మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

వడ్డెర చండీదాస్, కాశీభట్ల వేణుగోపాల్ ల రచనల సంక్షిప్త పరిచయం

by Dr. Kasarla Rangarao November 21, 2024
written by Dr. Kasarla Rangarao

వడ్డెర చండీదాస్
1937 నవంబర్ 30న పెరిచేపల్లి గ్రామము వ్యవసాయదారుల కుటుంబాల్లో జన్మించారు ఇది పామర్రు మండలం కృష్ణాజిల్లా కిందకు వస్తుంది వీరి పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు. పేద వృత్తి శ్రామికుల వడ్డెర ప్రజల నుండి వడ్డెరను 15వ శతాబ్దపు ఓ విప్లమాత్మక శాక్తేయ బెంగాలీ పేరు చండీదాసు తీసుకొని దగ్గర చేర్చి వడ్డెర చండీదాసుగా తన కలం పేరు చేసుకున్నాడు వీరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారు వడ్డెర చండీదాస్ గారి రచనలలో నవలలు కథలు లేఖలు తత్వశాస్త్రము ఉన్నాయి .

హిమజ్వాల అనుక్షణికం నవలలు చీకట్లోంచి చీకట్లోకి అనేది సంపుటి డిజైర్ అండ్ లిబరేషన్ తాత్వికం ప్రేమతో అనేది లేఖా సాహిత్యం . 2007లో గ్రంధ రూపం లేఖా సాహిత్యం . జనవరి 1984 నుండి 21 డిసెంబర్ 1991 వరకు చండీదాస్ గారు శ్రీ అడ్లూరి రఘురామరాజుకు రాసిన లేఖలు . వీరి రచనలన్నీ చైతన్య స్రవంతి కథని నడిచేవే మనో విశ్లేషణ చేస్తే చాలా పెద్ద థీసిస్ లే అవుతాయి. ఈయన వ్రాసిన సాహిత్యం దాదాపు 2000 పేజీలపైగా ఉంటుంది. 67 ఏళ్లు జీవించిన ఈ తాత్విక తపస్వి జనవరి 30, 2005న విజయవాడలో కన్నుమూశాడు దాదాపు 15 ఏళ్ల పాటు మౌనంగా నాలుగు గోడల మధ్య ఉండి పోయాడు ఆయన ఒకచోట తన గురించి వ్రాసుకున్న సుదీర్ఘ వ్యాఖ్యము “యాశ్వద కార్తీక కవోష్ణంలోంచి పుట్టుకొచ్చి కృష్ణ వరి పైరుల్లో సుషుప్తించి నిజామాబాద్ ప్రాంతపు పచ్చిక మైదానాల్లోంచి ఎదిగి హైదరాబాద్ వెన్నెల్లో తడిసి తిరుపతి వేడిలో కాగుతూ సంస్పందనాకాశంలో ఎగిరి, మూర్ఖత్వపు పంజరంలో పొడి, నిర్లిప్తనిరీక్షణావడిలోకి విముక్తమై అనురాగరసరాగ సౌందర్యంలో పునర్జన్మించాను కానీ అంతలోనే ఆ సౌందర్య అనురాగపు నా ఊపిరి శిలా వాల్మీకమైపోతే అందులో సమాధి అయి ఏకాంతిస్తున్నాను “వడ్డెర చండీదాస్ గారి రెండు నవలలు . హిమజ్వాల మరియు అనుక్షణికం ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ధారావాహికలుగా వచ్చాయి . హిమజ్వాల నవలను తెలుగు తనపు కూపం లో ఇమడలేక అభాసుపాలైన కళాతపస్వి బుచ్చిబాబు గారికి అంకితం చేశాడు . హిమ జ్వాల అనుక్షణికం నవలలను సీరియలించ్చి కీర్తిని అపకీర్తిని మూటగట్టుకున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మకు అంకితం చేశాడు వడ్డెర చండీదాస్ వ్రాసిన కథలన్నీ విజయ అనుబంధం చీకట్లోంచి చీకట్లోకి గా విజయ అనుబంధమాలికగా వెలువడ్డాయి. ఇది విజయం అనుబంధ 24వ నవలగా వచ్చింది. ఇది ఫిబ్రవరి 1978లో వచ్చింది దీనిని ఆమెః ఆమరణ నిర్బంధమాలిని ,మాతృభాల మలిన మందార ధార జగద్ధార మూలాధార నయన జ్వాలకు యివతలగా ,తన చీకటి కడుపున దాచిన , కాంతి నిస్వనపు సవ్వడి —-ఆమెకుఅంకిత మిచ్చారు .

ఇందులో ఏకథకు ఆ కథ గా ఉంటుంది .కానీ అన్ని కథలకు అంత సూత్రం అంటే గొలుసుకథగా ఉంటుంది. దీని గురించి ఈ విజయం అనుబంధంలోనే “సమర్పణ” పేరుతో దాదాపు 15 పేజీల సమీక్షాత్మక వివరణ విశ్లేషణ శ్రీ గుత్తికొండ నాగేశ్వరరావు వ్రాశాడు . డిసెంబర్ 1977గా అందులోనేప్రచురింపబడింది.
వీరి సాహిత్య వ్యాసంగాన్ని నిష్టతో నిష్పాక్షికంగా అధ్యయనం చేసిన వారు వైట్ హెడ్ సాత్రే జంగ్ లాంటి స్వతంత్ర ఇతివృత్తాలతో ” గమనాన్ని యానాన్ని ప్రవాహాన్ని అక్షరాలలో చిత్రించి ఉండే గొలుసు పొరలు చిరగకుండా ఒక్కొక్కటి విప్పి ఏదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కెతో రాసిన అతని వైజ్ఞానిక చైతన్య స్రవంతులు ,రచనా పటిమకు ” అబ్బురపడ్డారు హిమజ్వాల నవల రెండు ప్రధాన పాత్రల అంతరంగ బహి ప్రయాణ చైతన్య స్రవంతి మార్గ నిర్ధారణ ఇది ఒక మనో వైజ్ఞానిక నవల. కృష్ణ చైతన్య గీతాదేవి, ఈ రెండు ప్రధాన పాత్రలతో పాటు కృష్ణ చైతన్య తండ్రి , స్నేహితుడు శశాంక్ , గీతాదేవి భర్త శివరాం , అనారోగ్యపరుడైన చిదంబరం భార్య మాధురి దేవి మరియు కృష్ణ చైతన్య బంధువులు. తెలియకుండా మనసును మనిషిని కోసేసే జ్వలన ధ్వనితమైన జ్వలన జ్వలితమైన ప్రత్యేక జీవుల ఆ రెండు పాత్రలు హిమ జ్వాల నవల. సాంద్రత గాఢ వాక్యాలు . “తడిసి ముద్దయిపోయిన ప్రకృతి ఆమె శరీరంలోంచి ఎగిసే ఆవిరికి తేరుకుంటోంది .”
“మాటాడే తీరులో, సెలయేటివేగం , స్పటత ఉన్నాయి. ” ” పర్వతపు పచ్చని నుదుటి మీద నిప్పురవ్వ ఐ పడి, పగ కొద్దీ కాల్చి , అక్కడికి కసి తీరక దోససిల్ళ్ళతో మసి ఎత్తి గాల్లోకి తెగ పోసి వెళ్లిపోయాడు సూర్యుడు.”
ఈ నవలలో అధ్యాయాల పేర్లు వెలుగు మరక , మూగబోయిన వీణ , ఉప్పొంగిపోనాది గోదారి , అనుభూతి సిగ్గెరుగదట, ప్రేమ వెర్రిబాగులదట , మరీచి కాన్వేషణ , సశేషం జీవితం . ఈ పేర్ల ద్వారా ఆయాభాగాల్లో వచ్చే కథను క్లుప్తంగా చూపించాడు రచయిత నవల చివరన అర్ధాను స్వారంలో రచయిత తన భావాలను వెల్లడించారు.
వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం నవల క్లుప్తంగా శ్రీపతి , స్వప్న రాగలీన, అనంతరెడ్డి , గాయత్రి, మోహన్ రెడ్డి, గంగి ,రవి ,సీత ,కనకదుర్గ, విజయకుమార్, నళిని ,అంకినీడు, జయంతి, వెంకటావధాని ,రంగారెడ్డి ఇవన్నీ ప్రధాన పాత్రలుగా తార, రామారావు , స్రవంతి ,విమల ,ప్రసాద్ ,రాములు చారుమతి తండ్రి , చారుమతి , రమణి ,రంగారెడ్డి సూర్యప్రకాష్ ,రామ్మూర్తి ,సుబ్రహ్మణ్యం ,వేదవతి దురదృష్టవంతురాలు సీత , నిరంజన్ రావు , ప్రత్యేక పాత్ర వందన ,వరాహ శాస్త్రి ఇంకా ఉస్మానియా కిచిడి మిక్సర్ పాత్రలు .ఒక తరం నుండి ఇంకొక తరానికి నాటి సబ్జెక్టు విషయ సామాజిక మానసిక ఆర్థిక నేపద్యాల పది సంవత్సరాల గమనాన్ని రాజకీయ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ విశ్లేషణాలన్నీ మేళ నుంచి ఏ పాత్ర ఎదుగుదల గమనం నిష్క్రమణం దానిదే ఇంతటి సంక్లిష్ట సందిగ్ధం భీభత్స వేళా విశేష రచన ఇప్పటిదాకా తెలుగులో రాలేదు ఏదో ఒక ఇజం సంబందించిందో కాకుండా చారిత్రకతపై సామాజిక గమనంపై ఎక్కడ రచయిత అనవసర జోక్యం లేకుండా దేని వలయం విస్తరణ నిర్వాణం దానికదేగా నిర్వహించడం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప అరుదైన సందర్భం. ఇది ఒక 10 సామాజిక శాస్త్రాల అవగాహనను కలిగించగల ఏకైక నవల .ఉస్మానియా నేపథ్యంలో తెలుగు నైసర్గిక ప్రాతిపదిక విశ్లేషణలతో కూడిన వడ్డెర చండీదాస్ విశేష నవల .
వివిధ ఆంధ్రజ్యోతి సోమవారం 26 నవంబర్ 2018 నాటి తన వ్యాసంలో శ్రీ వల్లూరి రాఘవరావు గారు “అతీత వాద సాహితీ జలపాతం” శీర్షికతో వడ్డెర చండీదాస్ గారి సాహిత్య సమీక్ష చేశారు. ” ఓం వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ “అని పేర్కొంటూ శ్రీ కొడవళ్ళ హనుమంతరావు గారు విపులమైన సాహితీ సమీక్ష చేశారు.
http://eemata.com/ em/ issues/200507/ 177.html

“తెలుగు సాహితి వినీలాకాశంలో ఓ ధ్రువతార అనుక్షణికం” డి. రామచంద్ర రాజు., సంచిక -ఏప్రిల్ ఒకటి 2018.
“విరసాన్ని బోనెక్కించిన అనుక్షణికం ” ఫేస్బుక్ పోస్ట్ 22 ఫిబ్రవరి 2022.
రచన శృంగవరపు గారి ఫేస్బుక్ పోస్ట్ నాలుగు ఆగస్టు 2023 నుండి “చండీదాసు గారు -గొప్ప రచయితే కానీ!”ఇతర సమకాలీన రచనలతో పోల్చి తన అభిప్రాయం తెలుపుతారు .
ఇక వడ్డెర చండీదాస్ గారి సాహితీ ప్రయాణం లో అత్యంత ప్రత్యేకమైనది తాత్విక రచనా వెలుగు చూడడం. డిజైర్ అండ్ లిబరేషన్ అనే వీరి సూత్రప్రాయ రచన చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని విషయంలో శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు చాలా విపులమైన వివరణ తన ఫేస్బుక్ మాధ్యమం లో వివరించారు. అబ్ధుల్ రాజా హుస్సేన్ గారు కూడా చండీదాస్ గారిపై విపులమైన వివరణలు ఫేస్బుక్ మీడియా ద్వారా దృశ్యమానం చేశారు.

కాశీభట్ల వేణుగోపాల్
వేణుగోపాల్ జనవరి 2 1954లో కర్నూల్ లో జన్మించాడు. వీరికి ఇద్దరు అన్నలు. ఆరుగురు అక్కలు. 9 నెలలప్పుడే స్పష్టమైన పలుకులకు ముచ్చటపడి వీరి తల్లి వీరికి కాళిదాసు శ్లోకాలు పద్యాలు అమర కోశం నేర్పించింది. ఆ విధంగా వీరు చిన్నప్పటినుంచే జిజ్ఞాసతో అన్నలు అక్కలతో గ్రంథాలయానికి వెళ్తూ చదవడం అలవాటు చేసుకున్నాడు కాలేజీల చదువు అబద్ధం అని నమ్మి దృవపత్రాలు అన్ని చించి వేసి సాహిత్య ప్రస్థానం కొనసాగించాడు చాలా చాలా విస్తృతంగా అధ్యయనం చేశాడు శ్రోత్రియ నియమాలను మిగతా అన్ని మానవ నిర్మిత నిబంధనలన్నీ విలువల్ని ఒప్పుకోడు. మొదట మల్లాది బుజ్జిబాబు శ్రీశ్రీల ప్రభావం లో ఉన్న త్వరలోనే బయటపడి సొంత ఒరవడికై కృషి చేశాడు. గుంటూరు శేషేంద్ర శర్మకు మంచి అభిమాని. ఈయన అవివాహితుడు .మంచి పద్యం మద్యం రెండింటికి ప్రీతిపాత్రుడు. హరిప్రసాద్ చౌరాసియాలను బాగా ఇష్టపడతాడు. మూడుసార్లు దేశాటనం చేశాడు . గాఢమైన అనుభూతుల్ని ఒడిసి పట్టుకోవడంలో ఈ పర్యటన వల్ల ,అధ్యయనం వల్ల , అమ్మ చెప్పిన శ్లోకాల వల్ల వచ్చిందంటాడు . జీవితంలోని గందరగోళాన్ని అస్థిరత్వాన్ని రచనలోని ముగింపుకై పాఠకుడిలో ఏర్పడే అవగాహనను చిన్నాభిన్నం చేయడం ద్వారా అనేక ప్రశ్నల్ని గాడతల్ని బరువుల్ని పాఠకుడి పై మోపుతాడు . సమకాలీన జీవన సంఘర్షణ బీభత్సాన్ని వైరుధ్యాలని ఒకింత చిక్కగా ప్రశ్నార్ధకం చేస్తాడు ..ఒక ప్రత్యేకమైన రచనా ఒరవడిని ముంచెత్తి పాఠకుడ్ని ఆశ్చర్యల్లో ముంచెత్తి ఆలోచింప చేస్తాడు . ఈయన నాలుగు కథా సంకలనాలు మూడు కవిత్వం పుస్తకాలు ఎనిమిది నవలలు ఒక నవలిక రచించాడు. దిగంతం ,తపన, నేను చీకటి , మంచు పువ్వు , తెరవని తలుపులు , నిషకం, అసత్యానికి ఆవల , అసంగత నవలలు రంగులు అనే నవలిక . నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశాడు

అసంగతం నవలపై శివా అయ్యల సోమయాజులు పుస్తకం డాట్ నెట్ లో విప్లమైన సమీక్ష వ్రాశాడు. వెంకట సిద్ధారెడ్డి సారంగ సంచిక 15 డిసెంబర్ “వేణుగోపాల్ మరియు ఒక సామాన్యుడు ” శీర్షికగా కాశీ భట్ల వేణుగోపాల్ తపన నవల తనపై ఎంత ప్రభావం చేసిందో చూపిందో విపులంగా వివరిస్తాడు . కాశీభట్ల వేణుగోపాల్ చెప్పిన కవిత యూట్యూబ్లో స్టేట్మెంట్ పేరుతో ఉంది రెండు నిమిషముల 50 సెకండ్లు ఇందులో ఆయనకు సంబంధించిన ఒక కృత్యా ద్యవస్థ వివరిస్తాడు .” కుర్చీ మై చైర్ ఓ పారాభౌతిక భావన ఒక సమ్మోహకర ప్రార్థన కేంద్రం . ముందు నన్ను రూపంగా మార్చి ఈ కుర్చి ఓ పారాభౌతిక భావన .ఎండలో మెరిసే వాన వానలో తడిసే ఎండ నన్ను చీల్చుకు వచ్చే చిగురు కోసం ఎండ వానల్లోని నన్ను మార్చే కుర్చీ సాంతం కాళ్లు చేతులు ఉన్నాయంటూ లేకున్నా ఉన్నాయంటూ మట్టిని కౌగిలించుకోవడానికి మట్టైన నేను (కుర్చీలో) ఇంకో మెరిసే వాన కోసం తడిసి ఎండ కోసం .” ఈ విధంగా చాలా సంక్లిష్టమైన భావనలను ఆలోచనలని పాఠకునిలో రేకెత్తించిమనసులోకి దించి వదిలేస్తాడు కాశీభట్ల వేణుగోపాల్ వేణుగోపాల్.

November 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15))

by Narendra Sandineni November 21, 2024
written by Narendra Sandineni

తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.

November 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

“భాష- సభ్యత “

by Kondapally Neeharini September 30, 2024
written by Kondapally Neeharini

సెప్టెంబర్ 2024 మయూఖ పత్రిక సంపాదకీయం

ఈ భూమి మీద ఆవరించి ఉన్న అనంతమైన శక్తి ని అందిపుచ్చుకున్న ఏకైక జీవి మనిషి. సర్వ ప్రాణి కోటిలో ఉత్కృష్టమైన జీవి మనిషి అని పేరు వచ్చిన కారణం ఏమిటి అని యోచిస్తే, భావవ్యక్తీకరణ కు భాషను సాధనం చేసుకున్నందుకే, బుద్ధి ని వికసింపచేసుకొని విజ్ఞానానికి మళ్ళించినందుకే, మనసు మాట విని చెప్పగలిగే యుక్తి ఉన్నందుకే అంటూ ఇలా కొన్ని విశేషాలు విశేషణాలు ఉదాహరించవచ్చు.ఈ గొప్పతనాన్ని మరింత గొప్ప చేసుకోవాలి. దీనికి మంచి చెడు అనేవి రెండు పార్శ్వాలు గా ఉంటాయి. సరళసౌమ్యంగా మాట్లాడే మనుషులు ఉంటారు.దుర్భాషలాడేవాళ్ళూ ఉంటారు. మాట కు భాష ప్రధానమైనది కాబట్టి భాష రావాలి. భాషలెన్నో ఉన్నాయి. ఎవరి మాతృభాష వాళ్ళకుంటుంది. ఎవరికి నచ్చిన భాష వాళ్ళకుంటుంది.ప్రభావితం చేసే భాష , లేదు… రుద్దబడే భాష లేదూ…మనసుపడే భాష , ఇవన్నీ భాష గొప్పతనాన్ని చూపేవే!

మనసు నిండా మాలిన్యం ఉన్న వాళ్ళ మాట ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. ఈర్ష్య, వ్యతిరిక్తత, వ్యంగ్యం వంటి భావాలు వాక్యాలు వాక్యాలు గా వాళ్ళ నోటివెంట వస్తూనే ఉంటాయి.మాట రాలేని పక్షంలో నోటితో నవ్వుతూ నుదిటి తో వెక్కిరిస్తారు.
ప్రస్తుతం ఈ విషయంలో తెలుగు భాష ప్రయోగం చేసే క్రమాన్ని చర్చించుకోవడం లో ద్రావిడ కుటుంబ భాష నేనా కాదా అనే, ద్రావిడ భాష 500 సంవత్సరాల క్రితం భాషేనా కాదా అనే , అది సింధులోయ నాగరికత ప్రాంతంలో మాట్లాడిన భాష కాదా అనో ఈ చర్చ కాదు.

ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలేవి? ఏది ముందు ఏది వెనక,? ఓల్గా నుండి గంగ వరకు నడుచుకుంటూ వచ్చిన భాషనా? గంగనుండి ఓల్గాకు నడుచుకుంటూ వెళ్లిన భాషనా అనే చర్చకాదు. కొన్ని నిరూపించబడతాయి కొన్ని నిరూపించబడవు. సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలు ఉండవు. తాళపత్ర గ్రంథాలలో ఉన్నవే ముఖ్యమైన వనో , శిలా శాసనాల మీద ఉన్న భాషనే ముఖ్యమైన ది అని కాదు.

లేదు ….పల్లె ప్రాంతాల్లో ప్రజల నాలుక పైన మాట్యమాడే భాష ప్రధానం అనో కాదు! భాషా శాస్త్రజ్ఞులు చెప్పే లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ విషయ చర్చ కూడా కాదు.
ఎవరి భాష అయినా వాళ్లకు ప్రీతికరమైన భాష నే!
అయితే ఇతరులకు నచ్చేలా మన భాష ను మనం ప్రయోగిస్తున్నామా లేదా అనే విషయాన్ని చర్చించుకోవడం.
మంచి మాటలు మాట్లాడడం రాకుంటే చెడు మాట్లాడకుండా ఉంటే చాలు మేలు చేసిన వాళ్ళు అవుతారు.
పెద్దలు ఏది మాట్లాడితే పిల్లలు అదే నేర్చుకుంటారు అంటే చాలామంది ఒప్పుకోరు కానీ ఇది సత్యం. ఏ పనులు చేస్తున్న ఎక్కడ ఉన్నా పిల్లలు పెద్దవాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా చక్కని సంభాషణ చేయడం అలవర్చుకోవాలి.

బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఒక ఆఫీసర్లు, దేశ నాయకులు, సంఘ నాయకులు ఎలాంటి పదాలను ప్రయోగిస్తుంటే ఉచ్ఛరిస్తుంటే అవే మాటలను సబార్డినేట్స్, వాళ్ళ కింద స్థాయి వాళ్ళు అలవర్చుకుంటారు.
నలుగురికి పని చెబుతున్నాము అంటే నాలుగు ప్రపంచాలు మనని గమనిస్తున్నట్టే లెఖ్ఖ!

రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే నడుచుకుంటారు అంటూ” యధా రాజా తథా ప్రజా ” అని చెప్పిన మన పూర్వీకుల మాటను స్మరించుకుంటే, ఇంట్లో పెద్దవాళ్లు ఏది మాట్లాడితే పిల్లలు వాటినే అనుసరిస్తారు. అసలే చుట్టుపక్కల సమాజం చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇంట్లో వాళ్ళు కూడా దుర్భాషలాడము, చెడ్డ మాటలను ఉపయోగించడం చేస్తూ ఉంటే ఆ ఇళ్లల్లో పెరిగే పిల్లలు ఏం నేర్చుకుంటారు?
రాజకీయ నాయకులు ముఖ్యంగా సభ వేదికలపై ఉపయోగించే పదజాలం అసభ్యకరంగా ఉన్నప్పుడు సభ్య సమాజం ఏమి స్పందించకుండా ఉండడం విచారకరం.వ్యక్తిగతంగా
ఏవైనా కోపాలుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కానీ నలుగురి ముందు మాట్లాడే హక్కు వాళ్లకు ఉండకూడదు .ఈ నియంత్రణ అనేది పాలనలో తప్పకుండా రావాల్సి ఉంది. ఒకళ్ళు మాట్లాడారు కదా అని ఇంకొకళ్ళు మాట్లాడడం ,వాళ్ళతో పోలుస్తూ చెప్పడం వాళ్ళు చెప్పిందే మేము చెబుతున్నా అనే ఉదాహరిస్తూ చెప్పడం ఒక అలవాటుగా మారిన కాలంలో మనం ఉన్నాం .ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రసంగాలలో గమనిస్తున్నాం. ఇది ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయవలసిందే! దీనికి దేశంలోనే అత్యున్నత స్థానమైన న్యాయస్థానం ముందుకు రావాలి. అసభ్య పదాలను ఉపన్యాసాలలో ఉపయోగిస్తూ మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకొని చూపించాలి. అప్పుడే తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడరు .లేకుంటే భావితరాలకు ఏ సమాజాన్ని అందించిన వాళ్ళం అవుతాం?

ఒక ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన క్రింద పనిచేసే ఇతర హోదాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు, మర్యాదపూర్వకమైనటువంటి భాషతో భావంతో మెలుగుతూ తాము తీసుకున్న నిర్ణయాలు అందరికీ అందజేస్తారు. నాయకులైన అంతే.ఉదాహరణకు వివిధ రకాల సంఘాలు ఉంటాయి ఆ సంఘాలకు నాయకులు ఉంటారు వాళ్ళ మనసులో ఎలాంటి కోపతాపాలున్నా కూడా సంఘానికి సంబంధించిన మీటింగ్ సభను పెట్టుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. పిల్లలు తల్లి తండ్రి తమకు నచ్చని అంశాలు కనిపించిన పిల్లలతో సభ్యత ఉట్టిపడే స్వరంతోనే భాషతోనే మాట్లాడుతారు. ఇది ఎందుకు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలని తాము ఆశించినటువంటి సంస్కరణలే కాని, అభివృద్ధి పథకాలే కానీ మంచి విషయాలే కానీ చెప్పేందుకు ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతిలోనే మాట్లాడుతారు , వాళ్లకు చేరవేయగలుగుతారు,అప్పుడే అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో కాకుండా కార్యాలయాలలోనూ లేదా సంస్థ లాభనష్టాల విషయం చర్చించేప్పుడైనా ఒద్దికైనా మాటలతోనే తమ నిర్ణయాలను వెలిగిచ్చుతారు. అంతేకానీ కోపం వచ్చిందని ఇష్టమున్నట్టు మాట్లాడితే తమ అనుకున్నవి సాధించలేరు.

రాజకీయ నాయకుల వరకు వచ్చేసరికి ఇది క్రింద మీద అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రత్యర్థులను తిడితే కానీ దుర్భాషలాడితే కానీ ఒక హల్ చల్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది రాజకీయాలనేవి ఈనాటివి కావు వందల సంవత్సరాలుగా నడుస్తున్నాయి ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇది గర్హనీయం. ఈ పరిస్థితులు మారాలి.

ప్రత్యేకంగా మన తెలుగు భాషకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇతర భాషల కన్నా మిన్న అయిన భాష మనది. సరళంగా సౌమ్యంగా మాట్లాడడం చేతకాకుంటే శిక్షణ తీసుకోవాలి కోపోద్రి క్తులను చేసేలా పదజాలం
వాడితో మాట్లాడితే ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది. ఉపన్యాసాలలో చెడు
ఉంటే కలిగే నష్టం ఎవరికి ? కింది వర్గాల వారికి ! మా సారు ఇలాగే మాట్లాడాడు కాబట్టి మేము ఇలాగే మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎవరికి మంచిది కాదు. ఈ పద్ధతి పోగొట్టాలంటే,రాజకీయ పాఠశాలలను ఏర్పాటు చేసి శిక్షణనిచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా నిబంధనలను తీసుకువస్తే గాని మార్పు వస్తుంది. భాష సభ్యత ను ఇస్తుంది. భాష భవితను ఇస్తుంది. ఇది గ్రహించి మెసలుకోవడం ఓ బాధ్యత!

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

చక్కటి భాషను ఉపయోగించండి- సృజన సమాజానుకూలంగా చేయండి – డా. సంగనభట్ల నర్సయ్య

by Aruna Dhulipala September 30, 2024
written by Aruna Dhulipala

సాహిత్యము, సంగీతము, ఆధ్యాత్మికము, పరిశోధన, కళారంగాల్లో కృషి చేస్తూ తెలుగు భారతికి విశేష సేవలందిస్తున్న డా. సంగనభట్ల నర్సయ్యగారి జీవిత ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.
 
నమస్కారం సార్..

1ప్ర :- మీ జననం, పుట్టిన ప్రాంతం వివరాలు చెప్పండి.
జ:-     నమస్కారం అమ్మా! మయూఖ పత్రికకు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకోవడం చాలా విశేషమని అనుకుంటున్నాను. పైగా అది అంతర్జాల పత్రిక. పాఠకుల సంఖ్య కూడా ఎక్కువే. మీరు అడిగిన విధంగా నా జీవిత విశేషాలను చెబుతాను. నేను 1954 జూలై 23వ తేదీన పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గ్రామంలో పుట్టాను. మా అమ్మ నర్సుబాయమ్మ. మా నాన్న సంగనభట్ల వెంకన్న. ఆయనను వ్యవసాయ విజ్ఞాన నిపుణుడు అని చెప్పుకోవచ్చు. మా గ్రామానికి ఒరుసుకొని గోదావరీ నది పారుతూ ఉంటుంది. మనకు అలంకార శాస్త్రంలో “గంగాయామ్ ఘోషః” అనే మాట ఒకటి ఉంది. శబ్ద శక్తులు అభిద, వ్యంజన, లక్షణ అని మూడురకాలు. అందులో లక్షణ శక్తికి ఉదాహరణగా ఈ మాట ఉంటుంది. నేను పనిచేసిన కళాశాల ప్రహరీగోడ అవతలి వైపు దూకితే గోదావరిలో పడేంత దగ్గరగా ఉంటుంది. మావూరు తీర్థ క్షేత్రం. రెండు అర్హతలు ఒక్కచోట ఉండడం అరుదు. అది ఒక విశేషమైతే రెండవది మా ఊరు 3 వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. మన ఉభయరాష్ట్రాల్లో ఇంత ప్రాచీనమైన గ్రామాన్ని చూడము. దానికి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయి. దానిమీద “ధర్మపురి క్షేత్ర చరిత్ర” పుస్తకాన్ని నేను రాశాను.
 
2 ప్ర :-  మీ విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితాన్ని తెలపండి.
జ :-      మేము అగ్రహారీకులం కావడం వలన వంశాచారాన్ని అనుసరించి బాల్యంలోనే ఉపనయనం జరిగి సంస్కృతాధ్యయనం, వేదాధ్యయనం చేశాను. మా కుటుంబంలో నేను పెద్దవాడిని. 1969 లో నా హెచ్.ఎస్.సి పూర్తయింది. అది తెలంగాణ వేర్పాటు ఉద్యమ దశ. మేమంతా ఉద్యమవీరులం. ఒక పదిరోజులు జైలులో కూడా ఉన్నాను. అంతకు ముందు 4, 5 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో పెట్టిన “శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల” (సాయం కళాశాల)
లో ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో ఓరియెంటల్ లాంగ్వేజెస్ లో చేరాను. డిప్ ఓ ఎల్, బి ఓ ఎల్, ఎమ్ ఓ ఎల్ చేశాను. తర్వాత ఎమ్ ఎ. పి హెచ్ డి. అన్నీ మావూళ్ళోనే. నేను తర్కం, వ్యాకరణం, సంస్కృత కావ్యాలు, ఛందశ్శాస్త్రం సాంప్రదాయకంగా సంస్కృతం బేస్ డ్ గా చదివాను. తర్కశాస్త్రం, కావ్యాలు కొన్నింటిని కొరిడె రామారావు గారి దగ్గర, కాశీవజ్ఝల మృత్యుంజయ శర్మగారి దగ్గర సిద్ధాంత కౌముది, గుండి రఘురామ శాస్త్రిగారి దగ్గర రఘువంశం చదువుకున్నాను. వాళ్లంతా స్థానిక పండితులే కాక రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు. హిందీ శ్యామ్ సుందర్ గారి వద్ద చదువుకున్నాను. ఒక విశేషం ఏమిటంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన 60 సంవత్సరాల వరకు మా ఊరు నుండి నేను బయటకు రాలేదు.
          చదివిన కాలేజీలోనే లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేశాను. చదువుతున్నప్పుడే ఒక ఎయిడెడ్ పోస్టులో, పగలు నడిచే సంస్కృత పాఠశాలలో టీచరుగా పనిచేశాను. సుమారు 40 సంవత్సరాలు నా సర్వీసు. ఓరియెంటల్ కళాశాలలో 8 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసి తర్వాత ప్రిన్సిపాల్ గా చేశాను. నేను ప్రిన్సిపాల్ గా పనిచేసిన కాలం ఒక రికార్డు. 28 సంవత్సరాలకే ప్రిన్సిపాల్ గా చేరి, 58 సంవత్సరాలు వచ్చేవరకు 30 సంవత్సరాలు ప్రిన్సిపాల్ గా అది కూడా ఒకే కాలేజీలో చేయడం విశేషం. అభివృద్ధిలో కానీ, విస్తరణలో కానీ నేను దానికి ఉద్యోగిగా కాక తల్లికి చేసినట్టు సేవలందించాను.
 
3 ప్ర :-మీ కుటుంబ నేపథ్యాన్ని వివరించండి.
జ :-      మా ఇంటి పేరు సంగనభట్ల. సంగనభట్టు అనే వ్యక్తికి సంబంధించిన కుటుంబం కాబట్టి ఆ పేరు వచ్చింది. 8 వందల సంవత్సరాల క్రితం కన్నడ బ్రాహ్మణుడు సంగనభట్టు మా ఊరికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. అప్పటికే పశ్చిమ చాళుక్యుల పరిపాలనా కాలం ముగుస్తున్న దశ. అతని వంశీకులుగానే మేము తామరతంపరగా పెరిగాము. దాదాపు 500 బ్రాహ్మణ కుటుంబాలున్న ధర్మపురిలో 150 వరకు సంగనభట్ల వంశీయులవే ఉంటాయి. మరొక విశేషం ఏంటంటే ఇన్ని కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబం కూడా ఊరు వదిలి మరోచోటికి వలస వెళ్ళింది లేదు. దానివల్ల ఉభయ రాష్ట్రాలలో మా ఇంటిపేరు గలవాళ్ళం మేము తప్ప ఎవరూ లేరు. కొన్ని ఇతర కుటుంబాల వలె మాది గ్రామ నామంతో కాక వ్యక్తి విశిష్ట నామంగా ఏర్పడింది. మా తండ్రులు, తాతలు అంతా ఆ ఊరివాళ్లే.
       మా పెదనాన్నగారు రామకృష్ణ  ఘనపాఠి గోదావరి జిల్లాల్లో వేదసభలు నిర్వహించి ‘జగజ్జేయుడు’ అనిపించుకున్నాడు. తెలంగాణ నుండి 80 సంవత్సరాల క్రితం అక్కడి ప్రాంతాలన్నీ తిరిగి ‘విజయుడు’ అని పట్టా పుచ్చుకునేవరకు కదిలేవాడు కాదు. ఆయన చరిత్ర పుట్టపర్తిలో వేద కాలేజీ ప్రిన్సిపాల్ నాకు చెప్పాడు. మా పెద నాన్నగారితో ఈయనా తిరిగేవాడట. ఇక మాతామహుల వైపు మా తాతగారు హరికథలు చెప్పేవాడు. సంగీత విద్వాంసుడు, ఆయుర్వేద వైద్యుడు కూడా. ఒక్క రామదాసు కథను 400 హరికథలు చెప్పాడు. ఆ రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ గ్రామం తిరిగాడు. ఆ కథలో లీనమై కథ చెబుతూ ఏడుస్తుంటే, ప్రేక్షకులు కూడా ఏడ్చేవారట. అంత ప్రసిద్ధి ఆయన కథనం. మా మేనమామ చాచం కిష్టయ్యగారు గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మ కూడా సంగీతం పాడేది. త్యాగరాయ కృతులతో నాకు జోల పాటలు పాడేది. ఆమె విదుషి కూడా. పురాణ, ఇతిహాస కథలు చెప్పేది. ఆమె బాల్యంలో చదువుకోకపోయినా నాతో పాటు అక్షరాలు దిద్ది చదువుకున్నది. వేదం చదువుకున్నప్పటికీ జాగీర్దార్లం కావడం వలన పౌరోహిత్యం చేసేవాళ్ళం కాదు. మా మేనమామ కుటుంబం మాత్రం మా ఊళ్ళోనే పౌరోహిత్యంతో పాటు, ఆయుర్వేద వైద్యం కూడా చేసేవాళ్ళు.
         
4 ప్ర :-దేశి ఛందస్సు మీద పిహెచ్ డి చేయాలనే మీ కోరికకు కారణం ఏమిటి?
జ:-       ఓరియెంటల్ కాలేజీ కావడం వల్ల మాకు ఛందో వ్యాకరణాలు గురువులు చెప్పేవారు. మేము కూడా విశేష అధ్యయనం చేయడం జరిగింది. గ్రామీణ వాతావరణం కనుక పాటలంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. వచనం కంటే భిన్నంగా పాటలెందుకు ఆకర్షిస్తాయి? అనే ఒక ఊహలో నుంచి పరిశోధన చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ కాలంలో ‘భారతి’ వంటి ప్రసిద్ధ పత్రికలు ఉండేవి. అప్పకవి తెలుగులో గొప్ప ఛాందసికుడు. ఆయన చెప్పిన కందభేదాలు అసమంజసమంటూ ఆ పత్రికకు ఒక వ్యాసం రాశాను. అది పెద్ద సంచలనం ఆ రోజుల్లో. బిరుదు రామరాజు గారు ఆ వ్యాసం చూసి “ఛందస్సులో మీరు పరిశోధన చేస్తే బాగుంటుంది”. అని అప్లికేషన్ పంపించారు. ఛందస్సులో పరిశోధన చేయడానికి అది ఒక కారణం. నేను అధ్యయనం చేస్తున్నప్పుడు  ‘అప్పకవీయము’ ను క్షుణ్ణంగా చదివాను. ఆయన 40 దాకా యతిభేదాలు చెప్పారు. ఇవన్నీ అవసరం లేదనేది నా భావన. ఇది రెండవ కారణం. పి హెచ్ డి సీటు ఇవ్వడానికి సినారె గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. చాలాసేపు ఛందస్సు మీద ఆయన ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. చివరకు ఆయన ” నేనొక వేళ సీటు ఇవ్వకపోతే మీరేం చేస్తారు?” అని అన్నారు. ” సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా నా పరిశోధన కొనసాగిస్తూనే ఉంటాను” అన్నాను. ‘బాగా చెప్పావు’ అన్నారు నవ్వుతూ. 26వ యేట సీటు పొంది 32వ ఏట పూర్తిచేశాను. పి హెచ్ డి పట్టా రావడానికి ఆలస్యమైంది.
 
5 ప్ర :- ఆ జాప్యానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జ:-        ముఖ్యంగా రెండు కారణాలు. లెక్చరర్ గా ఉన్నప్పుడు పి హెచ్ డి రిజిస్టర్ చేస్తే, ప్రిన్సిపాల్ అయ్యాక బాధ్యతలు పెరిగి ఆలస్యమవడం ఒక కారణం. రెండవది…నేను తీసుకున్న అంశం “తెలుగులో దేశి ఛందస్సు – ప్రారంభ వికాస దశలు”. దేశి ఛందస్సులన్నీ గేయ మూలాలు అనే ప్రతిపాదనతో పాటు ఏ గేయం నుండి ఏ ఛందస్సు పుట్టింది? గణవ్యవస్థ ఏమిటి? వీటన్నిటి మీద పరిశోధన చేశాను. చివరి క్షణాల్లో నాకు వచ్చిన మరొక ఆలోచన ఏమిటంటే తెలుగు భాష అభివృద్ధిలోకి రావడానికి పూర్వం మన తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన భాష ప్రాకృతం. మరి ప్రాకృత భాషా ప్రభావం ఈ ఛందస్సుల మీద ఉండకూడదా? జనాల్లోనూ, సాహిత్యంలోనూ, పాటల్లోనూ ప్రాకృత భాష ఉంది. అది లేకుండా నేను చేసిన పరిశోధన అసంపూర్ణమవుతుందని భావించి ప్రాకృత ఛందస్సులు చదివాను. సీస పద్యంలో పద్యం మీద పద్యం ఉండడం మన ఛందస్సులో లేదు. అది ప్రాకృత భాషకు చెందిన ఛందస్సుగా గుర్తించాను. అట్లాగే కందం ఆర్యా ఛందస్సు మనది కాదు. అది పది రకాలుగా ఉంటుంది. దాంట్లో ‘గాహా’ అనేది ఒక ఛందస్సు. ప్రాకృతంలో ప్రసిద్ధి. హాలుడు రాసిన ‘గాథా సప్తశతి’ లో గాథ అంటే ప్రాకృతంలో ‘గాహా’. అది ఒక ఛందస్సు పేరు. మనమనుకునే కథ అనే అర్థం కాదు. ఏడు వందల కథలు కావు. ఏడువందల శ్లోకాలు.
ప్రాకృతంలో ఉన్న వీటన్నిటినీ పరిశీలించి సమగ్రంగా రాయడం వల్ల ఆలస్యమైంది.
    4, 5 ఏళ్ళలో పి హెచ్ డి పుస్తకం రావడం విశేషమైతే అచ్చు వేసిన తక్షణం బాగా ప్రాచుర్యం పొంది వివిధ విశ్వవిద్యాలయాలు పాఠ్య గ్రంథంగా
తీసుకోవడం, రెండుసార్లు అచ్చు కావడం మరీ విశేషం. ఈ విషయంలో సినారె గారు ఎంతో ప్రశంసించారు. పాటిబండ మాధవశర్మ గారి తర్వాత 25 ఏళ్లకు ఉస్మానియాలో దీనిపైన పరిశోధన చేసిన వ్యక్తిని నేనే. మాధవశర్మ గారు కేవలం మహాభారతంలో ఛందస్సు ఉపయోగించడం ద్వారా రసావిష్కరణ ఎలా జరిగిందో చూపించారు. కానీ నేను మొత్తం శాస్త్రం మీదనే పరిశోధన చేశాను. 1300 సంవత్సరాలలో ఛందస్సు పుట్టుక, పరిణామం, వికాసం వీటన్నిటి మీద పరిశోధన చేశాను. ఇలా నా అభిరుచి తప్ప మరొకటి కాదు. ఆరు పాదాల జానపద గేయం సీస పద్యంగా మారిందని, సీస పద్యానికి ఆరు పాదాలేనని చెబుతూ నేను ఒక పరిశోధన వ్యాసం రాశాను. అది చూసిన చేకూరి రామారావు గారు “ఈ ఒక్క దానికే మరొక పి హెచ్ డి ఇవ్వొచ్చు” అన్నారు. అలా నా ఇష్ట పూర్వకంగా సమగ్ర పరిశోధన చేశాను.
 

సంగనభట్ల నర్సయ్యగారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

6 ప్ర :- సంస్కృత ఛందస్సుల నుండి మన తెలుగులోకి మారిన విధానాన్ని తెలపండి.
జ :-      సంస్కృత ఛందస్సులన్నీ మనవి కావు. అవి మార్గి. గణ వ్యవస్థ, త్య్రక్షర గణాలు, ఉత్పలాది పద్యాలు, షడ్వింశతి ఛందాలు మొత్తం సంస్కృతం నుండి వచ్చినవే. అక్కడినుండి మన తెలుగులోకి తెచ్చుకున్నాం. ఛందస్సు రెండు రకాలు. ఒకరకంగా చెప్పాలంటే గంగా యమునలు. గంగానది దేశి ఛందస్సు అనుకుంటే యమున మార్గి. బయట నుండి వచ్చిందని అర్థం. త్య్రక్షర గణ ఛందస్సులన్నీ సంస్కృతం. అయితే వాటిని మనం సొంతం చేసుకునేటప్పుడు యతి, ప్రాసలను జోడించాము. అవి సంస్కృతంలో ఉండవు. సంస్కృతంలో ప్రాస అంటే అనుప్రాసాలంకారంలో ఉంటుంది. యతి కూడా మనలాగా ఉండదు. కేవలం విశ్రాంతి. అసలు యతి అనేది మన ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలతో తయారైంది. పాదం ఒకచోట ఆపాలంటే, ఉచ్ఛ్వాస ద్వారా గాలి లోపలికి పీలుస్తాం. అక్కడ శబ్దం పుట్టదు. నిశ్శ్వాసలో ధ్వనులు పుడతాయి. మన ఊపిరి ఎంతవరకు ఆపగలుగుతామో అంతవరకు ఉచ్చరించ గలుగుతాము. తరువాత ఉచ్ఛ్వాస ద్వారా గాలి పీలుస్తాం. అక్కడే మధ్యలో యతి ఉంటుంది. అందుకే సంస్కృతంలో పాదాన్ని ఆపడమంటే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలే ప్రధానం. అందుకే అక్కడే యతి పాటించడం జరుగుతుంది. “యతిర్విచ్ఛేద సంజ్ఞితా” అని శాస్త్రం. అంటే పదం ముగిసి తరువాతి అక్షరం దగ్గర యతి విచ్ఛేదం అవుతుంది. మనకు తెలుగులో అట్లా కాదు. విచ్ఛేదం కాకున్నా సంఖ్యా నియమానుసారం యతి పాటిస్తాం. దీన్ని ‘సదృశాక్షర యతి’ అంటారు. ఇలాంటి మార్పులతో సంస్కృతం నుండి ఛందస్సు తెలుగులోకి వచ్చింది.

 7 ప్ర :- గోదావరీ తీర వాసులు కావడం వల్ల బాల్యం నుండీ పుష్కర స్నానంలో పునీతులు అయ్యారు..అలాగే మీ  “పుష్కర విశిష్టత” గ్రంథానికి మీకు కలిగిన ఆసక్తి కారణమా? లేక ఎవరి ప్రోత్సాహం అయినా ఉందా?
జ :-     ఆధ్యాత్మిక రంగం నా పరిధిని విస్తృతం చేసింది. నేను సుమారు పది పన్నెండు అంశాల మీద గ్రంథాలు రాశాను. పరిశోధన చేశాను. ధర్మపురి పుణ్యక్షేత్రంలో పుట్టడం వలన గోదావరీ నదీ తీరం కాబట్టి పుష్కరాలు నాలో ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా గోదావరి నది పుష్కరాలు మిగతా నదుల కంటే విశేషం. ఎందుకంటే గోదావరి నదికి మాత్రమే ఆది, అంత్య పుష్కరాలు ఉంటాయి. గురువు సింహరాశిలో ప్రవేశించగానే ఆది పుష్కరాలు వస్తాయి. గురువు కన్యా రాశిలో ప్రవేశించే 12 రోజుల ముందు అంత్య పుష్కరాలు వస్తాయి. ప్రాచీన గ్రామాలన్నీ, రాజధాని నగరాలన్నీ నదీ తీరంలోనే వెలిశాయి. ఎందుకంటే నది లేకుండా మానవ జీవనం లేదు. నది ఒడ్డున ఉండే జీవితం గొప్పది. నేను 30 సంవత్సరాలు ఏ ఒక్కరోజు తప్పకుండా నదిలో స్నానం చేశాను. నదిలో ఈత కారణంగా వ్యాయామం అవుతుంది. అందులో ధర్మపురికి చాలా విశిష్టత ఉంది. నేను ఈ విషయాల్లో రాసిన రచనల ద్వారా ప్రసిద్ధుడనైన తరువాత చాలా పత్రికల వాళ్ళు నన్ను గోదావరి పుష్కరాల పైన వ్యాసాలు రాయమని అడిగి రాయించుకున్నారు. పుష్కరాల తర్వాత వాటిని వదిలివేయకుండా ఆ వ్యాసాలన్నీ సంకలనంగా వేయాలని నాకనిపించింది. అందులో ఈ వ్యాసాలతో పాటు కొంత ఆధ్యాత్మికత జోడించి, నదిలో స్నానం చేసేటప్పుడు ఏ మంత్రాలను చెప్పాలో వాటిని కూడా జత చేయడం వల్ల ఒక కరదీపికగా ఉంటుందని అలా ఈ పుస్తకం వేసి అందరికీ పంచిపెట్టాను. ఆ విధంగా ఆ నదీమతల్లి ఋణం తీర్చుకున్నాను. గోదావరికి గంగ అనే పేరు శాసనాల్లోనే ఉంది. కుందమాంబ ఆదిలాబాద్ జిల్లాలో వేయించిన శాసనంలో ఏ భూమినైతే బ్రాహ్మణుడికి దానం చేసిందో, దాని సరిహద్దులు చెబుతూ దక్షిణం వైపు గంగ ఉన్నదని చెప్పడం జరిగింది. అంటే గోదావరి గంగ పేరుతో ప్రసిద్ధం అని అర్థం. మా ఊరికి అటు వైపు కాశి పేట, కాశి అనే ఊర్లున్నాయి. అంటే ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు తెలంగాణలో దక్కను పీఠభూమి మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు నదీ తీరాల్లోనే ఉన్నారు. అందువల్లనే మాలాంటి ఊళ్ళు మూడు వేల సంవత్సరాల కిందటినుండే ఉన్నవని చరిత్ర చెబుతుంది. మిగతావి అవసరార్థం ఏర్పడినవి. తరువాతి కాలంలో పుష్కరాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. కానీ మాకు ఆ తేడా లేదు. నీటిలో ఉండే చేపపిల్ల, నేను సమానమే రోజూ జలక్రీడలే (నవ్వుతూ). నది వేగంగా ప్రవహిస్తున్నప్పుడు మెత్తటి ప్రాంతాల్లో ఉండే మట్టిని పైకి లేపుతుంది. అక్కడ జలాశయాలు ఏర్పడతాయి. అవి మాకు క్రీడా కేంద్రాలుగా ఉండేవి. అంత అనుబంధం గోదావరితో. అందుకే ఆ చరిత్రను రాశాను.
 
8 ప్ర :- రంగస్థలంపై మీ ప్రదర్శనలకు తొలి సోపానం ఏది? వాటి మీద మీ అభిరుచికి కారణం ఏమిటి? మీ నట ప్రస్థానం గురించి చెప్పండి.

జ :-     మా ఊరు కళలకు కాణాచి. ప్రాచీన సంప్రదాయాలన్నీ సజీవంగా నడుస్తున్న ఊరు. వేదం, వేదాంగాలు, జ్యోతిష్యం, తర్కం, మీమాంస, ఆయుర్వేదం వీటితో పాటు కళలు కూడా అక్కడే రాణించాయి. సాయంకాలం ఏదో ఒక వినోదం ఉండేది. భాగవత సప్తాహాలు, పురాణ ప్రవచనాలు, హరికథలు ఇలా దేవాలయాన్ని ఆశ్రయించి ఉన్న కళలకు సంబంధించిన కళాకారులు వచ్చేవారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరిగేవి. నటరాజ రామకృష్ణ గారు దేవాలయంలో జరిగే నృత్యాలు రికార్డు కూడా చేశారు. నాటకాల ప్రదర్శన కూడా జరిగేది. తెలంగాణలో నాటకం లేదంటారు. కానీ అప్పటికే ఉన్నాయి. బ్రాహ్మణులు మహారాష్ట్రకు వలస వెళ్లేవారు. బ్రిటిష్ వారు బొంబాయిని అభివృద్ధి చేసిన కాలంలో బ్రాహ్మణులకు అక్కడ ఇండ్లు ఉన్నాయి. ఇది 300 సంవత్సరాల క్రితం మాట. అంతకంటే ముందే పండితులంతా పూణేకు వెళ్లి పీష్వా ప్రభువుల వద్ద వారి పాండిత్యాన్ని ప్రదర్శించి జీవికకు కావలసిన డబ్బును, భూములను సంపాదించుకొని వచ్చారు. అక్కడే నాటక రంగానికి సంబంధించిన విషయాలు మన వాళ్లకు పరిచయం అయ్యాయి. 1936లో నాటకాలు చేయాలనే ఆలోచన రావడం, జాగీర్దార్లు కాబట్టి మహారాష్ట్ర నుండి ఆ వస్తువులను తీసుకొని వచ్చి నాటకాలు మొదలు పెట్టారు. అట్లా నాటకాలు చూస్తూ ఉండడం వల్ల నాటకాల పట్ల అభిరుచి ఏర్పడింది.

        ప్రధానంగా నేను హైస్కూలులో విద్యనభ్యసిస్తున్నప్పుడు విద్యార్థిగా నాటకం వేశాను. ప్రైమరీ, హైస్కూల్ దశలో నాటకం వేసే దిశగా ప్రేరేపిస్తే
 ఎంతస్థాయికి ఎదిగినా ఆ వ్యక్తి నాటకం వేస్తాడు. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాటకాలు వేశాడు. నేను హిందీ
నాటకాలతో మొదలుపెట్టాను. ‘సోనే కీ వర్షా’ అని , రామ్ కుమార్ వర్మ రాసిన నాటకంలో దశరథుని తండ్రి అజమహారాజు పాత్ర వేశాను. 11 వ తరగతిలో ‘కన్యాశుల్కం’ లో గిరీశం ఏక పాత్రాభినయం చేశాను. మా బంధువర్గంలో చాలామంది నాటకాలు వేయడం, మా పూర్వీకులు వేస్తున్నవి చూడడం, శాస్త్రీయ సంగీతం నేర్చుకొని ఉండడం, మంచి గాత్రం ఉండడం ఇవన్నీ నాటకాలు నా జీవితంలో భాగం కావడానికి కారణాలు. పౌరాణిక పద్య నాటకాలు కూడా వేశాము. నేను నలభై రాగాల్లో పద్యాలు పాడగలను. నేను హైదరాబాద్ కు వచ్చిన తరువాత పద్యాలు పాడడం చూసి ‘SICA’ ( South Indian Cultural Association ) సంస్థ వాళ్ళు పోతన భాగవతం మీద ఉపన్యసించమని అడిగారు. ఎలాగంటే కనీసం 30 పద్యాలు పాడాలి. 20 రాగాల్లో పాడాలి. ప్రతీ పద్యం ముందు రాగం పేరు చెప్పాలని కోరారు. అంటే సాహిత్య ప్రసంగాన్ని హార్మోనియం జతగా చేశాను. హిమాయత్ నగర్ బాలాజీ భవన్ లో ఇది జరిగింది. మా ఊళ్ళో”ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి” అనే పేరుతో నాటక సంస్థ థియేటర్లు లేని కాలంలో పెద్ద థియేటర్ లో నడుపబడేది. దాదాపు వేయి మంది ప్రేక్షకులు కూర్చుండే విధంగా సినిమా టాకీసు వలె నడిచేది. అటువంటి దానిలో నేను భాగస్వామిని అయ్యాను. రాముడు, కృష్ణుడు, అర్జునుడు, గయుడు, భీముడు, వీరభద్రుడు మొదలైన అనేక పాత్రల్లో దాదాపు 50 సంవత్సరాలు నాటకాలు వేశాను. ఇంకా వేస్తూనే ఉన్నాను. సాహిత్య రూపకాల్లో శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, నందితిమ్మన మొదలగు పాత్రలు వేయడం జరిగింది.
 
9 ప్ర :-  నాటకరంగానికి మీరు అందించిన సేవలు ఎటువంటివి?
జ :-   మా ఊళ్ళో నాటకాలు చూసే వాళ్ళ సంఖ్య అధికం. బ్రహ్మోత్సవాల్లో నాటకం వేయడం ఒక నియమం. “శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి” లో 88 సంవత్సరాలుగా నాటకాల ప్రదర్శన జరుగుతున్నది. నేను మూడవతరం వాడిని. నా ముందు రెండు తరాల వాళ్ళు బొంబాయి నుండి వస్తువులు తెచ్చుకునే వాళ్ళు. ఎవరి మేకప్ వాళ్లే వేసుకునేవారు. నేను కూడా చాలా కాలం అదే చేశాను. తర్వాత కాలంలో బయటి ప్రాంతాలకు వెళ్లి పోటీల్లో పాల్గొనడం, తెలుగు విశ్వవిద్యాలయ పోటీలకు, నంది పోటీలకు వెళ్లడం ప్రారంభించాము. నేను అతి బాల్యం నుండే నాటకాలు వేస్తూ వివిధ పాత్రలు ధరించాను. సాంఘికాలు, చారిత్రకాలు, పౌరాణికాలు ఇలా మూడు రకాల నాటకాలు వేశాను. వీర కాపయ, వీర పాండ్య కట్ట బ్రహ్మన, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు వంటి నాటకాలు ప్రదర్శించేవాళ్ళం. సమయాన్ని వృధా చేసుకుంటూ, వైవిధ్యం లేకున్నా, పద్యాన్ని జిలేబీ చుట్టలాగా చుడుతూ గంట నాటకాన్ని మూడు గంటలు చేయడం వంటి వాటికి నేను వ్యతిరేకిని. నా దృష్టిలో ప్రధానమైనది పద్యం, పద్యంలోని భావం. మంచి గొంతు లేకపోయినా, రాగం తెలియకపోయినా దాన్ని తగ్గించి భావానుగుణంగా పద్యం పాడితే చాలు. లేకుంటే నాటకం రక్తి కట్టదు. రసావిష్కరణ జరుగదు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుండి రాగ ప్రధానంగా వుండే నాటకాలు నాకు నచ్చేవి కావు. అదృష్టవశాత్తూ అప్పుడే సినిమాల్లో ఘంటసాల ప్రవేశం కావడం, సంక్షిప్తంగా పద్యాలు చదవడం చూసి ఆ పద్ధతిలో పద్యాలు చదవడం ప్రారంభించాము. ఆ కాలంలో నాటకం ఒక గొప్ప వార్తా మాధ్యమంగా పనిచేసేది. మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలు పదిరోజులు జరిగేవి. ” శ్రీ లక్ష్మీనరసింహ నాట్య మండలి” తరఫున 2017 లో 80 ఏళ్ల నాటకోత్సవాలను రెండురోజులు జరిపించాను. మొదటి రోజు వేరే అతనిని అధ్యక్షునిగా చేసి మూడు గంటలు ‘వీరపాండ్య కట్ట బ్రహ్మన’ నాటకం వేశాను. రెండవరోజు నా అధ్యక్షతన ‘పాండవోద్యోగ విజయం’ నాటకం వేయించాను. వృద్ధ కళాకారులను సన్మానించాము. రమణాచారి లాంటి పెద్దలను పిలిచాము. ప్రభుత్వం తరఫున లక్షా డెబ్భై వేల నగదు వచ్చింది. 80 ఏళ్ల నాటకరంగ చరిత్ర అంతా రాసి, ఫొటోలతో సహా అచ్చు వేయించాను.
         నేను ఒక ప్రయోక్తగా, ఒక దర్శకుడిగా ప్రధాన పాత్రలో ఉంటూనే చిన్న పాత్రల వాళ్ళను తయారుచేసి, నాలుగు తరాల నుండి సేవ చేస్తున్నాను. నేను చారిత్రకుణ్ణి, సాహితీవేత్తను కూడా అవడం వలన తెలంగాణ ప్రభుత్వం తయారు చేస్తున్న గెజిట్ లో తెలంగాణ నాటకరంగాన్ని గురించి రాయమంటే 50 పేజీలు రాసి ఇచ్చాను. ప్రభుత్వం మారడం వల్ల అది మరుగున పడింది. బళ్ళారి రాఘవ కన్నడంలో సుప్రసిద్ధ రంగస్థల నటుడు. అక్కడ ఆయన ఆడిటోరియం కట్టారు. తెలంగాణ నుండి బళ్ళారి రాఘవ స్వాగతోపన్యాసానికి నన్ను పిలిచారు. ఇది అరుదైన విషయం. విజయనగరంలో అయిదు నాటకాల మీద
నాటకోపన్యాసాలు చేశాను. ప్రయోగ నాటకాలకు పరీక్షకుడిగా, విశ్వ విద్యాలయాల్లో జడ్జిగా వెళ్ళాను. ఈ మధ్య పౌరాణిక నాటకాలకు మిర్యాలగూడలో పోటీలు పెడితే జడ్జిగా అయిదు రోజులున్నాను. తెలంగాణలో నాటక రంగం మీద ‘ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్’ లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో నేను ఒక మెంబరుగా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో నాటకాలకు ‘నంది’ అవార్డులు ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్రంలో నాటక రంగంలో ‘సింహ’ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించాము. శాస్త్రీయ సంగీతం నేర్చుకొనడం వల్ల పద్యాలకు నేనే వివిధ రకాల ట్యూన్ లు కట్టి పాడతాను. శాస్త్రీయ సంగీతంలో కచేరీలు చేశాను కానీ ఎక్కువ దృష్టి దానిపై పెట్టలేదు. సంగీతమైనా, నాట్యమైనా కేవలం ప్రదర్శన కోసం అభ్యాసం చేయలేము. అరగంట ప్రదర్శనకైనా రోజులు రోజులు చేయాలి. జీవితాన్ని మొత్తం దానికి కైంకర్యం చేయాలి. అందుకని పూర్తిగా నాటకాలకే నా జీవితాన్ని  వెచ్చించాను. 55 సంవత్సరాల నాటకరంగ అనుభవం నాది. ఇప్పటికి కూడా వేస్తూనే ఉన్నాను.
 

సంగనభట్ల నర్సయ్యగారి రచనలు

10 ప్ర :-  మన ప్రాంతంలో నాటకరంగానికి ఉన్న ప్రాధాన్యత ఎటువంటిది? తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం సాధ్యమవుతుందంటారా?
జ :-       నాటకం అనగానే గుంటూరు, విజయవాడ, తెనాలి, తణుకు, రాజమండ్రి ప్రాంతాలే అని ప్రజల్లో నిలిచిపోయింది. తెలంగాణాలో నాటకాలు లేవని ఒక అపప్రథ ఉంది. ఒక వాస్తవం కూడా ఉంది. ఎందుకు మనదగ్గర నాటకాలు వేయలేదని చెప్పాలంటే క్రీ.శ. 1475 కాలంలో రాచకొండ ప్రభువులు అంతమయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన 1948 వరకు మన తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం వివిధ రాజవంశాలకు చెందిన ముస్లింలే పరిపాలించారు. ఇస్లామిక్ కల్చర్ లో నాటకాలు ఆడడం, స్త్రీలు బాహాటంగా రావడం నిషేధం. తెలుగు భాషకు ఆదరణ లేకపోవడం ఇటువంటి కారణాల వల్ల వెనుకబడిన మాట వాస్తవం కానీ లేవని కాదు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా పల్లెటూళ్ళో నాటకాలు ఆడేవారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ‘యక్షగానం’ ప్రసిద్ధి. అది తప్ప వేరే నాటకాలు లేవు. నాటకంలో యక్షగానంలో వచనం కాకుండా గేయరూపం ఉంటుంది. కందుకూరి రుద్రకవి ‘సుగ్రీవ విజయం’ నుండి తెలంగాణలో యక్షగానాలు ప్రసిద్ధి. మా ఊళ్ళో శేషప్ప కవి ‘ధర్మపురి రామాయణం’ అనే యక్షగానం రాశాడు. అది మూడు రోజులు రాత్రి పూట తెల్లవార్లు నడిచేది. ఆయన మనుమడు ‘కృష్ణ శతక’ కర్త నరసింహ కవి ‘మైరావణ చరిత్ర’ అనే యక్షగానం రాశాడు.
        తెలంగాణాలో పౌర్ణమి నాడు నాటకాలు ఆడతారని కొత్త సిద్ధాంతాన్ని నేను ప్రవేశపెట్టాను. నాటకానికి ముందు నటులందరూ బయటకు వచ్చి చంద్రుడికి పూజలు చేసి, నైవేద్యం పెడతారు. మరొకటి రాత్రిపూట కాబట్టి పురుగు పుట్రా ఉన్నా పున్నమి వెన్నెలలో ఆ ఇబ్బంది ఉండదు. ఇంగ్లీషు వాళ్ళ కారణంగా ఇంగ్లీషు నాటకాలు చూసినవారు హైదరాబాద్ లో సెటిల్ అయిన కారణంగా నిజాం అనుమతితో కొన్ని ప్రాంతాల్లో నాటకాలు ఆడేవారు. అవి పౌరాణికాలు కాబట్టి ప్రభుత్వ అభ్యంతరం ఉండేది కాదు. ప్రస్తుతం నాటకరంగం క్షీణదశలోనే ఉంది. మొదట నాటకం ప్రసిద్ధంగా ఉండేది. దాన్ని పాడు చేసింది సినిమా. సినిమాను పాడు చేసింది టి వి. టీవీని పాడు చేసింది సెల్ ఫోన్. ఎంత అద్భుత నాటక ప్రదర్శన జరిగినా, ప్రముఖులతో వేయించినా బహుశా ఒక్కసారి చూడడానికి వస్తారేమో! మా కాలంలో పాఠశాలల్లో హెడ్మాస్టర్లు ప్రోత్సహించేవారు. నేను మా కళాశాలలో ప్రతీ సంవత్సరం నాటకాలు వేయించాను. ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల స్థాయిలో విద్యార్థులతో నాటకాలు వేయిస్తే నాటకం బతుకుతుంది. పూర్వ వైభవం వస్తుందని మాత్రం నేను ఆశపడడం లేదు.

11 ప్ర :- ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా సాహిత్య రూపకంగా “ప్రతాప రుద్ర విజయాన్ని” ఎన్నుకోవడానికి కారణం ఏదైనా ఉందా?
జ :- ఉంది. చాలా చక్కటి ప్రశ్న ఇది. తెలంగాణ ఏర్పడిన తరువాత మనం సంస్కృతీరంగాన, సాహిత్య రంగాన చాలా అణచి వేయబడ్డామన్న భావన మన తెలంగాణ వాళ్లకు ఉండింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇది కూడా ఒక బలమైన కారణం. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఒక సాహిత్య రూపకం ఏదైనా వేస్తే బాగుండునని ప్రభుత్వానికి  ఆలోచన వచ్చింది. అకాడెమీ నిర్వాహకులు సిధారెడ్డి గారు, అలాగే రమణాచారి గారు నన్ను పిలిచి అడిగారు. భువనవిజయం అనేక సార్లు ప్రదర్శించి ఉండడం, శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ చక్రవర్తి కాకపోవడం వల్ల అది కాకుండా తెలంగాణ చక్రవర్తుల మీద ఏదైనా నాటకాన్ని ప్రదర్శిస్తే సముచితంగా ఉంటుందన్నారు. సమయం కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. నేను బాగా ఆలోచించి కాకతీయులు, పద్మనాయకరాజులు ఇద్దరూ తెలంగాణ ప్రాంతాన్ని పాలించినప్పటికీ నేను ప్రతాపరుద్రుని సాహిత్యసభను తీసుకోవాలనుకున్నాను. చరిత్ర, నాటకం, సాహిత్యం
 తెలిసినవాడిని కావడం వల్ల ప్రతాపరుద్రుడు, ఆయన కొలువులో ఉన్న సాహితీమూర్తుల గురించి నాటకం రాశాను. ఆ వివరాలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు నాకు తెలుసు. ఆయన కొలువులో 300 మంది కవులు ఉండేవారు. ఆయన కొలువులోనే శ్రీనాథుని తాతగారు గౌరవ సత్కారాలు పొందాడు. ఈ విషయాన్ని భీమఖండంలో శ్రీనాథుడే స్వయంగా చెప్పాడు. అలాగే మల్లినాథ సూరి తాతగారు మల్లినాథుడు అక్కడ అవధానం చేసి స్వర్ణాభిషేకం పొందాడు. “శతావధాని మల్లినాథుడు వీరభద్రుని చేత సన్మానం చేయించుకున్నాడ”న్న శ్లోకం కూడా వుంది. ఆయన అవధాని కాబట్టి నేను నాటకంలో అవధాన ప్రక్రియను కూడా ప్రవేశపెట్టాను. దీన్నిబట్టి కాకతీయుల కాలం నాటికే అవధాన ప్రక్రియ ఉందని తెలుస్తుంది. ప్రతాపరుద్రుని ఆస్థానంలోని మల్లినాథుడు, విద్యానాథుడు మొదలైన కవి పండితుల పాత్రలను వేశాము. కృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగకవి లాగా హాస్య పాత్రకు ‘పేరిశాస్త్రి’ అనే పాత్ర ప్రవేశపెట్టి అతడు రాజుకు సహాధ్యాయి అయినట్టు కొంత స్వేచ్ఛా హాస్యం ఉండేటట్లు 40 పుటల నాటకం తయారు చేశాను. వాళ్ళ ప్రసిద్ధ పద్యాలను ఆ పాత్రలతో పలికించాను. ఉదాహరణకు విద్యానాథుని పాత్ర అయితే ఆయన ‘ప్రతాపరుద్రీయం’ నుండి శ్లోకాలు తీసుకొని ఆ పాత్ర చేత పలికించాను. కొన్ని పద్యాలను నేను రాశాను. అలాగ ఒక పద్య, చారిత్రక, సాహిత్య రూపకాన్ని వారం రోజుల్లో తయారుచేశాను. మిగిలిన వారం రోజుల్లో నాకు బాగా తెలిసిన, సాధ్యపడుతుందన్న వాళ్ళతో రిహార్సల్ చేయించాను. అలా ప్రపంచ మహాసభల్లో ‘ప్రతాపరుద్ర విజయం’ దిగ్విజయంగా వేశాము. ప్రతాపరుద్రుని కొలువులో ఇంత గొప్ప సాహితీ వేత్తలున్నారా? అని అందరూ ఆశ్చర్యపోయారు.
 
12 ప్ర :-  “సర్వజ్ఞ సింగభూపాలీయము” నాటక నేపథ్యం ఏమిటి?
జ :-     మనకు కాకతీయ రాజ్యం 1323లో పతనమై, తురుష్కాక్రాంతం అయింది. ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు కారణంగా మళ్లీ స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మొదట ఓరుగల్లు తరువాత మిగతా రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రతాపరుద్రుని కొలువులోని సైన్యాధిపతులు చేసుకున్న రాజ్య నిర్మాణాల్లో రాచకొండ ఒకటి. అది శత్రు దుర్భేద్యమైనది. ఆ ప్రభువులు సాహిత్యంలో గానీ, పరాక్రమంలో గానీ, ఆధ్యాత్మికతలో గానీ,
ప్రజానురంజకంగా పాలించడంలో గానీ కాకతీయుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఈ రాజవంశంలో ముగ్గురు సింగభూపాలురు ఉన్నారు. మొదటి సింగ భూపాలుడు యుద్ధాల్లో ప్రసిద్ధుడు. ఆయనే రాజ్యాన్ని విస్తరించాడు. శ్రీనాథుడు దర్శించుకున్న రాజు రెండవ సింగ భూపాలుడు. ఈయన మనుమడు మూడవ సింగభూపాలుడు పోతనను ఆదరించినవాడు. పోతనకు శ్రీనాథునికి మధ్య తాత మనుమలకున్నంత ఎడం ఉంటుంది. దీన్ని నేను చరిత్ర నిర్మాణంలో ఐనవోలు శాసనంలో నిరూపించాను. ఈ సింగభూపాలుడు కూడా ప్రతాపరుద్రుడు, కృష్ణదేవరాయల వలె కవులను ఆదరించినవాడు. సంస్కృతంలో గొప్ప పండితుడు. ‘రత్న పాంచాలిక’ అనే నాటకం రాశాడు. నేను దానిని తెలుగులోకి అనువాదం చేశాను. ఆయన ‘రసార్ణవ సుధాకరం’ అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని రాశాడు.   శార్ఙ్గదేవుని సంగీత రత్నాకరానికి వ్యాఖ్యానం కూడా రాశాడు. సంగీతం బాగా తెలిసినవాడు. వ్యాఖ్యాత మల్లినాథసూరి, గౌరన లాంటి వాళ్లంతా ఆయన కొలువును సందర్శించారు. విశ్వేశ్వరుడు ‘చమత్కార చంద్రిక’ అనే అలంకార శాస్త్ర గ్రంథం రాసి సింగభూపాలునికి (రెండవ)అంకితం ఇచ్చాడు.
       నాకొక ఆలోచన వచ్చింది. ప్రతాపరుద్రుని మీద రాసినట్టు శ్రీనాథుడు, పోతన, గౌరన, విశ్వేశ్వరుడు ఇత్యాదులందరినీ తీసుకొని సింగభూపాలుని ప్రధానంగా చేసి రూపకం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి అలాగే సాహిత్యరూప కం రాయడం జరిగింది. తెలుగునాట భోగినీ దండకం పోతన రాశాడా? అని సందేహించే స్థితి ఉండింది. నేను పోతన భోగినీ దండకానికి ప్రతిపదార్థ వ్యాఖ్యానం రాశాను. కాబట్టి పోతన యవ్వనంలో ఉండగా సింగభూపాలుని కొలువులో ఉండేవాడని భావించి పోతన, సింగన, భోగిని వీళ్ళందరిని కలిపి నాటకం రాస్తే బాగుంటుంది కదా! అని దీనికి పక్కనే మరో అయిదు అంకాల నాటకం రాశాను. సాహిత్య రూపకానికి దీన్ని జోడించి మొత్తం ఆరు అంకాలతో ‘సర్వజ్ఞ సింగ భూపాలీయం’ రాశాను. ఇది, ‘ప్రతాపరుద్ర విజయం’ రెండూ కలిపి అచ్చువేశాను. ‘సర్వజ్ఞ సింగ భూపాలీయం’ ప్రదర్శనకు నోచుకోలేదు.
సంస్కృతంలో ఒక ప్రథ ఉంది. “నాటకాంతం హి సాహిత్యం” అంటే నాటకం రాసినప్పుడే సాహిత్యానికి పరిణతి వచ్చినట్లు లెక్క. ఒక పరిణత కవి, ఒక సాహితీ వేత్త, ఒక పండితుడు తానెన్ని రచనలు చేసినా నాటకం రాయాలి. కానీ నాటకం రాయడం ‘కత్తి మీద సాము’. దీంట్లో రచయిత ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలుండదు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, కథ అంతా సంభాషణ రూపంలోనే నడవాలి. నాకు కూడా నాటకాలు రాయాలనే ఉబలాటం కలిగింది. అందుకే రెండు నాటకాలు రాశాను.
 
13 ప్ర :-  ‘ధర్మపురి’ క్షేత్ర చరిత్రను రాశారు కదా! దాని గురించిన విశేషాలు కొన్ని మా పాఠకుల కోసం చెప్పండి.
జ :-     నేను మౌలికంగా సాహిత్యవేత్తను. చరిత్ర నా అభిరుచి మాత్రమే. దానికి కారణం మా ఊరు ధర్మపురి ఒక గొప్ప విద్యా సాంస్కృతిక కేంద్రం. అంతులేని చరిత్ర కలిగినది. అది చెప్పాలంటే ఆధారాలు కావాలి. మా ఊళ్ళో దాదాపు 15 ప్రధాన దేవాలయాలు, 20 వరకు చిన్న ఆలయాలుంటాయి. అదొక దేవాలయాల నగరం. అంతకంటే పెద్దది మనకు చారిత్రకాధారమైన అనేక శాసనాలు ఉండడం. పశ్చిమ చాళుక్యుల నుండి బృహదాలయాలు నిర్మించబడ్డాయి. తరువాతి కాలంలో నరసింహ స్వామి దేవాలయాన్ని తురుష్కులు ధ్వంసం చేసి మసీదు కట్టుకున్నారు. సాహిత్యాధారాలు, శాసనాధారాలు, కావ్యస్థ ఆధారాలు, పండితులు ఆ నోటా ఈనోటా చెబుతున్న పారంపరిక కథనాలే కాక నేను పుట్టిన తర్వాత ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉండడం మూలంగా ఊరు చరిత్రను పరిశీలించడం మొదలుపెట్టాను. 37 శాసనాలు దొరికిన ఊరు. వీటితో నేను ‘ధర్మపురి చరిత్ర’ రాశాను. ఒక పక్క సాహిత్య నేపథ్యం, మరోపక్క గ్రామం అభివృద్ధి కావడానికి నదీపరంగా ఉన్న అవకాశాలేమిటి? ఇన్ని ఆలయాలు ఉండడానికి కారణం ఏమిటి? వీటిని ఎవరు కట్టించారు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొని 300 పేజీల చరిత్ర రాశాను. చేకూరి రామారావు గారు “నీవు రాస్తున్నది చరిత్రనా? క్షేత్ర మాహాత్మ్యమా?” అని అడిగారు. చరిత్ర అని చెప్పాను. వెయ్యి సంవత్సరాల క్రితమే ఒక సంస్కృత మహాకవి 3 వేల శ్లోకాలతో పరమాద్భుతంగా, పురాణ పద్ధతిలో క్షేత్ర మాహాత్మ్యాన్ని రాశాడు. నేను రాసేదేముంది? అందుకే చరిత్ర రాశాను. కొంతమందికి ఉండే సందేహాలకు కూడా నేను ఇందులో ఆధారాలు చూపించాను. ధర్మపురిలో ‘ధర్మ’ అనే పదం బౌద్ధ ధర్మం నుండి వచ్చింది. 2600 సంవత్సరాల క్రితం బుద్ధుని కాలంలో ఆయన దగ్గర శిష్యరికం చేసినవాళ్ళు, బౌద్ధమతం స్వీకరించిన వాళ్ళు మా ఊరికి చుట్టుపక్కల పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లు. పాయసి, కప్పడు, బావరి వీళ్లంతా పాళీ, ప్రాకృత భాషలు ఉన్న కాలంలో బౌద్ధ వాఙ్మయములో ఉన్నవాళ్లు ఇక్కడ నివసించారు కాబట్టి బౌద్ధం బాగా ప్రచలితమైంది. పక్కనే బుద్ధాజిపల్లి అనే గ్రామం, మావూళ్ళో బుదాం మసీదు అని ఉన్నాయి. 
         వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ధర్మపురి చరిత్ర రాశాను. ఆ కాలంలో స్త్రీలు కూడా దానధర్మాలు చేయడం విశేషం. సామాన్య వ్యక్తులు చేసిన దానం నుండి రాజుల వరకు చేసిన దానాల శాసనాలు లభించాయి. మొదట 12 శాసనాలు దొరికితే నేను మరో 25 శాసనాలను వెలికితీశాను. అట్లా 37 శాసనాలు అయినాయి. విజయ నగర సామ్రాజ్య నిర్మాణ కారకుడు విద్యారణ్యస్వామి, చరిగొండ ధర్మన్న,  శేషప్ప కవి  వంటి వారు ఈ గ్రామానికి చెందినవాళ్ళు. హరిహర బుక్కరాయలు మా ఊరి పక్కన ‘మంగళ’ అనే గ్రామానికి చెందినవారు. ధర్మపురికి చెందిన పురాణం నరసింహభట్టు సదాశివరాయల చేత పల్లకీ మోయించుకున్నాడు. అల్లసాని తర్వాత ఆయనదే ఆ ఘనత. అప్పటినుండి ఆయన చతుర్వేదుల నరసింహభట్టు అయినాడు. మరో విశేషం వేములవాడ అరికేసరి చక్రవర్తి పంప మహాకవికి ధారాదత్తం చేసిన అగ్రహారం ఇదే ధర్మపురి. జినవల్లభుని కురిక్యాల శాసనంలో ఈ విషయ ప్రస్తావన ఉంది.
         ఇట్లా తవ్వినకొద్దీ అంతులేని చరిత్ర దొరికింది. అందుకే మొదటి ముద్రణలో రాసిన చరిత్రను రెండవ ముద్రణలో సంస్కరణ చేస్తూ భాషను కూడా చేర్చాను. మొత్తం ఇప్పటికి ఆ పుస్తకం 5 ముద్రణలు పొందడం గొప్ప విషయం. ఈ పుస్తకాన్ని చూసిన ఎండోమెంట్ కమిషనర్ నందివెలుగు ముక్తేశ్వరరావు గారు మహదానంద పడిపోయి వంద పుస్తకాలు కొని ఉమ్మడి రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు పంపి మీరందరూ ఈ విధంగా దేవాలయాల చరిత్ర రాయాలని సర్క్యులర్ వేశారు. అంత పాపులర్ అయింది.

14 ప్ర :-  అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన మీరు వెలువరించిన రచనలేవి?

జ :-     నేను చాలా రంగాల్లో కృషి చేసిన మాట వాస్తవమే. విశేషంగా ప్రాచీన సాహిత్యంలో చేశాను. ఛందశ్శాస్త్రం, అలంకార శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, నాటకరంగం, శాసనాలు, ప్రాచీన చరిత్ర, వ్యక్తుల జీవితాలకు సంబంధించిన వ్యాసాలు రాశాను. నేను ఇప్పటివరకు 550 పై చిలుకు ఉపన్యాసాలు చేశాను. వాటికే పరిమితం కాకుండా పైన చెప్పిన అన్ని రంగాల్లో దాదాపు 20 పుస్తకాలు రాశాను. ధర్మపురి చరిత్ర (అయిదు ముద్రణలు), తెలుగులో ఛందో వైవిధ్యం, పోతన కృత భోగినీ దండక వ్యాఖ్య, పింగళి సూరన కృత కృష్ణ దండక వ్యాఖ్య, తెలుగులో దేశి ఛందస్సు, పీవీ నరసింహారావు జీవితం-సాహిత్యం, శ్రీకృష్ణదేవరాయలు (అనువాదం), తెలుగులో చాటు కవిత్వం, దివ్వెనేత్రాలు (పద్యకవిత్వం), సమాంతరరేఖలు (వచన కవిత్వం), చిత్రభారతం, బసవకళ్యాణం, రంగనాథ రామాయణం  (సంపాదకత్వాలు) శ్రీలక్ష్మీ నరసింహ నాట్యమండలి చరిత్ర, ఛందోరస స్వరూపాలు, చతుశ్శతి, తెలివాహ గోదావరి, చిన్న వ్యాకరణ దీపం, ప్రతాపరుద్ర విజయం, సర్వజ్ఞ సింగ భూపాలీయం, పూత గోదావరి పుష్కర విశిష్టత, కోటిలింగాలు, భాగవత దశమ స్కంధ ఉత్తరార్థ వ్యాఖ్య (తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ), తెలంగాణ మాండలిక భాషా వ్యాకరణం ఇవన్నీ నేను రాసిన పుస్తకాలు.


 15 ప్ర :-  చరిగొండ ధర్మన్న చిత్ర భారతాన్ని వెలికి తీసుకురావడానికి ప్రేరణ ఎవరు? దానిలోని విశేషాలను చెప్పండి.
జ :-      నేను ఛందశ్శాస్త్రంలో పరిశోధన చేస్తున్న సమయంలో తంజావూరు, మద్రాసు, తిరుపతి, విశాఖపట్నం, పూణె మొదలైన ప్రాంతాల లైబ్రరీలకు తిరిగాను. చెన్నైకి వెళ్ళినపుడు రావూరి దొరస్వామి శర్మ అని ఒక పెద్దాయన ఉండేవారు. నేను ఆయన దగ్గరకు వెళ్తుండేవాడిని. ఆయన నాకు ఆరుద్రను పరిచయం చేయించాడు. నేను చేస్తున్న పరిశోధనను చూసి అరుద్రకు నామీద అభిమానం ఏర్పడింది. ఒకరోజు మాటల్లో ఆయన “మీవూరి వాడే ఒకరు చిత్రభారతం పేరుతో రాశాడు చూశావా”? అని అడిగాడు. నాకు తెలియదన్నాను. విచిత్రం ఏమిటంటే కందుకూరి వీరేశలింగం పంతులు ఎనభై, తొంభై ఏళ్ల క్రితం ఆ పుస్తకాన్ని అచ్చువేశాడు. దాని గురించి వేట మొదలుపెట్టాను. ‘చిత్రభారతం’ దొరికాక చదివితే చిత్రంగా చరిగొండ ధర్మన్న అని మా ఊరివాడు రాసిందే అది. ఆయన ధర్మపురి వాడే అని చెప్పడానికి అందులో ఎన్నో ఆధారాలున్నాయి. ఆయన పోతనకు సమకాలికుడని, స్థలం ధర్మపురి అని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. పరిశోధన చేసి ఏడాదిన్నరలోపు పూర్తి చేసి దానిపై ప్రసంగాలు చేసి, తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు అడిగితే ఈ పుస్తకాన్ని పరిష్కరించి ఇవ్వగా వాళ్ళు అచ్చు వేశారు. చరిగొండ మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామం. అక్కడినుండి ఇక్కడకు వలస వచ్చాడు ఆయన. వలస వచ్చిన వాళ్ళందరికీ వారి గ్రామాల పేర్లున్నట్టే ఆయనకు చరిగొండ ఇంటిపేరు అయింది.
          ఇంకో విశేషం ఏంటంటే ఈ పుస్తకాన్ని అంకితం పుచ్చుకున్న ఎనుముల పెదనామాత్యుడు కూడా ధర్మపురి వాడే. ఇద్దరూ బాల్య స్నేహితులు. 
పెదనామాత్యుడు తన కళ్ళముందు నరసింహస్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసి హింసాకాండను సృష్టించడం చూసి “ఈ దేవాలయాన్ని పాడు చేసిన వాడిని చంపి తీరుతాన”ని ప్రతిజ్ఞ చేశాడు. బ్రాహ్మణుడై నప్పటికీ యుద్ధవిద్యలు నేర్చి సైన్యాధిపతియై ఆ శపథాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ విషయం చిత్రభారతంలో ఉంది. పెదనామాత్యుడు తదనంతరం ఓరుగల్లు షితాబ్ ఖాన్ రాజు దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు. అప్పుడే ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్నాడు. ఆ విధంగా ప్రాచీనసాహిత్యం పట్ల అభిమానం, దానికి ఆరుద్ర వంటి వారు ప్రేరణ కావడంతో ఈ పుస్తకాన్ని పరిష్కరించాను. దీన్ని నేను  ఒక ప్రాచీన మహా కావ్యాన్ని తెలంగాణ సరస్వతి మెడలో వేసిన పూలమాలగా భావిస్తాను. చరిగొండ ధర్మన్న ప్రబంధ కవులకంటే ముందు కాలం వాడు. ప్రబంధాలు ఎట్లా ఉండాలి? అనడానికి చిత్రభారతం ఒక మోడల్ గా ఉంటుంది. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, కృష్ణదేవరాయలు ఎన్నో పద్యాలను దీని నుండి తీసుకొని రాసుకున్నారు. నందితిమ్మన ‘పారిజాతాపహరణం’ లో సత్యభామ కథను రాయడానికి ముందే ధర్మన్న రాశాడు. తెలంగాణ మొత్తానికి మనకు తెలిసినంతవరకు , రికార్డులో ఉన్నంతవరకు మొదటి శతావధాని ధర్మన్న. అత్యంత మనోహరమైన కవిత్వం ఆయనది. దానికి ఎవరితోనూ పోలిక లేదు. మనుచరిత్ర, పారిజాతాపహరణం కలిపిన దానికంటే చిత్రభారతం పెద్దది.1300 పై చిలుకు పద్యాలు రాశాడు. అంత గొప్పకవి చరిత్ర రాయడం వల్ల ఒక సాహితీ వేత్తగా నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాను. ఆయన రచనలోని గొప్ప పద్యాలను తీసుకొని అవధాన ప్రక్రియలాగా ప్రశ్న అడుగుతుంటే చెప్పినట్లు ఆ పద్యాలను వివరిస్తూ పుస్తకం రాయాలని ఉంది.
 
16 ప్ర :-  మీ కోరిక నెరవేరాలని ఆశిస్తాం. అయితే ‘తెలుగులో చాటు కవిత్వం’ రాశారు కదా! అటువంటి ఆశు కవిత్వం ఇప్పటికీ ఆదరణ ఉందంటారా?
జ :-      ‘తెలుగులో చాటు కవిత్వం’ నా బాల్య రచన. అప్పుడెప్పుడో దేవులపల్లి రామానుజరావు గారు సాహిత్య అకాడెమీ పక్షాన ఇచ్చిన ప్రకటన మేరకు రాశాను. తర్వాత దాన్ని మళ్లీ సవరించుకొని అచ్చు వేశాను. మాకు హెడ్మాస్టర్ గా పని చేసిన వ్యక్తి వేమూరి లక్ష్మీ నరహరి శర్మ. ఆయన ఆ పుస్తకాన్ని చూసి “ఇంత మంచి పుస్తకాన్ని ఇన్నిరోజులు ఎందుకు దాచి పెట్టావ” ని అడిగారు. మనకు వేటూరి ప్రభాకరశాస్త్రి ‘చాటుపద్య మణిమంజరి’, దీపాల పిచ్చయ్య శాస్త్రి ‘చాటు పద్య రత్నాకరం’ పేరుతో చాటువులు సేకరించారు. శ్రీరంగాచార్య వంటివాళ్ళు కూడా చాటువులను సేకరించి మనకందించారు. చాటువులన్నీ కూడా ఆనాటి చరిత్రను, ఆ మహాకవుల జీవిత చరిత్రలను, వాళ్ళ పాండిత్య ప్రతిభలను చెప్తాయి. ఇవి నిజానికి పుస్తకాలలోని పద్యాలు కావు. జీవితంలో ఎప్పుడో జరిగిన సంఘటన ఆధారంగా రాసినవి. చాటుపద్యం వెనుక చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది.
వేములవాడ భీమకవి సుప్రసిద్ధ కవి అయినా ఆయన రాసిన 30 చాటు పద్యాల ద్వారా ఆయనను అంచనా కడుతున్నాం. అంతేకానీ ఆయన కావ్యాలేవీ లేవు. అట్లా మనకు వెయ్యేళ్ళ సాహిత్యం ఉంది. విశేషంగా కృష్ణ దేవరాయల అష్టదిగ్గజాల్లో సభాసంబంధమైన చర్చలు అన్నీ చాటురూపంలో ఉన్నాయి. వీటిని అధ్యయనం చేయాలి. వీటి వెనుక చమత్కారం ఉంటుంది. అనేకులకు ఈ పద్యాలు కంఠస్థంగా ఉంటాయి. కావ్యస్థం కాని ఈ చాటు పద్యం నిలుస్తుందా అంటే నిలుస్తుంది. మిగతావి నిలువవు.
 
17 ప్ర :- మీకు లభించిన అనేక పురస్కారాల్లో అమితంగా మిమ్మల్ని ఆనందింప చేసింది ఏది?
జ :- సహజంగా సాహితీవేత్తలకు పురస్కారాలు వస్తూనే  ఉంటాయి. నా స్వభావానికవి రుచించేవి కావు. పురస్కారాల కోసం పైరవీలు నడుస్తున్న రోజులు. ఏ వ్యక్తి పేరుమీద ఇస్తున్నారో, ఏ సంస్థ పేరు మీద ఇస్తున్నారో దానిమీద ఏ కృషి చేయనివాళ్లకు ఇస్తున్నారు. ఒకసారి నాకు గుంటూరు శేషేంద్రశర్మ గారి పురస్కారం ఇస్తామన్నప్పుడు ఆయన గురించి ఏమీ చేయకుండా తీసుకోనన్నాను. “ఆయన మీద ఒక రెండు గంటలు ప్రసంగం చేస్తాను తరువాత ఇవ్వండి” అని ఆ తర్వాతే తీసుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్ అవార్డు ఇచ్చింది. దానికి ఒక చమత్కార విషయం ఉన్నది. గణపతిదేవ చక్రవర్తి పాలనా కాలంలో కరీంనగర్ జిల్లాలో చామనపల్లి అనే ఊళ్ళో గణపతి దేవుడు నిర్మించిన చెరువులకు సంబంధించిన కాలువల్లో ఒక కాలువ వీళ్ళ ఊరు వచ్చేవరకు, నీళ్లు ఆగిపోతున్నాయి. పైన గండి పెడుతున్నారు. బ్రాహ్మణులంతా కలిసి గణపతిదేవుని దృష్టికి తీసుకువచ్చారు. చక్రవర్తి దాని నిజానిజాలు తెలుసుకునే విధంగా ‘మాచిరాజు’ అనే పరిశీలక అధికారిని పంపించాడు. ఆయన దాదాపు పది గ్రామాల నుండి కులానికి ఇద్దరు చొప్పున వ్యక్తులను తీసుకొని కాలువ పక్కనే కూర్చుండి అది నిజమేనని నిర్ధారిస్తాడు. అంతేకాదు చక్రవర్తి పక్షాన “ఇలాంటి అన్యాయాలు ఇకముందు జరుగకూడద”ని రాగి రేకులపై సంస్కృతంలో శాసనం వేయించాడు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నేను  సంస్కృత శాసనాలు పరిశీలిస్తున్నప్పుడు చూసి ఆశ్చర్య పోయాను. శాసనాలకు ఉండవలసిన లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి. అంతేకాదు శాసనం మొత్తం సంస్కృతంలో ఉంటే కాలువ హద్దులు ప్రజలకు అర్థమయ్యేవిధంగా తెలుగులో ఉన్నాయి. దీన్నొక పెద్ద వ్యాసంగా రాసి, గణపతి దేవ చక్రవర్తి నాటి కాలంలో జల వనరులకు సంబంధించి ఏమేం కార్యక్రమాలు చేశారో చెప్తూ దాంట్లో చిట్టచివరగా “కాకతీయులు ఒక చెరువు తవ్విస్తే ఆ చెరువులోని చిట్ట చివరి నీటిబొట్టు కూడా చివరి పొలానికి అందేటట్లు చర్యలు తీసుకున్నారు”. అనే పేరాతో ముగించాను. ఆనాటి తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలు అది చూసి మెచ్చుకొని “ఈయనకు ఫ్రీలాన్స్ జర్నలిస్టులకిచ్చే అవార్డు ఇవ్వమన్నార”ట. అట్లా మిషన్ కాకతీయ అవార్డు వచ్చింది. అది నాకు ఎంతో ఇష్టమైనది. ఈ వ్యాసం ‘తెలంగాణ’ మాస పత్రికలో వచ్చింది. అందులో నేను సీరియల్ గా కోటిలింగాల, కొండాపూర్, ధూళికట్ట, కొలనుపాక మొదలైన నగరాలను గురించి వాటి చరిత్రను ‘తెలంగాణ ప్రాచీన నగరాలు’ అనే పేరుతో రాశాను. ఛందశ్శాస్త్రంలో కృషి చేసినందుకు తెలుగు విశ్వవిద్యాలయం అబ్బూరి రామకృష్ణారావు మెమోరియల్ ‘ధర్మనిధి’ అవార్డు ఇచ్చింది. ‘గ్రామీణ కళాజ్యోతి’ పేరుతో నాటకారంగంలో పురస్కారం, శాసనాలలో కృషి చేసినందుకు బి.ఎన్ శాస్త్రి పురస్కారం ఇట్లా గ్రంథాలకు వచ్చినవి, శాస్త్రాల్లో కృషి చేసినవి ఎన్నో ఉన్నాయి.

 18 ప్ర :-  ఇటీవలే బాలవ్యాకరణ రీతిలో తెలంగాణ వ్యాకరణం రాశారు. దాని గురించి చెప్పండి.
జ :-       నేను బాల్యంలో ఓరియంటల్ కాలేజీ విద్యార్థిని కావడం వలన గురువుల నుండి వ్యాకరణం నేర్చుకున్నాను. అంతకు ముందే సంస్కృత వ్యాకరణం చదువుకున్న వాడిని. అందువలన ఆ శాస్త్రంలో పట్టు సాధించాను. పాఠాలు చెప్పడం, బాల ప్రౌఢ వ్యాకరణాల విశేషాలు తెలిసివుండడం మూలంగా ఒక భాషాప్రియుడిగా వ్యాకరణ రచన చేశాను. ఏ భాష మనకు ఉపయోగంలో  ఉన్నదో ఆ భాష లక్షణాలను, మిగతా ప్రాంత భాషలతో భిన్నత్వాన్ని, మాండలికాల భిన్నత్వాన్ని పరిశీలించే ఒక పద్ధతి ముందు నుండే ఉన్నది. మా ఊళ్ళో ఉన్నప్పుడే నాకు ఆంధ్ర వ్యాకరణ విశారద అని పేరు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో తెలుగు, ఉస్మానియా, కాకతీయ, అంబేద్కర్, కర్ణాటక హంపి విశ్వ విద్యాలయాలు అడిగితే పాఠాలు రాసిచ్చాను. రామోజీ ఫిల్మ్ సిటీలో డిక్షనరీ ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా తెలుగుకు సంక్షిప్త వ్యాకరణం తయారు చేస్తే నిఘంటువులో అనుబంధంగా వేస్తామన్నారు. మధ్యలో కరోనా వచ్చి ఆగిపోయింది. ఇంగ్లీష్ – తెలుగు, తెలుగు – తెలుగు, తెలుగు – ఇంగ్లీష్ ఇలా మూడు డిక్షనరీలు తయారు చేయాలనుకున్నాం. అది రామోజీరావు గారి కల. ఇంగ్లీష్ – తెలుగు ఒక్కటే తయారైంది. నేను కన్సల్టెంట్ గా రోజూ వెళ్లి పదాలు తయారుచేసి అర్థాలు రాసేవాడిని. ఆ ప్రాజెక్టులో భాగంగా పిల్లలకు డిక్షనరీతో పాటు వ్యాకరణం రాయడం జరిగింది. దీనిని తెలంగాణ విశ్వ విద్యాలయం ముద్రించింది. తెలంగాణ ఏర్పడడానికి ముందు భాషా ప్రాతిపదికన కూడా మన దగ్గర ఉన్న వైలక్షణ్యాన్ని కవులు, పండితులు చెబుతూ వచ్చారు. మనది మాండలిక భాష అయితే అయి ఉండవచ్చు కానీ మిగతా మాండలికాల కంటే విలక్షణమైనది. కాబట్టి దీన్ని ఇతరులకు పరిచయం చేయాలంటే అందరిలో నేను ఒకణ్ణి కాకుండా ఒక వ్యాకరణ శాస్త్రమే రాయాలనిపించింది. శాస్త్రబద్ధంగా, సాంప్రదాయిక వ్యాకరణం ఎట్లా ఉండాలో అట్లానే తయారు చేయాలనుకున్నా. చిన్నయసూరి సూత్ర పద్ధతిలో తెలంగాణ పదాలను సాహిత్యంలోనూ, యావజ్జన వ్యవహారంలో ఉన్నవి తీసుకొని సంక్షిప్తత, విశ్వజనీనతలు ఉండేలాగా మూడువందల సూత్రాలతో ఈ వ్యాకరణాన్ని తయారుచేశాను. అది డిటిపి అవుతోంది. త్వరలో దాన్ని వెలుగులోకి తీసుకువస్తాను. కొంత ఆలస్యమైనా ప్రామాణికమైన తెలంగాణ భాష అందరికీ పరిచయం కావడం కోసం చేస్తున్న బృహత్ ప్రయత్నం.
 
19 ప్ర :-  ఒక శాసన పరిశోధకులుగా మీరు వెలికి తీసిన శాసనాలు ఏవి?
జ :-     చరిత్రకు సంబంధించిన ఆకరాలు అనేక రకాలుగా మనకు దొరుకుతాయి. అన్నింటిలోకి శ్రేష్ఠమైనది శాసనం. ఎందుకంటే ఒక వస్తువు దొరికితే ఆ వ్యక్తి గురించి తెలుస్తుంది.  సాహిత్యంలో దొరికిన వాటిలో కొన్ని అభూత కల్పనలు ఉండొచ్చు. పురాణాల్లో విశేషాలున్నప్పటికీ కొన్ని నమ్మలేనివి ఉంటాయి. పురా వస్తువులు దొరికితే వాటి పూర్తి వివరాలు తెలుసుకోవడం కష్టం. శాసనాలు అయితే ఆనాటి చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఇంకో విశేషం లిపి కూడా ఆరోజుల్లో ఎట్లా ఉండేదో తెలుస్తుంది. నేనొక చరిత్ర పరిశోధకుడిగా, చరిత్ర పాఠకుడిగా, చరిత్ర రచయితగా ఏదైనా తవ్వకాల్లో బంగారు నాణాల బిందె దొరికిన దానికంటే ఒక శాసనం దొరికితే ఎక్కువ సంతోషిస్తాను (నవ్వుతూ). మా ఊళ్ళో అంతకుముందున్న 12 శాసనాలే కాక ఇంకా 25 వెలికితీసి మొత్తం 37 శాసనాలను వాటి అర్థాలతో సహా పుస్తకంలో రాశాను. ‘కోటిలింగాల’లో బుద్ధుని బోధనలను వివరిస్తూ రెండు వేల సంవత్సరాల కిందటి శాసనాలు పెద్ద పెద్ద బండరాళ్ల పైన ఉన్నాయి. నా ఊహ ఏంటంటే ఆ కాలంలో పెద్ద బౌద్ధ స్తూపం ఉండి ఉంటుంది. ప్రదక్షిణం చేస్తూ  వాటిని చదువుకునే విధంగా చెక్కి ఉంటారనిపించింది. తెలంగాణలో బౌద్ధం మీద ఒక వ్యాసం రాశాను. దానికి ఈ శాసనాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గోనబుద్ధారెడ్డి గురించి దొరికిన మూడే మూడు శాసనాల ఆధారంగా మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆయన జీవితాన్ని గురించి రాశాడు. తర్వాత నాకు ఇంకా పదకొండు శాసనాలు దొరికాయి. అందులో ఒక్కటి గోన బుద్ధారెడ్డి వాళ్ళ నాన్న గోన గన్నారెడ్డిది. అదొక్కటి విడిచిపెట్టి మిగతా వాటి ఆధారంగా సోమశేఖర శర్మ అంతకుముందు రాసిన బుద్ధారెడ్డి వంశవృక్షాన్ని సరి చేశాను. అట్లాగే రెండవ సర్వజ్ఞ సింగ భూపాలుని వద్దకు శ్రీనాథుడు వచ్చాడని, ఆయన మనుమడు మూడవ సింగభూపాలుని కొలువులో పోతన ఉన్నాడని, అందువల్ల శ్రీనాథ పోతనలకు చాలా ఎడం ఉందని నిర్ధారించి, ఐనవోలు శాసనంతో కొత్త ఆవిష్కరణ చేశాను.
        గోన గన్నారెడ్డి తమ్ముడు విఠల రెడ్డి. విఠల రెడ్డి కొడుకు బుద్ధారెడ్డి. తమ్ముని కొడుకును పెంచుకున్నాడు. ఈ కారణంగా శాసనాల్లో బుద్ధారెడ్డి తండ్రి గన్నారెడ్డి అని, పుస్తకంలో విఠల నాథుడని పేర్కొంటారు. ఇదే విధంగా ఒక శాసనంలో గణపతి దేవ చక్రవర్తి పెదనాన్న పేరు రుద్రుడు. తండ్రి మహదేవుడు. ఇక్కడ కూడా పెదనాన్న పెంచుకోవడం వల్ల ఒకచోట తండ్రి రుద్రుడంటే మరోచోట మహదేవుడు అన్నట్టు ఉంటుంది. దీని ఆధారంగా 7, 8 వందల సంవత్సరాల క్రితమే తమ్ముని కొడుకును పెంచుకోవడమనే సంప్రదాయాన్ని వెలికితీసి, నిర్ధారించడం జరిగింది. అయితే ఇవి చూడడానికి చిన్నవిగానే అనిపించినా లోతుల్లో పరిశోధన చేయవలసి వస్తుంది. బిర్లా ఫౌండేషన్ వాళ్ళు కరోనా కాలంలో హంపి విజయనగర రాజుల మీద ఉపన్యాసాలు చెప్పుమని అడిగారు. నేను 18 వారాలు రోజుకు రెండు గంటల చొప్పున ఉపన్యసించాను. ఆ సమయంలో విజయనగర కాలం నాటి శాసనాలను కూడా పరిశీలించాను. నందితిమ్మనకు ముక్కుతిమ్మన పేరు ఉందని శాసనాల ద్వారా నిరూపించాను.
 
20 ప్ర :-  మీరు చేసిన అనువాద రచనల గురించి చెప్పండి.
జ :-      అనువాదరంగం ఎలాంటిదంటే మూల గ్రంథానికి మాత్రమే ప్రసిద్ధి ఉంటుంది. ఎంత గొప్పగా లక్ష్య గ్రంథంగా అనువదించినా అనువాదకునికి పేరు రాదు. ఇంగ్లీషులో ఉన్న శ్రీకృష్ణ దేవరాయల పుస్తకాన్ని అనువదించుమని కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు అడిగారు. అనువాదం చేశాక చూసుకుంటే ఇది తెలుగు భాషేనా? అనిపించింది. మూల గ్రంథం పక్కకు పెట్టి నా శైలిలో తిరిగి రాశాను. ఆముక్తమాల్యదలోని పద్యాల సౌందర్యం ఇంగ్లీషు భాషలో ఎట్లా వస్తుంది? అందుకే అందులో లేకపోయినా కృష్ణదేవరాయల కవితా సౌందర్యం తెలిసిన వాడిగా మూలంలో లేకున్నా ‘ఆముక్త’ పద్యాలను ఇందులో రాశాను. మూల గ్రంథంలో లేకుండా ఒక్క వాక్యం ఎక్కువ రాయకూడదని సాహిత్య అకాడెమీ నియమం. కానీ దీనికి వాళ్ళు అనుమతిచ్చారు. అందువల్ల మంచి పుస్తకం వచ్చింది. హిందీ నుండి కూడా కొన్ని అనువాదాలు చేశాను. తెలుగు సాహిత్యం కంటే ముందు హిందీ, ఉర్దూ సాహిత్యాలు చదువుకున్నాను. ఏడవ తరగతిలో చదువుకుంటున్నప్పుడు డాటర్స్ మర్డరర్ అనే డిటెక్టివ్ నవల రాశాను. ఎనిమిదవ తరగతి నుండే హిందీ సాహిత్యం, దానితో పాటే ఉర్దూ సాహిత్యం చదివాను. పదవతరగతిలో ఉన్నప్పుడే హిందీ పాఠశాలలో ఏదో కారణంగా హిందీ ఉపాధ్యాయుడు వెళ్లిపోవడంతో పాఠాలు కూడా చెప్పాను. పండిట్ జాకీర్ హుస్సేన్ రాసిన ‘అబ్బూఖాన్ కీ బక్రీ’ కథను తెలుగులోకి అనువదించాను. స్వాతంత్ర్యానికి సంబంధించిన ఆ కథ చాలా పాపులర్ అయింది. సర్వజ్ఞ సింగభూపాలుని “రత్నపాంచాలిక” సంస్కృత నాటకాన్ని కూడా తెలుగులో అనువాదం చేశాను. సంస్కృతంలో ఉన్న శాసనాలను, సంస్కృత కవితలను కూడా అనువాదం చేశాను. ఒకసారి బహుభాషా సమ్మేళనంలో సంస్కృత భాషలోని కవితలను తెలుగులోకి అనువదించి చదివాను. అనువాదం కూడా లక్ష్యభాషలో మాత్రమే చేశాను.
 
21 ప్ర :-  సంగీతం, సాహిత్యం, నాటకం, పరిశోధన పెనవేసుకున్న మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఆధ్యాత్మిక రంగంలోనూ చేసిన కృషి ఏమిటి?
జ :-     నేను పవిత్ర తీర్థక్షేత్రంలో పుట్టడం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, చిన్నప్పటినుండీ వేదాధ్యయనం, సాంప్రదాయ కుటుంబ నేపథ్యం కారణంగా బాల్యం నుండే భక్తి ఎక్కువ. ధర్మపురిలో అనేక వైదిక సాంప్రదాయాలు, పండుగలు ఉన్నాయి. బతుకమ్మ కూడా అక్కడిదే. సత్యవతి అంటారామెను. ఆమె పేరు మీద ఒక దేవాలయం ఉంది. నేను సామాన్యుల నుండి శిష్టుల పండుగల వరకు అధ్యయనం చేసి వాటి విశేషాలను తెలుపుతూ వ్యాసాలు రాశాను. మన హిందూధర్మానికి రామాయణం, భారతం, భాగవతం మూడూ ప్రధానమైన గ్రంథాలని తెలిసిందే. వాటి మీద నేను అనేక
ఉపన్యాసాలు ఇచ్చాను. సంస్కృత భాగవత సప్తాహాలు చేశాను. దూరదర్శన్ వివిధ ఛానళ్లలో ప్రసంగించాను. తిరుమల, తిరుచానూరు, యాదగిరిగుట్ట మొదలగు దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యానం చేశాను. ‘జయ జయ శంకర’ అనే ఛానల్ వాళ్ళు అడిగితే సంస్కృత నరసింహ పురాణం 60 ఎపిసోళ్లు చెప్పాను. అందులో 30 ప్రవచనాలు యూట్యూబ్ లో ఉన్నాయి. వివిధ పవిత్ర పండుగ రోజుల్లో దేవాలయాల వారు అడిగినప్పుడు పురాణాల్లో ఉన్నదానికి ఒక నవ్యత్వాన్ని జోడించి, ఆధునిక కాలానికి తగినట్లుగా వ్యాఖ్యానాలు చెప్పేవాడిని. ఆధ్యాత్మిక రంగంలో పుస్తకాలు రాసిన దానికంటే ఉపన్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. ‘సనాతన ధర్మం’ అనే పేరుతో పుస్తకం రాశాను. అది అచ్చు కాలేదు. వ్యాసుని ‘నరసింహ పురాణం’ మూలం అర్థం రాసి అచ్చు వేయాలనే ఆలోచన ఉంది. ఆధ్యాత్మిక రంగంలో అనేక పుస్తకాలు వెలువడుతుండడంతో మనం చెప్పేదేముంది? అనే నిర్లిప్తత వల్ల రచనా వ్యాసంగం పెట్టుకోకుండా ఉపన్యాసాలు ఇస్తూ వస్తున్నాను.

22 ప్ర:-  నేటి సాహిత్యరంగంపై మీ అభిప్రాయం ఏమిటి?
రచనా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇప్పటి రచయితలకు మీ అనుభవపూర్వక సూచనలు ఇవ్వండి.
జ :-    సాహిత్య సృష్టి జరుగుతోంది. కానీ నాణ్యత లేదు. తెలుగు భాషను ప్రాథమిక దశ నుండి చదువుకున్న వాళ్లే సాహిత్య సృష్టి చేయగలరు. పరభాషా ప్రభావం వల్ల ఇంతకంటే అద్భుతంగా తెలుగు సాహిత్యం వికసిస్తుందని ఆశపడే పరిస్థితి లేదు. ఇంగ్లీషు భాషా ప్రభావం విస్తారమై మన మాటల్లో కూడా అనేక ఆంగ్ల భాషా పదాలు చొరబడి ఇది తెలుగేనా? అనే పరిస్థితిలో ఉన్నాం. అటువంటి భాష సాహిత్యానికి, కవిత్వానికి పనికొచ్చేది కాదు. కొన్ని అనివార్యమైన పదాలు వాడడం వేరు. వ్యవహారంలో మాట్లాడినట్లు రాతల్లో రాయలేము కదా! కాబట్టి భాషను శుద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. తాము రాసిన దానిని భాష తెలిసినవారికి చూపించి వాటిని సరిదిద్దుకోవాలి. ఇది సరియైనదా, కాదా అని తనకు తాను చెప్పుకోగలిగేలా ఉండాలి. శ్రేష్ఠమైన సాహిత్యం రావాలి. దానికి పూర్వ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. ” అనభ్యాసే విషం విద్యా” అని హితోపదేశంలో ఒక శ్లోకంలో ఉన్నది. దానికి సంస్కృతంలో పేరడీగా ‘అనధ్యయనే విషయం మిథ్య’ అన్నాను నేను. పూర్వకాలపు సాహిత్యకారుల సాహిత్యం అధ్యయనం చేయకుండా, పరిశీలించకుండా, అనుశీలించకుండా, అనుభవరాహిత్యంగా సాహిత్య సృష్టి చేయాలనుకుంటే అది వికారంగా తయారవుతుంది. అందువల్ల భావితరాన్ని నేను కోరేదేమిటంటే బాగా చదవండి. చక్కటి భాషను ఉపయోగించండి. సృజన సమాజానుకూలంగా చేయండి. ఏ ప్రక్రియలోనైనా నాణ్యత అవసరం. ఇది నా సలహా మాత్రమే.
 
        ధన్యవాదాలు సార్, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఎంతో ఓరిమితో మీ జీవిత విశేషాలను తెలిపినం

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ ఉద్యమ కవి కాళోజీ

by Dr. Aruna Parandhamulu September 30, 2024
written by Dr. Aruna Parandhamulu

ప్రపంచంలోని బాధలలో కన్నీళ్ళను చూసి కవిగా కాళోజీ హృదయం స్రవించి ఆ హృదయ ప్రకంపనలకు అక్షర రూపం కలిస్తూ నూతన పోకడలతో కవిత రూపంలో …
“అవనిపై జరిగేటి అవకతవకల చూసి
ఎందుకో నా హృదిన ఇన్ని ఆవేదనలు…?
పరుల కష్టము చూసి కరిగిపోను గుండెను
మాయ మోసం చూసి మండి పోను ఒళ్ళు
పతిత మానవుని జూసి చితికి పోవు మనస్సు
ఎందుకో ఇన్ని ఆవేశం నా హృదిని ఇన్ని ఆవేదనలు?….” అంటూ
ఆత్మశ్రయ ధోరణితో వ్యక్తపరిచాడు .

“ఉత్తమాటలు కట్టిపెట్టి
పెత్తనాలకు దేవులాడక
చిత్తశుద్ధిగా చేయబూనిన
చేతలెల్ల ఘటించినట్లె “

అంటూ మనసులోని ఆవేదనను వ్యక్తం చేస్తూ , ఐక్యతను కోరుకుంటూ కాళోజీ కవితలు రాయటం జరిగింది.
వరంగల్‌ పట్టణానికి చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గురించి తెలియని వ్యక్తి తెలుగు నేలపై ఉండకపోవచ్చు. సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలకే కాదు, సామాన్య వ్యక్తికి కూడా ఆయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమం పుట్టకముందు నుంచే ఆయన తెలంగాణ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. తెలంగాణ ప్రజల కష్టనష్టాలపై అనేక పోరాటాలు, ఉద్యమాలు సాగించిన కవి కాళోజీ నారాయణ గారు.
ఏనాడూ ఉద్యమ నాయకుడన్న ముద్రను ఆయన వేసుకోలేదు. కానీ,ఉద్యమ కార్యకర్తగానే తెలంగాణ చరిత్రలో , ప్రజల గుండెలలో నిలిచిపోయారు. ఒక సాహితీవేత్తగా కలం ఝళిపిస్తూనే, ఒక పోరాటవాదిగా కత్తి కూడా అంతే సమర్థవంతంగా ఝళిపించారు. 1914 సెప్టెంబర్‌ 9న జన్మించి 2002 నవంబర్‌ 13న కన్నుమూసిన కాళోజీ అసలు పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాస్‌ రాం రాజా కాళోజీ ‘నా గొడవ’ పేరుతో వెలువరించిన కవితా సంకలనం
తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిందనడంలో సందేహం లేదు.
ఈ అపూర్వ, అద్వితీయ, అపురూప కవిత్వం తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికి ప్రతిధ్వని అని చెప్పవచ్చు. అది రాజకీయ, సామాజిక చైతన్యాల సమాహారమని పలువురు సాహితీవేత్తలు ‘నా గొడవ’ను సమీక్షించడం జరిగింది. ప్రజల హక్కుల కోసం జీవితాంతం తపన పడిన ఈ ప్రజాకవి మొదటి నుంచి వరంగల్‌ పట్టణంలో నిరాడంబరంగా, సామాన్య ప్రజానీకంలో ఒక వ్యక్తిగా జీవించి, తాను ప్రవచించిన ప్రతి సిద్ధాంతాన్ని ఆచరించి చూపారు. ఆయన ఏ ఉద్యమం నడిపినా, ఏ కవిత రాసినా, సాహితీ ప్రసంగం చేసినా తెలంగాణ ప్రజల హక్కులను ప్రతిబింబించడానికే అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తనను తాను ప్రజావాదిగా అభివర్ణించుకున్నారు. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ.
మొదటిసారిగా ఆయన నిజాం దమననీతికి, అరాచకానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం, గళం ఎత్తారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్న కాళోజీ తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల్లో విరివిగా పాల్గొనడం జరిగింది. ఆయన 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్‌’ను
పొందడం జరిగింది. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది. వరంగల్‌ పట్టణంలో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. హన్మకొండ పట్టణంలో ఆయన పేరు మీద కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
కాళోజీ నారాయణ రావును సాటి సాహితీవేత్తలు, ఉద్యమకారులు తెలంగాణ తొలి పొద్దుగా సంభావిస్తుంటారు. ఆయన రాసిన ‘నా గొడవ’కు ప్రజాదరణ పెరగడం చూసిన కాళోజీ తెలంగాణకు సంబంధించి తన మనసులో ఉన్న లక్ష్యాన్నిఆయన ప్రజలకు తేటతెల్లం చేశారు. ‘అన్యాయాన్ని ఎదిరిస్తే ‘నా గొడవ’కు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.
అన్యాయంపై పోరాడినవాడే నాకు ఆరాధ్యుడు’ అని ఆయన చెప్పేవారు. తెలంగాణ ప్రజల తరఫున ఉద్యమం సాగించడమే ఊపిరిగా జీవించిన అసలైన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు.
దాదాపు తొంభై ఏళ్ళు జీవించిన కాళోజీ ఇరవయ్యో శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ప్రధాన ప్రజా ఉద్యమాల్లోనూ ముఖ్య పాత్ర పోషించారు. నిజాము పాలన మొదలుకుని 80ల దాకా రకరకాల ప్రజా ఉద్యమాల గురించి, కాలానుగుణమైన మార్పుల గురించి, నిజాం-బ్రిటీష్ ఇండియా ల మధ్య తేడాల గురించి – ఇలా అనేక సంగతులు పుస్తకంలో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, అన్న రామేశ్వరరావు గురించి ప్రస్తావన చాలా తక్కువ మొదట్లో చిన్నతనం గురించి తప్పిస్తే….
కుటుంబ ప్రస్తావన దాదాపు అసల్లేదనే చెప్పాలి.

నన్ను అమితంగా ఆకట్టుకున్న విషయం – ఆయన రాత అలా మాట్లాడుతున్నట్లే ఉండటం. ఆయనెంత ఎమోషనల్ మనిషో, ఎంత తొందరగా ఉద్వేగాలకి లోనౌతారో ఆయనే రాసుకున్నాడు గాని, పుస్తకంలో వివిధ సంఘటనల వద్ద కూడా – అది రాసిన విధానంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఆవేశమో, ఆవేదనో ఏదో కలుగుతుందని సన్నివేశాన్ని బట్టి మనం ముందే చెప్పేయొచ్చు అనమాట కాళోజీ నగర బహిష్కారానికి కూడా గురయ్యారంటే అసలు అలాంటి శిక్షలు జానపద కథల్లోనే అనుకున్నా నేను పరమ ఆవేశపరుడు అనిపిస్తుంది. కానీ, మళ్ళీ నాకు “చిన్న విషయం”గా తోచిన అంశాలకి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానని కూడా రాశారు. మొత్తానికి భలే మనిషి. అడ్వెంచరస్ కూడా. నిజాం కాలంలో వీళ్ళు చేసిన పనుల గురించి, జైలు వాసాలలో జీవితం గురించి చెబుతూంటే పరమ ఉత్కంఠతో చదివాను.

అక్కడక్కడా రాసిన ఆయన కవితలు నాకు చాలా నచ్చాయి. నాకు సాధారణంగా ఎక్కడో ఒక శ్రీశ్రీ, ఒక అజంతా, ఒక ఇస్మాయిల్ – ఇలా కొందరు ప్రముఖులు రాసిన నాలుగైదు కవితలు తప్పిస్తే కవిత్వమంటే భయం. అర్థం కూడా కాదు. దూరంగా జరుగుతాను. కానీ, ఈయన రాసినవి నాకు ఎందుకో చాలా నచ్చాయి. ఎక్కువ భావుకత, మార్మికత అనుకునే తరహా లేకుండా సూటిగా, తేలికైన భాషలో ఉండటం వల్ల కాబోలు. పైగా కొన్ని కవితలు ( “నా ఇజం” వంటివి) కాలాతీతంగా, ఇప్పటికీ సరిగ్గా సరిపోయేలా ఉండటం ఓ కారణం కావొచ్చు.

చాలామంది ప్రముఖుల గురించి ఆసక్తికరమైన స్కెచెస్ ఉన్నాయి – విశ్వనాథ, పీవి నరసింహారావు, రాయప్రోలు సుబ్బారావు, సర్దార్ జమలాపురం కేశవరావు – ఇలా అసార్టెడ్ వ్యక్తుల గురించి. విశ్వనాథ వారి గురించి నాలుగైదు చోట్ల ప్రస్తావన ఉంది. వీళ్ళిద్దరికీ స్నేహం ఉందన్న విషయం నాకసలు ఊహకైనా రాలేదు. పుస్తకం చదివే ముందు నా ఊహ వీళ్ళిద్దరూ భిన్న ధృవాలని. కానీ, ఇందులో ఆయన గురించి రాసిన విషయాలు పుస్తకాలు చదివి ఆయన గురించి అనుకున్నదానికి కొంచెం భిన్నంగానే ఉన్నాయి. అలాగే, భక్తుడు భజనచేసినట్లు కాక, ఒక సమకాలీకుడు, స్నేహితుడు, సాహిత్యకారుడు భక్తిభావంతో-గురుభావంతో కాకుండా, మామూలుగా ఇంకో తెలిసిన రచయిత గురించి రాసినట్లు ఉన్నాయి విశ్వనాథ మీద గుత్తాధిపత్యం తీసుకున్న దురభిమానులు ఇప్పుడు నన్ను ఏకేస్తారు కాబోలు. పీవీ గురించి ఈయన చాలా అభిమానంతో, చనువుతో రాసుకున్నారు. జమలాపురం కేశవరావు గురించి మాకు తెలుగు పాఠ్యపుస్తకంలో ఉండేది స్కూల్లో. పేరు తప్ప ఆట్టే గుర్తులేదు కానీ, కాళోజి రాసింది చదివాక ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.

పుస్తకం రచనా కాలం నాకు తెలియదు కానీ నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం మట్టుకు ఒక కాలం నుండి ఇంకో కాలంలోకి జంప్ అవుతూ ఆయన కథ చెబుతూ పోవడం. రికార్డు చేసిన దాన్ని ఫెయిర్ చేసినట్లే అనిపించింది నాకు – మొదట్లో వాళ్ళు రాసినట్లు. దీని వల్ల ఆయా సంఘటనలతో, కాళోజీ తో పరిచయం లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందే కావొచ్చు. ఏ బయోగ్రఫీనో చదవనిదే పూర్తి పిక్చర్ రాదు. పేర్వారం జగన్నాథం గారు రాసిన జీవిత చరిత్ర ఒకటి కనబడ్డది తెలుగుథీసిస్ వెబ్సైటులో. త్వరలో వీలు చూసుకుని చదవాలి.
గురించి ఆయన రాసిన విషయం ఆలోచింపదగ్గది.

“బ్రిటీష్ ఇండియా సంగతి తెల్వదుగాని నైజాంలో చదువుకున్న ప్రతివాని ఇంట (హైద్రాబాదు, వరంగల్ లలో) భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల ఫొటో వుండేటీది. బజార్లొ అమ్మెటోళ్ళు, వకీళ్ళ ఇళ్ళలో గాంధీ, మోతీలాల్, చిత్తరంజన్ దాసు, తిలక్, లాలా లజపతిరాయ్, సేన్ గుప్త ఫొటోలు కూడా వుండేటివి. ఇవేవీ నైజాం కాలంలో అభ్యంతరాలు కాదు. మరి ఇప్పుడు ’80-’85 లలో మావో సాహిత్యం, విప్లవ సాహిత్యం దొరికినయని దాడులు చేస్తరు, రాడికల్ సభలో ఆక్షేపిoచారు.
నిర్మొహమాటంగా, నిర్భయంగా ప్రజల హృదయాలలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు మన కాళోజీ!

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ భాషా దినోత్సవం

by Cheedella Seetha Lakshmi September 30, 2024
written by Cheedella Seetha Lakshmi

    ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషకు  ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా భాషకు యాసకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధపడి తెలుగు భాషకు ,తెలంగాణా భాషకు తగిన గౌరవం లభించాలని,మన భాషలో యాసలో రచనలు చేయాలని ఆశించి బాధపడ్డ తెలంగాణా ముద్దు బిడ్డ.   ఒక ధిక్కారస్వరం,నిరహంకారం,ఆవేశం,ఆలోచన ,సమాజంలో జరిగే అన్యాయాలను రచనల ద్వారా ఎండగట్టే మహనీయుడు.అందరి గొడవలను తన బాధగా భావించి ‘ నా గొడవ ‘ లో వినిపించి సమాజంలో మార్పు రావాలని ఆశించి గొంతెత్తిన కలం యోధుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారు.

1914 సంవత్సరం సెప్టెంబర్ 9 వ తేదీన బీజాపూర్లోని రట్టిహళ్ళి అనే గ్రామంలో రంగారావు,రమాబాయి దంపతులకు జన్మించాడు.కాళోజీ చిన్నతనంలోనే తెలంగాణాకు వలస వచ్చారు తల్లిదండ్రులు. కాళోజీకి మరాఠీ,కన్నడ,తెలుగు,ఉర్దూ,ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు.

   నిజాం ప్రభుత్వంలో ఉర్దూ రాజభాషగా ఉన్నందున ఉర్దూమాధ్యమంలో చదివినప్పటికి తెలుగు భాష పట్ల తెలంగాణ భాష పట్ల చాలా అభిమానం కలవాడు. 

   నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.ఆంధ్ర మహాసభలు,ఆర్యసమాజం,తెలంగాణా రైతాంగ పోరాటం,తెలంగాణ తొలిదశ,మలిదశ ఉద్యమాలలో చైతన్య వంతంగా తన వంతు పాత్రను పోషించాడు.తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఒక తెలంగాణా ఆత్మాభిమాన కెరటం.

  తెలంగాణా భాషకు యాసకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక తన గొంతును విప్పి కలం ఝళిపించిన భాషాభిమాని. 

   ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో,తెలంగాణా రచయితల సంఘ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు.

  అనేక రచనలు చేసిన మహాకవి.కాకతీయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ను,కేంద్ర ప్రభుత్వం వారు పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించారు.అనేక అవార్డులు,రివార్డులు పొందిన మహాకవి.

 ”  అన్య భాషలు నేర్చి 

    ఆంధ్రంబు రాదంచు

     సకిలించు ఆంధ్రుడా

      చావవెందుకురా “

   అని నినదించి తెలుగు భాష గొప్పతనాన్ని, మాతృ భాష ప్రాముఖ్యతను చాటి చెప్పాడు.

    ఇంత గొప్ప సేవ చేసిన మహనీయుని జన్మ దినాన్ని పురస్కరించుకొని తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించినాక తెలంగాణా భాషా దినోత్సవాన్ని,ఆయన పేరు మీదుగా తెలంగాణా సాహిత్య విశిష్ట వ్యక్తికి కాళోజీ పురస్కారమిచ్చి తన్ను తాను గౌరవించుకుంటుంది.కాళోజీ ధిక్కార స్వరం అందరికి ఆదర్శనీయం.బతుకమ్మ మురిసి విరిసి పోయింది.తెలంగాణా ప్రత్యేకతను చాటుకుంది…..

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

కసిరెడ్డి జలంధర్ రెడ్డి ఆశ నిండిన శ్వాస

by Narendra Sandineni September 30, 2024
written by Narendra Sandineni

కవితా సంపుటి పై పుస్తక సమీక్ష

కవి,రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల,తెలుగు బాషోపాధ్యాయుడు,కసిరెడ్డి జలంధర్ రెడ్డి కలం నుండి జాలువారిన ఆశ నిండిన శ్వాస కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.కవి జలంధర్ రెడ్డి తొలి కవితా సంపుటి జనవరి 2023 సంవత్సరంలో భవానీ సాహిత్య వేదిక నుండి ప్రచురింపబడింది. ఇందులో ముప్పై అయిదు కవితలతో అలరారుతూ ఉంది.ఈ పుస్తకాన్ని కవి జలంధర్ రెడ్డి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులు కసిరెడ్డి రుక్కమ్మ బాల్ రెడ్డి గారలకు అంకితం ఇవ్వడం ముదావహం.వైరాగ్యం ప్రభాకర్ ముందుమాటలో ఆశ నిండిన శ్వాస కవితా సంపుటిలో సమకాలీన అంశాలు,సందేశాత్మక కవితలతో పాటు నిత్య సత్యాలు,మానవుడు అనుసరించదగు మార్గాలు ఉన్నాయి. సామాన్యుడిగా కనిపించే జలంధర్ రెడ్డిలో ఒక అసాధారణ కవి ఉన్నాడని ఈ సంపుటి నిరూపిస్తుంది.వారి కలం నుండి మరిన్ని కవితా సంపుటులను ఆశిస్తునన్నారు.లేదాళ్ళ రాజేశ్వర రావు ముందు మాటలో మానవత్వం నిండిన అచ్చమైన అమాయకత్వం అతడు.ఆ సగటు మనిషి ఆశ నిండిన శ్వాసలే ఈ కవితలు అన్నారు. విశ్వ మానవాళికి కరోనా రూపంలో పెద్ధ విపత్తు వచ్చింది.చైనాలోని ఊహన్ నగరం నుండి ప్రారంభమై ప్రపంచమంతా పాకింది.కరోనా వైరస్ గాలి ద్వారా తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది.కరోనా వైరస్ మొదటి వేవ్ లో పెద్దగా ప్రభావం లేకున్నప్పటికీ,సెకండ్ వేవ్ లో లక్షలాది మంది విగత జీవులయ్యారు.

కవి జలంధర్ రెడ్డి ఆ బాధాకర దృశ్యాలను కళ్ళారా చూసి హృదయం ద్రవించిపోయి వేదనతో ఆశ నిండిన శ్వాస పుస్తకాన్ని అక్షరీకరించారు.కరోనా వైరస్ భయానికి గృహ నిర్బంధంలో ఉండాలి.ఎప్పటికప్పుడు సానిటైజర్ వాడి చేతులు శుభ్రం చేసుకోవాలి. తుంపర్ల ద్వారా గాలి ద్వారా వ్యాపించే వైరస్ మానవాళికి పెను ముప్పుగా మారింది.ఇప్పటికీ ఆ భయానక దృశ్యాల జాడ వీడ లేదు.ఆ విపత్తు వల్ల సర్వమానవాళి బాధలను ఎదుర్కొన్నారు.కవి కరోనా వైరస్ చూపించిన పెనుభూతాన్ని కళ్ళకు కట్టినట్లు ఆశ నిండిన శ్వాస కవిత ద్వారా తన భావాలను చక్కగా వ్యక్తీకరించారు.మనిషిని ఆవహించిన నిర్వేదం/ఘనీభవించి అనుదినం వెంబడిస్తూనే ఉంటుంది/అచేతనున్ని చేసి వెర్రిగా వెక్కిరిస్తుంది/కరోనా వైరస్ మనల్ని ఆవహించినప్పుడు కరోనాతో అనుదినం సహజీవనం చేయవలసిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. అలాంటి మనిషిని నిర్వేదం అనుదినం వెంబడిస్తూనే ఉంటుంది.వేదం అంటే ప్రమాణం,ఆచరించదగినది. వేదం కానిది నిర్వేదం అని చెప్పవచ్చు.ఒక విధంగా చెప్పాలంటే మౌన రోధన,మానసిక క్షోభ,ఒక విధమైన వైరాగ్య స్థితి.కవి కరోనా రక్కసి వల్ల కలిగిన భయానక స్థితిని కళ్ళకు కట్టినట్లు కవితలో చెప్పారు.కరోనా వైరస్ మనిషిని స్పృహ లేని వ్యక్తిని చేసి వెర్రిగా వెక్కిరిస్తుంది.భయంతో ఉన్న వ్యక్తి అభద్రతాభావపు సుడిగుండంలోకి జారిపోతాడు. సుడిగుండంలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడడు.నదుల్లో సరదాకని ఈత కొడుతూ ఉంటారు.ఒక్కోసారి నదిలో ప్రమాదవశాత్తు ఈత నేర్చిన వాళ్లు సైతం సుడిగుండంలో చిక్కి ప్రాణాలు కోల్పోతారు.శవం కూడా లభ్యం కాదు.భయం ఎలాంటిదంటే అభద్రతా భావపు సుడిగుండం లాంటిది అని కవి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఊపిరాడని వేళ/గుప్పెడు ప్రాణ వాయువు కోసం/ఆశతో దేహం తల్లడిల్లుతుంది/కరోనా సోకిన వ్యక్తికి ఊపిరాడదు.ఆక్సిజన్ అందితేనే ప్రాణం నిలుస్తుంది.కరోనా వైరస్ బారినపడి వేలాది మంది హాస్పిటల్లో సరైన ఆక్సిజన్ లభ్యం కాక ప్రాణాలు కోల్పోయారు.ప్రభుత్వ హాస్పిటల్లో సరియైన ఆక్సిజన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.ప్రభుత్వాల నిర్లక్ష్యం,చేతగానితనం వల్ల లక్షలాది మంది మృత్యువాత పడ్డారు.ఒంటరి గదిలో ముసిరిన చీకట్లు/కరిగి పోతున్న ఆయువును జ్ఞాపకం చేస్తుంటాయి/కరోనా సోకిన వ్యక్తి ఒంటరిగా చీకటి ముసిరిన గదిలో ఉండాలి.ఆ వ్యక్తికి ఒంటరితనం కరిగిపోతున్న ఆయువును జ్ఞాపకం చేస్తుంది అన్నది నిజం అని చెప్పవచ్చు.ఈ చీకట్లో కొత్త వెలుగులు/మోసుకొస్తాయేమోనన్న ఆశ వెంటాడుతుంది/ఈ చీకట్లో ఉన్న వ్యక్తికి కూడా కొత్త వెలుగులు వచ్చి బతకాలనే ఆశ ఉంటుంది.ఆశే మనిషిని బతికిస్తుంది.బతుకులో వెలుగును వెతుకుతాం.ఇవ్వాళ కాకున్న రేపైనా వెలుగు వస్తుందనే ఆశతో మనిషి బతుకుతాడు.ఒంటరి ప్రస్థానపు చేదు నిజాలు/చితాగ్ని కెరటాల్లా/ అనాధృతంగా దహన మౌతున్న దేహాలు/కరోనా సోకిన వ్యక్తి ఒంటరిగా ఉండి కోలుకుంటాడంటే కరోనా తీసుకుపోయింది.చేదు నిజాలు అంటే జీర్ణించుకోలేని వాస్తవాలు.అనుకున్నది ఎప్పుడు జరగదు.అనుకోలేనిది జరుగుతుంది.చనిపోయిన వ్యక్తిని మనం చితిని పేర్చి దహనం చేస్తాం.కానీ అనాధృతంగా దహనమౌతున్న దేహాలు. ఉద్దేశపూర్వకంగా జరిగిన కరోనా వైరస్ దాడిలో ప్రాణహాని కలిగి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లి పోయారు.చనిపోయిన లక్షలాదిమంది బాధితుల కుటుంబాలకు ఆ సంఘటనలు సరి కొత్త భాష్యాలు చెపుతాయి అంటున్నారు.జీవితంలో మనం ఎన్నో సంఘటనలను ఎదుర్కొంటాం.కొన్ని సంఘటనలు మనను సన్మార్గం వైపు నడిపిస్తాయి.కొన్ని సంఘటనలు మనను చెడు మార్గం వైపు నడిపిస్తాయి.కరోనా దాడి మనందరికీ ఒక గుణపాఠం నేర్పింది అని కవి ఘంటాపథంగా చెపుతున్నారు.కాలజ్ఞానం వ్రాసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గాలి ద్వారా వ్యాధులు వ్యాపించి లక్షలాదిమంది చనిపోతారని వ్రాశారు. మహానుభావుడైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట నిజం అయింది.అన్ని మరణాలకు ఆర్త నాదాలు ఉండవు/కరోనా వల్ల చనిపోయిన వ్యక్తి శవాన్ని కూడా ఇవ్వరు.హాస్పిటల్ వాళ్ళు శవాన్ని తీసుకుపోయి దహనం చేస్తారు. బంధువులు అందరు ఇక్కడ శవాన్ని చూసి విలపించే అవకాశం లేదు.కొన్ని దుఃఖాలు నిశిత నిశ్శబ్దంలో తలదాచుకుంటాయి/కొన్ని విషాదాలు కారు చీకట్లో కళ్ళు తెరుచుకు చూస్తుంటాయి/ఈ వాక్యాలు ప్రతీకలా ఉన్నాయి.వేదనల నుంచి వెలువడే శక్తి నిప్పుడు/రేపటి ఆశ శ్వాసల కోసం/దాచిపెట్టుకోవాలి/వేదనల నుండి కూడా శక్తి వెలువడుతుందని,అలాంటి శక్తిని రేపటి ఆశా శ్వాసల కోసం దాచిపెట్టుకోవాలి అని కవి ఎంతో అనుభవంతో మనకు చెబుతున్నారు.మనలను ఆశ శ్వాసలపై దృష్టి పెట్టాలని మనలో చైతన్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్నారు.శ్వాస మీద ధ్యాస పెట్టు అని పతంజలి మహర్షి మరియు మొదలగు యోగి పుంగవులు తెలియజేశారు.వేదనల నుంచి వెలువడే శక్తి నిప్పుడు రేపటి ఆశ శ్వాసల కోసం దాచి పెట్టుకోవాలి అన్నది అద్భుతంగా ఉంది. మాతృమూర్తి కవితలో అమ్మ అంటే ఆత్మ/ మమకారపు మాధుర్యం/నవ మాసాలు మోసి, పురుటి వేదనలో/మరో జన్మ ఎత్తి/తాను మరో జీవికి జన్మనిస్తుంది/మైమరచి తన్మయత్వం పొందుతుంది అని అంటారు.మనం పురాణాల్లో మాతృదేవోభవ అని చదువుకున్నాం.అమ్మ ప్రత్యక్ష దైవం.కనిపించే దైవం.అమ్మ మనల్ని కని పెంచుతుంది.అమ్మ లేని జన్మ లేదు.అమ్మ లేని లోకం లేదు.అమ్మంటే ఆత్మ.ఆత్మ అంటే జీవుడు మరియు జీవాత్మ స్వరూపం.అమ్మ స్వరూపంతోనే మనం భూమి మీదికి వస్తాం.ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. అమ్మంటే మమకారపు మాధుర్యం అన్నారు. మమకారం అంటే బలమైన అభిమానం.అమ్మ ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.అమ్మ యొక్క మమకారపు మాధుర్యాన్ని మనమంతా ఎరిగి యున్నాం.తల్లి జంతువులు మరియు తల్లి పక్షులు ఎంతో ప్రేమగా మమకారపు మాధుర్యంతో మెదులుతాయో మనమంతా చూసి యున్నాం. అమ్మ యొక్క మమకారపు మాధుర్యం వర్ణించడానికి కలం సరిపోదు.స్వార్థం లేని బలమైన ప్రేమతో కూడుకొని ఉంటుంది.అమ్మ నవ మాసాలు కడుపులో మోసి పురిటి నొప్పులను భరించి మరో జన్మ ఎత్తుతుంది మరియు మరో జీవికి జన్మ నిస్తుంది.అమ్మ ఆ పసి పాప లాలనలో తనను తాను మైమరిచి తన్మయత్వం పొందుతుందనే భావాన్ని చక్కగా వ్యక్తీకరించారు.అమ్మకు కలిగిన ఆనందాన్ని మైమరిచిపోయిన తన్మయత్వం కవుల కల్పనలకు కూడా అందదు.మన ఇంటి దేవాలయాల్లో అమ్మ దేవతగా కొలువై ఉంటుంది. మన అమ్మను మనం ప్రేమతో నిత్యం వెలిగించుకుందాం.అమ్మను దేవ దీపంగా వెలిగించుకున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయని మనమందరం ఎరిగినదే.కవి అమ్మలో దైవాన్ని చూస్తున్నాడు.అమ్మలు అందరు దైవ స్వరూపాలే అమ్మపై సాటిలేని ప్రేమను వ్యక్తం చేసిన తీరు అద్భుతం.ఇంకెన్నడు ? కవితలో మనుషుల్లో కుల మత ద్వేషాలు మాసి/వసుధైక కుటుంబముగా విలసిల్లు రోజు/ఐక్యభావమున సహజీవనం గడిపి/ శాంతి సౌఖ్యములను నెలకొల్పు రోజు/ ఎన్నడు..ఇంకెన్నడు/అని అంటున్నారు.మనుషులు కుల మతాల పేరిట ద్వేషంతో మెలుగుతున్నారు. మనుషుల్లో ద్వేష భావం సమసిపోయి విశ్వమంతా ఒకే కుటుంబముగా కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటే శాంతి, సౌఖ్యములు నెలకొంటాయి.శాంతి సౌఖ్యములు ఎన్నడు,ఇంకెన్నడు అని ప్రశ్నించడం చక్కగా ఉంది. చిరంజీవులు కవితలో మాతృభూమి రక్షణలో/మీ వీరత్వం విజయ సంకేతం/ మీ ధీరత్వం ఆత్మ విశ్వాస కేతనం/మీ పట్టుదల,నిబద్ధత మాకు నిత్య స్ఫూర్తి/మీ నిస్వార్థం,నిజాయితీ మాకు నిరంతర దీప్తి/మీరే మా ధైర్యం,స్థైర్యం/మీరే మా బలం, భవిత/శాంతిని స్థాపించే సమరంలో/మీ మరణం చివరి చరణం కారాదు/మీ త్యాగం ఆఖరి వాక్యం కారాదు/చిరంజీవులు మీరు/అని అంటున్నారు.దేశ రక్షణ కొరకు సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉండి కృషి చేస్తున్నారు.కవి సైనికులను చిరంజీవులు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.ఇంటి దీపాలు కవితలో ఇంటర్ ఫలితాల్లో లోపాలు/ఆరిన ఇంటి దీపాలు/అపజయం విజయానికి పునాది/పడరాదు మనాది../ఈ దేశానికి మీరే భవిత/విద్యార్థులారా!/ఎవరికుండదు బాధ/ చెట్లకు లేదా బాధ/శిశిరంలో ఆకులు రాలి మోడులై/ వసంతంలో చిగురిస్తాయి/పుడమికి లేదా వ్యథ/ గ్రీష్మంలో పగులు బారి/తొలకరితో పులకరిస్తుంది/ మరల ప్రయత్నం మానవ లక్షణం/నిరాశ నిస్పృహలతో/జారిపోయిన గుండెలతో/ రాలిపోవద్దు../మేధావుల్లో కూడా కొందరు మొదట పరాజితులే అని అంటున్నారు.ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేక నిరాశ నిస్పృహలతో కొందరు విద్యార్థులు అర్ధాంతరంగా జీవితాలను ముగించడం మంచిది కాదు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో మరల ప్రయత్నించి పరీక్షలు రాసి విజయం సాధించాలి అని స్ఫూర్తిని కలిగిస్తున్నారు.ఋతువిలాపం కవితలో కాలాన్ని నమ్మి/నార్లు పోసిన రైతుతో పాటు/చాలీచాలని తడితో/భరించలేని ఎండల వేడి/తట్టుకోలేని నారుమడుల/విలాపం/దున్నిన దుక్కులు/వర్షించని మేఘాల వంక/బేల దృక్కులు/అని అంటున్నారు. ఋతువిలాపాన్ని అతివృష్టి,అనావృష్టి,కరువు కాటకాలతో రైతులు అనుభవిస్తున్న కష్టాలను వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది.సాంత్వన కవితలో మనుగడ ప్రశ్నార్థకమై/మనసుకు సాంత్వనము లేక/నిరాధార బాధాకర జీవనం/ దురాచారంగా మారిన/ప్రాచీనాచారం చివరకు/ చారిత్రక పతనం/హృదయ వేదనగా మిగిలిన/ సత్వర తలాక్ విధానం ఇకపై చెల్లదు/అని అంటున్నారు.సుప్రీంకోర్టు తలాక్ విధానం చెల్లదు అని తీర్పు ఇచ్చింది.ముస్లిం స్త్రీలకు జరుగుతున్న చారిత్రక అన్యాయానికి అడ్డుతెర.సమానత్వ సామాజిక న్యాయానికి విజయం అని కవి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.అంతరంగం కవితలో అందం../వదనంలో ఉండదు/అంతరం ఆవిష్కరిస్తుంది/నలుగురితో నవ్వుతూ మాట్లాడు/ నలుగురిని నవ్వుతూ పలుకరించు/ఆ పలుకరింపుతో/అనురాగ పరిమళం పంచు/ పలుకరింపు చిన్నది అయినా../మనస్ఫూర్తిగా పలుకరిస్తే చాలు../నీకన్నా అందంగా/ ఎవరూ కనిపించరు/ఆనందమే అందం/ఆనందమే../జీవిత మకరందం/మనిషి కన్నా/మనసు గొప్పది/అని అంటున్నారు.మనిషి అంతరంగాన్ని వ్యక్తీకరించిన తీరు బాగుంది.కాలం శ్రమ కవితలో మానవుల్లో కొందరు/శ్రమను నమ్ముతారు/మరి కొందరు/ కాలాన్ని నమ్ముతారు/లక్ష్యంతో శ్రమించి/విజయం సాధించే వారు కొందరు/మరి కొందరు/కాలానుగుణంగా శ్రమిస్తూ/విజయం సాధిస్తారు/కాలం గమ్యం వైపు అడుగు వేయిస్తే/శ్రమ గెలుపుకి దగ్గర చేస్తుంది/ మనిషి జీవితంలో/కాలం – శ్రమ/జీవన గమన చక్రాలు/ అని అంటున్నారు.మనిషి జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు శ్రమను నమ్ముకుంటేనే విజయం వైపు అడుగులు పడతాయి అని చెప్పిన తీరు బాగుంది.జాగరూకత కవితలో ఓటరన్నా!జర పదిలం/మైకానికి,పైకానికి ఆశ పడకు/మనిషిని చూడు వాని నడవడి చూడు/ చేసిన బాసలు మరచి/ముఖం చాటేసే కపట నాయకుల/కనిపెట్టుకుని వుండని తరుణంలో/ రాజకీయాల్లో జరిగెడి/తప్పులే పునరావృతం/ నిన్నటి నీడలు రేపటి జాడలు/అని అంటున్నారు. ఓట్ల కోసం వచ్చే కపట రాజకీయ నాయకులు చూపించే నక్క వినయాలు నమ్మకూడదు. అమాయకంగా వారిని నమ్మి ఓటు వేయకూడదు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయ నాయకుల పట్ల జాగరూకతతో ఉండాలి.లేకుంటే మోసపోతావు అని తెలియజేసిన హెచ్చరిక ఒక చురకలాగా ఉంది. అపర చాణక్యుడు కవితలో శతవసంతాల సౌమ్యవాది/ఆర్థిక సంస్కరణల సారధి/నిరాడంబర జీవి,పి.వి./తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని,జాతి గౌరవాన్ని/దిగంతాలకు చాటి/రాజనీతికి మెరుగులద్దిన/విప్లవ తపస్వి/అపర చాణక్యుడు/ బహు భాషా కోవిదుడు/మనీషిగా,హిమనగమంతా ఎదిగిన సామాన్యుడు/ అని అంటున్నారు. తెలంగాణకు చెందిన పి.వీ.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి దేశానికి విశిష్ట సేవలు అందించారు.అలాంటి మహనీయుని స్మరించుకోవడం మరియు కవితలో అపర చాణక్యుడు అని పేర్కొన్న తీరు చక్కగా ఉంది. జనమెరిగిన కాళోజి!కవితలో తెలంగాణ వాడుక భాషను/తన భాషగా కాక జన భాషగా/మలచిన మన గొడవ’అతడు/పరభాష వ్యామోహంలో మ్రగ్గే/తెలుగు వాళ్ళని/తల్లి భాషను నేర్చుకొమ్మని/ చురకలంటించగలడు/అని అంటున్నారు.కాళోజి నారాయణరావు స్మృతిలో రాసిన కవిత బాగుంది. తెల్ల కొలనులో నల్ల కలువలు కవితలో ప్లీజ్ ఒదలండి ఊపిరాట్టం లేదు/నిరాయుధ జార్జి ఫ్లాయిడ్ వేదనాభరిత ఆవేదన/పెడ రెక్కలు విరిచి,సంకెళ్ళతో బంధించి/మెడపై మోకాలితో నొక్కి/ఊపిరి తీసిన తెల్ల పోలీస్/మరణ యాతన/ సోషల్ మీడియా సాక్షిగా దారుణ ద్వేషం/అని అంటున్నారు.అమెరికాలో జాతి వివక్షకు బలి అయిన జార్జి ఫ్లాయిడ్ మరణం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.తెల్ల జాతి వాళ్లు నల్లజాతి వాళ్లపై వివక్ష ఇంకా కొనసాగడం తీవ్రమైన బాధను కలిగిస్తుంది. జాతి వివక్ష సమసి పోవాలి.అప్పుడే తెల్లకొలనులో నల్ల కలువలు వికసించేది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.అశ్రునివాళి కవితలో మారుతున్న జీవనశైలిలో/అసహనంతో/మనుషుల్లో పురుడు పోసుకుంటున్న/ఉన్మాద మనస్తత్వం/ విచక్షణను కాలరాస్తున్న ఆవేశం/విధి నిర్వహణలో నున్న అధికారిని/పట్టపగలు/కార్యశాలలో సజీవ దహనం/కౌలు రైతుకూ,భూ యజమానికి/మధ్య వైరం/విజయా రెడ్డిని బలిగొన్న ప్రతీకార జ్వాల/ అభం శుభం ఎరుగని పసి మొగ్గలు/మాతృ ప్రేమకు దూరమైన అభాగ్యులు/అని అంటున్నారు.రెవెన్యూ అధికారి విజయా రెడ్డి తాను పనిచేస్తున్న ఆఫీసులో సజీవ దహనం చేశారు.అట్టి దుర్ఘటన వల్ల విజయా రెడ్డి పిల్లలు తల్లి ప్రేమకు దూరమై పోయిన అభాగ్యులు అని ఆవేదనతో అశ్రునివాళి కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.ఆలోకనం కవితలో నా ఆలోచనలు/అనుభవాలు/అనుభూతులుఅన్నీ/ ఎవరితోనూ పంచుకోలేను/నాలో నేనే నదిలా ప్రవహించుకుంటూ/నిశ్శబ్ద నిశీధిలో స్వప్నిస్తూ/ దోసెడు భావాల్ని/పిడికెడు మనస్సులో సొగసుగా నింపుకుంటాను/ఒక్కొక్కటిగా నిన్నటిని నెమరేచుకుంటూ/వ్యోమ గామినై జగాలన్నీ చరిస్తుంటాను/విశ్వ యవనికపై/ప్రేమనై ఆవిష్కరించబడుతాను/అని అంటున్నారు.

తన మనసులో కలిగిన భావాలను కవి చెప్పిన తీరు బాగుంది.గ్రీష్మ హవనం కవితలో తన విశ్వ రూపంతో/నిప్పుల కొలిమిలా జ్వలిస్తున్న భానుడు/ ఎండలు నిదాఘమై నిప్పులు చెరుగ/జల
ఊటలు తగ్గి,బీటలు వారి/ఎండిపోయిన పంట పొలాలు/హాలికుల మనో వేదన/తిండి లేక,దాహార్తి తీరక/జీవన ప్రస్థానంలో/చావు బతుకుల నడుమ/ కొట్టుమిట్టాడుతున్న మూగజీవుల దైన్యం/దినమొక గండముగ సామాన్యుల కష్టాలు/తీవ్ర వడ గాడ్పుల విసురులు/తట్టుకోలేని రెక్కాడితే డొక్కాడని శ్రమజీవులు/పిట్టల్లా రాలుతున్న దారుణస్థితి/అని అంటున్నారు.ఎండల వల్ల రైతులు సామాన్యులు పశు పక్షులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.వాళ్లు అనాథలు కవితలో వాళ్ల మనసులు/రాళ్ల మధ్య అద్దంలా/ముళ్ళ మధ్య పువ్వుల్లా/విచ్చుకుంటాయి /వాళ్ల ప్రేమ సముద్రమయితే/ఆకాశమంత ఆకలి/ పగలంతా తీరని వేదన/రాత్రంతా ఒడువని దుఃఖం/ బతుకంతా కాయ కష్టం/కళ్ళ మీద వాలిన ఆకలిని/కడివెడు నీ(కన్నీ)ళ్లతో నిద్ర పుచ్చుకుంటూ/ సజీవ సమాధుల్లో జీవిస్తుంటారు/వాళ్ల గుడిసెల్లో ఆకలి గిన్నెల భాష తెలుస్తుంది/వాళ్లు అనాథలు/ అని అంటున్నారు.ఒక వ్యక్తికి ఎవరు లేని స్థితి అనాథ.అనాథల గురించి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.ఆనంద రహస్యం కవితలో కొన్ని పుట్టుకతో వొస్తాయి/కొన్ని నేర్చుకుంటాం/కొన్నింటిని నేర్చుకుంటేనే వికాసం/ఎగరడం పక్షులకు/ఈదడం చేపలకు సహజాతాలు/మనం అభ్యసించవలసింది ఆనంద సృజన/అది అంగట్లో దొరికేది కాదు/మనపై మనం చల్లుకునే కర్పూర సుగంధమూ కాదు/ అందుకే ఇపుడు మనిషి/చేయాల్సింది ఆనంద సృజన/ఏ క్షణం నుండి మన మనసు/ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో./ఆ క్షణం నుండి ఆనందం మొదలవుతుంది/అదే అసలు,సిసలు బ్రతుకు రహస్యం/అని అంటున్నారు.మనుషుల జీవితాల్లో క్షోభ,దుఃఖం లేకుండా వచ్చేది ఆనందం. ఆనందం అనేది ప్రియమైన వారితో సమయం గడపడం లేదా ఆనందించే కార్యకలాపాలలో పాల్గొనడం వంటి సానుకూల జీవిత అనుభవాలతో ముడిపడి ఉంటుంది.ఆనందం అనేది శ్రేయస్సు మరియు మొత్తం జీవితం సంతృప్తికి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది.ఆనందం అనగా మనసుకు ఆనందంగా ఉండే స్థితి,అభిరుచి, సంతోషం అని అర్థాలు.పారమార్థికంగా ఎనిమిది ఆనందాలు ఉన్నాయి.బ్రహ్మానందం,విషయానందం, ఆత్మానందం,అద్వైతానందం,నిత్యానందం, యోగానందం,సహజానందం,పరమానందం ఉన్నాయి.ఆత్మలేని శరీరం కవితలో సడి లేని నడి రాత్రి/శిథిల కుటీరం/మదించిన మానవ మృగం/ అసహాయపు ఒంటరి అబలపై/పాశవిక పంజా/వద్దని వారించినా/ఆర్తిగా అర్థించినా/రాతి గుండెలో కనిపించని/ఆర్ద్రత/అక్రమ ఆక్రమణలతో/వలువలు తొలగిస్తూ/తనువును నలిపేస్తుంటే/ప్రతిఘటించ చేవలేక గట్టునపడిన/చేప పిల్లలా తల్లడిల్లిన/ హృదయ విదారకత/సుప్త చేతనలో/నగ్న శీలాన్ని పాశవికంగా/ హరిస్తుంటే/గుండె గొంతుకలో ప్రతిధ్వనించిన/దుఃఖరోదన/దైహికంగా, మానసికంగా/కుంగిపోయిన మౌనమై/సజల నేత్రాలతో విడిచిన దౌర్భాగ్యపు/నిట్టూర్పు ఆమె/ తనను తాను సాంత్వన పరచుకోవడం/ఎలాగో తెలీని అఘ్రాణిత పుష్పం/ఉనికి కోల్పోతున్న దీపశిఖ/జీవన నైరాశ్యంలో విసుగును,విరక్తిని/ నింపుకొని/మృత్యు స్పృహతో/ఆమె ఒక ఆత్మలేని శరీరం/అని అంటూ కవి వ్యక్తీకరించిన భావాలు స్త్రీల పట్ల సానుభూతిని తెలియజేస్తున్నాయి. సమాజంలో స్త్రీలపై దుర్మార్గుల అత్యాచారాలు, ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాళేశ్వరం జలదృశ్యం కవితలో కాళేశ్వరం జలదృశ్యం/అవుతున్నది ఆవిష్కృతం/అనవరతం జనపదాలు/జల సిరులతో మురిసిపోవగ/ తెలంగాణ వర ప్రదాయిని/ఎత్తిపోతల ప్రాజెక్టు/ కాళేశ్వరం శుభారంభం/అని అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంట పొలాలకు నీళ్లు అందాయి అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.మిత్రుడు కవితలో నవ్వుతూ నవ్విస్తూ/ కాలాన్ని నడిపించే మిత్రుడు కనబడితే/ మహదానందంలో కాసింత సేపు/మనసంతా బాల్యంలోకి జారిపోతుంది/కలతలు కనుమరుగవుతాయి/దిగులు చీకట్లు కరిగి,పున్నమ రేయి/ఆదమరిచి నిదురించినంత హాయి/స్వార్థ మెరుగని స్నేహారామంలో/ఓ పువ్వునై పరిమళించినట్టు/మనసంతా పులకరింపులతో తేలిపోతుంది/మన ప్రతి అడుగులో/వెన్ను తట్టే వారుంటే/జీవితం ఒక పూల చెట్టు/సృష్టిలో స్నేహం కన్నా తీయనిదేమున్నది/ఆత్మీయుని కౌగిలి/ అనుబంధాల లోగిలి/అని అంటున్నారు.ఒక మంచి మిత్రుడు ఉంటే మనిషి జీవితం నందనవనం అవుతుంది అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.అగోచర శత్రువు కవితలో కరోనా సృష్టించిన విలయం/కళ్లారా చూచిన పిమ్మట/ నాకిప్పుడు పరదేశాలకు కాదు/మాతృ గర్భంలోకి పోవాలనిపిస్తోంది/కరోనా ఈ కాలానికి మార్గ నిర్దేశనం చేస్తూ/నా నేత్రాలను తెరిపించింది/నా అపరిశుద్ధ చేతులను,చేతలను/శానిటైజ్ చేసుకొమ్మని/ కనిపించని కరోనా నేర్పిన జాగరూకత/తల్లి ఒడిలో హాయిగా/ తలదాచుకున్నట్టున్న నా ఉనికి/నాకై నేను విధించుకున్న గృహనిర్బంధం/జైలు జీవితంలా ఉంది అని అంటున్నారు.కరోనా పెనుభూతాన్ని చూసిన కవి అగోచర శత్రువు పట్ల జాగరూకత ఉండాలని కవితలో వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి. మధుర భావన కవితలో నా చెలి లేని శీతల రాత్రి/
శయన మందిరమొక మంచు గుహ/నా పాన్పు కఠిన హిమ శకలము/నిద్దుర కన్నుల నిరీక్షించు/ఈ ఏకాంత చీకటి శిథిల రాత్రి/నన్నే జాలిగా వీక్షిస్తూ/కాలమై నా కనుల ముందు కరిగిపోతున్నది/ నాకు కావాల్సినదిప్పుడు/మధు కలశము కాదు/ ఇప్పుడొక/ఉష్ణ స్పర్శ నన్నాశ్రయించిన/ఎంత బాగుండును/నా చెలి నా చెంతనే వున్నంత/వెచ్చని మధుర భావన/నన్నలుముకున్నట్లు/ అంతర్నిహితమైన అలజడి/అని అంటున్నారు. కవితలోని భావాలు ఒక్కసారిగా మనిషి మనస్సు మధుర భావనలు తేలియాడుతున్నట్లుగా ఉంది. ప్రగతి పథంలో కవితలో స్మార్ట్ సిటీ ముసుగులో/ అందమంతా ఒళ్ళో దాచుకొని/నగరం అభివృద్ధి చెందుతూనే వుంది/కార్లల్లో బైకుల్లో/గజిబిజిగా, గందరగోళంగా/పరుగులు తీస్తూనే వుంది/రాచ పుండ్లలాంటి గుంతల రహదారులతో/కంపుగొట్టే కాలనీల హట్టవాహినీలతో/పరుల కష్టార్జితాన్ని/ జుర్రుకొని బతికే పరాన్న జీవులతో/అభివృద్ధి చెందుతూనే ఉంది/అని అంటున్నారు.రాజకీయ నాయకులు,అధికారులు,కాంట్రాక్టర్లు కుమ్ముక్కై స్మార్ట్ సిటీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు.పేరుకే స్మార్ట్ సిటీ అని పేరు నిధులు మాయం అవుతున్నాయి.ఈ దుస్థితి మారాలని కవి ఆవేదన చెందుతున్నారు.భూమి పూజ కవితలో బాల రామునికి భవ్య మందిరమట/శ్రీరామ ధామానికి శ్రీకరమట/భక్తి పారవశ్యంలో భరత వర్షమట/రామ నామ స్మరణతో పంచభూతాలు/పరవశించే వేళ/పులకరించిపోతున్న అయోధ్యాపురి/అని అంటున్నారు.కవి అయోధ్యలో జరిగిన భూమి పూజకు స్పందిస్తూ రాసిన కవిత ఇది.రగిలే భావుటాలై కవితలో నేటి రాజకీయం వెర్రి తలలు వేస్తున్నది/నాయకుల గోముఖ వ్యాఘ్ర రూపాలు/బయటపడుతున్నాయి/ధరల ప్రవాహంలో/సామాన్యుని బతుకు/అగమ్య గోచరమౌతున్నది/ సంపన్నుల కొమ్ముకాస్తూ/ కష్టజీవులపై ఉక్కు పాదం మోపుతూ/ రాజకీయాలిప్పుడు భ్రష్టు పట్టి పోయాయి/అని అంటున్నారు.ఇవ్వాళ రాజకీయాల్లో విలువలు నశించిపోయాయి అని ఆవేదన చెందుతున్నారు. ప్రజలు రగిలే నిప్పుల భావుటాలై పోరు బాటలో సాగాలి అని స్ఫూర్తిని కలగజేస్తున్నారు.ప్రజా పోరాట యోధుడు కవితలో ఆ పేరు వింటేనే నిజాం నవాబుకు సింహ స్వప్నం/రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి అని అంటున్నారు.గట్టెపెల్లి మురళి ప్రజా పోరాటయోధుడు,తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.అట్లాంటి ఆదర్శమూర్తి ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు.మహానీయుడు గట్టెపల్లి మురళిని స్మరించుకోవడమే మనం వారికి అందించే నివాళి.ఆపాత ఘుమ ఘుమలు కవితలో ఆపాత/ఘుమ ఘుమలు/ వంటింటి పరిమళాలు/అమ్మ పోపు పెడితే/వాడంతా కమ్మని వాసన/గుప్పుమనేది/అమ్మ ఏ కూర వండుతుందో వాసనబట్టి/ఇట్టే గుర్తించే వాళ్ళం/ చిటికెడు లవంగాల పొడి వేసి సాంబారు చేస్తే/ఆ ఘాటుకు జలదోషం తోకముడిచేది/వంటింటితో అనుబంధం/ఓ మధుర స్మృతి/అని అంటున్నారు. కవి అమ్మ చేసిన వంట ఘుమఘుమలను మరిచిపోకుండా గుర్తు చేసుకున్న అనుభూతి చక్కగా ఉంది.అమరుడు అలిశెట్టి కవితలో సాహితీ కొలనులో/ఎర్రెర్రని అక్షర కలువలు పూయించి/అలతి అలతి పదాలతో/అనంత భావాలను పలికించినవాడు/దోపిడీ సమాజంపై/ మెరుపుల వంటి పదజాలంతో/కవిత్వ శర పరంపరలు సంధించి/విప్లవ సాహితీ పతాకమెగరేసినవాడు/మరణం నా చివరి చరణం కాదంటూ/ ఆఖరి క్షణం వరకు తన రచనలతో/ సామాజిక రుగ్మతలపై/ అలుపెరుగక పోరాడిన అభ్యుదయ వాది/సంపాదన కోసం ఆరాటపడక/ పీడితుల పక్షాన/నా కలం కుంచె రెండు వుంటాయని/సగర్వంగా ప్రకటించుకున్న సాహసి/ కవితాకాశంలో/రవి అస్తమించని/అక్షర సామ్రాజ్యం/ అలిశెట్టిది అని అంటున్నారు.అలిశెట్టి స్మృతి కవిత బాగుంది.గెలుపు కవితలో ప్రయత్నంలో ఎన్ని అవమానాలు/ఎన్ని అవరోధాలు ఎదురైతే/విజయం అంత గొప్పగా మలచబడుతుంది/ ఓడిపోతున్నానని/తెలిసిన క్షణంలో కూడా/పోరాడే వాడే నిజమైన ధైర్యశాలి/తీరం చేరాలంటే/ఎన్ని అలల్ని ఎదురీదాలి/వెలుగును వీక్షించాలంటే/ఎన్ని చీకట్లలోకి తలవాల్చాలి/అడుగడుగునా అడ్డుగోడలు/కాంతిలో కూడా కనిపించని చీకటి నీడలు/వాటి లోపల మెత్తని మోసాలు/ వెంటాడుతూనే వుంటాయి/వెలిగే దీపం చుట్టూ చీకటి ఉన్నట్టే/ప్రతి విజయం వెనక/లోకానికి తెలియని కష్టం వుంటుంది/జీవితాన్ని పోరాడకుండా/గెలిచినోడు వున్నాడా..?/అని ప్రశ్నిస్తున్నాడు గెలుపుకు కావలసిన స్ఫూర్తిని అందిస్తున్నాడు.అడవి కవితలో అమ్మలా అక్కున చేర్చుకుని/మన నుండి విషవాయువులను గ్రహించి/ప్రాణవాయువుని ప్రసాదించే/అడవి..జీవ వైవిధ్యం/సకల జీవులకు తోడు,నీడ/అవనికి సారం అందించే వర్ష ఋతువు/స్వచ్ఛమైన వాయువు, వానలు/మంచి జీవనమునిచ్చే అడవికి/హాని చేయకుండా/పర్యావరణాన్ని పరిరక్షిస్తూ/ప్రకృతిని ఆకుపచ్చగా ఉంచాలి/చెట్టు నుండి గుణాన్ని గ్రహిస్తూ/ఆకుల నుండి మార్పును గమనించాలి/ మానవ జీవితం అన్నిటికి ఆకర్షించబడే/ఒక అయస్కాంతం/దేనిని ఆకర్షించాలో వికర్షించాలో/ తెలుసుకోవడమే విచక్షణ/అడవిని రక్షించుకుంటూ/ మనుగడకు బాటలు వేసుకోవాలి/అలా కానినాడు./మనిషి ఒక్కడే తనకు తానే చివరకు/ అనంతానంత తిరస్కారంగా../మిగిలిపోతాడు/ అని అంటున్నారు.అడవి అంటే వృక్షాలు,మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారం తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం.అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం.అనేకమైన ఆహార పదార్థాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం.జల వనరులకు ఆలవాలం.భూమి ఉపరితలం మీద 9.4% అడవులు ఆక్రమించి ఉన్నాయి.అడవులు జీవావరణ వ్యవస్థలో ప్రకృతిలోని జీవరాశుల సమతుల్యాన్ని సాధిస్తుంది.వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి.వరదలు రాకుండా నివారిస్తాయి.కలప అతి ముఖ్యమైన ఉత్పత్తి.కలప గృహ నిర్మాణంలో,పరిశ్రమలలో ముడి పదార్థంగా వినియోగిస్తారు.మానవులు స్వార్థంతో అడవులు నరికి వేయడం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తున్నాయి.అడవులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.మనిషి – మానవత్వం కవితలో మన కోసం మనం జీవించడం గొప్ప కాదు/సాటివారి కోసం మన జీవితం/కొంత అంకితం చేయగలిగితే/అంతకు మించిన మానవత్వం/మరేముంటుంది?/ఒక మనిషి కన్నీరు తుడువ/రక్త బంధమో,స్నేహబంధమో/ఉండాల్సిన అవసరం లేదు/పిడికెడు గుండెలో/చిటికెడు మానవత్వముంటే చాలు/అంతులేని కోరికల దాహాన్ని అదుపు చేసి/పరులకు కడు మేలు కలిగేలా/తమ జీవనశైలిని రూపొందించుకొని/ మనిషికి.. మనిషి/మానసిక శాంతిని ఇవ్వగలిగాలి అని అంటున్నారు.మనిషి మానవత్వం అలవర్చుకోవాలి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నువ్వే నా లోకం కవితలో నీ ప్రేమలో తల మునుకలై/తనువంతా పులకించి,రేపవళ్లు/హాయిగా గడిచిపోవాలనిపిస్తుంది/నీ కళ్ళు ఒక్క క్షణమైనా,నా కలల నుంచి/ఎడబాయక ఉండిపోవాలనిపిస్తోంది/ నువ్వు నా దానవనే నమ్మకాన్నే/ఎదలో నింపుకొని/నీ జ్ఞాపకాలను ధ్యానిస్తున్న/నీ తలపై ఓ గడుసు పులకింత/ఒక్క గడియ నువ్వు నాకు ఎడమైతే/ యుగయుగాల ఏకాకి తనమేదో/ నాకు తెలియకుండానే నాలోకి/ఇంకిపోయినట్లుంటది/ నువ్వు లేక ఏకాంతముగా/నక్షత్రాలను వీక్షించలేను/ వెన్నెలను ఆస్వాదించ లేను/అని అంటున్నారు.కవి తనలో కలిగిన ప్రేమ భావనలను చక్కగా వ్యక్తీకరించారు.సంవేదన కవితలో మన ప్రేమ అమరం/అయినా!ఎందుకో నాకీ భయం/నా జీవన నేస్తమా!మదిలో ఏమిటీ కలవరం/పంచిన ఆనందానికి బదులుగా/మళ్లీ ఆ ఆనందం దొరుకదు.. ఎందుకని పంచిన నవ్వులకు మారుగా మళ్లీ ఆ నవ్వులు లభించవు ఎందుకనీ?/వ్యథను పెంచడమే గాని ఒక్క నిమిషం/శాంతి లభించదు ఎందుకనీ?/ నిరీక్షణల కెరటం మీద/ఎంతకాలమని తేలిపోను/ అని అంటున్నారు.వియోగం కవితలో ఏ నయనాలు నీ కోసం/నవయవ్వన సుందర స్వప్నాలు కన్నాయో/ఆ కళ్ళు..నిన్నెడబాసి దిగులుగా విలపిస్తున్నాయి/అని అంటున్నారు.ఆమె కొరకు తాను అనుభవించిన వేదనను వియోగం కవితలో చక్కగా వ్యక్తీకరించారు.
ఆశ నిండిన శ్వాస కవిత్వం
రచన : కసిరెడ్డి జలంధర్ రెడ్డి
ప్రచురణ : భవానీ సాహిత్య వేదిక,సీతారాంపూర్, కరీంనగర్ 505001.
పేజీలు : 78,
వెల:₹ 100/-
ప్రతులకు :
కసిరెడ్డి జలంధర్ రెడ్డి,
ఇంటి నెం. 8 – 3 – 159,
భగత్ నగర్,కరీంనగర్ – 505001.
స్టేట్ : తెలంగాణ,

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఇంద్ర ధనస్సు ఏడో రంగు

by Devanapalli Veenavani September 30, 2024
written by Devanapalli Veenavani

‘స్వేచ్ఛ ‘అన్న పదం ‘   స్వాతంత్య్రం ‘  కన్నా విశాలమైన అర్థం కలదని భావిస్తాను.  స్వాతంత్య్రం భౌతికమైనది ,అది అధీనతను సూచిస్తే, స్వేచ్ఛ ఆంతరంగికమైనది వ్యక్తుల ఆలోచనలను సూచిస్తుంది  .  ‘స్వాతంత్య్రం ‘లేని స్వేచ్ఛ విప్లవానికి పునాది అవుతుంది. స్వేచ్ఛ లేని  ‘ స్వాతంత్య్రం’లో  జాతి ఉనికినే  కోల్పోతుంది.  ఆది నుంచి జాతుల మధ్య  ఆధిపత్య పోరాటాలే చరిత్రను సృష్టించాయి.ప్రపంచ వ్యాప్తంగా మానవతా వాదం ముందుకు రావడం తో ఆధిపత్య ధోరణి   తగ్గినా పూర్తిగా తొలిగిపోయిందని చెప్పలేము.  అయితే ఈ మానవతా వాదం అంత సులువుగా అంగీకరించబడలేదు.ముందు దేశాల స్వాతంత్య్రం,  స్వేచ్చ , సమానత్వం, ఆయా  దేశాలు తమ సార్వభౌమాదికారాన్ని సాధించుకోవడం, విప్లవాలు మేల్కొలిపిన నైతిక భావనలు ఇవన్నీ దాని వెనుక ఉన్న నేపథ్యం.

           సార్వ భౌమాధికరం  నెలకొల్పుకొని స్వేచ్ఛాయుత  జీవనం కొనసాగించడంలో ఒక్కో దేశం ఒక్కో పంథా పాటించినా భారతదేశం సాగించిన పోరాటం మాత్రం అద్వితీయమైంది. అహింసా, సత్యాగ్రహం అనే పదునైన నైతిక ఆయుధాలతో భారతదేశం సాగించిన పోరాటం ప్రపంచ స్వతంత్ర పోరాటలలోనే  విలక్షణమైనది. అది 19 శతాబ్దపు నయా యుద్ద రీతిగా  ప్రపంచ దేశాలకు చుక్కాని అయింది.  

               భారత  స్వాతత్య్రోద్యమం పరిశీలించినట్లయితే గాంధీకి ముందు గాంధీ తర్వాత గా విభజించడం తెలుస్తుంది. గాంధీ అంతగా మన స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేయడం వెనుక ఉన్న నేపధ్యం ఏమిటి ?  దక్షిణాఫ్రికా లో గాంధీ సాధించిన విజయాలు ఏమిటి ?దక్షిణాఫ్రికాలో సాధారణ  వకీలు నుంచి ఏ పరిస్థితులు అతని ఇంతటి మహోన్నత కార్యంలో పాలుపంచుకునేలా చేశాయి ? అసలు దక్షిణాఫ్రికా కి భారతదేశానికి ఉన్న సంబంధం ఏమిటి? గాంధీ అక్కడ అంటే దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టిన ఉద్యమం ఎటువంటిది? అన్న విషయాలు నన్ను చరిత్ర చదువుకునే రోజుల్లో  ఆలోచింపజేసిన ప్రశ్నలు .  

                   వీటికి  సమాధానంగా నాకు   దొరికిన  సిద్ధాంత గ్రంధానికి సరిసమానమైన పుస్తకం  ఇంద్రధనస్సు ఏడో రంగు. నేనిప్పుడు పరిచయం చేయబోయే ఈ పుస్తకం నూటాయాభయ్యే ల్ల  ఆఫ్రికన్ జాతులు ఇంకా అక్కడ బతక వచ్చిన వివిధ దేశీయుల సంఘర్షణను సంగ్రహంగా 200 పేజీలలో  విశ్లేషణాత్మకంగా అందించిన ఈ పుస్తకం  2003లో వచ్చింది. నేను దాన్ని  ఒక చిన్న వ్యాసంలో కుదించడం  ఇప్పుడు నా ముందున్న సవాలు.   పుస్తక రచయిత పెన్నేపల్లి గోపాలకృష్ణ.1937 లో జన్మించిన పెన్నేపల్లి గారు  జామీన్ పత్రికలోనూ, ఉదయం, వార్త పత్రికలోనూ పనిచేసి 2001 నుంచి పూర్తిగా సాహిత్య వ్యాపకంలో ఉన్నారు.పెన్నేపల్లి వారి రచనల్లో ముఖ్యమైనవి ‘ఇంద్రధనస్సు ఏడో రంగు’ , ‘మధురవాణి ఊహాత్మక ఆత్మకథ’ , ‘గురజాడ డైరీస్ ‘,    ‘గురజాడ కంప్లీట్ వర్క్స్ ‘  . ఇంద్ర ధనుస్సు ఏడో రంగు పుస్తకం రాయడానికి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు కి చెందిన ఈ ఎస్ రెడ్డి ( ఏనుగు శ్రీనివాసులు రెడ్డి ) ఐక్యరాజ్య సమితి తరపున దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష విమోచన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని   సేకరించిన సమాచారంతో పాటు రచయిత మరి కొంత సమాచారాన్ని సేకరించి దీన్ని సమగ్రంగా తీర్చిదిద్దారు. ప్రతి వాక్యానికి విశ్లేషణకి ఆధారంగా ప్రతి అధ్యాయం చివర దాని తాలూకు ప్రతుల వివరాలు పొందుపరిచారు.రచయిత  2011లో వారి 73వ వయసులో మరణించారు  .ఈ వ్యాసం ద్వారా ఇంతటి సమగ్ర సమాచారాన్ని అందించిన పెన్నేపల్లి గోపాలకృష్ణ గారికి  సవినయంగా నివాళులు అర్పిస్తూ పుస్తకంలోకి వెళ్దాం.

                      దక్షిణాఫ్రికాని ఇంద్రధనస్సు దేశం అంటారు ఎందుకంటే అక్కడ స్వతహా గా  ఉండే నల్లజాతి ప్రజలు , వలస రాజ్యాలు స్థాపించిన  పోర్చుగీస్ వారు ,బ్రిటిష్ వారు , ఫ్రెంచి వారు ఇంకా బతకడానికి వచ్చిన భారతీయులు ,చైనీయులు వీరందరి సంతతి జాతులు ఇలా అనేక రకాల జాతుల సంగమంగా ఉంది గనుక దీనికా పేరు వచ్చింది. స్వతహాగా ఉన్న జాతులు ఎప్పుడూ గుర్తింపుకు నోచుకోలేదు .వారి స్థితిగతులు అత్యంత దయనీయంగా ఉండేవి.  భారత దేశం లో వలనే పోర్చుగీసు వారు దక్షిణాఫ్రికాలో మొదట  స్థావరం ఏర్పరచుకున్నారు . వారి స్థావరాలలో పని చేయడం కోసం భారతదేశం నుంచి మహిళలను బానిసలుగా  రవాణా చేశారు భారతదేశంలోని డచ్ ఈస్టిండియా కంపెనీ ఈ వ్యవహారాన్ని చూసుకునేది .బెంగాల్, బీహార్ ,ఒరిస్సా,పులికాట్ ,మచిలీపట్నం ,గోవా , బాంబే,  సూరత్ నుంచి ఎక్కువగా ఇలాంటి వలసలు జరిగాయి .కొంతమంది మహిళలు వివాహమాడి అక్కడే స్థిరపడ్డారు.ఇలా మహిళల, కూలీల రవాణా 1650 నుంచి బ్రిటిష్ సామ్రాజ్యంలో  1834లో  బానిస వ్యవస్థ రద్దు చేసే వరకు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగింది. అప్పటికీ దక్షిణాఫ్రికాలో డచ్ ఆధిపత్యం లో వలస పాలన ఉండేది.

 భారత్ లో   బ్రిటిష్ ప్రభుత్వం 1860 నుంచి కొత్త చట్టం  Indentured Labour Act ద్వారా వలస దేశాలకు కూలీలను రవాణా చేసింది .ఈ చట్టంలో,  కూలీగా వెళ్లిన వ్యక్తి ఐదు సంవత్సరాలు కాంట్రాక్టు  కూలిగా మరొక ఐదు సంవత్సరాలు స్వతంత్ర కూలీగా పని చేయవలసి ఉంటుంది . కూలీ యజమానికి ఎదురు తిరిగిన పక్షంలో  కొరడా దెబ్బలు తినవలసి ఉంటుంది. అయినప్పటికీ 1860 లలో భారత దేశంలోని తీవ్ర క్షామ పరిస్థితులలో పేద ప్రజానీకం దేశం విడిచి వెళ్లారు. ఆచరణలో ఈ చట్టం ప్రకారం వలస కూలీల జీవనం దుర్భరం కావడంతో ఇది బ్రిటీష్ సామ్రాజ్యానికి చెడ్డపేరు తేవడంతో కూలీల రవాణా ప్రోత్సహించడం  కోసం 1874లో  కొరడా శిక్షను   రద్దు చేేశారు. కూలీల కనీస సౌకర్యాలు లేకపోవడం ,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రి 9 గంటల తర్వాత భారతీయులు వీధులలో తిరగకుండా నిషేధం చిన్న చిన్న తప్పులకు జైలు శిక్షలు, యజమానులు  పెట్టే బాధలు ,చాలీచాలని జీతాలు ,అనారోగ్యం భారతీయ కూలీలు తిరిగి వెళ్ళలేక అక్కడ ఉండలేక ఇబ్బందుల పాలయ్యారు.

          ఇక  వ్యాపార నిమిత్తం దక్షిణాఫ్రికా కి వలస వచ్చిన రెండో వర్గం” ఫ్రీ పాసెంజర్ “ల పేరుతో వ్యవహారించబడ్డ వీరు  ఎక్కువగా గుజరాత్ నుంచి వచ్చారు . అయితే ఈ రకమైన వ్యాపార వర్గం ఉండడం ఇష్టం లేని ప్రభుత్వం భారతీయుల వల్లనే అనేక రకాల కష్టనష్టాలు వస్తున్నాయని ,అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయని ,రకరకాల జబ్బులు వస్తున్నాయని ఆరోపించి ఈ వలసలు తగ్గించడానికి  జస్టిస్ రాక్ విచారణ కమిషన్ 1857లో ఏర్పాటు చేసి నియంత్రణ విధించింది.అయినా వలసలు తగ్గక పోవడంతో 1895లో ఇమిగ్రేషన్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం భారతదేశం స్థిర నివాసం ఏర్పర్చుకునే భారతీయులు తలకు మూడు పౌన్లు  చెల్లించాలి కాంట్రాక్టు కూలీలు ఉండవచ్చు కానీ స్వతంత్ర కూలీలు పన్ను  చెల్లించి లైసెన్స్ పొందాలి.

పంతొమ్మిది వందల 1897లో మరింత కఠినంగా డీలర్స్ లైసెన్సింగ్ యాక్టర్ ప్రకారం అకౌంట్ లన్ని ఇంగ్లీష్ లోనే ఉండాలి లైసెన్స్ అధికారం ప్రభుత్వానిదే దానిమీద అప్పీల్ చేసుకునే అధికారం వ్యాపారికి ఉండదు.1885లో ఉన్న మరో చట్టం  ప్రకారం 25 పౌండ్లు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించిన భారతీయులకు మాత్రమే ట్రాన్స్వాల్ లో నివసించే హక్కు ఉంటుంది. డచ్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి భారతీయుల కొరకు బజార్లు అనబడే వెలి వాడలు కేటాయించాలని అవి దాటి రాకూడదని వ్యాపారులు కూడా వ్యాపారాలు సాధించుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని చట్టం చేశారు .ఆ విధంగా భారతీయులు కూలీలు మాత్రమే అంతకుమించి అంటరానివారు కూడా. అలాంటి పరిస్థితిలో గుజరాత్ వ్యాపారుల తరఫున న్యాయవాదిగా దక్షిణాఫ్రికా చేరిన గాంధీ 1894లో తిరిగి భారత్ రావాలని అనుకున్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు అక్కడే ఉండి భారతీయుల సమస్యలని పరిష్కారం దిశగా నడిపించాలని తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు .

మొదట మహర్జీల ( మహా ఆర్జీ) పోరాటం. భారతీయుల సమస్యలన్నీ ఆర్జీ రూపంలోప్రభుత్వానికి సమర్పించారుఅయితే వాటికి ప్రభుత్వం నుంచి ఏమాత్రం పరిష్కారం దొరకలేదు   ఆ  కాలంలోనే  జరిగిన  బోయర్ యుద్ధంతో  (అంటే డచ్ తో ఆధిపత్యం కోసం బ్రిటిష్ వారు  చేసిన యుద్ధాలలో ) బ్రిటిష్ వారి అధికారం 1904లో స్థిరపడింది.అప్పటికి గోపాల కృష్ణ గోఖలే గాంధీ మరికొంతమంది మితవాదులు భారతదేశంలోని దక్షిణాఫ్రికాలో ఓకే సామ్రాజ్యవాదం భారతీయుల సమస్యలు పరిష్కరించబడని అందుకు తగిన అహింసాయుత పోరాటం సరిపోతుందని భావించారు. భారత్ లోనూ దక్షిణాఫ్రికాలోనూ  ఒకే వలస ప్రభుత్వం ఉన్నది కనుక సామరస్యంగా సమస్యలు పరిష్కరించాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బ్రిటిష్ వారు రూపొందించిన భారతీయుల తప్పని సరి  రిజిస్ట్రేషన్ చట్టం( 1906) నల్ల  చట్టం గా పేర్కొంటూ మొదటి సత్యాగ్రహ  ఉద్యమం చేశారు.గాంధీకి సంకెళ్లు వేసారు. సత్యాగ్రహం ఒక పదునైన ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకున్న సంఘటన ఇదే.ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాలేదు.కాకపోతే 1911లో అప్పటి భారత ప్రభుత్వం వలస కూలీ చట్టం రద్దు చేసింది.

                ఇక దక్షిణాఫ్రికా లో 1910 నుంచి నాలుగు వలస ప్రభుత్వాల స్థానంలో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడింది.  ఇప్పుడు మరో మెలిక.. కేవలం క్రైస్తవ పద్దతిలో జరిగిన వివాహాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని. అలా 1913 లో మరింత విశాల భూమికగా మరో సారి సత్యాగ్రహం మొదలైంది.దీన్ని మహాయత్ర గా పేర్కొంటారు. ఉద్యమంలో శ్రామిక వర్గం ప్రవేశించడం ఒక మలుపు.దీని ఫలితంగా ఇండియన్ రిలీఫ్ ఆక్ట్ ఏర్పడింది. గాంధీ ఈ చట్టాన్ని భారతీయుల మాగ్నాకార్టా గా వర్ణించాడు ఆధునిక కాలంలో ఏ ఉద్యమమూ సాధించని ఫలితాలను సత్యాగ్రహం సాధించగలదని గుర్తించాడు.

 ఆ తర్వాత  1914లో  దాదాపు 24 ఏళ్ల ప్రవసాన్ని వదిలి   గాంధీ భారత్ కి వచ్చేశారు. హెర్మన్ కాలాంబక్  అనే గాంధీ అనుచరుడు ఇచ్చిన 1100 ఎకరాల భూమిని గాంధీ ‘టాల్ స్టాయ్ ఫామ్ ‘ పేరుతో  సత్యాగ్రహుల స్థావరం నెలకొల్పారు . ఏమిదేళ్ల పాటు  ఇక్కడినుంచే గాంధీ కార్యకలాపాలు చేసేవారు.గాంధీ వచ్చేసాక భారతదేశంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మరి దక్షిణాఫ్రికా భారతీయుల పోరాటం ఏమయ్యివుంటుంది ?

భారతీయులను  వలస ప్రభుత్వం రూపొందించిన క్లాస్ ఏరియాస్ చట్టం, పెగ్గింగ్ చట్టం వంటి చట్టాలతో వేధించినా భారతీయ సంతతి నాయకులు యూసఫ్ దాదూ, తంబి నాయుడు , ఆఫ్రికన్ నాయకులు ముఖ్యంగా మండేలా ఈ పోరాటం ఒక సమూహం తోనూ జరిగేది కాదని అందరూ కలిసి వలస ప్రభుత్వాన్ని ఎదిరించాలని నిర్ణయించుకుంటారు .పోరాటం శాంతియుతమా సాయుధమా… ఇలా అనేక రకాల సంఘర్షణలు దాటి 1961లో అంటే భారతీయులు దక్షిణాఫ్రికా వచ్చి నూ రేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో గణతంత్ర దేశంగా మారింది. అదే  సంవత్సరం  మండేలా నాయకత్వంలో దక్షిణాఫ్రికా విమోచనోద్యమం లో సాయుధ పోరాట దశను ముగిస్తూ స్పియర్ ఆఫ్ ద నేషన్  అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. అనేక పోరాటాల తర్వాత 1994 లో మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకొని  నిజమైన గణతంత్ర రాజ్యం గా నిలదొక్కుకుంది ఈ వివరాలన్నీ మండేలా జీవిత చరిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లో చదవ వచ్చు.

ఇక పుస్తకం రెండవ భాగంలో  ఇచ్చిన దక్షిణాఫ్రికా విమోచనద్యమ భారతీయుల వివరాలు పొందుపరచడం వారి త్యాగానికి నివాళిగా భావించవచ్చు.వారిలో వల్లియమ్మ.17 ఏళ్ల వళ్ళీయమ్మ మాతృ భూమి కోసం ప్రాణత్యాగం చేసిన తొలి దక్షిణఆఫ్రికా భారతీయ మహిళగా గుర్తించబడుతుంది. ఈమె స్మారకంగానే తమిళనాడు ప్రభుత్వం 1982 లో మద్రాసులోని చేనేత కార్మిక సహకార సంఘానికి ‘తిల్లైయాడి వళ్ళియమ్మ మాలిగై ‘అన్న పేరు పెట్టిందిట. గాంధీ చేతి కర్ర అనబడే తంబి నాయుడు, నానా సీత , యూసఫ్ దాదూ, నారాన్ ముఖ్యులు.

తంబి నాయుడు తన నలుగురు పిల్లలు  బాల, బాల భారతి, నారాయణ్ స్వామి, ఫక్రీ లను గాంధీ దంపతులకు శాస్త్రోక్తంగా దత్తత నిచ్చారట.  వీరికి గాంధీ పట్ల ఉన్న అనుబంధంతో వీరిని గాంధీ ముత్యాలు( FOUR PEARLS OF GANDHI )అని పిలిచేవారట. వీరు గాంధీ ఇండియాకు వచ్చిన తర్వాత రవీంద్రుని శాంతినికేతన్ లో 1933 వరకు ఉండి తిరిగి దక్షిణాఫ్రికాకు వచ్చి దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో మహిళలు కూడా పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు శాంతి, ఇలా గాంధీ , ఫిల్లిస్ నాయుడు, అమీనా, ఫతిమా మీర్.ఫతిమా మీర్ రచయిత.  ఇండియన్ వ్యూస్ అనే వార పత్రిక నడిపేవారు. ఆమె 40 పుస్తకాలు రాశారట . దక్షిణాఫ్రికాను కుదిపేసిన వందమంది మహిళల్లో ఒకరిగా ఈమెకు గుర్తింపు ఉన్నది. “Higher than hope : Rolihlahla We love you ” –  నెల్సన్ మండేలా జీవిత చరిత్ర  ఈమె రాసిందే. ఇండియా లో శ్యామ్ బెనెగల్ నిర్మించిన మహాత్మా  ఇన్ మేకింగ్ అన్న సినిమాకి ఈమె రచనలే ప్రామాణికంగా తీసుకున్నారట.ఇలా నేను అనేక విషయాలను కొత్తగా ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. చివరగా   ఇంద్ర ధనుస్సు ఏడో రంగు అంటే ఎరుపు రంగు, ఎరుపు చైతన్యానికి చిహ్నం. దక్షిణాఫ్రికా ఉనికిని, విమోచనోద్య మాన్ని సంయుక్తంగా ధ్వనించే పేరుతో ఈ పుస్తకం.భారతీయుల సాధికార పోరాటానికి సంగ్రహ రూపం.

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

సెప్టెంబర్ మయూఖ పత్రిక – విషయసూచిక

by mayuukha September 30, 2024
written by mayuukha

కవితలు:-

1 నీవెక్కడ నేనెక్కడ- చిట్టిప్రోలు వెంకటరత్నం

2. రెక్కలు,- పెద్దూరి వెంకట దాసు

3. నానీలు- జి. సులోచన

4. నవ్య కలం సినారె- డాక్టర్ వసుంధర, చెన్నై

5. శనార్తులు – దేవనపల్లి వీణా వాణి

6. వర్షం వర్షం వర్షం – మహమ్మద్ అబ్దుల్ రషీద్

7. ఉదయ సంధ్యలో- లక్ష్మీ త్రిగుళ్ళ

8. అంగూరు గుత్తులు- రమేష్ నల్లగొండ

9. కల్తీ యుగం -రుద్రాక్షల మఠం ప్రభులింగ శాస్త్రి

10. ఆత్మ సౌందర్యం- రాధిక సూరి

11. వృక్ష మాత- పద్మశ్రీ చెన్నోజ్వల

12. సహన ధాత్రి- అరుణా ధూళిపాళ

13. మహిళా చైతన్యం-కీర్తి శేషులు గొడవర్తి సంధ్య

కథలు:-

1 పాద యుగళం – ధర్మముళ్ళ చంద్రశేఖర్

2. కుజదోషం- డాక్టర్ మజ్జి భారతి

3. మరుగుజ్జు బుద్ధులు – శీలా సుభద్ర దేవి

4. కుబేర- ఒద్దిరాజు సుభాష్ చంద్ర

5. నా ఇల్లు- కథ రెండవ భాగం లక్ష్మీ మదన్

6. సభ్య సమాజం -నారాయణరావు (తరానా)

7. తనూజ లక్ష్మీ త్రిగుళ్ళ

వ్యాసాలు :-

1. లేఖ సాహిత్యంలో భాషా విశేషాలు- డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి

2. తొలి తెలుగు కవయిత్రి మొల్ల- విజయ రంగనాథం

3. నాకు తెలిసిన బిఎస్ రాములు డాక్టర్ భూతం ముత్యాలు

4. తోరణాలు – విజయ కందాళ

5. తెలంగాణ ఉద్యమ కవి కాళోజి – డాక్టర్ అరుణపరంధాములు

6. తెలంగాణ భాషా దినోత్సవం- డాక్టర్ చీదర్ల సీతాలక్ష్మి

7. తంజావూరు కవయిత్రి- మధురవాణి విజయ రంగనాథం

8. ఇల్లు మనిషి చిరునామా,- ఆచార్య కడారు వీరారెడ్డి

9సాహితీ సిరిమల్లి మన వడ్డేపల్లి- డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్

10. కవిత్వాస్వాదన – ఈశ్వర్ చరణ్ కవిత ఉషస్సు సంధినేని నరేందర్

11. జాతీయాలు -రంగరాజు పద్మజ

12. ఇంద్రధనస్సులో ఏడోరంగు- దేవనపల్లి వీణా వాణి

13. విద్యుత్కవి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ – ఎన్.నరేష్ చారి

14. విశ్వ కవి  – మన కవి-రవీంద్రనాథ్ ఠాగూర్ -రాధిక సూరి

15. గూటి పక్షులు గులాబీ ముళ్ళు పద్మశ్రీ చెన్నోజ్వల

16. మహాప్రస్థానం మళ్లీ చదువుదాం – కె.కె.తాయారు

17. శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ – కీర్తిశేషులు గొడవర్తి సంధ్య

ధారావాహిక:-

జీవన మాధుర్యం 2 వ భాగం

బాల సాహిత్యం:-

1.ఓ మేక ఓ తోడేలు (అనువాద కథ) ఒద్దిరాజు మురళీధర్ రావు

2.ఆర్మీ వీరుడు – దార ప్రీతిక

ఇంద్రధనస్సు:-

1. మన ఉపాధ్యాయుడు – ముదుగంటి ప్రతాప్ రెడ్డి – సందినేని నరేందర్

2. వేగుచుక్కలకే వేగుచుక్క – రంగనాయకమ్మ – రంగరాజు పద్మజ

3. ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ- వలిపె రామ్ చేతన్

4. కరణ్  బజాజ్ – నారాయణ రావు ( తరానా)

5. సాహిత్యాన్ని ప్రేమించిన కవయిత్రి గొడవర్తి సంధ్య గారికి శ్రద్ధాంజలి

-మయూఖ సంపాదకులు

ఇంటర్వ్యూ లు

1 బహుముఖ ప్రజ్ఞాశాలురు – సంగనభట్ల నరసయ్య గారు-అరుణ ధూళిపాళ

2

పుస్తక సమీక్షలు:-

1. విజ్ఞానం కలిగించే ఆయుధం ఆనందలహరి

-నన్నపురాజు విజయశ్రీ

2. కళ్యాణం శ్రీనివాస్ “పిడికిలి”

— నరేందర్ సాదినేని

3. మాటల చెట్టు మాటలు:-

-కట్టెకోల విద్యుల్లత

అనువాద సాహిత్యం:-

1. “గుల్జార్ షాయరీ” గీతాంజలి విశ్లేషణ -నరేందర్ సందినేని

2. పాఠశాల అనే విశాల భావం ముందు ఎవరు తెలుసుకున్నారు! (అనువాద కథ)-ఒద్ది రాజు మురళీధర్ రావు

3. “వచన కవితగా…”- (అనువాద కవిత)-ఎలనాగ

4. “మీ ఔర్ మీరా ఆంగన్”( అనువాద కవిత)

మూలం : వారాల ఆనంద్

 విజయ రంగనాథం (హిందీ అనువాదం)

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

శబ్దసంపదను పెంచుకోవాలి- అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి – డా.గండ్ర లక్ష్మణ రావు

by Ananthaacharaya K.S. September 30, 2024
written by Ananthaacharaya K.S.

డా.గండ్ర లక్ష్మణ రావు గారితో ముఖాముఖి

కే.ఎస్‌ : నమస్కారం సర్

గండ్ర : నమస్కారం అనంతాచార్యా

కే.ఎస్‌. .మీది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం.పంటలు, పశువులు ఆ నేపథ్యం లోంచి పద్యం పట్ల సాహిత్యం పట్ల అభిరుచి ఎట్లా మొదలయింది. ? బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఎవరి ప్రభావం వల్ల మొదలయింది.?
గండ్ర : మాది పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. మా బాపు చదువుకున్నవారు. ఆరోజుల్లో మూడవ తరగతి అనుకుంటా. కాని భారత, భాగవత , రామాయణాలుచదివేవారు, వాటిలోని అనేక కథలు రాత్రులు కల్లాల దగ్గర చెపుతుండేవారు. సాయంకాలాలు ఇంటి ముందర కూచొని వచ్చినవాళ్ళతో అవీ ఇవీ మాట్లాడుతూ ఏదో ఒక కథ వాటిల్లోంచి చెపుతుండేవారు. వేసవికాలం రాత్రులు ఆరుబయట మంచంలో పడుకొని పద్యాలు వల్లెవేయించేవారు. హరియను రెండక్షరములు వంటి భాగవత పద్యాలు నోటికి చదివించేవారు.
మా ఇంటి వెనుక తోటలుండేవి. వాటికి మోటలు కొట్టి నీరు పారించేవారు. అప్పుడు పాలేర్లు పోటీలు పడి పాటలు పాడేవారు. ఇంటికి వచ్చిన రకరకాల బిచ్చగాళ్ళు పదాలో పాటలో పాడేవారు. ఇవన్నీ చిన్నప్పుడు నన్నాకర్షించాయి. ఊరిలో కొందరు పద్యాలు, పాటలు కీర్తనలు చదివేవారుండేవారు. ఆయా సందర్భాలలో వారిని చూశాను. విన్నాను. హరికథలు , బుడిగ జంగమవారి కథలు, చిరుతల రామాయణం నాటకాలు, భాగవత నాటకాలు మొదలైనవి మా ఊరి వారే ప్రదర్శించేవారు. ఇంట్లో మా అమ్మ దగ్గరనుంచి ఇంటి చుట్టు ఉన్నవారు ఇతరులు అనేక సందర్భాలలో మాట్లాడే మాటాల్లో దొర్లే సామెతలు బాగా ఆకర్షించేవి.  ఇట్లా అనేకానేక గ్రామీణ సాంస్కృతిక వాతావరణం నాకు తెలియకుండా నన్ను సాహిత్యం వైపు మళ్ళించింది. నా చిన్నతనంలో మూడవ తరగతి, నాలుగ తరగతిలో నా చేత వారు రాసిఇచ్చిన ఉపన్యాసాలు ఇప్పించేవారు. నేను బాగా చదివి నిర్భయంగా నోటికి చెప్పేవాడిని అదే నన్ను ఇప్పుడు వేదికలమీద నిలబెట్టింది.

కే.ఎస్‌, అకాడెమిక్‌ గా బి.ఎస్‌.సి గణితం చదివిన మారు సాహిత్యం వైపు ఎట్లా మరలారు? అట్లా సాహిత్యం వైపునకు రావడానికి దిక్సూచి ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? ..
గండ్ర :  నేను చిన్నప్పటి నుండి గణితంలో చురుకుగా ఉండేవాడిని. మా ఊరులో చదువుకునేటప్పుడు వేమన పద్యాలు, సుమతి పద్యాలు చెట్ల కింద కూర్చోబెట్ట వల్లింప జేసేవారు. బాల ప్రసాద్‌ అనే టీచరు మా ఇంట్లోనే ఉండేవారు. ఆయన సాహిత్యం పట్ల అభినివేశం గలవారు. మాచేత మాటలు, పాటలు, పద్యాలు చదివించేవారు. నాటకాలు వేయించేవారు. హైస్కూలులో తెలుగు అధ్యాపకులు పలుగులు భూమారెడ్డి పద్యాలు చాలా అందంగా చదివేవారు. డిగ్రీ చదివేటప్పటికే గణితంతో పాటు సాహిత్యం మీద రుచి పెరిగింది. పి.యు.సి.చదివేటప్పుడు మా కాలేజికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు, డా. సి.నారాయణ రెడ్డ గారు వచ్చారు,  గొల్లపూడి మారుతీరావు వచ్చారు, ఇట్లా నాలో అంకుర రూపంగా ఉన్న సాహిత్యాభిలాషకు ఈ అన్ని సన్నివేశాలు నీరుపోసి పెంచాయి. డిగ్రీలో ఉండగా 1969లో సెకండ్‌ ఇయర్‌. తెలంగాణ నాన్‌ ముల్కీ ఉద్యమం వచ్చింది. ఒక సంవత్సరం కళాశాలలు మూతపడ్డాయి. ఆ సంవత్సరమంతా నేను విపరీతంగా సాహిత్యం చదివాను. అందుకు దోహదం చేసింది, ప్రోత్సహించింది, ఏవి చదవాలో చెప్పిన వారు కోవెల సంపత్కుమారాచార్యులు. అప్పుడు వారు మాకు తెలుగు ఉపన్యాసకులు. వట్టి గాలి చదువునుండి అచ్యమైన సాహిత్యం వైపు మళ్ళించిన వారు సంపత్కుమారగారు. అప్పుడే విశ్వనాథ, అడవిబాపిరాజు,కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ,ఆరుద్ర, దాశరథి, కాళోజి( జీవనగీత), బాపురెడ్డి  మొదలైన వారిని అత్యంత ఆసక్తితో అభిమానంతో చదివాను. అంతేకాదు సింహాసన ద్వాత్రింశిక, హరవిలాసం, ప్రభావతీ ప్రద్యుమ్నము, కళాపూర్ణోదయము మొదలైన ప్రబంధాలు చదివాను. ఆరుట్ల భాష్యాచార్యులుగారు మాకు మరో తెలుగు ఉపన్యాసకులు వారి వద్ద చనువుతో అనేక విషయాలు అడిగి తెలుసుకునే వాడిని. అప్పుడు మా ప్రిప్పిపాల్‌ కొండలరావుగారు. అయన ప్రతి సబ్జుక్టులో  వారం వారం సెమినార్లు నిర్వహించే వారు. శ్రీశ్రీ పై జరిగిన సెమినార్‌ లో నేను ప్రసంగం చేశాను. నాకు హైస్కూలునుండి సహవిద్యార్థి మిత్రులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య నేను కలిసి ఆముక్త మాల్యద, మనుచరిత్ర ,వసుచరిత్ర వంటివి వేదం వారి టీకాతో ఉన్నవి కలిసి చదివాం. అట్లా గణితం మీదనుండి తెలుగుకు ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది.

కే.ఎస్‌…సీరియస్‌ గా సాహిత్యం చదువుకున్న మీరు అధ్యయనం,అధ్యాపనం, సృజన మూడింటిని ఎట్లా సంయమనం చేశారు? మూడింటిని ఎట్లా సమాంతరం చేశారు?
గండ్ర : అధ్యయనం నా నిత్యజీవితంలో భాగమయింది. ఇప్పటికీ రోజూ ఏదో ఒక పుస్తకం చదువకుండా ఉండలేను. అధ్యాపనం కోసం కూడా పుస్తకాలు చదివేవాడిని. పాఠం చెప్పడం కోసం ఆయా పాఠాలు ఉన్న కావ్యాలు, కవుల గురించి అధ్యయనం చేసేవాడిని. ఎం.ఏ లో ఆచార్య దివాకర్ల వేంకటావధాని, డా. సి.నారాయణ రెడ్డి, జి.వి. సుబ్రహ్మణ్యం వంటి వారు ఎన్నెన్ని పుస్తకాలు ఉటంకించేవారో చూసి ఆశ్చర్యమనిపించి అట్లా అనేక రచనలు చదవాలని అధ్యయనం పట్ల మరింత ఆసక్తి కలిగింది. ఎన్నిసార్లు చెప్పిన పాఠమయినా క్లాసుకు పోయే ముందు తప్పక మరోసారి ఇంటి దగ్గరైనా చదివేవాణ్ణి. ప్రతిసారి కొత్త విషయాలు స్ఫురించేవి. అవి అధ్యయనం వల్ల కలిగిన మేలు. అధ్యాపనం నాకు చాలా ఇష్టమైన వృత్తి. పాఠం చెపుతున్న ప్రతి గంటా నా ఆయుస్సును పెంచుతుంది,,,,, అని నేను ఒక కవితలో రాసుకున్నాను. నా ఆరోగ్య రహస్యం ఏమిటని చాలామంది అడుగుతారు. ఒకటి అధ్యయనం, రెండవది అధ్యాపనం. వీటిలో మురిసపోయిన నేను సృజన వైపు చాలాకాలంగా దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడు మాత్రమే రాసేవాడిని. మూడింటిలో రెండింటికే ఎక్కువ ప్రాధాన్యత. తరువాత అధ్యాపకుడి మలిథలో సృజనవైపు ఎక్కువ దృష్టి పెట్టాను.

కే.ఎస్‌……సాహిత్య సంస్థల నిర్వహణలో మీ పాత్ర గొప్పది. అధిక సమయం వెచ్చించారు. అది మీ సృజనాత్మక పైన ఎంత వరకు ప్రభావం చూపించింది? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు?
గండ్ర :  కరీంనగర్‌ లో 1978లో పనిచేస్తున్నప్పుడు మా సహచర ఉపన్యాసకుడు డా. గోపు లింగారెడ్డి జానపద సాహిత్య పరిషత్‌ రాష్ట్ర కార్యదర్విగా కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుడు నాయని కృష్ణకుమారిగారు అధ్యక్షులు. కరీంనగర్‌లో ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నిటిలో నన్ను భాగస్వామిని చేయడమే కాక జిల్లా కార్యదర్శిగా పెట్టారు. వాటితో పాటు ఆయా కవులు జయంతుల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సమయానికి రావలసిన ప్రసంగం చేయాల్సిన వారు రాకపోతే నా చేత మాట్లాడించేవారు. తరువాత నూకలమర్రి గంగయాచారి కరెంటు ఆఫీసుల పనిచేసే అతను సమతా సాహితి అని ఏర్పాటు చేపి నన్ను, డా.బి. దామోదర్‌ రావును, డా.డింగరి నరహరి ఆచార్యను, త్రిపురారి సోమేశ్వర శర్మను, పర్శరామారావును, గజేందర్‌ రెడ్డిని కార్యవర్గ సభ్యులుగా నియమించి ఆయన స్వయం సౌజన్యంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఒక విధంగా మా సమయమంతా ( కాలేజి అయినాక) వాటికే గడిచిపోయింది, .. సాహితీ గౌతమి ఏర్పాటు, సినారె పురస్కారం ఏర్పాటు ఆయా కార్యక్రమాలు , అప్పుడే సమైక్య సాహితి , మాడిశెట్టి గోపాల్‌, కె.ఎస్‌అనంతాచార్య  ప్రారంభించడం ఇట్లా కరీంనగరం సాహిత్య వాతావరణాన్ని పెంచాయి. ప్రతి సాహిత్య కార్యక్రమంలో నేను నిర్వాహకుడిగానో, వక్తగానో, ఆయా పనులు చేసేవాడిగానో పాల్గొనని సందర్భం లేదు. ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం తప్పనిసరి అయింది. నెహ్రూ యువకేంద్ర విద్యాసాగర్‌ రావుగారు కో ఆర్డినేటర్‌ గా అనేక కార్యక్రమాలలో మమ్ములను భాగస్వాములను చేశారు. మా సహోపన్యాసకులు పార్వెళ్ళ గోపాల కృష్టగారు అవధానాలు చేశారు.సమతాసాహితి, సాహితీ గౌతమి సంస్థలకు అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పనిచేశాను, ఈ కార్యక్రమాల, సంస్లల నిర్వహణ నా సృజనాత్మక దృష్టికి ఆటంకమే అయినాయి. మిత్రులు కూడా మీరు ఈ పనులు మానేస్తే చాలామంచి కవిత్వం, రచనలు చేస్తారు అని అంటుండేవారు. అయితే నా రచనలే కాదు ఎంతో సాహిత్యం ఉంది, అది అధ్యయనం చేసే ఒక ప్రేరణ కలగాలని, కొత్త వారికి సాహిత్యం పట్ల ఉత్సాహం కలిగించాలని ఎక్కువ ఆరాటపడ్డాను.

కే.ఎస్‌…..కవిత్వంలో నీవు అనే ఆది మకుటంతో శతకం రాశారు. ప్రయోగాత్మక మయిన ఆ శతకం గురించి వివరించండి. తెలుగు సాహిత్య ప్రపంచంలో దానికి లభించిన స్థాన ఏమిటి?
గండ్ర : పద్యం చదవడం, అంటే ఇష్టపడే నేను పద్యాలు రాస్తుండే వాడిని. డిగ్రీలో ఉన్నప్పుడే నేను అనుమాండ్ల పద్యాలు రాశాం. ఎం.ఏ లో జి.రామశేషయ్య నేను ఒకే గదిలో అద్దెకు ఉండి కలిసి చదువుకునేవాళ్ళం. అప్పుడు మేం పద్యాలురాశాం. కృష్ణాపత్రికలో అచ్చయినాయి. మళ్ళీ చాలాకాలానికి పద్యాలు రాశాను. అయితే అప్పటికే ఉపనిషత్తులు అధ్యయనం చేయడం వాటి గురించి వ్యాఖ్యానాలు, భాష్యాలు వినడం చదువడం నన్ను బాగా ప్రభావితుడ్ని చేశాయి. అట్లా తత్వమసి అనే భావనను తెలుగులో నీవు అనే పేరుతో సంబోధించి కొన్ని పద్యాలు తాత్విక భావనతో రాశాను. అందులో మిగతా శతకాల వలె ఏ దేవుని సంబోధన గాని, పేరుగాని ఉండదు.తత్వం మాత్రమే ఉంటుంది. ఆ విషయం కొంత కష్టమే, దాంతో పాటు నీవు అనేది నొక్కి చెప్పాలని ప్రతి పద్యం అట్లే మొదలయితే బాగుంటుందని అనుకొని అట్లారాశాను. అప్పుడు ఛందోపరమైన ఇబ్బందులున్నాయి. కాని వాటిని అదిగమించ గలిగాను. అది కూడా వీలయినంత వరకు తెలుగులోనే, సంస్కృత సమాస ప్రయోగాలు లేకుండా చేశాను.
                ఈ శతకానికి చాలా ప్రశంస వచ్చింది. మా రామశేషయ్య బాగా ప్రోత్సహించాడు. తరువాత మాదిరాజు బ్రహ్మానందం, గిరిజామనోహరబాబు, సంగనభట్ల నరసయ్య వంటి వారు అమితంగా ఆదరించారు. కపిలవాయి లింగమూర్తిగారు, సముద్రాల లక్ష్మణయ్యగారు, కోవెల సుప్రసన్నగారు అభినందించి ఆశీర్వదించారు. తెలుగులో ఏకప్రాస శతకాలు గతంలో ఒకటి రెండు వచ్చాయిగాని ఆది మకుటంతో రాలేదు. ఇదే తొలి ప్రయోగం. మహామహోపాధ్యాయ, పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారథిగారు ఈ శతకాన్ని చదివి పాతిక పైగా ప్రశంసా శ్లోకాలు రాశారు.అంత బాగున్నాయి పద్యాలు అని మెచ్చుకున్నారు. మహామహోపాధ్యాయులు అవధాని శ్రీ తిగుళ్ళ శ్రీ హరిశర్మగారు సంస్కృతంలోకి అనువాదం చేస్తున్నారు.

కే.ఎస్‌…. పద్యంతో పాటు ముగ్గు, వర్తమాన సంధ్య, శతద్రు లాంటి వచన కవిత్వం కూడా రాశారు. ఆధునిక ప్రాచీన సాహిత్యాలలో మీరు దేనిని ఎక్కువ ఇష్ట పడతారు? ఏది రాయడం మీకు సులువు, అభిమానం?
గండ్ర : కవిత్వం పద్యమైనా, గేయమైనా, వచన కవిత్వమైనా ఇష్టమే. వచన కవిత్వం ఈనాడు ప్రాచుర్యంలో ఉన్న రూపం. నేను కూడా అట్లా వచన కవిత్వం రాశాను. సంపత్కుమార వంటి వారితోపాటు సినారె, శేషేంద్ర, కాళోజి  మొదలైన వారి అధ్యయనం ప్రభావం ఎక్కువ.
ఏది సులభం అని ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కవికి ఒక భావన వచ్చినపుడు అది తన రూపాన్ని తానే ఏర్పరుచుకొని బయటికి వస్తుంది.  ఆ రావడం ఒకసారి గేయంగా కావచ్చు, పద్యం గా కావచ్చు, వచనంగా కావచ్చు. తనంతగా వచ్చిందే సరిగ్గా ఆ భావానికి తగిన రూపమవుతుంది. ఈ భావాన్ని నేను పద్యంలో చెపుతాను, వచనంలో చెపుతాను అని అనుకొని రాయడం కృత్రిమమే అవుతుంఇ.  నీవు కవీంద్రులన్‌ కవివి…. అని ఉత్పలమాల ఛందస్సులో ఆరంభం వచ్చిందంటే మిగతాది అందులో కుదిరిపోతుంది. నేను పనిని ప్రేమిస్తాను…. అని వచ్చింది వచనకవిత్వమే అది అందులోనో సరిపోతుంది…. భావానికీ రూపానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. నేను పద్యాలు, వచన కవిత్వం రెండూ విరివిగా చదివిన అనుభవం ఉండటం వల్ల ఏది ఎట్లా వస్తుందో అట్లా రాశాను. శతద్రులో వట్టి వచనంలాంటి వాక్యాలు అట్లే ఉంచాను. వాటిని విరగ్గొడితే కవిత్వం కాదు. వాటిలో కవితా లక్షణముంటే అది కవిత్వమవుతుంది.అది వచనమైనా పరవాలేదు.

కే.ఎస్‌…..కవి సమ్రాట్‌ విశ్వనాథ నవలపై మీరు పరిశోధన చేశారు, దాంతో మీరు విశ్వనాథ అభిమానులు, ఆయన శిష్యులకు ప్రతిరూపం అంటారు మిమ్మల్ని, మీరెట్లా భావిస్తారు?
గండ్ర : విశ్వనాథను నేను చదువుకునే రోజుల్లో బాగా చదివాను. ముఖ్యంగా నవలలు  వేయిపడగలు, సముద్రపుదిబ్బ, శార్వరి నుండి శార్వరిదాక, కుణాలుని శాపము, దమయంతీ స్వయం వరం, చెలియలి కట్ట , ఏక వీర ఇట్లా ఎన్నో , పైకి చదివితే మా తో పాటు రూంలలో ఉన్న విద్యార్థులు, మా ఇంటి ఓనర్లు చదువురాని వారు కూడా విని రోజూ చదువుమనే వారు. ఆవిధంగా విశ్వనాథ పై అభిమానం కలిగింది. కాకతీయలో ఏ అంశం పై చేస్తావన్నప్పుడు ఏ ఆలోచించకుండా వేయిపడగలు అన్నాను. అప్పటికి దానిగురించి ఇది చేయాలని అనుకోలేదు. అంతగా మనసులో పడింది.
                జువ్వాడి గౌతమరావుగారు రామాయణ కల్పవృక్షం చదువుతుంటే ఎంతో మంది వచ్చి వినేవారు. లక్ష్మణ యతీంద్రులు,ఏలూరి పాటి అనంతరామయ్య,శ్రీలక్ష్మణ మూర్తి, బేతవోలు రామబ్రహ్మం, చేకూరి రామారావు, కోవెల సుప్రసన్న, సంపత్కుమార, విశ్వనాథ పావని శాస్త్రి , వాకాటి పాండురంగారావు, అనుమాండ్ల భూమయ్య  స్థానికంగా పార్వెళ్ళ గోపాల కృష్ణ …. వారి ఇంటిలో ఉంటూ రోజులకొద్తీ వినేవారు. వారిలో నేను కూడా ఒకడిని. అట్లా విశ్వనాథ పద్యకవిత్వం పట్ల కూడా అభిమానం కలిగింది. తరువాత విశ్వనాథ పద్యకావ్యాలు చదివాను ,సదస్సులలో వాటిపై పత్రసమర్పణలు చేశాను. కరోనా కాలంలో అంతర్జాలం మాధ్యమంగా మిత్రుల కోరికపై రెండున్నర సంవత్సరాలు రామాయణ కల్పవృక్షం లోని పన్నెండు వేల పద్యాలకు వ్యాఖ్యానం చెప్పాను. విశ్వనాథ సాహిత్యం పట్ల నాకు గల పరిచయాన్ని బట్టి నన్ను విశ్వనాథ అనుయాయి అని పిలుస్తుంటారు.

కే.ఎస్‌….. విశ్వనాథలో ప్రధానంగా మీకు నచ్చిందేమిటి? భాషనా? ఆధ్యాత్మికతనా? భావ వ్యక్తీకరణనా వివరించండి?
గండ్ర : విశ్వనాథ సాహిత్య క్షేత్రంలో పండించని పంటతేదు. అని వాడుక.ఒక్క వచన కవిత్వం జోలికి పోయినట్లు లేదు. కవిత్వం, నవల, నాటకం, కథ, విమర్శ వంటివాటిని సమర్థవంతంగా సాధికారికంగా అనితర సాధ్యంగా రాశారు. మధ్యాక్కరల వంటి ప్రయోగాలు కూడా నాకు ఇష్టంగా అనిపించేవి. నేను 6, 7 తరగతులలో ఉండగా మా బాపు విశ్వనాథ మధ్యాక్కరలు చదువడం చూశాను. అందులో ఒకచోట నాబిడ్డ ఈ కైత, దీని శోభాన గూడ వత్తురు …. అనే పదాలు పాదాలుచూసిన గుర్తు. అప్పుడప్పుడు మా బాపు ఎవరితోనైనా చెపుతున్నప్డుడు విశ్వనాథ సత్యనారాయణ కవిసమ్రాట్‌ కరీంనగర్‌ కాలేజి ప్రిన్సిపాల్‌… అనేవారు. ఆ మాటలు నాకు జ్ఞాపకం. ఆయన రచనలలో విశేషమేమిటంటే ఒకటి నచ్చితే అన్నీ నచ్చుతాయి. లేకపోతే ఏదీ నచ్చదు. గౌతమరావుగారు చెపుతుండే వారు ఆ రుచి తెలిసిన తరువాత మరేదీ అంతగా రుచించదు అని .
ఆయన ప్రతి రచనలోను ఒక వేదన ఉండేది. పైకి మాత్రం అవి కథలుగా నవలలుగా కావ్యాలుగా కనపడతాయి. కాని సమాజం పట్ల, దేశం పట్ల సంస్కృతి పట్ల అమితమైన అభిమానం అది క్రమంగా నశిస్తున్నదన్న వేదన అంతటా కనపడుతుంది. అది ఆయనను సంప్రదాయ వాదిగా ప్రచారం చేశాయి. కాని ఆధునికమైన దేనికీ వ్యతిరేకి కాదు. నవీనమైన ప్రతిదాన్ని స్వాగతిస్తాను. ఎంతవరకైతే మూలం చెడకుండా ఉంటుందో అంతవరకు అనేది ఆయన నిశ్చయం. భాష పాషాణ పాకం అనేది కూడా ప్రచారమే. రామాయణం చెపుతున్నప్పుడు చాలామంది ఇంత బాగా తేలికగా ఉందికదా? ఎంత గ్రామీణ జీవితం ఎన్ని జాతీయాలు, ఎంత వ్యవహార లక్షణం, ఎంత లోకం రీతి …అన విన్న మీవంటి ఆధునికులు, తెలుగు పండితులు, ఆనందించారు. అయితే ఆయన వ్యక్తీకరణ , శైలి ఆయనదే. లక్షపుటలు రాసినా ఒకరి ఎంగిలి లేదు, అని ఆయనే చెప్పుకున్నాడు.

కే.ఎస్‌….. మీరు విమర్శనా రంగంలో కూడా కృషి చేశారు. వర్తమాన తెలుగు విమర్శ ఎట్లా ఉంది? మీకు నచ్చిన విమర్శకులు ఎవరు? ప్రస్తుతం వస్తున్న సమీక్షలు, విమర్శలు, అర్థవంతంగా ఉంటున్నాయా? నిర్మాణాత్మక సూచనలు ఏమయినా చేయండి.
గండ్ర : కొందరు కవుల కవిత్వాన్ని గురించి, పుస్తకాల గురించి సాహితీ వనమాలి అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించాను,నిజానికి అంతకు కొన్ని రెట్ల వ్యాసాలు, ప్రసంగాలుఆయా పత్రికలలో సంచికలలో ముద్రితాలున్నాయి. విమర్శను కవి అంతరంగాన్ని బట్టి ,కావ్యంలో కవి చెప్పినదాన్ని బట్టి ఎక్కువగా విమర్శించాను.
ఈ రోజుల్లో సమీక్షల విమర్శలు అనే అభిప్రాయం పెరిగిపోయింది. విమర్వలో ప్రాచ్య పాశ్చాత్య విమర్శాధోరణులు, ప్రమాణాలు, సిద్ధాంతాలు ఎన్నో వచ్చాయి. వాటి అవగాహనతో విమర్శ చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆచార్య కోవెల సుప్రసన్న, ఆచార్య బేతవోలు , డా. సంగనభట్ల నరసయ్య, ఆచార్య అనుమాండ్ల, , నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, కే.పి.అశోక్‌ కుమార్‌, యం. నారాయణ శర్మ, లక్ష్మణ చక్రవర్తి, జి.లక్ష్మీ నరసయ్య వారాల ఆనంద్‌ లవంటి వారు కొంతమంది విమర్శను గురించి తెలిసి విమర్శలు చేస్తున్నవారు.

కే.ఎస్‌… ఖలీల్‌ జిబ్రాన్‌ ది మ్యాడ్‌ మ్యాన్‌ పుస్తకాన్ని తెలుగులో వెర్రి మానవుము  పేరుతో తెలుగులో అనువదించారు. ఇప్పుడు అనువాద అవసరాన్ని వివరించండి.
గండ్ర : అది అనుకోకుండా జరిగింది. ఒకరోజు ఐ పాడ్‌ లో ఏదైనా పుస్తకం చదువుదామని రైటర్‌ ఆప్షన్‌లో ఖలీల్‌ జిబ్రాన్‌ నొక్కాను. చాలా పుస్తకాలు వచ్చాయి. ఎందుకో మాడ్‌ మాన్‌ చదువాలనిపించి చదివాను. వెంటనే తెలుగులో రాస్తే బాగుంటుందని మూడు రోజుల్లో అనువాదం చేశాను.
                ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో అనేక గొప్ప రచనలున్నాయి. వాటిని అనువాదం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎందరో చేశారు. ఇప్పటికీ ఆ పని చేయాలి. వారాల ఆనంద్‌ ఇరుగుపొరుగు పేరుతో దేశంలోని విదేశాలలోని కవులను తెలుగులో అనువాదం చేస్తూ పరిచయం చేస్తున్నారు. అనువాదం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న కవితా ధోరణులు తెలియడంతో పాటు మానవుని ఆలోచనా విధానం, జీవన సంస్కృతి, దేశవిదేశాల పరిస్థితులు ఎన్నో వ్యక్తమై పాఠకుడిని విశాలం చేస్తాయి.

కే.ఎస్‌. ఏడు పదుల వయసులో మీరు అవధాన రంగంలో ప్రవేశించారు. అవధాన అవసరాన్ని మీ అనుభవాల్ని గురించి చెప్పండి.
గండ్ర :…. పద్యాలు కావ్యాలనుండి అలవోకగా సభలలో చదువడం, అప్పుడప్పుడు పద్యాలు ఆశువుగా చెప్పడం చూసిన మిత్రులు వేణుశ్రీ మీరు అవధానం చేస్తారు అని కరోనా కాలంలో నాకు రొజూ సమస్యలూ, దత్తపదులూ, వర్ణనలూ ఇచ్చి రాయమన్నారు. నేను వెంటనే పూరణలు పంపాను. తరువాత మిత్రులు రాజారామమోహన శర్మ ఒకరోజు నిర్ణయించి అవధానం చేయుమన్నారు. పృచ్ఛకులను నిర్ణయించారు. అట్లా ప్రారంభైన అవధానం నాకు కూడా ఉత్సాహంగానే అపినించింది. ఈ అవధాన ప్రక్రియ తెలుగులో అపురూపమైనది. కరీంనగర్‌లో ప్రస్తుతం ఎవరూ లేరు. నన్ను చూసి ఎవరైనా యువ కవులు పండితులు ముందుకు వస్తారని , అందుకు ప్రేరణగా స్ఫూర్తిగా నిలువాలని అవధానాలు చేస్తున్నాను. ఇంత వరకు జరిగిన అవధానాలు ప్రేక్షకులను సంతృప్తిపరచాయి. అదే నాకు ప్రోత్సాహకంగా ఉన్నాయి.

కే.ఎస్‌…. గత యాభైఏళ్ళలో తెలుగు సాహిత్యంలో పలు వాదాలు వచ్చాయి. వాటిలో మీరు ఎటు వైపు?
గండ్ర :     సామాజికమైన స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, ఇట్లాంటివి వచ్చాయి. వీటి ప్రభావంత తెలుగులో కవిత్వం, కథలు, వెలువడ్డాయి.ఈ వాదాలు కవిత్వంలో భాగమే కాని వాదాలే కవిత్వం కాదు. సాహిత్య వాదాలలో సంప్రదాయం, అభ్యుదయం వంటి వాదాలు వచ్చాయి. మా గురువుగారు సినారె గారి వలె సంప్రదాయం జీర్ణించుకున్న ప్రయోగాన్ని, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని, నేను ఇష్ట పడతాను.

కే.ఎస్‌…భువన విజయం నాటకం రాశారు. దాని వివరాలు చెప్పండి?
గండ్ర :…. ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయల పంచశతి ఉత్సవాలు జరుగుతున్నాయని నంది శ్రీనివాస్‌ , గాజుల రవీందర్‌,   మీరు నన్ను కలిసి భువనవిజయం నాటకం వేద్దామనుకుంటున్నాం మీరు సహాయం చేయండి అని అడిగారు. సరే నన్నాను. తీరా దానికి తగిన రచన (స్క్రిప్టు) లేదన్నారు. రెండుమూడు రోజులలో కావాలన్నారు. ఆ రాత్రి కూర్చొని అష్టదిగ్గజ కవులు, రాయలు, మంత్రి, నరసరాజు వంటి పాత్రలతో పద్యాలు మాటలు కలిపి నాటకం రూపొందించాను. రెండు రోజులు ఆయా పాత్రలు అభ్యాసం చేసి ప్రదర్శన ఇచ్చాం. అందులో నేను తెనాలి రామకృష్ణుని పాత్ర ధరించాను. ఒకవైపు హాస్యం పండిస్తూ మరో వైపు ఆయా పాత్రధారుల లోపాలు సరిచేస్తూ నాటకం రక్తి కట్టించాం. ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ నాటకాన్ని చూసి అభినందించారు.

కే.ఎస్‌. : మీ అధ్యాపకత్వంలో ఎందరో శిష్యులను తయారు చేశారు? అధ్యాపకానుభవం గురించి , నేటి విద్యావ్యవస్థ గురించి చెప్పండి? సాహితీ సాంస్కృతిక రంగం వైపు పిల్లల్ని ఎట్లా ప్రోత్సహించాలి?
గండ్ర : అందరూ కోట్లు సంపాదించి ఆనందిస్తే నేను శిష్యకోటిని సంపాదించాను అని గర్వంగా చెప్పుకుంటాను. ఎందరో శిష్యులు ఏ రంగంలో స్థిరపడిన వారైనా నా పాఠాలను గుర్తు చేస్తుంటారు. ఇక మీ వంటి వారు తెలుగు పండితులు కాకపోయినా తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తూ అద్భుతమైన సేవలందిస్తున్నారు. ఎందరో శిష్యులు తెలుగుపండితులుగా, ఉపన్యాసకులుగా, కవులు రచయితలుగా ఎదిగారు. తరువాతి తరాన్ని తయారు చేశాననే సంతృప్తి ఉంది. ఈ కాలం విద్యావిధానంలో సాంస్కృతిక రంగానికి కొంత ప్రాధాన్యత ఉన్నా ఎక్కువగా సినిమా పాటలు, జానపద గీతాలు నృత్యాలు వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భాష, వక్తృత్వము, కవిత్వము, సాహిత్యము వంటి వాటికి తక్కువ. ఆంగ్ల మాధ్యమం వచ్చిన తరువాత పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. భాష పట్ల అభిరుచిని కలిగించాలి. మంచి  సంభాషణా చాతురిని, వాఙ్నైపుణ్యాన్ని కలిగించాలి. ఈ నాటికీ మాట్లాడడం, సరిగా సమాధానం చెప్పటం రాక ( తెలిసి) పోవడం భాషాలోపం. వ్యక్తిత్వ వికాసంలో భాగంగానైనా భాషను నేర్పించాలి.

కే.ఎస్‌…. నూతన కవులకు రచయితలకు మీరేమి చెపుతారు? ఏ సందేశం ఇస్తారు?
గండ్ర :   ఎవరు చదివినా చదవక పోయినా ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. పుస్తకాలు వేస్తున్నారు. కొందరు సరికొత్త పద్ధతుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. కొందరు కవిత్వం కాని దాన్ని కూడా కవిత్వం అని మురిసి పోతున్నారు. కవులుగా దలచిన వారంతా అధ్యయనం చేయాలి. ప్రాచీనాధునిక కవులను బాగా చదువాలి. పదానికి అర్థాలు తెలియక ఏదో అనుకొని ఏవో పదాలు ప్రయోగిస్తున్న యువ నవ కవులు కూడా ఉన్నారు. శబ్దసంపదను పెంచుకోవాలి, అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి. ఎవరినీ అనుసరించకపోయినా ఆ అధ్యయనానుభవం తోడవుతుంది. ఒక పుస్తకం రాయగానే పురస్కారం రావాలని ఆశించడం వంటిది కూడా సాహిత్య రంగంలో అంత ఆశించదగినది కాదు.

ఎక్కువ మంది కవిత్వం రాయడం వల్ల తెలుగు భాష ఆయుర్దాయం పెరుగుతుందనే ఆశ మాత్రం కలుగుతుంది.

కే.ఎస్‌. ధన్యవాదాలు సర్‌.

September 30, 2024 0 comment
3 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us