మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.

by Narendra Sandineni November 22, 2024
written by Narendra Sandineni

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (16)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.
“శత్రువులను కలుద్దామని వాళ్ళ ఇళ్ళని
“వెతుక్కుంటూ వెళ్ళానా …ఇక చూడండి
“అక్కడ నా స్నేహితులతోనే ములాఖత్ అయింది”.
ఒకరికి కొందరికి హాని కలిగించినట్టి,రాజ్యానికి దేశానికి ద్రోహం చేసినట్టి వ్యక్తిని శత్రువుగా భావిస్తారు.మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు.ఒకరికి మరొకరిపై మనసులో కలిగే కీడు భావన ఇరువురి మధ్య శత్రుత్వాన్ని కలిగిస్తుంది. అటు వంటి వాడే శత్రువు.ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు మౌనంగా ఉండకపోవడం వల్ల మనసులో చెలరేగే ప్రతీకార భావనలు శత్రువుల్ని తయారుచేస్తాయి.తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో రాయబడి ఉంది.స్నేహితులు కాని వారు శత్రువులు.మనకు హాని కలిగించే వారు శత్రువులు.మనకు వ్యతిరేకంగా పని చేసే వారు శత్రువులు.శత్రుత్వం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య నెలకొన్న వ్యతిరేక భావనగా పేర్కొనవచ్చు.స్నేహితుల మధ్య సయోధ్య లేక పోవడం,అపోహలు,మనస్పర్ధలు,అవగాహన లోపంతో స్నేహం పటాపంచలై శత్రుత్వంగా మారుతుంది.స్నేహం అద్భుతమైంది.నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహానికి హద్దులు లేవు.అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది.స్నేహం ఓ మధురమైన అనుభూతి.దానికి వయసుతో నిమిత్తం లేదు.ఆట పాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.అటు వంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.సృష్టిలో నా అనే వారు, బంధువులు లేని వారైనా ఉంటారేమోగాని స్నేహితుడు లేని వారు అసలు ఉండరు.ఇంట్లో చెప్ప లేని సమస్యలను,బాధలను సైతం స్నేహితులతో ఎటు వంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పును పొందుతారు.అది స్నేహంలోని గొప్పతనం.స్నేహం ప్రకృతి వంటిది.అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయిని ఇస్తుంది.మనిషి జీవన యానంలో స్నేహం శ్వాస వంటిది.స్నేహం ఎంతో తియ్యనైంది.అమ్మ ప్రేమ,స్నేహం వెల కట్ట లేనిది.ఈ రెండే జీవితంలో ముఖ్యమైనవి. స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం చెప్ప లేనిది.పవిత్రమైన స్నేహం ఉండాలి.అటు వంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఈ కవిత శత్రుత్వం మరియు స్నేహం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది.మనం శత్రువులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు తారసపడ్డట్లుగా ఉంది.ఈ కవితలోని భావం మనల్ని ఆలోచింప జేస్తుంది.అసలు శత్రువులు అంటే ఎవరు? మనుషుల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడుతుంది? స్నేహం మరియు శత్రుత్వానికి గల సంబంధం ఏమిటి?ఈ కవితలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా స్నేహితులను మరియు శత్రువులను గురించి ఆలోచింప జేస్తుంది.శత్రువులు అందరు మన స్నేహితులు కాకపోవచ్చు.స్నేహితులు కూడా శత్రువులుగా మారవచ్చు.మనం ఎవరిని శత్రువులుగా భావిస్తాము అనే సంగతి గురించి ఆలోచించాలి.ఈ వాక్యం ఆలోచనాత్మకంగా మరియు వ్యంగ్య భరితంగా,ఎంతో లోతైన భావాలు,జీవన దార్శనికతతో కూడిన అనుభవాలను ప్రతిబింబించేలా ఉంది.శత్రువులను కలుద్దామని వెతుక్కుంటూ వెళ్లడం అనే వాక్యం మనలను ఆలోచింపజేస్తుంది.ఇది సమస్యను నేరుగా ఎదుర్కోవాలనే సంకల్పంతో ప్రారంభమైన చర్యగా భావించవచ్చు.శత్రువులు అంటే మీరు ప్రత్యర్థులుగా భావించిన వారు అని సూచిస్తుంది. జీవితంలో మనం ఎవరిని శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అసలు వాళ్లు శత్రువులే కాకుండా స్నేహితులుగా కూడా మారవచ్చు.అక్కడ స్నేహితులతో ములాఖత్ కావడం అనేది ఆలోచింపజేస్తుంది.ములాఖత్ అనేది ఉర్దూ పదం.ఎవరైనా లేదా వ్యక్తులతో సమావేశం కావడం అని అర్థం.ఒకో సారి మనకు జీవితంలో అనుకోని సందర్భాలు కూడా ఎదురవుతాయి.మీరు ఒక ప్రతికూల సంఘటనను ఎదుర్కొనే ఉద్దేశంతో వెళ్లడం అది ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మారిపోవడం సహజం అనిపిస్తుంది.అనూహ్యంగా మీరు శత్రువులుగా భావించిన వారు నిజానికి మీ స్నేహితులు అని తెలిసింది.అక్కడ మీరు అనుకోని స్నేహితులను కలిశారు.మీరు వారిని మనసులో ప్రతికూలంగా భావించారు.కాని సానుకూల పరిణామం ఏర్పడింది.అది జీవితపు వ్యంగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.మనం చాలా సార్లు ఒక దాన్ని అనుకుంటాం.విచిత్రంగా వేరే దాన్ని ఎదుర్కొంటాం. మనం కొన్ని సార్లు అపోహతో ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకుంటాం.జీవితంలో మనం కొన్ని సార్లు అనవసరంగా కొందరిని శత్రువులుగా భావిస్తాం.కాని వారిని గమనిస్తే మనకు వాళ్లలో ఏదో తెలియని సంబంధం,స్నేహం మిళితమై ఉంది అనిపిస్తుంది.ఒక్కో సారి మనకు తెలియకుండానే జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.మన జీవితంలో ఏది ఎలా జరుగుతుందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం.జీవితం అనే మజిలీలో జరిగిన ఆ సంఘటన చిత్రంగా అనుకోని మలుపుగా భావించవచ్చు. జీవితంలో ఎదురైన సంఘటనలు కొన్ని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాను ఎదురు చూసింది ఒకటి తనకు తెలియకుండానే మరొకటి జరిగింది. తాను ప్రతికూల భావనలతో వ్యవహరించినప్పటికీ చివరకు అది సానుకూల పరిణామంగా మారడం సంతోషాన్ని కలిగించింది.ఈ వాక్యం జీవితపు అంతర్లీన సత్యాలను,అనుభవాలను, దార్శనికంగా వ్యక్తపరుస్తుంది.శత్రువులను వెతుక్కుంటూ వెళ్లి స్నేహితులని కలవడం అంటే తాను అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని పొందడం విస్మయం కలిగిస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

శాంతి ఎందుకు అవసరం?

by రంగరాజు పద్మజ November 22, 2024
written by రంగరాజు పద్మజ

బహుముఖ ప్రజ్జాశాలులు శాంతి కాముకులు శ్రీ సిరాజుద్దీన్ గారితో మూఖాముఖీ

ఓం ద్యౌః శాన్తిరన్తరిక్షమ్
శాన్తి పృథివీశాన్తి రాపః
శాన్తి రోషధయః శాన్తి ౹
వనస్పతయః శాన్తిర్విశ్వేదేవాః
శాన్తి బ్రహ్మ శాన్తి సర్వం శాన్తిః
శాన్తి రేవ శాన్తిః
సామా శాన్తిరేధి ౹ ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

ఈ శాంతి మంత్రం భావంఏమిటంటే?
ఓ ప్రణవ స్వరూపా! ఊర్ద్వలోకంలో శాంతి నెలకొను గాక! అంతరిక్షంలో శాంతి నెలకొనుగాక!
మరియు జలములందు శాంతి నెలకొనుగాక! ఓషధులలో, అడవులలో,శాంతి నెలకొనుగాక! విశ్వమును పరిపాలించే దేవతలు శాన్తితో ఉందురుగాక! బ్రహ్మ శాంతి వహించుగాక! ప్రపంచమంతా శాంతి నెలకొనుగాక! విశ్వమంతటా శాంతి నెలకొను గాక!
అని వేదసూక్తం మనకేనాడో శాంతి యొక్క ఆవశ్యకతను చెప్పింది. శాంతి ప్రాధాన్యతను బృహదారణ్యక, ఈశావాస్య, తైత్తిరీయ మొదలైన అన్ని ఉపనిషత్తులలోనూ శాంతి మంత్రాలను పఠిస్తూ చివరిగా… ఓం శాంతిః శాంతిః శాంతిః అని ఈ పదాన్ని మూడుసార్లు ఎందుకు పలుకుతాం? అంటే
మూడుసార్లు ఎందుకు పలుకుతామని అంటే మొదటి శాంతి మనమూ, పరిసరాలు బాగుండాలనీ, అంటే అందరి శారీరక- మానసిక ఆరోగ్యాలు బాగుండాలని ప్రార్థిస్తాం!

రెండవ శాంతి పదం జీవకోటి సమస్తం ఏ ఆపదలూ? ముప్పు రాకుండా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తాం!
మూడవ శాంతి పదం ప్రకృతి నుండి కలిగే ముప్పులు.. ఉదాహరణకు భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ అపాయం కలగ కూడదని ప్రార్థిస్తాం !
మన ప్రార్థనలు విశ్వంలోకి వెళ్తాయనీ, మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే తప్పకుండా విశ్వశాంతి చేకూరుతుందని మన సనాతన ధర్మం చెప్తుంది.
శాంతి ఎందుకు అవసరం?
ఈ నేలమీద మన మనుగడ చక్కగా సాగాలంటే శాంతి కావాలి. ఈ శాంతిని మనం ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత, కాలుష్యంతో కొంత పోగొట్టుకుంటున్నామంటే… మరికొంత వైషమ్యాల వల్ల పోగొట్టుకుంటున్నాము.
అధికార ప్రదర్శనలో బలవంతులు బలహీనులపై చేసే యుద్ధాల వల్ల కూడా శాంతి కరువౌవుతున్నది. సమాజంలో శాంతి ఉన్నప్పుడు మాత్రమే మన మంతా సామరస్యంగా… అన్ని పనులు చేసుకోగలుగుతాం!
మరి సామరస్యం ఎందుకు లేదని అంటే???
ఒక పరిశీలన చేస్తే ఇద్దరి మధ్య విభేదాలు చర్చించి పరిష్కరించుకోకపోవడం, ఒకరికి ధన బలము, అధికార దర్పము ఉండి, ఇద్దరి మధ్య అవి అడ్డు రావడం ఒకటైతే… కాల ప్రభావంతో మానవ విలువలను మింగేయటమే ముఖ్యం. అయితే దేశాల మధ్య కానీ మానవజాతుల మధ్య కానీ ఆ తేడాలు ఉండడం సహజమే! కానీ శాంతి కావాలనుకున్నప్పుడు ఆ తేడాలను అంతగా పట్టించుకోకుండా
అందరమూ బాగుండాలి అందులో మనముండిలి అనే సిద్ధాంతం పాటిస్తే కొంతలో కొంత శాంతి మన సొంతమవుతుంది. అహాన్ని కొంత వదిలించుకుంటే అంతా శాంతే మరి!
మరి బతుకులోనూ మొండిగా నేను ఇలాగే ఉంటాను.. అంటే శాంతి లోపించి భయంకర పరిణామాలు ఎదురవుతాయి! అంటే అరాచకం చెలరేగుతుంది. మతం ఏదైనా సరే! జాతేదైనా సరే ! వర్ణమేదైనాసరే ? ఎవరైనా అందరూ శాంతి మంత్రాలు పాటించవలసిందే! ఇందులో భాగంగానే అటువంటి శాంతి స్థాపన కోసం మన వరంగల్ నివాసులు గౌరవనీయులు మహమ్మద్ సిరాజుద్దీన్ సోదరులు గొప్ప
ప్రపంచ శాంతి పండుగను కనుక్కొని, సమాజానికి పరిచయం చేసి, తాను పాటిస్తూ అందరూ పాటించడానికి గత కొంతకాలంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు.. ప్రయాస పడుతున్నారు.
ఆ శాంతి పండగ నేపథ్యంలో ఎందుకు ఆ వారికి ఆలోచన వచ్చిందీ? దానిని వారు ఎలా రూపకల్పన చేశారు? దాని కోసం వారు చేస్తున్న కృషి ఏమిటీ? అసలు శాంతి పండగ అంటే ఏమిటి? ఇలా వారి మనసులోని వసుధైక కుటుంబం అనే విశాల భావనలో నుండి ఏర్పడిన ప్రపంచ శాంతి పండగ ఆశయాన్ని చేరుకోవాలని శాంతి మన సమాజ సొంతం అవ్వాలని, మనః పూర్వకమైన శుభాకాంక్షలతో వారిని పరిచయం చేసుకుందాం… అందరమూ మనం శాంతి పండగను ఆచరించుకుందాం! సంతోషంగా ఉందాం!
శాంతి పండగ వ్యవస్థాపకులు గౌరవనీయులు మహమ్మద్ సిరాజుద్దీన్ గారికి స్వాగతం చెప్పుదామా? రస హృదయులైన సహృదయ పాఠకులకు నమస్కరిస్తూ…మీ రంగరాజు పద్మజ.

1 పద్మజ:- శ్రీ సిరాజుద్ధీన్ గారు నమస్కారాలండి.

Md సిరాజ్ :- నమస్కారాలండి పద్మజగారు.

  1. పద్మజ:- మీ కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా?
    Md సిరాజ్:- మా కుటుంబ నేపథ్యం ఏమిటంటే…
    మా అమ్మ శ్రీమతి మెహెరున్నీసా బేగం.
    నాన్న శ్రీ ఖాజా మొయినుద్దీన్.
    స్వస్థలం: మా స్వస్థలం రంగాపూర్, నల్లబెల్లి మండలం. రెండు గ్రామాలను మా ముత్తాతలు నిర్మించారు. ఇది పాత నర్సంపేట తాలూక, వరంగల్ జిల్లాలో ఉండేది. నేను ప్రస్తుతం హనుమకొండలో నివసిస్తున్నాను.
    మాది రైతుకుటుంబం.
  2. పద్మజ:- మీరు ప్రధానంగా ఏ ఏ రంగాల్లో కృషి చేశారు?

Md సిరాజ్ :– ప్రధానంగా అంటే సామాజికమే. శాంతి స్థాపన నా ధ్యేయం. మళ్లీ అందులో ప్రపంచ శాంతి. ఇవికాక, సాహిత్యం: ప్రధానంగా తెలుగు సాహిత్యం. ఇందులో కవిత, కథ, తదితరాలు. కొంతమేరకు హిందీ, ఉర్దూలలో కూడా.
ఇంకా ఆటా- పాటా రాజకీయాలు, చిత్రలేఖనం, క్రీడలు. నేను స్థాపించుకున్న మూడు సంస్థలు (ఉజ్వల సాహితీ, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ, మరియు తెలంగాణ రాష్ట్ర కవుల సంక్షేమ సమాఖ్య) ద్వారా సంగీత- సాహిత్య మరియు సంస్కృతుల సేవ.

  1. పద్మజ:- మీరు స్థాపించిన తెలంగాణా రాష్ట్ర కవుల సంక్షేమ సమాఖ్య గురించి వివరించండి.

Md సిరాజ్ :— ఈ సంస్థను ఓ ఏడు నెలలు ముందు స్థాపించాను. ఆ మధ్య ఇక్కడ ఇద్దరు కవులు చనిపోయారు. పేదరికం వల్ల కర్మకాండలు కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే మేము కొందరం కావులము చందాలు వేసుకుని వారిని ఆదుకునే ప్రయత్నాలు చేసాము. ఆ సందర్భాలు నన్ను కలచి వేసాయి. తెలంగాణాలో CM గారు ఆ మధ్య రైతులకు, యాదవులు, గౌడులు, తదితరులకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినాడు, అలాగే రైతులు తదితరుల జీవితాలకు ఉచిత భీమా కూడా చేసినారు. రైతు మరణిస్తే అతడి ఇంటికి 5 లక్షల భీమా డబ్బులు వచ్చేవి. అలాంటి పథకాలు, భీమా, తదితర పథకాలను నిస్వార్థంగా బ్రతుకంతా సమాజ సేవ చేసే కవులకు కూడా కల్పించండని KCR గారిని రాష్ట్ర కవుల తరపున మనవి చేసు కోవాలనే లక్ష్యంతో ఈ సమాఖ్యను స్థాపించాను. మరియు KCR గారికి పలు మార్గాల్లో విన్నవించుకోవటం కూడా జరిగింది. అయితే ఇంతలో ఎన్నికలు రావటం KCR పదవి నుండి దిగిపోవటం జరిగింది. అయినా ఈ ప్రభుత్వానికి కూడా విన్నవించుకోనున్నాము. ప్రస్తుతం ఈ సంస్థను రిజిస్టర్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాము.
కాగా పాటలను (కరోకే విధానంలో పాడే విధానం) పాడే ఏకశిలా కరోకే క్లబ్ తో కలసి నెలనెలా సాహిత్య, సంగీత సమావేశాలను వరుసగా నిర్వహిస్తూ వస్తున్నాము.
ఈ సందర్భంగా ఓ నెల ఒక కవినీ ఇంకో నెల ఈ సంగీత కారుణ్ణీ, సన్మానించుకుంటూ గంగా జమ్నీ తహెజీబ్ (మాట సామరస్యం) కు అనుగుణంగా ముషాయిరా మరియు కవిసమ్మేళనాలను నిర్వహిస్తూ వస్తున్నాం.

  1. పద్మజ:- శాంతి పండుగ, ప్రపంచ శాంతి గురించి వివరించగలరా?

Md సిరాజ్ :- 1995 లో ప్రపంచానికి నేను బహుకరించిన శాంతి పండుగను ఏదో ఆషామాషీగా కాదు, పండుగ ద్వారా నిజంగా ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, గ్రామానికీ, పట్టణం, జిల్లా, రాష్ట్రం, దేశం మరియు అలా సమస్త ప్రపంచానికీ అన్ని రకాల అభివృద్ధులతో పాటు అంతిమంగా శాంతి లభించాల్సిందే అనే అత్యంత పటిష్టమైన పండుగను రచించాను.
వేయి కాళ్ళ జెర్రిలా ప్రపంచాన్ని చుట్టుకుని ఉన్న అశాంతిని నేనొక్కణ్ణి, అందునా కేవలం పండుగ అనే ఒకే ఒక ఆయుధంతో ఎలా నిర్మూలించగలను అనే విషయాలు తెలవని మనిషినేమీ కాను. ఇన్ని తేలిసే నేనీ అశాంతిని నిర్మూలించి, ప్రపంచంలో శాంతిని సాధించే పండుగను సృష్టించే ప్రయత్నం చేసాను.
పండుగను 1995 లో ప్రతిపాదించి, దానిని 1996 లో అప్పటి UNO సెక్రెటరీ జనరల్ గారి దృష్టికి తీసుకు పోయాను. వారు 1996లోనే అభినందించారు. అలా నా ద్వారా జీవం పోసుకున్న ఈ పండుగను ప్రపంచం నిండా వ్యాపింప చేయడం కోసమని World Peace Festival Society పేర ఓ అంతర్జాతీయ శాంతి సంస్థను స్థాపించి రిజిస్టర్ చేయడం జరిగింది.
దీని జీవిత కాల సభ్యుల్లో శ్రీ కాళోజీ, శ్రీ జయశంకర్ తదితరులు ఉన్నారు. కొత్త పండుగను ప్రపంచం నిండా వ్యాపింప చేసేందుకు ఈ సంస్థ చేపట్టే కార్యక్రమాల్లో శాంతి పండుగల నిర్వహణ, భారత్ శాంతిదూత్ అవార్డుల బహూకరణ, ఉగాది మిలన్, ఈద్ మిలాప్, మన పండుగలు, శాంతి ర్యాలీలు వంటి పలు కార్యక్రమాలు ఉన్నాయి.
భారత్ శాంతిదూత్ అవార్డులు ప్రదానం చేయబడిన వారిలో పద్మవిభూషణ్ Prof MS స్వామినాథన్ గారు, శ్రీ పాలెం కళ్యాణ సుందరం (తమిళనాడు), పద్మభూషణ్ Dr K I వరప్రసాద్ రెడ్డి గారు (శాంతా బయోటెక్), పద్మశ్రీ Dr K విశ్వనాథ్ గారు (సినిమాలు), పద్మశ్రీ నెరేళ్ల వేణుమాధవ్ గారు, శ్రీ PV నరసింహా రావ్ గారి (మరణాంతర), శ్రీ తక్కెళ్లపల్లి పురుషోత్తమ రావ్ గారు, (గాంధేయవాది), Prof B సురేష్ లాల్, లాంటి ముప్పై మందికి కు పైగా ప్రముఖులు ఉన్నారు.
మా సంస్థకు UNO వారు Affiliation ఇచ్చినారు. ఈ సంస్థను స్థాపించుకున్నప్పటికీ అధ్యక్షులుగా ఇతరులనే నియమించుకుంటూ వస్తున్నాను. ఈ అసాధారణమైన ప్రయత్నం వెనుకాల నిస్వార్థంగా నేరుగా ఇరవై ఏడు సంవత్సారాలుగా జీవితాన్ని పణంగా పెట్టి మరీ ఇదే ధ్యాసాగా, శ్వాసగా జీవిస్తూ వస్తున్నాను.

  1. పద్మజ:-మీరు సాహిత్యం వైపు అడుగులు వేయడానికి కారణాలేవి?

Md.సిరాజుద్దీన్:- ఏమో నాకే తెలవదు. ప్రపంచ శాంతి పండుగ పుస్తకాన్ని తీసుకుని క్రొత్త పండుగకు కాళోజీ గారి సహకారాన్ని తీసుకోవటం కోసం వారిని 1996 లో అనుకుంటా కలిశాను. వారు కొందరు కవులను పరిచయం చేసారు. పండుగకు కవుల సహకారం తీసుకోవడం కోసం అపుడప్పుడు కవితలను రాసుకునే నేను కవితా రచనాసక్తి పెంచుకున్నాను. ఊహించని రీతిలో ప్రోత్సాహం లభించ సాగింది. అలా కవిగా కూడా నిలిచి పోయాను. అయితే ఇవన్నీ నాకున్న కొన్ని అభిరుచులే అని తలుస్తాను. వాస్తవానికి నా జీవిత లక్ష్యం గమ్యం ప్రపంచ శాంతి పండుగే.

  1. పద్మజ:- మీ పుస్తకాన్ని శ్రీ కాళోజి గారితో
    ఆవిష్కరించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పటి అనుభవాలు చెప్పండి. 1997 నుండి శాంతి పండగ ఇప్పటివరకు జరగడం ఆశ్చర్యం కాదా! దీని మీద ప్రముఖుల స్పందన ఏమిటి?

7.Md సిరాజ్ :- శ్రీ కాళోజీ గారు ప్రపంచ శాంతి పండుగ పుస్తకాన్ని చూసి పరమానందం పొందారు. ఈ పుస్తకం ఆవిష్కరించ బడిందా? అని అడిగారు.
ఆవిష్కరించబడలేదని అన్నాను.
నేను ఆవిష్కరిస్తా అన్నారు. సంతోషం అన్నాను. మిత్రమండలి నేతృత్వంలో మరికొన్ని సాహితీ సంస్థలను కలుపుకుని కాళోజీ గారు 27.01.1997 న నా పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ వారు,” ఈ పుస్తకం ప్రపంచ భాషలన్నింటిలో రావాలి, ప్రపంచ ప్రజలందరూ దీనిని చదవాలి, అపుడే ఈ పండుగను ప్రపంచమంతా జరుపుకో గలుగుతుంది”. అన్నారు.
Prof K జయశంకర్ గారు, ” ఆనాడు Newton కు వచ్చినటువంటి ఆలోచనే నేడు సిరాజోద్దీన్ కు వచ్చింది. Newton ఆలోచనా ఫలాలను నేటి ప్రజలు అనుభవిస్తున్నారు. సిరాజుద్దీన్ ఆలోచనా ఫలాలను రేపటి ప్రపంచం అనుభవించనుంది”. అన్నారు.
Prof S లక్షణమూర్తి గారు, ” నేనో ప్రతిపాదన చేస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఉర్దూలో తర్జుమా చేసి జుమ్మా (శుక్రవారం) లలో మస్జీద్ ల వద్ద, తెలుగులో ఇంకిన్ని ప్రతులు వేసి శనివారాలలో దేవాలయాల వద్ద, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ఆదివారాలలో చర్చ్ లవద్ద ప్రభుత్వమే ఉచితంగా పంచి పెట్టాలి అన్నారు.
శ్రీ నమిలిగొండ బాల్ కిషన్ రావ్ గారు వ్యక్తిగతంగా ప్రశంసిస్తూ, ” ఓ అయిదు వందల సంవత్సారాల తరువాత ప్రపంచం నిండా సిరాజోద్దీన్ విగ్రహాలే ఉంటాయి, ఇదే కోవలో శ్రీ గౌస్ మోహిఉద్దీన్ గారు ప్రశంసిస్తూ, ” నోబెల్ తో పాటు ప్రపంచంలోని అవార్డులు రివార్డులన్నింటితో సిరాజోద్దీన్ కు సన్మానం జరగాలి. సిరాజోద్దీన్ ను UNO ఆజన్మ ప్రపంచ శాంతిదూత గా ప్రకటించాలి”, ఇలాంటి ప్రశంసలు లభించాయి, లభిస్తున్నాయి కూడా….

  1. పద్మజ:- శ్రీ కాళోజీగారితో మీ స్నేహాన్ని వివరించగలరా?

Md సిరాజ్ :- కాగా కాళోజీ గారు నను కవిగా ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ, కవితా సంపుటి యుద్ధం ను వేసుకునే నాటికి (2005) వారు లేరు.
అయితే కాళోజీ గారితో నా అనుబంధం ఆరు సంవత్సారాల పాటు సాగింది. ప్రధానంగా ప్రపంచ శాంతి పండుగకు వెన్నుదన్నుగా వారే నిలిచారు. KCR గారి కాలంలో కాళోజీ గారన్నా జయశంకర్ గారన్నా ఉండి ఉంటే ఈ పండుగ కనీసం దేశం దాటేదేమో….
కవిగా కూడా కాళోజీ గారితో నా స్నేహం సంతృప్తిగానే సాగిందనేదానికి వారి మరణానంతరం వారిపై నేను రాసుకున్న శ్రద్ధాంజలి కవితా గేయమే సాక్ష్యం.

ఇక్కడ కాళోజీ కవిత పెట్టాలి.

  1. పద్మజ:- మీరు రచించిన పుస్తకాలు పేర్లు చెప్పగలరా? Md సిరాజ్:-ముద్రించుకున్నవి ప్రధానంగా రెండే. మొదటిది 1995 లో ప్రపంచ శాంతి పండుగ. (అది ఓ సామాజిక ప్రయోగంగా నేను తలుస్తాను).
    యుద్ధం….శాంతి అశాంతుల మధ్య
    అనేది రెండోది కవితా సంపుటి.
  2. పద్మజ:- మీకిష్టమైన పుస్తకం చెప్పండి.

Md సిరాజ్ -:నాకు నచ్చిన పుసఏడు తరాలు అనే అనువాద నవల. (Roots అనే ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది).

  1. పద్మజ:- మీరు రాసిన కవితలు మీకు బాగా నచ్చిన కవితను మా పాఠకుల కోసం వివరించగలరా?

Md సిరాజ్
కవత 2 పోస్ట్ చేయాలి.

13.పద్మజ:- మీ రచనలో ప్రధానంగా ఏ యే అంశాలు కనిపిస్తాయి?

Md సిరాజ్:- నా కవితలల్లోశాంతీ సామరస్యాలు, మంచీ మానవత్వం, కవితల్లో మెచ్యూరిటీ నిండుగా ఉండాలనుకుని కోరుకుంటాను. కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండి తీరాల్సిందే, అంటాను. కవితల్లో ప్రజా సమస్యలు ఉండాలంటాను. కవితలను వీలైనంతవరకు మధురంగా పాడి వినిపిస్తాను. కవితను ఇష్టంగా కష్టపడి రాస్తాను. నా కవితను ఒక మారు విన్నవారు దాదాపుగా నన్ను మరచిపోరని ప్రతీతి. ఇలాంటి ప్రత్యేకతలతో నా కవితలు కూడుకుని ఉంటాయి. కాబట్టి కవితలంటే పారిపోయే ప్రజలు కూడా నాకవితలను శ్రద్ధగా వింటారు. అలాంటి అభిమానులు నాకు ఉండటం నా అదృష్టం.

  1. పద్మజ:- మీరు ఏ వయసు నుండి సాహిత్యం మీద కృషి చేస్తున్నారు?

Md సిరాజ్:-చిన్నప్పటి నుండే. బహుశా నా16వ ఏటనుండి అనుకుంటున్నా.

  1. పద్మజ:- మీరు ఏ ఏ పత్రికలో వ్యాసాలు రాశారు? వాటి వివరాలు చెబుతారా?

Md సిరాజ్ :-మొదట్లో దాదాపు అన్ని పత్రికల్లో వచ్చాయి. పత్రికల్లో వేసుకోవాలనే కోరిక ఇపుడు లేదు. అట్లాగని కవితలను రాయటం ఆపుకోలేదు. రికార్డు చేసుకుని Youtube లో భద్రపరచుకోవాలని ఉంటుంది. కాని సమయం లభించదు.

  1. పద్మజ:- మీరు మా పాఠకుల కోసం ఇచ్చే సందేశం ఏమిటి?

Md సిరాజ్:- సాహిత్యంలో మిగతా ప్రక్రియలు అంటే కథలూ, నవలలూ, వ్యాసాలూ, సమీక్షలు లాంటివి రాయాలనుకున్నా విలువలు ప్రధానం. కాబట్టి రాయాలనుకునే వారందరూ ముందుగా విలువలను పాటించటం నేర్చుకోవాలి.
అరవై నాలుగు కళల్లో అన్నీ నేర్చుకుంటే వచ్చేవే అనే అభిప్రాయం ఉంది నాకు. ఒక్క కవిత్వాన్ని మినహాయించి , కవిత్వం నేర్చుకుంటే రాదు. అది వ్యక్తితో పాటు పుట్టి వ్యక్తితో పాటు పెరిగి వస్తుంది. అలాంటివారే అసలు సిసలైన కవులు. అలాంటి వారే కాలచక్రం పై నిలుస్తారు. కవి అలా ఉండాలనుకుంటాను.

కవులు తమ కవితలను ఇష్టపడి రాయాలి. కష్టపడి రాయాలి. కవితలు రాసే వారు నూటికి నూరుశాతం పరమ పవిత్రంగా ఉంటేనే అసాధారణ కవితలు వస్తాయి. అల్లాంటి కవులు యుగాల్లో ఒకరిద్దరు ఉండటం కూడా కష్టమే. వారు కాలం పై నిలుస్తారు. మిగతా వారు కూడా నీతి నిజాయితీలతోనే ఉండాలి. కవి లోపల ఏ భావముంటే అదే కవితా రూపంలో బయటకు వస్తుంది. కవి వ్యక్తిత్వమే కవి యొక్క కవితలు.

  1. పద్మజ:- మయూఖ పత్రిక మీద మీ అభిప్రాయం తెలుపండి

Md సిరాజ్:-
నిహారిణిగారు నా కవితను ఇదివరలో మయూఖలో ప్రచురించారు. వారిని రెండు మూడు సందర్భాల్లో కలిసి కూడా ఉన్నారు. విలువలతో కూడిన సాహితీ శ్రమ వారిది అనే అభిప్రాయం ఏర్పడింది. నిహారిణి గారిపవిత్ర ప్రయత్నాలు ఇలాగే ఫలిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

శ్రీ సిరాజుద్దీన్ గారు తలపెట్టిన లక్ష్యం నెరవేరాలనీ, వారు కోరుకునే విలువలు రేపటి తరానికీ అలాగే నిలిచి, వాటిని పాటిస్తూ… బతుకును శాంతిమయం చేసుకొని, వారితో పాటూ ప్రపంచం యావత్తూ శాంతి పండగను దసరా- దీపావళులవలె ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ…
ఈ సందర్భంగా సిరాజుద్దీన్ గారిని అభినందిస్తూ… అడిగిన వెంటనే ముఖాముఖీ జరిపేఅవకాశమిచ్చినందుకు మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక తరపున అభినందనలుచెప్తూ… పాఠకులకు శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నది. రంగరాజు పద్మజ, అందరికీ నమస్కారములు.

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

కళలకు చదువు కుంటుపడదు – గౌరీశంకర్

by రంగరాజు పద్మజ November 22, 2024
written by రంగరాజు పద్మజ

అవధాని శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారి తో ముఖాముఖీ- రంగరాజుపద్మజ
సాహిత్య ప్రయోజనం హృదయాన్ని స్పందింపచేయాలి.. సాహిత్య ప్రయోజనం జాతీయ ప్రయోజనమైనప్పుడు.. స్పందించే హృదయాలు సంస్కారాలను పెంచుకొని, మంచి పౌరులుగా తయారవుతారు. అలా ఉన్నతులైన వారు మరింతమందికి జీవిత విధానాలకు మార్గదర్శకులుగా .. సమాజానికి ప్రేరణ ఇచ్చేవారిగా చేయడం సాహిత్య లక్ష్యం!
సాహిత్యం పాఠకుని సంస్కారాన్ని పెంచే ప్రక్రియలో నూతనత్వం యొక్క అవసరాన్ని గమనించి ప్రతి తరంలో కవి పండితులు ఆయా ప్రక్రియలలో రచనలను సృష్టించారు… ఆ కోవలోనే చక్కటి పద్యాలను అవధానాల రూపంలో అందిస్తూ… అటు భాషామ తల్లికి, ఇటు సమాజానికి సాహిత్య సేవకులుగా.. అందిస్తున్న కవి పండితులు శ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మగారు మన మయూఖ ద్వైమాసిక పత్రిక పాఠకుల ఆత్మీయ అతిథులు.
సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వ్యర్థమని పెద్దలు చెప్పే మాట ! దానితో నేను ఏకీభవిస్తూ..
ఆ దిశగా మన సాహిత్య ప్రక్రియలను బతికి బట్టకట్టిస్తున్న సృజన కారులను గౌరవిస్తూ… రేపటి తరానికి మార్గదర్శకులుగా చూపించాలనే చిరు ప్రయత్నమే ఈ ముఖాముఖి!! ఆస్వాదించండి!

అష్టావధాన కార్య మ
దృష్టముచే గాక యెట్లు దీర్పంగ వచ్చున్
కష్టమో సుఖమో యది యు
తృష్ణ మనుషులే యెఱింగి కీర్తింతురిలన్॥

మన తెలుగు సాహిత్య పరిణామంలో ఎన్నెన్నో ప్రక్రియలు రూపొందాయన్నది అందరికీ తెలిసిన విషయమే!
పరిచయమే అక్కరలేని ప్రముఖ అవధాని గారిని పరిచయం చేయడం మంటే రేపటి తరానికి ప్రేరణ కల్పించడానికే! ఈనాటి మన ముఖాముఖీన కార్యక్రమంలో
బహుముఖీన విద్యా విశారదులు, జంట అవధానులుగా తెలుగు రాష్ట్రాలలో పేరుపొందిన సంస్కృత అవధానులు ,
1,మహాకాళీ సుప్రభాతం ,2. శ్రీరామచంద్ర సుప్రభాతం, 3.శ్రీ శివానందోదాహరణం, 4.శ్రీనోరి నరసింహోదాహరణము, వంటి బహుపుస్తక గ్రంథకర్తలు, మాన్యులు ముత్యంపేట గౌరీశంకరశర్మగారు. శ్రీయుత గౌరవనీయులైన ముదిగొండ అమర్నాథశర్మ గారితో పాటు సంస్కృత- తెలుగు అవధానాల నెన్నిటినో అలవోకగా చేసిన కవి, పండితులు , సాహితీవేత్త గారి ముఖతః గా వారి సాహితీ యాత్ర గురించి తెలుసుకుందాము. పద్మజ. నమస్కారమండీ!

ముత్యంపేట గౌరీశంకర శర్మ:- నమస్కారం.

పద్మజ :- మీవంటి సరస్వతీ స్వరూపులకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల గురించి, మీ నేపథ్యం గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?
గౌరీశంకర శర్మ: మా స్వగ్రామం లచ్చపేట, దుబ్బాక మండలం ॥సిద్దిపేట జిల్లా, మా తల్లిదండ్రులు నాగలింగ శాస్త్రి- రాజ్యలక్ష్మి గారలు. మా నాన్నగారు సంస్కృతాంధ్ర పండితులు. న్యాయ వేదాంతాయుర్వేదాభిజ్ఞ బిరుదు వారికి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఇద్దరు అక్కయ్యలు తర్వాత నేను, తమ్ముడు.

పద్మజ :- మీ విద్యాభ్యాసము, వృత్తి, ప్రవృత్తుల గురించి వివరిస్తారా?
గౌరీశంకర: నా విద్యాభ్యాసం మా నాన్నగారు సంస్కృత పండితులు కాబట్టి, నాకు కూడా సంస్కృతం నేర్పించాలనే ఉద్దేశంలో శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల కళాశాల వేములవాడలో చేర్పించారు. ఆరవ తరగత నుండి బి ఏ ఎల్ వరకు పది సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా విద్యను పూర్తి చేశాను.సంస్కృతం,సాహిత్యం, తర్క, వ్యాకరణాలు, మొదలగు వాటితో పాటు ఈశ్వర గారి కిష్ఠయ్య ఘనాపాఠీ గారి దగ్గర వేదం కొంత భాగం నేర్చుకోవడం జరిగింది. మా కళాశాలలో మంచి విద్వద్దిగ్గజా ల్లాంటి గురువులు ఉండేవారు. ఆ తర్వాత భాగ్యనగరంలో తెలుగు M A సంస్కృతం MA phd చేసి, 2002లో ఉద్యోగం లభించింది వృత్తిపరంగా వైదిక కార్యక్రమ నిర్వహణం.

పద్మజ : ఉపాధ్యాయ వృత్తిలో ఏవైనా పురస్కారాలు అందుకున్నారా? విశిష్ట సేవలందించినందుకు బిరుదులు గానీ పొందారా?
గౌరీశంకర : వృత్తిలో 2014లో జిల్లా స్థాయి [మెదక్] ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, తెలుగు మహాసభలలో అవధానంలో [మహబూబ్ నగర్] లో అవధాన తిలక అనే బిరుదునిచ్చారు. అలాగే శ్రీశైల పీఠం ఆస్థాన పండితుడిగా, శ్రీ పుష్పగిరి పీఠానికి కూడా ఆస్థాన పండితులుగా శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారు నియమించడం నా సుకృతం.

పద్మజ :- పద్య ప్రాశస్త్యాన్ని మీరెలా సమర్ధిస్తారు? దానిని ఎలా కాపాడుకోవచ్చు? విద్యా ప్రావీణ్యత చూపేందుకే పద్యరచన చేస్తారా? ఎందుకంటే ఆంగ్లమాధ్యమంలో కొనసాగుతున్న నేటి విద్యా బోధనా విధానంలో తరగతి గదిలో పాఠ్యాంశాలలో ఇదివరకు వలె పద్య పాఠాలు కనపడడం లేదన్నది ఒక వాదన వినిపిస్తున్న ఈ తరుణంలో పిల్లల చేత పద్య రచన ఎలా కొనసాగించ గలం ?
గౌరీశంకర శర్మ :- “పద్యము తెలుగువాడిలో భాగమగును భాగమే కాదు మనిషికి భాగ్యమగును” అన్నట్లుగా ఆత్మానందానికి ప్రతీక పద్యం! పద్యం చదువుతుంటే ఆందోళనలు అన్ని తగ్గి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆంగ్లమాధ్యమంలో చదివినా విద్యార్థులకు మంచి, మంచి వేమన పద్యాలు, సుమతీ శతక పద్యాల ద్వారా నీతిని బోధించాలి. ఇదివరకటిలాగా కాకుండా మా పాఠశాలలో నైతే పిల్లల చేత కొంతవరకు రచన చేయిస్తున్నాను

పద్మజ. :- ఉభయ భాషలలో పట్టు సాధించడానికి ఎలాంటి కృషి చేసారు?
గౌరీశంకర ( జ):- ఉభయ భాషలలో పట్టు -అమరకోశం – శబ్ధమంజరి- బాల బోధిని, కావ్య ప్రబంధ పఠనం మొదలైనవి చాలా దోహద పడినవి.

పద్మజ :– నోరి నరసింహోదాహరణము రచించడాని గల ప్రేరణఏమిటి? అసలు ఉదాహరణములను ఎలా చెప్పుకోవచ్చు?
గౌరీశంకర ( జ):- సద్గురు శివానంద మూర్తిగారు మా శైవపీఠానికి పీఠాధిపతిగా ఉండేవారు. వారు లోక గురువులు. ఆధ్యాత్మిక భావనా సంపన్నులు. ఎందరో గొప్పవారు వారికి శిష్యులుగా ఉన్నారు. ఒకసారి వారి ఆశ్రమం భీమిలి [విశాఖపట్నంలో] సభలు జరిగిత వెళ్ళాం. ఊరికే ఎలా వెళ్లడం? అని ఆలోచించి వారికి ఏదైనా సమర్పిస్తే బాగుంటుందని భావించి వారిపై ఉన్న భక్తికి నిదర్శనంగా విభక్తి కావ్యం ఉదాహరణ కావ్యం రచించి వారి సమక్షంలో ఆవిష్కరణ చేసి, వారికే అంకితం ఇచ్చాను.దీంట్లో సంబోధన విభక్తితో కలిసి, ఎనిమిది విభక్తులతో ఒక్కొక్క విభక్తి ఒక్కొక్క పద్యం, అలాగే కళిక- ఉత్కళిక, రగడలతో స్తుతి కావ్యాన్ని సంతరించి గురు పాదాలకు సమర్పించడం జరిగింది. పాల్కురికి సోమనాథుడు వేసిన సంప్రదాయమిది. కవిసామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి కుమారులు నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు వారి తండ్రి గారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రతి సం॥ పురస్కారాలు ఇస్తున్నారు. అలా మాకు కూడా ఇచ్చారు. వారి పైన సంస్కృతంలో మిత్రుడు అమర్నాథ్ శర్మ, తెలుగులో నేను రచించి వారికి సమర్పించుకున్నాము.

పద్మజ :- మహా కాళీ సుప్రభాతం రచనా నేపథ్యం చెప్పండి?
గౌరీశంకర :- అది 1990 సంవత్సరంలో వేములవాడలో విద్యాభ్యాసం కాగానే నాచారంలో శ్రీ మహా కాళి దేవాలయంలో వాస్తు జ్యోతిష పండితులు శ్రీ వేదాంతం నరసింహమూర్తి గారి దగ్గర శిష్యరికం, పురోహితం చేస్తూ అమ్మవారిపై శ్రీమహాకాళి సుప్రభాతం రచించి శ్రీమతి కే .కమల ఆచార్య రవ్వ శ్రీహరి గారు ముదిగొండ వీరభద్రయ్య గారి చేతుల మీద ఆవిష్కరణ జరిగింది.

పద్మజ :- అవధానాలే కాక ఇతర కళారంగాలలో మీ పాత్ర- వాటి విశేషాలు వివరించండి!
గౌరీశంకర శర్మ:- మా గురువుగారు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీ హరి శర్మ గారు వేముల వాడలో మాకు సాహిత్యాన్ని బోధించేవారు. వారు అష్టావధానులు వారి వద్ద మెలుకువలు నేర్చుకున్నాము అలా అవధానాలు చేస్తున్న సమయంలో ప్రాచీన కావ్యములు పఠించడం జరిగేది ఆ పద్యవాసన వల్లనే ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు దివాకర్ల వేదిక తరపున భువన విజయాలు వేసేవారు. ఒకసారి నన్ను దూర్జటి పాత్ర వేయమన్నారు. ఆ పాత్ర వేసి
రక్తి కట్టించేసరికి అలా అన్ని పాత్రల పద్యాలు కంఠస్థం చేయవయ్యా! నీకు ఏ పాత్ర అవకాశమిస్తే ఆ పాత్ర వేయాలి అనేవారు. అలా రాయలు, తిమ్మరసు తప్ప అన్ని పాత్రలు వేసేవాడిని. ముఖ్యంగా పెద్దన, ధూర్జటి, మల్లన పాత్రలు వేసేవాడిని అలాగే ప్రతాపరుద్ర నాటకంలో విద్యానాథుడి పాత్ర కైలాస సాహితీ సభలో శ్రీనాథుడి పాత్ర ఇలా పోషిస్తూ కళా రంగంలో కృషి చేయడం జరిగింది

పద్మజ :- అవధాన విద్య నేర్చుకోవాలనే అభిలాష కలవారికి మీరేమైనా మార్గదర్శనం చేస్తారా?ఇంకా ఇతరులెవరైనా ఆ దిశగా కృషి సల్పుతున్నారా? వారికి మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ:- అవధాన విద్యనేర్చుకోవాలనే తపన గల వారికి మామిత్రులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవగాహన కళాపరిషత్తు స్థాపించి ఎందరికో ఔత్సాహికులకు అవధానులచేత శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాంట్లో నేను కూడా పాల్గొని శిక్షణ ఇచ్చాను. నా సలహా ఒకటే పద్యాలు బాగ నేర్వాలి ఇతరులవి కూడా చదవాలి అదే ఆలోచన ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత మొదలైనవి ఉండాలి!

పద్మజ :- కళలకు సమయం వెచ్చిస్తే చదువు కుంటుపడుతుందనే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ : కళలకు సమయం వెచ్చిస్తే చదువుకుంటు పడుతుంది అనేది కేవలం వారి అపోహ మాత్రమే! అటు చదువుతూ ఇటు సంగీతం, నాట్యం, కరాటే, వాయిద్యాలు పిల్లలు నేర్చుకోవడం లేదా? ఇప్పుడు అలాగే ఈ పద్యరచన కూడా!!


పద్మజ :- తెలుగుభాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టమనే ఒక అపోహ ప్రజలలో ఉన్నది. దానికిమీరేమంటారు?
గౌరీశంకర శర్మ : తెలుగు భాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టం అనేది కూడా ఒక అపోహనే! ఇప్పటికీ తెలుగుతో పాటు ఆంగ్లభాష నేర్చుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా! కేవలం తెలుగైతే తెలుగు పండితులుగా భాషావేత్తలుగా అయ్యే అవకాశం ఉంది.

పద్మజ :- కొసమెరుపుగా మీరు తెలుగు భాష- విద్యా బోధన ఎలా ఉండాలనుకుంటారు? అంటే పిల్లవాడికి తనంత తానే తెలుగు భాష మీద మక్కువ పెంచుకునేలా ఏమి చేయవచ్చు? దానిని ఆచరణలో ఎలా పెట్ట వచ్చు? దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా?
గౌరీశంకర శర్మ :- పిల్లవాడికి తెలుగు భాష మీద మక్కువ కలగాలంటే మనం కొన్ని భాష చమత్కారాలు, పొడుపు కథలతో కూడిన పద్యాలు అనుప్రాసాలంకార శోభితమైన పద్యాలు ముందు మనం చదువుతూ, పాడుతూ, ఆడుతూ నేర్పిస్తే నేర్చుకుంటారు. మా పాఠశాలలో పిల్లలకు పద్యంతాక్షరి పోటీలు పెట్టి బహుమతులు ఇస్తాను. వాటికోసం పద్యాలు కంఠస్తం చేస్తారు.

పద్మజ : అటు వృత్తి ఇటు ప్రవృత్తి రెండింటికీ సమన్యాయం ఎలా చేయగలుగుతున్నారు? అలాగే సమయ సద్వినియోగం గురించి రెండు మాటలు చెప్పండి!
గౌరీశంకర శర్మ : వృత్తి- ఉద్యోగం -ప్రవృత్తి -వైదిక కార్యక్రమాలు- సాహిత్య- అవధాన, కళారంగాలపై అవగాహన సమయం సెలవులు ఉంటే వాటిని సార్థకం చేస్తున్నాను.
క్షణశఃక౯శశ్చైవ- విద్యామర్ధంచ సాధపేత్! అని మా నాన్న గారు చెప్పేవారు. ఊరికే ఉండొద్దు అంటే సంపాదన. అయితే విద్యాదానం ఇలా…

పద్మజ :- మీరు మెప్పు పొందిన అవధానం గురించి, ఛందోభాషణం కానీ అప్రస్తుత ప్రసంగం సందర్భంగా మీరు చెప్పిన పద్యాలు మా మయూఖ పాఠకులకు చెప్పండి!
గౌరీశంకర శర్మ :- అవధానములో మెప్పు పొందిన అవధానం రవీంద్రభారతిలో ప్రపంచ తెలుగు మహాసభలలో చేసిన అవధానం 17-12- 2017 లోజరిగింది. దానిని శ్రీ నాగ ఫణి శర్మగారు ప్రత్యక్షంగా విని మెచ్చుకున్నారు. అలాగే ఒక అవధానంలో ఒక సమస్యను ఇచ్చారు!

హనుమత్పుత్రుడు భీష్మ సూనను వివాహంబాడె రారండహో!
వినుమా! నేడిట కృష్ణ దివ్య కథలావిష్కారమున్ జేసెదన్
ఘన వంశాంబుధి నోలలాడిన మహా గాంభీర్య తేజస్విమున్
అనుమానింపకు మమ్మ! శౌరి మతడే యాశ్చర్యమౌ దివ్య దే
హనుమత్పుత్రుడు …..అంటూ నందుడు గోపవనితలలో తన కుమారుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్పే సందర్భం కొంచెం ఇబ్బంది అయినా బాగా వచ్చింది. అలాగే రచించిన మహాకాళేశ్వర శంకరా! అనే ఏకప్రాస శతకానికి ముందు మాట చెప్పి పద్యంతో ఆశీర్వదించారు ద్వి సహస్రావధాని నాగపణిశర్మ గారు.
మతి మన్మంజులమై, శివా కరుణమై, మాధుర్యమై ధుర్యమై
సతత త్ర్యంబక పాదభక్తివశమై సమ్మాన్యమై మాన్యమై
కృతి మన్మంగళమై సదాశివద గౌరీ శంకర ప్రోక్త- వా
క్యతపః పూర్ణమునౌ శతాత్మకము శ్రేయః ప్రేమముల్ గూర్చుతన్!
అంటూ ఆశీఃపూర్వకముగా అభినందించారు.
దాదాపు అవధాన వరేణ్యులందరి అవధానములలో పాల్గొన్నాను.
నాగఫణిశర్మగారు, గరికపాటి వారు, వద్దిపర్తి వారు, మేడాసాని వారు, జీఎం రామ శర్మ గారు, ఆముదాల, కడిమిళ్ళ వారిలాంటి పెద్దవారితో అవధానాలలో పాల్గొనే అవకాశం లభించింది.

చివరగా మయూఖపత్రికా ప్రశంస
ఈ మయూఖము శిఖరమై యిలను నిలిచి
బహుముఖీనము గాంచుచు భద్రమగుత!
సాహితీ సుధ వెలయించి శాశ్వతమగు
కీర్తినందుచుభవితకు స్ఫూర్తినిడుత!
ఈ అవకాశాన్ని కల్పించిన సహృదయ వరేణ్యులు ఆర్ష ధర్మ ప్రదీపిక రంగరాజు పద్మజ గారికి కృతానేక కృతజ్ఞతా పూర్వక ధన్యవాద నమస్సులు.
శుభం.

రంగ రాజు పద్మజ:- గౌరవనీయులైన అవధాని గారిచే చక్కని సాహిత్య విశేష విషయాలను తెలుసుకున్నాం! మనమూ ఆ దిశగా అడుగులు వేద్దాం!

మాన్యులు అవధాన శిఖామణి శ్రీయుత గౌరీశంకరశర్మ గారితో ముఖాముఖీ భాగ్యం కల్పించిన మయూఖ పత్రిక సంపాదకురాలికి ప్రతేక ధన్యవాదములు తెలుపుతూ…
జయతు ! తెలుగు భాషామతల్లీ! జయతు !

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

సుద్దులు

by Achyutuni Rajasri November 22, 2024
written by Achyutuni Rajasri

“సాధారణంగా మనం ఎంతోమంది తో మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటాం కానీ కొందరు చెప్పే మాటలు మనకు ఆనందం తోపాటు ఆదర్శభావాల్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి.అదే మనం తెలుసుకోవాలి” శివా మాష్టారు పాఠం చెప్పేముందు ఇలా కొన్ని మాటలు చెప్పి ఆలోచించమని పిల్లలకు చెప్తారు.అప్పుడు ఆసక్తికరంగా ఆయనపాఠంసజావుగా సాగుతుంది.బెల్లు ఐనా ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.” కులం అంటే ఏంటి?” ” అదే సర్! క్యాస్ట్!” పొలోమని అరిచారు.
“అసలు అర్థం నివాసం అని.వృత్తులు ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు చేసేవారు.అలా సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడి సహజీవనం గడిపేవారు.ఒకసారి శ్రీరామానుజులవారు స్నానం ముగించుకుని తిరిగి వస్తూ ధనుర్దాసు అనే శిష్యుడు భుజంపై చేయి వేసి నడిచారు.ఒక చుప్పనాతి శిష్యుడు అడిగేశాడు “వాడు తక్కువ కులంవాడుకదా? మీ మడికి భంగం కలగదా?”అని.
దానికి ఆయన ఇలా జవాబిచ్చారు” పిచ్చివాడా! చదువు డబ్బు గొప్ప వంశం కులంలో పుట్టాను అనేవి అహంకారం మదమాత్సర్యాలకి మూలం.వినయవిధేయతలున్నవాడే మానవత్వంతో సాయపడే వాడే దేవుని దృష్టిలో అసలుసిసలు భక్తుడు.శుచిశుభ్రత ముఖ్యం.” అన్నారట శ్రీ రామానుజులు . అంతెందుకు? మనమిసైల్ మాన్ అబ్దుల్ కలాం ని
బడిలో అయ్యర్ అయ్యవార్లు తమ ఇంటికి పిలిచి వంటింట్లో తమతోపాటు భోజనానికి కూచోబెట్టేవారు.మడి తో ఉన్న మాష్టారు భార్య
మామి కూడా కన్నకొడుకు లా బాల కలాం కి అన్నం కొసరి కొసరి వడ్డిస్తూ వినిపించేది.మీరు కూడా మధ్యాహ్నం లంచ్ అందుకే పక్కపక్కనే కూచుని తినాలి.మీరు తెచ్చినవి ఇతరులతో పంచపకుంటూ,వారివి మీరు పుచ్చుకోవడం లోనే ప్రేమ ఆప్యాయతలు బంధాలు పెరుగు తాయి.” అని శివా మాస్టారు చెప్పారు. అది వింటున్న బడి ఛైర్మన్ మనవడు రాము అన్నాడు” 
సార్! ఇవాల్టినుంచి నేను కూడా అందరితో కలిసి తింటాను.ఆగట్టుమీద కూచోను.మానౌకరు దగ్గర కూర్చుని తినిపిస్తాడు.మా అమ్మ మాట ప్రకారం.”
“సెభా‌ష్ రాము! మీనౌకరుకి చెప్తానులే లంచ్ బాక్స్ ఆయాకిచ్చి
వెళ్లిపొమ్మని.నీవుకూడా మీక్లాసుపిల్లలతో కల్సికూచుని తిను.అందరూ తమ ఇంట్లోంచి రకరకాల వెరైటీవంటకాలు తెస్తారు. అవి పక్కవారితో పంచుకొని తింటారు.వంకాయని రకరకాలుగా వండవచ్చు.కొందరుఅల్లంపచ్చిమిర్చి కొబ్బరివేసి గుత్తికూర చేస్తారు, కొందరు ఉల్లిగడ్డ వేసి ముద్దగా కూర చేసుకుంటారు, కొందరు వేపుడు గా చేసుకుని తింటారు. మరికొందరు వంకాయ పులుసు వండుతారు, కొందరు చట్నీ లా చేసుకుని తింటారు. వాటిలాగానే మనుషుల స్వభావాలుకూడా. చూడండి …. మన రాము ఎంత బాగా సరేనన్నాడో చూడండి.” శివాసార్ మాటల్తో పిల్లలంతా పొలోమని అరిచారు” హాయ్! రేపట్నించి రాముకూడా మనతోకల్సి చెట్టుకింద కూచునే తింటాడు.వాడి లంచ్ బాక్స్ లోని వెరైటీలు మనం కూడా రుచి చూడొచ్చు” .చప్పట్లతో రాముని పిల్లల అభినందించారు🌷

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కవితా సాగర మధనం

by Y. Sujatha November 22, 2024
written by Y. Sujatha

కవిత గాఢంగా ప్రారంభించాలన్నా
గుట్టు విప్పి ముగించాలన్నా
భావాల తీవ్రత
అక్షరాల ఆర్ద్రత
సమతూకం చేయాలి !

కష్టాల కన్నీటి ఉప్పదనంలో
దుఃఖ సముద్ర లవణ శాతమెంతో‌ లెక్కించాలి !

నిట్టూర్పుల గుండె మంటల సెగలో
బాధాగ్ని శిఖ వేడి
ఎంతో గణించాలి !

ఆనందాల క్రీడా కేళిలో
గెలుపు మలుపు
గుట్టేమిటో విప్పి చెప్పాలి !

సంతోషాల వెన్నెల చినుకుల్లో
చిటపటల సందడి
ఎంతసేపో గుర్తించాలి !

భావోద్వేగాల ఆవేదన మూటలో
సమతౌల్యం ఎంతో
తూకమెయ్యాలి !

అనుభవాల క్రమ పరంపరలో
నేర్చుకున్న పాఠాల విలువ
నిగ్గు తేల్చాలి !

త్రుళ్ళిపడే
ఈర్ష్యాద్వేషాల కార్చిచ్చులో
దహించుకుపోయిన
స్వచ్ఛదనం ఎంతో
స్పష్టం చేయాలి !

ప్రతీ విషయాన్ని
సున్నితంగా స్పృశించాలి
నిశితంగా పరిశీలించాలి
సాలోచనగా వీక్షించాలి
ఆర్ద్రతగా శ్రవణించాలి !

అప్పుడే కదా
లోగుట్టు తెలిసేది
భావ సాగర మధనంలో
కవితామృతం పుట్టేది !

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జనని

by Chandu Pendyala November 22, 2024
written by Chandu Pendyala

చెందు పెండ్యాల
తరానికో..
ఆడపిల్ల
తీరొక్క
రూపురేఖ.
కష్ఠానికి
ముందుంటది
సుఖానికి
ఎనుకకు పోతది.
అన్నిటిని
తట్టుకోడానికి
అలంకరించుకుని
మరీ పుడుతది.
ఇది లీలందుమా.
విధి గీతందుమా.
తన రాతందుమా.
పువ్వుకు
ప్రతిరూపమందుమా.
ఓపికకు
భూమాతందుమా.
కన్నీళ్ళ ను
కనపడనీయని
కీకారణ్యపు
పాయ అందుమా.
జన్మలకే
జనని అందుమా.

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాల్యం

by Butam Mutyalu November 22, 2024
written by Butam Mutyalu

ప॥ బాల్యం బాలల హక్కు భవితకు గురువే దిక్కు 2
ఆటలాడుతూ పాటపాడుతూ
చదువుతూ ముందుకు సాగాలి
మీరు చదువుతూ ముందుకు సాగాలి ॥ బాల్యం ॥

చిట్టి పలుకుల బుజ్జాయి
చిన్ని నడకల చెల్లాయి
జాగు చేయక రావాలి
జగతి వెలుగులే కావాలి

బడిలో టింగున బెల్లుమోగెరా మారామూ చేయక రావాలి
పలక బలపం చేతపట్టుకొని పరుగు పరుగునా రావాలి
అంక్షల చూసి బెదురేలా
కాంక్షతో బడికి రావాలి ॥ బాల్యం ॥

లేగదూడలా గంతులు వేస్తూ
లేడీ పిల్లల పరుగులు తీస్తూ సమయపాలన పాటిస్తూ
ఓనమాలు నేరుస్తూ చదువులన్ని చదవాలి
నీ భవితను నిర్మించు కోవాలి

ఆ అంటే అమ్మేరా ఆ అంటే ఆవేరా అమ్మనీకుతొలి గురువు
అమ్మ లాలి పాటలు నానబుద్ధి మాటలు మేలవించి చెప్పే టీచర్లు నీ కండ ఉండగా
శ్రద్ధతో బుద్ధిగా చదివినవో
అందవిశ్వాసాల అంతు చూడరా
దిగంతమే నీకు తలను వంచురా

November 22, 2024 0 comment
3 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

యాదోంకీబారాత్ జ్ఞాపకాల ఊరేగింపు-ఒక సృజనకారుడి ప్రయాణం

by Bodla Anuradha November 22, 2024
written by Bodla Anuradha

వారాల ఆనంద్  జ్ఞాపకాల ఊరేగింపు (యాదోంకీ బారాత్) మహా జోరుగా, మరెంతో ఘనంగా అలుపూ విరామం లేక ఆరు దశాబ్దాల చరితను పలకరిస్తూపాఠకులను పులకరింప చేస్తూ సాగుతుంది. కరీంనగర్ ఊపిరిగా మొదలైన ఈ బారాత్ వేములవాడ, సిరిసిల్ల, అగ్రహారం, మంథని, చొప్పదండి, హైదరాబాద్ ఇలా ఒకటీ రెండూ కాదు, తెలంగాణా ఊర్లన్నీ తిరుగుతూ, ఢిల్లీపురవీధులకి కూడ ఏగి పలు అవార్దుల, రివార్దుల హారతులందుకుంది.ప్రతి ఊరినీ అక్కడి వ్యక్తులనూ పరిచయం చేస్తూ మనల్ని తనతో పాటు తీసుకెళ్తుంది.     ఈ ఘనమైన బారాత్ ప్రయాణంలో ఇది అది అనిలేకుండా ఎన్నో విషయాలు మనకు పరిచయమవుతాయి. పలు సంస్థలకు, కార్యక్రమాలకూ జరిగిన రూపకల్పన, పలు సాహితీ ప్రక్రియల వివరణ, ఎందరోసాహితీ వేత్తల పరిచయం, దేశ విదేశ సినిమాల విశ్లేషణ,  పలు ప్రింటింగ్ విధానాలు, డాక్యుమెంటరీ సినిమాలు తీసే ప్రక్రియలు ఇలా ఎన్నింటినోవివరిస్తుంది.      ఈ జ్ఞాపకాల ఊరేగింపులో వందల కొద్దీ వ్యక్తులపేర్లు ఎదురొస్తాయి. కొన్ని తెలిసినవి, మరెన్నో తెలియనివి. ఇందులోఒక దగ్గర అనంద్ చెప్పినట్టు కొన్నిపేర్లు హాయి చెప్తే, కొన్ని హలో చెబుతాయి. ఇంతకుముందే పరిచయం ఉన్నవాళ్ళు హాయిచెబితే, కొత్తవాళ్ళు హలో చెప్పారు అని ఆయనేఒక చోట అన్నారు. అంతేకాదు కొన్నిచాఫ్టర్లలో హలొ చెప్పిన పేర్లు ఆ తరువాతిచాఫ్టర్లలో హాయి కూడా చెప్పేస్తాయి. అంటే ఆ పేర్లు మళ్ళీ మళ్ళీ ఎదురవుతూ మనకి అంతగానూ పరిచయమవుతాయి. ఇక్కడ మామూలు వ్యక్తులే కాదు, పలు సినీ నటులు, దర్శకులు, మరెందరో సాహితీవేత్తలు కూడా కలుస్తారు. అక్కడక్కడా దేశ విదేశసినిమాలూ పరిచయమవుతాయి, ఆపాత మధురాలైన అలనాటి హిందీ, తెలుగు పాటలు పలకరిస్తాయి, కూనిరాగాలుతీపిస్తాయి, మది నింపుతాయి.      ఈ పుస్తకంలో 80 వదశకం నుంచి 2014 వరకు కరీంనగర్ లో సాహితీ పరంగా, ఫిలిం సొసైటీ పరంగా జరిగిన ఎన్నో కార్యక్రమాల వివరణదొరుకుతుంది. ఎస్.ఆర్.ఆర్. కాలేజీ పరిధిలో జరిగిన కోర్సుల వివరాలు చేపట్టిన పలుఅభివృద్ది కార్యక్రమాలు, అందుకు ఎంతగానో సహకరించినఉపాధ్యాయులు, కలెక్టర్లు, మంత్రుల వివరాలు ఇలా ఎన్నో పొందుపరచబడ్డాయి.       కరీంనగర్ నేను పుట్టి పెరిగిన ఊరే. మా ఊరిలోనా చుట్టూతానే ఇంత  ప్రపంచం ఉండిందా, ఇన్ని కార్యక్రమాలు జరిగాయా, ఆప్రపంచం నాకు తెలియలేదే,  అందులో నేను లేనే అని నాకు చాలా చోట్ల అనిపించింది. ముఖ్యంగాఫిల్మ్  అప్ప్రీషియేషన్ కోర్స్ నేనూ చేసిఉండాల్సిందని, ఫిలిం సొసైటీ లోని మంచి మంచిసినిమాలు చూసి ఉండాల్సిందని అనిపించింది.    

ఈ యాదోంకీ బారాత్ ఒక సృజనకారుడి ప్రయాణం.సృజనకారుడైన వాడు తనను తాను వ్యక్తం చేసుకోవటానికి ఏదో ఒక్క రూపమే ప్రధానం కాదనినేను విశ్వసించాను అని చెప్తూ ఆనంద్ తన సృజనను,అన్నిరంగాల్లో చూపించారు. కధలు, కవితలు, విశ్లేషణలు, ఫిల్మీకరణలు, ఫిల్మ్ సొసైటీ స్థాపనలు,బోధనలు, ఉత్సాహాలు, ప్రోత్సాహాలు అన్నిటా తానైతను ఎరిగిన, తిరిగిన, ప్రపంచాన్ని మన కళ్లముందు అక్షరీకరించారు అనటం కంటేదృశ్యీకరించారు అనటం బాగుంటుంది.  అయితే ఈ సృజనకారుడిప్రయాణం పర్సనల్ కాదు. సమాజంతో, సాహిత్యంతో, సినీ ప్రపంచంతో ముడిపడి ఉన్న ఎన్నో యదార్ధ సంఘటనల చిత్రణ. ఈయదార్ధ సంఘటనలకు అక్షరరూపం ఇవ్వడం వల్ల అది భావి తరాలకు ఒక సాధికారిక చరిత్రగా మిగులుతుంది.కొన్ని దశాబ్దాల క్రితం ఉన్నసామాజిక పరిస్థితులు, మార్పుకోసం జరిగిన ప్రయత్నాలు, కార్యక్రమాలులాంటివి అర్ధమవటానికి, అలాటి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి, ఈ పుస్తకం ఒక ఆలంబన అవుతుంది.   . జీవితంఎల్లవేళలా పూల పానుపు కాదు. అది నవ్విస్తుంది,ఏడిపిస్తుంది, ఎత్తున నిలబెడుతుంది,ఎత్తి  కుదేస్తుంది. ఎంతటి సృజనకారుడిని కూడా ఊహించనిమలుపులు తిప్పుతుంది. కొన్ని చిన్న చిన్న మలుపులైతే కొన్నిపెద్ద కుదుపులు. జీవితంచీకటి వెలుగుల సంగమం అంటూ పుస్తక ముఖచిత్రం చెప్పకనే చెప్తుంది.  “ ఓటమి నాకు ఊపిరి కాదుఅలవాటు కాదు దినచర్య కాదు అది చీకటిలాఎదురు వస్తుంది, చిటికెస్తేపరిగెడుతుంది…” అంటూ అలాటిఆటుపోట్లను ఎదుర్కొంటూ, సమాజంలో తనదైన స్థానాన్నినిలబెట్టుకుంటూ తన సృజనకి విరామం ఇవ్వకుండా సాగిన ఆనంద్ ప్రయాణం ‘జ్ఞాపకాల ఊరేగింపు’ ఎంతో ఇంట్రెస్టింగ్ గాసాగుతుంది. ఇందులో దాదాపు ప్రతి చాప్టర్ ఒక కవితతో మొదలవుతూ ఆ చాఫ్టర్లో ఎలాంటిజ్ఞాపకాల సందడిని మనం చూడబోతున్నామో చెప్పకనే చెప్పుతుంది, మన మూడ్ ని దానికి సిద్ధం చేస్తుంది. కొన్నిసార్లు పేజీనిండుగా టెక్స్ట్ ఉంటె ఆమ్మో ఇంత ఉందా చదవాల్సింది అనిపిస్తుంది. అలా కాకుండా మధ్యమధ్యలో ఉన్న ఈ కవితలు చూపుకి, మనసుకి కూడాఆహ్లాదాన్నిస్తాయి. అలా కవిత్వమూ, వచనమూ కలగలిసిన ఈ ప్రయాణంచదువుతుంటే ఒక మంచి పుస్తకం చదువుతున్న ఫీల్ కలుగింది. నాకయితే ఎక్కడా, ఏ పేరా కానీ, ఏ పేజీ కానీ స్కిప్చెయ్యాలి అనిపించలేదు.     యదార్ధ గాధలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానేఉంటాయి. ఒక యదార్ధ గాధ, ఒక వ్యక్తి జీవిత చిత్రణఅయిన ఈ యాదోంకీ బారాత్ మొదలుపెడితే ఆగకుండా చదివిస్తుంది, చదివినవారి జ్ఞాపకాలను తడుముతుంది. ప్రత్యేకించి కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడలలో పుట్టి పెరిగినవ్యక్తులకు, ఇది ఒక నాస్టాల్జియా.     ఇక పుస్తకం రాసిన వారి గూర్చి చెప్పుకోవాలంటే, దొరికిన వృత్తి వారి ప్రవృత్తి అయిందో లేక వారి ప్రవృత్తికితగిన ఉద్యోగం దొరికిందో తెలియదుగాని వారి వృత్తి ప్రవృత్తి  రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని సాగింది. వారిజీవితం. చేస్తున్న వృత్తిని ఒక సామాజిక భాద్యతగా స్వీకరించి,  నిరంతరంగా అటు సాహితీ సేవచేస్తూనే, నవతరంలో సాహితీ బీజాలు నాటటానికి, వారిలో విశ్లేషణా శక్తి,ఆసక్తికలిగించడానికి, సృజనాత్మకతను పెంపొందించటానికి, అన్ని విధాలా కృషి చేశారు. వారి బహుముఖప్రజ్ఞ, చేసే పనిలో గల నిబద్దత ఈ బారాత్వేసే ప్రతి అడుగులో కనిపిస్తుంది.    నాకు ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ కొండంత  ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది, అదేమిటంటేఆరు దశాబ్దాలసంఘటనలలో ఎదురైన వ్యక్తులు, చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, జరిగిన సభలు, సభా కార్యక్రమాలు అన్నింటి గురించి పేర్లతో సహా చెప్పగలగడం. దాంతోఆనంద్ బహుముఖ ప్రజ్ఞావంతులే కాదు, వెరీ న్యాచురల్లీ ‘ఆర్టిఫిష్యల్ ఇంటెలిజెన్స్’ బ్రెయిన్  గలవారు అని. అయితే వీరి ప్రజ్ఞ పేర్లుగుర్తుంచుకోవటంలోనే కాదు, మంచి అందమైన పేర్లుపెట్టటంలో కూడా ఉంది. అవి పుస్తకాలకు అవొచ్చు,ఆర్టికల్స్కిఅవొచ్చూ, జరిపినకార్యక్రమాలకు అవొచ్చు. నాకు చాలా ముచ్చట కలిగించిన పేర్లలో కొన్ని, ‘కర్ర ముక్కలలో కమనీయ రూపాలు’, ‘కల్లోల జిల్లాలో ఎగసిన వచన కెరటాలు’, ‘మౌనం మాట్లాడింది’, ‘అజ్ఞాతవాసంలో అందాల మ్యూజియం’,  ‘వీక్షించండి-సమీక్షించండి’, ‘మేకప్ టు ప్యాకప్’. “నా గడిచిన జీవితాన్నిగుర్తుచేసుకోవటమే కాదు, ఇది ఖచ్చితంగా తిరిగిజీవించడమే” అంటూ తన అనుభవాల్ని, తన జీవితాన్ని చాలా లైవ్లీగా ప్రెజెంట్ చేశారు. అతి పెద్దజీవన్మరణ సమస్యని ఎదుర్కొని ..‘గతం’ పొరలు పొరలుగా తెరలుతెరలుగా పేర్చుకున్న జ్ఞాపకాల అర‘వర్తమానం’ క్షణ క్షణం నడక ‘భవిష్యత్తు’ రూపం దిద్దుకునే కలలమంచుపల్లకి అంటూ ఒకఆశావహ దృక్పధంతో వారాల ఆనంద్ తన జ్ఞాపకాల ఊరేగింపును ముగించగా  చదివినవారికి ఇది ఒక అందమైన జ్ఞాపకంగామిగులుతుంది.+++++++++++++++++బొడ్ల అనురాధ anubodla@gmail.com ++++++++++++ 
‘యాదొంకీ బారాత్- జ్ఞాపకాల ఊరేగింపు’ రచన: వారాల ఆనంద్ 
పేజీలు -180, వేల: రూ.250/ ప్రచురణ: ప్రాజ్ పోయెట్రీ ఫోరం, కరీంనగర్-505001
కాపీలకు: V.Indira RaniNo.302, R.V.ANUKURA,STREET No-22, MANCHIREVULA NARSINGI, HYDERABAD #9440501281ORNAVAYUGA BOOK HOUSE, HYDERABAD.TeluguBooks.in – Largest collection of Telugu books Online – TeluguBooks.in (Navodaya Book House)

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

విలక్షణ కవితా సంపుటి పల్లెపొలిమేరల్లోకి

by Narendra Sandineni November 21, 2024
written by Narendra Sandineni

ప్రముఖ కవి,సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.ఈ పుస్తకాన్ని కవి మల్లారెడ్డి తమ తండ్రి లింగారెడ్డికి అంకితం ఇవ్వడం ముదావహం.ఈ పుస్తకానికి వి.లక్మి నారాయణ చారి చక్కటి ముఖచిత్రం అందించారు.కవి మల్లా రెడ్డి ఈ పుస్తకానికి ఒక మాట – కవి బాట అంటూ తన మనసులోని భావాలను వెల్లడించారు.కవిత్వం ఇలా ఉండాలని నిర్వచించను నేను.దానికి హద్దు ఉంటుందని అనుకోను.అది వివిధ కళారూపాలలో ఉంటుందని నమ్ముతాను.కవిత్వానికి పరమార్థం ఉండాలని నమ్మే వాళ్ళలో నేను ఒకన్ని.

గులాబీల మల్లారెడ్డి

ఈ చిన్న పుస్తకములో ప్రచురించిన గేయాలు,కవితలలో ఉన్నది కవిత్వమో,కాదో సహృదయులైన పాఠక మిత్రులు,కవులు,రచయితలు,విమర్శకులే నిర్ణయించాలి.నా గుండె చేస్తున్న లయకి,మనస్సు కంపనాలకి,సమాజములో ప్రత్యక్షంగా కనిపిస్తున్న దృశ్యాలకి నాకు తెలిసిన పదాలలో రూపకల్పన చేశాను.ఇవన్నీ నా అనుభూతి గీతికలు.నా కళ్ళు చూసిన నిజాలు,మనస్సు కనే కలలు.కవిత్వానికి సామాజిక స్పృహ,మానవతా దృక్పథం ఉండాలని, సమస్త మానవజాతి కళ్యాణం కోసం,సుఖ శాంతుల కోసం మానవున్ని కార్యోన్ముఖున్ని చేయాలని ప్రగాఢంగా వాంఛిస్తాను. ఉపనిషత్తులలో మన పూర్వీకులు నుడివినట్లుగా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ,మృత్యోర్మా అమృతం గమయ అనే నానుడి కవిత్వానికి ఊపిరి కావాలి. మానవుడు అనంతంగా దోపిడీ చేయబడుతూనే ఉన్నాడు.దోపిడీ నశించాలి.మనుషులందరు స్వతంత్రులై ఆర్థిక,రాజకీయ,సాంఘిక,సమానత పొందాలని ఎన్నో కలలతో,ఆశలతో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాము.కాని జరిగింది ఏమిటి? సమానత్వం వచ్చిందా?రూల్ ఆఫ్ లా దేశములో పాటించబడుతుందా?దేశములో పోలీసులు,కోర్టులు ఆలోచనాసరళి,నడవడి ఏ విధంగా ఉంది?అని తోటి మనుష్యుల్ని ఆలోచింపజేయాలని ఈ కవితా సంపుటిని ప్రచురిస్తున్నాను.ఈ పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిని ఆదరించగలరని సహృదయులైన పాఠక మిత్రులను కోరుకుంటాను.ఇందులో ప్రధానంగా సామ్యవాదం,చైతన్యం గూర్చి చెప్పబడిన గేయాలే అధికంగా యున్నవి. ఇందులో కనిపించే ఇజం మానవ నైజం.మానవత అదే నా అంతరాంతరాలలో అనునిత్యం పారాడే అనుభూతి.ఈ చిన్న కవితా సంపుటిని ఆదరించగలరని కోరుకుంటూ సహృదయులైన పాఠకులను సాహితీ మిత్రులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అని కవి మల్లారెడ్డి అన్నారు. కవి మల్లారెడ్డి రచించిన విలక్షణ కవితా సంపుటి పల్లెపొలిమేరల్లోకి అంటే అతిశయోక్తి కాదు. నాగలి పట్టి దుక్కి దున్ని బక్క చిక్కిన సగటు గ్రామీణ రైతు జీవిత చిత్రం ఈ కవిత్వంలో చూడొచ్చు. దేశంలోని 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.హాలికుడైన రైతు మట్టిని నమ్ముకుని మడి చెక్కను దున్ని సేద్యం చేస్తున్నాడు.కాలం ఉంటేనే పంటలు.వర్షాధారంతో సాగుబడి అవుతున్న భూములు.రైతు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్ట పడతాడు.రైతు అహర్నిశలు పొలాలు,చేనులు,చెల్కల్లో శ్రమిస్తాడు.ఈ దేశంలో కష్టపడే వాళ్ళు ఎవరు?అంటే రైతులు అని ఠక్కున చెప్పవచ్చు.రైతు చేస్తున్న శ్రమకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా?లేదు అని చెప్పవచ్చు.రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నది రైతు.లాభాలు దండుకుంటున్నది దళారులు.ఈ వ్యవస్థలో తరాలుగా మార్పు లేదు.నిజంగా భారత దేశంలో రైతుల దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు ఈ కవితలో మల్లారెడ్డి.పల్లె పొలిమేరల్లోకి కవితలో నా వాళ్లంతా/నాగళ్లకు సిలువ వేయబడి/తరతరాలుగా/నెత్తురుని/నెత్తురు కంటే అమూల్యమైన చెమటని/సమాజం కోసం ధారపోస్తున్నప్పుడు/అంటున్నారు.మనకు తెలిసిన బైబిల్ కథ ఏ నేరం చేయని మంచి కోసం పాటు పడిన ఏసుక్రీస్తు ప్రవక్తను సిలువ వేసి పొట్టన పెట్టుకున్న వైనం.భారతదేశంలో రైతులు నాగళ్ళకి సిలువ వేయబడి తరతరాలుగా నెత్తురుని నెత్తురు కంటే అమూల్యమైన చెమటని సమాజం కోసం ధారపోస్తున్నారు.ఈ కవిత 1984 సంవత్సరంలో నలభై సంవత్సరాల కింద రాయబడింది.ఇది కవితా సంపుటిలోని మొదటి కవిత.దేశంలో రైతులను నాగళ్ళకి సిలువ వేసినప్పటికీ దుక్కి దున్నడం మాన లేదు.అనాదిగా రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.రైతు పండించిన పంటతో జనానికి తిండిని పెడుతున్నాడు.రైతే రాజు,జై కిసాన్, అన్నదాత సుఖీభవ అనే నినాదాలు వెలవెలబోతున్నాయి.స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అయినప్పటికి రైతు జీవితంలో ఎలాంటి మార్పు రాదు అనే తీరుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డి ఆశావాది.రైతు శ్రేయస్సు కోసం అహరహం కాంక్షించే వ్యక్తి అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఈ కవిత రైతులు ఎదుర్కొంటున్న సామాజిక,ఆర్థిక సమస్యలకు అద్దం పట్టినట్లుగా ఉంది.వర్తమాన గీతం కవితలో గాలిలా/ సూర్యరశ్మిలా/విశాల విశ్వములో/నీలాల నింగిలా/ నేలా/నీరు/అందరిది/భౌగోళిక హద్దులు లేవు/స్వంత పద్దుల ఆలోచనే లేదు/అప్పుడు మనిషంటె/సమిష్టి మానవ సంఘంలో/ఒక అంగం – అంతర్భాగం/ నేడు/మనిషంటె/కులం/మతం/వర్గం/దేశం/ఖండం అంటూ/విశ్వ మానవాత్మని/ముక్కలు ముక్కలుగా నరుకుతున్నాడు/మానవతని సమూలంగా హత్య చేస్తున్నారు/చీ!చీ!/ఏం దుర్గతి పట్టింది మానవ జాతికి/చీదరించుకుంటున్నవి/మిగతా నోరులేని విగత జీవులు/విప్పి చెప్పలేని సత్యాన్ని/విడమరిచి ముచ్చటించుకొంటున్నవి/మరి మనసున్న/ మనకెందుకు రాదు?/ఆ మంచి ఆలోచన/రండి కూర్చుందాము/తీరికగా చర్చిద్దాము/విశ్వ మానవ తత్వాన్ని/మంచి చెడుల/వెలుగునీడల/జాడల్ని వాడల్ని/గుండె మూలల్లో వెదుకుదాము/ అంటున్నారు.విశాల విశ్వంలో పంచ భూతాలు అందరివి.ఆ రోజుల్లో మనుషులందరు సమిష్టిగా కలిసి మెలిసి ఉండే వారు.నేడు మనిషి కుల మతాల పేరిట వర్గ విభేదాలను సృష్టిస్తున్నాడు. అధిపత్యం పేరిట దేశాల మధ్య యుద్ధాలు నడుస్తున్నాయి.మానవతను సమూలంగా హత్య చేస్తున్నారు.ఈనాటి మనుషులకు బుద్ధి ఎప్పుడు వస్తుంది?మనుషులు విశ్వ మానవ తత్వాన్ని ఎరిగి మసులుకోవాలి అనే భావన అద్భుతంగా ఉంది. ఎంత హాయి కవితలో ఇప్పుడు రోజు పాడుతున్నాను/అదే పాట/జైల్లొ – రైల్లొ/బస్సుల్లో/ కోర్టు హాల్లో/వందల దొరల ముందు/వేల పోలీసుల ముందు/జనం ముందు/జడ్జీల ముందు/ఎంత హాయి/అంటున్నారు.తెలంగాణలో ధనవంతులైన ఆసాములకు పోలీసులు దాసులుగా పని చేస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలి.ప్రశ్నించే గొంతులను తప్పుడు కేసులతో వేధిస్తూ కొందరి ప్రాణాలను తీస్తున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం పోరాటాలు చేసి పరిరక్షించుకోవాలి.ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలి.ఈ వ్యవస్థ బాగు కోసం దొర దొమ్మి ఆటలను గూర్చి పాట పాడినందుకు యువకుడు ఎన్నో శిక్షలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు ఆ యువకుడు పాట పాడుతున్నాడు.జనం ముందు,జడ్జీల ముందు, ఎంత హాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.కత్తి – డాలు కవితలో కాలం ఒక్కటే నాకున్న డాలు/నిజం ఒక్కటే నాకున్న కత్తి/నీకు ఎన్నెన్ని ఆయుధాలు/ అయినప్పటికి/గెలుపు నీకు సందేహమే?/ఎందుకో తెలుసా?/నా డాలు మానవత్వపు లోహపు ముద్ద/ నా కత్తి కమ్యూనిజంలో పదును పెట్టింది/ అంటున్నారు.డాలు పోరాట సమయంలో కత్తితో పాటు ఉపయోగించే ఆయుధం.వర్తులాకారంగా ఉండి మధ్యలో వుబ్బెత్తుగా ఉండును.వెనుక పక్కన చేతితో పట్టుకొనుటకు పిడి వుండును.ఎదుటి వ్యక్తి కత్తితో దాడి చేసినప్పుడు కత్తి వేటును అడ్డు కొనుటకు డాలును అడ్డుగా ఉంచెదరు.కత్తి – డాలు జంట పదాలు.ఈ కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.నేనెవరో తెలుసా?కవితలో ఇంతకి నా పేరు చెప్పనేలేదు/గౌతముడు నా రూపమే/జీసస్ నా ప్రతిరూపమే/గాంధీ నా వారసుడే/పేరు మానవత/ ఊరు విశాల విశ్వం/అంటున్నారు.సర్వ మానవాళి సుఖశాంతులు కాంక్షించడం,గౌతముడు,జీసస్, గాంధీ నా వారసుడే అని పేర్కొనడం,పేరు మానవత,ఊరు విశాల విశ్వం అని వ్యక్తపరిచిన భావాలు నిజాయితీని చాటుతున్నాయి.నేనెవరో తెలుసా?అంటూ ప్రశ్నిస్తూ సమాధానం చెప్పిన తీరు చక్కగా ఉంది.నిజం కవితలో ఇవాళ్ల పోలీసులు అరెస్టు చేశారు నన్ను/ఎందుకో తెలుసా?/నేను అక్కపల్లిలో పుట్టినందుకు/అక్కపల్లిలో ఇరవై సంవత్సరాలు నుండి పెరిగినందుకు/స్వేచ్ఛగా గాడుపు పీల్చి నందుకు/దొరల మాట విననందుకు/అంటున్నారు.అమాయకుడైన యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.జైలు నుండి విడుదల అయి కన్నీళ్ళతో చెప్పిన కథను కవి మల్లారెడ్డి కవితగా మలిచారు.దొరలు పోలీసులను లంచాలతో తమ వైపు తిప్పుకుంటారు.దొరలు తమ మాట వినని అమాయకులను కేసులలో ఇరికించి జైలు పాలు చేస్తారు.ఆ యువకుడు నిజమైన విప్లవకారుడు అవునా?కాదా?అని పరిశీలించాల్సిన పోలీసులు ఒక క్షణం ఆలోచిస్తే బాగుండేది.కానీ చివరకు పోలీసులు ఏ నేరం చేయని అమాయకుడైన యువకుడిని బలి చేశారు.చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు రాక్షసత్వం ప్రదర్శిస్తూ అమాయకులను పట్టుకొని జైలు పాలు చేస్తున్నారు. బ్రిటిష్ కాలం నుండి వచ్చిన పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.నిజాయితీపరులను పోలీసులుగా ఎంపిక చేయాలి.ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసి సమ సమాజంను స్థాపించాలి.ఆ యువకుడి అశ్రుధారలు కవితా బిందువులుగా మల్లారెడ్డి కలం నుండి నిజం కవితగా రూపుదిద్దుకున్నాయి.నిజం కవిత సమాజానికి స్ఫూర్తిని అందిస్తుంది.నడవడి కవితలో అయితె నేమి ఆ కామ్రేడు నడవడి/భావితరాల వాళ్ళకి రహదారి/మరి పోలీసుల నడవడి/యమదూతల ఒరవడిలో/అంటున్నారు.సమాజంలో పేదరికం, నిరుద్యోగం,అసమానతలు కొనసాగుతున్నాయి. పేదలు నిరుపేదలుగా మారుతున్నారు.నిరుద్యోగం పెచ్చు పెరిగిపోతుంది.ధనికులు కోట్లకు పడగ లెత్తుతున్నారు.అత్యాచారాలు,అరాచకాలు,దోపిడీల గురించి ప్రశ్నించినందుకు,పోరాటం చేస్తున్నందుకు కక్షతో దొరలు వారి తాబేదారులు పోలీసులకు అప్పగిస్తున్నారు.పోలీసులు పోరాట వీరులను చిత్రవధ చేసి చంపుతున్నారు.సమాజం కోసం పాటుపడుతున్న ఆ కామ్రేడు నడవడి,భావితరాలకి రహదారి,పోలీసుల నడవడి యమదూతల ఒరవడి. యమదూతలు తప్పు చేసిన వాళ్లను తీసుకుపోయి యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు.అప్పుడు యమధర్మరాజు ఇతడు చేసిన నేరం ఏమిటి?అని అడుగుతాడు.తప్పు చేసిన వాళ్లను సలసల కాగే నూనెలో వేస్తారు.కానీ మంచి కోసం,మంచి సమాజం కోసం పోరాడే వాళ్లకు స్వర్గం చూపించాలి.తప్పులు చేయని వాళ్లకు పోలీసులు నరకం చూపించడం ఎంత వరకు సబబు,ఏ శిక్షా స్మృతిలో ఉంది. పోలీసులు పరిశీలన చేసుకోవాలి.ఆత్మ శోధనలేని బతుకు అది ఏమి బతుకు?పోలీసు మిత్రులు సరియైన నడవడిలోకి మారేందుకు ఈ కవిత ఒక గుణపాఠంగా ఉంటుందని భావిస్తున్నాను.పోలీసుల నైతిక శిక్షణ పాఠ్యాంశాల్లో నడవడి కవితను కూడా చేర్చాలి.కవులు,కళాకారులు ప్రజలను సరైన నడవడి కల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు రచనల ద్వారా కళారూపాల ద్వారా అశేషమైన కృషి చేస్తున్నారు.చేదు మాత్ర కవితలో ఏదో అన్యాయం జరిగి/వాడిలో ఆవేశం పెరిగి/ఎవడి రక్తం వాడికే చెందాలి/ఎవడి చెమటని వాడే పొందాలి/మధ్యలో దొర ఎవ్వడు?/ఆని పోకడేంది?/పటేలు ఎవ్వడు?/ ఆని పటాటోపం ఏంది?/అన్నంత మాత్రాన/నక్సలైట్ ఎలా అవుతాడు?/వాడి దగ్గర బాంబు లెందుకుంటాయి?/కేసు పెట్టిన నాడు/ఒక్క పోలీసులకే మెదడు లేదనుకున్నాను/నేడు తీరా శిక్ష పడ్డాక/జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారని/నన్ను నేను సముదాయించుకున్నాను/అంటున్నారు.ఈ కవితను వ్రాసిన మల్లారెడ్డి న్యాయవాది,మా పల్లె గొల్ల ఎల్లయ్యకు సంబంధించిన కేసును వాదించినాడు.గొర్లు కాచేవాళ్లు పోలీసు అధికారులకి పండుగల పేరిట జీవాలు ఇనాంగా ఇవ్వాలి. దొరలకి,పటేండ్లకి, పెండ్లిండ్లకు మరియు పేరంటాలకి జీవాలు ఇనాంగా ఇవ్వాలి.ఎల్లయ్యకు దొరలపై, పటేండ్లపై మరియు పోలీసులపై కక్ష ఎందుకు ఉంటుంది?ఎల్లయ్య జీవాలను కాస్తూ వృత్తి జీవితాన్ని గడుపుతున్నాడు.ఎల్లయ్య దగ్గర బాంబులు ఎందుకు ఉంటాయి?అమాయకుడు ఎల్లయ్య మీద కేసు బనాయించడం,దొరలు,పటేండ్ల ప్రోద్బలంతో జరిగినట్లుగా తోస్తుంది.నక్సలైట్లను ఎదుర్కోలేక అమాయకుడైన ఎల్లయ్య మీద కేసు బనాయించారు.సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి అమాయకుడికి శిక్ష వేయడం ఎంత వరకు సబబు? అమాయకుని మీద కేసు పెట్టిన పోలీసులకే మెదడు లేదనుకున్నాను.కానీ తీరా శిక్ష పడ్డాక జడ్జీలలో కూడా పోలీసు తమ్ముళ్లే ఉన్నారని నన్ను నేను సముదాయించుకున్నాను అని వ్రాసిన కవిత చేదు మాత్రగా ఉంది.ఆనాటి వైద్యులు ధన్వంతరి వారసులు ధరణిలోని దేవతలు ఇచ్చిన చేదు మాత్ర రోగాన్ని నయం చేస్తుంది.అమాయకుడైన గొల్ల ఎల్లయ్యకు వేసిన శిక్ష చేదు మాత్ర.జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారు అనడం మల్లారెడ్డి సంస్కారాన్ని తెలియజేస్తుంది.చాలా మంది జడ్జీలు కింది నుండి పై దాకా అన్యాయపు తీర్పులు ఇస్తూ అమాయకుల ఉసురు పోసుకుంటున్న తీరును చేదుమాత్ర కవిత ద్వారా వెల్లడి చేశారు.ఖైది సంకల్పం కవితలో ఖైది కళ్ళలో/తిరుగుబాటు బావుటా రెపరెపలాడింది/ అంటున్నారు.జైలులో ఉన్న ఖైదీ కళ్ళలో తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపించింది. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యంలో ప్రజలకు సుఖశాంతులు లభించడం లేదు.ఈనాటికీ దోపిడీ విధానం కొనసాగుతుంది. పాలకవర్గాలు చేస్తున్న దోపిడీని అరికట్టడం కొరకు యువకులు మార్పు కోసం పోరాడుతున్నారు.ఈ దేశంలో నివసిస్తున్న తల్లులు ప్రజల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తమ పిల్లలను జైలులో ఖైదీలుగా చూస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలని కాంక్షించే వాళ్ళలో కవి మల్లారెడ్డి ఒకరు. అతడు రాసిన ఖైది సంకల్పం కవిత సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది.ఖైదీ సంకల్పం కవిత దిక్సూచిగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. 164 Cr.P.C. STATEMENT (స్టేట్ మెంట్) కవితలో కాని/నిరాశ వాదాన్ని/కర్మ సిద్ధాంతాన్ని/ మర్మ సిద్ధాంతాన్ని/మాయ సిద్ధాంతాన్ని/నా చుట్టూర పడి వున్న/చీమలకు మాత్రం/చస్తే చెప్పలేను/ అంటున్నారు.చీమలను మాత్రం సరైన దారిలో నడిపిస్తానని ప్రతిన చేసి చెప్తున్నాడు.90 శాతం ఉన్న చీమల్లాంటి జనాలు పేదరికం,అవిద్య, నిరుద్యోగం,అసమానతలు,కుల వివక్ష ఎదుర్కొంటున్నారు.పౌరుల హక్కుల కోసం పోరాడుతున్న కలాలను,గళాలను చంపుతున్నారు.

అయినప్పటికీ 90 శాతం ఉన్న చీమల్లాంటి ప్రజలకు నిరాశా వాదాన్ని,కర్మ సిద్ధాంతాన్ని,మర్మ సిద్ధాంతాన్ని,నా చుట్టూర పడి ఉన్న వాళ్లకు చస్తే చెప్పను.చీమలను ఉదాహరణగా చెబుతూ 90% ప్రజలకు హామీ ఇస్తున్నాడు.కవి మల్లారెడ్డి మానవులంతా ఒక్కటేనని ధనిక,పేద,తేడాలు ఎందుకని సమానత్వంతో అందరూ క్షేమంగా ఉండాలని కాంక్షించే వారిలో ఒకరని కవిత చదివితే తెలుస్తుంది.కవి మల్లారెడ్డి ప్రజలకు స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించే కవితను అందించారు. ఇదెక్కడి న్యాయం కవితలో పాలకవర్గమా!/చట్టం, నువ్వు/ఇద్దరు నా శత్రువు చుట్టాలే అని చెబుతున్నా/చట్టం చెప్పినట్టు వింటామంటావేమిటి?/ఇదెక్కడి న్యాయం?/ అంటున్నారు.సాధారణంగా అన్యాయమును ప్రశ్నించే సందర్భంలో ఇదెక్కడి న్యాయం అని ఉపయోగిస్తాం.న్యాయం అనేది సమానత్వం, సత్యం,ధర్మం మీద ఆధారపడినది.కానీ మన జీవితంలో అనేక సందర్భాల్లో అన్యాయం చోటు చేసుకుంటుంది.అది వ్యక్తిగతంగా కావచ్చు లేదా సమాజంలో ఇతరుల పట్ల జరగడం కావచ్చు.
అన్యాయం జరిగినప్పుడు మనలో ఆవేదన, ఆగ్రహం కలుగుతాయి.కోర్టు వ్యవస్థలో ఆలస్యాలు మరియు న్యాయం ఆలస్యం కావడం వలన బాధితులకు న్యాయం దక్కడం లేదు.సత్వర న్యాయం జరగకపోవడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.సమాజంలో ధర్మంపై న్యాయంపై ఆలోచింప జేస్తుంది.చట్టం,పాలకులు,సామాన్య మనిషి మధ్య ఉన్న విరోధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కవి న్యాయ వ్యవస్థ మరియు పాలకులపై ప్రశ్నలు లేపుతున్నాడు.ఇదెక్కడి న్యాయం?అని ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు.అన్యాయానికి గురి చేసిన పరిస్థితిని ప్రశ్నిస్తున్నాడు.ఈ దేశంలో నివసించే సామాన్య ప్రజలకు న్యాయం అందడం లేదు.సామాన్య ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు అనే భావనను ఈ కవిత ప్రతిబింబిస్తుంది.చట్టాలు తయారుచేసి అమలు చేసే పాలకులను ఉద్దేశించి పాలకవర్గమా?అని ప్రశ్నిస్తున్నాడు.పాలకులు సామాన్యుల అవసరాలను పట్టించుకోవడం లేదు. పాలకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారనే భావం వ్యక్తం అవుతుంది.చట్టం మరియు పాలకులను శత్రువులుగా చూపించారు.చట్టం దుర్వినియోగం చేస్తున్నారు.పాలకులు స్వార్థంతో ‌ వ్యవహరిస్తున్నారు.ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.ఈ దేశంలో సామాన్యులకు న్యాయం అందుబాటులో లేదు.ఇది ఎలాంటి చట్టం?చట్టం వల్ల సామాన్యులకు మేలు జరగడం లేదు.ప్రజలు చట్టాలను గౌరవించడం తప్పనిసరేనా?అని ప్రశ్నిస్తున్నారు.ప్రజలకు న్యాయస్థానాలు నిరాశను, పాలకుల తీరుపై వేదనను కలిగిస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం అంటూ కవి మల్లారెడ్డి న్యాయం గురించి ఆలోచింపజేస్తున్నారు.తేడా కవితలో చెలీ!/అప్పుడు నీవు నవ వసంత యామినివి/నాడు కనిపించినవన్ని/మల్లియలు – గులాబీలు/నేడు కనిపిస్తున్నవన్ని/పల్లేరులు – జిల్లేడులు/ ఎండమావులు – బండ బతుకులు/కన్నీళ్లు కష్టాలు/ పంతాలు సాధింపులు/నేడు వినిపిస్తున్నవన్ని/పిల్లల రోగాల గానం/దైనందిన జీవిత నిశ్శబ్ద భయంకర రావాలతో/నీవు నాడు అంది అందని ప్రేయసివి/ కలల ఊర్వశివి/నేడు అందిన యిల్లాలివి/నిరాశల నీడవి/నిట్టూర్పుల జాడవి/అంటున్నారు.చెలీ నీవు కనిపించినప్పుడు జీవితం ఎంతో మధురంగా ఉంది.నాడు అంది అందని ప్రేయసివి.నేడు అందిన ఇల్లాలివి,నిరాశల నీడవి నిట్టూర్పుల జాడవి అంటూ జీవితాన్ని కాచి వడబోసినట్లు వివరించిన తీరు అద్భుతంగా ఉంది.మానవుడే మరో దేవుడై గేయంలో మానవుడే మరో దేవుడై భూతలమ్మున స్వర్గము సృష్టించే/దేవుని మించిన దేవుడై సకల చరాచర జగతిని పాలించే/ కులాల గోడలు కూల్చి – మతాల ముళ్లను కాల్చి/మానవులందరికి మానవతయే గొప్ప మతమని చాటెను/శాంతి అమృతం పంచుతూ లోకమంత స్వర్గము చేయ తలంచే మానవుడు/అంటున్నారు.మానవుడే మరో దేవుడై అనే గేయ వాక్యం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది.మానవుడు దేవుడితో సమానమైన వ్యక్తిగా భావించబడుతున్నాడు.భూమి మీద స్వర్గాన్ని సృష్టించగల సత్తా మానవునికి ఉన్నది. మానవుని ఆలోచనలు గొప్పవి.మానవుడు సృష్టికి శాంతిని,సంతోషాన్ని ప్రపంచానికి అందించగలరని చెప్పబడింది.మానవుడు దేవుని కంటే గొప్ప శక్తిపరుడు,సమస్త చరాచర జగతిని పాలించగలవాడిగా చూపబడ్డాడు.కులాల మధ్య ఉన్న గోడలు,మతాల మధ్య ఉన్న విభేదాలు తొలగించి మానవత్వాన్ని పెంపొందించుకోవాలని కవి ఆశిస్తున్నాడు.మానవుడు శాంతి,సామరస్యం, సహనం వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకొని ఈ లోకాన్ని స్వర్గంగా మార్చాలని తలుస్తున్నాడు.ఈ గేయంలో మానవతా విలువల్ని ప్రోత్సహించి సమాజం అంతట శాంతిని వ్యాప్తి చేయాలనే భావన వ్యక్తం అవుతుంది.మానవుడిని మహోన్నతునిగా గేయంలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. మనుష్యులారా! కోయిలలై గేయంలో మనుష్యులారా కోయిలలై/యిలపై వసంత గానం చేయండి/సమ సమాజానికి ఊపిరి పోయండి/ ఓరిమి పంచి కూరిమి పెంచి/మనిషి అంటే మంచి తనమని చాటుతూ/నవ వసంత గానం చేయండి/ అంటున్నారు.మనుష్యులను కోయిలలతో పోలుస్తూ సమాజంలో వసంతాన్ని తీసుకురావాలని వసంతం కొత్త ఆశలకి సంతోషానికి చిహ్నం. మనుష్యులు కోయిలలా మారి ప్రేమతో ఐకమత్యంతో జీవించాలని కోరుతున్నారు. సమాజంలో అందరికీ న్యాయం,సమానత్వం, అందరు స్నేహంతో అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ సమాజాన్ని మంచి దిశలో నడిపించాలని సూచిస్తున్నారు.మనుష్యుల మధ్య ప్రేమను, ఆత్మీయతను,సౌభ్రాతృత్వం భావనను, మంచితనాన్ని పెంచుకొని అందరూ కలిసిమెలిసి ఉండి సమాజాన్ని సౌభాగ్యవంతం చేయాలని కోరుతున్నారు.మనిషి అంటే మంచితనానికి మారు పేరు.మనిషి నిరంతరం కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి.కొత్త మార్పులకు స్వీకారం చుట్టాలి. మంచితనాన్ని చాటాలి.నవ వసంతాన్ని గానం చేయాలి అంటూ స్ఫూర్తిని కలిగిస్తున్నారు.రెండు తరాలు కవితలో నేను నా చుట్టూరా పల్లె జనమంతా/పట్టుకూడుపు పిల్లలం/పొట్ట పోసుకోని దరిద్రులం/ఓరిమితో ఊరుకోవడం అలవాటె మాకు/ కాని మా పిల్లలు పొట్ట పోసుకోని దరిద్రులు కాదు/ పోరంటే,వెను తిరిగని పొట్టేళ్లు వాళ్ళు/గమ్యం తప్పా గతులు తెలియని సూర్యుళ్లు వాళ్ళు/అంటున్నారు. మొదటి తరం వాళ్లు బానిస బతుకులు బతికారు. రెండవ తరం వాళ్ళు వెను తిరుగకుండా పోరు బాటలో సాగే పొట్టేళ్లు వాళ్ళు.తరాల మధ్య మార్పును వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది. ఎవరన్నారు కవితలో ఎవరన్నారు మీరు మంచి వారు కాదని?/అంటున్నారు.ఎవరన్నారు మీరు మంచివారు కాదని ప్రశ్నించడంలోనే సమాధానం దాగి ఉంది.ఈ అసమ సమాజంలో కూడా మంచివారు ఉంటారని నమ్మిన వ్యక్తి.మంచి కోసం పాటుపడుతున్న మంచి వారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎందరికి ఉంటుంది?ఎవరన్నారు కవిత మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది.మనలో మరుగున పడిపోయిన మంచితనాన్ని ప్రేరేపించే భావనలు కలిగిస్తుంది.గది – హృది కవితలో ఆ గది/ఈ హృదికి ప్రతిబింబం/ఈ హృది/ఆ గదిని/ కూల్చి రేపటి సౌభాగ్యం కోసం/చెట్ల నీడల్లోకి/కొండ గుహల్లోకి/ బాధలు లేని బంజరు భూముల్లోకి/ సూర్యుడి కిరణాలపై పయనిస్తా/అమృత లోకాల కోసం బాణం సంధిస్తా/అంటున్నారు.విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి.కొందరు విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఒక లక్ష్యంతో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అసమానతలకు చరమ గీతం పాడేందుకు కంకణం కట్టుకున్నారు.విద్యార్థులు ప్రభంజనంలా ఉద్యమాల్లో దూకారు.సమాజంలో చైతన్యం తీసుకురావాలి అనే సంకల్పంతో అడవులు కొండల బాటలు పట్టారు.కొందరు విద్యార్థులు తమ జీవితాలను ఉద్యమాలకు అంకితం చేశారు.కొందరు విద్యార్థులు భారతమాత ముద్దుబిడ్డలై ప్రజా పోరాటాల్లోకి చేరి ప్రజలను మమేకం చేసే దిశగా ఎదిగారు.ప్రజలకు రాత్రిపూట చదువు నేర్పించినారు.నిరక్షరాస్యత నిర్మూలన,కూలీల రేట్ల పెంపు,వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు ప్రజలను సంఘటిత పరిచారు.ప్రజల హక్కులు ఏమిటో తెలియజేసి పోరాటం చేస్తేనే హక్కులు సాధిస్తాం. పోరాటం లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతాం.ప్రజలకు కూడా తమ సంక్షేమం గురించి పాటుపడుతున్న కార్యకర్తల పట్ల నమ్మకం పెరిగింది.ప్రజలు ఐక్యం అవ్వడం వలన ఉద్యమాలకు ఊపు వచ్చింది.ప్రజలలో వచ్చిన చైతన్యం చూసి పల్లెలో తమ అధికారం సాగదని దొరలు గ్రామాలు విడిచి పారిపోయినారు.దొరలు పట్టణాలలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవించసాగారు.ఆ యువకులు సూర్యుడి కిరణాలపై పయనిస్తారని అమృత లోకాల కోసం బాణం సంధిస్తారనే కవి భావన అద్భుతంగా ఉంది.ప్రేయసీ! కవితలో నిన్ను చూశాక తెల్సింది నాకు/అజంతా అడుగులేస్తుందని/ఎల్లోరా కదలాడుతుందని/హంపీ స్వరం విప్పుతుందని/మల్లియలు మాట్లాడగలవని/ వాడని గులాబీలు ఉంటాయనీ/అంటున్నారు.కవి తన ప్రేయసిని చూసిన తర్వాత తనలో పొంగిపొరలే భావాలను అనుభూతులను కవితగా మలిచిన తీరు బాగుంది.ప్రేయసి అందాన్ని,మనసుని కవి భారతీయ సాంస్కృతిక సంపదలైన అజంతా, ఎల్లోరా,హంపీల శిల్ప సౌందర్యంతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలు,గులాబీ పూలతో పోల్చడం అద్భుతంగా ఉంది.అజంతా అడుగు లేస్తుందని అంటే అజంతా గుహల నైపుణ్యాన్ని సూచిస్తుంది.ప్రేయసిని అజంతా లాంటి అపూర్వమైన శిల్ప కళారూపంతో పోలుస్తున్నాడు. ఆమె సౌందర్యం అజంతా శిల్ప సౌందర్యంలా అద్భుతంగా ఉంది.ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలో ప్రసిద్ధి చెందినవి.ప్రేయసి నడకను, సొగసును ఎల్లోరా శిల్పాలతో పోలుస్తున్నాడు. హంపీ అపూర్వ కట్టడాలకు ప్రసిద్ధి చెందినది.
ప్రేయసి మాటలు స్వరం హంపి శిల్పాలను ప్రతిబింబిస్తుందని చెబుతున్నాడు.సువాసనలు వెదజల్లే మల్లెపూవులను ప్రేయసి మాటల మాధుర్యంతో పోలుస్తున్నాడు.ఆమె మాటలు సుగంధాలు వెదజల్లుతాయి అని సూచిస్తున్నాడు. తన ప్రేయసి అందం వాడని గులాబీ వలె ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటుందని అంటున్నాడు.తన ప్రేయసి ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ గులాబీ వలె అందంతో మెరుస్తూ ఉల్లాసంగా ఉంటుందని భావిస్తున్నాడు.ప్రేయసి అందాన్ని భారతీయ సాంస్కృతిక సంపదలతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలతో,గులాబీలతో పోలుస్తూ తన ప్రేమను సున్నితంగా వ్యక్తీకరించిన తీరు బాగుంది. మల్లారెడ్డి ABOUT MY BETTER HALF అని ఆంగ్లంలో రాసిన కవిత గొప్పగా ఉంది. సర్వాంతర్యామితో మనవి కవితలో ప్రజాకంటకులు/ జాతి ద్రోహులు/స్వార్థం మోసం పెంచుకున్న వాళ్లు/ అధికారాన్ని పంచుకుంటున్న వాళ్ళు/అందలాలు ఎక్కుతున్నారు/ఇదెక్కడి న్యాయం ప్రభూ!/ అంటున్నారు.బాధలో ఉన్నప్పుడు భరించలేక గిలగిలా కొట్టుకుంటాం.మన ఆత్మ తృప్తి కొరకే దేవునికి మొర పెట్టుకుంటాం.దేవుడు మన మొరలు ఆలకిస్తాడా?అనేది ప్రశ్నగానే తోస్తుంది.ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను,ఇబ్బందులను సర్వాంతర్యామితో కవిత ద్వారా మనవి చేయడం చక్కగా ఉంది.సత్యము స్వప్నము కవితలో కలల సౌధంలో – కళ్యాణమందిరం/అంటున్నారు. విద్యార్థులు కంటున్న కలలో కలలసౌధం ఉంది. అందులో కళ్యాణమందిరం ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు.పెళ్లంటే నూరేళ్ల పంట అది పండాలి అని కవి రాసిన సినిమా పాటను ప్రతి పెళ్లిలో వింటాం.పెళ్లంటే ఎంత హంగామా?ఇప్పుడు లక్షల రూపాయలు కల్యాణ మందిరాలకు చెల్లిస్తున్నారు.ఆడంబరాల కోసం తల్లిదండ్రులు పెళ్లిలో అనవసరంగా వృధా ఖర్చులు చేయడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.పెళ్లిలో అంత ఖర్చు చేయడం అవసరమా?ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆడంబరాల పేరిట ఎంత ఖర్చు చేసినప్పటికీ అమ్మాయిల కాపురాలు బాగున్నాయా?అంటే అది కూడా లేదు.అదనపు వరకట్నం కోసం అత్త,మామ,ఆడబిడ్డలు,భర్త, మరదలు కలిసి కొత్త కోడలును వేధించి చంపేస్తున్నారు.వరకట్నం దురాచారం ఈ దేశంలో ఆడపిల్లల పాలిట శాపంగా మారింది.కట్నం తీసుకుని కోడలును చక్కగా చూడక కాటికి పంపిస్తున్న వైనం మనం ఎరిగినదే.ఆడపిల్లల తల్లిదండ్రులను తీరని క్షోభకు గురి చేస్తున్నారు. వరకట్నం అనే సాంఘిక దురాచారం వల్ల ఎంతో మంది ఆడపిల్లలు బలి అవుతున్న సంగతికి చక్కటి పరిష్కార మార్గం అందించారు.స్వప్నంలో కూడా సత్యాన్ని ఆవిష్కరించడం చక్కగా ఉంది. సుప్రభాతం ఆగుతుందా?కవితలో ఈ తపన/ఈ తపస్సు/ఈ యజ్ఞం/ఇది మా నేరమని,కుట్రని/మా కలాలకు – చేతులకు సంకెళ్లు వేస్తే/రానున్న సుప్రభాతం ఆగుతుందా?అంటున్నారు.ప్రజా కళాకారులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వాళ్ళ హక్కులను తెలియజేస్తూ గజ్జె కట్టి గళాల నెత్తి పాడుతున్నారు.ప్రదర్శనలు ఇస్తున్నారు.ప్రజా క్షేమం కాంక్షించి పాటల ద్వారా,కళారూపాల ద్వారా ప్రదర్శన చేస్తున్న కవులు,కళాకారులు,ప్రజలను కర్తవ్యం వైపుగా సాగేటట్లు చేస్తున్నారు.ప్రజల కోసం పాటుపడుతున్న కవులు,కళాకారులది కుట్రని మా కలాలకు,చేతులకు సంకెళ్లు వేస్తే రానున్న సుప్రభాతం ఆగుతుందా?సుప్రభాతం ఏనాడు ఆగదు.ఉదయించిన సూర్యుడు అస్తమించక మానడు.మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు.సుప్రభాతం కొనసాగుతుంది.వేనవేల సూర్య కిరణాలై అక్షర కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు,దీక్షలు ఏనాడు ఆగవు.రానున్న సుప్రభాతం ఆగదు అని కవి మల్లారెడ్డి ఘంటాపథంగా చెబుతున్నాడు.జంపాల ప్రసాద్ కవితలో నేస్తం/క్యాంపస్ విద్యార్థివైన నీవు/ కొత్త ఆర్థిక విధానాలు చూపినందుకు/మూఢ సంస్కృతిపై నీవు పురోగమించి/శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నందుకు/నిన్ను నక్సలైటని/ నిస్సహాయంగా/చెట్టుకు కట్టి/బందూకు గురి పెట్టినపుడు/కొండల గుండెలు జాలువారినవి/కన్నీటి జాలువారినవి/చెట్ల కొమ్మలు – ఆకులు/కత్తులై లేద్దామని/పిట్టలతో పిచ్చుకలతో ముచ్చట్లాడినవి/నీ గుండె చీల్చిన తుపాకి గుండు/జీవము లేని బొగ్గుగా మారింది/నీ రక్తం మోదుగు పూలై వనమంతా పూసింది/అంటున్నారు.జంపాల ప్రసాద్ ను నేస్తంగా సంబోధిస్తున్నాడు.చెలిమికి మారుపేరు స్నేహం. ఆపతి సంపతిలో ఆదుకునేవాడు స్నేహితుడు. అశేష విద్యార్థి లోకానికి ఆశాదీపం ప్రసాద్. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థిగా ఎదిగిన నిన్ను చూసి కన్న తల్లిదండ్రులే కాదు.నీవు పుట్టిన నేల కూడా పునీతమైంది.ప్రసాద్ తనతో చదువుకున్న స్నేహితులు,విద్యార్థులందరికీ మార్గదర్శిగా నిలిచాడు.ప్రసాద్ విద్యార్థులు, రైతులు,రైతు కూలీలు,సకల జనావళి ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలను కనుక్కున్నాడు.ప్రసాద్ నూతన ఆర్థిక విధానం, శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నాడు.ప్రసాద్ మూఢ సంస్కృతిని ఎదిరించాడు.పురోగమించిన ప్రసాద్ ను నక్సలైట్ అని ముద్ర వేసి నిస్సహాయంగా చెట్టుకు కట్టి బందూకు గురి పెట్టినప్పుడు కొండల గుండెలు కన్నీటితో జాలువారినవి.శిఖరంగా ఎదిగిన ప్రసాద్ ను చూసి కొండల గుండెలు కరిగి దుఃఖంతో కన్నీటి జలపాతాలై ప్రవహించినవి.ప్రసాద్ వీరుని హత్య చేస్తుంటే చూసి ప్రకృతిలో భాగాలైన చెట్లు, కొమ్మలు,ఆకులు కత్తులై లేద్దామని పిట్టలతో పిచ్చుకలతో మాట్లాడినవి.నోరు లేని పక్షులు ముచ్చటించాయని చదువుతుంటే ఒళ్లంతా బాధతో వణుకుతుంది.ప్రసాద్ గుండెను చీల్చిన తుపాకీ గుండు కూడా చలించి జీవము లేని బొగ్గుగా మారింది.ప్రసాద్ రక్తంతో తడిసిన నేల మోదుగు పూలై వనమంతా పూసింది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు కవితలో ఈ నిరాకార ఛాయ చిత్రాలలో/ఒక శిశువు నడవాలని/తొలి అడుగు వేయాలని తపిస్తున్నాడు/ఈ చీకటి వెలుతురు జయించి/ నూతన నవ వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు/అంటున్నారు.నిజానికి మనకు కనిపించని వినిపించని ఎన్నెన్నో సంఘటనలు నిశ్శబ్దంగా నిరాకారంగా కనుల ముందు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలు ఎన్నింటినో తీసుకొని ప్రతి శిశువు (మనిషి) నడవాలని చీకటి జీవితాలను జయించి నూతన వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు వేయాలని కవి వ్యక్తం చేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.ఎక్కడిది చైతన్య సమీరం కవితలో ఎక్కడిదీ చైతన్యపు సమీరం?/ఎక్కడిదీ ప్రభంజనం హోరు?/ఎక్కడిదీ ఝం,ఝం తుఫాను/ దీనికి మొదలెక్కడ?తుది యెక్కడ?/ఏ దూర తీరాల నుండి వీస్తుందీ ప్రభంజనం/ఏ దెస నుండి వీస్తుంది/ ఏ కొస నుండి వీస్తుంది/ అంటున్నారు.ఇది ప్రకృతి మరియు జీవితం యొక్క అంతర్లీన శక్తి చైతన్యాన్ని ప్రశ్నిస్తూ రాయబడిన కవిత.కవి తన ప్రశ్నల ద్వారా చైతన్యపు మూలాన్ని దాని ఆరంభాన్ని,అంత్యాన్ని విశ్లేషించడాన్ని తెలుపుతుంది.చైతన్యపు సమీరం అంటే జీవన శక్తి, ప్రాణ శక్తి.ఈ జీవన శక్తికి మూలం ఎక్కడుంది?ఇది ఎక్కడినుండి ఉద్భవించింది? ప్రభంజనం హోరు అంటే గొప్ప గాలుల తుఫాను. ప్రభంజనానికి పుట్టుక ఎక్కడ ఉంది?ఝం ఝం తుఫాను అంటే ప్రకృతి యొక్క ఉగ్ర రూపాన్ని తెలియజేస్తుంది.జీవితం మరియు ప్రకృతి శక్తుల ఆరంభం,ముగింపు ఏమిటి?అని ప్రశ్నిస్తున్నారు. ప్రభంజనం ఎక్కడి నుండి మొదలైంది?అది ఏ సుదూర ప్రాంతాల నుండి ఉద్భవించింది?జీవన శక్తి ఎటు నుండి వీస్తుంది?దాని ప్రయాణం ఏమిటి? అంటూ కవి వ్యక్తికరించిన భావాలు చక్కగా ఉన్నాయి.శిల్ప సుందరి కవితలో చూడాలి నా దేవి!నీ చూపు వాడి/కనికరించి కడవ దించి కాలు కదిలించి/మెరుపుతీగవై – వెలుగు రేఖవై/పూల బాణమై – విద్యుల్లతవై/కోడె నాగిణివై – రస రాగిణివై/భువన మోహినివై – నవమోహన నాట్యంల తేలించు/లాలించు పాలించు ఓ శిల్ప సుందరీ!/ ఇదిగో!నీ పాదపద్మాల ఉండనీ/నా కవితా మంజరీ/ అంటున్నారు.శిల్ప సుందరిపై వ్యక్తీకరించిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.జ్ఞాపకాలు కవితలో నీ జ్ఞాపకాల వాకిట/నీ గుండె లోగిలిలోనే/దోసిట మల్లియలతో/మజ్నునై నిలుస్తాను/అందినట్టే అంది/అందకుండా – అందే అంత దూరములోనే ఉంటూ/మల్లియలా – మౌనంగా నిలచిన/నా జీవన నెచ్చలి – కలల ఊర్వశికి/బతుకంతా నైవేద్యం/ అంటున్నారు.కవి జ్ఞాపకాలను పంచుకొని ఆమెను సజీవం చేసిన తీరు బాగుంది.సాగువాటు కవితలో నా దీన జనావళీ కన్నీళ్లను మాటి మాటికి తుడవ లేక/నేను సామ్యవాద పద్ధతిలో సాగువాటు చేద్దామనుకుంటున్నాను/తిరుగుబాటు చేసి అయినా సరే/భూముల్ని కబ్జా చేసుకుంటాను/ ప్రాణమే ఆయుధంగా బయలుదేరుతున్నాను/ కృత్తిక ఎండలు మండి/కుటిల విషం కక్కినా సరే/ రోహిణి వడలు తడలు/పెడబొబ్బలు పెడుతూ/ కబలించాలని వచ్చినా సరే/తిరుగుబాటు చేస్తాను/ సామ్య వాదం కోసం సాగువాటు చేస్తాను/నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను/మరో స్వర్గం సృష్టిస్తాను/అంటున్నారు.సమాజంలో అన్యాయాలు, అక్రమాలు,అసమానతలు మనసును కలవరపెడుతున్నాయి.దీన జనావళి కన్నీళ్లను తుడవడం అనేది ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నించడం.సామ్యవాద పద్ధతి ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరి అవకాశాలు తీరేలా వ్యవస్థను తీర్చిదిద్దాలనే సంకల్పం వ్యక్తం అవుతుంది.నందన కేదారవనం ఇది ఒక ప్రకృతి అందాల పూతోట.ఇది శాంతి,సౌందర్యం,న్యాయం, సమాజానికి చిహ్నంగా నిలుస్తుంది.సమాజాన్ని నందన కేదార వనం లాంటి పరిపూర్ణ స్థితికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది.మరో స్వర్గం సృష్టిస్తాం అంటే ప్రపంచాన్ని మార్చేందుకు అందరి శ్రేయస్సు కలిగించే సమాజం నిర్మించేందుకు దోహదపడతానని దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాడు.సామాజిక మార్పును సమానత్వం మరియు ప్రజలకు శ్రేయస్సును అందించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.ఇది ప్రేరణ కలిగించేది‌.ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటుంది.నగరంలో కన్నెలు కవితలో కన్నెలు .. కన్నెలు . నగరమంతా వన్నె వన్నెల కన్నెలు/సాయం సమయంలో నగరమంతా/ కన్నెల మేని కాంతితో ఎరుపెక్కుతుంది/ఎరుపెక్కిన సంధ్యలో రాగ రంజిత వేళలో/వెచ్చవెచ్చని చల్లగాలి సైక్లోనొకటి/ఆ గుమ్మల ఆ అమ్మల ఆ బొమ్మల/ఆ కొమ్మల పైట చెంగుల విసరులోయన/ముచ్చటగా ముద్దిడుతుంది/గిలిగింతల కవిత్వాన్ని వ్రాయమంటుంది/అంటున్నారు.నగరంలో కన్నెలను కవితామయం చేయడం అద్భుతంగా ఉంది.ఇది నా దేశం గాథ కవితలో ఇక నా దేశం నాగరికత/ఇక్కడ పార్టీకి క్యాడర్ కాని వాడు లీడరు/ఆశయాలు చంపుకున్నవాడు/ఆదర్శాలకి తిలోదకాలిచ్చిన వాడు/మానవత్వం ఎరువు తెచ్చుకున్నవాడు/ తోకవాల్చడం నేర్చుకున్నవాడు/ బట్రాజుగా మారినవాడు/వందిమాగధిగా ఎదిగిన వాడు/కాకా పట్టేవాడు/బాకాలూదేవాడు/నా దేశ ప్రజా ప్రతినిధి/నా దేశ నాయకుడు/అంటున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న నాయకుల దిగజారుడుతనాన్ని ఎండగట్టుతున్నాడు.నా దేశంలో ప్రజా ప్రతినిధి మరియు దేశ నాయకుడు ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన వాళ్ళు స్వార్థంతో వ్యవహరిస్తున్న తీరును చూసి కవి తీవ్రమైన ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిలోని కవితలన్ని అభ్యుదయ భావాలతో అలరారుతున్నాయి. మల్లారెడ్డి యువకుడిగా ఉన్నప్పుడు పొంగిపొరలే భావావేశం అద్భుతమైన కవితలుగా రూపు దాల్చాయి.కవితలను హాయిగా చదువుకోవచ్చు. ఇవి పాఠకుల హృదయాలను రంజింప జేస్తాయి. చక్కటి కవితలు రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

November 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అడవిలో చెట్లు

by Devulapalli Vijayalaxmi November 21, 2024
written by Devulapalli Vijayalaxmi

గబగబా మెట్లుదిగి వెహికల్ పార్కింగ్ దగ్గరకు అడుగులేసింది శారద. హెల్మైట్ పెట్టుకుంటూ ఆకాశంవంక చూసింది వర్షంపడే సూచనలున్నాయేమోనని. ఆతరువాత చుట్టూచూసింది అపరాజిత గురించి.ఫ్రెండ్సతో క్లాప్స్ కొట్టుకుంటూ ఆడుకుంటోంది.

“అప్పూ!”అని కేకేసింది శారద.

“ఆఁ అమ్మా!” అంటూ స్కేటింగ్చేస్తున్నట్లు వచ్చి ఆగింది హోండాఏక్టివ్ దగ్గర అప‌రాజిత.

“అప్పూ! ఎన్నిసార్లు చెప్పానమ్మా స్కూల్ బెల్ అవంగానే వెహికల్ దగ్గరకు వచ్చి నుంచోమని‌.అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది.” అంది శారద.

“అమ్మా! ఇవాళ ఉన్న ఒక్క గేమ్స్ పీరిడ్ నువ్వే ఎక్స్ట్రా క్లాసు తీసుకున్నావు.అందుకే కాస్త రిలాక్సేషన్. ” కళ్ళు గుండ్రంగా తిప్పుతూ కాళ్ళతో స్టెప్సు వేస్తూ అంది అపరాజిత.

“సరే డేన్స్ ఆపి బండెక్కు.”అంటూ బండి స్టేండ్ తీసింది శారద.

అందరినీ దాటుకుంటూ స్కూల్ గేటు నించీ బయటకు రావడానికి ఐదు నిమిషాలు పట్టింది.

‘అపర్ణ కాలేజీకి వెళ్ళడానికి పది నిమిషాలు, అక్కడనించీ మ్యూజిక్ క్లాసుకి పదినిమిషాలు,క్లాసు గంట,తరవాత ఇంటి ప్రయాణం ఎంతలేదన్నా అరగంట.ఇంటికి చేరేసరికి గంటన్నర.’ అంటూ మనసులో టైము కేలిక్యులేట్ చేసుకుంది శారద.

‘సాయంత్రం ఫ్రెండ్స్ ఫేమిలీ డిన్నర్ కి వస్తారు. పనిమనిషి రాలేదు.ఇంటినించీ ఆదరా బాదరాగా స్కూలు కెళ్ళటంతో ఇల్లంతా చిందరవందరగా ఉంది. యూనిట్ రిపోర్ట్స్ తయారుచేయాలి.’అనుకుంటూ తను చేయవలసిన పనుల లిస్టు మననంచేసుకుంది శారద.

ఆలోచనల్లో కాలేజ్ కి వచ్చిన సంగతే గమనించలేదు శారద.గేటుదగ్గర అపర్ణ సిధ్ధంగా ఉంది.
పిల్లలిద్దరినీ మ్యూజిక్ క్లాసులో వదిలి దగ్గరే ఉన్న కూరగాయల షాపుకెళ్ళ కూరలు తీసుకుంది.

మ్యూజిక్ క్లాసు అవుతున్నంతసేపు పేరెంట్స్ పూలమొక్కలదగ్గర బయట కుర్చీల్లో కూర్చొని ఖబుర్లు చెప్పుకుంటారు.శారద వింటున్నట్లు తలపంకిస్తూ తోటకూర శుభ్రచేసి చిక్కళ్ళువలిచి, మెరపకాయలు తొడిమలు తీసింది.

‘హమ్మయ్య రేపటికి కూర రెడీ.’అనుకుంది మనసులో శారద.

ఈలోపు పిల్లలు మ్యూజిక్ క్లాసు అయింది.పిల్లని ఎక్కించుకున్న వెంటనే ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టింది.కాదు పెట్టిస్తారు పిల్లలు.క్లాస్ రూమ్ ఖబుర్లతో,గిల్లికజ్జాలతో,ఎక్కిరింతలతో,వారి చేష్టలు శారద మనస్పూర్తిగా ఆస్వాదిస్తుంది. ఇల్లు దగ్గర పడుతోందంటే వాళ్ళ అల్లరి తారాపధం చేరతుంది. శారదకి బండి బేలన్స్ చేయటమే కష్టమవుతుంది.

“అమ్మా!హాట్హాట్ బజ్జీ స్నాక్స్ ఆకలేస్తోంది.” అంది అపరాజిత.

“చాల్లే అప్పూ!జాండీస్ తగ్గి వన్మంత్ కాలేదు ఆయిలీ ఫుడ్.” అంటూ కసిరింది అపర్ణ.

“అమ్మా ! బేకరీలో దిల్పసంద్ తీసుకో మళ్ళీ ఏ ప్రిపరేషన్ వద్దు .”అంది అపర్ణ.

ఇద్దరికీ సమాధానం చెప్పకుంండా ఇంటిదగ్గరకి వచ్చి ఆపింది శారద.పోర్టికోలో బండి ఆపి తాళం తీయంగానే చిన్నారిసింధూ తోకాడిస్తూ మీదకొచ్చింది.

“అప్పూ!స్నూపిని వాకింగ్ తీసికెళ్ళు.” అంటూ కాళ్ళకడుక్కొని వంటింట్లోకి వెళ్ళి గ్లాసుల్లో ప్రొటీనెక్స్, ప్లేట్లల్లో బొప్పాస ముక్కలతో వచ్చింది శారద.

“పిల్లలూ! పప్పాయ్యాతిని పాలు తాగి ఇల్లు సర్దండి.ఇవాళ డాడీ ఫ్రెండ్స్ ఫేమిలీ డిన్నర్ కి వస్తారు.” అంటూ ఒకకప్ టీ సిప్ చేసి పాతచీర కట్టిగిన్నెలుతోమ ఉపక్రమించింది శారద.

బొప్పాసముక్కలు పాలు చూడంగానే పిల్లల మొఖాలు మాడిపోయాయి.అయినా తల్లి. హడావుడి చూసి నోరు మెదపలేదు బంగారుతల్లులు.మెదలకుండా పండుతిని పాలుతాగి వాళ్ళగదిలోకెళ్ళి చదువుకోసాగారు.

నెమ్మదిగా వంట పూర్తిచేసి తనుకూడా ఫ్రష్ అయి కూర్చొంది శారద.

‘రిపోర్ట్ వర్క్ ఉంది వాళ్ళు వచ్చి వెళ్ళాకగానీ ఆ పని చేయలేను.’అనుకుంది శారద.

‘ఛీ ! ఏమిటో ఆడదాని జీవితం.ఎంత చదువుకున్నా గిన్నెలు,బట్టలు వంట,పిల్లలని కనటం,వాళ్ళ పెంపకం అంతా ఆడదాని మొహానే రాసాడు భగవంతుడు.ఏదైనా తేడావస్తే ‘ఆతల్లి పెంపకం’ అంటూ సమాజం తల్లినే వేలెత్తి చూపుతుంది .తాతయ్య అన్నట్టు ‘బి.ఏ.’చదివినా బియ్యం కడగక తప్పదే శారదా అనేవారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటే.”

ఆలోచనలలో వాకిట్లో కార్ హారన్ వినపడలేదు శారదకి.సింధూ గేటుదగ్గరకెళ్ళి ఒబీడియంటుగా తోక ఊపుతూ డాడీ ని స్వాగతిస్తోంది.శారదవెళ్ళి గేటు తీసింది.

కారుపార్కు చేసి”పిల్లలేరి శారదా?అన్నిసార్లు హారన్ కొట్టినా రాలేదు.”అన్నాడు వంశీకృష్ణ.

“చదువు కుంటున్నారు వాళ్ళగదిలో!”అంటూ అనుమానంతో గదిలోకి వెళ్ళింది శారద.

‘పుస్తకం హస్తభూషణం’ అన్నట్లు చేతిలో పుస్తకంతో కునికి పాట్లు పడుతున్నారు పిల్లలు.

శారద మాతృహృదయం తల్లడిల్లింది.’పిచ్చితల్లులు నాలుగింటికి లేచి అలసిపోయారు.స్కూలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇల్లు. స్వంతఇంటిని అనుభవించాలని ఉండటమేకాని దేనికీ దగ్గరకాదు.”అనుకుంది శారద.

వంశీ !టీ పెట్టనా!”అడిగింది.

“తప్పకుండా! ఇవాళ ఆడిటింగ్ కాదుగానీ పిచ్చెత్తిపోయింది. డిన్నరుకు వాళ్ళు ఏడున్నర ఎనిమిది ప్రాంతంలో వస్తానన్నారు.”అంటూ ఫ్రష్ అవటానికి వెళ్ళాడు.

“తల్లులూ రండి డిన్నరుకు చేసి పడుకోండి రేపెటూ సెలవేకదా చదువుకుందురుగాని.”అంటూ కేకేసింది శారద.

“డాడీ వచ్చారా?అమ్మా!”అన్నారు ముక్తకంఠంతో.

“వచ్చారు.కారు హారన్ కి మీరు లేవలేదు మీ చెల్లెలు రిసీవ్ చేసుకుంది. క్రెడిట్సన్నీ దానికే.”అంటూ నవ్వింది శారద.

“ఆయ్!”అంటూ ఇద్దరూ స్నూపి వెంట పడ్డారు.అది వంశీ కాళ్ళసందులోదూరి అరవసాగింది.

సారీ డాడీ అంటూ తండ్రికిరుపక్కలా గారంగా. చేరారు.

కంచాలదగ్గరకి ఈదురో అంటూ వచ్చిన అప్పూ అపర్ణలు” వావ్!” అంటూ ‘హైఫై’ ఇచ్చుకున్నారు.
బాదంపౌడరు స్పెషల్టచ్ సేమియాపాయసం, ఆనియన్ పకోడీ ,చోళే బటూరా,దధ్ధోజనం.

“అమ్మా!ఇవి గెస్ట్స్ కని చేసావా మాగురించా.” అంటూ తల్లిని వాటేసుకున్నారు.
★★★

వంశీకృష్ణ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్.ఇవాళ చాలా చికాకుగా ఉంది.వంట్లో నలతగా ఉంది.
“ఇన్సపెక్షన్ కి సైట్ కి వెళ్ళాలి.అమ్మకి వంట్లోబాగాలేదన్నమెసేజ్ ఒకమూల కలవర పెడుతోంది.దసరా సెలవలకి శారద పిల్లలు పుట్టింటికి వెళ్ళారు.ఇంటికెళ్ళి చెయ్యకాల్చుకోవాలి.పిల్లలకి టర్మ్ ఫీజుకట్టాలి హౌసింగ్ లోను హౌస్టాక్స్, వగైరా వగైరాపోనూ ఇంటి ఖర్చుకి బొటాబొటి ఇరవై ఇరవై ఐదు మధ్యలో మిగులుతుంది ఇంటిఖర్చుకి. మధ్యలో మెడికల్ ఖర్చు లేకపోతే.

ఇదిలా ఉండగా హెడ్ఆఫీస్ నించీ టార్గెట్ రీచ్ అవలేదని షంటింగ్.”ఎవరిమీదో ఎందుకో అర్ధం కాని కోపం చికాకుగాఉంది వంశీకి.

వంశీకృష్ణకి ఛీర్ఫుల్ అండ్ అండర్స్టాండింగ్ పర్శనాలిటీ అని సబ్స్టాఫ్ నించీ హెడాఫీస్ వరకూ పేరుంది.అంతేకాదు సిన్సియర్ అండ్ హైలీ డిసిప్లైన్డ్ అని కూడా భయపడతారు.

వంశీకృష్ణ చికాకుకి అసలు కారణం ఒక ప్రాజెక్ట్ కి కోటిన్నర సాంక్షన్ చేయమని ప్రషర్.కావాలంటే కమీషను తీసుకోమని.ఒక్క కాగితమూ సరిగ్గాలేదు.ఆల్రడీ ముఫ్ఫై లక్షలు సాంక్షన్చేసి సైట్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీలేదు.ఆ పార్టీ దర్జాగా ఖరీదైన కారులో బ్యాంకుకు వచ్చి సొల్లు ఖబుర్లు చెప్తాడు.ఆమినిస్టరు ఈ ఏక్టరు తన బంధువులంటూ.వళ్ళుమండిపోయి ఉన్నదున్నట్లు రిపోర్టు పంపినందుకు హెడాఫీస్నించీ దొబ్బులు. ఉద్యోగం రిజైన్ చేసి పారేద్దామనిఉంది వంశీకృష్ణకి.

‘ఛ! వెధవ బ్రతుకు. ఎన్ని అవాంతరాలొచ్చినా ఉద్యోగం చేయక తప్పదు.అదే ఆడది కావాలంటే ఉద్యోగం చేయకపోయినా భర్త తెచ్చింది తిని హాయిగా ఇంటిపట్టున ఉన్నా ఎవరూ ఎద్దేవా చేయరు.అదే మగవాడైతేఎన్నెన్ని మాటలంటారు.”ఆడంగివెధవ.పెళ్ళాం సంపాదిస్తే తిని కూర్చుంటున్నాడు.ఉద్యోగం పురుషలక్షణం అని కూడా తెలియదు.”అని ఎద్దేవా హేళన చేస్తారు.జీవితంలో అన్ని కష్టాలకంటే ఆర్ధికంగా సంసారాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా గడిపేందుకు ఎంతో మానసికమైన వత్తిడికిమగవాడు గురౌతాడన్నది ఎవరికీ తెలియదు. వాడికేం మగ మహరాజు ఇంటికెళ్ళేసరికి హారతి పళ్ళెంలో వండి వార్చిపెడుతుంది పెళ్ళాం. అంటారు.ఆ వండి వార్చటానికి కావలసిన ముడిసరుకుకు మగవాడు పడే తిప్పలు ఎవరైనా ఆలోచిస్తారా? ఛీ! ఈ మగవాడిగా పుట్టడం కన్నా అడవిలో మద్దిచెట్టు మానునై పుట్టినా బాగుండేది.’అనుకున్నాడు వంశీకృష్ణ.
★★★

అర్ధరాత్రి రెండున్నర వరకూ కూర్చున్నా క్వార్టర్లీ పేపర్ కరక్షన్లు పూర్తికాలేదు.ఇంకాఒక్కరోజుంది స్కూలు రిఓపెనింగ్ కి.ఎవరి క్లాసుమార్కలిస్టు వాళ్ల కి అందచేయాలి.సెలవలకి నాలుగురోజులు ఊరెళ్ళేసరికి వర్కంతా డిలే అయింది. పిచ్చెక్కినట్లుంది శారదకి.

“శారదా!ఆ లైట్ ఆపేయి.ప్రొద్దున్నించీ గొడ్డుచాకిరి చేసి రాత్రికాస్సేపు ప్రశాంతంగా పడుకుందామంటే ఆ వెలుతురు బెడ్రూం వరకూ వస్తోంది.”ఆసహనంగా అరిచాడు వంశీ.

“ఎక్జామినేషన్ పేపర్స్ కరక్షన్ చేసుకుంటున్నా వంశీ.సారీ బెడ్రూం తలుపేసుకోండి.”ఎంతో సౌమ్యంగా జవాబిచ్చింది శారద.

“బోడి ఉద్యోగం.ఏదో పెద్ద ఉద్యోగం వెలగపెడుతున్నట్లు అర్ధరాత్రి ఏంపని?గుడ్డిగుఱ్ఱానికి దానా ఎక్కువన్నట్లు సంపాదన తక్కువకానీ ఉద్యోగం చేస్తున్నానన్న పోజెక్కువ.”అన్నాడు చిరాగ్గా వంశీ.

శారద అహం దెబ్బతింది.”అవును బోడి ఉద్యోగమే.గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని మీకు వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలా ఉందామని ఈ ఉద్యోగం చేస్తున్నా.ప్రొద్దున్న నాలిగింటికి లేచి పిల్లలని చదివించాలి.పనిమనిషి రాకపోతే గిన్నెలుతోమడం,బట్టలుతకడం,ఇల్లూడవడం వండి కేరీర్లుకట్టడం ఇవన్నీ కూడా బోడిపనులే.నా ప్రాణానికి ఇద్దరూ ఆడపిల్లలువాళ్ళకి జడలువేసి మీతో పాటు వాళ్ళని పంపి.నేను ఇల్లుచక్కపెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ స్కూలుకెళ్ళేసరికి ఏరోజు ఆఖరి నిమిషం లేదా లేటు.
సాయంత్రం మ్యూజిక్ క్లాస్,కూరలు,వెచ్చాలు కొనటం కూడా బోడి పనులే.బండి నేర్చుకుని తప్పుచేసా ఆడపని మగపని చేస్తుంటే మీకేం తెలియటంలేదు.ప్రొద్దునే టిప్టాప్ గా రెడీ ఆయి కారులో ఎంచక్కా బ్యాంక్ కి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి అలసిపోతారు.ప్రొద్దున్నించీ స్కూల్లో పిల్లలతో వాగివాగి అదెంత అలసి పోతోందో అని ఎప్పుడైనా ఆలోచించారా!పైగా బోడి ఉద్యోగమట బోడి ఉద్యోగం అంటారా! ఆ బోడి టీచర్లు పాఠాలు చెపితేనే మీరింతవారయ్యారని మరవకండి. ఛీ!వెధవ ఆడజన్మ.ఆడదానిగా పుట్టడంకన్నా అడవిలో మానునైపుట్టినా బాగుండేది.”అంటూ ముక్కుచీదుకుంది శారద.
★★★

పనిమనిషి రాదని మూడుగంటలవరకూ నిద్రపోని శారద ,నాలుగు గంటలకల్లా లేచింది. చలిలో గిన్నెలు తోముతున్న శారదనిచూసివంశీకృష్ణ గుండె తరుక్కు పోయింది.బ్యాంకు గొడవలతో చికాకుగాఉండి
ఎక్కవగానే కసిరాననుకున్నాడు.

“శారదా! నాకుసారీచెప్పటం ఇష్టముండదు.నేను ఆడది హాయిగా ఉంటుంది. మగవాడే కష్టపడతాడనిపించి అలామాట్లాడాను.” అంటూ సింక్ లొ గిన్నెలు కడుగుతున్న భార్యబుజంమీద అనునయంగా చేయివేసాడువంశీ.

సరేలెండి మీటెన్షను అర్ధంచేసుకున్నా.అందరూ డబ్బుకోసం ఉద్యోగంచేస్తే మీది డబ్బతోనే ఉద్యోగమయ్యే.ఏంతేడాచ్చినా జేబులోంచి కట్టుకోవాలి. కాకపోతే నన్నూ నా ఉద్యోగాన్ని ఏమన్నా ఊరుకోను.”అంది పూర్తిగా భర్తకి లొంగకుండా.
★★★

దుప్పట్లోంచి లేవకుండా సైలంట్ గా అమ్మానాన్నల సంభాషణ విని. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని నవ్వుకున్నారు పిల్లలు.రాత్రి తల్లిదండ్రుల హాట్ డిస్కషన్ విని వాల్కెనో ఎరప్షన్ అనుకున్న అపర్ణ అపరాజితలు.
★★★

‘ఏమైనా ఆడదానిగా పుట్టడంకన్నా అడవిలో మానై పుట్టినా బాగుండేది.’ అందిశారద కాఫీ సిప్చేస్తూ.

‘ఔనౌను!మగవాడిగా పుట్టడంకన్నా ఆడవిలో మద్దిచెట్టు మానునై పుట్టినా బాగుండేది.’అన్నాడు వంశీ క్రీగంట శారదని చూస్తూ.

“డాడ్! బోత్ ఆర్ ట్రీస్ అండ్ దె గివ్ షెల్టర్ టు అదర్స్.”అంది అప్పూ దొంగలాగ తండ్రి వెనకచేరి.

“అమ్మా!నువ్వలా మాట్లాడితే మాకు భయంగా ఉందమ్మా! మేము నీలా ఆడపిల్లలం కదమ్మా!” అంది అపర్ణ.

శారద వంశీలు తమ తప్పు తెలుసుకున్నారు.

సంసారమనే రథానికి భార్యాభర్తలిద్దరూ చక్రాల్లాంటివారు.అందులో ఏచక్రం గొప్పదని చెప్పగలం. ఏ చక్రం లేకపోయినా బండి సజావుగా నడవదు.రెండుచక్రాలమీద భారం సమానంగా ఉంటేనే సంసారరథం సాఫీగా సాగుతుందని
తెలిసినప్పటికి స్త్రీ పురుషులు తాత్కాలికమైన శారిరక,మానసిక,ఆర్ధిక వత్తిడి లో ఎవరికి వారే వారే సంసారభారాన్ని మోస్తున్నామనుకోవటం పరిపాటి కొంచెం విచక్షణతో ఆలోచిస్తే ఎవరి కష్టం వారిదన్న సత్యం స్ఫురిస్తుంది.
సర్వేజనా సుఖినో భవంతు.

November 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us