మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 26, 2025
written by Narendra Sandineni

వాసి జ్యోత్స్న రచించిన నువ్వూ – నేను కవిత

కవయిత్రి,వాసి జ్యోత్స్న కలం నుండి జాలువారిన నువ్వూ – నేను కవిత పై విశ్లేషణా వ్యాసం.ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు నువ్వు – నేను అనే మాటలు సంభాషణలో తరచుగా వాడుతారు. వ్యక్తిగతంగా తన గురించి చెప్పడానికి నేను అనే పదాన్ని ఉపయోగిస్తారు.నువ్వు మరియు నేను,ఇది సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని సూచిస్తుంది.అత్యంత ఆత్మీయులు కలిసినప్పుడు ఎలా పలకరిస్తారో చూడండి.నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను?నువ్వు చెప్పు నేను వినాలని ఉంది.ఇది ఒకరికొకరు పలకరించుకునే విధానాన్ని తెలుపుతుంది.కవయిత్రి జ్యోత్స్న రాసిన నువ్వూ – నేను కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతుల లోకంలోకి వెళ్లి విహరించండి.
“నీ దగ్గరున్నంతవరకే/ఏ విషయమైనా రహస్యం/అంటున్నారు.గుప్పిట దాచి ఉంచినది రహస్యం.ఎవరికి తెలియకుండా గుప్తంగా ఉంచిన విషయం రహస్యం.ఒకరి విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా ఉండటం రహస్యం.ఎవరికీ తెలియని విషయం రహస్యం.నువ్వు – నేను ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గల సంబంధాన్ని సూచిస్తుంది.ఒకరు చెప్పిన విషయం మరొకరు గోప్యంగా ఉంచితేనే అది రహస్యంగా ఉంటుంది.
“నీ పెదవి దాటి మరో/చెవిన చేరిన తక్షణం/ప్రతి పదం హాస్యమే../అంటున్నారు.ఈ కవితా పంక్తులలో
ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి. ఒకరి పెదవి దాటి మరొకరి చెవికి వెళ్లిన వెంటనే రహస్యం రట్టు అవుతుంది.అసలు రహస్యం యొక్క గౌరవం,విలువ తగ్గిపోతుంది.ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాల్సిన విషయం బయటపడితే అది హాస్యాస్పదంగా మారిపోతుంది అనే భావన కవితలో వ్యక్తం అవుతున్నది.రహస్యం విషయం యొక్క గోప్యతను నొక్కి చెబుతుంది.మనం ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి.అట్టి విషయం వారు ఇంకొకరికి చెబితే ఆ రహస్యానికి విలువ ఉండదు.మన ఇద్దరి మధ్యన ఉండాల్సిన రహస్యం.దానిని ఇతరులు సాధారణ విషయంగా తీసుకుంటారు.ఈ కవిత రహస్యాన్ని ఇతరులకు తెలియకుండా కాపాడాలనే సందేశాన్ని ఇస్తుంది.
“నీ.. నా .. జీవితాలలో/ప్రతి క్షణం విలువైనది/ వలువల్లా చీల్చుకు తినే/బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/ అంటున్నారు.నీ జీవితం,నా జీవితం మరియు ఎవరి జీవితం అయినప్పటికీ ప్రతి క్షణం విలువైనది.మన జీవితాల్లో ప్రతి క్షణం అమూల్యమైనది.గడిచి పోయిన సమయం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు.కాబట్టి సమయం విలువను గుర్తించాలి. సమాజంలో లేదా వ్యక్తిగత జీవితంలో మనుషులు ఉత్తమమైన విలువలను కోల్పోతున్నారు. ఆత్మీయత, నమ్మకం,నైతికత వంటి విలువలు తగ్గిపోయాయి.పైకి కనిపించే మాయాజాలం వల్ల మనుషులు వలపుల ఆకర్షణలకులోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
“బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/మన గుండె భావోద్వేగాలకు స్పందించాలి.కానీ,ఇప్పుడు సున్నితంగా ఉండాల్సిన గుండె కఠినంగా బండరాయిలా మారిపోయింది. మనిషి తాను అనుభవించే బాధలు,గాయాలు తట్టుకోలేకపోతున్నాడు.జీవిత పోరాటాల వల్ల మనిషి మనసు కఠినంగా మారింది.ఇవ్వాళ మనిషి బ్రతుకు ఒక విధమైన భారంగా మారింది.మనిషి జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని కవిత ఎత్తి చూపుతుంది.విలువలు కోల్పోయిన సమాజంలో జీవిస్తున్నాం.మనుషులు బాహ్య ఆకర్షణల వలలో చిక్కినారు.మనుషులు నిజమైన అనుబంధాలను మర్చిపోయారు.సున్నితంగా ఉండాల్సిన మనిషి హృదయం బండరాయిలా మారిపోయింది.మనిషి లోపల తీవ్రమైన ఒత్తిడి,శూన్యతను ప్రతిబింబిస్తుంది.ఇందులోని భావం సమకాలీన జీవన శైలికి అద్దం పడుతుంది.మనిషి హృదయం బండబారిపోయినప్పటికీ తాను బ్రతకడానికి ప్రయత్నిస్తూ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
“నువ్వూ – నేను నవ్వుకుంటూ/నమ్మకంగా సాగిపోవాలే తప్ప/నువ్వెంతంటే నేనెంతని/నిత్యం ఘర్షణలతో ప్రాముఖ్యమైన/సమయాన్ని సామర్థ్యాన్ని/వృథా చేసుకోకూడదు/అంటున్నారు. నువ్వు నేను నవ్వుకుంటూ నమ్మకంగా సాగిపోవాలి. మన మధ్య స్నేహం,ప్రేమ,అనుబంధం కొనసాగాలి. మనం ఒకరి పట్ల ఒకరు నమ్మకంతోనే ఉండాలి. ఆత్మీయతతో మెలగాలి.ఆనందంగా ఉండాలి.మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా అవి మన బంధాన్ని ప్రభావితం చేయకూడదు.మనం ఇద్దరం నువ్వెంతంటే నువ్వెంతని నిత్యం ఘర్షణలకు తావు ఇవ్వరాదు.గర్వం వల్ల వచ్చే సమస్యలను గురించి చెబుతుంది.అహంకారం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.నువ్వు గొప్ప,నేను గొప్ప అనే భావనతో మెలగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన జీవితంలో సమయం అమూల్యమైనది.మన సామర్థ్యాన్ని,శక్తిని అనవసరమైన గొడవలకు వినియోగించ రాదు.అందు వల్ల మన విలువైన సమయం వృథా అవుతుంది.మనం ఇరువురం పరస్పరం అర్థం చేసుకుని కలిసి మెలిసి పురోగమించాలి.మనలో నెలకొన్న అనవసరమైన అహంభావాన్ని వదిలి పెట్టాలి.ఇరువురు నమ్మకంతో కలిసిమెలిసి అన్యోన్యతలతో జీవించాలని సూచిస్తుంది.మనలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే పోటీ తత్వం వద్దు.మన ఇద్దరం గర్వాన్ని విడిచి పెట్టాలి.మన ఇద్దరం గర్వంతో ఉంటే కీడు సంభవిస్తుంది.గర్వం వల్ల మేలు జరగదు.మన జీవితంలో విలువైన సమయాన్ని అప్రయోజనమైన విభేదాలతో,వివాదాలతో వృథా చేసుకోకూడదు. మనం ఒకరినొకరం అర్థం చేసుకొని కలిసి మెలిసి ఉండాలి.మనం నవ్వుతూ ఆనందంగా ముందుకు సాగాలి అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.
“వికృత చేష్టలతో/ప్రకృతి ప్రకోపించేలా/ఆకృత్యాలకు పాల్పడుతూ/అనునిత్యం నలిగిపోతూ/ఆవేదనలతో కుంగిపోతూ/మానవత్వాన్ని మింగేయొద్దు/ అంటున్నారు.వికృత చేష్టలు అంటే మనిషి చేస్తున్న అనైతిక పనులు,హింస మరియు పర్యావరణాన్ని హానికరంగా మార్చే చర్యలు.మనుషుల తప్పిదాల వల్ల ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. భూకంపాలు,వరదలు,వాతావరణ మార్పులు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మనుషులు చేస్తున్న ఆకృత్యాలకు అందరు అనునిత్యం నలిగిపోతున్నారు.మనుషులు దుష్టమైన పనులు చేసి ఇతరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.మనుషులు తప్పు దోవలో నడిచి తోటి వారిని ఆవేదనలకు గురి చేస్తున్నారు.మనిషి మనస్సు నిరాశగా మారి పోయింది.మానవులు సృష్టించిన దుష్ప్రభావాల వల్ల చివరికి మనమే బాధపడుతున్నాం.ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మానవత్వాన్ని మర్చిపోవద్దు.ప్రేమ, సహాయము,నైతికత వంటి విలువలను కోల్పోకూడదు.మనలో మానవత్వం వెల్లి విరియాలి.స్వార్థపూరితుడై మనిషి మనిషిని మింగి వేయకూడదు.సమాజంలోని అనైతికతను, ప్రకృతి వినాశనాన్ని మరియు మానవ సంబంధాల్లో పెరుగుతున్న అసహనాన్ని,అశాంతిని కవిత ఎత్తిచూపుతుంది.మనలోని అహంకారం, స్వార్థపూరిత వికృత చర్యలు చివరికి మనకే నష్టం తెచ్చిపెడతాయి.కాబట్టి మానవత్వానికి పెద్ద పీట వేసి సమాజానికి మేలు చేసే విధంగా నడుచుకోవాలి అని కవయిత్రి జ్యోత్స్న ఈ కవితలో సందేశాన్ని అందిస్తున్నారు.కవయిత్రి జ్యోత్స్న మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 26, 2025
written by Narendra Sandineni

డాక్టర్ బి.దామోదర్ రావు రచించిన నా కవిత సమత కవిత.

ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకుడు, డాక్టర్ బి. దామోదర్ రావు కలం నుండి జాలువారిన నా కవిత సమత పై విశ్లేషణా వ్యాసం.
“నా కవిత నందనవనంలో సుందర ప్రతిమ కాదు/ అంటున్నారు.నందనవనం అనగా పూలతో అలరారుతూ ఆనందాన్ని పంచే వనం.నందనవనం పిల్లలు ఆడుకునే అందమైన పూల చెట్లతో ఆహ్లాదాన్ని కలిగించు ప్రదేశం.దేవలోకంలోని వనం నందనవనం.సత్యభామ కోసం కృష్ణుడు స్వర్గమునకు పోయి నందనవనం నందలి పారిజాత వృక్షమును భూమికి తెచ్చినట్లు పురాణాల్లో ఉంది.కవి తాను రాసే కవిత అందమైన ప్రతిమను వర్ణించడం కాదు.తాను రాసే కవిత శ్రామికుని నిజమైన శ్రమ జీవిత సత్యాలపై ఆధారపడి ఉంది.నా కవిత భావ ప్రపంచానికి చెందినది కాదు అని కవి స్పష్టం చేస్తున్నాడు.కవి తాను రాసిన కవిత కేవలం అలంకారమైన సౌందర్యానికి బదులు జీవన పాఠాన్ని ప్రతిబింబించే ప్రకృతిని చూపిస్తుందని తెలుపుతున్నారు.
“శ్రమైక జీవుల కర్మజల బిందువు/అంటున్నారు.శ్రామికుల శ్రమ,కష్టం,అంకితభావం,జీవితానికి ప్రాణం అని కవితలో చెప్పబడింది.మానవ జీవితం శ్రమ పూర్వకమైనదిగా ఉండాలన్న సందేశం ఇక్కడ కనిపిస్తుంది.శ్రామికుని శ్రమతో నిండిన జీవితం మాత్రమే నిజమైన జీవిత లక్ష్యం అని ప్రతిపాదిస్తుంది.
“శాంతి,సమతల సింధువు/అంటున్నారు. న్యాయం,శాంతి,సమానత్వం అద్భుతమైన సముద్రం లాంటివి. శాంతి,న్యాయం సమాజంలో అత్యంత ముఖ్యమైనవి. శాంతి,సమానత్వం సముద్రంలా విస్తరించాలి.శాంతి,సమానత్వం అందరికీ అందుబాటులో ఉండాలి అనేది కవి ఆకాంక్షగా వ్యక్తం అవుతుంది.
“అన్యాయానికి,అవినీతికి బలిగా మారిన/దైన్య జీవాల,హృదిని హత్తుకుని ఓదార్చే/అంటున్నారు. సమాజంలో అన్యాయం, అవినీతి పెచ్చు పెరిగి పోయింది.సమాజంలో అన్యాయం,అవినీతి కారణంగా బాధపడుతున్న ప్రజల కోసం చింతిస్తూ వారి బాధలను అర్థం చేసుకుని వారికి ఓదార్పును ఇవ్వడం కవితలోని ముఖ్యమైన భావంగా తోస్తుంది.
“శాంతి మాత/న్యాయనేత/సౌమ్య చరిత/ అంటున్నారు.శాంతి,న్యాయం,దయ అనే సుగుణాలు,విలువలతో నడిచే వ్యక్తుల గొప్పతనాన్ని కొనియాడాలి.సమాజంలో గొప్ప నాయకుల విధానాలు,వ్యవహారాలు అందరికీ ఆచరణీయం.అట్లాంటి వారిని ఆదర్శంగా చూపిస్తుంది.ఈ ప్రపంచాన్ని న్యాయం,శాంతి ప్రేమతో నింపే మాతృ రూపం లాంటి నాయకత్వం అవసరం అని ప్రతిపాదించారు.శ్రామికులు,దయనీయ జీవులు,సమత మరియు శాంతి అనేవి ఈ కవితలోని ప్రధాన అంశాలు.అవి నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.ఈ కవి తన మనసులోని ఆవేదనను తెలుపుతూ సమాజంలో ఉండాల్సిన సమభావాన్ని చక్కగా వ్యక్తపరిచారు.ఈ కవితా పంక్తులలో ఆత్మ స్ఫూర్తి,న్యాయం, సమానత్వం,శాంతి వంటి అంశాలపై దృష్టిని సారించారు.ఇందులో శ్రామికుల జీవితాలు వారు పడుతున్న కష్టాలు,కన్నీళ్ళు,వేదనలు,న్యాయం, సమానత్వం వంటి అంశాలను కవి దామోదర్ రావు చాలా చక్కగా ప్రస్తావించారుఈ కవిత చదవగానే పాఠకులకు ఒక విధమైన గొప్ప భావం మరియు ఆనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. “పొగడ్తల పొగడ దండలై/పెత్తందారి గుండెల పై వాలేది కాదు/ అంటున్నారు.ఈ పంక్తిలో కవి తన కవిత పొగడ్తల పొగడ దండల కోసం నిర్దేశించింది కాదు.తన కవిత అధికారం లేదా ప్రతిష్ఠ కోసం రాయబడింది కాదని కవి తన కవిత్వం యొక్క లక్ష్యాన్ని వివరించారు.తాను రాసే కవిత కేవలం యశస్సు కోసం రాయబడినది కాదు అని,అధికారం గల వారి ప్రాపకం కొరకు మరియు వారి దృష్టిని ఆకర్షించడానికి కాదు అని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
“నిత్యం,మిత్తి సన్నిధిలో/తైలం లేని వత్తిలా వాడిన జీవితాల/అంటున్నారు.ఈ కవితా పంక్తిలో తన కవిత సాధారణ ప్రజల జీవితాలకు వారి కష్టాలకు దగ్గరగా ఉంది అని చెప్పబడింది.తన కవిత నిత్యం మృత్యువు సన్నిధిలో నూనె లేని వత్తి వలె కొడిగట్టిన జీవితాలు గల శ్రామికులతో మమేకం కావడాన్ని చూపిస్తుంది.ఇక్కడ తైలం లేని వత్తి అనేది శ్రమజీవుల అస్తిత్వానికి ప్రతీక.శ్రమజీవులు కార్మికులు,కర్షకులు రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతగానో కష్టపడుతున్నారు.అయినప్పటికీ వారికి కడుపు నిండా తిండి దొరకడం లేదు.శ్రామికులు ఆకలితో అలమటిస్తూ అభాగ్య జీవితం గడపడం మనం ఎరిగినదే.శ్రమజీవుల జీవితాల్లో ఎలాంటి మార్పు గాన రావడం లేదు.శ్రమజీవులకు సమాజంలో తగిన స్థానం అందడం లేదు. శ్రమజీవులు తమ జీవితాలలో వెలుగును పొంద లేక పోతున్నారు అని కవి అంటున్నారు.తైలం లేని వత్తి అనే ఉపమానాన్ని ఉపయోగించి కష్టాలు పడుతున్న సామాన్యుల జీవితాల కఠోర స్థితిని కళ్ళ ముందు కట్టినట్లుగా చూపించారు.తైలం లేని వత్తి వలె ఇక్కట్లు ఎదుర్కొంటున్న సామాన్యుల జీవితాలు వెలుగు లేకుండా చీకట్లలో మగ్గడం దారుణం అని గొప్ప భావాన్ని వ్యక్తం చేశారు.
“ఆదుకునేది,అందుకునేది/అంటున్నారు.కవి కవితా లక్ష్యం అణగారిన శ్రమజీవులకు ఆదరణను అందించడం,ఆశ్రయాన్ని కల్పించడం.వారి బాధలను అర్థం చేసుకొని వారికి జీవితంలో కొంత వెలుగును ప్రసాదించే విధంగా ఉంది.కవి తన భావాలను ఆవేదనతో,నిజాయితీగా వ్యక్తపరిచారు.ఇది కేవలం కవిత కాదు ఒక న్యాయం కోసం పిలుపు ఇచ్చినట్టుగా తోస్తుంది.తాను రాసే కవిత కేవలం యశస్సు కోసం రాయబడింది కాదు అని,అధికారం గల వారి ప్రాపకం కొరకు మరియు వారి దృష్టిని ఆకర్షించడానికి కాదు అని చెప్పిన తీరు బాగుంది.
“నా కవిత/తారల వయ్యారి చిందులు/తామరల సొగసు పసందులు/వర్ణించేది,వరించేది,అసలే కాదు/చెమటోడ్చి, సాధించి,శక్తిని సృజించి/చేవతో జీవించే/కార్మిక,కర్షక సోదరుల కళ్యాణం కోరేది/నా కవిత సమత/అంటున్నారు.ఈ కవితా పంక్తుల్లో కవి సమాజంపై తనకు ఉన్న గాఢమైన చైతన్యాన్ని సామాజిక సమత్వం పట్ల తన ఆరాధనను వెల్లడిస్తున్నాడు.ఇందులో రెండు ప్రధాన అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఒకటి ప్రకృతిలోని సౌందర్యం,రెండు కార్మికులు,కర్షకులు వంటి సాధారణ ప్రజల వేదనను ప్రతిబింబించిన తీరు.తన కవిత నక్షత్రాల సొగసుల నాట్యాలను వర్ణించేది కాదు.తామరల అందచందాల పసందులను చిత్రించేది కాదు.ప్రకృతిలోని సౌందర్యం నా కవితా వస్తువు అసలే కాదు.నిత్యం కష్టపడి చెమటను చిందించి సృజించిన సంపదతో బలంగా జీవించేటటువంటి కార్మిక,కర్షక సోదరుల బాగును కోరేది నా కవిత.సమాజంలోని ప్రకృతి సౌందర్యాన్ని గాక కార్మికుల,కర్షకుల శ్రమకు మాత్రమే కవి ప్రాధాన్యతను ఇస్తున్నాడు.
“చెమటోడ్చి సాధించి,శక్తిని సృజించి,చేవతో జీవించే అనే కవితా పంక్తులు కార్మికుల కర్షకుల కష్ట సాధనను కృషిని ప్రతిబింబిస్తున్నాయి.కవిత ఒక సామాజిక సందేశాన్ని అందిస్తుంది.ఇవి కేవలం ప్రకృతి అందాలను ఆరాధించమని చెప్పడం మాత్రమే కాదు.కార్మికుల,కర్షకుల సంక్షేమం కోసం పని చేయాలి అనే గొప్ప సందేశాన్ని సూచిస్తుంది. కవితలో సమతా భావం వ్యక్తమవుతుంది.కవి సమాజంలో సమానత్వం,న్యాయం మరియు ఐకమత్యం కోసం ఆకాంక్షిస్తున్నారని తెలుస్తోంది. కవిత ప్రకృతి మరియు సమాజానికి మధ్య సమతుల్యతను గురించి తెలుపుతుంది.ప్రకృతి అంశాలు ఎంత ముఖ్యమో కార్మికుల,కర్షకుల శ్రమను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. కవి సందేశం మన అందరికీ స్ఫూర్తిదాయకం.ప్రకృతిని కాపాడుకోవాలి మరియు శ్రమజీవులకు తోడ్పాటును అందించాలి అని కవి డాక్టర్ బి. దామోదర్ రావు నా కవిత సమత అనే కవిత ద్వారా ప్రబోధిస్తున్నాడు.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 26, 2025
written by Narendra Sandineni

గంటా మనోహర్ రెడ్డి రచించిన “అమ్మా నువ్వెవరు ? కవిత

ప్రముఖ కవి,విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి, గంటా మనోహర్ రెడ్డి,కలం నుండి జాలువారిన ఘంటా పథం కవితా సంపుటిలోని అమ్మా నువ్వెవరు?కవితపై విశ్లేషణా వ్యాసం.ఈ కవితా సంపుటి 1981 సంవత్సరంలో ముద్రించబడింది.ఈ కవిత భారతదేశం స్వాతంత్ర్యం పొంది ముప్ఫయి సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భాన ఆనాటి సామాజిక,సాంఘిక,రాజకీయ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. స్వాతంత్ర్యానంతరం కూడా దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది.భారత దేశానికి పట్టిన దుర్గతిని,ప్రజలు ఎదుర్కొంటున్న ఈతి బాధలను,సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని తన గాఢమైన భావాలతో వ్యక్తపరుస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ కవితలో కవి దేశమాతను నువ్వెవరివమ్మా?అని ప్రశ్నించడం దానికి భారత మాత సమాధానం చెబుతూ నేనో నష్టజాతకురాల్ని,స్వాతంత్ర్య భారతిని అని దిగులుతో చెప్పడం వేదన కలిగిస్తుంది.కవి మనోహర్ రెడ్డి రాసిన అమ్మా నువ్వెవరు?కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.”కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు/అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్లు/మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన నీ ఒళ్ళు/ఇంతకూ ఎవరమ్మా నువ్వు?అని అంటున్నారు.ఒక భావోద్వేగంతో రూపు దాల్చిన కవితను చదువుతుంటే దుర్భరమైన జీవితం గడుపుతున్న అమ్మ గురించి చెప్పినట్లు అనిపిస్తోంది.అమ్మ శరీరంలోని అవయవాలు అన్ని బాధలకు గురి అయి ఉన్నాయి.అమ్మ కళ్ళు కళ తప్పి పోయినట్లుగా ఉన్నాయి.అందంతో నిగనిగలాడే అమ్మ చెక్కిళ్ళు పేలవంగా,కాంతి విహీనంగా కనిపిస్తున్నాయి.ఆకలి,అనారోగ్యంతో అమ్మకు ఎడతెగకుండా వెక్కిళ్లు వస్తున్నాయి. జీవితంలో ఎన్నో బాధలు అనుభవించిన అమ్మకు ముప్పై ఏళ్ల వయసులోనే వృద్ధాప్యపు ఛాయలు ఆవరించాయి.కవితలోని భావాలు అమ్మ జీవితంలోని కష్టాలను,శారీరకంగా,మానసికంగా, సామాజికంగా ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి.ఎవరమ్మా నువ్వు?అని అడుగుతున్నాడు.దేశ మాత అయిన తల్లిని మాత్రమే కాదు.ఆ కష్టాలను అనుభవించే ప్రతి మహిళను ప్రతినిధిగా చూపుతున్నట్లుగా తోస్తోంది. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వాటికి కారణమైన పరిస్థితులు ఏమిటి?ఇందుకు సమాజం యొక్క పాత్ర ఏమిటి?అని తెలియజేయాలన్న లక్ష్యంతో కవిత రాయబడినట్లుగా తోస్తుంది.కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు అనేది ఆమె శారీరక,మానసిక దుస్థితిని ప్రతిబింబిస్తోంది.అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్ల ద్వారా ఆమె భావోద్వేగాలను గుండె నిండా పొంగిపొరలే బాధను వ్యక్తం చేస్తున్నారు.మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన ఒళ్ళు అంటే చిన్న వయసులోనే ఆవిడ జీవితం అనేకమైన కష్టాల సుడిగుండంలో చిక్కి కృంగి పోయిందని భావిస్తున్నారు.ఇంతకు ఎవరమ్మా నువ్వు?అని కవి ప్రశ్నించడం ద్వారా ఆమె జీవిత కథ,బాధలకు కారణాలు ఏమిటి?తెలుసుకోవాలనే ఆసక్తి గోచరమవుతుంది.ఇది కష్టాలలో ఉన్న మహిళల జీవన స్థితిగతులపై దృష్టి సారించి వారి బాధలను గుర్తించాలని హృదయగతమైన భావాలకు ప్రతీకగా నిలుస్తుంది.“వెయ్యేళ్ళ దుర్భర దారిద్ర్యాన్ని/అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు/ అంటున్నారు.ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విడివడినది.అరాచకపు పరాయి పాలన నుండి ఆగస్టు15,1947 రోజున భారతదేశం విముక్తి పొందింది.బ్రిటిష్ వారు మన దేశ సంపదను అక్రమంగా దోచుకుని వెళ్ళినారు.బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్య్రం సాధించినప్పటికీ దేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోవడం బాధను కలిగిస్తుంది. భారతదేశం ఇప్పటికీ ఆర్థికంగా,సామాజికంగా దోపిడీకి గురి అయి విలవిలలాడుతున్నది.కవి దేశ మాతను ఉద్దేశించి వెయ్యేళ్ల దుర్బర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు అని ప్రశ్నించడం చక్కగా ఉంది.”చీకట్లోంచి చీకట్లోకే పరుగులు తీస్తున్న పిచ్చిదానిలా ఉన్నావు/ అంటున్నారు.దేశం అభివృద్ధి కోసం ఎన్ని ప్రణాళికలు రచించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు.ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలలో అవినీతి చోటుచేసుకున్నది.అవి సత్ఫలితాలను అందివ్వడం లేదు.దేశం ఇంకా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి విలవిలలాడి పోతున్నది.ఇది దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న అవినీతి పాలనకు తార్కాణంగా నిలుస్తుంది.ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శను సంధించినట్టుగా తోస్తుంది.“నాడు నయాగరా జలపాతంలా కళకళలాడే నువ్వు/ నేడెందుకో సహారా ఎడారిలా వెలవెలబోతున్నావు/ అంటున్నారు.ఒకప్పుడు దేశం ఎంతో సమృద్ధిగా కళకళలాడేది.ఎంతో వైభవంగా అలరారిన దేశం మనది.ప్రకృతి అందాలకు పర్యాయపదంలా ఉండేది.మన దేశం పాడి పంటలతో విలసిల్లింది. ఒకప్పుడు రత్న గర్భగా పేరు పొందిన దేశం మనది. నేడు దేశం దుర్భర దారిద్ర్యం,పేదల ఆకలి కేకలు, అన్నార్తుల అలమటింపులు,నిరాశా నిస్పృహలు ఎల్లెడలా అలుముకున్నాయి అని కవి బాధను వ్యక్తం చేస్తున్నాడు.”గత కాలపు వైభవాల శిథిల శిల్ప సంకేతంలా ఉన్నావు/అంటున్నారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారతదేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది.నేడు మన దేశం శిథిల శిల్పాల గుర్తుల రూపంలో మాత్రమే మిగిలి ఉంది.స్వాతంత్ర్యానంతరం కూడా ప్రజలు దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు అనే వాస్తవాన్ని కవితా పంక్తి తెలియజేస్తున్నది.“కుత్సిత రాజకీయ విన్యాసాన్ని తలచుకొని/అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/అంటున్నారు.కేవలం కుత్సిత రాజకీయ గందరగోళాల మధ్య చిక్కుకొని దేశం వినాశనాన్ని ఎదుర్కొంటున్నది.ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు కాన రావడం లేదు.దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.కాని ఎందుకో దేశం అభివృద్ధి కుంటుపడింది అని కవి భావాల ద్వారా వ్యక్తం చేస్తున్న తీరు బాగుంది.“చచ్చిన శవంలా ఉన్నావు/అంటున్నారు.ప్రస్తుతం భారతదేశం శవం వలె చలనం లేని ఉద్దీపన రహిత పరిస్థితిలో ఉంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఇది ప్రజల వైపల్య భయాన్ని ప్రతిబింబిస్తుంది.”శవానికి భయం గొలిపేలా ఉన్నావు/ అంటున్నారు.శవం వలె నీ పరిస్థితి భయంకరంగా ఉంది.విపరీతంగా,అసహజంగా, భయాందోళనతో కూడిన అసహనాన్ని సూచిస్తుంది. చనిపోయిన వ్యక్తి భయానికి లోను కాడు.కానీ చనిపోయిన వ్యక్తికే భయాన్ని కలిగించేలా ఉన్నావు అని చెప్పడం బాగుంది.భయాన్ని సృష్టించడానికి చాలా తీవ్రంగా అశాంతిని కలిగించడాన్ని సూచిస్తుంది.ప్రజల చర్యలు మరియు ప్రవర్తన సహజ సిద్ధంగా ఉండక పోవడం వల్ల వారిని చూసి చనిపోయిన శవానికే భయం గొలిపేలా ఉంది అని చెప్పడం జరిగింది.వ్యంగ్యభరితమైన సమాజపు భావజాలాన్ని ప్రతిబింబించేలా ఈ కవిత ఉంది. ”భవిష్యత్తంటేనే ఎందుకో భయంతో కంపించి పోతున్నావు/అంటున్నారు.భవిష్యత్తు పట్ల ఆశ ఉంటేనే మనిషి మనుగడ కొనసాగుతుంది.మనిషి భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోతే మనుగడ ప్రమాదంలో పడుతుంది.ప్రజల్లో భవిష్యత్తు పట్ల ఎడతెగని భయం,తీవ్రమైన నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయని కవి స్పష్టంగా తెలియజేస్తున్నాడు.”ఎండిన పెదిమెలతో ఏదో చెప్పాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నావు/ అంటున్నారు.దేశంలో నివసిస్తున్న ప్రజలు నిరాశ నిస్పృహలకులోనై తమ బాధలను చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదని,వారి బాధలు చెప్పేందుకు అవకాశం లేకుండా పోయిందనే భావన వ్యక్తం అవుతున్నది.”నీ బాధలకు నిష్కృతి లేదని అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/“ఇకనైనా చెప్పు తల్లీ – నువ్వెవరివమ్మా?/అంటున్నారు.ఆవేదనతో,ఆక్రోశంతో బాధపడుతున్న ఆమెను కవి ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎవరో అనేది తెలుసుకోవడమే కాకుండా మనసులో దాగి ఉన్న బాధకు మూలాన్ని కూడా తెలుసుకోవాలనే సంకల్పం వ్యక్తమవుతున్నది. సమాజంలో ఆమె ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు వాటి మూలాలు ఏమిటో తెలుసుకొని పరిష్కారం చూపాలని కవి ఆకాంక్షిస్తున్నాడు.బాధితురాలైన ఆమె గుండెల్లో నిండి ఉన్న బాధను,ఆక్రోశాన్ని తెలియజేస్తున్నాడు.ఆమె ఎదుర్కొంటున్న బాధకు ముగింపు లేకుండా కొనసాగుతున్న పరిస్థితి ఎంతటి క్లేశాన్ని కలిగిస్తుందో గ్రహించవచ్చు.

ఆమె బాధలకు కారణమేమిటో చెప్పాలని కోరుతున్నాడు. సమాజంలో పేరుకుపోయిన అన్యాయం, అసమానతలను గూర్చి ప్రశ్నిస్తున్నాడు.ఈ ప్రశ్న దేశమాత ఆత్మను ఉద్దేశిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయని కవి ఆవేదన చెందుతున్నాడు.“కష్ట జీవుల నికృష్ట జీవితాలను కలం కుంచెతో/కాగితపు కాన్వాసు పైన కమనీయంగా చిత్రించాలని/వ్యర్థ ప్రయత్నం చేస్తున్న ఓ కవీ,నేనెవర్నో నీకు తెలీదా?/నేనొక నష్టజాతకురాల్ని నా దురదృష్ట నామధేయం/ స్వాతంత్ర్య భారతి/అంటున్నారు.దేశమాత తనను నష్టజాతకురాలిగా భావిస్తూ స్వాతంత్ర్యం తనకు కలిగించిన వాస్తవ పరిస్థితులపై బాధ పడుతున్నట్లు కవి చెబుతున్నాడు.ఈ కవితను భారతదేశంలోని సామాజిక,ఆర్థిక,రాజకీయ పరిస్థితులపై గాఢమైన ఆవేదనతో కూడిన ఆత్మ విమర్శగా భావించవచ్చు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు అని కవి తీరని ఆందోళనను వ్యక్తం చేస్తున్నాడు.ఇది కేవలం ఒక కవిత మాత్రమే కాదు.భారతదేశంలోని ప్రజల హృదయాల్లో నెలకొన్న ఆక్రోశానికి ప్రతీక.భారత దేశంలోని గడచిన సామాజిక, రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై విమర్శల సమాహారంగా నిలుస్తుంది. స్వాతంత్ర్యం సంపాదించుకుని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.అయినప్పటికీ దేశమాత పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నది.కవి 43 సంవత్సరాల కింద కవిత రాసినప్పటికీ ఇప్పటికీ దేశమాత పరిస్థితి దుర్భరంగా ఉండడం ఆవేదన కలిగిస్తుంది.ఈ కవిత దేశమాత విలాపంగా చెప్పవచ్చు.కవి మనోహర్ రెడ్డిగారు ఘంటారావం అనే శీర్షికతో వాట్స్ అప్ వేదిక ద్వారా ప్రతి రోజు ఒక కవితను అందిస్తూ తెలుగులో ఘంటారావం అనే ఒక కొత్త కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వీరు నిర్విఘ్నంగా నేటి వరకు ఘంటారావంలో -1651 కవితలు రాసినారు. వీరు రచిస్తున్న ఘంటారావం కవితలు సుజల స్రవంతిలా నిరంతరం కొనసాగుతునే ఉన్నాయి.వీరు ఘంటారావం శీర్షికన 1008 కవితలతో కవితా సంపుటిని తేది 16 – 11 – 2023 నాడు ఆవిష్కరించడం జరిగింది.వీరు ధారావాహికంగా ఘంటారావం కవితలను అందిస్తున్నందుకు అభినందిస్తున్నాను‌.కవి మనోహర్ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

హిల్దా

by ఒద్దిరాజు మురళీధరంరావు March 26, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

హిల్దా అనే యువ వయసులో ఉన్న అమ్మాయి, అంత తెలివైనది కాదు. ఇంకా దానికితోడు అత్యాశాపరురాలు. ఒకరోజు తన మేనత్త తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. తన వద్ద నీకోసం వివాహ డ్రెస్సు ఉంది. అదేగాక ఇంకో అదనపు డ్రెస్సు కూడా నీకే ఇవ్వాలనుకుంటున్నాను. నేను రెండు పెట్టెల్లో ఒక్కో వస్తువు పెట్టాను. దానిలో ఏదో ఒకటి నీవు ఎంచుకోవాలి. మొదటి పెట్టెలో ఈకలతో చేసిన బహుమతి. రెండవ దానిలో లోహంతో చేసినది. ఒకటి ఖరీదయినది, రెండవది కాదు. తూకంలో రెండూ ఒకేలా ఉంటాయి. జాగ్రత్తగా విచారించు నీకు ఏది కావాలో. అది నిర్ణయించేందుకు హిల్దాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆమెకు ఈకల కన్న లోహము విలువైనదని మరియు బరువైనదని కూడా ఆమె నిర్ణయించుకుంది. ఎక్కువ విచారించకుండా ఆమె రెండవ పెట్టెను ముట్టుకుంది. ఆమె మేనత్త రెండు పెట్టెల మూతలు తెరిచింది. ఒకదానిలో ఏ పెండ్లికొడుకైనా ఇష్టపడే మెత్తని ఈకలు ఉన్నాయి. రెండవ దానిలో ఒక పాత రంద్రాలు పడిన చారు గిన్నె ఉన్నది. హిల్దా తొందరపడ్డది మరియు అప్పటినుండి కొద్దిగా ఎక్కువగా జాగ్రత్త పడటం చేస్తుంది. ఆమె వివాహం జరిగాక ఆమె మేనత్త ఎలాగూ ఆ మెత్తని దిండు ఆమెకే ఇచ్చింది.
ఏ పనికైనా తొందరపడటం మంచిది కాదు.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక పిల్లి, ఒక ఎలుక

by ఒద్దిరాజు మురళీధరంరావు March 26, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒకరోజు ఉదయం ఒక అమాయకపు పిల్లి ఒక ఇంట్లో వంట సామాను గది ముందర ఒక ఎలుకను పట్టుకుంది. పిల్లి తన పెద్ద పంజాలో దాన్ని పట్టుకున్నప్పుడు ఎలుక అంది ”నీవు నన్ను తినే ముందు నన్ను నా తిండి తిననీయవా?” అని. ముఖ్యమైన విషయం, అమాయకపు పిల్లి తన పండ్లు చూపుతూ అదా నా తిండి అంది. నేను ఎంత అందంగా ఉన్నానో చూడలేవా? అని ఎలుక పలికింది. ఇంత అందమైన ప్రాణిని చంపేయడం దారుణం కాదా? ఆ పిల్లి తన చేజిక్కిన ఆహారాన్ని కిందా, మీదా చూచి అది చాలా అందంగా ఉందనుకుంది. ఆ ఎలుక అమాయకపు పిల్లిని ఇష్టపడుతున్నట్లు నటించింది కూడా. మోసపూరితంగా అది మనిద్దరం ఒకే సైజులో లేకపోవడం ఎంత దారుణం అంది. మనిద్దరం ఒకే సైజులో ఉంటే చాలా బాగుంటుందని ఆ ప్రయత్నం మొదలు పెట్టుమని ఎలుక, పిల్లికి సలహా ఇచ్చింది.

అప్పటి నుండి ఎలుక వెనుక గదిలో ఒక మెత్తని దిండుపై హాయిగా కూర్చుండిపోయింది. ఆ అమాయకపు పిల్లి ఎలుకకు తినేందుకు ఎన్నో మంచి మంచి తినుబండారాలు తెచ్చి ఇస్తూ పోయింది. ఆ పిల్లి సన్నబడేందుకు తిండి బాగా తగ్గించింది. చివరకు తిండి తక్కువై పిల్లి అనారోగ్యం పాలయ్యింది, బాగా బక్కచిక్కింది. అందువలన ఎలుకే స్వయంగా వెళ్ళి ఆహారం సంపాదించుకొని తింటూ బాగా లావై తినే వస్తువుల గది తలుపుకింది బొరియలో ఇరుక్కుపోయింది. అప్పుడు ఇంటి యజమానురాలు దాన్ని పట్టుకుని బోన్లో వేసింది. ఎప్పుడైతే పిల్లి కొంత బాగైందో బోన్లో ఉన్నదాన్ని చూసేందుకు వచ్చింది. పుస్సీ, నన్ను దయతో బయటికి తీయవా అని ఎలుక బ్రతిమాలింది. నువ్వు బోన్లో వున్నందుకు, అదృష్టవంతురాలివనుకో అని కోపంగా అంది పిల్లి. నీవు బాగా బలిసావు, నేను బాగా చిక్కిపోయాను. నీవు ఒకవేళ బయట ఉంటే తప్పకుండా నిన్ను మింగేసేదాన్ని.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

రాజు వాలెన్‌ టైన్‌

by ఒద్దిరాజు మురళీధరంరావు March 26, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

రాజు వాలెన్‌ టైన్‌ తన శవయాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తుండే వాడు. వాస్తవానికి అతనికి చనిపోవాలని లేదు, కానీ ప్రజలు ఎలా దుఃఖిస్తారో తెలుసుకోవాలని ఆశ పడుతున్నాడు. అతను వాస్తవంగా చనిపోయాక ఏమి జరుగుతుందో తను ఏమీ చూడలేనని గ్రహించాడు. ఒకవేళ నేను చనిపోతే ప్రజలు ఎలా దుఃఖిస్తారో తెలుసుకోవాలంటే నేను బ్రతికుండగానే నా శవయాత్రను ఏర్పాటు చేయాలి. అందుకు అతను చనిపోయినట్లు ప్రకటించాడు. సిటీ మొత్తం ప్రజలు నల్ల జెండాలు పట్టుకొని, వెయ్యి నల్ల జెండాలు దారి పొడుగునా ఏర్పాటు చేయాలని, తనకు శవపేటికలో పడుకో బెట్టాలని ఆజ్ఞాపించాడు. అది ఎవరు తెలుసుకోకుండా తను మాత్రమే ప్రజలు బాధపడటం చూడాలని అనుకున్నాడు.
అది కేవలం ముఖ్యమంత్రికే చెప్పి శవయాత్ర తీయుటకు ఆదేశించాడు. శవయాత్ర మొదలయ్యింది. కానీ ఇది ఏమిటి? వాలెన్‌ టైన్‌ చనిపోతే ఒక్క చుక్క కన్నీరు కూడా, ఏమాత్రం బాధ కూడా ప్రజల్లో చూడలేదు. ప్రజలు వారివారి దినచర్యల గురించి మాట్లాడుకుంటున్నారు. శవం వెంట నడిచేవారు, దారి ప్రక్కన నిలబడ్డవారు కూడా. ప్రజలు ఎన్నోసార్లు వీడు పోవడం మంచిదయింది, పీడ విరగడయిందని అనుకోవడం విన్నాడు రాజు. వచ్చేవాడు ఇంతకన్న చెడ్డవాడు కాకూడదని ఊహించసాగారు. ఇంతకన్న చెడ్డవాడు ఉండడు. వీరితో ఇంకా కొందరు కలిశారు. శవపేటికలో పడి వుండి తడి చెమటల్లో మునిగిపోయాడు రాజు. కాబట్టి అతను ఈ ప్రపంచాన్ని బాధలో ఉంచి మరణించ దలచలేదు. దానికి వ్యతిరేకంగా తన ప్రజలు తను చనిపోతేనే సంతోషిస్తారని ఎప్పుడైతే అతను ఇది గ్రహించాడో వాలెన్‌ టైన్‌ వాస్తవంగా చనిపోవాలని అనుకున్నాడు.
రాజు వాలెన్‌ టైన్‌ ఎంతో విచారపడినప్పటికీ శవ పేటికలో మరణించలేదు. మొదట్లో అతనికి చాలా కోపం వచ్చింది. తనను దూషించిన వారందరినీ చంపించాలనుకున్నాడు. కానీ అప్పుడు రాజ్యంలో పనులు చేసేవారు ఉండరు కదా! అతను ఆలోచించే కొద్ది అతనే చెడ్డవాడని తెలుసుకుని మారాలను కున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రితో తను మంచిగా పరిపాలించడం మొదటినుండి నేర్చుకోవాలని చెప్పాడు. కానీ ఎలా? అది చాలా సులభం, నవ్వాడు ముఖ్యమంత్రి. మీరు చేయవలసింది మారు వేషంలో ఆ ప్రజల్లోకి వెళ్ళండి, వారితో కలిసి పని చేయండి, వారు అనేది వినండి. అప్పుడు మీకు తెలుస్తుంది. వాళ్ళకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో? రాజు ఏమి తప్పు చేసేవాడో వారు చెప్పినది మరిచిపోనట్లయితే నీవు తిరిగి వచ్చాక చాలా తెలివిగా పరిపాలించగలవు. వారు నన్ను గుర్తించకపోతే ఎలా? అని రాజు అడిగాడు. మీరు విచారించకండి! వారు ఎల్లప్పుడు మీ కిరీటం, మీ మెత్తని పొడుగాటి కోటును మాత్రమే చూశారు. మీ ముఖాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోలేరు అని ముఖ్యమంత్రి నమ్మ బలికాడు. కానీ ఈ మధ్యన ఎవరు పాలిస్తారు? అని రాజు అడిగాడు. రాజు లేకుండా దేశం ఉండలేదు కదా! ఓహో, అవును అది సాధ్యమే, ముఖ్యమంత్రి హేళనగా నవ్వాడు. ఇదో సమస్యా అని. మీరు వచ్చేంతవరకు ప్రజల విచారం (దుఃఖం) ప్రకటిస్తాను. ఒకవేళ ఏమైనా నిర్ణయించవలసి వస్తే నేను ఎప్పుడూ చిన్న శబ్దం చేసి మిమ్మల్ని అడుగుతాను. అందుకు వాలెన్‌ టైన్‌ అంగీకరించి, పాలించడం నేర్చుకోవడానికి వెళ్ళాడు.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శత్రువుతో ప్రయాణం జండర్‌ స్పృహ

by Devendra March 20, 2025
written by Devendra

ఈ ఉగాది
నాకు విరోధి
షడ్రుచులు వడ్డించిన
భూమి తల్లిపై
అత్యాచారం
అంటూ స్త్రీల పక్షాన నిలబడి అక్షరగొంతుకను వినిపించిన కవి, విమర్శకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ గారు. శ్రీశ్రీ కోరినట్లుగా పీడితుల పక్షాన నిలబడి అభ్యుదయ దృక్పథంతో పయనిస్తున్నారు. ‘శత్రువుతో ప్రయాణం’ కవితా సంపుటిలో ఉన్న 36 కవితలు సమాజాన్ని అనేక కోణాల్లో ప్రశ్నిస్తాయి. మార్పుతో కూడిన మానవత్వాన్ని కోరుకుంటాయి. రాజకీయ రంగులను ఎండగడుతాయి. స్త్రీవాద ఉద్యమాన్ని సమర్థిస్తాయి.
అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా వచ్చిందే స్త్రీవాదం. స్త్రీల ఉనికిని, స్త్రీల హక్కులను, స్త్రీల సమస్యలను స్త్రీలే వ్యక్తపరిచే సాహిత్యాన్ని స్త్రీవాద సాహిత్యం అంటున్నాం. తరతరాల వ్యవస్థ నిర్మాణంలో మాతృస్వామ్యం రూపాంతరం చెంది పితృస్వామ్యంగా స్థిరపడిపోయింది. ఆనాటి నాగరిక సమాజం నుండి నేటికి ఆ మూలాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించి, ఎదిరించే క్రమంలో వచ్చిందే స్త్రీవాదం. జెండర్‌ స్పృహ, గృహహింస, మాతృత్వం, ఇంటి చాకిరి మొదలైన అంశాలెన్నో స్త్రీవాద ఉద్యమంలో వెలుగులోకి వచ్చిన అంశాలు. జండర్‌ సహజంగా ఏర్పడిరది కాదు. కుటుంబం, సమాజం, మతం ‘స్త్రీలు’ అంటే ఇలా ఉండాలి, ‘పురుషులు’ అంటే ఇలా ఉండాలి అని జీవనవిధానంలో అలవాటు చేసే క్రమపద్ధతిని జండర్‌స్పృహ అంటున్నాం. ఎంగెల్స్‌ ప్రకారం ‘‘పురుషత్వం, స్త్రీత్వం అనేవి శరీర ధర్మాల ప్రకారం ఏర్పడినవి కావు. ఒక సుదీర్ఘ చారిత్రక యుగంలోను పురుషత్వం, స్త్రీత్వం అనేవి వేరువేరుగా నిర్వచించబడ్డాయి. ఈ నిర్వచనం ఆయా యుగాలలోని ప్రధానఉత్పత్తి విధానమీద ఆధారపడి ఉంటుంది’’ అన్నారు. అంటే స్త్రీత్వ, పురుషత్వాల గురించి భావజాలాన్ని సమాజం తయారుచేసి అందిస్తోంది. ఆ భావజాలం తిరిగి సమాజక్రమాన్ని స్థిరపరచడంలో సహాయపడుతుంది. ఈ క్రమానంతటిని స్త్రీవాదం పరిశీలించింది. స్త్రీవాదం అంటే పురుషులను ద్వేషించడం కాదు. స్త్రీల సమస్యలను గుర్తించి స్త్రీలందరు ఏకమై పురుషులకు అర్థమయ్యేలా చెయ్యడం. ఈ భావజాలాన్ని అర్థంచేసుకున్న సహృదయ కవి ఆచార్య మాడభూషి కుమార్‌గారు. ‘ఆమె’ కవితలో స్త్రీల సమస్యలను కళ్ళకు కట్టినట్లు లోతైన భావుకతతో అక్షరీకరించారు.
‘‘చిన్నప్పటినుండి అంతే
చిన్నచూపుతోనే పెరిగింది’’ అంటారు
……….
ఇంకా
ఆమె నిఘంటువు నుంచి ఏ నిషేదం
అందుకే
ఎందుకు, ఏమిటి
లాంటి ప్రశ్నలు ఆమెనోట్లో రాకూడదని శాసనం’’
బాల్యంనుండే ఆడపిల్ల జండర్‌వివక్షను ఎదుర్కొంటుంది. కన్నతల్లే కొడుకును ఒకరకంగా కూతురును మరొరకంగా పెంచుతుంది. లేకపోతే తల్లిపెంపకం బాగాలేదంటారు. దుస్తులు, ఆటలు, ఆహారం, ఇలా అన్నిట్లోను ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కుటుంబంలో ఆడపిల్ల ఇట్లా ఉండాలి అని తర్ఫీదునివ్వబడుతుంది. తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో పెరిగిన ఆడపిల్లకు పెళ్ళి అనే బంధం మరిన్ని బాధ్యతలను, పరిమితులను విధిస్తుంది. అందుకే కవి ఇలా అంటారు.
‘‘అతగాడికి కావలసింది ఒక మరమనిషి
సంపాదించడానికి
వండిపెట్టడానికి
కోరికలు తీర్చడానికి
పెళ్ళిరోజున ఎ.టి.ఎం లాంటి
పెళ్ళాం దొరికిందని మరిసిపోతాడు’’
స్త్రీకి పెళ్ళిజీవితం అనేది రూపాయి బిల్లకు ఉండే బొమ్మ, బొరుసు లాగా మారిపోయింది. మంచి భర్త దొరికితే పరవాలేదు కాని, ఆమెను అర్థంచేసుకోలేని కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడు జీవితఖైదీగా మారిపోతుంది. అసలు కుటుంబమే స్త్రీని కంట్రోల్‌ చేసే బంధిఖానా అవుతుంది. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం అన్ని స్త్రీల బాధ్యతలే. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా వీటన్నింటిని బాలెన్స్‌ చేసుకోవాలి. తద్వార స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాలమీద ఒత్తిడి పెరుగుతుంది. ఎదిగే క్రమంలో అనేక సవాళ్ళను స్త్రీ ఎదుర్కోవలసి వస్తుంది. ‘ఆమె’ కవితలోనే ఈ పంక్తులు చూడండి.
‘‘ఆకాశమంత వ్యాపించి
అందీ అందని ఆ తేజోమూర్తిని చూసి
నిందలు వేసే వాళ్ళెందరో!
మబ్బుల నడుమనుంచి
అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటేనే
ఇంత అసూయగా ఉంటే
పున్నమి వెన్నెల విరిస్తే
రెక్కలు ముక్కలు చేసుకొని
ఆకాశానికి ఎగురుతున్న ఆమె రెక్కల్ని
ముక్కలు చేయడానికి ఎందరో’’
అన్న పంక్తులు బాధ్యతల దొందరలో, ఉరుకుల పరుగుల ‘ఆమె’ జీవితంలో పడగనీడలా నిందలు, ఆధిపత్యాలు, అకృత్యాలు, వివక్షలు, చిన్నచూపులు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘర్షణల మధ్య స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటు ముందుకు వెళ్ళే సాహసం చేస్తుంది. అయినప్పటికి స్త్రీలు తమను తాము నిరూపించుకుంటూ అన్నిరంగాలలో ముందుకు వెళ్ళే ప్రయత్నంచేస్తున్నారు. అయినప్పటికి అడగడుగున పరీక్షలపర్వాలను దాటక తప్పడంలేదు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లి కలలుకంటుంది. అన్నీ తానై భరిస్తుంది. అయినప్పటికి తండ్రి అంటే పిల్లలకు గౌరవం. తల్లి అంటే చిన్నచూపు. ‘ఆమె’ గురించి కవి మాటల్లో …
ఇంట్లో సెలవులేదు
పనిలో సెలవులేదు
జీవితమంతా పిల్లలకోసం పరుగెత్తి పరుగెత్తి
అలిసిపోయిన ఆమెకు
ఆసరా లేదు
………
ఆమె లేకుండా
మానవ చక్రం పరిభ్రమించదు
అందుకే ఆమెను
పరిమళించనివ్వండి
కవితా ముగింపులో స్త్రీ ఉన్నతిని ఆకాంక్షిస్తున్నారు కవి. ఈ విశ్వమానవ కాలభ్రమణంలో స్త్రీ, పురుషులిద్దరు అవసరమే. ఎవరికివారుగా బాధ్యత నిర్వహణలో పోటీపడాలి గాని ఆధిపత్యాలు, అహంకార పెత్తనాలు స్త్రీల అశాంతికి కారణమౌతున్నాయి. హింసకు దారితీస్తున్నాయి. స్త్రీల చుట్టు భయాన్ని గుర్తుచేస్తూ ‘భయం’ కవిత లో ఇలా అంటారు.
భయం
కట్నంలా రావచ్చు
పట్నంలో రావచ్చు
అత్యాచారంలా రావచ్చు
నిత్యాచారంలా ఉండవచ్చు
……………..
భయం
మగాడిలా ఉండవచ్చు
మగడి రూపంలో ఉండవచ్చు
మైరావుణుడి రూపంలో ఉండవచ్చు
రూపం ఏదైనా
భయం మాత్రం ఒక్కటే
అది భయమే
స్త్రీలకు ఉన్న భయాలు అన్ని ఇన్ని కావు. పురుషస్వామ్య ప్రపంచంలో ఎక్కడ పొంచి ఉంటుందో ఆ భయం. కవి పై కవితలో కట్నం వలన భయం అనడంలో మనం ఇప్పటికి వరకట్న వేదింపులకు బలైన స్త్రీలను మీడియా ముఖంగా చూస్తునే ఉన్నాం. స్త్రీలపై అత్యాచారం అన్నది ఈనాటికి రూపుమాపలేకపోయాం. ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు చేసిన దిశ లాంటి అమ్మాయిలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తవుతే కన్న తండ్రి కళ్ళు కామంతో కప్పబడినపుడు కూతురు పరిస్థితి అగమ్యగోచరం. ‘తండ్రి’ అన్న కవితలో
‘‘కన్న బిడ్డనే కామించే తండ్రులు
తండోపతండాలుగా పత్రికల్లో మొలుస్తూనే
టీవీలో మెరుస్తునే ఉన్నారు
వాటిని చూసిన మొహంతో
కన్నబిడ్డను చూసే శక్తిలేక
ఆత్మహత్య చేసుకుంటున్న’’
అంటారు. ఇక్కడ కవి ఈ సంఘటనకు కరుణరసభరిత కవితాక్షరాలను మనముందుంచారు. ఎవరో చేసిన పనికి తండ్రిగా కూతురు ముందు నిలబడలేని స్థితిని తండ్రులందరి పక్షాన నిలబడి బలమైన సందేశాన్ని ఇచ్చారు. ‘మగాడు’ కవిత జండర్‌ వివక్షను మరింత స్పష్టంగా చెప్తుంది.
‘‘వాడు కావాలనుకొన్నప్పుడు
నేను రావాలి
వాడు తేవాలన్నప్పుడు
నేను తేవాలి
వాడు తిరగమన్నట్టు
నేను తిరగలిగా తిరగాలి’’
స్త్రీ, పురుషులిద్దరు మనుషులే. ఇద్దరిలో ప్రవహించే రక్తం ఎర్రగానే ఉంటుంది. కాని, స్వేచ్ఛా పరిధిలోకి వచ్చేసరికి జండర్‌ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. పితృస్వామ్య వ్యవస్థ పురుషుడిని ‘మగాడు’ గా చూడాలనుకుంటుంది. మగాడు అంటే ఎలా ఉండాలని సమాజం, కుటుంబం చెప్పిందో కవి ప్రతిసందర్భంలో మగాడి రంగును తేటతెల్లం చేస్తాడు. స్త్రీ ఎల్లప్పుడు పిల్లలకోసమో, పుట్టింటి వారి కోసమనో, పరువు మర్యాదల కోసమనో తను ఉండాలనుకున్నట్టుగా ఉండలేకపోతుంది. తన అస్తిత్వాన్ని ఉనికిని పరిస్థితులకు ఫణంగాపెట్టి అన్నిటికి సర్ధుబాటుతనపు సంకెళ్ళు వేసుకుంటుంది. అందుకే ‘కవి’ స్త్రీ, పురుషుల సహవాసాన్ని శత్రువుతో పోల్చడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
‘‘నేను సహవాసం చేస్తున్నది
శత్రువుతో
నేను సహజీవనం చేస్తున్నది
శత్రువుతో
నేను పంచుకొంటున్నది
శత్రువుతో
పనిచేస్తున్నది
శత్రువుతో’’
ఈ శత్రువులు మిత్రులు అయ్యేదెప్పుడు! జండర్‌వివక్ష తగ్గినప్పుడు ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకెళ్ళినప్పుడు అంటే స్త్రీవాదాన్ని పురుషుడు అర్థంచేసుకున్నప్పుడే సమస్య పరిష్కారం దిశగా ముందుకు కదులుతుంది. ఆచార్యస్థానంలో ఉన్న మాడభూషి సంపత్‌గారు మహిళల ఆర్తిని, ఆవేదనను, వివక్షను అర్థంచేసుకున్న వ్యక్తిగా, కవిగా, ప్రగతిశీల మార్గదర్శకుడిగా స్త్రీల గొంతుకను ‘శత్రువుతో ప్రయాణం’ పేరుతో తన కవితాధారతో బలం చేకూర్చిన మానవతామూర్తి ఆచార్య సంపత్‌కుమార్‌గారు.

ªªª

March 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తొలి ఆత్మకథా రచయిత్రి

by Vijaya Kandala March 20, 2025
written by Vijaya Kandala

ఆత్మకథ రాసిన తొలి మహిళ  పేరు శ్రీమతి సత్యవతి  .ఈ చిరు వ్యాసంలో ఆమె రచించిన ఆత్మ చరితము లోని విశేషాలను  , సారాంశాన్ని  ఒకసారి గుర్తు చేసుకుందాం  .

ఆత్మకథని స్వీయ చరిత్ర అని కూడా అంటారు  .ఒక వ్యక్తి తన జీవితం గూర్చి తా నే రాసుకున్నది  ఆత్మకథ  లేక  స్వీయ చరిత్ర  .ఎవరైనా సరే వారి వారి జీవితాల్లో జరిగిన అ ను భవాలను ,సంఘటనలను,  జ్ఞాపకాలను భావితరాలకు అందించడానికి చేసే ప్రయత్నమే స్వీయ చరిత్ర.

భారతీయ భాషలలో స్త్రీలు స్వీయ చరిత్రలు రాయడం 19వ శతాబ్దపు మద్యభాగం నుంచి మొదలైంది. తెలుగులో స్త్రీలు రాసిన స్వీయ చరిత్రలు చాలా అరుదుగా కనిపిస్తాయి . మనం ఇప్పుడు తెలుసుకోబోయే   సత్యవతి గారి ఆత్మ చరితము మొట్టమొదటగా 1934లో ముద్రించబడింది  .ఇది తొలి తెలుగు మహిళా ఆత్మకథ .

మనిషి జీవితం కంటే ఆసక్తికరమైన అంశం మరొకటి ఉండదు .ప్రతి ఒక్కరు వారి వారి జీవితాల్లో అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటారు .ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. అలాగే సత్యవతి గారు కూడా వారి కాలంలో ఉంటే 1934 ప్రాంతంలో జరిగిన సాంఘిక దురాచారాలకు స్పందించి ఈ రచన చేశారు

రచయిత్రి గురించి కొంత

ఈమె సున్నిత మనస్కు రాలు. సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలకు ఎంతగానో బాధపడేవారు. మనసులో ఉన్న ఈ బాధంతా ఆత్మకథ రూపంలో వెలు వరించారు అని చెప్పవచ్చు. అయితే ఇందులో సత్యవతి గారి పుట్టుక ,వివాహం, ఆమె భర్తతో గడిపిన కాలం, అ  కాలంగా భర్త మరణించడం మొదలైన వివరాలన్నీ ఉన్నవి. కానీ వీటన్నిటికీ సంబంధించిన సంఘటన ,తేదీలు కానీ సమయాలు ,కానీ ఎక్కడా కనిపించవు. ఆమె వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకోలేదేమో ! అందువలన ఈ పుస్తకం తప్ప దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి మనకి ఇంకా ఏ ఆధారము లేదు .పుస్తకంలో చెప్పబడిన విషయాలను బట్టి , ఆనాటి సాంఘిక పరిస్థితులను సత్యవతి గారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను గురించి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది.

రచయిత్రికి పుస్తక పఠనం బాగా అలవాటుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ గ్రంథం చదువుతూ ఉంటే .చాలా  చిన్న పుస్తకమైన అలంకారాలు ,మంచి భాష , చక్కటి సమాసాలను ఉపయోగించారు .పదబంధాలను అలవోకగా వాడారు.ఈ రచన చేయడానికి ముఖ్య కారణం స్త్రీ పునర్వివాహాలు, భర్త చనిపోయిన స్త్రీకి శిరోముండనం , ఒకటే పూట భోజనం, సైను బట్టలనే చీరలుగా కట్టించడం, తద్డి నాలకు సంబంధించిన విధి విధానాలను చాలా లోతుగా చర్చించారు. తనకు తోచిన సమాధానాలు కూడా ఇందులో ఆవిడ సాహసోపేతంగా ప్రకటించారు . పుస్తకాన్ని చదివినప్పుడు ఈ గ్రంథం 1934 ఫిబ్రవరిలో అవనిగడ్డలో రాసినట్లుగా తెలుస్తోంది .దీన్ని చనిపోయిన భర్త శ్రీ సీతారామయ్య గారికి ఆమె అంకితం ఇచ్చారు .ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. అయితే ముందు చెప్పుకున్నట్లుగా ఇది అర్ధాంతరంగా ముగిసింది .  మొదటి భాగంలో ఈమె జీవిత కథ రెండవ భాగంలో ఆమె అభిప్రాయాలు ఉన్నాయి .అయితే అభిప్రాయాలు ఎక్కువ శాతం దేవుడు -మతం -సమాజం ఈ మూడు అంశాల పట్ల ఉన్నట్టుగా మనకు పుస్తకం చదివితే తెలుస్తుంది.

సత్యవతి గారు తనను తాను పతివ్రతగా భావించారు .సతీ సావిత్రి వలే తాను కూడా భర్తప్రాణాన్ని వెనక్కి తెచ్చుకోగలను అనుకున్నారు .ఒక వితంతువుగా పతివ్రత స్థానం కోసం వాదించడం నేటికీ విచిత్రంగానే అనిపిస్తుంది. మరి ఆ రోజుల సంగతి చెప్పనవసరం లేదు .ఇందులో ఆమె వెల్లడించిన అభిప్రాయాలు చాలా తీవ్రమైనవి .చాలా ఆచారాల్ని, నమ్మకాల్ని హేతువాదంతో ప్రశ్నించారు .సంతృప్తికరంగా సమాధానం దొరక ఉంటే నిరా ధారమైనవి అని కొట్టివేయడానికి కూడా వెనకాడలేదు .ఇలాంటి దృక్పధం ఏర్పడడానికి గల కారణాలను ఆ పుస్తకంలో ఆవిడ చర్చించలేదు.

నాణానికి మరోవైపు

 ప్రఖ్యాత రచయిత శ్రీ చలం గారు 19204లో సావిత్రి నాటకం రచించారు.అందులో ఆయన పురాణ గాధను అంటే సావిత్రి కథను అన్యోన్య ప్రేమను ప్రశంసించేందుకు వాడుకోగా, అదే కథను సత్యవతి గారు పాతివ్రత్యం విలువ కోసం మాత్రమే కాక అన్యోన్య ప్రేమను శ్లా ఘీం చడానికి ,అమ్మాయిలు భర్తల్ని తామే ఎంచు కు నే పద్ధతిని సమర్ధించుకోవడానికి వాడారు .

1934లో ప్రచురించబడిన ఈ గ్రంధంలో అంటే 90 సంవత్సరాల క్రితం తొలి పలుకులో రచయిత్రి లోకమును జరుగుతున్న దురాచారములను నిర్మూలించుటకే నేను ఈ గ్రంథమును ప్రకటించితిని .ముఖ్యంగా అనాధలకు జరుగుతున్న శిరోముం డనాది పరాభవములను తగ్గింపవలెనని నా ముఖ్య ఉద్దేశము అని ప్రకటించుట నిస్సందేహంగా సాహసోపేతమైన చర్య.

సారాంశం

సత్యవతి తండ్రి బెజవాడలో ఓవర్ సీయర్ .ఆమె ఐదేళ్ల వయసులో వాళ్ళ ఊరిలోని బాలి కా పాఠశాలకు పంపించారు. ఆమెకి చిన్నప్పటినుంచి దైవభక్తి ఎక్కువ .పతివ్రత చరిత్రలు ఎక్కువగా చదివేది. పది సంవత్సరాల వయసులో కోరంగి గ్రామంలో జరిగిన ఒక ఉపనయన కార్యక్రమానికి హాజరై, అతనే భర్తగా కావాలనుకున్నది .తర్వాత అతనితోనే ఆమె వివాహం జరిగింది .అతని పేరు సీతారామయ్య అతను ఎఫ్ .ఏ పరీక్షలో ఉత్తీర్ణు డయ్యాక  మామగారి ప్రోద్బలంతో కాకినాడ ఉన్నత కళాశాలలో బిఏ చదివాడు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరాడు .శ్రీకాకుళంలో ఆరు నెలలు పని చేశాడు. తర్వాత ఆముదాలవలసకు బదిలీ అయింది. అక్కడ అతను అకారణంగా ఉద్యోగం కోల్పోయాడు. మద్రాసు వెళ్లి పోరాడి, తిరిగి ఉద్యోగం సంపాదించుకున్నాడు .పై అధికారి అతని మీద కోపంతో బమినిగాం  అనే ఏజెన్సీ ఏరియాకు బదిలీ చేశారు. అక్కడ నివసించడానికి అనువు గా లేకపోవడంతో సత్యావతి కొద్దిరోజులు భర్త నుంచి దూరంగా ఉండవలసి వచ్చింది. తర్వాత అతనికి దారిగం బాడీ అనే స్టేషన్కు బదిలీ అయింది. అక్కడికి తన భార్యతో పాటు ఒక మనిషిని ఇచ్చి పంపమని మామగారికి ఉత్తరం రాశాడు సీతారామయ్య .సగం దూరం వచ్చిన తర్వాత ,అక్కడి పరిస్థితులు చూసి భయపడి తోడుగా వచ్చిన ముసలామె వెనక్కి వెళ్ళిపోయింది .చివరికి దంపతులిద్దరూ దారిగం  బాడీలో కొద్ది రోజులు కాపురం చేస్తారు. తర్వాత ఇద్దరు అప్పుడప్పుడు జ్వరం బారిన పడుతూ ఉండేవారు. కొంతకాలానికి సీతారామయ్య ఆ జ్వరంతోనే  కన్నుమూశాడు.

 భర్త మీదనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న ఆమె  ఆయనతో పాటు చనిపోవాలని సహగ మనం చేయాలని ప్రయత్నం చేసింది .కానీ చుట్టుపక్కల వాళ్ళు ఆమెను ఆపి తిరిగి తండ్రి వద్దకు పంపేశారు. అక్కడ నుంచి మరణించే వరకు ఆమె భర్తనే తలుచుకుంటూ జీవితం సాగించింది అనే విషయం మనకి గ్రంథం చదివినప్పుడు అర్థమవుతుంది.

ఇప్పుడు సత్యవతి గారి అభిప్రాయాలను గురించి తెలుసుకుందాం దానికి ముందుగా మరొక మాట గుర్తుంచుకోవాలి .ఇది 1934 అంటే 90 సంవత్సరాల క్రితం ప్రచురించబడి. రాయబడినటువంటి గ్రంథం అనే విషయం దృష్టిలో ఉంచుకోవాలి.

  1. వివాహమైన వెనుక ఎట్టి శ్రీమంతులకు శ్రీమంతునులైనను తమ భర్తను అనుసరింపక తప్పదు .
  2.  చదువుకొని చేతికి అందిన కుమారుడు ఇంట నుండి సంపాదింప కున్న తల్లిదండ్రులు ఊరుకొనరు .
  3.  పోలీసు వారికి విశ్వాసము సున్న . దయాదాక్షిణ్యములు చుక్కకెదురు. సత్యము వీరికి సవ తి .తల్లి వంటిది. లంచం అన్న మరి మంచినీ రు .
  4.   లోకమున భర్తతో పాటు భార్య కూడా కష్టసుఖముల యందు పాల్గొనుట సతి ధర్మము .
  5. అందరికీ తమ భర్తలను బ్రతికించుకొని, వారితో సుఖముగా ఉండవ లేనని ఉండును. అది సాగనిచో ప్రాణమునకు తెగించి ,సహగమనము చేయుట మంచిది

 భర్త పోయిన స్త్రీలకు జరపు వంచనలు ,పరాభవములు పొందుట కన్నా, చావే  సర్వోత్తమం అనిపించును .

  • దేశము కొరకు ఎన్ని పాట్లు పడుచున్నను గాంధీని కూడా కొందరు దూషించుచునే ఉన్నారు .
  • భర్త పోయిన వెంటనే కేశఖండనము చేయించుట,సాయిను గుడ్డ కట్టించి, ముసుగు వేసి ,మూలను కూర్చుండబెట్టుట ,రాత్రులందు  తిండిని మాన్పించుట ఇవన్నీ మానవ స్వభావమునకు విరుద్ధములై యున్నవి .
  • ముసుగు వేసికొన్న  మర్యాదలు, పిండి తినినందున వైరాగ్యము అలవాడు నా   ?9)మనదేశమున కన్యాశుల్కము వర సుల్కములు పుచ్చుకొను ఆచారం ప్రభలమైనది .అందుచేతనే అనేక అనర్ధములు వాటిల్లుచున్నవి .

10 ) దంపతుల అనురాగమునకు మనస్సు కలియుటయే ప్రధానము కానీ సూత్రధారణము కాదు .

  1. భార్యకు పతివ్రతాత్వం ఎంత ఆవశ్యకమో  భర్తకు పత్నీవ్రతము అంత ఆవశ్యమే.
  2.   పుణ్య పాపములు చేసిన వారలకు భేధ మేమియు మరణమున కాన వచ్చుటలేదు .
  3.  పుణ్యమన పరోపకారమే అని యు, ఇతరుల హింసించుట, కష్టపెట్టుట పాపమని నా అభిప్రాయము.

ఆమె జీవిత చరిత్రలో కొంతకాలమునకు సంబంధించిన కొన్ని సంఘటనలు మాత్రమే ఇందులో వ్యక్తం చేయబడినవి. నేటికీ కూడా ఆశ్చర్య పడునట్టు అనేక అభిప్రాయం వ్యక్తపరిచిన సత్యవతి గారి సామర్థ్యం ఊహకందని ది .ఆ రోజులలో ఇది ఎంతో దుమారము రేపి ఉండవచ్చు. అందువల్లనే ఇది అజ్ఞాతములో ఉండిపోయనేమో.

 90 సంవత్సరాలకు పూర్వము ఇటువంటి అభిప్రాయములను కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ మూర్తి వాటిని తన మనసులో దాచుకొనక ఒక పుస్తక రూపమున ప్రకటించుకొనుట అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజులలో మనము ఊహించినటువంటి కొన్ని భావాలను ఆవిడ ఆ గ్రంథంలో వెల్లడి చేశారు .ఇటువంటి కాలానికి ముందు నడిచిన వాళ్ళు ఎందరో ఉండి ఉండవచ్చు. మనకు తెలుసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తుంది.

ఇదండీ సత్యవతి గారి ఆత్మ చరితము యొక్క చిరు పరిచయం.

March 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

ఆ బంధాలలో తీపెంత?

by Kondapally Neeharini March 16, 2025
written by Kondapally Neeharini

మార్చ్ మయూఖ పత్రిక సంపాదకీయం

  • డాక్టర్ కొండపల్లి నీహారిణి, ⁠మయూఖ ఎడిటర్

మనిషి యాంత్రిక జీవితంలో కొత్తగా ఆర్టిఫిషల్ సంతోషాలు అలుముకున్న నేపథ్యం సంతృప్తి పరుస్తున్నాయా? మరోపక్క ఉమ్మడి కుటుంబాలు ఎంతవరకు మనుగడ కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా! ప్రతి జీవితం ఆశల సౌధమే…అయితే అర్భాటాలకు పెద్ద పీటలు ఎవరు వేస్తున్నారు! ఇది ఆలోచించాల్సిన విషయం. అన్నీ కలిసిన ” మిక్సర్ ప్యాకెట్ ” జీవితం అయినప్పటికీ , ఉండాల్సిన రుచి అనే ఆత్మీయతను కోల్పోయిన బంధాలు అనుబంధాలలో పొందుతున్న అనుభూతులెంత? వీటిలోతాత్కాలిక ఆనందానికి ఆ బాటలు ఎవరికి వారు వేసుకున్నవే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
   కలసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు.
అమ్మ, నాన్న, భార్య భర్త, కొడుకులు, కూతుర్లు, పిల్లలు , వాళ్ళ కు కలిగే సంతానం తో వచ్చే సంబంధాల పిలులుపు, అత్త మామ , చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ చిన్నాన్న, పెద్ద నాన, తాత వంటి మాటలు ఒక ధైర్యాన్ని , ఒక అనుబంధాన్నీ తెప్పించే మాటలు . వీటి విలువను తర్వాత తరాలకు అందించటానికి పునాదులు ఇప్పుడే వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది.
కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే  సంకేతాన్ని తెలియజేయడానికి,  ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. యాంత్రిక జీవితంలో  అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయిన కారణంగా… అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అతి చిన్న విషయాలైన ఒక వ్యక్తి ఒకరికి  చరవాణిలో పంపిన  మెసేజ్ ని చూడకపోతే , లేదంటే చూడటం సమయం ఎక్కువైపోయినా, ఆలస్యమైనా ఒక అభిప్రాయానికి వెంటనే సదరు వ్యక్తిపై సాధారణంగా ఏర్పరచుకుంటున్నారు. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. సాంకేతిక సౌకర్యాల వల్ల ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది.రోజూ వచ్చే సమస్యలు, అవి తీర్చుకునే అవసరాల వల్ల వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన, కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.
      ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఆవశ్యకతను తెలియజేయడం కోసం అందరం కృషి చేయాల్సిన కర్తవ్యం ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే చెర్చించుకుంటాం. అదే కుటుంబమే లేని రోజు మన బాధలు, మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా, ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి.  అంటే ఏకాకి జీవితాన్ని ఏర్పరుచుకొనే పరిస్థితులు రాకుండా ఉండడం కోసం  ప్రయత్నం చేయాలి. అన్ని జీవులలో మనిషి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ   కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం.  అన్నీ కలిస్తేనే జీవితమని కొత్త తరానికి అర్థం చేయించాలి.
       ఇప్పుడు ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు? పోనీ.. మనం ఉంటున్న ఊరిలో ఎక్కడన్నా  కుటుంబం అని చెప్పుకుంటున్న ఇంట్లో అయినా మొత్తం ఎంతమంది కలసి నివాసం ఉంటున్నారు? మహా అయితే, నలుగురు ఐదుగురు ఉంటున్నారేమో! ఓ పది పన్నెండు మంది కుటుంబసభ్యులు ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉన్నట్టు చెప్పగల వాళ్ళ ను మనం కూడా చూసే ఉంటాం. అంతకు మించి కలిసి జీవిస్తున్నవారిని చూసిన గుర్తు మీకుందా?   అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్తాం. ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రశ్నను చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం వింటే  ఒకే ఇంటిలో 38 మంది కలిసి నివసిస్తున్నారు  అంటే ఎవరైనా  నమ్ముతారా? అదీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో కూడా…అవును అటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎక్కడంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ దగ్గరలో. ఒక కుటుంబంలోని  పురుషులు బయట వ్యాపారాలు..ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉన్న విషయమని చెప్పవచ్చు.
కలసి ఉంటె కలదు సుఖం అని ఈరోజుల్లో కూడా ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్న ఆ పెద్ద కుటుంబం గురించి కొన్ని విశేషాలు పొందే పదే గుర్తుకు చేసుకోవాలి. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలకు ఇవే నిదర్శనం. కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై చర్చ చేయడం, బయటపడే మార్గం చూపడం చేయాలి. వీటిపై అవగాహన పెంచడం , కుటుంబాలను ప్రభావితం చేసేందుకు చాలా కోణాలలో పనిచేయడం మనందరి బాధ్యత.
” కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం – దేశాన్ని కాపాడుకుందాం”

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

ఆకాశవాణి

by mayuukha March 16, 2025
written by mayuukha

ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమాలు ఎఫ్ ఎం రేడియో 103.5 మెగా హెడ్స్ పై లేదా
https://onlineradiofm.in/stations/all-india-air-warangal
లింక్ ద్వారా కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా వినవచ్చు

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us