మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

అంగూరు గుత్తులు

by Ramesh March 19, 2026
written by Ramesh

అంగూరుతోటలో
అంగూరు నేలమీద అంగూరు తీగలు తీగలు
అందాల అంగూరుగుత్తుల ఆకాశం
ఆ ఆకాశం కింద అంతా అంగూరు తియ్యని గాలే
అన్నీ పండ్లు కండ్లైచూచే అద్భుతఅంగూరులోకం
అది అంగూరురైతు కలలుగన్న స్వప్నదేశం
పండ్లవ్యాపారం బండీలు ఎక్కి
అంగూరు గుత్తులు ఆసిఫాబాద్ అంగట్లోకి చేరాక
అగ్గువగా, అంగూరంగూరని తియతియ్యగా పిలుస్తాయ్
తోపుడు బండ్ల పై లేతఆకుపచ్చగా,పసిడిపచ్చగా అమాయక పసిపాపల కండ్ల అంగూరుగుత్తులు
మార్కెట్టులో ఆపిల్ల ధర ఆకాశనంటినా
అరకిలో యాభైయే అని అంగూర్లంటవి
గిరిజన గ్రామాలకు,లంబాడి తండాలకు,గుట్ట మీది పల్లెలకు, గ్రామగ్రామానికి, ఆసిఫాబాద్ పట్టణం ప్రతీవాడకు
యాబై కరెన్సీ నోటుకు ముస్తాబై ఉషారుగా బయలుదేరుతవి
ఆస్తులున్నవారని,పస్తులున్నవారని భేదంలేకుండా
కడుపులోకింత అంగూరు మధుర రసం భేషరతుగా దుంకుతది
అంగూరపండ్లవానికి
ఉసురు మన్న రోజులు కొన్ని అతనిగుండెలను గాయంచేస్తాయ్
ఊహకందని రోజులు కొన్ని ఆ గుండెలకే మాలాం రాస్తాయ్
కలవారి కలల ముందు
శపించిన జీవితం వేస్తున్న ప్రశ్నలముందు
నీరసించి నీల్గుతూతోపుడు బండిని ఈడ్చుకెళ్లిన రోజులుకొన్ని
అతని జీవితానికి పాఠమవుతాయి

ద్రాక్షా గుత్తుల్లో కొన్నిపండ్లు కుళ్లి పోయి పండ్లమ్మేవాడిగుండెను బరువెక్కించినా
ఆధునిక సంఘం ముందు అవంతగా కుళ్ళినవేం కావు బహుశా
ఊ‌సురమన్న చీకట్లు తొలగి గిరాకీ సూర్యుడుదయించినపుడు అతడు ఆనందుడవుతాడు
మమకారంగామాట్లాడి అరకిలోపండ్లకి ముత్యమంత ప్రేమను,చిరునవ్వునూ మొగ్గుగా ఇస్తాడు పండ్లవాడు
మరలా రావాలంటది అతడికండ్లనిండా తొంగిచూసే గిరాకీఆశ
గంపెడు బరువు గల నాలుగుటైర్లతోపుడు బండి
పండ్లవానికి ఎంతఅమ్ముడు పోతే అతనిగుండె అంత అల్కగవుతది కదా
పండ్లను బాగమ్మినరోజు అతడి కండ్లల్లో నియాను వెలుగులు నిండుతాయ్
పండ్లఅమ్మకాలరాబడి ఆగిఆగి పడే వానలు
ఐనా గానీ,రాతిరివేళ ఇల్లు మురుస్తుంది ఒక కుటుంబం పచ్చవడ్తది
తాజాదనం,సరసమైనధరలనీ ధనవంతులసూపర్ మార్కెట్లు కాకుండా
తోపుడు బండ్ల పై అంగూరుగుత్తుల
బేల చూపుల్ని చూడండి
బాల చూపుల్ని చూడండి
ఆ చూపుల్లో దాగున్న రోజువారి జీవితాల పిలుపులు వినబడతాయ్
అంగూర్ అంగూర్
అరకిలో యాభై అరకిలో యాభై….

మనం బజారుకెల్దాం పదండి, అరకిలోఅంగూర్లకోసం.

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 19, 2026
written by Narendra Sandineni

పి.శ్రీనివాస గౌడ్ నాలో నిద్రపోతున్న నగరం కవిత.
ప్రముఖ కవి,పి.శ్రీనివాస గౌడ్ కలం నుండి జాలువారిన నాలో నిద్రపోతున్న నగరం కవిత పై విశ్లేషణా వ్యాసం.నాలో నిద్రపోతున్న నగరం అనే కవిత ఆధునిక నగర జీవనంలోని సంక్లిష్టతను,మనిషి – నగరం మధ్య ఉన్న ఆత్మీయ మానసిక బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.నగరం కేవలం బయట కనిపించే ప్రపంచం మాత్రమే కాదు ; అది కవి అంతరంగ అనుభూతుల ప్రతిబింబం కూడా. ’నాలో’అనే పద ప్రయోగం ద్వారా నగరం కవి మనసులోనే నివసిస్తున్నదనే భావం స్పష్టమవుతుంది.’నిద్ర పోతున్న నగరం’ అన్న రూపకం అలసిపోయిన ఆలోచనలు,అణగారిన అనుభూతులు, తాత్కాలికంగా నిశ్శబ్దంలో మునిగిపోయిన జీవన చలనాలను సూచిస్తుంది.ఇప్పుడు కవి శ్రీనివాస గౌడ్ కవితా చరణాల లోకంలోకి ప్రవేశించి,ఆ భావ సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం ; కవిత్వానుభూతుల విస్తార లోకంలో విహరిద్దాం.
“నిద్ర రానప్పుడు/నగరాన్ని ఎదురుగా/ కూర్చొనపెట్టుకుంటాను/ఇక్కడ కవి ఒక అందమైన కల్పనను చేశాడు.నగరం అనేది కేవలం భవనాల సముదాయం మాత్రమే కాదు ; అది ఒక సజీవ చిత్రంలా కనిపిస్తుంది.నిద్ర దూరమైన రాత్రుల్లో నగరం కవికి స్నేహితుడుగా మారి,ఆగని సంభాషణలా అతని ముందుకు వస్తుంది.బాహ్య ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ,కవి మనసులో మాత్రం నగరం మేల్కొనే ఉంటుంది. ‌ ఇది అత్యంత లోతైన కవితా పంక్తిగా భావించవచ్చు.నిద్ర రాకపోవడం కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు ; అది మానసిక చలనం కూడా.ఆ సమయంలో కవి తనకు ఎదురుగా నగరాన్ని కూర్చోబెట్టినట్లు ఊహిస్తాడు.అంటే, నగరాన్ని కేవలం పరిశీలించడం కాదు – నగరంతో సంభాషణకు సిద్ధమవుతాడు.ఇక్కడ నగరం ఒక వ్యక్తిగా రూపాంతరం చెందుతుంది.ఇది కవి యొక్క ఒంటరితనాన్ని, ఆలోచనల్లో మునిగిపోయిన మనస్తత్వాన్ని సూచిస్తుంది. నగరం జీవన సంక్లిష్టతను,ఆధునిక ఒత్తిడిని,మనిషిలోని అంతర్గత మనో గందరగోళాన్ని ప్రతిబింబిస్తే,ఆకాశం విస్తృతిని,భావోద్వేగాల మార్పును, స్థిరత్వం లేని మనస్సు స్థితిని, ప్రతీకాత్మకంగా వ్యక్తపరుస్తుంది.
“ఎప్పుడు చూసినా రంగులు మారే ఆకాశంలా/ఇది నగర యొక్క వైవిధ్యాన్ని, మార్పును,అందాన్ని చూపిస్తుంది‌.ఇది చాలా సున్నితమైన ఉపమానం.ఆకాశం మారడం సహజం. నగరం కూడా అలాగే మారుతుంది.కానీ,ఆ మార్పు కేవలం దృశ్య రూపానికే పరిమితం కాదు – అది మనసును తాకే భావాత్మక పరివర్తన కూడా.
“ఎప్పుడు చూసినా రంగులు మార్చే/ వుంటుంది నగరం/ నగరం తన స్వరూపాన్ని చూసే వారి మనసు యొక్క స్థితిని బట్టి వ్యక్తం చేస్తుంది.ఆనందంలో ఉన్న వాడికి నగరం వెలుగుగా కనిపిస్తుంది.అలసటలో ఉన్న వాడికి నగరం భారంగా మారుతుంది.ఇక్కడ నగరం పోలిక రంగులు మారే ఆకాశం.ఆకాశం క్షణక్షణానికి రంగులు మారుస్తుంది.అలాగే నగరం కూడా తన రూపాన్ని,స్వభావాన్ని మారుస్తుంది. ఉదయం ఉండే కోలాహలం,రాత్రి ఉండే కాంతిపుంజాలు, మనుషుల అవసరాలకు తగ్గట్టుగా నగరం ధరించే ముసుగులు.వీటన్నింటిని రంగులు మార్చడం అనే ప్రతీకతో కవి వర్ణించారు.సరళమైన భాష – కానీ,భావం లోతుగా మరియు కవిత్వంలో అనుభూతి బలంగా ఉంది.
ఈ కవితలో ఒక వ్యక్తి తనలోనే ఉన్న నగరాన్ని చూసుకుంటూ,ఆత్మ పరిశీలనలో మునిగిపోతున్నాడు.నిద్ర రాని రాత్రుల్లో మనిషి బయట ప్రపంచాన్ని కాదు – తనలోని ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.నగరం అక్కడే ఉంది, నిద్రపోతూ కూడా మారుతూ ఉంటుంది.నగరం యొక్క చిత్రణ – కవి నగరాన్ని సజీవ వస్తువుగా చిత్రీకరించడం ద్వారా నగరం యొక్క జీవన శైలిని,అందాన్ని,మార్పును, చలనశీలతను చూపిస్తున్నాడు.ఈ కవితలోని భావాలు, వర్ణనలు,పాఠకులను నగరం యొక్క అందాన్ని అనుభవించేలా చేస్తాయి.ఇక్కడ కవిత శీర్షిక నాలో నిద్రపోతున్న నగరం.నగరం అనేది బయట ఎక్కడో లేదు.అది కవి వ్యక్తిత్వంలో,ఆలోచనల్లో భాగమై పోయింది.మనం నగరంలో నివసించడమే కాదు,నగరమే మనలో నివసిస్తుంది అనే తాత్విక చింతన ఇందులో కనిపిస్తుంది.ఈ కవితలోని ప్రత్యేకత చాలా సరళమైన పదాలతో లోతైన భావాన్ని పండించడం.నగరాన్ని ఎదురుగా కూర్చొనపెట్టుకోవడం అనే ప్రయోగం కవి యొక్క ఊహాశక్తికి,నగరం పట్ల ఆయనకున్న అనుబంధానికి నిదర్శనం.ఈ కవితా పంక్తులు ఆధునిక మానవుడి ఒంటరితనాన్ని,ఆ ఒంటరితనంలో నగరం ఇచ్చే తోడును,దాని అస్థిర స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఈ కవితలో నగరం ఒక ప్రదేశం కాదు – మనస్సు యొక్క స్థితి.నిద్ర లేని రాత్రి,మారుతున్న నగరం,రంగులు మార్చే ఆకాశం – ఇవన్నీ కలిసి మనిషి అంతరంగాన్ని మృదువుగా ఆవిష్కరిస్తాయి.
“నగరం కడుపులో ఏముంటుందో గాని/ఇక్కడ నగరం కడుపు అనే రూపకం ఎంతో ప్రభావవంతంగా ఉంది.కడుపు అంటే అంతర్గతం,దాచిన భావాలు,తెలియని నిజాలు‌.నగరం బయటకి ప్రకాశవంతంగా కనిపించినా,దాని అంతరాళంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు‌.ఇది ఆధునిక నగర జీవనంలోని రహస్యత్వం,ఆజ్ఞాతత్వం,అనిశ్చితిని సూచిస్తుంది.నగరం కడుపులో ఏముంటుందో తెలియకపోయినా నగరాన్ని చూస్తే కవి యొక్క మనసులో ఒక రకమైన అసౌకర్యం,దిగులు కలుగుతుంది.ఇది నగరం యొక్క సంక్లిష్టతను,దాని ప్రభావాన్ని కవి మనస్సుపై చూపిస్తుంది.నగరం – మనిషి సంబంధం బాహ్య పరిశీలన నుంచి అంతర్గత అనుభూతిగా పరిణమిస్తుంది.ఈ కవితా పంక్తి ప్రశ్నార్థకంగా మొదలవుతుంది.నగరానికి కడుపు అనే మానవీయ లక్షణం ఇవ్వడం ద్వారా కవి నగరాన్ని ఒక జీవిగా రూపాంతరం చేస్తాడు.నగరం లోపల దాచుకున్నది ఏమిటో తెలియదు – అది రహస్యంగా,భయంకరంగా కూడా ఉండ వచ్చు.ఇది నగరం యొక్క రహస్యాలను,దాని లోపలి సంక్లిష్టతను సూచిస్తుంది.
“నగరాన్ని చూస్తే నా కడుపులో దిగులుగా/వుంటుంది/ఇక్కడ నగరం మనసుకు భారంగా మారింది.కడుపులో దిగులు అనేది ఆందోళన,భయం,ఒత్తిడిని సూచిస్తుంది.
నగరం అంటే అవకాశాల ప్రదేశం,అదే సమయంలో ఒంటరితనం,పోటీతత్వం,ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని చూస్తాం.ఇది కవి యొక్క మనసులో ఒక మానసిక ఒత్తిడిని,నగరం వల్ల కలిగే అసౌకర్యాన్ని, దిగులును వ్యక్తం చేస్తుంది.ఇక్కడ నగరం – కవి మధ్య ప్రత్యక్ష భావోద్వేగ అనుసంధానం ఏర్పడుతుంది.నగరం కేవలం కంటికి కనిపించే దృశ్యం కాదు.అది శరీరంలో దాగి కడుపులో దిగులును కలిగిస్తుంది‌‌.ఆధునిక జీవన ఒత్తిడిని,శారీరక అనుభూతిగా మార్చిన కవితా పంక్తి.ఇక్కడ నగరం ఒక అంతు చిక్కని రహస్యం.నగరం బయటికి జిగేల్మనే రంగులతో,భావనలతో కనిపిస్తుంది.కానీ,అంతరంగంలో ఏముందో?ఎవరికి తెలియదు‌‌.ఈ అనిశ్చితి కవిలో ఒక తెలియని భయాన్ని, దిగులును కలిగిస్తుంది.ఇక్కడ ప్రధానంగా నగరం ఇచ్చే సౌకర్యాల కంటే అది కలిగించే మానసిక అశాంతి కనిపిస్తుంది.ఇక్కడ కడుపు మౌలిక భావాల నిలయం – ఆందోళన,అసహనం వంటి భావాలు అక్కడే కేంద్రీకృతమై ఉంటాయి.
“స్థలం లేకపోయినా ఇద్దరి మధ్య ఇరుక్కొని కూర్చున్నట్టు/ఇది కవి యొక్క ఒంటరితనాన్ని నగరం మధ్యలో తన స్థానాన్ని గుర్తించలేకపోవడాన్ని సూచిస్తుంది.ఇది నగర జీవనంలోని ఇరుకుదనాన్ని,గందరగోళాన్ని బలంగా వ్యక్తపరుస్తుంది.ఇద్దరి మధ్య ఇరుక్కోవడం అనేది శారీరకంగా మాత్రమే కాక, భావోద్వేగపరంగా ఒత్తిడిని సూచిస్తుంది‌.మనిషి తన వ్యక్తిత్వానికి స్థలం లేకుండా,జన సందోహంలో ఉన్నా,తన్ను తాను కోల్పోతున్నట్టు అనిపిస్తుంది.తనకంటూ ఒక వ్యక్తిగత స్థలం లేకపోవడం వల్ల కలిగిన సామాజిక ఒత్తిడి,ఆధునిక నగర జీవనంలోని ఇరుకును సూచిస్తుంది.
“నగరం మధ్యలో నేను ఇరుక్కున్నాను/ఇది కేవలం శారీరక స్థితి మాత్రమే కాదు,మానసిక స్థితిని సూచిస్తుంది.ఇది వ్యక్తి తన స్వంత స్థలాన్ని కోల్పోయిన స్థితి.ఇది ప్రత్యక్షంగా ఒంటరితనాన్ని,అసహయతను వ్యక్తపరుస్తుంది.నగరం మధ్యలో ఉన్నప్పటికీ కవి తాను పరాయివాడిలా భావిస్తున్నాడు.ఇక్కడ జన సమూహంలో ఉన్నా ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాడు అనే భావం ప్రతిఫలిస్తోంది.నగరంలో వేల మంది మనుషులు నివసిస్తూ ఉన్నా,ఎవరికీ,ఎవరితో సంబంధం ఉండదు.జన సందోహం మధ్య కూడా మనిషి ఏకాకి. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికుడిలా,విశాలమైన నగరంలో కవి ఊపిరి సలపని స్థితికి చేరి తన ఉనికిని కోల్పోయినట్టు భావిస్తున్నాడు.ఇది నగరాల్లో పెరిగిపోతున్న జనాభా సాంద్రతను మాత్రమే కాదు. మనుషుల మధ్య పెరిగిన మానసిక దూరాన్ని కూడా సూచిస్తుంది.ఈ కవితలో కవి నగరాన్ని ఒక సంక్లిష్టమైన, రహస్యమైన వస్తువుగా చిత్రీకరిస్తున్నాడు.నగరం యొక్క ప్రభావం కవి మనసుపై ఎలా ఉంటుందో,అతని అస్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ కవితలో వ్యక్తం చేయబడింది.
“కానీ నగరం చేతులు చాచిన ఆకాశం/కవి నగరాన్ని తనతో పోల్చుకుంటూ అద్భుతమైన ప్రతీకలను వాడారు.నగరం ఎప్పుడు తనను తాను విస్తరించుకోవాలని చూస్తుంది.నగరం ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి,అందరిని తనలో విలీనం చేసుకోవాలి అని చూసే ఒక భారీ శక్తి.ఇక్కడ ఒక మలుపు కనిపిస్తుంది.నగరం ఇరుకుదనానికి ప్రతీకగా ఉన్నప్పటికీ,అదే నగరం ఆకాశానికి చేతులు చాచినట్టు చూపిస్తుంది.ఇది ఆశ,స్వేచ్ఛ,విస్తరణకు సంకేతం‌‌.నగరం కేవలం బంధనమే కాదు – అది అవకాశాల విస్తృతి.కవి నగరం యొక్క విస్తరణ,దాని పరిధి,ఆకాశాన్ని తాకేంత విశాలంగా ఉందని భావిస్తున్నాడు.ఇది నగరం యొక్క వైభవాన్ని,విస్తృతిని చూపిస్తుంది.
“నేను బావి నీళ్లలో తేలుతున్న ఆకాశం/ఇది అత్యంత లోతైన భావం.బావి నీళ్లలో ఆకాశం కనిపిస్తుంది.కానీ అది కేవలం ప్రతిబింబం మాత్రమే.బావి అనేది పరిమితులకు,బంధాలకు సంకేతం.కవి తనను తాను ఆకాశమంత విశాలమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిగా భావించినా,తాను నగరం అనే బావిలో పడిపోయి,అందులోనే బందీగా ఉన్నానని ఆవేదన చెందుతున్నాడు.ఆకాశమంత స్వేచ్ఛ ఉన్నా అది కేవలం ఒక చిన్న నీటి చట్రంలోనే కనిపిస్తుంది.ఈ కవితా పంక్తులు నగరంలోని యాంత్రికతను,మనిషి తన సొంత మూలాలను కోల్పోయి అనుభవిస్తున్న అభద్రతా భావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.నగర విస్తృతికి,వ్యక్తిగత స్వేచ్ఛారాహిత్యానికి మధ్య ఉన్న సంఘర్షణే ఈ కవితా సారం.ఇది కవి తనను బావి నీళ్లలో తేలుతున్న ఆకాశంగా భావించడం ద్వారా,తన అస్తిత్వాన్ని,తన భావాలను ఆకాశంతో పోల్చి,ఒక లోతైన, అందమైన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.ఇది కవి యొక్క ఆత్మ పరిశీలనను,తన అస్తిత్వాన్ని గుర్తించడాన్ని సూచిస్తుంది.ఈ కవితా పంక్తి అత్యంత సారవంతమైన రూపకం.బావి నీళ్లలో కనిపించే ఆకాశం పరిమితంగా ఉంటుంది – కానీ అదే నిజమైన ఆకాశానికి ప్రతిబింబం.కవి తనను అలాంటి ప్రతిబింబంగా చూస్తున్నాడు.తనలో కూడా ఒక విస్తృతి ఉంది‌.కానీ ఒక పరిమిత పరిధిలోనే కనిపిస్తుంది.ఇది స్వీయ అవగాహన,అంతర్గత స్వేచ్ఛ,ఆత్మాన్వేషణకు సంకేతం.ఈ కవితా పంక్తులు నగర జీవనంలోని రెండు విభిన్న దృశ్యాలను చూపిస్తుంది‌‌.ఒక వైపు ఇరుకుదనం,ఒత్తిడి,ఒంటరితనం.మరో వైపు విస్తృతి,ఆశ.ఆత్మలోని ఆకాశం.నగరం బయటి ప్రపంచం అయితే కవి మనసు అంతర్గత ప్రపంచం.నగరం కడుపు ఏమిటో తెలియకపోయినా తన కడుపులోని దిగులు అతనికి తెలుసు.చివరికి తనలోని ఆకాశాన్ని గుర్తించడమే విముక్తి. ఇది ఒక అంతర్ముఖ కవిత.చదివిన తర్వాత మనలో కూడా ఒక ప్రశ్న మిగులుతుంది.మనం నగరంలో చిక్కుకున్నామా? లేక మనలోని ఆకాశాన్ని మర్చిపోయామా?ఈ కవితా పంక్తుల్లో నగరం ఒక భౌతిక స్థలం మాత్రమే కాదు – అది మనసు స్థితి.అంతర్మథనం మరియు వ్యక్తిత్వ సంక్లిష్టతకు ప్రతీకగా నిలుస్తుంది.
“ఆకాశాన్నంటే భవనాలను చూసి/అసింట పోతుంటాను గానీ/ఇది భవనాల వైభవాన్ని,వాటి ఎత్తును,ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్నా,వాటిని చూసి కవి అనుభవించే భావాన్ని సూచిస్తుంది.కవి భవనాల వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న కలలను,కష్టాన్ని గుర్తించలేకపోవడాన్ని వ్యక్తం చేస్తుంది.ఇక్కడ ‘ఆకాశాన్నంటే భవనాలు’అనే రూపకం అత్యున్నత ఆశయాలను, అభివృద్ధిని,విజయాన్ని సూచిస్తుంది.కానీ,కవి హృదయంలో ఉల్లాసం కంటే ఒక విచిత్రమైన కలవరపు భావం కలుగుతుంది.ఈ భావం ఆశ్చర్యం కాదు,అసమానతలపై ఒక అంతర్మథనం.నగరం అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఆకాశహార్మ్యాలు.వాటిని చూసి సాధారణంగా ఎవరైనా ఆశ్చర్యపోతారు.కానీ కవి చూపు ఆ భవనాల మెరుపుల కంటే లోతుగా వెళ్తోంది.ఆ భవనాలు కేవలం కొందరి కలల సౌధాలు మాత్రమే అని,కవి అంగీకరించ లేకపోతున్నాడు. అంటే ఆ అందమైన కట్టడాల వెనుక ఎందరో సామాన్యుల కష్టం,కన్నీళ్లు దాగి ఉన్నాయి అనే స్పృహ ఇక్కడ కనిపిస్తుంది.
“ఖరీదైన విలాస విరామ జీవితం చూసి/ కలవరపడతా గానీ/ నగరంలోని విలాసవంతమైన జీవనశైలి కవిని ఆశ్చర్యపరచదు ; అది అతనిని కలవరపెడుతుంది.ఆ విలాసం వెనుక దాగి ఉన్న శ్రమ,కష్టాల గాఢతను పూర్తిగా గ్రహించలేకపోవడం,అతన్ని గాఢమైన ఆలోచనలోకి తీసుకెళ్తుంది.విలాసవంతమైన జీవితం ఒక ఆకర్షణ.కానీ.కవి దానిని చూసి అసూయ పడటం లేదు,కలవరపడటం లేదు. ఎందుకంటే ఆ విలాసం వెనుక ఉన్న శ్రమ,అసమాన అవకాశాలు,అదృష్టం – దురదృష్టం మధ్య ఉన్న వ్యత్యాసాలు కవిని ఆలోచనలో ముంచేస్తాయి.
“చెమట చుక్కల శ్రమనో,మేధో కష్టమో/ఎవరిదైనా ఎవరైనా/ నగరంలోని విలాసవంతమైన జీవనశైలి,ఆ విలాసం వెనుక ఉన్న చెమట చుక్కల శ్రమనో,మేధో కష్టమా అని కవి ఆలోచిస్తున్నారు.అది ఎవరిదైనా సరే,ఆ సంపద సముపార్జనలో ఉండే నైతికతను లేదా అసమానతను ఆయన ప్రశ్నిస్తున్నారు.ఇక్కడ శ్రమకు రెండు పార్శ్వాలు చూపించారు.శారీరక శ్రమ,మేధో శ్రమ,విజయానికి కారణం ఏదైనా కావచ్చు.కానీ,అందరికీ సమానంగా దక్కదని కవి గ్రహిస్తున్నారు.ఇది కవి శ్రమను,కష్టాన్ని గుర్తించలేకపోవడాన్ని అందరి కష్టాన్ని ఒక విధంగా చూడలేకపోవడాన్ని వ్యక్తం చేస్తుంది.ఈ కవితలో కవి భవనాల వైభవాన్ని, విలాసవంతమైన జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న శ్రమను,కష్టాన్ని గుర్తించలేకపోవడాన్ని వ్యక్తం చేస్తున్నాడు.ఇది కవి యొక్క సామాజిక చైతన్యాన్ని, శ్రమను గుర్తించడంలోని లోపాన్ని సూచిస్తుంది.
“అందరి గమ్యం అదే కదాని అనుకోలేను/ఇది అత్యంత కీలకమైన కవితా పంక్తి.సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ ఖరీదైన విలాసాల కోసమే పరిగెడుతున్నారు.అందరి జీవిత పరమార్ధం ఆ సౌధాలను చేరుకోవడమేనని కవి నమ్మడం లేదు.భౌతిక సుఖాలే జీవితానికి అంతిమ లక్ష్యమని భావించే భౌతికవాద ధోరణిని కవి ఇక్కడ సున్నితంగా నిరసిస్తున్నారు‌.ఈ కవితలో అనుకోలేను అనే పదం పదేపదే రావడం గమనార్హం.ఇది కవి యొక్క వ్యక్తిత్వానికి, ఆయన తాత్విక నిలకడకు నిదర్శనం.లోకం దేనినైతే గొప్పగా చూపిస్తుందో,అదే కోణంలో చూడకుండా,దాని వెనుక ఉన్న సామాజిక మూల్యం గురించి కవి ఆలోచిస్తున్నారు. సమాజంలో అందరికీ ఒకే గమ్యం ఉండ రాదు.పరిస్థితులు, అవకాశాలు – ఇవన్నీ గమ్యాలను వేరు చేస్తాయి.కవి సమానత్వాన్ని ఆశిస్తున్నప్పటికీ వాస్తవం వేరు అని అంగీకరిస్తున్నారు.ఆకాశాన్నంటే భవనాలు అనే ప్రతీక ద్వారా అభివృద్ధి – అసమానతల ద్వంద్వాన్ని చూపారు.కవిత అంతా ఒక ఆత్మ పరిశీలనగా సాగుతుంది.వ్యక్తిగత భావం ద్వారా సామాజిక నిర్మాణాన్ని ప్రశ్నించడం ప్రధాన లక్షణం. ఆశ్చర్యం,కలవరం,శ్రమ,విలాసం వంటి విరుద్ధ భావాలను సమతుల్యం చేశారు.
ఈ కవిత ఆధునిక నగర సంస్కృతిపై ఒక మానవీయ ప్రశ్న.ఎత్తైన భవనాలు ఉన్నా – అందరి కలలు అక్కడికి చేరవు.విలాస జీవితం కనిపించినా – అందరి ప్రయాణం అక్కడితో ముగియదు.ఈ కవితలో ఉన్న భావ గాఢత, సామాజిక అవగాహనతో ముడిపడి ఉంది.అది ఒక సాధారణ పరిశీలన కాదు – ఒక సున్నిత మనసు ప్రపంచాన్ని చూసే విధానం.
ఈ కవితా పంక్తుల్లో ఆధునిక నగర జీవన విరుద్ధాలపై తలెత్తిన ఆత్మ పరిశీలన కనిపిస్తుంది.ఇది కేవలం భావనలను గూర్చిన వర్ణన కాదు – సమాజంలో ఉన్న అసమానతలపై,కలల విలువలపై,శ్రమ – విలాసాల మధ్య దూరంపై ఒక భావోద్వేగ స్పందన.ఈ కవితలో కవి ఆకాశాన్ని తాకే భవనాలను చూసి,వాటి వైభవాన్ని అనుభవిస్తూ,వాటి వెనుక ఉన్న కథను,శ్రమను గుర్తించలేకపోవడాన్ని వ్యక్తం చేస్తున్నాడు.భవనాలు కొందరి కలల సౌధాలు అని,వాటి వెనుక ఉన్న కష్టాన్ని,శ్రమను అర్థం చేసుకోలేకపోవడాన్ని చెబుతున్నాడు.ఈ కవితా పంక్తులు నగరంలోని సామాజిక అసమానతలను మరియు భౌతిక సంపద వెనుక ఉన్న వాస్తవాలను తాత్విక కోణంలో ప్రశ్నిస్తున్నాయి.
“బోనులో వున్న పులిని భీతిల్లి చూస్తున్నట్టు/ నగరాన్ని భీతిల్లి చూస్తున్నా/ఇక్కడ నగరం ఒక బంధించబడిన పులిలా కనిపిస్తుంది.పైకి అదుపులో ఉన్నట్టే అనిపించినా లోపల అణిచివేయబడిన క్రూరత్వం,అశాంతి దాగి ఉంది.కవి ఆ పులిని చూసి భీతిల్లినట్లే, నగరాన్ని కూడా భయంతో చూస్తున్నాడు.ఇది నగరంలో దాగి వున్న హింస,ఒత్తిడి, అస్థిరతకు సంకేతం‌‌.ఇక్కడ నగరాన్ని బోనులో వున్న పులితో పోల్చడం,అత్యంత బలమైన రూపకం.పులి అంటే శక్తి, హింసకు,దాడికి సంకేతం.బోను అంటే కనిపించే ప్రమాదం నియంత్రణలో ఉన్నట్టుగా భావించడం.నగరం కూడా అలాగే – అది నియంత్రణలో ఉన్నట్టుగా కనిపించినా,ఎప్పుడైనా మనపై దాడి చేయ గల శక్తిగా అనిపిస్తుంది.అందుకే కవి నగరాన్ని ఒక భయానక జీవిగా చూపించాడు.ఇది నగర జీవనంలోని అస్థిరతను,పోటీని మరియు నిరంతర ఒత్తిడిని సూచిస్తుంది.ఇది నగరాన్ని ఒక ప్రమాదకరమైన,భయపెట్టే వస్తువుగా చిత్రీకరిస్తుంది.కవి నగరాన్ని చూసి భయపడుతున్నాడు.దాని ప్రభావాన్ని తప్పించుకోలేకపోతున్నాడు. “నగరాన్ని భీతిల్లి చూస్తున్నా – ఇది కవి యొక్క నగరం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేస్తుంది.ఇక్కడ నగరాన్ని కవి ఒక పులితో పోల్చాడు.పులి బోనులో ఉన్నప్పటికీ దాని క్రూర స్వభావం మారదు.అది ఎప్పుడైనా దాడి చేయవచ్చు అనే భయం మనలో ఉంటుంది.నగరం కూడా చూడడానికి కట్టుదిట్టంగా,నాగరికంగా కనిపించినా,దాని లోపల ఒక హింసాత్మకమైన,క్రూరమైన స్వభావం దాగి ఉంది అని కవి భయపడుతున్నాడు.
“నిద్రలో దాని గాండ్రింపులు/వినపడుతున్నాయి/ఇక్కడ భయం బాహ్య ప్రపంచానికి మాత్రమే పరిమితం కాలేదు ; అది అంతర్మనస్సులోకి చొచ్చుకుపోయింది.నిద్రలో కూడా నగరపు గాండ్రింపు వినిపించడం అనేది మనస్సులోని కలవరం,మానసిక వేదన ఏర్పడింది అనే సూచన.నగరం ఒక స్థలం కాదు – అది మనసులోకి ప్రవేశించిన శబ్దం.ఇది ఆధునిక జీవనంలో మానసిక ప్రశాంతత కోల్పోవడాన్ని ప్రతిబింబిస్తుంది.నగరం యొక్క ధ్వని,కవి చెవులకే కాదు, ఆయన మనస్సులోకి కూడా చొచ్చుకుపోయింది.నగరం పగలు చేసే రణగొణ ధ్వనులు,శబ్దాలు నిద్రలో కూడా గాండ్రింపులా వెంటాడుతుంది.అంటే నగరపు యాంత్రికత, మనిషి అంతరంగ శాంతిని ఎలా హరించి వేస్తుందో ఇక్కడ స్పష్టం అవుతుంది.
“సముద్రాన్ని ఎదురుగా పెట్టుకుని/చెవులు మూసుకున్నా/ అలల ఘోషలు వెంటాడుతున్నాయి/ఇక్కడ సముద్రం ఒక విశాలతకు,ప్రకృతి శక్తికి ప్రతీక.చెవులు మూసుకోవడం, సమస్యను దాటవేయాలనే ప్రయత్నం.ఎంత దూరం పెట్టినా,ఎంత మర్చి పోవాలనుకున్నా,నగర జీవన శబ్దాలు మనసులోంచి పోదు.అలలు నిరంతరం తీరాన్ని తాకినట్టే,ఆ ఒత్తిడి మనసును తాకుతూనే ఉంటుంది.ఇక్కడ సముద్రం నగరం యొక్క అనంతమైన కోలాహలానికి ప్రతీక.మనం ప్రయత్నించి బాహ్య ప్రపంచానికి తలుపులు వేసుకున్నా, చెవులు మూసుకున్నా,నగరపు ఒత్తిడి,వేగం,ఆందోళనలు మనిషిని వదలవు.అవి సముద్రపు అలల ఘోషలుగా‌ నిరంతరం మనసును తాకుతూనే ఉంటాయి.ఈ కవితా పంక్తుల్లో కవి నగరాన్ని ఒక నియంత్రించ లేని శక్తిగా చిత్రించారు.మనిషి నగరం నుండి భౌతికంగా దూరంగా ఉన్నా,మానసిక గాయంలా అది అతడిని వెంటాడుతూనే ఉంటుంది.నగరపు నాగరికత మనిషికి అసౌకర్యాన్ని ఇచ్చి ఉండవచ్చు.కానీ, ప్రశాంతతను మాత్రం దూరం చేసింది అని కవి ఆవేదన చెందుతున్నాడు.ఈ కవితలో నగరాన్ని ‘పులి’ మరియు ‘సముద్రం’ వంటి ప్రకృతి శక్తులతో పోల్చడం ద్వారా దాని తీవ్రతను కవి అద్భుతంగా పండించారు.
ఈ కవితలో మూడు ప్రధాన ప్రతీకలు ఉన్నాయి‌.పులి – భయం,హింస,దాడికి సంకేతం.గాండ్రింపు – మానసిక కలవరానికి ప్రతీక.సముద్రపు అలలు – నిరంతర ఒత్తిడి, తప్పించుకోలేని వాస్తవానికి ప్రతీక.ఈ ప్రతీకల ద్వారా కవి నగరాన్ని ఒక భయానకమైన,శబ్దభరితమైన శక్తిగా మలిచాడు.
ఈ కవితా పంక్తుల్లో కవి బాహ్య నగరాన్ని కాదు.తనలోని అంతర్గత భయాన్ని మాత్రమే చిత్రిస్తున్నాడు.నగరం ఒక ప్రతీక మాత్రమే ; అసలు యుద్ధం మనసులోనే జరుగుతుంది. నగరాన్ని చూడటానికి భయపడటం,నిద్రలో కూడా వెంటాడడం,దూరం పెట్టినా శబ్దం ఆగకపోవడం,ఇవి అన్ని ఒక మానసిక అసౌకర్యానికి సంకేతాలు.ఈ కవితా పంక్తులు నగర జీవనంలోని శబ్దాన్ని,భయాన్ని,ఒత్తిడిని,ఒక ఆత్మీయ అనుభూతిగా మలిచింది.ఇది కేవలం నగరం పై విమర్శ కాదు – ఆధునిక మనిషి మనసులోని కలవరానికి ప్రతిబింబం‌. చివరిగా ఒక ప్రశ్న మిగులుతుంది.నగరం నిజంగా పులినా? లేక మన భయాలే ఆ గాండ్రింపులా?ఈ కవితా పంక్తుల్లో భయం,అనిశ్చితి,అంతర్మథనం మరియు రూపకాల ద్వారా భయాన్ని కూర్చిన తీరు విశేషంగా ఉంది. కవి నగరం ఒక వైభవ చిహ్నంగా కాకుండా ఒక బంధనంగా,ఒక భయంకర జీవిగా అనుభూతి చెందుతున్నాడు.కానీ,కవి దృష్టిలో ఆశ్చర్యాన్ని కలిగించినా,కొందరి కలల సౌధాలుగా మారలేకపోతున్నాయి.ఇక్కడ కవిత యొక్క ప్రధాన వ్యతిరేక భావన ప్రారంభం అవుతుంది.సముద్రం ఎదురుగా ఉన్నా, చెవులు మూసుకున్నా అలల ఘోషలు వినిపించడం.అంటే ఎంత దూరంగా ఉండాలనుకున్నా,ఎంత తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నా – నగరపు శబ్దం వెంటాడుతూనే ఉంటుంది.
ఇది నగరం నుండి విముక్తి సాధ్యం కాదన్న అంతర్లీన వేదనను సూచిస్తుంది.
ఈ కవితా పంక్తులు నగరాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా కాదు, ఒక భయానక జీవిగా,ఒక మనసును వెంటాడే శబ్దంగా,ఒక అసమాన కలల గూడుగా చిత్రిస్తుంది.ఇది కేవలం నగర విమర్శ కాదు – ఆధునిక జీవన విధానంపై ఒక అంతర్ముఖ ప్రశ్న.నగరం పట్ల కవికి ఉన్న అభద్రతాభావాన్ని,నగర జీవనంలోని బీభత్సాన్ని,అత్యంత శక్తివంతమైన ప్రతీకలతో ఆవిష్కరించాయి.
“నగరంలో కొచ్చి నగరాన్ని/తప్పించుకు తిరగడం/ఇది నగరంలో జీవించడం,నగరాన్ని తప్పించుకుని తిరగడం,ఎంత కష్టమో సూచిస్తుంది.ఇది ఆధునిక మనిషి మనోవైఖరి. నగరంలో నివసిస్తూ కూడా దాని సంస్కృతి,దాని వేగం,దాని ప్రభావం నుండి తప్పించుకోవాలని ప్రయత్నించడం ఒక అంతర్గత సంఘర్షణ.నగరం మన జీవనానికి అవసరం అయిపోయిన తర్వాత,దాని నుంచి విడిపోవాలన్న కోరిక ఒక అసాధ్యమైన ప్రయత్నంగా మారుతుంది.నగరాన్ని తప్పించుకు తిరగడం ఎంత కని సాధ్యం?అన్న ప్రశ్నలో ఒక నిస్సహాయత కనిపిస్తుంది.నగరం అనేది కేవలం భౌగోళిక ప్రాంతం కాదు – అది ఒక జీవనశైలి.దానికి కవి అద్భుతమైన ఉపమాతో మరింత లోతుగా చెబుతాడు. “సముద్రంలో మునిగిపోతూ/ఈత కొట్టకుండా వుండడం/ సముద్రం అంటే అపారత్వం,ఆవరించే శక్తి.అందులో పడిపోయి ఈత కొట్టకపోతే మునిగిపోవడమే.అదే విధంగా నగర జీవనంలో ఉండి దానితో మమేకం కాకపోతే జీవన యాత్ర సాఫీగా సాగదు.ఇక్కడ నగరం సముద్రంలా – మనల్ని చుట్టుముట్టి మనల్ని ఆవరించే వాస్తవం.సముద్రంలో ఉన్న వాడు ఈత కొట్టకపోతే మునిగి పోవాల్సిందే.అలాగే నగరంలో ఉన్న మనిషి నగర నియమాలకు లోబడకపోతే,ఆ వ్యవస్థలో తుడిచిపెట్టుకుపోతాడు‌.ఇక్కడ నగరం ఒక నిర్దాక్షిణ్యమైన సహజ శక్తిలా మారుతుంది.నగరం అనే మహాసముద్రంలో ఉంటూ దాని ప్రభావానికి లోను కాకుండా ఉండటం అంత కంటే అసాధ్యం అని కవి భావం‌.ఇది ఆధునిక మానవుడు నగర గమనంలో చిక్కుకుపోయిన తీరును తెలుపుతుంది.
“వేప చెట్టుని రావి చెట్టు పెనవేసుకున్నట్టు/ పెనవేసుకుంటుంది నగరం/ఇది నగరం – మనిషి సంబంధాన్ని పరాన్న జీవి సంబంధంలా చూపిస్తుంది.మొదట అది సహజంగా,అవసరంగా అనిపించినా,కాలక్రమేణా మన అస్తిత్వాన్ని,స్వతంత్రతను మెల్లగా కమ్మేస్తుంది.వేపచెట్టు తన ఔషధ గుణాలతో ప్రత్యేక గుర్తింపు ఉన్నది ; కానీ రావి చెట్టు దాన్ని పెనవేసుకుంటే వేపచెట్టు స్వరూపమే మాయం అవుతుంది.అలాగే మన వ్యక్తిత్వాన్ని మూలాన్ని మసక బార్చుతుంది.చెట్లు సహజంగా పెనవేసుకోవడం రూపకం.ఇది చాలా సున్నితమైనది.వేపచెట్టు,రావి చెట్టు వేరు వేరు స్వభావాలు కలవి.కానీ,ఒక దానితో ఒకటి పెనవేసుకుంటే విడదీయలేని సంబంధంగా మారతాయి.అలాగే నగరం కూడా మనిషిని నెమ్మదిగా,గమనించకుండా,తనలో చుట్టేసుకుంటుంది. ఇది బలవంతపు బంధం కాదు ; ఇది సహజమైన,కానీ తప్పించుకోలేని అనుబంధం.నగరంలో ఉంటూ నగరాన్ని దూరం పెట్టాలనుకున్నా,నగరం అతన్ని తన సంస్కృతితో,తన అవసరాలతో,తన కలలతో కట్టిపడేస్తుంది.
ఈ కవితా పంక్తుల్లో ఒక ప్రశ్నార్థకం ఉంది – ‘ఎంతకని సాధ్యం?ఈ ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది.నగరాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు.నగరం అంటే కేవలం భావనలు కాదు ; అది జీవనశైలి,ఆలోచన,పోరాటం,ఆశ, ఆవేదనల సమాహారం.మనిషి నగరంలో జీవిస్తూ దాని ప్రభావం నుండి పూర్తిగా బయట ఉండ లేడు.అది సముద్రం లాంటి అపారత్వం,చెట్లు పెనవేసుకోవడం లాంటి సహజ అనుబంధం.ఈ కవిత నగర జీవనంలోని వైరుధ్య భావనను సున్నితంగా ఆవిష్కరిస్తుంది.నగరంలో ఉంటూ నగరాన్ని దూరం పెట్టాలనుకోవడం అసాధ్యం.నగరం ఒక సముద్రంలా మనల్ని ముంచుతుంది.అది ఒక వేప చెట్టు వేరులా మన జీవితంలో పెనవేసుకుంటుంది.కవి చెబుతున్నది ఏమిటంటే – నగరాన్ని తప్పించుకోవడం కాదు.దానితో ఈత కొట్టడం నేర్చుకోవడమే జీవన జ్ఞానం.నగరం ఒక ప్రదేశం కాదు ; అది ఒక పట్టుదల గల వ్యవస్థ.దానిలోకి వచ్చిన మనిషి దాని ప్రభావం నుంచి పూర్తిగా తప్పించుకోవడం అసాధ్యం.ఇది నగర జీవితం మీద మాత్రమే కాదు – మన స్వేచ్ఛ ఎంతవరకు నిజమో అన్న ప్రశ్న. వేపచెట్టుని రావి చెట్టు పెనవేసుకున్నట్టు అనే ఉపమానం ఇక్కడ అత్యంత శక్తివంతమైనది. సాధారణంగా గ్రామాల్లో వేప,రావి చెట్లు పెనవేతను పవిత్రంగా భావిస్తారు.కానీ,ఇక్కడ నగరం మనల్ని ఆ విధంగా పెనవేసుకుంటోందని చెప్పడంలో ఒక విధమైన ఊపిరాడని బంధం కనిపిస్తుంది.నగరం మరియు మనిషి విడదీయలేనంతగా కలిసిపోయారు.కానీ,ఆ కలయికలో మనిషి తన ఉనికిని లేదా స్వేచ్ఛను కోల్పోతున్నాడనే హెచ్చరిక ఇందులో ఉంది.సముద్రం,ఈత, మునిగిపోవడం వంటి పదాలు అస్తిత్వ వేదనను సూచిస్తాయి.నగరం అనే సముద్రంలో మనిషి నిరంతరం ప్రవాహాన్ని ఎదురీతున్నాడు. ఒకవేళ ఈత కొట్టడం ఆపేస్తే,నగర వేగంతో పోటీ పడకపోతే మునిగిపోవడం ఖాయం.ఇది పరుగుల జీవనంలోని ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది.
ఈ కవితా పంక్తుల్లో నగరం ఒక ఆత్మీయ నేస్తంలా కాకుండా, మనిషిని తన కౌగిలిలో బంధించి తనలో లీనం చేసుకునే ఒక మాయావిలా కనిపిస్తుంది.ప్రకృతికి దూరమై కాంక్రీట్ వనాల్లో చిక్కుకున్న మానవుని స్థితిని ఈ కవితా రూపం అద్దం పడుతోంది.
ఈ కవితా పంక్తుల్లో కవి నగరాన్ని ఒక అజ్ఞాత శక్తిగా,ఒక తప్పించుకోలేని వాస్తవంగా చిత్రిస్తాడు.నగరంలో జీవిస్తూ నగరాన్ని దూరం పెట్టాలనుకోవడం,అసాధ్యమని,కవిత స్పష్టంగా తెలియజేస్తుంది.
ఈ కవితా పంక్తుల్లో నగరీకరణ మరియు ప్రకృతి మధ్య జరిగే సంఘర్షణను ఒక ఉక్కరిబిక్కిరి చేసే ఆలింగనాన్ని ఎంతో గాఢంగా వర్ణిస్తున్నాయి.నగరాన్ని ఉదాహరణగా తీసుకుని ఆధునిక నగర తీరుతెన్నులను కవి వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“ఊరే కాదు నగరం కూడా/మనిషిలో తల్లి వేర్లు దించుతుంది/ ఇది నగరాన్ని పూర్తిగా తిరస్కరించకుండా,అది కూడా మనిషికి ఒక రకమైన మాతృభూమి అవుతుందన్న భావన. ఊరు మాత్రమే కాదు,నగరం కూడా మనిషిని పోషిస్తుంది, రూపుదిద్దుతుంది.నగరం – తల్లి ప్రతి రూపం.ఇందులో కవి ఒక గాఢమైన భావ సత్యాన్ని వ్యక్తం చేస్తాడు.ఊరు అంటే సహజత్వం,మూలాలు,అనుబంధం.కానీ,నగరం మనిషి అంతరంగంలో వేర్లు పెడుతుందని చెప్పడం ద్వారా కవి నగరాన్ని పరాయిగా కాక,తన అంతరంగంలో భాగంగా చూపిస్తాడు.ఇక్కడ తల్లి వేర్లు అనే రూపకం నగరాన్ని పోషికశక్తిగా,ఆప్యాయతగా చిత్రిస్తుంది.సాధారణంగా తల్లి వేర్లు లేదా మూలాలు అంటే మనకు పల్లెటూరు గుర్తొస్తుంది. కానీ,కవి ఇక్కడ ఊరే కాదు,నగరం కూడా మనిషిలో తల్లి వేర్లు దించుతుంది అంటూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.
“అడవులు,నదులు మాయమయి/నగరాలు వెలిశాయి కదా../అనే కవితా పంక్తిలో ఆధునిక నాగరికత,ప్రకృతిని ఎలా మింగేసిందో సూచన.ఇక్కడ మాయమయి అన్న పదం అభివృద్ధి వెనుక జరిగిన నష్టాన్ని,నిశ్శబ్దంగా గుర్తు చేస్తుంది. ఇది ఆరోపణ కాదు ; ఒక వాస్తవ స్వీకారం.
“మరి నగరం మొలిచిన నేలలో/తడి హృదయాలు మొలవవా?/ఇది అత్యంత మానవీయమైన ప్రశ్న.రాతి, సిమెంట్ మధ్య కూడా సున్నితమైన మనసులు,కారుణ్య హృదయాలు పుట్టలేవా?అన్న ఆశ ఇక్కడ వ్యక్తమవుతుంది. తడి హృదయాలు అన్న ప్రతీక.ప్రేమ,కరుణ,స్పందనకు సంకేతం.ఇది నగరంపై విమర్శ కాదు ; ఇది నగరాన్ని సమర్థించే అంతర్మథనం.రాతి కట్టడాల మధ్య కూడా సున్నితమైన హృదయాలు వికసిస్తాయని కవి విశ్వసిస్తున్నాడు. అడవులు,నదులు మాయమై నగరాలు వెలిసినా,ఆ నేల తన గుణాన్ని,తడిని కోల్పోదని కవి నమ్ముతున్నాడు.
“నగరానిది రాతి ముఖమే గానీ/హృదయం కూడా రాయేనా?/నగరానికి బయట కనిపించే కఠినత్వం,వేగం, నిర్దాక్షిణ్యం – ఇవి దాని ముఖం మాత్రమే కావచ్చు.కానీ,ఆ లోపల దాగి ఉన్న హృదయం కూడా అంతే కఠినమా?ఇది తీర్పు కాదు – ఒక ప్రశ్న.ఆ ప్రశ్ననే కవితా పంక్తులుగా మలచడం ఈ రచనలోని గొప్పతనం.నగరాన్ని శత్రువుగా కాదు,ఒక పెరిగిపోయిన పిల్లలాగే చూస్తుంది – దాని ముఖం కఠినమైనా, హృదయం ఇంకా మారే అవకాశం ఉందన్న విశ్వాసంతో నగరాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని కూల్చడమే,పొగడడమో కాదు – అది కూడా మనలాగే మారుతున్న ఒక జీవి అనే భావన ఈ కవితలో నిగూఢంగా వ్యక్తం అవుతుంది.ఇక్కడ కవి నగర బాహ్య కఠినత్వాన్ని, అంతర్గత మృదుత్వంతో పోలుస్తాడు.నగరం నిశ్శబ్దంగా కనిపించినా,అది అనుభూతులను దాచుకుంటుందనే భావం వ్యక్తమవుతోంది.రాతి కట్టడాల వెనుక రక్తం పంచుకున్న మనుషుల భావోద్వేగాలు ఉంటాయని,అందుకే నగరానిది రాతి ముఖమే కానీ రాతి హృదయం కాదని కవి వాదిస్తున్నాడు.
“నిద్ర రానప్పుడు/నగరాన్ని ఎదురుగా కూర్చోబెట్టుకుంటాను/ ఇది ఒక అద్భుతమైన చిత్రణ.నగరాన్ని ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడటం అంటే తనను తాను ఎదుర్కోవడం.నిద్రలేమి ఇక్కడ కేవలం శారీరక స్థితి కాదు ; అది ఆత్మ అప్రమత్తంగా ఉండే క్షణం.ఆ క్షణంలో కవి నగరాన్ని ఎదురుగా కూర్చోబెట్టడం అంటే తన అంతరంగంలోని నగరాన్ని ఎదుర్కోవడమే.నగరం ఇక బయట స్థలం కాకుండా – చర్చకు సిద్ధమైన ఒక శక్తివంతమైన స్థితిగా మారిపోయింది.
“నోరు విప్పదు గానీ/గుండెలు విప్పుతుంది/ఇక్కడ నగరం మాటలతో కాదు,అనుభూతులతో స్పందిస్తుంది.నగరం మాట్లాడదు.కానీ,దాని అనుభవాలు,గాయాలు,జ్ఞాపకాలు మన హృదయాన్ని తెరుస్తాయి‌.ఇది నగరపు మౌనభాష. శబ్దాల నగరం ఇక్కడ నిశ్శబ్దంగా మారడం ఒక విశేషం.ఈ కవితా పంక్తుల్లో నగరానికి,మనిషికి మధ్య ఉన్న ఏకాంత అనుబంధం కనిపిస్తుంది.పగటి వేళ ఉరుకులు పరుగులతో రొద చేసే నగరం,రాత్రివేళ మౌనంగా తన గుండెను విప్పుతుంది.అంటే నగరంలోని ప్రతి గల్లీ,ప్రతి ఇల్లు ఒక కథను, ఒక గాథను దాచుకుని ఉంటుందని అర్థం
అవుతుంది.నగరం నోరు విప్పి మాట్లాడక పోయినా,తనలోని మనుషుల కన్నీళ్లను,కష్టాలను కళ్ళకు కడుతుంది.
“కళ్ళలో నీళ్లతో/ఊరిని చూసిన కళ్ళతో నన్ను చూడమంటుంది/నగరం కవికి తన మూలాలను గుర్తు చేస్తుంది.ఊరు అనుభూతి,నగరం అనుభవం – ఈ రెండు ఒకే దృష్టిలో కలిసిపోతాయి.ఇక్కడ నగరానికి కన్నీళ్లు ఉన్నాయి ; అవి మనిషివి కావు – నగరపు కన్నీళ్లు. “ఊరిని చూసిన కళ్ళు అంటే మూలాలను,సహజత్వాన్ని, కోల్పోయిన అమాయకత్వాన్ని తడిమిన చూపు.నగరం కవిని తన కళ్ళతో – అంటే మనిషి మూలాల దృష్టితో – చూడమంటోంది.ఇదే నగరం తన కఠినత్వాన్ని వదిలి ; మానవత్వాన్ని ఆలింగనం చేసుకునే క్షణం.
“క్షణం కళ్ళు మూసుకొని నాలో/చూసుకుంటే/నేను నగరంలో వున్నాను/ఇది కవిత యొక్క తాత్విక శిఖరం.బయట నగరాన్ని చూడడం ఆపి,లోపలికి చూసినప్పుడు నగరం తనలోనే ఉన్నదని కవి గ్రహిస్తాడు.నగరం ఒక భౌగోళిక స్థలం మాత్రమే కాదు – అది మన మనస్సులో ఏర్పడిన జీవన విధానం,అలవాటు,భయం,ఆశ.ఈ కవితలో కవి చెప్పదలుచుకున్నది ఇదే – నగరాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు,ఎందుకంటే మనలోనే వేర్లు వేసుకుంది.అయితే అదే నగరం మనలో దాగి ఉన్న ఊరి జ్ఞాపకాలను,తడి హృదయాలను మళ్ళీ గుర్తు చేసి,మనల్ని మనమే చూసుకోమని ఆహ్వానిస్తుంది.ఇది నగరంపై తీర్పు కాదు – మనిషి ముందు పెట్టిన అద్దం.చాలా లోతుగా,మౌనంగా తాకే కవితా పంక్తులు.వ్యక్తికి నగరం బాహ్య ప్రపంచం మాత్రమే కాదు ; అది ఒక అంతర్గత అనుభూతి కూడా.నగరం మనిషిలో భాగమైపోయిందని,మనిషి నగరంలో ఒక అణువైపోయాడని ఈ కవితా పంక్తులు ప్రతిబింబిస్తున్నాయి. ఊరిని చూసిన అదే ఆలోచనతో నగరాన్ని కూడా చూడమని చెప్పడమే ఇందులోని మర్మం.ఈ కవిత నగరాన్ని ఒక యంత్రంగా చూడకుండా,ఒక జీవనదిగా,గాయపడిన హృదయంగా చిత్రించింది.అభివృద్ధి పేరిట ప్రకృతిని కోల్పోయినా,మానవత్వం అనే తడి నగరంలో ఇంకా సజీవంగానే ఉందని,ఈ కవితా పంక్తులు తెలుపుతున్నాయి.
నగరం బయట కాదు ; అది మనిషి అంతరంగంలోనే ఉంది. మనిషి – నగరం అనుబంధం విడదీయలేనిది.ఈ కవితలో నగరం రాతి ముఖం ఎవరైనా,తడి హృదయం కలిగి ఉంటుంది.ప్రకృతి వినాశం ఉన్నప్పటికి అంతర్ముఖ సంభాషణ
కొనసాగుతుంది.కవి నగరాన్ని విమర్శించడం లేదు ; అతను దానిలోని మానవత్వాన్ని వెతుకుతున్నాడు.చివరికి ఈ కవిత మనకు చెబుతుంది – నగరం మన బయట కట్టడాల్లో కాదు,మన లోపలే నిర్మితమవుతుంది.
ఈ కవితలో నగరం ఒక భౌతిక స్థలం కాదు ; అది ఒక జీవి,ఒక తల్లి,ఒక అంతర్ముఖ ప్రతిబింబం.కవి నగరాన్ని రాతి గోడల సముదాయం నుంచి తీసుకువచ్చి మనసు కలిగిన సజీవసత్త్వంగా నిలబెడతాడు.
ఈ కవితా పంక్తులు నగరం పట్ల ఉన్న సాధారణ దృక్పథాన్ని – అది కేవలం కాంక్రీట్ జంగిల్ అనే భావనను – పటాపంచలు చేస్తూ దానికి ఆర్ద్రతను మరియు ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని ఆపాదిస్తున్నాయి.
“నగర కీకారణ్యంలో/గిరికీలు కొట్టే పక్షిలా వున్నాను/ఇక్కడ నగరం అడవిగా మారింది.అది సహజ అడవి కాదు ; ఇది కీకారణ్యం శబ్దం,వేగం,అయోమయం,గందరగోళం నిండిన మానవ నిర్మిత అడవి.ఆ అడవిలో కవి ఒక పక్షి – పక్షి స్వేచ్ఛకు ప్రతీక అయినా,ఇక్కడ అది దిశలేని గిరికీలు కొడుతోంది.ఎగరడం ఉంది,కానీ దిశ లేదు.ఇది నగర జీవితం ఇచ్చే తప్పుడు స్వేచ్ఛను సూచిస్తుంది.కవి తన స్థితిని తెలియజేస్తాడు.కీకారణ్యం అంటే దట్టమైన అరణ్యం.కానీ, ఇక్కడ అది భవనాల అరణ్యం.ఆ అరణ్యంలో తల తిరిగే పక్షిలా తన అస్థిరత,అయోమయం,దిశా హీనత వ్యక్తమవుతుంది.నగరం అతనికి ఆశ్రయం కాదు ; గిరికిలు కొట్టే స్థితి మాత్రమే.ఈ కవితా పంక్తులలో నగరంలోని గందరగోళం,దారి తెలియనితనం స్పష్టంగా కనిపిస్తాయి. నగరం ఒక అడవిలా మారినప్పుడు,మనిషి తన ఉనికి కోసం కొట్టుమిట్టాడే పక్షిలా మిగిలిపోతున్నాడు.
“నగరం నాలో ఉరవళ్ళు పెట్టే/నదిలా ఇంకిపోయి వుంది/ఈ కవితా పంక్తుల్లో నగరం బాహ్య వాస్తవం నుంచి అంతరంగ ప్రవాహంగా మారుతుంది.అది బయట ఉన్న నిర్మాణం కాదు – అతని రక్తనాళాల్లో పరుగులు తీసే ప్రవాహం.నగరం అతనిలో కలిసిపోయింది.అతను నగరంలో లేడు ; నగరం అతనిలో ఉంది.ఇది కవిత యొక్క భావాత్మక మలుపు.నగరం ఇక బయట లేదు ; అది కవిలోకి నదిలా ఇంకిపోయింది.నది ప్రవాహానికి,జీవానికి సంకేతం.కానీ ఇక్కడ అది ఉరవళ్ళు పెట్టుతూ ప్రవహిస్తుంది – అంటే నగరం కేవలం భారమే కాదు,శక్తి కూడా.ఆ శక్తి కవిలో కలిసి పోయింది ; విడదీయలేనంతగా.ఈ రెండు కవితా పంక్తుల మధ్య ఒక సూక్ష్మ విరోధం కనిపిస్తుంది – ఒకవైపు దిశలేని పక్షి,మరో వైపు ఉగ్ర ప్రవాహంతో పారే నది.అంటే బయట జీవితం అయోమయంగా ఉన్నా, లోపల నగరం ఒక బలమైన ప్రవాహంలా స్థిరపడింది.
ఈ కవితా పంక్తులు నగరాన్ని శత్రువుగానో, ఆశగానో చూపులు.అది మన జీవితంలో అనివార్యమైన భాగమని అంగీకరిస్తాయి.నగరం మనల్ని గిరికీలు కొట్టే పక్షుల్లా మార్చుతుంది.అదే సమయంలో మనలో ప్రవహించే నదిలా కూడా మారుతుంది.ఇది నగరంలో జరిగే పోరాటం కాదు ; నగరంతో కలిసిపోయిన అస్తిత్వం.నగరం కేవలం బయట కనిపించే భౌతిక రూపం మాత్రమే కాదు.అది మనిషి ఆలోచనల్లో,రక్తంలో భాగమై పోయిందని కవి భావం.
“నగరం నా ఎదురుగా కూర్చొని/తన మరో చెంప చూయించింది/ఇది అద్భుతమైన రూపకం.సాధారణంగా మరో చెంప చూపించడం క్షమ,సహనం,అహింసకు సంకేతంగా భావిస్తారు.ఇక్కడ నగరం తనపై వచ్చిన నిందల్ని,దెబ్బల్ని అంగీకరిస్తూనే – తన ముఖానికి ఇంకొక చెంప కూడా ఉందని చూపిస్తోంది.కవి – నగరం మధ్య ఉన్న విరోధ సంబంధం ఇక్కడ సంభాషణగా మారింది.ఇక్కడ నగరం ఒక మనిషిగా రూపాంతరం చెందుతుంది.తన మరో చెంపను చూపించడం అంటే తన రెండో వైపు – కనిపించని అంతరంగం,మృదుత్వం – బయటపడటం.నగరం కేవలం కాంక్రీట్ జంగిల్ మాత్రమే కాదు ; ఇది అనుభవాల గాయాలు, స్మృతి గీతాలు మోసుకెళ్ళే జీవి.నగరం తన మరో చెంపను చూపించడం అంటే మనం చూసే పైపై మెరుపులు మాత్రమే కాదు,దాని వెనుక ఉన్న ఆవేదనను,వాస్తవాలను చూడమని చెప్పడమే.
“తన మీద పారిన కొన్ని తీగలకి/బతికిన కలలు కొన్ని బహుకరించింది/నగరంపై పారిన తీగలు అంటే విద్యుత్ తీగలు,ఇంటర్నెట్ కేబుల్స్ వంటి ఆధునిక సౌకర్యాలు.వాటి నీడన ఎన్ని వేల మంది కలలు సాకారమయ్యాయో,ఎన్ని జీవితాలు నిలబడ్డాయో నగరం గుర్తు చేస్తోంది.అనేక మందికి ఆశ్రయమిచ్చిన ఒడిగా అది తన విశాల హృదయాన్ని చూపిస్తుంది.నగరంలో పేదరికం,వలసలు,శ్రమ, అణిచివేతలు,కలల భారాలు – ఇవన్నీ ఉన్నాయి.అవి నగరాన్ని నలిపినా,అదే నగరం బతికిన కలల్ని తిరిగి మనుషులకు బహుకరిస్తోంది.ఇది నగరం ఇచ్చే అవకాశాలపై ఒక మృదువైన అంగీకారం.అందరికీ అవకాశాలు సమానంగా లభించకపోయినా,అవి పూర్తిగా లేనివి కావు అన్న భావన ఇందులో దాగి ఉంది.ఈ తీగలు వలస వచ్చిన ప్రజల ఆశలకు ప్రతీకలుగా భావించవచ్చు.వాటికి బతికిన కలలు ఇవ్వడం ద్వారా నగరం ఒక అవకాశాల వేదికగా కనిపిస్తుంది.ఇక్కడ ఆశలు చనిపోవు ; పోరాడి నిలబడతాయి.
“కలలు కనే అనేక కళ్ళకి చోటిచ్చిన/తన ఒడి చూయించింది/ ఇక్కడ నగరం ఒక తల్లిలా మారుతుంది.’ఒడి’ అంటే ఆశ్రయం.భద్రత,సహనాన్ని సూచిస్తుంది.వేలాది ఆశావహ కళ్ళకు ఆశ్రయం ఇచ్చే ఒడిగా నగరం కనిపిస్తుంది.ఇది దయగల రూపం మాత్రమే కాదు.అనేక కళ్ళు,అనేక కథలు, అనేక ఆశలు,అనేక విఫలాలు వాటన్నింటికీ చోటిచ్చే విస్తీర్ణమే నగరం అని కవి ఇక్కడ అంగీకరిస్తున్నాడు.ఇక నగరం కఠినమైన ముఖం మాత్రమే కాదు ; తన గాయాలను,తన ఉదారతను చూపించే పరిపక్వ సత్తాగా కనిపిస్తుంది.ఇంతకు ముందు కవితా పంక్తుల్లో నగరం భయంగా కనిపించింది. తర్వాత అది ఒక ప్రశ్నగా మారింది.కానీ ఇక్కడ మాత్రం నగరం సహజీవనానికి సిద్ధమై మాతృ రూపంగా నిలిచింది. నగరాన్ని పూర్తిగా చూడాలనే భావనతో కవిత చాలా నిశ్శబ్దంగా,హృదయాన్ని తాకేలా ముగుస్తుంది.
“అభివృద్ధి అనకొండ/తన పిల్లను నోట కరుచుకుని/ చుట్టుకుంటుంటే/అరుస్తున్న ఆవులా అనిపించింది/ అభివృద్ధిని అనకొండగా పోల్చడం అత్యంత శక్తివంతమైన, కలవరపెట్టే రూపకం.సాధారణంగా అభివృద్ధిని పిల్లలను పోషించే తల్లిగా చెబుతారు.కానీ ఇక్కడ అది తన పిల్లలను నోట కరుచుకుని చుట్టుకునే అనకొండగా మారింది.అభివృద్ధి పేరిట మనుషులే – శ్రామికులు,పేదలు,వలసవాదులు, బాధితులు – బలై పోతున్నారు అనే తీవ్ర విమర్శ ఇందులో ఉంది.ఇది కేవలం పెరుగుదల మాత్రమే కాదు ; మింగే శక్తిని సూచిస్తుంది.తన పిల్లలను నోట కరుచుకుని చుట్టుకునే దృశ్యం అభివృద్ధి పేరిట జరిగే దమనాన్ని సూచిస్తుంది. పురోగతి అనిపించేది కొన్ని సార్లు వినాశమే కావచ్చు. ‘అరుస్తున్న ఆవులా అనిపించింది’ అన్న ఉపమానం అద్భుతంగా పని చేస్తుంది.ఇక్కడ అనకొండ బలవంతం, క్రూరత్వానికి సంకేతం.ఆవు నిస్సహాయతకు,మూగ వేదనకు ప్రతీక.అభివృద్ధి ప్రక్రియలో బాధపడుతున్న వారి అరుపులు బయటకు వినిపించవు.ఆ మూగ అరుపును కవి తనలోకి తీసుకుంటాడు.అభివృద్ధి అనకొండలా విస్తరిస్తూ చుట్టుపక్కల ఉన్న ప్రతి దాన్ని మింగేస్తోంది.తన పిల్లను,ప్రకృతిని కాపాడుకోలేక అనకొండ నోటికి చిక్కి విలవిలలాడుతున్న ఆవులా నగరం కనిపిస్తోంది.ఇది అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని,మనుషుల నిస్సహాయతను స్పష్టంగా చూపిస్తోంది.ఈ ఉపమానం నగరంలోని బాధను స్పష్టంగా వినిపిస్తుంది.అది మూగ అరుపు కాదు ; వినిపించని అరుపు కాదు ; శబ్దాల మధ్య నలిగే కేక అని భావాలు తెలుపుతున్నాయి.
“మిరుమిట్లు గొలిపే తన కళ్ళ వెనుక/జాలి గొలిపే మూగ కథలెన్నో మూట/విప్పింది/ ఇక్కడ అభివృద్ధి కళ్ళలో మెరుపు ఉంది – ఆకర్షణ,ప్రగతికి సంబంధించిన గణాంకాలు,భావనలు ఉన్నాయి.అవి చూసి మనం మోహించి పోతాం.కానీ,ఆ మెరుపు వెనుక నిజం దాగి ఉంది.అభివృద్ధి వెనుక మాటలేని బాధల మూటలు విప్పబడుతున్నాయి – నిరుద్యోగం,శ్రమ దోపిడీ,గుర్తింపు లేకపోవడం ఈ కథలో మూగగా ఉంటాయి. ఎందుకంటే వాటికి వేదిక లేదు.ఈ కవిత అభివృద్ధిని తిరస్కరించదు ; కానీ దాని క్రూర రూపాన్ని బట్టబయలు చేస్తుంది.ఇది ఒక ప్రశ్న వేస్తుంది – అభివృద్ధి ఎవరికోసం?దాని ధర ఎవరు చెల్లిస్తున్నారు?ఇక్కడ మానవత్వం ఒక స్పష్టమైన నైతిక స్థానంగా మారింది. మెరుపు వెనుక చీకట్లు,ప్రకాశం వెనుక కష్టాలు ఉన్నాయి.నగరం వెలుగులో మెరిసినా,దాని వెనుక పేదరికం,వలస బాట,శ్రమ,నిరాశ వంటి మూగ కథలు దాగి ఉంటాయి.కవి వాటిని విప్పి చూపించాడు.
ఈ కవితా పంక్తులు నగరాన్ని ఒక ద్వంద్వ స్వరూపంగా చిత్రిస్తాయి.నగరం కవికి శత్రువు కాదు,స్నేహితుడు కూడా కాదు ; అది అతనిలో సంభాషించేది,అతన్ని మలిచేది, అతనిలోనే ఇంకిపోయిన జీవి.కవి చూపులో నగరం ఒక అద్దంలా ఉంటుంది – అందులో మన సమాజం,మన కలలు,మన విరుద్ధతలు స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.
ఈ కవితా పంక్తుల్లో ప్రధాన శక్తి ప్రతీకల ఘనత్వం.అవి నగర అనుభవాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తాయి.అందు వల్ల ఈ కవిత ఒక వ్యక్తిగత అనుభూతి మాత్రమే కాక, ఆధునిక జీవనంపై ఒక సాక్ష్యంగా నిలుస్తుంది.నగరం రాత్రివేళ విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలుపుతుంది.కానీ,ఆ కాంతి వెనుక జాలి గొలిపే మూగ కథలు ఎన్నో ఉన్నాయి.ఫుట్ పాత్ ల పై బతుకులు,మురికివాడల కష్టాలు, ఒంటరితనం – ఇలాంటి ఎన్నో గాధలను నగరం తనలో మూటగట్టుకుని ఉంది.
కవి నగరాన్ని ఒక రాతి కట్టడంలా కాకుండా, ఒక జీవచ్చవంలా లేదా ఒక మూగజీవిలా చూస్తున్నారు.అది తన పిల్లలను,ప్రజలను సాకుతోంది.అదే సమయంలో ‘అభివృద్ధి’ అనే రక్కసి చేతిలో చిక్కి శల్యమవుతోంది.నగరంలోని వైభవాన్ని చూసి మురిసిపోయే కళ్ళకు,దాని వెనుక ఉన్న కన్నీటి కథలను కూడా చూడమని ఈ కవిత హెచ్చరిస్తోంది. నగర జీవనంలోని అభివృద్ధి – విధ్వంసం అనే ద్వంద్వ వైఖరిని ఈ కవితా పంక్తులు అద్భుతంగా వ్యక్తం చేస్తున్నాయి.
ఈ కవితా పంక్తుల్లో నగరం ఒక స్థలం మాత్రమే కాదు – ఒక జీవి,విరుద్దాల సమాహారం.కవి తన అనుభవాన్ని ప్రతీకల రూపంలో చిత్రిస్తూ,నగరాన్ని అంతరంగ – బాహ్య ప్రపంచాల సంగమంగా చూపించాడు.ఈ కవితా పంక్తులు నగరాన్ని ఒక సంక్లిష్టమైన దృశ్య కావ్యంగా,వైరుధ్యాల సమాహారంగా ఆవిష్కరించాయి.అభివృద్ధి వెనుక దాగి ఉన్న మూగ వేదనను కవి అత్యంత ప్రతిభావంతంగా వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
“శతాబ్దాలు ఒలకని/కన్నీటి చుక్క నగరం/నగరానికి ఉన్న సుదీర్ఘ చరిత్రలో అణిచివేతలు,మూగవేదనలు దాగి ఉన్నాయి.శతాబ్దాలుగా పోగైన బాధ, వలసలు, యుద్ధాలు,ఆకలి,శ్రమ – ఇవన్నీ ఒక కన్నీటి చుక్కగా సంక్షిప్తమవుతాయి.ఆ చుక్కలో చీలికలు ఉన్నాయి ; అంటే అది పూర్తిగా వెలిబుచ్చబడదు.నగర చరిత్ర నిశ్శబ్దంగా గుండెల్లోనే మిగులుతుంది.ఇక్కడ నగరం కాలాన్ని మోసుకుంటూ వచ్చిన వేదనగా రూపుదిద్దుకుంటుంది. ఒలకని కన్నీటి చుక్క అంటే – ఎప్పుడు బయటికి కారని, లోపలే నిలిచిపోయిన బాధ.ఇది నగర చరిత్రలోని నిరంతర శ్రమ,అణిచివేత,అసమానతలకు సంకేతంగా నిలుస్తుంది.
“జీవితం వెనుక పరిగెత్త లేక/కూలిన ఆశల గూడు నగరం/ ఇక్కడ నగరం ఒక విఫలమైన కలల సమాహారం.జీవితం వేగంగా పరిగెత్తుతుంటే దాన్ని అందుకోలేకపోవడం,ఆశల గూడు కూలిపోవడం – ఇది ఆధునిక మనిషి అసమర్థతను సూచిస్తాయి.’గూడు’ అనేది భద్రతకు,ఆశ్రయానికి ప్రతీక.అది కూలిపోవడం అంటే భవిష్యత్తు చీలి పోవడమే.నగరాన్ని సాధారణంగా ఆశల గూడు అంటారు.కానీ,ఇక్కడ అది కూలి పోయిన ఆశల గూడు.జీవితం ముందుకు పరిగెత్తుతుంటే దాన్ని అందుకోలేక వెనుకబడిపోయిన వారి కథలు ఈ కవితా పంక్తుల్లో దాగి ఉన్నాయి.నగరం అంటే కేవలం భవంతులు మాత్రమే కావు ; అవి ఎందరో మనుషుల కూలిపోయిన ఆశల గూడు.నిరంతరం పరుగులు తీసే నగర జీవితంలో ఆ పరుగును అందుకోలేక వెనుకబడిపోయిన సామాన్యుల నిస్సహాయతను కవి ఎంతో ఆర్ద్రంగా చిత్రించారు.
“ రేయింబవళ్ళు పరిగెత్తి పరిగెత్తి/ అహోరాత్రులు మేలుకొని మేలుకొని/అలసి పోయిన నగరం/ఈ పునరుక్తులు నగర జీవితం యొక్క యాంత్రికతను,నిరంతర శ్రమను స్పష్టంగా అనుభూతి పరుస్తాయి.నగరం నిద్రపోదు’ అనే భావనను ఇక్కడ తలకిందులు చేస్తూ,అది కూడా అలసిపోతుందనే మానవీకరణ ఈ కవితలో అద్భుతంగా ప్రతిఫలిస్తుంది.నగరం నిరంతర కదలికలో ఉంటుంది.అది ఎప్పుడూ నిద్రపోదని మనం అనుకుంటాం.కానీ,ఈ కవితలో మాత్రం నగరం అలసి పోయినట్టుగా చూపబడింది.ఇది ఒక అరుదైన దృశ్యం. సాధారణంగా మనిషి అలసిపోతాడు ; అయితే ఇక్కడ నగరమే అలసిపోవడం ద్వారా కవి నగరాన్ని మానవీకరించాడు.పగలు,రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం శ్రమించే నగరానికి కూడా అలసట ఉంటుందని కవి సూచిస్తున్నాడు..
“అహో రాత్రులు మేలుకొని మేలుకొని అలసి పోయిన నగరం” – ఇది కేవలం భౌతికమైన అలసట మాత్రమే కాదు. యాంత్రికమైన జీవనంలో కలిగే అంతర్గత విసుగును కూడా సూచిస్తుంది.నగరం తన అనేక కథలను వినిపించి,చివరకు కవి అంతరంగంలో నిద్రకు ఉపక్రమించడం,నగరం మరియు మనిషి మధ్య ఉన్న విడదీయలేని ఆత్మీయ బంధానికి సంకేతంగా నిలుస్తుంది.
“తన కతలు చెపుతూ చెపుతూ/అలాగే నాలో నిద్రకు ఒరిగింది/నగరం తన కథల్ని చెప్పుకుంటూ నిద్రపోవడం అంటే – కవి ఆ కథలకు ఆశ్రయంగా,సాక్షిగా మారాడని సూచిస్తుంది. ఇది కవి – నగరం మధ్య ఏర్పడిన అత్యంత సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది.నగరం కవి అంతరంగంలో ఒదిగిపోతుంది.అది బయట వినిపించే శబ్దం కాదు ; లోపల చెప్పుకునే కథ.ఆ కథల్లో వేదన ఉంది,అనుభవం ఉంది,మౌనం ఉంది.చివరకు నగరం కవి గుండెల్లో నిద్రపోతుంది.కానీ ఈ నిద్ర ద్వంద్వార్థకమైనది.
“ఏ పాపమెరుగని పసిపాప లాగో.. అనే ఉపమానం అమాయకత్వాన్ని,నిర్దోషిత్వాన్ని వ్యక్తం చేస్తుంది.నగరం తన క్రూరత్వాన్ని విడిచి ఒక చిన్నారి రూపంలో కనిపిస్తున్నట్లుగా కవి భావాన్ని వ్యక్తపరుస్తాడు.ఇదే కవితలోని కరుణ.
కవి ఉపయోగించిన ఉపమానాలు అత్యంత శక్తివంతమైనవి. నిద్రపోతున్నప్పుడు నగరం ఏ పాపమెరుగని పసిపాపలా నిశ్శబ్దంగా కనిపిస్తుంది.పగటి పూట కనిపించే రొద, కపటం ఏవీ లేని స్థితి అది.
“కడుపు నిండిన క్రూర మృగంలాగో../
కడుపు నిండిన క్రూర మృగంలాగానే నగరం కూడా ఒక ప్రమాదకరమైన శక్తి.కడుపు నిండినా దాని క్రూరత్వం మాయమవదు ; అది దాగి ఉన్న హింసగా ఉంటుంది.అదే సమయంలో నగరం ఒక క్రూర మృగంలా అనిపిస్తుంది.ఎందరో మనుషుల శ్రమను,కలలను,జీవితాలను మింగేసి కడుపు నింపుకొని విశ్రాంతి తీసుకుంటున్న రాక్షసిలా నగరాన్ని చిత్రించడం ఒక విశేషం.ఈ కవిత నగరాన్ని ఒక జీవమున్న ప్రాణిగా దర్శిస్తుంది.అది ఒక వైపు బాధితురాలైన పసిపాపలా కనిపిస్తే.మరో వైపు బాధించే క్రూర మృగంలా కూడా కనిపిస్తుంది.మనిషి తన ఉనికి కోసం నగరాన్ని ఆశ్రయిస్తాడు ; కానీ నగరం మాత్రం మనిషి అంతరాత్మను ఆశ్రయిస్తుందని కవి చెప్పిన తీరు అత్యున్నత సాహిత్య విలువలతో కూడి ఉంది.నగరానికి ఉన్న ఈ రెండు చిత్రాలు – పసిపాప మరియు క్రూర మృగం – కలిపి నగరపు అసలు స్వరూపాన్ని చూపిస్తాయి. నగరం పూర్తిగా అమాయకం కాదు,పూర్తిగా క్రూరం కాదు ; ఈ రెండూ కలిసిన ఒక సంక్లిష్ట జీవి.
“నగరం నాలో నిద్రపోతోంది/అనే కవితా పంక్తి లోతైన భావాన్ని మోసుకెళ్తుంది.నగరం బయట ఎక్కడో ఉన్న స్థలం కాదు ; కవిలోనే జీవిస్తోంది.ఈ భావన ద్వారా సమాజం మన వెలుపల మాత్రమే కాకుండా మన అంతరంగంలోనూ నివసిస్తుందని కవి సూచిస్తున్నాడు.మన కలలు,మన దౌర్పాల్యాలు,మన అమాయకత్వం,మన క్రూరత్వం – ఇవన్నీ కలిసే నగరంగా రూపుదిద్దుకుంటాయి.ఈ కవితలో నగరం చరిత్రలో పేరుకున్న కన్నీటి చరిత్ర,విఫలమైన ఆశల నిశ్శబ్దం, అమాయకత్వం మరియు క్రూరత్వం కలిసి ఏర్పడిన ఒక సంక్లిష్ట అనుభూతిగా దర్శనమిస్తుంది.కవి నగరాన్ని కేవలం విమర్శించే స్థాయిలో ఆగిపోకుండా,దానిని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.చివరికి నగరం ఒక బాహ్య వాస్తవం మాత్రమే కాదు ; అది మన అంతరంగంలో ప్రతిబింబించే ఒక గొప్ప అనుభూతిగా నిలుస్తుంది.అందువల్ల ఈ కవిత ఆధునిక జీవనంలోని విరుద్ధతలను,మృదువైన భావుకతతో కానీ, గాఢమైన అంతర్దృష్టితో ఆవిష్కరించిన సాహిత్య ప్రకటనగా నిలుస్తుంది.
ఈ కవితా పంక్తుల్లో నగరం ఒక విరుద్ధ స్వభావాల ప్రతిరూపంగా ప్రత్యక్షమవుతుంది – ఒక క్షణంలో కన్నీటి చుక్కగా,మరొక క్షణంలో క్రూర మృగంగా. కవి దృష్టిలో నగరం ఒక స్థిర వస్తువు కాదు కాలం,కష్టం,కలలు,పోరాటాలు, క్రూరత్వం – ఇవన్నీ కలిసి రూపుదిద్దుకున్న ఒక సజీవసత్వం.అలా బయట ఉన్న నగరం క్రమంగా అంతరంగంలోకి చేరి,అలసటతో,గాయాలతో చివరికి కవిలోనే నిద్రపోయే జీవిగా మారుతుంది.ఈ కవితా పంక్తులు నగర జీవితంలోని అలసటను,వైరుధ్యాన్ని, చివరికి దానికి దొరికే ప్రశాంతతను అత్యంత సున్నితమైన భావుకతతో ఆవిష్కరిస్తాయి. “నాలో నిద్రపోతున్న నగరం” అనే అందమైన కవితను అందించిన కవి పి.శ్రీనివాస గౌడ్ ను అభినందిస్తున్నాను.వారి కలం నుండి ఇలాగే మరిన్నో సుగంధభరితమైన కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆపిల్ నుంచి ఆకాశం దాకా

by Dr. Thanda Harish March 19, 2026
written by Dr. Thanda Harish

అప్పుడెప్పుడో
న్యూటన్ నాలోకి విసిరిన
ఆపిల్ పండే
ఇవాళ కవిత్వమై
మీ ముందుకొచ్చింది

చిక్కులు చిక్కులుగా కనిపించే
ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం
చిందర వందరవుతున్న
ఈ జీవితాన్ని
అర్థం చేసుకోడానికో
గొప్ప వరంలా దొరికింది

సూర్యుడు,గ్రహాలు
భూమి,చంద్రుడు
ఇవన్నీ
విశ్వమంతా ఒక్కటేనన్న
నినాదాన్ని
నిరూపిస్తున్నవి

తెల్లని కాగితం మీద
అక్షరాలను అందంగా
అచ్చొత్తగలుగుతున్నామంటే
కారణం తెలిసిందేగా

ప్రకృతి
పర్వతాలు
లోయలు
పచ్చని చిగుర్లన్నింటి మీద కురిసే
గోళాకార చినుకుల్లో కూడా
సైన్స్ దాగుందన్న విషయం
తెలియనిదా

గుండెను తీసి గుండెను పెట్టే
రోజులొచ్చాయంటే
సంభ్రమాశ్చర్యం!
మనసును తీసి మనసును పెట్టే
రోజులు కూడా
భవిష్యత్తులో ఉండొచ్చేమో

చంద్రమండలం మీదికి అడుగుపెట్టి
అక్కడి మట్టిని ముద్దాడుతున్నామంటే
మనిషి మరో భూమిని
సృష్టించుకున్నాడనేగా

సైన్స్ ఎక్కడో లేదు
నీ,నా  పక్కనే ఉంది
నీ,నా వెంటే ఉంది
చేతిలో అందంగా
నిత్యం అలంకరింపబడే
సెల్ఫోన్ లా
ఎన్ని యుగాలైనా
నన్ను,నిన్ను వీడనంటుంది

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మహిళా దినోత్సవ సంబరాలు

by mayuukha March 19, 2026
written by mayuukha

08-03-2026

సాహితీ వేత్తల సమ్మేళనం

తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అకాడమీ తరఫున నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరము సభను ‘థీమ్’ ప్రకారంగా మూడు సదస్సులుగా విభజించి నిర్వహిస్తున్నామన్నారు. మొదటి సదస్సు “స్త్రీవాద సాహిత్యం దశ – దిశ” రెండవది ‘ఆధునిక యుగంలో స్త్రీల సాధికారత’ మూడవ సదస్సు ‘డిజిటల్ యుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ ఇలా మూడు సదస్సులు ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి అన్నారు. మొదటి సదస్సులో పాల్గొన్న జూపాక సుభద్ర మాట్లాడుతూ మహిళలు సాధికారికంగా స్వేచ్ఛగా ఉండాలి. భారతదేశంలో కొందరు మహిళలు అంటరాని కులం లాంటి ప్రాతిపదికనే మహిళా ఉనికి కొనసాగుతుంది. పెద్దపెద్ద కంపెనీలలో ఇప్పటికి ఉన్నత స్థానంలో ఇలాంటి మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఆ సంఖ్య పెరగాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆచార్య త్రివేణి మాట్లాడుతూ సమాజంలో స్త్రీలే సృష్టికి మూలం అన్న విషయాన్ని సమాజం మర్చిపోదు. ప్రస్తుతం సమాజంలో గృహింస వరకట్నాలు భ్రూణ హత్యలు లాంటి అనేక అంశాల నుండి స్త్రీలు బయటపడినప్పుడే సాధికారత సాధించినట్లు అవుతుందన్నారు. మరొక అతిథి షేఖ్ హసీనా మాట్లాడుతూ మాతృస్వాతంత్రం నుండి పితృస్వాతంత్ర వ్యవస్థ వచ్చింది. ఇందుకు కందుకూరి, రాజారామ్ మోహన్ రావు లాంటి మహనీయులు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. మరో కవయిత్రి శిలాలోలిత మాట్లాడుతూ మహిళా సాధికారత ఇంకా సాధించాల్సి ఉంది అన్నారు.దేవనపల్లి వీణావాణి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య అనంతరం స్త్రీల విద్య కోసం కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు. అట్టి వాళ్లలో స్త్రీల విద్యకోసమై కృషి చేర్చినవారిలో పురుషులే ముందున్నారని అన్నారు. సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో మహిళను ముందుకు తీసుకెళ్లాలని, అందులో వారికి రాజకీయ, ఆర్థిక రంగాలలో తగిన భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మహిళలు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రముఖ అనువాదకురాలు స్వాతి శ్రీపాద మాట్లాడుతూ విలువైన వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లే స్త్రీమూర్తులను కూడా సమాజం భద్రంగా చూసుకున్నప్పుడే స్త్రీల ఆత్మవిశ్వాసము పెంచిన వాళ్ళవుతారని, వారికి స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. మరోక కవయిత్రి గోగు శ్యామల మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ఎందరో మహనీయులు స్త్రీవాదాన్ని అనేక కోణాలలో ఆవిష్కరించారు. భారతదేశంలో స్త్రీలకు అనేక హక్కులను కల్పించారు. దీనితోపాటు దేశంలో అమ్మ అనే పాత్రకు గొప్ప స్థానం ఉంది. అంటూ అమ్మల యొక్క గొప్పతనాన్ని విశ్లేషించారు. కవయిత్రి శాంతి ప్రబోధ మాట్లాడుతూ అచ్చమాంబ కాలం నుండి స్త్రీ వాద సాహిత్యం ఉందన్నారు. గత కొంతకాలంగా ఈ సాహిత్యంలో మార్పు వచ్చిందన్నారు. రాజకీయ, ఆర్థిక, అస్తిత్వం కోసం, హక్కుల కోసం స్త్రీ సమస్యలపై పోరాటం జరిగిన విషయాలను తెలియజేశారు. బయటి ప్రపంచంలో గుర్తింపు కలిగిన ఎందరో మహిళలకు ఇంటి లోపల గుర్తింపు లేకపోవడం విచారమంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. రెండో సదస్సుగా జరిగిన ‘ఆధునిక యుగంలో స్త్రీల సాధికారత’ అంశంపై సమన్వయకర్తగా కాళోజీ అవార్డు గ్రహీత శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు పాల్గొన్నారు. ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన మహిళలు వారు సాధికారంగా సాధించిన అనేక విషయాలపై, సమాజ నిర్మాణంలో స్త్రీలకు సమాన అవకాశాలు కలిగి ఉండే మహిళా హక్కులపై, మహిళ విద్యా వ్యవస్థ పై చర్చ జరిగింది. ఈ సదస్సులో అనేక మంది మహిళలు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివరి సదస్సుగా కవయిత్రి ఉషారాణి అధ్యక్షతన ‘డిజిటల్ యుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. సదస్సుల అనంతరం నూతనంగా కవిత్వం రాస్తున్న నేటి వర్తమాన కవయిత్రులు, విద్యార్థినిలను ఆహ్వానించి వారితో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సగిలి సుధారాణి, సమ్మెట విజయ, అరుణ కీర్తి పతాక, సంధ్యా విప్లవ్, బండారు విజయ, పల్లా మాలతి, రంగరాజు పద్మజ, నస్త్రీన్ ఖాన్, జ్వలిత, సమ్మెట ఉమాదేవి, సీతాలక్ష్మి, సరిత సలీమాతో పాటు అనేకమంది వర్ధమాన కవయిత్రులు, తదితర సాహితీవేత్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అకాడమీ తరఫున మెమొంటో, శాల్వతో ఘనంగా సత్కరించారు.

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

రచయిత సమాజ బహిరంతరాలను శోధించాలి – లింగంపల్లి రామచంద్ర

by Aruna Dhulipala March 19, 2026
written by Aruna Dhulipala

ఆదర్శకవి, మహోపాధ్యాయ బిరుదాంకితులు, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, బహుగ్రంథకర్త డాక్టర్ లింగంపల్లి రామచంద్రగారితో మయూఖ ప్రతినిధి అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి

                                       *****************************************

“నా మాట పతనమవుతున్న జాతికి వెలుగు బాట, నా పాట మత్తులో తూగుతున్న వాళ్ళకి సంస్కరణ దీపిక” అంటూ తమ రచనా ధ్యేయాన్ని వివరించిన ప్రముఖ కవి, విమర్శకులు డా. లింగంపల్లి రామచంద్ర గారి జీవితవిశేషాలను, అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్🙏🏼 

1. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన మీ జననం, బాల్య విద్యాభ్యాసాలను గురించి చెప్పండి?

జ:   నమస్కారం అమ్మా! జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలంలో ప్రాచీన జనపదమైన ‘వెల్ది’ మా స్వగ్రామం. ఆదికవి ఆశ్రమస్థలి, పాండవ తాత్కాలిక విశ్రాంతి స్థలి. బౌద్ధాచార్య నాగార్జునుడు జన్మించింది ఇక్కడే. మాది సామాన్య రైతు కుటుంబం. మా తల్లిదండ్రులు చదువుకున్నవారు కారు. మా తండ్రి రత్నయ్య పరమ ధార్మికుడు. సంస్కార శ్రీమంతుడు. ఆయనకు రామాయణ, భారత విరాటపర్వం అంటే చాలా ఇష్టం. మా అమ్మ శ్రీలక్ష్మి.  సనాతనాచారాల పట్ల అమెకెంతో విశ్వాసం ఉండేది. మా గ్రామంలోని వివిధ కుటుంబాలలో నిర్వహింపబడే శుభకార్యాలన్నీ ఆమె నేతృత్వంలోనే సాగేవి. 
         నేను జనవరి 1, 1945లో జన్మించాను. నా ప్రాథమిక విద్య ‘వెల్ది’ లోనే సాగింది. మాధ్యమిక విద్య మా ఊరు సమీప గ్రామం, గురువర్యులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారి స్వస్థలమైన ఖిలా షాపురంలో మాధ్యమిక విద్య చదువుకున్నాను. హైస్కూలు విద్య 9వతరగతి నుండి 12వ తరగతి వరకు హన్మకొండ మల్టీపర్పస్ హైస్కూలులో చదివాను. వరంగల్ లోని  ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీలో తెలుగు నా ఐచ్ఛిక అంశం. ఆచార్య చలమచర్ల రంగాచార్యులు గారు, ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ గారు, ఆచార్య మడుపు కులశేఖర రావు గారు, ఆచార్య కోవెల సుప్రసన్నా చార్యులు గారు, ఆచార్య మాదిరాజు రంగారావు గారు, ఆచార్య పేర్వారం జగన్నాథం గారు, ఆచార్య వేణు ముద్దల నరసింహారెడ్డి (వేనరెడ్డి) గారలు నాకు గురువులు.  వారి బోధనలన్నీ సాహిత్య పాఠాలే. ఆ సమయంలోనే గురువర్యుల సలహాననుసరించి ‘భారతి’ పట్ల అభిరుచి పెంచుకోవడం జరిగింది. మా కళాశాలకు చేరువలో ఉన్న నక్కలగుట్ట వీధిలోనే కాళోజీ గారి స్వగృహం ఉండేది. అక్కడ ప్రతినెలా మిత్రమండలి కార్యక్రమాలు జరుగుతుండేవి. తెలుగునాట ప్రసిద్ధులైన కవిపండితులు వచ్చేవారు. వారందరి ప్రసంగాల వల్ల బాగా ప్రభావితుడనయ్యాను. కళాశాలలో నిర్వహింపబడే సాహిత్య కార్యక్రమాలలో ప్రథమ బహుమతులు నన్నే చేరేవి. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎక్స్ టర్నల్ లో ఎమ్.ఏ (తెలుగు) చదివాను. అక్కడే “శ్రీ రంగరాజు కేశవరావు – సాహిత్య పరిశీలన” అనే అంశాన్ని పరిశోధించి 1992 లో డాక్టరేట్ పట్టా పొందాను.

2. సరస్వతీ దేవి నెలకొన్నట్లుగా ఉన్న మీ కుటుంబ నేపథ్యం గురించి మా పాఠకులకు తెలపండి.

జ:  మేం నలుగురం అన్నదమ్ములం. అందరమూ ఉపాధ్యాయులమే. మా పెద్దన్న వెంకటప్పయ్యగారు అధ్యాపక వృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి ఆదర్శ నేతగా ప్రఖ్యాతి పొందారు. ఆయనకు భక్తి సాహిత్యం పట్ల చాలా అభిరుచి ఉండేది. అనేక గ్రంథాలు తీసుకొచ్చి భద్రపరిచేవారు. రోజూ భగవద్గీత చదివేవారు. అందులోని విశేషాలను పదుగురికి చెప్తుండేవారు. ఆ కాలంలో వెలువడుతుండే ఆంగ్ల మాసపత్రిక ‘భవానాస్ జర్నల్’ (Bhavana’s) గురించి కూడా చెప్పేవారు. సామాజికాంశాల పట్ల అభిమానం ఉండేది. సభలను ఉర్రూతలూగించగల చాతుర్యం ఆయన సొంతం. ఆయా పనులపై మా ఊరికి వచ్చేవాళ్ళందరికీ మా ఇంట్లోనే భోజన సౌకర్యాలు కల్పించేవారు. అందరితోనూ ఆత్మీయంగా మెలిగేవారు. దీర్ఘకాలం ఏకగ్రీవ సర్పంచ్ గా ప్రజలను ఆనందపరిచారు. రెండో అన్న వెంకట రామనర్సయ్య గారు ఉపాధ్యాయునిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కూడా భక్తి సాహిత్యమంటే మక్కువ ఎక్కువ నిరంతరం వాల్మీకి రామాయణం పఠించేవారు. అన్ని సబ్జెక్టులను విశేషంగా బోధించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఘన సన్మానం పొందారు. మహర్షిగా పేరు వహించారు. మూడో అన్న సత్యనారాయణ గారికి ఆంగ్ల భాషలో మంచి పట్టు ఉండేది. ఆ భాషలో స్వయంగా పాటలు కూర్చి ఆలపించేవారు. విద్యార్థులను బాగా ప్రభావితం చేసి పౌరసన్మానం పొందారు.

3. మీరు ఇంతటి సాహిత్యానురక్తులు కావడానికి మీకు కలిగిన ప్రేరణ, మీ గురువుల ప్రభావం ఎటువంటిది? 

జ:    ఖిలా షాపురం మాధ్యమిక పాఠశాలలో చదివేటప్పుడు గుండాల నరసింహారావుగారు అనే అధ్యాపకుడు ఉండేవారు. ఆయన కవి. మంచి నాటక రచయిత. విద్యార్థుల చేత ప్రదర్శింపజేసిన సొంత నాటకాల్లో నాకూ అవకాశం ఇచ్చేవారు. నా చేత ఆయన గేయాలు పాడించేవారు. అవి నన్ను బాగా అలరించేవి. వివిధ పోటీల్లో పాల్గొనేలా నన్ను ప్రోత్సహించి, విజేత అయినందుకు అభినందించేవారు. హన్మకొండ మల్టీపర్పస్ హైస్కూలులో చదివేటప్పుడు ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు గారు మాకు తెలుగు అధ్యాపకుడు. ఆయన అప్పుడే ‘ఛందో వికాసం’ రాసి తెలుగునాట ఎంతో గౌరవం పొందారు. చేతనావర్త కవులు నలుగురిలో ఒకరు. ఆయన నా పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపేవారు. వ్యాసరచనకు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో చదివేటప్పుడు నా గురువుల్లో ఒకరైన ఆచార్య పేర్వారం జగన్నాథం గారు నన్ను తమ హృదయానికి చేరువగా తీసికొని సలహాలనిస్తూ వచన కవిత్వం, సాహిత్య పరిచయాలు రాయిస్తుండేవారు. మరొక గురువు ఆచార్య వేనరెడ్డి గారు డా. సి.నారాయణరెడ్డి గారి సాహిత్య, సౌందర్య మాధుర్యాలను తెలుపుతూ సినారె గారి సాహిత్యం పట్ల గాఢమైన అభిరుచి కలిగించారు. సినారె గారి నాగార్జున సాగరం, దివ్వెల మువ్వలు, జలపాతం కావ్య సంపుటులు కొని అడపాదడపా చదువుతుండేవాడిని. ఒక పర్యాయం మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినారె గారు ‘కాకతీయ’ పద సంపుటి గురించి చేసిన ప్రసంగం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. తొలిసారి అప్పుడే ఆయనను చూశాను. ఈ ప్రేరణే అనంతర కాలంలో ‘సినారె కవితాలోకనం’, ‘సినారె వాక్కుకు వయసు లేదు – తత్వ విశ్లేషణ’ అనే రెండు గ్రంథాలు రాయడానికి దారితీసింది.
          ఆచార్య పేర్వారం జగన్నాథం గారు కాళోజీ గారికి, కుందుర్తి ఆంజనేయులు గారికి, వి. వి. యల్. నరసింహారావుగారికి నన్ను పరిచయం చేశారు. అది నాకు బాగా ఉపయోగపడింది. కాళోజీ గారి గురించి కొన్ని వ్యాసాలు రాశాను. హన్మకొండకు వెళ్లినప్పుడల్లా ఆయనను కలుస్తుండేవాడిని. నా పరిశోధనా గ్రంథం “శ్రీ రంగరాజు కేశవరావు సాహిత్యం- పరిశీలన” గ్రంథాన్ని ఆచార్య పేర్వారం జగన్నాథం గారి షష్ట్యబ్ది సందర్భంగా వారికి అంకితమిచ్చాను. ఈ గ్రంథాన్ని సినారె గారు ఆవిష్కరించారు. 1986లో పేర్వారం వారి పర్యవేక్షణలో జరిగిన ‘అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు’ అనే సదస్సులో నేను వ్యాఖ్యాతగా వ్యవహరించాను. 
       1967లో ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య గారు ‘మన పండితులు-కవులు-రచయితలు’ శీర్షికన వరంగల్ కవుల పరిచయాలను రాసి ‘జనధర్మ’ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. ఈ సమాచార సేకరణలో తెలంగాణ ప్రథమ కర్షక కవి గంగుల శాయిరెడ్డి గారిని సంపత్కుమారాచార్య గారు నాకు పరిచయం చేశారు. రెడ్డిగారితో ఏర్పడిన అనుబంధం వల్ల నా సాహితీ జీవితానికి ఎంతో మేలు జరిగింది. 
        ఇక్కడ మరొకరి గురించి చెప్పాలి. నా సాహితీ జీవితానికి తొలి ప్రేరకుడు డా. తిరునగరి గారు. 1972లో నేను ఉద్యోగరీత్యా గుండ్ల గూడెం గ్రామానికి వచ్చినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన నా కవితా గురువు అని చెప్పాలి.

4. తెలంగాణాలో ప్రౌఢ కవిగా పేరొందిన “శ్రీరంగరాజు కేశవరావు” గారి పేరు చాలామందికి తెలియదు. ఆయన మీద మీరు పరిశోధన చేసి సిద్ధాంతగ్రంథంవెలువరించారు. ఆయనను గురించి మా పాఠకులకు సంక్షిప్తంగా చెప్పండి.

జ:   శ్రీ కేశవరావు గారు (1835 – 1905) జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం వాస్తవ్యులు. గొప్ప పండితకవి. సంగీత విద్యా ధౌరేయుడు. జమీందారు అయినప్పటికీ సామాన్య ప్రజలతో మైత్రీ బంధుత్వం నెరపినవారు. మధుర గాయకుడు. సంస్కృతం, తెలుగు, అరబ్బీ, పార్శీ, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. గణితం జ్యోతిష శాస్త్రాల్లో విద్వాంసుడు. సంగీతం, ఖగోళం, చిత్రలేఖనం వంటి విద్యల్లో అగణిత వైదుష్యం కలవారు. వీరు పురాణం, కావ్యం, ప్రబంధం, యక్షగానం, శతకం, లఘు కావ్యం, కీర్తనం వంటి ప్రక్రియల్లో రసజ్ఞ జ్ఞేయమైన రచనలు చేశారు. ఈ మహాకవిని తొలుత సురవరం ప్రతాపరెడ్డి గారు తన గోలకొండ కవుల సంచికలో పరిచయం చేశారు. కేశవరాయకవి కృతుల్లో ఇంద్రద్యుమ్నీయం, అధ్యాత్మ రామాయణం, దాశరథి శతకం, లఘుకృతులు, ఆచ్చయినాయి. విక్రమాదిత్యం, హనుమద్విజయం అముద్రితాలు. రామాభ్యుదయం, లీలాపరిణయం, కల్కి పురాణం అలభ్యాలు. పార్శీ కవిత్వంలో నవాబును మెప్పించి, ‘కవిశిరోమణి’ బిరుదు పొందారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలతో సఖ్యంగా ఉండి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. తన సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి, ఎన్నో విలువైన గ్రంథాలను పొందుపరిచారు. భూమి కొలతలను పద్యంలో చెప్పడం ఆయన ప్రతిభకు నిదర్శనం.  అంతేకాదు ఆయనకున్న నాటక కళాభిమానం ప్రత్యేకమైనది. తాము స్వయంగా రచించిన హనుమద్విజయం యక్షగానాన్ని తమ దర్శకత్వంలో ప్రదర్శించేవారు. వీరి రచనలో అలంకార మాధుర్యం, రసపోషణ, భావుకత, వర్ణనలు అద్భుతంగా ఇమిడి ఆర్ద్రత మిళితమై చవులూరిస్తుంది. రావుగారి పద్య విద్యా నైపుణ్యానికి ‘ఇంద్రద్యుమ్నీయం’ లోని ఒక పద్యం ఉదాహరణగా చెప్తాను.
సీ. వర త్రివిక్రమ పాద వనజ నిర్గళితాభ్ర
           గంగాధునీ తోయ కణములనఁగ
     నభ సరి ద్విహరదున్నత తమో గందేభ
            కర గళచ్చీ కరోత్కరములనఁగఁ
     గృత లాస్యహరశిరః పతిత శీతగభస్తి
             బింబ సుధాబిందు బృంద మనఁగఁ
     గస్తూరికాలిప్త గగన సతీ వపుః 
              కలిత ముక్తాహార గణములనఁగ
తే:  సమయ శబర వరేణ్య సుశ్యామ గాత్ర
      క్లప్త మగు సంకు పూసల దీప్తి యనఁగ
      వెలసి తండోపతండమై వేల్పు త్రోవఁ
      బ్రబిలి చూపట్టె నక్షత్ర పంక్తి యపుడు
ఇంతటి గొప్ప పండితులు కేశవరావు గారు…అందువల్ల ఆయన మీద పరిశోధన చేశాను.

5. తెలంగాణ సాహిత్య అకాడెమీ వారి కోరికను అనుసరించి “జనగామ జిల్లా సాహిత్య చరిత్ర”ను రాస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలు ఎటువంటివి?

జ:   అవును. నిజానికది తెలంగాణ సాహిత్య అకాడెమీ కోరిక మేరకు రాయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల స్వీయ ప్రచురణగా ముద్రించడం జరిగింది.

6.వరంగల్ జిల్లా స్థాయిలో హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మీరు క్రీడారంగంలో ఎందుకు ముందుకు వెళ్లలేకపోయారు?

జ:   (నవ్వుతూ) నిజమే కానీ నాటకాల్లో నటించాలన్న అభిలాష ఎక్కువగా ఉండేది. కొన్ని నాటికలు, నాటకాల్లో నటించాను కూడా..అందుకే క్రీడారంగాన్ని పక్కకు పెట్టాను.

7. నాటకరంగంలో కూడా ముద్రవేసుకున్న మీకు నాటకాల పట్ల ఆసక్తి ఎలా కలిగింది? నాటకరంగానికి మీరు అందించిన సేవలు ఎటువంటివి?

జ:   పదేండ్ల బాల్యవయస్సు నుంచే మా గ్రామంలో ప్రదర్శింపబడే వీధి భాగోతాలు, భజనలు చూసేవాడిని. ఆ పాటలూ, సంభాషణలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ బృందాలతో ఊరూరు తిరిగేవాడిని. వేషం కట్టాలనే అభిలాష బాగా ఉండేది కానీ మా పెద్దలు అంగీకరించేవారు కాదు. ఖిలాషాపురం మాధ్యమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు జి. నరసింహారావు గారు అనే అధ్యాపకుడు గొప్ప నాటక రచయిత. ఆయన వల్ల నాటకాలు వేసే అవకాశం వచ్చింది. అట్లా నాటకా రంగంలో ప్రవేశించాను. హన్మకొండ హైస్కూల్లో చదువుతున్నప్పుడు నారాయణరావుగారు అనే ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయనకు నాటకాల రాయుడు అని పేరుండేది. ఆయన ప్రదర్శింపజేసే నాటికల్లో నాకు అవకాశం ఇచ్చేవారు. అక్కడ నాటక సంస్థల్లో ప్రదర్శించే నాటకాలు చూస్తుండేవాడిని. ముచెర్ల సత్యనారాయణ, రుక్మారావు, శ్యామ్ సుందర రావు వంటి ప్రముఖ నటులతో పరిచయం ఏర్పడింది. వీరిలో ముచెర్ల సత్యనారాయణ గారు మంత్రి కూడా. నాకు ఏకపాత్రాభినయం చాలా ఇష్టం. దుర్యోధన, తాండ్ర పాపారాయుడు, రాణా ప్రతాప సింహుడు, చాణక్య, పేదవాడు వంటి ఏకపాత్రల్లో నటించాను. ఇవి నాకు విశేష ప్రాచుర్యాన్ని తెచ్చాయి. 
          జనగామ సంస్థలతో అనుబంధం ఏర్పడిన పిదప చిల్లరకొట్టు చిట్టెమ్మ, గాలివాన, పిచ్చివాడు నాటకాల్లో నటించి అందరినీ మెప్పించాను. మా స్వగ్రామంలో కొందరు యువకులం కలిసి తిరుపతి వేంకట కవుల శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించాం. నేను దుర్యోధనుడు, భీముడు పాత్రల్లో నటించాను. తొలిదశలోనే ఆ నాటక ప్రదర్శన విజయవంతమైంది. ఆ నాటకాన్ని మరికొన్ని గ్రామాలలో ప్రదర్శించాం కూడా.   సురభి నాటక సమాజం వారు రఘునాథపల్లిలో గుడారాలు వేసుకొని, కొన్ని నెలల దాకా అక్కడే ఉండి నాటకాలు ప్రదర్శిస్తుండేవారు. అవన్నీ చూడడమైంది. అవి మనస్సు మీద బలమైన ముద్రవేశాయి. నటులుగా ప్రసిద్ధులైన ఎ. ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములుగార్లతో జనగామలో కలిగిన పరిచయం మరువరాని అనుభూతిని మిగిల్చింది. జనగామలోనే ఆచార్య ఆత్రేయ గారు రచించిన కప్పలు, గుమాస్తా నాటకాల ప్రదర్శన సమయంలో ఆయన తోనూ పరిచయం కలిగింది. వాటిలో సీనియర్ నటులు నటించారు. ఆత్రేయ గారి సినిమా పాటల విశేషాలను వివరిస్తూ వ్యాసాలు రాసి ఆయనకు అందజేశాను. హైదరాబాద్ లో వారితో మంచి అనుబంధం ఏర్పడింది. దానికి గుర్తుగా ఆయన సినిమా పాటల గురించి ఒక బృహత్ వ్యాసం రాసి నా ‘సరళరేఖలు’ వ్యాస సంపుటిలో ప్రచురించడం జరిగింది. ఆయన ఆత్మీయతకు అవధులు నిర్మించలేను.

8.విద్యార్థులను ఏనాడూ దండించి ఎరుగని ఉపాధ్యాయులుగా మన్ననలు పొందిన మీ ఆదర్శ అధ్యాపక జీవితం గురించి తెలపండి.

జ:    నాకు జీవితంలో అధ్యాపకవృత్తి అంటే మక్కువ ఎక్కువ. నా అన్నలు, గురువుల అధ్యాపక జీవితాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను గుండ్ల గూడ సి.ఎస్.ఐ. ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా బోధకునిగా ఉద్యోగంలో చేరాను. పాఠశాల యాజమాన్యం వారు నన్ను మరొక చోటికి బదిలీ చేయలేదు. ఒకే చోట అధ్యాపకత్వాన్ని నెరపడం వాలా నా కృషి ఫలితాన్ని అందుకోగలిగాను, అనుభవించగలిగాను. నా ఎమ్. ఏ. విద్యార్థుల్లో నేను ఇచ్చిన ప్రేరణతో నలుగురు, వారు చదివిన డిగ్రీ కళాశాల వార్షిక సంచికా గ్రంథాలకు సంపాదకులుగా ఉండడమే కాక ఒకరు పిహెచ్ డి. ఇద్దరు ఎంఫిల్ చేశారు.
          నేను ఏ విద్యార్థినీ ఎప్పుడూ దండించలేదు. మరే శిక్షలూ విధించలేదు. కనీసం పరుష పద జాలాన్ని కూడా వాడలేదు. తుంటరి విద్యార్థులను మంచి మార్గంలోకి తేవడానికి ఎంతో శ్రమించేవాడిని. నీతికథలు, సుభాషితాలు, మహాపురుషుల ఆదర్శ జీవితాలు బోధించి వారిని మార్చగలిగే వాడిని. మనస్సును మార్చగలిగేదే అసలైన శిక్ష అనే కార్య ప్రక్రియలో గెలిచాను.  ప్రతీరోజు 9 పేజీల టీచింగ్ నోట్స్ రాసేవాడిని. అవి జిల్లా విద్యాధికారుల, పర్యవేక్షకాధికారుల మెప్పులు పొందేవి. ప్రధానోపాధ్యాయుల డివిజన్ స్థాయి సమావేశాల్లో అవి ప్రదర్శింపబడినప్పుడు ఎంతో పొంగిపోయేవాడిని. అత్యంత ఆధునిక భాషలో పాఠ్యాంశ బోధన, విద్యాసదస్సులో ప్రసంగాలు, మాదిరి పాఠ్యాంశ బోధన చేసేవాడిని. పాఠ్యపుస్తక రూపకల్పనలో నేను రాసిన వ్యాసాలు పలువురిని అలరించాయి. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ తరగతులకు పాఠాలు చెప్పడం వల్ల నా బోధనా విధానం చాలా మెరుగుపడింది. పరిశోధనాసక్తి చాలా పటిష్ఠమైంది.       నా అభిప్రాయాలను కానీ, అభిరుచులను కానీ విద్యార్థుల మనసుల మీద, మేధల మీద రుద్దే ప్రయత్నం ఏనాడూ చేయలేదు.

9. ‘బట్టల బంగారం’ గా సుప్రసిద్ధులైన మీకు ఆ పేరు రావడానికి గల నేపథ్యాన్ని వివరిస్తారా?

జ:    ఈ భూమిక చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలోనిది. జనగామ పట్టణ ఎస్ కె ఆర్ట్స్ సంస్థ పక్షాన ఈ నాటకం 9 చోట్ల ప్రదర్శింపబడి ప్రశంసలు పొందింది. ‘బట్టల బంగారం’ పాత్రలో సంభాషణలు చలాకీగా ఉంటాయి. హాస్యప్రధానంగా ఉంటుంది. హాస్యపూరితమైన భావాలను రమ్యంగా ఆవిష్కరించడంతో నాకు ‘బట్టల బంగారం’ పాత్ర మంచి గౌరవాన్ని, ప్రసిద్ధిని కలిగించింది.

డాక్టర్ లింగంపల్లి రామచంద్రగారితో అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి

10. దూరవిద్యా విధానంలో మీరు నిర్వహించిన పాత్ర ఎటువంటిది?

జ:    నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ లో డిగ్రీ తరగతులకు పాఠాలు చెప్పాను. ఇంటర్ విద్యార్థులతో పాటు అంతగా చదువులేని వాళ్ళు కూడా విద్యార్థులుగా ఉండేవారు. అందువల్ల నేను వాడుక భాషను ఉపయోగించే వాడిని. అటు తరువాత ప్రామాణిక భాషను వాడేవాడిని. ప్రత్యేకించి వ్యాకరణాంశాలను చెప్పేటప్పుడు ముందుగా గ్రామ్య భాషను ఉపయోగించి, తర్వాత ప్రామాణిక భాషలో బోధించడం వల్ల అన్నిరకాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. చేరా గారు, పి.వి. చలపతి రావు గారు, కె.ఎస్. రమణ గారు నా తరగతి గదిలో కూర్చొని పరిశీలించేవారు. నేను గ్రామప్రాంత అధ్యాపకుడిగానే కాక సాహిత్యం పట్ల కృషి చేస్తున్నవాడిని కాబట్టి నా భూమికను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. చర్చలు కూడా సాగేవి. అవి నాకు చాలా తృప్తిని కలిగించాయి. అభ్యాసకులకు ఆహ్లాదంతో పాటు ప్రయోజనం చేకూర్చేవి. 

11. ప్రత్యేకంగా మీరు “తెలంగాణాలో మల్లికార్జునాలయాలు” పేరుతో పుస్తకం వేయడానికి కారణం ఏమైనా ఉందా?

జ:   ఉంది. ఎందుకంటే వరంగల్ జిల్లా అయినవోలు మల్లికార్జునాలయం చారిత్రక సత్యాల గురించి వాదోపవాదాలు జరిగేవి. అందుకోసం సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు తెలంగాణాలో మల్లికార్జునాలయాలు రాస్తే బాగుంటుంది అనిపించింది. ఈ చారిత్రకాంశాన్ని  కొంతభాగం గ్రంథస్థం చేయడం జరిగింది. డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రి, డా. బూదరాజు రాధాకృష్ణ గార్ల సహకారం తీసుకోవడం జరిగింది.

12. నడుస్తున్న అక్షరంగా మీరు అభివర్ణించిన డా. పల్లేరు వీరస్వామిని గురించి చెప్పండి.

జ:   ఐదు దశాబ్దాల సాహితీ జీవితం ఆయనది. తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు. తెలంగాణ శతక సాహిత్యం (1975- 2000)అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఎనిమిది గ్రంథాలు వెలువరించారు. సినారె, ద్వానా శాస్త్రి మొదలగు వారి నుండి 15 ఉత్తమ పురస్కారాలు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందుకున్నారు. అనేకమందిని సాహితీ పరులుగా తీర్చిదిద్దారు. 

13. ఇప్పటి వరకు మీరు చేసిన సాహితీకృషి ఎన్ని గ్రంథాలుగా వెలువడింది? 

జ:    ఇప్పటివరకు నా సాహిత్యం 17 గ్రంథాలుగా వెలువడింది. ఆత్మ అక్షరమైన వేళ, ఎప్పుడూ వసంతానివే, అమ్మ పిలుస్తోంది, గదిలో నక్షత్రం, ఆకాశం నా సంతకమే, ఆమనిలో వెన్నెల కోయిలలు, మరో ఉదయాన్ని పిలుస్తా, తూర్పుతీరం (వచన కవితా సంపుటి), శ్రీ రంగరాజు కేశవరావు సాహిత్యం-పరిశీలన (సిద్ధాంత గ్రంథం), సినారె కవితాలోకనం(వ్యాససంపుటి), సరళరేఖలు (సాహిత్య విమర్శ), నడుస్తున్న అక్షరం (పల్లేరు వీరస్వామి జీవిత చరిత్ర), కొమురవెల్లి మల్లన్న క్షేత్ర మాహాత్యం (క్షేత్ర చరిత్ర), సినారె వాక్కుకు వయసు లేదు – తత్వ విశ్లేషణ, వాల్మీకి ఆశ్రమస్థలి వెల్ది, సమీక్షణం (వ్యాస సంపుటి), జనగామ జిల్లా సాహిత్య చరిత్ర ఇవి వెలువడిన గ్రంథాలు. జనగామ తాలూకా సాహితీమూర్తులు, జనగామ పట్టణం వందేండ్ల సాహిత్య సమావేశాలు, జనగామ తెలుగు కవులు-స్వీయ గానాలు ముద్రణలో ఉన్నాయి.

14. కవిత్వం, విమర్శ, అధ్యాపకత్వం ముప్పేటలుగా పెనవేసుకున్న మీరు సమాజ శ్రేయస్సు కోసం చేసిన రచనల్లో ఇంకా అనేకం అముద్రితాలుగా ఉన్నాయని చెబుతున్నారు కదా! అవి అలాగే ఉండడం ద్వారా వాటి ప్రయోజనం నెరవేరదు కదా! మరి వాటన్నిటినీ వెలికి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా?

జ:   ప్రస్తుతం మూడు గ్రంథాలు ముద్రణలో ఉన్నాయి. అన్నింటిని కాకపోయినా కొన్నిటిని వెలువరించగలను.

15. అసలు కవిత్వం కానీ, విమర్శ గానీ ఏ లక్షణాలకు లోబడి ఉండాలో మీ అభిప్రాయం చెప్పండి.

జ:     నేడు వెలువడుతున్న కవిత్వమంతా బాగుందని చెప్పలేం. పదాల పోహళింపుతో వెలువడే కవిత్వమే రాసులు రాసులుగా ఉంది. అటువంటి కవిత్వం బీరువాల్లో బందీ అవుతోంది. కవిత్వం ఎప్పుడైనా సార్వజనీనంగా ఉండాలి. సార్వకాలికమై జ్వలించాలి. ప్రయోగ శీలత తరగలెత్తాలి. అనుభూతి ఉండాలి కానీ అది వస్తు సౌందర్యాన్ని మరుగునపరిచేదిగా ఉండకూడదు. పద పదంలో కొత్తదనం విరబూయాలి. అనుభవ తాత్పర్యసీమల నుంచి ప్రభవించినట్లుగా ఉండాలి. ఆశావహమైన సవ్వడుల స్వరాలను ఒక ప్రవాహంగా నినదింపజేసే విధంగా ఉండాలి. ‘విప్పి చెప్పేది విమర్శ’ అన్నారు సినారె గారు. సాహిత్య విమర్శ సహేతుక విశ్లేషణతో సాగాలి. వస్తు తత్వాన్ని ప్రామాణికమైన కొలమానాలతో విడమరిచి చెప్పేదిగా ఉండాలి. నిష్పాక్షిక దృష్టితో వివేచన సాగాలి. అభిమానాశ్రిత ప్రశంస ఉండకూడదు. వ్యక్తి ప్రశంస కన్నా వ్యక్తిత్వ విశ్లేషణ కలిగిఉండాలి.

16. మా తరం కూడా పద్యసాహిత్యాన్ని చదువుతూ పెరిగిన వాళ్ళమే. ఇప్పుడు పద్యమే వద్దంటున్నారు. ఈ పరిణామాన్ని ఏ రకంగా అన్వయించుకోవాలి? 

జ:    ఎందరు చీదరించుకున్నా పద్యం చెరిగిపోదు. అమృత రూపమై జాలువారుతుంది. పద్యం విద్య అన్నాడు నన్నయ్య గారు. అందుచేత పద్యం అనారతం హరితమధురంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆగామికాల సాహిత్యానికి పరిపూర్ణతను స్థిరపరుస్తుంది. ఆధునికంగా ఎన్ని ప్రక్రియలు మొలుచుకొచ్చినా, దూకినా పద్యం నవ నవంగా శోభలు కుమ్మరిస్తూనే ఉంటుంది. ఖండకావ్యాలు, కావ్యసంపుటాలు, కావ్య సంకలనాలు పెద్ద ఎత్తున వెలువడుతూ రసజ్ఞ లోకాన్ని పరవశత్వంలో ముంచెత్తుతున్నాయి. పద్య సదస్సులు నిర్వహింపబడుతూనే ఉన్నాయి. ఇంతే చాలదు. ఆధునిక టెక్నిక్ తో పద్యం రాయబడాలి. అభివ్యక్తిలో తళుకు భాసించాలి. శైలిలో ఆర్ద్రతాశ్రితమైన వాదం ఉండాలి. పద్యంలోని ప్రాణ చైతన్యం వస్తువుతో సిద్ధిస్తుంది. కాబట్టి వస్తువు ఎంపికలో రుచిర భావనా తత్వాన్ని కలిగిఉండాలి. ప్రయోగశీలత సహజత్వాన్ని తొడుక్కొని సాగాలి.

17. మీరెన్నో పురస్కారాలు, సన్మానాలు పొందారు కదా! ఆ అనుభూతిని తెలపండి. పురస్కారాలు రచయిత రచనాశక్తికి కొలమానం అవుతాయా?

జ:    సన్మానాలు, పురస్కారాల వల్ల నేను పొందిన అనుభూతి వర్ణనాతీతం. సాహిత్యమే సర్వస్వంగా జీవిస్తున్న రచయిత ఎన్నడూ అవార్డులకోసం నిరీక్షించడు. ఎలాంటి ‘పట్టు’ పరిశ్రమ కోసం ఆరాటపడడు (నవ్వుతూ). పైరవీలు చేయడు. అవార్డులు రచయితకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. 

18. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మన ప్రాంతంలో సాహిత్యరంగం అభివృద్ధి చెందినదని భావిస్తున్నారా? ఏ విధంగా?

జ:   సాహిత్యరంగం బాగా అభివృద్ధి చెందింది. సాహిత్య సంస్థలు అసంఖ్యాకంగా వెలిశాయి. కవితాసంపుటాలు, సంకలనాలు వెలువడ్డాయి. సదస్సులు జరిగాయి. ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉన్నాయి. సాహితీ కృషి చేసినవారికి అధిక సంఖ్యలో పురస్కారాలు అందింపబడుతూనే ఉన్నాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రయోజనవంతంగా సాగుతూ సాహిత్య వికాసానికి దోహదపడుతున్నాయి. అందులో జిల్లా సాహిత్య చరిత్రలు వెలువరింప జేయడం బాగుంది. తెలంగాణ సారస్వత పరిషత్తు సైతం విశేషకృషిని అందిస్తున్నది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సాహిత్య చైతన్యానికి తెలంగాణ సంస్కృతికి అవిరళంగా సేవలు అందిస్తున్నది. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప సాహిత్యం సరికొత్త మూల్యాలతో ప్రవర్ధిల్లుతూ వచ్చిందని చెప్పవచ్చు.

19. ఒక రచయితకు సమాజం పట్ల ఉండే బాధ్యత ఎటువంటిది? ఇప్పుడున్న రచయితల్లో అది ఉందని భావిస్తారా?

జ:    రచయిత బాధ్యత గురుతరమైంది. అతడు సమాజ బహిరంతరాలను శోధించాలి. మనిషి జీవితంలోని కృత్రిమత్వాన్ని, అహేతుక విషయాల ఆంతర్యాన్ని ఛేదించాలి. స్వప్నలోకాలకు పట్టం కట్టడం ఆపేయాలి. మనిషి మనిషి మధ్య ఆత్మీయతా సౌరభ్యాన్ని ప్రవహింపజేయాలి. సత్యాన్ని ఎలుగెత్తి చాటాలి. ప్రతి కవితాక్షరంలో నవ్యత్వాన్ని దాచిపెట్టి, మనిషిని కాపాడాలి. అయితే రచయితలందరిలో ఈ భావన ఉంటుందని నేననుకోవడం లేదు. రచయితల్లో కొందరు వ్యాపార ధోరణి కలిగినవాళ్ళు ఉంటారు. వారికున్న బాధ్యత సొంత వైభవాన్ని పెంచుకోవడమే. ఉద్యమాలను తనవైపు మళ్లించుకొని సమాజాన్ని , సాహిత్య సమాజాన్ని అల్లకల్లోలపరచడమే. వ్రేళ్ళ మీద లెక్కపెట్ట గలిగేంతమంది రచయితలు మాత్రమే నిజాయితీగా రచనలు చేస్తున్నారు. అయితే ఇలాంటి రచయితల వల్లనే సమాజం సతతహరితంగా ప్రవర్ధిల్లుతూ ఉంటుంది. 

20. ఆధునిక కాలంలో వస్తున్న వివిధ వాదాల పట్ల మీ అభిప్రాయం చెప్పండి. 

జ:    సాహిత్యం విస్తృతమవుతూ వస్తున్నది. ఎన్ని వాదాలొస్తే అంత మంచిది. అవి అస్తిత్వాన్ని కోల్పోకూడదు. నాకు నచ్చింది మానవతావాదం.

21. మీ నిరంతర మార్గదర్శకత్వంలో ఎదిగి మీకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను గురించి చెప్పండి.

జ:   బాల్యవయస్సులో స్కూల్లో నన్ను అనుకరించడం, ప్రత్యేక కార్యక్రమాల్లో నా వాణిని కొనసాగించడం మొదలు ప్రఖ్యాత సాహితీవేత్తగా ఎదిగిన నా విద్యార్థి డా. పోరెడ్డి రంగయ్య. ఎన్నో గ్రంథాలు వెలువరించాడు. మరెన్నిటికో సంపాదకత్వం వహించాడు. వందలాది సదస్సులకు వ్యాఖ్యాతగా ప్రశంసలు పొందాడు. అనేక బిరుదులు పొందాడు. అందరికీ ఆత్మీయుడిగా నాకు గర్వకారణంగా నిలిచాడు. పోరెడ్డి రంగయ్య మూడో అన్న పోరెడ్డి ఉప్పల్ కూడా నాకు ప్రియ శిష్యుడే. ఇట్లా ఎంతోమంది వారి వారి సామర్థ్యాలను బట్టి మంచి పదవుల్లో ఉన్నారు.

22. మీ అనుభవ పురస్సరంగా ఈ తరానికి మీ సందేశం ఇవ్వండి.

జ:  ఈ తరం వారికి కొరవడింది అధ్యయనం. విస్తృత అధ్యయనం చేయాలి. రచన అనుభూతి ప్రధానంగా సాగాలి. అభివ్యక్తిలో నవ్యత్వం గుబాళించాలి. సృజన శీలత పదునుగా ఉండాలి. వ్యక్తిని, సమాజాన్ని ఉత్తేజపరచాలి.

అనేక ధన్యవాదాలు సార్🙏🏼 మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, సమగ్రమైన మీ జీవిత విశేషాలను అందించినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున నమస్సులు, కృతజ్ఞతలు

🙏🏼

March 19, 2026 1 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అరుణ కాంతులు

by Vijaya Kandala March 19, 2026
written by Vijaya Kandala

రంగు అనగానే మొదట గుర్తొచ్చే రంగు రెడ్  .అదే ఎరుపు  . సందేహిస్తున్నారా ?ఒక్క క్షణం ఆగండి . కళ్ళు మూసుకుని ఇలా ఊహించుకోండి  .మీరు దట్టమైన అడవిలో చిన్న కాలిబాట వెంబడి నడుస్తున్నారు  . .చుట్టూ అనేక వర్ణాల ఆకుపచ్చ పరచుకున్న పచ్చదనం  .ఎక్కడో సుదూరంగా ఆకుల మధ్య లోంచి తొంగి చూస్తున్న చిన్ని ఎర్రని గడ్డిపువ్వు . వెంటనే మీకు తెలియకుండానే మీ దృష్టి అటువైపు మళ్ళు తుంది అదే ఎరుపు రంగు మహత్యం ఒప్పుకుంటారా !

ప్రతి రంగుకు ఉష్ణోగ్రత ఉంటుంది  .ఊదా రంగు నుండి ఎరుపు రంగుకు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది  .అందుకే ఇది చలింప చేసే రంగు . మిగిలిన రంగులు అందమైనవి  ,కోమలమైనవి కావచ్చు . కానీ , ఇది ఉత్తేజపరిచే రంగు  .

 ఎరుపు అంటే ఉద్వేగం  .ఎరుపంటే శక్తి  .అగ్ని తత్వానికి ప్రతీక . నాడీ కణాలను రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. పంచేంద్రియాలలో చు రుకు పుట్టిస్తుంది  .లోన దాగిన భావా వేశాలను ఉద్రేకాలను బయటపెడుతుంది . సమర్థమైన రంగు  అంటే ఎరుపే  .ఎరుపు రంగులో ఎన్నో షేడ్స్ ఉన్నాయి  .మెరూన్ -కార్డినల్ -అరుణము -కుంకుమ రంగు,-రక్తం ఎరుపు  -లోహితం ముఖ్యమైనవి

బూర్గుండి  , క్లారిటీ  ,సిరీస్ వెర్మిలియన్ , క్రిమిసన్  ,స్కార్లెట్ ఎరుపు    .ఎ న్నో పేర్లు . అతి ప్రాచీన గుహలలో చిత్రకళలోతొంగి చూసిన  మొదటి రంగు ఇది  . చారిత్రాత్మకంగా త్యాగం , ప్రమాదం  ,ధైర్య గుణాలకు సంకేతం .యూరప్ లోని ఆధునిక సర్వేలు ఈ రంగును వేడి  ,కార్యాచరణ  ,అభిరుచి , కోపం  ,ప్రేమకు సంబంధించినదిగా నిరూపిస్తున్నాయి . కలలో ఎరుపు రంగు లేదా ఎర్రని వస్తువులు కనిపిస్తే  ,మీ జీవితం ఇప్పుడు మెరుగ్గా ఉందని  ,త్వరలో మరింత ఆనందాన్ని అనుభవిస్తారని అర్థం .

అనేక ఆసియా దేశాలలో ఇది ఆనందాన్ని, అదృష్టాన్ని సూచించే రంగు .

ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అంగారక గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అంటారు.

తూర్పు ఐరోపా నుండి  వియత్నాం వరకు కమ్యూనిస్టు పార్టీల రంగు ఎరుపు  .

పాశ్చాత్య దేశాలలో ఎరుపు అమరవీరుల త్యాగానికి చిహ్నం .

1968 లో జరిగిన విఎన్ఆర్ కన్వెన్షన్ లో రహదారి సంకేతాలకు అంతర్జాతీయ రంగుగా ప్రామాణికరించారు .

1917లో బోన్షివిక్ విప్లవం తర్వాత సోవియట్ రష్యా  ఎర్రజెండాను స్వీకరించింది  .

మానవ జనాభాలో ఒకటి నుండి రెండు శాతం మందికి ఎర్రటి జుట్టు సహజంగా ఉంటుంది  .

20వ శతాబ్దం ప్రారంభంలో నగరాల్లోని కొన్ని ప్రాంతాలను రెడ్లైట్ ఏరియాగా పేర్కొనడం మొదలుపెట్టారు  .

ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా జట్లు ఎరుపు రంగు యూనిఫామ్ లను వాడతారు  .

తప్పు చేస్తూ పట్టుబడే సందర్భాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అంటారు  .

కలర్ థెరపీ  ప్రకారం ఎరుపు రంగు పరిసరాల్లో వాడడం వల్ల రక్తహీనత తగ్గుతుంది  .

వా త లక్షణాలు తగ్గుముఖం పడతాయి .

 తడి పొడి దగ్గు లక్షణాలు మెరుగవుతాయి

రెడ్ లైట్ ఏరియా లేక డిస్ట్రిక్ట్ అనేది పట్టణ ప్రాంతాల్లోని ఒక నిర్దిష్ట ప్రాంతం . ఈ ప్రాంతంలో అధిక లైంగిక ఆధారిత కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇది మనుషులను ఆర్థికంగా  ,మానసికంగా  ,సాంఘికంగా  ,ఆరోగ్యపరంగా , నైతికంగా పీల్చి పిప్పి చేసే ప్రాంతం . ఇది ఒక ఊబి లాంటిది . ఇందులో నుంచి బయటకు రావడం సాధారణంగా జరగదు  . వచ్చినా చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రాణరక్షణ చేసుకుందామనే బాపతు వ్యవహారం .

ఎర్రని అరటి  పండు

 ఒకప్పుడు ప్రాంతీయంగా దొరికే ఎరుపు అరటి పళ్ళు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయి అన్ని చోట్ల దొరుకుతున్నవి  .దీంట్లో పోషకాలు ఎక్కువ  .ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం  .నరాల సమస్య మూర్ఛ వ్యాధితో బాధపడేవారు , తరచుగా వాడితే మంచి గుణం కనిపిస్తుంది .క్రమం తప్పకుండా వాడితే పునరుత్పత్తి వ్యవస్థ బలో పేతమై సంతానోత్పత్తి అవకాశాలు మెరుగవుతాయి  .కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి పరిష్కారం  .చర్మ  రోగాలకు పైపూతగా దీని తొక్కను వాడుతారు .

కర్మాగారాల్లో ఎరుపు ప్రమాద సంకేతం . ఆపరేషన్ థియేటర్లలో బయట కనిపించే ఎర్ర బల్బ్  కార్యాచరణకు సంకేతం మరి ఇలాంటి రంగును ఇష్టపడే వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా?

ఎ రుపు రంగును ఇష్టపడే వారిలో దూకుడు స్వభావం  ,దృఢమైన ఆలోచన విధానం ఉంటుంది  . ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవిశ్రాంతంగా పనిచేస్తారు మార్పులు కొరేవారిలో ముందుంటారు . గుండె నిబ్బరం , క్రమశిక్షణ వీధిలో ఎక్కువ  .సాధారణంగా ధైర్యవంతులు , ఉత్సాహవంతులు  ,ఆత్మ విశ్వాసం కలిగిన వీ రు జీవితాన్ని అభిరుచులతో ఆస్వా దిస్తారు  .నాయకత్వ లక్షణాలు ఎక్కువ  .శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం వల్ల సమూహంలో నాయకుడిగా రాణిస్తారు  .సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు  .చాలా ఎమోషనల్ మనుషులు  .అనర్గళంగా అనేక విషయాలపై మాట్లాడగలరు తమ కల లను సాకారం చేసుకోవడానికి పట్టుదలతో కృషి చేస్తారు .

 అయితే చాలా త్వరగా వీరికి కోపం వస్తుంటుంది

ఎరుపు రంగు _మానవ స్వభావం పై చాలా పరిశోధనలు జరిగాయి . ఈ రంగును గోడలకు వాడినప్పుడు కొంతమంది రోగులు వారి రుగ్మతల త్వరగా తగ్గినట్లు చెప్పారు  .హుశా ఈ కారణం చేతనే రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ గా ఏర్పడిందేమో . ఆదరణకు చిహ్నం ఈ రంగు

ఆకలిని ఎక్కువ చేస్తుంది అందుకే హోటళ్లలో చాలా పదార్థాలు ఆకర్షణీయంగా ఉండడానికి ఎరుపు రంగులో సిద్ధం చేస్తూ ఉంటారు  . సభలకు మీటింగ్లకు ముఖ్య అతిథులు చివరగా వస్తారు. అలా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎర్రని అతిధి ఎవరో తెలుసా ఇంకెవరు ఎర్ర గులాబీ .

గులాబీలలో ఎన్నో రంగులు ఉన్న ఎరుపు గులాబీ స్థానం వేరు  .దాని తరహానే వేరు సుమా  !వాలెంటైన్స్ డే మొదలుకొని మహిళా దినోత్సవం వరకు ఎర్ర గులాబీల సందడే సందడి  . లవ్ యు చెప్పడానికి  , ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇంతకంటే గొప్ప కానుక ఇంకేముంటుంది చెప్పండి .

 గాఢమైన ప్రేమను నిశ్శబ్దంగా తెలియచెప్పే సున్నితమైన హృదయ స్పందనే  ఎర్రగులాబి .పురాతన కాలం నుండి ఎర్ర గులాబీ ప్రేమకు  ,శౌర్యానికి  ,ధై ర్యానికి చిహ్నంగా పేరుగాంచింది .గ్రీకు పురాణాలలో ఎర్ర గులాబీలు ప్రేమతో అనుసంధానమై ఉన్నాయి

మన జీవితం రంగులమయం . దాని ఆవేశంతో  ,అనుమానంతో  ,అసహనంతో గడిపితే మిగిలేది అంతులేని ఒంటరితనం అంతేలేని ఏకాంతం  .ప్రకృతిలో కనిపించే రంగులన్నీ సంస్కృతి పరిరక్షణలో రంగవల్లికలై మన జీవితాన్నిశోభాయమానం చేస్తున్నాయి .భారతీయ ఆత్మకు అభివ్యక్తీకరణమే ఈ రంగుల సమ్మేళనం.

                                                             

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

సు’లోచనాల’లో మెరిసిన” నానీ లోచనాలు “

by Radhika Suri March 19, 2026
written by Radhika Suri

గడ్డం సులోచనగారితో నా తొలి పరిచయం సోమవారపు కుటుంబంలో . నిరాడంబరత, స్నేహపూరిత పలకరింపు ఆమెలో నన్నాకర్షించిన విషయాలు.
కలంపట్టి రాయమంటూ ప్రోత్సహించిన సహాధ్యాయుడికే తన తొలి రచనను అంకితమిచ్చి కృతజ్ఞత చాటుకున్న స్నేహశీలి.
పుస్తకావిష్కరణ సభలో ‘నానీ లోచనాలు’ పుస్తకంతో ఇల్లు చేరి సమీక్ష రాయాలనుకున్నా కారణాంతరాలతో జరిగిన జాప్యమిది.

అక్షరాలవెంట పరుగులుతీసి ఒజ్జగా మారినా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తించిన సందర్భం నేర్పిన అనుభవంతో
“ఇంటి వెలుగు
లైట్ల వల్లకాదు
ఇంట్లో స్త్రీలు
విద్యావంతులు”
అంటూ – పుట్టెడు బాధ్యతలున్నా బొంగరంలా తిరుగుతూ ఇంటెడు చాకిరీ చేసే ఇంతికి విద్యాగంధం తోడైతే పిల్లలలో అక్షరక్రాంతి నింపుతుందంటూ’ ఇల్లాలిని శ్లాఘిస్తూ పుస్తకానికి శ్రీకారం చుట్టారు.

కనిపించని దేవుళ్ళకు సాగిలబడుతూ కళ్ళెదుట ఉండే తల్లిదండ్రులను పట్టించుకోరు .
“చిన్నప్పుడు
అమ్మ అందరి సొత్తు
పెద్దపుడే
వదిలించుకునే విపత్తు “
అంటూ మమతానురాగాలు రంగరించి గోరుముద్దలు తినిపిస్తూ పెంచిన తల్లి పిల్లలను ఎప్పుడూ భారం అనుకోదు కదా! అదే తల్లులు అవసాన దశలో ఆదరణకు దూరమై అలమటిస్తున్న సందర్భాలు నేటి సమాజంలో కోకొల్లలు. కనిపెంచిన అమ్మదనానికి
మలిదశలో ఎందుకీ ‘అంకురయాతన’ అంటూ ఆవేదన చెందుతారు.

జల్లెడను పోలీసుతో పోలుస్తూ , ‘దాక్కున్న తాలును నిగ్గు తేల్చి’ పట్టిస్తుందంటూనే , డాక్టర్ల తెలివిని అభినందిస్తూ’ ప్రాణమున్న బికారి’ని చేస్తాడంటూ నేటి కార్పో’రేటు ‘వైద్యులకు
చురకలంటిస్తారు .అమ్మ ప్రేమలో నైర్మల్యం గూర్చి చెప్తూ అబద్ధాల్ని అమాయకంగా నమ్మేస్తుంది ‘అచ్చం యశోదమ్మ’లా అంటూనే కట్టుబాట్ల సంకెళ్ళల్లో ‘ఆమె’ తెలివితేటలు ‘కట్టడి’ చేయబడతాయి అంటూ ఆవేదన చెందుతారు. ‘నడిరేయి దేదీప్యమానంగా వెలిగే విద్యుత్ దీపాలున్నా ‘మహిళలు వీధులలో తిరుగలేని సమాజ స్థితిగతులకు మహిళగా ఆందోళన చెందుతారు.

“సాహితీ మాగాణంలో
కలం సేద్యం
అనంతభావాల
అక్షర నైవేద్యం “
అంటూ కలంతో కవితాసేద్యం చేస్తూ భావాక్షరాలను పండించే కవి ఇంట్లో దొంగలు పడితే సంపద కోసం కాకుండా తన’ కవితలు దోచుకుపోయారంటూ’
ఆవేదన చెందుతాడంటారు ఆమెలోని కవయిత్రి .

‘ప్రయత్న లోపాన్ని వీడితే విజయం తథ్యం’ అంటూ వెలిగే సూర్యుడిని ఆపడం ఎవరితరం కానట్టే , ప్రజాఉద్యమాల్ని అణచివేయడం అసాధ్యం అంటూ తెలంగాణ ఉద్యమం మదిలో మెదిలి, “చరిత్రపుటల్లో
అమరుల త్యాగాలు
తెలంగాణ
జీవన చిత్రాలు”అమరులైన తెలంగాణా వీరులు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో వెలుగొందుతారంటూ’ తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు.
‘పచ్చదనం చెట్టుకెరుక పొట్ట నింపడం అమ్మకెరుక’ అంటూ పర్యావరణానికి మమకారానికి లంకె పెడతారు .

“మొగ్గను గుచ్చినా
దారంతో ఉరేసినా
మల్లె
తెల్లగానే నవ్వుతుంది “
అంటూ విరుల ఒంటిపైనున్న గాయాల జల్లెడను చూసి మనసున్న మనిషిగా విలవిల్లాడిపోతారు .

“పరిణతి లేని
ప్రేమ వ్యవహారం
రెక్కలు రాని పక్షి
గూడు వదిలినట్టు”
అంటూ
అపరిపక్వపు ప్రణయం రెక్కలు రాని పక్షి గూడు వదిలి దారితప్పిన చంద’మంటూ యువతకు చిరు హెచ్చరిక చేస్తారు. క్రమశిక్షణ లేని జీవితాలు, అలవాట్ల పొరపాట్లతో ‘ఆరోగ్యం అనారోగ్యం పాలబడకుండా నడకతో సరిచేసుకోవచ్చంటూ’ చక్కని సూచన చేస్తారు. రాగద్వేషాలు వీడితేనే మనిషిలో మానవత్వం చిగురించేదని హితబోధ చేస్తారు.

లింగ వివక్ష పై మండిపడుతూ – స్త్రీని పూజించే సమాజం మనది అయినా గర్భస్థ శిశువు ‘ఆడ’ని తెలిస్తే అర నిమిషం కూడా ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా అంతమొందించే ప్రయత్నం చేస్తారు
“గుడిలో అమ్మని పూజిస్తారు
గర్భగుడిలో ఆడబిడ్డను
హత్య చేస్తారంటూ”
భ్రూణహత్యలపై ఘాటుగా స్పందిస్తూ, చిన్న బుద్ధిగల మనుషుల ‘మనసుల్లోని మాలిన్యాన్ని చీపురుతో
కడిగేయాలంటూ’ కళ్ళెర్రజేస్తారు . ‘గట్టిగా ముడివడని బంధాలు తెగదెంపులతో
దూరమౌతుండడం బాధాకరమంటూ నేటి వివాహ వ్యవస్థ తీరుకు వాపోతూనే ఇల్లాలిని సూర్యుని’తో పోలుస్తూ ఆమె చుట్టూనే పరిభ్రమించే ‘మమతల గ్రహాలు ‘ఇంట్లోని వారంటూ, కలతలు లేని సంసారాలు ‘మమతల కోవెల’లంటూ ఆనందం వ్యక్తం చేస్తారు. ‘ఎదగడానికి తొందర పనికిరాదంటూ’ అదను చూసుకుని అనువైన మార్గం వైపు దృష్టి సారించమని, ‘సద్విమర్శల్ని సహృదయంతో స్వాగతించమని’ అనుభవంతో చెప్తారు.

“ఉచితాలెందుకు?
ఉపాధి కావాలి
ఆశల సుడిగుండంలో
యువత ఉంది”
ఉచితాలతో యువత భవితవ్యం అయోమయంలో పడిపోయి ప్రశ్నలా మారిపోయిందని ఆవేదన చెందుతారు. పట్టణీకరణతో పచ్చని పల్లెలు కాంక్రీట్ జంగల్లుగా మారడం ,పొట్టకూటి కోసం రైతన్న వలస కూలీగా మారిపోయాడంటూ బాధపడి, భూకబ్జాలలో చిక్కి నలిగిపోతున్న భారతావనికి “భరతంపట్టే భీమసేనుల ” అవసరం ఎంతైనా ఉందంటూ ఆశాభావం
వ్యక్తం స్తారు.

‘వర్షించని మేఘపు నీటితడిఅంతా రైతు కళ్ళ’ల్లోనే దాగుంటుందంటూ జాలి పడుతూనే , కన్నీళ్ళను దాచి మనసు భారం కానీయొద్దంటూ ‘వర్షించిన మేఘా’నివై తెలిమబ్బులా సాగిపొమ్మంటూ ఊరడిస్తారు.

” తెలుగుకు తెగులు సోకిస్తున్న” ఆధునిక తల్లుల వింత పోకడలకు తల్లడిల్లిపోతారు. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో అంతా చరవాణి చేతిలో బందీలైన ఏకాకులంటూనే పాపం ‘ఉత్తరం ఉనికి లేకుండా పోయిందని ‘బాధ పడతారు .
ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు మమతానురాగాలు పెనవేసిన ‘లతానికుంజ’మంటూ కౌటుంబిక జీవన మాధుర్యాన్ని అందంగా వర్ణిస్తారు.

“బొమ్మలేయడం
ఈజీకాదు
భావాల చుక్కలకు
గీతలు కలపాలి”
అని చిత్రలేఖనంలోని సాధకబాధకాలను వెల్లబోసుకుంటుంది తనలోని చిత్రకారిణి. పదాల్ని దారంగా మార్చి భావాల కవితాపుష్పాలను మాలికగా అల్లుతుంది ఈమెలోని కవయిత్రి.
గ్రామీణ నేపథ్యమున్న వీరు పంటచేల నాట్యానికి పరవశిస్తారు, వరినాట్లేసే అతివల్లో ‘నేలకు దిగిన రంగుల సింగిడి అందాలను’ చూస్తూఆనందిస్తారు.

“పొలాల్లో
హరివిల్లులా ?
లేక వరినాట్లేస్తున్న
పల్లె పడతులా?
అంటూ అచ్చెరువొందుతారు.

స్వతహాగా ఉపాధ్యాయురాలైన
వీరు “నసుగుతూ మాట్లాడకు స్పష్టత అవసరమంటూ”గట్టిగా మందలిస్తారు. “ప్రశ్నించడం నేర్చుకోమంటూ బెత్తాన్నెత్తి హెచ్చరిస్తారు”. చదువులో ముందుండి జీవితంలో వెనుకబడ్డ అతివల్లోని అసంతృప్తి,అసహనం ఆమె కవితల్లో స్పష్టంగా కనబడుతుంది. ‘గ్రంధాలయాలు జ్ఞాన భాండాగారాలు ‘అంటూ పుస్తక పఠనపు ఆవశ్యకతను, చదువు సార్ధకతను ‘మహిళా సాధికారతను అక్షరాలలో రంగరించి చెప్తారు .

“సాహితీ సముద్రంలో
మునిగాను
అప్పుడప్పుడు
ముత్యాలు దొరుకుతున్నవి”
అంటూ ‘మేలిమి కవిత’ల ఊటకోసం ఆరాటం, ఒకింత నిరాశ కలగలిపిన కళ్ళతో అర్థవంతమైన అక్షరాలకై దోసిళ్ళొగ్గుతారు. .

సమాజపు తీరుతెన్నులను మీ ‘సులోచనాల’తో ఓ కంట గమనిస్తూ మీలో దాగిన సన్నటి అసంతృప్తి సెగను చల్లార్చి మీదైన శైలిలో మంచి కవితా ఝరులు జాలువారుస్తారని ఆశిస్తూ…

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తలుపుల మాటున మెదిలిన తలపులు – అల్మారా

by Padmasri Chennojwala March 19, 2026
written by Padmasri Chennojwala

‘అల్మారా’ మూడక్షరాల పదం. అతి సామాన్యుడికైనా, అపర కుబేరుడికైనా అత్యంత ముఖ్యమైన వస్తువు. స్థాయిని బట్టి నిర్మాణపరమైన తేడాలుండ వచ్చేమోగానీ అవసరంలో మాత్రం అందరిదీ.

కవి దాసరి మోహన్ గారు ‘దండెం ‘ మీద ఆరేసిన బట్టల్ని మడత వేసి ‘అల్మారా ‘ లో సర్దినట్టున్నారు. రండి, ఒకసారి తెరిచి చూద్దాం.

భరించడానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన అమ్మ పోర్టుఫోలియో లన్నిటిని చక్కబెట్టుకుంటూ త్యాగాల తోరణాలను గుమ్మానికి కట్టి, బొట్టుపెట్టెలో కన్నీటి బొట్లను దాచుకొని, తనివి తీరా ఏడవడానికి ప్రైవసీ కోరుకుంటుందంటూ కవితా సంపుటిని అమ్మతోనే ప్రారంభించారు.

తండ్రిని బాధ్యతల భూగోళం మోసే హెర్కులస్ అనీ, అతని అడుగుజాడలే జీవిత పాఠాలనీ, చెమట బిందువులు గంగాజలమంత పవిత్రమైనవని అంటూనే శక్తి సన్నగిల్లిన అతని దేహాన్ని పాలు పితకలేని పొదుగు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు.

గుండె కింది పాయకు ఆనకట్ట కట్టి,కొవ్వొత్తిలా కరిగిపోతూ ఇంటిని బృందావనంలా, సప్తవర్ణ సింగిడిలా మార్చే ఇల్లాలి ఔన్నత్యానికి, ఔచిత్యానికి మెచ్చి బతుకు చుక్కాని అని అంటూ కితాబిస్తారు.

అడవి ఆనంద తాండవం జింకలకు ప్రాణహాని లేదిక/
గంగ యమున నదులన్నీ
స్వచ్ఛ రాగాల నృత్య హేల/

అంటూ పర్యావరణాన్ని దెబ్బతీసే మానవ తప్పిదాలపై ధ్వజమెత్తారు.

ఎండోమెంట్ ఎరుగని పేద దేవుళ్లను స్తుతిస్తూ, పాదుల వేదికలపై పక్షులతో పాట కచేరీలు నిర్వహిస్తారు. రాలిన పూలలో రంగోలిని, కొమ్మల్లో కూచిపూడి ముద్రల్ని చూసి ప్రకృతికి పట్టాభిషేకం చేస్తారు.

పాత జ్ఞాపకాల్ని తోడటానికి గుప్పెడంత గుండెబావిలోకి పాతాళగరిగె వేస్తారు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు అది సింధువును ఇముడ్చుకున్న బిందువని వారికి తెలుసు.

ఎంత ఆడితే అంత/ ఇంటిల్లి పాదికి తమాషా/ శిలువ మాత్రం నీ పైనే హమేషా/
అంటూ
గాలిపటం ఎంత ఎత్తులో ఎగిరినప్పటికీ, దానికి ఆధారమైన దారం మరొకరి చేతిలో ఉన్నట్లుగానే, కుటుంబ భారాన్నంతా మోసే మనిషి బంధాలకు బానిసైన తీరును ‘పతంగి బతుకు ‘ అంటూ తన చిత్రాన్ని తానే గీసుకుంటారు.

ఎదలో గుచ్చిన ముల్లు వేయి క్యూసెక్కుల ప్రవాహమై స్రవిస్తూనే ఉంటుందని మాటను తూటాగా ప్రయోగించే మనుషులపై ఘాటుగా స్పందిస్తారు.

మువ్వల పట్టీల్ని సందుకలో పెట్టి తాళం వేసినా, గెరిల్లా వీరుల్ని అల్మారాలో బంధించినా అది వారికే చెల్లు.

గుండె ఆగిన రోజు గడప లోపల ఎంత తొందరో /
అంటూ మనిషి జీవితం ప్రకృతితో మమేకమైన తీరును స్పష్టంగా వివరిస్తారు.

కీమోథెరపీ కొలిమి/ దేహమి ప్పుడు ఆకులు రాలుతున్న వృక్షం/ నన్ను నేరుగా చూసే ధైర్యం చాలడం లేదు/

క్యాన్సర్ చికిత్సలో భాగమైన కీమోథెరపీతో మనిషి శరీరంలో కనిపించే మార్పులను హృద్యంగా వర్ణించారు.

కట్టప్ప వచ్చి కత్తితో పొడిచినా బాగుండు/ ఈ పాటకి శుభం కార్డు పడేది/
అంటూ క్యాన్సర్ వ్యాధితో విలవిల్లాడే రోగి దైన్యాన్ని తెలుపుతూనే,
లోకమంతా నన్ను మొదటిసారి పొగిడేది/

మనిషి బ్రతికున్నంత వరకు విలువను గుర్తించని సమాజం(కొంతమంది) ప్రాణాలు గాల్లో కలిశాకగానీ అనుకూలతలను ఏకరువు పెట్టదంటూ వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తారు.

మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలక బోసుకునే మనస్తత్వాలకు(ఇంకాస్త) చురక లంటిస్తారు.

కళ్ళెదుట ఎన్ని వసతులున్నా, మరెన్ని వనరులున్నా వాటన్నిటినీ సద్వినియోగ పరుచుకొని తన్ను తాను నిరూపించు కోవడంలోనే విజయరహస్యం (ఏదో) దాగుంటుందని చక్కని సందేశాన్నందించారు.

సామాజిక మాధ్యమాల సాలెగూటిలో చిక్కి విలవిల్లాడే మనుషులను తప్పులో తలో చెయ్యేసి కర్మ పాట పాడే కనికట్టు లోకమంటూ నిరసిస్తూనే, నిలువునా ముంచే నీలిచిత్రాల బారి నుండి ఆడపిల్లను అర్జెంటుగా దాచి పెట్టండంటూ హెచ్చరిస్తున్నారు.

ఎదిగిన తొవ్వెనక, ఎగరేసిన జెండా కింద ఊతమై, ఊపిరై నిలిచిన వారెందరో ఉంటారనీ, వారందించిన స్ఫూర్తిని ఏ స్థితిలోనూ మరవకూడదనీ హితవును బోధించారు.

తెలుగు ద(ధ)నాన్ని హరించి వేస్తున్న ఆధునికతకు వగచి మల్లెతీగను మన్నించమని వేడుకుంటారు.

నాగరిక మోజులో వాడిపోయే పచ్చందాలను కరోనా అద్దంలో కళ్ళకు కడుతూ, పల్లెతల్లి ఒడిలోని లాలనను జ్ఞప్తికి తెస్తారు.

ఊరి తొవ్వలో వాయిలి చెట్ల వయోలిన్ రాగాలు వింటూ మూలికల్లో ముక్కోటి దేవతలను కొలుస్తారు.

టెన్షన్ చొరబడని కోటగోడల్లో వారికి వారే రాజై,మంత్రై కలం,కాగితం పట్టుకుని మరో కవితా సంపుటికి వ్యూహరచన చేయాలని అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ…..

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చిత్రమైన చైత్రమాసం..

by Damaraju Vishalakshi March 19, 2026
written by Damaraju Vishalakshi

చైత్రమాసంలో వసంత ఋతువు వస్తుంది. మోడులను చిగురింప చేసి మనోహరంగా ప్రకృతిని మార్చి వేస్తుంది.
ఈ చిత్రాలు చేసే చైత్రమాసం 60 సంవత్సరాల మన కాలచక్రంలో మొదటిది. అందుకే పెద్దలు 60 సంవత్సరాల కాలాన్ని ఒక మహా విపంచిగా భావన చేశారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తంత్రి పలుకుతుందట.

మన సంప్రదాయంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంది.. సంవత్సరాన్ని ఆరుఋతువులుగాను
12 మాసాలుగాను ,రెండు అయినాలుగాను ,విభజించారు మన పూర్వులు.రెండేసి మాసాలకు ఒక ఋతువు చొప్పున ఆరు ఋతువుల్లో 12 మాసాలు అమరిపోతాయి.. చెట్లన్నీ పూలతో, సరస్సులన్నీ పద్మాలతో , స్త్రీ పురుషులు కాముక భావంతో అలరారుతున్నారని వర్ణిస్తాడు కాళిదాసు…
చైత్ర శుద్ధ పాడ్యమని ఉగాదిగా యుగాది నుండి ఆరాధిస్తూ వస్తున్నాం.. పూర్వం మన పెద్దలు చెప్పిన మాట ప్రకారం పుష్యమాసం మంచు కురిసే సమయంలో హేమంత ఋతువులో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండేటప్పుడు పోషణ శక్తి కలిగి ఉంటాడు కాబట్టి పుష్య పున్నమినాటి రాత్రి సిద్ధాంతులు తెల్లని నూతన వస్త్రాన్ని గాని దూదిని గాని మంచులో ఉంచి ఆ మరునాడు దానిని పిండి ఆ ప్రక్రియలో వచ్చే నీటి చుక్కల్ని బట్టి పంచాంగ రచన చేసే వారినీ, ఎన్ని చుక్కలు నీరు పడితే అన్ని కుంచాల వర్షం కురుస్తుందని అంచనా వేసే వారనీ,
తిథి వార నక్షత్ర కరణ యోగాలను గణించి, చైత్ర శుద్ధ పాడ్యమినాడు పంచాంగాన్ని చెప్పే వారని ప్రతీతి. ఇదే ఆచారంగా ఇప్పటికీ తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజైన ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేస్తారు..
తీపి, కారం , పులుపు , ఉప్పు , చేదు , వగరు కలిపిన ఆరు రుచుల పచ్చడిని తిని పగలు, రాత్రి , చీకటి , వెలుతురు , సుఖం , దుఃఖం అనే మానసిక వికారాలను అధిగమించడానికి నాందిగా ఉగాదిని జరుపుకుంటారు.
తిథి, వార , కరణ , నక్షత్ర , యోగ కారణాలు రోగాలను తొలగించి సమస్త శుభాలను కలుగచేయడం ఉగాది నుండే ప్రారంభం అవుతుందని గొప్ప విశ్వాసం. ఈ ఉగాది వసంత ఋతువులో చైత్రమాసంలో మొదటి రోజున వచ్చి భవిష్యత్తు ఆశలను చిగురింప చేస్తుంది….
కొన్ని ప్రాంతాలలో ఉగాదినాడు ఏరువాక ముహూర్తం కూడా పెట్టుకుని ఆరోజే నూతనమైన కార్యక్రమాలు అన్నిటికీ శ్రీకారం చుడతారు.
వసంతం ప్రకృతికాంతకు సీమంతం.. వసంతాన్ని మధుమాసం అని , మాధవ మాసమని కూడా అంటూ ఉంటారు. మాధవుడంటే విష్ణువు మాధవునికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి దీన్ని మధుమాసం అంటారంటారు.
మనసును చలింప చేసే మాసం వసంత ఋతువుగల చైత్రమాసం కాబట్టి దీన్ని మన్మధ మాసం అని కూడా అంటారు. వసంతంలో చెట్లన్నీ చిగుర్లు వేస్తాయి. ఎర్రగా పూచే మోదుగు పూలు , మల్లెలు , మొల్లలు , జాజులు, విరజాజులు , నందివర్ధనాలు , గరుడ వర్ధనాలు కనులవిందు చేస్తాయి. ముఖ్యంగా పూలు పరిమళించి, మహిళల
మనసులను రంజింపజేస్తాయి.. రాజుల కాలంలో ఈ వసంత రుతువులో అద్భుతమైన కార్యక్రమాలు , సాంస్కృతిక కార్యక్రమాలు , వేడుకలు నిర్వహించేవారు.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తీర్థాలు, పరసలు, అమ్మవారి పండగలు ఉగాది నుండే ప్రారంభమవుతాయి.. తెలుగు ప్రాంతంలో కూడా వసంత ఉత్సవాలు జరుపుకొనే సంప్రదాయమున్నది. “ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకుని వచ్చింది” అంటారు మన శ్రీశ్రీ గారు.
ఈ ఋతువులో ప్రకృతి సోయగాలు చూడడానికి రెండు కళ్ళుచాలవు… భగవంతుని మాయాజాలమే..
ప్రతి ఋతువు అందాలు చిందించినా, వసంత సోయగాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ ఋతువును ఋతువుల రాణి అన్నారు. ఈ నక్షత్రం సమయం లో అత్యంత ఆహ్లాదకరమైన వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజు,
దైవం మానస రూపేణా అన్న విధంగా,,మానవ ధర్మాలను విడమర్చి చెప్పడానికి ఆచరించి చూపిన శ్రీరామచంద్రుడు ఇనవంశంలో జన్మించాడు..తల్లిదండ్రులను దైవాలుగా భావించడానికి అన్నదమ్ములను ఆదరించడానికి, సేవకులను సంతోష పరచడానికి, ప్రజలను కన్న బిడ్డల వలె పాలించడానికి,, ముఖ్యంగా ఆలుమగల అనురాగానికి నిలువెత్తు నిదర్శనమైన సీతారాముల కళ్యాణం రామచంద్రుడు జన్మించిన నక్షత్రం నాడే .. అంటే, శ్రీరామనవమినాడే ఉత్సవంగా జరుగు తుంది ..రామ కళ్యాణం లోక కళ్యాణం అని భారతదేశం అంతటా బ్రహ్మాండంగా జరుపుకుంటారు.. ముఖ్యంగా మనతెలుగువారు సంప్రదాయబద్ధంగా తాటాకు పందిళ్లు వేసి, సీతారాములచే తలంబ్రాలు పోయించి, అయోధ్య రామయ్య అన్నయ్య మాకు … వాలు కనుల సీత వదినమ్మ మాకు … అంటూ మురిసిపోతూ ఆ కళ్యాణ ఘట్టాన్ని వీక్షిస్తారు.. రామ కళ్యాణపు అక్షితలను శిరస్సున ధరించి తమ జీవన మార్గానికి సోపానాలు వేసుకుంటారు……
ఉత్తరాది వారికి అత్యంత ప్రియమైన హోలీ పండుగ ఈ మాసంలోనే వస్తుంది . ఆటలతో పాటలతో సందడిగా, ఐకమత్యంగా రంగులు జల్లుకుంటూ ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటారు..

చిత్రాల చైత్రం శోభిల్లుతూ మదమాసం కావున మన్మధ భావాలు రేకెత్తిస్తూ మనోహరంగా సాగిపోతుంది.
సంవత్సరాది తో పాటుకళ్యాణాలతో కమనీయంగాసాగిపోయే మాసమిది.
నాటి రాజులలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు వసంతోత్సవాలు నిర్వహించి కవి పండితులను సత్కరించే వారని ప్రసిద్ధి . అదేవిధంగా కొండవీటి రాజులు కూడా వసంతోత్సవాలను కడువైభవంగా జరిపే వారట కర్పూర వసంతరాయులని అందుకే అతనికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు వచ్చింది .
రామాయణంలో, మహాభారతంలో, ఈ ఋతువర్ణనలు అద్భుతంగా జరిగాయి.. చైత్రమాసంలో జైత్రయాత్రలు చేసినట్లు ప్రబంధాల్లో వర్ణింపబడి ఉంది… వన విహారములు, ,జలవిహారాలు ఈ మాసంలో జోరుగా సాగుతాయి..
ఋతుసంహారమే ప్రధాన కావ్యం గా రచించిన, కవి కుల గురువు కాళిదాసు,వసంత ఋతువు గురించి అద్భుతంగా వర్ణించారు..కవిత్రయంలో ఎర్రన, భాగవతం లో పోతన, మనోహరంగా ఋతువులను వర్ణిస్తే …. ప్రబంధ కవులలో
అల్లసాని పెద్దన, చక్కగా వర్ణించారు.. వసంత ఋతువు రాగానే దేవకాంతలు హిందోళ రాగం లో గానం చేశారట . ఉగాది ని చైత్ర శుద్ధ పాడ్యమినాడుజరుపుకొని, గున్న మామిడి గుబురులలోంచి కూస్తూ హుకు హు రాగాల కోయిలమ్మను పిలుస్తూ, పంచాంగ శ్రవణంలో పరవశించిపోతూ,,
ఆరు రుచుల పచ్చడిని ఆస్వాదిస్తూ వసంత ఋతువు కు స్వాగతం పలుకుతాం..

భారతీయ సంస్కృతిలో కాలాన్ని అత్యంత పవిత్రమైన తత్వంగా భావించారు . కాలమే సృష్టికి ఆధారం . కాలమే జీవన చక్రాన్ని నడిపించేది . అందుకే కాలాన్ని మన పూర్వీకులు పండగగా జరుపుకునే సంప్రదాయాన్ని అర్పరిచారు . తెలుగు ప్రజలు ఆ సంవత్సర ఆరంభ దినాన్ని ఉగాది అనే పేరుతో మహోత్సవంగా జరుపుకుంటారు ఉగాది అనే శబ్దం సంస్కృత పదం యుగాది నుండి వచ్చింది. ఉగాది అనే పదం యుగానికి .. అంటే, సంవత్సరానికి మొదటి రోజు అనంటారు. ఉగాది అంటే యుగానికి ఆది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం అని అర్థం . భారతీయ కాల గణన ప్రకారం సంవత్సరాన్ని 12 మాసాలుగా విభజించారు . అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, , శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణ మాసం అనే పేర్లతో పిలుస్తాం. ఈ 12 మాసాలను వాటికి గల ప్రకృతి లక్షణాల ప్రకారం మారుతున్న విధానానికి సరిపడా విభజించారు . వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలు , గ్రీష్మఋతువు జ్యేష్ట ఆషాడ మాసాలు , వర్షఋతువు శ్రావణ భాద్ర పదమాసాలు, శరదృతువు ఆస్వాయుజ కార్తీక మాసాలు , హేమంత ఋతువు మార్గశిర పుష్య మాసాలు , శిశిర ఋతువు మాఘ ఫాల్గుణ మాసాలు. ఈ ఆరు ఋతువుల్లో వసంత ఋతువు ను అత్యంత సౌందర్యమయమైన ఋతువు గా వర్ణించారు . ప్రకృతి మళ్లీ పునర్జన్మ పొందినట్లుగా కనిపించే సమయంలో ముఖ్యమైన సమయం ఇదే . చెట్లన్నీ కొత్త చిగురులను అలంకరించుకొని, పూలు వికసించి, పక్షుల కిలకిల రావాలతో భూమి ఎంత అందంగా నిండిపోతుంది . అందుకే వసంతాన్ని ఋతురాజు అని కూడా పిలుస్తారు . ఈ వసంత ఋతువు ప్రారంభమయ్యే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు ప్రజలు ఉగాది పండుగ జరుపుకుంటారు . ఈరోజు ప్రకృతి నవచైతన్యంతో నవ నవీనంగా ప్రకాశిస్తూ మన జీవితాలలో కూడా కొత్త ఆశలను చిగురించేలా కనిపించి పరవశింప చేస్తుంది . అందుకే కొత్త ఆశలు ప్రారంభం కావాలని సంకల్పిస్తారు మనవాళ్ళు.

ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి , స్నానం చేసి, ఇల్లంతా శుభ్రం చేసి , మామిడాకుల తోరణాలతో అలంకరించి , ముంగిళ్ళలో రత్నాల ముగ్గులు తీర్చిదిద్ది, నూతన వస్త్రాలు ధరించి , ఉగాది పచ్చడిని తయారు చేసి , అందరూ సేవిస్తా రు. అందులోని ఆరు రుచులు తీపి పులుపు చేదు కారం ఉప్పు వగరు మన జీవితాలలో కలిగే ఆనందం కోపం ఆశ్చర్యం భయం అంటే అనుభవాలను సూచిస్తాయని భావిస్తారు . చాలావరకు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో కూడా అమ్మవార్లకు ఉత్సవాలు తీర్థాలు పండగలు పరసలు జరుగుతూనే ఉంటాయి.ఉగాదికి ముందు రోజు అమావాస్య కొత్తమవాస్య అని పిలుస్తారు అమావాస్యనాడు అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్సవాలు చేస్తారు.
ఈ రోజున మరొక ముఖ్యమైన పండగ అంటే ఈ పండగలో ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం.
ఈ పంచాంగం తయారు చేయడంలో కూడా ఆ కాల గణనను చేయడంలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తారని పెద్దల ఉవాచ . పుష్య మాసంలో సంక్రాంతికి పూజలు చేసి కాలపురుషునికి నమస్కరించి నిష్టాగరిష్ఠులైన పండితులు ఇంటిపై ఒక తెల్లని వస్త్రాన్ని సాయం సంధ్యా సమయంలో ఆరవేసి, ప్రాతఃకాలంలో అనుష్టానం అయిన తర్వాత ఆ వస్త్రాన్ని ఒక పాత్రలో పిండుతారని అలాగా ఆ నెల రోజులు పిండిన మంచు నుండి వచ్చిన బిందువులను లెక్కిస్తూ కాలగణన చేస్తారని చిన్నప్పుడు పెద్దలు చెప్పేవారు. ఆ విధంగా పంచాంగం లెక్కలు కడతారని నమ్మేవారు.
పంచాంగంలో ఆ సంవత్సరానికి సంబంధించిన గ్రహగతులు రుతువులు మార్పులు పండుగలు శుభకాలాలు మొదలైన విషయాలు వివరింప బడతాయి .
పంచాంగంలోని ఐదు ప్రధాన అంగాలు 1. తిథి 2. వారం 3. నక్షత్రం 4. యోగం 5 కరణం.ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఒకటి తిథి
చంద్రుడు సూర్యునితో సంబంధించి పొంది కోణాంతరాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడే కాలాన్ని తిథి అంటారు
ఒక నెలలో 30 తిథులు ఉంటాయి
15 రోజులు ఒక పక్షం. మాసంలో రెండు పక్షాలు ఉంటాయి. 15 తిథులు ఒక పక్షంలో వస్తాయి.
అవి వరుసగా పాడ్యమి ,విదియ, తృతీయ ( తదియ) , చతుర్థి( చవితి) , పంచమి , షష్టి, సప్తమి , అష్టమి , నవమి , దశమి , ఏకాదశి, ద్వాదశి , త్రయోదశి, చతుర్దశి , పౌర్ణమి ఇవి శుక్లపక్ష తిథులు.
కృష్ణపక్షంలో పాడ్యమి నుండి చతుర్దశి వరకు తిథులు యధాతథంగా వచ్చి 15వ రోజు అమావాస్య వస్తుంది.
వారం వారం అంటే వారంలోని రోజుల వ్యవస్థ. భారతీయ సంప్రదాయం ప్రకారం ఏడు వారాలు ఉంటాయి. అవి వరుసగా ఆది , సోమ , మంగళ , బుధ , గురు , శుక్ర , శనివారాలు. ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు.
నక్షత్రం విషయాలు చెప్పుకుంటే, చంద్రుడు తన ప్రయాణంలోని 27 నక్షత్రాలను దాటి సాగుతాడు . చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో ఆ రోజు నక్షత్రంగా చెప్పబడుతుంది . ఉదాహరణకు అశ్వనీ , భరణి , కృతిక , రోహిణి , మృగశిర , ఆరుద్ర, పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ, పుబ్బ , ఉత్తర , హస్త , చిత్త, స్వాతి , విశాఖ , అనురాధ, జ్యేష్ట, మూల , పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం , ధనిష్ట, శతభిషం , పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర , రేవతి. చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కూడియున్నది ఆశ్వీజ మాసం అని భరణితో కూడియున్నది బాధపడమాసం అనీ, కృత్తికతో కూడియున్నది కార్తీక మాసం ఇలా చెప్పబడతాయి..

ఇక యోగము …. సూర్యుడు, చంద్రుడు కలిసి ఏర్పడే గణిత సంబంధం ఆధారంగా యోగాలు నిర్ణయింపబడతాయి . మొత్తం 27 యోగాలు ఉంటాయి .
ఉదాహరణకు నిష్టం బయోగం ప్రీతియోగం ఆయుష్మాన్యోగం సౌభాగ్య యోగం మొదలైనవి.
ఐదు కరణం- తిథి యొక్క అర్థ భాగాన్ని కరణం అంటారు . మొత్తం 11 కరణాలు ఉంటాయి . ఉదాహరణకు
బావ కరణం బాలవకరణం, కొలవకరణం, తైతిల కరణం, గరజ కరణం వణిజ కరణం మొదలైనవి..
పంచాంగంలో ఉండే ఇతర విషయాలు…
పంచాంగంలో ఈ ఐదు అందాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా ఉంటాయి.
ఒకటి సంవత్సర నామం మాసాలు పండగల తేదీలు , గ్రహణాలు , శుభముహూర్తాలు , రాహుకాలం , యమగండం పాటించ వలసిన పద్ధతులు , ఉపాసనలు దీక్షలకు సంబంధించిన ముహూర్తాలు, వ్రతాలు ఉపవాసాలు మున్నగున వన్నీ ఉంటాయి .

ఉగాది రోజున పంచాంగ శ్రవణం ప్రాశస్త్యం.
ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు . దీనిని పంచాంగ శ్రవణం అంటారు.
పంచాంగం వినడం వలన, ఆ సంవత్సరంలో వర్షపాతం ఎలా ఉంటుంది, సహజ ఉత్పాతాలు, దొంగ భయాలు,
ఆర్థిక పరిస్థితులు, పశువులు పక్షులు, పశుపక్షాదులు, వారి పాలకులు . పాలితులు, యుద్ధాలు, యోచనలు
దేశ ప్రజల స్థితిగతులు గ్రహగతులు వంటి విషయాలను సాంప్రదాయం ప్రకారం సవివరంగా తెలియజేస్తారు . అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం శుభప్రదం . ఇది మన సంప్రదాయం.
పేరుపేరునా వారు పుట్టిన జన్మ నక్షత్రం నామ నక్షత్రం బట్టి ఆ సంవత్సర ఫలితాలు వారికి ఎలా ఉంటాయో పంచాంగ శ్రవణంలో తెలియచేస్తారు.
పంచాంగ శ్రవణ ఫల శృతి శ్లోకం..
“తిథేశ్చ శ్రీమాప్నోతి వారాదాయుష్య వర్ధనం ,
నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం
కరణాత్ కార్యసిద్ధిస్తు పంచాంగ శ్రవణం శుభం”
భావం – పంచాంగంలోని 5 అందాలను వినుటం వలన …. తిథి వలన ఐశ్వర్యం లభిస్తుంది . వారం వలన ఆయుర్దాయం పెరుగుతుంది . నక్షత్రం వలన పాపాలు తొలగిపోతాయి . యోగం వలన రోగాలు తగ్గుతాయి . కరణం వలన కార్యసిద్ధి కలుగుతుంది . అందువలన పంచాంగ శ్రవణం శుభప్రదమని ఈ శ్లోకం తెలియజేస్తోంది.

నూతన సంవత్సర మంగళ శ్లోకం….

సర్వే జనాః సుఖినోభవంతు సర్వే సంతు నిరామయా:
సర్వేభద్రాణి పశ్యంతు మా కశ్చిత్ ద్దు:ఖ భాగ్భవేత్ “
ఈ సంవత్సరం “పరాభవ” నామ సంవత్సరమని పరితపించే వారికి ఒక మాట . పరా అంటే పరాశక్తి త్రిపుర సుందరీ దేవి, భవ అంటే భవుడు శివుడు, “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః” అని ప్రార్థించే ఆ పరమేశ్వరీ పరమేశ్వరులపేర్లను తనలో దాచుకున్న ఈ “పరాభవ నామ ” సంవత్సరం,మనలను పరాభవించాలనుకున్న శత్రువులను పరాభవానికి గురిచేసి ఆ పరాశక్తి పరమేశ్వరుల కృపతో జగత్ కళ్యాణ కారణమై అలరిస్తుందని ఆశిద్దాం .
మానవ జీవితమే ఆరు ఋతువుల సమ్మేళన అయినప్పుడు మధురమైన వసంత ఋతువు మానసికోలాసాన్ని కలిగిస్తుంది… సృష్టికి ఆరంభమైన ఈ ఈరోజు ఉగాది అంటూ ఉత్సాహంగా 60 వసంతాల కాలగమనంలో
అందంగా వచ్చే సుందర సంవత్సరంలో ఆదిమాసమైన చైత్రం అందాల మాసం.సుందర దరహాసం…
ఈ పరాభవ సంవత్సరం సమస్త సుఖాలను శుభాలను కలుగజేసి మానవతా భావంతో మనుషులందరూ వికసించేటట్లు చేయాలని ఆశిద్దాం..మన ఆశయం సిద్ధించాలని ఆశలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం..

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శత్రువుతో ప్రయాణం ` జండర్ స్పహ

by Devendra March 19, 2026
written by Devendra

ఈ ఉగాది
నాకు విరోధి
షడ్రుచులు వడ్డించిన
భూమి తల్లిపై
అత్యాచారం
అంటూ స్తీల పక్షాన నిలబడి అక్షరగొంతుకను వినిపించిన కవి, విమర్శకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ గారు. శ్రీశ్రీ కోరినట్లుగా పీడితుల పక్షాన నిలబడి అభ్యుదయ దక్పథంతో పయనిస్తున్నారు. ‘శత్రువుతో ప్రయాణం’ కవితా సంపుటిలో ఉన్న 36 కవితలు సమాజాన్ని అనేక కోణాల్లో ప్రశ్నిస్తాయి. మార్పుతో కూడిన మానవత్వాన్ని కోరుకుంటాయి. రాజకీయ రంగులను ఎండగడుతాయి. స్తీవాద ఉద్యమాన్ని సమర్థిస్తాయి.
అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా వచ్చిందే స్తీవాదం. స్తీల ఉనికిని, స్తీల హక్కులను, స్తీల సమస్యలను స్తీలే వ్యక్తపరిచే సాహిత్యాన్ని స్తీవాద సాహిత్యం అంటున్నాం. తరతరాల వ్యవస్థ నిర్మాణంలో మాతస్వామ్యం రూపాంతరం చెంది పితస్వామ్యంగా స్థిరపడిపోయింది. ఆనాటి నాగరిక సమాజం నుండి నేటికి ఆ మూలాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించి, ఎదిరించే క్రమంలో వచ్చిందే స్తీవాదం. జెండర్ స్పహ, గహహింస, మాతత్వం, ఇంటి చాకిరి మొదలైన అంశాలెన్నో స్తీవాద ఉద్యమంలో వెలుగులోకి వచ్చిన అంశాలు. జండర్ సహజంగా ఏర్పడింది కాదు. కుటుంబం, సమాజం, మతం ‘స్తీలు’ అంటే ఇలా ఉండాలి, ‘పురుషులు’ అంటే ఇలా ఉండాలి అని జీవనవిధానంలో అలవాటు చేసే క్రమపద్ధతిని జండర్‌స్పహ అంటున్నాం. ఎంగెల్స్ ప్రకారం “పురుషత్వం, స్తీత్వం అనేవి శరీర ధర్మాల ప్రకారం ఏర్పడినవి కావు. ఒక సుదీర్ఘ చారిత్రక యుగంలోను పురుషత్వం, స్తీత్వం అనేవి వేరువేరుగా నిర్వచించబడ్డాయి. ఈ నిర్వచనం ఆయా యుగాలలోని ప్రధానఉత్పత్తి విధానమీద ఆధారపడి ఉంటుంది” అన్నారు. అంటే స్తీత్వ, పురుషత్వాల గురించి భావజాలాన్ని సమాజం తయారుచేసి అందిస్తోంది. ఆ భావజాలం తిరిగి సమాజక్రమాన్ని స్థిరపరచడంలో సహాయపడుతుంది. ఈ క్రమానంతటిని స్తీవాదం పరిశీలించింది. స్తీవాదం అంటే పురుషులను ద్వేషించడం కాదు. స్తీల సమస్యలను గుర్తించి స్తీలందరు ఏకమై పురుషులకు అర్థమయ్యేలా చెయ్యడం. ఈ భావజాలాన్ని అర్థంచేసుకున్న సహదయ కవి ఆచార్య మాడభూషి కుమార్‌గారు. ‘ఆమె’ కవితలో స్తీల సమస్యలను కళ్ళకు కట్టినట్లు లోతైన భావుకతతో అక్షరీకరించారు.
“చిన్నప్పటినుండి అంతే
చిన్నచూపుతోనే పెరిగింది” అంటారు
……….
ఇంకా
ఆమె నిఘంటువు నుంచి ఏ నిషేదం
అందుకే
ఎందుకు, ఏమిటి
లాంటి ప్రశ్నలు ఆమెనోట్లో రాకూడదని శాసనం”
బాల్యంనుండే ఆడపిల్ల జండర్‌వివక్షను ఎదుర్కొంటుంది. కన్నతల్లే కొడుకును ఒకరకంగా కూతురును మరొరకంగా పెంచుతుంది. లేకపోతే తల్లిపెంపకం బాగాలేదంటారు. దుస్తులు, ఆటలు, ఆహారం, ఇలా అన్నిట్లోను ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కుటుంబంలో ఆడపిల్ల ఇట్లా ఉండాలి అని తర్ఫీదునివ్వబడుతుంది. తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో పెరిగిన ఆడపిల్లకు పెళ్ళి అనే బంధం మరిన్ని బాధ్యతలను, పరిమితులను విధిస్తుంది. అందుకే కవి ఇలా అంటారు.
“అతగాడికి కావలసింది ఒక మరమనిషి
సంపాదించడానికి
వండిపెట్టడానికి
కోరికలు తీర్చడానికి
పెళ్ళిరోజున ఎ.టి.ఎం లాంటి
పెళ్ళాం దొరికిందని మరిసిపోతాడు”
స్తీకి పెళ్ళిజీవితం అనేది రూపాయి బిల్లకు ఉండే బొమ్మ, బొరుసు లాగా మారిపోయింది. మంచి భర్త దొరికితే పరవాలేదు కాని, ఆమెను అర్థంచేసుకోలేని కుటుంబంలోకి అడుగుపెట్టినప్ప్పుడు జీవితఖైదీగా మారిపోతుంది. అసలు కుటుంబమే స్తీని కంట్రోల్ చేసే బంధిఖానా అవుతుంది. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం అన్ని స్తీల బాధ్యతలే. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా వీటన్నింటిని బాలెన్స్ చేసుకోవాలి. తద్వార స్తీల శారీరక, మానసిక ఆరోగ్యాలమీద ఒత్తిడి పెరుగుతుంది. ఎదిగే క్రమంలో అనేక సవాళ్ళను స్తీ ఎదుర్కోవలసి వస్తుంది. ‘ఆమె’ కవితలోనే ఈ పంక్తులు చూడండి.
“ఆకాశమంత వ్యాపించి
అందీ అందని ఆ తేజోమూర్తిని చూసి
నిందలు వేసే వాళ్ళెందరో!
మబ్బుల నడుమనుంచి
అప్ప్పుడప్ప్పుడు మెరుస్తూ ఉంటేనే
ఇంత అసూయగా ఉంటే
పున్నమి వెన్నెల విరిస్తే
రెక్కలు ముక్కలు చేసుకొని
ఆకాశానికి ఎగురుతున్న ఆమె రెక్కల్ని
ముక్కలు చేయడానికి ఎందరో”
అన్న పంక్తులు బాధ్యతల దొందరలో, ఉరుకుల పరుగుల ‘ఆమె’ జీవితంలో పడగనీడలా నిందలు, ఆధిపత్యాలు, అకత్యాలు, వివక్షలు, చిన్నచూపులు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘర్షణల మధ్య స్తీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటు ముందుకు వెళ్ళే సాహసం చేస్తుంది. అయినప్పటికి స్తీలు తమను తాము నిరూపించుకుంటూ అన్నిరంగాలలో ముందుకు వెళ్ళే ప్రయత్నంచేస్తున్నారు. అయినప్పటికి అడగడుగున పరీక్షలపర్వాలను దాటక తప్పడంలేదు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లి కలలుకంటుంది. అన్నీ తానై భరిస్తుంది. అయినప్పటికి తండ్రి అంటే పిల్లలకు గౌరవం. తల్లి అంటే చిన్నచూపు. ‘ఆమె’ గురించి కవి మాటల్లో …
ఇంట్లో సెలవులేదు
పనిలో సెలవులేదు
జీవితమంతా పిల్లలకోసం పరుగెత్తి పరుగెత్తి
అలిసిపోయిన ఆమెకు
ఆసరా లేదు
………
ఆమె లేకుండా
మానవ చక్రం పరిభ్రమించదు
అందుకే ఆమెను
పరిమళించనివ్వండి
కవితా ముగింపులో స్తీ ఉన్నతిని ఆకాంక్షిస్తున్నారు కవి. ఈ విశ్వమానవ కాలభ్రమణంలో స్తీ, పురుషులిద్దరు అవసరమే. ఎవరికివారుగా బాధ్యత నిర్వహణలో పోటీపడాలి గాని ఆధిపత్యాలు, అహంకార పెత్తనాలు స్తీల అశాంతికి కారణమౌతున్నాయి. హింసకు దారితీస్తున్నాయి. స్తీల చుట్టు భయాన్ని గుర్తుచేస్తూ ‘భయం’ కవిత లో ఇలా అంటారు.
భయం
కట్నంలా రావచ్చు
పట్నంలో రావచ్చు
అత్యాచారంలా రావచ్చు
నిత్యాచారంలా ఉండవచ్చు
……………..
భయం
మగాడిలా ఉండవచ్చు
మగడి రూపంలో ఉండవచ్చు
మైరావుణుడి రూపంలో ఉండవచ్చు
రూపం ఏదైనా
భయం మాత్రం ఒక్కటే
అది భయమే
స్తీలకు ఉన్న భయాలు అన్ని ఇన్ని కావు. పురుషస్వామ్య ప్రపంచంలో ఎక్కడ పొంచి ఉంటుందో ఆ భయం. కవి పై కవితలో కట్నం వలన భయం అనడంలో మనం ఇప్పటికి వరకట్న వేదింపులకు బలైన స్తీలను మీడియా ముఖంగా చూస్తునే ఉన్నాం. స్తీలపై అత్యాచారం అన్నది ఈనాటికి రూపుమాపలేకపోయాం. ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు చేసిన దిశ లాంటి అమ్మాయిలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తవుతే కన్న తండ్రి కళ్ళు కామంతో కప్పబడినపుడు కూతురు పరిస్థితి అగమ్యగోచరం. ‘తండ్రి’ అన్న కవితలో
“కన్న బిడ్డనే కామించే తండ్రులు
తండోపతండాలుగా పత్రికల్లో మొలుస్తూనే
టీవీలో మెరుస్తునే ఉన్నారు
వాటిని చూసిన మొహంతో
కన్నబిడ్డను చూసే శక్తిలేక
ఆత్మహత్య చేసుకుంటున్న”
అంటారు. ఇక్కడ కవి ఈ సంఘటనకు కరుణరసభరిత కవితాక్షరాలను మనముందుంచారు. ఎవరో చేసిన పనికి తండ్రిగా కూతురు ముందు నిలబడలేని స్థితిని తండ్రులందరి పక్షాన నిలబడి బలమైన సందేశాన్ని ఇచ్చారు. ‘మగాడు’ కవిత జండర్ వివక్షను మరింత స్పష్టంగా చెప్తుంది.
“వాడు కావాలనుకొన్నప్ప్పుడు
నేను రావాలి
వాడు తేవాలన్నప్ప్పుడు
నేను తేవాలి
వాడు తిరగమన్నట్టు
నేను తిరగలిగా తిరగాలి”
స్తీ, పురుషులిద్దరు మనుషులే. ఇద్దరిలో ప్రవహించే రక్తం ఎర్రగానే ఉంటుంది. కాని, స్వేచ్ఛా పరిధిలోకి వచ్చేసరికి జండర్ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. పితస్వామ్య వ్యవస్థ పురుషుడిని ‘మగాడు’ గా చూడాలనుకుంటుంది. మగాడు అంటే ఎలా ఉండాలని సమాజం, కుటుంబం చెప్పిందో కవి ప్రతిసందర్భంలో మగాడి రంగును తేటతెల్లం చేస్తాడు. స్తీ ఎల్లప్పుడు పిల్లలకోసమో, పుట్టింటి వారి కోసమనో, పరువు మర్యాదల కోసమనో తను ఉండాలనుకున్నట్టుగా ఉండలేకపోతుంది. తన అస్తిత్వాన్ని ఉనికిని పరిస్థితులకు ఫణంగాపెట్టి అన్నిటికి సర్ధుబాటుతనపు సంకెళ్ళు వేసుకుంటుంది. అందుకే ‘కవి’ స్తీ, పురుషుల సహవాసాన్ని శత్రువుతో పోల్చడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
“నేను సహవాసం చేస్తున్నది
శత్రువుతో
నేను సహజీవనం చేస్తున్నది
శత్రువుతో
నేను పంచుకొంటున్నది
శత్రువుతో
పనిచేస్తున్నది
శత్రువుతో”
ఈ శత్రువులు మిత్రులు అయ్యేదెప్పుడు! జండర్‌వివక్ష తగ్గినప్పుడు ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకెళ్ళినప్పుడు అంటే స్తీవాదాన్ని పురుషుడు అర్థంచేసుకున్నప్ప్పుడే సమస్య పరిష్కారం దిశగా ముందుకు కదులుతుంది. ఆచార్యస్థానంలో ఉన్న మాడభూషి సంపత్‌గారు మహిళల ఆర్తిని, ఆవేదనను, వివక్షను అర్థంచేసుకున్న వ్యక్తిగా, కవిగా, ప్రగతిశీల మార్గదర్శకుడిగా స్తీల గొంతుకను ‘శత్రువుతో ప్రయాణం’ పేరుతో తన కవితాధారతో బలం చేకూర్చిన మానవతామూర్తి ఆచార్య సంపత్‌కుమార్‌గారు.

ªªª

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us