మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

అనంతం-అద్భుతం- అపూర్వం

by Damaraju Vishalakshi May 30, 2026
written by Damaraju Vishalakshi

“నాస్తి మాతృ సమా ఛాయా / నాస్తి మాతృ సమా గతిః/
నాస్తి మాతృ సమం ప్రాణం/
నాస్తి మాతృ సమా ప్రియా”..
అని మాతృతత్వ మహత్యాన్ని వర్ణిస్తూ సంస్కృతంలో ఒక సుభాషితం చెబుతుంది.
ఈ సృష్టిలో తల్లికి సమానమైన నీడ, తల్లికి సమానమైన గమ్యము, తల్లికి సమానమైన రక్షణ, మరియు తల్లికి సమానమైన ప్రియత్వం అంటూ వేరే ఏమీ లేవని దీని అర్థం.

మాతృతత్వము అతులనీయమైన దని దీనిఅర్థం.

84 లక్షల జీవరాశులలో ఈ మాతృత్వం అనేది ఉండటం చేతనే, సృష్టి క్రమంగా నిరాటంకంగా సాగుతోంది.

అందువల్లనే ఈ మాతృతత్వంలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించిన మార్కండేయ మహర్షి వారు, దుర్గా సప్తశతిలో

“యా దేవి సర్వభూతేషు/ మాతృ రూపేణ సంస్థితా/
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః.
అంటూ స్తుతించడం జరిగింది.

చండీ సప్తశతి లో సృష్టికి మూలాధారం శక్తి అని, మాతృ రూపంగానే వర్ణించి ఆరాధించడం జరిగింది.
ఏది ఏమైనా ఈ అనంతమైన సృష్టికి, జీవి
స్థితి మరియు లయములకు కూడా
మాతృ రూపమైన శక్తియే ఆధారమని అర్థమవుతుంది.

కాబట్టి, మన సంస్కృతిలో, మాతృ స్థానాన్ని దివ్యత్వాన్ని జోడించి, సర్వదా పూజనీయమని ఉద్ఘాటించారు మన పెద్దలు.

భాషలో చిన్నదైనా! భావంలో అనంతమైన పదం “అమ్మ” .
ఈ ఒక్క పదంలో సృష్టి, సంరక్షణ ,త్యాగం, కరుణ ,ప్రేమ దైవత్వం ఇలా అన్నీ నిండిఉంటాయి.

భారతీయ సంస్కృతిలో అమ్మ అనే పదం కేవలం కుటుంబ సంబంధాలను సూచించేది మాత్రమే కాదు /
అది దేవతా తత్వానికి ప్రతిరూపంగా వర్ణింపబడింది .
వేదాలలో తల్లి స్థానాన్ని అత్యున్నతంగా పేర్కొన్నారు .

ముఖ్యంగా” మాతృదేవోభవ “అనే వాక్యం
తైత్తిరీయ ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఇది తల్లిని దేవతగా భావించమని ఆజ్ఞాపిస్తుంది .తల్లి మొదటి గురువు. తల్లి మొదటి దేవత .తల్లి ప్రేమ నిస్వార్ధమైనది.

వేద దృష్టిలో తల్లి సృష్టి. స్థితి. లయ కారిణి గా భావించబడింది. ఇక మన పురాణాల్లో అయితే తల్లి అనేక రూపాలలో దర్శనమిస్తుంది .ఆమె సృష్టికి మూలమైన ఆదిపరాశక్తిగా, ప్రేమను, శాంతిని పంచే పార్వతీదేవిగా ,
ఐశ్వర్యాన్ని పంచే లక్ష్మీదేవిగా, జ్ఞానాన్ని పంచే సరస్వతీ దేవిగా జగత్తును పోషించే శక్తి స్వరూపిణిగా అభివర్ణింపబడినది. ఇతిహాసాల్లో తల్లి పాత్ర ఆదర్శవంతంగా త్యాగమూర్తిగా వర్ణించబడింది .

ఇక భారతీయుల తత్వశాస్త్రం ప్రకారం తల్లి ప్రేమ స్వరూపిణిగా, క్షమామూర్తిగా, త్యాగమయిగా, వర్ణింపబడింది. ప్రపంచంలో ఏ బంధం కూడా
తల్లి బంధంతో సమానంగా ఉండదని నిరూపించింది .
*జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ “
సృష్టికి మూలం స్త్రీ. ప్రకృతియే ప్రకృతిని సృష్టించి, పోషించి, లీనం చేసుకునే తత్వం స్త్రీ రూపంలో మమ్ముూర్తుల మూర్తీభవించి ఉంటుంది .అందుకే ఆమె మాతృమూర్తిగా బిడ్డలను కని పోషిస్తుంది. వారిని జ్ఞాన మార్గాన పయనింప జేసి, ఆనంద ధామం వైపు నడిపిస్తుంది..

పక్షికి ఎగరడం, చేపకు ఈదడం. నెమలికి ఆడడం ఎంత సహజమో ! అమ్మ తన వాత్సల్యాన్ని తమ సంతానం మీద ప్రదర్శించడం కూడా అంతే సహజం. అమ్మకు ఈ గుణం ఎవరో నేర్పితే వచ్చింది కాదు. ఇది సనాతనమైన సహజమైన గుణం.

నిజానికి నేర్పితే నేర్చినది విద్య కాదు .
అమ్మ ప్రకృతి .ఆమెలో అనుభూతి సహజం. ఆమె ప్రకృతి కాబట్టి ఆమె నుండి ఆమె సమకూర్చుకున్నది ధర్మం .
ఈ సనాతన ధర్మాలు స్త్రీలో పూత పూసినట్లుగా పురుషుల్లో కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి స్త్రీత్వం పరావర్తనం చెందినపుడు మాత్రమే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అని త్రికరణాలలో మొదటి స్థానం అమ్మకే దక్కింది .

భగవంతుడు భూమిపైకి వచ్చి ప్రజల్ని సన్మార్గంలో పెట్టాలని తలచి, తనకు బదులుగా తల్లినిపంపించాడని ఒక కథనం ఉన్నది.

దేవుడు చేయని, ఈయని సంస్కారం ,తల్లి ఇస్తుందనే కదా,దీనిభావం.

ఒకవేళ దేవుడే భువికి దిగి వచ్చినా, అమ్మ గర్భాన్ని ఆశ్రయించవలసిందే ! అతనికి కూడా వేరే మార్గం లేదు .

మానవులుగా జన్మించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తల్లి గర్భాన్నే కదా ఆశ్రయించారు? …

అమ్మ అనే పదం కమ్మనిది తీయనిది. అమ్మ పాలధార అమృతభాండం. పున్నమి వెన్నెల. ఆనందాన్నిచ్చే నదీ ప్రవాహం. అనంతమైన కడలి. ఆమె కన్నతల్లి భూమాత,
గోమాత, భూమాత, దేశమాత. అన్నీ ఆమే…..అమ్మ అనంతం, అమ్మ అద్భుతం, అమ్మ ఆశ్చర్యం .

“స్త్రీలలో అమ్మను దర్శించడం, పారమార్థిక మార్గాలలో ఆలోచించడం, పవిత్రంగా భావించడం, సనాతనధర్మం.
స్వధర్మే నిధనం శ్రేయః/ పరధర్మోభయావహః” అనే గీతాచార్యుని బోధనను గుర్తులో ఉంచుకొని, మన భారత భూమిపై తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో , ఆమె కంట తడిపెడితే ఎంతటి ఉత్పాతాలు సంభవిస్తాయో తెలుసుకుంటూ, తల్లిని గౌరవంగా, మర్యాదగా చూసుకోవాలి…

పర స్త్రీలో అమ్మతనాన్ని చూడడం వల్ల, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అందుకే ప్రహ్లాదుని గురించి భాగవతంలో ,
“కన్నుదోయికి అన్యకాంత లడ్డం బైన/ మాతృభావన చేసి మరలు వాడు” అన్నారు పోతన కవి .
కాబట్టే! అతనికి మిగతా సద్గుణాలు అలవడ్డాయి. విష్ణుభక్తి లభించింది.

పుట్టిన ప్రతి జీవి ఆకలిని తీర్చేది అమ్మ మాత్రమే. ఆ అమ్మను అన్నపూర్ణమ్మ అని అభివర్ణిస్తున్నాయి. మన ఇతిహాసాలు.

ఎవరికైనా అమ్మా! ఆకలిని తప్ప, ఇంకో శబ్దం
నోటి వెంట దొర్లదు” ..

అతి ప్రాచీన కాలం నుండి, ఆధునిక కాలం వరకూ, ఆకలి తీర్చేది, ఆత్మీయత పంచేది, అనురాగంలో ముంచి తేల్చేది అమ్మతనం మాత్రమే.

బిడ్డను కనినా, పెంచినా, కన్న బిడ్డలైనా, కాకపోయినా వారైనా, మాతృత్వంతో మురిసిపోయే స్త్రీ మూర్తి,
బిడ్డ పాలన, పోషణ కోసం తన సమస్త శక్తులు ధార వస్తుంది. అలా చేయగలిగేది తల్లి మాత్రమే..దాంపత్య ధర్మం అంటూ ఉంటేనే! ఈ మాతృభావన పరిపుష్టమవుతుంది . ఈ భావం నుండి సమాజము, సామాజిక ధర్మాలు అన్నీ ఆవిష్కరింప బడ్డాయి.

మాతృమూర్తిని గౌరవించడం ద్వారా పురుషులు ఉన్నతిని పొందినట్లుగానే, స్త్రీలు తమ సంతానం ద్వారా, ఉన్నత మార్గాల వైపు నడుస్తారు. శ్రీరామ సోదరులే ఉదాహరణ.
పిల్లల్ని పెంచి, ప్రేమ పంచడంలో, వారి తల్లులు ఎన్నుకున్న దారులు, ఆదికావ్యం రామాయణంలో అద్భుతంగా వర్ణింపబడ్డాయి. అమ్మ అంటే ఏమిటో తెలియజేస్తుంది రామాయణం. కౌసల్య మాత సౌశీల్యం, సుమిత్ర సహనం,
కైకేయి అతిశయం ఏ విధంగా తెలియజేస్తుందో!

సంతానాన్ని సమర జ్వాలల నుండి తప్పించడానికి మండోదరి చేసిన మహా యత్నాలు కూడా మనకు మాతృమూర్తి హృదయ వేదనను తెలియజేస్తాయి.

భర్త చేత పరిత్యజింప బడినా, నీలాపనిందలకు గురి అయినా, నిండు గర్భిణీ అయినా, జానకి దేవి, ఆశ్రమ వాటికలలో అష్ట కష్టాలు పడి తన సంతానాన్ని తీర్చిదిద్దిన విధానం ఆదర్శనీయం. రామాయణ, భారత, భాగవతాలలో, అష్టాదశ పురాణాలలో, ఆధునిక కావ్యాలలో, కొందరు తల్లులు పిల్లలను ప్రయోజకులను చేయడం కోసం, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం, పడిన తపన, ఎదుర్కొన్న కష్టాలు, చదివినా, విన్నా, గుండె చెరువై పోతుంది.

సంతానానికి దూరమైన దేవకీదేవి సంతాపాన్ని, అల్లరి కృష్ణుని ఆటపాటలతో ఆనందించినా కూడా పుత్రుడు, తనను విడిచి వెళ్ళినప్పుడు తల్లి పొందే వేదనకు పరాకాష్టగా యశోద మాతను, మనం గమనించవచ్చును.

అలాగే మాతృత్వాన్ని కాంక్షించి, ముగ్గురు మూర్తులను పసిపాపలుగా మార్చి జోలలు పాడిన అనసూయదేవి మాతృమూర్తిగా మమకారాన్ని తన పిల్లలకు అందించడమే కాదు. కఠోర తపస్సు ఫలితాన్నంతా ఆకలి గొన్నవారికి ఆహారాన్ని అందించడం కోసం, జలాన్ని రప్పించడం కోసం ధార పోసిన వైనం ఆమె అత్యుత్తమ మాతృమూర్తి అనడానికి నిదర్శనం..అరుంధతి, అదితి నుండి నేటి వరకు ఎందరో తల్లులు సంస్కారవంతమైన సమాజాన్ని సృష్టించారు, సృష్టిస్తున్నారు, అలా సంస్కారవంతమైన, సమాజాన్ని సృష్టించడానికి, ప్రధానమైనది, ప్రశస్తమైనది, విశిష్టమైనది, మాతృ స్థానం…

స్త్రీ సంస్కార బలం చేతనే, ఉత్తమ సంతానం కలుగుతుంది.
నారదుని ఉపదేశానుసారంతోనే లీలావతి ప్రహ్లాద సుపుత్రుని కన్నది. కశ్యప ప్రజాపతి వంటి మహనీయుని ధర్మపత్ని అయిన అదితి, ఆమె తన సంస్కార బలంతో దేవతలను కన్నది. ఆ కశ్యపుడే భర్త అయినప్పటికీ దితి తన కుసంస్కారం బలం చేత, రాక్షసులను కన్నది .

ఇక వినత,కద్రువ పిల్లల పెంపకంలో అవలంబించిన విధానాల వలన వాళ్ళు ఎలా తయారయ్యారో మనకు ఆ గాథల ద్వారా తెలుస్తుంది. అలా పెరిగిన వారి వ్యక్తిత్వాలను మనం చదువుకున్నాం చూస్తున్నాం.

ఎంత చెప్పినా తరగని కావ్యం, ఎంత వినినా తనివి తీరని చరితం అమ్మే అంటే, అతిశయోక్తి లేదేమో!

“కు పుత్రో జాయతే / కు మాతో న భవతి“ అని ప్రమాణమైన వాక్యాన్ని వెలువరించిన శంకరభగవత్పాదుల వారిని ఈ సమయంలో మనం స్మరించుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా మదర్ తెరిసా, ఆర్యాంబ, భువనేశ్వరి దేవి, జిజియా బాయి, పుతలీ దేవి, క్వీన్ విక్టోరియా,
ప్రిన్స్ డయానా, Harry potter writer J.K, Rowling . Biyonce ప్రపంచ ప్రఖ్యాత గాయని, మలాలాతల్లి వంటి తల్లులు, మాతృ దినోత్సవ సందర్భంగా స్మరణీయులు.

దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసం, ధీరమాతలై
తమ సంతానాన్ని సన్నద్ధం చేసి పంపుతున్న ఎందరో మాతృమూర్తులు! వారందరికీ ఈ మాతృ దినోత్సవం సందర్భంగా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను..

సమాజానికి మార్గదర్శకులు, సంస్కర్తలు,
సహృదయులు, వీరులు ,శూరులు, ధీరులు, ఉత్తమ పౌరులు, వీరవనితలు ధీరమాతలను, తయారు చేసేది అమ్మ. ఆ అమ్మ చూపించిన ప్రేమ ,త్యాగం, ధైర్యం, సేవ, వాత్సల్యం , మార్గదర్శకత్వమై ఎందరినో ఉన్నత స్థానాల్లో, ఉత్తములుగా సంస్కారవంతులుగా, సమాజంలో నిలబెట్టాయి.

మాతృ దినోత్సవం అనేది తల్లితనాన్ని గౌరవించే ఒక పవిత్రమైన సందర్భం. అమ్మ అనే పదాన్ని అపహాస్యం చేస్తున్న ఆధునిక కాలంలో, అమ్మ ప్రాశస్త్యాన్ని తెలుసుకొని, ఆమెకు ఆనందాన్ని చేకూర్చి, ఆదర్శంగా మసలే
ఉత్తమ సంతానాన్ని అభినందిద్దాం. తల్లిని గౌరవిస్తూ,
అమ్మ మనసును కనుక్కొని, ఉత్తమురాలైన ఆ తల్లి, ఆశయాలకు, ఆశలకు, అనుగుణంగా జీవించిన నాడు,ఈ భూమి స్వర్గతుల్యమవుతుంది.

ఇది అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తే అద్భుత అవకాశం. ఎందరో ఉత్తమమైన తల్లులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకోవాలి.
ఆకలి కేక వినేసరికి అయ్యో నాయనా వస్తున్నాను ఆగు అంటూ మరుక్షణంలోనే ప్రత్యక్షమై, ఆదరించిన అమ్మ
డొక్కా సీతమ్మ గారు వంటి దయార్ద్ర హృదయులు అయిన తల్లులను, వారి చిరస్మరణీయ సేవలను తలచుకుందాం.

ఈనాటికి ఎందరో తల్లులు మాతృత్వ మమకారంతో , మానసికంగా, శారీరకంగా, నలిగిపోతున్నా, తమ సంతానాన్ని సమున్నత స్థానంలో నిలపడంకోసం, సర్వ శక్తులు ఒడ్డి, పోరాడుతునే ఉన్నారు. అలాంటి మాతృ మూర్తులందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం.

మాతృ దినోత్సవ నాడు మాత్రమే మాతృత్వాన్ని, మాతృ మూర్తులని గుర్తిస్తూ, సంవత్సరం పొడవునా సమస్యల
పాల్జేసే కు సంస్కారవంతులైన సంతానానికి ఆ పని ఎంత మాత్రం తగదని, కన్నవారి ఋణం కడదాకా తీర్చుకోలేమని తెలియజేద్దాం. అమ్మను సంతోష పెట్టడానికి సంతానం సహృదయతను కలిగి ఉండాలని విన్నవించుకుంటూ ,

..మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో…

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

గుండె నిండిన స్వప్నాలు

by Kesharaju Venkata Prabhakar rao May 30, 2026
written by Kesharaju Venkata Prabhakar rao


తొంగి చూస్తున్న జాబిల్లి ఇంట్లోకే,
వాయుదేవుని ప్రతిభాపాటవాలతో
వెలుగు లీనుతున్న
ఇంటి పైకప్పు చిల్లులగుండా…!

మెరుపుల తీగలు ఇంటి చుట్టూతా
సిరీస్ బల్బుల్లా ధగధగలాడుతూ
మల్లెపూల దండలా వేలాడుతు
చినుకు చినుకు అతుక్కుని
వసుధను వలపుల మంజరితో అలంకరిస్తుంటే…!!

కుక్కి మంచంలో విరిగిపోతున్న నడుము
అమ్మా అయ్యా అంటుంటే,
పొట్టనే అతుక్కుపోతున్న వెన్నుపూస
గజం లోతుకి వెళ్లిన కళ్ళు
ఏమి చేయలేక!!

తడిసిన చితుకులు
నానిన మెతుకులు
తడిసిన దుస్తులు
ఈ అలమటలతో తలపడి
ఆర్ద్రతలో బతుకుని
అధిగమించి ఆనందంగా గడపాలని !!

జలఖడ్గం విసిరినవల
తెంచాలని తుంచాలని
భారంగా మూసిన మనసు . ‌.‌‌..
బ్రతకాలనే కాంక్ష
బ్రతికించాలనే తపనతో
గుండె నిండా స్వప్నాలే
కంటోంది….!!

ఇంతలో దానికదే
హోరు సర్దుకుంది
జడివాన వెలిసింది
పొంగిన వాగులు
ఎగిసిన కెరటాలు
చేరాయి తమ తమ తావులు!!

పచ్చని చేలు
విరబూసిన పూల సువాసన
నాసికను హత్తుకుంటే
మత్తుతో మతిని చిత్తు చేస్తూ…
చల్లని పిల్ల గాలులు మేనిని తాకుతూ
ఎగిరే పక్షుల రావాలు
తిరిగే పశువుల గిట్టెల చప్పుళ్ళు
వీనుల విందు చేస్తుంటే!!

తుడిచిన అద్దంలా
నిర్మలమైన ఆకాశం
మిల మిల మెరిసే తారలతో
వసంతం పూయిస్తుంటే!!

లేవాలనే కోరిక బలీయంగా
అయినా లేవలేక
పై కప్పు పొక్కలోంచి
తదేకంగా చూస్తుంటే !!

బాధంతా బలమై మొలిచింది
వేదన మోదమై
చిలిపిగా చూస్తుంటే
దుఃఖం
సాంఖ్య యోగము వినిపిస్తుంటే
స్వర్గంలో నడయాడుతున్న ట్టు
అనుభూతి!!
ఆహా ఏమి చిత్రం !?
ఈ విచిత్రం ప్రకృతి వైచిత్రి కదా!!

ఇది నా స్వీయ రచన

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

క్రైంచిత్రాలగీతాలలో — కావ్యవిలువలు.

by Dr. V.V. RamaRao May 30, 2026
written by Dr. V.V. RamaRao

 పాటకు పల్లవి ప్రాణమైతే  సినిమాకు మాత్రం పాటే ఆరో ప్రాణం. మాటలు లేని‌ సినిమాలను చూడగలమేమోగాని  పాటలులేని  సినిమాలను ఊహించలేం. అందుకే కథ, ఇతి వృత్తమేదైనా సరే ,ముఖ్యంగా మన తెలుగు సినిమాలలో పాటలుం డాల్సిందే! ఆ పాటలు కూడా చక్కని భావుకత తో సాహితీవిలువలతో రూపొందడం వలన సినీగీతం కూడా విశ్వవిద్యాలయాలో ఒక పరిశోధనాంశమ వడం శుభ పరి ణామం.అంతేకాదు తెలుగు పాట ఆస్కార్ పురస్కారం అందుకొని అంతర్జాతీయ వేదికపైన నర్తించడం  మరో ముందడుగే!

సాధారణంగా పౌరాణిక,జానపద,సాంఘిక,చారిత్రక చిత్రా లలో ఎక్కువ శాతం పాటల సాహిత్యం  ప్రామాణికంగానే ఉంటుంది. అయితే పగ ,ప్రతీ కారం; దొమ్మి,దోపిడి మొద లైన నేరపూరిత(క్రైం) ఉత్కంఠమైన( సస్పెన్స్) సినిమాల లోని పాటలు ఆటవిడుపుగా ఉండటం కోసమే చేర్చడం ఆన

వాయితి. ఇవి ఎక్కువ వాంప్ లేదా క్లబ్ డాన్సర్స్ పైననే చిత్రీ కరిస్తుంటారు.

జేమ్స్ బాండ్  చిత్రాలలో చాలా వరకు కథను కారు ఛేజింగ్ లతో వేగంగా నడుపుతుంటారు కాబట్టి పాటలు స్పీడ్ బ్రేకర్లు గా భావించే నిర్మాత దర్శకులు కూడా ఉం టారు. అయితే మన తెలుగు చిత్రాలకు సంబంధించినంత వరకు గౌతమ

బుద్ధుని గాథ తో తీసిన సినిమా లో సైతం డ్యుయెట్స్ ఉంచి  తేనే వసూళ్ళ వుతాయని భావించి ఔచిత్య అనౌచిత్యాల జోలికి వెళ్ళకుండా పాటను పల్లకిలో ఊరేగిస్తారు.

కొంతమంది సాహితీ అభిరుచిగల నిర్మాతలు దర్శ కులు  మాత్రం క్రైం చిత్రాలలో సైతం కల కాలం  విన దగిన  పాట లు రాయించి, మంచి సంగీతాన్ని జోడించి పాటకు పట్టం కట్టారు. 

 కావ్యవిలువలంటే ..

“కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే

శివేతరక్షతయే సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితయోపదేశయుజే.” కావ్యం యశస్సు కొరకు, ధనసంపాదన కొరకు, వ్యవహార ఙ్ఞానం కొరకు, అమంగళ పరిహరణం కొరకు, మోక్ష సాధనకొరకు, కాంతా సమ్మిత మైన ప్రభోధం కొరకు –అని మమ్మటుడు “కావ్య ప్రకాశం “లో కావ్య ప్రయోజనాలుగా‌ పేర్కొన్న అంశాలే ఆ ధునికకాలంలో స్థూలంగా సాహితీవిలువలు గా పరిగణించవచ్చని విమర్శ కుల మాట.

గీతం కూడా సాహితీ ప్రక్రియే కాబట్టి సినీ గీతాలు కూడా విలువలు కలిగివుంటాయి.. అయితే , పక్కా కమర్షియల్ మాస్ మసాల విభాగంలోకి వచ్చే క్రైం సినిమాలలో సైతం   సంగీత సాహిత్య విలువలతో కూడిన  పాటలుండటం విశేషం.

సినిమా చరిత్రలో 1962లో వచ్చిన డాక్టర్ నో ది ఫస్ట్ ‘ తొలి జేమ్స్ బాండ్ సినిమా. 1958లో ఇదే పేరున ఇయాన్

ఫ్లెమింగ్ రాసిన నవలాధారంగా వచ్చిన చిత్రమిది. Terence Young డైరెక్ట్ చేయగా..Harry Saltzman, Albert R. Broccoliలు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. జేమ్స్ బాండ్ గా సీన్ కానరీ నటించారు. హాలీవుడ్

జేమ్స్ బాండ్ స్ఫూర్తి తో తెలుగులోనూ అపరాధ పరిశోధన చిత్రాలు మొదలయ్యాయి.

తెలుగులో సస్పెన్స్ చిత్రాలకు ట్రెండ్‌సెట్టర్‌ గా మారిన తొలి తెలుగు  చిత్రం లక్షాధికారి(1963)  లో పాటలన్నీ ఆపాత మధురాలే. వి.మధుసూదన్ రావు దర్శకత్వంలో ఎన్.టి.రా మారావు, కృష్ణకుమారి లతో తమ్మారెడ్డి  కృష్ణమూర్తి నిర్మిం చిన  ఈ చిత్రం చివరి దాక కూడా విలన్ ఎవరో తెలి యక పోవడం ప్రేక్షకులను  సస్పెన్సులో ఉంచు తుంది.ఈ సిని మాలో కొసరాజు, ఆరుద్ర, సి.నారా యణరెడ్డి పాటలు రాశారు.ఈ ఏడు పాటలలో డా.సి.నారాయణ రెడ్డి గారు రాసిన “మబ్బులో ఏ ముంది మనసులో ఏముంది” all time hit  గా జనాదరణ పొందింది

 మబ్బులో ఏముంది…

 నా మనసులో ఏముంది?

మబ్బులో కన్నీరు..

 నీ మనసులో పన్నిరు.

 సాహిత్యం మొత్తం ప్రశ్న –సమాధానం లో సాగటం ఒక విశె‌షం. ప్రకృతిలోని అంశాలను  నాయిక ప్రశ్నిస్తే అవే అంశాలతో  నాయకుడు జవాబివ్వడం ఓ చమత్కారం .ఇలా రాయడమో  శిల్పం! ప్రతి చరణం అంత్యప్రాసతో

నిర్మించడం గజల్ రచనా విధానాన్ని తలపిస్తుంది. చివరి చరణంలో “ఆత్రేయుడి“(చంద్రుడు) ముద్ర కనిపిస్తుంది. టి.చలపతిరావు మధ్యమావతి రాగంఆధారంగా  జానపద శైలిలో స్వరపరచగా ఘంటసాల సుశీల పాడిన ఈ గీతం స్వరమధురిమకు ,లయచతురిమకు నిదర్శనం.

విజయ సంస్థ వారు 1965 లో తీసిన ‘సి.ఐ.డి.’ చిత్రం లోని పాటలన్నీ ఆణిముత్యాలే! పింగళి రాసిన పాటలకు ఘంట సాల సంగీతం అందిం చారు. ఈ చిత్రంలోని “నా సరి నీవని“, “నిను తలచిన నిముషమున” పాటలు ఎంతో జనా దరణ పొందాయి. పింగళి సాహిత్యంలో శబ్దాలంకారిక సౌందర్యంతో పాటు అలతి పొలతి పదాలతో కూర్చిన విధం

హృద్యం! సి.ఐ.డి .పక్కా  క్రైం చిత్రం కాదు.

.ఉస్తాదోంకె ఉస్తాద్ (1963) హిందీ చిత్రానికి రీమేక్ గా ఎస్.డి. లాల్ దర్శకత్వంలోతీసిన“మొనగాళ్ళకు మొనగా డు (1966) సినిమాలో మూలచిత్రంలోని రఫీ పాడిన” సౌ బార్ జనమ్ లేగే“బాణీని యథా తథంగా తీసుకొని  పి.బి. శ్రీనివాస్ తో పాడించిన ” “నేనున్నది నీలోనే..నీవున్నది నా లోనే” గీతం విలువైనదే.

   1966లో ఎం. మల్లికార్జునరావు దర్శకత్వం కృష్ణ జయ లలిత హీరో హీరోయిన్లుగా, డూండీ నిర్మించిన తొలి తెలుగు గూఢచారి చిత్రం “గూఢ చారి116′ లోని పాటలన్నీ హిట్ అయ్యాయి.సి.నా.రె.రాసిన“ఎర్రాబుగ్గలమీద మనసైతే” పాటను జానపద శైలి లో రాశారు. ఆరుద్ర రాసిన  “పడి లేచే కెరటం చూడు! పడుచుపిల్ల బింకం చూడు!” గీతం లో

“వెన్నెల విరిసే వేళా… వన్నెలు మెరిసే వేళా చందమామ పరుగులు చూడు… చల్లగాలి ఆరడి చూడు/పరులెవరూలేని చోటా… పరు వాలు పూచే చోటా తరుగుతున్న కాలం చూడు ,పెరుగు తున్న ఆశలు చూడు..ఇలా “చూడు” అనే క్రియా పదాన్ని అంత్యపదంగా వేసి ఏమేమి చూడాలో ఎలా చూడాలో ఆరుద్ర కలం చూపించింది.ఇదే చిత్రంలో సి.నా .రె రాసిన  “నువ్వు నా ముందుంటే” పాట కలర్ లో చిత్రీకరిం చబడింది. చిత్రంలోని ఒక భాగం కలర్ లో చిత్రీకరించిన చిత్రాలలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.గూఢచారి116 వాణిజ్యపరంగా, సంగీత సాహిత్య పరంగా భారీ విజయం సాధించి, అనంత రం వెలువడిన తెలుగు గూఢచారి సినిమా సీక్వెల్స్ గూడచారి 116 (1966), జేమ్స్ బాండ్ 777 (1971), ఏజెంట్ గోపి (1978), రహస్య గూడాచారి (1981) మరియు గూడచారి 117 (1989)సినిమాలకు  మార్గం వేసింది.

ఎస్.డి.లాల్ దర్శకత్వంలొ రామకృష్ణ,గీతాంజలి హీరో యిన్ లుగా తీసిన ” హంతకులొస్తున్నారు జాగ్రత్త“(1966) చిత్రంలోని పాటలను సి‌.నా.రే లలితభావాలతో రాయగా విజయ కృష్ణమూర్తి ఆపాత మధురంగా మలచారు. ఈ సినిమాలో

పల్లవించిన భావాలు  పరిమళించెను ఈనాడు“

అమ్మాయీ నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి“

“మా చల్లని ఇల్లు మమతల పుట్టిల్లు, “దిగి రావ య్యా ఓ

దేవా ”  మొదలగు పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

    1967  లో ఎ.వి.ఎం వారు ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శ క త్వంలో తీసిన ‘అవేకళ్ళు“తెలుగులో   విడుదలైన తొలి హారర్, సస్పెన్స్ కలర్ చిత్రం. కృష్ణ, కాంచన హీరో హీరో యిన్లు గా నటించిన ఈ సినిమాలో కొసరాజు, రాసిన“డుం డుం గంగిరెద్దు దాసరోడొచ్చాడు,/మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భలే భయమన్నది” మొదలైన పాటలు ప్రజాదరణ  పొందాయి.

      1968 నుంచి సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమాలు ఒక దశాబ్ద కాలం వరకు  వెల్లువలా వచ్చాయి.

ఈ సినిమాలెంత ఊపందుకున్నాయంటే చివరికీ కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యమిచ్ఛి నటించే అక్కినేని నాగేశ్వ ర రావు సైతం రివాల్వర్ ధరించి జమీందార్ ‘,’బందిపో టు దొంగలు‘,’ అదృష్టవంతు లు‘ మొదలైన సినిమాల్లో హీరో చితంగా నటిం చేంత వరకు.ఎన్.టి.రామారావు సైతం పౌ రాణిక పాత్రల కు స్వస్తి చెప్పి ‘నేనే మొనగాణ్ణి‘ ‘భలే త మ్ముడు: మొదలయిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో నటించి చివరివరకు కొనసాగించారు.

 కృష్ణ నటజీవితాన్ని మలుపుతిప్పినవి క్రైం యాక్షన్, చిత్రా లే! హాలీవుడ్ నటులైన సీన్ కానరి,రోజర్ మూరె, వలె టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా పేరు గాంచా డు.

        కృష్ణ కాంచన నటించిన ‘నేనంటే నేనె‘ చిత్రం

(1968) లోని యస్.పి.కోదండపాణి సంగీతంలో పాటలన్నీ హిట్టయినవే.సి.నా.రె రాసిన “ఒకే ఒక గులాబికై వాలిన

తుమ్మెద లెన్నెన్నో  ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నె న్నో.”కొత్త అభివ్యక్తు లతో ఉన్పది. కొసరాజు జానపదం  ‘అంబవో శక్తి వహో” తో పాటు  కాంచన ను ఆటపట్టిస్తు కృష్ణ పాడే  ‘ఓ చిన్నదాన నన్ను విడిచి’  టీజింగ్ సాంగ్  సూపర్  హిట్ అయింది .ఈ పాటలో “గుంతలకిడి గుమ్మా’ (గానం–ఎస్.పి.బాలు) ప్రయోగం తమిళ చిత్రం ‘నాన్’లో ఉండటం విశేషం. ఈ సినిమా లోనే కాంచన, విలన్ కృష్ణంరాజును కవ్విస్తూపాడే గీతం ‘నువ్వే నువ్వే నన్ను చేరుకోవా’ గీతంలో సి.నా.రె.పద చిత్రాలు భావకవితాసాంద్రమైనవి.

ఒక చరణం లో

“సెలఏరులాగ వస్తా..అల లాగ నినుపొంగిస్తా

చెలరేగి పొంగిస్తా..ఆ..చిన్నారి రాజా

మబ్బులపానుపు కావాల..మల్లెలదిండులు కావాల? ” అని రాశారు.

    అక్కినేని నాగేశ్వరరావు,జమున నటించిన

బందిపోటు దొంగలు (1968)చిత్రానికి పెండ్యాల ఆపాత మధురమైన సంగీతం అందించి సాహిత్యానికి పీట వేశారు. కె ఎస్ ప్రకాశ్ రావు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కథా చిత్రంలో సి.నా.రె.రాసిన ” విన్నానులే ప్రియ‘ గీతంలో

“కలకల నవ్వే నీ కళ్ళు కాముడు దాగిన పొదరిళ్ళు

“చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల” వంటి  అలంకారిక అభివ్యక్తులు

అలరిస్తాయి. ఇదే చిత్రంలో దాశరథి రాసిన

“విరిసిన వెన్నెలవో?పలికిన కోయిలవో” లలిత

పదాల పోహళింపుతొ వండిన ‘పొంగళి!

           ‌‌ అక్కినేని నటించిన మరో క్రైం చిత్రం అదృ ష్టవం తులు(1969) సూపర్ హిట్టయింది.

ఇందులో ‘అయ్యయ్యో బ్రహ్మయ్య,”చింతచెట్టు చిగురు చూడు, మొదలైన  పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.అయితే పెళ్ళయిన కొత్త జంట కోసం  “కోడికూసే జాముదాక తోడురారా చందురూడ” పాటలో ఆత్రేయ “చంద్రుడిని కళలు తెలిసిన చందురూడ అని, మత్తు తెలిసిన చందూరుడా తీపి చూపుల చందురూడ” అని రకరకాలుగా సంబోంధించారు.

            ఎన్.టి.ఆర్. ద్విపాత్రా భినయం చేసిన “భలేతమ్ముడు‘చిత్రం హిందీలోని “చీనా టౌన్“కు రీమేక్. ఇందులో తొలిసారి మహమ్మద్ రఫి

అన్ని పాటలు పాడించడం విశేషం. చాలా పాటలు హిందీ బాణీలను అనుసరించినప్పటికీ

‘నేడే ఈనాడే ” ఈ పాటను స్వతంత్రించి  మధు రంగా  స్వరపరచారు టి.వి.రాజు. ఇందులో

ఒక చరణంలో.

” మదిలో విరిసే మమతల మాలలు

 చెలిమికి కానుక చేసెదనూ

 ఆరని వలపుల హారతి వెలుగుల

 కలకాలం నిను కొలిచెదనూ” అని నాయిక తెలి యజేసిన విధానం కావ్య పరిభాషే.

       కృష్ణ,విజయనిర్మల నటించిన“టక్కరిదొంగ

చక్కనిచుక్క” కె. ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో వచ్చిన కౌబాయ్ తరహా చిత్రం.ఇందులో కృష్ణ

ద్విపాత్రాభినయం చేశాడు. సత్యం మ్యుజికల్

హిట్ చేసిన ఈ సినిమాలో దాశరథి రాసిన

” కలలు గనే కమ్మని వయ్యారి” సినారె రాసిన

” నీ నడకలు చూస్తే మనసవుతుఃది ” పాటలు

క్లాస్ ను మాస్ ను అలరించాయి. .

కె.ఎస్.ఆర్.దాస్ 1970 లోనే విజయలలిత తో ‘రౌడీ రాణి’ తీసి, ఆలిండియా లోనే మొట్టమొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాగా  నిల బెట్టడంతోపాటు తనూ మొట్ట మొదటి యాక్షన్ సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా ను హిందీలో ” రాణి మేరా నామ్‌” పేరుతో పున ర్నించారు. రౌడీరాణిలో శ్రీశ్రీ రాసిన అంత ర్నాటక గేయం” మన దేశంలో ఉన్నారు మహానుభావులు” వస్తువు పరంగా ఎంతో విలువైంది. ఆ తరువాత కె.ఎస్‌.ఆర్.దాస్ దర్శకత్వంలో పద్మాలయా పతా కంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ‘మెక్‌న్నాస్ గోల్డ్’ చిత్రం ఆధారంగా రూపొందించిన ‘మోసగా ళ్లకు మోసగాడు’ దేశానికి మొట్ట మొదటికౌబాయ్ సినిమాని అందిస్తూ, చరిత్రని సృష్టిం చారు. దర్శకునిగా దాస్‌ కి, హీరోగా కృష్ణకు ఎనలేని కీర్తిని అందించటం.. వీరి కాంబినేషన్ ఓ స్పెషాలిటీగా పేరుపొందటం విశేషం. అనంతర కాలంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.  ఈ చిత్రానికి ఆరుద్ర కథ మాటలు పాటలు రాశారు. పాటలలో ప్రధానంగా

“కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే

పాట చెప్పుకోదగ్గది.

తొలివలపే మధురసము..

మన బతుకే పరవశము

పూలతోటలై నా అందాలు పూచేనులే

తనివి తీరగా మకరందాలు గ్రోలేనులే..అని ఒక

చరణంలో

రాగబంధమై పెనవేసుకున్నానులే

మూగకోరిక నే తెలుసుకున్నానులే అని మరో చరణంలో రాశారు.ఆదినారాయణరావు

పాశ్చాత్యబాణీలతో  చక్కగా అందించి హిట్

చేశారు.తరువాత కెఎస్‌ఆర్ దాస్ –కృష్ణ  కాంబినేషన్‌లో పలు యాక్షన్ చిత్రాలు, దొంగలకు దొంగ, దొంగలకు సవాల్ వంటి కౌబాయ్ చిత్రాలు రూపొందాయి

1969లో ఐ ఎన్ మూర్తి దర్శకత్వంలో నిర్మించిన  –జగత్ కిలాడీలు. ఈ చిత్రానికి ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చారు. దేవులపల్లి కృ‌ష్ణశాస్త్రి రాసిన పాటలు “ఎగీరేపావురమా”  మరియు “వేళ చూస్తే సంజే వేళ ” పాటలు క్రైం సినిమాల పై గౌరవాన్ని పెంచేవిధంగా ఉన్నాయి.తరువాత తీసిన  జగత్ జెట్టీలు (1970), జగత్ జంత్రీలు (1971) చిత్రాలలోని పాటలు

కూడా ఎన్నదగినవే..చలం నిర్మించిన “బుల్లెమ్మ బుల్లోడు” లో ని పాటలన్నీ విలువలున్నవే.ముఖ్యంగా దాశరథి గారు రాసిన “అమ్మ అన్నది ఒక కమ్మని మాట” అమ్మ ఔన్నత్యాన్ని తెలియజేసింది. ఇందులో ” దేవుడే లేడను మనిషున్నాడు..అమ్మే లేదనువాడు అసలే లేడు” అన్న పంక్తి ఆక్షరలక్షల విలువ చేస్తుంది. ఇదే సినిమాలో రాజశ్రీ రాసిన ” కురిసింది వానా నాగుండెలోన నీ చూపులే జల్లుగా” పాట ఈనాటికి జనరంజకంగా నిలిచింది.

   హిందీ లో విజయవంతమైన ” ఇంత కామ్” సినిమాను వి.రామచంద్రారావు దర్శకత్వంలో శారద,హరనాథ్, లతో తీసిన “పగ‌బట్టిన పడుచు“చిత్రంలోని పాటలన్నిటిని సంగీత దర్శకుడు ఎం.రంగారావు మ్యూజికల్ హిట్ చేశారు.ఒక పాట మినహా మిగతాపాటలన్నీ హిందీ బాణీల ననుసరించి చేసినవే,కానీ సి.నా.రే.పాటలను‌ భావుకతతో రాశారు.ఈ సినిమాలో “రా రాదా“(ఆ జానే జా ఆ మేరాఏ హుస్న్ జవా– ఇంత కామ్ ) “ఏనీడలో ఏమున్నదో“(మెహఫిల్ సోయీ ..ఐసా కోయీ– ఇంతకామ్).  )

“ఏవో మౌనరాగాలు,ఏవో మధుర భావాలు” &

“చిరునవ్వు వెల ఎంత మరుమల్లె పూవంత “

యుగళగీతం సాహితీ పరిమళభరితాలు. జానకి పాడిన “ఓయబ్బో నిషాలో ఉన్నానని ఉలికిపడు తు ఉన్నావా” ( కైసె రహు చుప్ కె‌మైనే పీహె క్యా హై– ఇంతకామ్)  పాటను  శారద చిత్తుగా తాగి మత్తుగా అభినయిస్తుంది.

1971 లోనే కె.వి.నందనరావు దర్శకత్వంలో

యస్ వి ఆర్ టైటిల్ పాత్రగా తీసిన ‘రౌడీ రంగడు” చిత్రం లో “కనకమేడల ” కలం నుంచి వెలువడిన

“మౌనముగా కూకుండి చూసేవు..కొంటెతనమా‘

గీతం  పరిగణించదగ్గదే. సంగీతం. ,బి.గోపాలం సంగీతంలో  ఘంటసాల ఎంతో హుశారుగా పాడారు.

         జానపద చిత్ర దర్శక బ్రహ్మ బి.విఠలాచార్య నిర్మాతగా కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తీసిన “సి.ఐ.డి.రాజు ‘ సిని మా లో డా.సి.నా.రె.రాసిన పాటలలో “నేనే లే ! పిలుపు నాదేలే !” మరియు  “మనసైన ఈనాటి రేయీ.” పాటలను ఎంతో ఆపాత మధురం గా స్వరపరచారు సత్యం.

1972 లో ఇన్స్ పెక్టర్ భార్యలోని “రాధను నేనైతే”  ,కిలాడి బుల్లోడు లోని “నిన్ను చూసీ ఈ లోకం చూస్తే అన్ని వైపులా అందాలే” మొదలైన పాటలలోభావచిత్రాలున్నవే..

ముఖ్యంగా సస్పెన్స్ చిత్రం  గూడుపు ఠాణి (1972)లో దాశరథి గారి “తనివి తీరలేదే పాట‘ సార్వకాలికమైన గీతం గా వర్ణించ బడింది. ” ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామె” వంటి అలంకారిక ఆభివ్యక్తి అలరిస్తుంది.

గిడుతూరి సూర్యం దర్శకత్వంలో  తీసిన ” పంజ రంలో పసిపాప‘(1973)క్రైం చిత్రం లో గోన విజయ రత్నం రాసిన ” కలం నుంచి వెలువడిన “ఓపచ్చని సంసారం మన చక్కని అనుబంధం” గీతాన్ని ఎస్.హన్మంత రావు హిందీ బాణి “ఓ నీలే‌గగన్ కే తలే“(మహేంద్ర కపూర్– హమ్ రాజ్)

ఆధారంగా స్వరపరచారు.ఇదే సిన్మాను హిందీలో ” హిమ్మత్

వాలి” పేరున డబ్బింగ్ చేయగా మన్నా డే , వాణీజయరాం తో “మస్తి లుఠాయే హమ్” అని పాడించటం విశేషం

1973-74 లో గుండెలు తీసిన మొనగాడు,నిప్పు

లాంటి మనిషి, (1975 )నుంచి క్రైం &యాక్షన్ చిత్రాల జోరు అకస్మాత్తుగా తగ్గింది .

కాంతారావు నిర్మించిన గుండెలు తీసిన మొనగాడు క్రైం థ్రిల్లర్ చిత్రం.. ఇందులో ” ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలీ” పాట( గానం: బాలు,రమోల ) మంచి మెలోడి పాట..

.1975 లో 66 సినిమాలు విడుదలకాగా ఎన్.టి.ఆర్ .నటించిన ‘ఎదురులేని మనిషి‘,చిత్రం మాత్రమే క్రైం చిత్రం. గా వచ్చింది.వైజయంతి మూ వీస్ వారి తొలి చిత్రమిది. హిందీ లో దేవానంద్ నటించిన “జానీ మేరా నామ్“చిత్రానికి రీ –మేక్ ఇది. అయితే ఈ చిత్రం తోనే  ద్వంద్వార్థం తో ధ్వనించే సాహిత్యం నుంచి సరాసరి అశ్లీలభావ  గీతాలకు నాందీ పలికిందని చెప్పాలి. ” కసిగా ఉంది కలువక కలువక కలిసినందుకు కస్సు మంటుంది” అని ఆత్రేయ కలం విజృంభించింది.అంతకు పూర్వం క్రైం చిత్రాలలో కేవలం హలం, జ్యోతిలక్ష్మి ,ప్రభృతులపై  డాన్స్ కోసం చిత్రించే  క్లబ్ సాంగ్స్ లో మాత్రమే‌ కాస్త‘మసాల ‘వుండేది.

ఎన్.టి.ఆర్ నటించిన ఎదురులేని మనిషి, చిత్రం లో హీరో హీరోయిన్ల  యుగళగీతాలను సైతం ద్వంద్వార్థాలతో  తో రాయడంతో ఇక ఆ తరువాత  వచ్చిన సినిమాలలో పచ్చి శృంగార గీతాల రచన అనివార్యమైనది. దాంతో ” చిలక

కొట్టుడు” పాటలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.1976 లో వచ్చిన ‘నేరం నాది కాదు ఆకలిది‘(హిం ది చిత్రం“రోఠి“) రీమేక్  లోని ” మంచిని సమాధి చేస్తారా ” వంటి పాటలు కథాపరంగా  కాస్త ఫరవాలేదని పించాయి.1976 లోనే హిందీలో విజయవంత మైన “ఫకీరా” చిత్రాన్ని తెలుగులో కృష్ణ జయప్రద లతో ‘దొంగలకు దొంగ” పేరిట పునర్ని ర్మిం చారు. ఇందులో “ఎవరేమన్ననూ తోడురాకున్న ను ఒంటరి గాను పోరా !” ఫకీరా చల్ చలా చల్“పాట బాణీని అను సరించి రాసినది.ఈ సినిమాలో నే దాశరథి రాసిన “ఈరాతిరి ..ఓ చందమామ ..ఎట్లా గడిచేది అయ్యో రామ” పాట, ఆరోజుల్లోమధుర గీతంగా రవళించింది.

1978 లో కేడీ నంబర్‌ వన్‌,ఏజెంట్‌ గోపి,, మొద లైన సినిమాలు వచ్చాయి. క్రైం చిత్రాలు ఎంత తెలుగు నాట ఎంత ప్రత్యేక గుర్తింపు పొందాయం టే చివరికి  కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు  సైతం ఈ ప్రభంజనంలో పడి శోభన్ బాబు ,జయసుధ లతో  తీసిన “కాలాంతకులు“(1978) చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.ఈ సినిమాలో ” కొండా కోన పిలిచింది, కొమ్మా రెమ్మా పిలిచింది” అనే యుగళ గీతం సాహితీ విలువలున్నదే!

     1979 సం లోనే కృష్ణ, రజనీకాంత్ నటించిన ‘ ‘ఇద్దరూ అసాధ్యులే సినిమా లోని “చినుకు చినుకు పడుతూవుంటే ” ప్రజాదరణ పొందిన వాన పాటలలో అగ్రగామిగా నిలిచింది.అలాగే  అన్నదమ్ముల సవాల్ ‘లోని నీరూపమే నామది” పాట చెప్పుకోదగ్గ మధురగీతం.

యస్.పి.బాలసుబ్రహ్మణ్యం  తొలిసారి సంగీతం అందించిన  చిత్రం‘కెప్టెన్ కృష్ణ(1979) సినిమా లోని “కల కాలం ఇలా సాగనీ… నీలో నన్నే చూడనీ” పాట మన మనసుల్ని తడిమి తడిపేసే‌ గీతం.ఈ పాట వింటే ఏదో సాంఘిక చిత్రంలోని ప్రణయ గీతమేమో నని అనుకొంటాం. కానీ ఈ పాట  కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించిన  సినిమా లోనిదంటే కాస్త ఆశ్చర్యం కలుగు తుంది.

1980 నుంచి ఎక్కువగా హిందీ లో హిట్ అయిన

డాన్, అమర్ అక్బర్ ఆంథోని మొదలగు చిత్రాల ను రీమేక్ తీశారు. కానీ తెలుగు చిత్రాలు మ్యూజి కల్ హిట్ కాలేక పోయాయి. కోడి రామకృష్ణ దర్శ కత్వం లో మెగా స్టార్ చిరంజీవి తొలిసారి గూఢ చారి పాత్ర పోషించిన  ” గూఢచారి నం 1 ‘ (1983)లో పాటలంతా విజయవంతం కాలేదు . 1984 లో చిరంజీవి నటించిన ‘ఖైదీ‘ చిత్రం తో కథాంశంలో ఫాక్షనిజం మొదలైంది. సినిమాలలో  సిఐడి.డిటెక్టివ్ పాత్రలు విలన్ రహస్య స్థావరాలు  తగ్గిపోయాయి..సమరసింహారెడ్డి,ఇంద్ర, ఒక్కడు ప్రేమించుకొందాం రా! , మొదలైన సినిమాలు ఇందుకు ఉదాహరణలు.

                     నాడు క్రైం సినిమాలైనా పాటలు ఆపాత మధురంగా  ఆసక్తిగా ఉండేవి.నేడు భక్తి చిత్ర గీతాలలోను విలువల కోసం జల్లెడ పట్టాల్సి వస్తుంది. 

నిజానికి ఇదొక సిద్ధాంత వ్యాసానికి సంబంధించిన అంశం.

ప్రస్తుత వ్యాసం విహంగవీక్షణంగా పరిశీలించి రేఖామాత్రంగా స్ప్రశించిన వ్యాసం!

ఏది ఏమైనప్పటికి ఉత్తమ సాహిత్యాభిరుచి గల నిర్మాతలు ,దర్శకులుంటే  క్రైం ,జేమ్స్ బాండ్,డిటె

క్టివ్ సినిమా పాటలు సైతం ప్రజాదరణకు పాత్ర

మవుతాయన్నది అక్షరసత్యం..

                     ****0****

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఇల్లంతా ఇల్లాలు

by Gaddam sulochana May 30, 2026
written by Gaddam sulochana

మబ్బులు గ్రహణాలు
పట్టని ఇంటి సూర్యుడామే/
పొద్దుచుక్కన ముగ్గు పెట్టి/
సూర్యుడికే స్వాగతం
పలుకుతుంది

ఉదయపు ఉషస్సు/
బద్దకాన్ని తరిమే తేజస్సు/
వంటిల్లే అవధానాల అరుగు/
ఎన్నో కళలు మెళు కువలు/
భూగోళంలా తిరుగుతూనే ఉంటది

అగ్ని పోరాటాలు కత్తి యుద్ధాలు/
నిత్యవిధి కృత్యాలు/
ఎవరికీ భయాలు గాయాలు లేనియుద్ద మిది/
కమ్మని రుచులకు నాంది/
తొందరపాటో ఏమరుపాటో/
ఎప్పుడైనా చిన్నచిన్న గాయాలైనా/
వంటింటి వైద్యం పసుపు చాలు

చిరు చెమటల్లో
వర్షంలో తడిసిన భూదేవి/
పంటసిరుల్లా వంట రుచులు సిద్ధం

ఓర్పు నేర్పు కూర్పు సహజాతం/
ఇంటెడుపని ఆమే సొంతం/
ఇంటిని తీర్చిదిద్దడం సంతోషం/
అల్లరి ఆకతాయిలకు
శాంతి మంత్రం/
అసహనపు పెద్దల చెలిమి గీతం/
అతిథులకు అమ్మరూపం/
ఇంటతనకి ఇంధనం చందనం..

దేశాన్ని కాపాడే సైనికుడిలా/
ఇంటిభక్తి నింపుకున్న ఇల్లాలు/
ఇంటి గుట్టంతా గుప్పిట్లోనే/
కష్టాలు బాధలన్నీ కొంగు చివర ముడిలోనే

అలసిన సూర్యుడు
సంధ్యఒడిలో సేదతీరి/
అలల ఊయల నిద్రించినా/
ఎప్పటికో పడక చేరే
వెండి వెన్నెల/
అమవసలు లేని ఇంటి చంద్రుడామె

May 30, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

అన్వేషణ కాశ్మీరీ కథ ధీబా నజీర్

by Sudharshan Chintapatla May 30, 2026
written by Sudharshan Chintapatla

శ్రీనగర్ బస్ స్టాండ్ చేరేటప్పటికి సాయంత్రం అయింది. నేను శ్రీనగర్ రావడం ఇదే మొదటిసారి. ఒక ఆటో డ్రైవర్ ని దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా అని అడిగా ఆటో వాడు నన్ను జహంగీర్ హోటల్ కు తీసుకువెళ్లాడు. నేను శ్రీనగర్ లో చేయవలసిన రెండు పనులు ఉన్నాయి మర్నాటి ఉదయం తొందరగా నిద్ర లేచాను. హోటల్ నగరం మధ్యన ఉన్నట్టుంది. ట్రాఫిక్ శబ్దాలు పెద్దగా వినిపిస్తున్నాయి. కిటికీ పరదాలు పక్కకు తప్పించి చూశాను. ఫ్లై ఓవర్ మీద పరిగెడుతున్న వాహనాలు కనిపించాయి. వీధిలో పిల్లలను బడికి లాక్కెళ్తున్న తల్లులు కనిపించారు. నాకు చిన్నతనం గుర్తుకు వచ్చింది. ప్రతిరోజు అమ్మ కూడా నన్ను ఇలాగే లాక్కుపోయేది.
హోటల్ నుంచి బయటకు వచ్చి కనపడ్డ ఓ వ్యక్తిని హబ్బాకడల్,సఫాకడల్ అనే చోట్లకి వెళ్లడానికి బస్సు స్టాప్ ఎక్కడుందని అడిగాను. కొద్ది దూరంలో ఉన్న చౌరస్తాని చూపుతూ అక్కడ మీకు కావలసిన బస్సు వస్తుందని చెప్పాడు. బస్సులో సీటు దొరికింది. నా పక్కనే కూర్చున్న వ్యక్తి సెల్ ఫోన్ లో ఎవరికో తను డౌన్ టౌన్ కి వెళ్తున్నానని చెప్తున్నాడు. బహుశా నగరంలో అది ఒక వీధి అయి ఉండవచ్చు అనుకున్నాను. కండక్టర్ సఫ్ఫా కడల్ అని బిగ్గరగా అరవడంతో బస్సు దిగాను. ఎదురుగా ఒక బ్రిడ్జి కనిపించింది బ్రిడ్జి దాటుతూ ఓ పక్కకు నిలబడి క్రిందికి తొంగి చూశాను. క్రింద పారుతున్న నది వైయత్ అయివుండాలనుకున్నాను అదే మాట పైకి అనేశాను. నాకు కొద్ది దూరంలో సూటు బూటుతో నిలబడిఉన్న వ్యక్తి’ ఏమన్నారు?’ అన్నాడు. మళ్ళీ తనే, ‘అది జీలం నది’ అన్నాడు. ” మీకు అది జీలం అయి ఉండవచ్చు కానీ నాకు మాత్రం వయతే” అన్నాను.
నది ఒడ్డున చాలా దూరం దాకా చుక్కల్లా కనబడుతున్న ఆలయాలు, మందిరాలు చూశాను. దగ్గర్లోనే ఓ గుడి ఉండాలి.గుడిలో దేవుని దర్శనం చేసుకుని పోవచ్చు కదా అనిపించింది. అందువల్ల నేను చేయబోతున్న పని సానుకూలం అవుతుందేమోనని కూడా అనిపించి, బ్రిడ్జి దాటి కుడి వైపు తిరిగి నడక సాగించాను. ఎదురుగా ముందుకు పొడుచుకువచ్చిన బాల్కనీలతో ఆకట్టుకునే ఒక భవనం కనిపించింది. ఆవరణలో ఒక పెద్ద మల్బరీ చెట్టు ఉంది దాన్ని చూస్తూ నిలబడిపోయాను ఇప్పుడు అందులో నివసిస్తున్నది మాత్రం ఇదివరకటి మనుషులు కాదు.

గుడి ముందుకు వచ్చాను తలవంచి కళ్ళు మూసుకున్నాను. నేను ఎవరిని, ఎక్కడికి వెళ్తున్నాను అన్న విషయం కాసేపు మరిచిపోయాను. ఏ శక్తో నన్ను ముందుకు తోస్తే పాదాలు కదిలాయి. గుడి పక్కనే మరొక ఇల్లు ఉంది. ప్రహరీ గోడ చాలా మటుకు కూలిపోయింది. తలుపులు కిటికీలు ఉండాల్సిన చోట ఖాళీ స్థలం ఉంది. విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న రెండు రెక్కల ప్రధాన ద్వారానికి ముందు వరండా ఉంది. వరండాలో వీధి కుక్కల గుంపు విశ్రాంతి తీసుకుంటున్నది. కాంపౌండ్ లోపల ఒక పెద్ద వాల్నట్ చెట్టు నిలబడి ఉంది. శిథిలమైన ఆ ఇల్లు తన విషాద గాధను వినిపిస్తున్నట్టు అనిపించింది. దాన్ని ఈ స్థితికి తెచ్చినది ఎవరో నేను చెప్పను. నోరు విప్పడానికి సాహసించను.

నా కుడి వైపున నదిలోకి దిగడానికి మెట్లు ఉన్నాయి . ఒడ్డున నదిని దాటడానికి పడవలు ఉన్నాయి . నాకు మరికొన్ని కూలిన గోడల ఇళ్ళు, విరిగిన తలుపులు కిటికీల ఇళ్ళు, ధూళి నిండిన కాలిపోయిన ఇళ్ళు, సాలెగూళ్ళు వేలాడుతున్న ఇళ్ళు కనిపించాయి. ఇళ్ళ ఆవరణలు అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలతో నిండి ఉన్నాయి. కొన్నిచోట్ల చినార్ చెట్లు కూడా కనిపించాయి. మొత్తానికి చాలా ఇళ్ల ప్రహరీ లలో ఋతువు రాకుండానే ఆకురాలు కాలం వచ్చేసినట్టు కనిపించింది. బొమ్మలా నిలబడి చూస్తూ ఉండిపోయాను. నాకు ఆ రోజు శుక్రవారం అని గుర్తొచ్చింది. చెల్లి నేను శుక్రవారం నాడే పుట్టాం.అమ్మ చెప్పేది ముస్లింలు శుక్రవారం నాడు పసుపు అన్నం చేస్తారని. రోడ్డు మలుపులో ఒక మహిళ పసుపు అన్నపు పళ్ళెంతో కనిపించింది. పిల్లలు ఆమె చుట్టూ గుమిగూడారు. ఆమె నన్ను పిలిచింది.నేను ముందుకు నడిచి చేయిచాచి పసుపు అన్నం తీసుకున్నాను. అది నా ఆకలిని కొంతవరకు తీర్చగలిగింది.

ఇక్కడి నుంచి మరికొన్ని అడుగుల దూరం నడిచి నేను షర్ఫుద్దీన్ అబ్దుల్ రహమాన్ అలియాస్ బుల్బుల్ షా మజార్ ముందుకు వచ్చి నిలబడ్డాను. అది కూడా వైయత్ నది ఒడ్డునే ఉన్నది.ఇరుకు సందుల్లో నడుస్తున్న నాకు పైన వేలాడ కట్టిన తోరణాలు కనిపించాయి. అవి నన్ను స్వాగతిస్తున్నవని అనిపించింది. ఎన్నో ఏళ్ల నుంచి నాకోసం ఎదురుచూస్తున్నవని కూడా అనిపించింది. ఫెరాన్ ధరించిన కొందరు దుకాణాలలో కూర్చుని హుక్కా పీలుస్తున్నారు. ఆడవాళ్లు తలల మీద ముసుగులతో నడిచి వెళుతున్నారు.ఉన్నట్టుండి ఒక వాసన నా ముక్కుపుటాలకు గట్టిగా తాకింది. అది ఒక బేకరీలో కాల్చి బయటకు తీసిన తాజా బ్రెడ్ నుంచి వచ్చింది. పైన కరెంటు తీగల మీద పావురాలు చప్పుడు చేస్తుంటే అడుగు అడుగుకు ఆగిపోయి కనిపించే దృశ్యాలని చూస్తూ మనసు నిండా బాధని నింపుకుంటున్న నేను దారి తప్పిపోయాను. ఎక్కడున్నానా అని వెనక్కి తిరిగి చూస్తుంటే ఒక పాల దుకాణం కనిపించింది.
దుకాణంలో ఉన్న వ్యక్తిని” ఇది ఏ బజారు” అని అడిగాను. అతను “ఇది డౌన్ టౌన్” అన్నాడు కానీ నాకు తెలిసి ఒకప్పుడు అది షహరికాస్.ఇప్పుడు” నేను ఎక్కడ ఉన్నాను? ” అని అడిగాను. పాలశాపతను మీరు షాహి -ఏ -హందన్ మసీదు దగ్గర ఉన్నారు అన్నాడు. ఎటువైపు వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే షాపు వాడు
” ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డా? ” అన్నాడు.
నేను హబ్బా కడల్ , సఫా కడల్ లకు వెళ్లాల్సి ఉంది కానీ దారి తప్పినట్టు ఉన్నాను” అన్నాను.

“ఫరవాలేదు. మీరు హబ్బా కడల్ కు దగ్గరలోనే ఉన్నారు. రండి కాసేపు దుకాణంలో కూర్చుని విశ్రాంతి తీసుకుని పొండి” అన్నాడు.
నేను తటపటాయిస్తూ షాపులోకి వెళ్లి కూర్చున్నాను. కాసేపయ్యాక ఆయన గిన్నెలో నుంచి చెంచాతో పెరుగు తీసి నా చేతిలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం వేసింది. బహుశా ఇది వాళ్ళ ఆచారమేమో అనుకున్నా.
తర్వాత “ఈ ఎదురుగ్గా ఉన్న రోడ్డులో తిన్నగా వెళితే చౌరస్తా వస్తుంది, అది దాటి అలాగే కొంత దూరం వెళ్తే హబ్బాకడల్ చేరుతారు” అన్నాడు. ఆ మాట విని నేను దగ్గరలోనే ఉన్నానని స్థిమితపడి షాపులో నుంచి బయటకు వచ్చాను.


మళ్లీ నడక మొదలుపెట్టిన నాకు గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు రాసాగాయి. దుకాణం యజమాని చెప్పిన దారి వెంట నడిచి హబ్బాకడల్ చేరుకున్నాను. నాన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అక్కడ పబ్లిక్ ట్యాప్ ఉన్న సందులో ఎడమ వైపు ఉండేది ఒకప్పటి మా ఇల్లు. అది సరిగ్గా నాన్న చెప్పిన చోటే ఉన్నది.ఆ ఇంటి వైపు కదిలాను. నా కాళ్లు సీసపు కాళ్లల్లా బరువెక్కాయ్. ముందుకు నడవడం భారంగా మారింది ఇంటికి రెండు తలుపుల ద్వారం ఉంది. దానికి ఒక పెద్ద రింగ్ వేలాడుతున్నది. ఇంటి ముందు స్థలంలో రెండు దానిమ్మ చెట్లున్నవి . బయట గోడ పూర్తిగా కూలిపోయింది. ఊడిపోయిన కిటికీలు గోడకు వదులుగా వేలాడుతున్నవి. అలా చూస్తూ నిలబడి పోయిన నన్ను, ఇంటి గోడలు కదిలి వచ్చి గాఢంగా కౌగిలించుకున్నట్టు అనిపించింది. ఒక దురదృష్టకరమైన అర్ధరాత్రి ఇక్కడి నుంచి పారిపోతూ మా కుటుంబ సభ్యులు చేసిన అర్తనాదాలు నా చెవుల్లో ప్రతిధ్వనించాయి.


‘ మీరు మీ ఇంటికి తిరిగి రండి. కనిపిస్తున్నదిగా నా ఈ దీనస్థితి. కనీసం నిలబడ లేకుండా ఉన్నాను. అవమాన భారంతో తలదించుకొని ఉన్న నన్ను తల ఎత్తుకునేట్టు చేయండి.రండి!’అని ఆ పరిసరాలు అంటున్నట్టు అనిపించింది.

రాతితో కట్టబడిన వరండాలో అమ్మమ్మ కూర్చుని ఉన్న దృశ్యం కనిపించింది. ఆమె తన ముందున్న కూరనుండి పండిన ఆకులను వేరు చేస్తున్నది. ఆ పక్కనే నిలబడి మా అమ్మ నన్ను ఎత్తుకొని పాట పాడుతున్నది. నాన్న పిలుస్తున్నా వినిపించుకోకుండా అన్నయ్య దానిమ్మ చెట్టు కింద దాక్కుని ఉన్నాడు. ప్రహరీ గోడ అవతలి వైపు నిలబడి ఉన్న చాచీ “తులసి వంట అయిందా?” అని అడుగుతున్నది.
హఠాత్తుగా ఓ చెయ్యి నా భుజం మీద పడింది. ఆలోచనల నుంచి బయటకు వచ్చాను. నా వెనుక నిలబడి ఉన్న ఆయన
” ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావ్? అన్నాడు.
” నేను మోతిలాల్ మనవడిని. ఆయన మా అమ్మకు తండ్రి” అన్నాను.

ఆ వ్యక్తి కళ్ళనిండా నీళ్లతో నన్ను దగ్గరికి లాక్కుని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
” మీరంతా వెళ్ళిపోయాక హబ్బా కడల్ కళా విహీనం అయిపోయింది” అన్నాడు.
ఆయన నన్ను తన ఇంటికి తీసుకుపోయి
” ఎవరో గుర్తుపట్టారా? సునీల్ కొడుకు” అని చెప్పాడు ఇంట్లో వాళ్లంతా నా చుట్టూ మూగారు. కొందరు పెద్దగా రోదించారు. కొందరు ఇప్పుడు మా కుటుంబం గురించి చెప్పమన్నారు. నాకోసం బియ్యపు పిండి రొట్టెలు, ఉప్పుటీ తెచ్చారు. నేను రెండు రొట్టెలు తిన్నాను. ఇంట్లో వాళ్ళు నన్ను అక్కడ రెండు రోజులు ఉండి పొమ్మన్నారు నేను సఫా కడల్ కు వెళ్లాల్సి ఉందన్నాను. నేను ఏది చూడాలని వచ్చానో దాన్ని చూశాను ఇంకా ఇక్కడ ఉండి చూస్తే నేను నేను కాకుండా పోతాను అనుకున్నాను.
పెద్దాయన కొడుకు గ్యారేజ్ నుంచి స్కూటర్ బయటకు తీశాడు. సఫాకడల్ లోఎక్కడికి వెళ్లాలని అడిగాడు. నేను దారెసలామ్ సందు అన్నా. అతను నన్ను అక్కడ దించి వెళ్ళాడు. అమ్మ చెప్పింది ఆ సందులో ఎడమవైపు మూడవ ఇల్లని. ఆ ఇంటి ముందు నిలబడి తలుపు తట్టాను. ఒక మహిళ బయటకు వచ్చింది.
“మాస్టర్ జీ ఉండేది ఇక్కడే కదా!” అడిగాను.
” వాళ్లు ఇక్కడ లేరు. పధ్నాలుగు ఏళ్ల కిందటే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది మా ఇల్లు” అందామె.
నా ఆశలు పేకమేడల్లా కుప్ప కూలిపోయాయి. ఆమె నన్ను లోపలికి రమ్మంది కానీ నేను నిలబడ్డ చోటే మంచు బొమ్మనైపోయాను. వాళ్ళను కలుసుకోవడం ఎలా అనుకుంటూ అడిగాను
” మాస్టర్జీ అడ్రసు ఏమైనా ఉందా? ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా ?
“తెలీదు తెలిస్తే తప్పకుండా చెప్పేదాన్ని వాళ్ళని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నారు?” అని అడిగింది.
విషయం చెప్పక తప్పలేదు. 1986 ఫిబ్రవరి నెల లాస్ట్ డేట్.లాల్ డెడ్ ఆసుపత్రిలో 12వ వార్డులో మా అనుబంధం ఏర్పడింది. మా అమ్మ మంచం నెంబర్ 201.ఆ పక్కనే ఉన్న 202 మంచం మీద మాస్టర్ జీ భార్య కూడా ఉన్నది. మా అమ్మ నన్ను ప్రసవించిన వెంటనే ఏదో జబ్బుకు గురైంది.మాస్టర్జీ భార్య ఒక ఆడపిల్లను ప్రసవించింది. అస్వస్థత కారణంగా అమ్మ నాకు పాలు ఇవ్వలేకపోయింది. మాస్టర్జీ భార్య రెండు రోజులపాటు నాకు పాలిచ్చింది. అప్పటినుంచి ఆమె కూతురు నాకు చెల్లి అయింది. నేను మధ్యాహ్నం రెండు గంటలకు పుట్టాను. చెల్లి సాయంత్రం ఎనిమిదిన్నరకు పుట్టింది అని వివరంగా చెప్పాను.
” అయితే ఇప్పుడు మాస్టర్జీని, నీకు పాలు ఇచ్చిన తల్లిని కలవడానికి వచ్చావన్నమాట” అందామె.
” ఇప్పుడు నాకు చెల్లి అవసరం ఎంతో ఉన్నది అన్నాను దీనంగా”
అది ఎందుకో కూడా చెప్పాను.
“వచ్చే నెల నా పెళ్లి నిశ్చయమైంది. అన్నయ్య పెళ్లిలో చెల్లి ఉండి తీరాలి. అది మా ఆచారం. నా పెంపుడు తల్లి కోసం నా చెల్లి కోసం వెతుక్కుంటూ వచ్చాను. వారిని చూడాలని నా మనసు ఆరాటపడుతున్నది”అన్నాను.
” మరి ఇంతకాలం?ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ల గురించి ఆలోచించనే లేదా? ” అందామె.
“మేము ఇక్కడ మా సర్వస్వాన్ని కోల్పోయాం. ముఖ్యంగా మా ఉనికినే కోల్పోయాం. ఇల్లు కోల్పోతే తిరిగి కట్టుకోవచ్చు కానీ అయిన వాళ్ళని కోల్పోవడం తట్టుకోలేని విషయం.ప్రతి రాఖీ పండుగ నాడు చెల్లి గుర్తొచ్చేది. తనకు నేను గుర్తున్నానో లేదో తెలియదు. కానీ ఆమె ముఖ్యంగా తన చేతులకు గోరింటాకు పెట్టుకునే నాడైనా నేను గుర్తుకొస్తాను” అన్నాను వణుకుతున్న కంఠంతో. కన్నీటిని ఆపుకుంటూ చివరగా
” మీరు ఆమెను ఎప్పుడైనా చూడటం జరిగితే ఈ అన్నయ్య తనకోసం వెతుకుతున్నాడని, ఆమెను చూడటానికి తపిస్తున్నాడని చెప్పండి” అంటూ అక్కడ నుంచి కదిలాను.

ధీబా నజీర్ కాశ్మీరీ రచయిత్రి. శ్రీనగర్ కు చెందిన ధీబా నజీర్ 17వ శతాబ్దపు మార్మిక కవయిత్రి. రూపా భవాని యొక్క శైవతత్వం, సూఫీతత్వాలపై ఈమె చేసిన పరిశోధన కాశ్మీరీ సాహిత్యకారుల ప్రశంసలు పొందింది. ఆమె తను కాశ్మీరీ భాషలో రాసిన సాహిత్యాన్ని ఉర్దూలోకి కూడా అనువదించింది. గుల్ బకావలి దాస్తాన్, కూలియాత్ అబ్దుల్ అహద్ ఆజాద్, కూలియాత్ రూప భవాని ఆమె రచనలు. ధీబా నజీర్ కథాసంపుటి ‘జరీన్ జఖం ‘ కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్నిఅందించింది. జరీన్ జఖం (మెరిసే గాయాలు )లోని ఒక కథ ఈ ‘అన్వేషణ’ కశ్మీరీ భాషలో Tchaandaww
ఈ కథలో తమ సర్వస్వం వదిలి వలస వెళ్లిన ఒక కుటుంబ గాథ. ఒకే ఆసుపత్రిలో కొన్ని గంటల తేడాతో వేరు వేరు తల్లులకు జన్మించిన వారి అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎంతో హృద్యంగా చిత్రించబడింది. ఒక ముస్లిం రచయిత్రి తను ఒక హిందూ సోదరునిగా ప్రథమ పురుషలో ఈ కథ చెప్పడం విశేషం. కథలో వచ్చిన ఫెరాన్ అనే పదానికి కాశ్మీరీ కుర్తా అని కడల్ కు వంతెన అని అర్థం.

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

కొత్త ప్రపంచం

by Laxmi Madan May 29, 2026
written by Laxmi Madan

“అమ్మా! గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు చూసాను. చాలా బాగుంది.నువ్వు ,నాన్న చూస్తే అడ్వాన్స్ ఇస్తాను.దివికి కూడా నచ్చింది” అన్నాడు విజయ్ తల్లి శాంభవి తో..

“ఏంటి! గేటెడ్ కమ్యూనిటీ లోనా? అస్సలు వద్దు.నేనైతే ఉండలేను.అవి ఊరికి చివర ఎక్కడో ఉంటాయి.నాకు ఇక్కడే బాగుంది” అన్నది శాంభవి.

భర్త భాను ప్రసాద్ కూడా ఎంతో నచ్చ చెప్పాడు.అయినా కూడా ససేమిరా అన్నది శాంభవి.

సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఉద్యోగాలన్నీ హైటెక్ సిటీ వైపు ఉన్నాయి.వీళ్ళు ఉండేది తార్నాక లో.

కొడుకు కోడలికి ఇంత దూరం ప్రయాణం చేయడం కష్టంగా ఉంది. ప్రయాణంలో సగం సమయం పోతుంది.

అటు వైపు ఇల్లు తీసుకుని పోదాం అనుకుంటే తల్లి తండ్రులను వదిలి వెళ్ళ బుద్ధి కావడం లేదు.

అప్పటికి తండ్రి చెప్పాడు..

“మీరు అటు వైపు ఇల్లు తీసుకుని ఉండండి.కొన్ని రోజులైతే అమ్మ మారుతుంది” అని సలహా ఇచ్చాడు.అతనికి కూడా కొడుకు కోడలు ముఖ్యంగా మనవడిని వదిలి ఉండాలంటే కష్టంగా ఉంది.

కానీ కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. మనవడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి చుట్టుపక్కల పిల్లలే కనిపించడం లేదు. అందులో వాడి స్కూల్ కూడా దూరంగానే ఉంది. కొడుకు, కోడలు వచ్చేవరకు రాత్రి అవుతుంది.

ఎప్పటిలాగే విజయ్, దివి ఆఫీస్ కి వెళ్లి వస్తున్నారు. అనుకోకుండా విజయ్ ఫ్రెండ్ అమెరికాకు వెళ్లిపోవడం వల్ల అతని విల్లా అమ్మేస్తున్నానని చెప్పాడు. అంతకుముందే విజయ్ ఆ విల్లాను చూసాడు. చక్కని సౌకర్యాలతో ఎంతో బాగుంది.

ఎలాగైనా సరే అనుకుని తల్లి, తండ్రి కి చెప్పి ఆవిల్లా కొనేసాడు. ఇల్లంతా శుభ్రం చేయించుకొని రంగులు వేయించి గృహప్రవేశం తేదీ నిర్ణయించుకున్నారు. గృహప్రవేశం అయిన తర్వాత మనసు మార్చుకుని తల్లి వస్తుంది అనుకున్నాడు.

బంధువులను పిలుచుకొని చక్కగా గృహప్రవేశం చేసుకున్నారు.

“అమ్మా! మన విల్లాలోకి షిఫ్ట్ అయిపోదామా?”అన్నాడు విజయ్.

“విజయ్! నాకు ఆ కమ్యూనిటీలు నచ్చదని చెప్పాను కదరా! మీరు వెళ్లి రండి. శని ఆదివారాలు ఒకసారి మీరు రండి మరొకసారి మేమిద్దరం వస్తాము నాకు ఇక్కడే అలవాటైపోయింది రా”అంటూ కచ్చితంగా చెప్పింది భవాని.

చేసేదేమీ లేక విజయ్ అన్య మనస్కంగా భార్య, కొడుకుతో కొత్త ఇంటికి వెళ్లి పోయాడు.

వాళ్లు వెళ్లినప్పటి నుండి భవానికి ఏమి తోచడం లేదు. ఇల్లంతా ఖాళీగా అనిపించ సాగింది. చేయడానికి ఏమీ పని కనిపించడం లేదు.

ఇంతకు ముం దులాగా ఇరువు పొరుగు పలకరించడం అసలే లేదు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు టీవీలు చూడటంతో సరిపోతుంది. భవానికి కూడా ఎక్కడికి వెళ్లడం అలవాటు లేదు. ఇన్నాళ్లు పిల్లలు, పనులు వీటితోనే సరిపోయింది. టీవీ సీరియల్లు చూసే అలవాటు అంతకన్నా లేదు. భర్తతో పోరు పెట్టి గుళ్ళకు వెళ్లడం చేస్తుంది. భాను ప్రసాద్కు రోజు ఇలా తిరగాలంటే కష్టంగానే ఉంది. హాయిగా పిల్లలతో ఉంటే మనవడినీ స్కూలుకు పంపించవచ్చు. సాయంత్రాలు వాడితో ఆడుకోవచ్చు అని అతని ఆశ.

వారం వారం పిల్లలు వచ్చి పోతూనే ఉన్నారు. ఒక వారం విజయ్ ఫోన్ చేసి..

“అమ్మా! బుజ్జిగాడికి జ్వరం వచ్చింది. ఈ వారం మేము రాలేము. అంత దూరం వస్తే వాడికి జ్వరం ఇంకా ఎక్కువవుతుంది. వీలైతే మీరు నాన్నగారు వచ్చేయండి” అని చెప్పాడు. కోడలు కూడా ఎంతో నెమ్మ దస్తురాలు. తాను కూడా ఫోన్ చేసి రమ్మని మరీ మరీ చెప్పింది.

మనవడికి జ్వరం అనగానే ఆమెకు మనసంతా కలచి వేసింది.

వెంటనే భర్తను అడిగింది..

“బుజ్జిగాడికి జ్వరం వచ్చిందట. ఈవారం మనమే వెళ్దాం అండి”అన్నది భవాని.

ఈ మాట కోసమే ఎదురుచూస్తున్న భాను ప్రసాద్ “తొందరగా బట్టలు సర్దుకో” అని చెప్పి తాను తన బట్టలు ఒక బ్యాగ్ లో పెట్టుకొని తయారయ్యాడు.

ఇద్దరూ కలిసి కొడుకు ఉండే విల్లా కు బయలుదేరారు.

గేటు లోపలికి వెళ్తుంటే వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించింది భవానికి. ఎప్పుడో ఒకసారి స్నేహితుల ఇళ్ళకు వెళ్ళింది. కానీ తాను అంతగా గమనించు కోలేదు. ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లంతా కూడా విశాలంగా అందంగా కనిపించింది.

మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మను పట్టుకున్నాడు. వాడిని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది. రెండు రోజుల్లో మనవడు కోలుకున్నాడు.

అప్పటికే సెలవు మీద ఉన్న కొడుకు, కోడలు తెల్లవారి ఆఫీస్ కి వెళ్తామన్నారు.

“వాడికి ఇంకా నీరసంగా ఉంది. రెండు రోజులు ఇంట్లో ఉంటే కోలు కుంటాడు మీరు ఉండగలరా?”అని తల్లి,తండ్రిని అడిగాడు.

“అదేంట్రా! వీడికి జ్వరంగా ఉంటే మేము వెళ్ళి పోతామా?”అన్నది భవాని.

కొడుకు, కోడలు ఆఫీస్ కి వెళ్ళగానే తాను వంట పనిలో ఉంటే, మనవడితో భాను ప్రసాద్ ఆడుకున్నాడు. వాడికి నచ్చిన వంట చేసి తినిపించింది భవాని.

సాయంత్రం కింద పార్క్ కి తీసుకెళ్లారు. ఎంతోమంది పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఆ పిల్లలతో పాటు ఇలా అమ్మమ్మ, తాతలో నాయనమ్మ తాతలో వెంట ఉన్నారు. వాళ్లంతా ఒక జట్టుగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తనకు తన చిన్నప్పుడు చూసిన ఊరి వాతావరణంలా అనిపించింది.

సాయంత్రాలు అందరూ ఒక అరుగు మీద చేరి కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఇక్కడ అలాగే పెద్ద వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉంటే, పిల్లలు అంతా ఆడుకుంటున్నారు. ఇప్పుడు తాము ఉండే ఇంటిలో అసలు చుట్టుపక్కల మనుషులు ఉన్నారా! లేరా! అన్నట్లు అనిపించ సాగింది.

భవానిని చూడగానే అక్కడ ఉన్నవాళ్లు పలకరించారు.

“విజయ్ తల్లి ,తండ్రి నా మీరు?”అని అడిగారు.

అవునని చెప్పారు ఇద్దరు.

“మరి మీరు ఎక్కడుంటున్నారు”? అని అడిగారు వాళ్ళు.

విషయం అంతా తెలుసుకుని వాళ్ళందరూ అన్నారు..

“పిల్లలను వదిలి అక్కడ ఎక్కడో ఉండటం ఎందుకండీ? ఇక్కడైతే వాళ్లకు ఆఫీసుల దగ్గరగా ఉంటాయి. ఇదిగో ఇలా చూడండి అన్ని కుటుంబాలు కలిసి ఉంటాయి. పండగలన్నీ కూడా మన ఊర్లలో జరుపుకున్నట్లు అందరూ కలిసి హాయిగా జరుపుకుంటాము. ఎన్నో రకాల పోటీలు జరుగుతుంటాయి. ఈ వయసులో కూడా మనం చిన్న పిల్లల లాగా పోటీలలో పాల్గొని మన టాలెంటును మనం చూపించుకోవచ్చు. ఇలా విల్లాలలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి”అని చెప్పారు.

ఇలా రోజు కిందికి వెళ్లి వస్తూ ఉంటే ఎంతోమంది స్నేహితులయ్యారు భవానీకి. భాను ప్రసాద్ సంగతి చెప్పనవసరం లేదు. ఆయనకు ఒక సమూహమే ఏర్పడింది.

రెండు రోజులు అనుకున్న వాళ్ళు వారం రోజులు ఉండి పోయారు.

కొడుకుకు ఆశ్చర్యంగా అనిపించింది. ‘అదేంటి అమ్మ వెళ్తానంటుంది అనుకున్నాను. సంతోషంగా ఉంది ఇక్కడే!’ అని లోన సంతోష పడ్డాడు. ఇది కూడా చెప్పింది రోజు కిందికి వెళ్తున్నారు చాలామంది స్నేహితులయ్యారని. వాళ్లు ఇక్కడే ఉంటే బాగుంటుంది అని ఎంతగానో అనుకున్నారు.

ఒకరోజు అందరూ భోజనాలు చేసి కూర్చున్న తర్వాత భవాని కొడుకు కోడల్ని పిలిచింది..

“ఇలా కూర్చోండి” అని పిలిచింది.

ఇంటికి వెళతాము అని చెప్తుందేమో అని ఇద్దరు భయపడుతూ వచ్చి కూర్చున్నారు.

కానీ వాళ్లు ఊహించనీ విధంగా భవాని చెప్పిన మాటలు విని ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

“ఇన్ని రోజులు నేను విల్లాలు అంటే అపోహ పడ్డాను. ఇక్కడికి వచ్చాక ఇలా అందరూ కలవటం, పిల్లలంతా ఆడుకోవడం నాకు ఎంతో బాగా అనిపించింది. ఇప్పుడు మనమున్న ఇంట్లో ఏ మనిషి కనిపించడం లేదు. ఇక్కడ ఉంటే మా చిన్నప్పుడు ఊళ్ళల్లో ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

మీ నాన్నకు కూడా చాలా మంది స్నేహితులయ్యారు. అక్కడ ఉంటే బిక్కు బిక్కుమనుకుంటూ గడపాలి. ఎంతసేపటికి సమయం గడవదు. ఇక్కడ అసలు సమయమే తెలియడం లేదు. మేము ఇక్కడికి వచ్చేస్తాం రా”అని చెప్పింది.

విజయ్ ,దివిలకు ఎంతో సంతోషంగా అనిపించింది. బుజ్జిగాడు అయితే రోజు అడుగుతూనే ఉన్నాడు.
‘! వెళ్ళద్దు’ అని.. వీళ్ళు ఇక్కడే ఉంటారని తెలవగానే వాడు నానమ్మను గట్టిగా పట్టుకొని గంతులు వేశాడు.

ఎక్కడో మన ఇల్లు ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ఉన్నాము అని భావిస్తూ ఒంటరిగా ఉండే కంటే మన వాళ్ళతో ఉండి సమయానుకూలంగా మారితే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది!

అలా ఒక నిర్ణయం తీసుకొని హాయిగా నిద్రపోయారు.

May 29, 2026 4 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

పాఠశాల గదిలో జీవిత పాఠాలు

by రంగరాజు పద్మజ May 29, 2026
written by రంగరాజు పద్మజ

పాఠశాల అనేది కేవలం పుస్తకాల జ్ఞానం అందించే స్థలం మాత్రమే కాదు; అది జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పే పుణ్యక్షేత్రం కూడా. ఈ భావాన్ని ఆచరణలో చూపిస్తూ విద్యార్థులకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలను బోధిస్తున్న గురువుల్లో తెలుగు భాషోపాధ్యాయురాలు తిరునగరి పద్మ గారు ఒకరు. తన బోధన విధానంలో క్రమశిక్షణ, బాధ్యత, స్వీయనిర్భరత వంటి విలువలను విద్యార్థులలో పెంపొందించే ప్రయత్నం చేస్తూ, చదువు మాత్రమే కాకుండా జీవన మార్గాన్ని చూపించే గురువుగా నిలుస్తున్నారు. ఆమె అనుభవాలు, ఆలోచనలు, బోధనలోని ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మయూఖ పత్రిక తరఫున ఆమెతో చేసిన ముఖాముఖి!


పాఠ్యాంశం దాటి, విద్యార్థులలో క్రమశిక్షణ, స్వీయనిర్భరత పెంచే బోధనా విధానాన్ని అమలు చేస్తున్న మీతో సంభాషణ చాలా సంతోషానిస్తున్నది. మయూఖ పాఠకులకు మీ సమగ్ర కృషిని తెలుపుతారా?

తిరునగరి పద్మ :- తప్పకుండా మేడం. ఇది నా అదృష్టంగా భావిస్తాను

రంగరాజు పద్మజ:– నమస్కారమండీ!

తిరునగరి:- నమస్కారం మేడం గారు.

పద్మజ* :- మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి వివరించగలరా?

తిరునగరి:- నేను హన్మకొండ జిల్లా, పరకాల దగ్గరున్న పోచారంలో పుట్టాను. అమ్మ పుష్పలత, నాన్న తిరునగరి శేషయ్య. ఆయన సీనియర్ అకౌంటెంట్ గా పనిచేసేవారు. ఉద్యోగ రీత్యా ఊరూరు మారడం వల్ల నా విద్యాభ్యాసం కూడా అనేక చోట్ల జరిగింది. 1 నుండి 9వ తరగతి వరకు స్టేషన్ ఘనాపూర్ లోనూ, 10వ తరగతి ములుగులోనూ గడిచింది. ఇంటర్ మరియు డిగ్రీ పినిగిల్లి ఉమెన్స్ PG కాలేజీలోనూ, MA తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ, Bed , Med ఏకశిలా కాలేజీ జనగామలో జరిగింది. మా వారు లంకా రఘు, టైపిస్ట్ గా పని చేస్తున్నారు.

పద్మజ – తెలుగు భాషోపాధ్యాయురాలిగా మారడానికి మీకు ప్రేరణ ఏమిటి?

తిరునగరి :-విద్యార్థులను నైతిక మార్గంలో నడిపించడానికి, వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించి, భావి భారత పౌరులుగా.. తీర్చిదిద్ది..
సమాజానికి ఉన్నత వ్యక్తిత్వ విలువలు ఉన్న పౌరులుగా.. మార్చడం కేవలం తెలుగు భాషో పాధ్యాయులకు మాత్రమే సాధ్యం. అందుకే ఈ తెలుగు భాషలో ,నేను ప్రావీణ్యాన్ని సంపాదించడం ,మరియు విద్యార్థులను ప్రావీణ్యులుగా.. ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం నా ఉద్దేశం.

పద్మజ :- గురువుగా మీ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు లేదా అనుభవాలు ఏమిటి?

తిరునగరి :-నేను పల్లెటూరి పిల్లగాడ పాఠం బోధిస్తుంటే… మిర్యాలగూడమోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మహాత్మా హెల్పింగ్ హాండ్స్ అధినేత శ్రీ గంట రవీందర్ గారు.. అకస్మాత్తుగా మా పాఠశాలకు వచ్చారు.. కృత్యాధార పద్ధతి లో ఇంత బాగా చెప్తారా? అని.. మా పాఠశాల పిల్లలకు సుమారుగా 30 వేల రూపాయలు విలువగల టీ షర్ట్స్ బహుమతిగా ఇచ్చారు. అప్పుడు నేను చాలా ప్రభావితురాలినై.. ఇంకా బాగా చెప్పడం మొదలుపెట్టాను. చాలా సంతోషం వేసింది..

పద్మజ :- కృత్యాధార బోధనలో ప్రత్యేకత ఎలా ఉంటుంది?

తిరునగరి :-ఉపాధ్యాయులు అంటే కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే అందించడం కాదు, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలి..ఒక ఉపాధ్యాయుడు బహు రూపుల వేషాలు వేసుకుంటూ వారి స్థాయికి దిగి వారికి అర్థమయ్యేలాగా బోధించాలి అంటే కేవలం కృత్యా ధార బోధనతో మాత్రమే సాధ్యం అందుకే వీలైనంతగా విద్యార్థులకు కొన్ని పాత్రలు ఇచ్చి, వారు ఆ పాత్రలో లీనమై వారు ఆ పాఠ్యాంశాన్ని నేర్చుకున్నట్లుగా..అనిపించకుండా.. కొన్ని
పాఠ్యాంశాలను బడి గోడలపై కుడ్య చిత్రాలుగా చిత్రీకరించుకుంటూ, వారిని భాగస్వాములుగా చేస్తూ ఆటపాటల ద్వారా విద్యను అందిస్తున్నాను..

పద్మజ :- విద్యతో పాటు జీవననైపుణ్యాలను బోధించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?

తిరునగరి :-నేను పదవ తరగతి ములుగు బాలికోన్నత పాఠశాలలో చదివేటప్పుడు మా డ్రాయింగ్ మాస్టర్ శ్రీ రామాచారి గారు మాకు
ఎంతో చక్కగా నైపుణ్యంతో చిత్రలేఖనాన్ని నేర్పించారు. అది నాకు ఒక అభిరుచిగా మారి, తరచుగా వేసి, ప్రావీణ్యాన్ని సంపాదించిన
తర్వాత చీరలపై ఫ్యాబ్రిక్ పెయింట్ వేస్తూ ఉద్యోగం రాకముందు, అది ఒక వృత్తిగా పెట్టుకున్నాను. ఆ విధంగా డబ్బులు సంపాదించుకున్నాను. నేను ఎవరిపై ఆధారపడకుండా, నా సంపాదన నాకు ఉంది అని గర్వంతో జీవించాను. అలాగే నేను కూడా నా విద్యార్థులకు చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నాను. చాలామంది విద్యార్థులు చక్కగా నేర్చుకొని వారు కూడా ఇప్పుడు ఒక వృత్తిగా పెట్టుకున్నారు. ఆ విద్యార్థులు నాకు ఫోన్ చేసి “టీచర్ ! మేము మీ వల్ల చీరలపై పెయింట్ వేస్తూ, మా డబ్బులు మేము సంపాదించుకుంటున్నాము.. మా కాళ్ళ పైన మేము నిలబడుతున్నాము” అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇది చాలు! నాకు ఎన్నో అవార్డులు వచ్చినంత సంతృప్తి కలిగింది.

పద్మజ :–మీరు విద్యార్థులకు నేర్పించే ముఖ్యమైన జీవన నైపుణ్యాలు ఏమిటి?

తిరునగరి :-జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలి. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు,
విజయం వచ్చిందని విర్రవీగిపోకూడదు. కలిమిలేములను సమానంగా చూడాలని, అహంకారం, గర్వం కూడదని, వినయ విధేయతలతో మెలగమని చెబుతాను.

పద్మజ- తరగతి గదిలో ఈ పద్ధతిని ఎలా అమలు చేస్తారు?

తిరునగరి :-ఒకసారి ఫస్ట్ వచ్చిన పిల్లలు గర్వంతో సరిగ్గా చదవక ఇంకో పరీక్షల్లో తక్కువగా మార్కులు వస్తాయి. ముందుగా తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు, పోటీపడి చక్కగా చదివి, మంచిర్యాంకు పొందుతారు. అందుకే మంచి ర్యాంకు వచ్చిందని పొగరు వద్దు, ఫెయిల్ అయినామని కుంగిపోవద్దు.
ఎప్పుడు ఎవరి సమయం ఎలా ఉంటుందో తెలియదు! మన చేతిలో ఉన్నదల్లా కృషి ..కేవలం కృషి.. పట్టుదల.

పద్మజ :- ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో మీరు గమనించిన ముఖ్యమైన మార్పులు ఏమిటి? క్రమశిక్షణ, స్వీయనిర్భరత పెరిగిన ఒక సంఘటన గుర్తుంటే చెప్పగలరా?

తిరునగరి :-మా పాఠశాలలో ఒక విద్యార్థి బాగా చదువుతున్నానని గర్వంతో పదవ తరగతి పరీక్షల సమయంలో అసలే చదవలేదు. చదవమంటే..
“ప్రతి పరీక్షలో నేనే ఫస్ట్ వస్తాను కదా టీచర్! నాకు చదవడం అవసరం లేదు” అనేవాడు. వేరొక అమ్మాయి మామూలుగా చదివేది. ఆమె ఫస్ట్ రావాలని అనుకున్నది. గట్టిగా పట్టు పట్టి చదివింది.
ఏ ప్లస్ గ్రేడ్ సాధించింది. బాసర ఐఐటీలో సీటు సంపాదించుకుంది. బాగా చదివే కుర్రాడు నాలుగు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం ట్రాక్టర్ నడుపుతున్నాడు. అందుకే విజయం వరించిందని గర్వం తలకెక్కితే, అథః పాతాళానికి తోసేస్తుంది అని చెబుతాను.

పద్మజ :- ఈ విధమైన బోధనలో మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి?

తిరునగరి :-ఎప్పుడైనా ఒకరు మంచి చేస్తుంటే , వెనకకు లాగి కింద పడేయాలని చాలామంది చూస్తారు. అలా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను.
నాకు నేనుగా ధైర్యం చెప్పుకొని భుజం తట్టుకొని, నా ఉద్యోగ ప్రస్థానంలో పట్టు వీడని విక్రమార్కిణిలా,
కృత్యాధార పద్ధతిలో బోధన కొనసాగిస్తున్నాను.

పద్మజ :- గురువుగా మీకు అత్యంత ఆనందం కలిగించిన క్షణం ఏది?

తిరునగరి :-ఒక అమ్మాయి సరిగ్గా పాఠశాలకు రాకపోయేది, ఒకసారి నేను ఆ అమ్మాయితో ఒక ఫోటో దిగాను. నా ఫోటో ముందు పెట్టుకుని, ఇంటి దగ్గర కూర్చొని చదువుకొని, అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి, పరీక్షలు రాసి, అందరికంటే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. కేవలం 5వ తరగతి అమ్మాయి. అప్పుడు నా కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు జలజలా రాలిపోయాయి.

పద్మజ :- నేటి విద్యావ్యవస్థలో జీవన నైపుణ్యాల విద్య ఎంతవరకు అవసరం?

తిరునగరి :-నేటి అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థలో విలువలతో కూడిన విద్య ఎంతో అవసరం.
ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిలను ప్రేమించడం, అమ్మాయిలు కూడా విచిత్ర వస్త్రధారణతో అబ్బాయిలను ఆకట్టుకోవడం.. అబ్బాయిలు చింపిరి జుట్టు, పిట్టగూళ్ల కటింగ్ లతో.. చిత్రవిచిత్రమైన, హెయిర్ స్టైల్స్, కలర్స్ తో విద్యను పక్కనపెట్టి, అనవసరపు విషయాలపై మక్కువ చూపుతున్నారు. అలాంటివి పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు వాటిని ఖండించి, వారిని సరైన దారిలో పెడితే సమాజానికి నీతి, నిజాయితీ , నైపుణ్యం గల మంచి భావిభారత పౌరులను అందించగలము.

పద్మజ :- గురువుగా మీ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు లేదా అనుభవాలు ఏమిటి?

తిరునగరి :- నా మొట్టమొదటి ఉద్యోగ ప్రస్థానం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామరాజు పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో. మా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మంగు ప్రవీణ గారు. ఆమె విద్యార్థులకు చక్కగా గణితం బోధించేది. శ్రీసోమరాజు గారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చాలా సహనంతో వారి స్థాయికి దిగి, ఎలా చెప్పాలో… చక్కగా వివరించి చెప్పేవారు.
శ్రీ రాధాకృష్ణ గారు, ప్రవీణ్ గారు, ‌‌ ప్రసన్న గారు, ఇలా ఒక్కొక్కరి నుండి ఒకటి గ్రహించుకొని, నాదైన శైలిలో విద్యార్థులకు కృత్యాధార బోధన పద్ధతిలో ఇలా చెప్పాలని, నాలో బోధనా నైపుణ్యానికి నాంది పడింది. ఇంట్లో మావారు, మా బాబు, మా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు.

పద్మజ :- విద్యాబోధన అంటే మీ దృష్టిలో ఏమిటి? కేవలం పాఠ్యాంశం బోధించడమేనా లేక మరేదైనా విస్తృతమైన అర్థం ఉందా?

తిరునగరి :-విద్యా బోధన అందరూ చేస్తారు కానీ “హృద్యమైన విద్యా బోధన” అందరూ చేయరు.
విద్యార్థి స్థాయికి దిగి, వారి భాషలో సరళమైన శైలిలో మనం వారికి పాఠం చెప్పిన విషయం కూడా తెలియకుండా, వారితోనే ఆటపాటల ద్వారా నేర్చుకునేటట్టు కృత్యాధార పద్ధతిలో చేయించడం. ఇది ఎక్కువగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో సాధ్యమయ్యే విద్యా బోధన. ఇక్కడ ఈ చిన్న తరగతులలోనే పునాది గట్టిగా ఉంటేనే ఎన్ని అంతస్తులైన వేయగలమనే నానుడితో క్షేత్రస్థాయిలోనే విద్యార్థులకు బేసిక్స్ బాగా నేర్పించి వదిలిపెడితే, వారు ఏదైనా చదవగలరనే ఉద్దేశం నాది..

పద్మజ :- మీరు తరగతిలో విద్యతో పాటు జీవన నైపుణ్యాలను కూడా నేర్పిస్తారని వింటున్నాం. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? విద్యార్థులకు నేర్పించే ముఖ్యమైన జీవన నైపుణ్యాలు ఏమిటేమిటి?

తిరునగరి :- ఒకసారి నేను రామరాజు పల్లి పాఠశాలలో పనిచేసేటప్పుడు.. శ్రీకాంత్ అనే ఆరవ తరగతి విద్యార్థి బడికి సరిగ్గా రాక, చదవకపోయేవాడు. వాడు కోళ్ల ఫారంలో పనిచేసేవాడు. ఒక రోజు వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చి, “టీచర్! మా బాబుని తీసుకొని ఊరికి పోతుంటే బస్టాండ్ కి వెళ్లి, బస్సు పేరు చదవమంటే వాడు వేరే వాళ్ళని అడిగాడు. మీరు ఏమి చదువుచెప్పుచున్నారు? వాడు బడికి రాకపోతే మీరు పట్టించుకోరా?” అని అడిగింది. అప్పుడు నేను ప్రతిరోజూ సరిగ్గా బడికి పంపాలి, లేకపోతే వారు విద్యలో వెనుకబడుతారని సమాధానం ఇచ్చాను. విద్యార్థులలో జీవన నైపుణ్యాలను పెంపొందించి, వారిని ముందుగా సక్రమంగా బడికి వచ్చేటట్టుగా ఆకట్టుకోవాలంటే కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే కాదు వారికి నచ్చిన విధంగా వారితోనే ఆ పాఠ్యాంశానికి సంబంధించిన బోధనా సామాగ్రిని తయారు చేయిస్తూ, వారికి తగిన ప్రోత్సాహక బహుమతులు ఇస్తూ, వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించాలనే ఆలోచన నాకు కలిగింది. నేను ముఖ్యంగా విద్యార్థులకు బోధించే జీవన నైపుణ్యాలు ఏమిటంటే? కేవలం విద్య ద్వారానే కాకుండా, సహ పాఠ్యాంశ కార్యక్రమాలైన ఆటలు, ఎన్సిసి, చిత్రలేఖనం.. ఇలా ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యత సంపాదిస్తే, కేవలం ఉద్యోగం పైన మాత్రమే ఆధారపడకుండా వారే సొంతంగా ఏమైనా.. వ్యాపారం మొదలుపెట్టి, నలుగురికి జీవనోపాధి కల్పిస్తారు. ఏది నేర్చుకున్నా పట్టుదలతో నేర్చుకొని,
విజయాన్ని సాధించే దిశలో పయనించి, వినయ విధేయతలతో మెలగాలని చెబుతాను.

విద్యార్థులను ప్రభావితం చేసేది ఎక్కువగా ఉపాధ్యాయులే!
ఉదాహరణకు ఒక పిల్లాడు చక్కగా చదివి, సంస్కారంతో మెలిగితే, అక్కడ ఊళ్లో వాళ్ళు కానీ వారి బంధువులు కానీ “అరె బాబు నువ్వు బాగా చదువుతున్నావు. ఏ స్కూల్లో చదువుతున్నావు.
మీ తెలుగు టీచర్ ఎవరు., వెరీ గుడ్ చక్కగా నేర్పిస్తున్నారు” అని మెచ్చుకుంటారు.. అదే చదువకుండా , పొగరుగా ఉంటే, “ఎవతిరా,
ఎవడ్రా నీకు చదువు చెప్పేది? ఏదీ పోదాం పారా మీ సార్/మీ టీచర్ దగ్గరికి, ఏం చెప్తాండ్రో అడుగుతా పదరా! నడువు రా!.. ” అని తిట్టుకుంటూ వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి విద్యార్థులను వినయ విధేయతలు గల విద్యాసంపదగా భావించి, వారికి ‌ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను వారికి వారే పరిష్కరించే విధంగా ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని పెంపొందించుతాను..

పద్మజ :-ఈ విధానం అమలు చేసే సమయంలో మీరు అనుసరించే పద్ధతులు ఏమిటి?
సాధారణ బోధన విధానంతో పోలిస్తే ఈ పద్ధతిలో విద్యార్థుల్లో మీరు గమనించిన మార్పులు ఏమిటి?

తిరునగరి :-సాధారణ బోధన విద్యార్థులకు విసుగుగా ఉంటుంది. ఈ కృత్యాధార బోధనతో..
విద్యార్థులు ఎంతో ఆసక్తితో వింటారు. స్వయంగా.. వారే ఆ బోధన సామాగ్రిని ఉపయోగిస్తూ నేర్చుకోవడం వల్ల వారు ప్రతి రోజూ పాఠశాలకు రావడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా సబ్జెక్టు పైన ఆ సబ్జెక్టు టీచర్ పైన ఇష్టాన్ని పెంపొందించుకొని విద్యను కష్టంగా కాకుండా ఇష్టంతో నేర్చుకుంటారు.

పద్మజ :- చదువు మాత్రమే కాకుండా జీవితానికి ఉపయోగపడే విలువలు పిల్లలకు నేర్పడం ఎందుకు ముఖ్యమని మీరు భావిస్తారు?

తిరునగరి :- విద్య అందరూ నేర్పిస్తారు. కానీ విలువలతో కూడిన విద్యను కొందరే నేర్పిస్తారు. ఆ విలువలను వారు నేర్చుకొని ఆచరిస్తే సమాజంలో
గౌరవింపబడతారు. ఉన్నత స్థాయిలో నిలుస్తారు.

పద్మజ :- తెలుగు భాష బోధనలో మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అంశం ఏమిటి? సాహిత్యం ద్వారా పిల్లల్లో విలువలను పెంపొందించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏమిటి?

తిరునగరి :-తెలుగు భాషా బోధనలో ముందు అక్షరాలను చక్కగా గుండ్రంగా దోష రహితంగా రాయించడం, ధారాళంగా చదియించడం ఇవి రెండు ముఖ్యమైనవి. ఇవి చక్కగా నేర్చుకుంటే, ఏదైనా రాయగలరు, చదవగలరు.
ఇంకా కొన్ని సందర్భాలలో ఒక అందమైన గులాబీ పుష్పాన్ని చూసినా ఒక చిట్టి చిలకమ్మను చెట్టు పైన చూసినా ఒక కమ్మని కోయిలమ్మ పాటను విన్నా మనసు పులకరిస్తుంది. ఆ విషయాలను చిన్నగా కవితల రూపంలో విద్యార్థులతో రాయిస్తూ,
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక అని అక్షర శరాలను సంధిస్తూ సాహిత్యం ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. రవి కాంచని చోటును కవిగాంచగలడు అని విద్యార్థులకు బోధిస్తూ, భావి జీవితంలో మీరు కూడా గొప్ప కవులు కావాలని, సమాజ హిత రచనలు చేయాలని, విద్యార్థులకు హితబోధ చేస్తాను.

పద్మజ :- నేటి డిజిటల్ యుగంలో పిల్లల్లో తెలుగు పట్ల ఆసక్తి పెంచడానికి గురువులు ఏమి చేయాలి?

తిరునగరి :-ఇప్పుడు ప్యానెల్ బోర్డులు వచ్చాయి కదా! వాటిని ఆపరేట్ చేస్తూ, విద్యార్థులతోనే చేయిస్తూ, పాఠ్యాంశం అందులోనే వినిపిస్తే వారికి కూడా రొటీన్ టీచింగ్ కు భిన్నంగా ఉంటుంది. చాలా ఆసక్తిగా చిత్రాలను చూస్తూ నేర్చుకుంటారు. ఇంకా నేను బోధించే పాఠ్యాంశాలను ఎక్కువగా టి ఎల్ ఎం ద్వారా మరియు పాఠశాల గోడల పైన కుడ్య చిత్రాలుగా నేను చిత్రీకరిస్తూ విద్యార్థులతో కూడా చిత్రీకరింప చేస్తూ, ఆ గోడ పైన ఆ బొమ్మ చూశారంటే, విద్యార్థికి పాట మొత్తం వచ్చేస్తుంది. ఆ విధంగా కూడా విద్యాబోధన చేస్తే, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని అనుకుంటాను.

పద్మజ :- ఈ విధమైన బోధనలో మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏమిటి? తల్లిదండ్రులు మరియు పాఠశాలల సహకారం ఈ విధానానికి ఎంతవరకు అవసరం?

తిరునగరి :- ఇంతవరకు ఏ మహిళా ఉపాధ్యాయురాలు కూడా పాఠశాలగోడల పైన బొమ్మలు వేసి చెప్పలేదు. చీరల పైన వేశారేమో కానీ
అయితే నేను ఇలా వేయడం వల్ల చాలామంది ఉపాధ్యాయులకు ఇంత శ్రమ అవసరమా? ఏదో బడికి వెళ్లి పాఠాలు చెప్పుకోక అని విమర్శలను ఎదుర్కొన్నాను. అంతేగాక పొగడ్తలను కూడా పొందాను.
మా సోలిపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు..( తరిగొప్పుల మండలం జనగామ జిల్లా)
పాలకుర్తి ఎంఈఓ గారు శ్రీ పోతుగంటి నర్సయ్య గారు మహాత్మా హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను నడిపిస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (మిర్యాలగూడ) శ్రీ గంటా రవీందర్ గారు మరియు వందేమాతరం ఫౌండేషన్ సృష్టికర్త శ్రీ వందేమాతరం రవీందర్ గారు మా పాఠశాలకు వచ్చి, ఎన్నో ఉపకరణాలను దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువచేసే, వస్తువులను బహుకరించారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. శ్రీ యాదగిరి గారు.. రైలు భోగిగా తరగతి గది అనే ఒక చిత్రాన్ని నాకు చూపించారు. వెంటనే మా పాఠశాల గోడలపై మా అటెండర్ యాదలక్ష్మి మరియు విద్యార్థుల సహాయంతో నేను కూడా రైలు మోడిని వేశాను..
అప్పుడు కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారి గారు మాపాఠశాలను సందర్శించి మిగతా ఉపాధ్యాయులను కూడా మా పాఠశాలను సందర్శించమని చెప్పారు. “బొమ్మల టీచరమ్మ”
అనే శీర్షికతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సాక్షి పేపర్లో నా కథనం వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నన్ను ప్రోత్సహించిన వీరందరితో పాటుగా మా హిందీ మాస్టర్ నాకు సోదర సమానులు కస్తూరి సతీష్ కుమార్ మరియు సుధా మేడం, సారంగ పాణి, సంపత్ కుమార్, హెచ్ఎం శ్రీ యాదగిరి గారు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ‌‌వీరందరికీ కృతజ్ఞతాభివందనములు

పద్మజ :– ఒక గురువుగా మీకు అత్యంత సంతృప్తి కలిగించిన క్షణం ఏమిటి?

తిరునగరి :- ప్రస్తుతం పని చేసే పాఠశాల భూపాల్ పల్లి జిల్లా నేరేడుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నేను 317 G.O లో ట్రాన్స్ఫర్ పై వెళ్ళినప్పుడు ఆ పాఠశాల గోడలు బూజులు పట్టి ఉన్నాయి. అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. అదే ప్రైవేట్ పాఠశాలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో అందంగా ఉండడం వలన విద్యార్థులను ఆకర్షిస్తాయి. ప్రవేట్ పాఠశాలలకు దీటుగా మాబడిని కూడా తయారు చేయాలని, అంతకుముందు నేను పని చేసిన సోలిపూర్ పాఠశాలలో 65 కుడ్య చిత్రాలను ఒక్కదాన్నే వేసాను. ఇక్కడ వేద్దాము అనగానే మా ప్రధానోపాధ్యాయులు శ్రీ పూలాల సాంబయ్య గారు వెంటనే స్పందించి “సరే చెల్లెమ్మా!
ఏమేమి కావాలి చెప్పమ్మా” అని లిస్టు రాయించుకుని ఆ పెయింట్స్ ను బండి పైన పెట్టుకొని తెస్తున్నప్పుడు, నా హృదయం ఆనంద భాష్పాలతో నిండిపోయింది. మిగతా సహ ఉపాధ్యాయులు, శ్రీ ప్రణీత్ కుమార్, కుమారస్వామి, మల్లికార్జున్, మంజుల, సునీత, లావణ్య ,విజయలక్ష్మి వాళ్ళందరూ ఎంత బాగా సహాయ సహకారాలు అందించారంటే మాటల్లో చెప్పలేను. ఈ పాఠశాలలో కూడా” రైలు భోగిగా” తరగతి గది పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు నిచ్చెన పైకెక్కి, డ్రమ్ములు బోర్లించుకుని ఎక్కి, పెయింటింగ్ వేసినప్పుడు నా సంతోషాన్ని మాటలలో చెప్పలేను. అది అనుభవైకవేద్యం. ఈ చిత్రాన్ని చూసి, ఎంపీడీవో గారు భూపాల్ పల్లి కలెక్టర్ గారికి చెబితే మా పాఠశాలకు లక్ష రూపాయలు బహుమతిగా శాంక్షన్ చేశారు. అప్పుడు ఇంకా ఆనందం కలిగింది అది వర్ణనాతీతం.. గొర్లవీడు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రషీద్ గారు, మేము వేసిన కుడ్యచిత్రాలను చూపెట్టడానికి రెండుసార్లు మా పాఠశాలలో ప్రత్యేకంగా కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. మిగతా టీచర్లకు మేము ఆదర్శమని చెప్పారు. ఆ ఉత్సాహాన్ని నా మానసికోల్లాసాన్ని ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను..

పద్మజ :- నేటి విద్యావ్యవస్థలో జీవన నైపుణ్యాల విద్య ఎంత అవసరమని మీరు భావిస్తున్నారు?
కొత్తగా గురువులుగా రావాలనుకునే వారికి మీరు చెప్పే సూచనలు ఏమిటి?

తిరునగరి :-కేవలం పుస్తకాలలో ఉన్న విద్య మాత్రమే కాకుండా ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఎలా మెలగాలి? ఉన్నత వ్యక్తిత్వంతో జీవిస్తూ ఉద్యోగ భద్రతను ఎలా కాపాడుకోవాలి? సాటివారితో ఎలా మెలగాలి? ఇవి నేర్పిస్తే చాలు అనుకుంటున్నాను.
కొత్తగా గురువులుగా వచ్చే వారికి నేను ఇచ్చేసలహాలు ఏమిటంటే? ఎ టీచర్ ఇస్ ఏ రోల్ మోడల్ మనం ఆదర్శంగా ఉంటూ విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ వారి భవితవ్యాన్ని చక్కగా తీర్చిదిద్దే దిశగా ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ వెలుగుతున్న దీపం ఇతర దీపాలను వెలిగిస్తుంది అన్న చందంగా మెళకువలను జీవన నైపుణ్యాలను బోధించాలి అని చెబుతాను..

పద్మజ :-విద్యార్థులకు మీరు చెప్పదలచిన ఒక ముఖ్యమైన జీవన సూత్రం ఏమిటి?

తిరునగరి :- “విద్య వల్ల ఎదగాలి వినయంతో మెలగాలి”

పద్మజ :-చివరిగా, తరుణి పత్రిక పాఠకులకు మీ సందేశం ఏమిటి?

తిరునగరి :-ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి..
మనం ఆదర్శంగా ఉంటూ ఇతరులకు ఆదర్శప్రాయంగా మెలగాలి.

విద్య అనేది మార్కులకే పరిమితమైపోయిన నేటి కాలంలో, పిల్లలకు జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం మరియు నైపుణ్యాలను నేర్పే గురువులు సమాజానికి అవసరం. తెలుగు భాషను బోధించడమే కాకుండా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని వెలిగించే తిరునగరి పద్మ గారి బోధన విధానం నిజంగా ఆదర్శప్రాయమైనది.
ఇలాంటి గురువుల ఆలోచనలు మరెంతో మందికి ప్రేరణనిస్తూ, విద్యను జీవితానికి దగ్గర చేసే దిశగా మార్గం చూపుతాయని ఆశిద్దాం. ఇంత చక్కని ఆదర్శవంతమైన విద్యాబోధకురాలాని పరిచయం చేయడం నాకెంతో సంతోషంగా ఉంది
ఇలాంటి గురువుల ఆలోచనలు మరెంతో మందికి ప్రేరణనిస్తూ, విద్యను జీవితానికి దగ్గర చేసే దిశగా మార్గం చూపుతాయని ఆశిద్దాం.

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శాంతి విలువ

by Dr k Geetha May 29, 2026
written by Dr k Geetha

కడుపు నిండిన వాడికి
ఆకలి బాధ తెలియదు
యుద్ధం మొదలు పెట్టిన వాడికి
శాంతికి అర్థం తెలియదు
గుప్పెట్లో ప్రాణాలు
అంటే తెలియదు
నెత్తి మీద ఎప్పుడు
ఏ బాంబు పడుతుందో
ఎప్పుడు ఎవరికి మూడుతుందో
…ఏవీ తెలియవు
చోద్యం చూసే వాళ్లకూ
తెలియదు
సెల్ ఫోనుల్లో
రీల్స్ చూసుకుంటూ
కడుపు చల్ల కదలకుండా
బతికే వాళ్లకు
యుద్ధమంటే ఏవిటో
తెలియదు
యుద్ధమంటే
అమానుషత్వం
యుద్ధమంటే
అణచివేత
యుద్ధమంటే
ఊచకోత
యుద్ధమంటేనే
సర్వ నాశనం కావడం
యుద్ధమంటేనే
సర్వం కోల్పోవడం
పాపం అప్పటి వరకూ
బడి ఒడిలో
అమాయకంగా
పరుగులెడుతున్న
పసివాళ్ళకి
తెలియదు
గూగుల్ తమ లొకేషన్
యుద్ధ స్థావరంగా చూపిస్తుందని
తల్లి ఒడిలో ప్రశాంతంగా
నిద్రించే పసికూనకి తెలియదు
తాము కాలూనుకున్న
భూమి కింది
పొరల్లోని నూనె నిల్వలే
తమని పొట్టనబెట్టుకుంటాయని
అప్పటివరకూ
తమదనుకున్నదేదీ
తమది కాదని
సామాన్య జనానికీ
తెలియదు
యుద్ధతంత్రాలు
రాసే వాడికి తప్ప
ఎవరికీ ఏ నష్టం
కలుగుతుందో
ఎవరికీ తెలియదు
ఎవరికీ
అర్థం కాదు
యుద్ధమంటే ఏవిటో
అనుక్షణం
భయం భయంగా
గుండె దడగా
బతకడమంటే
ఏవిటో –
పోయిన వారి
ఆనవాళ్ల కోసం
బతికున్న వారి
జానెడు పొట్ట కోసం
దీనాతిదీనంగా
వెర్రిచూపులు
చూడడమంటే
ఏవిటో
యుద్ధం మొదలు పెట్టిన వాడికీ
యుద్ధం అవసరం అయిన వాడికీ
యుద్ధం వినోదం అయిన వాడికీ
తెలియదు
యుద్ధానికి ఎదురు నిలబడేవాడికి
మాత్రమే తెలుసు
ఆయుధపు మొన గుండెల్లో గుచ్చుకున్నవాడికి
శకలాలుగా చీలిపడ్డ మొండాల్ని
భుజాన మోసే వాడికి మాత్రమే తెలుసు
యుద్ధానికి ఎదురు నిలబడేవాడికి
మాత్రమే తెలుసు
శాంతి విలువ

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మౌనలోకం

by Dr. Varigonda Satya Surekha May 29, 2026
written by Dr. Varigonda Satya Surekha

సుహృత్ కన్నా సుచరిత ప్రవర్తన ఎక్కువ బాధని కలిగిస్తోంది. వాస్తవం అంగీకరించడానికి తన మనసు ఎందుకు సిద్దం కావట్లేదో అర్థంకాదు. ఇవాళ  మళ్ళీ స్కూల్ కి వెళ్ళింది. అక్కడేం జరుగుతుందో తెలిసిందే. ఇంటికొచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది. రెండు రోజులవరకు మాములు మనిషి కాదు. నిద్రాహారాలు ఉండవు. తన వైఖరి సుహృత్ కి ఎంత చేటు చేస్తుందో గ్రహించదు.
ఊరికి వెళ్ళక రెండు  సoవత్సారాలు అయింది. అమ్మ నాన్న ముఖ్యంగా నాన్నమ్మ ఎలా ఉందో. చిన్నప్పటి నుండి పనికైనా పరిష్కారానికైన తను చేరేది నాన్నమ్మ ఒడికే. అటువంటిది ఇప్పుడు తన జీవితంలో ఇంత పెద్ద తూఫాను చెలరేగింది. నాన్నమ్మ దగ్గర ఎపుడు ఏది దాచని తాను ఇవాళ సుచరిత వల్ల సుహృత్ విషయం దాచాల్సి వస్తోంది. “నాన్నమ్మ నాకు మార్గం చూపవు.” మనసులోనే అర్థించాను.

                                      *
“నాన్నమ్మ నువ్వు నిజంగా వచ్చావా?” ఆనందo ఉక్కిరిబిక్కిరి చేయగా ఆటో దిగిన నాన్నమ్మని వాటేసుకున్నాను.
“బడుద్దాయి! వదలరా , ముందు ఆటో అబ్బాయ్ కి డబ్బులు ఇచ్చి పంపు.” ప్రేమపూర్వకమైన నవ్వుతో ఇంట్లోకి దారితీసింది. సామానుతో ఆ వెనుకే ఆవిడని అనుసరించాను.
అవ్వడానికి డెబ్బై ఏళ్ళ వృద్ధురాలుఅయినా పడుచు వారికి ధీటుగా ఇప్పటికి ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంది. ఒక్కసారి చూసిందో , ఇక అంతే , జన్మలో మర్చిపోదు. అందుకే ఆవిడ ఇక్కడికి వచ్చిమూడేళ్ళు పైన అయినా “ఎలా రాగలిగావు” అన్న ప్రశ్న వేయలేదు.
మంచి నీళ్ళు అందిస్తూ అడిగా “ కాఫీ పెట్టనా? తాగి స్నానం చేస్తావా” .
“అదేంటి నువ్వు పెట్టడం .సుచరిత ఏది”
“సుహృత్ స్కూల్ కి వెళ్ళిందిలే” చెప్పి కాఫీ పెట్టడానికి వంటిట్లోకి వెళ్ళా.
                        “ఏరా ఇంత విషయం ఉంటే మాకెవరికి చెప్పావు కాదే” “సుచరిత ఇష్టపడలేదు నాన్నమ్మ. అందరు పిల్లాడిని గేలి చేస్తారేమోనని భయపడింది. అలాగే మీ నుండి ఏమ్మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని కూడా కొంత భయపడింది. అందుకే రెండేళ్ళ బట్టి రావడానికి ఒప్పుకోలేదు..” సంజాయిషీ ఇచ్చాను. “అందులో తన తప్పేమీ లేదు లేరా. నూటికి నూరుపాళ్ళు ఏ తల్లి అయినా అలాంటి పరిస్థితుల్లో అలాగే చేస్తుంది.” మనుషులని మనసులని అర్థం చేసుకోవడం లో నాన్నమ్మ తర్వాతే ఎవరైనా అనిపించింది.                    
సుహృత్ కి Intellectual disability ( ఇంటెలెక్చువల్ డిసబిలిటి)ఉందన్న విషయం  వాడికి ఐదేళ్ళు వచ్చేవరకు మాకు అర్థం కాలేదు. వాడు పాకడం , నడక , మాటలు అన్నీ ఆలస్యమే. తరగతి గదిలో ఓ చోట కుదురుగా కూర్చోలేకపోవడo, టీచర్ చెప్తోంది అర్థం చేసుకోలేకపోవడo, మిగిలిన పిల్లల మాదిరిగా కాక విషయాలని మర్చిపోతూ ఉండడం, పుస్తకంలో అక్షరాలని కుదురుగా కాక విసిరేసినట్లుగా రాయడం , ఏదైనా చెప్పడంలో , మాట్లాడటంలో పదే పదే తడబడ్డం…… వేటేనీ కూడా Intellectual disability (ఇంటెలెక్చువల్ డిసబిలిటి ) లక్షణాలుగా గుర్తిచడంలో విఫలం అయ్యాం.
“మీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వేరే పిల్లల లంచ్ బాక్స్ల్లో వారు తింటుండగా తీసుకుని తింటున్నాడు. కోప్పడ్డా ప్రయోజనం లేదు. కొడితే భయపడాలన్న విషయం కూడా తెలియట్లేదు. ఒకసారి డాక్టర్ ని కలవండి…..” అని వాడి క్లాస్ టీచర్ చెప్పేవరకు , మా పిల్లాడి ప్రవర్తన మిగిలిన పిల్లలకి భిన్నంగా ఉంటోందన్న విషయం అర్థం కాలేదు.
అర్థమయినా సుచరిత అంగీకరించడానికి సిద్దపడలేదు. టీచర్ల సాకులంది. స్కూల్ మార్చాలంది. మార్చిన స్కూల్లోనూ అవే కంప్లైంట్స్ . ఇంక లాభం లేదనుకొని సుచరిత ని బలవంతం గా ఒప్పించి సుహృత్ ని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళా.
ఏ విషయం అయితే సుచరిత మనసు స్వీకరిoచట్లేదో అదే సుహృత్ జీవితo యొక్క కఠ‌‍‌‍న వాస్తవమైంది. ఆ క్షణాన ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కంపించినట్లైంది. తండ్రిగా నా పరిస్థితే దుర్భరం . ఇక తల్లిగా సుచరిత……. అర్థం చేసుకోగలిగాను. ఓపిక పట్టాను. మెల్లిగా తనకి తాను సర్దుకుంటుందని , వాస్తవాన్ని జీర్నిoచుకుంటుందని ఆశిoచాను. కాని అలా జరగట్లేదు.
లోకమంతటినీ తప్పు పడుతోంది కాని తన బిద్దలోని లోపాన్ని మాత్రం ఒప్పుకోదు. ఎవరైనా పిల్లాడి గురించి సలహానో సానుభూతో ప్రకటిస్తే వారితో ఎదురు దాడికి దిగుతుంది. రాను రాను వైద్యం వారిద్దరిలో ఎవరికి ఎక్కువ అవసరమో తనకి అర్థం కావట్లేదు. డాక్టర్ , ఇలాంటి పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిద్దరూ శిక్షణ పొందాలి అంటారు. ముఖ్యం గా తల్లి .
వాడితో ఓపిగ్గానే ఉంటుంది. వాడిని కొట్టడం కాదుకదా కనీసం విసుక్కోగా కూడా తనెప్పుడూ చూడలేదు.విరాం లేకుండా వాడి వెంటే తిరుగుతూ, వాడి ప్రతీ చర్యను సర్దుకుంటూ , సమర్థించుకుంటూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా బిడ్డకి బుద్దిమాoధ్యత ఉంది అని ఒప్పుకోదు. చర్చ కి తావులేదు. “మీ బిడ్డని మీరే వెర్రివాడని అనుకుంటున్నారా ….” అని ఆవేదన చెందుతుంది. తన దుఖాన్ని చూసి మౌనం వహించడం మినహా చేయగలిగింది లేదు.
                     
***
“ ఏంటి! నాన్నమ్మ సుహృత్ ని ఆడిస్తున్నావా…”  వెనక వైపు  వసారా లో నాన్నమ్మ సుహృత్ లని అలా చూస్తుంటే తనకి తన బాల్యం గుర్తోచ్చిoది.  
“సుహృత్ ! తాతమ్మ ని ఆట పట్టిస్తున్నావా …” అంటూ నా వెనుకే వచ్చిన సుచరిత వెళ్ళి వాళ్ళిద్దరి ప్రక్కగా కూర్చుంది. ఆ ముగ్ద చిత్రంలో నా స్థానానికై నేనూ వెళ్ళి కూర్చున్నాను.
నాన్నమ్మ మమ్మల్ని చూసి చిరునవ్వు తో “ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి “ అని “అక్కడెక్కడో బౌద్ధ గురువట, యేవో పరీక్షలు జరిపి ప్రపంచంలోనే అందరికన్నా సంతోషవంతుడు అని తేల్చారట. వారి పరిశీలనలు ఏమోగాని , నాకు తెలిసి ఆయన సంతోషం గా ఉండటానికి కారణం తనదైన ప్రపంచంలో హాయిగా ఆనందంగా  జీవించడం , రాగద్వేషాలు కలిగి ఉండకపోవడం, ప్రకృతిని ప్రేమించడం, వస్తువులకి విలువ్వివక పోవడం, ముఖ్యంగా ఎవరితోటి దేన్నీ పోల్చుకోకపోవడం… అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మీరు గొప్పవారిగా  ఒప్పికుంటారా?” నాన్నమ్మ ప్రశ్న కి సమాధానంగా ఇద్దరం తలూపాం.
“మరి మీ బిడ్డ ఎదుగుదల పట్ల ఎందుకు అనుమానపడుతున్నారు.” నానమ్మ తర్కం అర్థంకాలేదు. నాన్నమ్మే మళ్ళీ “నా  మనవడు ఎండగా ఉన్నప్పుడు వాన కావాలి అంటాడు.  కుదిరిన ప్రతిమబ్బు కురవలంటాడు. అలా జరగనందుకు నిరుత్సాహ పడతాడు . ఒక్కోసారి విసుగు చెందుతాడు.  ఆ ఆలోచనలో నీకు లోపం కనిపిస్తే నీ భార్యకి అది ఆందోళని కలిగిస్తుంది. అసలు ప్రకృతే గమనించడం మానివేసిన మీలాంటి వారికి అదో మానసిక రుగ్మత లా కనిపిస్తుంది.”
నాన్నమ్మ మాట్లాడుతోంది. నాకు అర్థమై కానట్లుగా ఉంది. కాని ఎక్కడో ఏదో నా ఆలోచనల్లోనే లోపం ఉందని అర్థమైంది. వికాసమైన వికలత అయినా మనిషి ఆలోచనల్లోనే ఉందని అర్థమైంది. వాడి గురించి నేనలా ఆలోచించడం నా మనో వైకల్యoలా ఇపుడు అనిపిస్తోంది.
“మనిషి ఎదిగేకొద్దీ  వాడిలోని పసిమనసు కనుమరుగవుతుంది. మేధ పెరగడమే దానిక్కారణం అనుకుంటారు మీలాంటి మేథోవంతులు కాని అసలు సిసలు మేథ జిజ్ఞాసని ఎల్లప్పుడు జీవింపచేసి ఉంచటమే. ఆ మేధ వాడిలో ఉంది. మీ అజ్ఞానo వాడి మేధని అడ్డుకుంటోందని ఏనాడైనా ఆలోచించారా..?” సూటిగా ప్రశ్నించింది నాన్నమ్మ.
“నిజమే! అమ్మమ్మగారు. నలుగురిలోనూ ఆఖరికి నా భర్త సమక్షంలో కూడా నేనేనాడు నా బిడ్డకి మనో వైకల్యత ఉందని ఒప్పుకోలేదు. కాని నాకేతెలియకుండా నా అంతరంగాలలో ఎక్కడో ఎప్పుడో అదే అభిప్రాయం స్థిరపడినట్లుంది. అందువల్ల నిత్యం నేను , నాతో ఇతరులతో కూడా ఘర్షణ పడుతూ ఉండేదాన్ని. మీరు స్థిరంగా నా బిడ్డ ఆరోగ్యవంతుడు అని చెప్తున్నారు.  నా మనస్సు , వాక్కు , చేత దేనికి పొంతన లేని కారణాన నా బిడ్డ జ్ఞానాన్ని జిజ్ఞాసని గుర్తించలేకపోయాను. సంఘంలో నా బిడ్డ స్థానం గురించిన ఆందోళనే తప్ప నా ఈ రకమైన ప్రవర్తన వాడి ఎదుగుదలకి అవరోధం అవుతోందని తెలుసుకోలేకపోయాను. ఇతరులకి భిన్నంగా ఉండడo ప్రత్యకమే తప్ప పొరపాటు కాదు అని ఆలోచించలేకపోయాను.” కళ్ళు వర్షిస్తుండగా మనసు విప్పి మాట్లాడుతోంది సుచరిత.
ఇన్నాళ్ళూ సుచరిత లో తప్పులు వెదకడమే తానూ చేసాడు  తప్ప తన ఆలోచనల్లో దాగి ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సుహృత్ కూడా ఆ బౌద్ధ గురువులాగే రాగద్వేషాలు లేనివాడు. దేనితోనూ ఏది పోల్చనివాడు. ప్రకృతి ని ప్రేమించేవాడు. అమ్మ అంటే విపరీతమైన అనురాగం, నిష్కల్మషమైన చిరునవ్వుతో అందరిని పలకరించే వాడి అమాయకత్వం… ఆలోచిస్తుంటే తెలుస్తోంది వాడి వ్యక్తిత్వపు పరిమళం.
నాన్నమ్మ పాదాలనoటి చెప్పాను “ఇంకెప్పుడు ఎవరితోనూ పోల్చను. వాడి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. వాడి మేధ ఎందులో ఉందో వెలికితీస్తాను.”
“ఈయన తిప్పని psychriyatist లేరు. కాని మీలా అర్థం చేయించిన వారెవరూ లేరు. చాలా థాంక్స్ అమ్మమ్మగారు…” ఆనందాశ్రువులు రాలుతుండగా రెండు చేతులూ జోడిచింది సుచరిత. మునుపెన్నడూ లేని సంతోషం సంతృప్తి కనిపించాయ్ ఆ కళ్ళల్లో.
“చాల్లెండర్రా ! మీరు మీ పొగడ్తలూ. వీడు నా మనవడు. వాడు నా మునిమనవాడు. నా కుటుంబంలోని పిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుస్తుంది కాని మీరు చెప్పే ఆ నాలుగు మాటలు వినే ఆ డాక్టర్ కి ఏం తెలుస్తుంది. యెంత తెలుస్తుంది. సరే!ఇంక మమ్మల్ని విసిగించక వెళ్లండి. మేమిద్దరం ఆడుకోవాలి….” అని నవ్వుతూ నా జీవితంలోని ఉప్పెనని ప్రశాంత నదీ ప్రవహంలా మార్చిన నాన్నమ్మ ఋణo ఏమిచ్చి తీర్చుకోగలను…..
 
 
 

May 29, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మానవత్వమా… నీ చిరునామా ఎక్కడ?

by Dr. Aruna Parandhamulu May 29, 2026
written by Dr. Aruna Parandhamulu

పట్టణపు వెలుగుల వెంబడి నడిచాను
నీలి దీపాల నీడల్లో తిరిగాను
ఎత్తైన గోడల మధ్య
మనుషుల గుంపులు కనిపించాయి
కానీ… మనసుల జాడ మాత్రం దొరకలేదు.

చెరువు ఒడ్డున ఆకలి ఏడుపు వినిపించింది.
చిన్నారి కళ్లలో ప్రపంచం మునిగిపోయింది.
“మానవత్వం ఎక్కడ?” అని అడిగితే
జవాబు కాదు కన్నీరు మాత్రమే జారింది.

ఆసుపత్రి గడప వద్ద జీవితం తడబడుతుంటే,
డబ్బు లేక ప్రాణం ఆగిపోతుంటే,
చేతులు జోడించిన తల్లి వేదనగా అడిగింది
“మానవత్వమా… నువ్వూ ధనవంతులింటికే చేరావా?”

రోడ్డు మీద రక్తం కథ చెబుతుంటే,
చుట్టూ నిల్చున్న కళ్ళు కెమెరాలయ్యాయి…
ఒక్క చేయి ముందుకు రాలేదు
అక్కడే మానవత్వం మౌనంగా చనిపోయింది.

కులం గోడలు కట్టిన లోకం ఇది,
మతం కత్తులు దించిన కాలం ఇది,
అధికారపు అహంకారంతో
మనిషి మనిషినే దహించుకుంటున్న దృశ్యం ఇది.

ఇంట్లో తల్లిదండ్రుల నిశ్శబ్దం విలపిస్తోంది,
వృద్ధాశ్రమాలే వారి చిరునామాలయ్యాయి.
బయట ప్రేమను బోధించే వాక్యాలు,
లోపల బంధాలను బంధించే తాళాలు…

అందుకే…
ఈ భూమిపై నీ జాడ కోసం తిరిగి
నా అడుగులు అలసిపోయాయి, మానవత్వమా!

నువ్వింకా బ్రతికి ఉంటే
ఆకలికి అన్నం అయ్యి రా,
కన్నీటికి ఓదార్పు మాటగా మారి రా,
పడిపోయినవారికి తోడు నిలిచే భుజమై రా.

ఎందుకంటే
మనుషుల కోసం గోపురాలు కట్టిన ఈ లోకంలో,
మనసుల కోసం మాత్రం గుడి కట్టలేకపోతున్నారు…
మనిషి కోసం ఒక్క మానవత్వ హృదయం కూడా
కనిపించదు ఈ కాలంలో—
ఇంకా నిన్ను వెతకను…
ఎందుకంటే…
నువ్వుంటే
అది ఒక మనసులో కాదు—
మనిషిలో కనిపించాలి.

May 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us