“రైతో రక్షతిరక్షితః”
రైతును మనం రక్షిస్తే
రైతు మనలను సంరక్షిస్తాడు…
ఇది వాస్తవం…
మరి…
నేల తల్లిని నమ్ముకున్న రైతు
నాగలి పట్టి నలుగురికి అన్నం పెట్టిన రైతును…
నేల విడిచి సాము చేయమంటే ఎలా….
రెక్కాడితే కానీ, డొక్కాడని వాళ్ళు…
రెక్కల కష్టం మీద బ్రతికే వాళ్ళు…
రెక్కల కష్టం ఆపితే ఎలా….
ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ…
ఏళ్ల కొలది భూమిని నమ్ముకుంటూ…
కాలం కన్నెర్రజేసినా, కడుపు కాలినా…
కండరాళ్ళను కరిగిస్తూ….
కన్నీళ్ళనే కాలువలుగా పారిస్తూ…
క్వింటాళ్ళ కొలది పంటను పండిస్తూ…
వేయిలమందికి అన్నం పెట్టిన అన్నదాత….
చెమట చుక్కనే నీటి చుక్కగా మార్చి...
నేల తల్లికి దాహం తీర్చే దాత..
రెక్కల సాము ఆపితే ఎలా….
ఇంటిని, పాడిపంటలను చూసుకుంటూ….
చెమట చుక్కను ధారపోసి…
బిడ్డలను కార్పోరేట్ చదువులకు పంపుతూ…
పల్లె బాటను పానంలా కాపాడుకునే రైతు…
రెక్కల కష్టం ఆపితే ఎలా…
భూస్వాముల చేతిలో రైతు
కీలు బొమ్మలుగా మారి
నమ్ముకున్న భూమిని చేజార్చుకున్న రైతు…
ఉరితాడుకు బలి అయితే ఎలా….
కాలిఫోర్నియాకు కర్మేది పట్టెనో
కాలిపోవుచుండె కళ్ళ ముందె
ప్రకృతెక్కడైన పగబట్టితే చాలు
ఫలిత మివ్వ లేదు ప్రజ్ఞ ఏది!!
గుండె లవిసి పోయె గూళ్లు చెదరిపోయె
మూగ జీవులెన్నొ ముద్ద లాయె
గాలి తోడు యవ్వ గంతేసి జ్వాలలే
అశన మోలె మ్రింగె అందినంత!!
అగ్ని మాపకులును అహరహం కృషిచేసి
ఎంత కష్ట పడిన నేమి ఫలము
కళ్లు కప్పు నట్టి కార్చిచ్చు మాపగన్
ప్రాణ త్యాగులౌచు పరుగు లిడిరి।!
కొన్ని గంట లందు కోట్లుమసిగమారె
అందమైన ఇండ్లు ఆహుతాయె
వేలకొలది జనులు విడనాడిరిండ్లను
దీనులైరి చిత్ర దిట్ట లెల్ల!!
కాలిఫోర్నియాను కరుణించరాస్వామి
నీకు తెలియనట్టి నిజముయేది
మూడు జగము లేలు ముక్కోటి వేల్పులు
ముందుzబడుడి మాకుముదముతెండి !!
( అమెరికా నుండి)
దీపాలం దీపాలం
తిమిరాలకు శాపాలం
తమోహక ప్రతాహలం
అమవసపై కోపాల
అయినా మేం గర్వించం
అసలే ఆనందించం
బహిరంగపు చీకట్లను
ప్రహరిస్తున్నాం గానీ
అంతరంగపు చీకట్ల
నంతం చేస్తున్నామా?
అందుకే ఈషణ్మాత్రం
ఆనందించడం లేదు
అందుకే ఒక్కింతైనా
అహంకరించడం లేదు
యదార్థ కథనం చేస్తే
అసలు సిసలు దీపాలం
మేమని చెప్పుకోలేము
మా మనసులోని మాటది
మానవాళినంతటిని
ప్రాణికోటులన్నిటిని
ప్రేమించిన, సేవించిన
ధీమాన్యులు దీపాలు
జనకోటిని నడిపించిన
ఘననాయక శేఖరులు,
మన అందరికీ సుఖ జీ
వన వరమందించేందుకు
ఎన్నెన్నో కనిపెట్టిన
మిన్న లైన శాస్త్రజ్ఞులు
అసలు సిసలు దీపాలు
ఆరని దీపాలు , నూనె అవసరమొక్కింతలేని
అనశ్వర ప్రదీపాలు
కనులకు కనిపించే ఈ
ఘనతర దీపాలె కాక
ఆలోచించగలిగితే
మీలోంచే ఉదయించే
అపురూపమైన దీపా
లవి ఎన్నో ఉన్నాయి
బ్రతుకులోన తల ఎత్తే
ప్రతి అనుభవము ఒక దీపం
అది నేర్పే గుణపాఠం
ఆ దీపకాంతిపుంజం
వాటిలోనూ చేదు అనుభ
వాల వెలుగు తీక్ష తరం
ఆ అనుభవాలలోనూ
అవమానా లిడే వెలుగు
అనన్య సామాన్య వరం
మిన్నల ఘనరూపంలో
మీ అనుభవరూపంలో
వెలిగే దీపాల వెలుగు
విలువ తెలిసి వర్తిస్తే
మీ ప్రతి ఒక్కరి మనుగడ
దీపావళి కాగలదు
చరితలోన మీ పేరు
చిరస్థాయి కాగలదు
_**
ఓ ముసలి వాసిల్ తన వలలో ఏమి పడిందో చూద్దామని సముద్ర ఒడ్డుకు వెళ్ళాడు. ఎప్పుడైతే అతను తన వలను పరిచిండో, దాంట్ల ఒక బంగారు చేపను చూసాడు, దాన్ని పట్టుకున్న వెంటనే ఆ చేప అంది, ఒకవేళ నీవు నన్ను మరల సముద్రములో వదిలిపెడితే నీ కోరికలన్ని తీరుస్తాను అని. ముసలి వాసిల్ కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, చాలా మంచిది, నీవు సముద్రములోకి వెళ్ళు. కాని ఏమి వరం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. అందుకు నేను ఇంటికి వెళ్ళి నా భార్యను అడగాలి. అతను ఇంటికి వెళ్లి భార్యతో జరిగినదంతా చెప్పిండు. ఆ ముసలి ఆడది అతడ్ని బాగా తిట్టింది. వెంటనే వెళ్ళి నేను వేసుకోవడానికి మంచి కొత్త బట్టలు అడుగమంది. నా వద్ద కేవలం చిరిగిపోయిన పాత బ్లౌజు మాత్రమే ఉంది. ఆ ముసలతను కొత్త బట్టలతో ఇల్లు చేరాడో వెంటనే తిరిగి పంపిస్తూ తనను బంగారు బండిలో ఎక్కించి తిప్పు, ఎందుకనగా ఇంతకుముందు ఎన్నడూ బండిలో ఎక్కలేదు. కాని అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు.
ఇప్పుడు ఆమె సముద్రపు ఒడ్డున ఒక అందమైన మేడ కావాలని కోరింది, దాని చుట్టు విశాలమైన అందమైన తోటలు, చాలామంది నౌకర్లు ఉండాలని అంది. కాని అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు. చివరకు ఆమెకు విచిత్రమైన భావన కలిగింది. ఆ బంగారు చేప వచ్చి ఆమెకు సేవ చేయాలని తలచింది. ఆ చేప ఇది విని వెంటనే ఆగ్రహించి ఇచ్చిన బహుమతులన్ని తిరిగి తీసేసుకుంది. ఆ ముసలామె తన పాడుబడిన గుడిసె ముందు, తన పాత చిరిగిపోయిన బ్లౌజు వేసుకొని వలను బాగు చేసుకుంటూ మరల నిలబడింది. ఇప్పుడు నీవు మొదట ఎక్కడ ఉన్నావో అక్కడనే ఉన్నావు.
ఒకవేళ నీవు అతిగా కోరాలని ప్రయత్నిస్తే, చివరకు నీవు ఏమి లేకుండా మిగిలిపోతావు.
”అతి ఆశ కొంపకు చేటు”
అవును
నన్ను పట్టి చూపింది
ఆ పువ్వే.
నా ఆనవాళ్లు ఆ పువ్వే
నాది బతుకమ్మ జాతి.
ఖరీదైన పువ్వులు
ఎన్నైనా ఉండొచ్చు!
కొప్పులకు ఎక్కే పువ్వులు
కోకొల్లల్లుండొచ్చు!
ఆత్మగల్ల పువ్వు మాత్రం
అదొక్కటే.
ఈ మట్టి సంస్కృతిని
పట్టి చూపిన పువ్వు.
వానకు పసుపుపచ్చ
ముత్యమై మురిసింది.
ప్రకృతి చీరపై
పట్టు అంచుగా మెరిసింది.
ఆమే ఓ పార్వతి
ఆమే ఓ శక్తి స్వరూపిణి .
పెతరమాస నాడు
ఎంగిలి పువ్వై,
సద్దుల బతుకమ్మ నాడు
తాంబాల మంతై ,
వనం లోంచి వనం
ప్రకృతి లోంచి ప్రకృతి
ఆమెకే చెల్లింది.
అడవిని కాస్తున్న తల్లి ఆమె.
సబ్బండ వర్ణాల
మనసుల్లో నిలిచిన పువ్వు.
నా యాసకు
నా భాషకు
తానే నిలువెత్తు ప్రతీక.
రుద్రమ్మ పౌరుషం
సమ్మక్క సారక్క వీరత్వం
ఐలమ్మ ఆక్రోశం
వీరనారీల ఒక్కరూపు
మా బతుకమ్మ.
ఆడబిడ్డల
మనసుల్లో నిలిచింది.
వాళ్ళ గొంతుల్లో
పాటై పరుగులెత్తింది.
అస్తిత్వ పోరాట
ఆయుధ మైంది.
బతుకమ్మను
ఒక్కసారి తలకెత్తుకో
నువ్వెవరో నీకే తెలుస్తుంది.
మూడవ భాగం
వసంత శ్రీనివాస రావు తో మాట్లాడిన అపర్ణ టిఫిన్ చేయడానికి పెళ్లి పందిట్లోకి వెళుతుంది. పందిట్లోకి వెళ్లిన అపర్ణకి అక్కడి ఫలహారాలను చూస్తే నోరుఊరిపోతోంది.పందిట్లో ఒకపక్కగా చిన్న చిన్న తాటి చాపలు పరిచి, అరటి ఆకులలో ఉపహారం వడ్డిస్తున్నారు. కింద కూర్చొని తినలేని వాళ్లకు టేబుల్స్ పై వడ్డిస్తున్నారు.
చట్నీ పొడితో కలిపిన అటుకుల చుడువా,అందులో వేయించిన పల్లీలు, కొబ్బరి ముక్కలు ,పుట్నాలు, కరివేపాకు అన్ని చక్కగా కనిపిస్తున్నాయి .చట్నీ పొడి వాసన కమ్మగా ముక్కుపుటాలకు తగిలింది. తర్వాత విస్తట్లో కొంచెం ఉప్మా తర్వాత కరియలు ,చక్కిలాలు తేనెతెరలు, బూందీలడ్డు ఇవన్నీ వడ్డించారు. ఎక్కడ పెళ్లికి వెళ్లినా ఇడ్లీ ,వడ, దోస లేదా ఉత్తర భారతం నుండి దిగుమతి చేసుకున్న గప్ చుప్ లు, కచోరీలు ఇలాంటి చాట్ ఐటమ్సే కనబడుతున్నాయి. అందుకు భిన్నంగా ఇక్కడ వడ్డించిన పదార్థాలను చూస్తే అపర్ణకు నోరూరిపోయింది. వెళ్లి కింద పరిచిన చాపలో కూర్చుంది. వంట వాళ్ళు, వడ్డించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా వారి దగ్గర బంధువుల అమ్మాయిలు కొంతమంది ప్రేమగా వడ్డనలు చేస్తున్నారు.
లంగా వోణి వేసుకున్న ఒక అమ్మాయి దగ్గరగా వచ్చి “అత్తా! మీకు ఇంకేం కావాలి? ఏంకావాలన్నా నన్ను అడగండి. నేను ఇక్కడే ఉంటాను”‘ అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది. ఈ రోజుల్లో ఆంటీ ,అంకుల్ అని పిలిచే కల్చరే ఉంది కదా !ఇలా’ అత్తా’ అని పిలిచేసరికి ఎంతో ఆనందం అనిపించింది అపర్ణకి. ఆ అమ్మాయిని పరిశీలనగా చూసింది అపర్ణ. చక్కగా జడ కుచ్చులు వేసుకున్న బారు జడ ,మల్లెలు కనకాంబరాలు కలిపి పెట్టుకుని, చెంప స్వరాలను పెట్టుకుంది. ఎర్ర పట్టు లంగాకి ఆకుపచ్చ ఓణీ వేసుకుంది. ఎంతో కళగా ఉన్న ముఖం, అతి తక్కువ మేకప్ వేసుకొని ఎంతో అందంగా కనబడింది.
అపర్ణ నవ్వుతూ ఆ అమ్మాయిని చూసి”అలాగే మొహమాట పడకుండా అడుగుతాను. నీ పేరేంటమ్మా? ఏం చదువుతున్నావ్”? అని అడిగింది.
” నాపేరు మధురిమ అత్తా! నేను మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతున్నాను. వసంత గారి మేనకోడల్ని. మీరు అత్త ఫ్రెండ్ కదా, అందుకే నేను మిమ్మల్ని కూడా అత్తా అని పిలిచాను” అని నవ్వుతూ చెప్పింది.
అపర్ణకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ
కాలం అమ్మాయిలా, ఎంత నిదానంగా ఉంది! మళ్లీ మెడిసిన్ చదువుతుంది. అయినా కూడా ఎంత అణుకువ! ఇలా పనులు చేయాలనే మనస్తత్వం ఉండడం ఎంత మందికి సాధ్యం? ” ఇలా ఆలోచిస్తూ ఒక్కొక్క పదార్థం రుచిని చూస్తుంది.”ఎన్నాళ్ల తర్వాతనో ఇలాంటివి తింటున్నాను. ఇంత అద్భుతమైన వంటకాల రుచిని, ఇలాంటి పెళ్లిని, భర్త పిల్లలు కూడా చూస్తే బాగుండు” అని అనుకుంది. అపర్ణ కూడా తన కూతురు పెళ్లి సంప్రదాయ పద్ధతిలోనే చేసింది. కాకపోతే ఇలా పల్లెటూరులో కాదు. కాబట్టి ఇంత పద్ధతిగా జరగలేదు.
పలహారం చేశాక వాళ్ళు ఇచ్చిన వేడి కాఫీ తాగేసి, పందిరంతా కలయ తిరిగింది.అక్కడ ఉన్న గాడి పోయ్యిలని చూసి, ఆశ్చర్య పోయింది. ఏ కాలం పద్ధతి!అందరూ గ్యాస్ స్టవ్ లను వాడుతున్నారు.ఇంకా ఇక్కడ గాడి పోయే వాడే విధానం చూస్తే సాంప్రదాయానికి ఎంత విలువ ఇచ్చారో అర్థమైంది. పెద్దగా తవ్విన పొయ్యిల చుట్టూ, పచ్చ పిండితో తీర్చిన ముగ్గులు.(పచ్చ పిండి అంటే పసుపు విసిరిన తర్వాత బియ్యాన్ని విసిరుతారు. అప్పుడు వచ్చే పిండిని పందిట్లో ముగ్గు కోసం వాడుతారు.) ఆ పొయ్యిల మీద పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలు ఉన్నాయి. అవన్నీ చూస్తే ఎంతో ముచ్చటగా అనిపించింది. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకుని చేసే ముందు రోజు, గాడి పొయ్యి తవ్విస్తారు.తర్వాత ఆ ప్రాంతమంతా పేడ నీళ్లు చానిపి( కళ్ళాపి) చల్లించి, చక్కగా పచ్చ పిండితో ముగ్గులు వేస్తారు. పెళ్లికూతురు లేదా పెళ్ళికొడుకుని చేసే రోజు, వారు స్నానం చేసిన తర్వాత, పొయ్యి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని, అగ్నిహోత్రుని ప్రార్థించి ,అంతా శుభం జరగాలని కోరుతూ, వండిన వంటకాలను అందరూ సంతృప్తిగా తినాలని, విన్నవించుకుని, ఎవరికీ ఏవిధమైన ఇబ్బంది కలగకూడదని నమస్కరించేసుకొని, అగ్నిని వెలిగిస్తారు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చింది అపర్ణ.
పాతకాలం చతుశ్శాల భవంతి. కొంచెం మార్పులు చేర్పులతో అందంగా చేశారు. ఇల్లంతా బంతిపూల తోరణాలతో అందంగా కనబడుతుంది. ఒక మండువాలో పెళ్లికూతురు కూర్చోవడానికి అలంకరణ చేసి ఉంచారు. అక్కడే అంకురార్పణ కొట్నం జరిగేది.
అదంతా పరిశీలిస్తూ, అక్కడే పరిచిన జంపు కానాలో కూర్చుంది అపర్ణ. ఇంతలో ఆ పక్క సందులో ఏదో కలకలం వినిపించి ఒక్కసారిగా భయంతో అటుగా చూసింది.
ఒక్కసారిగా అందరి దృష్టి వాకిట్లోకి వెళ్ళింది. కుతూహలంతో అందరూ అటువైపే చూసారు. ఊళ్లో పనిచేసుకునే చాకలి, మంగలి, మస్కూరోళ్ళు “శుభకార్యం పెట్టుకుంటే మాకు డబ్బులు ఇవ్వాలి.” అని గొడవ చేస్తున్నారు.
“ఇంటి ముందర పచ్చటి పందిరి ఏసింరు.ఎంకటి నుంచి అన్ని పనులు మీ ఇంట్లో మేమే చేస్తున్నాం. గిప్పుడు ఆ మిషన్లు వచ్చినయని మమ్ములను పనిచేయనిస్తలేరు. కటింగులు మాతో చేపించుకుంటలేరు .గాడ అద్దాల షాపులలో చేపించుకుంటున్నారు. ఇగ మస్కూర్ వాళ్లతో పనే పడతలేదు. జెర్రమా మొకాలు చూసి పైసలు ఇయ్యిర్రి” అని గట్టి గట్టిగా అరుస్తున్నారు.
అప్పుడే శ్రీనివాసరావు బయటకు వెళ్లి “మీకు డబ్బులు ఇవ్వకుండానే శుభ కార్యాలు జరిపిస్తామా! ఇంత మంచి శుభకార్యం జరుగుతుంది. గొడవెందుకు చేస్తారు. ‘మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి’ అంటే ఇస్తాను కదా! మంచిగా భోజనాలు చేసి, మల్ల రేపు పెండ్లికిగూడ వచ్చి ,అదో ఏదో అరుసుకొని మంచిగా సంతోషంగా పైసలు తీసుకొని పోండి. అంతేగాని ఇట్లా అల్లరి చేయొద్దు” అని అన్నాడు.
వెంటనే వాళ్లంతా సంతోషంగా…
” అయ్యా నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతావని మేము అనుకోలేదు. ఇంక పక్క సందులో వెంకట్రావు ఇంట్లో పెళ్లి అయితే ,ఒక్క పైస ఇయ్య లేదు గందుకే గిట్లడిగినం .తప్పు పట్టుకోకుండి.మేము వచ్చి అన్ని పనులు చేస్తాం” అని సంతోషంగా పందిట్లోకి వెళ్లిపోయారు.
ఇదంతా చూస్తున్న అపర్ణ అనుకుంది “ఊళ్ళల్లో ఇలాంటి ఆచారాలు ఇంకా ఉన్నాయా?” అని. “అయినా మన మాట మంచిదైతే అన్నీ మంచిగానే ఉంటాయి. ఎందుకంటే శ్రీనివాస్ మాట్లాడిన తీరుతో వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారు. అందుకే సంతోషంగా వాళ్లు పని కూడా సహాయం చేస్తానని చెప్పారు” అని అనుకుంది.
కొట్నం దగ్గర పంతులుగారు ఏమున్నాయో! ఏం అవసరమో! చూసుకుంటున్నారు.
” వసంతా! ఇక్కడ తమలపాకులు ,వక్కలు రాలేదమ్మా! ఇసుర్రాయి, రోకండ్లు ,కుందెన సున్నం జాజుతో పూదించారా? ఐదు సేర్ల బియ్యం తలంబ్రాల కోసం కావాలి. అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి .ఎండు కొబ్బరి కుడుకలు, పూలు, రెండు పంచ పాత్రలు ఉద్ధరణలు అన్ని సిద్ధం చేసి పెట్టండి? తొందరగా కానీ ముహూర్తానికి లేట్ అవుతుంది” అని పురమాయిస్తున్నాడు.
అతన్ని చూసి ” ఎక్కడో చూసినట్లు ఉంది ఈయనని, ఎవరై ఉంటారు?” అని అనుకున్నది అపర్ణ.
వెంటనే గుర్తొచ్చింది అతను తనతోనే చదువుకున్న శంకర శర్మ అని.
“శంకర్ గారు! బాగున్నారా? ఎన్ని రోజులకు మిమ్మల్ని చూశాను. ఇంతకీ నన్ను గుర్తుపట్టారా?” అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది అపర్ణ.
అతను అపర్ణని తేరిపారా చూసాడు.
” అమ్మా! నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎక్కడైనా పెళ్లిలో చూసి ఉంటానా! మీరే చెప్పండి తల్లి! ” అన్నాడు.
గట్టిగా నవ్వేసింది అపర్ణ.
” ఎక్కడైనా పెళ్లిలో చూసారా? అయ్యో నేను మీతో చదువుకున్న అపర్ణని. మీరు, నేను, వసంత అందరము ఒకటే క్లాసులో ఉన్నాము” అని అన్నది.
వెంటనే శంకర్ శర్మ కూడా నవ్వేసి..
” అపర్ణ గారా! గుర్తుపట్టలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు మీ మొహం చూస్తే గుర్తొచ్చింది .బాగా చదువుకునే వారు. అప్పుడు అల్లరి కూడా ఎక్కువే చేసేవారు. నాకు అంతా గుర్తొచ్చింది. మీరు వసంత గారు, మరొక అమ్మాయి మీతో ఉండేది. పేరు గుర్తు రావడం లేదు” అన్నాడు శంకర శర్మ.
“ఆహా! అన్ని గుర్తున్నాయి మీకు. అయినా ఈ గారు అని పిలవడం ఏంటి? మనమంతా ఒకటే తరగతి కదా! చక్కగా పేరుతో పిలవండి” అన్నది అపర్ణ.
ఇంతలో వసంత బయటకు వచ్చింది. వీళ్ళిద్దరినీ చూసి ” పరిచయాలు పూర్తయ్యాయా ఒకరినొకరు గుర్తుపట్టుకున్నారా! నేనే వచ్చి చెబుదాము అనుకున్న.మీరే మాట్లాడుతూ కనిపించారు” అన్నది.
“అవునే, ముందుగా నేనే గుర్తుపట్టాను .ఇంకా మన ఫ్రెండ్స్ ఎంతమంది నీకు తెలుసు వాళ్ళ అడ్రస్ అందరివి ఉన్నాయా? ఒకసారి అందరం కలుసుకుందాం” అన్నది అపర్ణ.
“తెలుసుకోవడం ఎంతసేపు లేవే! పెళ్లయ్యాక వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ముహూర్తం టైం అవుతుంది” అని చెప్పి కొట్నంకు అవసరం ఉన్న సామాన్లన్నీ తెప్పించి పెట్టింది.
కొట్నం మంటే ఒక మంచి రోజు పెళ్ళికొడుకుని లేదా పెళ్ళికూతురు చేసేముందు, అన్నిటికీ శుభ సూచకమైన పసుపుతో మొదలుపెడతారు. అదే రోజు అంకురార్పణ కూడా చేస్తారు.
ముందుగా పెళ్లికూతురు లేదా పెళ్ళికొడుకు వారి తల్లిదండ్రులు స్నానం చేసి కొత్త వస్త్రములు కట్టుకొని పీటల మీద కూర్చున్నప్పుడు, పురోహితుడు వారి చేతికి కంకణాలు కట్టించి, వారితో గౌరీ పూజ, గణపతి పూజ చేయించి తర్వాత ముత్తైదువలందరినీ పిలిపించి, రోకళ్ళతో పసుపు కొమ్ములను దంచమంటారు .అలా అందరూ పసుపు దంచుతూ పాటలు పాడుతారు. తర్వాత ఆ దంచిన పసుపును మళ్లీ విసుర్రాయిలో వేసి, విసురుతారు. తర్వాత తీసి తలంబ్రాల బియ్యం లో కలుపుతారు కలుపుతారు.
“పెళ్లికూతురుని తీసుకురండి “అన్న పురోహితుని మాటతో వసంత కూతురిని ముత్తైదువలు బయటకు తీసుకొని వచ్చారు.
అపర్ణ పెళ్లికూతురుని అలా అపురూపంగా చూస్తూనే ఉంది.
వసంత కూతురు శ్రీవల్లి చెప్పలేనంత అందంగా ఉంది. అందులో సాంప్రదాయమైన దుస్తులు ధరించడం వల్ల, అందం ఇంకా రెట్టింపు అయ్యింది. చిలకపచ్చ రంగు పట్టు చీరకు, ఎర్రని అంచు ఉన్న పట్టు చీర ధరించింది. వెంట్రుకలు చాలా బాగా ఉన్నందువల్ల చక్కని వాలు జడ వేసుకుంది. చిన్న కనకాంబరం దండం మాత్రం పెట్టుకుంది. చెవులకు జుంకాలు, చేతినిండా వేసుకున్న గాజులు, నడుముకు చిన్న వడ్డాణం, తిలకంతో పెట్టుకున్న ఎర్రబొట్టు చక్కగా మెరుస్తుంది. కాళ్లకు పెట్టుకున్న వెండి పట్టా గొలుసులు ఘల్లు ఘల్లు మంటుంటే, చిరునవ్వుతో నడుస్తూ బయటకు వచ్చింది.
అపర్ణకి ఆ అమ్మాయిని చూస్తుంటే ఎంతో నచ్చేసింది. తన వంక చూసిన శ్రీవల్లిని చిరునవ్వుతో పలకరించింది అపర్ణ.
” నమస్తే అత్త” అని రెండు చేతులు జోడించింది.
” ఈ రోజుల్లో ఇంత సంస్కారంగా ఉన్న అమ్మాయిలు ఉన్నారా? చక్కగా ఉంది అమ్మాయి. వసంత పెంపకం మంచిదే” అనుకుంది అపర్ణ.
అప్పటికే పీటల మీద ఆసీనులైన శ్రీనివాసరావు, వసంతల మధ్యలో వేసిన చౌకీపీట మీద వెళ్లి కూర్చుంది శ్రీవల్లి. శంకర్ శర్మ పూజ ఆరంభించారు. ముందుగా గౌరీ పూజ, గణపతి పూజ చేయించి, పసుపు దంచే కార్యక్రమం చేశారు.
ఒక్కొక్కరుగా ముత్తైదులు అందరూ వచ్చి, పసుపు దంచి, విసురాయిలో వేసి విసిరి, తర్వాత కుందనలో వేసి దంచి ,అందులోనే తలంబ్రాల బియ్యం పోశారు .అందరూ కలిసి పాటలు పాడుతూ చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు.
తర్వాత ఇంటి ఆడపడుచులు వచ్చి, రోకలితో పసుపు తీసుకొని, పెళ్లికూతురు భుజాల మీద, తల మీద తర్వాత పెళ్లికూతురు తల్లిదండ్రుల తలమీద, భుజాల మీద వేశారు. తర్వాత తలకు నూనెతో అద్ది, హారతి ఇచ్చి మంగళ స్నానాలకు వెళ్లి రమ్మని చెప్పాడు శంకరశర్మ.
వారి స్నానాలు చేసి వచ్చే లోపల ,అంకురార్పణకి మట్టి కంచుళ్ళలో ఇసుకను నింపి ,వాటి చుట్టూ దారంతో ఒక పద్ధతి ప్రకారం చుట్టేసి, నవధాన్యాలను సిద్ధంగా పెట్టుకుని కూర్చున్నాడు శంకరశర్మ.
వచ్చే బంధువులు వస్తూనే ఉన్నారు. పలహారాలు ముగించుకొని వచ్చి, భవంతిలో కూర్చుని జరిగే తంతును చూస్తున్నారు. చాలా రోజులకు కలుసుకున్న బంధువులందరూ ఎన్నో కష్టసుఖాలు పంచుకుంటూ, సంతోషంగా ఉన్నారు .చిన్న పిల్లలు ఆటలాడుకుంటున్నారు. యుక్త వయసులో ఉన్న పిల్లలు, వారి కాలేజీ ముచ్చట్లు ,కాలేజీలో జరిగే చిన్న చిన్న సంఘటనలు ,వారు ఎవరెవరితో స్నేహం చేశారు. ఆ సంఘటనలు చెప్పుకొని నవ్వుకుంటున్నారు.
మొత్తం మీద పెళ్లి ఇల్లు హడావుడిగా, సందడిగా నిండుగా కళకళలాడుతూ ఉంది. ఇంటి ముందు వేసిన పందిరిలో ఐదు రకాల ఆకులు తప్పకుండా ఉండాలి. మామిడి, జువ్వి, మేడి, రావి, కానుగ. ఆ చెట్ల చిగుళ్ళు మళ్లీ పూజలో కూడా అవసరం పడతాయి .వాటిని ‘పంచ పల్లవాలు’ అంటారు. శుద్ధి కొరకు గంగాజలం, ఆవు పంచకం, గోమయం ,గోక్షీరం ఇవన్నీ ఉపయోగిస్తారు. ఎంత సాంకేతిక నైపుణ్యం వచ్చినప్పటికీ, ఈపద్ధతులు చాలా మంచివని నిరూపణ జరిగింది. గోవు పవిత్రతకే కాదు, పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే గోమాతని పూజించాలి.
వారు స్నానాలు చేసి, రావడానికి కొంచెం వెసులుబాటు ఉండటం వల్ల, బయటకు వచ్చింది అపర్ణ. ఇంటి ముందు వాకిట్లో వేసిన కుర్చీలో కూర్చుంది అపర్ణ. ఇంతలో డెబ్బై ఐదు ఏళ్లు ఉంటాయేమో !ఒక ఆడ మనిషి వస్తూ కనిపించింది. కొంచెం వయసు ఎక్కువగా ఉండటం తప్ప, మనిషి చాలా చక్కగా ఉంది. మెల్లగా లోపలికి నడుచుకుంటూ వస్తుంది. ఆమె చేతిలో అరిటాకుల కట్ట ఉంది. అది పట్టుకుని మెల్లగా వస్తుంది. ఆమెను గుర్తుపట్టిన అపర్ణ ఒక్కసారి ఆనందంతో” బూమవ్వా! ” అని పిలిచింది.
ఇటువైపు చూసిన భూమవ్వకి, అపర్ణ కల్పించింది. కానీ గుర్తుపట్టలేకపోయింది.
” అమ్మ ఎవరో యాదికొస్తలేదు! ” అన్నది.
” నేను అపర్ణను” అని నేను ఫలానా వారి అమ్మాయిని. నువ్వు చిన్నప్పుడు నన్ను ఎత్తుకునే దానివి. మా ఇంట్లోనే ఎక్కువగా ఉండే దానివి” అని గుర్తు చేసింది.
” నువ్వా ! అప్పు తల్లి! ఎన్నేండ్లయింది?.గప్పుడు పెండ్లిల జుషిన.బాగున్నవా!.పిల్లలు ఎంత మంది?” అని దగ్గర కూర్చొని ప్రశ్నల వర్షం కురిపించింది.
నాల్గవ భాగం
అలా ఎన్నో ఊహలతో ఉన్న అపర్ణకి తను దిగాల్సిన ఊరు ఎప్పుడు వచ్చిందో చూసుకో లేదు. అప్పటికే బస్సు అంత ఖాళీ అయిపోయింది. కండక్టర్ అన్నాడు” మేడం ఇదే లాస్ట్ స్టేజ్ దిగండి”
” ఒక్కసారిగా ఊహా ప్రపంచం నుంచి బయటకు వచ్చి కిటికీలో నుండి బయటకు చూసింది. బస్టాండ్ అంతా కోలాహలంగా ఉంది .తను ఎక్కిన బస్సు ఖాళీగా ఉంది ,వెంటనే తన సూట్ కేసు బ్యాగు తీసుకుని కిందకు దిగింది.
ఎదురుగా కనబడిన మనుషులు చూసి ఆశ్చర్యపడింది. అతను ఎవరో కాదు రామాలయంలో పూజ చేసే పూజారి. వయసు పైబడి నడవలేక నడుస్తూ బసు కోసం అనుకుంటా ముందుకు వస్తున్నాడు.
అపర్ణ వెళ్లి పలకరించింది.
“పెద్దనాన్న బాగున్నారా”అన్నది అపర్ణ.
“ఎవరు తల్లి, నాకు చూపు అనడం లేదు గుర్తుపట్టలేకపోతున్నాను” అన్నాడు వణుకుతున్న శరీరంతో.
“నేను దక్షిణామూర్తి గారి అమ్మాయిని. నా పేరు అపర్ణ .చిన్నప్పుడు మీ అమ్మాయి, నేను ఇద్దరం కలిసి స్కూలుకు వెళ్లే వాళ్ళం గుర్తొచ్చిందా? పెదనాన్న”అని చెప్పింది అపర్ణ.
గుర్తుపట్టినట్లు తలాడించాడు పూజారి గారు. బ్యాగ్ లో నుంచి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టి
“ఇది ఉంచండి” అన్నది అపర్ణ.
“ఎందుకు బిడ్డ, నాకు డబ్బులు అవసరం ఉన్నవని నీకు అర్థం అయ్యిందా”అన్నాడు నవ్వుతూ.
“బస్సు వచ్చింది నేను వెళ్తాను బిడ్డ. వెళ్లే లోపల మా ఇంటికి రా?”అని చెప్పి కర్ర సహాయంతో ముందుకు వెళ్లిపోయారు పూజారి గారు.
ఒక్క నిట్టూర్పు వదిలింది అపర్ణ .”రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో అర్థం కావడం లేదు. పూజారి పెద్దనాన్న గుడిలో అలంకరించిన తీరు చూస్తే ఎంతో బాగుండేది. ఏంటో ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నారు” అని బాధపడింది.
తన స్నేహితురాలు వసంతకు ఫోన్ చేసింది..
” వసంతా! నేను మన ఊర్లో బస్సు దిగాను. మీ ఇల్లు ఎటువైపు ?చెబితే నేను వచ్చేస్తాను” అని చెప్పింది.
” వచ్చేసావా?కాస్త ముందే ఫోన్ చేయకూడదా? కార్ పంపిస్తాను, ఐదు నిమిషాలు వెయిట్ చెయ్.. మన ఊరు నువ్వు చూసినప్పటిలా లేదులే. చాలా మారిపోయింది. నువ్వు మా ఇల్లును గుర్తుపట్టలేవు.అక్కడే ఉండు ” అని చెప్పింది వసంత.
” సరే” అని అక్కడ బెంచ్ మీద కూర్చుంది అపర్ణ.
బెంచ్ మీద తన పక్కనే ఒకతను కూర్చుని ఉన్నాడు.తెల్ల పంచె ,లాల్చీ వేసుకుని ఉన్నాడు. మనిషి బాగా ఎత్తుగా తెల్లగా ఉన్నాడు. వయసు దాదాపు 75 ఏళ్లు ఉంటుందేమో!
“ఎక్కడో చూశాను ఇతన్ని అని అనుకొని
“అయ్యో ఈయన డ్రాయింగ్ మాస్టారు ఆనందం సార్ కదా” అని అనుకొని,
” నమస్తే సార్ బాగున్నారా!” అని అడిగింది అపర్ణ.
” బాగున్ననమ్మా ! కానీ, నువ్వు ఎవరో నేను గుర్తు పట్టలేదమ్మ! ఏమీ అనుకోవద్దు .వృద్ధాప్యం కదా! కళ్ళు కాస్త మసకబారాయి” అని అన్నాడు అతను.
” నేను మీస్టూడెంట్ ను సార్, నాపేరు అపర్ణ.నేను క్లాస్ లో ఎప్పుడైనా మీరు ఇచ్చిన చిత్రాన్ని అచ్చంగా అలాగే వేస్తే, ఎన్నోసార్లు నన్ను మెచ్చుకున్నారు. ఆడ్రాయింగ్ పైన మీరు పెట్టే సంతకంతో పాటు ‘ గుడ్ ‘ అని పెట్టించుకోవాలని క్లాస్ అంతా ప్రయత్నించేవాళ్ళు. అందులో నేను ఒక దాన్ని.ఎన్నోసార్లు నన్ను మెచ్చు కున్నారు .” అని చెప్పింది అపర్ణ.
ఆనందం సారు కొంచెం ఆలోచిస్తున్నట్లుగా తలపైకెత్తి,
” ఆ !గుర్తొచ్చింది. తరగతిలో అల్లరి కూడా బాగా చేసే దానివి. చాలా సంతోషం తల్లి, నన్ను గుర్తుపట్టి మాట్లాడించినందుకు. ఎక్కడ ఉంటున్నావ్ ?ఏం చేస్తున్నావు? భర్త పిల్లలు అందరూ కులాసానా?” అని అడిగాడు సార్.
” అన్ని వివరంగా చెప్తాను సార్ .మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? మీఇంటి అడ్రస్ చేప్తే వస్తాను. నేను ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటాను. మీఇంటికి వచ్చి కాసేపు కూర్చొని అన్ని వివరాలు చెప్తాను” అని అన్నది అపర్ణ.
ఆనందం సార్ తన ఇంటి అడ్రస్ చెప్పి ,తను వెళ్లాల్సిన బస్సు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు.
అపర్ణ తన స్నేహితురాలు పంపించిన కారులో వాళ్ళ ఇంటికి చేరుకుంది. దారిలో ఊరంతా చూస్తుంది. తన పుట్టి పెరిగిన ఊరుకు, ఇప్పటి ఊరుకు పోలికే లేదు. అంతా పట్టణ వాతావరణం లాగే ఉంది.
” వసంత చెప్పినట్లు నేను ఒక్కదాన్ని వెళ్లడం కష్టమే” అని అనుకున్నది. ఇంతలో కారు ఇంటి ముందు ఆగింది .
కారు దిగి దిగగానే ఎదురుగా స్నేహితురాలు వచ్చేసింది.ఇద్దరూ ఒకరి ఫోటోలు ఒకరు వాట్సాప్ లో పంపించుకోవడం వల్ల గుర్తుపట్టుకోగలిగారు. లేకపోతే పూర్తిగా మారిపోయిన వాళ్ళ రూపాలను గుర్తుపట్టుకునే వాళ్ళు కాదు.ఎంతో లావుగా అయిన వసంతను చూసి,
” ఏంటే ఇంత మారిపోయావు,?” అని దగ్గరకు తీసుకుంది అపర్ణ.
” అవునే చాలా మారిపోయాను. బాగా ఒళ్లు వచ్చేసింది. ఇంట్లో అందరూ కూడా తిడుతున్నారు. ఆరోగ్యం పాడవుతుంది కాస్త డైట్ చూ సుకో అని ” అని నవ్వుతూ అపర్ణను చేతులతో పట్టుకుంది.
” కానీ, నువ్వు మాత్రం ఏమీ మారలేదు అప్పూ! అలాగే ఉన్నావ్. ఈ చీర కట్టులో బాగున్నావు. అందమైన జడ ఏమాత్రం చెక్కుచెదరలేదు సుమా! ” అన్నది వసంత.
” ఇంట్లోకి రానిస్తావా? లేక ఈ ముచ్చట్లతోనే కడుపు నింపుతావా? నిన్నటి నుండి ప్రయాణం చేసీ చాలా అలసిపోయాను” అన్నది అపర్ణ.
” అయ్యో! నిన్ను చూసిన సంతోషంలో ఆవిషయమే మర్చిపోయానే! పద పద లోపలికి వెళదాము. నీకు గది ఏర్పాటు చేశాను. స్నానం చేసి టిఫిన్ చేసి అలసట తీరేవరకు పడుకో” అని చెప్పి స్నేహితురాలిని లోపలికి తీసుకెళ్ళింది వసంత.
ఇల్లంతా పెళ్లి సందడిగా ఉంది. పూల తోరణాలు, మామిడి ఆకుల తోరణాలు కట్టి ఎంతో అందంగా ఉంది. చక్కని పరిమళాలు వెదజల్లుతుంది . ఒక్కసారి అలసట అంతా మాయమైపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న కొంతమంది తెలిసిన బంధువులను పలకరిస్తూ గదిలోకి వెళ్లిపోయింది అపర్ణ.
తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిన అపర్ణకు, ఆగదిలోని అమరిక ఎంతగానో నచ్చింది. ఆ గది వసంత వాళ్ళ తల్లి తండ్రులదట. వసంత అత్తగారు కూడా ఒకటే ఊరు కావడం వల్ల ఇంచుమించు అందరూ కలిసే ఉంటారు. అందులో వసంత అత్తగారు వాళ్ళు మేనరికం. వసంత ఒకతే అమ్మాయి. అందుకని తల్లిదండ్రులు తన దగ్గరే ఉంటారు. ఆ గదిలోని సామాను చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. పాత కాలపు పందిరి మంచం , డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా కొన్ని చెక్క బొమ్మలు. ఇలా ఎంతో బాగుంది.మరో పక్క చిన్న దివాన్.అది తనకోసం కావొచ్చు అనుకున్నది.ఇల్లంతా మార్పులు చేసినా, ఈ గది అలాగే ఉండాలని వాళ్ళ కోరికట.గదిలో గంధపు పరిమళం వస్తుంది. దేవుడి పటానికి గంధపు పూమాల వేశారు.
అపర్ణ తన సూట్ కేస్ తెరచి, అందులో నుండి టవల్, సబ్బు,షాంపూ ,కట్టుకునే చీర బయటకు తీసి,సూట్ కేస్ మూసి, ఒక పక్కగా పెట్టింది.బాత్రూమ్
లోకి వెళ్లి హాయిగా నీళ్లు ఒంటి మీద పోసుకుంటే, బడలిక తీరినట్లు అనిపించింది. ఇంతలో బయట నుండి వసంత పిలుపు వినిపించింది.
” అప్పూ! కుంకుడు కాయ రసం బాత్ రూం లో పెట్టించాను.నీకు నచ్చితే చెయ్యి,లేదా షాంపూ కూడా అక్కడే ఉంది ” అని చెప్పింది .
” ఓహ్! అవునా! ఎన్నాళ్ళయింది కుంకుడుకాయ రసంతో స్నానం చేసి.సరెనే ! ” అని చెప్పి చక్కగా కుంకుడు రసంతో తలస్నానం చేసి ,సున్నిపిండితో స్నానం చేసి బయటకు వచ్చి,తలకి చిన్న పంచె కట్టుకుని ,తనకి ఎంతో ఇష్టమైన పింక్ చీర కట్టుకుంది.లైట్ గా మేకప్ చేసుకుని, కొంచెం పెద్ద బొట్టుపెట్టుకుని,ముత్యాల దండ మెడలో వేసుకుని తనని తాను చూసుకుంది.వెంటనే భర్త గుర్తొచ్చి ఒక సెల్ఫి తీసుకుని పంపించింది.
తర్వాత తలని తుడుచుకుని, జుట్టు వదిలేసి ఒక క్లిప్ పెట్టుకుని బయటకు వచ్చింది.అపర్ణని చూసిన వసంత
” భలే అందంగా ఉన్నావే” అని పిలిచి అందరికీ పరిచయం చేసింది.
అపర్ణ కూడా అదే ఊరు కావడం వల్ల తనకు చాలామంది తెలిసినవాళ్లే.
అలా అందరితో మాట్లాడుతూ కూర్చుంది. ఇంతలో అందరిని టిఫిన్ చేయడానికి రమ్మని పిలుపులు వచ్చాయి. పెళ్ళంతా సాంప్రదాయంగానే ఉండాలని ఏర్పాటు చేసింది వసంత. ఆకాలపు ఉపహారాలు, భోజనాలు ఇంటి వెనక పెరట్లో తడికల పందిళ్లు, పచ్చని విస్తారాకులలో భోజనాలు. కింద కూర్చొని తినగలిగే వాళ్ళకి చాపలు పరిచారు. కింద తినలేని వాళ్ళకి వరుసగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ తడికల పందిరిలోకి వెళ్ళగానే ఎంతో సంతోషం అనిపించింది అపర్ణకు . తన పెళ్లి జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఇంకా అదే విధంగా ప్లాన్ చేసుకున్న వసంతను మనసులోనే అభినందించింది.
” వసూ! ఎంత బాగా ఏర్పాట్లు చేసావే, ఇంతకీ ఆలోచన నీదా ?మీ ఆయనదా?” అని అడిగింది.
“ఏం? నాకు అలాంటి ఆలోచనలు రావు అనుకున్నావా?. నిజం చెప్పాలంటే మా ఆయనదే” అని చెప్పి పక్కకు తిరిగినంతలో వసంత వాళ్ళ ఆయన శ్రీనివాసరావు వస్తూ కనిపించాడు.
“అదిగో మాటల్లో వచ్చారు మాశ్రీవారు” అని అపర్ణ వైపు చూసి,
“మాఆయన శ్రీనివాస రావు, ఇదేమో నా ఫ్రెండ్ అపర్ణ” అని పరిచయం చేసింది.
పరస్పర పరిచయాలు అయ్యాక..
“రండి అపర్ణ గారూ!టిఫిన్ చెయ్యండి ” అన్నాడు శ్రీనివాస రావు.
” అందరం కలిసి తిందాం మీరూ రండి ” అని వసంత వైపు చూసింది అపర్ణ.
“మేము ఇప్పుడు ఏమీ తినకూడదు.ఈ రోజు అమ్మాయిని పెళ్లి కూతురును చేస్తున్నారు కదా!అంకురార్పణ,ఇంకా కొట్నం ఉంటుంది “అని చెప్పింది.
“అవును మరచే పోయాను.సరే, నేను వెళ్లి టిఫిన్ చేసి వస్తాను. ఏదైనా సహాయం చేస్తాను తిన్నాక ” అని చెప్పి అపర్ణ పందిట్లో కి వెళ్ళింది .
పందిట్లోకి వెక్కిన అపర్ణ ఆ వాతావరణం చూసి మై మరచి పోయింది.
సశేషం
భారతదేశంలో అలనాటి ప్రఖ్యాత రాజకీయ నేత, అంతకుమించిన దాత, ఎందరికో స్ఫూర్తి ప్రదాత, ‘మాన్సాస్’ సంస్థ వ్యవస్థాపకులు, విజయనగరం పూసపాటి గజపతి వంశతిలకుడు, స్వర్గీయ పివిజి రాజుగారి శతజయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల సమాహారంగా ‘మాన్సాస్’ సంస్థ ప్రచురించిన ‘The last Maharaja of vizianagaram’ ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాద గ్రంథమే ఈ “స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా” పుస్తకం.
ఇది కేవలం ఒక జీవిత చరిత్ర కాదు. 20వ శతాబ్దంలో మనందరి మధ్య నడచిన ఒక రాజర్షి జీవన ప్రస్థానానికి సజీవ చిత్రం. నియమబద్ధమైన వారి జీవన విధానానికి, హృదయ సౌశీల్యానికి అక్షర రూపం. ఇది కేవలం వారి గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఉద్దేశించబడినది కాదు. వారి జీవితపయనంలోని అనేక మజిలీలతో పాటుగా, నిబద్ధతకు, నిరాడంబరతకు, నిస్వార్ధ తత్వానికి మారుపేరైన వారి జీవనశైలికి అద్దంపడుతూ రాబోవు తరాలవారికి కూడా మార్గదర్శకమయ్యే గ్రంథం. చదువుతున్నంతసేపూ మనం కూడా పివిజి రాజుగారి జీవనపయనంతో పాటుగా ప్రయాణిస్తాము. అంతలాగా మనల్ని లీనంచేసి ఆసాంతం చదివింపజేస్తుంది. చక్కటి అందమైన తెలుగుశైలిలో పొందికగా అమరిన ఈ పుస్తకం చదివితే ఎక్కడా అనువాద రచనగా అనిపించదు. అచ్చమైన తెలుగు గ్రంథంగా అనిపిస్తుంది. అనువాదకులకు నా ప్రత్యేక అభినందనలు.
‘రాజ కుటుంబీకులు’ అనగానే వారు ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతారని, వారి జీవితం వడ్డించిన విస్తరిలా ఎప్పుడూ హాయిగా నిండుగా ఉంటుందని మాత్రమే ఆలోచించేవారు తప్పకుండా ఈ పుస్తకం చదవవలసి ఉంది. ఎందుకంటే పైకి కనిపించే వారి హుందా ఆయన చిరునవ్వు వెనుక ఎన్ని రాచరికపు కట్టుబాట్లు ఉన్నాయో, జీవితంలో ఎన్ని ఒడిదుడుకలను ఎదుర్కొన్నారో తెలుస్తుంది. అందులోనూ పివిజి రాజుగారు, వారి తండ్రి అలక్ నారాయణ గజపతి గారు బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పరిష్కరించుకునేందుకు వారు నిలబడి పోరాడిన తీరు ఈ పుస్తకం ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

పివిజి రాజు గారు అనగానే విజయనగర సంస్థానానికి పట్టాభిషిక్తులైన ఆఖరి మహారాజుగా, ప్రజా సోషలిస్టు పార్టీ నాయకులుగా, కేంద్రమంత్రివర్యులుగా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను నిస్వార్ధంగా చేసిన మహనీయులుగా చాలామందికి తెలుసు. వారి జీవితాన్ని గురించిన పుస్తకం అనగానే వారి జీవితంలో మధురమైన ఘట్టాలు, వారు సాధించిన విజయాలు, వారి ఉదాత్తతను చాటే కార్యాలు మాత్రమే ఉంటాయనుకుంటే అది పొరపాటే. వారి జీవితం నిజానికి పరచిన పువ్వుల బాట కాదు. ఎన్ని రకాల సవాళ్లను సమస్యలను ఎదుర్కొంటూ వారు ఆ స్థాయికి చేరుకున్నారో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ, అన్ని కోణాలనుండీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన పుస్తకం ఇది.
పుస్తక ప్రారంభంలోనే అలక్ నారాయణ గజపతి రాజు గారు మద్రాసు కోర్టులో తన పిల్లల జీవితాలకి సంబంధించిన కీలక నిర్ణయం కోసం పోరాడిన విషయాలను గూర్చి చదివితే పసివయసులోనే ఆ పిల్లలు ఏ విధమైన ఆందోళనకు గురై ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పివిజి రాజు గారు ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా పనిచేసిన తీరు దగ్గరనుంచి, జీవితంలో రాజకీయ ఉన్నతి పొంది అత్యుత్తమ స్థాయిలో ఉన్న సమయంలో యాక్సిడెంట్ జరగడం వలన అనుభవించిన మనోవేదన వరకు ఎన్నో విషయాల గురించి విపులంగా చర్చించబడింది. ‘దుఃఖాలకు కృంగిపోక సుఖాలకు పొంగిపోకుండా జీవితంపై సమదృష్టి గలవాడే స్థితప్రజ్ఞుడు’ అని చెప్తుంది భగవద్గీత. పివిజి రాజుగారు దీనికి సజీవ ఉదాహరణగా స్ఫూరిస్తారు వారి జీవితయాత్ర చదివితే. వారియొక్క పూజ్య గురువుల అనుగ్రహంతో ఎంతో ఆధ్యాత్మిక పరిణితి పొందిన కర్మయోగి ఆయన. అందుకే ఈ వ్యాసం ప్రారంభంలో వారిని ‘రాజర్షి’ అని సంబోధించాను. చిన్న సమస్య వస్తే చాలు విపరీతంగా కృంగిపోయి ఆందోళనపడే ఈతరం పిల్లలు తప్పకుండా చదువుకోవలసిన పుస్తకం ఇది. మాన్సాస్ విద్యాసంస్థల విద్యార్థులు మరీ ముఖ్యంగా చదవాలి. ఏ ఆశయ సాధన కోసం ఎంత కష్టపడి ఈ సంస్థలను నిలబెట్టారో, ఎంతమంది అక్కడ చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారో, ఎటువంటి మహానుభావులు ఈ విజయనగరం నేలపై నడయాడారో నేటి తరం తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
పివిజి రాజుగారు కుసుమాగజపతి గారు దంపతులు భూదానోద్యమ సమయంలో వినోబాభావే గారితో పాటు కలసి నడిచి ఎంతో ప్రచారం చేశారు. ఊరి నడిబొడ్డులో తమ వంశపారంపర్యంగా వస్తున్న కోటను విద్యాభివృద్ధి కోసం దానం ఇచ్చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ‘వేల ఎకరాల భూమిని ప్రజలు కోసం దానమిచ్చిన ఉదాత్త హృదయులు మా రాజుగారిని’ విజయనగర ప్రజలు తరతరాలుగా గర్వంగా చెప్పుకుంటారు.
పూసపాటి గజపతి రాజవంశం.. నిరంతరం ప్రజల బాగును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్న కుటుంబం అది. విద్యాసంస్థలను నెలకొల్పడంలో కానీ, బ్రిటిష్ పరిపాలనా పద్ధతులకు కొన్నిసార్లు తలవంచడం కానీ, అప్పట్లో లక్షల రూపాయల విరాళాలతో వివిధ ప్రదేశాలలో కట్టించిన కట్టడాలు కానీ.. అన్నిటి వెనుక ఉద్దేశం ఒకటే.. దీనజనోద్ధరణ, నలుగురికి ఉపయోగపడాలనే తాపత్రయం. అంతటి ఉదాత్తమైన వంశ చరిత్ర అంతా కూడా సంపూర్ణంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. కనుక సుమారు 300 యేండ్ల చరిత్రతో పాటు, రాష్ట్రంలో సంభవించిన యుద్ధాలు, అప్పటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిణామాలనన్నింటినీ సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. విజయనగరంవారు మాత్రమే కాకుండా తెలుగువారందరూ గర్వపడాల్సిన అంశాలను తనలో అందంగా పొందుపరచుకున్న ఈ పుస్తకం తప్పక పాఠకాదరణ పొందుతుందని ఆశిస్తూ మాన్సాస్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు,
జనవరి మయూఖ పత్రిక సంపాదకీయం
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
అందమైన జీవితాన్ని ఎవరు ఆశించరు? ఆనందమైన బ్రతుకు పయనాన్ని ఎవరు కోరుకోరు? తరతమ బేధాలలో శాతాలుగా విభజించుకొని నైతికతను తినేస్తున్నది ఇప్పటి సభ్య సమాజం. దీన్ని ఎవరికి వాళ్లు వాళ్లలోకి వాళ్లు చూడడానికి నిరాకరించుకుంటున్నారు.
“బూడా గోడా లాల్ లగామ్”ముసలి గుర్రానికి షో కైన కళ్లెం” కాదు జీవితమంటే.లౌక్యం వేరు లోకజ్ఞత వేరు. అసలే ఒకే తరహా రాజకీయ పద్ధతిని చూస్తున్నాం. అదెంతా వికారమో తెలుసు. ప్రజాస్వామ్యం ఎట్లున్నది అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడెలా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. పార్లమెంటరీ పాలనా విధానాలు అనేవేవీలేవు. వందరెట్ల నిరంకుశతత్వాన్నే చూస్తున్నాం. పార్టీలు కాదు గెలిచేది పైసలు గెలుస్తున్నాయి అన్నట్టున్నవి పరిస్థితులు. ధైర్యం అనేది కొనుక్కుంటే వచ్చేదా? ఇది అన్యాయం అన్నప్పుడు నిరసనను ఏ విధంగానైనా తెలియజేయాలి కదా !కేవలం నిందలు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా అంతర్లీనంగా ఒకటి నడుస్తున్నది. ప్రత్యామ్నాయ శక్తి లేకుండా పోతున్న రోజులు . అది ఏ పార్టీ గాని అది ఏ ప్రాంతం కానీ ఇదే పరిస్థితి. ఈ రాజకీయాలు విద్యావ్యవస్థలోనూ జొరబడ్డాయి.
సమాజము, ప్రజలు ,విలువలు అనేవి ఏవి మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ….ఇవి మాత్రమే రాజ్యమేలుతున్నాయి. ఈ భావ దారిద్ర్యం ప్రజల పట్ల ఒకే సారాంశంతో సంచరిస్తున్నది. Political గా అస్తిత్వం అనే భావన కనుమరుగవుతున్న రోజులు.
ఇవన్నీ పాఠశాలలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రభావితం చేస్తున్నవి. కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయికి వెళ్లిన తర్వాత
వంటబట్టాల్సిన రాజకీయాలు, ఉన్నత ప్రాథమిక పాఠశాల నుండే కుటుంబ పరంగా, కుల పరంగా వాళ్ల మెదడులలో దూర్చి పిల్లల చైతన్యవంతమైన ఆలోచనలను శాసించి చైతన్య హీనంగా చేస్తున్నవి. మార్కులు, ర్యాంకులు మరో విధమైన చెలగాటం ఆడుతున్న విద్యార్థులతో …దీనివల్ల తల్లిదండ్రులు, కుటుంబం, బడి ,చదువు ,టీచర్ అనే వాతావరణం నుండి మరింకేదో వాతావరణం కోరుకుంటున్నది ఈ తరం. అది కాస్త వికృత రూపం దాలుస్తున్నది. వీటి నుండి బయట పడాలంటే ఒక్కటే మార్గం… పుస్తకాలను చదివించడం. బవంతంగా నైనా చదివించడం…. ఇష్టపడేలా చేసి చదివించడం… ఎలా? రెండు వైవిద్యమైన భావాలు ఒక్కచోట చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నాయి.దీనిలోని మంచి చెడులను గ్రహించి తల్లిదండ్రులు టీచర్లు కలిసి పిల్లల ముందు చర్చించుకోకుండా వాళ్ళ లేత మనసులు గాయపడకుండా జాగ్రత్తగా ఒక ప్రణాళికను ఏర్పరచుకొని చేయాలనుకుంటే…
సారస్వత క్షేత్రంలో బంగారు పంటలు పండించిన ఇతిహాసాలు మనకున్నాయి. కావ్య యుగంలో రసవత్తరమైన రచనలు వెలువడిన సాహిత్య చరిత్ర మనకు ఉన్నది. విద్వత్ కవుల అద్భుత రచనలు అక్షర దీపాలుగా ప్రజ్వలిల్లిన వాజ్మయ చరిత్ర మనకున్నది. శాస్త్ర సాంకేతిక విద్య సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యసన, తాత్వికచింతన ఉన్న మన దేశం విలువలను ప్రస్ఫుటించే పుస్తకాలెన్నో ఉన్నాయి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఉన్నాయి. అటువంటివన్నీ అందుబాటులోకి తీసుకువచ్చి కొత్త తరం వాళ్లకు నేర్పించాలి. లేకుంటే చెప్పలేనంత సాచ్యురేషన్ అనేది వచ్చి అన్నీ పోతాయి . ఎక్కడికి పోతాయి? ఆ గ్రంథాలు అలాగే ఉంటాయి భాండాగారాలలో!! ఆ జ్ఞానసంపద అంతా అలా నిక్షిప్తమైపోయి ఉంటుందే కానీ ఏ సమాజానికైతే అవసరమో భావి పౌరుల జీవన్ మార్గానికి తోడుగా ఉంటాయో అవి ఏవి వాళ్లకు అందకుంటే అవన్నీ అక్కడ భద్రపరిచి ఉన్నా లేనట్టే!
అయితే అవన్నీ ఈ కాలం పిల్లలు చదవలేరు అనుకుంటే వాళ్లకు అర్ధమయ్యే రీతిలో వాళ్ళ వాళ్ళ మాతృభాషలో నే కాకుండా ఇప్పుడు వాళ్లు ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ లో నైనా
చిన్న చిన్న వాక్యాలతో ఆ పెద్ద భావాన్ని ప్రోది చేస్తూ కొత్తగానైనా పుస్తకాలు రాయాలి. రాయించాలి. ఇటువంటి పుస్తకాలు యూనిక్ గా ఉండి సమాజ యోగ్యమైనవి రచింపజేస్తే పిల్లలకు రురించి అవి మాత్రమే నిలుస్తాయి.
గ్రూపులు కట్టడాలు, నిందలు వేయడాలు…. తీవ్రమైన లొసుగులు తో నడుస్తున్నవి రోజులు.అవినీతి చాలా పెరిగిపోయి పాఠశాలలను కూడా వ్యాపార కేంద్రాలుగా చూస్తున్నారు. విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను పావులుగా వాడుకుంటున్నారు.
“జై సాకరోగే వైసా బరోగే” “మనం ఎట్లా చేస్తే ఫలితం అట్లా వస్తుంది”
పాఠశాలల ఉపాధ్యాయులు శ్రద్ధగా పాఠాలు చెప్పకుంటే పిల్లలు చదువరు. పిల్లల స్థాయికి తగినట్టుగా చదువు చెప్పే వాళ్ళు లేకుంటే విద్య నిలువదు. చాలా వరకు తెలుగు మీడియంలో చదువుకున్న టీచర్లు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం వాళ్లకు బోధనలో ఉండడం అనేది శోచనీయమైనటువంటి విషయం. అంతటా కాకుండా గ్రామీణ ప్రాంత బళ్ళలో ఇదే జరుగుతుందని వినికిడి. టీచర్స్ కే రాకుంటే పిల్లలకి ఏం చెప్తారు? భాష పై పట్టు ఉండి, భాషా సౌందర్యాన్ని విడమర్చి చెప్పగలిగే శక్తి ఉండి గ్రామర్ మిస్టేక్స్ పిల్లలు ఎక్కడ చేస్తున్నారో పట్టుకొని నేర్పించగలిగే యుక్తి ఉంటేగాని విద్యార్థులకు సరైన ఇంగ్లీష్ వస్తుంది , న్యాయం జరుగుతుంది. అసలే smart phone మాయాజాలంలో అంతా బూటకపు వార్తల ప్రపంచంలో సమాజం . ఎన్నో మంచి విలువైన విశేషాలు ఉన్నా కూడా ఫోన్ ను miss use చేస్తూ పిల్లలు వాళ్ళ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు ఈ విషయంపై అంతుపట్టడం లేదు. చదువుతున్నారు… ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి.. అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ, తమ పిల్లలపై ఇన్ని రకాల చెడు ప్రభావాలు పడుతున్నాయి… ఈ ఆవరణలో నుంచి బయటికి రాలేకపోతున్నారు మా పిల్లలు అని గ్రహించలేకపోతున్నారు.ఏం చేయాలో వాళ్ళ కూ అర్థం కావడం లేదు. మొక్కలలోనూ divinity ఉన్నదని చెప్తున్న పరిస్థితులను చూస్తున్నాం … అటువంటిది మనుషులలో ఎందుకు లోపిస్తుంది ? లోపించదు. వెలికి తీయాలి. అన్ని మతాలలోనూ నిత్య నూతనమైన సనాతనమూ ఉన్నది. నిలువెత్తు ధర్మాన్ని ఆపాదించుకున్న సంస్కృతి మనకున్నది. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్న
భారతదేశం ఇది. ఈ ఉన్నత విలువలను జారవిడుచుకుంటే భవిష్యత్తు అంతా అంధకారమే. సనాతన ధర్మము అంటే, సంస్కృతి అంటే, ఆచారాలు అంటే ఏవో తప్పు మాటలు అనే భావాన్ని కొత్త జనరేషన్ కు నేర్పిస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా ఇవన్నీ పాటిస్తుంటారు. మరి మన దేశానికి ఏమైంది? మనుషులం… మనం ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఇవన్నీ తప్పకుండా అందరూ గ్రహించాలి. ఒక సమయమనంతో సాగాలి.
ఒకప్పుడు ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధాసక్తులతో పాఠ్య బోధన చేసేవాళ్లు. ఆనాటి టీచర్స్ ను గుర్తు చేసుకుంటే down to Earth అని చాలామంది అంటారే… ఆ విధమైన మనస్తత్వాలతో సమాజ నిర్మాణం వాళ్ల చేతుల్లోనే ఉన్నది అనే గొప్ప భావనతో పాఠ్య బోధన చేసేవాళ్ళు. ఇది మళ్ళీ పునరావృతం కాకుంటే…
రాబోయే తరాలకు జవాబుదారీగా నిలవాల్సింది ఎవరు? మేధావులు ఇలా మౌనం వహించడం మంచిది కాదు. ఈ మౌనం దేశ సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాలను ఎదగకుండా చేస్తుంది. కౌన్సిలింగ్ క్లాసెస్ టీచర్స్ కి కూడా పెట్టి వాళ్లలో దాగి ఉన్న మంచితనాన్ని , తెలివినీ, కృషి తత్వాన్ని, ఋషి తత్వాన్నీ మేలుకొలిపి మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చేలా … ఎ గుడ్ టీచర్ మేక్స్ ఎ గుడ్ సొసైటీ అనే నినాదాన్ని ఎలుగెత్తి చెప్పాలి.
“పట్టుపట్టగ రాదు పట్టి విడువగ రాదు
పట్టెనేని బిగియపట్టు పట్టవలయు….” అన్నారు పెద్దలు . ఈ మాటలకున్న అర్ధాన్ని అందిపుచ్చుకొని మరణం అంచుల్లో పడిపోకుండా నిలపాల్సిన బాధ్యత ఇప్పుడు మన అందరిదీ. చాలాచోట్ల మంచి ఉద్దేశంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు లేకపోలేదు. వాళ్ల కృషిని గ్రహించి వాళ్లకు చేయూతనిచ్చి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఇంకా ఇంకా న్యాయమైన పద్ధతిలో నిజాయితీగా సేవలు చేసే దిశగా పెద్దలు మాట్లాడాలి.
మన మెప్పులో వేయి సౌదామినుల మెరుపు ఉండాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా … గుండె లోతుల్లోనుంచి మెచ్చుకుంటామో ఈ ఫలితాలు వస్తాయి.
అన్ని సమయాలలో మౌనం మంచిది కాదు!!
____***____
(మొదటి భాగం, మహాబోధి బుద్ధవిహార)
బౌద్ధధర్మాన్ని సామాన్య ప్రజలలోనికి కొనిపోవడానికి జాతకకథలు ఎంతో ఉపయోగపడ్తాయి. ఈ జాతక కథలు పాలీ(భాష)లోని గాథలకు సందర్భసహిత వివరణలు. ఇవి పాలీత్రిపిటకాలలో ఖుద్ధనికాయంలో భాగంగా ఉన్నాయి. బౌద్ధులకు ఆదర్శ గ్రంథాలు త్రిపిటకాలు. అవి: 1. వినయపిటకం, 2. సుత్తపిటకం, 3.అభిధమ్మపిటకం.ఈ త్రిపిటకాలలో రెండవదైన సుత్తపిటకానికి సంబంధించిన గ్రంథమే ఖుద్ధనికాయగ్రంథం.
ఈ ఖుద్ధనికాయగ్రంథం మొదటిభాగంలో 150(నూటాయాబై) కథలున్నాయి. ఆ కథలను పదివర్గాలుగా విభజించారు. అవి: 1) అపణ్ణక, 2) శీల, 3) కురుఙ్గ (కురుంగ), 4) కులావక,5) అత్థకామ, 6) ఆసీస, 7) ఇత్థి, 8) వరుణ, 9) అపాయిమ్హ .10) లిత్థ, 11) పరోసత, హంచి, కుసనాళి, 14) అసమ్పదాన, 15) కకణ్టక వర్గాలు. ఇందులోని ఒక్కొక్క వర్గంలో ‘పది కథలు’(15I10R మొత్తం 150) ఉన్నాయి.
ఒకటి రెండు కథల్లో తప్ప, ప్రతికథలోనూ ఒక వర్తమాన కథ, ఒక అతీతకథ(గతాపూర్వ)జన్మకు సంబం ధించినకథ) ఉంటుంది. అంతేగాకుండా ఈ కథల్లో మనుష్యులు, యక్షులే గాకుండా రకరకాలప్రాణులు ాజంతువులు (ఏనుగు, కోతి మొసలి మొదలైనవి), పక్షులు(పావురాలు, చిలుకలు మొదలైనవి) కూడా కనబడుతాయి. ముందుగా ఆ కథల్లోనుండి వ్యాపారుల కష్టనష్టాల గురించి తెలుసుకుందాం,
వ్యాపారుల కష్టనష్టాలు ా సమాజం (అపణ్ణకకథ)
సరుకుల రవాణాకు పూర్వకాలమైన, ఇప్పుడైనా కష్టమైన పనే. సరుకుల రవాణా, ధరల నిర్ణయం, అనిశ్చిత స్థితి, అస్థిరస్థితి, భయాందోళనతోనే ఉంటుంది. ఆనాటికి, ఈనాటికి సరుకులరవాణాలో వేగం పెరిగితే పెరగవచ్చు. కాని, అవే సమస్యలు, కొన్ని వందల ఏండ్లనుండి వ్యాపారస్థులకు ఎదురు అవుతునే ఉన్నాయి. జాతకకథల ద్వారా ఆ వ్యాపారుల సాధకబాధకాల గురించి తెలుసుకుందాం.
ప్రాచీనకాలంలో అయినా, నేటి ఆధునికకాలంలో అయినా కొన్ని ప్రాంతాల్లో సరుకు రవాణావాహనాలు అడవులగుండా వెళ్ళాల్సి ఉంటుంది.ఆ అడవలు అనేకరకాలుగా ఉంటాయి. అవి: 1) దొంగల అడవి, 2) క్రూరమృగాల అడవి, 3) నీరులేని అడవి, 4) అమనుష్యుల అడవి, 5) తిండి దొరుకని అడవి.
ఈ అడవులగుండా భూమార్గంలో తూర్పు నుండి పడమరకు, పడమటి నుండి తూర్పుకు వ్యాపారనిమిత్తం బండ్లమీదసరుకు తీసుకొని రండు, మూడుజట్ల వ్యాపారులు కలిసి వెళ్లేవారు. ఆ జట్లకు ఎదురయ్యే, కలిగే లాభనష్టాలు: ` సాధారణంగా దారి, నీరు, ఆహారం, సరుకులు, వాటి విలువనిర్ణయించడాలు, దొంగలు, యక్షులు, మోసగాళ్లు మొదలైన సమస్యలు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.
రెండు, మూడుజట్ల వ్యాపారులబండ్లు ఒకేసారి ప్రయాణం చేస్తే ఒనగూరే కష్టనష్టాల గురించి, ఒక్కొక్కజట్టు వెళ్తే ఒనగూరే కష్టనష్టాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపణణ్జజాతక కథలో బోధిసత్వుడు ఒక వ్యాపారికుటుంబంలో, సౌమ్యుడు మరో వ్యాపారికుటుంబంలో జన్మించారు. వీరిద్దరు తూర్పు నుండి పడమరకు, పడమటి నుండి తూర్పుకు సరుకు అమ్ముకోవడానికి వెళ్లేవారు.
బోధిసత్వుడు (మొదటి వ్యాపారి) 500 బండ్లతో సరుకు అమ్ముకోవడానికి, మరో వ్యాపారి కొడుకు ` సౌమ్యుడు కూడా 500 బండ్లతో సరుకు అమ్ముకోవడానికి బయలుదేరారు.
ఇద్దరూ ఒకే సారి వెళ్తే పశువులకు మేత, నీళ్లు కష్టమౌతాయని బోధిసత్వుడు భావించాడు. అంతేగాకుండా దారి బాగా నలిగి, గతుకులు, గాళ్లు పడుతుందని, నీటికి ఇబ్బంది అవుతుందని, ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక నెల ఆలస్యంగా బయలుదేరితే మంచిదని బోధిసత్వుడంటాడు. అప్పుడు సౌమ్యవ్యాపారి తానే ముందుగా వెళ్తానంటాడు.అందుకు బోధిసత్వుడు అంగీకరిస్తాడు.
ముందుజట్టువారి ఆలోచనలు: ముందుజట్టుకు ఎదురయ్యే లాభనష్టాలు
- దారి నలిగి పోదు. గతుకులుండవు. పశువులకు కావలసినంత మేత, నీరు పుష్కలంగా లభిస్తుంది, దారిలో ఆకుకూరలు, కూరగాయలు కొదువలేకుండా దొరుకుతాయి. పైగా ముందుగా వ్యాపారం చేయడం వల్ల ఇష్టం వచ్చిన ధరలకు సరుకులు అమ్ముకోవచ్చు.
వెనకజట్టుకు ఎదురయ్యే లాభనష్టాలు: వెనక జట్టువారి ఆలోచనలు
మొదటి జట్టు నష్టాలు రెండవ జట్టుకు లాభాలుగా మారుతాయి. 1) మొదటిజట్టులో వెళ్లినవారు ా శ్రమించి ఎగుడుదిగుడు బాటలను (ఎత్తుపల్లాలు)సరిచేస్తారు. 2) మొదటిజట్టువారి ఎడ్లు దారిలో ముదురుగడ్డి తింటాయి. 3) నీరు లేని చోట చెలిమెలు తవ్వుతారు.
వెనక జట్టుకు లాభాలు:
1) బండ్ల ప్రయాణం చేసే దారి సుగమంగా ఉంటుంది.
2) లేత పసిరిక(గడ్డి), లేత కూరగాయలు దొరుకుతాయి
3) నీటి కోసం శ్రమించాల్సి అవసరం లేదు. చెలిమలు, ఇతర నీటివనరులు సిద్ధంగా ఉంటాయి.
4) ముందుజట్టుగా పోయినవారు సరుకులధరలు నిర్ణయించాలంటే ప్రాణం పోయినంత పని అవుతుం ది. సరుకులధరలు ముందుజట్టునిర్ణయిస్తుంది. ఆ శ్రమ వెనకజట్టుకు ఉండదు. కాబట్టి సరుకులు తేలిగ్గా అమ్ముకోవచ్చు.
ముందు జట్టు నష్టాలు, వెనక జట్టుకు లాభాలు:
వెనక జట్టు నష్టాలు, ముందు జట్టుకు లాభాలు
యక్షులు: యక్షులతోబాధలు
జాతకకథలను చదువుతుంటె ఎక్కడ యక్షుల ప్రస్తావన వచ్చినా, వారిని నరమాంసభక్షకులుగానే చిత్రించారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. వీరు అనేకరకాలుగా మోసాలు చేస్తుంటారు.
అ) నీరు ా మోసాలు
యక్షులు చేసే మోసాలు, క్రూరకర్మలు ఇన్నిఅన్ని కావు. 1) దారెంట బండ్లు వెళ్తుంటే వ్యాపారస్తులు తీసుకెళ్లే నీటిని మోసపు మాటలతో, మోసపువేషాలతో నమ్మించి, నీటిని పారబోయిస్తారు. 2) వారు (వ్యాపారస్తులు) నీరు లేకుండా బలహీనులైనప్పుడు వారిని పీక్కు తింటారు(అపణ్ణక కథ, పుట,85) చనిపోయినా కూడా వారిని పీక్కు తింటారు.
ఆ) యక్షులమోసపు వేషం:
యక్షుల నాయకుడు వయస్సులో ఉన్న ఎడ్లను అందమైన బండికి కట్టుకుంటాడు. విల్లంబులు, డాలు, కత్తి ధరిస్తాడు. పదిపన్నెండు మంది అనుచరులును వెంటబెట్టుకొని, తామరపూలను, కలువపూలను పట్టుకుంటాండు. తడిసిన వెంట్రుకలతో, తడిసిన బట్టలతో సంపన్నుల్లా బండి మీద కూర్చుంటాడు.
బురద అంటిన చక్రాలతో కూడిన బండితో వ్యాపారస్తులకు ఎదురు వస్తాడు. అనుచరులు కూడా అలాగే దాదాపు తమ నాయకుని వేషంలోనే ఉంటారు. ఆ బండిని, బండికున్న బురదను, తడిసిన బట్టలను, వెంట్రుకలను చూసి, వ్యాపారస్తొలవారు వర్షంలో తడిసి వస్తున్నారనే అనుకుంటారు.
నిజమన వ్యాపారి తన పైకి దుమ్ము రాకుండా ‘ముందుబండి’లో పయనిస్తుంటాడు. యక్షుడు అతని పక్కన బండిని పోనిస్తూ మెల్లెగా మాటల్లోకి దింపి, తేలిగ్గా బరువులేని బండ్లతో వెళ్లమని సలహా ఇచ్చి,వారిని నమ్మేటట్లు చేస్తారు. వారి వద్ద బానల్లో ఉన్న నీటిని పార బోయిస్తాడు.
పాపం! నిజమైనవ్యాపారస్తులు ఎంతదూరం వెళ్ళినా వాన వచ్చిన జాడగానీ, నీటిజాడ గానీ ఉండదు. నీరులేక నీరసించి, బలహీనం కాగానే యక్షులు వచ్చి, ఆ మనుష్యులను, వారి ఎద్దులను పీక్కుతింటారు.
వ్యాపారస్తుల ఎడారి ప్రయాణం:
వ్యాపారస్తుల ఎడారి ప్రయాణం కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే (పుట. 92). ఎడారి ప్రయాణం సముద్రప్రయాణం (నీటిమీది ప్రయాణం) లాంటిదే.
అ) ఎడారిలో దారి తప్పడం:
సముద్రపుప్రయాణంలో దారి గుర్తులుండవు. అలాగే ఎడారిప్రయాణంలో కూడా నేలమీద దారి గుర్తులుండవు. అందువల్ల ఆ కాలంలో వ్యాపారాస్తులు(సార్థవాహులు) నక్షత్రాలను బట్టి దారి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. లేదా దిశానిర్దేశం చేయడానికి ఎవరైనా నక్షత్రజ్ఞానంకలిగిన ఒక వ్యక్తిని తీసుకెళ్లేవారు. అతను రాత్రిపూట ఏమాత్రం కునుకుతీసినా ఆ బండ్లు దారి తప్పేవి. బండ్లు ఒక్కోసారి తిరిగి, బయటుదేరిన చోటికే వెళ్లే అవకాశాలు ఉండేవి.
ఆ) ఎడారిలో ఇసుక కాలడం:
ఎడారిఇసుకను చేతిలోకి తీసుకుంటే వేళ్లసందుల నుండి జారిపోయే సన్ననిదువ్వలా ఉంటది. పొద్దు ఎక్కువ అవుతున్న కొద్దీ ఇసుక వేడెక్కి, ఇసుక నిప్పులరాశిలా మారుతుంది. కాళ్లుకాల్తుంటే పశువులు నడవలేవు. ఈ కారణంగా ప్రయాణం జటిలమౌతుంది. ప్రయాణం చేయడానికి వీలు లేకపోవడంవల్ల ప్రయాణం ఆపేస్తారు.గుడారాల్లోనే ఉండిపోతారు.
ఒకవైపు మలమల మాడ్చే ఎండ, మరోవైపు నీళ్లకరవు:
నీటిజాడ(జలనిధి) గురించి తెలిసినవారు ఎవరైనా ఉంటే వారివారి ద్వారా జాడ తెలసుకొని, చెలిమెలు, బావులు తవ్వే ప్రయత్నం చేసేవారు. ఎడారిఇసుకలో ఎక్కడైనా ఆకుపచ్చగా దర్భగడ్డి ఉంటే అక్కడ నీరు ఉన్నట్టు గ్రహించేవారు. ఆ చోట చెవిపెట్టి నీళ్లు పారుతున్నట్లుగా, జలజల శబ్ద వస్తుందా, లేదా అని వినేవారు.
క్రూరమృగాలు: వీటికి తోడు క్రూరమృగాలు. ప్రాణభయం.
రాత్రిపూట ప్రయాణం చేయడానికి చీకటి దిశ సరిగా తెలియదు, క్రూరమృగాలు ఎక్కడినుండి వచ్చి మీద పడ్తాయో తెలియదు.
సంచారవ్యాపారుల మోసాలు:
సంచారవ్యాపారులు అంటే తాము తీసుకెళ్లిన వస్తువులపేర్లతో కేకలు వేసుకుంటూ, వీధులవెంట తిరుగు తూ, ఇంటింటికి సరుకుల అమ్ముకునే వారు. ఈ సంచారవ్యాపారుల్లో కొందరు అమాయకులైన ప్రజలను మోసం చేస్తుంటారు. విలువైన వస్తువులను, విలువలేని వాటిగా చెప్పి, వెల తక్కువ చేసి చెప్తారు.
వర్తకుల నియమం:
వర్తకుల నియమం ప్రకారం ఒక వర్తకుడు వచ్చి వెళ్లాకనే, మరొక వర్తకుడు వెళ్ళాలి. కాని ఒకేసారి ఇద్దరు వెళ్లకూడదు (పుట. 96).
లివితేటలుగల యువకుని వ్యాపారం:
శ్రేష్ఠికులంలో పుట్టిన బోధిసత్త్వుడు మహామేధావి, పండితుడు. అతను ఒకనాడు రాజాస్థానానికి పోతూ పోతూ, ఒక చచ్చిన ఎలుకను చూస్తాడు. దాని నక్షత్రబలాన్ని చూసి, ‘ఎవరైనా తెలివిగలవాడు ఈ చచ్చిన ఎలుకతో వ్యాపారం చేసి, భార్యాపిల్లలను పోషిస్తాడు’ అని అంటాడు.
ఆ మాటలు విన్న ఒక యువకుడు ఆ చచ్చిన ఎలుకను తీసుకెళ్ళి, పిల్లికి మేతగా ఒక కాకణికం(అణా వంటి చిన్న నాణెం)కు అమ్ముతాడు. దానితో కొన్ని బెల్లంముక్కలు కొంటాడు. ఒక పెద్దకుండా నీరు తీసుకొని పోయి, దారిలో పెట్టుకుంటాడు. అడవిలో పూలు ఏరుకొని, ఆ దారెంట వచ్చే దాహార్తులకు కావలసినన్ని నీళ్లుపోసి, వారికి ఒక బెల్లం ముక్క ఇస్తాడు. వారు సంతోషంతో తలా గొప్పెడు పూలు పెడ్తారు.
ఆ యువకుడు ఆ పూలను అమ్మి, మళ్ళీ బెల్లాన్ని కొని, వారికి ఇస్తాడు. తర్వాత అతను తోటకు వెళ్తే పూలమొక్కలు ఇస్తారు. వాటిని అమ్మి ఎనిమిది ‘కార్షాపణాలు’ సంపాదిస్తాడు. ఇంతలో ఒక రోజు గాలివాన వస్తుంది. రాజుగారి ఉద్యావనంలో చెట్లకొమ్మలు విరగి, ఆకులు రాలి, వాటితో నిండిపోతుంది. తోటమాలి అనుమతితో పిల్లలతో విరిగిన చెట్లకొమ్మలను ఏరించి, ఆ చెట్లకకొమ్మలను కుమ్మరి వాళ్లకు అమ్ముతాడు.
కకుమ్మరిఅతను కుండలు, బానలు ఇస్తాడు. వాటిని అమ్మితే 16 కార్షాపణాలు వస్తాయి. మొత్తంమీద అతనికి 24 కార్షాపణాలు సంపాదించాడు. వాటితో కుండలు కొని, మంచి నీరు నింపి, గడ్డిని అమ్మేవారికి (500మందికి) దాహం తీరుస్తాడు. వారు తిరిగి అతనికి ఏదైనా సహాయం చేయాలని అనుకుంటారు. వారి సహాయం తర్వాతతీసుకుంటానని చెప్తాడు.
ఆ యువకునికి ‘స్థలపథవర్తకులు (ఊర్లు తిరిగి వ్యాపారం చేసే వర్తకులు), జలపథవర్తకులు (నౌకావ్యాపారులు)’ వద్ద పనిచేసే పరిచారకులతో పరిచయమైతది. ‘స్థలపథవర్తకుడు’ గుర్రాలతో వస్తున్నాడని తెలుసుకొని, గడ్డి వాళ్ల వద్దకు వెళ్లి, గడ్డిమోపులు మాట్లాడుకుంటాడు. ‘తన గడ్డి అయిపోయేవరకు వాళ్లు అమ్మకూడదని ఒప్పందం చేసుకుంటాడు. 500 గడ్డిమోపులను 1000 నాణాలకు గుర్రాల వ్యాపారికి అమ్ముతాడు.
తర్వాత పెద్దనౌకలో ‘జలపథవ్యాపారి’ సరుకు తెస్తున్నాడని తెలుసుకొంటాడు. ఎనిమిది కార్షాపణాలతో బండిని కొని, చక్కగా, ఆర్భాటంగా అలంకరించుకొని, నౌకాశ్రయానికి వెళ్తాడు. తన దగ్గరున్న ఉంగరాన్ని బయానాగా (అడ్వాన్స్)ఇచ్చి, సరుకుతో సహా నావను కొని, అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న మంటపాన్ని ఏర్పాటుచేసుకుంటాడు.
‘బయటి నుండి ఎవరన్నా సరుకులు కొనే వ్యాపారులు వస్తే మూడవజాములో నాకు చెప్పండని అక్కడివారికి చెప్తాడు. సరుకులతో నౌక వారణాసి నుండి వచ్చిందని తెలియగానే వందమంది వ్యాపారులు సరుకులను కొన డానికి నౌక వద్దకు వెళ్తారు. అప్పుడే సరుకు అమ్ముడు పోయిందని, ఒక యువకుడు కొన్నాడని, అతను మూడవ జామున వస్తాడని చెప్తారు. మొత్తం మీద ఆ యువకునికి ఒక్కొక్కరు 2000కార్షాపణాలు ఇచ్చి మొత్త సరుకును కొనేస్తారు. మొత్తం మీద రెండులక్షల (200000) కార్షాపణాలు సంపాదించుకొని తిరిగి వారణాసి వెళ్తాడు.
చచ్చినఎలుకతో వ్యాపారంచేయడమనే ఈ కథవల్ల వ్యాపారస్తునకు ఉండవలసిన లక్షణాలు తెలుస్తున్నాయి. అత్యల్పసమయంలో పనికిరాని వస్తువు(చచ్చాన ఎలుక)ను కూడా తెలివితేటలతో అమ్మవచ్చు, ముందుచూపు, యుక్తి, లౌక్యం, సమయస్ఫూర్తి ఉంటే డబ్బును ఎంతైనా, ఎలాగైనా సంపాదించవచ్చ ని కూడా మనకు ఈ కథ వల్లతెలుస్తుంది. వ్యాపారస్తులకు ఉండవలసినివి తెలివితేటలు అని ఈ కథ నిరూపిస్తున్నది.
వ్యాపారులు ా సరుకు ధర నిర్ణయం ా అధికారులకు లంచాలు:
సర్వసాధారణంగా రాజులుకొనే సరుకులు ` గుర్రాలు, ఏనుగులు, మణులు, మాణిక్యాలు, బంగారం మొదలైనవి. ఆ సరుకులధరలు నిర్ణయించడానికి ఆనాడు ‘ప్రత్యేకఅధికారులు’ఉండేవారు. ఆ ప్రత్యేకఅధికారులు ‘న్యాయం’గా సరుకు వెల’ నిర్ణయంచి, వాటిని అమ్మేవారికి ‘రొక్కం’ ఇప్పించేవారు. అలా సరుకులవెలను న్యాయంగా ఇప్పించడంతో ఖజానా ఖాళీ అవుతుండేది. ఈ విషయాన్ని రాజు గ్రహించాడు. అందువల్ల ‘సరుకు విలువ తెలియని’ ఒక ‘మూర్ఖుడిని, లోభిని’। అధికారిగా నియమిస్తాడు. ఇతనికి సరుకు గురించి తెలియకపోవడంతో, సరుకుకు విలువ కట్టకుండా నోటికి వచ్చినంత చెప్తుండేవాడు.
ఒకసారి ఒక వ్యాపారి ఉత్తరాపథంనుండి 500 గుర్రాలను తీసుకొని ‘ధరలనిర్ణయాధికారి’ వద్దకు వచ్చాడు. అతను వాటికి ‘మానెడు బియ్యం’ వెల కట్టాడు. ఆ వ్యాపారి అంతకుముంఉన్న ‘ధరల అధికారి’ వద్దకు వెళ్లి, మొరపెట్టుకుంటాడు. అప్పుడు అతను ఆ అధికారికి ‘లంచం’ ఇవ్వమంటాడు. తర్వాత రాజుగారి సమక్షంలో ‘మానెడు బియ్యం విలువ’ చెప్పమంటాడు. అందుకు అతను సరేనని ఒప్పుకొని, రాజుగారి సమక్షంలో మానెడెబియ్యం విలువ ‘రాజుతో సహా వారణాసి రాజ్యమంత’ అని అంటాడు. దాంతో అతని తెలివితేటలు బయటపడ్తాయి.
వర్ణాంతర వివాహం ా శ్రేష్ఠి కుటుంబం:
శ్రేష్ఠి కుటుంబంలోని కూతురు సేవకునితో సంబంధం పెట్టుకొని, చేతికి అందినంత సొమ్ముతీసుకొని, అతనితో ఇంట్లోనుండి వెళ్లిపోతుంది. మానసిక, శారీరక వేదన చెందుతుంది. ప్రసవానికి పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటది. కాని మధ్యలోనే ప్రసవం అవుతుంది. రెండుసార్లు అలాగే మధ్యలోనే ప్రసవించి, వెనుకకు తిరిగి వస్తుంది. పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత, తాతఅమ్మమ్మల గురించి అడిగితే వారికి ఏ విషయాలు చెప్పకుండా, ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వస్తుంది. నగరద్వారం వద్ద ఉన్న ధర్మశాలలో దిగి, తల్లిదండ్రులకు కబురు పంపిస్తుంది.కాని, తల్లిదండ్రులు ఆమెను ఇంటిలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడరు, ఆమెను ఇంటిలోకి రానివ్వరు.కాని పిల్లలనుతమతో ఉంచుకోవడానికి అంగీకరిస్తారు, ఆ పిల్లలను దగ్గరికి తీసుకుంటారు.
(శ్రేష్ఠి : ఇది ఒక పదవి, ఈ పదమే శెట్టిగా మారింది)
ఇలాంటి వ్యాపార సంబంధిత అంశాలు, ఆనాటి సమాజం మనకు జాతకకథలవల్ల తెలుస్తాయి.
మహంతయ్య మఠంల గంజాయి నిషాలో ఉన్న నాగప్పకు వచ్చిన కొత్తమనిషితో సంభాషణలో ” ఈ జన్మ రోత ఆలి ఎవతె ? చూలు ఎవరు? ” అనే విషయం బాగా నచ్చింది. దాంతో అతను లేడికి లేచిందే పరుగు అన్నట్లు స్నేహితులతో కలిసి ఇల్లు సంసారం వదిలి మఠాల చుట్టూ తిరగడం లో మునిగి పోయిండు. ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ రచయిత్రి . ” ఆ మఠంలో తీరొక్క కులపోళ్ళున్నరు. తీరొక్క గుణపోళ్లున్నరు . పొట్టకు గడవక సన్నాసోడైనోడున్నడు. రోగంతోన ఏగలేక జోలె కట్టినోళ్ళున్నరు. అప్పుల దాడికి మొకం దిస్పిచ్చినోళ్ళున్నరు. జైల్ల కెల్లి పరారై వచ్చినోళ్ళు న్నరు. కూనీలు చేసినోళ్ళున్నరు. సోరోళ్ళున్నరు. ముసలోళ్ళున్నరు. షావుకారున్నడు. చదువుకున్నోడున్నడు. సాకలోడున్నడు. సాగినోడున్నాడు. జారిపడ్డోడున్నడు…… ఆ మఠంల అందరికీ సోటుంది” అంటుంది.కాని రచయిత్రి చెప్పిన వ్యక్తుల్లో నాగప్ప ఏ కోవలోనికి చెందినవాడు కాదు. అది రచయిత్రికి మఠాలపట్ల ఉన్న అవగాహన. ఈ కథలో నాగప్ప మఠాల వెంట తిరిగింది మత్తునిషాలో , కొత్తమనిషి ద్వారా విన్న వేదాంతం వల్ల. నాగప్పకు తన దగ్గరున్న పైస ఖర్చైన తర్వాత ఇల్లు జ్ఞాపకం రాలేదనీ కాదు. వచ్చింది. కాని క్షణికావేశంలో ఆలెవరు? చూలెవరు? అని ఇల్లొదిలిన మనిషికి తిరిగి ఇంటికి పోవడానికి మొహం చెల్లలేదు. ఇక చేతిలో చిల్లి గవ్వలేని స్థితి జోలెతో భిక్క్షాటనను ఆశ్రయించేటట్లు చేసింది. కట్టుబట్ట తప్ప మారుబట్ట లేకపోవడంతో కట్టుకున్న బట్టలు కావిరంగులోకి మారినై. ఈ రెండూ నాగప్పకు కొత్త జీవితాన్ని తెచ్చిపెట్టినై. వాటికి తోడు కావలసినంత సమయం గుళ్ళు గోపురాలు మఠాలు తిరిగే అవకాశాన్ని ఇచ్చినై. మఠాధిపతుల సాంగత్యమూ దొరికింది. జీవితం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. సన్యాసి జీవితానికి ఆ జీవితం ఆకర్షితమైంది. అందుకు చాలా తాపత్రయపడింది కూడా.
సన్యసించడమంటె కుటుంబ బంధాలకు దూరమై రాగద్వేషాలు లేకుండా జగమంత కుటుంబం నాది అనే ధోరణిలో జీవిస్తరు. జీవించాలి కూడా. కాని అసమర్థులైన చాలామంది కుటుంబాన్ని వదిలి దానికి సన్యాసి పూతను తగిలించుకొని దేశ దిమ్మరులౌతుంటరు. నాగప్ప విషయంలో కొంత ప్రత్యేకత ఉన్నది. కుటుంబాన్ని వదిలినా దేశదిమ్మరైనా స్త్రీ లోలుడు కాదు. కుటుంబ వ్యాపారానికి సంబంధించిన విషయంలో లెక్క పత్రాలు పకడ్బందీగ ఉండేవి. అంటే అతనిలో కొంత నిబధ్ధత ఉంది. ఆ నిబద్ధత మఠాధిపతులను సేవించడంలోనూ కనబడుతుంది. బలహీనతల్లా గంజాయి సేవించడం. సాహచర్యంలో వేదాంతధోరణి. వేదాంతం కూడా చాలా విచిత్రమైన పదం. నిజానికి వేదాలలో ఉండేది వేదాంతం. కాని బంధాలను పరిత్యజించడం కూడా వేదాంత ధోరణి అనే అర్థం స్థిరపడింది. ఈ కథలోని నాగప్ప ఆ కోవకు చెందినవాడే. మఠాల్లో చేరిన వాళ్లలో తేడా ఉన్నట్లే, మఠాల్లో ఆ మఠాధిపతు ల్లో కూడా తేడా ఉంటుంది. మఠాధిపతులు కొందరు తమ శిష్యపుంగవులకు వాత్సల్యంతో సద్బోధనలు చేస్తే మరి కొన్ని ఆశ్రమరూపంలోని మఠాల్లో ఆయా మఠాధిపతులు అక్రమాల పుట్టగా ప్రజలను పెడమార్గం పట్టిస్తూ డబ్బు చేసుకుంటారు. నాగప్ప చేరిన మఠం మొదటి కోవకు చెందింది.ట్రాన్స్ లో ఉన్న నాగప్ప మఠంలోని పెద్దయోగిని సన్యాసం ఇప్పించమని అడిగినప్పుడు అతను నాగప్ప మఠం వరకు రావడానికి గల కారణం క్షణికావేశమని పసిగట్టి కుటుంబం అనుమతి తీసుకొని రమ్మని సలహా ఇచ్చిండు. ఆ సలహాలో నాగప్ప స్థిరత్వాన్ని నిగ్గు తేల్చాలనుకున్నడు. అనుకున్నది సాధించిండు కూడా.
” పిలగాడు ఏమంటున్నడు?”. మఠం నుండి సొంతూరుకు ఆ తర్వాత స్వంత ఇంటికి బిచాణ మార్చిన రెండు రోజుల తర్వాత భార్యను అడిగిండు బసప్ప ఇంటికి చేరిన కొడుకుని ఉద్దేశించి
“ఏమంటడు? ఎద్దోలె తిని మొద్దోలె పండుతుండడు.” అన్నది భార్య సమాధానం.
ఈ సమాధానంలో నిద్రాహారవిషయంలో నాగప్ప సాధారణజనం లక్షణమే తప్ప ఒక యోగికి ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకు కన్పించలేదు. అంటే నాగప్ప దేశదిమ్మరిగా గుళ్ళూ గోపురాలు తిరిగిండు . యోగులతో కలిసి కాలం గడిపి సన్యాసి అనే ఊహాలోకంలో బతికిండే తప్ప సన్యసించిన మనిషికి ఉండాల్సిన స్థిరమైన అభిప్రాయాలు లేవని అనుకోవచ్చు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించినందుకే కోడలుకు కొడుకుకు ఏకాంతం కల్పిస్తే కొడుకు అంతరంగం ఆవిష్కృతమౌతదని ఆలోచించిన్రు. వాళ్ళ ఆలోచన నూటికి నూరుపాళ్ళునిజమైంది. తల్లిదండ్రులు తిరిగొచ్చేవరకు ఆహారంలోనే కాదు ఆహార్యంలోనూ పూర్వపు నాగప్ప ఐండు. తప్పు చేసినవానోలె నెత్తి కిందికేసుకొని వాళ్ళకు దండం పెట్టిండు. ఈ తప్పు అనే భావన ఎందుకొచ్చిందని ప్రశ్న వేస్తే అది ఇంటినుండి జాడపత్తా లేకుండ దేశంమీద పడి తిరుగుడు, తను సన్యాసుల బ్రమలో బ్రతుకడం అనేది క్షణికావేశంలో జరిగిందని గుర్తించడం. .
ఈ కథలో అంతర్లీనంగా నాగప్ప భార్య శివమ్మ ఆత్మస్థైర్యాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు.
మఠం నుండి ఇల్లు చేరుకున్న నాగప్పను భార్య శివమ్మ దేబురించి వేడుకోమని అడగలేదు కానీ “పనీపాటయినంక వచ్చి తలుపు పట్టుకొని నిలబడి నాగప్పను చూసి పోతది . అంతే కానీ ఏడ్వలేదు నగలేదు ఏగిర్త పడలేదు. వొణ్కలేదు.
పొద్దు మూకి మట్కు ముద్దుగ నెత్తి దువ్వుకొని మల్లెపూలు శికెల ముడ్సుకొని దోస పల్కు బొట్టు పెట్టుకుంటది. నాగప్ప కూసున్న అరుగు ఎదురుగా ఉన్న రెండో అర్గును అలికి శుద్ధిచేసి ముగ్గేసి అరిటాకు పర్సి రాగి చెంబుల నీళ్లు పెట్టి దానిమీద స్తాళి బోర్లించి పోతది. బంకుల కింద కాళ్లు చేతులు కడుక్కొనికే నీళ్ల కొప్పెర పెట్టి పోతుండె “
అనే రచయిత్రి మాటల్లో ఆమె స్థిరత్వం ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ఆమె అలంకరణలో జాణతనం నడతలో తనను వదిలి పోలేడనే దృఢ నిశ్చయం కనబడుతుంది.
ఓ అర్ధరాత్రి దాహంతో తలుపు కొట్టి”మంచి తీర్థం ఇప్పిస్తారా”అని అడగడం, విచ్చుకున్న మల్లె మొగ్గల సిగతోని శివమ్మ కనబడటంతో సన్యాసి నాగప్ప కు బంగు తాగినట్లైంది. కానీ నాగప్ప తనకు కలిగిన వాంఛని సంభాళించు కొని మంచినీళ్ల విషయాన్నే చెప్పినా పరిస్థితిని అర్థం చేసుకున్న శివమ్మ భర్తను గుర్తుపట్టనట్టే
“ఏయ్ బైరాగోడ ! మా అత్త మామ ఇంట్ల లేంది జూసి మంచి తీర్థం గించితీర్థం అనుకుంటా ఇంట్ల జొరవడ చూస్తుండవా?”అంటూ దబాయించి అతను అడిగినట్లు చెంబులో నీళ్లతో నిలబడగానే తన మనోవాంఛ మతలబును వెల్లడిస్తూ
“శివ నీవు అదృష్టవంతురాలు నిన్ను అనుగ్రహించాలని కోరిక కలుగుతున్నది” అని నాగప్ప అనగానే
“ఏమో శివ్వ గివ్వ అనబడుతివి. నీకు నన్ను అనుగ్రహించాలని కోరిక పుడితే బాగానే పుట్టింది. గని మరి నిన్ను నేను అనుగ్రహించొద్దా?” అని శివమ్మ ప్రశ్నించడంలో ఆమె ఆత్మ గౌరవం
చాలా స్పష్టం .
అంతేకాదు స్వాములను అనుగ్రహించాలి వాళ్ల కోర్కెను కాదనకూడదు అన్న నాగప్ప మాటలకు”గా ఇంత దానికి సన్నాసి గిన్నాసి అని దొంగేశం ఎందుకు కట్టాలె.”అని నిలదీసి అతని బుర్రకాయను పగలగొట్టించి, మెడలో లింగంకాయ వేసి, జన్మలో సన్యాసులజాడ పట్టకుండ ఒట్టు వేయించుకొని అతన్ని అనుగ్రహించింది.
మొత్తంగా రచయిత్రి యశోద రెడ్డి గారు ఈ కథలో క్షణికావేశ పలాయన వాదులను గృహిణుల ఆత్మగౌరవ, విశ్వాసాలను దృఢ చిత్తాన్ని నిగ్గు తేల్చి చూపించారు.
ఇక ఈ కథ పేరు విషయానికి వస్తే కథలో ముఖ్యమైన పాత్రగా నాగప్ప కనపడుతుండగా పేరేమో జోగుళయ్య అని ఉన్నది. నాగప్ప జోగిగా (యోగిగా) మారిన ముఖ్యాంశాన్ని జోగుళయ్యగా పెట్టినట్టు కనబడుతున్నది.
కథను గమనిస్తే నాగప్ప కుటుంబం లింగాయతులది అని తెలుస్తుంది. కానీ ఎందుచేతనో రచయిత్రి కథ ముగింపులో మంచి తీర్థం వంటి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన పదాన్ని వాడినారు ఆలోచించవలసిన విషయం అది.
కథలో తెలంగాణ మాండలికాలు
లిడ్తి వడి =. నష్టం
పిస పిసలు. =. గుసగుసలు
ఎదలల్ల. =. మనసుల్లో
సోరోళ్ళు. =. యుక్త వయస్కులు
ఆడ్తి. =. చిన్న చిన్న రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి వ్యాపారం చేసే దుకాణం
కీసల. =. జేబుల
తాల్మివట్టు. =. ఓపిక పట్టు
పొట్కు. =. ఒత్తిడి
సందే. =. సంధ్యాకాలం
సస్కాలు. =. పైసలు
ఈ త్యాప. =. ఈ తడవ, ఈ సారీ
పోవడి. =. పోలిక
పావురం. =. ప్రేమ
ఇర్గవడ్తుండరు. =. విరుచుక పడుతున్నారు
పడ్సు. =. పడుచు, వయసు
గేరొచ్చి. =. మూర్చ వచ్చి
సుట్క. =. సుట్టుక, తల తిరిగి
సోమ్మసిల్లి. =. కళ్ళు తిరిగి
ఏగిర్త. =. తొందర
స్తాళి =. మూత
తనబ్బీ. =. సామాను పెట్టుకునే పెద్ద
గూడు
దూప. =. దాహం
మిళ్ళి. =. చెంబు
ఏశం. =. వేషం
యీబూతి. =. విభూతి
మాణిక్యాలు. =. మన్సాల, మగసాల, మగవాళ్లు కూర్చునే మొదటి పెద్ద గది
బంకులు. =. గ్రామ జనం కూర్చోవడానికి అనుకూలంగా మొదటి పెద్ద ద్వారం నుండి ప్రవేశించగానే ఇరువైపులా ఉండే అరుగులు
నూగువిండికారం=నువ్వుల పొడితో కారం
పై తెలంగాణ మండలికాలే కాక
నిండా మునిగినంక సలేంది
దారం గుంజినట్లల్ల బొమ్మాడినట్లు(తోలుబొమ్మలాట వలె)
అనే సామెతలు కూడా ఉన్నాయి.
