మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కవిత్వాస్వాదన —- ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 17, 2024
written by Narendra Sandineni

అన్నవరం దేవేందర్ తెలంగాణ పల్లె సోయగం అరుగు కవిత్వం.
భరోసా కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండల ప్రజా పరిషత్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల, అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని అరుగు కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలంగాణ మాండలికంలో రాసిన అరుగు కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.తెలంగాణ పల్లెల్లో ప్రతి ఇంటి ముందట అరుగు ఉంటుంది.కవి దేవేందర్ అరుగు పై వ్రాసిన కవిత ఆద్యంతం మనోహరం.అరుగు కవిత చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి. “ఇల్లు వాకిలి ఇంటి చుట్టూరా పడారి “గోడకు ఆనుకునే అటు ఇటూ అరుగులు “ఆడ కూకోని పెట్టుకున్న ముచ్చట్ల మురిపాలు “ఇప్పటికీ చెవుల్ల వినిపిస్తున్న జ్ఞాపకాలు” మొదటి నాలుగు కవితా చరణాలు ఎంతో హృద్యంగా ఉన్నాయి.తెలంగాణలో పాడిపంటలతో పొంగి పొర్లే పల్లెలు ఎక్కడ చూసినా చెట్టు చేమలతో ఎంతో అద్భుతంగా ఉండేవి.ఈనాడు ఆ పల్లెలు తన సహజ సౌందర్యాన్ని కోల్పోతున్నాయి.పల్లెలో వర్షాలు లేక పంటలు పండక కరువు విలయతాండవం చేస్తున్నది.

ఈనాడు పల్లె జనం పల్లెను విడిచి పట్నాలకు వలస వెళుతున్నారు. ఆరుగాలం కష్టించే అన్నదాత ఇవ్వాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు.పల్లెల్లో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది.ఆ పల్లెల్లో నివసించే జనాలు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని అరుగుల మీద కూర్చుండి వాళ్ళ కష్ట సుఖాలు కలబోసుకునే వారు. పల్లెలో జనాలు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వారు.పల్లెలో ఎంతో మంచి అనుకూలమైన వాతావరణం ఉండేది.ఇప్పుడు పల్లెల్లో కూడా పట్టణమునకు చెందిన ఘర్షణ వాతావరణం ఏర్పడింది.పల్లెలోని అరుగులు,ఇండ్లు ప్రేమాభిమానాలకు నెలవుగా ఉండేవి.పల్లెలో జనాలు ఆ పాత ఇండ్లను,ఇంటి గుమ్మం ముందు ఉన్న పాత అరుగులను కాపాడుకోడం లేదు.పల్లెలో అరుగులపై కూర్చుండి జనాలు ఆడినారు, పాడినారు,పడుకున్నారు.ఆనాటి పల్లె ప్రజలు ఇప్పుడు ఎవ్వరు లేరు.కాలం వారిని తన వెంట తీసుకుపోయింది.పల్లెలోని కొందరు ఉపాధి పేరిట పల్లెను విడిచి పట్టణాలకు వలస వెళ్ళినారు. ఇప్పటికీ పల్లెను నమ్ముకుని జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు.పల్లె అరుగుల మీద కూర్చుండి ఇప్పటికీ కొందరు తమ కష్ట సుఖాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు.పల్లెలో జనాలు అరుగుల మీద కూర్చుండి మాట్లాడుకోవడం,ఇప్పటికీ అదొక వేడుకగా కొనసాగుతుంది. “వాకిట్లోనే శాద బాయి దాని పొన్న జాలారి “పక్కన్నే పెరిగిన బంతి చెట్ల వరుస “పొద్దుగాల రోజూ కాల్రెక్కలు కడుక్కుంటాంటే “కంటికి ఇంపుగ కనిపించే బంతిపూల సొగసు”. తెలంగాణలో పల్లె ఎలా ఉంటుంది.పల్లె రూపు రేఖల గురించి మనకు పరిచయం చేస్తున్న వాక్యాలు ఇవి. తెలంగాణ మట్టిలో పూసిన మాణిక్యాల వలె మనకు అరుగులు కనిపిస్తున్నాయి.తెలంగాణలో పల్లెల్లో ప్రతి ఇంటి వాకిట్లో చేద బావి ఒకటి ఉంటుంది.చేద బావి పక్కనే జాలారి ఉంటుంది.చేద బావి లేని వాళ్లు పక్కింట్లో నీళ్లు తోడుకొని పోతుంటారు. తెలంగాణ పల్లె జనాల్లో నెలకొన్న ఆప్యాయతలు, అనుబంధాలు మనసును అబ్బురపరుస్తాయి.ఒక ఆనంద లోకంలోకి మనల్ని తీసుకువెళ్తాయి.పల్లె పల్లె ఆంతా ఒక వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు.తెలంగాణ పల్లె ఎక్కడ కని విని ఎరుగని చిత్రమైన దృశ్య కావ్యంలా అగుపిస్తుంది.అలనాటి రామ రాజ్యం రోజులను గుర్తుకు తెస్తుంది.జాలారిలో నీళ్లు నిలవకుండా చూస్తారు.జాలారిని ఆనుకొని ప్రతి ఇంట్లో బంతి చెట్ల వరుస ఉంటుంది.పొద్దుగాల రోజు కాల్రెక్కలు కడుక్కుంటుంటే కంటికి ఇంపుగా కనిపించే బంతిపూల సొగసు మధుర మనోహరంగా ఉంటుంది.చూడడానికి బంతిపూలు ఎంతో అందంగా ఉంటాయి.బంతిపూలు రెండు రకాలు. రిక్క బంతిపూలు మరియు ముద్దబంతి పూలు. మనకు ఘంటసాల పాడిన సినిమా పాట ముద్దబంతి పూలు మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికి తెలుసులే ఈ పాట ఎన్నిసార్లు విన్నా మన హృదయం పరవశించి పోతుంది.మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.అందుకే వాటిని అపాత మధురాలు అంటారు.ఆ బంతి పూలు స్త్రీలు తమ సిగలో అలంకరించుకుంటారు.మరియు కొందరు మాల అల్లి తమ కులదేవతకు సమర్పించుకుంటారు.పల్లెలో ప్రతి ఇంటిలోనూ తోటలో చేనులు చెలకల్లోనూ పొలాల గట్ల మీదనూ బంతి చెట్లు పెంచుతారు.బంతిపూల సొగసు పరిమళాలు కమనీయంగా రమణీయంగా ఉంటాయి.పల్లెలో ప్రతి ఇంటి ముందు పందిరి వేస్తారు.దానిమీద ఈత కమ్మలు,తాటి కమ్మలు మరియు వరిగడ్డితో కప్పుతారు.పల్లెలో పందిరి కింద మంచం వేసి ఉంటుంది.పల్లె జనాలు పందిట్లోనే కూర్చుండి ముచ్చట్లు పెడతారు.వారు అలసి పోయినప్పుడు మంచంలో సేద తీరి అక్కడే పందిరి కింద నిద్రపోతారు. “పెద్దర్వాజ ముందల పరుచుకున్న పందిరి. “గుంజల మీంచి పచ్చగా పారిన అన్వే తీగ. “చిన్నపిందె రోజింత రోజింత పెరిగిన అన్యే కాయ. “అమ్మ తెంపకపోయి పొయ్యి మీద గోలిస్తాంటే. “ఇల్లంతా కమ్మ కమ్మని వాసన నోర్లల్ల ఊరిల్లు”. పెద్దర్వాజల ముంగల తెలంగాణలో ప్రతి ఇంటి ముందు పరుచుకున్న పందిరి ఉంటుంది.పందిరికి వర్షాకాలం రాగానే అనియపు విత్తనాలు నాటుతారు.పల్లెలో అనియపు తీగే పెరిగి పెద్దయి పందిరి నిండా పరుచుకుంటుంది.అనియపు చెట్టు లెక్క లేనన్ని కాయలు కాస్తుంది.సొర కాయలను ఆ ఇంటి వారు తినడమే కాకుండా తమ ఇరుగు పొరుగు వారికి పంచుతారు.కవి దేవేందర్ తన కవితలో చిన్న పిందె పెరిగి పెద్దది కాగానే అమ్మ తెంపుకపోయి పొయ్యి మీద గోలిస్తాంటే ఇల్లంతా కమ్మ కమ్మని వాసన నోర్లల్ల ఊరిల్లు ఊరుతాయని అంటున్నాడు.అమ్మ చేతి వంట ఎంతో అద్భుతంగా ఉంటుందనేది జగమంతా ఎరిగిన సత్యం.ప్రతి పల్లెలో అమ్మ ఎప్పుడు ఇలానే కమ్మ కమ్మగా వండి పెడుతుంది.తెలంగాణలో ప్రతి అమ్మ కుటుంబం కొరకు ఆరుగాలం కష్టపడుతుంది.అమ్మ తన భర్తతో,పిల్లలతో, బంధువులతో మరియు ఇరుగు పొరుగు వారితో ఎంతో సఖ్యతగా మెలుగుతూ కుటుంబాన్ని గుట్టుచప్పుడు కాకుండా గుంభనంగా ఎంతో నేర్పుగా అలవోకగా కొనసాగిస్తుంది.పల్లెలో కోడి కూతతోనే ఆ తల్లి నిద్ర లేస్తుంది.అమ్మ ఇల్లును మరియు వాకిలిని శుభ్రంగా ఊడ్చుతుంది.అమ్మ వాకిలిని పెండ నీళ్లతో కల్లాపి (సాన్పు) చల్లుతుంది. అమ్మ వాకిట్లో సుద్ద మట్టితో ముగ్గులు వేస్తుంది. రంగవల్లులతో వాకిలిని తీర్చిదిద్దుతుంది.అమ్మ ఇల్లు మొత్తం ఎర్రమట్టి కల్పిన పిడుసతో అలుకుతుంది. అమ్మ పశువుల పేడ తీసి వేసి పశువుల కొట్టం శుభ్రం చేస్తుంది.అమ్మ పశువులకు కుడితి నీళ్లు పెడుతుంది.అమ్మ పాలిచ్చే బర్ల పాలు పిండుతుంది. తర్వాత మగ వాళ్ళు పశువులను తోలుకొని వ్యవసాయ పనులకు తరలిపోతారు.అమ్మ తర్వాత పొయ్యి గద్దెలు పుట్ట మట్టి పిడుసతో అలుకుతుంది. తర్వాత పొయ్యి ముట్టించి పాలు వేడి చేస్తుంది. “పదారి గోడకు పొడుగుతా “ఎర్రలుకు మీద సున్నం తీనెలు ,”కడపలకు పుధిచ్చిన పసుపు పండుగ శోభ “ఎర్ర కుంకుమ,పసుపు,తెల్లబొట్ల సింగారం “గల్మల్ల నిలబడంగనే కండ్లకు ఇంపైన మురిపం.” మన తెలంగాణలో ప్రతి పల్లెలోని ఇల్లు ఇలానే ఉంటుంది.పడారి గోడకు పొడుగుతా ఎర్ర మట్టితో అలుకుతారు మరియు సున్నంతో బొట్లు పెడతారు. పల్లెలో దర్వాజా మరియు కడపలకు పసుపుతో అలంకరించి ఎర్ర కుంకుమ పసుపు తెల్లబొట్లతో సింగారం చేస్తారు.ప్రతి ఇంట ఇలానే అలంకరణ చేసి శుభ్రంగా ఉంచుతారు. “పెరట్లో సన్న సన్నగా ఎగబాకుతున్న మల్లె తీగ”. ప్రతి ఇంటిలో మల్లె చెట్టు ఉంటుంది.మల్లె పూల పరిమళం ఎంతో కమ్మగా ఉంటుంది.మల్లె పూలను ఆడవాళ్లు తమ సిగలో అలంకరించుకుంటారు. “గోడ అవతల నుంచి చల్లగాలి విసురుతున్న యాపలు” వేప చెట్టు గాలి ఎంతో అద్భుతంగా ఉంటుంది.వేప చెట్టు గాలి గురించి చెప్ప తరం కాదు.వేప చెట్టును మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు.వేప ఆకులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.వేపాకును ఇళ్లల్లో టేకు దూలాలు అమర్చి టేకు పరోటా చెక్కలను కొట్టిన తర్వాత దానిమీద వేపాకు పరిచి తర్వాత గూన పెంకలు కప్పుతారు.పల్లెలో నివసించే జనాలు గూన పెంకలతో ఇల్లు కట్టుకునే వారు. పల్లెలో గూన పెంకల ఇల్లు కూడా చాలా చల్లగా ఉంటుంది.కాలం మారింది.ఇప్పుడు గూన పెంకల ఇండ్లు కట్టడం లేదు.పాత గూన ఇండ్లు సరైన మరమ్మతులు లేక కూలిపోతున్నాయి.పల్లెల్లో కుటుంబాలు పెరిగి పాత ఇండ్లను విడిచి రోడ్డుకు దగ్గరగా వెళ్లి స్లాబ్ బిల్డింగులు కట్టుతున్నారు.పాత పల్లెలు బీడు పడుతున్నాయి.పల్లెలో జనాలు రోడ్డు దిక్కు వచ్చి షాపులు సెట్టర్లతో ఇల్లు కట్టి ఉంటున్నారు.పల్లె వాతావరణం కనుమరుగు అవుతున్నాయి. కొన్నాళ్లకు గూన పెంకుల ఇండ్లు ఉండవు. “ఆ కళల వాకిట్లో గడెంచ పరుచుకొని ఒరుగుతే” “కాకులు కోయిలలు వూరవిష్కల పలకరింపులు” “దూరంగా గోడ సూరుకు ఉరుకుతున్న ఉడతల జోడి”. “ఊళ్లే మా ఇల్లు వాకిళ్ళ కమనీయ దృశ్య కావ్యం”. పల్లెలో జనాలు చెట్ల కింద ఒరిగితే కాకులు కోయిలల కుహు కుహు రావాలు,ఊరవిష్కల కితకితలు,ప్రతి ఇంట్లో జామ చెట్టు,ఆ జామ చెట్టు మీద ఉడతల జోడి కనబడుతుంది. ఉడతలు, రామచిలుకలు జామ పండ్లు తింటాయి. “ఊళ్లే మా ఇల్లు వాకిళ్ళ కమనీయ దృశ్య కావ్యం”. తెలంగాణలో ప్రతి పల్లెల్లో ఇల్లు ఎలా ఉంటుందో అరుగు అనే కవిత ద్వారా కవి దేవేందర్ చాలా చక్కగా గ్రామీణ వాతావరణాన్ని తెలియపరిచారు. పల్లెలో పుట్టి పెరిగిన దేవేందర్ పల్లెలోని మట్టి పరిమళాన్ని పల్లె సోయగాన్ని ఎంతో ఆకలింపు చేసుకొని ఇలాంటి వాస్తవిక కవితను రాశాడని తోస్తోంది.తెలంగాణ పల్లెల్లో పుట్టిన దేవేందర్ తెలంగాణ పల్లె సంస్కారాన్ని పుణికి పుచ్చుకొని తెలంగాణ పల్లె ఎలా ఉంటుందో అరుగు కవిత ద్వారా మనకు అందించారు.ఇప్పటికీ మన తెలంగాణ గ్రామాల్లో అరుగులు ఉన్నాయి.సబ్బండ వర్ణాల ప్రజలు తమ ముచ్చట్లు మురిపాలతో అరుగు మీద తేలిపోతుంటారు.అరుగు కవిత చదివితే మాభూమి సినిమా చూసినట్టుగా ఉంది. గ్రామీణ వాతావరణం మన కళ్ళకు కదలాడుతుంది. మా భూమి సినిమా తీసింది మన తెలంగాణకు చెందిన పల్లె బిడ్డ బి.నర్సింగరావు.తెలంగాణ పల్లె ముఖచిత్రంలో ఇప్పటికీ అరుగు నిలిచి ఉంది.పల్లె వర్తమానంలో కూడా అరుగు ఉంది.పల్లె భవిష్యత్తులో కూడా అరుగు ఉంటుంది.పల్లె వాకిట్ల చేద బావి దాని పొంటి జాలారి,పడారి గోడ పక్కనే పూల చెట్లు,పూబంతులు ముద్దబంతులతో కూడిన ఎన్నెన్నో పూల తోటలు కనిపిస్తాయి.పల్లెలో ఆ పూల వనాలు మన మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. పల్లెలో పండగలప్పుడు ప్రతి ఇంటి దర్వాజలకు బంతిపూల మాలలు కట్టి అలంకరిస్తారు.ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కడతారు.దేవుని గదిలో బంతి పూల మాలలతో తమ ఇష్ట దైవాన్ని కొలుస్తారు. పల్లెల్లో ఎటు చూసినా పచ్చదనంతో చెట్టు చేమలతో ప్రకృతికి పర్యాయ పదంలా కళకళలాడుతుంటుంది. తెలంగాణలో పల్లెల్లో ప్రతి ఇంట అరుగు శోభించాలని మనమంతా కోరుకుందాం.పల్లె వాతావరణం తలపించేలా అరుగు కవితను రాసిన కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


అన్నవరం దేవేందర్ భరోసా కవిత పై విశ్లేషణా వ్యాసం

ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండలం ప్రజా పరిషత్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని భరోసా కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలంగాణ మాండలికంలో రాసిన భరోసా కవితను ఆసక్తితో చదివాను‌.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.భరోసా కవిత ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.ఇవ్వాళ సమాజంలో మనిషికి భరోసాను ఇచ్చేవారు అరుదుగా కనిపిస్తారు.హామీ ఇవ్వడం,స్థిరముగా చెప్పుట అనేవి భరోసాకు అర్థం.ఎవరి ఆందోళననైనా
తగ్గించడానికి ఉద్దేశించిన సలహా భరోసా.ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అతనికి చెప్పు ఓదార్పు మాటలు భరోసా.నేను ఇది చేస్తానని ఖచ్చితంగా చెప్పడం భరోసా.కవి దేవేందర్ భరోసా కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.
“ఎవుసం ఎటమటమైతేంది
“ఎట్లనన్నా బతుక రాదా
“సచ్చుడు ముచ్చట ఎందుకు సాయిలు నాయినా !
ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను,జంతువులను పోషించి తద్వారా ఆహారాన్ని,మేతను,జనప నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయము లేదా కృషి అంటారు.వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయాభివృద్ధి ఒక కీలకాంశంగా చెప్పవచ్చు.వెనుకటి కాలంలోనే ఎవుసం బాగుండేది.గప్పటి ఎవుసం వేరు.ఇప్పటి ఎవుసం వేరు.అప్పుడు ఇంటిల్లిపాది అందరూ కలిసి ఎవుసం పని చేసే వాళ్లు.ఈనాడు అప్పటి తీరుగా ఇంటిల్లిపాది అందరూ కలిసి ఎవుసం చేయుట లేదు.అప్పుడు అడవి జంతువుల బెడద లేకుండేది. కాలం మారింది.ఇప్పుడు అడవి జంతువుల బెడద ఉంది.కాలం కలిసి రాక వ్యవసాయంలో పంట దిగుబడి రావడం లేదు.కరువు కాటకాల వల్ల పంట దెబ్బతింది.వ్యవసాయంలో పంట రాలేదని ఎందుకు బాధ పడుతున్నావు‌.కాలం కలిసి రాకనే కదా పంట రాక పాయె.పంట దెబ్బతిందని నువ్వు ఇంత దిగులు ఎందుకు పడుతున్నవు.పంట లేక పోయినా ఎట్లనన్నా బతుక రాదా? అని ప్రశ్నిస్తున్నాడు. చనిపోవడం ముచ్చట ఎందుకు చెపుతున్నావు సాయిలు నాయినా అని అతను ఓదార్చుతున్నాడు. సాయిలు నాయిన ఎవుసం చేసే రైతు అని తోస్తోంది.రెక్కలు ముక్కలు చేసుకుని ఎవుసం చేసినప్పటికి పంట దిగుబడి లేక పోవడం వలననే దిగులు పడిన సాయిలు నాయినను ధైర్యం కలిగిస్తూ ఓదార్చుతున్నాడు.
“కలీగం మీద మనుషులందరు
“ఎవుసమే చేస్తండ్రా
“ ఎన్నో తీర్లుగ బతుకుతుండ్రు.
వేదాల ననుసరించి యుగాలు నాలుగు.1) సత్య యుగం 2) త్రేతా యుగం 3) ద్వాపర యుగం 4) కలి యుగం.ప్రస్తుతం నడుస్తున్న యుగం కలియుగం.కలి యుగంలో అన్యాయం,అధర్మం చెలరేగుతుంది. మంచి వాళ్లకు చెడు ఎదురవుతూ ఉంటుంది. కలియుగంలో నివసిస్తున్న మనుషులందరూ వ్యవసాయం వృత్తిగా చేసుకొని బతుకుతున్నారా? అని ప్రశ్నిస్తున్నాడు.ఈ దేశంలో నివసిస్తున్న మనుషులందరు వివిధ రకాల వృత్తులు చేపట్టి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.నీ లాగా ఒక్కటే వ్యవసాయం చేసి మనుషులు బతకడం లేదు.కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. మనుషులు తమ బతుకు గడపడానికి ఎన్నో పనులను ఎన్నో తీర్లుగా చేస్తున్నారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“వో ఫసల్ లుక్సనా అయితది
,”మల్లో పంటకన్నా పచ్చగుండదా
“కాలం కర్మగాలి
“ఎవుసం ఎల్లెల్కల పడచ్చు
“భూమిల నీళ్లు పాతాళం పట్టచ్చు
‘ మొగులుకు కనికరం లేక పోవచ్చు
“ ఆవుసు తీసుకుంటవా ! అన్యాలం చేస్తవా !
ఫసల్ ఉర్దూ పదం.ఫసల్ అనగా పంట.వ్యవసాయం చేస్తున్న రైతుకు వాతావరణం అనుకూలించకపోతే పంటలు పండవు. వర్షాలు లేక కరువు ఏర్పడి ఒక పంట చేతికి రాకపోతే నష్టం వస్తుంది.అంత మాత్రానికే బెంబేలు పడకూడదు.మరుసటి సంవత్సరం వర్షాలు కురిసి పచ్చని పంట చేలతో కళకళలాడుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
“కాలం కర్మగాలి
“ఎవుసం ఎల్లెల్కల పడచ్చు
గడియారం తెలిపేది కాలం.నిమిషాలు గంటల గురించి తెలిపేది కాలం.ఏదైనా పనిచేయుటకు ఇచ్చు సమయం కాలం.ఆగమన్న ఆగనిది కాలం. భూత వర్తమాన భవిష్యత్తులను కలిపి చెప్పబడేది కాలం.కర్మ అంటే సరియైన అర్థం పనిచేయడం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే.నిద్రించడం,శ్వాసించడం,ధ్యానించడం,తపస్సు,మౌనం, భుజించడం,ఉపవసించడం కర్మ. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేడు. మనం నివసిస్తున్న వర్తమాన కాలంలో మనుషులు తాము చేస్తున్న కర్మల వల్ల ఫలితం అనుకూలంగా రాక నష్టపోవడం జరుగుతుంది.రైతు చేస్తున్న వ్యవసాయం ప్రకృతి మాత కరుణించకపోవడం వల్ల పంట రాకపోవడం జరుగుతుంది.ప్రకృతి మాత ప్రసాదించిన నీరు పాతాళానికి చేరి మనం చేస్తున్న వ్యవసాయ పంటకు నీరు అందకపోవడం వల్ల పంటలు ఎండి పోవచ్చు.వరుణ దేవుడు కరుణిస్తేనే ఆకాశం నుండి వర్షం కురుస్తుంది.ఆకాశం దయ చూపించకపోవడం వల్ల వర్షం పడక పోవచ్చు.అంత మాత్రాన ఏదో అయిందని ఎందుకు తొందర పడుతున్నావు అని ఓదారుస్తున్నాడు.పంట పండలేదని ప్రాణం తీసుకుంటవా? అన్యాయం చేస్తవా? అని ప్రశ్నిస్తున్నాడు.
“రాజస్థాన్ కరువు రైతులే
“మన తాన స్వీట్లు దుకాండ్లు నడుపుతుండ్రు.
రాజస్థాన్ ఎడారి ప్రాంతం.అక్కడ నివసించే కరువు రైతులు వ్యవసాయంలో రాబడి రాక మన తెలంగాణ రాష్ట్రంకు వచ్చి స్వీట్ల దుకాణాలు పెట్టి జీవనం కొనసాగిస్తున్నారు.రాజస్థాన్ వాళ్లు అక్కడ ఎల్లు మాను లేక ఇక్కడి ప్రాంతానికి వచ్చి పొట్ట పోసుకుంటున్నారు.రాజస్థాన్ వాళ్ళని చూడు అని చెబుతున్నాడు.
“నేపాల్ బక్క ఎవుసం చేసేటోల్లే
“సలి కాలం ఉన్ని దుస్తులు అమ్ముతుండ్రు.
నేపాల్ దేశం ప్రజలు అక్కడ వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు.కానీ వాళ్ల దేశంలో బతుకు బండి సాగక మన దేశంకు వచ్చి చలి కాలంలో ఉన్ని దుస్తులు అమ్మి జీవనం కొనసాగిస్తున్నారు.పుట్టి పెరిగిన నేపాల్ దేశం విడిచి వచ్చి ఇక్కడ బతుకు గడుపుతుండ్రు అనేది వాస్తవమని చెప్ప వచ్చు.
“నాలుగు గీరెల బండి మీద
“కారీలు అమ్ముకుంట తిరిగేటాయన
“మన పక్కపొన్న మహారాష్ట్ర మనిషి.
పొద్దున లేవగానే మన గడప ముందుకు వచ్చి నాలుగు గీరెల బండి మీద కారీలు,తినే పదార్థాలు అమ్ముకుంటా తిరిగే ఆయన మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన వాడు.అతను మహారాష్ట్ర ప్రాంతమును విడిచి పెట్టి బతుకు తెరువు కొరకు ఇక్కడికి వచ్చి భార్యా పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.
“బతుకు తెరువు లేక
“సోలపురం భీవండి సూరత్ పోయినోల్లను
“ఎందరిని సూల్లేదు ఎన్కటి నుంచి.
మన ఊళ్లో బతుకు తెరువు లేక ఎంతో మంది అన్ని కులాల కుల వృత్తులు చేసుకునేటోళ్లకు ఇక్కడ మన ఊరిలో పని దొరకక సోలాపురం,భీవండి,సూరత్ వంటి ప్రాంతంకు వెళ్లి అక్కడనే పని చేసుకుంటూ భార్యా పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు.మన ఊరుని విడిచి పెట్టి వేరే ప్రాంతంలో బతుకు గడుపుతున్నారు.
“అప్పులు కావచ్చు తిప్పల అవుతుండొచ్చు
“వూరు దాటి పోయన్న బతికి రావాలె
“ఉసూరుమంట పాణం తీసుకుంటె ఎట్లనే
“పోనీ సస్తే మాఫీ అయితయా నాయన.
మనిషన్న వాడికి ఎల్లు మాను లేక అప్పులు అయితయి.మనుషులకు కాకుంటే అప్పులు మానులకు అయితయా.అప్పులతోనే తిప్పలు అయితది.అప్పులు ఇచ్చిన అతడు అప్పు తీర్చమని వెంటపడి వేధిస్తాడు.అప్పులు ఉన్నయని ప్రాణం తీసుకుంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నాడు. అప్పులు తీర్చలేక నీవు చనిపోతే నీవు చేసిన అప్పులు మాఫీ అయితయా నాయనా అని ప్రశ్నిస్తున్నాడు.
“పుల్కు పుల్కున సూస్తున్న
“పొలగాండ్ల మొకమన్న సూడు
“ ఇంటామె నెత్తి నోరు కొట్టుక సస్తది
“ఇల్లంతా ఆగం పక్షి అయితది.
ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమగా నీ వంక చూస్తున్న పిల్లల ముఖము ఒకసారి చూడు.ఒక్క సారి నీ పిల్లల మొఖం చూస్తే నీకు బాధగా అనిపించదా?నీతో పెన వేసుకున్న బంధమైన నీ భార్య,ఇంటామె నీవు లేకుంటే నెత్తి నోరు కొట్టుకుని గోడు గోడున ఏడ్చి చనిపోతది.నీవు లేకుండా నీ ఇల్లు,నీ కుటుంబం గూడు లేని పక్షిలా జీవితం అస్తవ్యస్తం అయితది.గూడు లేని పక్షిలా ఏడ్చి చావదా?అప్పులు చేసినోళ్లు అందరూ ప్రాణాలు తీసుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నాడు.పెద్ద పెద్ద బడా బాబులు దేశాన్ని ముంచి కోట్లకు కోట్లు అప్పులు ఎగ్గొట్టి తిరుగుతున్నారు. కోట్లు అప్పులు చేసి అట్టి అప్పులు ఎగ్గొట్టి సుఖంగా బతుకుతున్నారు.అందులో నీవు చేసిన అప్పు ఏ పాటిది.చాలా చిన్నది.నీవు కష్టం చేసి మళ్లీ ఆ అప్పును తీర్చగలవు అని ఓదారుస్తున్నాడు.
“ఎవుసమే కాదు నాయినా
“ఎన్ని దందలైనా చెయ్యొచ్చు
“ఎద్దూ ఎవుసాన్ని కొన్ని రోజులన్నా
“బందుకు పెట్టు
“బతకనీకి బహు మార్గాలు
“వూరిడువు,ఇల్లిడువు,పల్లె ఇడువు
“కాల్రెక్కలున్నయ్ ఏన్నన్న చేస్క బతుకు
“లోకానికి ఇన్ని రోజులు అన్నం పెట్టినోనివి
“లోకం నీకు ఇప్పుడు అన్నం పెట్టదా !
వ్యవసాయం వృత్తిగా చేయడం కాదు.బతకడానికి ఎన్ని పనులైనా చేయవచ్చు.నీవు చేస్తున్న ఎద్దు ఎవుసాన్ని కొన్ని రోజులు చేయకుండా మాని వేయి అని సలహా ఇస్తున్నాడు.ఈ సమాజంలో బతకాలంటే లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి.నీవు బతకడం కొరకు ఊరిని విడిచి వెళ్లి పోవచ్చు.నీవు బతకడం కొరకు ఇల్లును విడిచి పెట్టు.నీవు బతకడం కొరకు పల్లెను విడిచి పెట్టు.నీవు ఇప్పుడు పట్నంకు పోయి బతుకు.నీ కాళ్లు రెక్కలు చక్కగా పని చేస్తున్నాయి.ఎక్కడికన్నా పోయి ధైర్యంగా ఏదైనా పని చేసుకుని బతుకు.లోకానికి నీవు ఇన్ని రోజులు అన్నం పెట్టిన అన్నదాతవు.అట్లాంటి అన్నదాత అయిన నీకు లోకం ఇప్పుడు అన్నం పెట్టదా? అని ప్రశ్నిస్తున్నాడు.భరోసా కవిత ద్వారా సాయిలు నాయనకు జీవితం పట్ల ఆశ కలిగేటట్టు చేస్తున్నాడు.సమస్యలు ఉన్నాయని బాధపడ వద్దు. నీవు ఎక్కడైనా కష్టపడి పని చేస్తే నీ సమస్యలు ఇట్టే తొలగిపోతాయి.ఈ కవిత ఎన్నో ఉదాహరణలతో రైతు సాయిలుకు మనో ధైర్యాన్ని,భరోసాను కల్పించేదిగా తోస్తుంది.దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కవిత ద్వారా పరిష్కారాన్ని చూపిస్తున్న కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అపార్ధం

by Devulapalli Vijayalaxmi March 17, 2024
written by Devulapalli Vijayalaxmi

అసహనంగా ఫోనులో వాట్సప్ ఓపెన్ చేసాడు రాజశేఖర్.
స్మార్ట్ ఫోను వచ్చినప్పటినించీ వాట్సాప్ ఓపెన్చేయ మెసెజెస్ డిలీట్ చేయా! దీనితో గంటల కొద్దీ సమయం వృధా అవుతోంది. పొరపాటున రెండు రోజులు చూడలేదంటే వార్నింగ్ ఇంటర్నల్ స్పేస్ నిండిపోయిందని. వద్దుమొర్రో అంటే అమ్మాయి రాజశేఖరానికి ,అబ్బాయి వాళ్ళమ్మకి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చారు.
“తెల్లారిందా! పిల్లలకంటే ఎక్కువైంది పొద్దూకులూ ఆ ఫోన్ పట్టుకుని.నాతోకాస్త మంచీచెడు మాట్లడదామనిలేదు. టిఫిన్ , భోజనం
ఆ ఫోన్ పట్టుకొని ఏం తింటున్నారో కూడా తెలియకుండా, ముగించేయడం. ఏమిటో బాబు మీ ధోరణి. కాస్త ఏ.గుడికో గోపురానికో అలా.నడుచుకొని వెళ్దామంటే.మోకాళ్ళ నొప్పులు మోక్షానికి అడ్డు..మీతో మాట్లాడుదామంటే మీకు ఆ వెధవ ఫోన్ తో సరిపోతుంది.” స‌రోజ సణుగుడు వాట్సప్ మెసేజెస్ కి మించి ఉంది.
నిజమే మరి రిటైర్ అయ్యేవరకు తన ఆలనా పాలనా చూసింది.పిల్లల్నిప్రయోజకుల్నిచేసింది.తను తన ఉద్యోగం సంపాదన,తప్పించి వేరే విషయాలు పట్టించుకోలేదు. ఇంటిపట్టునే ఉండి సంసారాన్ని దిద్దింది.యాంత్రికంగా బాధ్యతలతో జీవితం ఎలా గడిచిందో ఊహకి అందటంలేదు.స్వగతంగా అనుకున్నాడు రాజశేఖర్.
“సరూ! నీ సణుగుడు ఆపు. ఫోన్ చస్తున్నానని మొరపెట్టుఘకుంటోంది. డిలీట్ చేయలేదనుకో, వాట్సిప్ ఎగిరి పొయ్యిందంటే పిల్లలతో వీడియో. కాల్ మాట్లాడలేము”.
“సరే బాబు ఒక అరగంటలో ఆ పని కానీండి నేను ఈ లోగా వంటింట్లో పని పూర్తి చేసి వస్తా! యోగా మేట్స్ వేయండి.” అంటూ నిష్క్రమించింది.
పొద్దున్నే ఇద్దరూ కలసి శ్రీ శ్రీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తారు. రిటైర్ అయ్యిన తరువాత ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు.అందులో భాగమే ఈ వ్యాయామాలు.
★★★
రాజశేఖర్ రిటైర్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇంకా రావలసిన డబ్బు చేతికి అందలేదు. వాట్సాప్ లో “రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫ్రెండ్స్” గ్రూప్ లో చేరాడు. ఊరికొకడు గా చెల్లా చెదరవుతున్న సహచరులతో అనుబంధం ఉండాలని విషయాలు తెలుస్తాయని.
అందులో అతిఛాందసులు రోజూ ఏదో సూక్తి లేక దేముడి బొమ్మతో శుభోదయాలు, పండగల్లో శుభాకాంక్షలు పెడ్తూ ఉంటారు. కొందరైతే మరీ వాళ్ళ పిల్లలవి మనవలవి ఫోటోలు పెడ్తారు.ఎవరి గోల వారిదన్నట్లు ఉంటుంది గ్రూప్.
“అందరూ బాధ్యత గలిగిన ఉద్యాగాలు చేసి రిటైర్ అయ్యారు ఏంలాభం గ్రూప్ లో చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు.” స్వగతంగా అనుకోబోయి కొంచెం గట్టిగానే అన్నాడు.
“ఏమిటండీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు?” చేయిచెంగుకి తుడుచుకుంటూ అడిగింది సరోజ.
“ఆ‍ఁ ! ఏముంది లేవంగానే నీకు ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకోవడం అన్నా అవుతుంది కాని ,నాకు దీన్ని శుభ్రం చేయటం కావటంలేదు.” అంటూ ఫోను చూపాడు.
“చక్రపాణి అయితే మరీను. వీడు గ్రూప్ లో చాలనట్లు పర్శనల్ గా శుభోదయం ,శుభాకాంక్షలు పంపుతాడు. ఎన్నోసార్లు చెప్పాను ఎక్కడో ఒకచోట పెట్ట రా! రెండుచోట్ల ఎందుకురా ?’అని.
దానికి వాడు, “ఒరేయ్ శేఖర్! అది మాస్ గ్రీటింగ్స్. ఇది నాప్రాణ స్నేహితుడికి పంపే స్పెషల్ కోట్స్. నీకో విషయం తెలుసా! నీకు పంపాలంటే గూగుల్ లో ఎంత సెర్చ్చేస్తానో !” అని.
ఏమిటో వాడి అభిమానానికి నవ్వాలో ఏడవాలోతెలియదు. అంటూ స్నేహితు జ్ఞాపకాల్లో హఠాత్తుగా వెన్ను చరచి నట్లయింది.
అవును దగ్గర దగ్గర నెల రోజుల్నించీ సరిగ్గా మెసేజెస్ డిలీట్ చేయడంగాని తిరుగు మెసేజ్ పెట్టటం చేయలేదు.తమ కంపెనీ రిటైర్మెంట్ గ్రూప్ వాళ్ళ కోర్ట్ కేస్ ఎంతవరకు వచ్చిందో చూడనేలేదు . దక్షిణ భారతదేశం తీర్ధయాత్రలకి వెళ్ళటం వచ్చాక కాస్త ప్రయాణం బడలికతో వళ్ళు వెచ్చపడటంతో .
మన గురువుగారివే చాలా ఉంటాయి అనుకుంటూ వాట్సప్ గ్రూప్ తెరిచాడు.
ఏ వేవో చవకబారు జోక్స్,ఫొటోలు తప్పించి శుభోదయం, శుభాకాంక్షలు లేవు.అలా అలా వెనక్కి వెళ్ళి చూస్తున్న నా మతిపోయింది. గత రెండు నెలలుగా చక్రపాణినించీ ఒక్క మెసేజ్ పంపలేదు.వాడి పర్సనల్ ఎక్కౌంటు చూసాను. రెండు నెలల క్రితం అంటే ఆగస్టు పదిహేనున ” స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు”అంటూ చక్రి మెసేజ్ .
దాని క్రింద తనతిట్లు.”ఒ‌రేయ్ చక్రీ!ఒక్కసారి ఫోన్ చేయవచ్చు కదరా! నువ్వు చెయ్యవు,నేను చేస్తే ఎత్తవు”అని. దాని కింద వాడి వైపునించీ ఒక స్మైలీ.
మా చదువు ఉద్యోగం ఒకే చోటవడంతో మా ఇద్దరికీ చాలా అవినావభావ సంబంధం. రిటైర్మెంట్ కి రెండు సంవత్సరాల ముందే వాడి భార్య కేన్సర్ వ్యాధితో పోవడంతో ఆ రెండేళ్ళు ఒంటరిగా అతి కష్టం మీద వంటరిగా సమర్ధించుకున్నాడు.పెద్ద కొడుకు ఢిల్లీలో డిఫెన్స్ లో చేస్తున్నాడు. చిన్నవాడుఅమెరికాలో.తనే సలహా ఇచ్చాడు “పిల్లలు వాళ్ళ దగ్గిరకితీసికెళ్తానంటే వాళ్ళదగ్గరకి వెళ్ళిపోరా!రెండు సంవత్సరాలనించీ చేయికాల్చుకుని అవస్తపడుతున్నావు.” అని.
“ఒరేయ్! ఢిల్లీ వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదురా!కొడుకు కోడలు వారి ఉద్యోగాలలో వాళ్ళు బిజీ. మనవలు చదువులు.అందులో వాడికూతురు ఐ.ఏఎస్ కి ఎప్పియర్ అవుతోంది.తాత తాత అంటూ అదేకాస్త నాదగ్గరకి ఎక్కువ వచ్చేది” అన్నాడు.
“ఏది ఏమైనా నువ్విక్కడ వంటరిగా ఉండద్దు.
ఫోన్లో మాట్లాడుకుందాం!ఇండియా లోనే కదరా!నువ్వైనా రావచ్చు నేనైనా రావచ్చు.” అని కష్టం మీద ఫ్రెండ్సందరం కలిసి ఒప్పించారు.
గత రెండు నెలలుగా ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తటం లేదు.అలా అని ఫోన్ డెడ్ ఏమో అనుకోవటానికి యధావిధిగా శుభోదయాలు, శుభాకాంక్షలు వస్తున్నాయి. మెసేజెస్ కి ఎమోజీ లు.
ఏది ఏమైనా ఇవాళ వాడితో మాట్లడాలని నిర్ణయించుకున్నా. అదేమాట సరోజతో చెప్పాడు రాజశేఖర్.
“అలాగా అండీ! జ్రోత్స్న పోయినప్పటినించీ అన్నయ్యగారు చాలా వంటరి వారయ్యారు సుమా!”
“అవును సరోజా!జంటలో ఏ ఒక్కళ్ళు వంటరిగా మిగిలినా వారి బ్రతుకు దుర్భరం.సరే ఇవాళ వాడితో ఎలాఅయినా మాట్లాడాలి. వాడు కాంటాక్టు లోకి వస్తే నిన్ను పిలుస్తా పలకరిద్దుగాని అంటూ వాడికి అదేపనిగా కాల్ చేస్తునే ఉన్నాడు. అటునించీ స్పందన లేదు. రాజశేఖరానికి పట్టుదల ఎక్కువైంది. రాత్రి ఎనిమిది గంటలైంది. రాజశేఖర్ మొహం వివర్ణమైంది. దుఃఖం తన్నుకు వస్తోంది. “ఏమైంది వాడికి?” అదేమాట సరోజతో అన్నాడు.
“ఫోన్ పారేసుకున్నారేమో! లేదా కొత్తఫోన్లో కాంటాక్ట్స్ లోడ్చేసుకోలేదేమో ! లేదా కొత్త నంబరు తీసు కున్నారేమో! “
సరోజ ఇన్ని కారణాలు చెప్పినా రాజశేఖర్ మనసు రాజీ పడలేదు. అతని మీద అతనికే కోపం వచ్చింది.
ఇండియాలోనే గా అన్నాడు కానీ వాడి ఢిల్లీ ఎడ్రస్స్ గానీ వాడి కొడుకు ఫోన్ నంబరు కానీ తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు తనకి పిచ్చి వాడిలా?
నిజమైన స్నేహం అంటే ఇదేనేమో!స్వంత పిల్లల దగ్గరనుండి క్షేమసమాచారం తెలియక పోతే అల్లల్లాడినట్లు అల్లల్లాడిపోయింది మనసు.
“శేఖర్!కోవిడ్ తగ్గాక హైదరాబాద్ వచ్చి ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నా!ఎవరైనా ఉంటే చూడు.” అన్న వాడి మెసేజ్ గురించి ఆతృతగా వెదికా!
మెసేజ్ కనబడింది .ఆఁ ! ఆ మెసేజ్ ఆఖరి మెసేజ్ వాడు టైప్ చేసింది. తరువాత అన్నీ ఎమోజీలు స్మైలీ లు.
నా ఆలోచనలకి అంతరాయంకలిగిస్తూ ఫోన్ మ్రోగింది.చక్రపాణి దగ్గరనించీ.ఒక్కక్షణం సంతో్షం వెంటనే విపరీతమైన కోపం వచ్చింది.ఫోన్ ఎత్తుతూనే ఛడామడా తిట్లవర్షం మొదలుపెట్టా!”ఇడియట్! నన్నింత టెన్షన్ పెట్తావా” అంటూ.
“అంకుల్! నేను రాకేష్ ని.చక్రపాణిగారి పెద్దబ్బాయిని”
“అవునా బాబూ రాకేష్!బాగున్నావా!వాడికివ్వు ఫోన్.”
“అంకుల్ ! నాన్నగారు లేరండీ!”
“అమెరికా వెళ్ళాడా ఫోన్ మరచిపోయి‌‌‌‌‌.వాడికి కొంచెం మతిమరుపు ఎక్కువ బాబూ.”
“లేదండీ !నాన్నగారు పరమపదించి నెలైంది.
ఇవాళ మాసికం ఇక్కడ దగ్గర సంస్థ లో పెట్టివచ్చాం. నాన్నగారి ఫోన్ చాలా రోజులుగా కనపడలేదు. బాయ్ ఎక్కడోపెట్టి వెళ్ళిపోయాడు. నాన్నగారి గది శుభ్రం చేస్తుంటే కనపడింది. చార్జ్ లేకపోవటం తో చార్జికి పెట్టి ఇప్పుడే నాన్నగారి ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పెట్దామనుకుంటుంటే మీ మిస్డ్ కాల్స్ చూసా!
ఫారెన్ ఎంబసీస్ ని రిసీవ్ చేసుకోవటం వారి సెక్యూరిటీ ఎరేంజ్మైంట్స్ తో నాన్నగారు పోయాక కంటినిండా ఏడవలేదు అంకుల్ .”
రాకేష్ !గద్గద స్వరం విని రాజశేఖర్ తల తిరిగి పోయింది.
బలవంతంగా తెప్పరిల్లి ,”ఎలా జరిగింది బాబూ రాకేష్ ” .
“నాన్నగారికి మూడునెలల క్రితం పరాలిటిక్ స్ట్రోక్ వచ్చి మాట పడిపోయింది.ఒకచేయి.కాలు పడిపోయాయి. అప్పటినించీ మంచంలోనే ఉన్నారు. ఫిజియోథె‌రపీకి మెడిసిన్స్ కి రెస్పాండ్ కాలేదు.” ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం బ్రయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళే అవకాశం ఇవ్వలేదు.అంతా క్షణాలమీద అయిపోయింది దుఃఖాన్ని అదిమి పెట్టుకొని వివరాలు అందించాడు రాకేష్.
“మరి ఆ మెసేజెస్……” రాజశేఖర్ మాట పూర్తి కాకుండానే….,.
“నాన్న గారికి ఒక బాయ్ ని కుదిర్చాము. ఆయన అవసరాలు తీర్చటానికి.వాడి కి ఫోన్ యూసేజ్ బాగా తెలుసు.ప్రతిరోజు ఆయన కాలకృత్యాలు తీర్చిన తరువాత ఆయన చూపెట్టిన వాళ్ళకి గుడ్ మాణింగ్ మెసేజెస్ పంపమనేవారు.మెసేజెస్ చదివి ఎమోజీలు పంపమనే వారు.పండగలకి నేనే గ్రీటింగ్స్ డౌన్ లోడ్ చేసే వాడిని.అవి పంపేవారు. ఆయన ఫ్రెండ్స్ మెసేజెస్ చదువుతుంటే కళ్ళలో ఒక స్పార్క్ చూసేవాడిని. నాబిజీ లైఫ్ లో ఆయన పరిస్థితి మెసేజ్ చేద్దామన్న ఆలోచన రాలేదు . కాకపోయినా ఆయనకి సింపతీ ఇష్టం ఉండదని మీకు తెలుసుకదా అంకుల్ అందుకని.
అంకుల్ మీరెలా ఉన్నారు? మీతో మాట్లాడుతుంటే నాన్నతో మాట్లాడినట్లుంది.గుండె బరువు తగ్గినట్లుంది అంకుల్. వచ్చేనెలలో నేను హైదరాబాద్ వస్తాను. మీ ఇంట్లోనే దిగుదామనుకుంటున్నా! మీకు ఇన్కన్వీనియన్స్ అయితే తెలపండి అంకుల్. మాఇంటి గురించి డెసిషన్ తీసుకోవాలని దానికి మీ సలహా కోరుతున్నా!”
“అలాగేబాబూ!నాకెటువంటి ఇబ్బంది లేదు.చక్రపాణే వచ్చాడనుకుంటా. అమ్మాయిని పిల్లల్ని కూడా” తీసుకునిరా!మీపినతండ్రి పెదతండ్రి ఇల్లనుకో! నా! ఎడ్రస్ వాట్సప్ లో పెట్తా ఉంటా బాబూ రాకేష్!”
రాజశేఖర్ మెదడు మొద్దుబారిపోయింది వాడి సిన్సియారిటీకి.అంత సుస్తీలో కూడా ఒక్కరోజంటే ఒక్కరోజు వాడి దగ్గర నుండి శుభోదయం రాని రోజు లేదు.తను పెట్టిన మెసేజెస్ కి వాడెందుకు జవాబివ్వకుండా ఎమోజీలు పెట్టెవాడో తెలిసాక రాజశేఖర్ గుండె పగిలిపోయింది.
“ఒరేయ్!చక్రీ “నువ్వు చాలా ‘గ్రేట్’ రా!నీలాంటి స్నేహితుడు ఒక్కడు చాలురా జీవితానికి. నీచిరునవ్వు నీ స్మైలీ లో ఉందిరా! ఒరేయ్!ఎంత అన్యాయంరా!నీవు పోయి రెండు నెలలు, నీవు మంచంలో పడి ఆరునెలలు, వెరసి ఎనమిది నెలలు.
నిన్ను నాలో ఎప్పటిలాగే ఊహించుకునేటట్టు చేసావు. స్నేహానికి నిర్వచనం నువ్వేరా!నీదగ్గిరనించీ మెసేజెస్ రాకపోతే ఎందుకా అని కూడా ఆలోచించని దౌర్భాగ్యుడిని.నువ్వు పోయా వని తెలియక నీ శుభోదయాలు,శుభాకాంక్షలు డిలీట్ చేయాలని తిట్టుకున్నా! తనలో తను ఉన్మాదిలా గుండె పగిలే లాగా ఏడుస్తూ అనుకున్నాడు.
★★★
తెల్లవారింది. ఎప్పటిలా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రాజశేఖర్..యాంత్రికంగా గ్రూప్ ఓపెన్ చేసాడు.
అందులో మెసేజెస్,గ్రీటింగ్స్ అన్నీ చాలా అమూల్యమైనవిగా ఉన్నాయి.గబగబా అందరికీ శుభోదయాలు,శుభాకాంక్షలు, టైప్ చేసాడు! రెగ్యులర్ గా మెసెజ్ పెట్టే వాళ్ళ దగ్గిర నించీ మెసేజ్ లేకపోతే ఫోన్ చేసి వాళ్ళెలా ఉన్నారో కనుక్కున్నాడు! చాలా తృప్తిగా ఉంది నాకిప్పుడు. అనుకుంటూ వాలుకుర్చీలో వాలుతూ, ‘చక్రీ !నాకు మంచి గుణపాఠం చెప్పావురా! ‘అంటూ చమ్మగిల్లిన కళ్ళని పంచె అంచుతో తుడుచుకున్నాడు రాజశేఖ‌ర్.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అంగలకుదిటి సుందరాచారి సాహితీసేవ

by డా.కందేపి రాణీప్రసాద్ March 17, 2024
written by డా.కందేపి రాణీప్రసాద్

1927 వ సంవత్సరం జూన్ ఆరవ తేదీన వేటపాలెం గ్రామంలో అంగలకుదిటి వంశంలో జన్మించారు సుందరాచారి గారు. తల్లి దండ్రులు అంగలకుదిటి శేషమ్మ, అంగలకుదిటి మల్లిఖార్జునా చారి గార్లు. అన్నయ్య అంగలకుదిటి రామేశ్వరాచారి గారంటే సుందరాచారికి ఎంతో ప్రేమ. ఆయన అతి పిన్న వయసులోనే మరణించారు. శివుడంటే వల్లమాలిన ప్రేమ భక్తి ఆయనకు. ఎప్పుడూ అభిషేకాలూ, పూజలు అంటూ శివుడ్ని కోలిచే వారు అన్నయ్య. అన్నయ్య రామేశ్వరా చారి మరణం తర్వాత సుందరాచారి కట్టిన తొలి రైసుమిల్లుకు అన్నయ్య పేరుతో “శ్రీ రామేశ్వరా రైస్ మిల్ ‘ అని పేరు పెట్టుకొని తన భాతృ భక్తిని చాటుకున్నారు. తండ్రి మల్లిఖార్జునా చారి మంచి శిల్ప వైపుణ్యం కలవారు. కులవృత్తి అయిన బంగారు ఆభరణాల తయారీ చేసుకుంటూ జీవనం గడిపేవారు. ఇద్దరు కోడుకులనూ బాగా చదివించాలనీ పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలని అనుకునేవారు.

సుందరాచారి

తల్లి శేషమ్మ గాన కళా కోవిదురాలు. నిరంతరం పాటలు పాడుతూనే గడిపేది. ఆమె ఏ పని చేస్తున్నా నోరు మాత్రం పాటను పాడుతూనే ఉంటుంది పొద్దున్నే సూర్య నమస్కారాల దగ్గరుంచి అన్ని మడితో భక్తిగా చేసేది. ఆమెకు కూడా శివపార్వతులు అంటే చాలా ఇష్టం . ఉదయాన్నే బావి దగ్గర తలురా స్నానం చేసి, ఆ తడి బట్టలతోనే ఇంటి పనంతా చేసుకుంటుంది. ఆమె మడితో ఉవుప్పుడు ఎవరన్నా తాకారా ! అంతే సంగతులు! వాళ్ళని కోప్పడి మరల పోయి బావి దగ్గరే స్నానం చేసి వస్తుంది.
సుందరాచారి వేటపాలెం గ్రామంలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. ఆ గ్రామంలో అప్పటికి ఏడవ తరగతి వరకు మాత్రమే చదుపుకోవటానికి వీలున్నది. ఆ తర్వాతి చదువు చదవాలంటే చీరాలకు వెళ్ళవలసి ఉంటుంది. వేటపాలెం చీరాల రెండూ జంట నగరాల్లా ఉంటాయి. ఆయన చదువుకునే సమయంలోనే ఊర్లో స్వాతంత్రోద్యమం ముమ్మురంగా కొనసాగుతుంది. సుందరాచారి కూడా ఆ ఉద్యమం పట్ల ఆకర్షితుడైనాడు. అప్పట్నుంచి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం తద్వారా దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించడం చేసేవారు. అప్పటి వరకు టెరి కాటన్ ప్యాంటు, షర్టులు వేసుకునే సుందరాచారి మొదటగా ఖద్దరు కట్టడం మొదలు పెట్టారు. అప్పుడు మొదలు పెట్టిన ఖద్దరు ఆయన 1992 డిశంబరు లో మరణించే దాకా ఆయనను వీడలేదు. ఖద్దరు పంచె, లాల్చీ ధరించేవారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యతoగా పనిచేసి కొన్నాళ్ళు జైలు జీవితం గడిపారు. ఇల్లు, చదువు వదిలేసి ఇలా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూ ఉండడంతో తల్లి దండ్రులు పెళ్ళిచేస్తే కుదుట పడతాడని పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించారు.
1945 వ సంవత్సరం జనవరి నెలలో చీరాలకు చెందిన సామంతపూడి బ్రమ్మయ్య గారి కుమార్తె అయిన గోవిందమ్మతో వివాము జరిగింది. పెళ్ళి తర్వాత భార్యను కూడా స్వాతంత్ర్య ఉద్యమం దిశగా ప్రోత్సహించాడు. పెళ్ళి సమయానికి భార్య గోవిందమ్మకు పది సంవత్సరాల వయసు అత్త నారింట కాలు మోపిన తరువాత నుంచీ ఆమెను బాగా చదువుకోమని ప్రోత్సహించారు. ఇంటికి ట్యూషన్ పెట్టించి ఆమెను చదువు వైపు చూపు సారించేలా చేశారు. థర్డ్ ఫారమ్ వరకు చదివించారు. అంతే కాకుండా సంస్కృతం, హిందీ బాషల్లోని అనేక పరిక్షలు రాయించారు. గ్రామంలో ఉన్న లైబ్రరీ అయిన సారస్వత నికేతనంలో మహిళా విద్యను ప్రోత్సహిస్తూ ఎన్నో రకాల విద్యలు నేర్పించారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, విద్య వంటి అన్ని రకాల విద్యలనూ నేర్చుకోవటానికి ప్రోత్సహించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే పెళ్ళైన తరువాత భార్యను చదువుకోమ్మని ప్రోత్సహించిన ఆదర్శమూర్తి సుందరాచారి.
స్వాతంత్ర్యం లభించిన తరువాత కొన్నాళ్ళు కమ్యూనిష్ట్ పార్టీలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వేట పాలెం గ్రామానికి కొద్ది కాలం పని చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఇష్టం చివరి రోజుల వరకూ కొనసాగింది. గాంధీగారు సారస్వత నికేతనాన్ని సందర్శించినపుడు ఆయన్ని అనుసరిస్తూ కుటుంబ సభ్యులంతా నడుస్తూ వెళ్ళారట.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లు, తామ్రపత్రం లభించాయి. ప్రభుత్వం ఇచ్చిన పది ఎకరాల పొలం కూడా లభించింది. . ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చిన స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ కు మాత్రం అంగీకరించలేదు. అప్పటికి ఆర్థికంగా మెరుగ్గా ఉన్నందున ఆ పెన్షనేను వద్దని చెప్పారు. ఆ విధంగా ఆయన గొప్పదనాన్ని చాటుకున్నారు. సమాజంలో స్వాతంత్ర్య సమర యోధులుగా పేరు ప్రఖ్యాతులు, గౌరదం సంపాదించారు.
ఆ తర్వాత రై సుమిల్లు వ్యాపారంలోకి వచ్చారు. వేట పాలెంలో తోలిసారిగా సొంతంగా రైసుమిల్లును నిర్మించుకోని దానికి తన కీర్తి శేషులైన అన్న గారి అవుగారి పేరును పెట్టుకున్నారు. ఏ ఇంజనీరు సహాయం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి స్వయం ప్రతిభ లో రైసుమిల్లును నిర్మించడం అప్పట్లో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. లోహ యంత్రాలు ఆయన చెప్పినట్లుగా వింటాయని అప్పటి కవులు ప్రశంసించారు . రైసుమిల్లు వ్యాపారంతో పాటుగా, సాహిత్య పిపాస కూడా మొదలయింది. అనేక రకాల సాహితీ పుస్తకాలు చదవడం, ప్రముఖ సాహితివేత్తల ఉప న్యాసాలు వినడం చేసేవారు . అప్పటి నుంచి సాహిత్యం పై విపరీతమైన అభిమానం, మమకారం కలిగి ఉన్నారు. అదే భవిష్యత్తులో కవులకు సత్కారాలు చేయటానికి ఛారిటీస్ సంస్థ నెలకొల్పేలా చేసింది.
1966 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన శ్రీ రామేశ్వర రైసుమిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనేక మంది పండితుల్ని ఆహ్వానించారు. అప్పటికే వేద కవులకు సహాయం చేయడం మొదలు పెట్టారు .తోలి సారిగా ప్రారంభోత్సవ సమయంలో కవులను పిలిచి సత్కరించడంతో సుందరాచారి సాహితి పిపాస లోకానికి తెలిసింది. వచ్చిన కవులందరూ ఆయన నిర్మాణాన్ని దానగుణాన్ని కీర్తిసూ పద్యాలు చెప్పారు. వారందరికీ వచ్చిన బాధువులందరితో పాటుగా అతిథి మర్యాదలు చేసి ఘనంగా సత్కరించారు. అప్పటి వరకూ సంతానం లేని సుందరాచారి దంపతులను సంతాన ప్రాప్తిరస్తు’ అని కవి పండితలంతా దీవించారు.
పెళ్ళైన ఇరవై సంవత్సరాల దాకా పిల్లలు లేక పోవడంతో బాధపడ్డారు. ఎన్నో నోములు ప్రతాలు నోచారు. ఎంతో మందికి అన్నదానాలు చేశారు. వారాలు చేసుకుని చదువు కునే వారికి అండగా నిలిచి అందరిలో పోటు ఏదో ఒక రోజు అన్నం పెట్టడమే కాకుండా వారికి సొంత ఖర్చులతో ఉపనయనాలు చేయించారు. పీటల మీద కూర్చునీ పెళ్ళిళ్ళు చేశారు. డాక్టర్ల చుట్టూ తిరిగారు. సోముల వ్రత ఫలితమో, డాక్టర్ల చేలి చలవో గాని చివరకు సుందరాచారి భార్య గోవిందమ్మ గర్భం దాల్చింది. కుటుంబమంతా ఎంతో సంతోషపడ్డారు.
చీరాలలో 1950-60 ప్రాంతాలలో కంచి కామాక్షి అమ్మవారి గుడిని కొంత మంది కట్టడానికి సంకల్పించారు . ఆ గుడి కట్టాక శాశ్వత పూజల కారకు బంధువులతో పాటుగా సుందరాచారి కూడా కొంత ధనమును ఇచ్చియున్నారు. దసరా నవరాత్రులలో ఆ గుడిలో పూజలు జరుగుతాయి. బంధుగణమంతా ఆ పూజల్లో పాల్గొంటారు.

సుందరా చార్యి భార్య గోవిందమ్మకు నెలలు నిండటంతో చీరాల లోని సాల్మన్ ఆసుపుత్రీ కి తీసుకెళ్ళారు. వారు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని చెప్పారు. అవి దసరా రోజులు.అందువల్ల కంచి కామాక్షి అమ్మవారి పూజ చేయించి ఆపరేషన్ కు పంపారు. ఆ రోజుల్లో సిజేరియన్ ఆపరేషన్ చేయడం చాలా తక్కువ మందికి చేసేవారు. ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. అలా దసరా నవరాత్రుల్లో “గోవిందమ్మ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమ్మవారి దయవల్ల అంతా మంచే జరిగిందని ప్రతియేటా మూలా నక్షత్రం రోజే అమ్మకు పూజలు చేసేవారు. అలా అమ్మయి పుట్టిన రోజే శాశ్వత పూజ అమ్మవారికి సీ ఏర్పాటు చేశారు.
అమ్మాయి బారసులకు కవులను సత్కరంచే అవకాశం కలిగింది సుందరాచారికి. అప్పటికి యద్దనపూడి సులోచనారాణి నవలలు ఆంధ్ర దేశమంతా ప్రభంజనం సృష్టిస్తున్నాయి . సుందరాచారి కూడా ఆమె నవలలు చదివి అభిమాని అయ్యారు. అందుకే తన ఒక్కగానోక్క కూతురికి ‘సులోచనారాణి’ అని నామకరణం చేశాడు.


ఆ మహాత్సవానికి తన మిత్రులైన కవులందరినీ పిలిచాడు. వారు పద్యరత్యాలతో ఆశీర్వదించారు. ఆయన తన కూతురు యద్దనపూడి సులోచనారాణిలా పెద్ద రచయిత్రి కావాలని కోరుకున్నాడు. ఆనాడు వేట పాలెం, చీరాల “ప్రాంతాల లోని కవులందరూ హాజరయ్యారు. 1969 వ సంవత్సరం అక్టోబరు 19వ తేదీ అమ్మాయి పుట్టిన తేది ఆ తరువాత చీరాలకు 20 కీ.మీల దూరంలోని ఇంకోల్లు అనే గ్రామంలో మంగి రైసుమిల్లును నిర్మించ దలిచారు. కుటుంబం అక్కడికి మారింది. అక్కడి రైసుమిల్లుకు ‘శ్రీ వీర బ్రహ్మేంద్ర రైస్ మిల్లు’ అని పేరు పెట్టారు. దీని ప్రారంభోత్సవానికి చాలా ఎక్కువ మంది కవులను ఆహ్వసించారు. అదే సమయంలో కూతురి అక్షరాభ్యాస కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి కొండూరి రాఘవాచారి, పులివర్తి, శరభా చారి, మునుగంటి కృపాచారి, విశ్వనాధ సత్యనారాయణ వంటి పెద్ద పెద్ద కవులు హాజరయ్యారు. ఆరోజు వంగవాలు ఆదిశేషశాస్త్రి గారిచే అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. ఆ మహా కవుల చేత”అమ్మాయికి అక్షరాలు దిద్దించారు. అప్పటి నుంచి అమ్మాయిని స్కూలుకు పంపకుండా టీచర్లను ఇంటికి పిలిపించి చదువు చెప్పించారు. ఒకే ఒక్క సంవత్సరంలో ఐదు తరగతులనూ పూర్తి చేయించి ఆరు సంవత్సరాల వయసులో హైస్కూలులో జేర్చారు. తక్కవ వయసులో డాక్టర్ చదివించి అమ్మయి పెళ్ళి వేయాలని సుందరాచారి ఆకాంక్ష.
అష్టావధాని వంగవోలు ఆదిశేష శాస్త్రి గారు ‘యశోధర’ అన్న కావ్యాన్ని రాశారు. దానికి ముందుమాట తొలి వెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. ఈ పుస్తకాన్ని సుందరాచారి ఆర్థిక సాయమందించి ప్రింటింగ్ చేయుంచారు. కావ్యదాత సుందరాచారి కుటుంబ సభ్యులందరి ఫోటోలు, కుటుంబ సభ్యులందరి ఫోటోలు, కుటుంబ దాతృత్వం గురించి నాలుగు పేజీల్లో పద్యాలు రాశారు రచయిత. రైసుమిల్లుల్లోని యంత్రాలు సుందరాంచారి చెప్పినట్లు పని చేస్తాయని కాబోలు “లోహజగల్ చాతుర్య” అని బిరుదునిచ్చారు. పూస పాటి నాగేశ్వర రావు అనే అష్టాదధాని రాసిన “శిల్ప సౌందర్యం” అనే పుస్తకాన్ని అచ్చు వేయించారు. అలాగే వేటపాలెం లోని కవి కడెం వెంకట సుబ్బారావు రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక పుస్తకాన్ని అచ్చు వేయించారు. మరొక వీరబ్రమ్మెంద్ర స్వామి కాలజ్ఞాన తత్వములు అనే పుస్తకానికి ఆర్థిక సహాయాన్నాందించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న కవుల వెందరివో పుస్తకాలు సుందరాచారి దాతృత్వం వలన వెలుగు చూశాయి. కళాప్రపూర్ణ కొ౦డూరు రాఘవాచారి, దురిశేటి రామాచారి, చిఱ్ఱావూరి నాగభూషణ శర్మ, నాగశ్రీ, వివియల్ నరసింహారావు, ఎర్రోజు మాధవాచారి, మందరపు సత్యా చార్యులు, రావూరి భరద్వాజ వంటి ఎంతో మంది కవులు సుందరాచారి కూతురి అక్షరాభ్యాసానికి హాజరయ్యారు. కవులందరి పద్యాల ఆశీస్సులు తీసుకొని వారిని ఘనంగా సత్కరించి పంపారు సుందరాచారి.
1974 లో సుందరాచారికి ఓ కుమారుడు జన్మించాడు. ఆతర్వాత చీరాలలో మరో రైసుమిల్లు నిర్మించటానికి తలపెట్టారు. కుటుంబం చీరాలకు మారింది. ఆ రైసుమిల్లు నిర్మాణం పూర్తయ్యేసరికి కుమారుడ్ని బడిలో వేయాలనుకున్నారు. రైసుమిల్లు ప్రారంభోత్సవం తో పాటు కుమారుడి
అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టారు. ఈ మహోత్సవానికి వంద మంది కవి పండితులను అహ్వానించి బ్రహ్మాండంగా జరిపించారు. ఈ కవి పండిత సభలో కుమార్తె చేత తెనాలి రామలింగడు మొల్లల మధ్య సంభాషణా పద్యాలున్న కథను చెప్పించారు. కూతురు రాణి చదివిన జట పద్యాలను విన్న కవులు “అమ్మాయికి వేదాలు చెప్పించండి అచారి గారూ” అన్నారు. రాణి ని మంచి రచయిత్రి కావాలని ఆశీర్వదించారు. అంగరంగ వైభోగంగా జరిగిన ఈ కార్య క్రమంలో కవి పండిత సభ సుందరాచారికి “వదాన్య శేకర”, “అభినవ సమాజ భోజ” అని బిరుదల నిచ్చి సత్కరించింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పూసపాటి నాగేశ్వర రావు గారితో అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ఫణి భూషణా చారి తో లలిత సంగీతం పాడించారు. ఇది 1978 ఫిబ్రవరి నెలలో జరిగింది. మార్కాపురం నుంచి కన్నెగంటి రాజమల్లా చారి రావూరి భరద్వాజ, ఉటుకూరి లక్ష్మి కాంతమ్మ, వాసిలి వెంకటలక్ష్మీ
నరసింహారావు వంటి మహా కవులంతా వచ్చారు సుందరాచారి కి చిత్ర లేఖనం పై కూడా ఆసక్తి ఎక్కువ. తన రైసుమిల్లుల్లో మద్రాసు నగర సౌందర్యం, ఫ్లోరల్ డిజైన్, కంచి కామాక్షి అమ్మవారి చిత్రపటాలను ప్రముఖ చిత్ర కారులతో వేయించారు. ఆయన స్వయంగా ఎన్నో చిత్రాలు వేశారు.
కుటుంబ శుభకార్యాలలో ఇలా కవులను ఆహ్వానించి “సత్కరించడం కాకుండా ప్రతి ఏటా సత్కరించాలనే ఉద్దేశ్యంతో సొంతంగా ఒక ఛారిటిస్ ను ప్రారంభించారు. “శ్రీ అంగలకుదిటి సుందరాచారి చారిటీస్” అనే సంస్థను స్థాపించి తద్వారా ప్రతి సంవత్సరం నలుగురు కవులు కళాకారులను సత్కరించాలని సంకల్పించారు. అంతే కాకుండా పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు అందజేయాలని తలపెట్టారు. ఆ విధంగా 1974 నుండి 1992 లో సుందరాచారి మరణించే దాకా విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందజేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలోని కవులందరూ “సుంధరాచారి పురస్కారాన్ని పొందిన వారే. ఆయా జిల్లాల్లోని విద్యార్థులు చాలా మంది స్కాలర్ షిప్పులను పొందిన వారు నేడు ఉన్నత ఉద్యోగాల్లో ప్రభుత్వ సేవలందిస్తున్నారు. 1992 లో వారు మరణించిన దగ్గర నుండీ చారిటీస్ సంస్థలు నిలిచిపోయాయి.
మరొక కార్యక్రమం 1988 లో తన కుమార్తె వివాహా సందర్భంగా ఏర్పాటు చేశారు. వివాహ సందర్భంగా కవులను ఆహ్వానించి వారి చేత ఆశీస్సులను అక్షరాల రూపంలో అందజేయడం అంత వరకూ ఎక్కడా జరగలేదు. వివాహ ఆహ్వాన పత్రికలో కవి పండితుల అక్షరాక్షతలు అని ముద్రించారు. వివాహానికి ముందుగానే ప్రముఖ కవులందరికీ ఆహ్వానాలు పంపి వారి ఆశీర్వాద పంచరత్నాలను తెప్పించారు. వాటినన్నింటినీ ఒక పుస్తక రూపంగా ముద్రించారు.
సుందరాచారి తన కుమార్తె వివాహ సమయంలో కవి పండిత గోష్ఠి నిర్వహించారు. దీని కోసం ‘వివాహ ముహూర్తాన్ని ఉదయం పూట వచ్చేలా చూసుకున్నారు. మధ్యాహ్య సమయం నుంచి పండిత గోష్ఠి నిర్వహించాలని తలచారు. ఈ పండిత గోష్ఠి అంతా బ్రహ్మార్షి విశ్వామిత్ర సినిమా మాటల రచయిత, కవి నాగభైరవ కోటేశ్వర రావు గారి అధ్యక్షతన జరిగింది. వివాహ మంత్రాల వైశిష్ట్యం గురించి లక్ష్మీ పార్వతి గారు రెండు గంటల సేపు ప్రసంగించారు. సుమారు ఐదారు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కవితా గోష్ఠి కార్య క్రమంలో ప్రాచీన పుస్తక భాండాగార అధ్యక్షులుగా పనిచేసిన డా॥ వి.వి.ఎల్ నరసింహారావు, కళాప్రపూర్ణ కొండూరు రాఘవాచార్యులు, ఉటుకూరు లక్ష్మి కాంతమ్మ, డాll చేబోలు చిన్మయకవి, సంస్కలత పండితులు మునుగంటి కృపాచారి, అష్టావధానికి వంగవోలు ఆదిశేష శాస్త్రి ఈమని దయానంద, దీవి రంగాచార్యులు, చోడా చంద్రశేఖరరావు, షేక్ అలీ, మాగుతారి రామకోటేశ్వర రావు, నాగశ్రీ, మల్లవరపు జాన్, పూసపాటి నాగేశ్వరరావు, అడుగుల రామయ్య బీరం సుందర్రావు నాగభైరవ కోటేశ్వరరావు ప్రభ్రుతులు పాల్గొన్నారు. వచ్చిన కవులoతా ఇలా వివాహ సందర్భంగా కవులను ఆహ్వానించి సత్కరించడం ఎక్కడా వినలెదనీ కనలేదనీ కొనియాడారు.
వివాహ సందర్భంగా ముద్రించిన పుస్తకానికి ‘కల్యాణ కౌముది’ అన్న పెరు పెట్టారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రముఖ కవులందరూఆశీ: పంచరత్నాలను అందించారు. ఈ పుస్తకాలను మూడు వేల కాపీలు ముద్రించారు. వివాహానికి వచ్చిన వెయ్యి మందికి ఈ పుస్తకాలను పంచారు. గత ముప్పై సంవత్సరాలుగా అందరికీ ఆ ప్రతులు అందిస్తూనే ఉన్నారు.
ఇదీ సుందరాచారి గారు బతికి ఉండగా చేసిన సాహితీ సేవ. వారి భార్య అంగలకుదిటి గోవిందమ్మ గత సంవత్సరం 2018 లో భక్తిపాటలను ‘పుష్పాంజలి’ పేరుతో ప్రచురించారు. ఆవిడ ఆ భగవతీ గానాలను చక్కగా పాడుతుంది. 2019 వ సంవత్సరంలో ‘టిక్ టాంబుర్ర’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. పూర్వకాలం లోని జానపద కథలన్నింటిని తన కుమార్తె చేత రాయించి వాటన్నింటినీ బాలల కోసం ప్రచురిస్తున్నారు. వాళ్ళ కాలంలో చెప్పుకునే, పిల్లల కోసం చెప్పే కథలన్నీ చెప్పి కుమార్తె రాణీప్రసాద్ చేత రాయించి ప్రచురించారు. ఈ పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం వారు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్నందించారు. గోవిందమ్మ గారు కూడా సుందరాచారి సహచర్యంలో సాహితీ పిపాసి గా మారారు. వారిల్లు నిత్యం కవుల కవితా గానాలతో, వచ్చి పోయే కవులతో విలసిల్లటం వల్ల ఆవిడకూ సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది.
సుందరాచారి గారు మరణిoచాక వారి పేరుతో తెలుగు విశ్వవిద్యాలయంలో కీర్తి పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. వారి కుమార్తె, కందేపి రాణీప్రసాద్, అల్లుడు గారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డా|| కందేపి ప్రసాదరావు గార్లు రెండు లక్షల రూపాయలు తెలుగు విశ్వ విద్యాలయానికి డొనేషన్ ఇచ్చారు. 2011 సంవత్సరం నుంచీ శ్రీ అంగలకుదిటి సుందరాచారి స్మారక బాల సాహిత్వ పురస్కారాన్ని తెలుగు విశ్వ విద్యాలయం వారు రెండు తెలుగు రాష్ట్రాల లోని బాలసాహితీ వేత్తలకు అందిస్తున్నారు. వేదాంత సూరి, పైడిమర్రి రామకృష్ణ, డోకల సుజాతాదేవి, వి.ఆర్, శర్మ, పుష్పాల కృష్ణ మూర్తి, బెలగాం భీమేశ్వర్రావు మొదలగు బాల సాహితీ వేత్తలు ఈ కీర్తీ పురస్కారాన్ని అందుకున్నారు.
కుమార్తె కందేపి రాణీప్రసాద్ ప్రతిభ కలిగిన కవులకు మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ అంగలకుదిటి సుందరాచారి ఛారిటీస్ తరుపున పురస్కారాలు, సర్టిఫికెట్లు అందిస్తున్నారు. వారిలో ప్రేముఖులు చాగంటి కృష్ణకుమారి, పత్తిపాక మోహన్, షేక్ అబ్దుల్ హకీం జానీ, చిల్లర భవానీ దేవి, వడలి రాధాకృష్ణ వంటి కవులు, రచయితలు ఉన్నారు. సిరిసిల్ల ప్రాతంలోని డాక్టర్ సీట్లు సంపాదించిన విద్యార్థులకూ సర్టిఫికెట్ల సత్కారాలు అందిస్తున్నారు. 2007 రాష్ట్రం లో ఎమ్ సెట్ లో మొదటి ర్యాంకు సాధించిన సాయిష్ రెడ్డిని సత్కరించారు.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

వారాల వాదాలు

by డా.కందేపి రాణీప్రసాద్ March 17, 2024
written by డా.కందేపి రాణీప్రసాద్

కాలెండర్ గోడకు వేలాడుతోంది ఆ ఇంటి యజమాని కాలెండర్ వంక చూసి “అబ్బా రేపు ఆదివారం హాయిగా ఇంట్లో ఉండవచ్చు” అని సంతోషంగా అనుకున్నాడు. ఆ ఇంటి పిల్లలు కూడా “అమ్మా రేపు ఆదివారం. మాకు స్కూల్లేదు శలవు” అంటూ అరుస్తూ చెప్పారు. అమ్మ వంటింట్లో నుంచి ‘సరే సరే’ అని విసుగ్గా అన్నది.
గోడ మీదున్న కాలెండర్ లోని ఆదివారం, సోమవారం వంటి వారాలన్నీ ఒకదాన్నోకటి పలకరించు కుంటున్నాయి “అబ్బ! ఆదివారం నీ పని హాయి! అన్ని శలవు. ఏ పనీ ఉండదు నీకెంత అదృష్టం” అంటూ శని వారం నిష్టూరంగా అవ్వది “నాకయితే విపరీతమైన పని ఉంటుంది. ఇంటి వాళ్ళు శుభకరమని ఇళ్ళు కడుక్కోవడం, ఆడవాళ్ళంతా తలస్నానాలు చేయడం, దేవుడికి పూజలు చేయడం వంటి వన్నీ చేస్తుంటారు .నాకైతే అసలు తీరికే ఉండదు ” అంటూ శుక్రవారం తెగ బాధపడుతూ అన్నది.
‘ఊరుకో నీవున్న రోజేనా పూజలు చేసేది. మరినేనా, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజును నేను. మగ వాళ్ళందరూ నా వారం నాడే గుళ్ళకు వెళతారు. ప్రసాదాలు చేసుకుంటారు. చాలా మంది ఉపవాసాలు చేస్తూ పూజలు చేసుకుంటూ సుప్రభాతం చదువుకుంటారు అంటూ శనివారం తన గొప్పను చెప్పింది శుక్రవారాన్ని ఎద్దేవా చేసింది.
అప్పుడు సోమవారం ముందుకోచ్చి ఇలా అన్నది “ ఏమిటి ఇందాకట్నుంచి మీ గొప్పలు చెప్పుకుంటున్నారు మీ గొప్పలు ఆపండి. సోమవారం అంటే ఆఫీసులు, స్కూళ్ళు అన్ని పనిచేసే రోజు. ఏ పని కావాలన్నా ఈ రోజే వస్తారు మరియు వారాలలో మొదటి దాన్ని. ఇంత ప్రాధాన్యం గల నన్ను వదిలి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. నాకున్న ప్రాముఖ్యం గురించి చెప్పడం లేదు. లయకారుడైన శివుడికి ఇష్టమైన రోజును నేను తెలుసా ? అంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది. మిగతా వారాలన్నీ భయపడి వెనక్కు తగ్గాయి.
కానీ శుక్రవారం మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి “ నేను ఎవరో తెలుసా ? నా షేరేమిటో తెలుసా ? నన్ను లక్ష్మీ వారమని అంటారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు, అండ ఉంటేనే ఏ పనైనా జరిగేది. ఏమిటి, హెచ్చుగా మాట్లాడుతున్నావు ” అంటూ కోపంగా అన్నది.
“ఆగండాగండి! అందరూ ఎవరి గురించి వారే చెప్పుకుంటే ఎలా ? మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా! నా గురించి కూడా తెలుసుకో! నేను కూడా గొప్పనే, నేనేమీ అశుభాల మంగళవారాన్ని కాను. సాయి బాబాకు ఇష్టమైన వారాన్ని సాయంత్రమైతే ఎన్నో భజనలు చేస్తారు ” అంటూ గురువారం ముందుకొచ్చి పరుషంగా మాట్లాడింది.
మంగళవారం ముక్కుపుటాలు అదురుతుండగా కోపంతో అన్నది ” నేను మిమ్మలి ఎవరినన్నా ఏమన్నా అన్నానా? నన్ను అశుభం అంటారా. నా పేరేమిటి మర్చిపోయారా నా పేరు మంగళవారం నేను మంగళకరమైన దాన్నని. నా కా పేరు పెట్టారు. నేను ఎవరినీ కించ పరిచేలా మాట్లాడలేదు మీరు నన్నెందుకు తక్కువగా చూస్తున్నారు? ఏడుపు గొంతుతో మాట్లాడింది. ఇక మాటలు మాట్లాడలేక గొంతు మూగబోయి ఆగింది.
ఆపండి మాటలన్నీ! ఎవరూ ఎవర్ని అనలేదు అసలు విషయం ఏమంటే ఆదివారానికి పనేమీ లేదని అందరూ ఆనాలనుకున్నాయి. మిగతా వారాలన్నీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాయి. ఆఫీసులు స్కూళ్ళు అంటూ చాలా పనుంటుంది కానీ, ఆదివారానికె ఏమీ పనిలేదు. ఆ విషయం చెప్పాలనుకుని చివరకు మీలో మీరు వాదులాడుకుంటున్నారు. అంతే అంటూ బుధవారం ఆసలు విషయాన్ని తేల్చి చెప్పేసింది.
“అవునవును నువ్వు చెప్పింది నిజం ఆదివారానికి అసలు పనేమీ లేదు. కష్టపడేదంతా మనమే. ఆదివారం అన్నీ సెలవే, ఏపనీ ఉండదు” అంటూ అన్ని వారాలూ మూకుమ్మడిగా అన్నాయి.
అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న ఆదివారం నింపాదిగా ముందుకొచ్చి అన్నది ” ఏమిటీ ఆదివారం సెలవా ! నాకేమీ పనుండదా! మరి వారం రోజులూ వేర బెట్టిన పనులన్నీ ఏ వారం నాడు చేస్తారు. ఇల్లు బూజులూ దులపడం, ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతకడం వంటివన్నీ ఎప్పుడు చేస్తారు. బంధువులింటికి వెళ్ళాలన్నా , సినిమాలు, షికార్లకు వెళ్ళాలన్నా ఏ వారం నాడు వెళతారు ? మీరంతా పనులు చేసే వాడావిడి తప్ప అందులో ఆనందం ఉండదు. అదే ఆదివారం నాడు ఎంత పని చేసినా సంతోషంగా ఉంటారు. నాకు పని లేదని మీరెట్లా అంటారు. చెప్పండి ! అంటూ ఆదివారం ప్రశాంతంగా అన్ని విషయాలూ చెప్పింది.
ఆదివారం చెప్పిన మాటలన్నీ విని మిగతా వారాలన్నీ తల ఆడించాయి. తన మాటలు నిజమని ఒప్పుకున్నాయి. ఆదివారాన్ని అభినందించాయి. సోమవారం నుంచి శనివారం దాకా అందరూ. చేయి చేయి పట్టుకుని కలిసి ముందుకోచ్చాయి “అసలు మనలో మనకు తగాదాలు ఎందుకుని మనందరం కలసి ఉంటేనే మనుష్యులు మనల్ని గుర్తిస్తారు. అందరం కలిసిమెలిసి ఉంటేనే వారాలు నెలలు అంటూ గుర్తింపు లభిస్తుంది. ఇంక ఎప్పుడూ మనలో మనకు అభిప్రాయ భేదాలోద్దు” అంటూ అన్ని కలిసి చెట్టాపట్టాలేసుకుని ముందుకు నడిచాయి. ఆదివారం నుండి శనివారం దాకా అందరూ కలసికట్టుగా ‘వారాలు’ గా ఉంటున్నారు.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఒక క్రూరమైన మారుతల్లి మరియు పన్నెండు మంది యువకులు

by ఒద్దిరాజు మురళీధరంరావు March 17, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

పూర్వం ఒక క్రూరమైన మారుతల్లి. ఆమె భర్తపేరు మ్యాలెట్‌. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రోజీ ఆమె స్వంత కూతురు. జానీ ఆమె చనిపోయిన సవతి కూతురు. పొద్దున్నే ఆమె కూతురు రోజీకి కడుపు నిండా రుచికరమైన కోడి కూర, మాంసముతో నింపబడిన పావురము తినడానికి ఇచ్చింది. ఏదో మిగిలింది చాలీ చాలనిది జానీకి ఇస్తుండేది.

రోజీ ఏ చిన్న పని కూడా ముట్టుకోకపోయేది. మొత్తం ఇంటిపని ఉదయం నుండి సాయంత్రం వరకు జానీతో చేయించేది మారుతల్లి. అయినా మెచ్చుకోకపోయేది.

రోజీ ఎప్పుడు మంచి సిల్కు మరియు ఖరీదైన వులన్‌ దుస్తులు ధరించేది. జానీకి మాత్రం మామూలు కాటన్‌ దుస్తులు ఉండేవి.

అది జనవరి మాసం. బయట మొత్తం మంచు, విపరీతమైన చలి. చాలా మటుకు అందరు చలికి తాళలేక మంటల దగ్గర కూర్చునేది. ఒకసారి మారుతల్లి బయటికి తొంగి చూసేవరకు చలికి ముక్కు ఎర్రబడింది.

ఎంతో ప్రేమ నటిస్తూ నోట్లో పంచదార ఉన్నట్లు ఓ నా ముద్దుల జానీ అని పిలిచి నాకు మన ఇంట్లో టేబుల్‌పై గాజు వేజులో లిల్లీ పూల సువాసన ఆనందించాలని ఉంది. నీవు వెళ్ళి అడవి లోయలో పూసే లిల్లీ పూలు తీసుకరా అని అంది. అందుకు జానీ అమ్మా ఇది జనవరి మాసం, ఇప్పుడు లిల్లీలు వుండవు కదా. ఆ మాట పట్టించుకోకుండా జానీని డోర్‌ తీసి బయటికి నెట్టి వెనుక నుండి డోరు ఢబీల్న మూసేసింది. విధిలేక జానీ ఆ చలిలో అడుగుపెడితే జారే మంచుపై, అతి కష్టంగా నడుస్తూ అడవిలోకి చేరింది. ఆ అడవిలో ఆమె పన్నెండు మంది యువకులను చూసింది. వారు వేసవికాల దుస్తుల్లో వున్నారు. ఒకడు మాత్రం మేకతోలు కోటు వేసుకొని ఉన్నాడు. అతనే వారి లీడరు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి జాలితో ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. ఆమె కథంతా వాళ్ళకు చెప్పింది. అప్పుడు వారిలో ఒకతని జేబు నుండి లిల్లీ పూలు తీసి ఇచ్చాడు. అవి పట్టుకొని ఇల్లు చేరింది. మారుతల్లికి ఈమె తిరిగి వచ్చినందుకు కోపమే కాని లిల్లీలు తెచ్చిందని లోనికి రానిచ్చింది.

మరుసటి రోజు ఎంతో ప్రేమను నటిస్తూ నా ప్రియమైన జానీ, నాకు బాస్కెటు నిండా స్ట్రాబెర్రీసు అడవి నుండి తీసుకురా అంది మారుతల్లి. దాదాపు కన్నీరు పెట్టుకుని జానీ అంది, అమ్మా అవి జనవరిలో అవి పండవు కదా. నోరు ముయ్యి అని గద్దించింది మారుతల్లి. నీవు లిల్లీసు తెచ్చినవు గదా. అదే మాదిరిగ స్ట్రాబెర్రీసు తే అని జానీని బయటికి నెట్టి తలుపు మూసేసింది. పాపం అమ్మాయి  మోకాళ్ళ మటుకు మంచులో, చలి గాలిలో మామూలు దుస్తుల్లో అడివికి చేరింది. అక్కడ ఆ పన్నెండు మంది యువకులు కలిశారు. వారితో ఆమె తన మారుతల్లి చెప్పిన విషయం చెప్పింది. ఆ యువకులకు కోపం వచ్చింది. మేకతోలు కోటు వేసుకున్నతను సరే నీకు స్ట్రాబెర్రీసు ఇస్తాను, కాని నీ మారుతల్లి జాగ్రత్త పడాలి. అతను తనవారిలో ఒకతనితో అమ్మాయి బ్యాగ్‌ నిండా రుచికరమైన స్ట్రాబెర్రీసు నింపమన్నాడు. నింపినాక వాటిపై అతను ఊదాడో, అదేంటో తెలియదు కానీ ఇది నీ మారుతల్లిని బాగు చేస్తుందన్నాడు. జానీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది. ఆమె దారిలో వెచ్చదనం అనుభవించింది. మారుతల్లికి జానీ తిరిగి రావడం ఇష్టంలేక కోపించింది, కానీ స్ట్రాబెర్రీసు బాగా ఇష్టమైనవి. వాటిని తీసుకుని ఆమె, ఆమె కూతురు రోజీ గబగబా ఒక్క పండు మిగలకుండా తినేశారు. జానీకి పాపం ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కానీ తల్లి బిడ్డ ఆ రాత్రి వానరాళ్ళు తిన్నట్లు చాలా కడుపునొప్పితో బాధపడ్డారు.

మరునాడు ఉదయం రోజీ మరియు ఆమె తల్లికి కొంత ఆరోగ్యం బాగయ్యింది. మారుతల్లి  జానీని బయటకు పంపేందుకు ఏదో ఉపాయం ఆలోచించసాగింది. ప్రేమ ఒలకపోస్తూ ఓ నా ప్రియమైన జానీ, నువ్వు గోనెసంచీ తీసుకొని అడవికి అవతలివైపు వెళ్ళి అక్కడ పండే మంచి వెరైటీ వోర్‌ సిస్టర్‌ పియర్‌ మేన్స్‌ ఆపిల్సు సంచీ నిండ తెంపుక రా. జానీ ఈసారి ఏ అడ్డూ చెప్పకుండా ఒక నిట్టూర్పు తీసి బయటికి వెళ్ళింది. మంచులో మూడుసార్లు జారిపడింది. కాళ్ళకు దెబ్బలు తగిలి గాయాలయినాయి. ఎలాగో అడవి చేరింది. అక్కడ ఆ 12 మంది యువకులు కలిశారు. ఈమె చెప్పినట్లు సంచి నిండా ఆపీల్సు పెట్టించాడు మేకతోలు కోటులో ఉన్నతడు. ఓహో ఆమె గార్కి మంచి వెరైటీ ఆపిల్సు కావలసి వచ్చిందా అన్నాడు. సంచిలో పండ్లు నింపిన తరువాత వాటి మీద మూడుసార్లు చల్లని ఆవిరి వచ్చేట్లు ఊదాడు. ఇప్పుడు మారుతల్లి వీటిని అంతగా ఆనందించకపోవచ్చు అన్నాడు అతడు. ఆ బరువైన సంచి జానీకి ఒక ఈకవలె తేలికగా ఉండి ఆమె మంచు మీద మెత్తటి దారి మీద నడిచినట్లు నడిచి ఇల్లు చేరింది. అతను మీ చెల్లెలును వీటిని తినవద్దని చెప్పమన్నారు. ఆమె ఆ విషయం చెప్పినందుకు చెల్లెలు ఆమెను నెట్టివేసి తామే తినేశారు గబగబా. వారికి కడుపులో బాగా నొప్పి లేచింది. ఈ విశ్వాసం లేని అమ్మాయి దయ్యంతో కలిసి మనమీద కుట్ర చేసిందని మారుతల్లి అంది. వారి కడుపులో పేగులకు ఏమీ తెలీదు. కానీ వారు దూదిపింజల లాగ ఇంటి పొగ గొట్టం నుండి బయటపడి ఎంతో దూరం తేలిపోయారు. ఇంటిదారి ఎప్పటికీ దొరకలేదు. ఇంటి వద్ద తండ్రి, కూతురు వివాహమై తన మంచి భర్తతో కలిసి ముగ్గురు ఎప్పటికన్నా ఎక్కువ సంతోషంగా వుండిపోయారు. మారు తల్లికి తగిన శాస్తి జరిగింది.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అన్నమాచార్య సంకీర్తన

by mayuukha March 17, 2024
written by mayuukha
March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

ప్రముఖ విద్యావేత్త M.L.C. సురభి వాణీ దేవి ముఖాముఖి

by రంగరాజు పద్మజ March 17, 2024
written by రంగరాజు పద్మజ

భారత దేశ ప్రధానమంత్రి గా విశేషమైన సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి పి.వి. నరసింహారావు గారి కుమార్తె సురభి వాణీ దేవి గారు. వీరు తండ్రి తో పాటు వివిధ దేశాల పర్యటన చేసారు.అప్పటి వారి అనుభవాలను ఈ ఇంటర్వ్యూ లో ప్రముఖ రచయిత్రి రంగరాజు పద్మజ గారితో చెప్పిన విషయాలనూ, వారి జీవిత ప్రస్థానాన్ని వారి మాటల్లోనే వినాలంటే జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి అంతే !

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఇక‌ ” మీకు” చరిత్ర పుటలే గీతి

by Dr. Lakshmanacharyulu M March 17, 2024
written by Dr. Lakshmanacharyulu M

పూరి గుడిసెల కనుకొలకుల్లో
ఉబికిన రక్తాశ్రువులు
అపార్ట్మెంట్లు,గృహాల గుండెల్లో
హోరెత్తిన మరణం మృదంగారావాలు;
ఇంతకాలం తమ రెపరెపల్లో కేవలం
వాత్సల్యం
తమ గలగలల్లో కేవలం అనురాగం
పలికించిన చిలికించిన
కొంగులు, గాజులు
ఒరుసుకుంటున్నాయ్
బిగుసుకుంటున్నాయ్
ఆవేశం తో ఆక్రోశం తో
వారి ఆవేశం ఆక్రోశాల అగ్ని పర్వతం పెఠిల్లున విస్ఫోటించి
మీ అస్తిత్వం తుడిచి పెట్టుకు ముందే
ఓ సారాసురా,! ఓ గుడంబ పిశాచమా! ఓ కల్తీ మద్యమా!
క్విట్ తెలంగాణా! క్విట్ ఆంధ్రా!
అలనాటి నెల్లూరు,దూబగుంటల
మద్యపానవ్యతిరేక మహిళోద్యమ క్రోధాగ్ని
అదిగో! ఇంకా రగుల్తూనే ఉంది
మరి..ఇక మీకు చరిత్ర పుటలే గతి!

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సిండ్రెల్లా పునః కధనం

by డా.కందేపి రాణీప్రసాద్ March 17, 2024
written by డా.కందేపి రాణీప్రసాద్

అనగనగా ఒక రాజ్యంలో ఒక ధనికుడు నివసించేవాడు. అతనికి ఒక కూతురు పుట్టాక భార్య మరణించింది. కూతురును అతనే పెంచి పెద్ద చేయసాగాడు. కూతురు ఎంతో అందగత్తె మరియు దయా వృదయం గలది. కొన్నాళ్ళకు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆమె సవతి తల్లి కదా! కూతురు సిండ్రెల్లాను ఏమి బగా చూసేది. కాదు తర్వాత ఆమెకిద్దరు కుమార్తెలు పుట్టారు. సవతి తల్లి ఆమె కుమార్తె లిద్దరూ కూడా సిండ్రెల్లాను ఎప్పుడూ ఏడిపిస్తుండే వారు ఇంటి చాకిరీ అంతా చేయించేవారు. కనీసం ఆమెకు మంచి ఆహారం కూడా ఇచ్చేవారు కాదు. తండ్రి ఇదంతా చూసి చాలా బాధపడేవాడు. తాను అనవసరంగా రెండో పెళ్ళి చేసుకున్నానని చింతించేవాడు.
ఒకరోజు వ్యాపార పనుల నిమిత్తం తండ్రి పొరుగూరికి వెళ్ళాడు. తండ్రి కూడా లేక పోవడంతో సవతి తల్లి సిండ్రెల్లాను మరింత బాధ పెట్ట సాగింది. కడిగిన పాత్రల్నే మరల కడిగిస్తూ, ఇల్లంతా శుభ్రం చేశాక చెత్త పడేసి మరల శుభ్రం చేయమని చెప్తూ సిండ్రెల్లాను పని మనిషి గా మార్చేశారు. ఎంతో అందంగా ఉండే సిండ్రెల్లాను మసి బొగ్గు లా తయారు చేశారు. వంటలన్నీ వండినా పారబోసేసి మరల వండమని చెపుతూ పొయ్యి దగ్గరే ఉంచేవారు.
ఇలా ఉండగా ఒకరోజు రాజ భటుడు కరపత్రాలతో వీరింటికి వచ్చాడు. “రాజు గారి కోటలో సంబరాలు జరుగుకున్నాయనీ, వాటి కోసం రాజ్యం లోని యువతులందర్ని ఆహ్వానిస్తున్నారని” చెప్పాడు. అంతేకాక తనకు నచ్చిన యువతితో రాజకుమరుడు నృత్యం చేస్తారనీ, ఆమెనే పెళ్ళిచేసుకుంటాడనీ ఆహ్వాన పత్ర సారాంశమనీ చెప్పాడు.
సవతి తల్లి చాలా సంతోషించింది తన కుమార్తెల కోసం మంచి మంచి బట్టలు, టోపీలు, హారాలు ఎన్నో కొన్నది. రాజకుమారుడు తన కూతుళ్లిద్దరిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆశించింది. అప్పుడు సిండ్రెల్లా వచ్చి “అమ్మా నేను కూడా సంబరాలకు వస్తాను కొత్త దుస్తులు కొనవా నాకు ఈ చినిగిన గౌను తప్ప కొత్తవి లేవుకదా” అన్నది. అప్పుడు ఆమె నవ్వుతూ” పనిమనుషులు రాజభవనానికి రాకుడదు నువ్వు ఇక్కడే ఉండు” అంటూ తన కుమార్తెలతో వెళ్ళిపోయింది.
సిండ్రెల్లా మరేమి చేయలేక ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. తోటలోని చిలుకలు ఆమెను ఊరడిస్తున్నాయి. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవమాత ప్రత్యక్షమయింది. సిండ్రెల్లా ఆశ్చర్యంగా చూస్తుండగానే “నువ్వు రాజవనానికి వెళతావా” అని అడిగింది దేవమాత “నేను వెళ్ళాలంటే నాకు సరైన దుస్తులు, వెళ్ళడానికి బండి కూడా లెవు కదా” నిరాశగా అంది సిండ్రెల్లా. వెంటనే దేవదూత తన మంత్రదండంతో సిండ్రెల్లాకు మంచి మెరుపుల బట్టలు, నగలు, గాజు చెప్పులు సృష్టించింది. వారి పెరట్లో ఉన్న ఒక గుమ్మడి కాయను రథంగా మార్చేసింది. అక్కడ తిరుగుతున్న రెండు ఎలుకలను గుర్రాలు గా మార్చింది. మరొక ఎలుకను రథ సారధి గానూ, మరొక తొండను ఆమెకు సేవకుడి గానూ మార్చింది.
“ఇప్పుడు నువ్వు రాజభవనానికి వెళ్ళు సిండ్రెల్లా ! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అర్థరాత్రి 12 గంటలలోపు నువ్వు ఇంటికి రావాలి. ఆ తర్వాత నా మాయ పని చెయ్యదు అన్ని మామూలై పోతాయి” అని చెప్పి దేవదూత అదృశ్యమైపోయింది.
సిండ్రెల్లా రాజభవనానికి చేరుకుంది. ఆమె అద్భుత సౌందర్యం చూసి అక్కడున్న అందరూ ఆమె తప్పక రాజుకుమారి అయి ఉంటుందని అనుకున్నారు. రాజకుమారుడు కూడా ఆమె అందానికి ముగ్ధుడై ‘నాతో నాట్యం చెస్తావా’ అని అడిగాడు. సిండ్రెల్లా రాజకుమారుడు నృత్యం చేస్తూ సమయం చూసుకోలేదు హటాత్తుగా సిండ్రెల్లా కు గుర్తువచ్చి ‘నేనిప్పుడే ఇంటికి వెళ్ళాలి’ అని బయటకు నడిచింది. ‘నీపేరు, చిరునామా చెప్పవా’ అంటూ రాజకుమారుడు ఆడుగు తుండగానే ఆమె రథమెక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేటప్పుడు ఆమె పాదాలకున్న గాజు చెప్పు అక్కడే పడిపోయింది.
సమయానికి ఇంటికి చేరింది సిండ్రెల్లా. సమయం 12 కాగానే అన్ని మాయమై పోయాయి. రాజ భవనంలో సిండ్రెల్లాను ఎలాగైనా గుర్తించాలని. అనుకున్నారు. ఆమె వదిలిన గాజు చెప్పు సాయంలో సిండ్రెల్లాను గుర్తించాలి అనుకున్నారు. వెంటనే అందరి వద్దకూ వెళ్ళి పరీక్షించారు. అoదులో భాగంగా సిండ్రెల్లా ఇంటికీ వచ్చారు. సవతి తల్లి కుమార్తె లిద్దరూ నాదే ఈ చెప్పు అంటూ ఇద్దరూ చెప్పారు. భటుడితో పాటు రాజకుమారుడూ వచ్చాడు అక్కడకు. చెప్పును తొడుక్కుని చూపమనగా ఒకరికి పట్టనేలేదు, మరొకరికి చాలా పెద్దదైంది. అప్పుడు మసి బట్టలతో దూరంగా నిలుచున్న సిండ్రెల్లానూ చెప్పు తొడుక్కుని చూడమనగా ఆమెకు సరిగ్గా సరిపోయింది. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై సిండ్రెల్లాకు పూర్వపు దుస్తులను, రూపాన్నీ ఇచ్చింది. రాజు కుమారుడు సిండ్రెల్లాను గుర్తు పట్టాడు ఆమెను తన రథం ఎక్కించుకొని రాజ భవనానికి తీసుకు వెళ్ళాడు. తన భార్యగా చేసుకున్నాడు సిండ్రెల్లా యువరాణిగా ఎన్నో సుఖాలను పొంది ఆనందంగా జీవించింది.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

వీడిపోను – వాడిపోను కవిత పై విశ్లేషణా వ్యాసం

by Narendra Sandineni March 17, 2024
written by Narendra Sandineni

కవిత్వాస్వాదన ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు.

ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషా రీడర్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,హన్మకొండ,డాక్టర్ ముదిగొండ వీరేశలింగం కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని వీడి పోను – వాడి పోను కవిత పై విశ్లేషణా వ్యాసం.స్పందన కవితా సంపుటిలో కవిత్రయం తమ కవితలను రాశారు.అందులో మొదటి కవి ముదిగొండ ఈశ్వర చరణ్,రెండవ కవి మాదాడి నారాయణరెడ్డి,మూడవ కవి ముదిగొండ వీరేశ లింగం.ఈ కవితా సంపుటిని 1982 లో వెలువరించారు.స్పందన కవితా సంపుటికి చక్కటి ముఖ చిత్రం కె రాజయ్య చిత్రకారుడు అందించారు. స్పందన కవితా సంపుటికి ఇరివెంటి కృష్ణమూర్తి గారి ఆశీస్సులు మీ కవిత్వోద్యమానికి నా సాధు వాదం మీ ప్రతిభా విశేషానికి ఆశీర్వాదం తెలియజేశారు. ”వేముగంటి నరసింహాచార్యులు ప్రతిస్పందన. మనసు స్పందిస్తే కవిత.మనిషి స్పందిస్తే మానవత.

ఇది ఈ సంపుటిలోని భావ సంపుటి.నిండైన జీవితానికి అను స్పందించి లోతైన లోకానికి ప్రతి స్పందించి నీతిలోనూ రీతిలోనూ విచ్చలవిడిగా పెచ్చు పెరుగుతున్న అన్యాయాన్ని అసమానతలను తొలగించి మానవతకు మణి మకుటం తొడగాలని ఈ కవిత్రయం ముదిగొండ ఈశ్వర చరణ్,మాదాడి నారాయణ రెడ్డి,ముదిగొండ వీరేశ లింగం గారలు తమ కవితల ద్వారా చేసిన ప్రయత్నం ఈ సంపుటి నిండా కనబడుతుంది.ఈ ముగ్గురు కవులు భావుకులు మనీషులు,భాషను ఉచిత రీతి ప్రకటించడంలోనూ,భావాలను ఉజ్వలంగా పలికించడంలోనూ నేర్పరులు.ఆవేశమున్నా దానిని అదుపులో ఉంచే సంయమనం కూడా కలిగి ఉండడం వీరిలోని విశేషం.ఈ కవిత్రయం ముందు ముందు ఇతోధిక భావ ప్రాభవాన్ని కవితా రచన సాగించాలని కవి మిత్రుడిగా కాంక్షిస్తున్నాను.వీడి పోను వాడి పోను కవితను ఆసక్తితో చదివాను. నాలో ఆలోచనలు రేకెత్తించింది.వీడి పోను ఏమిటి? వాడి పోను ఏమిటి? ఈ భూమి మీద పుట్టిన మనిషి ఏదో ఒక రోజు నేలను విడిచి వెళ్లి పోవాల్సిందే.అది తిరుగు లేని సత్యం.కవి వీరేశ లింగం కవితకు వీడి పోను – వాడి పోను అని శీర్షిక పెట్టాడు.వీడి పోని వాళ్లు, వాడి పోని వాళ్లు ఎవరైనా ఉంటారా? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.మరణానంతరం మనిషి చేసిన మంచి కార్యాల ఫలితం వల్ల స్వర్గానికి పోతారు అని అంటారు.మరణానంతరం మనిషి చేసిన దుష్కార్యాల ఫలితం వల్ల నరకానికి పోతారు అని అంటారు.స్వర్గంలో మనుషులు వీడి పోకుండా కలిసి ఉంటారు.స్వర్గంలో చెట్లకు పూచిన పూలు వాడి పోకుండా ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ ఉంటాయని అంటారు.వీడి పోను – వాడి పోను కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.” చెమ్మగిలిన నయనాలతో/ మందహాసానికి నోచుకోని ముఖంతో/ బరువెక్కిన హృదయంతో/ గద్గద కంఠంతో చెబుతున్నా ఈ కవిత.బాధలో ఉన్నప్పుడు మనిషి కళ్ళు చెమ్మగిల్లుతాయి.బాధలో మనిషికి దుఃఖం పొంగి పొర్లుతుంది.బాధను అనుభవించిన వారికే తెలుస్తుంది.బాధంటే ఏమిటి? బాధలో ఉన్నప్పుడు మనిషి ముఖం మీద నవ్వు మాయమై పోతుంది. బాధను అనుభవిస్తున్నప్పుడు మనిషి నవ్వును మరిచిపోతాడు.బాధలో ఉన్నప్పుడు ఎందుకో తెలియకుండానే మనిషి హృదయం బరువెక్కుతుంది.హృదయం బాధగా ఉంటే మనిషి కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా వస్తాయి.గధ్గధ కంఠంతో బిగ్గరగా చెబుతున్నాడు.ఈ కవితను వ్రాస్తున్నా వ్రాయాలని లేకున్నా అని ఆవేదనతో చెబుతున్నాడు. ‘ఎడారిలో నీరు కనిపిస్తుంది ఎక్కడో ఒక చోట/మానవత మాత్రం అసలే కనబడదు జనమున్న చోట.”ఎటు వంటి వృక్ష సంపద లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం ఎడారి.భూమిపై ⅓ వంతు వైశాల్యాన్ని ఎడారులు ఆక్రమించి ఉన్నాయి.ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఒయాసిస్సులు ఉన్న చోట నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది.కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు ఉన్నాయి.ఎడారుల్లో కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి.ఎడారులు జీవ కోటి మనుగడకు సహకరిస్తాయనే పేరు ఉంది.అయితే నిజానికి మనం ఎడారుల్లో కూడా చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు.సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు.మానవత్వం లేని మతం రాణించదు.మతాలన్నీ మానవత్వం కలిగి ఉండమని బోధిస్తాయి.మానవత్వం లేని వాళ్లకు స్వర్గంలో చోటు లభించదు అని అంటారు .మానవత్వం అంటే కరుణ,ప్రేమ,దయ,అహింసను పాటించడం.మానవ ప్రేమే మానవ ఆదర్శం.ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న అని చెబుతారు.వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి .ఎడారిలో నీరు కనిపిస్తుంది ఎక్కడో ఒక చోట. ఎడారిలోని ఒయాసిస్సుల్లో నీరు లభిస్తుంది అని చదివి ఉన్నాం.మనుషులు ఉన్న చోట మానవత మాత్రం అసలే కనబడదు.సమాజంలో నివసిస్తున్న ప్రజలు సాటి మనుషుల పట్ల ప్రేమ,దయ,కరుణ జాలి చూపాలి.ఇవ్వాళ మను‌షుల్లో మానవత్వం మృగ్యమై పోయింది అని కవి వీరేశ లింగం వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది. “చక్కెర రుచి మాటల్లోనే /మార్కెట్లోకెళ్తే చుక్కెదురవుతుంది.” చక్కెరను మనం బజారులో కొనుక్కొని వంటశాలలో వాడుకుంటాం.చక్కెర అనే మాటను జీవ రసాయన శాస్త్రంలో మరొక విధంగా చెప్పుకుంటారు.గ్లూకోజ్, ప్రక్టోస్,సుక్రోస్,మాల్టోస్,లాక్టోస్ మొదలైన కార్బోహైడ్రేట్లు అనే దృష్టితో చర్చ జరుపుతారు. మామూలు చక్కెరను సుక్రోస్ అంటారు.చక్కెర స్పటికాల రూపంలో స్వచ్ఛంగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది.చక్కెర తొందరగా శరీరానికి శక్తిని చేకూర్చేవి.కొందరు మనుషులు చక్కెర రుచిని మాటల్లోనే ఒలకబోస్తారు.చక్కెర రుచి తెలవాలంటే మనం నోట్లో వేసుకోవాలి.చక్కెర నోట్లో వేసుకుంటే నోరు తీయగా అవుతుంది.ఇవ్వాళ నడుస్తున్న సమాజం గురించి చెబుతూ మనుషులు చక్కెరకు గల రుచిని మాటల ద్వారానే తెలియజేస్తారు.తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు అని సినిమా పాట ఉంది.కొందరు వ్యక్తులు చక్కెర నోట్లో పోసినట్లుగా చక్కగా మాట్లాడుతారు.ఇవ్వాళ మార్కెట్ కు వెళ్లి చక్కెర కొందామంటే చక్కెర దొరకదు,కృత్రిమ కొరతను సృష్టించి చక్కెరను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు.చక్కెర కొందామంటే దొరకక చుక్కెదురవుతుంది అని సమాజంలోని మనుషుల్లో పేరుకు పోయిన అవినీతిని చక్కెరను ఉదాహరిస్తూ కవి వీరేశ లింగం చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.” కొంత కాలం పోతే /ఈ జనాభా పెరుగుతూ పోతే /మనం పోవాల్సింది విదేశ యాత్రకు మాత్రం కాదు / పరలోక యాత్రకు” సామాజిక శాస్త్రం లోను జీవ శాస్త్రంలోను జనాభా అనే పదాన్ని ఒక జాతికి చెందిన జీవుల సంఖ్యను చెప్పడానికి వాడతారు.జనాభా అనే పదాన్ని గణాంక శాస్త్రంలోను ఇతర విజ్ఞాన శాస్త్రాలలోను సముదాయం అనే అర్థంలో కూడా వాడుతారు. నిర్ణీత ప్రాంతాలలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా.అధిక జనాభాతో వనరులు నానాటికి తగ్గిపోతున్నాయి.దేశంలో జనాభా పెరుగుదల వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది.భవిష్యత్తులో జరిగే యుద్ధం,ధనం ఉన్న వారికి ధనం లేని వారికి మధ్య జరుగుతుంది.శరీరం విడిచిన తర్వాత మనిషి యొక్క ఆత్మ చేరే లోకాన్ని పర లోకం అంటారు. కొంత కాలం పాటు జనాభా పెరుగుతూ పోతే మన దేశంలో నివసిస్తున్న వారు పోవాల్సింది విదేశాలకు కాదు.అధిక జనాభా వల్ల మన దేశ వాసులు పర లోకానికి చేరుకుంటారు అని కవి చెప్పిన తీరు చక్కగా ఉంది. “ఎవరినడిగినా ఏమడిగినా /భగభగ మండుతారు,దావాగ్నిలా”.ఈనాటి సమాజంలో జీవిస్తున్న మనుషులను ఏదైనా విషయం గురించి ఎవరినడిగినా ఏమి అడిగినా దావాగ్నిలా భగభగ మండిపోతారు.దావానలం అంటే దావాగ్ని లేదా కార్చిచ్చు.అడవులలో సంభవించి అతి త్వరగా వ్యాపించే అగ్ని ప్రమాదాలు దావాగ్నులు.ఇవి మానవుల అలక్ష్యం వలన,మెరుపుల మూలంగా లేదా అగ్నిపర్వతాల వలన సంభవిస్తాయి.దావాగ్ని వల్ల మంటలు విస్తృతంగా వ్యాపించి అక్కడ నివసించే జంతు జాలాన్ని కూడా నాశనం చేస్తాయి.“గడబడ చేస్తారు బస్సు స్టాండులా.” విపరీతంగా పెరిగిన జనాభా వల్ల బస్సు స్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఇసుక పోస్తే రాలనంతగా జనాలు గుమి గూడి ఉంటారు.బస్సు స్టాండులో ఉన్న జనాలు తీవ్రమైన అసహనంతో గడబిడ చేస్తారు. ” అశాంతి ఈనాటి ఆత్మీయత.” మనుషులు ఏదేని చింతించాల్సిన సంఘటన కారణంగా కలిగే భయం చేత కలత చెందుట అశాంతి.అనుకోకుండా అసాంఘిక శక్తుల వల్ల బాంబు పేలుడు సంఘటన జరిగితే ప్రజలలో అశాంతి వ్యాపిస్తుంది.మనిషికి దగ్గరి బంధువుల వల్ల ఆత్మీయత నెలకొంటుంది.తల్లికి పిల్లలపై ఉండే ప్రేమ ఆత్మీయత.ఆత్మీయత అనేది ఒక వ్యక్తిగత సంపద.ఆత్మీయతను పెంపొందించుకోవడానికి మనుషులు ప్రయత్నించాలి.ఆత్మీయత మనిషికి బలం.ఈనాటి మనుషుల్లో ఆత్మీయత కొరవడింది. ఈనాటి మనుషుల్లో నైతికత లేకపోవడం వలన, విశ్వాసం లేకపోవడం వలన,ఆత్మీయతకు దూరమై కలత చెందుతారు.ఈనాటి మనిషి వ్యాకులత వలన ఏ పని పైన ధ్యాసను ఉంచలేక పోతున్నాడు.పెరిగిన జనాభా వల్ల కలవరంతో మనుషుల్లో అశాంతి పెరిగి ఆత్మీయతకు దూరమవుతున్నారు.అశాంతిని తొలగించాల్సిన అవసరం చాలా ఉంది.” ద్రోహం ఈనాటి దేశ భక్తి.” మంచికి వ్యతిరేక భావన ద్రోహం గా చెప్పవచ్చు. మనిషి ఎప్పుడైనా మంచిని గూర్చే ఆలోచించాలి.మనుషులకు ద్రోహ భావన పనికి రాదు.దేశ భక్తి అంటే ప్రజలకు వారు జన్మించిన దేశం మీద గల మక్కువ.ఇది ఒక ప్రాంతం లేదా పట్టణము లేదా గ్రామానికి పరిమితమై ఉండవచ్చు.దేశ భక్తితో వారి దేశం సాధించిన ప్రగతి,సంప్రదాయాలు మొదలైన వాటిని గొప్పవిగా భావిస్తారు.దేశ భక్తి, జాతీయత భావం ఒక్కటే.దేశ భక్తి కలిగి ఉండుట, ఇందులో వ్యక్తి కంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. దేశ భక్తిని కలిగిన వారు ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకంజ వేయరు.దేశం పట్ల గల ప్రేమను విధేయతను దేశ భక్తిగా చెప్పవచ్చు.దేశ భక్తి అంటే దేశం,చరిత్ర,సంప్రదాయాల పట్ల ప్రేమ,గౌరవం ఉండడం.దేశ భక్తులు తమ దేశ అభివృద్ధికి దాని చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తారు.దేశ భక్తితో చాలామంది తమ దేశానికి సేవ చేసి ప్రాణాలను కూడా అర్పించారు.ఇప్పటికి చాలా మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో తమ దేశానికి నిస్వార్ధంగా సేవ చేస్తూనే ఉన్నారు.భారత స్వాతంత్ర్య సమరంలో ఎంతో మంది ప్రజలు తమ దేశం కొరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.దేశ భక్తి వల్ల దేశ ప్రజలు తరతమ భేదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటారు.దేశ భక్తి వల్ల దేశం బలోపేతంగా తయారవుతుంది.జనాభా పెరుగుదల వల్ల ప్రజలు ద్రోహ చింతనను దేశ భక్తిగా భావించడం తీవ్రమైన ఆవేదన కలిగిస్తుంది. “అహంకారం అంతకన్నా రక్తి. ”అహంకారం,దర్పము లేదా గర్వము ఒక విధమైన ఆలోచనా పద్ధతి.రక్తి అంటే ఏమిటి? ఆహ్లాదకరమైన మనోహరమైన ఆకర్షణీయమైన అందమైన అనే అర్థంలో రక్తిని వాడుతారు. పెరిగిన జనాభా వల్ల మనుషుల్లో అహంకారం పెరిగి పోయింది.మనుషులు మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అహంకారం వల్ల సాటి మనిషిని గౌరవించ లేరు. సాటి మనిషిని హీనంగా చూస్తారు.అహంకారం వల్ల మనిషిలోని ఆత్మజ్ఞానం అడుగంటి పోతుంది. “అదేమంటే,ఉందంటారు మాకు శక్తి.అహంకారం గురించి అదేమని అడిగితే గర్వంతో ఉందంటారు మాకు శక్తి.“దీనికంతా కారణం ఏమిటి? / కల్తీ లేని శాల్తీ కనబడకపోవడం/ఏ రంగంలో చూచిన/ఏ మనిషినడిగినా,సోదా చేసినా/సాదాయైన సీదా జీవితం కనబడదు.” నిత్యావసర వస్తువులలో ఇతర పదార్థాలను కలిపి చలామణి చేయడం నేరం. వస్తువులను కల్తీ చేయడం Aduleration అంటారు. కల్తీ వలన మనిషి ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది.ఆహార కల్తీ విపణిలో ఏ వస్తువు ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఏ వస్తువుకు ధర ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువు కల్తీ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.నూనె,పాలు, నెయ్యి,కారం, పప్పు దినుసులను ఎక్కువగా కల్తీ చేస్తున్నారు.ప్రమాదకరమైన రంగులు వేసి అమ్ముతుంటారు.మనిషి మితి మీరిన అహంకారంతో వ్యవహరిస్తున్నాడు.దీనికంతా కారణమేమిటి అని ప్రశ్నించడమే కాకుండా జవాబు కూడా ఇస్తున్నాడు.ఇవ్వాళ సమాజంలో మనుషులు అందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నైతికంగా దిగజారిపోతున్నారు.సమాజంలో మంచి వారు ఒక్కరు కూడా కనబడడం లేదు అని కవి వీరేశ లింగం ఆవేదన చెందుతున్నాడు.సమాజంలో ఏ రంగంలో చూచినా ఏ మనిషిని అడిగినప్పటికీ సరైన సమాధానం లభించదు.సమాజంలో ఏ మనిషిని సోదా చేసినా స్వచ్ఛత కనబడడం లేదు.ఏ మనిషి జీవితం కూడా మంచితనంతో మానవత్వంతో పరిమళించడం లేదు అని కవి వీరేశ లింగం వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ కౌటిల్యుడు పోయి ఎన్ని శతాబ్దాలు అయింది/ కాని,నేడు కౌటిల్యుడు లేని ప్రదేశమే లేదు. కౌటిల్యుడు మహోన్నత మానవతావాది.కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం చాణిక్య నీతి శాస్త్రంగా పేర్కొంటారు.కౌటిల్యుడు ఈ లోకాన్ని వీడిపోయి ఎన్నో శతాబ్దాలు గడిచాయి అనేది వాస్తవం.నేటి సమాజంలో కౌటిల్యుల లాంటి వ్యక్తులు అడుగడుగునా తారసపడతారు.నేడు ఎక్కడ చూసినా కౌటిల్యుడు అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు అని వెల్లడి చేయడం,కవి వీరేశ లింగం సమాజాన్ని ఔపోషణ పట్టినట్టుగా తోస్తోంది.కౌటిల్యం అంటే కుటిల రాజకీయం అని లోకంలో స్థిరపడిపోయింది. సమాజాన్ని అడుగడుగునా కలుషితం చేస్తున్న కుటిల రాజకీయ నాయకుల నుండి అప్రమత్తంగా ఉండాలని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది. “కనీసం చంద్రగోళమైనా వెళ్లి బ్రతుకుదామా అంటే, /అక్కడా ఉన్నది గందరగోళం/కనిపించేది రాళ్లు,అదో రకం బూడిద/గాలి అసలే లేదు./అనువైన వాతావరణం ఏమీ లేదు.”మానవులు అడుగు పెట్టిన మొదటి కొత్త ప్రపంచం ఏది? అంటే చంద్రమండలం అని తోస్తుంది.చంద్రుడు భూమికి సమీపంలో ఉండటం వల్ల గ్రహ శాస్త్రానికి ప్రయోగశాలగా దానిని వాడుకుంటున్నాం. అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించడం,పని చేయడం ఎలాగో తెలుసుకోవడానికి చంద్రుడు ఒక ప్రధాన ప్రదేశంగా మిగిలిపోయాడు.ఈ లోకంలో మనుషులు చేస్తున్న అక్రమాలు చూసి విసుగు చెందిన అతడు కనీసం చంద్రుని వద్దకు వెళ్లి బ్రతుకును కొనసాగిస్తానని ఆలోచించాడు.అక్కడ కూడా తన ఆలోచనలకు భిన్నంగా ఉంది.చంద్ర లోకంలో కూడా తాను ఊహించిన దానికి అతీతంగా ఉంది.ఎందుకో చంద్ర గోళం చిందర వందరగా ఉండడం,ఒక క్రమ పద్ధతిలో లేక పోవడంను చూసి అతనికి ఆందోళన కలిగింది.అక్కడ అతడు చూడగానే చంద్రుని వద్ద కనిపించేవి రాళ్లు మరియు అదో రకం బూడిద అక్కడ పేరుకు పోయి ఉంది. ఎందుకో? ఏమిటో? చంద్రుని వద్ద గాలి అసలే లేదు. చంద్రుని వద్ద నివసించడానికి అనువైన వాతావరణం కూడా అక్కడ లేదు అని కవి వీరేశ లింగం కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది. ”మరింకే గోళంలో ఉందా వీలైన వాతావరణం ? /సైంటిస్టుల నుండి సమాధానం లేదు.” మరింకే గోళంలో ఉందా వీలైన వాతావరణం అని ప్రశ్నిస్తున్నాడు మరియు అతనే జవాబు చెబుతున్నాడు.శాస్త్రవేత్తల నుండి ఎటువంటి సమాధానం లభించడం లేదు అనే వాస్తవము ఒప్పుకుంటున్నాడు.కవి వీరేశ లింగం కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది. “అందుకే చివరికిది నా నిర్ణయం -’.నిర్ణయం తీసుకునే చర్య లేదా ప్రక్రియ. నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక ప్రశ్న లేదా సందేహం వంటి నిర్ణయం.నిర్ణయం అంటే ఏదైనా పని చేయుట కోసం తీసుకోబడే దృఢ సంకల్పం లేదా నిశ్చయం.ఏదైనా కారణం ద్వారా ఒక ఉద్దేశానికి రావటం నిర్ణయం.ఏదైనా ఒక విషయంపై నిర్ధారణ చేసుకోవటం నిర్ణయం.ఒక పని చేయాలనే ఆలోచన లేదా భావన నిర్ణయం.ఒక ఆలోచన లేక పథకం గురించి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకోవడం జరుగుతుంది.అందుకే అతను చిట్ట చివరిది అయిన నా నిర్ణయంలో ఎలాంటి మార్పుకు ఆస్కారం లేదు అని బహిరంగంగా వెల్లడి చేస్తున్నాడు.“ఉంటాను భూమి మీదే,/ తొలగిస్తాను ముళ్ల కంపలు.” అతను తీసుకున్న అసలైన నిర్ణయం గురించి చెబుతూ పుట్టి పెరిగిన ఈ భూమి మీదనే ఉంటాను.ఈ భూమి మీద విచ్చలవిడిగా పెరిగిన ముళ్ళ కంపలను గొడ్డలితో నరికి తొలగిస్తాను.ముళ్ళ కంపల లాంటి మనుషుల వల్లనే భూమి మీద మానవ పురోగతికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.ఈ భూమికి అడ్డంకులు కలిగిస్తున్న ముళ్ళ కంపలను తొలగిస్తాను అని ప్రతిన చేసి చెప్పుతున్నాడు. ”మారుస్తాను జీవితాలూ – వాటి ధోరణులూ – పెను తుపానులా ముంచుకు వస్తున్న విప్లవ ధోరణులను/ దిగ మ్రింగుతాను అపర శివుడిలా.” మానవుడి సామాజిక సంబంధాలు,తాత్విక మరియు మతపరమైన ఆలోచనల ధోరణులను మారుస్తాను అంటున్నాడు.పెను తుపాను వేగంగా గాలితో వచ్చే వర్షం.దివిసీమ తుఫాను వల్ల వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.సునామీ వచ్చి వైజాగ్ పట్టణం విలవిలలాడింది.ప్రపంచ సమాజంలో కొన్ని కొన్ని విధానాలు ప్రజాస్వామ్యము కమ్యూనిజం అనే సిద్ధాంతాలు ప్రసిద్ధిలో ఉన్నాయి.ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధానాన్ని ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటారు.ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పద్ధతిని జనాలు అనుసరిస్తూ ఉంటారు.విప్లవం అంటే ఒక దేశం యొక్క ప్రభుత్వ వ్యవస్థ,పరిపాలన వ్యవస్థ, రాజ్యాంగం లేదా సామాజిక వ్యవస్థలో అసాధారణమైన ఊహించని మార్పు అని చెప్ప వచ్చు.విప్లవం అంటే సమాజంలోని తరగతి,జాతి లేదా మతపరమైన నిర్మాణాల యొక్క వేగవంతమైన పరివర్తన.విప్లవం అనేది రాజకీయ పాలనలో మార్పునకు ప్రయత్నిస్తుంది. గణనీయమైన సామూహిక సమీకరణ,రాజ్యాంగేతర మార్గాల ద్వారా సామూహిక ప్రదర్శనం,నిరసనలు, సమ్మెలు లేదా హింస వంటి వాటి చేత సమాజాన్ని బలవంతంగా మార్చే ప్రయత్నాలను విప్లవ ధోరణి కలిగి ఉంటుంది.మానవ చరిత్రలో అనేక విప్లవాలు తల ఎత్తినాయి.ఏదైనా ఒక వ్యవస్థ మీద కలిగే అసహ్యం,విరక్తి,విరాగం,అకస్మాత్తుగా తీవ్రంగా ఏర్పడిన ఏహ్యా భావం విప్లవంగా రూపు దిద్దుకుంటుంది.సాధారణంగా రాజకీయ మార్పుని విప్లవం అంటారు.అణచివేత,అన్యాయమైన పాలన, లంచగొండితనం,అసమర్ధ రాజకీయ వ్యవస్థ, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు,వలస పాలన పై ప్రజల తిరుగుబాటు మొదలైనవి విప్లవాలు.ఒక భావజాలానికి అనుకూలంగా ఉద్యమం రూపంలో ఉంటాయి. ప్రజల మనస్సుల్లో,భావోద్వేగాల్లో పాత ఆలోచనలకు బదులుగా కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం విజయవంతం అయితే అది విప్లవంగా పరిగణించబడుతుంది.సమాజంలోని ఏదైనా సామాజిక సమూహం,తరగతి లేదా వర్గానికి చెందిన వ్యక్తుల పట్ల పక్షపాతం కారణంగా కూడా విప్లవాలు సంభవించవచ్చు.ఎవరైనా మీకు నచ్చని పనిని చేయమని బలవంతం చేస్తే చేయనని ఖరాఖండిగా చెప్పడం విప్లవంగా చెప్పవచ్చు.ప్రజల జీవితాలను మారుస్తాను.ప్రజల జీవితంలో వెల్లువెత్తుతున్న తీవ్రమైన ధోరణులను కూడా మారుస్తాను. సమాజంలో మార్పు కోసం సాగుతున్న పెను తుపానులా ముంచుకు వస్తున్న విప్లవ ధోరణులను కూడా మారుస్తాను.క్షీరసాగర మథనంలో దేవతలకు రాక్షసులకు అమృతం కొరకు సాగుతున్న పోరులో దేవతలు శివుని ప్రార్థించగా శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం దక్కేటట్లు చేశాడు. ఇవ్వాళ సమాజంలో తుఫాను వలె ముంచుకు వస్తున్న విప్లవ ధోరణులను కూడా దిగ మ్రింగుతాను అపర శివుడిలా అంటున్నాడు.అర్రులు చాచుతాను అంటూ అతను అమరత్వం కొరకు అర్రులు చాస్తాను.అమరత్వం కొరకు ఎదురు తెన్నులు చూస్తూ పోరాడుతాను అనే సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు.సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నిస్తూ సమస్యల అంచుల వరకు ఆలోచిస్తాను.ఆలోచనల ఫలితాన్ని అందుకుంటాను. ఇవ్వాళ దేశం ఎదుర్కొంటున్న ఇక్కట్లకు పరిష్కారం కనుగొని నా దేశానికి పూర్ణత్వం చేకూరుస్తాను.ఇది తానూ ఎన్నుకున్న తీర్మానం,తిరుగులేని నా నిర్ణయం అంటున్నాడు.అందుకే ఈ భూమిని వీడి పోను వాడిగా అసలే పోను అని అతనిలో చెలరేగుతున్న భావాలు నిత్య నూతనత్వంతో కూడుకుని ఉన్నాయి.వాడి పోను వీడి పోను అని మనలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు.మనలను ఏదో కొత్త లోకంలోకి తీసుకొని పోతున్నాడు.అతను వ్యక్తం చేస్తున్న భావాలకు స్వాగతం పలుకుతున్నాను.వీడి పోను వాడి పోను.నా భావాలను సజీవంగా నిలిపే ప్రయత్నం చేస్తాను అనే అతని ఊహలు ఆశ్చర్యంగా ఉన్నాయి.కవి వీరేశ లింగం కవితలో వ్యక్తం చేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.కవి వీరేశ లింగం మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
డాక్టర్ ముదిగొండ వీరేశ లింగం తేది 08 – 06 -1940 రోజున వరంగల్ జిల్లాలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు భవానమ్మ,శంకర శాస్త్రి.వీరి తండ్రి శంకర శాస్త్రి వరంగల్ పట్టణంలో విశ్వేశ్వర సంస్కృత కళాశాల,దుర్గేశ్వర మహిళా కళాశాలలను నడిపాడు.ఆచార్య డాక్టర్ రవ్వా శ్రీహరి గారు శంకర శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు.శంకర శాస్త్రి ప్రియమైన శిష్యుడు ఆచార్య డాక్టర్ రవ్వా శ్రీహరి. వీరి తండ్రి శంకర శాస్త్రి 1993 సంవత్సరంలో ఈ లోకాన్ని వీడి పోయారు.వీరి తాత వీరేశ లింగం నాయనమ్మ అన్నపూర్ణమ్మ.వీరి తాత వీరేశ లింగం,1916 సంవత్సరంలో ఈ లోకాన్ని వీడి పోయారు.వీరు 5 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఎ.వి. హై స్కూల్ హన్మకొండలో చదివారు. వీరు 10 వ తరగతి1957 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు.వీరు పి.యు.సి. నుండి బి.ఏ. డిగ్రీ 1959 – 1962 వరకు ప్రభుత్వ ఆర్ట్స్& సైన్స్ డిగ్రీ కళాశాల,వరంగల్ లో చదివారు.వీరు ఎం.ఏ. తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాదులో చదివారు.వీరు ఎం.ఏ. తెలుగు 1965 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు.వీరు జైమిని భారతం సంశోధనాత్మక పరిశీలన అంశంపై ప్రొఫెసర్ యం.కుల శేఖర రావు గారి పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్ నుండి 1978 సంవత్సరంలో పి.హెచ్.డి.అవార్డు పొందారు. వీరు డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పటి నుండి సాహిత్య సృజన చేయడం ప్రారంభించారు.వీరు18 – 09 – 1969 రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గూడూరు,నెల్లూరు జిల్లాలో లెక్చరర్ గా నియమింపబడ్డారు.వీరు వివిధ హోదాలలో పనిచేస్తూ కాకతీయ డిగ్రీ కళాశాల,హన్మకొండ నుండి రీడర్ గా 30 – 06 -1998 రోజున రిటైర్ అయ్యారు. వీరు రీడర్ గా కాకతీయ డిగ్రీ కళాశాల,హన్మకొండలో పని చేస్తున్నప్పుడు వీరి పర్యవేక్షణలో ఇద్దరు విద్యార్థులు పి.హెచ్.డీ. అవార్డు పొందారు.వీరి పర్యవేక్షణలో పిన్న శారద “మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారి జీవితం సాహిత్యం” అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి అవార్డు పొందింది.పిన్న శారద దుర్గేశ్వర మహిళా సంస్కృతాంధ్ర కళాశాల,వరంగల్ నుండి ప్రిన్సిపల్ గా పని చేసి రిటైర్ అయింది.వీరేశలింగం గారి పర్యవేక్షణలో హరి సనత్ కుమార్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఖండ కావ్యాలు పరిశోధన అంశం” పై పరిశోధన చేసి పి.హెచ్.డి.అవార్డు పొందినాడు.హరి సనత్ కుమార్ ప్రొఫెసర్ హరి శివకుమార్ తమ్ముడు.హరి సనత్ కుమార్ యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారి ఖండ కావ్యాలు పరిశోధన గ్రంథం ప్రచురింపబడింది.
వీరేశ లింగం గారు ఇస్కాన్ ముంబాయి సంస్థలో నవంబర్ 1998 నుండి 2011 వరకు ఉచితంగా పని చేశాడు.వీరు సంస్కృతం భగవద్గీతకు సంపాదకత్వం వహించారు.వీరు సంస్కృత భాగవతం 18 వాల్యూమ్స్ లకు సంపాదకత్వం వహించారు.వీరి సంపాదకత్వంలో ఇస్కాన్ సంస్థ నుండి 25 పుస్తకాలు వెలువడ్డాయి. శివానందమూర్తి గారు ప్రచురించిన వ్యాస గ్రంధాలలో వీరు రాసిన వ్యాసాలు యోగ శాస్త్రం,తెలంగాణలో శైవ మత వ్యాప్తి ప్రచురింపబడినవి.వీరేశ లింగం గారి వివాహం జ్ఞాన ప్రసూనాంబతో తేది 08 – 06 – 1966 రోజున పెసరమిల్లి గ్రామం కృష్ణా జిల్లాలో జరిగింది. వీరేశ లింగం,జ్ఞాన ప్రసూనాంబ దంపతులకు ముగ్గురు సంతానం :1)ప్రథమ సంతానం : కుమారి శివ కౌముదీ దేవి, కవయిత్రి,రచయిత్రి,జర్నలిస్ట్, కథలు వ్యాసాలు రాశారు.వీరు రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ ను ఇంటర్వ్యూ చేసారు.వీరు రేడియోలో ప్రసంగాలు చేశారు.కుమారి శివ కౌముదీ దేవి అనారోగ్యంతో 02 – 06 -2016 రోజున ఈ లోకాన్ని వీడిపోయింది. సాహిత్య లోకం ఒక గొప్ప కవయిత్రిని కోల్పోయింది.
2) ద్వితీయ సంతానం : దుర్గాప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పని చేస్తున్నాడు.
3)తృతీయ సంతానం : భావనా శంకర్ భార్య శైలవర్తన.భావనా శంకర్ కెనడాలో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు.
వీరేశ లింగం గారు వెలువరించిన పుస్తకాల వివరాలు.
1) స్పందన కవితా సంపుటి – 1982.
2) జైమినీ భారతం సంశోధనాత్మక పరిశీలన గ్రంథం -1983.
వీరేశ లింగం వరంగల్ పట్టణంలో స్వగృహం నిర్మించుకున్నాడు.వీరికి 84 సంవత్సరాల వయస్సు.ప్రత్యేక తెలంగాణ 1969 గురించి అడిగితే తెలంగాణలోని రాజకీయ నాయకులకు ఎవరి స్వార్థం వారికే ఉంది.రాజకీయ నాయకులు నిజాయితీగా తెలంగాణ కోసం పని చేయ లేదు అన్నారు.2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా చూసుకోవాలి.తల్లిదండ్రులను బట్టి పిల్లలు తయారవుతారు.తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమగా ఉండాలి.చేతనైనంత వరకు ఎవరికైనా సహాయం చేయాలి.మాటలు చెప్పడం కాదు పని చేసి చూపించాలి అని అన్నారు.వీరు 50 మందికి హోమం చేసి లింగ ధారణం,పంచాక్షర మంత్రం ఉపదేశం చేశారు.వీరు నూతన రచయితలకు కొన్ని సూచనలు చేశారు.చేతిలో కలం ఉంది కదా అని ఏది పడితే అది రాయ కూడదు.రాసే వాళ్ళు ఆలోచించి రాయాలి.నేను రాసిన దానివల్ల ఎవరికన్నా ప్రయోజనం ఉందా? లేదా? అని ఆలోచించాలి.నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు.సమాజంలో రాయి రాయక పో.మనసును వాక్కును కంట్రోల్ చేయడం చాలా అవసరం.పెద్దల ఎడ గౌరవాన్ని కలిగి ఉండాలి.బుద్ధి,మనస్సు,ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి.ఎవరిని అవమానించ కూడదు. అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి.తామరాకు మీద నీటి బొట్టు లాగా బతకాలి.ప్రాచీన,ఆధునిక సాహిత్యం రెండు చదవాలి.మనసులో ద్వేషం పెట్టుకుని పుస్తకాలు చదవ వద్దు.ఎవరిని గూర్చి కూడా చెడు మాట్లాడ కూడదు అని చెప్పినారు.వీరు 5 గంటలకు నిద్రలేస్తారు.కాలకృత్యాలు తీర్చుకుంటారు.రోజు శివ పూజ చేస్తారు.సమయం దొరికినప్పుడు సాహిత్య అధ్యయనం చేస్తారు.రాత్రి 10 గంటలకు నిద్ర పోతారు.

డాక్టర్ ముదిగొండ వీరేశ లింగం విప్లవానికి మలుపు కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషా రీడర్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,హన్మ కొండ,డాక్టర్ ముదిగొండ వీరేశ లింగం కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని విప్లవానికి మలుపు కవిత పై విశ్లేషణా వ్యాసం.విప్లవానికి మలుపు కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.విప్లవాలు ఒక భావజాలానికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఉద్యమ రూపంలో ఉంటాయి.ప్రజల మనస్సుల్లో భావోద్వేగాల్లో పాత ఆలోచనలకు బదులు కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం విజయవంతమైతే విప్లవంగా పరిగణించబడుతుంది.చరిత్రలో ఎన్నో విప్లవాలు జరిగాయి.విప్లవానికి మలుపు ఉంటుందా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ధనిక,పేద అసమానతలు తొలగించడానికి పేద ప్రజలు ఐక్యమై పోరుబాట సాగిస్తారు.ఆ పేద ప్రజల పోరు బాట అనేక మలుపులు తిరిగి చివరికి విప్లవం విజయవంతం అవుతుంది.
“ఈనాటి నా జాతి స్వరూపం
“రంగు రంగుల సుమాల వనం
“నానా జాతి సమితి మినీ స్వనం
“విపుల బాంధవ్య వైవిధ్యాలు లేని గుణం – నిక్వణం.
సమాజంలో జాతుల స్వరూపం అనేక తెగలతో నెలకొని ఉంది.వివిధ తెగలు గల జాతి రంగు రంగుల పూల తోటలా ఉంది.సమాజంలో అనేక తెగల మధ్య దేశాల మధ్య యుద్ధాలు ఆధిపత్యం కోసం జరుగుతూ ఉండేవి.ప్రపంచ దేశాల మధ్య అనేక తెగల మధ్య సయోధ్య చేకూర్చడానికి నానా జాతి సమితి అనే ప్రపంచ సంస్థ ఏర్పడింది.నానా జాతి సమితి లోని తెగల మధ్య ఏర్పడిన చిన్న ధ్వని ప్రభవించింది.మనం నివసించు ప్రదేశం మనకు తల్లి లాంటిది.అలాంటి ప్రదేశాలలో నివసించు ప్రజల మధ్య సంబంధాలు ఏమీ లేకపోయినప్పటికీ అనేక తెగలు కలిసిన బాంధవ్యాల మధ్య ఒక చక్కని ధ్వని వినబడింది.
“ఈ జాతికి ఎందుకో పుట్టింది విప్లవం
“ఏనాటికి మారకూడదు ప్లవంగంలా
“మారినా పరవా లేదు అది లవంగంలా
“ఎందుకైనా మంచిది : అది అలానే కావాలి.
ఈ దేశంలో పుట్టిన ఈ జాతి జనులకు ఎందుకో పుట్టింది విప్లవం? అని ప్రశ్నిస్తున్నాడు. అరాచకాలకు,అణిచివేతకు,దోపిడీకి,వివక్షకు గురి అవుతున్న ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాల బాట పట్టి పోరాటం సాగిస్తారు.మార్పు కోరే హక్కు ప్రజలకు ఉంది.అట్టి ఆ మార్పే విప్లవంగా రూపు దిద్దుకుంటుంది.ప్రజలలో చైతన్యంతో పుట్టుకు వచ్చిన విప్లవం హక్కుల సాధన కోసం మార్పు కోసం నిరంతరం ఉద్యమాలుగా కొనసాగుతుంటాయి.ప్రజలు సాగిస్తున్న అట్టి విప్లవం సరైన పంథాలో సాగాలి.ప్రజలు సాగిస్తున్న ఆ విప్లవం ఏనాటికి మారకూడదు కోతిలా అని ప్రజలను హెచ్చరిస్తున్నాడు.విప్లవాలలో పాల్గొన్న వారి ప్రవర్తన క్షణ క్షణం మారే కోతి చేష్టల వలె ఉండకూడదు.విప్లవాలు నడిపే వాళ్ళ ప్రవర్తన కోతిలా ఉంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాడు.తమ హక్కుల కోసం ప్రజలు సాగిస్తున్న విప్లవం మారినా ఫర్వాలేదు లవంగంలా అని అంటున్నాడు.లవంగం ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.విప్లవం కూడా లవంగం వలె ఆరోగ్యకరమైనదిగా కొనసాగాలి అని కోరుకుంటున్నాడు.ఎందుకైనా మంచిది విప్లవం అలానే కొనసాగాలని అంటున్నాడు.ఆరోగ్యకరమైన విప్లవం కొరకు ఆరాటపడుతున్న తపన కనబడుతుంది.మంచి కోసం పాటు పడే విప్లవాలు చోటు చేసుకోవాలి అని చెబుతూ ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతూ ప్రేరణ కలిగిస్తున్నాడు.
“విప్లవ రుధిర జ్వాల కోసం
“ఎదురుచూస్తున్నారు ఈనాటి యువకులు
“కాని ఎందరున్నారు.ఈ జాతిలో రక్తం ధార పోసే వారు.”
సమాజంలో ఎందరో యువకులు విప్లవాల బాటన సాగుతున్నారు.సమాజంలో ఎందరో యువకులు విప్లవ రుధిర జ్వాల కోసం తమ రక్తాన్ని ధార పోయడానికి ఎదురు చూస్తున్నారు.ఈనాటి సమాజంలో రక్తాన్ని ధార పోసే యువకులు ఎందరు ఉన్నారు.విప్లవాల కోసం ఉద్యమాలు ఉవ్వెత్తున రగులుతున్నాయి.కాని తమ జాతి హక్కుల సాధన కోసం రక్తం ధార పోసే యువకులు ఎందరు ఉన్నారు అని ప్రశ్నించడం చక్కగా ఉంది.సమాజంలో చెలరేగుతున్న ఉద్యమాల్లో పాల్గొని యువకులు జాతి కొరకు పాటు పడాలని ప్రేరణ కలిగిస్తున్నాడు.
“రక్తమంటే ఏమో కాదు
“అర్థం చేసుకున్న వారికి
“తెలుస్తుంది దాని విలువ
“ఆరోగ్యానికి కావాలి రక్తం
“ఆయుర్దాయానికి కావాలి రక్తం.
రక్తం మానవులు ఇతర జంతువులలో కణజాలాలకు పోషకాలను,ఆక్సిజన్ ను సరఫరా చేసే ద్రవం.రక్తం జీవ క్రియలో భాగంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆ కణజాలాల నుండి తీసుకుపోతుంది.రక్తమును నెత్తురు అని కూడా అంటారు.జీవి మనుగడకు రక్తం అత్యవసరం.రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి ఎరుపు రంగు.రక్తానికి ప్రాణం హిమగ్లోబిన్.దీన్నే రక్తచందురం అంటారు. కవి వీరేశ లింగం రక్తం యొక్క విలువ అర్థం చేసుకున్న వారికే తెలుస్తుంది అని అంటున్నాడు. రక్తం లేకుంటే మనిషి నీరసించి అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతాడు.మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి రక్తం కావాలి.రక్తం ఉంటేనే మనిషి ఆయుర్దాయం కలిగి సుఖంగా ఎక్కువ కాలం జీవించగలుగుతాడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“చైతన్యానికి కావాలి అదే
“యువతకు కావాలి అదే
“అందుకే అంటాం
“ఆపరేషన్ థియేటర్లో
“ఆరోగ్య పూరిత రక్తమే కావాలని.”
చైతన్యం లేదా స్పృహ అంటే ఆలోచనలు, జ్ఞాపకాలు,భావాలు,అనుభూతులు మరియు పరిసరాలపై వ్యక్తిగత అవగాహన కలిగి ఉండటం. చైతన్యం లేదా స్పృహ అనేది మీ గురించి మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మీకున్న అవగాహన అని చెప్పవచ్చు.చైతన్యం అంటే శక్తి లేదా ఉత్సాహం అని అర్థం.చైతన్యమంటే ప్రాణము లేదా జీవ శక్తి అని కూడా చెప్ప వచ్చు.కవి వీరేశ లింగం మానవుని చైతన్యానికి కావాలి రక్తం.మనిషి చైతన్యం లేకుంటే ఏ పని చేయ లేడు.చైతన్యం లేకుంటే మనిషి నీరసించి పోతాడు.మనిషి చైతన్యంతో ఉండాలి అంటే రక్తం తప్పనిసరి కావాలి అని చెప్పిన తీరు బాగుంది.యువత అనగానే తమ కుటుంబం,సమాజం,రాష్ట్రం,దేశం యొక్క అభివృద్ధిలో ఎల్లప్పుడు సానుకూల మార్పును కోరుకునే శక్తివంతమైన సమూహంగా చెప్పవచ్చు. యువత దేశానికి వెన్నెముకగా పేరు గాంచింది.దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలంటే చైతన్యంతో,దృఢ సంకల్పంతో యువత ఒక ప్రణాళిక ప్రకారం కృషి చేయాలి.భారత దేశం ఇప్పటికి పేదరికం,నిరుద్యోగం,అవినీతి, ఆత్మహత్యలు మరియు వివిధ రకాల సామాజిక సమస్యలను ఎదుర్కొంటుంది.ఉత్సాహంతో పరుగులు తీస్తున్న యువతకు కూడా రక్తం కావాలి. యువత రక్తం ఉంటేనే చైతన్యంతో ఉంటారు. యువత చైతన్యంతో సమాజాభివృద్ధి కొరకు పాటు పడతారు అని చెప్పిన తీరు బాగుంది.ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఆపరేషన్ థియేటర్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు అతనికి ఆరోగ్యపూరితమైన రక్తం ఎక్కిస్తేనే ప్రాణాపాయం నుంచి బయటపడ గలుగుతాడు.రక్తం ఎక్కించిన తర్వాత అతను ఆరోగ్యకరమైన వ్యక్తిగా జీవించగలుగుతాడు అనుటలో సందేహం లేదు.
“కాబట్టి ఈనాటి జాతికి
“పనికి వచ్చే నవయువకుల నవచైతన్యం
“ఆలోచించే అర్థవంతపు జీవితం
“అమరత్వం కొరకు అర్రులు చాచే
“మతి భ్రమణం లేని యువకుల చైతన్యం
“కావాలి అదే – చివరంటా సాగాలి అదే –
“సంకేతాలను తప్పించుకునే వారు
“సంకటాలను తప్పించు కొనాలి
“దానికే ఈనాటి యువతరం
“పడాలి మధనం పొందాలి ఆవేదన.
దేశం ఎదుర్కొంటున్న సమస్యల విష వలయం నుంచి బయటపడాలంటే చైతన్యవంతులైన నవ యువకుల వల్లనే సాధ్యమవుతుంది.అలాంటి నవ యువత మాత్రమే దేశ అభివృద్ధి,సమాజ అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టగలరు. నవ యువత అమరత్వానికి అర్రులు చాస్తారు. అమరత్వం అనేది శాశ్వత జీవితం యొక్క భావన. అమరత్వం అనగా మరణము లేని తనం.కొండలు పిండి చేసే నవ యువకులలోని చైతన్యం మతి భ్రమణం కోల్పోయేలా ఉండకూడదు.నవ యువకుల చైతన్యం వెర్రి తలలు వేయకూడదు. ఈనాటి నవ యువత సానుకూల భావాలతో ముందుకు సాగాలి.అలాంటి సానుకూల భావాలు ఉన్న నవ యువకులు కావాలి.అలాంటి నవ యువకులు దేశ శ్రేయస్సు కొరకు జీవితాంతం వరకు ముందుకు సాగాలి అని పిలుపునిస్తున్నాడు.ఈ దేశంలో నివసించే యువత నిర్దిష్టమైన ప్రణాళికలతో చైతన్యవంతులై ఆపదల నుండి తప్పించుకునే వారుగా ఉండాలి.ఈనాటి నవ యువత తమ ఆశయాలను సాధించడానికి ఎదురయ్యే కష్టాలను తప్పించుకొని ఎదుర్కొంటూ తమ కృషిని కొనసాగించాలి.కవి వీరేశ లింగం ఈనాటి యువతరం ఉత్సాహంతో మధనపడి ఆవేదన చెంది దేశం కోసం పాటుపడాలని చైతన్యాన్ని కలిగిస్తున్నాడు.
“పది మందిలో బడ్డ పామైనా చావదు
“అదే నేటి మన సమాజపు లోటు
“దిద్దు కోవాలి ఈ లోపం
“హద్దు మీరితే పరితపించ గలం పాపం.
పది మందిలోకీ వచ్చిన పాము చావదు అని తెలుగులో సామెత ఉంది.అదే నేటి మన సమాజం యొక్క లోటు అని తెలియజేస్తున్నాడు.నేటి సమాజంలో కొందరు తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు.చేసిన తప్పు తెలుసుకొని చివరికి బాధ పడుతుంటారు.ఈ లోపాన్ని దిద్దుకోవాలని అని చైతన్యం కలగిస్తున్నాడుమనిషి చేసిన తప్పులు హద్దులు మీరితే పరితపించక తప్పదు అని చెబుతున్నాడు.
“చీకాకుల చిడిముడిపాటులో
“ఆకుల పాటులో ఆకతాయితనాన్ని
“అణగ ద్రొక్కేయి నేస్తం అణగ ద్రొక్కేయి
“నిర్లిప్తంగా పడి ఉంటే నువ్వు
“నిజంగా పడిపోతావు
“జాగ్రత్తే నీ జన్మ హక్కని
“పోరాడు శాశ్వతంగా గెలుస్తావు
“తస్మాత్ జాగ్రత్త : జాగ్రత్త : జాగ్రత్త :.
మనిషి చీకాకుగా ఉండడం వలన బాధలను ఎదుర్కొంటాడు.మనిషి చీకాకుతో ఏర్పడిన బాధల వలన కలిగిన ఫలితం అనుభవిస్తాడు.మనిషి చిన్న పిల్లల చేష్టల వంటి ఆకతాయితనాన్ని విడిచి పెట్టాలని స్నేహితుడి వలె సలహా ఇస్తున్నాడు. నిర్లిప్తంగా పడి ఉంటే ఏ పనిలోను మనసును నిమగ్నం చేయ లేక పోతాడు.నిర్లిప్తంగా ఉంటే బాధకు లోనై పడి పోతావు అని సలహా ఇస్తున్నాడు. చిన్న పిల్లల చేష్టలను మనస్సులోనే అణగ ద్రొక్కేయి నేస్తం అణగ ద్రొక్కేయి అని చెప్పడం చక్కగా ఉంది. మంచి చెడు ఆలోచించకుండా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నిజంగా పడిపోతావు.యువత ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. యువత చర్యలు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి.యువత నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటిలో జాగ్రత్తగా ఉండాలి.యువత ప్రమాదాన్ని నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.జాగ్రత్తగా ఉండడం యువత యొక్క జన్మ హక్కు. యువతా అచంచల ఆత్మ విశ్వాసంతో పోరాడు శాశ్వతంగా గెలుస్తావని జాగ్రత్త వహించమని కవి వీరేశ లింగం వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.విప్లవానికి మలుపు కవిత ద్వారా యువత సమాజం పట్ల తమ బాధ్యతను ఎలా నెరవేర్చుకోవాలి?యువత అమాయకత్వంతో దుందుడుకు చర్యలకు పాల్పడకూడదు అనే కర్తవ్య బోధ ఉంది.విప్లవానికి మలుపు కవిత ద్వారా యువతకు కవి వీరేశ లింగం గొప్ప సూచనలు ఇచ్చారు.ఈ కవిత యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.కవి వీరేశ లింగం మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ముదిగొండ వీరేశ లింగం, జ్ఞాన ప్రసూనంబ
March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us