మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

సారస్వత క్షేత్రంలో విరిసిన తెలుగు మహిళారత్నాలు

by Radhika Suri May 11, 2023
written by Radhika Suri

       భాషా వికాసానికి    సాహిత్యం ఒక వేదిక లాంటిది . మానవునిలోని సృజనాత్మకతను, కవితా శక్తిని సమర్థవంతంగా వెలికి తీసే ఒక గొప్ప సాధనం . భాషాభివృద్ధి సంస్కృతి – సంప్రదాయాల పరిరక్షణ కవిత్వంతోనే సాధ్యమవుతుందనేది నిర్వివాదాంశం . భావవ్యక్తీకరణకు  కవిత్వం ఒక దర్పణంలాంటిది . ప్రతి దేశ చరిత్రలో సాహిత్య ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుంది .  ఆయా దేశకాల పరిస్థితులను ప్రతిబింబించేటట్టుగా సమాజ శ్రేయస్సులో కవి పోషించిన పాత్ర అవగతం అవుతూనే ఉంటుంది .

     మన దేశం కళలు , సాహిత్యాల కాణాచి . 11వ శతాబ్దికి ముందునుండే ఎంతో మంది సాహితీప్రియులైన రాజులు , చక్రవర్తులు      సాహితీఅభినివేశులై కవులను , కళాకారులను ప్రోత్సహించి , ఆదరించిన నిదర్శనాలు కోకొల్లలు . (ఇతర దేశాలలో 18వ శతాబ్దికి ముందు వరకు ఇలాంటి సంస్కృతి మనకు ఎక్కడా కనిపించదు ) తెలుగు భాష 2000 ల  సంవత్సరానికి ముందునుండే వాడుకలో ఉందనడానికి లభించిన సాక్ష్యం’ గాధా సప్తశతి ‘ . తొలి తెలుగు కావ్య ప్రక్రియ రాసిన నన్నయకు ముందు నుండే తెలుగు సాహిత్యం ఉందనడానికి ప్రధాన ఆధారం ,

క్రీస్తు శకము .1000 నాటి విరియాల కామసాని ‘గూడూరు శాసనం’. ఇందులో మూడు చంపకమాల రెండు ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి . ప్రాచీన సాహిత్యం  భక్తిరస ప్రధానమని పేర్కొనవచ్చును.  తమ రచనలతో వెలుగొందిన కొందరు ప్రముఖ రచయిత్రులు :-

 కుప్పాంబిక : తొలి తెలుగు కవయిత్రి గా భావించవచ్చు.  13వ శతాబ్దికి చెందినవారు . వనజా తాంబకుడేయు సా యకములన్  వర్ణింపగారాదు నూ … ఈపద్యం ఆమె తన ‘బూదపుర’ శాసనం లో వేయించారు. ఈ పద్యం అయ్యల రాజు తన ‘సంకలన గ్రంథం’లో ప్రస్తావించారు . ఇంతకు మించిన ఆధారాలు అలభ్యం.

  తాళ్లపాక తిమ్మక్క :15వ శతాబ్దికి చెందినవారు .అన్నమయ్య భార్య అయిన వీరు ‘సుభద్రా కళ్యాణం ‘ , ‘ ద్విపద ‘ లో రచించారు.

  ఆతుకూరి మొల్ల : ‘ మొల్ల రామాయణం ‘ రచించారు . కవయిత్రి మొల్లగా ప్రసిద్ధులు, 16వ శతాబ్దికి చెందినవారు.

  రంగాజమ్మ : 17వ శతాబ్దికి చెందినవారు . ‘ మన్నారు దాస విలాసం ‘ ప్రబంధం రచించారు.

  తరిగొండ వెంగమాంబ : 19వ శతాబ్దం వారు . ‘ వేంకటాచల మహాత్మ్యం ‘  రచించారు.

   ఈ నారీమణులు తమ రచనలతో ప్రాచీన సాహిత్యాన్ని సుసంపన్నం చేసి చరిత్రలో తమ స్థానాన్నిపదిలపరుచుకున్నారు.

          ఇక ఆధునిక సాహిత్య ప్రస్థానం విభిన్న రీతులతో వేగాన్ని పెంచుకుని వివిధ రూపాలుగా విస్తరించింది . ముఖ్యంగా వచన కవితలు ఊపందుకున్నాయి . ఛందోబద్ధం కాని పదాడంబరత లేని వచన కవిత్వాన్ని ఆధునిక సమాజం ఆదరిస్తోంది . సామాజిక చైతన్యమే కవిత్వం ప్రధాన లక్షణం .  అలతి పదాలతో అందంగా విస్పష్టంగా చెప్పడం ‘ ఓ గొప్ప కళ ‘ . కవిత్వం ‘ అనుభూతి పరిమళాల ‘ను వెదజల్లాలి . ఆధునిక సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వెలువడ్డాయి. తెలుగులో సాహితీమణులు ఎందరో తమ తమ రచనలతో సమాజ పురోగతిలో కీలకపాత్ర పోషించి సాహిత్యాన్ని పరిపుష్టం చేసి కీర్తి గడించారు. వారిలో కొందరి ముఖ్యరచనలు కొన్ని :-

  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ‘ కిరీటం’ గా దాల్చిన నలుగురు మహిళా మణులు :-

 1. ఇల్లిందల సరస్వతీదేవి : వీరు తమ రచనలతో ఎంతో ప్రభావితం చేశారు . ‘ కృష్ణా ‘ పత్రిక లో వీరి  ‘ఇయం గేహే లక్ష్మి’ శీర్షిక ఎంతో ఆదరణ పొందింది . ‘ స్వర్ణ కమలాలు’ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు . ఈ అవార్డు పొందిన  తొలి తెలుగు మహిళ కావడం విశేషం .

 2. మాలతి చందూర్ : ఆంధ్రప్రభ లో వీరి  ‘   ప్రమదావనం ‘ శీర్షిక విశ్వవిఖ్యాతినొంది’ గిన్నిస్ రికార్డు’ సాధించింది  . ఎన్నో రచనలు చేసిన వీరికి ‘హృదయనేత్రి’ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

3.   అబ్బూరి ఛాయదేవి : స్త్రీవాద రచయిత్రి . పిల్లల పెంపకంలోని లింగ వివక్ష పై వీరు రాసిన కథ ‘బోన్సాయి బతుకు’ అత్యంత ఆదరణ పొందింది. ‘ తన మార్గం ‘ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.

4.  కాత్యాయనీ విద్మహే: అభ్యుదయ స్త్రీవాద రచయిత్రి . ‘  సాహిత్యా కాశంలో సగం ‘వ్యాస సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు .

     ఇంకా సాహిత్యాకాశంలో  మెరిసిన ధృవ తారలు వారి మేటి రచనలు కొన్ని :

    బసవరాజు రాజ్యలక్ష్మి : ‘సౌదామిని ‘ కలం పేరుతో కవితలు అల్లారు.’ అప్పారావు గారు – నేను’ ఆత్మకథ రచించారు.

  సత్యవాడ సోదరీమణులు : సత్యవాడ రఘునాథమ్మ , సత్యవాడ సూర్యకుమారి. సంగీత సాహిత్యాలలో అభినివే శమున్న వీరు’ సరస్వతీ నమస్తుభ్యం’ ,’హరిప్రియ’రచించారు.

  జొన్నవాడ రాఘవమ్మ : ‘భావతరంగాలు’  ‘ రాధికా గీతాలు’ రాశారు.

  భానుమతి రామకృష్ణ : సినీ నటి , రచయిత్రి ‘అత్తగారి కథ లు ‘  వీరు రచించిన వాటిలో ముఖ్యమైనవి.

    మల్లు స్వరాజ్యం : సాయుధ పోరాటంలో వీరిది క్రియాశీల పాత్ర . జానపద బాణీల్లో రాసి , పాడి గిరిజనులకు స్ఫూర్తి కలిగించారు . సిపిఐ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు.

  ముప్పాళ్ళ రంగనాయకమ్మ : సమాజంలోని అసమానతలపై కలం ఝలిపించి ఎన్నోరచనలు చేశారు. ‘ స్వీట్ హోమ్.’ ‘రామాయణ విషవృక్షం’  వీరి ముఖ్య రచనలు .

     వాసిరెడ్డి సీతాదేవి : ‘వైతరిణి ‘, ‘మట్టి మనిషి’ నవలలు ముఖ్యమైనవి . మట్టి మనిషి నవల 14 భాషల్లోకి అనువదించబడింది .

  డి కామేశ్వరి : మానవీయ దృక్పథం వీరి రచనాశైలి .  ‘ఆకలి ‘ ,   ‘ కొత్తనీరు’ ముఖ్యరచనలు.

  వింజమూరి సోదరీమణులు : వింజమూరి అనసూయ , వింజమూరి సీతాదేవి . వీరు జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేసి ప్రాచుర్యం పొందారు. అనసూయ గారు ‘భావ గీతాలు,’  ‘ జానపద గేయం’  రచించారు . సీతాదేవి గారు  ‘ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ‘ రచించారు.

  పాకాల యశోద : ప్రముఖ రచయిత్రి  ‘ఉగాదికి ఉయ్యాల’ , ‘ భావిక ‘ సంకలనాలు వెలువరించారు.

  ముదిగంటి సుజాత రెడ్డి :   ప్రముఖ రచయిత్రి. ‘తెలంగాణ తొలి తరం కథలు ‘ చాలా ప్రా చుర్యం పొందింది.

  డాక్టర్ మృణాళిని : ప్రముఖ రచయిత్రి . అధిక్షేపహాస్యం వీరి ప్రియమైన శైలి . ‘ కోమలి గాంధారం , ‘తాంబూలం’ వీరి ముఖ్య రచనలు.

 డాక్టర్. పి. లక్ష్మి: కవయిత్రి , విమర్శకురాలు. ‘శిలాలోలిత’ కలం పేరుతో రచనలు చేస్తారు. ‘పంజరాన్ని నేనే – పక్షిని నేనే’ వీరి ముఖ్య రచన.

     లలిత కుమారి : స్త్రీవాద రచయిత్రి . ‘ ఓల్గా’ కలం పేరుతో రచనలు చేస్తారు . వీరి ముఖ్య రచన ‘ స్వేచ్ఛ’ నవల. ఇది వివిధ భాషల్లోకి అనువదించబడింది.

  మల్లంపల్లి జలంధర : ప్రముఖ రచయిత్రి అయిన ఈమె  రచనలలో ‘ఆటోగ్రాఫ్’  , ‘పున్నాగ పూలు’ ముఖ్యమైనవి.

  కొండేపూడి నిర్మల : వీరు ప్రముఖ రచయిత్రి , కవయిత్రి , జర్నలిస్టు . వీరి ‘ లేబర్ రూమ్ ‘ కవిత అత్యంత ప్రాచుర్యం పొందింది.

   పాటిబండ్ల రజని : ‘అబార్షన్ స్టేట్మెంట్ ‘ కవిత అత్యంత ఆదరణ పొందింది.

      సమాజ హితవు కోరి స్ఫూర్తి ప్రదాతలై భావావేశపు ‘సిరా చుక్కల ఉలి’తో అక్షర శిల్పాలను అందంగా మలచి ‘జీవకళ ‘ నిచ్చిన సాహితీస్ర ష్టలైన మహిళా మణులు ఎందరో !  సమయాభావంతో పేర్కొనని తేజోవిరాజమానులైన ‘మహిళా మణులు ‘ ఇంకెందరో కదా ! అందరికీ అక్షరాభివాదములు .        

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆకాశ మంత హనుమన్న

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) May 11, 2023
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

“అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ ” హనుమంతుని మనసార స్మరిస్తే చాలట బుద్ధి, శరీరబలం, యశస్సు, చెదరని ధైర్యం, ఎవ్వరి వలన భయపడకపోవటమూ, ఆరోగ్యము కలుగుట, పనిలో చురుకుదనం, వాక్కు యొక్క సామర్థ్యం కలుగుతాయని ప్రమాణం. మన భారతీయ సంప్రదాయాలను మనకెన్నో పండుగలున్నా విశేషమైన భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీ హనుమజ్జయంతి వొకటి.

“వైశాఖే మాసి కృష్ణాయాం దశమి మంద సంయుతా\

పూర్తప్రోష పదాయుక్తా అధనైదృత సంయుతా తసాం మధ్యాహ్ననే వాయాం జనయా మాస వైసుతమ్”\
అంటే ఆంజనేయస్వామి వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమి శనివారం, పూర్వాబాధ్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో నైదృతీ నామయోగం గ్రహాలన్నియు శుభ స్థానాలలో సంచరిస్తున్న మధ్యాహ్న సమయంలో కేసరి ఆంజనాదేవి
ముక్తాఫల గర్భమున జన్మించాడు. ఆనాటి నుండి వైశాఖ బహుళ దశమినాడు “హనుమజ్జయంతి”ని జరుపుకుంటున్నారు. వాల్మీకి రామాయణ కథలో హనుమంతుడు ప్రధాన భూమిక వహించాడు. త్రేతాయుగంలో అవతరించినా ద్వాపరం, కలియుగంలో కూడా హనుమం తుని ప్రభావం కనబడుతుంది. ఈయన కల్పాంతము జీవించే చిరంజీవి అంటారు. “అశ్వత్థామా బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్లైతే చిరంజీవినః అని అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసులవారు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు వీరంతా కల్పాంతము వరకు నడిచే చిరంజీవులని చెబుతారు.

లోకములను బాధిస్తున్న రావణుడిని వధించి లోక కళ్యాణం కొరకు నారాయణుడు శ్రీరామావతారం ధరించబోగ, రామకార్య సహాయం కోసం హనుమంతుడు జన్మించాడు. ఏకాదశ రుద్రులలో పదకొండవ వాడు నందీశ్వరుడు. ఆ నంది రావణున్ని కోతి రూపములో వచ్చి లంకను, నిన్ను నాశనం చేస్తామని శపిస్తాడు. మహా దేవుని అష్టమూర్తి అంటారు అట్టి ఎనిమిదవ వాయు రూపంలో నందీశ్వ రుని అంశ కేసరి అనే వానర వీరుడి యొక్క భార్యయైన అంజనయందు ప్రవేశించింది. ఆ స్వరూపమే ఆంజనే యుడుగా అవతరించింది. అంజన గర్భాన జన్మించుట వలన ‘ఆంజనేయుడు’ అయినాడు. ఇంద్రుడు కోపించినవాడై తన వజ్రాయుధంతో హనుమంతుని కొట్టగా, ఆ దెబ్బతో హనుమంతుని దవడ దెబ్బతిన్నది. దవడను ‘హనువు’ అంటారు. హనువు సొట్టబడినవాడు కాబట్టి ‘హనుమంతుడు’ అనే పేరు వచ్చిందట. హనుమంతుడు దీనులను కాపాడటానికి ఎనిమిదవ వాయు రూపంలో నందీశ్వ రుని అంశ కేసరి అనే వానర వీరుడి యొక్క భార్యయైన అంజనయందు ప్రవేశించింది. ఆ స్వరూపమే ఆంజనే యుడుగా అవతరించింది. అంజన గర్భాన జన్మించుట వలన ‘ఆంజనేయుడు’ అయినాడు. ఇంద్రుడు కోపించినవాడై తన వజ్రాయుధంతో హనుమంతుని కొట్టగా, ఆ దెబ్బతో హనుమంతుని దవడ దెబ్బతిన్నది. దవడను ‘హనువు’ అంటారు. హనువు సొట్టబడినవాడు కాబట్టి ‘హనుమంతుడు’ అనే పేరు వచ్చిందట. హనుమంతుడు దీనులను కాపాడటానికి నిరంతరం సంసిద్ధుడై వుంటాడు. ఎటువంటి బాధలైనా, కష్టాలైనా, పీడలై నా ఆంజనేయుని కొలుస్తే చాలు తొలగి పోతాయి. హనుమంతుని శక్తి ముందు ఎంతటి పిశాచాలైనా నీరసపడి పోతాయి. భయాన్ని, గ్రహ పీడలను, భూతప్రేత పిశాచాది భయాలను పోగొట్టు కొనేందుకు శ్రీ ఆంజనేయస్వామిని పూజించుట అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. స్వామిని కొలచినవారికి మానసిక దౌర్భల్యం నశించి, మనోబలం సిద్ధించి, గర్వం, అహంకారం నశిస్తుందని, బుద్ధిబలం శక్తి ప్రాప్తిస్తుందని, పల్నాటి శని దోషం ఉన్నవారు స్వామి ఆరాధన వల్ల శని దేవుడు జాతకులను మనిస్తాడని, అవివాహితులకు వివాహం జరుగుతుందని, వ్యాధుల నుండి విముక్తి కలిగి పారలౌకిక అనుభవాలు లభిస్తాయని, విపరీత గ్రహాలు. శాంతిస్తాయని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది.

శ్రీరాముని సర్వాత్తమ దాసభక్తుడైన హనుమంతుడు మహాదీశాలి. సర్వ సమర్ధుడు, నిరంతరం శ్రీరామ పాదారవిందములు కొలుస్తూ, శ్రీరామనామ జప మాధుర్యాన్ని గ్రోలుతూ, స్వామి భక్తి పారాయణుడై, నీతి శాస్త్రం, తత్త్వ, వాస్తు శాస్త్ర కోవిదుడిగా, శ్రీరామ పాదసేవతో మనకు దర్శనమిస్తాడు. భగవంతుని కంటే భక్తుడు గొప్ప వాడన్న విషయం ఆంజనేయుడు నిరూపిం చాడు. మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. రామాలయం లేని గ్రామముండదు. అందు కే శ్రీరామ చంద్రుణ్ణి, భక్తులు ఎంతటి భక్తి భావనలతో కొలుస్తారో హనుమంతుని
అంతే భక్తి భావనతో స్మరిస్తారు. ఆంజనేయుడికి సింధూరం లంకా విజయం తర్వాత శ్రీరాముడు సుగ్రీవాదులకు అనేక బహుమానాల
నిచ్చాడట. అయితే సీతాదేవి హనుమం తునికి మణిహారాన్ని ఇవ్వడం అందులో రామనామం లేదని స్వామి భక్తుడు నిరాశ చెందగా సీతాదేవి తన పాపిటలోని సింధూరం ఇచ్చి “ఇది నా ముఖ్య సౌభాగ్య చిహ్నం నీకు ప్రసాదిస్తున్నాను” అనగా ఆంజనేయుడు ఆనందభరితుడై స్వీకరించాడట. అందుకే ఆంజనేయుడికి సింధూరానికి అంతటి ప్రాముఖ్య త ఏర్పడింది. ఆంజనేయుడికి సింధూరం సమర్పించి ప్ర సన్నం చేసుకోవడంలో అంతరార్థం ఇదేమరి.

హనుమజ్జయంతినాడు ఆంజనేయ పూజ వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఎక్కడెక్కడ శ్రీరామనామ కీర్తనం జరుగుతుందో, రామాయణ సంకీర్తనం జరిగే చోట్ల ఆనంద బాష్పముతో నిండిన నేత్రములతో ఆంజనేయుడు తప్పక వచ్చి తీరుతాడని ప్రమాణం. ఎవ్వరు భక్తితో హనుమాన్ చాలీసా గానం చేస్తారో వారికి అనుగ్రహం

ఇవ్వగలనని వరం ఇచ్చాడు. హనుమజ్జయంతినాడు. హనుమాన్ చాలీసా పఠించి, హనుమచ్చరిత్ర, తమలపాకు పూజలు నిర్వహించి, సింధూరం సమర్పించి ఆంజనేయుని కృపకు పాత్రులవుదాం

శయనాంజనేయుడు

ఆంజనేయుడు అనగానే అభయమూర్తిగానో, భక్తపరమాళువుగానో, వీరాంజనేయుడిగానో, సంజీవనీ పర్వతధారిగానో కనబడతాడు. ఈ మూర్తులు కూడా విగ్రహాల రూపంలోనో, రాతిరూపంలోనో ఉండి సింధురం నింపుకుని ఉంటాయి. ఆకాశాన్ని తాకేంతగా ఉండే ఆంజనేయులు మనకు కనబడుతుంటారు. కానీ ఎంత వెతికినా శయనమూర్తిగా పడుకుని ఉన్న ఆంజనేయుడు మనకు కనబడదు. అలాంటి మూర్తిని చూడాలంటే అటు ఔరంగాబాద్, ఇటు అర్హనాద్క వెళ్ళాలి. మహారాష్ట్రలో చారిత్రక స్థలమైన ఔరంగాబాద్ చూడడానికి వెళ్ళే వారికి తప్పకుండా కనిపించే వాడు భద్రమారుతి ఆలయం. 1967లో ఆలయం కుదురుకున్న ఈ మారుతి మూర్తికి అంతకు ముందు ఒక షెడ్ మాత్రమే ఉండేది. ఔరంగజేబు దాడుల నుంచి స్వామివారిని కాపాడుకోడానికి ఈ స్వామికి ఆలయం నిర్మించలేదు. ఈ కుల్జాబాద్ పట్టణంలో ఉంది. ఈ ఊరిని గతంలో భద్రావతినగర్ అని పిలిచేవారు. ఈ పురాన్ని భద్రసేన మహారాజు పరిపాలించేవాడు. అపారమైన అంజనేయ భక్తితో పులకించిపోయేవాడు. ఆ పట్టణంలో భద్రకుంద్ చెరువు ఉంది. ఆ చెరువు గట్టున కూచుని భక్తిగీతాలు ఆలపించే వాడు. ఆయన మధురగీతాలను అలకించడానికి ఆంజనేయుడు స్వయంగా విచ్చేసేవారు. ఆ గాన మాధుర్యానికి మైమరచిపోయిన అంజనేయుడు కటిక నేలపై అలానే పడి నిద్రపోయాడట. భద్రసేన మహారాజు పాట పూర్తయ్యాక లేచిన ఆంజనేయుడు అలా పడుకుంటే ఎంతో బాగుందని ఇక్కడ ఇలాగే పడుకుంటానని రాజుగారితో అంటారు. ఇక్కడ శయనరూపుడిగా ఉన్నా భక్తుల కోరికలు మన్నించి కటాక్షించాలని రాజుగారు ఆంజనేయుడిని కోరుకుంటాడు. అందుకు ఆయన సమ్మతిస్తాడు. ఈ భద్రపురమే తరువాతి కాలంలో రాంపూర్ మారింది. ఔరంగజేబు పాలనలో ఇది కుర్దాబాద్ గా మారింది.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అస్తమించిన అగ్రశ్రేణి పండితులు

by Acharya Phanindra May 11, 2023
written by Acharya Phanindra

ఆచార్య రవ్వా శ్రీహరి గారిని నేను తొలుత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వారు తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నప్పుడు, కలుసుకొని నా తొలి గ్రంథం “ముకుంద శతకం” ప్రతిని అందజేసాను. రవ్వా శ్రీహరి గారు, మా మాతామహులు శ్రీమాన్ ఆచి వేంకట నృసింహాచార్యులు గారు దాదాపు 90 ఏళ్ళ క్రితం చదువుకొన్న సీతారాంబాగ్ సంస్కృత కళాశాలలోనే – 60 ఏళ్ళ క్రితం చదువుకొన్నారు. ఆ తరువాత పూర్వ విద్యార్థులైన ఈ ఇరువురే సీతారాంబాగ్ స్వామి వారైన శఠకోప రామానుజాచార్యులు గారి షష్టిపూర్తి మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఇది శ్రీహరి గారు నాకు స్వయంగా చెప్పిన విషయం.

రవ్వా శ్రీహరి గారు 1943 సెప్టెంబరు 12 వ తేదీ నాడు ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా (ఇప్పటి
యాదాద్రి భువనగిరి జిల్లా) లోని వలిగొండ మండలం, వెల్వర్తి గ్రామంలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో జన్మించారు. చిన్న నాడే తల్లి మరణించడంతో, ఆ వయసులోనే ఆయన కుటుంబ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. వారు తొలుత 1967 లో
ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా  పనిచేసారు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగు రెండూ బోధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 1973 లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించారు.
సంస్కృతాంధ్ర భాషలలో అగ్రశ్రేణి పండితులైన శ్రీహరి గారితో తరువాతి కాలంలో .. చాల సభలలో కలిసిన సౌభాగ్యం నాది. మా యువభారతి సభలలో కూడ వారు చాల ప్రసంగాలు చేసారు.
అసమగ్రంగా మిగిలిన మన తెలుగు నిఘంటువులను సమగ్రం చేసే ప్రయత్నంగా నిర్మించిన “శ్రీహరి నిఘంటువు” వారు తెలుగు భాషకు చేసిన ఉత్కృష్టమైన సేవ.
ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కూడ బాధ్యతలను నిర్వహించిన శ్రీహరి గారు ఆచార్య సి. నారాయణరెడ్డి గారి “ప్రపంచ పదులు” కృతిని సంస్కృతంలోకి అనువదించి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. గుర్రం జాషువా గారి “గబ్బిలం”, “ఫిరదౌసి” కావ్యాలను కూడ సంస్కృతంలోకి అనువదించారు. వారు ఎంతటి సంస్కృత పండితులో, అంతగా .. అనేక తెలుగు మాండలికాలలో విశిష్టమైన కృషి చేసిన మహా భాషా శాస్త్రవేత్త. ఐదారేళ్ళ క్రితం తెలుగు అకాడమీలో నేను తెలంగాణ భాషా సాహిత్యాలపై చేసిన ప్రసంగాన్ని వారు ప్రశంసించడం నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలుగజేచేసింది.
ఆచార్య శ్రీహరి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి “మహామహోపాధ్యాయ” బిరుదాన్ని స్వీకరించిన ఘనులు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశారు.
ఉభయ భారతి, అన్నమయ్య సూక్తి వైభవం, అన్నమయ్య భాషా వైభవం, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, సాహితీ నీరాజనం, తెలుగు కవుల సంస్కృతానుకరణలు, వాడుకలో తెలుగులో అప్రయోగాలు, తెలంగాణ మాండలికాలు – కావ్యప్రయోగాలు,
నల్లగొండ జిల్లా ప్రజలభాష వంటి విమర్శ గ్రంథాలు మరియు సిద్ధాన్త కౌముది, అష్టాధ్యాయీ వ్యాఖ్యానం వంటి వ్యాకరణ గ్రంథాలు వీరి ఇతర ప్రధాన రచనలు.
ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఎంతటి పండితులో, అంతకు మించిన సహృదయులు. నన్ను పుత్ర సమానునిగా ఆదరించేవారు.
79 ఏళ్ల వయస్సులో రవ్వా శ్రీహరి గారు గుండెపోటుతో హైదరాబాదులో 2023, ఏప్రిల్ 21నాడు పరమపదించారు.
ఆ మహనీయుని మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తొడిమ వేదన

by chittiprolu Subbarao May 11, 2023
written by chittiprolu Subbarao

పూశిశువుకు పాలపీకనై 

జీవరసాలను కుడిపికుడిపి
తల్లి కాని తల్లినవుతాను

కష్టసుఖాల సంవేదనలను
అటుయిటు మోసుకుపోతూ
చెట్టుకూ పూవుకూ నడుమ
పచ్చటి చిరువంతెననవుతాను

పూవును చెట్టునుండి విడదీసే
కఠినమైన బాధ్యతను నాపై పెట్టింది ప్రకృతి

ప్రేగుతో బిడ్డ తల్లిని వీడినట్లు
ఒకనాటికి నాతోపాటు పూవూ 
చెట్టును వీడి నేలరాలుతుంది

నన్నే తల్లిగా తలపోస్తూ
గట్టిగా హత్తుకునుండే పూవు
గాలికీ ఎండకూ కమలిపోయి
మట్టిలో కలిసిపోతూ కంటతడిపెట్టుకుంటూ
చివరివరకూ కనిపెట్టుకునున్న నన్ను
ఓరిమికవచంగా కొనియాడుతుంది

జీవితాంతం నన్నంటిపెట్టుకున్న పూవు

తుదిశ్వాస విడిచాక
నా బాధ్యత తీరిపోయినట్లే
ఇక నా పాత్రా చివరి అంకానికి చేరినట్లే

రంగూ రూపం తేనే తావీ

కలగలిసిన భువనైకసౌందర్యం పువ్వు

విత్తుకూ వేరుకూ ఆకుకూ రెమ్మకూ

కొమ్మకూ మానుకూ లేని విలువ

నేను సాకిన పువ్వుకే

చెట్టుకిరీటంలో

మెరిసే అనర్ఘరత్నం పువ్వే


ఆ పూవుకు జీవితాంతం సేవలు చేసిన నన్ను 
కనీసం ఆయాగా గుర్తిస్తారా ఎవరైనా
మనసారా ఒక పద్యం రాస్తారా ఎపుడైనా

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

యువ తరంగాలు

by Kondapally Neeharini May 11, 2023
written by Kondapally Neeharini

(మే నెల 2023 మయూఖ సంపాదకీయం)

సామాజిక వ్యవస్థ కొత్త పోకడలతో రూపుదిద్దుకుంటున్న కాలంలో వర్తమానానికే అధిక ప్రాధాన్యత ఉంటున్నది. ఈరోజు ఈ క్షణం ఇదే ప్రాథమిక అవసరమైంది. వెనుకబడిన దేశాలను జయించి తమ సామ్రాజ్యాలను స్థాపించుకోవాలనుకున్న ఒకప్పటి చరిత్ర మరపు పొరలలో పడిపోయింది. ఇది మరచిపోకుండా ఉంటేనే ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలిసేది.
ఆర్థిక సమస్యలు,రాజకీయ చాతుర్యాలు మనిషిని అతలాకుతలం చేసిన పరిస్థితులు అన్నీ బోధించని పాఠాలు అయ్యాయి.

మూఢనమ్మకాలు పూర్తిగా తొలిగిపోలేదు సంపూర్ణ అక్షరాస్యత సాధించలేదు. శాస్త్ర పరిజ్ఞానంలో ముందంజ వేస్తున్నాం అనుకునే వరకే కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి.
సామాజిక నైతిక తాత్విక సత్యాలను గుర్తించకుండానే యువత పరుగులు తీస్తున్నది.ఏ గమ్యం లేకుండా ,ఏ ఆశయాలు లేకుండా.

అయితే సోషల్ మీడియా అనే ఒక మాట ప్రస్తుతం ప్రతి నోట వినిపిస్తున్నది. ఇది ఎంతలా ప్రభావితం చేస్తున్నదంటే మనుషుల మధ్య మకారాలు అనురాగాలు ఆత్మీయతలు వంటి మంచి పదాలు పూర్తిగా కనుమరుగైపోయినాయి.

భారతదేశంలో 22 షెడ్యూల్ భాషలు, హిందీ, ప్రపంచాన్ని ఏలుతున్న భాష ఇంగ్లీష్ లతో కలిపి ఇరువై నాలుగు అధికార హోదా ఉన్నవి. దాదాపు 19 వేల పైచిలుకు భాషలు మన దేశంలో ప్రజలు మాట్లాడే భాషలున్నవి. ఈ అన్ని భాషలు ఉనికిని కోల్పోతూ ఇంగ్లీష్ భాష కే మొగ్గు చూపుతున్నారు.
ఇదే పరిస్థితి దాదాపు ప్రపంచం మొత్తంలోనే ఉంది. వాళ్ల వాళ్ల మాతృభాషను మర్చిపోతున్న వాళ్ళు వాళ్ళ భాషలో వచ్చిన సాహిత్యాన్ని ఏం చదవగలుగుతారు? దినపత్రికలు కూడా చదవడానికి కష్టపడుతున్న దీ యువత.ఎన్నో ఆధునిక సౌకర్యాలతో వచ్చిన యంత్రాల ముందు కూర్చుని సమయాన్ని ఆలోచనలని తెలివిని నిర్వీర్యం చేసుకుంటున్న యువతరమే ఎక్కువ కనిపిస్తున్నది. అలా అని అందరూ అదే దారిలో లేరు. ఇదే సాంకేతిక పరిజ్ఞానం తో యంత్రాల ముందు కూర్చుని వాటిలో నిక్షిప్తమై ఉన్న అద్భుతమైన విజ్ఞాన శాస్త్రాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానంలోకి పయనిస్తున్న వారు ఉన్నారు.

” జర్నలిజం సాహిత్యం కాదు, సాహిత్యం అన్నదానిని ఎవరూ చదవరు” అని ఆస్కార్ వైల్డ్ అన్నాడు. ఇదేనాటి మాట! ఇక ఇప్పుడు పోల్చుకోగలమా అసలు?

కవులు రచయితలు అద్భుతమైన సాహిత్యాన్ని పండిస్తున్నారు. ఈ ఫలితాలు యువతకు చేరుతున్నవా లేదా అనే ప్రశ్నలు ఉదయించి తీరుతాయి!
ప్రకృతి ప్రేమ మనుషుల మీద గౌరవం తగ్గిపోయి విపరీతమైన హింస ను ప్రేరేపించే తీరులో తీస్తున్న ప్రపంచ చలనచిత్రాలు చెడు ప్రభావాలు చూపిస్తున్న వి. ఇటు పత్రికలు అటు సోషల్ మీడియా రెండు ఈ సినిమా ల ప్రస్తావనతోనే రేటింగులు తెచ్చుకుంటున్నవి. అసలు జీవితంలోని సారాన్ని మాత్రం కోల్పోవడానికి ఇవే పెద్ద ప్రతిబంధకాలు అవుతున్నాయి. జీవితంలో ఏం కోల్పోతున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో నేటి యువతరం కొట్టుమిట్టాడుతున్నది. మానవ స్వభావాలను ఆవిష్కరిస్తూ జీవితాలకు అన్వయించుకునే శక్తి సామర్థ్యాలు కోల్పోతున్నది. ప్రకృతితో పర్యావరణంతో కాకుండా ఆయా విష సంస్కృతిని వదిలి ఇటువంటి సహజీవనాన్ని కలిగి ఉంటున్నారు . యువత ఇవ్వేవీ పరిశీలించడం లేదు. ఒక భావి ప్రణాళిక లేదు, ఓ చిత్త శాంతి లేదు. విరుద్ధంశాలతోటి వేరువేరు గొంతులతోటి అనుభూతి రహిత జీవితాలను వెళ్లిదీస్తన్నది యువత!

అందుకే రాజకీయాలు ప్రామాణికత లేకుండా అయిపోయాయి, కుటుంబాలు విలువలు తగ్గిపోయి వెలవెలబోతున్నాయి. ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా నిలిచి పోరాడే చిత్తస్థైర్యాన్ని పొందగలిగే భూమికను ఏర్పరుచుకోవాలి. ఇవి విద్యార్థి దశ నుండే నేర్పించగలిగే విద్యా బోధన వ్యవస్థ ఉండి ఉంటే బాగుండేది.కళాసాహిత్యం రెండు కళ్ళుగా ఉండవలసిన స్థితి నుండి చాలా దూరం తొలగిపోయింది హింసాత్మక ప్రవృత్తి పెట్రేగిపోయి సహజతను కోల్పోతున్న యువత రాజకీయాల్లోకి రావాలి అంటే , చదువు మీద శ్రద్ధ పెట్టాలి, మాతృభాష ను పొదవుకోని, ముందడుగు వేయాలి.

అప్పుడే స్వయం ప్రకాశ వంతంగా వెలుగుతారు

_ డాక్టర్ కొండపల్లి నీహారిణి
మయూఖ సంపాదకులు

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఇది మన మంత్రం

by SriRekha Bakaraju May 11, 2023
written by SriRekha Bakaraju

సర్వే  భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయా
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఇది ప్రముఖమైన శాంతి మంత్రము. వేదాలలో ఉపనిషత్తులలో చెప్పబడినది.  అందరికీ శాంతి సౌభ్రాతృత్వాలుండాలనే ఆశయంతో ఈ మంత్రము చదువబడుతుంది.  భారతదేశ సంస్కృతిలో ఇది ఒక భాగం. ఈ మతం ఆ మతమని లేకుండా విశ్వ జనులందరికీ శాంతి  చేకూరాలని  ఆకాంక్ష  గలిగిన గొప్ప సంస్కృతీ భారతదేశానిది. మునులు ఋషులచే విరచితమై శాంతి మంత్రాలు గొప్ప ఆదరణ పొందినవి. యజ్ఞ యాగాదులలో పూజలలో ఈ మంత్రాలను చదువుతారు.
 
పై మంత్రం భావార్ధం ‘సర్వే ‘అంటే అందరికీ, ‘భవంతు సుఖినః ‘సుఖంగా ఉండాలని కోరుతున్నాము. ‘సర్వే సంతు నిరామయా ‘అంటే అందరూ నిరోగులవ్వాలని,  సర్వే భద్రాణి పశ్యన్తు‘అంటే అందరూ మంచి చూడవలెనని, మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్ ‘అంటే ఎవరికీ ఏ విధమైన బాధలు కష్టాలు ఉండకూడదని ఆశయం. ఇది ఏ ఒక్క సమూహానికి సంబంధించినది కాదు. ఇది అందరి గురించి ఆశించినది. పై మంత్రం శాంతి మంత్రాలలో ఒకటి. అందరికీ శాంతి చేకూరాలని ముమ్మారులు జపించబడినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః అంటే అన్ని  లోకాలలోను శాంతి కలగాలని కోరుతున్నారు.
మనుష్యులకు కాకుండా జంతువులకు పశు పక్ష్యాదులు కూడా ఇది వర్తిస్తుంది. సర్వత్రా అందరికీ మంచి జరగాలనే భావన ఈ మంత్రం వలన తెలుస్తున్నది.
 
ప్రాచీన కాలంలో సంస్కృతం వాడుకలో ఉండేది. కాబట్టి చాలా వేద మంత్రాలు సంస్కృతంలో రచింపబడినవి. ఈనాటి కాలంలో సంస్కృత భాష వాడుకలో లేదు కాబట్టి చాలా మందికి మంత్రాల అర్థ తాత్పర్యాలు తెలియకపోవడంతో వాటి ప్రభావం కానీ, విలువ కానీ తెలుసుకోలేకపోతున్నారు. మంత్రాల భావార్థాలు తెలుస్తే వాటిని తప్పక ఆచరిస్తారు. వాటిని పూజలలో హృదయపూర్వకంగా చదువుతారు. మంత్రం అంటే మననాటి  త్రాయతే ఇతి మంతః అంటే  మంత్రాలను మననము చేస్తూ చదివితే జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది. మంత్రం అంటే మరొక అర్థం మనసునకు లభించే ఒక గొప్ప శక్తి. మంత్రాలను ఉచ్చ్చరించడం  వలన జీవితానికి గొప్ప పరమార్థముూ సత్యమైన మహత్తు లభిస్తుంది. అన్ని మంత్రాలలో  శాంతి మంత్రం ఇంకా గొప్పది. ఎందుకంటే శాంతి మంత్రాలు విశ్వ శాంతిని కోరతాయి. ఈ మంత్రాన్ని ఎప్పుడైనా  ఎక్కడైనా చదువవచ్చు,. ధ్యానం  లో కూడా. మంత్రాలు సాధారణంగా గురువుల నుండి నేర్పబడతాయి. ఉచ్చ్చారణ దోషాలు లేకుండా చదవడం చాలా ముఖ్యం.  అర్థాలను తెలుసుకొని మంత్రాలను మననం చేస్తే వాటి ప్రభావం, లాభం మనసుపై సరియైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ మంత్రం భావార్థాన్ని ఆశయాన్ని తెలుసుకొని దీనిని జపించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారని ఆశిద్దాం.

అయితే ఈ మంత్రం పూర్వకాలంలో యజ్ఞ యాగాలలో నే కాదు ఈ ఆధునిక కాలంలో నూ చాలా మంది చాలా చోట్ల చదువుతున్నారు. దీనికి ప్రధాన కారణం సామాజికం గా ఆలోచించి అందరూ బాగుండాలి అనేదే ఈనాటి యజ్ఞం. కాబట్టి మనమూ ప్రతి రోజూ చదువుకుందాం!

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తీర్చుకోలేని రుణం

by V. Kameshwari May 11, 2023
written by V. Kameshwari

ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను తల్లి

నేనే ప్రపంచమై బ్రతికిన ఓ అనురాగమయీ
ఇది
నవమాసాలు మోసి.
పుట్టు నొప్పులు భరించి
నాకు జన్మనిచ్చిన మాతృ మూ ర్తీ…
లాలీ లాలీ అనే జోల పాటలు పాడి
చందమామను చూపి గోరుముద్దలు పెట్టి
ఒకటి రెండు అంటూ….అంకెలు నేర్పి

చిట్టి పద్యాలు పలికించి

తొలి అడుగులలో తడబాట్లనూ
బతుకు బాటలో పొరపాట్లను
సరిదిద్ది
మమ్ము పరిపూర్ణులుగ చేసే
ఆది గురువయ్యావు
ఓ అమృత వల్లి
నీ మనసు ఆకాశమంత
ఓర్పు భూదేవిని మించి
త్యాగంలో తరువుకు సరిసాటి

అమ్మ!
నీవు నిత్యం శ్రమించే గుప్త కార్మికురాలివి

నేను నీకు ఇవ్వ గలిగేది మనసారా
“పాదాభివందనం”మాత్రమే.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఎందుకో….

by Rama Devi Nellutla May 11, 2023
written by Rama Devi Nellutla


ఎందుకో ఈరోజు కొత్తగా వుంది
పూల గాలి ఒకింత మత్తుగా ఉంది
పుడమి అంతా బంగారు తాపడం చేసినట్టు
నవ కాంతులతో గమ్మత్తుగా ఉంది

కొమ్మలు వింత రంగుల లతాంతాలను ప్రసవించాయి
సూర్యుని లేత కిరణాలు పూలపై ప్రసరించాయి
జగతిలోని సహజ అందాలు నవ్వుతున్నాయి
ధరణిపై దివ్య దీప్తులు ప్రకాశించాయి

చెట్లు కొత్త చిగుళ్ళకు జన్మనిచ్చాయి
ఆకులకు తీగలు ప్రాణమిచ్చాయి
తోట పరిమళపు విరులకు క్రొంగొత్త ఊపునిచ్చాయి
తేటి పాటలకు ఆతిథ్యం ఇచ్చాయి

అగ్నిపూలు అడవంతా ఎర్రని హంగులనద్దాయి
దిరిసెన పూలు పసుపుపచ్చని వింత శోభలు దిద్దాయి
ముందే వచ్చిన వసంతోత్సవ సంబరాలు
వనాలన్నింటికీ ఆకుపచ్చని రంగులు రుద్దాయి

వేపకొమ్మ తెల్లని పువ్వులను సింగారించింది
మామిడి వృక్షం పిందెల హారాలు సవరించింది
చింత చెట్టు వోనగాయల లోలకులు ధరించింది
పొలం చెరుకుగడల వరుసలను అలంకరించింది

పండి వంగిన వరి చేలు పచ్చని శోభలీనాయి
నింగిలోని నక్షత్రాలు మిల మిలలాడాయి
కొమ్మ కొమ్మన కోయిలమ్మలు
కొత్త రాగాలు ఆలపించాయి
మల్లె పూలు మత్తిల్లే సువాసనలు వెదజల్లాయి

ప్రకృతి కాంత వింత శోభతో ఒప్పింది
మావి చెట్టుపై మాధవీలతను
మంచుతెర కప్పేసింది
ఉగాది వచ్చిందని నా మది
పదేపదే చెప్పింది!!!

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సరిగంచు చీర

by రంగరాజు పద్మజ May 11, 2023
written by రంగరాజు పద్మజ

చీరలూ వాటి ప్రశస్తి ని వివరిస్తూ రంగరాజు పద్మజ గారు రచించిన ‘ సరిగంచు చీర’ కథ ను చదివి ఆనందించండి. కాకతీయుల పరిపాలన కాలం నుండి ఆడవాళ్ళు కట్టుకున్న చీరల విషయాలు కథాత్మకంగా తీసుకొచ్చారు. ఆనాటి కవయిత్రులైన గంగాదేవి, కుప్పాంబ వంటి స్త్రీ మూర్తుల నుండి మన కాలం మహా నటి సావిత్రి గారి వరకు వాళ్ళంతా ముచ్చట్లు పెట్టుకున్నట్టు కథ ని అల్లారు ! చదవండి…
                                                                                                                         – సం. పా.

ఆ ప్రాంగణమంతా చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టినారు. ఆ ముగ్గులలో రంగులు నింపారు. ఆ ముగ్గులు సిరిసంపదకు ఆహ్వానం పలికినట్టు అతిధులను ఆహ్వానిస్తున్నట్టుగా… ముగ్గులలో స్త్రీల అద్భుతకళకు అద్దం పట్టినట్టుగా ఉన్నాయి. దానికి తోడు పచ్చని మామిడాకు తోరణాలు సంప్రదాయ సిద్ధంగా కట్టబడి అక్కడి కార్యక్రమం సంబరంగా జరగబోతున్నట్టుగా అవగతం అవుతున్నది.

ఓరుగల్లు కోటలో ఎప్పుడూ… ఏవేవో.. కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే… ఈ రోజు అన్ని రాష్ట్రాలలో తయారైన వస్త్రాలతో వస్త్ర ప్రదర్శనం ఏర్పాటు చేసి ప్రముఖులను ఆహ్వానించారు.

మధురవిజయ రచయిత్రి గంగాదేవి వివిధ రంగాలలోని ప్రముఖులైన మహిళా మణులను ఆహ్వానించగా… కుప్పాంబిక, కామసాని, మొల్ల, మధురవాణి, మదన మంజరి, మహానటి సావిత్రి , ఒద్దిరాజు కమలాదేవి మొదలైన వారంతా వచ్చారు.
ఆ సభలో రచయిత్రులు, కవయిత్రులు, గాయనీమణులు, చిత్రకారిణిలు, సామాజిక వేత్తలు అందరూ వేదికకు ఎదురుగా కూర్చున్నారు. ఆహ్వానించబడిన వారంతా వచ్చారని నిర్ధారణ చేసుకొని గంగాదేవి ఆసనం నుండి లేచి అందర్నీ ఉద్దేశించి “మాట్లాడుతూ మహిళలమని, అబలలమని మనమేమీ వెనుకకు పోనక్కరలేదు. మనమందరం చక్కని రచనలు చేద్దాం! ” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే… సభలో గుసగుసలు హోరులా వినపడడంతో… తన కంఠాన్ని కాస్త పెద్దదిగా చేసి, “ఏమిటీ? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నేను చెప్పే విషయం వినడమే లేదే?” అనగానే అందరూ ఒక్కసారిగా… మీరు కట్టుకున్న చీర చాలా అందంగా.. అద్భుతంగా ఉంది! మీరు ధరించిన హార భూషణాలు, పద్మరాగాలు గుచ్చిన మొలనూలు, పచ్చల కడియాలు, మొరవంక కడియం, గోమేధికాల అందెలు,బన్నసరాలు , చిరుత చౌకము, పుష్యరాగాల ఉంగరాలు, రవ్వల దుద్దులు, మీ చీరకు ఎంతగానో నప్పి మా కండ్లు మీమీదనుండి మరలడమే లేదు. ఎక్కడ ఈ చీరను తయారు చేయించారు? అని ముసిముసి నవ్వులు నవ్వుతూ… అడగడంతో సరే ముందు నా చీరగురించి మాట్లాడుకున్నాకే మిగతా కార్యక్రమాలు జరపనిచ్చేటట్టున్నారు! ఔనా? అని నవ్వుతూ ఇలా చెప్పడం మొదలు పెట్టింది.
నా భర్త కంపరాయల వారు దండయాత్ర చేసి అందులో విజయం పొందడతో ఆ దండయాత్ర విశేషాలతో మధుర విజయం అనే కావ్యం రాసాను. వారికి ఆ గ్రంథం ఎంతగానో నచ్చి విదేశాల నుండి ఈ పట్టు చీర తెప్పించి బహుమతిగా ఇచ్చారని చెప్పింది.

హాలుడు తన భార్య మలయవతి సంస్కృత పండితురాలు కాబట్టి, ఆమెను సంతోషపెట్టేందుకు ఇటీవల పండిత గోష్టులు జరిపించి, కవయిత్రులను సన్మానించాడు. అక్కడికి వచ్చిన వారంతా గొప్ప గొప్ప చీరలు కట్టుకొని వచ్చారు. వారి అందచందాలు ఆ బట్టలలో చెప్పనలవికానంత అందంగా ఉన్నాయి. అదొక దేవతల యాత్రనా? లేక ఏదైనా పండగనా అన్నట్టున్నది అని గంగాదేవి చెప్పగానే చీర మనదేశ సాంప్రదాయం కదా? విదేశాలలో చీరలు కడతారా? అని సదస్యులెవరో అడిగారు.

మలయవతి సింహళ రాజ కుమార్తె ఐనా అక్కడ కూడా భారతీయుల కట్టూ- బొట్టూ పాటించేవారున్నారు. అక్కడ పేరు పొందిన పట్టువస్త్రాలెన్నో రకాలుగా ఉన్నాయి. మీరనుకుంటున్నట్టు ! మన చీరకట్టులోనే భారతీయ సంప్రదాయం ఉట్టిపడడమే కాకుండా… ఎన్నోరకాల చీరలు అందుబాటులో ఈనాడే కాదు ఆనాడూ ఉన్నట్టు విన్నాము కదా!
రామాయణంలో సీతారాములు వనవాసానికి బయలుదేరమని కైకేయి నార వస్త్రాలు ఇచ్చిందని చదివాంకదా? ఈనాడు ఆ నార చీరలను కాస్త ఆధునీకరించి జూట్ చీరలని తయారు చేస్తున్నారు.
అలానే మరో సన్నివేశంలో సీతమ్మ అరణ్యవాసం బయలుదేరే ముందు అనసూయకు నమస్కరించి ఆశీస్సులందుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఎప్పుడూ మాయని- ముడతలు పడని చీర , వాడని పూలదండ ఇస్తుంది… ఇచ్చి నీకు వన సంచారంలో పనికివస్తుందని అంటుంది… అంటే ఇప్పుడు రింకిల్ ఫ్రీ బట్ట (Rinkel free) (nano ) నానో చీరలు అనుకోవచ్చు ……

అలాగే పురాణాలలో పతీవ్రతామ తల్లులను భగవంతుడు పరీక్ష పెట్టడం మనం చదివే ఉంటాము. అలాంటి ఒక సంఘటన త్రిమూర్తులు అనసూయను పరీక్షించడానికి నగ్నంగా భోజనం వడ్డించమని అడుగుతారనీ ఆమె అలాగేనని, వారిని పసిపాపలను చేసి వడ్డించిందని కథ చదివినప్పుడు … ఆ కథను నాదగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు ఎలా చెప్పాలని మా అక్కయ్య మల్ల్యేల దయామతీ దేవిగారిని అడిగాను. త్రిమూర్తులను పసివారిగా చేసినా కూడా ఆమె వివస్త్రగా ఎలా మారగలిగిందని అడిగాను. మా అక్కయ్య ఏమన్నారంటే
మార్కండేయ మహా ముని సంతతికి చెందిన వారు కమలా పుష్పాల నారతో లేదా దారంతో పట్టు వస్త్రం నేసేవారట. అది వంటి రంగులో కలసిపోయి, చూపరులకు చీర కనిపించకుండా ఉండేదట! అటువంటి చీరనే కట్టి ఉండవచ్చు అన్నది. ఆమె చీరకట్టినా కనపడని చీరలుండేవి ఆనాడని అన్నారు. ఆ మాట మాకోడలు విని సినిమా తారలుకూడా శరీరరంగులో ఉన్న చర్మానికి అతుక్కొని పోయే బట్టలుంటాయని, ఆయా సన్నివేశాలలో కట్టుకుంటారని వివరించింది. అంటే వస్త్రాల పరంగా మన వారు సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందారో కదా ఆనాడే?
అప్పుడు గంగాదేవి ద్రౌపదిని చూసి ఆ మారు పమిట ఎందుకు వేసుకున్నావు అని అడిగితే ద్రౌపది ” నా వస్త్రాలను పుట్టింటివారు ప్రత్యేక లక్షణాలతో నేసేయించేవారు. దాదాపు 10 గజాల చీరైనా తేలికగానూ, పిడికిటిలో అమరేటట్టుగా ఉండేది.

ఇప్పుడు సిరిసిల్ల చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేస్తారు చూడూ అలాగే ఉండేది నా చీర. నా వక్షస్థలం ఘనంగా ఉండడం చేత పమిట జారకుండి పొత్తి చీర నడుముకు కట్టే దాన్ని. దీన్నే మారు పైట అనేవారు. నేను ఎక్కువగా చీనీ చీనాంబరములే ధరించేదానిని. చీరకు తగినట్లుగా సింధూర తిలకం పెట్టుకోని, పాపిటలో సింధూరం ధరించి, బంగారు రవిక తొడిగే దానిని.
నా వలె సత్యభామ కూడ నరకాసురవధ సమయంలో చీరను మగవారి యుద్ధ వస్త్రాలవలె జంగాళం అంటే నిడుపాటి లేదా పొడగాటి చీర కుచ్చెళ్ళుపోసి కట్టుకునేది. ఈమె ఎక్కువ జాళువాలు ధరించేది. కృష్ణుడు తన దగ్గరకు వచ్చేరోజు కుసుమ రవిక అంటే పూలతో అల్లిన రవికను ధరించేది. శకుంతల కూడా ఈ విధంగానే పూల రవికెలు ధరించేది. సత్యభామ జడ చాలా ప్రశస్తమైనది.

అలంకారం చేసేవారు ఎక్కువ శ్రద్ధతో ఆమె జడను అల్లేవారు. వారంలో రోజుకొక్క తీరున మొగిలిరేకుల జడ, మల్లె-మొల్లల జడ, ముత్యాల జడ, జడకు ముత్యాల కుచ్చులు, జడకుప్పెలు, నాగరం, ఇంకా చాలా రకాలుగా సొమ్ములు పెట్టి జడలు వేసేవారు !
ఇంతలో మధురవాణి లేచి ఈ విధంగానే రాణీ రుద్రమ కూడా యాదవరాజు కుట్ర నుండి బయట పడేందుకు తాను కట్టిన చీరనే గుఱ్ఱపు స్వారీకి అనుగుణంగా మార్చింది. ఇలా బహుళార్ధ సాధకంగా చీరలను తయారు చేయడంలో భారతీయ నేత పనివారు దిట్టలు. ఈమె చాలా కాలం మగవేషంలో ఉండడం వల్ల మగవారు ధరించేటటు వంటి సొమ్ములే ధరించేది.
ఉదాహరణకు పులిగోరు గొలుసు, సింహ తలాటాలు, ముత్యాలసరాలు, పగడపు ఉంగరాలు, పెట్టుకుని, ఈమె నుదుట ఆమె గురువు , మంత్రి శివదేవయ్య మంత్రించి ఇచ్చిన పసుపు సున్నంతో నూరిన పోకరంగు బొట్టు అర్ధచంద్రాకారంలో పెట్టుకొంటుంది. మెడ కిందు భాగం విబూది రేకలు తెల్లగా మెరుస్తూ ఉండేవి! రుద్రమదేవికి చీనీ చీనాంబరాలు విదేశాల నుండి వస్తాయి. పట్టు కంచుకాలు తొడుగుతుంది. దర్బారుకు వచ్చినప్పుడు జలతారు మారు పమిట వేసుకుంటుంది, నగర పర్యటన చేసేటప్పుడు తోలుతో తయారు చేసిన ప్రత్యేక దుస్తులు ధరిస్తుంది.
మన భారత దేశంలో ఐదవ శతాబ్దంనుండే నూలును అల్లి దానికి రంగులద్దింది ఎప్పుడో కాదు సింధులోయ నాగరికత నుండే ఉంది. కాకపోతే అప్పుడు బట్ట తయారు చేసే విధానం వేరుగా ఉండేది. అల్లే సూదులు ఎముకలతో తయారు చేసుకునేవారు. నూలు వడికేందుకు చెక్కతో ఒక పరికరం ఉండేది. ఆ కాలంలోనే నూలువస్త్ర తయారి ఎంతో పేరు పొందింది ఇప్పటికీ కొన్ని పద్ధతులు ఆ కాలంలోనివే వాడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ వేడి గల ప్రదేశాలలోని ప్రజలకు వేసవికాలంలో పత్తితో నేసిన బట్టలు సౌకర్యంగా ఉండడమే కారణం. చేనేత కళాకారులు ఎక్కువగా గుహలలోని రాతి శిల్పాలు, చిత్రాలలో దేవతలు, నాట్యకత్తెలు కట్టిన చక్కని చీరలను చూసి, తమదైన శైలి జోడించి బట్ట తయారు చేసేవారు.
పూర్వం రాజుల కాలంలోనూ వస్త్ర భాండారాలు ఉండేవి. నేను ముందే చెప్పిట్టు వారు ఇతర ప్రాంతాల నుండి తయారైన వస్త్రాలను కూడా తెప్పించేవారు. అవి రకరకాల రంగులతో అందంగా ఉండేవి.
త్రిలింగ దేశమనే ఈ ప్రాంతం అటు ఉత్తర భారతదేశం ఇటు దక్షిణ భారతదేశనికి మధ్యలో ఉండడంవల్ల ముఖ్యంగా ఎందరో రాజులు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని, ఏలడం వల్ల వస్త్రధారణలో ఉత్తర దక్షిణ ప్రాంతాల సంప్రదాయ కట్టు బొట్టు ఇక్కడ ఈ రాజధాని నగరంలో ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది… నాగరికతకు చిహ్నంగా వస్త్రధారణ ఎన్నో కొత్త ప్రయోగాలు చేసిందనే చెప్పాలి!
అంతేకాకుండా ఈ ప్రాంతం పత్తి పంటకు అనువుగా ఉండి, అధిక దిగుబడి ఇవ్వడంతో నాణ్యమైన నూలు లభ్యమవ్వడంతో, అందమైన బట్టలు తయారు చేయడానికి ప్రసిద్ధి చెందిందీ ప్రాంతం!
మచిలీ బందర్ లో దొరికే మసూల అనే సన్నటి బట్ట దీన్నే ఇంగ్లీషులో మస్లీన్ అంటారు. ఇలా చెబుతూ ఉండగానే….
ఇంతలో మొల్ల అన్నది కదా! నేను రామాయణం పవిత్రంగా రాయాలని, శుచితో మడితో రాయడానికి వీలుగా యోలగంధపు బొట్టు పెట్టుకొని, పట్టుకంచుకం తొడుగుకొని, ముత్యాల శంఖువులు, గుండ్లపేరులు, హారికంకణాలు వేసుకుని నిద్దెంపు వెలిపట్టు, ఒంటిపొర పట్టు మడుగు కట్టుకుంటాను. ఇవి 6 గజాలు; 9 గజాలలోనూ దొరుకుతాయి. రోజంతా గోచీపోసి, కుచ్చిళ్ళు పోసి కిందకు జారవిడిచి కట్టుకుంటాను. దివ్యాంబరములనే చీరలు ఎక్కువ ఆదరణ పొందే చీరలు. ఇవి అన్ని రంగులలో ఉంటాయి. భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు జరిగే సమయంలో ధరిస్తారని మొల్ల చెప్పడం ముగించగానే…
కుప్పాంబిక అన్నది కదా! మా అంతఃపురానికి సాలెవారు ఎన్నోరకాల చీరలు తెస్తారు. అందులో వెంజావళి పట్టు, భూ తిలకంబు పట్టు, శ్రీవన్నియ పట్టు; మహా చీని పట్టులని రకరకాలుగా ఉండేవి. కొంగు- అంచు బంగారు తీగతో నేసేవారు. మా రాచవారు వారి అభిలాషను తెలిపితే వారికనుగుణంగా నమూనాలు చేసి ఇచ్చేవారు…
మమ్ములను కస్తూరి బొట్టుతో, కాటుక లేదా అంజనంతో చెలికత్తెలు సింగారిస్తారు. మాకు ఈ చీరల మీద తగిన రవికలు కుట్రపు వాడు కుట్టి ఇస్తాడు. కుట్రపువాడు అంటే దర్జీ. చీరకు తగినట్టు బంగారు త్రిసరాలు అంటఘ మూడు అంతస్తులుగా ఉంటుంది, చంద్రహారాలు, నవరత్న మాలలు, మెడకు బిగుతుగా ఉండే పతకాలు, పాపటబొట్టు, సూర్య-చంద్ర బిళ్ళలు, మొరవంక కడియం, విచ్చుటాకుల దుద్దుకమ్మలు, కంకణాలు, కాంచీ నూపుర కంకణాలు, భుజాలకు సందిదండలు ఇలా ఎన్నోరకాల ఆభరణాలను ఆయా పండగలు, పెండ్లిండ్లకు, వేరువేరుగా, రాచరికపు కూటములకు వేరుగా సందర్భాన్ని బట్టి అలంకరించే వాళ్ళు.

మధుర వాణి అన్నది కదా నేను ప్రత్యేకంగా బంగారు నీరు తాపడం చేసిన చీరలు, అంటే చీర నిండా బంగారు జరీ ఉంటుంది. చిత్ర వన్నెల పట్టుచీరలు, కంబళి చీరలు; చెంగావి వన్నె చీరలు; చలువ పావడాలు; దుకూలముల చీరలు కట్టేదాన్ని‌. ఈ చీరలు కొంగుకు నేతపరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నేసేవారు. జిగురు బొమ్మంచు చీరలు.

ఈమధ్య తెలంగాణ గవర్నర్ తమిళ సెల్వి గారికి సిరిసిల్ల చేనేత కార్మికుడు చీరలో వారి చిత్రం నేసిన తెచ్చి బహుకరించాడు అలాగ నేయించుకుని కట్టుకునే దాన్ని. చందన లేపనం చేసి,కస్తూరి తిలకం, బంగారు బొట్టు, పెడుతుంది నా సైరంధ్రి.
నేను జడకుచ్చులు వేసుకుని, జడకు కుప్పెలు, బంగరు మొగ్గలు, చెవులనుండి కొప్పుకు బంగారు పూచేర్లు, నాసాగ్రం, ముక్కరి, ముత్తెపు సత్తు, బులాకీలు, తాటంకాలు, మకరకుండలాలు, కంఠహారాలు, కాలి అందెలు, పట్టాగొలుసులు, మెట్టెలు, పిల్లెండ్లు మొదలైన సొమ్ములు వేసుకుంటాను అని అంటుండగానే …
మహానటి సావిత్రి చెప్పడం మొదలుపెట్టింది. నేను ప్రత్యేక పూజలు; వ్రతాలు చేసుకొనేటప్పుడు తిలకం పెట్టుకుని కింద తిరుమణి రావిరేక పెట్టుకుంటాను. కాటుక , రకరకాల పౌడర్ లు స్నోలు, సెంటు వాడుతాను. తెల్లనిపట్టు చీరలు, పాల నురుగులాంటి పొన్ను పట్టుచీరలు కట్టేదాన్ని. పట్టురవికలు వేసుకుంటాను. వెండి జరీతో నేసిన గళ్ళ చీరలు కుచ్చులు పోసి, పెద్ద కొంగు నడుముకు చుట్టి,
నా మేకప్ మ్యాన్ నాకు కడితే సినిమాలను చూసిన వారు అలాంటి చీరలే కావాలని అడిగి మరీ కొనేవారు… నా సొమ్ములు నాను పట్టెడ, కంఠహారాలు, నెక్లెస్, నల్లపూసలు, అడ్డకిలు, మణులు, కెంపులతో చేసిన మెడకు దగ్గరకుండె గొలుసులు, సంది దండలు వేసుకునేదాన్ని.
ఇంతలో మదన మంజరి అన్నది కదా! మావంటి సామాన్యులు నూలు వస్త్రాలను నూలు రవికెలను కట్టుకుంటాము. వాటిని మడుగులు అంటాము. కొందరు రవిక తొడుగరు.
ముంజేతులకు పలక కంకణాలు, కాళ్లకు దండ గడియాలు, వంకీల గాజులు, రత్నాలతో చేసిన జంట కడియాలు, జంట తాయెత్తులు, నీలాల గాజులు, పచ్చల కంకణాలు, చామలకడియాలు, మురుగులు, గజ వడ్డాణం, గంటల మొలనూలు, మువ్వల అందెలు, కాళ్ల కడియాలు, గజ్జెలు ధరించేవాళ్ళం!

హోంబట్టు సరిగ రవిక రవ్వల ఒడ్డాణము,రవ్వల బేసరి,రవ్వల అడ్డబాస, రవ్వల పతకము,
రత్నాలతో శిరోభూషణాలు, రాగిడి, చంద్రవంక,తమలపాకు,మొగిలిరేకు,బంగర చామంతి పూవు,చెంపసరులు ఇట్లా కలవారి ఆభరణాలు ఎన్నో!

సామాన్యుల సొమ్ములు రాగికుండలాలు, రాగి కుందులు, దొడ్డ రాగి కంటెలు ,రాగి ఉంగరాలు, రాగి దండలు, వలుద కొక్కెరలు, పోలెలు, సరిపెణ, నేకళంబులు, కీలు గొలుసులు, కీర్తిముఖాలు, కాలి అందెలు, రాగి కటక వంకీలు, రాగి పధకంబులు, రాగి వడ్డాణాలు, కటి సూత్రాలు, తగరపు కడియాలు, కంచు మట్టెలు, వల్దయూరాలు, నల్ల గాజులు, పచ్చగాజులు, పూసలు, సంకుపూసలు, నల్లపూసలు వేసుకుంటారు.
కాటుక, అగరు బొట్టు, తిలకాలను వాడుతారు.

నూలులో చందనపురంగు, నీలపురంగు, ఎర్ర రంగువి, కడిమిరంగువి, కరకంచులు , బొమ్మంచులు, ముడుగు బొమ్మంచులు, ముయ్యంచులు ,చిలుక చాళ్ళు, పేటచాళ్ళు, ముదురు రంగు నిండు వన్నెలు, ఉఱుత చారలు ,గంటకి వన్నెలు, పుప్పొడి వన్నెలు, రుద్రాక్ష వన్నెలు, నాగ బంధాలు, పూజా బంధాలు, జలపంజరాలు ఇలా 45 రకాల నూలు చీరలు నేస్తారు… కానీ చీరకు కొంగు- అంచు లేకుండా కట్టేవారు కాదు…

ఒద్దిరాజు కమలమ్మ అన్నది కదా!, సాదా చీరలు, సన్నని బట్టతో 120 నెంబరు కలనేత చీరలు నేయించుకొని రోజూవారీ కట్టుకుంటాను.

బతుకమ్మపండగ రోజు తలంటు స్నానం చేసి, నాగరం , కొప్పుబిళ్ళ, కొప్పుమొగ్గలు బంగారు రాళ్ళ పిన్నులు, చంద్రహారం, కంటె, కాసులపేరు, రవ్వల దిద్దులు, రవ్వల కంఠహారం, సూర్య హారం, చేతులకు గాజులు, పులిసేరు కడియాలు, సింహంమూతి కడియాలు,
కాళ్ళకు పట్టా గొలుసులు, పాంజేబులు, తోడాలు , కడియాలు, మట్టెలు , వేళ్ళకు వంకీ ఉంగరం , గోమేధికం తో చేసిన ఉంగరం ,రూబీ ఉంగరాలు, బొడ్లో వెండి తాళంచెవుల గుత్తితో బతుకమ్మ ఆటకు చెరువుకట్ట కిందకు వెళ్ళి ఆడుకొని వస్తాము. కంచిపట్టు, ఆరణి, ధర్మవరం, బనారసు మొదలైన పట్టుచీరలు వాటికి తగిన రవికలు ఎన్నోతీర్ల కుట్లు, అల్లికలతో మేర వాడు కుట్టేవాడు. దేశ ముఖ్ ,దేశపాండ్యాలైన ఒద్దిరాజు వారింటి కోడలుకదా! ఆ మాత్రం బాబు దర్పం ఉండదా?
మడికి దిండిగల్ పట్టు , నారపట్టు చీరలు మడిచారు పోసి కట్టుకుంటాను. గద్వాల, కోట, వెంకటగిరి, ఉప్పాడ, దారుకోసు, నారాయణ పేట చీరలు, మధుర , మిరియాల చీరలు హుందాగా ఉంటాయి.
రోజవారీ కట్టుకోవడానికి మా ఊరు చీరలకు ప్రసిద్ధి! 9 గజాల చీర మూడు మూరల ఎత్తుతో పిండినాకొద్దీ మెరుస్తూ మెత్తగా కడితే ఒంటికి హాయిగా ఉండేవి. మా చాకలి తమాషాగా ఓ మాటనేది .. ఉతికేటప్పుడు గుండి చెరువులో చీర పరిస్తే చెరువు నిండా నీ చీరనే నిండుతుంది.. “అమ్మా మడతబెట్టి తెస్తే పుస్తకమంత అవుతుంది చీర దొరసానీ! మేం సదువుకోనోళ్ళం! జర గొప్పగా సెప్ప రాదు కానీ ఈ చీరకడితే నువ్వు అందంగా కనిపిస్తావు? అనుకొన్న కానీ చీర చెరువులో వేసి ఉతికినప్పుడనిపించింది…
నువ్వు కట్టుకుంటేనే ఈ చీరకు అందమని… “అనిపించిందమ్మా! అని చాకలి బుంగి అనగానే చాలు! సంబడం! నీకేమో కవిత్వం వస్తున్నది ఇవాళ అని రుసరుసలాడి అప్పాలు ఆమె ఒడి నింపి! పిల్లలకు తీసుకుపో అన్నది.
రంగు రంగుల చీరలు ముతక చీరలు సామాన్యులు ధరించేవారు. వారి వారి స్తోమతను బట్టి లేత రంగుల చీరలకు ముదురు రంగులు పూల డిజైన్ అద్దేవారు. కొంగులకు లేత బొమ్మంచు చీరలు కూడా ఉన్నాయి…

వీరి సొమ్ములు ఇలా ఉండేవి. రాగిడి తిరుగుడు పువ్వు, చంద్రవంక, పాపిట బొట్టు, పసిడిపోక, సూసకంకి ,పల్లేరు పువ్వు, నెరతమ్మి రేకు ,అపరంజి కమ్మలు, బనిరెలు, కుప్పె, కుతికంఠ మెడసూలు, గుండ్లపేరు, నాను పట్టెడ, దండ పలుక కడియాలు, పరిగెలు, కడియాలు, గంటల మొలనూలు, గజ్జలు అందెలు (కంచువి) గిల్కుసిరి ( గోల్డ్ ప్లేటెడ్) మట్టెలు, ముక్కుకు ముక్కెర, ముత్తెపు పూస, ముత్తెపు నత్తు, ఈ సొమ్ములు పెట్టుకొని తలలో తంగేడు పూలు, రవికెలేని నునుపైన భుజాలతో అందమంతా తమదే అని ఒకరి భుజాల మిద మరొకరు చెయ్యేసి నాట్యం చేస్తుంటే రెండు కళ్ళూచాలవు!
ఆకాశం ఆ కొసన వాలిన సూర్యుడిని చూసి,చంద్రుడు సన్నని రేక వలె సాగి, మెల్లిగా ఆకాశాన్ని ఆక్రమించుకుంటున్నాడు. మల్లెపూల గుబాళింపులు చల్లగాలితో కలసి గుప్పుమంటూ .. ఉదయం నుండి పనిచేసిన వారికి హాయికలిగిస్తున్నవి. అడవికి పోయిన పశువుల మందలు ఇళ్ళకు చేరుకుంటున్నాయి. ఆ దుమ్ములో క్రమంగా చిరు చీకటి అలముకుంటున్నది. మన కోసం మన వారంతా ఎదురుచూస్తుంటారు. ఈ నాటికి మనం ఇంతటితో చాలించి మరొక రోజు మరిన్ని విషయాలు ముచ్చటించుకుందాం!
ఓ కవితామాలికతో ఈ సభను ముగించుకుందాం..

నేతన్నలకు జోతలు
“నూలు పోగుతో నాగరికతకు
నాందిపలికినారు నవనవోన్మేషంగా!

మేలైన నూలు వడికి నేత నేసిన నేతన్న !
అతడు నేత విరించి!

నేతలందు కొత్త కొత్త రీతులు చిత్రముగ అల్లినారీ విరించులు

నేతలందు ఏర్చి కూర్చి పొందుపరిచి,
పోగు పోగులందు పొసగినారు

విలువలనెల్ల వలువలందు తీర్చి,
మగ్గములపై పరిమళించినట్టి
పనితనముతో పట్టు చీరలందు
చేర్చినారు.

చేడియల మానరక్షణే చేసి,
నలు మూలల ఖ్యాతి చెంది
జగము నిండా- జోతలందుకున్నారు!

నిపుణులైన వారి సాటిలేని కళకు
పొగడగ మాటలేదు! చేతులెత్తి మొక్కేము!!

తరతరాల నేతన్నల స్వేదము
జాతిపేరు నిలుపు నేతన్న హస్తము

సుగుణమణులకు సుందరముగ
వస్త్ర దానమేచేసి,డాసిన చుట్టమాయె!!
—-
—-
కరతాళ ధ్వనులు మ్రోగినాయి!!

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

వివేక వాసంతం **

by V. Kameshwari May 10, 2023
written by V. Kameshwari

ఆరోజు ఉదయం ఐదు గంటల సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే నిద్ర లేచిన వాసంతి అరచేతులు చూసుకొని మంగళ సూత్రాలు కళ్ళకు అద్దుకొని హాలు లోకి రాబోయింది. అప్పుడే తన గదిలోంచి రాబోయిన అత్తగారు కనిపించింది . వాసంతి కి ఎక్కడ లేని కోపం వచ్చి ” ఏమిటి అత్తయ్య గారు… ప్రొద్దుటే ఎవరికీ ఎదురుపడకూడదని తెలియదా.ఈరోజు ఏమి దాపరించబోతుందో ఏమో ” అని అనుకుంటూ వంటింట్లోకి దారితీసింది. అప్పటికే అత్తగారు పాలు కాచి డికాషన్ తీసి రెడీగా పెట్టారు. కోడలు లేవగానే కాఫీ కి ఇబ్బంది ఉండొద్దని! వాసంతి తయారయి ఆఫీసుకు వెళ్లబోతుంటే గడప కొ ట్టుకొని పడబోయి , ఆపుకుంది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని మంచినీళ్లు ఇమ్మని అడిగి ” ఇవాళ ఉదయం లేవగానే మీ ముఖ దర్శనం అయింది కదా, మొదలయ్యాయి అశుభాలు. మీకు ఆ మాత్రం ఇం గి త జ్ఞానం లేదా ” అంటూ అరచింది. “రోజు నీవు లేచేటప్పటికి పొద్దుపోతుందని, ఆఫీసుకు లేట్ అవుతుందని ఏదో సహాయం చేద్దామని అలా వచ్చానమ్మా, క్షమించమ్మా ” అంది దీనంగా అత్తగారు. ఇది రోజు జరిగే తతంగమే కదా అని వాసంతి విసుక్కుంటూ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళింది.

“ఏమిటో కొడుకుకేమో వేరే ఊర్లో ఉద్యోగం, నా బ్రతుకు ఇలా ఉంది” అని మనసులో బాధపడ్డారు. చాలా మంది అత్తగార్ల లాగానే ఈ అత్తగారు కూడా!కాలంఎప్పుడూ ఒకలా ఉండదు. ఒకరోజు వాసంతి తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తల్లి ఎందుకో ఏడుస్తోంది. వాసంతి కంగారుగా ” అమ్మ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ బాగున్నారా? విషయం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ” గట్టిగా కోపంగా అరిచింది. దానికి ఆవిడ ” వసు ఏమని చెప్పను! మీ అక్క వనజ ఆత్మహత్యకు పాల్పడిందట ఉరి వేసుకుని. ఇప్పుడే కబురు తెలిసింది. నేను మీ నాన్న తట్టుకోలేకపోతున్నాం. నువ్వు వస్తే ఒకసారి మనం కలిసి అక్కడికి వెళ్దాం. దాని పిల్లలు ఎలా ఉన్నారో అని మీ నాన్న తెగ ఇది అయిపోతున్నారు అంది. దానికి వాసంతి ” అక్క ఎందుకు అంత అగత్యానికి పాలు పడింది. అసలే బావ లేరు. పిల్లల ముఖమైనా చూసి ఉండాలి కదా” అని అంది. దానికి వాసంతి తల్లి ” ఏమి చెప్పనమ్మా మీ బావ పోయిన తర్వాత అక్కడ మీ అక్క అగచాట్లు చెప్పలేము. కూర్చుంటే తప్పునుంచుంటే తప్పు.దాని అత్తగారట,”నీ దురదృష్టం వల్లే నా కొడుకు పోయాడు, ఈ పాడు ముఖాన్ని చూడలేక మేము చస్తున్నాం. తెల్లారి నీ మొహం చూడకపోతే మాకు గడవటం లేదు. మా మనుమలను చూచి నిన్ను భరిస్తున్నాను కానీ నీ మొహం చూసి కాదు” అంటూ నిత్యం దానిని సూటి పోటి మాటలతో దెప్పి పొడిచేది. దానికి విసిగి వేసారి ప్రాణాలు తీసుకోవడానికి ఒడిగట్టింది.” అని చెప్పి బాధపడింది.
తల్లి మాటలు విన్న వాసంతి లో వివేకం ఒక్కసారి మేల్కొది. తను అత్తగారిని చూసే పద్ధతి కి పశ్చాత్తాపం కూడా కలిగింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన అత్తగారు ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటూనే ఉంది . పిదపకాలపు మనిషి కనక ఎంతో ఓరిమి తో ఉంది. అక్క విద్యావంతురాలు . కానీ ఆవేశపరురాలు. ఆత్మాభిమానం ఉండాలే కాని మితిమీరకూడదు అక్క లాగా. అంత దాకా ఎందుకు! నేను ఒక ఆడదాన్నే కదా! విద్యావంతురాలని కూడా. ఎందుకు నాలో ఈ ఆలోచన రాహిత్యం ఏర్పడింది?”” ఆడదే ఆడదానికి శత్రువు” అన్న మాటను ఖండిస్తాను ఈ రోజు నుండి. ఆడదానికి ఆడదే ఆసరా అని చాటి చెబుతాను. చేసి చూపెడతాను ” అని అనుకుంది వాసంతి.
అత్తగారి గదిలోకి వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పి, “ఇప్పటిదాకా జరిగినదానికి చింతిస్తున్నాను. నన్ను మీ కూతురుగా భావించండి ” అని అం ది.జరిగినదంతా అత్తగారికి వివరించి నేను ఇప్పుడు అమ్మ గారి ఇంటికి వెళ్తున్నా నని, మీరు టైం కి ముందు లేసుకొని జాగ్రత్తగా ఉండండి, పనిమనిషి తో కూడా చెప్పి ఉంచుతాను, మీ అబ్బాయికి కూడా ఫోన్ చేసి చెప్తాను” అంటూ ఆటో ఎక్కింది. తల నిండా అక్క ఆలోచనలే ” వీలైతే అక్క పిల్లల్ని తెచ్చుకుంటే బావుంటుందేమో ” అనే చిరు ఆశ కూడ మొలకెత్తింది.

May 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us