మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

స్వామి దయానంద సరస్వతి

by రంగరాజు పద్మజ September 23, 2024
written by రంగరాజు పద్మజ

వర్ధంతి(1833-10-30)సందర్భంగా ఒక స్మరణ:–

భారతదేశం తరతరాలుగా వేదాలు, పురాణాలు ఇతిహాసాలకు పెట్టింది పేరు. అలా వాటిని నిక్షిప్తం చేసిన పురాణ పురుషులు, ఋషి పుంగవులు కారణజన్ములు ఎందరో మహానుభావులు.. జీవితాన్ని త్యాగం చేసి చతుర్ముఖ బ్రహ్మ నాలుగు ముఖాల నుండి వెలువడ్డ నాలుగు వేదాలు కంఠస్తం చేసి తరవాత తరాలకు అందించారు.
వాటిన చదివి, అర్థం చేసుకొని మరొక తరానికి కాస్త సులభతరం చేసి, వేదంలో అన్నీ ఉన్నాయి, అని హేళన చేసే వారి నోళ్లు మూయిచడానికి… ఔను!! వేదంలో అన్నీ ఉన్నాయని తెలియజేసిన మహామహులు ఎందరెందరో…
వారిలో మూల్ చంద్ లేదా మూల శంకర అనే జన్మనామధేయులు, వీరి వాఙ్మయ సేవకు, వేద సారాన్ని గ్రంథాల ద్వారా అందించినందుకు స్వామి బిరుదు పొందిన పరమ పూజ్యులు స్వామిదయానంద సరస్వతి గారు.


దయానంద అని ఎందుకు పిలుస్తారు? అంటే చిన్నప్పుడు ఒక గురువు దగ్గర శిక్షణ పొందేవారు. ఆయన పేరు విరజానందుడు. ఈయన వ్యక్తిత్వాన్ని చూసి దయానందుడు అని వారు పేరు పెట్టారు. అలా పూర్తి పేరు స్వామి దయానంద సరస్వతిగా అందరికీ తెలిసిన వారు.
వీరు 1824 – 2-12 న గుజరాత్ లోని కతియవాడ్ లోని టంకర అనే గ్రామంలో జన్మించారు
దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని హిందీలోనూ,వేద భాష్య అనే గ్రంధాన్ని సంస్కృతంలోనూ, వేద భాష్య భూమిక హిందీ, మరియు సంస్కృతంలోనూ రాసారు. లఘు గ్రంథాలు వ్యవహార భానువు, స్వమంత వ్యామంతవ్య ప్రకాశములు.
శ్రీ దయానంద సరస్వతి గారు 1875 ఏప్రిల్ 10 బొంబాయిలో ఆర్య సమాజం స్థాపన చేసి, తర్వాత లాహోరు కు మార్చారు.
ఆర్య సమాజాన్ని ఎందుకు స్థాపించారు అంటే ఆయనకు చిన్నప్పటినుండి ఆధ్యాత్మిక మార్గంలోనే నడిచేవారు కనుక సత్యాన్వేషణలో భాగంగా ఆయన వివాహం కూడా వద్దనుకొని 1820లో ఒక శివరాత్రి రోజు ఈశ్వరాలయానికి వెళ్లి జాగారం చేస్తూ శివలింగం వైపే చూస్తూ కూర్చొని ఉండగా, ఒక ఎలుక వచ్చి శివలింగం మీద పరుగులు పెడుతుంది… అక్కడి పూలను కెలకడం, ప్రసాదం తింటూ గందరగోళం చేస్తుంటే….. శివుడే ఏమీ చేయడం లేదు ఏమిటి? అని అనుకుంటూ అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అనే ఆలోచన ఆయనలో కలుగుతుంది. దాంతో తండ్రిని అడుగుతాడు “నాన్నా! ఈ ఎలుకను శివుడు ఎందుకు శిక్షించడం లేదు? అని అడిగితే “నీకు అన్ని సందేహాలే మెదలకుండా కూర్చో”! అని కసురుకుంటాడు తండ్రి.
అప్పటి నుండి దేవుడు ఉన్నాడా లేడా అనే అన్వేషణలోనే ఏది సత్యం అని తెలుసుకోవాలనుకుంటాడు.ఇంతలో అతని తల్లి మరణిస్తుంది. అయితే పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందేనా? అని మరొక సందేహం కలుగుతుంది ఆయనకు.. చావును జయించలేమా? అని ఆలోచనలు సాగుతున్నప్పుడే సమాజంలో ధర్మం అనే ముసుగులో ఎన్నో అన్యాయాలు ఆయన దృష్టికి వస్తాయి.
అన్నిటికీ సత్యాన్వేషణే సమాధానమిస్తుందని అనుకొని, అందులో భాగంగా ఇల్లు వదిలి యావత్ భారత దేశ పర్యటన చేయాలనుకుని బయలుదేరుతాడు. ఎన్నో పుణ్య క్షేత్రాలు దర్శించుకొని, ఎందరో ఋషులను కలిసి చాలా విషయాలు తెలుసుకుంటాడు. అలా శృంగేరి పీఠానికి వచ్చినప్పుడు పరమానంద సరస్వతి దగ్గర వేదాల గురించి తెలుసుకొని, మన హిందూ మతం గొప్పదనాన్ని తెలుసుకొని ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలనుకుని మధురలోని విరజానంద స్వామిని కలిసిన తర్వాత పూర్తిగా ఆయనలో ఒక మార్పు ఏర్పడుతుంది. అంతగా తనపై ప్రభావం చూపిన గురువుకు గురుదక్షిణ ఇవ్వాలనుకుని, స్వామీ! గురుదక్షిణగా ఏమివ్వను? అని అడుగుతారు.
దానికి ఆయన హిందూ మతాన్ని పునరుద్ధరించి ప్రచారం చేయమంటారు. అందుకోసం వేదాలను బాగా చదివాలనీ, సమాజంలోని సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను తొలగించడానికి కోసం 1875లో ఆర్య సమాజ స్థాపన తర్వాత హిందూ మతంలోని గొప్పతనాన్ని ప్రచారం చేయడంలో భాగంగా వేదాలకు తరలిపొండి అని నినాదం చేస్తారు స్వామి దయానంద సరస్వతి.
మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఎందుకు ఎక్కువయ్యాయి అంటే? ఆ సంధి కాలంలో మంచిగా చదువుకొని పురోహితులు ఉండడం వల్ల
ధనం కోసం మూఢనమ్మకాలను ప్రజలలో సృష్టించి తమ పబ్బం గడుపుకునేవారు. దేవుడి పేరు చెప్పి ఎన్నో అవైదిక కార్యక్రమాలు చేసేవారు. ఎందుకంటే? వారు ఎవరూ వేదం చదవక అందులోని ధార్మిక విషయాలు తెలుసుకోకపోవడమే అనుకొని వేద ప్రచారం జరగకపోవడమే కారణమని గ్రహించి ప్రచారం చేస్తూ సాంఘిక దురాచారాలను అరికట్టాలని దయానందసరస్వతి అప్పుడే నిర్ణయించుకున్నారు.
అప్పుడు సమాజంలో బాధించే మూఢాచారాలు ఏమిటి అంటే? అస్పృశ్యత, బాల్య వివాహాలు… వీటిని అరికట్టడం కోసం స్వామిదయానంద సరస్వతి
స్వరాజ్య
స్వధర్మ
స్వభాష
అనే మూడు సందేశాలను ఇచ్చారు..
స్వరాజ్యము అని అంటే మన దేశాన్ని మనమే పాలించుకోవాలని, స్వధర్మము అంటే మన ధర్మాన్ని వదిలిపెట్టవద్దని, స్వభాష అంటే మన భాష -సంస్కృతిని చదవాలని, ఇంగ్లీష్ భాషను కాదని చెప్పారు!
ఇదిలా నడుస్తూ ఉండగానే 1852 లో గోవధ సంరక్షణ ఉద్యమాన్ని, గోవద నిషేధం అనే ఉద్యమాన్ని తీవ్రంగా చేపట్టారు.
వీటికి తోడు శుద్ధి ఉద్యమాన్ని కూడా నడిపారు. అంటే ఇతర మతాలలో చేరిన వారిని తిరిగి హిందూమతంలోనికి చేర్చుకోవడం జరిగింది. కేరళలో 2000 మంది ముస్లింలను హిందువులలో చేర్చుకున్నారు. దాంతో ముస్లిం, క్రిస్టియన్ లకు హిందూమతం వారితో తీవ్ర విభేదాలు చెలరేగుతాయి.
హిందూ మతం గురించి అందరికీ అవగాహన కలిగించడానికి, అలాగే వేద విద్యను నేర్పించడానికి, అభివృద్ధి చేయడానికి
దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించారు. దీనికి లాలాజపతిరాయ్, మదన్మోహన్ మాలవ్య కూడా సహకరించారు.
ఉత్తరప్రదేశ్ లోమదన్మోహన్ మాలవ్య ప్రచారం చేశారు,
1892లో ఆర్య సమాజం రెండుగా విడిపోయింది.
1- గురుకుల ఆర్య సమాజ్,
2- కళాశాల ఆర్య సమాజ్ గా చీలిపోయింది.
ఎందుకంటే? వేదం నేర్చుకుంటే జీవన భృతి ఇవ్వదని మిగతా ఆంగ్ల సబ్జెక్టులు నేర్పించాలనే తీవ్ర పట్టింపులతో చివరకు వేదాలను గురుకుల ఆర్య సమాజంలో నేర్పించాలని, లాలా మున్షీరామ్ ( స్వామి శ్రద్ధానంద)హరి ద్వార్ లో వేద పాఠశాలను స్థాపించారు. అదిప్పటికీ నడుస్తున్నది.
ఈ శ్రద్ధానందకు హిందీ భాషను జాతీయ భాషగా చేయాలనే సంకల్పం ఉండేది.
ఈ విశాలమైన భారతంలో
సాధన- సభ్యత అనేవి తత్త్వానుభూతి మీద ఆధారపడి ఉన్నాయి. భారతీయ సాహిత్యం, శిల్పం, విజ్ఞానం, దర్శనము, కుల, మత సమాజాలు,వారి యొక్క ధర్మాలు, ఆర్థికపరమైన విషయాలు, మంచి మాటలు చెప్పే నీతులు మొదలైన అన్ని విషయాలు వేదాలను నుండి ఉపనిషత్తులు వాటి ద్వారా మనకు తెలిసాయి! కాబట్టి వాటినితెలుసుకొని, ఆచరణలో పెట్టుకోవడం మన సంస్కృతిని మనం కాపాడుకోవడమే!
మహర్షులు ఏ ఆధ్యాత్మిక తత్త్వాలను జ్ఞానదృష్టితో సాక్షాత్కరించుకున్నారో? వాటిని తాము తమ వేద భూమిక, వేద రహస్య, వేద భాష్య గ్రంథాలలో చక్కగా తెలిపారు దయానందులు.
మీరు తమ జీవితాన్ని త్యాగం చేసి రేయింబవళ్లు వేద రహస్యాలను తెలుసుకోవడంలోనే గడిపారంటే అతిశయోక్తి కానే కాదు!
సంస్కృత భాష భారతీయ సంస్కృతికి మూలం అని అనుకొని, ఆ సంస్కృత భాషను ఎలా చదవాలో అలా ఒక క్రమాన్ని తయారు చేసి పెట్టిన సంస్కృత భాషా ప్రేమికుడు దయానంద సరస్వతి. అందుకే ఆయన ఈశ్వర, దేవ, సోమ, సూర్య, బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైన నామాలకు ఉత్పత్తి అర్ధాలను తన సత్యార్థ ప్రకాశమనే గ్రంథంలో రాసి పెట్టారు. ఈ గ్రంథం ఋక్, యజు స్సామ, అధర్వవేదముల ఆధారంగా రాశారు.
వీటిని చదివి, గురుకుల ఆర్య సమాజ నిర్మాణ ఆవశ్యకతను గమనించిన మాన్యులు డా॥ సర్వేపల్లి రాధాకృష్ణగారు భారత నిర్మాతలలో దయానంద సరస్వతి ఒకరని వ్యాఖ్యానించారు. అంతటి గొప్ప దార్శనికులు స్వామిదయానంద సరస్వతి.
మరొక విశేషం ఏమిటి అంటే? దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించినప్పుడు అది సక్రమంగా కొనసాగేందుకు దశ నియమాలతో అవగాహన ఉండేలా ఒక నియమావళిని రూపొందించారు. ఆ నియమావళి లేకపోతే ఆర్య సమాజం ఇంతవరకు కొనసాగక పోయేది అని ఖచ్చితంగా చెప్పవచ్చు! ఈ నియమాలు ఎంతో గొప్ప నియమాలు. ఎందుకంటే? వీటిల్లో కర్తవ్యాన్ని, మార్గదర్శనాన్ని కూడా చేశాయి. ఈ నియమాలు చదివితే చాలు. ఆర్య సమాజం గొప్పదనం తెలుస్తుంది.
వేద ధర్మాలు ప్రచారం చేయడం అనేది మామూలు మాట కాదు! అన్ని కాలాలలోనూ అన్ని ప్రదేశాలకు తగినట్టుగా వేదం ఉంటుంది. ఎందుకంటే వేదం యొక్క ముఖ్య ఉద్దేశమే ప్రపంచానికి మేలు చేయడం కదా! ఎక్కడెక్కడ మానవజాతి నివసిస్తుందో అక్కడక్కడ వేద వాక్కులు అవసరమౌతాయి! ఈ ఉపకారమనేది శరీర ఉన్నతికే కాక, ఆత్మ ఉన్నతికి , సమాజం ఉన్నతికి కూడా ఎంతో ముఖ్యం. అంతేకాదు ఈ ఉపకారం జాతి, మతం, కులం, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉపకారం తలపెట్టే వేదం, అటు మానవజాతికే కాకుండా భూతయజ్ఞంలో భాగంగా ఏ ప్రాణిని హింసించకూడదని ఆదేశిస్తుంది.. అంటే మనుషులకే కాదు అన్ని ప్రాణులకు ఉపకారం చేయాలని లక్ష్యం ఉన్న వేద సంస్కృతి సాగించాలనే లక్ష్యం ఉన్న ఈ సంస్థ స్వార్థం లేకుండా సంకుచిత భావంలేకుండా కొనసాగడానికి ఈ నియమాలు ఎంతో ఉపకరిస్తాయి.
స్వామి దయానంద సరస్వతి ఇలా వేదమంత్రాలకు భాష్యం రాసి వాటి ఆధారంగా వైదిక ధర్మాలను ప్రచారం చేయడం ప్రారంభించారు. హిందూ ధర్మ సంస్కృతికి వేదమే మూలమని వేదపఠనం చేయాలని వేదం వినాలని ఒక నియమం పెట్టారు.
అలా వేదం ద్వారా సత్యమేమిటో తెలుసుకోవచ్చని, అంటే (సత్యం అంటే భగవంతుడే సత్యం) ( ఆర్య జగత్తుకు నిమిత్త కారణం పరమేశ్వరుడు) ఇంకా స్పష్టంగా తెలిపేందుకు సృష్టికర్త ఆధారం పరమేశ్వరుడే అనేందుకు ఒక ప్రమాణాన్ని ఇలా తెలియజేశారు.
యతో వా ఇమాని భూతాని జాయంతే
యేన జాతాని జీవంతి యత్ప్రయంత్యభి–
సంవింశంతి తద్విజిజ్ఞాసస్య తద్రబ్రహ్మ
తై.ఉ.భృ.8-1
భావమేమిటంటే.. ఏ పరమాత్మ రచన చేత ఈ సమస్త పృథ్వివ్యాది భూతములు ఉత్పన్నమవుచున్నవో? ఎవని జీవనమును- ఎవని యందు ప్రళయం పొందుచున్నదో అతడే బ్రహ్మము అని ఇష్టంగా చెప్పు!!
ఇలా ఈ సృష్టికర్త, రక్షణము చేయువాడు పరమేశ్వరుడని శృతి -స్మృతి ఎన్నో ప్రమాణములను చెప్పింది.
దయానందుల వారు ఈ జగత్ వ్యాపారానికి మూలం పరమేశ్వరుడని బోధించేవారు. సంపూర్ణ జ్ఞానానికి, జ్ఞానంవల్ల తెలియపడే సమస్త ఙ్ఞేయ ( తెలియదగినది) పదార్థాలకు ఆదిమూలం కూడా పరమేశ్వరుడే! ఎలా అంటే?
ఋగ్మంత్రం
ఋతంచ సత్యం చాభీద్ధాత్తపసోధ్యజాయత (1-190-1)
ఇటువంటి మంత్రాలతో పది నియమాలు ఏర్పరిచారు.
ఒకచోట
పరమేశ్వర నిర్వచనం ఇలా చేశారు.
య ఈశ్వరేషు సమర్ధేషు పరమః శ్రేష్ఠః *పరమేశ్వరః అని… అంటే సమర్థవంతునకు ఈశ్వరుడని పేరు. సమర్థులలో సమర్థుడై తనతో సమానుడైన వాడెవ్వడు లేని వాడని, వాడిని పరమేశ్వరుడు అని అంటారు. సమర్ధత అంటే స్వభావాలలో వ్యవహారాలలో అందరికంటే అధికుడిని శ్రేష్ఠుడు అని అంటారు. ఇటువంటి శ్రేష్టుల అందరిలో అత్యంత శ్రేష్టుడు పరమేశ్వరుడని, అతనితో సమానమైన వాడు లేడని, ముందు రాబోడని అర్ధమని సత్యార్థ ప్రకాశిక లో పరమేశ్వర పదాన్ని వివరించారు.
వీరి నియమాలను చదివినప్పుడు పెద్దలకు అనిపించిన భావాన్ని వారి ఉపన్యాసాలలో మనం విన్నప్పుడు… మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే? వేదం అపౌరుషేయమని, ఈశ్వరీయమని, పరమేశ్వరుడే కార్య జగత్తుకు నిమిత్త కారణమని, కారణరూపంలో జగత్తు సత్యం అని తెలుస్తుంది. ఇంత గొప్పవిశేషాంశాలన్నీ తమ నియమాలలో తెలిపారు.
జీవులు చేసిన పుణ్యపాపాలన్నింటికీ సుఖదుఃఖ రూప ఫలాన్ని ఈశ్వరుడిస్తాడని, ఏ ఒక్క కర్మ కూడా ఫలము అనుభవించకుండా నశించదని, తన న్యాయకారి శబ్దానికి నిర్వచనం చేశారు.
ఈశ్వరునికి జన్మ లేదనడానికి వేద శాస్త్ర ప్రమాణాన్ని మనం ఎక్కువగా వినే ఒక మంత్రంలో చక్కగా వివరించారు. ప్రజాపతి శ్చరతి గర్భే అంతరజాయ మానో బహుధా విజాయతే ( యజు -31 -19 )
అంటే ప్రజాపతి గర్భస్థ జీవుని యందు వ్యాపించి ఉన్నాడు- స్వస్వరూపంతో అనుత్పన్నుడైనా అనేక ప్రకారములతో యోగుల అంతఃకరణములలో విశేషముగా కనపడుచుండును అని భావం.
వీటన్నిటి వలన పరమాత్మ పుట్టుక లేనివాడని తెలుస్తుంది.
ఉపాసనా పద్ధతులు వాటి ఫలితాలు మొదలైనవి కూడా ఈ నియమాలలో ఉన్నాయి.
వేదం సమస్త విద్యల గ్రంథం. దీనిని చదవాలని, చదివించాలని, వినాలని, వినిపించాలని ఇది శ్రేష్ఠులు ఆచరించే పరమధర్మమని సందేశాన్ని ఇచ్చారు. ఇలా వేద పఠనం జరగాలంటే వేదం (గ్రంథం) ప్రతి ఇంట్లోనూ ఉండాలని, లేకపోతే ఉత్తముడు కాడని తన నియమాలలో తెలిపారు. ఎందుకంటే పురాణాలు, రామాయణం, భగవద్గీత మొదలైన గ్రంథాలు వేదాలను గురించి చెప్తున్నాయి. ఇవి చదువుతున్నారు.. కానీ వేదం ఎందుకు చదవడం లేదని అంటే మధ్యకాలంలో ఎవరిష్టం వచ్చిన మతాన్ని వారు అనుసరించటం వల్ల వాటిని చదవడం మానేశారని, దాంతో వేదం మరుగున పడిందని, దాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఈ నియమాలలో చేర్చారు. దీని వెనుక ఒక గొప్ప ఆశయం ఉన్నది! అది ఏమిటంటే? వేదం ఉంటేనే హిందువులంతా ఒకే సూత్రంపై నడవాలని… నడుస్తారని.. అనే ఈ ఆలోచన దయానంద సరస్వతికి మాత్రమే వచ్చింది. అందుకే తన సత్యార్థ ప్రకాశం
ఏడవ సమూల్లాసంలో “ఎవరైనను నీ మతమేమని? ప్రశ్నించినచో… నా మతము వేదమతము! దానిలో ఏముందో దాన్ని ఆచరిస్తామని” సమాధానము ఇయ్యవలెను అని రాసారు.
మానవ జాతిని ఉద్ధరించడానికి, దేశ క్షేమం కోసం ఎంతో కష్టపడి వేదమంత్రాల అర్థాలను చెప్పడానికి… బ్రాహ్మణములు చదివి వాటికి, వేదములకు వ్యాఖ్యానాలు రాసిన ఋషుల వంటి వారు స్వామి దయానంద సరస్వతి.
వేద విధి ప్రకారం సత్యం గ్రహించి, అసత్యాన్ని వదిలేయాలని మరో నియమంలో చెప్పారు.
सतय कं ग्रहण कर ने और असत्य को छोड़ने मे सर्वदा उदयत रहना चाहिए।* భావమేమిటి అంటే? సత్యము గ్రహించుటకు- అసత్యము త్యజించుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి! అని…
మనం నివసించి ఉండే ఈ జన్మలోనూ… వచ్చే జన్మలలోను.. పరలోకంలోనూ.. అభివృద్ధి, నిశ్రేయసనము- మోక్షము కావాలనుకునే వారు జీవితాన్ని ఒక వ్రతం వలె గడపాలని, అందులోనూ సత్యం ముఖ్యమైనదని చెప్పారు.
స్వామి దయానంద సరస్వతి సంఘశాంతికి ఎంతో కృషి చేశారని ముందే చెప్పుకున్నాం కదా! తన యొక్క తపశ్శక్తితో మంత్రార్ధం తెలుసుకొని వేదాలకు భాష్యం రాశారు.
దాంతో అశాంతి ఎందుకు కలుగుతున్నదో కారణం తెలుసుకొని, దానికి ఉపాయం మిధ్యారూపణ అని తన భూమికలో
సత్యాన్ని సత్యముగా- మిధ్యను మిధ్య
గా ప్రతిపాదించడానికి సత్యార్థ ప్రకాశం రాసానని, అందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే సత్యమని, ఎవరైనా పక్షపాత దృష్టితో అసత్యాన్ని- సత్యంగా ఋజువు చేయాలనుకుంటాడో.. అతను సత్యాన్ని చూడలేడు!” అని నిర్ధారణ చేశారు.
ఈ వాక్యాలతోనే దయానందుల వారి సత్యాభిలాషిత్వం తెలుస్తుంది.
సత్యమేవ జయతే నానృతం
సత్యేన పంథా వితతో దేవయానః
అనే సూక్తికి కట్టుబడి ఉన్నారు. ఈ విషయం తన స్వమంత వ్యామంతవ్య ప్రకాశంలో రాసారు.
ఇలా సంఘం శాంతిగా ఉండాలంటే సత్యం ముఖ్యమని దాన్ని తప్పక ఆచరించాలని తన నియమాలలో చెప్పారు. దీన్ని ఆచరించాలంటే దృఢ సంకల్పం, స్వాధ్యాయం ఈశ్వర ప్రణిదానం అవసరమని వాటిని ఇవ్వమని భగవంతుని ప్రార్థించి పొందాలని తెలిపారు.
స్వాధ్యాయము= స్వస్య + అధ్యాయః =స్వాధ్యాయః = బాగా చదువవడం.
ఈ సత్యాన్ని పరిక్షించేదుకు మరో ఐదు పద్ధతులను సూచించారు.
సర్వ కార్యాలను ధర్మానుసారంగా చేయాలని, అంటే సత్యాసత్యాలను విచారించి చేయాలని, మరో నియమంలో సూచించారు. గుడ్డి నమ్మకంతో కాక బుద్ధిని ఉపయోగించి విచారించి కర్మలు ఆచరించాలని భావం…
ధర్మ ఏవ హతోహన్తి ధర్మో రక్షతి రక్షితః ౹
తస్మా ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతవధీత్॥ మను – 13 -15.
అంటే ధర్మహానే జీవనహాని, ధర్మరక్షణే- జీవన రక్షణ… కాబట్టి ధర్మానికి హాని కలిగించకూడదు! హత ధర్మము మానవ జీవనమును హతము చేయకుండగాక! అని ఈ మంత్ర భావము.
ఇలా సత్య- ధర్మాల గురించి ఎన్నో మంత్రాలలో వివరించారు.
సమాజానికీ, ప్రపంచానికీ ఉపకారం చేయాలని అంటే శరీరోన్నతికి -ఆత్మోన్నతికి- సామాజికోన్నతికి పాటుపడాలని నియమం ఏర్పాటు చేశారు.
ఈ ఉపకారాలను మూడు రకాలుగా చేయవచ్చని, ప్రాణుల శక్తులను వృద్ధిపరచడం, ఆత్మోన్నతి సాధించడం, ఎలా ఐతే తన కుటుంబాన్ని ఉన్నతిగా నిలబెట్టడానికి తాము ప్రయత్నిస్తారో? అలాగే సమాజంలో ఉన్న మూఢాచారాలను తొలగించడానికి అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని, ఆలోచించి, ఐకమత్యంగా సాధించాలని, సమాజ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందించాలనే నియమం పెట్టారు.
మనిషి సంఘజీవి కనుక ఇతరుల సహకారంతోనే తాను ఎదుగుతాడు కనుక వారితో ప్రవర్తించే తీరు ప్రేమగా, ధర్మానుసారంగా, యోగ్యతగా ఉండాలని, అంటే స్వ- పర బేధం లేకుండా అందరితో కలిసికట్టుగా ఉండాలని ఈ నియమం చెప్పింది.
అయితే ఇవన్నీ చేయడానికి విద్య ఆవశ్యకత ఎంతో అవసరమని, అవిద్యను తొలగించి విద్యను పెంచాలని మరో నియమంలో చెప్పారు.
అనిత్యా శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి రవిద్యా…* (యో.ద.2-5)
అంటే అనిత్యమును- నిత్యమని; అశుచిని- శుచి అని; దుఃఖాన్ని- సుఖమని; అనాత్మను- ఆత్మ అని తలవడమే అవిద్య అని అంటారు. దీని గురించి విశేషంగా చర్చించారు…
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖభాగ్భవేత్॥
అర్థం ఏమిటి అంటే? సమస్త జనులు ఆరోగ్యంగా ఉండి, సుఖాలను, శుభాలను సదా పొందుదురుగాక! ఏ ఒక్కరు దుఃఖమును పొందకుండు గాక! అనే దివ్య భావనలతో కలిసి మెలసి ఉండాలని నియమం రాశారు.
ఇదే కదా! తన ఉన్నతితో పాటు సమాజం యొక్క ఉన్నతికి పాటు పడగలగడం
మరో నియమంలో ప్రతి వ్యక్తి తన ఉన్నతితోనే సంతృప్తి చెందక అందరి ఉన్నతిలోనే తన ఉన్నతి ఉందని అనుకోవాలని నియమం ఏర్పాటు చేశారు. మంత్రంతో విశేషించి చర్చించారు. జగత్ అంటే ప్రపంచంలో ఏ మాత్రం పదార్థం ఉన్నా అది చలనంలోనే ఉంటుందని దాని ఆధారంగా విస్తారంగా రాసారు.
అయితే తే వ్యక్తి ధర్మానికి -సమాజ ధర్మానికి విరోధ భావం కలిగితే… ఏ మార్గాన్ని అవలంబించాలి? అనే సందేహం కలిగినప్పుడు మరో నియమంలో ఆసందేహ నివృత్తిచేసారు.
మనిషి సంఘజీవి కనుక తనకు ఏది మంచిదనిపిస్తుందో దాన్ని పాటించడం మంచిదే కానీ, దాని వల్ల సమాజానికి కీడు కలుగకూడదని, తనకు మాత్రమే లాభం కలిగేవి సమాజహితానికి ఉపయోగపడకపోతె మానుకోవాలని నియమాన్ని రాసారు.
ఇలా స్వామి దయానంద సరస్వతి సదా సమాజ శ్రేయస్సు కొరకే పాటుపడుతూ , అధర్వణ, యజుర్వేదం భాష్యం చేసిన భాష్యకారుడు దయానందులు.
వేద ధర్మాలు ప్రచారం చేస్తూ… తన వాదనలను, ఉద్యమాన్ని కొనసాగిస్తూ హిందూ ధర్మానికి పిలుపు నివ్వడంతో కొందరికి కంటగింపుగా మారాడు. ఎన్నోసార్లు విషప్రయోగాలు జరిపారు. యోగ క్రియల ద్వారా విషాన్ని ప్రక్షాళన చేసుకుని బతకగలిగారు. కానీ చివరకు 1883 – 10 -30 న దీపావళి రోజున సాయంత్రం విష ప్రయోగంతో క్షీణించి, ఓంకారం చేస్తూ.. సమాధి అవస్థలో మోక్షాన్ని పొందారు.
వంద సంవత్సరాలు దాటి ఎంతో కాలమైనా.. దయానందులు స్మరణీయులే! అంతేకాదు సంఘ శాంతినే కాంక్షించిన ఋషి తుల్యులు స్వామి దయానంద సరస్వతి గారి కృషిని భారతీయ జాతి ఉన్నంత కాలం మరచిపోదు!
ప్రతి హిందువు మదిలో శాశ్వతంగా సుస్థిరంగా నిలిచిపోయే మూర్తిమత్వం వర్ధంతి సందర్భంగా నమస్సుమాంజలులు అర్పిస్తూ…

September 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni September 23, 2024
written by Narendra Sandineni

ముదిగొండ ఈశ్వర చరణ్ తొలి ఉషస్సు మెరిసింది కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాష ఉపన్యాసకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఆదిలాబాద్,ముదిగొండ ఈశ్వర చరణ్ కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని తొలి ఉషస్సు మెరిసింది కవిత పై విశ్లేషణా వ్యాసం.స్పందన కవితా సంపుటిలో ముగ్గురు కవులు కవితలను రాశారు.అందులో మొదటి కవి ముదిగొండ ఈశ్వర చరణ్,రెండవ కవి మాదాడి నారాయణరెడ్డి,మూడవ కవి ముదిగొండ వీరేశలింగం.స్పందన కవితా సంపుటిలోని ఈశ్వర చరణ్ రాసిన మొదటి కవిత తొలి ఉషస్సు మెరిసింది.తొలి ఉషస్సు మెరిసింది కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.తొలి ఉషస్సు ఎలా మెరిసింది? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.తెలతెల వారుతుండగా ఆకాశంలో సూర్యబింబం యొక్క కాంతిని చూసి ఎందుకో తెలియదు కానీ మనసులో ఆనందిస్తాం.సూర్యునికి అర్ఘ్యమిచ్చి శక్తిని ప్రసాదించమని వేడుకుంటాం. తూర్పున ఉదయించిన సూర్య కాంతి రేఖలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి. సూర్యోదయాన్ని చూడడం వల్ల ఒక రకమైన చైతన్యం మరియు ఉత్సాహంతో కూడిన నూతనత్వం మనిషిలో మేలుకుంటుంది.కవి ఈశ్వర చరణ్ రాసిన తొలి ఉషస్సు మెరిసింది కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“తొలి ఉషస్సు మెరిసింది
“తొలి ఊహ విరిసింది
“తరళమై సరళమై
“అరుణమై కరుణమై
“తొలి ఉషస్సు మెరిసింది
“తొలి ఊహ విరిసింది.
ఉషస్సు అనగా ఉషోదయం,ప్రభాతం,ప్రత్యూషం, ప్రాతః కాలం,తెల్లవారుటకు ముందు నాలుగు ఘడియల కాలం అని అర్థాలు ఉన్నాయి.ఉషస్సు ప్రపంచంలో ప్రతి రోజు తొలి వెలుగును ప్రసరింపజేస్తుంది.ఉషస్సు చీకటిని తరిమి కొడుతుంది.ఉషస్సు చెడును నిర్మూలిస్తుంది. ఉషస్సు మనిషి జీవితాన్ని చైతన్య పరుస్తుంది. ఉషస్సు తన కాంతితో ప్రకృతిలో కదలికలను తెస్తుంది.ఉషస్సు ప్రతి ఒక్కరిని వారి విధులను నిర్వర్తించుటకు ప్రేరేపిస్తుంది.సూర్యుడు అన్ని జీవులకు ప్రాణం,చర్య మరియు శ్వాస యొక్క ప్రేరేపకుడు.ఉదయాన ఆకాశాన వెలసిన సూర్యుని చూసి తొలి ఉషస్సు మెరిసింది అన్నాడు కవి.వర్షం పడే ముందర ఆకాశం మెరుస్తుంది.ఆకాశంలో మేఘాలు గర్జిస్తాయి.మేఘాలు మెరుపులతో ఆకాశమంతట వ్యాపిస్తాయి.ఉరుములు మెరుపులతో ఆకాశం బీభత్సంగా ఉంటుంది.వర్షం పడగానే నేల తల్లి పులకిస్తుంది.నెమలి పురి విప్పి ఆడుతుంది.తన మనసులో రెక్కలు విప్పిన ఆలోచనలను చూసి తొలి ఊహ విరిసింది అన్నాడు.సూర్య కాంతిని చూడగానే అతని మనసులో ముప్పిరిగొన్న ఆలోచనల్లో తొలి ఊహ వికసించింది.ఊహ అనగా మనసులో గోచరించే దృశ్యం.మనసులో కలిగే ఒక వ్యక్తీకరణ,సరదా ప్రేమ మరియు జీవితాన్ని సృజనాత్మకతతో ఆలోచించడం ఊహ.ఊహ పట్ల జాగరూకత కలిగి ఉండుట మంచిది.చూడని లేదా వినని మాటలను చూచినట్టు మనసులో అనుకోవడం ఊహ. జరగడానికి అవకాశం లేని ఒక ఆహ్లాదకరమైన దానిని గురించి ఆలోచిస్తూ ఆనందిస్తూ ఉంటాం. అటు వంటి విషయాల గురించి ఆలోచించే చర్య ఊహగా చెప్పవచ్చు.కొన్ని సార్లు ఊహ వాస్తవ ప్రపంచం నుండి ముఖ్యంగా మధ్య యుగాల చరిత్ర నుంచి వచ్చిన ఆలోచనలు,సంఘటనలతో కూడి ఉంటుంది.ఊహ నుంచి జనించినవే మన అరువది నాలుగు కళలు.మనిషి మనస్సు నుండి తొలి ఆలోచన వికసించింది.మనిషి మనస్సును ఆలోచనలు ప్రభావితం చేస్తుంటాయి.చెట్లపై పువ్వు విరిసింది అంటాం.కవి ఇక్కడ తొలి ఊహ విరిసింది అన్నాడు.మనిషి మనసులో పుట్టిన ఆలోచన మొగ్గగా రూపు దాల్చి ఊహ అనే పూవుగా వికసిస్తుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.తరళం అంటే ప్రకాశం.ఏదైనా అతిగా కావాలనుకోకుండా జీవించడం సరళం.మానవ జీవన శైలిలో సరళత అనేది సాధారణ జీవన శైలిని కలిగి ఉండటం అని చెప్పవచ్చు.సరళత అందం, స్వచ్ఛత లేదా స్పష్టతను సూచిస్తుంది.అరుణము అంటే ఎరుపు క్రిమ్సన్ కలర్,సంధ్యారాగము అనే అర్థాలు ఉన్నాయి.ఉదయించే సూర్యుడి వర్ణం అరుణం.కరుణ అనగా కనికరం,కృషి అనే అర్థాలు ఉన్నాయి.కరుణ అనగా దయాగుణం. దుఃఖితాత్ముల యందు పరితపించుట కరుణ. మరొకరి బాధను తగ్గించాలనే కోరిక కరుణ.ఒక మనిషి దుఃఖముతో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది కరుణ.దయా దృష్టితో ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన కరుణ.కవి ఈశ్వర చరణ్ తొలి ఉషస్సు చూసిన క్షణంలో తొలి ఊహ జనించింది.మనసులో కలిగిన భావన కాంతివంతం, ప్రకాశంతో సులభం అయినదిగా,ఎరుపు రంగు దాల్చినదిగా దయాళువుగా రూపు దిద్దుకొని తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“శోకమై శ్లోకమై
“కావ్య రస హేలయై
“అంతరమ్ములను బాసి
“అంతరంగముల చూసి.
శోకం సాధారణంగా ఏడవటం అనే చర్యను సూచిస్తుంది.దుఃఖం,బాధ కలిగినప్పుడు వచ్చేది శోకం.మనసు కలత చెందడం శోకం.ఏదైనా పనిలో మనసు నిమగ్నం చేయలేకపోవుట శోకం.ఏదైనా బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు కార్చుతూ కుమిలిపోవడం శోకం.
మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీసమాః
యత్ క్రౌంచ మిథునాదేకమ్ అవధీః కామ మోహితమ్.ఓ బోయవాడా!కామ మోహితమై యున్నటు వంటి క్రౌంచ పక్షుల జంట నుండి ఒక దానిని ఏ కారణం చేత హతమార్చితివో,ఆ కారణము చేత నీవు ఎక్కువ సంవత్సరములు జీవించియుండుట ప్రాప్తించకుండును గాక.ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం.వేదన నుండి వచ్చిన దుఃఖం శ్లోకంగా రూపు దాల్చినది.కవి హృదయంలో చెలరేగిన సంఘర్షణ శ్లోకంగా మారింది.కావ్య రస భావ వికారముల వంటి లక్షణాలు మనుషుల మధ్య గల నీది,నాది అనే తరతమ భేదాలను రూపుమాపి,మనిషిలో వెల్లువెత్తిన విశాల దృక్పథాన్ని కలిగించి మనసులను ఏకం చేస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“గానమై తానమై
“సంగీత స్నిగ్ధ సారమై
“భాషా భేషజాలను దాటి
“జాతి మతాల గోడలను దూకి.
గానము అనగా గీతము,పాట,పలుకబడినది. తానము అనగా స్నానము,స్థానము.సంగీతం Music శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ.సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది.ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది.సంగీతం సుప్రసిద్ధమైన చతుష్షష్టి కళలలో ఒకటి.సంగీతం ప్రాథమిక లక్షణాలైన శృతి,రాగం,తాళం పల్లవి మొదలైన లక్షణాలతో కూడి ఉంది.సంగీతం ఆ దేశ సంస్కృతి సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్దిష్టమైన సాహిత్య పరంగా రచింపబడిన రాగాలకు నిబద్దితమై ఉంటుంది. శాస్త్రీయ సంగీతంలో రాగాలు అనంతమైనవి.కొన్ని
పాడే వారిని బట్టి మారుతుంటాయి.సంగీతం సాహిత్యంలో మేళవించబడి నాట్యం,నాటకం, లలిత కళలు,సినిమా మొదలైన దృశ్య కావ్యాలుగా మలచబడ్డాయి.సంగీతం అనేది శాస్త్రీయ సంగీతం,జానపద సంగీతం,భక్తి సంగీతం మరియు సమకాలీన సంగీతంతో సహా వివిధ రకాల సంగీత రూపాలను కలిగి ఉంటుంది.ఇది ధ్వని మరియు లయ కళను సూచిస్తుంది.సంగీతం తెలుగు సంస్కృతి సంప్రదాయంలో అంతర్భాగంగా ఉంది.పాట రూపంలో లయాత్మకంగా సంగీతంతో తడిసిన సారం మరియు భాషల పట్టింపుల భేషజాలను దాటి,జాతి మతాలు అనే అడ్డుగోడలు తొలగిపోయి తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వరచరణ్ వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“లోకమై నాకమై
“నాక ధునీ పూతమై
“మనిషి లోగుట్టు దాటి.
లోకం విశాల విశ్వంలో భాగం.జీవులు నివసించే ప్రదేశం.పురాణాలను అనుసరించి మొత్తం పదు నాలుగు లోకాలు ఉన్నాయి.నాకము అనగా నక్షత్రాలు,చంద్రుడు,సూర్యుడు మొదలైనవి ఉండే శూన్య ప్రదేశం.అకం అంటే దుఃఖం.అకం లేనిది నాకం పూర్తిగా ఆనందమయమైనది.నాకం అంటే స్వర్గం.ఇహ లోకంలో ఉండే శారీరక బాధలు, జరాదులు లేనిది నాకం.లోకం స్వర్గమై,గంగా నదితో పవిత్రతను పొంది మనిషి హృదయాల అట్టడుగున దాగి ఉన్న రహస్యాలను,మనసుల లోతులలో అణగి ఉన్న భావాలను స్పందింప జేయడం ద్వారా తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“క్రాంతమై శాంతమై
“సౌమనస్యపు క్రాంతియై
“విషదంష్ట్రలను పూడ్చి
“సర్ప దష్టులను గూర్చి.
క్రాంతి అంటే క్రమణం,కాంతి,విప్లవం,వెలుగు, తిరుగుబాటు.రత్నాల నుండి వెలువడే వెలుగు క్రాంతి.శాంతం ఒక రసం,శాంతి పొందినది. నూతనత్వాన్ని కలిగినది.శాంతితో కూడినది.స్నేహ కాంతుల వెదజల్లినది.విషపూరిత కోరలను కనుమరుగు చేసినది.బాధాసర్ప బాధితులను గూర్చి వివరించినది అయి తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వరచరణ్ చెప్పిన భావం చక్కగా ఉంది.
“చాపమై శాపమై
“క్రోధారుణతా క్రాంతమై
“దానవతకు సమాధి కట్టి
“మానవతకు విలువ కట్టి.
చాపము అనగా ధనుస్సు,విల్లు బాణాలను విసరటానికి ఉపయోగించే ఒక రకమైన ఆయుధం.విల్లు మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన ఆయుధాలలో ఒకటి.విల్లు వేల సంవత్సరాల నాటిది.విల్లులు వివిధ సంస్కృతులలో,వివిధ కాలాలలో వేట, యుద్ధం, క్రీడల కోసం ఉపయోగించబడ్డవి.వేటగాడు పక్షులను జంతువులను వేటాడడానికి బాణాలను ఎక్కుపెట్టే సాధనం విల్లు లేదా చాపం.శాపము అనగా తిట్టు ఒట్టు అని అర్థాలు. ధనుస్సుగా రూపొంది దుష్టుల పాలిటి శాపం అయి,కోపపు ఎరుపుదనమును పొంది, రాక్షసత్వానికి గోరీ కట్టి మానవత్వపు విలువను పెంచడానికి తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“రుచియై శుచియై
“సర్వ జనాస్వాద్యమై
“మమతకు పందిరి వేసి
“సమతకు ప్రాణం పోసి.
రుచి మనం భుజించే ఆహార పదార్థాల ముఖ్య లక్షణం.రుచిని నాలుక గుర్తిస్తుంది.రుచులు ఆరు. వీటిని షడ్రుచులు అంటారు.అవి మధురం తీపి, ఆమ్లం పులుపు,లవణం ఉప్పు,కటువు కారం, తిక్తము చేదు,కషాయము ఒగరు.శుచి అంటే పాపహీనమయ్యే స్థితి లేక భావం.మమత అనగా అనురాగం,ప్రేమ,అభిమానం,అప్యాయత,ప్రీతి, మాతృ ప్రేమ,లోతైన బంధం.సమత కావ్య గుణములలో ఒకటి.సమత అంటే సమానత్వం. ఇంపు అయినది,శుభ్రం అయినది,ప్రజలందరికీ అనుభవ యోగ్యమై,ప్రేమ,అనురాగాలకు పందిరి వేసినది.సర్వ మానవాళి సౌభ్రాతృత్వం, సమానత్వానికి ప్రాణం పోస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం గొప్పగా ఉంది.
“రౌద్రమై భద్రమై
“విశ్వ కళ్యాణ హేతూద్భవమై
“చైతన్య స్మృతులను రేపి
“కళ్యాణ శ్రుతులను చూపి.
రౌద్రం నవరసములలో ఒకటి.రౌద్రం అంటే భయంకరమైనది,కల్యాణప్రదమైనట్టి,విశ్వ మానవ శ్రేయస్సుకు కారణమై తొలి ఉషస్సు పుట్టినది. చైతన్యంతో కూడిన జ్ఞాపకాలను రేకెత్తించినది. మంగళప్రదం,ప్రబోధాత్మకం అయిన భావాలను ప్రకటిస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“తరతరాలు యుగయుగాలు
“పరిఢవించ పరిప్లవించ
“తొలి ఉషస్సు మెరిసింది
“తొలి ఊహ విరిసింది.
ప్రజలు తరతరాల నుండి అన్ని యుగాలలో అభివృద్ధి పథంలో పురోగమించునట్లు ప్రేరేపిస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది. ముదిగొండ ఈశ్వర చరణ్ తేది 29 – 09 – 1937 రోజున సిద్దిపేట జిల్లాలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు రాజేశ్వరి దేవి,నందికేశ్వర చరణ్.వీరు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినారు.వీరు అమ్మమ్మ మరియు మేనమామ ఇంట పెరిగారు.వీరి వివాహం పదహారు సంవత్సరాల వయస్సులో
ఇందిరా చరణ్ తో జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు కలరు.పెద్ద కుమారుడు రాజా మల్లికార్జున చరణ్ భార్య శైలజ.రాజా మల్లిఖార్జున చరణ్ కిరణ్ ప్రింటర్స్ నడిపించే వారు.వీరు అనారోగ్యంతో తేది 17 – 01 – 2020 రోజున ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు.రాజా మల్లిఖార్జున చరణ్ శైలజ దంపతులకు ఒక్కడే సంతానం శ్రీహర్ష.
చిన్న కుమారుడు శ్రీకాంత్ చరణ్ భార్య సంగీత. వీరికి ఇద్దరు పిల్లలు హిమాంశు,ప్రత్యూష.శ్రీకాంత్ చరణ్ మేనేజింగ్ డైరెక్టర్ గా Good Health insurance Company TPA Ltd. లో ప్రస్తుతం పని చేస్తున్నారు.
పెద్ద కుమార్తె గట్టెపల్లి అపర్ణ భర్త కుమార స్వామి. కుమార స్వామి తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సర్వీస్ లో ఉండగానే అనారోగ్యంతో తేది 01 – 07 – 1992 రోజున ఈ లోకాన్ని వీడి పోయారు.వీరికి ఇద్దరు పిల్లలు.కుమార్తె దీప్తి, కుమారుడు ధీరజ్ కుమార్.అపర్ణ కొండపాక,సిద్దిపేట జిల్లా ఎం.పి.డి.ఓ.గా పని చేసి తేది 31 – 08 – 2019 రోజున రిటైర్ అయ్యారు.
చిన్న కుమార్తె శాస్త్రుల కిరణ్మయి భర్త విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఆంధ్రా బ్యాంక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ co-ordinator గా పని చేసి రిటైర్ అయ్యారు.వీరు ప్రస్తుతం అందులో ఎగ్జామినర్ గా Part-time job చేస్తున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు,కుమార్తె హిమజ,కుమారుడు మనోజ్ కుమార్. కిరణ్మయి ప్రభుత్వ పాఠశాల,దుద్దెడ గ్రామంలో ఆంగ్ల భాషా ఉపాధ్యాయిని స్కూలు అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.ఈశ్వర చరణ్ భార్య ఇందిరా చరణ్ తేది 04 – 03 – 2018 రోజున ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.ఈశ్వర చరణ్ సిద్దిపేటలో పి.యు.సి. వరకు చదివి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.వీరు ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి చదువు మీద ఉన్న ఆసక్తితో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సిద్దిపేటలో చేరి బి.ఏ. డిగ్రీ పూర్తి చేశారు.వీరు ట్యూటర్ గా పని చేస్తునే ఎం.ఏ. తెలుగు చదివారు.వీరు సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ట్యూటర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి వివిధ హోదాలలో పని చేస్తూ లెక్చరర్ గా పదోన్నతి పొందారు.వీరు 1972లో ఆదిలాబాద్ జిల్లా డిగ్రీ కళాశాలకు బదిలీపై వెళ్లారు.వీరి సహ అధ్యాపకులు మాదాడి నారాయణరెడ్డి,ముదిగొండ వీరేశలింగం. వీరు ఆదిలాబాద్ జిల్లా గ్రామ నామాలపై ఉస్మానియా యూనివర్సిటీలో పి.హెచ్.డిలో ప్రవేశం పొంది కొన్ని అనివార్య కారణాలవల్ల పూర్తి చేయ లేక పోయారు.ఈశ్వర చరణ్ విద్యా గురువులు డాక్టర్ కోవెల సంపత్కుమారాచార్య గారు,ఆచార్య పరాంకుశం గోపాలకృష్ణ మూర్తి గారు.వీరి అభిరుచులు చదవడం,వ్రాయడం,విమర్శన.
ఈశ్వరచరణ్ ముద్రిత రచనలు:
విశ్వనాథ తారావళి,శరభేశ్వర తారావళి,శ్రీగిరి శతకం,వివేక వాణి,శైవలిని,వెలుతురు (వచన కవితలు),నవమి వ్యాస సంపుటి,వ్యాసపీఠం వ్యాస సంపుటి,ఈ రెండు కాకతీయ విశ్వవిద్యాలయం వారిచే పాఠ్య గ్రంధాలుగా ఎంపిక చేయబడినవి. ఎఱ్ఱన జన జీవితము – సమాలోచన పక్ష పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది.
వీరి అముద్రిత రచనలు :
వ్యాస కాశి – ధార్మిక వ్యాసాలు,జాతి – జాతీయత, దీనదయాళ్ ఉపాధ్యాయ గారి హిందీ వ్యాసాల తెలుగు సేత.తిష్య రక్షిత (నవల) ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితం.
భారతి సాహిత్య మాస పత్రికలో ప్రచురింపబడిన వీరి వ్యాసాలు.
1)ఉదంకుని కథ వ్యాసం – 1984.
2) మినీ కవిత వ్యాసం – 1985.
3) పాత రోతయేనా వ్యాసం -1986.
వేయి పడగలు కథా నాయకత్వం వ్యాసం – 1984లో సాధన సాహితీ పక్షపత్రికలో ప్రచురింపబడినది.
సమాలోచన సాహితీ పక్ష పత్రికలో ప్రచురింపబడినవి.
1) తెలుగు సాహిత్యంలో గాంధీ వ్యాసం – 1985.
2) కవిద్వయం ద్రౌపది వ్యాసం – 1985.
3) వేయి పడగలు సామాజిక దృక్పథం వ్యాసం –
1985.
4) అచ్చ తెనుగన్న – పొన్నగంటి తెలుగన్న వ్యాసం – 1986.
స్రవంతి మాసపత్రికలో ప్రచురింపబడినవి.
1) వేయి పడగలు అంకిత పద్యం వ్యాసం – 1985.
2) వేయి పడగలు ధర్మారావు వ్యాసం – 1985.
వీరు చేసిన సాహిత్య సేవ.
సిద్దిపేట సాహితీ వికాస మండలికి వేముగంటి నరసింహచార్యులు అధ్యక్షులుగా,ఈశ్వర చరణ్ ప్రధాన కార్యదర్శిగా ఉండి సాహితీ సేవలు అందించారు.ఈశ్వర చరణ్ ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్నప్పుడు అవధాని గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ అవధాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఈశ్వర చరణ్ పృచ్ఛకుడిగా వ్యవహరించారు.శ్రీ నటరాజ రామకృష్ణ గారిచే సిద్దిపేటలో పేరిణి శివతాండవం,ఆంధ్ర నాట్యం ప్రదర్శనలు ఇప్పించారు.వీరు తెలుగు సాహిత్యానికి ఇతోధిక సేవలు అందించారు.వీరు పలు సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు.వీరు 54 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో 1992 నవంబర్ 16వ తేదీ నాడు పర లోక గతులు కావడంతో తెలుగు సాహితీ లోకం ఒక గొప్ప సాహిత్యకారుడిని కోల్పోయింది.

September 23, 2024 3 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహితీ సిరిమల్లి మన వడ్డేపల్లి

by Dr. chitikena Kirankumar September 23, 2024
written by Dr. chitikena Kirankumar

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 1948 సంవత్సరంలో సిరిసిల్ల లో చేనేత వృత్తిగా కలిగిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. తన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, లింగయ్య. ఇతనికి బాల్యం నుండే సినారె స్ఫూర్తితో సాహిత్యం పట్ల ఎక్కువ అభిరుచి కలిగింది. ఒకవైపు తపాలా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు సాహిత్యంలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఉద్యోగ విరమణ తర్వాత నుండి తన తుది శ్వాస విడిచేంతవరకు రచనలు కొనసాగించారు.
డా. సి.నా.రె. గారి ఆశీస్సులతో తెలుగు సాహితీ రంగంలో తన ముద్రను నిలుపుకున్నారు. ఆరు దశాబ్దాలుగా సాహితీ రంగంలో విశిష్ట సేవలు అందించారు. ఇటీవల సెప్టెంబర్ 6న అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. వడ్డేపల్లికి భార్య మణెమ్మ, ఒక కూతురు ఇద్దరు కుమారుల సంతానం కలరు. కుమారులు ఇద్దరు అమెరికాలో స్థిరపడినారు.
ఆనాడు సాహిత్యరంగంలో డా. భానుమతి, అక్కినేని గార్ల ప్రోత్సాహంతో సినీ సాహిత్యరంగంలో, ప్రకాశించిన డా.వడ్డేపల్లి కృష్ణ 1968 నుంచి పలు పత్రికల ద్వారా కవితల్ని, 1969 నుంచి ఆకాశవాణి ద్వారా, 1979 నుంచి దూరదర్శన్/ సినిమాల ద్వారా లలిత / సినీ గీతాల్ని నిరంతరంగా రచిస్తూ నిగ్గుదేరిన రచయిత. 1995 సెప్టెంబర్ మాసమంతా ఆకాశవాణి ద్వారా వీరి లలితగీతం అన్ని రాష్ట్రాలలో ఆయా భాషల అనువాదాలతో ప్రసారం కాగా జాతీయ కవిగా, లండన్ పార్లమెంటు అమెరికా న్యూజెర్సీ ప్రభుత్వ కవి సత్కారాల్ని పొంది; మలేషియా, ఆస్ట్రేలియా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని అంతర్జాతీయ కవిగా ఖ్యాతి గాంచారు.
తను మొట్టమొదటిగా 1971లో “కనరా నీ దేశం” గేయ సంపుటిని వెలువరించి తదుపరి “అంతర్మథనం” వచన కవితా సంపుటిని తన గురువర్యులు అయిన సినారే గారికి అంకితం ఇచ్చారు. అంతర్మథనం కవితా సంపుటికి ‘ చుట్టు కుదురు’ పేరుతో ఆరుద్ర పీఠిక సమకూర్చారు. తను రచించిన హాలాహలం కవితా సంపుటికి దేవులపల్లి స్మారక పురస్కారాన్ని అందుకుంది. వడ్డేపల్లి గేయవల్లి కవిత, వడ్డేపల్లి గేయవల్లి సంపుటికి కరీంనగర్ సాహితీ గౌతమీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ గేయ సాహిత్య పురస్కారం లభించినది.
వడ్డేపల్లి వెయ్యికిపైగా రాసిన ‘లలితగీతాలు సమకాలీన సమాజంలో తెలుగు శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఇది ఒక గొప్ప రికార్డు అని చెప్పక తప్పదు. ఆకాశవాణి ద్వారా వడ్డేపల్లి కృష్ణ లలితగీతాలు ప్రక్రియకు వన్నెతెచ్చిన “ఈమానపు పాట’కు పెద్దదిక్కుగా నిలిచినవారు. వడ్డేపల్లి కృష్ణ లలితగీతాలపై, లలితగీతాల పుట్టు పూర్వోత్తరాలపై, ప్రారంభ వికాసాలపై, వస్తు శిల్ప వైవిధ్యంపై పిహెచ్.డి చేసి డాక్టరేట్ పొందిన సిద్ధాంతవేత్త సినిమా పాటలు రాయడంలో తనదైన శైలి, రంగస్థల సాంఘిక నాటకాలు రాసి, ప్రదర్శింపజేసి ప్రసిద్ధులైనవారి మెప్పు పొందిన నాటక కర్త వడ్డేపల్లి కృష్ణ వీరి సంగీత, నృత్య రూపకాలు, నృత్య రీతులకు, కళాకారులకు గొప్ప సామగ్రి అందించారు. వాటిని సంగీత రూపకాలుగా రంగస్థలంపై ప్రదర్శించినప్పుడు వీక్షించితే అప్పుడే వడ్డేపల్లి కృష్ణ సాహిత్య ప్రజ్ఞ అనుభూతిలోకి వస్తుంది.
స్వదేశ, విదేశాలలో ప్రదర్శించిన అసంఖ్యాక సంగీత నృత్య రూపకాలు, వివిధ ముక్తకాలు, నాటకాలకు మరియు డాక్యుమెంటరీలతో పాటు అనేక టి.వి. ధారావాహికలకు, చలన చిత్రాలకు కథ మాటలు పాటలు రచించడమేగాక దర్శకత్వం వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి! “పాట వెలదులు” అనెడు నవీన పద్యాలను సృష్టించిన ప్రతిభాశాలి!

“బలగం” సినిమాలో

వడ్డేపల్లి రచించిన పుస్తకాలకు ప్రముఖుల ముందుమాటలలో తన సాహిత్య ప్రతిభను, కృషిని అక్షర బద్దం చేశారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. కె. శివారెడ్డి గారు వడ్డేపల్లి రాగ రామాయణం – బాలల గేయ కథ పుస్తకానికి ముందుమాట వ్రాసిన మాటల్లో … కృష్ణగారు- యింత సాహిత్య సృజన తర్వాత – మళ్ళీ రామాయణం దగ్గరకి రావటం యాదృచ్ఛిక మనుకోను – ఒక విలువని చిన్న పిల్లల మనస్సుల్లో నాటడానికి ఈ రూపాన నడుం కట్టారు. విజయం సాధించారు. ఎవరయినా గొంతెత్తి హాయిగా గానం చేయవచ్చు. చాలా మనోహరంగా వుంటుంది. చాలా క్లుప్తంగా కథ చెప్పినా – దేన్నీ వదలలేదు. మొత్తం వాల్మీకి రామాయణాన్ని చదివితే ఏ అనుభూతి వస్తుందో ఈ బాల రామాయణాన్ని చదివినా అదే కలుగుతుంది. హాయిగా ఏ నట్టూ కొట్టకుండా, ఏకబిగిని చదివించారు వడ్డేపల్లివారు. డా. వడ్డేపల్లి వారితో నేను విన్నవించాను, నేను ముందుమాటకు తగినవాణ్ణి కాదు అని. కాని ఆయన వినలేదు.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం,సుప్రసిద్ధ సినీ గాయకులు వడ్డేపల్లి రాగ రామాయణం – బాలల గేయ కథ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో… రామాయణం భారతీయ జీవనవిధానం మన సంస్కృతికీ, సంప్రదాయానికి మూలం. ఇది కథ కాదు – జీవితం – మన ధర్మ సంపద. ప్రస్తుతం ఇది చాలా అవసరం తరువాతి తరానికి అత్యవసరం ఈ ప్రక్రియ. రాముడికి భరతుడేమౌతాడో, విభీషణుడికి మండోదరి ఎవరో, ఆంజనేయుడికి తలిదండ్రులెవరో కూడా తెలియని దుర్భరమైన సందర్భంలో ఈ కావ్యసృష్టి కొంతైనా అవగాహనారాహిత్యాంధకారాన్ని వెలుగులో నింపే కరదీపిక కాగలదని ఆశిస్తున్నాను. భావాక్షర ప్రజ్ఞ గల కవి శ్రీ వడ్డేపల్లి కృష్ణ. ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదన్న దుగ్ధ ఉన్న కొద్దిమందిలో నేనూ ఒకణ్ణి. ఈ సత్కవికి, సన్మిత్రునికి అభినందనలు తెలియజేస్తున్నాను.

వడ్డేపల్లి కృష్ణ గారితో రచయిత

ప్రభుత్వ టి.వి. నంది అవార్డుల కమిటీలకు (2006 / 2009) చైర్మన్ గా, అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి (2003) న్యాయనిర్ణేతగా, నిజాయితీగా వ్యవహరించిన నిష్పక్ష ధీశాలి!
36 కావ్యాలను, 60 ఆడియో ఆల్బమ్లను, 15 డాక్యుమెంటరీలను వెలువరించారు. 96 ధారా వాహికలకు, 2 చలన చిత్రాలకు కథ – మాటలు పాటల రచనతో పాటు దర్శకత్వం కూడా నిర్వహించారు.
ఇటీవల బలగం సినిమాలో ఆచారి పాత్ర నటుడిగా నటించినారు. ఈయన రచించిన కొన్ని పాటలను “బాల భారతి” (పూనె) 3, 4వ తరగతుల తెలుగు వాచకాల్లో పాఠాలుగా పెట్టడం విశేషం!
నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1987 నుండి నేటి వరకు అందరు ముఖ్యమంత్రులచే రాష్ట్ర కవిగా, మాజీ ప్రధాని వాజ్ పేయి లచే దేశభక్తి గీత రచయితగా సన్మానాలను పొందినారు.అంతర్జాతీయ అనేక తెలుగు సంఘాలకు స్వాగత గీతాలను వ్రాసి తెలుగు వెలుగులను విశ్వవ్యాప్తం చేయుటలో సాహితీ మూర్తిగా తన పాత్రను నిర్వర్తించారు. సాహిత్యంతో సంబంధం ఉన్న మరెన్నో ప్రక్రియలలో తన ముద్రను వేసిన అలుపెరుగని తెలుగు సాహిత్య సారధి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారికి అక్షర నివాళులర్పిస్తూ…

September 23, 2024 2 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

నా ఇల్లు

by Laxmi Madan September 23, 2024
written by Laxmi Madan

“అమ్మా! అమ్మా! నేను అందంగా అమర్చిన బొమ్మలన్నీ ఎవరు తీసేశారు? నా చిన్నప్పటి నుండి ఇవన్నీ ఇలాగే పెడుతున్నాను కదా?”అని అడిగింది సుదీప. కొంచెం ఏడుపు కొంచెం కోపం మిళితమైన గొంతుతో.
అప్పుడే అక్కడికి వచ్చిన సుదీప తల్లి వసుంధర జవాబు చెప్పేంతలో, సుదీప అన్న సుధీర్ అక్కడికి వచ్చాడు.
“అవి మీ వదిన సర్దింది. అయినా తను ఈ ఇంట్లోకి వచ్చాక తన ఇష్టం ఉన్నట్లు తను పెట్టుకుంటుంది. నువ్వు నీ పెళ్లయ్యాక నీ ఇష్టం ఉన్నట్లు మీ ఇంట్లో సర్దుకో”అన్నాడు వ్యంగ్యంగా సుధీర్ .
ఈ సమాధానం ఊహించని సుదీప , వసుంధర ఇద్దరూ నివ్వె రపోయారు.
“అదేంటి అన్నయ్యా! వదిన తన ఇష్టం ఉన్నట్లుగా సర్దుకుంటానంటే నేను మాత్రం వద్దంటానా? చిన్నప్పటినుండి నాకు బొమ్మలంటే చాలా ఇష్టం కదా! నా పదేళ్ల వయసు నుండి ఒక్కొక్కటి కొని అన్నిటినీ ఇలా సర్దాను. ఇంట్లో అందరికీ నచ్చింది కూడా! నాన్న అయితే మరీ మెచ్చుకున్నాడు. నువ్వు కూడా ఎన్నోసార్లు బాగుందన్నావు కదా! అన్నయ్య”అన్నది మెల్లగా సుదీప.
“అయితే ఏమంటావు? అప్పుడు బాగుందని, ఇప్పుడు మీ వదినకి నచ్చిన బొమ్మలు పెట్టుకుంటానంటే వద్దంటావా?” అన్నాడు కోపంగా సుధీర్.
జవాబు చెప్పాలనుకుని సుదీప నోరు తెరిచినంతనే వసుంధర “దీపా ఎందుకీ అనవసరపు వాదన. నీ పెళ్ళయ్యాక మీ ఇంట్లో నీకు నచ్చినట్లు నువ్వు సర్దుకుందువుగానిలే. లోపలికి వచ్చేయ్”అన్నది.
అసలు ఏమీ అర్థం కాని సుదీప మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది.
అంతకుముందే వచ్చి బయట నిలబడ్డ సుదీప తండ్రి రాజేందర్ నీరు నిండిన కళ్ళతో నిలబడ్డాడు.
తనేవి విననట్లుగానే లోపలికి వచ్చాడు.
సుదీపకు చిన్నప్పటినుండి ఇంటి అలంకరణ అంటే చాలా ఇష్టం. ఎన్నో బొమ్మలని సమకూర్చి, వాటిని చక్కగా ఇంట్లో ఏవి ఎక్కడ పెట్టాలో ఆలోచించి పెట్టేది .అలా చిన్నప్పటినుండి కొన్న బొమ్మలన్నీ కలిపి చాలానే ఉంటాయి. ప్రతి సంవత్సరం దీపావళికి బొమ్మల కొలువు పెట్టి అందరిని పిలిచేది వసుంధర.
చదువులో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటూ, అందరి మెప్పులు పొందేది సుదీప.
ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సుదీపకు ఈ మధ్యనే క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కూడా వచ్చింది.
సంవత్సరం క్రితమే సుధీ ర్ పెళ్లి జరిగింది. వదిన వస్తే ఎంతో చక్కగా కలిసి ఉండొచ్చు అని ఎన్నో ఊహించుకుంది సుదీప.
కానీ సుధీర్ భార్య సౌమ్య అసలు ఎవరితోనూ కలిసి ఉండేది కాదు. ఎన్నోసార్లు మాట్లాడలనీ ప్రయత్నించింది సుదీప. నిజానికి సుదీప మనస్తత్వం చాలా నిష్కల్మషమైనది. ఎవరినీ నొప్పించే తత్వం కాదు.
ఒకరోజు కాలేజ్ ఫంక్షన్ జరుగుతుండడంతో తన చీరలేవి అంత బాగా లేదనిపించి వదినను అడగడానికి వెళ్ళింది.
“వదినా! రేపు నాకు కాలేజీలో ఫంక్షన్ ఉంది. నీ చీర ఏదైనా కట్టుకొని వెళతాను. మనం ఇద్దరం ఒకే వెయిట్ లో ఉంటాము. కాబట్టి, మీ బ్లౌజ్ కూడా నాకు సరిపోతుంది”అని అడిగింది వదిన పక్కనే కూర్చుంటూ.
“ఏంటి, నా చీర నువ్వు కట్టుకొని వెళ్తావా? అందులో బ్లౌజ్ కూడా వేసుకుంటావా? ఛీ ఛీ నాకు ఒకరు వేసుకున్న బట్టలు నచ్చవు. నా బట్టలు నేనెవరికీ ఇవ్వను” అన్నది నిక్కచ్చిగా.
“పోనీ బ్లౌజ్ నాది వేసుకుంటాను. చీర నీది కట్టుకొని వెళ్తాను. సరేనా”అని అడిగింది అమాయకంగా సుదీప.
“ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇలా అడుక్కొని కట్టుకోవడం దేనికి? నీకున్నవే కట్టుకొని వెళ్ళు”అన్నది కఠినంగా.
అప్పుడు కానీ అర్థం కాలేదు సుదీపకు ,వదిన నిజంగానే అంటుందని.
కళ్ళనీళ్ళతో బయటకు వచ్చింది. ఆ విషయం తల్లితో కూడా చెప్పలేదు. కానీ విషయం గ్రహించిన వసుంధర , వెళ్లి దగ్గర్లో ఉన్న షాపులో ఒక చీర దానికి సంబంధించిన ఫాల్ కొనుక్కొని వచ్చింది.
“అమ్మా! ఎక్కడికి వెళ్లావు? నీకోసం అప్పటినుండి వెతుకుతున్నాను .రేపు కాలేజీలో ఫంక్షన్ ఉంది. నీ చీర ఏదైనా ఉంటే కట్టుకొని వెళ్తాను”అన్నది సుదీప.
“నా చీరలు నీకేం బాగుంటాయి తల్లి. అప్పుడెప్పుడో ఫంక్షన్ ఉంటుంది అని నువ్వు అన్నావు కదా! అది గుర్తొచ్చి ఇక్కడ షాప్ లో చీరలు బాగున్నాయంటే వెళ్లి తీసుకొచ్చాను. చూడు బాగుందా”అని తాను తెచ్చిన చీర చూపించింది వసుంధర.
చిలకపచ్చ రంగు చీరకి, గులాబీ రంగు అంచు, అక్కడక్కడా జరిగి బూటాతో చీర ఎంతో అందంగా ఉంది.
“చాలా బాగుందమ్మా, అయినా, అలా ఎలా తెచ్చావ్ ?పోనీ నన్నైనా పిలవలేదు”అన్నది సుదీప చీరను పట్టుకొని సంతోషంగా చూస్తూ.
“నీకు నచ్చకుంటే వెళ్లి మార్చుకొని వద్దాము. ఇంకా సమయం ఐదు గంటలే అయింది కదా? షాప్ మూయరు” అన్నది వసుంధర.
“మార్చడం ఏమీ వద్దమ్మా, నాకు చాలా నచ్చింది. ఇదే కట్టుకొని వెళ్తాను. కానీ దీనికి బ్లౌజ్ ఎలా?”అన్నది సుదీప.
ఇప్పటికిప్పుడు కుట్టిచ్చాలంటే కష్టమే కద మ్మ, నీపట్టు పరికిణి మీది జాకెట్టు దీనికి సరిగ్గా సరిపోతుంది .ఒకసారి పెట్టి చూడు”అన్నది వసుంధర.
ఆ చీర కు కరెక్టుగా మ్యాచ్ అవ్వడంతో ఆ రాత్రికి ఫాలు కుట్టేసింది వసుంధర.
తెల్లవారి కాలేజీకి కట్టుకొని వెళ్తే అందరూ ఎంతో బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అందులో చక్కనైన సుదీపకు ఆ చీర ఇంకా బాగా నప్పింది.
అలా ఇంట్లో వదిన దేనికి తనతో కలిసి ఉండేది కాదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని తొందరగా వెళ్ళిపోతే బాగుండు అన్నట్లుగా చూసేది.
ఇది మాది నువ్వు పెళ్లి అయ్యాక కొనుక్కో ఇలాగే మాట్లాడేది.
ఎంతో బాధపడేది సుదీప.
ఇక్కడే పుట్టి పెరిగినా నేను పరాయిదాన్ని అయ్యానా? అంటే ఈ ఇంట్లో నాకు స్థానం ఏమీ లేదా?”ఇలా ఎంతో బాధపడేది సుదీప.
తల్లి మాత్రం పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోమని చెప్పేది.
కానీ ఇదంతా చూస్తున్న తండ్రికి మాత్రం చాలా బాధగా ఉండేది. బుడిబుడి అడుగులతో నడిచిన బంగారు తల్లి పెరిగి పెద్దదై ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతుంటే ఇప్పుడు తనను పరాయిది అంటారేంటి? అలాగని కోడల్ని తక్కువ చేసి చూడలేదుకదా? కోడల్ని కూడా కూతురు లాగానే చూసుకుంటున్నాము కదా! ఇంకా సుదీప్ అయితే వదినను ఎంతో ప్రాణంగా చూసుకుంటుంది. ఏది కొన్నా వదిన కోసం ముందుగా తెస్తుంది. ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? కొడుకు సుదీర్ లో కూడా మార్పు వచ్చింది. రేపు పెళ్లి అయిన తర్వాత అయినా సుదీప అత్త వారు మంచిగా చూసుకునే వాళ్ళు వస్తే చాలు” అని ఎన్నోసార్లు బాధపడేవాడు.
చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన సుదీప కు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు తల్లిదండ్రులు. అనుకున్నట్లుగానే ఎన్నో సంబంధాలు చూసి అందులో సుదీపకు కూడా నచ్చిన వరుడి తో పెళ్లి జరిపించారు.
ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. సుదీప వదినకి పెళ్లి జరుగుతుందన్న సంతోషం కన్నా సుదీప ఇంట్లో నుండి వెళ్తుంది అని ఆనందమే ఎక్కువ కనిపించింది.
పెళ్లయి అత్తవారింటికి భర్తతో వెళ్లింది సుదీప. పెళ్లిరోజు రాత్రి పది గంటలు దాటింది. అప్పటికే అందరూ ఎవరి పడక గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. “కొత్త పెళ్లికూతురు వచ్చింది” అని ఎవరు బయటకు రాలేదు. లోపలికి వెళ్లి సూట్ కేసు లోపల పెట్టి, బట్టలు మార్చుకొని హాల్లోకి వచ్చింది సుదీప.
బయటకు వచ్చిన సుదీపను అత్తగారు ఒక చూపు చూసి”నువ్వు శ్రీకర్ అన్నం పెట్టుకొని తినండి. మేమందరం భోజనం చేసాము. గిన్నెలన్నీ సర్ది బయట వేసి స్టవ్ గట్టు అన్ని తుడిచిపెట్టి వెళ్లి పడుకోండి”అని చెప్పింది ఎప్పుడూ ఇంట్లో ఉండే మనిషికి చెప్పినట్లే చెప్పింది.
వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదినని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో? సుదీపకు గుర్తొచ్చింది. అందరూ కలిసి స్వాగతం పలికి వదినను కూర్చోబెట్టి అన్ని సపర్యాలు చేశారు. తల్లి వడ్డించి కొసరి కొసరి భోజనం వడ్డించింది.
సుధీర్ కి కూడా చెప్పింది “తను మొహమాట పడకుండా చూసుకునే బాధ్యత నీదేనని.”
ఎన్నో రోజుల వరకు ఏ చిన్న పని కూడా చేయనిచ్చేది కాదు వసుంధర. కానీ వీళ్లు చూపించిన ప్రేమలో తను రెండు శాతం కూడా తనకు ప్రేమ ఉన్నట్లు ప్రవర్తించేది కాదు సుదీప వదిన.
ఆలోచనలో నుండి బయటకు వచ్చిన సుదీప
“అలాగే అత్తయ్యా!” అని నెమ్మదిగా సమాధానం ఇచ్చింది.
ఇంతలో స్నానం చేసి వచ్చిన శ్రీకర్
“ఏంటి నిలబడ్డావ్? భోజనం చేద్దాం పద”అన్నాడు.
మెల్లగా శ్రీకర్ తో పాటు వంటింట్లోకి నడిచింది.
డైనింగ్ టేబుల్ నిండా ఎంగిలికంచాలు అలాగే పడి ఉన్నాయి. వంట పదార్థాలు ఉన్న గిన్నెల మీద మూతలు కూడా సరిగా లేవు. వంటిల్లు అంతా చిందరవందర గా ఉంది. ఒక్కసారి అద్దంలాంటి తన పుట్టిల్లు గుర్తొచ్చింది .కానీ అదేది బయటపడకుండా మౌనంగా ఆ కంచాలన్ని తీసి బయటపెట్టి భర్తకి, తనకు కంచాలు పెట్టుకొని గిన్నెలు మూతలు తీసి చూసింది. అడుగుబొడుకు కూరలు మాత్రమే ఉన్నాయి. అన్నం అడుగంటి పోయింది. మెల్లగా పైపై అన్నం పెట్టేసి ఉన్న కూ రలు సర్దేసింది.
ఇదేమి పట్టనట్లు శ్రీకర్ గబగబా తినేస్తున్నాడు. సుదీపకు అసలు ఆ కూరలేవీ సహించలేదు. అందులో మిగిలిన కూరలు పాడైపోయే స్థితిలో ఉన్నాయి.” కొత్తగా కోడలు ఇంట్లోకి అడుగు పెడుతుంటే కాస్త మంచి భోజనం కూడా తయారు చేయలేరా” అని అనుకొని అన్నంలో మజ్జిగ పోసుకొని తినేసింది.
ఉదయమే లేచిన సుదీప హాల్లో వస్తువులని సర్ది పెట్టింది.శెల్ఫ్ లో అటు ఇటు పడి ఉన్న బొమ్మలను కాస్త అందంగా సర్దింది.
అప్పుడే బయటకు వచ్చిన సుదీప మరదలు దీక్ష
“అప్పుడే అధికారం చేతిలోకి తీసుకున్నావా? ఆ బొమ్మలు అలా పెట్టకూడదు. నువ్వెందుకు సర్దావ్ అసలు? ఇదేం నీ పుట్టిల్లు కాదు ఇష్టం ఉన్నట్లు చేయడానికి?” అన్నది.
ఒక్కసారి ఆశ్చర్యపోయింది సుదీప్.
అక్కడ పుట్టింట్లో వదిన ఇంట్లోకి రాగానే “నీ ఇల్లు ఇది కాదు నీ ఇంట్లో సర్దుకో” అన్నది ఇక్కడ మరదలు “ఇది నీ పుట్టిల్లు కాదు” అంది అసలు నాకంటూ ఒక ఇల్లు ఉందా?”అని బాధపడుతూ నిలబడింది సుదీప.

September 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా

by Narendra Sandineni September 23, 2024
written by Narendra Sandineni

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(10)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
.ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్  తనకు గల అపారమైన జీవితానుభవాన్ని,  తాత్వికతను మేళవించి షాయరీ కవితను రాసిన తీరు అద్భుతంగా ఉంది,షాయరీ కవితలోని భావాలు మనసును పరవశింప జేస్తాయి.షాయరీ కవితను చదవాలనే ఆసక్తి ఉందా? తెలుసుకోవాలని మనసు తహతహలాడుతుందా? అయితే కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.షాయరీ కవితలోని అపూర్వమైన భావాల లోకంలో విహరించండి.గొప్ప గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“నన్ను ఈ చీకటిలోనే ఉండనీయ్ గాలిబ్!
“వెలుతురులో నా అనుకున్న వాళ్ళ
“ముఖాలు కనిపించి భయపెడతాయి!
చీకటి అనునది వెలుగునకు వ్యతిరేక పదం.చీకటి ఒక ప్రదేశంలో దృగ్గోచర కాంతి లేమిని సూచిస్తుంది.చీకటి అంతరిక్షంలో నలుపు రంగులో కనిపిస్తుంది.మానవుడు కాంతి గాని చీకటి గాని ప్రబలమైనప్పుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేడు.చీకటి తక్కువగా ఉంటే మసక చీకటి అంటారు.చీకటి ఎక్కువగా ఉంటే దాన్ని కారు చీకటి అంటారు.ప్రతి రోజు రాత్రి కాగానే చీకటి అలుముకుంటుంది.ఎక్కువగా నేరాలు మరియు ఘోరాలు రాత్రి సమయంలోనే జరుగుతుంటాయి. సూర్యుడు అస్తమించడంతో లోకం అంతటా అంధకారం వ్యాపిస్తుంది. జీవితంలో తనకు అత్యంత ప్రధానమైనటువంటిది దూరమైనప్పుడు జీవితం అంధకారమయంగా తోస్తుంది.చీకటి అనేది అజ్ఞానానికి ప్రతీకగా చెబుతారు.అజ్ఞానం అంటే జ్ఞానము లేదా ఒక నిర్దిష్ట విషయంపై అవగాహన లేకపోవడం అని చెప్పవచ్చు.ముఖ్యమైన సమాచారం లేదా వాస్తవాల గురించి తెలియని వ్యక్తులను అజ్ఞానులుగా తలంచ వచ్చు.అజ్ఞానం మూడు రకాలుగా పేర్కొంటారు.1)వాస్తవ అజ్ఞానం అనగా కొన్ని వాస్తవాల జ్ఞానం లేకపోవడం. 2)వస్తువు అజ్ఞానం అనగా కొన్ని వస్తువులతో పరిచయం లేకపోవడం.3)సాంకేతిక అజ్ఞానం అనగా ఏదైనా శాస్త్రబద్ధంగా ఎలా చేయాలో తెలియక పోవడం.అజ్ఞానం అంటే తెలియనితనం.ప్రసిద్ధ కవి గాలిబ్ అగ్రాలో జన్మించాడు.గాలిబ్ చిన్న చిన్న మాటలతోనే తన కవితల్లో పెద్ద భావాన్ని పలికించాడు.మనసు నుండి ఉబికి వచ్చే దుఃఖం, ఊహా ప్రేయసి,ప్రేమ,శృంగారం,విరహం,కరుణించని ప్రేయసి కాఠిన్యం,స్వీయ అన్వేషణ,నీతి, సౌకుమార్యం, జీవితపు గాఢత,మానవుడి అంతరంగపు లోతు,ఒంటరితనపు క్షోభ,బతుకు రుచి,లోక రీతి,ఏదీ శాశ్వతంగా ఉండిపోదన్న వాస్తవాలు గాలిబ్ కవితల్లో కనిపిస్తాయి.అందంతో ఆరోగ్యవంతుడిని చేసే ప్రేయసి గురించి గాలిబ్ మాత్రమే రాయగలడు.ప్రేమకు ప్రేమే బాధ,ప్రేమకు ప్రేమే చికిత్స అని గాలిబ్ చెప్పగలడు.మనలో మనం మాట్లాడుకుంటాం.మనం ఇతరుల వల్లనే  మోసపోయాం అని అనుకుంటాం.కానీ వాస్తవానికి మనం మనతోనే ఎక్కువగా మోసపోయామని గాలిబ్ మాత్రమే చెప్పగలడు.ఈ షాయరీ కవితలోని భావాలు అతని హృదయం లోతుల్లో జరిగే సంఘర్షణల తాలూకు చీకటిని అజ్ఞానాన్ని తెలియజేస్తాయి.ఈ లోకంలో నివసించే ఎవరికైనా రోజుకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటాయి.అందులో పదహారు గంటలు తాను ఏదైనా పని చేస్తూ జీవిస్తాడు.మిగతా ఎనిమిది గంటలు మాత్రం నిద్రపోతేనే అతని శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది.నిద్ర పోయే ఎనిమిది గంటల సమయంలో కూడా ఆ చిమ్మ చీకటి రాత్రిలో అతనికి ఏవేవో తెరిపిలేని ఆలోచనలు,మనసును మెలిపెట్టే సమస్యలు, బాధ,దుఃఖం,దూరమైన ప్రేయసి ఎడబాటు గుర్తుకు వచ్చి సతమతమవడం ఎంతో ఆందోళనను కలిగిస్తుంది.చీకటిలో కూడా మరిచిపోలేని దుఃఖం,వేదన,దిగులు మనసును ఆవహించి అతన్ని నీడలా వెంటాడుతుంది.తన వాళ్ళు అంటే రక్తసంబంధీకులు,తన హృదయానికి నచ్చిన వాళ్ళు,దగ్గరి వాళ్ళు,బంధువులు మరియు స్నేహితులు అందరు ధన వ్యామోహంలో కూరుకుపోయి ఆత్మీయత,అనుబంధాలను మరిచిపోయారు.వారు తన పట్ల అనురాగమున్నట్లు నటిస్తూ,ఎంతటి దుర్మార్గం చేయడానికి అయినా వెనుకాడడం లేదు.అతను తన హృదయంలో చెలరేగే భావోద్వేగపు సంఘర్షణలను తనను చుట్టుముట్టిన సమస్యల సుడిగుండాలను జీవితం విసిరిన సవాళ్లను ఎదుర్కొనలేక నన్ను ఈ చీకటి ప్రదేశంలోనే ఉండనీయమని వినమ్రంగా గాలిబ్ ను వేడుకుంటున్నాడు.తన జీవితంలో కలిగిన అలజడులు, ఆందోళనలను అవాంతరాలను తొలగించడానికి గాలిబ్ నుండి మాత్రమే పరిష్కారం దొరుకుతుందని అతని ఆలోచన.అతని వల్లనే .తన జీవితానికి శాంతి,స్వాంతన లభిస్తుంది అనుకుంటున్నాడు.తన గుండెలో చెలరేగుతున్న భావావేశం,అలజడులు,కష్టాలు,కన్నీళ్లను గాలిబ్ కు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.గాలిబ్ నుండి మాత్రమే తాను ఓదార్పును పొందగలనని అతని విశ్వాసం.ఈ లోకంలో ఎవ్వరు తన బాధలను అర్థం చేసుకోలేరు.ఒక్క గాలిబ్ మాత్రమే అర్థం చేసుకుంటాడు.జీవితం అనే ప్రయాణంలో చీకటి నుండి బయటికి వచ్చిన తర్వాత మనకు వెలుతురు కనిపిస్తుంది. వెలుతురును చూడగానే మన బతుకు తిరిగి చిగురిస్తుందని అనుకుంటాం.కానీ అలాంటి వెలుతురులో కూడా నాకు ప్రియమైన వాళ్ళ ముఖాలు కనిపించి భయపెడతాయి.నా ప్రియమైన వాళ్ళు అనుక్షణం నన్ను వేధించిన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.భయం నీడలోకి నన్ను త్రోసిన వారిని,నా వినాశనాన్ని కాంక్షించిన వారిని చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు.ద్రోహం చేసిన వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనిపించి నన్ను భయపెడతాయి అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.ఈనాడు లోకంలో మనుషులు ద్వేష భావాన్ని కనిపించకుండా ప్రేమను ఒలకబోస్తూ ఆప్తులుగా నటిస్తూ మన వెంటే ఉంటారు. ఆప్తులుగా నమ్మిన వారే మనను ఒక్కసారిగా వెన్నుపోటు పొడుస్తారు.మనకు వారి నిజస్వరూపం తెలిసినప్పుడు ఏమీ చేయలేని సందిగ్ధత నెలకొంటుంది.గుల్జార్ మనుషుల విచిత్ర మనస్తత్వాలను బాగా అర్థం చేసుకున్నాడు.అందుకే షాయరీ కవితల్లో అద్భుతమైన భావాలను పండిస్తూ లోక రీతిని చెప్పిన తీరు అసాధారణం అని చెప్పవచ్చు.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని)  అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(11)
గుల్జార్ షాయరీ కవితలోని పొంగి పొరలే భావాలు,  ప్రేమ,అనుభూతి,అపారమైన జీవితానుభవంతో కూడిన తాత్వికత,పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. గుల్జార్ షాయరీ కవితల్లోని భావాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే మనసు పెట్టి షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“పోయినేడాదిలాగే ఈ చలికాలపు
“డిసెంబర్ నెల కూడా వెళ్ళిపోతుంది
“దీనికి కూడా నీలాగే నా కోసం
“ఆగిపోయే అలవాటే లేదు !
పోయిన ఏడాదిని గడిచిపోయిన సంవత్సరం లేదా గత సంవత్సరం అని అంటారు.గత సంవత్సరం అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి?అతని జీవితంలో అనురాగం,అప్యాయతలు పంచిన మధుర క్షణాలు ఉన్నాయి.గత సంవత్సరం జీవితంలో తీరని వేదన కలిగించిన సంఘటనలు అతని తీపి జ్ఞాపకాలను ఆనందాన్ని దూరం చేశాయి.గడిచిన సంవత్సరం గుర్తుకు వస్తే అతనికి నిరాశ,నిస్పృహలు కలుగుతాయి.విషాదం, పెను చీకటి అతని వెన్నులో చలి పుట్టిస్తుంది.డైరీలోని పేజీలను తిరిగేస్తే గత సంవత్సరపు జ్ఞాపకాలు,అతని జీవితంలో జరిగిన మార్పులు తెలుస్తాయి.నిత్యం జరిగే వ్యవహారాలను డైరీలో రాసే అలవాటు అందరికీ ఉండదు.కొందరికి మాత్రమే ఉంటుంది.ఒక వేళ అతనికి డైరీ రాసే అలవాటు లేనట్లయితే రాయని ఎన్నో విషయాలు అతని మెదడులో నిక్షిప్తం అయి ఉంటాయి. మరపురాని తీపి జ్ఞాపకాలు,మరిచిపోలేని చేదు అనుభవాలు,అనుభూతులు అతని బ్రతుకులో గుర్తులుగా చెరిగిపోకుండా ఉంటాయి.తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే అతని మనస్సు ఎక్కడా లేని ఆనందానుభూతిలో తేలి ఆడుతుంది.చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తే అతను తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోతాడు.రంగు రంగుల రమ్యమైన అతని జీవితంలో ఎన్నో మధుర స్మృతులు, ఆనందాలు,అనుభూతులు పెనవేసుకుని ఉన్నాయి.జీవిత  ప్రయాణంలో అతనికి తెలియకుండానే గడియారంలోని ముళ్ళు తిరిగినట్లుగా నిమిషాలు,గంటలు,రోజులు, సంవత్సరాలు గడిచి పోయినాయి.చిత్రమైన అతని జీవితంలో మనస్సును ఆహ్లాదపరిచే సంఘటనలు, ఆనందాన్ని పంచే అనుభూతులు, అనుభవాలు వున్నాయి.ఈ లోకం ఎన్నెన్నో వింత,వింత అద్భుతాల సృష్టి.వెల్లివిరిసే ఆనందాలకు కొదువ లేదు.ఒక్క క్షణం కళ్ళు మూసి తెరవగానే అతనికి సంవత్సరం గడిచి పోయింది.గడిచి పోయిన సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలను,చేదు అనుభవాలను వెంట తీసుకొని వెళ్ళి పోయింది.ఈ సంవత్సరం డిసెంబర్ నెల మాసం వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉదయాన ఉషోదయాలు, రాత్రి వేళ చీకట్లు కలుగుతూ కాలం కరిగిపోతున్నది. శీతాకాలంలో మంచు కురుస్తూ విపరీతమైన చలి గాలులు వీస్తున్నాయి.చలి కాలంలో విస్తృతంగా వీస్తున్న చల్ల గాలుల మూలంగా శరీరానికి వణుకు పుడుతున్నది.డిసెంబర్ నెలలో జరిగిన మరపురానివి,మర్చిపోలేని కొన్ని సంఘటనలు అతని మనసుని మెలి పెడుతున్నాయి.మనసును గిలిగింతలు పెట్టే చలి,ప్రేయసి చెఃతన లేకపోవడం, ఏదో తెలియని గుబులు,అతనికి దడ పుట్టిస్తోంది. తాను అవ్యాజంగా ప్రేమించిన ప్రియురాలి ఎడబాటు,మనసును కలత పెట్టింది.ఆమె తనను ఒంటరి వానిని చేసి వెళ్లడంతో,తీవ్రమైన విషాదం తెలియని అలజడి,ఆందోళన మొదలైంది.ఆమె తన చెంత లేకపోవడం వల్ల,ఒక రకమైన నైరాశ్యం అతనిలో కలిగింది.ఆమె లేని ఎడబాటును తల్చుకుని అతని మనసు చెప్పలేని బాధతో విలవిలలాడింది. చూస్తుండగానే డిసెంబర్ నెల మాసం కరిగి వెళ్ళి పోతుంది.విరామం ఎరుగనిది కాలం.కాలం ఎవ్వరి కోసం ఆగకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంది.అత్యంత గాఢంగా ప్రేమించిన నీవు నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్లినట్లే డిసెంబర్ నెల వెళ్ళిపోతుంది. ఎంతగానో ప్రేమించిన నీవు నా కోసం ఆగ లేదు. డిసెంబర్ మాసం కూడా నీలాగే నన్ను వదిలి వెళ్ళిపోతున్నది.డిసెంబర్ మాసానికి ఆగిపోయే అలవాటు అసలు లేదు.డిసెంబర్ మాసం నాకు మనసులో ఎప్పటికీ గుర్తు ఉంటుంది.గాఢంగా ప్రేమించిన నీవు నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు.ఈ సంవత్సరం డిసెంబర్ మాసం కూడా వెళ్ళిపోతుంది.నీ కోసం నాలాగే ఆగిపోయే అలవాటు దానికి లేదు అని కవి గుల్జార్ వ్యక్తికరించిన భావాల్లో ఎంతో సత్యం గోచరిస్తుంది. బ్రతుకులో గడిచి పోయిన కాలం నాటి చేదు జ్ఞాపకాలు,అనుభవాలు,మనసుని చుట్టుముట్టిన ఆలోచనలు,అలజడులను తట్టుకోవడం అతనికి కష్టంగా ఉంది.కవి గుల్జార్ లోక రీతిని ఎరిగినవాడు. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(12)
గుల్జార్ లో మానవ జీవితంలోని సంఘర్షణలను కవిత్వంలోకి మలిచే అపారమైన సృజన శక్తి దాగి ఉంది.షాయరీ కవితలోని భావాల్లో నూతనత్వం, సహజ సరళి పాఠకుల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి.గుల్జార్ షాయరీ కవితను గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“ఎవరైనా వచ్చి నన్ను తమ
“బాహువులతో పొదువుకుంటే
“బాగుండు … చాలా  కొద్దిగా
మిగిలాను .. అచ్చం ఈ
“డిసెంబర్ నెలలాగే !
మానవ జీవితం సంఘర్షణల నిలయం.అతని మనసులో చెలరేగే సంఘర్షణలు విరుద్ధ భావాన్ని తెలియజేస్తున్నాయి. ఎవరైనా అంటే ఎవరో ఒకరు అని అర్థం.ఎవరో ఒకరు ఆపద్బాంధవునిలా వచ్చి తనను ప్రేమానురాగాలతో పలకరిస్తే బాగుంటుంది. ఎవరో ఒకరు తనకు తెలియని వారు తన దగ్గరికి ఎందుకు వస్తారు?ఎవరో ఒకరు వచ్చి అప్పుడే కలిగిన ప్రేమ,ఆకర్షణలతో తనను తన బాహువులతో అలుముకోవాలి అనే ఆలోచనలు అతనిలో కలుగుతున్నాయి.అతని మనసులోని ఆలోచనలు మనసులోనే ఉంటాయి.వాటికి రూపం ఇవ్వడం జరగదు.అతని ఆలోచనలు ఊహకు అందకుండా ఎక్కడో విహరిస్తున్నాయి.అతను తనకు తానే ఏదేదో మనసులో ఊహించుకుంటున్నాడు.అతని మనసులో చెలరేగిన ఊహలకు సమాధానం లేదు.అతను మనసులో అనుకున్నట్టుగా ఎవరో ఒకరు వచ్చి తనను బిగి కౌగిలిలో బంధిస్తే బాగానే ఉంటుంది. కానీ అలా జీవితంలో ఊహించినవి ఎలా జరుగుతాయి? ఊహించినవి జరిగితే ఊహలకే రెక్కలు వచ్చినట్టుగా ఉంటుంది.జరగని వాటిని గురించి ఎడతెగని ఆలోచనలు కలుగుతున్నాయి.అసలే అతను సున్నిత మనస్కుడు.అతడు హృదయ వేదనతో చాలా కొద్దిగా మిగిలాను అని అంటున్నాడు.అతని ఆలోచనల్లో స్పష్టత లోపించింది.ఎడతెగని ఆలోచనలతో అతని మనసు చిక్కి శల్యమైంది.సంవత్సరంలోని చివరి నెల డిసెంబర్ మాసంలాగే అతని ఆలోచనల్లో తగ్గుదల ప్రభావం కనిపిస్తుంది.తాను ఊహించినవి జరగకపోవడాన్ని తెలియజేస్తుంది.మనుషుల జీవితాల్లో కార్యాలు సంభవం అయినవి ఉంటాయి. సంభవం కాని కార్యాలు కూడా ఉంటాయి. మనిషి జీవితాన్ని సానుకూల దృక్పథంతో అడుగులు వేసి కృషి చేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలవుతాయి. మనిషి తనలో తాను వ్యతిరేక భావాలతో మెదులుతూ అసంభవాల వైపు ఊహలు చేస్తూ ఉన్నాడు.ఇట్లాంటి ఆలోచనలు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి వెళ్ళినట్లుగా ఉంటుంది.జీవితమంటే కష్టసుఖాల కలబోత అంటారు.మానవ జీవితంలో ఏది జరిగినా సానుకూలంగా భరించాలి. సానుకూలంగా ఎదుర్కోవాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది.ఒక్కోసారి కష్టపడినప్పటికీ ఫలితం రాదు.అయినా మనిషి ఓర్పుతో మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుంది.కష్టాలు వచ్చినప్పుడు అనుకున్నవి జరగనప్పుడు మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు.ఓర్పుతో తనకు తాను ప్రేరణ కలిగించుకుంటూ జీవితాన్ని సాగించాలి. ప్రేరణ మానవున్ని విజయాల బాట పట్టిస్తుంది. గుల్జార్ షాయరీ కవితలోనీ అద్భుతమైన భావాలు పాఠకుల హృదయాలను కదిలిస్తాయి.గుల్జార్ మనిషి మనసు చేసే మాయాజాలాన్ని కవిత్వీకరించడం అబ్బురపరుస్తుంది.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(13)
గుల్జార్ లో మానవ జీవితంలోని సంఘర్షణలను విభిన్న కోణాల్లో మలిచే అపారమైన సృజన శక్తి దాగి ఉంది.గుల్జార్ షాయరీ కవితలో పొంగి పొరలే భావాలు, అద్భుతమైన పద సంపద, జీవితానుభవం,తాత్వికతతో నిండి ఉండి పాఠకుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి.గుల్జార్ షాయరీ కవితలోని భావాలను గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందా అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.
“ఎవరి కోసమైతే చీకటి నిండిన రాత్రులతో
“స్నేహం చేశానో ….
“వాళ్ళే ఉదయపు వెలుగులో నన్ను
“నిర్దయగా వదిలేశారు.
అతని మనసు గతం గురించిన తలపోతలు,అనుభవాలతో నిండిన ఆలోచనలు ఒక తెరిపి లేకుండా నిరంతరంగా సాగుతున్నాయి.అతని మనసులో చెలరేగిన ఆలోచనలకు ఒక క్రమం లేదు.అతను తన హృదయంలో ఆమెకు చోటు ఇచ్చాడు.ఆమెను ఎంతగానో అపురూపంగా ప్రేమించాడు.ఆమెతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నాడు.ఆమె లేకుండా తన జీవితం లేదు అనుకున్నాడు.తాను ప్రేమించిన ఆమెను గురించి చెప్పకుండా చీకటితో స్నేహం చేశాను అంటున్నాడు. రాత్రులు చిమ్మ చీకటితో నిండి ఉంటాయి. అంధకారంలో చూస్తే కంటికి ఏమీ కనిపించదు. అతను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు,కలిసి రాని కఠిన సమయం,మూర్తీభవించిన సహనం, మొక్కవోని ధైర్యం,ఆత్మవిశ్వాసాన్ని పెంచినాయి. నేను కష్ట సమయాల్లో ఎవరినైతే చేరదీశానో వారు నన్ను ప్రభాత వేళ  నిర్దాక్షిణ్యంగా వదిలేశారు అంటున్నాడు.కష్ట సమయాలు ముగిసిన తర్వాత తన జీవితం నూతనత్వంతో కూడిన ప్రకాశవంతమైన సూర్యకిరణాలు సోకి అద్భుతమైన సమయం ప్రారంభమైనప్పుడు తన చెంతనే ఒకప్పుడు అనురాగం,ఆప్యాయతతో తనను ఆశ్రయించి ఉన్న వారు అక్కర తీరిన తర్వాత తనని వదిలి పెట్టారనే భావాలను చక్కగా వ్యక్తీకరించారు. మరపురానిది,మరిచిపోలేనిది స్నేహం అంటారు. ఎల్ల వేళలా స్నేహం ఒక్క తీరుగా ఉంటుంది. స్నేహంలో మార్పు ఉండదు.కఠిన సమయాలు వచ్చినప్పుడు స్నేహం మారదు.కఠిన సమయాల్లో కూడా స్నేహం,ప్రేమ,ఆప్యాయతలు పొంగి పొరలుతూ ఉంటాయి.కష్ట సమయాలు తీరి వారి పరిస్థితులు బాగుపడి నప్పుడు వారు అతనితో కలిసి మెలిసి ఉన్న స్నేహాన్ని మరిచిపోయి నమ్మక ద్రోహంతో మోసంతో పట్టించుకోనితనంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం,విడిచిపెట్టడం, స్నేహంలో గల వ్యత్యాసాన్ని స్వార్థపూరితమైన మనుషుల నైజాన్ని తెలియజేస్తుంది.అతను తన జీవితంలో ప్రత్యక్షంగా జరిగిన అనుభవాలు మరియు యదార్థమైన సంఘటనల దృశ్యాన్ని  కళ్ళముందు కదలాడినట్లుగా షాయరీ కవితలో వ్యక్తం చేయడం జరిగింది.ఎవరినైతే అత్యంత ఆప్తులుగా భావించి నమ్మినాడో వారు అతని గుండె పగిలేలా చేశారు.నమ్మిన స్నేహితులు అతని నమ్మకాన్ని వమ్ము చేసినారు.తన గుండెకు కోలుకోలేని  గాయాన్ని కలిగించి తీరని ద్రోహం చేశారు.స్నేహితులు ఇలా చేయడం ఎక్కడా చూడలేదు.స్నేహానికి జరిగిన అవమానం ఇది. ఎవరు కూడా కలలో ఊహించని సంఘటన.అతను వారిని తన వారని అమాయకంగా నమ్మినాడు. అతను వాళ్ళ శ్రేయస్సు కొరకు అహో రాత్రులు శ్రమించాడు.అతను ఎన్ని కష్టాలు ఎదురైనా భరించినాడు.అతను వారి జీవితాల్లో వెలుగులు నింపాడు.కష్టాలు తీరిన తర్వాత వారు అతనిని నిర్దయగా వదిలేశారు అని బాధపడుతున్నాడు. లోకంలో మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తించిన తీరు వింతగా విడ్డూరంగా ఉంది.కష్టంగా ఉన్నప్పుడు వారు అతని చెంత చేరారు.కష్టం తీరిన తర్వాత అతని అవసరం మాకు లేదు అనుకున్నారు.అతని పట్ల కనపరిచిన దయా దాక్షిణ్యం లేని  వారి చేష్టలు క్షమించ రానివి.అక్కర తీరిపోయిన తర్వాత వారు అతనిని విడిచి  పెట్టి వెళ్లి పోవడం ద్రోహంగా చెప్పవచ్చు.లోకంలో మనుషులు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు.అవసరం ఉన్నప్పుడు మనుషులు ఒక తీరుగా ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత మరో రకంగా ఉంటారు.అతని పట్ల వారి ప్రవర్తన ఎప్పటికీ క్షమించరాని ద్రోహంగా చెప్పవచ్చు.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తీకరించిన భావాల్లో నిజాయితీ ఉంది.కష్టాల్లో ఉన్నప్పుడు మరియు కష్టాలు తీరిన తర్వాత మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ షాయరీ కవిత తెలియజేస్తున్నది.స్నేహంలో కూడా ద్రోహం ఉంటుందని మనకు షాయరీ కవితలోని భావాల ద్వారా అవగతమవుతుంది.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(14)
గుల్జార్ లో సామాజిక దృక్పథం,తాత్విక చింతన,అపారమైన జీవితానుభవం మరియు లోక రీతికి చెందిన షాయరీ కవితలో వెల్లడించిన భావాలు పాఠకుల మనోఫలకంపై చెరగని ముద్ర వేస్తాయి.గుల్జార్ రచించిన షాయరీ కవిత్వం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అపూర్వమైన అనుభూతుల లోకంలోకి వెళ్లి విహరించండి.
“కాకరకాయలా చేదుగానే ఉండు
“గులాబ్ జామూన్ లా తియ్యగా
“ఉన్నావనుకో …జాగ్రత్త జనం తినేస్తారు
“నిన్ను!
కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తీకరించిన భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.మనిషికి తన జీవన గమనంలో తన లోతైన జీవితానుభవం తోడ్పడుతుంది. లోకంలో మనుషులు అందరు ఒక్కలా ఉండరు. విభిన్నమైన మనస్తత్వాలు కల వాళ్ళు ఉంటారు. మనిషి చేతికి ఉండే ఐదు వేళ్ళు ఒక్కలా ఉండవు. ఒక్కో వ్రేలు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. లోకంలో నివసించే మనుషులు విభిన్నమైన వ్యక్తులతో వ్యవహరించాల్సి ఉంటుంది.వారు అటు వంటి సమయంలో సహనంతో మెలగాలి.మనిషి తాను ఇతరులతో ఎలా మసులుకోవాలి అనేది ఒక రకమైన కళ.అట్టి అపురూపమైన కళలో కవి గుల్జార్ నిపుణుడు అని షాయరీ కవితలోని భావాల  ద్వారా వ్యక్తం అవుతున్నది.ఇవ్వాళ మంచిని చెప్పే వాళ్ళు అరుదుగా ఉంటారు.మంచిని బోధించే కవితలోని భావాలు చదువుతుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.మనిషి నడవడి సవ్యమైన మార్గంలో ఉంటే జీవితం సరి అయిన బాటలో సాగుతుంది.గుల్జార్ జీవితానుభవంతో వెలిబుచ్చిన భావాలు సకల మానవాళికి అనుసరణీయం. మంచిని పాటిస్తే జీవితంలో విజయం సాధించి ముందుకు సాగడం ఖాయం.జీవితం అనే ప్రయాణంలో మనిషి జాగరూకతతో నడుచుకోవాలి. లేకుంటే బొక్కబోర్లా పడతాడు. మనిషి అడుగుల్లో తేడా వస్తే అధః పాతాళానికి దిగజారుతాడు. మనిషిగా మనం మనగలగాలంటే ఏం చెయ్యాలి అనే సందేహాలు మనని వెంటాడుతాయి.ఈ లోకంలో మనిషిగా మనుగడ సాగించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోకానికి ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా,తియ్యగా,మంచిగా కనిపించేదైనప్పటికీ అందులో ఒక జాగ్రత్త అనేది తప్పకుండా ఉండాలి. అది మన జీవితానికి ఎంతో అవసరం.అందులో సందేహానికి తావులేదు.లోకో భిన్న రుచిః లోకంలో భిన్న రుచులు కల వాళ్ళు ఉన్నారు.సహజంగా మనం రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడడం జరుగుతుంది.మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి మంచిది కాక పోయినప్పటికీ రుచి గల పదార్థం అయితే మనం ఇష్టంగా తింటాం. ఆరోగ్యానికి మంచి చేసేది అయినప్పటికీ రుచిగా లేకుంటే ఆ పదార్థాలను మనం తినం.రుచి లేని ఆహార పదార్థాలు తీసుకోవడం జరగదు మరియు వాటి జోలికి పోకుండా ఉంటాం.చాలా మంది కాకర కాయ పేరు వింటేనే చాలు.అమ్మో కాకరకాయ!నాకు వద్దు చేదు కూర అని పెదవి విరుస్తారు.చాలా మందికి కాకర కాయ చేదు అయినప్పటికీ మనసులో తినాలని కోరిక ఉంటుంది.కాకర కాయ చేదు అనే ఒకే ఒక్క కారణంతో దానిని తినడానికి అయిష్టత చూపుతున్నారు.ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో కాకర కాయ మొదటిదిగా ఉంటుంది. కాకరకాయ ఉపయోగాలు తెలిస్తే దానిని తినడం ప్రారంభిస్తారు.కాకరకాయ ఓ  తీగ జాతికి చెందినది కాకర కాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకరకాయ చేదు అయినప్పటికీ మధుమేహానికి మందుగా వాడుతున్నారు. కాకర కాయ చేదుగా ఉండడం వల్ల  జనాలు తినడానికి ఇష్టపడరు. గులాబ్ జామూన్ అనేది ఒక తీపి మిఠాయి.గులాబ్ జామూన్ తియ్యగా ఉంటుంది.తియ్యగా ఉన్న గులాబ్ జామూన్ తినడానికి అందరు ఆశగా ఎదురు చూస్తారు మరియు ఆనందంతో తినడానికి ఎగబడతారు.అదే విధంగా మనం కూడా అందంగా,తీయగా,ముద్దు ముద్దుగా మురిపాలు ఒలకబోస్తూ మాట్లాడుతూ ఉంటే మన ప్రవర్తనను ఆసరాగా తీసుకుని జనం మనలను  తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారు. అందుకే మనిషిగా మన స్వభావాన్ని మరియు వ్యక్తిత్వాన్ని కాకర కాయలా చేదుగా ఉంచంకుంటూ జాగ్రత్తగా కాపాడుకోవాలి.మన పట్ల మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని ఇతరులు తమ స్వార్థపూరితమైన ప్రయోజనాలకు వాడుకుంటారు. మనం మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోకపోతే ఇతరులకు మనం కేవలం వాడుకునే వస్తువుగా మిగిలి పోతాం. మనిషి వ్యక్తిత్వం అలా చేదుగా ఉన్న. చేదుగా ఉన్న మన జీవితంలోకి ఇతరులు చొరబడరు.స్వార్థపరులైన  ప్రజలు కాకరకాయలా చేదుగా ఉండే మనకు దూర దూరంగానే ఉంటారు.గులాబ్ జామూన్ లా మనం తీయ తియ్యగా ముద్దులు ఒలకబోసేలా మాట్లాడుతూ ఉంటే ప్రపంచం మనల్ని మిగలనివ్వదు.కాబట్టి ఈ కవితలో  మనిషిగా మీ  మీ వ్యక్తిత్వాల ప్రత్యేకతను జాగ్రత్తగా కాపాడుకొండి.
అనే ఒక గొప్ప సూచన దాగి ఉంది.కవి గుల్జార్ షాయరీ కవిత మనకు ఒక బలమైన  సందేశాన్ని మరియు జాగ్రత్తలను తెలియజేస్తున్నది.మనిషిగా మీ ప్రవర్తన కాకరకాయలా చేదుగా ఉండాలి. మనిషిగా మీరు  తీయ తీయగా గులాబ్ జామూన్ లా బలహీన మనస్తత్వం కలిగిన వారుగా ఉంటే తెలివైన  ఈ లోకంలోని ప్రజలు  మిమ్మల్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు.మీ వ్యక్తిత్వంలో తేనె లాంటి తీపి పదార్థాలు గల గులాబ్ జామూన్ లాంటి స్వభావం ఉంటే అందరు మిమ్మల్ని దోచు కుంటారు. మీరు మీ జీవితం పట్ల గాడమైన అనురాగం,ఆప్యాయత కలిగి ప్రతి క్షణం మెళుకువతో జాగ్రత్తగా ఉండాలి.ఎందు కంటే ఈ ప్రపంచం మీరు గులాబ్ జామూన్ లా తీపిగా సరళంగా ఉంటే మీలోని విలక్షణతను వాడుకుంటుంది.మీరు కాకరకాయలా చేదు స్వభావం కలిగి ఉంటే ఈ విశాల ప్రపంచం మిమ్మల్ని చూసి భయపడుతుంది.మీకు దూర దూరంగా ఒదిగి ఉంటుంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఈ కవిత మనిషిగా మీ వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి?.మనిషిగా మీరు ఈ ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి? అనే గొప్ప సందేశాన్ని అందిస్తున్నది.గుల్జార్ షాయరీ కవిత ఊహాత్మకమైన భావాల హెచ్చరికగా విలసిల్లుతున్నది.షాయరీ కవితలోని అపూర్వమైన భావనలు పాఠకులకు ఒక రకమైన వినూత్నమైన సందేశాలను  అందజేస్తున్నాయి.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

September 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

అల్లెన్, అతని కుమారుడు

by ఒద్దిరాజు మురళీధరంరావు August 1, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అల్లెన్ అనే వడ్ల గిర్నీ యజమానికి విలియం అనే ఒక కుమారుడు పుట్టాడు. కొడుకు చంటివాడుగా తొట్లెలో ఉన్నప్పటినుండి చూస్తూ తన ఏకైక వారసుడని సంతోష పడుతుండేవాడు. నువ్వు పెద్ద పెరిగాక మిల్లు యజమానివి అవుతావు నావలనే. నేను మా తండ్రి దగ్గర నుండి ఈ వృత్తిని తీసుకొన్నాను.వడ్లు పట్టే గిర్నీ వృత్తి వాళ్ళం అయ్యాము అని అనుకుంటుండేవాడు.
అల్లెన్ చాలా కాలం నుండి గిన్నివాడని పిలువబడుతుండేవాడు.కానీ విలియం కర్ర పనిని ఇష్టపడేవాడు. అప్పటినుండి ఎప్పుడూ ఒక కత్తి పట్టుకొని కర్రను చెక్కడం ఇష్టపడేవాడు అతను పెరిగాక కర్ర పని తప్ప వేరే ఏదీ చేయనని అనేవాడు. అతని తండ్రి అలా అయితే ఇంటి నుండి వెళ్లగొడతానని భయపెట్టేవాడు. ఆ మాట ప్రభావం పడినప్పుడు ఎన్నో రకాలుగా ఆశపెట్టాడు అయినా ఆ బుజ్జగింపులు పనిచేయలేదు అప్పుడు తండ్రి మన వృత్తి మారిపోతుందని కొడుకును బాగా తిట్టాడు. తండ్రిని మెప్పించే కన్నా తను ఇష్టపడిన వడ్రంగి వృత్తినే అవలంబించాడు విలియం.అతని మాట విననందుకు గిర్నీ నుండి కొడుకును తీసివేశాడు. నువ్వు అన్నీ బయట ప్రపంచంలో నేర్చుకుంటావు అని బాగా దుర్భాషలాడాడు. విలియం బయటికి వెళ్లాడు తన గ్రామంలో కార్పెంటర్ పని వంటివి బయట కూడా దొరుకుతుందని తను తన కత్తితో బయటికి వెళ్లిపోయాడు.
ఆ రోజు నుండి అల్లెన్ ముందు లాగా పని చేసే శక్తి క్రమంగా కోల్పోయాడు. వెంటనే అతను పని చేసి సంపాదించి దాచవలసిన అవసరం కూడా లేదనుకున్నాడు. అందువల్ల మిల్లు పనిపై శ్రద్ధ తగ్గించేశాడు.దానివల్ల మిల్లు కు ధాన్యం తెచ్చేవాళ్ళు తగ్గిపోయారు ఇంతే కాకుండా ఆ మిల్లుకు కొంత దూరంలో ఇంకో మంచి మిల్లుకు వెళ్లిపోయేవారు అల్లెన్ తాగుడుకు కూడా అలవాటు పడ్డాడు.అందుకే మిల్లు అధ్వాన్నమైపోయింది.
అప్పటినుండి అల్లెన్ చేతకాకుండా అయిపోయినాడు.అతడు దేశమంతా తిరిగాడు. కానీ ఎక్కడా ఏ పని దొరకలేదు. అతని గుడ్డ సంచి ఎప్పుడు ఖాళీయే! అంతే కాదు, అతని చేత కర్ర బిచ్చగాని చేత కర్రలా అయింది. దయగల వారు పెట్టినప్పుడు మాత్రమే తినగలిగేవాడు.అలా అతని జీవితం దుర్భరమైంది. తిరిగి తిరిగి అతను రాష్ట్ర రాజధాని చేరాడు ,ఏదైనా పని దొరుకుతుందోనని! చివరకు ఒక పెద్ద కర్ర పని చేసే కొట్టు ముందుకు చేరాడు.
ఆ కర్ర మిల్లు దగ్గర చాలామంది పనివాళ్ళు పని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అందమైన వస్తువులు కర్రతో చేసినవి అక్కడ కనిపించాయి. వాటికి మంచి గిరాకీ కూడా ఉన్నది .అక్కడ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా ఉన్నది.
అక్కడి యజమాని ఈ ముసలతని చూశాడు.ఇతడు ఓ ముద్ద అన్నానికి నేల ఊడుస్తానని అంటూ కన్నీరు పెట్టుకొని తన రెండు చేతులను ముందుకు చాచాడు. “నాన్నా నన్ను గుర్తు పట్టలేదా మీరు,?”అని తన చేతులు బోర్లా ముందుకు చాపాడు.
“మీరు ఇక్కడ, మీ ఇంటి ముందు ఉన్నారు” అన్నాడు .అప్పుడు ఆ ముసలి వాడు అల్లెన్ తన కొడుకు ముందే ఉన్నానని గ్రహించాడు.
” నా మీద కోపం లేదా విలియం” అని అడిగాడు .”నా ఇంటి నుండి నిన్ను వెళ్ళగొట్ట లేదా ?
“అదంతా చాలా కాలం క్రితం “అని కొడుకు జవాబు ఇచ్చాడు. “కానీ నన్ను మీరు క్షమించాలి కూడా! నాకు తెలిసింది ‘మనిషి తనకు ఇష్టమైన పనే చేయాలి.అప్పుడే అతను ఆ పనిలో రాణించగలడు’. అన్నాడు విలియం.
” కానీ నేను ఇక్కడ ఏమి పని చేయాలి?” అని‌ ముసలి తండ్రైన అల్లెన్ రంధి గా అడిగాడు.
“మీకు చాలా పని ఉంది.” అని ఆ కార్పెంటర్, అల్లెన్ కొడుకు విలియం అంటూ,” నాకు ముగ్గురు కొడుకులు.అంటే మీకు ముగ్గురు మనుమలు. బహుశా వారిలో ఒకడిని మీరు మిల్లర్ను చేయవచ్చు”.

August 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

చిన్న గింజంత బంగారం

by ఒద్దిరాజు మురళీధరంరావు August 1, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

_ ఒక బిచ్చగాడు బిచ్చం యాచిస్తూ బజారులో పోతుంటాడు. అతని ఎదురుగా బ్రహ్మాండమైన ఒక రథంపై మహారాజు వస్తుంటాడు. ఆ చక్రవర్తి ని చూసి
అతను తనకు కావలసినంత బిచ్చం దొరుకుతుందని చాలా ఉల్లాసపడిపోయాడు బిచ్చగాడు.

కానీ, బిచ్చగాడు ఆశ్చర్యపోయేట్టు, ఖంగుతినేట్టు నువ్వు నాకేమిస్తావన్నాడు చక్రవర్తి. ఇదంతా ఏలిన వారు ఆడుతున్న పరాచకమనుకుంటాడు బిచ్చగాడు. నెమ్మదిగా,
జాగ్రత్త గా తన జోలె నుండి ఒక జొన్న గింజ ముక్కను తీసి చక్రవర్తి చేతిలో పెడతాడు .

ఆ సాయంత్రం బిచ్చగాడు తన జోలెలో చిన్న జొన్న గింజ ముక్కంత మెరుస్తున్న బంగారు బిళ్ళ ను చూస్తాడు. బాగా ఏడుస్తాడు. అతను తన జోలె లోని మొత్తం బిచ్చాన్ని చక్రవర్తి కి ఇచ్చేస్తే బాగుండేదనుకొని ఎంతో అనుకుంటూ బాధపడ్తాడు, దుఃఖిస్తాడు.
నిజానికి ఆ చక్రవర్తి భగవంతుడు.

తీసుకునే దానికంటే ఇవ్వడమే గొప్ప అని తెలిపే కథ ఇది. ఇదే ప్రపంచం లో అన్నింటి కంటే అందరినీ ఆకట్టుకునే గొప్ప గుణం. మనిషి తత్త్వాన్ని తెలిపే ఈ కథ రవీంద్రనాథ్ టాగూర్‘ గీతాంజలి‘ లోని 50 వ పద్యం. విశ్వకవి రవీంద్రుడు 1913 లో రచించినది.
ఇది భగవంతుడు భక్తుల ను విచిత్రం గా పరీక్షించే మార్గం

August 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కృష్ణాన్వేషణయే అంతరంగ అన్వేషణ

by Palakurti Rammurty July 31, 2024
written by Palakurti Rammurty

నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై
జల్లెడివాడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వురా
జిల్లెడిమోమువాడొకడు చెల్వుల మానధనంబుదెచ్చెనో
మల్లియలార మీపొదల మాటున లేఁడుగదమ్మ చెప్పరే!
(భాగవతం – పోతన గారు)
నల్లనివాడు:- కృష్ణుడు…. “కృష్” భూవాచకము… “ణ” కారము మోక్షానికి ప్రతీక. “భూ” శబ్దము ప్రయత్న శీలతకు ప్రతీక కాగా “ణ” కారము ఆ ప్రయత్నానికి వచ్చే ఫలితము. ప్రయత్నించిన వారికి లేదా దృఢమైన సంకల్పంతో సాధన చేసిన వారికి వారి సాధనకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు.. కృష్ణుడు అతడే భగవంతుడు. భగము అంటే…సమగ్రమైన కామము, విభూతి, యత్నము, మాహత్మ్యము, శ్రీ, ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనసును ఆకర్షించేవే లేదా ఆకర్షక కేంద్రాలే. ఇవన్నీ కలిగినా వీటికి అతీతంగా ఉండేవాడు భగవంతుడు. అందుకే గోపికలు కృష్ణుడివైపు ఆకర్షితులయ్యారు… వాటిని లేదా అవి కలిగిన వానిని సాధించాలని వెతుకుతున్నారు, గోపికలు. అవి ఎక్కడుంటాయి? నిజానికవి అంతటా ఉన్నాయి… కాని వారు గుర్తించడం లేదు.. ఎందుకు అంటే… గోపికలు రజస్ తమో గుణాల బంధనాలలో చిక్కినవారు. మనసులో ఏదో కావాలని ఉన్నది కాని స్పష్టత లేదు… ఆ స్పష్టతను సాధించే ప్రయత్నమే వారి వెతుకులాట. నిజానికది సత్వగుణ సాధనకే. ఇక ఎక్కడ వెతుకుతున్నారు. మల్లెల పొదల మాటున వెతుకుతున్నారు. మోక్ష సాధన కావాలి అనుకోవడం “కామమే”. నేను సాధించాలి అనుకోవడం సాత్వికాహంకారం. నిజానికి సాత్వికాహంకారం కూడా లక్ష్య సాధనలో ప్రతిబంధకమే.
వెతకాలి అంటే దేనిని వెతుకుతున్నామో దానికి ఒక రూపమో లక్షణమో ఉండాలి కదా… అందుకే ముందుగా నల్లగా ఉంటాడని చెపుతున్నారు. నలుపు పెంజీకటికి ప్రతీక. ఉన్నది పెను చీకటి మాత్రమే. వెలుగు అనేది సృష్టి. సృష్టించబడింది… నశిస్తుంది. శాశ్వతత్వాన్ని కలిగింది నలుపు మాత్రమే. వెలుగు సృష్టించబడింది అంటే… ఉన్న చీకటిలో వెలుగు కూడా ఉన్నట్లే కదా. కాబట్టి కృష్ణుని శాశ్వతత్త్వాన్ని పరిచయం చేయడానికి, అనంతత్త్వాన్ని చెప్పేందుకు, సర్వవ్యాపితత్త్వాన్ని చెప్పేందుకు నలుపును చెప్పారిక్కడ. నలుపును ఎలా తెలుసుకోవాలి? తెలిసిన వారో, చూసిన వారో ఎలా గుర్తిస్తారు? అంటే… ఆ పెంజీకటికి ఆవల ఉన్న వెలుగు వల్ల గుర్తించాలి. టార్ఛ్ లైట్ వేసినట్టుల. ఆ వెలుగే జ్ఞానం. ఈ జ్ఞానం రెండు రకాలు. జ్ఞానం పెరిగినా కొద్దీ “నాకు తెలుసు” అనే అహంకారం పెరుగుతుంది. ఇంకా కావాలనే “జిజ్ఞాస” పెరుగుంది. నేనే “అధికుడనని” నిరూపించుకోవాలనే ఆతృత పెరుగుతుంది. ఇవి పిల్లల మూర్ఖత్వం లాంటిది (Childishness). ఎదుటివారు గుర్తించక పోతే అసహనం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఆచరణ లేని “తెలుసు”కోవడానికి ప్రేరణ నిస్తావి. ఇది మొదటి రకం. ఇక రెండవ రకం… సమత, క్షమత కలిగి విశాల భావనామయ జగత్తు అంతరంగంలో ఆవిష్కృతమౌతుంది. ఇది పసిపిల్లల మనస్తత్వం లాంటిది (Child likeness). మొదటి మానసిక స్థితి ఇతరములను గుర్తించేందుకు సహకరించదు. గోపికలు ఈ స్థితిలోనే ఉన్నారు… “ఆకాశశరీరంబ్రహ్మ సత్యాత్మప్రాణారామం మనఆనందం శాంతిసమృధ్ధ మమృతం ఇతిప్రాచీన యోగ్యోపాస్వ” అన్న తైత్తిరీయం ఆధారంగా ఆకాశమే శరీరముగా కలిగిన కృష్ణుడు సర్వాంతర్యామిగా గుర్తించలేమిని, కృష్ణుడిని తమవానిగా, అతనికొక పరిధిని సృష్టించి ఆ పరిధిలో ఆలోచిస్తూ… అపరిమితత్వాన్ని పరిమితత్తంలో వెతుకులాటను ఆరంభించారు, గోపికలు.

పద్మనయనంబులవాడు:- పద్మాలు లక్ష్మీదేవికి నివాస స్థానాలు. లక్ష్మీదేవి సకల ఐశ్వర్యానికి ప్రతీక. ఐశ్వర్యం ఎక్కడ ఉంటుంది అంటే… దానిని భరించగలిగిన వారి వద్ద ఉంటుంది. సమగ్రత్వానికి చిరునామా కృష్ణుడే కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడే ఉంటుంది. ఐశ్వర్యం అంటే భౌతిక సంపద మాత్రమే కాదు కదా… అది జ్ఞాన సంపద కూడా. జ్ఞానాన్ని అనుగ్రహించ గలిగిన వాడు కృష్ణుడు. ఏది మన వద్ద ఉంటే అదే ఇవ్వగలము. అన్నీ ఉన్నవాడు అన్నీ ఇవ్వగలడు. అందువల్ల ముందుగా సకలైశ్వర్యాలకు ఆలవాలమైన లక్ష్మిని సాధించాడు. అర్హత ప్రాతిపదికగా ఇవ్వాలి కాబట్టి గోపికల అర్హతను పరీక్షించేందుకే వారికి కనిపించడం లేదు.

కృపారసంబు పైజల్లెడివాడు:- “కృప” అనేది మనసు పొందే ఒకానొక భావోద్వేగస్థితి. ఇతరుల కష్టసుఖాలకు స్పందించే మానసిక స్థితి. ఇది అదుపులో ఉంటే.. అర్హత ప్రాతిపదికగా ఇవ్వవచ్చు అది సదుపయోగమవుతుంది. లేకపోతే దురుపయోగమవుతుంది. జిజ్ఞాస నిర్మలమై అంతశ్ఛేతనలోని కోరిక లేదా సంకల్పం బలోపేతమై కార్యావిష్కరణకు దారితీయాలి అంటే… భగవంతుని “కృప” కావాలి… సాధకునిలో నిశ్చలమైన చింతన ఉండి సరైన మార్గంలో సాధన సాగుతూ ఉంటే ఆ సాధకులపై కృపారసాన్ని జల్లేవాడు, కృష్ణుడు.

మౌళిపరిసర్పిత పింఛమువాఁడు:- తలపై నెమలిపింఛము ధరించినవాడు. అంటే ఎవరితో కూడా ఏ దేహ సంబంధిత అనుభూతులు, అనుభవాలు లేనివాడు అని భావము. ఎందుకు అంటే… నిర్వికార, నిరాకార తత్త్వమే పరబ్రహ్మము. కృష్ణుని ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని దర్శించాలి అంటే ఆ స్థితిని సాధకుడు పొందాలి. సాధకుని నుండి భగవంతుడేమి ఆశిస్తున్నాడో ఆ స్థాయిని భగవంతుడూ ప్రదర్శించాలి. ఇక్కడ చిన్న అవగాహన కావాలి. గోపికలు దేహధారులు. వారికి తెలిసిన, వారు చూస్తున్నకృష్ణుడూ దేహధారియే… దేహధారుల మధ్య ఉండే దర్శన సమగ్రతను సంతరించుకోదు. అయినా గుర్తించాలి అంటే.. ఒక గుర్తును చూపాలి కాబట్టి నెమలిపింఛాన్ని కలిగిన వాడని చెపుతున్నారు

నవ్వురాజిల్లెడిమోమువాడు:- దరహాసాస్యం ప్రసన్నతకు, ప్రశాంతతకు చిహ్నం. కృష్ణుని ముఖం ప్రక్షణమూ చిరునవ్వులతో వెలుగుతుంది. శరీరం ఒక షోరూం అనుకుంటే.. అందులో ఉండే షోకేస్ లాంటిది ముఖం. అది చక్కగా, పద్ధతి ప్రకారం, ఆకర్శణీయంగా ఉంటే వినియోగదారుడు ఆకర్షితు డౌతాడు. కృష్ణుని ముఖం కూడా దర్శించిన ప్రతి వానికి హాయిని గూర్చుతుంది, ఆనందాన్ని పంచుతుంది. సాధారణంగా నాలుగు స్థాయిలలో ఆనందాన్ని చెప్పడం జరుగుతుంది. మొదటిది సంతోషం, రెండవది ఆనందం, మూడవది తాదాత్మ్యత నాలుగవది తన్మయత. ఈ తన్మయ స్థితినే ఉపనిషత్తులు శాశ్వతమైన బ్రహ్మానందం స్థితిగా ప్రతిపాదించాయి.

ఒకడు:- ఒకడేమిటి? అంటే “ఏకమేవ అద్వితీయం బ్రహ్మ” నిజానికి ఉన్నది ఒక్కడే… అద్వైతమే… భగవంతుడు ఒక్కడే… దృష్టిభేదం చేత అనేకంగా కనిపిస్తున్నాడు. గోపికలు ఒక్కొక్కరు ఒక్కక్క రూపంలో అతనిని భావించారు. అతడు ఒక్కడే తాను చూచిన లేదా భావించిన కృష్ణుడు మాత్రమే అనే భావనలో ఉన్నారు. అందుకే వారు ఒక్కడే అని ప్రతిపాదిస్తూ.. ఒక్కడు అంటున్నారు. ఒక వ్యక్తిని గాని, ఒక వస్తువును గాని చూడగానే దాని ఆకృతి పట్ల ఒక చిత్రం మన మనసులో ఆవిష్కృతమౌతుంది. ఆ చిత్రం ఎదుటి వారి మనసులో ఆవిష్కృతమైన చిత్రం వలనే ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఇది చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక చిత్రాన్ని ఊహించుకున్నా.. దాని ప్రసక్తి రాగానే తామూహించుకున్న చిత్రానికి అనుసంధానించుకుంటారు. కాబట్టి అనేకమయినా అది ఏకమే. ఆ ఏకాన్నే ఒక్కడు అంటున్నారు గోపికలు.

చెల్వలు… చెల్వలు అంటే స్త్రీలు. స్త్రీ లో “స” కార “ర” కార “త” కారాలు “ఈ” కారంతో బంధింపబడి ఉంటాయి. సత్వరజస్తమో గుణాలను ఒకటిగా బంధించి వేసే అహంకార మమకారాదులు ఈ కారంగా తీసుకుంటే… ఈ త్రిగుణాలకు బంధీ అయిన వారంతా స్త్రీలే. “ఈం” అమ్మవారి బీజం. అదే లక్ష్మీ అంశగా చెప్పుకోవచ్చు. ఆమె కృష్ణుణ్ణి పొందే ఉంది… ఆయన పరబ్రహ్మ కనుక సత్త్వోపలబ్ధితో గోపికలు ఆ స్థానానికి ఎదగడమే మోక్షం…

మానధనంబు తెచ్చె:- గోపికల మానధనాన్ని దోచాడట. అంటే వారి వద్ద మాన ధనం ఉంది. మానము అంటే… దేహాభిమానం కావచ్చు, అహంకార మమకారాదులు కావచ్చు. మేమే సాధకులమనే ఆధిక్యతాభావన కావచ్చు. కృష్ణ సాంగత్యాన్ని పూర్తిగా తామే అనుభవించాలనే “కామము” కావచ్చు. ఇలా అన్ని విధాలయిన మానాదులచే అతి భారమయింది వారి అంతరంగం. భారమయిన దానితో ప్రయాణించడం వారికి కష్టమౌతుంది. ఆ మానాన్ని దోచుకున్నాడు, కృష్ణుడు. దానితో భారహీనులయ్యారు, గోపికలు. భారహీనత సన్నద్ధతను సూచిస్తుంది. అన్నీ పోగొట్టుకున్న గోపికలు అన్ని అర్హతా పరీక్షలలో ఉత్తీర్ణులయినట్లు గానే భావించాలి. ఉద్యోగ పరీక్షలన్నింటిలో నెగ్గి నియామక పత్రానికై ఎదురుచూచే స్థితి వారిది. ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి.

ఓ మల్లియలార:- స్వఛ్చత స్వఛ్చతను ఆకర్షిస్తుంది. మల్లెలు స్వఛ్ఛతకు గుర్తు. తాము స్వఛ్ఛతను సంతరించుకున్నారు. కాబట్టే గోపికలు స్వఛ్ఛమైన మల్లెలను ఆశ్రయించారు. దేనికి ఆ మల్లియలలో ఉన్న పరమాత్మను అన్వేషించేందుకు. ఇంకా అన్వేషణ వారికి బాహిరంగానే సాగుతుంది. బాహిరాన్వేషణలో పరమాత్మ లభ్యంకాడు…

మీపొదల మాటున:- “పొద” అంటే ఆవరణం. కొన్ని జన్మల నుండి పొందిన కర్మల ఫలితాలు ముద్రల రూపంలో మనసుపై ముద్రింపబడి ఆవరణాలుగా ఏర్పడ్డాయి. ఆ ఆవరణాలు మాయగా చెప్పబడుతూ అంతశ్చేతనలోని పరమాత్మ తత్త్వాన్ని చూడనీయకుండా, గ్రహించనీయకుండా అడ్డుకుంటున్నాయి. ఆ ఆవరణాలను ఎన్ని సాధనలో దాటగలిగినా ఇంకా ఎక్కడో ఏ మూలో ఒకటో రెండో మిగిలి అంతరంగాన్ని చూడడంలో స్పష్టతనీయడం లేదు. ఏది కనిపిస్తే అక్కడ వెదుకుతున్నారు. అంతటా ఉన్న పరమాత్మను ఎక్కడా చూడలేకపోవడంతో వారిలో చిన్న సందేహం పొడసూపింది. అందుకే… పొదలనే (మాయనే) అడుగుతున్నారు…. మీ పొదల మాటున…….

లేఁడుగదమ్మ చెప్పరే:- సాధారణంగా ఎవరిని గూర్చయినా అడగవలసి వచ్చినప్పుడు, “అతనున్నారా” అని అడుగుతాము. అది అతని ఉనికి పై స్పష్టత లేకపోవడం. కాని లేడు కదా అనడం… సంశయానికి నిదర్శనం. సంశయం ఉన్నదానిని కూడా గుర్తించనీయదు. “ఛిద్యతే హృదయగ్రంధి: భిద్యంతే సర్వ సంశయా:” అజ్ఞానం నశించి మాయావరణం తొలగిపోతే జ్ఞానోదయం ఐనట్లే. “కలడు కలండనెడి వాడు కలడో లేడో” అనే ఏనుగు సందేహం ఎలాంటిదో గోపికల సందేహమూ అలాంటిదే. పోతనగారికే ఎన్నో మార్లు భగవంతుని ఉనికిపై సందేహం కలగడం, ఆ సందేహ నివృత్తిని పొందడం భాగవతంలో ఎన్నో మార్లు కనిపిస్తుంది.

బహుశా.. ఇది పోతన గారికి కలిగిన సంశయం కాకపోవచ్చు. సాధకులకు కలిగే అవకాశం ఉన్న ప్రతి సన్నివేశాన్ని గుర్తించి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వాడుకున్న సందర్భాలు కావచ్చు.
చివరగా ఒక సందేహం. కృష్ణుని జాడ చెప్పమని గోపికలు ఈ చెట్లు చేమల చుట్టూ తిరగటమేమిటి? పైగా వాటిని అడగటమేమిటి? అవి ఎలా చెపుతాయి? వాటికి మాట్లాడే శక్తి ఉన్నదా? అంటే ఉన్నది అనే చెప్పాలి. ” ఓషధయః సంవదన్తే” అనేది వేదము.
అంతేకాదు… సకల సృష్టీ భగవత్కల్పితమే కదా… అన్నింటిలో ఉండేది భగవంతుడే కదా… ఆయన అంశలేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. కాబట్టి చెట్లు చేమలలో కూడా భగవదంశను గుర్తించి దానితో గోపికలు ముచ్చటిస్తున్నారు. మరొక అంశం… మాట్లాడే భాష… మౌనం పలికించినన్ని భావాలను శబ్దాలు పలికించలేవు. భగవంతుని భాష మౌనమే… ఆమౌనంలోనే ఎన్నో ప్రశ్నలు ఎన్నో జవాబులు.

July 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాట

by Jhostna Tattiraju July 31, 2024
written by Jhostna Tattiraju

బాట ……
ఇది నున్నని నల్లని తారుబాట
చూస్తున్నకొద్దీ చూడాలనిపించే బాట
ఏవేవో తలపులను రేకెత్తించే బాట
ఎన్నెన్నో మలుపులు తిరిగే బాట

ఎందరినో గమ్యానికి చేర్చే బాట
గమ్యమే ఎరుగని బాట
జీవనగమనంలో నేస్తమైన బాట
జీవితమే గమనమైన బాట

వేకువ వెలుగురేకలు విచ్చుకునే వేళ
ప్రభాత పవనపు స్పర్శకి తలలూపే చెట్లతో
పక్షుల కిలకిలలు,గుడిగంటల సవ్వడితో
ఆహ్లాదకరమైన అందమైన బాట

పాఠశాలలకు వెళ్లే పిల్లల పరుగులతో
ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగుల హడావిడితో
వాహనాల రణగొణధ్వనులతో ట్రాఫిక్ తో
చీకాకుపెట్టే చిందరవందర సిటీబాట

మిట్టమధ్యాహ్నపు వేళ
మండిపడే సూర్యుడి ప్రతాపంతో
వేడెక్కి ఊదరగొట్టి
ఉస్సురుస్సురనిపించే బాట

సూర్యాస్తమయాన గూటికి చేరే
పక్షుల్లాంటి పిల్లాపాపలతో,
ఉద్యోగులతో ఉక్కిరిబిక్కిరై
అలసిసొలసే బాట

సాయంకాలపు చల్లని వేళ
బేకరీలు చాట్ బండార్ లను
చేరిన జనంతో సందడి చేసే బాట
పానీపూరీ తినే కుర్రకారుతో
హుషారెత్తించే నగరపు బాట

రాత్రి కాంతుల్లో విందువినోదాలు పంచే
రెస్టారెంట్లు,సినిమాహాళ్ళతో చిత్రమైన బాట
అర్ధరాతిరి సద్దు సేయక నిద్దరోయే వేళ
అనాధలకు ఆశ్రయమిచ్చే అమ్మ ఈ బాట

మండే వేసవి వడగాడ్పులకు వేసారి,
చిరుజల్లుకు మురిసి,జడివానకు తడిసి,
గజగజ వణికించే శీతగాలులకు బిగిసి,
వసంతంలో రంగురంగుల పూలతో విరిసి
మెత్తటి తివాచీలు పరిచి, స్నేహహస్తం చాచి
పిలుస్తోంది ఈ బాట, చిక్కటి అనుభవాల ఊట!

ఎన్నినాళ్ళుగా ఏయే దృశ్యాలను కన్నదో,
ఎన్ని ఏళ్ళుగా ఏయే కథలను విన్నదో
ఎందరెందరిని ఎక్కడెక్కడికి చేర్చిందో
ఎవ్వరికీ చెప్పనిది,ఎల్లలే ఎరుగనిది ఈ బాట

ఉదయపు బాల్యాన్ని, మధ్యాహ్నపు యవ్వనాన్ని ,
సాయంకాలపు వృద్ధాప్యాన్ని చవి చూస్తూ
అనుభూతులను నెమరు వేసుకుంటూ
జీవనగమనానికి భాష్యంగా నిలిచింది ఈ బాట !

మలుపు మలుపుకీ మజిలీ చేయిస్తూ,
క్షణం క్షణం,తరం తరం, నిరంతరం
తరగని పయనానికి లక్ష్యమైనది ఈ బాట!!
గడిచే కాలానికి సాక్ష్యమైనది ఈ బాట!!!

July 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సినారె కవితా శిల్పం​

by డా॥ గండ్ర లక్ష్మణరావు July 31, 2024
written by డా॥ గండ్ర లక్ష్మణరావు

జూలై 29. సినారె జయంతి సందర్భంగా

​​జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఉన్నతపదవులు ఉదాత్తంగా నిర్వహించిన ప్రజ్ఞాధురంధరులు డా.సి.నారాయణ రెడ్డి. నవ్వని పువ్వునుండి నా రణం మరణం పైనే దాకా సాహిత్యసృజనలో ఎన్నో శిఖరాల నధిరోహించిన మహాగిరి సముదాయం సినారె కవిత. ఏ శిఖరాన్ని చూసినా అక్కడే ఆగిపోయి అబ్బురపడి అక్కడి శిల్ప వైభవాన్ని విశ్లేషించడం మరిచిపోయి తన్మయులమవుతాం. అది సినారె  శిల్పం లోని వైశిష్ట్యం.
​​ రచనలోని శిల్పం అంటే రచనా కళ అనీ, రచనా నైపుణ్యం అనీ చెప్పుకోవాలి. ప్రాచీన ఆలంకారికుల ప్రకారం శబ్దార్థాలంకారాదుల ప్రయోగం, రసరామణీయకాలు, ధ్వని మొదలైనవి శిల్పంలో అంతర్భాగాలు. సినారె పండిత కవి. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనమే కాదు అర్థవంతంగా సమర్థవంతంగా అధ్యాపనం చేసిన అనుభవ సంపన్నుడు. ఆధునిక సాహిత్యంలో సంప్రదాయము ప్రయోగములు పేరుతో నిశితంగా శోధించిన పరిశోధకుడు.ప్రాచీనాధునికతల సమ్మేళనం ఆయన మేధోక్షేత్రం. జానపదుల యాసలనుండి, పాటలనుండి, మాటలనుండి, శబ్దలయను హృదయగతం చేసుకున్న సహృదయుడు. పద్యాన్నీ పాటనూ సమంగా ప్రేమించి మధ్యేమార్గంగా గేయాన్ని అద్వితీయంగా నడిపించిన నవ్య కవితా వైతాళికుడు.


​​గేయమైనా, సినీగేయమైనా, ప్రపంచపదులైనా, ద్విపదులైనా, వచన కవితలైనా, వచనకవితా కావ్యాలైనా, వచనమైనా తనదైన అక్షర ముద్రలు అడుగడుగునా ప్రతిఫలింపజేసిన ప్రతిభాశాలి సినారె. తన అక్షరాలలో లయలు, అంతర్లయలు, ప్రాసలు, యతులు, అంతఃప్రాసలు, వృత్యనుప్రాసలు అలవోకగా సాగిపోతాయి. అక్షర రమ్యత అతిమనోహరంగా పాఠకుని లేదా శ్రోతలను పరవశింపజేస్తుంది. లకుమ నాట్యానికి రాములు వివశుడైనట్లు సినారె పదాలకు సహృదయులంతా పరవశులయినారు.
​​కావ్యాన్ని ప్రేమించి తన గొంతులోనుంచి అందంగా వినిపించిన వాడే కాదు స్వయంగా తొలినాళ్ళలో  పద్యాలు రచించిన వాడు. రామప్పలో ఒక పద్యం…
​​ఏదో వెల్గు కరళ్ళు ద్రొక్కినటులై ఏదో మహాసౌరభే
​​యీ దుగ్ధమ్ము నురుంగు లెత్తినటులై ఈ నా సమస్తాంగముల్‌
​​పాదుల్‌ వీడెను, జీవనాడులను శంపావల్లరుల్‌ నృత్య మ
​​ర్యాదల్‌ జూపెను – ఈ మహానుభవమౌరా ! యెట్లు రూపొందునో?
ఒక కళానుభూతిని శార్దూల విక్రీడితంలో బంధించిన తీరు ఇది.
​​సినారె సంప్రదాయం నుండి సారాంశాన్ని తీసుకున్నారు. కాని తిరస్కరించలేదు.
​​​నేను సంప్రదాయాన్ని జీర్ణించుకున్న
​​​ప్రయోగాన్ని
​​​ప్రయోగంలో జీవిస్తున్న
​​​సంప్రదాయాన్ని……………………… అని తన కవితా సిద్ధాంత తత్వాన్ని ఆవిష్కరించారు.
​​ఈ దృష్టితో సినారె రచనా శిల్పాన్ని సంప్రదాయ విమర్శలోను, ఆధునిక విమర్శలోను విశ్లేషించుకునే అవకాశం ఉంది.
​​నవ్వని పువ్వు నుండి నారాయణ రెడ్డి కవిత అనగానే చటుక్కున ఎవరికైనా స్ఫురించేవి శబ్దలయ, అంత్య ప్రాసలు. రెండింటినీ కాకుంటే కనీసం అంత్యాన్ని పాటించడం ఆయన సహజ ధారా లక్షణం.
​​ఓ చిన్నమొగ్గా ! ఓ కన్నెమొగ్గా !
​​చల్లచల్లని తీగె తల్లి ఒడిలో నూగు
​​ఓ చిన్ని మొగ్గా ! ఓ కన్నె మొగ్గా !
​​చివురుటాకుల లోన  / రవల రేకుల లోన
​​మంచు ముత్యాలుంచి / మంచి మధువుల నించి
​​ఉదయ భాను కరాల / సుధలు జారే వేళ
​​ప్రకృతి లక్ష్మి దివ్య / పాదపూజలు చేసి …………….. అని తొలిగేయం సాగింది. ఇందులో పదేసి మాత్రలకొక పాదం విరుగుతూ ఆది ప్రాసనూ అంత్య ప్రాసనూ పాటించారు. ప్రతి రెండు పాదాలలో వాడిన పదాల మాత్రలు సమతూకంలో ఉన్నాయి. దీనితో గేయ లయను సాధించారు. ‘ నడక నా తల్లి ‘ అని చెప్పుకోవడం లో తన ఉదయపు నడకకే కాదు తన హృదయ కవిత్వపు నడకకు కూడా వర్తిస్తుంది. నాటినుండి గేయం వచన గేయంగా మారినా ఈ ప్రాసనియమాలను, ఒకింత పదాలలో తూగునూ , నాద స్వభావాన్నీ మరిచిపోలేదు. విడిచి పెట్టలేదు. మాట్లాడినా , యతి ప్రాసలు దొర్లి పోయేవి. ఆ క్రమంలో ఆయన మాటే పాటయింది. పాటే పలువురాడుకునే మంచి మాటయింది. అందుకనే ‘ మాటకు దండం పెడతా / పాటకు దండం పెడతా / మాటను పాటను నమ్మిన మనిషికి దండం పెడతా ‘ అన్నాడు. ఇందులో మాట, పాట అనేవి ప్రాసలు. ‘ దండం పెడతా’ అనే పదం మనలను పల్లెలకు పట్టుకొని పోతుంది. తన మాట, పాట జానపదం అనే ధ్వని ఈ మాటలో ఉంది. ఈ రెంటినీ నమ్మిన మనిషికి అనడం కళాకారునికి, పల్లెటూరి శ్రమజీవికి, భాషావేత్తలకు, పశుత్వం కాక పరవశత్వం  పొందే హృదయానికి అనేంత అర్థయుక్తి ఉంది. అర్థ వ్యాఖ్యానం ఇంత చేయడానికి ఆ వాడిన పదాలు, వాటి తీరే కారణం కదా !.  
గేయాల గతులను, సినీ గేయాల శ్రుతులను గురించి  వివరించకుండా, వాటిలోని రచనా శిల్పాన్ని గురించి కొంత ప్రస్తావిస్తాను.
​​గేయాలలో అంత్యప్రాసలతో పాటు అనుప్రాసలు, అంతః ప్రాసలు కూడా పడి వాటి నడకల్లో సరికొత్త అందాలు, గానంలో మాధుర్యాలు తొణికిసలాడినాయి.
​​రాలలోపల పూలు పూసిన రామ మందిర లీలా
​​​ఆ రామ మందిర హేలా!
​​రాలలో హృదయాలు మోసిన రాసకేళీశాల
​​​రామ మందిర లీల………………………అనే ఈ గేయంలో ఎన్ని ‘ర’ , ‘ ల’ లు జతకట్టుకొని రాలిపడ్డాయి. అవే ఒక లీలను ధ్వనింపజేస్తాయి. ‘రాల’ లో ‘రామ’ మందిర , ఆ ‘ రామ’ సుందర  
‘ రాలలో…….. రాసకేళీశాల………… అనేక చోట్ల ‘రామ’, రా లు మధ్యలో రావడం వల్ల పద్యాల్లో యతివలె, ప్రాసయతివలె, నడకకు లయనూ అందాన్నీ కూర్చాయి. ఇట్లా గేయాలలో అనేకం చూపవచ్చును.
​​కనురెప్పల దుప్పట్లు ,  చిక్కుముళ్లలో తొక్కిసలాట…మొదలైనవి.
సినీగేయాలలో నన్ను దోచుకుందువటే నుండి అన్నింటిలోను ఈ ప్రాస యతుల నియమాలు నియమంగా కాక సహజంగా కనిపించడం సినారె పదశిల్పం.
​​కవితాశిల్పంలో కవితా నిర్మాణం, కావ్య నిర్మాణం రెండూ ఉంటాయి. కథాకావ్యాల్లో, దీర్ఘ కవితల్లో వస్తుపరమైన నిర్మాణం విభాగాలుగా అంతస్సూత్రంతో బంధించబడి ఉంటాయి. భూమిక, మట్టీమనిషీ ఆకాశం, మొదలుకొని విశ్వంభర దాకా ఈ అంతస్సూత్రం ఉంది. ఇది కథాకథన శిల్పంగా భావించాలి. విశ్వంభరను మానవేతిహాసంగా ఐదు ఖండాలుగా విభజించాడు. ఇవి మనిషి థలు. బాల్య కౌమార యౌవన వార్థక్య అవసాన థలు, చతురాశ్రమాలు – తరువాత జీవన భ్రమణం – జననమరణాల పునశ్చరణం – అయిదవ ఖండంలో తనదైన మానవతా సిద్ధాంతంతో ముడివేసి ” తరలిపోయే జీవితం – తిరగి చూడని చిరపథం’ మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి, అని ముగించడంలో మనిషి మనసు ప్రకృతి అనే మూడింటి అనుబంధాలు విడదీయరాదని బోధించారు.
​​ఒకటి ప్రపంచ చారిత్రక మానవేతిహాసం.
​​రెండు  మనిషి ఆబాల్య జీవనాంతం థల గమనం.
​​మూడు ప్రకృతి జీవుల అవినాభావ సంబంధం.
ఈ మూడు అంశాలు మూడు పొరలుగా సాగింది విశ్వంభర. ఇది మహాకావ్య లక్షణం ఇది కథా కథన శిల్పమయితే కథే లేని అంశాన్ని కథగా మలిచి వర్ణించడం మరో వినూత్న శిల్పం.ఈ విశ్వంభరను అనుశీలనం చేసిన మిత్రుడు గురిజాల రామశేషయ్య శాస్త్రి వ్యాఖ్యాన గ్రంథం సాహితీలోకానికి గమనార్హం.దీర్ఘ కథా కావ్యాలలో ఒకటి కేవలం స్పృశించాను.
​​అర్థశతాబ్దం వెలువడిన యాభయి పైగా కవితాసంకలనాలలో కవితల నిర్మాణాలు, బహురూపాలను సంతరించుకున్నాయి.
​1. భావలయలు ( లయలు) 2. దృశ్యచిత్రాలు 3.నాటకీయత – సంభాషణ శైలి 4.ప్రశ్నలు – ప్రశ్నోత్తరాలు
​5.శబ్ద, అర్థ ధ్వనులు 6.శ్లేషలు 7.చమత్కారాలు 8. కొత్త ప్రయోగాలు – పదబంధాలు 9. నిర్మాణ వైవిధ్యాలు​​10. కొత్త రూపాలు – ప్రపంచపదులు, గజళ్ళు మొదలగునవి.
ఒక భావం కోసం ఒక లయను రెండుపాదాలుగా , లేదా రెండుమూడు నాలుగు పాదాలుగా పాదసామ్యాన్ని పాటిస్తూ నడిపించడం భావలయ.
​కాలం కేలెత్తి పిలుస్తున్నది / కంకాళం లేచి నడుస్తున్నది
​గిరిజనుడే పురజనుడై / ధరాచక్రమును తిప్పే తరుణం వస్తున్నది – కాలం…… ( అక్షరాల గవాక్షాలు )
సినారె కవితల్లో దృశ్యచిత్రాలు భావాలను అనుభూతం చేయడమే కాక కళ్ళముందుంచుతాయి. వాస్తవంగా కనిపించే వాటిని వర్ణించి చూపడం, లేనివాటిని ఉన్నట్లుగా చిత్రించడం రెండు రకాల దృశ్యచిత్రాలుంటాయి.
​నదులు, పర్వతాలు, శిల్పాలు, జలపాతాలు, వృక్షాలు, పకక్షులు, ఋతువులు, మొదలైన వాటినన్నిటినీ సహజోక్తిలో చెపుతూనే శబ్ద సౌష్టవాన్నీ, అర్థగాంభీర్యాన్నీ పొదుగుతారు. వర్ణనలలో ఔచిత్యం పరచుకొని ఉంటుంది.
​​తడిమట్టి పొరల్లో తలదాచుకున్న /​విత్తనం మొక్కగా పైకి లేచి / కాలానుగుణంగా
​​శాఖోపశాఖలతో వృక్షమై విస్తరిస్తుంది (ప్రాకృతిక రూపాలు – అలలెత్తే అడుగులు)……….. ఇందులో మట్టిలో ఉన్న విత్తు మొలకై వృక్షమై విస్తరించడం చాలా సహజమైన విషయం. అయితే మట్టిలో తలదాచుకోవడం, పైకి లేవడం, విస్తరించడం అనే పదాలలో అటు చెట్టుకు, ఇటు ఎదిగే మనిషికి, లేదా ఏదైనా ఒక క్రమపరిణామం చెందే అంశానికి వర్తిస్తుంది. అర్థపరంగా కలిగే విస్తృతి ఇది. ఇక గింజ మొలకెత్తడం, పైకి లేవడం , చెట్టుగా ఎదగడం అనేది ఒక దృశ్యక్రమమే. నాలుగు పంక్తుల్లో చెప్పడం కూడా నాలుగు కాలాల వ్యాపకాన్ని తెలియజేస్తుంది.
ఇట్లాంటి పంక్తుల్లో సూర్యుడు, మబ్బు, గాలి, నీరు అంశాలను గురించి కూడా నాలుగేసి పంక్తుల్లో చిత్రించి చివరకు
వృక్షం, సూర్యబింబం, నీలిమేఘం, మారుతం, సాగరం అనే పదాలు వేరు వేరు పాదాలుగా విరిచి చివర ” విశ్వానికి స్థితి కారకంగా ఉన్న / ప్రాకృతిక రూపాలు ” అని ముగింపు లో రాశారు. పైన నాలుగు పాదాలలో చెప్పిన వాటికి క్రమంగా వాచ్యం చేసి క్రమాలంకారం పాటించారు. అంతేకాదు పంచభూతాలను ప్రాకృతిక రూపాలుగా నాలుగు , తరువాత ఒకటి చొప్పున ఐదేసి పంక్తులుగా పేర్చడం వలన పంచభూతాల పంచీకరణ ధ్వనిస్తుంది.చివరి మాటల్లో స్థితికారకాలు అని ప్రాకృతికాలు అంటే మూలాలు అనీ ప్రకృతి సంబంధాలు అనీ ఎప్పటికీ ఉండేవి అనీ స్పష్టం చేశారు. ఈ మాటలతో పై పాదాలను మరలా చదివితే కలిగే అర్థవ్యాకోచం మరోవిధంగా ఉంటుంది. ఉత్తమ కవిత్వానికుండాల్సిన లక్షణాల్లో ఒకటి అది మరలా చదివింపజేసేదిగా ఉండడం. భావవ్యక్తీకరణలో రూపనిర్మాణ శిల్ప వైశిష్ట్యం ఇది.ఇదంతా దృశ్యమానం కావడం మరొక విశేషం. ఇది ఒక మచ్చుతునక మాత్రమే.  ఇట్లాంటివి ఇంకా అనేక రకాల శిల్పాలు సినారె కవితల్లో కనిపిస్తాయి.
​​నాటకీయ పద్ధతిలో కవిత్వం సంభాషణా రూపంలో సాగిస్తారు కొన్ని చోట్ల….
​రోజులు గడుస్తున్నాయి / పూలు వాడిపోతున్నాయి
​గత్యంతరం లేక / తీగల్ని బతిమాలుకున్నాయి
”మమ్మల్ని మీలో పొదుగుకుంటారా?”  అనగానే తీగలు జాలి చూపులు ప్రసరించి
” వేళ దాటిపోయింది
అనాలోచితంగా మీరు తీసుకున్న నిర్ణయం
మీ అవసాన థకు దారితీసింది,
ఇప్పుడు నేనేం చేయలేను”
ఇదంతా పూలకు తీగలకు జరిగిన సంభాషణ. నాటకంలో పాత్రలు మాట్లాడుకున్నట్లుగా పంక్తులు ప్రశ్నలు, జవాబులుగా ఉండటం, వాటి తీరుతెన్నులు కూడా హావభావాలను ప్రకటిస్తున్నట్లు చూపడం కనిపిస్తుంది. తీగ జాలిచూపులు చూపడం వంటివి మానవీకరణ చేసినట్లుగా ఉన్నాయి. ఇట్లాంటివి కూడా సినారె కవితల్లో ఎన్నో ఉన్నాయి.
ప్రశ్నలు సంధించి సమాధానం రాబట్టటం. ఇక్కడ పాత్రల వలె కాక కవియే ఒక సన్నివేశంలో ఒక ప్రశ్నను సంధించడం దానికి సమాధానం కూడా తానే సూచించడం.
ఏం చేసుకోను ఈ వెండి కంచం? / ఏవేవో క్రిములు కదలుతున్నాయి
ఎలా పట్టుకోను ఈ మధుచషకం / ఏ వికట స్మృతులో తొణకుతున్నాయి  ( విశ్వంభర )……వీటిలో ప్రశ్న సమాధానమూ రెండూ ఉన్నాయి. పాత్ర కవి ఒకరే. ఒకవేళ ప్రశ్నలేకుండానే చెపితే ” కంచం వెండిదే అయినా క్రిములు కదులుతున్నాయి ” అని చెపితే అంత బలంగా వ్యక్తం కాదు. ఎవరో తనకు వెండి కంచమే ఇచ్చారు, కాని చూస్తే అందులో క్రిములున్నాయి, అంటే ఆ కంచం శూన్యం కాదు అందులో ఏవో పదార్థాలున్నాయి, వాటికి చీమలు పట్టినాయి, వెండి అయినా బంగారం అయినా ఆరగించే పదార్థానికి చీమలు పడితే వ్యర్థం కదా! అనే అర్థం ఈ ప్రశ్నతోనే సాధింపబడింది. అట్లే రెండవ ప్రశ్నలో తీసుకునే చషకంలో ఉన్న మధువులో లోపం లేదు, కాని తీసుకుంటే వికట స్మృతులు కలవరపెడతాయనే భయంలాంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకటి భౌతికమయింది, రెండవది మనస్సుకు చెందింది. మామూలు ప్రశ్నల వలె కనిపించే ఈ చరణాలలో ఇంత అర్థాన్ని ఇమిడించాడు సినారె. ఈ ప్రశ్నోత్తరాల నిర్వహణ కూడా నిర్మాణంలో ఒక భాగమే.
​​కొన్ని చోట్ల ప్రశ్నలే ఉంటాయి, సమాధానం వ్యక్తం కాదు, ఊహకు వదిలేస్తారు,
నా మదిలో విరిసిన ఆమనివో?
నా కన్నుల మెరిసిన పున్నమివో? ………… ఈ ప్రశ్నలో నీవు ఆమనివా? పున్నమివా? అని ఆమె సౌందర్యాన్ని సందేహాలంకారంగా ప్రకటించారు. ఈ రెండుగా నాలో నిండి ఉన్నావనే ధ్వని మాత్రమే ఉంది. ఇవి నిజంగా సమాధానం ఆశించిన ప్రశ్నలు కావు.
​కొన్ని చోట్ల ప్రశ్నలు నిశ్చయార్ధాన్ని తెలుపుతాయి.
ఎన్ని రంగులు పులుముకున్నా / ఎపుడైనా గెలిచిందా చీకటి?
ఏ ఆంక్షలు నిషేధించినా / ఉదయించకుంటుందా కిరణ సంపుటి?
​ఈ ప్రశ్నలను విశేషణాలతో సహా ప్రయోగించారు. చీకటి గెలువదు, ఉదయం ఆగదు అనే నిశ్చయార్ధాన్ని చెప్పడానికి చీకటికి రంగులు పులిమే విశేషణం, ఆంక్షలు ఆపలేని లక్షణాన్ని కిరణాలకు విశేషణం, ఈ రెండూ అసాధ్యాలని స్థిరమైన అర్థమే ఇందులో సూచితం. అజ్ఞానం చీకటికి అహంకారాది రంగులు పులమటం వ్యర్థం, వెలుగు కిరణాలకు వేళ్ళు అడ్డుపెట్టడం కూడా వ్యర్థం అనే నిషేధాలను కూడా ఇందులో వ్యంజింపజేశారు. నిశ్చయాన్ని , నిషేధాన్ని నిర్వచనంలా కాకుండా ప్రశ్నలా వేయడం వలన పాఠకుడు కూడా అవును కదా! అని సమాధానం తానే చెపుతున్నట్లుగా అనుభూతిని పొందుతాడు. ఒక భావాన్ని బలంగా చెప్పడానికి వాడుకున్న నిర్మాణ మార్మికత ఇది.
​​ నిన్న లేని అందమేదో / నిదుర లేచె నెందుకో?   ……      ఈ సినీగీతం ప్రశ్నతో మొదలై ఒక ఆశ్చర్యార్ధాన్ని, ఒక ఆనందాన్ని, ఉద్వేగాన్ని ప్రకటిస్తున్నది. ఈ ప్రశ్నలో కవి, లేదా నాయకుడు సమాధానం ఆశించడం లేదు. తరువాతి చరణంలో ” ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో? ” అంటాడు. ఇక్కడ కూడా ఎప్పుడూ ఉన్నవే అయినా ఇవాళ శోభాయమానంగా కన్పడుతున్నాయనే భావననే వ్యక్తమవుతుంది కాని ప్రశ్న సమాధానాన్ని ఆశించింది కాదు.
​​ప్రశ్నలను అనేక విధాలుగా ప్రయోగిస్తూ కవితా నిర్మాణంలో కొత్త దారులు చూపించారు సినారె. దాశరథి, శ్రీశ్రీ మొదలైన వారిలో కూడా ఈప్రశ్నల రూప కవిత్వం ఉంది, అయితే వైవిధ్యం, నూతనత్వం ఎక్కువగా ప్రవేశపెట్టాడు సినారె.
​కవిత్వంలో రసధ్వనులు ప్రధానాలు, ప్రాణాలు అని ఆలంకారికులు చెప్పినారు. సినారె అలంకార శాస్త్రాలు చదివారు. బోధించారు. ఆయనలో చాలా విషయాలు జీర్ణమయినాయి. అందువలన అవి ఆయన కవిత్వంలో అప్రయత్నంగానే దొర్లుతుంటాయి. వాటిలో ధ్వని ఒకటి.
​విత్తనం మట్టిలోకి విసరితే
​వృక్షమై పేలుతుంది……………………… ఈ పంక్తుల్లో ఇంతకు ముందు చూపిన గింజ చెట్టుగా మారడమనే భావనయే ప్రధానంగా కన్పడుతుంది. కాని మట్టిలో గింజ దాక్కోవడం వేరు, లేదా మట్టిలోకి చల్లడం వేరు, ఇక్కడ విసరితే అన్నాడు పేలుతుంది అన్నాడు. ఈ రెండు పదాలు బాంబులు విసరడానికి పేలడానికి వాడేవి. ఈ రెండు మాటలతో విత్తనమంత బాంబు విసరినా చెట్టంత పేలుతుంది అని , ఒక మొలకను రాబట్టే వాడు నాటాలని కాని విసరకూడదని, దానినుండి మంచి ఫలితాన్ని ఆశించాలని కాని అది పేలిపోయి తనను తన చుట్టుఉన్న వారిని పేల్చేయకూడదని, విధ్వంసం కాదు, విచ్చుకోవాలని , పిల్లలను చక్కగా పెంచాలి కాని విసరేసినట్లు వదలేస్తే వారే సమాజానికి హానిచేస్తారని , ఇట్లా అనేకానేకార్థాలను ఈ రెండు మాటలలో పొదిగాడు. ఇది ధ్వని.
​​నిత్య నినదిని అక్షరం / నిశ్శబ్ద ప్రాకార విచ్ఛేదిని అక్షరం
​​గజ్జెలా కాళ్ళకు కమ్ముకొని/ డప్పులా బాహువులను కరచుకొని
​​చెమట చుక్కల్లా శరీరాన్ని కప్పుకొని / గొంగడి గొంతులో చిందేసిన అక్షరాలు
​​దోపిడి దుర్గాలను కూల్చే ఘోషలవుతాయి / ఎర్రకారం పీల్చే శ్వాసలవుతాయి
ఈ మొత్తంలో శ్రమజీవి, కళాజీవి, ధిక్కారస్వరం అన్నీ ధ్వనిస్తున్నాయి. ఒక జానపదకళారూపం కళ్ళముందు కదలాడుతుంది. ఎన్నో ఉపమానాలు, రూపకాలు పదాలు అర్థాలు పోటీపడుతున్నట్లున్నాయి. దీన్నే పరస్పరాన్యోన్యతాక్రమణలు అంటారు. పదాన్ని అర్థం, అర్థాన్ని, రూపం ఒకదాన్నొకటి మించిపోవడానికి పోటీపడుతున్నాయా అన్నట్లుండడం. ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఔచితీవంతంగా, ఆకర్షణీయంగా, రూపావిష్కరణ చేసేవిధంగా ప్రయోగించారు.కరుచుకొని, కప్పుకొని, కమ్ముకొని వంటి సమతూకమైన అంత్యాలు సినారెకు సహజం
​​సినారె కవిత్వంలో శ్లేషలు కోకొల్లలరు. సినీగీతాలలో కూడా వాటిని అలవోకగా సాధించారు.
​నాదానివి, నీవే నా దానివి, కలవరించి , కల  వరించి , హరి జనుడై , హరిజనుడే , వంటివి ఇది సభంగ శ్లేషలు.ఇంకా ఉత్ప్రేక్షలు, ఉల్లేఖనాలు ఎన్నో ఉన్నాయి. ఇవి అలంకారాలే అయినా శిల్పంలో భాగాలే.
​​సినారె రచనల్లో కొత్త ప్రయోగాలున్నాయి. అవి ప్రక్రియా పరమైనవి, విషయ పరమైనవి. భాషాపరమైనవి.
గజళ్ళు తెలుగులో విస్తృత ప్రచారంలోకి తెచ్చింది సినారె. ప్రపంచపదులు, వంటివి రూపపరమైనవి.
ప్రబంధ కథానాయికలను రూపకాలుగా, నాటికలుగా మార్చి రచించడం కూడా విషయపరంగా ప్రయోగాలు. వరూధిని, సుగాత్రి, నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు. కర్పూర వసంతరాయలు గేయ కథాకావ్యంగా రూపొందించినా తిరిగి గేయరూపకంగా మలిచారు.
బుర్రకథ అదివరకున్న రూపమే అయినా వాటిలో దరువులను, ఎత్తుకునే వంత చరణాలను ఎన్నిటినో కొత్తవి ప్రయోగించారు.
​​ఎవరన్నా రవి కన్నులని, అరరే మధువొలికే గిన్నెలవి,
​​ఎవరన్నారివి బుగ్గలని, అరరే ఎర్రని రోజా మొగ్గలవి…………………….. కన్నులను మధువొలికే గిన్నెలతో, బుగ్గలను రోజా మొగ్గలతో పోల్చడం సినారె చేసిన కొత్త ప్రయోగం. అంతకు ముందు కలువలు, పద్మాలు, మీనాలు మొదలైనవాటితో కన్నులు పోల్చడం ఉండేవి.
​​జ్వలన శీలం కోల్పోయిన వ్యక్తిత్వం/ శ్వాసకు వేలాడే కళేబరం……………… ఇందులో జీవచ్ఛవం అనే మాటకు బదులు శ్వాసకు వేలాడే కళేబరం అనేది కొత్త ప్రయోగం.
​​నదుల నందులు తరగల తలలతో / కుమ్ముకు పోతుంటాయి……… ఇందులో నదులను నందులుగా , అలలు కొమ్ములుగా చెప్పడం కొత్త ప్రయోగం. అయితే గట్టు చిమ్మేయడం అనే సామాన్య లక్షణాన్ని అంటగట్టి ఇది సాధించాడు.  
అగ్గిపుల్ల గీకిన శబ్దం వింటే / తలమీద కప్పు తగలబడి పోతుంది……….. ఇందులో తలమీద కప్పు ఇంటి కప్పును, తలమీద అనడంతో మరో అర్థం తన నీడయైన నివాసాన్ని అని మామూలు మాటలో రెండర్థాలు పొదిగించడం.
‘ఎన్ని కుట్లు వేసినా / చినిగిన వాక్కులకు/ ఆ దృఢత్వం రాదు……….. వాక్కులను వస్త్రంతో పోల్చడం కొత్త. కావ్య దుకూలముల్‌ అని దాశరథి అన్నాడు అది కావ్యానికి చెందిన ప్రయోగం. ఇది వాక్కులకు సంబంధించింది.
​ సినారె రచనల్లోని శిల్ప నిర్మాణాలకు సంబంధించి సంప్రదాయ దృష్టితో కొన్నింటిని మాత్రమే నేనిక్కడ ప్రస్తావించాను. ఆధునిక దృష్టితో ప్రతీకలు, శబ్దసంయోజనాలవైవిధ్యం, శీర్షికల పేర్లు , మనోవైజ్ఞానికత, కొత్త పదబంధాలు వంటివెన్నో ఉన్నాయి. వాటిని ఎవరైనా పరిశోధన చేయవచ్చు. ఒక గ్రంథంగా వ్రాయవచ్చు.
​​​ఎన్ని సార్లు చెక్కితే శిల్పం /​ఎన్ని సార్లు తీర్చితే చిత్రం
​​​కబుర్లు చెప్పకు కాలమా / ఎన్ని సార్లు చస్తే జీవితం…..
ఆయనే చెప్పినట్లుగా కవితాశిల్పాన్ని ఎంతో జాగరూకతతో అపురూపంగా, అద్వితీయంగా  చెక్కిన అసమాన ప్రతిభాశాలి సినారె.  

July 31, 2024 2 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us