మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

“వేద…అక్షరయోధ”

by Chitti Sidda Lalita November 29, 2024
written by Chitti Sidda Lalita

“వేద”….ఈ పదంలోనే ఒక వైబ్రేషన్ వుంది.వేదాలు ఎంత ప్రాముఖ్యమైనవో వేదమంత్రాలు ఎంత పవిత్రమైనవో మనకు తెలుసు. తన నవలకు వేద అనే శీర్షికను ఎంచుకుని నవలా నాయికకు వేద అనే నామకరణం చేసి తన సాహితీ ప్రతిభను చాటుకున్నారు అనూశ్రీ.

అలాగే వేద అనే ఈ శీర్షిక ద్వారా నవలకు ఎంతో పవిత్రతను, గౌరవాన్ని ఆపాదించారు. నా దృష్టిలో విధివంచితలై ఆవేదనతో కన్నీరు కార్చే ప్రతి స్త్రీ జీవితం ఒక వేదమే..

తపస్వి మనోహరం వారు డిజైన్ చేసిన అందమైన ఆకట్టుకునే ముఖచిత్రం ఈ వేదకు మరింత సొగసును తీసుకొచ్చింది. లబ్ధప్రతిష్టులైన రచయితలు యండమూరి, మన్నెం శారద గారి అభినందనలతో, ఆశీస్సులతో ఈ నవలకు మరింత నిండుదనం సమకూరింది.
ఇంతకీ ఏముంది ఈ నవలలో…? ఇది కమర్షియల్ నవలా..!?
ఎవరినో మెప్పించడానికి, సాహితీ శిఖారాగ్రాన కూర్చోడానికి లేకపోతే అమ్మి సొమ్ము చేసుకోవడానికో రచయిత్రి ఈ నవలను రాయలేదు.
మన దేశంలో స్త్రీలు పడే బాధలు, అనుభవించే వేదన, పురుషపుంగవుల అణచివేతలతో స్త్రీ అబలగా నిలిచి అల్లాడే వైనం,ఈ సమాజపు పోకడ, ఆడపిల్లకు ఇంట్లో వ్యతిరేకతలు, ఆత్మహత్యలకు పాల్పడడం, కాదని పిల్లలకోసం ప్రాణం నిలుపుకుని జీవించడం లాంటి సగటు భారతీయ స్త్రీ అనుభవించే వ్యథతో రూపుదిద్దుకున్న ఒక అక్షర శిల్పం ఈ వేద.

ఈ వేద అనూశ్రీ గౌరోజు ఆప్యాయంగా చెక్కిన ఒక శిల్పం.
ఇదో జీవన వేదం. ఆరవ వేదం. పురుషహంకారపు కోరల్లో చిక్కుకుని బతకలేక చావలేక విలవిల్లాడుతున్న ఎందరో స్త్రీ మూర్తుల వ్యథలకు అక్షర రూపం ఇది.

ఈ సమాజం భర్త తోడు లేనిదే స్త్రీకి మనుగడ లేదు, ఒంటరి స్త్రీలకు గౌరవం లేదు అని భయపెడుతుంది. అందుకే ఎంతోమంది స్త్రీలు బాధలు భరించలేక, వేధింపులకు తాళలేక, చిత్రహింసలను తట్టుకోలేక వంటింట్లో కిరోసిన్ కు ఆహుతి అయ్యారు. ఉరి వేసుకుని అశువులు బాసారు. గోదాట్లో దూకి బలవన్మరణం పాలయ్యారు. మరి ఈ సమాజం ఆమెకు ఆలంబనగా నిలవకపోగా ఆమె బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళను ఇంత కళ్ళేసుకుని చూస్తూనే వుంటుంది. ఆమెను హేళన చేస్తుంది. వెంటాడుతుంది. నాలుగురాళ్ళను విసిరి గాయపరుస్తుంది.

అనుశ్రీ గౌరోజు

ఎందుకలా..?
ఎందుకింత వివక్ష..?
మిలియన్ డాలర్ల ప్రశ్న.
సమాధానం సమాజం చెప్పదు.
మనమే చెప్పాలి.
ఎందుకంటే సమాజమంటే ఎవరోకాదు. మనమే.
ఇదెంతో శోచనీయం.
మూడువందల పేజీల ఈ నవలను మూడు భాగాలుగా విభజించవచ్చు.
ఒకటి వేద పెళ్ళికి ముందు స్నేహితులతో గడిపిన కాలం.
ఇక్కడ తేజ, స్నేహ, స్వాతి, మురళి అనేవాళ్ళను ప్రాముఖ్యంగా చెప్పుకోవాలి. అరమరికలు లేని వీరి స్నేహం అబ్బురపరుస్తుంది.
కష్టసుఖాలు పంచుకుని తోడ్పాటును అందించుకుంటారు.
నవల చదువుతుంటే అందులో లీనమయిపోతాం. అరె ఇలాంటి ఫ్రెండ్స్ మనకుంటే ఎంత బావుండు అనిపిస్తుంది. ఈ ప్రథమ భాగంలో రచయిత్రి స్నేహానికి వేసిన పీట సమున్నతమైనది. స్నేహబంధానికి వున్న విలువను, ప్రాధాన్యతను రచయిత్రి చక్కగా అక్షరీకరించారు. నవలలో ఎక్కడా మనకు అసభ్యత, అనైతికత కనిపించదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవల్సింది నాకు నచ్చింది ఏమిటంటే.. దగ్గరే వున్న మిత్రులకు కూడా ఉత్తరాలు రాయడం. వేదకు వున్న మంచి అలవాటు ఇది. మాటల్లో చెప్పలేని భావాలు అక్షరాలతో చెప్పచ్చు అంటుంది.ఈ విధంగా రాయడం.. భావాలను కాగితంతో పంచుకోవడం అనే అలవాటు బాగుంది కదా..!
ఇక రెండవ భాగానికి వస్తే…
పెళ్ళి తరువాత జీవితాలు అందరివీ ఒకేలా వుండవు.
ఒడిదుడుకులు, కష్టాలు,కన్నీళ్ళు జీవితంతో పెనవేసుకుని వుంటాయి. కానీ అవి శృతి మించకూడదు. గతి తప్పకూడదు. ఎవరినీ బలి తీసుకోకూడదు.
దానికీ ఒక లిమిట్ వుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఎంతో ప్రతిభకల వేద జీవితం భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసే దాకా వస్తుంది. ఇక్కడ తేజ, స్వాతి పాత్రలు బాధ్యతాయుతమైన స్నేహానికి చిరునామాగా చెప్పచ్చు. స్నేహమంటే ఆషామాషీ వ్యవహారం కాదు అది ఒక బాధ్యత అని గుర్తెరిగినవాడు తేజ. అలాగే అతడి చెల్లెలు స్నేహ.చెలిమికి ప్రాణమిచ్చే నీటి చెలమ. అన్నకు ప్రియమైన చెల్లిగా వేదకు ప్రాణ మిత్రురాలిగా మంచి సపోర్ట్ ఇస్తుంది స్నేహ. కానీ స్నేహ అర్థాంతరంగా లోకాన్ని వీడడం మనల్ని కంటతడి పెట్టిస్తుంది.
స్త్రీ కుమిలిపోతూ, కృంగిపోతూ, కన్నీళ్ళు కారుస్తూ జీవచ్ఛవంలా ఎన్నాళ్ళు జీవిస్తుంది..? ఏ ఆశతో జీవిస్తుంది..?
రకరకాల మగాళ్ళు. మృగాళ్ళు. శాడిస్టులు. సైకోలు. వీళ్ళ టార్గెట్ స్త్రీ.
ఆమెని బాధించడం.. వేధించడం, హింసించడమే వీరి లక్ష్యం.
స్త్రీలే తిరగబడి వీరికి తగిన బుద్ది చెప్పాలి. ప్రతి స్త్రీ శక్తిని కూడగట్టుకుని నరకాసురుని వధించిన సత్యభామ కావాలి.
ఇంతకీ ఈ వేద నవల అందించే సందేశం ఏమిటంటే..
రచయిత్రి అనుశ్రీ అయినా నేనయినా కోరుకునేది ఒక్కటే.
ఈ వేద మన చుట్టూ జరిగే సంఘటనల సమాహారం.
వేదలాంటి స్త్రీలు మన చుట్టుపక్కలే వుండచ్చు.
అమ్మల్లారా.. అక్కల్లారా.. చెల్లెళ్ళారా.. మిమ్మల్ని అర్థించేది ఒక్కటే.
ఒంటరి స్త్రీలను కాకుల్లా పొడవకండి. మగాడికి వత్తాసు పలకుతూ గుసగుసలతో, సూటిపోటి మాటలతో నొప్పించకండి. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే మాటను మనం చరిత్రలోనుండి తీసేద్దాం. సాటి స్త్రీకి చేతనయిన సహాయం చేద్దాం. వారికి ఆసరా ఇచ్చి కన్నీళ్ళు తుడుద్దాం. అది చేతకాకపోతే మనపని మనం చూసుకుందాం. అంతే తప్ప ఆమెను పరిహసిస్తూ కుళ్ళబొడిచి పాపం మూట కట్టుకోవద్దు.అయినా గట్టునున్నవారికేం తెలుస్తుంది గుండెకోత..? మునిగితే కదా తెలిసేది బతుకు రోత.

ఏ రంగమైనా సరే ఒక స్త్రీ ముందడుగు వేస్తే వెనక్కి లాగడానికి ఎన్ని ప్రయత్నాలో..ఎన్ని కుట్రలో..ఆమెను అణిచి వేయడానికి ఎన్ని కుయుక్తులో..స్త్రీకి స్వంత ఇంట్లోనే ప్రోత్సాహం లభించదు.
ఆడదానివి నీకెందుకు ఇంట్లో కూచో అంటారు.ఒక స్త్రీ విజయం సాధించాలంటే ఎంతో శ్రమించాలి. తపస్సు చేయాలి.తప్పదు.
మహిళం మనం శ్రమించుదాం. తపస్సు చేద్దాం. విజయాన్ని స్వంతం చేసుకుందాం.ప్రపంచానికి మన సత్తా చూపిద్దాం.
~~
ఈ నవలలో హృదయాన్ని పిండేసే మాటలు చాలా వున్నాయి.
కొన్ని చెప్పి ముగిస్తాను.

1.ఎవరు ఆదరించకపోయినా, కన్నతల్లి కాదన్నా..పుడమితల్లి మాత్రం కాదనదుగా.. అలసిన నన్ను తన ఒడిలో చేర్చుకుంటుందిగా అంటుంది వేద నిర్వేదంగా. ఎంతగా విరక్తి కలిగితే ఒక స్త్రీ ఆ మాట అంటుందో ఒకసారి ఆలోచించండి.

2.”ఆడపిల్లలు గుండెలో అగ్ని పర్వతాలు దాచుకుంటారు. పైకి సంతోషంగా వున్నట్లు నటిస్తారు “అంటాడు మురళి. “బాధను పౌడర్ గా నిరాశను కాటుకగా ఆవేదనంతా మేకప్ గా వేసుకుంటాను. నువ్వు ఓదార్చగలవా..? ఆడవాళ్ళని ఓదార్చాలంటే యుగాలు సరిపోవు మీ మగాళ్ళకి అంటుంది” స్వాతి.
ఈ స్వాతి ముక్కుసూటిగా మాట్లాడే పాత్ర. చాలా బాగుంది.

3. ఒక సందర్భంలో “ఈరోజును ఎంజాయ్ చెయ్యనీరా..రూపంలేని రేపటిలో విషాదాన్ని వెతుక్కుంటూ ఈ సమయాన్ని పాడుచెయ్యలేను” అంటాడు తేజ. నిజమే రేపనేది వుందో లేదో ఈ క్షణం నిజమైనది. అమూల్యమైనది. దాన్ని ఆస్వాదించాలి.

4. అలాగే “మీనుండి ఏదైనా ఆశించి సహాయం చేస్తే అది వ్యాపారం అవుతుంది. అది నాకిష్టం లేదు” అంటాడు తేజ.
ఇతడు అందరినీ ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు. బాధ్యతలను బరువులను మోసే ఉదాత్తమైన పాత్ర అని చెప్పాలి.
“తల్లిదండ్రుల మాట విని.. భర్త నీడలో సుమంగళిగా రాలిపోయి
వంశోద్ధారనిగా బిరుదులు తెచ్చుకున్న కథలు ఇప్పటికే బోలెడు ఉన్నాయి కదా. నా కథను నేను కొత్తగా రాసుకోవాలనుకుంటున్నాను. గొప్పగా చెప్పుకోడానికి కాదు తృప్తిగా చదువుకోడానికి ” అంటుంది వేద..
నాకూ కొత్తగానే అనిపించింది..
ఈమధ్య నేను ఒక కవిత రాస్తే కొందరు అడిగారు. “కాలం మారింది. స్త్రీ బ్రతుకు మీరనుకున్నంత అధ్వానంగా లేదు!” అని
నేనన్నాను..
“ఎక్కడా మార్పు రాలేదు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. స్త్రీల బ్రతుకులు ఎంత హీనంగా వున్నాయో..పెళ్ళి అనే పంజరంలో చిక్కి ఎంతగా రోదిస్తున్నాయో, మీరనుకున్నట్లు మారితే సంతోషమే అని చెప్పాను.
సాయంకాలం మందు షాపుల ముందు ఆరాటంగా క్యూలో నిల్చున్న మగాళ్ళను చూస్తే అర్థమవుతుంది మన కుటుంబాల పరిస్థితి. మగాళ్ళతో పాటూ స్త్రీలు కూడా బాధ్యతలు మరిచి బారులు తీరుతున్నారా..?
అయితే ఎంతమంది..?
మరి పురుషులే ఎందుకిలా..?
వీళ్ళను పాడుచేసేది సమాజమా, మన కుటుంబ వాతావరణమా..?
~~~
మూడో భాగం. నేను చెప్పను. నవల చదివి మీరు తెలుసుకోవాలి.
సున్నితమనస్కురాలయిన వేద, చిన్న బాధకే కదిలిపోయే ఆమె హృదయం
తరువాత ఎలా గట్టిపడింది..? పరిస్థితులను ఎదిరించి ధైర్యంగా ఎలా నిలవగలిగింది? ఆమెకు ప్రేరణ ఏమిటి..? ఆమెకు తోడు ఎవరు? ఆమెను ప్రపంచానికి పరిచయం చేసి వేదికపై నిలబెట్టే పెన్నిధి ఎవరో తెలుసుకోవాలంటే వేద నవలను మీరు చదవాల్సిందే.
ఈ వేదకు ప్రాణం పోసి రూపాన్నిచ్చి, ఆవిష్కరించిన రచయిత్రి అనూశ్రీ గౌరోజును **వేద అని **అక్షరయోధ అని పిలవాలనిపిస్తోంది.వేద నవలకి గిడుగు రామమూర్తి పురస్కారం లభించడం ఆనందదాయకం. ఎన్ని అడ్డంకులున్నా, అవరోధాలు ఎదురైనా.. వెనుదిరగక, నిరాశ చెందక తన కవిత్వంతో, సాహితీ సేవలతో ఈ ప్రాంతానికి కీర్తి తెస్తున్న అనూశ్రీ నిస్సందేహంగా అక్షరయోధే..
వేద నవలకు నన్ను సమీక్షకురాలిగా, అనిశెట్టి రజిత గారిని ఆవిష్కర్తగా, రమాదేవి గారిని స్వీకరణకర్తగా ఎన్నుకున్న అనూశ్రీ నిస్సంకోచంగా స్త్రీ పక్షపాతి. భవిష్యత్తులో స్త్రీవాద రచనలు చేసి మరిని పుస్తకాలను వెలువరించి స్త్రీ విముక్తికోసం పోరాడాలని ఆశిస్తూ.. అభినందిస్తున్నాను.
మరోసారి మీ అందరికీ నా నమస్సులు జైహింద్.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం

by Narendra Sandineni November 29, 2024
written by Narendra Sandineni

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
“నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
“జీవితమా …
“ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
“ఎంత గారాల బిడ్డనో నేను ? “
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (16)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“శత్రువులను కలుద్దామని వాళ్ళ ఇళ్ళని
“వెతుక్కుంటూ వెళ్ళానా …ఇక చూడండి
“అక్కడ నా స్నేహితులతోనే ములాఖత్ అయింది”.
ఒకరికి కొందరికి హాని కలిగించినట్టి,రాజ్యానికి దేశానికి ద్రోహం చేసినట్టి వ్యక్తిని శత్రువుగా భావిస్తారు.మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు.ఒకరికి మరొకరిపై మనసులో కలిగే కీడు భావన ఇరువురి మధ్య శత్రుత్వాన్ని కలిగిస్తుంది.అటు వంటి వాడే శత్రువు.ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు మౌనంగా ఉండకపోవడం వల్ల మనసులో చెలరేగే ప్రతీకార భావనలు శత్రువుల్ని తయారుచేస్తాయి.తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో రాయబడి ఉంది.స్నేహితులు కాని వారు శత్రువులు.మనకు హాని కలిగించే వారు శత్రువులు. మనకు వ్యతిరేకంగా పని చేసే వారు శత్రువులు.శత్రుత్వం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య నెలకొన్న వ్యతిరేక భావనగా పేర్కొనవచ్చు.స్నేహితుల మధ్య సయోధ్య లేక పోవడం,అపోహలు,మనస్పర్ధలు,అవగాహన లోపంతో స్నేహం పటాపంచలై శత్రుత్వంగా మారుతుంది. స్నేహం అద్భుతమైంది.నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహానికి హద్దులు లేవు.అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. స్నేహం ఓ మధురమైన అనుభూతి.దానికి వయసుతో నిమిత్తం లేదు.ఆట పాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.అటు వంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.సృష్టిలో నా అనే వారు,బంధువులు లేని వారైనా ఉంటారేమోగాని స్నేహితుడు లేని వారు అసలు ఉండరు.ఇంట్లో చెప్ప లేని సమస్యలను,బాధలను సైతం స్నేహితులతో ఎటు వంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పును పొందుతారు.అది స్నేహంలోని గొప్పతనం.స్నేహం ప్రకృతి వంటిది.అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయిని ఇస్తుంది.మనిషి జీవన యానంలో స్నేహం శ్వాస వంటిది.స్నేహం ఎంతో తియ్యనైంది.అమ్మ ప్రేమ,స్నేహం వెల కట్ట లేనిది.ఈ రెండే జీవితంలో ముఖ్యమైనవి.స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం చెప్ప లేనిది.పవిత్రమైన స్నేహం ఉండాలి.అటు వంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఈ కవిత శత్రుత్వం మరియు స్నేహం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది.మనం శత్రువులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు తారసపడ్డట్లుగా ఉంది.ఈ కవితలోని భావం మనల్ని ఆలోచింప జేస్తుంది.అసలు శత్రువులు అంటే ఎవరు? మనుషుల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడుతుంది? స్నేహం మరియు శత్రుత్వానికి గల సంబంధం ఏమిటి?ఈ కవితలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా స్నేహితులను మరియు శత్రువులను గురించి ఆలోచింప జేస్తుంది.శత్రువులు అందరు మన స్నేహితులు కాకపోవచ్చు.స్నేహితులు కూడా శత్రువులుగా మారవచ్చు. మనం ఎవరిని శత్రువులుగా భావిస్తాము అనే సంగతి గురించి ఆలోచించాలి.ఈ వాక్యం ఆలోచనాత్మకంగా మరియు వ్యంగ్య భరితంగా,ఎంతో లోతైన భావాలు,జీవన దార్శనికతతో కూడిన అనుభవాలను ప్రతిబింబించేలా ఉంది.శత్రువులను కలుద్దామని వెతుక్కుంటూ వెళ్లడం అనే వాక్యం మనలను ఆలోచింపజేస్తుంది.ఇది సమస్యను నేరుగా ఎదుర్కోవాలనే సంకల్పంతో ప్రారంభమైన చర్యగా భావించవచ్చు.శత్రువులు అంటే మీరు ప్రత్యర్థులుగా భావించిన వారు అని సూచిస్తుంది. జీవితంలో మనం ఎవరిని శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అసలు వాళ్లు శత్రువులే కాకుండా స్నేహితులుగా కూడా మారవచ్చు.అక్కడ స్నేహితులతో ములాఖత్ కావడం అనేది ఆలోచింపజేస్తుంది. ములాఖత్ అనేది ఉర్దూ పదం.ఎవరైనా లేదా వ్యక్తులతో సమావేశం కావడం అని అర్థం.ఒకో సారి మనకు జీవితంలో అనుకోని సందర్భాలు కూడా ఎదురవుతాయి.మీరు ఒక ప్రతికూల సంఘటనను ఎదుర్కొనే ఉద్దేశంతో వెళ్లడం అది ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మారిపోవడం సహజం అనిపిస్తుంది.అనూహ్యంగా మీరు శత్రువులుగా భావించిన వారు నిజానికి మీ స్నేహితులు అని తెలిసింది.అక్కడ మీరు అనుకోని స్నేహితులను కలిశారు.మీరు వారిని మనసులో ప్రతికూలంగా భావించారు.కాని సానుకూల పరిణామం ఏర్పడింది.అది జీవితపు వ్యంగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.మనం చాలా సార్లు ఒక దాన్ని అనుకుంటాం.విచిత్రంగా వేరే దాన్ని ఎదుర్కొంటాం.మనం కొన్ని సార్లు అపోహతో ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకుంటాం.జీవితంలో మనం కొన్ని సార్లు అనవసరంగా కొందరిని శత్రువులుగా భావిస్తాం.కాని వారిని గమనిస్తే మనకు వాళ్లలో ఏదో తెలియని సంబంధం,స్నేహం మిళితమై ఉంది అనిపిస్తుంది.ఒక్కో సారి మనకు తెలియకుండానే జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.మన జీవితంలో ఏది ఎలా జరుగుతుందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం.జీవితం అనే మజిలీలో జరిగిన ఆ సంఘటన చిత్రంగా అనుకోని మలుపుగా భావించవచ్చు.జీవితంలో ఎదురైన సంఘటనలు కొన్ని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాను ఎదురు చూసింది ఒకటి తనకు తెలియకుండానే మరొకటి జరిగింది.తాను ప్రతికూల భావనలతో వ్యవహరించినప్పటికీ చివరకు అది సానుకూల పరిణామంగా మారడం సంతోషాన్ని కలిగించింది.ఈ వాక్యం జీవితపు అంతర్లీన సత్యాలను,అనుభవాలను, దార్శనికంగా వ్యక్తపరుస్తుంది.శత్రువులను వెతుక్కుంటూ వెళ్లి స్నేహితులని కలవడం అంటే తాను అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని పొందడం విస్మయం కలిగిస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (17)
తెలుగులోకి అను సృజన ;గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.దీనిని గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఎందుకు ఎప్పుడు నా వెంటే
“నడుస్తుంటావని నా నీడను అడిగాను
“మరి ఇంకెవరున్నారు నీకు తోడుగా
“ చెప్పు .. అంటూ చిన్నగా నవ్వేసింది నా నీడ !
నీడ ఇది ఒక మూల పదం.నీడ లేదా ఛాయకు ఆంగ్లంలో Shadow అని అర్థం.మనం నీడ కోసం గొడుగులు వాడతాము. ఇవి వేసవి కాలంలో మనల్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తాయి.కాంతి ప్రసారాన్ని వస్తువు అడ్డగించినప్పుడు,అడ్డగించిన ఆకారాన్ని పోలిన నల్లటి ఆకారం నీడ.పురాతన కాలం నుండి గడియారం అవసరం లేకుండా సూర్యుని నీడను ఉపయోగించి సమయాన్ని కనుగొనేవారు.తోలుబొమ్మలాటలు బొమ్మల నీడలను ఉపయోగించి జన రంజకంగా ప్రదర్శించే సాంప్రదాయం చాలా దేశాలలో ఉంది.ఖగోళంలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి.సూర్యుని వెలుతురు పడని స్థలం నీడ.సూర్యుని ప్రకాశానికి ఏదైనా వస్తువు అడ్డుగా వచ్చినప్పుడు నీడ ఏర్పడుతుంది. ఎండా కాలంలో బాటసారి చెట్టు నీడలో చేరి సేద తీరుతాడు.ఒక వస్తువు యొక్క ప్రతిబింబం కనిపించుట నీడ.వెలుతురు ఉన్నప్పుడు మనలాంటి ఆకారమే మరొకటి కనిపిస్తుంది.అది నీడ.ఈ కవిత ఒక భావోద్వేగంతో కూడిన భావనను ప్రతిబింబిస్తుంది.ఇందులో కవి తనకు నీడతో ఉన్న అనుబంధాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరిస్తాడు.వ్యక్తి తన నీడను అడగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ”ఎప్పుడు నా వెంటే నడుస్తుంటావు ఎందుకు?దానికి నీడ సమాధానం ఇస్తుంది.నాకు తోడుగా నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చిన్నగా నవ్వుతూ అంటుంది.ఈ వాక్యం మనుషుల జీవితాలలో తోడుగా ఉండే ఒంటరితనాన్ని,అనుబంధాలను ప్రతిబింబిస్తుంది.నీడ ఇక్కడ కేవలం శారీరకంగా ఉండే దృగ్విషయం మాత్రమే కాదు.మన జీవన ప్రయాణంలో నీడ అణుకువగా ఉన్న తోడు అని భావించవచ్చు.నీడను అడగడం ద్వారా తనను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా?అనే ఆలోచనను వ్యక్తం చేస్తాడు.ఇది మనిషి జీవితంలో సహజంగా ఎదుర్కొనే ప్రశ్నలను ప్రతిబింబిస్తుంది.నీడ సమాధానం చెబుతూ నాకు తోడుగా నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పడం ద్వారా వ్యక్తికి సానుభూతిని కలిగిస్తుంది.నీడతో చెప్పిన మాటలు జీవిత సత్యాన్ని తెలియజేస్తాయి.ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండవలసి వస్తుంది.ఒంటరిగా ఉన్న సమయంలో మనిషి తనకు తానే తోడుగా నిలుస్తాడు.నీడ ఎక్కడైనా నవ్వుతుందా?అనే ప్రశ్నలు మనలో చెలరేగుతాయి.
నీడ చిన్నగా నవ్వడం అనేది కవితలో ఒక తేలికపాటి దార్శనిక భావనను సూచిస్తుంది.ఇది మనం సాధారణంగా చూసే విషయాలను ప్రత్యేక దృక్పథంలో పరిశీలించవల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.ఈ కవితలోని భావనలు మనకు కొన్ని ముఖ్యమైన సందేశాలను ఇస్తాయి.మన జీవిత ప్రయాణంలో కొన్ని సార్లు మనకు మనమే తోడుగా నిలవాలి.నీడ మనకు స్నేహం,నమ్మకం,ధైర్యం కలిగిస్తుంది.నీడ మనకు ఎప్పుడు తోడుగా మన వెన్నంటి ఉంటుంది.నీడ ఎప్పుడు మనలని వదిలి పెట్టదు.మనుషుల ఒంటరితనం అలాగే మన ఆత్మ బలాన్ని కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం ఇక్కడ వ్యక్తం అవుతున్నది.ఇందులో జీవితంలోని సహజమైన అనుబంధాలను చక్కగా తెలియజేసిన తీరు బాగుంది.ఈ కవిత మన జీవితంలో నీడ వలె ఉండే వ్యక్తుల గురించి చెబుతుంది.నీడ ఎల్లప్పుడు మన వెంట ఉంటుంది.అదే విధంగా మన జీవితంలో నీడ వలె కొంత మంది వ్యక్తులు ఎల్లప్పుడు మన వెంట ఉంటారు.ఈ కవిత మనల్ని మన జీవితంలోని వ్యక్తుల గురించి ఆలోచింపజేస్తుంది.మన జీవితంలో వారి పాత్రలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ కవితలో నీడ ఒక ప్రతీకగా ఉపయోగించబడింది. నీడ అనేది మన జీవితంలో ఎల్లప్పుడు మన వెంట ఉండే వ్యక్తులను సూచిస్తుంది.ఈ కవితలో భాష సరళంగా ఉన్నందు వల్ల అర్థం చేసుకోవడం సులభం.గుల్జార్ షాయరీ కవితలోని శైలి ప్రత్యేకతను కలిగి ఆకర్షణీయంగా ఉంది.షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలకు ఉల్లాసం కలిగిస్తుంది.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (18)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.దీనిని గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ప్రతీ సంధ్య వేళలో నా కుశలం
“కనుక్కుంటున్నావు కదా మర్చిపోయావా …
“లేక … మీ ఊర్లో అసలు సాయంత్రమే “కాదా ఏంటి?”
రాత్రి ముగిసి సూర్యోదయం అయ్యే మధ్య కాలాన్ని అలాగే సాయంత్రం ముగిసి సూర్యాస్తమయం అయ్యే మధ్య కాలాన్ని సంధ్యా సమయం అంటారు. రాత్రి వేళ చలి మంట కాచుకుంటూ చంద్రుని నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తుంటే ఎంతో కను విందుగా ఉండేది.ఆ సంధ్య వేళ వీచే చిరు గాలి చుట్టూ ఉన్న మొక్కల నుండి మోసుకొచ్చే పరిమళాలు ఇంపుగా ఉండేవి.సాయంత్రం అనేది పగటి పూట ముగింపుతో ప్రారంభమయ్యి మరియు రాత్రి మొదలు కావడంతో ముగుస్తుంది.ఈ కవిత ఒక వ్యక్తి తన స్నేహితుడితో సంభాషించడం గురించి చెబుతుంది.కవితలోని భావం హృదయానికి తాకేలా ఉంది.”ప్రతీ సంధ్య వేళలో నా కుశలం కనుక్కుంటున్నావు కదా?మర్చి పోయావా? లేక మీ ఊర్లో అసలు సాయంత్రమే కాదా? ఏంటి?అని కవితాత్మకంగా అడుగుతున్నాడు.ఈ కవిత మన జీవితంలోని స్నేహ ప్రాధాన్యతను వ్యక్తం చేస్తుంది. స్నేహితులు మన జీవితంలో ఎల్లప్పుడు మన వెన్నంటి తోడుగా రక్షణ కవచంలా నిలుస్తారు. స్నేహితులు ఎప్పుడు మన యోగ క్షేమాలపై దృష్టి సారిస్తారు.స్నేహం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైంది.స్నేహితులు మనల్ని సరి అయిన గమ్యంలో నడిపిస్తారు.స్నేహం అనేది మన జీవితంలో మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది.ఈ భావన స్నేహితుల మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని తెలుపుతుంది.స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయతతో అడగడం,సమాధానం ఇవ్వడం వంటి విషయాలు మనం ఎరిగినదే.ఇది స్నేహితుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.వారు పరస్పరం మరిచిపోని వారై ఒకరిపై ఒకరి పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారు.సాయంత్రం అనే కాలమానానికి మానవ సంబంధాలను అన్వయిస్తూ మనసులోని వ్యధను ఈ విధంగా వ్యక్తీకరించడం బాగుంది.ఈ కవిత ఒక వ్యధతో కూడిన ప్రేమను, ఆత్మీయతను ప్రతిబింబిస్తుంది.ఇది ప్రేమ,దూరం కావడం మరియు మరిచిపోవడంపై కవి గుండెలో చెలరేగుతున్న అనేక అనుభూతులను వ్యక్తీకరిస్తుంది.ఈ కవితలోని ప్రతి పంక్తి లోతైన భావాలతో నిండి ఉంది.ప్రతి సంధ్య వేళలో నా కుశలం కనుక్కుంటున్నావు కదా మర్చిపోయావా? ప్రతి సాయంత్రం తనను గుర్తు చేసుకుంటున్నావా అని కవి ప్రేమతో,ముద్దుగా మనసులో నెలకొన్న సందేహంతో ప్రశ్నిస్తున్నాడు.మర్చిపోయావా అనే ప్రశ్న వేదనతో కూడిన సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది ప్రేమలో ఉన్న అపార్థాలను అంతర్గత భయాన్ని సూచిస్తుంది.లేక,మీ ఊర్లో అసలు సాయంత్రమే కాదా ఏంటి? అని కవి ప్రశ్న ద్వారా సార్వజనీనమైన ప్రకృతిని కూడా వ్యక్తిగతంగా అన్వయిస్తున్నాడు. సాయంత్రం అనే సమయాన్ని గుర్తు చేస్తూ ఆ వ్యక్తి తన గురించి ఆలోచించడం లేదని భావించి,అది నిజమా?కాదా?అని ప్రశ్నిస్తున్నాడు.ప్రేమికుల మధ్య ఎడబాటు మరియు దూరం వల్ల ఉత్పన్నమైన ఆత్మీయతను కోల్పోవడం మరియు ప్రేమలో కలిగే నిరాశకు ప్రతీకగా ఉంది.ఈ కవితలో ప్రేమికుల మధ్య పెరిగిన దూరం,సాయంత్రం వంటి ప్రత్యేక సమయాలు జ్ఞాపకం వచ్చి ఆ వ్యక్తి తన గురించి ఆలోచిస్తున్నాడా?లేదా?అనే అనుమానాన్ని, మరిచిపోయాడేమో అనే బాధను ప్రతిబింబిస్తుంది. ఇది వేదనతో కూడిన భావన.మీ ఊర్లో సాయంత్రమే కాదా ఏంటి?అనే ప్రశ్న ద్వారా కవితలో గంభీరతతో కూడిన భావన మరింతగా హృదయాన్ని తాకుతుంది.ఈ పంక్తి గుండెలో నెలకొన్న బాధను, అసహనాన్ని మరియు ఒక ప్రత్యేకమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది.కవి ఎదుటి వ్యక్తిలోని నిర్లక్ష్యాన్ని లేదా స్పందన లేకపోవడాన్ని గమనిస్తున్నాడు. సాయంత్రమే లేక పోతే అని రూపకాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి జీవితంలో ప్రేమను, ఆత్మీయతను తాను కనుగొనలేక పోతున్నట్లు భావిస్తున్నాడు.ఇది ఆ వ్యక్తిలోని అజాగ్రత్తను, స్పందన లేనితనాన్ని ప్రతిబింబిస్తుంది.సాయంత్రం అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆహ్లాదాన్ని,ప్రశాంతతను, ఒక ప్రత్యేకతను గుర్తు చేస్తుంది.అయితే మీ ఊర్లో సాయంత్రమే కాదా?అనే ప్రశ్న ద్వారా కవి ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయతకు చోటు లేదని పేర్కొంటున్నాడు.అది వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం వల్ల వచ్చిన కోపాన్ని,నిరుత్సాహాన్ని సూచిస్తుంది.మీ ఊర్లో సాయంత్రమే కాదా? అనే ప్రశ్న వ్యంగ్యంగా ఉంది.ఇది ఎదుటి వ్యక్తిలోని నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే పద్ధతిగా భావించ వచ్చు.అది నిజంగా సాయంత్రం లేక పోవడం గురించి కాదని, అతను సాయంత్రం గురించి ఆలోచించట్లేదని స్పష్టం చేస్తున్నాడు.ఈ పంక్తి ప్రేమలో నిర్లక్ష్యం లేదా మర్చిపోవడాన్ని సూచిస్తుంది.మనం మన ప్రియమైన వ్యక్తిని గుర్తు పెట్టుకోవడం మరియు వారి కోసం ఆలోచించడం మన సహజమైన బాధ్యత. సాయంత్రం ప్రకృతిలో నిరంతర చక్రం కాగా అది వారిలో ఉండకపోవడం అంటే ప్రేమ,ఆత్మీయత లోపించినట్లు కవి భావిస్తున్నాడు..మీ ఊర్లో సాయంత్రమే కాదా?అనేది వ్యక్తిగత బాధను, అపేక్షను మరియు అంతర్మధనాన్ని వ్యక్తీకరించే అద్భుతమైన ప్రశ్న.ఇది ప్రేమలో గోచరమయ్యే దూరం,నిజమైన భావోద్వేగాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను అద్భుతంగా వ్యక్తీకరించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.కవి గుల్జార్ లోక రీతిని ఎరిగిన వాడు.షాయరీ కవితలో పొందుపరిచిన భావాలు పాఠకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కలసి ఉంటే కలదు సుఖం

by ఒద్దిరాజు మురళీధరంరావు November 29, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒకానొకప్పుడు ఓ ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్లు మంచి పెయింటర్లు. వాళ్లలో ఒకతను మంచి మనిషి బొమ్మలు వేసేవాడు. రెండవతను వాటికి మంచి ముఖాలు చేసేవాడు. మూడవ తమ ఆ బొమ్మల్లో ని ఇళ్ళూ , చెట్లు అందంగా పెయింట్ చేసేవాడు. అలా వాళ్ళు ముగ్గురూ కలిసి పెయింట్ చేసిన పటాలు చాలా అందంగా ఉండేవి. ఎంతో మంది ఆ పటాలను చూసి సంతోషంతో కొనుక్కొని వెళ్లేవారు. దాంతో ఆ సోదరులు తృప్తిగా ఉంటుండేవాళ్ళు.

కానీ కొన్నాళ్ల తర్వాత పెద్దతను తను వేస్తున్న మనిషి బొమ్మలు చాలా అందంగా ఉండడం వల్లనే ఈ పటాలన్నీ అమ్ముడుపోతున్నాయి అనుకుంటూ…
“నేను అనవసరంగా నాకు వచ్చే డబ్బులు ఇద్దరు సోదరులకు ఇస్తున్నాను కదా ! కాబట్టి నేను వేరుగా బొమ్మలు వేసి పెయింటింగ్ లను తయారు చేయడం మంచిది’ అనుకొని అలా మొదలుపెట్టాడు.
రెండవతను ఆ బొమ్మలకు తను పెయింట్ చేసిన అందమైన ముఖాల వల్లనే పెయింటింగ్స్ అందంగా ఉండి అవన్నీ బాగా అమ్ముడుపోతున్నాయనుకొంటూ,
” నేను ఒక గొప్ప పెయింటర్ను !నాకు అర్థం అవడం లేదు…. నేను ఇద్దరు సోదరులకు ఎందుకు డబ్బు ఇస్తున్నానో !! ఇప్పటినుండి నేనే స్వయంగా ముఖాలు పెయింట్ చేస్తే సరి. ముఖాలు మనిషిలోని భావాలను తెలిపేవి. ఆ పెయింటింగ్ లకు మంచి గిరాకీ ఉంటుంది” అనుకొని తను విడిగా పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు.
ఇక మూడవ తను కూడా తను పెయింటింగ్ చేసే ఇల్లు చెట్లు ఉండడంతోనే ఆ పెయింటింగ్ లకు సంపూర్ణత వచ్చి ఎంతో అందంగా ఉంటున్నాయి, ఆదర్శనీయంగా ఉంటున్నాయి, దాని వల్లనే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని అనుకొని, తను విడిగా ఇల్లు చెట్లు వేస్తూ పెయింటింగులు వేయడం మొదలుపెట్టాడు.” తన గొప్పతనానికి వచ్చే డబ్బు అనవసరంగా ఇద్దరు సోదరులకు ఇవ్వడం మూర్ఖత్వం” అని అనుకున్నాడు
ఇలా విడివిడిగా ఉన్న పెయింటింగ్ లను చూసి ఎవ్వరు ఇష్టపడక కొనేవాళ్లు రాలేదు. ఇట్లా ముగ్గురు అన్నదమ్ములు విడివిడిగా ఉండి అసంపూర్ణమైన పెయింటింగులను వేయడం వల్ల రాబడి లేక ముగ్గురికీ ఇల్లు గడవడమే ఇబ్బంది అయిపోయింది .
కొన్నాళ్ల తర్వాత ఈ పద్ధతి ఏమీ బాగోలేదు ముగ్గురం కలిసే ముందు లాగే ఒక్క పెయింటింగ్ లో ముగ్గురి నైపుణ్యత చూపించడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు. అప్పటినుండి మళ్లీ వాళ్ల పెయింటింగులు బాగా అమ్ముడుపోవడం మొదలై రాబడి పెరిగింది.
అప్పుడు వాళ్లకు అర్థమైంది కలిసి ఉంటే కలదు సుఖం అని,
United we stand, divided we fall అని!!

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

జూ’లో గొరిల్లా

by ఒద్దిరాజు మురళీధరంరావు November 29, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక జంతు ప్రదర్శన శాల (జూ,zoo)లో ఏనుగులు, మొసళ్ళు, రైనోసిరస్ లు (ఖడ్గమృగాలు) ఇంకా ఎన్నో ఎన్నో వేరే జంతువులు చాలా ఉన్నాయి. అక్కడ ఒక గొరిల్లా కూడా ఉన్నది. అది చూడటానికి చాలా భయంకరంగా ఉన్నది. దాన్ని చూసి అందరూ భయపడేవాళ్లు. ఆ గొరిల్లా ఎవరితో కూడా స్నేహం చేయలేదు. దాని పేరు పీట్ ( Pete) అని ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు ఒక చిన్న పాప వాళ్ళు ఈ జూ కు వచ్చారు. ఆ పాప పేరు జోసఫైన్. జోసఫైన్ తన తల్లి తో కలిసి గొరిల్లా బోను(cage) దగ్గర ఆగింది, వెళ్దాం రమ్మంటే అక్కడ నుండి కదలనే కదలని అన్నది.
” రా డియర్ వెళ్దాము” అని తల్లి పిలిచినా వెళ్లలేదు.
“మనం ఇంకా బ్యూబన్లను(Baboons), కంగారులను ( Kangaroos),జిరాఫీలను ( Giraffes) చూడాలి అని ఎంతగానో పిలిచింది. కానీ జోసెఫ్ తలను అడ్డంగా ఊపింది. “గొరిల్లా అన్నింటికంటే ఆహ్లాదకరమైంది.నాకు ఇతనితో … ఈ గొరిల్లా తో ఆడుకోవడమే ఇష్టం”అని అన్నది . గొరిల్లా ఈ మాటలు విన్నది. దాని మనసు ఈ చిన్న అమ్మాయి వైపు తిరిగింది.
మర్నాడు ఉదయం జూ కాపరి గొరిల్లా వెళ్లిపోయిందని తెలుసుకున్నాడు.అది మామూలుగా బోను ద్వారాన్ని నెట్టి తెరిచి జూ గోడ ఎక్కింది, అలా టౌన్ లోకి వెళ్లి పోయింది. వెంటనే అలారం మోగింది. అగ్నిమాపక దళం నిచ్చెనలతో బయటకు బయలుదేరింది.పోలీసులు వాళ్ళ లాఠీలతో, సైనికుల గుంపులు ట్యాంకులతో, కొద్దిమంది మిలిటరీ డాక్టర్లు, పశువుల డాక్టర్లు అందరూ గొరిల్లాను కనిపెట్టాలని బయలుదేరారు.
వెంటనే లౌడ్ స్పీకర్ వ్యాన్లు బజార్లో పెద్ద సంగీత ధ్వనులతో బయలుదేరాయి.
“ఎవ్వరూ ఇండ్ల నుండి బయటికి రావద్దు! జాగ్రత్త!! బయట భయంకరమైన గొరిల్లా తిరుగుతున్నది. ఎవరైనా చూస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలి ” అని అనౌన్స్ ఇది విని బలహీనమైన గుండె ఉన్న అమ్మాయిలు కొందరు మూర్ఛిల్లిపోయారు.ఎక్కడి వారు అక్కడనే భయపడిపోయారు.

కొందరు ఔత్సాహికులైన గొప్ప వేటగాళ్లు ఇండ్ల మీదికి గుండ్లు నింపిన రైఫిల్స్ తో ఎక్కారు. కానీ ఎక్కడా గొరిల్లా జాడలేదు. అది గాల్లో ఎగిరిపోయిందా అన్నట్లు అనిపించింది వాళ్ళ కు.
ఓ ఐదారు గంటలు గొరిల్లా కొరకు వెదికారు. కానీ అది ఎక్కడ కనిపించలేదు అప్పుడు ఒక జనరల్ కు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది.
AI. ఆల్సేషన్ ( శునకం, కుక్క) . అది ఎప్పుడైనా వాసన చూసి పసిగట్టేదొక దాన్ని తెప్పించారు.అది గొరిల్లా ఉంటున్న బోను వాసన చూసి, కాసేపు మొరిగింది.వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని వెంట శాశ్వత సైనిక విభాగ సైనికులు ఒక ప్లాటూన్ పోలీసులు,ఇంకా ఒక అగ్నిమాపక దళం , ఎవరైతే వాళ్ల నిచ్చెన్లను దారిలో పోగొట్టుకున్నారో వాళ్లంతాను పరిగెత్తారు.
AI . ఆల్ సెషన్ వాసన పసిగట్టి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి చేరింది.వెంట ఉన్న డాక్టర్లు,పశు వైద్యులు అందరూ దాన్ని వెంబడించారు.ఈ శునకాన్ని పట్టుకున్న పోలీస్ ట్రైన్డ్ కేర్టేకర్ భయపడుతూ కుక్క చూపిన ఒక ఇంటి డోర్ బెల్ కొట్టాడు,అది మొరగడం ఆపింది. పోలీసు వాళ్ళు వాళ్ళ కర్రలతో రెడీగా… గట్టిగా పట్టుకొని నిలబడ్డారు.
జోసఫైన్ డోర్ తెరిచి అల్లరి చేయవద్దని పెదవులపై వేలు పెట్టుకుంది. అతి నెమ్మదిగా ” నేను ఇప్పుడే ఒక కథ చెప్పి నిద్రపుచ్చాను. ఎవరు మీరంతా ? ఆగండి” అన్నది.
పోలీసులు, సైనికులు ,అగ్నిమాపక దళాలు అందరూ 475 మంది మెట్లపై ఇరుక్కుని నిలబడ్డారెందుకో గ్రహించి ,
అమాయకపు గొరిల్లాను నిద్ర నుండి లేపి,
జోసఫైన్ గొరిల్లాతో ” నేను రోజు వచ్చి కలుస్తాను నిన్ను.. ఇప్పుడు వాళ్లతో వెళ్ళు “అని మెల్లిగా వివరించింది. అలా ప్రతిరోజు వెళ్లి దాన్ని కలుస్తానని వాగ్దానం చేశాక అది అల్లరి చేయకుండా నెమ్మదిగా వాళ్ళ వెంట జూకు తిరిగి వెళ్ళింది.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వారాల ఆనంద్ మనిషి లోపల no man’s land

by Narendra Sandineni November 29, 2024
written by Narendra Sandineni

కవిత్వం పై పుస్తక సమీక్ష.
ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత,విశ్రాంత లైబ్రేరియన్,ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,వారాల ఆనంద్ మనిషి లోపల no man’s land కవిత్వంపై పుస్తక సమీక్ష.ఈ పుస్తకాన్ని తన భార్య ఇందిరా రాణికి అంకితం ఇవ్వడం ముదావహం.ఆనంద్ కవితా సంపుటిలో కలిసి బతుకుని పంచుకుందామని వచ్చి నాకు జీవితాన్నే ప్రసాదించిన సహచరి ఇందిరకు అని రాసుకున్న అంకిత వాక్యాలు అతనికి తన భార్యపై ఉన్న గౌరవాన్ని ప్రకటిస్తున్నాయి.ఈ పుస్తకానికి అన్నవరం శ్రీనివాస్ చక్కటి ముఖచిత్రం అందించారు.దర్భశయనం శ్రీనివాసాచార్య ముందు మాటలో ఆగస్టు 2013 నుంచి ఇటీవల దాకా ఆయన రాసిన కవిత్వమే ఈ సంపుటి.నేను ఈ కవితల్ని చదివి ఆశ్చర్యపోయాను.క్లిష్ట వేదనా సమయంలో ఇంత రాశిగా కవిత్వం రాసాడా అని నిదానంగా ఆలోచిస్తే,ఇది పెద్దగా ఆశ్చర్య పడాల్సిన విషయం కాదనిపించింది.వ్యక్తీకరణ తెలిసిన సాహిత్యశీలి కనుక తన లోపలి ప్రపంచాన్ని,

ప్రకంపనల్నీ,నిశ్శబ్దాన్నీ,అలజడిని రికార్డ్ చేశాడు. ఐతే కుదురైన వచన వాక్యాన్ని రమ్యంగా రాయగలిగే శక్తీ,అలవాటు ఉన్న ఆనంద్ తన భావాల్ని వచన రూపంలోకి కాక,కవిత్వ రూపంలో ఎందుకు పెట్టి వుంటాడు?తాను తన వేదనను వ్యక్తీకరించాలి.వేదనను అధిగమించే ప్రయత్నాన్ని వ్యక్తీకరించాలి.ఒక emotoional సందర్భం.దానికి కవిత్వమే సరైన మాధ్యమని భావించి వుంటాడు. వ్యక్తీకరణకు అవసరమైన మూలకాలు తనలో ఎలాగు వున్నాయి.వేదనా సమయంలో మనిషి ఆలోచనలు పలు దిశలకు ఎలా సాగుతాయో ఈ సంపుటిలో కవితలు చెబుతాయి.మనిషికి మెలిక అవసరాలైన ప్రేమ,స్నేహం,తోడు,సంభాషణల పలవరింత ఆనంద్ కవితల్లో అగుపడుతుంది. దుఃఖాన్ని అధిగమించడానికి మనిషి చేసే ధైర్య చింతనకు దాఖలాలు ఇందులో వున్నాయి. నిజానికి,రెండు మూడు కవితల్ని మినహాయిస్తే, మిగతా అన్ని కవితల్లో సాగిన చింతనలో ఏక సూత్రత వుంది.అరమరికలు లేని సూటి దనముంది.వ్యక్తీకరణలో స్పష్టత ఉంది.కవిలోని శిల్ప ధ్యాస వస్తువుతో మిళితమై రాణించిన కవితలు బలంగా సాగాయి.వస్తు ప్రధానమైన కవితలు భావ ప్రకటన అనే ఏక లక్ష్యంతో కదలాయి.సున్నితంగా మనిషిలో సాగే ప్రకంపనలు దాదాపు అన్ని కవితల్లోనూ వుండడం ఒక వాస్తవాంశమే కాకుండా విశేషాంశం కూడా.ఒక సంక్లిష్ట సందర్భానికి ఆనంద్ ఇచ్చిన అక్షర రూపం ఈ సంపుటి.దుఃఖమూ కవిత్వమూ కవలలని తాను తెలుసుకున్నాడు.అనుభవంతో తాత్విక స్థాయి కెళ్ళి దుఃఖపు జీర లేకుండా ఏదైనా ఆనందమెలా అవుతుంది అని వ్యాఖ్యానించాడు ఆనంద్.ఈ సంపుటిలో దుఃఖం అనే మాట కనిపించినంతగా మరే మాట కనిపించదు.ధైర్యం అనే భావం పలికినంత మరే భావము పలక లేదు.వారాల ఆనంద్ సినిమా ప్రపంచంలో కదుల్తూనే కవితా ప్రపంచాన్ని వెంటేసుకు తిరగాలని ఆకాంక్షిస్తూ .. దర్భశయనం శ్రీనివాసాచార్య అన్నాడు.ఆనంద్ మనిషి లోపల కవిత్వం గురించి తెలుసుకోవాలని తహతహగా ఉందా?అయితే ఒక్క సారి మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి. గొప్ప గొప్ప కవితానుభూతుల లోకంలోకి వెళ్ళి విహరించండి.లోపలా – బయట కవితలో గది లోపల/మిరుమిట్లు గొలిపే కాంతిలో/ఆకులన్నీ పేర్చి విస్తరి కుట్టినట్టు/గ్లౌజులు తొడుక్కున్న చేతులు/ చకచక కదిలి పోతున్నాయి/సైగలే అక్కడి భాష/ నిశ్శబ్దానిదే రాజ్యాధికారం/గది బయట/ ప్రశాంతమైన కొలనులో రాయి పడినట్టు/అలలు అలలుగా అక్కడొకరు ఇక్కడొకరు/చేతులు కట్టుకుని ఒకరు/జేబుల్లో చేతులు పెట్టుకొని ఒకరు/ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆగని వెక్కిళ్ళు/నిశ్శబ్దాన్ని మంద్రంగా చేదిస్తున్నాయి/అంటున్నారు.ఆనంద్ తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నాడు.హాస్పిటల్ గది లోపల ఏం జరుగుతుంది?హాస్పిటల్ గది బయట ఏం జరుగుతుంది? అనే విషయాలను ఎంత అద్భుతంగా కవిత్వంలోకి మలిచాడో చదివితే హృదయం ద్రవిస్తుంది.ఆనంద్ వేదనామయ జీవితాన్ని కవిత్వంలో చక్కగా వ్యక్తీకరించిన సాహసిగా చెప్పవచ్చు.వేదన నుంచి కవిత్వం పుడుతుంది అంటారు.కాలం కవితలో గతం, వర్తమానం,భవిష్యత్తు కాలాన్ని తడుముతూ నడుస్తున్న కాలం/మనిషికి జీవ ధాతువు/ అంటున్నారు.నడుస్తున్న కాలంలో మనిషి తాను జీవనం కొనసాగించాలి.నడుస్తున్న కాలం మనిషికి జీవాన్ని అందించే ధాతువు అంటూ కాలం విలువను తెలియజేసారు.కవి ఆత్మవిశ్వాసంతో బతుకు పట్ల ఆశను కలిగిస్తూ ప్రేరణను అందిస్తున్న తీరు బాగుంది.ఇమ్మ్యునో సప్ప్రెస్సర్స్ కవితలో శరీరంలో ప్రతిఘటించే గుణాన్ని/నియంత్రించేదేదో/రక్తనాళాల్లో సుళ్లు తిరుగుతోంది/ప్రతిఘటనా నియంత్రణ/ శరీరానికే కానీ ఆలోచనకు కాదు కదా/మనసులో ముంచిన ఆలోచనలకు/పదును పెడుతూ/తనని తాను ఆవిష్కరించుకుంటున్నాడు/ఎంతయినా మనసున్న మనిషి కదా/అంటున్నారు.ఇమ్మ్యునో సప్ర్పెస్సర్స్ అంటే శరీర రోగ నిరోధక వ్యవస్థను తగ్గించే ఔషధాలు.రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలతను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.అవయవ మార్పిడి సమయంలో శరీరం కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు వైద్యుల పర్యవేక్షణలో దీనిని ఇస్తారు.దురదృష్టవశాత్తు ఆనంద్ మూత్రపిండాలు పాడై పోయినాయి.తన సహచరి ఇందిర మూత్రపిండం ఇచ్చి తన భర్త ఆనంద్ ను ప్రేమతో కాపాడుకుంది.ఈ కవితలో తన శరీరంలో మూత్రపిండం అవయవ మార్పిడి జరిగినప్పుడు మనసున్న మనిషి కదా అని తన గురించి తాను నిభాయించుకుంటున్నాడు.ఈ వాక్యాలు ప్రాణం పోతున్నవారికి ప్రాణం పోసేలా ఉన్నాయి.విజయ తీరం కవితలో మూసినా తెరచినా/కళ్ళు కలల్ని/తోడ్కొని వస్తాయి/కురిసిన ఆరినా/కన్నీళ్లు/మనసును కడిగేస్తాయి/వేకువా చీకటీ/ఒక దాని వెనక మరోటి/ఏది ముందు వస్తుందో/ఏమి ఎరుక/అంటున్నారు.మనిషి కాలంతో పాటు పయనించి విజయ తీరాలకు చేరుకోవాలనే భావన స్ఫూర్తిని కలిగిస్తుంది.నాని గాడు కవితలో ఇన్నేళ్లూ/వాడు నాకర్థం కాలే/అవును ఎవరయినా/ ఎందుకు అర్థం అవుతారు/మనం ప్రయత్నిస్తే కదా/ ఇన్నేళ్లూ నాకు తెలియనిదేదో/తెలుస్తున్నట్టు/వాడి అంతరంగమేదో/ఆవిష్కృతమవుతున్నట్టు/వాడి కలలేవో రూపు దిద్దు కుంటున్నట్టు/అంతరిక్షం నుంచి సృజన వైపు/వాడి ప్రయాణం/సారీ రా నాని/నువ్వు అర్థం కాలేదనుకున్నా/కాని నేనే అర్థం చేసుకోలేదు/ అంటున్నారు.పిల్లలు తల్లిదండ్రుల కలలకు రూపాలు.పిల్లలు దైవ స్వరూపాలు అంటారు. అందులో సందేహానికి తావులేదు.తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు గ్రహిస్తారు,అర్థం చేసుకుంటారు.తల్లిదండ్రులు తమ గురించి ఏమనుకుంటున్నారు?అనే వాస్తవాన్ని పిల్లలు గ్రహిస్తారు.తల్లిదండ్రులే పిల్లలను సరిగా అర్థం చేసుకోరు అనిపిస్తుంది.ఆనంద్ తన కుమారుడు అన్వేష్ కు సృజనాత్మకమైన కళల పట్ల గల ఆసక్తిని తెలుసుకొని తండ్రిగా ఎంతో సంతోషిస్తాడు.నా కలలూ నీ కలలూ/ప్రోది చేసుకుని/విశ్వంలోకి దూసుకెళ్ళు/నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు/ అంటున్నారు.ఆనంద్ అవధులు లేని తన సంతోషాన్ని వ్యక్తం చేసిన తీరు బాగుంది.నిష్టూరం కవితలో ఎవరికీ ఎవరి మీదైనా/నిష్టూరం ఎందుకు/ముడుచుకోవడం/విచ్చుకోవడం/ పరిమళించడం/వారి వారి జీవ లక్షణం కదా/కలిసి రావడం/కలిసి నడవడం/కలిసి జీవించడం/ఎవరికి వారు గీసుకున్న/వృత్త పరిధిలోనే కదా/అయినా ఎవరి మీదయినా/నిష్టూరం ఎందుకు/కలిసొచ్చే అంశాల్లో కలిసిపోయి/కాని విషయాల్ని వదిలేసి/చిరునవ్వులు చిందిస్తూ/ప్రవాహమయి పోతే సరి/అంటున్నారు.నిష్ఠూరం అనగా నిందనీయమైన మాటలు.ఇతరుల మాటలను అపార్థం చేసుకుని సరైన కారణం లేకుండా నిందిస్తుంటారు.ఇతరులు ఏ సందర్భంలో అలా మాట్లాడారు అనే విషయాన్ని గ్రహించాలి.నిష్ఠూరపు మాటల వలన మనకు కావాల్సిన దగ్గరి వాళ్ళు మనసు నొచ్చుకొని దూరమవుతారు.కవి నిష్ఠూరం ఎందుకు?అని ప్రశ్నిస్తున్నారు.కలిసి వచ్చే అంశాల్లో కలిసి పోవాలి.పనికిరాని విషయాలను వదిలి వేయాలి.మనసులో ఏ కల్మషం లేకుండా చిరు నవ్వులు చిందిస్తూ కలిసిమెలిసి ఉండాలి.మనలో సానుకూలమైన ఆలోచనలు కలిగేలా ప్రోత్సహించి ఇతరులతో సామరస్య ధోరణిలో కలిసిమెలిసి సాగాలి అని వ్యక్తీకరించిన భావం అద్భుతంగా ఉంది.మనస్సు తేలికపడింది కవితలో దేన్నయినా/కోల్పోవడానికి/దూరం చేసుకోవడానికి/ సిద్ధంగా లేదు మనసు/ప్రేమనీ ద్వేషాన్నీ/కోపాన్నీ ఆప్యాయతనీ/విచ్చుకున్న పూలనీ/విరగ కాసిన చెట్టునీ చెట్టు బెరడునీ/చుక్కల ఆకాశాన్ని హత్తుకున్న దేన్నయినా సరే/వదులుకోవడానికి సిద్ధంగా లేదు మనసు/నేనే అశాశ్వతం కదా/ అన్నాను గుసగుసగా/ఉలిక్కిపడింది మనస్సు/ నువ్వు నేనూ లేకున్నా/నీ కవిత్వం ఉంటుందిగా/ తేలికపడింది మనస్సు/అంటున్నారు.మనస్సు చేసే మాయాజాలం మనం ఎరిగినదే.మనలను ఆలోచనా తరంగాల్లో తేలియాడ జేసిన భావాలు చక్కగా ఉన్నాయి.సహచరి కవితలోఆమె/ఒక భోళా/తనకు తెలిసినదేదో తెలిసినట్టు/తోచిందేదో తోచినట్టు/ స్వపర భేదాల్లేవు/ముందు వెనకల్లేవు/కుళ్ళూ లేదు కుతంత్రం లేదు/మా ఇద్దరి గమనంలో రహస్యం లేదు/ప్రేమలో మాలిన్యం లేదు/ఆమె స్నేహంలో/ వెన్నెల కురుస్తుంది/త్యాగంలో ఆకాశాన్ని స్పృశిస్తుంది/ఆమెతో జీవితం/బతుకంత లోతయింది/విశ్వమంత విశాలమయింది/ అంటున్నారు.ఇందిర కిడ్నీని దానం చేసి తన భర్త ఆనంద్ ను కాపాడుకుంది.నేటి సమాజంలో కుటుంబ సంబంధాలు బీటలు వారుతున్న ఈ రోజుల్లో తన భర్త పట్ల అపారమైన ప్రేమానురాగాలను చూపిన ఇందిర తన కుటుంబానికి,సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఆనంద్ సహచరి ఇందిర గురించి వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి.ఆపరేషన్ థియేటర్ కవితలో శీతల గదిలో తెల్లటి మంచం మీద/కాళ్లు బార్లా జాపి/శవాసనంలా వున్నాడతను/ అకస్మాత్తుగా/కళ్ళు మిరుమిట్లు గొలిపే/కాంతి ప్రసరించింది/అతని కాళ్లూ చేతులూ/తలా శరీరమూ అన్నీ/మాట్లాడటానికి నోళ్ళు తెరిచాయి/గానం చేయడానికి గొంతు సవరించుకున్నాయి/కాని అన్నీ చలనరహితమయి మూగవయిపోయాయి/అతని మనసొక్కటే మేల్కొని/కళ్ళ కిటికీలోంచి మంచు గదిని చూడ్డం మొదలు పెట్టింది/అంటున్నారు. ఆపరేషన్ థియేటర్ లో ఏం జరిగింది?అనే దానిని స్పష్టంగా గమనించి తన మనసులోని భావాలను కవితలో చక్కగా వ్యక్తీకరించిన తీరు బాగుంది. ఎట్లా…కవితలో నాకేదీ నచ్చడం లేదు/నన్నసలు ఏదీ ఆకర్షించడం లేదు/అవును మరి/కళ్ళల్లో మెరుపు లేకుండా/పెదాలపై చిరునవ్వు ఏం బాగుంటుంది/అందుకే/గుండె లోతుల్లోంచి రాకుండా/పైపైన ఏమి వస్తే మాత్రం/ఎట్లా నచ్చుతుంది/ఆత్మ లోతుల్లోంచి లేకుండా/ ఎంత అందమైతే మాత్రం/ఎట్లా ఆకర్షిస్తుంది/అంటున్నారు. ఇవ్వాళ మనుషులు వ్యవహరించే తీరులో ఎంతో మార్పు వచ్చింది.మనిషి బతుకు నటనగా మారింది.హృదయం లోతుల్లో నుంచి వచ్చే ఆత్మీయత కావాలి.మనుషుల్లో ఈనాడు ఆత్మీయత కొరవడింది.నాకేది నచ్చడం లేదు.నన్ను అసలు ఏది ఆకర్షించడం లేదు.పై పై ప్రేమలు నీటి బుడగ లాంటివి.అవి నటనగానే కనిపిస్తాయి.నటనలు వద్దు.హృదయపూర్వకమైన ప్రేమ కావాలి అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.నో మాన్స్ లాండ్ కవితలో సరిహద్దుకు అవతల/అది ఎవరికీ చెందిన స్థలం కాదు/నన్ను చూడ్డానికి వచ్చావు/గాలి నియంత్రించిన గదిలో/పడి ఉన్నాను/నిన్ను చూస్తూనే ఉన్నాను/కూడబలుక్కున్న మాటలు/నీ కళ్ళల్లోఓ కన్నీటి చార/అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చిన బంధువులు,మిత్రులతో ఆ ప్రాంతం సందడి సందడిగా ఉంది.దుఃఖము వద్దు.వేదన వద్దు.

వీడ్కోలు తెలియని సాంగత్యంలో ఇక నిర్భయంగా కలిసి ఉందాం అనే ఓదార్పు మాటలు ఎవరికైనా తృప్తిని కలిగిస్తాయి.మనిషి జీవితం ఒక్కో సారి సరిహద్దు అవతల పని చేస్తున్న సైనికుని జీవితం వలె మారడం సహజం అనిపిస్తుంది.ఆనంద్ ఆనాటి తన మానసిక స్థితిని చక్కగా కవిత్వీకరించారు. విషాదం కవితలో ఎటూ కదలడానికి వీల్లేదు/ఎటూ మెదలడానికి వీల్లేదు/మైళ్ళకు మైళ్ళు నడవాలనిపిస్తది/ఉరుకులు వేయాలనిపిస్తది/ అందరిలో కలవాలనిపిస్తది/అందరిని అవ్వాలనిపిస్తది/మనం అనుకున్నట్టుగా చేయలేకపోవడం/మనం అనుకున్నట్టుగా ఉండ లేకపోవడం/మరణం కన్నా విషాదం/అంటున్నారు.ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. మనిషి జీవితం చిత్రమైనది.ఒక్కోసారి మనిషి జీవితం తెలియకుండానే విషాదంలోకి నెట్టబడుతుంది.మనిషి జీవితం మరణం కన్నా విషాదం అని తెలిపిన భావాలు వాస్తవానికి అద్దం పడుతున్నాయి.ఒక్కోసారి కవితలో ఒక్కోసారి నిలిచిపోవడం/కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడి పోవడం/మంచిదేనేమో/ఒక్కోసారి/నిలిచిపోవడం లోంచే/నిలువెత్తుగా ఎగిసిపడడానికి సత్తువ వొస్తుంది/తలెత్తుక తిరగడానికి/ప్రాణమొస్తుంది/ అంటున్నారు.ఒక్కోసారి మనిషి జీవితంలో ఏం జరుగుతుంది?కూలబడిపోయిన మనిషికి కూడా స్వస్థత చేకూరుతుంది.మనిషి సంకట సమయంలో ధైర్యంతో వ్యవహరిస్తే అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్య వంతుడవుతాడు.మనిషిలోని నిర్జీవమైన అవయవాలు చైతన్యం పుంజుకుని ఆరోగ్యంతో నిలబడగలుగుతాడు అనే ధైర్యం కలిగిస్తున్నాడు.ప్రేమ స్నేహం కవితలో తొలి చూపులో ప్రేమించడం/మొదటి పరిచయంలోనే స్నేహించడం సులభమే/ సహజంగా స్వచ్ఛంగా వాటిని కొనసాగించడమే కష్టం/ప్రేమలోనూ స్నేహంలోనూ/ఇవ్వడం పుచ్చుకోవడం రెండూ ఉంటాయి/ప్రేమకు అనంతమైన భావోద్వేగమూ/ స్నేహానికి నిర్మలమైన స్వచ్ఛతా కావాలి/ అంటున్నారు.ఇవ్వాళ సమాజంలో ప్రేమ,స్నేహంలో కూడా తేడాలు కనబడుతున్నాయి.ప్రేమ,స్నేహం లేకపోతే దిక్కులేని వాన్నవుతాను.ప్రేమ,స్నేహం లేకపోతే ఈ లోకమే దిక్కులేనిది అవుతుంది అంటూ నిర్మలమైన ప్రేమ,స్నేహం ఆవశ్యకతను తెలియజేసిన తీరు చక్కగా ఉంది.సమయమిదే… కవితలో లోపలెక్కడో దాగి వున్న/పిసరంత ధైర్యాన్ని కూడగట్టుకుని/నిలబడాల్సిన సమయమిదే/సరిగ్గా ఇప్పుడే ఇక్కడే/నీ కాళ్లపై నువ్వు నిలబడాలి/ఓటమి అంచుని తాకి,విజయ తీరాల వైపు సాగాలి/ అంటున్నారు.ఆరోగ్యం బాగాలేదని ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు.ధైర్యాన్ని కూడగట్టుకొని నిలబడాల్సిన సమయం ఇదే అని చెప్పిన భావాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ కవితలో నిరాశ నిండిన జీవితం/ప్రేమ కోసం ఎంతగా ఆశపడుతుంది/నిరాశ నిండిన రోజున/వెలుగు కిరణాల మెట్లపై/గాలి కెరటాల వోలె ఉప్పొంగితే/చిరునవ్వులు విరబూస్తూ ప్రేమ చిగురిస్తుంది/చిరుజల్లు వోలె రోజంతా వర్షిస్తుంది/అంటున్నారు.నిరాశ కమ్ముకున్న రోజున ప్రేమ కోసం ఆరాటపడతాం.సూర్యకిరణాలు ప్రసరిస్తే,సముద్రంలోని కెరటాలు ఉప్పొంగితే మనలో సంతోషం ఎగసిపడుతుంది.ఆశావహ దృక్పథంతో మనలో ప్రేమ చిగురిస్తుంది.ప్రేమ చిరుజల్లు వలె కురుస్తుంది అని వ్యక్తం చేసిన భావాల తీరు బాగుంది.ఇంకా మిగిలే వుంది కవితలో నేస్తమా/జీవితాన్ని శోధించాలి/కొంచెం వేదనను వదిలేయి/ఇంకొంచెం ఆశ్చర్యాన్ని విడిచేయి/గుప్పిట విప్పి గుండె లోతుల్లోని/స్వప్నాల్ని మేల్కొల్పాలి/ కళ్ళు తెరిచి కన్నీటి/సముద్రాలు దాటాలి/ఎత్తు పల్లాల్ని దాటుకుంటూ/మనం పయనం సాగించాల్సిందే/మనం కలిసి గడపని/క్షణం ఇంకా మిగిలే వుంది/అంటున్నారు.మన ప్రయాణం ఇంకా మిగిలే ఉంది అంటూ స్నేహితునికి ప్రేరణ కలిగిస్తున్నారు.ఆత్మగల మనుషులు కవితలో ఏదో ఒక క్షణాన/సంక్షోభం ఆవరిస్తుంది/తెలియని సంక్లిష్టత/చుట్టు ముడుతుంది/ధైర్యం కొడిగడుతుంది/దైన్యం ముప్పిరిగొంటుంది/ఆత్మ గల మనుషులే/అన్ని శక్తుల్ని కూడదీసుకుని/ కూలిపోకుండా నిలదొక్కుకుంటారు/చేతులు బార్లా జాపి/అందర్నీ నిలబెడతారు/అంటున్నారు.ఆత్మగల మనుషుల గురించి వ్యక్తీకరించిన భావాలు వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి.బతుకు కవితలో బతుకు కష్టంగా ఉందా/నిరాశ చుట్టూ/ఓ వృత్తాన్ని గీయి/ఆశ దాని చుట్టూ తిరిగి తిరిగి/నిటారుగా/ నీ ముందు నిలుచుంటుంది/అంటున్నారు.మనిషి బతుకులో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి.బతుకులో కష్టాలు ఉన్నాయని నిరాశతో బెదిరిపోకూడదు. మనిషి ఆశను శ్వాసగా చేసుకుని జీవించాలి అని బతుకు అర్థం చెప్పిన తీరు బాగుంది.ఎక్కడ కవితలో దుఃఖమూ సంతోషమూ/మొదలెక్కడ చివరెక్కడ/చీకటీ వెల్తురూ/దారెక్కడ దరెక్కడ/నిద్రా మెలుకువా/పోరెక్కడో బతుకక్కడ/ అంటున్నారు. ఎక్కడ అంటూ ప్రశ్నించి సమాధానం చెప్పిన తీరు బాగుంది.మిత్రమా కవితలో మనం మాట్లాడుకోవడం మానేసి/చాలా రోజులైంది/ పలకరించుకోవడమే మిగిలింది/అవును మరి మాట్లాడుకోవడానికి/మనసులుండాలి,ఆత్మలుండాలి/ఎదురు ఎదురుగ్గా మనుషులుండాలి/ అంటున్నారు.ఈనాటి సమాజంలో మిత్రుల మధ్య పొరపొచ్చాలు,విభేదాలు పొడచూపుతున్నాయి. ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండాల్సిన మిత్రుల మధ్య సఖ్యత కొరవడింది.మిత్రులు మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది అంటూ ఆవేదన చెందుతున్నారు.కలిసిపోయే మనసులు ఆత్మలు ఉండాలి.మిత్రమా మనుషులు ఎదురు ఎదురుగా ఉండాలి అంటూ చెప్పిన భావం చక్కగా ఉంది.మలుపు కవితలో సాఫీగా గడిచిపోతున్న/జీవితంలో/ఓ పెద్ద కుదుపు/అది మొదటిది కాదు/చివరిది కాదు/మిగిలిన జీవితానికో/పెద్ద మూల మలుపు/అంటున్నారు. ఆనంద్ మూత్రపిండాలు పాడయిపోయి హాస్పిటల్ లో చేరడం అతని జీవితానికి అది కోలుకోలేని ఓ పెద్ద దెబ్బ.అతని బతుకులో పెద్ద మూల మలుపు అని పేర్కొన్న భావాలు అద్భుతంగా ఉన్నాయి. మాట్లాడటమే కవితలో అన్ని అనివార్యతలకి/అన్ని నిర్బంధాలకి/అన్ని మౌనాలకి ఒకే సమాధానం/ నిశ్శబ్దాన్ని ఛేదించుకు మాట్లాడ్డమే/గుండెను గొంతులోకి తెచ్చుకొని విచ్చుకోవడమే/ అంటున్నారు.మాట్లాడ లేనప్పుడు మౌనంగా ఉంటాం.మాట్లాడటం అవసరమైనప్పుడు మాట్లాడటమే అని చెప్పిన తీరు బాగుంది. మొదలయింది.. కవితలో ఏదైనా మొదలు పెట్టడమే కష్టం/మనసుని కూడ దీసుకోవాలి/ఆలోచనల్ని సరి చేసుకోవాలి/అందమైన పువ్వుల్ని కూర్చాలి/కలల్ని చల్లాలి కన్నీళ్ళని చల్లాలి/మొదలైంది ఏదీ ముగియకుండా వుండదు/అది బతుకయినా.. కవితయినా!/అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తనలో కలిగిన స్పందనలకు రూపం ఇది.ఏదైనా పని మొదలు పెట్టడం కష్టం.పని మొదలు పెట్టడానికి మన మనసు సిద్ధం కావాలి.మన మనసును సమాధాన పరుచుకుని పనిలోకి నిమగ్నం అవ్వాలి.పని చేయడం మొదలు పెట్టిన తర్వాత ఏ పని అయినా పూర్తి అవుతుంది.మనం బతుకడం కొరకు పని చేస్తాం.కవి రాసిన కవిత అయినా రాయడం మొదలు పెడితేనే పూర్తి అవుతుంది.మనిషి బతుకుకు,కవితకు పోల్చి చెప్పిన భావం అద్భుతంగా ఉంది.భావ లయ కవితలో సూర్య చంద్రుల సాక్షిగా/కాలం గడుస్తూనే వుంటుంది/ జీవితంలో/అనుభవం మాత్రం మిగులుతుంది/ చీకటి,శూన్యము/అమితంగా భయపెడతాయి/కానీ వాటిలోంచే/వెల్తూరు సృష్టీ మొదలవుతాయి/ అంటున్నారు.ఎంత మాట్లాడినా మిగిలేదేముంది? అని ప్రశ్నిస్తున్నారు.మాట్లాడే విషయం మన
గురించి మరియు అసంఖ్యాక జనం గురించి అయినా అయి ఉండాలి.లేకుంటే మనం మాట్లాడే మాటల్లో పనికిరాని ఉబుసుపోక కబుర్లతో ప్రయోజనం ఏమీ ఉండదు అంటూ వ్యక్తం చేసిన భావం ఆలోచింపజేస్తుంది.దుఃఖం కేంద్రీకృతమయింది కవితలో కదలడానికి చేతులూ/నడవడానికి కాళ్లూ/ఏడిచేందుకు కళ్ళూ.. అన్నీ/ఇసుక పొరల కింద కమ్మేసినట్టు/ఇనుప చెరల కింద బందీ అయినట్టు/మనసంతా ఆవరించిన దుఃఖం/ ఆలోచనల్నీ నియంత్రిస్తోంది/ అంటున్నారు.బంగాళాఖాతంలో తుఫాను కేంద్రీకృతమైంది.అందుకే భారీ వర్షాలు పడుతున్నాయి అంటాం.ఆనంద్ మనసు పొరల అడుగున అవధులు లేని దుఃఖం కేంద్రీకృతమైంది. బతుకు మళ్లీ కొత్త దోవలోకి మళ్ళింది.ఆనంద్ దుఃఖాన్ని అధిగమించాడు అనే భావం బాగుంది. నేను కవితలో నాకు నటించడం చేతకాదు/కష్టాలూ కన్నీళ్లూ తెలుసు/ప్రేమించడం స్నేహించడమూ తెలుసు/అందుకే/నేను మరెవ్వరిలానూ ఉండలేను/ అంటున్నారు.నేను కవితలో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్టు పలికించడం అద్భుతంగా ఉంది.శేషం కవితలో దుఃఖాన్ని ఆనందంచే/భాగించేసా/శేషంగా మిగిలింది/నేనూ నా కవిత్వం/అంటున్నారు.ఒంటరితనం – ఏకాంతం కవితలో ఒంటరితనం ఓ సంఘర్షణ/ఒంటరితనం ఓ అనివార్యత/ఏకాంతం ఓ తపస్సు/ అనిర్వచనీయమైన/అవిభాజ్యమైన మానసిక స్థితి/ఒంటరితనంలోంచి పరిణామం చెందిన/ ఏకాంతం/అంతం లేనిది/అనంతమయింది/ అంటున్నారు.మనిషి జీవితంలో ఒంటరితనాన్ని ఏకాంతాన్ని ఎప్పుడో ఒకసారి ఎదుర్కొంటాడన్న అద్భుతమైన భావాలు అలరింపజేస్తున్నాయి. వోటమి గెలుపు కవితలో కను చూపు మేరలో/ఓటమి అంచు కనిపిస్తూ వుంటే/నిలదొక్కుకోవడం ఎంత కష్టం/కళ్ళు బైర్లు కమ్ముతాయి/గుండెలు జారిపోతాయి/మొత్తంగా ఊపిరి/లయ తప్పుతుంది/వెనక్కి నడవలేం/పక్కకి కదలలేం/వున్న చోటా వుండలేం/అంటున్నారు. ఓడిపోతున్నామని మనకు తెలిసినప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది?అప్పుడు మనిషి ధైర్యంతో తనను తాను నిభాయించుకొని ముందుకు సాగాలి.జీవితంలో గెలుపు ఓటమి ఓ భాగం.నిటారుగా నిలబడి ఓటమిని జయించడానికి నడుచుకుంటూ వెళ్ళవచ్చు అని చెప్పిన తీరు చక్కగా ఉంది. మౌనం కవితలో నా మౌనం ఒక మౌనం కాదు/నా మౌనం వెనకాల దృశ్యాల పరంపర/నా మౌనం ఒక ఆంధీ/ఆంధీ గలీలు దాటుకుంటూ/జిందగీని/తవ్వుకుంటూ/చౌరంఘి లేన్ లో స్థిరపడింది/మౌనమే గొప్పది కదా/మౌనమే గొప్ప సంభాషణ కదా/అంటున్నారు.ఒక్కోసారి మనిషి మౌనంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు తటస్థ పడతాయి.మౌనంలో కూడా గొప్ప భావాలు దాగి ఉంటాయి.మౌనాన్ని కవితామయం చేయడం బాగుంది.ప్రకృతి మనుషులు కవితలో నిజంగానే ప్రకృతిలో/నవ యవ్వనం ప్రతిఫలిస్తుంది/వేల ఏళ్లుగా ఇంతే/ప్రకృతికేమో వయసు తెలీదు/ఈ మనసులకే/ యవ్వనమూ ముసలితనమూ/ అంటున్నారు.ప్రకృతితో మనుషులను పోల్చిన తీరు అద్భుతం.సత్యం కవితలో ఏదో ఒకటి/దేనికోసమో ఒక దాని కోసం/నిరంతరం వెతుకుతూనే వుంటాం/ అనవరతం తిరుగుతూనే వుంటాం/అది సత్యం కావచ్చు/సౌందర్యం కావచ్చు/అన్వేషణ కొనసాగుతూనే వుంటుంది/జీవితం నిరంతరం చలనంలో వుంటుంది/చలనం వైరుధ్య భరితం అవుతుంది/వైరుధ్యంలోంచి సంఘర్షణ/ సంఘర్షణలోంచి సత్యం బయటపడుతుంది/ అంటున్నారు.సత్యం అనగా నిజాయితీ,త్యాగం వలె ఆచరించదగినది.సత్యం మనం పాటించవలసినట్టిది.సత్యం కోసం పాటు పడిన సత్య హరిశ్చంద్రుడు మనకు గుర్తుకు వస్తాడు. ఎందుకైనా మంచిది కవితలో ఎందుకైనా మంచిది/హృదయం తెరిచే వుంచాలి/మనసు గల ఏ మనిషో/తలుపు తట్టకుండానే పలకరించి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ ఆత్మ గలవాడు/ప్రేమ సంతకం చేసి పోవచ్చు/అంటున్నారు.ఎందుకైనా మంచిది అంటూ హృదయాన్ని తెరిచి ఉంచు అంటూ మనకు ప్రేరణ కలిగిస్తున్నాడు.వెల్తురు ముక్కలు కవితలో ఆ వెల్తురు ముక్కల్ని/చేతిలోకి తీసుకున్నా/ఒళ్లంతా వెల్తురు ప్రవహించింది/గది సంగతేమో కాని/నా లోపలి చీకటి అంతా పటాపంచలయింది/ అంటున్నారు.మనిషి జీవితంలో వెలుతురు కోసమే ఆరాటపడతాడు.వెలుతురుతోనే మనిషిలో చైతన్యం పొంగి పొరలుతుంది.వెలుతురు తోనే మనిషి ఏదైనా సాధించ గలుగుతాడు.కవి ఆనంద్ తాను వెలుతురులోకి వచ్చినట్లుగా చెప్పిన తీరు బాగుంది.బతికి పోదు కవితలో ప్రేమను పంచ గల/మనిషి ఎవరయినా కనిపిస్తే/అక్షరాలు వాక్యాలయి సంభాషణై/నిశ్శబ్దం పటాపంచలై పోను/నే బతికి పోదు/అంటున్నారు.ప్రేమ అనేది అత్యంత ఉత్కృష్టమైన సద్గుణం లేదా మంచి అలవాటు.లోతైన వ్యక్తుల మధ్య అనురాగం నుండి సరళమైన ఆనందం వరకు బలమైన భావోద్వేగ మరియు మానసిక స్థితిని కలిగి ఉంటుంది. సర్వసాధారణంగా ప్రేమ,బలమైన ఆకర్షణ మరియు భావోద్వేగ అనుబంధాన్ని సూచిస్తుంది.ప్రేమను పంచగల మనిషి కావాలి అప్పుడే సృజన ఆవిష్కృతమవుతుంది అని చెప్పిన తీరు బాగుంది. ప్రాణ వాయువు కవితలో నిద్రా మెలకువా/ రెంటిలోనూ కలలే/కలలు నిండా/ఆశలూ ప్రేమలే/ అవి మనకు ప్రాణవాయువులే/అంటున్నారు. మనిషికి నిద్రలోను కలలు వస్తాయి.మనిషికి మెలకువగా ఉన్నప్పుడు కలలు వస్తాయి.కలలు మనిషి జీవితానికి ప్రాణ వాయువులు.కలలలోనే మనిషి బతుకుతాడు.కలలు,ఆశలు,ప్రేమలు,మనిషి జీవితంలో పెనవేసుకుని ఉంటాయి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.ఎప్పటికప్పుడు కవితలో ఎప్పటికప్పుడు/దరి కోసమో దారి కోసమో/ ఊపిరి కోసమన్నంత ఆర్తిగా/వెతుకుతూనే వున్నా/చీకటి తుఫానులో/చిక్కుకున్న ప్రాణానికి/రాత్రి లేదు పగలు లేదు/నిద్ర లేదు మెలకువా లేదు/అంటున్నారు.ఎప్పటికప్పుడు అంటూ మనిషి బతుకుకు అవగాహన కల్పిస్తున్న తీరు బాగుంది.కవలలు కవితలో దుఃఖం నాలో వున్నదో/నేను దుఃఖంలో వున్నానో/నాకు తెల్వదు/ నా కవిత్వం లాగే/భూమికీ ఆకాశానికీ మధ్య/నాకు నా అంతరంగానికి మధ్య/దుఃఖం అంటిపెట్టుకునే వుంటుంది/రోడ్డుమీదో కాగితం మీదో/నడుస్తూ ఉంటానా/ఒకడుగు నేల మీద/మరోటి ఆలోచనల్లో/అంటి పెట్టుకునే వుంటుంది/నాకు తెల్సు/దుఃఖమూ కవిత్వమూ కవలలని/ అంటున్నారు.దుఃఖము కవిత్వము రెండు కవలల వలె అంటిపెట్టుకొని ఉంటాయి అని చెప్పిన తీరు బాగుంది.కలలు కవితలో కళ్ళు మూసుకుంటానా/ కనురెప్పల తెరపై నీ/రూపం సాక్షాత్కరిస్తుంది/ చుట్టూ వేగంగా వీస్తున్న గాలిలో/నీ పాదాల సవ్వడి వినిపిస్తుంది/అంటున్నారు.నిద్రకు చెందిన స్థితిలో కొన్నిసార్లు అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల,భావావేశాల,ఇంద్రియ సంవేదనల సందోహాలని కలలు అంటారు.మనిషి కలలు కంటాడు.కలలో ఆమె రూపం కనబడుతుంది.ఆమె పాదాల సవ్వడి వినిపిస్తుంది.కలల గురించి
కవిత రూపంలో వ్యక్తం చేయడం బాగుంది.లంగరు కవితలో నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు/సగం శబ్దం సగం నిశ్శబ్దం/ శబ్దమేమో బతుకు ఏడుపులోంచి/ఎగిసిపడుతున్న ఎక్కిళ్ళు/ నిశ్శబ్దమేమో బతుకు చేతగాని తనంలోంచి/ వ్యక్తమవుతున్న మౌనం/నిజానికి నాకు కవిత్వం/ కేవలం కవిత్వం మాత్రమే కాదు/సంక్షోభ కాల ప్రవాహంలో/నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప/బతుకు సమరంలో/నిలబెట్టే లంగరు/అంటున్నారు.కవి ఆనంద్ జీవితంలో కవిత్వం ఎంతగా పెనవేసుకుపోయిందో తెలియజేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.నిశ్శబ్దం కవితలో నీకూ నాకూ మధ్య/నిటారుగా నిశ్శబ్దం/ మాటలుంటాయి/మమతలు కరువు/నీకు నాకు మధ్య/ట్రాన్స్పరెంట్ నిశ్శబ్దం/అంటున్నారు.మన నుంచి మనసుకు చేరిన మంచును ఎలా కరిగించాలి?కలల్ని బతుకుల్ని పండించుకునేదెట్లా అని చెప్పిన తీరు బాగుంది.పెద్ద తేడా లేదు కవితలో చుట్టూ ఉన్న చెట్లన్నీ గాలికి/ఊగి నాదాలు పలుకుతుంటే/మౌన నినాదమై నిలుచున్నాడతను/ ప్రశాంత సరస్సుపై కురుస్తున్న/చినుకుల సవ్వడి/ నేలరాల్తున్న ఆకుల గలగల/శబ్దం అంటని మౌనముని అతను/అతనికి నాకూ/పెద్ద తేడా లేదు/అంటున్నారు.అతనికి మౌనమునికి ఎలాంటి తేడా కనిపించడం లేదు అని చెప్పిన భావాలు విస్మయం కలిగిస్తాయి.జీవితం విసిరిన సవాలు అతనిని మునిగా మార్చింది.చిరు ప్రేమలు కవితలో నా మల్లెపూల బాల్యాన్ని/వదిలి వచ్చింది ఇక్కడే/ తెలియని తనాన్ని తెలిసినతనంగా/భ్రమ పడిందీ ఇక్కడే/ఇష్టమయిన వారి కోసం వెతుక్కుంటూ/ చౌరస్తాలో నిలబడిందిక్కడే/కాలం విసిరిన/వెలుగు కిరణాల దారులెంట/పడుతూ లేస్తూ నడుస్తూనే వున్నా/నడక నా గమ్యం కాదు/నా జీవనశైలి/ అంటున్నారు.చిరు ప్రేమలు కవిత బాల్యం నాటి సంగతులను గుర్తుకు తెస్తున్నాయి.మాట్లాడ కూడదు కవితలో ఒంటరితనంతో దిగాలు పడ్డ/బతుకు కెరటంపై/జంట పక్షుల కిలకిల రావాల్ని కురిపిస్తూ/స్నేహంగానో ధైర్యంతోనో/ఏదైనా మాట్లాడకూడదూ/మాటలు ఉట్టి మాటలే కాదు/ భావాల్ని మోస్తున్న/బాధ్యతా తరంగాలు/మనిషికీ మనిషికీ/మధ్య ధ్వని బంధాలు/అంటున్నారు.కవి ఆనంద్ మాటల గురించి అద్భుతమైన భావాల్ని పండించారు.కర్తవ్యం కవితలో యుద్ధం జరుగుతూనే ఉంది/లోపలా బయటా/గెలుపును చేరుకోలేను/ ఓటమిని అంగీకరించనూ లేను/కొనసాగుతున్న యుద్ధంలో గెలుపు ఓటములు ఎట్లా నిర్ణయిస్తావు/ముగియని యుద్దంలో/విజేత లెవరు పరాజితు లెవరు/పోరు అనివార్యమయిన చోట/యుద్ధమొక్కటే సిద్ధాంతం/కాలు కదపడమే కర్తవ్యం/అంటున్నారు.మనిషి లోపల మనసు లోపల జరుగుతున్న సంఘర్షణను కర్తవ్యం కవితగా మలిచిన తీరు అద్భుతం.రాత్రి కవితలో విరామం కావలసిన రాత్రి/నిద్రా మెలకువా కాని/సందిగ్ధ సందర్భమవుతుంది/అన్ని స్థితుల్నీ పటాపంచలు చేస్తూ/తూర్పున వెలుగు కిరణం/వేకువ ఒకటే/ రాత్రులు ఎన్నో/అంటున్నారు.ఒక్కోసారి విరామం తీసుకోవలసిన రాత్రి కళ్ళ మీద కునుకు లేకుండా చేస్తుంది.మనిషి జీవితంలో నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి.కాని వేకువ ఒకటే అంటూ పాఠకులను ఆలోచింపజేస్తున్నాడు.నీడ కవితలో నీడది ఎప్పుడూ/వెల్తురుకు వ్యతిరేక దిశే/వెల్తురు చిమ్మితే విజృంభిస్తుంది/దీపం ఆరితే/ దిగాలుగా అదృశ్యమవుతుంది/పెరుగుతూ తరుగుతూ/నీడ ఒక బహు రూపి/నిలబడ్డానికైనా/అంతరంగ దర్శనానికైనా హృదయపు నీడే/ అంటున్నారు.నీడ మనిషి వెన్నంటే ఉంటుంది.చూడు చూడు నీడలు అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు.నీడను కవితామయం చేయడం బాగుంది.అతను కవితలో మాటల పరిమళాల్ని/వెదజల్లుతూ/అతనొస్తాడు/నా ముఖం వికసిస్తుంది/విలువల పూల గంపని/నా ముందు బోర్లిస్తాడు/గదంతా పరిమళభరితమవుతుంది/ ఆయన నన్ను ఇష్టపడ్డాడో/నేను అతన్ని ప్రేమించానో/సుఖ సమయంలో కాదు కాని/దుఃఖ కాలాల్లో/నాలుగు ధైర్యపు చినుకుల్ని రాల్చాడు/ అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను చూడడానికి వచ్చేవాడు.అతని సహచర్యంలో కలిగిన అనుభూతులు కవిత ద్వారా వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి.తల్లి వేరు కవితలో మనిషన్నంక/గాయపడ్తాం/కత్తులూ కటార్లతోనే కాదు/మాటలతో చేతలతో/మూతి విరుపులతో/గాలికి గాయాలను మాన్పే మర్మం తెలుసు/గాలి విశ్వవ్యాప్తం/మనస్సే మరింతగా/ విస్తరించాలి/తడితోనూ ప్రేమతోనూ/మనిషి తనానికి మనసు లోపల తడి/తల్లి వేరు/అంటున్నారు. మనస్సు విశాలం చేసుకుంటే అపార్థాలకు తావు ఉండదు,గొడవలకు ఆస్కారం ఉండదు.మనిషి మనస్సును అర్థం చేసుకోవాలి అంటూ తల్లి వేరు కవిత ద్వారా గొప్ప భావాలను పలికించారు.ఆమె కవితలో ఆమె/నడిచినంత మేరా/స్నేహ పరిమళాలు/సీతాకోకచిలుకల్లా విహరిస్తాయి/ పూలన్నీ తలవంచి/సలాములు చేస్తాయి/ లోకంలోని ధైర్యమంతా/నాలోకి ప్రవహిస్తుంది/ఆమె/ సాన్నిహిత్యం నిండా/ ప్రేమలు విరబూస్తాయి/ అంటున్నారు.ఆమెతో గడిపిన అనుభూతులు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి.ఇల్లు కవితలో వాకిలీ పెరడూ/పెద్దర్వాజా/రెండు తలుపులు తీసుకుని వెళ్తే/రెండు లోకాలు/కాపురం ఒక్కటే/ దేహాలు రెండు/బతుకు ఒకటే/భాషలే రెండు/ఒకటి ఆకాశమూ/మరోటి నేల/మాట మాటకు ఉరుము/ ఛత్ ఒక్కటే/మనసులే రెండు/ఎప్పుడూ విడిపోవు/ నిరంతరం సమాంతరం/ అంటున్నారు.ఇల్లుతో మనిషి బతుకును పోల్చిన తీరు అద్భుతంగా ఉంది.పులకరింత కవితలో గాలి అలల్నిండా/ సంగీతమే/శరీరం నిండా పులకరింతే/నా చెవుల్నిండా జీవితమే/ అంటున్నారు.అస్తమిస్తున్న సూర్యుడు, లోకాన్ని తడుముతున్న చిరుగాలి,గాలి అలల నుండి వినిపించే సంగీతం,ప్రకృతిలోని అందాలు చూడగానే శరీరం నిండా పులకరింత,నా చెవుల నిండా జీవితమే అంటూ పరవశించిపోవడం బాగుంది.కిష్టాపురం కవితలో గంగవతల అడవిలో/పొందిచ్చిన ఊరు/కిష్టాపూర్/నిజంగానే కిష్టాపురం/నాకు శ్వాసనిచ్చింది ఆత్మ నిచ్చింది/ సరికొత్త లోకాన్ని దర్శనమిచ్చింది/పట్నం గాలి నుంచి/విశాల ప్రపంచం వైపు/దారులు తీసింది/ అంటున్నారు.కిష్టాపురం గ్రామంలోఆనంద్ పెద్దమ్మ ఉండేది.కిష్టాపురం సందర్శించిన ఆనంద్ కు కలిగిన అనుభూతులు మధుర మనోహరంగా ఉన్నాయి. రూం నెం. 213 కవితలో నేను నిలబడే ఉన్నాను/ హృదయం పగిలిపోయింది/నాకెదురుగా కూర్చుని తలవంచుకుని/మాటల కోసం వెతుక్కుంటున్నావు నువ్వు/ఏదో చెప్పాలని ఎంతో చెప్పాలని/నాకు తెలుసు/నీ కళ్ళ వెనక అశ్రు పర్వతాలున్నాయని/నీ గుండెల నిండా అగ్నిగుండాలున్నాయని/ భవిష్యత్తుంతా శూన్యమయినట్టు/నీ కాళ్లు చేతులు ఆడటం లేదని/నేను నిలబడే ఉన్నాను/నిరర్థకమైన మాటల కంటే/నీ చేయిని నా చేతుల్లోకి తీసుకుని/ భవిష్యత్తులోకి నడవడం మొదలు పెట్టాను/ అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు రూమ్ నెంబర్ 213 గదిలోకి తనకు కావలసిన ఆప్తుడు వచ్చినప్పుడు కలిగిన స్పందనగా తోస్తోంది. అతడితో ఆనంద్ ఏమీ మాట్లాడలేదు.ప్రేమగా అతడి చేయిని తన చేతిలోకి తీసుకొని భవిష్యత్తులోకి నడవడం మొదలు పెట్టాను అని చెప్పిన మాటలు బాగున్నాయి.దాఖలా కవితలో కాలానికి/నిరంతర గమనమే/గమ్యాల్ని మనమే నిర్దేశించుకోవాలి/వేగాన్ని మనమే అందుకోవాలి/ కాలానికి పోటీపడి/నడవడం అభ్యసించాలి/ అప్పుడు కదా/కాల పాదముద్రికల్లో/మన గుర్తులు మిగుల్తాయి/పలానా కాలంలో/ జీవించామనడానికి/దాఖలాలు మిగుల్తాయి/ అంటున్నారు.కాలం యొక్క విలువను తెలియజేసిన తీరు అద్భుతంగా ఉంది.నింగికి ఎగిరిన తార కవితలో కలాలకూ గళాలకూ బేడీలు ముసురుకుంటున్న కాలంలో/ఆయన అక్షరాలు కూర్చుకుంటూ/నిర్మలంగా నిల్చున్నాడు/కరీంనగర్ క్లాక్ టవర్ సాక్షి గా/వచ్చే వాళ్ళకూ పోయే వాళ్ళకూ/మిత్రులకూ యోధులకూ/యువకులకూ మేధావులకూ/దిక్సూచిగా నిర్భయంగా నిల్చున్నాడు/అంటున్నారు.జీవగడ్డ విజయ్ కుమార్ స్మృతిలో రాయబడ్డ కవిత ఇది.ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంది.వీడ్కోలు కవితలో మనం కలిసున్న క్షణాల కంటే తల్చుకున్న క్షణాలే అధికం/మన స్నేహానికి/వయసంతరాల్లేవు దూరభారాల్లేవు/ అంటున్నారు.వీడ్కోలు కవిత కూడా నరేందరు స్మృతి కవిత.మనిషి లోపల కవితా సంపుటిలోని కవితలు అన్ని ఆనంద్ హృదయం నుండి ఉబికి వచ్చిన భావాలు.వాటిని చక్కగా చదువుకోవచ్చు. చెరబండ రాజు రాసిన కవితా పంక్తి ఒకటి గుర్తుకు వస్తుంది.అనారోగ్య బాధితుడిని అయినా నేను యోధున్నే అని అన్నాడు.నిజంగా ఆనంద్ కలం యోధుడు.అతనిని మనసారా అభినందిస్తున్నాను. కవి ఆనంద్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని కోరుకుంటున్నాను..
పుస్తకం : మనిషి లోపల no man’s land
రచయిత : వారాల ఆనంద్
ప్రచురణ : ప్రోజ్ పోయెట్రీ ఫోరమ్
కరీంనగర్.
పేజీలు : 122
వెల. :₹ 60/-
ప్రతులకు :
వి.ఇందిరా రాణి,
ఇం.నెం. 8 – 4 – 641, హనుమాన్ నగర్,
కరీంనగర్ -505001.
సెల్ నెంబర్: 9440501281.
and
All leading Book sellers.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

విహంగ ప్రేమికుడు

by Vani Devulapalli November 29, 2024
written by Vani Devulapalli

                “అనగనగా ఒక పెద్ద చెట్టు , చెట్టు తొర్రలో ఒక పెద్ద పక్షి…,””  ఆకు వేసి నీళ్లలో మునిగి పోతున్న చీమను కాపాడిన పావురం…” ఇవి  ప్రపంచం  గురించి తెలిపిన  పంచతంత్రం కథలు,  “ఏక్  కవ్వా ప్యాసా థా…”, బళ్ళో హిందీ సారు మొదటి  కథా పాఠం, “ఊ ఊ .. ఆయమ్మ్మా ..పిట్ట రావే పిట్ట .. పిల్లల్ల తల్లి ” అని తమ్మునెత్తుకొని  అమ్మమ్మలు  తీసే రాగం, అలిగి  విస్తట్లో మెతుకు ముట్టని కాకిలా నానమ్మ… బేరమాడి కొన్న కంజు పిట్టలు వండక ముందే ఎగిరి పోయినప్పుడు ఇంట్లో జరిగిన కొట్లాట…గంప కింద కమ్మి కాపు గాసిన కోడి పిల్లలు..సివంగిలా దూకే పిల్లల కోడి పెట్ట …ఇలా  ఏ కార్టూన్ పాత్రలు కబ్జా చేయని చిన్నతనంలో  పక్షులే గొప్ప హీరోలు.  

 భూతల జీవులు  స్థానువులు అంటే వృక్షాలు, జంగామలు అంటే ఒకచోట నుంచి మరో చోటకి వేల్లగలిగేవిమనకు తెలుసు. భూమి మీదనే ఉంటూ గగనతలంనుంచి తన జీవితాన్ని కొనసాగించే మరో వర్గం జీవులు విహంగాలు.పక్షులకు మనకు అవినాభావ సమ్భంధం ఉంది. మన సాహిత్యంలోనూ వాతిక్ తగిన స్థానం ఉంది. సోహం కాస్తా హంసగా ఓం కారంగా మనం గుర్తుచేసుకునేది పక్షినే. ప్రసిద్ద ఇతిహాసం రామాయణం  పక్షివేటతోనే మొదలౌతుంది. పక్షులు మన ఆహారంగానూ, వార్తహరులుగానూ, ఆహ్లాదం పంచె సాధుజీవులుగానూ మన జీవనాన్ని సులభాతరాన్ చేసాయి. అయితే ప్రాచీన పక్షిశాస్త్ర పరిశోధనలు,అన్వయాలు, స్వభావ పరిశీలనలకు చెందిన వివరాలు ఉన్నప్పటికీ ఆధునిక కాలానికి తగిన పరిశోధనలు చేసి, విలువైన సమాచారమేంతో నిబద్దతతో సేకరించి అందించిన సలీంఅలీ  మనదేశపు పక్షి శాత్రవేత్తలలో అగ్రగణ్యుడు.పక్షుల చెలికాడు, అలుపెరుగని యాత్రికుడు.సలీం అలీ గురించీ ఆయన చేసిన అపూర్వ పరిశోధన గురించి తెలుసుకొనే ప్రయత్నంలో ఆరేళ్ల క్రితం ఆయన తన  ఎనభై ఏడేళ్ల ఏళ్ల వయసులో రాసుకున్న ఆత్మ కథ The Fall a Sparrow చదివాను. ఈ మధ్య వచ్చిన రోబో 2.0 సినిమాలో సూటిగా మన మీద వదిలిన ప్రశ్న ‘యాభై గ్రాముల పక్షి నీతో కలిసి జీవించలేనప్పుడు నీదేమి అభివృద్ధి ..?’మరొక్క సారి సలీం అలీని గుర్తుచేసింది. పక్షులే జీవితంగా తొంభై ఏళ్ళ తన జీవితంలో దాదాపు ఎనభై ఏళ్ల జీవితాన్ని ధారపోసి భారతదేశంలో ఉన్న పక్షి జాతుల వివరాలను గ్రంథస్థంచేసి భారతీయ పక్షి పితామహుడిగా పేరుగాంచిన సలీం అలీ ఆత్మ కథ అది.

సలీమ్ అలీ 1896లో  ప్రస్తుత ముంబై లో మొయిజుద్దీన్ , జీనత్ ఉన్నీసా దంపతులకు 9 వ సంతానం. సలీం పుట్టిన ఏడాదిలో తండ్రినీ  మూడేళ్ల వయసులో తల్లినీ  కోల్పోతే తల్లి తరపు మేనమామ అమీరుద్దీన్ త్యా బ్జి వద్ద మిగిలిన నలుగురు అన్నలు , నలుగురు అక్కలతో పాటు పెంపు చేయబడతాడు. మేనమామ నిస్సంతు కాగా ఆయన  చేరదీసిన పిల్లలు చాలా మంది వీరితో పాటు ఉండేవారు.  సాంఘికంగా ఉన్నతంగా ఉన్న  నవాబుల కుటుంబం వారిది.  ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల ఆటపాటలతో గడిచేది. సంప్రదాయ ముస్లిమ్ కుటుంబపు ఆచారం ప్రకారం ఆహారంగా స్వీకరించ దగిన పక్షులు, జంతువుల్ని మాత్రమే హలాల్ చేసేవారు. పిచ్చుకలను తినడం ఇస్లాం ప్రకారం అనుమతించి బడింది కనుక చాలా సార్లు వాటిని వండడం  అతనికి తెలుసు .కనుక అతని పాటు ఉండే పిల్లలు పిచ్చుకల్ని, ఇతర పక్షుల్ని, గుడ్లని వెతుక్కుంటూ వాటిని గమనిస్తూ గడిపేవారు. 

సలీం తొమ్మిదేళ్ళ వయసులో వాళ్ళ మేన మామ అతనికి ఒక వేటకు ఉపయోగించే తుపాకీని బహుమతిగా ఇస్తాడు. ఆ కాలంలో వేట అతి సాధారణమైన ఆటవిడుపు. కనుక పిల్లలు పిచ్చుకల్ని వేటాడుతూ వెంబడిస్తూ గడిపేవారు. ఒకసారి పొదల్లో ఉన్న పిచ్చుక గూడు వైపు గురిపెట్టి గూడు ముందు కాపలా ఉన్న మగ పిచ్చుకను కాల్చేస్తాడు. అప్పటికి  గూడులోపల ఆడ పిచ్చుక గుడ్లను పొదుగుతోంది. మగ పిచ్చుక  చనిపోయిన వెంటనే ఆడ పిచ్చుక ఎగిరిపోయి మళ్లీ వస్తుంది. చనిపోయిన మగ పక్షికి బదులు మరో మగ పక్షి గూటికి కాపలాగా వస్తుంది.సలీం మళ్లీ ఈ మగ పక్షిని కూడా కాల్చేస్తాడు. ఆడ పక్షి మళ్లీ ఇంకో మగ పక్షిని వెంటనే కాపలాకి తెస్తుంది. ఇలా ఎనిమిది పక్షుల్ని సలీం కాల్చేస్తాడు. ఆశ్చర్యపోతాడు.తాను చంపిన ప్రతి సారీ మరో మగ పక్షి గూటికి కాపలా ఉంటోంది. ఇంత చిన్న పక్షి గూటికి కాపలా కోసం ఎంత పట్టుదలతో ఉందని.ఇది మొదటి సంఘటన. 

మరో సారి వంట కొరకు తెచ్చిన పక్షుల్లో పసుపురంగు మెడ కలిగిన పిచ్చుక  కనిపిస్తుంది. సలీం మనసులో ఒక అనుమానం .ఇది ఎప్పుడూ వండే పిచ్చుకలా లేదు .మెడ కింద పసుపురంగుతో ఉంది. దీన్ని తినడానికి ఇస్లాం అనుమతించిందా లేదా తెలుసుకోవాలని మేనమామ వద్దకు వెళ్తాడు. ఇది రెండో సంఘటన. ఆయన పక్షిని బాగా పరిశీలించి దీన్ని తినడానికి వీలులేదని తేల్చి బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ సెక్రటరీ వాల్టర్ శామ్యూల్ మిల్లార్డ్ వద్దకు వెళ్ళమని చెపుతాడు. సలీం మేనమామ BNHS  స్థాపించిన సభ్యుల్లో ఒకరు. కనుక బ్రిటిష్ వారు తమను తాము గొప్పగా ప్రకటించుకొని ఏర్పరచుకున్న మిథ్యా కుడ్యాలను దాటి అంత చిన్న వయసులో  మిల్లార్డ్ ని కలుసుకునే అవకాశం దొరుకుతుంది.  అది మొదలు   సలీం పక్షుల గురించీ, వాటిని ఈ విధంగా సేకరించాలి అనీ, దాని చర్మం ఒలిచి శాస్త్రీయ అవసరాలకోసం భద్ర పరచడం  , వాటి ఆవాసాలను, అలవాట్లను, జీవన విధానాన్ని గ్రంధస్తం చేయడం ఇలా పక్ష్షులకు  చెందిన అనేక విషయాలలో నేర్పరి అవుతాడు. 

సలీం 1914 నుంచి 1917వరకు బర్మాలో దగ్గరి బంధువుల  వద్ద ఉంటాడు. 1918లో తెహ్మినా ను వివాహం చేసుకొని ముంబైలో కాపురం ఉంటాడు. 1924లో అప్పటికి BNHS ద్వారా కొత్తగా మొదలైన నాచురల్ హిస్టరీ మ్యూజియంలో గెస్ట్ లెక్చరర్ గా అవకాశం వస్తుంది.  ఆ తర్వాత పక్షుల అధ్యయనాన్ని కొనసాగించడానికి మెరుగైన శిక్షణ కోసం బెర్లిన్ వెళ్తాడు.అక్కడ ఎర్విన్ స్ట్రెస్ మన్ పర్యవేక్షణలో  శిక్షణ పొందుతాడు.

1930లో ఇండియాకి తిరిగి వచ్చాక BNHS  ద్వారా పక్షుల సర్వే చేయాలని నిర్ణయించి అప్పటివరకు పక్షులకు సంబంధించినటువంటి విషయాలలో తక్కువ  తెలియబడిన హైదరాబాద్ సంస్థానాన్ని ఎంచుకొని హైదరాబాద్  స్టేట్ ఓర్నితోలోజికల్ సర్వే నిర్వహిస్తాడు.అందుకు గాను అప్పటి హైదరాబాద్ ఆర్థిక మంత్రి అక్బర్ హైదరి మూడు నెలల కాలానికి మూడువేల రూపాయలు గ్రాంటుగా మంజూరు చేస్తాడు. ఆదిలాబాదు జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో వీరి బృందం బస చేసింది. 1931లో ఇప్పటి మహబూబ్నగర్ మన్ననుర్ ప్రాంతంలో కూడా బస చేసింది. 1897 వరకు వేటకు ఎవరైనా వెళ్ళవచ్చు కానీ 1914లో నిజాం ఇచ్చిన నియమాల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ వన్యప్రాణులను వేటాడడానికి వీలు లేదు. నిజాం ప్రభువుకు అతని కుటుంబీకులకు, జాగీ ర్థార్లకు ఇందుకు మినహాయింపు. 1931 నుంచి సలీం అలీ హైదరాబాద్ సంస్థానంలో చేసిన పరిశోధనలను BNHS వారు ప్రచురించారు.  హైదరాబద్ సంస్థానం అప్పట్లో పులుల వేటకు ప్రసిద్ది చెందింది. అమ్రాబాద్, ఉట్నూర్, పాకాల్ , ములుగు ఎక్కువగా వేటాడే ప్రాంతాలు.1930 లో గిజిగాడు   లేదా వీవర్ బర్డ్  మీద రాసిన ఆర్టికల్ సలీం కి ఎంతో పేరు తెచ్చింది.

సలీం తర్వాత 1935 నుంచి 1939  వరకు డెహ్రాడూన్ లో ఉంటాడు. 1939 లో భార్య అనారోగ్యంతో మరణిస్తుంది. డెహ్రాడూన్ వెళ్ళేటప్పటికి చేతిలో ఉన్న Economic Ornithology  ప్రాజెక్టును విరమించు కుంటాడు. పక్షుల ఆవాసం, ఆహారపు అలవాట్లు , అటవీ మరియు వ్యవసాయం మీద వాటి ప్రభావం పరిశోధించాలని భావిస్తాడు. ఆ తరవాత  ఆఫ్ఘనిస్తాన్ ,మానస సరోవరం , కచ్ ప్రాంతం, భరత్ పూర్, బస్తర్, ప్రాంతాలలో పరిశోధనలు కొనసాగిస్తాడు.తన పరిశోధనల సారాన్ని  1941 లో  బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ ను , పది సంపుటాలు కలిగిన హ్యాండ్ బుక్ ఆఫ్ ది బర్డ్స్ ఆఫ్  ఇండియా అండ్ పాకిస్థాన్ ను,  1967 లో కామన్ బర్డ్స్ అన్న ఫీల్డ్ గైడును , 1985లో  తన జీవిత చరిత్రను రాశాడు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నకాలంలో అంతరించిపోయిందని అనుకున్న కలివికోడిని తిరిగి గుర్తించిన కడప జిల్లాలో ఆ పక్షిని పరిశీలించడానికి అయన స్వయంగా వచ్చారు. దురదృష్టవశాత్తు  ఆ పక్షి బతకకపోయినా దానిని గుర్తించడం ప్రపంచం మొత్తం మన దేశంవైపు చూసే పరిస్థితి కల్పించింది. ఆప్రాంతం ఇప్పుడు లంక మల్లెశ్వర అభయారణ్యంగాప్రకటించి సంరక్షణ చేస్తున్నారు. ఇలా పసితనం నుంచి చివరిదాకా ఆయన పక్షుల్తోనే సహజీవనం చేసాడు. చిరకాల చెలికాడయ్యాడు.

సలీంఅలీ  విలువైన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1958లో పద్మ భూషణ్ ను, 1976లో పద్మ విభూషణ్ ను ఇచ్చి సత్కరించింది. ఈ మహనీయ పరిశోధకుడు తన తొంభై ఏళ్ళ వయసులో 1987 జూన్ మాసంలో మరణించాడు.సలీం అలీ పేరు మీద తమిళనాడులోని అనైకట్టిలో  భారత పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ , BNHS ఆధ్వర్యం లో  SACON సలీం అలీ సెంటర్ ఫర్ ఓర్నితొలజీ  అండ్ నాచురల్ హిస్టరీ అన్న సంస్థను   1990 లో నెలకొల్పారు.అతనిని మొదటి సారి  పరిశోధనా రంగానికి పరిచయం చేసిన యెల్లో త్రోటెడ్ స్పారో / పసుపు రంగు మెడ కలిగిన పిచ్చుక  “సలీం అలీ ” పక్షిగా పిలవబడుతుంది. అంతే కాదు సలీం అలీ ఆంగ్లంలో మంచి పట్టుగల వ్యక్తి.అతను రాసిన  వ్యాసం అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ  ఆంగ్ల విభాగం ప్రచురించిన ఇండియన్ మాస్టర్స్ ఆఫ్ ఇంగ్లీష్ సంకలనంలో ప్రఖ్యాత రచయితలు రవీంద్రనాథ్ టాగోర్, సరోజినీ నాయుడుల సరసన చోటు సంపాదించుకున్నది.

ఈనాటికీ పక్షుల గురించిన ఏ సమాచారం కొరకు అయినా సలీం అలీ పుస్తకాలు ఎంత ప్రామాణికమైనవో , నేటి విద్యార్థి లోకానికి గొప్ప సందేశాన్ని ఇచ్చే అతని జీవిత చరిత్ర అంతే   తలమానికమైనది.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

అస్తిత్వం రూపొందాలంటే సాహిత్యం అవసరం- నందిని సిధారెడ్డి

by Aruna Dhulipala November 29, 2024
written by Aruna Dhulipala

తెలంగాణ ఉద్యమకారులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి సాహిత్య అకాడెమీ అధ్యక్షులు, ‘నంది’ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు డా. నందిని సిధారెడ్డి గారితో మయూఖ ముఖాముఖి
                                    – అరుణ ధూళిపాళ

“నా తొవ్వ, నా ప్రయాణం, నా సంపద కవిత్వమే” అని తెలంగాణ భాషా వికాసం కోసం నిరంతరం తపించి, రాష్ట్రసాధన కోసం ప్రజలను చైతన్య బాటలో నడిపించిన పల్లెతల్లి ముద్దుబిడ్డ డా. నందిని సిధారెడ్డి గారి జీవిత విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్.

1. “బందారం కనిపెంచిన మందారం”గా ప్రసిద్ధి పొందిన మీరు మీ జననం, ఆ ఊరిలో మీ విద్యాభ్యాసాన్ని గురించి తెలపండి.
జ :-    నా మొదటి కవితా సంకలనం ‘భూమిస్వప్నం’ పుస్తకానికి ముందుమాట రాస్తూ దేవిప్రియ ఈ మాట అన్నారు. నేను పూర్వపు మెదక్ జిల్లాలోని బందారం అనే గ్రామంలో జన్మించాను. మా అవ్వ (అమ్మ) రత్నవ్వ. మా బాపు నర్రా బాల సిద్ధారెడ్డి. వాళ్లిద్దరూ వ్యవసాయ దారులు. ఊళ్ళో జానపద, సాంస్కృతిక వాతావరణం బాగా ఉండేది. మా బాపుకు తాను చదువుకోలేదు కాబట్టి తన పిల్లల్ని బాగా చదివించాలని కోరిక. అందుకే మమ్మల్ని బాయి దగ్గరికి పోనిచ్చేవాడు కాదు. ఒకసారి నాలుగవ తరగతిలో ఉన్నప్పుడు నేను బాయి దగ్గరికి పోయి ఇంటికి ఆలస్యంగా వచ్చానని నన్ను తిట్టడమే కాకుండా స్కూల్ కి వచ్చి సార్ ను కూడా మందలించాడు. సార్ నన్ను కొట్టిండు (నవ్వుతూ). నాకు కూడా చదువుకోవడం చాలా ఇష్టంగా ఉండేది. మా ఇంటి ముందు మా బాపు దగ్గరికి వాళ్ళూ వీళ్ళూ రావడం పంచాయతీలు చెప్పడం అట్లా ఒక పురుష ప్రపంచం వుండేది. ఇంటి వెనుక మా అమ్మ దగ్గరికి సమస్యలు, కష్టాలు చెప్పుకోవడానికి వచ్చే స్త్రీల ప్రపంచం ఉండేది. ఎన్నో సమస్యలను తీర్చే మా బాపు అప్పుడప్పుడు తాగి అమ్మను కొట్టేవాడు. అందుకే ఆమెకు కూడా అది ఒక ఊరట. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలు వింటుండేవాడిని. చదువుకునే వాళ్లకు నిద్ర కూడా పట్టదని, కష్టం ఎక్కువని చెప్పుకునేవారు. ఈ కష్టమేందో నేనూ పడాలి అనుకునేవాడిని. మా ఊళ్ళో 5వ తరగతి వరకు మాత్రమే ఉండేది. అక్కడ నేను 4వ తరగతి దాకా చదువుకున్నాను.

2. తరువాత మీ విద్యాభ్యాసం ఎట్లా కొనసాగింది?
జ :-    మా ఊళ్ళో సత్యనారాయణ అని గజ్వేల్ దగ్గర వర్గల్ లో హెడ్మాస్టర్ గా పని చేసేవాడు. వాళ్ళ నాన్న రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మా నాన్నకు గైడ్ గా ఉండేవాడు. సలహాలు, సూచనలు ఇచ్చి మా నాన్నకు అక్షరాలు నేర్పించినవాడు. ఆ హెడ్ మాస్టర్ వాళ్ళ ఇంటిని, మామిడితోటను చూసుకోవడానికి, వాటి డబ్బులను వసూల్ చేసుకోవడానికి ఎండాకాలం వస్తుండేవాడు. మా నాన్న ముందు జాగ్రత్తగా తన స్కూల్లో నన్ను చేర్చుకోమని అడిగాడు. ఆయన నన్ను కొన్ని ప్రశ్నలడిగి నన్ను 5వ తరగతి చదవకుండానే 6వ తరగతిలో చేర్చుకుంటానని నన్ను వర్గల్ తీసుకుపోయిండు. అప్పటివరకు నేను మా అవ్వ, బాపులను విడిచి ఎక్కడికీ వెళ్ళలేదు. నెలరోజులకే ఉండలేక పోయాను. జ్వరం వచ్చింది. మా బాపుకు ఉత్తరం రాద్దామనుకొని 5 పైసల కార్డు సంపాదించి, స్కూల్లోనే హిందీ క్లాసులో ఉత్తరం రాస్తుంటే సార్ గమనించి ఉత్తరం చదివిండు. గమ్మత్తు ఏంటంటే అడ్రెస్ సత్యనారాయణ సార్ దే రాసిన. అప్పుడాయన ఆ అడ్రెస్ కొట్టేయించి మా బాపు అడ్రెస్ కి ఉత్తరం రాయిస్తే మా అమ్మ చూసి శోకాలు పెట్టి ఏడ్చిందట. మా బాపు మనిషిని తోలించిండు. నేను ఊరికి చేరుకున్న. 7వ తరగతి మా ఊరుకు దూరంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్కటూరులో చదువుకున్నా. 5 కి.మీ. దూరంలో ఉన్న దుద్దెడలో స్కూల్ వున్నా మా బాపు చేర్పించలేదు. ఆయన ఉద్దేశ్యంలో పిల్లలు సరిగ్గా చదవాలంటే రోడ్డు, హోటలు లేని ఊరు కావాలి. వాటివల్ల పిల్లలు తొందరగా చెడిపోతారని ఆయన భావన. వెల్కటూరులో అవి లేవు కాబట్టి అక్కడ చేర్పించాడు. మా బాపును చూసి ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇంకో 20 మంది వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించారు. అట్లా అక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నా.

3. అనేక వేదికలపైన, మీ రచనల్లో చాలాచోట్ల మీ నాన్నగారి గురించి ప్రస్తావిస్తూనే వుంటారు. మీ జీవన గమనంలో ఆయన ప్రభావం ఎటువంటిది?
జ :-     మా బాపు నా హీరో. చదువుకోలేదు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించేవాడు. ప్రతీ దాంట్లో జోక్యం చేసుకొని ఊరు బాగు పడాలనే ప్రయత్నం చేస్తుండేవాడు. రెండవది నన్ను చదువుకొమ్మని నాలో ఆసక్తిని కలిగించిందీ ఆయనే. ఆయన ఎక్కడ ఏ వార్త విన్నా ఒక నోట్ బుక్ లో రాసుకునేవాడు. అంతేకాక దానికింద తన భావాన్ని కామెంట్ గా రాసుకునేవాడు. అది బాగా ఇష్టంగా చదివేవాణ్ణి. కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగాడు. తెలంగాణ రైతాంగ పోరాటంలో గ్రామ రక్షక దళాలలో ఆయన పాత్ర ఉంది. దాదాపు పది ఊళ్ళల్లో రజాకార్లు రాకుండా అడ్డుకోవడానికి దళాలు ఏర్పాటుచేసి రాత్రిపూట కావలి కాసేవాడు. మార్క్సిస్ట్ పార్టీతో కూడా ఆయనకు సంబంధం ఉంది. మంచి గొంతు కానప్పటికీ మావూరి పోలీసు పటేల్ మీదనో, ఊరి సర్పంచ్ మీదనో పాటలు కట్టి పాడేవాడు. ఊళ్ళో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వేదికల మీద మాట్లాడేవాడు. స్కూల్ విద్యా కమిటీ సభ్యునిగా ఉండేవాడు. ఇవన్నీ నాకు ఆకర్షణీయంగా ఉండేవి. పాటల పట్ల నాకు ఆసక్తి కలగడానికి ఆయన ఒక కారణం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చి చల్లారిన రోజులు. కారణం తెలియదు కానీ ప్రభుత్వం 250 పుస్తకాలను పంపింది. దాంతో మా ఊళ్ళో ఒక లైబ్రరీ ఏర్పాటయింది. ఆ పుస్తకాలు మొత్తం నేను చదివాను. అప్పుడు మా బాపు “చదువుడు గొప్ప కాదురా! రాసుడు గొప్ప” అన్నాడు. అది నాకు గొప్ప ఇన్స్పిరేషన్. అట్లా చదవడం, రాయడం, పాటలు, ధైర్యంగా ప్రజల కోసం పని చేయడం వీటన్నిటి పట్ల ఆసక్తికి ఆయనే కారణం. నాలో ఒక ఉద్యమకారుడున్నాడన్నా, పాట కారుడున్నాడన్నా, రచయిత ఉన్నాడన్నా ఆయన ఆదర్శమే. అందరు మంచిగుండాలన్నదే ఆయన కోరిక. అయితే నాకు ఆయనలో నచ్చని గుణం ఒకటున్నది. సాయంత్రం కల్లు తాగినప్పుడు అప్పుడప్పుడు అమ్మను కొట్టేవాడు. ఈ విషయంలో చాలా కోపం వచ్చేది. మా బాపు 8 నెలల వయసులో తల్లిని, మూడు, నాలుగు  ఏండ్లకే తండ్రిని, 5 ఏండ్లకు తనను చూసుకునే బాపమ్మను కోల్పోయాడు. పెంచిన పెద్దన్న జాగా, పాలు ఉన్నప్పటికీ చిన్న జీతగానిలా పనులు చేయించడం, పెద్దమ్మ, వదిన తనను తేడాగా చూడడం, సరియైన తిండి కూడా పెట్టకపోవడం చేశారట. ఆ కష్టమంతా బాయి దగ్గర ఉన్న జీతగాండ్లతో చెప్పుకొని బాధ పడేవాడట. అట్లా ఒకరిద్దరు జీతగాండ్లతో కలిసి పల్లీలు కాల్చుకొని, కుండలో పెట్టుకొని, భూమిలో పాతి, ఆకలైనప్పుడు తినేవారట. చాలా దుర్భర జీవితాన్ని అనుభవించాడు (కన్నీళ్లు పెట్టుకుంటూ). ఇంత బాధ నుండి ధైర్యంగా బయటపడి, తన అస్తిత్వాన్ని తాను నిలబెట్టుకున్నాడు. పది ఊళ్లకు నాయకుడు. ఏ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా బాపును తీసుకుపోయేవారు. మేము పెరుగుతున్న దశలో ఫలానా ఆయన కొడుకని మాకు మంచి ఆదరణ ఉండేది. చొచ్చుకుపోయే గుణం, పదిమందికి మంచి చేయాలన్న మానవీయ కోణం ఆయనలో ఉండేది. చిన్నతనంలో ఆయన కష్టాన్ని చూసినవాళ్ళు అప్పుడప్పుడు మాకు చెప్పి బాధపడేవాళ్ళు. ఈ అనేక విషయాల్లో ఆయన నాకు ఆదర్శవంతుడు.

4. మీరు తెలుగుభాషానురక్తులు కావడానికి, కవిత్వం పట్ల ఆసక్తికి ఏ విధమైన సాహిత్య వాతావరణం తోడ్పడింది?
జ :-  మా ఇంట్లో సాహిత్యానురక్తి ఏమాత్రం లేదు. కానీ పరోక్షంగా ఎక్కడో కవికి సంబంధించిన వాతావరణం ఉండింది. నాకు తెలుగు, లెక్కలు అంటే చాలా ఇష్టంగా ఉండేది. గణితంలో చాలా గొప్పవాడిని అవుతానని మా సార్లు అంటుండేవాళ్ళు. 4, 5 తరగతులలో “అరుగులన్నిటి యందు ఏ అరుగు మేలు?” అనే గేయం ఉండేది. ఏడు చేపల కథ, శిబి చక్రవర్తి కథ వీటివల్ల కొంత ఇన్స్పిరేషన్ పొందాను. 7వ తరగతిలో కంకంటి పాపరాజు రచించిన ‘ఉత్తర రామాయణం’లోని కరుణరసంతో కూడిన పద్యాల వల్ల మనుషుల్లో ఉండాల్సిన హృదయపు తడి అర్థమైంది. మా ఊళ్ళో జానపద సంస్కృతి ఉండేది. చేను దున్నినప్పుడు, నాట్లేసినప్పుడు, కోత కోసేటప్పుడు, మోట కొట్టేటప్పుడు, పీర్ల పండుగ సమయంలో నిప్పుల మీద నడుస్తున్నప్పుడు, బతుకమ్మ, బోనాలు మొదలైన పండుగలప్పుడు నిరంతరం అద్భుతమైన పాటలు పాడేవాళ్ళు. ఇవేకాక ఊళ్ళో ఒగ్గు కథ, చిందు భాగోతాలు, శారద కాండ్రు ఇలాంటి వాళ్ళందరూ పౌరాణిక గాథలు, వీరగాథలు చెప్పేవాళ్ళు. ఈ వాతావరణమంతా ఉన్నా ఒక రూపం నాలో ఏర్పడలేదు. 9వ తరగతిలో మా సీనియర్ అంజిరెడ్డి మా తెలుగు సార్ చారికి పద్యాలు రాసి చూపిస్తే అందరూ మెచ్చుకునేవారు. పద్యాలు రాస్తే ఇంత పేరొస్తుందా? అనుకునేవాణ్ణి (నవ్వుతూ). అప్పటికే కరుణశ్రీ పద్యాలు చాలా ఇష్టంగా ఉండేవి. ఛందస్సు తెలియకపోయినా ఉత్పలమాల అక్షరాలను బట్టి పద్యం రాసి సార్ కు చూపిస్తే పద్యం రాయాల్సిన పధ్ధతి అది కాదని చెప్పారు. ఆయనకు బదిలీ అయి అష్టకాల నరసింహ శర్మ గారు మాకు తెలుగు టీచరుగా రావడం నాకు టర్నింగ్ పాయింట్. ఆయన రావడంతోనే ఆయన రాసిన ‘శిథిల విపంచి’ అని ఖండికలు ఉన్న పుస్తకాన్ని విద్యార్థులకు చారణాకు ఇచ్చారు. అవన్నీ కంఠస్థం చేశాను. ఆయన క్లాసులో పద్యాలు రాసుకుంటుంటే కవిసమ్మేళనం అనేది ఒకటుంటుందని తెలిసింది. ఆయన మాకు “నీ జీవితోద్దేశ్య మేమిటి?” అని అంశంతో వ్యాసరచన పోటీ పెట్టారు. ఎమ్. ఎల్. ఏ. కావాలని రాశాను. వెల్కటూరుకు వచ్చిన వల్లూరి బసవరాజు అనే మంత్రి వచ్చినప్పుడు కాన్వాయ్ తో ఆయనకు కలిగిన మర్యాద, పిల్లలకు స్కూల్ బంద్ చేయించి ఆయనకు స్వాగతం చెప్పించడం వీటితో అదే గొప్ప అనుకున్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్  వచ్చింది. బహుమతిగా నాకు మరిపెడగ బలరామాచారి రాసిన ‘మేనకా విశ్వామిత్రం’ పుస్తకం ఇచ్చారు. మా స్నేహితునికి సెకండ్ ప్రైజ్ గా ‘సూరదాసు పదాలు’ ఇచ్చారు.  నాకిచ్చిన పుస్తకములో పద్యాలు, గేయాలు ఉంటాయి. అదొక ఇరవైసార్లు చదివి ఉంటాను. అది నన్ను బాగా ఆకర్షించింది. దీనివల్ల సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. ఇక ఆగలేదు. అదే సమయంలో పద్యాలు రాయి. కానీ వచన కవిత్వం కూడా ఉంటుందని నరసింహరామశర్మ చెప్పారు. ఉమాపతి పద్మనాభ శర్మ, రుక్మాభట్ల కృష్ణమూర్తి, విఠాల శ్రీకాంత శర్మ, జాలపల్లి చంద్రారెడ్డి ఈ నలుగురు కలిసి రాసిన ‘ఋతచేతన’ పుస్తకాన్ని ఇచ్చారు. అప్పటినుండి వచన కవిత్వం రాయడం ప్రారంభించాను. 9వ తరగతిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆక్టివ్ గా ఉన్నాను. పదవతరగతిలో ఉన్నప్పుడు చలం ఆనందం, విషాదం అనే రెండు పుస్తకాలు చదివాను. తాత్వికత వల్ల అప్పుడు అర్థం కాలేదు. శరత్ సాహిత్యాన్ని కూడా చదివాను. తాళ్లూరు నాగేశ్వరరావు రచించిన ‘మా ఊరి కథలు’ నన్ను బాగా ఆకట్టుకుంది. ఇట్లా ఎన్నో పుస్తకాలు, నరసింహరామశర్మ గారి ప్రోత్సాహం ఇవి నా ఆలోచనలను కవిత్వం వైపు తీసుకు పోయాయి.

5. ఎమ్ ఫిల్. పరిశోధనాంశంగా “ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు” అని ప్రాచీన కావ్యాలలోని ఉదాహరణలను ఉటంకిస్తూ అనేక విషయాలను విశ్లేషించారు కదా! అటువంటి వైవిధ్య అంశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?
జ :-   నేను మాథ్స్ పూర్తి చేసి టీచరుగా చేయాలనుకున్నాను. కానీ డిగ్రీ సెకండ్ ఇయర్ నుండి పూర్తిగా కవిత్వం తప్ప మరేమీ లేదన్నంతగా  మునిగిపోయిన. మా గురువు చుక్కా రామయ్య ఎంత చెప్పినా వినలేదు. డిగ్రీలో ఫెయిలయ్యాను. ఎమ్. ఏ తెలుగు చేయడానికి డిగ్రీలో స్పెషల్ తెలుగుతో ఎక్స్ టర్నల్ చేసే అవకాశం ఉంది. అది చేసి ఎకనామిక్స్, తెలుగు, పొలిటికల్ సైన్స్ తో డిగ్రీ పూర్తి చేసి ఎమ్.ఏ తెలుగులో చేరాను. ఇక్కడ సి. నారాయణరెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. 9వ తరగతిలో ఉన్నప్పుడు (1969) ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో స్కూళ్ళు బంద్ చేశారు. మా ఇంట్లో రేడియో లేదు కాబట్టి హైదరాబాద్ లో జరిగే వార్తలను తెలుసుకోవడానికి అవుసుల రామాచారి ఇంటికి ప్రతిరోజూ వెళ్ళేవాడిని. అది గమనించిన మా బాపు 3 నెలల తరువాత ఒక ఎద్దును అమ్మి ఆ డబ్బుతో రేడియో తీసుకువచ్చారు. ఆయనకు కూడా రేడియో ఇష్టమే. మా వాడకు మొదటి రేడియో అది. ఆ రోజు రేడియో వింటున్నప్పుడు మఖ్డుమ్ మొహియొద్దీన్ అనే ఉర్దూ కవి చనిపోయాడని వార్త తెలిసింది. ఆయన శ్రద్ధాంజలి కార్యక్రమం ప్రసారమైంది. అందులో సినారె గారు ఆయనను కీర్తిస్తూ “నూరు శరత్తులు నోరారా పాడవలసిన బుల్బులీ, నూరు వసంతాలు దోర వెన్నెల కురియవలసిన జాబిలీ, వెళ్లిపోయావా నేస్తం ప్యారే మఖ్డుమ్, మేరే హమ్ దమ్” అని కవిత చదివారు. కవిత్వం ఇలా చదవడం నేను ఎప్పుడూ వినలేదు.  ఆయన చదివే విధానము, కవిత రెండూ నన్ను ఆకట్టుకుని సినారె గారి మీద అభిమానం ఏర్పడింది.నరసింహరామశర్మ గారు ‘యువభారతి’ సంస్థను పరిచయం చేశారు. అందులో ప్రచురింపబడిన సినారె గారి ‘మందార మకరందాలు’ చదివాను. ఆయన మీద మరింత గౌరవం పెరిగి ఆయన దగ్గర చదువుకోవాలన్న కోరిక పెరిగింది. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు తెచ్చిన ‘మంటలు-మానవుడు’ చదివాను. నా కోరిక నెరవేరి పీజీలో ఆయన నాకు గురువయ్యారు. ఆయన మాకు ప్రాచీన కవిత్వంలో ‘విజయ విలాసం’, ‘కళాపూర్ణోదయం’, ఆధునిక కవిత్వంలో ఎంకిపాటలు, మహా ప్రస్థానం, జాషువా కవిత్వం చెప్పారు. నా సీనియర్ విద్యార్థులను చూసి నాకు కూడా డాక్టర్ అనిపించుకోవాలని కోరిక కలిగింది. దానికోసం వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. గుంటూరు శేషేంద్రశర్మ గారు ‘మండే సూర్యుడు’, కె. శివారెడ్డి గారు ‘రక్తం సూర్యుడు’ అని రాశారు. 1970 – 75 మధ్య విప్లవ కవిత్వం వచ్చిన సమయంలో సూర్యుని మీద రచనలు బాగా వచ్చాయి. నేను కూడా “సూర్యుడు నాడు దేవత, నేడు విప్లవ ప్రతీక” అని వ్యాసం రాశాను. అది చాలామందికి నచ్చింది. శేషేంద్రశర్మ గారిని, శివారెడ్డి గారిని తులనాత్మకంగా పరిశీలిస్తూ ‘ఇద్దరు కవితా సూర్యులు’ అని నేను రాసిన వ్యాసం ‘భారతి’ లో అచ్చయ్యింది. నారాయణరెడ్డి గారు ‘ఉదయం నా హృదయం’ అని రాశారు. నేను ఎంచుకున్న అంశాలలో ఎవరూ ఇంతవరకు చేయని అంశం సూర్యుని పైన చేయుమని చెప్పిన ఆయన సూచనను అనుసరించి చేశాను. గైడ్ కూడా ఆయనే. అట్లా1981లో నా ఎంఫిల్ పూర్తయింది.

ముఖాముఖి గ్రహీత అరుణదూూళిపాళ నందిని సిిధారెడ్డిగారితో

6. మీరు వెలువరించిన సిద్ధాంత గ్రంథం “ఆధునిక తెలుగు కవిత్వం వాస్తవికత – అధివాస్తవికత” లో మీరు నిరూపించిన అంశాలేవి?
జ :-    ఎమ్ ఫిల్ అయిపోయాక జానపద సాహిత్యం మీద పి హెచ్ డి చేయాలన్న ఆసక్తి ఉండింది. ఆర్ట్స్ కాలేజీ అంతా జానపద సాహిత్యం వెలుగుతున్న రోజులవి. రామరాజు గారిది జానపద సాహిత్యం కావడం, నేను పల్లీయుడిని కావడం, మెదక్ జిల్లా జానపద సాహిత్యంపై అంతవరకు ఎవరూ చేయకపోవడం వల్ల ఊరూరా తిరిగి సేకరించాలనుకున్నాను. లేదా “తెలంగాణ రైతాంగ పోరాట సాహిత్యం” గురించి చేద్దామనుకున్నా. అప్పటికే “తెలంగాణ విమోచనోద్యమం – తెలుగు నవల” మీద వరవరరావు గారు చేసి ఉండడంతో కవిత్వం మీద చేయాలనుకున్నా. సినారె గారు వద్దన్నారు. దాంతో ‘తెలుగు కవిత్వం – వాస్తవికత’ అనుకున్నా. దానికి పద సౌందర్యంతో పాటు ‘Realism’ తో పాటు ‘Surrealism’ కూడా చేయమని అధివాస్తవికత చేర్చారు సినారె గారు. దీనికి కూడా ఆయనే గైడ్. 1984లో పి హెచ్ డి పూర్తి అయినప్పటికీ హాస్టల్ సీటు పోతుందని 1986లో ఉద్యోగం వచ్చాక సబ్మిట్ చేశాను. అదే సంవత్సరంలో డాక్టరేట్ తీసుకున్నాను. వాస్తవికత లేకుండా కవిత్వం లేదనే విషయాన్ని దీంట్లో నిరూపించాను. చాలామంది కాల్పనికం అంటారు కానీ యథార్థం నుండి కల్పన పుడుతుంది. కల్పనాశక్తి లేనిదే ఎవరూ కవి కాలేరు. కల్పనకు బేస్ వాస్తవికత. అది లేనిది కవితా శక్తి లేదు. ఒక్క మన తెలుగు కవిత్వం అనే కాదు. ప్రపంచ కవిత్వం ఏదైనా దాంట్లో వాస్తవికత ఉన్నప్పుడే సహృదయుని చేరుతుంది. అధివాస్తవికత కూడా అప్పటివరకు ఎవరూ తీసుకోలేదు. ఎట్లా వస్తే అట్లా రాయడమే అధివాస్తవికత. దానికి ఎడిటింగ్ లేదు. అది కల్పన కావచ్చు. వాస్తవికత కావచ్చు. సమాజం ఒప్పుకుంటుందా లేదా సంబంధం లేదు. ఒకరకంగా స్వేచ్ఛా కవిత్వం. దానికైనా కొన్ని పరిమితులు ఉంటాయి కానీ దీనికట్లా కాదు. మనసులో ఏది తోస్తే అది రాయడమే. ప్రధానంగా చెప్పాలంటే వాస్తవికతకు బేస్ భౌతిక జీవితం అయితే అధివాస్తవికతకు బేస్ మానసిక జీవితం. భౌతిక జీవితం సమాజాన్ని, కుటుంబాన్ని ఆశ్రయించి ఉంటుంది. కానీ మానసిక జీవితం భావ పరంపర లోంచి వచ్చేది. ఇవన్నీ దీంట్లో నిరూపించాను.

7. మిమ్మల్ని విప్లవమార్గంలో నడిపించడానికి దారి చూపింది ఎవరు?

జ :-    నేను కవిత్వం పట్ల ఇష్టంతో అభిమానంతో నడుస్తున్న సమయంలో 1973 వచ్చేసరికి విప్లవ కవిత్వం వికాసదశలో ఉంది. నేను డిగ్రీ కళాశాలలో సెకండియర్  ఉన్నప్పుడు ‘నవ సాహితీ సంస్థ’ అని ఉండేది. దానికి గులాబీల మల్లారెడ్డి కన్వీనర్. సరిపల్లి కృష్ణారెడ్డి అడ్వైజర్. నెల, రెండు నెలలకొకసారి మీటింగులు జరిగేవి. విద్యార్థులను సమ సమాజం వైపు చైతన్యం చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఒకసారి అక్కడ జరిగిన కవిసమ్మేళనంలో వేదిక మీద వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న కవిత చదివాను. దానికి కూడా ఒక ప్రేరణ ఉంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చివరలో నేను సిద్దిపేట శాఖా గ్రంథాలయానికి తరచూ వెళ్ళేవాడిని. శ్రీ శ్రీ ‘మహాప్రస్థానం’, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’, ఆరుద్ర ‘వెన్నెల వేసవి’ లాంటి పుస్తకాలు చదివాను. నవంబర్ 14 నెహ్రూ జయంతి సందర్భంగా లైబ్రరీ  వారోత్సవాలు చేస్తారు. అక్కడ జరిగిన కవిసమ్మేళనంలో మహమూద్ పాషా పరిచయం అయ్యాడు. నా భావజాలాన్ని గ్రహించి, అప్పటికే తీవ్రమైన కవిత్వం రాస్తున్న భగవంత్ రెడ్డిని పరిచయం చేయించాడు. ఆయన ద్వారా దిగంబర కవుల గురించి తెలిసింది. ఈ నేపథ్యంలో విప్లవ కవిత్వంతో పరిచయం ఏర్పడింది. మల్లారెడ్డి ఫైనలియర్ అయిపోయి నేను ఫైనల్ కు రావడంతో ఆ సంస్థకు నేను కన్వీనర్ ని అయ్యాను. సరిపల్లి కృష్ణారెడ్డికి విప్లవోద్యమాల గురించి, విప్లవ కవిత్వం గురించి బాగా తెలుసు. ఆయనతో చర్చల్లో వాటికి సంబంధించిన అవగాహన బాగా ఏర్పడింది.
         ఈలోపు మల్లారెడ్డి ‘గులాబీ’ అనే పత్రికను ప్రారంభించాడు. కవిత్వ ఎడిటింగ్ బాధ్యత నాకు అప్పగించాడు. ఆ టైమ్ లోనే ‘దివిటీ’ పుస్తకం వేశాము. కృష్ణారెడ్డి నాకు విప్లవ భావాలున్న భూపాల్ ను పరిచయం చేయించాడు. మా బాపుకు ఆయనను పరిచయం చేయమన్నాడు. మా బాపుకు కూడా ఇష్టమే కాబట్టి భూపాల్ ను సైకిల్ మీద ఎక్కించుకొని పది ఊళ్ళు తిప్పాడు. కానీ తర్వాత ఆయన నక్సలైట్ అని తెలిసింది. ఎమర్జెన్సీలో గిరాయిపల్లి ఎన్ కౌంటర్ లో ఆయన మరణించాడు. దాంతో జాగ్రత్త పడ్డాను. నవ సాహితి, సరిపల్లి కృష్ణారెడ్డి, భూపాల్ వీళ్ళ ద్వారా కొంత, కాలేజీలో ఉన్న వాతావరణం వల్ల విప్లవం ఎంత ప్రభావితం చేసిందో హైదరాబాద్ కు వచ్చిన తరువాత సినారె, కె. శివారెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ వీళ్ళ నుండి కవిత్వం పట్ల అంతే ప్రభావితుడనయ్యాను. కవిగా ఉండాలంటే విప్లవోద్యమం వైపు ఇంతకన్నా ఎక్కువ వెళ్లొద్దు అని అర్థమైంది.

8. ఆధునిక దృక్పథం కలిగిన తొలి మినీ కవితల సంకలనంగా, మినీ కవితా విప్లవంగా, ముగ్గురు కవులు పట్టిన దివిటిగా గుర్తింపు తెచ్చుకున్న ‘దివిటి’ మినీ కవితా సంకలనాన్ని గురించి తెలపండి.
జ :-   డిగ్రీ రెండవ సంవత్సరంలో కవిత్వం విరివిగా రాయడం, కవిత్వమే జీవితం, అదే నా మార్గం అన్న స్థాయికి వెళ్ళిపోయాను. వచన కవిత్వ రూపాలను చూస్తున్న ఆ సమయంలో ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ‘కొత్తకలాలు’ అనే శీర్షికతో చిన్న కవితలు వేసేవాళ్ళు. అది 1974లో కొత్త ట్రెండ్ అయింది. స్పేస్ ప్రాబ్లమ్ వల్ల చిన్న కవితలను రాసి పంపితే త్వరగా అచ్చయ్యేవి. కవిత్వ వ్యతిరేకి అనుకునే ‘ఈనాడు’ పత్రికలో కూడా ‘కొత్తపాళీ’ అనే శీర్షికతో రోజుకొక కవిత వేసేవాళ్ళు. అట్లా చాలామందికి అవకాశం వచ్చేది. అప్పుడు అందరం మినీ కవితలు రాయడం ప్రారంభించాం. ఆగం రెడ్డి, నేను ఇద్దరం సినిమాల మీద ఉన్న పిచ్చితో విరివిగా చూసేవాళ్ళం. ఆగం రెడ్డి స్నేహితుడు కర్ణాల బాలరాజు. నాకు ఎప్పటికైనా నారాయణరెడ్డి గారు లాగా సినిమా పాటలు రాయాలని కోరిక ఉండేది. రోజుకొక పాట రాసేవాణ్ణి. దాదాపు 200 పాటలను రాసిన. బాలరాజు నిజామాబాద్ లో ఏదో డ్యూటీలో చేరాడు. ఆయన ఉంటున్న ఇంటి ఓనర్ కొడుకు బెడిద రాజేశ్వర్. ఆయనకు కవిత్వం అంటే పిచ్చి. నేను బాలరాజుకు కందపద్యంలో ఉత్తరం రాస్తే అది చూసి ఆయన పద్యాలతో నాకు ఉత్తరం రాశాడు. అట్లా ఇద్దరం పద్యాలలో కలం స్నేహంతో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. రాజేశ్వర్ ఒకసారి నన్ను చూడడానికి వచ్చినప్పుడు కందుకూరి శ్రీరాములును పరిచయం చేయించాడు. నేను, కర్ణాల బాలరాజు, శ్రీరాములు మినీ కవితల్ని రాసేవాళ్ళం. ‘గులాబి’ పత్రికలో కూడా మినీ కవితలను వేసేవాణ్ణి. అంతవరకు మినీ కవితల పుస్తకం ఎవరూ వేయలేదు కాబట్టి మేము వేయాలనుకున్నాం. కుత్ బీ గూడలో మురళి పవర్ ప్రెస్ ఉండేది. గులాబి అక్కడే ప్రింట్ అయ్యేది. ‘దివిటి’ అనే పేరుతో మేం కూడా అక్కడే పుస్తకం వేసాం. ఆవిష్కరణకు కె. శివారెడ్డి సార్ ని పిలవాలని అనుకున్నాం. కాలేజీకి వెళ్లి ఆయన్ని కలిస్తే అన్నీ చూసుకుంటాడని రాజేశ్వర్ చెప్పాడు. శివారెడ్డి సార్ జాంబాగ్ వివేకవర్ధని కాలేజీలో లెక్చరర్ గా చేసేవాడు. ‘దివిటి’ పనుల కోసం హైదరాబాద్ చేరుకున్నాను. రెడ్డి హాస్టల్ లో ఉన్న చెట్టుకింద గద్దె మీద పడుకున్నాను. ఆయన కాలేజీకి వెళ్లి వచ్చే సమయానికి ఆయన్ని కలిశాను. ఆవిష్కరణకు సిద్దిపేటకు రమ్మని అడిగాను. ఆయన నన్ను చూసి ” అవన్నీ తర్వాత ముచ్చట. ముందు ఏమైనా తిందువు గానీ రా” అని తల్లి మనసుతో ఆదరించి హోటల్లో టిఫిన్ పెట్టించారు. “సిద్దిపేటకు దేవీప్రియను తీసుకొని వస్తానని అధ్యక్షుడుగా ఆయన ఉంటాడని, మిగతా ఏర్పాట్లు చేసుకోమని” మాటిచ్చారు. ఆ పుస్తకానికి ఉమాపతి పద్మనాభ శర్మ, బెడిద రాజేశ్వర్ ముందుమాటలు రాశారు. ముఖచిత్రం నేనే వేశాను. చుక్కారామయ్య గారిని వక్తగా పిలిచాం. మరొక వక్త మా తెలుగు లెక్చరర్ ముదిగొండ వీరభద్రయ్య గారు. మా ప్రిన్సిపాల్ ఛీఫ్ గెస్ట్ గా ఆవిష్కరణ జరిగింది. బెల్లంకొండ సంపత్ ఈమధ్య దీనిమీద ఒక వ్యాసం రాశాడు. అది ‘వివిధ’ పత్రికలో వచ్చింది. దాన్ని చూసి ఇద్దరు ముగ్గురు అంతకుముందు కూడా మినీ కవితా సంపుటి వుందేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. 1974 అక్టోబర్ కంటే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వచ్చి ఉంటే మేము ఒప్పుకుంటామని బహిరంగంగానే చెప్పాం. కానీ ఇంతవరకు ఎక్కడా తెలియలేదు. అందువల్ల ఇదే మొదటిది అని చెప్పొచ్చు. రాసింది ముగ్గురం. దివిటి మూడక్షరాలు. దానిపై త్రిమూర్తుల మినీ కవితా సంపుటి అని వేశాం.

9. ‘మంజీరా రచయితల సంఘం’ ఆవిర్భావానికి పునాది ఎప్పుడు పడింది?
జ :-   నాలో ఉద్యమ కార్యకర్త ఉన్నాడని చెప్పిన కదా! కార్యకర్తృత్వం కూడా నాకు ఇష్టం. సలంద్ర అనే కవి ప్రేరణతో ‘ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్’ అని ఒకటి పెట్టినం. 1984 ఫిబ్రవరిలో నాకు మెదక్ లో జాబ్ వచ్చింది. నారాయణరెడ్డి గారి దగ్గరకు వెళ్ళి చెబితే “సాహిత్యం, కవిత్వం, కవులు అక్కడ లేరు కదా! ఎట్ల బతుకుతవ్?” అన్నారు. “సాహిత్యకారులను తయారు చేసుకుంటాను. కవుల మధ్యనే జీవిస్తాను సార్” అన్నాను (నవ్వుతూ). ఏలేశ్వరం నాగభూషణాచారి, ఆయన బావమరిది మోత్కూరు అశోక్ కుమార్ ఇంకా కొంతమందితో కవిత్వ వాతావరణాన్ని సృష్టించుకున్నాను. అక్కడ అప్పటికే TNGO సంఘ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, లియాఖత్ అలీఖాన్, శేషగిరి మొదలైన వాళ్లతో కలిసి ‘మెదక్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాం. 1985 తరువాత దాన్ని జిల్లాకు విస్తృతం చేయాలనే ప్రపోజల్ వచ్చింది. అండర్ గ్రౌండ్ లో ఉన్న శాఖమూరి అప్పారావుతో నాకు పరిచయం ఉండింది. విరసంలో నేను చేరదలచుకోలేదు. మెదక్ జిల్లాలో ఒక సాహిత్య సంఘం పెట్టాలనే ఆలోచన, మెదక్ స్టడీ సర్కిల్ ను విస్తృతం చేయాలనే ఆలోచన వచ్చాయి.  నాకు అప్పటికే సంగారెడ్డిలో అమ్మంగి వేణుగోపాల్, సిద్దిపేటలో ఉన్న కొమురవెల్లి అంజయ్య మొదలైన వాళ్ళు తెలుసు. అప్పుడు మెదక్ లో రెండే రెండు సంఘాలున్నాయి. ఒకటి మెదక్ మండల సాహిత్య పరిషత్తు. ఇది అంతా వైదికులది.  రెండోది మెదక్ జిల్లా రచయితల సంఘం. ఇది అచ్చంగా వైష్ణవులదే. ఈ రెండూ సాంప్రదాయ కవిత్వానికి ప్రాధాన్యతనిచ్చేవి. ఉమాపతి పద్మనాభ శర్మ వలన ఈ గ్రూపులో అప్పుడప్పుడు కథలు, వచన కవిత్వం వస్తుండేవి. ఆధునిక సాహిత్యాన్ని ప్రచారం చేసే సంస్థ ఇంకోటి లేదు. ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఒక సాహిత్య సంస్థ అవసరమనిపించింది. మెదక్ జిల్లా పేరుతో రెండు సంస్థలు ఉన్నాయి. మెదక్ లో పనిచేయడం వల్ల మంజీర నదితో అనుబంధం ఏర్పడింది. దాశరథి గారు మంజీర నది మీద “ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర, ఎవరి కజ్జెల భాష్పధారవే మంజీర” అంటూ అద్భుతమైన పద్యాలు రాశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘మంజీరా రచయితల సంఘం’ అనే పేరుతో సిద్దిపేటలో జూలై 20, 1986లో నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. చంద్రశేఖర్ రావు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కొమురవెల్లి అంజయ్య  చంద్రశేఖర్ రావు ద్వారా కొంత ఆర్థిక సహాయం చేయించాడు. వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను, ఉపాధ్యక్షునిగా అమ్మంగి వేణుగోపాల్, కార్యదర్శిగా అంజయ్య ఉన్నాం.

10. మరసం ప్రధాన ఉద్దేశ్యమేంటి? దానిని ఎలా బలోపేతం చేయగలిగారు?
జ :-    మంజీరా నది ఏడుపాయల వలె దీన్ని కూడా ఏడు శాఖలుగా విస్తరించాలనుకున్నాం. అందుకే సిద్దిపేటతో పాటు మెదక్, గజ్వెల్, సంగారెడ్డి, పటాన్ చెర్వు, నర్సాపూర్, దుబ్బాకలలో కలిపి జీవనదిలా ఉండే సాహిత్యాన్ని సృష్టిస్తూ ఏడు శాఖలుగా విస్తరింప చేశాం . ఆధునిక సాహిత్యాన్ని ప్రచారం చేయడం, చెల్లాచెదురుగా ఉండే రచయితలను ఏకత్రితం చేయడం, సమసమాజ స్థాపన, శాస్త్రీయంగా మానవ విలువల కోసం పనిచేయడమనే ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగినం. అప్పటికే జిల్లాలో కవులు, రచయితలు ఉన్నారు. సాహిత్యాభిమానులైన వాళ్ళూ వస్తున్నారు. వాళ్లందరికీ ఒక వేదికంటూ లేదు. శాఖమూరి అప్పారావు ప్రభావంతో మరో వైపు విప్లవోద్యమం పనిచేస్తున్నది. వాళ్ళు ఏదీ రాయకపోయినా కలుసుకోవడానికి, చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరం ఉండింది. ఉదయం, ఈనాడు పత్రికలు జిల్లా ఎడిషన్స్ ని పెట్టాయి. దాంతో విలేఖరుల సంఖ్య బాగా పెరిగింది. అప్పుడు మేము పుస్తకాల్లో రాసే రచయితలే కాక, పత్రికల్లో రాసే రచయితలు కూడా అంటూ రచయితల నిర్వచన పరిధిని పెంచాం. మెదక్ జిల్లా జర్నలిస్టుల సంఘం ఏర్పడింది. అదీ, మరసం రెండూ కలిశాయి. గ్రామాల్లో వచ్చిన కొత్త చైతన్యం, కవుల్లో వచ్చిన యౌవనోత్సాహం, జర్నలిస్టులలో విస్తరిస్తున్న వాతావరణం ఇవన్నీ ఒకేసారి కలవడం వల్ల మరసం బలోపేతమైంది. మాకు రాజకీయ నాయకులతో, ప్రభుత్వంతో ద్వేషం లేదు. మంత్రులను, శాసన సభ్యులను పిలిచి కార్యక్రమాలను ఓపెన్ ప్లేస్ లో చేసేవాళ్ళం. జనాలు విపరీతంగా వచ్చేవాళ్ళు. సాహిత్య సభలు అట్లా జరగడం ఊహించలేము. ప్రజా ప్రతినిధుల్ని సభలకు ఆహ్వానించడం రచయితలు, జర్నలిస్టులు,  కలిసి పనిచేయడం వల్ల మరసం అంత గొప్పగా అవతరించింది.
          గ్రామాలలో స్త్రీలను చైతన్య పరచడం ద్వారా సభలకు బాగా హాజరయ్యేవాళ్ళు. స్త్రీలు, హమాలీలు, కూలీలు, రైతు కూలీలు, బీడీ కార్మికులు వీళ్ళందరి మీటింగులకు నన్ను మాట్లాడడానికి పిలిచేవాళ్ళు. అందుకే ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. సారా వ్యతిరేకోద్యమం వచ్చినప్పుడు సంపూర్ణ మద్యపాన వ్యతిరేక దినం చేయాలని మేము జర్నలిస్టులం తిరిగాం. గుట్కా మానేయాలంటూ చేసే ఉద్యమాలు, అందాల పోటీలు వద్దంటూ చేసే ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేకోద్యమాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొన్నాం. ఆంధ్ర ప్రాంత రచయితలతో కూడా సంబంధాలుండేవి. ఈ రకంగా ప్రజలతో , వారి జీవితం, సమస్యలతో మమేకమై ఉండడం, అటు సాంస్కృతిక రంగాన్ని, ఇటు పత్రికా రంగాన్ని సమ్మిళితం చేసుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బాగా గుర్తింపు తెచ్చుకుంది.

11.తెలంగాణ  పోరాటోద్యమ మలిదశ వైపు మీ నడక ఏవిధంగా కొనసాగింది? అందులో మరసం, తెలంగాణ రచయితల వేదికలు నిర్వహించిన పాత్ర ఎటువంటిది?
జ :-     1996 మరసం మంచి ఊపుకు వచ్చిన సమయం. దశాబ్ది ఉత్సవాలు రెండురోజులు భోజనవసతి ఏర్పాటుచేసి ఘనంగా నిర్వహించాం. 1996 నవంబర్ 1వ తేదీన అనుకోకుండా నేను హైదరాబాద్ కు రావడం, అదే రోజు అక్కడ గాంధీభవన్ లో జరుగుతున్న తెలంగాణా వాదుల సమావేశానికి హాజరయ్యాను. టంక శాల అశోక్, జ్వాలాముఖి కలిశారు. ఆ సమావేశం గురించి అందరికీ అసంతృప్తి ఉంది. ఇదిట్లా కాంగ్రెస్ వాళ్ళతో కాదని మనమే టేకప్ చేద్దామనుకున్నాం. అదేరోజు వరంగల్ లో అమరుల దినోత్సవం అని ఊరేగింపు చేసారు. పదిరోజుల తర్వాత ప్రణాళిక చేసుకుందామని వచ్చాను. జ్వాలాముఖి వెనుకడుగు వేసిండు. నవంబర్ 24 న మరసం మీటింగులో తెలంగాణ ఇష్యూ బలపడుతోంది కాబట్టి మనం కూడా దానికోసం పనిచేద్దామని ప్రతిపాదన తెచ్చాను. ఆంధ్రా వాళ్ళతో ఇబ్బంది లేకుండా “మా ఉద్యమం ఆంధ్రాలోని పేదవాళ్ళు, కూలీలతో కాదని, ఆంధ్ర దోపిడీదారులతోనేన”ని క్లారిటీతో తీర్మానించాం. ఈ తీర్మానంతో పత్రికా ప్రకటన ఇచ్చాం. తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ తెలంగాణలో తీర్మానం చేసిన మొదటి సాహిత్య సంస్థ ‘మంజీరా రచయితల సంఘం’ అని తెలిపాం. కాంగ్రెస్ వాళ్లు వాళ్ళ మీటింగుకు నన్ను పిలిచి మాతో కలిసి చేయమన్నారు. మేము ఒప్పుకోలేదు.
         ‘తెలంగాణాలో ఏం జరగబోతుంది?’ అనే ఒక పుస్తకాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య రాయగా కాళోజీ దాన్ని ఆవిష్కరించారు. 1997 జనవరి 1వ తేదీన పాశం యాదగిరి, ఇన్నయ్య మొదలైన వాళ్ళు మీటింగ్ పెట్టి నన్ను పిలిచారు. పూర్తి స్థాయిలో సమయం కేటాయించుమని అడిగారు. సరేనన్నాను. మార్చి 8, 9 తేదీలలో భువనగిరిలో రెండు రోజులు బహిరంగసభలు నిర్వహించారు. 8వ తేదీన జరిగిన హైదరాబాద్ ఊరేగింపులో పాల్గొని భువనగిరి వెళ్ళాను. తెలంగాణ సంస్కృతి మీద నేను మాట్లాడాను. తెలంగాణ సంస్కృతి గురించి చర్చలు జరిగాయి. గద్దర్, బెల్లి లలిత పాటలు పాడారు. సిద్దిపేటలో జరిగిన తెలంగాణ సదస్సుకు ముందురోజు ఆగస్టు 17, 1997 షేక్ బాబా కోరిక మేరకు  ‘నాగేటి చాల్లల్ల’ పాట గంట సేపట్లో రాశాను. అది చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత వరంగల్ సభకు వెళ్తున్నప్పుడు అమరుల మీద పాట రాస్తే బాగుంటుందని షేక్ బాబా అన్నాడు. బస్సులో కూచొని వరంగల్ పోయేలోపు ‘జోహారులూ జోహారులూ’ పాట రాసిచ్చాను.
        నవంబర్ 1,1998 న ‘తెలంగాణ సాంస్కృతిక వేదిక’ అనే సంస్థ పెట్టినప్పటికీ అది ఎక్కువగా ముందుకు పోలేదు. నక్సలైట్ల మీద నిర్బంధం పెరిగి బెల్లి లలితను చంపారు. మరో గాయకుడు అయిలయ్యను కాల్చి చంపారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పదం వినిపించకుండా కఠినంగా వ్యవహరించాడు. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి ఉద్యమం జీరోకొచ్చింది.ఆ సమయంలో కె. శ్రీనివాస్ నాతో మీరు దిగి సాహిత్య సంస్థ పెడితే బాగుంటుందని సూచించాడు. 2001వ సంవత్సరంలో ఏప్రిల్ లో కేసీఆర్ పార్టీ పెట్టారు. అక్టోబర్ లో మరసం 15వ వార్షికోత్సవ సందర్భంగా రెండురోజుల సభలు జరిగాయి. అందులో రచయితలుగా మనవంతు బాధ్యతగా ఒక సంస్థ పెట్టాలని ‘తెలంగాణ రచయితల వేదిక’ పెట్టాం. జనవరిలో కరీంనగర్ వేదికగా దాదాపు 60 మంది రచయితలు వచ్చారు. అందరి దగ్గరికీ నేను తిరిగాను. రచయితల వేదిక నియమావళి తయారుచేసుకున్నాం. నేను అధ్యక్షునిగా మొదటి సదస్సు వరంగల్ లో జరిగింది. వేణు సంకోజు కార్యదర్శి. రచయితలు కాకుండా ఇతరులు రావడం ఆశ్చర్యకరం. ఇక్కడ ఏం జరుగుతుందో చూడుమని కేసీఆర్ కొంతమందిని పంపించారని తెలిసింది. ఆ సదస్సులో కవిగానం, తెలంగాణం పేరుతో కవిత్వం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతీ మూడు నెలలకొకసారి ఒక మీటింగ్ జరపాలని నిర్ణయించాం. ‘సోయి’ అనే పత్రిక పెట్టి కె. శ్రీనివాస్ కు ఆ బాధ్యతలు అప్పగించాం. నేను ఎడిటర్ గా ఉన్నాను. 13 సంచికలు తెచ్చాం. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇట్లా అన్ని జిల్లాల్లో తిరుగుతూ శాఖలు ఏర్పాటుచేసి ఏడాదికి మళ్లీ సిద్దిపేటలో ఆ సంస్థ వార్షికోత్సవం చేశాం. రెండవ వార్షికోత్సవం హైదరాబాద్ అంబేద్కర్ భవన్ లో చేశాం. అప్పటినుండి కేసీఆర్ కూడా ప్రోత్సహించడం జరిగింది. ‘తెలంగాణం’ అనే పేరుతో దేశపతి శ్రీనివాస్ పాటల క్యాసెట్ ను తీసుకొచ్చాం. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో వ్యక్తిగతంగా నేను, మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక చాలా కృషి చేశాం. 2004 నుండి ఉద్యమం ఊపందుకుంది.

నందిని సిధారెడ్డి రచనలు

12. మీరు ఉద్యమకారులు కావడానికి ఎవరి ప్రభావం ఉంది? ఉద్యమవీరులతో మీ అనుభవాలు ఎటువంటివి? ప్రత్యక్షంగా మీరు పాల్గొన్న ఉద్యమాలు ఏవి?
జ :-   ఉద్యమంలోకి రావడానికి మొదటి కారణం, ప్రేరణ మా బాపే. ఆయన సిపిఐలో పని చేసిండు. వార్తల్లో ఎవరైనా సిపిఐ నాయకులు జైలుకు పోతే “మీరట్లా పోతార్రా?” అనేవాడు (నవ్వుతూ). డిగ్రీకి వచ్చిన తర్వాత సరిపెల్లి కృష్ణారెడ్డి, భగవంత్ రెడ్డి. ఆ తర్వాత భూపాల్. క్యాంపస్ లో ఎక్కువగా విద్యార్థి సంఘాలతో మిళితమై ఉండేవాణ్ణి. కవిత్వంలో కూడా విప్లవ భావాలే ఎక్కువ ప్రచారంలో నడుస్తున్నాయి. కాబట్టి విప్లవోద్యమాలతో నడవడానికి విప్లవ కవిత్వంతో పాటు వరవరరావు, శివారెడ్డి, కె.వి.రమణారెడ్డి లాంటి పెద్దలు కూడా కారణం. అట్లాగే గద్దర్ పాటలు నాకు ఇన్స్పిరేషన్. అవి యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరనుండి అందరినీ ఆకట్టుకునేవి. అదే క్రమంలో విమోచన గ్రూప్ కూర రాజన్న వంటివాళ్ళ పరిచయం, ఉద్యోగం వచ్చిన తర్వాత శాఖమూరి అప్పారావు లాంటి వాళ్ళ పరిచయం నాలో విప్లవ భావాలను పెంచింది. లోపల పనిచేస్తున్న వాళ్లలో సముద్రుడు అనే కవి ఉండేవాడు. ఆయన పేరు కనకరాజు. కవిత్వమంటే పిచ్చి. ఆయన మీద ఎన్ని ఆంక్షలు ఉన్నా వచ్చి నన్ను కలిసేవాడు. మరొక కవి సదానందం. ‘కౌముది’ పేరుతో రాసేవాడు. ఆయన కూడా నన్ను కలిసేవాడు. కవుల దగ్గరికి తీసుకుపొమ్మనేవాడు. ఆయన, నేను కలిసి ప్రయాణం చేయాలంటే భయం. ఇవన్నీ ఒకవైపు, మరొకవైపు ప్రజాఉద్యమాల్లో పాల్గొనడం. సారా వ్యతిరేకోద్యమంలో భాగంగా సంపూర్ణ మద్య నిషేధంలో ప్రత్యక్షపాత్ర వహించాను. ఎన్ టి ఆర్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేయడం జరిగింది. కల్లు వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నాను. విప్లవోద్యమాన్ని వందశాతం అభిమానించాను. కానీ కార్యాచరణలో నేను లేను. నేను తిరిగిన ప్రాంతం, నేను రాస్తున్న కవిత్వమే దీనికి భూమిక. నిజాయితీగా ఉండాలన్న దృక్పథంతోనే ప్రజాఉద్యమాల్లో పనిచేశాను.

13. ప్రత్యేకంగా “తెలంగాణ రచయితల సంఘం” స్థాపనకు కారణం ఏమిటి? దాని ద్వారా మీరనుకున్న లక్ష్యాలు నెరవేరుతున్నాయని అనుకోవచ్చా?
జ :-    2007 సంవత్సరం వచ్చేసరికి తెలంగాణ రచయితల వేదికలో సామాజిక సమీకరణల ప్రస్తావన తెచ్చారు. తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు తెలంగాణ భావోద్వేగం, తెలంగాణ సాహిత్యం, అస్తిత్వాలు మాత్రమే ప్రధానంగా ఉండాలి. సమీకరణలు అనేసరికి నేను స్వచ్ఛందంగా తప్పుకున్నాను. మామూలు సభ్యులుగా ఉంటామన్నా అధ్యక్షుడు, కార్యదర్శి ఏనాడూ సర్వసభ్య సమావేశాలు పెట్టలేదు. దేనికీ పిలవలేదు. సామాజిక సమీకరణల్లో ఒదగని చాలామంది రచయితలు ఇంకొక సంఘం పెడితే బాగుండన్నారు. అప్పుడు నేను “పోటీ సంఘం పెట్టకూడదని, ఒక ప్రాంతానికి సంబంధించిన భావోద్వేగాలతో పనిచేస్తున్నప్పుడు మనలను మనమే పలుచన చేసుకోవద్దని, తెలంగాణ రాష్ట్రం కోసం, మనమీద ఇతరుల ఆధిపత్యం లేకుండా చేయాలని పోరాడుతున్నాం. కాబట్టి ఇంకో సంఘం వద్దు” అన్నాను. ఇక రాష్ట్రం ఎప్పుడైతే వచ్చిందో, తెలంగాణాలో సాహిత్య, సాంస్కృతిక వికాసాలు ఎట్లా జరగాలి? రచయితలు ఇప్పుడు ఏ పాత్ర వహించాలి? అనే దానికోసం మనకొక సంస్థ కావాలనుకున్నాం. అంతకుముందే దాశరథి, నారాయణరెడ్డి అధ్యక్ష, కార్యదర్శులుగా ఉండి నడిపిన సంస్థ ఆగిపోయి ఉంది. అదే పేరుతో కొత్త సంస్థ కాకుండా దానినే తీసుకొని కొనసాగింపుగా నడిపిద్దామనుకున్నాం. నా అధ్యక్షతన, వి. శంకర్ కార్యదర్శిగా ఆక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టాం. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనం లేదా పునర్నిర్మాణం జరగాలి. అన్న ధ్యేయంతో ముందుకు నడిచాం. ఇప్పటికీ మేము అనుకున్న లక్ష్యం నెరవేరిందని, నెరవేరుతుందని అనుకోవడం లేదు. దానికి కారణాలు అనేకం. అంటే ఒక రాష్ట్రం లాగా భౌగోళికంగా వెంటనే జరిగే ఏర్పాటు కాదది. అదొక సుదీర్ఘ క్రమం. సుదీర్ఘ పరిణామం. దానికి అడుగులైతే పడ్డాయి. ఇంకా పరిణామం, వికాసం జరగాల్సి ఉంది. మేమింకా ప్రయత్నించాలి. అందరితో రాయించడం, భావాలకనుగుణంగా ఒక వేదిక ఉండడం, ఎప్పటికప్పుడు తెలంగాణ భావోద్వేగ ప్రయాణానికి దిక్సూచిగా ఉండడం ‘తెలంగాణ రచయితల సంఘం’ ముఖ్య ఉద్దేశ్యాలు. ఇవన్నీనెరవేర్చుకునే దిశగా నడుస్తున్నది. అసలు కృషి అంతా ముందే ఉన్నది.

14. తెలంగాణ తొలి సాహిత్య అకాడెమీ అధ్యక్షులుగా తెలంగాణ యాసను, భాషను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలిగారు?

జ :-   ‘తెలంగాణ సాహిత్య అకాడెమీ’ ఏర్పాటు అనేది తెలంగాణ సాహిత్య సాంస్కృతిక వికాసానికి ఒక మంచి అడుగుగా నేను భావిస్తున్నాను. రాష్ట్రం ఏర్పాటు ఎంత గొప్ప విషయమో సాహిత్య అకాడెమీ ఏర్పాటూ అంతే. 1984లో ఎన్టీఆర్ మూసివేసిన అకాడెమీ అది. ఆయన నార్ల వెంకటేశ్వర రావు నేతృత్వంలో కమిటీ ఏర్పరచి పరిశీలించమని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ఉన్న  సాహిత్య, సంగీత నాటక, లలిత అకాడెమీలకు డబ్బులు దండగ అని వెంకటేశ్వరరావు కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఎన్టీఆర్ వాటిని రద్దు చేశాడు. క్రియాశీలకంగా పనిచేసే ఆ సంస్థలు రద్దు అయినాక మళ్లీ 34 ఏండ్లకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ సాహిత్య అకాడెమీ ఏర్పాటు చేయడం నా దృష్టిలో ఒక మంచి మెట్టు. తెలంగాణకు సంబంధించిన భావోద్వేగాలు తీవ్రంగా ఉన్నప్పుడు భాష మీద తీవ్రమైన అసంతృప్తి, వాదోపవాదాలు జరిగాయి. కానీ తెలంగాణ వచ్చినాక ఈ భాషను కాదన్నవాళ్లే దాన్ని గుర్తించే పరిస్థితి వచ్చింది. కాబట్టి సాహిత్య అకాడెమీ కృషి అనే కాకుండా రాష్ట్రం రావడంతో అంతవరకు మాండలికం అన్నవారు తెలంగాణ భాషను గుర్తిస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లో, సాహిత్యంలో, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ భాషను మాట్లాడే విధంగా వాతావరణం మారిపోయింది. ఒకప్పుడు సినిమాల్లో విలన్లకు, హాస్య పాత్రలకు పరిమితమైన భాష ఈరోజు హీరో, హీరోయిన్లతో కూడా మాట్లాడించేంత అభివృద్ధి జరిగింది. భాష అనేది ఆధిపత్యం మీద ఆధారపడి ఉంటుంది. మరొక ప్రాంతపు ఆధిపత్యం వలన దీన్ని మాండలికానికి పరిమితం చేసి హద్దులు గీయడం జరిగింది. రాష్ట్రావిర్భావంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు ఈ భాషను మాట్లాడడానికి పౌరుడు కానీ, సినిమాల్లో కానీ, సాహిత్యంలో గానీ రాయడానికి ఒక రచయిత భయపడటం లేదు. భాష వికాసం చెందడం ఒక సుదీర్ఘ పరిణామం. రెండు వేల సంవత్సరాల భాషా పరిణామంలో వంద సంవత్సరాలకు పైగా ఆంధ్ర ఆధిపత్య పరిణామం ఉంది. ఒక 60, 70 ఏండ్ల వరకు  భాషా పరిణామం జరుగుతూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను.

15. అన్ని ప్రాంతాల మాదిరిగా తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని బట్టి దాన్ని మాండలికం అనకుండా ‘భాష’గా పేర్కొనాలని అనడానికి గల కారణాన్ని వివరించండి.
జ :-   రచయితలం మేమే దీన్ని ముందుకు తీసుకొచ్చినం. ఒక మండలంలోని భాషను మాండలికం అంటారు. ఆ పద వ్యుత్పత్తి లోనే మనకు  అర్థమవుతుంది. అప్పుడు తెలంగాణ పది జిల్లాల భాషను మాండలికం అన్నారు. జిల్లాల వారీగా మాండలికాలు వేరు. మరి పది జిల్లాలకు కలిపి ఒక భాష , ఉనికి ఉన్నప్పుడు దాన్ని మాండలికం అని ఎట్లా అంటారు? ఆంధ్ర ప్రాంతంలో రెండు జిల్లాలకు సంబంధించిన మాండలిక క్రియలను ఒక ప్రామాణిక భాషగా ఏర్పరచుకున్నారు. వచ్చాడు, వచ్చిండు అనే పదాలను చిన్నయసూరి గ్రామ్యాలని చెబుతూ “లక్షణ విరుద్ధంబైన భాష గ్రామ్యంబు” అన్నాడు కదా! మరి ‘వచ్చాడు’ ప్రామాణికమైతే, ‘వచ్చిండు’ కూడా ప్రామాణికమే కావాలి. రాయలసీమలో ఇప్పటికీ క్రియా పదాల్లో ‘వచ్చినాడు’ అని గ్రాంథికం కనిపిస్తుంది. దాన్ని వ్యతిరేకించి ఆంధ్రులు వ్యావహారికం కావాలని కొట్లాడినారు. అదే వ్యావహారికంలో మనం ‘వచ్చిండు’ అంటే ప్రామాణికం కాదంటున్నారు. అంటే వాళ్ళది
గ్రాంథిక వాదమా? ప్రామాణిక వాదమా? వ్యావహారిక వాదమా? వాళ్ళది వ్యావహారిక వాదమైతే, మాదీ వ్యావహారికమే అని కొట్లాడినం. తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భాషను భాషగానే గుర్తించాలి కానీ మాండలికంగా కాదు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగానే తీసుకున్నాం.

16. సాహిత్య అకాడెమీ ఛైర్మెన్ గా ప్రపంచ తెలుగు మహాసభలను అనూహ్యరీతిలో నిర్వహించిన మీరు ఆ కార్యక్రమాల్లో ప్రతిష్టాత్మకంగా భావించినదేది?
జ :-     1975లో జరిగిన ప్రపంచ మహాసభల్లో కేసీఆర్ విద్యార్థిగా పాల్గొన్నారు. ఆ అనుభూతితో రాష్ట్రం ఏర్పడ్డాక ప్రపంచ మహాసభలను, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా ప్రతిష్టాత్మకంగా జరిపించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షునిగా ఈ బాధ్యతలన్నీ చూడమని నాకు అప్పగించారు. అంతవరకు జరిగిన నాలుగు ప్రపంచ మహాసభలకంటే ఘనంగా జరగాలని,  అంతకు ముందు వాటికి కొనసాగింపుగా కాక కొత్తరాష్ట్రం ఏర్పడింది కాబట్టి ‘నభూతో న భవిష్యతి’ అన్నట్లు జరగాలని ఆయన కోరిక. ఐదు వేదికల మీద వివిధ అంశాలకు విభిన్న పార్శ్వాలతో, వివిధ రంగాలలో చర్చా వేదికలు, సాహిత్య సదస్సులు జరగాలని నా బలమైన కోరిక. ఒకటి రవీంద్ర భారతి మెయిన్ హాల్, రెండవది రవీంద్రభారతి మినీహాల్, మూడవది ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, నాలుగవది తెలుగు విశ్వవిద్యాలయం, ఐదు తెలంగాణ సారస్వత పరిషత్తు. బాలల సదస్సు, మహిళల సదస్సు, కవుల సదస్సు, అవధానం, శతావధానం, కథా ప్రక్రియ, విమర్శ, నవల, కవిత్వం వీటన్నిటి మీద ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి, ఎక్కడా ఇది జరగలేదు అనకుండా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఎక్కడికక్కడ నిర్వహణా బాధ్యతలు అప్పగించి ప్రతీ వేదికకు ఒక కమిటీ, ఇంకా ఇతర కమిటీలు వేసి, ఈ ఐదు వేదికల మీద కార్యక్రమ నిర్వహణ ఎట్లా జరుగుతుందో అన్నిచోట్లా తిరుగుతూ పర్యవేక్షించాను. మంచి పేరు వచ్చింది. బహుశా ఐదు రోజులు నిరాఘాటంగా కవి సమ్మేళనం జరిపిన చరిత్ర ఇంతవరకు ఏ మహాసభలకు లేదు. అంతగా జరిగినా ఇంకా కవులు మిగిలిపోయారు. కేసీఆర్ కోరిక మేరకు ప్రధాన వేదికపైన దేశ విదేశాలు ఆశ్చర్య పోయేలా అట్టహాసంగా, ఆడంబరంగా జరిగాయి. సాహిత్య కారులందరూ నివ్వెరపోయేటట్లు ఒక క్రమ బద్ధమైన ప్రణాళికను రూపు దిద్దడం జరిగింది. ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడిచినా అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ విషయాలు మళ్లీ ప్రస్తావనకు రావడం గొప్పతనం. రచయితల సభలుగా, భాషా సాహిత్య సభలుగా ప్రత్యేకంగా నిర్వహించాలని కేసీఆర్ బలమైన కోరిక. అందువల్ల అంత ఘనంగా నిర్వహించగలిగాం. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది.
        మొదట తెలుగు మహాసభలుగా జరపడమా, తెలంగాణ మహాసభలుగా జరపడమా అన్న విషయంలో పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో చాలా క్లారిటీ తెచ్చుకున్నాం. తెలంగాణలో జరిగిన తెలుగు వికాసాన్ని చూపించే సభలుగా నిర్వచనం ఇచ్చుకొని తెలంగాణ ప్రతిభను, తెలంగాణ భాషను, తెలంగాణ సాహిత్యాన్ని అద్భుతంగా చూపెట్టాం. హైదరాబాద్ అంతటా 120 ద్వారాలు పెట్టాం. రచయితలలో దున్న ఇద్దాసుతో సహా, యాదగిరిగుట్టలో ఈగ బుచ్చిదాసు అని ఒక సంకీర్తనాచార్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఎవరికీ తెలియదు. అలాంటి వాళ్ళందరి పేర్లతో ద్వారాలు ఏర్పాటు చేశాము. బుచ్చిదాసు మనుమడు అది చూసి మా తాత ఇంత గొప్పవాడు అని నాకు తెలియదు అన్నాడు. అట్లా తెలంగాణ రచయితలకు, కళాకారులకు గొప్ప గుర్తింపు వచ్చింది. సాహిత్య అకాడెమీ 120 ప్రధాన పుస్తకాలను ప్రచురించింది. దాంట్లో 80 సంవత్సరాల కింద రాచకొండ సర్వజ్ఞ సింగ భూపాలుని ‘రసార్ణవ సుధాకరం’ అనే అలంకార శాస్త్రాన్ని కూడా వెలువరించాం. జరిగిన దానికంటే జరగాల్సింది చాలా ఉంది. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ.

17. మీరు రాసిన మొదటి పాట “నాగేటి చాల్లల్ల నా తెలంగాణ” అనే దానికి ‘నంది’ అవార్డు వచ్చిన నేపథ్యం తెలుపుతూ మీ అనుభూతిని వివరించండి.
జ :-     1997 ఆగస్ట్ 17న సిద్దిపేటలో తెలంగాణ సదస్సు జరిగింది. షేక్ బాబా ముందు రోజు రాత్రికి మాఇంటికి వచ్చి ఉన్నాడు. “సర్! ఒక పాట రాయొచ్చు కదా!” అన్నాడు. నాకూ రాయాలని ఉంది. గంటసేపట్లో ‘నాగేటి చాల్లల్ల’ పాట రాసి ఆయనకు ఇచ్చి ట్యూన్ చేసుకొని పాడమని చెప్పిన. దేశపతి శ్రీనివాస్ కోరస్ ఇచ్చాడు.  ఆ తర్వాత జరిగిన అనేక సభల్లో ఈపాట తప్పనిసరిగా ఉండేది. దాంతో విస్తృతంగా గుర్తింపు వచ్చింది. నేను పొంగిపోయాను. దేశపతి శ్రీనివాస్ పాడుతుంటే వేదికల మీద పాడుతుంటే సభలో చాలామంది లేచి నృత్యం చేసేవాళ్ళు. అది చూసి ఎంతో పరవశించి పోయేవాణ్ణి. దర్శకుడు, గాయకుడు ఆర్. నారాయణమూర్తిని ఈ పాట బాగా ఆకర్షించింది. ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కలుస్తానని చెప్పి వచ్చి కలిశాడు. ‘వీర తెలంగాణ’ సినిమాలో దాన్ని పెట్టడానికి అనుమతి అడిగాడు. ఆపాట ఎప్పుడో ప్రజాపరమైంది. సరేనన్నాను. చాలా బాగా వచ్చింది. దానికి 2010లో నంది అవార్డు వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండిందప్పుడు. తెలంగాణోద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న రోజులు. అటువంటి సమయంలో సినిమా రంగంలో నా పాటకు పురస్కారం ఇవ్వడం గొప్పతనం. ఆ జ్యూరీకి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకొక సంతోషం ఏంటంటే నారాయణరెడ్డి గారిని చూసి సినిమాలకు పాటలు రాయాలని కోరిక ఉండేదని చెప్పిన కదా! విప్లవోద్యమంలో అడుగు పెట్టిన తర్వాత ఆ కోరిక వదిలేశాను. కానీ తెలంగాణ ఉద్యమం సినిమాను నా ఇంటిదాకా తీసుకువచ్చింది (నవ్వుతూ). పాటను సినిమాలో పెట్టడమే ఊహకందనిది. అట్లాంటిది నా మొదటి పాటకు నంది అవార్డు రావడం అంతకంటే ఊహకందనిది. అందుకే చాలా ఆనందం కలిగింది. సినిమారంగంలో కూడా ఒక గుర్తింపు తెచ్చింది. వేదిక మీద ఉత్తమ నటులు, ఉత్తమ రచయితలు, ఉత్తమ దర్శకులు, ఉత్తమ సంగీతకారుల మధ్య నేను నిలబడడం పరవశాన్ని కలిగించింది. ప్రత్యేకంగా ఛానళ్ల వాళ్ళు దాన్నొక ప్రత్యేక వార్తగా చెప్పడమే కాక ఇంటర్వ్యూలు చేశారు.

18. “పాటలంటే చానా ఇష్టమ” ని చెప్పుకునే మీ పాటల  ప్రస్థానం ఎట్లా కొనసాగింది?
జ :-     మా బాపు వల్ల నాకు పాటల మీద ఆసక్తి కలిగిందని ఇందాక చెప్పిన కదా! పాటలు రాయాలనే కోరికతో రాస్తూ వచ్చాను. నాలో గాయకుడు లేనందువల్ల అవి కాగితాల్లో, పుస్తకాల్లో ఉండిపోయాయి. నేను చదువుకునే రోజుల్లో నా క్లాస్ మేట్ ‘నకులుడు’ అని పాటలు పాడుతుండేవాడు. నేను రాసిన “ఇది నిశిరాత్రి మది నిశిరాత్రి, చిగురించే మొక్కలను చీకటిలో పాతిరి” అనే పాటను అతను పాడితే నన్ను అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మంజీరా రచయితల సంఘ’ సంస్థాగీతం రాశాను. మొదట బాలమల్లు అనే గాయకుడు పాడిండు. తర్వాత దేశపతి శ్రీనివాస్ పాడుతున్నాడు. తిరిగి నేను పాటలు రాయడానికి ప్రేరణ రసమయి బాలకిషన్. మద్యపాన వ్యతిరేకోద్యమ సమయంలో నన్ను పాటలు రాయమన్నాడు. ఏదైనా ట్యూన్ ఇస్తే రాస్తానన్నాను. ఆయన రెండు, మూడు ట్యూన్లు ఇచ్చాడు. నేను నాలుగు పాటలు రాసి ఇచ్చాను. శ్రీనివాస్, బాలకిషన్ పాడేవాళ్ళు. ఎక్కడ ఊరేగింపు జరిగినా, ప్రదర్శనలు జరిగినా ఈ పాటలతోనే మొదలయ్యేవి. “బీడీలు చేసేటి చెల్లెమ్మా, నీవు బీరాన నిద్దుర లేవమ్మా!”, తవ్వెడొడ్ల మూడుసోళ్ల కైకిలెందుకే పిల్లా కైకిలెందుకే” ఇట్లా తాగుడు వద్దని సందేశమిస్తూ రాసిన పాటలు, షేక్ బాబా అడిగితే రాసిన రెండు పాటలు, ‘నాగేటి చాల్లల్ల’ పాట తెలంగాణ వైభవాన్ని తెలిపేది. మరి తెలంగాణలో దుఃఖం కూడా ఉంది కదా! అని అనిపించి ” తెలంగాణ వట్టి త్యాగాల పట్టి” అనే పాట రాసిన. సినిమాల్లో మళ్లీ రెండవసారి అవకాశం ఇచ్చింది ఎన్. శంకర్. ‘జై బోలో తెలంగాణ’ సినిమాలో డ్యూయెట్ రాయమన్నాడు. “50 దాటిన వయసులో డ్యూయెట్ ఏం రాస్తాను?” అన్నాను (నవ్వుతూ). ఆయన బలవంతం మీద ” ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాల లూగేనా?” అంటూ రాసిన. అది యూత్ లోకి బాగా వెళ్ళింది. అందులో గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ నేను ముగ్గురం మూడు డ్యూయెట్లు రాసినం. ఉద్యమం గురించి గద్దర్ రాసిన “పొడుస్తున్న పొద్దు మీద” అనే పాట చాలా హిట్టయింది. రెండవది నా పాట హిట్టయింది. అందులో నేను విశేషంగా తెలంగాణ భాష, వ్యావహారిక పదాలు ఉపయోగించడం వల్ల దానికొక అందం వచ్చింది. ‘బందూక్’ అనే సినిమాలో కూడా ఒక పాట రాశాను. సునీల్ హీరోగా వచ్చిన ‘టు కంట్రీస్’ సినిమాలో లవ్ ఫెయిల్యూర్ మీద పాట రాయమని శంకర్ అడిగాడు. సినిమా హిట్టవలేదు. కానీ ఆ సినిమాలో ఈ పాటే బాగుందని అందరూ ప్రశంసించారు. ఇట్లానే ఎవరైనా అడిగితే రాస్తున్నాను.

19. ఒక విమర్శకులుగా మీ విమర్శనాత్మక దృక్పథాన్ని తెలపండి.
జ :-   నేను అకడమిక్ గా వచ్చినవాణ్ణి కావడం, పిహెచ్ డి. కూడా చేసి ఉండడం వల్ల విమర్శ ఇష్టంగా ఉండేది.
నేను సాహిత్య వ్యాసాలు కూడా రాశాను. విస్మరించబడిన రచయితల మీద, తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ మాండలికం పైన, తెలంగాణ భాష పైన రాసిన కవులు తొక్కుడు బండ కృష్ణమూర్తి, ‘తొక్కుడుబండ’ పుస్తకం రాసినందుకు ఆయనకాపేరు వచ్చింది. పంచరెడ్డి లక్ష్మణ్ అనే ఆయన ‘ఇసిత్రం’ రాశాడు. దేశరాజు మహారాజు ‘గుడిసె గుండె’ అని ఇవన్నీ అచ్చం తెలంగాణ మాండలిక భాషలోనే ఉంటాయి. ఒక ప్రయోగాత్మకంగా రాశారు వాళ్ళు. దాన్ని తెలుగు సాహిత్యం గుర్తించాల్సి ఉండె. గుర్తించలేదు కనుక వాటి మీద విమర్శ వ్యాసాలు రాశాను. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ నిర్మాణం జరగాలని తెలంగాణ భాష, సాహిత్యం మీద వ్యాసాలు రాశాను. ఇవన్నీ కలిపి ‘ఇగురం’ అనే పుస్తకం వేశాను. ఇతరత్రా వ్యాసాలు, కేతవరపు రామకోటి శాస్త్రి విమర్శ ప్రస్థానం మీద, ఆయన విమర్శలో పునర్మూల్యాంకనం ఎట్లా ఉంటుంది? అనే దాని మీద రాసినవి కలిపి విశాలాంధ్ర వాళ్ళు ‘ఆవర్తనం’ అనే పుస్తకం వేశారు.

20. నృత్య రూపకాలవైపు మీరు దృష్టి సారించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా?
జ :-    నిజానికి అది నేననుకున్నది కాదు. కానీ ఇందిరా పరాంకుశం అని కూచిపూడి నర్తకి ఒకసారి ఫోన్ చేసి నన్ను కలవాలనుకుంటున్నట్లు తెలిపింది. తెలంగాణ మీద తనకు ఒక నృత్య రూపకం కావాలని అది మీరే రాయగలరని టంకశాల అశోక్ చెప్పారని చెప్పింది. అంతవరకు నృత్యరూపకం రాసిన అనుభవం లేదు. కనీసం చూడను కూడా లేదు. ఆమె ఒక స్క్రిప్ట్ పరిశీలించుమని ఇచ్చింది. తెలంగాణ చరిత్ర మీద రాయడం కాబట్టి దాన్నొక ఛాలెంజ్ గా అనుకున్నాను. ఒక ఉత్సుకత కూడా కలిగింది. నా పద్ధతిలో నేను రాసి ఇచ్చాను. తరువాత తెలంగాణ చరిత్రకు సంబంధించి మరొకరు రాసిన నృత్యప్రదర్శన చూశాను. దానికంటే నేను రాసిందే బాగుందనిపించింది. దాంట్లో ఇటీవలి  చరిత్రనే రాశారు. నేను లోతుల్లోకి వెళ్లి పూర్వం నుండి ఉన్న చరిత్రను పరిశీలించి తెలుగు భాషకు ఉండే మూలాల్ని అంతా పరిశీలించి భాష, సాహిత్య, సాంసృతిక కోణంలో రాశాను. ఆ రూపకానికి డి.వి.ఎస్.శాస్త్రి సంగీతాన్ని రూపొందించాడు. ఇందిరా పరాంకుశం వాళ్లకు త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ అని వాళ్ళకొక నృత్యకళాసంస్థ ఉంది. మే లో ఆ సంస్థ వార్షికోత్సవ సందర్భంగా “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే పేరుతో నేను రాసిన రూపకాన్ని ప్రదర్శించారు. దాన్ని చూస్తున్నప్పుడు ఇది నేనే రాశానా? అనిపించింది. రవీంద్రభారతి వేదిక మీద ఏడెనిమిది మంది నృత్యకారులు నృత్యం చేస్తుంటే పులకించిపోయాను. ప్రారంభంలోనే ‘నమో తెలంగాణ మాత’ అనే వందన గీతం ఒకటి ఉంటుంది. అది పాడుతున్నప్పుడే చాలా ఆనందం కలిగింది.
          ఇందిరా పరాంకుశం గొప్ప నర్తకీమణి. అభినయాత్మకంగానే కాక అనుభూతి పరంగా నటించింది. నేను ఎంత ఆర్ద్రంగా రాశానో అంతటి భావాన్ని ఆమె ప్రదర్శించింది. అందులో ఒకచోట కులీకి, భాగమతికి మధ్య ఉన్న ప్రేమకు సంబంధించిన చిన్న బిట్ ఉంటుంది. అంత చిన్నదాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శించింది. ఆ ఒక్క బిట్ కోసం మరోసారి ప్రదర్శన చూశానని ఎవరో ఆమెకు చెప్పారట. సినిమాలాగా రోజూ ప్రదర్శించేది కాదు కదా. మళ్ళీ ఎక్కడో ప్రదర్శన జరిగినప్పుడు గుర్తుపెట్టుకొని వెళ్లి చూడడం గొప్ప విషయం. ఆ రూపకం నాకు బాగా పేరు తెచ్చింది. ఆ తర్వాత ఒకరిద్దరు రాయమని అడిగారు. మళ్ళీ ఒకసారి ఆమే దాశరథి మీద రాయమన్నది. అది కూడా బాగా సంతృప్తినిచ్చింది. అన్నదాత మీద రాయమని అడిగింది. రైతుల ఆత్మహత్యలు, కష్టాల నేపథ్యంలో రాసిన ఆ రూపకానికి కూడా బాగా గుర్తింపు వచ్చింది. అనేక సార్లు ప్రదర్శింపబడింది. CPM వాళ్ళ అనుబంధ సంస్థ ఒకటి ఉంది. వాళ్ళ ద్వారా కూడా ఇది ప్రదర్శింపబడింది. ఆమె డబ్బు కొరకు కాకుండా ప్రజల్లోకి వెళ్లడం కోసం ఒక చిన్న గ్రామంలో కూడా ప్రదర్శించింది. ఇప్పుడు నవంబర్ 28న ‘సుందరయ్య విజ్ఞాన కేంద్రం’ లో ప్రదర్శన ఉంది. నా కవిత్వ ప్రయాణంలో ఇది నాకు ఒక మేలి మలుపు. చాలా ఆనందాన్ని కలిగించిన విషయం.

21. మీ సంపాదకత్వంలో వెలువడిన మంజీర, సోయి, జంబి పత్రికల నిర్వహణను గురించి తెలపండి. సంపాదకులుగా మీ అనుభవాలను వివరించండి.
జ :-    ఈ మూడు పత్రికలు కూడా అవసరార్థం వచ్చినవే. మంజీరా రచయితల సంఘాన్ని మెదక్ స్టడీ సర్కిల్ ను నిర్వహిస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉండే కవుల, రచయితల రచనలను ప్రోత్సహించాలని, సంస్థ యొక్క కార్య కలాపాలను బయటకు చెప్పడానికి ‘మంజీర’ అనే పత్రికను ప్రారంభించాం. దాదాపు ఏడెనిమిది సంచికలు వేశాం. తెలంగాణ ఉద్యమం వచ్చిన తరువాత తెలంగాణ భావోద్వేగాలను, తెలంగాణ భావజాలాన్ని పరిచయం చేయడం కోసం ఒక పత్రిక అవసరమని భావించి ‘తెలంగాణ రచయితల వేదిక’ నుంచి ‘సోయి’ పత్రిక తీసుకొచ్చాం. ఆ ఉత్సాహం ఎంత బలంగా ఉండేదంటే డబ్బులకోసం కొంచెం వెనుకడుగు పడుతున్న సమయంలో జిగురు ఐలయ్యఅని గోదావరిఖనిలో ఒక కార్మికుడు పదివేల రూపాయలు ఇవ్వడం మరిచిపోలేనిది. అట్లా పది పన్నెండు సంచికలు తీసుకొచ్చినం. అదొక గొప్ప విషయం. ‘తెలంగాణ రచయితల సంఘం’ పెట్టే ముందు ఇంకొక పత్రిక పెట్టాలనుకున్నాం. అమెరికాలో సెటిలయిన ఇద్దరు మిత్రులు డబ్బులు పెట్టడానికి ముందుకొచ్చారు. దాంతో ‘జంబి’ అనే పత్రిక ప్రారంభం చేసినం. పనిభారమంతా నామీద పడడంతో మూడు సంచికలు వచ్చిన తర్వాత ఆపివేయాల్సి వచ్చింది. సంపాదకునిగా చేయడం ఇష్టమే కానీ చాలా శ్రమతో కూడుకున్నది. ‘సోయి’ రచనలకు ఒక బారికేడ్ పెట్టుకోలేదు కాబట్టి అన్ని సంచికలు తీసుకురాగలిగాం. ‘జంబి’ లో అట్లా వేయలేకపోయాం. నాకు వీలు పడకపోవడం కొంత, వయసురీత్యా కొంత, ప్రూఫుల దగ్గర నుండి నేనే చూడాల్సి రావడం వల్ల కుదరక ఆపేశాను. అకాడెమీ అధ్యక్షుడుగా నేను, కార్యదర్శిగా ఏనుగు నరసింహారెడ్డి ఉన్నప్పుడు ‘పునాస’ అనే త్రై మాసిక పత్రిక తెచ్చాం. ఒక విడి పత్రిక తేవాలని ఉన్నా వయసును దృష్టిలో పెట్టుకొని క్రియేటివ్ సైడ్ ఉంటేనే బాగుంటుందనిపించింది.

22. కవిగా, రచయితగా అర్థ శతాబ్దం పైగా రచనలు చేస్తున్న మీనుండి వెలువడిన రచనలేవి? అందులో మీకు అమిత సంతృప్తినిచ్చిందని చెప్పేదేదైనా ఉందా? జ :-   నేను నా కవిత్వాన్ని 8 సంపుటాలుగా, ఒక పాటల సంపుటి కలిపి 9 పుస్తకాలు వచ్చాయి. రెండు విమర్శ గ్రంథాలు, ఒక కథా సంపుటి, రెండు థీసిస్ లు తీసుకొచ్చాను. వీటిలో ‘భూమిస్వప్నం’ బాగా సంతృప్తి, గుర్తింపులనిచ్చింది. ఒక ఇరవై సంవత్సరాలు రాసిన కవిత్వమంతా వడబోసి దాన్ని తెచ్చాను. ఆ తర్వాత ఉత్సాహంతో రాసినటువంటి ‘ప్రాణహిత’ లో నాకు నచ్చిన చాలా కవితలుంటాయి. నాకు గుర్తున్నంత వరకు కాకతీయ యూనివర్సిటీలో అది టెక్స్ట్ బుక్ గా ఉంది. నేను విన్నంతవరకు వేంకటేశ్వర యూనివర్సిటీలో కొంతకాలం టెక్స్ట్ గా ఉంది. తెలంగాణ ఉద్యమం నా జీవితంలో భాగమైంది కాబట్టి తెలంగాణకు సంబంధించిన చాలా కవితలు ‘నది పుట్టువడి’ లో వచ్చాయి. రిటైర్మెంట్ తర్వాత వేసిన ‘ఇక్కడి చెట్ల గాలి’ కవిత్వ సంపుటిలో కూడా నాకు నచ్చిన చాలా కవితలున్నాయి. ఈ నాలుగు నాకు బాగా ఇష్టమైనవి.

23. తెలంగాణోద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత సాహిత్య పరంగా వచ్చిన పరిణామక్రమాన్ని వివరించండి.
జ :-    తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన సాహిత్యమంతా ఉద్యమ సాహిత్యం. రాష్ట్రం వచ్చిన తర్వాత పునర్నిర్మాణ, పునరుజ్జీవన, పునర్వికాస సాహిత్యం వచ్చింది. ఈ క్రమం జరగాల్సినంత వేగంగా జరుగలేదు. ఇంకా జరగాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, ఆనాడు అధికారంలోకి వచ్చిన ఉద్యమపార్టీ గానీ ఉద్యమస్ఫూర్తితో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో పూర్తి కృషి చేయలేదు. నేను ఈ విషయం గురించి ప్రస్తావించిన ప్రతీసారి నీళ్లు, నిధులు, నియామకాలు అయిపోయిన తర్వాత గానీ చేయము, చేయలేము అన్నారు. ఇది అప్పటిదాకా ఆగేది కాదు. సుదీర్ఘకాలం జరగాల్సిన పని. ఇది ఒక ప్రాజెక్టు నిర్మాణం కాదు. అంత శ్రమ కూడా అవసరం లేదు. కవులు, గాయకులు కోరుకుంటున్నది. అన్నిటితో పాటు ఒక పాయగా నడవాల్సింది. జరగలేదని నేననను. కొంత జరిగింది.
        ఒక తెలంగాణ ఉద్యమ ప్రేమికునిగా, తెలంగాణ సాంస్కృతిక ప్రేమికునిగా జరిగిన పరిణామాన్ని పాజిటివ్ గా, సానుకూలంగా గుర్తించే ప్రయత్నం చేసినప్పుడు ఒకటి భాషకు సంబంధించిన మార్పును చూశాను. సినిమా రంగంలో, సాంస్కృతిక రంగంలో, కళారంగంలో భాషకు ఒక గుర్తింపు వచ్చింది. రెండవది అప్పటికి లక్షరూపాయల పురస్కారాలు లేవు. కాళోజీ, దాశరథి పురస్కారాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో దాశరథిని ఒప్పుకున్నారు కానీ కాళోజీని ‘ఒక కవేనా?’ అన్నారు. కాదన్న వాళ్ళు కూడా నా చుట్టే ఉన్నారు. తెలంగాణ వచ్చాక కాళోజీకి గుర్తింపు వచ్చింది. దాశరథిని కూడా ఉద్యమకాలంలో ఆయన రాసిన పద్యాలను చూసి గుర్తించినా, ఎన్ టి రామారావు ఆయనను అవమానించి ఆస్థానకవి పదవినే రద్దు చేశాడు. ఒక ఉద్యమ కవి తినడానికి తిండి లేక, మందులు కొనడానికి డబ్బులు లేక అవస్థ పడ్డాడు. ఆస్థానకవిగా ఉండడం వల్ల ప్రభుత్వానికి అమ్ముడు పోయిండని కాకతీయ యూనివర్సిటీకి రానివ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు గొప్ప గుర్తింపు వచ్చింది. కవిత్వం ఆగిపోదనడానికి సాక్ష్యమిది. పోతన తర్వాత రాజ్యాధికారాన్ని ఎదుర్కొన్న అంత గొప్పకవి దాశరథి. రాష్ట్రం ఏర్పడ్డాక కాళోజీ, దాశరథి పేర్ల మీద లక్షరూపాయల పురస్కారాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రతి ఏటా ఇవి ఇవ్వడం జరుగుతున్నది. కాళోజీ పేరు మీద ఒక వైద్య విద్యాలయం, ఒక యూనివర్సిటీ పెట్టారు. సాంస్కృతిక కేంద్రం నిర్మాణం జరుగుతున్నది. గోల్కొండ ఖిలాలో స్వాతంత్ర్య దినోత్సవం జరగడం ఒక చరిత్ర. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంతోమంది పండితులు, విదుషీమణులు పురస్కారాలు అందుకుంటున్నారు.

24. మొదట ఛందో బద్ధమైన పద్య రచన చేసిన మీరు వచన కవిత్వం పట్ల అనురక్తులవడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం వచన కవిత్వం ఏ దశలో ఉందని మీరు భావిస్తున్నారు?
జ :-    ఛందోబద్ధంగా రాయాలని కూడా నేను కచ్చితంగా అనుకోలేదు. కాలక్రమంలో పద్యం రాస్తున్నప్పుడు వచన కవిత్వం కూడా ఉంటుందని తెలిసిందని ఇంతకు ముందు చెప్పిన కదా! శ్రీశ్రీ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత సాహిత్యంలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పును గుర్తించాల్సిన అవసరం ఉందని భావించారు. ఇవాళ ఒక ప్రధానమైన రూపాన్ని సంతరించుకొని వచన కవిత్వం నిలబడింది. దాంట్లో కూడా ప్రతిభావంతులైన కవులున్నారు. వేల పుస్తకాలు వచ్చాయి. వాటిని కూడా గౌరవ స్థానంలో నిలబెట్టి చరిత్ర రాసుకోవాల్సిన అవసరం ఉంది. 

25. నర్రా సిద్ధారెడ్డి అనే మీ పేరును ప్రత్యేకంగా నందిని సిధారెడ్డిగా మార్చుకోవడానికి కారణం ఏమిటి?

జ :- ప్రత్యేకంగా కారణం ఏమీ లేదమ్మా! నర్రా అనేది మా ఇంటి పేరు. మా పక్క ఊళ్ళో నర్రా సిద్ధారెడ్డి పేరుతో ఒకాయన ఉన్నాడు. మా ఊళ్ళో నర్రా సిద్ధారెడ్డిలే నలుగురున్నారు. నేను చదువుకునే రోజుల్లో మరో సిద్ధారెడ్డి ఉండేవాడు. నేను రాసిన కవితలు పత్రికలలో ప్రచురింపబడినప్పుడు ఆయన అనుకొని అందరూ అభినందిస్తుంటే ‘నేను కాదు’ అని కూడా చెప్పేవాడు కాదు. నాకప్పుడు మార్చుకోవాలనిపించింది. మా సీనియర్స్ లో ‘గులాబీల’ మల్లారెడ్డి ఇంటి పేరు వేరేది ఉంటే అది బాగాలేదని మార్చుకున్నాడు. ఆనందం అనే ఆయన తన ఇంటి పేరును ‘మల్లెల’ అని మార్చుకున్నాడు. నర్ర అంటే ఎద్దు అని అర్థం. నంది తిమ్మనను దృష్టిలో పెట్టుకొని నంది అంటే అర్థం ఒకటే అవుతుంది కదా అని నంది సిద్ధారెడ్డి అని మార్చుకున్న. నాలుగైదు కవితలు అదే పేరుతో అచ్చు కూడా అయ్యాయి. ఉమాపతి పద్మనాభ శర్మ అది సంపూర్ణంగా లేదని ‘నందిని’ అని మార్చారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైనప్పుడు ఎవరో వచ్చి ‘ఫిడేలు రాగాల డజను’ పట్టాభిని అభినందించారట. అప్పుడాయన నేను ఆ పట్టాభిని కాను. పఠాభిని అన్నాడట. అట్లా ఆయన పేరును మార్చుకున్నాడు. అట్లాగే చిన్న నీటి పారుదల శాఖామంత్రి శీలం సిద్ధారెడ్డి అని ఉండేవాడు. నన్ను కొంతమంది ఆయనగా అనుకునేవారు. అందుకే పఠాభిని ఆదర్శంగా తీసుకొని సిద్ధారెడ్డి అన్నదాన్ని కూడా సిధారెడ్డి అని మార్చుకున్నా.

26. ‘అనిమేష’ ను ఉపద్రవ గాథగా దీర్ఘకవితగా మలిచారు కదా! దాని గురించి వివరించండి.
జ :-    ‘అనిమేష’ రాయాలని ప్రత్యేకంగా అనుకోలేదు. కానీ ఒక కావ్యం రాయాలని ఉండింది. అది చాలాకాలం వాయిదా పడుతూ వచ్చింది. ఈలోపు కరోనా రావడం, చాలాకాలం ఖాళీగా ఉండడంతో కరోనా వైరస్ గురించి, అది సైంటిఫిక్ గా, కల్చరల్ గా తీసుకొచ్చిన మార్పులు, మనిషి ఎదుర్కున్న హెచ్చరికలు, పర్యావరణం వీటన్నిటి మధ్య ఒక కావ్యం రాయాలనిపించింది. మానవ సంబంధాలు క్రూరంగా హింసించబడ్డాయి. హృదయవిదారకమైన సంఘటనలు, వలస కార్మికులు వాహన సదుపాయాలు లేక వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లడం లాంటి వాతావరణం చూసిన తర్వాత రాశాను. అనిమేష అంటే రెప్పపాటు లేనిది ప్రకృతి. ప్రకృతికి మనం కోపం తెప్పించినం గనుక ఆ కోపాన్ని, వైపరీత్యాన్ని అనుభవించినం అన్న అర్థంలో అది రాయడం జరిగింది.

27. మీ ‘చిత్రకన్ను’ కథా సంపుటి పేరే వినూత్నంగా ఉంది. ఆ పేరుతో ఉన్న కథలో చిత్రించిన సన్నివేశం యథార్థంగా జరిగినదా? ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో రాసినదా?
జ :-    కథలు రాయడమనేది నాకు ముందు నుండి ఉన్న కోరిక. చాలా ఇష్టంతో కథలు రాసిన. విద్యార్థి దశలో మెస్ ఛార్జీలు కట్టలేని స్థితిలో కథల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించుకొని చదువుకున్న సందర్భాలున్నాయి. అట్లా కథలతో ఒక అనుబంధం ఉంది. ఊరు నుండి వచ్చిన వాణ్ణి కాబట్టి ఆ అనుభవంతో రాసిన. చాలాకాలం పుస్తకం వేయలేదు. నాకు కథలు రాయడం రాదని వాసిరెడ్డి నవీన్ అన్నాడు. మానవ సంబంధాల గురించి రాస్తున్నావు కానీ విప్లవ పోరాటం గురించి రాస్తలేవు అని అల్లం రాజయ్య అన్నాడు. మా ఊళ్ళో విప్లవ పోరాటం లేదు. అందుకే రాయలేదు. అంతకు ముందు రాసిన కథల్ని ‘చిత్రకన్ను’ పేరుతో పుస్తకం వేశాను. మా ఊళ్ళో జరిగిన వాస్తవ సంఘటన. ఒకామె చనిపోతే శవదహనానికి డబ్బులు ఇచ్చే విషయానికి సంబంధించిన సంఘటన. క్లైమాక్స్ మటుకు ఊహించి రాసింది.

28. ‘బందారం కథలు’ పేరుతో మూసీ పత్రికలో వస్తున్న మీ ఊరి కథలను త్వరలో పుస్తకరూపంలో వెలువరిస్తారని ఆశించవచ్చా?
జ :-     బందారం కథలు రాయాలని చాలా కాలంగా నా మనసులో మగ్గుతున్న కోరిక. విద్యార్థి దశలో తాళ్లూరు నాగేశ్వరరావు రచించిన ‘మాఊరి కథలు’ చదివాను. అప్పటినుండే బందారం కథలు రాయాలని అనుకున్నాను. కానీ ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. మూసీ పత్రిక నిర్వహణలో భాగం పంచుకుంటున్న అట్టెం దత్తయ్య నన్ను పత్రిక కోసం ఏదైనా రాయమన్నప్పుడు బందారం కథలు అనుకున్నాను. వేముగంటి రఘునందన్ నన్ను ‘మీవూరి కథలు రాయుమని’ ఎప్పుడూ అంటుండేవాడు. నేను రాయకపోయేసరికి శంకరమంచి సత్యం రాసిన అమరావతి కథలు, ఇంకో రెండు మూడు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు. తరచుగా అడుగుతూ ఉండేవాడు. వీటన్నిటి ప్రేరణతో బందారం కథలు 24 రాశాను. మూసీ పత్రికలో వచ్చాయి. అవన్నీ సంపుటిగా వేయబోతున్నా. త్వరలోనే వస్తుంది.

29. వర్తమాన తెలంగాణ సాహిత్యంలో ప్రత్యేకముద్ర వేసుకున్న మీరు ఇంకా ఏమైనా రచనలు చేస్తున్నారా?
జ :-     ప్రస్తుతానికి నేను ఖాళీ సమయం ఎక్కువగా ఉంటున్నది కాబట్టి పాటలు రాస్తున్నాను. యూట్యూబ్ వచ్చాక పాటలకు మంచి గుర్తింపు వస్తున్నది. నేను రాయాలనుకున్న ప్రాజెక్టులలో మా బాపు గురించి ఒక నవల రాసిన. అది అచ్చు వేయాల్సివుంది. ఆయన కథానాయకుడు. ఆయన జీవితంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రాసిన. అది కూడా త్వరలో అచ్చవుతుంది.

30. ఒక జాతి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడంలో కవుల పాత్ర ఏ విధంగా ఉండాలని మీరు భావిస్తారు? ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఆధునిక కవిత్వం ఆ స్థాయిలో ఉందని అనుకోవచ్చా?
జ :-     ఎప్పుడైనా ప్రాంతీయ అస్తిత్వం కీలకమని నేను భావిస్తాను. అది ఎంత కీలకమో జాతి అస్తిత్వం కూడా అంతే కీలకం. ఏదైనా ఒక అస్తిత్వం రూపొందాలంటే దానికి సాహిత్యం అవసరం. అందుకు రచయితల కృషి అవసరం. అస్తిత్వాన్ని గుర్తించి దాన్ని బయటి ప్రపంచానికి చెప్పి నిరూపించేది సాహిత్యకారులు.  ప్రాంతీయ అస్తిత్వం లేకుండా ఏ రచనా రాదు. అది అనివార్యం. స్థల, కాల, ప్రాంతీయ, లింగ, మత అస్తిత్వాలు ఏవైనా అవి ఉనికిలోకి రావాలంటే రచయితలే కీలకం. ఇక జాతి అస్తిత్వం అంటే ఒక జాతిలో దేశం, మతం, ప్రాంతం, భాష ఇట్లా వివిధ అంశాల ఆధారంగా వివిధ జాతులు ఉంటాయి. అనేక కోణాల్లో అస్తిత్వాలు ఉంటాయి. ఇవన్నీ బలంగా ఉండాలంటే రచయితలు కూడా బాగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగింది, ప్రస్తుతం జరుగుతున్నది. భవిష్యత్తులో జరగాలి. ఇది నిరంతర ప్రక్రియ.

31. కవిత్వం, కథ ఈ రెండింటిలో తక్కువకాలంలో ప్రజలను చైతన్యపరిచేది ఏది? ఇప్పటి సాహిత్యం ఆ దిశలోనే ప్రయాణిస్తోందంటారా?
జ :-    ఈ రెండింటిలో కథ ప్రజలను ఎక్కువగా చైతన్య పరుస్తుంది. వీటికంటే ముఖ్యంగా పాట ప్రజలకు
తొందరగా చేరువవుతుంది. పాట కంటే నాటకం, నాటకం తర్వాత నృత్య రూపకం. పాటలో కూడా గానం, సాహిత్యం రెండూ ఉంటాయి. ప్రదర్శన కూడా ఉంటుంది. కవిత్వం కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ కథ సూటిగా హృదయాన్ని చేరుతుంది.

32. ప్రస్తుత సామాజిక స్థితిగతులను అనుసరించి తరువాతి తరానికి మీ అనుభవపూర్వకమైన, మార్గదర్శక సూచనలు ఇవ్వండి.
జ :-   ఇప్పటివారిలో ముఖ్యంగా అధ్యయనం తగ్గిపోయింది. అధ్యయనం చేయాలన్నది నా ప్రధాన సూచన. ఎందుకు చదవాలన్నది కొంతమంది ప్రశ్న. చదవక పోవడం వల్ల భాష, పదాలు, సమాసాలు, వాక్య నిర్మాణాలు తెలియకుండా పోతున్నాయి. భావం కలుగుతున్నది. కానీ భావవ్యక్తీకరణకు సరిపోయినంత భాష వాళ్ళ దగ్గర లేదు. పదాలు తెలియనప్పుడు, వాటి అర్థం తెలియనప్పుడు, సరైన భాషా పదాలు లేనప్పుడు భావం వ్యర్థమవుతుంది. సరిగా వ్యక్తం కాదు. రెండవది ఎవరైనా సమకాలికంగా జీవించాలి. నీ చుట్టూ వున్న వస్తువుల నుండే వస్తువును తీసుకోవాలి. పుస్తకాలు చదవడం భాషను, నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. చుట్టూ వున్న మనుషుల జీవితాలను చదివితే వస్తువులు, వ్యక్తిత్వాలు, ఆదర్శాలు, విలువలు, ఘర్షణలు, బాధలు, కష్టాలు అన్నీ దొరుకుతాయి. అందుకే మానవ సంబంధాలు కలిగి ఉండాలి. మూడవది దాన్ని ప్రాథమికంగా చేసి కొంత త్యాగం కూడా చేయవలసి ఉంటుంది. ఏదీ వదులుకోకుండా, వెదుకకుండా నీ దగ్గరికి రాదు. దాని కోసం సమయం వెచ్చించాలి. శ్రద్ధ, ఏకాగ్రత లేకుండా, సమయం ఇవ్వకుండా నేను రాసిందే చెలామణి కావాలంటే కాదు. పోటీ ప్రపంచంలో నీకంటూ ఒక ముద్ర, నీ అస్తిత్వం, నీ శైలి, నీ వ్యక్తిత్వం అనివార్యంగా ఉన్నప్పుడే కవిత్వమైనా, కథైనా రాణిస్తుంది. అధ్యయనం, శ్రద్ధ, అంకితభావం, చిత్తశుద్ధి సమయం వెచ్చించడం చేస్తే తప్ప నిలబడలేరు అన్నది కొత్త తరానికి నా సూచన.

చాలా సంతోషం సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మీ జీవన ప్రయాణంలో వివిధ కోణాలను మాకు తెలియజేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేకానేక కృతజ్ఞతలు. నమస్కారాలు🙏🏼

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

రచనలు జీవిత విలువలను ప్రబోధించాలి-అమ్మంగి వేణుగోపాల్

by Aruna Dhulipala November 29, 2024
written by Aruna Dhulipala

తొలి కాళోజీ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు డా. అమ్మంగి వేణుగోపాల్ గారితో మయూఖ ముఖాముఖి-

                                          -అరుణ ధూళిపాళ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణా భాషా దినోత్సవం (2015) సందర్భంగా కాళోజీ నారాయణ రావు గారి తొలి పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ కవి, రచయిత డా. అమ్మంగి వేణుగోపాల్ గారి సాహితీ జీవనాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

సార్ నమస్కారం

1.సాహిత్య రంగంలో బహుముఖీన ప్రజ్ఞ కలిగిన మీరు ఎక్కడ జన్మించారు? మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచాయో తెలపండి.
జ :-   నమస్తే అండీ! మయూఖ పాఠకులందరికీ నా అభినందనలు. వికారాబాద్ జిల్లాలో మూసీనది జన్మస్థానమైన అనంతగిరి కొండలు తెలుసుకదా!  మూసీనది పుట్టిన చోటు నుంచి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో నున్న ఆలంపల్లి మావూరు. జనవరి 20, 1948 లో నేను జన్మించాను. 
భట్టుపంతులు అనే టీచర్ వద్ద కొంత, వికారాబాద్ స్కూల్లో కొంత రెండవతరగతి వరకే నేను అక్కడ చదువుకోగలిగాను. మా నాయన రెవెన్యూలో క్లర్క్ గా పనిచేసేవాడు. అప్పుడింకా నిజాం స్టేటే ఉండింది. వివిధ ప్రాంతాలకు బదిలీలు అవుతుండడం వల్ల నా చదువు కొంచెం వెనుకబడింది. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నారాయణ్ ఖేడ్ వెళ్లిపోయాం. అక్కడికి వెళ్లిన తర్వాత కేశవరావని హెడ్మాస్టర్ నాకొక టెస్ట్ పెట్టి నన్ను డైరెక్టుగా నాల్గవతరగతిలోకి తీసుకున్నారు. అప్పుడు మెట్రిక్యులేషన్ అంటే 11వ తరగతి. అప్పటివరకు నేనక్కడే ఉన్నాను. ఈ లోపు మా నాయనగారు రిటైర్ అయ్యారు. ఇక నేను పియుసి చదువుకోవడానికి నిజాం కాలేజీకి వచ్చాను. బి.ఏ. ఎమ్.ఏ. ఆర్ట్స్ కాలేజీలో చదివాను.

2.మీ ఉద్యోగ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది? ఎలా కొనసాగింది?
జ :-   1969 తెలంగాణ తొలి ఉద్యమం నడుస్తున్న రోజులు. డిసెంబర్ లో మా ఎమ్.ఏ. పరీక్షలు అయిపోయాయి. 1970 ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చాయి. ఉద్యోగం కోసం కాలేజీలో అప్లై చేసుకున్నాను. ధర్మావంత్ ఎయిడెడ్ కాలేజీలో, ఓరియంటల్ కాలేజీ కొడంగల్ లో, హుజూరాబాద్ గవర్నమెంట్ కాలేజీలో ఒకేసారి మూడు ఆర్డర్లు ఒకేరోజు తేడాతో వచ్చాయి. దివాకర్ల వేంకటావధాని గారు “మీది బీద కుటుంబమని నాకు తెలుసు. అందుకే హైదరాబాద్ ఆకర్షణలో పడకుండా దూరమైనా హుజూరాబాద్ వెళ్ళమని” సలహా ఇచ్చారు (నవ్వుతూ). పాటిబండ మాధవశర్మ గారు, నారాయణరెడ్డి గారు కూడా అదే సలహా ఇవ్వడంతో హుజూరాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరాను. అక్కడినుండి సదాశివపేట, ఆ తర్వాత భువనగిరి, తర్వాత ప్రమోషన్ వచ్చి డిగ్రీ కాలేజీ
లెక్చరర్ గా గద్వాల్ వెళ్ళాను. గద్వాల్ నుండి సంగారెడ్డి, ఆ తర్వాత జహీరాబాద్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేరి, అక్కడే రిటైర్ అయ్యాను.

3. సాహిత్య విషయకంగా మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన గురువులు ఎవరైనా ఉన్నారా?
జ :-    నారాయణ్ ఖేడ్ లో నేను చదువుతున్నప్పుడు నందగిరి అనంతరాజ శర్మగారని తెలుగు టీచరుగా వచ్చారు. వారిది వేములవాడ. ఆయన నాలుగేళ్లు మా స్కూల్లో ఉన్నారు. నాకు పద్యాలు రాయడం నేర్పింది ఆయనే. నాకు తెలుగులో మంచి మార్కులు వచ్చేవి. ఆయన విద్యార్థులకు తోకపద్యాలు, వ్యాసరచన, పద్యరచన వంటి పోటీలు పెట్టేవారు. దానివల్ల కొంత రాటు తేలడం జరిగింది. కాశీ కృష్ణాచార్యుల బాలబోధిని వంటి సంస్కృత వాచకాలను ఆయన మాచే చదివించేవారు. మాకు హిందీ పండిట్ రుక్మయ్యగారు. లైబ్రేరియన్ కూడా ఆయనే ఉండేవాడు. ఆయన నన్ను లైబ్రరీకి తీసుకెళ్లి ” ఏ పద్యోంకే చక్కర్ మే నై పఢ్ నా” అంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా prose చదువుమని, ప్రేమ్ చంద్ రాసిన ‘గోదాన్’ నవలను చదవడానికి ఇచ్చారు. మన చుట్టూ ఉన్న జీవితమే ఆ పుస్తకంలో ఉంది. కవిత్వం అంటే ఊహించి రాసేది కాదని down to earth ఉండాలని తెలిసి ఆశ్చర్యపోయాను. పుస్తకం చదివిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని ప్రశ్నలు కూడా రుక్మయ్యగారు నన్ను అడిగారు. రెండు నగరాల కథ, గోర్కీ-అమ్మ, టాల్ స్టాయ్ యుద్ధము-శాంతి వంటి అనువాద పుస్తకాలను, క్లాసిక్స్ గా ఉన్న తెలుగు పుస్తకాలను నా చేత చదివించారు. అట్లా నాకు సాహిత్యంలో ఒక కొత్త ప్రపంచం కనిపించింది. దానికి కారణం రుక్మయ్యగారు. తెలుగు సంప్రదాయాలు, తెలుగు పద్యం, సంస్కృత భాషల గొప్పదనాన్ని చెప్పినవారు అనంతరాజ శర్మ గారు. రెండు భిన్న కోణాలు నా మనసులో అప్పుడే ముద్ర వేసుకున్నాయి.
         మాకు దామోదర్ రావ్ అనే హెడ్మాస్టర్ ఉండేవారు. ఆయన సిటీ కాలేజీ స్టూడెంట్. పట్నం నుంచి వచ్చినవాడు కాబట్టి కొత్త కొత్త ఆలోచనలతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్న సాహసం ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేసేవారాయన. ఒక వంద కార్డులు, పక్కనే ఒక గల్లాపెట్టె. కార్డు ఒక పైసో, రెండు పైసలో ఉండేది. గల్లాలో డబ్బులు వేసి కార్డు తీసుకొని ఇంటికో, స్నేహితులకో విద్యార్థులను ఉత్తరం రాయమనేవాడు. ‘గోడపత్రిక’ ఒకటి ఏర్పాటు చేశారు. మీ సార్లకు చూయించనవసరం లేకుండా, ఎవరూ సెలెక్ట్ చేయకుండా మీకు తోచింది రాసి గోడకు అతికించుమనేవాడు. దానివల్ల పద్యమో, గద్యమో, కథో ఏదో ఒకటి రాసే అలవాటు పిల్లల్లో పెరిగేది. ప్రతీ శనివారం ఉపన్యాస పోటీలు కూడా పెట్టేవారు. నాలుగు శనివారాల్లో మూడు సార్లు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఈశ్వరప్ప అని ఇంకో మిత్రునికి అప్పుడప్పుడు వచ్చేది. అట్లా సాహిత్యబీజాలు అప్పుడే మొదలయ్యాయి. నారాయణ్ ఖేడ్ ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగా ఉన్నా మేమున్నప్పుడు ఇట్లాంటి టీచర్ల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. నాలాంటి ఆసక్తి గల విద్యార్థులను పదిమందిని గ్రూపుగా చేసి మా పాఠశాలకు సంసృతం ఐచ్చిక భాషగా ఉండే ఏర్పాటు చేయించారు అనంతరాజ శర్మగారు.

4. కవిత్వరంగంలో మీ ప్రవేశం ఎలా జరిగింది?
జ :-    మా సార్ అనంతరాజ శర్మగారు, దాశరథి గారు ఇద్దరూ స్నేహితులు. ఒకసారి క్లాసులో ఉన్నప్పుడు పోస్టులో కొన్ని పుస్తకాలు సార్ కు దాశరథి గారి నుండి వచ్చాయి.  దాంట్లో ‘మంజీర’ కవితను చదివారు. “ఏమన్నదే నిన్ను ఏమన్నదే నిన్ను, ఏడుపాయల దుర్గ ఏమన్నదే నిన్ను? స్వరమొక్క పాయగా చీలి పొమ్మన్నాది. సాగిపొమ్మన్నాది” అంటూ ప్రశ్న, జవాబులు లాగా సాగిన కవిత. ఏడు పాయలు ఏడు స్వరాలుగా చెప్పబడిన కవిత. ఆయన అది చదివి కవిత్వమంటే ఇట్లా ఉండాలిరా! అన్నాడు. నాకప్పుడు అర్థం కాలేదు. సార్ ని అడిగి తెలుసుకున్నాను. అట్లా దాశరథి గారి మీద అభిమానం ఏర్పడింది. నారాయణరెడ్డి గారు సభల్లో ఆయన రచనల్లోని ఏవైనా గేయాలు పాడేవారు. ఆ గొంతులో మాధుర్యం, రాజసం, ఇవన్నీ ఎంతో ఆనందాన్నిచ్చేవి. ఆయనకు ప్రత్యక్ష శిష్యుణ్ణి కూడా కావడం ఎంతో అదృష్టం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు అంధులతో పరిచయం ఏర్పడింది. అదెలాగంటే ఒకరోజు నేను నిజాం కాలేజీకి అవతలివైపు నిలబడ్డా. బాగా రష్ ఉంది. ముగ్గురు అంధులు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే నేను వాళ్ళను నాతో పాటు రోడ్డు దాటించాను. “ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడి వరకు తోడుంటాను” అని చెప్పాను. అప్పుడు వాళ్ళు తాము నిజాం కాలేజీ స్టూడెంట్స్ మని, రెగ్యులర్ గా రావడానికి హాస్టల్ లో సీటు దొరికిందని చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది. అట్లా ఏర్పడిన పరిచయంతో అప్పుడప్పుడు వాళ్లకు పాఠం చదివేవాణ్ణి. ఒకసారి వాళ్ళ కోరిక మేరకు చాదర్ ఘాట్ కమలా టాకీసులో మల్లీశ్వరి సినిమాకు తీసుకువెళ్ళాను. సినిమా అయిపోయిన తర్వాత “అందులో మీరేం చూసిన్రు?” అని అడిగాను. “కనపడక పోయినా ఆ డైలాగులను బట్టి మేము అర్థం చేసుకుంటాం” అన్నారు. ఎంత గొప్ప విషయం అనిపించింది. వాళ్లకు నేను కళ్ళద్దాలు ఇప్పించాను. ఇట్లా దగ్గరగా వాళ్ల అలవాట్లను, ప్రవర్తనను గమనించాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘చీకటిలో బతుకు నీడ’ అని కవిత రాశాను. అది సృజన పత్రికలో వచ్చింది. దానికి రాష్ట్రస్థాయి మొదటి బహుమతి వచ్చింది. అట్లా కవిత్వ రంగంలో ప్రవేశించాను.

5.  ఆ కవితకు రాష్ట్రస్థాయి బహుమతినందుకున్న విశేషాలను చెప్పండి.
జ :-   నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ‘సృజన’ పత్రిక వస్తుండేది. ఎడిటింగ్ వ్యవహారాలన్నీ వరవరరావు చూస్తున్నాడు. దాంట్లో రాష్ట్రస్థాయి కవితా పోటీలకు సంబంధించి ఒక ప్రకటన వచ్చింది. ఉస్మానియా, వేంకటేశ్వర, ఆంధ్ర మూడు యూనివర్సిటీలలో ఎవరైనా ఈ పోటీలో పాల్గొనొచ్చు అని. ఆ పోటీ కోసం నేను ‘చీకటిలో బతుకు నీడ’ అనే కవితను రాశాను. చెన్నకేశవరెడ్డి అని నా క్లాస్ మేట్. ఆయనకు చూపిస్తే “నీ శీర్షికకే ప్రైజ్ వస్తుంది” అన్నాడు (నవ్వుతూ). రెండు నెలల తర్వాత వరవరరావు నుండి “నీ చీకట్లో బతుకు నీడ కవితకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింద”ని ఉత్తరం వచ్చింది. అంతమందిలో నాకు రావడం గొప్ప అనుభూతి.

6. హేతువాదిగా, మనోవైజ్ఞానిక సాహితీవేత్తగా పేరుగాంచిన గోపీచంద్ నవలలను ఆ దృక్కోణంలోనే సిద్ధాంత గ్రంథంగా వెలువరించారా? మరో కోణం ఏమైనా ఉందా?
జ :-   గోపీచంద్ జీవితం నాస్తికునిగా ప్రారంభమైంది. మానవేంద్ర నాథ్ రాయ్ అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవాడు. ఆయనకు కమ్యూనిజం మీద నమ్మకం సడలిన తర్వాత ‘రాడికల్ డెమొక్రాటిక్’ పేరుతో ఒక రాజకీయ పార్టీ స్థాపించాడు. ఆ పార్టీలో గోపీచంద్ కూడా చేరి, ఆంధ్ర ప్రాంతానికి సెక్రటరీగా పనిచేశాడు. నాస్తిక వాదం, హేతువాదం, రాయిజమ్ మీద కూడా ఆయనకు నమ్మకం సడలిపోయి ఆస్తికుడయ్యాడు. అరబిందోకు శిష్యుడై ఆయనను దర్శించుకున్నాడు. ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’ లో మనకు అది కనిపిస్తుంది. ‘హేతువాది’గా ఆయన అభిప్రాయం సడలుతున్న సమయంలో ‘అసమర్థుని జీవయాత్ర’ రాశాడు. రాయ్ ప్రభావంతో రాసింది ‘పరివర్తనం’ అది మొదటి నవల. ముందు ఆయన కర్నూలులో ఉద్యోగం చేసి ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి , ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంటులో జాయింట్ డైరెక్టర్ గా చేశాడు. అది ప్రభుత్వోద్యోగం కాదు. రాజకీయ పలుకుబడి ద్వారా వచ్చింది. దాని కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఆకాశవాణిలో ప్రయోక్తగా చేరాడు.
         ఆయనకు వ్యవసాయంతో సంబంధం  ఉంది కనుక గ్రామాలకు వెళ్లి ఆ విధానాలను తెలుసుకుంటుండేవాడు. అదే సమయంలో ‘జపాన్ వరిసాగు’ అనే ఒక పద్ధతి వచ్చింది. అంతకుముందు నార్లు వేయడం ఇష్టం వచ్చినట్టు ఉండేది. ఈ పద్ధతి వచ్చిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో వేసే విధానాన్ని రైతులు అలవరచుకున్నారు. ఈ పద్ధతిని ప్రచారం చేసిన వాళ్లలో గోపీచంద్ కూడా ఒకడు.  అరబిందో విశ్వాసాల పట్ల కూడా ఆయనకు నమ్మకం సడలి సాయిబాబా వైపు వచ్చాడు. నిలకడ ఉన్న మనిషి కాదు. ఆర్. ఎస్. సుదర్శనం అనే విమర్శకుడు “గోపిచంద్ రచనలు లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఉంటాయి. ఒక ‘అసమర్థుని జీవయాత్ర’ లో మాత్రం స్థిరత్వం కనిపిస్తుంది” అన్నారు. అది గోపిచంద్  మాస్టర్ పీస్. అనేకమైన కథలను రాశాడు. కథా సాహిత్యాన్ని బాగా ప్రచారం చేసిన వారు ఇద్దరు. ఒకరు కొడవటిగంటి కుటుంబరావు, మరొకరు గోపీచంద్. పుంఖానుపుంఖాలుగా కథలు రాశారు. గోపీచంద్ మీద పరిశోధన చేసి గమనించింది ఏంటంటే ఆయన హేతువాదం, ఆస్తికవాదం, నాస్తికవాదం ఇట్లా అన్ని వాదాలను గౌరవించాడు. వేటినీ వ్యతిరేకించకుండా వాటిలోని మంచిని తీసుకున్నాడు. అందుకని ఆయనను ఒక సమన్వయ వాదిగా గ్రహించాను. కుటుంబరావు, శ్రీశ్రీ ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. కానీ ఈయన అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వచ్చాడు.

7. మొదట పద్యకవిత్వం రాసిన మీ దృష్టి వచన కవిత్వంపై మళ్ళడానికి కారణం ఏమిటి?
జ :-    మొదట నేను పద్యాలు రాసేవాణ్ణి అని చెప్పాను కదా! లాల్ బహదూర్ శాస్త్రి మరణించేంతవరకు రాసిన. ఆయన మరణం నన్ను కలచి వేసి పది పద్యాలు రాశాను. మా ప్రిన్సిపాల్ ఆర్వేంద్ర శర్మ గారని జర్మనీలో చదువుకొని, ఉద్యోగం చేసి  వచ్చినవాడు. ఆయన శాస్త్రి గారి సంతాపసభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆ పద్యాలను పాడిన. ప్రిన్సిపాల్ తెల్లవారి నన్ను పిలిచి “బహుత్ అచ్ఛా లిఖే, ఔర్ గాయే భీ” అని మెచ్చుకున్నారు. నా మిత్రుడు చెన్నకేశవరెడ్డి నీ పద్యాలకు మోగినన్ని చప్పట్లు ఎవ్వరికీ మోగలేదు అన్నాడు. ఒక పెద్దాయన చనిపోతే రాసిన పద్యాలకు ప్రశంసలు పొందడం బాధగా అనిపించింది. చెన్నకేశవరెడ్డి “పద్యాలకు కాలం చెల్లిపోయింది” అని ఒక మాట అన్నాడు. ఇతను నాకు రెండవ గురువు.
         ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో రాసిన ‘les miserables’ నవలను చదివాను. నేరం చేసినవాడు ఏ పరిస్థితుల్లో చేశాడో తెలుసుకుంటే అది నేరమా కాదా? తెలుస్తుందని రచయిత ఒక కొత్త, ప్రధాన అంశాన్ని తెలుపుతూ రాసిన నవల. చెల్లెలి కూతురు ప్రాణాలు కాపాడడానికి రొట్టె ముక్కను దొంగతనం చేసి శిక్షార్హుడైన వాడి కథ. ప్రపంచ నవలల్లో గొప్పగా చెప్పబడే మొట్టమొదటి నవల. ఇటువంటి గొప్ప నవలలను చదవడం వల్ల నాకు ప్రపంచం అర్థమైనట్టు అనిపిస్తుంది. శ్రీశ్రీ రచనలు చదివాను. ‘అమృతం కురిసిన రాత్రి’ రాకముందు హారతి పత్రికలో వచ్చిన తిలక్ కవితల పేపర్ కటింగ్ లను చెన్నకేశవరెడ్డి చదవమని తెచ్చిచ్చేవాడు. దాశరథి వచన కవిత్వం, కుందుర్తి రచనలు చదివాను. అవి నన్ను కొత్తలోకాలకు తీసుకుపోయేవి. సీతా కల్యాణి గారని లెక్చరర్ ఉండేవారు. ఆమె మాకు సారస్వత పరిషత్తును చూపించి సాయంత్రం ఆరుగంటలు దాటిన తర్వాత మన కవులందరూ ఇక్కడికి వస్తుంటారు వెళ్ళమని చెప్పారు. అక్కడే విశ్వనాథ మొదలగు కవులందరినీ చూశాను. YMCA లో ఒక హాలుండేది. భద్రిరాజు కృష్ణమూర్తి, బుచ్చిబాబు, మొక్కపాటి నరసింహశాస్త్రి మొదలైన వాళ్ళు ఉపన్యాసాలిచ్చేవారు. ఒకసారి భద్రిరాజు కృష్ణమూర్తి మాట్లాడుతూ చిన్నపిల్లలు వాళ్ళ చిన్న బుర్రలలోకి స్పష్టత చేకూర్చుకునే క్రమంలో మాటలకు కొన్ని కొత్త అర్థాలను సృష్టిస్తారని, ఏ డిక్షనరీలో అవి ఉండవని, భాషా సృష్టిలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని చెప్పిన విషయం నన్ను ఆలోచింపజేసింది. బుచ్చిబాబు చాలా సంస్కారవంతంగా మాట్లాడేవాడు. ఈ విధంగా సాహితీ మూర్తులను ప్రత్యక్షంగా కలుసుకోవడం, కవుల రచనలను చదవడం నా వచనకవిత్వానికి ప్రేరణనిచ్చాయి.

డా. అమ్మంగివేణుగారితో ముఖాముఖి గ్రహీత అరుణ ధూళిపాళ

8. మీ ‘సాహిత్య సందర్భం – సమకాలీన వ్యాస సంపుటిలో వెలువరించిన అంశాలేవి?
జ :-   నావి మూడు వ్యాస సంపుటాలున్నాయి. ‘అవినాభావం’ మొదటిది. అప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరి రామ్మోహన్ రావు. ఒకసారి గురజాడ ‘సంస్కర్త హృదయం’ కథానికను గురజాడ రాసిన తీరును విమర్శిస్తూ ఒక వ్యాసం రాసి పంపించాను. వెంటనే ప్రచురించారు. అంతేకాదు. “మీ వ్యాసం కొత్త ఆలోచనలతో ఉన్నది. ఇంకా ఏదైనా రాస్తే పంపించండి” అని కార్డు రాశాడు. ఏడెనిమిది వ్యాసాలు రాశాను. అట్లా ఈ వ్యాసాలన్నీ 1999లో ‘అవినాభావం’ అనే పేరుతో వేశాను. ‘సూర్య’ అనే పత్రికలో నెక్స్ట్ టు ఎడిటర్ గా ఉన్న నిజం అనే ఆయనతో నాకు పరిచయం ఉండేది. ఆయన తెలుగు పత్రికలకు, రచనలకు సంబంధించిన వ్యాసాలు రాయమని అడిగాడు. ప్రతి సోమవారం ‘దస్తూరి’ అనే కాలమ్ వచ్చేది. దానికి రాసేవాణ్ణి. అందులో నచ్చినవన్నీ తీసుకొని ‘సాహిత్య సందర్భం – సమకాలీన స్పందన’ అనే పేరుతో వేశాను. వరవరరావు దాన్ని ఆవిష్కరించారు. కవులు వ్యాసాలు రాస్తే కవిత్వం ఉంటుందనే విమర్శ ఉంది. దీన్ని బాగా ప్రచారం చేసినవాడు చేకూరి రామారావు. కవిత్వంలో మాత్రమే కవితాత్మకత ఉండాలి కానీ వచనంలో కవిత్వ వాసన ఉండకూడదని ఆయన ఉద్దేశం. వచనాన్ని పోయెటిక్ గా రాస్తే ప్రభావశీలంగా ఉంటుందని నా వాదన. దాన్ని రూఢి చేస్తూ ఆ వ్యాసాలు రాశాను. మొదటి వ్యాసం కాళోజీ పైనే ఉంటుంది. ఈ వ్యాసాలలో పోయెటిక్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుందని ఎంతో మంది మెచ్చుకున్నారు. బుచ్చిబాబు, చలం నవలల్లో కూడా వారి హృదయగతమైన కవితాత్మ కనిపిస్తుంది.

9. మీరు చేసిన అనువాదాల గురించి చెప్పండి.
జ :-    నేను అనువాదాలు ఎక్కువగా చేయలేదు. పరబ్రహ్మ శాస్త్రి గారి “Telugu script : Origin and Evolution” పుస్తకాన్ని అనువాదం చేయమని ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీకి డైరెక్టర్ గా ఉన్న జయధీర్ తిరుమలరావు గారు కోరారు. అప్పటికే నేను రిటైర్ అయ్యాను. దాన్ని ‘తెలుగు లిపి – పరిణామం’ అనే పేరుతో అనువదించాను. అది నా మొదటి అనువాద పుస్తకం. ఇదే కాక ఇంకా 35 ఇతర పుస్తకాలను ఎడిట్ చేస్తే అవి కూడా వాళ్ళు వేశారు. అంతకుముందు ఇటువంటి కృషి ఎవరూ చేయలేదు. ఇంకో ఇద్దరు కూడా 4, 5 పుస్తకాలు చేశారు. అట్లా కేవలం రెండున్నర సంవత్సరాల వ్యవధిలో దాదాపు 45 పుస్తకాలు వాళ్ళు వేయడం గొప్ప విషయం. రెండవది మఖ్దూం మొహియొద్దీన్ మీద ఇంగ్లీషులో ఉన్న పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశాను. కేంద్రసాహిత్య అకాడెమీ వాళ్ళు వేశారు. గవర్నమెంట్ సిటీ కాలేజీ వాళ్ళు మఖ్దుం మొహియొద్దీన్ గురించి కృషి చేసిన వాళ్లకు ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. ఆయన గురించి కృషి చేయకపోయినా ఆయన భావజాలాన్ని సమర్థిస్తూ కృషి చేసిన వాళ్లకైనా ఇస్తూ వచ్చారు. నేను ఆ పుస్తకాన్ని రాసిన తరువాత సిటీ కాలేజీలో విప్లవ్ శుక్లా దాన్ని చూసి ప్రిన్సిపాల్ కు తెలియజేశారు. ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీకు అవార్డు ఇస్తున్నామని తెలిపారు. ఇక్కడొక విషయం చెప్పాలి. మఖ్దూం మొహియొద్దీన్ అందోల్ కు చెందినవాడు. మా అమ్మమ్మ పుట్టి పెరిగిన ఊరు. మేము ఎండాకాలం సెలవులకు వెళ్ళినప్పుడు ఈత కొట్టడానికి చెరువుకు వెళ్ళేవాళ్ళం. పిల్లలమనే భయంతో మా అమ్మమ్మ మాతో పాటు వచ్చేది. ఒకసారి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆంజనేయస్వామి గుడి చూపించి ” ఇండ్ల ఒక తుర్కకవి తెలుగు నేర్చుకున్నడటరా” అని చెప్పింది. ఆమెకు ఆ కవి పేరు తెలియదు. తుర్కకవి హనుమంతుని గుడికి రావడమే విశేషం. తెలుగు నేర్చుకోవడం మరీ విశేషం. ఆ కాలంలో అతణ్ణి గుడి లోపలికి రానివ్వడం పూజారి గొప్పతనం. ఈ పుస్తకాన్ని అనువాదం చేస్తున్నప్పుడు ఈ విషయం అందులో ఉంది. దాంతో నేను అతడు చిన్నప్పటి నుండీ తెలిసిన వాడిగా అనుభూతి చెందాను.
         ఆకాశవాణి కేంద్రం వాళ్ళు ప్రతీ సంవత్సరం జనవరి 25 నాడు జాతీయ కవి సమ్మేళనం చేస్తారు. దాదాపు 30 కవితలు భారతీయ భాషలకు చెందినవై ఉంటాయి. దాదాపు 30 సంవత్సరాలు వరుసగా నన్ను పిలిచారు. వాటిని నేను తెలుగులోకి అనువాదం చేసి చదివేవాణ్ణి. ఇంకొకటి అప్పటి గవర్నర్ ఎన్.డి.తివారీ స్నేహితుడు జహీరుద్దీన్ బాబర్ ఉర్దూ కవిత్వాన్ని రాసి, పుస్తకంగా వేయించుమని ఆయనను అడిగాడు. గవర్నర్ దాన్ని తెలుగు అకాడెమీకి పంపించారు. అకాడెమీ డైరెక్టర్ నన్ను పిలిచి అనువాదం చేయమన్నారు. చేసి పంపితే పుస్తకం వేసి కాపీ ఒకటి పంపారు కానీ అది దొరకడం లేదు.

10. మీ సంపాదకత్వంలో వెలువడిన ప్రముఖ రచనలను తెలుపుతూ అరుదైన కవితా సంకలనంగా చెప్పబడే “మజహర్ మెహదీ – మరో ప్రపంచం” అనువాద కవితా సంకలన ప్రత్యేకతను తెలపండి.
జ :-   నా సంపాదకత్వంలో వ్యాసమంజీర, మరో కొత్త వంతెన (ఏక్ ఔర్ నయా పూల్), మజహర్ మెహదీ మరో ప్రపంచం, తెలంగాణ వైతాళికుడు – సురవరం ప్రతాపరెడ్డి, ప్రజల పక్షాన ప్రతిజ్ఞ, అద్దంలో విద్యార్థి  వచ్చాయి. అందులో మజహర్ మెహదీ – మరో ప్రపంచం ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. మజహర్ మెహదీ ఒక లౌకిక వాది అయినటువంటి ముస్లిం కవి. అయినా ఆ లక్షణాలు ఆయనలో కనిపించేవి కావు. మేము ఏక్ ఔర్ నయా పూల్  ఉర్దూ – తెలుగు కవితా సంపుటి వేసినం. ఒక పేజీ ఉర్దూ, అదే కవిత మరో పేజీ తెలుగు అనువాదంలో ఉంటుంది. ఈ విషయంలో ఆయన నాకు బాగా సహకారం అందజేసిండు. ఆయనతో నాకు స్నేహం ఏర్పడింది. అప్పటినుండి సభా కార్యక్రమాలు కలిసి చేసినం. కొంతకాలానికే ఆయన క్యాన్సర్ తో చనిపోయాడు. చాలా బాధకు గురయ్యాము. ఆయన రాసిన కవిత్వం మూడు నాలుగు సంపుటాలు ఉన్నాయి. అందులో 32 కవితలను ఎంపిక చేసి నేను, వెంకటేశ్వర్లు, వేణు సంకోజు, నోముల సత్యనారాయణ, దేవరాజు మహారాజు అందరం కలిసి వాటిని తెలుగులోకి అనువదించి ఒక దిక్కు తెలుగు మరో దిక్కు ఉర్దూ ఉండేలా చేశాము. నాకు ఉర్దూ లిపి రాదు కానీ భాష తెలుసు. అందువల్ల లిప్యంతరీకరణ చేసి ఉర్దూను తెలుగులో రాసిన. ఇట్లా ఎవరూ చేయలేదు. ఈ ప్రాజెక్టుకు నాతో పాటు ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసిన అలీ అస్గర్ గారు అందించిన సహకారం మరువలేనిది.

11. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కారాన్ని మొట్టమొదటగా మీరు అందుకోవడం వల్ల కలిగిన అనుభూతి ఎటువంటిది?
జ :-  2015 వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ నా జీవితంలో ఒక మరపురాని రోజు. కాళోజీ నారాయణ రావు గారి పేరిట తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అవార్డు మొట్టమొదటి సారిగా నన్ను వరించింది. అది నాకు ఆశ్చర్యం. ఆనందం. దాన్ని నేను జీవన సాఫల్య పురస్కారంగా భావిస్తాను. కాళోజీ గారితో అంతకు ముందే నాకు పరిచయం ఉంది. వరంగల్ కు 30, 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజూరాబాద్ లో పని చేసినప్పుడు ఆదివారాలు ఖాళీగా ఉండడం వల్ల వెళ్ళేవాణ్ణి. నవీన్, పెద కాళోజీ, చిన కాళోజీ ఇంకా కొంతమంది సాహితీ మిత్రులు కలిసేవారు. 1970 నుండే ఈ పరిచయాలు ఉన్నాయి. కాళోజీ గారి గురించి నేను 1978-79 ప్రాంతంలో ఒక కవిత రాసిన. మామూలుగా ఆయన ఎవరికీ ఉత్తరాలు రాయరు, చెప్పిస్తారు. అటువంటిది విద్యార్థి అనే మిత్రునితో కవిత బాగుందని ప్రశంసిస్తూ ఉత్తరం రాయించడం విశేషం. అంతకుముందే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో ఒక సమావేశంలో సభాధ్యక్షుడుగా నారాయణరెడ్డి గారు ఉన్నారు. సభ అయిపోయి నేను వస్తుంటే వెనకనుండి నారాయణ రెడ్డి గారు ‘వేణుగోపాల్!’ అని పిలిచి, “కాళోజీ మీద అద్భుతంగా రాశావయ్యా” అని మెచ్చుకున్నారు. ఆవిధంగా ఆ అవార్డు నా బాధ్యతను పెంచింది. నాకు పేరు ప్రఖ్యాతులను అందించింది. నాకు సారస్వత పరిషత్తు వాళ్ళు సి. నారాయణరెడ్డి పురస్కారం ఇచ్చారు. మరో సంస్థ ఆకృతి పురస్కారం ఇచ్చింది. అట్లా నా సాహిత్య ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు వచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కాళోజీ పురస్కారాన్ని మాత్రం ఎంతో విశిష్టంగా భావిస్తాను.

12. మీ రచనల్లో కాళోజీ గారి ప్రభావం ఉందని అనుకోవచ్చా?

జ :-     ఆయన కవిత్వ ప్రభావం లేదు కానీ ఆయన ఐడియాలజీ ప్రభావం ఉంది. ముఖ్యంగా తెలంగాణ వాదం. ఏ పరిస్థితుల్లోనూ ఆయన దాన్ని వదులుకోలేదు. ఏనాడూ దూరం జరగలేదు. అది ఆయన గొప్పతనం. ఆయన ఆరోజుల్లో ఇందిరాగాంధిని, కాసు బ్రహ్మానందరెడ్డినీ ఎదిరించాడు. వీళ్ళిద్దరినీ విమర్శిస్తూ రాసినవి, ఉద్యమం గురించి రాసినవే 100 కవితల దాకా ఉంటాయి. తండ్రి మహారాష్ట్ర, తల్లి కన్నడ, తాను తెలంగాణలో పుట్టినవాడు కూడా కాదు. అయినా ఈ భూమి మీద పెరిగినందుకు ప్రాణం పోయినా పరవాలేదన్న తెగింపుతో ఉద్యమం చేయడం గొప్ప సాహసం. అందరినీ అది ప్రభావితం చేసింది. ఉద్యమధార తెగకుండా చూసినవారిలో కాళోజీ ఒకరైతే మరొకరు జయశంకర్ గారు. ఉద్యమం మొదటి నుండీ 2014 వరకు మీదికి కనిపించకపోయినా అంతర్గతంగా అందరి హృదయాల్లో రగిలిందంటే కారణం ఆయనే. ఆయనలాగా ప్రజాకవిత్వం రాసిన వారెవరూ లేరు. సరళమైన పదాలతో గంభీరమైన అర్థాన్నిచ్చే కవిత్వం రాశారాయన. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి మిత్రమండలి సమావేశం జరుగుతున్నది. రిక్షాలో బియ్యం సంచి వచ్చింది. రిక్షా అతను దాన్ని మోయలేక పోతుంటే ఒక కవి లేచి సహాయానికి వెళ్లబోతుంటే రిక్షా అతను “మీతో కాదు ఒక పనిమనిషి కావాలి” అన్నాడు. అప్పుడు కాళోజీ “చూశారా? పని చేసే వాణ్ణే ‘మనిషి’  అంటున్నాడతను అన్నారు. ఎంత లోతైన ఆలోచన కలిగే మాటలో చూడండి. చాలా చమత్కారంగా మాట్లాడేవాడు. కానీ మాటల్లో లోతు ఎక్కువ. అందుకే ఆయన విశిష్ట వ్యక్తిత్వం నన్ను ప్రభావితం చేసింది.

13. కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా సభ్యులుగా మీ అనుభవాలను తెలపండి.
జ :- 2012 నుండి 2017 వరకు అయిదు సంవత్సరాలు నేను కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా సంఘ సభ్యునిగా ఉన్నాను. అప్పుడు గోపీ గారు కన్వీనర్ గా ఉన్నారు. నేను బయటి ప్రాంతాలకు వెళ్ళలేదు కానీ హైదరాబాద్ లోనే ఎన్నో సభలు నిర్వహించాను. అది ఎంతో తృప్తి. ‘మఖ్దూం మొహియొద్దీన్’ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడెమీ వేయించిందే. పల్లా దుర్గయ్య గారి శత జయంతిని నిర్వహించిన. అప్పుడొచ్చిన వ్యాసాలన్నీ రెండు, మూడు నెలల్లో పుస్తకంగా రాబోతుంది. వట్టికోట ఆళ్వార్ స్వామి శతజయంతిని నిర్వహించాను. దాని ప్రత్యేక సంచికకు సంపాదక బాధ్యతలు కూడా నేనే చేపట్టాను. త్రిపురనేని గోపీచంద్ మీద రాయమంటే రాసిచ్చాను. అది కూడా ఈ మధ్యనే వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రపంచంలోనే పెద్ద పబ్లికేషన్ సంస్థ. వీళ్ళు ప్రచురణ చేసినన్ని పుస్తకాలు ఏ సంస్థా వేయలేదు. 22 భాషల్లో పుస్తకాలు వేయడమే కాక, వాటిలో మంచి వాటికి అనువాదాలు చేయిస్తున్నది. అనువాదకుల కొరత ఉన్నది కానీ అనువాదాలు బాగానే చేయిస్తున్నారు.  ఈమధ్యనే  మహాకవి గాలిబ్ జీవిత సాహిత్యాల మీద ఇంగ్లీషులో ఉన్న గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన ఎలనాగ గారికి సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం లభించింది.

14. ఇతర భాషల్లోకి అనువదించబడిన మీ రచనలను గురించి తెలపండి.
జ :-  డా. ఎం. రంగయ్య గారు ఆయనకు నచ్చిన నా కవితలన్నీ హిందీలోకి అనువాదం చేశారు. నా ‘చీకటిలో బతుకునీడ’ అనే కవితా శీర్షికనే ఆ పుస్తకానికి “అంధేరే మే జీవన్ ఛాయా” అనే టైటిల్ గా పెట్టుకున్నారు. నారాయణ రావు అనే మిత్రుడు నాకు అవార్డు వచ్చిన ‘భరోసా’ పుస్తకాన్ని హిందీలోకి భరోసా పేరుతోనే అనువాదం చేశాడు. ఎలనాగ గారు దాదాపు 50 కవితలను “Faded leaves and Fire flies” అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. కొన్ని కవితలు కన్నడంలోకి అనువాదం అయ్యాయి. 1993లోనే ఆకాశవాణి జాతీయ కవిసమ్మేళనంలో పాల్గొని వినిపించిన ‘చెట్టు ఆత్మఘోష’ కవిత 20 భాషల్లో అనువదించబడింది.

వేణుగారి రచనలు

15. మీరు రచించిన నాటికలను గురించి చెప్పండి.
జ :-     నా నాటికలన్నీ ఆకాశవాణిలో వచ్చిన నాటికలే. అయినప్పటికీ స్టేజీ మీద ప్రదర్శించడానికి అనువుగా రాశాను. ఇందులో ‘పునాదిరాళ్లు’ అనే నాటికను రేడియో వాళ్ళు ‘వికృతశిశువు’ గా మార్చుకున్నారు. తెలంగాణ శకుంతల, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి నటులు ఈ నాటికలో పాల్గొన్నారు. నా నాటికల్లో ఒకదానికి ప్రముఖ రేడియో ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్ దర్శకత్వం కూడా వహించారు. అట్లా దాదాపు పది నాటికలు వచ్చాయి. అందులో రెండు ప్రచార సంబంధమైనవి. ఎయిడ్స్ మీద రాసినవి. వాటిని పుస్తకంలో తీసుకోలేదు. ఇంకొక మూడు నేను రాసి, పుస్తకంగా వేసేటప్పటికి పదేండ్లు గడిచిపోయింది కాబట్టి దొరకలేదు. మిగిలిన వాటితోనే ‘అమ్మంగి వేణుగోపాల్ నాటికలు’ అనే పేరుతో పుస్తకం వచ్చింది.

16. మీ ‘భరోసా’ కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ వచన కవితా పురస్కారం పొందిన ప్రత్యేకతను తెలపండి.
జ :-  ‘భరోసా’ లోని కవితలన్నీ జీవితం మీద ఒక నమ్మకం కలిగించడమనే అంశాన్ని ప్రధానంగా చేసుకొని రాసినవే. అందుకే శీర్షిక దానికనుగుణంగా పెట్టడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం పొందడం సంతృప్తి కలిగించింది.

17. మీరు రాసిన కవితలన్నీ యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చినవేనంటారా?
జ :-   నేను ఏ కవితనూ స్వల్పవ్యవధిలో రాయను. ఒక భావం కల్గినప్పుడో, ఒక వ్యక్తి ఎదురైనప్పుడో, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడో, ఒక ఆశ్చర్యకరమైన, భయానకమైన వార్త పేపర్లో చదివినప్పుడో అది నా మనసులో ఉండిపోతుంది. ఎప్పుడో ఒకసారి కవితారూపంలో వెలువడుతుంది. మొన్ననే సాయిబాబా గారు మరణించారన్న వార్త చాలా బాధకు గురి చేసింది. దాదాపు పూర్తి వైకల్యం కలిగిన మనిషిని జైల్లో అంతగా హింసించారన్న ఆవేదనతో ‘మనిషి – మరణం’ కవిత రాశాను. “మనిషంటే/ కాల సముద్రాన్ని ఈదిన గజ ఈతగాడు..” అంటూ మొదలవుతుంది ఆ కవిత. మండల స్వామి చనిపోయిన విషయం కూడా ఎంతో వేదన కలిగించింది. దివ్యాంగులను ప్రత్యక్షంగా చూసి కవిత రాశాను. రైల్వేస్టేషన్ కు సంబంధించిన ఒక యథార్థ ఘటన.. ప్రేమించి వివాహం చేసుకున్న యువతీ యువకులు రైల్వే స్టేషన్ కి వస్తారు. ఇప్పుడే వస్తానని చెప్పి ఆ యువకుడు వెళ్ళిపోతాడు. అతను ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ జీవితమంతా ఆమె అక్కడే ఉండిపోతుంది. దాని గురించి కవిత రాశాను. సముద్రం అనే కవితలో సముద్రంలో కొండను అలలు ఎంత వేగంగా, బలంగా తాకినా కొండ నిబ్బరంగా ఉంటుందన్న అంశంతో ధైర్యమే దానికి కారణమంటూ సందేశమిస్తూ రాశాను. ఇవన్నీ నాకు మంచిపేరు తెచ్చాయి. ఎక్కువ సంఖ్యలో కవితలు రాయడం నా ఉద్దేశ్యం కాదు. రాసినవి కొన్నైనా మంచివై ఉండాలంటాను. ఆత్మీయ మిత్రుడు గోవింద్ మీద, కరోనా మీద, యుద్ధోన్మాదం మీద రాసిన కవితలు ఇటీవలి నా కవితా సంపుటి ‘ముఖచిత్రం’ లో ఉన్నాయి. ఇవన్నీ నాకు తృప్తి మిగిల్చిన కవితలు.

18. భారతీయ సాహితీ నిర్మాత మఖ్దూం మొహియొద్దీన్ గురించి అనువాద పుస్తకం రాశారు. ఆయనలో మీకు నచ్చిన అంశాలేవి?
జ :-    మఖ్దూం మొహియొద్దీన్ ఉర్దూలో గొప్ప కవి.   “చమేలీ కే మండ్ వే తలే, దో బదన్ ప్యార్ కే ఆగ్ మే జల్ గయే” పాట ‘ఛా ఛా ఛా’ అనే హిందీ సినిమాలో వచ్చింది. సినిమా ఫెయిలయ్యింది కానీ పాట చాలా హిట్టయింది. అలాంటి పాటలు ఎన్నో రాసిండు. ఆయన స్వయంగా మంచి గాయకుడు. గజల్స్ అద్భుతంగా పాడేవాడు. గజల్ ప్రక్రియకు ఆయనను ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఆయన రాసినవి మూడే మూడు సంపుటాలు అయినప్పటికీ ఎంతో పేరు పొందాయి. ఆయన ముఖ్యంగా కార్మిక నాయకుడు. ఎల్లవేళలా వాళ్ళతో ఉంటూ అధికారుల అన్యాయాలను ఎదిరిస్తూ కార్మికుల సమస్యలను పరిష్కరించేవాడు. నిజాం చివరి రోజుల్లో దేవిడీలో పనిచేస్తున్న ఖాన్ అనే అధికారి కార్మికుల దగ్గర అన్యాయంగా డబ్బు లాక్కుంటుంటే అడగడానికి మరొక కమ్యూనిస్టు లీడర్ ను కూడా తీసుకొని దేవిడీ గేటు లోపలికి వెళ్తుంటే చౌకీదార్ వీళ్లను అడ్డుకొని రానివ్వకుండా “ఖాన్ సాబ్ టైగర్ హై” అన్నాడట. అప్పుడు మొహియొద్దీన్ “ఓ టైగర్ హై తో హమ్ 303 హై” అని సమాధానమిచ్చాడట. 303 అనేది ఒక రైఫిల్. అంతటి ధైర్యం కలవాడు. కమ్యూనిస్ట్ లీడర్ గా చాలా పనులు సాధించాడు. ప్రత్యర్థులను కూడా గౌరవించేవాడు. 1952 ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ నుండి హనుమంతరావుకు, పిడిఎఫ్ నుండి మఖ్దూం కు టిక్కెట్లు దొరికాయి. ఇద్దరి ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో సంగారెడ్డి చౌరస్తాలో ఒకరికొకరు ఎదురు పడ్డారు. మొహియొద్దీన్ తన జీపు దిగి హనుమంతరావు దగ్గరికి వెళ్లి ” హనుమంతరావు సాబ్! ముబారక్ హో, హమారే గావ్ కో ఆప్ మహబూబ్ నగర్ సే ఆయే, ఆప్ హమారా అతిథి హై” అంటూ కరచాలనం చేయడమే కాక నా వేదిక నుండి మీ భావాలను ప్రచారం చేయండి” అన్నాడట. అంతటి విశాల హృదయం కలవారు. మంచి కవిగానే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు.

19. ‘పచ్చబొట్టు – పటంచెరు’ సంపుటి ప్రధాన ఉద్దేశ్యం పర్యావరణమేనా? మరేదైనా ఉందా?
జ :-   అది ప్రధానంగా పర్యావరణం దృష్టితో రాసింది. మా చిన్నప్పుడు గతంలో పటం చెర్వు పరిశుభ్రంగా ఉండేది. ఆ తర్వాత ఫ్యాక్టరీల కాలుష్యమంతా చెరువులో కలిసి చెరువే లేకుండా అయింది. ఒక ఫ్యాక్టరీకి ఇంకొక ఫ్యాక్టరీకి మధ్య ఉండవలసిన దూరాన్ని పాటించకుండా నియమాలను అతిక్రమించి కట్టారు.  Un planned గా ఫ్యాక్టరీలు ఉన్నాయన్న దానిమీద కేసు నడిచింది. ఈ కేసు గురించి హైకోర్టు “ఈ పటాన్ చెర్వులో ఏర్పడ్డ కాలుష్యం కాలుష్యం కాదు విషం. ఆ విషం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మనుషుల ప్రాణాలను పణంగా పెట్టే పారిశ్రామిక ప్రగతి అవసరం లేదు. పారిశ్రామికీకరణ అనే ఉన్మాదపు పరుగులో మనం మనిషిని మరిచిపోతున్నాం” అని తీర్పునిచ్చింది. ఈ తీర్పును యథాతథంగా పుస్తకం ముందుమాటలో పెట్టాను. పచ్చబొట్టు ఆరోగ్యానికి సంకేతమైతే, పటం చెర్వు అనారోగ్యానికి సంకేతమన్నట్లు రాశాను.

20. వట్టి కోట ఆళ్వారు స్వామి రచనల మీద పరిశీలన గ్రంథం రాశారు కదా! ఆయన వ్యక్తిత్వాన్ని తెలపండి.
జ :-    ఆయనది గొప్ప పర్సనాలిటీ అమ్మా! ఆయన కవిత్వం రాయలేదు కానీ కథలు, నవలలు రాసిండు. శ్రీవైష్ణవుడు అయినప్పటికీ ఎక్కడా ఆ లక్షణాలు కనిపించవు. మనుషుల మధ్యనే ఉన్నాడు. రిక్షా వాళ్ళ యూనియన్ పెట్టిండు. వారికి మంచి రిక్షాలు ఇప్పించినవాడు. గుమాస్తాల సంఘం ఏర్పాటు చేశాడు. వాళ్లకు దుకాణాల్లో అమాస, పున్నమలకు తప్ప మిగతా రోజుల్లో సెలవు ఉండేది కాదు. జీతాలు కూడా చాలా తక్కువ. వాటి గురించి పోరాడి వారానికొక సెలవు ఉండేలా చేసి జీతాలు కూడా పెరిగేటట్లు చేశాడు. వాళ్ళల్లో చైతన్యాన్ని పెంచడానికి ‘గుమాస్తా’ పత్రికను నడిపాడు. ఆయన పూర్తి కమ్యూనిస్టు. రావి నారాయణ రెడ్డి అనుయాయుడు. చాలామంది చెప్పనిది, నేను మాత్రమే చెప్పేది ఆయన మంచి వక్త అని. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రైతులలో, రైతు కూలీల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నించాడు. పెద్దపెద్ద సభలు నిర్వహించి అనర్గళంగా ఉపన్యసించేవాడు. ఒకసారి రేషన్ బియ్యం దొరుకుతలేవని కరపత్రాలు తయారుచేసి సికింద్రాబాద్ అంతటా పంచాడు. దానికి దాదాపు ఆయనను నెలరోజులు జైల్లో పెట్టారు. ఇంకో రెండుసార్లు కూడా జైలు శిక్ష అనుభవించాడు. దాశరథి, కాళోజీ 1948 వరకే జైళ్లల్లో ఉంటే కమ్యూనిస్టు కావడం వలన 1952 వరకు జైల్లో ఉన్నాడు. జనరల్ చౌదరికి కమ్యూనిస్టులంటే పడదు. అందువల్ల ఆళ్వార్ స్వామి, రావి నారాయణరెడ్డిలతో పాటు కమ్యూనిస్టులందరినీ జైల్లో పెట్టాడు. ఎన్నికలు వస్తుండడంతో విడుదల చేశారు. ఆళ్వార్ స్వామి పుస్తకాలు వేసి ఊరూరా పంచాడు. దానివల్ల చదివే గుణం పెరుగుతుందని, దానితో అక్షరాస్యత పెరుగుతుందని నమ్మకం. అది జరిగింది కూడా.

21. విమర్శకులుగా….సాహిత్య విమర్శలో ఏ అంశాలను స్పృశిస్తూ రచనలు రావాలని మీరు భావిస్తారు?

జ :-    సాహిత్య విమర్శ అన్నది కూడా ఒక గొప్ప ప్రక్రియ. అది గనుక లేకపోతే ఏది మంచి పుస్తకమో, ఏది చెడు పుస్తకమో పాఠకులకు తెలియదు. ఏది ఆకర్షణీయంగా ఉంటుందో దాన్ని చదవడానికి పాఠకుడు ఇష్టపడతాడు. కానీ ఆకర్షణీయంగా ఉన్న ప్రతి పుస్తకం మంచి పుస్తకం కాదని చెప్పగలిగేవాడే విమర్శకుడు. అంటే విమర్శకుని మీద గొప్ప బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఉన్నవాడే మంచి విమర్శకుడవుతాడు. లేకుంటే మామూలు సమీక్షలుగా ఉండిపోతారు. విమర్శను జడ్జిమెంట్ అనికూడా అంటారు. అంటే పుస్తకం మీద తీర్పు ఇవ్వడం. అందువల్ల విమర్శ చాలా విలువైనది. ప్రజల దృష్టిలోకి పుస్తకాల మంచి చెడులు రావాలి. కానీ అది ప్రాంతాలకు పరిమితమై ఉండకూడదు.

22. వచన కవిత్వ నిర్మాణం ఏ విధంగా ఉంటే ప్రజాదరణ పొందగలుగుతుంది?
జ :-  వచన కవిత్వంలో ప్రారంభ వాక్యాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా, ఆలోచనీయంగా ఉండాలి. ఇప్పుడొస్తున్న కవిత్వంలో శిల్పం కొరవడి, ఒకరినొకరు మెచ్చుకోవడమే తప్ప మంచి కవిత్వం తక్కువగా ఉంటున్నది. మేము ఇన్ని కవితలు రాసినామని చెప్పుకునే భ్రమలో ఉంటారు వాళ్ళు. జీవితంలోంచి, జీవితానుభవంలోంచి, హృదయంలోంచి కవిత రావాలి. అట్లా పద్య కవిత్వంలో కూడా వస్తుంది కానీ ఛందస్సు ఆటంకంగా ఉంటుంది.  ఛందస్సు లేనిది, నీ మనసులో నానింది ఒక రూపంగా నిలిచి వస్తువు, శిల్పం రెండూ ఒకదానికొకటి ఉంటేనే వచన కవిత్వం బాగుంటుంది. అట్లే ముగింపు కూడా పవర్ ఫుల్ గా, ఒక మెరుపులా ఉండాలి. ఆలోచనాత్మకంగా ఉండాలి. కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలి. జీవితాన్ని చైతన్యవంతం చేసే తాత్వికత కూడా ఉండాలి.

23. పదికాలాలు నిలబడే సాహిత్యం ఏ విధంగా ఉండాలని మీరు భావిస్తారు?
జ :-  జీవిత విలువలకు సంబంధించిన రచనలు కలకాలం నిలబడతాయి. అది కవిత్వం గానీ, నవల గానీ, నాటకం గానీ జీవిత విలువలను ప్రబోధించాలి. అయితే డైరెక్టుగా ఉండకుండా సృజనాత్మకంగా ఉండాలి. అటువంటప్పుడే అది నిలుస్తుంది. ‘Les miserables’ అట్లాగే ఉంటుందని చెప్పాను కదా!ఇట్లాంటివి పాఠకులను ఆలోచింపజేస్తాయి. హృదయాన్ని ప్రశ్నిస్తాయి. ఇప్పటివరకు ఏవైతే గొప్ప పుస్తకాలుగా, క్లాసిక్స్ లాగా ఉన్నాయో అవన్నీ జీవిత విలువలను ప్రబోధించినవే.

24.  మీ రచనలు పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయని విన్నాం. వాటి గురించి చెప్పండి
జ :-  నా కవితా సంపుటి ‘మిణుగురు’ లో కొన్ని మినీ కవితలున్నాయి. బెంగుళూరు యూనివర్సిటీ తెలుగు శాఖ వారు 1990 లో ఎమ్.ఏ ఫస్ట్ ఇయర్ పాఠ్య పుస్తకంలో ఈ మినీ కవితల్ని పెట్టుకున్నారు. తరువాత ఎనిమిదో తరగతి ఉర్దూ మీడియం పిల్లలకు సెకండ్ లాంగ్వేజ్ కోసం కులీ కుతుబ్ షా రాసిన కవితకు నేను తెలుగులో చేసిన అనువాదాన్ని పాఠంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎలనాగ గారు అనువాదం చేసిన “Faded leaves and fire flies” నుండి ‘The beggar’ (బిచ్చగాడు) కవితను పాఠ్యాంశంగా పెట్టారు. ఇంటర్మీడియట్ బోర్డు వారు నాకు ఉత్తరం రాసి అనుమతి తీసుకున్నారు.

25. ప్రస్తుత రచనల పట్ల మీ అభిప్రాయాన్ని తెలుపుతూ సామాజిక చైతన్య దిశగా నేటి రచయితలకు ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వండి.
జ :-    అందరూ చెప్పేదే నేనూ చెప్తా. ఇప్పటి రచయితలెవరూ చదవడం లేదు. మేము చదివీ చదివీ రాసినం. వాళ్ళు రాసీ రాసీ కూడా చదువుతలేరు. అందుకే సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయాలి. మన పూర్వీకులు ఏం చెప్పారు? మనం అంతకంటే గొప్పగా చెప్పగలుగుతామా? చెడును ఖండించగలుగుతామా? తెలుసుకోవాలి. సీనియర్ రచయితల రచనలను చదివి ఈ రచన ఎట్లున్నదనే విషయంలో తామే ఒక అభిప్రాయానికి రావాలి. అప్పుడే మంచి రచయితలు అవుతారు. దానివల్ల సమాజానికి మేలు కలుగుతుంది. ఇది ఒక భాషకు సంబంధించినది కాదు. ఇతర భాషల సాహిత్యాన్ని కూడా కనీసం అనువాదరూపంలో నైనా అధ్యయనం చేయాలి. వివిధ భాషల్లో ఎంతో గొప్ప రచనలు ఉన్నాయి. వాటిని చదవడం వల్ల లాభం కలుగుతుంది. తెలుసుకోకపోతే మనకే నష్టం. మనమే గొప్ప అనే భ్రమలోనే ఉండిపోతాం. ఏ రచయిత అయినా ముందు మానవుడు. అందుకే మానవజాతి ప్రయోజనమే రచయిత ప్రయోజనం కావాలి

నమస్కారం సార్🙏🏼  ఎంతో ఓపికగా మాకు మీ జీవిత, సాహిత్య ప్రస్థానాలను, అనుభవాలను పంచినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున మీకు

అనేక ధన్యవాదాలు.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

రంజింపజేసే రచన ఉండాలి – ముక్తవరం పార్థసారథి

by Aruna Dhulipala November 29, 2024
written by Aruna Dhulipala

ప్రసిద్ధ నవలాకారులు, కథకులు, అనువాదకులు ముక్తవరం పార్థసారథి గారితో మయూఖ ముఖాముఖి

                                   – అరుణ ధూళిపాళ

ప్రపంచ సాహిత్యాన్ని ఆకళింపు చేసుకొని అందులోని  విభిన్నమైన రచనలను తెలుగువారికి అందించాలనే సదాశయంతో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించిన ప్రముఖ అనువాదకులు, కథకులు, నవలాకారులు ముక్తవరం పార్థసారథి గారి సాహిత్య ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్!

1. మీ బాల్య విశేషాలను తెలుపుతూ మీ కథాపఠనం ఎక్కడ, ఎలా మొదలైందో వివరించండి.
జ :-    నా బాల్యమంతా భువనగిరిలో గడిచింది. నా చిన్నతనంలో మా ఇంటికి ‘నవ్వులు- పువ్వులు’, ‘పాపాయి’ ‘గోల్కొండ’ పత్రికలు వచ్చేవి. నేను ఆ పత్రికలు చదివేవాడిని. అలా తొట్టతొలుత నా కథా పఠనం ప్రారంభమైందనుకుంటా. మాఇంట్లో కూడా వావిళ్ళవారి భారతం, రామాయణం, మనుచరిత్ర ఇలాంటి పుస్తకాలు ఉండేవి. వాటిని చూస్తూనే ఉన్నప్పటికీ పద్యాలు అంటే భయం వల్ల చదవకపోయేవాడిని. మా మామయ్య అక్కడే స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. కృష్ణదేవరాయ నిలయం ప్రోత్సాహంతో మామయ్య లైబ్రరీ ప్రారంభించారు. బహుశా పది, పదకొండు ఏళ్ళ వయస్సులో పుస్తకాలు చదవడం ప్రారంభమైంది. ఇంచుమించు తెలుగు పుస్తకాలన్నీ చదివేశాను. కథాప్రపంచం, కథాసాగరం అని వాల్యూమ్స్ వచ్చేవి. పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, రావూరి భరద్వాజ, ధనికొండ హనుమంతరావు వంటి వారి రచనలు చదివాను. నవలలూ చదివాను. నాకు కూడా రాయాలనిపించింది. ఆ విధంగా రచనలు చదవడం మొదలయింది.

2. పత్రికల్లో వచ్చిన మీ మొట్టమొదటి రచన ఏది?
జ :-    ఇందాక చెప్పినట్టు పుస్తకాలు చదువుతుంటే రాయాలనే ఆసక్తి కలిగి 1959లో నేను 9వ తరగతిలో ఉండగా, వేసవి సెలవుల్లో ఒక కథ రాశాను. పేరు గుర్తు లేదు. గోల్కొండ పత్రికకు పంపించాను. పత్రికకు ఎలా పంపించాలో తెలియదు. పేజీకి వెనుకవైపు రాయకూడదనే నియమం తెలియదు. ఒక చిన్న కవర్ కొని అందులో కుక్కి పెట్టి పోస్టులో వేశాను. 20 రోజుల తర్వాత పత్రికలో వచ్చింది. ఆరోజుల్లో హైదరాబాద్ నుండి భువనగిరికి పత్రిక రావడానికి మధ్యాహ్నం అయ్యేది. భోజనాలు చేస్తున్న సమయంలో పత్రిక వచ్చింది. మా మామయ్య చూసి తిట్టాడు. స్కూల్లో చదువుకునే కుర్రాడు ఈ కథలు రాయడంలో ఏమైపోతాడోనని ఆయన భయం. గ్రాంథికం రాయాలని, ఛందోబద్ధమైన, భక్తి పద్యాలు రాయాలని ఆయనకుండేది. పిల్లలకు ఇటువంటి ఆలోచనలు రావద్దని ఆయన ఉద్దేశ్యం. ఇంట్లో సంప్రదాయకమైన వాతావరణం ఉండేది కాబట్టి అట్లాంటి భయాలు ఉండేవి. ఆ రోజుల్లో భువనగిరిలో కథలు రాసేవాళ్ళు లేరు. అందువల్ల మా మామయ్య నన్ను తిట్టినప్పటికీ మా అల్లుడు కథలు రాస్తాడని స్కూల్లో చెప్పుకునేవాడు (నవ్వుతూ).
        అదే 1959లో ఒక పోటీలో ప్రముఖ రచయిత వేణు పిళ్ళై కథకు ప్రథమ బహుమతి వచ్చినట్టు గుర్తు. నేను కూడా ఆ పోటీకి కథ పంపాను. ఆయన కథకు బాపు అద్భుతమైన బొమ్మ వేశాడు. మాస్టర్ పీస్ అది. నా స్కూల్ చదువు అయిపోయాక పియుసి కోసం హైదరాబాద్ కు వచ్చాను. ఇంగ్లీషు మీడియంలో చదివాను. అప్పటికే తెలుగు పుస్తకాల్లో ఇంగ్లీష్  రచయితల పేర్లు అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు, బుచ్చిబాబు, చలం రచనల్లో రచయితల పేర్లు, కొన్ని పదాలు ఇంగ్లీష్ లో కనబడుతుండేవి. అఫ్జల్ గంజ్ సిటీ లైబ్రరీకి రోజూ వెళ్ళేవాడిని. మొదటిసారి ఆ పుస్తకాలను చూసినప్పుడు నేను చదివిన బుచ్చిబాబు, చలం రచనల్లోని పేర్లు అక్కడ చూశాను. ఇంగ్లీషు రాదు. కానీ చదవాలి. అప్పటికి దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ వాళ్ళు వేసిన ‘స్రవంతి’ పత్రిక వచ్చేది. దివాకర్ల వేంకటావధాని దానికి సంపాదకులు. ఒక గేయం రాసి పంపాను. అచ్చయింది. ఇంకోటి రాసి పంపితే అది కూడా అచ్చయింది. ఎందుకో నాకు పోయెట్రీ ఇరుకుగా, ఫ్రీగా చెప్పలేకపోతున్నట్టు అనిపించింది. అందుకే కథలు రాయాలనుకున్నాను. కథలు రాసేందుకు కాగితాలు కొనుక్కోవడానికి, పంపడానికి కావలసిన డబ్బులు లేవు. ఈలోపు లీవ్ వేకెన్సీ కింద స్టేట్ గవర్నమెంట్ లో తాత్కాలికంగా చిన్న ఉద్యోగం వచ్చింది. కథలు రాయడం ప్రారంభించాను.

పార్థసారధిగారితో అరుణదూళిపాళ

3. ఆ తరువాత మీ కథారచన కొనసాగిన విధానాన్ని తెలపండి.
జ :-    జాబ్ లో చేరిన తర్వాత స్టేట్ లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదవడం వలన ఇంగ్లీషు అలవాటయింది. William Somarset Maugham రచించిన  ‘Of Human Bondage’ వెయ్యి పేజీల పుస్తకం. దాన్ని చదివాను. అది చదివాక ధైర్యం వచ్చింది. వాళ్ళ పుస్తకాలు పక్కా ఇండ్ల లాగా ఉంటాయి. వాళ్ళు ఫాంటసీని కూడా పక్కాగా రాయగలరు. అప్పుడు18 ఏళ్ల వయస్సు. ఇంట్లో కూర్చొని రాయడం మొదలు పెట్టాను. కిరోసిన్ దీపం పెట్టుకొని రాసేవాడిని. తర్వాత పోస్టాఫీసులో కొంతకాలం ఉద్యోగం చేశాక రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఇక ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. దీపావళి, ఉగాది కథలు నవలల పోటీకి రాసేవాడిని. ఒక అద్భుతమైన విషయం మీకు ఇక్కడ చెప్పాలి. ఉద్యోగం రాకముందు ‘అభిసారిక’ అనే పత్రికకు కథ రాసి పంపితే వాళ్ళు “మీరు రాసిన దాంట్లో అభ్యంతరకరమైన వాక్యాలున్నాయి. గవర్నమెంట్ మీమీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చు”. అని ఒక కార్డ్ రాశారు. ఏదైనా సరే అన్నాను (నవ్వుతూ). వాళ్ళు దాన్ని అచ్చు వేసి పాతిక రూపాయలు పంపించారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. నెలంతా సరిపోయేది.
         1969లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఉగాది నవలల పోటీకి ‘రంగులవల’ అని ఒక నవల రాశాను. దానికి విద్వాన్ విశ్వం సంపాదకుడు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని టెలిగ్రామ్ వచ్చింది. 5500 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. ఎమెస్కోలో ఎమ్.ఎన్.
రావుగారు అని వుండేవారు. ఆయన 3000 రూపాయలు ఇచ్చి, దాని కాపీ రైట్స్ అన్నీ తీసుకొని వేశారు. బి. గోపాలం అనే సినిమా దర్శకుడు 2000 ఇస్తానని కథ ఇవ్వమని అడిగి తీసుకున్నాడు. మా అంకుల్ ఒకాయన సలీంనగర్ లో 4500 రూపాయలకు 400 గజాల ప్లాట్ ఉంది తీసుకో! అన్నారు. నేనాయన మాటలు వినలేదు. రచయితల గురించి, పుస్తకాల గురించి ఆలోచించడం తప్ప డబ్బులు ఏం చేసుకుంటాం? అన్నట్టు ఉండేది నాకు. కథలు రాస్తే అందరూ నన్ను పిచ్చివాడిలా చూసేవారు. దానికి Utility Value ఉన్నదని వాళ్లకు తెలియదు. ఇంగ్లీష్ సాహిత్యంలో విశేషం ఏంటంటే ప్రపంచ భాషల సాహిత్యమంతా తెలుగుతో సహా ఇంగ్లీషులోకి వస్తోంది. ఆ రుచి మరిగిన తరువాత దాంట్లో మునిగిపోతాం. ఇన్ని లక్షలమంది దృక్పథాలు, అభిప్రాయాలు, స్పందనలు, ఆలోచనలు, సాంస్కృతిక పరమైన వైరుధ్యాలు, మార్పు కోసం చేసిన పోరాటాలు ఇవన్నీ మనకు ఆ సాహిత్యం చదివితే అర్థమవుతుంది. అందువల్ల వాటిని చదివిన తరువాత రాయడం కొనసాగుతూనే వచ్చింది.

4. చలం గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది?
జ :-   నేను కథలు రాయడం ప్రారంభించిన తర్వాత, రెండు మూడు అచ్చు అయినప్పటికీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా సరిగా దృష్టి పెట్టలేకపోయాను. ఏం చేయాలో తెలియలేదు. ఇంట్లోంచి వెళ్లి పోవాలనుకున్నాను. 1962 మే నెల. నాంపల్లి స్టేషన్ కు వెళ్ళాను. అప్పుడు మద్రాసుకు 16రూ. టిక్కెట్టు ఉండేది. ఆ సమయంలో ‘అష్టగ్రహ కూటమి’ ఒకటి వస్తుందని, దానివల్ల అందరూ మునిగిపోతారని ప్రచారం జరుగుతోంది. ‘ప్రజాతంత్ర’ అనే పత్రికలో శివం అనే ఆయన చలం గారిని ప్రశ్నలు అడుగుతుండేవాడు. అలా చలం గారు తిరువణ్ణామలైలో ఉంటారని తెలిసింది. ఆ పత్రికలో ‘అష్టగ్రహ కూటమి’ వస్తున్నది కాబట్టి దానినుండి రక్షించుకోవాలనుకునే వారు, తిరువణ్ణామలైకి రావాలని చలం చెప్పాడు. నేను ఆయన రచనలు చదివాను కానీ నా వయసుకు మించిన వర్ణనలు కాబట్టి నాకు అర్థం కాక మొదట ఆయన పట్ల ఆకర్షితుడిని కాలేదు. ఇక నేను ఎలాగూ ఇల్లు వదిలాను కాబట్టి ఎలాగో అలా తిరువణ్ణామలై చలం ఇంటికి చేరుకున్నాను. అదొక గొప్ప అనుభవం. అక్కడొక నర్తకి, ఆయన పెంపుడు కూతుళ్లు, సొంత కూతురు చంపక ఉండేవాళ్ళు. నా ప్రశ్న ‘డబ్బులెలా వస్తాయని?’ ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి అనేవాడు. నీకుంది కానీ నాకు లేదు కదా! అని మొండిగా వాదించేవాడిని. ఓపిగ్గా వినేవాడు. ఇంట్లో పదిమంది దాకా ఉండేవాళ్ళం. డబ్బున్నా లేకున్నా ఉన్నది అందరం పంచుకొని తినడం, అందరూ పని చేయడం వాళ్ళ పద్ధతి. గర్భవతులు వంటింట్లోకి రాకూడదు అని నియమం ఉండేది. అలా వాళ్ళింట్లో వారం రోజులు ఉన్నాను. తిరిగి వచ్చి చిన్న ఉద్యోగంలో చేరాను.

5. చలం గారితో మీ అనుబంధం ఎంతవరకు కొనసాగింది? మీ మీద చలం గారి ప్రభావం ఉందని అనుకోవచ్చా?
జ :-    చలంతో అనుబంధం పదేళ్లు కొనసాగింది. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. నేను రిజర్వ్ బ్యాంకులో పని చేయడం వల్ల మద్రాసులో ప్రతీ సంవత్సరం పని ఉండేది. అందువల్ల శనివారం మధ్యాహ్నం భోజనం చేసి తిరువణ్ణామలైకి వెళ్ళిపోయి అదివారమంతా అక్కడ గడిపి తెల్లవారి బ్యాంకుకు వచ్చేవాడిని. అయిదారేళ్ళు ఇలా గడిచింది. ఆయన రచన విభిన్నమైనది. అందువల్ల ఆయన రచనకంటే వ్యక్తిత్వం నన్ను ప్రభావితం చేసింది. సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, ప్రభుత్వం పట్ల అతనికున్న కోపం, తీవ్రత, వ్యంగ్యం ముందు ఆయన మిగతా విషయాలన్నీ చిన్నవి. జంతువుల లాగా బతికేకన్నా స్త్రీ స్వేచ్ఛగా ఉండడం కావాలన్నాడు. అందరూ అదొక ఉద్యమంలాగా చూశారు. కాదు. అది ఆయన వ్యక్తిగతమైన బాధ. తన చెల్లెలు భర్త ఆమెను ప్రతిరోజూ గదిలో బంధించి కొడుతూ ఉంటే అలా బాధపడే కంటే స్వేచ్ఛగా బతికితే బాగుంటుంది కదా అన్న ఆవేదనతో కూడిన ఆయన వ్యక్తిగత ఆలోచనే తప్ప సంఘ ఉద్ధరణ కోసం చేసింది కాదు. రెండు, మూడుతరాల స్త్రీలు ఈ రకంగా తమ వ్యక్తిత్వాలను కోల్పోతే ఎంతో సామాజిక నష్టం జరుగుతుంది. స్త్రీల జీవితాలు సమాజానికి ఉపయోగపడకుండా వంటింటికి పరిమితమై వాళ్ళ సామర్థ్యమంతా వృథా అయిపోతే ఎంత బాధాకరం? అన్నది ఆయన ఉద్దేశ్యం. టాలెంట్ అనేది స్త్రీ పురుషులిద్దరికీ సమానమే. అది పురుషులకు మాత్రమే పరిమితం కాదు. అలాంటప్పుడు స్త్రీలు నిర్బంధంగా ఎందుకుండాలి? అని ఆయన వాదన. నిజానికి ఆయన తిరువణ్ణామలైకి వెళ్లడం వల్ల ఆధ్యాత్మిక చింతన ఏర్పడిందని కాదు. 1927లో ఆయన ‘అరుణ’ అనే పుస్తకం రాశాడు. అందులో చివరగా “ఆమెకోసం స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి” అని రాశాడు. అప్పటికే ఆ దృష్టి ఆయనలో ఉంది. ఆయన బ్రహ్మసమాజి. రవీంద్ర నాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ స్థాపించిన కొత్త మతం ‘బ్రహ్మసమాజం’. అంటే ఏకోపాసన. కృష్ణశాస్త్రి కూడా దీనికి అనుయాయి.
        1730 ప్రాంతంలో బ్రిటిష్ సమాజం స్త్రీని ఒక వ్యక్తిగా కూడా గౌరవించలేదు. ఆస్తిహక్కు గానీ కన్న బిడ్డల మీద కూడా ఆమెకు అధికారం లేదు. అటువంటి సమాజంలో పుట్టిన స్త్రీ Mary wollstone craft. ఆమె ఇంగ్లాండులో తొలి స్త్రీవాద రచయిత్రి. ఆమె కూతురును ప్రముఖ రచయిత షెల్లీ వివాహం చేసుకున్నాడు. మేరీ ‘A vindication of the rights of Women’ అనే పుస్తకాన్ని రాసి స్త్రీల హక్కుల గురించి అనేక విషయాలు వివరించింది. కానీ ఇలా రాసినందుకు స్త్రీలే నన్ను తిడుతున్నారని ఆమె బాధకు గురయింది. అంటే స్త్రీలే ఆ స్వేచ్ఛను కావాలని కోరుకోవడం లేదు.  చలం స్వచ్ఛమైన మనస్సు ఉన్నవాడు కాబట్టే సమాజాన్ని చూసి కలత చెందాడు. బానిసత్వం అనేది మనసులో ఉంటుంది. ఇతరులకు బానిసత్వం అనిపించినది అనుభవిస్తున్నవాళ్ళకి  అనిపించక పోవచ్చు. అనిపించినా బయట పడకపోవచ్చు. ధైర్యంతో స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు బతకాలంటాడు ఆయన. అందుకే అలా రాసాడనిపిస్తుంది. ప్రపంచ సాహిత్యంతో ఉన్న పరిచయాలు, ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం కలవాడు. ఆయన ఎప్పుడూ, ఏ రకమైన సంకెళ్లను ఇష్టపడలేదు.

6. మీరు భారతీయ సాహిత్యం కంటే కూడా ప్రపంచ సాహిత్యంపై ఎక్కువ అనువాదాలు చేయడానికి కారణం ఏమిటి?
జ :-     మామూలుగా ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, ఒకసారి నేను Arthur Millar రాసిన ‘I don’t need you any more’ (short stories) అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కథా ప్రారంభం చాలా బాగా అనిపించింది. ఎందుకో దాన్ని తెలుగులో రాయాలనిపించింది. మనవాళ్లకు దాని గురించి తెలియజెప్పాలనిపించింది. మనకెవరికైనా ఏదైనా చదివినప్పుడు, ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఎవరికైనా దాన్ని చెప్పాలని, వాళ్ళు విన్నా వినకపోయినా ఆ అనుభూతిని పంచుకోవాలనిపిస్తుంది. ఇది మరో భాషలో ఉండడం వల్ల అనువాదం అంటున్నాం. అలా ప్రపంచ సాహిత్యం చదివినప్పుడు నాకు నచ్చినవి తెలుగులో అనువాదం చేయాలని, మనవాళ్లకు చెప్పాలని కోరిక కలిగింది. అందుకే చేశాను.

7. అసలు అనువాదం అంటే ఏ విధంగా ఉండాలో తెలపండి.
జ :-     అనువాదాల నియమాల గురించి చాలా పుస్తకాలున్నాయి. రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. అందులో అన్ని విషయాలను ఆయన చెప్పారు. నేననేది ఏంటంటే మూలానికి భిన్నం కాకుండా textual గా యథాతథంగా చేసే అనువాదం వేరు. కానీ నేను చేసేది అలా కాదు. నా టార్గెట్ తెలుగు రీడర్. నేను రాసింది తెలుగు పాఠకులకు నచ్చుతుందా లేదా? అన్నది నా మొదటి ప్రాధాన్యత. పాశ్చాత్య రచయితలు ఎక్కువగా వర్ణనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉదా:- ఒక పెళ్లిని వాళ్ళు అనేకంగా వర్ణిస్తారు. అది తెలుగు పాఠకులకు అవసరం లేదు. ఒకవేళ వాటిని నేను రాస్తే పాఠకులు అవి వదిలి చదువుతారు. అందుకని నేనే వదిలేసి రాస్తే బాగుంటుంది కదా! రచయిత ఏ ఉద్దేశ్యంతో రాశాడో అది స్పష్టంగా తెలియజేస్తే చాలు.
         ‘కాసుల కమ్ముడు పోయిన కళలు – సాహిత్యం’ అని నేనొక అనువాదం చేశాను. మూడువేల సంవత్సరాల పాశ్చాత్య సాహిత్య కళారంగాల గురించిన సర్వే. ఆ రచయిత పాశ్చాత్య రచయితలు, కళాకారులు పాఠకులకు ముందే తెలుసుననుకొని వాళ్ళ గురించి ఎలాంటి వివరం ఇవ్వకుండా వ్యాఖ్యానం రాశాడు. నేను అనువాదంలో రచయిత అభిప్రాయాన్ని, ఆయన కాలం, ఆయనను గురించి రచయితలు ఏమనుకున్నారు? వీటన్నింటినీ వివరిస్తూ రాశాను. అప్పుడే దానికి ఒక సమగ్రత వస్తుంది. రచయిత గురించే పాఠకులకు తెలియకపోతే నేనెంత వ్యాఖ్యానం చేసినా లాభముండదు. రచయిత ఉద్దేశాన్ని స్పష్టంగా పాఠకులకు చెప్పగలిగినట్లయితే అంతకంటే వివరాలు చెప్పవలసిన అవసరం లేదు. మన విచక్షణలో కథ ఎక్కడా పక్కకు జరుగకూడదు. చాలామందికి ప్రముఖుల రచనలు అనువాదం చేసేటప్పుడు అంత పెద్దవాళ్లు రాసిన దాంట్లో ఏ ఒక్క వాక్యమైనా మనం వదిలేయడం బాగుండదనే భయం ఉంటుంది. వాళ్ళు పాఠకులను రంజింపజేసేందుకు రాస్తున్నారు. మనం కూడా మన పాఠకులను రంజింపజేసేందుకు రాస్తున్నాం. అందుకే అవసరమైతే పెంచాలి. అనవసరమనుకున్నవి వదిలేయాలి.

8. అనువాద సాహిత్యం వల్ల చేకూరే ప్రయోజనాలు ఎటువంటివి?
జ :-    ఇతర భాషల నుండి వచ్చిన అనువాదాలు చదవడం వల్ల మన దృక్పథం విశాలమవుతుంది. ఆ సాహిత్యంలో ఉన్న విషయాలకు మన భాషలో ఉన్న విషయాలకు తేడాలు అర్థమవుతాయి. అయితే ఎటువంటి రచనలు చదవాలన్న విషయం వ్యక్తి అభిరుచిని బట్టి ఉంటుంది. అనువాదం అనే మాట అనడానికి పునశ్చరణ అంటే బాగుంటుంది. అంటే మనం చదివి, ఆనందించి, జీర్ణించుకొని తిరిగి దాన్ని స్నేహితునికి వివరించడం లాంటిది. ‘Re telling’ అన్న మాట. అసలైన రచయితను ఆ సమయంలో మర్చిపోవాలి. చదివి అనుభూతి చెందిన దాన్నే చెప్పాలి. కృష్ణశాస్త్రి పోయెట్రీని ఇంగ్లీషులోకి అనువదించలేము. మాండలికంలో రాసేవాళ్ళున్నారు. మాండలికాన్ని చదివి ఆనందించగలుగుతామే తప్ప దాన్ని మరోభాషలోకి అనువదించలేము. ఇక్కడ కథ చెప్పే పద్ధతి ముఖ్యం. అందుకే నేను నాకు నచ్చినవి ఆ దశలో వ్యాసమో, కథో, నవలో ఏదైనా కావచ్చు, అదే నేను చేశాను. తెలుగు పాఠకులకు అందించే ప్రయత్నం చేశాను.

9. వరవరరావు గారికి, మీకు మధ్య ఉన్న అనుబంధం ఎటువంటిది?
జ :-    నేను 1962లో చలం గారి దగ్గరకు వెళ్లి వచ్చిన తర్వాత చలం గారు వరవరరావుకు హైదరాబాద్ లో పార్థసారథి అనే వాడుంటాడు. కలవమని ఉత్తరం రాశారు. ఆయన అప్పుడు ఎమ్. ఏ చదువుతున్నాడు. ఆయన, అంపశయ్య నవీన్, ఇంకో ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చారు. ఆ పరిచయంతో అప్పటినుండి ఇప్పటివరకు మా మధ్య స్నేహం అలాగే కొనసాగుతున్నది. అప్పుడప్పుడు ఆర్థికంగా నాకు సహాయం కూడా చేసేవాడు. నా ‘శూన్యం’ నవలకు ఆయన ముందుమాట రాశాడు.

10. జాక్ లండన్ రచించిన ‘ఐరన్ హీల్’ అనే నవలను ‘ఉక్కుపాదం’గా అనువదించారు కదా! ఇందులోని ఇతివృత్తం ఎవరికి సంబంధించింది?
జ :-   వరుసగా రచనలు చేస్తున్న సమయంలో మా స్నేహితుడు చోడవరపు వెంకటేశ్వరరావు 1908లో జాక్ లండన్ రచించిన ‘Iron Heel’ పుస్తకాన్ని చదవమని ఇచ్చాడు. నేను చదవలేదు. చూసీ చూసీ “నువ్వు చదవకపోతే నేను నీతో మాట్లాడను” అన్నాడు. నాకు పుస్తకం కంటే నా మిత్రుడు ముఖ్యం. అందుకే చదివాను. బాగా ఆకర్షించింది. తెలుగులో రాయడం మొదలుపెట్టాను. మొదటి పేరా అంతా ప్రకృతి వర్ణన. పదిపేజీల తర్వాత కథ మొదలవుతుంది. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని కథా రూపంలో అద్భుతమైన నాటకీయతతో రాసినటువంటి సోషియో ఫాంటసీ నవల అది. దాన్ని మార్క్సిస్టు వాళ్ళే కాక సామాన్యులూ అంగీకరించారు. శ్రమ శక్తిని గౌరవించడం, మనకెదురుగా మనలను దోపిడీ చేస్తున్న వాళ్ళను గ్రహించే నేర్పు ఉండడం, చూసి పోట్లాడ గలగడం ఇవన్నీ తెలుసుకోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ వికృత రూపాన్ని ఇందులో ఆయన చూపించాడు.
          శ్రీనివాసాచార్య అనే ఆయన దీనిలో కొన్ని ప్యాసేజ్ లను పద్యరూపంలో అనువాదం చేశాడు. 1970 లో హ్యాండ్లూమ్ వీవర్స్ నాయకుడైన జి.సి కొండయ్య అనువాదం చేశాడు. ఆ తర్వాత నేను చేశాను. చెరబండరాజు వారానికి ఒకసారి నా దగ్గరికి వచ్చి అడిగి మరీ తెలుగు అనువాదాన్ని వినేవాడు.  సి.కె నారాయణ రెడ్డి అనే లెఫ్టిస్టు నాయకుడు. ఆయన నాతో మాట్లాడుతూ ఒకసారి నా పుస్తకం వేస్తానన్నాడు. అది రాకముందే సహవాసి అనే ఆయన దానికి అనువాదం చేశాడు. నా పుస్తకానికి ముందే అది పుస్తకంగా వచ్చింది.  అయితే ‘Iron Heel’ పుస్తకానికి ఒక Particular Technique ఉంది. ఈ పుస్తకంలో ఉన్న కథ 20 వ శతాబ్దానికి చెందినది. అది అప్పటి పాఠకుల కోసం రాసినది. కాబట్టి ఆ శతాబ్దికి చెందిన వివరణలు ఇస్తూ కథ సాగుతుంది. కథ సగం ఉంటే మిగతా సగం ఆ వివరణలు ఉంటాయి. నిజానికి ఆ రెండు కలిపి చదివితేనే కథ అర్థమవుతుంది. ఈ ముగ్గురు అనువాదకులు వాటిని వదిలివేసి కేవలం కథను అనువాదం చేశారు. చేస్తే మొత్తం చేయాలన్నది నా ఉద్దేశ్యం. అందుకే ఫుట్ నోట్స్ తో సహా మొత్తం నేను అనువాదం చేశాను. రత్నమాల అనే ఆవిడ తన ‘నూతన’ అనే పత్రికలో వరుసగా దీన్ని వేశారు. ఆ తర్వాత వికాసం వాళ్ళు పుస్తకంగా వేశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని పాఠకరంజకంగా, విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ ఉండేలా సోషియో ఫాంటసీగా జాక్ లండన్ రాసిన నవల.

11. అమెరికన్ రచయిత రాసిన “Burn my heart at Wounded Knee’ కి మీరు చేసిన తెలుగు అనువాదం గురించి చెప్పండి?
జ :-   అమెరికన్ కవి రాసిన కవితలోని ఒక పంక్తి ఇది. అమెరికన్ సామ్రాజ్యాన్ని 400 సంవత్సరాలు జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఇటాలియన్ వాళ్ళు వచ్చి అమాయకులైనటువంటి స్థానికులను, ఆదివాసీలను, మోసం చేస్తూ దొంగ వాగ్దానాలు చేసి, హత్యలు చేసి వాళ్ళ భూభాగాలను లాక్కొని వాళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రమనే దేశాన్ని ఏర్పరచుకున్నారు. చివరకు వాళ్ళను బోనులో జంతువుల లాగా చిన్న చిన్న కాటేజెస్ కట్టించి ఇచ్చారు. ఇప్పటికీ కొంతమంది అలాగే బతుకుతున్నారు. డీబ్రౌన్ అనే వ్యక్తి పరిశోధన చేసి ఈ విషయాలన్నీ పుస్తకంగా రాశాడు. చాలామంది దాన్ని “గాయపడిన మోకాలి దగ్గర నా హృదయాన్ని ఖననం చేయి” అన్నట్టు అనుకుంటారు. అది సరైనది కాదు. అక్కడి నేటివ్ అమెరికన్ తెగల వాళ్ళు పెట్టుకున్న పేరది. Flying eagle, running bul ఇలా ఉంటాయి ఆ పేర్లు. వాటిని అనువాదం చేయలేం. షికాగో అనేది కూడా ఒక తెగ. ఇప్పుడది ఆధునిక నగరంగా మారింది. మిన్నె సోటా కూడా అటువంటిదే. అలా అనేకమైన తెగలను ఆక్రమించుకొని తెల్లవాళ్ళ రాజ్యంగా మార్చుకున్నారు. ఆ హృదయ విదారకమైన గాథని  డీబ్రౌన్ రాశాడు. దానికి నేను చేసిన అనువాదం ‘నరహంతకుని స్వగతం’ అనే పేరుతో వచ్చింది.

పార్థసారథిగారి రచనలు

12. ‘ప్రపంచ రచయిత్రుల కథలు’ సంపుటిలో ఎటువంటి అంశాలకు చోటు కల్పించారు?
జ :-    ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేను. కానీ నేను చదివిన టిల్లీ ఆల్సెన్, గ్రేస్ పాల్ మొదలైన ప్రపంచ రచయిత్రులు ఒక 14 మంది రచించిన కథలను అనువాదం చేసి ఈ పుస్తకం వేశాను. ఇవన్నీ విపుల మాసపత్రికలో అచ్చయినాయి. చెప్పాలనుకున్నది అనువదించాను. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానని చెప్పడానికి గీటురాయి అంటూ ఏదీ లేదు. అందుకే కారణాలు చెప్పలేను.

13. ‘కథల వాచకం’ అనే పేరుతో రాసిన రచనలో 14 దేశాలకు చెందిన 20 కథలు ఒకే కోణంతో రాసినవా? విభిన్న కోణాలను ఆవిష్కరించేవా? అవి ఏ విధమైనవి?
జ :-   ఇది కూడా ప్రత్యేకంగా ఈ కోణంలో మాత్రమే అనేవిధంగా తీసుకున్నవి కావు. నేను ముందే చెప్పాను కదా! నాకు నచ్చినవి, మనకు అభిరుచికి తగినవి తెలుగువారికి అందజేయడం కోసమే నేను అనువాదాలు చేశాను. అలా నాకు నచ్చిన 20 కథలు ఇంగ్లండ్, రష్యా, ఈజిప్టు, సింగపూర్, ఇండోనేషియా, నైజీరియా, చెక్, పోలిష్/ ఇడ్డిష్, చైనా, ఇటలీ, బ్రెజిల్, కరీబియన్, కొలంబియా, యు ఎస్ ఎ దేశాలనుండి తీసుకొని ఈ పుస్తకం వేయడం జరిగింది. వివిధ పత్రికల్లో ఇవి ప్రచురింపబడ్డాయి.

14. ‘బెస్ట్ సెల్లర్స్’ బుక్ పుస్తకాలకు సంబంధించిన ఎటువంటి నేపథ్యాన్ని తెలుపుతుంది?
జ :-   కథ అనేది ఒక ఊబి లాంటిది. ఒకసారి మనం చదవడం ప్రారంభిస్తే అది మనలను లోపలికి లాక్కోవాలి. అది కథకు ఉండే లక్షణం. అది లేకపోతే అది కథ కాదు. కథలన్నీ భావోద్వేగాలు, మానవ సంబంధాలు, మనిషికి, సమాజానికి ఉన్న సంబంధాలను చెప్పగలిగేవి. అలా చెప్పలేనివి మంచి కథలు కావు. ఆ విధంగా ప్రపంచంలో మంచి పుస్తకాలుగా, బాగా అమ్ముడుపోయిన 60 పుస్తకాలకు సంబంధించి చేసిన పరిచయం ఈ పుస్తకం. ఆయా రచయితలు, రచయిత్రులు ఆ పుస్తకం రాయడానికి గల నేపథ్యాన్ని వివరిస్తూ రాసినది. ఒకరకంగా ఆ కథల వెనుక ఉన్న వెతలను కూడా తెలిపేది. ఇవన్నీ ‘నవ్య’ వారపత్రికలో ప్రచురితమయ్యాయి.

15. రష్యన్ విప్లవం గురించి రాయాలనుకోవడానికి కారణం ఏమిటి?
జ :-    కారల్ మార్క్స్ తో నాకు పరిచయం ఆలస్యంగా అయింది. అమెరికా సాహిత్యంలో మునిగిపోయాను. తర్వాత కారల్ మార్క్స్ రాసింది నిజాయితీగా ఉందనిపించింది. స్టీమ్ ఇంజన్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు ఏర్పడడం సులభమైంది. ఒకే రూఫ్ కింద వందలమంది కార్మికులు యంత్రాల ద్వారా పనిచేసే సామర్థ్యం వచ్చింది. చేతివృత్తులను వదిలి అందరూ వాటికి మొగ్గు చూపారు. యంత్రం అనేది రోజు రోజుకూ ప్రగతి చెందుతూనే ఉంటుంది. అందువల్ల యంత్ర సామర్థ్యం పెరిగింది. కార్మికులు చేసే పనిగంటలు పెరగకపోయినా చేసే పని ఒత్తిడి పెరిగింది. జీతాలు పెరగలేదు. వచ్చే లాభం యజమానికే తప్ప వీళ్లకు ఎలాంటి అధికారం, హక్కు ఉండవు. అదే దోపిడి. మార్క్సిజం  సిద్ధాంతానికి మూలం. ఈ శ్రమ దోపిడి ఆగినప్పుడే సమసమాజం ఏర్పడుతుంది. దీనికోసం పోరాడాలంటే ఒక్కరితో కాదు. అందువల్ల లెనిన్ దీనికొరకు రష్యాలో విప్లవం తీసుకొచ్చాడు. లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవన్నీ చరిత్రలో పుస్తకాలుగా వచ్చాయి. Mary Gabriel రాసిన ‘ Love and Capital’ ను నేను ‘ప్రేమ- పెట్టుబడి’ గా అనువదించాను. రష్యన్ విప్లవం ప్రజల చరిత్ర, కారల్ మార్క్స్ బయోగ్రఫీ రాశాను.

16. మీ ‘నోబెల్ తారలు’ పుస్తకాన్ని గురించి చెప్పండి.
జ :-  ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి అందరికీ తెలిసిందే. తాను కనుక్కున్న డైనమెట్ దుష్పరిణామాలకు చింతించి తన మరణానంతరం నోబెల్ శాంతి బహుమతి కోసం తన యావదాస్తిని ఇచ్చేసాడు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఇది ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ బుక్ లో నోబెల్ బహుమతి పొందిన 32 మంది గురించిన కథానికలు రాశాను. ఇవి కూడా వివిధ పత్రికల్లో అచ్చు వేయబడ్డాయి.

17. ప్రత్యేకంగా ‘విట్ గన్ స్టైన్’ స్మృతి కవిత రాయడానికి కారణం ఏంటి?
జ :-  Wittgenstein గణిత శాస్త్రజ్ఞుడు. అందులో గణిత తార్కికతలో బాగా పరిశోధన చేసినవాడు. Bertrand Russell అనబడే గొప్ప గణిత శాస్త్రజ్ఞునికి గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారం లేకున్నా దానికి బదులుగా సాహిత్యంలో ఇచ్చారు. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు విట్ గన్ స్టెయిన్ ఇతనికి శిష్యుడు. కొద్దిరోజుల్లోనే రస్సెల్ తో నువ్వు చెప్పిందంతా తప్పు అని చెప్పిన గొప్ప మేధావి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో స్టెయిన్ కొంతకాలం పాఠాలు చెప్పాడు. ఒక్కోసారి క్లాస్ లో పాఠాలు కూడా చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఆయన పాఠం చెప్పదలచుకున్నప్పుడు విద్యార్థులను ఉదయం 6 గంటలకే రమ్మనేవారు. అంతటి మేధావి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసి ఆసక్తి కలిగి ఆయన మీద ఒక పెద్ద వ్యాసం రాశాను. దాంతో పాటు మరికొన్ని వ్యాసాలు కూడా కలిపి పుస్తకం వేశాను. ఇవన్నీ ‘మిసిమి’ పత్రికలో వచ్చినవే.

18. సాహిత్యం పలు రకాలుగా పరిణామం చెందుతున్న ప్రస్తుత కాలంలో వస్తున్న రచనల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఈనాటి రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.
జ :-    ఇప్పుడొస్తున్న సాహిత్యాన్ని ఒక యూనిట్ గా చూడలేము. వేలమంది రాస్తున్నారు. అన్నిరకాల పుస్తకాలు అనేక ప్రక్రియలతో వస్తున్నాయి. ఇదొక సూపర్ మార్కెట్ లాంటిది. Lu Xun అని గొప్ప చైనీస్ రచయిత. ఆయన ఒక మాట అంటారు. “పుస్తకాల షాపులో ఒకటి విప్లవానికి సంబంధించినది, దాని పక్కనే లవ్ స్టోరీకి సంబంధించిన పుస్తకం ఉంటుంది. ఈ రెండింటిలో ఎవరికి ఇష్టం ఉన్న పుస్తకాన్ని వాళ్ళు కొంటారు. నీ పుస్తకానికి విలువ ఏముంది?” అని. అంతే కదా! ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కో కోణంలో చర్చించలేము. అనేక కోణాలుంటాయి. కానీ అవసరాలు ఎన్నున్నాయో తెలియదు కదా! అందుకే ఇది మంచి చెడు అని చెప్పలేము. ఎవరికి ఇష్టమైంది వారు రాసుకుంటారు. మీకు చెప్పాను కదా! రచన ఏదైనా పాఠకులను రంజింపజేసేదిగా ఉండాలి. మనకు ఇష్టమైనది రాసినా, పాఠకులకు ఆకర్షణీయంగా, ఆలోచింపజేసేదిగా ఉండాలి. చాసో గొప్ప రచయిత. ఒక్కొక్క పదాన్ని చెక్కుతాడు. రాసి అక్కడ పెడతాడు. మళ్లీ మళ్లీ చూస్తాడు. మార్పులు చేస్తాడు. అందుకే వ్యర్థమైన పదం ఒక్కటి కూడా కనిపించదు. కాబట్టి మనలను మనం సరిదిద్దుకుంటూ రచన చేయాలి. అప్పుడే మంచి పుస్తకం రాగలుగుతుంది.

సంతోషం సార్, మా కోసం ఎంతో ఓపికగా మీ విలువైన సమయాన్ని కేటాయించి, మీ సాహితీ యాత్రా విశేషాలను తెలియజేసినందుకు మా తరపున, మా మయూఖ పాఠకుల తరపున కృతజ్ఞతలు నమస్కారాలు🙏🏼

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

” గిన్నిస్ బుక్”

by Vijaya Kandala November 22, 2024
written by Vijaya Kandala

ప్రముఖ రచయిత్రి విజయ కందాళ గారు ” గిన్నిస్ బుక్” అనే పుస్తకం గురించి వారు చేస్తున్న ఆడియో ‘ మితభాషి‘ శబ్ద సంచికలో ప్రముఖ రచయిత ముక్తవరం పార్థ సారథి గారు రచించిన పుస్తకం లోనుంచి విషయాన్ని సమీక్షిస్తున్నారు వినండి , తెలుసుకోండి. నోరిస్ మాక్ విర్టర్, రాస్ మాక్ విర్టర్
కవల సోదరులు.
లండన్ లో August 1955
తొలి ప్రచురణ చేసిన గిన్నిస్ బుక్ గురించి మీకోసం..
-సంపా

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us