మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

వెలుతురు చెట్టు

by కుడికాల వంశీధర్ August 15, 2022
written by కుడికాల వంశీధర్


అది నిన్నటి నీటిని,
ఈనాటి కన్నీటిని
పీల్చుకొని ఊపిరి పోసుకుంది.
ఆటంకాలని చీల్చుకొని,
చీకటి తొడుగుని
విప్పుకొని మొలకెత్తింది.

కొండగాలి కొంటెగా
హార్మోనియం వాయిస్తుంటే
అడుగుల్లో అమ్మోనియం నైట్రేట్
రైట్! రైట్! అంటుంటే
శ్రవణానందకరంగా
ఆకులు అల్లరి చేస్తాయి
నయన మనోహరంగా
కొమ్మలు ఊయలలూగుతాయి
కిరణజన్య సంయోగ క్రియతో
పరిసరమంతా
పత్రహరిత నర్తనమౌతుంది.

దాని వేర్లలో
నల్లని జాడలు ఇంకా ఉన్నాయి.
అయినా
ఆత్మీయతా వెలుతురు సోకినప్పుడల్లా
ఆకుపచ్చని ఆశలను కలగంటుంది

August 15, 2022 2 comments
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అత్యద్భుత యాత్రా ప్రదేశం లడక్

by Rangaraju Shyamsundar August 15, 2022
written by Rangaraju Shyamsundar

ఏం కొంచెం యాత్రా స్థలాల దర్శనానికి అవకాశం ఉన్నా ముందుండేది మేమే. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ప్రభలడంతో టూరిజం మొత్తంగా కుప్పకూలడం యాత్రా ప్రదేశాలపై కోవిడ్ ఆంక్షల వల్ల ఎక్కడకైనా వెళ్ళాలన్నా అవకాశాలు తగ్గిపోవడంతో రెండు సంవత్సరాల పాటు అన్ని ఆలోచనలకి, కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది.

కొంచెం కొంచెంగా కోవిడ్ తగ్గుముఖం పడ్తున్న ఈ సందర్భంలో లడక్ యాత్ర గురించి మిత్రుల ద్వారా తెల్సుకొని ఎలా అయినా ఈసారి టూర్ మిస్ కావద్దు అనుకొని ముందుగానే వెళ్ళాల్సిన ప్రాంతం వివరాలు ఎక్కువగా తెలువకున్నా ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం.

ప్యాకేజి అయితే బుక్ చేసుకున్నాం కాని, సహచర మిత్రులను ఆహ్వానిస్తే వారు మా ఆహ్వానం తిరస్కరించడమే కాకుండా ఒకరకంగా మమ్మల్ని టూర్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని వత్తిడి తేవడం ప్రారంభించారు. వాళ్ళు చెప్పిన విషయం సూక్ష్మంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన కర్ దుంగ్లా పాస్ 18000 అడుగుల ఎత్తులో ఉంటుందని, ఆ శిఖరాలు అన్ని మంచుతో కప్పబడి ఉంటాయని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి హై ఆల్ టిట్యూడ్ సిక్ నెస్ తో వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ ప్రాంతంలో అక్కడక్కడ మిలటరీ క్యాంప్స్ తప్ప పెద్దగా జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటాయని వైద్య సౌకర్యాలు కూడా చాల తక్కువగా ఉంటాయని, ప్రయాణించే ప్రతి వెహికిల్ లో ఆక్సిజన్ సిలిండర్లు తప్పనిసరిగా క్యారీ చేస్తారని, ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ ద్వారా ధృవపత్రం అందజేస్తేనే ప్రయాణానికి అనుమతి ఉంటుందని వివిధ కారణాలతో మాతో లదాక్ రావడానికి ఉత్సాహం చూపలేదు. మేము మాత్రం ఈ టూర్ ఎలా అయినా వెళ్ళాలనే దృఢ నిశ్చయంతో ప్రయాణానికి సన్నాహాలు మొదలు పెట్టాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఒకసారి ఈ

ప్రాంత విశేషాలను, ఈ ప్రాంతాలు దర్శించిన యాత్రికుల అనుభవాలు కొంత ఉపయోగపడతాయని

వివరాలు సేకరించడం మొదలు పెట్టాం.

మొట్టమొదటగా ఈ ప్రాంతంలో కొంతకాలం పనిచేసిన ఒక డాక్టర్ మిత్రున్ని సంప్రదించి మేం లడక్ వెళ్తున్న విషయం చెప్పగానే చాలా పెద్ద సాహసయాత్ర చేయబోతున్నావ్ అంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ప్రోత్సహించి, అక్కడ పరిస్థితులను, అసౌకర్యంగా ఉన్నప్పుడు ఏ సమయాల్లో ఏం మందులు అవసరమో వివరంగా చెప్పడంతో నేను నా డైరీలో వాటికి సంబంధించిన వివరాలను నోట్ చేసుకుని భద్రపరచుకున్నా. దీనితో పాటు యాత్రలో సందర్శించబోయే ప్రాంతాలు, వాటికి సంభంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంతో మునిగిపోయా.

ఇక లడాక్ వివరాల్లోకి వెళ్తే, వరల్డ్ రూఫ్ టాప్ గా పరిగణించే లడక్ ఒక సుందరమైన ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం. ముఖ్యంగా జూన్, జులై మాసాల్లో అయితే లడక్ లోని వివిధ ప్రాంతాలు సందర్శించుకోవడానికి చాలా మంది యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా యువతీ యువకులు వారి సైకిల్ మోటార్లపై సాహసోపేతంగా ప్రయాణించడానికి ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతం ఐన కార్డుంగ్ లాపాస్ ప్రాంతానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

ఈ ప్రాంతంలో విహరించిన వారం రోజులు ప్రకృతిలో లీనమయినట్టుగా జీవితం సాగిపోయింది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అన్నట్టు ఉండే కరెంటు. ఎప్పుడో ఒక సారికాని కనెక్ట్ కాని ఫోన్, స్వచ్ఛంగా తెల్లగా మెర్సిపోతున్న మంచు కొండలు, గడ్డకట్టి చలిగాలులు, ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు, కిలోమీటర్ల కొద్ది కానరాని మనుషులు, కుడివైపు అంతా కారకోరం పాస్ పర్వత శిఖరాలు, పర్వతాలపై పడి కర్గి పోతున్న మంచు తాలుకు నీటితో లోయలోకి ప్రవాహంలా దూసుకపోతున్న సయోక్ నది ఎడమవైపు ఎంతో ఇరుకైన రహదారి మనని ఎంతో ఆహ్లాదంలో, ఆనందంలో ముంచెత్తుతాయి.

లడక్ ప్రాంతంలో గల లెహ్ ప్రాంతం సముద్రమట్టానికి 11562 అడుగుల ఎత్తున ఉండే అందమైన ప్రదేశం ఇది. పురాతన చరిత్ర పరిశీలిస్తే మొదటి శతాబ్దంలో కుషాన్ చక్రవర్తి కాలంలోనే లడక్ నుండి ఇండియాకు చైనా ద్వారా వ్యాపార సంబంధాలు ఉండేవని దీన్ని సిల్క్ రోడ్ గా వ్యవహరించారని ఇండియాలోని చివరి గ్రామమైన తు తు అనే గ్రామ ప్రాంతం ద్వారా సిల్క్ రూట్ గా ప్రాముఖ్యత వహించిన ప్రాంతం ఇప్పటికి దర్శనీయ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది.

పర్యావరణ మార్పులు, మామూలు వర్షపాతం కంటే అత్యధిక వర్షం పడ్తున్న ప్రాంతాల్లోని 100 ప్రాంతాల్లో ఈ పాతనగరమైన లేహ్ కూడ ఉంది. యాత్రా ప్రదేశమవడం చేతను, జనాభా అధికంగా పెరగడం వల్ల నగర విస్తరణ లేకపోవడం మూలాన, అత్యధిక వర్షపాతం వల్ల వచ్చే ఆకస్మిక వరదలూ ఈ ప్రాంత సురక్షితాన్ని ప్రశ్నిస్తున్నాయి.

లడక్ అంటేనే ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ గా పరిగణిస్తారు. ఈ మౌంటేన్ రేంజెస్ సముద్రమట్టానికి 16400 అడుగుల నుండి 22000 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇవి దాదాపు 45 మిలియన్ సంవత్సరాల క్రితం తయారు అయినట్టుగా పరిగణిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని కారకోరం పాస్ శిఖరాలు సముద్రమట్టానికి 18875 అడుగుల ఎత్తు నుండి 25171 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.

ప్రపంచంలోనే అతి ఎత్తైన మోటరబుల్ రోడ్ ఈ ప్రాంతంలోనే ఉంది. మౌంటేన్ బైకింగ్ కు ఎంతో ప్రాముఖ్యంగా ఉండే ఈ రోడ్డు సముద్ర మట్టానికి 17893 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాన్ని కర్ దుంగ్ లా పాస్ గా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం బ్రిడ్జిల నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఈ ప్రాంతంలోనే జాన్ స్కర్ నది మరియు ఇండస్ నది రెండు కల్సి ఇండస్ నదిగా మారి పాకిస్తాన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.

దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద పార్కైన హెర్నీస్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంది.

వారం రోజుల లడక్ యాత్ర ఆ రోజు ఉదయం నాలుగు గంటలలో ప్రారంభమయింది. ప్రొద్దున్నే 7 గం||లకు ఫ్లైట్ ద్వారా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుండి లేహ్ ఎయిర్ పోర్టుకి మద్యాహ్నం వరకు వెళ్ళడం జరిగింది. లేహ్ ఎయిర్ పోర్టులో దిగగానే అతి ఎత్తైన ప్రదేశం అవడం మూలాన హై ఆల్టిట్యూడ్ సిక్ నెస్ వచ్చేసిందా అనే మానసిక వత్తిడి ఫీల్ అవడం కూడా జర్గి పోయింది. ఏదో ఒక అనిర్వచనీయమయిన భయం ఆవహించి ఎంత తొందరగా రూంకి వెళ్ళి, చలికి తట్టుకునేలా నూతన వాతావరణానికి, హై ఆల్ ట్ట్యూడ్ కి శరీరం తట్టుకునేలా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి వెహికిల్ లో కూర్చున్నాం. థెర్మల్ తో సహా 4 లేయర్స్ తో డ్రెస్ వేసుకున్నా ఇంకా చలిగా ఉండడంతో ఒక్కసారిగా మిత్రులు లడక్ ప్రయాణమంటే ఎందుకు భయపడ్డారో అర్థం అయింది. ఈ ప్రాంతం చూడాలనే ఉత్సుకత ఎంతో ఉన్నా, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాక ఒక విధమైన నిర్వేదం, భయం ఆవహించాయి. హై ఆల్ టైట్యు లో తట్టుకోవడం కోసం మా డాక్టర్ సూచించిన డయామోక్స్ 250 ఆ రోజు విమానంలో వేసుకోవడంతో దాని పనితనం కొంచెం కొంచెంగా తెలిసొచ్చింది. సహచర తోటి ప్రయాణీకుల్లో ఉన్న తలనొప్పి, అసస్వత మాలో చాలా తక్కువ

శాంతి స్థూపం

మోతాదులో ఉన్నట్లు ఫీల్ అయ్యాం . మాకు కేటాయించిన రూంకి వెళ్ళి వేడివేడిగా టీ త్రాగి, తోటి యాత్రికులతో కాసేపు కబుర్లతో గడిపాము. అప్పటికి కొంత యాంగ్లైంటీ తగ్గింది. హోటల్ లో సర్వ్ చేసిన వేడివేడి ఫుడ్ తినేప్పటికి కొంచెం కొంచెం నార్మల్ స్థితికి వచ్చినట్టుగా రిలాక్స్ అవడం జర్గి, ఆ రోజు క్రొత్త క్రొత్త అనుభూతులతో రాత్రంతా చలితోనే గడిచిపోయింది.

ఆ తర్వాత రోజు ప్రొద్దునే బ్రేక్ ఫాస్ట్ చేసి ఆ రోజు దర్శనీయ ప్రాంతాల్లో మొదటిదైన ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన శాంతిస్తూపం దర్శించడం జరిగింది. ఇక్కడ సూర్యోదయ, సూర్యాస్తమయలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇది 11841 అడుగుల ఎత్తులో చాన్స్పా అనే కొండపై, చంద్ స్పా అనే గ్రామంలో ఉన్న ఒక బౌద్ధ తెల్లని స్తూపం. 1991లో జపనీస్ బౌద్ధ బిష్ణువు గ్యామియో నకమురా చే నిర్మింపబడి 14వ దలైలామ టెస్టిన్ గ్యాట్సో ద్వారా ఆగష్టులో ప్రతిష్టించబడింది.

రెండవ ప్రపంచ యుద్ధంలో హీరోషిమా, నాగసాకి పై జర్గిన అణుబాంబుల దాడిలో దాదాపు 150000 సామాన్య ప్రజలు మరణించాక జపానీ బుద్ధిప్ట్ మాంకు నిచిదత్యుపూజి ఆధ్వర్యంలో ప్రపంచశాంతి కోసం దాదాపు 80 పీస్ పగోడాలు ప్రపంచవ్యాప్తంగా నిర్మించడం జర్గింది. ఇందులో భాగంగా నిర్మించిందే ఈ శాంతిస్తూపం.

ప్రపంచశాంతి మరియు ప్రపంచ శ్రేయస్సులను ప్రోత్సహించడానికి బౌద్ధమతం యొక్క 2500 సంవత్సరాల జ్ఞాపకార్థం దీని నిర్మాణం ఏప్రిల్ 1983లో ప్రారంభమైంది. శాంతి స్థూపం రెండు అంతస్తుల నిర్మాణంగా కల్గి ఉండి మొదటి అంతస్తులో బంగారు బుద్ధ విగ్రహ చిత్రం, రెండో అంతస్తులో బుద్ధుని పుట్టుక, ధ్యానం మరియు మహా నిర్యాణం చిత్రాలు దర్శనమిస్తాయి.

ప్రపంచ శాంతి కోసం నిర్మించిన అద్భుత కట్టడం శాంతిస్థూపం దర్శించుకున్న జ్ఞాపకాలతో ఇంకో ప్రాచుర్య పర్యాటక స్థలం అయిన లెహ్ ప్యాలెస్ దర్శించుకోవడం కోసం వెళ్ళాం. లేహ్ ప్యాలేస్ గా పిలువబడే లాచన్ ఫాల్కర్ ప్యాలెస్ 1645 సం||లో సెంగే న్యాంగన్ నిర్మించిన పూర్వపు టిబెట్ స్టైల్ లోని రాజభవనం. 19వ శతాబ్దంలో డోగ్రా సేనలు లడఖ్ ని తమ ఆధీనంలోకి తీసుకొనే వరకు ఈ రాజభవనం నివాస యోగ్యంగా ఉండేదని చెప్తారు, 9 అంతస్తులుగా ఉన్న ఈ రాజభవనంలో 9వ అంతస్తులో రాజకుటుంబ వసతిగా ఉండేది. క్రింది అంతస్తులో రాజకుటుంబ సహాయకులు, మధ్య అంతస్తులో రాజకీయ ఇతర కార్యకలాపాలకు ఉపయోగపడేలా వివిధ సమావేశ మందిరాలు ఉన్నాయి. ఆకస్మికంగా వచ్చే వరదలను, భూకంపాలను తట్టుకునేలా ఉన్న ఈ మట్టి/రాతిలో ఉన్న నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. చాలా వరకు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో అవసానదశలో ఉన్న ఈ నిర్మాణంలో 450 సం||ల వరకు పూర్వం చిత్రించిన చిత్రాలు మనం దర్శించుకోవచ్చు. మొత్తం 9 అంతస్తులు ఎక్కి చూడ్డానికి చాలా మంది యాత్రికులు ఉత్సాహంతో ప్రయత్నించారు. ఇరుకుగా ఉన్న వుడెన్ స్టెప్స్, అంతస్తు, అంతస్తు ఎక్కటంలో ఉండే అలసట, ఎక్కువగా చలిగా ఉండటమూ కొంత నిరుత్సాహం కల్గించినా, 9వ అంతస్తు పై భాగంలోకి వెళ్ళాక ఎంతో అద్భుతంగా కన్పిస్తుంది ఈ ప్యాలెస్. అక్కడ నుంచి చుట్టూ కనుచూపు మేరలో కన్పిస్తున్న నివాసాలు, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది.

లేహ్ ప్యాలేస్ నుండి ఎంతో ప్రాముఖ్యం గలది, తప్పని సరిగా చూడాల్సిన ప్రాంతం అయిన “హల్ ఆఫ్ ఫేం”కి వెళ్ళడం జర్గింది. ఇండో పాక్ యుద్ధంలో ఇండియాను రక్షించడానికి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర భారత సైనికుల

జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మ్యూజియం లే కార్గిల్ రోడ్ ‘లేహ్‘ నగరానికి 4 కి.మీ. దూరంలో ఉంటుంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఉపయోగించిన వివిధ రకాల ఆయుధాలు, స్వాధీన పర్చుకున్న ఆయుధాలు,

సియాచిన్ ప్రాంతంలో భారత సైన్యం ఉపయోగించిన వివిధ రకాల దుస్తులు, మంచులో కర్తవ్య నిర్వహణలో ఉన్న సైనికుల చిత్రాలు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ చిత్రాలు, దేశాన్ని కాపాడడం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికుల చిత్రాలు మనకు ఎంతో ఉత్తేజాన్ని కల్గించడమే కాకుండా సైనికులు చేస్తున్న త్యాగాలకు జోహార్లు అర్పించేలా మనసంతా దేశభక్తితో నిండిపోతుంది.

మూడవ రోజు ప్రయాణం ఎంతో ఉత్సుకత, ఉత్సాహంతో ప్రారంభమైంది. ప్రయాణం ఆద్యంతమూ హాలివుడ్ సినిమాల్లోనూ మెకనాస్ గోల్డ్ చిత్రాల్లోను చూపించిన లొకేషన్స్ మాదిరిగా ఎత్తైన కొండలు, లోతైన లోయలూ, ఆ ప్రాంతమంతా ప్రకృతి తప్ప ఎవరూ లేనట్టుగా ఎంతో అద్భుతమయిన రోడ్లపై సాగింది మాప్రయాణం.

ఇక ఈ కర్ దుంగ్ లా పాస్ వివరాల్లోకి వెళ్తే ఈ మార్గాన్ని 1976లో ఆర్మీవారు సియాచిన్ ప్రాంతంలో పహారా కాచే సైనికులకు నిత్యావసర వస్తువులు, ఆయుధాలు చేరవేయడం కోసం నిర్మించబడిందని చెప్తారు. 1988 వరకు ఆర్మీ అవసరాలకు మాత్రమే దీన్ని వాడేవారు. ఆ తర్వాత యాత్రికులను కూడా అనుమతిస్తున్నారు. సంవత్సరంలో 9 నెలలు మంచుతో కప్పబడి ఉండే ఈ రోడ్డు కేవలం మూడు నెలలు మాత్రమే రహదారిగా వాడబడుతూ ఉంటుంది. కారకోరం శిఖరాలు ఒకదానితో ఒకటి పోటీ పడున్నావా అనే విధంగా ఆకాశం తాకుతున్నట్టుగా ఎత్తైన శిఖరాలు, కుడివైపు, లోతు కన్పించనంతగా లోయ, లోయలో మంచు కర్గి నీరు పారుతున్న దృశ్యాలు, ఎడమవైపు క్షణాల్లో ఆకాశంలో మారుతున్న అందమైన దృశ్యాలు చూస్తుంటె, లడక్ యాత్రికులకు ఎందుకు స్వర్గధామంగా విలసిల్లుతోందో ఆ ప్రదేశం చూడాలనే తాపత్రయం ప్రభలంగా ఎందుకు అన్పిస్తుందో అనుభవంలోకి వచ్చింది. కొంత దూరం వెళ్ళేటప్పటికి మంచు విపరీతంగా కురవడంతో కొండలన్ని మంచుదుప్పటి కప్పుకున్నట్టుగా ఉన్న చిత్రం చూశాక మానసికంగా ఎంతో తృప్తిగా, అనిర్వచనీయమైన ఆనందం తొణికిసలాడింది.

ఎత్తైన రోడ్డు, పైకి ఎక్కలేక, మంచులో కూరుకుపోయిన కార్లు, వాటిని తోయడానికి దిగిన లోకల్ డ్రైవర్లతో మొత్తం కార్ల కాన్వాయ్ ఆగిపోయింది. అందరూ తమ తమ కార్లలోనుంచి దిగి మంచుతో ఆడుకొనే దృష్యాలు, ఫోటోలతో, సెల్ఫీలతో ఆ ప్రదేశమంతా యాత్రికులతో నిండిపోయింది.

ప్రకృతిని, శిఖరాలను, లోయలో పారుతున్న నదిని, ఆకాశంలో మారుతున్న మేఘాలను చూస్తూ రెండు గంటల ప్రయాణం కొనసాగాక ప్రపంచంలోని ఎత్తైన కదుం యో పాస్ 18000 అడుగుల మైలురాయి రానే వచ్చింది. మొత్తం అన్ని కార్లు ఆగాక అందులోని యాత్రికులు క్రిందకు దిగి ఆ మైలురాయి వద్ద ఫోటోల కోసం వరుసలో నిలబడ్డారు.

నాకైతే ఉత్సాహంతో పాటు మానసిక సంఘర్షణ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ప్రపంచంలో ఎత్తైన మోటరబుల్ రోడ్ పైన ప్రయాణం చేస్తున్న విషయం సాహసోపేతంగా ఉంటే ఆప్రాంతంలో కొంచెం సేపైనా గడపాలంటె మరి అక్కడ ఉండే ఆక్సిజన్ మనకు సరిపోతుందా, ఇలాంటి ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు వస్తే ఎదుర్కోవడం ఎలా? మా వాహనంలో అయితే ఆక్సిజన్ సిలిండర్ ఉన్నాయి. కాని పార్కింగ్ ప్లేస్ నుండి కర్ దుంగ్ లా పాస్ ఓ మూడు, నాలుగు వందల ఫీట్ల దూరంలో ఉంటుంది. ఇలా మనసులో పరిపరివిధాలుగా ఆలోచనలు సుడితిర్గుతుంటే ఎలాగు ధైర్యం చేసి ఇంత దూరం వచ్చాం. అంటూ ధైర్యం చేసి కర్ దుంగ్ లా పాస్ మైల్ స్టోన్ దగ్గర ఫోటోలకు పోజులిచ్చి మరికొంత సేపు గడిపాంజ అప్పటికి మాత్రం జీవిత ధ్యేయం నెరవేరినట్టుగా, ఒక గొప్ప అనుభూతిని స్వంతం చేసుకున్న ఆనందంతో పాటు, గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్ సంపాదించినంత ఫీల్ అయితే వచ్చింది.

దారిలో సయాక్ వార్ మెమోరియల్స్ దర్శించుకొని సియాచిన్ ప్రాంతంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు అంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నాం.

ఆగుతూ, ఆగుతూ వెళ్ళడం మూలాన ప్రయాణం ఆలస్యం అయి భోజనాల సమయం కూడా దాటిపోయింది. సాయంత్రం నాలుగంటల సమయంలో డిక్ సిట్ మోనాస్టీ చూడ్డానికి వెళ్ళాం.

మోనాస్టీ పరిసర ప్రాంతం వెళ్ళెవరకు విపరీతమయిన వర్షం ప్రారంభమయింది. లడక్ ప్రాంతం అంతా వాతావరణం విషయంలో ఏ నిమిషానికి ఏం జరుగునో’ అన్నట్లుగా ఉంటుంది. కొద్దిసేపు విపరీతంగా ఎండ, కొంతసేపటికి వర్షం, కొంతసేపటికి విపరీతమయిన చలి ఈ విధంగా వాతావరణ పరిస్థితులు ఎప్పుడు మారుతూ ఉంటాయి.

ఈ డిక్ సిట్ మోనాస్టీ 10315 అడుగుల ఎత్తులో 14వ శతాబ్దంలో చాంగ్ జెమ్ తెసరాజ్ జాంగో స్థాపించారు. ఈ మఠం సమీపంలో 106 అడుగుల ఎత్తైన మైత్రేయ బుద్ధ విగ్రహం సయాక్ నదికి ఎదురుగా నుబ్రావ్యాలీ వైపు ఉంటుంది. ఈ విగ్రహం నిర్మాణం ఏప్రిల్ 2006లో ప్రారంభించబడింది. దీనిని దలైలామ 25 జులై 2010న ప్రతిష్టించారు. మూడు ప్రధాన కారణాలతో దీనిని నిర్మించారని చెప్తారు. డిక్ సిట్ విలేజ్ రక్షణ, ప్రక్క దేశాలతో తదుపరి యుద్ధాన్ని నివారించడం మరియు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడం. నుబ్రా వ్యాలి, పరిసర ప్రాంతాలలో చలికాలంలో మంచుతో పూర్తిగా కప్పబడ్డాయి. ఈ సమయంలో ప్రజలకు ఈ మఠంలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఈ మఠంలో మంగోలియన్ మరియు టిబెటన్ గ్రంధాలు కూడా ఉన్నాయి.

డిక్ సిట్ మోనాస్టీ నుండి అతి ఎత్తైన ప్రదేశంలో అతి చల్లని ఎడారిగా పిలవబడే హుందర్ గ్రామంలోని ఇసుక తిన్నెలకు వెళ్ళాం. మంగోలియా నుండి వచ్చి స్థిరపడిన రెండు మూపురాల ఒంటెల పై ప్రయాణించడం ఇక్కడకు వచ్చిన యాత్రికుల సరదా. మేం కూడా ఈ ఒంటెల పై కొంతసేపు ప్రయాణించి ఈ నుబ్రాలోయలోని టెంట్స్ లో బస చేయడానికి సయూక్ నదీ తీరంలో ఉన్న మాకు కేటాయించిన టెం లోకి వెళ్ళాం.

నుబ్రావ్యాలీని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. నుబ్రా నది (సియాచిన్ నది అని కూడా పిలుస్తారు) మరియు సయోక్ నది ప్రవహించే అందమైన లోయ ప్రాంతాన్ని నుబ్రా వ్యాలీగా వ్యవహరిస్తారు. సముద్రమట్టానికి 10000 అడుగుల ఎత్తును ఉన్న ఈ ప్రాంతంలో రెండు రాత్రులు టెంట్ లో ఉండటం జరిగింది. ఇది ప్యాంగాంగ్ సో లేక్ వద్ద గడపబోయే ఒక రాత్రికి ప్రిపరేటివ్ గా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా నిర్మింపబడ్డ ఈ టెంట్ లో ఒక వరండా, ఒక బెడ్ రూం, ఒక రెస్ట్ రూంతో కల్సి బట్టతో తయారు చేయబడిన ఈ టెంట్ లో, మనం లోపలికి వెళ్ళాక జిప్ తో అన్ని రూములు మూయాల్సి ఉంటుంది. రాత్రంతా విపరీతంగా చలి వల్ల నిద్రలేమిగా ఉన్నా ఒక క్రొత్త అనుభవంతో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి పొందగల్గాం.

మరుసటి రోజు ప్రొద్దునే బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ఇండియా పాకిస్థాన్ బార్డర్ లోని చివరి గ్రామమైన తురు అనే గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళాం. రెండు గంటల ప్రయాణం తర్వాత హిమాలయా ప్రాంతంలోని కారకోరం రేంజ్ లోని తు తు గ్రామంలో ప్రవేశించాం. ఈ గ్రామం నుబ్రోవ్యాలీలోని సయోక్ నదీ తీర ప్రాంతంలో ఉంది. ఇది ఒకప్పుడు బలిస్తాన్ చక్రవర్తి రాజ్యంలో ఉండే ఈ గ్రామం 13వ శతాబ్దం వరకు బుద్ధిప్ట్ రీజియన్ గా ఉండేది. ఇది 1971 వరకు పాకిస్తాన్ ప్రాంతంలోని కాశ్మీరీ భాగంలో ఉండేది. ఇక్కడ ఉన్న మోనా’ నుండి మౌంట్ పార్క్ కె2ను చూడొచ్చు.

ఎత్తయిన బుద్ధ విగ్రహం

బల్టీ  మ్యూజియంలో 400 సంవత్సరాల క్రితం వాడిన వస్తువులను మనం దర్శించవచ్చు. నేచురల్ కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో ఫ్రెష్ గా వున్న స్టాక్స్ ను మనం గమనించవచ్చు. 2.2 కి.మీ. దూరంలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమించిన గిల్ గేట్ – బల్టిస్తాన్ బార్డర్ ఫెన్ సింగ్ ని టెలిస్కోప్ ద్వారా చూసాం. అప్రికాట్, వాల్ నట్ ఇక్కడ సమృద్ధిగా లభిస్తాయి. 5000 సం||ల క్రితం నిర్మించిన బో క్రాఫోర్ట్ ని యాంగ్బో డైనాస్టీకి సంబంధించిన షయాక్ నదీ తీర ప్రాంతంలో ఉన్న కోట అవశేషాలను సమయాభావం వల్ల చూడలేకపోయాం. తిరుగు ప్రయాణం చేసి హుందర్ ప్రాంతంలోని మా అతిథి గృహమైన టెంట్ కి వెళ్ళాం. ఆరోజు ప్రత్యేక ఆకర్షణగా స్థానిక మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లడాక్ గ్రామీణ యువతులు నిర్వహించిన నృత్య కార్యక్రమాల్లో పాల్గొని భోజనం తర్వాత రిలాక్ అయ్యాం .

ఆ మరుసటి రోజు హుందర్ గ్రామం నుండి ప్యాంగాంగ్ సో సరస్సుకి దాదాపు 274 కి.మీ. 8 గం||ల ప్రయాణం చేసి, సాయంత్రం 5 గం||లకి చేరుకున్నాం.

2017 ఆగష్టులో ప్యాంగాంగ్ సో సమీపంలో చైనా | భారత దళాలు పరస్పరం రాళ్ళు విసురుకోవడం, 2020 మే 5-6 తారీఖున సుమారు 250 భారతీయ, చైనా దళాలు ముఖాముఖి తలపడడంతో ప్యాంగాంగ్ సో సరస్సు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది.

సముద్రమట్టానికి 13862 అడుగుల ఎత్తున ఉండే ఈ సరస్సు అంతర్టీనంగా త్యోనాక్, రమ్ తో – జంట సరస్సులు, న్యాక్ స్సో అనే ఐదు ఉప సరస్సులతో మిళితమై ఉంటుంది. ఈ సరస్సు 134 కి.మీ. పొడవు, 5 మీటర్ల గరిష్ట – 3.1 మీటర్ల వెడల్పు కనిష్టంగా ఉండి 50% శాంతం చైనా భూభాగంలో, 40% ఇండియా భూభాగంలో 10% రెండు దేశాల పరిధిలో ఉన్నది. ఇది చలికాలంలో పూర్తిగా గడ్డకట్టబడి ఉండి వేసవికాలంలో మాత్రం హిమాలయ శిఖరాలను

ప్రతిబింభించే విధంగా స్వచ్ఛంగా ఉన్న నీరు, ఏడు వివిధ రంగుల్లో ఉండి కొన్ని ప్రాంతాల్లో ఫోటో-6 అడుగు భాగం స్వచ్ఛంగా కన్పించేలా ఉంటుంది. ప్రకృతిలో ఉండే స్వచ్ఛదనం, రాత్రిపూట ఆకాశంలోని

నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ జీవితంలో మనం ఎప్పుడూ చూడని క్రొత్త ప్రపంచం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మేము మాత్రం విపరీతంగా చలి ఉన్నా మా రూంకి ఉన్న గ్లాస్

డోర్ సహాయంతో ఆకాశం అంతా పరుచుకొని ఉన్నట్లున్న నక్షత్రాలను తనవి తీరా చూసి ఆనందించాం. మాటలకు, రాతలకు అందని అనిర్వచనీయమైన ఆనందం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. లే లో గడిపిన రెండు రోజులు నుబ్రావ్యాలీలోని హుందర్లో గడిపిన అనుభవంతో ప్యాంగాంగ్ సోలోని ఒక రాత్రి

గడపడానికి ఎంతో ఉపయోగపడింది. హై ఆల్టిట్యూడ్ సిక్ నెస్ దాని పర్యావసనాలు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా దాని వల్ల వచ్చే సమస్యలు, అతి కష్టంగానైనా అందుబాటులో దొరకని వైద్యులు ఇవన్నీ కలసి మానసిక ధైర్యం ఈ సాహసయాత్రకు ఎంతో ఉపయోగపడతాయి. ఉదయం ప్యాంగాంగ్ సో సరస్సు మీదుగా వస్తున్న సూర్యోదయ చిత్రం ఎంతో అద్భుతంగా అనిపించింది.

ఈ లేక్ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ ఊసరవెల్లిలా ఈ లేక్ లోని నీటి రంగు మారుతూ ఉంటుంది. నీటి అడుగుభాగం కూడా స్వచ్ఛంగా కన్పించేలా ఉంటుంది. ఇది -30 డిగ్రీల నుండి -10 డిగ్రీల వద్ద గడ్డకట్టబడి ఉండి చలికాలంలో అనేక రకమైన పక్షులను ఆకర్షిస్తుంది. గడ్డకట్టిన లేక్ లో నిర్వహించబడే ట్రెక్కింగ్ ఇక్కడ ప్రత్యేకత. మంచు చిరుతలు ఉండే ఒకే ఒక్క ప్రదేశం లడక్ ఈ లేక్ చలికాలంలో పూర్తిగా గడ్డకట్టి ఉంటుంది.

ఆ మర్నాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని యాత్ర కొనసాగింపుగా ఆ చివరి రోజు ఫోటో-7 సాహసయాత్ర మళ్ళీ కొనసాగింది. తిరుగు ప్రయాణం 150 కి.మీ దూరం ప్రపంచంలోనే రెండో

ఎత్తైన ప్రదేశమైన చాంగ్లాపాస్ 17857 అడుగుల ఎత్తున గల ఈ ప్రాంతంలో చాలా వరకు ల్యాండ్ స్టెడ్స్ జరగడం మూలాన డ్యామేజి అయిన రోడ్లతోను, విపరీతంగా మంచుపడి వాటి ప్రవాహంతో కొట్టుకుపోయిన రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణంవల్ల ప్రయాణం ఆగుతూ, సాగుతూ సాగింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఉద్యోగులు అంత చలిలోను, నిరంతరం శ్రమిస్తూ రోడ్ల నిర్మాణానికి, యాత్రికుల సౌకర్యం కోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తే వాళ్ళ త్యాగ నిరతికి మనసులోనే జోహార్లు సమర్పించుకోవడం జరిగింది.

దాదాపు 6 గం||ల సాహసయాత్ర ముగించుకొని, లేప్లో ఇంకా చూడాల్సిన షేప్యాలెస్లోకి ప్రవేశించాం. దీన్ని 10వ శతాబ్దంలో ల్యాచెన్ పాల్గగాన్ అనే బుద్ధ గురువు నిర్మించారు ఇది లేహ్ సిటికి 15 కి.మీ దూరంగా ఉన్న లేహ్ – మనాలి రోడ్డులో 11204 అడుగుల ఎత్తులో ఉంది. లడక్ కి గతంలో వేసవికాలంలో క్యాపిటల్ గా ఉన్న ఈ ప్రాంతంలో బుద్ధుని అవతారమైన షాక్యముని బుద్ధ రెండవ అతిపెద్ద స్థూపం 39 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ అత్యంత ఎత్తుపైన ఉన్న ఈ ప్యాలెస్ పై భాగం నుండి చూస్తె చుట్టు ప్రక్క సింధునది ప్రాంతాలు ఎంతో అందంగా కన్పించి టూరిస్ట్ స్పాట్ లాగా వెలుగొందుచున్నది. షాక్యముని బుద్ధస్థూపం దర్శించుకొని అక్కడి నుండి లేహ్ ప్రాంతంలోని చివరి టూరిస్ట్ ప్రాంతమైన తిక్ సె మోనా’ దర్శించుకోవడానికి వెళ్ళాం.

థిక్ సె మోనాస్తి లడక్ లోని అతి పెద్ద మానాస్టీల్లో ఒకటి. ఇది 11800 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాదాపు 12 అంతస్తులుగా ఉన్న ఈ మోనా’ పైకి ఎక్కడానికి కొంత ఆయాసపడ్డాం. ఎందుకంటే ఉదయం నుండి నిరంతరంగా ప్రయాణం చేయడం, చలీ ఇబ్బంది పెట్టాయి. ఈ 49 అడుగుల ఎత్తైన మైత్రేయ బుద్ధ విగ్రహం. 1970లో 14 దలైలామాచే ప్రారంభించబడ్డ ఈ రెండంతస్తుల విగ్రహంలో అతి ముఖ్య ఆకర్షణ.

చివరిదైన థిక్ సె మోనాస్టీ దర్శించుకొని లేహ్ లోని మా హోటల్ కి చేరుకొని మరుసటి రోజు తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యాం.

మరుసటి రోజు ఉదయం గడిచిన వారం రోజుల యాత్ర తాలూకు జ్ఞాపకాలతో అందరికీ వీడ్కోలు పల్కుతూ, ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాం. మధ్యాహ్నం వరకు నిరీక్షించినా ఆరోజు రావలసిన ఫ్లైట్ క్యాన్సిల్ అవడం మూలాన, (వాతావరణ పరిస్థితులు అని కొందరంటె, సాంకేతిక కారణాలు అని మరికొందరు చెప్పారు) మళ్ళీ తిరిగి మా హోటల్ కి వెళ్ళి ఆ మరుసటి రోజు ప్రయాణంతో మా లడయాత్ర సుసంపన్నమైంది.

జీవితంలో అత్యద్భుతమైన సాహసయాత్రగా, చిరస్మరణీయ జ్ఞాపకాలతో మాయాత్ర ముగిసింది.

August 15, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

జొన్న రొట్టెలు “కథ

by Butam Mutyalu August 15, 2022
written by Butam Mutyalu

వానాకాలపు సాయంత్రం మలిసంజపొద్దు పడమట కొండల మాటున జారుకుంటుంది. మస్క మసకగా చీకటి ముసురుకుంటుంది. చెట్టు, పుట్ట, గట్టు, కొండలు గుట్టలు అనక ఊరు, వాడ నల్లని కాటుకమల్లే చీకటి దుప్పటి కప్పుకుంటున్నాయి అప్చిపటికే చినుకులు రాలి రోడ్డంతా తడిసిముద్పోదగయిపోయి చిత్తడి చిత్తడిగా మారింది. అటు పడమటి దాపున సరిహద్దుగా ఎత్తైన కొండల శిఖరాలుగా కాపురాలు గుట్ట అంచు వెంబడి దూరంగా విసిరేసినట్టున్న నల్లగొండలోని జీవివారిగూడెం రోడ్డు బాటంతా వచ్చిపోయేవారితో రద్దీగా ఉంది ఆ బస్టాపు మూలమలుపు తిరిగితే నల్లతాసులా పరుచుకునే వారిగూడానికి బాట చాపుతుంది 

    అసుంట ఆంజనేయస్వామి గుడి బాటకు ఇటు అటుగా ఇద్దరు ముగ్గురు లంబాడ లచ్చువమ్మలు బాటకు పక్కెంట కట్టెలు పొయ్యిలు రాజేసుకుంటు పొయ్యి ముందు సేదతీరిండ్రు పొయ్యిలో మంట రాజుకుంటుంది పొయ్యి మీద పెంక వేడెక్కుతుంది పొయ్యి చుట్టూత రక్షణ కవచంలా నాపరాళ్ళు మూడువైపులా అమర్చి ఉన్నాయి పొయ్యి ముందు ఆమెకు ఒకవైపు ఎండు కట్టెలు కొన్ని, చేతులో ఊదురుగొట్టంతో ఊపిరి బిగబట్టి ఊదుతూ నిప్పు రాజేస్తుంది ఇటుముందు తాంబాలంలా ( బేషన్ గిన్నే ) ఇంకో పక్క కాల్చిన రొట్టెలు వేడి చల్లారకుండా ఉండేందుకు హాట్ బాక్స్. బేషన్లో పిసికి ముద్ద చేసిన పిండి  

పక్కెంట జగ్గులో నీళ్ళు , కలపని పొడిపిండి, పొడిపిండిని పీటపై చల్లుతూ పిసికిన పిండి ముద్ద తీసుకొని ఒకచేత పట్టి మరోచేత ఒత్తుతూ అద్దుతూ పీట నిండారగా చేతితో రొట్టెను సాగదీస్తూ నిండు సందమామలా రొట్టెకు రూపమిస్తుంది

   యథాలాపంగా వేడివేడి రొట్టెలకోసంనేను ఆమె దగ్గరికి సమీపించాను ఆమె నా వైపు ఇంతలేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ” ఎన్ని రొట్టెలు కావాలి సారు” అని తిన్నగా అన్దినది. నేను ఆమె వైపు చూస్తూ ” రెండు జొన్న రొట్టెలు ఇవ్వమ్మా” అని అన్నాను. నేను అన్న మాటను అందుకుని పీటపై అప్పటికే పచ్చి రొట్టెగా చేసిన రొట్టెను చేత తీసుకొని పొయ్యి పై మంటకు వేడెక్కుతున్న పెంక పై వేసింది. కుడి చేతిని నీటిలో ముంచి పెంకపై కాలుతున్న రొట్టెను తడి చేస్తూ ఉంది , నాలాగే రొట్టెలకు వచ్చినవారు నాకు పక్కగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఆమె దగ్వగరకు వచ్చిన గిరాకి మళ్ళి పోకుండా మంటని పెద్దది చేస్తూ త్వరగా రొట్టెను కాల్చేలా తిప్పి తిప్పి పెంకమీద వేస్తూ ఉంది , వేడికి రొట్టె అక్కడక్కడ ఉబ్బుతుంది అక్కడక్కడ కాలి నల్లగా మారిపోతూ ఉంది . ఆమె తిప్పి తిప్పి కాలుస్తూనే ఉంది. అటు ఇటు చూస్తే బజారు వీధి లైట్లు వెలుగుతూ ఉన్నాయి అక్కడక్కడ గతుకులు పడిన రోడ్డు కురిసిన వర్షానికి రంగు మారిన నీళ్ళు బురదరూపు సంతరించుకున్నాయి. పొయ్యి మంట బగబగమని మండుతూ ఉంటే ఆమె మొఖము ఆ వెలుగులో దగదగ మెరిసిపోతోంది . ఇంత పిండి ముద్ద మరొకటి తీసుకొని అప్పడంలా సాగదీస్తూ రొట్టెను చేస్తావుంది కానీ ఏదో పోగొట్టుకున్న దానిలా మొఖమంతా పాలిపోయి విచారంతో నిండిపోయింది ఆమె పక్కన ఆమెను చూస్తూ కూర్చున్న కూతురు ఆమె పనికి ఆటంకం కలిగిస్తూ ఉంది. 

 ” ఏమే పిల్ల జరట్లుండు విసిగించకూ ” అని కసురుకుంటూ అన్నదామె

” నీయమ్మ నేన్జేస్తనే ” అని బిడ్డ విసిగిస్తూ అనసాగింది.

” జర్రాగే మమ్మగాని సతాయించకు” అని బతిమాలుతున్నట్టు అన్నది.

” నీయమ్మ నేన్జేస్తేందమ్మ నన్నొదంటవు నాకు చెయ్యరాదా ఎట్ల “

“జర్రాగు రొట్టె పిండి ముద్ద సరిగ చెయ్యరాదు నీకు పీటమీద కొడితే అప్పలాగ పల్సగ రావాలి ముందు చూడు తర్వాత చేద్దువు చిత్తడిల ఎందుకొచ్చినవే మళ్ళీ వానొస్తే నేన్తడుస్త నువ్ తడుస్తవ్ , వానకు తడిస్తే సర్ది అయితది రూమ్ దగ్గర ఉండి చదువుకోపో “

“ఊకే సదువు సదువు అంటవ్ నేన్ సదవన్ పో ఈయాల సెలవు సెలవు నాడు సదవాలా “

“ఒశే పిల్ల జోలి బాగుందిగా బలె గమ్మతి చేస్తుందేంరో మాకే సదువు లేక రోడ్ల మీద కుసోని రొట్టెలమ్ముకుంటున్నం నువ్వన్న గింత సద్వుకుంటవంటే” అని గుల్గ సాగింది.

మాటలవడి పెంకమీద రొట్టె నల్లగా మాడింది ” అయ్యో అయ్యో జర్రాగు సారు రొట్టే నల్లగ అయ్యింది ఇంకోటి చేస్తా “అని

లబోదిబోమంటు కూతురి వైపు గుడ్లురిమి చూసింది చూస్తూనే పీటపై తొందరతొందరగా రొట్టెను సాగదీయసాగింది సాగదీస్తుంటే రొట్టె పర్రెలు పర్రెలు గా ఇచ్చుకుంటుంది సరిచేస్తూ సాగదీస్తుంది

” ఏమ్మా నీ కూతురా” అని నేను అనగానే

” అవును సారు , చదువుతుంది సారు , నాకొడుకు వాటర్ ఫిల్టర్ మీద ఉండు వాడు సదువు సద్వురా అంటే… సదువుకు పంగనామాలు బెట్టిండు. ” అని అంటుండగా

” ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్” మంటూ ఆమె రొమ్ములో దాగివున్న సెల్ పోన్ మోగింది. గుండెల్లో పిడుగు పడ్డట్టు ఉలికిపడి తిన్నగా తడిచేత తీసుకుంది. ఒకవైపు అసహనంతో కూడిన ఆందోళన చెందుతూనే జీరబోయిన గొంతుకతో “అలో అలో” అంటూ తడబడుతూనే పలికింది. ఆమె మాటలో వనుకు స్పష్టంగా కనిపిస్తూవుంది. మొఖంపై చెమట కమ్మింది. తను మండుతున్న పొయ్యి ని తదేకంగా చూస్తానే పెంకపై జొన్నరొట్టె ను తిరిగేయబోయింది అంతలోనే చేయికి సురుక్కున వేడితగిలి అలాగే రొట్టెను విడిచింది రొట్టె పోయ్యిలో పడి బగబగ మండుతూ నల్లగా మాడింది “ అయ్యో వోరి దేవుడా … ఇయ్యాల లేసి ఎవరి మొఖం చూస్తినిరా శని చుట్టుకున్నట్టు వున్నది అని తనను తానే నిందించుకుంటూ జర్రాగు సారు ఇంకోటి చేసి ఇస్తాను అని ఒకచేత పిండి తీసుకొని పిసుకుతూనే మరోచేత “ అలో అలో ఎవరూ? “ అని అన్నది.

“ హలో నేను “ అంటూ అవతలి గొంతు పలికింది.

“ ఆ చెప్పుండ్రి “ అని బదులు పలికింది.

“ అదేనమ్మా నీ కూతురు గురించి నేను చెప్పిన విషయం గురించి ఏమి అనుకుంటున్నారు” అంటూ అతను సావదానంగా పలికిండు. 

“ యాడియే …మీరే చెప్పుండ్రి . నేనా ఆడిమన్సిని నాకంటే మీకే బాగా తెలుసు , పిల్లల గురించి అంతా మీకు ఎర్కేనాయే మీరే ఏదో ఒకటి చెప్పుండ్రి ఏమి చేద్దామో?” అంటూ గబగబా పలికింది . పీటపై రొట్టె చేస్తూనే

“ అంతా నాకు తెలుసు అంటే ఎలాగమ్మా? మనం సావదానంగా ఒక నిర్ణయానికి వద్దాం ఏమంటవూ?” అని అతను అనగానే 

“ అదేనయా నేనా ఆడపిల్ల తల్లిని. ఏదెర్కలేనిదాన్ని. నాకా సదువు గిదువు తెల్వని దాన్ని . జర్రంత మీరే నజర్ పెట్టి నా బిడ్డ బతుకు ఆగం గాకుండా సూడాలి జల్దిన లగ్గం జేస్తే సరి” అని కట్టెవిరిచినట్టు అన్నది. 

“ అట్లా అంటే ఎట్లమ్మా? పెండ్లి పెండ్లి అని ఒకటే తొందర పెడుతున్నవ్. అట్లా గబగబ ఉర్కులాడితే ఎట్లా? ఉర్కి ఉర్కి పసుల కాస్తే కుదురుతుందా చెప్పు. ఇదిగో నేను ముందే చెప్పిన మా ఇంటికాడ పప్పన్నం తిందాం. మీ ఇంటికాడ ఎంగేజ్మెంట్ 

 చేద్దాం. అలాగే మీ ఇంటి దగ్గరనే పిల్ల, పిలగానికి లగ్గం పెట్టుకొని లగ్నపత్రిక రాయిద్దాం . మన్చిరోజు చూసుకొని మీ ఇంటిదగ్గరనే పెండ్లి చేద్దాం సరేనా, లగ్గం మీ యింటి దగ్గర చేస్తే అది మీకే మంచిది” అంటూ నింపాదిగ పలికిండు అతను 

“ సరే అట్లనే కానిద్దాం “ అని ఆమె అన్నది….

“ కానీ ఏందమ్మా, ఇంకా నేనే ఒకమెట్టు దిగివస్తే “ అంటూ కాస్తా కటువుగా పలికిండు అతడు.

“ అదికాదు బయ్యా.. పిల్లా, పిలగానికి పెండ్లి మీ యింటి దగ్గర జరుపుండ్రి. నేనా ఏదెర్కలేని ఆడిమన్సిని, అటసూత్తే పెండ్లి అన్ని ఇగురంగ చెయ్యగలనా? నాకేమన్న సదువా సాత్రమా, అసలే మగదిక్కు లేనిదాన్ని , నువు కూడ నన్నే చేసియమంటున్నవు. నీదేంబోయింది రేపు నలుగురు నన్నంటరు అడదాని పెత్తనం తమ్మల్ల దొరతనం అని వూకెనే అనలే , ఏది గింత సరిగ కుదురకున్నా వచ్చిన జనం నన్నాడిపోస్కుంటరు బయ్యా.. జర గది నువ్వే ముంగట నడ్సి పుణ్యం గట్టుకోండ్రి.” అని దీనంగా వేడుకుంటి. అయిన వుండి “ అలాగంటే ఏట్లనమ్మా , యిద్దరం కల్సి ఒకపని చేద్దాం . ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం , దసరా, దీపావళి లగ్గాలప్పుడన్న , కుదరకుంటే మళ్లి మాఘమాసం లగ్గాలప్పుడు పెండ్లికి వాయిదా వేద్దాం. అప్పుడు అందరం ప్రీగా వుంటాం కదా, ఇగపోతే నువు పిలగానికి ఇస్తానన్న కట్నం డబ్బులు యిప్పుడే ముందుగా యిస్తే అబ్బాయి ఏదేవొక యాపారం చేసుకుంటడు. వచ్చే ఎండాకాలం లగ్గాల నాటికి 

“ ఆ.. ఏందమ్మా వినిపించనట్టు మాట్లాడుతవు. “ అని అతను అన్నడు

 “ అట పతిదానికి తప్పులు తీస్తవేందయా యినవడ్డది కాని ముంగల ముంగల ఎట్ట ఇయ్యను పైసలతో పని” అని అన్ననోలేదో “ సూడమ్మా నువు ఇప్పుడు పైసలు ఇచ్చి సరేనంటే మనకు మంచిది. లేకుంటే పిలగాడు ఏదో ఒకటి చేసి కుదుర్కున్నంకనే పెండ్లి ఏమంటవు సరేనా? “ అని అనే.

 “ ఆ… ఓరిదేవుడా ఎట్టా సచ్చేది గాళ్ళ మన్సుల మర్మం ఏందోగని అంతు చిక్కుతలేదు “ అని లోలోన గొనుగుతూ బాదతో కండ్లు పిండసాగింది. చేతులున్న పోను నేల జారింది. నేలచూపులు చూస్తూ నే కొంగు మొఖానికి పెట్టుకొని బోరుమంటూ ఏడుపందుకుంది. “ ఏమయిందమ్మా” అంటూ కూతురు కాసింత ఆందోళన చెందుతూ ఆత్రుతగా అడిగింది 

….

” ఏందమ్మా ఏమైంది ఏడుస్తున్నవ్” అని ఆమె వైపు తీక్షణంగా చూస్తూ నేను అడిగిన.

ఇగో సారు నా పేరు తీత్రిబాయి

నాకు ఒక్కగానొక్క ఆడబిడ్డె , పేరు సామియా. మాది మీరంగాని తండా గా ముచ్చట ఇనుర్రి కొడుకును ఆపి పిల్లను డిగ్రీ దాక సదివిచ్చిన కాలేజు పోరల సోపతిల అది ఒక పిలగాన్ని ఇష్టపడింది మేము లంబాడ. గాళ్ళు సూదర్లట సరే పిల్ల మన్సు పడింది గదా గా ముచ్చట నా కండ్ల పడింది గాళ్ళను ఇడదీస్తందుకు నాకు మనసొప్పలే , గాళ్లను కలపాలని చూస్తున్న గా పిలగాన్ని అడిగితే ఇద్దరం ప్రేమించుకుంటున్నం పెళ్ళి చేస్కుంటం అని అన్నడు నా బిడ్డె కుద్దుగ అదే మాట పలికింది కని గా పిల్లగ్గాన్ని అయ్య గింత తేడు పెడుతుండు కిందికంటే మీదికేస్తడు మీదికంటే కిందికేస్తడు ఒక్కతీరు మనిషికాదు ఒకపాలి ఏమో “నాకు ఇష్టం లేదు గుడిల దండలు మార్చి చేపిచ్చుకో అంటడు. లేకుంటే రీస్టరు పెండ్లి చెపియ్యి అంటడు, ఇంకోపాలి పప్పన్నం తిందాము అంటడు సరే దారిలకు వచ్చిండని , పిల్లను గార్వంగ సాదుకుంటి ఉత్తగ ఎట్ల పట్టియ్యను దాన్ని ఎవరినో ఒకయ్యను జూసి పెండ్లిచేసి నాల్గిత్తులు నెత్తిన సల్లితే నా బర్వు దిగుద్ది అనుకుంటి గట్లనే మన్సుల అనుకుని పిల్లకు ఇంత ఒంటిమీదికి నల్లపూసలదంండను చేపిచ్చిన నా మెడల గుండ్లను సెడగొట్టి నా చెవుల గెంటీలు చెడగొట్టి పిల్లకు దిద్దులు బుట్టాలు చేపించిన రెక్కలు ముక్కలు చేసుకుని పైసపైస కూడబెట్టి సందేళ్ళ మాపు గీడ కూకొని జొన్న రొట్టెలు చేసి అమ్ముకుని పూట ఎల్లదీస్కుంట ఊస్నూరు పాస్నూరు చేసుకుని జర్రంత నలుగురిల నజరు గొడితట్టు తలెత్తి బతికేటట్టుగ ఉండాలని నేను చూస్తున్న , కాని నన్ను పగ్గుతూ ఇబ్బంది పెడుతుండ్రు గాళ్ళు పిల్ల ఒంటిమీదికి బంగారం పెడితే నీ పిల్లకు పెట్టుకుంటున్నవ్ అనే, సరే పిలగానికి లగ్గం కర్సులకు గిన్ని పైసలు జూస్త తియ్య అంటే నా పిలగానికి కట్నం ఇయ్యమనే, మళ్ళీ అయన ఆడిబిడ్డ కట్నం ఇయ్యమనే ఆ పిల్లగానికి ఏదో యాపారానికి నన్నే ఎగనూకమనే సరే అదులో బదులో చేసి దులుపుకుందాం అంటే ఆ ఇచ్చే డబ్బులు ముంగల ముంగల ఇయ్యమంటుండు లగ్గం తర్వాత అంటుండు. ఎట్టజెయ్య సారు …ఆయిన అత్తగారి సొమ్ము అయినట్టు ఇయ్యమంటే ఎట్లియ్యాలే సారు అదికూడ ముంగల ముంగలంటే లోకంల ఎవలన్న ఇస్తరా. నేనయుతే సూడలే సారు గిదేంపజ్జతి గతిలేని సంసారానికి గంజినీళ్ళే పాన్కం అని మేం బతుకుతుంటే ఆయిన సంపాయించి పెట్టిన ముల్లెలు వున్నట్టు ముంగల ముంగల ఇయ్యాలంట నాకు అరికాలిమంట నెత్తికెక్కింది వొచ్చిన కోపానికి కొర్కాసు వాత పెట్టాలన్నంత కోపం వుంది గని పిల్ల మొఖం సూడాల్సి వచ్చే. పిల్లను గార్వంగ సాదుకుంటి ఎట్ట జెయ్యాలే సారు… యిగ్గో

మొంచోడు మంచోడనుకుంటే మంచం కరాబు సేసిండట అట్టుంది గాయిన వాలకం , ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదంటరా . నమ్మితిరా సిద్దా అంటే ముంచితి బిడ్డా అన్నట్టుగుంది గాళ్ళ యిలవరస, 

మిరాశి హక్కు వున్నట్లు పీస దీస్కుంట అడిగిండు

పిల్ల బతుకు ఆగం గావొద్దని సుట్టాల దాపుకు జేరుదామంటే 

సెడి చెల్లెలు యింటికి అలిగి అత్తగారింటికి పోగుడదాయే ఎట్ట జెయను సారు

” అంటూ ఎగదన్నుకొచ్చే దుఃఖాన్ని పైటకొంగుతో తూడ్సుకోసాగింది.

“అమ్మా మరేం గాబరా పడకు నీ కూతురిపై నీకు మమకారం ఉంటది సహజం , విషయం సాగతీత మంచిది కాదు దీని పరిష్కారానికి వెంటనే వెళ్ళి పోలీసులను కలువు ” అని నేను అనగానే అలా అన్నానో లేదో సరసర అక్కడ పని పక్కన పెట్టి పిల్లను వెంటబెట్టుకొని ” దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కించే దారి చూపు” అని ఆమె మతిలో ప్రార్ధించింది శుభ సూచకంగా దూరాన వున్న గుడి లో గంట మోగిన సప్పుడు వినిపించింది . ఆమె తన కూతురు ను తోడు గా వెంటబెట్టుకొని ముందుకు సాగిపోయింది తెగిన గాలి పటంలా…! దిక్క దాపు ఆసరా కోసం.నేను వారినే చూస్తూ కొయ్య బారిన వాడిలా నిశ్చేష్టుడయ్యాను. అలా క్షణకాలం రెప్ప వేయకుండా చూస్తోవుండిపోయా. కానున్నది కాకమానదు ఎమైనా కానియ్యి బంధం ముడి పడి వుంటుందా? తెగుతుందా, సమస్య జటిలమే కానీ బుర్ర లో అలోచనలు పరిపరి విధాలుగా గింగిరాలు కొడుతున్నాయి. అటుగా చిరుగాలి వీచింది, మనసు కాసింత తేలికగా అనిపించింది.గుండెలో బరువు తగ్గి చినుకుల చిరుజల్లు ఆశ మిణుగురు లా మినుకు మినుకు మంటూ చిరుదివ్వే వెలిగింది.

…….. 

August 15, 2022 0 comment
4 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తపస్వి మనోహరం

by చంద్రకళ దీకొండ August 15, 2022
written by చంద్రకళ దీకొండ

మాస రచనల పోటీకి

తేదీ:24/12/2021
పేరు:చంద్రకళ. దీకొండ
ఊరు : మల్కాజిగిరి
చరవాణి : 938131384
అంశము : పుస్తక సమీక్ష
రచన సంఖ్య : 11

పుస్తకం పేరు : గెలుపు పిలుపు
రచయిత : శ్రీ బుర్రా వెంకటేశం,ఐ. ఎ. ఎస్. గారు

పేద కుటుంబంలో పుట్టి,స్వయంశక్తితో ఎదిగి
పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, బలహీన వర్గాల సంక్షేమ కార్యదర్శి, వివిధ ప్రభుత్వ శాఖలలో పాతిక సంవత్సరములు వృత్తి నిర్వహణ గావించి,రెండువేల మంది మానసిక వికలాంగుల పునరావాసానికై కృషి చేసి జాతీయ,
అంతర్జాతీయ అవార్డులు,రివార్డులు అందుకున్న,
స్వయంగా గెలుపు శిఖరాగ్రం చేరుకుని,గెలుపు సంతకం చేసిన శ్రీ బుర్రా వెంకటేశం,ఐ. ఎ. ఎస్.గారి రచన…ఎంతో ప్రజాదరణ పొందిన సెల్ఫీ విత్ సక్సెస్ పుస్తకం గెలుపు పిలుపు గా తెలుగు భాషలో… బెంగాలీ,స్పానిష్ మరియు పోర్చుగీస్ భాషలలోనికి అనువదించబడినది.

మనం సాధించే ప్రతి విజయం ఆనందాన్ని ఇచ్చినప్పుడే అది నిజమైన సక్సెస్ పని చేయడం ఆపితే అదే ఫెయిల్యూర్
గెలుపును పలువురికి పంచినప్పుడే దానికి సార్థకత వంటి సూక్తులు…
ఏకలవ్యుడు,రెండు కప్పలు,నక్క-నాగలోకం వంటి కథలతో ఆసక్తిని రేకెత్తిస్తూ… గెలుపు దశలను, కోణాలను, గెలుపు శిఖరాగ్రం చేరుకొనుటకు కావలసిన ఓర్పు,జిగి, పట్టుదల అనే ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను సులభశైలిలో పిల్లలు,యువత, పెద్దలు అవగాహన చేసుకునేలా రచించబడినది.

ఇందులో “కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”కోట (గెలుపు దుకాణం)
బాపూజీ,టాటా వంటి గెలుపు శ్రేణులు
ఎన్నోసార్లు విఫలమై గ్రాంఫోన్, విద్యుద్దీపంతో పాటు మరెన్నో వస్తువులు కనిపెట్టి 1093 పేటెంట్లు పొందిన ఎడిసన్,ఐజాక్ న్యూటన్ వంటి శాస్తవేత్తలు…
హేళనకు గురై పట్టుబట్టి సంస్కృతం నేర్చుకున్న తిల్ శాస్త్రి …
గెలుపును పదిమందికీ పంచిన
ప్రేమ్ జీ, వారెన్ బఫెట్ వంటి వ్యాపార దిగ్గజాలు, వితరణశీలురు…
గురు స్థానాన్నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ రాధాకృష్ణన్ వంటి వారు…
రామోజీరావు,
ఐ. ఐ. టి.రామయ్య వంటి కృషీవలురు…
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదాహరణంగా నిలిచి మనకెన్నో గెలుపు పాఠాలు చెపుతారు.

ఈర్ష్య, కోపం,ప్రతీకారం,పగ, అహంకారం వంటి గెలుపు లోపాలతో పతనమైన హిట్లర్ వంటి చరిత్రకారులు…విధ్వంసాలు,
విద్వేషాలతో పతనమైన
మాదకద్రవ్యాల మాఫియా చక్రవర్తి “పాబ్లో ఎస్కోలర్” గెలుపులో పాపాలను వివరిస్తారు.

కష్టపడి నిచ్చెనలెక్కి పెద్దపాము నోట్లోకి జారిన పావుల్లా దుర్వ్యసనాలకు లోనైన మైఖేల్ జాక్సన్ ; అతిగా అందరినీ నమ్మి మోసపోయిన మహానటి సావిత్రి వంటి వారు గెలుపు లోపాలను మనకు తెలియబరుస్తారు.

గెలుపును సమన్వయంతో ఎలా సాధించవచ్చో బాపు-రమణలు చెపుతారు.
కలిసికట్టుగా సమస్యలను పారద్రోలిన డిస్నీ&పిక్సార్
గెలుపు పథానికి దారి చూపిస్తారు.

పన్నెండు మంది పబ్లిషర్ల వద్దకు తిరిగి ఓటమినే ఇంధనంగా తీసుకున్న ప్రఖ్యాత రచయిత్రి జె.కె.రోలింగ్ పరిచయం ఎంతో స్ఫూర్తిని కలుగజేస్తుంది.

బాధనే పెట్టుబడిగా పెట్టి రాప్ సంగీత రారాజుగా ఎదిగిన ఎమినమ్ వృత్తాంతం మనలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది.

అంతేకాదు…ఫార్స్ వర్త్ ప్రతిభను వాడుకుని అరువు గెలుపు అందుకున్న డేవిడ్ పార్నాఫ్ గురించీ,దాని పర్యవసానాల గురించీ మనం తెలుసుకోవచ్చు.

నిరుపేద కుటుంబంలో పుట్టి రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్ జీవన కథనమూ ఇందులో ఉంది.

తనకే తెలియని ప్రతిభ దాగున్న సైలెంట్ పాప బియాన్,
బాల్యంలో అత్యాచారానికి గురై, ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాతగా పేరు పొందిన నల్లజాతిరత్నం ఓప్రా విన్ ప్రే,
బంగారు పతకాన్ని అందుకున్న బాక్సింగ్ ఛాంపియన్,ఇద్దరు బిడ్డల తల్లి మేరికొం మహిళలలో స్ఫూర్తిని రగిలిస్తారు.

ఇంకా ఎందరో విభిన్న రంగాలలో దీక్షతో గెలుపు సాధించిన వారి గెలుపు చిత్రాల ను మన కళ్ళ ముందు నిలిపి
స్ఫూర్తిని,ఉత్తేజాన్ని రగిలించే
పుస్తకమిది.

ఓటమితో క్రుంగినప్పుడు,
అవకాశాలు అందక నిరాశలో కూరుకుపోయినప్పుడు ఈ పుస్తకం ఒక్కసారి తిరగేస్తే చాలు…మనలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగి,చైతన్యం పెల్లుబికి,అంతర్మథనమే మన ప్రగతికి సోపానమౌతుంది

పుస్తక ప్రదర్శనశాలకు వెళితే…
తప్పక ఈ పుస్తకంతో పాటు ఆత్మవిశ్వాసాన్నీ మీ వెంట తెచ్చుకుంటారు కదూ…?!

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

1947 ఆగస్ట్ 15 నాటి ఆంధ్రపత్రిక

by mayuukha August 15, 2022
written by mayuukha
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

బాల చిత్రం

by Hasini August 15, 2022
written by Hasini
చిత్రకారిణి : ఏ. నాగసాయి హాసిని, 6th class
Sri Chaithanya Techno School
Hyderabad
D/O.A.Gopal Krisha Rao
A.Viraja Vonhika
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ August 15, 2022
written by కొరుప్రోలు హరనాథ్

తప్పు తప్పే…

పక్కనే

కట్టుకున్న భర్త

అటు పక్కన సమయం చూసి

ప్రియురాల్ని కాటువేయాలని చూసే

పొంచి ఉన్న ప్రియుడు

క్షణంలో ‘భార్య’ గల్లంతు

భర్త ‘పరేషాన్’

ఇదీ ఇప్పటి సంస్కృతి

ఇది ప్రియుడి తప్పా

ప్రియురాలి తొందరపాటా….

ఏమై పోతుందీ ‘నవల’

ఎటు పోతుందీ ‘యువత’

(ఇటీవల విశాఖపట్నం బీచ్ లో జరిగిన సంఘటన ఆధారంగా)

నగరం తోడు

ఈ నగరం గమ్మత్తైన కిమ్మిక్కు

ఎడ తెరపి లేని వాన దెబ్బకు

త్రవ్విన రోడ్లపై

ట్రాఫిక్కంతరాయ కలిగి

ఏ హాస్పిటల్లోని పుట్టవలసిన పసిగుడ్డు

ఏ అంబులెన్స్ లోనో, ఏ ఆటోలోనో

పుట్టలేక పుట్టి ఏ తల్లికి గర్భశోకం

ఎప్పుడు ఎలా

ఈ మహానగరం ‘రోడ్లు’

కలిగిస్తాయో తెలియదు కదా….

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణకలనం -9

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి August 15, 2022
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

ఆధారములు

*****

అడ్డం

**

01. దినుసుల గంధం కోసం నూరే రాయి (2)

03. భారతీయ దృశ్యశ్రవణ మాధ్యమం తెలుగు రూపంలో  (5)

07. అపుణ్యుడు చిరాయువు అంటారు (2)

09. తన్మయత్వం (3)

11. సముద్రం మెడ (2)

12. దయగల చురకత్తి (4)

14. పొల్లు మాంసం (2)

16. భార్యాభర్తలు (4)

18. పదములు కలిగిన సంఖ్య (2)

20. కొరడా (2)

22. డొల్లుగింజ (2)

23. దండు (2)

24. నెమ్మది కవి (3)

26. పరిఖ ఎటుచూచినా (3)

28. వివరంగా భూమి (3)

29. పొందాలనే కోరిక (3)

31. … ప్రభూ! మనసు (2)

33. బయట కాదు (3)

34. సంతకం రాత (2)

36. విశ్వామిత్ర పిత (2)

38. పూర్తిగా యావ తీరగ (4)

41. భవుడు (5)

44. కొయ్యముక్క తుంగ కాదు (2)

46. వివరం (2)

47. భిన్నంలో భాగములను తెలిపే కొంచెం (2)

49. పాలకూర భూమి(2)

50. భద్రంగా (4)

51. అశ్వినీ నక్షత్రం (4)

నిలువు

**

01. సత్యవంతుడు (5)

02. కొత్త దురద (2)

04. నరకంలో తీరు (2)

05. వెన్న (3)

06. మోసాలు (4)

07. చేయి (2)

08. కోకిలకోకిలలు చెల్లాచెదరగు (6)

10. మెఱుపు (2)

13. క్షీరం వంతు (2)

15. దీవి (2)

17. ధ్వజం (3)

18. తిరుగువాడు (3)

21. శతకంలో కాలప్రమాణం (2)

23. పశువు వీపు (2)

25. రక్తం పారేది దీనిలో (3)

27. అమావాస్య చూపు (2)

28. ద్రవ్యం (2)

30. ఆహ్వానపత్రికలో కుటుంబసభ్యులు, సేనతో ..(6)

31. పైనుండి చల్లు (3)

32. వేపుడుకు ప్రసిద్ధమైన గడ్డ (5)

35. మమతల బంగ సోదరి (2)

37. విడత  (2)

39. ఉష్ణం (2)

40. ప్రసిద్ధచారిత్రక చిత్రకారుడు (4)

42. వెలుగు తోడు (2)

43. నేను కాదు నువ్వు లు (3)

45. అర రోగి (2)

48. వంగజేయు (2)

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi August 15, 2022
written by Chillara Bhavanidevi

3

తూర్పుదిక్కు సూర్యభగవానునికి స్వాగతం పలుకుతూ వేయిరేకుల వెండి పద్మాలను సమర్పిస్తున్నది. విద్యారణ్యస్వామి ఆశీస్సుల్లా విజయనగరం శిరస్సుపై వేలవేల వెలుగు అక్షింతలు వర్షిస్తున్నాయి. విజయనగరంలోని దేవాలయాల నుండి సుప్రభాత సమయాన జరిపే పూజాదికాల మంత్రోచ్ఛాటనా తరంగాలు పంపానదీ జలాలను తాకి పవిత్రమొనర్చి మరల విరూపాక్షుని చరణాలను అభిషేకిస్తున్నాయి.
విరూపాక్షస్వామి దేవాలయం బయట తుంగభద్ర కృష్ణరాయని కీర్తి వాహినిలా ప్రవహిస్తోంది. విరూపాక్ష ఆలయ గాలిగోపురం శిల్పకళాశోభితమై అనేక స్తంభాలు కిటికీలతో విరాజిల్లుతోంది. ప్రాకారద్వారం నుండి వశిష్టతీర్థమనే తుంగభద్రానదీ భాగం పవిత్రఘట్టంగా విరాజిల్లుతోంది. హంపీ విరూపాక్ష దేవాలయం హేమకూట పర్వతపాదం దగ్గర హంపీ పట్టణం నడిబొడ్డున వుంది. దీనినే ‘పంపావతి దేవాలయం’ అని కూడా అంటారు. హంపీలోని అన్ని దేవాలయాలకన్నా పరమ పవిత్రంగా భావించబడే ఈ దేవాలయం ఏడవ శతాబ్దకాలంనాటిదని చెప్తుంటారు. శివ, పంప, భువనేశ్వరీ ఆరాధన జరిగే ఈ గుడి గర్భగుడి, మూడు అంతర్భాగాలు, స్తంభాల మండపం, శ్రీకృష్ణరాయ నిర్మిత రంగమండపంతో అలరారుతున్నది. ఈ దేవాలయం చుట్టూ అనేక స్తంభాల మండపాలు, ద్వారాలు సమావేశ మందిరాలున్నాయి.
రంగమండపం అనేక శిల్పాకృతులతో ముప్ఫై రాతిస్తంభాలతో నిర్మితమైంది. ప్రతిస్తంభం రెండు నిలువు భాగాలుగా కన్పిస్తుంది. మొదటిది మకర శరీరంతో సింహాకృతిలో కన్పిస్తే రెండవది శైవ సంబంధిóత అంశాలతో అలరారుతున్నది. రంగరాయ మండపం లోపల పైభాగం దూలాలన్నింటిమీద మహాభారతం, రామాయణం, శివపురాణాలు చిత్రీకరించబడినాయి. విరూపాక్ష గుడివద్ద తొమ్మిది అంతస్థులతో అత్యంత ఎత్తులో ఉండే బృహద్గోపురాన్ని అనుసరించి విపణివీధి ఉంది. విరూపాక్షగుడి ప్రధాన గోపురాన్ని ‘బిష్టప్ప గోపురం’ అంటారు. దీనికి మరో చివర మహానంది వుంది.
భువనేశ్వరీ దేవాలయ మహాద్వార కళాత్మకత, రాతిస్తంభాలు, పైకప్పు లోపలిభాగ చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
హంపీ విరూపాక్షస్వామిని దర్శించుకొన్న మంజరి చంద్రప్పలు స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కాసేపు దేవాలయం మెట్లమీద కూర్చున్నారు.
‘‘మంజూ! ఈ విజయనగర ప్రజలు ఎంత అదృష్టవంతులో కదా! ఇంతటి మహనీయుడైన ప్రభువు పాలనలో జీవించటానికి అర్హులయ్యారు. విరూపాక్షస్వామి దయవల్ల ఆ తిరుమలేశుని కృపవల్ల కృష్ణరాయ ప్రభువు కీర్తిచంద్రికలు దశదిశలా వ్యాపిస్తున్నాయి.’’
‘‘అవును చంద్రా! రాయలవారు ప్రతి విజయయాత్ర తర్వాత దేవేరులతో తిరుమల సందర్శించి తులలేని కానుకలను సమర్పించడం ప్రభువు భక్తికి నిదర్శనం.’’
‘‘మంజూ! చెప్పటం మరిచాను. తిమ్మరుసులవారు నాకోపని అప్పగించారు.’’
‘‘వారికి నీవు నమ్మినబంటువి కదా! ఏం చెప్పారేంటి?’’
‘‘నిర్మాణం కొనసాగిస్తున్న విఠల మండపం, ఏకశిలారథం నిర్మాణ పర్యవేక్షణ నాకప్పగించారు.’’
‘‘ఇంకేం! ఇక రాత్రింబవళ్ళు ఆ శిల్పకన్యల ధ్యాసే!’’ ఉడుక్కుంది మంజరి.
‘‘ఆ శిల్పాలకి మించిన సజీవ శిల్పమే నాకోసం ఉంది మంజూ! ప్రధాన శిల్పాచార్యుడు ఎంపికచేసిన శిల్ప విన్నాణాలన్నింటిలో నీవే కన్పిస్తున్నావు. ఆయన నిన్ను, నీ నృత్యాన్ని ఎప్పుడైనా చూశారా అని నా అనుమానం.’’
‘‘చాలులే చంద్రా! అతిశయోక్తి వద్దుగానీ వారు నా నాట్యాన్ని రాయలవారి పట్టాభిషేకోత్సవ సందర్భంలో చూశారు అంతే’’ నవ్విందామె చిన్నగా.
‘‘కళాహృదయుల కళాతపస్సుకు కాలమే బందీ అవుతుంది. విఠల మందిరంలో నిర్మితమవుతున్న సప్తస్వర స్తంభాలని మీటుతుంటే వివిధ వాయిద్యాల సందడి. నువ్వయితే పరవశంతో నర్తిస్తావు.
‘‘ఎల్లుండి పున్నమిరాత్రి నన్నక్కడికి తీసుకుపో చంద్రా’’ తమకంగా అడిగింది.
‘‘పరులకు ప్రవేశం నిషిద్ధం. అయినా ఆచార్యుల అనుమతి అడిగి తీసుకెళ్తాను.’’
‘‘పద! చిన్నాదేవిగారి పూజకు వేళకాకముందే నేను మందిరానికి చేరాలి.’’
‘‘ఉండుండు! ఇవ్వాళ విద్యారణ్యస్వామి జయంతి. వారి ఆశీస్సులు ప్రత్యేకంగా తీసుకోవాలి. ఈ గుడి వెనుక వారి ఆలయానికి వెళదాం.’’
మంజరి చంద్రప్ప వెంట విద్యారణ్యుల గుడిలోకి ప్రవేశించింది.
విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ప్రేరణగా నిలిచిన ఆ మహనీయుని మూర్తి చూడగానే చంద్రప్ప పరమ భావుకుడయ్యాడు. అతని కళ్ళు ఆనందంతో చెమర్చాయి.
‘‘మంజూ! స్వామి ఎంతటి శక్తి సంపన్నుడో చూడు! పాడయిన ఓరుగల్లు సౌభాగ్యాన్ని విద్యానగర రాజవీధిలో నిలిపిన ఘనుడీయన. క్షీణిస్తున్న హిందూమత ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టిన తపస్వి. రాజకీయ తంత్రజ్ఞుడు. ఇహానికి పరానికి నిలిచిన నిస్సంగి. ఎప్పుడో వశిష్టుని గురించి విన్నాము. ఈ విద్యారణ్యుల దివ్య ఋషిత్వము వారి విగ్రహంలో ఎంతగా ప్రస్ఫుటిస్తున్నదో చూడు.’’
‘‘ఆ కన్ను మూతలో నంతర్విలీల పం
చాలనిలస్తంభ నాత్మార్చి వెలుగు
ఆ బొమ్మ మోడ్పులో నసమాక్షుసెగకన్న
మంట రేగిన సుళ్ళు మాటుమణుగు
ఆ కన్నువిప్పులో నఖిల రాజన్య శి
క్షాదక్షమైన వర్చస్సు మెరయు
ఆ చిరునవ్వులో నాంధ్ర సామ్రాజ్యసు
శ్రీ నవ్య జీవన శీలమిముడు
ఈ శిలావిగ్రహము నందె యింతగొప్ప
కుదురుకొని యుండ ఊహలు గుములుకొనిన
ఎంతవాడవొ నిను స్తుతింప గలమె?
విజయనగరాంధ్ర దేవుడవే నిజంబు’’
అంటున్న చంద్రప్పతో కలిసి ఆ స్వామికి నమస్కరించింది మంజరి.
‘‘దేశబాధ చూసి తపస్సు మాని రాజకీయాలలో ప్రవేశించి హంపీలో తెలుగు రాజ్యాన్ని పునఃప్రతిష్టించి సంస్కర్తjైు మతోద్ధారకుడై ముక్తిపొందిన ఈ విద్యారణ్యస్వామి గుడి తెలుగు ప్రజలందరూ చూసి తరించాల్సినది’’ మంజరి ప్రస్తుతించింది.
మనసులోని భావోద్వేగాలను సమన్వయపరుచుకుంటూ గుడి మెట్లు దిగి వస్తున్న మంజరి చంద్రప్పలను చాటునుంచి చండ్రనిప్పుల్లాంటి రెండు
కళ్ళు ఆగ్రహజ్వాలలతో గమనించడం వారికి తెలియదు. ఆ క్షణం నుంచి ఆ కళ్ళు వారి జీవితాలపై నిప్పుల వర్షం కురిపించబోతున్నాయని తెలిస్తే ఆ జంట అంత ఆనందంగా ఉండగలదా?
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు ఆలోచనామగ్నుడై మందిరంలో పచార్లు చేస్తున్నారు. వార్తాహరుడొచ్చాడు. తిమ్మరుసు మహామంత్రి రాక గురించిన సమాచారాన్ని నివేదించి నిష్క్రమించాడు. విజయనగర సామ్రాజ్యమే తిమ్మరుసు తయారుచేసిన చిత్రపటం. ఆయనకి ఎక్కడికెళ్ళాలన్నా ఆంక్షలుండవు. ముఖ్యంగా రాయలను కలవాలంటే కూడా కబురు పంపటం అనుమతి పొందటం అవసరం లేదు. అయినా రాచమర్యాదలు తప్పని సంస్కారి ఆయన. తిమ్మరుసు ప్రవేశించగానే కృష్ణదేవరాయలు ఎదురేగి ఆహ్వానించారు.
‘‘రండి అప్పాజీ! మీ కోసమే ఎదురుచూస్తున్నాను.’’
ఇరువురూ ఆసీనులైనారు. అప్పాజీవారు ఎప్పటిలాగే గంభీర ముద్రతో
ఉన్నారు.
‘‘అప్పాజీ! మన సామ్రాజ్యవిస్తరణకు దక్షిణ జైత్రయాత్ర దిగ్విజయంగా సాగింది. ఇక ఉత్తర విజయయాత్ర గురించి ఏమాలోచించారు’’
‘‘రాయా! కృష్ణకు ఉత్తరాన మనకున్న బలమైన శత్రువు గజపతి. గతంలో విజయనగర సామ్రాజ్య ఆధీనంలో ఉదయగిరి కొండవీడులను జయించి తన ఆధీనం చేసుకొన్నాడు. అవి తిరిగి విజయనగర సామ్రాజ్యంలో చేరాలి’’ యుద్ధానికి తిమ్మరుసు అనుమతి లభించినట్లే!
వెంటనే సేనానాయకులకు సమాచారం అందింది. శత్రు దుర్భేద్యమైన
ఉదయగిరికోట ముట్టడి ప్రారంభమైంది. నెలల తరబడి జరిగిన ముట్టడివల్ల
ఉదయగిరి రాయలవశమైంది. ఉదయగిరికి రాయసం కొండమరుసును పాలకుడిగా నియమించి రాయలు తిరుమల శ్రీనివాసుని దర్శనానికి పయనమయ్యారు. తిరుమల వేంకటేశునికి అనేక కానుకలు సమర్పించి మళ్ళీ కొంతకాలానికి కొండవీడుపై దండెత్తారు. దారిలో అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ వంటి ఉపదుర్గాలను జయించి కొండవీడును ముట్టడిరచి గజపతి కుమారుడు వీరభద్రగజపతిని ఇతర సామంతులతో బందీలుగా పట్టుకున్నారు. ధరణికోటలోని అమరేశ్వరుడ్ని, శ్రీశైల మల్లన్ననూ దర్శించి భక్తిమీర అర్చించారు రాయలు.
అనంతరం కొండపల్లి, అనంతగిరి, నల్గొండ, కంభంమెట్టు, కనిగిరి కోటలు ఆక్రమించి సింహాచలం చేరారు. విజయస్తంభం నాటారు. కృష్ణరాయని విజయయాత్ర శ్రీకూర్మం, పూరి, కటకందాకా సాగింది. కృష్ణరాయ గజపతుల మధ్య ఎడతెగని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తిమ్మరుసు భేదోపాయం, రాయల అసాధారణ ప్రజ్ఞాపాటవాలు విజయనగర విజయానికి దోహదపడ్డాయి. రాయల కీర్తిపతాక నీలిగగనంలో రెపరెపలాడిరది.
నిర్వీర్వుడయిన గజపతి రాయలతో సంధిచేసుకుని అయిష్టంగా అయినా తప్పని పరిస్థితులలో తన కుమార్తె అయిన ఆన్నపూర్ణాదేవిని రాయలకిచ్చి వివాహం చేశాడు.
తనను దాసీపుత్రుడని అవమానించిన గజపతిచే కాళ్ళు కడిగించుకుని కన్యాదానం పొంది సంతృఫ్తుడైన కృష్ణరాయలు కృష్ణకు ఉత్తరాన ఉన్న భూములన్నీ గజపతి ఆధీనం చేసి తన సహృదయతను ప్రకటించారు. అన్నపూర్ణాదేవిని బెదిరించి వారి తొలిరేయి రాయలను హత్య చేయించాలను కున్న గజపతుల కుట్ర ఫలించలేదు. రాయలు అన్నపూర్ణాదేవిని క్షమించి జంటగా విజయనగరానికి చేరారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చల్లని వెన్నెల రాత్రి చంద్రికల వెలుగులో మెరిసిపోతున్న మంజరిని తదేకంగా కొన్ని నిమిషాలు చూశాడు చంద్రప్ప. ప్రేమగా ఆమెను కౌగలించాడు. నిర్మాణం దాదాపు పూర్తవుతున్న విఠల మండపంలోకి తీసుకెళ్ళాడు.
మానవుడికి విశ్వకర్మకు జరిగిన పోటీయా అన్నట్లుండే విజయ విఠల దేవాలయం విఠలస్వామి విష్ణువుకు అంకితంగా నిర్మితమవుతోంది. కృష్ణరాయ ప్రభువు ప్రారంభించిన ఈ కట్టడం పూర్తికావటానికి ఎన్నాళ్ళు పడుతుందో మరి! గర్భగుడిలో మూలవిరాట్‌, ఉత్సవ విగ్రహాలుండాలి. విఠలస్వామిమందిరం మూడువైపులా ద్వారాలతో పెద్దరాతి గోడలమీద నిర్మాణమవుతోంది. బలమైన శిలావేదికను సైనికులు నర్తకీమణులు మోస్తున్నట్లు తీరుస్తున్నారు. మూలలు నిర్మితమౌతున్న నృత్యమందిరాలు, కల్యాణ మండపాలు పూర్తిగా తయారయ్యాక ఎంత సుందరంగా ఉంటాయో!
ఒక్కొక్క శిల్పాన్ని చూస్తూ నడుస్తున్నారు. ఏమి అందమా కళాకృతులది! నాట్యభంగిమలు నాట్యశాస్త్రాన్ని లిఖిస్తున్నాయి. ప్రతిభంగిమ మన్మోహనంగా నృత్యానికి ప్రేరణ ఇస్తోంది. మంజరి పాదాలు లయగా మండపమంతా తిరుగాడుతున్నాయి. చంద్రప్ప మురళీ మాధురులు పున్నమి పరిమళంతో కలసి అల్లనల్లన గాలి తరంగాలుగా వ్యాపిస్తున్నాయి. విఠలస్వామి దేవాలయంలోని శిల్పవిన్యాసం చూస్తుంటే మంజరి మనస్సు ఆనందార్ణవంలో ఉరకలు వేస్తున్నది. అక్కడక్కడ స్తంభాలకు పాక్షికంగా అమర్చిన సంగీతశిలలను స్పృశించాడు చంద్రప్ప.
సరి… గమ… ప… ద… ని…
సప్తస్వరాలు పలుకుతున్న కొన్ని సంగీత స్తంభాలు స్వర సంచారం చేస్తున్నాయి. మీటగల కళాకారునికి, సంగీతజ్ఞునికి ఎదురుగా నిలిచి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. కొన్ని శిలా స్తంభాలు మృదంగ ధ్వానాన్ని, కొన్ని వీణాస్వనాన్ని, కొన్ని సారంగిని… ఓప్‌ా… సకల సంగీత ప్రపంచమంతా విఠలస్వామి మందిరంలో కొలువుదీరింది. చేతిలోని వెదురు వేణువును పక్కనబెట్టి శిలావాయిద్యాలతోనే రకరకాల మేళకర్తలు రంగరించి వాద్యాలాపన చేశాడు చంద్రప్ప. శిల్పరాగాలకు పులకించిన మంజరి మరింత తన్మయ సమ్మోహనంగా విఠలమండపంలో నృత్యం చేస్తున్నది.
ఆమె అందెల రవళికి ప్రతిస్పందించిన శిలావాయిద్యాలు చంద్రప్ప అంగుళీస్పర్శతో ప్రాణం పోసుకుని మరింత చైతన్యాన్ని ప్రసారంచేశాయి. ఆ రాత్రి నాదమాధురీ మహిమ ఎంతసేపు పరిసరాలను రసప్లావితం చేశాయో వాళ్ళకే తెలీదు. ఒకరి కౌగిట ఒకరు పరవశించి ఆదమరిచిపోయిన ఆ జంట హృదయాలు తొలికిరణ స్పర్శకు జాగ్రదావస్థకు వచ్చాయి.
విఠలమండపం మెట్లుదిగి తూర్పువైపున తేజరిల్లుతున్న ఏకశిలారథం ఎదుట నిలిచారు.
ఒకే శిలలోంచి శిల్పీకరించినట్లుండే ఈ ఏకశిలారథం పెద్ద రాతివేదికపై చెక్కబడిరది. నాలుగు రాతిచక్రాలు వృత్తాకారంలో రాతిఇరుసులతో పూడ్చబడ్డాయి. ఇవి కదులుతాయని కూడా ప్రతీతి. గుండ్రని రాతిచక్రాలపై ఇరుసు కేంద్రంగా వలయాకారంలో చెక్కడపు రేఖలు తీర్చబడ్డాయి. ఆ రేఖల వలయాల్లో లతలు, కళాకృతులు చూసినవాళ్ళకి కనుల పండుగే! దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తైన పీఠంపైన రథం రకరకాల శిల్ప స్తంభాలతో కన్పిస్తున్నది. రథానికి నాల్గువైపులా పీఠాన్ని మోస్తున్నట్లు సింహవాహికలు బలాఢ్యులున్నారు. రథశిఖరంపై రాతితో రథం. ఆపైన గోపురం…. ఇదంతా ఒకే శిలలోంచి మలిచారంటే నమ్మలేనట్లు అన్పిస్తుంది.
రాతిరథాన్ని చూస్తుంటే మంజరికి నోటమాటే రాలేదు.
‘‘మనిషి ఎంత గొప్పవాడు! శక్తిమంతుడు! అలవిగాని గండశిలలను సైతం చిన్నఉలితో లోబరుచుకుని ఇంతటి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన ఆ శిల్పుల పేర్లు కూడా తర్వాతి తరాలకు తెలియకపోవచ్చు. అటువంటి ప్రజ్ఞావంతులైన శిల్పకారులను పోషించి తన కీర్తితోబాటు వారి ప్రావీణ్యతకు శాశ్వతత్వాన్ని కల్పించిన కృష్ణరాయప్రభువెంతటి ధన్యుడు! రాజులు, రాజ్యాలు శాశ్వతం కాకపోవచ్చు. కానీ చెదరని ఈ శిల్పనగరం ఎప్పటికీ ప్రభువును చిరంజీవిని చేస్తుంది’’ తనలో తాను అనుకున్నట్లుగా మంజరి మాట్లాడుతుంటే చంద్రప్ప సంతోషభరితుడయ్యాడు.
‘‘మంజూ! నీవింతటి భావుకురాలవని తెల్సు. ఈ స్థలం, ఈ శిల్ప సౌందర్యం నీ రసపిపాసను మరింతగా ఇనుమడిరపచేస్తుందని తెలిసే శిల్పాచార్యుల అనుమతితో నిన్నీనాడు ఇక్కడికి తీసుకువచ్చాను. నా ఆలోచన ఫలించింది. ఈ సంగీత మండపంలో నిత్య నృత్య గాన వినోదాలు జరగాలనే సత్సంకల్పంతోనే ప్రభువీ సరస్వతీ నిలయాన్ని రూపొందింపజేశారు’’ చంద్రప్ప మాటలు శ్రద్ధగా విన్నదామె.
సంగీత మండపంలో బోర్లాపడుకుని అరచేతుల్లో పద్మంలాంటి వదనాన్ని
ఉంచి ప్రేమంతా కుప్పబోసి చంద్రప్పవైపే చుస్తూ పారవశ్యంతో వింటున్న మంజరిని రహస్యంగా వెంటాడుతున్నాయి అవే జత కళ్ళు. ఆ కళ్ళల్లో చంద్రప్ప పట్ల అసూయ, కసి కన్పిస్తున్నాయి.
‘‘మంజూ! నడిరాత్రి దాటింది. ఇక పోదాం. రేపు మరికొన్ని చూద్దాం.’’
చంద్రప్ప మంజరి చేయిపట్టుకొని మెట్లు దిగుతున్నాడు.
‘‘చంద్రా! నీకో మాట చెప్పాలి. మా అమ్మ ఎవరితోనో రహస్యంగా చర్చలు చేస్తున్నది.నేను వెళ్ళగానే ఆపేస్తున్నది. నాకేదో అనుమానంగా ఉంది. మొదట్నుంచీ మన స్నేహం అమ్మకి ఇష్టంలేదు. ఈ మధ్య సేనానాయకుడు గండమనాయకుని కుమారుడు మా యింటికి వచ్చి అమ్మను కలిసి ఏవో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ కంటకుని చూపులు, చేష్టలు నాకంతగా రుచించటం లేదు’’ దిగులుగా అంది. చంద్రప్ప మౌనంగా విన్నాడు.
వాళ్ళిద్దరూ విఠలస్వామి దేవాలయ ప్రాంగణం దాటి మెట్లు దిగుతున్నారు. వెన్నెల విరగకాస్తున్నది. ప్రేమైక జీవుల హృదయాల పట్ల వెన్నెలకీ ఆసక్తి ఎక్కువేమో అన్నంత ప్రకాశవంతమైన రాత్రి అది.
‘‘మంజూ! ఇంటిదాకా వస్తాను పద’’ ఆమె చేతిని వదల్లేదు చంద్రప్ప.
‘‘అహ… వద్దు. అమ్మకి తెలిస్తే! ఇంత పొద్దుపోయి రావటానికి కారణాలు చెప్పాలి. ఇంక నీతో చూస్తే?’’
‘‘మరేం చెప్తావు’’
‘‘మా నేస్తం మలయద్వతి ఇంట నృత్యారాధన చేసి వస్తున్నానని’’
‘‘ఎంతటి జాణవు! నీ ఆరాధన నృత్యానికా! నాకా!’’ కొంటెగా నవ్వాడు చంద్రప్ప.
‘‘చంద్రా! నిజం చెప్పనా! నీవు గాయకుడివి. నీ స్వరాలు నా అందెలు చేస్తున్న స్నేహం మనది.’’ అతని చేతిని మృదువుగా నొక్కి ముందుకు కదిలింది. ఆమె కనుమరుగయేంతవరకు చూసి చంద్రప్ప వడివడిగా కదిలాడు.
చంద్రప్ప అటు నాలుగడుగులు వేశాడో లేదో ఇటు తన గృహాన్ని సమీపిస్తున్న మంజరిని వెనుకనించి ఎవరో నోరు మూసేసి రెండు చేతులు వెనక్కి బిగించి పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆమె దిగ్భ్రాంతి చెందింది. కీచుగా అరవబోయింది. కానీ గొంతు భయంతో పెగలలేదు.
ఆమెను పట్టుకున్న వ్యక్తి కొంత నీడలో ఉండటం వల్ల ముసుగేసుకోవటం వల్ల అతనెవరో తెలీటం లేదు.
‘‘ఆ చంద్రప్పను మర్చిపో! లేదంటే’’ బొంగురు గొంతుతో హుంకరించాడు ముసుగుమనిషి.
ఇంతలో మరోవ్యక్తి చెంగున దూకి ముసుగుమనిషిని గట్టిగా మెడమీద కొట్టాడు. ఊహించని దెబ్బకు ముసుగుమనిషి మంజరి నొదిలేశాడు. ఆమె అతనికేసి తీక్షణంగా చూస్తున్నది. ఎవరో తెలీటం లేదు. కొత్తవ్యక్తి వదలకుండా కొడ్తున్న దెబ్బలకు ముసుగుమనిషి తట్టుకోలేకపోయాడు. దూరంగా పరుగులు పెట్టాడు. కొంతసేపట్లో కొత్తవ్యక్తిని తిమ్మరుసు మహామాత్యుని కుమారుడు గోవిందరాయలుగా గుర్తించిన మంజరి అతనికి వినమ్రంగా నమస్కరించింది.
‘‘మంజరీ! ఇంత రాత్రివేళ ఇలా రావటం మంచిదేనా! త్వరగా వెళ్ళిపో!’’ అంటూ గోవిందరాయలు చకచకా కదిలి నీడల్లో కలిసిపోయాడు.
అతని సంస్కారానికి మనసులోనే అంజలి ఘటించిందామె.
శ్రీకృష్ణదేవరాయల రాజ్యం తిమ్మరుసు శక్తిమీదే ఆధారపడిరదనుకున్నా, తిమ్మరుసు కుటుంబీకులంతా రాజు గౌరవాన్ని కాపాడేవారేననిపించింది.
ఆమె నివాసం మొన్నటిదాకా చిన్నాజీ భవనంలోనే! అప్పుడప్పుడు వచ్చే మంజరి కోసం కృష్ణసాని ఎదురుచూడటం జరిగేది కాదు. అందులోనూ మంజరిని రాజభవనానికి చేర్చాక కృష్ణసాని మరింత హాయిగా నిద్రపోతున్నది.
తల్లిగాఢనిద్ర చూసి నిట్టూర్చి తన కక్ష్యలోకి ప్రవేశించిన మంజరి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. ఎవరో తన గదిలో దేనికోసమో వెదికారన్న వాస్తవం అర్థం అయింది. తన గదిలోని భద్రపేటికలో తనపైన అతినమ్మకంగా చంద్రప్ప దాచిన రహస్యపత్రాలు మాయమయ్యాయని గుర్తించిన మంజరి వణికిపోయింది. రాజాగ్రహానికి గురికావలసివస్తుందనే భయంతో ఆ రాత్రంతా జాగారమే చేసింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీతో సమావేశ మందిరంలో దీర్ఘచర్చల్లో మునిగి
ఉన్నారు.
‘‘అప్పాజీ! మీరు చెప్పిన విషయాలకు మా మనసు కల్లోలపడుతున్నది. మనమేం చేయలేమా?’’
‘‘రాయా! రాజ్యక్షేమం రాజు వ్యక్తిగత అంశాలకన్నా ముఖ్యమైంది. అన్నపూర్ణాదేవిగారు సకల సద్గుణశీల. గజపతుల ఇంటి ఆడబడుచుగా తగిన మర్యాదలు కోరటం సహజం.’’
‘‘మనమూ ఏ విషయంలోనూ తీసిపోనివారమే!’’ రాయలు పౌరుషంగా అన్నాడు.
‘‘నిజమే రాయా! కానీ చెప్పుడు మాటలు ఎంతటివారలకైనా చేటు చేస్తాయి. మీరు అన్యథా భావించకపోతే ఆ వీరేంద్రుని… అదే… అన్నపూర్ణాదేవి వెంట ఈ రాజ్యానికి వచ్చిన ఆమె బంధువు. అతనిని ఓ కంట కనిపెట్టడం మంచిది’’ సాలోచనగా అన్నాడు తిమ్మరుసు మంత్రి.
‘‘నిజమే! గజపతులకు మనమీద ప్రేమాభిమానాలుంటాయని ఎప్పటికీ అనుకోలేము. మన సైన్యాధికారులందరినీ అప్రమత్తుల్ని చేయండి అప్పాజీ. చిన్నపామైనా పెద్ద కర్రను ఉపయోగించాల్సిందే.’’
‘‘మంచిది రాయా! నేనిక వెళ్ళివస్తాను.’’
తిమ్మరుసు వెళ్ళిపోయాక కృష్ణరాయలు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి కంగారుగా హజరారామ దేవాలయ ప్రాంగణంలో కదంబం చెట్టు నీడలో ఎదురుచూస్తున్నది చంద్రప్ప కోసం! అతను ఎంతకీ రాలేదు. మనసును సమాధానపరుచుకొని ఆలయానికి ప్రదక్షణం చేస్తున్నది.
హజరారామ దేవాలయం పేరుకు తగ్గట్టు రామాయణ కాలంనాటి కిష్కింధాపురిలో నిర్మించబడినందున ప్రాకారాల గోడమీద లోపలివైపు రామాయణ గాధంతా శిల్పచరిత్రగా లిఖించబడి ఉంది. వెలుపలి వైపు ఐదారు వరుసలుగా వీరసైనికులు, అశ్వాలు, ఏనుగులు, విజయనగర సైన్యశక్తిని చెబుతున్నట్లున్నాయి. ప్రధాన దైవమైన విష్ణువు, బుద్ధునిగా కన్పించడం ప్రత్యేక ఆకర్షణ. ఇది రాజవంశీకులు దర్శించే ఆలయం కావటాన ఎక్కువగా జనం లేరు.
ఎన్నోసార్లు చూసిన దేవాలయమైనా ఆనాడు మంజరి ప్రత్యేకంగా ప్రతిశిల్పాన్ని శ్రద్ధగా చూస్తూ పరిశీలిస్తూ ముందుకు నడిచింది. ఎంతటి నిష్ణాతులైన శిల్పులైతేనే ఇది చెక్కగలుగుతారు! చంద్రప్ప ఎంతకీ రాడేం? జరిగింది చెప్పాలని తనెంత ఆతురతతో ఉంది.
దేవాలయ శిల్పాలమీద మనసు నిలవడం లేదు. ఇంతలో దూరంగా చంద్రప్ప కనిపించాడు. ఆ నడకలో మునుపటి చురుకుదనం లేదు.
‘‘చంద్రా!’’ ఎదురెళ్ళి కౌగిలించుకుంది. అతనామెకు దగ్గరకు తీసుకొని దేవాలయం ప్రాంగణంలో అరుగుమీద కూర్చుండబెట్టాడు.
‘‘ఎలా జరిగింది? ఎవరి పని?’’ అడిగాడు.
‘‘తెలియటం లేదు. కంటకుని పనేమో! మొన్నరాత్రి జరిగిన సంఘటనలు రెండూ జోడిరచి చూస్తే మనమీద కాదు, విజయనగరం మీదే ఏదో కుట్ర జరుగుతున్నట్లనిపిస్తుంది.’’
‘‘రహస్యపత్రాలు దొంగిలించబడినట్లు తిమ్మరుసులవారికి తెలియాలి.’’
‘‘వారు చారచక్షువు. వారికీపాటికి తెలిసే వుంటుంది. నన్ననుమానిస్తే ఎలాగా అనే ఆలోచిస్తున్నాను.’’
‘‘నువ్వే వెళ్ళి తిమ్మరుసు మహామాత్యుల వారికి జరిగింది విన్నవించు. అమాత్యులు ప్రజ్ఞావంతులు. విచక్షణతో వ్యవహరిస్తారని నా నమ్మకం.’’
ఆమె విశ్వాసాన్ని అతను ఖండిరచలేదు.
‘‘సరే! నేను తిమ్మరుసులవారిని కలుస్తాను. అంతా విరూపాక్షుని దయ’’
విచారంగా వెళ్ళిపోతున్న చంద్రప్పనుఅలాగే చూస్తూండిపోయింది.మంజరి.
అతను తిమ్మరుసును కలవలేదనీ, వీరేంద్రుని కుట్రవల్ల దారిలోనే రాజభటులు రాజద్రోహం నేరంకింద అతన్ని బందీనిచేసి చెరసాలలో పెట్టారనీ మరో నాలుగు దినాలదాకా మంజరికి తెలిసే అవకాశమే లేదు.

వేలవేల వెలుగు అక్షింతలు వర్షిస్తున్నాయి. విజయనగరంలోని దేవాలయాల నుండి సుప్రభాత సమయాన జరిపే పూజాదికాల మంత్రోచ్ఛాటనా తరంగాలు పంపానదీ జలాలను తాకి పవిత్రమొనర్చి మరల విరూపాక్షుని చరణాలను అభిషేకిస్తున్నాయి.
విరూపాక్షస్వామి దేవాలయం బయట తుంగభద్ర కృష్ణరాయని కీర్తి వాహినిలా ప్రవహిస్తోంది. విరూపాక్ష ఆలయ గాలిగోపురం శిల్పకళాశోభితమై అనేక స్తంభాలు కిటికీలతో విరాజిల్లుతోంది. ప్రాకారద్వారం నుండి వశిష్టతీర్థమనే తుంగభద్రానదీ భాగం పవిత్రఘట్టంగా విరాజిల్లుతోంది. హంపీ విరూపాక్ష దేవాలయం హేమకూట పర్వతపాదం దగ్గర హంపీ పట్టణం నడిబొడ్డున వుంది. దీనినే ‘పంపావతి దేవాలయం’ అని కూడా అంటారు. హంపీలోని అన్ని దేవాలయాలకన్నా పరమ పవిత్రంగా భావించబడే ఈ దేవాలయం ఏడవ శతాబ్దకాలంనాటిదని చెప్తుంటారు. శివ, పంప, భువనేశ్వరీ ఆరాధన జరిగే ఈ గుడి గర్భగుడి, మూడు అంతర్భాగాలు, స్తంభాల మండపం, శ్రీకృష్ణరాయ నిర్మిత రంగమండపంతో అలరారుతున్నది. ఈ దేవాలయం చుట్టూ అనేక స్తంభాల మండపాలు, ద్వారాలు సమావేశ మందిరాలున్నాయి.
రంగమండపం అనేక శిల్పాకృతులతో ముప్ఫై రాతిస్తంభాలతో నిర్మితమైంది. ప్రతిస్తంభం రెండు నిలువు భాగాలుగా కన్పిస్తుంది. మొదటిది మకర శరీరంతో సింహాకృతిలో కన్పిస్తే రెండవది శైవ సంబంధిóత అంశాలతో అలరారుతున్నది. రంగరాయ మండపం లోపల పైభాగం దూలాలన్నింటిమీద మహాభారతం, రామాయణం, శివపురాణాలు చిత్రీకరించబడినాయి. విరూపాక్ష గుడివద్ద తొమ్మిది అంతస్థులతో అత్యంత ఎత్తులో ఉండే బృహద్గోపురాన్ని అనుసరించి విపణివీధి ఉంది. విరూపాక్షగుడి ప్రధాన గోపురాన్ని ‘బిష్టప్ప గోపురం’ అంటారు. దీనికి మరో చివర మహానంది వుంది.
భువనేశ్వరీ దేవాలయ మహాద్వార కళాత్మకత, రాతిస్తంభాలు, పైకప్పు లోపలిభాగ చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
హంపీ విరూపాక్షస్వామిని దర్శించుకొన్న మంజరి చంద్రప్పలు స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కాసేపు దేవాలయం మెట్లమీద కూర్చున్నారు.
‘‘మంజూ! ఈ విజయనగర ప్రజలు ఎంత అదృష్టవంతులో కదా! ఇంతటి మహనీయుడైన ప్రభువు పాలనలో జీవించటానికి అర్హులయ్యారు. విరూపాక్షస్వామి దయవల్ల ఆ తిరుమలేశుని కృపవల్ల కృష్ణరాయ ప్రభువు కీర్తిచంద్రికలు దశదిశలా వ్యాపిస్తున్నాయి.’’
‘‘అవును చంద్రా! రాయలవారు ప్రతి విజయయాత్ర తర్వాత దేవేరులతో తిరుమల సందర్శించి తులలేని కానుకలను సమర్పించడం ప్రభువు భక్తికి నిదర్శనం.’’
‘‘మంజూ! చెప్పటం మరిచాను. తిమ్మరుసులవారు నాకోపని అప్పగించారు.’’
‘‘వారికి నీవు నమ్మినబంటువి కదా! ఏం చెప్పారేంటి?’’
‘‘నిర్మాణం కొనసాగిస్తున్న విఠల మండపం, ఏకశిలారథం నిర్మాణ పర్యవేక్షణ నాకప్పగించారు.’’
‘‘ఇంకేం! ఇక రాత్రింబవళ్ళు ఆ శిల్పకన్యల ధ్యాసే!’’ ఉడుక్కుంది మంజరి.
‘‘ఆ శిల్పాలకి మించిన సజీవ శిల్పమే నాకోసం ఉంది మంజూ! ప్రధాన శిల్పాచార్యుడు ఎంపికచేసిన శిల్ప విన్నాణాలన్నింటిలో నీవే కన్పిస్తున్నావు. ఆయన నిన్ను, నీ నృత్యాన్ని ఎప్పుడైనా చూశారా అని నా అనుమానం.’’
‘‘చాలులే చంద్రా! అతిశయోక్తి వద్దుగానీ వారు నా నాట్యాన్ని రాయలవారి పట్టాభిషేకోత్సవ సందర్భంలో చూశారు అంతే’’ నవ్విందామె చిన్నగా.
‘‘కళాహృదయుల కళాతపస్సుకు కాలమే బందీ అవుతుంది. విఠల మందిరంలో నిర్మితమవుతున్న సప్తస్వర స్తంభాలని మీటుతుంటే వివిధ వాయిద్యాల సందడి. నువ్వయితే పరవశంతో నర్తిస్తావు.
‘‘ఎల్లుండి పున్నమిరాత్రి నన్నక్కడికి తీసుకుపో చంద్రా’’ తమకంగా అడిగింది.
‘‘పరులకు ప్రవేశం నిషిద్ధం. అయినా ఆచార్యుల అనుమతి అడిగి తీసుకెళ్తాను.’’
‘‘పద! చిన్నాదేవిగారి పూజకు వేళకాకముందే నేను మందిరానికి చేరాలి.’’
‘‘ఉండుండు! ఇవ్వాళ విద్యారణ్యస్వామి జయంతి. వారి ఆశీస్సులు ప్రత్యేకంగా తీసుకోవాలి. ఈ గుడి వెనుక వారి ఆలయానికి వెళదాం.’’
మంజరి చంద్రప్ప వెంట విద్యారణ్యుల గుడిలోకి ప్రవేశించింది.
విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ప్రేరణగా నిలిచిన ఆ మహనీయుని మూర్తి చూడగానే చంద్రప్ప పరమ భావుకుడయ్యాడు. అతని కళ్ళు ఆనందంతో చెమర్చాయి.
‘‘మంజూ! స్వామి ఎంతటి శక్తి సంపన్నుడో చూడు! పాడయిన ఓరుగల్లు సౌభాగ్యాన్ని విద్యానగర రాజవీధిలో నిలిపిన ఘనుడీయన. క్షీణిస్తున్న హిందూమత ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టిన తపస్వి. రాజకీయ తంత్రజ్ఞుడు. ఇహానికి పరానికి నిలిచిన నిస్సంగి. ఎప్పుడో వశిష్టుని గురించి విన్నాము. ఈ విద్యారణ్యుల దివ్య ఋషిత్వము వారి విగ్రహంలో ఎంతగా ప్రస్ఫుటిస్తున్నదో చూడు.’’
‘‘ఆ కన్ను మూతలో నంతర్విలీల పం
చాలనిలస్తంభ నాత్మార్చి వెలుగు
ఆ బొమ్మ మోడ్పులో నసమాక్షుసెగకన్న
మంట రేగిన సుళ్ళు మాటుమణుగు
ఆ కన్నువిప్పులో నఖిల రాజన్య శి
క్షాదక్షమైన వర్చస్సు మెరయు
ఆ చిరునవ్వులో నాంధ్ర సామ్రాజ్యసు
శ్రీ నవ్య జీవన శీలమిముడు
ఈ శిలావిగ్రహము నందె యింతగొప్ప
కుదురుకొని యుండ ఊహలు గుములుకొనిన
ఎంతవాడవొ నిను స్తుతింప గలమె?
విజయనగరాంధ్ర దేవుడవే నిజంబు’’
అంటున్న చంద్రప్పతో కలిసి ఆ స్వామికి నమస్కరించింది మంజరి.
‘‘దేశబాధ చూసి తపస్సు మాని రాజకీయాలలో ప్రవేశించి హంపీలో తెలుగు రాజ్యాన్ని పునఃప్రతిష్టించి సంస్కర్తjైు మతోద్ధారకుడై ముక్తిపొందిన ఈ విద్యారణ్యస్వామి గుడి తెలుగు ప్రజలందరూ చూసి తరించాల్సినది’’ మంజరి ప్రస్తుతించింది.
మనసులోని భావోద్వేగాలను సమన్వయపరుచుకుంటూ గుడి మెట్లు దిగి వస్తున్న మంజరి చంద్రప్పలను చాటునుంచి చండ్రనిప్పుల్లాంటి రెండు
కళ్ళు ఆగ్రహజ్వాలలతో గమనించడం వారికి తెలియదు. ఆ క్షణం నుంచి ఆ కళ్ళు వారి జీవితాలపై నిప్పుల వర్షం కురిపించబోతున్నాయని తెలిస్తే ఆ జంట అంత ఆనందంగా ఉండగలదా?
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు ఆలోచనామగ్నుడై మందిరంలో పచార్లు చేస్తున్నారు. వార్తాహరుడొచ్చాడు. తిమ్మరుసు మహామంత్రి రాక గురించిన సమాచారాన్ని నివేదించి నిష్క్రమించాడు. విజయనగర సామ్రాజ్యమే తిమ్మరుసు తయారుచేసిన చిత్రపటం. ఆయనకి ఎక్కడికెళ్ళాలన్నా ఆంక్షలుండవు. ముఖ్యంగా రాయలను కలవాలంటే కూడా కబురు పంపటం అనుమతి పొందటం అవసరం లేదు. అయినా రాచమర్యాదలు తప్పని సంస్కారి ఆయన. తిమ్మరుసు ప్రవేశించగానే కృష్ణదేవరాయలు ఎదురేగి ఆహ్వానించారు.
‘‘రండి అప్పాజీ! మీ కోసమే ఎదురుచూస్తున్నాను.’’
ఇరువురూ ఆసీనులైనారు. అప్పాజీవారు ఎప్పటిలాగే గంభీర ముద్రతో
ఉన్నారు.
‘‘అప్పాజీ! మన సామ్రాజ్యవిస్తరణకు దక్షిణ జైత్రయాత్ర దిగ్విజయంగా సాగింది. ఇక ఉత్తర విజయయాత్ర గురించి ఏమాలోచించారు’’
‘‘రాయా! కృష్ణకు ఉత్తరాన మనకున్న బలమైన శత్రువు గజపతి. గతంలో విజయనగర సామ్రాజ్య ఆధీనంలో ఉదయగిరి కొండవీడులను జయించి తన ఆధీనం చేసుకొన్నాడు. అవి తిరిగి విజయనగర సామ్రాజ్యంలో చేరాలి’’ యుద్ధానికి తిమ్మరుసు అనుమతి లభించినట్లే!
వెంటనే సేనానాయకులకు సమాచారం అందింది. శత్రు దుర్భేద్యమైన
ఉదయగిరికోట ముట్టడి ప్రారంభమైంది. నెలల తరబడి జరిగిన ముట్టడివల్ల
ఉదయగిరి రాయలవశమైంది. ఉదయగిరికి రాయసం కొండమరుసును పాలకుడిగా నియమించి రాయలు తిరుమల శ్రీనివాసుని దర్శనానికి పయనమయ్యారు. తిరుమల వేంకటేశునికి అనేక కానుకలు సమర్పించి మళ్ళీ కొంతకాలానికి కొండవీడుపై దండెత్తారు. దారిలో అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ వంటి ఉపదుర్గాలను జయించి కొండవీడును ముట్టడిరచి గజపతి కుమారుడు వీరభద్రగజపతిని ఇతర సామంతులతో బందీలుగా పట్టుకున్నారు. ధరణికోటలోని అమరేశ్వరుడ్ని, శ్రీశైల మల్లన్ననూ దర్శించి భక్తిమీర అర్చించారు రాయలు.
అనంతరం కొండపల్లి, అనంతగిరి, నల్గొండ, కంభంమెట్టు, కనిగిరి కోటలు ఆక్రమించి సింహాచలం చేరారు. విజయస్తంభం నాటారు. కృష్ణరాయని విజయయాత్ర శ్రీకూర్మం, పూరి, కటకందాకా సాగింది. కృష్ణరాయ గజపతుల మధ్య ఎడతెగని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తిమ్మరుసు భేదోపాయం, రాయల అసాధారణ ప్రజ్ఞాపాటవాలు విజయనగర విజయానికి దోహదపడ్డాయి. రాయల కీర్తిపతాక నీలిగగనంలో రెపరెపలాడిరది.
నిర్వీర్వుడయిన గజపతి రాయలతో సంధిచేసుకుని అయిష్టంగా అయినా తప్పని పరిస్థితులలో తన కుమార్తె అయిన ఆన్నపూర్ణాదేవిని రాయలకిచ్చి వివాహం చేశాడు.
తనను దాసీపుత్రుడని అవమానించిన గజపతిచే కాళ్ళు కడిగించుకుని కన్యాదానం పొంది సంతృఫ్తుడైన కృష్ణరాయలు కృష్ణకు ఉత్తరాన ఉన్న భూములన్నీ గజపతి ఆధీనం చేసి తన సహృదయతను ప్రకటించారు. అన్నపూర్ణాదేవిని బెదిరించి వారి తొలిరేయి రాయలను హత్య చేయించాలను కున్న గజపతుల కుట్ర ఫలించలేదు. రాయలు అన్నపూర్ణాదేవిని క్షమించి జంటగా విజయనగరానికి చేరారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చల్లని వెన్నెల రాత్రి చంద్రికల వెలుగులో మెరిసిపోతున్న మంజరిని తదేకంగా కొన్ని నిమిషాలు చూశాడు చంద్రప్ప. ప్రేమగా ఆమెను కౌగలించాడు. నిర్మాణం దాదాపు పూర్తవుతున్న విఠల మండపంలోకి తీసుకెళ్ళాడు.
మానవుడికి విశ్వకర్మకు జరిగిన పోటీయా అన్నట్లుండే విజయ విఠల దేవాలయం విఠలస్వామి విష్ణువుకు అంకితంగా నిర్మితమవుతోంది. కృష్ణరాయ ప్రభువు ప్రారంభించిన ఈ కట్టడం పూర్తికావటానికి ఎన్నాళ్ళు పడుతుందో మరి! గర్భగుడిలో మూలవిరాట్‌, ఉత్సవ విగ్రహాలుండాలి. విఠలస్వామిమందిరం మూడువైపులా ద్వారాలతో పెద్దరాతి గోడలమీద నిర్మాణమవుతోంది. బలమైన శిలావేదికను సైనికులు నర్తకీమణులు మోస్తున్నట్లు తీరుస్తున్నారు. మూలలు నిర్మితమౌతున్న నృత్యమందిరాలు, కల్యాణ మండపాలు పూర్తిగా తయారయ్యాక ఎంత సుందరంగా ఉంటాయో!
ఒక్కొక్క శిల్పాన్ని చూస్తూ నడుస్తున్నారు. ఏమి అందమా కళాకృతులది! నాట్యభంగిమలు నాట్యశాస్త్రాన్ని లిఖిస్తున్నాయి. ప్రతిభంగిమ మన్మోహనంగా నృత్యానికి ప్రేరణ ఇస్తోంది. మంజరి పాదాలు లయగా మండపమంతా తిరుగాడుతున్నాయి. చంద్రప్ప మురళీ మాధురులు పున్నమి పరిమళంతో కలసి అల్లనల్లన గాలి తరంగాలుగా వ్యాపిస్తున్నాయి. విఠలస్వామి దేవాలయంలోని శిల్పవిన్యాసం చూస్తుంటే మంజరి మనస్సు ఆనందార్ణవంలో ఉరకలు వేస్తున్నది. అక్కడక్కడ స్తంభాలకు పాక్షికంగా అమర్చిన సంగీతశిలలను స్పృశించాడు చంద్రప్ప.
సరి… గమ… ప… ద… ని…
సప్తస్వరాలు పలుకుతున్న కొన్ని సంగీత స్తంభాలు స్వర సంచారం చేస్తున్నాయి. మీటగల కళాకారునికి, సంగీతజ్ఞునికి ఎదురుగా నిలిచి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. కొన్ని శిలా స్తంభాలు మృదంగ ధ్వానాన్ని, కొన్ని వీణాస్వనాన్ని, కొన్ని సారంగిని… ఓప్‌ా… సకల సంగీత ప్రపంచమంతా విఠలస్వామి మందిరంలో కొలువుదీరింది. చేతిలోని వెదురు వేణువును పక్కనబెట్టి శిలావాయిద్యాలతోనే రకరకాల మేళకర్తలు రంగరించి వాద్యాలాపన చేశాడు చంద్రప్ప. శిల్పరాగాలకు పులకించిన మంజరి మరింత తన్మయ సమ్మోహనంగా విఠలమండపంలో నృత్యం చేస్తున్నది.
ఆమె అందెల రవళికి ప్రతిస్పందించిన శిలావాయిద్యాలు చంద్రప్ప అంగుళీస్పర్శతో ప్రాణం పోసుకుని మరింత చైతన్యాన్ని ప్రసారంచేశాయి. ఆ రాత్రి నాదమాధురీ మహిమ ఎంతసేపు పరిసరాలను రసప్లావితం చేశాయో వాళ్ళకే తెలీదు. ఒకరి కౌగిట ఒకరు పరవశించి ఆదమరిచిపోయిన ఆ జంట హృదయాలు తొలికిరణ స్పర్శకు జాగ్రదావస్థకు వచ్చాయి.
విఠలమండపం మెట్లుదిగి తూర్పువైపున తేజరిల్లుతున్న ఏకశిలారథం ఎదుట నిలిచారు.
ఒకే శిలలోంచి శిల్పీకరించినట్లుండే ఈ ఏకశిలారథం పెద్ద రాతివేదికపై చెక్కబడిరది. నాలుగు రాతిచక్రాలు వృత్తాకారంలో రాతిఇరుసులతో పూడ్చబడ్డాయి. ఇవి కదులుతాయని కూడా ప్రతీతి. గుండ్రని రాతిచక్రాలపై ఇరుసు కేంద్రంగా వలయాకారంలో చెక్కడపు రేఖలు తీర్చబడ్డాయి. ఆ రేఖల వలయాల్లో లతలు, కళాకృతులు చూసినవాళ్ళకి కనుల పండుగే! దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తైన పీఠంపైన రథం రకరకాల శిల్ప స్తంభాలతో కన్పిస్తున్నది. రథానికి నాల్గువైపులా పీఠాన్ని మోస్తున్నట్లు సింహవాహికలు బలాఢ్యులున్నారు. రథశిఖరంపై రాతితో రథం. ఆపైన గోపురం…. ఇదంతా ఒకే శిలలోంచి మలిచారంటే నమ్మలేనట్లు అన్పిస్తుంది.
రాతిరథాన్ని చూస్తుంటే మంజరికి నోటమాటే రాలేదు.
‘‘మనిషి ఎంత గొప్పవాడు! శక్తిమంతుడు! అలవిగాని గండశిలలను సైతం చిన్నఉలితో లోబరుచుకుని ఇంతటి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన ఆ శిల్పుల పేర్లు కూడా తర్వాతి తరాలకు తెలియకపోవచ్చు. అటువంటి ప్రజ్ఞావంతులైన శిల్పకారులను పోషించి తన కీర్తితోబాటు వారి ప్రావీణ్యతకు శాశ్వతత్వాన్ని కల్పించిన కృష్ణరాయప్రభువెంతటి ధన్యుడు! రాజులు, రాజ్యాలు శాశ్వతం కాకపోవచ్చు. కానీ చెదరని ఈ శిల్పనగరం ఎప్పటికీ ప్రభువును చిరంజీవిని చేస్తుంది’’ తనలో తాను అనుకున్నట్లుగా మంజరి మాట్లాడుతుంటే చంద్రప్ప సంతోషభరితుడయ్యాడు.
‘‘మంజూ! నీవింతటి భావుకురాలవని తెల్సు. ఈ స్థలం, ఈ శిల్ప సౌందర్యం నీ రసపిపాసను మరింతగా ఇనుమడిరపచేస్తుందని తెలిసే శిల్పాచార్యుల అనుమతితో నిన్నీనాడు ఇక్కడికి తీసుకువచ్చాను. నా ఆలోచన ఫలించింది. ఈ సంగీత మండపంలో నిత్య నృత్య గాన వినోదాలు జరగాలనే సత్సంకల్పంతోనే ప్రభువీ సరస్వతీ నిలయాన్ని రూపొందింపజేశారు’’ చంద్రప్ప మాటలు శ్రద్ధగా విన్నదామె.
సంగీత మండపంలో బోర్లాపడుకుని అరచేతుల్లో పద్మంలాంటి వదనాన్ని
ఉంచి ప్రేమంతా కుప్పబోసి చంద్రప్పవైపే చుస్తూ పారవశ్యంతో వింటున్న మంజరిని రహస్యంగా వెంటాడుతున్నాయి అవే జత కళ్ళు. ఆ కళ్ళల్లో చంద్రప్ప పట్ల అసూయ, కసి కన్పిస్తున్నాయి.
‘‘మంజూ! నడిరాత్రి దాటింది. ఇక పోదాం. రేపు మరికొన్ని చూద్దాం.’’
చంద్రప్ప మంజరి చేయిపట్టుకొని మెట్లు దిగుతున్నాడు.
‘‘చంద్రా! నీకో మాట చెప్పాలి. మా అమ్మ ఎవరితోనో రహస్యంగా చర్చలు చేస్తున్నది.నేను వెళ్ళగానే ఆపేస్తున్నది. నాకేదో అనుమానంగా ఉంది. మొదట్నుంచీ మన స్నేహం అమ్మకి ఇష్టంలేదు. ఈ మధ్య సేనానాయకుడు గండమనాయకుని కుమారుడు మా యింటికి వచ్చి అమ్మను కలిసి ఏవో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ కంటకుని చూపులు, చేష్టలు నాకంతగా రుచించటం లేదు’’ దిగులుగా అంది. చంద్రప్ప మౌనంగా విన్నాడు.
వాళ్ళిద్దరూ విఠలస్వామి దేవాలయ ప్రాంగణం దాటి మెట్లు దిగుతున్నారు. వెన్నెల విరగకాస్తున్నది. ప్రేమైక జీవుల హృదయాల పట్ల వెన్నెలకీ ఆసక్తి ఎక్కువేమో అన్నంత ప్రకాశవంతమైన రాత్రి అది.
‘‘మంజూ! ఇంటిదాకా వస్తాను పద’’ ఆమె చేతిని వదల్లేదు చంద్రప్ప.
‘‘అహ… వద్దు. అమ్మకి తెలిస్తే! ఇంత పొద్దుపోయి రావటానికి కారణాలు చెప్పాలి. ఇంక నీతో చూస్తే?’’
‘‘మరేం చెప్తావు’’
‘‘మా నేస్తం మలయద్వతి ఇంట నృత్యారాధన చేసి వస్తున్నానని’’
‘‘ఎంతటి జాణవు! నీ ఆరాధన నృత్యానికా! నాకా!’’ కొంటెగా నవ్వాడు చంద్రప్ప.
‘‘చంద్రా! నిజం చెప్పనా! నీవు గాయకుడివి. నీ స్వరాలు నా అందెలు చేస్తున్న స్నేహం మనది.’’ అతని చేతిని మృదువుగా నొక్కి ముందుకు కదిలింది. ఆమె కనుమరుగయేంతవరకు చూసి చంద్రప్ప వడివడిగా కదిలాడు.
చంద్రప్ప అటు నాలుగడుగులు వేశాడో లేదో ఇటు తన గృహాన్ని సమీపిస్తున్న మంజరిని వెనుకనించి ఎవరో నోరు మూసేసి రెండు చేతులు వెనక్కి బిగించి పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆమె దిగ్భ్రాంతి చెందింది. కీచుగా అరవబోయింది. కానీ గొంతు భయంతో పెగలలేదు.
ఆమెను పట్టుకున్న వ్యక్తి కొంత నీడలో ఉండటం వల్ల ముసుగేసుకోవటం వల్ల అతనెవరో తెలీటం లేదు.
‘‘ఆ చంద్రప్పను మర్చిపో! లేదంటే’’ బొంగురు గొంతుతో హుంకరించాడు ముసుగుమనిషి.
ఇంతలో మరోవ్యక్తి చెంగున దూకి ముసుగుమనిషిని గట్టిగా మెడమీద కొట్టాడు. ఊహించని దెబ్బకు ముసుగుమనిషి మంజరి నొదిలేశాడు. ఆమె అతనికేసి తీక్షణంగా చూస్తున్నది. ఎవరో తెలీటం లేదు. కొత్తవ్యక్తి వదలకుండా కొడ్తున్న దెబ్బలకు ముసుగుమనిషి తట్టుకోలేకపోయాడు. దూరంగా పరుగులు పెట్టాడు. కొంతసేపట్లో కొత్తవ్యక్తిని తిమ్మరుసు మహామాత్యుని కుమారుడు గోవిందరాయలుగా గుర్తించిన మంజరి అతనికి వినమ్రంగా నమస్కరించింది.
‘‘మంజరీ! ఇంత రాత్రివేళ ఇలా రావటం మంచిదేనా! త్వరగా వెళ్ళిపో!’’ అంటూ గోవిందరాయలు చకచకా కదిలి నీడల్లో కలిసిపోయాడు.
అతని సంస్కారానికి మనసులోనే అంజలి ఘటించిందామె.
శ్రీకృష్ణదేవరాయల రాజ్యం తిమ్మరుసు శక్తిమీదే ఆధారపడిరదనుకున్నా, తిమ్మరుసు కుటుంబీకులంతా రాజు గౌరవాన్ని కాపాడేవారేననిపించింది.
ఆమె నివాసం మొన్నటిదాకా చిన్నాజీ భవనంలోనే! అప్పుడప్పుడు వచ్చే మంజరి కోసం కృష్ణసాని ఎదురుచూడటం జరిగేది కాదు. అందులోనూ మంజరిని రాజభవనానికి చేర్చాక కృష్ణసాని మరింత హాయిగా నిద్రపోతున్నది.
తల్లిగాఢనిద్ర చూసి నిట్టూర్చి తన కక్ష్యలోకి ప్రవేశించిన మంజరి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. ఎవరో తన గదిలో దేనికోసమో వెదికారన్న వాస్తవం అర్థం అయింది. తన గదిలోని భద్రపేటికలో తనపైన అతినమ్మకంగా చంద్రప్ప దాచిన రహస్యపత్రాలు మాయమయ్యాయని గుర్తించిన మంజరి వణికిపోయింది. రాజాగ్రహానికి గురికావలసివస్తుందనే భయంతో ఆ రాత్రంతా జాగారమే చేసింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీతో సమావేశ మందిరంలో దీర్ఘచర్చల్లో మునిగి
ఉన్నారు.
‘‘అప్పాజీ! మీరు చెప్పిన విషయాలకు మా మనసు కల్లోలపడుతున్నది. మనమేం చేయలేమా?’’
‘‘రాయా! రాజ్యక్షేమం రాజు వ్యక్తిగత అంశాలకన్నా ముఖ్యమైంది. అన్నపూర్ణాదేవిగారు సకల సద్గుణశీల. గజపతుల ఇంటి ఆడబడుచుగా తగిన మర్యాదలు కోరటం సహజం.’’
‘‘మనమూ ఏ విషయంలోనూ తీసిపోనివారమే!’’ రాయలు పౌరుషంగా అన్నాడు.
‘‘నిజమే రాయా! కానీ చెప్పుడు మాటలు ఎంతటివారలకైనా చేటు చేస్తాయి. మీరు అన్యథా భావించకపోతే ఆ వీరేంద్రుని… అదే… అన్నపూర్ణాదేవి వెంట ఈ రాజ్యానికి వచ్చిన ఆమె బంధువు. అతనిని ఓ కంట కనిపెట్టడం మంచిది’’ సాలోచనగా అన్నాడు తిమ్మరుసు మంత్రి.
‘‘నిజమే! గజపతులకు మనమీద ప్రేమాభిమానాలుంటాయని ఎప్పటికీ అనుకోలేము. మన సైన్యాధికారులందరినీ అప్రమత్తుల్ని చేయండి అప్పాజీ. చిన్నపామైనా పెద్ద కర్రను ఉపయోగించాల్సిందే.’’
‘‘మంచిది రాయా! నేనిక వెళ్ళివస్తాను.’’
తిమ్మరుసు వెళ్ళిపోయాక కృష్ణరాయలు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి కంగారుగా హజరారామ దేవాలయ ప్రాంగణంలో కదంబం చెట్టు నీడలో ఎదురుచూస్తున్నది చంద్రప్ప కోసం! అతను ఎంతకీ రాలేదు. మనసును సమాధానపరుచుకొని ఆలయానికి ప్రదక్షణం చేస్తున్నది.
హజరారామ దేవాలయం పేరుకు తగ్గట్టు రామాయణ కాలంనాటి కిష్కింధాపురిలో నిర్మించబడినందున ప్రాకారాల గోడమీద లోపలివైపు రామాయణ గాధంతా శిల్పచరిత్రగా లిఖించబడి ఉంది. వెలుపలి వైపు ఐదారు వరుసలుగా వీరసైనికులు, అశ్వాలు, ఏనుగులు, విజయనగర సైన్యశక్తిని చెబుతున్నట్లున్నాయి. ప్రధాన దైవమైన విష్ణువు, బుద్ధునిగా కన్పించడం ప్రత్యేక ఆకర్షణ. ఇది రాజవంశీకులు దర్శించే ఆలయం కావటాన ఎక్కువగా జనం లేరు.
ఎన్నోసార్లు చూసిన దేవాలయమైనా ఆనాడు మంజరి ప్రత్యేకంగా ప్రతిశిల్పాన్ని శ్రద్ధగా చూస్తూ పరిశీలిస్తూ ముందుకు నడిచింది. ఎంతటి నిష్ణాతులైన శిల్పులైతేనే ఇది చెక్కగలుగుతారు! చంద్రప్ప ఎంతకీ రాడేం? జరిగింది చెప్పాలని తనెంత ఆతురతతో ఉంది.
దేవాలయ శిల్పాలమీద మనసు నిలవడం లేదు. ఇంతలో దూరంగా చంద్రప్ప కనిపించాడు. ఆ నడకలో మునుపటి చురుకుదనం లేదు.
‘‘చంద్రా!’’ ఎదురెళ్ళి కౌగిలించుకుంది. అతనామెకు దగ్గరకు తీసుకొని దేవాలయం ప్రాంగణంలో అరుగుమీద కూర్చుండబెట్టాడు.
‘‘ఎలా జరిగింది? ఎవరి పని?’’ అడిగాడు.
‘‘తెలియటం లేదు. కంటకుని పనేమో! మొన్నరాత్రి జరిగిన సంఘటనలు రెండూ జోడిరచి చూస్తే మనమీద కాదు, విజయనగరం మీదే ఏదో కుట్ర జరుగుతున్నట్లనిపిస్తుంది.’’
‘‘రహస్యపత్రాలు దొంగిలించబడినట్లు తిమ్మరుసులవారికి తెలియాలి.’’
‘‘వారు చారచక్షువు. వారికీపాటికి తెలిసే వుంటుంది. నన్ననుమానిస్తే ఎలాగా అనే ఆలోచిస్తున్నాను.’’
‘‘నువ్వే వెళ్ళి తిమ్మరుసు మహామాత్యుల వారికి జరిగింది విన్నవించు. అమాత్యులు ప్రజ్ఞావంతులు. విచక్షణతో వ్యవహరిస్తారని నా నమ్మకం.’’
ఆమె విశ్వాసాన్ని అతను ఖండిరచలేదు.
‘‘సరే! నేను తిమ్మరుసులవారిని కలుస్తాను. అంతా విరూపాక్షుని దయ’’
విచారంగా వెళ్ళిపోతున్న చంద్రప్పనుఅలాగే చూస్తూండిపోయింది.మంజరి.
అతను తిమ్మరుసును కలవలేదనీ, వీరేంద్రుని కుట్రవల్ల దారిలోనే రాజభటులు రాజద్రోహం నేరంకింద అతన్ని బందీనిచేసి చెరసాలలో పెట్టారనీ మరో నాలుగు దినాలదాకా మంజరికి తెలిసే అవకాశమే లేదు.

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

బాల సాహిత్యం లో బుర్ర కథ -విప్లవ జ్యోతి అల్లూరి సీతా రామ రాజు ….

by Divakarla Rajeshwari August 15, 2022
written by Divakarla Rajeshwari

జానపద వినోద గాన కళా ప్రక్రియగా బుర్రకధ ఉత్తమ ప్రచారసాధనం. సంగీతం, నృత్యం, అభినయాలతో కూడిన జన ప్రియమైన ప్రదర్శన కళ బుర్ర కథ. ప్రజలకు వినోదంతో పాటు
విజ్ఞానాన్ని ప్రసాదించి, ఉత్తేజ పరచిచైతన్య వంతులను చేయగలిగిన మహత్తర మాధ్యమం బుర్రకథ.

బుర్రకథ లో ప్రధాన కథకుడు, భుజం మీది తంబురా మీటుతూ, ఎడమ చేతివ్రేళ్ళలోని అందెల్ని మ్రోగిస్తూ తంబురా శృతిలో కథా గానం చేస్తాడు. షరాయి, నిలువుటంగీ, తలపాగ ధరించి, కాళ్ళకు గజ్జెలు ధరించి, రసానుగుణంగా చిందులు తొక్కుతూ, గంతులు వేస్తూ, అభినయిస్తాడు. అతని గానాలాపనలకు సహకరిస్తూ ఇద్దరు లేక ఒక్కరు గుమ్మెటలు ధరించి, తందాన తాన వంత పాడుతూ, కథాకథనంలో తాళరీతిని అందిస్తారు.
బుర్ర కధలుగా స్వాతంత్ర్య వీరుల గాథలు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగిస్తాయి.భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు చరిత్ర ప్రత్యేక మైన అధ్యాయం.

ఓడిపోతానని తెలిసి కూడా/ కడదాకా పోరినెత్తురోడి పడిపోవడం/ సాధారణ యోధ కథప్రజల మీది ప్రేమతో/ ప్రజల్ని గట్టెక్కించాలనిఆత్మార్పణ చెయ్యడం/ అసాధారణ వీరగాధ!…
అటువంటి అసాధారణ యోధుడు అల్లూరి సీతారామరాజు గాధను వచన కవితా కథా కావ్యంగా మలిచారు ప్రజాకవి డాక్టర్‌ అద్దేపల్లి రామ్మోహనరావుగారు. అల్లూరి సీతారామరాజు గారి వీర గాథ తెలుగులో అనేక ప్రక్రియలుగా వెలువడింది. వీరగాథా వాజ్ఞ్మయంపై లోతైన పరిశోధన చేసిన డా.తంగిరాల సుబ్బారావు గారి కోరిక మేరకు డా.మల్లెల గురవయ్య 1995లో ‘సీతారామ రాజీయము’ పేరుతో సుమారు 2000 పద్యాల్లో ఒక మహా కావ్యాన్ని రచించారు. దాన్ని అల్లూరి శతజయంతి సందర్భంగా 1997 జూలై లో ముద్రించారు.

జానపదులు అల్లుకున్న వీర గాథల్లో మిక్కిలి జనప్రియమైన కథ అల్లూరి సీతా రామ రాజు. శ్రీ సుంకర సత్యనారాయణ గారు ఈ వీరుని స్వాతంత్య్ర సమరాన్ని ఒక ఉత్తేజపూరిత మైన బుర్రకథగా రూపొందించారు. బుర్రకథా పితామహులుగా పేరు పొందిన శ్రీ నాజరు గారు ఈ వీరుని కథను ఊరూరా ప్రదర్శించి ప్రచారం చేసారు. బుర్రకథకు ప్రత్యేకమయిన దుస్తులు ధరించడం శ్రీ నాజరు గారితో ప్రారంభమయింది.

శ్రీ అల్లూరి సీతారామ రాజు ను విప్లవ జ్యోతిగా కీర్తిస్తూ శ్రీ పి. దుర్గా రావు ఎం ఒ ఎల్ గారు బుర్రకథను రాసారు. (1955 ). దుర్గా రావు గారు భారత కోకిల సరోజినీ దేవి. నవయుగ నిర్మాత శ్రీ కందుకూరి, వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితాలను గూర్చి చిన్న చిన్న బుర్ర కథలను రాసినట్టు తెలిపారు. పూర్వం వారు రావుల పెంట పాఠశాల విద్యార్థులు ప్రదర్శించడానికి రాసిన కథను విస్తృత పరచి ప్రస్తుత బుర్ర కథను బాలలందరికి ఉపయోగార్థం గా ప్రచురించారు. (1984 మే ). పుస్తక ప్రతిని బట్టి వారు చెరుకు పల్లి పోస్ట్,నక్రేకల్, నల్లగొండ జిల్లా వాస్తవ్యులని తెలుస్తుంది.
దుర్గా రావు గారు తాము ఈకథను బాలల కోసం రాసినట్లుగా ప్రకటించినా,అల్లూరి
సీతారామరాజుకథ ఆబాల గోపాలానికి అచంచలమైన దేశ రక్షణా ధ్యేయాన్ని కలిగిస్తుంది.

తమ రచనకు అల్లూరి సీతారామ రాజు చరిత్ర పరిశోధకులు, రచయిత, స్వాతంత్య్ర సమరయోధులు. శ్రీ పడాల రామారావు గారు రాసిన “ఆంధ్రశ్రీ “మొదలైన గ్రంధాలు ఆధారమని తెలిపారు. దుర్గారావుగారు బుర్రకథ ఆరంభం లో అమర వీరులందరకూ, దేశభక్తులకూ జోహారులను అర్పించారు. ప్రార్థన గా “అంబవైన నీవేనమ్మా! జగదాంబవైనా నీవేనమ్మా! అని భారతాంబను స్తుతించారు.

బుర్రకథకు జీవం వంతలు. వంతల బలం లేక పోతే బుర్రకథకు అందం లేదు. కథకుడు చరణం పాడిన తరువాత, “భళా భళానోయ్ తమ్ముడా! సై భాయి భళానోయ్ తమ్ముడా!” అంటూ ఈ బుర్ర కథలో వంత కథకునికి తోడుగా తమ్మునిగా సహకరించాడు.

వంత అడిగిన ప్రశ్నలకు సందేహాలకు జవాబు చెబుతున్నట్లుగా కథకుడు విశాఖ జిల్లా పాండ్రింగిలో 1897 జులై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు పుట్టుక నుంచి 1924లో జరిగిన బలిదానం వరకూ జరిగిన ఏ సంఘటననూ విడవకుండా అన్నింటినీ పూసగుచ్చినట్లుగా వివరించాడు.
వినరా భారత వీర కుమారా !-విజయము మనదేరా! అంటూ పల్లవి తో ఆరంభం అయిన కథ, రగడలతో, కీర్తనలతో, పల్లె పదాలతో, సందర్భానికి తగిన బాణీలతో, రసావేశం చిందే పదాలతో రక్తి కట్టింది.
రచయిత తాము బాలలకోసం ఉద్దేశించి రాసారు కాబట్టి, ప్రతి గీతాన్ని పాడిన తరువాత తమ్ముడు అని సంబోధించిన వంతకు సంభాషణలో మరల కథను వివరించారు.

“పదునేడవ శతాబ్దిరా
పడవల పైనే వచ్చిరి” …ఈస్టిండియా పేరుతో వాణిజ్యానికని వచ్చిన ఆంగ్లేయులు “నెత్తిన టోపీ
పెట్టుక, మెత్తని మాటలు నత్తుచు, ఒకచే త్రాసునుబట్టుక, ఒకచే కత్తినిబట్టుక ” “భారత దేశము నాక్రమింపగా
పన్నాగమునే పన్నిరి దొరలు”. …అని కథకుడు ద్రుత తాళ గతులతో పాడుతూ,
“భారత ప్రజలే ముందుకొచ్చిరి పగతురనెదిరింపా. ..
అంటూ ఆవేశం కనబరుస్తూ” “బుసలు కొట్టెడి నాగుబాములా
కెరటాల్ చిందేసముద్రంబులా
గిర గిర తిరిగేసుడిగుండములా ..దేశ ప్రజలలో రగులుకున్న జ్వాలను ఉపమానం కావించాడు.

ఆ ప్రజా విప్లవం తిరుగుబాటును ఆంగ్లేయులు అణచి వేసారని ఆ ఆరంభ సంగ్రామ మే స్వాతంత్ర్య దీక్షకు ప్రేరణమని కథకుడు…తందాన తాన, క్రమం లో కథను సమ తులగతుల తో నడి పించాడు.
తరువాత గాంధీజీ నాయకత్వం లో స్వాతంత్రోద్యమం జరుగుతున్నా సాయుధం గా పోరాడి రక్తం చిందినప్పుడే స్వాతంత్ర్యం పొందగలమని మన్యంలో పోరాటం జరిపాడు అల్లూరి సీతారామరాజని కథా సూత్రాన్ని బిగించాడు.
విశాఖ లో సుభాష్ చంద్రబోసు ఉపన్యాసం ద్వారా దీక్షా కంకణ బద్ధుడై చదువుకు స్వస్తి చెప్పి సీతారామరాజు సంగ్రామానికి దూకాడని ఆ యువకుని లో జాగృత చైన్యానికి నాందిని తెలిపాడు.

మహాత్మా గాంధీ గారు ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించిన సందర్భం లో “నేను సాయుధ విప్లవాన్ని ఆమోదించ లేను, కాని శ్రీ రామ రాజు వంటి ధైర్య వంతుడు, త్యాగి, నిరాడంబరుడు, ఉత్తమ శీలుడునగు యువకునికి జోహారులు అర్పింపకుండ ఉండలేను “(యంగ్ ఇండియ పత్రిక 1926.) అని గాంధీ గారు సీతా రామ రాజును గురించి రాసారు.

సీతా రామరాజు ,స్వాతంత్ర్య దీక్షను వహించడానికి ముందుగా దేశమంతా పర్యటన కావించాడని, తాను నిర్వహించ వలసిన కర్తవ్యాన్ని గురించి పరి పరి విధాల ఆలోచించాడని తెలుపుతూ కథకుడు సంభాషణా లౌల్యం లో మునిగిపోయినప్పుడు, వంత అతడు ఉపన్యాస ధోరణి లోకి మళ్ళాడని చనువుగా చెప్పడం రచయిత తనకు తానే హెచ్చరించు కున్నట్లు కనిపిస్తుంది.

రౌలటు ఆక్టు, తీవ్ర నిర్బంధాలు, జలియన్ వాలాబాగు హత్యలు, డయ్యరు సేనాని దురంతాలు సీతా రామ రాజు మనస్సును కలచి వేశాయి.
మన్య ప్రాంతం లో ఆంగ్లేయుల ఘోర పైశాచిక కృత్యాలు కనబడ్డాయి. కోయ ప్రజల దీనావస్థలను కళ్ళారా తిలకించాడు.
నిర్దాక్షిణ్యం గా హింసిస్తున్న తీవ్ర శక్తులతో పోరాడాలని బహిరంగంగానూ, రహస్యం గానూ, పోరాడి చావు దెబ్బ కొట్టాలని నిశ్చయించాడు.
ఇక్కడ రచయిత రామరాజు వ్యక్తిత్వాన్ని చక్కాగా నిరూపించారు. వ్యక్తిగతంగా ఆ వీరుడు హింసావాది కాదని, తీవ్ర శక్తులను అంత చేయడమే ఆతని ధ్యేయం అనీ స్పష్టం చేసారు. ఆ ఆశయం కోసం నిప్పు రవ్వగా రాజుకొని జ్వాలగా ప్రజ్వరిల్లిన ఆతన భావ తీవ్రతను బాలలకు తగిన పదాలతో వివరించారు.
పరదేశీయులతో జరిగే పోరాటం లో సమిధగా కావాలనీ, దేశమాత చరణాలకు పూజా పుష్పం గా ఆత్మార్పణ కావించు కోవాలని ఎంచినట్లు సీతారామరాజు త్యాగ గుణాన్ని తెలిపారు.

మన్య ప్రాతం మధ్య ప్రదేశ్ ఒరిస్సాలకుమధ్య -ఇటు ఉభయ గోదావరులను ఆనుకుని కొండలతో, కోనలతో, అడవులతో నిండి ఉందని మన్య ప్రాంతాన్ని బాలలకు భౌగోళిక పటం గీసినట్లు తెలిపారు.
మన్య ప్రాంత ప్రజలు “చేతులు రెండు -చక్కన ఉంటే -చల్ల కదలనీ -చల్లని బ్రతుకు -ఎల్లారే ఎల్లల్ల పిల్లా!” అంటూ జానపద రీతులలో ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా ఉన్న జన జీవన రీతికి తంబురను మీటారు.
అల హాయిగా సాగే మన్యం లో జొరబడి క్రూరమైన దమన నీతితో ఆంగ్లేయులు
అమాయకులను హింసించారు. వాళ్ళ భూములను ముఠా దార్లకు అప్పగించారు.
ఇక్కడ రచయిత కథకు కొంత విరామాన్ని కల్పిస్తూ కథకుని ద్వారా
మన్య ప్రజలను కాపాడ దలచిన సీతారామరాజు తలిదండ్రలు, జననము. బాల్యము లను గురించి వినరా భారత వీర కుమారా! అని వినిపించారు. ‘ప్రాణాలకు తెగించి పోరాడుట, ప్రాణాలిచ్చి యితరుల్ని రక్షించుట, అతనికి పుట్టుక నుంచి కలిగినగుణాలు.. అందుకు ఉదాహరణగా బాల్యంలో గోదావరిలో కొట్టుకుపోతున్న మిత్రుణ్ణి తనకు ఈత రాక పోయినా సంకల్ప బలంతో గోదావరిలో దూకి అతన్ని ఒడ్డుకు లాగి రక్షించడాన్ని విన్నవించారు.
సీతా రామ రాజు మన్యానికి సింహ ద్వారం అయిన కృష్ణ దేవు పేట నీలకంఠేశ్వరాలయం లో సన్యాసిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించడం జరిగింది. అక్కడ రాజుకు చిటెకెల భాస్కర రావు గారు ఆశ్రయం ఇచ్చారు.
ఇక మన్యం కోయలను బాష్టియన్ అనే తహసిల్దారు క్రూరంగా హింసించిన రీతి ఆనాటి దీనావస్థను ధ్వనించింది.
కోయలను కూలెద్దులుగా చేసి, వాళ్ళ శ్రమను దోచుకున్న విధానాన్ని తెలుపుతూ, “భద్రాద్రి రాముడా!బాధలికెన్నాళ్ళు! ఐలేసా!ఓ ఐలేసా అంటూ శ్రామిక గీతాలను చేర్చారు. అతని బాధలు తట్టుకోలేక కోయలు ఎదురు తిరిగారు. సీతారామరాజు వారికి అండగానిలిచాడు. సమీపాన ఉన్న గట్టు పొణకల గ్రామం మునసబు గంటు దొర,అతని తమ్ముడు మల్లుదొరలు కూడా తోడయ్యారు. వారితో బాటుగోవిందు రత్తి దంపతుల పరిచయం కలిగింది. మరికొంతమందితో కలసి సీతా రామరాజు సామ్రాజ్య వాద శక్తులను, వారి తాబేదార్లను ఎదుర్కొనడానికి ప్రణాళికను సిద్దం చేసాడు.

ముందుగా సీతా రామరాజు కోయ చెంచులలో ఐకమత్యం కలిగించడానికి కృషి చేసాడు.
తాగుడు మానమని ప్రబోధించి, మల్లు దొర వంటి వారిచే కూడా మాని పించాడు.
అంతా ఒక్కటే కులం కర్మజీవులం శ్రమజీవులం అని బోధించాడు. వారిని మట్టి నుండి మహావీరులను కావించాడు. ఇత్తడిని పుత్తడి గా మలచాడు. 24 సంవత్సరాల వయసులో (1921) లోమన్యం తిరుగు బాటు సాయుధ పోరాట లక్ష్యం స్వాతంత్ర్య సాధనగా ఏర్పరచాడు.

సీతా రామ రాజు గాము కొండ ధార కొండల నడుమ విప్లవ పొరాట యొధులకు గెరిల్లా పద్ధతులను ప్రబోధించాడు. గెరిల్లా పద్ధతులను గురించి
“ప్రక్క పోటు పొడవండి
పక్షి వోలె యెగరండి
చుక్కలు తెగి పడి నట్టులుగా
సూటిగ శత్రువు పై బడుడీ
వెనక నుండి పై బడదాము వేగమె
కను మరుగవుదాము భారతీయ వీరులు అనగా
భయము తోడ పరుగిడవలెరా” అంటూ కథకుడు పోరాట పటిమకు తగిన అభ్యాస నైపుణ్యాన్ని విశదం చేసాడు.
ఇక తుపాకులు ఫిరంగులు మారణాయుధాలు కలిగిన ఆంగ్లేయులతో రామరాజు “విల్లమ్ములతో వచ్చి చేరుకొను వేయి కనులతోడా ..
అమ్ముకు కట్టీ మిరపకాయలను
అంపును లేఖల శత్రు శిబిరముల,
ఇన్ని గంటలాకు-ఇన్ని దినములకు
వచ్చెద కాచుకొమ్మనుచు …అంటూ మిరప కాయ టపా ను గూర్చిన విశేషాన్ని తెలిపినప్పుడు
ఒక అమ్ముకు మిరపకాయను చీటీని గుచ్చి తాము దాడి చేయ బోయే ప్రదేశానికి దగ్గర చెట్టుకో తలుపుకో ప్రయోగించేవారని బాలలకు విశదం అవుతుంది
అల్లూరి సీతా రామ రాజు మెరుపు దాడి చేసిన స్టేషను లను వరుస గా తెలుపుతూ, ఆ దాడులలో పట్టుబడిన ఆయుధాల వివరాలను ఎప్పటికి అప్పుడు రికార్డు పుస్తకాలలో దాఖలా చేసినట్లు, అల్లూరి సీతా రామ రాజు పోరాట నిబద్ధతను కథకుడు వెల్లడించాడు.
అలాగే లాగరాయి పితూరియోధుడు వీరయ్య ను గురించి చెప్తూ. పితూరీలు అంటే ఉద్యమాలు, తిరుగుబాట్లు అనీ. వాటిని వైరులు అణచి వేసానీ తెలిపాడు.

ఇలా కొనసాగి పోతుంటే
ఆ వెల్లువ నాపే శక్తి లేదని బాష్టియను బ్రేకను దొరకు వినతి చేసాడు.

ఇక్కడ హాస్యాన్ని జోడించారు రచయిత. బ్రేకను హల్లో హల్లో అని ఆర్తనాదం చేస్తూ మన్యం వీరుని చిత్ర గాథలను మద్రాసు గవర్నరు వెల్లింగ్టన్ కు ఫోనులో గోడు చెప్పుకున్నాడని అల్లూరి సీతారామ రాజు పరాక్రమాన్ని అన్యాప దేశం గా నిరూపించారు.
మన్యం విప్లవాన్ని అణగ ద్రొక్క డానికి
జర్ జర్ మనుచు లారీల నిండా కాకినాడ రిజర్వు దళాలు కదిలి వచ్చాయి,
జయపురం నుండి ఏనుగులు వచ్చాయి.
తిరుగుబాటును అణచి వేయడానికి గవర్నరు ప్రపంచ యుద్ధం లో పేరు పొందిన మేజర్ జనరల్ గుడాల్ ను పంపించాడు. కాని
అతని వల్లకూడా సాధ్యం కాలేదు.
“కుయ్యో మొర్రో అని కూత పెట్టాడు….
గుడాలు వినతికి పై అధి కారులు
పంపిరి వేలాది సైనిక భటులను,
గూర్ఖాదళమును గూర్చి పంపిరీ
మలబార్ పోలీసు మందిని దెచ్చిరి మన్యం భూములకూ” …రామరాజు తో తామిక చాల లేమని స్పెషల్ ట్రయిను లో దిగిన అస్సాము, మలబారు, గూర్ఖా దళాల తో మన్యం నిండి పోయింది.

తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు బ్రేకను దొరకు బదులు రూథరు ఫర్డ్ వచ్చాడు. ఈ రూథర్ ఫర్డ్ పన్నుల నిరాకరణోద్యమం సాగించిన పల్నాటి వీర హనుమంతుని చంపిన వాడు. ప్రపంచ
యుద్ధం లో ఎడారి యుద్ధ యోధుని గా పేరు పొందిన కవర్టు హైటరులు కూడా గుడాలుకు సహాయకులుగా వచ్చారు.
వారు ఇక విప్లవ జ్యోతిని మోసం తో ఆర్పివేయడమే శరణ్యం అని తలచారు,
వారి క్రూర నీతి నెరుగక భాస్కర రావు గుడాలు తో సంధి చేసుకోడానికి వెళ్ళ మని అల్లూరి సీతా రామ రాజుకు సలహాను ఇచ్చారు.

అల్లూరి సీతా రామ రాజు ఆంగ్లేయులకు దొరికి పోవడం, ఆ వీరుని మరణాలను గురించి, వేర్వేరు వివరణలున్నాయని, బుర్రకథా రచయిత తెలిపారు.
కొన్ని గ్రంథాలలో ఆశ్రయాన్నిచ్చిన చిటికెల భాస్కర రావు గారి సలహాను అనుసరించి అల్లూరి సీతా రామ రాజు ఆంగ్ల సేనాని గుడాలు దగ్గరకు వెళ్ళడం, అతడు మోసంతో అల్లూరిని బంధించి కాల్చివేసినట్లు ఉందని , శ్రీ పడాల వారు రాసిన ఆంధ్ర శ్రీ లో శ్రీ రాజు రక్త సిక్తమైన తన దేహాన్ని యేటిలో కడుగు కొని అర్ఘ్యం ఇస్తున్న సమయం లో అస్సాం సైన్యానికి తెలిసి, శ్రీ రాజును బంధించి చెట్టుకు కట్టి కాల్చారని ఉందని దుర్గా రావు గారు తెలిపారు.
దుర్గా రావు గారు తమ బుర్ర కథలో సీతా రామరాజు భాస్కర రావు గారి సలహాను విని ఒక్క క్షణం చ లించినట్లు, తరువాత చిన్న తనం లో తడ్రి పలికిన మాటలు జ్ఞప్తికి వచ్చి ఆంగ్లేయులతో పోరాడడానికే నిశ్చయించినాట్లు రాసారు. రక్త సిక్తమైన దేహాన్ని నదిలో కడుగు కొని సంధ్యార్కునికి అర్ఘ్యాన్ని ఇస్తున్న సమయం లో అస్సాం సైన్యం చుట్టు ముట్టి, సేనాని గుడాలు దగ్గరకు తీసుకుని పోగా అతడు సీతారామరాజును చెట్టుకు కట్టి కాల్చాడని రాసారు.

అల్లూరి సీతారామ రాజు అనుచరుల పేర్లు, శత్రువులైన దొరలపేర్లు, అధికారుల పేర్లు, ఇలా అందరి పేర్లూ రచయిత పొందుపరిచారు. ఒక ప్రజాయోధుడు, ఒక మహా విప్లవకారుడు
మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు వెలుగుబాట వేసిన త్యాగధనుని అమరగాధ ను అతి సరళం గా బుర్ర కథగా రచించిన పి. దుర్గా రావు గారు అభినంద నీయులు రాజేశ్వరి* దివాకర్ల .

విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో
జరిగే జయంతి (జూలై 4)కార్యక్రమానికి ప్రధాని మోదీ భీమవరాన్ని సందర్శించారు.

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us