిత్వ వికాసానికి, కళాపోషణ,సాహిత్యాభిరుచి, సృజనాత్మకత,వివేచనా శక్తి మొదలైన సామర్థ్యాల పెంపుదలలో మాతృభాష ప్రధాన పాత్ర వహిస్తుంది.
మాతృభాషలో అధ్యయనం ద్వారా బట్టి విధానానికి స్వస్తి పలకడమే కాకుండా, అవగాహనతో కూడిన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించ గలుగుతారు. మాతృభాషలో విద్యార్థి జ్ఞానాన్ని పెంపొందించుకుని స్వీయ రచన కోసం సంసిద్ధుడవుతాడు. మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా విద్యార్థులు మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఆట పాటల ద్వారా శారీరక మానసిక వికాసం కలుగుతుంది. తద్వారా సామాజిక స్పృహ పెంపొందుతుంది. మాతృభాషలో బోధన ద్వారా పిల్లల అభ్యసన క్రమం మరింత మెరుగు పరచడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరుగుతుంది. తద్వారా సత్ఫలితాలు సాధించవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ వికాసంలో మాతృ భాష బోధన కీలక పాత్ర వహిస్తుంది. కానీ నేడు చదువులు ఆంగ్ల మాధ్యమంగా సాగడం అనేది తప్పనిసరి అవసరంగా ప్రజలు భావిస్తున్నారు. దీనికి కారణం ఇంగ్లీషులో చదివితేనే ఉద్యోగాలు వస్తాయని భావించడమే. అయితే నిరుద్యోగానికీ, ఆయా దేశ ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక విధానాలకీ ఉన్న సంబంధం గుర్తించలేని విద్యావిధానాన్ని విడనాడాలి. ప్రతిభకేత ప్ప భాష ప్రాతిపదికగా ఉద్యోగాలు లభించవని గుర్తించగలగాలి.కావున ఇప్పటికైనా విద్యను గురించి వ్యాపార దృష్టితో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించాలి. మాతృభాష మాధ్యమంగా బోధన సాగించి, విలువల విద్యను అందించాల్సిన అవసరాన్ని తెలుసుకొనగలగాలి. యునెస్కో రిపోర్టు ప్రకారం వారి పరిశీలనల ప్రకారం ఏ భాష అయినా కనీసం 40 శాతం మంది మాతృభాషలో విద్యను నేర్చుకోకపోతే కొద్ది సంవత్సరాల్లోనే ఈ భాష అంతరించి పోతుంది. ఈ పరిస్థితికి దరిదాపుల్లో ఉన్న తెలుగు భాషను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులు, పాలితుల పైన ఉందనేది మరవరాదు.
కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సి ఆర్ ఎస్) ఆర్టికల్ 29, 1 ఓ సెక్షన్ 269 లో ఆర్టికల్ 29 ప్రకారం మాతృభాషలోనే విద్య నేర్చుకునే విద్యార్థులకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా మాతృభాషలో విద్యాభ్యాసం ద్వారా ప్రపంచంలోకి చూసే హక్కు పిల్లలందరికీ ఉందని నిర్ధారించడమైనది. పిల్లలకున్న భాషా పరమైన హక్కుని దృష్టిలో పెట్టుకుని మాతృభాషను క్షుణ్ణంగా నేర్పాలి. డాకర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ (2000), వరల్డ్ డిక్లరేషన్ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (1990 )యునెస్కో లాంటి సంస్థలు పిల్లల భాషాపరమైన హక్కుని తెలియజేస్తున్నాయి.
విద్యార్థుల్లో సమగ్ర వికాసానికి మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకత ప్రముఖుల మాటల్లో….
సుప్రసిద్ధ అమెరికన్ భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ వాదన ప్రకారం విద్యార్థికి 15 నుండి 20 సంవత్సరాలు వచ్చే వరకు మాతృభాషలో బోధన జరిపిన తర్వాత మాత్రమే ఏదైనా ఇతరభాష బోధనాభాషగా ప్రవేశపెడితే అతడు అభ్యసనం సులభంగా సాగించగలడు.
“Indian Education will collapse if, mother tongue is not as a medium of Instruction ” అంటున్న పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోగాసింగ్ గారి లాంటి పెద్దల మాటలను పెడచెవిని పెట్టకుండా చిత్తశుద్ధితో కార్యాచరణ దిశగాఅడుగులు వేయాలి.
“వ్యక్తి ఏ భాషా జాతీయతకు, ఏ సాంస్కృతిక వారసత్వానికి,ఏ ప్రాంతానికి చెందినవాడో అతని భాష చెప్తుంది. వ్యక్తుల అస్తిత్వం వారి మాతృభాష వల్లనే రుజువవుతుంది. మాతృభాషను పదిలపరచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడు. విద్య గ్రామీణుల అవసరాలు తీర్చేదిగా ఉండాలి. విద్యాబోధన మాతృభాషలోనే జరగాలి. కొల్లగొట్టుకు తినే సామ్రాజ్యవాదులకు సహాయకారిగా ఉండకూడదు.” -మహాత్మాగాంధీ (1937 )
” మాతృ భాష యందు విద్య గరుపుటయే మిక్కిలి సహజమైన మార్గము. ఆంగ్ల దేశమునందు ఆంగ్లేయులకు ఆంగ్లభాష యందును, ఫ్రాన్స్ దేశమునందు ఫ్రెంచి భాష యందును విద్య గరపబడుచున్నది. కానీ ఇతర భాషల యందు గరపబడుట లేదు. మన ప్రస్తుత విద్యా విధానము నందు అనేక లోపములు గలవు. అందులో మొదటిది మన బాలురు విషయ జ్ఞానము లేకయే తమ పాఠములను గ్రుడ్డితనంగా వల్లించి మెదడులోనికి ఎక్కించుకొనుట. ఆ పాఠములు పరభాషలో నుండుట వలన బాలురు వానిని జ్ఞాపకముంచుకొనుటకే యత్నించుచున్నారుకానీ తాము చదివే పాఠముల యొక్క అర్ధమునుగానీ, విషయమునుగానీ గ్రహించుటకు యత్నించుట లేదు. దీనివలన వారి గ్రహణ శక్తి నశించి పోవుచున్నది. జ్ఞానమును అభివృద్ధి చెందించని విద్య నిజమైన విద్య కానేరదు.అటువంటి విద్యావిధానం ఖండం ఖండనార్హము.”- సర్ కట్టమంచి రామలింగారెడ్డి
ప్రసిద్ధ తెలుగు భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు పాఠశాల స్థాయిలో ఐదో తరగతి దాకా మాతృభాషలోనే అన్ని అంశాలు చెప్పాలి. ఆరో తరగతి నుంచి ఒక పాఠ్యాంశంగా ఆంగ్లం నేర్పడం,ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి వరకు ఏటా ఒక సబ్జెక్టును ఆంగ్లంలో ప్రవేశపెట్టడం ప్రధానంగా విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక విషయాలు. ఒకటి నుండి పదో తరగతి వరకు తెలుగు చదువుకునే పిల్లలకు ఆంగ్లం నేర్చుకోవడం సులభం అవుతుంది. భావ వ్యక్తీకరణలో సృజనాత్మకత దెబ్బతినకుండా ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర విషయాలను అంచెలంచెలుగా 8 -10 తరగతుల్లో ఉభయ భాషా విధానంలో నేర్పాలి. అప్పుడు అవగాహన బాగా పెరిగి పై తరగతులకు వెళ్ళినప్పుడు ఉభయ మాధ్యమాలకు అలవాటు పడతారు. వీటిని అమలు చేస్తే తెలుగు చిన్నారుల నైపుణ్యాలకు ఆకాశమే హద్దుగా ఉంటుంది.
“మానవ నియో కోర్టెస్క్ (మెదడు పై భాగం)లో పెద్ద భాషా సంబంధిత ప్రాంతం ఉంటుంది. తెలివితేటలు, విశ్లేషణా శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను అది ప్రభావితం చేస్తుంది. మాతృ భాషలో చదువుకుంటున్నప్పుడు అది విశేషంగా స్పందిస్తుంది. మెదడు దాని సారాంశాన్ని జీర్ణించు కుంటుంది. దాని లోతుపాతులపై మెరుగైన పద్ధతిలో చర్చించడానికి,తిరిగి ప్రశ్నించడానికి అవసరమైన చురుకుదనాన్ని ప్రేరేపిస్తుంది.”- డాక్టర్ అశోక్ పంగారియా
మాతృభాషలో బోధించడం అంటే పిల్లలకు వాళ్ళ జాతి సంస్కృతుల్ని గూర్చి తెలియజెప్పటమే అంటున్న పరిశోధకులు, భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని,పాఠశాలల్లో బోధనాభ్యసన పద్ధతులు, విధి విధానాలను రూపొందించే విషయంలో ప్రభుత్వాలు జాతి మనుగడపై దృష్టిసారించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ఆలోచించి సహకరించాలి.
అభ్యాసకునికి మొదటి భాష (మాతృభాష) ద్వితీయ భాష నేర్చుకోవటంలో ముఖ్య కారకమవుతుంది. మొదటి భాష రెండవ భాష నేర్చుకోవటంలో చేతనంలోగానీ, ఉప చేతనంలోగానీ ఉపకరణంగా సహకరిస్తుంది. మాతృభాష వచ్చాక అవకాశాన్ని బట్టి,అవసరాన్ని బట్టి,ఇష్టాన్ని బట్టి,ఇతర భాషలు నేర్చుకోవడం సులభతరం అవుతుంది. మాతృభాషలో విద్యా బోధన వల్ల విద్యార్థికి బోధన అంశం సమగ్రంగా అర్థమవుతుంది. నైపుణ్యాలు పెరుగుతాయి. మాతృభాషలో అభ్యసనం విద్యార్థులకు వినయవిధేయతలను అందిస్తుంది. ఐక్యరాజ్యసమితి 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ స్వదేశీ భాషల సంవత్సరంగా ప్రకటించింది. కనుమరుగయ్యే స్థితిలో ఉన్న భాషలను పరిరక్షించుకోవాలన్నది దానర్థం. ఒక భాష అభివృద్ధి అనేది ఒక వ్యక్తి సమగ్ర అభివృద్ధికి భూమిక అని ఒక యాభై ఏళ్ళ క్రితమే ఆధునిక హిందూ పిత భారతేందు హరిశ్చంద్రగారన్న మాటల్ని బట్టి మాతృ భాష మీద అవగాహన లేకుండా ఒక వ్యక్తి ఎదుగుదల అసాధ్యం అని అర్థమవుతుంది. గణితం విజ్ఞాన శాస్త్రం వంటి వాటిని మాతృభాషలో బోధించడం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది.ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలు చూపే సృజనాత్మకత వారి భవిష్యత్తుకు పునాది వంటిది. అది మాతృభాషలో బోధన ద్వారానే సాధ్యమౌతుంది. చిన్నారుల వ్యక్తిత్వానికి సంబంధించిన మేధోపరమైన, నైతిక లక్షణాలను అభివృద్ధి చేయడంలోమాతృ భాష కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో సమాజంలో పిల్లాడికి చుట్టుపక్కల ఎక్కువగా మాట్లాడే భాషకు సంబంధించిన దృశ్య శ్రవణ సంకేతాలను మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ గ్రహించి, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాయి. చిన్నారికి మాతృభాషలో శ్రవణ భాషణములందు నైపుణ్యము సిద్ధించే వరకు ఈ అనుకరణ కొనసాగుతుంది.మానవ మేధో వికాసానికీ,,ఆలోచనాశక్తి అభివృద్ధికీ మాతృభాషే ప్రాథమిక సోపానం. ప్రాంతాలపరంగా నైతేనేమి,ప్రా కృతిక పరంగానైతేనేమిఒకే భాషాజాతిలో నెలకొనే సాంస్కృతిక వైవిధ్యాలను, వారసత్వాలను కాపాడుకోవాలంటే మాతృభాషా పరిరక్షణ అత్యంతా వశ్యకము.
మాతృభాషలో బోధన ద్వారా విద్యార్థుల సమగ్ర వికాసానికి బాటలు వేయడానికి మనం ఆచరించవలసిన ప్రస్తుత కర్తవ్యం ఏమిటంటే ప్రపంచీకరణ పేరుతో మనకు దగ్గరైన సాంకేతిక నైపుణ్యాన్ని అంతర్జాలాన్ని వినియోగించుకుంటూ మన భాష,సాహిత్య,సాంస్కృతిక సంపదలను మూలాలతో సహా పదిలపరచుకొని భావితరాలకు వారసత్వపు హక్కుగా అందించాలి. తెలుగు సాహిత్యం లోని విశిష్టమైన అవధానం వంటి ప్రక్రియల్లో విద్యార్థులకు అభినివేశం కల్పించి,వారి మేధోవృద్ధికి తోడ్పడాలి.తెలుగు భాష లోని సాహిత్య, సాంస్కృతిక, పౌరాణిక,చారిత్రక, నైతిక,మానవీయ విలువలతో కూడిన అంశాలతో పాఠ్యాంశాలను రూపొందించాలి. ఈ విధమైన కృషి ద్వారా మన మాతృభాష ఘనతను ప్రపంచానికే తలమానికమగునట్లు విశ్వవ్యాప్తం చేస్తూ మాతృభూమి రుణం తీర్చుకునే ప్రయత్నం నిర్విరామంగా కొనసాగాలని ఆశిస్తున్నాను.

* పాఠశాల యందు పాఠ్యాంశ బోధన
మాతృభాష లోనె మధుర మవుచు
కన్న ప్రేమ లోని కమ్మదనము బంచి
బాల బాలికలకు భవిత నొసగు

* మాతృభాష లోని మాధుర్యము నెరిగి
ఆత్మ శుద్ధి తోడ ఆదరించు
పరుల భాషలోన పలుకుట యేలరా
నీదు భాష గూర్చు నీకు ఘనత

April 9, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మయూఖ ద్వైమాసిక పత్రికకు వార్షికోత్సవ శుభాకాంక్షలు !!

by రంగరాజు పద్మజ April 9, 2022
written by రంగరాజు పద్మజ

ఉదయసూర్య తేజమై ” మయూఖ విషయ ” వెలుగు నిచ్చుగాక !
మధ్యాహ్న మార్తాండుడి వలె- మతలబుల నిగ్గు తేల్చి, పదుగురికి పంచుగాక!
అజ్ఞాన తిమిరాల బాపు ” మయూఖ “మై బ్రహ్మాండాలన్నిటా విస్తరిల్లు గాక!
పండిత పామర భేదమేలేక ” మయూఖ భాసమై ప్రత్యక్షరం యువతకు ప్రకాశమగుగాక!
ఆదర్శాలన్నీ ఆచరణలోరాగా ఆశయాల తళుకీను మయూఖ గా
రచనా జ్వాల సమాజ సమస్య పరిష్కరింపబడు సూచనలిచ్చుగాక!
పూర్వకవుల దీధితి- అభ్యుదయ కవుల అభ్యున్నతి మయూఖ మై – భావికవులకు ప్రేరణై
చంద్రుల కిరణ సమమగు గాక!
విలువల సమాజ నిర్మాణపు పునాదిగా మయూఖ పీఠమగుగాక !
ద్వైమాసిక పత్రిక- మాస పత్రికై,పక్షమై,వారమై ,దినపత్రిక యై దినదినాభివృధ్ధి యగు గాక!
మయూఖ విశ్వమంతా ప్రసరించి,అన్నిరంగముల అభివృద్ధి గాంచుమా! మయూఖమా

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వెలుగుల వేళ – శుభకృతేతెంచె

by బ్రాహ్మణపల్లి జయరాములు April 9, 2022
written by బ్రాహ్మణపల్లి జయరాములు

“శార్వరి బతుకు చీకట్లో సాగిపోయే
ప్లవరు జనులంత పడరాని పాట్లుపడిరి
నేటి కైనను బతుకాశ నిజము చేయ
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
కోవిడను వ్యాధి బీదల కొంపముంచె
చేయ పనులేవి లేకను చెదిరె మనసు
ఉసురు సురని బతుకువారి యుసురు నిలుప
శుభకృతేతెంచె ప్రజలకు సుఖముగూర్ప
రెండువత్సరాలుగ ప్రజలేమి తోడ
చెప్పలేనట్టి బాధల చిన్నబోగ
ఊపిరిని పీల్చు కొనజేసి యుత్సవముగ
శుభకృతేతెంచె ప్రజలకు సుఖము గూర్ప
రోగ బాధలు లేనట్టి రోజు లొచ్చి
కష్టజీవులు సుఖపడుకాలమొచ్చి
లోకమంతట శుభములు కేకవేయ
శుభకృతేతెంచె ప్రజలకు సుఖముగూర్ప
రైతు శ్రామిక జనులంత రేయి పగలు
శ్రమకు తగిన ఫలితములు సొంతమవగ
సర్వవృత్తుల జనులెంతొ సౌఖ్యమొంద
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
భారతీయులందరునిక బాధలేక
సుఖము సంతోషములనెంతో చూరగొనగ
ఈ యుగాదియు నూరట నిచ్చుచుండ
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శుభకృత్ వత్సర శుభాకాంక్షలతో..

by చుక్కాయపల్లి శ్రీదేవి April 9, 2022
written by చుక్కాయపల్లి శ్రీదేవి

చం.శుభములొసంగుచున్ ప్రకృతి శోభలతో నెదమోదమొందగా
ప్రభవమయెన్ శుభోదయ ప్రభాత మయూఖములే వసంతమై
సభికుల లాస్యలాహిరి ప్రశాంత మనోహర రంగభూమియం
దభయముదెల్పుచున్ శుభకృతై తరలెన్ ఘనమౌయుగాదియై

ఉ.తీయని గూఢముల్ బ్రతుకు తీరును మార్చగ, వేపపూతయే
మాయని గాయముల్ మరచి మౌనముదాల్చగ‌,నుప్పు కారముల్
సోయగమౌచు జీవితపు సొంపులు హంగులు తీర్చిదిద్దగా
సాయమొనర్చు షడ్రుచుల సారముగూర్చు నుగాది పచ్చడై

ఉ.కోకిల సుస్వరమ్ములును కొమ్మలరెమ్మల లేత పత్రముల్
సాకరమై మనోహర వికాసములై వనశోభనింపగా
చీకటి వీడ జాతకము చింతలు బాపెడి యోగమందగా
యీకలి దోషముల్ తొలగి యీశ్వర దీవెనలే స్రవించులే

శా.పంచాంగశ్రవణమ్ము పాపహరమై భావిన్ ప్రసాదించగా
సంచారమ్మొనరించుచుండు గ్రహముల్ చైత్రమ్ముతో సాగుచున్
పంచున్ వత్సర సత్ఫలమ్ములదె సంప్రాప్తమ్ములౌ రాశులున్
పెంచున్ ధైర్యము జాగ్రతల్ ప్రజలలో విచ్చేయు సన్మిత్రతన్

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్త్రీ విద్య

by రంగరాజు పద్మజ April 9, 2022
written by రంగరాజు పద్మజ

ఒద్దిరాజు సోదరులు వంద సంవత్సరాల క్రితమే తెనుగు పత్రిక( 12-8-1925) లో ఒక ఆదర్శవంతమైన సంపాదకీయం రాశారు. అదేమిటంటే స్త్రీ విద్యా వ్యాప్తి కోసం సమాజానికి కనువిప్పు కలిగించేలా ఉంది ఆ సంపాదకీయం ! అంతే కాదు! స్వాతంత్ర్యోద్యమం, గ్రంథాలయోద్యమం గురించి చెప్పిన సంపాదకీయం!
ఆ సంపాదకీయాన్ని వంద సంవత్సరాలైనాఎందుకు ఆ విషయం చెప్పుకుంటున్నామంటే…? ఈ సంవత్సరం తెనుగు పత్రిక శత జయంతి జరుపుకుంటోంది. అంతేకాదు స్త్రీ విద్యావశ్యకత చెబుతూనే మగవారి బాధ్యతలను తెలిపారు.అందుకే ప్రత్యేకంగా ఈ అంశాన్ని పాఠకులకు మరియొక సారి తెలియజేయదలచుకున్నాన
మహిళల విద్య గురించి ఇప్పటికీ బాహటంగా
కాకున్నా లోలోపల ..అక్కడక్కడా …పల్లెల్లో కాకున్నా
బాగా చదువుకున్న వారి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
తమ వాదాలు పరిగణనలోకి తీసుకోవాలనీ, నిజా నిజాలు బయట పడాలనీ,కాని పక్షంలో నిందా పాత్రులేననీ, స్త్రీలు విద్యావంతులైతే ఆ సంసారం ఆనందంతో గడపుతూ,సుఖవంతమైన జీవితం జీవించవచ్చనీ,ముఖ్యంగా స్త్రీ విద్య తప్పనిసరనీ,
అప్పుడే మహిళ అంతులేని మెప్పులు పొందుతుందనీ అందరికీ తెలుసు.
ఐనా కొందరు అహంభావులై మహిళలు విద్యావంతులైతే అవిధేయులుగా అవుతారనీ చెడు ప్రచారాలు చేసే వారికి స్వాభిమానం లేదేమో?
చదువుకొన్న యువతులకు మాత్ర స్వాభిమానం తప్పక దెబ్బతింటుంది అనడంలో సందేహమేలేదు.ఆ విషయంలో చర్చకు తావేలేదు.సరే ఆవిషయం వదిలేసి, సాధ్యమైనంత వరకు తమ భార్యా- బిడ్డలను
చదివించడం మంచిదని ఈనాటి కాలానికి అక్కరకొచ్చేది చదువేనని అనుభవం ద్వారా తెలుసుకున్నవారందరూ స్త్రీ విద్య ఆశపడుతున్నారు.
విద్య కొరకు తాపత్రయ పడుతున్న సమాజంలో
నిజామాంధ్ర ప్రదేశ్ లలో ఉన్న చదువుకోవాలనుకునేమహిళల వంటి ( తెనుగు పత్రిక సంపాదకుల జనయిత్రి వంటి ) అంటే ఒద్దిరాజు సోదరుల తల్లిగారైన రంగనాయకమ్మ గారివంటి వారెందరో ఉన్నారు.
వాళ్ళు కేవలం పెద్ద వారి ఆచారమని. మంచిదైనా కాకున్నా దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇక్కడే కాదు ప్రపంచమంతటా అందరూ చదువుకోలేకపోతున్నారు. ఇలా తెలియని వారెందరో ఉన్నా…బహిరంగ సభలలో వేదికలమీద భయమే లేకుండా ఉపన్యాసం చేసేలా స్త్రీ విద్యను సాటి తోటి మహిళలకు తెలిసేలా శ్రీమతి చాట్రాతి లక్ష్మీ నరసమాంబ, శ్రీమతి సత్యవతీబాయి మొదలైన ఏ కొద్దిమంది మాత్రమో మహిళలు అదీ వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మాత్రమే నిజాంరాష్ట్రాంధ్ర దేశంలో స్త్రీ విద్య ఉందనేది కొంచమైనా అపవాదు తొలగించగలుగుతున్నారు.
స్త్రీ విద్యను గురించి శ్రద్ధ తీసుకోవలసిన ఈ సమయంలో సులువైనది, భావుకతతో కూడిన ఉన్నత విద్యాభిరుచికి మూలమైన , అంతులేని లాభాలున్నటువంటి, అందరికీ ఆమోదమైనట్టి ఇంట్లోనే విద్య నేర్చుకునే విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇలా ఇంట్లో ఉండి విద్య నేర్చుకోవడం చాలా తేలిక!కాబట్టి ఆడపిల్లలే కాకుండా గృహిణులు కూడా చదువు నేర్చుకోవచ్చును. అక్షరం ముక్క రాని ఆడవారుసైతం తక్కువ సమయంలోనే తన ఇంటి
కుపయోగపడే పనులను అవలీలగా చేసుకునే శక్తి సామర్ధ్యాలు కలుగుతాయి.
స్త్రీ విద్యపై అభిమానమున్న అన్ననో, కుమారుడో? భర్తనో? తండ్రో ఇంటినుండి చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలనుకునే వారికి కాస్త సహాయం చేయడమేమంత కష్టం కాదు!
ఇలా ఇంట్లో ఉంటూనే చదువుకొని పరీక్షలు రాసే అవకాశము మన రాష్ట్రంలోనూ వ్యాప్తి చెందుతున్నది. అందుకుగాను చాలా సెంటర్లు ఏర్పడ్డాయి. వాటి ద్వారా కావలసిన సమాచారము దొరుకుతుంది. అయినా కూడా యువతులందరికీ ఈ విషయం గురించి తెలిసింది అనుకోవడానికి వీలు లేదు. అందుకే ఎక్కువమంది మహిళలు ఈ పరీక్షలు రాసి పాస్ అవుతారని చెప్పలేము. కానీ ఇలాంటి అవకాశము అందిపుచ్చుకోవడానికి ముందుకు రావడానికి ఎన్నో ఆటంకాలున్నాయి.. అయినా ఎక్కువమంది ఈ విషయం తెలుసుకొన్నారనీ… వారు ముందుకు వస్తారనీ చెప్పలేము. ఎందుకంటే ఎక్కువమంది తెలియని వారే ఉండడంవల్ల అంచనా వేయలేం. ప్రస్తుతం కాదు కూడదని ఈ నలుగురో ఐదుగురో ఈ పరీక్షలలో పాల్గొన్నంతమాత్రాన సరిపోదు.
ఈ పరీక్షలు జాతి లింగ వివక్షత లేకుండా సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడినప్పుడు మగవారు పరీక్ష రాయడం కంటే వారు తమ కోసం ఇంట్లో శ్రమ పడుతున్న మహిళలకు బోధించడంలో సమయాన్ని ఎక్కువ కేటాయిస్తే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కానీ అంతటి ఓపిక ఆడవాళ్ళ లోను మగవాళ్ళ లోనూ ఉండాలి!
విద్యావ్యాప్తి స్త్రీలలో లేకపోవడం వల్ల ఈనాటి గృహ విద్య పరీక్షలో ఆసక్తి కలగాలంటే… కొంత శ్రమ పడాలి! ఇటువైపు స్త్రీల వైపు నుండి కూడా శక్తి కలిగి ఉండి ఉంటే విద్య నేర్చుకోవడానికిఅవకాశాలున్నాయి. స్త్రీ పురుషులు విద్య నేర్చిన వారైతే దేశానికి ఉపకార దీక్ష పూని, పల్లెటూర్లలో కి వెళ్లి అక్కడ సభలను సమావేశాలను ఏర్పాటు చేసి ఉపన్యాసాలు ఇచ్చి స్త్రీలకు విద్య పట్ల ఆసక్తి ముఖ్యంగా ఇంటి నుండి పరీక్షలు రాయాలనే అభిరుచి కల్పించవచ్చు. కానీ అది అంత సులువు కాదు! ఎందుకంటే ఎవరికి తగ్గ పనులలో వారు తలమునకలయ్యే ఈ సమయంలో తమ పనులు విడిచిపెట్టి ఇంకొకరికి విద్యా బోధన, అవగాహన కలిగించడం కష్టమైన పనే.. అయినా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు పర్యటన చేసినా సరిపోదు! ఇది చాలా మంది కూడి జరపవలసిన ఒక బృహత్తర కార్యక్రమం… అందుకే ఈ పని అనుకున్నంత సంతృప్తి కరంగా ఈ విధానంలో వ్యాప్తి చెందదేమో అనిపిస్తున్నది.
విద్యా పక్షపాతి అని పేరు పొందిన నిజాం ప్రభుత్వం ఏ చిన్న ఊళ్ళోనో కాకుండా మిగిలిన ప్రతి గ్రామంలోనూ బాలల పాఠశాల తోపాటు బాలికల పాఠశాల ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది . దాంతో స్త్రీ విద్య అతి తక్కువ కాలంలోనే వ్యాపించవచ్చు అనే ఒక నమ్మకం కలగవలసిన అవసరముంది. కానీ ఏ బస్తీలోనో తప్ప బాలికల పాఠశాలలో గల ప్రతి గ్రామమునందైనా బోధన, పరీక్షల నిర్వహణకై స్థలాన్ని కేటాయించవలసి వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు బదులు ఉపాధ్యాయినులను తక్కువ చూపు చూడకూడదు. పల్లెటూరులలో వాతావరణం వేరుగా ఉంటుంది. సామాన్యంగా ఏ బాలిక అయినా వివాహం ముందు మాత్రమే విద్య అభ్యసించాలని అనుకుంటారు పెద్దలు. తరవాత కుటుంబ పరిస్థితులు సహకరిస్తేనే ఆ విద్య కొనసాగుతుంది… లేని పరిస్థితుల్లో ఆమె చదువుకు అంతరాయం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భర్త, కుటుంబం ఆమెకు సహకరిస్తే అత్యున్నత విద్య ఆమె సొంతం అవుతుంది.
స్త్రీ విద్యాధికురాలైనప్పుడు ఆ కుటుంబం సవ్యదిశలో నడుస్తుంది. పిల్లలు విద్యాధికులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకుగాను ప్రోత్సాహం కూడా ఎక్కువ లభిస్తుంది. అంతేకాదు కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చినపుడు చక్కటి బేరీజు వేస్తుంది. ఏఖర్చుకుఎంత డబ్బు కేటాయించాలి? అనే స్పష్టత ఉంటుంది.కొండొకచో చేదోడువాదోడుగా సంపాదిస్తుంది. అప్పుడు కుటుంబం వీధిలో పడకుండా చక్కని ఆర్థిక పరిపుష్టితో నిలదొక్కుకుంటుంది.
కాబట్టి మన తెలుగు రాష్ట్రంలో మహిళలకు విద్య ఎంతో అవసరమని గుర్తించి మన పాలకులు ప్రతి గ్రామంలోనూ బాలికల పాఠశాలలను స్థాపించాలని సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇలా ఎంతో అవగాహనను కలిపించే సంపాదకీయం రాయడం ఆనాడు ఒద్దిరాజు సోదరులకే చెల్లును.
అంతేకాకుండా నిజాం నవాబుకు బాలికల పాఠశాల నెలకొల్పాలని అర్జీతో పాటు ఒక హెచ్చరిక కూడా చేశారు. పట్టుబట్టి ఇనుగుర్తి గ్రామంలో” “ప్రయోగాత్మక బాలికల ప్రాధమిక పాఠశాల” వచ్చే లా కృషిచేసి, ఏర్పాటు కూడా చేశారు.
ఇలా స్త్రీ విద్యావ్యాప్తికి ఎంతగానో తోడ్పడింది ఈ తెనుగు పత్రిక.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శుభ స్వాగతం

by డా॥ గండ్ర లక్ష్మణరావు April 9, 2022
written by డా॥ గండ్ర లక్ష్మణరావు

కాల మెప్పుడు ముందుకే కదలుచుండ
జ్ఞాన సంపన్నుడయ్యెను మానవుండు
అయిన హత్యలు యుద్ధాలు ఆక్రమణలును
ఆప లేనట్టి యిట్టి విజ్ఞానమేల 1

తీయగా రాగమ్ము తీయవే కోకిలా
కఱకు గుండెల లోన కరుణ గలుగ
చలువ చేయగరావె మలయానిలాంగన
కోపాగ్ని చల్లారి కుదురు కొనగ
తెల్లని మల్లెలు చల్లుమా వల్లికా
పగల భావము లన్ని ప్రణయ మవగ
తరులార రెక్కల తలిరాకు నింపుడీ
బీటలౌ మనముల ప్రేమ లోలుక
అరుణ కిరణాల రథమెక్కి తరలి రమ్ము
అంద మంతయు లొకాన చిందు లాడ
సరస మాధవా శుభ వసంత మవగ
వచ్చు నీకు నిదియె శుభ స్వాగతమ్ము 2

తెలుగు జనాలు షడ్రుచుల తీరును పచ్చడి గా గ్రహించి యీ
కలుములు లేములున్ మరియు కష్ట సుఖమ్ముల రాక పోకలన్
దలతురు గాని యాశలను తప్పక పెంచుక చూచు చుందు రా
ఫలముల నీయ రాగదవె| పండుగ వోలెను నవ్య వత్సరా | 3

వైద్య మెంతగా పెరిగిన , వాయు వందు
ప్రాణ హరమైన కీటముల్ ప్రాకి పోయె
మానవులు తప్పు చేయుట మాన రైరి
మనిషి తడి యెండి పోవుటే మనకు శిక్ష 4

ఎప్పుడు వచ్చి పోయెదవు నెన్నియొ కోర్కెల పంచి పెట్టుచున్
ఇప్పుడు తీరునింక నని యెంతోముదమ్మున చూచు చున్న మా
తప్పులు దిద్ది సర్వ శుభదాయిని వైన యుగాది నీకు మే
మెప్పుడు స్వాగతించెదము, మీరిన యాశల త్రుంచ బోకుమా | 5

దేశము లందు వైరములు తెచ్చి, యమాంతము పోరు పెట్టి,యా
వేశము నింపి ప్రాణముల పేల్చి నివాసము కాల్చి వేసి యా
కాశము వైపు చూపినది కాలము కాలుడు గాప్లవాబ్ది ,రా
వే, శుభ కృత్ సార్థకము వేయివిధమ్ముల చేయు మాధవా| 6

చైత్ర రథమెక్కి భాస్కర శస్త్రములతొ
దుష్ట రాక్షస గుణముల దునిమి వేయ
శ్రీ వసంతమాధుర్యము చిహ్న ములుగ
సకల జనులకు మేలుగా సాగి రమ్ము 7

ఈ శుభ కృత్ వత్సర మున
రాశులు గా పంచి పెట్టు ప్రజలందరకున్
పేశల మైన గుణమ్ముల
దేశము సుఖ శాంతులందు తేలి సుఖించన్ 8

అర్థ కామమ్ము లందున అణగి పోక
ధర్మ మార్గమ్ము వైపుకు ధరణి యంత
కదలి సాగగ నీవె దిగ్దర్శనమ్ము
నగుచు రావయ్య నీకు నమస్కరింతు 9

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఆచార్య దేవోభవ – నాటిక (పౌరాణికం)

by Arutla Sridevi April 9, 2022
written by Arutla Sridevi

పాత్రలు
గురువు – ధౌమ్య ముని
శిష్యులు – అరుణి, వేదా, ఉపమన్యు
తెరవెనుక – సూత్రధారి
ద్వాపర యుగాంతంలో ధౌమ్యుడనే ఋషి ఉండేవాడు. అతనివద్ద వేదాభ్యాసము చేస్తూ ముగ్గురు శిష్యులుండేవారు. అందులో ఒకడు అరుణి, రెండవవాడు వేదా. ఇతనిని బైదుడు అని కూడా అంటారు. మూడవవాడు, అందరికన్నా చిన్నవాడు ఉపమన్యు. విద్యాభ్యాసం కోసం వారు ముగ్గురూ గురువును సేవిస్తూ ఉండేవారు. ఆ కాలంలో గురువులు ముందుగా శిష్యుల అంతఃకరణంలో భక్తిని పరీక్షించి వారిపై కృప చూపి, వారికి విద్యనేర్పేవాడు. ఈ గురుశిష్యుల కథనే నాటికగా రూపొందించాను. ఈ కథ మహాభారతం మొదటి పర్వంలోనిది (ఆదిపర్వం).
ఈ నాటికను 5 తరగతి నుండి 8వ,9వ తరగతివరకు వేయవచ్చు. గురువు పాత్ర 9,10వ తరగతి విద్యార్థులు వేస్తే బాగుంటుంది.
మొదటి ఘట్టమం
తెర తోలుతుంది. ముందుగా ఆశ్రమ వాతావరణం కనపడుతూ ఉంటుంది. పర్ణకుటీరము, పచ్చని చెట్లు, లేళ్ళు, కుందేలు, పక్షులు, పూల మొక్కలు ఉంటాయి. రంగస్థలంపైన అయితే తెరద్వారా వాతావరణం చూపించాలి.
T.V.లో అయితే సెట్టింగ్స్ ద్వారా చూపించవచ్చు. రేడియోలో అయితే వాయిదాల సహకారంతో పక్షుల కిలకిల రావాలు మొదలైనవి వినిపించవచ్చును.
ధౌమ్యముని : (పద్మాసనుడై కూర్చొని ఉంటాడు)
నాయనా అరుి ఇలా రా నాయనా
అరుణు: పిలిచారా గురువుగారు (లోపల నుండి రంగస్థలంపైకి పరిగెత్తుకొస్తాడు)
ధౌమ్యముని : ఈ రోజు నీవు మన పొలానికి వెళ్ళి చెరువులోని నీరు పొలానికి మళ్ళించు, వెంటనే వెళ్ళు.
అరుణి : ఆజ్ఞ. గురువుగారు ఇప్పుడే వెళ్తున్నాను (రంగస్థలంపై నుండి లోపలికి వెళ్లిపోతాడు)
(తెర ద్వారా పొలం చూపించాలి. చెరువులో నీరు చూపించాలి. నీటి శబ్ధము వాయిద్యాల సహకారంతో చూపించాలి)
అరుణి పొలం దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ పొలం మధ్య గుండా ఒక కాలువ ప్రవహిస్తూ ఉంది.
అరుణి: (ఆశ్చర్యముఖంతో – స్వగతం) (సంభాషణ బయటకు వినబడాలి)
ఆ ఇదేమిటి పొలంలో నీరు ఇలా ప్రవహిస్తుందేమిటి? అయ్యో ఇప్పుడేం చెయ్యాలి? (కొంచెంసేపు ఆలోచిస్తూ అటూ, ఇటూ తిరుగుతాడు). ఆ ఇక్కడేదో పెద్ద బండలా ఉఁదే. అవును బండే. ఈ బండను ప్రవాహానికి అడ్డంగా పెడ్తాను.
(బండను వేదికపై ముందే అమర్చి పెట్టుకోవాలి (అట్టతో తయారుచేసినది) )
(అయినా కూడా ఈ బండను నెటే్టసి నీరు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది)
అయ్యో! నీరు ఆగడం లేదే ఎట్లా?
(కొంచెంసేపు అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తాడు)
ఆ ఇక్కడ గడ్డిమోపును అడ్డంగా వేస్తాను.
(అరుణి ముఖం సంతోషంగా ఉంటుంది)
గడ్డి మోపును అడ్డంగా వేస్తాడు.
(అయినా నీరు ప్రవహించడం ఆగలేదు)
భగవంతుడా శ్రీహరీ నీవే ఏదైనా దారి చూపించు. గురువుగారు చెప్పిన పని పూర్తి చేయలేకపోతున్నాను. నీటి ప్రవాహం ఆపలేకపోతున్నాను. పొలం అంతా నీటితో మునిగిపోతుంది.
ఏడుస్తూ ఓ చెట్టుకింద చతికిలబడిపోతాడు)
(మళ్లీ కొంతసేపటికి లేచి కళ్ళ నీల్లు తుడుచుకుని ఇలా తన మనసులో అనుకుంటాడు).
ఏమైనా సరే గురువుగారి ఆజ్ఞను పాటించాల్సిందే. అందుకు నా ప్రాణాలు పోయినా సరే. (నిర్ణయించుకుంటాడు)
(మనసులో గురువుని ఇలా ధ్యానించాడు)
గురుః బ్రహ్మ గురుః విష్ణు
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
రెండు చేతుల్తో పక్కనున్న తీరాన్ని పట్టుకొని, రెండవవైపు తన పాదాలు పెట్టి నీటికి అడ్డుగా పడుకొన్నాడు.
(ఈ విధంగా చేయగానే పొలం లోనికి ప్రవహించే నీటి ప్రవాహ వేగం కొంత తగ్గింది. అరుణి మాత్రం నీటిలో మునిగిపోయాడు. తల మాత్రం బయట ఉంది).
ఆహా నాదెంత భాగ్యము. ఎలాగైతేనేం గురువుగారు చెప్పిన పని చేయగలిగాను. ఇక నా ప్రాణం పోయినా నాకే బాధ లేదు.
(సెట్టింగ్ మార్చాలి)
(ఆశ్రమ వాతావరణం)
ధౌమ్యముని : (అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తాడు.)
పగలు గడచిపోయింది. చీకటి పడ వస్తూంది. అరుణి ఇంకా రాలేదేమిటి? (ఆందోళనగా)
ఎందుకైనా మంచిది. ఒక్కసారి పొలం దగ్గరకు వెళ్ళి చూసొస్తాను.
(పొలానికి వెళ్తాడు అక్కడ శిష్యుడు కనబడడు)
అరుణీ అరుణీ (పిలుస్తాడు)
అయ్యో అరుణి ఏమయ్యాడు? అతన్ని ఏ క్రూరమృగమో తినెయ్యలేదు కదా! (మనసులో)
నాయనా అరుణీ (ఇంకా గట్టిగా పిలుస్తాడు) ఎక్కడున్నావు నాయనా.
అరుణి: గురువుగారూ నేనిక్కడ అంటూ పరుగెత్తుకొని వస్తాడు (బట్టలు తడిచి ఉంటాయి).
ధౌమ్య : (ప్రేమతో అతన్ని ఆలింగనం చేసుకుంటాడు). అరుణీ తడిచిపోయావా నాయనా. ఎంత పని చేశావు నాయనా. గురువు మాట కోసం నీ ప్రాణాలమీదికే తెచ్చుకున్నావా? (గద్గద స్వరంతో)
శిష్య శిఖామణీ నీకు వేదశాస్త్రం, వ్యాకరణాది విషయాలు అన్నీ ధారపోస్తాను. రా నాయనా మన ఆశ్రమానికి వెళదాం.
(ఇద్దరూ ఆశ్రమానికి వచ్చేస్తారు)
(తెర వెనుక : అరుణికి సకల విద్యలూ అబ్బిన తరువాత వివాహ యోగ్యుడైన తరువాత గురువుగారు అతన్ని ఆశీర్వదించి గృహస్థాశ్రమం స్వీకరించమని ఇంటికి పంపిస్తాడు).
…………………

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

స్వాగత లేఖ

by Arutla Sridevi April 9, 2022
written by Arutla Sridevi

పల్లవాలపై పచ్చ రంగు తో
లిఖియించిన స్వాగత లేఖ
నోట కరచుకొని గొంతు సవరించి
పాట పాడినది కోకిల దూత
పిలుపునందుకొని వసంత రాజు
చైత్ర రథము పై పుడమికి రాగా
రాలిన పువ్వులు తివాచీ పరువా
రాలే పువ్వులు అక్షితలైనవి
మధువు టీ గలు విందు చేయగా
మధువు గ్రోలిన మత్తు మదాన
నిదుర పోయెను వన రా రాజు
రెక్కల మాటున దాచుకున్న
మంచు బిందువుల పన్నీరు జల్లుతూ
మేలుకొలిపినవి కుసుమ రాణులు
కళ్ళు తెరిచిన రుతు రారాజుకు
కనిపించిందోక నందన జాన
ఆమె మోము చందమామ
పేరేమో శుభకృత్ నామా

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలుగు సులభ వ్యాకరణం

by కూకట్ల తిరుపతి April 9, 2022
written by కూకట్ల తిరుపతి

పురాతనం నుండి అధునాతనం వరకు తెలుగుభాషను ఎందరో మహానుభావులు సుసంపన్నం చేశారు. ప్రతినిత్యం తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి మరెందరో మహనీయులు పలు విధాలుగా పాటుపడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా “తెలుగు వ్యాకరణం” మీద ఎన్నో పుస్తకాలను వెలువరిస్తున్నారు. ప్రత్యేకించి పాఠశాల దశ విద్యార్థుల కోసం తేలికపాటి పదాలతో, వ్యాకరణ సూత్రాలను సరళంగా అందించడానికి తెలుగు పండితులు కుంట వేంకటేశం గారు పూనుకోవడం ప్రశంసనీయం. తెలుగు పాఠ్యాంశాల బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగంగా వచ్చే భాషా వ్యాకరణాంశాలను, ఛందో అలంకారాలను అలతి అలతి పదాలతో లలితమైన రీతిలో లక్ష్యాలక్షణం చేశారు. కమ్మనైన అమ్మభాషకు మరింత కమ్మదనాన్ని అద్దారనడంలో అతిశయోక్తి లేదు.

తేట తెలుగు భాషకు చెందిన వర్ణములు, అందలి భేదముల వివరణతో “విద్యార్థి వ్యాకరణ కిరణం” భాషా పునాదుల్లోకి ప్రసరించింది. పద విభాగములు, భాషా భాగములు, వాచకములు, వచనములు, విభక్తి ప్రత్యయములను విడమరచి చెప్పిన తీరు తేజోవంతంగా ఉంది. వాక్య భేదములు, విరామ చిహ్నములను సోదాహరణంగా విశ్లేషించిన విధం సహజాతిసహజంగా ఉంది. తెలుగు సంధులు, సంస్కృత సంధుల పరిచయం అరటిపండును ఒలిచి నోట్లో పెట్టినట్టే ఉన్నది. సమాసములు, అలంకారములు, ఛందస్సులను అలవోకగా అభ్యసించేటట్టుగా అక్షరాల ఆసువోశారు.

పెద్దపల్లి జిల్లా, కమాన్ పూర్ మండలం, జూలపల్లి వాస్తవ్యులు కుంట వేంకటేశం గారు. ఆయన పుట్టినూరులోనే 1989లో పాఠశాలను నెలకొల్పి, విద్యాగంధాలను పంచిన విద్యాభిమాని. 2006లో తెలుగు భాషోపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించారు. ఆ వెనువెంటనే 2008లో తెలుగు భాష సహోపాధ్యాయులుగా ఎంపికవడం ఆయన పట్టుదలకు నిదర్శనం. పిల్లలకు మాతృభాషా మాధుర్యాన్ని పంచుతూ, వారిలో విలువలను జీవన నైపుణ్యాలను పెంచుతున్న ఆదర్శ ఉపాధ్యాయులు కుంట వేంకటేశం గారు. “అనంతవరం మాణిక్యలింగం, శతక సాహిత్యం – పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేసి, కాకతీయ విశ్వవిద్యాలయం ద్వారా ఎం.ఫిల్. పట్టాను పొందిన గొప్ప పరిశోధకులు. దశాబ్దాల బోధనానుభవం, పరిశోధనలో పటుత్వం కుంట వేంకటేశం గారి సొంతం. తెలుగు వ్యాకరణం గొట్టు కాదు. తేలికైనది తెలుగు భాష. పిల్లలు తెలుగును సులువుగా నేర్చుకోవచ్చని, ఈ పొత్తం ద్వారా రచయిత నిరూపించారు.

బాల వ్యాకరణ పీఠికలో చిన్నయసూరి స్వయంగా “పెక్కు లక్ష్యములు సావధానముగా పరిశీలించి, రచనా ప్రణాళిక నిర్ణయించుకొని” తానొక లక్షణ గ్రంథమును రచించినట్లు పేర్కొన్నారు. వ్యాకరణం పాఠకుల్లో సాధు, అసాధు శబ్ద వివేకాన్ని కలిగిస్తుంది. భాష యొక్క కీలక స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. కవి ప్రయుక్తములైన శబ్దాలకే లక్షణం చేస్తుంది. లక్ష్యం లేకుండా లక్షణం పుట్టుట అసంభవం కదా! కాబట్టి వ్యాకరణం ప్రయోగశరణమైనది. విద్యార్థులు భాషను సులువుగా నేర్చుకోవడానికి వ్యాకరణం దోహదపడుతుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి, వ్యాకరణ అధ్యయనం తోడ్పడుతుంది. పిల్లలు ఉత్తమ పాఠకులుగా, లేఖకులుగా ఎదగడానికి ఈ చిరు పొత్తం చంద్రునికో నూలు పోగులాగా సహకరిస్తుందని భావిస్తున్నాను.

ఈ పుస్తకంలో రచయిత కుంట వెంకటేశం గారు తనకున్న భాషా పరిజ్ఞానంతో, బోధనానుభవసారంతో, ఎన్నో విషయాలను సముచిత వివరణలతో, చక్కని ఉదాహరణలతో తెలియజేశారు. దీనిప్రతి ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండదగినది. బడిపిల్లలందరికీ అందుబాటులోకి తీసుకురాదగినది. ఉపాధ్యాయులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని, విద్యార్థులకు చేరువ చేయాల్సిన అవసరముంది. తెలుగు వ్యాకరణాన్ని సులభరీతిలో, బొత్తిగా వివరంగా, విపులంగా విడమరచి చెప్పిన ఈ గ్రంథాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. విద్యార్థుల మదిలో చెరగని ముద్రవేసే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. తెలుగుభాషా బోధకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన కుంట వేంకటేశం గారికి హృదయ పూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో పుస్తకాలు ఆయన కలం నుండి జాలువారాలని ఆకాంక్షిస్తూ…

సెలవిప్పటికీ… స్నేహమెప్పటికీ…

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ April 9, 2022
written by కొరుప్రోలు హరనాథ్

టేక్స్

కేవలం
జీతానికే
టే్క్స్ కదా అని
చంకలెగరెయ్యకు-
జీవితానికి కూడా
టేక్స పడే రోజొకటి
వస్తందున్న
విషయం మరిచిపోకు

ఆస్తి – నాస్తి
ఎయిర్ కండిషన్ గదులూ
త్రీ యేసెస్ బార్ లు
లెక్సెస్ – యన్ – యక్సీ కార్లు
మఖ్ మల్ కుషన్ పరుపులు
బొచ్చుకుక్కలు
ఆస్తికుని ఆస్తికత్వం-
మురికివాడలూ
కూలన గోడలు
పేవ్ మెంట్లు
మెట్లోషల్టర్లు
గజ్జికుక్కలు
నాస్తికుని ఆస్తికత్వం

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us