అలా స్తబ్దుగా ఉన్నావేమిటి? అవునూ మొహం గoటు పెట్టుకొని ఉన్నావేమిటి? అరే ఏమైంది? మొహం ఉబ్బిపోయింది? అంటూ కదలామెదలక కూర్చున్న మూత్రపిండాన్ని పలకరించింది క్లోమం. క్లోమం అలా పలకరించిందో లేదో మూత్రపిండం ఒక్కసారిగా ఏడ్చేసింది.
“ఊరుకో ఊరుకో ఏడవకు! ఏమైందో చెప్పు! అలా నీరసంగా ఉన్నావేమిటి? మూత్రపిండం వీపు నిమురుతూ ఉరడిస్తూ అడిగింది క్లోమం. ఏం చెప్పమంటావు నా బాధ. నా మొహం ఉబ్బిపోయింది నేనేమీ పని చేయలేకపోతున్నాను. నా కాళ్లు కూడా ఎలా వాచిపోయాయో చూడు”. అంటూ తన కాళ్ళను చూసుకోగానే మాట్లాడడం ఆపి ఏడవడం మొదలు పెట్టింది మూత్రపిండం.
అయ్యో ఏడవకు ఏడవకు, సరే తర్వాతే చెబుదువు గానీ ముందు ఏడవటం ఆపేయ్, ఇలా కూర్చో! కళ్ళు తుడుచుకో అని ఊరడిస్తూ “ఇదిగో కాసిని మంచినీళ్లు తాగు అన్నది క్లోమం. ఆ మాట అనీ అనగానే మూత్రపిండం మళ్ళీ ఏడవడం మొదలు పెట్టింది. అరే మళ్లీ ఏమైంది నీతో ఏం మాట్లాడినా ఇబ్బందిగా ఉన్నదే అని క్లోమం ముందుకు వంగి మూత్రపిండం భుజం తడుతూ అన్నది.
మూత్రపిండం ఏడుస్తూనే “నా ఈ పరిస్థితికి కారణం మంచినీళ్లే కదా! అందుకే నీవు మంచినీళ్లు మాట ఎత్తగానే నాకు ఏడుపు వచ్చింది” వెక్కుతూ వెక్కుతూ చెప్పింది. “అంటే ఏమిటి! మంచి నీళ్ల వలనే నీకీ పరిస్థితి దాపురించిందా! నాకు నీ విషయం వింతగా ఉన్నది నాకేమీ అర్థం కావడం లేదు” అన్నది ఆశ్చర్యంగా క్లోమం.
“నా మొహం కళ్ళు, కాళ్ళు ఇలా వాచిపోయి రోగగ్రస్థమై పోయానంటే ప్రధాన కారణం మంచినీరే. నా కడుపు లోపల రాళ్లు ఏర్పడి బాగా నొప్పి కలిగిస్తుంది. నా ఈ అవస్థలన్నింటికీ కారణం మంచినీరే!” అంటూ మూత్రపిండం చెబుతూ ఉండగానే క్లోమం మధ్యలో అడ్డు తగిలింది. “సకల జీవులకు దాహం తీర్చే మంచినీరు నీకిన్ని కష్టాలను తెచ్చిందా, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. పంచభూతాలలో ఒకటైన స్వచ్ఛమైన మంచినీరు పోయే ప్రాణాలను నిలబెడుతుంది తిండి లేకపోయినా మంచినీటితో కొన్ని రోజులు జీవించవచ్చు అని అంటారు కదా! ప్రాణాన్ని నిలబెట్టే నీరు కాసేపు గొంతు తడపకపోతే ప్రాణం పోవడం ఖాయం అలాంటి మంచినీటిని తప్పుగా మాట్లాడుతావా”? ఆవేశంగా అన్నది క్లోమం.
“నేను చెప్పేది పూర్తిగా వినకుండా మాట్లాడతావేమిటి? మంచినీళ్లు తాకపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం. నేనొక ఆడపిల్ల కడుపులో ఉన్నాను ఆ అమ్మాయి ఏ రోజూ తగినంత మంచినీరు తాగదు అందువల్లే నాకీ జబ్బులు వచ్చాయి” అన్నవి మూత్రపిండం రోదిస్తూనే!
“ఓహో మంచినీరు తాగకపోవడం వల్ల నీకి జబ్బులు వచ్చాయా! మరి సరిగా చెప్పవేం? నేను మంచినీటి వలనే ఇలాంటి జబ్బులు వచ్చాయనుకున్నాను. అదేమిటి నేను ఎప్పుడూ వినలేదే అనుకున్నాను అందుకే ఆశ్చర్యం అనిపించింది. సరే ఇంతకు మంచినీరు ఎందుకు తాగటం లేదట” ఆరాగా అడిగింది క్లోమం
“అదే నేను ఇందాక చెప్పాను కదా! నేనొక ఆడపిల్ల కడుపులో ఉంటున్నానని. ఆడపిల్లకు చాలా చోట్ల బాత్ రూములు అందుబాటులో ఉండవు. బాత్ రూములు తక్కువగా ఉండటం వలన మూత్ర విసర్జన కష్టం కదా! ఎక్కువసార్లు మూత్ర విసర్జన జరగకుండా ఉండాలంటే మంచినీళ్లు తాగటం మానేయాలి అనుకుంటారు. అందుకే చాలామంది ఆడపిల్లలు బయటికి వెళ్లాలంటే మంచినీరు తాగరు. వారు మంచినీరు తాగకపోతే నా పని ఎలా జరుగుతుంది. దేహంలోని విసర్జకాలను నేను జల్లెడ బట్టి నీటితో కలిపి బయటికి పంపించే డ్యూటీయే కదా నాది, మరి మంచినీళ్లు లేకపోతే దేహంలో ఉన్న పనికిరాని వ్యర్థాలను బయటికి ఎలా పంపించాలి దాని వల్లే నాకీ బాధ” బోరు బోరున ఏడుస్తూ తన బాధను వెళ్ల గక్కింది మూత్రపిండం.
“వాళ్లు మంచినీళ్లు తాగకపోతే నువ్వేం చేస్తావు దానికి నువ్వు బాధపడి ఏం ప్రయోజనం. వారి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించకు. వాళ్లకే అనారోగ్యం వస్తుంది. వారి ఆరోగ్యం గురించి వారికి శ్రద్ధ లేదా” అని క్లోమం కొద్ది కోపంతో అన్నది.
వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉంటే నాకీ బాధ ఉండదు. వారికి శ్రద్ధ లేకపోవడం వల్లే నాకీ కష్టాలు వస్తున్నాయి. నేను వ్యర్ధాలను బయటికి పంపకపోతే నాకే నష్టం జరుగుతుంది. మన ఇంట్లో చెత్త పేరుకుపోతే ఇల్లంతా దుర్గంధమయం అయినట్లుగా ఈ వర్గాలంతా నా కడుపులోపలే ఉంటే అనారోగ్యం సంభవిస్తుంది. వాళ్లకు డయాలసిస్ అవసరం పడుతుంది. నన్ను ఇబ్బంది పాలు చేసి వారు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏమిటో ఈ తెలివి తక్కువ మనుషులు. “నాగరికత పెంచుకున్నాం, మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి” అని విర్రవీగే మనుషులు వారికి వారే సొంతంగా జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. అని మూత్రపిండం వాపోయింది.
“ఓహో అలాగా! చక్కగా సమయం ప్రకారం మంచినీరు తాగితే ఇన్ని సమస్యలు ఉండవు కదా! చిన్న జాగ్రత్త పాటిస్తే పెద్ద సమస్య నుంచి బయటపడవచ్చు. ఆడపిల్లకు తగినన్ని బాత్ రూములు కట్టించవచ్చు కదా! దీనివల్ల ఎంతో ఉపయోగముందని తెలుసు కదా! తెలిసీ పరిష్కరించకపోవడం ఎంత తప్పు” క్లోమం ఆవేశంగా అన్నది.
“నా బాధ కూడా అదే కదా! ఏం చెయ్యను. ఏమి చేయలేకనే ఏడుస్తూ కూర్చున్నాను. ఎంతో తెలివిగల మానవులు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? నా బాధలు ఎప్పుడూ తీరతాయో! ఎప్పుడైతే పరిష్కార దిశగా ప్రయత్నాలు జరుగుతాయో అప్పుడే నా బాధలు మాయమవుతాయి. దానికోసమే ఎదురుచూస్తున్నాను” అంటూ క్లోమం చెయ్యి పట్టుకుని నడవలేక నడుస్తూ వెళ్ళిపోయింది మూత్రపిండం.
భారత దేశం లోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. దేనికది విశేషమైన చరిత్ర ను చెబుతున్నాయి. ఈస్ట్రెన్ ఘాట్స్ గా పేరున్న శేషాచలం కొండలు పచ్చని అడవులతో , పక్షి జాతుల తో జంతుసంతతితో అలరారుతున్నాయి. వీటినే తిరుమల గిరులు అంటారు.
తిరుమలగిరుల్లో 1008 తీర్థాలు ప్రధానమైనవి. ఈ తీర్థాల విశిష్టత ను తెలుసుకుందాం…
వీటిలో 108 జ్ఞానప్రదాతలుగా తెలియచేయబడినాయి.
తిరుమల తీర్థాలలో స్నానమాచరిస్తే వారికి ముక్తి కలుగు తుందని చెప్తారు. ఒక్కొక్క తీర్థానికి పేరు పెట్టబడింది.వాటిలో కొన్ని తీర్థాలను గురించి……
కుమార తీర్థం
కుమారస్వామి తారకాసురుడిని సంహరించడం వల్ల బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. కుమారస్వామి బ్రహ్మ హత్యా దోష నివారణకు తగిన పరిహారం చెప్పమని మహేశ్వరుడిని ప్రార్ధించాడు. అప్పుడు శంకరుడు “నువ్వు భూలోకంలోని వేంకటాచల క్షేత్రానికి వెళ్ళు. ఆ ప్రదేశంలో ఉన్న పరమపవిత్రమైన తీర్థంలో నువ్వు ప్రతి రోజూ స్నానం చేసి ఆ పర్వతంపైన వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేయి. ఆ స్వామి నీ దోషాన్ని తొలగిస్తాడు. అని చెప్పి కుమారస్వామిని భూలోకానికి పంపాడు.
జనకుడు ఆదేశించిన ప్రకారంగా చేసి తన దోషాన్ని నివృత్తి చేసుకున్నాడు కుమార స్వామి. తపస్సుకు ముందు ప్రతిరోజూ కుమారస్వామి ఆ తీర్థంలో స్నానమాచరించడం వల్ల ఆ తీర్థానికి కుమార తీర్థంగా పేరు వచ్చిందని తెలు స్తోంది. ఈ తీర్థంలో స్నానం చేసిన వారు నవయవ్వన వంతులుగా ఉంటారని పురాణ కథ ద్వారా తెలుస్తోంది.
పూర్వం ఒక పండు ముదుసలి ఈ తీర్థంలో స్నానం చేసి బయటకు రాగానే యువకుడిగా మారిపోయాడట. స్వామి వారి ఆలయానికి సుమారుగా ఏడు కిలో మీటర్ల దూరంలో వాయవ్య దిశలో ఈ తీర్థం ఉంది. మాఘ పూర్ణిమ, మఖ నక్షత్రంనాడు మధ్యాహ్న సమ యంలో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
తుంబుర తీర్థం
తుంబురుడు తన వీణను వాయిస్తూంటే ఆ వీణను చూసిన నారదుడు నీ వద్ద ఆ కొత్త వీణ ఎక్కడిది అని అడిగాడు. ఒక మహారాజును తాను కీర్తించగా ఆ రాజు ఈ వీణను తనకు బహుమతిగా ప్రసాదించాడని చెప్పాడు తుంబురుడు. దైవాన్ని స్తుతించవలసిన నోటితో మానవుని కీర్తించడమేమిటని ఆగ్రహించిన నారదుడు నువ్వు చేసిన ఈ పనికి దైవత్వాన్ని కోల్పోయి భూలోకం లోనే ఉందువుగాక అని తుంబురుని శపించాడు. నారదుని శాపఫలితంగా తుంబురుడు తిరుమలేశుని కొండ మీద ఘోణ తీర్థంలో భూమి మీద పడతాడు. ఘోణ తీర్ధంలో స్నానమాచరించి ఆ పర్వతం మీదే ఉండి, శ్రీవేంకటేశ్వరుని గురించి తపస్సు చేస్తాడు. అతని భక్తికి, దీక్షకు, ఏకాగ్రతకు మెచ్చిన ఆ స్వామి తన దేవేరితో సహా అతనికి దర్శన మిచ్చాడు. నారదుని శాపం నుంచి తుంబురునికి విముక్తి కలిగించాడు. తాను ఆ ప్రాంతాన తపమాచరించడం వల్ల ఆ తీర్ధం తన పేరు మీద తుంబురు తీర్ధంగా ప్రసిద్ధి చెందాలని తుంబురుడు స్వామిని కోరాడు. అప్పటి నుంచి స్వామి అంగీకారంతో ఘోణ తీర్ధం తుంబురు తీర్ధంగా పిలువబడుతూ ప్రాముఖ్యతను పొందింది. ఫాల్గుణ మాసం, ఉత్తర ఫల్గునీ నక్షత్రం పౌర్ణమి నాడు మధ్యాహ్న సమయంలో తుంబురు తీర్థంలో స్నానం చేసినట్లయితే వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. వారి కోరికలు నెరవేరుతాయి. ఈ తీర్థం శ్రీవేంకటేశ్వరస్వామి కోవెలకు సుమారుగా 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.
ఆకాశగంగ తీర్ధం
ఈ తీర్థ ప్రాముఖ్యతను స్కాంధపురాణం తెలిపింది. అంజనాదేవి ఈ తీర్థంలో స్నానమాచరించి ఇక్కడ తపస్సు చేసి వాయుదేవుడు ప్రసాదించిన ఫలాన్ని తిన్న తర్వాత గర్భంధరించి, ఆంజనేయునికి జన్మనిచ్చిం దని పురాణం ద్వారా వివరిం చబడింది. ఈ కొండ మీద అంజనాదేవి తపస్సు చేయడంవల్ల ఆంజనేయునికి జన్మనివ్వడం వల్ల దీన్ని అంజనాద్రిగా పిలుస్తారు. ఆకాశగంగ తీర్థం గురించి ఒక కథ ఉంది. పూర్వం శ్రీశైలపూర్ణుడు పాపవినాశన తీర్థం నుండి స్వామివారికి అభిషేక జలాన్ని తెచ్చేవాడు. స్వామివారిపై అతనికున్న భక్తిశ్రద్ధలను గుర్తించిన తిరుమలేశుడు ధనుస్సు, బాణాలతో ఒక కిరాతకుని రూపం ధరించి శ్రీశైల పూర్ణుడు ప్రతిరోజూలాగానే పాపవినాశనం నుంచి పవిత్ర తీర్థజలం తెస్తూంటే అతనికి అడ్డు నిలిచి తనకు అమిత దాహంగా ఉందనీ, ఆ నీటితో తన దాహాన్ని తీర్చమనీ ప్రాధేయ పూర్వకంగా అడిగాడు. శ్రీశైలపూర్ణుడు ‘ఆ జలాన్ని పాపవినాశనం నుంచి స్వామి వారి అభిషేకా నికి తీసుకువెళ్తున్నాని, అది మానవుల కోసం కాదనీ, అతనికి నీరు ఇవ్వలేని తన నిస్సహాయతను తెలిపి ముందుకు అడుగులు వేశాడు. వెనుకనే వస్తున్న కిరాతకుని రూపంలో ఉన్న శ్రీనివాసుడు బాణం చేసి మట్టికుండకు రంధ్రం చేసీ, ఆ కుండలోని ఉదకాన్ని తాగేవాడు. ఆ ఘటం బరువు తగ్గడం గమనించిన శ్రీశైలపూర్ణుడు కుండకు రంధ్రం ఉండటం గమనించారు. “భగవంతునికి సమర్పించవలసిన జలాన్ని నువ్వు తాగేసి అపచారం వేశావు” అని బాధ పడుతున్న శ్రీశైలపూర్ణుడితో “దాహాన్ని తట్టుకోలేక ఆ పని చేశాను. అయినా నువ్వు విచారించవలసిన పని లేదు. ఇక్కడకు దగ్గరలోనే ఒక తీర్థం ఉంది. అందులోని జలాన్ని తీసువెళ్ళి స్వామివారి అభిషేకానికి సమర్పించవచ్చు” అన్నాడు. కిరాతకుడు.
కిరాతకుడి మాటలు విన్న అతను ఆ కిరాతకుని వెంట జలం తేవటానికి వెళ్లాడు. అతను శ్రీశైలపూర్ణుడిని ఆకాశతీర్థం వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ తీర్థం లేకపోయేసరికి అతను ఒక గడ్డిపోచను తీసి బాణంగా చేసి కొండ మీదకు విసిరాడు. అక్కడ నీరు ఉబికి ధారగా క్రిందకు రాసాగింది. “ఇది ఆకాశగంగానదిలోంచి వచ్చే జలం. ఇక ఈ తీర్థాన్ని ఆకాశగంగా తీర్థం అని పిలుస్తారు. దీన్నే శ్రీవేంకటేశ్వర స్వామి అభిషేకానికి ప్రతి రోజూ తీసుకువెళ్ళు. ఇందులోని జలం ఎంతో పవిత్ర మైనదిగా భావించబడుతుంది” అని చెప్పి వెళ్ళిపోయాడా కిరాతకుడు. ఇక్కడ పితృకార్యాలు కూడా చేస్తారు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు చిత్తా నక్షరంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థంలో మరికొన్ని తీర్థాలు వచ్చి చేరుతాయి. కనుక ఆ రోజున ఆకాశగంగ తీర్ధంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ఈ ఆకాశగంగ తీర్ధం తిరుమలేశుని ఆలయానికి సుమారుగా అయిదు కిలోమీటర్ల దురంలో ఉంటుంది.
పాండవతీర్థం
ఈ పాండవ తీర్థాన్ని గోగర్భ తీర్థం అని కూడా చెప్తారు. ఇది గోగర్భ డ్యామ్కు కిందగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే పాండవులు నివసించినట్లుగా తెలుస్తోంది. పాండవులు రాజ్యాన్ని వీడి ద్రౌపదితో కలిసి శ్రీకృష్ణుడి సలహా ప్రకారంగా ఈ క్షేత్ర తీర్థం వద్దకు వచ్చి ప్రతిరోజూ తీర్థంలో స్నానం ఆచరిస్తూ శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించే వారు. ఇక్కడ వారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించి రాజ్యాన్ని దక్కించుకున్నారు. పాండవులు నివసించి స్నానమాచ రించిన తీర్థం, స్వామిని వారు కొలిచినందున ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు ఏర్పడింది. ఈ గోగర్భజలం తిరుమలకు చేరుతోంది. వృషభమాసం, శుద్ధ ద్వాదశి ఆదివారంనాడు లేదా బహుళ ద్వాదశి మంగళవారం నాడు ఈ తీర్థపు జలంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పోయి పుణ్యం లభిస్తుందని భక్తుల పరిపూర్ణ నమ్మకం. పాండవ తీర్థ సమీపంలో ఒక రాయి రెండు ముక్కలుగా విడిపోయింది. ఒక భాగం తీర్థ సమీపంలోనూ, రెండోది ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో ఉంది. ఈ గుండ్రాయిని దైవంగా భావిస్తూ మొక్కుకుంటే కలహాలు నివారించబడి అపార్థాలు, అశాంతి తొలగిపోతాయి. ఈ తీర్ధం శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ గంగాదేవి ఆంజనేయ స్వామి దేవాల యాలు ఉన్నాయి. పాపవినాశన తీర్థంలో స్నానం చేసిన భక్తులు ఆ ఆలయాలను దర్శిస్తారు. పేరుకు తగ్గట్టే ఈ తీర్థం పాపాలను హరిస్తుంది. ఆశ్వయుజ శుక్ల పక్షం, సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన ఆదివారంనాడు. లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన నాడు ఈ తీర్థానికి పర్వదినం. ఆ రోజుల్లో ఇతర తీర్థాలలోని జలం ఈ తీర్థంలోకి చేరుకుంటాయి. అందువల్ల ఆ పర్వదినాల్లో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనారోగ్యాలు, మానసిక అశాంతి, వేదనలు తొలగిపోయి పుణ్యం లభి స్తుంది. ఈ పాపవినాశన తీర్థం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి గుడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
శేష తీర్థం
ఈ తీర్థం లోయలో ఉంది. ఈ తీర్థానికి చేరు కోవడమన్నది సాహసోపేతమైన చర్య. ఈ క్షేత్రం ఆది శేషుని తలపిస్తుంది. పాచికాల్వ గంగమ్మ గుడి నుంచి బయలుదేరి ఆ మార్గానికి రెండు వైపులా కనిపించే లోయ లను పాచిమడుగు, అవ్వాచారి కోనలు, సున్నపురాతి కోనలు, పోలిగాడి శిలను దాటుకుని ఈ శేషతీర్థానికి చేరుకోవలసి ఉంటుంది. తిరుమలేశుని గుడికి రామకృష్ణతీర్థం దగ్గర గా ఉంటుంది.
రామకృష్ణుడనే ఋషి శేషాచలం పర్వతం మీద తపస్సు చేసాడు. ఆయన తను స్నానం చేయటానికి ఒక తీర్థాన్ని ఏర్పరచుకున్నాడు. శ్రీనివాసుడు ఆ మహర్షికి దర్శనమిచ్చి ఆయన నిర్మించిన తీర్థం ఆ ఋషి పేరుతో రామకృష్ణతీర్థంగా పిలువబడుతుందని వరమిచ్చాడు. స్వామి ఆ మహర్షిని కరుణించిన రోజు మకరమాసం, పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆ రోజు దేవతలు దిక్పాలకులు వచ్చి ఈ తీర్థంలో స్నానం చేస్తారట. ఈ తీర్థం గురించి స్కాంధపురాణంలో తెలియజేయబడింది. ఆ రోజున ఈ తీర్థంలో స్నానం చేసిన భక్తుల నేరాలు, దోషాలు నివా రింపబడుతాయి. గురువులు, తల్లిదండ్రుల అభిమానాన్ని, అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీవారి ఆలయానికి దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తీర్థం.
జాబాలి తీర్థం
తిరుమల నుంచి ఆకాశగంగకు చేరుకునే మార్గంలో ఈ తీర్థం నెలకొని ఉంది. ఈ ప్రదేశంలో జాబాలి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ తీర్థానికి ఆ పేరు వచ్చింది. హనుమంతుని పుట్టుక ఈ ప్రదేశం లోనే జరిగిందని స్థలపురాణ కథల ద్వారా తెలుస్తోంది. బాల్యంలో ఆంజనేయుడు ఇక్కడే ఉన్నట్లు, సూర్యని చూసి అది పండుగా భ్రమించి మింగబోవడం కూడా అక్కడే జరిగిందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. రావణుని సంహరించిన రాముడు పత్నీ సమేతంగా అయోధ్యకు వెళ్లేటప్పుడు ఈ ప్రాంతానికే వచ్చినట్లుగా ఓ ప్రత్యేక కథనం. స్థల మహత్యాన్ని తెలుసుకున్న జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగానూ, అప్పుడు ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం తెలియజేసింది. ఇక్కడ బాలాంజనేయస్వామి ఆలయ ఉంది. చైత్రపౌర్ణమి నాడు హనుమజ్జయంతి పర్వదినాన్ని ఇక్కడ జరుపుతారు. తిరుమలేశుని సన్నిధికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ తీర్ధం ఉంది. ఈ తీర్థాన్ని జాపాలి, జాడాలి అన్న పేర్లతో పిలుస్తారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే ఆధ్యాత్మిక భక్తి భావనలు పెరుగుతాయి. భగవంతునికి భక్తి మార్గం ద్వారా చేరువై ఆయన అనుగ్రహన్ని పొందుతారని భక్తులు విశ్వాసం. గ్రహబాధలు, గాలి, ధూళి (దెయ్యాలు), భూతాలు) తొలగిపోతాయని చెప్తారు.
కపిల తీర్ధం
పూర్వం భగీరథుడనే చక్రవర్తి శివుని తపమాచ రించి ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. గంగానదిని తెచ్చే ప్రయత్నంలో గంగానది పాతాళలోకానికి భోగవతి’ అన్న పేరుతో చేరుకుంది. ఆ నదీతీరంలోనే కపిల మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజాభిషేకాలను చిత్తశుద్ధితో భక్తిశ్రద్ధలతో చేస్తుండేవాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పాతాళ లోకంలోని శివలింగం పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి వచ్చేసింది. ఆ లింగం మరింత పెరగకుండా బ్రహ్మ దేవుడు ధేనువు ఆకారం దాల్చి కాలిగిట్టలతో లింగాన్ని తొక్కి పెట్టినట్లు ఆ లింగం పైభాగాన ధేనువు గిట్టల గుర్తులు స్పష్టమవుతాయి. ఈ కపిలేశ్వర మహాలింగం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. భోగవతి గంగ కూడా శివలింగంతోపాటు పైకి ఉబికి వచ్చింది. దాన్నే కపిల తీర్ధంగా చెప్తారు. ఈ తీర్థప్రాంతంలో శ్రీకపిలేశ్వరస్వామి, దేవేరి కామాక్షితో కలిసి భక్తులకు తన దర్శనాన్ని ప్రసా దిస్తారు. ఇక్కడ ఉమాదేవితోనూ, స్కంధునితోనూ కలిసి ఒకే పీఠంలో ఉత్సవమూర్తి ఉండటంవల్ల ఆయనకు సోమాస్కంధమూర్తి అన్న పేరు ఏర్పడింది. ఈ కపిల తీర్థాన్ని గురించి అనేక కథలు ఉన్నాయి. వకుళమాత పద్మావతిదేవిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయాల్సి ఉందిగా ఆమె తండ్రిని కోరాలని వెళ్తూ తన కోరిక నెరవేరాలన్న ధ్యేయంతో ఈ కపిల తీర్ధంలో స్నానం చేసిందట. అగ్నిదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి శివలింగా నికి పూజాభిషేకాలు నిర్వర్తించడంతో ఇక్కడి శివలింగానికి ఆగ్నేయలింగం అన్న పేరు ఏర్పడినట్లుగా పురాణకథనం. ఈశ్వరుడు తాను వేంకటాచలంలో ఉంటానని విష్ణువును కోరాడు.
అప్పుడు విష్ణుమూర్తి వేంకటాచల పర్వతపు ఆగ్నేయమూలగా ఉండమని ఆదేశించారట. విష్ణుమూర్తి ఆదేశానుసారంగా కపిల తీర్థ సమీపాన శివుడు ఇక్కడ ఉండటం వల్ల ఆ లింగం ఆగ్నేయలింగంగా పేరు పొందింది. అలిపిరికి దిగువన ఉన్నది ఈ కపిల తీర్ధం. ఈ తీర్థం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల నుండి ఉద్భవించి తిరుమల కొండల మీదుగా ప్రవహించి తిరుపతికి చేరు కుంటుంది. అచ్యుత దేవరాయలు ఈ తీర్థం చుట్టూ నాలుగువైపులా నాలుగు సుదర్శన చక్రాల రాళ్ళను నాటి దానికి చక్ర తీర్థమని పేరు పెట్టారని చరిత్రాధారాలతో తెలుస్తోంది. దీన్నే సుదర్శన చక్రత్తాళ్వార్ తీర్ధం అని పిలుస్తున్నారు. శైవులు ఈ తీర్థాన్ని కపిల తీర్ధంగానూ, వైష్ణవులు ఆళ్వార్ తీర్ధంగానూ చెప్తారు. కపిలతీర్థంలో పితృకర్మలు, పిండ ప్రదానాలు, ఇతర దానాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. ఆశీర్వ దిస్తారు. కోనేటికి దక్షిణంవైపుగా శ్రీవేణుగోపాలస్వామి దేవేరులు రుక్మిణి, సత్యభామల సమేతంగా ఆలయంలో భక్తులకు తన దర్శనాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ శ్రీలక్ష్మీ నారాయణుని ఆలయం కూడా ఉంది. కపిల తీర్ధంలో స్నానం చేస్తే ఏడుకొండలను ఎక్కి స్వామిని సునాయా సంగా అలసట లేకుండా దర్శించుకోగలమని భక్తుల నమ్మకం. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పోయి పుణ్యం లభిస్తుంది. భగవంతుని అనుగ్రహం పొందుతారు. కోరికలు మొక్కులు తీరుతాయి.
శక్రతీర్థం:
కపిల తీర్థానికి పైభాగాన ఉంది శక్రతీర్థం. శక్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు గౌతమి మహర్షి భార్యతో సంగమించిన పాపాన్ని తొలగించు కోవటానికి గాను ఈ తీర్థంలో స్నానమాచరించాడు. శక్రుడు నివసించిన ఈ తీర్థానికి చక్రతీర్థం అన్న పేరు ఏర్పడింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు దోషాలు నివారింప బడుతాయని భక్తుల నమ్మకం.
విష్వక్సేన తీర్ధం
శక్రతీర్ధానికి సమీపంలో ఉంది ఈ తీర్థం. వరుణ దేవుని పుత్రుడయిన విష్వక్సేనుడు ఇక్కడ తపస్సు ఆచరించాడు. అతని భక్తికి ప్రసన్నుడై విష్ణుమూర్తి దర్శన మిచ్చాడు. అతనిని తన సేనాధిపతిగా నియమించి విష్వక్సేనునికి శంఖు, చక్రాయుధాలను ప్రసాదించాడు. ఆ తీర్థం వరుణుని కుమారుని పేరు మీద విష్వక్సేన తీర్ధం అన్న పేరు మీద ప్రసిద్ధి చెందింది.
పంచాయుధ తీర్థాలు
విష్ణుమూర్తి ఆయుధాలయిన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనుస్సు వేరువేరు ప్రాంతాల్లో శ్రీమహా విష్ణువును గురించి తపస్సు చేశాయి. వాటి తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై వాటిని అనుగ్ర హించాడు. అవి తపస్సు చేసిన స్థలాలే వాటి పేర్లతో తీర్థాలుగా ఏర్పడ్డాయి. శంఖతీర్థం, చక్రతీర్థం, గదాతీర్థం, నందక తీర్ధం, ధనుస్తీర్థంగా ఆ తీర్థాలు పిలువబడ్డాయి. ఈ పంచాయుధ తీర్థాలలో స్నానం చేసిన భక్తులకు శత్రుభయం ఉండదు. పాపాలు తొలిగిపోతాయి.
అసల తీర్థం
పూర్వం అగ్నిదేవుడు ఉదరంలో నొప్పితో బాధ పడసాగాడు. తన అనారోగ్యాన్ని పోగొట్టుకోటానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు. అప్పుడు ఆయన బాధ తొలగి పోయింది. అందువల్ల ఈ తీర్థాన్ని అనల తీర్థమనీ, అగ్ని తీర్థమనీ అంటారు. ఈ తీర్థంలో స్నానం చేసే వారికి ఆరోగ్యం పెంపొందుతుందని చెప్తారు. అనారోగ్యాలు తొలగిపోతాయి.
సనకసనందుల తీర్థం
బ్రహ్మ మానస పుత్రులు సనకసనందులు. వీరిద్దరే కాక ఎందరో మహర్షులు పరమేశ్వరుని గురించి ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. ఇక్కడ వారు పరమేశ్వరుని అనుగ్రహం పొందటంతో ఈ తీర్థానికి సనకసనందుల మహర్షుల పేరు వచ్చింది. ఈ తీర్థం పాపవినాశనం డ్యామ్కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.
బ్రహ్మతీర్థం
అగ్ని తీర్థానికి ఎగువగా ఉంటుంది బ్రహ్మతీర్థం. ఇక్కడ బ్రహ్మదేవుడు నారాయణుని గురించి తపస్సు చేశాడు. శ్రీహరి బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై ఆయన కోరిక ప్రకారంగా సృష్టి కార్యానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా నిరాటంకంగా కొనసాగేటట్లుగా వరం పొంది నట్లుగా తెలియచేయబడింది. బ్రహ్మదేవుడు తపమాచ రించిన కారణంగా దీనికి బ్రహ్మతీర్ధమనే పేరు కలిగింది. ఈ తీర్థంలో స్నానం చేసిన భక్తులకు బ్రహ్మహత్యాపాతకం, ఇతర దోషాలు తొలగిపోతాయి.
త్రిమూర్తి తీర్థాలు
కపిల తీర్థానికి వాయువ్య దిశలో పెద్ద గూళ్ళల్లాగా మూడు దొన్నెలు ఉంటాయి. వాటి ద్వారా నీరు ప్రవహిస్తూ ఆ జలం కపిలతీర్ధంలో కలుస్తుంది. ఆ మూడు దొన్నెలను త్రిమూర్తులుగా భావిస్తూ వాటిని బ్రహ్మ గుండం, విష్ణుగుండం, మహేశ్వర గుండంగా పిలుస్తారు. మూడు దొన్నెలు ఒకే చోట ఉండడంతో ఈ తీర్థానికి త్రిమూర్తుల తీర్థాలు అనే పేరు ఏర్పడింది. కపిలేశ్వరుని అభిషేకించటానికి మహేశ్వర గుండంలోని నీటిని ఉపయోగిస్తారు.
అస్థి తీర్ధం
పూర్వం కృష్ణ శర్మ అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను తీసుకుని గర్భవతి అయిన తన పత్ని, కుమారు నితో కాశీ పట్టణానికి బయలుదేరాడు. గంగానదిలో స్నానం చేసి తండ్రి అస్థికలను ఆ పుణ్యనదిలో కలిపి పితృకార్యం నిర్విఘ్నంగా నెరవేర్చాలనుకున్నాడు. అతను తొండమాన్ రాజును దర్శించాడు. “మహారాజా! నా భార్య గర్భవతి. నా కుమారుడు చిన్నవాడు అవడం వల్ల వీరు ప్రయాణించడం దుర్భరమవుతుంది. వీరిని వెంట పెట్టుకుని కాశీకి వెళ్ళలేను. అందువల్ల నా భార్యను, పుత్రుడిని మీ వద్ద ఉంచి నేను కాశీకి వెళ్ళి పితృకార్యాలను నిర్విఘ్నంగా నిర్వహించి వస్తాను అంతవరకూ దయ ఉంచి మీరు వారి పోషణ, రక్షణ బాధ్యతలను స్వీకరించ మని ప్రాధేయపడుతున్నాను” అని వేడుకున్నాడు కృష్ణశర్మ, అందుకు తొండమానుడు అంగీకరించి ఆ బ్రాహ్మణుని ఇల్లాలిని, కొడుకును ఒక గృహంలో ఉంచి వారికి ఆరు నెలలకు సరిపడే పచారీ సామానులను వస్తుసామగ్రిని అమర్చాడు. వారిని బయటకు రావద్దని చెప్పాడు. ఆ రాజు రాచకార్యాలతో నిమగ్నుడై బ్రాహ్మణుని భార్య, పుత్రుని విషయాన్ని విస్మరించేశాడు. కృష్ణశర్మ కాశీకి చేరుకుని తన జనకుని అస్థికలను కాశీలోని గంగానదిలో కలిపి గయకు వెళ్ళి శ్రాద్ధము పెట్టి పితృ కార్యాలను నిర్వర్తించాడు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ రెండు సంవత్సరాలకు తిరిగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుని చూడగానే తొండమాన్ రాజుకు అతని భార్య, పుత్రుడు గుర్తుకు వచ్చారు. కృష్ణశర్మతో అతని భార్య బిడ్డలు క్షేమంగానే ఉన్నారని చెప్పాడు. కానీ అతని భార్యాబిడ్డలు మరణించి ఆ గృహంలో వారి అస్థికలు మాత్రమే మిగిలాయి. రాజు ఎంతో దుఃఖితుడయ్యాడు. వారు ఆకలిదప్పులతో మర ణించి ఉంటారని, తాను మహాపాపినని ఎంతో వ్యధతో చిత్తక్షోభను అనుభవించాడు. అతని మానసిక బాధను గుర్తించిన శ్రీవేంకటేశ్వరస్వామి “వారి అస్థికలను తీర్ధంలో ముంచమని” ఆదేశించాడు. స్వామి ఆదేశానుసారంగా ఆలయానికి తూర్పు దిశన ఉన్న తీర్థంలో అస్థికలను ముంచాడు. ఆశ్చర్యంగా ఆ అస్థికలు మాయమై కృష్ణశర్మ భార్య, పుత్రుడు సజీవులయ్యారు. అందువల్ల ఆ సరోవరానికి ఆ తీర్ధమనే పేరు వచ్చింది. శారీ కలియుగంలో ఆ తీర్థం కనుమరుగైంది. నేడు ఆ అస్థితీర్థం కనిపించలేదు.
*స్వామి పుష్కరిణీ తీర్ధం
ఈ తీర్థం శేషపర్వతం మీద ఉంటుంది. ఇది స్వామి వారి ఆలయానికి ఈశాన్నిదేశగా ఉంటుంది. స్వామి ఉండే ప్రదేశంలో నెలకొని ఉండడం పట్ల దీనికి స్వామి పుష్కరిణీ తీర్ధం అనే పేరు వచ్చింది. తిరుసులలోని స్వామి పుష్కరిణీ తీర్ధంలో పవిత్రంగా శక్తి భారంతో స్నానం చేస్తే సర్వతీర్థాలలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని బ్రహ్మ తెలిపినట్లుగా నామన పురాణంలో లిఖించబడింది. శ్రీవేంకటేశ్వర స్వామి తన దేవేరులైన శ్రీదేవి, భూదేవితో కలిసి ఈ పుష్కరిణిలో ఎలకాలాకు తాడని చెప్పబడింది. మార్గశిర శుక్ల పక్షంలో ద్వాదశి తిథినాడు ఉదయం సమయంలో ఇక్కడ పర్వోత్సవం జరుపబడుతుంది. ఈ పుష్కరిణికి ఉత్తర దిశగా వరాహ స్వామి కొలువై ఉంటాడు. ఆ ఆలయపు ముందుభాగాన్ని ‘వరాహ పుష్కరిణి’గా చెప్తారు.
కాయరసాయన తీర్థం
తెల్లని ఆకును ఈ తీర్థంలో వేస్తే అది నీలి రంగులోకి మారిపోతుందని చెప్తారు. ఈ తీర్థంలో స్నానం చేసే వారికి మునులు, యోగులు తమ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఆనాటి పెద్దలు విశ్వసించేవారు. ఈ తీర్థం స్వామి దేవాలయానికి సుమారుగా మూడున్నర మైళ్ళు. దూరంలో ఉంటుంది. సనకసనందన తీర్ధం నుంచి అది పాయగా చీలుతుంది. ఇందులో స్నానమాచరిస్తే మానసి శక్తి, దేహారోగ్యం పెరుగుతాయని భక్తుల పరిపూర్ణ నమ్మకం.
ఒక కథా రచయిత, కథ రాయాలని సంకల్పించినప్పుడు అది సమాజపరంగానో లేదా వ్యక్తిపరంగానో
కావలసిన, రావలసిన మంచి మార్పులకు ప్రతిబింబంగా తన కథ ఉండాలని ప్రయత్నం చేస్తాడు అలా చెయ్యాలి కూడా అప్పుడే ఆ కథకు సార్ధకత
ఉంటుంది. కిరణ్ కుమార్ గారి కథలను పరిశీలించినప్పుడు మనిషిలో ఉన్న మంచిని పైకి తెచ్చే ప్రయత్నంతో పాటు, సమాజంలో జరిగే కొన్ని అరాచకాలను ఖండించడంలో తన కథ ప్రతిబింబంగా ఉండాలి అన్న ధ్యేయం మనకు ప్రస్ఫుటమవుతుంది.
“రాధా అరవిందం”ఈ కథకు పేరు కథలోని పాత్రలతో పెట్టబడింది.
కథలోముఖ్యపాత్రులు మూడు రాధ, అరవింద్, నిషా. అరవింద్ ప్రేమించిన వ్యక్తి రాధ. అరవింద్ పెళ్లి చేసుకున్నా వ్యక్తి నిషా.
మానవ తప్పిదాల పరంగా చూస్తే అరవిందుకు ప్రేమ ఒకచోట,పెళ్లి ఒకచోట.
ఇది వివాహ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపం అనవచ్చు.
తత్పలితంగా వచ్చే అనర్థాలు తక్కువేమీ కాదు. వాటిని వివరించేదే ఈ కథ అరవింద్ రాధను ప్రేమిస్తాడు. సోషల్ మీడియాలో ఎవరో చేసిన పనికి రాధను అనుమానించి వద్దనుకొని మరొకరిని వివాహం చేసుకోవడం అరవింద్ చేసిన మానవ తప్పిదం. ఇది మన వివాహ వ్యవస్థలో ఉన్న లోపం.
ప్రేమకు నిర్వచనం నమ్మకం, అంకితం.
తనను తాను మరొకరికి ఆర్పించుకోవాలి. పూర్తిగా నమ్మకంతో తన జీవితంలోకి ఆహ్వానించాలి.
ప్రేమించిన వ్యక్తి పైన అపనమ్మకపు నీడ కూడా పడకూడదు.
కానీ తాత్కాలిక ఇష్టాన్ని ప్రేమ అనే పేరుతో భ్రమించడం నాటి నుండినేటివరకు సమాజంలో జరుగుతున్న ఒక దురదృష్టకర విషయం.
వివాహానంతరం భార్యకు అరవింద్ ఇంట్లో చోటు ఉన్నది గాని మనసులో మాత్రం రాధకే ఓటు.
ఇది అరవింద్ చేసినరెండో తప్పిదం.
ఫలితంగా అరవింద్ రహస్య ప్రేమ నిషా ప్రాణాలకు ముప్పు కరిగించేదాకా వచ్చింది. చివరకు రాధ ప్రాణ త్యాగం చేసి తన ప్రేమకు ప్రాణం పోశానని, అరవింద్ నిషాల దాంపత్యం దానివల్ల బాగుంటుందని ఊహించడం మనిషికి ఆత్మవిశ్వాసాన్ని క్షీణింప చేసి, ఆత్మహత్యలకు ప్రోత్సహించడం లాగ ఉంది.
రాధ లేనంతా మాత్రాన నిషాలో ఏర్పడ్డ శూన్యత మాసి పోతుందా?
తనదైన చోటును మరొకరు ఇంతకుముందే ఆక్రమించి ఉన్నారన్న భావన నిషాలో నిమిషాల మీద ఎగిరిపోవడానికి ఇది తన ఇష్టం వచ్చినట్టు రాయించుకున్న సినిమా కథకాదు. సినిమాలో ప్రజాకర్షణ కోసం ఉండవచ్చు.
కానీ కథరాసే రచయిత అలా చూపించడు చూపించకూడదు.
ఈ కథా రచయిత కిరణ్ కుమార్ గారు ఈ కథ రాసే ముఖ్యోద్దేశం సోషల్ మీడియా చేసిన దుర్మార్గాన్ని బయటపెట్టాలి అనుకోవడమే.
కానీ దానితో పాటు మరోకొన్ని జీవిత సత్యాలను తన కథలో ఆవిష్కరింపజేశారు. అవి_ స్త్రీ పురుషులిరువురి కి ప్రేమ పెళ్లి రెండు ఒక్కటే. రెండు కాదు.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకో లేకపోతే పెళ్లి మానుకో. రెండు పడవల మీద ప్రయాణం నాలుగు జీవితాలకు అశాంతి.
నమ్మకానికి మరో పేరు ప్రేమ. అన్నిటికీ పరిష్కారం ఆత్మహత్య కాదు. రాధా లాంటివారు చేయాల్సిన ఆలోచన ఏవిటంటే, తన మంచితనంతో,
నిషా అనుమానాలను, ఆవేదనను అంతం చేయడం రాధ లాంటి వ్యక్తి చేయాల్సిన మంచి మార్గం,తన నిర్ణయాల ద్వారా,
మాటల ద్వారా అరవింద్కు తన హృదయంలో పూర్వ స్థానం తొలగించి సోదర భావన ఆవిష్కరిస్తే ఆ దాంపత్యం ఆరు పువ్వులు పన్నెండు పండ్లుగా. వర్ధిల్లుతుంది.
రాధ ఆత్మహత్య వల్ల అరవింద్ మనసులోని రాధా చనిపోదు కదా. ఆ భావన నిషాను ప్రతి నిమిషం బాధిస్తూనే ఉన్నప్పుడు
వారి దాంపత్యం రాధ కోరుకున్నట్లు హాయిగా జరుగుతుందా?
కథ చెప్పి విధానాల్లో ఇది ఒక పద్ధతి. కలిగే నష్టాలు కళ్ళ ముందు పెడితే మనిషిమారతాడని, మారాలని ఈ కథ రచయిత, డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారు ఈ పద్ధతిలో మనకు కథను అందించారు.
దానితోపాటు నేడు జరుగుతున్న సోషల్ మీడియా లోని అకృత్యాలను, అఘాయిత్యాలను ఖండిస్తూ వాటి వల్ల ఎన్ని జీవితాలు నాశనమవుతున్నాయి అని ఈ కథ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు కిరణ్ గారు. సెల్లులో అసభ్య శృంగారాలు, స్నేహి తాలు, ఆకృత్యాల వల్ల మంచి జీవితాలు మాడిపోతున్న విషయాన్ని ప్రభుత్వాలు, ప్రజలు ఇప్పటికైనా గ్రహించి నిగ్రహించాలి. అని కిరణ్ కుమార్ గారి ఈ కథ గొంతెత్తి చెబుతున్నది.
వ్యక్తి పరంగా, సమాజ పరంగా, వివాహ వ్యవస్థ పరంగా ఈ కథ అందరికీ మేలుకొలుపు. చక్కటి కథ మనకు అందించిన కిరణ్ కుమార్ గారు అభినందనీయులు.
మీ జననం మరియు కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
నేను పుట్టింది1967లో. మాది ఉమ్మడి మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామం. మాది స్వర్ణకారుల కుటుంబం. చిన్నతనంలోనే మా నాన్నగారు పరమపదించడంతో మా కుటుంబం చాలా కష్టాలను అనుభవించింది. మా అమ్మే పూర్తిగా మా ఆలనా పాలనా చూసింది.
మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
మా నాన్న చనిపోయిన అనంతరం చాలామంది మా అమ్మతో నన్ను ఏదైనా పనిలో పెట్టమని అన్నారు. కానీ మా అమ్మ చదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా నమ్మి నన్ను పాఠశాలలో చేర్పించింది. ఆమె ప్రోద్బలంతోనే నేను చదువు కొనసాగించాను. ఏడవతరగతి వరకు అల్లీపూర్ లోనే చదువుకున్నాను. ఎనిమిది నుండి పదవ తరగతి వరకు సిద్దిపేటలో చదువుకున్నాను.ఇంటర్మీడియట్,డిగ్రీ నిజామాబాద్ లో పూర్తి చేశాను. అనంతరం బి.ఇడి పూర్తి చేశాను.
మీ ఉద్యోగ ప్రస్థానం గురించి చెప్పండి.
1995 లో ఉపాధ్యాయుడిగా నా ఉద్యోగ ప్రస్థానం కల్హేర్ మండల్ లోని మీర్ ఖాన్ పేట్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమైంది. అనంతరం వడ్డేపల్లికి బదిలీ అయ్యాను. తరువాత ఇర్కోడుకు వచ్చాను,తదుపరి సికింద్లాపూర్ లో విధులు నిర్వహించి చివరిగా ఓబులాపూర్ లో రిటైరయ్యాను.
మీరు సాహిత్యం వైపు అడుగులు వేయడానికి ప్రేరణ ఎవరు?
మేము ఐదుగురం అన్నదమ్ములం ఒక అక్కయ్య. ఇందులో పెద్దన్నయ్య 18 సంవత్సరాలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించాడు. ఆయన కథకుడు. ఆయన కథలు పత్రికల్లో కూడా అచ్చయ్యాయి. ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. నేను కూడా ఎందుకు కథలు రాయలేను అనే ఆలోచన మా అన్నయ్యను చూసినప్పుడు కలిగింది కానీ అడుగులు ముందు పడలేదు. అయినప్పటికీ రాయాలన్న దృఢ సంకల్పం మాత్రం నాకు అన్నయ్య నుండే వచ్చింది. నాకు ప్రేరణ ఆయనే.
మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పండి
నేను చదువుకుంటున్న సమయంలో మా ఊరిలో వాణి గ్రంథాలయం ఉండేది అది మా చిన్నాన్న ఆధ్వర్యంలో నడిచేది. అందులో దాదాపు 700 పుస్తకాలు, రకరకాల మ్యాగజైన్లు, వివిధ రకాల పత్రికలు ఉండేవి. నేను రోజు వెళ్లి వాటిని తెచ్చుకుని బాగా చదివే వాడిని.ఎంతగా అంటే అప్పట్లోనే నేను 600 పుస్తకాలవరకు చదివేశా.అలా పుస్తకాలు చదవడం వల్లే నాకు వాక్యనిర్మాణం పైన పట్టు దొరికింది. కథలను, నవలల్ని ఎలా రాయాలో ఏ విధంగా పాత్రలను ప్రవేశపెట్టాలో, డైలాగ్స్ ఏ విధంగా ఉండాలో తెలిసింది. ఆ సమయంలో నన్ను కకుభ గారి “జీవితమంటే ఏమిటి”నవల తీవ్రంగా ప్రభావితం చేసింది.అది చదివి దాన్నుంచి స్పూర్తి పొంది కచ్చితంగా నేనుకూడా నవల రాయాలని అనుకున్నాను.
నేను నిజాంబాద్ లో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక కామర్స్ లెక్చరర్ ఉండేవారు.ఆయన పేరు గన్ను కృష్ణమూర్తి.వారు ప్రముఖ కవి.ఆయన ఇటీవలే మరణించారు.వారు విమర్శనాత్మకంగా,చిక్కగా రాసేవారు. ఆ సమయంలో నేను అడపాదడపా కవితలు, కథలు రాసేవాడిని. అవి ఒకసారి వారికి చూపించాను. వారవి చూసి బాగున్నాయి ఇలాగే కొనసాగించు అని చెప్పారు. అప్పటినుంచి ఇంకా బాగా రాయడం పైన దృష్టి పెట్టాను. ఒకసారి కాలేజీలో కవితలు, వ్యాసరచన పోటీలు జరిగాయి. అందులో నేను పాల్గొన్నాను. అందులో ప్రథమ బహుమతి వ్యాసానికి,కవిత్వానికి రెండో బహుమతి వచ్చింది.నేను కవిత్వానికి మొదటి బహుమతి వస్తుందనుకున్నాను దానికి రెండో బహుమతి రావడానికి కారణం ఏంటి అని అడిగాను. అప్పుడు సార్ గారు మీ కవిత నెగటివ్ గా ముగిసింది అలాకాకుండా ఎప్పుడూ పాజిటివ్ గా ముగియాలి అని చెప్పారు. అప్పటి నుంచి కవితలు ,కథలు బ్యాలెన్డ్స్ గా రాయడం మొదలెట్టాను.
నా మొదటి కవిత 1982 లో” ఆంధ్రభూమి “లో అచ్చయింది. అనంతరం చాలా కవితలు కథలు అచ్చయ్యాయి.అప్పట్లో నేను చాలా పత్రికలకు ఉత్తరాలు రాసేవాడిని.అవి ప్రచురితమయ్యేవి కూడా. ఒకసారి నేను రాసిన మొదటి ఉత్తరం ఆంధ్రభూమిలో అచ్చయ్యింది. అప్పుడు నన్ను మా ఊర్లో అందరూ మెచ్చుకున్నారు. అది నాకు ఒక మంచి గుర్తింపునిచ్చింది. నాలో ఆత్మవిశ్వాసం పెంపొందింది.ఉత్తరాలు రాయడం ద్వారా నాకు మంచి రచనా శైలి అలవడింది. రాయడం,రాసినవి ప్రచురితమవడం నాకు ప్రేరకాలుగా ఉండేవి.అలాగే నా మిత్రులు రంగారావు,చంద్రం లాంటి వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు.
శ్రీ శ్రీ గారు చనిపోయిన రెండు సంవత్సరాలకు 1985 లో ఆయన స్మృతిగా ఓ కవిత రాశాను. అది “ఆంధ్రజ్యోతి” లో ప్రచురితమై నాకు మంచి పేరుతో పాటు 30 రూపాయలను తీసుకొచ్చింది. అప్పటినుంచి రాయడంలో నాకు వేగం పెరిగింది. కవితలు రాసే సమయంలోనే కథలు కూడా రాశాను. మొదటగా సినిమా రంగంపై వ్యంగంగా రెండు కథలు రాశాను. అవి “మయూరి” పత్రికలో అచ్చయ్యాయి. అలాగే స్వాతి వీక్లీ లో 8 కథల వరకు అచ్చయ్యాయి. 1994లో ఆంధ్రప్రభ పెట్టిన సంక్రాంతి కథల పోటీలో” వారసత్వం “అనే కథ రాశాను. దానికి చాలా మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వారసత్వం సుధాకర్ అని పిలిచేవారు .అది నాకు అమితానందాన్ని ఇచ్చింది. అది గంగిరెద్దుల వాళ్ళ కథ. దీన్ని సినిమా డైరెక్టర్ వంశీ గారు కూడా కట్ చేసి తన ఫైల్ లో పెట్టుకున్నారట. ఇప్పటికి కూడా వంశీ మెచ్చిన కథలు సెకండ్ వాల్యూమ్ లో ఈ కథ ఉంటుంది.దీన్ని బట్టి నేను కూడా ప్రామాణికంగా, బాగా రాయగలుగుతానని నమ్మకం నాకు కలిగింది. నేను ఇప్పటివరకు దాదాపు 100 కథలు,8 నవలలు,3000 కవితలు రాశాను.కానీ అచ్చయినవి మాత్రం ఒక కవితా సంపుటి (శబ్ద ఋతువు),ఒక కథల సంపుటి (వెన్నెల కుప్పలు),ఒక నవల(జీవితం చేసిన సంతకం).
మీ మొదటి కవితా సంపుటి “శబ్ద ఋతువు” గురించి చెప్పండి.
నేను కవితలు రాసిన సమయంలోనే “ఎక్స్ రే”వాళ్ళు రాష్ట్రస్థాయి కవితల పోటీ పెట్టారు. అది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. అందులో నేను పాల్గొన్నాను. దానికి నేను రాసిన “వలస దృశ్యం”కవిత పంపాను. దీనికి నేపథ్యం ఏంటంటే నేను సిరిసిల్లకు వెళ్లినప్పుడు మనవాళ్ళు అక్కడ నుండి బొంబాయి మీదుగా దుబాయ్ వెళ్ళేవాళ్ళు, వారి గాథలు దయనీయంగా ఉండేవి. వాటికి చలించి నేను రాసిన కవితే “వలస దృశ్యం”. ఈ కవితను పంపగా దానికే మొదటి బహుమతి వచ్చింది.1000 రూపాయలను నగదుగా పొందాను.చాలామంది సాహితీ ప్రముఖులు మెచ్చుకున్నారు. కొంతకాలం తర్వాత నేను రాసిన కవితలను గన్ను కృష్ణ మూర్తి గారికి చూపిస్తే బయట ఎన్ని అవార్డులు తీసుకున్నా, కవితా సంపుటి మాత్రం తప్పకుండా వెలువరించాల్సిందేనని చెప్పారు. అప్పటినుండి నాకు కూడా తప్పకుండా పుస్తకం వేయాలనిపించింది కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా త్వరగా వేయలేకపోయాను.చివరికి మిత్రుల సహకారంతో 2002 లో నా మొదటి కవితా సంపుటి “శబ్ద ఋతువు” తీసుకొచ్చాను.ఆవిష్కరణకు వార్తా సబ్ ఎడిటర్ గుడిపాటి గారు కూడా హాజరయ్యారు.అన్ని ఋతువులు ఉన్నట్టుగానే మనిషికి మాట్లాడే ఋతువు ఒకటి ఉండాలని అప్పుడైనా కాస్త నోరు విప్పడానికి సిద్ధపడతాడని ఆపేరు పెట్టాను.చాలామంది చదివి రాశిలో ఇది చిన్నదైనా వాసిలో పెద్దదని మెచ్చుకున్నారు. అందులోని కవితలు ఇప్పటికి కూడా వర్తిస్తాయని చాలా మంది అప్పుడే చెప్పారు. శివారెడ్డి గారు నా కవిత్వాన్ని చదివి 50 సంవత్సరాల వయస్సులోగల కవికి ఎలాంటి పరిణతి ఉంటుందో అంత పరిణతితో కవితలు రాశావని నన్ను మెచ్చుకున్నారు.కథలు రాసినా ,నవలలు రాసినా కవిత్వాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోకు అని చెప్పారు. దాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేని ప్రశంసగా భావిస్తాను.

మీ శబ్ద ఋతువు కవిత సంపుటిలో మార్మికత తక్కువగానే ఉంది.దాని గల కారణం?
నేనెప్పుడూ సూటిగా కవిత్వం చెప్పడానికే ఇష్టపడుతాను. మార్మికతతో కూడా కొన్ని కవితలు రాశాను. కానీ ఎక్కువగా దానినే ఆశ్రయించలేదు. ఎందుకంటే అది సాధారణ పాఠకునికి అర్థం కాదు. మార్మికతను,పాండిత్యం తెలివితేటలు ప్రదర్శించడానికి,విషయం క్లిష్టంగా చెప్పడానికి ఉపయోగించవచ్చు. కానీ పూర్తిగా అందులోనే రాస్తే సాధారణ పాఠకుడు కవిత్వానికి దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే నేను విషయం స్పష్టంగా,సూటిగా ఉండే విధంగానే కవిత్వం చెప్పాలనుకున్నాను.చెప్పాను.
కవిగా జీవితం ప్రారంభించి కథా రచయితగా మరో అవతారం ఎందుకు ఎత్తాల్సివచ్చిందో చెప్పండి.
నేను కవిత్వం రాసే సమయంలోనే కొన్ని కొన్ని సంఘటనలు నన్ను కథకునిగా మార్చాయి.కవిత్వంలో చెప్పలేని విషయాలను కథల్లో చెప్పొచ్చు.కథలో కూడా కవిత్వాన్ని చూపించవచ్చు. నేను కథకుడిగా రాణించడానికి గల కారణం నా వాక్యాలు కవితాత్మకంగా ఉండడమే. ఒక పెద్ద విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు మనకు కథ, నవల సహాయపడతాయి. కాబట్టి నేను చూసిన సంఘటనలు,నన్ను కదిలించిన విషయాలు కొన్ని కవిత్వంలో ఇమడలేనివి. అందువల్లే కథలు రాయడం ప్రారంభించాను. నా మొదటి కథ 1989 లో అచ్చయింది. కథాసంపుటి మాత్రం కొన్ని కారణాలవల్ల 2011లో (వెన్నెల కుప్పలు) వెలువరించాను. ఇప్పటికీ నా దగ్గర 10-12 పుస్తకాలకు అచ్చయ్యేంత సాహిత్యం ఉంది. అది మొత్తం బయటికి రావాలంటే చాలా డబ్బు కావాలి. ఈసంవత్సరం మాత్రం ఒక పుస్తకం తీసుకొస్తున్నాను.
నేను ఈ మధ్య ఒక కథ రాసాను. దాని పేరు “తెల్లారే ముంగట సుక్క” ఇందులో విషయమేంటంటే ఒక ఊర్లో మల్లవ్వ అనే మంత్రసాని ఉంటుంది. ఆమె ఊర్లో అందరికీ కాన్పులు చేసింది;కాని ఆమెకు మాత్రం పిల్లలు లేరు. ఆ ఊరిలో రెండు మూడు తరాలు ఆమె చేతులమీదుగా పుట్టిన వాళ్లే. ఒకరోజు ఆమె చనిపోతుంది. ఆమెకు పిల్లలు లేరు కాబట్టి ఆమెకు తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో,చివరికి ఆ ఊరికి కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రెటరీ కలుగజేసుకొని తానే తలకొరివి పెడతాడు. ఈ సంఘటన ఒక ఊరిలో జరిగింది దీన్ని నేను కవిత్వంలో చెప్పలేక కథలో చెప్పాల్సి వచ్చింది.నేను ఒక చోట “కథ కాలనీ వంటిది నవల నగరం వంటిది” అని చెప్పాను. వస్తువును బట్టి చెప్పాల్సిన విషయసాంద్రత మారుతుందని దాన్నిబట్టి ప్రక్రియ మారుతుందని నా ఉద్దేశం.
మీ “వెన్నెల కుప్పలు” కథా సంపుటిలో ఉన్న కథలన్నీ అద్భుతంగా ఉంటాయి. అందులో “గంటీలమడి” కథ ఎప్పుడో రాసినా దానికి ఇప్పటికీ దానికి ప్రాసంగికత ఉంది.అలా ఎలా రాయగలిగారు?
ఒక కవి లేదా రచయిత కవిత్వమో, కథనో రాయాలంటే తను ఊహించి రాయొచ్చు లేదా ఏదైనా సంఘటన ఆధారంగా రాయవచ్చు .నేను రాసిన” గంటీల మడి” కథ అలాంటిదే. భూమిని అమ్ముకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అందుకే కొన్ని ప్రాంతాల్లో భూమిని భూతల్లి అని కూడా అంటారు.గంటిల మడి కథ కూడా నా జీవితంలో చూసి రాసిందే. కొంత కల్పన జోడించాలంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో కొంత ఊహించి రాయాలి. అలా రాసాను కాబట్టే దానికి ఇప్పటికీ ప్రాసంగికత ఉన్నదని అనుకుంటున్నాను.అలాగే “పంట పొలాలు” కథ కూడా భూమి ఇది వృత్తం గానే సాగుతుంది. ఆ కథలో ఇద్దరు ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తులు ఒకరు జాబ్ చేసి చివరికి వ్యవసాయం వైపు, ఇంకొక వ్యక్తి ఉన్న పొలాన్ని వదిలి జాబ్ వైపు పయనించాలని చూస్తారు. కానీ అతనిలో మార్పు వచ్చి మళ్లీ పొలం దగ్గరికే వెళతాడు. రైతు కంటే రాజు ఎవరూ ఉండరు కదా! . నా కథా సంపుటిలో నాకు రాష్ట్రస్థాయి బహుమతి తీసుకొచ్చిన కథ “బతుకు వాసన” . ఇందులో గొప్పగా ఎదిగిన వ్యక్తి తన మూలాలు మర్చిపోతాడు.కొంతకాలం తరువాత ఒక గాలివానలో చిక్కుకున్నప్పుడు తనకు తన మూలాలు గుర్తుకువచ్చి మళ్ళీ పేదలవైపు ఆలోచించడం మొదలుపెడతాడు. ఈమధ్య కాలంలో ఈ అంశంతో సినిమా కూడా వచ్చింది. ఎందుకంటే ఆ పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి.
మీరు కథలు రాసే సమయానికి ఇప్పటికీ సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందని భావిస్తున్నారా?
చాలా వచ్చింది. ఎడ్యుకేషన్ పెరిగింది, సామాజిక పరిస్థితులు మారాయి ,పంటపొలాలన్నీ ప్లాట్లుగా మారుతున్నాయి, సోషల్ మీడియా జీవితాలపై బాగా ప్రభావం చూపుతుంది.జీవితం కూడా యాంత్రికంగా మారిపోయాయి.
మీ సాహితీ లక్ష్యం నెరవేరిందని మీరు భావిస్తున్నారా?
మంచి సమాజాన్ని నిర్మించడమే సాహిత్యం లక్ష్యం. అందులో నా సాహిత్యం చాలా వరకు వాస్తవ జీవితాలను ప్రతిబింభించేదే కాబట్టి వాటి యొక్క ప్రభావం బాగానే ఉంటుందని అనుకుంటున్నాను.ఉదాహరణకి నేను బిక్షగాళ్ళపైన ఒక కథ రాశాను. అది చదివినవారు వారికి దానం చేయకపోవచ్చు కానీ అసహ్యించుకోరు. అదేవిధంగా తల్లిదండ్రులపై రాసిన కథలు చదవడం ద్వారా తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి,వాళ్లకి చివరి దశలో ఏం అవసరమో తెలుసుకుంటారు వారి పట్ల దృక్పథాన్ని మార్చుకుంటారు.ఇలా ఒక్కో కథ ఒక్కో ప్రయోజనాన్ని ఆశించి రాసిందే . దాని ప్రభావం ప్రత్యక్షంగానో,పరోక్షంగానో సమాజం పైన ఉంటుందని నా నమ్మకం.
మీరు రాసిన కథల్లో కొన్ని పూర్తి తెలంగాణ మాండలికాల్లో రాశారు. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? కథా రచనలో భాషా,యాసల ప్రభావం ఎంత ఉంటుంది?
దానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి భాష ప్రవేశిస్తుంది.అలాగే మన యాసలోనే చెప్తే బాగుంటుందని కొన్ని కథలను అలా చెప్పాను. కథలో భాష,యాసలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. యాసలో రాయడం వలన ఆ కథలను ఓన్ చేసుకోగలుగుతారు. అలాగని అన్ని కథలు అలాగే రాయలేము. నగరం ఇతివృత్తంగా గల కథలో యాసను అంతగా వాడలేం. కాబట్టి ఇతివృత్తాన్ని బట్టి భాషను ఎంచుకోవాలి అప్పుడే కదా!చదివేవారికి కథ మనసుకి హత్తుకుంటుంది. కథలో జీవం ఉంటుంది.
కథా రచయిత నుండి మళ్ళీ నవలా రచయితగా మారడానికి గల కారణం?
చెప్పాలనుకున్న విషయమే ఒక కారణం.నేను నవలలు బాగా చదివేవాడిని. వాటిని చదివిన తరువాత నేను కూడా ఎందుకు నవలలు రాయకూడదు అనే ప్రశ్న నాలో ఉదయించింది. అదే నన్ను నవల రాసే విధంగా చేసింది. నేను రాసిన “జీవితం చేసిన సంతకం” నవల 1991లో రాసింది. అది పత్రికలో కూడా సీరియల్ గా వచ్చి దానికి మంచి పేరు కూడా వచ్చింది. మొదటగా ఆ నవల పోటీ కోసం రాసింది; కానీ అది బయటకు రావడానికి చాలా సంవత్సరాల టైం పట్టింది. 2017 లో దాన్ని ప్రచురించాను.సీరియల్ గా రాస్తే వారం వారం ఒక మంచి ముగింపు ఉండాలి. తర్వాత వారం ఎప్పుడు వస్తుందో అనిపించే విధంగా రాయగలగాలి.అలాగే రాశాను కాబట్టి ఆ నవల ఎక్కువమంది పాఠకులకు చేరుకోగలిగింది.ఇది క్రైమ్,రాజకీయాల బ్యాగ్రౌండ్ లో జరుగుతుంది. కాబట్టి ఇది అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నవల ఒక సాధారణ వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశారు అనేది నవలలో అంశం. ఇంతపెద్ద డ్రామా కథలో చెప్పలేను కాబట్టి నవలలో చెప్పాలనిపించింది.
మీ “జీవితం చేసిన సంతకం” నవలలో ఫరీదా పాత్ర కీలకమైంది. అది ఊహించి రాసిన లేదా నిజ జీవితంలో ఎవరినైనా చూసి రాసినదా?
కొంత రియాల్టీ లోంచి రాసింది,కొంత కల్పితాన్ని జోడించి రాసింది.రాజకీయాలు చాలావరకు డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇందులో స్త్రీలు కూడా కొన్ని సందర్భాలలో కీలకంగా మారతారు.అవసరమైతే రాజకీయాలను కూడా శాసిస్తారు.వారు తెగిస్తే ఎలా ఆలోచిస్తారో, పావులు ఎలా కదుపుతారో ఈ నవలలో చూడొచ్చు.
మీ అభిమాన రచయిత ఎవరు ఎందుకు?
నా అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఆయన ఫిక్షన్ అయినా నాన్ ఫిక్షన్ అయినా ఆకట్టుకునే విధంగా రాస్తాడు. ఒక తరాన్ని తన నవలా లోకంలో విహరింపజేసిన అద్భుతమైన రచయిత.అలాగే చిక్కగా రాసేవారెవరినైనా నేను ఇష్టపడతాను.
మీరు పొందిన అవార్డుల గురించి చెప్పండి.
“కీర్తిచక్ర” సాహితీ పురస్కారం.పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారు అందించారు.
కవిత్వానికి:
సాహిత్యంలో అత్యుత్తమ సంస్థ “ఎక్స్ రే”కవిత్వ పోటీలో మొదటి బహుమతి.(1995)
1996 లో రంజనీ కుందుర్తి అవార్డు.
GVR పురస్కారం రెండుసార్లు.
కథలకు
రంజని కుందుర్తి సంస్థ వారు నిర్వహించిన కథల పోటీలో “మట్టి పండగ” కథకు మొదటి బహుమతి.
సోమెపల్లి పురస్కారం.(మొదటి బహుమతి)
గంటీలమడి కథకు జాగృతి పత్రిక వారు అందించిన బహుమతి.
ఆంధ్రభూమి పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో “బతుకు వాసన ” కథకు బహుమతి.
“రచన” సంస్థ (USA) వారు నిర్వహించిన కథల పోటీలో “ఉన్నోళ్లు”కథకు ప్రథమ బహుమతి.
“మైత్రేయి కళాసమితి” (సంగారెడ్డి) వారు నిర్వహించిన కథల పోటీలో “వారసత్వం” కథకు ప్రథమ బహుమతి.
APTF వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి.
ఉపాధ్యాయ పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో”రంగు వెలిసిన బతుకులు”కథకు మొదటి బహుమతి.
“ఆంధ్ర ప్రభ” దినపత్రిక వారు నిర్వహించిన పోటీలో “ద్వానాంతరంగం” పుస్తకం పై రాసిన విమర్శకు గాను మొదటి బహుమతి.
కొత్తగా రాసేవాళ్ళకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి?
కొత్తగా రాసే రచయితలు ముందుగా బాగా చదవాలి. ప్రాచీన సాహిత్యాన్ని ,ఆధునిక సాహిత్యాన్ని, ఇప్పుడు వస్తున్న సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి .అదేవిధంగా చిక్కగా రాయడం నేర్చుకోవాలి.నిరంతరం రాస్తూ పత్రికలకు పంపించాలి. అప్పుడు మాత్రమే కవైనా, రచయితైనా రాణించగలుగుతాడు. తన భావనా శక్తిని ఇనుమడింపజేసుకుంటారు.భవిష్యత్ తరాలకు గుర్తుండి పోతారు.
– చొప్పదండి సుధాకర్
9177348349
అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు రాము, గౌతమ్,రాజేష్ ఈ ముగ్గురు మంచి మిత్రులు ఒకరోజు రాజేష్ మిగతా ఇద్దరు మిత్రుల దగ్గరకు వచ్చి వినాయక చవితి దగ్గరకు వచ్చింది. చెందాకు తిరుగుదామా అన్నాడు. వారు సరే రేపటి నుంచి తిరుగుదాం అన్నారు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ముగ్గురు స్నేహితులు స్నానాలు చేసి చందా వసూలు చేయడానికి బయలుదేరారు. అలా కొన్ని రోజులు చందా వసూలు చేశారు. వినాయక చవితి ముందు రోజు ముగ్గురు స్నేహితులు పందిరి వేసి డెకరేషన్ చేశారు. గౌతమ్ వాళ్ళ నాన్న ట్రాక్టర్ ని తెచ్చాడు. ట్రాక్టర్లో మట్టి గణపతిని తీసుకొని వచ్చారు. గణపతి బప్పా మోరియా అనుకుంటూ పందిరిలోకి తెచ్చారు. గణపతికి కొబ్బరికాయ కొట్టారు. పూజారిని పిలిచి పూజ చేశారు. ప్రసాదం నైవేద్యం పెట్టారు. అందరినీ పిలిచి ప్రసాదం పెట్టారు. సాయంత్రం అయ్యింది. కాళ్లు చేతులు కడుక్కొని దేవుని పందిరిలోకి వచ్చారు. రాత్రి దేవుని పందిరిలోనే పడుకున్నారు. మరుసటి రోజు రాము వచ్చి మిగతా ఇద్దరి మిత్రులతో మనం అన్నదానం చేద్దామా అన్నాడు. మిత్రులు సరే అన్నారు. మూడు రోజుల తర్వాత రాము రాజేష్ గౌతమ్ ముగ్గురు మిత్రులు కలిసి అన్నదానం చేశారు. తొమ్మిది రాత్రులు గడిచాయి. పదవరోజు పులిహోర తయారు చేశారు. వినాయకున్ని ట్రాక్టర్లో పెట్టి ఎగురుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. వినాయకున్ని చెరువులో నిమజ్జనం చేశారు.
నీతి. చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను చెరువులో వేస్తే నీళ్లు కలుషితం అవుతాయి.నీటిలో ఉండే జీవులు చనిపోతాయి. కాబట్టి మట్టి వినాయకులనే పూజిద్దాం.
కవి హృదయం సున్నితమైనది. ప్రతి వస్తువులో ప్రాధాన్యతను గుర్తిస్తాడు. పువ్వులోని సువాసనలు, పక్షిలోని జీవనతత్వం, మానవ మనగడలోని ప్రతి కోణాన్ని తన కలమనే ఆయుధం ద్వారా కవిత్వీకరిస్తాడు. కొన్ని సందర్భాలలో మనసును వెంటాడే అంశాలను, భావోద్వేగమైన సంఘటనలను ఎద పొరల్లో కదిలించి వేసినప్పుడు, తను ప్రతిఘటించ లేనప్పుడు మానవత్వం గల మనిషిగా మానసికంగా ‘మరణిస్తూనే’ ఉద్యమ గీతమై, ఎగిసిపడే కెరటమై భావాల అలలా తీరం చేరడానికి ప్రయత్నిస్తాడు.
ఒక వస్తువు అందమైన రూపాన్నివ్వాలంటే లోహాన్ని నిప్పులో కాల్చి సుత్తితో కొడుతూ ఆకారాన్ని ఇచ్చి నగిషి కూర్చాలి. కవి హృదయం కూడా అంతే. అంతరంగంగా మథనం చేస్తూ సముద్ర కెరటంలా పడి లేస్తున్నట్లే కవి మనసు సమాజ హితమైన వాక్యం రాయడానికి ఓడి గెలుస్తూ, గెలుస్తూ ఓడడం వల్ల కవి ‘మరణిస్తూనే’ తన కలం ద్వారా తిరిగి జన్మిస్తూ, ఆకాశంలోని సూర్యునిలా ప్రకాశిస్తూ మానవ మనుగడకు ముందు ఉంటాడు. ఇటీవల బిల్ల మహేందర్ వెలువరించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ కవిత్వ సంపుటి కూడా మానవ సమాజ మార్పు కోసం పరితపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కవి గా ఆందోళన, సంఘర్షణకు గురవుతూ అనేక ప్రశ్నలు వేధిస్తుండగా ఆ మానసిక స్థితిని కవిత్వం చేసాడు. అలాంటిదే ‘మేం కవిత్వమే రాస్తాం’ కవితలో చూడొచ్చు. అసమానతలను రద్దు చేస్తూ, సమిష్టి ఉద్యమాల అవసరాన్ని గుర్తిస్తూ వాటి ఆశయాలకు నిబద్ధుడై కవిత్వం రాస్తాడు బిల్ల మహేందర్.
సమాజం అంటే మనుషుల సమూహం. అంటే మనిషి సమాజంలో అంతర్గతంగా ఉంటాడు. కరోనాకాలం మనుషుల మధ్య ఎడమ చూపించినప్పటికీ ఆపదలో ఒకరికొకరు అండగా ఉండాలనే ఆవశ్యకత కూడా నేర్పింది. మానవత్వాన్ని సజీవం చేసింది. కవి రాసిన ఓ కవితలో ‘చినుకు/ మట్టిలోంచి విత్తు మొలకెత్తించినట్లు/ మనిషిలోని మానవత్వాన్ని/ మొలకెత్తిస్తే ఎంత బాగుండు!?’ అంటాడు. ఇక మనిషి పువ్వై పుష్పించి మానవతా పరిమళాలను వెదజల్లాలని ఆశపడతాడు.
ఇజ్రాయిల్ బాంబుదాడులకు, సైనిక కాల్పులకు మరణించగా మిగిలిన పిల్లల లేత మనసులు భయబ్రాంతులకు గురైన సందర్భాన్ని ‘ముట్టుకుంటే ముత్యమైపోతరు కదా/ పట్టుకుంటే లేడి పిల్లలై దుంకుతరు కదా/ కదిలిస్తే పువ్వై విచ్చుకుంటరు కదా’ అంటూనే వారి మానసిక స్థితిని ”బ్రెడ్ కు రాసిన జామ్ ను చూసి రక్తమని’ భయపడిన క్షణాలను భిన్నంగా అక్షరీకరించాడు మహేందర్. బతకడమే యుద్దంగా మార్చిన వ్యవస్థను ధిక్కరిస్తాడు.

నేటి ప్రపంచీకరణ కాలంలో చదువుల వేటలో పిల్లలకు, కన్నవారికి మధ్య దూరం పెరుగుతున్నది. అలాంటి సందర్భాన్ని ‘నాలుగు పదుల వయసు దాటాక / ఖాళీ విలువ బాగా తెలిసి వచ్చింది / ఒక్క ఖాళీ పూరించడానికి వేలసార్లు మరణించేవాడిని / ఇప్పుడు నాకు ఆరుపదులు / ఇద్దరు పిల్లలు రెక్కలొచ్చి అందనంత దూరం ఎగిరిపోయాక / బతికే పూరించని ఖాళీగా మిగిలిపోయింది’ అంటాడు. చేనేత పరిశ్రమ గురించి చక్కగా వ్యథభరితంగాత ‘ఆకలి పేగుల్ని పోగులుగా పోగులుగా రాట్నంతో వడికి / కండలను కండేలుగా చేసి / ఒంటి చేత్తో పట్టు బట్టలు నేసిన బాపు / పెయ్యి మీద రోజు ఒక్కటే చినిగిన బనీనును తొడుక్కునప్పుడు / బాపు ఎందుకో నాకు నచ్చలేదు’ అంటూ తండ్రుల త్యాగాలను స్పష్టం చేశాడు.
స్త్రీ, పురుషుల సంబంధాల్లో పురుషాధిక్యతను తెలిపే కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. ‘మౌనానికి అర్థాలు వేరులే’ అన్నట్లుగానే నిశ్శబ్దానికి భావాలు అనేకం. మనం సూటిగా చెప్పలేని భావం నిశ్శబ్దానికి వదిలినట్లే కవిత్వం నిశ్శబ్దం భావాన్ని వ్యక్తీకరిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీ మెడలోని బంగారం అవసరానికి ఆయుధంగా మారే ఆర్థిక వనరు అవుతుంది. ఎన్నో, మరెన్నో సార్లు మన జీవన యానం ఆర్థిక వనరుగా మారుతుందనే విషయం ‘వసంతహారం’ కవిత తెలుపుతుంది. అంతర్జాలంలో చిక్కుకుపోయి స్మార్ట్ ఫోన్ కి వెళ్ళాడుతున్న తరం గురించి ‘గూగుల్ సెర్చ్’ లో, గాజా యుద్ధం అంతర్జాతీయ దృక్పథాన్ని మరియు దురాక్రమణ, ప్రతిఘటన దాడులు సర్వసామాన్యమైపోయిన పాలాస్తీనా దారుణమైన జీవన బీభత్సవాన్ని ‘గాజా’ కవిత్వం లో అద్భుతంగా కవిత్వీకరించాడు.
రైతులు మన దేశానికి ఊపిరి అని, వాళ్ళ చేతులు కాళ్లు దేశాన్ని, ప్రజలను బతికించే ఆకుపచ్చ సంతకం చెబుతూ వారి ఆత్మ గౌరవాన్ని చాటుతాడు కవి. ‘బతకంతా అసమానత శిలువను మోస్తూ, అడుగడుగున అవమానపు చూపులు ధరిస్తున్న’ బహిష్కృత మానవుడి దుఃఖం మురికి కాలువలు, ఫుట్ పాత్ ల చిరునామాగా ఉపాంతీకరించబడిన మానవుడి దుఃఖం ‘నా దేశం / ఏ కులం గానో మతం గానో / విడిపోయిన ప్రతిసారి / నేను మరణిస్తూనే ఉన్నాను’ అంటూ కవిగా తన మనోవేదనను కవిత్వం చేసిన బిల్ల మహేందర్ తాత్వికత తెలిసిన కవిగా ఈ సంపుటిలో కనబడతాడు.
రచయిత్రి: మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన సాంఘిక నవల . పశ్చిమగోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలలోని వ్యవసాయ కుటుంబాలు వంద సంవత్సరాలలో నాలుగు తరాల జీవిత చిత్రాలను చిత్రీకరించినటువంటి నవలగా మట్టి మనిషి మలచబడింది. ఈ నవల ప్రత్యేకత 14 భారతీయ భాషలలోకి అనువదింపబడడం . దీని యొక్క కథ నేపథ్యం భూస్వామి ధనిక రైతు దళారి వ్యవస్థ మధ్య ఉన్న సంఘర్షణని చిత్రీకరించినటువంటి నవల. ప్రధాన పాత్రధారి సాంబయ్య అనే రైతు . అతని భూమి కుటుంబం అతని తర్వాత వంశం ఎటువంటి సంఘర్షణలకు లోనయ్యారు అన్నది వివరిస్తుంది. ఈ నవల లో సాంబయ్య కు భూమి పట్ల గల ప్రేమను కళ్ళకు కట్టినట్లు చూపించారు . భూమి అనేది రైతుకు జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నది ఈ నవలలో ప్రస్ఫుటంగా వివరించే ప్రయత్నం చేశారు వాసిరెడ్డి సీతాదేవి గారు.

39కి పైగా నవలలు 100కి పైగా కథలు రచించినటువంటి ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. వీరి మరీచిక నవలను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత అది తొలగిపోయింది. సీతాదేవి గారు 2000 లో మట్టి మనిషి నవలను రచించారు. కొన్ని నవలలు ప్రజానాయకుడు , మనస్సాక్షి, ఆమెకథ , మృగతృష్ణ మొదలైనవి సినిమాలుగా వచ్చాయి.
జవహర్ బాలభవన్ డైరెక్టర్ గాను ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గారు పని చేసారు. కొన్ని అనువాదాలు కూడా. 5 సార్లు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. రచయిత్రిగా ప్రత్యేక స్థానం పొందిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి.
నాటకీకరణ :
ఈ నవల నాటకీకరణ కు పూనుకున్న రచయిత శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు. కథా , నాటక రచయితగా సాహితీ లోకంలో విశేషంగా కృషి చేస్తున్నారు . 70 కి పైగా రచించిన కథల్లో 30 కి పైగా బహుమతులు పొందినవి. గత సంవత్సరం వీరు రచించిన కొరివి కథకు అనిల్ కథలపోటీలో 25 వేల బహుమానం అందుకున్నారు. అనేకమైన నాటికలు రచించారు . 25 నాటికల సంపుటిని ఇతర సంపుటులు వెలువరించారు. శ్రీ చక్రం , ఎడారికోయిల, మిస్సెడ్ కాల్స్, ధ్వంస రచన , క్షతగాత్ర గానం, హింసధ్వని వంటి పలు నాటికలు ,నాటకాలు , శ్రవ్య నాటికల సంపుటి వీటన్నింటితో పాటు అరసం ప్రధాన సంపాదకులు గా పలు సంపుటాలను వెలువరించారు . నాటక చర్చా కార్యక్రమాలు నిర్వహించారు.


దర్శకత్వం:
మట్టి మనిషి నాటకం దర్శకత్వం చేసిన వారు. యస్ యం బాషా గారు . అనేక నాటకాలలో నటించి , దర్శకత్వం వహించిన బాషాగారు స్వయంగా ఈ నాటకంలో కీలకమైన కనకయ్య పాత్రలో నటించి నాటకమంతా తనదైన పాత్రతో హుషారుతనం జోడించారు. నాటకానికి నిండుతనం ఈ పాత్రలోనే అన్నట్లుగా తనదైన నటనను ప్రదర్శించారు.
కథాంశం :
మట్టి మనిషి పెద్ద నవల. కథలో పాత్రలు వీరభద్రయ్య దగ్గర పాలేరుగా వెంకయ్య పని చేసేవారు . ఆ పాలేరు వెంకయ్య కొడుకు సాంబయ్య. యజమాని అయిన వీరభద్రయ్య కొడుకు బలరామయ్య. బలరామయ్య కూతురు వరూధిని.
సాంబయ్య కొడుకు వెంకటపతి. తండ్రి పాలేరుగా పడిన అవస్థ నుంచి బయటపడి ఏనాటికైనా తనకు కొంత భూమి సమకూర్చుకుని స్వంతంగా వ్యవసాయం చేసి ఆ భూమిని క్రమంగా పెంచుకుంటూ పోవాలని తాపత్రయం సాంబయ్యది . దాని కోసం చాలా కష్టపడి భూమిని కంటికి రెప్పలా చూసుకుని క్రమక్రమంగా కొన్ని ఎకరాల భూమి ఇల్లు సంపాదిస్తాడు.


ఈ క్రమంలో భార్య సహాయం కూడా తీసుకుంటాడు . తీరా భార్య పురిటి నొప్పులతో ఉంటే పంట నూర్పిడి చేయిస్తూ పని కొందరికి అప్పగించి భార్య దగ్గర కు వస్తాడు మగబిడ్డ పుట్టాడని మురిసి పోయాడు. కానీ భార్య అనారోగ్యం తో ఉందని బయట పట్నం ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలని నాటు వైద్యుడు చెప్పగానే అయోమయం లో సరైన నిర్ణయం తీసుకోలేక పోతాడు. ఫలితంగా భార్యను కోల్పోతాడు.
పొలం పనుల ధ్యాసలో వేరే వివాహం చేసుకోకుండా కొడుకు వెంకటపతి ని కూడా తన బాటలో నడిపిస్తాడు.
పెంచుకున్న భూమి తనలో ఆశను పెంచింది . ఏ యజమాని దగ్గర తన తండ్రి పనిచేసాడో అదే యజమాని కొడుకైన బలరామయ్య తన కూతురైన వరూధినిని తన కొడుకు వెంకటపతికిచ్చి కాళ్ళు కడిగించాలనుకుంటాడు. వరూధిని కోడలిగా ఇంట్లో అడుగు పెడుతుంది. మొగ దిక్కులేని ఇంటిని అందంగా తీర్చిదద్దినట్లు చేసి ఇంటిని భర్తను తన అధీనంలోకి తీసుకుంటుంది.
మామ గారైన సాంబయ్య కష్టార్జితాన్ని తన ఆలోచనలు విలాసం కోసం వినియోగించి తన స్నేహితుడైన రామనాథం సినిమా థియేటర్ యజమానితో చేతులు కలిపి , మరో డి.ఎస్పీని కలుపుకుని పెట్టుబడులు పెట్టి భర్తను తాగుడుకు బానిస చేసి ఉన్నదంతా కోల్పోతుంది. ఈ ప్రక్రియలో లాయర్లు నమ్ముతుంది. అందుకు తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటుంది. కోలుకోలేని ఎదురు దెబ్బకు బలౌతుంది . భర్త వెంకటపతి తండ్రికి ముఖం చూపలేక కొడుకైన రవిని సాంబయ్య ఉండే చోట వదిలి వెళ్ళిపోతాడు.
మనవడు రవి వచ్చి సాంబయ్య ను చేరగానే సర్వం కోల్పోయిన దుఃఖం లో ఉన్న సాంబయ్య కు ప్రాణం లేచి వస్తుంది. మనవడు తన వారసుడు తిరిగి తనకు పొలం సమకూర్చాలని తాపత్రయంతో బంజరు భూమిని తన దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి కూరగాయలు మనవడికి చూపిస్తూ పని నేర్పుతూ పంట పండిస్తాడు. ఈ క్రమంలో తాతా మనవడు సంభాషణలు రైతుకు పొలం పట్ల మట్టితో ఉన్న అనుబంధం వివరించబడుతుంది.
పంట చేతికి వచ్చే సమయానికి పొలం అప్పచెప్పిన కనకయ్య అది తన భూమి అని పోలీసులను తీసుకొస్తాడు. చేతికొచ్చిన పంట భూమి నీది కాదు అన్న మాట జీర్ణించుకోలేక ఆ మట్టిలోనే ప్రాణం విడుస్తాడు సాంబయ్య. సాంబయ్య చనిపోవడం తట్టుకోలేక చిన్నవాడైన రవి కర్ర తీసుకుని కనకయ్యని కొట్టబోగా అది పక్కన ఉన్న కామందు తలకు తగిలి రక్తం కారుతుంది. హత్యా ప్రయత్నం చేసాడని పోలీసులు రవిని అరెస్ట్ చేస్తారు. రవి తిరిగి వస్తా నీ అంతు తేలుస్తా అనడంతో కథ ముగుస్తుంది.
హైదరాబాద్ రంగభూమిలో ప్రదర్శన:
మట్టి మనిషి నాటకీకరణ చేసి మొదట్లో నాలుగు గంటల నాటకం గా గతంలో ప్రదర్శనలిచ్చారు. ప్రస్తుతం 3 గంటలకు కుదించిన నాటకాన్ని ఇటీవల రంగభూమి లో ప్రదర్శన మే నెల 31, జూన్ 1 వ తేదీ రెండు రోజులు ప్రదర్శన ఏర్పాటు చేసారు. విజయ వంతంగా రెండు ప్రదర్శనలు జరిగాయి. నాటకం చూసేందుకు సీతాదేవి గారి కుటుంబం నుంచి కృష్ణకుమారి గారు మరి కొందరు వచ్చి పారితోషికం అందజేసారు.
నటీ నటులు:
నాటకం ముందు ప్రస్తావన తో మధ్య మధ్య జరిగే కథనం వ్యాఖ్యానంతో సూత్రధారి గా సురభి నిఖిలేశ్ , సురభి ప్రియాంక అందరినీ ఆకట్టుకున్నారు.
ప్రధాన పాత్రధారి సాంబయ్య పాత్రను మొదటి దశలో పి. భుజంగరావు గారు , తర్వాత దశలో ఎం వి. రాజర్షి గారు ఇరువురూ తమ పాత్రలకు న్యాయం చేసారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. వరూధిని పాత్రలో ఎన్ షణ్ముఖి పూర్తిగా పాత్రలో ఇమిడిపోయే నటనను ప్రదర్శించింది. ఒక రకంగా వరూధిని నాటకంలో నవల పరంగా ఎక్కువ భాగం నాటకం లో తన పాత్రతో చుట్టూ ఉన్న పాత్రధారులు తో తానై నిలిచింది. ఎక్కువ సమయం ఈ సన్నివేశాలలో సాగింది. వాసిరెడ్డి సీతాదేవి గారు భూమి పట్ల పట్టింపు లేక తర్వాత తరాలు వ్యసనాలకు లోనయ్యారని తెలపడం వరూధిని తన భర్త, ఆ తరం ఎలా ప్రవర్తించారో తెలియజెప్పారు.


నాటకం ఆద్యంతం రకరకాల హావభావాలతో సమయానుకూల స్పందనలతో ఆకర్షణీయంగా , ఆకట్టుకునే నటన కనకయ్య పాత్రధారి అయిన నట దర్శకుడు యస్ ఎం బాషా గారు పాత్రౌచిత్య నటనతో నాటకంలో చైతన్యవంతమైన ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. నటన దర్శకత్వం రెండు బాధ్యతలను స్వీకరించి తదనుగుణంగా నాటకాన్ని నడిపించారు.
కొడుకు వెంకటపతి గా కె. గోవర్ధన్ రెడ్డి అమాయకంగా ను , రామనాథ బాబు గా ఎస్ . డి. హసన్ మోసకారి గాను చక్కని నటనను అందించారు . నాటకంలో ఇతర పాత్రలలో సోల్జర్ షఫి డి ఎస్ పి గాను, యలమంద గా పి. తిరుమల రావు, ఏసోబు గా డి. సాయికిరణ్, రామి గా బి.సంధ్య, రత్తమ్మ గా సాయి దీపిక , ఆచారిగా , గురునాథంగా ఎం సాంబశివరావు, దుర్గమ్మ పాత్రలో , బుచ్చమ్మ పాత్రల్లో యస్ మాధవి , పాపారావుగా జె. రత్న రాజు, కాంతమ్మ గా డి. చిత్కళ, జూనియర్ వెంకటపతిగా శ్రీకర్, పోలీస్-1గా, ఆఫీస్ బాయ్ , క్లీనర్ పాత్రలలో సాయికిరణ్, పోలీస్ -2 గా దానిష్ అలీ, నటి గా రూపిక , స్త్రీలుగా చిత్కళ, దివ్య, రూపిక, సాయి దీపిక, శేషమ్మ గా సురభి ప్రియాంక , బలరామయ్య గా కె. శేఖర్ రెడ్డి , గుమాస్తాగా సుజిత్, పాపారాయుడు గా మాధవ్ , రాముడు ఎస్ వంశీ, దాసుగా పి. తిరుమలరావు, గోపాలరావుగా బి స్వరాజ్, శివరామ కృష్ణయ్య గా , మంత్రి గా , రామానందం పాత్రలలో వై. వి ఆర్ ఆచార్యులు, కృష్ణయ్య గా సుజిత్, రవి పాత్రలో దేవేష్ నటించారు.
సాంకేతిక నిపుణులు:
ఇంత పెద్ద నాటకానికి సాంకేతిక నిపుణుల సహకారం ఎంతో అవసరమైనది. ఆహార్యం పచ్చల శివ, సంగీతం సురభి నాగరాజు, కాస్ట్యూమ్ బి . సంధ్య/ ఎస్ వంశీ , కీ బోర్డ్ వై. గంగాధర్, గేయ రచన చింతలపల్లి అనంత్ , గేయ రచన సుద్దాల అశోక్ తేజ , పాటలు వసీం, డప్పు డప్పు అనిల్, లైటింగ్/ సెట్ సురభి ఉమా శంకర్/ అభి అందించగా స్టేజ్ మానేజర్ గా అభి రెడ్డి, ఆడిటోరియం మానేజర్ గా అర్షద్ షేక్, /శివరామ కృష్ణ ఆడిటోరియం అసిస్టెంట్ గా వెంకట్ లక్ష్మన్ వ్యవహరించారు. ఫొటో , వీడియో, పబ్లిసిటీ బి . సాయికిరణ్ చూసుకున్నారు. పి ఆర్ ఓ గా అర్షద్ షేక్/ సాయికిరణ్ ఉన్నారు. వీరందరి సమిష్టి సహకారం నాటకంలో నిండుతనాన్ని తీసుకు వచ్చాయి.

ఇంతమంది కళాకారులను సిద్ధం చేసుకుని సమన్వయం చేసుకుంటూ చేసిన ప్రయత్నం గొప్పది .ఈ విషయం
నాటకంలోని సాంబయ్య రవితో అన్న మాటలతో తెలుస్తుంది.
మనిషికి సంతోషం ఎక్కడుందంటావు? కష్టపడి పని చేయడంలో ఉంది . చెమటోడ్చి భూమి దున్నడం లో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావడంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లోకి వచ్చే ఆనందం లాంటిది ఈభూమి . దీనిని మించినది మరొక్కటి లేదురా.. అంటాడు రవితో.
బడిలో చదివే విద్యార్థికి పొలంలో పని చేసే రైతుకి సామ్యం చెప్పే ఒక గొప్ప డైలాగ్ సాంబయ్య మనవడితో అనడం . ” ఈ నేల నా పలక. నాగలే నా బలపం . పొలమే నా బడి . భూమి మీద దిద్దాను . రోజుకు ఒక్కొక్క మాట ఈ భూమే నాకు నేర్పింది. నా తల్లి , దైవం, గురువు ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పురా మనవడా నీ బడి గొప్పదా నా బడి గొప్పదా? “
పొలాన్ని బడిగా మార్చుకున్న మట్టి మనిషి జీవన రేఖా నాటకమిది.
దళిత చైతన్యం నింపుతూ వస్తాను భూమిని ఆక్రమించే వారి పని పట్టడానికి అని చెప్పడం ఆశావహ దృక్పథం కలిగిస్తుంది. చివరిగా మట్టిలో పుట్టిన వాడ్ని
మట్టి మీద బతికిన వాడ్ని
మట్టిలో కలిసి పోతున్న వాడ్ని
వంటి మీద మట్టి ఉండక
మరి బంగారం ఉంటుందా !
అని ప్రశ్నించిన పాత్ర మట్టి మనిషి.
మట్టి మనిషి నవల ప్రముఖ నవలలలో 13 వ స్థానంలో నిలిచిన నవలగా పేరొందడమే గాక గొప్ప నాటకంగా వల్లూరు శివప్రసాద్ గారిచే నాటకీకరణ గా మలచబడి యస్. ఎం బాషా గారు దర్శకత్వం లో రూపుదిద్దుకుని మనందరి మనసులలో స్థిరంగా నిస్సందేహంగా నిలిచి ఉండే నాటకం మట్టి మనిషి .
ఊహా తెలియని
నాడు ప్రేమించిన నా తల్లి
ఊహా తెలియగానే
ద్వేషించడం మొదలెట్టింది. ఎందుకో..!
అయినా! నా జన్మ కారకురాలే
అనుకుని సర్దుకుపోయా..!
కఠినత్వానికి మరోరూపమని
నా తల్లి పేరు చరిత్రలో నిలిచిపోయింది.
కసాయి తల్లి అని నా మనసును సమాధానపరుచుకున్న
ఆ దేవుడికే నోరు ఉంటే
ఎంత బాగుండేదో!
జన్మనిచ్చిన పిల్లల్ని
ప్రేమించమని చెప్పేవాడేమో! బహుశా!
రాతి బండలాంటి
నా తల్లి మనసును కరిగించే వాడేమో..!
బహుశా!
నుదుటి రాతలు రాసిన
ఆ బ్రహ్మదేవుడు నా తల్లి
తలరాత ఇంత చక్కగా
రాశాడేoదుకో..!
కన్న పిల్లల పైన కసాయితనం చూపించమన్నాడేoదుకో!
కన్న పిల్లల మనసు
నా కసాయి తల్లికి తెలిస్తే
ఎంత బాగుండో!
నిజంగా! ఆ బ్రహ్మ దేవుడే వచ్చి నా తల్లి మనసు మారిస్తే ఎంత బాగుండో..!
అద్భుతాలను సృష్టించిన నాటిక అమ్మ చెక్కిన బొమ్మ
మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.. అన్నారు తల్లిది ఎన్నటికీ ప్రథమ స్థానమే!
అమ్మ పేరులోని మాధుర్యానికి అక్షరాలతో అభిషేకించిన పాటలెన్నో..
• అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట..
• పెదవే పలికిన మాటల్లోని తీయని పలుకే అమ్మా
• అమ్మని మించి దైవమున్నదా..
ఇలా చెప్పుకుంటూ పోతే పాటలనేకం
కొత్తగా ప్రత్యేకంగా వినపడుతున్న పాట..
బొమ్మరా ఇది బొమ్మరా అమ్మచెక్కిన బొమ్మరా.. ఈ పాట మనల్ని అమ్మ ప్రేమలో ముంచెత్తుతుంది. శ్రీనిధి వీనులవిందుగా పాడిన ఈ పాట అమ్మ చెక్కిన బొమ్మ నాటికలోనిది.
మొదలు పెట్టిన కొద్ది కాలంలోనే పలువురి ప్రశంసలతో పలు ప్రదర్శనలవైపుకి విస్తరించి ప్రదర్శించిన ప్రతి చోటా అభినందనలు , అవార్డుల వెల్లువ కొనసాగుతున్న అమ్మచెక్కిన బొమ్మ . ఆ నాటకం వివరాలలోకి వెళితే …
రచయిత్రి :
అమ్మ చెక్కిన బొమ్మ నాటికను శ్రీమతి జ్యోతిరాజ్ బీశెట్టి రచించారు. ప్రముఖ నాటకరంగ దర్శకుడు, నటుడు అయిన డా. వెంకట్ గోవాడ తన తల్లి పేరు మీద నిర్వహించిన అమ్మ కథాంశంగా నిర్వహించిన నాటికలపోటీలో ద్వితీయ బహుమతి పొందిన నాటిక.
జ్యోతి రాజ్ బీశెట్టి పలు నాటకాలలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న నటి. అమ్మ చెక్కిన బొమ్మ లో ప్రధానమైన అమ్మ పాత్రను తానే నటించారు .నాటికను తనే రచించి నటించడం ఈ నాటిక ప్రత్యేకత. జ్యోతి పదకొండేళ్ళ వయసులో రేపేంది నాటికలో తొలిప్రదర్శన చేసి, తిరిగి 2017 లో “బావా ఎప్పుడు వచ్చితివీవు” నాటికతో మొదలుపెట్టి నేటి వరకు నిరంతరాయంగా నాటకాలలో నటిస్తున్నారు. శిష్లా చంద్రశేఖర్ గారి రచనల మీద ప్రస్తుతం పి హెచ్ డి చేస్తున్నారు . జ్యోతి అంతకు ముందు మూల్యం నాటికతో మంచి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు .మంచి ఇతివృత్తం , సామాజిక అంశాన్ని ఎంచుకోవడం జ్యోతి రచనకు నటనకు వన్నె తెచ్చాయి.

దర్శకత్వం : డా. వెంకట్ గోవాడ తెలుగు నాటక రంగంలో యువ నాటక దర్శకుడు నటుడు నిర్మాత ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి పూర్తిస్థాయిలో నాటక రంగానికి తమ సేవలను అందిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ లో పీజీ డిప్లమా చేసిన డాక్టర్ వెంకట్ గోవాడ పలు నాటకాలలో విభిన్న పాత్రలను పోషించి అందర్నీ మెప్పించారు . 2013లో గోవాడ క్రియేషన్స్ ప్రారంభించి పలు నాటకాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు సినిమాలు సీరియల్స్ లో పాత్రలు పోషిస్తున్నారు. మూల్యం నాటికలో నటన తో పాటు దర్శకత్వం వహించి పలువురి ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం వీరి దర్శకత్వంలో అమ్మ చెక్కిన బొమ్మ రెండు తెలుగు రాష్ట్రాలలోను అందరి ప్రశంసలను అందుకుంటుంది. పరిషత్తులలో పలు అవార్డులను సొంతం చేసుకుంది.
కథాంశం: అమ్మ చేతిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న అబ్బాయి ఎదుగుతున్న క్రమంలో కొన్ని మార్పులు గ్రహిస్తుంది తల్లి. మొదట పొరపడుతున్నాననుకుంది తర్వాత గమనించింది. అబ్బాయిగా ఉన్న కొడుకు అమ్మాయిగా ఉండటానికి ఇష్టపడటం అతనిలో మార్పులు ..తనలో జరుగుతున్న మార్పుల పట్ల సంఘర్షణ.. ఈ విషయమై తల్లి పాట్లు, భర్త విముఖత సమాజానికి భర్తకు ఎదురీది తల్లి తీసుకునే నిర్ణయం దాని ఫలితం .. వీటన్నింటి మధ్య రూపుదిద్దుకున్న నాటిక.
పాత్రలు: వెన్నెల గా రూపుదిద్దుకునే ముందు చిన్న బాబు గా దివేష్, కాస్త పెద్దయ్యాక భాను ప్రకాష్ వెన్నెలగా మారిన ట్రాన్స్ జెండర్ పాత్రలో ట్రాన్స్ జెండర్ హర్షిణి మేకల పాత్రలకు జీవం పోసారు. తండ్రిగా డా. వెంకట్ గోవాడ తల్లిగా జ్యోతి పరిణితి చెందిన కళాకారులుగా నాటకాన్ని తల్లితండ్రుల మానసిక స్థితిని భావోద్వేగ నాటకంగా మలిచి పాత్రలలో లీనమై నటించారు. బొమ్మరా ఇది బొమ్మరా పాటతో శ్రీనిధి, సంగీతం సమకూర్చిన నాగరాజ్ , ఫణీంద్ర రోహిత్ సెట్ డిజైన్.. ఇతర సిబ్బంది సహకారంతో రూపుదిద్దుకున్నదీ అమ్మ చెక్కిన బొమ్మ.

ప్రత్యేకత :
విన్నూత్న కథాంశం.. ఎదురు దెబ్బలకు తట్టుకున్న ధీరగా తల్లి పాత్ర, భర్తా బిడ్డా మధ్య బిడ్డవైవు మొగ్గు చూపిన సంఘటనలు సంభాషణలు.. ట్రాన్స్ జెండర్ల దుస్థితి వారి భవితను ఎంచుకొనే విషయంలో లేని సహకారం , ఎదుర్కొన్న వివక్ష, అవమానం చివరకు కన్న తండ్రి నిరాదరణ .. అన్నింటిని అధిగమించి చేరుకున్న లక్ష్యం ఐ ఏ ఎస్ వెన్నెల గా రూపాంతరం .. అనేక విషయాల కలబోత ఈ బొమ్మ.. తను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఏది? తను మాత్రం తన సాధనతో సమాధానమై నిలిచింది.

ప్రత్యేక ప్రశంస : ఈ నాటికలో ప్రత్యేక ప్రశంస అందించ వలసిన అమ్మ చెక్కిన బొమ్మ వెన్నెల పాత్రలో నటించిన హర్షిణి మేకల . హర్షిణి మేకల ఒక ట్రాన్స్ వుమన్, ఆమె అందాల పోటీలలో, నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చిన్నతనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె 2024 లో జరిగిన మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలలో ఐదవ స్థానంలో నిలిచారు మరియు మూడు టైటిల్స్ గెలుచుకున్నారు. తన జీవితం లాంటి ఈ నాటికలో తను నటించడం ఈ పాత్రకు న్యాయం చేసినట్లైంది. హర్షిణి నటన అందరి ప్రశంసలకు నోచుకుంది.
అద్భుతమైన కథనం రచించిన జ్యోతిరాజ్, విలక్షణంగా నటింపజేసి దర్శకత్వం వహించిన డా వెంకట్ గోవాడ, ట్రాన్స్ జెండర్ ఆత్మకథ అనిపించిన రీతిలో స్వయంగా ఆ పాత్రకు న్యాయం చేసిన హర్షిణి , తన స్వరంలో అమ్మ చెక్కిన బొమ్మను చూపిన శ్రీనిధి .. నాటకంలోని భావాలలోకి సంగీతం జోడించిన నాగరాజ్ , వెన్నంటి ఉన్న రాధ గారు స్వరాజ్ గారు తదితర బృందం మొత్తం అభినందనీయులే! ఈ మహత్తర నాటకంలో అవార్డులతో పాటు ప్రశంసల జల్లుకు పాత్రులు. మరిన్ని విజయాలను అందుకుంటూ సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల మన దారుణమైన ప్రవర్తన మార్చుకునేందుకు దోహదం చేస్తుందీ నాటిక.
శీర్షిక. అంబోధిలో ఆణిముత్యాలు
విషయ సూచిక
1ముందుమాట 2రచయిత,చిరుపరిచయం
3 కథల సమీక్షలో,
పాత్రలు
సంభాషణ
అంతరార్థం
సందేశం. మొ!!నవి
1ముందుమాట
సంగీత సాహిత్యాలు రెండు, సరస్వతిదేవి మానవులకు ప్రసాదించిన క్షీరామృతాలు.
సంగీతం,శృతి మధురం.వింటేనే ఆనందం కలుగుతుంది. క్షీరంవలె
సులభతరం.
సాహిత్యం, అమృత మదనంవలె
కష్టతరం. అందుకే నన్నయ్య కవిత్వాన్ని (భారతాన్ని) “లోనారసి”
చూడాలన్నాడు. మన కవిత్వాది రచనలకు
సమీక్షలు,వివరణలు, ముందు మాటలు పీఠికలు ఉండడం వల్లే ఆ యాకావ్యాల విలువ, మనం తెలుసుకుంటున్నాం.
అందుకే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి నారాయణరెడ్డి గారు ఇలా అన్నారు “కప్పి చెప్పేవాడు కవి, విప్పి చెప్పేవాడు విమర్శకుడు”అని.
కథలు కాలక్షేపం కోసం రాయకూడదు.
సమాజ క్షేమం కోసం
సందేశాత్మకంగా రాయాలి. కవి, లేదా కథా రచయిత సమాజ స్పృహ కలిగి ఉంటేనే
అది సాథ్యమవుతుంది
***
2) రచయితపరిచయం
సాహిత్య సస్యాభివృద్ధికి
మాగాణి, కవి పండితులకు పుట్టినిల్లు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మస్థలమైన సిరిసిల్ల, కిరణ్ కుమార్ గారికి కూడా జన్మస్థానం కావడం విశేషం.
ఉమా, కనకయ్య గార్ల మొదటి సంతానం కిరణ్ కుమార్ గారు.
కనకయ్య గారు మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయాలలో ఉంటూ, వంశపారపర్యంగా ఉన్న వృత్తి, వస్త్ర వ్యాపారాన్నీ సాగించారు. కిరణ్ కుమార్ తండ్రికి సహాయంగా ఉంటూనే M.com పూర్తి చేశారు. కాలేజీ రోజులలో నుంచి సాహిత్య సేద్యం ప్రారంభించి అచిర కాలంలోనే
సాహిత్య బృందావనాన్నీపెంచి వివిధ సాహిత్య ప్రక్రియా పుష్పాలను
వందల సంఖ్యలో
పూయించిన ఘనత కిరణ్ కుమార్ గారిదే.
. ఆసంఖ్యాక అవార్డులు బహుమతులు వారి సొంతం.అతి చిన్న వయస్సు లోనే అలుపెరుగని సాహితీ ప్రయాణం ప్రారంభించి
ఉన్నత స్థాయికి ఎదిగిన కిరణ్ కుమార్ గారు శ్రమించే స్వభావం కలవారు, సౌమ్యులు, సాహిత్యా భిలాష వారిఊపిరి.
***
3) కథల సమీక్ష
కథ, నవలా ప్రక్రియలకు పాత్రలు సంభాషణలు ప్రాణం
వంటివి.
ప్రస్తుత సమీక్షలో కిరణ్ గారి రెండు కథలను సమీక్షకు ఎన్నుకున్నాను.
1 అనుబంధం.
2 ఉషోదయమా…
ఈ రెంటినీ ఎన్నుకోవడంలో ఉద్దేశం, ఈ రెండు కథలకు పాత్రలు, సంఘటనలు ఒకటే కావడం ముఖ్య కారణం.
రెండు కథలలో సమాజానికి కావలసిన సందేశాలు, ఉపదేశాలు మొదలైన వాటిని పాఠక హృదయాలకు దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నమేఈ సమీక్ష.
కబీర్ చెప్పినట్లు ఏదైనావిషయాన్ని ఉపమానంతో చెప్పాలి.
రసాల మామిడిపండును బాగా రసం తీసి గ్లాసులో పోసి ఇవ్వుచ్చినప్పుడు తాగేవాళ్లు బాగా ఆనందిస్తారు అలాగే కథలలో, రచనలలో ఉండే అంతరార్థాలను, సంభాషణ చాతుర్యాలను, ప్రజలకు ఆచరణీయమైన సందేశాలను సమీక్షలో విపులంగా చూపించగలిగినప్పుడు ఆకథ, సమీక్ష రెండు ధన్యమవుతాయ్.
.ముందు అనుబంధం+ ఉషోదయమా అనే వాటిని గురించి మీకు వివరించాలి.
అనుబంధం అనేది కిరణ్ కుమార్ గారు రాసినమొట్టమొదటి కథ.
అటు తరువాత ఉషోదయమా? అనే కథ తన మొదటి కథ, “అనుబంధా”నికి పొడిగింపుగా రాసిన రెండో కథ. ఇవి విడివిడిగా చదివినా, లేక కలిపి చదివినా వాటి వాటి సందేశం సమగ్రంగానే ఉన్నది. కానీ కలిపి చదివినప్పుడు పాఠకుని లోతుగా ఆలోచింపజేస్తుందనడంలో సందేహం లేదు.
మొదటి దానిలో మోసం కనపడితే రెండవ దానిలో మోసానికి తగిన ప్రతిఫలం, దర్పణంలో చూపించినట్లు చూపించారు రచయిత కిరణ్ కుమార్. అందుకే రెండు చదివినప్పుడు సంపూర్ణమైనటువంటి అవగాహన చదువరులకు ఏర్పడుతుంది.
అందువల్ల నేను అనుబంధం+ ఉషోదయమా? రెంటిని కలిపి సమీక్షిస్తున్నాను.
ఈ కథలను గురించిన ఒక గొప్ప విషయాన్నీ మీ ముందు సంతోషంగా సగర్వంగా నేను సమర్పిస్తున్నాను.
ఏ కొద్ది మంది రచయితలకోదక్కే ఇటువంటి అదృష్టం మన కిరణ్ కుమార్ గారికి దక్కింది అని చెప్పడం సమచితం
పై రెండు కథలలో
ఓ కొడుకు మోసం
ఓ తండ్రి నిర్ణయం కలిసి “ఓ తండ్రి తీర్పు” అనే లఘు చిత్రంగా తయారయింది. ఆ చిత్ర విశిష్టతను గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది.
ఓ తండ్రి తీర్పు లఘు చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు రెండు వరించాయి.
ఐ ఎఫ్ యం ఏ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్) వారి అవార్డు మరియు పిన్ టీవీ సంస్థ వారి అవార్డులు గెలుచుకున్నాయి.
శ్రీరామదూత ఫిల్మ్ మేకర్ పతాకంపై చిట్టా రాజేశ్వరరావు చిట్టా అపూర్వ అనేవారు నిర్మించగా ఈ చిత్రానికి ఐదు ప్రభుత్వ నంది అవార్డులు అందుకున్న శ్రీ గాదంశెట్టి ఉమామహేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. అంతర్జాల విఫణి నుండి 10 ఓ టి టి ఏజెన్సీ ఫ్లాట్ ఫార్ముల ద్వారా
ప్రేక్షకులు వీక్షిస్తున్నారు.
అనేక కుటుంబాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఇతివృత్తంగా తీసుకున్న కథా నేపథ్యంలో కొనసాగింది ఈ చిత్రం.
తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన తనయులే తమ బాధ్యతను విస్మరిస్తున్నారని, నిరాదరణకు గురి అవుతున్న తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని యువతలో మార్పు కోరే దిశగా ఈ లఘు చిత్రం నిర్మించబడింది.
ఓ తండ్రి తీర్పు లఘుచిత్రం లింక్, కథా సమీక్ష అనంతరం
చూడగలరు.
ఇక కథలోకి తొంగి చూద్దామా!
1వ కథ అనుబంధం.
****”
పాత్రలు 1 రంగనాథం 2 రాజా 3 ఆదిత్య
గుడ్డి ప్రేమ ప్రమాదం.
పిల్లలనుప్రేమించు
కానీ నమ్మవద్దు. నీ ఆస్తి, ఏదైనా నీ తర్వాతే ఎవరికైనా.
పిల్లవాడు నీ వాడే వాడి భార్య పరాయిది.
ఇత్యాది నిత్య సత్యాలను తెలిపే కథ అనుబంధం.
రంగనాథం గారి పిచ్చి ప్రేమను వాడుకొనీ ఆయన కొడుకు
రాజా, నాన్నగారి ఆస్తులుఅన్ని అమ్మించి తనపేర డబ్బు వేసుకొని నాన్నను ఎయిర్ పోర్ట్ లో వదిలే గుట్టుగా అమెరికా వెళ్ళిడం, రంగనాథం గారు
పక్కింటి ఆదిత్య సహాయంతో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావడం తో కథ ముగుస్తుంది.
కానీ ఈ కథలో రెండు విషయాలు అసంపూర్ణంగానే ఉన్నాయని రచయిత కిరణ్ గారికి అనిపించిది. ఆ రెంటిని పాఠకులకు తెలపడానికి రెండో కథ రాయడం జరిగింది.
అదే ఉషోదయమా…
అన్న పేరు గల రెండో కథ.
2)ఉషోదయమా..
“ముఖ్య”పాత్రలు 1 రాజా2 రాజా భార్య, నిషా 3 నిషా అన్న.4. రంగనాథం (రాజా తండ్రి )
“””””””””””””””””””
మనం తప్పు చేస్తుంటే ఎవరు చూడలేదనుకుంటా ము.
కానీ చూచేవాడు చూడనే చూస్తాడు. తగిన శిక్ష వేస్తాడు.
ఒకప్పుడు నిజంగా జరిగింది సాఫ్ట్వేర్ రంగం ఎందరో లక్షాది కారులు భిక్షాధికారులు అయినారు. అందులో రాజా నిషా ప్రధములు. ఉన్నదంతా ఊడ్చుకొని పోతే పొట్ట చేత పట్టుకుని ఇండియాకి వస్తారు
బావ మరిది తన నాన్నను కూడా రాజాకు అప్ప చెప్పి నాగపూర్. జారు కుంటాడు
రంగనాథం గారిని మోసం చేసి ఆస్తి కాజేసిన రాజాను, నిష ను నిష పుట్టింటి వాళ్ళు పురుగులను చూసినట్టు చూస్తారు ఇక్కడ సందర్బానికి తగ్గ సంభాషణతో కథ
రక్తి కట్టింది.
మూలిగే నక్క మీద తాటికాయ పట్టేట్టు
రాజా నిషాల జీవితం
దుర్భరమైంది.
రాజా, ఓమిత్రుని సహాయంతో, తనకు నిషాకు ఉద్యోగాలుసంపాదించినా ఆ ఉద్యోగాల్లో అనుకొని ఆపద వస్తుంది. తన మీద మోపిన నేరాన్నీ
తన యజమానికి చెప్పుకోవడానికి వెళ్లిన రాజా, నిషా, అక్కడ యజమాని స్థానంలో
ఉన్న రంగనాథం గారిని చూచి
వణికిపోతారు. ఇంతవరకు వారిని కమ్ముకొని ఉన్న అహంకారమనే చీకటి (నిషా ఆమెకు తగ్గ పేరు) తొలగి వారిలో ఉషోదయ రేఖలు కనపడినట్లు పశ్చాత్తాపంతో రంగనాథం గారి పాదాలపై పడతారు.
రంగనాథం గారు నిష్పక్షపాతంగా, కోర్టులో న్యాయమైన తీర్పు చెప్పే జడ్జి లాగా వారిద్దరిని అడగవలసిన అడిగేసి గెట్ లాస్ట్ అంటాడు.
దానికి కారణం రంగనాథం గారి
సిద్ధాంతాలు రెండు. 1) నమ్మిన వారినిమోసం చేయకూడదు.
2)
ఆత్మ విశ్వాసమే నీ ఆయుధం.
వాటిని నమ్ముకున్న రంగనాథం గారు కొడుకును కోడలిని
నిర్ధాక్షిణ్యంగా శాశ్వతంగా వదులుకున్నారు. ఇదే “ఓ తండ్రి తీర్పు” కొడుకు వల్ల రిక్తహస్తాలతో నిలిచిన రంగనాథం గారు ఆత్మవిశ్వాసంతో ఈనాడు కోట్లకు అధిపతి అయినారు.
చారిత్రాత్మకమైన ఈ తీర్పు ఈనాటి యువతీ యువకులకు గుణపాఠం కావాలి.
చివరి దశలో ఎవరు చూస్తారో (పనిమనిషో
పరాయి వాళ్ళోఎవరైనా)
,వారికి తమ ఆస్తినీ తల్లిదండ్రులు ఇచ్చేసే నిర్ణయానికి రావాలి.
ఈ కథలో ఇది చక్కని సందేశం.
విలువైనవిషయాలు..
1) కొడుకు మోసానికి గురైన రంగనాథం గారిని,తల్లి తండ్రి లేని ఆదిత్య, “నిన్ను నాన్నా అని పిలవచ్చా” అన్న వాక్యం, సందర్భానికి విలువనిచ్చే వాక్యం.
2)ఎంతవిద్యావంతులైనా,
నిషాలాంటి వారి నోట
వచ్చే మాటలు.”ఆ ముసలాడిడబ్బులు
కూడా అయిపోయాయి” అన్నది
2) తన కొడుకు, కోడలికి కనపడకుండా అటు తిరిగి కూర్చున్న రంగనాథం గారు “నేను తప్పు చేయలేదు నాపై కేసు పెట్టారు”అన్నకొడుకు మాటలకు “నీకు మోసం చేయడం, తప్పు చేయడం తెలియదా?” అంటూ కొడుకు వైపు తిరిగిన రంగనాథం గారి మాటలు,కదలిక చక్కగా సందర్భోచితంగ ఉన్నాయి..
ఇలాంటివి కవి యొక్క పదప్రయోగ దక్షతకు, వాక్య నిర్మాణ చాతుర్యానికి, పాత్ర పోషణ నైపుణ్యానికి
నిదర్శనం.
సాహిత్యాభిమానులు,సకల సాహిత్య ప్రక్రియా నిపుణులు,
అన్నిటికంటే ఓర్పు నేర్పు, గల రచయిత డా. చిటికన కిరణ్ కుమార్ గారు చక్కటి కథా రచయితగా ఈ కథల ద్వారా గుర్తింపు పొందారు. దానికి నిదర్శనమే “ఓ తండ్రి తీర్పు” ఇది పేరుకు లఘుచిత్రం. పెద్దరికం లో అలఘు చిత్రం.
ఈ సమీక్షతో కూడా ఆ లఘుచిత్రాన్ని జోడించడం జరుగుతుంది. పాఠకోత్తములు కదా సమీక్షలు చదివి లఘు చిత్రాన్ని వీక్షించి ఆనందిస్తారని ఆశిస్తూ…
ఐ. ఎఫ్. ఎమ్. ఎ మరియు పిన్ టి. వి ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు అందుకున్న ” ఓ తండ్రి తీర్పు”లఘు చిత్రం
