మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

ఘర్షణ కథాసంపుటి ఆవిష్కరణ సభ

by mayuukha September 30, 2023
written by mayuukha
September 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగుభాష…పుట్టుపూర్వోత్తరాలు

by రంగరాజు పద్మజ September 30, 2023
written by రంగరాజు పద్మజ

దేశభాషలందు తెలుగు లెస్స అని పేరు తెచ్చుకొన్న మన తెలుగుభాష ద్రావిడభాషలలో ఒకటి. ద్రావిడ భాషలు సుమారు 31 ఉన్నాయి. వాటిలో తమిళం అతి ప్రాచీనమైన భాష. అందుకే తమిళ భాషలో మన నన్నయ కంటే ముందే సాహిత్య భాష పుట్టింది.
తొలక్కాపియం వంటి రచనలు వచ్చాయి. తమిళం నుండి తెలుగు, కన్నడం ,మలయాళం భాషలు వేరైనట్లు పరిశోధకులు భావిస్తున్నారు. క్రీస్తుశకం ఆరవశతాబ్దం నాటికే తెలుగు భాష ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.
నన్నయ భారతరచనలో సంస్కృత శబ్దాలను (తత్సమాలు) అధికంగా వాడడం వల్ల తెలుగు సంస్కృత జన్యమని పండితులు భావించారు. కానీ అది నిజంకాదు. తెలుగు ద్రావిడ భాషల నుండి విడివడి స్వతంత్ర భాషగా ఏర్పడినది.

మన మాతృభాష తెలుగు.ఈ తెలుగుకు ఆంధ్రం , తెలుగు,తెనుగు అని మూడు పేర్లను పర్యాయపదాలుగా వాడుతున్నాము.

ఆంధ్రము:-
ఆంధ్ర’ అంధ్ర అనే శబ్దాలు రూపాంతరాలైన సంస్కృత పదాలు.ఇవి జాతి పరంగానూ,భాషాపరంగాను ప్రయోగించడం జరిగింది.శాశన ప్రామాణికతను బట్టి ‘అంధ్ర ‘అనేది ప్రాచీనరూపమైతే ఆంధ్ర అనేది అర్వాచీన రూపం.చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి ఆంధ్రుల గురించి రాశారు. అశోకుని శాసనాల ద్వారా ఆంధ్రులను ఒక జాతిగా పేర్కొన్నారని తెలుస్తున్నది. భాషాపరంగా నన్నయ తన స్నేహితుడైన నారాయణభట్టు గురించి “ఆంధ్రభాషా సుకవి శేఖరా” అని సంబోధించాడు నన్నయ్య రచించిన నందంపూడి శాసనంలో ‘ఆంధ్ర శబ్దం’ భాషా వాచకంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విధంగా ఆంధ్రశబ్ధం మొదట జాతి పరంగానూ తర్వాత భాష పరంగానూ తర్వాత దేశ పరంగానూ ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది .

తెనుంగు…తెనుగు

తెనుగు పదము త్రినగము పదము నుండి ఏర్పడింది. త్రినగములనగా ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం ఈ నడుమ ప్రాంతంలో ఉన్న ప్రదేశాన్ని త్రినగ ప్రాంతమని ,ఇక్కడ ప్రజలు మాట్లాడే భాషను తెనుగు ప్రజలని వ్యవహరిస్తున్నారు. తెనుంగు ,తెలుగు అనే పదాలు కవులెందరో ఉపయోగించారు.నానారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు మహాభారత అవతారికలో “తెలుగున రచియింపుమధిక ధీయుక్తి మెయిన్” అని భాషాపరంగా ఉపయోగించారు. నన్నెచోడుడు,పాల్కురికి సోమన జాను తెనుగు పదాన్ని వాడారు. ఈ విధంగా తెనుగు పదము భాషాపరంగా ఉపయోగించారు
తెలుగు :-*
తెలుగు శబ్దము త్రిలింగములున్న దేశం త్రిలింగదేశమని అదే తరువాత ‘తెలుగు’ పదంగా మారిందని ఊహించడం జరిగింది.తెలుగు త్రిలింగ సిద్ధమని అది ప్రాచీనమైన పదమని సాహితీకారులు భావించారు .

మొత్తం మీద ఆంధ్రం,తెనుగు, తెలుగు పదాలు సమానార్థక పదాలనీ అన్నిటికీ సమప్రాధాన్యం కలిగి ఉందని తెలుస్తున్నది .
ఈ తెలుగు భాష గొప్పదనం తెలుసుకునే ముందు మనం సంస్కృత, ప్రాకృత భాషలో పరిచయం కూడా కొంత తెలుసుకుందాం!

సంస్కృతం:- సంస్కృతమును దేవనాగరి భాష లేదా ఆర్య భాష అంటారు.ఈ భాషలో అనంతమైన సాహిత్యసంపద ఉంది. “పరమేశ్వరుని ఢమరుకనాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష” అని విజ్ఞులు చెబుతారు. అలా వెలువడిన 14 రకాల సూత్రాలను మహేశ్వర సూత్రాలు అంటారు.ఢమరుకం నుండి వెలువడిన ఈ అక్షరధ్వనులను పాణిని ప్రఖ్యాత వ్యాకరణమైనా అష్టాధ్యాయిని రచించాడు.

  1. అ ఇ ఉ ణ్
  2. ఋ లుక్
  3. ఏ ఓ జ్
  4. ఐ ఔ చ్
  5. హ య వ ర ట్
  6. లణ్
  7. ఞ్ మ జ్ ణ న మ్
  8. ఝ భ ఞ్
  9. ఘ ఢ ధ వ్
  10. జ బ గడ శ్
  11. ఖ ఫ చ ఠ థ చ ట త వ్
  12. క ప య్
  13. శ ష స ర్
  14. హ ల్ అచ్చులు:-
    మహేశ్వర సూత్రాల్లో 1 2 3 4 తీసుకోగా మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రం చివరి అక్షరం చ్ కలిపితే అచ్చు అవుతుంది .ఇవే అచ్చులు.అ ఇ ఉ ఋ లు ఏ ఓ ఐ ఔ (చ్) హల్లులు :-
    మహేశ్వర సూత్రాల్లో 5 నుండి 14 వరకు తీసుకోగా 5 సూత్రంలో మొదటి అక్షరం’ హ’ 14 వ సూత్రంలో చివరి అక్షరం ల్. ఈ రెండిటిని కలపగా హల్ గామారి ఏర్పడింది. అవే హల్లులు.
    హ య వ ర ల ఞ్ మ జ్ ణ న ఝ భ ఘ డ ద జ బ గ డ ద ఖ ఫ ఛ ఠ థ చ ట త వ క ప శ ష స (ల్)
    పై మహేశ్వర సూత్రాలను ప్రత్యాహారాలు అంటారు. పాణిని సూత్రాలను అల్పాక్షరాలతో చెప్పడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నాడు.
    శివుడు తాండవానంతరం ముక్తాయింపుగా ఢమరుకం మీద 14 అక్షరాల ధ్వనులు మ్రోగించాడు. అవే శివసూత్ర జాలంగా ప్రసిద్ధికెక్కాయి.

నృత్తావసానే నటరాజ రాజో
సనాద ఢక్కమ్ నవ పంచవారమ్
ఉద్దుర్తు కామః సనకాది సిద్ధానే
తద్విమర్శే శివ సూత్ర జాలమ్
బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాది సిద్ధులు ఈ శబ్దాలను గ్రహించి, పాణిన్యాదులకు ప్రసాదించారు. అందుకే అక్షరాభ్యాస సమయంలో ‘ఓం నమః శివాయ సిద్ధం నమః’ అని స్మరించడం.

సంస్కృత భాషలో ఆదికవి వాల్మీకి రామాయణం రాశాడు. వ్యాసుడు భారతం, అష్టాదశ పురాణాలు రాశాడు. కాళిదాసు, భవభూతి, దండి, విశాఖదత్తుడు, భాణుడు, బాసుడు , అభినవగుప్తుడు, ఆనందవర్ధనుడు, విద్యానాధుడు, విశ్వనాథుడు మొదలైన ఎందరో కవులు అద్భుత కావ్యాలు రాసి మనకు అందించారు.

ప్రాకృతం :-
అసలు ప్రాకృతం అంటే …..

షడ్వధేయం ప్రాకృతశ్చ శూరసేనీచ మాగధీ
పైశాచీ చూళికా పైశా చ్యప్రభంశ ఇతి క్రమాత్

అంటే ప్రాకృతం ఆరురకాలుగా ఉందన్నమాట.

  1. ప్రాకృతం, 2.శూరసేని, 3.మాగధి, 4. పైశాచి, 5.చూళిక, 6.అపభ్రంశ పైశాచి

ప్రాకృతం అంటే అర్థం “అప్పటికి వ్యవహారంలో ఉన్న వాడుక భాష” అని దానికి ఐదు రకాల మాండలిక భాషలు చేరాయి. ఈ విధంగా ప్రాకృతం ఆరు రకాలు. భారతదేశాన్ని క్షత్రియులు పాలించినప్పుడు ప్రాకృతభాష రాజభాషగా చలామణి అయింది. అశోకుని శాసనాలు ప్రాకృత భాషకు సంబంధించిన తొలి ప్రస్థావనాలు. శాతవాహనులకాలం నాడు ప్రాకృతం రాజభాషగా చలామణి అయింది. హాలుడు తన గాధాసప్తశతిని ప్రాకృతంలో రాశాడు. గుణాడ్యుడు ప్రాకృతంలోని పైశాచిక మాండలికంలో బృహత్కథ అనే గొప్ప కథలు రాశాడు. ఇంకా ఎందరో ప్రాకృత కవులు ఉన్నారు.

వర్ణోత్పత్తిక్రమం

సంస్కృత, ప్రాకృత, తెలుగు భాషకు ఉన్న అక్షరాలు పరిశీలిద్దాం.
చిన్నయసూరి బాలవ్యాకరణంలో సంజ్ఞా పరిచ్ఛేదంలో మొదటి సూత్రంగా ఇలా చెప్పారు.

సంస్కృతం:- సంస్కృతమునకు వర్ణములేబది వచించారు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ లు లూ ఏ ఐ ఓ ఔ అం అః
క ఖ గ ఘ జ్ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ
ప్రాకృతం :-* ప్రాకృతమునకు వర్ణములు నలుబది.
అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఓ అం అః
క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ సహళ
ఇక్కడ సంస్కృతంలో ఉన్న అక్షరాల్లో ఋ ౠ లు లూ ఐ ఔ మరియు జ్ ఞ శ ష అనే 10 అక్షరాలు ప్రాకృతంలో లేవు .కేవలం 40 అక్షరాలు మాత్రమే ప్రాకృత భాషలో ఉందని చెప్పబడింది.

తెలుగు :-
ఇక మన తెలుగు భాషకు చిన్నయసూరి చెప్పిన అక్షరాలు పరిశీలిద్దాం
తెలుగుకు వర్ణములు ముప్పదియారు.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
క గ చ చ(దంత్యం) జ జ(దంత్యం) ట డ ణ త ద న ప బ మ య ర ల వ స హ ళ

సంస్కృత భాషలో లేకుండా కేవలం తెలుగుభాషలో ఉన్న అక్షరాలు 4. ఎ ఒ చ జ(దంత్యాలు) వీటితోబాటు తెలుగులలో అరసున్న( ఁ) శకటరేఫము (ఱ) ఉన్నాయి.

సంస్కృతం నుండి 19 అక్షరాలను తెలుగులోకి వచ్చాయి .వాటిని చిన్నయసూరి ఇలా సూత్రీకరించారు.

ఋ ౠ లు లూ విసర్గ ( ః) ఖఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ జ్ ఞ శ ష లు
సంస్కృత సమములగూడి తెనుగున వ్యవహరించబడు

ఇలా తెలుగు భాషకు మొత్తం 56 అక్షరాలుగా వెలుగొందుతూ నన్నయ నుండి నేటి కవుల కలములో నర్తిస్తూ అందరినీ అలరిస్తుంది.

September 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మార్పు దిశగా

by Aruna Dhulipala September 29, 2023
written by Aruna Dhulipala

ఆ రోజు వినాయక చవితి… ఎటు చూసినా ప్రతి ఇల్లు మామిడితోరణాలతో అలంకరించబడి పండుగ సంబరాల్లో కళకళలాడుతూ నవ్వుల పూలను పూయిస్తోంది. మోహన్ తెల్లవారు జామునే ఇంట్లోంచి బయటపడ్డాడు. గత నెల రోజులుగా వాళ్ళు ఉండే కాలనీలో వినాయక విగ్రహాన్ని పెట్టే ఏర్పాట్లలో తల మునకలుగా వున్నాడు. దానికి ప్రధాన సూత్రధారి మోహనే. విగ్రహాన్ని సెలెక్ట్ చేయడం దగ్గర్నించీ పూజకు పురోహితుని మాట్లాడడం, మంటపాన్ని వేయించడం, ఎలక్ట్రికల్ పనులు, రికార్డు, మైకులు, టెంట్లు, బ్యాండు…ఇవే కాక పూజకు కావలసిన పూలు, పండ్ల వరకు ప్రతీది దగ్గరుండి చూసుకుంటున్నాడు. అది ఎంతో తృప్తి తనకు.
అది తనకు కేవలం తృప్తి కోసం చేస్తున్నాడనుకోవడం కూడా పొరపాటే. ఎవరూ గ్రహించలేని స్వార్థం కూడా ఇందులో ఉంది. వార్డుమెంబరు రాజేశ్ అండ తనకు ఉండడం వల్ల అతడు కార్పొరేటర్ అయితే తనకు చాలా ప్రాముఖ్యత పెరుగుతుందని, తద్వారా రాజకీయాల్లో కాలు మోపి భవిష్యత్తులో తిరుగులేని నాయకుడు అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకోసం పక్క వీధిలో తమకు వ్యతిరేకులైన గ్రూప్ వారు ఏర్పాట్లు చేస్తున్న వినాయక ఉత్సవాలకు రెట్టింపు ఆర్భాటంగా చేయాలని సంకల్పించాడు. దానికి తన అయిదుగురు స్నేహితులు వత్తాసు పలకడం అతని నమ్మకాన్ని, బలాన్ని మరింత పెంచింది. అందుకే అవతలి వారు చేస్తున్న దానికి “అంతకు మించి” అన్నట్లు వుండేలాగా అక్కడి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ( ఆ గ్రూపు లోని ఒక వ్యక్తికి డబ్బు ఆశ చూపి ) వినాయకుడి విగ్రహం సెలక్షన్ నుండి ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తూ నలుగురి చూపు తన మీద పడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు.
అలా ఇంటి నుండి బయలుదేరి మంటపం దగ్గరికి వెళ్ళిన మోహన్ అక్కడ తడకలు బిగిస్తున్న పని వాళ్లకు ఇంకా కొన్ని సూచనలు చేసి, స్నేహితులతో కలిసి దుకాణానికి వెళ్ళి, విగ్రహాన్ని తీసుకు వచ్చాడు. పూజారి రాగానే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రత్యేక అతిథిగా ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన వార్డు మెంబరు హడావిడిగా రావడం పోవడం కూడా జరిగింది. వీధిలో చిన్న, పెద్ద, ఆడ, మగ అందరూ పూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొని, తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్లడం చూసి తన ధ్యేయం తప్పకుండా నెరవేరుతుందన్న ఆత్మ విశ్వాసంతో ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరి తృప్తిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నాడు మోహన్.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతున్నాయి. ఆడవాళ్లు పోటీలు పడి రకరకాల నైవేద్యాలు తెస్తున్నారు. సాయంత్రం కాగానే పిల్లలు, యువతీయువకులు ఆటా పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అంతో ఇంతో హుండీలో డబ్బులు కూడా చేరుతున్నాయి. నిరుటి కంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారని ప్రశంసలూ అందుతున్నాయి. ఎనిమిది రోజులు గడిచాయి. కానీ మోహన్ ఆలోచనలన్నీ రాబోయే తన అదృష్టంపై సాగుతున్నాయి. ఈసారి తను స్నేహితులతో కలిసి వసూలు చేసిన చందాలు, ఖర్చులు లెక్క వేసుకుంటే రేపటి నిమజ్జనం తర్వాత కనీసం 25 వేలు అయినా మిగిలేలా ఉన్నాయి. అనుకున్న దానికంటే భక్తులు అధిక సంఖ్యలో రావడం, ధూప దీప నైవేద్యాలన్నీ వారు భక్తిగా సమర్పించుకోవడం ద్వారా ఆ ఖర్చంతా తగ్గింది. ఇంకా హుండీ ఉండనే ఉంది. సుమారుగా పదివేల వరకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల స్నేహితులతో 5 వేలు ఖర్చు పెట్టి ఎంత ఘనంగా మందు పార్టీ చేసుకున్నా 30 వేలు తన సొంతం అవుతాయి. ఈ విషయంలో మిత్రులు తనను ప్రశ్నించే అధికారం లేదు. వాళ్ళను దేంట్లో కూడా భాగస్వాములను చేయకుండా ముందే జాగ్రత్త పడ్డాడు మరి. తన మీద ఉన్న ప్రేమతో వాళ్ళు కొంత కష్టపడ్డారు అంతే. రాజేశ్ తో తిరిగే సమయంలో అవసరాన్ని బట్టి కొంత ఖర్చు పెట్టవలసి వస్తే ఈ డబ్బు ఉపయోగపడుతుంది. తద్వారా తనపై అతని దృష్టి మరలిపోకుండా చేసుకుంటాడు. ఏది ఏమైనా తాను అనుకున్నది సాధించి తీరుతాడు. ఉద్యోగం చేయడం సుతరాము ఇష్టం లేదు తనకు. రోజు రోజుకూ ఉద్యోగం వెతుక్కోమంటున్న అమ్మా నాన్నల నస భరించలేక పోతున్నాడు. కొంతకాలం ఓపిక పడితే నా ఆలోచనే సరియైనదని వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా వరుసగా మోహన్ ఆలోచనలు ఆగని ప్రవాహంలా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు అన్నీ చూసుకొని కాస్త ఆలస్యంగా ఇంటికి బయలుదేరాడు మోహన్. తాను వెళ్లే దారిలో రోడ్డు మరమ్మత్తు కోసం తవ్వడం మూలాన పక్క సందులోకి బండి పోనిచ్చాడు మోహన్. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యానికి లోనయి, బండి ఆపకుండా వుండలేకపోయాడు. పక్కకు బండిని పార్క్ చేసి చేతులు కట్టుకొని అలాగే నిలబడి పోయాడు. ఒక చిన్న వేదిక పైన కూర్చుండబెట్టిన చిన్ని గణపతి ముందు కూర్చొని కొంతమంది పిల్లలు భక్తిగా

భజన చేస్తున్నారు. వారితో పాటు మరికొంతమంది పెద్దలు కూడా పారవశ్యంలో మునిగి గణనాథుని సేవలో నిమగ్నమయ్యారు. ఎంతటి తన్మయత్వం? ఈ ఎనిమిది రోజుల్లో ఏనాడైనా తను భజనలో పాల్గొన్నాడా? భక్తిగా
పూజించాడా? తన హంగూ, ఆర్భాటాలు, ఇతరుల దృష్టి పడడానికి పడుతున్న తపన, రాజకీయాల కోసం కంటున్న కలలు, దానికోసం వినాయక ఉత్సవాల పేరిట సమకూర్చుకుంటున్న డబ్బు ఇవన్నీ మదిలో మెదిలాయి. “అన్నా హారతి తీసుకోండి” అన్న మాట వినబడి అటుదిక్కు చూశాడు. ఒక పిల్లవాడు హారతి పళ్లెంతో తన ముందు నిలబడి ఉన్నాడు. హారతి కళ్ళకు అద్దుకున్నాడు. ఇంతలో “ఇదిగో ప్రసాదం అన్నా” అంటూ మరో పిల్లవాడు వేయించిన శనగలు చేతిలో పెట్టాడు. అప్రయత్నంగా భక్తిగా కళ్ళుమూసుకొని నోట్లో వేసుకున్నాడు. పెద్దవాళ్ళంతా వెళ్లిపోయారు. మోహన్ అక్కడే నిలబడి చూస్తున్నాడు. బహుశా 15 ఏళ్ళ లోపు వుంటారేమో అందరూ.. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. అన్నీ సర్దుకుంటూ నిమజ్జనానికి ఏం చేయాలో చర్చించుకుంటున్నారు. రేపటి ఏర్పాట్లలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూసుకోవాలని, గణేశుని భజనలతో కొలుస్తూ ఊరేగించాలని, అందరికీ ప్రసాదం అందేలా జాగ్రత్త వహించాలని వాళ్ళ చర్చల సారాంశం. దానికి ఎవరెవరు ఏం చేయాలో , ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలో నిర్ణయించుకున్నారు. చివరగా స్వామికి దండం పెట్టి వేడుక జయప్రదంగా జరగడానికి అనుగ్రహాన్ని ఇవ్వమని కోరుకొని వెళ్లిపోయారు. అంతా గమనిస్తున్న మోహన్ శరీరంలో ఒక్కసారిగా నీరసం ఆవహించింది. మెదడు మొద్దుబారి పోయింది. మనసులో తెలియని వెలితి ప్రవేశించింది. ఎలాగోలా ఇల్లు చేరుకున్నాడు. నిద్ర పట్టడం లేదు. పదే పదే ఆ పిల్లల మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
తెల్లవారి ఉదయమే కలత నిద్రతో ఎర్రబడిన కళ్ళతో లేచాడు మోహన్ . బయటకు వెళ్ళడానికి అన్యమనస్కంగానే తయారవుతున్నాడు. ఇదంతా సోఫాలో కూర్చుని గమనిస్తున్న తండ్రి ‘నాయనా మోహన్!’ అని పిలిచాడు. ఇదే ఇంకో సందర్భంలో అయితే ఒంటి కాలు మీద లేచేవాడే. కానీ ఎందుకో తండ్రి వైపు అడుగులు వేసి చిన్న పిల్లాడిలా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. “ఏమయింది నాన్నా? ఈరోజు నీలో ఎందుకో హుషారు కనిపించడం లేదు. తీవ్రంగా దేని గురించో ఆలోచిస్తున్నట్లు నీ కళ్ళు చెప్పకనే చెప్తున్నాయి. ఆ మాత్రం అర్ధం చేసుకోగలను. అసలేం జరిగింది?” అంటూ లాలనగా అడిగాడు. అమాంతం తండ్రి ఒడిలో తల పెట్టుకొని నిన్నటి విషయం చెప్పి, అది తనను ఎంతగా మనస్తాపానికి గురి చేస్తున్నదో చెప్పాడు.
తండ్రి ఓదార్పుగా మోహన్ తలను ప్రేమగా నిమురుతూ “మోహన్! ఒక్కగానొక్క కొడుకువని గారాబంతో నిన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా పెంచాం. అతికష్టం మీద ఇంజనీరింగ్ పాస్ అయి ఎలాంటి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే ఎన్ని సార్లు నీకు హితబోధ చేయడానికి ప్రయత్నించినా మా మాట పెడచెవిని పెట్టావు. మా పెంపకం లోపమని అనుకుని నేను, మీ అమ్మ బాధ పడని క్షణం లేదు. మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నీకు ఎలాంటి లోటు రాదు. మరి ఆ తర్వాత? ఒక్క విషయం చెప్పనా? మనం స్వచ్ఛమైన భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క క్షణం భగవంతుని తల్చుకున్నా చాలు..ఆ పరంధాముని అనుగ్రహాన్ని పొందవచ్చు. హంగులూ, ఆర్భాటాలు, రాజకీయపు పోకడలు, స్వార్థ చింతనలు, మోసపూరిత భావాలు ఇవన్నీ మనిషికి అప్పటికప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయేమో కానీ శాశ్వతంగా ప్రశాంతతను దూరం చేస్తాయి. ‘భక్తి’ అనే భావన మనసుకు సంబంధించినది. పదిమందిలో నిరూపించుకునేది కాదు. అందరిలో గొప్పలు ప్రదర్శించడానికీ కాదు. నిష్కల్మషమైన మనసు, నిస్వార్థ భావన, భగవంతుని పట్ల అనురక్తి..ఇవన్నీ ఆ పిల్లల్లో నువ్వు ప్రత్యక్షంగా చూశావు. ఇది ఒకరు నేర్పితే వచ్చేది కూడా కాదు. అది మనిషి అంతర్గత పొరల్లో నుండి ఉబికి వచ్చే భావన. నీవు ఎన్నో చోట్ల ఈ వేడుకలను ప్రతీ సంవత్సరం చూస్తూనే ఉన్నావు. ఇవేమీ నీకు కొత్త కాదు. కానీ నిన్న
వాళ్ళను చూసిన తర్వాత ఇంతగా చలించడానికి, ఆవేదనకు గురి కావడానికి కారణం ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. నీకే బోధ పడుతుంది” అన్నాడు. వంటింట్లోంచి వీళ్ళ మాటలను వింటున్న తల్లి సుశీలమ్మ
కంటి నిండా నీళ్లు.
ఎన్నడూ లేని విధంగా తండ్రి మాటలను శ్రద్ధగా వింటున్న మోహన్ నిట్టూర్చి చెప్పులు వేసుకొని నిశ్శబ్దంగా బయటకు నడిచాడు. మంటపం దగ్గరికి
వెళ్ళాడు. అప్పుడే పూజారి వచ్చి విగ్రహాన్ని ఉద్వాసన చేయించే పనిలో నిమగ్నమయ్యాడు. పూజ జరుగుతున్నంతసేపు కదలకుండా పరిపరి విధాల ఆలోచిస్తూ కూర్చున్న మోహన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకిస్తూ లేచి నిలుచున్నాడు. చేతులు జోడించి గణనాథుని వైపు చూశాడు. ఆ స్వామి తన నిర్ణయాన్ని సమర్థిస్తూ అనుగ్రహ పూర్వకంగా నవ్వుతున్నట్లు అనిపించింది. దిగులు అంతా మాయమైంది. నూతన ఉత్సాహంతో నిమజ్జనాన్ని ఎలాంటి లోటు జరుగకుండా పూర్తి చేశాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. పవిత్రమైన మనసుతో తృప్తిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఉదయం సరిగ్గా తొమ్మిదిగంటలు. నీట్ గా తయారైన మోహన్ క్యాష్ బ్యాగుతో తన గది నుండి
బయటకు వచ్చాడు. తల్లి దండ్రుల పాదాలకు నమస్కరించి, నవరాత్రుల ఖర్చులు పోనూ మిగతా డబ్బును అనాథ శరణాలయానికి ఇవ్వడానికి వెళ్తున్నట్లు అలాగే ఉద్యోగం కొరకు ప్రయత్నాలు ప్రారంభించ బోతున్నట్లు చెప్పి హుషారుగా ముందుకు నడిచాడు. ఆనందం నిండిన కళ్ళతో కొడుకు వైపు మురిపెంగా చూస్తూ ఆశీర్వదించారు సుశీల దంపతులు.

September 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

విశిష్ట అధ్యాపకులు వెల్లలూరి వెంకట రాఘవశర్మ

by డా॥ వెలుదండ నిత్యానంద రావు September 29, 2023
written by డా॥ వెలుదండ నిత్యానంద రావు

1950 లో హైదరాబాదు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుల కోసం ఇంటర్యూలు నిర్వహించింది. హేమాహేమీలైన తెలుగు పండితులు ఉద్యోగార్థులై వచ్చారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో లేదా బ్రిటిష్ ఆంధ్రలో కన్న నిజాం ప్రభుత్వంలో లెక్చరర్లకు 150 రుపాయల జీతం అధిక మని వినికిడి. అందువల్ల ఇతర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నవారు సైతం ఇక్కడికి రావాలని కోరుకునేవారు. పింగళి లక్ష్మికాంతం, విశ్వనాథ సత్యనారాయణ, నిడుదవోలు వెంకటరావు, గంటిజోగి సోమయాజి లాంటివారు వచ్చారని వినికిడి. వారంతా వయసులో మరీ పెద్దవారు కావడం అభ్యంతరకరమైంది. కొత్తపల్లి వీరభద్రరావు ఇంటర్వ్యూకు హాజరైనట్లు, సెలెక్ట్ కానట్లు స్వయంగా చెప్పుకున్నారు. సెలెక్టయిన వారు ఇద్దరు. 1. వెల్లలూరి వెంకటరాఘవ శర్మ 2. దివాకర్ల వెంకటావధాని. రాఘవశర్మ 1950 లో చేరి 1951 ఉత్తరార్థంలోనే ఇక్కడి వాతావరణం సరిపడక రాజీనామా చేసి వెళ్ళి పోయారు. దివాకర్ల వ్యక్తిగత కారణాలతో ఏడాది పాటు ఆలస్యం చేసి 1951 జూన్ లో ఉస్మానియా తెలుగు శాఖలో చేరారు. ఇక్కడే రిటైర్ అయ్యారు .

వెల్లలూరి వెంకట రాఘవశర్మ గురించి వివరాలు పెద్దగా తెలియడంలేదు. చిత్తూరు వాస్తవ్యులు. జననం.3-9-1912. ఉస్మానియా తెలుగుశాఖలో చేరిన తేది 10-8-1950. బక్కగా ఎర్రగా నిగనిగలాడుతూ ఉండేది. తలపాగ – జోద్ పురి కోటు, పింజలు పోసిన ధోవతి. బూట్లు వేసుకోక పోయేది. చెప్పులు వేసుకొనేవారు. ఇది వారి ఆహార్యం. కాస్త ఎత్తు పండ్లు కూడ ఉండేవి. ఆపారమైన పాండిత్యం ఆయన సొంతం. బి.ఓ.యల్ పూర్తి చేసిన పిదప 1940 లో మదరాసు విశ్వవిద్యాలయం నుండి నన్నెచోడ మల్లికార్జునుల కృతుల్లోభాష గురించి సిద్ధాంతవ్యాసం రాసి ఎం. ఓ. యల్ పట్టం గ్రహించారు. సంస్కృతాంధ్రాంగ్లభాషల్లో కూలంకషమైన పాండిత్యం, కన్నడ తమిళాల్లో అభినివేశం కలవారు. సంగీతజ్ఞానం ఆయనకు అదనపు ఆకర్షణ. ఉద్యోగానికి జరిగిన ఇంటర్వ్యూ లో అప్పటి తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, విషయనిపుణులు (subject expert) గా అంధ్రవిశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు గంటి జోగిసోమయాజులు, పబ్లిక్ సర్వీసు కమీషన్ సభ్యులు, ఇంగ్లీష్ ప్రొఫెసర్ తనికెళ్ళ వీరభద్రుడు, ఇంకా మరికొందరు సభ్యులున్నారు. ఇంకా ఆనాటి ఉస్మానియావిశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు నవాబ్ అలీయావర్ జంగ్ బహద్దూర్, బూర్గుల రామకృష్ణారావు, వి.బి. రాజు కూడా సభ్యులని కొత్తపల్లి వీరభద్రరావుగారు పేర్కొన్నారు. అప్పటి ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపల్ దొరైస్వామి కూడా ఇంటర్య్వూలో ఉంటే ఉండవచ్చు. సభ్యుల్లో ఒకరు కారకమంటే ఏమిటి అని ప్రశ్నించారు. కారకం ఒక్కటి ఉండదు. కర్తృకారకం, కరణకారకం, అధికరణకారకం అంటూ ధారాపాతంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూ చేస్తున్న పెద్దలందరూ ప్రసన్నులయ్యారు. సెలెక్ట్ చేశారు. హైదరాబాదులో 1950 లో కాపురం పెట్టారు. అద్దె ఇల్లు దొరకడం కష్టమయింది. నేరుగా అప్పటి ముఖ్యమంత్రి ఎం.కే వెల్లోడి ప్రభుత్వంలోని ఒక మంత్రిని వెళ్లి వసతి సౌకర్యం లేనప్పుడు ఎలా ఉండగల మని ప్రశ్నించారు. మంత్రి గారు ఏవో రెండు మూడు ప్రభుత్వ క్వార్టర్స్ సూచించారు. కాచిగూడ రైల్వేస్టేషన్ దగ్గరున్న ఒక చిన్న ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉన్నారు. ఆర్ట్స్ కళాశాలలో బి. ఏ క్లాసులు ఎం. ఏ క్లాసులు ఇచ్చారు.

బి.ఏ (రెండవసంవత్సరం) లో సి. నారాయణరెడ్డి, ఎం. ఎల్. నరసింహారావు (?), రసగ్రాహి కలంపేరుతో కవితలు రాసిన తోటపల్లి యజ్ఞనారాయణశర్మ లాంటి వారు విద్యార్థులు. అందరి కంటె ఆరేడేళ్ళు పెద్ద అయిన చలపతి రెడ్డి మరో విద్యార్థి. బి.ఏ (మొదటిసంవత్సరం)లో ఎం. కులశేఖరరావు, ఇరివెంటి కృష్ణమూర్తి, బాలకృష్ణ, తిరుపతిరంగారావు, చంద్రమరాజు మొ. వారున్నారు. ఆరోజుల్లో బియ్యే రెండేళ్ళు మాత్రమే వుండేది. సినారె batch కు కొన్ని నెలలు మినహా రెండేళ్ళు (1950 ఆగస్టు-  1951 జూన్ తరువాత ) చెప్పారు. 1951 జూన్ ఆఖరులో బి.ఏ (మొదటిసంవత్సరం)లో చేరిన ఎం. కులశేఖరరావు batch కు కొన్ని నెలలు గద్యాన్ని బోధించినట్లు ఆచార్య ఎం. కులశేఖరరావు తమ స్వీయచరిత్ర నాకథ (2016) పుట 25లో పేర్కొన్నారు. ఎం. ఏ (ఫైనల్ -1950 జూన్ నుండి 1951 ఎప్రిల్ ) లో బి. రామరాజు, ఇల్లిందల సరస్వతీదేవి కూతురు సుజాత రెగ్యులర్ విద్యార్థులు కాగ అబ్బూరి రామకృష్ణరావు అల్లుడు సత్తిరాజు కృష్ణారావు ( ప్రైవేటు విద్యార్థి ) ఎం.ఏ (ప్రథమ)లో వెల్దుర్తిమాణిక్యరావు తమ్ముడు వెల్దుర్తి రామకృష్ణారావు ఒక్కడే విద్యార్థి. బి. రామరాజుగారు తమ పరిణతవాణి ప్రసంగంలో, మరోచోట ప్రస్తావించారు. తొలి తెలుగు ఎం.ఏ విద్యార్థిని శ్రీమతి ఇల్లిందల సుజాతగారు (నేడు 92ఏళ్ళు) కూడా రాఘవశర్మగారి బోధనవైశిష్ట్యాన్ని మనసారా ప్రశంసిస్తున్నారు. ఇరివెంటి కృష్ణమూర్తి గారు తమ డాక్టరేట్ గ్రంథమైన “కవిసమయములు” ను 1987లో ప్రచరించారు. అందులో “విశ్వవిద్యాలయస్థాయిలో నన్ను విద్యార్థిగా తీర్చిదిద్ది, నాలో సాహిత్యజిజ్ఞాసను మేల్కొల్పి, నాజీవితానికి లక్ష్యాన్ని ప్రసాదించిన మనీషివతంసులు, మానవతామూర్తులు, ఉత్తమదేశికులు” అంటూ ఖండవల్లి, దివాకర్ల, పల్లాదుర్గయ్యలతోపాటు విద్వాన్ శ్రీ వెల్లలూరు వేంకట రాఘవశర్మగారిని కూడ స్మరించి ఇరివెంటివారు భక్త్యంజలి ఘటించారు. చంద్రమరాజుగారు  90 ఏళ్ళు దాటిన వారు. ఇటీవలె కీర్తిశేషులు. ఉన్నతోద్యోగంలో రిటైర్ అయినవారు. ఆచార్య బి. రామరాజుగారి బావమరిది. వారు కూడ బియ్యేలో తాను రాఘవయ్య విద్యార్థినని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని, వారు ప్రతిదానికి రకరకాలుగా జవాబులు చెప్పేవారు.. దానివల్ల నాకు ఉద్యోగజీవితంలో ఎంతో మేలు జరిగింది. నేను మా ఉన్నతాధికారులకు భిన్నభిన్న కోణాల్లోంచి పరిష్కారాలను సూచించేవాడిని. వారి కనుకూలమైంది వారు స్వీకరించేవారు. ఈ నైపుణ్యం నాకు రాఘవయ్య శిష్యరికం వల్ల కలిగింది. ఇన్నేళ్ళ తర్వాత ఆ మహానుభావుడిని గుర్తు చేసినందుకు ముందుగా మీకు కృతజ్ఞత లన్నారు చంద్రమరాజుగారు.

తన ప్రవచన వైపుణ్యంతో శిష్యులను ఆకట్టుకున్నారు. త్యాగరాజు కీర్తనలు ఆలపించేవారు. వసుచరిత్ర పద్యాలను కమ్మగా రాగయుక్తంగా పాడి శిష్యుల మనసులను దోచుకున్నారు. శిష్యులు ఒకటడిగితే పది చెప్పేవారు. సి. నారాయణ రెడ్డిని నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. క్లాసు లెగ్గొట్టకుండా రెగ్యులర్ గా రావాలని చెప్పారు. దాంతో సినారె గురువుగారికి ప్రియతమ శిష్యుడయ్యాడు . అప్పుడే 1950- మే నెలలో బి.యే విద్యార్థి చలపతిరెడ్డికి సంయుక్తారెడ్డిగారితో వివాహమైంది. రాఘవశర్మ గారు వాత్సల్యంతో వారింటికి వెళ్ళి ఆ నూతన దంపతులు ఎంతో గౌరవంగా ఇచ్చిన పాలను స్వీకరించి ఆశీర్వదించారు. శిష్యుడు రిక్షా తెస్తానన్న వినకుండా దగ్గరే కదా అంటూ నడిచి వెళ్ళి పోయారు. శ్రీమతి సంయుక్తారెడ్డిగారు 1955 లో ఎం. ఏ చేసి 9 ఏప్రిల్ 1959న ఉస్మానియాలో తెలుగుశాఖలో అధ్యాపకులుగా చేరారు. 1993 జూన్ 30న రిటైర్ అయ్యారు.  వారు కూడా . ఇటీవలె కీర్తిశేషులు. ఆనాటి బి.ఏ విద్యార్థుల్లో ఒకరైన చలపతిరెడ్డి గారికి నేడు 94 ఏళ్ళు. ఖండవల్లి లక్ష్మీరంజనం, కోవూరు గోపాలకృష్ణారావు శాశ్వతోపన్యాసకులు కాగా నిజాం కళాశాల నుండి గరికపాటి లక్ష్మికాంతయ్య, సరిపల్లె విశ్వనాథశాస్త్రి, కురుగంటి సీతారామయ్య మొదలగు వారు వచ్చి ఎం ఏ క్లాసులు తీసుకొనేవారు. కాని వీరెవరూ పద్యాన్ని రాగ యుక్తంగా పాడే వారు కాకపోవడంతో రాఘవశర్మ గారి ఆకర్షణ పెరిగింది. దివాకర్ల వెంకటావధానికే ఆయన ఉపన్యాసాలు స్ఫూర్తి ఇచ్చాయని అంటారు. ఆ కాలంలో నిజాం కళాశాల తెనుగు సారస్వతసమితి పక్షాన వీరు ప్రసంగించినట్లు తెలుస్తుంది. “ఆచార్య శ్రీ వెల్లలూరి వేంకట రాఘవశర్మగారు నవంబరు 15 (1950) వతేదీన సాహిత్యము– సంగీతము అను విషయముపైన ఉపన్యసించిరి. కడు హాస్యముతో భావగర్భితమైనవారి ఉపన్యాసము శ్రోతలనానంద పరవశులు చేసినది. అందులకు మాసమితి కృతజ్ఞతలు” అని ఆ సమితి వార్షిక నివేదికలో పేర్కొనబడింది. (“విద్యార్థి ” నిజాం కళాశాల సారస్వత సమితి వార్షికసంచిక ఎప్రిలు, 1951 పుట, 122)

ఉస్మానియావిశ్వవిద్యాలయం ఆంధ్రవిద్యార్థిసంఘం 1950 నాటి నివేదికను కార్యదర్శి వెల్దుర్తి రామకృష్ణారావు ఉస్మానియా తెలుగువిద్యార్థుల అర్ధవార్షిక సంచిక శోభ జనవరి 1951సంచికలో ప్రచురించారు. అందులో రెండుసార్లు వీరి ప్రస్తావన వస్తుంది. “23-11-50 గురువారము మధ్యాహ్నము పై సంఘపక్షమున నొక యసాధారణ సమావేశము జరిగినది. బ్రహ్మశ్రీ వెల్లలూరి వేంకట రాఘవశర్మగారు (ఆంధ్రోపన్యాసకులు) సంగీతసాహిత్యములకు గల సంబంధమెట్టిదో క్షుణ్ణముగ దెలిపిరి. 1950 డిసెంబరు 9, 10, 11 తేదీలలో ఉస్మానియా ఆవరణలో ఘనంగా జరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాలు ఆనాటి విద్యార్థులకు ఒక మధురస్మృతి. అందులో భాగంగా రెండవరోజు 11-12-1950 సాయంత్రం 5 గంటలకు “దేశభాషలందు తెలుగు లెస్స” రాఘవశర్మగారు ప్రసంగించారు.  కాళిదాసు మేఘసందేశంలో మొదటి 15 శ్లోకాలకు రాఘవశర్మగారి అనువాద పద్యాలు “ఆంధ్రమేఘసందేశము” పేరిట శోభ జనవరి 1951సంచికలో ప్రచురితమయ్యాయి.

ఒకరోజు ఆర్ట్స్ కళాశాలకు మదరాసు విశ్వవిద్యాలయం నుండి ఆచార్యులు కోరాడ రామకృష్ణయ్య వచ్చారు. వారు భాషోత్పత్తి, సంధి పుస్తకాలు రాశారు. రాఘవయ్య గారికి సాక్షాత్తు గురువు గారే అయినా కోరాడ రామకృష్ణయ్య తప్పులు రాసి విద్యార్థులను తప్పుదోవ పట్టించారని ఆయనతో వాదానికి దిగారు.

హైదరాబాదులోని ఉష్ణవాతావరణానికి తట్టుకోలేక పోయారు. కాస్త కుష్ఠు వ్యాధి తలెత్తిందని అతి ప్రచారం చేశారు. పొమ్మనకుండా పొగబెట్టారు. ఆయనకు మానసిక స్థైర్యం ఇవ్వలేదు. ఒకనాడు అంగీ లేకుండగా రాఘవశర్మగారిని చూసినట్లు, ఎక్కడా కుష్టుకు సంబంధించిన ఒక్క మచ్చ కూడా లేకపోవడాన్ని గమనించినట్లు, మరెందుకిలా ప్రచారంచేసి వెళ్ళిపోయేలా చేశారో ఈనాటికీ అర్థం కానట్లు చలపతిరెడ్డిగారు చెప్తున్నారు. హైదరాబాదునుండి వెళ్ళిపోవడం అన్నివిధాలా శ్రేయస్కరమన్న భావన పెరిగింది. ఆయన నిజంగానే వెళ్ళిపోతే ఆ ఉద్యోగం తనకు వస్తుందని అప్పుడే ఎం.ఎ పూర్తి చేసిన విద్యార్థిలో ఆశలు మోసులెత్తాయి. రాఘవయ్య 1951చివరలో ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగుళూ వెళ్ళి పోయారు. బహుశా తొందర పడ్డారేమో! 1952నాటి ఉస్మానియావిశ్వవిద్యాలయం బడ్జెట్ వివరాలు తెలిపే గ్రంథంలో తెలుగుశాఖలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు లెక్చరర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఒక ప్రొఫెసర్ అంటే ఖండవల్లి లక్ష్మీరంజనం, ఇద్దరు లెక్చరర్లు అంటే కోవూరు గోపాలకృష్ణారావు, దివాకర్ల వేంకటావధాని, కనుక రాఘవయ్యగారు 1952 జనవరికి ముందే వెళ్ళిపోయారని నిర్ధారణ అవుతుంది. ( 1952ఎప్రిల్ నుండి 1953 మార్చి దాక ఆచార్యుని సంవత్సరజీతం 8400 Basic +1260 D.A. మొత్తం 9660రు.లు అంటే నెలకు 805రు.లు జీతం. ఇక ఇద్దరు లెక్చరర్లకు కలిపి సంవత్సరానికి 7680 Basic +1334 D. A. మొత్తం 9024రు.లు అంటే నెలకు 376 రు.లు. అన్నమాట. రాఘవశర్మగారి ప్రారంభవేతనం 274-4-6 అని విశ్వవిద్యాలయ సివిల్ లిస్టులో నమోదు చేయూడింది.   ఇంటి అద్దెలు, ఇతర అలవెన్సుల లాంటివేవీ లేవు. గోపాలకిషన్ రావు, రాఘవశర్మలు నాలుగయిదు నెలలు తేడాలో కొత్తగా సర్వీసులో చేరినవారే కనుక జీతంలో తేడా వుండదు. ఇద్దరికీ ప్రారంభం scale వుంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో ఏవో పుస్తకాలు చూస్తూ, కాళ్ళకు పుస్తకాలు తగులుతున్నాయని పక్కకు జరుపుతుంటే ఈ బడ్జెట్ పుస్తకం దొరికింది. 1951, 1952 బడ్జెట్ వివరాలు, అధ్యాపకులవివరాలకోసం ఎంతో గాలించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. 1949 జూన్ దాక నిజాంప్రభుత్వంలోని ప్రతిశాఖలోని ప్రతి ఉద్యోగి వివరాలు లభిస్తున్నాయి. కాని తరువాతి రికార్డ్స్ మాత్రం ఎందుకు దొరకడంలేదో బోధపడడం లేదు. ఉస్మానియా నుంచి వెళ్ళి 1952లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ట్యూటర్ గా చేరినట్లుగా ఉంది. ఆధారాలు లేవు. ఆ తరువాత రాఘవయ్య బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజిలో అధ్యాపకులుగా పనిచేసినట్లు తెలుస్తుంది. (1953- 1960ల నడుమ కావచ్చునని నా ఊహ.) ఆయన తరువాత ఆ ఉద్యోగాన్ని అప్పటికే సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో తెలుగు పండితునిగా పనిచేస్తున్న ఆయన మేనల్లుడు గడియారం సుబ్బయ్యశాస్త్రి కి ఇచ్చారట. ఈ రోజు రాఘవయ్య గారు, సుబ్బయ్య శాస్త్రి గారు ఇరువురు గతించారు. బెంగుళూరులో తెలుగు వారు అధికంగా ఉండే శివాజినగర్ లో రాఘవయ్య ఒక తెలుగు ముద్రాక్షరశాల నడిపి చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తుంది. ఒకసారి చాలాకాలం తర్వాత బెంగుళూరు వెళ్ళినప్పుడు అచార్యబి. రామరాజు, ఆచార్య ఎం. కులశేఖరరావు గారలు రాఘవశర్మను దర్శించారు. “నేను మీ శిష్యపరమాణువునండీ” అని రామరాజుగారన్నారట. వెంటనే ఆ గురువుగారు “వామ్మో! పరమాణువా? వెరీడేంజర్” అన్నారట. వారి వివరాలు చెప్ప గలిగే వారు లేరు. బెంగుళూరులో ఏమైనా ఆచూకి దొరకకపోదా అని ఆచార్య తంగిరాల సుబ్బారావు, ఆచార్య జి.యస్. మోహన్, శ్రీ ఘట్టమరాజు అశ్వత్థనారాయణ లాంటి పెద్దలను సంప్రదించాను. కానీ పెద్దగా లాభం కలుగలేదు. రాఘవయ్య ఆంధ్రమేఘసందేశం పద్యాలు తప్ప మరే రచనలు చేసినట్లు కనిపించడంలేదు. బెంగుళూరు వాస్తవ్యులైన ఆచార్య రత్నాకరం శంకరనారాయణరాజు 97 ఏళ్ళపెద్దలు, వారిని టెలిఫోనుద్వారా సంప్రదించే అవకాశం కలిగింది. రాఘవయ్య అన్నగారి పేరు వెంకటాద్రిశర్మ. వారు కూడ తెలుగు అధ్యాపకులే. 1951-52 లో బెంగుళూరు ఎం. అర్ కాలేజిలో వెంకటాద్రిశర్మ రిటైర్ కాగా, ఆ స్థానంలో తాను అధ్యాపకులుగా నియమితులైనట్లు తెలిపారు. రాఘవయ్య మృదుభాషి, మితభాషి, గంభీరంగా ఉండేవాడని, పెద్దగా పరిచయం ఏర్పడలేదని శంకరనారాయణరాజుగారు చెప్తూనే మరో అదనపు సమాచార మందించారు. రాఘవయ్యగారి కొడుకులు, కూతుళ్ళసంగతి సరిగా తెలియదు. ఒక్కకూతురు మాత్రం పెళ్ళయి ప్రవసమయంలో ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యంగా కడుపులో గుడ్డలు కుక్కి కుట్టేయడంతో చనిపోయిందని తెలిపారు. ఈ సంఘటన ఎన్నేళ్ళక్రితం జరిగిందో, అప్పుడు తండ్రి బతికే ఉన్నాడా లేదా అన్న సంగతి వారికి గుర్తుకు రావడంలేదు.

ఈమాత్రం అయినా తెలుస్తున్నాయంటే అది చలపతి రెడ్డి గారు కట్టుకున్న పుణ్యం కొంత. నా ఆసక్తి, శ్రమ ఫలితం కొంత. ఈ తెలివిడి నాకు పాతికేళ్ళక్రితమే కలిగివుంటే మరెన్నో విషయాలు సేకరించగలిగేవాడిని. ఇప్పుడందరూ కీర్తిశేషులే. ఏంచేస్తాం!. వీరి మనుమలు, మనుమరాళ్ళు బెంగుళూరులోనో, అమెరికాలోనో  హైదరాబాదులోనో ఉండే అవకాశముంటుంది. వెల్లలూరు ఇంటిపేరు గలిగిన బెంగుళూరు వయోవృద్ధులకు తెలియవచ్చు.  దయచేసి వీరి వివరాలుకానీ, సంతానం వివరాలుకానీ ఏ మాత్రం తెలిసినా తెల్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

***

September 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

“నీలో దీపం వెలిగించు-నీవే వెలుగై వ్యాపించు”

by Aruna Dhulipala September 21, 2023
written by Aruna Dhulipala

– డా. వడ్డేపల్లి కృష్ణ

ప్రముఖ లలిత గీతాల కవి, లలిత గీత పరిశోధకులు రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ గారితో మయూఖ ముఖాముఖి.. శ్రీ, గేయకిరీటి, కవనప్రజ్ఞ బిరుదాంచితులు, జాతీయస్థాయి స్పెషల్ జ్యూరీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ కవి, రచయిత, గౌరవనీయులు డా. వడ్డేపల్లి కృష్ణ గారి జీవితం, సాహితీ ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. – మయూఖ ప్రతినిధి అరుణధూళిపాళ

నమస్కారం సార్, ఈరోజు మా మయూఖ పాఠకులకు

మీ గురించిన వివరాలు చెప్పండి.

మొదటగా…..

 మీరు ఎక్కడ జన్మించారు? మీ తల్లిదండ్రులు, మీ బాల్యం గురించి వివరించండి.

నమస్కారం. నేను 1949 జూలై 30వ తేదీన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల గ్రామంలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో పుట్టాను. మా అమ్మగారు లక్ష్మమ్మ, నాన్నగారు లింగయ్య. అక్కడే హైస్కూల్లో హెచ్.ఎస్.సి వరకు చదువుకున్నాను. చిన్నప్పటినుండీ నాటకాలు వేయడం, రాయడం పట్ల ఆసక్తి ఉండేది. బాల్యమంతా అలాగే గడిచింది. మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. చేనేతవృత్తి జీవనంగా బతికినవాళ్ళు.  ఈ వృత్తిలో వాళ్ళు మాస్టర్ వీవర్స్ గా ఉండేవాళ్ళు.  మా నాన్న, మా పెద్దన్నయ్య మొదట షోలాపూర్ వెళ్లి అక్కడ నేత నేస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చిన వాళ్లే. మెల్ల మెల్లగా మంచి స్థాయిని సంపాదించుకున్నారు.

ప్రాథమిక దశలోనే మీకు అలాంటి ఆసక్తి కలగడానికి కారణం ఏమిటి?

నా విద్యాభ్యాస ప్రాథమిక దశలో కనపర్తి లక్ష్మీనర్సయ్య గారని సినారె గారి సహచరులు. హన్మాజీ పేటలో పుట్టి పెరిగినవారు. ఆయన నేను 6వతరగతిలో ఉన్నప్పుడు సినారె గారు రచించిన ‘సినీకవి’ అనే ‘ఏకాంకిక’ లో సినీ రచయిత తారాపతి పాత్ర నాతో వేయించారు. అప్పుడు నా వయస్సు 11 సంవత్సరాలు. ఆ విధంగా సినారె గారితో ఆనాడే అవినాభావ సంబంధం పరోక్షంగా ఏర్పడింది. అనంతరాజశర్మ గారు హైస్కూలులో మాకు తెలుగు పండితులు. మంచి వైయాకరణులు. ఆయన వల్ల పద్య ఛందస్సు బాగా పట్టువడింది. పోతన భాగవత పాఠాలకు సంబంధించిన పద్యాలు చెబుతూ ” మీరు కూడా పద్యాలను, ఛందస్సును ఒంట బట్టించుకుని రాస్తే మీ పద్యాలు కూడా పాఠ్యాంశాలు అవుతాయి ” అన్నారు. ఎందుకో ఆ రోజుల్లో తెలియకుండానే ఆ బీజం తలలో పడింది. సి.నారాయణరెడ్డి గారిది మా తాలూకా ఊరే. ఆయన రాసిన “సాగుమా ఓ నీల మేఘమా/ గగన వీణా మృదుల రాగమా” అనే పాటను అనంతరాజ శర్మ గారు రేడియోలో పాడారు. మా గురువు గారు సినారె గారికి నేను పాడాను అని చెప్పగా ఆయన బాగుందని మెచ్చుకున్నారు. అప్పుడు నేను గేయం రాయాలని ప్రయత్నించి ముందు ఒక ఆటవెలది పద్యం, ఆ తర్వాత ఒక గేయం రాశాను. ” నమో నమో శ్రీ రమణా/ చూపుము నాపై కరుణా ” అని మా ఊళ్ళో ఉన్న ఆలయంలోని వెంకటేశ్వర స్వామి మీద రాశాను. ప్రతి శరన్నవ రాత్రులకు పదిరోజులు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరిగేవి. మైకులో భక్తిగీతాల రికార్డు మోగుతుండేవి.  అప్పుడప్పుడు గాయనీ గాయకులు కూడా వచ్చి పాడుతుండేవారు. నేను రాసిన గేయం విన్న మా గురువుగారు ” నీవు చాలా బాగా రాయగలుగుతున్నావ్” అన్నాడు. అప్పుడు నేను రాయడం కాదు. నేను రాసింది అందరికీ తెలియాలి కదా! అన్నాను. వెంటనే మా స్నేహితుడు రేపాక రాములును పిలిచి “ఈ పాట నువ్వు గుడి దగ్గర పాడాలి” అని చెప్పాను. నాకు ఆనందం కలిగింది. అతడు, నేనూ కలిసి నాటకాలు కూడా వేశాము. అతను రాజబాబు లాగా ఎక్కువ యాక్ట్ చేసేవాడు. నేను ఎఎన్ఆర్ లాగా హీరో పాత్రలు వేసే వాడిని. చదువులో కూడా ముందుండేవాళ్ళం. పాట విని అతడు ‘చాలా బాగుందిరా’ అని ఆ పాటను మైకులో పాడాడు. అందరూ దాన్ని వినడం చూసి చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాను. అప్పటి నుండి రచనలు చేయడం మొదలయ్యింది. ‘తరంగిణి’  అని స్కూల్ మ్యాగజైన్ వచ్చేది. దానికి నేను ‘విధి లిఖితం’ అని ఒక కథానిక రాసి ఇచ్చాను. అది అచ్చు వేశారు 1964 లో జరిగింది ఇది. మా గురువుగారు నన్ను పిలిచి ” ఈ కథ నువ్వే రాశావా?” అని అడిగారు. అవునన్నాను. “అందరూ వాళ్ళింట్లో పెద్దవాళ్ళను అడిగి రాసుకొస్తారు. కానీ నువ్వు బాగా రాయగలిగావురా..” అన్నాడు. ఆంధ్రప్రభ వారపత్రికలో 15వ ఆగస్టుకి బాలల కథా రచనల పోటీలు పెట్టేవారు. బహుమతులు కూడా ఇచ్చేవారు. నేను రెండు, మూడు సార్లు ప్రయత్నం చేసాను. ప్రైజు రాలేదు కానీ కథా రచన బలపడింది. ఆ తర్వాత గేయాల మీద మనసు పెట్టాను.

వడ్డేపల్లి కృష్ణగారితో అరుణ ధూళిపాళ

మరి సినారె గారు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఏవిధంగా ప్రభావితం చేశారు?

నేను నారాయణరెడ్డి గారి లాగా లలిత గీతాలు రాయాలి. సినిమా గీతాలు రాయాలని అనుకున్నా. సినిమా గీతాల పట్ల ఆసక్తితో రాసి, వాటిని సినారె గారికి పోస్టులో పంపించేవాడిని. వారు బిజీగా ఉన్నప్పటికీ వాటిని చదివి ” నీ రచనలన్నీ బాగానే ఉన్నాయి. సినీ బాణీల ఒరవడితోనే రాసినట్టుగా తెలుస్తోంది. అలాకాదు. నీవు స్వతహాగా గేయ రచన చేయాలి. ఏదైనా కావ్యం అచ్చు వేయాలి. అలా ప్రయత్నం చేయి. నేను నీ కావ్యానికి ముందు మాట రాస్తాను ” అని ప్రోత్సహించారు. గేయాలు రాయాలంటే మాత్రా ఛందస్సు నేర్చుకోవాలి. పద్య ఛందస్సు తెలుసు కానీ మాత్రా ఛందస్సు తెలియదు. సినారె గారే కనపర్తి గారికి లెటర్ రాసి ” కృష్ణ మనవాడు. నువ్వు గేయ రచనా పద్ధతి చెప్పాలి ” అన్నారట. కనపర్తిగారు నా దగ్గరికి వచ్చి “నువ్వు నారాయణ రెడ్డి గారికి లెటర్ రాశావా? నువ్వు ఏం రాశావో చూపించు” అన్నాడు. మాత్రా ఛందస్సు గురించి అడిగా. “ఏముంది గురు లఘువుల గుణకారమే. గురువుకు రెండు మాత్రలు, లఘువుకు ఒక్క మాత్ర. అన్ని పాదాలు సమ మాత్రలతో ఉండేలా చూసుకో” అన్నారు. సరేనని “నేటికాలం ఏటి కాలం/ గొడ్డు కాలం గడ్డు కాలం” ఇట్లా మొదలు పెట్టాను. అది కృష్ణా పత్రికలో అచ్చు అయింది. అప్పటినుండీ సినారె గారు నన్ను అన్ని వేళలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూనే వున్నారు.

ఇలా రచనల మీద దృష్టి పెట్టిన మీరు ఉన్నత విద్యాభ్యాసం ఎలా కొనసాగించ గలిగారు?

నేను హెచ్ ఎస్ సి లో స్కూల్ ఫస్ట్ వచ్చాను. పియుసి లో డాక్టర్ కావాలని బైపిసి తీసుకున్నా. ఫస్టు క్లాసు స్టూడెంట్స్ అందరూ నిజాం కాలేజీలో చదువుతున్నారంటే అక్కడ చేరాను. హాస్టల్ లో నా రూమ్మేట్ జగన్నాథం అని బ్లైండ్ స్టూడెంట్ ఉండేవాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఒకరోజు నేను చదువుకొని పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్లి వచ్చేలోగా నా బట్టలు, పుస్తకాలు ఎవరో ఎత్తుకుపోయారు. ఆయన బ్లైండ్ కాబట్టి రూముకు తాళం వేయడానికి వీలు కాలేదు. ఆయనను అడిగితే తనకు తెలియదన్నాడు. ఆ డిప్రెషన్ తో 61% మార్కులు వచ్చాయి. 67% వరకు మెడిసిన్ సీటు వచ్చి ఆగిపోయింది. ఇప్పటిలాగా వేరే అవకాశాలు లేవు. మళ్లీ రిపీట్ చేయాల్సిందే. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా అన్నయ్య నన్ను చదివించడం కుదరదన్నాడు. ఆ రోజుల్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సెలెక్షన్స్ జరిగేవి. కావున నాకు మెడిసిన్ సీటు లభించలేదు.  హెచ్ ఎస్ సి మార్కులతో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ కోసం వైజాగ్ వెళ్ళాను. ఆ తర్వాత ఉద్యోగం..తక్కిన చదువు అంతా ఎక్స్ టర్నల్ లో కొనసాగింది.

ఒకవైపు వృత్తి పరమైన బాధ్యతలు, మరో వైపు  ప్రవృత్తి పరమైన రచనా వ్యాసంగం కొనసాగిస్తూ ఉండి ఇంకా చదవాలనే ఆలోచనకు ఎలాంటి పరిస్థితులు దోహదమయ్యాయి?

ధర్మపురిలో మొట్టమొదట పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగంలో చేరాను.  ఆ తర్వాత మా ఊరు సిరిసిల్లకు దగ్గరగా ఉంటుందని ఎల్లారెడ్డి పేటకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అక్కడ సబ్ పోస్ట్ మాస్టర్ గా ఉన్నాను. నారాయణరెడ్డి గారు నాతో  “పోయెట్ గా రాణించాలంటే పోస్టల్ లో కాదు. అకడమిక్ లైన్లో రావాలి” అన్నారు. అంటే ఎమ్ ఏ చేయాలి. ‘వివేకవర్ధిని’ లో బీఏ కోసం (1972, 73 ప్రాంతం) కాలేజీకి వెళ్లకుండా అటెండెన్స్ వేయించుకునే విధంగా ఫీజు కట్టాను. అప్పుడు బోయిన్ పల్లిలో సబ్ పోస్ట్ మాష్టారుగా ఉన్నాను. అలా బిఏ పూర్తయింది. తర్వాత సిరిసిల్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1976 లో ఉస్మానియా ఎక్స్ టర్నల్ నోటిఫికేషన్ వచ్చింది. బహుశా 1st బ్యాచ్ నాది. 1978 లో ఎమ్ ఏ పూర్తయింది. అలా సినారె గారి మాట ప్రకారం అకడమిక్ లో ముందుకు నడిచాను.

ఆకాశవాణిలో  మీ లలితగేయాల అరంగేట్రం ఎప్పుడు జరిగింది?

ఉద్యోగం కోసం ట్రైనింగ్ కి వైజాగ్ వెళ్లానని చెప్పాను కదా! అక్కడ మొట్టమొదటి సారి సముద్ర తీరాన్ని చూశాను. సాయంత్రం చూసి వెళ్లబోతుంటే అక్కడివాళ్ళు “ఇప్పుడెందుకు వెళ్తున్నారు? ఈరోజు పౌర్ణమి కదా!రెండు గంటలు ఆగితే అలలు తీరం దాటి వస్తాయి”అని చెప్పారు. రాత్రి 8.00..8.30 ప్రాంతంలో చాలా దూరం వరకు అలలు ఎగిసి వచ్చాయి. అప్పుడు “సంద్రము, చంద్రునకు గల సంబంధం ఎవడెరుగును” అని ఆశువుగా వచ్చింది ఒక పాదం.  “శిథిల శిల్పాల దాగిన కథల గూర్చి ఎవడెరుగును/ చితికిన బతుకుల లోపలి వెతల గూర్చి ఎవడెరుగును / వాడిన కుసుమాలలోని ఏడుపులను ఎవడెరుగును / వీడిన ప్రేమికుల లోని విరహాగ్నుల నెవడెరుగును / మినుకు మినుకు మను తారల కునికిపాట్ల నెవడెరుగును / నీకు నాకు వీలు కాని లోకానికి కానరాని విధిని గూర్చి ఎవడెరుగును /  విను వీధుల కెవడెరుగును / ఆ మధ్యలో సంద్రము చంద్రునకు గల సంబంధం ఎవడెరుగును /అని రాశాను. నారాయణ రెడ్డి గారు అంటుండేవారు గేయాలు రాయడానికి చేయితిరిగి ఉండాలని. ఈ గేయం ఆయనకు పంపిస్తే ” భేష్! నేను అనుకున్నది జరిగింది.

నీ కవితాగుణం పెరిగింది” అని స్రవంతి పత్రికకు పంపమన్నారు.. అది జూన్ లో అచ్చు అయింది. అదే జూన్ లో ” నేటికాలం ఏటికాలం ” కృష్ణా పత్రికలో అచ్చు అయింది.  జూన్ లోనే ధర్మపురిలో పోస్టింగ్ వచ్చింది. అలా జూన్ 1968 నా జీవితంలో ఒక మలుపు. అలాగే గేయాలు, కవితలు రాస్తూ పోయాను. కృష్ణా పత్రిక, ప్రగతి, ప్రభవ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇలాంటి పత్రికల్లో అచ్చు అయినాయి.  లలితసంగీతంలో కృష్ణశాస్త్రి, బోయిభీమన్న, దాశరథి, సినారె వీళ్ళు రాసిన పాటలు రేడియోలో ఎక్కువగా వినిపిస్తుండేవి.  ఆ ప్రేరణతో లలితగీతాలు రాస్తూ పంపించేవాడిని. అవన్నీ తిరుగుటపాలో వచ్చేవి. ఎందుకు వాళ్లకు నచ్చలేదని అనుకుంటుంటే దాంట్లో ” It does not reflect upon your merit.” అని ఒక ప్రింటెడ్ మ్యాటర్ ఉండేది. అప్పుడు నాలో కసి పెరిగి, కృషి పెరిగి నాలుగైదు సార్లు ప్రయత్నించాక ఒకేసారి రెండు సెలెక్ట్ అయినాయి. “కనరా నీ దేశం, వినరా సందేశం/ కనులు తెరిచి ఒక్కసారి కనరా నీ దేశం/ మనసులోన మంచి నెంచి వినరా సందేశం” అనే దేశభక్తి గీతం ఒకటైతే, ప్రకృతి పరంగా నారాయణ రెడ్డి గారు ” సాగుమా ఓ నీలమేఘమా ” అని రచించినట్టు నేను ” వర్షించవె మేఘమా! వరి చేలు ఫలించగా, వనములు చిగురించగా, మనముల నలరించగా ” అని రాసినది రెండవది. ఈ రెండు సెలెక్ట్ అయినట్టు ఆల్ ఇండియా రేడియో నుండి లెటర్ వచ్చింది. అప్పటి నుండి వరుసగా ప్రోత్సాహంతో లలితగీతాలు రాస్తూ పోయాను. అలా వంద గీతాలు రాసి “కనరా నీదేశం” అని లలిత గీతాలను సంపుటిగా 1971 లో వెలువరించాను.

దీనికి సంబంధించినదే మరో ప్రశ్న… ఆకాశవాణిలో ప్రసారమైన మీ గేయాలను కొన్నింటి గురించి చెప్పండి.

1969 జనవరి నుండి ఆకాశవాణిలో నా గేయాలు ప్రసారమవుతున్నాయి. అలా వరుసగా రాస్తూ వచ్చాను. రేడియోలో ‘ఈ మాసపు పాట’ అని వచ్చేది నెలంతా. దాని కోసం గేయం రాస్తే 1972లో సెలెక్ట్ అయింది. “జగతి రథం జై కొడుతూ/ ప్రగతి పథం పై పోనీ/ ప్రగతి పథం పైన జగతి పండు వెన్నెలై రానీ/ స్వార్థానికి కట్టనిమ్ము శాశ్వతముగ సమాధి/ అదియే దేశాభ్యుదయపు అందమైన పునాది”..అనే ఈ పాటకు చిత్తరంజన్ స్వరాలు సమకూర్చి ఆయనే పాడారు. 1972 సెప్టెంబర్ నెలంతా ప్రసారం అయిందది. 50 సంవత్సరాలు దాటింది. అయినా అది ఇప్పటికీ One of the most better songs గా నిలిచింది. ఈ పాటను చిత్తరంజన్ పలు సందర్భాల్లో చెప్పారు. “ఈ పాట నేర్చుకుందాం” అనే కార్యక్రమంలో కూడా ఆయన దీన్ని నేర్పించారు.  “ద్వేషమే విడనాడితే ఈ దేశమే నవ నందనం/ ప్రేమతో మనగలిగితే నీ హృదయమే శ్రీ చందనం” అనేది, అలాగే ” పాడై పోతున్నదోయి పరిసర వాతావరణం, మార్చుకో ఇకనైనా మసలే నీ ఆవరణం ” మొదలగునవి అనేకం ఈమాసపు పాటలుగా వచ్చాయి. ఎమ్. నర్సింహమూర్తి గారని జానపద గేయాలు పాడేవారు నా గీతాలు కూడా కొన్ని పాడారు.  “మళ్లీ జన్మించు ప్రభూ మానవ కళ్యాణముకై/ మమ్ముల దీవించు ప్రభూ మానవతా సాధనకై/ వంచనకే నేడు విలువ మంచితనముకే శిలువ/ నవ నాగరికతతో భువి వదిలేస్తున్నది వలువ” అన్న నా పాటను ఆయన పాడారు.. చిత్రంగా ఆయన ఈ పాట పాడి విజయవాడ నుండి కారులో తిరిగి వస్తుంటే పెద్ద ఆక్సిడెంటు అయింది. అటు ఇటు ఉన్న ఫ్రెండ్స్ కి బాగా దెబ్బలు తగిలాయి. ఈయనకు మాత్రం కొంచెం నుదుట క్రాస్ పడింది. ఆయన నన్ను కౌగిలించుకుని “కృష్ణా! నేను ఈపాట పాడడం ఏమో కానీ మెరాకిల్ జరిగింది. ఆ దేవుడు నన్ను కాపాడాడు” అన్నాడు. “శ్రీ వేంకటేశా, శ్రీ తిరుమలేశా, శ్రీదేవి నాథా శ్రిత పారిజాతా” అనే పాట కూడా ఆయనే పాడారు. అట్లా చాలా పాటలు పాడారు.

“తెలుగులో లలితగీతాలు” అనే ప్రత్యేక అంశాన్ని పిహెచ్ డి కోసం తీసుకోవాలని అనుకోవడానికి కారణం ఏమిటి?

ముందు నుండీ సినారె లాగా సినీ గీతాలు రాయాలని ఉందని చెప్పాను కదా..ఆయన పేరు కింద వెండితెరపై  నా పేరు కనిపించాలన్న కోరిక ‘అమృతకలశం’, ‘యుగకర్తలు’ లో తీరింది. డాక్టర్ సి. నారాయణరెడ్డి లాగా డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అనిపించుకోవాలనే కోరిక కలిగింది (నవ్వుతూ). ఆయనలాగే లలితగీతాలు, సినీ గీతాలు, రుబాయిలు, ముక్తకాలు, గేయనాటికలు రాశాను. మరి ఈ కోరిక తీరాలంటే పిహెచ్ డి. చేయాలి.  ఆ సమయంలో “భక్త కవి పోతన” సీరియల్ రచన, దర్శకత్వంలో ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు పిలిచి “ఇంతవరకు లలితగీతాల మీద ఎవరూ పిహెచ్ డి చేయలేదని, మీరు చేస్తే బాగుంటుంది. కేవలం మీ గీతాల మీదనే పి హెచ్ డి చేయొచ్చు అన్ని లలితగీతాలు మీరు రాశారు”. అని అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఎవరు కూడా ఇలాంటి వాటి మీద చేయరు. చాలా సులువు అనుకుంటారు.  దిగితే కాని లోతు తెలియలేదు. అందుకే ఎవరూ చేయడానికి సాహసించలేదు. నేను ఐచ్ఛికంగానే ఈ అంశాన్ని తీసుకున్నాను.

లలితగీతాలకు నిర్దేశితమైన లక్షణాలతో ప్రామాణిక పరిశోధన చేశారు కదా..అంతకుముందున్న లలితగీతాలకు, మీరు నిర్ణయించిన లక్షణాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటి?

అసలు అంతకుముందు లలితగీతాలకు లక్ష్య, లక్షణ నిర్దేశమే లేదు. అదే నాకు ఎంతో కష్టమైంది. గురజాడ ‘దేశభక్తి’ గీతం నుండి తీసుకోవాల్సి వచ్చింది. 90 ఏళ్ళ సాహిత్యాన్ని వడబోయాల్సి వచ్చింది. ఒక్కరి రచనల మీదనే పిహెచ్ డి లు వస్తున్న సమయమది. అటువంటిది 90 ఏళ్ళ సాహిత్యాన్ని తలకెత్తుకోవలసి వచ్చింది. నాకు గైడుగా ఉన్న ఎస్వీ రామారావు గారు  “నువ్వు మొట్టమొదటగా ప్రామాణికమైన బాట వేస్తున్నావు. కాబట్టి తప్పదు ఇది. కానీ నీ పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది” అన్నారు. అదే సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్ లో నా అనేక లలితగీతాలు, పాటలు వస్తుండేవి. సీరియల్స్ కూడా బుల్లితెరకెక్కుతుండేవి. కావున కష్టమేమో అనిపించింది. హింసలు భరిస్తేనే కదా హంసలుగా మన పేరు విహరిస్తుంది అనుకున్నా. కష్టపడి పరిశోధన  చేసాను. ఆ తర్వాత “తెలుగులో లలిత గీతాలు” పేరున సిద్ధాంత గ్రంథం వెలువరించాను. దానిని ఆవిష్కరించిన ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ” నా ఆధునికాంధ్ర కవిత్వం రెఫరెన్సు లాగా రీసెర్చ్ స్కాలర్స్ కి ఎట్లా ఉపయోగపడుతుందో వడ్డేపల్లి ఈ సిద్ధాంత గ్రంథం కూడా ప్రామాణికంగా అట్లే నిలబడుతుంది. అంతేగాక రీడబిలిటీ ఉన్న సిద్ధాంత గ్రంథం రాశాడు. గేయ రచనలో చేయి తిరిగిన వాడు అనిపించుకోవడమే కాక విమర్శనా దృక్పథంలో కూడా మంచి వన్నె కెక్కినవాడు అనిపించుకున్నాడు” అని అభినందించారు.

నేను ఆరుద్ర గారిని, తొలి గాయనీ గాయకులైన ఎస్. రాజేశ్వర రావు గారిని, బాల సరస్వతీ దేవి గారిని, లలిత సంగీత ప్రయోక్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు గారిని సంప్రదించాను. వాళ్ళను ఇంటర్వ్యూ చేసి..తగిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను. మన పరిశోధన ఉపరిశోధన కావొద్దు కదా (నవ్వుతూ)…కావున ప్రామాణికంగా “తాళం, లయ తప్పకుండా రాగయుక్తంగా పాడగలిగే ప్రతి భావ గీతం లలిత గీతం” అని లక్షణ నిర్దేశం చేశాను. అందుకు వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. ఇంటర్వ్యూలో ఆరుద్ర గారు “అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కృతులు తీసుకుంటున్నావా?” అని ఒక ప్రశ్న వేశారు. త్యాగరాయకృతులు రాగ నిర్దేశాలు కాబట్టి తీసుకోవడం లేదు. అన్నమయ్యవే అనుమానంగా ఉంది. కొంతమంది జానపదాలుగా పాడుకుంటున్నారు, లలితగీతాలుగా పాడుకుంటున్నారు అన్నాను. అందుకు ఆయన నవ్వుతూ …”వాళ్ళు పాడుకుంటే పాడుకోనీ.. కానీ అవి ముట్టుకోవద్దు అన్నారు” ‘ఎందుకు సార్’ అంటే అన్నమయ్య రాతలు మనకు రాగిరేకుల్లో భద్రంగా దొరికాయి. కానీ రాగనిర్దేశితాలు దొరకలేదు. కానీ అవన్నీ రాగ నిర్దేశితాలే, సంకీర్తనలే అన్నారు. బతికించారు అనుకున్నాను. 90 ఏళ్ళ సాహిత్యమే ఎలా అనుకుంటే అన్నమయ్య రచనలను తీసుకుంటే మరో 32 వేల సంకీర్తనలు అవుతాయి కదా…కావున వాటి నుండి బయటపడి ఇలా సమర్థవంతంగా మొత్తానికి పిహెచ్ డి పూర్తిచేశాను.

వేయికి పైగా లలితగీతాలు రాసిన మీరు సిద్ధాంత గ్రంథంలో ఏ క్రమంగా విశ్లేషించారు?

ముందుగా ప్రచురిత, ఆ తర్వాత ప్రసారిత గీతాలను ఎన్నుకోవడమైంది. కావున 1910 వ సంవత్సరంలో ప్రచురితమైన గురజాడ గారి ‘దేశభక్తి’ గేయాన్ని తొలి లలితగీతంగా చూపడమైనది.  అది ఆకాశవాణిలో కూడా ఆ తర్వాత  ప్రసారం అయింది.  అంతకుముందు బాలాంత్రపు రజనీకాంతరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, అడవి బాపిరాజు, మల్లవరపు విశ్వేశ్వర రావు, వింజమూరి శివరామారావు మరియు ఆ కోవలో రచించిన బోయి భీమన్న, దాశరథి, నారాయణరెడ్డి, శశాంక, బాపురెడ్డి గారల ప్రచురిత లలితగీతాలు ప్రసారం అవుతున్న కారణాన  తీసుకోవడమైనది. ఆతర్వాత సి. నారాయణ రెడ్డి, బాపురెడ్డి గార్ల కోవలో అత్యధిక లలితగీతాలు రాసింది నేనే కావడం విశేషం. నా తర్వాత ఆచార్య తిరుమల, తిరుమల శ్రీనివాసాచార్య గార్లు నాకంటే సీనియర్లు కానీ లలితగీతాలు రాయడం ఆలస్యంగా ప్రారంభించారు. అలా నేను మలితరం అగ్రశ్రేణి లలితగీతాల రచయితగా గణుతికెక్కాను. 1969 జనవరిలో మొట్టమొదట నా లలితగీతం ప్రసారమైనప్పటినుండీ వరుసగా ఇప్పటికీ రాస్తూనే ఉన్నాను.  ఇటీవల 75 ఏళ్ళ స్వాతంత్ర్య భారత అమృతోత్సవంలో కూడా ఆకాశవాణి వారు నన్నే ‘ఈ మాసపుపాట’ రాయమన్నారు. వేరేవాళ్ళకు అవకాశం ఇవ్వక పోయారా? అన్నాను. అందుకు వారు నవ్వుతూ “ఇచ్చినా మేము అనుకున్న భావం రాలేదు. మీరైతే సత్తా ఉన్నవాళ్ళు. కరెక్టుగా తొందరగా రాసి ఇవ్వగలిగే వాళ్ళు కాబట్టి మీరే రాయమన్నారు. అప్పుడు ” ఎత్తరా మనజెండా వినువీధుల నిండా/ ఎలుగెత్తరా భారతీయ భావం ఎద నిండా” అని రాశాను. దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేశారు. ఆకాశవాణిని ఇప్పటికీ వదిలి పెట్టలేదు. ఆకాశవాణి కూడా ఎప్పుడూ నన్ను విస్మరించక  అమ్మలా లాలించింది. దూరదర్శన్ తండ్రిలా పోషించింది. పత్రికలు మిత్రుల్లా ప్రోత్సహించాయి. సినిమా రంగం మాత్రమే అప్పుడప్పుడు అవకాశం ఇస్తూ, మధ్యలో చేయిస్తూ ప్రియురాలిలా ఊరించింది ( గలగల నవ్వేస్తూ ).

సినారె గారి లాగా పేరు తెచ్చుకోవాలనుకున్న మీ కోరికకు తొలి మెట్టు ఎక్కడ మొదలైంది?

1974 లో వేములవాడలో పెద్ద బహిరంగసభ జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు మొదలగు పెద్దలంతా వచ్చారు..వీళ్ళందరికీ పౌర సన్మానం జరిగింది. మరునాడు జరిగిన సాహిత్య సదస్సులో నా అంతర్మథనం కవితా సంపుటిని గురువు గారైన ఆచార్య సినారె గారికి, వాన మామలై వరదాచార్య గారి అధ్యక్షతన అంకితం ఈయడమైనది.  ఆ తర్వాత నారాయణరెడ్డి గారు ‘వెన్నెలవాడ’ అని రాస్తే నేను ‘వెలుగుమేడ’ పేరుతో 9 గేయనాటికలు రచించి ఒక సంపుటిగా వేశాను. దాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వదలిచాను. సి. నారాయణ రెడ్డి గారే నాగేశ్వరరావు గారిని పరిచయం చేశారు. అప్పుడు “నాకెందుకు అంకితం?” అన్నారాయన. అందుకు సినారె గారు “కావ్యమంటే ఒక పుష్పం లాంటిది, తీసుకోండి” అన్నారు. ” పుష్పాలు ఆడవాళ్లకు , నాకెందుకు?” అన్నారు నాగేశ్వరరావు గారు. “మీరనేది జడలో పువ్వు. ఇది గుడిలో పువ్వు” అని నారాయణరెడ్డి గారు సమర్థించేసరికి నవ్వుతూ ఆమోదించి స్వీకరించారు. 

ఆ తర్వాత నేను ఆయనను సినిమా పాటకు అవకాశం ఇవ్వమని అడగడం జరిగింది.  ‘వసంతోదయం’ గేయ కథా కావ్యం రాసి భానుమతి గారిని కలిశాను. గంట తర్వాత అనుమతి లభించింది. “సారీ కవిగారు! బయట నిలబెట్టాను. ఏమనుకోవద్దు. నీ కావ్యాలు తిరగేసానయ్యా. అచ్చం దాశరథి, నారాయణరెడ్డి గార్లు రాసినటువంటి పదాలు పడుతున్నాయి. నువ్వు సినిమా పాటలు ఎందుకు రాయకూడదు?” అన్నారు. (మనం వెళ్ళింది అందుకే గానీ ఎగిరి గంతేయకుండా) మీరు అవకాశం ఇస్తే రాస్తానండీ. అన్నాను. అందుకు ఆమె “ఇలా ఏదో భావగీతం కాదయ్యా. నేను బాణీ వినిపిస్తాను రాస్తావా?” అన్నారు. అప్పుడు నేను” మీదంతా రాగ ప్రస్తారం. నాదంతా మాత్రా ప్రస్థానం. మీటర్ తెలిసిన వాణ్ణి కాబట్టి మ్యాటర్ ఏదైనా రాస్తాను” అన్నాను. మాటలు బాగా చెప్తున్నావు పాట ఎలా రాస్తావో చూస్తాను. అని ఆమె ట్యూన్ వినిపించింది. మొదటి సారి శరత్ బాబును హీరోగా పరిచయం చేసిన సినిమా అది. హీరో హీరోయిన్ ను ప్రేమిస్తాడు కానీ హీరోయిన్ సెకండ్ హీరోను ప్రేమిస్తుంది.అక్కడ హీరో భగ్న హృదయంతో పాడుకునే పాట. ” నీవే లేని ఈ జీవితమే కలయై కరిగెనుగా, నాలో కలతై మిగిలెనుగా/పల్లవి లేని పాటగ వలపే తాళం తప్పెనుగా, దేవీ రాగం మారెనుగా” అని రాసి చూపించాను. అందుకు ఆమె ఎంతో మెచ్చుకొని ఏ పదం కూడా తీయడానికి వీల్లేకుండా రాశావు. ఇక చరణాలు కూడా నీవే రాయమని అన్నారు. రికార్డింగుకు కూడా రమ్మన్నారు. టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. ఉద్యోగరీత్యా వెళ్లలేక పోయాను. నా బాధ చూసి మా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నువ్వు యుడిసి ఎగ్జామ్ పాసయితే హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీసులో ఉండొచ్చు. అక్కడ సెలవు పెట్టుకోవడం ఇబ్బంది కాదు అన్నారు. అది పోటీ పరీక్ష కాబట్టి కష్టపడి చదివి యుడిసి పాసయ్యాను. భానుమతి గారిని కలిసి రాలేని కారణం చెప్పాను.అప్పుడు రికార్డు చేసిన నాపాట వినిపించారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు బాగా వచ్చింది. ఆ విధంగా భానుమతి గారితో నా సినీ ప్రస్థానం మొదలైంది.

సినిమా రంగంలో మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలేవి? వాటి అనుభవాలు చెప్పండి.

భానుమతి గారి ‘రచయిత్రి’ సినిమా ద్వారా మొదటి అవకాశం వచ్చినా అది రెండు సంవత్సరాలు ఆలస్యంగా విడుదల అయింది.  ఈ మధ్యలో మళ్లీ నాగేశ్వరరావు గారిని కలిశాను. సంగీత సాహిత్యాలు తెలిసిన భానుమతి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనకు నామీద నమ్మకం కుదిరింది. 1980లో ‘పిల్ల జమీందార్’ షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో సింగీతం శ్రీనివాసరావు గారికి నన్ను పరిచయం చేసి, భానుమతి గారికి రాశాడు. సత్తా ఉన్నవాడే. మనం కూడా అవకాశం ఇద్దాం అన్నాడు. ఆయన నన్ను మద్రాసుకు రమ్మన్నారు. వెళ్లి ఆయన చెప్పినట్లుగా మూడు డ్యూయెట్లు రాశాను. కానీ చక్రవర్తి గారు మాత్రం ట్యూన్ చేయడం లేదు.అప్పుడు శ్రీనివాసరావు గారు నన్ను అక్కినేని గారిని కలవమన్నారు. కలిసి విషయం చెప్పాను. ఆయన చక్రవర్తి గారిని మ్యూజిక్ కంపోజింగ్ కు పిలిచి ఒక మెలోడీ ట్యూన్ చేయమన్నారు. అప్పుడు ఆయన “ఇప్పటి ట్రెండ్ స్లో మెలోడీకి బాగుండదు” అన్నారు. దానికి అక్కినేని గారు నవ్వి మా ‘దొంగరాముడు’ చిత్రం మొదలిడి ఇప్పటివరకు మెలోడీయే కొనసాగుతోంది. కావున స్లో ట్యూన్ చేయండి అని ఒప్పించారు. “కృష్ణా! ఈ ట్యూన్ కి తగ్గట్టు పదాలు వేసి మెప్పించుకో” అన్నారు. రెండు జంటల డ్యూయెటది.”నీ చూపులోన విరజాజి వాన, ఆ వానలోన నేను తడిసేనా హాయిగా/ నీ నవ్వులోన రతనాల వాన, ఆ వానలోన మేను మరిచేనా తీయగా” అని రాసి సింగీతం గారికి చూపిస్తే ” పల్లవి బాగుంది.సన్నజాజుల మీద చాలా వచ్చాయి. విరజాజుల మీద రాలేదు కావున నచ్చింది. బాణీకి సరిపోయింది. అయితే అనుపల్లవిలో మారిపోవాలి. రతనాల వాన రావొద్దు మరి” అన్నారు.

అలాగేనని ” నీనవ్వులోన వడగళ్ల వాన, ఆ వానలోన నేను మునిగేనా తేలేనా” అని సవరించాను..నవ్వి వెంటనే  చరణాలు కూడా రాయమన్నారు. కానీ ట్యూన్ కి రాయడం వల్ల తమిళ్ డబ్బింగ్ లాగా వస్తుందేమోనని నా భయం. అప్పుడు “ఆ వెన్నెలేమొ పరదాలు వేసె, నీ వన్నెలేమొ సరదాలు చేసె/ వయసేమొ పొంగింది, వలపేమొ రేగింది” అని చరణం అందించాను. చాలా బావుందని మెచ్చుకున్నారు. చక్రవర్తిగారు ఫిటింగ్ పెట్టారు, చరణాంతంలో కటింగ్ వస్తే బాగుంటుందని. దానికొక ట్యూన్ ఇచ్చారు. దానికి సరిపడేలా ” కనివిని ఎరుగని తలపులు చిగురించె” అంటూ  ముగింపు పలికాను. నాగేశ్వరరావు గారు శ్రద్ధగా విని అది గొప్ప హిట్టవుతుంది అన్నారు. నిజంగానే అది ఆ సినిమాలోనే కాక ఆ ఇయర్ (1980) లోనే హిట్ సాంగ్ అయింది. ఎన్నో సంవత్సరాలు ఆ రంగంలో ఉన్న అనుభవం ఆయనది. మొదట్లో హీరోగా స్వయంగా ఆయనే పాటలు కూడా పాడారు. అందుకే ఆయన మాట పొల్లు పోలేదు. ఆ తర్వాత నాకు సినిమాలో డైరెక్షన్ చేయాలని ఆసక్తి కలిగింది. గిడుతూరి సూర్యం గారు అది “అమృత కలశం” చిత్రంలో గమనించి తనతో ఉండమన్నారు. నెలన్నర సెలవు పెట్టి ఉన్నాను. ఒక సన్నివేశానికి జావళి కావాలన్నారు. నేను రాస్తాను అన్నాను. “నీవు కాదయ్యా..సినారె గారు రాయాలి” అన్నారు. అప్పుడు సినారె గారు “నేను డ్యూయెట్ రాస్తాను జావళి మనవాడికిచ్చెయ్యి నేను చాలా రాశాను కదా!” అన్నారు. ఆయన సందేహిస్తూనే ఇచ్చారు. జావళి అంటే సంప్రదాయ శృంగార గీతం. కృష్ణుని పరంగా అన్యాపదేశంగా ఉండాలి. ఆనందింప చేయాలి. ” సిగ్గాయె సిగ్గాయెరా స్వామీ బుగ్గంత ఎరుపాయెరా” అంటూ పల్లవి రాసి, చరణం సాహిత్యపరంగా ఉండాలని “చిగురు పెదవుల లోన తగని కోరికలాయె/ నిండు జవ్వనమందు పండు వెన్నెలలాయె” అంటూ రాశాను. ఆయన చాలా ఆశ్చర్య పోయి “నిజంగా సినారె లాగే అద్భుతంగా రాశావు” అని ఎలాంటి మార్పులు లేకుండా రమేష్ నాయుడు గారి చేత ట్యూన్ చేయించారు. సుశీల గారు అద్భుతంగా పాడారు. ఆ తర్వాత పెళ్ళిల్లోయ్ పెళ్లిళ్లు, యుగకర్తలు, అందరూ అందరే ఇలా ఎన్నో సినిమాలకు పాటలు రాశాను. ఎ. ఎమ్. రత్నం గారి మొట్టమొదటి డైరెక్షన్ లో వచ్చిన ‘పెద్దరికం’ సినిమా నాకు బాగా పేరు తెచ్చింది. పరుచూరి వెంకటేశ్వరరావు నాకు మిత్రుడు. ఆయనే ఎ. ఎమ్ రత్నం గారికి పరిచయం చేశాడు. ” ఈ సినిమా మలయాళ మాతృకగా వస్తున్నది. కానీ ఈ ట్యూన్ రాజ్ కోయి చేత విడిగా చేయించాను. తెలుగు నేటివిటీ ఉండాలి. భానుమతి గారి మనవరాలుకు ఎంగేజ్ మెంటు. ఆమె అంచనాకు తగిన లెవెల్ లో ఉండాలి. అట్లయితేనే రికార్డు చేస్తా. తర్వాత బాధ పడొద్దు” అన్నారాయన. ” ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే, ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకు పోవలెనే” అని రాశాను. ఆయనకి బాగా నచ్చింది. ఇదే ట్యూన్ కి వేటూరి గారు భువనచంద్ర గారు కూడా రాశారట. నాకు తెలియదు. వేటూరి గారు కూడా ” భలే రాశావయ్యా. నా పారితోషికం నాకు ముట్టిందిలే. గోఎ హెడ్” అన్నారు నవ్వుతూ..ఇప్పటికీ ఆ పెళ్లి పాట 30 సంవత్సరాలు గడిచినా పెళ్లి వేడుకల్లో మోగుతూనే ఉంది. అన్ని వెడ్డింగ్ ఆల్బమ్స్ లో చోటు చేసుకుంటోంది. గూగుల్ సర్వేలో కూడా ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల పెళ్లి పాటల్లో టాప్ టెన్ లో ఉంది. ఆ తర్వాత ‘భైరవద్వీపం’ లో ” అంబా శాంభవి భద్ర రాజ గమనా” పాట రాశాను. దానికి సింగీతం గారే డైరెక్టర్. మాధవపెద్ది సురేశ్ మ్యూజిక్ డైరెక్టర్. సింగీతం గారు మంచి సంగీతజ్ఞుడు కూడా. అందువల్ల ఒక పట్టాన ఓకే చేయరు. ఓకే అయిన వాటిని కూడా మళ్లీ ఇంకొక ప్రయత్నం చేద్దాం అంటారు. అందువల్ల 4, 5 సార్లు మద్రాసుకు పోవలసి వచ్చింది. అయినా ఓపికతో వెళ్ళి సాధించుకున్నాను. విజయా వారి సంస్థ కదా.! ఇలా ఎన్నో అనుభవాలు సినీరంగంలో కలిగాయి.

మీ రచనలు, పురస్కారాల గురించి చెప్పండి.

మొట్టమొదటి సారిగా “కనరా నీ దేశం” అనే పేరుతో 1971 లో నా మొదటి గేయసంపుటి అచ్చయ్యింది. రెండవది ‘అంతర్మథనం’ అనే కవితా సంపుటి. దాన్ని సినారె గారికి అంకితం ఇచ్చాను. లలిత గీతాలు ఎన్నో రాశాను కాబట్టి “వడ్డేపల్లి గేయవల్లి” అని 1995 లో నా సాహిత్య రజతోత్సవానికి సంపుటి వేశాను. దానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి గేయ సాహిత్య పురస్కారం లభించింది. అంతకుముందే 1992 లో బాల సాహిత్య రచనల పోటీ పెట్టారు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. ‘చిరుగజ్జెలు’ అనే పేరుతో పిల్లల పాటలు వంద రాశాను. దానికీ అవార్డు వచ్చింది. అందులోని ఒక పాటను ‘బాల భారతి’ పూణె వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పాఠ్యాంశంగా పెట్టారు. “మీరు పద్యాలు గానీ పాటలు గానీ బాగా రాస్తే భవిష్యత్తులో పాఠంగా ఉంటాయన్న” మా గురువు గారి మాటలు గుర్తుకొచ్చాయి. “చెట్లే జగతికి పనిముట్లు/ చెట్లే ప్రగతికి తొలి మెట్లు/ అందుకె వాటిని పెంచాలి/ ఆనందాలను పంచాలి…..ప్రాణ వాయువందించేవి/ పరిసరాల రక్షించేవి/ చెట్లు చెట్లు చెట్లు/ ఆ దేవుని దీవెన లైనట్లు…దీన్ని లైబ్రరీ పుస్తకంలో చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 40 కావ్యాల్ని, 60కి పైగా సంగీత నృత్య రూపకాలను రచించాను. 60 ఆడియో ఆల్బమ్స్, 15 వరకు డాక్యుమెంటరీలు, 96 టీవీ సీరియళ్ళ ధారావాహికలరచన, అందులో 30 కి దర్శకత్వం కూడా చేశాను. ఈ సందర్భంగా మరో విషయం చెప్పాలి. మనం రాసుకున్న రచనల్ని మనం వేసుకోవడం స్వార్థం. పరమార్థం ఏదైనా చేయాలని అనిపించింది.  కరోనా కాలంలో ఇంట్లో ఉన్నప్పుడు తెలంగాణా ప్రముఖ కవులు, కావ్యాలు అని చెప్పి పంపన నుండి 2000 సంవత్సరం వరకు వర్ధిల్లిన ప్రముఖ కవులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సాహిత్య పరిచయమే కాకుండా ఆ రచనలు ఎలా రాసారో  కూడా మచ్చుకు చూపుతూ పుస్తకం రచించాను. మామిడి హరికృష్ణ గారు చూసి ఇది గొప్ప రీసెర్చ్ వర్క్ అవుతుంది. కాబట్టి ఇది అందరికీ కరదీపికగా పనిచేస్తుందని వాళ్ళ డిపార్ట్మెంట్ పక్షాన వెలువరించారు. మూడు నెలల క్రితం దీన్ని మంత్రివర్యులు  శ్రీనివాసగౌడ్ గారు ఆవిష్కరించారు. అది ఎంతో సంతృప్తిని కలిగించింది. ఎందుకంటే ఇలా అందరి గురించి ఎవరు రాస్తారు?  పైగా నాకు ఈర్శ్యతో అన్యాయం చేసిన పెద్ద మనుషుల గురించి కూడా చాలా సవ్యంగా రాశాను. విమర్శకుడు ఎప్పుడూ సమ్యక్ దృష్టితో ఉండాలి కదా. రచన, కవిత్వం ఎలా వుందో చూడాలి కానీ మనవాడా, కాదా అన్నది ఉండొద్దు. 500 పేజీల పుస్తకం అది. రాయడానికి ఏడాదిన్నర పట్టింది నాకు. అయినా అది తొందరగా అయినట్టే. ఎందుకంటే క్రీ.శ. 941 నుండి 2000 సం. వరకు వర్ధిల్లిన ప్రముఖ కవుల జీవిత, సాహిత్య సమాచారాలు ఉన్నాయి దాంట్లో. అందులో చేర్చినవాళ్ళు 1975 లోపు జన్మించి వుండాలి. 2000 సం. వరకు వాళ్ళ రచన, కావ్యం ఏదైనా వచ్చి ఉండాలి. దానికి ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, ఎస్వీ రామారావు గారి తెలంగాణ సాహిత్య చరిత్ర, ఇంకా కొన్ని సాహిత్య చరిత్రలు తిరగేసి, ఆధునికులవి దొరకవు కాబట్టి ఫోన్లు చేసి, బయోడేటాలు, రచనలు సేకరించి చేశాను. ఎస్వీ రామారావు గారు కూడా ” ఇది పెద్ద రీసెర్చ్ వర్క్. పిహెచ్ డి చేయవచ్చు. ఒంటి చేత్తో చేశావని” ప్రశంసించారు.

ఆటా,తానా వంటి సభల్లో, మనదేశంలో మీ సంగీత నృత్య రూపకాలు ప్రదర్శించబడినప్పుడు వచ్చిన ప్రతిస్పందన ఎటువంటిది?

నేను లలితగీతాలు, సినిమా పాటలు రాస్తూనే మధ్యలో రూపకాలు రాశాను. “జయజయహే తెలంగాణ” రూపకం చాలా పేరు తెచ్చింది. అంతకు ముందు ‘ఆటా, తానా’ వీటికి స్వాగత గీతాలు రాశాను. 60కి పైగా సంగీత నృత్య రూపకాలు రాశాను. వాటన్నింటినీ పుస్తకాలుగా కూడా వేశాను.  2004 లో ‘ఆటా’ వాళ్ళకు స్వాగతగీతం రాయాలంటే సరే అయిదు నిమిషాల పాట అనుకున్నాను. కాదు… సంగీత నృత్య రూపకమది. వాళ్ళ ఆవిర్భావం, ప్రగతి, ప్రస్థానం, వాళ్ళ లక్ష్యాలు అన్నీ రావాలి. అందులో ఒక హరికథ, ఒక బుర్రకథ ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన తెలుగుదనం ఉట్టిపడే సమాహారంలా ఉండాలి. అలాగే రాశాను. బాగా వచ్చిందన్నారు.  ప్రదర్శన చికాగోలో జరిగింది. ఆహ్వానించి టికెట్టు ఇచ్చారు. నారాయణరెడ్డి గారు, మాడుగుల నాగఫణి శర్మ గారు, రామానాయుడు గారు, దాసరి నారాయణరావు గారు వీళ్లంతా ముందు వరుసలో కూర్చున్నారు.  నా స్వాగత గీతం తోనే ఆ ప్రపంచ తెలుగు మహాసభల వేడుక ప్రారంభం అయింది. స్టేజీ మీద 70 మంది నాట్య కళాకారులతో ప్రదర్శన జరిగింది. నన్ను పిలిచి దాసరి నారాయణరావు గారు ‘నువ్వే రాశావా’ అన్నారు. “ఇంకెవరు రాస్తారు నేను కాక?” అన్నాను. మళ్లీ ప్రదర్శన వేయించమని చెప్పి చూసి, అక్కడ నాకు ‘లలితశ్రీ’ బిరుదునిచ్చారు. హేమా హేమీలందరు ఉండగా ఇలా జరగడం గొప్ప అనుభూతి. 2014 లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు “జయజయహే తెలంగాణ”  రూపకాన్ని రూపొందించాను. అసలు 60 ఏళ్ళుగా ఏం జరిగింది? తెలంగాణా సంఘర్షణ, సాధన అన్నది ప్రధానంగా మలిచాను. కొమురం భీం, దొడ్డి కొమురయ్య, చాకలి  ఐలమ్మ, కాళోజీ, దాశరథి వీళ్లంతా ఎట్లా పాటుపడ్డారు? నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అరాచకాల్ని , కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను, గద్దర్ పాట “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా!” ఇలా ఆయన కూడా ఎలా ప్రేరేపితులను చేశాడో ఇవన్నీ కలగలిపి ఒక సమాహారంగా చేశాను. అప్పుడు స్పీకర్ మధుసూధనాచారి గారు, స్వామి గౌడ్ గారు, మండలి ఛైర్మన్ గారు వాళ్ళు చూసి, ” మేము అన్నిచోట్ల ఎన్నో విషయాలు చెప్తున్నాం. కానీ కరెక్టుగా ఇప్పుడు మాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు” అని ప్రశంసించారు. ఇది అన్ని జిల్లాల్లో ప్రదర్శించాలని కూడా వాళ్ళు ఆదేశించారు. పది జిల్లాల కలెక్టర్లు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శింప చేశారు. ఇది ఒక అపూర్వ సంఘటన. ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫేర్ లో కూడా వేశాము. తర్వాత “విత్తనాల విలువ” అని ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కు కూడా రాయడం జరిగింది. అలాగే ‘భారత రత్న’ అంబేద్కర్, మహాత్మా పూలే, భాగ్యరెడ్డి వర్మ వాళ్ళ జీవితాలను కూడా డాన్స్ బేస్ డ్ రూపకలుగా రచించాను.

ఈ రూపకాలన్నిటికీ పూర్తిస్థాయిలో బాధ్యత మీరే వహించేవారా?

అవును. రాయడం, దానిని రూపొందించడం అంతా నేనే. ప్రదర్శింప చేయడం అంటే కోట్ల హనుమంతరావు అనే ఆయన డ్రామాకు, కొరియోగ్రాఫర్ గా ఆయన భార్య అనితారావు ఇద్దరూ చేశారు. “జయ జయహే తెలంగాణ” మొత్తం సత్కళా భారతి, సత్యనారాయణ ఆధ్వర్యంలో వాళ్లే చేశారు. “భారతరత్న అంబేద్కర్” కూడా వాళ్ళకే ఇచ్చాను. తర్వాత  “రమణీయ రామప్ప” వసుమతీ వర్కాల అనే ఆమెతో చేయించాను. అద్భుతంగా వచ్చింది అది. మేము ప్రదర్శించిన రెండేళ్లకు దానికి గ్లోబల్ రికగ్నీషన్ వచ్చింది. అంతకుముందే ‘ఆమ్రపాలి’ ని మద్దాలి ఉషా గాయత్రి చేసింది. “తెలంగాణ తేజాల అభినయం” అని వనజా ఉదయ్ చేసింది. దీపికారెడ్డి గారేమో “తెలంగాణ వైభవం” చేసింది. ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్రపతి వచ్చేముందు దాన్ని ప్రదర్శింప చేశారు. తర్వాత ఆటా, నాటా, టాటా మొదలగు వాటికి  ఎన్నోసార్లు స్వాగత గీతాలు రాశాను. మొన్న మొన్న కూడా ‘నాట్స్’  న్యూజెర్సీలో జరిగినప్పుడు కూడా స్వాగతగీతం రాయడం జరిగింది. కానీ వెళ్ళడం కుదరలేదు. సినిమాలకు అనేక అవకాశాలు రాలేదని ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ఏది అవకాశం వస్తే అది రాస్తూనే వున్నాను.

కరీంనగర్ లో ఉన్న క్షేత్రాలపైన చేసిన ఆడియో సీడీ వివరాలు చెప్పండి. ఆడియో రికార్డులు చేయాలి అనుకున్నది మీ ఆసక్తితోనేనా?

అవును. మీరు బాగానే గుర్తుచేశారు. నేను పోస్టల్ ఇన్సూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా ఆంధ్ర దేశమంతటా తిరిగాను. ప్రతీ జిల్లాకు వెళ్ళేవాణ్ణి. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు వెళ్లి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని ఎన్ లైటెన్ చేసి, ఎన్ రోల్ చేసేవాడిని. అయితే ఆంధ్రప్రాంతంలో చిన్న చిన్న దేవాలయాల్లో కూడా క్యాసెట్లు మారుమోగుతుండేవి. వేములవాడ మా సిరిసిల్ల దగ్గరే కదా! శ్రీశైలం తర్వాత మన ప్రాంతంలో ద్వితీయ స్థానం ఉన్న దేవాలయమిది. దానికి ఒక్కరికార్డ్ కూడా లేకపోవడం గమనించి ఈవోను అడిగాను. ఎవరూ చేయలేదన్నాడు. సరేనని నేను పూనుకొని  (1991)”కరీంనగర్ క్షేత్రాలు” పేరుతో  బాల సుబ్రహ్మణ్యం గారు, వాణీ జయరాం గారి చేత పాడించి క్యాసెట్ చేయించాను. వాళ్ళు పాడడం అంటే చాలా గ్రేట్ ఆరోజుల్లో. ”

కైలాస నిజనివాస ఓ మహేశ్వరా/ వేములవాడ ప్రవాసా రాజేశ్వరా/ బూడిద ధరియిస్తావు, భుక్తి ప్రసాదిస్తావు….అంటూ బాలుగారి గాత్రంలో పాట సాగుతుంది. ఎ.ఎ.రాజ్ దానికి మ్యూజిక్ డైరెక్టర్. వాణీ జయరాం గారితో మేలుకొలుపు పాట పాడించారు. ఆ రోజుల్లోనే లక్ష క్యాసెట్లు అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఫేస్ బుక్ మాధ్యమంగా విదేశాల నుండి ఆ పాట ఉంటే పంపండి అని నన్ను అడుగుతుంటారు. వెబ్ సైట్ లో పెట్టాను కొన్ని. కైలాస నిజావాసా అనే పాట సినిమా పాట కంటే పాపులర్ అయింది. నేను రాసిన భక్తి గీతాల సంకలనం ఒకటి వేయాలనుకుంటున్నాను. బాల మురళీకృష్ణ గారు కూడా నా పాటలు  పాడారు. ఒకసారి “శివ శివ నామం జపియించు/ భయ భవ బంధం తొలగించు.” అనే పల్లవి.  ఆయన “భవ భయ బంధం” అని పాడారు. అలా కాదని సరి చేశాను. అప్పుడాయన అంత గొప్పవాడు అయి ఉండి కూడా “అందుకే మిమ్మల్ని ఉండమన్నది. మేమెంత స్వర కర్తలం అయినా సాహిత్యం రాసేవాళ్ళు ఉండాలి” అన్నారు. అది ఎంతో అనుభూతిని ఇచ్చింది.

‘నరకాసుర’ అనే సినిమా వస్తోంది. దానిలో శివుని మీద మూడు పాటలు రాశాను. అప్పుడు వాళ్ళు ” మీరు చాలా బాగా రాశారు. పేరున్న వాళ్ళను కూడా అడిగాము. కానీ సరిగా రాయలేకపోయారు” అని అన్నారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే సరిగ్గా పదాలు పడాలి అంటే ఆస్తికత్వం ఉండాలి. భక్తి, అనురక్తి ఉండాలి. అలాగే శబ్ద శక్తి కూడా ఉండాలి. పురాణాల అవగాహన ఉండాలి. అప్పుడే అది అనుకున్న విధంగా వస్తుంది. సాయిబాబా జీవిత చరిత్రను, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆడియో రికార్డు చేసి ఇంట్లోనే వింటూ చేసుకునేలాగా రూపొందించాను.

ఒక జాతీయ కవిగా మీరు గుర్తింపు పొందిన అనుభవాలేవి?

ఈ రోజు అందరూ “నేను జాతీయ కవిని” అని గర్వంగా చెప్పుకుంటుంటారు. నేను 1975 లోనే జాతీయ కవినయ్యాను. ఎలాగంటే ఆకాశవాణి వాళ్ళు నన్ను “మీరు లలితగీతాలు అనేకం రాశారు “జాతీయ బాలల సామూహిక గానం కోసం ఒక పాట రాసి ఇవ్వండి. ఢిల్లీకి పంపుతాము. అది సెలెక్ట్ అయితే జాతీయకవి అవార్డు వస్తుంది.” అని అన్నారు. “జాతీయకవి అంటున్నారు మరి నాకంటే చాలామంది పెద్దవాళ్ళు వున్నారు కదా! వాళ్ళను అడగండి” అన్నాను. “అందరివీ పంపించాము. కానీ అవేవీ సెలెక్ట్ కాలేదు. మీరూ ఒక ప్రయత్నం చేయండి” అన్నారు.”భలేవాళ్లే!  వారివే సెలెక్ట్ అవలేదంటే నేను రాస్తే ఏమవుతుంది?” అన్నాను. అప్పుడు కొట్రా మల్లికార్జునశర్మ గారు  “మీ ప్రయత్నం మీరు చేయండి” అన్నారు. సరేనని రాసిచ్చాను. ” మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి/ జగమంతా ఒక్కటనే జన జాగృతి కావాలి.” అని ఇచ్చాను ముందు. బాలల గీతం కాబట్టి జనజాగృతి కష్టమవుతుందేమో అన్నారు. అప్పుడు “మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి/ జగమంతా ఒక్కటనే మంచిరోజు రావాలి” అని మార్చి, బిందువు బిందువును చేరి సింధువుగా పారునుగా/ సింధువు సింధువు చేరి సంద్రముగా మారునుగా/ మల్లిక మల్లికను చేరి మాలగ రూపొందునుగా/ మాలను మలిచేందుకు ఒక దారమె ఆధారముగా/ అని రాసి, ఇచ్చాను. అదే సెలెక్ట్ అయింది. కావున అది సెప్టెంబర్ (1995 ) నెలంతా ఆలిండియా రేడియోలో అన్ని భాషల అనువాదాలతో తెలుగు పాట మారుమోగింది. థ్రిల్లింగ్ ఫీలయ్యాను. కానీ అది నేను రికార్డ్ చేసి పెట్టుకోలేదు. అనువదించబడిన  ఇతర రాష్ట్ర భాషల పాటలను కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటే బాగుండేది. నేను రాసింది మాతృక కదా వీటికి. అంతకు ముందు ఎన్నో పాటలు రేడియోలో వచ్చాయి కదా! దీన్ని అంతగా పట్టించుకోలేదు. అందరూ ఆ గొప్పతనాన్ని పొగుడుతూ జాతీయ కవిగా ప్రశంసలు కురిపించారు. చిత్తరంజన్ గారు పాడిన తెలుగు పాటతో పాటు మిగతా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పాట ప్రసారమవుతుండేది.  లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో ఉభయ రాష్ట్రాల్లో నా కవిత సెలెక్టు అయింది. అలా కూడా జాతీయ కవినయ్యాను. అందరూ అంటుంటారు. “అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాల్లోనే మీ పాటలు ప్రచారం అవుతుంటే  ఎప్పుడో అంతర్జాతీయ కవి అయ్యారని.”నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు.

తెలంగాణ మాండలిక భాషలో వెలువడిన మీ రచనలేవి?

తెలంగాణ భాషలో 1976 లోనే ‘వెలుగొచ్చింది’ అనే నాటిక రచన చేసి, దర్శకత్వం వహించి, ఎవరైనా పాత్రధారి రాకపోతే ఆ పాత్ర కూడా పోషించాను. అవార్డులు కూడా వచ్చాయి దానికి. అప్పటికి ఒక లోకువ తెలంగాణా భాష, యాసల్లో రాయడం. కానీ ఆ ప్రయత్నం, సాహసం అప్పుడే చేశాను నేను. ఇప్పుడు తెలంగాణా యాసలో రాస్తే గొప్ప. 10 నాటకాలు రాశాను. వెలుగొచ్చింది, భాగ్యనగర్, ఉద్యోగపర్వం, ముందుచూపు, అతిథి, అడ్డుతెరలు, చదువు బాట, మంచు తెరలు.. ఇలా అన్నింటినీ కలిపి “రంగ తరంగాలు” పేరుతో సంకలనం చేశాను. 2017 లో ప్రపంచ తెలుగు మహా సభలప్పుడు రమణాచారి గారు.. (జయ జయహే తెలంగాణకు కూడా ఆయనే ప్రేరణ) విదేశాల నుండి ఎంతో మంది వస్తారు కాబట్టి హైదరాబాద్ చరిత్ర గురించి తెలియడానికి రాయమంటే ‘భాగ్యనగర్’ రాశాను.  భాగమతి, కులీ కుతుబ్షాల ప్రణయ నేపథ్యంతో పురానాపూల్ ఎలా ఏర్పడింది? చార్మినార్ ఎందుకు ఏర్పడింది? కందుకూరి రుద్రకవి మొదటి యక్ష గానాన్ని ( సుగ్రీవ విజయం ) మల్కిభ రామునికి వినిపించడం ఇవన్నీ వచ్చేలాగా చారిత్రకంగా రచించగా ‘సత్కళా భారతి’ ఆధ్వర్యంలో గొప్పగా ప్రదర్శించారు. అది సినిమాటిక్ గా అద్భుతంగా ఉందని ఎల్. బి శ్రీరామ్, గుమ్మడి గోపాలకృష్ణ వీళ్లంతా ప్రశంసించారు. ‘రస రంజని’ రజతోత్సవాల్లో కూడా దాన్ని ప్రదర్శించారు.  ఇటీవలే నేను 75 ఏళ్ళ అమృతోత్సవంలో అడుగుపెట్టాక దాన్ని పుస్తకంగా “భాగ్యనగర్ – వెలుగొచ్చింది” అని వేశాను. వెలుగొచ్చింది నాటికను పాత్రలు, అంకాలు పెంచి నాటకంగా మలిచాను. మొన్నటి జూలైలో ఆవిష్కరణ జరిగింది. నారాయణ రెడ్డి గారు జూలై 29 న పుడితే నేను జూలై 30న పుట్టాను. సినారె గారు “నన్ను జన్మతః అనుసరిస్తున్నాడు” అనేవారు. ఆయన కూడా తన పుట్టినరోజున పుస్తకాన్ని ఆవిష్కరించుకునే వారు. అలానే నేను కూడా అట్టహాసం లేకుండా నా పుట్టినరోజు న పుస్తకం వేసుకున్నాను. “తెలంగాణ సంస్కృతి- బతుకమ్మ ఆకృతి” అని డాక్యుమెంటరీ చేసాను. అలానే మా సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి “నేతన్నల ఆత్మహత్యలు” పేరుతో అంటే ఆత్మహత్యలు కాదు ఆత్మస్థైర్యం పెంచుకోవాలని వాళ్లకు ప్రబోధకంగా డాక్యుమెంటరీ చేశాను. బొమ్మలమ్మ గుట్ట మీద తొలి కంద పద్యాలు  నన్నయ్యకు 100 ఏళ్ళ ముందే తొంగి చూశాయని దానిమీద డాక్యుమెంటరీ చేసి ఆ కంద పద్యాలను ప్రొఫెషనల్ సింగర్స్ తో పాడించాను. అలా సాహిత్య పరంగా చేతనైనంత రాస్తూ దాన్ని పాటిస్తూ వచ్చాను.

పాటలు రాయడమే కాకుండా సినిమా, టీవీ సీరియల్స్ కు కూడా దర్శకత్వం చేశారు. ఏమైనా కష్టంగా అనిపించిందా? ఆ వివరాలు కూడా కొన్నింటిని చెప్పండి.

మొదట్లో మా హెడ్మాస్టర్ “మీరు స్కూల్ డే కి నాటకాలు వేయాలని, వేయకపోతే హాల్ టికెట్ ఇవ్వనన్నా”రు. ఆ ప్రేరణ తర్వాతి నా రచనలకు, నాటకాలకు, సినిమాలకు, టీవీ సీరియళ్లకు పునాది అయింది. ఇంతకుముందు చెప్పాను కదా. 30 సీరియల్స్ కి దర్శకత్వం వహించానని. సినిమాలు, టీవీలలో కట్ చేసి టేకులు తీసుకోవచ్చు. నాటకాలు అలా కావు కదా! ప్రత్యక్షంగా ఉంటాయి కాబట్టి పోర్షన్ మరిచిపోతే వెనకనుండి అందించేవాళ్ళం. జనం ముందు అభాసుపాలు కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు టెక్నికల్ డెవలప్ మెంట్ చాలా పెరిగింది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏవీ లేవు. నేను “ఎక్కడికెళ్తుందో మనసు” ప్రేమకే తెలుసు అనే టాగ్ లైన్ తో సినిమాకు దర్శకత్వం వహించాను. అలాగే “లావణ్య విత్ లవ్ బాయ్స్” అనే సినిమా….అయితే ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిన విషయం చెప్తాను. “ఎక్కడికెళ్తుందో మనసు” సినిమాలో ఒక మంచి తెలుగు పాట ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించాము. సన్నివేశంలో హీరో చికాగో నుండి స్వంత ఊరికి వస్తాడు. తెలుగు రాష్ట్రావతరణ దినోత్సవంలో సర్పంచ్ తో (అక్కిరాజు సుందర రామకృష్ణ  గారు) “తెలుగు రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా శంకరం బాడి సుందరాచారి తర్వాత అలా తెలుగు పాట రాసి, పాడి మెప్పించేవాళ్ళు లేరా?” అనే డైలాగ్ పెట్టించాను. అప్పుడు హీరో లేచి నేనున్నాను అని పాడుతున్నట్లు పాట పెట్టాను. ” తేట తేనెల చిలుకు పలుకు నా తెలుగు/ రాజహంసల కులుకు తళుకు నా తెలుగు/ అద్భుత సంస్కృతి విరియు రెమ్మ నా తెలుగు/ అమృత ధారల కురియు అమ్మ నా తెలుగు/ ఆ తెలుగు తల్లికి అభివందనం/ అనురాగవల్లికి శ్రీచందనం- అని రాశాను. మిగతా రెండు చరణాల్లో ఒకటి సాహిత్యం, మరొకటి సంస్కృతి ఉండేలా రాశాను. ఆ పాట చూసి బాల సుబ్రహ్మణ్యం గారు ” ఎంత బాగా రాశారు? అప్పుడెప్పుడో ‘అమెరికా అమ్మాయి’ లో దేవులపల్లి, తర్వాత ఇన్నేళ్ళకు వడ్డేపల్లి ఇంత మంచి పాట రాశారు. ఇది పాడగలగడం నా అదృష్టం” అన్నారు. అలా జీవితంలో ఎన్నెన్నో మరువలేని అనుభూతులు మిగిలాయి.

వివిధ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతలుగా, జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు కదా! మీకు ఎదురైన అనుభవాలు ఎటువంటివి?

నేను సెన్సార్ బోర్డు మెంబరుగా మూడుసార్లు చేశాను. అప్పట్లో తెలంగాణ భాషను రౌడీలకు, గూండాలకు, హాస్య పాత్రలకు పెట్టేవాళ్ళు. దీన్ని నేను అడ్డుకునేవాడిని. కట్స్ పెట్టేవాడిని. మీరు తెలంగాణ వారయి ఉండి దీనిని ఎందుకు అడ్డుకుంటున్నారు? అనేవాళ్ళు. తెలంగాణా వాడిని కాబట్టే కట్స్ పెడుతున్నాను. ఇదే భాషను హీరో, హీరోయిన్లకు పెట్టండి ఆదరిస్తాను. పరోక్షంగా మా భాషను అవమానిస్తుంటే ఎలా ఊరుకుంటాను అనేవాడిని.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ సభ్యుడిగా చేశాను  (2003). 2006, 2009 లో నంది అవార్డుల కమిటీ చైర్మన్ గా చేశాను. సాధారణంగా ఒకసారి చేశాక మళ్ళీ ఇవ్వరు. కానీ రెండవసారి కూడా ఇచ్చారు. “అదేంటీ? ఎవరైనా అభ్యంతర పెడతారు” అంటే “ఎవరూ సరిగా చూడరు. మీరు న్యాయంగా, నిష్పక్షపాతంగా అన్నీ చూస్తారు. అందుకే మీరే చేయండి” అన్నారు. ఆ పేరు నిలబెట్టుకున్నాను. చాలా కార్యక్రమాలకు, సీరియల్స్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాను. అంతకు ముందు ఒకే దానికి అవార్డులు వచ్చేవి. దానికి నేను బ్రేక్ వేశాను. ఒకదానిలో ఒక అంశానికి ప్రాధాన్యత నిస్తే మరో దానిలో ఇంకో ప్రత్యేక అంశానికి, అలా తీసుకొని కేటగిరీలుగా విభజించుకుంటూ ఇచ్చాము. కొందరు నొచ్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో సీనియారిటీ, శిఖర స్థాయిలో ఉన్న వాళ్లకు కాకుండా కొత్తగా వచ్చిన ప్రతిభావంతులకు ఇచ్చాము. పేరున్న వాళ్ళు అంతకుముందు ఎన్నో అవార్డులు పొంది వుంటారు కదా..వారికి ఇంకొకటి ఇవ్వడం లెక్క కాదు. అందుకే కొత్తవారికి ఇస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రతిభకు పట్టం కట్టాము. దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. కానీ చలించలేదు. నిష్పక్షపాత వైఖరి నా అభిమతం.

ఇంతటి సాహితీ సేవ చేస్తున్న మీకు ‘ఇంకా ఇది జరగలేదు’ అన్న అసంతృప్తి ఏదైనా మిగిలివుందా?

ఇన్ని రచనలు చేసినా, ఎంత బాగా రాసినా, ఎన్ని ప్రశంసలు పొందినా, ఎన్ని పురస్కారాలు, సన్మాన, సత్కారాలు పొందినా నా రచనలు కేంద్ర సాహిత్య అకాడెమీ వరకు ఎందుకు వెళ్లడం లేదు? అని ఒక లోటు అనిపిస్తుంది. కొంతమంది 2, 3 రచనల్లోనే సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహిస్తున్నారు. 1992 లో రాష్ట్ర స్థాయిలో తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన బాలల కోసం నిర్వహించిన రచనల పోటీలో నేను రచించిన  ‘చిరుగజ్జెలు’ గేయ సంపుటికి అవార్డు వచ్చింది. ఇటీవల కూడా 2020లో ‘బాల రసాలం’ అనే బాల గేయ సంపుటిని వెలువరించాను. అంతేకాక “రాగ రామాయణం” అనేది నేను పిల్లల కోసం చేసిన రచన. వారికి ప్రబోధకంగా, కర్తవ్య సుబోధకంగా ఉండేలా, మాతా పితరుల భక్తి, గురుభక్తి పెంచేలా ( ఈ రోజు పిల్లల్లో అదే లోపించింది కదా) చేయాలంటే రామాయణమే సరియైనదని భావించి వాల్మీకి రామాయణాన్ని 100 పేజీల్లో లవకుశుల్లా పాడుకునేలా రాశాను. దానికి తెలంగాణా సారస్వత పరిషత్తు అవార్డు కూడా వచ్చింది. ఆడియో కూడా చేయించాను. రామాయణ చరితమంత రమ్య రాగ భరితం/ త్యాగాలకు నిలయమైన సకల ధర్మ సహితం/ ఇది పల్లవి.. రామ రామాయన్న రాగాలు ఉదయించు/ రామ రామాయన్న రోమాలు పులకించు/ వ్యాధుని వాల్మీకిగ మార్చిన తారక మంత్రం/ శోకము శ్లోకమ్ముగ తీర్చిన అద్భుత మంత్రం…ఒక హైస్కూలు స్థాయి పిల్లలకి అర్థమయ్యేలాగా రాశాను. దానివల్ల మన సంస్కారం, మన సంస్కృతి గురించి తెలుస్తుంది. బాల సుబ్రహ్మణ్యం గారు దీనికి ముందు మాట రాస్తూ ” ఇంతటి అద్భుతమైన రచనాశక్తి, ప్రతిభ, వ్యుత్పత్తి ఉండి మీకు తగిన పేరు ఇంకా ఎందుకు రాలేదోనని వేదనగా ఉంది నాకు” అని రాశారు. అంతా రాజకీయమే. ప్రతీ దానికి లాబీయింగ్ చేసి సాధించుకోవడం అలవాటైపోయింది.  అది నచ్చకనే జ్యూరీ సభ్యుడిగా వున్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాను. పల్లకీలు మోయడానికి కొంతమంది శిష్యులు వుంటారు. నాకు ఆ అవకాశం లేదు. పల్లకి పల్లకి గానే ఉండిపోవాలి ఎప్పుడూ. పోతన ఇప్పుడు లేకపోయినా ప్రతీ పద్యాన్ని కళ్లకద్దుకుంటున్నాము. అలా ఉండాలని నా సంకల్పం. దాశరథి గారు రాసిన “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో” అనే గీతానికి అప్పట్లో పేరు రాలేదు. ఇప్పుడు దాన్ని క్యాలెండర్ లో ముద్రించారు. ప్రతీ దాంట్లో చెప్తున్నారు. ఆయన రాసిన “నీలో దీపం వెలిగించు/ నీవే వెలుగై వ్యాపించు” అన్నదానికి ఎక్కువ పేరు వచ్చింది. దూరదర్శన్ లో కూడా గేయనాటికలు మొట్టమొదట నావే ప్రసారం అయ్యాయి. ఏదైనా రచన బాగుంటేనే కాల గర్భంలో కలిసి పోకుండా నిలిచిపోతుంది. ఆ తర్వాత శాశ్వతంగా ప్రకాశిస్తుంది. అన్నదే నా విశ్వాసం.

ధన్యవాదాలు సార్…విశేష సాహితీ మూర్తులైన మీరు మాకోసం మీ సమయాన్ని వెచ్చించడం మా అదృష్టంగా భావిస్తూ మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు..

September 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శృతి తప్పిన వీణ

by Padmasri Chennojwala September 21, 2023
written by Padmasri Chennojwala

విధి చేసిన మది గాయం అగాధపు అంచులు తాకింది

పగిలిన అద్దంలో ప్రతిబింబం వికృతంగా వెక్కిరిస్తోంది

కమ్ముకున్న నైరాశ్యపు మేఘాలు నీలాల నింగిని కరిమబ్బును చేశాయి

శృతి తప్పిన కళ్యాణ వీణ ప్రణయరాగం విరిసే వేళ విషాద గీతం పలికిస్తోంది

సగాలు రెండు సమాంతర రేఖలై గమనం సాగిస్తున్నాయి

మృగాల వేటలో సగాల ఘోష మిన్నంటుతోంది

పుట్టలోని కాలనాగులు పడగవిప్పి బుసలు కొడుతున్నాయి

సోలో పయనంలో ముసుగుచాటు వికృతం అంతకంతకూ విజృంభిస్తోంది

ముడివడిన బంధం ద్విదళ బీజమై చీలుతోంది

అంకురచ్ఛదాలు అడకత్తెరలో పోకచెక్కలవుతున్నాయి

ప్రేమ కోసం పిందెలు చెకోరాలై పరితపిస్తున్నాయి

తెగిన దారాలను సవరించుకుంటూ

విరిగిన మనసులను అతికించుకుంటూ

సమాంతర రేఖలు దిశ మార్చుకుని సరళ రేఖలైతే

ఖండన బిందువు అనురాగ సంగమమౌతుంది

బాల్యానికి భద్రతావలయమౌ తుంది

శూన్యం నిండిన ఎదలోయల్లో సుస్వర వీణ మోహనరాగం పలికిస్తుంది

శిశిరం పలాయనం పఠించి మది వసంతమై విరబూస్తుంది

September 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

భావాల స్పర్శ

by Y. Sujatha September 21, 2023
written by Y. Sujatha

భావాల ధాటికి చిట్లిపోయిన నరాలు
నెత్తుటి సిరాగా
కలంలో ప్రవహిస్తున్నప్పుడు……………….
అక్షరాల శబ్దానికి
విస్పోటనమై పోయిన భావాలు
శిధిల శకలాలుగా
కాగితంపై కుప్పకూలుతున్నప్పుడు………..
అనుభవాల ప్రకంపానికి
విచ్ఛిన్నమై పోయిన సంఘటనలు
బాధల స్మృతులుగా
కాలం వేదికపై కదలాడుతున్నప్పుడు………
శ్రమజీవుల రెక్కల కష్టానికి
ఆవిరి అయిపోయిన ఊపిరి సెగలు
స్వేద బిందువులుగా
బతుకు చిత్రంపై వర్షిస్తున్నప్పుడు……….
మృగాల కామద్రావకానికి
దహనమైపోయిన శరీర భాగాలు
సమాధి గోడలుగా
సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నపుడు…….
సేద్యకారుడి పంట నష్టానికి
పగిలిపోయిన ఆశల గుండెలు
అశ్రు సముద్రాలుగా
సంసార నౌకను ముంచేస్తున్నప్పుడు……..
వేదనల తీవ్రతలో
ముక్కలైపోయిన జీవితాలు
నిస్సహాయ నిట్టూర్పులుగా
జీవన యానంలో కొనసాగుతున్నప్పుడు……….
కవయిత్రి కలంలో
కవిత దానికదే పుడుతుంది
అక్కున చేర్చుకొని బాధిత వర్గాన్ని ఓదారుస్తుంది!


September 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కేయూర మాట

by mayuukha September 20, 2023
written by mayuukha
September 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

కిరాయి

by తడక మళ్ళ మురళీధర్ September 20, 2023
written by తడక మళ్ళ మురళీధర్


అమాయకత్వానికి మరో పేరు చంద్రమోహన్. అందరూ తెలివి తక్కువ వాడని అవహేళన చేసినా ముఖం చిట్లించుకునే రకం తప్ప ఎదురు జవాబు చెప్పడు. అమాయకత్వానికి తోడు చదువు కూడా అబ్బలేదు. మూడు సార్లు దండ యాత్రల తర్వాత పదవ తరగతి సర్టిఫికెట్ చేతికి దక్కింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవటంతో అంతటితో చదువు ఆపేసాడు. రెండు గదుల పోర్షన్ లో ముందు గదిలో తల్లి చిన్న కిరాణా కొట్టు నడిపించేది. వెనుక గదిలోనే కుటుంబమంతా నివాసం. చదువు మీద పెద్దగా శ్రద్ధ లేకపోవటంతో అప్పుడప్పుడు తల్లికి తోడుగా కిరాణా కొట్టులో కూర్చునే వాడు. యుక్త వయసు రాగానే ఆర్ధికంగా అంతంత మాత్రమే ఉండే మేనమామ బాలనర్సు కూతురు రమ్యతో ఇరు కుటుంబాల వారు వివాహం జరిపించారు. రమ్య కూడా పదవ తరగతితో చదువు ఆపేసింది. పెళ్ళైన కొంత కాలానికే చంద్రమోహన్ తల్లి కాలం చేసింది. కిరాణా కొట్టును రమ్య చూసుకోసాగింది. తెలివైంది కావటంతో ఆర్ధిక ఇబ్బందులను దాటుకుంటూ కొద్ది సంవత్సరాల్లోనే వ్యాపారాన్ని ఓ మోస్తరుగా వృద్ధి చేసింది. కాలం గడుస్తుంటే చంద్రమోహన్ దంపతులు కొడుకు, కూతురుకు జన్మ నిచ్చారు.

ఇంటికి ఆనుకొని ఉన్న స్వంత ఖాళీ జాగాలో కూడబెట్టిన పైస పైసాతో చంద్రమోహన్ తండ్రి తన హయాంలోనే మూడు గదుల పోర్షన్ ను కట్టించి జనార్ధన్ కు కిరాయికి ఇచ్చాడు. దాదాపు ఇరవై సంవత్సరాల నుండి జనార్ధన్ తన కుటుంబంతో నివాసముంటున్నాడు. ఆ ఇంట్లో చేరినప్పటి నుండి అతని రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఆ ఇల్లు తమకు అచ్చి వచ్చినట్టుగా జనార్ధన్ కుటుంబ సభ్యులు భావిస్తారు. అదే ఇంట్లో ఉంటూ కూతురు రాణి వివాహం భారీగా కట్నం ఇచ్చి ఘనంగా జరిపించాడు. కొడుకు రాకేష్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మరో రెండు సంవత్సరాల్లో విదేశాలకు పంపించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇంత సంపాదించి కూడా ఇరుకైన మూడు గదుల ఇంట్లోంచి మారాలనే ఆలోచన ఏనాడు కలుగలేదు. జనార్ధన్ ప్రస్తుత స్థాయికి ఆ ఇల్లు ఏమాత్రం సరిపడదు. చనువుగా ఉండే బంధువులు, స్నేహితులు కలుగజేసుకొని విశాలమైన ఇల్లుకు మారవచ్చు కదా అంటే, “ఇప్పుడు నేనుండేది నా స్వంత ఇల్లే, దీన్ని వదిలి వేరే ఎక్కడో ఎందుకుండాలి” అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చేవాడు. ఆ సమాధానం లోని అంతరార్ధం పసిగట్టలేని వాళ్లు సైలెంటుగా ఉండేవారు. మనిషి మానసిక స్థితి ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇన్నేళ్లుగా ఆ ఇంట్లో నివాసముంటూ నెలనెలా విద్యుత్ చార్జీలు కడుతున్నందుకు ఇంటిపై అన్ని హక్కులు తనకు దక్కుతాయనే భావనతో ఉన్నాడు జనార్ధన్.
పిల్లల వయస్సు పెరుగుతుండటంతో కుటుంబమంతా ఒక్క రూములో సర్దుకోవటం రమ్యకు ఇబ్బందిగా అనిపించసాగింది. పిల్లలు చదువుకోవాలన్నా, రాత్రులు నిద్రపోవాలన్నా సతమతం అవుతున్నారు. అదే విషయం భర్తతో చెప్పింది. అమాయకంగా ముఖం పెట్టి

“ఇల్లు సరిపోకుంటే నన్నేం చేయమంటావు” అన్నాడు చంద్రమోహన్.

“అది కాదయ్యా, జనార్ధన్ సారు వాళ్లను ఖాళీ చేయించి ఆ పోర్షన్ కూడా మనమే ఉంచుకుందాం” అన్నది రమ్య. “అయితే నువ్వే అడుగు జనార్ధన్ సారును” అన్నాడు. మరుసటి రోజే సమయం చూసుకొని రమ్య జనార్ధన్ ఇంటికి వెళ్లి, తన పిల్లలు పెరుగుతున్నారని, ఒక్క రూంలో సర్దుకోలేక పోతున్నామని, ఇల్లు ఖాళీ చేస్తే ఆ పోర్షన్ ను కూడా తామే ఉంచుకుంటామని వేడికోలుగా చెప్పింది.

“ఇల్లు నేను ఖాళీ చెయ్యటమేమిటి, గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇందులో మాకు యాజమాన్య హక్కు ఏర్పడింది, ఇది ఇప్పుడు నా స్వంత ఇల్లు, మమ్మల్ని ఖాళీ చేయించే హక్కు మీకు లేదు ” జవాబిచ్చాడు జనార్ధన్.
“అదెలా సార్, ఈ ఇంటిని మా మామయ్య తన స్వంత జాగాలో స్వంత డబ్బులతో కట్టించాడు. మీరు కిరాయికి ఉన్నంత మాత్రాన హక్కు ఏర్పడిందని ఎలా చెబుతారు. మా పిల్లలు పెద్దోళ్లు అవుతున్నారు. మాకూ అవసరాలు ఉంటాయి సార్. దయచేసి ఖాళీ చేయండి” అంటూ ఈ సారి గట్టిగానే చెప్పింది రమ్య.
“కుదరదమ్మా, కరెంటు బిల్లు, నీటి పన్ను నేనే కట్టుకుంటున్నాను. ఇంట్లో చేరినప్పటినుండి అన్ని రిపేర్లు నేనే చేయించుకుంటున్నాను. పన్నెండు సంవత్సరాల పాటు అద్దెకు ఉంటే చట్ట ప్రకారం ఇంటి మీద హక్కులు ఏర్పడతాయి. మీకు తెలియదేమో నేను చెప్తున్నాను. అర్ధం చేసుకో. మీరు ఎంత అరచి గీపెట్టినా ఇల్లు ఎప్పుడో నా స్వంతమైంది, కావాలంటే కోర్టును ఆశ్రయించు” అంటూ రమ్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇంటి లోపలికి వెళ్లి పోయాడు జనార్ధన్.
కళ్ళ నుండి కారిన నీళ్లను చీర కొంగుతో తుడుచు కుంటూ దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చింది రమ్య. జరిగిన విషయం తెలిపింది భర్తకు. న్యాయాన్యాయాలు ఏమిటో బోధపడలేదు చంద్రమోహన్ కు.
“నిజంగానే ఇల్లు జనార్ధన్ స్వంతం అవుతుందా? మరి ఇప్పుడు మనమేం చేద్దాం రమ్యా? ” ప్రశ్నించాడు చంద్రమోహన్.
జనార్ధన్ చెప్పిన విషయం పదే పదే మెదడును తొలిచేస్తుండటం మూలాన రమ్యకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. చంద్రమోహన్ కు మాత్రం ఎటువంటి ఆలోచన లేదు. మరుసటి దినం లాయర్ చక్రవర్తి రోజు మాదిరే తన కిరాణా కొట్టు ముందు నుండి నల్లకోటు వేసుకొని బైకుపై వెళ్ళటం రమ్య గమనించింది. కొన్నాళ్ల క్రితం చక్రవర్తి పేరు విన్నది. ఆయనతో తనకు ఇప్పుడు అవసరం ఏర్పడింది. తనకు వరుసకు సోదరుడైన రామచంద్రం పొలం విషయంలో పెట్టిన కేసులో చక్రవర్తి బాగా సహాయం చేశాడని, మంచి పేరున్న లాయరని విన్నది. ఇంటి విషయంలో లాయర్ చక్రవర్తిని సంప్రదిస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికొచ్చింది రమ్య. వెంటనే రామచంద్రంకు ఫోను చేసింది “అన్నా బాగున్నారా ” అంటూ. బాగున్నామని రామచంద్రం జవాబిచ్చాడు.

“అన్నా, నా ఇద్దరు పిల్లలు పెద్దోళ్లు అవుతున్నారు నీకు తెలుసు కదా. ఇప్పుడు మేముండే చిన్న గదిలో సర్దుకోవటం కష్టంగా ఉంది. మా మామయ్య కట్టించిన పక్క పోర్షన్ లో కిరాయికి ఉండే జనార్ధన్ సార్ ఖాళీ చేస్తే అది కూడా మేమే ఉంచుకుందామని ఖాళీ చెయ్యమన్నాను. నా పెళ్ళికి ముందు నుండే ఆయన ఆ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. ఇప్పటికి ఇరవై ఏళ్ళు అయింది. ఇరవై ఏళ్ల నుండి ఉంటున్నాను కాబట్టి తనకు ఇంటిమీద యాజమాన్య హక్కులు ఏర్పడినాయని ఖాళీ చేసేది లేదని ఖరాఖండిగా అంటున్నాడు జనార్దన్ సారు. ఈ విషయంలో లాయర్ చక్రవర్తిని సంప్రదిస్తే ఏదైనా సలహా ఇస్తాడని అనుకుంటున్నాను. నువ్వేమంటావ్ అన్నా “.
“మంచిదే. చక్రవర్తి సారు న్యాయం కోసం కొట్లాడే మనిషి. తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ రోజు సాయంత్రం నేను నీ కొట్టు దగ్గరికి వస్తాను. ఇద్దరం కలిసి ఆయన దగ్గరకు వెళ్దాం” అంటూ ఫోను పెట్టాడు రామచంద్రం.

చెప్పినట్టే అదేరోజు సాయంత్రం రామచంద్రం రమ్య కిరాణా కొట్టు దగ్గరకు వచ్చాడు. ఇద్దరు కలిసి లాయర్ చక్రవర్తి ఆఫీసుకు వెళ్లారు. రామచంద్రం రమ్యను చక్రవర్తికి పరిచయం చేశాడు. తనకు, జనార్ధన్ కు మధ్య జరిగిన విషయాన్ని ఏడుస్తూ రమ్య చక్రవర్తికి విశదీకరించింది. “లాయరు గారూ, మా మామయ్య కష్టార్జితమైన ఇల్లును మేము పోగొట్టుకున్నట్లేనా, దీనికి పరిష్కారం ఏమిటి ” అడిగింది.

“లేదమ్మా, మీరు భయపడాల్సిన పని లేదు. మీ ఇల్లు కిరాయిదారైన జనార్ధన్ కు ఎప్పటికీ స్వంతం కాదు. ఎన్నేళ్లు ఉన్నా అతడు కేవలం కిరాయిదారు మాత్రమే. మీరు అమ్మితే తప్ప అతడు ఇంటిపై యాజమాన్య హక్కులు పొందలేడు. యాజమాన్య హక్కు ఉండదనే విషయం తెలిసి కూడా మిమ్మల్ని మోసం చేసి అమ్మకం పత్రం రాయించుకోవాలనే దురుద్దేశంతో అన్నాడో లేక తెలియక అన్నాడో కానీ నీవు చెప్పిన విషయాలను బట్టి అతడికి ఇల్లు ఖాళీ చేయాలనే ఆలోచన లేదనిపిస్తుంది.” వివరించాడు చక్రవర్తి.
“లాయర్ గారూ, ఎట్లైనా చేసి మీరు ఇల్లు రమ్య కుటుంబానికి దక్కేలా చేయండి. ముందే ఆమె భర్త అమాయకుడు. ఈమె కూడా పెద్దగా చదువుకోలేదు. చిల్లర కొట్టు తప్ప వేరే ఏ ఆదాయం లేదు. ఇద్దరు పిల్లలు, భర్తతో సంసారాన్ని నెట్టుకొస్తుంది.” జోక్యం చేసుకుంటూ అన్నాడు రామచంద్రం.
“నీకు డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా సహాయం చేస్తాను. కాకపోతే ఇదంతా వారం పది రోజుల్లో తేలే ముచ్చట కాదు. కొంచెం ఓపిక పడితే ఓ మూడు నాలుగు నెలల్లో ఒక కొలిక్కి వచ్చేట్లు ప్రయత్నం చేస్తాను. ఈ రోజే ముందుగా ఈ నెలాఖరుకల్లా ఇల్లు ఖాళీ చేయాల్సిందని జనార్దన్ కు నోటీసు పంపిస్తాను. అతని జవాబును బట్టి తదుపరి నిర్ణయం తీసుకుందాం “.
లాయర్ చక్రవర్తి వెంటనే నోటీసు తయారు చేయించి జనార్ధన్ చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాల్సిందిగా తన సిబ్బందికి ఆదేశాలిచ్చాడు. నెల రోజుల పిదప కలువమని రమ్యకు చెప్పాడు. సరిగ్గా నెల రోజుల అనంతరం చంద్రమోహన్, రమ్య చక్రవర్తిని కలిశారు. తను పంపిన రిజిస్టర్డ్ నోటీసు జనార్ధన్ అందుకున్నట్లు, అతడి నుండి ఎటువంటి జవాబు రాలేదని చక్రవర్తి చెప్పాడు.
“కోర్టులో కేసు వేస్తే తీర్పు రావటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. పైగా కోర్టు ఫీజుకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా లోక్ అదాలత్ లో దరఖాస్తు ఇద్దాం. పైసా ఖర్చు ఉండదు. తీర్పు కూడా త్వరగా వస్తుంది.” అంటూ సలహా ఇచ్చాడు చక్రవర్తి. కంప్యూటర్ మీద దరఖాస్తు తయారు చేయించి, చంద్ర మోహన్, రమ్యల సంతకాలు తీసుకొని మరుసటి రోజే లోక్ అదాలత్ న్యాయాధికారికి సమర్పించాడు చక్రవర్తి. దరఖాస్తును పరిశీలించిన న్యాయాధికారి అది సక్రమంగా ఉన్నందున జనార్ధన్ కు నోటీసు పంపిస్తూ లోక్ అదాలత్ బెంచి ముందు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలకనుగుణంగా జనార్ధన్ ముగ్గురు సభ్యులతో కూడిన లోక్ అదాలత్ బెంచి ఎదుట నిర్ణీత తేదీ నాడు హాజరయ్యాడు. తను ఇరవై సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నట్టు, కాబట్టి యాజమాన్య హక్కులు తనకు సంక్రమించినట్లు వాదన వినిపించాడు. వాదనతో పాటు కరెంటు బిల్లులు, నీటి పన్ను తనే కడుతున్నట్లు సాక్ష్యంగా సమర్పించాడు.
“జనార్ధన్, నీవు ఒక విషయం గమనించాలి, కరెంట్ బిల్లులు, నీటి పన్ను కట్టినంత మాత్రాన నీకు యాజమాన్య హక్కులు సంక్రమించవు. ఏ చట్టం కూడా ఆ విధంగా చెప్పలేదు. ఎన్నేళ్లయినా కేవలం కిరాయిదారుగా మాత్రమే ఉంటావు. నీవు ఇరవై ఏళ్లుగా ఉంటున్నావు, నీ కూతురు వివాహం చేశావు, ఎదిగిన కొడుకు ఉన్నాడు, నీ వ్యాపారం బాగానే వృద్ధి చెందిందనేది వాస్తవం. చంద్రమోహన్ అమాయకుడు. దంపతులిద్దరు చిల్లరకొట్టు నడుపుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ ఒకే ఒక్క గదిలో జీవితం వెళ్ళదీస్తున్నారు. ఇప్పటి పరిస్థితిలో కొంచెం విశాలమైన ఇంట్లో ఉండాలనుకోవటం నిస్సందేహంగా వారికున్న హక్కు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిపై వారికి సర్వాధికారాలు ఉంటాయి. చంద్రమోహన్ కోర్టులో కేసు వేస్తే నీవు ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని తీర్పు రావటమే కాకుండా అతడికి అయిన ఖర్చులన్నీ నువ్వే తిరిగి కట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఇద్దరికీ పైసా ఖర్చు ఉండదు. కావాలంటే ఖాళీ చెయ్యటానికి కొంత గడువు నీవు కోరటంలో తప్పేమి లేదు. ఒక గంట సమయం తర్వాత ఈ కేసును మళ్ళీ పిలుస్తాం. ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని చెప్పు ” అంటూ బెంచి లోని న్యాయాధికారి సలహా ఇచ్చాడు.
ఒక గంట తర్వాత కేసును పిలవటం జరిగింది. బెంచి లోని సభ్యులు జనార్ధన్ ను ఏమి నిర్ణయం తీసుకున్నావని ప్రశ్నించారు. “సార్, ఇల్లు ఖాళీ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాకపోతే ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు నాకు అందుబాటులో ఉండదు కదా. కనీసంగా ఒక మూడు నెలల గడువిస్తే ఈలోగా వేరొక ఇల్లు చూసుకుంటాను” జవాబిచ్చాడు జనార్ధన్.
చంద్రమోహన్, లాయర్ చక్రవర్తి కూడ జనార్ధన్ ప్రతిపాదించిన గడువుకు ఒప్పుకున్నారు. సమస్య సులువుగా పరిష్కారమైనందుకు లోక్ అదాలత్ న్యాయాధికారి, ఇతర సభ్యులు హర్షం వెలిబుచ్చారు. జనార్ధన్ మూడు నెలల్లోగా ఇంటిని ఖాళీ చేయాల్సిందని, అప్పటిదాకా ఒప్పుకున్న అద్దె చెల్లించాలని, కరెంటు, వాటర్ బిల్లులు చివరిదాకా చెల్లించాలని, ఇంటిని ప్రస్తుతమున్న స్థితిలో చంద్రమోహన్ దంపతులకు అందజేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చంద్రమోహన్ కోర్టు సహాయం కోరవచ్చని లోక్ అదాలత్ బెంచి తుది తీర్పు ఇచ్చింది. అదే విధంగా ఈ మూడు నెలలపాటు చంద్రమోహన్ దంపతులు జనార్ధన్ ను ఏ విధమైన అక్రమ పద్ధతుల్లో జబర్దస్తీగా ఖాళీ చేయించే ప్రయత్నం చేయరాదని కూడ నిబంధన విధించింది. ఆమోద యోగ్యమైన అంగీకారానికి సుముఖత తెలియజేసి సత్వర పరిష్కారానికి తోడ్పడినందుకు లోక్ అదాలత్ బెంచి అభినందనలు తెలియజేస్తూ, అశోక చక్రంలో ఉండే 24 ఆకులకు భావాలుగా భావించబడే వివేకం, నైతికత, న్యాయం ఇరు వర్గాల వారు పాటించి ధర్మాన్ని గెలిపించారని, ఇది ఎవరి గెలుపో, ఓటమో అని భావించ రాదని, చంద్రమోహన్, జనార్ధన్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ తీసుకోవాలని కోరుతూ తీర్పు ప్రతులు ఇరువురికి అందజేసింది.

**
చూస్తుండగానే మూడు నెలల గడువు ముగిసింది. జనార్దన్ ఇల్లు ఖాళీ చేసే రోజు రానే వచ్చింది. ఇన్నేళ్లుగా తమదిగా భావించిన కిరాయి ఇల్లును వదిలి మరో కిరాయి ఇంటికి వెళ్ళాల్సి వస్తున్నందుకు జనార్ధన్, అతని భార్య, కొడుకు ఏదో కోల్పోతున్న వారిలా దిగులుతో ఉన్నారు. సామాన్లు తీసుకుపోవటానికి లారీ వచ్చింది. కూలీలు సామాన్లను లారీ మీదకు ఎక్కించారు. హడావిడిని గమనించి చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని “ఇల్లు ఖాళీ చేస్తున్నారా జనార్ధన్ గారూ” అంటూ పలకరించారు. “ఏమి బతుకులో ఏమో, దేవుడు నోటీసు పంపిస్తే ఒళ్ళు ఖాళీ చెయ్యాలి, కోర్టు నోటీసు పంపిస్తే ఇల్లు ఖాళీ చెయ్యాల్సిందే, మనిషి బతుకే కిరాయి బతుకు” నిర్వేదంగా జనార్ధన్ అంటుండగా లారీ భారంగా కదిలింది మరో చోటుకు.

*****

September 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

చిన్నారి తల్లి

by కె. వీణారెడ్డి, September 20, 2023
written by కె. వీణారెడ్డి,


           ఎల్బీనగర్ లోని  ఓ మొబైల్ షాప్ నడుపుకుంటున్న,   చంద్రపురి కాలనీ అపార్ట్ మెంట్ లో వుంటున్న మహేశ్ మనసు మంటలై మండిపోతున్నది.. అంతకంతకూ అవమానభారంతో అతడి ఆంతర్యం ఉడికిపోతున్నది. తన ఫ్లాట్ కెదురుగా వున్న ఆ ఇంటి ఓనర్, గవర్నమెంట్ టీచర్ అయిన రామచంద్ర పైన ఆ కోపం ఉప్పెనలా పొంగిపొర్లుతున్నది. రెండు నెలలుగా తరచూ రాత్రిపూట తాను ఫ్రండ్స్ తో కూడి సరదాగా తన ఫ్లాట్ లో పేకాడుతున్న సంగతి తెలిసి అతడు అభ్యంతరం తెలిపినా తాను వినక ఆట కొనసాగించేసరికి,  ఆయన సోమ్మేదో పోయినట్టు పోలీసులకు సమాచారమిచ్చి తమనరెస్టుచేయించి అందరిలో అవమానంపాలు చేశాడు. కొంత పెనాలిటీతో మరికొంత రాజకీయ ప్రాబల్యంతో బయట పడగలిగాడు కానీ.. కాలనీలో మాత్రం అప్పట్నుండీ   చుట్టుపక్కలందరూ, తెలిసినవాళ్లింకొందరు తననదోలా చూడడం, అవహేళన చేయడం భరించలేకపోతున్నాడు. ‘మొగుడు కొట్టినప్పుడు లేని బాధ తోడికోడలు నవ్వినందుకు కలిగింది’ అన్నట్టుగా, మునుపు తాను పేకాడుతాడని వీళ్లకు తెలిసినా ఎవరూ పట్టించుకోలేదుగానీ.. పోలీసులరెస్టుచేయడంతో అందరికీ అలుసైపోయాడు తాను. చట్టాలు శాసనాలు రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఊదరగొట్టే ఆ రామచంద్రగాడివల్లనే ఇదంతా జరిగింది. ఏదో చేసి వాడిని కూడా జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడ్చేలా చేయాలి. వాడి కూతుర్నెత్తుకెళ్లి చంపిపారెయ్యాలి.
అంతకుమించి మరో శిక్ష లేదు వాడికి.. అనుకొంటూ
కసిగా పిడికిళ్లు బిగించాడు.
పదేళ్ల ఆ పిల్ల శ్రధ్ద తనకు బాగానే పరిచయం. తోటి పిల్లలతో కలిసి అంకుల్ అంకుల్ అంటూ తనతో కేరమ్స్, ఛెస్ ఆడడానికొచ్చేది. ఆన్ లైన్ క్లాసులప్పుడు ఫోన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెట్ రైట్ చేయించుకొని, థ్యాంక్స్ చెబుతూ “మంచి అంకుల్ మీరు” అంటూ వెళ్లేది. తానంటే ఆపిల్లకెంతో అభిమానం. ఏదో చెప్పి తనవెంట ఎక్కడికి రమ్మన్నా వస్తుంది. ఆ నిర్మానుష్య ప్రాంతానికి దాన్ని తీసుకెళ్లి, ఆపిల్ల గొంతునులిమి ఆ బ్రిడ్జ్ కింద పడేస్తే సరి.. అని.. ఆ ప్లేస్ కూడా  నిర్ణయించుకొని,  అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఆ ఇంటివైపే ఓ కన్నేసి వుంచాడు మహేశ్ . ఆ వారంలోనే ఆ సమయం రానే వచ్చింది. తల్లీ తండ్రీ ఏదో ఫంక్షన్ కు వెళ్లడం, స్కూల్ కి సెలవు కావడంతో ఆ అమ్మాయి శ్రధ్ధ ఒక్కతే ఇంట్లో వుండిపోవడం గమనించి, ఏవో మాయమాటలతో శ్రధ్దను తనవెంట తీసుకెళ్లడానికి వెంటనే ఆ ఇంటికి బయల్దేరాడు ప్రతీకారేచ్చతో మహేశ్ .
                    
     ఆ ఇంటి గేటు తీసుకుని లోపలికడుగు పెట్టబోయాడు మహేశ్ . అంతలోనే హటాత్తుగా, ఊహించని రీతిగా ”భౌ” అన్న పెద్ద శబ్దంతో మీదికి దూకబోయినట్టనిపించిన కుక్కను చూసి అదిరిపడి , గేటు చివరిమెట్టు తట్టుకొని బోక్కబోర్లా పడిపోవడం, చీరుకుపోయివున్న కుక్కగిన్నె అంచు బలంగా నుదుటికి తగిలి గాయమవడం క్షణంలో జరిగిపోయింది.
ఆ శబ్దానికి మెరుపులా బయటికి పరుగెత్తుకొచ్చిన శ్రధ్ద “అయ్యో అంకుల్ ” అంటూ వెంటనే అతడిని సమీపించించింది.
“అరెరె.. మీకు దెబ్బ తగిలింది.. రక్తం వస్తోంది” అంటూ తన అరచేత్తో ఆ రక్తాన్ని అదిమిపట్టి వుంచింది కాసేపు.
“ఇలా జరిగినందుకు సారీ అంకుల్ .. లోపలికి రండి” అంటూ అతడు లేవడానికి తన శాయశక్తులా సాయంచేసింది. అతడి చేతిని పట్టుకొంటూ లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చుండబెట్టింది.
వెట్ వైబ్ తో గాయాన్ని తుడిచి, ఫస్ట్ ఎయిడ్ చేస్తూ గాయానికి బాండేజ్ వేసింది. “అంకుల్.. ఇలాంటి అవసరాల కోసమే నాన్న ఎప్పుడూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నింట్లో వుంచుతాడు!” అని చెబుతూ, మంచినీళ్లందించింది. పాలు వేడిచేసి పసుపువేసి తీసుకొచ్చింది.”పసుపుపాలు మంచిదంట.. ఇన్ ఫెక్షన్ కానివ్వదంట..తాగండి!” అంటూ అతడి నోటికందించడంతో, నోట మాట రాక శిలాప్రతిమలా మారిపోయాడు మహేశ్ . మరుక్షణం ఒక అనిర్వచనీయభావంతో ఆ చిన్నారి వైపు చూశాడు.
“అంకుల్ .. కాంపౌండ్ లో కుక్క వుందని మీకు తెలీదు కదూ? మా ఫ్రెండ్ వాళ్లు ఊరెళ్లిపోతూ, మాకు బాగా అలవాటుందని రెండ్రోజులకోసం మా ఇంట్లోనే ఒదిలి వెళ్లారు. సో సారీ అంకుల్  ప్లీజ్ ఎక్స్ క్యూజ్ మి” అంటూ అపాలజీగా తన చేతులు పట్టుకొన్న శ్రధ్దను చూస్తూ చలించిపోయిన మహేశ్ కళ్లలో నీళ్లు ధారకట్టాయి.
“దెబ్బ బాగా నొప్పిగా వుందా? రేపటికల్లా తగ్గిపోతుంది లెండి.. ఏడవకండి అంకుల్ !” అంటూ పువ్వంటి తన చేతి స్పర్శతో ఆ గాయాన్ని సున్నితంగా తడిమింది శ్రధ్ద.
అమాయకమైన ఆ బాలిక స్వఛ్చమైన ప్రేమకు  పూర్తిగా కదిలిపోయిందతడి హృదయం.
అమ్మలా ఆరిందాలా ఆప్యాయత పంచుతూ, తన చిన్న చిన్న చేతులతో ఓడాక్టర్ లా ఓ నర్స్ లా తనకు సేవలందించిన ఆ బాలిక శ్రధ్దకు ముగ్ధుడైపోయిన మహేశ్ అణువణువునా  పశ్చాత్తాపం చోటుచేసుకొంది.
కాటేయవచ్చిన పాముకే పాలుపోసి ఆదరించిన ఆ పసితత్వంముందు పశుత్వం తలవంచింది.
‘ఇంత చిన్న అమ్మాయితనంలో సైతం అధ్బుతమైన అమ్మతనాన్ని ఆస్వాదించగలిగాను. పగ ప్రతీకారాలతో అమ్మాయినే కాదు అమ్మాయిలోని అమ్మనే అంతం చేయబోయిన దుర్మార్గుణ్ణి తల్లీ నేను! నీ పసితనపు అమాయకత్వంతో, ఆ అమాయకపు అమృతత్వంతో నాలోని విషపు భావాలను హరించివేశావమ్మా.. నాకే కాదు నాలాంటి ఎందరికో నీ అమ్మతనంలోని కమ్మదనాన్ని చవి చూపించి కల్మషాలెన్నో కడిగేయడానికై నిండు నూరేళ్లు  జీవించు చిన్నారితల్లీ!’                                                    అని మనసులోనే దీవిస్తూ, శ్రధ్ద తలనిమిరాడు. ఆపై “నన్ను మన్నించు తల్లీ” అన్న మనో భావనతో ఆ పదేళ్ల అమ్మాయి పాదాలపై తన శిరసునుంచి మౌనంగా క్షమాభిక్ష వేడుకున్నాడు.
“అయ్యో అంకుల్ మీరు నాకన్నా పెద్దవారు. అలా చేయకూడదు” అంటూ తనను వాటేసుకున్న శ్రధ్దను పదిలంగా, పవిత్రంగా, ప్రాణంగా పట్టుకొని ఆ చిన్నారితల్లిని గుండెలకు హత్తుకొని కన్నీటితో అభిషేకించాడు.
‘పదేళ్ల పాపలో కూడా వందేళ్ల సంస్కారాన్ని నింపి మరీ పెంచిన మీ మహోన్నత వ్యక్తిత్వానికి వేనవేల జోహార్లు రామచంద్రగారూ!’ అనుకొంటూ అతడికి అజ్ఞాత వందనాలర్పిస్తూ ఆ ఇంటి నుండి వెనుదిరిగాడు మహేశ్ .
                    *
                                             కె.వీణారెడ్డి.

September 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us