మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

నీవెక్కడ నేనెక్కడ!!

by ChittiProlu Venkata Ratnam March 31, 2024
written by ChittiProlu Venkata Ratnam

నా జీవన మాధుర్యం నీవు
నీ మనుగడ లోని చేదు నేను

నా అశాంతి కుపశాంతివి నీవు
నీ హృదయాని కశాంతిని నేను

నా అలపున విశ్రాంతివి నీవు
నీకొక తీరని అలసట నేను

నను నిమిరే అతిమృదులత నీవు
నేను కసిరే మతికఠినత నేను

తల్లివి, చెల్లివి, మల్లివి నీవు
కల్లను, పొల్లును, డొల్లను నేను

నా స్వేచ్ఛకు చలనానివి నీవు
నిను కట్టే శృంఖలాన్ని నేను

దీనమైన ధీరురాలు నీవు
ధీమాగల దీనుణ్ణి నేను

నా కాలంబన బలిమివి నీవు
నీ కాలంబన భంగిమ నేను

నను నిలిపిన మహాకరుణ నీవు
నిను నలిపిన మృషాచరిత నేను

కాలం ప్రేమకు పాత్రవు నీవు
కాల క్రుద్ధనేత్రాన్ని నేను

మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా

ప్రథితోన్నత హిమశైలం నీవు
వట్టిరాళ్ల చిరుగుట్టను నేను

తలెత్తి చూసేందుకసలు తరం గాని ఎత్తు నీవు
చూడలేక నీ తల వేలాడించే జిత్తు నేను

మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా
 

March 31, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నాకుకవిత్వం ఆసరాఎందుకు అయిందంటే..

by Y. Sujatha March 31, 2024
written by Y. Sujatha

కష్టాల్ని కళ్ళారా చూసి
నష్టాల్ని నిలువెల్లా భరించాను!
ఆకల్ని తనివితీరా రుచిచూసి
కన్నీళ్ళను
గుండె నిండా దిగమింగాను !
మోసాలకు అడుగడుగునా గురై
నిట్టూర్పుల్ని
శ్వాస నిండా విడిచాను !
జీవితంలోపూర్తిగా విఫలమై
మనసు వికలమై నిలువెల్లా
ఆహుతైయ్యాను!
అణచివేతకు
అణువణువునా గురై
వివక్షతను అనుక్షణం
ఎదుర్కొన్నాను !
మిత్ర ద్రోహాలకు
నిష్కారణంగా బలై
శతృ కుట్రలకు కుప్పకూలాను !
స్నేహితులకన్నా
శత్రువులెక్కువయ్యారు
హితులకన్నా హింసించేవారెక్కువయ్యారు!
విజయాలకన్నా
అపజయాలెక్కువయ్యాయి
అభిమానాలకన్నా
అవమానాలెక్కువయ్యాయి!

ఆకర్షణ, వికర్షణ
ఘర్షణ, సంఘర్షణ
అనుభూతులు, అనుభవాలు
ఎదలో గూడు కట్టాయి
ప్రభవించిన అక్షరాలు
కలంలో సిరా అయ్యాయి!

ప్రాణమై కదిలింది కవిత్వం
ఊపిరై ఎగిసింది అనునిత్యం!

ఈ కవితే సత్యం
సజీవ సాక్ష్యం !

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఎలనాగ : ఓ సాహితీప్రభంజనం

by Radhika Suri March 31, 2024
written by Radhika Suri

ఎలనాగ సాహితీ ప్రియులకు చిరపరిచితమైన పేరు .పుట్టిన ఊరు లోని సగం, ఇంటి పేరులోని సగాన్ని తీసుకొని ‘ఎలనాగ’ కలం పేరుగా చేసుకుని సాహితీ వినీలాకాశంలో ధ్రువతారలా ప్రకాశిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. వృత్తి ధన్వంతరీతత్వం, ప్రవృత్తి సాహితీ సేద్యం, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన అక్షర కృషీవలుడు.

      కరీంనగర్ కు కూతవేటు దూరంలోని ఎలగందుల వీరి జన్మస్థానం .తల్లిదండ్రులు నాగరాజు తిరుమలయ్య ,రంగమ్మ గార్లు. వీరి అన్నయ్య శ్రీ నాగరాజు రామస్వామి ప్రముఖ సాహితీవేత్త కాగా తమ్ముడు డాక్టర్ నాగరాజు రవీందర్ సంస్కృతం, పద్య రచనల్లో దిట్ట.

        ఎలనాగ గారు వైద్య విద్యను అభ్యసించి, కొంతకాలం నైజీరియా లో ఉద్యోగం చేసి, ఇండియా  తిరిగి వచ్చి వైద్య విధానపరిషత్తు లో వివిధ స్థాయిల లో బాధ్యతలు నిర్వర్తించి రాష్ట్ర స్థాయి అధికారిగా పదవీవిరమణ చేసారు.

            పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుడి అక్షరసత్యం అంటూ బాల్యంలోనే అబ్బిన  కవన సురభిళానికి ప్రతీకగా కరీంనగర్ నుండి వెలువడ్డ ‘గౌతమి’ పత్రికలో వీరి తొలి కవిత ప్రచురితమైంది. మెడిసిన్ అభ్యసించే సమయంలో భారతి, కృష్ణా పత్రిక ,స్రవంతి, ఆంధ్ర ప్రభ,తరుణ  పొలికేక, విపుల మొదలైన పత్రికల్లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి.   అప్పటినుండి వెనుతిరిగిచూడకుండా సాహిత్యంలో కృషి చేస్తూనే ఉన్నారు. నైజీరియాలో వైద్యుడిగా సేవలు అందిస్తూనే తీరిక వేళల్లో ఆంగ్ల సాహిత్యాన్ని ఎక్కువగా చదివి పట్టు సాధించారు. ఆంగ్ల పదాలకు అర్ధాలు వెతికే పనిలో  డిక్షనరీకి ఎంతో సమయాన్ని కేటాయించి  మరీ చదివేవారు. సోమర్సెట్ మామ్ రచనలను చదివి ప్రభావితమయ్యానని చెప్పే వీరు  ‘The Alien Corn ‘ నవలికను తెలుగులో ‘కలుపుమొక్క’ గా అనువదించారు. ఇది 2005లో అచ్చయింది. అప్పటివరకు చేసిన రచనలన్నీ నాగరాజు సురేంద్ర పేరుతో చేసినవి కాగా 2009 నుండి’ ఎలనాగ’ కలం పేరుతో రాయడం మొదలెట్టారు.    

         ఎన్నో ప్రక్రియల్ని సృజించినా కవిత్వం, అనువాదాలను ఎక్కువగా ఇష్టపడతానంటారు. వచనం రాయడంలో నైపుణ్యం ,ఆకర్షణీయత రెండు ప్రధానమంటారు. అనువాదం ఓ ‘గొప్ప కళ’ దాన్ని తపస్సులా భావించి సాధన చేయాలి. మూల భాష ,లక్ష్య భాషలపై సరైన పట్టుండాలని, పొందికైన పదాలకు భావ సౌందర్యం తోడైతే రచన అందమైన ఆకృతిదాలుస్తుందని వీరి అభిప్రాయం .తెలుగు ఇంగ్లీష్ భాషల్లో సమానమైన పట్టు ఉండడంతో తెలుగు నుండి ఆంగ్లంలోకి ఆంగ్లం నుండి తెలుగులోకి ఎన్నో పుస్తకాలు అనువదించారు .

        వచనాన్ని అనువదించడం సులభమని కొందరి అభిప్రాయం, నాకైతే కవిత్వానువాదమే సులభతరమని అనిపిస్తుంది. బహుశా కవిని కావడమే కారణమేమో అంటారు. అనువాద రచనల్లో స్వేచ్ఛ తక్కువే కానీ ఇరు ప్రాంతాల సంస్కృతీసాంప్రదాయాలు  ఒకరివొకరికి చేరు వౌతాయనేది వీరి భావన .ఆ ప్రాంత ప్రజల శైలి ,నైపుణ్యాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందంటారు. అనువాద రచనలు చాలా తక్కువ. తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువాదాలు చాలా తక్కువ జరిగాయి. ప్రోత్సాహలేమి ప్రధాన కారణమని పేర్కొన్నారు. జాతీయాలకు ఆంగ్ల పదాలు దొరకవు ,అటువంటి సందర్భాల్లో ఆ పరదాలను ఆంగ్లంలో పెట్టి,  క్రింద ఫుట్ నోట్స్ లో వివరిస్తానంటారు. ఉదాహరణ : బొడ్రాయి బతుకమ్మ మొదలైనవి.

  కాళోజీ ,దాశరథి ,వట్టికోట ఆళ్వారు స్వామి ,అమ్మంగి వేణుగోపాల్ గార్ల రచనల్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. వీరు తమ పుస్తకాలకు పెట్టే శీర్షికల్లో ఎంతో భావ సౌందర్యం కనిపిస్తుంది.

‘నుడి క్రీడ ‘గళ్ళ నుడికట్టుకు ఎంతోమంది ప్రభావితులయ్యారు. ఒక ప్రముఖ పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థుల కోసం కొన్ని పుస్తకాలను తెప్పించి వారి తెలివికి పదునుపెట్టించారు అనడంలో అతిశయం లేదు.     శాస్త్రీయ సంగీతం పై మక్కువ, అవగాహనలతో శాస్త్రీయ సంగీతంపై 28 కవితలు,

సంగీతజ్ఞులపై 33 వ్యాసాలతో Memorable Melody Makers and Other Poems on Music అనే గ్రంథాన్ని రాశారు. ఇది కాకుండా అదనంగా సంగీతం మీద సంగీత విద్వాంసుల మీద తెలుగులో ఎన్నో కవితలు, వ్యాసాలు రాశారు.

    వీరి మొదటి ప్రచురణాసంకలనం ‘వాగంకురాలు’ . తెలుగులో 16 స్వతంత్ర రచనలు, ఆంగ్లంలో 2 స్వతంత్ర రచనలు,ఇంగ్లీషు -తెలుగు అనువాదాలు -10, తెలుగు-ఇంగ్లీషు అనువాదాలు- 9 చేశారు, మొత్తం 37 పుస్తకాలు వెలువరించారు.

 ఆంగ్లంలో రచించిన ‘Dazzlers’ కవితా సంపుటిని ,Kolkata Literary Carnival లో ‘ఉకియోటో’ సంస్థ ప్రచురించి ‘,poet of the year 2023 ‘అంతర్జాతీయ పురస్కారం  అందించడమే కాకుండా ఏడు ప్రపంచ భాషల్లోకి  అనువదించారు.

( ఫ్రెంచ్  ,చైనీస్, జర్మన్,టర్కిష్ ,రష్యన్, స్పానిష్,జాపనీస్ ) వీరి పుస్తకాన్ని 70 దేశాలకు పంపుతుందీసంస్థ.

       సరైన  పదాల అన్వేషణ ఓ తపస్సు లాంటిది .ఒక్కోసారి పదాల పొందిక ,అర్థాలకై నెలల తరబడి వెతుకులాడిన సందర్భాలు ఉన్నాయంటారు.  కేంద్ర సాహిత్య అకాడమీ కి చేసిన అనువాదాలు రెండే , మొదటిది పవన్. కె. వర్మ రాసిన Galib : The Man, The Times.గాలిబ్ : నాటి కాలం, కాగా రెండవది సైరన్ మిస్త్రి  రాసిన ‘Chronicle of corps bearer ‘ ‘శవాలు మోసే వాడి కథ’ . మూడవది ప్రచురణ దిశగా సాగుతోంది . గాలిబ్ – నాటి కాలం పుస్తకానికి (అనువాదంలో) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆ కాలపు సామాజిక ,రాజకీయాంశాలు గాలిబ్ ఆయన రాజకీయ, జీవిత విశేషాలు ,రచనా వ్యాసంగాల ఒడిదొడుకుల నేపథ్యంతో సాగే రచన ఇది. దీనిని పవన్ కె. వర్మ .ఆంగ్లంలో రచించారు.

    ‘మోర్సింగ్ మీద మాల్కౌస్ రాగం ‘ ఇది కొత్త రకం ప్రక్రియ. అచ్చం వచన కవితలా కనిపించే ఛందోబద్ధ పద్యాలుంటాయి.

పన్ ( pun) నీటి జల్లు :  శ్లేషాత్మక వాక్యాలు.

మేధామథనం : ప్రామాణిక గళ్ళ నుడికట్టు ,ఆధారాలు (వాక్యాలు) గ్రిడ్  (గడులు) లేకుండా రూపొందించారు.

19 శతాబ్దంలో పుట్టి ఫ్రాన్స్ లో ప్రాచుర్యం పొందిన’ పేరాగ్రాఫ్’ కవితా ప్రక్రియ, తెలుగులో రాసేవాళ్ళు అంతగా లేరని ఈ కవితారూపాన్ని ఎక్కువగా రాసి పాపులర్ చేశానంటారు . ‘Tempest Of Time ‘ పేరుతో కొండపల్లి నీహారిణి గారి

‘కాల ప్రభంజనం’ కవితా సంపుటిని 2022 లో ఆంగ్లంలోకి అనువదించారు.

       పాశ్చాత్తా సాహిత్యంలో శిల్ప సౌందర్యం అద్భుతం అంటూ ,లాటిన్ అమెరికా కథలు చదివేటప్పుడు నిజమనే భ్రాంతికి లోనవుతామన్నారు.

    వారి రచనల్లో కొన్ని పంక్తులు: పద్యపు మొక్కను పెంచుతుంటే విశేషణాల మిడతలు

గుంపులుగా వచ్చి వాలుతాయి వాటిని పారద్రోలకలపోతే

 పద్యపు మొక్కకు పచ్చదనం చేకూరదు –  అని చెప్పే వారిలో, చదువరులకు ఓ అక్షర హాలికుడు మనసులో మెదలక మానడు. సేద్యం చేసే రైతు ఎంత ఎరుకలో ఉండి సాగు చేస్తాడో అలాగే ఈయన కవన సేద్యం కూడా అంతే జాగరూకతతో చేస్తాడు.

ఇక వీరి జ్ఞాపకాలదొంతర  తిరిగేసినప్పుడు:

 పదవ తరగతిలో తెలుగు మాస్టారు రాజ శర్మ గారు శ్రీనాథునిపై వ్యాసం రాయమనగా పుస్తకంలోని కొన్ని పేరాల్లోని విషయాల్ని తీసుకుని సమాస భూయిష్టంగా రాయగా వారు మెచ్చుకొని ,అన్ని తరగతులు తిరిగి చదివి విద్యార్థులకు వినిపించారని చెప్తారు.

          ఇంకో సందర్భంలో సినారె అధ్యక్షతన వేములవాడలో జరిగిన కవి సమ్మేళనంలో ప్రౌఢభాషలో రాసిన ‘తారావిలాసం’ కవితను సమయాభావం వల్ల గబగబా  చదవడంతో చివరగా సినారె మెచ్చుకుంటూ , ఇదే కవిత నేను గాని చదివి ఉంటే సభ కరతాళ ధ్వనులతో మార్మోగేదని కితాబిచ్చారు అని అంటారు.    

        1975లో ఆకాశవాణి కవి సమ్మేళనంలో చదివిన కవిత విని భుజం తట్టి ,బాబూ ఇలాగే రాస్తూ ఉండండి అంటూ సీనియర్ దాశరథి గారు మెచ్చుకోవడం గుర్తు చేస్తారు.

       ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు సామల సదాశివ మాస్టారు గారి సాంగత్యం ఎంతో స్ఫూర్తిదాయకమని  అప్పుడే సంగీతంపై మరింత ఆసక్తి కలిగిందని ఇలా ఎన్నో మధుర  జ్ఞాపకాలని   గుర్తు చేసుకుంటారు. 

     గాలిబ్  – నాటి కాలం  లోని కొన్ని పంక్తులు:

‘ నేను సలిపే సమరం పంజరంలో కూడా పుల్లలతో గూడుకట్టుకునే పక్షుల పోరాటం లాంటిది’ అంటాడు ‘ఓ నా హృదయమా దుఃఖ గీతాన్ని సైతం ఉపశమనముగా భావించు లేని పక్షంలో ఈ శరీరం ఎక్కడో ఒకనాడు ఇంద్రియ జ్ఞానం లేకుండా మొద్దుబారిపోతుంది ‘ అంటూ – సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించమంటూ చేసే హితబోధ కనిపిస్తుంది .

కాశీలోని ధూళి స్వర్గపు కనుబొమల నడుమ కమనీయంగా మెరిసే సిందూరపు బొట్టు.. అంటూ

 కాశి క్షేత్ర వైభవాన్ని హృద్యంగా వర్ణించారు.

“ఈ ధనస్సులో బాణం లేదు

ఏ వేటగాడు వేట పనిలో లేడు

ఈ బంది ఖానా బతుకులో అంతటి సౌకర్యం ఉంది “

“ఓ గాలిబ్ నావ తీరానికి చేరినప్పుడు

నావికుని అధర్మం గురించి ఫిర్యాదు ఎందుకు

అంటూ తన శారీరక రుగ్మతలతో విసిగి అసంతృప్తిలో హృదయ వేదనను వెల్లడించే క్రమంలోని హృదయ ఘోష.

      ఇలా ఓ కవి హృదయాన్ని సరైన రీతిలో ఆవిష్కరించడం మరోకవికే  సాధ్యమౌతుందనేది అక్షరసత్యం.

  స్థానికంగా తగిన ప్రోత్సాహం లభించలేదనేవీరు, ఆంధ్రప్రదేశ్ నుండివచ్చిన పురస్కారాలే ఎక్కువంటారు.

 వీరిని వరించిన పురస్కారాలు :

     1. Ukiyoto’s Poet of the year Award – 2023

      2. సోమ సుందరం పురస్కారం

       3. అద్దేపల్లి పురస్కారం

        4. జింక నాగరాజు పురస్కారం 

        (  అనువాదాలకు)

         5. తెలుగు విశ్వవిద్యాలయం

            వారి కీర్తి పురస్కారం   

              (అనువాదాలకు )

       6. విశ్వ సాహితీ వారి

      పురస్కారం       

      7.  గిడుగు రామ్మూర్తి పంతులు

           పురస్కారం

       8.నెలవంక – నెమలీక  వారి              

 కలహంస పురస్కారం   ( రెండేండ్లు వరుసగా)

 9. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం వారి పురస్కారం.

భావోద్వేగం ఎక్కువైనప్పుడే మంచి కవితలు తన్నుకువస్తాయంటారు .తెలుగులో కవిత్వం రాయడం తగ్గించి ఆంగ్ల సాహిత్యం లోనే రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పిన వీరు, మరీ భావోద్వేగం ఎక్కువైనప్పుడు తెలుగులో తప్పకుండా రాస్తానని చెప్పారు .వాసి గల కవిత్వం రాసే కొద్ది మంది కవుల కోసం ఫేస్బుక్ చూస్తానంటూ చెప్తారు.

     కవిగా, రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ఇన్ని ప్రక్రియల్లో చేసిన నిరంతర సాధనే వారిని కేంద్ర సాహిత్య అకాడమీ పీఠంపై ఆసీనుడిని చేసిందనడంలో అతిశయోక్తి లేదు .వారు మరిన్ని మంచి రచనలు చేస్తూ, మరెన్నో పురస్కారాలు అందుకుంటూ, సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేయాలని ఆకాంక్షిస్తూ …

        అక్షరాభివాదం

విరించి కలానికి భారతి

పాళీని కూర్చగా

సారస్వత క్షేత్రంలో ఉదయించిన తెలుగు తేజం

సృజన పర్వతపు అధిరోహణ మెళకువల్ని ఆపోశన  పట్టి

అక్షర శిల్పాలకు మెరుగులద్ది  సుందరాకృతినిచ్చిన సాహితీశిల్పి

 స్వర ఝరులలోని సారాన్ని గ్రోలి నేర్పుతో సాహితీ సుసేద్యంలో అంకురార్పణ చేసిన అక్షర కృషీవలుడు

స్పృశించే అంశానికి

సృజనాత్మకత చేర్చి

 అందంగా మలచిన  శిల్పాలెన్నో !

పద కవిత మొదలు పద్య

 కవిత వరకు

ప్రక్రియలు ఎన్నింటనో

పరకాయ ప్రవేశం చేసిన

 భాషా సాహసికుడు

అనువాద కళకు

అక్షర సొబగులద్ది

 భాషాభిమానాన్ని విశ్వవ్యాప్తం చేసిన సాహితీ వైతాళికుడు

 వృత్తి ధన్వంతరీతత్వం

ప్రవృత్తి సాహితీమూర్తిమత్వం

సాహిత్య ‘గురుకులం’లో నిత్య పరిశోధకుడు

 వాగాడంబరమెరుగని

నిరాడంబర భాష్యకారుడు

( పితృసమానులైన ఎలనాగ గారికి                                

        చిరు కవితాసుమగుచ్ఛం)

March 31, 2024 1 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అవిశ్రాంత సాహిత్య సృజనశీలి పెన్నా

by Dr. T Shyamala devi March 30, 2024
written by Dr. T Shyamala devi

(తెలంగాణా ప్రభుత్వం చేత ”కాళోజీ అవార్డు (2021)” అందుకున్న డా. పెన్నా శివరామకృష్ణ)

అతి సాధారణమైన వేషధారణ, చురుకైన చూపు, నిత్యచైతన్యశీలి, అలుపెరుగని సాహిత్య సృజనకారులు, తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో ప్రయోగాలు చేసిన నిజమైన ప్రయోక్త. అతడే పెన్నా శివరామకృష్ణశర్మ. సాహితీ సృజనకారులకు, విమర్శకులకు తెలుగు సాహిత్యలోకంలో సుపరిచితమైన పేరు. వారు నల్గొండలో సహాధ్యాయి కావడం వలన, కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, వచన కవిత్వం, (తెలుగు) గజళ్ళు, రుబాయీలు, హైకూలు, విమర్శ గ్రంథాలు సమాంతరంగా సృష్టించి తెలుగు సాహిత్యంలో తనదైన స్థానాన్ని పరచుకున్న తెలంగాణా కవి శ్రీ పెన్నాగారు. నిరంతర చదువరి, సమసమాజాన్ని చాలా లోతుగా పరిశీలించి, వాచ్యంగా కాకుండా వ్యంగ్యంగా, ధ్వనిపూర్వకంగా విషయాలను వచన కవిత్వం ద్వారా తెలిపిన కవి. ఛంథ్శాస్త్రంలో, ఆలంకారిక శాస్త్రంలో నిష్ణాతులు, ఆంగ్ల, ఉర్దు సాహిత్య పరిచయం ఉన్నవారు.

అలల పడవలమీద, నిశ్శబ్దం నా మాతృక మొబబన కవితా సంపుటాలు వచన కవిత్వానికి గీటురాళ్ళుగా నిలుస్తాయి. దీపఖడ్గం కవితా సంపుటి వారి కవితా మాధుర్యానికి నిదర్శనాలు. రహస్య ద్వారం, దేశదేశాల హైకు – అన్న హైకూ ప్రక్రియా సామర్థ్యానికి ప్రతీకలు. ఆ తరువాత ఈనాడు హైకూలు రాస్తున్న కవులకు మార్గదర్శకులయ్యారు.

సాహిత్య విమర్శ ఎంతో ఇష్టంగా వారు ఎంచుకునే ప్రక్రియ. డిగ్రీ చదివే నాటికే ప్రాచీన సాహిత్యంతో పాటు, ఆధునిక సాహిత్యాన్ని ఆసాంతం చదివారు. శేషేంద్ర, ఆరుద్ర, శ్రీశ్రీ, సినారే, శివారెడ్డిల కవిత్వాలను, వ్యక్తిత్వాలను చదివినవారు. వారు శేషేంద్ర కవిత్వానుశీలనం’ పేరుతో పరిశోధన గ్రంథాన్ని వెలువరించారు. రచనలద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. సినారే కవిత్వాన్ని, శివారెడ్డి కవిత్వాన్ని తన ఆలోచనాలోచనలతో పరిశీలించారు.

ఈ మధ్య 2017, 2020లలో గోరటి వెంకన్న కవితా పరామర్శ, ఎన్‌. గోపీ తత్త్వవివేచన అనే సాహిత్య విమర్శను వెలయించారు. వచన కవిత – ఆలంకారికలు (2018లో) వచన కవిత్వంలో పదచిత్రాలు, భావచిత్రాలు సాధారణంగా చెప్తారు. కానీ ఆలంకారికత గురించి విశ్లేషించడం పెన్నా పెన్ను విశేషం.

అలాగే సినారే విశ్వంభరలో ఆర్థయుక్తిని విశ్లేషించారు. గోరటి వెంకన్న గేయాల్లో సాహిత్యాన్ని లోకానికి చూపించారు.

వీటన్నింటికీ వేరవుతూ, కొన్ని ప్రక్రియలు విలక్షణంగా చేపట్టి కృతకృత్యులయ్యారు పెన్నా. వాటిలో ఉర్దూ మూలంగా తెలుగు భాషలోకి దాశరథి, సినారే వలన తెలుగులో కాలూనిన గజల్‌, రుబాయీ. వీటిని ఉర్దూ భాషా మాధుర్యాన్ని ఛందస్సు రీత్యా పూర్తిగా తెలుగులోకి తీసుకొచ్చిన కవి పెన్నా. గజళ్ళలో సల్లాపం, శిశిరవల్లకి కవిత్వం మనసుకు హత్తుకుంటాయి.

గజల్‌ కి ఒక ప్రత్యేకమైన ఛందస్సు, భావం, పదజాలం ఉంటాయి. ఇవన్నీ బాగా అవగాహన చేసుకుని, గజల్‌ ప్రక్రియని ఫలవంతం చేశారు. గజళ్ళు, రుబాయీలు విషయంలో ఏమైనా సందేహాలున్నప్పుడు వారి గురువులైన నోముల సత్యనారాయణ, సామల సదాశివ గార్లతో సంప్రదించి, రచనలు చేశారు.

ఈ షేర్‌ చూడండి-

ఎపుడూ కొనగోటనైన మీటబోకు నాతనువు,

అణువణువున నీపేరే మారుమోగిపోతుంది.         (29) ”సల్లాపం”

ప్రియుడు ఏకపక్షంగా ప్రియురాలి గురించి విరహంతో, తన ప్రేమను అద్భుతంగా తెలియచేయడమే.

గజల్‌. అదే మార్గంలోనే వారి గజల్‌ రచన సాగుతుంది.

‘నవ్వబోకు నా చెలియా’ నా వయసు ఆగిపోతుంది.

నీ నవ్వు ననుకరించాలని ఏరు ఆగిపోతుంది’.   అని అద్భుతంగా షేర్‌ రాసారు.

”శిశిర పల్లకి” నుండి మరొక షేర్‌

‘నిన్ను మరచిన నన్ను మరచుటె అనుచు తానే పలికెను

నను మరచిపొమ్మని తేలికగ’నే చెప్పివెళ్ళెను ప్రేమతో

నిను మరచిన నన్ను మరచినట్లే అన్న ప్రేయసి, మరచిపొమ్మని తనను తేలికగా చెప్పి వెళ్ళిందట. గజల్‌ కి చమత్కారం ప్రధానం, ఇలాంటి చమత్కారాలు వారి ఎన్నో షేర్లలో కన్పిస్తాయి.

‘ఆశ్రువంటే ఆణిముత్యమె, విలువ ఎరిగిన మంచిది.

ఒక్క బిందువు కూడ రెప్పను దాటనీయకు మిత్రమా!’

కన్నీటి కుండను గుండెలోనే దాచుకోమంటున్నాడు కవి. గజళ్ళలో అశ్రువు అనే పదం పలుమార్లు వస్తుంది.

ఇక రుబాయీల విషయానికి వస్తే, తెలంగాణా రుబాయీలు, అశ్రుధార రెండు ఉన్నాయి. తెలంగాణా ఉద్యమం ఊపందుకున్న సమయంలో రాసినది తెలంగాణా రుబాయీలు, అవి ఆ కాలానికి సరిపోయేవే. ”ఆశ్రుధార” 2021లో వచ్చిన రుబాయీల కవిత్వ పుస్తకం. ఇది కవిత్వపరంగా, రుబాయీ, లక్షణ పరంగా, భావపరంగా అద్భుతమైనది. ఇవి కాక గజళ్ళు, రుబాయీల పై లక్షణ గ్రంథాలనదగిన ”తెలుగు గజళ్ళు-రుబాయీలు, గజల్‌ సౌందర్యదర్శనం” కూడా గజళ్ళు, రుబాయీలు నేర్చుకునే వారికి మార్గదర్శక గ్రంథాలు, అశ్రుధార నుండి ఒక రుబాయీ.

”కనిపించే గాయమైతే తడమకనే తెలిసేది!

లోలోపల వేదన ఒక తలగడకే తెలిసేది!

అవ్యక్తపు ఆర్తులన్ని చితిదాకా అనాథలే!

సాంధ్య ఘోష అంతా ఒక పడమరకే తెలిసేది!”

మరొక రుబాయిలో చివరి రెండు పాదాలు

”కడదాకా అశ్రు అగ్ని గర్భ అక్షరమే!

భగ్నహృదయ శకలాలకు కడతీరం అయినది”

ఇలా విషాద మాధుర్యాన్ని రుబాయీల్లో ఒలకబోసారు.

ఇక ఎన్‌ గోపి కవితా తత్త్వవివేచన విమర్శ గ్రంథంవైపు చూస్తే. ప్రతి ఒక్క కవి మీదా పెన్నాగారికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కనిపిస్తుంది. ఇది దానికి నిదర్శనం.

‘పాఠకుడు భావుకుడు.

కాలటం తెలిసిన కట్టెలాంటివాడు.

కరగడం తెలిసిన వెన్నలాంటి వాడు!

నేను రాసిన కవిత సగమే!

అతనికి అందినపుడే అది సంపూర్ణ కవిత!” – అంటారు గోపీ గారు.

దానికి పెన్నాగారి విమర్శ – ”కాలటం తెలిసిన కట్టెలాంటివాడు పాఠకుడు అని చెప్పడం భరతుని నిర్వచనాన్ని గుర్తుచేస్తాయి. ”యో ఆర్థో హృదయ సంవాదీ తస్య భావో రసోద్భవః| శరీరం వ్యాప్యతే తేన శుష్యం కాష్ట మివాగ్నినా” భరతుడు రసానుభవాన్ని ఎండుకటైకు అగ్ని వ్యాపించడంతో పోల్చాడు. ”కాలటం తెలియడం” లోనే భావుకత్వమూ, కావ్యానుశీలనానుభవమూ ఇమిడి ఉన్నాయి. అని తీర్మానిస్తారు పెన్నా నవ్యంగా చెప్పారు.

గోపీ అంటారు –

”కవి కావడంలో సుఖం లేదు.

అది నిత్యారుణమైన గుండెకోత” – అంటారు గోపి. దీనిని సాదరంగా ఆహ్వానిస్తారు పెన్నా, ఏదైనా గోపీ ఆశావాది అని, ప్రగతిశీల మానవతావాది, వచన కవిత్వాన్ని కొత్తదారుల్లో నడిపించినవాడు గోపీ యని పెన్నా సద్విమర్శ చేస్తారు.

ఇవే కాకుండా, కవితా సంకలనాలకు సంపాదకులుగా ఉన్నారు. తెలుగువారికే కాకుండా అందరికీ పనికొచ్చేట్లుగా ”రోజు రోజుకో చరిత్ర” ”జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు”, ”తారీఖుల్లో తెలంగాణ” వంటి సాధారణ ప్రజ్ఞకు సంబంధించిన విషయాలతో పుస్తకాలు రాసారు.

కవిత్వం – 12. సాహిత్య విమర్శ – 9. ఇతర రచనలు – 6. సహసంపాదకత్వం – 8. ఇలా వారి సాహిత్య ప్రస్థానం కొనసాగింది. ఇంకా కొనసాగుతుంది.

సాహిత్యంపై నిజమైన ప్రేమతో, నిజాయితీగా, నిబద్ధతతో రచనలు చేసే కొద్దిమంది రచయితల్లో, కవుల్లో డా. పెన్నా శివరామకృష్ణ గారు ఒకరు. ఎన్నో పురస్కారాలు వీరిని వరించాయి. ఇలా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని, ముఖ్యంగా ఆధునిక ప్రక్రియలలో తనదంటూ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ”పెన్నా” తెలంగాణా కవిగా, తెలంగాణా భాషాదినోత్సవం, కాళోజీ జయంతి సందర్భంగా కాళోజీ అవార్డును తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందడం అభినందనీయం.

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నువ్వొక్కడివే ఉంటావు

by ఆచార్య మస‌న‌ March 30, 2024
written by ఆచార్య మస‌న‌

హైదరాబాదులో చదువంటే ఎంతో కష్టం. అద్దె ఇంట్లో ఉండి స్వయంగా వంట చేసుకోవాలి. నేనైతే పది రూపాయలు సంపాదించుకోవాలి. నా అవసరాలు తీర్చుకోవాలి. అద్దె ఇంట్లోను ఒకరిద్దరు మిత్రులతో కలిసుంటే నావంతు అద్దె కూడా తగ్గుతుంది.

ఏదేమైన సిటీలో డిగ్రీ పూర్తి అయ్యేవరుకు ఒక ఇరవై ఇండ్లైనా మార్చి ఉంటాను. ఇంటివారికి కోపం వచ్చినా, మనకు కోపం వచ్చినా ఇల్లు మారవలసిందే కదా!

బొగ్గులకుంట, హనుమాన్‌ టేక్డీ, నారాయణగూడా, గౌలిగూడా, హుస్సేన్‌ ఆలం, గౌపురం, షాలిబండా మొదలైన ప్రాంతాల్లో నీ విద్యార్థి థలో అద్దెకుండడం జరిగింది. వివాహం తర్వాత లాల్‌ దర్వాజలో కొంతకాలం ఉండి 1977లో వారాశిగూడాకు రావడం జరిగింది. అక్కడుండగానే బౌద్ధ నగర్‌ లో ఎనభై గజాల్లో చిన్న ఇల్లు నిర్మించుకొని అందులో ఇరవై ఐదేండ్లున్నాను.

ఇస్లామియా బాయిస్‌ హైస్కూలులో ఆరేండ్ల అధ్యాపక వృత్తికి ఫుల్‌ స్టాప్‌ పెట్టి ప్రగతి మహా విద్యాలయంలో లెక్చరర్‌ గా చేశాను. అక్కడ ఎనిమిదేండ్లు పనిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రవేశించాను.

ప్రగతి మహావిద్యాలయం నుండి నిష్క్రమించినప్పుడు వచ్చిన పి.ఎఫ్‌. డబ్బుతో బోడుప్పల్‌ లో ఒక ప్లాటు తీసుకున్నాను.

పిల్లలు పెద్ద వాళ్లయ్యారు. కనుక ఇల్లు సరిపోక బోడుప్పల్‌ ప్లాట్‌ లో ఇల్లు కొత్తగా నిర్మించు కోవాలన్న కోరిక కల్గింది. తదనుగుణంగా లోన్‌ తీసుకొని ప్రమీల పేరుతో ఉన్న ప్లాటులో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశాను. ఐతే నా ఇద్దరు పిల్లలకు బోడుప్పల్‌ పల్లెటూరుగా కనిపించింది. అందుకే వాళ్ళు నాతో ”ఫ్యూచర్‌ లో అమ్మా, నీవు మాత్రమే ఇక్కడ ఉండవలసి వస్తుంది” అని పదే పదే చెప్పడం నాకు గుర్తుంది.

ఎట్లాగైతేనేమి ఇల్లు కట్టుకొని కొత్తగా నివసించడం మొదలుపెట్టిన తర్వాత పల్లె రూపంలో ఉన్న బోడుప్పల్‌ పట్నమైంది. ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగులు, షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, స్కూళ్లు, కాలేజీలు వచ్చాయి. 2004 నాటికి 2022 నాటికీ కాలనీల రూపురేఖలే మారిపోయాయి.

నేను ఏది చేసినా ప్రమీలతో ఆలోచించి మాత్రమే చేస్తాను. బోడుప్పల్‌ లో ఇల్లు ఆమె పేరు మీదనే కట్టాను. విచిత్రమేమిటంటే మా ఉదయనగర్‌ కాలనీలో ఎవరి ఇంట్లోను బోర్లున్నా పని చేయవు. కాని ప్రమీలచే కొబ్బరికాయ కొట్టించిన పుణ్యవిశేషం కావచ్చు, మా ఇంట్లో ఇప్పటికీ దేవుని అనుగ్రహం వల్ల బోర్లో నీళ్లున్నాయి.

వారాశిగూడా నుండి బోడుప్పల్‌ కు వచ్చి అప్పటికి పదకొండు సంవత్సరాలవుతుంది. ఈ కాలంలో మగ పిల్లల పెళ్లిళ్లు చేశాం కట్నాలు ఏమీ తీసుకోకుండానే. ప్రమీలకు కట్నాలు తీసుకోవడమంటే ఇష్టం ఉండేది కాదు. పిల్లల కోరిక మేరకు ప్రమీల, నేను ఇద్దరమే బోడుప్పల్‌ ఇంట్లో మిగిలాం. కొత్తింట్లో మీరిద్దరే ఉంటారన్న పిల్లల మాట నిజమైంది.

తోడుగా ప్రమీల ఉందనే ధైర్యంతో, విశ్వవిద్యాలయానికి దూరంగా ఉన్నా క్రమం తప్పకుండా డ్యూటీ చేశాను. వేళకు ఇంటికి రావడం, భోజనం చేయడం విద్యార్థులు వస్తే మాట్లాడడం, బంధు మిత్రులకు ఆతిథ్యమివ్వడం – ఇవన్నీ సజావుగానే జరిగేవి.

మేం ఇద్దరం ఉల్లాసంగానే ఉండేవాళ్లం. ప్రమీల అనారోగ్యం అనే మాట ఎఱుగదు. ఆమెను ఎన్నడూ పిల్లలు పుట్టినప్పుడు తప్ప హాస్పిటల్స్‌ కు తీసుకొని పోలేదు. ఆమెనే ఇంటిపనులన్నీ చూసుకునేది. కాని అప్పుడప్పుడు నేనేమైనా అంటే బాధపడేది. ”నేను పోయిన తర్వాత నువ్వొక్కడవే ఈ ఇంట్లో ఉండవలసి వస్తుంది” అని హెచ్చరించేది. కని ఎన్నడూ ఆమె నాకంటే ముందుగా ఈలోకాన్ని విడుస్తుందని భావించలేదు.

ఇద్దరే ఉంటారని పిల్లలనడం, నువ్వొక్కడవే ఉంటావని ప్రమీల అనడం పదేపదే గుర్తుకు వస్తాయి. కాని కళ్ల నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇప్పుడు నేనేమి చేయగలను?

——————–

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మా తిరుపతి ప్రయాణం

by ఆచార్య మస‌న‌ March 30, 2024
written by ఆచార్య మస‌న‌

అది వేసవి కాలం, ఎండలు మండుతున్నవి. ఏ.సీ. గదుల్లో ఉన్నవారిక బయటికి వెళ్లాలంటే భయం. మా ఇంట్లో ఏ.సి ఉన్నా దాన్ని వాడం. చిన్నప్పటి నుంచి శీతోష్ణాలను సహించే శక్తి భగవంతుడు నాకే కాదు, నా అర్ధాంగి ప్రమీలకు ఇచ్చాడు.

మా ఇద్దరిదీ ఇకే మనస్తత్వం. చిన్న కుమారుని పెద్ద కూతురికి పుట్టు వెంట్రుకలు తీయిద్దామని తిరుపతికి బయలుదేరాం. రిజర్వేషన్‌ సౌకర్యం ఉండడం వల్ల రైళ్లో చక్కగా ప్రయాణం చేసి తిరుపతి చేరుకున్నాం. మాది ఎనిమిది మంది గ్రూప్‌. నేనూ, మా ప్రమీల, మా చిన్నక్క, చిన్న కుమారుడు ప్రణవ్‌, వాడి భార్య అఖిల, అమ్మాయి శ్రీవిష్ఠ, మా పెద్ద కుమారుడు క్రాంతి, ప్రణవ్‌ బావమరిది సుమన్‌.

అందరం దిగువ తిరుపతికి చేరుకున్న తర్వాత తిరుమలకు మా ప్రణవ్‌, అతని భార్య, బావమరిది క్రాంతి కుమార్‌ అందరూ కాలినడకన బయల్దేరారు. నేనూ ప్రమీల, మా అక్కగారు ముగ్గురం బస్సులో కొండ పైకి చేరుకున్నాం. కాలినడకన రావడం వల్ల వారికి దర్శనం సులభంగా లభించింది. కాని మా ముగ్గురం మూడువందల టికెట్‌ లైన్లో నిలబడ్డాం. లైన్‌ పెద్దగా ఉంది. లోపల కంపార్ట్‌ మెంట్లలోనూ జనం నిండుగా ఉన్నట్లు ఎవరో చెప్పగా విన్నాను. టికెట్టు తీసుకున్నా, తీసుకోకున్నా దైవ దర్శనం మర్నాడే జరుగుతుందని ఊహించాను ఆ స్థితిలో.

దైవదర్శనం కోసం వచ్చినప్పుడు అంతా దైవమే చూసుకోవాలి కదా! అందుకే దైవం మీద భారం వేసి కంపార్ట్‌ మెంట్ల వైపు నా భార్యతో, అక్కతో వెళ్లాను. గేటు దగ్గరున్న అతడు మమ్మల్ని చూసి ”మా మనుమరాలు, వాళ్ల తల్లిదండ్రులు కాలినడకన వచ్చి, దైవదర్శనానికి వచ్చారు. మమ్మల్ని లోపలికి పంపవా పుణ్యముంటది” అని ప్రమీల వినయంగా గేటు దగ్గరున్నవాణ్ణి అడిగింది. అంతే అతడేమనుకున్నాడో ఏమో మమ్మల్ని లోపలికి పంపించాడు. మేం బ్రతుకుజీవుడా అని లోపల పడ్డాం కాని, అప్పటికే జనం ఆ కంపార్ట్‌ మెంటులో నిండుగా ఉంది. నిలబడడానికి కూడా స్థలం లేదు. కూర్చోవడం దేవుడెరుగు. నాకు ఎక్కువగా నిలబడడం చేతగాదు. ప్రమీల, అక్కగారు ఇద్దరూ కష్టంగా నిలబడ్డారు.

ఆ కంపార్టుమెంటులో ఉన్నవాళ్ల చేతుల్లో టికెట్లున్నాయి. కొందరు బయటికి వెళ్లి రావడానికి పాసులు కూడా తీసుకున్నారు. మా దగ్గరవేం లేవు. మేం నేరుగా 10వ కంపార్టుమెంటులో ప్రవేవించాం. మమ్మల్ని ఎవరూ ఏమీ అడగలేదు. ప్రవేశించనైతే ప్రవేశించాం గాని, నిలబడడానికి చోటు లేదు. కంపార్టుమెంటు నుంచి కంపార్టుమెంటులోకి మారేటప్పుడప్పుడు గేటు ఇట్లా తీసారో లేదో జనం ఒకరి మీద ఒకరు పడిపోయారు. కొందరు ఊపిరాడక నిశ్చేష్టులయ్యారు. నాలో ఆందోళన పెరుగుతుంది. కూర్చోలేం. నిలబడలేం. ప్రక్కకు కదలలేం. ముందుకు నడవలేం. బయటకు కూడా వెళ్లే అవకాశం లేదు. ‘ఏమిట్రా ఈ దైవ దర్శనం? కాకుండే బాగుండేది” అనుకున్నాను నా మనస్సులో.

ప్రమీలకు చాలా ఇబ్బంది కల్గింది. చాలాసేపు నిలబడడం వల్ల కదలలేకపోయింది. నిజానికి ఆ జనం కదలనిస్తే కదా! గేటు తెరిచి తెరవకముందే వెనుకున్నవాళ్లు ముందున్న వాళ్లను నెట్టేస్తూ గేటు దాకా రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేనెట్లాగో కదిలినా ప్రమీలకు, మా అక్కకకూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఒక విచిత్రం జరిగింది.

ఆశ్చర్యంగా ఇద్దరు యువకులు మా దగ్గరకు వచ్చి ”సార్‌ మీరేమి భయపడకండి. మేడం గారికి మేం రక్షణగా ఉంటాం. మీకు దర్శనం సులభంగా జరుగుతుంది” అని మాట్లాడేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది.

”సార్‌ మీరు ఆచార్యులు గదా! మిమ్మల్ని టీవీలో చూశాం. అందుకే మిమ్మల్ని గుర్తు పట్టాం. మీరే వచ్చారా? ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగారు ఆ యువకులు. మా పిల్లలు బహుశా ఇప్పటికే స్వామి దర్శనం చేసుకొని ఉంటారు. మేం ఇలా రావలసి వచ్చింది” అని వాళ్ల డౌట్‌ క్లియర్‌ చేశాను. నిజంగా వారిద్దరూ ప్రమీలకు అక్కకూ బాడీ గార్డ్స్‌ లాగా ఉండి దైవదర్శనం చేయించారు.

నాకాశ్చర్యం కల్గింది. వారు మమ్మల్ని మా పిల్లలు లోపల ఉండగానే మాతో కలిపారు. మేం మా పిల్లలతో కలిసిన మరుక్షణంలో వాళ్లు మాయమయ్యారు. వారికోసం అక్కడా ఇక్కడా ఎంత చూసినా కనిపించలేదు. ఇదొక అద్భుత సంఘటనగా నా స్మృతిలో నిలిచిపోయింది.

నా ప్రమీల గురించి గొప్పగా చెప్పవలసిన పనిలేదు గాని, ఇక్కడ కొన్ని మాటలు చెప్పక తప్పదు. మూడువందల రూపాయల టికెట్‌ తీసుకోకుండానే కంపార్టుమెంటులో ప్రవేశించడానికి ఆమే కారణమైంది. అట్లే ఆమె రక్షణకు ఇద్దరు యువకులు రావడం విశేషం. వారు మమ్మల్ని మా పిల్లలతో కలిపి మాయం కావడం చిత్రమనిపించింది.

ప్రమీల కొంచెం బొద్దుగా ఉన్నా, ఆమె దేహకాంతి ఎరుపు. ముఖం గుండ్రంగా ఉండి, కుంకుమ తిలకం దానికి మరింత అందాన్ని కల్గించేది. ఆమె చీరకట్టు, స్ఫురద్రూపం ఎవరినైనా ఆకర్షిస్తుంది. సాధుస్వభావుల్ని చేస్తుంది. మొదటినుంచి ఆమెతో నేనెక్కడికి వెళ్లినా నాకు గంటలో అయ్యే పని క్షణంలో అయ్యేది. ఆమెను చూసినవారు, నన్నదృష్టవంతునిగా వర్ణించేవారు. నా నలభై ఏండ్ల కాపురంలో నా సహధర్మచారిణిగా ప్రమీల మంచి మార్కులు సంపాదించింది. ఒక్క తిరుపతే కాదు, దేశంలోనూ, విదేశంలోనూ ఎక్కడికి వెళ్లినా ఆమె సహధర్మచారిత్వం ఆమెకు శ్రీరామరక్షగా ఉండిందని చెప్పక తప్పదు.

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తమ్ముని పెళ్లి

by ఆచార్య మస‌న‌ March 30, 2024
written by ఆచార్య మస‌న‌

ఆనంద్‌ మా ప్రమీలకు పెద్దమ్మ కొడుకు. చిన్నప్పుడు మా ఆవిడ అతణ్ణి ఎత్తుకొని ఆడించేదట. అందుకేనేమో ఆనంద్‌ తన పెళ్లి అయిన తర్వాత కూడా మా ఇంటికి వచ్చేవాడు. మా పెళ్లి సమయంలో అతడు మా వూరికి వచ్చినట్లు జ్ఞాపకం ! ”బావా మీ ఇల్లు నాకు నచ్చలేదు. ఇంట్లో ఫ్యాన్లు లేవు. లైట్లు లేవు. ఇక్కడ నువ్వెట్లా చదువుకున్నావు బావా?” అని ప్రశ్నిస్తే, ”మాది వూరు కదా! పట్నంలోలాగా అవేవీ ఉండవు. ఐనా అన్నీ సజావుగానే జరుగుతాయి” అని సమాధానపరచడం నా వంతయ్యింది.

”అక్కా! ఎట్లుంటవు ఈ వూర్లో?” అని నా ముందరే ప్రమీలనడిగాడు. ఆమె నెమ్మదిగా ”బావ ఉద్యోగం హైదరాబాదులో కదా!” అని సమాధానపరిచింది. తానుండేది పట్నంలోనే కదా అని ఆమె ఆంతర్యం.

ఆనంద్‌ కు ఒక ఉపాధ్యాయురాలి కూతురుతో పెళ్లైంది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏవో పొరపొచ్చాలు వచ్చి భార్య నుండి విడాకులు కూడా తీసుకున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఒక జడ్జి గారి దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు.

అక్కమీది ప్రేమతో తరుచుగా వారాసిగూడాలోని ఇంటికి వస్తుండేవాడు. ప్రతి సంవత్సరం శబరిమలైకి వెళ్లి ప్రసాదం తెచ్చేవాడు. ఆ సంవత్సరం కూడా వెళ్లి వచ్చాడు.

”బావా! ఒంటరిగా ఉన్నాను. ఆ అయ్యప్ప కూడా కరుణ చూపడంలేదు. నాకు చెన్నప్ప బావే దిక్కు” అని కాళ్ల మీద పడ్డాడు. వాడి ఉద్దేశం అర్థమైంది. వాడికో పిల్లను చూసి పెళ్లి చేయాలని వాని కోరిక.

‘సరే చూద్దాంలే’ అని అప్పటికి తప్పించుకున్నాను.

ఒకరోజు మా ఇంటికి సమీపంలో ఉన్న రామాలయానికి వెళ్లి అప్పుడే వచ్చాను. ఆనంద్‌ ప్రత్యక్షమయ్యాడు. నాకు వెంటనే ఒక ఆలోచన మనస్సులో తళుక్కున మెరిసింది. రామాలయంలో నాకు తెలిసిన వాళ్లే అర్చన చేస్తున్నారు. కొండబత్తిని కుటుంబం అని మంచిపేరే ఉంది. హనుమంత రావుకున్న ఏడుగురు సంతానంలో చివరి ఐదుగురు ఆడపిల్లలే. ఒక అమ్మాయి పెళ్లి అయింది. రెండవ అమ్మాయిని సోలాపూర్‌ ఇస్తే ఏవో తగవులొచ్చి, ఇంటి పట్టుననే ఉంది. బి.ఏ. చదివింది. హెచ్‌.ఎమ్‌.టీ వాచ్‌ కంపెనీలో ఉద్యోగం. ఇంకా ముగ్గురి పెళ్లిళ్లు కావలసి ఉంది. రెండవ అమ్మాయి ఎంతో భారమైంది. హనుమంతరావు మా బస్తీలో పెద్దమనిషి. తరుచుగా మా ఇంటికి వచ్చి ప్రమీలతో మాట్లాడేవాడు. ప్రమీలకు వారి కుటుంబం గురించి బాగా తెలుసు.

హనుమంతరావు 2వ అమ్మాయిని ఆనందుకు ఇప్పిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏమనుకున్నా సరే అనుకొని ప్రమీలకు ఈ విషయం చెప్పాను లోగడ ఒకసారి.

ఆనంద్‌ ఆ సంవత్సరం శబరిమలైకి వెళ్లి మాకోసం ప్రసాదం తెచ్చాడు. నేను ఒకరోజు రామాలయం నుంచి వచ్చి రాగానే ప్రమీల హనుమంతరావు కుటుంబం అక్కడికి వచ్చిందా అని అడిగింది. వచ్చిందని చెప్పాను. వెంటనే ప్రమీల ఆ 2వ అమ్మాయి ఎట్లనిపించింది? అని నన్నడిగింది. ఫరవాలేదన్నాను. ప్రమీల ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఆనంద్‌ తో ”మీ బావ నీకో అమ్మాయిని చూశాడు- రామాలయంలో. చూస్తే ఇప్పుడే పోయి చూడు” అని పురమాయించింది.

ఆనంద్‌ ఆనందంతో ఎగిరి గంతేశాడు. అక్కా బావలు చెప్పిన తర్వాత ఇంకా ఆగవలసిన పని లేదనుకొని అడ్రస్సు పట్టుకొని రామాలయానికి వెళ్లాడు. ”మా బావగారు పంపించారు నన్ను” అని హనుమంతరావుతో పరిచయమయ్యాడు. హనుమంతరావు తన పరివారాన్ని అతనికి పరిచయం చేశాడు. ఆ 2వ అమ్మాయిని గుర్తించాడు. అక్కడేమీ మాట్లాడకుండా, ప్రసాదం తీసుకొని మా ఇంటికి వచ్చాడు.

హఠాత్తుగా అక్క కాళ్ల మీదపడి ”ఆ అమ్మాయితో నా పెళ్లి నువ్వే చేయాలి. మా అన్న పెళ్లి కూడా నువ్వే చేశావు ఆలేరు నుంచి పిల్లను తెచ్చి” అని ప్రాధేయపడ్డాడు.

ఆనంద్‌ కు ఆరుగురు అన్నలు. పెళ్లి కావాలంటే అన్నలనందరిని ఒప్పించాలి. ఇరువైపుల మాట్లాడి సంబంధం కుదిరించాలి. పెళ్లి చేసుకోవడం సులభం కాని, పెళ్లి చేయడం కష్టం.

పెద్దమ్మ కొడుకైనా ఆనంద్‌ బాధ్యతను ప్రమీల తన భుజానికెత్తుకుంది. పెళ్లి కాని అమ్మాయితో ఆనంద్‌ పెళ్లి చెయ్యాలనే ఆలోచన అన్నలకు లేకపోలేదు. ఐనప్పటికీ ప్రమీల వారినందరినీ ఒప్పించింది. ”ఆనంద్‌ కు భార్యలేదు. హనుమంతరావు కూతురికి భర్తతో తెగదెంపులయ్యాయి. ఇద్దరూ సమానమే. న్యాయం ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది” అని తెలివిగా అందరిని తన వాదానికి అనుకూలంగా మార్చింది.

ఎట్లాగైతేనేమి ప్రమీల ముందుండి ఆనంద్‌ పెళ్లి చేసింది. ఇప్పుడానంద్‌ ఇద్దరు పిల్లల తండ్రి. ఒక బాబు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి డిగ్రీ చదువుతుంది. చిత్రమేమిటంటే హనుమంతరావు ముగ్గురు ఆడపిల్లలకు చకచకా పెళ్లిళ్లయిపోయాయి.

ఆనంద్‌ ఎప్పుడైనా కలిస్తే ప్రమీలను గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ”బావా! అక్క లేకపోతే నా పెళ్లి అయ్యేది కాదు” అనే మాటలు ఆనంద్‌ హృదయంలోంచి వచ్చినవిగా భావిస్తాను. ప్రమీలను గూర్చి నేను ”ఘటనా ఘటన ధురీణురాలు” అని సంతృప్తి చెందుతుంటాను.

——————-

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పక్షుల విశేషాలు

by డా.కందేపి రాణీప్రసాద్ March 30, 2024
written by డా.కందేపి రాణీప్రసాద్

‘చిట్టి చిలకమ్మా! అమ్మ కొట్టిందా’ అనీ, ‘బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది’ అనీ, ‘కాకీ కాకీ కడవల కాకి’ అనీ మనం చిన్నతనంలో పాటలు పాడుకుంటూ పెరిగాం. నెమలీకలు పుస్తకాల్లో పెట్టుకొని మేతపెట్టడం, తూనీగ రెక్కలకు దారాలు కట్టి ఆడడం బాల్యపు తీపి గురుతులు. తన పిల్లలను తినేస్తున్న పాము పని బట్టడానికి రాణిగారి గొలుసుతెచ్చి పాము పుట్టలో పడేసిన కాకి కథ, గాలి వానకు పిచ్చుక కట్టుకున్న పిడకలిల్లు పడిపోయిందని చెప్పే కథ, వేటగాళ్ళ ఉచ్చులో ఎన్నో పక్షులకు సంబంధించిన కథలు చదువుకుంటూ పెరిగాం. ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు’, ‘ఎంగిలి చేత్తో కాకిని విసరడు’ వంటి సామెతలూ మన జీవితంలో భాగమే. ఇంటి ముందు వసారాలో పిచ్చుకల కోసం వరి కంకులు కట్టడం, ఇంటి చూరులో పిచ్చుకలు, పావురాలు పిల్లల కోసం గూళ్ళు కట్టుకుంటే వాటిని జాగ్రత్తగా చూడటం వంటివి మనకు పక్షులపై ఉన్న ప్రేమను తెలుపుతుంది. మన జీవితాలతో ఇంతగా మమేకమైన పక్షులు ఆధునిక ప్రపంచంలో అనేకానేక కారణాల వల్ల మనల్ని వీడి మాయమై పోతున్నాయి. పక్షుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
పక్షుల వర్గీకరణను మొదటగా ‘ఫ్రాన్సిస్ విల్లగ్టీ’ మరియు ‘జాన్ రే’ అనే శాస్త్రవేత్తలు చేపట్టారు. 1676వ సంవత్సరంలో ఈ శాస్త్రవేత్తలు ‘ఆర్వితోలాగే’ అనే పుస్తకంలో పక్షుల గురించి వివరించారు. ఈ తర్వాత వచ్చిన ‘కారల్ లిన్నేయస్’ అనే శాస్త్రవేత్త 1758వ సంవత్సరంలో పక్షుల వర్గీకరణను ఆధునీకరించాడు. ఈ పక్షులు సరీసృపాల వారసులు. సరీసృపాలకు పక్షులకు చాలా దగ్గరి పోలికలుంటాయి. శిలాజాల చరిత్రను గమనిస్తే అతిపెద్ద సరీసృపాలైన డైనోసార్లు ఆహారం దొరకక విలుప్తమైపోయాయి. పాకే జీవులైన సరీసృపాల నుంచి రెక్కలున్న పక్షులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. క్రస్టేషియన్ యుగంలో మొట్టమొదటగా పక్షులు అవతరించాయని తెలుస్తున్నది. క్రస్టేషియస్ యుగమంటే దాదాపు వంద మిలియన్ల సంవత్సరాలకు పూర్వమన్న మాట.
పక్షులు ‘ఏవ్స్’ విభాగానికి చెందినవి. రెక్కలు ఉండడం, ఆకాశంలో ఎగరగలగడం ప్రధాన లక్షణాలు. ఇవి నాలుగు గదుల గుండెను కలిగి ఉంటాయి. పళ్ళులేని ముక్కులున్న దవడలు గలిగిన జంతువులు ఇంకా ఇవి ఎండోదెర్మిక్ వర్టిబ్రేట్స్. వీటికి చాలా తేలికైన శరీరం, బలమైన అస్థిపంజరం ఉంటాయి. ఇవి గట్టి పెంకు గలిగిన గుడ్లను పెడతాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ కూడా వీటిలో ఎగరడానికి అనుకూలంగా పరిణామం చెంది ఉన్నాయి. ముందున్న రెండు కాళ్ళూ రెక్కలుగా పరిణామం చెందటం వలన, రెక్కలకున్న ఈకల్లో గాలి గదులుండటం వలన ఇవి ఎగర గలుగుతున్నాయి. సరీసృపాల నుంచి పక్షులు ఏర్పడ్డాయని అనుకున్నాం కదా! ఇవి అంతా ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో జరగదు కదా! పరిసరాలు, పరిస్థితులను బట్టి కొన్ని అంగాలను కోల్పోవటం, కొత్తగా కొన్నింటిని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. సరీసృపాలకు, పక్షులకు మధ్య వారధిలా ‘ఆర్కియాప్టెరిక్స్’ అనే జంతువు ఉండేది. దీనికి సరీసృపాల లక్షణాలు, పక్షుల లక్షణాలు రెండూ ఉంటాయి. ఇది పూర్తిగా ఆకాశంలో ఎగరలేదు. పళ్ళున్న దవడలు, పొడవైన ఎముకలున్న తోకలు కలిగి ఉంటాయి. ఇది సరీసృపాల లక్షణం.
పక్షులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. సుమారు ఎనిమిది వేల జాతులన్నాయని తెలుస్తున్నది. వీటిలో 5 సెం.మీ పొడవున్న అతి చిన్న హమ్మింగ్ బర్డ్ నుంచి 9 ఫీట్ల పొడుగున్న అతి పెద్ద ఆస్ట్రిచ్ వరకు అన్ని రకాల పక్షులున్నాయి. కొన్ని పక్షులు చాలా తెలివి కలవి. అందులో చిలకలు, కొర్విడ్లు మొదలైనవి తెలివైన వాటికి ఉదాహరణగా నిలుస్తాయి. చాలా జాతుల పక్షులు సంవత్సరానికొకసారి చాలా చాలా దూరాలు వలస పోతుంటాయి. పక్షులు సంఘజీవులు. ఇవి సైగల ద్వారా, అరుపుల ద్వారా, పాటల ద్వారా తోటి పక్షులకు కావలసిన విషయాన్ని చేరవేస్తాయి. పక్షులు ఎంతో శ్రమకోర్చి పుల్లా పుడకా ఏరుకొచ్చి రకరకాల గూళ్ళను అల్లుకుంటాయి. అలా అల్లుకున్న గూళ్ళలో తమ పిల్లలను పెట్టుకుంటాయి. గుడ్లు పొదిగి పిల్లలైన తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి పిల్ల పక్షుల్ని తల్లి పక్షులు. పక్షులు మనుష్యులతో కలసి బతుకుతాయి. మానవులకు ఆహారంగా ఉప యోగపడతాయి. వాటిని వేటాడే పిల్లులు, కుక్కల కన్నా పక్షులు మానవుల వల్లే ఎక్కువగా చనిపోతున్నాయి. 17వ శతాబ్దం నుంచి దాదాపు 120 నుండి 130 జాతుల పక్షులు అంతరించిపోయాయి. అంటే మానవుడు అభివృద్ధి బాట పట్టి నాగరికత వైపు అడుగులు వేస్తున్న సమయం నుండీ పక్షులు అంతరించి పోవటం మొదలయిందన్నమాట.
కొన్ని పక్షులు ఆర్థిక ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. కోడి, బాతు వంటి వాటి గుడ్లు, మాంసం మానవులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాక పక్షుల ఈకలు కూడా టోపీలు, ఆభరణాల తయారీలో ఉపయోగపడతాయి. చిలకలు, పావురాలు వంటి పక్షులు పెంపుడు జంతువులుగా మానవుడితో సహజీవనం చేస్తాయి. పక్షుల పెంటను పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు.

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అలుపెరుగని జీవనం

by Kondapally Neeharini March 30, 2024
written by Kondapally Neeharini

పూర్వ సామ్రాజ్యాలను కీర్తించడమో, రాజుల గాథలను చెప్పడమో అసలైన చరిత్రకాదు. సకల ప్రజల, సకల జాతి ప్రగతిని కోరుకున్న విషయాలు చెప్పేది చరిత్ర. ఈ ప్రజా చరిత్రలో అత్యంత మహత్తరమైన వ్యక్తి బీదవాడు. ఆ బీదల వైపు నిలబడిన వాడు అసలైన నాయకుడు. చారిత్రక పురుషుడు తన జీవితంలో ముఖ్యమైన కాలన్నంతా ప్రజాపక్షాన పోరాడిన నాయకుడు పెండ్యాల రాఘవరావు.ఆయనలో దేశభక్తి బీజాలు మొక్కౖెె మానై మహావృక్షమై ఫలాలందించే స్థాయికి ఎదిగాయి. ఆనాటి తెలంగాణా ప్రాంతమంతా చీకటిలో మ్రగ్గి ఉందన్నది రాఘవరావు తన చిన్న వయసులోనే గ్రహించి ప్రపంచ జ్ఞానాన్ని చారిత్రకాంశాలనీ, భారతదేశ ఆర్య సంస్కృతినీ అన్ని విషయాలను తెలుసుకున్నాడు. ఒక దేశం సునపంన్న దేశంగా ఎదగాలంటే అది సారవంతమైనదే కావాల్సిన అవసరం లేదనీ, స్వతంత్ర దేశం అయితే చాలుననీ గ్రహించాడు రాఘవరావు. మహాత్మాగాంధీ సత్యాగ్రహాలు చేయడం వీరిపై పెద్ద ప్రభావమే చూపింది. తాను కూడా వరంగల్లో నిరాహార దీక్ష చేసి, హరిజనోద్ధరణకు నడుకట్టాడు. మత మార్పిడి పై వచ్చిన తబ్లీగ్‌ ఉద్యమాన్ని అడ్డుకోవడం, వీటి వల్ల వచ్చిన ఆంక్షలను, ఎదుర్కోవడంతో రాఘవరావులో గట్టి నిర్ణాయకుడు ఉద్భవించాడు.

ఆనాటి సామాజిక వ్యవస్థలోని కుళ్ళు వ్యవస్థ అయిన అంటరానితనాన్ని ఎండగడ్తూ హరిజనులను ఇంట్లోకి తీసుకురావడం వారితో సహపంక్తి భోజనాలు చేయడం, దేవాలయ ప్రవేశంచేయడం, హరిజన స్త్రీలతో బతుకమ్మ ఆడించడం వంటివన్నీ రాఘవరావు ఎంతో దృఢ నిశ్చయంతో చేశారు. జాతీయోద్యమాలను అనుసరిస్తూ అత్యంత ప్రభావం చూపిన ఆర్య సమాజంలో, చేరడం సత్యాగ్రహోద్యమం, గ్రంథాలయోద్యమం, రైతు కూలీ పక్షాన నిలబడడం ఈ పోరాటాలలో అతని ప్రాణాలు తీయాలన్న ప్రయత్నాల నెదుర్కోవడం అన్నీ రాఘవరావు జీవితంలో ప్రముఖ ఘట్టాలే!కాంగ్రెస్‌ సత్యాగ్రాహిగా ఉండి జైలు జీవితాన్ని అనుభవించడం రాఘవరావులో అణగారి ఉన్న విప్లవవాదికి కొత్త భావాలు తోడైనవి. కమ్యూనిస్టు కార్యకర్తగా కాలక్రమంగా నాయకునిగా ఎదిగి ప్రజారాజ్యాన్ని చూడాలని సాయుధ వీరుడయ్యాడు.అజ్ఞాత జీవితంలో అనేక సంఘటనలు చవి చూశాడు. రజాకార్ల నెదుర్కొంటూ పోలీస్‌ ఆక్షన్‌ సమయంలో వీరోచిత పోరాటం చేశాడు. జాతీయ రాజకీయాలకు తోడు నిజాం గద్దె దిగడం, ఎన్నికలు రావడం, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసేవ చేయాలనుకోవడం అన్ని పరిస్థితులననుసరించే జరిగినవి. పి.డి.ఎఫ్‌ ద్వారా ఎన్నికల్లో పాల్గొన్న విషయాలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా చెప్పిన విషయాలెన్నో! ఆయన ఉపన్యాస ధోరణిని, వాక్కుపటిమనీ, కథలు కథలుగా చెప్పుకునేవారు ప్రజలు. ప్రత్యక్షంగా ఎన్నో తడవలు విన్న అనుభవాలు ఆ రోజుల్లో రికార్డు చేసుకోలేని పరిస్థితి. కాలం వేగంగా పరుగిస్తూ ఎన్నో సత్యాలను తనతో తీసుకెళ్ళింది.”అవి ఎమర్జన్సీ చీకటి రోజులు, రాజ్యమేలుతున్న కాలం. మహాసభానంతరం జనగామ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో రావి నారాయణ రెడ్డి గారి ప్రసంగం తరువాత రాఘవరావుగారి ఉపన్యాసం వింటూ కాళోజీ ఏడుస్తూ చెట్టు క్రింద రాయిపై కూర్చున్నాడు. తర్వాత కాళోజీని ప్రసంగించమంటే ”రాఘవరావు ప్రసంగం తర్వాత నేను ఉపన్యసించడం అనవసరమని” కన్నీటితో జవాబు చెప్పి, వేదికపైకి రానే లేదు. స్వాతంత్రోద్యమ ఘట్టాలను ఆనాటి ప్రజల కడగండ్లను చెప్పుతుంటే సభికులు అచ్చెరువొందారు. రాఘవరావు గారి ప్రసంగం ఆ స్థాయిలో ఉండేదని చెప్పడానికే ఇది రాశాను. ఆ ఉపన్యాసం కొన్ని పత్రికలలో ప్రముఖంగానే వచ్చింది చాలా వాటితో పాటు అదికూడా మీకు లభ్యం కాలేదు.” అంటూ జనగామ నుండి కె. మాధవ రెడ్డిగారు వ్రాసిన ఉత్తరంలో ఉంది. 2007లో రాఘవరావుగారి 20వ వర్ధంతి సందర్భంగా ‘నా ప్రజాజీవితం’ పుస్తకావిష్కరణ చేసిన తర్వాత అందిన ఉత్తరం. రాఘవరావుగారు వ్రాసుకున్న అనుభవాలు కొన్ని, పెద్దల అభిప్రాయాలు కొన్ని ఉన్న ఆ పుస్తకాన్ని చదివి, ఆ పుస్తకం అసమగ్రంగా వుంది అంటూ ఎన్నో విషయాలను ఉటంకిస్తూ 18 పేజీల ఉత్తరం ఒకటి, 9 పేజీల ఉత్తరం మరొకటి వ్రాశారు. మాదవరెడ్డిగారు కొంతకాలం జిల్లా పార్టీ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేసి, రాఘవరావుగారిని దగ్గరినుండి చూసిన, పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవాలు ఆ ఉత్తరాలలో ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నవి.ఎంతో శ్రమకోర్చి పుస్తకాన్ని అచ్చువేయిస్తే, తర్వాత చాలా విషయాలు తెలిశాయి. అది సమగ్రమైందికాదని తెలిసీ, అసలు విషయాలెన్నో వెలుగులోకి రాలేదనీ ఇంకా ఏదైనా చేయాలనీ సంకల్పం ధృవపడింది. వీలున్నపడల్లా రాఘవరావుగారి గురించి సమాచారం సేకరించి సిద్ధం చేసుకున్న విషయలనూ, రాఘవరావుగారి మేనకోడలు దయామతిగారు చెప్పిన విషయాలనూ ఆధారం చేసుకొని కొంత వ్రాసి పెట్టుకోవడం జరిగింది. వీరిది రాయపర్తిగ్రామం, ఈమె పరమ పండితోత్తమురాలు. రామాయణ భారత, భాగవతాలను కక్షుణ్ణంగా చదివి, పద్యాలనూ, శ్లోకాలనూ అనర్గళంగా చవగలుగోవారిమె. ఇప్పటికీ చదువుతున్నారామె. 2007లోనే ఆమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వూ తీసుకున్నాను. చిన్నపెండ్యాల ఊళ్ళన్నీ చుట్టు ప్రక్కల తిరిగి సమాచారం సేకరించి ‘నా ప్రజా జీవితం’ ప్రచురించినప్పుడు దయామతిగారి దగ్గర సేకరించలేదు. ఆ పుస్తకం చదవగానే ఆమె నన్ను దగ్గరకు పిలిపించుకుని ఎన్నో విషయాలు చెప్పారు. తర్వాత కొత్తపల్లి భగవానుగారు 30 పేజీల పోరాటాల చరిత్రను వ్రాసి పంపారు. అందులో ప్రతి, సాయుధ పోరాటంలోనూ రాఘవరావే వున్నాడు. ఆ ఉదంతాలన్నీ ఈ రచనకు ప్రేరణ.’వీర తెలంగాణా సాయుధ సమరం’ కందిమళ్ళ ప్రతారెడ్డిగారి పుస్తకం, వాసిరెడ్డి నవీన్‌ గారి ‘తెలంగాణ విముక్తి పోరాట కథలు’ పుస్తకం, తెలంగాణా విమోచనోద్యమం-తెలుగు నవల’ వరవరరావు గారి పుస్తకం, పోరాటాల బాటలో అనుభవాలు జ్ఞాపకాలు’ యస్‌.వి.కె.ప్రసాద్‌ గారి పుస్తకము, సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము, విజ్ఞాన సర్వస్వం వంటి ఎన్నో పుస్తకాలు చదివి ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాను. 2008లో అఫ్జల్‌ గంజ్‌ లో వున్న లైబ్రరీకి చాలారోజులు పోయిసేకరించిన పాత పత్రికలూ నాకు రచనలకు తోడ్పడ్డవే. రాఘవరావు వ్రాసిన ”నా ప్రజాజీవితం” ఆధారంగా పై పుస్తకాల నుండి సేకరించిన సమాచారంతోనూ, మా జ్ఞాపకాల ఆధారంగాను ఈ పుస్తకాన్ని వ్రాశాను.”స్వాతంత్య్ర పోరాటంలో వరంగల్‌ తాలూకా’ అనే వ్యాసం కొయ్యడ రాజయ్య, పెండ్యాల రాఘవరావుగార్లు వరంగల్‌ జిల్లా స్వాతంత్య్ర యోధుల ద్వితీయ మహాసభ సందర్భంలో, సావనీర్‌ వెలువరించిన సందర్భంలో వచ్చిందై వుంటుంది. ఆ వ్యాసం చదివితే చాలు రాఘవరావుగారి వ్యక్తిత్వం అర్థమౌతుంది. అంత పెద్ద వ్యాసంలో తన విషయానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వలేదు. వరంగల్‌ జిల్లా అంతా, ఊళ్ళన్నీ తిరిగిన వీరు ఏ ఒక్క పంక్తిలోనూ ఈ వ్యాసంలో కనిపించరు. అదీ! అదివారి నిస్వార్థసేవాభావం, ప్రతిఫలం ఆశించని మనస్తత్వం.ఈ పుస్తక రచనకు పూనుకొన్నప్పుడు యస్‌.వి.కె. ప్రసాద్‌ గారి పుస్తకాన్ని చదివి, రాఘవరావు గారి సందర్భం వచ్చినప్పుడు వీరు వ్రాసిన విషయాల్ని చదివి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను.” ‘పెండ్యాల రాఘవరావు, చింతల రామకృష్ణారెడ్డిగారలకు అప్పగించిన వరంగల్లు పడమటి ప్రాంతములో భూపంపక కార్యక్రమం కొంతవరకైనా అమలు జరుగలేదు. తూర్పు వరంగల్లు ప్రాంతంలో పెద్ద భూస్వాముల వద్దగల భూమి కూడా సకాలంలో పంచబడనందున, రాష్ట్ర కమిటీ నుండి తీవ్రమైన విమర్శలు వచ్చాయి.” అని వారి పుస్తకంలో పేజీ 53లో ఎస్‌.వి.కె గారు వ్రాశారు. 1948 రోజుల్లో జరిగినట్టు వ్రాశారు. అదే పుస్తకంలో 49వ పేజీలో ”గ్రామ రక్షణ దళాలతోపాటు, చైత్రయాత్రా దళాలు వెలిశాయి. ఇచ్చట వాలంటీర్లు చేతులు చాచి కొట్టడానికి అనువుగా తయారుచేసుకున్న పొడవాటి లావు కర్రలను ‘గుత్పలు’ అనేవారు. దీనివల్ల దీనికి ‘గుత్పల సంఘం’ గా పేరొచ్చింది”. అని వ్రాసుకున్నారు వారి పుస్తకంలో., ఇంత అసంబద్ధ అన్యాయమైన విషయాన్ని సభ్యసమాజం ఖండించాలి. ‘గుత్పలు ‘ అంటే ఏమిటో అర్థం చెప్పాల్సిన అవసరం  తెలంగాణ ప్రజలకు అక్కర లేదు.”1947 సెప్టెంబర్‌ 11వ తేదీన కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ విముక్తి కోసం సాయుధపోరాటానికి పిలుపునిచ్చింది. నైజాం సైన్యాలకు, రజాకారు ముఠాలను ప్రజలు సాయుధంగా ప్రతిఘటించడం ప్రారంభించారు. భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని, ప్రభుత్వ భూములను ప్రజలకు పంచే కార్యక్రమం, గ్రామరాజ్యాల ఏర్పాటు ప్రారంభమయినవి.” ఇట్లా పై మాటలతో పొంతన లేకుండా వ్రాశారు. వరంగల్‌ ప్రాంతానికి వీరు వచ్చిందే 1948లల్లో ఇట్లా వ్యక్తుల మీద తప్పుడు రిపోర్టులు పంపినారనడానికి ఇంతకన్నా సాక్ష్యమింకేం కావాలి? బహుశా ఆ రోజు, ఆ క్షణంలో వారు ఇచ్చిన ఆదేశాల అమలు జరపలేకపోయి వుంటారు. కానీ వారు ఇక్కడికి వచ్చేవరకే కొన్నిగ్రామాల్లో భూపంపిణీ ఉద్యమాన్ని రాఘవరావు జరిపారు. ప్రజా పోరాటాల భాగం లో తన యవ్వన కాలమంతా అడవులలో గడిపి, ఎన్నో ఉద్యమాలు చేసిన రాఘవరావు ఇట్లాంటి అభియోగాలను ఎదుర్కోవడం లో న్యాయం ఎక్కడున్నది? వాటి పర్యవసానాలను ఏమీ పట్టించుకోని రాఘవరావు నష్టపోయింది చాలానే అని పుస్తకాలు చదివాక తెలిసింది.అయినా సరే, ఇప్పటికి తెలిసిన విషయాలైనా వ్రాయాలని నిర్ణయించుకొని వ్రాసిందే ఈ పుస్తకం! దాదాపు 1932,33ల నుండే ప్రజాపోరాటాల్లో వుండి సాయుధుడై అద్భుత విజయాలు సాధించిన రాఘవరావు క్రిష్ణారెడ్డి గార్లు తాము ఇచ్చిన భూపంపకాల కార్యమాల డ్యూటీని సరిగ్గా నిర్వర్తించలేదని వ్రాయడం ఎంతవరకు సబబు? దాదాపు 15 ఏళ్ళు వీరికంటే ముందే పోరాటాల్లో పాల్గొంటున్నవారి గురించి ఈ విధంగా నిందలు వేశారంటే ఆశ్చర్యం, బాధ కలుగుతుంది.”మావి రికార్డులు ఏమీ లేవు. వున్న రికార్డులను తగులబెట్టడమే మా కార్యక్రమాలాయే ” అని నాతో, నేను తీసుకున్న ఇంటర్వ్యూ లో చెప్పిన బొమ్మగాని ధర్మభిక్షంగారి మాటలు గుర్తుకువచ్చాయి. ”అసలు మేము బ్రతుకుతామనుకున్నామా? రాఘవరావు గారి జీవితం, విశేషాలు అది ఒక మహాసముద్రం. దానికి న్యాయం జరగాలంటే ఒకరిద్దరు మాటలతో అయ్యేదిగాదు” అని చెప్తూ మద్దికాయల ఓంకార్‌ గారు కొన్ని సలహాలు ఇచ్చారు , నేను వారిని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు. ఇవన్నీ చూస్తుంటే నేను రాఘవరావుగారి జీవిత విశేషాలను సమగ్రంగా తీసుకురావడం సాధ్యమయ్యే పనేనా అని ఆలోచించేలా చేశాయి.  ఎవరు వ్యక్తులను ఎక్కడెక్కడ ఎలా దెబ్బకొట్టాలని ప్రయత్నాలు చేస్తారో కదా!మా బాల్యమంతా రాఘవరావుగారి క్రమశిక్షణలో, శ్రమతత్వపు ఆలోచనలతో పెరిగింది. అబద్ధాలడవద్దు, అన్యాయం చేయవద్దు. తెలివిగా విజ్ఞానదాయకంగా మంచినడవడితో జీవించాలని నేర్పించారు. కమ్యూనిస్టు భావాలతో వున్న పెండ్యాల రాఘవరావు గారి భార్య , మా అమ్మ కౌసల్యాదేవి తమ పిల్లలను రాఘవరావుగారి ఆదర్శాలకనుగుణంగా తీర్చిదిద్దింది. క్రియాశీలక రాజకీయాల్లో నిలువలేకపోవడం వారి అసమర్ధతవల్లగాడు చుట్టూ వున్న వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలవల్ల, ఒక ప్రణాళికతో ఆక్రమించే ప్రయత్నాలవల్ల అని అర్థమైంది.నిరంతరం ప్రజాసేవాభిలాషలో జ్వలించిన వారి ఆలోచనలు ఆదర్శవంతమైన జీవితపు వెలుగులు నేటి యువతరానికి, భావిభారతపౌరులకు తెలియజేయాలన్న సంకల్పంతో వ్రాయడం జరిగింది. పెండ్యాల రాఘవరావుగారి కన్న బిడ్డగా గర్వంగా తలెత్తుకొనగలుగుతున్నానని సవినయంగా తెల్పుతూ – నేను ఇందులో వ్రాయనివి, మీకు తెల్సినవి, ఆనాటి పోరాటాల విషయాలైనా, రాఘవరావుగారి వ్యక్తిత్వ విషయాలైనా తెలిసినవి వుంటే మాకు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. _*_(పెండ్యాల రాఘవరావు జీవిత ప్రస్థానం’ అనే జీవిత చరిత్రను నేను తెలుగు అకాడమీకి వ్రాసిచ్చాను. 2014లో అకాడమీ ప్రచురించింది. నేను రాసిన చాలా భాగాలను తొలగించారు. నేను రాసిన ఈ ముందుమాటను కూడా అందులో ప్రచురించలేదు. ఆ జీవిత చరిత్రను ఇంకా పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నదేమో !)( 2017 మార్చ్ నెలలో పెండ్యాల రాఘవరావు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాము మేము . రాఘవరావు గారి సంతానం కొడుకులు కోడళ్లు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరం కలిసి. )

( మార్చ్ 15 పెండ్యాల రాఘవరావు గారి జన్మదిన సందర్భంగా)  

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సమాజహితవు కోరిక ఉంటేనే సత్ఫలితాలు పొందగలుగుతాం

by Aruna Dhulipala March 30, 2024
written by Aruna Dhulipala

– అక్కిరాజు సుందర రామకృష్ణ

కవితా గాండీవి, నాట్య శ్రీనాథ, పద్యవిద్యామణి మొదలగు బిరుదులు పొందిన ప్రముఖ నటులు, గాయకులు, కవి, రచయిత అక్కిరాజు సుందర రామకృష్ణ గారితో మయూఖ ముఖాముఖి…                            – అరుణ ధూళిపాళ

         వివిధ రంగాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించి ఆయా ప్రముఖుల ప్రశంసలు పొందిన అక్కిరాజు సుందర రామకృష్ణ గారి జీవిత విశేషాలను వారి మాటల్లో తెలుసుకుందాం.

అక్కిరాజు సుందర రామకృష్ణ గారితో ముఖాముఖి గ్రహీత అరుణ ధూళిపాళ

నమస్కారం సార్🙏

1. మొట్టమొదటగా మీరు పుట్టి పెరిగిన ఊరు, తల్లిదండ్రులు మొదలగు విషయాలు చెప్పండి.

జ:     అమ్మా! నమస్కారం. దేశంలో ‘ఋషి’ శబ్దం చాలా గొప్పది. విశ్వనాథ వారు రెండవ వాల్మీకి అని ఒక పద్యంలో చెప్పినట్టు మా నాన్నగారు కవి పండితుడు కాదు గానీ ఋషి. మంచి శిష్టాచార కుటుంబం. నాకు ఇద్దరక్కయ్యలు, నలుగురు అన్నయ్యలు, నాతో కలిపి మొత్తం ఏడుగురం. ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా ఇంట్లో పిల్లలకు ట్యూషన్లు చెప్పి మమ్మల్ని ఇంత యోగ్యులను చేసాడంటే ఆయన ఋషి. మా నాన్నగారి పేరు అక్కిరాజు రామయ్య పంతులు, మా అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ. నేను1949 ఏప్రిల్ 23 చైత్ర బహుళ ఏకాదశి, శనివారం నాడు జన్మించాను. మేష లగ్నం కావడం వల్లనో ఏమో మొదటి నుంచీ మాట పడేవాడిని కాదు.
           మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. అది మహాకవులకు, జాతీయ వాదులకు నెలవు. 1930 ప్రాంతంలో మా నాన్నగారు అక్కడికి వచ్చారు. ఆయన తన మంచితనం, గొప్పదనంతో అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. గొప్ప గాయత్రీ ఉపాసకుడు. అదే నాకు కూడా కొంచెం అబ్బింది. ఆయన సుందర కాండ పారాయణం చేసేవారు. తత్ఫలితంగా నేను పుట్టానని సుందర రామకృష్ణ అని పేరు పెట్టారు. మా రెండో అన్నయ్య అక్కిరాజు రమాకాంతరావు గారు. ప్రసిద్ధ రచయిత. మీ అందరికీ తెలిసినదే.

2. నరసరావు పేటలో మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచింది?

జ:    నాకు పది, పదిహేనేళ్ళు వచ్చేసరికి మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ‘ఆవారా’. అందులో కూడా అగ్రశ్రేణి ‘ఆవారా’ ( నవ్వుతూ ). చిలిపి పనులు ఎన్నో చేసేవాడిని. “ఆర్తజన గేయ పాతూరి ఆంజనేయ” అనే మకుటంతో నేను రాసిన ‘ఆంజనేయస్వామి శతకం’ లో నా బాల్య చేష్టలను రాసుకున్నాను. నేను అందరికంటే చిన్నవాడిని కావడం వలన మా అమ్మగారు బాగా గారాబం చేసేది. మా ఊరివాళ్ళు ఎకసెక్కాలు చేసేవారు. పదోతరగతి కూడా పాసవుతానని ఎవరూ అనుకోలేదు. నరసరావుపేట హైస్కూలులో లంకా సీతారామ శాస్త్రిగారు సంస్కృత పండితులు. మాకు గురువు. ఆయన రాజ్ భవన్ కి వెళ్లి సంస్కృతం నేర్పేవారు. ఆయన కూడా ఒకసారి మా నాన్నగారితో “మీ చివరి వాడు ఎందుకూ పనికిరాడయ్యా రామయ్య పంతులూ” అన్నాడట. అలా ఉండేవాడిని. స్కూల్ ఎడ్యుకేషన్ లో మూడుసార్లు తప్పాను. మా నాన్నగారు ఆంధ్రా మెట్రిక్యులేషన్ కట్టిస్తే అదీ తప్పాను.
         ఆ సమయంలో మా మూడో అన్నయ్య ప్రభాకర్ గారు మెహదీపట్నంలో ఉంటుండేవారు. ఆయన నాకు పద్యాలను బట్టీ కొట్టించినట్లు, లెక్కలు బట్టీ కొట్టించి పరీక్ష రాయించారు. అప్పుడు అత్తెసరు మార్కులతో పాసయ్యాను. నరసరావుపేటలో ఉంటే నాలో మార్పు రాదని 1966 లో హైద్రాబాదుకు తీసుకువచ్చి, న్యూ సైన్సు కాలేజీలో పియుసి లో చేర్పించారు. అక్కడ కూడా నాలో మార్పు రాలేదు. బైపిసి అంటే అది కాస్త బుర్ర ఉన్న వాళ్ళకని నా అభిప్రాయం. అందుకేనేమో బాటనీ లెక్చరర్ భార్యగా లభించింది (నవ్వుతూ). ఆ తరువాత 1967, 68లో వెనక్కి వెళ్లి  హిస్టరీ, పొలిటికల్ సైన్సు, స్పెషల్ తెలుగుతో కాలేజీలో చేరాను. చాలా పెద్ద మార్పు వచ్చింది. హిస్టరీలో కాలేజీ ఫస్ట్ వచ్చాను. అంత మార్పును ఎవరూ ఊహించలేదు. అప్పటి నుంచి వెను తిరిగి చూసుకోలేదు.

3. రంగస్థలంపై మీ అరంగేట్రం ఎలా జరిగింది?

జ:      ఇంటిలో ఉన్న వాతావరణం నాకు తెలుగు మీద అభిమానాన్ని కలుగజేసింది. నాకు తెలుగు బోధించిన గురువుల వల్ల తెలుగు భాషా గొప్పదనం అర్థమై, తెలుగు భాషలో పరిణతి సాధించి, తెలుగు మాష్టారిని కావాలని ఒక కోరిక కలిగింది. అప్పుడప్పుడు కళాశాలలో పాడుతుండడం వల్ల గురువులు, తోటివాళ్ళు బాగా పాడతావని ప్రోత్సహించారు. 1968 లో బి.ఏ లో వారణాసి వెంకటేశ్వర్లు గారు మాకు తెలుగు గురువు.  ఆ కాలేజీలో ఆయనతో పాటు మదనపల్లి సత్యనారాయణ గారు, జొన్నభట్ల వీరభద్రయ్య గారు భాషలో నిష్ణాతులు. వారణాసి వెంకటేశ్వర్లు గారు నాకోసం ఒక నాటకం రాసారు. శివాజీ పాత్రకు సరిగ్గా నేను సరిపోతానని శివాజీ వేషం వేయించారు. అది మొదలు 1968, 69, 70 మూడేళ్లు నేను కాలేజీలో బెస్ట్ యాక్టర్ ని. అదృష్టవశాత్తు నాలో ఘంటసాల గారి గాత్రధర్మం ఉండడం వల్ల చిన్నప్పటినుండే స్కూల్లో ‘అహో ఆంధ్ర భోజ’, ‘నీల గగన ఘన శ్యామ’, ‘మోహనరూప గోపాలా’ లాంటి పాటలను అప్రయత్నంగానే అందరూ మెచ్చుకునేలా పాడేవాడిని. అయితే కొరిటాల వెంకట కోదండ రామారావు గారు నేను బాగా పాడుతుండడం చూసి ఒక సాంఘిక నాటకంలో సందర్భాన్ని సృష్టించి ‘వీరాభిమన్యు’ సినిమాలో కృష్ణుడిని బెదిరిస్తూ ” బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ సంతసింపక ఔరా ! నను భాగమిమ్మనెదరా, బెదిరింతురా ఏయ్…” (పాడుతూ ) పౌరాణిక రంగస్థల అరంగేట్రానికి ఇది నాంది. దీని తర్వాత పద్య పరంపర మొదలైంది.

4. ఆకాశవాణిలో ఉద్యోగం ఎలా సంపాదించగలిగారు?

జ:  నేను నరసరావుపేటలో డిగ్రీ మూడేళ్లు పూర్తి చేసుకొని హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ ఎమ్. ఏ. నిజాం కళాశాలలో చేరాను. ఎన్. వి. రాజగోపాల్ అని ప్రిన్సిపాల్. కోవూరు గోపాల కృష్ణగారు, కులశేఖరరావు గారు, జి. వి. సుబ్రహ్మణ్యంగారు, రవ్వా శ్రీహరి గారు, తంగిరాల నారాయణ శర్మగారు, అమరేశ్వరం రాజేందర్ గారు.. ఇలాంటి హేమాహేమీలు అందరూ ఉండేవారు. అది సాయంకాలం కాలేజీ కాబట్టి డ్రామాలు వేయడానికి కుదిరేది కాదు. నా డ్రామాల తృప్తిని ‘AIR’ లో తీర్చుకున్నాను. రేడియోలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కోరికగా ఉండేది. దానికి కావాల్సిన ఎన్నో సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి. ఉత్తమ గాయకుడు, ఉత్తమ నటుడు, తెలుగు ఎమ్.ఏ, వ్యాఖ్యాత ఇవన్నీ ఉన్నాయి. “సిఫార్సు లేనిదే స్మశానమందు దొరకదు రవంత చోటు”, “పేరుకు ప్రజలదె రాజ్యం, పెత్తందార్లదే భోజ్యం” (ఆరుద్ర ) అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి మార్పులు లేవు.
       రేడియోలో అడిషన్స్ కి వెళ్ళాను. పెద్ద అద్దం, దానికో కర్టెన్ కడతారు. నేను అప్లికేషనులో పౌరాణికంలో ప్రవేశం ఉందని రాశాను. ముందు ఒక డైలాగ్ చెప్పి, పౌరాణికంలో ఒక డైలాగ్ చెప్పి, పద్యం గానీ, పాట గానీ పాడమన్నారు. మూడవది రేడియోలో బాగా ప్రయత్నం చేశానన్నావు కదా! వార్తలు ఎలా చదవాలో చెప్పుమన్నారు.
        రెండు రౌండ్లు అయ్యాక “బానిసలంచు…..” అనే పద్యం పాడటం మొదలుపెట్టాను. వెంటనే కర్టెన్ తొలగించి ‘వీడెవడు’ అన్న కుతూహలంతో నా వైపు చూశారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదని నా అభిప్రాయం. ఎంతో గర్వకారణంగా అనిపించింది. తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎంతగానో ప్రశంసించారు. అలా రేడియోలో స్థానం సంపాదించాను.

5. రేడియో ఆర్టిస్టుగా మీ సహ ఆర్టిస్టులు, వారితో మీ అనుభవాలను చెప్పండి.

జ :   నేను శారదా శ్రీనివాసన్, మద్దూరు విజయలక్ష్మి, మల్లాది విజయలక్ష్మి , మీరా కుమారి మొదలైన ‘ఎ’ గ్రేడ్ ఆర్టిస్టులందరితో నాటకాల్లో వేశాను. సంగీత రూపకాలన్నింటికీ నన్ను పిలిచేవారు. గాయకుడు చిత్తరంజన్ గారు కూడా నామీద ఎంతో అభిమానం చూపించేవారు. రెండు, మూడేళ్లు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. పాలగుమ్మి విశ్వనాథం గారు, కొండా బలరామశర్మ గారు ( పుట్టు గుడ్డి అతను )..ఇలాంటి గొప్ప ఆర్టిస్టులుండేవారు. రేడియోలో వచ్చే కార్మికుల కార్యక్రమం నిర్వహించే ఆర్టిస్టులు ఏకాంబరం ( వట్టెం సత్యనారాయణ ), చిన్నక్క ( రతన్ ప్రసాద్ )లకు నేనంటే ఎంతో అభిమానం. ఒక్కొక్కప్పుడు వాళ్ళ రికార్డింగులు కూడా పక్కన బెట్టి మా రికార్డింగు వినడానికి వచ్చేవారు. నన్ను ఒక గాయకునిగా, పద్య నటునిగా, ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తిగా ఆకాశవాణి నిలబెట్టింది. హైద్రాబాద్ ఆకాశవాణి ద్వారానే లోకానికి నేను పరిచయమయ్యాను. ఇప్పటికీ కూడా యామినీ పూర్ణ తిలక, బద్దెన సేనాని, వెంకటేశ్వర మాహాత్మ్యం, నరకాసురవధ నాటకాలు రేడియోలో వస్తుంటాయి.

6. రంగస్థలంపై మీ నాటకాలకు లభించిన ప్రోత్సాహం గురించి ఏవైనా రెండు విషయాలు చెప్పండి.

జ:  1980 లో నాకు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాతే రంగస్థలం వైపు ఎక్కువ దృష్టి పెట్టాను. ‘యోగివేమన’  నాటకం మార్నింగ్ షో జరిగింది. జె.ఎస్.ఎన్. శాస్త్రి గారని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ లో పనిచేసేవారు. ఆ నాటకంలో ఆయన వేమన. నేను అభిరాముడు. బ్రహ్మాండంగా నాటకం సాగింది. నేను గ్రీన్ రూమ్ లోకి వచ్చి మేకప్ తీసేసుకుంటుండగా వేలూరి సహజానందగారు వచ్చి ఆలింగనం చేసుకొని రేడియోలో ఎంత గొప్పగా పాడావో, స్టేజీ మీద అంతకన్నా గొప్పగా పాడావు నాయనా అని అన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇన్స్పెక్టర్ జనరల్, కీర్తిశేషులు, భజంత్రీలు, మనస్తత్వాలు ఇలా ఎన్నో నాటకాల్లో నటించాను. భమిడిపాటి రాధాకృష్ణ, ఆరుద్ర, కొరపాటి గంగాధరరావు మొదలైన వాళ్ళు రాసిన నాటకాల్లో వేసేవాడిని. హైదరాబాద్ లో నాటకాల్లో నన్ను బాగా ప్రోత్సహించిన వ్యక్తి ఎర్రమనేని చంద్రమౌళి గారు. నాకు గురువు ఆయన. ఇక ఆకాశవాణిలో పనిచేసే మద్దూరు విజయలక్ష్మి, ఆమె భర్త సోమేశ్వరరావు గారు ఫోటోగ్రాఫర్. వాళ్ళు ఖైరతాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం. నేను పిల్లవాడినని, చక్కగా ఉంటానని, అవకాశం వస్తే స్టేజీమీదికి ఎక్కించాలని బాగా ప్రోత్సహించేవాళ్ళు. అయ్యదేవర పురుషోత్తమ రావు స్థాపించిన సి.ఎస్.ఆర్.కళామందిర్ అని ఉండేది. దాంట్లో పురుషోత్తమరావు కృష్ణుడి పాత్ర వేసి, అర్జునునిగా నాతో వేయించాడు. అది బాగా రక్తి కట్టింది. కొన్ని వందలసార్లు అర్జునుని పాత్ర వేశాను. అర్జునుడంటే అక్కిరాజు, అక్కిరాజు అంటే అర్జునుడు అనే పేరు తెచ్చుకున్నాను.

7. అటు ఆకాశవాణిలోను, ఇటు నాటకరంగంలోను పూర్తిగా నిమగ్నమైన మీకు వేంకటపార్వతీశ కవుల పైన పిహెచ్ డి చేయడానికి ప్రోత్సహించిందెవరు?

జ:  మంచిప్రశ్న. 1985 – 86 కాలంలో ఉధృతంగా నాటకాలు వేస్తున్నాను. ఇరివెంటి కృష్ణమూర్తి గారు విద్యానగర్ లో ఉండేవారు. ఆయన, నేను ఆటోలో వస్తున్నాం. అప్పుడాయన “అరేయ్! ఈ నాటకాలు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి. ఇవి నీకు భగవంతుడు ఇచ్చిన వరం. పి హెచ్ డి చెయ్యరా తొందరగా” అన్నాడు మహానుభావుడు. నేను పట్టించుకొనలేదు. అప్పటికే కాలేజీలో 150 రూపాయలకు ఉద్యోగంలో చేరి కష్టపడుతూ ఉన్నాను. పరాయతనం కృష్ణమూర్తి గారని ఓరియెంటల్ కాలేజీలో చేస్తున్నారు. ఆయన తిలక్ రోడ్ లో ఉండేవారు. “అబ్బాయ్! నీవు అటూ ఇటూ పిల్లిలాగా తిరగకు. అదే కాలేజీలో ఉండు” అన్నారు. జలగం వెంగళరావు గారి పుణ్యమా అని ఎయిడెడ్ కాలేజీలో వచ్చింది. ప్రభుత్వ కాలేజీలతో సమానంగా జీతం ఉండేది. ముందు ఎంఫిల్ చేశాను. నందిని సిధారెడ్డి, అనంతలక్ష్మి, పరిమళ, మృణాళిని వీళ్లంతా నా క్లాస్ మేట్స్. “వేంకటపార్వతీశ కవుల ఏకాంతసేవ” నా ఎంఫిల్ టాపిక్. అది మధురభక్తికి సంబంధించినది. దాన్ని రామరాజుగారు సూచించారు. ఇక్కడ ఒక గమ్మత్తు అయిన విషయం చెప్పాలి. నేను పరీక్ష రాస్తుండగా రవ్వా శ్రీహరిగారు వచ్చి పేపర్లు తీసుకొని  పట్టుకొని ఊపారు కాపీ కొడుతున్నానేమోనని. కొంతమంది ముఖాలను చూస్తే అలా అనిపిస్తుందేమో   ( పగలబడి నవ్వుతూ ). మొత్తానికి ఎంఫిల్ అయిపోయింది. పి హెచ్ డి కి అప్లికేషను పెట్టుకున్నాను. అప్పుడు బిరుదురాజు రామరాజుగారు
“వేంకటపార్వతీశం కవుల ఏకాంతసేవ” గురించి చేశావు కదా! వారి పద్య రామాయణం, ఇతర కావ్యాల మీద పిహెచ్ డి చేయి” అన్నారు. పక్కనే ఉన్న నారాయణరెడ్డి గారు రంగస్థల నటుల్లో ఇంత మంచి స్వరం ఎవరికీ లేదు అన్నారు. వారి నుండి ఆ మెప్పు పొందడం చాలా సంతోషాన్ని కలిగించింది. నారాయణరెడ్డి గారి పలుకుతీరు చాలా గొప్పది. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇరివెంటి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో “వేంకట పార్వతీశ కవులు – రామాయణ పద్య కృతులు” అన్న అంశంపై డాక్టరేట్ పొందాను. పరాయతనం కృష్ణమూర్తి చెప్పినట్లు ఠాగూర్ హామ్ కాలేజీ అని నేను చేసిన కాలేజీ 1974 నుండి 2007 వరకు అదే కాలేజీలో ఏకచ్ఛత్రాధిపత్యంగా అక్కడే ఉన్నాను.

8. మీకు నచ్చిన, మీరు బాగా అభిమానించే నటులు ఎవరు?

జ:  అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా అభిమాన నటుడు ఎన్టీరామారావుగారే. ఆయనను బాగా ఇమిటేట్ చేసేవాడిని. ఒకసారి “మామా! కురు సార్వభౌమా! పాండవ దూతనై నీ యొద్దకు” అని మొదలుపెట్టాను. ఆయనకు నామీద కోపం వచ్చింది. పద్యం పాడడం ఘంటసాల వలె. యాక్షన్ ఎన్టీఆర్ లాగా. అయితే ఒక స్థాయిలో ఉన్నవాడు, దేవాలయం కట్టించుకునేంత స్థాయికి ఎదిగినవాడు, గొప్ప నటుడు, కారణజన్ముడు, కలియుగ కృష్ణుడు అని బిరుదు పొందినవాడు బాగా చేస్తున్నావని ప్రోత్సహిస్తే బాగుండేది. కానీ ఆయన సహించకపోవడం బాధ కలిగించింది. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇది ఫాక్ట్. అందుకే కవినైనాను. నండూరి రామకృష్ణాచార్యులు “You are more than NT Ramarao” అన్నారు. ఘంటసాల గారు లేకపోతే ఎన్టీరామారావు గారికి గాత్రం లేదు కదా! అది ఉండడం నాకు ప్లస్ పాయింట్. ఇప్పటికీ నేను చెప్పేది ఎన్ టి ఆర్ తో నేను ఎప్పుడూ సమానం కాలేను. ఎందుకంటే నేను గాయకుడిని కావచ్చు, విద్యాధికుడిని కావచ్చు, కానీ ఎన్టీఆర్ పర్సనాలిటీ ఎవరికీ రాదమ్మా!
      ఇప్పుడు యాదగిరిగుట్ట స్పెషల్ ఆఫీసరుగా ఉన్న కిషన్ రావు గారికి నేనంటే వల్లమాలిన ప్రేమ. నాతో ఎన్టీరామారావు గారి ముందు కృష్ణుడి వేషం వేయించాలని ఆయన కోరిక. ఢిల్లీలో నాటకం వేస్తున్నాం.
ఎన్ టి ఆర్ గారు “కిషన్ రావు గారూ! ఇటు రండి” అని పిలిచి ఆడనీయకుండా కర్టెన్ వేయించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన చేతనే నాకు సన్మానం చేయించారు కిషన్ రావు గారు. ఆ సమయంలో ఆయన నన్ను చూసిన చూపు మరచిపోలేనిది. ఆ వేదికపై పివి నరసింహరావుగారు, కుముద్ బెన్ జోషిగారు కూడా ఉన్నారు. అంటే ఒక మనిషిలో మనకు కనపడని మరొక వ్యక్తి కూడా ఉంటాడన్న మాట. అది మనం గ్రహించాల్సింది. ఇది చెప్పడానికే ఈ విషయం చెప్పాను కానీ ఎవరినీ తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఎన్.టి.ఆర్ లాంటి రూపము, అకుంఠిత దీక్ష, అతడు తినేలాంటి భోజనం, ఇవన్నీ చూస్తే అతని లాంటి వాడు ఎవరూ ఉండరు. అతడొక విచిత్రమైన కారణం జన్ముడమ్మా! నాగేశ్వరరావు గారితో కూడా చేశాను. అతను పెద్దగా చదువుకోకపోయినా విప్రనారాయణ, జయభేరి, కాళిదాసు లాంటి పాత్రలు వేసి మెప్పించాడు. నేను రంగారావు, ముక్కామల, సూర్యకాంతం వంటి వాళ్ళతో తప్ప మిగిలిన వాళ్ళందరితో చేశాను. దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంత అనుభవంలో నా అభిమాన నటుడు ఎన్టీరామారావు అనే చెప్తాను. అందుకే ఆయన మీద రెండు శతకాలు రాశాను.

9. జమున గారితో ఎన్నో కృష్ణుని పాత్రలు వేశారని విన్నాం. ఆమెతో మీ నాటకరంగ ప్రస్థానం ఎలా మొదలయ్యింది?

జ :  జమునగారు ఒకసారి నన్ను త్యాగరాయ గానసభలో నారద పాత్రలో నన్ను చూసి “నువ్వు నారదుడివి కావు. కృష్ణుడి పాత్రలు వేయాలి” అన్నారు. అంతే. అక్కడినుండి ఒక పదేళ్ల పాటు దేశమంతటా ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రదర్శనలిచ్చాం. గేట్ల ముకుందరెడ్డి (ఎమ్మెల్యే ) ఆధ్వర్యంలో పెద్దపల్లిలో పెద్ద సన్మానం జరిగింది. కడప, షోలాపూర్, సింధలూరు, కర్ణాటక, మహారాష్ట్ర …ఇలా అనేక ప్రాంతాల్లో నాటకాలు వేశాము. ఎన్నో ప్రశంసలందుకున్నాము. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో జమున గారి పక్కన ఎన్టీఆర్ కృష్ణుడిగా వేస్తే, రంగస్థలంపై ఆమె పక్కన నేను కృష్ణుడిగా వేశాను. అయితే ఎన్టీరామారావు గారు నాతో “టీవీలో నీ తులాభారం చూశాను బ్రదర్” అన్నారు. కానీ ఎట్లున్నది చెప్పలేదు (నవ్వుతూ ).

10. జమున గారితో ఉన్న అభిమానంతోనే ‘జమునా రమణా’ పంచ పద్య శతతి రాశారా?

జ:    రకరకాల వ్యక్తులు, రకరకాల శక్తులు, రకరకాల యుక్తులు. జమున గారు గొప్ప నటి. అందులో సందేహం లేదు. సత్యభామ పాత్రకు ఆమెను మించిన వారు లేరు. సత్యభామ అంటే ఆమే అన్నంతగా ఉండేది.
“సత్యాపతి పాత్రకు
సత్యము మన యన్టియారె సరియౌ కాదో?
సత్యగ మాత్రము భళిరా
సత్యము నీ సాటి నీవె జమునా రమణా!”
 సినిమా రంగంలో ఉండే కుట్రలు, కుతంత్రాలు, చదువులు, సంధ్యలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వీటన్నిటిని గురించి ఐదు వందల పద్యాలు రాశాను. సినిమా యాక్టర్ అయిన ప్రదీప్ వాళ్ళ తండ్రి వెంకటేశ్వర్లు గారికి, నాతోపాటు అర్జునుడి పాత్ర వేసే అయ్యదేవర పురుషోత్తమ రావు గార్లకు ఈ పుస్తకం అంకితం ఇచ్చాను. జమున గారికి ఇచ్చి చదవమన్నాను. చదివారా అని పదే పదే అడిగి గుర్తు చేసాను. ఆమె కనీసం పట్టించుకొనలేదు. చివరకు ఏదీ చెప్పకుండానే స్వర్గస్తురాలయింది. అసూయ ద్వేషాలతోనో, కోపంతోనో  చెప్పడం లేదు. బాధతో చెప్తున్నా. ఇంతగా ఆమె గురించి రాసిన నేను ఆమె నుండి ఏమీ ఆశించలేదు. కానీ ఆమె కనీసం గుర్తించకపోవడం బాధ కలిగించింది. నాతో పదేళ్లు సత్యభామగా నటించిన వ్యక్తి మా కృష్ణుడు, మా అక్కిరాజు ఇలా నా మీద పద్యాలు రాశాడని చెప్పకపోవడం చాలా బాధాకరం.

11. సాహిత్యరంగంలో మీ మొదటి కావ్యం ‘అమ్మతోడు’ గురించి చెప్పండి.

జ:  2000 సంవత్సరం నుండి నేను రాయడం మొదలుపెట్టాను. మొట్టమొదటి కావ్యం ‘అమ్మతోడు’. దానికి జ్వాలాముఖి మంచి పీఠిక రాశారు. రాళ్లబండి కవితా ప్రసాద్, ఆచార్య తిరుమల నన్ను ఆశీర్వదించారు. అప్పటినుండీ పరంపరగా సంవత్సరానికి రెండు చొప్పున పుస్తకాలు వేస్తున్నాను. ఇందులో భాష సరిగ్గా రాక ఇష్టం వచ్చినట్లు రాసి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి స్టేజీల మీద గజమాలలు వేసుకునేవారిని ఎండగడుతూ రాశాను. నేనంత సంస్కృత పండితుడిని కాను, తెలుగు భాషా పండితుడినని గర్వంగా చెప్పుకోను. కానీ ఏమీ రాని వారు సత్కారాలు పొందడం చూసి తట్టుకోలేక రాశాను. తీవ్ర సంచలనం రేగింది.
         మా ఊళ్ళో భీమలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. స్వామికి ఇరువైపులా వీరభద్రుడు, భద్రకాళి ఉంటారు. ఆ అమ్మవారు అత్యంత సౌందర్యవంతంగా ఉంటుంది. నా 75 ఏళ్ళ వయస్సులో అంత సౌందర్యం ఎక్కడా చూడలేదు నేను. హనుమంతుని గుండెను చీలిస్తే రాముడు కనిపించినట్లు, నా హృదయాన్ని చీలిస్తే ఆ అమ్మవారు ఉంటుంది. ఆమె అంటే అంతటి భక్తి నాకు. ఆమె అనుగ్రహంతోనే నేను ఇవన్నీ రాయగలుగుతున్నాను. ఛందో సంబంధమైన వ్యాకరణాంశాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఏదో ప్రయోజనం ఆశించి నేను రాయలేదు. ఒక హృదయావేదన నుండి రాసింది. ఆ పుస్తకాన్ని వట్టికోట ఆళ్వారు స్వామికి, దాశరథికి అంకితమిచ్చాను. ఏ పుస్తకాన్నయినా ఇద్దరికి అంకితం ఇవ్వడం నాకలవాటు. వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరథి ప్రజల కోసం ఎన్ని కష్టాలు పడ్డారు? నిజానికి రజాకార్ల కాలంలో చచ్చిపోయేవాళ్ళు. ఉద్యమాల్లో వెలుగులోకి రాకుండా ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా! కానీ తెర మీదకు ఎవరినో తీసుకువస్తారు. ఇదిగో ఇలాంటి అంశాలనే ‘అమ్మతోడు’ లో రాశాను. రాజకీయ నాయకులైతేనేమి? అవకాశ వాదులైతేనేమి? ఇలాంటివారు ప్రతీ రంగంలో ఉంటారు. వాళ్ళను గురించి రాశాను. కవి ఎప్పుడూ అవకాశవాది కారాదనేది నా ఉద్దేశ్యం. అలా సాహిత్యరంగంలో ‘అమ్మతోడు’ తో అడుగుపెట్టాను. ఇప్పటికి 54 పుస్తకాలు రాశాను.

12. ఇంతటి సాహిత్య రచన చేసిన మీరు అభిమానించే కవి ఎవరు?


జ:   నా అభిమాన కవి దాశరథి. “తెలగాణ కవుల లోపల తలచగ దాశరథి యొకడె” అన్నాను నేను. “మిగతావాళ్ళు కాదా?” అని ప్రశ్నిస్తారు. కాదనడం లేదు. కానీ వ్యక్తిత్వ పరంగా కాదని నా అభిప్రాయం. దాశరథి తన 18 ఏండ్ల వయస్సులో కొడుతుంటే తప్పించుకుంటూ, పొలాల వెంబడి పరుగులెత్తి, బురద గుంటలో పడి, సిమెంటు కలిపిన అన్నం తిని, నోట్లో మూత్రం పోసినా పోయించుకొని భరించాడు. ఇదంతా ఆయనకు ఏమవసరమమ్మా? జాతికోసం భరించాడు. అందుకే నేను “దాశరథీ సత్కవితాశరథీ” అని ఒక పుస్తకం రాశాను. అందులో జ్వాలాముఖి పీఠిక రాశారు. బిరుదురాజు రామరాజు గారు కూడా “బాబూ! ఎవరూ చేయలేని పని నువ్వు చేశావు” అన్నారు. అంటే నేనేదో మహా పండితుడినని కాదు. “అంత నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా దాశరథి వ్యక్తిత్వాన్ని కళ్ళముందు దృశ్య సాక్షాత్కారంగా చేసింది నువ్వే”. అని ఉత్తరం రాశారు. ఇప్పటికీ ఆ ఉత్తరం ఉంది నా దగ్గర.  నాకు దాశరథి గారితో పరిచయం ఏర్పడ్డ తరువాత ఆయన నన్ను చాలా అభిమానించారు. ‘ఒరే అబ్బాయ్!’ అనేవారు. ఒకసారి బమ్మెరలో కవిసమ్మేళనం జరిగినప్పుడు నన్ను తీసుకొని పోయి పద్యాలు పాడించారు. అప్పుడు నేను వాళ్ళకంటే చాలా చిన్నవాడిని. అదీ హృదయమంటే.

13. ‘అధిక్షేప కవితారత్న’ బిరుదు పొందడానికి మీ రచనల్లోని అంశాలు కారణమా? ఎలా?


జ:    నాటక రంగంలో చూస్తే అభినవ కృష్ణుడు, అభినవ ఘంటసాల, నాట్య శ్రీనాథ అన్నారు. కానీ సాహిత్యంలో అధిక్షేపకవి అని పేరు పొందాను. ఇప్పటికాలంలో నా దృష్టిలో సాహిత్యానికి, సమాజానికి ఏ విధమైన పక్షపాతం లేకుండా నిష్పక్షపాత ధోరణిలో సేవ చేస్తున్నవారు కె. వి. రమణాచారి గారు. ఆయన గురించి ‘కెవి రమణా’ అనే మకుటంతో శతకం రాశాను కందపద్యాల్లో. అది కూడా అధిక్షేపమే. మీరంటుండవచ్చు. ఇలా రాసి మీరేం సాధించారని? నాతో ఒకాయన అన్నారు. ” నువ్వు ఇలా రాయకుండా ఉంటే ఎన్నో అవకాశాలు వచ్చేవి. అవన్నీ పోగొట్టుకున్నావు” అని. కోవెల సంపత్కుమారాచార్య గారు నాకు ఒక ఉత్తరం రాశారు. ఇన్ లాండ్ లెటర్ అది. ఇప్పటికీ దాచుకున్నాను. “నాయనా! చిన్నవాడవు. చాలా బాహాటంగా పెద్దలైన వ్యక్తుల్ని నీ ధోరణిలో విమర్శిస్తున్నావు. ఉడుకు రక్తం. అది మంచి పద్ధతి కాదు. పైకి రావాల్సినవాడివి”. ఇట్లు…నీ శ్రేయోభిలాషి, కోవెల సంపత్కుమారాచార్య. అని రాశారు. నేను దాశరథి, అలిశెట్టి లాంటి ఆవేశపరుడిని కాను. ప్రశ్నించే తత్వం నాది. ఊరకే ఉండడం నాకు చేతకాదు.

కొండపల్లి శేషగిరిరావు గారు గొప్ప చిత్రకారులు. ఆ కాలంలోనే వారికి ‘పద్మశ్రీ’ రావాలి. ఆయన నన్ను ఎంతో అభిమానించేవారు. కానీ వచ్చిన వారికే మళ్లీ పురస్కారాలు వస్తున్నాయి. అందుకే నా బాధ. అన్ని పుస్తకాలు అధిక్షేపంగా రాశానని కాదు. కానీ అధిక్షేపం లేకుండా రాయను. కీర్తి కోసం రాయడం లేదు. సమాజంలో నచ్చని అంశాన్ని ప్రశ్నిస్తున్నాను.

14. మీ రచనల్లో అధికశాతం శతకాలై ఉండడానికి కారణం వివరిస్తారా?

జ:    మకుటం ఉంటుంది కాబట్టి దాన్ని శతకం అనాలే తప్ప శతక లక్షణం ఒక్కటీ ఉండదు. ఉన్న విషయాన్ని సూటిగా సత్యప్రకటన చేయడం నాకలవాటు. చదివిన వారు వాళ్లను గురించే అనుకుంటే నేనేమీ చేయలేను. “సత్యానికి గెలుపన్నది తథ్యమురా మానవుడా” అన్న దాశరథి చివర్లో ఎన్ని కష్టాలు పడ్డదీ అందరికీ తెలుసు. ఆస్థాన కవి పదవి నుండి పక్కకు రావడానికి ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. ఇవన్నీ నన్ను బాధిస్తాయి “ఎప్పటి కయ్యెడు ప్రస్తుతమప్పటికా మాటలాడి…..తప్పించుకు తిరుగువాడు ధన్యుడు” అన్న సుమతీ శతకకారుని ఒప్పుకోను నేను. తప్పించుకు తిరిగేవాడు సమాజానికి ఎలాంటి మేలు చేస్తాడు? ఇలాంటి గమ్మత్తైన విషయాలు తీసుకొని సినిమా యాక్టరును అయి ఉండి కూడా సినిమా రంగం గురించి రాశాను. సినిమా రంగం, సాహిత్య రంగం, ఆకాశవాణి అన్నీ చూశాను. ఎన్నో సమస్యలు ఎదుర్కున్నాను. అయినా తట్టుకొని నిలబడ్డాను. ఆ అనుభవాలను, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినవే ఈ శతకాలు. శతకాలే ఎక్కువ రాయడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు.

15. మీ ‘రంగ రంగ’ కావ్యం గురించిన విశేషాలు చెప్పండి.

జ :   నన్ను హేతువాది అని, నాస్తికుడని అంటారు. కాదు కాదు. నేను మానవతావాదిని. వెంకటేశ్వర స్వామిని గురించి ‘రంగ రంగ!’ అనే మకుటంతో రెండు వందల సీస పద్యాలు రాశాను. నాలాగా ఎవడూ రాయడేమో! ( నవ్వుతూ ) “నీతో ఎవడైనా పెట్టుకుంటే హెలికాఫ్టర్ ఎక్కిస్తావు” అన్నాను. ఇంతింత ఆదాయం వస్తుంటే ఏం చేస్తున్నావని, తిరుమలలో జరుగుతున్న అన్యాయాలు, వాటన్నిటినీ ఎందుకు పట్టించుకోవని నిలదీసినట్టు రాశాను. కలియుగ దైవమంటారు. మరి నిన్ను చూసీ చూడగానే తోసేస్తారు. ఇదంతా ఏమిటని అడుగుతూ నువ్వొచ్చి ఒక్కసారి క్యూలో నిలబడితే నీకు మా బాధ అర్థమవుతుంది అన్నాను. చమత్కారం జోడించి వ్యంగ్యంగా రాసిన పద్యాలివి. ఇందులో సరళ గ్రాంథికం, వ్యావహారికం, తెలంగాణ మాండలికం కూడా కలిసి ఉంటాయి. హాస్యం, వ్యంగ్యం, చమత్కారం, అధిక్షేపం అన్నీ కలబోసి ఉంటాయి. దీన్ని ‘బాపు-రమణ,’ లకు, వాళ్ళను అత్యధికంగా అభిమానించే డా. సముద్రాల బాబూరావు, డా. టి.ఎన్. చౌదరి, డా. ప్రసాద్ దుగ్గిరాలకు అంకితం ఇచ్చాను.

16. ‘శంకర నారాయణ శతకం’ దేనిని గురించి తెలుపుతుంది?

జ :   ‘శంకర నారాయణీయం’ రాశానని తెలిసి హాస్యబ్రహ్మ తురుమెళ్ళ శంకర నారాయణ “అన్నయ్యా నా మీద ఏమైనా రాశావా” అన్నాడు. కాదురా! శంకరుని గురించి వంద పద్యాలు, నారాయణుని గురించి వంద పద్యాలు రాశాను అన్నాను. “హమ్మయ్య హార్ట్ అటాక్ వచ్చినంత పని చేసినావు” అన్నాడు. దాంట్లో కూడా చిత్ర విచిత్రంగా ఉంటుంది. వేదాంతం, సామాజిక స్పృహ, నీతి, ధర్మం అన్నీ ఉంటాయి. నిజానికి సమాజం మంచిగా ఉంటే ధూర్జటి, శేషప్ప లాంటి కవులు ఎందుకు అంతగా మొత్తుకున్నారమ్మా! “అధిక విద్యావంతులు అప్రయోజకులై, పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి” అని శేషప్ప అన్నాడు కదా!  ఇప్పుడంతటా అదే కదమ్మా జరుగుతున్నది. ఒకడికి పదవి ఉంటే చుట్టూ తనవాళ్లే ఉంటారు. ఎన్నో చిత్ర విచిత్రమైన  భావనలు, గమ్మత్తు అయిన శైలి ఇందులో ఉంటుంది. ‘శంకర నారాయణా!’ అనేది మకుటం కూడా కాదు.
“పళ్ళ బిగింపు పోయి పలు బాధలు నోటికి రాకముందె అల్లుళ్లు, పుత్రికా మణుల రూల్సుకు బానిస కాకముందె మోకాళ్లకు నీరు చేరి నరకమ్మును జూపక ముందె కిడ్నిలో రాళ్ళవి రాకముందె గిరిరాజ సుతాధవ నన్ను బ్రోవరా!” ఇలా ఉంటాయి అందులో పద్యాలు.

17. ఎవరూ దృష్టి కూడా సారించని శనీశ్వరునిపై శతకం రాయాలని ఎందుకనిపించింది?

జ:  అమ్మా! నాకిప్పుడు 75 ఏళ్ళ వయస్సు. నేనేదో బ్రహ్మాండమైన సుఖజీవిని కాదు. చాలా చికాకులు ఎదుర్కున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఇంత శని నాకెందుకు పట్టింది? అనిపించింది. వరుసగా అనేక ఇబ్బందులు క్రమంగా పెరగడం మొదలైంది. దీనితో ‘శనీశ్వర శతకం’ రాస్తే పీడా విరగడయి పోతుందనుకున్నాను ( గట్టిగా నవ్వుతూ ). ‘శ్రీ శనీశ్వరా!’ అని మకుటం పెట్టాను. ‘శనైశ్చరా’ అనాలి అన్నారు. నేనలాగే అంటాను అన్నాను. అందుకే నీకు శని పట్టిందన్నారు. అయినా పరవాలేదని మార్చలేదు. దాంట్లో కూడా సమాజం, కుటుంబ వ్యవస్థ, రాజకీయం, సినిమాలు, తాగుడు వీటన్నిటి గురించి 127 పద్యాలు రాశాను. నిజానికి శని దేవుని పైన పది, పదిహేను పద్యాలు తప్ప అంతకుమించి రాసినవాళ్ళు లేరు. తిరుపతి వేంకటకవుల యొక్క వేంకట శాస్త్రి గారి కుమారుడు రోగ గ్రస్తుడై మంచం పట్టినప్పుడు ఆయన ‘శనిగ్రహమా!’ అనే పేరుతో నా కొడుకును ఇట్లా ఎందుకు చేశావని ఓ పదిహేను పద్యాలు రాశాడట.
             ఇందులో నేను ధూర్జటిని అనుసరించి,
“దంతములూడి సాంతమవి దౌడలు చిత్ర విచిత్రరీతి,బల్
వింతగ గాకముందె, తన పిల్లలె మాసము కొక్కయింటిలో
వంతుల వారి చూచుకొను భాగ్యము గల్గక ముందె దేవ; నా
తంతు ముగింప వేడెదను; తప్పును బట్టకు శ్రీ శనీశ్వరా!
అంటూ రాశాను. ఈ రోజుల్లో వంతులు వేసుకొని తల్లిదండ్రులను చూసే పిల్లలు మనకు అంతటా కనబడుతున్నారు. ఇలాగే సమాజంలో ఉన్న ఎన్నింటినో సహించక రాస్తూ పోయాను.

18. మీ రచనల్లో మణి ప్రవాళ శైలి ఉండడానికి కారణం ఏమైనా ఉందా?

జ:   కారణమంటూ ప్రత్యేకంగా లేదు. నేను 55 ఏళ్లుగా హైదరాబాదులో ఉన్నాను. వరంగల్లు అమ్మాయితో నా వివాహం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండడం మూలంగా ప్రజలు మాట్లాడే భాష పట్ల అవగాహన ఉంది. నా రచనలు ఏ పండితులనో ఉద్దేశించి రాసినవి కావు. సమాజంలో జరుగుతున్న విషయాలను నిక్కచ్చిగా తెలపడమే నా ఉద్దేశ్యం. అందుకే అందరికీ అవగాహన కోసం తెలుగు, సంస్కృతం, ఆంగ్లం కలిపి కొత్తగా రాయడం మొదలుపెట్టాను. తెలంగాణ అల్లుడిని కూడా కావడం వల్ల మూడు భాషలు కలిపి రాస్తుంటాను. మధ్య మధ్య ఉర్దూ పదాలు కూడా వాడుతూ ఉండడం అలవాటయింది.

19. ఇప్పటికీ నటిస్తున్నారా? మీకింకా చేయాలని మిగిలిన కోరిక ఏదైనా ఉందా?

జ:   నాటకరంగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, బిల్వమంగళుడు, భరతుడు ఇలాంటి ఎన్నో పాత్రలు వేశాను. కానీ బిల్వమంగళుని పాత్ర మీద అభిమానం ఎక్కువ. ఇప్పటికే 50 పర్యాయాలు ఆ పాత్ర వేశాను. వంద పర్యాయాలు వేయాలని సంకల్పం. వేస్తాను కూడా. ‘చింతామణి’ అనగానే ఒక వేశ్య పాత్ర అందరి దృష్టిలో మెదులుతుంది. ఒక ఉన్నతకుటుంబంలో జన్మించినవాడు పక్కదారి తొక్కి, ఆచార భ్రష్టుడై సర్వ రంగాలలో అందరిచేత హీనుడు, పనికిరానివాడు అనిపించుకున్నవాడు ఈ ఇద్దరినీ కృష్ణతత్వాన్ని ప్రపంచానికి తెలియచెప్పడానికి ఆ శ్రీకృష్ణపరమాత్మ నియోగించుకోవడం ఎంతటి మహద్భాగ్యం? అదే లీలాశుకుడు రాసిన ‘కృష్ణ కర్ణామృతం’. కాలమహిమ ఎంతటి వారినైనా ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. అనే విషయంతో పాటు ఎటువంటివారైనా భగవంతుని కృపకు పాత్రులే అన్న విషయం ఇందులో నిరూపించబడింది.

20. ప్రస్తుత నటనా రంగం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జ:   నటన అనేది ఒక కళ అనేది అందరికీ తెలిసిందే. మనం ఒక పాత్రను ధరించినప్పుడు ఆ పాత్రలో పరకాయప్రవేశం చేయాల్సి ఉంటుంది. అక్కడ నటుడు కనిపించకూడదు. కేవలం పాత్ర మాత్రమే కనిపించాలి. ఆ పాత్ర లక్షణాలు మొత్తం నటునిలో ఇమిడిపోవాలి. అందుకే ఆ కాలం వాళ్ళను ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటున్నాం. రోజుకొకరు పుట్టుకొచ్చే ఈ రోజుల్లో డబ్బు సంపాదించే వ్యామోహం తప్ప, ఒక నిబద్ధత కనిపించదు. నాలుగు రోజులకే ఆ నటుడిని మర్చిపోతున్నాం అంటే ఎటువంటి నటులున్నారో చెప్పనవసరం లేదు. కొంతమంది మాత్రమే దానిని సాధ్యం చేసుకుంటున్నారు. ఏ రంగంలోనైనా సమాజహితవు కోరిక ఉంటేనే సత్ఫలితాలు పొందగలుగుతాం. దేనికైనా అంకితభావం ముఖ్యం.   ఈ రోజుల్లో కావలసిన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ఏవీ లేని రోజుల్లోనే తెలుగు సినిమా రంగం ప్రపంచానికి తన ఉనికిని చాటింది. కాబట్టి తీసేవాళ్ళు, వేసేవాళ్ళు అందరూ మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటించే విధంగా నడచుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. కనబడుతున్నది అభివృద్ధి అని మురిసిపోవడం కాదు. ఎంత ప్రయోజనం చేకూరిందన్నదే ముఖ్యం.

21. కవిగా,రచయితగా నేటి సమాజానికి మీరిచ్చే సందేశం ఏది?

జ:   అమ్మా! నాకస్సలు నచ్చని విషయం సముఖంలో పొగడ్త, వెనుకకు వెళ్లి తిట్టడం. నేను ఏదైనా ముఖం ముందే చెప్పేస్తాను. నేనేదో కావాలని, ఎవరినో ఏదో అనాలని చెప్పడం లేదు. సమాజంలో ఉన్న వ్యవస్థనంతా ఒకేసారి మార్చాలని కంకణం కట్టుకోలేదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ధోరణిలో నేను రాశాను. నేను రాసిన కొన్ని శతకాలలో భక్తి కనిపించే మకుటం ఉంటుంది. కానీ సమాజ వ్యవస్థ నా కవితావస్తువు. నాలో బాధ కాస్త కవిత్వంగా మారి కలం నుండి వెలువడింది. కవులు, రచయితలు సమాజాన్ని మార్చగలరు. ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించగలరు అని చరిత్ర చెబుతున్నది. ఆ శక్తి ఆ కలానికి ఉన్నప్పుడు సమాజంలో జరిగే అన్యాయాలను ఎదుర్కొనే రచనలు వస్తే బాగుంటుంది. నేనేదో నా మటుకు నేను రాస్తూ పోతాను అనుకోవడం సరి కాదు. నా రచన ఒక మనసునైనా కదిలిస్తే చాలు అనుకొని రాస్తే పరిణామం వేరుగా ఉంటుంది. కలం, గళం రెండూ నేటి వ్యవస్థకు అవసరం.

ధన్యవాదాలు సార్🙏 అడిగిన వెంటనే ప్రతిస్పందించి, మీ జీవిత విశేషాలను తెలిపినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున కృతజ్ఞతలు. నమస్కారాలు. బిల్వమంగళ పాత్రను వంద పర్యాయాలు ప్రదర్శించాలనుకున్న మీ సంకల్పం తప్పక నెరవేరాలని, దానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సదా మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ సెలవు.

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us