మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

శాంతి ఓటమి కాదు!మానవజాతి విజయం!!

by రంగరాజు పద్మజ May 30, 2026
written by రంగరాజు పద్మజ

మన పూర్వీకులు ఏదైనా మంచి ఆలోచన లేదా కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే ఉగాది మరుసటి రోజు ఈ రోజునుండి దీన్ని ఆచరిస్తాను అని గట్టి నిర్ణయం తీసుకునే వారు.(Resolution) వలె… ఆ పని మీదే ధ్యాస పెట్టి మరీ చేసేవారు.
అలా మనం కూడా ప్రపంచ శాంతి కోరుకుంటూ ఆ దిశగా ఒకరికొకరం చెప్పుకుంటూనో? ఆచరిస్తూనో సాగుదాము.
ప్రపంచ శాంతి అనే గొప్ప సంస్కారం మనకు మహాభారతం నుండి హిరోషిమా వరకు ఒక హెచ్చరిక చేసింది.
ఈ విశాల భూమండలంలో మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు.కానీ అదే మనిషి, తన అహంకారంతో, తన కోపంతో, తన స్వార్థంతో…
ప్రపంచాన్ని ఎన్నోసార్లు నాశనం అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇది చరిత్ర సాక్షిగా జరిగిన సత్యం.
శాంతి అనేది ఒక పదం కాదు!అది మానవ జాతి నిలబెట్టే మూల స్తంభం.
మన దేశ చరిత్ర లోని సంఘటనలు మనకెన్నో పాఠాలు చెప్పాయి….
మహాభారతం ఇతిహాసమే తీసుకుంటే…..ఆ యుద్ధం ముందు వచ్చిన శాంతి కోసం ప్రయత్నాలెన్నో… అవకాశాలు అన్నన్ని…( కృష్ణ- సంజయ- రాయబారాలు; ధౌమ్య- వ్యాస-విదుర హితోక్తులు, మునుల సందేషాలు) అందుకే మహాభారతం ఒక గొప్ప అద్దంవంటిది.
శ్రీకృష్ణుడు స్వయంగా శాంతి దూతగా కౌరవుల దగ్గరకు వెళ్లి, పాండవులకు వారి కుటుంబాలను పోషించుకోవడానికి “ఐదు గ్రామాలు ఇవ్వండి” అని హితవు పలికాడు…రాయబారం నడిపాడు.కానీ దుర్యోధనుడు అహంకారంతో….
సూది మొన ఆనేంతైనా భూమి ఇవ్వను” అన్నాడు.
ఆ ఒక్క మాట —
లక్షల ప్రాణాలను బలి తీసుకున్న యుద్ధానికి నాంది పలికింది.యుద్ధం ముగిసిన తర్వాత: ఏమైంది?
గెలిచిన పాండవులు కూడా ఆనందించలేదు! కృష్ణుడికి గాంధారి శాపంతో బాధ మిగిలింది!
కుటుంబాలు, రాజ్యాలు చిద్రమయ్యాయి
మహాభారతం చెబుతున్నది స్పష్టంగా ఇదే:
యుద్ధం గెలిచినా, జీవితం ఓడిపోతుంది.

మరో ఉదాహరణ కూడా మనందరికీ తెలిసిందే!

హిరోషిమా..సంఘటన ఎప్పుడో యుగాల కింద జరగలేదు! నిన్నా-మొన్నా ఆధునిక యుద్ధపు భయానక చిత్రం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది…పీడకలవలె ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిన తరం నాకు చెప్పిన విషయాలు ఎన్నటికీ మరువలేను.ఇది కేవలం పురాణ కథ కాదు!మన ఆధునిక చరిత్ర కూడా ఇదే నిజాన్ని చెబుతోంది.
1945లో, జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు పడింది.ఒక క్షణంలోలక్షల మంది ప్రాణాలు కోల్పోయారు;నగరం బూడిద కుప్ప అయింది. మరణించగా మిగిలినజీవించిన వారు జీవితాంతం బాధలు అనుభవించారు.చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు —అందరూ యుద్ధానికి బలయ్యారు.ఆ రోజు ప్రపంచం తెలుసుకున్నది…
యుద్ధం అనేది శత్రువును కాదు, మానవత్వాన్ని నాశనం చేస్తుంది. అని…ఎంత నిజం.. కానీ ఏం లాభం? సమాజ హితైషులు అన్ని రంగాలలోని వారు గగ్గోలు పెట్టారు.శాంతి కావాలని, ఎవరికైనా మనదేశంలో జరగడం లేదు కదా? అనిపించవచ్చు! మనది వేద భూమి- కర్మభూమి.మన వేదం చెప్పిన విషయం వసుధైకకుటుంబకం అనే భావనలో జీవించాం! జీవిస్తున్నాం…ఇకముందు తరాలు కూడా జీవించేలా నేర్పాలి.
ఐనా పక్కిల్లు కాలిపోతుంటే మన ఇంట్లో సుఖంగా ఉండగలమా? ఆ మంటల తాలూకు సెగలు మనకు సోకవా? పసిపిల్లల రోదనలు – అమాయక ప్రజల ఆక్రందనలు మనకు కూడుతిననిస్తాయా? కునుకు పట్ట నిస్తుందా ? ఆ వ్యర్ధాలతో వాయు- జల – వాతావరణ కాలుష్య మేర్పడదా? మన ఆరోగాయాలమీద ఆ మిసైళ్ళ తాలూకు- బాంబుల రసాయనాలు శారీరక- మానసిక రుగ్మతలు తెచ్చిపెట్టవా?
ముందు మానవత్వం తో పక్కవాడి మేలు కోరుకుందాము! తర్వాత మనను మనం ప్రేమించుకుందాము! అందుకే దేశిధి నేతలు
యుద్ధం – లాభనష్టాల బేరీజు వేసికొని,
ప్రపంచ దేశాలు ఒకసారి ఆలోచించాలి!
యుద్ధం వల్ల లాభం ఏమిటి? వస్తే కొంత భూభాగం వస్తుందేమో? లేదా ఆధిపత్యం వస్తే వస్తుంది కావచ్చు.అది కూడా తాత్కాలిక ఆధిపత్యమే!
కానీ నష్టం ఏమిటి?
అనేక ప్రాణాలు పోతాయి, అదికూడా అన్నెంపున్నెం ఎరుగని పౌరులు, పసివారు, ఆడవాళ్ళు…వీరికీ ఆ యుద్ధానికి సంబంధమే ఉండదు.ఐనా బలౌతారు…అనాధలౌతారు…ఒక తరం వెనుక బడుతుంది.ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి…సంవత్సరాల కొద్దీ నిర్మించుకొన్న భవనాలు కూలిపోతాయి, చారిత్రక సంబంధ ఆనవాళ్ళు పోయే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ఆ దేశ – ప్రాంత అస్థిత్వమే కోల్పోతుంది
ఆ జాతి. అదెంత నష్టమో ఆలోచించరా?
భవిష్యత్ తరాలపై చెడు ప్రభావం ఆరోగ్య పరంగానూ, ఆ చేదు విషాదంతో మానసికంగానూ ఎంతగానో పడుతుంది.మనుషులు మృదుత్వం కోల్పోయి హృదయాలు కరుడుకట్టుతాయి . దాంతోమానవ విలువల పతనం ఔతుంది…కనుక
యుద్ధం వల్ల లాభం తక్కువ నష్టం అంతులే నంత! అదే ప్రపంచంలో శాంతి ఉంటే:దేశాలు అభివృద్ధి చెందుతాయి;విద్య, వైద్యం, విజ్ఞానం పెరుగుతాయి!మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మన ప్రాచీన మహర్షులు చెప్పినట్లు:

అహింసా పరమో ధర్మః”

హింసను విడిచి శాంతిని ఆచరించడమే పరమ ధర్మం.
చుట్టుపక్కల జరుగుతున్న భీకర యుద్ధ బీభత్సం చూసే పాలకులకు- ప్రభువులకు చీమ కుట్టినట్టైనా లేదా?

మహాభారతం మనను హెచ్చరిస్తోంది…
హిరోషిమా మనకు గుర్తుచేస్తోంది…

యుద్ధం అనేది పరిష్కారం కాదు!
శాంతి మాత్రమే శాశ్వత మార్గం! అని….

కాబట్టి మనం, ఆ యా దేశాలు, వాటి నాయకులు
అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి:
అస్త్రాల కంటే ఆలోచనలు గొప్పవి”
యుద్ధాల కంటే సంభాషణలు శ్రేష్ఠమైనవి.”
ప్రపంచ ప్రజలంతా కలసి అనుకోవాలి! సమాజ హితైషులంతా కలిసి అహింసా- శాంతి నినాదాన్ని యుద్ధకాముకులదాకా చేరవేయాలి…
దుష్టులను శిక్షించండి! కాదనము! కానీ శిష్టులను రక్షించే మరో కృష్ణులు కమ్మని మాత్రమే కోరుకుంటూ… ఎలుక చొచ్చిందని ఇల్లు తగుల బెట్టుకోనవసరం లేదుకదా? ఎలుకలను ఏరిపారేయండి! ఏమీ తెలియని అమాయకులను బలిచేయకండి!

“ప్రపంచం యుద్ధ రహితంగా ఉండాలి*… శాంతి పతాకం ఎల్లప్పుడూ ఎగరాలి!”

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

గతమెంతో ఘనము

by Dr. G. Bavani Krishnamurty May 30, 2026
written by Dr. G. Bavani Krishnamurty

పరంధామయ్య, సుభద్రమ్మ రెండు రోజులు అయింది, కొడుకు దగ్గరకి వచ్చి. స్టేషన్నుంచి ఇంటికి తీసుకొచ్చి, ఆఫీసులో మీటింగ్ ఉందని వెంటనే వెళ్ళిపోయాడు కొడుకు సుధాకరం. ఇద్దరికీ టిఫిన్ పెట్టి, “భోజనం టేబుల్ మీద పెట్టాను. మీ టైముకి మీరు పెట్టుకుని తినండి అత్తయ్య… బాబుని స్కూల్ దగ్గర దింపి, నేనూ ఆఫిస్ కి వెళ్ళొస్తాను ” చెప్పి, హడావిడిగా వెళ్ళిపోయింది కోడలు కమల.
సాయంత్రం వరకూ ఇద్దరూ మాటలు రాని బొమ్మల్లా కూర్చున్నారు.
ఆరుగంటలకి కోడలు మనవడిని తీసుకుని వచ్చింది.
వాడికి పాలు తాగించి,అదే అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో ఉన్న ట్యూషన్ కి తీసికెళ్లి దిగబెట్టి వచ్చింది.
బట్టలు మార్చుకుని నైటీ వేసుకుని, సెల్ లో మాట్లాడుతూ సోఫాలో కాలిమీద కాలు వేసుకుని కూర్చుని, ఎదురుగా అత్త మామలున్నారన్న ధ్యాసకూడా లేకుండా కాలు ఊపుతూ మాట్లాడుతూనే ఉంది.
ఎనిమిది అవుతుంటే, “డిన్నర్ టేబుల్ మీదుంది, మీకు ఆకలి అయినప్పుడు తినండి. నేనలా వెళ్ళి బాబుని ట్యూషన్ నుంచి తీసుకొస్తాను ” చెప్పి, తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది.
తొమ్మిది అవుతుంటే వచ్చింది కోడలు కమల.
కొడుక్కి తినిపిస్తూ “మీరు తినలేదేం?” అడిగింది.
‘”అబ్బాయి వచ్చాక తింటాo లేమ్మా ” అంది సుభద్రమ్మ.
“సుధా వచ్చేసరికి లేట్ అవుతుందట. మిమ్మల్ని తినేసి పడుకోమన్నాడు”. హోటల్ నుంచి తెచ్చిన డిన్నర్ పేకెట్స్ విప్పి, ప్లేట్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చింది.
బిర్యానీలో మసాలా, వెల్లుల్లి వాసన అలవాటు లేక పోవడంతో సుభద్రమ్మ “నాకంతగా ఆకలిగా లేదు ఇంతవద్దు తీసేయమ్మా “అని తనే కొద్దిగా ఉంచుకుని మిగిలినది బౌల్లో వేసేసింది. ఆ కాస్త తిన్నాననిపించి చేయి కడుక్కుంది. పరంధామయ్యకి సహించక పోయినా ఆకలికి ఆగలేక ముద్దకి ముంతడు నీళ్లు అన్నట్లు, ముద్ద నోట్లో పెట్టుకుని, నీళ్లు తాగి లోపలికి పంపాడు.
ఇద్దరూపడుకున్నాక కొడుకు ఎప్పుడొచ్చాడో వారికి తెలియదు.
ఉదయం ఇద్దరూ తొందరగానే లేచి, తయారై హాల్లోకి వచ్చి కూర్చున్నారు. కొడుకు లేచి వస్తే మాట్లాడవచ్చు అనుకున్నారు.
సుధాకరం ఎనిమిదిన్నర దాటాక బెడ్ రూమ్ లోనుంచి బయటికి వచ్చాడు. ఆఫీస్ కి వెళ్ళడానికి తయారై ఉన్నాడు.
తల్లిదండ్రుల్ని చూసి, “బ్రేక్ఫాస్ట్ చేశారానాన్నా,? ” అడుగుతూనే, తనే డిష్ లో ఉన్న ఇడ్లి ప్లేట్ లో పెట్టుకుని తినడం మొదలు పెట్టాడు.
కొడుకుతో కలిసి తిందామని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు.
కొడుకు, కోడలు మనవడిని తీసుకుని వెడుతూ “అత్తయ్యా!సుధా కి ఈ రోజు ఆఫీస్ లో లంచ్ ఉందట.నేనూ కేంటేన్ లో తినేస్తాను. మీరు ఏం కావాలో వoడుకుని తినేయండి.”సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయారిద్దరూ.
పరoధామయ్య, సుభద్రమ్మ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.
–
తను ఖమ్మం లో ఉద్యోగం చేసే రోజుల్లో మొదటిసారి అమ్మ నాన్న ఖమ్మం వచ్చినప్పుడు తను స్టేషన్ కి వెళ్ళి,వారిని ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకొచ్చాడు.సుభద్ర ఎదురొచ్చి వారిని ప్రేమగా పలకరించి, అత్తగారి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. కుశల ప్రశ్నలు వేసి కాఫీ ఫలహారాలు అందించింది.
ఆ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టేశాడు తను.
లోపలికి వెళ్ళి “చూడు. అమ్మకి నాన్నకి ఏం కావాలో కనుక్కుని సమయానికి ఇవ్వు.భోజనంలోకి కూడా ఏం తింటారో కనుక్కుని చెయ్యి. నాన్న కారంకారంగా తింటారు. చూసి చెయ్యి తెలియకపోతే అమ్మని కనుక్కునిచెయ్యి ” చెప్పాడు.
“ఆ విషయo మీరు ప్రత్యేకంగా చెప్పాలా? అదంతా నేనూ చూసుకుంటాను మీరు ఆఫీస్ కి వెళ్ళండి “అంది సుభద్ర.
వాళ్ళు ఉన్న వారం రోజులు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని తల్లిదండ్రులకి చెప్పి, వారిని జాగ్రత్త గా చూసుకోమని, వేళకి భోజనం పెట్టేయమని భార్యకి చెప్పి వెళ్ళేవాడు. సాయంకాలం వచ్చేటప్పుడు వారికి నచ్చిన ఉపాహారాలు, పళ్ళు తీసుకొచ్చి, ప్లేట్స్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చేవాడు
రాత్రి భోజనాలు అయ్యాక నలుగురు కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకునే వారు.
“మీరిద్దరూ ఒంటరిగా అక్కడెoదుకు,?. ఇక్కడే మాతోపాటు ఉండిపోవచ్చుగా ” అంది సుభద్ర.
“లేదులేమ్మా….. ఇంకా మాకు కాస్త ఓపిక ఉందిగా.. ఓపిక తగ్గితే మీ దగ్గరకే వస్తాం. మాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? ” అన్నాడు తండ్రి.
“అవునమ్మాయ్! మీకూ మొన్నీ మధ్యనేగా పెళ్లయింది. కొన్నాళ్ళు సరదాగా ఉండండి. పిల్లా పాప బయలుదేరితే మనవడితో ఆడుకోడానికి అప్పుడు వచ్చి ఉంటాములే.”అంది అత్తగారూ కోడలికి బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకుంటూ.
ఇద్దరికీ బట్టలు పెట్టి, కాళ్ళకి దణ్ణం పెట్టి ఆశీసులు తీసుకున్నారు.
పరoధామయ్య కొంత డబ్బు తండ్రి చొక్కా జేబులో పెట్టి, “ఏవైనా ఖర్చులకి ఉంటాయి ” చెప్పాడు.
“ఎందుకురా నాదగ్గర ఉన్నాయిలే “తండ్రి తియ్యబోతుంటే,”మీ దగ్గర లేవని కాదు, ఏదో నాతృప్తి కోసం ” తండ్రి చేతి మీద చెయ్యి వేసి ఆపాడు.
వాళ్లిద్దరూ ప్రయాణమై వెడుతుంటే పరంధామయ్య, సుభద్ర కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారు. స్టేషన్ కి వెళ్ళి ట్రైన్ ఎక్కించి, ట్రైన్ కదిలే వరకు ఉండి వచ్చారు…..”తలుపు చప్పుడు అవుతుంటే
ఆలోచనలనుంచి తేరుకొని తలుపు తెరిచింది సుభద్రమ్మ.
కోడలు మనవడుని తీసుకుని వచ్చింది.
ఆమె కాళ్లు కడుక్కుని డ్రెస్ మార్చుకుని వచ్చే వరకూ ఆగి,”అమ్మాయ్! మేము బయలుదేరుతున్నాం అబ్బాయి వచ్చాక చెప్పు.”బేగ్ తీసుకుని చెప్పారు.
” అదేంటీ, పది రోజులు ఉంటారని చెప్పాడు సుధా,…” మనసులో సంతోషంగా ఉన్నా, అయోమయం నటించిందికమల.
“మరోసారి వస్తాం లేమ్మా,అయినా పిల్లాడికి సెలవులిచ్చినప్పుడు మీరే రండి. మేమిక్కడుంటే మీకూ ఇబ్బంది, మేమూ తిని కూర్చోవడం. అక్కడైతే గుడి, గోపురం, తెలిసినా వాళ్ళు రావడం, పోవడం . ఏదో కాలక్షేపం అయిపోతూo టుంది .”అన్నాడు పరoధామయ్య.
కమల సెల్ తీసుకుని “సుధా!మీ అమ్మ, నాన్న వెళ్ళిపోతామంటున్నారు…” చెప్పింది.
” అప్పుడేనా? అదేంటి.. నిన్ననే కదా వచ్చారు, ఉదయం నాతో ఏమి చెప్పలేదు.
ఉండమని చెప్పకపోయావా? ” “
“… చెప్పాను వెళ్లాలట…..”
“సరే! నాకు ఇప్పుడే రావడానికి కుదరదు.. దారిఖర్చులకి డబ్బులున్నాయో లేదో ? వెయ్యో, రెండూవేలో ఇచ్చి పంపించు ” చెప్పాడు.
వెయ్యి రూపాయలు తెచ్చి వారి చేతిలో పెట్టి, వాళ్ళు బయటికి రాగానే తలుపులు మూసుకుంది.
ఇద్దరూ ఆటోలో బస్ స్టాండ్ కి వెళ్ళి తమ ఊరు వెళ్లే బసు ఎక్కి కూర్చున్నాక,మనసు స్థిమిత పడినట్లు అయింది. హాయిగా ఊపిరి పీల్చుకుని వెనక్కి జార్లబడి కూర్చున్నారు.
“గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్ ” భారతoలో నన్నయ రాసిన పద్య పాదం గుర్తుకొచ్చింది పరoధామయ్యకి.

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

స్నేహం

by Varalakshmi Yanamandra May 30, 2026
written by Varalakshmi Yanamandra

గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ అభినందన సభకు జిల్లా కలెక్టరే కాక జిల్లాలో, మండలంలోని ప్రముఖులందరూ హాజరవడం విశేషం.

ఆ ఊరికి చెందిన ఇద్దరమ్మాయిలు “ఐఏఎస్” పూర్తి చేసి కలెక్టర్లుగా పక్కపక్క జిల్లాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్న సందర్భం. ఎందరో కలెక్టర్లు అవవచ్చు.. కానీ ఇదొక ప్రత్యేక సందర్భం.

ఈ సభకు ఊరు ఊరంతా హాజరయ్యారు. పెద్ద బహిరంగ సభ అది.
అందరూ మాట్లాడడం ఐపోయింది. జిల్లా కలెక్టరు గారు జానకి, శైలజలకు సన్మానం చేయబోతున్నారు.

వారి గురించి ఆఊరి సర్పంచ్ చెబుతున్నారు ఇలా …
“జానకి, శైలజ మంచి స్నేహితులు. జానకి అతి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి, అంతే కాక తనకు చిన్నప్పుడు( కాలికి) పోలీయో వచ్చి సరిగా నడవలేదు.‌ ఐతే చాలా తేలివి గలది జానకి.
ఇంటరు పూర్తిచేశారు జానకి, శైలజ ఇద్దరూ. ఐతే జానకి చదువు ఆపేసింది….”
ఇంతలో కలెక్టరు గారు వాళ్ళనే చెప్పమన్నారు..
జానకి “అలాటి పరిస్థితిలో శైలజ చేసిన గొప్ప సహాయం, మరువరానిది
నా కోసం డబ్బు ఖర్చు పెట్టింది. నాకాలికి వాళ్ళ నాన్నగారిచేత వైద్యానికి సంబంధించి సహాయం చేయించింది.. తాను ఎక్కి చదువుకుందో…నన్నుకూడా తనతో పాటుగా చదివించిన ఆ కుటుంబానికి ఋణం తీర్చుకోలేను. శైలజ నాకు దేవుడిచ్చిన వరం.”
అంటూ కన్నీరు పెట్టుకుంది.

ఇక శైలజ మాట్లాడుతూ” జానకి చదువుకు సహాయం చెయ్యడం గొప్ప కాదు.తను ఏకసంథాగ్రాహి. నేను ఈ పరీక్ష ఉత్తీర్ణత పొందడానికి నాకు తాను నాకు చక్కగా తెలియని అంశాలన్నీ వివరంచడమే ముఖ్య కారణము. కాబట్టి తను ఉన్నత వ్యక్తిత్వం గలది “…. అంటూ ముగించిది.

ఇక కలెక్టరు గారు ఇద్దరికీ వారు పొందిన విజయాన్ని పురస్కారించుకుని చాలా గొప్పగా సన్మానం చేశారు. చివరగా ఆయన చెప్పిన సందేశానికి పెద్ద ఎత్తున చప్పట్లు మారు మ్రోగిపోయాయి… “ఇద్దరికి ఇద్దరూ గొప్పవారే…వారి ఆశరం ఉన్నతం, ఉత్తమం… సమాజం పట్ల వారికున్న అవగాహనను నేను వారి మాటలలో తెలుసుకున్నాను.అంటూ…….
” ఏమతమైనా వివరించేదో మానవత్వమే,” అని వీరిరువురూ నిరూపించారు. “విధాత సృష్టిలో లోపం లేదు, మానవ దృష్టిలోనే శాపం ఉంది.” ఆ శాపాన్ని వీరువురూ బాపారు ఒకరికొకరు. “బాధ్యతల సుడిగుండాల్లో మనిషి జీవితం ముడిపడి ఉంది.” అనేది కూడా చక్కగా ఋజువు చేసి సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేశారు. చివరిగా అతి గొప్ప మాట చెప్పారు…..” స్వచ్ఛమైన స్నేహానికి ఎల్లలు లేవు” అని వీరువురూ నిరూపించారు.
వీరిరువురి వలన ఇంకా మరన్ని మేళ్ళు జరగాలని ఆశిస్తూ చిరంజీవులను ఆశీర్వదిస్థున్నాను.” అంటూ సభను ముగించారు..‌సభలోని వారంతా కరతాళధ్వనులతో అభినందించారు.

May 30, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మట్టిలో మాణిక్యం శ్రీ ఉడతా రామకృష్ణ

by Achyutuni Rajasri May 30, 2026
written by Achyutuni Rajasri

ఆయన ఓప్రసిద్ధ జర్నలిస్టు, ఆకాశ వాణిలో గళం విప్పిన శ్రీ ఉడతా రామకృష్ణ గారి జీవితం నల్లేరుపై బండి కాదు. ఆయన బాల్యం యవ్వనం సంకుల సమరం అనే చెప్పాలి.

కృష్ణాజిల్లాలోని గొల్లనపల్లి గ్రామంలో ఉడతా వెంకటేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులకు 2.2.1961లో జన్మించారు. ఈయన 5వ ఏటనే తండ్రి చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతే, బాల్యం అంతా కష్టాలలో గడిచింది. ఆ తండ్రి 1966 లో వెళ్లిపోయిన ఆయన తిరిగి 1982 లో రావటం మరవలేని జ్ఞాపకం. ఐనా తండ్రిని ఆదరించి అక్కున చేర్చుకున్న రామకృష్ణ, ఆయన తల్లిని మనం అభినందించి తీరాల్సిందే! నిజంగా ఇది నమ్మలేని నిజం! కన్నతల్లి అండదండలతో రామకృష్ణ ఎస్.ఎస్.సి. చదివి పేదరికం, కుటుంబ పోషణ కై చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి కులవృత్తి ఐన మగ్గంపై చేనేత వస్త్ర తయారీలో నిమగ్నమైనారు 1975_1988…
అలా రేడియోతో బంధం అనుబంధం ఏర్పడ్డాయి.నేత రాత పడుగుపేకలా సాగాయి.మంచి విశ్లేషణాత్మక లేఖలతో వివిధ భారతి సిన్మాపాటలతో కూర్చిన ప్రోగ్రాంలు (అరగంట ) తయారుచేసి పంపటం వరకు ఎదిగింది ఆయన కలం!అవిప్రసారం కావటంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన లో రచయిత విజృంభించాడు.రేడియో సంగీత పాఠాలు మొదలు కార్మికుల కార్యక్రమాలు కూడా శ్రద్ధగా ఆసక్తిగా వినేవారు.తన గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ చేనేత కార్మికుల చేత ప్రోగ్రాములు చేయించడం తో మంచి గుర్తింపు వచ్చింది.చాణుక్యుడు,చంద్రగుప్తుడు ఏకపాత్రాభినయం తో ఆయన లో నటుడు బైటికొచ్చాడు.తన 20వ ఏటకృతజ్ఞత కృతఘ్నత అనే స్వంత కథను రికార్డింగ్ లేకుండ సరాసరి చదవటం ఆలైవ్ ప్రసారంతో రామకృష్ణ లో ఆత్మవిశ్వాసం పెరగటం,దీనికితోడునిర్వాహకులు శ్రీమాడుగుల రామకృష్ణ గారి మెప్పుపొందటం ఓమధురానుభూతి.
శ్రీసుధామ గారి ప్రోత్సాహంతో రేడియో లో “రాబోయే ఎన్నికలు, నడుస్తున్న చరిత్ర( వారంవారం) ఏనుగులవానిలంక బ్లోఅవుట్ ” రేడియోలో ప్రసారమై అశేషజనాదరణ పొందాయి.చమురుబావిలో మంటలు ఎగిసిపడటాన్ని ప్రత్యేకంగా చెప్పి రాయించిన సుధామ గారికి తను ఋణపడి ఉన్నానని అంటారాయన!
కానీ రామకృష్ణ కు ఏలూరు బదిలీ కావటంతో రేడియోకి దూరమైనారు.


ఇక జర్నలిస్టుగా ఆయన యాత్ర కు మార్గదర్శకులు గన్నవరం ఈనాడు విలేఖరి శ్రీ అవ్వారి గోవిందరాజులుగారని, ఆయనే తన తొలిగురువని చెప్పారు.1988లో ఆయన పరిచయంతో రామకృష్ణ పాత్రికేయునిగా స్థిరపడటానికి దోహదం చేసింది.1990లో ప్రజాశక్తిలో పాత్రికేయుడిగా జీవితం గొప్ప మలుపు తిరిగింది.36ఏళ్లు ఆపత్రికలో విలేఖరిగా, ఎడిటోరియల్ బోర్డ్ సభ్యునిగా ,జర్నలిజం కాలేజీ ఇన్ఛార్జిగా,ప్రిన్స్ పాల్ గా, క్వాలిటీ సెల్ ఇన్ చార్జిగా ఎదిగినా ఒదిగి ఉన్న నిగర్వి కావటంతో అందరిచేత సెభాష్ అనిపించుకొన్నారు. 2019లో రిటైరైనాక ప్రస్తుతం రైతువాణి మాసపత్రిక బ్యూరో చీఫ్ గా ఉన్నారు2020నుంచి.ఆయన కలంపేర్లుఉష్ణ, శ్రీవర్ష, వరుణ్. ఆయన ప్రజాశక్తి ఆదివారం లో వారం వారం రియల్ స్టోరీస్,సాహిత్య నృత్య శిల్ప చిత్ర, నాటక, సినీ నిపుణుల ఇంటర్వ్యూలు,రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ రాజకీయ యోధులచరిత్రలు వెలువడ్డాయి. తెలకపల్లి రవిగారి సలహాపై 36వ ఏట టైప్ ఇన్ స్టిట్యూట్ కెళ్లి 15ఏళ్ల పిల్లల తో కల్సి టైప్ నేర్చుకోటం చిన్నతనంగా భావించలేదు రామకృష్ణ. కారణం కుటుంబ బాధ్యతలు,ఉదరపోషణ!ఆయన ఇంటర్య్వూ చేసిన ప్రముఖ వ్యక్తులుపద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, కోరాడ నర్సింహ్మారావు,కర్నాటి లక్ష్మీ నరసయ్య, వల్లం నరసింహారావు,చిత్ర కారుడు పద్మశ్రీ రామారావు,అంతర్జాతీయ శిల్పికాటూరి వెంకటేశ్వర రావు,వి.కోటేశ్వరమ్మ, వీరనారి నాగళ్ల రాజేశ్వరమ్మ..ఇలా ఎందరెందరో!
ఇక ఈయన అమ్మకు అక్షరనైవేద్యం,బోనాలపై 535 కవితాసంకలనం,550కవితలతో సమ్మక్కసారలమ్మలపై సంకలనాలు వెలువరించినవిషయనిపుణుడిగా చరిత్రసృష్టించారు

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

వేటగాడు

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు May 30, 2026
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

రష్యన్ మూలం: అంతోన్ చెహోవ్
ఆంగ్లంనుండి అనువాదం: ఎలనాగ

మధ్యాహ్నం. ఉక్కగా ఉంది. ఆకాశంలో ఒక్క మబ్బు సైతం లేదు. ఎండ ధాటికి గడ్డి వడలిపోయి దీనత్వాన్ని, నిరాశను ప్రతిఫలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ వాన పడినా పచ్చదనం నెలకొనదు అన్నట్టుగా చెట్ల పైచివరలతో దేన్నో చూస్తూ ఉపశమనాన్ని ఆశిస్తున్నదా అన్నట్టు అడవి నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంది.
చెట్లు లేని ఒక ఖాళీ ప్రదేశంలో ఎత్తైన నలబయ్యేళ్ల పురుషుడొకడు కాళ్లీడ్చుకుంటూ, తడబడుతూ, మందకొడిగా, వంగివంగి నడుస్తున్నాడు. అతడు వెడల్పు లేని భుజాలతో, ఎర్ర చొక్కా మచ్చల ప్యాంటూ పొడవైన బూట్లూ ధరించి ఉన్నాడు. రోడ్డు వెంట రికామీగా నడుస్తున్నాడు. కుడివైపున పచ్చని చెట్లు, ఎడమ వైపున లేత బంగారు వర్ణంతో కనుచూపు మేర వ్యాపించిన సముద్రం ఉన్నాయి. అతడు ఒగరుస్తూ చెమటలు కారుస్తున్నాడు. తలమీద తెల్లని టోపీ ఉంది. దాన్ని ఉదారుడైన ధనిక మిత్రుడెవరో బహూకరించాడు అనిపిస్తోంది. చనిపోయిన అడవికోడి ఒకటి అతని బుజానికి వేలాడుతున్న బట్టసంచిలోంచి కనిపిస్తోంది. అతడు రెండు గొట్టాల తుపాకీనొకదాన్ని పట్టుకున్నాడు. దాని ట్రిగ్గర్ వెనక్కి లాగివుంది. పొదలను వాసన చూస్తూ పరుగులాంటి నడకతో ముందు పోతున్న కుక్కమీదనే దృష్టిని కేంద్రీకరించాడతడు. పక్షులు, జంతువులు వేడిమిని తప్పించుకోవడం కోసం చల్లని ప్రదేశాల్లో దాక్కొనడం చేత చుట్టూ నిశ్శబ్దం, స్తబ్ధత ఆవరించి ఉన్నాయి.
“యెగోర్ వ్లాసిచ్,” అకస్మాత్తుగా మంద్రస్వరంలో ఒక పిలుపు వినిపించింది.
ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ ముఖం చిట్లించాడతడు. భూమిలోంచి ఉబికివచ్చిందా అన్నట్టు సుమారు ముప్పయ్యేళ్ల వయసున్న ఒక స్త్రీ పాలిపోయిన ముఖంతో, చేతిలో కొడవలితో అతని పక్కనే ఉంది. క్షీణించిన ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ అతని ముఖంలోకి చూస్తోంది ఆమె.
“ఓ నువ్వా పెలాజియా. ఇక్కడికి ఎలా వచ్చావు?” అన్నాడు ఆ వేటగాడు, తుపాకీ ట్రిగ్గర్ ను మూస్తూ.
“మా ఊరి మహిళలు కొందరు ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. వాళ్లతో కలిసి వచ్చాను.”
“ఓ అలాగా,” అని మెల్లగా నడవసాగాడు యెగోర్ వ్లాసిచ్.
పెలాజియా అతని వెంట నడుస్తోంది. వాళ్లు మౌనంగా ఇరవై అడుగుల దూరం నడిచారు.
“నిన్ను చూడక చాలా కాలమైంది యెగోర్ వ్లాసిచ్,” అన్నది పెలాజియా అతని మృదువైన భుజాలను ఆర్తితో చూస్తూ. “ఈస్టర్ నాడు దాహం తీర్చుకునేందుకు ఒక నిమిషం కోసం నా గుడిసెకు వచ్చి నువ్వు నన్ను తిట్టి కొట్టి వెళ్లిపోవడం ఆ దేవునికే ఎరుక. అప్పట్నుంచి నీకోసం ఎదురుచూసి చూసి నా కళ్లు కాయలు కాచాయి. ఓ యెగోర్ వ్లాసిచ్, ఒకసారి రావచ్చు కదా.”
“వచ్చి అక్కడ నేను చేసేదేముంది?”
“అవుననుకో. అక్కడ నువ్వు చేసేదేమీ లేదు కానీ, అక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తూ నువ్వు సంరక్షించాల్సిన చోటు అది. నువ్వే యజమానివి కదా. నువ్వొక అడవికోడిని తుపాకీతో కొట్టావు. ఇప్పుడు నువ్వు కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి యెగోర్ వ్లాసిచ్.”
ఈ మాటలను అంటున్నప్పుడు పెలాజియా చిలిపి అమ్మాయిలాగా నవ్వుతూ యెగోర్ ముఖాన్ని చూసింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
“నీకిష్టమైతే ఇక్కడ కూర్చో. ఎందుకు నిల్చున్నావు? నువ్వూ నాతో పాటు కూర్చోవచ్చు,” అన్నాడు యెగోర్ నిర్లక్ష్యం నిండిన గొంతుకతో. రెండు దేవదారు వృక్షాల మధ్య కూర్చున్నాడతడు.
పెలాజియా కొంచెం దూరంలో నీడలో కూర్చుంది. తన ఆనందం తనకే సిగ్గును తెప్పిస్తుంటే నోరుమీద చెయ్యి పెట్టుకుంది. రెండు నిమిషాలు మౌనంలో గడిచాయి.
“ఒకసారి వస్తే బాగుంటుంది,” అన్నది పెలాజియా.
యెగోర్ తలమీది టోపీని తీసి నుదురును చేయితో తుడుచుకుంటూ, “దేనికోసం రావాలి నేను? వచ్చేందుకు కారణమేదీ లేదు. ఒక గంట లేక రెండు గంటల కోసం వస్తే అది సమయాన్ని వృథా చేయటమే అవుతుంది. వచ్చి నీకు బాధ కలిగిస్తూ ఆ ఊళ్లో ఎప్పటికీ నివసించడాన్ని నా హృదయం భరించలేదు. నేను ఎక్కువగా సుఖాలకు అలవాటు పడినవాడినని తెలుసు నీకు. నాకు పడుకునేందుకు ఒక పరుపు, తాగేందుకు టీ, వీటికి అదనంగా మంచి సౌకర్యాలు, నాగరిక సంభాషణ కావాలి. నువ్వేమో దుమ్ము నిండిన ఊళ్లో దారిద్ర్యంలో బతుకుతున్నావు. అక్కడ నేను ఒక్కరోజు కూడా ఉండలేను. నీతో కలిసి జీవించేందుకు ఒకవేళ అక్కడ ఒక భవనం ఉన్నా నేను నీ గుడిసెను కాల్చెయ్యాలి, లేదా నన్ను నేను బాధించుకోవాలి. చిన్నప్పట్నుంచీ సుఖజీవనం అలవాటైపోయింది నాకు. ఏమీ చేయలేము,” అన్నాడు వ్లాసిచ్.
“ఇప్పుడెక్కడ ఉంటున్నావు నువ్వు?”
“డిమిత్రి ఇవనోచ్ ఆనే ఆసామి దగ్గర వేటకానిగా ఉంటున్నాను. అతని తిండికోసం అడవి జంతువులను, పక్షులను వేటాడుతాను. కానీ నాకు తన యింట్లోనే ఆశ్రయమిచ్చాడతడు. అది అతని ఆనందం కోసమే తప్ప వేరే కారణం ఏదీ లేదు.”
“నువ్వు చేస్తున్న పని సరైనది కాదు యెగోర్ వ్లాసిచ్. వేరేవాళ్లకైతే అది వినోదపు వ్యాపకం లాగా బాగుంటుంది. నీకు మాత్రం అది వ్యాపారం లాంటిదవుతుంది.”
ఆకాశం వైపు విచారంగా చూస్తూ, “నువ్వు అవివేకురాలివి పెలాజియా,” అని తర్వాత ఇలా కొనసాగించాడు యెగోర్: “నీకెప్పటికీ అర్థం కాదు. నేను ఏ రకం మనిషినో నీ మొత్తం జీవితంలో తెలుసుకోలేవు నువ్వు. నేను చెడిపోయిన మూర్ఖుడినని అనుకుంటున్నావు నువ్వు. కానీ వివేకం ఉన్న ఎవరైనా ఈ మొత్తం జిల్లాలో నేను అత్యుత్తముడిని అంటారు. పెద్దమనుషులు ఈ సత్యాన్ని గుర్తించడమే కాకుండా నేను చాలా మంచి వేటగాడినని ఒక పత్రికలో ప్రచురించారు. నాతో పోల్చతగిన స్ఫూర్తిమంతుడైన వేటగాడు లేడు. దానికి కారణం నేను నీ ఊరిజీవితాన్ని నిరసించడం గానీ సుఖమయ జీవితాన్ని అనుభవించడం గానీ కాదు. చిన్నప్పట్నుంచీ నాకు తుపాకులతో, జాగిలాలతో గడపటం తప్ప ఎప్పుడూ వేరే వ్యాపకం లేదు. నా తుపాకీని లాక్కున్నప్పుడు నేను గాలం తీసుకుని బయటికి పోయేవాణ్ని. గాలాన్ని లాక్కున్నప్పుడు పిట్టలను, జంతువులను చేయితో పట్టుకునేవాణ్ని. గుర్రాల కొనుగోలు, అమ్మకం కూడా చేశాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నేను సంతలకు పోయేవాడిని. ఒక రైతు క్రీడాకారునిగా మారినా లేదా గుర్రాల వ్యాపారం చేసినా వాడు వ్యవసాయానికి వీడ్కోలు చెప్పినట్టే. ఎవడినైనా ఒక్కసారి స్వతంత్రేచ్ఛ ఆవహించిందంటే దాన్ని నిర్మూలించడం జరగని పని. అదేవిధంగా ఎవడైనా అభినయం మొదలైన కళను ఆశ్రయించాడంటే వాడెప్పుడూ అధికారిగా కానీ భూస్వామిగా కానీ మారడు. నువ్వొక ఆడదానివి. కాబట్టి దీన్ని నువ్వర్థం చేసుకోలేవు. కానీ అర్థం చేసుకోవాలి.”
“నాకు అర్థమైంది యెగోర్ వ్లాసిచ్.”
“ఏడిస్తే నీకు అర్థం కాదు.”
అటువైపు తిరుగుతూ, “నేను ఏడ్వటం లేదు. నేను పాపిష్ఠిదాన్ని యెగోర్. అయినా అదృష్టహీనురాలైన నాతో నువ్వు ఒకరోజు గడపవచ్చు. మన పెళ్లి జరిగి పన్నెడేళ్లవుతోంది. కానీ ఒక్కసారి సైతం మన మధ్య ప్రేమ చిగురించలేదు. నేను ఏడ్వటం లేదు,” అన్నది పెలాజియా.
“ప్రేమ …” అని గొణిగాడు యెగోర్, తల గోక్కుంటూ. తర్వాత, “మన మధ్య ప్రేమ చోటు చేసుకోవడం జరగదు. పేరుకు మాత్రమే మనం ఆలుమగలం. నీ దృష్టిలో నేను ఆటవికుడిని. నా అభిప్రాయం ప్రకారం నువ్వు జ్ఞానం లేని మామూలు రైతు స్త్రీవి. మనం ఒకరికొకరం బాగా సరిపోయామా? నేను సుఖాలు పొందగోరే స్వేచ్ఛా జీవిని. నువ్వేమో తాటాకులతో చేసిన చెప్పులు తొడుక్కుని నడుము వంచకుండా పని చేసే శ్రామికురాలివి. నేను ప్రతి సాహసకార్యంలో ముందుండే మగవాణ్ని. నువ్వేమో నన్ను సానుభూతితో చూస్తావు. ఇప్పుడు చెప్పు మన జత బాగా కుదిరిందా?” అన్నాడు వ్లాసిచ్.
“కానీ మనం ఆలుమగలం. కామా యెగోర్?” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
“ఆ పెళ్లి స్వేచ్ఛా సంకల్పంతో జరగలేదని మరచిపోయావా? నువ్వు సెర్గేయ్ పేలోవిచ్ దొరనూ, నిన్ను నువ్వూ అభినందించుకోవాలి. నేను అత్యుత్తమ వేటగాడిననే ఈర్ష్యతో ఆ దొర నాకు ఒక నెలరోజుల పాటు వరుసగా మద్యం తాగించాడు. బాగా తాగి ఉన్నప్పుడు ఎవరికైనా పెళ్లి చేయడమే కాదు అతడి చేత మతాన్ని కూడా మార్పించవచ్చు. నా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు, నేను బాగా తాగివున్నప్పుడు మన పెళ్లి జరిపాడు ఆయన. ఒక వేటగాడికి ఆటవిక అమ్మాయితో పెళ్లి! నేనప్పుడు విపరీతమైన నిషాలో ఉన్నానని తెలిసి కూడా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు కౌలుదారువు కాదు కనుక ప్రతిఘటించగలిగేదానివి. ఒక ఆటవిక స్త్రీ ఒక వేటగాడిని పెళ్లాడటం అదృష్టమే అనుకో. కానీ అప్పుడు నువ్వు ఆలోచించి ఉండవలసింది. ఇప్పుడు ఏడుస్తూ కూచో. ఈ వ్యవహారం ఆ దొరకు ఒక జోక్ అయింది. నీకు మాత్రం ఏడుపు తెప్పించే విషయం. గోడకేసి తల కొట్టుకో.”
కొంత సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. మూడు అడవిబాతులు పైనుంచి ఎగురుతూ వెళ్లాయి. అవి చిన్న చుక్కలుగా మారి కింద వాలేంత వరకు యెగోర్ వాటిని నిశితంగా చూస్తూ నడిచాడు.
“బతుకుతెరువు కోసం ఏం చేస్తున్నావు నువ్వు?” అని పెలాజియాను అడిగాడతడు, చూపును మరల్చుతూ.
“ప్రస్తుతం బయటికి పోయి కూలిపని చేస్తున్నాను. చలికాలంలో ఫౌండ్లింగ్ హాస్పిటల్ లో ఒక పాపకు సీసాతో పాలు తాగిస్తాను. అందుకు నాకు నెలకు ఒకటిన్నర రూబుల్స్ ఇస్తారు.”
“ఓ, అలానా?”
మళ్లీ నిశ్శబ్దం చోటు చేసుకుంది. కోసిన పైరు తాలూకు మొదళ్ల మీంచి మృదువైన పాట వినపడింది. వేడిమి ఎక్కువగా ఉంది.
“అకులినా కోసం గుడిసెను నిర్మించావని చెప్పుకుంటున్నారు,” అన్నది పెలాజియా.
యెగోర్ మాట్లాడలేదు.
“అయితే ఆమె నీకు ప్రియురాలు అన్నమాట.”
“అది నీ దురదృష్టం, నీ కర్మ. పాపం, దాన్ని నువ్వు భరించాలి. ఓకే, బై. నీతో చాలా సేపటినుండి మాట్లాడుతున్నాను. సాయంత్రానికి నేను బోల్టోవో దగ్గర ఉండాలి,” అన్నాడు వ్లాసిచ్ ఒళ్లు విరుచుకుంటూ.
అతడు లేచి నిలబడి, తుపాకిని బుజానికి తగిలించుకున్నాడు. పెలాజియా కూడా లేచి నిలబడింది.
“నా ఊరికి ఎప్పుడొస్తున్నావు?” అని అడిగింది మృదువుగా.
“రావాల్సిన పని నాకు లేదు. ఎప్పుడూ మత్తులో లేకుండా రాను నేను. తాగివున్న నాతో నీకు ప్రయోజనం ఉండదు. మద్యపు మత్తులో మునిగినప్పుడు నేను ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాను. బైబై.”
“బై, యెగోర్ వ్లాసిచ్.”
యెగోర్ టోపీని తల వెనుకభాగం మీద పెట్టుకొని, ధ్యాసను మళ్లీ జాగిలం మీదికి మరల్చి, వెళ్లిపోయాడు. పెలాజియా అతణ్నే చూస్తూ నిశ్చలంగా నిలబడింది. అతని బుజాలను, సొగసైన టోపీని, నిర్లక్ష్యపు నడకను చూస్తున్న ఆమె కళ్లు విషాదంతో, కరుణ పూరితమైన ప్రేమతో నిండిపోయాయి. ఆమె చూపు తన భర్త శరీరం మీదికి పోయి మృదువుగా స్పృశించింది. ఆ చూపుస్పర్శ అనుభూతమైందా అన్నట్టు అతడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అతడేం మాట్లాడలేదు. ఏదో చెప్పాలనుకుంటున్నాడని తెలిసింది ఆమెకు అతని ముఖం ద్వారా, బుజాల ద్వారా. ఆమె భయంగా అతని దగ్గరికి పోయి, వేడుకుంటున్న కళ్లతో అతడిని చూసింది.
యెగోర్ వెనుకకు తిరిగి, “దీన్ని తీసుకో” అని, నలిగిన ఒక రూబుల్ నోటును ఇచ్చి వెళ్లిపోయాడు.
దాన్ని తీసుకుంటూ “గుడ్ బై యెగోర్ వ్లాసిచ్,” అన్నది పెలాజియా యాంత్రికంగా.
నిటారుగా నడుస్తూ రోడ్డుమీద నడిచాడతడు. ఆమె పాలిపోయి రాతిబొమ్మ లాగా అతని ప్రతి అడుగును అపేక్షగా చూసింది. కొద్దిసేపటి తర్వాత అతని ఎర్రచొక్కా, నల్లని పంట్లాము, బూట్లు అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏమీ కనపడలేదు. పచ్చదనం నిండిన చెట్లలోకి యెగోర్ ఎకాయెకిన మలుపు తిరగడంతో టోపీ కూడా అదృశ్యమైంది.
“గుడ్ బై యెగోర్ వ్లాసిచ్” అని గుసగుసగా అనుకొని, అతని తెల్లని టోపీని మరొకసారి చూసేందుకు కాళ్ల మునివేళ్ల మీద నిలబడింది పెలాజియా.

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కవి చివరి చరణం !!

by Ananthaacharaya K.S. May 30, 2026
written by Ananthaacharaya K.S.

పుట్టడం సహజం
చావడమూ అంతే
మధ్యకాలo అర్ధయ్యేసరికి
కళ్ళముందు పొద్దువాలి పోతుంది!!

ఈ మధ్యలో
ఎన్ని అక్షరాలు చెక్కాడో
అవే చరిత్రలో నిలబడే సూచీ స్తంభాలు!!

పూలదండలు
పురస్కారాలు పొగడ్తలు
కవికి కొత్త ఊపిరియే కానీ
ఊనిక కాదు కొలమానాలు కావు
దినపత్రిక మీద మురిపించే
ఒక రోజు బాక్స్ ఐటమ్ !!

కవి అంతిమయాత్ర లో
అతని పద్యాలలోని
పాదాలు గులాబీ రెక్కలై వీధుల గుండా చల్లబడుతాయి!

సిరచుక్కలు ఇకపై
గడ్డ కట్టుకుని పోతాయి
జీవితం శూన్యమా అన్నట్టు
కవి గారి డైరీ చివరి పేజీ అసంపూర్తి
గా బిగుసుకు పోతుంది!

ఆయన పుస్తకాలు పార్థివ దేహం దగ్గర
తలగడయై, కృతజ్ఞతగా ఒదిగి ఉంటాయి!
ఎవరో ఒకరు, పుటలు తెరిస్తే, బావురుమంటాయేమో ?

అంజలి ఘటిస్తూఎవరో అస్పష్టంగా చెప్పిన అమర్ రహే
పదాలు
డోలాయమానమై గాల్లో
ఊగిసలాడుతూనే ఉంటాయి !
ఒంటరిగా..
జై కొట్టే లోగొంతుకలయినా లేక!

కవీ!! బతికి ఉన్నన్ని నాళ్ళు
పుస్తకాల్లో తల ఇముడ్చుకుని
కూర్చున్నావు
ఇప్పుడు నీ గేయం మీద
జ్ఞాపకానివై నిలబడ్డావు!

ప్రజాస్వామ్యం కొరకు
శిర మెత్తి అన్యాయం మీది అరిచిన అరుపులు
నిరసన చెణుకులు క్రమంగా కవి కులం నుండి వెలివేయబడతాయి!

అయినా కవీ
నీ కలం లో పుట్టిన
పదాలు మౌన
విస్పోటనాలు!
దాని
అణుధార్మికత
మెదళ్ళలో
మెల్లిగా మొదలౌతుంది!
కవీ!

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

‘ఆధ్యాత్మిక భాస్కరుడు’ ఆదిశంకరాచార్యులు *

by కావ్యసుధ (హరిశంకర్) May 30, 2026
written by కావ్యసుధ (హరిశంకర్)

భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి. భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి ముప్పువాటిల్లుతున్న సమయంలోఒక మహాత్ముడు అవతరించి వ్యవస్థను, చక్కదిద్దడం మనకు యుగాలుగా వస్తున్నది.అట్టి వారిని అవతార పురుషులుగా భావించి, ఆరాధించి ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. శివుని అంశతో జన్మించిన ఆదిశంకరాచార్యుల వారు కేవలం 32 ఏళ్ల వయస్సులోనే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని సాధించి ,లోకానికి జ్ఞానం బోధ చేశారు.

వేదములు, స్మృతులు శ్రీశంకరుల అవతారము వల్లనే పున రుద్ధరింపబడినవి, వాటి పునరుద్ధరణ చేతనే మనము శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, సంక్రాంతి తదితర పండుగలు జరుపుకోవడమనే ఆచారం పునరుద్ధరింపబడినది. అట్టి విధంగా శంకర జయంతియే మిగతా అన్ని జయంతులు జరగడానికి మూల కారణమయిందని కామకోటి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఉద్ఘాటన.


పరమశివుని అవతారమైన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి అవిశ్రాంత కృషివలనే ఈనాడు మనం సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాం ఆ మహానీయ ఆచార్యులు దేశమంతటా పర్యటించి ఉపనిషత్తుల అద్వైత సారాన్ని వ్యాప్తి చేశారు గొప్ప దూర దృష్టితో శ్రీ ఆదిశంకరాచార్యులు భారతదేశంలోని నాలుగు దిక్కులలో నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు వీటిలో శృంగారిలో స్థాపించబడిన దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ప్రత్యక్ష శిష్యుడైన శ్రీ సురేశ్వర ఆచార్యుల నుండి మొదలుకొని అవిచ్ఛిన్నమైన ప్రసిద్ధ గురువుల పరంపరతో అలంకరించబడింది. ఆచార్యుల జీవితాలు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఉద్యమాన్ని కొనసాగించడానికి వారు చేసిన ప్రయత్నాలు అద్భుతమైనవి, విశిష్టమైనవి.హిందూ తత్వ శాస్త్రానికి, ఆధ్యాత్మికతకు ఆదిశంకరాచార్యుల వారు చేసిన సేవలను ,వారి జీవితాన్ని గౌరవించడమే శంకరాచార్య జయంతి యొక్క ప్రాముఖ్యత.

భారత చరిత్రలో ఆది శంకరాచార్య భగవత్పాదులు ఒక అద్భుతమైన శక్తి, భారతీయ జీవన విధానానికి, సాంఘిక వ్యవస్థకు జీవన గడ్డయైన వేదాంతాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే అద్వైత సిద్ధాంతం. పరమాత్మ, జీవాత్మ ఒక్కటే, జీవాత్మ పరమాత్మలకి అభేదం “ఏకమేవా అద్వి తీయం బ్రహ్మ’ ‘జీవో బ్రహ్మైని నా పరః” అనే వ్యాఖ్యల అద్వైత, సిద్ధిని చెబుతాయి. ఈ జ్ఞానాన్ని పొందిన జీవాత్మ మోక్షం పొందగలు గుతుంది. అంటే పరమాత్మలో లీనమౌతుంది. ఇలాంటి జ్ఞానం పొందడానికీ అందరికీ సాధ్యం కాదు. భారతీయ సంస్కృతి వైభవా నికి కృషి సల్పిన మహాత్ములలో శంకరాచార్యులు ఒకరు. సాక్షాత్తు పరమశివుని అవతారంగా చెప్పబడుతున్న ఆదిశంకరుల శక్తి అనన్య సామాన్యమైంది.

భారతీయ సంస్కృతి వైభవానికి కృషి సల్పిన మహాత్ములలో శంకరాచార్యులు ఒకరు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలనే త్రిమతాలు. ఆనాటి ఆర్ష ధర్మానికి వ్యతిరిక్తంగా వున్న మతాలను ఖండించడమే కాకుండా భారతీయ సంస్కృతిలో అద్వైత సిద్ధాంత సమభావాన్ని ఆధారం చేసుకొని శంకరులు శైవం, వైష్ణవం, శాక్తం, శూలం, గానపత్యం, కౌమారం అనే మతాలలోని దోషాలను తొలగించి షణ్ముఖ స్థావనాచార్యులై వివిధ మతాల మధ్య సామరస్య భావన పెంపొందించుటకు, సంప్రదాయాల మధ్య వున్న అంతర్లీన సూత్రాన్ని ప్రచారం చేసి, పంచాయ తన పూజా విధానాన్ని వ్యాపింపజేసి, ఇష్ట దైవాన్ని పూజించేట్లుగా విధి విధానాలను అమలు చేసేవిధంగా పూజా విధానంలోని లోపాలను సవరించిన ఆధ్యాత్మిక సంస్కర్త శంకరాచార్యులు.

వేదమాత పునరుద్ధరణ కోసం తొలుత వ్యాసులుగా పిమ్మటశంకరులుగా అవతరించారు.వ్యాసులు నారాయణ స్వరూపం. శంకరులు ఈశ్వర స్వరూపం.ఈశ్వరనామ సంవత్సర, ఉత్తరాయణం, వైశాఖమాసం, వసంత ఋతువు, శుద్ధ పంచమి, సోమవారం, కర్కాటక లగ్నంలో, ఆరుద్ర నక్షత్ర యుక్త ప్రథమ పాదంలో, నవగ్రహాలలో ఐదు గ్రహాలు ఉచ్ఛలో ఉండగా కేరళ రాష్ట్రంలోని పూర్ణానది తీరానగల వృషభా చల వృషాదీశ్వర స్వామి అంతచే ‘కాలడి’ అనే గ్రామంలో శివగురు, ఆర్యాంబ పుణ్యదంపతుల తపః ఫలంగా శంకరులు జన్మించారు.
లౌకిక విషయాలు దుఃఖ మిశ్రితాలు, పారమార్ధికాలు, సుఖ రూపాలు దుఃఖ రహిత సుఖస్వరూపాలు “శంకరోతీత శంకరః” అని దివ్యమైన సుఖాలను ప్రస్తావించువాడు ‘శంకరుడు కనుక ఆ బాలునికి ‘శంకరుడు’ అని నామకరణం చేశారు. ‘శం’ అనే అక్షరం ‘ఐదు’ అంకెకు సంకేతం. ‘క’ అనే అక్షరము ‘ఒకటి’ అనే అంకెకు పర్యాయము. ‘ర’ అనే అక్షరం, ‘రెండు’ అంకెకు సంకేతం. శంకరులు జన్మించిన తిథి, వార, పక్ష, మాస, నక్షత్రాలను అనుసరించి చూచినవారు జ్ఞానం ద్వార ప్రపంచానికి నిత్య సుఖము ప్రసాదించేవాడని స్పష్టం చేశారు.
శంకరులు మూడవ ఏటనే చదవడం, వ్రాయడం ఐదవ సంవత్సరం వచ్చేసరికి సంస్కృత భాషలో వైదుష్యం సంపాదించి, మూడు వత్సరాల కాలంలోనే సమస్త విద్యలను అభ్యసించి సర్వ శాస్త్ర కోవిదుడయ్యాడు. శంకరుని వైదుష్య వైదగ్ధ్యాలను చూసి విద్వాంసులు విస్మయం చెందారు.
శంకరులకు ఏడవ ఏట ఉపనయం చేశారు. ఎనిమిదవ ఏటకే వేద విజ్ఞానాన్నంతటిని ఔపోసనం పట్టారు. ఈ మధ్య ‘కాలంలోనే తండ్రి శివగురువు మరణించాడు. కారణ జన్ములైన శంకరులు నర్మదా నదీతీరంలో శ్రీగౌడ నాదాచార్యుల శిష్యులైన శ్రీగోవింద భగవత్పాదుల నాశ్రయించి సన్యాస దీక్షను స్వీకరించారు. నాలుగు వేదాలను తర్మవిద్యల సభ్యసించి బ్రహ్మ విద్యోపదేశం పొందాడు. తర్క వితర్కాల శాస్త్ర చర్చలలో భారతీయులకు తిరుగులేదని ఋజువు చేసి ఆరాధ్య గురువయ్యాడు.

శంకరులు జన్మించేనాటికి శైవం, జైనం, బౌద్ధం, పలు మతాలు ప్రాబల్యం స్థితిలో ఉన్న సమయంలో స్మార్త, వైష్ణవ, సౌర, శాక్తేయ, గణాపత్య, శైవ మతాల వారితో వాదించి ఏ మతాన్ని నిరసించకుండా వారి ఆచార విదానాలను సంస్కరించి షణ్మత స్థాపకులై శాస్త్ర దృక్పథంలో ఇతర మతాలన్నింటినీ ఒకటిగా గ్రహించి అన్ని మతాలనూ అంతర్లీనం చేసుకొని, భౌతిక, విజ్ఞాన, వాదం చేసే మతాలన్నీ అద్వైత స్థితికి తీసుకొనిపోయే సోపానాలనీ, సిద్ధాంతీకరించి, విశ్వమానవ మతాన్ని స్థాపించినారు శంకరులు. సమాజాన్ని అద్వైత స్థాపనతో ఒకటి చేసిన శంకరులు ప్రచారం కోసం తూర్పున గోవర్ధన మఠం, దక్షిణాన శృంగేరి మఠం, పశ్చి మాన ద్వారక మఠం, ఉత్తరాన జ్యోతిర్మఠం పేరిట భారతదేశంలో నాలుగు మఠాలు స్థాపించి ఈ పీఠాలకు పద్మపాదుడు, సర్వేశ్వరుడు, హస్తామలకుడు, తోటకాచార్యులను పీఠాధిపతులుగా నియమిం చాడు. తదనంతరం దేశమంతటా పర్యటించి ఇతర విశ్వాసాలతో ఉన్న వారినందరినీ అద్వైతంలోకి తెచ్చారు. కర్నాటకలోని తుంగ భద్రానదీ తీరమందున్న శృంగేరికి వేంచేసి అద్వైత వ్యాప్తికి శారదా పీఠాన్ని స్థాపించారు. ఇది శంకరులు స్థాపించిన తొలి శృంగేరి పీఠం, ఆ పీఠాధిపతులందరినీ శంకరాచార్యులనీ పిలుస్తారు.

అద్వైత మనునది అద్భుతమైన, అనిర్వచనీయమైన ఆనందానుభూతి. అద్వైత మనేది ఆచారము కాదు, మతమూ కాదు. జ్ఞాన మార్గంద్వారా పొందేది. తర్కయుక్తులతో సాధించబడేది కాదు. అద్వైతము శంకరులతో ఆరంభమైనది కాదు. అద్వైత ప్రమాణమును శంకరులకు పూర్వీకులైన ఆచార్యులైన, వశిష్ఠ, గౌడ పాద, బ్రహ్మదత్తాదులు ప్రవచించారు.
శంకరులు తమ అసమాన ప్రతిభా పాటవాలతో ఉపనిష త్తులలో వివరించబడిన సనాతన ధర్మము, ఆచారములు విశిదపరిచి వైదిక ధర్మాచరణము సుష్టుపరిచాడు. ఈనాడు భారతీయ వైదిక సంస్కృతి అవిచ్చిన్నంగా పరిఢవిల్లుతున్నదంటే అందుకు కారణం శ్రీశంకరాచార్య భగవత్పాదులే! పతనావస్థలో ఉన్న భారతీయ సంస్కృత సనాతన ధర్మాన్ని పరిరక్షించారు.

వామాచార ధోరణులతో నరులు, పశువుల బలులతో కూడిన అవైదిక పద్ధతులను, పూజాదికాలను, వైదిక ధర్మానికి విఘాతం కలిగించే విధానాలను రూపుమాపాడు. రుద్రమూర్తులైన ఎన్నో దేవతామూర్తులలోని రౌద్రాత్మకమైన బీజాక్షరాలను తొలగించి శాంతపరిచి, సాత్వికరూపంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించాడు.

32 సంవత్సరాలు తన జీవిత కాలంలో 24 గ్రంథాలకు భాష్యాలు రచించడం జరిగింది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతపై భాష్యాలు, అమరోక్షానుభూతి, భజగోవిందం, వివేక చూడామణి, శతశ్లోకి, శివానందలహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, భవానీ భుజంగ, గణేశ పంచరత్న, దక్షిణామూర్తి, లక్ష్మీనరసింహ, మీనాక్షి, పంచరత్నాలను ఇంకా బ్రహ్మ మీమాంస, ఉత్తర మీమాంస, బ్రహ్మసూత్రాలను, కనకధారా స్తోత్రాన్ని, మనీష పంచకం, ఇలా ఆదిశంకరాచార్యులు వ్రాసినన్ని విషయాలు ఈ ప్రపంచం మొత్తం మీద మరెవరూ వ్రాసి ఉండరు. అందుకే ఆయన కృతయుగంలో ఆదిశంకరులు అని పండితుల వచనం.
మానవులకు భక్తి, జ్ఞానం, ధర్మాల ద్వారా మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తికి మార్గం చూపిన మార్గదర్శకులు జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు కేవలం 32 సంవత్సరాలు జీవించారు.

శంకరాచార్యను స్మరించడం ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందిస్తుంది, అద్వైత వేదాంతంపై అవగాహనను పెంచుతుంది మరియు హిందూ తత్వశాస్త్ర సంప్రదాయంతో అనుబంధాన్ని బలపరుస్తుంది.అంతే కాకుండా, భక్తులు ఆది శంకరాచార్యుల వారి కాలాతీత జ్ఞానాన్ని మననం చేసుకోవడానికి మరియు ఆయన బోధనలను తమ దైనందిన జీవితంలో అన్వయించుకోవడానికి ఇది ఒక అవకాశంగా కూడా ఉపయోగపడుతుంది.

సనాతన ధర్మ వృక్షాన్ని చిగురింపజేసి, ద్వైత చీకట్లను తొలగించిన అద్వైత ఆనందమూర్తి ఆదిశంకరులు.

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సడి చేయని చప్పట్లు

by Rohini Satya May 30, 2026
written by Rohini Satya

ఆరునెలల నుండి చడీ చప్పుడు లేకుండా మౌనం నిశ్శబ్దం నా జీవితంలో సగానికి పైగా స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. ఏదో ఊపిరాడని ఫీలింగ్. ఇప్పుడిలా ఈ మాటల పందిరి క్రింద జరుగుతున్న పెళ్లి సంబరంలో ఆ పని ఈ పని అంటూ హడావుడిగా తిరుగుతూ అందరితో మాటలు కలుపుకుంటూ ఆనందం అంతా నా స్వంతం అన్న భావన ఊపిరి పోసుకోవడంతో పెద్ద బరువు దించుకున్నట్టుగా వుంది. ఇదే మాట వీరితో పంచుకుంటే… మరీ ఎక్కువగా సంబరపడకు ఊరికెళ్ళిన తరువాత మళ్ళీ అదే పరిస్థితిని పేస్ చేయాల్సివుంటుంది విమలా! అన్నారు. ఈ మనిషి ఇంతే! భావనారహితంగానే జీవితం గడిపేస్తూ వుంటారు. పొంగిపోవడాలు కృంగిపోవడాలు ఏవీ పట్టక తన మానాన తాను బ్రతికేస్తూ వుంటారు. కాస్త చిరాకన్పించినా తనలా ఉండడం ఒకందుకు మంచిదే అనిపిస్తుంది.

ఏదో పెళ్లింట్లో కాస్త సంతోషం ఇల్లు కట్టుకుంటే వీరి మాటలతో ఆ స్థానంలో గుబులు గూడు కట్టుకుంది. ఓ క్షణం మనసు చివుక్కుమన్నా నెలల తరబడి మౌన సముద్రంలో మునకలేసిన నాకు ఇప్పుడు ఇక్కడ లభిస్తున్న ఈ సందడి సంభ్రమాలను దూరం చేసుకునే ఉద్దేశ్యం లేక ఆలోచనలను విదిలించి ఆ మాట ఈ మాట కలుపుకుంటూ అందరితో కలిసిపోయాను.

రాత్రి భోజనం చేసి పడుకోడానికి వెళ్ళినపుడు రేపు మధ్యాహ్నం ట్రైన్ కు తిరిగి వెళ్ళాలి అన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ దిగులు భూతం ఆవహించింది. అదే విషయం అనబోతే ఈ విషయాలకు అతీతంగా వీరి గురక మంచి నిద్రకు జారుకున్న సూచన ఇచ్చింది. పాపం పడుకోని లేపడంఎందుకని అలా ఇలా దొర్లుతూ చివరకు నిద్రకు జారుకున్నా. ఓ గంట గడిచిందేమో మళ్ళీ మెలకువ నిద్రను కాజేసింది.

నీరవపు రాత్రిలో తలపుల ఊరేగింపు…
అమ్మ నాన్న అక్కలు అన్నలు పెద్ద కుటుంబంలో ఆఖరుదాన్ని నేనవడంతో అతి గారాబంగా పెరిగాను. స్కూల్ కాలేజ్ స్నేహితురాళ్ళు అప్పుడప్పుడూ వచ్చిపోయే బంధువులతో ఇరుగు పొరుగువారి ముచ్చట్లతో ఒంటరితనం నన్నెప్పుడూ భాధించలేదు. గారాబంగా పెరగడంతో ఒకింత బేజారుని సహించే ప్రకృతి నాకబ్బలేదు.

పెళ్లయి చేరిన అత్తగారిల్లు కూడా ఉమ్మడి కుటుంబం కావడంవల్ల అక్కడ కూడా సందడే. కాలం గడుస్తూ పిల్లలు వారి ఆలనా పాలనలో రోజులు నెలలు సంవత్సరాలు దొర్లుకుంటూ వెళ్ళిందే తెలియలేదు. పిల్లలు బాగా చదూకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నప్పుడు ఒక్కొక్కరిగా పిన్నలు పెద్దలు కాలం చేసారు. కానయితే ఆ ఎడబాటుని కాస్త మరపించింది పిల్లల పెళ్లి విషయం. ముగ్గురు పిల్లలు వారి కాళ్ళమీద వారు నిలిచే ప్రయత్నంలో సఫలీకృతులవడంతో పెళ్లి చేయాలన్న తపన బలీయమయ్యింది. పిల్లలను మొదటి నుంచి ఎక్కువ ఆంక్షలు విధించక వారి ఇష్టాయిష్టాలకు విలువనిస్తూ స్నేహితులకు మల్లే పెంచాము అన్నది కాస్త గొప్పే. అదే విధంగా వారి పెళ్లి విషయంలోనూ మేము మా అభిప్రాయాలను మోపక ఒకిన్ని విషయాలను వారికి స్పష్టం చేస్తూ ఒక్కొక్కరిగా వారిష్టపడ్డవారితో వారికి పెళ్లి జరిపించాము.

వీరు నిద్ర లేవడంతో నా తలపుల గొలుసు తెగింది. బ్రష్ చేసి స్నానాలయ్యాక బట్టలు సర్ది అందరితో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి పెట్టె బేడా సర్దుకుని బయలుదేరాము. ఆ హడావుడిలో రాత్రి తినడానికి ప్యాక్ చేసిన డబ్బా వదిలేసి వచ్చిన విషయం స్టేషనుకెళ్లిన తరువాతగాని తెలియలేదు. పోనీలే కనీసం ఇప్పుడే చూసుకున్నామని సంతోషిస్తూ దగ్గర్లో వున్న హోటల్లో ఇడ్లీలు కట్టించుకురావడానికి వెళ్లారు. చాలా పెద్ద క్యూ. ముప్పావు వంతు దూరం వెళ్లారో లేదో ఇడ్లీలు ఖాళీ అయ్యాయి ఇక ట్రైన్ బయల్దేరే టైం అయ్యిందని తిరిగొచ్చేశారు. ఇద్దరం ట్రైన్ ఎక్కి కూచున్నాము.

మాకు ఎదురుగా ఒక అమ్మాయి అబ్బాయి కూచున్నారు చిన్న పిల్లాడు నిద్రపోతున్నాడు. ట్రైన్ కదిలింది. ఓ పది నిమిషాల తరువాత ఆ అమ్మాయే మాటలు కలిపింది. కాసేపటికి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఎన్నో రోజులుగా పరిచయమున్నట్టు అనిపించసాగింది. మాటల మధ్యలో మావారు “నేను ఇక్కడ దొరికే పలావు తింటాను నీవైతే అది తినవు. ట్రైన్ ఈ స్టేషన్లో కాసేపు ఆగుతుంది నీకు కాసిని అరటిపళ్ళు బిస్కేట్లూ పట్టుకొస్తానుఅని అన్నారు. వారి మాటలు వింటున్న ఆ అమ్మాయి మీరేమీ అనుకోక పోతే బాబుకి తెచ్చిన ఇడ్లీలు వున్నాయి, వాడు నిద్రపోయాడు మీరు తినండి అంది నాతొ ఆత్మీయంగా. నేను ఓ క్షణం కూడా ఆలోచించక అలాగే ఇవ్వమ్మా అంటూ తీసుకున్నాను. మా వారు నాకేసి వింతగా చూసారు. కారణమింతే … అలా ట్రైన్లో కొత్తవారి దగ్గర తినే వస్తువులు తీసుకోకూడదని వాదించే తను ఇలా ప్రవర్తించడం వారికి కాస్త వింతగా అనిపించింది. ఇన్ని రోజుల ఒంటరితనం, మాటలు ఎక్కువగా లేని మౌనం నాపై ఇంత ప్రభావాన్ని చూపుతోందా?! ఆత్మీయతకు అఱ్ఱులుజాస్తోందా?! అని అనిపించకపోలేదు. నెలల తరబడి నా ఒంటరితనం ఆ అమ్మాయి చూపిస్తున్న అక్కరకు ఆవిరవుతున్నట్టనిపించడమే నా ఈ ప్రవర్తనకు కారణమనిపించింది. ఎందుకో తెలియదు మా ఇంట్లో మనిషిలాగా అనిపిస్తోంది. అందుకే ఏ మాత్రం సంకోచ లేకుండా తీసేసుకున్నాను.

నేను ఇడ్లీలు తింటున్నప్పుడు ఆ అమ్మాయి తన గురించి చెప్పుకోసాగింది. అప్పుడు తెలిసొచ్చింది ఆ అమ్మాయి స్టేట్స్ లో వుంటున్నది అబ్బాయి ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. పిల్లాడిని అమ్మాయి తల్లి చూసుకుంటోంది. ఇప్పుడు వారి ప్రయాణం అత్తగారింటి వైపు. వాళ్ళ అమ్మగారిని ఒప్పించి అబ్బాయికూడా స్టేట్స్ కు త్వరలోనే వెళ్ళాలి అన్న విషయం తీర్మానించడానికి. మంచిదే ఒకరక్కడ ఒకరిక్కడ ఇలా పిల్లాడికి దూరంగా ఉంటూ అవస్థలు పడేకన్నా ఇది మంచి నిర్ణయం అన్నపుడు మా పెద్దాడు ఇదే కారణానికి ఆరు నెలలక్రితం ఇల్లొదిలిన విషయం గుర్తొచ్చింది. అప్పుడు పైకనకపోయినా ఈ విషయానికి బాగా నొచ్చుకున్న విషయం కూడా గుర్తొచ్చింది. అయితే ఈ అమ్మాయి మాటలు విన్నాక అలా వాడు స్టేట్స్ వెళ్లడం ఆక్షేపించే విషయం కాదేమో అని అనిపిస్తోంది. అలా అనిపించడంతో నాలో దట్టంగా గూడు కట్టుకున్న దిగులు మేఘాలు కాస్త పలచబడ్డట్టనిపించింది. వెంట వెంటనే ఆఫీస్ చాలా దూరం వెళ్లి రావడం అలసటగా వుంది. పిల్లాడికి కూడా అక్కడే దగ్గరగా వున్న స్కూల్లో చేర్పించి అందరం వీకెండ్స్ వస్తామమ్మా అన్న మూడవ అబ్బాయి మాటలు ఇప్పుడు తేలిగ్గా తీసుకోవాలనిపిస్తోంది. ఇక రెండవది అమ్మాయి. తను పెళ్ళయిన వెంటనే దూరదేశానికి వెళ్లడంతో తాను లేని లోటు కూడా బాధించేది. ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే పిల్లల కష్టం కూడా కాస్త కాస్త అర్థమవసాగింది. పిల్లలందరూ ఎలాంటి గొడవలు మనస్థాపాలు లేక కేవలం వారి వారి అవసర కారణాలకు దూరం వెళ్లారు. మూడవ అబ్బాయి కోడలు మనవడు వచ్చీ పోతూ వుంటారు, మంచి చెడూ కనుక్కుంటూ వుంటారు. పెద్దవాడు వీలయినపుడు తప్పక వస్తానమ్మా అంటూ సముదాయించేవాడు. ఎటూ పోయి అందరు కలిసి వున్నపుడు అంత సందడిగా వున్న ఇల్లు అలా ఒక్కసారికి ఖాళీగా అనిపించడం నన్ను ఇంతగా కృంగదీసింది అని అనిపించక పోలేదు.

అపుడు ఇంట్లో పని వంట వార్పూ, పిల్లలతో కాలక్షేపంతో టైం గడిచేదే తెలిసేది కాదు. బుర్రలో అనవసరపు ఆలోచనలకు తావుండేది కాదు. ప్రస్తుతం ఎలాంటి వ్యాపకం లేక చిన్న చితక పనులు చేసుకుంటూ ఎక్కువ శాతం ఖాళీగా వున్న మైండ్ చిన్న విషయాలను బూతద్దంలో చూడడంవల్ల ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను ఈ దైన్య పరిస్థితినుండి బయటపడాలంటే ఒక వ్యాపకాన్ని సృష్టించుకోవాలి. అందులో ఎక్కువ సమయం గడిపితే ఈ మౌనం ఒంటరితనం ఎక్కువగా బాధించదు. చదూకునే రోజుల్లో క్లాసుకు తానే ఫస్ట్. అందులోనూ మాథ్స్ తనకు కొట్టిన పిండి. ఇక హిందీ తాను చక్కగా పాఠం చెప్పగలదు. భోజనం పనులు అయ్యాక నిద్రపట్టక పొర్లుతూ మనసు పాడుచేసుకోవడం కంటే చిన్న పిల్లలకు పాఠాలు చెబితే సమయం వ్యర్థమైన ఆలోచనలకు తావులేక చక్కగా గడిచిపోతుంది. పిల్లలతో గడిపినట్టూ ఉంటుంది. కొడుకులు కోడళ్ళు పిల్లలు అమ్మాయి అల్లుడు అందరితో దొరికిన సమయంలో సంతోషంగా మాట్లాడుతూ మనసుని చక్కగా ఆరోగ్యంగా వుంచుకోవాలన్న నిర్ణయానికొచ్చాను. “ఎందుకు ఉన్నట్టుండి అలా మౌనంగా కూచున్నారు” ఆ అమ్మాయి ప్రశ్నకు తెప్పరిల్లి ” ఆ ఏంలేదమ్మా ఇలా ఏదో విషయం గుర్తొస్తేనూ… అని అన్నాను. మేము వచ్చే స్టేషన్లో దిగుతాము మీ ఫోన్ నెంబరు ఇవ్వండి టచ్ లో ఉందాము అన్న ఆ అమ్మాయిని ముచ్చటగా చూస్తూ అంతర్మధనంతో తేలికపడ్డ మనసుతో మనసారా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దాంతో నాలో అంతవరకూ గూడు కట్టుకున్న దిగులు మేఘాలు ఆవిరైపోయి మనసు నిర్మల ఆకాశంలా ప్రశాతంగా అనిపించసాగింది.

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

భ్రమలో–బంధం

by రంగరాజు పద్మజ May 30, 2026
written by రంగరాజు పద్మజ

“షుగర్ డాడీ కల్చర్” అనేది ఒక సామాజిక విపరీత ధోరణి. ఇందులో సాధారణంగా పెద్దవయసు, ఆర్థికంగా బలమైన వ్యక్తి (షుగర్ డాడీ) మరియు తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి (షుగర్ బేబీ) మధ్య ఆర్థిక సహాయం–వ్యక్తిగత సంబంధం ఆధారంగా ఒక ఒప్పందం లాంటిది ఉంటుంది. మానసిక పరిపక్వత లేని అమ్మాయిలు సోషల్ మీడియాలో కనపడే విలాసవంతమైన జీవితాలు తమ కు ఎందుకు లేవు? దీనికి డబ్బే కారణం కదా! అదెలాగో సంపాదించుకుని ఆ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అందరి ఎదుటా డాబు చూపించుకోవడానికి పట్టే తప్పుతోవనే షుగర్ డాడీ ( ఒక విధమున ట్రాప్) లో పడుతున్నారు.
ఇది ప్రేమ అని మొదలై, క్రమంగా డబ్బు అవసరాల ఆధారంగానే కొనసాగుతాయి. క్రమంగా ఆశలు- అత్యాశలై కుటుంబ విలువల కంటే డబ్బు, లాభం, సౌకర్యం వీటి మీద పడి ప్రేమ కాస్త దోమౌతుంది… డబ్బు.. డబ్బు.. అని కుట్టడం మొదలౌతుంది. ఇవి పాశ్చాత్య ధోరణిని తమ స్వంతం చేసుకుంటున్న సంస్కృతి. కానీ అక్కడో- ఇక్కడో ఒకటీ-అరా ఉన్నత వర్గాలలోఉండేవి. రాను రాను మధ్యతరగతికి ఎగబాకిన గజ్జి సంస్కృతి.దీని వల్ల భారతీయ సమాజానికి ఎంతో హాని కలుగుతుంది. నైతిక విలువల క్షీణత కలుగుతుంది. మన భారతీయ సంస్కృతిలో ఉన్న ధర్మం, గౌరవం, కుటుంబ బంధాలు బలహీనమవుతాయి. మహిళల గౌరవానికి ముప్పు ఏర్పడుతుంది.
ఇది మహిళలను ఒక “వస్తువు”లా చూసే భావనను పెంచుతుంది. యువత తప్పు దారులు తొక్కుతారు, ఎందుకంటే డబ్బు సంపాదించాలనే యావలో పడి వారికి ఎలాంటి నైతికత గుర్తురాదు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఈ మార్గంలో పడే ప్రమాదం ఉంది. దీనితో మానసిక మరియు భావోద్వేగ సమస్యలు వస్తాయి. ఇలాంటి సంబంధాలు స్థిరంగా ఉండవు. దాంతో ఒత్తిడి, నిరాశ, నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. సామాజిక అసమానత పెరుగుదల డబ్బు ఉన్నవారికి మాత్రమే అధిక ప్రాధాన్యత కలిగే పరిస్థితి ఏర్పడింది. మన సంస్కృతికి మూలపట్టైన పవిత్రత మంట కలసిపోతున్నది. దీనివల్ల ఎన్నో గుప్త రోగాల పాలౌతారు. అంతేకాదు! ఏ సోషల్ మీడియాతో ఆకర్షింపబడి ఈ దారిని ఎన్నుకుననదో… అదే సోషల్ మీడియా వాళ్ళ రేటింగ్ కోసం గంటలు గంటలు చర్చోప చర్చలు చేసి, ఆ అమ్మాయి జీవితాన్ని బజారుకీడ్చి, మనసుతో పాటు జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేసి, వారి నోటి దురద తీర్చుకుంటారు. ఈ అమ్మాయి రాటు దేలినదైతే పర్వాలేదు చావకుండా బతుకుతుంది. లేదా ఆ అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఒకప్పుడు స్నేహితురాలు చెప్పిన మాట సోషల్ మీడియాలో చూసేదంతా నిజంకాదు! జాగ్రత్త గా ఉండాలనే మాట ఆనాడు పెడచెవిన పెట్టినా… ఈ రోజు చెవిలో గింగురుమంటుంది.
ఈ సంస్కృతి రావడానికి కారణాలు పాశ్చాత్య ప్రభావం మరియు సోషల్ మీడియా, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, Instagram వంటి Instagram లో కనిపించే గ్లామర్ జీవితం. కుటుంబాల మధ్య ఆర్థిక అసమానతలు పేదరికం, ఉద్యోగ అవకాశాల లోపం దాంతో అందరివలె తానూ బతకాలనే కోరిక, తామూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నామనే ప్రదర్శన ( ఒకరిని చూసి మరొకరు) సులభంగా డబ్బు సంపాదించాలనే కోరికతో అడ్డదారులు తొక్కడం, వద్దని అంతరాత్మనో లేక స్నేహితులో చెప్పితే విలాసవంతమైన జీవితం ఆకర్షణ వదులుకోలేక, తన స్నేహితురాలి వలె లగ్జరీ జీవితం జీవించాలని దానిమీద ఆకర్షణ కలుగుతుంది. ఎందుకంటే ఈ దారులు వెతుక్కునే పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం సరిగా ఉండక కుటుంబ, విలువల లోపంతో పిల్లలకు సరైన మార్గదర్శకత లేకపోవడంతోనూ… అందుకు తగిన ఆకర్షణలు ఆ ఊబిలోకి తమంత తామే పడతారు. దీనికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు తోడై ,ఈ చిన్న పిల్లల కోరికలకు వత్తాసు పలుకుతూ ఇలాంటి సంబంధాలను ప్రోత్సహించే వెబ్‌సైట్లు, యాప్స్ యువతను సర్వ నాశనం చేస్తున్నది.

విలాసవంతమైన జీవితం కొరకు తప్పు తోవపడితే తర్వాత బాధ-ఒత్తిడే మిగులుతుంది
దీన్ని అరికట్టడమెలా? అంటే మొదటి మెట్టు కుటుంబమే… నైతిక విలువల విద్య నేర్పించాలి! పిల్లలకు చిన్నప్పటి నుంచే ధర్మం, గౌరవం, స్వాభిమానం నేర్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యం. పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడాలి, వారి సమస్యలు అర్థం చేసుకోవాలి. వారికి సోషల్ మీడియా అవగాహన కల్పించాలి. అందులోని నిజానిజాలు; సాధక బాధకాలు మొదలైనవి పిల్లల మనసులోనికి ఇంకించాలి. వాస్తవ జీవితం ఇలా తక్కువ వసతులులన్నా పరవాలేదు! గౌరవంగా బతకడమే మనకు ముఖ్యమని, తాత్కాలిక సుఖాలకంటే స్వాభిమానమే గొప్పదని , అలాంటి ప్రలోభాలకు లోనూకావద్దని చెప్పాలి. దాంతో పాటు సోషల్ మీడియా భ్రమలు వివరించాలి. నువ్వు చూసేదంతా నిజం కాదు! తెరమీద అలా కనపడుతుంది వెనుక జీవితాలు వేరేగా ఉంటాయి. అదొక ఊబిలాంటిది. దాని దగ్గరకు పోతే అపవిత్రమైన జీవితంలో కూరుకు పోవడమే తప్ప గౌరవప్రదమైన జీవితం ఉండదని విడమర్చి చెప్పాలి. డబ్బులకోసం ఇటువంటి తోవలు తొక్కవద్దని చెప్పి, వారి అవసరాలు తామే తీరుస్తూ… అలా వీలు కాకపోతే ఆర్థిక స్వావలంబన గురించి చెప్పాలి! దానికోసం ఎలా చదవాలో? ఎలా నైపుణ్యాలను నేర్చుకోవాలో వాటి ద్వారా ఎలా సంప్రదించుకోవాలో తెలిసేలా వివరించాలి. యువతకు ఉద్యోగ నైపుణ్యాలు నేర్పాలి. ఇక ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి దోపిడీ సంబంధాలను నియంత్రించడానికి కఠిన నిబంధనలు అవసరం.
“షుగర్ డాడీ కల్చర్” అనేది తాత్కాలిక సుఖం ఇచ్చేదే కానీ దీర్ఘకాలంలో నష్టాన్ని కలిగించే ధోరణి. మన భారతీయ సంస్కృతి గౌరవం, ప్రేమ, బాధ్యత మీద నిలబడింది.
కాబట్టి యువతలో స్వాభిమానం మరియు నైతికత తో పాటు కష్టపడి సాధించే జీవితం విలువలను పెంపొందిస్తే మాత్రమే ఈ సమస్యను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఒకరిని చూసి మరొకరు ఇందులో కూరుకొని పోతున్నారు.
అంతేకాదు తన తోటి వారితో పోల్చుకోవాడాలు ఎక్కువ అయినవి… ఈ పోలిక చిన్న వస్తువు దగ్గర నుండి అతి ఖరీదైన వస్తువులు, నగలు, ఇండ్లు ఇలా దానికి అంతే లేదు! హద్దు అసలే లేదు. సామాజిక వేత్తలు తమ వంతు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి.
ఇంట్లో ఆధ్యాత్మికత వాతావరణం ఉండి తల్లిదండ్రులు ఆచరిస్తే… పిల్లలలో కాస్త పాపభీతి- భయంతో వెనకడుగు వేసే అవకాశమున్నది. తప్పొప్పులు బేరీజు వేసుకునే ఆలోచన కలుగుతుంది.
ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందో? అన్న వెరపు ఎప్పుడైతే పోయిందో ఇలాంటి అసహజ పనులు చేయడానికి యువతులు వెనుకాడడంలేదు. దైవభీతి, పాపపుణ్యాల పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గి వారు మందలించబోతే ఎదురు తిరిగి వారిని మానసికంగా గాయపరచడం చేస్తున్నది యువత. అందుకని బాల్యంలోనే నైతిక విలువలను నేర్పించడం, తమ శక్తిమేరకు పిల్లల అవసరాలను తీర్చడం చేయాలి. వాళ్ళముందు విలాసవంతమైన జీవితం లేదని తరచూ భార్యాభర్తలు గొడవపడితే అలాంటి కోరిక సమంజసమైనదేమోననే ఆలోచన పిల్లలో కలుగుతుంది. అలా కాకుండా మన పరిథి ఆదాయంలో మనం గౌరవంగా, ప్రశాంతంగా బతుకుతున్నాము. మన జీవితాలకేమైంది హాయిగా ఉన్నామనే సంకేతాలు పిల్లలకు అందించాలి. అపుడు సంతృప్తి ముఖ్యమనే జీవన విధానానికి పిల్లలు అలవాటు పడతారు.
పాఠశాలలోనూ ఉపాధ్యాయులు చెడు తోవ పడ్తున్నాడని పసిగట్టి సరైన దారిలోకి తెచ్చే విద్యాబోధన చేయడం చేయాలి.
ముఖ్యంగా ఈ ఆకర్షణలన్నీ మొబైల్స్, లాప్ టాప్ల వంటి విద్యుత్ పరికరాలే కాబట్టి వాటికి నియంత్రణ ఏర్పాటు చేసి, పిల్లల మీద నిఘా పెట్టాలి. ఎటువంటి పోస్ట్ లు, వెబ్ సైట్లు, చాటింగ్ ఎవరితో చేస్తున్నారని, తరచూ ఎలాంటివి చూస్తున్నారని గమనించి హెచ్చరిక చేయడం, వినకపోతే వాటికి తాళం వేయడం చేయాలి. అలా చేయాలంటే పిల్లలతో సమయం గడిపి, వారికి ఖాళీ సమయం చిక్కనీయ వద్దు.ఇలానే అని కాకున్నా .. తమకు తోచిన విధానంలో ఆకర్షణల వైపు పోనీయకుండా చేయాలి.
మనదేశంలో యువత ఎక్కువ ఉన్నది. దాంతో మన దేశం ఎంతో ఉన్నతి సాధించవచ్చు. ప్రపంచమంతా ఈ మన యువ శక్తికి ఈర్ష్య- అసూయలు పడుతున్నారు. మనం మన శక్తిని మనమే నిర్వీర్యం చేసుకుంటున్నామని త్వరగా గ్రహించాలి! యువతను పెడమార్గం పట్టకుండా చూసి, మనతో పాటు దేశ అభివృద్ధి లో పాలు పంచుకునే కొత్త నైపుణ్యాలతో అవసరమైనవి కనిపెట్టే దిశగా ప్రోత్సహిస్తూ… పిల్లల అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిని కోరుకుందాం!

సర్వే జనాః సుఖినో భవన్తు!!

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మే డే శుభాకాంక్షలు…

by Manjula Pathipati May 30, 2026
written by Manjula Pathipati

పిడికిలి బిగించి ఎదిగే ప్రతి క్షణం
శ్రమ జెండా ఎగరే ప్రతి వేళ..
హృదయం పలుకుతోంది
కార్మికుడే నిజమైన వీరుడు అని..!

కడుపు నింపే అన్నం వెనుక దాగిన కష్టాలను
ప్రతి ఇంటి నిర్మాణం వెనుక ఉన్న వారి
శ్రమ గాథలను పదాలుగా మలిచే
కలం చెబుతోంది..
కార్మికుడే సూర్యుడు ఈ భూమికి అని..!

వారి చెమట చుక్క పడిన నేలపై
మన జీవితం మొలకెత్తింది అని గుర్తుంచుకో..!
వారి అలసిన చేతులు ఆగిన క్షణంలో
ప్రపంచం నిలిచిపోతుంది అని గుర్తుంచుకో..!

ఖాళీ కుండతో అన్నం వండే మంటల్లో..
కడుపు ఆకలిగా ఉన్న రాత్రుల్లో..
వారి పేగుల చప్పుడు వినిపించిన ప్రతిసారి
హృదయం బద్దలవుతుంది

వారి చెమటతోనే నిలుస్తుంది సమాజం
వారి శక్తితోనే ముందుకు సాగుతుంది ప్రపంచం
కానీ…. ఏమీ ఆశించక
కుటుంబం నవ్వులే తనకు పండుగ అని
భావించే నిజమైన శ్రామికురాలు మహిళ..!

పొయ్యి వెలిగించే ప్రతి మంటలో
తన కన్నీళ్లను గుండెల్లో దాచుకుని
తన కలలు గిన్నెల్లో మరిగిపోతున్నా కూడా…
చిరునవ్వు మాత్రం తగ్గని నిజమైన
శ్రామికురాలు మహిళ..!

చెమట చుక్కలతో స్వప్నాలు నిర్మించే శ్రామికులకు
వందనాలు తెలియజేస్తూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us