మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

దైన్యం నిండిన శవవాహకుల గాథ

by డా. ఏనుగు నరసింహారెడ్డి November 22, 2023
written by డా. ఏనుగు నరసింహారెడ్డి

ఎలనాగ చేసిన సైరస్‌ మిస్త్రీ అనువాద నవల ‘శవాలను మోసేవాడి కథ‘పై వ్యాసం

కాలం మారినా అన్ని మతాలలోని అట్టడుగు వర్గాల స్థితిగతులు ఉన్నత వర్గాలతో పోల్చదగినంతగా మారలేదు. అందుకు సామాజిక కారణాలు, ధార్మికత నెపంతో రుద్దబడిన కట్టుబాట్లు, వాటి వల్ల ఆవరించిన పేదరికం ప్రధాన కారణాలు. ఈ వలయం నుండి బయటపడలేని సమూహాలు కనీసావసరాలకు, మానవ హక్కులకు నోచుకోనంతగా అణచివేయబడ్డాయి. అటువంటి సమూహాలు సాహిత్యానికెక్కడం అరుదు. మరాఠాలో దళిత సాహిత్యం విస్తారంగా వచ్చింది కానీ అది హిందూ మతంలోని నిమ్న కులాల కోసం రాయబడింది. అదే ప్రాంతం నుండి పార్శీ మతంలోని ఖాంథియాల గురించి రాయబడిన నవల Chrolicle of a Corps Bearer.

ఈ నవలా రచయిత సైరస్‌ మిస్త్రీ. ఈయన జర్నలిస్టుగా, Short Films రచయితగా ప్రసిద్ధుడు. Radiance Ashes అనే నవల, కొన్ని కథలు ప్రచురించిన మిస్త్రీకి Chrolicle of a Corps Bearer చాలా పేరు తెచ్చింది. దీనికి సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు 2014 సం||నికి గాను దక్షిణాసియా సాహిత్య బహుమతి లభించింది. సాహిత్య అకాడమీ కోరిక మేరకు ప్రసిద్ధ అనువాదకుడు ఎలనాగ ఈ నవలను ‘శవాలను మోసేవాడి కథ’గా అనువదించారు.

పార్సీలలో ఒక ప్రత్యేకమైన తెగ ఖాంథియాలు. శవాలను శుద్ధి చేయడం, మోసుకుపోవడం, రాబందులు ఇతర పకక్షులకు ఆ శవాలను ఆహారంగా బురుజుల మధ్య వదలి రావడం వీరి వృత్తి. ఈ వృత్తి నిర్వహణ కోసం ఖాంథియా కుటుంబాలన్నీ బురుజుల దగ్గరి స్మశాన వాటిక దగ్గరే నివసిస్తాయి. కుటుంబాలన్నీ అక్కడే నివసించడం వల్ల స్మశానవాటిక ప్రభావం వారి మీద పడుతుంది. శుభ్రత లోపిస్తుంది. పిల్లలకు సమీపంలో బడి ఉండదు. చుట్టూ అడవి ఆవరించి ఉండడం వల్ల పురుగు పుట్రతో సహవాసం తప్పదు. ఇక అసలు వృత్తి నిర్వహించే శవ వాహకులకు చాలా వేదన ఉంటుంది. సాధారణంగా శవాలకు దగ్గరగా ఉండలేని పరిస్థితి మనుష్యులది. వీరు మాత్రం శవాల శరీర భాగాలను శుభ్రపరిచి, చనిపోయిన ప్రదేశం నుండి బురుజుల ప్రాంతాన్ని మోసుకు రావాలి. బురుజుల ప్రాంతంలో శవాలను ఎత్తైన ప్రాంతానికి తీసుకుపోయి, మళ్ళీ లోయలోకి దించాలి. ఈ పనిలో శారీరక శ్రమ ఎక్కువే కాక తీవ్రమైన మానసిక అయిష్టతను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్ణీత సమయంలేని పని కూడా కావడం మరొక సమస్య. అందువల్ల ఖాంథియాలంతా తప్పనిసరిగా మద్యం సేవిస్తారు. శవాల అంత్యక్రియలు కాకముందు మందు తాగొద్దని నిబంధన పెడతారు ట్రస్టీలు. మందు కొడితేనే కానీ శవాల పని చేయలేమన్న బాధ ఖాంథియాలది. ఇంత కఠినమైన వృత్తిలో ఉన్న ఖాంథియాలకు వచ్చే కూలీ తక్కువ. సెలవులు ఉండవు. అందువల్ల ఆ కుటుంబాల స్త్రీలు వ్యభిచారం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఆ వృత్తిలో విటుల చేతుల్లో స్త్రీలు హత్యకు గురైన సందర్భాలూ ఉంటాయి. ఇలాంటి ఖాంథియాల దయనీయ జీవితాన్ని రెండు మూడు కుటుంబాల కథల నేపథ్యంలో విస్తృతంగా చిత్రించాడు రచయిత.

శవాలు మోసేవాడు ఫిరోజ్‌ ఎల్చిదానా. ఫిరోజ్‌ పుట్టి పెరిగింది బొంబాయిలోని ఇచ్చాపోరియా  అగ్ని దేవాలయ ప్రాంతం. చదువు ఆగిపోవడంతో బొంబాయి వీధులన్నీ లక్ష్యం లేకుండా, జులాయిగా తిరిగాడు. డూంగర్‌ వాడీ బురుజుల దగ్గర ఖాంథియాగా నుసెస్సెల్లార్‌ పని చేస్తూ జీవితం గడుపుతాడు.

ఫిరోజ్‌ నాన్న ఫ్రాంరోజ్‌ పార్శీ పూజారి. ఇచ్చాపోరియా గుడి వెనక నివసించే ఫ్రాంరోజ్‌ కుటుంబానికి చాలా గౌరవప్రదమైన స్థానం ఉంటుంది పార్శీ సమాజంలో. ఫ్రాంరోజ్‌ నాన్న మొదటి భార్య కూతురు రుదాబె. ఆమె ఫ్రాంరోజ్‌ కు సోదరి కిందే లెక్క. కానీ రుదాబెతో ఫ్రాంరోజ్‌ లైంగికాసక్తిని కనబరచడంతో వారి తండ్రి తీవ్రంగా మందలిస్తాడు. రుదాబె చెడు తిరుగుళ్ళతో బొంబాయి వీధుల వెంట కనబడుతుంది. అలాంటి తిరుగుడులలో భాగంగా తెమూరస్‌ తో కలుస్తుంది, పెళ్ళాడుతుంది. అలా తెమూకు ఫ్రాంరోజ్‌ కు వైరం ఏర్పడుతుంది. వారికి సెపిడె అనే కూతురు పుడుతుంది. వారిది శవాలను మోసే వృత్తి. డూంగర్‌ వాడీలో ఉంటారు.

అగ్ని దేవాలయం దగ్గర ఉంటున్న ఫ్రాంరోజ్‌ కు ఇద్దరు కొడుకులు, విస్ఫీ, ఫిరోజ్‌. విస్ఫీ చదువులో ఆసక్తి చూపిస్తాడు కానీ, ఫిరోజ్‌ ఫేలై జులాయిగా తిరుగుతాడు. బొంబాయి అంతా తిరిగి చెడు అలవాట్లన్నీ నేర్చుకుంటాడు. తల్లి హిల్లాతో కలిసి డూంగర్‌ వాడీలో ఒక బంధువు అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు సెపిడెను చూసి ప్రేమలో పడతాడు. ఇక అప్పడినుండి డూంగర్‌ వాడీకి వెళ్ళి సెపిడెతో తిరుగుతాడు. సెపిడెను పెళ్ళాడడానికి ఖాంథియాగా మారాలన్న షరతుకు తల ఒగ్గుతాడు. అమ్మానాన్నలను ఎదిరించి పెళ్ళాడి శవాలను మోస్తూ బతుకుతుంటాడు. ఫరీదా అనే కూతురు పుట్టాక సెపిడె పాము కరిచి చనిపోతుంది. శవవాహకులు అంతా తాగి శవాలను మోస్తూ ఉంటారు. ఫిరోజ్‌ ఒకరోజు శవాన్ని మోస్తూ బోర్లా పడేస్తాడు. ట్రస్టీలు మెమో ఇస్తారు. ట్రేడ్‌ యూనియన్‌ పెట్టడంతో తగ్గుతారు.

బొంబాయిలో పార్శీ ప్రముఖుడు నారిమన్‌ మొదటి భార్య కొడుకు వ్యాధితో బాధపడుతూ పార్శీగా చనిపోవాలనుకుంటాడు. అందుకు అతని తమ్ముడైన రోహింటన్‌, ఫిరోజ్‌ ను అతని తండ్రిని ధర్మ సలహాకు ఒప్పించమంటాడు. ఫిరోజ్‌ కోరికను తిరస్కరించిన తండ్రి, నారిమన్‌ డబ్బుతో ట్రస్టీలను ఒప్పించి పార్శీ పద్ధతిలోనే కొడుకు అంత్యక్రియలను జరిపిస్తాడని అంచనా వేస్తాడు. అతని అంచనా ప్రకారం ట్రస్టీలు నారిమన్‌ కొడుకు జోసెఫ్‌ శవాన్ని పార్శి పద్ధతిలో రాబందులకు పెట్టడానికి ఒప్పుకుంటారు. కానీ, ఇది పార్శీమతం పట్ల విఘాతమని బుఖియా, జోసెఫ్‌ శవాన్ని రాత్రికి రాత్రి దొంగిలించి క్రిస్టియన్‌ స్మశానవాటికలో రహస్యంగా అంత్యక్రియలు జరిపేస్తాడు.

ఫ్రాంరోజ్‌ మరణించడంతో ఆయన పెద్ద కుమారుడు విస్ఫీ, తమ్ముడు ఫిరోజ్‌ సహాయంతో ఇల్లు ఇతర ప్రాంతానికి మార్చడంతో కథ ముగుస్తుంది.

ఖాంథియాల దైన్య జీవితానికి తిరుగులేదని చెప్పే ఒక గొప్ప ధర్మపన్నాగం మతంలో ఉంది. ‘నిజానికి నుసెసెల్లార్లు శవాల కుళ్ళు తాలూకు దుష్ప్రభావాన్ని పీల్చుకొని సమాజాన్ని కాపాడుతారు. ఈ ఉదాత్తమైన పనికి ప్రతిఫలంగా వారి ఆత్మ మళ్ళీ పుట్టదని మా మతగ్రంథాలు వాగ్దానం చేస్తున్నాయి. నిష్టతో శ్రద్ధతో ఆ పనిని నిర్వర్తించే శవ సంరక్షకుడు దేహం శిథిలం కావడం, మరణం, పునర్జన్మల నుండి విముక్తి పొందుతాడు’ అని ఫిరోజ్‌ చెప్పుకొస్తాడు. అతనే ‘అయితే, ఈ జన్మలో ప్రజలు అతన్ని మకింలాగా, మలంలాగా, అస్పృశ్యునిగా చూస్తారనే విషయాన్ని మత గ్రంథాలు రాయలేదు’ అని కూడా అంటాడు.

ఏమీ చేయలేని అశక్తులు యజమాని లేని సమయంలో ఎంత కోపంగా మాట్లాడుకుంటారో మామూలుగా యజమానులు ఊహించలేరు. ఫిరోజ్‌ పని ఒత్తిడి వల్ల ఒకసారి కళ్ళు తిరిగి శవాన్ని పడవేస్తాడు. అప్పుడు యాజమాన్యం వాళ్ళకు మెమోలు ఇచ్చి శవాలను మోసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించకూడదని హెచ్చరిస్తుంది. అప్పుడు నుసెసెల్లారు యాజమాన్యాన్ని బూతులు తిడతారు. వాడీ పని చేస్తే తెలిసేది అని కూడా ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు.

ఖాంథియాలలో భరించలేనంత పేదరికం ఉంటుంది. పూట గడవడం కోసం మగవాళ్ళు శవాలను మోస్తే కొందరిండ్లల్లో స్త్రీలు వ్యభిచారం చేయడం కూడా తప్పనిసరవడం ఈ నవలలో చిత్రించాడు రచయిత. తెమూరస్‌ భార్య రుదాబె దాదాపు ప్రతిరోజు రాత్రి అలంకరించుకొని పోవడం భర్తకు తెలుసు. ఇంకోరకంగా ఆయన అనుమతి కూడా ఉంటుంది. చిన్న పాపను భర్తను ఇంట్లో వదిలేసి వెళ్ళి రుదెబా తీవ్రమైన లైంగిక వేధింపులకు గురై చనిపోతుంది. కానీ దోషి దొరకడు. ఎవరికీ ఏ శిక్షా పడని, పడడానికి పట్టుబట్టలేని స్థితి ఖాంథియాలది.

మతం పట్ల మనుషుల పట్టుదల ఎంత కఠినంగా ఉంటుందో ఈ నవల అడుగడుగునా గమనించవచ్చు. నిజానికి ధర్మం పేరు మీద మతం విధించిన కట్టుబాట్లు మనుష్యుల్ని ఎంతో బాధకు గురి చేస్తుంటాయి. అయినా వాటిని సడలించరాదన్నంత స్థిరంగా మనుష్యుల అంతరంగంలో అవి గూడు కట్టేట్లు చేయడంలో అన్ని మతాల మతపెద్దలు విజయమే సాధించారన్నది శవాలు మోసేవాడి కథలో గమనించవచ్చు. జోసెఫ్‌ నారిమన్‌ కొడుకే అయినప్పటికీ ఆయన క్రిష్టియన్‌ భార్యకు పుట్టిన కొడుకు. అతను ఇంగ్లండులో మతాల ధార్మికత మీద పరిశోధన చేసి పార్శీ మతమే అన్ని మతాలలో గొప్పదని భావించి తను చనిపోయాక పార్శీ మతం పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని భావించి బొంబాయి వస్తాడు. జోసెఫ్‌ తమ్ముడు రోహింటన్‌, ఫిరోజ్‌ తో తనకున్న స్నేహాన్ని ఆధారం చేసుకొని ఫిరోజ్‌ తండ్రి ఫ్రాంరోజ్‌ తో పార్సీ ట్రస్టీలకు సిఫారసు చేయించుకొని అన్నకు పార్సీ పద్ధతిలో అంత్యక్రియలు జరిపించాలనుకుంటాడు. ఫ్రాంరోజ్‌ అందుకు తప్పుబట్టడమే కాకుండా నుసెసెల్లార్‌ అయిన ఫిరోజ్‌ కూడా దానికి వ్యతిరేకించాలంటాడు. చివరికి నారిమన్‌ తన పలుకుబడితో పార్సీ ట్రస్టీలను ఒప్పించగలుగుతాడు. కానీ ఆ ధర్మ వ్యతిరేక కార్యానికి బుఖియా గండికొట్టి ఆ శవాన్ని క్రిస్టియన్‌ సిమెటరీలోనే ఖననం చేస్తాడు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయమేమిటంటే క్రిస్టియన్‌ సిమెటరీ నిర్వాహకుడు గోమ్స్‌ శవపేటిక లేకుండా ఖననం చేయడం తప్పని, అంతటి రాత్రిలోనూ ఏ ప్రలోభాలకు లొంగకుండా పేటిక తెప్పించాకే ఖననం చేయనిస్తాడు.

శవాలను మోసేవాడి కథలో కొన్ని అలవోకగా వేసినట్లనిపించే ప్రశ్నలలో గొప్ప జీవన తాత్వికత పొడసూపుతుంది. సెపీడె తన జీవిత కాలమంతా జంతువులకు, పకక్షులకు, పురుగు పుట్రకు ప్రేమతో ఆహారం పెడుతుంది. చివరకు ఆమె పాముకాటుకు చనిపోయిందని కూతురు ఫరీదాకు చెప్పినప్పుడు ఆమె వేసిన అస్పష్టమైన ప్రశ్నలో ఈ ప్రకృతిలో ఏ నీతీ, ధర్మం లేనే లేదా అనే అర్థం ఇమిడి ఉన్నట్లు ఫిరోజ్‌ కు అనిపిస్తుంది. ఫిరోజ్‌ నుసెసెలార్‌ గా మారడానికి చెప్పుకున్న కారణం తాత్వికంగా ఆలోచనా త్మకంగా ఉంటుంది. అతడు ఇలా అనుకుంటాడు :

”నా విధి తాలూకు భవిష్య దర్శనం నన్ను ఆ అంతిమ విశ్రాంతి స్థలాలవైపు లాగిందా? ఆ ప్రదేశాల నుండి ఇంటికి తిరిగి వచ్చింతర్వాత ఒక్కసారి కూడా నేను కాళ్ళు చేతులు కడుక్కోలేదు. రాత్రివేళ మా దేవాలయంలోకి పోయే ముందు స్నానం చేసే ఆచారాన్ని ఎన్నడూ పాటించలేదు. నేను చేసిన నీచమైన మురికి పనుల గురించి తెలిస్తే నాన్న చాలా భయపడేవాడు. ఒకవేళ మనుష్యులకు పునర్జన్మ అనేది ఉంటే, ఇప్పుడు సైతం అప్పటి నా రహస్య కార్యకలాపాల గురించి తెలిస్తే ఆయన నన్ను క్షమిస్తాడనుకోను”.

మనుషుల ప్రవర్తనలోని డొల్లతనాన్ని రచయిత అనేక సందర్భాలలో వ్యక్తపరుస్తాడు. ఒక తల్లి శవాన్ని తీసుకుపోతున్నప్పుడు ఆమె కుమారుడు వీళ్ళేదని అడ్డం పడతాడు. పెద్దవాళ్ళు సర్దిచెప్పి నప్పుడు పాడెలో తనూ పడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది వాస్తవమైన ఫీలింగా, లేక ప్రదర్శనా అనే అనుమానాలు పాఠకులకు రావాలని రాసినట్లనిపిస్తుంది. ఆ శవం పోతే బతకలేమన్నట్లు ఏడ్చినవాళ్ళు శవాన్ని లేపడంలో కొద్దిగ కూడా సహాయం చేయరు. ఎంతో కష్టంగా ఖాంథియాలు శవాన్ని అతి కష్టం మీద మోస్తే కంటి తుడుపుగా ఇరవై రూపాయల టిప్పుతో సరిపెడతారు.

ఖాంథియాల వృత్తి దైన్యం, తద్వారా విస్తరించే కుటుంబ దైన్యం, మత పెద్దలు, ట్రస్టీల చర్యలలోని డొల్లతనం విస్తృతంగా చర్చించిన నవల ”శవాలను మోసేవాడి కథ”. పట్టణీకరణ విపరీతంగా పెరిగిన ఇలాంటి రోజుల్లో శవాలను తినే పకక్షులు జంతువులు రావడం లేదనే వాదనకు ఆస్కారం కలిగించే రెండు మూడు సంఘటనల్ని కూడా ఉదహరించారు రచయిత. విలువైన భూముల ఆక్రమణ కోసం శవాలను తినే జీవరాశి రావడం లేదనే వాదనను పుట్టించారనే ఇంకో వర్గపు అభిప్రాయానికి కూడా అవకాశం కల్పించాడీ నవలా రచయిత.

ఇది ఒక మౌలికమైన విషయాన్ని అద్భుతంగా చర్చకు పెట్టిన నవల. తెలుగులో రాయబడ్డ నవలేనా అన్నంత సహజంగా అనువదించారు అనువాదకులు ఎలనాగ.

November 22, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆడదంటే

by Y. Sujatha November 22, 2023
written by Y. Sujatha

ఆడదంటే కష్టాలు కన్నీళ్ళు కాదు –
బయపడకు తల్లి భయఆపడకు
ఇప్పుడు నీ కర్తవ్యం కన్నీళ్ళు కార్చడం కాదు
నీ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవడం.
నీశక్తి నీవు తెలుసుకొని. ఆపరకాళిలా మారాలి నివు
మహభారతపర్వంలో ద్రౌపతి కావు నీవు
నిప్పును నీళ్ళలా దోసిళ్ళతో సేవించగల నేర్పరివి నివు
అబలవు కావు నీవు బద్దలైన అగ్ని పర్వతం జ్వలనం నీవు.
స్తన్యం. అందని చంటిపిల్లలా ఎక్కేక్కి పడి ఏడువకు నీవు
మోసపోయిన ఆడకూతూర్ల నిక్కమైన దిక్కారస్వరం నీవు..
దగాపడ్డ ఆడపిల్లలు ఆలపించిన విముక్తగేయం నీవు.
ప్రశ్నార్ధకమైన బతుకులకు పోరాట నినాదం నీవు ..

శాంతివ్యూహాలను వల్లిస్తే సరిపోదు నీవు
సర్వతంత్రులను మీటి నీవు వేటాడే మగ మృగాలను ప్రారతోలాలి నీవు
అప్పుడే తిరగపడ్డ వీణ ఆగ్రహాజన తంత్రివి నీవు
అసిత్వ పోరుకు ఆర్తివి కావాలి నీవు
పక్షవాతం వచ్చిన మగహృదయలకు నీవు అక్షరజ్ఞానా ఖడ్గాలను సంధిస్తూ నీవు
శస్త్రచికిత్సలు చేయాలి నీవు
రాబోయే తరాలకు కొత్త కాలజ్ఞానం లిఖిoచాలి నీవు
పసిరికలు వచ్చి పచ్చబడ్డ కీచకుల కళ్ళల్లో నీవు కారం నీళ్ళు చల్లాలి నీవు
నీవు ఓక సైన్యంగా పోరాటం చేస్తూ
పోరు జీవన పాఠాలు నేర్పాలి నీవు
మగవాళ్ళ గుండెల్లొ పెల్లుబికిన అగ్నిశిఖలా ప్రజ్వలించాలి. నీవు
స్త్రీ జాతిస్వప్నం సాకారం చేస్తూ ప్రణవమై ప్రదీప్తించాలి నీవు
అప్పుడే ధిక్కార పు సమాజంలో దివిటివి అవుతావు నీవు
స్వయం సంపూర్ణ చిహ్నానివి నీవు అవుతావు బిడ్డా..

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వైద్య పరిజ్ఞానం- ఇంట్లో ఆరోగ్యం

by రంగరాజు పద్మజ November 22, 2023
written by రంగరాజు పద్మజ

డా॥ పెళ్ళకూరి జయప్రద సోమిరెడ్డి.

ప్రతి జీవి తన ఉనికి, బతుకు కోసం పోరాడుతూనే ఉంటుంది. శరీరంలోని ప్రతి జీవకణం ప్రోగ్రాం చేయబడి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే అయినా… మనుగడకోసం యుద్ధం తప్పదు!

   ఈనాటి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువగా దీర్ఘ రోగాలతో బాధపడుతున్నారు. రకరకాల వ్యాధుల గురించీ, ఆ బాధల నుంచి ఎలా తట్టుకొని నిలబడాలో * వైద్య పరిజ్ఞానం -ఇంట్లో ఆరోగ్యం* అనే పుస్తకం ద్వారా  శాస్త్రీయ పరిజ్ఞాన వ్యాస పరంపరను మనకు డాక్టర్ పెళ్ళకూరు జయప్రదా సోమిరెడ్డి గారు అందించారు. వీరు వృత్తిరీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి రీత్యా చక్కని రచయిత్రికి.  నవల, కథలు, కవితలు ఇలా ఎన్నో ప్రక్రియలలో  రచనలు వెలువడ్డాయి.

   ఈ పుస్తకం చదివినప్పుడు నేను గమనించినదేమంటే? అటు ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే… రచయిత్రిగా సామాన్య శాస్త్ర వ్యాసాలు రాసి  ప్రజలలో వైద్యం, ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.

  రోజులు మారినా, మానవత్వ విలువలు మారినా, చదువుతున్న వారి సంఖ్య పెరిగినా, నాగరికత ఎంత పెరిగినా, మూఢనమ్మకాలతో బలైపోయే రోగులు ఎందరో???

ఇలా మూఢనమ్మకమున్న రోగులు ఆరోగ్యానికి ఆమడ దూరంగా ఉండడం… రక్తదానం చేస్తే తాము బలహీనులవుతామని అపోహలో దగ్గర వారిని కోల్పోవడం ఇలాంటి సంఘటనలు తమ వృత్తిరీత్యా ఎదుర్కొని, ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరుగకూడదని ఒక ప్రేరణ ప్రజల్లో కల్పించి, వారి అజ్ఞానం తొలగించాలని సైన్స్ ఆధారిత వ్యాసాలు రాశారు.

    వ్యాసాలు పాఠకులపై ఎక్కువ ప్రభావం చూపెట్టలేవని, కథలుగా మలచానని స్వయంగా రచయిత్రి తమ ముందుమాటలో రాశారు.

         ఆడపిల్లనే చిన్న చూపుతో కడుపులో ఉన్న బిడ్డను ఆపరేషన్ చేసి తీయాలంటే, వద్దన్న తల్లి-అత్తల అమానుషానికి బలైన శిశువు మృతిని మరో కథగా మలిచారు.

   ఎయిడ్స్ వంటి రోగాల పట్ల సరైనా అవగాహన లేక ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని వదిలేయడం, డిప్రెషన్ అనే జబ్బును దయ్యం పట్టిందని, నాటు వైద్యాలు చేయించి నిండు జీవితాలు నాశనం చేసుకున్నటువంటి ఎన్నో ఘటనలు రచయిత్రి చేత కథలుగా మలచబడ్డాయి.

   రక్త సంబంధీకుల మధ్య వివాహాలు అంగవైకల్యంతో పుట్టిన పిల్లల గురించి చక్కటి  అవగాహన కలిగేలా కీబోర్డ్ అనే కథను రాశారు.

  ఈ వీణకు శృతి అనే నవల అవయవ మార్పిడి పట్ల అవగాహన కల్పించే రచన!

   అలాగే వైద్యపరమైన ఎన్నో విషయాలపై వ్యాసాలు , కవితలు రాసి, రోగుల బంధువులు వాళ్ళ నిర్లక్ష్యంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని వాటి గురించి తెలిపారు!

   ఈ పుస్తకానికి ముఖచిత్రం రచయిత్రి- డాక్టర్ పెళ్ళకూరి జయప్రద రెడ్డిగారి చిత్రమే అందంగా వేశారు.

   ఈ పుస్తకానికి ముందు మాట శ్రీ గుమ్మా సాంబశివరావు గారు విశ్రాంత ప్రిన్సిపల్ రాస్తూ రచయిత్రిగా, డాక్టర్ గాతన అనుభవాలను రంగరించి వైద్య విజ్ఞానాన్ని- సాహిత్య సంస్కారాన్ని జోడించి రాసిన ఈ పుస్తకం అమృత గుళికని ప్రశంసించారు.

   ఎంత అభివృద్ధి చెందామని అనుకుంటున్నా ఇంకా మనకు ఆరోగ్యం పట్ల సరైన అవగాహన ఏర్పడలేదని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పుస్తకం ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఈ ఆరోగ్య అవగాహన కల్పించే వైద్య పరిజ్ఞానం పుస్తకంలో… మహిళలకు సంబంధించిన వ్యాధుల గురించిన ఎన్నోఅధ్యాయాలు ఉన్నాయి.

1. పిల్లలు కలగక పోవడానికి కారణం

2.తల్లి కావాలనుకుంటే…

3. గర్భం ధరించాక,

4. అబార్షన్ పర్వం,

5. ముత్యాల గర్భం,

6. ఎదురు కాళ్ళు,

7. ఎక్టోపిక్ ప్గ్రెన్సీ ( పక్కపేగులో గర్భంరావడం),

8.  ప్రసవంలో ప్రమాదం,

9.  బ్లడ్ బ్యాంకు లేని రోజుల్లో,

10. నాలుగు దశాబ్దాల సిజేరియన్ చరిత్ర.

       ఈ అంశాలపై చక్కని వ్యాసాలు అందించారు డాక్టర్ జయప్రదగారు.

  తల్లి కావాలనే కోరికను ఎండమావి చేయకూడదని, తపనతో పిల్లలు కలగక పోవడానికి కారణాలు, వైజ్ఞానిక కారణాలతో పాటు డాక్టర్లు ఏం చేయగలరు? అని విశ్లేషించిన వైనం చాలా బాగుంది. అలాగే సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.

   తల్లి కావాలనుకునేవారు పాటించాల్సిన మూడు సూత్రాలను పాటించే విషయ వివరణ చాలా బాగుంది.

   అలాగే గర్భం రాకముందు వారి మానసిక పరిస్థితి- ఒత్తిడికి లోనుకావద్దనే సలహా పాటిస్తే ఆ సమస్య నుండి బయటపడే విధానం చక్కగా వివరించారు.

   గర్భిణీ స్త్రీలలో వచ్చే మార్పులని మొదటి మూడు నెలలు గుండెల్లో మంట మలబద్ధకం మొదలైన శీర్షికలు పెట్టి చాలా చక్కగా వివరించారు. గర్భిణీ స్త్రీల నిద్రలేమి ఎందుకు వస్తుందని చెప్పారు.

   ఇక గర్భస్రావాలు ఎన్నిరకాలు? వాటిని ఎలా కనుక్కోవాలి? వాటి నిర్ధారణ !వాటికి వైద్యం? పూర్తిగా గర్భస్రావం , మరియు పూర్తిగాని గర్భస్రావాలు ఎలా ఉంటాయి? వాటి లక్షణాలు.. వాటి నివారణకు ఏం చేయాలని వీటికి కారణాలు, వైద్యం, ఇవన్నీ గర్భం దాల్చే యువతులకే కాదు కుటుంబ సభ్యులు కూడా తెలుసుకొని ఉంటే… గర్భం దాల్చే స్త్రీలకే కాకుండా, ఆ యువతులకు ఒత్తిడికి లోనుకాకుండా చేయగలరు. అంత విషయ పరిజ్ఞానం ఉందీ పుస్తకంలో…

  ముత్యాల గర్భం అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది?  వాటి లక్షణాలు- వైద్యంతో పాటు, గర్భిణీ స్త్రీకి కడుపునొప్పి రావడానికి కారణాలు, ఎదురు కాళ్లతో ప్రసవంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపరేషన్ కు సంబంధించిన విషయాలు కూలంకషంగా చర్చించారు స్వతహాగా రచయిత్రి అయిన డాక్టర్ జయప్రద గారు.

   గర్భం పక్క పేగుల్లో రావడానికి కారణాలు, ఇన్ఫెక్షన్లు, వైద్యం కూడా వివరించారు.

      ప్రసవంలో ప్రమాదాలు గురించి ఎంతచక్కగా వివరించారంటే ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన విషయమిది.

  సరే ఇక రక్తం గురించి ఇప్పుడు సామాన్యులకు కూడా తెలుస్తుంది , బంధువులు ఇవ్వకపోయినా, బ్లడ్ బ్యాంకులలో దొరుకుతున్నది లేదా రక్తదాతలు ఇస్తారని …ఈ అధ్యాయం ఎందుకు అనుకోవద్దు! ఒక వైద్యురాలి ద్వారా తెలిసిన విషయం అరాకొరగా ఉండకుండా… పూర్తి అవగాహనతో చదువుకున్న వైద్యశాస్త్రంతో వివరించారు కాబట్టి ఈ నా ఆలోచనల్లో- ఆమె అధ్యాయంకూడా ముఖ్యమే! ఎందుకంటే? రక్తం కావాల్సిన వారికే  కాకుండా రక్తదాతలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి ఈ సలహాలతో అపోహలు తొలగిపోతాయి.

  40 సంవత్సరాలుగా ఆపరేషన్ల గురించి, వాటి మీద అపోహల గురించి చెప్పి, అటు పేషెంట్లూ నష్టపోకుండా, ఇటు డాక్టర్లు కూడా వివాదాస్పదంలో పడకుండా ఉపయోగపడే అధ్యాయమే ఈ నాలుగు దశాబ్దాల చరిత్ర ! అందుకు గల కారణాలు మనమూ తెలుసుకోవాలి…

   “గర్భసంచి సంబంధిత జబ్బుల విభాగంలో” ఎన్ని విభాగాలున్నాయో? వాటి పనితీరులు చక్కగా వర్ణించారు రచయిత్రి.

   మోనోపాజ్ (ఋతువిరతి ) ఎదుర్కొనే మహిళల అవస్థలు- అనారోగ్యాలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూనే.. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని హెచ్చరిక చేశారు. గర్భసంచి జారడం గురించి చక్కని వివరణ ఇచ్చారు.

    ఇలా మహిళలకు గర్భసంచి సంబంధిత రోగాలు, వాటి లక్షణాలు ,ఆరోగ్యం గురించి అవగాహన లేకపోయినా, సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోయిన ఆ వ్యాధి క్యాన్సర్ గా ఎలా మారుతుందని? అప్పుడిక చేసేది ఏమీ లేక క్యాన్సర్ హాస్పిటల్కు పంపడమేనని బాధగా అనడం.. స్త్రీ సహజమైన జాలిగుణం కనపడుతున్నది డాక్టర్ గారిలో…

   మూఢ నమ్మకాలగురించి చెప్తూ డాక్టర్ కూ పేషెంట్ కు మధ్య స్నేహభావం, నమ్మకం ఉండాలని చెప్పడం బాగుంది.

  అప్పుడే పేషెంట్ తన మనసులోని బాధని చెప్పుకుంటుంది కదా!

   ముఖ్యంగా డాక్టర్ గానూ రచయిత్రిగాను చెప్పేది ఏమిటంటే యువత  వ్యాధి సోకిన తరువాత మూఢనమ్మకాలతో  కాలం వెళ్ళబుచ్చకుండా ఆరోగ్యంపట్ల జాగ్రత్త, సైన్స్ విజ్ఞానాన్ని కలిగి ఉండాలనీ, డాక్టర్లు పేషెంట్లకు ఏం వైద్యం చేస్తున్నారో తెలుసుకొని ఉండాలని , వితండ వాదంతో పూర్తి అవగాహన ఏర్పరుచుకోకుండా డాక్టర్ల పై నిందలు మోపడం సరికాదనీ సూచించారు.

       కొన్ని చిట్కాలు ఇంట్లో దొరికే పదార్థాలలో ఏ ఏ మంచి గుణాలుంటాయో? వాటి వాడకంవల్ల ఎటువంటి ఫలితాలను పొందుతామో  ఒక అమ్మమ్మ వలెనో, ఒక బామ్మ వలెనో చక్కగా విడమర్చి చెప్పారు రచయిత్రి .

అలానే జీవన విధానాన్ని మార్చుకోమని సున్నితంగా హెచ్చరిక చేశారు. మంచి ఆహారాలు తీసుకుంటే వాటిలో ఉండే సుగుణాలు అవి ఎలా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని వివరించారు. నమ్మకూడని నమ్మకాలు నమ్మవద్దని చెప్పారు.

    ఈ విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మన ఆరోగ్యం పట్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, వైద్యం మొదలైన ఎన్నో విషయాలు తెలుసుకొని, వాటిని ఆచరించి ,మన జీవితాలను బాగు చేసుకుందాం! నలుగురికీ చెప్పి డాక్టర్ గారి వలె సమాజంలో ఆరోగ్యపరమైన సేవచేద్దాం!

  అందరూ జబ్బుల పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల , డాక్టర్లు చెప్పిన సలహాలు పాటించి, ప్రాణాలు కాపాడుకొని, హాయిగా జీవించాలనే సదుద్దేశంతో చేసిన రచన ఈ పుస్తకం వైద్య పరిజ్ఞానం-ఇంట్లో ఆరోగ్యం. ఈ రచన చదివి….

శతంజీవ – శతదో వర్ధమానః

శతం వసంతాన్- శతం హేమంతాన్ ॥

వంద వసంతాలు , వంద హేమంతాలు వర్ధిల్లుతూ జీవించండి॥

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆడ సిపాయి!

by Ramesh November 22, 2023
written by Ramesh

సుగుణమ్మ ఒక ఆడ సిపాయే
ముసలవ్వను,తన బిడ్డను అద్దెగుడిసెలో విడిచి
ఉదయం మా పాఠశాలకు బయలుదేరినప్పుడు
ఆమె తరగతి గది తలుపులు కిటికీలు తెరవందే
సూర్యుడి లేతఎండ వాలదు
స్వచ్ఛమైన కొండగాలీ వీయదు
తళతళా మెరవాల్సిందే
పాఠశాల గచ్చునేలైనా తినే బువ్వ పళ్లాలైనా
ఆమెచేతిలో చీపురు పడ్తేచాలు
చెత్తాచెదారమంతా దూరం
వానాకాలం వరండాలో
ప్రతిబింబాలు చూపే నీళ్లమడుగు మాయం

క్లాస్ రూముల్లో ఊడ్చేవేళ బడిపిల్లలు చింపి పారేసిన
చిత్తుకాయిదాలు గాలిఅలల్తో ఆడే భరతనాట్యం
శిశిరాన ఆ కానుగమానులురాల్చినఎండుటాకులరాశులు
బడిలో పనిచేసే ఆమె సహనానికి వార్షిక పరీక్షే
చిరునవ్వు తప్ప చిరాకు కానరాదు ఆ ముఖంలో

ఉదయంపూటా పిల్లల దాహానికి మంచినీరు
ఇంటర్వెల్ లో టీచర్లకు తేనీరు ఆమె
తేనీరు మిగులని వేళ
ఎవరైనా అతిథి అరుదెంచిన వేళ
మీరు తాగితే నేనుతాగినట్టే..అన్న వాక్యంలో
ఆమె దయాహృదయమే ధ్వనిస్తున్నది
నిర్మలమైన ప్రేమే కనిపిస్తుంది నాకు
వంటావార్పుకాడ ఆమె నగుమోముదే వెలుగంతా
మధ్యాహ్నభోజన సమయం
ఆమె వుంటే వుండబోదు ఏ అంతరాయం
భోజన విరామ అనంతరం
వరండా నిండా చిందవందరగా
రహస్యలిపిలా రాలిపడివున్న విద్యార్థులఅన్నం మెతుకులు…
టీచర్ల కంచాలు, ఖాళీగాచూస్తున్న అంట్ల లంచ్ బాక్స్ లు…
స్వాగతం చెబుతుంటాయ్ ఆమెకు
ఐదుపదులు దాటినవయోభారమైనా పనిభారమైనా
ఏనాడూ ధిక్కార స్వరం వినిపించిందిలేదు
పనికాడ వెనుకడుగు వేసిందీలేదు ఆమె
గంటతరపడి బడంతా బండచాకిరీ చేసినా
తనకు బుక్కడుఅన్నంకూడా మిగలనిరోజు
మందహాసం తప్ప నీరసం కంటికి ఆనదు నాకు
సర్దుబాటుతత్వం ఆమె సుగుణం అనుకుంటా
రాజీమార్గం ఆమెకు జీవితం నేర్పిన పాఠం బహుశా
పనిలోనే ఆనందం…పనే దైవం ఆమెకు
ఆకాశాన మార్తాండు మండుతూ పడమరకొండదిశకు వాలేవేళ
ఎపుడో ఆమె పేగుల్లో ఆకలిఆదితాళం
అపుడే పిడికెడు కడుపులో ఇంత ఆహారం
ఆఖరు గంటమోగిన అరగంట తర్వాతే ఆమెకు చుట్టి
పెద్దబడిలో…ఇంతసేవజేసినా ఇంత ఊడిగంజేసినా
గూడులేదు,గుంట భూమీ లేదు
చిల్లి గవ్వా చేతిలో లేదు
కిరాణదుకాణంలో బారువడ్డీ అప్పులు
ఊర్లో అవమానాల,వెటకారాల మాలలు తప్ప
పాఠశాల విద్యాసంవత్సర ఆరంభం నుండి అణారాలేదు ఆమెజీతం
బాధలు,బరువుల బడబాగ్నుల గుండె నాదమై పాడుతున్న గీతం ఆమె
అభినవ సీతమ్మ తల్లి ఆమె
అందుకే ఆమె సుగుణమ్మ కాదు సుగుణాల అమ్మ

సమాన పనికి సమానవేతనమేది?
అంతరిక్షంలో చందమామ అందడం అద్భుతం
నిగూఢ రహస్యాలు పరిశోధనలకు అందనుండడం ఆనందమే
ఆకలి మూలాలు
కార్చిచ్చులా వ్యాపిస్తున్న అవినీతి మూలాలు
అంతుచిక్కకపోవడమే బహుఆశ్చర్యం!
భూలోకంలో ఇంకా ఎన్నాళ్లు ?
సముద్రఅగాధమంతటి సమసిపోని ఈ అంతరాలు?.

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అరుదైన ఫోటో

by mayuukha November 22, 2023
written by mayuukha
November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చాచా నెహ్రూ

by Nellutla Sandhya November 22, 2023
written by Nellutla Sandhya

చాచా నెహ్రూ (రూపకం)

నానమ్మ :         ఏమర్రా ! ఏమిటీ హడావుడి. ఈ రోజు ఇంత తొందరగా తయారవుతున్నారు. ఎక్కడికి?

బాబు :  స్కూలుకి నానమ్మా! ఈ రోజు బాలల దినోత్సవం కదా! అందుకే త్వరగా వెళ్తున్నాము.

పాప :   అవును నానమ్మా ! ఈరోజు నెహ్రూ పుట్టినరోజు కదా! నాలుగు రోజులుగా మా పాఠశాలలో ఇదే హడావిడి. మాకు అన్ని రంగాలలో పోటీలు జరిపారు. మరి నాకు పాటల పోటీలో, తమ్ముడికేమో పరుగు పందెంలో బహుమతులు వచ్చాయి. అవి ఈ రోజు ముఖ్య అతిథి చేతుల మీదుగా మాకు అందజేస్తారు. అందుకే తొందరగా వెళ్ళాలి.

నానమ్మ :         ఓహో అలాగా ! అయితే వెళ్ళి రండి.

xxxxxxxxxxxxxxxxxxxxxxxx

నానమ్మ :         వచ్చేసారా పిల్లలు ! మీ బళ్ళో కార్యక్రమాలు ఎలా జరిగాయి ?

బాబు :              స్కూల్లో ప్రోగ్రాం ఎంత బాగా జరిగిందనుకున్నావు? డాన్సులు, ఆటలు, పాటలు. అందరు చాచా నెహ్రూ గురించిన పాటలే పాడారు.

పాప :   మా హెడ్‌ మాస్టర్‌ నెహ్రూజీ గురించి క్లుప్తంగా చెప్పారు. నానమ్మ! మాకు ఇంకా నెహ్రూ గురించి తెలుసుకోవాలని వుంది. చెప్పవూ !

నానమ్మ :         ఆకలిగా వుంది కదర్రా ! ప్రొద్దున హడావిడిలో ఏమి తినకుండానే వెళ్ళారు. అన్నం తిన్న తర్వాత నిదానంగా అన్ని చెపుతాను రండి. మీకు ఆకలిగా లేదా?

బాబు : ఎందుకు లేదు? ఆకలి దంచేస్తుంది. పద పద….

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

పాప :   అన్నం తిన్నాం కదా! ఇప్పుడు చెప్పు నానమ్మా ! చాచాజీ గురించి తెలుసుకోవాలని వుంది.

నానమ్మ : చూడండి పిల్లలు ! నిశ్శబ్దంగా కూర్చుని శ్రద్ధగా వినండి.

            మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ. ఈయన పూర్తి పేరు జవహర్‌ లాల్‌ నెహ్రూ. జవహర్‌ అంటే రత్నం అని అర్థం.

బాబు :  నెహ్రూ పుట్టిన ఊరేది నానమ్మా ?

నానమ్మ :         ఉత్తర ప్రదేశ్‌ లోని అలహాబాదు పట్టణంలో మన చాచాజీ పుట్టాడు. అలహాబాదు త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదుల కలయిక అలహాబాదును ఒకప్పుడు ప్రయాగ అనే వారు. అలాంటి పవిత్ర స్థలంలో పుట్టిన పవిత్రమూర్తి నెహ్రూ.

పాప :   నవంబర్‌ 14న (అంటే ఈ రోజే) కదా ఆయన పుటా

నానమ్మ :         అవునర్రా! 1889 సం|| నవంబర్‌ 14న చాలా ధనవంతులైన మోతీలాల్‌ నెహ్రూ, స్వరూప రాణి దంపతులకు ముద్దుబిడ్డగా జవహర్‌ పుట్టాడు. నెహ్రూకి ఇద్దరు చెల్లెళ్ళు. ఒకరు విజయలక్ష్మి పండిట్‌, చిన్న చెల్లెలు కృష్ణ (హతీసింగ్‌)

పాప :   మరి నెహ్రూ ఎక్కడ చదువుకున్నారు నానమ్మా ?

నానమ్మ :         ముందు అలహాబాదులో చదువుకున్నారు. ఆ తరువాత ఇంగ్లాండ్‌ వెళ్ళా అక్కడ చదువుకొన్నారు. నెహ్రూ ఇంగ్లాండులో చదువుకుంటున్న రోజుల్లో ఒకసారి ఏమయిందంటే!

బాబు :  ఆఁ ఏమయింది?

నానమ్మ :         నెహ్రూ చదివే పాఠశాలకు అనేక గేట్లుండేవట. పాఠశాల వదిలాక ఇంటికి వెళుదామని నెహ్రూ తన స్నేహితులతో కలిసి మాట్లాడుతూ గేటు వరకు వచ్చాడు. తండ్రి తనకోసం ఏర్పాటు చేసిన కారు అక్కడ లేదు. పాఠశాల కున్న అన్ని గేట్లలో ఏ గేటు దగ్గర తన కారు వుందో తెలుసుకోవడం కష్టమైంది నెహ్రూకి. ఈ విషయాన్ని గురించి తన తండ్రి మోతిలాల్‌ నెహ్రూకీ ఒక చిన్న జాబు వ్రాశారు చాచాజీ. అంతే ఆ తరువాత ఆ పాఠశాలకు వున్న అన్ని గ్లే ముందు ఒక్కొక్క కారు నెహ్రూ కోసం వేచి వుండేదట. అటువంటి ఏర్పాటు చేయగలిగిన మోతీలాల్‌ సంపద గురించి జనం ఆ రోజుల్లో కథలుగా చెప్పుకునేవారట.

పాప :   అవును నానమ్మా ! చాచాజీ పేరు జవహర్‌ లాల్‌ కదా! మరి నెహ్రూ అన అంటారెందుకు?

నానమ్మ :         నెహ్రూ అనేది జవహర్‌ లాల్‌ ఇంటిపేరు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, నెహ్రూ పూర్వికులు కాశ్మీరులో ఓ కాలువ ఒడ్డున వున్న ఇంట్లో ఉండేవారుట. కాశ్మీరు భాషలో నహర్‌ అంటే కాలువ అని అర్థం. కాలక్రమేణ నహర్‌ నెహ్రూగా మారింది. ఆ తరువాత వారు అక్కడినుండి అలహాబాదు వచ్చి స్థిరపడ్డారు. ఆ విధంగా నెహ్రూ అనేది వారికి ఇంటిపేరుగా మారింది.

బాబు :  నెహ్రూ ఎంతవరకు చదువుకున్నాడు నానమ్మ ?

నానమ్మ :         నెహ్రూ బారిష్టర్‌  అంటే న్యాయవాద విద్య పూర్తి చేసుకుని 1912 సం||లో భారతదేశానికి తిరిగి వచ్చారు. లాయరుగా (న్యాయవాది) జీవితం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సమయంలోనే 1914 సం||లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది.

బాబు :  నువ్వు నెహ్రూజీని చూసావా నానమ్మ ?

నానమ్మ :         లేదురా! అప్పుడు మేము మీ అంటే వున్నాము. మా తాత చెప్పితే మాకు తెలిసింది. పుస్తకాల్లో చదివా. ఫోటోలోనే నెహ్రూని చూసాం. అంతే.

నానమ్మ :         ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారం కొఱకు వచ్చి మన దేశాన్ని చిన్య రాజ్యాల్ని మోసంతో గెలిచి క్రమంగా మనల్ని బానిసలుగా చేసారు.

            1857వ సం||రం లో సిపాయిల తిరుగుబాటుతో మన స్వాతంత్య్ర పోరాటం మొదలయింది. అలా తిరుగుబాటు చేసినవారు చాలామంది వున్నారు. ఝాన్సీ లక్ష్మిబాయి, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్‌ చంద్రబోసు, చంథ్రేఖర్‌ ఆజాద్‌, తాంతియా తోపే, నానా సాహెబ్‌ ఇలా చాలా మంది వున్నారు. 80 సం||రాలకు పైగా హింసాయుత మార్గంలో పోరాటం జరిపినప్పటికి మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదు. ఇలా ఎందరో నాయకులు స్వాతంత్య్ర పోరాటం జరుపుతూనే వున్నారు. (ఆ సమయంలోనే జాతీయ నాయకుడైన బాలగంగాధర తిలక్‌ 1914 సం|| జైలు నుండి విడుదలై వచ్చారు.)

            1915 సం|| గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చి స్వాతంత్య్రం కోసం అప్పటికే పోరాటం సాగిస్తున్న నాయకులను కలుసుకున్నారు. అహింసాయుత స్వాతంత్య్ర పోరాటానికి నాంది పలికారు.

పాప :   అవునవును గాంధీజీ యుద్ధం లేకుండా (ఎవరిని చంపకుండా) అహింసాయుతంగా పోరాడి మనకు స్వాతంత్య్రం తెచ్చారని మా టీచర్‌ చెప్పారు. నెహ్రూజీకి గాంధీ తాతతో పరిచయం ఎలా అయింది? చెప్పు నానమ్మ!

నానమ్మ :         అదే కదా చెపుతున్నా ! చాచాజీ మొదటి నుండి మొహమాటస్థుడు, బిడియస్తుడు. అందుకని స్వాతంత్య్ర పోరాటం పట్ల ఆసక్తి ఉన్నప్పటికి చాలారోజుల వరకు రాజకీయ రంగంలో (ప్రత్యక్షంగా) పాల్గొనలేదు.

పిల్లలు :            అలాగా !

నానమ్మ :         1916 సం||రం డిసెంబర్‌ నెలలో లక్నోలో భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో పత్రికా స్వాతంత్య్రాన్ని భంగ పరచడానికి ఉద్దేశించిన కొత్త చట్టం వస్తె దాన్ని తీవ్రంగా విమర్షిస్తు మొట్టమొదటి సారిగా ఆ సభలో ఉపన్యసించారు. ఆ సమావేశంలో గాంధీజీని మొదటిసారిగా కలుసుకున్నారు నెహ్రూజీ.       

            సహజంగా మృదు స్వభావి, మితభాషి అయిన నెహ్రూ గాంధీజీ సిద్ధాంతాల పట్ల అహింసా యుత విధానాల పట్ల ఆకర్షితుడైనాడు. రానురాను గాంధీజీకి కూడా తన మితవాద సిద్ధాంతాలను గౌరవించి, అహింసాయుత పోరాటానికి తగిన అత్యంత సన్నిహితమైన అనుచరుడు నెహ్రూయే అని నమ్మకం కలిగింది. తరువాత బార్దోలి సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్‌ ఇండియా వంటి అనేక స్వాతంత్య్ర ఉద్యమాల్లో సత్యాగ్రహాల్లో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్ళాడు. దాదాపు 30 సం||రాలు అగ్రశ్రేణి నాయకుడుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న నెహ్రూ నాయకత్వం జనాకర్షణకి, దేశభక్తికి నిలయం కావడం వల్ల ఇంకా అనేక కారణాల వల్ల తన వారసుడు నెహ్రూయేనని గాంధీజీ ప్రకటించాడు. భారతదేశ భవిష్యత్తు నెహ్రూ చేతుల్లో భద్రంగా వుంటుందని కూడా గాంధీజీ పేర్కొన్నారు. అందుకే 1946 వ సం|| సెప్టెంబర్‌ 2వ తేదీన 12 మంది సభ్యులతో మధ్యంతర ప్రభుత్వం నిర్వహణ కొఱకు ఉపాధ్యకక్షుడుగా నెహ్రూని ఎన్నుకున్నారు.

            ఆ తరువాత 1947 ఆగస్టు 15 తేదీన స్వాతంత్య్రం రాగానే జవహర్‌ లాల్‌ నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.

బాబు :  అబ్బా ! దానమ్మ నువ్వు ఈ విషయాలన్ని చెపుతుంటే టైమే తెలియలేదు. హాయ్‌ అదిగో అన్న కూడా కాలేజీ నుండి వచ్చేసాడు.

అన్న :  ఏరా బబ్లూ ! నానమ్మని కాసేపైనా రెస్ట్‌ తీసుకోకుండా కథలు చెప్పుమని వేధిస్తున్నారా ఏమిటి?

నానమ్మ :         అన్న వచ్చాడుగా అన్న చెపుతాడులే. ఇంతలో నేను అక్కకి తింటానికి ఏమయినా ఇచ్చి కాసేపు నడుం వాలుస్తానర్రా !

అన్న :  నువ్వు రెస్ట్‌ తీసుకో నానమ్మ ! నాకిప్పుడేమి వద్దు.

బాబు :  అన్నా! అన్నా ! నెహ్రూ గురించి ఇంకా చెప్పన్నా !

పాప :   అవుననాన ! నెహ్రూ ప్రధాని అయ్యాక మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేశాడో చెప్పు.

అన్న :  ఓకే, ఓకే చెపుతాను. 200 సం|| పరాయి పీడన తరువాత అన్ని విషయాలలో మన దేశం వెనుకబడి వుండేది. అంటే, అనారోగ్యం, అవిద్య, నిరుద్యోగం, బీదరికం ఇలా అన్ని రంగాలలో చితికిపోయిన మన స్వతంత్ర భారతదేశాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత నెహ్రూపై పడింది. స్వాతంత్య్రం రావడానికి 19 సం||రాల ముందే భావి స్వాతంత్య్ర నవ భారతానికి పటిష్ఠమైన పునాదులు వేసిన ద్రష్ఠ నెహ్రూజీ. లాహోర్‌ కాంగ్రెస్‌ లో ప్రజాస్వామ్యం, మిశ్రమ ఆర్థిక విధానం, ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, మతాతీత రాజ్యాంగం మన ధ్యేయం కావాలని ప్రకటించిన మనిషి నెహ్రూజీ. ఈ విధానాలను స్వాతంత్య్రం వచ్చాక కార్య రూపంలోకి తీసుకువచ్చారు. పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు.

బాబు :  పంచవర్ష ప్రణాళికలు అంటే ఏమిటన్నా ?

అన్న :  ఒక్కొక్క రంగంలో దేశం అభివృద్ధి చెందడం కోసం 5 సం|| పాటు అమలులో ఉండే విధానం. అన్ని రంగాల్లో ఒకేసారి అభివృద్ధి సాధించడం కష్టం కదా! అందుకని ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలో ఒక్కో రంగానికి ప్రాముఖ్యతనిచ్చి అభివృద్ధి సాధించడం. ఉదాహరణకు మొదటి పంచవర్ష ప్రణాళిక గ్రామీణాభివృద్ధి అయితే, రెండవ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలు, మూడవ పంచవర్ష ప్రణాళిక బీదరిక నిర్మూలనం, ఉత్పత్తులు పెంచడం ఇలా ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క విషయానికి ప్రాముఖ్యానిస్తూ దేశాన్ని అభివృద్ధి చేయడం.

పాప :   ఎంత మంచి ప్లాన్‌ కదా అన్నయ్య !

అన్నయ్య:         అవును నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో మూడు పంచవర్ష ప్రణాళికలు అమలు జరిగాయి. వీటి ద్వారా చక్కటి పథకాలు అమలుపరచి, వ్యవసాయ పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చేసి దేశాభివృద్ధికి ఎంత కృషి చేసారు నెహ్రూజీ. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పెద్ద ప్రాజెక్టులైన బాక్రానంగల్‌, నాగార్జున సాగర్‌, హిరాకుడ్‌ మొదలైన ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేసింది నెహ్రూజీయే. అంటే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలుగా పేర్కొన్నది నెహ్రూయే. రోజులో 4 గంటలు విశ్రాంతి తీసుకుని 20 గంటలు దేశాభివృద్ధికి పాటు పడిన వ్యక్తి చాచాజీ. అందుకే నెహ్రూజీని ”నవభారత నిర్మాత” అన్నారు.

పాప :   మరి భారత్‌ నుండి పాకిస్తాన్‌ ఎందుకు విడిపోయిందన్నా?

అన్నయ్య:         కలిసివుండి అలజడులు, అరాచకాలు సృష్టించుకొని బాధపడటం కన్న విడిపోవడమే మేలు కదా! అలా మత ప్రాతిపదిక మీద ఏర్పడిన పాకిస్తాన్‌, భారత్‌ నుండి వేరయింది. అప్పుడు కూడా మన దేశం విషమ పరిస్థితులను ఎదుర్కొంది. లక్షలాది మంది కాందిశీకులుగా పాకిస్థాన్‌ నుండి భారతదేశానికి కాందిశీకులుగా తరలి వస్తే వారికి జీవనోపాధి, గృహ వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రధానిగా నెహ్రూ పైనే పడింది. దాదాపు 55 లక్షల మంది పాకిస్తాను నుండి తరలి వచ్చిన వారికి పునరావాసము కల్పించడంలో నెహ్రూ ప్రభుత్వం సఫలీకృతమైంది.

            స్వాతంత్య్రం వచ్చాక అస్తవ్యస్థంగా వున్న మన పరిపాలనా విధానాన్ని దేశాన్ని ఒక క్రమ పద్ధతిలోకి మార్చుకోవడానికి రాజ్యాంగాన్ని రూపొందించుకొని 1950 జనవరి 26 నుండి నూతన రాజ్యాంగాన్ని అమలు పరచుకోవడంతో భారతదేశం సర్వ స్వతంత్ర ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.

            మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగంలో లేవు.

బాబు :  మన రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు ఏమిటి అన్నా ?

అన్న :  14 సం|| వరకు బాల బాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించడం, 2) అంతర్జాతీయ ఖ్యాతికి కృషి చేయడం, 3) గ్రామ పంచాయితీలను నెలకొల్పి స్థానిక స్వపరిపాలనను పెంపొందించడం, 4) అడవులను వన్యప్రాణులను రక్షించడం, 5) స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఇలా ఇంకా చాలా వున్నాయిలే.

పాప :   నెహ్రూజీని ”శాంతిదూత” అని ఎందుకంటారన్నా?

అన్న :  శాంతి కాముకుడైన నెహ్రూ దేశ ఆర్థిక ప్రగతికి, విశ్వ కళ్యాణానికి, శాంతి ఎంతో అవసరం అన్న విశ్వాసంతో ప్రపంచ శాంతికి కృషి చేసాడు. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు నెలకొల్పడానికి ప్రపంచంలో అన్ని దేశాలలోనూ అనేక పర్యాయములు పర్యటించి భారత దేశానికి గొప్ప స్థానం కల్పించడానికి నిరంతరం పాటుపడ్డాడు. అగ్రరాజ్యాల మధ్య సమభావాన్ని, సమతౌల్యాన్ని సాధించేందుకు ఎప్పటికప్పుడు ప్రతి సమస్యను పరిశీలిస్తూ ముఖ్యంగా అమెరికా, రష్యా దేశాల పట్ల ఖచ్చితమైన తన అభిప్రాయాన్ని నిస్పక్షపాతంగా ధైర్యంగా సౌమ్యంగా హేతుబద్ధంగా ప్రకటించేవాడు. ఆ విధంగా రష్యా, అమెరికాలతో సత్సంబంధాలను కొనసాగించేవాడు. అలీన విధానానికి అంకురార్పణ చేసి ఒక కొత్త విదేశాంగ విధానాన్ని రూపొందించాడు. బ్రిటన్‌ తో స్నేహ సంబంధాలు కొనసాగించడానికి కామన్‌ వెల్త్‌ లో మన దేశానికి సభ్యత్వం కల్పించాడు. ప్రపంచంలో చాలాసార్లు విషమ పరిస్థితులు ఎదురైనపుడు, విషమ పరిస్థితుల్లో వున్నప్పుడు ప్రపంచంలో చాలాసార్లు ఉద్రిక్తతను తగ్గించడానికి, ఆఫ్రికా, ఆసియా దేశాల శాంతికి తద్వార ప్రపంచ శాంతికి కృషి చేసి ”శాంతి దూత” గా ప్రఖ్యాతి గాంచాడు.

పాప :   నెహ్రూజీకి విదేశాలలో కూడా మంచి నేతగా పేరుందంటారు కదన్నా !

అన్న :  అవును స్నిగ్ధ ! నెహ్రూ భారతదేశ ప్రగతికి ఎంత కృషి చేశారో ప్రపంచ శాంతికి, భారత్‌ తో అన్ని దేశాల మధ్య సత్సంబంధాలకు అంతే కృషి చేశారు. 1954లో చైనా ప్రధాని చౌ-ఎన్‌-లై తో కలిసి ప్రకటించిన ఐదు సూత్రాల ”పంచశీల” అను పేరుతో ప్రపంచ రాజ్యాల మన్ననలను అందుకున్నాయి. ఈ నాటికి వాటి విలువ తగ్గలేదు. దేశ ఆర్థిక ప్రగతికి స్వతంత్ర అలీన విధానం ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఆయన స్వతంత్ర భారత విదేశ విధానాన్ని రూపొందించాడు. ఆ విధానము ఇప్పటికి భారత విదేశాంగ విధానాలలో ముఖ్య సూత్రంగా వుంది.

పాప :   నెహ్రూ ఏం పుస్తకాలు రచించారన్నా ?

అన్న :  రచయితగా నెహ్రూ ఆంగ్ల రచనా విధానంలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన రచించిన డిస్కవరి ఆఫ్‌ ఇండియా, ఆటో బయోగ్రఫి, గ్లిమెన్స్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ గ్రంథాలు అందుకు నిదర్శనాలు. స్వాతంత్య్ర పోరాట సమయంలో జైల్లో ఉన్నప్పుడు తన కూతురు ఇందిరకు వ్రాసిన లేఖలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఆ తరువాత కాలంలో అవి లెటర్స్‌ టు హిజ్‌ డాటర్‌ అన్న పేరుతో పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. అవి నాటి మన భారత స్వాతంత్య్ర ఆర్థిక చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. ఆ లేఖల ద్వారానే తన కూతురును ఒక గొప్ప రాజకీయ వేత్తగా తీర్చిదిద్దిన ఘనత నెహ్రూదే.

పాప :   ఆయన ఎన్ని సం||రాలు ప్రధానిగా వున్నారు?

అన్న :  1947 ఆగస్టు 15 నుండి 1964 మే 27 వరకు దాదాపు 17 సం||రాలు. భారత భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి నడిపించిన మహనీయుడు కూడా ఆయన. 1964 మే నెల 27వ తేదీన అశేష భారత ప్రజానీకాన్ని శోక సముద్రంలో ముంచి తీవ్రమైన గుండెపోటులో మరణించారు. నెహ్రూ మరణించినప్పటికి ఆయన సిద్ధాంతాలు, రాజనీతి, విధానాలు, శాంతిమార్గం ప్రజల గుండెల్లో పదిలంగా వున్నాయి. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ స్వాప్నికుడు, దార్శనికుడు, 20వ శతాబ్దపు ఉత్తమ రాజకీయవేత్త ప్రపంచ నేతల చరిత్ర గమనాన్ని అంచనా వేయగల దూరదృష్టి గల ప్రపంచ నేతల్లో అగ్రగణ్యుడు. అతని జీవితం ఎందరికో ఆదర్శనీయం. అందరికి మార్గదర్శకం.

బాబు :  బాలల పండుగ నెహ్రూ పుట్టిన రోజు నాడే ఎందుకు చేస్తారన్నా ?

అన్న :  నెహ్రూజీకి బాలలన్నా పువ్వులన్నా ఎంతో ఇష్టం. ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవంగా ప్రకటించారు. పెదవులపై చిరునవ్వు తెల్లని కోటుపై ఎర్రని గులాబీ చేతిలో శాంతి పావురం ఇవన్ని ఆయనను శాంతి దూతగా తలపిస్తాయి.

బాబు :  అన్నా ! అన్నా ! గాంధీ తాత గురించి చెప్పన్నా ?

అన్న :  ఇప్పుడు కాదు! మరోసారి ఎప్పుడైనా చెపుతాను. నీకు రేపు పరీక్ష వుంది. చదువుకోవాలి. మీరు కూడా వెళ్ళి కాసేపు చదువుకోండి. బాగా చదువుకొని పెద్దయ్యాక గాంధీజీలా చాచాజీలా గొప్పపేరు తెచ్చుకోవాలి తెల్సిందా?

పిల్లలు :            అలాగే అన్నా బాగా చదువుకుంటాం …!

నెహ్రూ ఉన్నత ధనిక కుటుంబంలో పుట్టినా ఎంతో నిరాడంబరమైన జీవితం గడిపాడు. స్వాతంత్య్రం తేవడంలో గాంధీజీకి కుడి భుజంగా ఉంటూ ఆయన నేతృత్వంలోని ఎన్నో ఉద్యమాలలో పాల్గొని అనేకసార్లు జైలుకి వెళ్ళారు. స్వాతంత్య్ర భారతానికి 18 సం|| ప్రధానిగా వుండి విశిష్ట సేవలు అందించారు. దేశాభివృద్ధి కోసం వీరు ప్రవేశపెట్టిన పంచశీల సూత్రాలు, పంచవర్ష ప్రణాళికలు, అలీన విధానం మన దేశ కీర్తిని నలుమూలలా చాటినది. శాంతిదూతగా నెహ్రూ ప్రపంచ ప్రసిద్ధులు.

నెహ్రూ పిల్లలను రేపటి పౌరులుగా మాత్రమే కాదు, దేశ భవిష్యత్తుకు వారు వెన్నెముకగా, మూల స్థంభాలుగా భావించారు. ఏ చిన్నారికైనా తన తల్లిని మించిన ఉత్తమ స్నేహితురాలు మరొకరుండరు. ఆమెను ప్రేమించడం, గౌరవించడం మన బాధ్యత అని బోధించారు. 

సరే చాలా పొద్దుపోయింది రాజ్యాంగం గురించి దాని పుట్టుపూర్వోత్తరాల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం పడుకోండి.

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఎదహోరు

by Radhika Suri November 22, 2023
written by Radhika Suri

నా జీవితం-
ఓటిపడవ ప్రయాణం
నిత్యం నా నిరీక్షణ
దరిదాపుకై సంశోధనం

నేను-
ఎడారి కోయిలను
నా హృదయాలాపన
గ్రీష్మకాల ప్రణవనాదం

నాది-
క్షతగాత్ర హృదయం
నా అంతరంగం
ఓ మరుభూమి

నాకు-
ఓదార్పు కలకంఠి గాత్రం
మోడువారిని నా జీవితానికి
తొలకరి జల్లు ఆ గీతం

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi November 22, 2023
written by Chillara Bhavanidevi

ధారావాహికం – 10వ భాగం


శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసుమంత్రి,పెమ్మసాని రామలింగ నాయకుడితో సుదీర్ఘసమాలోచనలు జరుపుతున్నారు.
‘‘రాయా! మనం అనుకున్నట్లుగానే కర్ణాటక, తమిళ ప్రాంతాలు దక్కనులో మలబారు ప్రాంతమేగాక సింహాళంలోని కొంతభాగం కూడా మన వశమైంది’’ తిమ్మరుసు గంభీర ఉత్సాహంతో చెప్పాడు.
‘‘దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదు ప్రభువులవారి కీర్తిని మరింత ఇనుమడిరపజేస్తున్నది మహామంత్రి!’’ రామలింగనాయకుడు సంతృప్తిగా అన్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు ఆనందాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేశారు. తర్వాత తిమ్మరుసు తను వ్యూహరచనను వెల్లడిరచాడు.
‘‘ఇప్పటివరకు మనం జయించిన దక్షిణ ప్రాంతాలు గాక ముఖ్యమైన శత్రువుల గురించి ఆలోచించాలి ప్రభూ!’’
తిమ్మరుసు మాటలకు అవునన్నట్లు తల పంకించారు రాయలు. తిమ్మరుసు ఇలా చెప్పారు ‘‘మన శత్రువులలో అతి బలవంతులు బహ్మనీలు. బహ్మనీ ప్రభువు మామూద్‌ షాయే గాక బహ్మనీ రాజ్యంలో బీజాపూర్‌, గోల్కొండ, అహ్మద్‌నగర్‌ రాష్ట్రపాలకులు సుల్తాన్‌ అధికారాన్ని ధిక్కరించి స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నారు.’’ ‘‘అది వారి సమస్య కదా అప్పాజీ?’’ రాయలు ప్రశ్నించాడు. ‘‘కానేకాదు. ఇది మన సమస్య కూడా! ఎందుకంటే వారిలో వారికి ఎంత విద్వేషమున్నా ఒక్కవిషయంలో వారికి ఐక్యత ఉంది. అదే విజయనగర సామ్రాజ్యం పట్ల ద్వేషం. మన సిరిసంపదలు, వైభవం చూసి అసూయ పొందటమే గాక ఈ ఐశ్వర్యాన్ని కొల్లగొట్టటం లక్ష్యంగా భావించి అదను దొరికినప్పుడల్లా మన రాజ్యంపై దురాక్రమణ జరపటం వారికి పరిపాటి అయింది’’ తిమ్మరుసు విశదీకరించాడు. ‘‘మరి మన కర్తవ్యం?’’ రాయలు సూటిగా కర్తవ్యోన్ముఖుడయ్యాడు. ‘‘బహ్మనీసుల్తాన్‌ మహ్మద్‌ షా విజయనగరంపై ‘జీహాదు’ ప్రకటించినా బీజాపూర్‌ సుల్తాన్‌ ఆదిల్‌షా యుద్ధం చేసినా బహమనులతో మన యుద్ధాలు ముగియలేదు ప్రభూ’’ ‘‘గతంలో మీరు బీజాపుర్‌ జయించి బీదర్‌ను వశం చేసుకుని బందీగా ఉన్న బీదర్‌ సుల్తాన్‌ను తిరిగి బహ్మనీ సింహాసనంపై ప్రతిష్టించి ‘యవనరాజ్య స్థాపకాచార్య’ అనే కీర్తి పొందినాక బహమనీ సుల్తానులకు మీ కీర్తి ప్రతిష్టల మీద కన్నెర్ర అయింది రాయా.’’ తిమ్మరుసు ప్రశంసకు రాయలు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఆత్మవిశ్వాస సాహసాలు తొంగిచూశాయి. ష్ట్ర ష్ట్ర ష్ట్ర చంద్రప్ప ఈ మధ్య బాగా గమనిస్తున్నాడు. మంజరి తనని తప్పించుకు తిరుగుతోందని. కారణం బోధపడటం లేదు. క్షమాభిక్ష పొంది కారాగారం నుంచి విడుదల అయిన కంటకునితో రెండు మూడుసార్లు కన్పించింది కూడా! చంద్రప్పకి తీరని వేదనగా ఉంది. మంజరి ప్రవర్తనలోని మార్పు అతడిని వేధిస్తున్నది. బాధ్యతా నిర్వహణ కూడా సరిగా చేయలేకపోతున్నాడు. పిచ్చివాడిలా విఠల దేవాలయం, రాతిరథం చుట్టూ తిరుగుతూ మంజరి కోసం పరితపిస్తున్నాడు. అన్నపూర్ణాదేవి మందిరంలో ఉంటున్న మంజరి అతనికి పంజరంలో చిలకలా కన్పిస్తోంది. ఆమె సాన్నిహిత్యం కోసం అతని మనస్సు పరితపిస్తున్నది. మంజరికి కూడా అలాగే ఉన్నా చంద్రప్ప మేలుకోరింది కనుక దూరంగా ఉండదలిచింది. ఈ మధ్య ఎవరో ఆమెకి చెప్పారు. అతను నవమోహిని విగ్రహం దగ్గరే సొమ్మసిల్లి పడి ఉన్నాడట. ఎవరు కన్పించినా ‘‘మంజూని చూశారా?’’ అని అడుగుతున్నాడట. ఇవన్నీ వింటుంటే మంజరికి కన్నీళ్ళాగటం లేదు. ‘‘చంద్రా! నీవు లేని నా జీవితం తావిలేని పూవే కదా! ఏం చేయను? మనిద్దరికీ ఆ బ్రహ్మ రాయలేదు’’ అనుకుంటూ దుఃఖిస్తున్నది. మరోపక్క కంటకుని చొరవ ఆమెకు చీదరగా ఉంది. ‘‘శిలలో దాగిన శిల్పాలను కనులముందు నిలుపుతావనీ శ్రుతి చేసిన వలపు వీణను బ్రతుకంతా పలికించేవనీ తలచినదంతా కల్లలాయెనా వలపు వల్లరులే వాడిపోవునా ॥ ఆమె మనసు విషాదగీతికలా ఉంది. ష్ట్ర ష్ట్ర ష్ట్ర రాయలు బహమనీలను అదుపుచేయగలిగానని తలిచాడు. విజయోత్సవాలు జరిగాయి. తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళ్ళి వచ్చారు. ‘‘రాయా! నామమాత్రంగా మనం బహ్మనీ సుల్తాన్‌ను సింహాసనంపై నిలిపాం. వారిలో వారు అంతఃకలహాలలో మునిగిఉంటారనీ, విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడరనీ భావించాం’’ తిమ్మరుసు విశ్లేషించారు. ‘‘అవును అప్పాజీ! మరి ఈ పెనుమార్పేమిటి?’’ రాయలు అసహనంగా అడిగారు. ‘‘బీజాపూర్‌, గోల్కొండ, అహ్మద్‌నగర్‌, బీదర్‌, బీరారు సంపూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నా వారిని చూస్తూ ఉండిపోయాం. కానీ గోల్కొండ రాజ్యం నుండి కులీకుతుబ్‌షా మన కొండవీడుపై దాడికి సిద్ధమయ్యాడు.’’ ‘‘ఫర్వాలేదు అప్పాజీ! మన పాండురంగ సేనాపతి ఆ సంగతి చూడగలరని భావిస్తున్నాం.’’ ‘‘రాయా! అదే నా యోచన కూడా’’ ఇరువురు ప్రశాంత మనస్కులై సమావేశ మందిరం నుండి బయటికి వస్తుంటే చాటుగా స్తంభం మాటున జరిగిన ఓ నీడ తిమ్మరుసుమంత్రి దృష్టిలో పడకపోలేదు. ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. నొసలు ముడిపడిరది. ష్ట్ర ష్ట్ర ష్ట్ర వీరేంద్రుడు, కంటకుడు మదిరాపానం చేస్తూ ఒళ్ళు తెలియని ప్రేలాపన స్థితిలో ఉన్నారు. ‘రాళ్ళన్నీ ఒకచోట, రత్నాలన్నీ ఒకచోట’ అన్నట్లుగా వీళ్ళిద్దరిదీ ఒకే ఆలోచన. విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేయాలని. ఒకే స్నేహం, కుటిలబుద్ధితో లాభం పొందటానికి. ‘‘ఆ ముసలినక్కను తప్పిస్తేగానీ మన పాచిక పారదు’’ వీరేంద్రుని మాటలు ముద్దముద్దగా ఉన్నాయి. ‘‘అది అంత సులభంకాదు వీరేంద్రా! తిమ్మరుసుమంత్రి రాయలవారికంటే రాజనీతి చతురుడు. ఆయనని తప్పించటమంటే రాయలవారినే’’ ‘‘హుష్‌’’ నోటిమీద వేలుంచి ఆపాడు వీరేంద్రుడు. ‘‘జగన్నాథ! ఆ పని మనమెందుకు చేస్తాం? రాయలతోనే చేయిద్దాం’’ వీరేంద్రుడు కుటిలంగా అన్నాడు. ‘‘అసాధ్యం. తన బొందిలో ప్రాణమున్నంతవరకూ రాయలు తిమ్మరుసును వదులుకోడు’’ కంటకుని నిరాశాస్వరం. ‘‘జగన్నాథ! అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికే గదా ఈ వీరేంద్రుడున్నది’’ మరోసారి మదిర సేవించాడు వీరేంద్రుడు. ‘‘మీ మాటలు నాకు బోధపడటం లేదు. వారిద్దరూ ఒకరికొకరు బహిర్‌ ప్రాణాలు.’’ ‘‘జగన్నాథ! బహిర్‌ప్రాణాలు. హ్హాహ్హాహ్హా! ఆ ప్రాణాలు పోతే పోలా’’ ‘‘ఆఁ!’’ నిర్ఘాంతపోయాడు కంటకుడు. భయపడ్డాడు కూడా! ‘‘మా నాయన గండమనాయకుడు వంటి నమ్మకమైన సేనాధికారులున్నంత వరకూ అది కుదరని పని’’ కంటకుడు పళ్ళు కొరికాడు. తనని కారాగారంలో వేసినప్పుడు ఏ సహాయం చేయని తండ్రి అంటే అతనికి చాలా కోపంగా ఉంది. ‘‘జగన్నాథ! నేను ఎన్నిసార్లు మహారాజుకు ఆ ముసలి మంత్రి మీద ఆరోపణలు చెప్పాను! ఉహు వింటేనా? కానీ నా దగ్గర మరో బ్రహ్మాస్త్రం ఉంది’’ వీరేంద్రుడు కళ్ళు పెద్దవి చేశాడు. బ్రహ్మాస్త్రం పేరు వింటూనే కంటకునిలో ఆసక్తి పెరిగింది. ‘‘ఏమిటది వీరేంద్రా!నీవు చాలా తెలివైనవాడివి.చెప్పు చెప్పు’’ ఆరాటపడ్డాడు. ‘‘ఆఁ! అది చెప్పేది కాదు జగన్నాథ! చేసి చూపించేది. ఆ బ్రహ్మాస్త్రాన్ని మా గజపతుల వంశంలోంచే తెచ్చాము. మా దుర్గాలన్నీ స్వాధీనపర్చుకొని మాకింత బిచ్చం వేస్తాడా ఆ రాయలు’’ వీరేంద్రుని కళ్ళు ఇంకా ఎరుపెక్కాయి. కంటకునికేదో అర్థం అయీ కానట్లుంది. ఆరేళ్ళ తిరుమలరాయుడు పరుగుపరుగున వచ్చాడు. ‘‘మామయ్యా! మీరు నాకు కత్తియుద్ధం ఇంకా ఎప్పుడు నేర్పిస్తారు?’’ ‘‘కాలం వచ్చేసింది నాయనా! జగన్నాథ! నేర్పిస్తాను. నువ్వు వెళ్ళి ఆడుకో’’ వీరేంద్రుడు తిరుమలరాయని బుజ్జగించి పంపేశాడు. ‘‘చాలా పొద్దుపోయింది వీరేంద్రా! మేము వెళ్తాం’’ ‘‘జగన్నాథ’’ కంటకునికి వీడ్కోలిచ్చి పంపేశాడు వీరేంద్రుడు. తూలుతూ ఇటు తిరిగిన వీరేంద్రునికి కాళికలా నిప్పులు చెరిగే కళ్ళతో అన్నపూర్ణాదేవి కన్పించింది. ‘‘ఏమిటిది వీరేంద్రా! నీ ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. చుట్టమై వచ్చి దయ్యమై పట్టినట్లు.’’ నిందావాక్యాలకు అతడేమీ చలించలేదు. వీరేంద్రునికి కార్యసాధనే ముఖ్యం. ‘‘జగన్నాథ! చుట్టాన్ని కాబట్టే నీ గురించే నా ఆరాటమంతా’’ లేని ప్రేమ ఒలకబోశాడు. ‘‘నా గురించి నువ్వేం ఆరాటపడనక్కర్లేదు. నా పుట్టింటి చుట్టానివని ప్రభువు ఆదరిస్తుంటే ఇంకా ఎన్నాళ్ళిక్కడ?’’ అన్నపూర్ణాదేవికి చాలా కోపంగా ఉంది. ‘‘జగన్నాథ! అంత కోపం వద్దమ్మా! మహారాజుకు ఎందరో భార్యలుండటం మామూలే! కానీ వీరగజపతి వంశంలో పుట్టిన నిన్ను అందరిలో కలపటమే’’ నసిగాడు. ‘‘అది మా స్వవిషయం. ఇందులో నీ ప్రమేయమవసరం లేదు’’ గిరుక్కున వెనుదిగిరింది అన్నపుర్ణాదేవి. ‘‘జగన్నాథ! నీ స్వవిషయమే! మా ఇంటి ఆడపడుచువైన నీ గురించి నీ కొడుకు గురించి నువ్వు వద్దన్నా మాకు తాపత్రయమే!’’ నచ్చజెప్తూ రెచ్చగొడుతున్నాడు. ‘‘ఇప్పుడు నాకు, యువరాజుకి వచ్చిన లోటేం లేదు. ఇక్కడ నువ్వు ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి ఉండేట్లు లేదు’’ కుపిత స్వరంతో అంది అన్నపూర్ణాదేవి. ‘‘జగన్నాథ! మన యువరాజే రాజు కావాలని నా ఆశ.’’ ‘‘నీ ఆశ అనకు. అది విజయనగర ప్రజల ఆశ. ప్రభువు కోరిక కూడా.’’ ‘‘జగన్నాథ! కోరితే తీరుతుందా! విజయనగర సింహాసనం మీద ఏ రాజైనా సరి అయిన పద్ధతిలో కూర్చున్నాడా!అంతదాకా ఎందుకు?నీ భర్త.. అదే శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సోదరులను, వారి కుమారుడ్ని చంద్రగిరిలో బందీగా చేసేగా రాజయ్యాడు! పైగా ఈ ముసలిమంత్రేగా తంత్రమంతా నడిపింది’’ ఆలోచింపజేస్తున్నాడు. ‘‘అయితే’’ అన్నపూర్ణాదేవి అతనికేసి తిరిగింది. ‘‘జగన్నాథ! అయితే అంటావేమిటి తల్లీ! ఈ రాజ్యంలో తిమ్మిని బమ్మి చేయాలన్న బమ్మిని తిమ్మి చేయాలన్నా తిమ్మరుసు మంత్రికి నల్లేరు మీద బండి నడకే!’’ రహస్యం చెబుతున్నట్లు అన్నాడు. మళ్ళీ తన బోధ కొనసాగించాడు. ఆమె ముఖ కవళికలు మారుతున్నాయి. ‘‘ఈ మహామంత్రి మనసులో ఏముందో తెలుసా! నేను బాగా కనిపెట్టాను. రాయలు తన చేతిలో కీలుబొమ్మ. కాలం కలిసిరాగానే రాయల్ని అడ్డు తొలగించి తన కొడుకు గోవిందరాయలకి పట్టం గట్టాలని.’’ ‘‘స్వామీ జగన్నాథ! ఎంత మాట విన్నాను! తిమ్మరుసు మహామంత్రి కృష్ణరాయల కెగ్గు తలపెట్టటమా! కలలోనైనా ఊహించలేమే’’ ఆవేదనగా అంది అన్నపూర్ణాదేవి. ‘‘ఆ కలలో కూడా ఊహించనిది చేయటమే తిమ్మరుసు తెలివి’’ ‘‘నువ్వు చెప్పేది వింటుంటే నా తల తిరిగిపోతున్నది. నేనిప్పుడేం చేయాలి? నా ప్రభువునెలా రక్షించుకోవాలి’’ ఆసనంపై కూలబడిరదామె. ‘‘నీ ప్రభువును రక్షించుకోవాలంటే నీ కుమారుడు తిరుమలరాయని ఈ విశాల విజయనగరానికి సామ్రాట్టుని చేయాలంటే ముందు రాయలవారు తిమ్మరుసును గుడ్డిగా నమ్మరాదు. బానిసలా బతకరాదు. స్వంతబుద్ధితో ఆలోచించాలి. జగన్నాథ!’’ ‘‘అదెలా సాధ్యం! వారు ప్రభువుకు తండ్రిలాంటివారు. ఏ పనిచేసినా తిమ్మరుసులవారిని సంప్రదించనిదే జరుగదు.ఆఖరికి మా వివాహ విషయంలో కుడా తిమ్మరుసువారి పట్టుదలే కారణం’’ అన్నపూర్ణాదేవి గతంలోకి చూసింది. ‘‘ఆ! అక్కడే ఉంది కుట్ర. గజపతులు చాలా పరాక్రమవంతులు. వారింటి ఆడబిడ్డను వివాహమాడితే బంధుత్వరీత్యా ఆ ముప్పు తొలగిందిగా!’’ ‘‘వారు నన్ను వీరభోజ్యంగా గ్రహించారు వీరేంద్రా! ఇంతకాలంలో ఏనాడూ నాపట్ల ఇసుమంతైనా చిన్నచూపు చూసింది లేదు. పైగా తిరుమల రాయలు మా విజయనగర సామ్రాజ్యానికి ఏకైక వారసుడు. ఇక ముప్పేముంది?’’ ‘‘అని నువ్వనుకుంటే సరిపోయిందా పిచ్చితల్లీ! నేనిందాకే చెప్పాను. ఈ సింహాసనానికి వారసత్వశక్తి లేదు.’’ ‘‘మరి ఏం చేద్దాం’’ ప్రశ్నించింది ఆరాటంగా రాణి. అన్నపూర్ణ తన దారిలోకి రావటం వీరేంద్రునికి పరమానందంగా ఉంది. ‘‘జగన్నాథ! ఇప్పటికి నేను చెప్పేది నీకు అర్థమైంది. ఇన్నాళ్ళు నీకు అరణపుచుట్టంగా ఇక్కడ పడిఉన్నందుకు ఫలితం దక్కుతున్నది.’’ గొంతు తగ్గించాడు. అటూ ఇటూ చూశాడు. చాటున ఉండి రహస్యంగా వింటున్న మంజరి కొద్దిగా నీడలోకి జరిగింది కనపడకుండా. ఆమె మొహం విషాదంలో ముడుచుకుపోయింది. వీరేంద్రుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చి రహస్యం చెప్తున్నట్లు చెప్పాడు
‘‘చూడమ్మా! మన గజపతుల వంశాంకురమే విజయనగర సింహాసనం అధిష్టించాలని నా ప్రాణం కొట్టుకుంటున్నది. పుట్టింటి మీద నీకుమాత్రం ప్రేమలేదా ఏంటి? కృష్ణరాయల్ని, కుమారుడిని రక్షించుకోవాలంటే మనపని నెరవేరాలంటే… రాయలను నువ్వో కోరిక కోరాలి.’’
‘‘కోరికా! ఏమని?’’
‘‘నీ కుమారుడికి పట్టాభిషేకం చెయ్యమని’’
‘‘అందుకు ప్రభువు అంగీకరిస్తారా! తిరుమలరాయలింకా పసివాడే గదా!’’ అన్నపూర్ణాదేవి సందేహం.
‘‘జగన్నాథ! అక్కడే ఉంది కిటుకు. రాయలు నీ ముచ్చట తీర్చటానికైనా అంగీకరిస్తాడు.కానీ ఆ తిమ్మరుసు ఒప్పుకోవటమే అనుమానం. దీనిలో అతని కుటిలత్వం ప్రభువుకు కూడా తెలుస్తుంది’’గుట్టు విప్పినట్లు నవ్వాడు వీరేంద్రుడు.
ఇప్పుడు అన్నపూర్ణాదేవి పూర్తిగా వీరేంద్రుని మాయాజాలంలో పడిపోయింది. పుత్రప్రేమ ఆమె కళ్ళు కప్పేసింది.
‘‘నువ్వు చెప్పినట్లే నేను ప్రభువును ఆ కోరిక కోరతాను’’ ఆమె నిర్ణయించుకుంది.
వీరేంద్రుని ఆనందానికి అవధులు లేవు. తన మొదటి పాచిక పారుతోంది. సరిగ్గా గురిచూసి తగిలితే తిమ్మరుసుకూ, రాయలకూ మధ్య మొదటి విభేదం తలెత్తుతుంది. పసివాడికి పట్టం గట్టటానికి తిమ్మరుసు ఎటూ ఒప్పుకోడు. దాంతో రాయలు రాణికిచ్చిన మాటకోసం తిమ్మరుసును కాదనవలసి వస్తుంది. రాణి కోరిక రాయలు ఒప్పుకుంటాడా? ఒకవేళ తిమ్మరుసు రాయల మాటకు ఒప్పుకుంటే?’’ వీరేంద్రుడు ఉత్కంఠభరితంగా నవ్వుకున్నాడు.
మంజరి మనసు కలతపడుతున్నది. సాధ్వి అన్నపూర్ణాదేవి మనసులో విషబీజం నాటుతున్నాడీ దుర్మార్గుడు. తిమ్మరుసులవారికి రాయలవారికి తగవు తేవాలనే ఈ ప్రయత్నాన్ని వమ్ముచేయి స్వామీ విరూపాక్షా! అనుకుంటూ బయలుదేరిన మంజరి తిమ్మరుసు మహామంత్రికీ వార్తను అతి రహస్యంగా చేరవేయటంలో సఫలురాలయింది.
* * *
తిమ్మరుసు, రామలింగనాయకుడు వ్యాసరాయలు ఆశ్రమంలో సమావేశమైనారు.
‘‘ఏదో బురదపామనుకున్నాం గానీ తాచులా బుసలుకొడుతోంది’’ రామలింగనాయకుడు కోపంతో ఆవిర్లు కక్కుతున్నాడు.
‘‘ఆ తాచుపాము మెడపట్టి పడగ దింపాలి రామలింగ నాయకా! ఇక
ఉపేక్ష పనికిరాదు’’ తిమ్మరుసు నెమ్మదిగా చెప్పినా నిర్ణయం దృఢంగా ఉంది.
‘‘కాగల కార్యమేమిటి మహామంత్రీ!’’ వ్యాసరాయలు శాంతంగా అడిగారు.
‘‘ఏముందీ! వీరేంద్రుడిని తన్ని తగలేయటమే’’ ఆవేశంగా బుసలుకొట్టాడు రామలింగనాయకుడు.
‘‘ఆ…ఆ…! అలా చేస్తే రాయలవారి దృష్టిలో నిజంగానే మనం దుర్మార్గులమైపోతాం. ఆ వీరేంద్రుని పాచికకు ఎదురు పాచిక వేయటమే మనం చేయాల్సిన పని’’ తిమ్మరుసు సాలోచనగా అన్నారు.
‘‘ఏమిటది మహామంత్రీ’’ వ్యాసరాయలి ప్రశ్నకు తిమ్మరుసు ఇలా వివరించారు`
‘‘మనకి అందిన వార్త ప్రకారం అన్నపూర్ణాదేవి మహారాజును ఓ కోరిక కోరతారు.’’
‘‘ఏమని?’’ వ్యాసరాయలు అడిగారు.తిమ్మరుసు తన వివరణ కొనసాగించారు.
‘‘అదేమంటే యువరాజు తిరుమలరాయలకు పట్టాభిషేకం చేయమని.’’
‘‘ఆఁ! అంత పసివాడికి పట్టాభిషేకమా’’ రామలింగనాయకుడు నిర్ఘాంతపోయాడు.
‘‘అవును. దీనికి నేను ఒప్పుకోననీ, తద్వారా రాయలవారికి నాకూ విభేదాలు పెంచాలని వీరేంద్రుని పాచిక’’ తిమ్మరుసు విడమరిచారు.
‘‘మరి మనం అవునంటే?’’ వ్యాసరాయలు సందిగ్ధంగా చూశాడు.
‘‘అవునంటే పట్టాభిషేకం చేయాలి’’ తేల్చి చెప్పారు మహామంత్రి.
‘‘కాదంటే’’ రామలింగనాయకుడి ఆవేశం.
‘‘రాయలకూ, మాకూ విభేదం’’ స్థిరంగా ఉంది తిమ్మరుసు స్వరం.
‘‘రాయలవారికి ఇంతటిస్థానం సంపాదించి ఇచ్చింది మీరు. మీతోనే విభేదిస్తారా?’’ రామలింగనాయకుడు కలవరపడ్డాడు.
‘‘రామలింగనాయకా! అధికారం విచక్షణ కళ్ళుమూస్తుంది. అది ఎవరికైనా ఒకటే! ఇన్నాళ్ళకి రాయలకూ నాకూ ఒక విషమపరీక్ష ఎదురైంది. చూద్దాం! నా రాయలు దీనిని ఎలా ఎదుర్కొంటాడో!’’ తిమ్మరుసు మంత్రి కంఠంలో సన్నని వణుకు మొదటిసారిగా ధ్వనించింది.
‘‘మన కర్తవ్యం?’’ వ్యాసరాయలు వాతావరణాన్ని తేలిక చేశారు.
‘‘గురువర్యా! గతంలో రాయలవారి జన్మకుండలి ప్రకారం యోగం తప్పినప్పుడు మీరే విజయనగర సామ్రాజ్యమధిష్టించి సహాయం చేశారు. మరోసారి రాయలవారి జాతకాన్ని పరిశీలించండి. మనమేం చేయాలో దానిననుసరించి నిర్ణయిద్దాం.’’
తిమ్మరుసు మాట ప్రకారం వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయల జన్మకుండలి పరిశీలించారు. ఆయన వదనం వివర్ణమయింది.
‘‘మహామంత్రీ! రాయలవారి రోజులు అంతగా బాగాలేవు. కొంత గ్రహశాంతి చేయాలి. యువరాజుగారి జాతకం కూడా ఆపద సూచిస్తున్నది.’’
‘‘దీని పరిహారం?’’ తిమ్మరుసు మంత్రి ఆందోళనగా చూశారు.
‘‘యువరాజు పట్టాభిషేకం ఇప్పట్లో జరగరాదు’’ వ్యాసరాయలు తేల్చి చెప్పారు.
‘‘అదెలా సాధ్యం? రాయలవారు జరపదలుస్తారు కదా!’’ రామలింగ నాయకుని సందేహం.
జరుపదలుస్తారు. అంతే! అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్ళకుండా
కొన్నాళ్ళు రాయలవారిని ఆపగలిగితే… తిమ్మరుసు ఆలోచనలో పడ్డాడు.
‘‘గురుదేవా! మేమిక వెళ్ళివస్తాం. ప్రణామాలు! మేమీ చర్చ చేసిన విషయం కడు రహస్యం. మీకు తెలుసుగదా!’’ నర్మగర్భంగా నవ్వారు తిమ్మరుసు.
‘‘మంచిది మహామంత్రీ! నిశ్చింతగా వెళ్ళిరండి. శుభం’’
వ్యాసరాయలు ఆశీస్సులు తీసుకొని తిమ్మరుసు, రామలింగ నాయకుడు వెళ్ళిపోయారు. విజయనగర సామ్రాజ్య రక్షణకు కట్టుబడి ఉన్న ఆ ఇద్దరు దేశభక్తులను చూస్తూండిపోయారు వ్యాసరాయలు.
* * *
‘‘మంజూ! ఆగు’’
ఒంటరిగా ఇన్నాళ్ళ తరువాత కలిసింది తన ప్రేయసి. చంద్రప్ప ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు.
అది వాళ్ళు తరచుగా కలుగుకునే ఉద్యానవనం. అయితే చాలారోజులుగా ఆ తోట చిన్నబోయింది. ఈ ప్రేమికుల సందడి లేక వెలవెలబోత్నుది. ఆమె ఆగింది. పెడమోమై నిల్చున్నది.
‘‘మంజూ! నీకిది న్యాయంగా ఉందా! ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు?’’ దీనంగా అడిగాడు.
తన కన్నీళ్ళు అతనికి కన్పించనీయలేదామె.
‘‘నావల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను శిక్షించు. అంతేగానీ ఇలా దూరం చేస్తే చచ్చిపోతాను.’’
చటుక్కున వెనుదిరిగి చేత్తో అతని నోరు మూసేసింది. ‘‘చంద్రా!’’ అంటూ అరచేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
‘‘మంజూ!’’ ఆమెని దగ్గరికి తీసుకున్నాడతను.
‘‘జాతకం నమ్మి నన్ను దూరం చేస్తావా! చావైనా బతుకైనా ఇద్దరికీ ఒకసారే అనుకున్నాం కదా! ఆ కంటకునితో కలిసి ఎందుకు నా కంటబడుతున్నావో తెలుసుకోలేని బుద్ధిహీనుడ్ని కాను’’ కోపంగా అన్నాడు.
‘‘నువ్వు గ్రహించగలవని నాకు తెలుసు చంద్రా! నిన్ను నొప్పించాను. మన్నించు’’ దీనంగా అంది.
‘‘అలా అడిగితే సరిపోదు.శిక్ష వేయాల్సిందే’’ అల్లరిగా అన్నాడు.
‘‘ఏం శిక్ష వేస్తావ్‌?’’ నడుం మీద చేతులుంచుకొని మంజరి అడిగిన తీరుకు నవ్వేశాడు.
‘‘శిక్షా! మూడుముళ్లే…’’
ఆమె మొహం వివర్ణమయిందా ప్రస్తావనతో. పైకి బింకంగా మాట్లాడుతోందే గానీ తనవల్ల చంద్రప్పకి ఎటువంటి ఆపదయినా, అదీ పెళ్ళి రూపంలోనైనా రాకూడదని ఆమె ఆలోచన.
‘‘సర్లేగానీ ఇలా రా కూర్చో. నీతో చాలా సంగతులు చెప్పాలి. మనం కలిసి చాలా రోజులైంది కదా!’’ చంద్రప్ప ఆమె చేయిపట్టి పూపొదరింట కూర్చోబెట్టుకున్నాడు.
‘‘మన పెళ్ళి ఎల్లుండి పున్నమిరోజు విఠల మందిరంలో. ఇంకేం మాట్లాడకు సరేనా?’’
ఆమె అంగీకరసూచకంగా తలూపింది. అతని ఆనందానికి అవధులు లేవు. వాళ్ళిద్దరి మధ్య కాలం మరపురాని మధురగీతంలా జాలువారింది.
ఆమె : తొలగించవే తెరలు తారకా
పులకింపనీ వలపు మల్లికా
అతడు : సద్దు దేయని రేయి జారిపోనీక
ముగ్ధమోహనగీతి పాడనీ ఇంక ॥
ఆమె : ఆనాటి నా కలలు నెరవేరు వేళ
అందాల జాబిల్లి అందేటి వేళ
అతడు : కొమ్మ కొమ్మన చివురు పులకరించింది
పూవుపూవున తావి పొంగిపోయింది ॥
ఆమె : కొండకోనల గాలి కునికేటి వేళ
కోటితలపులు ఎదను కొలువైన వేళ
అతడు : అల్లనల్లన పదము పాట పాడిరది
జల్లుజల్లుగ మనసు కరిగిపోయింది ॥
చాలాసేపు మైమరచి అలాగే ఉండిపోయారా ప్రేమికులు.
దూరంగా నగారా మోగింది. చంద్రప్ప ఈ లోకంలోకి వచ్చాడు ఏదో గుర్తొచ్చినట్లుగా.
‘‘మంజూ! రామేశ్వరశాస్త్రి సన్యసించాడు. తెల్సుగదా!’’
‘‘అవును చంద్రా! అతను మహాశిల్ప గాయకుడు. ఉపాసకుడు. నిజానికి విఠల దేవాలయ సప్తస్వర స్తంభాల పూర్ణాకృతి అతనివల్లనే సిద్ధించింది.’’ గౌరవం ధ్వనించిందామె స్వరంలో.
‘‘శాస్త్రి విజయనగరం వీడి వెళ్ళిపోయాడట మంజూ!’’
ఆమె ఆశ్చర్యపోలేదు. శాస్త్రి గురించి అప్పటికే చాలా కథనాలు విన్నది. అతను అడుగుపెట్టిన చోట శుభప్రదంగా ఉంటుందనీ, ఏదైనా అశుభాలు జరుగబోతుంటే అతనా స్థలంలో ఉండడనీ.
‘‘నాకు అదే కలవరంగా ఉంది చంద్రా!శాస్త్రి విజయనగర విశిష్టశిల్పుల్లో ఒకడు. అలాంటిది ఈ నగరాన్ని వీడిపోయాడంటే అదీ ఎక్కడికో తెలీదంటే’’ అర్థోక్తిలో ఆగింది.
‘‘కాశీలో ఎవరికో కన్పించాడట. వెళ్ళేముందు ఆశ్రమవాసులతో ఇక విజయనగర వైభవం కనుమరుగవుతుందని అన్నాడట’’ బాధగా చెప్పాడు.
ఆ విషయం నేనూ విన్నాను. అతను సన్యాసం తీసుకున్న తర్వాత పెనుమార్పు జరిగింది. కుండలిని సాధనతో భవిష్యత్‌ చెప్పగల శక్తి వచ్చిందట. ఏది ఏమైనా గొప్ప సంగీత శిల్పి’’ నిట్టూర్చిందామె.
‘‘నిజమే! ఇప్పుడు విజయనగర పరిస్థితులు ఆ సూచన చేస్తున్నాయి కూడా… ఆ వీరేంద్రుడు’’ కోపంగా ఏదో చెప్పబోయాడు. ఆమె మధ్యలోనే ఆపింది.
‘‘చంద్రా! నీకు మరో ముఖ్యవిషయం చెప్పాలి. ఆ వీరేంద్రుడు ప్రభువుకూ మహామంత్రికీ వివాదం రేపాలని కుట్రపన్నుతున్నాడు.’’
‘‘అలాచేస్తే గానీ వాడి ఆటలు సాగవని పన్నాగం కాబోలు’’ చంద్రప్ప దవడ ఎముకలు బిగిసాయి.
‘‘ఆ వివాదం యువరాజు పట్టాభిషేకరూపంలో వస్తున్నది’’ మంజరి వివరించింది.
‘‘అయితే మనమేం చేయాలి’’ చంద్రప్ప ఆలోచించాడు.
‘‘మనం చేయగలిగేది మహామంత్రి చెప్తారు. ఆ కంటకుడితో నేను మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. ఆ ద్రోహి కూడా వీరేంద్రునితో చేతులు కలిపాడు. వాడేమన్నాడంటే’’ అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది.
‘‘ఆఁ! దుర్మార్గుడు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెడతాడా!’’ పళ్ళు కొరికాడు చంద్రప్ప.
‘‘మనం మహామంత్రి చెప్పినట్లే చేయాలి. తెలిసిందా! ఆవేశపడి రహస్యాన్ని బట్టబయలు చేయకు.’’
అతను కొంత తగ్గాడు. ఆమె అతనికి దగ్గరగా జరిగింది.
‘‘ఈ ప్రశాంతమైన రాత్రి ఓ పాట పాడు చంద్రా! విని చాలానాళ్ళయింది’’ బతిమలాటగా అంది. మనసులో మాత్రం చంద్రప్పను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అని బెంగగా ఉందామెకు.
‘‘ఈ చల్లని రేయిలో
నా ఉల్లము రంజిలగా
పాట పాడనా చెలీ
పరవశించనా’’
అతనలా పాడుతూనే ఉన్నాడు. ఆమె అతని భుజంమీద తలవాల్చి వింటున్నది.
‘‘బాగు బాగు’’ చప్పట్లు విన్పించటంతో ఇద్దరూ దిగ్గున లేచి నిలిచారు. ఎదురుగా రామకృష్ణ కవీంద్రులు.
మంజరి అనవతంగా నిలబడిరది. చంద్రప్ప రామకృష్ణునికి నమస్కరించాడు.
‘‘కవీశ్వరులకు అభివాదం’’
‘‘చిరంజీవ. విజయనగర సామ్రాజ్యంలో కళారాధనకు వెన్నెల కూడా వికసిస్తుందని ఇవాళే తెలిసింది’’ కొంటెగా నవ్వాడు రామకృష్ణుడు.
‘‘క్షమించాలి స్వామీ! మంజరి, నేను…’’ తడబడ్డాడు చంద్రప్ప.
‘‘నాకు తెల్సుగానీ మీరు నిర్వహించవలసిన రాచకార్యమొకటున్నది. ఇది అతి రహస్యము. మహామాత్యులు సెలవిచ్చారు’’ అంటూ రామకృష్ణకవి చంద్రప్ప, మంజరిలని దగ్గరిగా పిలిచి కొన్నిమాటలు చెప్పారు.
‘‘అర్థమైందికదా! ఎలాగైనా సరే ప్రభువు పదిహేను దినాలు అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్ళకూడదు. అంతే! అన్నపూర్ణాదేవి మందిరంలో చక్కబెట్టే పని మంజరిది. మిగతా పని నీది చంద్రప్పా! ఆపైన అంతా విరూపాక్షునిది’’ రామకృష్ణుని దగ్గర సెలవు తీసుకుని కార్యభారంతో ఇద్దరూ బయలుదేరారు.

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

పుత్రోత్సాహము తల్లికి

by Kattekola Vidyullata November 22, 2023
written by Kattekola Vidyullata

 ట్రింగ్ …ట్రింగ్ ..

ఫోన్ మోగడం తో వంట గదిలో నుంచి వచ్చింది సుజాత “హలో, హలో ,నేను అమ్మా నీ శీను ని మాట్లాడుతున్నాను.”

” చెప్పు బాబూ, ఏంటి సంగతి అంత ఆనందంగా ఉన్నావు?”

” ఆ అవునమ్మా ! ఆనందం కాదు అంతకు మించి. నా (నీ) కల నెరవేరింది అమ్మా. నేను కలెక్టర్ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాను.. ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. వెంటనే నీకు ఫోన్ చేస్తున్నాను.

ఈ క్షణం నీ పక్కన ఉండి ఉంటే బాగుండు. నీ కళ్ళల్లో ఆ వెలుగులు చూస్తే బాగుండు అనిపిస్తోంది అమ్మా. రాత్రి ట్రైన్ కి బయలుదేరి వస్తాను.”

“ఏంటి శ్రీనూ, నువ్వు చెప్పేది నిజమా? మన కల నెరవేరిందా? సో గ్రేట్ నాన్నా! కంగ్రాట్యులేషన్స్! మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ఎంతో గర్వంగా ఉంది. సరే వెంటనే బయలుదేరిరా.

నువ్వు వచ్చేసరికి నీకు ఇష్టమైన బొబ్బట్లు, ఆవ పెట్టిన పులిహోర చేసి ఉంచుతాను. మీ స్నేహితులను కూడా భోజనానికి పిలువు. ఈ ఆనందం వాళ్ళ అందరితో షేర్ చేసుకుందువు గానీ.”

“అలాగే అమ్మా. అలా అయితే ముద్దపప్పు ఉంచు. ఆ వెంకట్ గాడికి మన ఇంట్లో ముద్దు పప్పు ఆవకాయ అంటే ప్రాణం. మీ అమ్మ అంత బాగా ఆవకాయ ఎవరూ చేయలేరు రా అంటాడు. ఇక ఉంటాను మరి. వాళ్ళందరికీ ఫోన్లు చేయాలి. బై,”

” బై శీను, జాగ్రత్త. బయలుదేరినప్పుడు ఫోన్ చెయ్,” చెప్పింది సుజాత.

ఫోన్ పెట్టేసి ఆనందభాష్పాలు తుడుచుకుంటూ సోఫాలో కూర్చుంది. మనసు గతంలోకి జారిపోయింది అప్రయత్నంగా.

“అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు భర్తను వదిలేస్తే ఈ పిల్లాడిని పెట్టుకుని ఎలా బతుకుతావు? నువ్వు చేస్తున్నది ప్రైవేట్ ఉద్యోగం. ఆ సంపాదనతో పిల్లాడిని చదివించడం సాధ్యమవుతుందా? మంచో చెడో పిల్లాడి కోసమైనా నువ్వు సర్దుకుపోవాలి అతడితో,” తన తల్లి మాటలు.

“లేదమ్మా అతనితో కలిసి ఉంటే నా పిల్లాడికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అనిపిస్తుంది నాకు. అతడి చెడు ప్రవర్తన పిల్లాడి పెరుగుదల పై ప్రభావం చూపిస్తుంది. నాకది ఇష్టం లేదు. నేను నా శ్రీనూని ఒక గొప్ప పౌరుడిగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాను.సాధ్యమైతే వాడిని కలెక్టర్   గా చూడాలనుకుంటున్నాను. నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకు. అతనితో కలిసి ఉండమని చెప్పకు, ప్లీజ్.”

ఏ ధైర్యంతో ఆ నిర్ణయం తీసుకుందో తెలీదు కానీ తన భర్త తనను మోసం చేస్తున్నాడని, తిరుగుబోతు గా మారాడని తెలియగానే అతడితో విడాకులకు సిద్ధమైంది.

కానీ అమ్మ చెప్పిన మాట నిజమే. తన ప్రైవేట్ టీచర్ ఉద్యోగం తో కొడుకుకి మంచి చదువు చెప్పించడం కష్టం. కనుక దీనికి ఏదైనా చేయాలి. శ్రీను ని బాగా చదివించాలి. ఎలా? ఏం చేయటం? ఆలోచిస్తూ ఉండగా ఒక  మంచి ఉపాయం తట్టింది  సుజాతకి.

అవును కరెక్ట్ అలా చేస్తే తనతోపాటు తన లాంటి మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కల్పించవచ్చు. సంపాదన పెరుగుతుంది కనుక ఇబ్బంది ఉండదు.

కానీ తను అనుకున్నది ఆచరణలో పెట్టి ఫలితం రావడానికి కనీసం ఒక ఏడాది కాలం పడుతుంది, అప్పటి వరకూ తనూ, పిల్లాడు బ్రతకడానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోతుందా? మళ్లీ ఆలోచనలో పడింది సుజాత.

తన ఆలోచనని, ప్రణాళికను అన్నగారితో చర్చించింది. చిన్ననాటి నుంచి అన్నయ్య తను మంచి ఫ్రెండ్స్. తన ప్రతి సంతోషంలో, కష్టంలోనూ తోడు ఉన్నవాడు అన్నయ్య. ఇది కూడా తన ధైర్యానికి కారణం కావచ్చు.

“చాలా బాగుంది సుజాతా. నీకు ఎలాగు వంట చేయడం ఇష్టం కదా. నీ చేతి వంట అమోఘంగా ఉంటుంది కాబట్టి  తప్పక విజయం సాధిస్తావు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అన్నా వదినలు ఉన్నారని మర్చిపోకు,” అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించాడు అన్నయ్య.

అదిగో ఆరోజు తన ఆలోచనల్లో మొదలైనది “అమ్మ చేతి వంట” అనే క్లౌడ్ కిచెన్. పూర్తి శాకాహార ఆంధ్ర భోజనం.

ఉన్నపళంగా హైదరాబాద్ వచ్చేసింది తను. భర్త (తను) ఉద్యోగం చేస్తున్న ఊరిని వదిలి. అయితే ఇక్కడ తన చిన్ననాటి స్నేహితులు చాలామంది ఉన్నారు. వారికి ఫోన్ చేసి చెప్పింది తను వస్తున్నానని.

 తన స్నేహితురాలు సీత ఎంతో సహాయం చేసింది. ఉండేందుకు ఇల్లు చూసి పెట్టడమే కాక ఆమె భర్త వ్యాపారంలోనే ఉండడంవల్ల తను వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన సరుకులు వస్తువులు వంటివి అతని స్నేహితుల వద్ద హోల్ సేల్ ధరలకు ఇప్పించడం వంటి ఎన్నో.

చివరికి తను విడాకులకు అప్లై చేసేందుకు లాయర్ గారిని కూడా పరిచయం చేసింది సీత. ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి.

ఆ విడాకుల ప్రహసనం మామూలుగా జరిగిందా? తను మగవాడిని కనుక ఎంతమందితో తిరిగినా తప్పులేదనే అహంకారంతో ఉన్న భర్త, అంతే గొప్పగా అతనికి వత్తాసు పలికే అత్తగారు ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేయడానికి ప్రయత్నించారు!

తనకు తెలియకుండా

పిల్ల వాడిని కలుసుకుని వాడి బుర్రలో తనకు వ్యతిరేకంగా విషం నూరి పోయడానికి కూడా సిద్ధపడ్డారు. 

పాపం శీను, చిన్న పిల్లవాడు. తల్లా,తండ్రా అంటే ?కానీ వాడు చాలా తెలివైనవాడు. అంతేకాక చిన్ననాటి నుండి తానే లోకంగా బ్రతుకుతున్న తన తల్లి మనసు అర్థం చేసుకున్నాడు. తన తోటే ఉన్నాడు. తనని పూర్తిగా నమ్మాడు.

తన భర్త లాంటి మగవారిని ఏం చేయాలి అసలు? కాలం ఎంత మారినా తాము మారమని, మగవాడు అంటే అదేదో దేవుడు అన్నంత అహంకారం. తాను విడాకులు అనే సరికి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు తల్లీ కొడుకులు. అయినా తన తప్పు ఒప్పుకునేంత ఔన్నత్యం లేదు కదా!

అతని తప్పు మూలానే తాను విడాకులు కోరుతున్న విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

తన అన్నయ్య స్నేహితుడైన ఒక ఇన్స్పెక్టర్ సహాయంతో సాక్ష్యాలను సేకరించగలిగింది.

కేవలం విడాకులతో వదిలేయాలా లేక తనను మానసికంగా ఇంత బాధపెట్టిన అతడినిజైలుకు పంపించాలా? ఎన్నో ఆలోచనలు.

కొత్తగా మొదలు పెట్టిన వ్యాపారం ఒకపక్క, కోర్టు కోసం తిరగటం ఒకపక్క. ఈ మధ్యలో బంధువులలో గుసగుసలు. వీటన్నిటినీ అధిగమిస్తూ శ్రీను చదువుకు ఏమాత్రం అంతరాయం కలుగకుండా చూసుకుంటూ తన వ్యాపారంపై దృష్టి పెట్టలేక పోతోంది.కానీ పోరాడాలి, గెలవాలి అన్న తపన, గెలుస్తాను అనే ఆత్మవిశ్వాసం ఏనాడు విడవలేదు సుజాత.

ఏదైనా వ్యాపారం మొదలు పెట్టి అందులో విజయం సాధించడం సినిమాలో చూపించినంత సులువైన విషయం కాదు అని అర్థమైంది సుజాతకు.

అందులోనూ తన లాంటి ఒంటరి మహిళలకు ఆ పోరాటం ఇంకా ఎక్కువ. కానీ పోరాడితే విజయం తప్పక సాధించగలం అని నిరూపించింది కూడా తను.

తను ఆనాడు ఒక శాఖగా ప్రారంభించిన “అమ్మ చేతి వంట” తన అయిన వాళ్ళు, స్నేహితుల ప్రోత్సాహం తో పాటు హైదరాబాద్ నగర వాసుల ప్రోత్సాహంతో, వారి శాఖాహార అవసరం తీరుస్తూ, వారిచ్చిన మంచి ఫీడ్ బ్యాక్ వలన ఈరోజు నగరంలోని వివిధ ప్రాంతాలలో 8 శాఖలుగా విస్తరించింది.

 అన్ని శాఖలలో కలిపి దాదాపు 50 మందికి పైగా ఆడవారు పనిచేస్తున్నారు. వారంతా తనలాగా జీవితంలో ఏదో విధంగా దెబ్బతిన్నవాళ్లే.

కొత్త శాఖను ప్రారంభించినప్పుడల్లా కనీసం ఒక నెల రోజులు తను అక్కడే ఉంటూ అక్కడ వంట చేయడానికి వచ్చిన వారికి ప్రతి ఆహారం తను అనుకున్న రుచి వచ్చేలా ఎలా చేయాలో కొలతలతో నేర్పించడం చేసింది .

అందువల్ల అన్ని శాఖలలోనూ ప్రతి రోజూ ఒకే రుచి. రుచి, శుచి, నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వల్ల తను అనుకున్న విధంగా విజయం సాధించగలిగింది.

వ్యాపారం లో ఎంత బిజీగా ఉన్నా శ్రీను చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎప్పుడూ మర్చిపోలేదు సుజాత. మంచి కాలేజీలో ఇంటర్ చదివాడు.

ఫ్రెండ్స్ అంతా ఇంజనీరింగ్ చదువుతున్నా తన ఆశయం అది కాదని తెలుసు కనుక డిగ్రీలో చేరాడు శ్రీను. చదువులో ఎప్పుడూ అశ్రద్ధ చూపలేదు. పీజీ చదువుకుంటూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.

తల్లి కష్టం, మనసు అర్థం చేసుకున్నాడో ఏమో చిన్ననాటి నుంచి తల్లి కలనే తన కలగా చేసుకుని కలెక్టర్ అవడం కోసమే చదివాడు. గత రెండు ప్రయత్నాలు విఫలం అయినప్పుడు కుంగిపోకుండా ముచ్చటగా మూడో ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు.

ఈ సంతోషానికి అవధులు ఉన్నాయా? అసలు ఇది నిజమేనా? తను కలగంటోందా?  చేతి మీద గిల్లుకుంది సుజాత. ‘అబ్బా!’ నొప్పి తెలుస్తోంది. అయితే ఇది నిజమే అన్నమాట.

వెంటనే ఈ ఆనందాన్ని తన తల్లిదండ్రుల తోటి, అన్నా వదినల తోటి పంచుకోవాలి. తన స్టాఫ్ అందరికీ శ్రీను వచ్చాక పెద్ద పార్టీ ఇవ్వాలి.

“అమ్మా, నేను కలెక్టర్ అయిన తర్వాత నువ్వు ఇంక ఏ మాత్రం కష్టపడొద్దు.నాతోటే ఉండాలి. ఈ ఆంటీలందరికీ నేను ప్రభుత్వ రుణాలు వచ్చేలా చేసి సొంత వ్యాపారాలు చేసుకునేలా చేస్తాను,” అని చెప్పే శ్రీను అంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టమో. ఈ వార్త విని చాలా సంతోషిస్తారు. ఆలోచిస్తూ సోఫాలోంచి లేచింది తన పుత్రోత్సాహాన్ని అందరితో పంచుకోవడం కోసం సుజాత.

రచన :  కట్టెకోల విద్యుల్లత

6302805571

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగు… సంస్కృత పదాల స్వరూపం

by రంగరాజు పద్మజ November 22, 2023
written by రంగరాజు పద్మజ

      పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయులకైనా , విద్య నేర్చుకొనే చిన్నారులకైనా పెద్ద సమస్య ఏమిటంటే? ఏది సంస్కృత పదం?, ఏది తెలుగు పదం? అని గుర్తించడం, కత్తి మీద సామే . అయితే కొంచెం కష్టపడి ప్రయత్నం చేస్తే సంస్కృతం, తెలుగు పదాలును సులభంగా కొనుక్కోవచ్చు. కష్ట పడితే సాధించలేనిది లేదు కదా! తెలుగు, సంస్కృత పదాలను సులభంగా ఎలా తెలుసుకోవచ్చో చేసే చిరు ప్రయత్నం ఇది.

    బాలవ్యాకరణంలో చిన్నయసూరి సంస్కృత సమం , సంస్కృత భవం, ప్రాకృత సమం, ప్రాకృత భవం, దేశ్యాలు గురించి సంజ్ఞాపరిచ్ఛేదంలో చక్కగా వివరించారు. సంస్కృత పదాలను తత్సమాలని, తెలుగు పదాలను ఆచ్ఛికాలని చెప్పారు.ఆచ్ఛిక పరిచ్ఛేదంలో

“సంస్కృత సమేతరంబైన యీ భాష యచ్చనా బడు” అని సూత్రీకరించారు.

అనగా పైన చెప్పిన సంస్కృత సమ పదాలుగాక , సంస్కృత భవం ,ప్రాకృత సమం ,ప్రాకృత భవం ,దేశ్యాలతో కూడిన పదాలను ఆచ్చికపదాలు లేదా తెలుగు పదాలని చెప్పవచ్చని ఫలితార్థం.

మొదట సంస్కృత పదములను… గురించి తెలుసుకుందాం

1.సంయుక్తాక్షరములతో కూడిన పదములన్నీ సంస్కృతపదాలు.

ఉదా:-చక్రః , వర్షమ్ , మూర్ఖః ,అర్చన , కర్పూరమ్ ……

ఇవి తెలుగులో చేరునపుడు వీటికి తెలుగు ప్రత్యయాలైన డు, ము ,వు లు చేరి చక్రము,  వర్షము , మూర్ఖుడు , అర్చన , కర్పూరము అని మారుతాయి.

2. సంశ్లిష్టాక్షరములతో కూడిన పదములు సంస్కృత పదాలు….

ఉదా:-స్త్రీ ,రాష్ట్రం ,అర్ఘ్యం ,జోత్స్న ,క్త్వార్థం……

3 మహాప్రాణాక్షరాలతో కూడిన పదాలు సంస్కృత పదాలు…….

ఖరం ,ఘటం ,ఛత్రం ,ఝషం ,కంఠం ,ఢంకా ,కథ ,ధనం ,ఫలం భజన…..

4.విసర్గతో కూడినవి సంస్కృత పదాలు….

ఉదా:-దుఃఖం ,అంతఃపురం ,అంతఃకరణ ,తపఃఫలం, మనఃకాయం….

5.ఋ ౠలతో కూడిన పదాలు సంస్కృత పదాలు….

ఉదా:-ఋషి  ,ఋణం , ఋతువు ,….

6.శ ,ష ,హలతో కూడినపదాలు సంస్కృత పదాలు….

ఉదా:- శతము ,శంకర ,శశము, శంతనుడు ,ఆశ ,ఆకాశం ,

వేషము, దోషము ,ప్రదోషము ,

హంస ,హలము ,హాలాహలం ,హారం హీనం ,హోమం……

7.డు ,ము,వులు చేరడానికి తగిన పదాలు సంస్కృత పదాలు….( ఇవి తెలుగులోకి చేర్చేటప్పుడు డు ,ము ,వు లు చేరి వస్తాయి.)

రామ, భీమ , భయంకర, కంస

వన, దేశ , ప్రాంత ,ఆవేశ ,

చిత్ర, క్రతు , ధేను, తరు గురు,….

రాముడు, భీముడు , భయంకరుడు, కంసుడు

వనము, దేశము , ప్రాంతము ,ఆవేశము ,

చిత్రము,  క్రతువు , ధేనువు, తరువు గురువు,….

8.ఉపసర్గతో కూడిన పదాలు సంస్కృత పదాలు….

ఉదా:-ప్రతిదినం , ప్రఖ్యాతి , సకుటుంబం , ప్రత్యక్షం , పరోక్షం , దుర్లభం , సంతృప్తి, అపరిశుభ్రం , ,…

9.సంస్కృత సంఖ్యావాచకాలతో కూడినవి సంస్కృత పదాలు….

ఏక ,ద్వి ,త్రి చతు ,పంచ ,షష్టి సప్త, అష్ట, నవ , దశ , శత , సహస్ర….

10. సవర్ణదీర్ఘ ,గుణ ,యణాదేశ వృద్ది , అనునాసిక , విసర్గ , జస్త్వ , శ్చుత్త్వ…. సంధులతో కూడినవి సంస్కృత పదాలు….

అష్టావధానం, కవీశ్వర, గురూపదేశం, పితౄణం వేంకటేశ్వర ,మహర్షి ,ప్రత్యేక, అణ్వస్త్రం, ఏకైక ,పరమౌషదం మనోహరం ,చతుషష్టి……

11 ఋతువుల పేర్లు , తిథులపేర్లు , నక్షత్రాల పేర్లు ,తెలుగు సంవత్సరాలు…. సంస్కృత పదాలు

ఉదా:-వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు….

అమావాస్య ,పాఢ్యమి …..

అశ్వని ,భరణి,…..

ప్రభవ, విభవ….

12. వట్రుసుడితో కూడినవి సంస్కృత పదాలు….

ఉదా:-గృహము ,కౄరుడు , కృపాణము , ధృతరాష్ట్రుడు , దృష్టి , ధృవీకరణ, పృథివి , పృచ్ఛకులు , భృగువు , సవితృ ,ధాతృ ,నేతృ ,భర్తృ కర్తృ …..

13.యకారముతో కూడిన పదాలు తెలుగులో లేవు. అంటే యకారంతో కూడిన పదాలన్నీ సంస్కృత పదాలే.

యమున , యముడు , యజ్ఞము , యంత్రము , యాత్ర….

ఇక తెలుగు పదాల గురించి తెలుసుకుందాం

1.ద్విత్వాక్షరములతో కూడిన పదాలు తెలుగు పదాలు

ఉదా:-అమ్మ, అక్క ,అవ్వ, అత్త , కుక్క, మొగ్గ , వెన్న , కర్ర , నిచ్చెన , గజ్జెలు , పిట్ట….

2 .అరసున్నతో కూడిన పదాలు తెలుగు పదాలు

ఉదా:-తెలుఁగు ,మూఁడు ,చీఁకటి ,పాఁత , కోఁతి మూఁత. కోఁట పేఁట మూఁట……

3.సర్వనామాలన్నీ తెలుగుపదాలు

ఉదా:-నేను, మేము, నీవు మీరు, అతడు , వాడు , వారు , వాడు , వీడు, ఎవడు, ఎంత , అంత , ఇంత,  కొంత, కొన్ని, ఎన్ని , అన్ని , అక్కడ, ఇక్కడ , ఎక్కడ….

4.క్రియలతో కూడినపదాలు తెలుగు పదాలు

ఉదా:-వండు ,తిను,చదువు ,పాడు ,వచ్చు ,పోవు ,అమ్ము , కొను….

(లిఖించు ,భావించు ,భేధించు ,ఖండించు ఇలాంటివి సంస్కృత క్రియలు. సంస్కృత క్రియలు తెలుగులో అలాగే చేరవు. క్రియలు చివరి ఇంచు చేరుతాయి)

5.స.. తో కూడిన పదాలు ఎక్కువగా తెలుగు పదాలు

ఉదా:-సంత, సంచి , సంతకం ,ఆస ,ఆకసం ,పూస, గసగసాలు……

(సంతోషం , సంభవం… ఇలాంటివి సంస్కృత పదాలు)

6.కొన్ని డు, ము, వులతో కూడినవి తెలుగు పదాలు

ఉదా:-వాడు ,వీడు ,పాపడు ,మగడు, కైరుడు, కత్తలుడు , జన్నడు , తమ్ముడు, మనుమడు, ఆటగాడు , జూదగాడు, పాటగాడు , వేటగాడు, బల్లిదుడు, ఱేడు, చెలికాడు , హెగ్గడికాడు , అటమటీడు , కన్నడీడు , కల్లరుడు , పాము , ఇనుము , అల్లము, సున్నము, బియ్యము , అందము, చందము,చెరువు, పరువు, కరువు, దరువు, నిలువు , కొలువు,….

7. సంయుక్తాక్షరంతో గానీ మహాప్రాణాక్షరంతో గానీ కూడినప్పటికి పదం చివర డు ,ము ,వు … చేరితే అవి తెలుగు పదాలుగా మారుతాయి. (కానీ మూలం సంస్కృత పదం) వీటినే తత్సమాలు అంటారు. వీటికి మరొక పేరు ప్రకృతులు.

ఉదా:- ఈశ్వరుడు, భీముడు , పర్వతము, భయము , క్రతువు , తరువు..

భీముడు+ అతడు

పర్వతము + అది

భయము +ఎందుకు

8.ఎ ,ఒ, చ, జ(దంత్యాలతో కూడినవి) లతో కూడినపదాలు తెలుగు పదాలు 

ఉదా:-ఎలుక ,ఎంత ,ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ,ఎరుక, ఎరువు ,ఎరుపు , ఒక , ఒంటె, ఒంటరి, ఒనరు, ఒప్పు, ఒత్తు, ఒద్దిక , చాప, చురక ,చూలు, చందమామ, జడ, జల్లెడ, జముడు ,జాతర ,జున్ను

9.సంఖ్యలన్నీ తెలుగు పదాలు

ఉదా:-ఒకటి ,రెండు,మూడు ,నాలుగు ,ఐదు ,ఆరు…నూరు ,వంద ,ఇన్నూరు ,వేయి,

10. కృదంత ప్రత్యయాలు చేరిన పదములు అచ్చతెలుగు పదాలు

కోయు+త….కోత

కోయు అనేది క్రియ .. క్రియా మీద త అనే కృదంత ప్రత్యయం చేరి కోత అని నామవాచకంగా మారింది.

పండు+ట..పంట

మూయు+త…మూత

పూయు +త…పూత

మండు +ట…మంట

అరుచు+పు…అరుపు

మునుగు +క…మనక

చేరు+ఇక…..చేరిక

కోరు+ఇక…..కోరిక

అలుగు+క….అలక

పోవు+ క….పోక

ఊరు +ట….ఊట

11.తద్దిత రూపాలతో ఏర్పడు పదాలు తెలుగు పదాలు.

నామవాచకాల మీద గానీ, విశేషణాల మీద గానీ చేరి నామవాచకంగా మారే పదాలను తద్దినాలు అంటారు.

పెద్దతనము… పెద్ద అనేది విశేషణం. దాని మీద తనము అనే తద్దిత ప్రత్యయం చేరి పెద్దతనంగా మారింది.

 పెద్దఱికము, చుట్టఱికము , కన్నెఱికము, పూజారి, అరమరిక ,చదువరి ,తెంపరీ , తెరువరి ,సుంకరి ,జూదరి,

జాలరి ,టక్కరి ,వగలాడు ,దొమ్మరి ,ముక్కిడి,ఆటగత్తె , మోసగత్తె ,చాకిత ,కఱవత , చిఱుతుక , నాతుక, నెలతుక

12.శకటరేఫములతో ఏర్పడేవి తెలుగుపదాలు.

కఱ్ఱ ,బఱ్ఱె ,తొఱ్ఱ ,గొఱ్ఱె ,ఱంపము ,జుఱ్ఱు ,కఱ్ఱు ,మఱ్ఱి ,,……..

13.కొలమానం తెలుపే పదాలు అచ్చతెలుగుపదాలు….

జాన ,మూర ,బిత్తెడు ,దోసెడు ,మానిక, కుంచం , పడి , సేరు , అణా , దమ్మిడి , రూక ,రూపాయి

గుర్తించుకోవలసినవి….

1.సంయుక్తాక్షర పదములన్నీ సంస్కృతపదాలే కానీ

కర్జము ,సంద్రం ,….మొదలైన పదములు ఆచ్చికపదాలు.

2 వస్తే ,ఇస్తే ,తెస్తే,అరిస్తే మొదలైన చేదర్థకాలతో కూడినవి  ఇవి సంయుక్తాక్షరాలతో కూడినా మూల రూపం వచ్చు ఇచ్చు తెచ్చు అరుచు అనేవి అచ్చతెలుగు పదాలు.

(మూల రూపం వచ్చు+తే… వస్తే)

3.అన్నము వంటి ద్విత్వాక్షర పదాలు సంస్కృత పదాలుగా ఉన్నాయి.

ఇలా తెలుగు, సంస్కృత పదాలను సులభంగా గుర్తించవచ్చు. కానీ అభ్యాసం వలన మరి కొన్నింటిని తెలుసుకోవచ్చు

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us