మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కవిత్వాస్వాదన —- ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 27, 2024
written by Narendra Sandineni

కున్వర్ నారాయణ్ హిందీలో రచించిన కవిత.
ఆంగ్లం అనువాదం : అపూర్వ నారాయణ్.
తెలుగు అనువాదం : వారాల ఆనంద్.
కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రఖ్యాత కవి,కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన ఓ వింతయిన రోజు కవిత ఇది.కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను అపూర్వ నారాయణ్ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన ఓ వింతయిన రోజు కవితను వారాల ఆనంద్ తెలుగులోకి అనువాదం చేశాడు. తెలుగులోకి వారాల ఆనంద్ అనువాదం చేసిన వింతయిన రోజు కవిత చదవగానే నాలో కలిగిన భావాలకు అక్షర రూపం దాల్చిన విశ్లేషణా వ్యాసం ఇది.ఏదైనా కొత్త విషయం తెలిస్తే మనకు వింతగా అనిపిస్తుంది.ఏదైనా కొత్త వస్తువు అపురూపమైనది చూస్తే మనకు వింతగా అనిపిస్తుంది.మనలను సంభ్రమాశ్చర్యాలకు ముంచెత్తే విషయం వింతగా చెప్పవచ్చు. ఏదైనా వింతను చూస్తే ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యం కలిగించే మాటలు వినినప్పుడు మనకు వింతగా అనిపిస్తుంది. అసాధారణమైన మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మన మనసులో కలిగే భావనను వింతగా చెప్పవచ్చు. విస్మయము కలిగించే వస్తువును కూడా వింత గొల్పేది అని చెప్పవచ్చు.ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ కూడా ఒకటి.రోజుకు 24 గంటల సమయం ఉంటుంది.కాలచక్రం ఎవరికి తెలియకుండానే గిర్రున తిరుగుతూ ఉంటుంది.మనం అనుభవించే ప్రస్తుత క్షణం కూడా రోజులోని భాగమే అని చెప్పవచ్చు. రోజును దినం అని కూడా అంటారు.రోజును వివిధ రకాలుగా పిలుస్తారు.ఏదో ఒక రోజు అని చెబుతాం. ప్రతిరోజు అని కూడా అంటాం.జీతాలు ఇచ్చే రోజును జీతాల రోజు అని అంటాం.కొందరు పుట్టిన రోజు సందర్భంగా వేడుకను జరుపుకుంటారు. కొందరు భార్యాభర్తలు పెళ్లి రోజు సందర్భంగా వేడుకను జరుపుకుంటారు.సమాజానికి గొప్ప సేవ చేసిన వారు లోకాన్ని వీడిన రోజును వర్ధంతి రోజుగా జరుపుకుంటారు. సమాజానికి గొప్ప సేవ చేసి చనిపోయిన వ్యక్తి జన్మించిన రోజును కూడా జయంతి రోజును వేడుకగా జరుపుకుంటారు. నడుస్తున్న ఈ రోజున మంచి జరిగితే మంచి రోజు అని చెబుతారు.నడుస్తున్న ఈ రోజున ఏదైనా దుర్ఘటన జరిగితే దానిని చెడ్డ రోజు అని చెబుతారు. ఓ వింతయిన రోజు కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.అసలు వింతయిన రోజు ఏదైనా ఉంటుందా? అనే సందేహాలు మనలో పొడచూపవచ్చు.వింతయిన రోజు అనగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.ఓ వింతయిన రోజు ఏమిటి? అనే సందేహాలకు సమాధానాలు కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను చదివితే తెలుస్తుంది.కవి కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవిత ద్వారా ఒక రోజులో జరిగిన వింతలు,విశేషాలను వ్యక్తం చేయడం అద్భుతంగా ఉంది.వింతయిన రోజు సందర్భంగా అతను ఏమేమి చేశాడు? ఆ రోజున అతనికి ఏమేమి జరిగింది అనే సంఘటనలను పూసగుచ్చినట్టు విడమర్చి చెప్పిన తీరు అబ్బురం కలిగిస్తుంది.వింతయిన రోజున జరిగిన దానిని అతను అదృష్టంగా భావిస్తున్నాడు.వింతయిన రోజు గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తితో కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.వింతయిన రోజులో జరిగిన సంగతులు తెలుసుకొని అలౌకిక అనుభూతులను సొంతం చేసుకుందాం.

వారాల ఆనంద్.


“ నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను
“ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు
“ అనేకమంది మనషుల్ని కలిసాను
“ ఎక్కడా అవమానం ఎదురు కాలేదు.
అతను అలా రోజంతా పని చేయకుండా వృధాగా నగరమంతా ఎందుకు తిరిగాడు? అతను ఆ రోజున చేయాల్సిన పని చేయకుండా ఎందుకు వృధాగా వీధులలో తిరుగుతాడు? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.కారణాలు ఏమిటో అతడు చెబుతున్నది నిజమేనా? అని మనకు సందేహం కలుగుతుంది.అతను అంత పెద్ద నగరంలో అలసట ఎరుగక,విసుగు చెందకుండా వృధాగా తిరిగినప్పటికీ ఆ రోజు ఏ వాహనం వల్ల గాని మరే విధంగా గాని ప్రమాదం సంభవించలేదు అని అంటున్నాడు. నిజమేనా?ఆ రోజు ఎలాంటి పని చేయకుండా నగరంలోని వీధులన్నీ తిరుగుతూ వృధా సంచారం చేస్తూ ఖాళీగా ఉండక అనేకమంది మనుషులను కలిశాను,మాట్లాడాను అని అంటున్నాడు.ఆ రోజు కలిసిన వ్యక్తులు అందరు అతనితో సానుకూలంగా మాట్లాడారు.అతనితో ఎలాంటి వాదోపవాదాలు చర్చలు జరప లేదు.ఆ రోజు ఎందుకో ఏ మనిషి వల్ల అతనికి అవమానం ఎదురు కాలేదు.అతను చెప్పిన మాటలు వింటుంటే ఎందుకో మనకు నమ్మశక్యం అనిపించదు.ఆ రోజు జరిగిన సంగతుల గురించి అతని మాటలు వినగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.ఆ రోజు అతను కలిసిన అనేకమంది మనుషులు సానుకూలంగా మాట్లాడటం ఏమిటి? ఎలాంటి గొడవలు లేకుండా మనుషులు అందరు సానుకూలంగా ఎలా ఉంటారు?.మనుషులు అందరు ఒక్కలా ఉండరు.మనుషులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.ఒకరినొకరు విమర్శించుకుంటూ,వ్యతిరేకిస్తూ అవమానించుకుంటారు.కాని ఆ రోజున ఇలాంటివి ఏమీ జరగలేదు అన్న అతని మాటలు వింటుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.
“ నేను రోజంతా సత్యమే మాట్లాడాను
“ ఎవరూ తప్పుగా స్వీకరించలేదు
“ నేనివాళ అందరిని విశ్వసించాను
“ ఎక్కడ మోసగింప బడలేదు.
అతను ఈ రోజు అందరితో సత్యమే మాట్లాడాడు.అతను మాట్లాడిన మాటలను ఎవరు తప్పుగా అర్థం చేసుకోలేదు. అతను మాట్లాడిన మాటలను ఎవరు ఎందుకు వ్యతిరేకించలేదు?ఆ రోజు సత్యాన్ని మాత్రమే మాట్లాడటానికి అతను సత్య హరిశ్చంద్రుడు కాదు.అతను సత్యం ఎలా మాట్లాడాడు? అతను సత్యం మాట్లాడుతుంటే అందరు అతన్ని సత్యవంతుడుగా ఎలా స్వీకరించారు? అనే సందేహాలు కలుగవచ్చు.అతను ఆ రోజు అందరు మనుషులను విశ్వసించాను అని చెబుతున్నాడు.ఎవరైనా అందరి మనుషులను విశ్వసిస్తారా? అప్పుడే పరిచయమైన వ్యక్తిని ఎలా విశ్వసిస్తారు? అతను ఎవరో? ఏం చేస్తుంటాడో? అతని గురించిన వివరాలు ఏమీ తెలవదు.అతను తెలవని వ్యక్తిని విశ్వసించాను అని చెబుతున్నాడు. అతని మాటలు వింటుంటే ఆశ్చర్యం గొలుపుతుంది. ఏ మనిషి చేత ఎక్కడ మోసగింపబడ లేదు అని చెబుతున్నాడు.మనకు తెలియని మనిషి ఎలా సాయం చేస్తాడు.తెలియని వ్యక్తి సాయం చేస్తాను అని అతనితో చెప్పి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది.సాయం చేస్తానని తెలిసిన మనిషి చెప్పిన మాటలను కూడా పూర్తిగా విశ్వసించలేము.తెలిసిన మనిషి కూడా నమ్మించి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి.తెలిసిన మనిషిని కూడా పూర్తిగా విశ్వసించలేము.తెలవని వ్యక్తులు కూడా అతనిని మోసగిస్తారు. తెలిసిన వ్యక్తులు కూడా అతనిని మోసగిస్తారు.ఆ రోజు అతను ఏం చేస్తున్నాడో? ఎక్కడికి పోతున్నాడో? ఏం పని మీద పోతున్నాడో? తెలియకుండా అయోమయంగా నగరం అంతా సంచరించడం ఆశ్చర్యం గొల్పుతుంది.ఆ రోజు అతను అందరిని ఎలా విశ్వసించగలడు?ఆ రోజు ఎందుకో అతనిపై అందరికి నమ్మకం కుదిరింది. అందుకే అతను అందరిని విశ్వసించాడు అని తోస్తుంది.ఆ రోజు మనుషులు అందరు సత్యవంతులు అని అతడు భావించాడు.సమాజం నిండా మోసగాళ్ళు నిండి ఉన్నప్పుడు ఆ రోజు అతన్ని మోసం చేయకుండా ఎలా ఉంటారు? అనే సందేహాలు మనలో తలెత్తుతాయి.సత్యమేవ జయతే అని సూక్తి ఉంది.సత్యమే జయిస్తుంది. హరిశ్చంద్రుడు సత్యం కొరకు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు.చివరికి విజయం సాధించాడు. హరిశ్చంద్రుడు సత్యమైన బాటలో నడిచి సత్యవంతుడుగా ఖ్యాతి గడించాడు.
“ అద్భుతమయిన విషయమేమిటంటే
“ నేను ఇంటికి చేరుకోగానే
“ తిరిగొచ్చింది ఇంకెవరో కాదు
“ నేనే అని కనుగొన్నాను.
ఆరోజు నగరంలో అతను ఎటు పోతున్నాడో? ఏమి చేస్తున్నాడో? తెలియకుండా అయోమయంగా వీధులన్నీ తనవిగా భావించి తిరిగాడు.ఎందుకో ఆ రోజంతా తిరిగిన తర్వాత అలసిపోయిన అతను ఒక ఇంటికి చేరాడు.ఆ ఇల్లు ఎవరిదో అని అనుకున్నాడు.అద్భుతంగా ఆ రోజు నగరం అంతా తిరిగిన తర్వాత మొహమంతా పీక్కుపోయి బాగా అలసిపోయినాడు.ఇది ఎవరి ఇల్లో? అని మనసులో అనుకున్నాడు.ఆ రోజంతా నగరంలో తిరిగిన తర్వాత అలసిపోయి చిత్రంగా తన ఇంటికే చేరుకున్నాడు.ఎందుకో ఆ రోజు అయోమయంగా ఎక్కడ తిరిగినప్పటికీ ఏం చేసినప్పటికీ అతని అడుగులు మాత్రం మర్చిపోకుండా ఇంటికి చేర్చాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.ఇంకా అతను ఆ రోజు జరిగిన విషయాన్ని గొప్పగా అందరికీ తెలియజేస్తున్నాడు.ఆ రోజు జరిగిన అద్భుతమైన విషయం ఏమిటి? అంటే చివరికి నగరమంతా తిరిగిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. చివరికి తన ఇంటికి చేరుకున్నాడు.అతను తన ఇంటికి చేరిన తర్వాత తెలిసింది.అయోమయంగా నగరమంతా తిరిగి తన ఇంటికే వచ్చినాడు.నగరం అంతా తిరిగి తన ఇంటికి వచ్చినది ఇంకెవరో కాదు తానే అని తెలుసుకున్నాడు.అయోమయంగా నగరం అంతా తిరిగిన ఆ రోజు అతని జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనగా వింతైన రోజుగా తోస్తోంది.అతను ఆ రోజు ఏం చేసింది? అన్ని విషయాలు అందరితో పంచుకున్న తీరు చక్కగా ఉంది.అతని జీవితంలోని ఆ రోజుకు సంబంధించిన వింత విషయాలను పాఠకులకు అర్థం అయ్యేలా కవి కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవితలో చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.ఆ రోజు జరిగిన వ్యక్తి జీవితంలోని సంఘర్షణలను కవితగా మలిచిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది.ఆ రోజు వ్యక్తిలో చెలరేగిన భావాలను వింతైన రోజు కవితలో వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.కవి కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను తెలుగులోకి అద్భుతంగా అనువాదం చేసిన కవి వారాల ఆనంద్ ను అభినందిస్తున్నాను.

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పసివాని కోరిక

by Sammeta Umadevi March 17, 2024
written by Sammeta Umadevi

జిల్లా పరిషత్తులో గుమాస్తాగా పనిచేస్తున్న గంగాధర్ పిల్లలే అరుణ ఆనంద్ లు. పదవ తరగతి చదువుతున్న అరుణ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటుంది. ఆరో తరగతి చదువుతున్న ఆనంద్ కేమో స్నేహితులంటే ప్రాణం. వాళ్ళ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆడుకోవడానికి తన ఈడు పిల్లలు లేక చిన్నబోయి ఉండేవాడు. ఇప్పుడు గంగాధర్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి మారాక అక్కడ తన ఈడు పిల్లలు కొందరు ఉండడంతో ఆనంద్ తన కొత్త మిత్రులతో సంతోషంగా గడపసాగాడు. ముఖ్యంగా ఆనంద్ కి పక్కింటి రియాజ్ కి మంచి స్నేహం కుదిరింది.

 ప్రత్యేక తరగతులు ఉన్నందున ఆనంద్ అక్క అరుణ రోజూ బడికి ముందు వెళ్ళిపోతుంటుంది.  అందువల్ల ఆనంద్, రియాజ్ ఇద్దరూ కలిసి బడికి వెళ్తున్నారు. పెరట్లో జామచెట్టు కింద చాప వేసుకుని కూర్చుని కలిసి హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. పోటీ పడి చదువుకుంటున్నారు. హాయిగా ఆడుకుంటున్నారు. పాలపాకెట్టో, కూరగాయలో ఎవరు తెమ్మన్నా ఇద్దరూ కలిసి వెళ్ళి తెస్తున్నారు. రియాజ్ వాళ్ళ నాన్న ఖాదర్ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తల్లిని ఒప్పించి ఆనంద్ తన నోట్సులు కొన్ని రియాజ్ కి ఇచ్చాడు. అప్పుడప్పుడు పెన్సిల్లు, పెన్నులు కూడా ఇస్తుంటాడు.. ఇక తల్లి సుదతి పండ్లూ పలహారం ఏమిచ్చినా రియాజ్ తో పంచుకుని తినడం అలవాటయ్యింది ఆనంద్ కి. రియాజ్ వాళ్ళ అమ్మ జరీనా ఏమి వండినా ఆనంద్ ని పిలిచి  మరీ పెడ్తుంటుంది. కొన్ని నెలలు గడిచి ఆనంద్ రియాజ్ ల స్నేహం మరింత బలపడింది. కొత్తవా వాళ్ళెవరైనా  ఖాదర్ ఇంట ఈ ఇద్దరు పిల్లలను చూస్తే.. ఖాదర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు. గంగాధర్ ఇంట ఆ పిల్లలిద్దరినీ చూసిన వాళ్లు గంగాధర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు.

 “ఆనంద్ కి ఇదివరకు తినడానికి ఏది పెడ్తే.. ఒక్కటి ఇస్తే ఇంక చాలు చాలు అనేవాడు. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇంకొకటి కావాలి అంటున్నాడు” అని భర్తకు  చెప్పింది సుదతి. “పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు వాడికి ఆకలి పెరుగుతుంది. వాడు తినగలిగినన్ని ఇవ్వు” అని చెప్పాడు గంగాధర్. ఎవరు ఏమీ పెట్టినా జామ  చెట్టు వెనకకు వెళ్ళి పంచుకుని తింటున్న మిత్రులిద్దరినీ చూసి ఆనంద్ కి ఆకలి ఎందుకు పెరిగిందో అర్థమై నవ్వుకున్నది అరుణ.

ఇప్పుడు దసరా పండగ వచ్చింది. గంగాధర్, సుదతి పిల్లలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం తయారుకండి  అని చెప్పారు. “నాన్నా నాకు రెండు జతల బట్టలు కొనిపెట్టవా?” అని అడిగాడు ఆనంద్.  “రెండు నెలల తరువాత నీ పుట్టినరోజు ఉంది కదా. అప్పుడు మళ్ళీ నీకు కొత్త డ్రెస్ కొనాలి. ఇప్పుడు నేను రెండు జతలు కొనలేను” అని చెప్పేశాడు గంగాధర్. “నాన్నా.. నాకు పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనకపోయినా పరవాలేదు.. ఇప్పుడు మాత్రం రెండు జతలు కొనండి నాన్నా” అని బతిమిలాడాడు. గంగాధర్ కి బాగా కోపం వచ్చింది. “ఎందుకు ఎంత జిద్దు చేస్తున్నావు ఆనంద్..”అని కోపంగా అరిచాడు.

“నాన్నా! పాపం రియాజ్ కి సరైన బట్టలు లేవు. బడిలో సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మంచి బట్టలు లేక ఆ రోజు బడి మానేస్తున్నాడు. నాకు ఖరీదైన బట్టలు వద్దు. మామూలు ధరలోనే మా ఇద్దరికీ చెరో జత కొనండి నాన్నా.. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే.. నేను కొత్త బట్టలు వేసుకోలేను నాన్నా!” అని చెప్పాడు.  స్నేహితుని పై కొడుకు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాడు గంగాధర్.

పక్కింటికి వెళ్ళి ఖాదర్ ని జరీనాని ఒప్పించి, అరుణా ఆనంద్ లతో పాటు రియాజ్ ని కూడా తీసుకుని.. బట్టల షాప్ కి బయలుదేరారు గంగాధర్ సుదతి దంపతులు.

                                                   ***

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సావిత్రీ దర్శనం

by Devanapalli Veenavani March 17, 2024
written by Devanapalli Veenavani

పాఠక లోకానికి నమస్సులు!

ప్రముఖ కవయిత్రి , రచయిత్రి దేవనపల్లి వీణావాణి మయూఖ పత్రిక లో ‘ దర్శనం‘ పేరుతో కాలమ్ రాస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇది సమీక్ష నో , విమర్శనో కాదు. ఒక సమున్నత రచన వైపు చూడవలసిన అవసరాన్ని చూపే ఉద్దేశ్యం తో రాస్తున్న కాలమ్. విషయ విశేషతను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని చెప్పడం. భారతీయ సంస్కృతి విశిష్టత ను, అంతరార్థాన్ని గౌరవంతో వివరించడం కోసం మయూఖ పాఠకుల కోసం రచయిత్రి ‘ దర్శనం‘ చేయించే ప్రయత్నం ఈ కాలమ్ ప్రత్యేకత. ఆదరిస్తారని ఆశిస్తూ…

-డాక్టర్ కొండపల్లి నీహారిణి
మయూఖ సంపాదకులు.

“యోగం” అంటే నేను అర్థం చేసుకున్నంత వరకు “ధారణ చేసుకోగల శక్తి”. ఈ శక్తి శరీరమూ, మనసు ఒకే సరళ రేఖ మీదకు తెచ్చుకోగలిగినప్పుడే సిద్ధిస్తుంది. మహర్షులు ఈ ధారణా శక్తిని సాధించడానికి అనేక మార్గాలు చూపించారు. వాటిని యోగ దర్శనాలు అన్నారు. భగద్గీతలో కృష్ణుడు చెప్పిన జ్ఞాన, భక్తి, కర్మ యోగాలు, పతంజలి అష్టాంగ యోగం, కపిలుని సాంఖ్య యోగం ఇవి మహర్షులు చెప్పినవి. మనముందు కాలపు యోగులు మహావతార్ బాబాజీ క్రియా యోగం, మాస్టర్ సీవివి గారి భక్తృ రహిత రాజ యోగం, అరవిందుల పూర్ణ యోగం, ప్రస్తుత కాలపు యోగులు మాత నిర్మలా దేవి సహజ యోగం, సద్గురు ఈశా యోగం, దాజీ సహజ మార్గ యోగం ఇలా అనేక యోగ మార్గాలు చూపుతున్నారు.

అనేక మంది ఆధ్యాత్మిక సత్ జీవన చరిత్రలు ఏదో యోగ సూత్రానికి అనుసంధానించి ఉన్నవే.నా మటుకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సాధనాపరులతో ఉన్నప్పటికీ అది నాకు అర్థం కాలేదు, సాధ్యమూ కాలేదు. మనః శరీరాల మధ్య సమన్వయం లేనిదే ఏ యోగ సాధనా సఫలం కాలేదని మాత్రం తెలుసుకోగలిగాను. గీత, కపిలుని సాంఖ్యం, క్రియా, భక్త్రు రహిత రాజయోగం మీద కొంత అవగాహన ఉన్నప్పటికీ అది కేవలం పత్రికలు చదివి వార్తలు గ్రహించినంత మాత్రమే.

అయితే నేను పోటీ పరీక్షలకు చదువుతున్నప్పుడు శ్రీ అరబిందో గురించి , అతను “సావిత్రి “ని రాశారని తెలుసుకున్నప్పుడు అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఒక ICS అధికారి కాగదగినవాడు, విప్లవకారుడు, స్వతంత్ర పోరాటంలో ఉన్నవాడు, ఉన్న ఫలంగా ఎలా యోగ దర్శనం చేశాడు, ఎలా పూర్ణ యోగం సిద్ధాంతం చేశాడు, యోగిగా ఎలా మారాడు అన్నది తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. అయితే అన్నిటికీ మించి అతని ‘ సావిత్రి ‘ లో ఏముంది అని , అది తెలుసుకోవాలనీ అనిపించేది. అది స్వామి రామా రాసినట్టుగా ఆధ్యాత్మిక ప్రయాణపు అనుభవాల సమాహారం అయి ఉండవచ్చు అని చాలా రోజుల వరకు అనుకున్నాను. తెలుగులో చదవగలిగితే బాగుండుననీ అనుకున్నాను.కొన్నాళ్ళకు నాకు వరంగల్ సెంట్రల్ లైబ్రరీ లో ఒక కాపీ దొరికింది కూడా. కానీ ఎంత అడిగినా లైబ్రేరియన్ Xerox తీసుకోవడానికి గానీ ఇంటికి తీసుకు వెళ్లి చదవడానకి గానీ అనుమతించలేదు.ఒకే ఒక కాపీ ఉండడం దానికి కారణం.

మరి కొన్నాళ్ళకు నాకు సిరికోన సాహిత్య అవార్డుల కార్యక్రమం లో శ్రీ వాసిలి వసంత కుమార్ గారి పరిచయమైంది. వారు అరవిందుల సావిత్రిని ఆంధ్ర మహా సావిత్రి లా తెలుగు చేసిన మాస్టర్ శార్వరి గారి పుత్రులు. అయితే ఆ విషయం నాకు తెలియదు. మాటల్లో నేను సావిత్రిని చదవాలని ఉందని ,అయితే అది దొరకడం లేదనీ అన్నాను. వారు, మా తండ్రి గారు శార్వారి , వారే దానిని అనుసృజన చేశారని చెప్పడంతో ఆశ్చర్య పోయాను. అనేక పునర్ముద్రణ ల తర్వాత తిరిగి ముద్రించామనీ , తప్పక ఒక కాపీ పంపగలననీ హామీ ఇచ్చి మరో పది రోజుల్లో పంపారు.

ఇది మూడేళ్ల కిందటి సంగతి. రెండు మూడు సార్లు చదవడానికి ప్రయత్నం చేశాను. కానీ అందులోకి ప్రయాణం చేయలేకపోయాను.
ఈనాటికి మూడు సంపుటాలుగా వెలువడిన వెయ్యి పేజీల బృహద్ గ్రంథం పూర్తి చేయగలిగాను. సాధ్యం అయినంత వరకు అర్థం చేసుకోగలిగాను.

సానిత్రి అనుసృజనకు శ్రీ శార్వరి గారు దశాబ్దకాలం వెచ్చించారు. అరవిందులు కూడా మూల ప్రతిని పూర్తిగా సిద్ధం చేయడానికి పుష్కర కాలానికి పైననే తీసుకున్నారు.
యథా వారి యోగ దర్శనం , తథా కావ్య గతం చేశారు. అటువంటి ధ్యాన యోగ దర్శనానికి శ్రీ శార్వరి వారు అంతే యోగ సాధనా శక్తి ద్వారా అనుసృజన చేయగలిగారు. ఇది అంత సులభమైన విషయం కాదు. ఇద్దరూ యోగ సాధకులు కనుకనే సాధ్యం అయిందని నేను భావిస్తున్నాను.

శార్వరి వారి సావిత్రికి గుంటూరు శేషేంద్ర శర్మ ముందుమాట రాస్తూ వ్యాస వాల్మీకి సరసన నిలబడగల కావ్యం సావిత్రి అన్నారు. అలా అనడానికి కారణం సావిత్రి కావ్య రూప ఆధ్యాత్మిక వాఖ్యానం.

ఇంతకీ సావిత్రి ఏమిటి అంటే మహా భారతంలోని సావిత్రి కథనే. సతీ సావిత్రి తన భర్త అయిన సత్యవంతుని
మృత్యువునుంచి గెలిపిస్తుంది.అయితే ఆమె మృత్యువు(యమున్ని)జయించడానికి చేసిన సాధన, ఆమె చేసిన దర్శనాలు, తెలుసుకున్న సత్యాలు ఇవన్నీ పన్నెండు గ్రంథాలుగా రాశాడు అరవిందుడు. .సావిత్రిలోని పన్నెండు భాగాలు అనేక పర భౌతిక విషయాలను చర్చిస్తాయి. వాటిని మూడు భాగాలు సత్య దర్శనం, యోగ దర్శనం, విశ్వదర్శనం గా కూర్పు చేశారు శార్వరి వారు. ఎంతో కొంత ఆధ్యాత్మిక ప్రయాణం లేకుండా సావిత్రిని అర్థం చేసుకోవడం కష్టం.

ఇవి అరవిందులు తాను సావిత్రిగా మారి ప్రయాణం సిద్ధిస్తేగానీ రాయగలిగేవి కావు.
సావిత్రి దేనిని సాధించిందో దాని ద్వారానే మృత్యువుని జయించింది. ఆ సాధనే ఒక తేజస్సు, అదే గాయత్రి. అరవిందులు పూర్ణయోగం ద్వారా ఆ సావిత్రి సాధించిన అమరత్వ ఉషస్సును పొందమని సూచించారు.
ఇక అరవిందుల పూర్ణ యోగం అంటే భక్తి, జ్ఞాన, కర్మ యోగాలు మూడు కలిసి చేయగల యోగం. అది సావిత్రి చర్చించదు. కాకపోతే ఈ యోగ సాధనలో సావిత్రి ద్వారా చెప్పిన అమరత్వం సిద్ధిస్తుందని భావించాలి.

ఈ విలువైన కృషిని తెలుగులో అందించడానికి మరొక్క మారు ప్రయత్నం చేసిన శ్రీ వాసిలి వసంత కుమార్ గారు ఎంతగానో అభినందనీయులు.
అది నాకు అందించినందుకు కృతజ్ఞతలు

అరవిందుని సావిత్రి పరిచయం తర్వాత మిత్రులు కొంతమంది సావిత్రి గురించి మరి కాస్త వివరంగా రాస్తే బాగుంటుందని అడగడం జరిగింది.

సావిత్రిని చదవడం నా బలమైన కోరిక, అలా ఎందుకు కలిగిందో నాకు తెలియదు. ఒక శిక్షణా కార్యక్రమంలో గెస్ట్ స్పీకర్ గా వచ్చిన ఒకరు మాటల్లో అరవిందుడులాంటి ప్రజ్ఞాశాలి మన స్వతంత్ర పోరాటం నుంచి ఎందుకు బయటికి వచ్చాడు , అలా రాకుండా పోరాటంలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అనడం నాకు అరవిందుని మీద అంతకు ముందు ఉన్న భావనను మరింత పెంచింది. ఇక పండిత పరమేశ్వర శాస్త్రి రాసిన త్రిపురనేని గోపీచంద్ మనసులో మాట ఆ నవల్లో చెప్పకనే అరవిందుని పూర్ణ యోగాన్ని చెప్తుంది. పూర్ణయోగం సంభవమేనా అన్న సంశయం ప్రధాన పాత్ర వెలిబుచ్చడం ఆ నవల్లో కనిపిస్తుంది. అయితే దానిని ఆచరించిన వారు మాత్రమే చెప్పగల సాహసకార్యమది. అంతటి సాహసం చేయలేను కాకపోతే సావిత్రి గురించి మాత్రం చెప్పగలిగే సాహసం చేస్తాను. ఎందుకు అంటే అర్థం చేసుకోగల వివరణలు ఇంతకు ముందు పెద్దలు అనేకులు అందజేశారు కనుక.

అరవిందుని సావిత్రి అర్థం కావాలి అంటే అంతకుముందు మృత్యువును జయించడానికి ప్రయత్నం చేసిన వారి చరిత్రను కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేసి తెలుసుకొని శక్తి మేరకు అర్థం చేసుకున్న దానిని ఇక్కడ రాస్తున్నాను.

17, 18 శతాబ్దానికి చెందిన మహనీయులు, యోగ సిద్ధాంతాలని ఆచరణ యోగ్యమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేసి ప్రజలు ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరిన్చడం కోసం సులభమైన విధివిధానాన్ని ఏర్పరచే ప్రయత్నం చేశారు. అయితే పాత కథని తిరిగి దర్శించడం, రాయడం జరగలేదు. అయితే అరవిందుని విషయంలో ఇది జరిగింది.

పురాణాలని అంటుంటాం కదా ఇటువంటి పురాణాలని అరవిందుడిలాంటివాడు సమకాలీనానికి ఏ విధంగా తీసుకువచ్చాడు, తన యోగదర్శనాల కొరకు అతను సావిత్రిని ఎందుకు ఎంచుకున్నాడు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత ,భాగవతం లాంటి వాటి వ్యాఖ్యానం, కాకుండా అందులోని ఒక స్త్రీ కథని అది మృత్యుంజయ కథని ఎందుకు తీసుకున్నాడు? ఆ కథ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ? ఎవరైనా అసలు మృత్యువుని ఎందుకు చేయించాలి? ప్రతి ఒక్కరూ మృత్యువుని జయించడానికి ప్రయత్నించినట్లయితే ఎలా ? ఎటువంటి సాధన చేసినట్లయితే అటువంటి వారి యొక్క భౌతిక ప్రయోజనము కలుగుతుంది ? అది ఎట్లా ఉండబోతోంది..? అమరత్వము, మృత్యువును జయించడం రెండు ఒకటేనా ? ఇవన్నీ నాకు కలిగిన సందేహాలు.

సందేహ నివృత్తి కోసం లోకంలో చిరంజీవులు గా ఉన్నవారు , మృత్యుంజయులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. మృత్యువును జయించిన వారు ఆ ప్రత్యేక సందర్భంలో మృత్యువుని తప్పించుకున్నారు కానీ వారు శాశ్వతలు కారు అంటే చిరంజీవులు కారు. వారు ఏ ప్రయోజనం కోసం మృత్యువుని వాయిదా వేశారో అది సిద్ధించిన తర్వాత వారు మామూలు మానవుడిలాగే నిష్క్రమించారు. కానీ అమరులు, వారు మృత్యువు యొక్క మితిని దాటి పరివ్యాప్తం చెందారు కనుక వారిని
మృత్యువు అందుకోలేదు. ఇలా మృత్యువు యొక్క మితిని అతిక్రమించి లోకంలో పరివ్యాప్తమై ఉన్నటువంటి వారు చిరంజీవులు. శాస్త్రం ప్రకారం చిరంజీవులు ఏడుగురు అనీ, ఎనిమిది అనీ అంటారు. మనకు హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, మార్కండేయుడు బాగా తెలిసిన పాత్రలు.

అయితే మృత్యుంజయులు మాత్రం ముగ్గురు. మార్కండేయుడు, సావిత్రి దేవి, నచకేతుడు. ఇందులో మార్కండేయుడు మృత్యుంజయుడు ఇంకా చిరంజీవి. మిగిలిన ఇద్దరు సావిత్రి, నచికేతులు మృత్యుంజయులైనప్పటికీ వారు చిరంజీవులు కారు. ఈ మూడు మృత్యుంజయ పురాణాలు లేదా పాత్రలు మృత్యువును జయించడానికి లేదా మరణాన్ని వాయిదా వేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.
అయితే అన్ని జీవులకి సమవర్తిగా ఉండేటువంటి యముడు వీరి పట్ల ఏ కారణం చేత తన సమవర్తి నియమాన్ని పక్కకు పెట్టాడు ఎందుకు వారి యొక్క విన్నపాన్ని మన్నించి తన సమవర్తి నియమాన్ని దాటి వారికి ఆయువృద్దికి తోడ్పడ్డాడు ? ఇదే ముఖ్యమైనటువంటి విషయం .

ఇవి మనం మూడు కథలుగా అధ్యయనం చేయవల్సి ఉంటుంది. ఒకటి మార్కండేయుని కథ, రెండవది సావిత్రి కథ, మూడవది నచికేతుని కథ. మార్కండేయుని పాత్ర చూసినట్లయితే రామాయణంలోనూ భారతంలోనూ కనిపిస్తుంది. అయితే సావిత్రి యొక్క ఉపాఖ్యానం మహాభారతంలో మార్కండేయుడు ద్వారా ధర్మరాజుకు అరణ్యవాసంలో తెలియజేయబడుతుంది. ఇక నచికేతుని కథ కఠోపనిషత్ కథ.

మార్కండేయుని కథ చూసినట్లయితే భృగు మహర్షి యొక్క కుమారుడు ధాత. ఇతను పగలుకి అధిపతి.మరొక పుత్రుడు విధాత రాత్రికి అధిపతి. ఒక పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు విధాత తలపున ప్రభవించినది అనాది రాగమని రాస్తారు అంటే చీకటి అధిపతి అయినటువంటి విధాత తలపున ప్రభాతం అనేటువంటి ఒక అనాది రాగం వస్తుందని ఆయన అర్థం. మహాత్ములు పదాలను ఆయాచితంగా వాడరు. అయితే ఇక్కడ ధాత యొక్క కుమారుడు ఎవరైతే పగటి అధిపతి ఉన్నాడో అతని కుమారుడు మృకండుడు. సంతాన ప్రాప్తి కోసం శివునికీ విష్ణువుకీ చేసిన తపస్సు ఫలితంగా మార్కండేయుడు జన్మిస్తాడు. అతని ఆయుషు 16 సంవత్సరాలు.

తల్లిదండ్రుల ద్వారా తాను అల్పాయుష్కుడను అని తెలుసుకున్న మార్కండేయుడు ఏ ప్రయోజనం ఆశించి తన తండ్రి తపస్సు ఫలితంగా తనను పొందాడో ఆ ప్రయోజనం నెరవేరనప్పుడు తనకు వచ్చిన జన్మ యొక్క సార్ధకత్వం ఉండదని దానిని సాధించడం కోసం శివుడికి తపస్సు చేస్తాడు. అతని తపస్సు ఎంతగా ఫలిస్తుందంటే శివుడు మార్కండేయుడు రెండు రూపాలు సాయుజ్యం అయిపోతాయి. అంటే శివుడే మార్కండేయుడు మార్కండేయుడు శివుడు. మార్కండేయుని ఆయుర్థాయం పూర్తయిన తర్వాత
యముడు మార్కండేయుడుని తీసుకువెళ్లే సమయంలో అతనికి శివుడికి మార్కండేయుడికి భేదం తెలియదు. అయితే అప్పుడు శివుడు యమధర్మరాజు తో ఎవరైతే పరోపకార సిధ్యర్థం తన ఆయుష్షుని వృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారో వారి ప్రయోజనము అంత నిష్కల్మషమైనదీ లోకోపకారి అయినట్లయితే వారికి శివుని అనుగ్రహం ఉంటుంది కనుక వారి ప్రాణాలను హరించవలదని యమునికి ఆజ్ఞ వేస్తాడు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆయుష్షు ప్రపంచానికి ఉపకారం చేసేటువంటిది అయితే అతను ఏ ప్రయోజనం కోసం కృషి చేస్తున్నట్లయితే అటువంటి ప్రయోజనము నెరవేరేవరకు అతనికి మృత్యువునుంచి శివుని యొక్క రక్షణ ఉంటుంది ఇది మార్కండేయుడు చెప్పేటువంటి సత్యం. మార్కండేయుడు తన తండ్రి యొక్క కోరిక నెరవేరడం కోసం ఏ ప్రయోజనం కోసం తన తండ్రి తనను పొందాడు అది నెరవేరేంత వరకు సమయం ఇవ్వాలని కోరుకుంటాడు. అలా పుట్టిందే మృత్యుంజయ మహామంత్రం..

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వరుహ నివ బందనాత్ మృత్యోర్ముక్షీణ మామృతాత్

జీవుడు తను పుట్టి, పొందవలసినవి పొంది, పూర్తిగా మగ్గిన ఒక దోస కాయ తన తల్లి తీగ నుంచి విడిపోయినట్లుగా తాను శరీరం విడిచి పెట్టాలని అర్థం.అదే మార్కండేయుడు కోరిక , అలా శివానుగ్రహం పొంది అలాగే తల్లి తండ్రి సేవ చేసి ఆ పాత్రలకు న్యాయం చేస్తాడు మార్కండేయుడు. లోకహితునికి, పరోపకార ప్రయోజకునికి మరణభయం లేదు ఇది మార్కండేయుడు మృత్యువుని జయించిన వివరం.
మార్కండేయుడు తదుపరి ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్ణయించుకుంటాడు, సమవర్తి నుంచి రక్షణ పొంది చిరంజీవి అయ్యాడు.

తదుపరి నచికేతుడు, సావిత్రి కథలు చూస్తే ముందు నచికేతుని గురించే చూడాలి.ఎందుకంటే నచికేతుడి ద్వారా లేదా కఠోపనిషద్ ద్వారా
ఏ విద్య అయితే లోకానికి అందించబడిందో అది సావిత్రి ఆచరించింది కాబట్టి.

నచికేతుడు, యముడి సంవాదమే కఠోపనిషత్ చెప్తుంది.
అయితే కఠోపనిషత్ అన్న పదం, దాని వివరణ మాస్టర్ పార్వతీ కుమార్ గారు వారి ప్రసంగపాఠం’ మరణ రహస్యం. -3 ‘ లో చక్కగా వివరించారు.

నచికేతుడు ఐదేళ్ల చిన్న పిల్లవాడు, తండ్రి పేరు ఉద్దాలకుడు
గౌతమ వంశస్తుడు, అరుణ కుమారుడు.ఇతను అన్న దానము తదితర దానాలు వంటివాటిని విని అచరించదలిచిన వాడై దానక్రతువు చేస్తాడు. ఇలా తనకు ఉన్నది అంతా ఇచ్చివేసే వ్రతాన్ని చేయడం వల్ల ఇతనికి వాజశ్రవనుడు అనే పేరు వచ్చింది. ఉత్తమ గతులు పొందడమే లక్ష్యంగా చేసినప్పటికీ మంచి గోవులను తాను ఉంచేసుకొని,తనకు అవసరంలేనివి దానం ఇవ్వడం చూసిన నచికేతుడు తండ్రి తప్పుచేస్తున్నాడని మదనపడతాడు.అన్నీ ఇచ్చివేస్తున్నాడు కదా..మరి నన్ను ఎవరికి ఇస్తావు నాన్నా అని తండ్రిని అడుగుతాడు.తండ్రి వెంటనే జవాబు ఇవ్వకపోతే నచికేతుడు ఈ ప్రశ్నని మళ్లీ మళ్లీ అడుగుతాడు, చిరాకు పడ్డ తండ్రి నిన్ను యముడికి ఇచ్చేస్తాను అంటాడు. నచికేతుడు యమలోకానికి వెళ్ళిపోయి యముడి కోసం చూస్తాడు. అక్కడ ఆ సమయంలో యముడు వుండడు. మూడు రోజులకు యముడు వస్తాడు. నచికేతుడి రాకకు కారణం అడుగుతాడు.

యమ లోకంలో మూడు రోజులు భూ లోకంలో మూడు సంవత్సరాలు. అంతకాలం ఎటువంటి ఆతిథ్య ఆదరణ లేక ఒక పిల్లవాడు, బ్రాహ్మణుడు తన లోకంలో ఉండడం వల్ల తనకు అతిధి నిరాదరణ దోషం కలుగుతుందని భావించిన యముడు నచికేతుడిని మూడు వరాలు ఇస్తాను, కొరుకోమంటాడు.

నచికేతుడు సంతోషించి మొదటి వరంగా తన తండ్రి గారు ఇలా యమలోకానికి వచ్చినందుకు తన మీద కోపం కలిగి ఉండకూడదని , రెండవ వరంగా ఏం చేయడం లేదా ఏ విద్యను ఆచరించడం వల్ల స్వర్గాన్ని చేరవచ్చునో తెలియజేయాలనీ, మూడవ వరంగా జీవుడు మరణించిన తర్వాత ఉంటాడా, ఉండడా తెలియజేయాలని కోరతాడు.

యముడు మొదటి వరాన్ని అనుగ్రహించి, నీ తండ్రి ఎప్పటిలాగా నిన్ను ఆదరిస్తాడని, రెండవ వరం స్వర్గం చేరుకునే విద్య అంటే అగ్ని విద్య గురించి చెప్పి ఇకనుంచి ఆ అగ్ని విద్య నచికేత అగ్ని అని పిలవబడుతుంది అనే నాలుగో వరాన్ని ఇస్తాడు. ఒక రంగుల మాల కూడా బహుమతిగా ఇస్తాడు. సృష్టిలో మొదట ఆవిర్భవించినది అగ్ని కనుక అగ్ని విద్యను ఆచరించాలి. అగ్ని విద్య లేదా యజ్ఞం. ఇది బహిర్యజ్ఞం, అంతర్యజ్ఞం. బహిరి యజ్ఞం 24 ఇటుకలతో చతురస్రంగా పేర్చినటువంటి హవనకుండంలో అగ్నిని ఆవాహన చేస్తూ భూత సూక్ష్మాన్ని అనగా బయట ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాలు భూత సూక్ష్మంగా ఏర్పడి ఉన్న వాటిని సంచయనం చేయడం. అంతర్యజ్ఞం ద్వారా మనలో అగ్నిని సంచయనం చేయడం అలా అంతరయజ్ఞం ద్వారా సంచయనం చేయబడిన అగ్ని ద్వారా జీవుడిని ఊర్ధ్వ లోకాలకి తీసుకువెళ్లడం ఆ విధంగా స్వర్గ ప్రాప్తి పొందడం ఇదే నచికేతాగ్ని. దీనికి ఆది శంకరులు భాష్యం చెప్తూ మూడు సార్లు నచికేతాగ్ని సంచయనం చేసిన వారు, తల్లి, తండ్రి, ఆచార్యుల అనుశాసనాన్ని పొంది జన్మ రహితుడు అవుతాడని తెలియజేశాడు.

మూడవ వరంగా నచికేతుడు అడిగిన ప్రశ్న మరణాంతరం జీవుడి అస్తిత్వం ఏమిటో తెలియజేయడానికి యముడు నచికేతుడిని పరిపరి విధాల పరీక్షిస్తాడు. ఇది అత్యంత గహనమైన విషయమని దీనికి బదులుగా మరొక వరం కోరుకోమని అడుగుతాడు, కానీ నచికేతుడు పట్టుబడతాడు. మరణాంతరం
జీవుడు అస్తిత్వం తెలియజేయడానికి తమరి కన్నా ఉత్తమమైన గురువు నాకు దొరకడని మీరు మాత్రమే తెలియజేయడానికి సమర్ధులని నాకది తప్పనిసరిగా తెలియచేయాలని కోరుకుంటాడు నచికేతుని పట్టుదల చూసిన యముడు అతనికి జీవుడు మరణాంతరం ఉన్నాడా లేడా అన్న విషయాన్ని తెలియజేస్తాడు. ఈ ప్రశ్నకి జవాబును అర్థం చేసుకోవడం కొంత కష్టమైనా నచకేతుడి ద్వారా యముడు జీవుడు మరణాంతరం ఉంటాడని ఉండగలడని ప్రతి వ్యక్తి సాధన ద్వారా తన అస్తిత్వాన్ని తెలుసుకోగలరని తెలియజేస్తాడు.

ఇక్కడ కఠోపనిషత్ మీద ఆదిశంకర భాష్యం వివరంగా ఇచ్చినప్పటికీ నాకు మాస్టర్ పార్వతీ కుమార్ గారి ప్రసంగ పాఠం మరణ రహస్యం-3 గా వచ్చిన నచికిత విద్య పుస్తకం ఎంతగానో ఉపయోగపడింది మాస్టర్ పార్వతీ కుమార్ గారు తన ప్రసంగం ద్వారా చాలా సులభంగా నచికేతుని మూడో వరం వివరించారు. మాస్టర్ పార్వతి కుమార్ గారు కఠోపనిషత్ పదం ఉత్పత్తిని వివరిస్తూ ఇలా చెప్తారు.

కఠోపనిషత్ అంటే క నుంచి ఠ వరకు ఉన్న 12 అక్షరాలు కలది. ఈ 12 అక్షరాలు 12 రేకులు గల పద్మాన్ని ద్వాదశ దళ పద్మం అంటారు. ఇది అనాహిత చక్రాన్ని సూచిస్తుంది.

మన శరీరంలోని షడ్చక్రాలు మీరు వినే ఉంటారు మూలా ధార , స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహిత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు అత్యంత పైన ఉన్నది సహస్రార. అనాహితం హృదయ స్థానం హృదయం అంటే గుండె కాదు, గుండె పక్కన శరీర మధ్య భాగంలో ఉండేటువంటి ఈ చక్రము నాలుగు స్థరాలుగా మూడు మూడు దళాలతో మొత్తం 12 దళాలు మధ్యలో ఆత్మని కలిగి ఉంటుంది. మొదటి స్థరం అన్నమయ కోశం, రెండవ స్థరం ప్రాణమయ కోశం, మూడోస్తరం మనోమయ కోశం , నాలుగవ స్థలం విజ్ఞానమయ కోశం మధ్యలో ఉన్నవాడు వెలుగు అదే ఆత్మ.

ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు ప్రతిదీపానికి సమానమైన వెలుగు ఉన్నట్టు జీవులను ప్రకాశితమయ్యేటువంటి ఈ వెలుగు ఆత్మ రూపంలో మన శరీరంలోనూ ఉంది. జీవుడు సూక్ష్మ దేహంగా మన నాభి కింద రెండు వేళ్ళ అంత దూరంలో సూక్ష్మ శరీర ధారుడుగా ఉంటాడని అక్కడ ఉన్నటువంటి జీవుడిని అంతర్యజ్ఞం ద్వారా షట్ చక్రాల ద్వారా ప్రయాణింప చేసి అనాహిత ద్వారా ఆత్మను చేరుకొని ఉన్నవాడు తన సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరనీ పూర్వపు రచనల్ని బట్టి అర్థం చేసుకోగలము. అటువంటి సాధన చేసిన వారు
ఆజ్ఞా చక్రం అనగా రెండు కనుబొమ్ముల మధ్య ఉన్న స్థానం ద్వారా సూక్ష్మ శరీరం ధరించి కావలసినప్పుడు శరీరం లోపలికి, బయటకు ప్రయాణం చేయగలరు. పరమహంస యోగానంద తన ప్రసిద్ధ పుస్తకం యోగి ఆత్మకథ లో ఎంతో మంది భారతీయ యోగులను పరిచయం చేస్తూ తన పరమ గురువైనటువంటి శ్యామ చరణ్ లాహిరి మహాశయుల గురించి చెప్తూ లాహిరి మహాశయులు సూక్ష్మ శరీరాన్ని ధరించి ఎంతో మందికి కనిపించారని రాశారు. ఇలా అనేక చోట్ల కోరుకున్న చోట ప్రత్యక్షమైనటువంటి యోగుల్ని చూసిన సందర్భాలు అనేకులు తమ అనుభవాలలో రాశారు.

కఠోపనిషత్ చెప్పింది ఇలా అనాహిత చక్రాన్ని దాటి ప్రయాణం చేయమనే. అలా ఎవరైతే సాధన ద్వారా చేయగలుగుతారో, వారు తమ సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరు, వారు శరీరాన్ని వదిలివేసిన తర్వాత కూడా తమ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోగలరు. తమ భూత భవిష్యత్తు ప్రయాణాన్ని వారు నిర్దేశించుకోగలరు. ఆ విధంగా సాధన ద్వారా తెలుసుకున్న వారు తమ మరణాంతరం కూడా అస్తిత్వాన్ని కలిగి ఉంటారని యముడు నచికేతులకి తెలియజేసినట్టు మనం కఠోపనిషత్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక నచికేతుని మూడో ప్రశ్నకు యముని సమాధానం నీ సాధనే నీ అస్తిత్వానికి సమాధానం. అయితే ఈ ప్రయాణం అంతా కూడా సుశిక్షుతుడైనటువంటి గురువు ద్వారానే సాధ్యపడుతుంది అనేది అన్ని పుస్తకాల్లో ఇచ్చినటువంటి వివరణ. అందుకే భారతీయతలో గురువుకి అంతటి పవిత్ర స్థానం.
ఇక ఆజ్ఞా చక్రం నుండి సహస్రార చక్రం చేరగలిగిన వాడు సాక్షాత్ భగవంతుడే అంటాడు సద్గురు.

ఇది సూక్ష్మంగా కఠోపనిషత్ సారము లేదా నచికేత యముని సంవాదము. యముని ద్వారా మూడువరాలనీ, అనుకోని నాలుగో వరాన్ని పొందిన నచికేతుడు తిరిగి తన తండ్రి వద్దకు చేరుకొని యముడు ఏవైతే సూచించాడో వాటిని పాటించి తన భౌతిక ప్రయాణాన్ని ముగిస్తాడు.

మార్కండేయుడు స్వీయ ప్రయత్నం ద్వారా, నచికేతుడు తండ్రి యథాలాపంగా అన్న మాటతో యముడి ద్వారా మరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. వీరు ఇరువురికీ తమ పరిస్థితి అది ఎదుర్కునే వరకు తెలియదు. ఇందుకు భిన్నంగా సావిత్రికి తాను ఏం చేయాలనుకుంటూదో ముందే తెలుసు. యే సాధన ద్వారా తాను సూక్ష్మ శరీరధారి కాగలదో, దానితో ఏమి సాధించగలదో తెలుసు. ఆమెకు తెలుసు కనుకనే అల్పాయుష్కుడు అని తెలిసినా సత్యవంతుణ్ణి వివాహం చేసుకుంటుంది. తన సాధన మీద తనకంత నమ్మకం ఉంది గనుకనే తన అభీష్టాన్ని నెరవేర్చుకోగలిగింది కేవలం తన భర్త ప్రాణాలనే కాకుండా తన మామగారు, తండ్రి గారి అభిష్టాలను కూడా వరాలుగా పొందగలిగింది.

సావిత్రి, మద్ర దేశ అధిపతి అయిన అశ్వపతి కుమార్తె. అశ్వపతి సంతానం కొరకు 18 సంవత్సరాలు రోజుకి పదివేల గాయత్రీ మంత్రాలను అనుష్టానం చేస్తూ తపస్సు చేస్తాడు అతనికి సవిత్రమూర్తి ప్రత్యక్షమై సావిత్రి పేరుతో కుమార్తెగా జన్మించగలదని వరం ఇస్తుంది. అశ్వపతి తనకు పుత్రుడు కావాలని కోరుతాడు అందుకు సవిత్రమూర్తి ఈ కుమార్తె ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్తుంది.

అశ్వపతి సావిత్రిని అపురూపంగా పెంచుతాడు ఆమె యుక్త వయసుకి సత్యవంతుని గురించిన సమాచారం తెలుస్తుంది అప్పటికే ఆమెకు సత్యవంతుడు తన భర్త అయితే బాగుంటుందని అభిప్రాయం ఏర్పడుతుంది. సావిత్రి యొక్క ప్రతిభాపాటవాలకి ఆమెకు తగిన వరుణ్ణి తానే ఎన్నుకోవాల్సిందిగా తండ్రి అయిన అశ్వపతి సూచిస్తాడు. సావిత్రి తాను సాల్వ రాజ్యానికి చెందిన ద్యుమత్సేనుని కొడుకు సత్యవంతుణ్ణి వివాహం చేసుకోగలనని అంటుంది. నారదుడు సత్యవంతుడు అల్పాయుష్కుడని ఒక సంవత్సరం మాత్రమే అతనికి ఆయుష్యు ఉందని అతను ఫలానా రోజు మరణిస్తాడని ముందే తెలియజేస్తాడు. అయినప్పటికీ సావిత్రి తాను సత్యవంతున్నే వివాహం చేసుకోగలనని చెప్తుంది. తండ్రి అశ్వపతి కూడా కూతురు నిర్ణయాన్ని వ్యతిరేకించడు.

అతను సావిత్రిని, సత్యవంతునికి ఇచ్చి వివాహం చేస్తాడు. సావిత్రి వివాహం చేసుకునేటప్పటికీ సత్యవంతుడు రాజ్యం కోల్పోయి అంధత్వంతో ఉన్న తండ్రి, అరణ్యంలో మునివాసం చేస్తూ బ్రతుకుతున్న పరిస్థితి. అందునా అతను అల్పాయష్కుడు. అతను అల్పాయుష్కుడన్న విషయము అతనికి గాని అతని తల్లిదండ్రులకు కానీ తెలియదు కానీ సావిత్రికి తెలుసు. అన్నీ తెలిసి సావిత్రి సత్యవంతుని జీవితంలో ప్రవేశిస్తుంది. అదే సావిత్రి గొప్పతనం. ఆమె తన సాధన మీద ఆమెకున్న నమ్మకం.

సావిత్రి సత్యవంతులు సంవత్సరకాలం ఆనందంగా జీవిస్తారు. సత్యవంతునికి మరణ సమయం ఆసన్నమవుతుంది. యధావిధిగా అరణ్యంలో కట్టెలు సేకరించడానికి సత్యవంతుడు బయలుదేరుతాడు. తానూ వస్తానని సావిత్రి అంటుంది. అతనితో బయలుదేరుతుంది. అరణ్యంలో కట్టెలు సేకరిస్తూ ఉన్నఫలంగా సత్యవంతుడు పడిపోతాడు. సావిత్రికి దీని గురించి ముందే తెలుసు కనుక ఆమె అంతకుముందు మూడు రోజుల నుంచి త్రైరాత్ర వ్రతం చేస్తుంటుంది. త్రైరాత్ర వ్రతం అంటే మూడు రోజులు పగలు రాత్రి సాధనలో ఉండడం. సావిత్రి పరిస్థితిని అర్థం చేసుకొని అతని శరీరాన్ని ఒక భద్రమైన చోటుకు మార్చి తాను అక్కడే ఉండి, తన సూక్ష్మ శరీరం ద్వారా సత్యవంతుని ప్రాణాలను తీసుకున్న యమునితో ప్రయాణం చేస్తుంది. యముడు తనతో రావద్దని వారిస్తాడు. సావిత్రి యమునితో తన భర్త ప్రాణాలు తనకు ముఖ్యమని అందుకనే తను సూక్ష్మ శరీరధారియై తనతో ప్రయాణం చేస్తున్నానని చెప్తుంది. ఈ లోకాలవెంట రాకూడదని యముడు పదేపదే చెప్తాడు. అందుకు ప్రతిగా నాలుగు వరాలను కోరుకో, కానీ ఈ ప్రయాణం మానుకో అని చెప్తాడు. అప్పుడు ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కోరుకో అంటాడు.

మొదటి వరంగా సావిత్రి తన మామగారి అంధత్వం పోవాలని, రెండవ వరంగా రాజ్యం రావాలని కోరుకుంటుంది. మూడవ వరంగా తన తండ్రికి నూరు పుత్రులు కలగాలని కోరుకుంటుంది నాలుగవ వర సమయంలో యముడు ‘నీ పతి ప్రాణాలు తప్ప’ అన్నమాట అనడు. అప్పుడు ఆమె తన భర్తని పునరుజ్జీవున్ని చేయాలని కోరుతుంది.

ప్రసన్నుడైన యముడు నాలుగు వందల సంవత్సరాల పాటు ఎందుకంటే అది కృతయుగం కనుక కృతయుగంలో మానవుని ఆయుషు నాలుగు వందల సంవత్సరాలు కనుక నాలుగు వందల సంవత్సరాలు నూరుగురు పుత్రుల్ని కలిగి సుభిక్షంగా బతకమని వరం ఇస్తాడు. ఆ విధంగా సావిత్రి తన మామగారి చూపుని, రాజ్యాన్ని, తన తండ్రికి పుత్రుల్ని, తన భర్త ఆయుష్షుని యముని ద్వారా పొందగలిగింది. ఆమె తిరిగి తన సూక్ష్మ శరీరంతో తనదేహానికి ప్రవేశిస్తుంది అలాగే సత్యవంతుడు యొక్క ప్రాణాలని యముడు తిరిగి ప్రసాదిస్తాడు. ఆ విధంగా యముడికి సావిత్రి కి మధ్య జరిగిన ప్రయాణం శుభప్రదంగా ముగిసి సత్యవంతుడు పూర్ణాష్కుడై చిరకాలం ఆనందంగా జీవిస్తారు. ఇది సావిత్రి కథ. ఇది మార్కండయుడు ధర్మరాజుకి చెప్పిన ఉపాఖ్యానం.

మాస్టర్ పార్వతీ కుమార్ గారు రాసిన తన ప్రసంగ పాఠం పుస్తకం మరణ రహస్యం -2 లో సావిత్రి సంబంధించిన అంశాలని ఇలా విశ్లేషిస్తారు. సవిత్రు మండలం అంటే 12 సూర్యులని కలిగినటువంటి ఒక మండలం. ఇలాంటి 12 సవిత్రు మండలాలు కలిసి ఒక భర్గో మండలం. సావిత్రి అన్న పదానికి అర్థం సాయం సంధ్య లో ఉన్న వెలుగు అది శక్తివంతమైనది. సావిత్రి వెలుగు యొక్క ప్రతిరూపం. అందుకే గాయత్రి మంత్రంలో ” భర్గో దేవస్య ధీమహి ” అని ఉంటుంది. వెలుగు ప్రతిరూపమే సావిత్రి అది అనుష్టానం చేయడమే గాయత్రి. అశ్వపతి అనే పదానికి అర్థం ప్రాణాలకు అధిపతి అయిన జీవుడు. ఈ అశ్వపతి తపస్సు చేయడం కోసం మిగిలిన కథలలో లాగా శివుడినో, విష్ణువునో ధ్యానం చేయలేదు. అవ్యక్త రూపమైన వెలుగు. సృష్టి లో ఏది వెలుగు ను ప్రకటిస్తుందో అది.
అతను సవిత్ర మండలంలోని వెలుగును, సావిత్రిని పొందడానికి 18 సంవత్సరాలు గాయత్రీ మంత్రోపాసన చేశాడు. ఆ సవిత్ర మండల వెలుగే సావిత్రిగా అశ్వపతికి జన్మించింది. ఆ వెలుగు సూక్ష్మ శరీరాన్ని ధరించగలిగే సాధన కూడా పొందగలిగిన ప్రజ్ఞ. తనకు భవిష్యత్తు తెలిసిన ఆమె వెరవలేదు తన వెలుగు దేహంతో ముందు లోకాలకు సైతం ప్రయాణం చేసి తాను సాధించాలనుకున్న వాటిని సాధించింది.

ఆమె సాధించిన వాటిలో మొదటిది మామ గారి అంధత్వం పోవడం. మామగారు ధ్యుమత్సేన రాజు జ్ఞానముతో మూడో కన్ను కూడా కలిగిన వాడు, కానీ తన అహంకార ప్రభావం చేత తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. సావిత్రి అతని అధంత్వం పోవాలని అంటే తిరిగి జ్ఞానం రావాలని కోరుతుంది. సత్యవంతుడు అసలు పేరు చిత్రాశ్వుడు అంటే చిత్రంగా ప్రాణాలని నిలుపుకోగలిగినటువంటివాడు. వ్యవహార శైలి వలన అతనికి సత్యవంతుడు అనే పేరు వస్తుంది. అతని జన్మతః వచ్చినటువంటి పేరు చిత్రాశ్వుడు లాగానే చిత్రంగా సావిత్రి వల్ల తన ప్రాణాలను పునరుద్ధరించుకోగలుగుతాడు. సావిత్రి యమునితో చేసిన సూక్ష్మలోకాల ప్రయాణం షట్ చక్రాల ప్రయాణమే. చక్రాలు ఒక్కొక్క లోకానికి ప్రతీకగా చూపబడతాయి వాటి ప్రయాణము అనుభవము అరవిందుడు మరింత విపులంగా రాస్తాడు.
పరోక్షంగా సావిత్రి యొక్క ఉపాఖ్యానమంతాను సూక్ష్మదేహధారియై ప్రయాణించగలిగేటువంటి శక్తి సాధన దాని యొక్క ఫలితాలు, శక్తి వంటివి చెప్పడం.

మార్కండేయుడు, నచికేతుడు, సావిత్రి కథల వల్ల అర్థం చేసుకోగలిగింది ఏదైనా ఉంది అంటే అది పరోపకారం, లోక శ్రేయస్సు. మరణం సత్యం, దానిని వాయిదా వేయగల శక్తి వారి వారి సంకల్పాలకు ఉంది. అందుకు దైవం సహకరిస్తుంది.దాని కోసం సంకల్ప వృద్ది చేయాలి.దానికి కొరకు సాధన చేయాలి. అలాటి వారు మృత్యువును వాయిదా వేయగలరు. మరణించినా జనుల స్మృతిలో ఉన్నంత కాలం అమరులుగా ఉండగలరు. ఎందుకు మృత్యువును జయించాలి అంటే ప్రతీ జీవి ఎంతో కొంత నాణ్యమైన, భద్రమైన, ఆదర్శమైన జీవనాన్ని తన తదుపరి తరాలకు మిగిల్చి వెళ్ళాలి.అదీ లక్ష్యం.

అరవిందుడు ఇంకాస్త ముందుకు వెళ్తాడు. తన సాధన ద్వారా ఆయన ప్రయాణం చేసినటువంటి సుక్ష్మ లోకాలు సావిత్రి పాత్ర ద్వారా తన ” సావిత్రి” లో నిక్షిప్తం చేశాడు సావిత్రి ఒక కావ్యానురూప యోగానుభవ ప్రకటన. ఇరవై నాలుగు వేల వాక్యాలు కలిగిన బృహత్ కావ్యం.1872 లో పుట్టిన అరవిందుడు తన 54 వ యేట మౌని గా మారిపోయి తదుపరి 24 యేళ్లు మౌనంగానే ఉండిపోయారు. 1930లో సావిత్రి రచనను మొదలు పెట్టి చాలాకాలం తన యోగానుభవాలను చేరుస్తూ పోయారు. స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారునిగానున్న అరవిందుడు అలీపుర్ కుట్ర కేసులో జైలు శిక్ష అనుభవించే క్రమంలో ఆధ్యాత్మిక అనుభవాలను పొందినట్లు రాశారు. అప్పటినుంచి యోగిగానే జీవించారు.ఆయన రూపొందించిన భక్తి, కర్మ, రాజ యోగాల ఆచరణ , అది సూప్ర మైండ్ థియరీ లేదా పూర్ణ యోగంగా చెప్పబడింది. మానవ మేధస్సులో అనేక స్థరాలు వున్నాయని దానిని కనుగొనే అవకాశం ఉందని చూపారు. అయితే దీనిని విమర్శించిన వారూ ఉన్నారు. అరవిందుడు దీర్ఘకాలం మౌనంగా ఉండడమూ దీనికి ఒక కారణము.

అరవిందుడు మొదట విప్లవకారుడు, దేశాభిమాని.తన దేశ ప్రజలకు యే సందేశం ఇవ్వలేదా అని అనుకున్నప్పుడు ఒక భావన కలిగింది. “పెద్దపులి ఆత్మకథ ” లో ఆర్కె నారాయణ్ , భారత దేశాన్ని పెద్దపులితో పోల్చుతారు. నాకు అరవిందుడి సావిత్రిలో జ్ఞానంతో మూడు కన్ను కలిగి ఉన్నా అజ్ఞానంతో దానిని కోల్పోయి రాజ్య భ్రష్ఠుడైన రాజు ద్యుమత్సేనుడిగా భారత పాలకులూ, అతని విరోధులుగా పరదేశ పాలకులూ కనిపించారు. మరణించి మళ్లీ జీవించిన సత్యవంతుడు ఈ దేశ స్వాభిమానం , దానిని సాధించిన సావిత్రి అదే ఆ వెలుగు సామాన్యుని సాధన లేక పోరాటం.
మనం మన అస్తిత్వాన్ని మర్చిపోవడమే నిజమైన మృత్యువు, మన ఆస్తిత్వం మనం నిలబెట్టుకోవాలని అనుకుంటే నచికేతుడు వలె ప్రయత్నం చేయాలి, సావిత్రి వలే మన దేశమాతకి చూపునివ్వాలి. స్వాభిమానంతో జీవించాలి.సాధనా సమన్వయంతో ఇది సాధ్యం.ఇది నాకనిపించిన ఒక భావన.

ఇది స్థూలంగా అరవిందుడి సావిత్రిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే సుదీర్ఘ వివరణ. తెలుగులో వచ్చిన సావిత్రిని చదివి సులువుగా వారి కావ్యంలోకి ప్రయాణించవచ్చు. అనుసృజన, అనువాదం రెండూ అందుబాటులో ఉన్నాయి. అందరికీ సావిత్రి అవగాహన సులభతరం అవుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను.

దేవనపల్లి వీణావాణి
17.03.2024

March 17, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

స్నేహం ముద్దు, యుద్ధం వద్దు

by ఒద్దిరాజు మురళీధరంరావు March 17, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగనగా ఒక రాజు. అతని పేరు పగ్నాషియన్‌. అతనికి బాల్యం నుండి కొట్లాట ఆటలే ఇష్టము. చెక్క గుఱ్ఱం ఎక్కి కఱ్ఱ ఖడ్గం తిప్పుతూ ఊగుతూ సంతోషంగా ఆడుకునేవాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. యువరాజు అయ్యాడు. అతను రాజు అయిన వెంటనే మావుడ్‌ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
అతను ప్రతీ యుద్ధంలో పాల్గొనేవాడు. అతనికి ఎప్పుడు యుద్ధకాంక్షే. అతను ఎప్పుడూ స్నేహం వద్దు, యుద్ధం ముద్దు అనుకునేవాడు. అతని యుద్ధాల వలన పక్క రాష్ట్రాల రాజులకు కష్టం, నష్టం జరుగుతుండేది. ఈ తలనొప్పి తగ్గించుకోవడం కోసం పక్క మూడు రాష్ట్రాల రాజులు కలిసి ఒక ఒడంబడిక చేసుకున్నారు, ఇతనికి గుణపాఠం నేర్పాలని. ఇతనిపై సవాలు విసిరారు.
ఇది సామాన్యమైన యుద్ధం కాదని భార్యతో చెప్పాడు. తను ఒక సంవత్సరం వరకు తిరిగి రాకపోతే తను ప్రపంచంలో లేననుకొని లేక జైల్లో బంధించబడినానని అనుకొని నీవు స్వేచ్ఛగా వేరే వివాహం చేసుకో అని చెప్పాడు. అంతవరకు ఒంటరిగా వుండలేవు కాబట్టి నీవు రాత్రిళ్ళు పొద్దుపోయే వరకు మన న్యాయశాఖ పెద్ద గుమాస్తాచేత పుస్తకాలు చదివించుకో. అతను ప్రపంచంలో జీవించి లేననుకోమనే మాట ఆమె మనసుకు బాధను కలిగించింది. అయినా ఒంటరిగా కాలక్షేపం చేయడం కష్టమనుకొని భర్త చెప్పిన పెద్ద గుమాస్తాతో రాత్రిళ్ళు పుస్తకాలు చదివించుకుంటూ వుండమన్న మాట కొంత నయమనుకుంది.
ఆ పెద్దగుమాస్తా కోటలో వున్న పుస్తకాలన్నీ అరడజన్‌ సార్లు ఇదివరకే చదివేశాడు. అతను చాలా గౌరవంగా రాణీగారికి కొన్ని పుస్తకాలు, మరికొన్ని ఆయన రాసినవి ప్రతిరోజు చాలాసేపు వరకు చదివి వినిపించేవాడు. ఆమెగారు అతనితో సంతోషంగా మాట్లాడుతూ ఆ కథలన్నీ వింటూ ఒక సంవత్సరంపైన ఒక దినం కాలం గడిపింది.
భర్త చెప్పిన కాలం గడిచింది కాబట్టి, గుమాస్తాతో తనను వివాహం చేసుకోమని కోరింది రాణి. దానికి గుమాస్తా నేను ధన్యుడను మహారాణి. కానీ నేను చాలా మామూలు వాడిని. మీరు రాజ వంశీయులు. అదీగాక రాజు ఏదైన జైలులో బంధింపబడి ఉండవచ్చు. నాకు ఇష్టం లేదని చెప్పను కాని, ఇంకొక సంవత్సరం, ఒక దినం వేచి ఉండటం మంచిదన్నాడు. ఆ సమయం కూడా గడిచింది. కానీ రాజు రాలేదు.
రాజు పగ్నాషియస్‌ యుద్ధంలో చంపబడలేదు. కానీ అతడ్ని గాయపరిచి రెండు సంవత్సరాలు జైలుశిక్ష విధించాడు రాజు లిటిల్‌ గోర్ము. అతను మూడు ప్రక్క రాష్ట్రాల ప్రతినిధి రాజు. ఆ సమయం గడిచాక రాజు పగ్నాషియస్‌ ను అతను జైలు నుండి విడిపిస్తూ ఇప్పుడు నీకు యుద్ధకాంక్ష జబ్బు కుదిరందనుకుంటా అన్నాడు. ఇకముందు నీపై జాలి చూపను. యుద్ధభూమిలో పట్టుబడితే నీ తల నరికేయబడుతుంది. ఇప్పుడు నిన్ను వదిలి పెడుతున్నాను. రాజు లిటిల్‌ గోర్ము, పగ్నాషియస్‌ గుఱ్ఱాన్ని జుర్మానా కింద తన వద్దనే ఉంచుకున్నాడు. కాబట్టి పగ్నాషియస్‌ తన ఇంటికి నడిచి పోవలసి వచ్చింది.
అతను నడిచి నడిచి చివరకు తన కోట చేరేవరకు అక్కడ పెండ్లికి జోరుగ తయారీలు అవుతున్నాయి. ఎందుకనగా గుమాస్తా పెట్టిన రెండు సంవత్సరాల ఒక దినం గడువు పూర్తి అయింది. పగ్నాషియస్‌ అప్పటికి రాలేదు, కాబట్టి గుమాస్తా వివాహానికి ఒప్పుకున్నాడు.
అప్పుడు ఆ రాణి ఆ గుమాస్తా తను మామూలువాడినన్న మాటను మదిలో ఉంచుకొని, అతడిని రాజవంశంలో చేర్చి, రాజ్య వ్యవహారాలు చూచే అర్హత ఇచ్చింది. ఇప్పుడు అతను ఆమెకు తగిన వాడైనాడు. వారు వారి పెండ్లి వేడుకలకు గొప్ప ఏర్పాటు చేశారు. దానికి దూర దూరాలనుండి రాజులు, ధనికులు, గొప్పవారు అక్కడికి చేరారు. వచ్చిన వారిలో రాజు లిటిల్‌ గోర్ము రాణి మావుడ్‌ కు శుభాకాంక్షలు తెలిపాడు, కాని రాజు పగ్నాషియస్‌ గురించి ఏమీ అడగలేదు. కేవలం ఒక ముసిముసి నవ్వు నవ్వాడు.
విందు భోజనాలు చివరకు వచ్చేవరకు పగ్నాషియస్‌ కోట వద్దకు చేరాడు. ఆ చింపిరి వెంట్రుకల నెత్తితో, చిరిగిన గుడ్డల్లో ఉన్న తమ రాజును ఖడ్గం మరియు గుఱ్ఱం లేనందున ఎవరూ కూడా గుర్తించలేదు. పగ్నాషియస్‌ బాధతో కన్నీరు కార్చాడు. తను యుద్ధం వలన రాజ్యాన్ని, ధనాన్ని, చివరకు తన భార్యను కూడా పోగొట్టుకున్నానని అంటూ మూల్గాడు. నా పని అయిపోయిందన్నాడు. నౌకర్ల ఇండ్లలో అతనికి ఒక కోడి కాలును తినేందుకు ఇచ్చారు. అది తిని నోరు మరియు కండ్లు తుడుచుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. కనీసం తన పాత రాజ్యంలో మరెప్పుడూ కనబడలేదు. అతను చివరకు అనుకున్నాడు. స్నేహం ముద్దు, యుద్ధం వద్దు. అది ఆనాటికే కాదు, ఏనాటికైనా అదే సత్యం .అదే క్షేమం. ఇదే అతనిలో కలిగిన పరివర్తన.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మరుగుపడుతున్న పేర్లుఆచారాలు

by Acharya Madireddy Andamma March 17, 2024
written by Acharya Madireddy Andamma


ఆధునిక నాగరికత, శాస్త్రవిజ్ఞానాభివృద్ధి చెందడం, ఉద్యోగరీత్యా సమయం లేకుండా ఉండడం, వృత్తులు, జీవనోపాధులలో మార్పులు రావడం, మతాలు మారడం, వలసలు వెళ్లడం, హేతువాదం మొదలైనవన్నీ ఆచారాలు మారడానికి కారణాలు.

వ్యక్తికి సంకేతం పేరు. అందువల్లనే ప్రపంచంలోని కోట్లాది మనుష్యులకు కోట్లాది పేర్లు ఏర్ప డ్డాయి. ఈ కోట్లాది మనుష్యుల్లో వ్యక్తులను పోలిన వ్యక్తులు ఉండడం అరుదేమోగానీ పేరును బోలిన పేర్లు అనేకంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తులను వారి ఇంటిపేరుతోగానీ, తండ్రిపేరుతోగానీ, ప్రాంతం, రంగు, రూపు, ఆకారస్వరూపం, వయసు మొదలైన వాటిని జోడించిగానీ పిలవడం కద్దు. ఈ సువిశాల ప్రపంచంలోని ఇలాంటి పేర్లను, ఓ పట్టిక రాసి, పరిశీలించిచూస్తే అనేక విషయాలు వెలి కి వస్తాయి. కొన్నిపేర్లు చాలా వరకు మరుగున పడిపోయాయి. కొన్నిపేర్లు ఒకనాడు సర్వసాధారణంగా నూ, ఆ తర్వాత అసాధారణంగానూ, ఈనాడు వింతగానూ అనిపిస్తాయి. అంతేగాకుండా ఈ పేర్లను పరిశీలనాదృష్టితో చూసినపుడు సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా కనిపిస్తుంది. కొంతకాలం క్రితం వరకు ప్రతి ఒక్కరు ప్రకృతి మీదనే భారం వేసి, ‘నారు పోసినవాడు నీరు పొయ్య డా, కిస్కా కిస్మత్ ఉన్కే సాత్, పుట్టేవాడు రాముడౌతాడో, రావణుడౌతాడో (రాకాసుడౌతాడో’ అని కుటుంబనియంత్రణ పాటించకుండా పిల్లలను కంటూ ఉండేవారు. ఇప్పటికీ కొన్ని మతాలవారు, కొన్ని ప్రాంతాలవారు, మూఢవిశ్వాసాలు అధికంగా ఉన్నవారు, అదే పని చేస్తున్నారు. ఎవరైనా ఇద్దరు కొత్తవా రు కలిసినపుడు సర్వసాధారణంగా అడిగే ప్రశ్న ‘మీకు పిల్లలెంతమంది, ఏంచేస్తున్నార’ని అడుగుతారు. కాని ‘నీకెంత ధనముంది, ఎంత సంపద ఉంది’ అని అడగరు కదా’ అని వారి సంతానాపేక్షను సమర్థించుకుంటారు. వీరి సంతానాపేక్షకు తగినట్టుగానే ఆ కాలంలో అరడజనుకు తక్కువగా పుట్టకపోయే వారు. పిల్లలు కలగని వారికి అసలే కలగక పోయేవారు. కొందరు ఇద్దరు, ముగ్గురు భార్యలను చేసుకు న్నా సంతానం కలుగకపోయేది. మరి కొందరికి పుడుతూ గిడుతూ ఉండేవారు. సంతానం లేనివారు, సంతానం పుడుతూగిడుతూ ఉండేవారు.
సంతానం లేని వారు ఎదురైన దేవుళ్లకూ, రాళ్లకూ, రప్పలకూ, దయ్యాలకూ భూతాలకూ దండాలు ద స్కాలు పెడుతుండేవారు. మరికొందరు నాగుపాము, త్రాచుపాము శాపం తగిలిందనుకునేవారు. అందు వల్లనే గర్భస్రావం అవుతుందనుకునేవారు. సంతానం పొందడానికి, వారిని సంరక్షించుకోవడానికి నానా తిప్పలు పడుతుండేవారు. ఈ రోజుల్లోనూ సంతానం కోసం కుటుంబ వ్యక్తులు పడేపాట్లను వార్తాపత్రికల్లోనూ, టి.విల్లోనూ వార్తలుగా చూస్తూనే ఉన్నాం. ఈ తాపత్రయాలు పురాణకాలంనుండి ఈనాటి వరకూ – స్పష్టంగా వారు ఆచరించే ఆచారాల్లోనూ, సంతానానికి పెట్టుకునే పేర్లలోనూ కనిపి స్తున్నాయి. ముందుగా పుడుతూగిడుతూ ఉండే పిల్లలకోసం చేసే ఆచారాల గురించి తెలుసుకుందాం.
గ్రామాల్లో ఇంటివద్ద గర్భిణీస్త్రీ ప్రసవమైతే, శిశువు జన్మించగానే, వారిమీద కలినీళ్లు (కూరాడు కుండలోని నీళ్లు) చల్లి, మెత్తటి బట్టతో తుడిచి, చేటలో ధాన్యం పోసి, మెత్తటి బట్టవేసి, అందులో పడు కో బెడ్తారు. ఇది మనఆచారం.
పిల్లలు పుట్టి చనిపోతున్నపుడు పెద్దలు చెప్పిన ఆచారాల ప్రకారం అన్ని ‘సాగుబాట్లు’ చేస్తే పిల్లలు గిట్ట డం లేదనీ, చనిపోతున్నారని, అందుకు భిన్నంగా చేస్తేనైనా పిల్లలు బతుకుతారేమోనని భావించి, అలా కూడా చేసేవారు. ఆ శిశువును పెంట (చెత్తకుప్ప)మీదనో, బొందలలోనో, గొయ్యిలోనో, గాలిధూళికి కాసేపు పడుకోబెట్టి, తీసుకొని వచ్చేవారు. లేదా వయసుపండిన వ్యక్తి తిన్న ఎంగిలి విస్తరాకులోనో, పుల్లాకులపైననో పడుకోబెట్టేవారు. కొన్నిసార్లు కడుపునిండా కన్నతల్లికి (అధికసంతానం ఉన్న తల్లికి) దత్తత ఇచ్చేవారు. ఆ తర్వాత వారికి ‘తాలో తౌడో, బియ్యమో నూకలో రూకలో ‘ ఇచ్చి, వారి నుండి కొనుక్కునేవారు. లేదా వారి నుండి ఆ సంతానాన్ని భిక్షంగా అడుక్కునేవారు. మరికొందరు ‘చాకటింటి గుడ్డ చలవ’ అని చాకలింటి నుండి ఓ గుడ్డ తెచ్చి, అందులో పడుకోబెట్టేవారు. ఇవన్నీ కూడా సంతాన పరిరక్షణకోసం చేసే చర్యలే. ఈ విధంగా చేసే వారి పనులను బట్టే ఆ పిల్లలకు పేర్లు బెట్టేవారు.
ఉదా:
పెంటమ్మ మీద పడుకో బెట్టేవారిని పెంటయ్య, పెంటమ్మ అనీ, బొందపైన పడుకో బెట్టేవారిని బొందె(ద)య్య, బొందె(ద)మ్మ అనీ, విస్తరి మీద పడుకో బెట్టేవారిని ఇస్తారి, ఇస్తారమ్మ అనీ, పుల్లాకుల మీద పడుకోబెట్టే వారిని పుల్లయ్య, పుల్లమ్మ అనీ, గాలిలో ధూళిలో పడుకోట్టే వారిని గాలయ్య, ధూలయ్య అనీ ఇలా శిశువును దేని మీద పడుకోబెడే ఆ పేరు పెట్టేవారు.
—
శిశువును ఎవరికైనా దానం ఇచ్చేవారు. వారిని ప్రతిఫలం ఇచ్చి కొనుక్కునేవారు. ఆ మారకం (ప్రతిఫలం) వస్తువు తాలు, తౌడు, రొక్కం, రూక మొదలైనవి ఏవైనా కావచ్చు. అలా కొనుక్కున్న వారికి ఆయా వస్తువుల పేరు ‘తాలయ్య, తౌడయ్య, రొక్కమ్మ, రొక్కయ్య’ అని పేరు పెట్టే వారు. దానం ఇచ్చి తీసుకున్న వారిని దానయ్య, దానమ్మ అనీ, భిక్షం ఇచ్చి, మళ్లీ అడుక్కొని తెచ్చుకున్నవారిని భిక్షం, బిక్షమయ్య (బిచ్చం, బిచ్చమయ్య), బిచ్చపమ్మ అనీ పేరు పెట్టేవారు.
స్త్రీ ప్రసవించిన తర్వాత అలసటతో నిద్రించినపుడు, తల్లికి తెలియకుండా శిశువును బంధువు లు ‘దొంగలు’ ఎత్తుకొనిపోయినట్లు ఎత్తుకు పోయేవారు. మెలకువ వచ్చినతర్వాత శిశువుకోసం తల్లి రోదిస్తున్న సమయంలో ఆ శిశువును వెదకినట్లుగా చేసి, తల్లికి తెచ్చి ఇచ్చేవారు. దొంగలు ఎత్తుకు పోయిన ఆ శిశువుకు ‘దొంగయ్య’ అని పేరు పెట్టేవారు.
కొందరు ఏడు ఇండ్లల్లో భిక్షమడిగి తెచ్చిన సొమ్ముతో పంచలోహాలతీగను, ఒక ముత్యాన్ని, పగు(గ)డాన్ని కొంటారు. ఆ తీగకు పగడాన్ని, ముత్యాన్ని గుచ్చి విడిచెవుకు, విడిముక్కును కుట్టించి, పెట్టేవారు. కుడిచెవి, ఎడమ ముక్కుడానీ, ఎడమచెవి, కుడిముక్కును గానీ విడిముక్కు, విడిచెవి’ గానీ కుట్టిస్తుంటారు. భిక్షం అడిగి సంపాదించిన సొమ్ముతో విడిముక్కు విడిచెవి కుట్టించిన పిల్లలకు కూడా ‘భిక్షం, భిక్షమయ్య, బిచ్చపమ్మ’ అని పేరు పెట్టేవారు. ఇప్పటికీ ఇలాంటి పేర్లున్నవారు, ఆ తాలూకు చిహ్నాలు ఉన్నవారు మనకు కనిపిస్తుంటారు.
మొగులయ్య, మొగులమ్మ అని పేర్లు రావడానికి అనేక కారణాలున్నాయి. 1) కొంతమందికి ‘మొగుళ్లజబ్బు’ వస్తుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడంతో, కడుపు ఉబ్బి, శ్వాస తీసుకోవ డం చాల కష్టంగా ఉంటుంది. ఆ జబ్బువచ్చిన తర్వాత బతికిన వారికి కూడా ‘మొగులయ్య, మొగుల మ్మ’ అని పేరు పెట్టేవారు. 2) మరి కొందరు మొగుళ్లు (మబ్బులు) వచ్చిన సమయంలో పిల్లలను ఆరుబయట పండుకోబెట్టి వారికి మొగులయ్య, మొగులమ్మ అని పేరు పెట్టేవారు. 3) వానాకాలంలో బాగా మబ్బులు పట్టి, వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు, పసిపిల్లలకు శ్వాసపీల్చుకోవడం చా లా కష్టమవుతుంది. కడుపు ఉబ్బుతుంది. అలాంటి వారికి కడుపు పైన నూనె, పసుపు రుద్ది, జిల్లేడుపా లు గానీ, తమలపాకులు గానీ పెడుతుండేవారు. మంత్రాలు వేయించేవారు. ఈ జబ్బువచ్చి, బతికి బట్ట కట్టిన వారికి కూడా ‘మొగులయ్య, మొగులమ్మ’ అని పేరు పెట్టేవారు.
ఇలా అనేక బాలారిష్టాల నుండి శిశువు బయటపడి, ఎదిగే వరకు చేసే కొన్ని తతంగాలు కూ డా ఉన్నాయి. ఉదా: వెట్టికి పెంచడం.
పిల్లలను అపురూపంగా, ప్రేమగా పెంచడం వల్ల వారు అపురూపమై పోతున్నారని (మరణిస్తు నారని) భావించి, వారిని వెట్టికి పెంచుతారు. గారాబంతో చూడరు. వారి పట్ల తగిన శ్రద్ధ తీసుకోకుం డా, వెట్టికి పెంచినట్లు పెంచేవారు. అలాంటి వారికి చీమిడి కారుతున్నా, ఈగలు వాలుతున్నా, ఆకలై ఏడుస్తున్నా, అంతగా పట్టించుకోరు. సరైన బట్టలు గానీ, అందమైన బట్టలు గానీ వేయరు. కొత్తబట్టలు అసలే వేయరు. మంచిపేరు పెట్టరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిల్లిపాది తమ మనసును, మమ తానురాగాలను చంపుకొని, ఈసడించుకుంటూ పెంచుతారు. వారు వెట్టిగా పెంచిన విధానానికి తగిన ట్టుగానే వారికి ‘ఎ(వె)ట్టయ్య, ఎ(వె)ట్టమ్మ’ అని పేర్లు పెట్టేవారు.
నరదృష్టి (కొందరిది) మంచిది కాదని, వారి దృష్టి ఎక్కడ పడితే అక్కడ, వారి దృష్టిదోషం వల్ల నష్టం జరుగుతుందని జానపదులు నమ్ముతారు. వారి సంతానానికి దృష్టిదోషం తగలకుండా వారి పిల్ల లకు కనుబొమల మధ్యన (ముక్కు,నొసలు కలిసే చోటు) లేదా గదుమ(చుబుకం) మీద పచ్చబొట్టు పొడిపిస్తారు. శరీరం పైన ఎలాంటి మచ్చలు లేనివారిని, అంగవైకల్యం లేనివారిని, అందమైన వారిని పూర్వకాలం పెద్దపెద్ద కట్టడాలకు, నిధులకు, చెరువులకు, కుంటలకు తరచుగా బలిచ్చేవారు. అంగవైక ల్యం ఉన్నా, పచ్చలు, మచ్చలు, ఉన్నా బలులివ్వరు. (అంతా ఒకందుకు మంచిదే అని మనం చిన్నప్పు డు విన్న రాజు, మంత్రి కథ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు). అంతేగాకుండా అందంగా ఉన్న వారిపై మంత్రాలు నేర్చుకున్నవారు మంత్రానికి ‘పాటి’ చూసుకునేవారు (కుంటారు). పాటి అంటే మంత్రం ఫలిస్తుందా? లేదా? అని ప్రాక్టికల్స్ చేసి, చూసుకోవడం. ‘పాటి చూసుకోవడానికి పనికి రాకుండా కూడా ముక్కుపైన అడ్డంగా పచ్చబొట్టు పొడిపించేవారు.
మరికొన్ని పేర్లు ఆయా వ్యక్తుల ఉనికిని, సంఘటనలను తెలియజేస్తాయి. రెక్కాడితేగాని డొక్కా డని జీవులు కూలికోనాలకో, కట్టెకో పిడకకో, చేనుకో, అడవికో వెళ్తారు. ఇలాంటి పని నిండుచూలాలికై పచ్చిబాలెంతకైనా తప్పదు. నిండుచూలాలు పనికివెళ్లి, తిరిగిరావడానికి వెళ్లే పరిస్థితుల్లో ఏ అడవి లోనో ప్రసవించాల్సి వస్తుంది. ఆ విధంగా ఆగంగా ఆగంగా జన్మించినవారికి ఆ సంఘటనకు గుర్తుగా ‘ఆగయ్య, అడవయ్య, ఆగమ్మ అడివమ్మ ‘ అని పేర్లు పెట్టుకుంటారు. పిల్లలు దక్కని వారుకూడా అడ విలో పడుకోబెట్టి, తిరిగి తెచ్చుకొని, అవే పేర్లు పెట్టుకుంటారు.
ఇవేగాకుండా పిచ్చమ్మ, పిచ్చయ్య, బుచ్చమ్మ, బుచ్చయ్య, డొడ్డమ్మ, డొడ్డయ్య, ఉచ్చమ్మ, రొక్క(ల)మ్మ అనే పేర్లు కూడా ఒకనాడు సాధారణం. ఈనాడు ఇవి వింత పేర్లే. కానీ, ఒకనాడు సర్వ సాధారణం.
ప్రభుత్వం కుటుంబనియంత్రణా కార్యక్రమం చేపట్టనపుడు కూడా ప్రజలు దానిని ఆచరించిన ట్లు తెలుస్తుంది. అందుకుగాను వారు ఆపరేషన్లు చేయించుకోలేదు. భావజాలాన్ని ఉపయోగించుకున్నా రు. భగవంతుని మీద భారం వేసి, పిల్లలు ఇక చాలు, పిల్లలు వద్దనుకొని, అందరికన్నా చిన్నవారికి ‘సాలయ్య, సాలమ్మ (చాలు అయ్య, చాలు అమ్మ)’ అనీ పెట్టుకునేవారు. ‘ముద్దుకు మొద్దోడు’ అని పిలి చినట్లు, వింతగా మనకు అనిపించినా అవి ఒకనాటి మానవుల మనస్తత్వాన్ని, వారి ఆలోచనాసరళిని, ప్రకృతితో మానవుడికున్న అనుబంధాన్ని, గతం తాలూకు వాసనలను, అనుభవాలను, వాటిని వదలలే ని మానవుడిని మనకు గోచరింపజేస్తాయి.
ఆ పేర్లను బట్టి ఆ వ్యక్తులు ఏ ప్రాంతం వారో, ఏ మతం వారో తెలుసుకోవడానికి కూడా ఉపయోగ పడ్తాయి. దంపతులకు ‘సంతానం ఇచ్చే దైవం ముఖ్యం గానీ మతం కాదు. ఆ దైవం తమ మతం వాడా, ఇతర మతం వాడా అని ఆలోచించరు. ఈ కారణంగా తెలుగువారి పేర్లలో ముస్లింమతా నికి చెందిన పేర్లు, క్రిస్టియన్ మతానికి చెందిన పేర్లు కనిపిస్తుంటాయి.
దంపతులు దర్గాల వద్దకు వెళ్లి వచ్చింతర్వాత వారికి జన్మించిన సంతానానికి ఆయా దేవుళ్ల పేర్లు పెట్టుకుంటారు. ఉదాహరణకు – జానయ్య, జంగయ్య, జంగమ్మ, సైదయ్య జానపాడ్ సయ్యద్ ను, జహంగీర్, కాశిం మొదలైన పేర్లు అలాంటివే. పిల్లలను గిట్టించుకోవడానికి వింతైన మరో ఆచా రం, మరో ప్రయత్నం – లింగ సహజం కాని పేర్లు పెట్టడం. పేరు చివర ‘అమ్మ’ను చేర్చి మగపిల్లలకు ‘అయ్య’ను చేర్చి ఆడపిల్లలకు పేరు పెడుతుండేవారు. ఉదా: కిష్టమ్మ (మగవాళ్లపేరు, వేములకొండ గ్రామం, నల్లగొండజిల్లా)
పేర్లను బట్టి కూడా కొన్నిసార్లు – వారు ఏ ప్రాంతం వారో తెలుసుకోవడానికి అవకాశం ఉం టుంది. యాదగిరి పేరు వినగానే ఇది తెలంగాణవారి పేరనీ, మునయ్య, మునమ్మ అనగానే రాయల సీమ వాళ్ల పేర్లనీ, పైడితల్లి, పైడయ్య, పైడమ్మ విజయనగరం వారి పేర్లనీ చెప్పవచ్చు. అప్పయ్య, అప్ప లమ్మ. సింహాచలం (శ్రీకాకుళం), మస్తానమ్మ, మస్తానయ్య పేరు వినగనే గుంటూరు ప్రాంతం వారనీ తెలుసుకోవచచ్చు. ఉస్మానియావిశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సుదీర్ఘకాలం తన సేవలందించిన కీ.శే. ఆచార్య నాయనికృష్ణకుమారి గారిని ఆమె ఇంటివారు, బంధువులు ‘మస్తానమ్మ’ అనే పిలిచేవారు. మొట్టమొదటి మన హైకోర్టు న్యాయాధిపతి పేరు మస్తానయ్యనే.


తెలుగువారు సాధారణంగా శిశువు జన్మించిన పదకొండవరోజు ‘పురుడు’ చేస్తారు. ఆ రోజు పేరంటాళ్లను పిలిచి, మంతస్రానితో శిశువుకు ‘పేరు’ పెట్టిస్తారు. మగపిల్లలకైతే ఆ రోజు ‘మొలదారం, మొల్దారం’ కూడా కడ్తారు. అకాలమృత్యువు పొందే పిల్లలకు నిర్ణీతదినం(11 వరోజు) కాకుండా ‘దొంగ పురుడు’ లేదా ‘కుక్కపురుడు’ చేస్తారు. అంటే పురుడును ముందే పదకొండ(11)వ రోజు కాగుండా 3, 5, 9రోజుల్లో – ఏదో ఒక రోజు చేస్తారు. బంధువులకు ఎవరికి తెలియకుండా చేసేది దొంగపురుడు. బంధువులను పిలిచి, విందు మొదలైనవి చేయకుండా కుక్కకు అన్నం పెడితే అది ‘కుక్క పురుడు’. కాలక్రమేణ ప్రజలు విద్యావంతులు కావడంతోనూ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరగడంతోనూ నమ్మకాలపైన చెప్పుకున్న ఆచారాలు తగ్గినాయి. ఇలాంటి (ఒకనాటి) ఆచారాలు, పేర్లు మరుగునపడిపోతున్నాయి.


ఇటివల కాలంలో 21వరోజు నామకరణ మహోత్సవమని చేస్తున్నారు. కాని నిజానికి అది డోలారోహణ మహోత్సవానికి ఆ రోజు 21వ రోజు శిశువు తల్లిని (బాలెంతను) బావికి తీస్తారు. ఆ రోజు నుండి బాలెంత ఇంటి పని చేసుకోవచ్చు. ఎవరినైనా పెద్దవారిని వరసవాయి, పెద్దా చిన్నా అనే గౌరవం లేకుండా, పేరు పెట్టి పిలిస్తే – ఏమిరా! ‘బొడ్డుగోసి పేరు పెట్టినావురా?’ అని తిడ్తారు. సంతానం కలుగుతున్న కొద్ది, కొందరి కుటుంబాల్లో ఒక్కొక్కరకి రెండు రోజులు చొప్పున తగ్గించుకుంటూ పురుడు, బారసాల చేస్తారు. ఉదా : ‘పాశం’ ఇంటి పేరు కలిగిన గౌండ్లవారు, ముకునూరు గ్రామం, ఇబ్రహీం పట్నం మండలం.
ఇలాంటి ఎన్నో ఆచారాలు, మూఢ విశ్వాసాలు తగ్గుముఖం పట్టినాయి.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కాలం మారింది

by Dr. Dasoju Padmavati March 17, 2024
written by Dr. Dasoju Padmavati

సాయి,తేజ బడి నుంచి రాగానే నాన్నమ్మ, తాతయ్య దగ్గరకు పరుగు తీశారు.

నాన్నమ్మా–నానమ్మా ! “ఓ మంచి కథ చెప్పవా”! అంటూ బుద్దిగా కూర్చున్నారు.

“అలాగే చెపుతానురా! శ్రద్ధగా వినాలి మరి” అంటూ చెప్పుకొచ్చింది నాన్నమ్మ. ఓ కాకమ్మ కథను.

ప్రకృతి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న పసిబిడ్డ లాంటి చల్లని పల్లె ఆ ఊరు.పచ్చదనానికి పెట్టింది పేరు.

ఊరి పొలిమేరలో ఉంది పురాతన కాలం నాటి శివాలయం.

ఆ ఆలయ ప్రాంగణంలో గున్న మామిడి చెట్టు మీద తన పిల్లలతో కాపురం వుంటుంది ఓ కాకమ్మ.

ఆకసమంతా విహరించి తన పిల్లల కోసం ఆహారం సేకరించి తినిపిస్తుంది.

ఓ రోజు ఆ చెట్టు కిందికి వచ్చింది ఓ నక్క.

ఆత్మీయంగా మిత్రున్ని ఆహ్వానించింది తన రెక్కల రెప రెపతో కాకి.

ఇంకేముంది–తన సహజ స్వభావానికి
పదును పెడుతూ– మిత్రమా ! అంటూ ప్రేమగా పిలిచింది. కుశల ప్రశ్నలు అడిగింది నక్క.

నీ మధుర గానంతో నాకు వినుల విందు చేయమని కోరింది.

“నేనా!” అంటూ సంశయం వ్యక్తం చేసింది కాకి.

నీవే! నీవెవ్వరు? కోకిలమ్మ ఇంటి పంటవు.

పుట్టింటి గళ మాధుర్యం ఎక్కడికి పోతుంది అంటూ ప్రశంసల జల్లు కురి పించింది.

నోటిలోని ముక్కను కాళ్ళ మధ్య పెట్టుకొని రాగాన్ని అందుకుంది కాకి.

నీ గాన మాధుర్యానికి నేను మై మరిచిపోయాను.
ఓసారి నాట్యం కూడా చేయవా ! అంటూ మరో ఎత్తుగడకు సిద్ధ మయ్యింది

ఓ అదెంత భాగ్యం! ఆడుతూ పాడుతాను. పాడుతూ ఆడించగలను అంటూ తన కాళ్లలోని మాంసం ముక్కలు చెట్టు కొమ్మల్లో పెట్టి ఆ రసాలసాల వేదికపై తన గాన కచేరి చేసింది.

నీ గానం, అభినయం అద్భుతం మిత్రమా!

మరి!
నేను వస్తాను! అంటూ మరో ప్రణాళికను రచించడానికి దారి వెతుక్కుంటూ ముందుకు సాగింది నక్క.

నీవు ఎందుకు వచ్చావో! నాకు తెలుసు అనుకుంది మదిలో వాయసం.

మిత్రమా! మిత్రమా– కారణం ఏదైనా- నీవు నా ఇంటి ముందుకొచ్చిన ఆత్మీయ అతిథివి.

అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం. అంటూ తన పిల్లల కోసం తెచ్చిన ఆహారంలో ఓ నాలుగు ముక్కలు కిందకు వేసింది.

మిత్రమా! మోసం,ద్వేషం అపజయానికి సోపానాలు.

ఇచ్చిపుచ్చుకునే లక్షణమే స్నేహాన్ని కలకాలం నిలుపు తుంది సుమా!

మనలోని అనైక్యత మరొకరికి బలం కారాదు.

ప్రేమకు, విశ్వాసానికి, నిజాయితీకి, మానవులకు మనమే ఆదర్శం.

ఒకరి కష్టానికి ఒకరం ఆసరాగా నిలబడటం జీవితేచ్చను పెంచు తుంది.

మిత్రమా! నీకు నేనున్నాని ఏనాడు మరువకు–

అంటూ రివ్వున ఆకసాన ఎగిరింది వాయసం.

కృతజ్ఞతా పూర్వకంగా వాయసం ఎగిరిన వైపే చూస్తున్నది జంబూకం.

నాన్నమ్మ ! ఈ కథను తాతయ్య మరోలా చెప్పారు తెలుసా!అన్నారు పిల్లలు. అవును! నాన్న
కాలం మారింది.

ఈ కథను మీరు మరోలా చెప్పే ప్రయత్నం చేయండి. చూద్దాం అంది నానమ్మ.

అలాగే? నాన్నమ్మ.

ఈ “కథ మాత్రం చాలా బాగుంది ! అంటూ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు.


March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహిత్యము – హాస్యరసము

by Manjula Vani March 17, 2024
written by Manjula Vani

ఒక ప్రబంధమైనా, ఒక పురాణమైనా, ఒక గేయమైనా, ఏ రచనలోనైనా, అందులో రవ్వంత హాస్యరసము మిళితమై ఉన్నాగాని పఠితులు ఆ కావ్యరసానందాన్ని పొందలేరు.

మనిషి జీవితంలోని విషాదాలను, కష్టాలను మరిచిపోవాలంటే మనసారా నవ్వుకుంటే గాని వాటిని కొద్దిసేపైనా మరచిపోయి తన జీవనయాత్రను కొనసాగించగలడు. ”సంతోషమే సగం బలం” అన్న సామెత ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.

శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానకారి

భీభత్సాద్భుత శాంతాశ్చ రసారి పూర్వైరుదాహృతః

అని మన లాక్షణికులు మొదలు శృంగారానికి ఆ తర్వాత హాస్యానికే ప్రాధాన్యతనిచ్చారు.

శృంగారము కేవలము యౌవనుల మనములను మాత్రమే రంజింపజేయును. కానీ హాస్యము  సర్వవేళ సర్వావస్థలయందు ఆబాలగోపాలము నానందింపచేయును.

హాస్యము అనగా నవ్వు పుట్టించే సంఘటన, మాటలు, చేష్టలు, ఆకారాదులు.

”వికృతి దర్శనాది జన్యో మనోవికారః హాసః” స్వభావ విరుద్ధములగు వేషభూషాదుల వల్ల కూడా హాస్యము లేక నవ్వు గల్గును.

హాస్యరసమునకు స్థాయీభావము హాసము. ఇది 6 విధములుగా విభజింపబడింది.

1) స్మితము

2) హసితము

3) విహసితము

4) అవహసితము

5) అపహసితము

6) అతి హసితము

1. స్మితము : కొద్దిగా చెక్కిళ్ళు వికసింపజేసి, కనుబొమ్మలు కదిలించుచు, పండ్లు కనిపించకుండా మధురముగా నవ్వుట.

2. హసితము : ఎక్కువగా ముఖము, కన్నులు, చెక్కిళ్ళు వికసింపజేసి కొద్దిగా పండ్లు కనిపించునట్లు నవ్వుట.

3. విహసితము : లోలోపలనే మధురస్వరము కలుగగా, ముఖముపై రాగము జూపుచు, నోరగంట తిలకించుచు మంద్రముగా నవ్వుట.

4. అవహసితము : భుజాలు, తల అదులునట్లు ఓరచూపుతో ముక్కుపుటాలు లెస్సగా వికసింపజేసి నవ్వుట.

5. అపహసితము : తగిన కారణం లేకుండా కన్నీరు కారుస్తూ, భుజాలు, వెంట్రుకలు అదురునట్లు నవ్వుట.

6. అతిహసితము : కన్నులనుండి నీరు కారునట్లు చేతులు, కడుపు, పార్శ్వములదురునట్లు, కఠోరధ్వనితో కర్ణకటువుగా నవ్వుట.

ఇట్లు ఇన్ని రకాల నవ్వులు మన లాక్షణికులు నిర్వచించారు. మరియు ఇందులో

ఉత్తములు – స్మిత హసితులు గా,

మధ్యములు – అవహసిత, విహసితులుగా

అథములు – అపహసితాతి హసితులుగాను పేర్కొనబడ్డారు.

ఈ హాస్యము పుట్టుటకు నిర్ణీతమైన కాలముకాని, వస్తువుకాని, దేశముకాని, పదజాలముకాని లేదు. మానవుని చిత్తవృత్తిపై, అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. కొందరు ఎంత నవ్వించినను నవ్వరు. నవ్వేవారిని చూసి సహించరు. అందరినీ నవ్వించి, తాను నవ్వుతూ బాధలను మరిపింప చేసేవారు చాలా తక్కువ. ఇది దైవదత్తమగు ప్రతిభ.

”నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ

నవ్వుతూ చావాలిరా” అన్న పాట ఇందుకు నిదర్శనం.

వెఱ్ఱి వెంగళాయిలు, బొజ్జ బాపలు, గుజ్జు మనుషులు, నత్తి చెవిటి కుంటి గుడ్డి మొదలగు అంకవైకల్యపు వారి చేతలు, ముదుసలి మొగడు పడుచు పెండ్లాము జంట, బావామరుదుల సంభాషణ, వదినె మరదళ్ళ విసుర్లు, ఛాందసుల ప్రవర్తన, బుడ్డరుఖాను, బఫూను, పిసినారి మొదలగువారి చేష్టా విశేషాలు నవ్వు కల్గించును.

కాని ప్రకృతి వల్ల వచ్చిన స్థితిని చూసి నవ్వరాదు.

సామాన్యముగా నవ్వు ఆకస్మిక సంభవాలకు, పరధ్యానంగా ఉండేవారికి, వంకరటింకర మాటలకు, తిట్లకు, కొత్తపాత ఫ్యాషన్లకి, అలంకారాలు విపరీతమైన, పిరికితనానికి, భయానికి, వ్యర్థ కోపానికి, మిశ్రమ భాషా చేష్టాదులకు కల్గుతుంది.

తప్పర్థాలు, విశేషార్థాలు, అపార్థాలు, వికృతార్థాల వల్ల నవ్వు కల్గును.

ఖ.జు. డిగ్రీని మేకప్‌ ఆర్టిస్టు అనీ, ఔ.ఐబీ. డిగ్రీని బాటా షూ కంపెనీ అనీ, షికారును ఐనీలి ష ్పుబిజీ అనీ, మనిషిని ఖళిదీలిగి ష ఐనీలి అనీ అంటే నవ్వనివారికి కూడా నవ్వు వస్తుంది.

మాటలు మాట్లాడుటలో కూడా కొందరికి నవ్వు కల్గించును. మాలతి అనే అమ్మాయి వద్దకు వెళ్ళి మీరు మాలా? అనుటకు బదులుగా మీరు…. (అని కొంచెం ఆగి).. మాలా? అంటే అపార్థము కల్గి నవ్వు వచ్చును.

అదీగాక ఒకడు కాలుజారి పడ్డాడని నవ్వితే ఎంతో బాధ కల్గుతుంది. అన్ని సందర్భాలలో నవ్వు అంత మంచిది కాదు.

‘నవ్వంగ రాదు పలుమరు

నవ్విన చిఱునవ్వెగాని నగరాదెపుడున్‌’ అన్నట్లు, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా నవ్వితే అంత మంచిది కాదు. అనేకులు అనేక అర్థాలు తీసుకుంటారు.

నవ్వకు మీ సభలోపల

నవ్వకు మీ తల్లిదండ్రుల నాథుల తోడన్‌

నవ్వకు మీ పరసతితో

నవ్వకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !

అని సుమతీ శతకకారుడు బద్దెన కూడా అన్నాడు.

పెళ్ళిళ్లలో వియ్యాలవారి విందులు, వేళాకోళాలు నవ్వు పుట్టిస్తాయి.

బూతాడక నవ్వు పుట్టదన్నాడు గువ్వల చెన్నడు. కానీ బూతు ఉత్తమ హాస్యము కాదు.

నేటి మన సినిమాలల్లో వచ్చే హాస్యము వల్ల నవ్వుగాదు కానీ వెగటు కల్గిస్తుంది.

ఇద్దరాడవాళ్ళ సంభాషణలో ఒకావిడ ”మావారు కలెక్టరు” అంటే మరొకావిడ ”మావారూ బిల్‌ కలెక్టరు” అంటుంది .ఇది విన్నవారికెంతో నవ్వు వస్తుంది.

”నా భర్త డాక్టరు” అని ఒకావిడంటే, ”నా భర్త కండక్టరు” అని మరొక ఆవిడ అంటే నవ్వు రాక మానదు.

అసభ్యంగా వ్యక్తుల స్థాయిని గమనించక, దేశకాల పాత్రముల నెంచక, సంగతి సందర్భములు లెక్కించక, మోతాదు మించిక, శ్రుతి తప్పక, స్థాయి చెడక, మర్యాద విడవక, ఔచిత్యంగా, స్వారస్యంగా,  సవ్యంగా, నవ్యంగా, భవ్యంగా జనింపచేసే నవ్వే నవ్వు. తేలికగా సమయస్ఫూర్తిగా నవ్వింపజేసేదే నవ్వు.

మన తెలుగు సాహిత్యంలో చిలకమర్తివారి ప్రహసనములు, గణపతి, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం, అడవి బాపిరాజు గారి కొంటె కోణంగి, గురజాడవారి కన్యాశుల్కం, పానుగంటి వారి సాక్షి, మునిమాణిక్యం వారి కాంతం కథలు, విశ్వనాథ వారి ‘హాహాహూహూ” శ్రీశ్రీ వారి వారం-వారం మొదలగునవి ఉత్తమ హాస్యరచనలుగా పేర్కొనబడ్డాయి.

అంతేగాక వైద్యపరంగా కూడా మానవునికి హాస్యము ఒక టానిక్‌ లాంటిది. నవ్వు శ్వాసకోశాన్ని క్షాళనం చేయటము, శిరస్సుకు రక్తాన్ని తోడటము, మానసికశ్రమకు ఆటవిడుపుగా ఉండటం మొదలైనవి కల్గిస్తుంది.

ప్రస్తుతం వచ్చే దిన, వార, పక్ష, మాస పత్రికల్లో నవ్వు పుట్టించే జోకులు, కార్టూనులు తప్పక ఉంటాయి. కొన్ని హాస్యపత్రికలు కూడా వెలువడుతున్నాయి.

ప్రాచీన కవులలో కూడా హాస్యరసం పండించినవారు ఉన్నారు.

ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతంలో అర్జునుడు ద్రుపదుని పట్టితేగా ”వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులె ! అని ద్రోణాచార్యులచే మేలమాడించుట ఉత్తమ హాస్యానికి మచ్చుతునక.

అలాగే తిక్కన ఉత్తరుని ప్రగల్భములు, బృహన్నల హావభావ చేష్టలలో హాస్యరసమును గుప్పించాడు.

పోతన కూడా భక్తి శృంగారములతో పాటు యశోదమ్మతో, గొల్లపడుచులు ఫిర్యాదు చేయుట, చిలిపి చిన్ని కృష్ణుని అల్లరి చేష్టలలో హాస్యరసమును మేళవించాడు.

ఇక శృంగార కవియైన శ్రీనాథుడు తన చాటుపద్యాలలో ”జొన్నకలి జొన్న అంబలి” అంటూ, రాయలసీమలో నీటి కరువేర్పడినపుడు

‘సిరిగలవానికి చెల్లును

తరుణుల పదియారువేలదగ పెండ్లాడన్‌

తిరిపెమున కిద్దరాండ్రా

పరమేశా! గంగ విడువు పార్వతి చాలున్‌” అంటూ హాస్యపూరితములగు పద్యములను నుడివారు.

ఇక అష్టదిగ్గజముల వరకు పోతే తెనాలి రామకృష్ణుల వారి చేష్టలు, రాయల ఆస్థానమునకు విచ్చేసిన భట్రాజులను, పండితులను ఓడించుటలో హాస్యము కన్పించును. ఇతనికి ‘వికటకవి’ అని బిరుదుకూడా ఉన్నది. అతనికి హాస్యచమత్కృతికి మచ్చుతునకలు కొన్ని.

ఒకనాడు పింగళి సూరనగారు సభలో అష్టదిగ్గజములతో కొలువుతీరి ఉండగా ”తెనాలి రామలింగడు తిన్నాడు తట్టెడంత” అని అంటుండగానే వెంటనే సూరనగారిని పూర్తి చేయనివ్వకుండా రామకృష్ణుడు లేచి ”బెల్లం బెన్నగ మన పింగళి సూరన్నకు నోరంత పేడయై పోయెనుగా” అని చమత్కరించగా అందరూ నవ్వారు.

ఒకరోజు ఒక భట్రాజును ఓడించాలని

”మేకతోకకు మేకతోక మేకకుతోక

మేకతోకా మేక తోక మేక” అని మేకల మందను వర్ణింపగా అతడు అందులోని అర్థమును గ్రహించక ఓడిపోయి వెళ్ళాడు. ఇలా చెప్తూపోతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి.

అలా తన హాస్య చమత్కృతితో వచ్చిన ఉద్ధండ పండితులనందర్నీ ఓడించి పరాభవం గావించాడు.

ఈ విధంగా హాస్యము మనస్సుకు హాయిని కల్పించేదిగా ఉండాలి గాని, అది అపహాస్యమును కల్పించునదిగా ఉండరాదు.

”అన్నమయితే నేమిరా? మరి సున్నమయితే నేమిరా?” అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా! అంటే ఎంతో నవ్వురాక మానదు.

అట్లే సంభాషణలో చమత్కృతి కలిగినా నవ్వురాక మానదు. ఒకరిని అవమానపరుచబోయి, తానే నవ్వుల పాలవుట ఇందులోని అర్థం.

ఒక రెడ్డిగారు ఒక కవితో ”ఓహో! మీరు కపీశ్వరులా?” అని హేళన చేయగా, ఆతడు ”వే” పట్టినట్లు నీ నోట ”వీ” పట్టదేమి” అనగా ఆరెడ్డి అవనత వదనుడయ్యాడు. ఇట్లే ఒకరిని అనబోయి తానే తిరిగి అదే మాటను పొందుట వినేవారికి నవ్వు వచ్చును.

అలాగే మిశ్రమ భాషలో మాట్లాడినా, ఆంగ్లము-తెలుగు, సంస్కృతం-తెలుగు ఇలా మిళిత భాష విన్నా హాస్యం కలుగుతుంది.

‘ప్రథమం ఆవులించంత

ద్వితీయం కాళ్ళు చాపటం

తృతీయం త్రుళ్ళిపడటం

చతుర్థం లేచిపోవటం”

అన్న ఎవరికైనా నవ్వు వస్తుంది.

ది స్కై యీజ్‌ మబ్బీ

ది రోడ్‌ యీజ్‌ దుమ్మీ

ది మనీ యీజ్‌ కమ్మీ

ది ఫూల్‌ యీజ్‌ బ్యూటీ

అని వచ్చీరాని ఆంగ్లం తెలుగు మిళితం చేసి మాట్లాడినా హాస్యం కలుగక మానదు.

ఉచ్ఛారణా దోషం వల్లను, ఒక మాటకు రెండర్థాలున్నను నవ్వు వస్తుంది.

”కాఫీ తేరా” అంటే నోటుబుక్‌ (కాఫీ) తెచ్చిన నవ్వు వస్తుంది.

కావ్యానికి ప్రతిభ ఎంత అవసరమో, హాస్యసృష్టికి అంతే ప్రతిభ అవసరం.

నవ్వు జీవిత వికాసానికి ఊతకఱ్ఱ వంటిది. మనసారా నవ్వలేని వానికి ఆనందం కించిత్తైనా ఉండదు. జీవితం నిస్సారంగా ఉంటుంది. దుర్భరమవుతుంది. లేనిపోని అంతఃరోగములు వచ్చును. మంచిగా నవ్వు నేర్చినవారు, దుర్భరదురిత దుఃఖములను కూడా ఆనందమయములుగా చేసుకొంటారు. సంస్కృత తెలుగు మిళితమైన ఈ పద్యభావం

కక్షుధాతురాణాం న ఉడికిర్న ఉడకః

అర్ధాతురాణాం న చెల్లిర్న చెల్లః

నిద్రాతురాణాం న మెట్టర్న పల్లః

కామాతురాణాం న ముసలిర్న పిల్లః

అన్నచో నవ్వు పుట్టక మానదు.

మానవులెంత నవ్వగలిగితే అంత శరీరారోగ్యము కలుగుతుంది. నవరసాల్లో హాస్యరసము మాత్రమే మానవునికి ఆనందదాయకమును కల్గుజేయుననుటలో సందేహము లేదు. కడుపార తాను నవ్వి ఇతరులను నవ్వులలో ముంచెత్తేవాడే రసహృదయం కలవాడు.

విషాదంలోంచే హాస్యము జనించిందనే వింతవాదం కలదు. మానవునికెంత కష్టం వచ్చినా నవ్వుతూ బ్రతకడమనేది ఒక గొప్పవరం, కళ. అది సామాన్యంగా అందరికీ అలవడదు. అందరూ ఏడుస్తూ కూర్చుంటే, నవ్వించే వాడొకడుంటే, అందరూ తమ తమ బాధల్ని విస్మరించి, జీవితాన్ని ఆనందమయం చేసుకోగల్గుతారు.

అందువల్లే పూర్వం రాజుగారి కొలువుల్లో విదూషకులుండేవారు. శ్రీకృష్ణదేవరాయల వారి తెనాలి రామకృష్నుడు, అక్బర్‌ పాదుషా వద్ద బీర్బల్‌ అందుకు దాహృతులు. నాటి కాళిదాస, భాస, భారవి లాంటి మహాకవుల కావ్యాలలో విదూషకుని పాత్ర తప్పక ఉండేది.

”అతి సర్వత్ర వర్జయేత్‌” అన్నట్లు అతిగా నవ్వినా ప్రమాదమే.

ఎంత అందంగా ఉన్నా ముఖంలో రవ్వంత చిరునవ్వు కన్పించకపోతే వారితో ఎవ్వరూ స్నేహం చేయలేదు. మనుషులు ఒకరికొకరు పరిచయం కానపుడు, మొదట ‘నవ్వే’ వారిని పలుకరించి స్నేహాన్ని కలుపుతుంది. ఒక చిరునవ్వే వేయివరహాలంత విలువ చేస్తుంది.

మనస్సలను రాగరంజితము చేసే హాస్యరసము ప్రతి గ్రంథరచనలో ఉండటానికి ప్రోత్సహించాలి. హాస్యరచన పోటీలు పెట్టి ఉత్తమ హాస్యమును ప్రచారం చేయాలి.

విషాదాంతమైన కొందరి మానవ జీవితాల్లో వెలుగులు నింపే హాస్యరచనలు ఎక్కువగా రావాలి. అందరి హృదయాలు ఆనందమయం కావాలి.

అరాచకత్వం, అన్యాయం, అశ్లీలం, అధికారత్వం చెలరేగుతున్న ఈ రోజుల్లో ఆధునిక యువ కవులు ముందుకువచ్చి, ప్రజలలోని అవినీతి, కుళ్ళు, కుతంత్రం పారద్రోలి జాతీయ సమైక్యతను నెలకొల్పేటటువంటి సున్నితమైన హాస్యరచనలు చేసి మానవ ప్రజావళిలో మార్పులను, చైతన్యాన్ని తీసుకొని రావాలి.

శ్రీశ్రీ గారు వ్రాసిన ”మహాప్రస్థానం”లా హాస్యభరితమైన అందరికీ అర్థమై, అలరించే విధంగా హాస్యరచనలు పెక్కులు, మిక్కిలిగా రాసి, జనంలో చైతన్యాన్ని తీసుకొని రావాలి. ప్రాచీన కాలంలో మన పూర్వ కవులు వ్రాసిన ఉత్తమ హాస్యరచనలకై కృషిని చేయాలి.

అన్ని రసాల్లో కన్న

హాస్య రసమే మిన్న

అది లేని జీవితం ఓరన్నా !

నిస్సారమేరా ఓ కన్నా !

                                                                          

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఆధునిక తెలుగు కథానిక – పర్యావరణ స్పృహ

by Dr. Y. Subhashini March 17, 2024
written by Dr. Y. Subhashini

ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లుగానే పర్యావరణంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రపంచంయాంత్రికయుగంగా ఎప్పుడైతే మారిందో అప్పుడేపర్యావరణమూ కలుషితంకావడం ప్రారంభమైంది. ఈ సృష్టిలోని ప్రాణులన్నింటిలో బుద్ధిజీవి మానవుడు. కానీ బుద్ధిగలిగిన మనిషే నేడు మితిమీరిన స్వార్థంతో ప్రకృతి, సృష్టిలోని సమతౌల్యందెబ్బతినడానికి కారణమవుతున్నాడు. ప్రకృతిశక్తులను విచక్షణారహితంగా వాడుతూ పర్యావరణకాలుష్యానికి దోహదపడుతున్నాడు. అందువల్ల నేటి సామాజికసమస్యలలో అతి ప్రధానమైనది పర్యావరణ కాలుష్యం.

ఈ సమస్యను గుర్తించిన ఎందరో తెలుగు రచయితలు తమ రచనలద్వారా పర్యావరణ స్పృహను తీసుకొస్తున్నారు. నేడు సాహిత్యంలో అత్యంత విలువైన వస్తువు పర్యావరణం కావడంవల్ల తమ రచనలద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రబోధిస్తున్నారు. ప్రజలను జాగృతం చేస్తున్నారు. కర్తవ్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో మైనంపాటి భాస్కర్, పెద్దింటి అశోక్ కుమార్, పాపినేని శివశంకర్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, మధురాంతకం మహేంద్ర, సలీం, కస్తూరి మురళీకృష్ణ, చిత్తర్వు మధు,సడ్లపల్లి చిదంబరం, గన్నవరపు నరసింహమూర్తి, గుజ్జారి రామచంద్రరావు,కె. వరలక్ష్మి,ఒమ్మి రమేష్, కాలువ మల్లయ్య, బెలగాం భీమేశ్వరరావు, అప్పిరెడ్డి హరినాథరెడ్డి వంటి ఎందరో కథా రచయితలు పర్యావరణ చేతనపై రచనలు చేస్తున్నారు. వారు రాసిన కొన్ని కథలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
1. భూ కాలుష్యం : పర్యావరణంలో జరుగుతున్న కాలుష్యాల్లో భూకాలుష్యం ప్రధానమైంది.మనుషులు తమ స్వార్థంకోసం పెరుగుతున్న పారిశ్రామికీకరణతో ఎన్నోరకాల కల్తీ ఎరువులు విత్తనాలు మందులు తయారుచేసి వాటిని ఉపయోగించడం ద్వారా భూమి కలుషితమవుతూ ఉంది. భూమి మాత్రమే కలుషితంకాకుండా పండించిన పంటలు మొత్తం రసాయనాలతో నిండిపోతున్నాయి. వాటినితినడంవల్లఎన్నో వ్యాధులకు మనిషి దేహం కేంద్రం అవుతూ ఉంది. ఈస్థితిపట్ల రచయితలు గాఢంగా స్పందించారు.

విదేశీపంటలను ఆహ్వానించి వాటిద్వారా మననేల, నీరు, గాలివంటివాటన్నింటినీ కలుషితం చేసుకుంటూ మనపైన మనకే హక్కులేని పరిస్థితిని మన ప్రభుత్వం కలిగించింది. ఈ నేపథ్యంతో పెద్దింటి అశోక్ కుమార్ “కీలుబొమ్మలు” అనే కథను రాశారు. ఆంధ్రప్రదేశ్లోని సిరిసిల్ల ప్రాంతం సర్వాయి పల్లెలో గులాబీ పూలసాగును చేపట్టి వాటికి రసాయనిక మందులు స్ప్రే చేయడంవల్ల ప్రజలు ఉక్రిబిక్కిరి అయిన తీరుని చెప్తూరాసినకథ. మరోవైపు ఆహార భద్రతపై, దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేయడంతో విదేశీ మార్కెట్లు విచ్చలవిడిగా దేశంలోకి వచ్చాయి. ధాన్యంరేటు పడిపోయి ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రారంభించడం, వాణిజ్య పంటలను ప్రోత్సహించడం, దానికి అనుగుణంగా కౌలుదారు చట్టాన్ని ప్రభుత్వం మార్చడంవల్ల రైతులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం జెనిటికల్ ఫుడ్స్ ప్రాజెక్టుకు అనుమతిస్తే, దానికి పెద్ద ఎత్తులో రసాయనాలు వాడాల్సి ఉంటుందని అదే జరిగితే వాటిని తిని ఎన్నో సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుందంటాడు కథలో జర్నలిస్ట్. విదేశీ కంపెనీలు ఆర్థిక, జన్యుపరమైన పంటలను మనదేశంలో ప్రవేశపెట్టడం, ఆ పంటలకు విపరీతంగా రసాయనాలను ఉపయోగించడంవల్ల మనభూమి నీరు గాలి అన్నీ కలుషితమైనాయి. దానితో ఎన్నో జబ్బులకు ఆలవాలమై మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రచయిత ఆవేదనతోఆవిష్కరించినకథ.
రసాయనిక ఎరువులు, మందులవల్ల ఒక రకమైన ఇబ్బందులు ఎదురవుతుంటే, పాలిథిన్ వాడకంవల్ల మరోరకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. పాలిథిన్ వాడకంపై ఉండే మోజును వాటి వల్ల జరిగే నష్టాన్ని తెలియజేస్తూ డా. కాలువ మల్లయ్య “గ్లోబలైజేషన్” అనే కథను రాశారు. గ్లోబలైజేషన్ ద్వారా సమాజంలోచాలామార్పులువచ్చాయి. ఆమార్పులవల్ల స్నేహితుడి పెళ్లిలో వాడిన పాలిథిన్ కవర్లు, గ్లాసులు, విస్తర్లు, కాగితాలు వంటి చెత్తాచెదారాన్ని ఆవు తినడం చూసిన అర్జున్ అదిలించడం, ఇవి తినడం వల్ల పశువులు మరణిస్తున్నాయనే ఆవేదన చెందటం, ఇది చూసిన స్నేహితుడు తింటే ఏమవుతుందని ప్రశ్నించడం, దానికి కడుపులోకి వెళ్ళిన ప్లాస్టిక్ తిరిగి బయటకురాదని దీనితో అటు పశువులకు ఇటు భూమికి కాలుష్యం పెరిగిపోతుందని వాపోవడంకథ.మారుతున్న నాగరికత వలన మనం ఆరోగ్యాన్నిచ్చే అరటి ఆకులకు బదులు ప్లాస్టిక్ ఆకులు, ప్లేట్లు, గ్లాసులు వాడడంవల్ల ఇటుమనిషి అటు పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి. పెరుగుతున్న అవసరాలకు ఇవి సులభంగా లభిస్తున్నాయి కానీ వాటివల్ల జరిగే కాలుష్యాన్ని మనం గుర్తించడంలేదు. ఒకవేళ గుర్తించినా నాగరికతా వలయంలో చిక్కుకుంటున్నాడనే ఆవేదన రచయితది.
రసాయనికఎరువులు పాలిథిన్ వాడకం ఒక ఎత్తు అయితే, ప్రకృతిలో అత్యంత ప్రాధాన్యం వహించిన వృక్షాన్ని సంరక్షించకపోవడం భూకాలుష్యానికి మరో ప్రధానకారణం. అందుకే‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న ఆర్యోక్తిని శిరసావహించిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి “ఆకుపచ్చని మాయ”, కస్తూరి మురళీకృష్ణ “మనిషి – మామిడి చెట్టు”అనేకథలను రాశారు. ప్రపంచీకరణ ఫలితంగా మనిషి డబ్బు మాయలోపడ్డాడు. దానితో ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలనే తపన ప్రతి ఒక్కరికీ ఎక్కువైంది.అయితే పిల్లలకి ఫీజులు కట్టలేక చెట్లని అమ్మాలనుకున్నాడు కొడుకు. దానికి తండ్రి రామయ్య ఒప్పుకోలేదని తన ప్రాణమే తీయాలనుకున్నాడు. తాతలకాలంనాటి వ్యవసాయ పద్ధతులు నలుగురికి తిండినీ నీడనూ ఇచ్చేవి. కానీ నేడు ఆ పాత పద్ధతులు పనికిరావని పొలాల్లోకి వచ్చే ఉడుతల్ని ఎలుకల్ని చంపాల్సిందేనని అప్పుడే పంటను రక్షించుకోగలమని అంటాడు మరోవైపు కంపెనీ నుంచి వచ్చిన వ్యక్తి.“మీరేం మనుషులయ్యా? ఉడత ఎలక పిట్ట గొడ్డూగోదా చీమా దోమా తినకుండా పండించినవన్నీ నీవే తిందాం అనుకున్నావా”? అని మనిషిలో పెరిగిన స్వార్థాన్ని ప్రశ్నించాడు రామయ్య. ఊళ్లో ఇల్లు, పొలంలో చెట్టు మనిషికి నీడ అన్న విషయాన్ని గుర్తించక ఆ చెట్టునే నరికి సొమ్ము చేసుకోవడం పాపమని భూమి నాశనమవుతుందనేహితబోధ చేశాడు రచయిత.
కస్తూరి మురళీకృష్ణ రాసిన “మనిషి – మామిడిచెట్టు” అనే కథలో మనిషికీ చెట్టుకూ ఉన్న చక్కని అనుబంధాన్ని చెట్టునుండి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను బోధించారు. ఒక విత్తనం భూమిలో వేస్తే అది మహావృక్షమై ఎందరికో ఆలవాలమవ్వటమే కాకుండా తరతరాలకు నీడను పళ్ళను అందిస్తూ…ఆచెట్టుపై ఆధారపడి ఒక జీవవలయమే ఉంటుందని తెలియజేసిన కథ. మనిషి ఎంత ఎత్తు ఎదిగినా ఎంతదూరం పోయినా అతని వ్రేళ్ళు భూమిపై స్థిరంగా ఉండాలని చెప్పిన కథ ఇది. కనుక భూమి మనిషికి శక్తి. అలాకానిపక్షంలో గాలి ఎటు వీస్తే అటుకొట్టుకుపోతాడు. ప్రకృతితో కలిసి జీవిస్తే ఎంతో విజ్ఞానం నేర్పిస్తుందనే జీవితసత్యాన్ని వెల్లడి చేసిన కథ. చెట్లవల్ల భూకాలుష్యం జరగకుండా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో క్రమంగా వివరిస్తూనే అటువంటి చెట్లను నరికి దానవుడు కావద్దని హెచ్చరించాడు కవి. జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా చెట్లను అభివర్ణించారు. ఆదిమానవుడి స్థితి నుండి ఆధునిక మానవుడి స్థాయిదాకా మానవ ప్రస్థానంలో ప్రతి దశలోనూ చెట్టు మనిషికి అండగా నిలిచి ముందుకు నడిపించిందనే స్పృహనందించారు.


జల కాలుష్యం :పెరుగుతున్న జనాభావల్ల పారిశుద్ధ్యంలోపించి నీరు కలుషితమవుతూ నీటి కొరతకు కారణమవుతూ ఉంది. నీటివనరులైన చెరువులు, నదులు, సముద్రాలు వంటివి పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతూ ఉన్నాయి.దానితో ఎన్నో సముద్రజీవులు కోల్పోతూ ఉన్నాం. నీటిలో ఫ్లోరిన్ మోతాదు పెరిగి తాగునీటి కొరత ఏర్పడుతూ ఉంది. నీటికాలుష్యంవల్ల నీటి వ్యాపారం బాగా పెరిగిపోయింది. ఈ స్థితికి చలించిన సాహితీస్రష్టలు ఎన్నో కథలను రాశారు. అందులో ఒకటి ఒమ్మి రమేష్ బాబు రాసినకథ‘మురికి’. నగరాలలో పారిశుద్ధ్యం లోపంవల్ల ప్రజలు పడే ఇబ్బందులను గూర్చి రాసిన కథ. రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్ లోపల ఒక హోటల్. పక్కనే నాలుగు కాకా హోటళ్ళు. ఈ హోటల్ లో నుండి పారబోసే వ్యర్థాలవల్ల అక్కడ ఉన్న స్థలం అసహ్యంగా అపరిశుభ్రతతో ఉంది. కాలువల్లో మురికితో నిండిన నీళ్లు. ఆ నీటిలో పొర్లుతున్న పందులు, కుక్కలు.హోటల్స్ నుండి వచ్చి చేరే మురికినీళ్లు. ఇంకోవైపు వ్యర్థ పదార్థాలతో కూడిన పారిశుద్ధ్యలోపంతో పాటు బండి రాముడు హోటల్ వల్ల ఏర్పడిన పెంటకుప్ప. మరోవైపు ఆ హోటల్లో మంచినీళ్ల బానకి పేరుకున్న నాచు. ఇది అక్కడి మంచినీటి పరిస్థితి. జనసంచారం ఉన్న ఇలాంటి చోట్ల అపరిశుభ్రతతో పాటు కాకాహోటల్స్ వల్ల మరింత పారిశుద్ధ్యంలోపం పెరుగుతూ ఉన్న స్థితిని రచయిత కళ్ళకు కట్టించారు. అక్కడి ప్రజల జీవనం ఎంత దుర్భరంగా ఉందో వ్యక్తీకరించారు.

వాయు కాలుష్యం : నేడు నవనాగరిక మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలలో వాయు కాలుష్యం మరొకటి. వాయుకాలుష్యంతో అనేకరకాలైన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పరిశ్రమలు వాహనాలు ఎక్కువైపోయి, ఇవి వదిలే విషవాయువులతో వాయుకాలుష్యం పెరుగుతూ ఉంది.ప్రాణవాయువులను ప్రసాదించే చెట్లను నరికేయటం వల్ల జరుగుతున్న పరిణామమిది. మరోవైపు పారిశుద్ధ్యలోపంతో వాయువు కలుషితమవుతూ ఉంది. దీనితోనూ అనేకరకాల వ్యాధులకు మనిషి గురవుతున్నాడు. ఈ విషయాలను గూర్చి సాహితీవేత్తలు తమ సాహిత్యం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

పరిశ్రమలద్వారా జరుగుతున్న వాయు కాలుష్యాన్ని ఆ ధూళితో అక్కడ పనిచేసేవారు అనారోగ్యానికి గురయ్యే తీరును చెబుతూ కె. వరలక్ష్మి “అతడు – నేను” కథను రాశారు. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి 15 ఏళ్ల కుర్రాడు గ్రానైట్ మిల్లులో చేరడం, దాని ద్వారా వచ్చే పౌడర్ వల్ల దుమ్ము ధూళితో వారి శరీరాలు నిండిపోవడం, దీనితో ఆకుర్రాడికి టీబీ రావడం, ఎన్ని మందులు వాడినా అదే ధూళిని పీల్చడం వల్ల నీరసించి పోవడం, ఆతర్వాత పనిలోకి రాకుండా నిలిచిపోవడం, దీనితో ఆ కుటుంబం ఏమైందోననే ఆవేదనతో రచయిత్రి రాసిన కథ ఇది. గ్రానైట్ మిల్లులో పనిచేసే వారి జీవితాలు ఎంత అర్ధాంతరంగా ముగిసిపోతాయోననేది చూసినప్పుడు హృదయం ద్రవించిపోతుంది.

కాలుష్యం వల్ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిన తీరును కె. వరలక్ష్మి చిత్రీకరిస్తే, చెట్లను నాటి వాయుకాలుష్యాన్ని దూరం చేసుకోవచ్చు అంటూ సడ్లపల్లి చిదంబర రెడ్డి “ఉగాది” కథను రాశారు. ఉగాది పండుగకోసం మామిడి ఆకులను బస్తాలకు బస్తాలు బస్తీలకు కోసుకుపోతూ చెట్లను విరిచేస్తున్న మనుషులకు హితబోధ చేయడమే కథ. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనాలంటే ప్రతి ఇంటిముందు రెండు మామిడి మొక్కలు నాటితే నిత్యం పచ్చతోరణాలై ఇళ్లకు శోభనీ శుభాన్నీ అందిస్తాయనే స్పృహను అందించారు రచయిత.ఇదేవిషయాన్ని సుందర్ లాల్ బహుగుణ “ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ” (నాశనంకాని జీవావరణ వ్యవస్థల సముదాయమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ) అని అంటారు. కనుక మనంకూడా రెండు రోజుల్లో వాడిపోయే మామిడిఆకులను తోరణాలుగా కట్టడం కాకుండా ఇంటిముందు మామిడి మొక్కనే నాటితే శాశ్వతంగా పచ్చదనాన్ని పొందవచ్చునంటారు రచయిత.


ధ్వనికాలుష్యం : వాహనాల వలన వాయుకాలుష్యంతో పాటు ధ్వనికాలుష్యం కూడా పెరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారు. దీనినే సాహితీస్రష్టలు కథల ద్వారా ప్రజలకు కనువిప్పు కలుగజేస్తున్నారు. వాహనాలు ఎడతెరిపి లేకుండా ప్రయాణించడం వల్ల వాటిద్వారా వచ్చే దుమ్ముతో శబ్దాలతో ప్రజలు పడే కష్టాలను తెలియజేస్తూ సలీం “రూపాయి చెట్టు” కథను రాశారు. వాహనాలు ఎక్కువగా ప్రయాణించే హైవేలలో రమేష్ లాంటివాళ్లు ఎస్టీడి బూత్ పెట్టుకొని చాలీచాలని డబ్బులతో ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు వాహనాల ద్వారా వెలువడే వాయువులతో మానసిక ఒత్తిడితో శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తీరును దృశ్యమానం చేశారు.

మైనంపాటి భాస్కర్ రాసిన మరో కథ “డీప్ ఫ్రీజ్”. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకొని 2050వ సంవత్సరం నాటి మానవ సమాజాన్ని సాంకేతిక పురోభివృద్ధిని ఊహించి రాసిన కథ ఇది. భారతదేశ జనాభా 2050వ సంవత్సరంనాటికి 3000 కోట్లు అవుతుందని అంచనా వేసి రాసిన కథ. జనాభా పెరగటంతో విపరీతమైన కాలుష్యంతో వ్యాధి నిరోధక దుస్తులు, ఆక్సిజన్ మాస్క్, చెవులకు ఫిల్టర్లు లేకుండా బయటకు రాలేని దుస్థితి మనుషులకు రాబోతుందని రాసిన కథ. చివరికి ఆరుబయట ఒక్క చెట్టు కూడా కనిపించదని కథలో ఎంతో ముందు చూపుతో రచయిత ఊహించి పాఠకులకు ఒక స్పృహను అందించారు. మనిషి అత్యాశతో చేస్తున్న అసహజమైన పనులవల్ల ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నాడు. అందుకే ప్రకృతిని నాశనంచేసి తిరిగి ప్రకృతిని శాసించే ప్రయత్నం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఈ కథ నడిచింది.చనిపోయాడనుకొన్న మనిషి క్యాన్సర్ వ్యాధి ప్రయోగంలో భాగంగా తిరిగి బ్రతికితే ఆకుటుంబ సభ్యులు ఏవిధంగా ఆలోచిస్తారనేది కూడా స్పష్టంచేశారు. ఆధునికత పెరిగేకొద్దీ కుటుంబసభ్యులమధ్య ఉండే ఆర్థిక సంబంధాలు వ్యాపారసంబంధాలైపోయాయి. చివరికి చిన్నపిల్లలను కూడా రోబోలు ఆడించాల్సిన దుఃస్థితిని, మనిషి తనకు కావాల్సిన వాటికి తన మెదడుతోకాకుండా యంత్రాలపైన ఆధారపడటం వంటివన్నీ మనిషి నిర్వీర్యం కావడానికి దోహదమవుతున్న తీరును రచయిత చాలా చక్కగా వ్యక్తీకరించారు.


భూతాపం – జీవవైవిద్య ప్రమాదం : ప్రకృతిలో జీవుల మధ్య సమతౌల్యం నెలకొని ఉంది. అలాగే నేడు మానవతప్పిదాలవల్ల ప్రకృతి వైపరీత్యాలవల్ల జీవులన్నీ నశించి సమతూకం చెడిపోతూ ఉంది. భూతాపం పెరిగిపోయి జీవులకు నీటి కొరత, మరోవైపు ఆహారం దొరకక అవి నివసించడానికి తగిన వసతులులేక అంతరించిపోతున్నాయి. ప్రకృతికి అందాన్నిచ్చే రంగురంగుల పిట్టలు, వన్యప్రాణులు, గర్జించే మృగరాజులు, కనులకు విందుచేసే నెమలి నాట్యాలు, లేళ్ల గంతులు, పచ్చిక బయళ్ళు ఇవన్నీ చూస్తుండగానే కనుమరుగైపోతున్నాయి. దీనికి మానవ తప్పిదాలు ఒక కారణంకాగాభూతాపం మరోకారణమై నీటికొరతతో, అడవుల నాశనంతో వన్యప్రాణులన్నీ మాయమవుతున్నాయంటూ పాపినేని శివశంకర్ “చివరి పిచ్చిక”; సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి “పిట్ట పాట”,  “కడితివేట”, “అతడిబాధ”; గన్నవరపు నరసింహమూర్తి “అభయారణ్యం”;చిత్తర్వు మధు “రెండు డిగ్రీలు” వంటి కథలను రాశారు.
వ్యవసాయ పంటలకు వాడే రసాయనాలవల్ల భూమికలుషితమై మనిషి మనుగడ కునారిల్లుతుంటే స్పందించిన సాహితీస్రష్ట హృదయం అక్షరంగా ఆవిష్కృతమైన కథ “చివరి పిచ్చిక”. తమ చిత్రవిచిత్ర చేష్టలతో కిచకిచ శబ్దాలతో నిత్యం మనల్ని వెంటాడే పిచ్చుకలు కనుమరుగవటం వల్ల అంతరించిపోతున్న పిచ్చుకజాతికి అంతిమనివాళిగా అందించిన కథ ఇది. వడ్లకంకులను గుత్తులుగా వేలాడదీసి పక్షులకు ఆహారాన్ని అందించే మానవీయత నేడు కరువైంది. చదువుల వేటలో అధికారదాహంలో డబ్బుసంపాదనలో ఈవిషయం మనకు సంబంధంలేనిదైపోయింది.  పర్యావరణంలో పశుపక్షాదులది విడదీయరాని అనుబంధం. కానీ మనిషి తను అభివృద్ధి చెందడానికి ఇతర ప్రాణులకు ఎప్పుడూ హాని చేస్తుంటాడు. అందుకే రచయిత ‘ఏదో ఒకనాటికి ఈ రెండు చేతుల జీవివల్లనే మన జాతి అంతరిస్తుందని నాభయం’ అంటాడు. ఇక్కడ రెండు చేతుల జీవి అంటే మనిషి. సృష్టిలో రెండుచేతులు ఉన్నది ఒక్కమనిషికే. తన స్వార్థంకోసం మనిషి ఏమైనా చేస్తాడనేది రచయిత ఆవేదన.“సృష్టిలో కెల్లా తానే విజ్ఞానవంతుడని తెలివితేటలు కలవాడినని విర్రవీగుతుంటాడు మనిషి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వివిధ జీవరాశులలో ఎన్నో జీవులు తమకి మాత్రమే సాధ్యమైన ప్రజ్ఞని ప్రదర్శిస్తాయని తెలుస్తుందం”టారు కేకలతూరి కృష్ణయ్య గారు. అది అక్షరాలా నిజం. పర్యావరణ సమతుల్యాన్ని మనిషి దెబ్బతీస్తున్న విధానాన్ని రచయిత పిచ్చుకద్వారా స్పష్టపరిచారు. అంతేకాదు మనిషి జాతిసమస్తాన్ని ధ్వంసంచేస్తూ చివరికి తానే ధ్వంసమయ్యే పరిస్థితిని తెచ్చుకోబోతున్నాడనే హెచ్చరిక ఈకథలో ఉంది. ఒకప్పుడు పిచ్చుకలకు పంటపొలాల్లో తినడానికి జొన్నకంకులు అందుబాటులో ఉండేవి. కానీ నేడు మిరపలాంటి తోటల్లో ద్రావకాల్లో తేలుతున్న పురుగులను తినడంవల్ల పిచ్చుకలు అంతరించిపోయాయని పిచ్చుకలకు చోటులేని ప్రపంచం ఒకనాటికి ఎడారిగా మారిపోతుందన్న భవిష్యత్తు ఉపద్రవాన్ని సూచించారు రచయిత.


పరిశుభ్రత పేరిట, నాగరికత పేరిట పిచ్చుకలు పెట్టే గూళ్ళను ఊడబీకడం ఎంత కారుణ్యరాహిత్యమో తెలియజేస్తూ రాసిన మరోకథ “పిట్టపాట”. ఒకప్పుడు పంటపొలాల్లో వచ్చే పురుగులను ఏరి తినే పక్షులు నేడు లేకపోవడం వల్ల పంటలమీద పురుగులు ఎక్కువై దిగుబడి లేక రైతులు అప్పులు పాలైన స్థితిని చిత్రీకరించిన కథ. పాతతరంలో పొలాలు కుటుంబాన్ని పోషిస్తే నేటితరం పొలాన్ని పోషించుకోవాల్సి రావటం బాధాకరం. అది మనిషి స్వయంకృతాపరాధమేనని తెలిపిన కథ. పర్యావరణ చేతనారాహిత్యం జీవావరణ విధ్వంసానికి కారణమవుతుందని హెచ్చరించిన కథ. చివరికి బంధువులను కలవడమన్నది అవసరానికేకాదు హృదయసంబంధమైనదిగా భావించాల్సిన అవసరాన్నికూడా తెలిపిన కథ. అందుకే కేకలతూరి కృష్ణయ్యగారు సామాజిక విలువలు, సమతామమతలను అందించే ‘సృష్టి జనజీవన దర్పణం’ అనే ఒక మంచి పుస్తకం వెలువరించారు. బంధాలు అవసరానికి మాత్రమే అనే నేటి సమాజంలో అవి ఎంతమేర ఉండాలో చాలా చక్కగా వ్యక్తీకరించారు. ఇదే విషయాన్ని ‘పిట్టపాట’ కథలోనూ రచయిత సూచించడం నేటి సమాజానికి ఇది ఎంత అవసరమో తెలుస్తూ ఉంది.
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత చిత్తర్వు మధు. ఇతను వృత్తిరీత్యా డాక్టరు. తన వృత్తిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ లాంటి ముఖ్య విషయాల మీద పరిశోధించి రాసిన కథ “రెండు డిగ్రీలు”. రాబోయే తరాలు ఎలాంటి భవిష్యత్తును ఎదుర్కోబోతున్నారో చూపిన కథ. భవిష్యత్తు పరమైనటువంటి అవగాహనలేని మనల్నిఇక ఆ భగవంతుడే కాపాడాలనేఅద్భుతమైన కథనంతో ఈకథనుమనకుఅందించారు.
ప్రభుత్వంచేసిన నల్లచట్టంవల్ల బాక్సైట్ తవ్వకాలు చేయడంతో జంతువులన్నీ మాయమైపోతున్నాయని చెప్తూ గన్నవరపు నరసింహమూర్తి “అభయారణ్యం”కథరాస్తే, నీళ్లులేక ఎన్నో జీవాలు అంతరించిపోయిన దుస్థితిని చిత్రిస్తూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి“కడితి వేట”అనే కథను రాశారు. నోరులేని మూగజీవాలమీద మనిషి పైశాచికత్వానికి నిదర్శనం జంతువుల అదృశ్యం. అరణ్యాలలోని చెట్లను నరికి మంటపెట్టడంవల్ల ఎన్నో పక్షులు, జంతువులు, లేతచెట్లు మాడిపోయి కనీసం తాగడానికి నీళ్లుకూడా లేని దుస్థితిలో ఒక కడితి నీళ్ల కోసం మడుగులో దిగి తాగితే దాన్ని కూడా చంపి తినడానికి సిద్ధమైన మానవ మృగాలను చిత్రించిన కథఇది.
మన పర్యావరణంలో ఒకరిమీద ఆధారపడి మరొకరు జీవించటం సహజం. కాని ఇది జరగనప్పుడు ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయో తెలియజేస్తూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారు “అతడిబాధ” అనే మరోకథను రాశారు. నక్కలు, తోడేళ్ళు అంతరించిపోయాక కుక్కలను పెంచేవాళ్ళులేక అవి తిండికోసం పెద్దనక్కలు తోడేళ్ళ బదులు కుక్కలే గొర్రెలని, కోళ్ళను తినే పరిస్థితికి వచ్చిన తీరుని తెలిపిన కథ ఇది. ఒకప్పుడు కుక్కలకు ఇంట్లో తిండి పెట్టేవారు. కాని నేడు అలాంటి పరిస్థితులు కనుమరుగయ్యాయి. దానితో కుక్కలకి తిండి దొరకక రాబోయేకాలానికి నక్కలు, తోడేళ్ళ మాదిరి మారిపోతాయేమోననే ఆవేదన రచయితది.


ఇలా మనిషి తన స్వార్థంకోసం ప్రతీదాన్ని కలుషితంచేస్తూ జీవులను నాశనంచేస్తూ ప్రకృతి సమతౌల్యాన్ని చెడగొడుతున్నాడు. ప్రకృతి విలయతాండవం చేయడానికి కారణమవుతున్నాడు. తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాడు కనుక స్వార్థాన్ని వదలి పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, ఆచరిస్తేనే ఈ భూమి,భూమిపై మనిషి మనుగడ స్థిరమవుతుంది.దీనికోసం ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వర్తించాల్సినతరుణంఆసన్నమైంది.

***

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సంధి అంటే

by రంగరాజు పద్మజ March 17, 2024
written by రంగరాజు పద్మజ

రెండు పదాల కలయిక. రెండు పదాలు కలిసేటప్పుడు అనేక మార్పులు కలుగుతుంటాయి. అంటే అక్షరాలు తగ్గడమో పెరగడమో జరుగుతూ ఉంటాయి. దీన్ని సంధి కార్యం అంటారు. వ్యాకర్తలంటే సూత్రాలు రాస్తారు. అలా చిన్నయసూరి సూరి సంధి గురించి ” పూర్వ పర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి యనంబడు” అంటూ సంధి గురించి నిర్వచించారు.
అంటే పూర్వ పదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చుకు పర పదంలో ఉన్న అచ్చుకు కలిసి సంధి జరిగినప్పుడు పర పదంలోని అచ్చు వచ్చి చేరడాన్ని సంధి అంటారని ఫలితార్థం.
ఆ రోజులలో గ్రాంథిక భాష వాడుకలో ఉంది కాబట్టి సూత్రీకరణ కూడా గ్రాంథిక భాషలోనే జరిగింది.

ఉదాహరణకు..
రాముడు+ అతడు
రాముడ్ + ఉ+ అతడు = ఇక్కడ ‘ఉ’మరియు ‘అ’ల మధ్య సంధి జరిగి, ఆ రెండింటి స్థానంలో ‘అ’ వచ్చి చేరి, రాముడ్ + అ+తడు = రాముడతడు అని అవుతుంది.

ఈ సంధులు అచ్చుల మధ్య జరిగితే అచ్చంధులని, హల్లుల మధ్య జరిగితే హల్సంధులని చెబుతారు. ఇవి తెలుగు సంధులు, సంస్కృత సంధులని బేధాలు ఉన్నాయి. ఈ సంధి కార్యాలు మూడు రకాలుగా జరుగుతాయి.
1. ఏకాదేశ సంధులు
2.ఆదేశ సంధులు
3. ఆగమ సంధులు.
1. ఏకాదేశ సంధులు:- ఈ సందులలో పూర్వ స్వరానికి, పరస్పరానికి సంధి జరిగినప్పుడు పరస్పరం వచ్చి చేరడం గానీ, లేదా వేరొక స్వరంగానే వచ్చి చేరుతాయి. తెలుగు సంధులలో అంతే పరస్వరమే వచ్చి చేరుతుంది.
ఉదా-:ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి.
1. ఏకాదేశ సంధులు:- ఈ సందులలో పూర్వ స్వరానికి, పరస్పరానికి సంధి జరిగినప్పుడు పరస్పరం వచ్చి చేరడం గానీ, లేదా వేరొక స్వరంగానే వచ్చి చేరుతాయి. తెలుగు సంధులలో అంతే పరస్వరమే వచ్చి చేరుతుంది.
ఉదా-:ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి.

సంస్కృత సంధులలో అయితే పూర్వ పర స్వరాలకు సంబంధం లేకుండా వేరొక స్వరం వచ్చి చేరుతుంది.
ఉదా:- సవర్ణదీర్ఘ సంధి ,గుణ సంధి, వృద్ధి సంధి.

2. ఆదేశ సంధులు:- ఆదేశం అనగా ఒక అక్షరాన్ని కొట్టివేసి, దాని స్థానంలో కొత్త అక్షరం వచ్చి చేరడం. అందేకే వ్యాకర్తలు “శత్రువదాదేశః” అని నిర్వచనం చెప్పారు. అంటే శత్రువులాగా రా నీ కొట్టివేసి దాని స్థానంలో మరొక అక్షరం వచ్చి చేరడం.
ఉదా:– వాడు + కొట్టెను = వాడుగొట్టెను.
ఇక్కడ ‘కొ’ స్థానంలో ‘గొ’ వచ్చి చేరింది.
ఉదా:– సరళవాదేశ సంధి ; గసడదవాదేశ సంధి; పుంప్వాదేశ సంధి; యణాదేశ సంధి.

3. ఆగమ సంధులు:– ఆగమం అనగా కొత్తగా ఒక అక్షరం రావడం.. అంటే ఉన్న అక్షరాలన్నీ ఉండగా, వాటి మధ్య కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరుతుంది. అందుకే వ్యాకర్తలు ‘మిత్రవధాగమః’ అన్నారు. అంటే మిత్రుని వలే కొత్తగా ఒక అక్షరం చేరుతుంది అని ఫలితార్థం.
ఉదా:- మా + అమ్మ
మా +య్+అమ్మ = మాయమ్మ.
ఇక్కడ ‘య్’ మిత్రునిగా వచ్చి చేరింది.
ఉదా:– యడాగమ సంధి; రుగాగమ సంధి; టుగాగమసంధి, నుగాగమసంధి, దుగాగమ సంధి, అనునాసిక సంధి ; జస్త్వసంధి, శ్చుత్వసంధి;
మొదలగునవి.
తెలుగు సంధులు- సంస్కృత సంధులు ఏవో చూద్దాం!!
తెలుగు సంధులు:–
ఉత్వ సంధి;
ఇత్వసంధి;
అత్వ సంధి;
యడాగమసంధి;
ఆమ్రేడిత సంధి;
ద్విరుక్త టకారాదేశ సంధి; సరళాదేశ సంధి ;
గసడవాదేశ సంధి;
నుగాగమ సంధి; టుగాగమసంధి;
నుగాగమ సంధి;
టుగాగమ సంధి; పుంప్వాదేశసంధి;
పడ్వాదుల సంధి ; ప్రాతాదులసంధి;
దుగాగమ సంధి;
త్రికసంధి మొదలైనవి.

సంస్కృత సంధులు:– సవర్ణధీర్ఘ సంధి;
గుణసంధి;
యణాదేశ సంధి;
వృద్ధి సంధి;
అనునాసిక సంధి;
జస్త్వసంధి;
శ్చుత్వ సంధి మొదలైనవి.
చిన్నయ సూరి సంధి నిర్వచనం ఇలా సూత్రీకరించారు. “పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యనంబడు” ఈ సంధి సూత్రం కేవలం అచ్చు సంధులకు మాత్రమే వర్తిస్తుంది. హల్లులకు వర్తించదు. ఈ సంధి నిర్వచనం ఒకటవ సూత్రం నుండి 11వ సూత్రం వరకు వర్తిస్తుంది. మిగిలిన వాటికి ఆగమాలుగానో ఆదేశాలుగానో సంధులు జరుగుతాయి. పైన చెప్పిన 11 సూత్రాలకు మాత్రమే ఏకాదేశం జరుగుతుంది.
ఇక్కడ మనం ఆదేశం, ఏకాదేశం, ఆగమం గురించి కొద్దిగా తెలుసుకుందాం.
ఆదేశమనగా శత్రువు లాగా ఒక అక్షరమొచ్చి ముందు అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం చేరడం.
కూర+కాయ::: కూరగాయలు
మా+ అమ్మ :::::మాయమ్మ
ఏకాదేశం అనగా పూర్వస్వరానికి పరస్వరానికి కలిపి ఒకే అక్షరం రావడం.
సీత+ అమ్మ…. సీతమ్మ
ఆగమం అనగా మిత్రునిలాగా కొత్తగా అక్షరం వచ్చి చేరడం..
పేద+ ఆలు:::: పేదరాలు
పేద+ర్+ఆలు..
ఇక్కడ రెండు పదాలు మధ్య ర్ కొత్తగా చేరింది.
చిన్నయసూరి చెప్పిన మొదటి సూత్రం చూద్దాం!
“ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు”
చిన్నయసూరి సూత్రీకరణ అత్వసంధితో కాకుండా ఉత్వసంధితో ప్రారంభించారు. అత్వసంధి బహుళ సంధి , ఉత్వ సంధి నిత్య సంధి. విద్యార్థులకు మొదటే బహుళం గురించి చెప్పి , వారిని తికమక పెట్టడం కంటే నిత్య సంధిని పరిచయం చేయడం విద్యార్థులకు వ్యాకరణం సులభంగా నేర్పించవచ్చని చిన్నయ సూరి అభిప్రాయం. ఎంత మంచి ఆలోచన.
తన బాలవ్యాకరణంలో ఉత్త్, అత్త్ ,ఇత్త్ అని తపరకరణం(హ్రస్వ ఉకార, అకార ,ఇకార ఉకారములు) చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంది. ఉత్తు అంటే హ్రస్వమైన ఉత్వం అని అర్థం. ఉకారం అంటే ఉ మరియు ఊ అని అర్థం.
హ్రస్వమైన ఉత్వమునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది.
రాముడు+ అతడు… రాముడతడు
సోముడు+ ఇతడు… సోముడితడు
వారు+ ఎవరు ….. వారెవరు… మొదలైనవి.
వ్యాకరణ ప్రియులు ఈ సంధిని ఉకారసంధి అని గాక ఉత్వసంధి అని చెప్పాలని సూచించారు. ఎందుకంటే?
ఉకార సంధి అని చెప్పడం వలన ఉ, ఊ లు రెండు వస్తాయి. కానీ ఉత్వసంధి అని చెప్పడం వలన కేవలం హ్రస్వమైన ఉత్వం మాత్రమే ఉంటుంది. కనుక ఉత్వసంధి అని చెప్పడం సబబుగా ఉంది.
ఉత్వసంధి నిత్యసంధి అయినప్పటికీ కొన్నిచోట్ల వికల్పరూపం కూడా కనిపిస్తుంది. అందుకే రెండో సూత్రం ఇలా సూత్రీకరించారు.
“ప్రథమేతర విభక్తి, శత్రర్థక చువర్ణంబులందున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగు”
సూత్రమును ఒకసారి పరికిద్దాం!
విభక్తులు తెలుగులో ఏడున్నాయి. అవి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్టి, సప్తమీ. వీటిలో ప్రథమా విభక్తి గాక మిగిలిన విభక్తుల్లో ఉకారం చివరనున్న విభక్తులు
నన్నున్… ద్వితీయా విభక్తి
కొరకున్…. చతుర్థీ విభక్తి
నాకున్….‌‌ షష్టీ విభక్తి
అందున్…. సప్తమీ విభక్తి .
అందున్ సామ్యం చేత ఇందున్, ఎందున్ కూడా గ్రహించాలి.
ఇవేకాక శత్రర్థక చువర్ణం అంటే వర్తమాన కాలంలోని అసమాపక కాలమును సూచించు చువర్ణమని అర్థము.
వచ్చుచున్, చూచుచున్ ఇలాంటివి శత్రర్థక చువర్ణకాలు. పైన సూచించిన విభక్తి ప్రత్యయాలకు గానీ, శత్రర్థకాలుకు గానీ వైకల్పికముగా సంధి జరుగుతుంది.
నన్నున్+ అడిగె… సంధి జరిగితే మొదట నన్నున్ లో ఉన్న ద్రుతం లోపించి
నన్ను+ అడిగె…‌ ఇక్కడ సంధి జరిగి నన్నడిగె అవుతుంది. సంధి జరగని పక్షంలో ద్రుతం వచ్చి
నన్నున్+ అడిగె.‌..‌నన్నునడిగె అనే రూపం ఏర్పడుతుంది. ఇలా ఈ సూత్రం ద్వారా రెండు రూపాలు సిద్ధిస్తాయి. మిగిలిన ఉదాహరణలు చూద్దాం!
నాకొరకున్+ ఇచ్చె … నాకొరకిచ్చె.. నాకొరకునిచ్చె
నాకున్+ ఆదరువు… నాకాదరువు… నాకునాదరువు
నాయందున్+ ఆశ… నాయందాశ.. నాయందునాశ
ఇందున్+ ఉన్నాడు… ఇందున్నాడు… ఇందునున్నాడు…
ఎందున్+ ఉంటివి.. ఎందుంటివి.. ఎందునుంటివి
వచ్చుచున్+ ఉండెను… వచ్చుచుండెను.. వచ్చుచునుండెను
చూచుచున్+ ఏగెను… చూచుచేగెను… చూచుచునేగెను…
తరువాత యడాగమ సంధిని చూద్దాం!
తెలుగులో అచ్సంధులలో ఎక్కడైనా సంధి జరగకుంటే యడాగం వస్తుంది. దీర్ఘాచ్చులు మీద సంధి జరగదు. అత్వ, ఇత్వ సంధుల మీద కొన్ని చోట్ల సంధి జరగదు. అలాంటి సందర్భాల్లో యడాగమం వస్తుంది. అందుకే చిన్నయసూరి యడాగమం సంధిని ఈ విధంగా సూత్రీకరించారు.
“సంధి లేనిచోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమగు”
మా+ అమ్మ…. మాయమ్మ
మీ+ ఇల్లు..‌‌ మీ ఇల్లు
మా+ ఊరు…మాయూరు
ఈ ఉదాహరణలో పూరస్వరంలో దీర్ఘం ఉంది కాబట్టి సంధి జరగలేదు.
తర్వాత అత్వ సంధిని చూద్దాం చిన్నయసూరి ఆత్వసంధిని ఇలా సూత్రీకరించారు.
” అత్తునకు సంధి బహుళము”.
బహుళమనగా అనేక రకములని అర్థం. కానీ వ్యాకరణ పరిభాషలో బహుళము నాలుగు రకాలు. 1. ప్రవృత్తి (నిత్యము)
2. అప్రవృత్తి (అనిత్యము)
3. విభాష (వైకల్పికము)
4. అన్యత్వం
వీటి వివరణ చూద్దాం!
సంస్కృతంలో బహుళం గురించి ఇలా సూత్రీకరించారు.
క్వచిత్ ప్రవృత్తిః క్వచిదప్రవృత్తిః
క్వచిత్ విభాషా క్వచిదన్యదేవ
విధేర్విధానం బహుధా సమీక్ష
చతుర్విధం బహుళకం వదన్తి
1. ప్రవృత్తి :- విధించిన వ్యాకరణ కార్యం తప్పక జరగడాన్ని ప్రవత్తి లేదా నిత్యము అంటారు.
సీత+ అమ్మ…. సీతమ్మ
రామ +అయ్య రామయ్య
2) అప్రవృత్తి:- విధించిన వ్యాకరణ కార్యం జరగకుంటే అప్రవృత్తి లేదా అనిత్యం అంటారు.
అమ్మ+ ఇచ్చెను…. అమ్మయిచ్చెను
దూత+ ఇతడు…. దూతయితడు
3) విభాష :- విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి జరిగి మరొకసారి జరగకుంటే దాన్ని వైకల్పికం లేదా విభాష అంటారు.
మేన+ అల్లుడు… మేనల్లుడు, మేనయల్లుడు
పుట్టిన+ ఇల్లు… పుట్టినిల్లు, పుట్టినయిల్లు
4) అన్యత్వం:- విధించిన వ్యాకరణకార్యం ఒక విధంగా జరగవలసి ఉండగా మరొక విధంగా జరగడానికి అన్యత్వం అంటారు.
ఒక+ఒక.. ఒకానొక
పై ఉదాహరణలో ఒక+ ఒక ఆమ్రేడిత సంధి జరిగి ఒకొక్క కావలసి ఉండగా అలా జరగక కకారమునకు దీర్ఘం వచ్చి దాని పైన ద్రుతము వచ్చి ఒకానొక అయినది. అలాగే
తామర+ ఆకు…. తామరపాకు
బొమ్మ+ ఇల్లు… బొమ్మరిల్లు.. మొదలైనవి.
బహుళగ్రహణము చేత స్త్రీవాచక, తత్సమ, సంబోధనాంతములకు సంధిలేదని చిన్నయసూరి సూత్రీకించారు. ఆ సూచన ప్రకారం
అమ్మ+ ఇచ్చెను… అమ్మయిచ్చెను
దూత+ ఇతడు… దూతయితడు
చెలువుడ+ ఇందము… చెలువుడయిందము
స్త్రీ వాచక శబ్దాలు అంటే స్త్రీలను గురించి తెలిపే అమ్మ, అక్క,అవ్వ, మొదలైనవి. తత్సమ శబ్దాలు అంటే సంస్కృత పదాలు మీద తెలుగు పదాలు చేరడం వలన ఏర్పడిన పదాలు. సంబోధనాంతం అంటే ఎవరిని సంభోధన చేస్తామో ఆ పదం. ఇలాంటి పదాల మీద సంధి జరగదని తెలుసుకోవాలి.

ఇత్వసంధిలోని భేదాలు తెలుసుకుందాం!
” ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఏమి మొదలైన పదాల్లో ఉన్న హ్రస్వమైన ఇకారమునకు అచ్చు పరమైతే సంధి జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు.
ఉదా:- ఏమి+ అంటివి
ఈ పదాల మధ్య సంధి జరిగితే ఏమంటివి అవుతుంది. ఈ రెండు పదాల మధ్య సంధి జరగకపోతే వాటి మధ్య యడాగమం వచ్చి ఏమియంటివి అనే రూపం ఏర్పడుతుంది.
అలాగే

మరి +ఏమి::: మరేమి, మరియేమి
హరికిన్ + ఇచ్చె సంధి జరిగితే పూర్వ రూపంలో ఉన్న ద్రుతం లోపిస్తుంది .ఆ తర్వాత ఇత్వం మీద సంధి జరిగి హరికిచ్చె అవుతుంది . ఒకవేళ సంధి జరగపోతే ముందున్న ద్రుతంతో కలిసిపోయి హరికినిచ్చె అని ఏర్పడుతుంది. సూరి ఈ సూత్రం కింద “ఏమి, మఱి , కి- షష్టి, అది, అవి, ఇది,ఇవి, ఏది, ఏవి” అనేవి ఆకృతిక గణాలని ఇచ్చారు. పైన ఇచ్చిన పదాల్లో ఇత్వ సంధి వైకల్పికముగా జరుగుతుందని అర్థం.
తరువాత సంధిని చూద్దాం!
“క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఇంతకు మునుపు సూత్రంలో ఎక్కువ భాగం సర్వనామాలు మీదే సంధి జరిగిన విధానం చెప్పబడింది. ఇప్పుడు క్రియా పదాలు మీద సంధి వైకల్పికముగా జరుగుతుందని సూచించారు.
ఉదా- వచ్చిరి+ అపుడు :::
సంధి జరిగితే వచ్చిరపుడవుతుంది. సంధి జరగకపోతే రెండు పదాల మధ్య యడాగమం వచ్చి వచ్చిరియప్పుడు అని అవుతుంది.
ఇలాగే
వచ్చితిమి+ ఇప్పుడు ::: వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు అని అవుతుంది.
తర్వాత సూత్రం గురించి తెలుసుకుందాం. “మధ్యమ పురుషక్రియలందిత్తునకు సంధి యగును”.
తెలుగులో పురుషలు మూడు రకాలు. అవి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రధమ పురుష .
తన గురించి తాను తెలిపేది ఉత్తమ పురుష, ఎదుటివారి గురించి తెలిపేది మధ్యమ పురుష, దూరంగా ఉన్న వారి గురించి తెలిపేది ప్రథమ పురుష.
మధ్యమ పురుష క్రియల మీదున్న ఇత్వానికి అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్థము.
ఉదాహరణలు పరిశీలిద్దాం.
ఏలితివి+ అప్పుడు ఇక్కడ ఏలుతివి అనేది మధ్యమ పురుష క్రియ. దీని మీదున్న ఇత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరిగి ఏలితివపుడు అవుతుంది. ఇలాగే ఏలితి+ ఇప్పుడు… ఏలితిప్పుడు, ఏలితిరి+ ఇప్పుడు ఏలితిరిప్పుడు అనే రూపాలు ఏర్పడుతాయి .
తర్వాత సూత్రం చూద్దాం.
“క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు”.
క్త్వార్థమంటే భూతకాలిక అసమాపక క్రియ. భూత కాలిక అసమాపక క్రియలు మీద ‘ఇ’ అనే ప్రత్యయం చేరుతుంది.
వండు+ ఇ:::: వండి
చదువు + ఇ:::: చదివి
ఇలా వచ్చిన క్త్వార్థమునకు అచ్చుపరమైతే సంధి జరగనే జరగదని సూత్రార్థం.
వచ్చి+ ఇచ్చెను. ఇక్కడ వచ్చి అనేది క్త్వార్థక ఇకారం ఉంది కాబట్టి దాని మీద సంధి జరగదు అలాంటి సమయంలో యడాగం వచ్చి
వచ్చియిచ్చెను అని అవుతుంది. అలాగే
వండి+ ఇచ్చెను::: వండియిచ్చెను
దీనితో ఇత్వ సంధి సూత్రాలు పూర్తి అయ్యాయి.
తర్వాత ద్విరుక్త టకారాదేశ సంధి గురించి తెలుసుకుందాం!
“కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఱ, డలకచ్చు పరమైనపుడు ద్విరుక్తటకారాదేశంబగు”
వివరణ చూద్దాం!
కుఱు, చిఱు అనే పదంలోని “ఱ”కారమునకు కడు, నడు, నిడు అనే పదములోని “డ”కారమునకు అచ్చు పరమైతే ద్విరుక్తటకారం అంటే రెండు టకారాలు(ట్ట్) ఆదేశంగా వస్తుందని సూత్రార్థం.
కుఱు+ ఉసురు
కుఱ్+ ఉ+ ఉసురు
ఈ సూత్ర ప్రకారం ‘ఱ్’ స్థానంలో ట్ట్ వచ్చి చేరి కుట్ట్ +ఉసురు అవుతుంది. తర్వాత ట్ట్ మీద ఉ చేరి ట్టు అవుతుంది. తర్వాత ఉత్తునకచ్చు పరమగునపుడు సంధి యగు అనే సూత్రంతో కుట్టుసురు అవుతుంది.
ఇలాగే
చిఱు+ ఎలుక…. చిట్టెలుక
కడు+ ఎదురు…. కట్టెదురు
నడు+ ఇల్లు… నట్టిల్లు
నిడు+ ఊర్పు… నిట్టూర్పు
తరువాత సంధిని గురించి తెలుసుకుందా!
” అందు, అవగాగమంబులనం దప్ప అపదాది స్వరంబు పరంబగుగనప్పుడు అచ్చునకు సంధి యగు”
అందు,అవక్ అనేవి తప్ప మిగిలిన అపదము
అనగా పదము కానిది పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్ధం. అందు, అవక్ పరమైనప్పుడు వికల్పంగా సంధి జరుగుతుంది.
వాడు+ ఏ అన్నప్పుడు “ఏ” అనేది అపదం. అనగా ఏ అనేది పదం కాదు. అలాంటప్పుడు ఆ రెండు పదాల మధ్య సంధి నిత్యంగా జరిగి వాడే అవుతుంది.
ఇది+ ఓ…ఇదో
అది+ ఓ …. అదో
ఇలా పదాల్లో సంధి నిత్యంగా జరుగుతుంది.
మూర+ ఎడు ఇక్కడ ఎడు అనే పదానికి అర్థం లేదు, అది అపదం కాబట్టి నిత్యంగా సంధి జరిగి మూరెడు అవుతుంది.
వీసె+ ఎడు..‌‌ వీసెడు
అర్ధ + ఇంచు ఇక్కడ ఇంచు అనేది అపదం కాబట్టి సంధి నిత్యంగా జరుగుతుంది. అర్థించు అవుతుంది. ఇలాగే
నిర్జి+ ఇంచు::: నిర్జించు
అందు, అవుక్ అనేవి పరమైతే ఎలాంటి రూపాలు వస్తాయో చూద్దాం!
రాముల+ అందు…. సంధి జరిగితే రాములందు అవుతుంది. సంధి రాని పక్షంలో రాములయందు అవుతుంది.
ఎనిమిది+ అవ.. ఎనిమిదవ, ఎనిమిదియవ ఇలా రెండు రూపాలు ఏర్పడుతాయి.

ఆమ్రేడితం గురించి చిన్నయసూరి “ద్విరుక్తం యొక్క పరరూపం ఆమ్రేడితము” అని నిర్వచనం చెప్పారు. ద్విరుక్తం అనగా ఒకే పదం రెండుసార్లు రావడమని అర్థం. పరరూపం అనగా సంధి పదంలోని రెండవ పదం. ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండవసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితమంటారని సూత్రార్థం.

ఇప్పుడు ఆమ్రేడిత సంధిలోని వివిధ సూత్రాలను పరిశీలిద్దాం….
1) అచ్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు సంధి తరచుగానగు.
పూర్వ రూపంలో చివరనున్న అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి ఎక్కువ భాగం జరుగుతుంది. సూత్రంలో తరచుగా అని చెప్పడం చేత కొన్నిచోట్ల వైకల్పికముగా కూడా జరుగుతుందని భావం.
ఔర+ ఔర …ఔరౌర
ఆహా +ఆహా… ఆహాహా
ఊరు +ఊరు… ఊరూరు
అక్కడ+ అక్కడ …అక్కడక్కడ మొదలైనవి.
సూత్రంలో తరచుగా అనడం చేత
ఏమి+ ఏమి… అన్నప్పుడు సంధి జరిగితే ఏమేమి అవుతుంది. సంధి జరిగిన పక్షంలో యడాగమం వచ్చి … ఏమియేమి అవుతుంది.
ఏగి+ ఏగి అన్నప్పుడు ఏగి అనేది క్త్వార్థకం కాబట్టి క్త్వార్థక ఇకారం మీద సంధి రాదు కాబట్టి యడాగమం వచ్చి ఏగియేగి అనే రూపం ఏర్పడుతుంది.
రెండవ సూత్రం చూద్దాం.
2)ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్ల అదంత ద్విరుక్తటకారంబగు.
సూత్రార్థం చూద్దాం! కడ మొదలైన పదాలకు ఆమ్రేడితం పరమైతే పూర్వ పదంలోని తొలి అక్షరం తప్ప దాని మీద ఉన్న అక్షరాలన్నిటికి కలిపి అదంత ట కారం అంటే ” ట్ట” అనేది ఆదేశంగా వస్తుందని భావం.
కడ +కడ …కట్టకడ
చివర+ చివర …చిట్టచివర
పగలు+ పగలు… పట్టపగలు
బయలు+ బయలు బట్టబయలు మొదలైనవి.
కడాదులని క్రింది వాటిని పిలుస్తారు.
కడ, ఎదురు, కొన, చివర, తుద,తెన్ను, తెరువు పగలు, బయలు మొదలైనవి.
ఇంకా మూడవ సూత్రం చూద్దాం!
3)నిందయందు ఆమ్రేడితంలో ఆద్యక్షములకు హ్రస్వ దీర్ఘములకు గి గీ లగు.
నిందను చెప్పే సందర్భంలో ఆమ్రేడితం అనగా రెండో పదంలో మొదటి అక్షరం హ్రస్వం ఉంటే గి వస్తుంది, దీర్ఘం ఉంటే గీ వస్తుంది అని సూత్రార్థం.
రావణుడు +రావణుడు… రావణుడు గీవణుడు ఇక్కడ రెండవ పదంలోని రావణుడు పదంలోని రా కు బదులుగా గీ వస్తే రావణుడు గీవణుడు అని అవుతుంది.
అలాగే కుంభకర్ణుడు+ కుంభకర్ణుడు… కుంభకర్ణుడు గింభకర్ణుడు
పుస్తకం+ పుస్తకం … పుస్తకం గిస్తకం
పూలు+ పూలు… పూలు గీలు అవుతుంది.

ఇక నాలుగో సూత్రం చూద్దాం
4) ఆమ్రేడితం పరమగునప్పుడు విభక్తి లోపం బహుళముగానగు.
మొదటి పదం చివరనున్న విభక్తి ప్రత్యయానికి ఆమ్రేడితం పరమైతే ఆ విభక్తి ప్రత్యయానికి లోపం బహుళంగా వస్తుంది, అనగా అనేక రకాలుగా రాచ్చునని సూత్రార్థం.
అప్పటికిన్ + అప్పటికిన్
ఇక్కడ కిన్ అనే షష్టి విభక్తి మీద సంధి జరిగితే విభక్తి లోపించి అప్పటప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. ఒకవేళ సంధి జరగకపోతే రెండవ పదంలోని మొదటి అచ్చు విభక్తి ప్రత్యయముతో కలిసి అప్పటికనప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. అక్కడన్+అక్కడన్ …అక్కడక్కడన్ లేదా అక్కడనక్కడన్ అని అవుతుంది.
మరొక ఉదాహరణ చూద్దాం!
ఊరన్+ ఊరన్ …ఊరూరన్ లేదా ఊరనూరన్ అని వస్తాయి .
సూత్రములో బహుళమని చెప్పడం చేత ఇంచుక , నాడు మొదలైన పదాలు చివరి అక్షరం లోపించి సంధి జరుగుతుంది.
ఇంచుక + ఇంచుక… ఇక్కడ మొదటి పాదంలో చివరి అక్షరం క లోపిస్తే ఇంచించుక అవుతుంది. క లోపించకుంటే ఇంచుకించుక అవుతుంది. అలాగే
నాడు+ నాడు…. నానాడు లేదా నాడు నాడు అనే రూపాలు కూడా ఏర్పడతాయి.
ఇక ఐదవ సూత్రం చూద్దాం
5) ఆమ్రేడితం పరమగునప్పుడు మధ్యమ ము,డుజ్ లకు లోపం విభాషనగు.
డు, ము, వు,లు మొదలైన విభక్తి ప్రత్యయాలు కాగా డుజ్,రు,వు,రు,ను,ముజ్ అనేవి క్రియా ప్రత్యయాలు. ఈ క్రియా ప్రత్యయాలలో మధ్యమ పురుషను చెప్పేటప్పుడు బహువచనములో ము ప్రత్యయము ఏకవచనంలో డు ప్రత్యయము అనేవి విభాషగా లోపిస్తుందని సూత్రార్థము. ఉండుము+ ఉండుము… సంధి జరిగితే ము లోపించి ఉండుండుము అవుతుంది. సంధి జరగకపోతే ఉండుముండుము అనే రూపాలు వస్తాయి.
ఇలాగే కొట్టుడు+ కొట్టుడు… కొట్టుకొట్టుడు
కొట్టుడు కొట్టుడు అనే రూపాలు వస్తాయి.
ఇక ఆరవ సూత్రం చూద్దాం!
ఆమ్రేడితంలో అనేక రకాలుగా కార్యాలు రావడం వలన అన్ని ప్రయోగాలకు సూత్రాలు నిరూపించడం కష్టం కనుక ఒక నిపాత సూత్రంతో వాటికి సాధుత్వం కల్పించాలని చిన్నయ సూరి ఈ సూత్రాన్ని చెప్పాడు. దాన్ని చూద్దాం!
6) అందదుకు ప్రభృతులు యథాప్రయోగముగా గ్రాహ్యములు.
వివరణ చూద్దాం! అందదుకు మొదలైనవి కవి ప్రయోగాలను యథాతథంగా స్వీకరించాలని సూత్రార్ధము.
అదుకు+ అదుకు….అందదుకు
ఇంకులు+ ఇంకులు..ఇఱ్ఱింకులు
ఇగ్గులు+ ఇగ్గులు… ఇల్లిగ్గులు
చెదురు+ చెదరు …చల్లచెదురు, చెల్లాచెదురు
తురుము+తురుము …తుత్తుమురు
తునియలు+ తునియలు… తుత్తునియలు మిట్లు+ మిట్లు, మిరుమెట్లు మొదలైనవి .
పైన ఉన్న ఉదాహరణలు పరిశీలించండి. ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్కరూపంలో ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం సృష్టించడం కష్టం కనుక ఇలా సూరి తెలివిగా నిపాతం చేశాడు.

March 17, 2024 1 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మనసు చెమ్మ

by Chandaluri Narayana Rao March 17, 2024
written by Chandaluri Narayana Rao

మనసుది  బహు పెలుసు 
ఇష్టం చిట్లి 
విరిగి కుప్పకూలితే ?

నలిగే మనిషి కేక
వినబడని లోతులో పడి
కంటికి కనిపిస్తుందా?

జ్ఞాపకాల సుడిలో
తునకలైన మాట
ఖాళీ ముఖంలో తేలి

ఎండిన పరిచయానికి
చులకనతో చిరిగి
గాలికి కొట్టుకుపోతూ

పొట్లిన రోజులకి
మనిషి స్తంభంలా ఒరిగి
మనసు పగుళ్లు బారి

కల ఇంకిన కళ్ళలో
చీకటి సెగల మధ్య
కోరిక ఆరిపోతున్నా

వెన్నుముకకు 
వ్రేలాడే శరీరంలోనూ
మనసు చెమ్మ రేగుతునే ఉంది.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us