మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

కలలు

by Pendyala Shaymsunder January 1, 2023
written by Pendyala Shaymsunder

గాలి చెట్ల మధ్యన అల్లుకోవటం ప్రకృతి
పగిలిన గ్రుడ్డు ఆకాశం పై పరిచినట్టు గా కరిగిపోవడం
ఒక అనుభూతి

మంచి ఆలోచనలు నాలో రేకెత్తినట్టుగా
అందమైన జీవితం నా చుట్టూ అల్లుకున్నది
చాలా రోజుల క్రితం నాలో నిండిన
రంగురంగుల
ఆ కలలో నేను కులాసాగా కరిగిన దృశ్యం లా!
కానీ,
నిజజీవితంలోని నిస్సారాన్ని
అధిగమిస్తూ
లెక్కల టీచర్ చెప్పే బోరింగ్ ఫ్రాక్షన్ గణితాన్ని వినడానికి
స్కూల్ కు పరుగెత్తినట్టుగా
నాదైన అవర్ గ్లాస్ పగిలి
ఇసుక అంతా వేళ్ళ మధ్యన కారినట్టు కాని నిజాన్ని నేను అనుభవించాలికదా
పగిలిన గ్లాసు లో కారుతున్న ఇసుకను పెట్టడానికి ప్రయత్నించినట్టు
కరిగిపోయిన కలలను
తిరిగి కూర్చి
మెదడులో నింపడానికి ప్రయత్నించినట్టు ఆలోచించాను
ఈ ప్రపంచ తత్వం
నిర్ణయ సాధ్యం కాదని ద్వేషించడం సులభం
ప్రేమించడం కష్టం
నిర్ణయాలైతే సులభంగా నిర్ణయానికి వస్తాం
కాని
ఒప్పుకోవడం కదా మనసుకు కష్టం
ప్రపంచ నీతి అది
అయినా ఈ ప్రపంచం ఎంతో అందమైనది
ప్రపంచం నడిచే పద్ధతి లో
నా కలల్లోకి దూరిపోకుండా
నా రంగుల కలను
నా ఆశయాలను జీవిత కాన్వాస్ పై
చిత్రీకరించాలని ఆశిస్తున్నాను

అనువాదం- పెండ్యాల శ్యామ్ సుందర్ రావు
మూలం – మేఘా ఇషాణి పెండ్యాల.

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నాన్న ఎక్కడ

by Dr. Aruna Parandhamulu January 1, 2023
written by Dr. Aruna Parandhamulu

పట్టరాని సంతోషముతో నాన్న కోసం వెతుక్కుంటూ వెళ్ళా!

నాన్న అప్పుడే ఎందుకో
కోపంగా ఉన్నాడు..

అమ్మతో కస్సు బుస్సు
లాడుతున్నాడు..

నాన్న కోపం నాకు అర్థం కాలేదప్పుడు….

అమ్మ నన్ను బడికి పంపినందుకు….
నాకు పని
నేర్పించనందుకు!

సద్గుణాలు ఎన్నో..
ఉన్న నాన్న అమ్మను కసిరించుకుంటుంటే….
ఆ క్షణాన నాన్నను
ఎదిరించ
కుండా
ఉండే
మనసు
నాక్కేడిది..!

ఆడపిల్లలు
ఆరు బయట
కూర్చోరాదని…… ఆంక్షలెట్టినప్పుడు…
నాన్న నన్ను
అనుక్షణం
కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడని
సంతోషపడ్డా…!

కానీ….!
నాన్నే….
నా స్వేచ్ఛ కు అడ్డుకట్ట
వేసే మొదటి వ్యక్తి అని…
అప్పుడు
తెలుసుకో
లేకపోయా…
ఇప్పుడే
తెలిసింది…
మా నాన్న
మగామహారాజు…
అని ఆడజాతిని
అణిచి వేసే
శక్తివంతుడని ….

నాన్న శక్తి
నాకు నచ్చలే…
నాన్నను ఏదురించ
కుండ ఉండలేపోయా…

ఆడపిల్లలు
ఆరు బయటనే
కాదు
అర్థరాత్రి ఒంటరిగా
తిరగాలని నిర్ణయానికీ
వోచ్చా…
మా నాన్న విధించిన
అంక్షాల సంకెళ్లలను తెంచుకొని..

మా నాన్న లాంటి
నాన్నలను
ఒప్పించి
మెప్పించి
అమ్మాయిలందరినీ
బడికి పంపించా……
అమ్మాయి చదువు అవనికి
వెలుగు అని

ఇప్పుడు
మా నాన్నే
ప్రతి ఇంటి వెళ్లి
అమ్మాలoదర్ని
బడికి
పంపించే మార్గం వెతుకుతున్నారు…

డాక్టర్. అరుణ పరంధాములు

(హామీ పత్రము:-ఇది నా స్వీయ రచన ఎక్కడ నుండి కాఫీ చేయలేదు.)

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రమేశ్వర్ రాజు

by Ananthaacharaya K.S. January 1, 2023
written by Ananthaacharaya K.S.

రమేశ్వర్ రాజు గారిది గొప్ప అనుశీలనం. అదిత్యుడి కిరణ శక్తి పరిపూర్ణంగా వీరిపై ఉంది. వీరు వైష్ణవ మతానుయాయులు.శ్రీమన్నారాయణ భక్తులు. అది పద్యాలను పరికిస్తే కనపడుతుంది. నేటి పద్యంలో అనుచు నారాయణా….తుంబురు నారదాదలు నంబరమున… ఆ దృశ్యాన్ని కేవలం ఉహించగలం కానీ అనుభవించలేమన్న దృగ్విషయం తేటతెల్లబరిచారు. దేవలోకం లో తుంబురు నారాదులు ఇద్దరు సంగీత విద్వాంసులు. ఇరువురు ముల్లోక సంచారులు. మహావిష్ణువును స్తుతియిస్తూ కీర్తనలు గానం చేసే వారు. నారదుడి వీణ మహతి అయితే తుంబురుని వీణ కళావతి.
అహో దేవర్షార్ధన్యోయం యత్కీర్తిం శార్ ఙ్గ ధన్వనః
గాయన్మాద్యన్నిదం తంత్ర్యా రమయత్యాతురం జగత్!
దేవర్షి నారదుడు బహుధన్యుడు. ఏల అనగా వీణ మ్రోగిoచుచూ
హరి గుణగానం చేయుచూ పారవశ్వము నందుచూ ఈ జగత్తునంతయూ ఆనందింప చేస్తూ సంచరించేవాడు ఆలాగే సూర్యుడు సంచారీ ఆ గాన మాధుర్యం అలపన అద్భుతమైన దృశ్యం వీక్షించిన వాడే సూర్య నారాయణుడు. అన్ని అవతారలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరయోగీంద్రులకు దర్శనీయుడు. సకల సృష్టి అవతారాలకు ఆయనే మూలం. ఆది మూల మితడు అని అన్నయ్య కీర్తనలో కొనియాడినాడు.
దేవ్ ఋషియైన నారాదునిగా అవతరించి శ్రీమన్నారాయణుడు సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదించే పాంచారాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
మహావిష్ణువు 21 అవతారాలలో మూడో అవతారం నారదుడు. మహాజ్ఞాని.బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప వక్త,రాజ నీతిజ్ఞుడు,లోకహితవాది ( భాగవత ప్రథమ స్కంధం) అన్నింటిని మించి భగవద్భక్తుడు. సర్వలోక సంచారీ.అనంత బ్రహ్మాoడములలో ఎక్కడా ఏది జరిగినా ఆయనకు ఇట్టే తెల్సిపోయేది. నారద అన్న శబ్దం లోనే జ్ఞానాన్ని అందించే వాడని అర్థం. ఈ జ్ఞాన బోధకోసమే ఆయన లోకాలు తిరిగేవాడు.అలాగే సూర్యుడూ లోకసంచారియే. ఇరువురి
మార్గాలు ఒక్కటే, స్వరూపాలు నారాయణుడివే. భాగవతాన్ని రచింపమని వేదవ్యాసునికి నారదుడు చెప్పినట్లు భాగవత ప్రథమ స్కంధంలో ఉంది.
వాల్మీకి కి రామాయణం నారదుడు రచింపమనట్లుబాలకాండలో ఉంది. అలాటి అద్భుత భక్తి భావ తత్పరుడు పరమభాగవతోత్తముడు చేసే
దివ్యగానం వినే భాగ్యశాలి సూరుడిని అభివర్ణించడం సహేతుకం. అట్లాంటి నారదుని చూడకున్నా సూర్య నారాయణుడిని సేవిస్తున్నామని రాజు గారు పద్యం లో చెప్పారు.
పరమశివుని డమరుక నాదంలోంచి జన్మించి సంగీతమును విశ్వవ్యాప్తం చేసేందుకు బయలు దేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ది పొందినాడు.గంధర్వుడు తుంబురుడు విష్ణుమూర్తి భక్తుడు..పౌరాణిక ప్రసిద్ధి హిందూ పురాణాల ప్రకారం. సూర్యగణంలో సూర్యునికి తోడుగా ప్రతీ ఋతువులో అతని రథంలో ఇద్దరు ఆదిత్యులు,ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణిస్తారు. చైత్రమాసం ( మధుమాసం)లో ధాత,హేతి,వాసుకి, రథకృతి,పులస్త్య, కృతస్థలి,అనే వారితో పాటు తుంబురుడు రథం లో తిరుగుతాడు. ఈ ఇరువురి ప్రస్తావనతో పద్యానికి నిండుదనం చేకూర్చారు. ఆది దేవా అని,అమరవంద్యుడిని చక్కగా సంబోధించి నిన్ను ఒక్కడిని చూస్తే సకల సౌభాగ్యాలు ఓన గూరుతాయని మంచి పద్యం అందించిన రమేశ్వర రాజుగారికి అభినందనలు.

స్వార్థ రహిత సేవకు నీవే అంటూ ఈ రోజు పద్యానికి శ్రీకారం చుట్టిన రమేశ్వర రాజు గారి కవనాశ్వం సూర్య తేజో విరాజమానంగా సాగుతుంది. మనిషి స్వార్థాన్ని వీడి పరమార్థం వైపుకు అడుగు వేయాలని అందుకు సూర్యుడిని ఉదాహరించారు…ఎటుల బాగుపడునో ఇజ్య దేవ అని చిక్కటి పదప్రయోగం చేశారు రాజు గారు. విష్ణువు సహస్రనామాలలో 446వ నామం ఇజ్య…ఇజ్య దేవుడు అంటే యజ్ఞముల చేత ఆరాధింపబడేవాడు. విష్ణు సహస్రనామo విశ్వం విష్ణుర్…అని మొదలవుతుంది. విశ్వo అంటే విశ్వమంతా తానే అయినవాడు ( నామ రూపాత్మకమై,చిత్రాతి చిత్రమై,వికసించి,విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చారా చర జాడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము ) సకల విషయములందు సంపూర్ణమైనవాడు. అంతా భగవంతుడే భాష్యకారుల వ్యాఖ్యానం. విష్ణుః అంతట వ్యాపించి వున్నవాడు. వషట్కారహః వేదమంత్ర స్వరూప, వషట్ క్రియకు గమ్యము ( యజ్ఞం లో ప్రతీ మంత్రం చివర మంత్ర జలమును వషట్ అనే శబ్దంతో వదులుతారు) అంతటిని నియంత్రించి పాలించేవాడు. పరమాత్మ అయిన నేను యజ్ఞ పురుషుడిని,యజ్ఞకర్తను,యజ్ఞఫల స్వరూపుడిని అనిచెప్పారు. కాబట్టి అలాటి ఇజ్య దేవుడిని యజ్ఞం తోనే ఆరాధిస్తారు. యజ్ఞం అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదం లో యజ్ఞోవై విష్ణుః అని చెప్పబడినది. అనగా యజ్ఞం విష్ణుస్వరూపంగా భావించవచ్చు.యజ్ఞం అను శబ్దం యజ దేవ పూజయామ్ అనే ధాతువు నుండి ఏర్పడింది.దైవ పూజయే యజ్ఞం.యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలను సంతృప్తి పరచడం,వారిని మెప్పించడం. యజ్ఞం అనేది అగ్ని ( హోమం) వద్ద వేద మంత్రాల సాక్షిగా హావిస్సులు స్వాహాకారాల తో సంతృప్తి పరుస్తాం హావిస్సులు అగ్నిలో పడుతున్నప్పుడు పరిపూర్ణ ఏకాగ్రతతో విష్ణవే ఇదం నామమ ఇది విష్ణువు కు సమర్పితం నాది కాదు అని సమర్పిస్తాం.తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. ఇష్ట కామ్యాలు నెరవేరుతాయి. ఈ కవిగారు అక్షర యజ్ఞం చేస్తూ స్వార్థ బుద్ధిని సమాజ పోకడలు మార్చమని సూర్య నారాయణుడి ద్వారా శ్రీమన్నారాయణుడిని వేడుకుంటున్నారు. పరస్పరo భావయన్తహః శ్రేయః పర్మవ్యాప్సధ…. పరమాత్మ తాను సృష్టించిన ప్రజలను.. ఓ ప్రజాలారా ఈ యజ్ఞం ద్వారా మీరు శ్రేయస్సును కాంక్షించి అందరూ లాభం పొందండని యజ్ఞ సూత్రాన్ని గీతలో శ్రీకృష్ణుడు తెలిపాడు. యజ్ఞం చేయడం అంటే సర్వజీవి ఆరాధన చేయడం అనే సత్యం పద్యంలో స్ఫురిస్తుంది. యజ్ఞం లో కూడా చాలా రకాలున్నాయి.మానవ జీవితంలో యజ్ఞాలు చేస్తే పరమాత్మకు ప్రీతి కలుగుతుంది. ఈ యజ్ఞాలు 5 రకాలు బ్రహ్మ యజ్ఞము,దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, నృయజ్ఞము. బ్రహ్మ యజ్ఞము అంటే వేదాధ్యయనం చేయడం. జ్ఞాన విస్తరణ చేయటం. దేవయజ్ఞం అంటే కామ్యం ..ఆజ్యాది హోమద్రవ్యాలను వినియోగించి చేసే ప్రక్రియ.పితృ యజ్ఞము అంటే పరలోకంలో ఉన్న తండ్రికి, పూర్వీకులకు శ్రాద్ధ, తర్పణాలు నిర్వహించడం. భూత యజ్ఞము అంటే సకల జీవరాసులకు ఉపయోగపడేలా నడుచుకోవాలి.
నృయజ్ఞము అంటే అతిథి స్వయం విష్ణుః అని ఆదరించి గౌరవించాలి. కనీసం దైవారాధన ,ఐక్యత దానం చేయడం ద్వారా యజ్ఞ పురుషుడిని సంతృప్తి పరుచవచ్చు. మానవ హితాన్ని కోరి రాజు గారు యజ్ఞకర్మల బోధ చేశారు. చక్కటి పద్యం అందించిన మీకు అభినందనలు .

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

తులసీదాసు

by Geetha Charmy nunepally January 1, 2023
written by Geetha Charmy nunepally
January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

లంబాడోళ్ళ పిల్ల

by కందుకూరి శ్రీరాములు January 1, 2023
written by కందుకూరి శ్రీరాములు

పాండవులు వాళ్లే గాదు
మేమూ ఐదుగురమే !
వాళ్లు అరణ్యవాసం చేశారు
మేము సముద్రవాసం చేశాం

  • * * *

అప్సరస కావచ్చు
రాజహంస కావచ్చు
చీకట్లో చూడలేము
చూద్దామని
వేకువ కోసం
కాళ్లు ముందుకు వెళుతుంటే భూమి వెనక్కి వెళ్తుంది ఆకాశమంచును చూడటానికి అడవులు

దాటి పర్వతాలు దాటి మైదానాలు దాటితే
ఒక ఉదయాన మా ముందు
మిలమిల మెరిసే లంబాడోళ్ళ పిల్ల నృత్యం చేస్తున్నట్టు సముద్రం –
అల అలా ముసుగేస్తూ తీస్తూ ఎంత అందమో –

పిఠాపురం వెళితే పండు లాంటి సోమసుందర్ కనపడ్డట్టు
ఉప్పాడ వెళితే జాంపండు లాంటి సంద్రం పిల్ల కంటపడ్డది
‘ కెరట గమన ‘
సయ్యాటలాడుకుంటూ వస్తుంది
చెమ్మా చెక్కలాడుకుంటూ వయ్యారంగా పోతుంది
మేమంతా తన్మయత్వంలో పడి ఇసుకలో ఇటూఅటూతిరుగుతుంటే
ఆల్చిప్ప దొరికింది ఆ తీరాన
అది ఆ పిల్ల అద్దం బిళ్ళ అనుకొని అరచేతిలో వేసుకుని అందులో చూస్తే
గలగల నవ్వుతుంది గజ్జల గౌను తొడుక్కొని
చూస్తేనే తరిగిపోతుంటే
నవ్వితే కరిగిపోకుండా ఉంటామా !

ప్రేమకు పొద్దూ లేదు మాపూ లేదు తెల్లారిందో లేదో
భూమిని సూర్యుడు చూసినట్టు ప్రేమికులం మేం అదే పనిగా చూస్తుంటే
దేహమునిండా అద్దాలు తగిలించుకుని
పొర్లుతుంది నీటి పొర మీద నెలవంకలా –
రజిత పథకాల జిలుగు పైట మెరిసిపోతుంటే
అందాల ముద్దుగుమ్మ
పడుకునే పరవశించిపోతుంది
తళతళ మెరుస్తున్న అలల దారాలతో నేసినవే
ఉప్పాడ జరీ చీరలు
నీటి కాంతుల్తోనో చెక్కిళ్ల నునుపుల్తోనో
చీర మెరుపుల్తోనో
చేపల కన్నుల్తోనో
లంబాడ పిల్ల తళుక్ తళుక్ మంటున్నది
ఓరచూపు కిరణాల కాళ్లు విసురుతూ
కసితీరా వేళ్ళు
మా కళ్ళల్లో గుచ్చుతున్నాయి
ఒడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చుని
మోహం తపస్సు చేస్తున్నాం
మేనక ముందు విశ్వామిత్రుడిలా –

తుంపరల్తో తనువును తనివితీరా సుతి మెత్తని చెక్కిలిగింతలుచేస్తుంటే
మతి గతితప్పి చెలించిపోతుంది
చేతులతో రారమ్మంటూ
పాదాలతో పోపొమ్మంటూ
ఆరామ్ చైర్ లో కూర్చుని హాయిగా ఊగుతుంది
ఉప్పాడ లంబాడోళ్ళ పిల్ల ఉద్వేగమైపోతుంది నిమిషనిమిషానికి –
దాని వాడి చూపులతో మేమంతా వేడెక్కిపోతున్నాం క్షణక్షణానికీ –

  • * * * *

పంచ పాండవులు వాళ్లే కాదు మేము ఐదుగురమే
వాళ్లు అరణ్యవాసం చేశారు
మేం సముద్రవాసం చేశాం
వాళ్లు ద్రౌపది కోసం మత్స్యయంత్రాన్ని కొట్టారు
మేం లంబాడోళ్ళ పిల్ల కోసం జల మంత్రాన్ని బట్టీ పట్టాం !!

( కె.శివారెడ్డిగారు , సుగమ్ బాబు గారు , ఆశారాజు గారు ,పెన్నా శివరామకృష్ణ గారు, నేను
ఒంగోలు కవిసమ్మేళనంలో పాల్గొనటానికి వెళ్లిన సందర్భంలో ఉప్పాడ బీచ్ సందర్శించిన సమయంలో రాసిన కవిత.

‘ పీఠభూమి’ పుస్తకంలో ప్రచురించబడిన
సౌజన్యంతో )

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కథాసాహితి కడలి తరంగం – వడలి రాధాకృష్ణ

by Banda Venkata Krishna ShaktiDhar January 1, 2023
written by Banda Venkata Krishna ShaktiDhar

తెలుగు సాహిత్యంలోని కథాసాహితి ప్రక్రియలో ఆధునిక కాలంలో కృషి చేసిన కథా రచయితలలో సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని కథారచన చేసినవారు “కథాసుధానిధి” వడలి రాధాకృష్ణ గారు. ప్రవృత్తిరీత్యా తెలుగు సాహిత్యంతో మమేకమైన “కథాప్రపూర్ణ” వడలి రాధాకృష్ణ గారి కలం నుండి 600 కథలు జాలువారాయి. “కథాబ్రహ్మ”, “కథా విరించి” లేఖిని నుండి కథలే కాకుండా 400 కు పైగా కవితలు వెలువరించబడినాయి. అనేక కథా సంకలనాలకు ప్రధాన సంపాదకత్వం వహించి “భావకవితాభారతి” వడలి రాధాకృష్ణ గారు. సాహీతీవేత్తలకు “సాహితీమిత్ర” గా కవులకు “కవిమిత్ర” గా కథారచయితలకు “కథకరత్న” గా ప్రసిద్ధిచెంది కథాసాహితి కడలి తరంగమైన వడలి రాధాకృష్ణ గారి “మనసు మూలాల్లోకి” మన “అంతర్నేత్రం” దృష్టి సారిస్తే ఆ “మనసు చెప్పిన కథలు”, “వడలి రాధాకృష్ణ కథలు” గా ఆవిష్కృతమవుతాయి. కడలి తరంగమైన వడలి “మంచినీటి సముద్ర” కెరటం. “జీవనది”, “మంచినీటి సముద్రం” తో సంగమిస్తే కడలి కెరటాలు వడలి కథలై కథాసరిత్సాగర మవుతాయి. “చీకటి పున్నమి” కాంతులను మన “దోసలి సందిట” పెట్టుకొని “గూటిపడవ”లో ప్రయాణించి కథాసాహితి కడలి తరంగ ఆవిర్భావ తీరానికి చేరుదాం.

వడలి వెంకట సుబ్బారావు – సూరమ్మ పుణ్యదంపతులకు 1963 సెప్టెంబర్ 5వ తేదీన (సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మించిన రోజున) వడలి రాధాకృష్ణ గారు జన్మించారు. తల్లిదండ్రులు రాధాకృష్ణ అని నామకరణం చేయడం వెనుక గల కారణం రాధాకృష్ణన్ గారు పుట్టిన తేదీ, రాధాకృష్ణ గారు పుట్టిన తేదీ సెప్టెంబర్ 5వ తేదీ కావడమే. స్నాతకోత్తరస్థాయిలో (పోస్టు గ్రాడ్యుయేషన్) మూడు పట్టాలు పొందారు. 1) ఎం.ఏ. (ప్రభుత్వ పాలనా శాస్త్రం), 2) ఎం.బి.ఏ., 3) బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్, పిలానిలో ఎం.ఈ. (మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్). సైన్స్ నుండి యం.ఇ.; ఆర్ట్స్ నుంచి ఎం.ఏ.; కామర్స్ నుంచి ఎం.బి.ఏ. డిగ్రీలు విభిన్నరంగాలలో సాధించిన వడలి రాధాకృష్ణ గారు ప్రస్తుతం చీరాలలోని ఐ.టి.సి.లో ప్రోసెసింగ్ మేనేజర్గా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రవృత్తి అయిన కథారచనలో మేటిగా నిలిచి నేటి ఆధునిక కథా రచయితలను, సాహితీవేత్తలను గౌరవిస్తూ, వారి గ్రంథాలను ఆవిష్కరిస్తూ, సాహితీసేవలో తరిస్తున్నారు. 2005వ సంవత్సరములో చీరాలలో “సహజ సాహితీ” అనే సాహితీ సంస్థను నెలకొల్పారు. “సహజ సాహితీ”

ఆధ్వర్యములో ప్రసిద్ధ చిత్రకారులు, కవి, గాయకులు, సంగీత దర్శకులు, కథారచయిత అయిన శ్రీ కోన రమణరావు గారు రచించిన “విరిసిన వెన్నెల” కథా సంపుటిని; రెక్కలు ప్రక్రియలో రచనలు చేసిన పోగుల విజయశ్రీ గారి “ఉదయరాగాలు” ను ఆవిష్కరించారు. సాహితీ మిత్రులైన శ్రీనివాసగౌడ్ గారు, పోగుల విజయశ్రీ గారు, వంగర పరమేశ్వరరావు గారు మొదలగు వారితో కలిసి అనేక కవి సమ్మేళనాలు నిర్వహించారు. చీరాలలోని ప్రముఖ సాహితీ సంస్థలైన అప్పాజోస్యుల విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్కు; కళాంజలికి; సాహితీ స్రవంతికి; శ్రుతిభారతికి విశిష్ట సేవలందిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ తెలుగు పత్రికలలో వడలి రాధాకృష్ణ గారి రచనలు, కథాసంకలనాలు ప్రచురితమయ్యాయి. రాధాకృష్ణ గారి కథా సంకలనాలలో “జీవనది”; “గూటిపడవ”; “అంతర్నేత్రం”; “మనసు మూలాల్లోకి”, “చీకటి పున్నమి”, “వడలి రాధాకృష్ణ కథలు”; “మంచినీటి సముద్రం”; “దోసిలి సందిట” మొదలగునవి కథా సాహితీ ప్రపంచంలో అటు పాఠకులను, ఇటు పరిశోధకులను అలరిస్తూ ప్రజాదరణ పొందాయి. వడలి రాధాకృష్ణ గారి కథా సంకలనాల మీద విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలో పరిశోధనలు జరిగి, యం.ఫిల్.; పి. హెచ్.డి. డిగ్రీలు పొందిన పరిశోధక విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధక విద్యార్థి పెదలంక సుధాకరబాబు “జీవనది” కథా సంకలనంపై పరిశోధన చేసి యం.ఫిల్. పట్టా పొందారు. రాజమండ్రి దగ్గర బొమ్మూరులో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన నన్నయ ప్రాంగణములో తెలుగు పరిశోధక విద్యార్థి బొంతా రమేష్ “వడలి రాధాకృష్ణ – కవితానుశీలన” అనే అంశంపై పరిశోధన చేసి యం.ఫిల్. పట్టా పొందారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయములో తెలుగుశాఖలో పనిచేసిన ఆచార్య తేళ్ళ సత్యవతి గారి పర్యవేక్షణలో శ్రీ యల్. జ్యోతీశ్వర నాయుడు అనే తెలుగు అధ్యాపకులు “వడలి రాధాకృష్ణ రచనలు” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు. బొబ్బిలికి చెందిన శ్రీ కర్రి రాంబాబు అనే తెలుగు పరిశోధక విద్యార్థి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారి పర్యవేక్షణలో “వడలి రాధాకృష్ణ రచనలు-సమాలోచన” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు.

“భావకవితా భారతి” అనే బిరుదును కలిగియున్న వడలి రాధాకృష్ణ గారు “జలఖడ్గం”; “శిశిరచిత్రాలు”, “వట్టివేళ్ళు” (నానీలు) అనే మూడు కవితా సంపుటాలను వెలువరించారు.

కథారచనలు, కవితా సంపుటాలను వెలువరించడమే కాకుండా 30 కి పైగా ఇతర కవుల, రచయితల సంకలనాలకు ముందుమాటలు వ్రాయడం వలన వడలి రాధాకృష్ణ గారు పీఠికా రచయితగా సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. తాను ప్రధాన సంపాదకులుగా ఉండి నాలుగు కథాసంకలనాలకు, రెండు కవితాసంకలనాలకు, రెండు మినీ కథాసంకలనాలకు ప్రధాన సంపాదకత్వ బాధ్యత సమర్థవంతంగా నిర్వహించిన ఘనత కూడా వడలి రాధాకృష్ణ గారికే దక్కుతుంది. వారు ప్రధాన సంపాదకత్వం వహించిన కథా సంకలనాలు – “కథాపురి”, “నాలుగు నాలుగుల పదహారు”, “ఐదు కలాలు ఐదేసి కథలు”; “కథానికా కదంబం”; కవితా సంకలనాలు – “మలిసంధ్య”; “అనేక అడుగులు-ఒక ప్రస్థానం”; మినీ కథా సంకలనాలు – “మినీ కథావసంతం”, “కాలుతున్న కాలం” (కరోనా మినీ కథా సంకలనం).

సాహితీ రంగాలలో విశేష కృషి చేసిన వడలి రాధాకృష్ణ గారిని రాష్ట్రంలోని అనేక సాహితీ సంస్థలు బిరుదులను ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. వాటిలో ముఖ్యంగా సెట్ సంస్థ, చీరాల వారు “సాహితీమిత్ర” బిరుదును; పి.యం.కె.ఎఫ్. సంస్థ, ఒంగోలు వారు “కవిమిత్ర” బిరుదును; శ్రీ చైతన్యభారతి సాహితీ సమాఖ్య, మార్కాపురం వారు “కథావిరించి” బిరుదును; భావతరంగిణి మచిలీపట్నం వారు “కథకరత్న” బిరుదును; గుఱ్ఱం జాషువా కళా సమితి, దుగ్గిరాల వారు “కథాప్రపూర్ణ” బిరుదును; కళాలయ సాహితీ సంస్థ, పాలకొల్లు వారు “కథాసుధానిధి” బిరుదును; పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వారు “భావ కవితా భారతి” బిరుదును; విశ్వభారతి, ఒంగోలు వారు “కథాబ్రాహ్మి” బిరుదును; సాహితీ స్రవంతి, చీరాల వారు “సాహితీవాచస్పతి” బిరుదును ప్రదానం చేశారు.

“సహజ సాహితి” సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, చీరాల వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఉపాధ్యక్షులుగా, ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలులో కార్యనిర్వాహక సభ్యునిగా విశిష్ట సేవలందిస్తున్న వడలి రాధాకృష్ణ గారికి రాష్ట్రంలోని అనేక సాహితీ సంస్థలు ఎన్నో పురస్కారాలను ప్రదానం చేశాయి.

రజనీ కుందుర్తి, హైదరాబాద్ సాహితీపురస్కారం; తిక్కన రచయితల సంఘం, నెల్లూరు వారి సాహితీపురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ సాహితీపురస్కారం, డా॥ రావూరి భరద్వాజ స్మారక సాహితీపురస్కారం, “మల్లెతీగ” మాసపత్రిక జాతీయస్థాయి ప్రతిభాపురస్కారం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారిచే ప్రతిభాపురస్కారం, భువనగిరి-తేజ ఆర్ట్స్ జాతీయ సాహితీపురస్కారం, మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితి వారు వట్టివేళ్ళు నానీల సంపుటికి యిచ్చిన ప్రతిభాపురస్కారం, డా॥ వల్లభనేని నాగేశ్వరరావు విశిష్ట సాహితీపురస్కారం – 2007, శ్రీమతి పోగుల వెంకట రత్తమ్మ స్మారక విశిష్ట సాహితీ పురస్కారం – 2008, గూడూరుకు చెందిన శ్రీమతి ఇ. రత్తమ్మ శ్రమశక్తి పురస్కారం -2010, చీరాల – పసుమర్తి పార్థసారథిరావు ప్రతిభాపురస్కారం-2011, నెల్లూరు డా|| నాగభైరవ స్మారక స్ఫూర్తి పురస్కారం – 2013, కడప డా|| కవితా స్మారక సాహితీపురస్కారం-2014, వేద విజ్ఞాన పరిషత్ శ్రీ సేవాశక్తి పీఠం సాహితీపురస్కారం-2017, చీరాల యర్రమిల్లి నరసింహారావు సాహితీపురస్కారం- 2019.

ఆకాశవాణి విజయవాడ, మార్కాపురం కేంద్రాలవారు వడలి రాధాకృష్ణ గారి కథలను, కవితలను ధారావాహికల రూపంలో ప్రసారం చేశాయి. ప్రముఖ హాస్య నటులు శ్రీ యల్.బి. శ్రీరామ్ గారు వడలి రాధాకృష్ణ గారి రచనను “పసుపు కుంకుమ” పేరుతో లఘు చిత్రంగా చిత్రీకరించారు. అనేక అవధానాలలో పృచ్ఛకునిగా పాల్గొన్నారు.

కథారచయితగా, కవితాసంకలనాలకర్తగా, ప్రధాన సంపాదకునిగా, పీఠికారచయితగా, సహజ సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ఉపాధ్యక్షులుగా, ప్రకాశం జిల్లా రచయితల సంఘ కార్యనిర్వాహక సభ్యునిగా, అవధానపృచ్ఛకునిగా, జాతీయ స్థాయి విశిష్ట సాహితీ పురస్కారాల గ్రహీతగా, వక్తగా, సాహితీ సమావేశాల రూపకర్తగా, గ్రంథ ఆవిష్కర్తగా తెలుగు సాహితీ లోకంలో ప్రఖ్యాతి చెందిన వడలి రాధాకృష్ణ గారు నేటి యువ కథారచయితలకు మార్గదర్శకంగా నిలిచి స్ఫూర్తిదాయకమవుతున్నారు.

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi January 1, 2023
written by Chillara Bhavanidevi

5

‘‘మంజరీ! ఏమిటే చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నావు?’’

‘‘ఏమీలేదు చిన్నాజీ’’

‘‘ఏదో నాకు చెప్పవే! వేయిచంద్రికలు విరబూస్తున్న నీ మొహంలో ఆనందం చెప్పకనే చెప్తున్నది. చంద్రప్పను కలిశావా?’’

‘‘అవును చిన్నాజీ! ప్రభువు దయవల్ల మనకి మంచిరోజులే!’’

‘‘ఇక కల్యాణయోగమేనేమో!’’ చిన్నాదేవి ఆమెను ఆట పట్టించింది.

‘‘పోండి చిన్నాజీ! ఆ… నేను మా అమ్మని చూసి చాలాకాలమైంది ఇంటికి వెళ్ళివస్తాను.’’

‘‘నా అనుమతి ఎందుకు మంజరీ! నీవు నా చెలికత్తెవు కావు. చిన్ననాటి నేస్తానివి. నీకీ భవనంలో రాకపోకలకు పూర్తి స్వాతంత్రం ఉంది.’’

సంతోషంతో చిన్నాదేవి మందిరం నుండి బయలుదేరింది మంజరి.

విరూపాక్షస్వామి దేవాలయ వాణిజ్య వీధిలోంచి వస్తుండగా ఎవరివో గుసగుసలు చెవినబడ్డాయి.

‘‘ఇస్మాయిల్‌ ఆదిల్‌ఖాన్‌ పంపారు’’

‘‘ఏంటి ఖబర్‌?’’

ఒకడు  పరదేశి  అని  తెలుస్తోంది.  ముఖాలను  పూర్తిగా  వస్త్రంతో కప్పుకున్నాడు. మరొకడు విజయనగర పౌరుడే!

మంజరి వాళ్ళకి కనబడకుండా అటువైపు తిరిగి వస్త్రాలు, గాజులు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ ఆ సంభాషణ వింటున్నది.

‘‘రాయచూర్‌ ముట్టడికి రాయలు వస్తాడు కదా’’ పరదేశి చెప్తున్నాడు.

‘‘అయితే?’’

‘‘ముట్టడి జరుగుతుండగా రాయల సైన్యం రాయచూర్‌కి తూర్పువైపు గుడారాలు వేస్తారు’’ పరదేశి వివరిస్తున్నాడు.

‘‘అవును. సరిగ్గానే ఉందీ విషయం.’’

‘‘ఇకవిను.  మా  ఇస్మాయిల్‌  ఆదిల్‌ఖాన్‌  అశ్వదళాలు  పదాతి  దళాలతో విజయనగరానికి తొమ్మిదికోసుల దూరాన నిలుస్తాడు. కందకాలు తవ్వి ఫిరంగులను పేలుస్తాడు’’ పరదేశి మాట్లాడాడు.

‘‘ఇక విజయనగరం కోటమట్టిదిబ్బేనంటారా’’ విజయనగర వాసి ప్రశ్నించాడు.

‘‘ష్‌! జనం వింటారు. ఈ సమాచారం ఎక్కడా పొక్కరాదు. ఆదిల్‌ఖాన్‌ కోట ముట్టిడిరచే సమయానికి మీరు కోటలోపల నుంచి సహకరించాలి.’’

‘‘మాకు లాభం’’ ఆశపడ్డాడు విజయనగర ద్రోహి.

‘‘ఎంత కోరితే అంత’’ శత్రువు ఆశ చూపించాడు.

‘‘సువర్ణరాజ్యం ఇది. దీనిని స్వాధీనపరచటమంటే మాటలు కాదు. సరే మీ ఖాన్‌సాబ్‌కి చెప్పు. అంతా సవ్యంగా జరుగుతుందని’’ మాట ఇచ్చాడతను.

వాళ్ళిద్దరూ త్వరత్వరగా అక్కడినుంచి వెళ్ళిపోయారు.

మంజరి  తమ  ఇంటికి  పోలేదు.  నేరుగా  తిమ్మరుసు  భవనానికి బయలుదేరింది. విజయనగర ద్రోహి గుర్తించి ఆమెని వెంబడిరచాడు. తన అనుమానం నిజమే. ఆమె విజయనగరంలో వేగు. ఈ వార్త తిమ్మరుసుకు చేరవేస్తుంది. సందేహం లేదు. దారికాచి ఆపాడు.

‘‘ఆగు! నీ గొంతులోంచి మా రహస్యం పొక్కనీయకు’’ బొంగురుగా అన్నాడు.

‘‘ద్రోహి! విజయనగరానికే ఎగ్గు తలపెట్టిన నిన్ను వదిలిపెట్టను’’ సివంగిలా అతని జుట్టుపట్టుకుంది మంజరి.

ఒక  సామాజ్య  నర్తకి  అని  భావించిన  మంజరిలో  ఇంతటి  శక్తి అతడూహించలేకపోయాడు. తడబడి కైజారు దూయబోయాడు.

మెరుపులా ఒక అశ్వికుడొచ్చాడు. ఒక్కవుదుటున మంజరిని తన గుర్రంపైన కూర్చుండపెట్టుకొని క్షణంలో మాయమయ్యాడు. మైదానంలోకి వచ్చాక అశ్వం ఆగింది. అతని మొహం చూసి ఆమె నివ్వెరపోయింది. ఆనందించింది కూడా.

‘‘చంద్రా!’’

‘‘మంజూ! సాహసం కూడా అదను కనిపెట్టి చేయాలి. ఈ వార్త నాకూ తెలిసింది. తిమ్మరుసుగారికి చేరింది కూడా! నువ్వు మీ ఇంటికి పో! నేనూ వచ్చి కలుస్తాను. అక్కడ నీ అవసరం ఉంది’’ అంటూ ఆమెను అశ్వంపైన ఎక్కించుకొని కృష్ణసాని ఇంటిదగ్గర దింపి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు చంద్రప్ప.

ఇంటిదగ్గర జనం గుమికూడారు. తలా ఒకటి అనుకుంటున్నారు.

‘‘ఎలా జరిగింది? ఎవరు చేశారో ఈ ఘాతుకాన్ని’’ ఎవరో వ్యాఖ్యానించారు.

‘‘కాలమహిమ’’ మరొకరి బదులిది.

‘‘బతికినన్నాళ్ళు  కూతురి  వైభోగం  కోసమే  తపించింది’’  ఒకరు  జాలి చూపిస్తున్నారు.

ప్రజల మాటల్ని దాటుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్ళిన మంజరి ఎదురుగా కన్పిస్తున్న దృశ్యాన్ని చూసి నిట్టనిలువునా కూలిపోయింది.

‘‘అమ్మా!’’ ఆ ఆక్రందన అందరి హృదయాలను పిండేసింది.

రాత్రి ఎవరో ఇంటదూరి విలువైన రత్నాభరణాలను దొంగిలించి కృష్ణసాని గొంతునులిమారట. ఆమె అతనిని చూసి ఉంటుంది. అందుకే  ఈ  మరణం. మరికాసేపట్లో చిన్నాదేవికీ వార్త అందింది. ఆమె పంపిన రాజోద్యోగుల సాయంతో మంజరి తల్లి అంత్యక్రియలను పూర్తిగా నిర్వర్తించగలిగింది.

ఇక  ఈ  భవంతిలో  ఏముంది?  తనను  గొప్పస్థానంలో  చూడాలని బతికినన్నాళ్ళూ  తపించిన  తల్లి  ఇక  లేదు.  తాను  ప్రేమించిన  చంద్రప్ప మారువేషంలో తిరుగుతున్నాడు. ఈ భవనంలో తనకి భద్రత ఏముంది?

మంజరి చిన్నాదేవి భవనానికే చేరింది. ‘‘చిన్నాజీ’’ అని ఏడుస్తున్న మంజరిని కౌగలించుకొని కంటతడిపెట్టింది చిన్నాదేవి. ప్రేమతో మంజరిని ఓదార్చింది.

‘‘నేటినుంచి  నువ్వు  నా  సోదరివి.  నా  దగ్గరే  ఉండు’’  అని  పలువిధాల సమాధానపరచింది. మంజరి మనసులో ఆకాశమంత దిగులున్నా తారకల్లాంటి వెలుగు దివ్వెలు దూరాన కన్పిస్తుంటే కొంత ఊరట చెందింది.

*  * *

రాయల సైన్యం రాయచూర్‌ ముట్టడికి బయలుదేరింది. వారి వ్యూహం ప్రకారం రాయచూర్‌కి తూర్పుదిక్కున రాయలసైన్యం శిబిరాల్లో ఉంది. ముట్టడికి రాయలు సర్వసన్నద్ధంగా తరలి వస్తే ఇస్మాయిల్‌ అదిల్‌ఖాన్‌ అశ్వపదాతి దళాలతో కోటకు తొమ్మిది కోసుల దూరాన నిలిచి కందకాలు, ఫిరంగులతో యుద్ధానికి సన్నద్ధమైనాడు. రాయలు గ్రహించాడు.

కోటముట్టడికి  కొంత  సైన్యాన్ని  అక్కడే  ఉంచి  మరికొంత  సైన్యంతో ఆదిల్‌ఖాన్‌ని ఎదిరించటానికి పూనుకొన్నాడు. నిజానికి ఈ యుద్ధం రాయల శక్తికి మించిపోయింది. ఒక దశలో అపజయం సూచనలున్నాయి. చివరికి అవమానం ఒప్పుకోని ధీమంతుడైన రాయలు యుద్ధరంగంలోకి స్వయంగా దిగి, తన సైనికులకు బలాన్నిచ్చాడు. ‘‘విజయమో వీరస్వర్గమో’’ అనే నినాదాలతో సైనికులకు నాయకత్వం వహించి నడిపించాడు. రాయల పౌరుషం శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడిరది. అపజయం విజయంగా మారింది. ఆదిల్‌ఖాన్‌ పారిపోయాడు. అతని సేనాధిపతి బందీ అయ్యాడు. ఆదిల్‌ఖాన్‌ పరాజయాన్ని కళ్ళారా చూసిన అల్లసాని పెద్దన ఆశువుగా ఇలా అన్నాడు.

అలుక న్ఘోటక థట్టికా ఖురపుటీ హల్యన్భురాసాని శ్రపు

చ్చలు వో దున్ని, తలచ్చమూ గజ మదాసార ప్లుతీన్గీర్తిపు

ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తే దృష్టికే

దుల నోగ్రఖాకపాలమర్ధప హరిద్భూజాంగల శ్రేణికిన్‌ (2)

రాయలు  రాయచూర్‌పై  యుద్ధానికి  వెళ్ళినప్పుడు  సపరివారంగా  కవులు, పండితులు వెంట ఉన్నారు. యుద్ధశిబిరం యుద్ధభూమిలా లేదు. రకరకాల ధాన్యాలు, ఆభరణాలు, ముత్యాలు అమ్మకాలు జరిగాయి. ఏదో మహానగరంలా ఉంది. రాయలు పోర్చుగీసు సైనికుల సహాయాన్ని కూడా పొంది రాయచూర్‌ ముట్టడిని సాధించాడు.

*  * *

తల్లి మరణం తర్వాత మంజరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. చిన్నాదేవి ప్రేమ, చంద్రప్ప స్నేహం ఆమె బాధను మరిపిస్తున్నాయి.

‘‘మంజూ! ఈ రోజు భువనవిజయానికి రావాలి’’ చంద్రప్ప ఆహ్వానించాడు.

‘‘ప్రత్యేకత ఉందా’’ నిరాసక్తంగా అంది.

‘‘ఈ రోజు రాయలవారు అన్ని భాషల కవులకు తమ కవిత్వాలు చదివే అవకాశం ఇస్తున్నారట.’’

‘‘అష్టదిగ్గజ కవుల కవిత్వాలు, ఛలోక్తులు ఎంతో రమణీయాలు కదా! మరి ఈ కవులెవరు? ఏ దేశంవారు?’’ ఆమెకి ఆసక్తి కలిగినట్లుంది.

‘‘మనదేశంలోని అన్ని భాషల కవులు విచ్చేస్తున్నారు. వస్తే నీ మనసు ఆనంద తరంగితమౌతుంది.’’

‘‘మరి నువ్వు రావా?’’

‘‘ఎందుకురాను! కానీ నన్ను అక్కడ నువ్వు గుర్తించలేవు.’’

అతనికి మంజరిని త్వరగా వివాహమాడాలని ఉంది. కానీ తల్లి మరణంతో దిగాలుపడిన ఆమె వద్ద అటువంటి ప్రస్తావన కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మంజరి మనసును ఉల్లాసపరచాలని చంద్రప్ప ప్రయత్నం. ఆ విషయం గ్రహించిన మంజరి భువనవిజయానికి హాజరవటానికే నిర్ణయించుకుంది.

*  * *

భువనవిజయసభ  ఇంద్రసభను  తలపిస్తున్నది.  శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, పూర్వపశ్చిమ దక్షిణ సముద్రాధీశ్వర, మూరురాయర గండ, సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయలకు జయీభవ! విజయీభవ! వందిమాగధుల స్తోత్రాలతో శ్రీకృష్ణదేవరాయలు సింహాసనంపై కొలువుదీరాడు.

కర్ణాటాంధ్ర సామ్రాజ్య రక్షామణి సభావైభోగం కళ్ళార చూడాలేగానీ ఊహింప శక్యము కాదు.

తిమ్మరుసు మంత్రి కనుసన్నలతో సభ ప్రారంభమైంది. మొదటగా తాళ్ళపాక పెదతిరుమలయ్యగారు అన్నమాచార్యుని పదకవితలను భక్తి పురస్సరంగా ఆలపించారు.

తందనానా అహి తందనానా పురె

తందనానా భళా తందనానా ॥

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే ` పర

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే

కందువగు హీనాదికము లందులేవు

అందరికి శ్రీహరే అంతరాత్మ ॥

ఇందులో జంతుకుల మింతా ఒకటే

అందరికి శ్రీహరే అంతరాత్మ ॥

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే

అండనే బంటునిద్ర అదియునొకటే ॥

మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే

ఛండాలుడుండేటి సరిభూమియొకటే ॥

కడిగి యేనుగు మీద కాయునెండొకటే

కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ

జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ॥

విశిష్టాధ్వైతంలోని ఆధ్యాత్మిక తత్వాన్ని సంకీర్తనగా విన్న కృష్ణరాయలు పరవశించారు.

నాడు ఒక ప్రత్యేకాంశం భువన విజయసభలో జరిగింది. తిమ్మనకవి నిలబడ్డాడు.

‘‘ప్రభూ!  నాచే  విరచితంబైన  పారిజాతాపహరణ  మహాప్రబంధంలో చాలావరకు విన్పించాను. నేడు విన్పించు రచన ఈ కావ్యానికి చాలా ముఖ్యమైంది. అవధరించండి.

అలకబూని కోపగృహంలో ఉన్న సత్యభామను ప్రసన్నం చేసుకోవటానికి శ్రీకృష్ణుడు అనేక విధాల ఆమెను అనునయించాడు. చివరకు

పాటల గంధిó చిత్తమున బాటిలు కోప భరంబుమాన్ప నె

ప్పాటున బాటు గామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ

పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ వెట్ట నా జగ

న్నాటక సూత్రధారి యదునందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్‌

జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన

ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం

దొలగం ద్రోచె లతాంగి యట్లయగు నాధుల్నేరముల్జేయ బే

రలుకం జెందిన కాంత లెందు సుచిత వ్యాపారము ల్నేర్తురే!

ఇంత జరిగినా శ్రీకృష్ణ స్వామి ఏమన్నాడో వినండి ప్రభూ!

నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా

చిన యది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ

త్తను పులగాగ్ర కంటకవితానము దాకిన నొచ్చునంచు నే

ననియెద, నల్క మానవుగదా! యికనైన నరాళకుంతలా!

అంతా ముక్కున వేలేసుకున్నారు. సాక్షాత్‌ జగన్నాథుడయిన శ్రీకృష్ణుడు భార్య కాలితో తన్నినా ఓర్పు వహించినాడనే దీని భావం రాయల మనసుని ప్రభావితం చేసింది. దీనికి సంబంధించిన ఓ సంఘటన ఆయన స్మృతిపథంలో ఆ క్షణంలోనే మెదిలింది.

సాధారణంగా  చక్రవర్తి  వచ్చేదాకా  మహారాణి  తలగడ  మీద  తలపెట్టి పడుకోకూడదు. మహారాణి కాళ్ళవైపున తలపెట్టి పడుకున్నది. ఆ రాత్రి రాయలు ఆలస్యంగా అంతఃపురంలోకి వచ్చాడు. మెలకువ రాకపోవడంతో మహారాజు ఆమెకి నిద్రాభంగం కలగకుండా తలగడ మీద తలపెట్టుకుని నిద్రపోయాడు. పొరపాటున మహారాణి కాలు ఆయనకి తగిలింది. ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో మహారాణి కావాలనే రాజు తలను కాలితో తన్నిందని భావించి ఆగ్రహించి రాయలు అప్పటికప్పుడు అంతఃపురం వదిలి వెళ్ళాడు. ఆనాటినుంచి మహారాణి అంతఃపురానికి ఆయన పోలేదు.

పారిజాతపుష్పాన్ని తనకివ్వకుండా సవతి రుక్మిణికి శ్రీకృష్ణుడు ఇచ్చాడని ఆగ్రహించిన సత్యభామ ఆయన తలను కాలితో తన్నినా కృష్ణుడు ఆగ్రహించ లేదు. శ్రీకృష్ణదేవరాయలను కృష్ణాంశగా భావిస్తారు గాబట్టి ఆయనకూడా రాణిగారి కాలు తగిలినా ఆగ్రహించరాదని కావ్యబోధ. శ్రీకృష్ణదేవరాయలు మహారాణిని అనుగ్రహించేట్లు చేయడం కావ్యప్రయోజనం. మహారాణి నందితిమ్మనను రాయల మనసును మార్చమని కోరిన కోరికననుసరించే నందితిమ్మన అర్థస్ఫోరకంగా ‘పారిజాతాపహరణం’ రాశాడు. రాయలు  ఆలోచిస్తున్నాడంటే కావ్యప్రయోజనం నెరవేరినట్లేనని స్వస్తిపలికాడు తిమ్మనకవి.

మహాకవులు  కావ్యాలు  వెలయించటమే  కాదు,  కాపురాలు  కూడా నిలబెట్టగలరనటానికి ఇది ఉదాహరణ మాత్రమే!

చింతలపాటి ఎల్లకవి రాధామాధవ కావ్యాన్ని రుచి చూపించాడు. ప్రసిద్ధ కన్నడకవి తిమ్మణ్ణి కుమారవ్యాసుని భారతం నుంచి కావ్యగానం చేశాడు. విద్యానందుడు, గుబ్బిమల్లహ్హణ్ణ, కుమారవాల్మీకి, చాటు విఠలనాథుడు తమ కావ్యాలనుండి కొన్ని భాగాలను విన్పించారు.

నాటి సభకు గురువులైన వ్యాసరాయలు, వాగ్గేయకారులైన పురంధరదాసు కనకదాసులు కూడా విచ్చేశారు. తమిళకవి కుమారసరస్వతి ‘‘రాయల గజపతీ కుమారీ పరిణయం’’  నుండి  కవితాగానం  చేశాడు.  హరిహరదాసుడు ‘‘ఇరుసమయ  విళక్కుం  గ్రంథం,  జైన  నిఘంటికుడు  మండలపురందర్‌, జ్ఞానప్రకాశర్‌ ‘‘మంజరిప్పా’’ గ్రంథం, తిరువారూర్‌, ‘తత్వప్రకాశర్‌’ ఆయా కవులచే సభాసదులకు పరిచయం చేయటం జరిగింది.

సంస్కృత  కవులు  శ్లోకాలు  విన్పించారు.  రాయలు  తాను  స్వయంగా సంస్కృతంలో రచించిన ‘‘మదాలసచరితం’’ నుండి కవిత్వం విన్పించారు. కటకవాసి లొల్ల పండితుడు, ఈశ్వర దీక్షితుడు సత్కరించబడ్డారు. తనకు సంగీతం నేర్పిన లక్ష్మీనారాయణను రాయలు వైభవంగా సత్కరించారు. తిమ్మరుసు మహామంత్రి తాను రచించిన ‘అగస్త్య భారతవ్యాఖ్య’లో కొంత సభకు విన్పించారు.

ముగ్గురు దేవేరులు ఈ సభను ఎంతగానో ఆనందించారు. సంస్కృతం అంతగా రాని చిన్నాదేవి, కర్ణాటక తమిళ భాషలు తెలియని అన్నపూర్ణాదేవి మూడు భాషల్లో విదుషి  తిరుమలాంబ  ఈ  మువ్వురూ  కవితా  సౌరభాలను  నిండుమనస్సుతో ఆస్వాదించారు.

భువనవిజయ సభాప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు ఒక అపూర్వ ప్రకటన చేశారు. తెలుగుభాష తెలుగుజాతి ఉన్నంత కాలం నిలిచిపోయే ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించే  ఆ  సన్నివేశం  మరికొన్ని  రోజుల్లోనే  జరుగనున్నదని  తెలిసి అష్టదిగ్గజకవులంతా ఆనందించారు. అటువంటి నిర్ణయానికి అప్పాజీ రాయలను అభినందించారు.అందరూ పెద్దన అదృష్టాన్ని వేనోళ్ళ కొనియాడారు.

మంజరి కళ్ళు మాత్రం చంద్రప్ప కోసం ఆ సభలో నలుమూలలా వెదుకుతూ నిరాశగా వెనక్కి తిరిగి వస్తున్నాయి.

అప్పాజీవారికి చేరువలో కానుకలు అందిస్తున్న పరిచారిక సైనికుడు చంద్రప్ప అని గుర్తించడానికి ఆమెకి చాలా సమయం పట్టింది. దాదాపు సభ ముగిసే సమయానికి గానీ ఆమె అతన్ని గుర్తించలేకపోయింది. ఇది గమనించిన చంద్రప్ప తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నాడు.

*  * *

 ‘‘ఫో! నీతో మాట్లాడను’’ మంజరి అలక నటించింది.

‘‘మరి ఈ రాళ్ళతో మాట్లాడటానికి వచ్చావా?’’ చంద్రప్ప ఉడికించాడు.

‘‘అంత సభలో ఎక్కడున్నావని వెదకను’’ రోషంగా అంది.

‘‘ప్రస్తుతం నేను ప్రచ్ఛన్నంగా ఉన్నాను. రాయచూర్‌ విజయం దక్కింది గదా! ఇంక అజ్ఞాతవాసం తేలినట్లే.’’

‘‘హమ్మయ్య’’

‘‘మంజరీ! సుముహూర్తం నిర్ణయించుకునే వచ్చాను’’

ఆమె ఆనందంగా చూసింది.

‘‘దసరా  మహోత్సవాల్లో  విజయదశమి  శుభదినం.  ఆనాడు  మనం దంపతులమవుదాం.  భువనేశ్వరీదేవి,  విరూపాక్షస్వామి  కృపవల్ల  ఈ విజయనగర సామ్రాజ్యంలో మనమూ నీడల్లానయినా మిగిలిపోతాం.’’

‘‘చంద్రం! నాదో కోరిక’’

‘‘చెప్పు మంజూ’’

‘‘మన వివాహం తిమ్మరుసుల వారి ఆశీస్సులతో జరగాలి. వారు కరుణా సముద్రులు. అడిగితే కాదనరు. నాకు ఎవరున్నారు? తల్లిపోయింది. వారిని నేను  పితృదేవులుగా  సంభావించాను.  తిమ్మరుసు  తనయులు  కూడా సోదరులుగా ఎల్లవేళలా నాకు రక్షణ ఇస్తున్నారు.’’

‘‘నీవన్నదానిలో అణుమాత్రమయినా అసమంజసం లేదు. రేపు తిమ్మరుసుల వారిని కలిసి నీ కోరిక విన్నవిద్దాం’’ ఒప్పుకున్నాడు చంద్రప్ప.

‘‘మన వివాహం విరూపాక్ష మందిరంలో జరగాలి’’ ఆమె కోరింది.

‘‘ఎంత చక్కని యోచన చేశావు మంజూ! విజయనగర సామ్రాజ్య రక్షకుడా ప్రభువు. అతని కృపతోనే మనం ఒకటవుదాం’’ అతనూ సంతోషించాడు.

‘‘చంద్రా! ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. ఆహారధాన్యాలకు కొదవలేదు. విజయనగర వీధుల్లో కెంపులు, వజ్రాలు, నీలాలు, పచ్చలు, ముత్యాలు, రత్నాలు అమ్మటం చూసి పరాయి మూకలు ఈ రాజ్యంపై కన్నేస్తున్నారు. ముఖ్యంగా బహమనీలు.’’

‘‘అవును. రాయచూర్‌ని రాయలవారు జయించాక ముసల్మానులకు కన్నెర్ర అయింది. వర్తకం పేరుతో శత్రు గూఢచారులు విరివిగా విజయనగరంలోకి ప్రవేశిస్తున్నారని సమాచారం.’’

‘‘ఈ వ్యాపకంలో నీ నృత్యసాధన కూడా మర్చిపోతున్నావు’’ ఆమె ధ్యాస మళ్ళించటానికి అన్నా అంతకుముందు మంజరి నోట వెలువడినవి చంద్రప్ప మనసులోని ఆలోచనలే.

‘‘తెలుగుభాషను అందలం ఎక్కించిన రాయలవారు దేవేరుల కోసం మూడు మందిరాలు నిర్మించారు కదా! వాటిని చూశావా మంజూ!’’

‘‘చూశాను! తిరుమలదేవి శివాలయం, చిన్నాదేవి కృష్ణ మందిరం, అన్నపూర్ణాదేవి జగన్నాథమందిరం. ఏమా దేవాలయాల వైభవం! ఎవరెన్ని మందిరాలు  ఏర్పాటుచేసుకున్నా  వారి  హృదయమందిరంలో  కొలువైంది శ్రీకృష్ణదేవరాయలవారే గదా!’’

‘‘మరి మా హృదయరాణి మందిరంలో ఎవరో!’’

‘‘ఇంకెవరూ’’ అతనివైపు చూసింది. నాట్యంలాంటి నడకతో నునుసిగ్గుతో అతని చేతిల్లో వాలిపోయింది మంజరి.

అప్పటిదాకా రాజ్యశ్రేయస్సు గురించి గంభీరంగా చర్చించిన మంజరి పెళ్ళిప్రసక్తి రాగానే సిగ్గుపడటం చూసి ‘ఆడవారి మనసు ఆర్ణవం లాంటిది’ నవ్వుకున్నాడు చంద్రప్ప.

*  * *

ఆ రోజు విజయనగరం నిజంగానే విద్యానగరమై సరస్వతీ నిలయమైన సత్యలోకంగా భాసిల్లుతున్నది. ప్రభువు మందిరం నుండి ఎదురుగా ఉన్న రాజమార్గం ఇరుపక్కలా మంత్రులూ, రాజోద్యోగులు, సేనానాయకులు, రాజబంధువులు, ప్రజలు, అష్టదిగ్గజ కవులు నిలబడి తిలకిస్తున్నారు. ప్రభువు మందిరంలోంచి అందమైన బంగారుపల్లకీ బయటికి వచ్చింది. పల్లకీలో ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన ఆసీనులై ఉన్నారు.

రాజమార్గానికిరువైపులా మామిడి తోరణాలు, మార్గమధ్యంలో రంగవల్లులు అలంకృతమైవున్నాయి.

శ్రీకృష్ణదేవరాయల ప్రభువు సర్వాలంకారభూషితుడై తెల్లని పట్టు వస్త్రాలు ధరించి అప్పాజీతో మందిరం వెలుపలికి వచ్చారు.

పల్లకీ  వెనుక  కొమ్ము  పండితవర్యులు  పట్టారు.  సాహితీపిపాసి, భువనవిజయాధిపతి, ఆంధ్రభోజుడు, తెలుగులెస్స అని పల్కిన కళావాచస్పతి, హిందూ సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజితుడు, మూరురాయగండడైన శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సంస్కృతాంధ్రాలలో సమానంగా కవితామాలిక నల్లినవేళ కాలికి గండపెండేరము తొడిగించుకున్న ఆంధ్ర కవితాపితామహుడు అల్లసాని పెద్దన అధిరోహించిన బంగారు పల్లకీని తన భుజాన మోయటం తెలుగువారి చరిత్రలోనే అపూర్వ సంఘటనగా నిల్చింది. నాడు చూసినవారి కన్నులదే అదృష్టం.

హర్షధ్వానాలతో విజయనగర రాజమార్గం మారుమ్రోగింది. ప్రభువు భాషానురక్తి, కవులపట్ల వారికున్న గౌరవం భావితరాలవారికి ఆదర్శప్రాయమై నిలిచిన శుభవేళ అది.

*  * *

ప్రధాన  శిల్పాచార్యుడు  శిల్పులందర్నీ  సమావేశపరిచాడు.  హంపీ విజయనగరంలో నిర్మితమవుతున్న దేవాలయాల నిర్మాణానికి ఎందరో శిల్పులను విభిన్న ప్రాంతాల నుండి రప్పించడం జరిగింది. వారందరితో ప్రధాన శిల్పాచార్యుడు ఇలా ప్రస్తావించాడు`

‘‘దక్షిణ  భారతదేశంలో  అచిరకాలంలో  ఏకైక  చక్రవర్తిగా  కీర్తిగడిరచిన హిందూసామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన ఆంధ్రభోజుడు కృష్ణరాయ ప్రభువుల వారు అటు కదనరంగంలోనూ ఇటు కవనరంగంలోనూ ఎనలేని కీర్తిప్రతిష్టలు సాధించారు. రాయలవారు దైవభక్తి, కళాపోషణ, ప్రజాసేవానురక్తి, దయ, మానవీయత, వీర పరాక్రమం, పెద్దలయందు గౌరవం గల గొప్ప రేడు. మహామంత్రి తిమ్మరుసు ప్రభువుకు మంత్రికావటం వారికేకాదు మనందరి అదృష్టం.

ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ప్రభువు, మహామంత్రి, వారికి హృదయా న్నర్పించి సేవచేసే సేనావాహిని, న్యాయాధికారులు, దండనాయకులు, రాజ్యక్షేమం  కోరే  కవి  పండితులున్న  రాజ్యం  మన  విజయనగరం. రాత్రింబవళ్ళు ఆడామగా తేడా లేకుండా నిర్భయంగా తిరగగలిగే పరిపాలన ప్రభువు మనకిచ్చారు. వీధుల్లో రత్నాలు అమ్ముతున్న రాజ్యం ఇది.  కొత్తవారొస్తే మర్యాదలు చేసి గౌరవించే పౌరులున్న రాజ్యం మనది. కక్షలు, కార్పణ్యాలు మచ్చుకైనా కానరాని ఈ శాంతి సామ్రాజ్యంలో మనలాంటి కళాకారులు మనస్ఫూర్తిగా కళాసేవలో తరించగల అవకాశం ఉంది.

కళాకారునికి ఎక్కడైతే రాజాశ్రయం దొరుకుతుందో, ఎక్కడైతే  కళాకారులు అన్నవస్త్రాలకు కష్టపడక మనశ్శాంతిగా సంపూర్ణంగా కళారాధనలో నిమగ్నమౌతారో ఆ రాజ్యంలో సిరిసంపదలు విలసిల్లుతాయి. శారదాదేవి కొలువు తీరుతుంది. తిరుమలేశుని, విరూపాక్షుని సమానంగా అర్చిస్తూ హరిహరతత్వాన్ని ఆరాధించే రాయలవారు అనేక ఆలయాలు, కళామందిరాల నిర్మాణాలను తలపెట్టటం మనందరికీ తెలుసు.

మనలాంటి శిల్పులందరినీ పోషించి రాళ్ళల్లో రాగాలు పలికింపజేసే ప్రభువాయన.  మనందరం  ఐక్యభావనతో  ఈ  హంపీని  శిల్పారామంగా తీర్చిదిద్దుద్దాం.

నిన్ననే  తిమ్మరుసు  మహామంత్రి  నిర్మిస్తున్నవి,  సంకల్పిస్తున్నవి,  మరెన్నో వివరించారు. ఈ ఆలయాల సృష్టికి విశ్వకర్మ అబ్బురపడేట్లు మన ఉలులతో శిలలకు ప్రాణం పోయటానికి కంకణం కట్టుకోవాలి. ఏమంటారు?’’

శిల్పాచార్యుల సుదీర్ఘ గంభీర వాక్కుకు శిల్పులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వాళ్ళంతా ‘నభూతో న భవిష్యతి’ అన్నట్లు విజయనగర రాజధాని హంపీపట్టణాన్ని నిర్మిస్తున్న మయులా అన్నట్లున్నారు. ప్రతి ఒక్కరి మనసుల్లో సంకల్పదీక్ష, నేత్రాల్లో కళాకాంక్ష ద్యోతకమవుతున్నాయి.

శిల్పాచార్యులు మళ్ళీ కొనసాగించారు.

‘‘రంగమండపం పూర్తయింది. ఇంకా విరూపాక్ష దేవాలయ కళ్యాణమండపం, మహాగోపురం పూర్తికావాలి. కృష్ణస్వామి ఆలయం, హజారా రామాలయం, నాగలాపురంలోని విఠోభా ఆలయానికి కళాకృతుల బాధ్యతను నరహరివర్మకు అతని శిష్యులకు అప్పగిస్తున్నాను.’

నరహరివర్మ లేచి శిల్పాచార్యునికి కృతజ్ఞతగా వందనం చేశాడు.

మహోన్నత శిలపై తలపెట్టిన ఉగ్ర నరసింహమూర్తిని రామప్పే తీర్చిదిద్దాలి.

కాళహస్తిలో నూరుస్తంభాల మండపాన్ని, గోపురాన్ని చిన్నప్పకు అప్పగించాం.

చిదంబరంలో ఉత్తర గోపురాన్ని వరదయ్య పూర్తిచేస్తాడు.

శ్రీకృష్ణదేవరాయల ప్రభువు తిరుమల శ్రీ వేంకటేశుని గుడిముంగిట నిర్మింప తలపెట్టిన వేయిస్తంభాలమండపం, గర్భగుడి, వినాయక రథం, మూలగోపురం, వీటన్నిటి నిర్మాణం పూర్తి కావస్తున్నది. అక్కడ అత్యద్భుత కళాకృతుల పర్యవేక్షణ స్వయంగా మేమే చేస్తున్నాం.

శ్రీశైలంలో మండపం, గోపురం మల్లయ్య చూస్తాడు.

అరుణాచలంలో వేయిస్తంభాల మండపం, పదకొండు అంతస్తుల గోపురాన్ని శివన్న దగ్గరుండి శిల్పీకరిస్తాడు.

శిల్పాచార్యుల వారి వింగడిరపుకు శిల్పులంతా హర్షాతిరేకాన్ని ప్రకటించారు.

‘‘కాలం ప్రవాహం వంటిది. విజయనగర సామ్రాజ్య శిల్పులు చరిత్రలో మహనీయులుగా నిలిచిపోయే సువర్ణవకాశం దక్కింది. ఇదంతా పంపావతి కృప. భావితరాలవాళ్ళు మనం తీర్చిన కళామందిరాలు చూసి పులకాంకితులు కావాలి. ఈ శిల్పారామ సౌందర్యదీప్తుల వల్ల రాయల వారి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోవాలి. హంపీలోని విఠలమందిరం, రాతిరథాలకు స్వయంగా మేమే

ఉలిసేవలను అందిస్తున్నాము. ఇంక మీరంతా వెళ్ళి మీమీ పనులలో నిమగ్నం కండి. మీకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరిగాయి’’ అని అందరికీ సెలవిచ్చి పంపాడు శిల్పాచార్యుడు.

అపర విష్ణువు అయిన శ్రీకృష్ణదేవరాయల కీర్తిచంద్రికలను యుగాల పాటు శాశ్వతం చేసే కార్యక్రమానికి ఇది నాంది. రాజ్యం ఎంత సంపన్నవంతమైనా కాలచరిత్రలో ఏది నిలుస్తుందో చెప్పలేం. కానీ హంపీ శిలలు పాడుతున్న ఆ శిల్పరాగం మాత్రం శాశ్వతంగా నిలుస్తుందని శిల్పాచార్యుడికి తెలుసు. దూరంగా ఎవరో బైరాగి ఏకతార మీటుతూ పాడుకుంటున్నాడు.

‘‘రాయి రాయి అంటూ

రాతలే రాసేవు

రాయి రాత తెలియుడయ్యా!

రాయిలోనే ఉంది

రాయల ఘనచరిత ` అది

రాత కందని కావ్యమయ్యా!

రాజ్యమంటూ రగిలి

కోటలన్నీ దాటి

ఏమి సాధించేవు నరుడా

ఎన్ని గెల్చిన గాని

పున్నెమే మిగిలేది

ఏనాటికైనాను నరుడా!’’

తత్వం పాడుకుంటూ బైరాగి వెళ్ళిపోతున్నాడు. అతడు విజయనగర సామ్రాజ్య కీర్తి కావ్యాన్ని లిఖిస్తున్న బ్రహ్మలా కన్పిస్తున్నాడు.

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

by Mala Kumar January 1, 2023
written by Mala Kumar
January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సీతాయణం…

by Ramesh January 1, 2023
written by Ramesh

నాజూకు అందాలసీతా స్వయంవరం
విల్లును ఎత్తలేక యువరాజుల కలవరం
చివరికి రాముని కరమున విరిగింది శివధనస్సు
చిరునవ్వుల మురిసింది సీతమనస్సు

మిధిలా నగరిని
అయోధ్యాపురిని
ముడివేసింది నవమి
మురిసిపోయింది పుడమి

అమాయక కన్నుల బిలబిలచూపులు
నవవధువు జానకి మిలమిల మెరుపులు
పుట్టినింట అప్పగింతల కన్నీళ్లు
మెట్టినింట సంతోషాల సవ్వళ్లు
ఆనందశోభన సంరంభం
శృంగారరసయోగ జీవనం ఆరంభం

కైకేయి తలలో కన్నపేగుఅనురాగం
ఇలలో భరతుని పట్టాభిషేకం
మాటతప్పని రాఘవుడు
అయోధ్య విడిచివెళ్లాడు అరణ్య వాసం

రామపాలన మిధ్య
ఇక అడవే భుమిజకు అయోధ్య
చెట్టుచేమలు, మూగ జీవుల మధ్య
వైదేహి వైవాహికజీవితం
అష్టకష్టాల కన్నీటి గీతం

సీత అందానికి లంకాపతి అల్లాడే నిలువెల్లా
మతిపోయిన పదితలల రావణుడు
వేశాడు బంగురు లేడి వల
చెదిరింది సీతమ్మకల
సీతాపహరణంతో శ్రీరాముడే విలవిల

భర్త దూరమై భగ్నహృదయంతో
అశోకవనంలో ఆగని శోకం సీత
కలలుగన్న కాపురం
కమ్ముకున్నది గడ్డుకాలం
ఐనా వీడలేదు విభుని పై విశ్వాసం

హనుమంతుని నిండైన స్వామి భక్తి
వానరసేనల యుక్తి,ఉడతభక్తి
వానరచెలిమికి ఉప్పొంగిపోయే దాశరథి
నిర్మించెను లంక పై ఘన వారధి

దశరధపుత్రుడి సమర శంఖాపూరణం
తిరుగులేదు రామబాణం
నేలచూపేసింది రావణ అహం
లంకలో దశకంఠుని అంతం

అడవిలో అవనిజ పైవివక్ష
అనుమానంతో నిలువునా అగ్నిపరీక్ష
కాల్చి తేల్చింది అంగారం
సీతమ్మతల్లి మేలిమిబంగారం

అయోధ్యపురిలో రామ పట్టాభిషేకం
పులకించే అయోధ్య ప్రజానీకం
నాలుగు పాదాల పై ధర్మం
నడిచి తెలిపింది మనుగడ మర్మం

నెలలు నిండిన జానకి
ఎల్లలులేవు ఆనందానికి
రాముని మనసు కల్లోలం చాకలి నిందకి
నిండు చూలాలు లక్ష్మణుడితో నడిచే నట్టడవికి

సీత వాల్మీకి ముని ఆశ్రమంలో
ధరణిజ మరల రాముడు లేని వనవాసంలో
కుశలవుల జననంతో మురిసింది సీతమ్మతల్లి
ఆనందవర్షం కురిసి పులకించే పుడమితల్లి

సీతలేని రాముడు అయోధ్యలో
రాకుమారులు మునిఆశ్రమం లో
తండ్రికి,తనయులు దూరం
తుదకు తీరింది తల్లి దుఃఖ భారం

పరీక్షించిన పాడుకాలానికి
తల్లడిల్లిన సీతమ్మతల్లి
అమ్మ( భూమి) ఒడిని చేరింది మళ్లీ
తండ్రితనయులకు మిగిలింది నిట్టూర్పు
కాలానికి ఇది సీతా తీర్పు
రామాయణంలోఇది సీతాయణం.

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తొలి దళిత చారిత్రక నవల హేళావతి

by Butam Mutyalu January 1, 2023
written by Butam Mutyalu

దళిత అస్తిత్వ చారిత్రక తొలి దళిత నవల ‘హేలా వతి”. నిచ్చెనమెట్ల కుల సమాజంలో చరిత్రయవనిక పై తొలి దళిత నవల ‘హేలావతి’. రచ యిత ఉద్దేశం మత మార్పిడులు నివారిం చాలన్నది ఒకటైతే, హిందు మతంలోని లొసుగులను ఎత్తి చూపుతూనే సంస్కరణకు పూనుకున్న రచయిత తల్లా ప్రగడ సూర్య నారాయణ రావు. ఈ నవల కథా గమనాన్ని పరిశీలించే ముందు అప్పటి కాలాన్ని ప్రదేశాన్ని గమనంలోకి తీసుకోవాలి.

అప్పుడే నవల యొక్క విశిష్టత అవగతమ వుతుంది. మొఘల్ చక్రవర్తి బాబర్ కుమారుడు హుమాయూన్‌ను కాపాడిన వీరబలుని (మాల) కూతురే హేలావతి. ఆమె పెరిగి పెద్దదయి ఇస్లాం మతం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను రచయిత నాటకీయ ఫక్కీలో నాటి గ్రాంధిక భాషలో రాశాడు. వీర బలుడు కుటుంబం మతం మారడానికి కారణం. అంటరా నివారుగా నీచకులస్తులుగా హిందు మతంలో వారుపడిన కష్టాలు, కటిక పేదరికం, ఊరికి దూరంగా ఉండడం, బ్రాహ్మణులు ఎదురైతే తొలగిపోవడం, లేకుండే వారు విధించే శిక్షకు గురికావడం జరుగుతుండేది. ఆకలికి తాళలేక అడవిలోని గడ్డలు తవ్వుకొని తిని బతికే బతుక్కంటే మరణమే మేలని ఎదురు చూచే బతుకు ఎందులకు అని తలపోసేవారు.

రీసెంట్ గా (10సం) కింద విశాలాంధ్ర వారు బుక్ ప్రింట్ చేశారు

హిందూ మతం కల్పించిన పుట్టుక కారణంగా మాలవాడైన వీరబలుని కుటుంబం పనిలేక తినడానికి తిండిలేక మరణావస్థకు చేరుకుంటుంది. ఆ సమయంలో శత్రువు చేతిలో ఓడిపోయి పలాయనం చిత్తగించి ప్రాణాలు అరచేతపట్టుకొని మొఘల్ చక్రవర్తి హుమాయూన్ పారిపోతుండగా నది అడ్డుగా వస్తుంది. నదిని దాటే క్రమంలో రాజు ఆ ఏటిలోపడి స్పృహతప్పి పడిపోగా అక్కడ కంద గడ్డలకై ఏటి ఒడ్డున తిరుగాడుతున్న వీరబలుడు చక్రవర్తిని కాపాడుతాడు. అతను చక్రవర్తిఅని ఎరుగడు. హుమాయూన్ వలన అతనికి అతని కుటుంబానికి తినడానికి తిండి దొరుకుతుంది.
కొన్నిరోజులు అకడే ఉన్న చక్రవర్తి వెళ్లే సమయంలో చక్రవర్తి ప్రాణాలు దక్కించిన వీరబలునికి కృతజ్ఞతగా కొంత ధనం ఇచ్చి పోతాడు.

వీరబలుడు ఆర్థికంగా నిలదొక్కుకుని ధనవంతుడు అవుతాడు. కానీ, కులంలో మార్పు ఉండదు. అతని కూతురైన హేలావతి బాల్యం నుండి అతి సుందరవతి. బాల్యవివాహాలు జరిగే కాలంలో కూతురు పెళ్లికి నచ్చినవాడు దొరకక ఆందోళన చెందుతారు. కానీ, ఆమెను అమితంగా గౌతముడు ప్రేమిస్తాడు. హేలావతికి తన కులం, హిందూమతం కారణంగా తను పుట్టిన మాల కులంపైన తన జాతికి పేరు లేని వర్ణం రుద్దిన హిందూ మతంపైన అసహ్యం కలిగి ఆమె మతం మారి మరొక మతస్థుని పెళ్లాడాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఏటి జలగండం కలగగా, అప్పుడు గౌతముడు ఆమెకు బదులు తన ప్రాణాలు అర్పించి తన ప్రేమను చాటుకొని ఏటి మొసలికి బలవుతాడు.
గౌతముడు త్యాగానికి గుర్తుగా నిలుస్తాడు. ఆమె ఆయనను తలచుకుంటూ విచారమొందుతూ నిద్రలోకి జారుకుంటుంది. ఆనాడు తెల్లవారుజామున ఆమెకు ఒక కల వస్తది. ఆ కలలో ఆమె తన చుట్టూ పరిచారికలతో అంతఃపురకాంతలతో ఉన్నట్టు వచ్చిన కలను తల్లికి చెబుతుంది. అదే సమయంలో వారుండే చోటుకి దగ్గరలో కొండపై సోదెకత్తె శివశక్తి ఉంటుంది. సోదెకత్తెను భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకొని తల్లిదండ్రులతో ఢిల్లీ చేరుకొని అక్కడ హుమాయూన్ చక్రవర్తి మంత్రి కుమారుడి ప్రేమలో పడి చివరకు హిందూ మతాన్ని వీడి ఇస్లాం మతం స్వీకరించి అతడిని పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

మొఘల్ చక్రవర్తిగా హుమాయూన్ ఉండగా, ఢిల్లీ పురవీధులలో హేలావతి తండ్రి వీరబలుడిని పాదుషా కౌగిలించుకొని అతడు తనకు చేసిన ఉపకారానికి రుణగ్రస్థుడై మాలడైన వీరబలుడిచే మత మార్పిడి చేయించి అతనికి సామంతుని హోదా కల్పించడం ద్వారా పంచముల గుణశీలములు వారి పరాక్రమములు చరిత్రలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి. 15వ శతాబ్దిగాథను ( యదార్ధ కథ)ను వందేళ్ల క్రితమే మన ముందుంచి యావత్తు దళితులకు గొప్ప మేలు చేశారు రచయిత.

  • భూతం ముత్యాలు
January 1, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us