మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంట‌ర్వ్యూలు

గ్రంథాలయం పెట్టాలనుకోవడంలో నా కష్టాలే నాకు స్ఫూర్తి.

by Aruna Dhulipala January 30, 2024
written by Aruna Dhulipala

డా. కూరెళ్ళ విఠలాచార్య

పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త కూరెళ్ళ విఠలాచార్య గారితో మయూఖ ముఖాముఖి…                                   

అభినవ పోతన, మధురకవి, ఎల్లంకి వేమన్న, నల్లగొండ కాళోజీ, అక్షర సామ్రాట్ బిరుదాంకితులు సుప్రసిద్ధ కవి, రచయిత, సామాజిక వేత్త , భారత ప్రధానమంత్రి మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి నోట “మన్ కీ బాత్” రేడియో ప్రోగ్రాంలో ప్రశంసించబడి, జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్రంథాలయ వ్యవస్థాపకులు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారి జీవిత విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. – అరుణ ధూళిపాళ

నమస్కారం సార్. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం మా భాగ్యం. మా పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయడం మహదవకాశంగా భావిస్తున్నాను.

1. మీ జననం, పుట్టిన ఊరు, తల్లిదండ్రులు, బాల్యం గురించి చెప్పండి.
జ:  అమ్మా! నమస్కారం. నేను జూలై 9, 1938 లో నీర్నేముల గ్రామంలో జన్మించాను. మా అమ్మగారి పేరు కూరెళ్ళ లక్ష్మమ్మ, నాన్నగారు కూరెళ్ళ వేంకటరాజయ్య. అప్పటి కాలంలో  అన్నీ బాల్య వివాహాలు కావడం వల్ల మా అమ్మ గారికి 15 ఏళ్ళ వయస్సు వున్నప్పుడు నేను పుట్టాను.  దురదృష్టవశాత్తు నేను అయిదు నెలల పసివానిగా ఉన్న సమయంలో మా నాన్నగారు మరణించారు. మా చిన్న పెద్దనాయన గారు నన్ను ఎత్తుకొని మా నాన్న చితిని ముట్టిస్తుంటే జనమంతా ఏడ్చారట. అప్పటినుండీ నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వెల్లంకిలో మా పెదనాన్నలెవ్వరూ మమ్మల్ని చేరదీయలేదు. మా మాతామహులు మమ్మల్ని నీర్నేములకు తీసుకుపోయినారు. మా అమ్మమ్మకు నేనంటే అమితమైన ప్రాణం. ఒక్క క్షణం నేను కనబడకపోతే ఆమె ప్రాణం విలవిలలాడేది.   దానికి ఒక ఉదాహరణ చెబుతాను. మా అమ్మగారితో పాటు నేను బంధువుల ఇంటికి ఎప్పుడైనా వెళ్లాల్సి వస్తే నా పాదాలను జాజులో ముంచి, గోడకు ముద్రించి వాటిని చూస్తూ నేను తిరిగి వచ్చేవరకు గడిపేది. అంతటి ప్రేమమూర్తి ఆమె. ఆ సందర్భాన్ని తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి నాకు ( కన్నీటి పర్యంతమవుతూ). అందుకే వీళ్ళ ఋణం తీర్చుకోవడానికి మా అమ్మమ్మ పేర , తాతయ్య గారి పేర ఏటా బేతోజు లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ పురస్కారాన్ని ఇస్తున్నాను. 7వ తరగతిలో తెలుగు భాషలో ప్రథమశ్రేణి వచ్చినవారికి మాత్రం వాళ్ళు ఫెయిల్ అయినాసరే ఈ పురస్కారాన్ని ఇస్తున్నాను.

కూరెళ్ళ విఠలాచార్య గారితో ముఖాముఖి గ్రహీత శ్రీమతి అరుణధూళిపాల

2. బాల్యమంతా ఇంత కష్టాన్ని ఎదుర్కొన్న  మీ విద్యాభ్యాసం ఎలా గడిచింది?
జ:   నేను పుట్టింది 1938లో అయినా విద్యాభ్యాసం మటుకు 1945 లో జరిగింది. ఆ కాలంలో ఊళ్ళల్లో ముస్లింలు చదువు చెప్పేవారు. మసూల్ దార్ సాహెబ్ నీర్నేములలో, వెల్లంకిలో షేక్ అహ్మద్, సిరిపురంలో గాలిబ్ సాబ్, రామన్నపేటలో గులాం రసూల్ అని టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్లకు భాష రాకపోయినా ఏదో నేర్చుకొని చెప్పేవారు. అప్పుడు పాఠశాలలు లేవు. విచిత్రం ఏమిటంటే మసూల్ దార్ సాహెబ్ నాకు పీర్ల కొట్టంలో అక్షరాభ్యాసం చేయించారు. మా అమ్మతో పాటు తిరగాల్సి రావడం వలన నాది వానాకాలం చదువయ్యింది. ఆ పరంపరలో నీర్నేముల, ముని పంపుల, వెలివర్తి, వెల్లంకి ఇలా రకరకాల ఊళ్ళల్లో నా చదువు సాగింది. ఆ తర్వాత 1950 నుండి రామన్నపేటలో నాల్గవ తరగతి నుండి ఒక క్రమపద్ధతిలో నా చదువు కొనసాగింది. అక్కడ ప్రాథమిక పాఠశాలలో కోటిచింతల పురుషోత్తమం గారని పాఠశాల హెడ్ మాస్టర్ వయసు ఎక్కువవుతుందని రికార్డులలో జననం 1940 గా రాయించారు. నీర్నేముల నుండి సద్దిగట్టుకొని రామన్నపేటకు పోయి చదువుకునేది. ఆ కాలంలో కుల వ్యవస్థ కూడా గట్టిగా ఉండేది. అంగీ తగిలినా, సద్దులున్న గోడ తగిలినా సద్దులు పారేసేవాళ్ళు. అట్లా ఏడవతరగతి వరకు అక్కడ చదివాను. ఆ తర్వాత నాకు చదువుకోవడానికి అవకాశాలు తక్కువ ఉండడంవల్ల భువనగిరిలో  విశ్వకర్మ హాస్టల్ నిర్వాహకుల పిలుపు మేరకు మా మేనమామ నన్ను అక్కడ చేర్పించాడు.  నిర్వాహకులు ఒక బజారు చూపించి అక్కడ విశ్వకర్మల ఇళ్లల్లో భిక్ష పైసలుగానీ, బియ్యం గానీ తెమ్మని ఆదేశించారు. అదే ప్రకారం వెళ్లి తెచ్చి రూములో వండుకొని తినేవాళ్ళం. చదువు కోసం వారేది చెబితే అది చేశాము. 1954 జూన్ నుండి 1957 వరకు 8,9,10 తరగతులు అక్కడే చదువుకున్నాను. ఆదిరాజు వీరభద్రరావు గారి అల్లుడు ఆంజనేయ శాస్త్రి గారు నాకు గురువు. ఆయన పాఠశాలకు రాని రోజు నన్ను పాఠం చెప్పుమనేవారు. అందువల్ల చిన్నతనం నుండే నాకు తెలుగు భాష పట్ల కొంత పట్టు ఏర్పడింది. ఆయన నేను బాగా చదువుతానని హైద్రాబాదుకు తీసుకువెళ్లి వారాల భోజనం పెట్టిస్తాను చదువుకోమన్నారు. కానీ ఇక ఇంటింటికి తిరిగి భోజనం సంపాదించడం నావల్ల కాదని పదవతరగతి పూర్తవగానే ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాను.

3. మరి అప్పుడే ఉద్యోగం సంపాదించగలిగారా? మీ ఉద్యోగ ప్రస్థానం ఎలా కొనసాగింది?
జ.  1950 ఆ ప్రాంతంలో పదవతరగతి హాల్ టికెట్ చూపిస్తే ఉద్యోగం ఇచ్చేవారు. అలా రామన్నపేట తహశీల్ ఆఫీసులో తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి ఉండేవాడు. ఆయన “కాపీయిస్ట్ పోస్ట్ ఉంది.చేస్తావా?” అని అడిగారు.  ఏదైనా చేస్తానన్నాను. ఇంగ్లీషు రాయొచ్చా అని అడిగారు. రాస్తానన్నాను. 20 రూపాయలకు రెవెన్యూలో కాపీయిస్ట్ ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో కో ఆపరేటివ్ బ్యాంకులో సూపర్ వైజర్ గా వచ్చింది. దాంట్లో చేరాను. భువనగిరి కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర రైటర్ గా చేశాను. అప్పుడే సేల్స్ టాక్స్ లో ఉద్యోగం దొరికింది. ఒక దాని తర్వాత ఒకటి ఒక్క నిముషం కూడా ఖాళీ లేకుండా చేశాను. డబ్బులు వచ్చాయి. కానీ లంచాలు తీసుకోవడం, తినడం, తాగడం ఇవన్నీ నాకు నచ్చలేదు. అందుకే ఉద్యోగం విడిచిపెట్టి టీచరు ట్రైనింగ్ చేసి, 1959లో టీచరునయ్యాను. ఉపాధ్యాయ శిక్షణా కాలం నాలో కవితా వ్యాసంగానికి బలమైన పునాది వేసింది. నేను, మా అమ్మ ఎన్నో బాధలు పడి రెండుగదుల పెంకుటిల్లు వెల్లంకిలో కట్టుకున్నాం. ఆ ఒత్తిడిలో జిల్లా విద్యాధికారి కార్యాలయానికి ఆలస్యంగా వెళ్ళాను. అప్పటి నల్లగొండ జిల్లా విద్యాధికారి రామదాసుగారు దయార్ద్ర హృదయులు. “మహానుభావా! ఇప్పుడు వచ్చావా” అని ప్రేమతో మందలించి ఉద్యోగం ఇచ్చారు. ఆగస్టు 29 1959 నాడు రామన్నపేట తాలుకాలో మునిపంపుల గ్రామంలో సహాయోపాధ్యాయునిగా జాయినయ్యాను. అప్పటినుండి మొదలుకొని నాకు ‘గ్లకోమా’ వ్యాధి వల్ల కంటిచూపు చాలావరకు కోల్పోవడంతో నా ఉద్యోగ జీవితాన్ని 1993లో జూనియర్ లెక్చరర్ గా విరమించవలసి వచ్చింది. చేసినంతకాలం విద్యాలయాల, విద్యార్థుల అభివృద్ధికి శాయా శక్తులా కృషి చేశానన్న తృప్తి ఉంది.

4. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఫిల్ , పి హెచ్ డిలు ఎలా పూర్తి చేయగలిగారు?
జ: నేను పదవతరగతి వరకే క్లాస్ రూములో కూర్చొని చదవడం తప్ప ఎక్కడా తరగతులు వినలేదు. నాకు స్ఫూర్తి బి. ఎన్. శాస్త్రి గారు. ఆయన ఎమ్. ఏ చదువుతుంటే ఎన్ని కష్టాలు పడ్డాడో చూసినవాణ్ణి. నేనూ రవ్వా శ్రీహరి బాల్య స్నేహితులం. నాకంటే చిన్నవాడు. ఆయనకు చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఇద్దరమూ ‘మునిపంపు’ లో పెరిగిన వాళ్ళం. ఇద్దరమూ కలిసి ఆడుకున్నాం. ఉద్యోగం చేస్తూనే నేను ఎమ్ ఏ దాకా ప్రయివేటుగా చదువుకున్నాను. పి హెచ్ డి చేయాలనుకుంటున్నట్లు రవ్వా శ్రీహరితో అన్నాను. ఎమ్ ఏ లో కూడా సెకండ్ క్లాస్ లో పాసయ్యాను.  పాటిబండ మాధవశర్మ గారు నన్ను బాగా అభిమానించేవారు. సీటు గురించి రామరాజు గారిని అడగాలంటే అందరికీ భయం. ఆయన చాలా సహృదయులు. కాకపోతే కొంచెం కఠినంగా ఉంటారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లాలంటే భయం. రవ్వా శ్రీహరి గారిని అడిగితే “అమ్మో! నేను వెళ్ళను” అన్నారు (నవ్వుతూ). నేనే అడుగుదామని వెళ్ళాను. అప్పటికి ఒక హైస్కూలు హెడ్ మాష్టరును నేను. పదిన్నరకు ఇంటర్వ్యూ ఉంటే ఎనిమిది గంటలకే వెళ్ళి నమస్కరించి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. “ఎందుకొచ్చావ్? నీ నమస్కారాల సంగతి నాకు తెలుసు. ఇవాళ ఎంఫిల్ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా! అప్లై చేసి ఉంటావు. ఆ సీటు కొరకే వచ్చావు . అట్లా రావచ్చునా? పోనీ ఓ పని చెయ్యి. మొత్తం 12 సీట్లు ఉన్నాయి. నీకిస్తాను పంచిపెట్టుకో ” అని కోప్పడ్డారు. ఏమీ మాట్లాడకుండా తిరిగి వస్తుంటే  “మాస్టారూ ఇలా రండి” అన్నారు. నా సంస్కారం ఆయన మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. “నువ్వు హైస్కూలు హెడ్ మాస్టర్ వి. వయసులో పెద్ద. రీసెర్చ్ చేసి ఏం సాధిస్తావు?”  అన్నారు. చేద్దామనే కోరిక ఉంది సార్! మీరు అనుగ్రహిస్తే చేస్తాను అన్నాను. ‘ఏమైనా రాశావా?’ అప్పటికే దాదాపు రకరకాల ప్రక్రియల మీద నేను వ్యాసాలు రాశాను. సూట్ కేస్ నిండా తీసుకువెళ్ళాను కూడా.  “వంద దాకా రాశాను సార్! చూస్తారా?” అన్నాను. వద్దన్నారు. ముందు ఎంత కోప్పడ్డారో అంత అనుగ్రహం చూపారు. ఆయన నాకు చాలా ఇష్టమైన గురువు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1977లో మొట్టమొదటగా ఏర్పడ్డ ఎంఫిల్ పరిశోధకుల్లో నేను ఒకడిని కావడం గర్వకారణం. రవ్వా శ్రీహరి ప్రోత్సాహం, పూజ్య గురువర్యులు బిరుదురాజు రామరాజు గారి బలమైన ఆశీస్సులు నన్ను పరిశోధనారంగంలో ప్రవేశించేటట్టు చేశాయి.

5. ఎంఫిల్ అంశంగా తీసుకున్న “తెలుగులో గొలుసు కట్టు నవలలు” నవలా ప్రక్రియను, మీ అనుభవాలను తెలపండి.
జ :  అప్పటి తెలుగు శాఖా అధ్యక్షులు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు అప్పటివరకు విమర్శకులు ఎవరూ స్పృశించని వినూత్నమైన, విచిత్రమైన నా పరిశోధనాంశం “తెలుగులో గొలుసుకట్టు నవలలు” అనే దాన్ని పరిశీలించి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో రామరాజుగారు,  నారాయణరెడ్డి గారు, నాయని కృష్ణకుమారి గారు, కులశేఖర్ రావు గారు, జి.వి. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. “అందులో సాహిత్యమే లేదు. అదెలా చేస్తావన్నారు?” అన్నారు. అందుకే చేస్తానన్నాను ( నవ్వుతూ). వారి ప్రశ్నలకు తగినరీతిలో సమాధానాలు చెప్పి వారిని సంతృప్తి పరిచాను. మామూలుగా అయితే ఒక పుస్తకాన్ని ఒకరు రాస్తారు. గొలుసు కట్టు నవల అంటే ఇందులో అనేకమంది రాస్తారు. ఒక రచయిత కథ ప్రారంభం చేస్తాడు. మరొకరు దాన్ని కొనసాగిస్తారు. కథలోని కథా నాయకుడిని ఒకరు సృష్టిస్తే, మరొకరు మిగిలిన కథను రాస్తారు. కథను అనుకూలంగా మార్చడం, ప్రతికూలంగా మార్చడం ఎవరి వారి ఇష్టం. సృష్టించిన కథానాయకుని గొప్పగా చూపించొచ్చు. లేదా చంపవచ్చు. అట్లా ఆనాడు 24 మంది రచయితలు, రచయిత్రులు రాసిన “ముద్దు దిద్దిన కాపురం” నవలను వారికి విడమరిచి చెప్పాను. ‘హాస్యప్రభ’ పత్రికలో సీరియల్ గా వస్తుండేది. రాంబాబు అనే ఆయన వేసేవాడు. మొత్తానికి ఆ టాపిక్ లో చేయడానికి నాకు అనుమతి లభించింది. కానీ దాంట్లో ఏమీ లేదని గైడుగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. మహానుభావుడు ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఒప్పుకున్నారు. ” నేను గురువును కాదు నీవు శిష్యుడవు కావు ఇద్దరం మిత్రులం” అనేవారు. ఇద్దరం చేతులు పట్టుకొని ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. పాతపుస్తకాల్లో ఏమైనా దొరుకుతుందేమోనని వెతికేవాళ్ళం. మద్రాసు, తిరుపతి, విజయవాడ, భీమవరం ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. “గొలుసుకట్టు నవల” రచయితలలో పాలగుమ్మి పద్మరాజు, శ్రీ శ్రీ , ఆనందారామం, తురగా జానకీరాణి, నాయని కృష్ణకుమారి, రావూరి భరద్వాజ, కొడవటిగంటి, ఆరుద్ర , పురాణం సుబ్రహ్మణ్య శర్మ , మధురాంతకం రాజారాం, రంగనాయకమ్మ , మాదిరెడ్డి సులోచన లాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేశాను. రంగనాయకమ్మ గారు, ఆరుద్ర గారు లేఖాముఖంగా పంపించారు. వీళ్ళందరి సమాధానాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాలతో విలక్షణమైన నా పరిశోధనలో నవలా వ్యాసంగాన్ని పూర్తిచేశాను.  250 పేజీల సాహిత్యాన్ని సృష్టించాను. ఇప్పుడు 40 మంది, 60 మంది రాసినవి కూడా వస్తున్నాయి. 1980 లో నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నాకు ఎంఫిల్ పట్టా లభించింది. తెలుగు పరిశోధనారంగంలో నా సిద్ధాంతగ్రంథం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే రవీంద్ర భారతిలో జరిగిన ‘గొలుసు కట్టు నవల’ ఆవిష్కారానికి నన్ను పిలిచి సన్మానం చేశారు.

6. పి హెచ్ డి అంశంగా “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” మీద తీసుకున్న నవలలేవి?
జ:  ఎంఫిల్ పూర్తయిన వెంటనే పిహెచ్ డి సీటు సులభంగానే దొరికింది. రామరాజు గారికి, నారాయణ రెడ్డి గారికి చేస్తాడన్న నమ్మకమూ కుదిరింది. నాకు ఎంఫిల్ పర్యవేక్షకులైన ఇరివెంటి కృష్ణమూర్తి గారు  వెంటనే పి హెచ్ డి చేయమని సలహా ఇస్తూ “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” అనే పరిశోధనాంశాన్ని సూచించారు. దాన్ని రామరాజు గారు 1947 వరకు అని సవరించారు. చారిత్రక నవలా చక్రవర్తి డా. ముదిగొండ శివప్రసాద్ పర్యవేక్షణలో నా పరిశోధన సాగింది. దీనికోసం క్షేత్ర పర్యటన చాలానే చేశాను. 1947కు పూర్వం వచ్చిన నవలలు, నవలలు కావు కావ్యాలు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి “మాలపల్లి” వేలూరి శివరామశాస్త్రి గారి ‘ఓబయ్య’, విశ్వనాథ వారి  ‘వేయి పడగలు’, అడవి బాపిరాజుగారి ‘నారాయణరావు’, ‘కోనంగి’, వాశిష్ఠ గణపతి ముని గారి   ‘పూర్ణ’, తల్లాప్రగడ సూర్యనారాయణ గారి ‘హేలావతి’, కేతవరపు వేంకటశాస్త్రి గారి ‘లక్ష్మీ ప్రసాదం’, వేంకట పార్వతీశ్వర కవుల ‘మాతృ మందిరం’, బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’.. ఈ పది నవలలు తీసుకున్నాను.  1947 వరకు ఈ నవలలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? ఈ సాహిత్యం ఉద్యమానికి, ఉద్యమం సాహిత్యానికి ఎట్లా ఉపయోగపడింది ఇందులో వివరించాను. ఈ పరిశోధన కారణంగా  జాతీయోద్యమంలో పాల్గొన్న మహనీయులను ఎంతోమందిని దర్శించుకునే భాగ్యం కలిగింది. దీనికి  “Best Informative Thesis” అని పేరు వచ్చింది. చాలా కష్టపడి వడబోసి తయారుచేసిన సిద్ధాంతగ్రంథం. సరి చేయడానికి ఏమీ లేకుండె. శివప్రసాద్ నాకంటే చిన్నవాడు. అందుకే “మొత్తం పూర్తయ్యాక సంతకం కోసమే నా దగ్గరకు రండి” అన్నాడు. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి గారిని, రావి నారాయణరెడ్డి గారిని, ఎన్. జి రంగాగారిని, గడియారం రామకృష్ణ శర్మ లాంటి ఎందరినో ఇంటర్వ్యూ చేసి సమాచారం సేకరించాను. నిజానికి చెప్పాలంటే ఆ కాలంలో వచ్చిన నవలలు చాలా తక్కువే కానీ నవలా సాహిత్యానికి అది స్వర్ణయుగం. నవలాకారులందరూ మహనీయులు. స్వాతంత్ర్యోద్యమ నుండి ప్రభావితులైనవారు. వారి హృదయం నుండి జాలువారిన ఈ రచనలు జాతిని ఉత్తేజపరిచాయి. ముందుకు నడిపించాయి.

7. సంస్కృత భాష పట్ల మీకు ఆసక్తిని కలిగించినదెవరు?
జ:  మొదటి నుండీ నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఉండేది. అయినా సరియైన పరిస్థితులు, వాతావరణం లేక సంస్కృతంలో అనుకున్నంత ప్రావీణ్యం సంపాదించుకోలేకపోయాను. అప్పుడు ఎనిమిదవ తరగతిలో సంస్కృతం ఆప్షనల్ గా ఉండేది. భువనగిరి హైస్కూలులో, సూర్యాపేటలో మొట్టమొదటగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. దానికోసమే నేను భువనగిరి హైస్కూలులో చేరాను. కోవెల సంపత్కుమారాచార్య గారు ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ. మొదటి స్టూడెంటును నేనే. అప్పలాచార్యులు గారు, సంపత్కుమారాచార్య గారు సంస్కృత గురువులు నాకు. నా విషయంలో సంస్కృతం వచ్చు అని చెప్పడం ఎంత అబద్ధమో, రాదని చెప్పడం కూడా అంతే అబద్ధం ( నవ్వుతూ ). ఆ గురువులిద్దరి మూలంగా సంస్కృతం మీద పట్టు ఏర్పడింది.

8. మీ పద్య పఠన పద్ధతికి ఉత్పల సత్యనారాయణాచారి గారి ప్రభావం ఉందంటారు. అది ఎలాగో వివరిస్తారా?
జ : 1958లో నేను మేడ్చల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఉత్పల సత్యనారాయణాచార్యగారు అతిథిగా వచ్చారు. బహుభాషా కవిసమ్మేళనం జరిగింది. తెలుగు భాషకు సంబంధించి ఆయన వచ్చారు. నేను ఆ సభలో ఆయన మీద ఆశువుగా పద్యం ఆయానలాగే చదివాను. ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటినుండీ “మరో ఉత్పల” అనే పేరు వచ్చింది. ఉత్పలగారు చనిపోయే చివరి దశలో మంచం మీద ఉన్నప్పుడు నేనొక పద్యం కార్డు మీద రాసి పంపించాను. ” కమ్మని తేట తెల్గు నుడికారము కల్గిన పద్యమొక్కటిన్, ఇమ్ముగ కోరుకున్న మనకిమ్మహనీయుడొసంగు గొప్ప భాగ్యమ్మున గల్గె ఉత్పల మహాకవి తెల్గునాడులో తమ్ములు రండి రండి కవితామూర్తిని కొలువగా వలెన్” అని పంపాను. ఆయన సంతోషపడి నా మీద మూడు పద్యాలు రాసి పంపించారు.

9. కూరెళ్ళ గ్రంథాలయ స్థాపనకు దోహదం చేసిన పరిస్థితులేవి?
జ: గ్రంథాలయం పెట్టాలనుకోవడంలో నా కష్టాలే నాకు స్ఫూర్తి. నేను చదువుకునేటప్పుడు పుస్తకాలు కొని చదువుకునేంత స్తోమత నాకు లేదు. పుస్తకాలు ఉన్నవాళ్ళ దగ్గర వారు రాత్రి చదువుకోవడం పూర్తయిన తర్వాత పుస్తకాలు అడిగి తీసుకొని రాత్రంతా చదువుకొని ఉదయం నాలుగు గంటలకే వాళ్లకు అప్పగించే ఒప్పందంతో తెచ్చుకునేవాడిని. ఇలాంటి నా కష్టాలు తరువాతి యువతరానికి రావొద్దని లైబ్రరీ పెట్టాను. అది చాలలేదు. 1954 లో వెల్లంకిలో శంభు లింగేశ్వర గ్రంథాలయం అని చిన్న లైబ్రరీ పెట్టాను. నాకు పెద్దలు ఎవరూ సహకరించలేదు. 1962 లో నేను మాఊరికి ప్రధానోపాధ్యాయునిగా వచ్చాను. మా  తల్లిదండ్రుల పేరుతో లక్ష్మీ వెంకట రాజయ్య గ్రంథాలయం పెట్టాను. ప్రముఖ నాటక రచయిత ఆకెళ్ల నర్సింహమూర్తి గారు ప్రారంభించారు. 1993లో తెలుగు ఉపన్యాసకునిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. గ్రంథాలయ స్థాపన నా మనసులోంచి పోలేదు. ఎలాగైనా ఈ మారు మూలలో మహా గ్రంథాలయం పెట్టాలని గట్టి నిర్ణయం చేసుకున్నాను. అందుకే నా ఇంటినే దీనికోసం ఇచ్చాను. పెద్దలు దీనికి “కూరెళ్ళ గ్రంథాలయం” అని నామకరణం చేశారు. నా సొంత ఐదువేల పుస్తకాలతో ఫిబ్రవరి 13, 2014 లో ప్రారంభమైంది. ఇప్పుడు సుమారు రెండు లక్షల గ్రంథాలతో పెద్ద లైబ్రరీ అయింది. మా పిల్లలు, లైబ్రేరియన్ సహకరిస్తున్నారు. శిష్యులు, స్నేహితులు చాలామంది ఉండడం వల్ల సాహితీప్రియులు ఎంతోమంది పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. ద్వానా శాస్త్రి గారు తన లైబ్రరీలోని మొత్తం పుస్తకాలను ఇచ్చారు. కోడూరు పుల్లారెడ్డి గారు కూడా వేల పుస్తకాలు ఇచ్చారు. భగవంతుని అనుగ్రహం వల్ల ఎంతోమంది ముందుకు వచ్చారు. తెలియని వాళ్ళు కూడా ఈ అడ్రెస్ తెలుసుకొని మరీ వచ్చి వందలాది పుస్తకాలు ఇవ్వడం నా అదృష్టం. వారందరి సహకారం వల్లనే ఎంతో గొప్ప సాహిత్యాన్ని ఇందులో సమకూర్చగలిగాను. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, వేదాలు, పరిశోధన, చరిత్ర, పద్య గద్య ఇలా అన్ని విభాగాల్లో ప్రక్రియల్లో పుస్తకాలున్నాయి. ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. తలచుకుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ని చేయగలిగానా అని.

10. మీ గ్రంథాలయం గురించి 2021 వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” లో ప్రశంసింపబడడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
జ : అది నా జీవితానికి గొప్ప వరం. పల్లెటూళ్ళని వదిలి చాలామంది నగరానికి వెళ్లి పోతున్నారు. అందరూ మళ్లీ పల్లెబాట పట్టాలని గ్రంథాలయం నెలకొల్పాను. నా కోరిక తీరి ఎంతోమంది సద్దులు కట్టుకొని మరీ వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు నా విషయం ప్రధానమంత్రి వరకు ఎలా వెళ్లిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయన “మన్ కీ బాత్” లో నన్ను , నా లైబ్రరీని ప్రశంసించారు.

ఈ ప్రభావం వల్ల అస్సామ్ విశ్వవిద్యాలయం నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి సందర్శకులు వచ్చారు. అమెరికా లోని ‘తానా’ వారు స్వరమీడియా వారు నాతో ఇంటర్వ్యూలు జరిపారు. అస్సాం యూనివర్శిటీ ప్రొఫెసర్ నారాయణ మూర్తి గారు ఎన్నో ఇంగ్లీషు పుస్తకాలు పంపించారు. నిన్న కూడా హయత్ నగర్ నుండి సర్వేపల్లి సుందరం అని ఒక వ్యక్తి వచ్చి ఆయన రాసిన పుస్తకాలు ఇచ్చి వెళ్లారు. అలా ఎంతోమంది సహకరిస్తున్నారు. నా శ్రమకు ప్రధానిగారు ఊపిరి పోశారు. మోదీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఆయన వల్ల నాకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. రాష్ట్రపతి నుండి పోయిన ఏప్రిల్ 2023లో ఆహ్వానం వచ్చింది. నాలుగు రోజులు అక్కడే ఉన్నాను. అక్కడ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ కర్ గారి చేత సన్మానం అందుకున్నాను. మాకు మూడు రోజులు వసతి కల్పించి అక్కడి విశేషమైన ప్రాంతాలను చూపించారు. పెద్ద సభ కూడా జరిగింది. ఈ నెలలో కూడా గణతంత్ర దినోత్సవాలకు రమ్మని ఆహ్వానం వచ్చింది. ఆరోగ్యం బాగా లేకపోవడం, అధికమైన చలి కారణంగా రాలేనని చెప్పాను.

11. దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన జనగామ రైలు ప్రమాదం గురించి మీరు రాసిన “అధికవృష్టి” పద్యాలను గూర్చి తెలపండి
జ : ఇది 1954లో జరిగింది. అప్పుడు కురిసిన అధికమైన వర్షాలకు “వసంతవాగు” పొంగుతుండడం వల్ల రైలు పట్టాలు తప్పింది. అప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నాను. ఆ దుర్ఘటనకు కదిలిపోయి నేను రాసుకున్న పద్యాలే మొట్టమొదటగా అచ్చులో చూసుకున్న పద్యాలు.
ఉరుములు మెరుపులు నొకసారె ఉద్భవించె
గాలి సుడిగాలి మేఘముల్ గప్పుకొనియె
సరవి ధారగ వర్షంబు కురియుచుండె
అల్ల తెలగాణ రఘునాథ పల్లియందు!
అధిక వర్షంబుచే నంత నయ్యె గాదె
మృత్యుదేవత ఆనాడు నృత్యమాడె
ఇట్టివెప్పుడు రాకుండ నెల్ల వేళ
మనల వేలుపు గాపాడి మనుచు గాత!
ఇలా రాశాను. ఆ పద్యాలు చూసి మా మాస్టార్లు ఆశ్చర్యపోయారు. కోవెల సంపత్కుమారాచార్య గారు “నీకు పద్యం మీద మంచి పట్టు ఉంది” అని ప్రశంసించారు.  స్కూల్ వార్షిక సంచిక  ‘ఉదయ’ లో కూడా వేశారు. ఆనాటి నుండి నా మిత్రులు తమాషాగా ‘పోతన’ అని పిలిచేవారు.

12. “వెల్లంకి వెలుగు” పేర రాసిన ఎల్లంకి గ్రామ వైభవం ఎటువంటిది?
జ: “వెల్లంకి వెలుగు” నా పల్లెతో నాకున్న అనుబంధాన్ని, గురించి రాసుకున్నది. చాలా చిన్న పుస్తకం. ఆ ఊరుకు ఆ పేరు ఎట్లా వచ్చింది మొదలుకొని నాకు తెలిసినంతవరకు ఆ గ్రామాన్ని గురించి ఆనోటా ఈ నోటా విన్న విషయాలు రాసుకున్నాను. నేను పుట్టింది పెరిగింది పల్లెటూరే. ఇప్పటికీ పల్లెటూళ్ళోనే ఉన్నాను. నా కార్యక్రమాలన్నిటికీ ప్రధాన భూమిక పల్లెటూరు. అందుకే “విఠ్ఠలేశ్వర శతకం” లో పల్లెను దేవతగా భావిస్తూ..
పల్లియలోనె పుట్టితిని పల్లియయే నను పెంచె
ఇల్లును వాకిలిన్ కలిమినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టె
పల్లియె ‘అమ్మ’ ఆవనుచు’పల్కులు పల్కగ నేరిపించె నా
పల్లియె నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠ్ఠలేశ్వరా!

13. వేమన శతకంతో సమానమని పలువురి ప్రశంసలు అందుకున్న మీ “విఠ్ఠలేశ్వర శతకము” గూర్చి చెప్పండి.
జ : 1991 ఆగస్టు 1న మా ఇంటి గేదెకు వైద్యం చేస్తుండగా అది ఎగిరి నా మీద పడడం వల్ల జరిగిన ప్రమాదంలో నా ఎడమ కాలు విరిగింది. అంతకుముందే నాకు నాలుగు ఆపరేషన్లు జరిగాయి. నేత్ర వ్యాధి ‘గ్లకోమా’ వల్ల కంటి చూపు చాలావరకు తగ్గిపోయింది. ఈ దుర్భర పరిస్థితుల్లో బాధతో అలవోకగా నా గుండె లోంచి ఒక పద్యం వచ్చింది.
“పుట్టుకతోనె కొందరికి పుట్టెడు దుఃఖము వెంటవచ్చు, ఎ
ప్పట్టున నైన కొందరికి పట్టినదెల్ల పసిండియే యగున్
తిట్టు వరంబు కొందరికి దీవెన కొందరి పట్ల తిట్టగున్
ఎట్టెట్టు స్వామి నీ నటన ఎంత విచిత్రము విఠ్ఠలేశ్వరా!”
అలా వరుసగా పద్యాలు రాసుకుంటూ పోయాను. నన్ను పలకరించడానికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, రసజ్ఞులకు వినిపించేవాణ్ణి. అందరూ అభినందించారు. మకుటం బాగుందన్నారు. మా అమ్మగారు నాకు మా నాన్నగారు విఠలేశ్వరుని భక్తులని అందుకే ఆ స్వామి పేరు మీదనే నాకు పేరు పెట్టారని చెప్పారు. అందుకే మా నాన్నగారి ఆకాంక్ష వల్లే ఇది ఉద్భవించిందేమో. నా ఆత్మ వేదనే అయినా ఆ విఠలేశ్వరుని అనుగ్రహంతోనే మంచం మీద ఉన్న మూడు నెలల్లో శతకం పూర్తి చేయగలిగాను. వివిధ సేవా కార్యక్రమాల కారణంగా పుస్తకరూపం చేయాలన్న ఆలోచన రాలేదు. ప్రింట్ కాకపోయినా జనుల నోళ్ళల్లో నానుతుండేవి. నాకు అరవై ఏళ్లు నిండిన తర్వాత 2000 సంవత్సరంలో ఇది రామరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. శతక సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సాధించుకుంది. తెలంగాణ సాహిత్య అకాడెమీ వారు దీనిలోని కొన్ని పద్యాలను హిందీ, ఇంగ్లీషు లోనికి అనువాదం చేయించారు. ఇందులో సమాజంలోని రకరకాల విషయాల పట్ల కలిగిన వేదనతో రాసిన పద్యాలున్నాయి. దీని రెండవ ముద్రణ గవర్నర్ గారిచే ఆవిష్కృతం కానుంది.

14. “శిల్పాచార్యులు” కావ్యం రాయడానికి ప్రేరణ ఎవరు?
జ : నా ఎనిమిదవ ఏట నుండి భువనగిరిలో నా  చదువు కొనసాగింది. అక్కడే నా కవిత్వం మొగ్గ తొడిగింది. ఎంతోమంది సహృదయులు మిత్రులయ్యారు. ఇక్కడ నేనొక ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ కవిగా ప్రధానాచార్యుల, ఆచార్యుల పండితుల మన్ననలు పొందాను. అందుకే భువనగిరి కోటను నా హృదయంలో ముద్రించుకున్నాను. ఆ ఋణం కొంతైనా తీర్చుకుందామన్న ఆశయంతో ఈ పట్టణానికి, పట్టణ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రఖ్యాత త్యాగమూర్తులను కొందరిని, ప్రసిద్ధ స్థలాలను కొన్నింటిని తలచుకుంటూ ఆ స్మృతులతో ఈ కావ్యం ద్వారా వారిని మనసారా స్మరించుకుంటున్నాను.
ఆరుట్ల దంపతులను ఉద్దేశించి…
“నాడు నేడైన ఏనాడు నైన/ కొలనుపాకనంగ మదిలొ గుర్తుకొచ్చె….” బి. ఎన్.శాస్త్రి గారిని ఉద్దేశించి..
“ఊళ్ళన్ని వడబోసి రాళ్ళ రాత చదివి/ వేల యేండ్ల చరిత వెలికి తీసె….”
ఇలా స్మరించుకుంటూ పద్యాలు రాశాను. ఈ ప్రాంతం శిల్ప కళకు ప్రసిద్ధి.
“శిలలపై గీత గీసె ఈ శిల్పి వాడు/ తెల్పినాడు నాటి చరిత్ర నిల్పి నేడు..” ఎక్కడో గాని చక్కని చెక్కడాల/ పనిని నేర్పితివి కద! ఓ పరమ శిల్పి!/ బుక్కెడన్నము దొరికెడి దిక్కు లేదు/ నాయనా తమ చక్కదనాల పనికి”
అంటూ శిల్పకారుల కళా నైపుణ్యాన్ని, వారి దీనావస్థను గురించి రాశాను.
“భువనగిరి తెలంగాణ సంపుటములోన / పసిడి వర్ణాలలో చెక్కబడును లెస్స” అని ఆ పట్టణాన్ని గురించి రాసి నమస్కృతులు తెలుపుకున్నాను.

డా. కూరెళ్ళగారిచే అరుణధూళిపాళకు సన్మానం

15. మీరు రాసిన ఇతర రచనలేవి?
జ :  1953 లో నేను ఏడవతరగతిలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించే మా మాతామహుడు బేతోజు లక్ష్మీ నారాయణ చనిపోయినప్పుడు ఛందస్సు ఏమీ తెలియకున్నా ఆ దుఃఖాన్ని  స్మృతి కావ్యంగా రాశాను. అలా ఎంతోమంది స్మృతులతో “స్మృత్యంజలి” పద్యాలు రాశాను. అవి ముద్రణలోనికి రాలేదు. అదీకాక “చద్దిమూటలు” అనే పేరుతో 5516 కొటేషన్లు ఒక్కచోట చేర్చాను. ఒక్కసారి ఆ పుస్తకం తిరగేస్తే చాలు ఆ ప్రభావం మన మీద పడుతుంది. అది కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.  పుష్ప విలాపం ఖండికతో ప్రేరణ పొంది “గోవిలాపం” రాశాను. కుడ్య మాసపత్రికలో ప్రచురించబడింది.
” చిక్కగున్నంత కాలం చితుక గొట్టి
చేత చేయించుకొందురు, చేరదీసి
బక్క పడగానె మమ్ముల బాహ్యపరచి
కోత కమ్ముదురయ్య మీ కులము వారు”
ఇట్లా ఉంటాయి ఆ పద్యాలు. 
ఛందో నియమాలు ఉన్న పద్య కవిత్వం రాయడానికి యువత ముందుకు రావడం లేదు. అందుకే వారికి సులువుగా ఉండడానికి “దొందూ దొందే” అనే త్రిపదుల కృతిని రాశాను. “దేవుడు లేని గుడి/ దేశికుడు లేని బడి/ దొందూ దొందే”…ఇలా అయితే ఎన్నో పద్యాలు రాశాను కానీ ఎప్పుడూ ఉద్యమాలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో తిరగడం వలన అచ్చు వేసుకోవాలనే ఆలోచన ఉండేది కాదు.

16.  తెలంగాణా ఉద్యమం వైపు మిమ్మల్ని ఉత్తేజితులను చేసిందెవరు?  ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఏమిటి?
జ:  నేనెప్పుడూ విశ్రాంతి కోరుకోనమ్మా! ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. చదువుకున్న రోజుల్లో చదువుకున్నాను. తర్వాత సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పాల్గొన్నాను. వాస్తవానికి ఆంధ్ర వ్యతిరేకోద్యమం కె సి ఆర్ పుట్టక.మునుపే 1952 లో ప్రారంభమైంది. “నాన్ ముల్కీ గో బ్యాక్” అనే నినాదంతో  ముల్కీ ఉద్యమం వచ్చింది. అప్పుడు నేను ఆరవ తరగతిలో ఉన్నాను. నాకేమీ తెలియదు. అయినా ఫ్లెక్సీ పట్టుకొని తిరిగిన వాణ్ణి. “ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్”,  “గోంగూర పచ్చడి గో బ్యాక్” అనే నినాదాలు అప్పుడు పుట్టినవే. తెలంగాణ తొలి ఉద్యమం, మలి ఉద్యమం రెండింటిలోనూ కవిగా, రచయితగా నా వంతు పాత్ర నిర్వహించాను. తెలంగాణా ఉద్యమంలో ‘ధూంధాం’ కార్యక్రమంలో పాటలతో ఎట్లా ఉర్రూతలూగించారో  సభల్లో నేను పద్యాలతో ఉర్రూతలూగించిన వాడిని.
” ఆత్మార్పణము జేసి అమరులైనట్టి మా త్యాగమూర్తుల ప్రసాదంబు గాదె,
పుట్టుకంత తెలంగాణ పోరు కంకితమయ్యె జయశంకరులవారి జయము గాదె
మాట నిలుపుకున్న మహనీయురాలు మా సోనియా ఇచ్చిన వరము గాదె” ఇలా ఎన్నో పద్యాలు..
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని దాశరథి అంటే నా తెలంగాణ కోట్ల రతనాల వీణ” అని పద్యం చెప్పాను. “తెలంగాణలో చదువుకున్న పెద్దవాళ్ళు లేర”ని అంటే “ఎవడ్రా అన్నది?”  “మందార మకరంద మాధుర్య మూర్తి మా పోతన్న పుట్టిన పుణ్యభూమి” అంటూ వంద పాదాలతో “తెలుగు కాగడాలు” రాశాను.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాజమండ్రిలో విశ్వవిద్యాలయానికి నన్నయ్య పేరు పెట్టినట్లు, కడపలో విశ్వవిద్యాలయానికి యోగి వేమన పేరు పెట్టినట్లు 2007లో నల్లగొండలో మంజూరైన విశ్వవిద్యాలయానికి పోతన పేరు పెట్టాలని ఉద్యమం మొదలుపెట్టాను. చాలామంది పెద్దలు సహకరించారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మా విన్నపాన్ని పట్టించుకోకపోగా మా నోళ్లు మూయించాలని మహాత్మాగాంధీ పేరు పెట్టారు. ఏమీ అనలేక పోయాం. తెలంగాణా మహాకవి పోతన అంటే నేను ఊరుకోను. తెలంగాణాలో పుట్టిన మహాకవి ఆయన. రాజశేఖరరెడ్డిగారు పోతన మీ వాడు కాదు అన్నాడు. అప్పుడు వరంగల్ లో సెమినార్లు జరిగాయి. “పోతన మా వాడు కాదంటే డొక్క చీలుస్తాం” అని వార్నింగ్ ఇచ్చాము. అప్పటినుండీ ఆంధ్రా ప్రాంతం వాళ్ళు రాసిన వ్యాసాలు రావడం ఆగిపోయాయి.
ఇట్లా తెలంగాణోద్యమం, మహాత్మాగాంధీ ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఉపాధ్యాయ ఉద్యమం, అక్షరాస్యత ఉద్యమం, పోతన నామ సాధక కమిటీ అధ్యక్షునిగా పోతన ఉద్యమం ఇలాంటివి చేశాను. అక్షరాస్యతా ఉద్యమం ప్రభుత్వం ప్రారంభించకముందే నేను ప్రారంభించాను. ఇంటింటికీ వెళ్లి చదువు చెప్పేవాణ్ణి. ఉడాయి గూడెం అనే చిన్న ఊళ్ళో పిల్లలు బడికి వచ్చేవారు కాదు. నేనే పలక, బలపం పట్టుకొని వెళ్లి నేర్పించేది. చచ్చేముందు సంతకం అయినా నేర్చుకోవాలని 80 ఏళ్ల పెద్దమనుషులకు కూడా సంతకం నేర్పాను.

17. మీ సంపాదకత్వంలో వెలువడిన పత్రికలేవి?
జ : పత్రికలు రచనా శక్తిని పెంపొందిస్తాయి. జ్ఞానాన్ని కలిగిస్తాయి. చైతన్య ప్రేరకాలు అవుతాయి. అందుకే నేను ఎక్కడ పని చేసినా స్కూల్లో కానీ, కాలేజీల్లో గానీ అక్కడ పత్రిక పెట్టేవాడిని. స్టాఫ్ ప్రోత్సహించేవారు కాదు. “ఈ పిల్లలకు ఏమొస్తది సార్? ఎందుకు ఈ పేపర్ ఇదంతా?” అని ఉత్సాహాన్ని నీరు కార్చేవారు. అయినా నేను వినేవాణ్ణి కాదు. మనం చేసే పని మనం చేయాలి. ఎవరో వద్దంటే ఊరుకుంటే పనులు ఎలా జరుగుతాయి?
నేను పని చేసిన విశ్వ విద్యాలయాల్లో కూడా కుడ్య పత్రికల ద్వారా విద్యార్థుల్లో రచనాసక్తి, సృజనశక్తి కలిగించడానికి ప్రయత్నం చేశాను. ఇక నడిపిన పత్రికలు…. బాపు భారతి, మన తెలుగుతల్లి, వలి వెలుగు, చిరంజీవి, ప్రియంవద, ముచుకుంద. నాకు చేతనయినంత వరకు చదువుపట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగేలా చేశాను.

18. సాహితీ సేవకై మీరు స్థాపించిన వివిధ సంస్థలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా?
జ : పల్లెటూళ్లను చైతన్య పరచడానికి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాను. దానికోసం కొన్ని సంస్థలు స్థాపించాను. అక్షర భారతి, మిత్ర భారతి, సాహితీ స్నేహితులు, భువనభారతి, ప్రజా భారతి, మల్లెల భారతి ఇలాంటి సంస్థలే కాక సాంసృతిక సంస్థలను కూడా స్థాపించాను. అందులో ఇంకా ఇప్పటికీ కొన్ని నడుస్తున్నాయి. వీటన్నిటికీ మంచి స్పందన లభించింది. మా సేవలు గుర్తించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు మా సేవలను గుర్తించి, బిరుదులతో, పురస్కారాలతో గౌరవించారు. పల్లెటూరులో పుట్టి పెరిగిన నా జీవితం ప్రస్తుతం సాహిత్య సేవలో గడిచిపోతోంది. ఆ తృప్తి చాలు. ” జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి” అన్న ఆర్యోక్తి నాకు ఆదర్శం.

19. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం మీకు ‘పద్మశ్రీ’ బిరుదును ఇవ్వడం పట్ల ఎటువంటి అనుభూతి చెందుతున్నారు?
జ:   అవార్డు ఇవ్వడం ఆనందమే. కానీ గర్వంగా భావించడం లేదు. ఎందుకంటే నాకు తోచినంతవరకు నలుగురికి ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశ్యం. నేను కీర్తి కాంక్షల కోసం ఈ పనులు చేయడం లేదు. నావల్ల ఒక్కరు బాగుపడ్డా దాన్ని నాకొచ్చిన అవార్డుగా భావిస్తాను. అవార్డు వచ్చిందని తెలిసి ఎంతోమంది స్వయంగా నా దగ్గరకు వచ్చారు. ఎంతోమంది తమ అభినందనలు తెలిపారు. నా కృషిని గుర్తించి  అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రమ్మని ఆహ్వానం వచ్చినా ఆరోగ్య పరిస్థితుల వల్ల వెళ్లలేకపోయాను.

20. ఇంతటి ఖ్యాతిని ఆర్జించిన మీరు గ్రంథాలయ విషయంలో ఇంకా చేయాలనుకుంటున్న పనులు ఏమైనా ఉన్నాయా?
జ : ఇప్పుడున్న గ్రంథాలయానికి స్థలం సరిపోవడం లేదు. ఇంతకు ముందు చెప్పాను కదా రెండు లక్షల పుస్తకాలకు పైగా ఉన్నాయని. ఇంకా ఎంతోమంది తెచ్చి ఇస్తున్నారు. అందుకే దీని పైన ఇంకో పెద్ద హాలు కట్టించాను. సాహితీ కార్యక్రమాలు కూడా జరుపుకునే లాగా చిన్న వేదిక కూడా ఏర్పాటు చేసాను. వచ్చే నెల ఫిబ్రవరిలో గవర్నర్ తమిళిసై గారి చేతుల మీదుగా అది ప్రారంభం కానున్నది. మీరు కూడా తప్పకుండా రావాలి ఆహ్వానం పంపుతాను ( నవ్వుతూ).

గవర్నర్ గారి చేత ఆవిష్కరింపబడనున్న గ్రంథాలయం

ధన్యవాదాలు సార్! తప్పకుండా వస్తాను. మీలాంటి ఆదర్శమూర్తులను కలుసుకోవడం, మా పాఠకులకు పరిచయం చేయడం మాకు గర్వకారణం. ఆరోగ్యరీత్యా ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా మీ జీవిత విశేషాలను ఇంత ఓపికగా చెప్పిన మీకు  మా తరఫున, మా పాఠకుల తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు.

January 30, 2024 3 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలుగు ప్రతిభా మూర్తులకు పట్టం గట్టిన

by Dr Radhey January 30, 2024
written by Dr Radhey

హ్యాండ్ బుక్ “సబ్బని సాహిత్య వ్యాసాలు” !

కొందరు ప్రతిభా మూర్తులు ప్రచారార్భాటాన్ని ఎంతమాత్రం ఇష్ట పడరు.

తనకు నచ్చిన పనిని ,ఇష్టం గా మార్చుకొని నిబద్దతతో చేసుకుంటూ పోతుంటారు.ఎవరి ప్రశంసల కోసమే ఎదురు చూడరు. అదీ వారి గొప్పతనం.

ఈ కోవలోకి వచ్చే అరుదైన కరీంనగర్ కవి సబ్బని లక్ష్మి నారాయణ గారు. తెలంగాణా  సాహిత్య చరిత్ర లో వీరి పాత్ర మరువలేనిది.

ఒక్క తెలంగాణా ఉద్యమ సాహిత్యం లో భాగంగా పది పుస్తకాలను వెలువరించిన ఘనత వీరిది.ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ వివక్ష లేని రచయిత గా సబ్బని గారిని పేర్కొన వచ్చు.

కేవలం కవిత్వమే కాదు,గేయాలు,వ్యాసాలు,దీర్ఘ కావ్యాలు,అనువాదాలు,నానీలు,పద్య శతకాలు మొదలైన విభిన్న సాహిత్య ప్రక్రియల్లో వీరి రచనలు వెలువడ్డాయి.

వీరు ఇటీవలే వెలువరించిన “సబ్బని సాహిత్య వ్యాసములు” ప్రత్యేకంగా పేర్కొన దగింది.

తెలుగు సాహిత్యం లో ఇరవై నాలుగు మంది సంఘ సంస్కర్తలు, రచయితలు,కవులు, నవల కారులు సాహితీ విమర్శకులు మొదలైన అత్యంత ప్రతిభా మూర్తుల సాహితీ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ రాసిన విలువైన వ్యాసాలు ఇవి.

ఇందులో నవయుగ వైతాళికుడు గా పేరుపొందిన గురజాడ అప్పారావు మొదలుకొని తెలంగాణా రుబాయిల్లో శిఖర స్థాయిని చేరుకున్న డా.ఏనుగు నరసింహారెడ్డి వరకు వివరణాత్మక వ్యాసాలు ఇందులో పొందు పరిచారు.

గురజాడ 150 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధునిక భాషా సాహిత్యాల యుగ కర్త గురజాడ పేరుతో చక్కటి వివరణాత్మక వ్యాసం రాస్తూ..

“సామాజిక ప్రయోజనం,హృదయానందం అనేవి సాహిత్య హితం కూర్చే రెండు మౌలికమైన ప్రయోజనములు.ఈ విషయాలను గుర్తెరిగి రచనలు చేసిన సాహిత్య సృజన శీలి గురజాడ” అంటారు.

విశ్వనాథ సత్యనారాయణ గురించి రాస్తూ..

వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ అనేక సాహిత్య ప్రక్రియల్లో వారి ప్రతిభ అసామాన్యమ ని , వారికలం నుండి వెలువడిన నవల “మ్రోయు తుమ్మెద” ఒక ఆణిముత్యం గా పేర్కొన్నారు.

జాషువా కవితా వైభవాన్ని కీర్తిస్తూ..

పద్యాన్ని హృద్యంగా పండించి సామాజిక చైతన్యం తో,సమాజం లోని అసమానతలు రూపు మాపడానికి కృషి చేసిన మహా కవుల్లో జాషువా అగ్రగణ్యుడనీ,సదా స్మరణీయులని ప్రశంసించారు.

గిడుగు వారిని వ్యవహార భాషోద్యమకారులుగా  అభివర్ణిస్తూ …

“వాచకాల్లో పుస్తకాల్లో సాహిత్యంలో వ్యవహారిక భాష ఉండాలని పట్టుబట్టి ఉద్యమంలా పనిచేసి దాని అమలుకు కృషిచేసిన బాధ్యుడు గిడుగు వారు. వారు సమాజ సేవలో పాల్గొంటూనే ముఖ్యంగా లిపిలేని సవర భాషకు లిపిని, భాషను, వాచకాలను, నిఘంటువులు, ఇచ్చిన ఘనుడు గిడుగు వారు. వారు తెలుగువారికి ఎంతో ప్రాతస్మరణీయులు”. అని పేర్కొన్నారు

సబ్బని లక్ష్మీనారాయణ

మహా కవి శ్రీశ్రీ ని గురించి రాస్తూ…

శ్రీశ్రీ కవిత ఒక్కొక్కటి ఒక అగ్నికణం.వాటికి వ్యాఖ్యానాలు రాయాలంటే పేజీలు చాలవు.

శ్రీశ్రీ కవితాక్షరాలు ఆవేశం తో ఊగి పోయేలా చేస్తాయి.అద్భుత వీర రస వాహిని శ్రీశ్రీ కవిత్వం అని కొనియాడారు.

తిలక్ కవితా తత్వంలో అమృతం కురిసినరాత్రి గురించి ఒక అద్భుత విశ్లేషణ చేశారు సబ్బని గారు..

“వస్తువును కవిత్వం చేయడంలో ఒక గొప్ప రసజ్ఞుడైన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. అమృతం కురిసిన రాత్రి, అందరూ ఆదమరచి నిద్ర పోతుంటే తను మాత్రం వర్షములోని అమృతపు సొనను పట్టుకొని దోసిల్లతో తాగి తిరిగి వచ్చాను అంటాడు. నిజంగా తిలక్ కవిత్వంలో అమరుడు 45 ఏళ్ల నడివయసులో కవితా రసగంగాధరుడి కవిత్వానికి ముగ్దులై అప్సరసలే తిలక్ ని స్వర్గలోకానికి తొందరగా తీసుకుపోయారేమో అనిపిస్తుంది” అంటారు

వచన కవితా పితామహుడైన స్వర్గీయ కుందుర్తి గారిని ఈ కవి బాగా ఇష్టపడతాడు ఆయన రాసిన తెలంగాణ దీర్ఘకావ్యం గురించి ఒక మంచి వ్యాసాన్ని సమర్పించారు

“నిజంగా కుందుర్తి తెలంగాణా ఒక దృశ్యమాన కావ్యం. కళ్లకు కట్టినట్లు సంఘటనలు, దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ప్రజలు పడిన కష్టాలు తెలుస్తాయి. అర్ధనాదాలు వినిపిస్తాయి.

తెలంగాణ ఒక కష్టాల కడలి, కన్నీటి కావ్యం, కాలగమనంలో, నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణా సాయుధ పోరాట క్రమాన్ని,

ఆ రోజుల్లో ప్రజలు పడిన కష్టనష్టాల్ని పోలీస్ చర్యతో అప్పటికి అవి సద్దుమణిగిన తీరును అంతవరకే టైం లిమిట్లో తన కావ్యాన్ని ముగించారు”.

తెలంగాణ సాయుధ పోరాట నేపద్యంగా ఈ కావ్యాన్ని రాసినందుకు కుందుర్తిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించాడు రచయిత.

మరో వ్యాసం లో కాళోజీ ధిక్కార స్వరం గురించి రాశారు.

“కాళోజీ రాసిన కావ్య భాష చాలా పదునైన భాష. ప్రజల భాష ,పలుకుబడుల భాష ,ఆ భాషలో ఉధృతి ఉంది ,నిరసన ఉంది, ధిక్కార స్వరం ఉంది ,ధ్వని ఉంది .కాళోజీ సాహిత్యంలో సామాజికాంశం కానిదేదీ లేదు.

 కాళోజీ తెలంగాణ అంటే తెలంగాణ భాష.  ఈ భాషకు ప్రాణమిచ్చాడు కన్నతల్లిలా ప్రేమించాడు. తెలంగాణ భాషలో రాయండి అని, తెలంగాణ భాషను బ్రతికించండి అని పసిపిల్లాడిలా కన్నీరు కారుస్తూ సెలవిచ్చాడు.”

ప్రముఖ అభ్యుదయకవి సోమ సుందర్ గారిని ప్రశంసిస్తూ ..కొన్ని రచనలు సామాజిక ప్రయోజనం ఆశించబడతాయి రాయబడతాయి. అలాంటిదే అవంత్స సోమసుందర్ “వజ్రాయుధం” ఈ కవి ధన్యుడు.

అణగారిన నేల కోసం, ప్రజల కోసం, కవిత్వము రాసిన అభ్యుదయ కవి, ఎంతో ఆలోచనతో తన ఇరువది ఐదేళ్ల వయస్సులో రాసిన కావ్యమే వజ్రాయుధం.

ప్రముఖ కవి దాశరథి గారి గురించి రాస్తూ.. “కవి వాక్కు వేద వాక్కు, కవి వాక్కు ,బాలవాక్కు, కవి వాక్కు బ్రహ్మ వాక్కు నాడైనా నీడైనా కవి కాంతి దర్శి. దూరదృష్టి గలవాడు. కవిస్పూర్తి ప్రదాత. చిత్తశుద్ధి నిజాయితీగల కవి నిత్యం సత్యాన్వేషణ చేస్తాడు. ఈ ప్రశంసలకన్నిటికి దాశరధి సత్య వాక్కులే సాక్ష్యాలు అంటారు.”

 “త్వమే వాహమ్” లో ఆరుద్ర కవిహృదయాన్ని గురించి చక్కటి ప్రస్తావన చేస్తారు.

“ఆరుద్ర “త్వమేవాహమ్” ను వివరణలు లేకుండా చదువుకోవడం కష్టం. కవి తన భావన లో ఒక వ్యవస్థను ఊహించుకొని చక్కటి ప్రతీకలతో పోలుస్తూ ఈ కవిత చెప్పారు.

ఈ కావ్యం పాఠకులకు సులభంగా అర్థం కానంత రీతిలో ఉన్నా, అది ఒక ప్రయోజనం ఆశించి రాసిన మహత్తర కావ్యం. అలా ఆరుద్ర గారు చిరస్మరణీయులుగా ఈ కావ్యంలో నిలిచిపోతారు.”

కవి శేషేంద్ర గారి పైన సబ్బని గారికి విపరీతమైన అభిమానం. వారిని వారి ప్యాలెస్ లో కలిసి స్వయంగా ఒక ఇంటర్వ్యూ నే చేశారు.

ఇందులో శేషేంద్ర గారి ఆధునిక ఇతిహాసం “నా దేశం నా ప్రజలు” గురించి ఒక గొప్ప వ్యాసాన్ని సమర్పించారు ఇందులో ఆయన గురించి వ్యాఖ్యానం చేస్తూ..

“కవి శేషేంద్ర ఒక రసైక ప్రేమ మూర్తి, పురుషుడు తనకు కావలసిన రసాత్మక భౌతిక మానసిక ఆనందాన్ని స్త్రీ నుండి పొందుతాడు. సంతృప్తిని బ్రతుకులోనింపు కుంటూ పరిపూర్ణ విజయుడై ముందుకు సాగుతాడు విజయ పథం లో.

శేషేంద్ర నా “నా దేశం నా ప్రజలు” కథా కావ్యం కాదు ఒక కవి జగత్తు, శ్రామికుడి జగత్తు, మిళితమై సాగిపోయిన భావాత్మక కావ్యం. అడుగడుగునా ప్రకృతి ఇందులో పులకించి పరవశించిపోతుంది కవి చేతిలో పడి. శేషేంద్ర కవిత్వంలోని గొప్పతనం ఒక కొత్త అభివ్యక్తి,

కొత్త డిక్షన్. కవి మాటల్లోనే చెప్పాలంటే శేషేంద్ర కవిత్వం ఒక విశిష్ట భాష అంటాడు సబ్బని.

ఇంకా ఇంకా..డా. సి.నారాయణ రెడ్డి గారి విశ్వంభర గురించి, ద్వా నా శాస్త్రిగారి సాహిత్యం గురించి,నవలా రచయిత వడ్డెర చండీ దాస్ గురించి,మినీ కవి అలిశెట్టి ప్రభాకర్ గురించి, కె.శివారెడ్డి “మోహనా ఓ మోహనా “గురించి,

డా.ఎన్.గోపిగారి జలగీతం గురించి, ఆచార్య రాచపాళెం రాసిన దీర్ఘ కావ్యం పొలి గురించి,బి.ఎస్ రాములు బతుకు పోరు నవల గురించి, కవి డా.ఏనుగు నరసింహారెడ్డి విశేష సంఖ్య లో తెలంగాణా రుబాయీలు గురించి, నేత కార్మికుల జీవన పోరాటం గురించి నేను రాసిన మగ్గం బతుకు దీర్ఘ కావ్యం విశిష్టతను గురించి.. ఎన్నో విలువైన వ్యాసాలు, వ్యాసాల్లో అర్థవంతమైన వ్యాఖ్యలు ,విశేషణలు చేశారు.

ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు ఈ పుస్తకానికి తన ముందు మాట లో

ఇందులోని సాహిత్య వ్యాసాలన్నీ తెలుగు వారి సాహిత్య సమైక్యతను,సహృదయత ను చాటేవిగా ఉన్నాయని ప్రశంసించారు.

ఈ పుస్తకాన్ని విశిష్ట సాహిత్య అభిమాని,నేటినిజం ఎడిటర్ బైస దేవదాస్ గారికి అంకితమివ్వడం రచయిత సముచిత నిర్ణయం గా నేను భావిస్తున్నాను.

ఈ పుస్తకం తెలుగు విద్యార్థులు,పరిశోధకులు,అధ్యాపకులకు హ్యాండ్ బుక్ గా,అధ్యయన గ్రంథం గా ఉపయోగ పడుతుందని నేను అభిప్రాయ పడుతున్నాను.

ఈ పుస్తకం కస్తూరి విజయం ప్రచురణల ద్వారా ప్రింట్ ఆన్ డిమాండ్ బుక్ గా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది.

సాహిత్య విలువలున్న ఒక మంచి పుస్తకాన్ని తెలుగు సాహిత్య లోకానికి అందించిన కవి మిత్రుడు సబ్బని లక్ష్మి నారాయణ గారిని మనసారా అభినందిస్తున్నాను.

‘సబ్బని సాహిత్య వ్యాసములు’ పుస్తకం లభ్యమయే చోటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్. 

https://amzn.to/3S2C6DA
https://bit.ly/3jUVp5r

సబ్బని లక్ష్మీ నారాయణ ఫోన్ నంబర్ : 8985251271

January 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తట్టంత దుఃఖం !

by రాఘవాచార్య‌ January 30, 2024
written by రాఘవాచార్య‌

బరువులు దించుకున్న తట్ట
రాత్రంతా బోర్లపడో వెల్లకిలనో అడ్డదిడ్డంగానో నిద్రిస్తున్నట్లే పడి పోయి ఉంటుంది
తెల్లారితే చాలు
నిండా ఇటుకలు నింపుకుని
శ్రమపడుతునే ఉంటుంది
రికం లేదు
ఆకలి చల్లారని పొట్టకోసం
బరువులు నింపుకుని
తనను తల పైకి ఎత్తుకునే బాల కార్మీకుల చూసి బాధగా తట్టకు తట్టుకోలేని పది తట్టలంత దుఃఖం
మళ్లీ మళ్లీ కింద మీద పడుతూ
తట్టకు పొద్దు పోయే వరకు బరువులు మోసుడే !
అల్కగా ఉన్నా పనిలోకి దిగితే
బరువు బరువే!
జీవిత కాలమంతా శ్రమిస్తునే ఎత్తుల నుండి పడి ముక్కలు ముక్కలుగా కూలీకి పనికి రాకుండా తట్ట వైకల్యం వైకల్యం !
తల పై ఉంటే తట్ట చివరకు మక్కల కుప్ప
నిర్వాసితుల పొయ్యి కిందకో
చలి మంటల్లో పడో అడ్రసు లేకుండా పొగ పొగ.
కాలుస్తునే ప్లాస్టిక్ వాసన అంటూ ముక్కు మూసుకుంటారు మనుషులు !
“ప్లాస్టిక్ తట్టనైన నన్ను కాలుస్తూ
పర్యావరణ ప్రమాణాన్ని
పదిలం కాకుండా చేస్తారు!”
దుమ్ము దుమ్ము అనాథ ఒంటరి శ్రామికుడిలా తట్ట గుర్తింపు లేకుండా బూడిద బూడిద
తట్టంత బూడిద !

January 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సంక్రాంతి

by Shuktimati Vemuganti January 15, 2024
written by Shuktimati Vemuganti

ప్రాచీన కాలం నందలి నీతిని ,రీతిని తెలుసుకొనవలెనన్నచో పండుగలే ఆధారములు. పండుగల వలననే మన దేశము ఆధ్యాత్మికంగా, భౌతికంగా అభివృద్ధి చెందుతున్నదనడంలో సందేహం లేదు. పండగ యొక్క ప్రయోజనం సమస్త మానవాళి ఆనందాన్ని అనుభవించటం కోసం.
మన జాతి యొక్క సంస్కృతికి ప్రతీకలు, స్ఫూర్తిదాయకాలు మన పండుగలు. పండుగ అంటే ప్రత్యేకించిన పిండి వంటలు, వంటలు చేసుకుంటాం. ప్రతి పండుగకు తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరిస్తాం. కుటుంబ సభ్యులమంతా ఒకే చోట కలుసుకొని సంతోషంగా పండుగ వేడుకలను జరుపుకుంటాం. దానితోపాటు ప్రతి పండుగకు ఒక యదార్థ విశేషం ఉంటుంది. దాన్ని కూడా మనం తెలుసుకొని మన పిల్లలకి అంటే ముందు తరాలకి ఆ విశేషాన్ని చేర వేయాలి. అది మన బాధ్యత. అలాంటి పండుగలలో విశేషమైనది, ప్రముఖమైనది, పవిత్రమైనది సంక్రాంతి పండుగ.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రాంతి రోజులలో సంక్రమణ పురుషుడు ప్రతీ యేడు ప్రత్యేక లక్షణాలు కలిగి వుంటాడు.
సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. ఈ పండుగను గొబ్బెమ్మ పండగ అని కూడా అంటాం.. గొబ్బెమ్మ అనగా గోవునకు తల్లి.
పౌష్యలక్ష్మి రైతుఇంటికి వస్తుంది. ఆరుగాలం కష్టపడిన రైతు పంట కోసి ఇంటికి తెచ్చుకుని గాదెలు నింపితే ఆ పంట సమస్త ప్రాణకోటి కడుపునింపి వారిని వృద్దిలోకి తీసుకువచ్చి లోకమంతా శాంతి యుతంగా ఉంచుతుంది.
శాంతి కావాలంటే అందరి కడుపునిండాలి. అలా అందరి కడుపు నింపేది అన్నపూర్ణ. ఆ అన్నపూర్ణ పౌష్యలక్ష్మి గా రైతు ఇంటికి వస్తుంది. పంట వలన పశువుకు గ్రాసం దొరుకుతుంది. పశువులు కూడా కడుపు నింపుకొని, విశ్రాంతితో పాడిని కుండల నిండా ఇచ్చే సమయం ఇది. వర్ష ఋతువులోనూ, వేసవికాలంలోనూ పాడి తక్కువగానే ఉంటుంది. ఈ ధనుర్మాసంలో పాడి అధికంగా ఉంటుంది.
పక్షికి పరిగె గింజలు దొరుకుతాయి. రైతు విశ్రాంతి తీసుకుని పరమ సంతోషంగా ఉండే రోజులివి.
చెట్లు కూడా పూలతో ,కాయలతో నిండుగా ఉంటాయి.
ఎక్కడ చూసినా పచ్చదనమే కనబడుతుంది.
వాతావరణం కూడా చల్లగా ,హాయిగా ఉంటుంది. ఎంత శ్రమ చేసినా అలసట రాదు. వ్యవసాయపు పనులు పూర్తి అయి పంట ఇంటికి వచ్చి రైతులంతా విశ్రాంతి తీసుకునే సమయమిది. వ్యవసాయం అనేది ప్రధానంగా తీసుకున్న ఎంత చిన్న రైతు అయినా ఇంట్లో సంపద కనపడే రోజు ఈ సంక్రాంతి రోజు. ఆడపిల్లలు తప్పనిసరిగా పుట్టింటికి వెళ్లే పండుగ ఇది. దీన్ని పెద్ద పండుగ అని కూడా మనం చెప్పుకుంటాం. ఈ సంక్రమణ సమయంలో దానాలు చేయటం వలన చాలా పెద్ద ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. ఈరోజు ముఖ్యంగా కుష్మాండ దానం చేస్తారు. కూష్మాడమంటే గుమ్మడి పండు. ఈ గుమ్మడి పండు సంపూర్ణతకి సంకేతం. గుమ్మడి పండు భూగోళానికి సంకేతం. ఈనాడు బలి చక్రవర్తి విష్ణు మూర్తి అనుమతితో భూలోకానికి వచ్చి భూమి అంతా పరిపాలించే రోజుగా చెప్తుంటారు. కేరళ ప్రాంతంలో బలి చక్రవర్తికి సంబందించిన పండుగగానే చేసుకుంటారు. బలి చక్రవర్తి కి ప్రధాన లక్షణం దానం చేయడం. ఆ దాన గుణం వల్లనే కదా శుక్రాచార్యులు వద్దంటున్నా వినకుండా వామనునికి భూదానం చేశాడు.
అసలు సంక్రాంతి అనగా చేరుట అని అర్థం. మకర సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. సంక్రాంతి ప్రతినెలా జరుగుతుంది. కానీ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి ఈ సంక్రాంతికే ప్రాధాన్యం.. ఎందుకంటే సూర్యుడు ఇప్పటివరకు దక్షిణాభిముఖంగా ప్రయాణం చేస్తున్నవాడల్లా ఈనాటి నుండి ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తాడు. ఉత్తరం అంటే దిక్కు అనే అర్థమే కాకుండా శ్రేష్టం అనే అర్థం కూడా ఉంది. సూర్యుడి యొక్క వెలుగు ఉత్తమంగా ఉంటుంది. సూర్యకాంతి మనననుగ్రహించేటువంటి కాలం. భారతదేశంలో ఉన్న చాలా గొప్ప సంపదలలో ప్రధానమైనటువంటిది సూర్యకాంతి.ఏ దేశంలోను సూర్య కాంతి మనకు ఉన్నంతగా ఉండదు. ఈ కాంతి వలన మనకు అనేక రకాలైన మేలు జరుగుతుంది. మానసికంగా ప్రజ్ఞఉండడం, తెలివితేటలు ఉండటం, పంటలు బాగా పండడం లాంటివి. అనేక రకాలైనటువంటి అంటు వ్యాధులు లేకుండా పోవడం. వీటన్నిటికీ ఈ సూర్యకాంతి కారణం. అందుకే మనం సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం. సూర్యుడి వలెనే ప్రాణకోటికిశక్తంతా వస్తుందని మనమంతా ఆధారపడింది సూర్యుడి మీదే అని అనుకుంటాం. దానిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించింది కదా. అలాంటి సూర్య గమనాన్ని అనుసరించి మనం కొన్ని పండగలు చేసుకుంటాం. దానిలో ప్రత్యేకమైన క్రాంతి కలిగినది సంక్రాంతి.
ప్రధానమైనది మకర సంక్రాంతి. మిగతా సంక్రాంతులలో ప్రకృతిలో మార్పు అంత స్పష్టంగా ఉండదు. కానీ మకరంలోకి సూర్యుడు ప్రవేశించగానే ప్రకృతిలో మార్పు వస్తుంది. ఇప్పటివరకు దక్షిణాయనంలో వానలు బాగా పడటం, వాతావరణం సరిగా లేకపోవడం, అనేక ఆరోగ్యకరమైన ఇబ్బందులు రావడం వలన కలిగే చిరాకుతో ఉన్న ప్రాణులకు ఈ ఉత్తరాయణం ప్రవేశించగానే నులివెచ్చని చలి నుండి మొదలై తర్వాత మెల్ల మెల్లగా వేడి పెరగటం తర్వాత వానలు పడటానికి అనుకూలమైన వాతావరణం కల్పించబడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరముగా పోవుటయే ఉత్తరాయణం. కానీ మనము ఉత్తరాయణం బదులుగా ఉత్తరాయణ పుణ్యకాలం అనే అంటాం.. మకర సంక్రాంతి అని కూడా అంటాం
జ్యోతిష్య ఆరోగ్య ఆధ్యాత్మిక శాస్త్రములకు సంబంధించిన ఈ సంక్రాంతిలో భోగి, సంక్రాంతి, కనుము. ఈ మూడు పండగలు .వెళ్లిన మర్నాడు ముక్కనుము అని కూడా కొన్ని ప్రాంతాలలో చేసుకుంటారు.
ఇందులో మొదటిదైన భోగి అనగా అనుభవించుట అని అర్థం. భోగినాడు భోగిమంటలకు ప్రాధాన్యం. ఈ భోగి మంటలను ఆవు పేడతో చేసిన పిడకలతో వెలిగించటంలో ఆధ్యాత్మిక భావం అగ్నిస్వరూపంలో మన ముందు ప్రత్యక్షమవుతుంది. మనం తెలిసో తెలియకో చేసిన మనలో ఉన్న పాపాలు తాపాలన్నీ అగ్నిలో వేసి వాటిని దహింపచేసి మనం పవిత్రులం కావడం కోసం. ఆ మంటలు ఆరిపోయిన తర్వాత దానిలో ఉన్న బస్మాన్ని నుదుట రాసుకుంటే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెప్తుంది.
ఈ పండగను మూడు రోజులు జరుపుకుంటారు.


భోగి పండుగనాడు ఇంద్ర పొంగలిని పాలు అన్నంతో తయారు చేస్తారు.ఇది ఇంద్రుని ఆహ్వానించుటకు. అనగా రాబోవు వేసవి యొక్క తీవ్రతను తగ్గించి త్వరలో తొలకరిని ప్రసాదించమని వేడుకోవడం.
భోగినాడు చిన్న గ్రామమైనచో గ్రామమంతటికి ఒకే భోగిమంట ఉంటుంది. పెద్ద గ్రామమైనచో వాడవాడలకు ఒక భోగిమంట వేస్తారు.
ప్రతి పండగకు తిధి ఉంటుంది. ఈ పండగకు తిధి ఉండదు. పంచాంగంలో తిథిని చెప్పని పండగ అంటే ఇదే. దక్షిణాయనమంత ఉపాసనా కాలం. దక్షణాయనం ఎప్పుడు పూర్తయిపోతే అదే భోగి. అనగా భోగమనుభవించాలి. దీన్ని యథార్థంగా ఆలోచిస్తే కష్టం అనుభవించాకే సుఖం లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడే అన్నం విలువ తెలుస్తుంది. తీపి తినాలంటే ముందు చేదు తినాలి. ఇది ఆరోగ్య సూత్రం. అందుకే ఉగాది నాడు చేదు తింటాం. తర్వాత కాలమంతా రైతు, పశువు కష్టించి చెమటోడ్చి పనిచేసి భోగి పండుగ నాడు పొంగల్ చేసుకొని తీపి పదార్థం తింటాం.
కన్నె పిల్లలతో గొబ్బెమ్మలు చేయిస్తారు. గొబ్బెమ్మ అర్థం గోవు. ఇది లక్ష్మీ ఉపాసన. చిన్నపిల్లలు పెద్ద పెద్ద పూజలు చేయలేరు కాబట్టి ఆవు పేడతో చిన్న చిన్న గొబ్బెమ్మలు చేయించి తల్లి ఆడపిల్లతో ఈ పూజ చేయిస్తుంది. ఎందుచేత ఆవుపేడతో గొబ్బెమ్మలు చేయాలి అంటే అన్ని ప్రాణుల మలమూత్ర విసర్జనాలు దుర్వాసనగా ఉంటాయి ఒక్క గోవు మలమూత్రాలు తప్ప. దానికి కారణం గోవు వెనక భాగం లక్ష్మీ నివాసం. అందుకే వాటిలో అంత పవిత్రత.
గృహాలంకరణ కొరకు గోమయము, గుల్ల ముగ్గు, పసుపును, సున్నమును కలుపగా వచ్చిన పారాణి లేక కుంకుమను వాడతారు. ఆవు పేడ ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైనది. క్రిమిసంహారి. వాయు దోషములను, మశూచి మొదలగు వ్యాధులను రానివ్వదు. దోమల బాధను నివారిస్తుంది. గోవు వలన లభించు ప్రతి వస్తువు ఆరోగ్యకరము, మంగళప్రదమై ఉండును.
ఎందుకు ఆడపిల్లల తోనే ఈ పూజ చేయిస్తారంటే మగ పిల్లవాడు ఒకవైపు వంశాన్ని తరింప చేస్తే ఆడపిల్ల ఇరు వంశాలను తరింప చేయాలి కనుక ఈ సమయం లక్ష్మీ అనుగ్రహం కలిగే సమయం కావున కన్నె పిల్లలకు ఆ శక్తిని అనుగ్రహించాలని భోగి పండగ కంటే ముందే కన్నె పిల్లలతో రకరకాల ముగ్గులు వేయించి, అందులో గొబ్బెమ్మలను పెట్టి వాటికి పసుపు, కుంకుమ, పువ్వులు, పిండి, బంతి పూలతో అలంకరించి పూజ చేయించి పులగం వండి నైవేద్యం పెట్టిస్తారు తల్లులు. ఇంకా కొంతమంది అటుకులు, శనగపప్పు, బెల్లం,, కొబ్బరికాయలు, అరటి పళ్ళు నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ చేసి ఆ తీపి ప్రసాదాన్ని తిని ఆడపిల్ల సమాజంలో చక్కగా వృధ్ధిలోకి రావాలని తల్లుల కోరిక .
ఎండిపోయిన గొబ్బెమ్మలను భోగిమంటల్లో వేస్తారు. దాని పరమార్థం మంచి ఆలోచనలు, ధార్మికమైన అభివృద్ధిని ఇచ్చేది అగ్నిహోత్రుడే. ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు వృద్ధిలోకి వచ్చి అందరూ సుభిక్షంగా ఉండాలని మనసారా వేడుకునే పండుగ ఇది.
ఇంటి ముందు రంగవల్లుల పండగ. వంట ఇంట్లో ఘమగఘమల పండగ. చిన్నపిల్లల గాలిపటాల పండగ. హరిదాసుల ఆటపాటల పండుగ. ఇవన్నీ కలిపితే సంక్రాంతి పండగ.
మలినాడు పెద్ద పండుగ లేక సంక్రాంతి. ఈరోజు సూర్య పొంగలిని తయారు చేసి సూర్యుని ఆహ్వానిస్తూ‌, ‘దక్షిణాయనము నుండి ఉత్తరాయణంనకు మారిన ఓ లోకబాంధవా ఆరోగ్యవంతంగా ప్రాణులను కాపాడమని’ ప్రార్థిస్తారు.
రెండవ రోజైన సంక్రాంతి నాడు అంతకుముందు రోజు భోగి మంటలలో మనలో ఉన్న చెడునంతా, కోరికలను వేసి బస్మం చేసి మర్నాడు వచ్చేటటువంటి సంక్రాంతి అది కూడా ఉత్తరాయన పుణ్యకాలము అంటే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజు ఆ భోగిమంటల కాంతితో లోకానికి ఒక కొత్త కాంతి కలుగుతుంది.
ఈ పెద్ద పండుగనాడు విభక్త కుటుంబం వారు అనగా ఒకే కుటుంబం నుండి వేరుగా విడిపోయిన వారు ఈరోజు ఉమ్మడిగా వండుకొని ఒకే చోట కలిసిమెలిసి భుజిస్తారు.
ఇది దేవతలకు సంబంధించింది. దక్షిణాయనం భోగితో అయిపోయింది. ఉత్తరాయణ ప్రారంభం. అందుకని దక్షిణాయనమయిపోయి పితృదేవతలందరూ తమ తమ స్థానాలకు వెళ్లిపోతూ ఉంటే చిట్టచివరిగా మనం ఆ పితృదేవతలను ఆరాధించుకునేటటువంటి కాలం ఇది. అందుకని సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఈనాడు పెద్దలకు పెట్టుకుంటారు.
భోగి రోజేమో తలంటు స్నానాలు, పిండి వంటలు భోగి మంటలు. సంక్రాంతి రోజు పితృదేవతల ఆరాధన, తర్పణాలు వదలటం, పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు దానాలు ఇవ్వటం చేస్తారు. ఈరోజు కూష్మాండం అంటే గుమ్మడి పండు దానం చేస్తారు.ఎందుకంటే బలి చక్రవర్తి భూమిని వామనునికి దానం చేశాడు కదా. గుమ్మడికాయ గుండ్రంగా భూమి ఆకారం గా ఉంటుందని అంటారు. నువ్వులు, బట్టలు కూడా దానాలు చేస్తారు.
చనిపోయిన వాళ్ళని పితృదేవతలంటాం. వాళ్లకి ఉత్తమలోకాలు కలగడానికి ఈ సంక్రాంతి రోజు ఈ లోకంలో ఉన్న వాళ్ల వంశీకులు వాళ్లకి చేయవలసిన పనులన్నీ అంటే తర్పణాలు విడిచి పెట్టడం, బ్రాహ్మణులకు దానాలు చేయటం మొదలైనవి చేస్తూ ఉంటారు. దీనివలన వాళ్లు తరించి వీరిని ఆశీర్వదించడంకోసం వస్తారట. ఈరోజు కూడా కొత్త బట్టలు ధరించి పెద్దలకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం పొందుతూ దేవాలయాలకు కూడా వెళ్లి స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఈరోజు కూడా ముగ్గులు వేస్తారు. ధనుర్మాసంలో ముగ్గులు వేయడం మొదలై సంక్రాంతితో ముగుస్తుందిథఐచథ్సై. ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఇంటి ముంగిలి లో రథం ముగ్గును వేసి ఆ ముగ్గును ఇరిగింటి పొరుగింటి ముగ్గులతో తాడులా వేస్తూ కలుపుతారు. ఈ కలపటం లో అర్థం అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒకరితో ఒకరు మమేకమై ఉండాలని అర్థం. అందుకే ఈ ధనుర్మాసపు ముగ్గులలో ప్రతి ముగ్గులో మన సంస్కృతి ప్రతిబింబిస్తుంది.
మన సంప్రదాయంలో దేవతలు, పితృదేవతలు, పరివారదేవతలు, పరిసర దేవతలు, వృక్షాలు, పశువులు అన్నింటిని పూజించుకుంటూ వీటన్నింటి యొక్క అనుగ్రహంవలన వాటి యొక్క సహకారంతో వాటితో సహజీవనం చేస్తూ చాలా మహత్తరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాం.
ఇక మూడవ రోజు కనుమ పండగ.ఈ రోజున మాట్టుపొంగలి చేసి పూజ గావించి ఒకటి గోవునకు పెట్టి ఒకటి గోవు మెడలో కట్టుదురు. కూరగాయలు దొరకని మండువేసవిలో నీవు పాలిచ్చి మము కాపాడుమని వేడుకుంటారు.
ఈ పండుగలో నువ్వులు, నెయ్యి ,గొంగళ్ళు బీదలకు దానం చేయదురు. పైవన్నీ ఉష్ణమును కలిగించును. నువ్వులు శరీరంలోని కొవ్వును తగ్గించి ఆరోగ్యమునిచ్చును.
ఈ రోజులలో మానవ చర్యలను యముడు కనిపెట్టుచుండునట. అందువలన దానధర్మములు, పరోపకారం విరివిగా చేస్తారు.
సంక్రాంతికి సంకెళ్ళలో ఉన్న వారికి కూడా విముక్తి ఉంది అని సామెత కూడా కలదు.
కనుమ పండుగ నాడు దేశ సౌభాగ్యమును, శాంతిని కలిగించే 18 జాతుల వారు తమ వృత్తి పనిముట్లను శుభ్రపరచి, వ్యవసాయమునకు తోడ్పడే పశువులను స్వచ్ఛమైన నీటితో కడిగి పసుపు కుంకుమ గంధములు రాసి పువ్వులు పత్రి తో పూజించి ధూప దీపాలిస్తారు.
కొన్నిచోట్లలో ఈ మూడు పండగల తర్వాత ముక్కనుమ పండుగ చేస్తారు. ఈ పండుగలో కోడి పందెములు, గొర్రెపోతుల పందెములు ఆడుతూ పరిసరములందుండడి అమ్మవార్లకు పోతురాజులకు మొక్కుబడులను చెల్లిస్తారు.
పల్లెలకు వెళితే ఈ నెల అంతా పండగల వాతావరణమే ఉంటుంది. కలాపి చల్లటం, ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలను పెట్టటం, హరిదాసులు రావడం ఇంకా జంగం దేవరలు, కాశి కావరులు, విప్రవినోదులు ఇలా బిక్షాటన చేసేవాళ్లంతా కూడా ఈ రుతువులో వస్తూ ఉంటారు. వారికి చాటలతో ధాన్యాన్ని రైతులు సంతోషంగా దానం చేస్తారు. వీరంతా ఈ నెల రోజులు బాగా సంపాదించుకుంటారు. ఇక గంగిరెద్దుల వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. ఇంటి ముందు ముగ్గులో ఉన్న గొబ్బెమ్మను గంగిరెద్దు తొక్కితే శుభమని తలుస్తూ గంగిరెద్దు వాళ్ళు రావటానికి ఇంట్లో వాళ్లంతా ఎదురు చూస్తుంటారు. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు, డు డు డు బసవన్న అంటూ గంగిరెద్దుల వాడు దానితో ఇంటింటికి తిరుగుతూ వారికి అన్ని రకాలైన శుభాశీస్సులు అందింపజేస్తాడు.
పంటలు బాగా పండి ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. ఎంత లేని వాళ్ల నుండైనా ఈ సమయంలో ‘లేదు’ అనే మాట వినం. ప్రకృతి కూడా సహకరించే సమయం. ఎక్కడ చూసినా కాయలు, పండ్లు, కూరగాయలు ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులతో నిగనిగలాడుతుంటాయి. పంటలకు సహాయం చేసిన పశువులకు కూడా విశ్రాంతి దొరికే సమయమిది.
అందుకే సంక్రాంతి మనకు ఒక కొత్త కాంతిని, మనసుకు ఒక కొత్త శాంతిని ప్రసాదిస్తుంది.
అందుకని సంక్రాంతిని ఎక్కువ రోజులు చేసుకొనే పెద్ద పండగని, పెద్ద ఎత్తున చేసుకుంటామని, పెద్దల కోసం చేస్తామని విశేషంగా చెప్పుకోవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రకృతి పండగ. ప్రకృతి వలన మనకు కలిగిన ప్రసాదానికి కృతజ్ఞతగా మానవుడు ప్రకృతిని ఆరాధిస్తున్న పండగ. అదే మన సంక్రాంతి పండగ.

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చేనేత పరిశ్రమ

by Padmasri Chennojwala January 15, 2024
written by Padmasri Chennojwala

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రపంచంలో అతి కొద్ది దేశాలకు మాత్రమే పరిమితమై , గ్రామీణ జీవనోపాధికి ఆయువు పట్టైన రెండవ అతిపెద్ద పరిశ్రమగా , ప్రత్యక్షంగా , పరోక్షంగా 70 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం . ప్రపంచ చేనేత వస్త్రాలలో 90% పైగా భారతదేశంలోనే నే యబడతాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న భారత ‘జాతీయ చేనేత దినోత్సవం’ గా జరుపుకుంటాము. నూలు , కాటన్ , సిల్క్ , పట్టు వంటి పలు రకాలుగా ఈ వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. పద్మశాలి , పట్టుశాలి, తొగట , దేవాంగ వంటి వారి కులవృత్తి. మగ్గంపై వస్త్రాలను చేతితో నేయడం జీవనోపాధిగా కలిగిన వారిని చేనేతకారులు అంటారు. తెలుగు రాష్ట్రాల జనాభాలో 12 శాతం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.

చేనేత వస్త్రం తయారీ విధానం :

మలినాలను తొలగించిన పత్తిని స్థూపాకారంగా చుట్టి రాట్నం సహాయంతో దారాన్ని బయటకు తీసి ఈ దారానికి గంచిని పెట్టి గట్టిదనం వచ్చేలా చేసి ఆ తర్వాత మగ్గంపై వస్త్రాన్ని నేస్తారు. నిలువు వరస దారాలను ‘పడుగు ‘ (వార్పు) అనీ, అడ్డు వరస దారాలను ‘పేక ‘(ఫిల్లింగ్ త్త్రెడ్) అనీ అంటారు.

ఉనికి:

భారతదేశంలో అతి ప్రాచీన కుటీర పరిశ్రమ ఆయన ఈ చేనేత వృత్తి కారణంగా దేశానికి పేరు ప్రఖ్యాతలు , ఆర్థిక బలాన్ని చేకూర్చింది . దేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వనరైన చేనేత 100 ఏళ్ల క్రితం నుంచి విదేశీ మరకద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత కలిగినది. శాతవాహనుల కాలంలో మన వస్త్రాలు యూరప్ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి

ఆరడుగుల చీరను అగ్గిపెట్టెలో దూర్చి ప్రపంచాన్ని అబ్బురపరచిన ఘనత మన చేనేత రంగానిది. మహాత్మా గాంధీ రాట్నంపై నూలు వడికి దేశ ప్రజలకు స్వదేశీ వస్త్రాలని ధరించాలని ఇచ్చిన పిలుపు ఉద్యమానికి ఊతమిచ్చింది. 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్లో నిర్వహించిన భారీ సమావేశంలో నేతలంతా విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలు ధరించి ఉత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు . ‘బానిసత్వం వద్దు ఆత్మగౌరవం ముద్దు’ అని సాగిన స్వాతంత్రోద్యమంలో నూలు వడికే రాట్నం ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనంగా మారింది. ఆ విధంగా స్వాతంత్ర ఉద్యమానికి , చేనేత రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ అభిరుచులకనుగుణంగా మన చేనేతకారులు తమ కళను, నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి వస్త్రాలు అమెరికా , స్విట్జర్లాండ్ , సింగపూర్ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి . సిరిపురం, వెల్లంకిలలో తయారవుతున్న కాటన్ దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్స్ కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది . రాజాపేట మండలంలోని రఘునాధపురం లో తయారవుతున్న లుంగీలు ముంబై , సూరత్ ల ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి .భూదాన్ పోచంపల్లి తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం , సంస్థాన్ నారాయణపురం , పుట్టపాక , సిరిపురం , వెల్లంకి ,ఆలేరు ,గుండాల ,నాగారం వంటి వందలాది గ్రామాల్లో వేల సంఖ్యలో చేనేత కుటుంబాలు చేనేత వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు ప్రత్యేకించి మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు విశిష్ట స్థానం ఉండడం భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం. ఇక ఇందులోని లోతుపాతులను తరచి చూస్తే….

సిద్దిపేట గొల్లభామ చీరలు:

ఏ బుర్రలో ఏ ఆలోచన పురుడు పోసుకుంటుందో అది ఏ సరికొత్త ఆవిష్కరణకు దారితీస్తుందో చెప్పలేం . తల మీద పాలకుండ , చేతిలో పెరుగు గురిగి పట్టుకొని , కొప్పున పూలదండను ముడిచి , చేతి గాజులు గలగలలు, కాలి గజ్జల ఘల్లు ఘల్లుల సందడింపులతో తన ఇంటి ముందు నుంచి నడిచి వెళుతున్న గొల్లకాంత నీడను చూసిన నేతన్న మదిలో మెరిసిన ఆలోచన ఏడు పదుల ప్రస్థానాన్ని కొనసాగించి , 2012లో ‘జాగ్రఫీకల్ ఇండికేషన్ ట్యాగ్ ‘ ను సొంతం చేసుకుని ‘జీ 20 శిఖరాగ్ర సదస్సు’ లో స్థానం సంపాదించి యావత్ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కళాత్మక వస్త్ర సోయగం సిద్దిపేట గొల్లభామ చీరల అద్భుత ఆవిష్కరణ.

సిద్దిపేటకు చెందిన వీరబత్తిని సోమయ్య, రచ్చ రాం నరసయ్య అనే ఇద్దరు నేత కార్మికులు చాలా శ్రమించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు .

చీర అంచులు , పైట చెంగుల్లో వయ్యారంగా హోయలొ లికించే రంగురంగుల గుల్లభామలు సిద్ధిపేట నేతన్నల కళా నైపుణ్యాన్ని ‘ఔరా !’ అనిపించి ఎల్లలు దాటించాయి.

దరీస్:

యావత్ భారత దేశంలో తమకు మాత్రమే స సొంతమైన ‘ దరీస్ ‘ను నేసి 2017లో జాగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొంది , లండన్ మ్యూజియంలో ప్రదర్శనా ర్హతను సాధించి , రంగురంగుల తివాచీలను పరిచి ప్రపంచ చేనేత ప్రియులను స్వాగతించిన వరంగల్ జిల్లా కొత్తవాడ నేతన్నల కళాత్మక నైపుణ్యానికి దేశం గర్వపడింది.

హిమ్రూ:

తొలిసారిగా జీన్స్ క్లాత్ తయారు చేయడమే కాకుండా ఒకనాటి రాజ కుటుంబాల స్త్రీలు ధరించే హిమ్రు పట్టు చీరలను మగ్గంపైనే వేసి యునెస్కో విశిష్ట సాంప్రదాయ వస్త్రాలలో చోటు దక్కించుకున్న వరంగల్ జిల్లా కమలాపూర్ నీ తన్నుల కళా నైపుణ్యానికి ప్రపంచం అచ్చె రువొందింది.

దసలి:

పట్టుపురుగుల నుంచి దారం తీసి వస్త్రాన్ని నేయడమే కాకుండా అటవీ ప్రాంతాలలో లభించే సహజ సిద్ధమైన వివిధ రంగులతో వాటిని ఆకర్షణీయంగా రూపుదిద్ది మహాదేవపూర్ నేతన్నలు దసలీ పట్టు నేతలోని మెళకువలతో ప్రపంచ చేనేత పటంపై తమ సత్తా చాటుకున్నారు.

రాజన్న సిరిసిల్ల చీరలు:

సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీరను తయారుచేసి సరికొత్త రికార్డు సృష్టించడమే కాక వెండి కొంగుతో అరటి , తామర నారుతో పట్టుచీరలు తయారుచేసి అందరిని అబ్బురపరిచి ప్రభుత్వ అవార్డు సైతం అందుకున్నారు.
వందల ఏళ్ల క్రితమే అగ్గిపెట్టలో దూరే చీరలను నేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఘన చరిత్ర మన చేనేత రంగానిది.

బతుకమ్మ చీరలు, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు , దబ్బనంలో దూరే చీరలు , భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టుపీతాంబరాలు, ప్రధాని మోడీకి ప్రత్యేక శాలువ, సచిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రంతో వస్త్రం , తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ గారి చిత్రంతో వస్త్రం నేసి, దానిపై జాతీయ గీతాన్ని కూర్చడం వంటి పలు అద్భుతాలను ఆవిష్కరించిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ మగ్గం కూడా తానే స్వయంగా తయారు చేసుకొని దానిపై బంగారంతో పట్టుచీరలు నేసి సొంత బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఈతని కళానైపుణ్యానికి ముచ్చటపడిన సునీతా విజయ్ అనే ఎన్నారై ఇతడు తయారు చేసిన వస్త్రాలకు ‘సిరి పట్టు ‘అని నామకరణం చేసి , చాలా ప్రోత్సహించి అన్ని రకాలుగా సహాయసహకారాలందించడం ముదావహం.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే మరో చేనేతకారుడు అరటి , తామర నారతో పట్టుచీరలు తయారు చేయడమే కాకుండా 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను తయారుచేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ బృహత్కార్యానికి రాజకీయ , చలనచిత్ర రంగ ప్రముఖులు , ఎన్నారైలు శాయశక్తుల తోడ్పడటం అభినందించదగిన విషయం.
రంగుల సోయగాలను కొంగున ముడేసి, మన ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నేతన్న నేడు సరైన ఆదరణ లేక , శ్రమకు తగిన ఫలితం దక్కక శూన్యంలోకి దృక్కులు సారిస్తున్నాడు.

మనదైన ఈ కళను బ్రతికించుకోవడం మనందరి బాధ్యత అని నేననుకుంటాను. ప్రభుత్వాలు ఎంతగా ప్రోత్సాహాన్ని అందించినప్పటికీ మార్పు అనేది మూలం నుంచి వచ్చినప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని నా భావన.
అతి సామాన్యులమైన మనవల్ల ఏమవుతుందని అనుకోకుండా ‘బిందువు బిందువు కలిస్తే సింధువు’ అవుతుందని , అందుకు మన వంతు సహకారం అందించాలని, శుభకార్యాలు , ప్రత్యేక సందర్భాలలో స్త్రీలు ఈ వస్త్రాలను కొనుగోలు చేయడం తమ విధిగా భావిస్తే , చేనేత కుటుంబాల్లోని యువకులు ఎన్ని కార్పోరేట్ చదువులు చదివినప్పటికీ వారసత్వ సంపద అయిన ఈ నేత పనిని న్యూనతగా భావించకుండా దాన్ని వారి వారసత్వ హక్కుగా గర్వంగా స్వీకరించగలిగితే మన అద్భుతమైన ఈ కళా నైపుణ్యం కనుమరుగవకుండా కొత్తపుంతలు తొక్కుగలదని అనుకుంటాను.

సంపన్న వర్గాల్లోని ఉన్నతమైన విలువలు కలిగిన స్త్రీలు చాలామంది వస్త్రాలు కొనుగోలు చేసి పేదవారికి వితరణ గావించడం మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. ఆ సహృదయతకు ఇంకో అడుగును కూడా జోడించి ఈ వస్త్రాలను కొనుగోలు చేసి వితరణ గావిస్తే దానంతో పాటు కళను కూడా బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం.

‘సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడుపడవోయ్ ‘ అన్న గురజాడ అప్పారావు గారి హితాన్ని అనుసరించి మనం కొనుగోలు చేసే వస్త్రాలలో ఇప్పటినుండి చేనేత వస్త్రాలను కూడా జోడించి మనదైన ఈ అద్భుత కళను బ్రతికించి ముందు తరాలకు ఘనమైన కానుకగా అందిద్దాం.

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖల్లో సాహిత్యాంశాలు

by Cheedella Seetha Lakshmi January 15, 2024
written by Cheedella Seetha Lakshmi

ఆంగ్లేయుడైన సి.పి. బ్రౌన్ చేసిన కృషి వలననే తెలుగు భాషలో కావ్యాలు వెలుగు చూడగలిగాయి. తెలుగు కావ్యాల సంస్కరణ విషయంలో కానీ పరిష్కరణ విషయంలో కానీ బ్రౌన్ కృతకృత్యుడయ్యాడు. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉన్న కావ్యాలను తెప్పించి పండితుల చేత శుద్ధప్రతులను తయారు చేయించి వ్యాఖ్యలను రాయించి నిస్వార్థంగా కృషిచేసి కీర్తి గడించాడు.
బ్రౌన్ లేఖల వలన ఆయన పరిశ్రమను అంతా తెలుసుకోవచ్చు.

ఆ కాలంలో కావ్యాలకు వ్యాఖ్యానం రాసే విషయంలో పండితులకు సహితం సలహాలను ఇచ్చాడు బ్రౌన్. “శబ్దమునకు శబ్దం ఎంత మాత్రమూ అల్లించకుండా తేలే తాత్పర్యం మాత్రం చెప్పుకు అపురూప శబ్దములు తాత్పర్యం బోధ చేస్తే చాలుతుంది” అని పెద్ద కావ్యాలకు టీక రాసే మార్గాన్ని సూచించాడు.

19వ శతాబ్ది ఉత్తరార్ధంలో కొందరు కవులు తెలుగులో సంస్కృత నాటకాలను అనువదించారు. నాటకాలను అనువాదం చేసేటప్పుడు ఎటువంటి కష్టాలు ఉంటాయో లేఖల ద్వారా తెలుసుకోవచ్చును.

వీరేశలింగం పంతులుగారు పూండ్ల రామకృష్ణయ్యకు వ్రాసిన లేఖలో “తెలుగు నందు నాటకములు లేని కాలములో మొట్టమొదట ఆంధ్రీకరణమునకుం బూనిన నాకు కష్టములెక్కువగా ఉండును. ఇప్పటివారితో ఇదివరకు చేయబడిన భాషాంతరీకరణము లొకటి రెండుండి యుండుట చేత నట్టి కష్టము లేదు. వెనుకటి వానిం జూసి కొంత మెరుగు పెట్టవచ్చును. వెనకటి వానిలో గొన్ని లోపములెంచవచ్చును” అని వ్రాయడం వలన మొదట అనువాదం చేసిన వారికి కష్టాలు ఎక్కువ కానీ తర్వాత వారికి మార్గం సులభతరం అని అభిప్రాయపడ్డారు.

అనువాద ప్రక్రియ ఎంత కష్టమైనదో అనువాదం చేయడం కూడా ఒక కళే అని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు దువ్వూరి రామిరెడ్డి గారు. ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి అనువాదం చేయునప్పుడు సంప్రదాయ సిద్ధములైన కొన్ని ఉత్ప్రేక్షలు, ఉపమానములు ఇంగ్లీషులోకి తర్జుమా చేయబడినప్పుడు ఆ భాష ప్రతిభను అనుసరించి చాలా నీరసములుగను మెకానికల్ గను అగుపడును. ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా కాబడవలసిన కవిత్వమునందు యూనివర్సల్ అప్పీల్ ఉండవలెను. అట్టివే ఏరుకొనిన బాగుగానుండును. ఇంగ్లీషులోని భావములు తర్జుమా చేయగలమే గాని మన సంప్రదాయము ననుసరించి ఆ భావముల నావరించిన అట్మాస్ఫియర్ ను తర్జుమా చేయలేము”

ఇట్లు అనడం వలన ఒక భాషలోని భావాలను అనువాదం చేయవచ్చును గానీ, వాతావరణాన్ని సంప్రదాయములను పాటించడం కష్టం కాబట్టి అనువాదం చేయాల్సిన విషయాలను ఏరుకొని భావాన్ని గ్రహించి అనువాదం చేయాలి. మక్కికి మక్కి అనువాదం చేస్తే కూడా కవిత్వం ఆహ్లాదకరంగా ఉండదు అని గమనించాలి.

వేదం వేంకటరాయ శాస్త్రి పాత్రోచిత భాషను నాటకాలలో ప్రయోగించి కొత్త మార్గాన్ని తొక్కారు. ఈ విషయంలో పండితుల్లో అనేక వాదోపవాదాలు వచ్చాయి కొందరు పండితులు మెచ్చుకున్నారు. కొందరు విమర్శించారు. కాలం మారుతున్నప్పుడు రచనా పద్ధతి మారడం సహజం. పూర్వకాలంలో రాజాస్థానాలల్లో ఆదరించబడిన కావ్యాలకే కావ్య గౌరవం ఉండేది. అందుకని ఆనాటి కవులు రాజానుగ్రహం పొందటానికే, విద్వాంసులలో అగ్ర పీఠం సంపాదించడానికే ప్రయత్నం చేసేవారు.
“నేడన్నచో నాటక మూలము ప్రజలను జ్ఞానవంతులుగను, నీతిమంతులుగను చేయవలసిన బాధ్యత వర్తమాన కవుల యందున్నది”. రామస్వామి చౌదరి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ కవికి స్వాతంత్ర్యం ఉండాలని నొక్కి వక్కాణించాడు. ద్రావిడ భాషలు స్వతంత్రమైనవి కాబట్టి “నీచ పాత్రములకే గ్రామ్య భాష గాని,మిశ్రమ భాష గాని యుపయోగింపబడవలయును. ఉచ్ఛ పాత్రములకు భిన్నజాతీయుడైన నేమి, భిన్న మతస్తుడైన నేమి గ్రాంథిక భాషనే యుపయోగించుట సమంజసమని” తలుస్తూ భాషా ప్రయోగ పద్ధతి పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రామస్వామి చౌదరి.

వడ్డాది సుబ్బరాయశాస్త్రి వేదం వారికి రాసిన లేఖలో “నీచ పాత్రములకు తెలుగు నాటకముల యందు తమరు చూపిన దారి నా మటుకు ఆదరణీయంగానే తోచుచున్నది. గ్రామ్యము లేవో యగ్రామ్యములేవో యె రుంగనివారు అనేకులు ఉందురు గాన వారికి గ్రామ్యములివి యగ్రామ్యములివి యని తెలుసుకొనుటకు వీలు కలుగుచున్నది”అని వ్రాశారు.

గురజాడ అప్పారావు “నాది ప్రజల ఉద్యమం” అని చెప్పుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా లక్ష్యపెట్టక వ్యావహారిక భాష ఉద్యమాన్ని కొనసాగించి విజయం సాధించారు.కన్యాశుల్కం నాటకానికి “సమకాలిక ఇతివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగున వాడుక భాషలో నాటకంగా రూపొందించాను”అని రాశారు.ఇతివృత్త స్వీకారంలో భాషా విషయంలో నూతన ఫక్కీ లో చరించి ఆ కాలంలో ఒక విప్లవాన్ని లేపి సంప్రదాయుల విమర్శలకు గురైన ప్రజాకవి గురజాడ తనదంటూ ఒక ప్రత్యేక బాట నేర్పరిచి తరువాత వారికి మార్గదర్శకుడు అయ్యాడు.

కవిత్వ విషయాన్ని ప్రస్తావిస్తూ గుడిపాటి వెంకటాచలం తన లేఖలో రచయితలు రెండు రకాలని చెబుతూ “తాము బాధపడుతో ఆ బాధని కాగితం మీద రాసేవారు. వీరు కోరేది లోకంలో సంఘస్థితిలో మార్పు. రెండో రకం వారు రాద్దామనుకుని ఏదో ఒక సమస్యను ఆధారంగా చేసుకుని రాసేవాళ్లు” అని వివరిస్తూనే “చలం కోరింది హృదయంలో మార్పు గనుక అతడు ఎన్ని శతాబ్దాలకీ లోకవిరోధిగానే వుండిపోయినాడు, ఉండిపోతాడు” అని తనకు బాధ లోంచే కవిత్వం పుడుతుంది అని వ్రాస్తూ “బాధ అనేది ప్రపంచంలో ఉన్నన్నాళ్ళు పుట్టడం అనేది విషాదం. నాలుగు మణుగుల ఆనందం ఉన్నా సరే రెండు తులాల బాధ దాన్నంతా చెరుపుతుంది. ఇంత బాధ చుట్టూ లేకపోతే నేను రాసే ఉండను రాసినా అవసరం ఉండకపోను” అంటూ తన రచనావైఖరిని విశదీకరించాడు.

కథ చిత్రించే విధానంలో కూడా చలం అభిప్రాయం “కథకి గొప్పతనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమి నుంచి పైకి తేవాలి” అంటూనే ఆకలి, డబ్బు లోంచి పోయెట్రీని తెప్పించలేం. ఒక లోతైన అనుభవం లోంచి వచ్చిన మనిషి మాట్లాడుతున్నట్టు” అని కథారచన వాస్తవికంగా ఉండాలన్న అనుభవంతో కూడుకొని ఉండాలనేదే చలం ఉద్దేశం.

ఆదర్శం లేకుండా కవిత్వం లేదు ఒక ఆదర్శాన్ని ఆశించి మానవత్వాన్ని చూపిస్తూ కవిత్వం రాయాలి అన్న బాల గంగాధర్ తిలక్ అభిప్రాయం. “కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని బూజుపట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే అంటాడు తిలక్. “కరుణ, సౌందర్యం, మానవత్వం ఈ మూడు ప్రాతిపదికలుగా చేసుకొని తన ఆదర్శాన్ని ,ఆలోచనల్ని నిర్మించుకున్నానని చెప్పుకున్నాడు తిలక్.

రచనా పద్ధతిని వివరిస్తూ సంజీవ్ దేవ్ “సుందరమైన భావావళి లేని సుందరమైన పదావళి పాఠకుని హృదయం పై అంతగా ముద్ర వేయజాలదు కానీ ఇందుకు వ్యతిరేకంగా సుందరమైన పదావళి లేని సుందరమైన భావావళి పాఠకునిపై మంచి ప్రభావాన్ని వేస్తుంది” అంటూ అభి వ్యక్తికి చక్కని భాష మాత్రమే కాదు భావ గాంభీర్యం కూడా ఉండాలి అని తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

లేఖల వలన వివిధ కవుల
సాహిత్య కృషి తెలుస్తుంది. వీరేశలింగం పంతులు స్వీయ చరిత్ర, కవుల చరిత్ర రచించినట్లు గురజాడ అప్పారావు కన్యాశుల్కం,బిల్హణీయ నాటకాలను, ముత్యాల సరాలను వ్రాసినట్టు, వేదం వారి సాహిత్య పిపాస, దువ్వూరు రామిరెడ్డి కృషీవలుడు, జలదాంగన,వనకుమారి కావ్యాలు రచించినట్లు తమ తమ లేఖలలో తెలిపినారు.

బ్రౌన్ సాహిత్యానికి చేసిన కృషి అనగా నిఘంటు నిర్మాణంలో పడిన శ్రమ, కావ్య సేకరణ కోసం పడిన పాట్లు, టీకా వ్యాఖ్యానాలు వ్రాయించడంలో చూపిన నైపుణ్యం, సలహాలు బ్రౌన్ లేఖల వలన తెలుస్తుంది.

విజ్ఞుల అభిప్రాయాలను లేఖల ద్వారా వెల్లడించడం వలన గుంటూరు శేషేంద్ర శర్మ రచనల ప్రాధాన్యత స్పష్టమవుతుంది.
నా దేశం నా ప్రజలు, ఋతుఘోష, సాహిత్య కౌముది, స్వర్ణ హంస, నరుడు- నక్షత్రాలు, షోడసి మొదలగు కావ్యాలపై
“శ్రీశ్రీ,విశ్వనాథ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు, వేలూరు శివరామశాస్త్రి, జలసూత్రం రుక్మిణినాథ శాస్త్రి, దివాకర్ల
వేంకటావధాని మొదలగు ప్రముఖుల అభిప్రాయాలు సాహిత్య విమర్శకు దోహదం చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. శేషేంద్ర కవిత్వాన్ని గురించి శ్రీ శ్రీ అన్న మాటలు శేషేంద్ర కవితా రీతిని తెలుపుతాయి.

“శ్రీనాధుని క్రీడల్లో
అల్లసాని వాడల్లో
కూడా దొరకని
పదచిత్రం
విచిత్రం కడు పవిత్రం
ధూమాగా ఉంది ఇమేజీ రమారమి కవుల సమాధి”.

వేలూరి శివరామశాస్త్రి గారి మాటలు శేషేంద్ర కావ్య శైలిని తెలుపుతాయి. “తిలకించండి నేడు ఆవిర్భవించుచున్న పలు తెరగుల కవితలలో గూడా మీ ప్రతిభ ఉజ్వలముగా దీపించుచున్నది మీరు నడిచినను పరిగెత్తినను సొగసుగనేయున్నది
మీ నడకలో పరుగు పరుగులో నడక కానగును”.

వీరేశలింగం కవుల చరిత్ర ప్రథమ భాగమును ముద్రించి మిత్రులకు పంపించి, వారికి రాసిన లేఖల్లో “నా పుస్తకములోని గుణములను శ్లాఘింపవలసిన పనిలేదనియు, నేను దిద్దుకొనుటకవకాశం కలుగుటకై దోషములను మాత్రమే చూపవలసినదని వ్రాసియుంటిని”. అని వంగూరు సుబ్బారావుకు రాయడం వలన కావ్యాన్ని రచించగానే విమర్శ కోసం నలుగురికి పంపించేవారని సాహిత్యంలో విమర్శకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలుసుకోవచ్చు.

గురజాడ “ఒక కావ్యాన్ని చదివి దాన్ని సునిశితంగా పరిశీలించి తూచినట్లు విలువ కట్టాలని” విమర్శ విధానాన్ని పేర్కొన్నాడు. గురజాడ అప్పారావు ఇంగ్లీష్ లో రాసిన సారంగధర పద్యాలను చదివి శ్రీముఖర్జీ “సారంగధర నిజంగా చెప్పుకోదగ్గ కల్పన. కవికి ఎంతో గొప్ప భవిష్యత్తు ఉందని అది ఋజువు చేస్తున్నది…. నిరంతర పఠనం అవసరం, మీరు అన్య భాషలో వ్రాస్తున్నారు గనుక ఆ భాష పై సంపూర్ణ అధికారం మీకు సిద్ధించాలి. గొప్ప గొప్ప కవులు తమ భావాలను ఎలా అభివ్యక్తం చేశారో ఆకళించుకోండి. భావ వ్యక్తీకరణకు తగినంత శబ్దశక్తిని సాధించేవరకు మీ జీనియస్ కు సరిపడే నూతన మార్గాన్ని అన్వేషించే వరకు
మీరు ఇతరులను అనుకరించవలసి ఉంటుంది” అని వ్రాయడం వలన విమర్శయే కాక మహాకవులుగా రాణించడానికి పెద్దవారు ఇచ్చిన సలహాలు, మార్గాలు కూడా కారణాలు అయ్యాయి, అనడానికి లేఖలు ప్రత్యక్ష సాక్ష్యం.
ఈ విధంగా రచనను విమర్శించడమే కాక హితోక్తులు,పూర్వ రచనలు చదవాలని సూచనలనిస్తూ కూడా చెప్పేవారు.

దువ్వూరి రామిరెడ్డి
కృషీవలుడు కావ్యంపై గిడుగు రామ్మూర్తి పంతులు గారి విమర్శ లేఖల వల్ల తెలుస్తుంది “కృషీ వలుడు, జలదాంగన కావ్యాలను సమీక్ష చేయడానికి నాకే అభ్యంతరమూ లేదు వాటిలో నిజమైన కవిత్వం ఉన్నది. కానీ వ్యక్తంగాను వ్యక్తావ్యక్తం గానూ కవి వాడుకలో లేక గ్రంథము నందే నిలిచిన పదాలను ప్రయోగించడము చూచి విచారము కలిగింది” అని వ్యావహారిక భాషను ఉపయోగించనందుకు విచారాన్ని వ్యక్తం చేశాడు.

జి.హెచ్. కజిన్స్ సమదర్శన అను గ్రంథము నందు “భారతీయ భాషా కవిత్రయము అను భాగమునందు రామిరెడ్డిని గురించి వ్రాశాడు. రామిరెడ్డి తన కావ్యాలను ఇంగ్లీషులో “వాయిస్ ఆఫ్ ద రీడ్” గా ప్రకటించడం చూసి కజిన్స్ మెచ్చుకుని
తొలిపలుకలలో మహోన్నతమైన దేశ భాష కవిత్వమునకు ఇది ఆహ్లాదకరమైన అనువాదము అని తన గుణముల మీదనే ఆధారపడి నిలువవలెను అనడం వలన రామిరెడ్డి కావ్యాలకున్న విలువను గుర్తించవచ్చు.

వేదం వెంకటరాయ శాస్త్రి జలదాంగన, కృషీ వలుడు కావ్యాలపై అభిప్రాయాన్ని తెలుపుతూ “వాని యందు కవితాబీజమైన ప్రతిభ నాకు గోచరించినది. శబ్ద సౌష్ఠవ ప్రణవత్వము కూడా నగపడుచున్నది అనడం వలన రామిరెడ్డి కవిత్వంలో శబ్ద సౌందర్యానికి సంబంధించిన ప్రశస్తి తెలుస్తుంది.

సోమ సుందర్ కథలు చదివి తిలక్ తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా వ్యక్తం చేస్తూ “కథాకథనంలో గద్యశయ్యా విధానంలో చక్కని కౌశల్యం ఉన్నది. కానీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకు కానీ బలపరచడం గాని నీవు చేసిన ప్రయత్నం ఆ కథా శిల్పంలోని ముఖ్య దోషం” అని విమర్శించాడు.

చలం మిత్రులకు వ్రాసిన లేఖ వలన వర్తమాన కాలంలో కవులపై చలంకు గల అభిప్రాయము వ్యక్తమవుతుంది. మండువ జగ్గారావుకు రాసిన లేఖలో “శరత్ నాయికా నాయకులకు వెన్నెముక లేదు వాళ్ళ ఒళ్లంతా మెత్తని హృదయాలే ఎముకలు లేవు విధికి వెన్నవలె లొంగిపోతారు” అంటాడు.

“శ్రీ శ్రీ ఒక్క ఆర్థిక విధానాన్నే కాక అతని కవిత్వంలో ఇంకా చాలా మార్పుల్ని కోరాడు, కనుక అతని కవిత్వానికి గొప్పతనం పట్టింది.

చలం కోరింది హృదయంలో మార్పు గనుక, అతడు ఎన్ని శతాబ్దాలకి లోక విరోధిగానే ఉండిపోయినాడు ఉండిపోతాడు” అంటూ ఇలా ఇతర కవులపై అభిప్రాయాలే కాక ఆత్మవిమర్శ కూడా కనిపిస్తుంది చలం లేఖలో.

రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి “నాజూకైన సూర్యకాంత తీగెకి మృదువు, ఉజ్వలమైన ఎర్రటి పువ్వులా పూసినట్టుంది ఠాగూర్ కవిత్వం” అని తెలిపాడు.

గురజాడ పై విమర్శ ఇలా ఉంది “తెలుగు రచనల్లో ఆనాడు ఎవరూ సాహసించని పనుల్ని చేశారు ఆయన. అది ఆయనలో విశేషం. ఆయన తిరుగుబాటంతా ఆయన ఆలోచనల్లోనూ రాతల్లోనే కానీ జీవితంలో ఏమీ కనపడదు. ఆయన హృదయం విశాలమైంది. ఆయన ఆనాటి సమాజాని కన్నా రచనా, ఇరుకు పద్ధతుల కన్నా దూరదృష్టితో చూశారు. భాషాభావాల్ని ఇరుకున్న పెట్టే సంకెళ్ళని ఒక్క దెబ్బతో ముక్కలు చేశారు” అని విమర్శతో కూడిన ప్రశస్తి ఉంది.

శివం గారికి రాసిన లేఖలో శివం రచనలపై విమర్శ కనిపిస్తుంది “భగ్నజీవితాలు చదివాను. క్యారెక్టరైజేషన్ సి చ్యుయేషన్ డైలాగ్ బాగున్నాయి. కానీ సాగదీశారు చాలాసేపు పైగా ఆ ఎండింగ్- ఆదర్శం ఇట్లాంటివి ప్రజలకు ఏదో సంతోషాన్నిస్తాయి. థాట్ లో ఇమ్మెచ్యూర్ ఇంకా” అనే అభిప్రాయం తిలక్ వ్యక్తపరిచారు.

‘సంజీవ్ దేవ్’ “అభిమానాలకు కులతత్వాలకు అయోగ్యతలకు విలువ ఇవ్వటానికి చాలా విఖ్యాతి చెంది ఉన్నాయి అకాడమీలు” అని అకాడమీల వ్యవస్థను విమర్శిస్తూనే సమీక్షలు ఎట్లా ఉండాలో వివరిస్తూ “సమీక్షలు ప్రశంసాత్మకంగా ఉంటేనే ఉత్తమమైనవని నేను భావించను కానీ నింద మాత్రమే ప్రధానంగా ఉన్నవే ఉత్తమమైనవి అని కూడా నేను భావించను. అయితే నేను భావించేది మాత్రమే సక్రమమైనదని… నేను భావించనిది అక్రమమైనది కూడా నేను భావించను లెండి” అంటారు. సమీక్షలు
నిర్మొహమాటంగా చేయాలి. ప్రశంసలు విమర్శలు అన్ని సక్రమంగా ఉంటేనే నిజమైన సమీక్ష. ముఖస్తుతి వెగటు ఉండకూడదు.రచనపై చక్కని అవగాహన చేసుకుని ఖచ్చితమైన అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తం చేయాలి. విమర్శ అయినా అంతే… రచనను సమగ్రంగా చదివి ఒక అభిప్రాయానికి వచ్చి తూచి విలువ కట్టాలి అప్పుడే విమర్శకు న్యాయం జరుగుతుంది.

రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) లేఖల్లో సాహిత్యానికి సంబంధించిన అంశాలెన్నో చోటుచేసుకున్నాయి. అనువాద విధానాన్ని వివరిస్తూ రా. రా. ఒక భాషలో నుండి వేరే భాషలలోకి అనువాదం చేయాలంటే ఆ భాషపై సంపూర్ణ అధికారం, అవగాహన ఉండాలంటాడు.

మిరియాల రామకృష్ణ రాసిన ‘శ్రీశ్రీ సింబాలిజం’ పై విమర్శిస్తూ “శ్రీశ్రీ గేయాలను ప్రతీకలుగా కాక స్వతహాగానే ఎంతో అర్థవంతంగా చూస్తే మంచిదని, ప్రతీక వాదం పేరుతో శ్రీశ్రీ గేయాలను పొడుపు కథలుగాను, ప్రహేళికలు గాను మార్చకండి” అని నిస్సంకోచంగా లేఖలో తెలిపాడు.

గురజాడను అంచనా వేసే తీరు రా.రా.లేఖల్లో స్పష్టంగా గోచరిస్తుంది. గురజాడ పై విమర్శ చేయాలంటే ఎంతటి అవగాహన ఉండాలో సూచిస్తాడు. గురజాడ మీద అవాకులు చవాకులు పేలే వాళ్ళు అ.ర.సం.లో ప్రముఖులైనారు. అంటూనే “వీరేశలింగం ఎంత గొప్పవాడైనా గొప్ప ఉద్యమకారుడు మాత్రమే గొప్ప సంస్కర్త మాత్రమే. మరి గురజాడ, పోలికే లేనంత గొప్పవాడు. ఆయన రచనలు డైరీలతో సహా చదివితే ఎంత గొప్ప మేధావి అయిందీ, సృజనాత్మక రంగంలో ఎంత మహా రచయిత అయింది, హృదయ పరిపాకం విషయంలో ఎంత మహాపురుషుడు అయింది తెలుస్తుంది అంటాడు.

కాళోజి నా విమర్శకు అర్హుడని ఎంతో ఘనంగా చెప్పుకుంటాడు రా.రా. ఆయనలో ఉన్న ధైర్యం విమర్శనా దృక్పథం లేఖల్లో స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి అవకాశముంది.

మల్లారెడ్డికి రా.రా. రాసిన లేఖలో ముప్పాళ్ళ రంగనాయకమ్మ రాసిన విషవృక్షంపై ఘాటైన విమర్శ ఉంది. దానిలో శాస్త్ర దృష్టి ,చారిత్రక దృష్టి చివరికి రొమాంటిక్ దృష్టి కూడా లేదని విమర్శించాడు. అర్థం లేని ద్వేషమూ, కసి తప్ప ఏమీ కనపడవని అన్నాడు. వాల్మీకి శ్లోకాలను ఉల్లేఖించి వక్ర భాష్యం చేయడం, మరి ఇలాంటి విషం మీద మనమేమని విమర్శ రాయాలి? రంగనాయకమ్మకున్న విషదృష్టిని చెడమడా తిట్టకుండా విమర్శ రాయడం సాధ్యం కాదు. అని స్పష్టంగా దూషోక్తంగా, నిర్మొహమాటంగా విమర్శించాడు రా.రా.

రారా సాహిత్య విమర్శకులలో గొప్పవాడని ఆయన లేఖలను బట్టి ఘంటాపథంగా చెప్పవచ్చు.

నార్ల వేంకటేశ్వరరావు లేఖల్లో కొన్ని మాత్రమే సాహిత్యాంశాలు కన్పిస్తున్నాయి. నార్ల రచించిన జాబాలిని హరిహరప్రియ కన్నడం లోకి అనువదించినట్టుగా హరిహరప్రియకు రాసిన లేఖల వలన తెలుస్తుంది. నార్ల తాను పాతకాలం మనిషి అయిన కారణం చేత తన వచనం కూడా పాతదేనని తన శైలిని వివరించాడు. నార్ల గ్రంథాలు మరాఠీ భాషలోకి అనువదింపబడినట్లు లేఖల ద్వారా విదితమవుతుంది. వీరేశలింగంపై వ్రాసిన మోనోగ్రాఫ్ గుజరాతీ భాషలోకి కూడా అనువదింపబడింది. నార్ల రచనల గొప్పతనం తెలుగు వారికే పరిమితం కాలేదన్న విషయం లేఖల ద్వారా స్పష్టమవుతుంది.

కట్టమంచి రామలింగారెడ్డి లేఖల్లో సాహిత్య విషయానికి సంబంధించిన లేఖలే అత్యధికంగా ఉన్నాయి. రాళ్లపల్లి కి వ్రాసిన లేఖల్లో వేమన గురించి సంపూర్ణ అవగాహనతో కూడిన సమగ్ర సమాచారాన్ని,
విలువగల సలహాలను ఇచ్చినట్టు
ద్యోతకమవుతుంది. రాళ్లపల్లికి వ్రాసిన ఒక లేఖలో వి.వి. శర్మ దగ్గరున్న వేమనకు సంబంధించిన విషయాలను తెప్పించుకోమని, వేమన జీవితంపై రాసిన వంగూరి సుబ్బారావు గ్రంథం, క్రిస్టియన్ కాలేజీ మ్యాగజైన్ లో వెలువాడిన వ్యాసం చూడవలసినదని సలహా ఇచ్చాడు.

వావిళ్ళ వారు ముద్రించిన గ్రంథంలో రాళ్లపల్లి రాసిన పీఠికను ప్రస్తుతిస్తూనే ఇంకా న్యాయం జరగలేదని, వేమన గురించి ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని విమర్శిస్తూ సూచనలు ఇస్తాడు.

తన “కవిత్వ తత్వవిచారము” రెండో ముద్రణకు నోచుకుంటుందన్న విషయాన్ని లేఖలో తెలిపాడు. “శాలివాహన సప్తశతి” కి రాళ్లపల్లి చేసిన అనువాదాన్ని మెచ్చుకొని, శైలి బాగున్నదని, సహజంగా, ఆకర్షణీయంగా ఉన్నదని, ఇంత మంచిగా ఉన్నందువల్లనే నన్ను పీఠిక రాయటానికి పురికొల్పిందని అంటూ పీఠిక వ్రాయాలన్న ఆసక్తిని కనబరిచాడు. ఈ విధంగా కట్టమంచి లేఖల్లో సాహిత్యాంశాలు గమనించవచ్చును.

ఈ విధంగా లేఖల్లో అరమరికల్లేకుండా నిర్మొహమాటంగా సాహితీవేత్తలు వారి వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి సావకాశం ఉంది. విమర్శలు, పొగడ్తలు హృదయం విప్పి చెప్పే రహస్యాలు అనేక సాహిత్య విషయ సంబంధులు లేఖల్లో గోచరిస్తాయి.

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మా పంతులు

by Rudrakhala Matam Prabhu linga Shastri January 15, 2024
written by Rudrakhala Matam Prabhu linga Shastri

సిగరెట్టు త్రాగే బలహీనత ఉండేదేమో
త్రాగుచుండగ మా కంటపడలేదెన్నడు.

మాకు తెలియకూడదని చివరిదినం నాడు
రెండవ ఆటకు సినిమాకు పోయెవాడట.

మాలో ఒకరి వలె దైవ భక్తి ఉండెనో లేదో
నుదుటి పై విభూతి లేకుండ ఉండకుండె.

మధ్యాహ్నం ఓపిక ఉన్నా లేకున్న తప్పక
కాళ్ళు చేతులు ముఖం కడిగే తినేవాడు.

ఇంటిలో ఒక్క పనియైనా చేసేవాడో కాదో
బడిలో తిన్నాక బాక్స్ ను కడుక్కునేవాడు.

మద్యం సేవించే వాడో కాదో ఏ ఒక్కరును
మా పంతులు త్రాగునని అనగా వినలేదు.

మేము హోంవర్క్ సక్రమముగ చేయకుంటె
ఇళ్ళకు వచ్చి పెద్దలను చేయించమనేవాడు.

మా సోమరితనం వలన పై అధికారి నుండి
మాటపడిన మా ముందు అబద్దమాడలేదు.

మా అల్లరికి విసిగి ఒక్కోసారి ఆయన చేసిన
బడితెపూజ మేం మరచినను, బాధపడేవాడు.

బడిలో తనకొడుకు మాలాంటి విద్యార్థియే
ప్రత్యేకహోదా లేదు; అర్హత బట్టే మార్కులు.

మా పంతులు ముందు మేము విద్యార్థులమే
కాని విద్యార్థి మరియు విద్యార్థినిలము కాము.

మా యూనిఫామ్ స్టిచ్చింగ్ లో తేడా ఉండేదేమో
మా పంతులు చేయించే డ్రిల్ లో ఉండేదికాదు.

పద్యాల ఎక్కాల లో వారి కఠిన శిక్షణలో నేడు
మా ల్యాబ్ టాప్ తప్పినా మేం తప్పడములేదు.

వల్లెవేయించే వారి అసమాన ఓర్పుతో నేడు
స్పెల్లింగ్స్, అల్ప, మహాప్రాణాలలో దిట్టలం.

టైప్డ్ ‘ఒ’ మరియు ‘బ’లను గుర్తుపట్టలేరేమో
వారు దిద్దించినందున మేము వ్రాస్తె పొరబడరు.

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

బక్కవ్వ

by Humayun Sangheer January 15, 2024
written by Humayun Sangheer


“ఈ ఫోటోలోని మహిళ పేరు స్వరూప. వయసు 28 సంవత్సరాలు. మతిస్థిమితం బాగాలేక గతవారం తప్పిపోయింది. ఎక్కడైనా కనిపిస్తే కింది నెంబర్‌లో తెలుపగలరు.. ఇట్లు పంకజ్” వాట్సాప్‌లో ఫార్వాడెడ్‌గా వచ్చిన ఆ మెసేజ్, అందులోని ఫోటో చూసి హృదయ్ ఒక్కసారిగా షాకయ్యాడు?

ఎదురు సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న అనిత భర్త ముఖంలో టెన్షన్ గమనించింది. పుస్తకం పక్కనబెడుతూ “ఏమైందండీ” అని ప్రశ్నించింది. అదుర్దాగా భార్య ముఖంలోకి చూస్తూ చేతిలో ఫోన్ అనిత ముందుకు చాచాడు హృదయ్.

అనిత ఆ మెసేజ్ చదివింది. “ఈమె మనూరామెనే గదా” అడిగింది అనిత. శూన్యంలోకి చూస్తూ అవునన్నటట్టు తలూపాడు. “అసలే పిచ్చిది.‌ ఎటు వోయిందో ఏమో” అంటున్న భార్య మాట విని ఆమె వైపు ఉరిమినట్టు చూశాడు. “ఓహ్ సారీ అండీ పొరపాటుగా అన్నాను” అపాలజీ చెప్పింది అనిత. హృదయ్‌కి తన చిన్ననాటి స్నేహితులు అందరూ ఎంతో ఇష్టమనే విషయం అనితకు అప్పుడే స్ఫురణకు వచ్చింది.

ఎప్పుడు టైం దొరికినా వాళ్లతో ఆడిన ఆటల గురించి చెప్పడం.. యాదగిరి, సీను, గోపి, నసీమా, లతీఫా, సాయవ్వ, పోషవ్వ, ముజ్జు, సంగవ్వ, లచ్చిమి, రవి, శివుడు, సాదక్, పంకజ్, స్వరూప (బక్క) ఇలా భర్త చెప్పిన చిన్నప్పటి స్నేహితుల పేర్లన్నీ అనితకు బాగా నోటెడ్ అయ్యాయి.

ఆలోచనలో పడిపోయింది కాసేపటివరకు. బక్క గురించి ఆలోచిస్తోంది. ఊరు వెళ్లినప్పుడు ఒకట్రెండు సార్లు బక్కను కలిసిన రోజులను గుర్తు చేసుకుంది. బక్క రూపం కాసేపు కళ్లల్లో మెదిలింది. బక్క అందరిలాంటి పిల్ల కాదని దిగులు చెందుతోంది. హృదయ్ మథనం కూడా అదే. కాసేపటికి “అనిత” అన్న హృదయ్ పిలుపుతో ఠక్కున వాస్తవంలోకి వచ్చింది అనిత.

భర్త వైపు చూసింది. “ఏం ఆలోచిస్తున్నవు” అడిగాడు. ఏం లేదన్నట్టు తలూపింది. హృదయ్ తన ఫోన్‌తో పంకజ్‌కు కాల్ కలిపాడు.

పంకజ్ ఫోన్ ఎత్తాడు. “బక్క కనిపిస్తలేదురా” అని వలవలా ఏడ్చేస్తున్నాడు.

“ఎన్ని రోజులైందిరా?” కంగారుగా అడిగాడు హృదయ్. “మూడు రోజులైందిరా. దానికి ఎర్వ పర్వ ఏం తెల్వది. ఎటువోయిందో ఏమో. ఇంట్ల అమ్మానాయిన గుండె వల్గుతున్నరు” అని ఏడుస్తూనే మాట్లాడుతున్నాడు పంకజ్.

“నువ్వేం టెన్షన్ వడకు యాడికి పోదు” హృదయ్ మాట పూర్తి కాకుండానే పంకజ్ అందుకుని “అసలే బయట కరోనా రోగం పార్సుకపోయి ఉన్నది. ముట్టుకుంటే అంటుకుంట అన్నట్టే ఉన్నది. దీనికి ఆ రోగం దెల్వది, మాస్కులు, శానిటైజర్ల గురించి అసలే దెల్వది. సరిగ్గా మాట్లాడలేదు. నత్తి నత్తి మాట్లాడుకుంట ఎటెటు తిర్గుతున్నదో ఏమోరా” గాద్ఘధికమైంది పంకజ్ గొంతు.

“పోలీస్ స్టేషన్‌ల కంప్లైంట్ ఇచ్చినవార”
“ఇచ్చినరా. కరోనా టైంల గా పిచ్చిదాన్ని సరిగ్గా సూస్కోరా అని ఎస్సై ఉల్టా తిట్టిండు. ఇసుంటి టైంల దమాక్ మంచిగ లేనోళ్లను ఇంట్ల కట్టేశి పెట్టాలె అని అన్నడు. ఈ టైంల పోలీసోల్లకు ఇరువై నాలుగ్గంటలు కరోనా డ్యూటీ జేస్తందుకే సరిపోతున్నరు. ఇప్పుడు ఇసుంటి కొత్త కేసులు యాడ వట్టించుకుంటర్ర” విచారించాడు పంకజ్.

హృదయ్ ఏం చెయ్యాలనే ఆలోచనలో పడ్డాడు.

మళ్లీ అతనే అందుకుంటూ..”పోలీసోల్లు ఇప్పుడు ఏం జెయ్యరనే ఇషారతోని సోషల్ మీడియాను నమ్ముకున్న. ఎవరికైన కానస్తే ఫోన్ జేస్తరుగదా” “అవును మంచిపని చేసినవురా. నువ్వు పరేషాన్ అయి అమ్మానాయినలను పరేషాన్ చెయ్యకు సరేనా”

“మంచి మంచోళ్లనే దిక్కులేని సావు సంపుతున్న కరోనా మన బక్కవ్వను ఏం జేస్తదోనని గావర అయితున్నదిర. గదొక్కటే బుగులు నాకు”
“నువ్వు అంతదాక ఆలోశించుకొని మైండు కరాబ్ జేస్కోకు” ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు హృదయ్.

“లాక్‌డౌన్ ఉండుంటే నాకేం రంది లేకుండేరా. లాక్‌డౌన్ తెరిశినకాన్నుంచి పాజిటివ్ కేసులు శానా పెరుగుతున్నయి. అదే నా భయం. హైదరాబాదులనే ఉన్న ఆ మహమ్మారి ఇప్పుడు జిల్లాలకు గూడ పాకింది. మనూర్ల గూడ ఒకోళ్లకు కరోనా అచ్చింది. అచ్చినోడు గాంధీల నవుస్తున్నడు. ఈడ ఇంటిల్లాదులంతా 28 రోజులు హోం క్వారంటైన్‌ల ఉన్నరు. దీంతోని ఊరంతా తాయిమాయి అయితున్నరు. ఏం పాడు గత్తరోనని కుదెం వెట్టుకున్నరు. ఈ టైం ఎసుంటిదో దానికి తెల్వది. ఇంట్లున్నప్పుడే యాల్లకు బువ్వ తినది. ఇప్పుడు బయట ఏం తింటున్నదో, ఎటేటు తిరుగుతున్నదో. ఈ టైంల మంచిగ తిని ఇమ్యూనిటీ పెంచుకోవాలని మనకు తెలుసు గనీ, దానికేం తెలుసురా? ఆ సాడేసాతోని పేరు తలుసుంట అది ఇంకింత పిచ్చిపిచ్చి జెయ్యవట్టిందిర” వణుకుతోంది పంకజ్ స్వరం.

సాడేసాతోడు అనగానే ‘కిరణ్’ అనే పేరు ద్యోతకమైంది హృదయ్‌కి. “పెండ్లి ఏమంట అయిందో కిరణూ కిరణూ‌‌.. ఇదే దాని నోటి నుంచి అచ్చిన పేరు. ఇది పిచ్చిదని, ఎత్తుపండ్లు ఉన్నయని, ఒంటె పెదవులు ఉన్నయని, మాట్లాడ్తె నోట్లెకెల్లి సొల్లు కారుతున్నది, తుంపిర్లు వడ్తున్నయని, చెవులకెల్లి చీము కారుతున్నదని.. ఇట్ల శానా వంకలన్ని తీశి దీనితోని సంసారం జెయ్యనంటే చెయ్యా అంటున్నడు ఆడు. ఎడ్డిదాన్ని అంటగట్టినమని ఉల్టా మామీద కేసు వెడ్తా అంటున్నడురా. అల్ల అని దాన్ని ఈడ నూకిపెట్టి ఆడు మిర్యాలగూడకు ఎల్లిపోయిండు. సంసారం చెయ్ బావా అని వాని కాల్లు మొక్కుతమా. పోని అని ఊకున్నం కనీ, ఇది వాన్ని మచ్చంవోయిన మరుస్తలేదు. పన్నా లేశినా కిరణ్ తప్పిచ్చి దాని నాల్కె మీద వేరే పేరే ఉంటలేదు. దీనిది నిజంగనే పిచ్చి ప్రేమరా. ఆడు దీన్ని ఇడసవెట్టి రేపు ఇంకోదాన్ని ఏలుకుంటడు. మా అమ్మా నాయినలు చెప్తే ఇనకుంట దాని లగ్గం చేశిర్రు. ఇయాల్లరేపు లోపం ఉన్న ఆడపిల్లలను ఎవడు పెండ్లి చేసుకుంటడు చెప్పు?”

“అవున్రా బక్క లగ్గం జేశి తప్పు జేశిర్రు. అట్లనే ఉంటుండె” హృదయ్ అన్నాడు.
“లోకం బాధకు అమ్మా నాయినలు దాని బొండిగె కోశిర్రు‌. పిల్ల పెయిమీదికి 28 ఏండ్లు అచ్చినయి. ఇంటి మీద బెలుగు లెక్కట ఇంకా ఆ పిల్లను ఎన్నొద్దులు ఉంచుకుంటరు. ఆమెకు తగ్గ పొలగాన్ని లెంకి అటు ఎత్తి ఇయ్యుర్రి అని మా మేనమామలు, పెద్దమ్మలు గూడ జోరీగల లెక్క పోరిర్రు. ఆల్ల బాధ పడలేక ఎత్తిచ్చినట్టు అయింది” వాపోయాడు పంకజ్.

“అయిందేదో అయిపోయిందిరా. తలరాత ఎట్ల రాసుంటే అట్లనే అయితది. విధిరాతను ఎవరం మార్చలేం గదా” సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు హృదయ్.

ఇంతలో పంకజ్ మరింత వెక్కడం వినిపించింది. “అరేయ్ పంకజ్ ఊకె ఏడ్వకురా. నువ్వు భయపడుతున్నంత ఏంగాదు‌. నేను గూడ వాట్సాప్ గ్రూపులల్ల, ఫేస్‌బుక్‌ల షేర్ జేస్త సరేనా. వీలైతే టీవీల గూడ వార్త ఏపిద్దాం. నువ్వు అంతలోపు ఎసుంటి పిచ్చి పిచ్చి ఆలోచన్లు వెట్టుకోకుంట ధైర్యంగ ఉండు. నిన్నిట్ల జూస్తె ఇంట్ల అందరు పరేషాన్ అయితరు. ఇంటికి పెద్దోనివి నువ్వఉ ఏం గుండెవల్గకు” అన్నాడు హృదయ్.

వెక్కుతూనే “థాంక్స్ రా ఉంటమరీ” “సరే.. బాయ్” అని ఫోన్ కట్ చేసి అనితను చూస్తూ నిట్టూర్చాడు. వాళ్ల డిస్కషన్ మొత్తం విన్న అనిత ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది.

ఇంతలో హృదయ్ నెర్వస్‌గా అంటున్నాడు. “ముందు నుయ్యి వెనుక గొయ్యి లెక్కటుంది మన పరిస్థితి. హైదరాబాద్‌ల కేసులు శితాం బుక్ అయితున్నయి. ఏమన్న బయటకు వోయి ట్రై జేద్దామంటే కరోనా భయం ఉన్నది” హృదయ్ గొంతులో జీర.

“అనవసరంగా ఆ పిల్ల పెండ్లి చేశిర్రు. నాకు పెండ్లి చెయ్యుర్రని ఎల్లాడినట్టే చేశిర్రు. చెయ్యకపోయినా గట్లనే ఉండేది. అసుంటోల్లు చాలా సెన్సిటివ్ ఉంటరు” అంటున్న అనిత వైపు చూస్తూ అవునన్నట్టు తలాడించాడు.

“ఎంత మంచిది పాపం. ఎటు వోయిందో.. ఏమేం గోస వడుతున్నదో. కరోనాల గూడ కొందరు కావురాలు వట్టిన బాడ్కావ్‌గాళ్లు పాపాలకు పాల్పడుతున్నరు. ఎడ్డిది, గొడ్డుది అంటలేరు. అదే టెన్షన్ అయితున్నది” అంటున్న భర్త భుజం మీద చేయి వేసింది అనిత.

“ఇప్పటిదాకా మీ దోస్తుకు ధైర్యం జెప్పి ఇప్పుడు నువ్వే ఇట్ల గావరైతే ఎట్ల? ఏంగాదు అనవసరంగ ఆలోచించకు” అంది భుజాన్ని నొక్కుతూ.

“ఎంటనే ఊరికి పోవాలనిపిస్తున్నది. కనీ పోలేం. పోంగ తొవ్వల కరోనా యాడ అంటుకుంటదోనని భయం‌. వర్క్ ఫ్రం హోమ్‌తోని మెసలకుంట పని అయితున్నది. ఇంత పని జేశినా సగం జీతమే ఇస్తున్నది కంపెనీ. ఇట్ల దేశంల ప్రతీ కంపెనీ దివాళా తీశింది. ఇంటి కిరాయోల్లు ఆగరు, కర్సులు మోపవుడు ఆగయి. ఎసుంటి దినాలు అచ్చినయి. ఇట్ల అయితదని ఊహించలేం. అవునూ పోరలేరి?” ఇంట్లో అటూ ఇటూ చూస్తూ అడిగాడు హృదయ్.

“ఇస్కుల్లు లేక దినాం ఆటనే అయింది వాళ్లకు. కింద ఆడుకుంటున్నరు” తాపీగా అంది అనిత.

“గేటుకు తాళం ఏశిర్రు గదా” “ఆ వేసే ఉంచిన. ఈ కరోనాతోని పాపం పోరగాళ్లను గూడ జైల్ల పెట్టినట్టు అయిపోతున్నది. ఈ అపార్ట్‌మెంట్‌ల కిందికి మీదికి ఆడుకుంటున్నరు అంతే” నిట్టూరుస్తూ అంది.

ఇంక మరో మాటకు ఆస్కారం లేకుండా తన ఫోన్‌లోంచి బక్క మెసేజ్ ఫార్వాడ్ చేశాడు. తన ఫోన్‌లోని అన్నీ గ్రూపుల్లో పెట్టాడు. అలాగే ఎఫ్బీ, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్‌లో కూడా ఫార్వాడ్ చేశాడు.

కొంతమంది తన హైదరాబాద్ స్నేహితులకు ఫోన్ చేసి మరీ చెప్పాడు.

* * *

బక్క అసలు పేరు స్వరూప. చిన్నప్పుడు కాస్త సన్నగా ఉందని వాళ్లమ్మ ‘బక్కవ్వ’ అని పిలుచుకునేది.

దీంతో అదే నిక్ నేమ్ అయిపోయింది. బక్కవ్వను కాస్త తోటి పిల్లలందరూ కలిసి ‘బక్క’ అని పిలవడం మొదలుపెట్టారు.

బక్కకు ముందు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లున్నారు. పంకజ్ బక్కవ్వకు పెద్ద తమ్ముడు. పంకజ్ టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం ఓ స్కూల్లో విద్యా వాలంటీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు కూడా చెబుతున్నాడు. బక్క వాళ్ల నాన్న అంగళ్లు తిరుగుతూ ఉల్లి, వెల్లుల్లి, అల్లం అమ్ముతుంటాడు. వాళ్లమ్మ ఇంట్లో చిన్నగా కిరాణా కొట్టు పెట్టుకుంది. పుట్టడమే బక్క మతి స్థిమితం లేకుండా పుట్టింది.

అలాగనీ మరీ మతిస్థిమితం లేనిదేమీ కాదు. తను మాట్లాడే మాటల్లో స్పష్టత లేకపోయినా అర్థమయ్యేవి. ఇతరులు చెప్పింది కూడా అర్థం చేసుకునేది.

ఇల్లు, వాడకట్టు తప్ప వేరే ప్రపంచం తెలియదు. అందరి పిల్లల్లాగ బట్టలు సరిగ్గా వేసుకోవడం, తల దువ్వుకోవడం వంటివి చేసేది కాదు. వాళ్లమ్మే అవన్నీ చేసేది.

అంతా బాగానే సాగుతున్న వారిని ఇరుగుపొరుగు వారు, బంధువులు బక్క పెళ్లి ప్రస్తావన తెచ్చి వారి కుటుంబంలో అశాంతికి కారణం అయ్యారు.

మిర్యాలగూడలో కిరాణా కొట్టు ఉంది మంచి అబ్బాయని కిరణ్‌ను చూశారు. కిరణ్ కూడా పెద్ద అందగాడేమీ కాదు. అతనికి పోలియోతో ఒక కాలు కుంటిగా ఉంది.

దీంతో అతనికి పిల్లను ఇచ్చేవారు కరువయ్యారు. ముప్ఫై ఐదేళ్ల వయసొచ్చింది. తనకింక ఈ జన్మకు పెళ్లి కాదని దిగులు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బక్క సంబంధం అతనికి వరంలా అనిపించింది.

బక్కను చూడగానే ఆతృతగా సంబంధం ఖాయం చేసుకుందాం అన్నాడు. ఈ జన్మకు తమ బిడ్డకు పెళ్లే కాదనుకున్న బక్క అమ్మానాన్నలకు ఈ సంబంధం ఖాయం అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అటు కిరణ్ అమ్మానాన్నలు కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్లు అడిగినదాంట్లో కొసరుతూ తమతో అయినంతలో పెళ్లి చేశారు. పెళ్లయ్యాక రెండు నెలలు సజావుగానే ఉన్నారు.

ఆ తర్వాత కోడలు పిచ్చిదని అత్తామామలు, పిచ్చిదాన్ని నాకు అంటగట్టారని కిరణ్ పోరడం మొదలుపెట్టారు. “దానికి వంటావార్పు వచ్చు. మాటలు జర తొతరతొతర వోతయి. ఇంటి మట్టుకు అన్ని పనులు సగవెడ్తది” అని బక్క వాళ్ల అమ్మానాన్నలు ఎంత సర్ది చెప్పినా కిరణ్ వినిపించుకోలేదు.

చివరికి వదిలేస్తానని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో బక్క వాళ్ల అమ్మానాన్నలు మహిళా మండలిలో ఫిర్యాదు చేశారు. వారొచ్చి చెప్పారు, చివరికి పోలీసులతో కూడా కౌన్సెలింగ్ ఇప్పించారు.

అయినా అతని తీరులో మార్పులేదు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రారంభ దశలో ఉన్నాయి. బక్కకు ఏవో కబూర్లు చెప్పి రాత్రి ఇంటిదాక దిగబెట్టి అటునుంచి అటే బస్సెక్కి తన ఊరు వెళ్లిపోయాడు కిరణ్.

భర్త మళ్లీ వస్తాడనే ధ్యానంలో ఉండిపోయింది బక్క. కిరణ్ చేసిన పనికి మండిపోయిన పంకజ్, కిరణ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తోంది.

వదిలించుకున్నాడని నిర్ధారించుకున్నారు. ఇంతలో దేశంలో, రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్రం పక్షం రోజుల సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది.

ఇది అయిపోయాకే కిరణ్‌తో మాట్లాడదామని భావించాడు పంకజ్. వైరస్ తీవ్రత, కరోనా మరణాలు రేటు పుంజుకోవడంతో లాక్‌డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ఈ మధ్యలో బక్క కిరణ్‌ను తలుచుకోని రోజు లేదు.

ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు అని నచ్చజెప్పుకుంటూ వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువే.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వికృత రూపం దాల్చి కరాళనృత్యం చేస్తోంది. ఎందరో బలి అవుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలతో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నారు.

ఎటుచూసినా కరోనా హాహాకారాలే. లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరోవైపు వలస కార్మికులు కూడా ఆకలికి అల్లాడుతున్నారు. పనుల్లేక తమ సొంతూళ్లకు కాలినడకన, సైకిళ్ల మీద వందలు, వేల కిలోమీటర్లు వెళుతున్న గుండెలు కలిచివేసే సంఘటనలు ఎన్నో.

చైనావాడి నిర్వాకంతో ప్రపంచం మొత్తం పరేషాన్ అవుతోంది. ఇలా మూణ్నెల్ల కాలం గడిచిపోయింది. ‘ఇక లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల్సిందే.. లేదంటే మరింత సంక్షోభంలో కూరుకుపోతాం’ అని భావించాయి ప్రభుత్వాలు.

లాక్‌డౌన్‌ను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఈ క్రమంలో ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన ప్రజలు తమతమ స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. దీంతో హైదరాబాద్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగింది‌. రోజుకు వందలు నుంచి వేలకు వేలు కేసులు నమోదవుతున్నాయి.

ఎటు వెళ్లాలన్నా ఎవర్ని ముట్టుకోవాలన్నా ఒక రకమైన భయం అందరిలో. బక్క, కిరణ్ నామస్మరణను ఇంకా పెంచింది. ఆ పేరే ఆమె నోటివెంట జపమైంది. ‘కిరణ్.. కిరణ్..,’ అంటూ అటూ ఇటూ పరుగులు పెడుతుంటే ఇంట్లో కట్టేశారు.

అయినా తాడు తెంపుకొని ఎదురైన బస్సులో ఎక్కి వెళ్లిపోతోంది. ఒకసారి మెదక్‌లో, ఒకసారి నర్సాపూర్‌కు వెళ్లి పట్టుకొచ్చాడు పంకజ్. స్థానిక డాక్టర్‌కి చూపిస్తే “క్రాక్ అయిపోయింది. తీసుకెళ్లి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించండి” అని చెప్పాడు.

నిద్ర కోసం ఏవో మాత్రలు రాసిచ్చాడు. అలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న క్రమంలో ఓరోజు రాత్రి హైదరాబాద్ బస్సెక్కింది. తన భర్తతో ఎలా వచ్చిందో కాస్త గుర్తు పెట్టుకున్నట్టుంది. అలాగే వెళ్లిపోదామని భావించి బస్సెక్కింది.

  • + +
    పక్షం రోజులు అవుతోంది బక్క తప్పిపోయి. నిత్యం సోషల్ మీడియాలో పంకజ్, హృదయ్ ఆ పోస్టును షేర్ చేస్తూనే ఉన్నారు.

ఇంతలో హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ మట్టుకు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అప్పటికే సోషల్ మీడియాలో హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉందనీ.. ఊళ్లకు వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోండనే వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

హృదయ్ తన పిల్లల గురించి ఆందోళన చెందుతున్నాడు. తనకేమైనా, పిల్లలకు ఏమైనా తట్టుకోలేడు. అసలే మధ్య తరగతి జీవితాలు. కరోనా సోకితే గాంధీలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సిందే.

అనిత కూడా ఊరెళ్లిపోదామని అంటోంది. వెళ్లడమే బెటర్ అనుకుంటుండగా బక్క గురించి తెలిసి ఆగిపోయాడు. బక్క ఆచూకీ తెలిశాక ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో ఓరోజు శంషాబాద్‌లో ఉండే మితృడు రాజు అనుకోకుండా ఫోన్ చేసి బక్క శంషాబాద్ బస్టాండ్‌లో కనిపించిందని చెప్పాడు. వెంటనే రమ్మన్నాడు.

ఆతృతగా హృదయ్ ఫోన్ కట్ చేసి బయలుదేరడానికి హడావిడి పడుతున్నాడు. అనిత వెంటనే చేతులకు గ్లౌజులు, ఫేస్ మాస్క్, గాగుల్స్, శానిటైజర్ సీసా తెచ్చి హృదయ్‌కి అందించింది. అవన్నీ తీసుకుని ఇంట్లో కాలు బయట పెడుతుండగా పిల్లలిద్దరూ “డాడీ మేమూ వస్తాం” అని హృదయ్ కాళ్లను అల్లుకుపోయారు. “డాడీ ఇప్పుడే అస్తరు. మీరు ఉండుర్రి” అంటూ అనిత వాళ్లిద్దరినీ పట్టుకుంది. హృదయ్ ఒక్క ఉదుటున బయటపడ్డాడు.

బైక్ కిక్ కొట్టాడంటే శంషాబాద్ చేరేవరకు ఎక్కడా ఆగలేదు. శంషాబాద్ బస్టాండ్ వద్దకు వెళ్లి బక్కను చూసి షాకయ్యాడు హృదయ్. జుట్టంతా చింపిరైంది. ఒంటిమీద దుస్తులు మైలబారి, చిరిగిపోయాయి. ఆ స్థితిలో బక్కను చూసి హృదయ్ మనసు తరుక్కుపోతోంది.

ఇంతలో పోలీస్ జీపు, అంబులెన్స్ వాహనాలు వచ్చాయి. హృదయ్ ఉండబట్టలేకపోయాడు మాస్క్ తొలగించి “బక్కా” అని గట్టిగా అరిచాడు. హృదయ్ పిలుపు విని తలతిప్పి చూసింది‌ బక్క. హృదయ్‌ని గుర్తుపట్టిన బక్క ముఖంలో ఆనంద చారికలు.

“అరేయ్ చిన్నా” అని ఏడుపందుకుంది. ‘చిన్నా’ హృదయ్ నిక్ నేమ్. హృదయ్ దగ్గరకు పరుగెత్తుకు వస్తున్న ఆమె చేతిని నిండా పీపీఈ కిట్ ధరించిన అంబులెన్స్ సిబ్బంది గట్టిగా పట్టుకుంది.

“చిన్నా చిన్నా” అని ఏడుస్తూ దగ్గుతోంది బక్క. “వదలండి సర్ తను మా ఫ్రెండ్ వాళ్ల సిస్టర్. మెదక్ దగ్గర గోపాల్‌పేట్ ఊరు తనది” గట్టిగా అరుస్తూ చెప్పాడు హృదయ్. “ఓకే బట్ ఆమెకు కరోనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే తాను చచ్చింది గాక ఇతరులను చంపుతుంది” మాస్కులో ఉన్న ఎస్సై అన్నాడు.

హృదయ్ ఖిన్నుడయ్యాడు. “ఈ ఏరియాలో గత వారం నుంచి కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈమె వల్ల కేసులు పెరుగుతున్నాయని ఇక్కడి స్థానికులు మాకు సమాచారం అందించారు. అందుకే గాంధీకి తీసుకెళ్తున్నాం. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి ఏమైనా ఉంటే చెబుతాం” అన్నాడు ఎస్సై.

“సర్ తనకు మామూలు సర్ది, దగ్గు కావచ్చు. గోలీలేసుకుంటే తక్కైపోతది” కంగారుగా హృదయ్ అన్నాడు. “అవన్నీ పరీక్షలు చేస్తేనే కదా తెలిసేది తప్పుకో” హృదయ్‌ని పక్కకు నెట్టాడు ఎస్సై. అంబులెన్స్ సిబ్బందికి రాజు, హృదయ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు.

‘‘ఈవారం నుంచి స్వరూప ఈ బస్టాండ్‌లనే ఉంటున్నదట. ఆకలైతే ఇండ్ల పొర్త వోయి అడుక్కచ్చుకొని తింటున్నదట. రాత్రింబగళ్లు కిరణ్ పేరే తల్సుకున్నదని ఇక్కడోల్లు చెప్పిర్రు. ఈ నాలుగైదు రోజుల సంది దగ్గుతుంది, తుమ్ముతుందట. ఇక్కడోళ్లందర్కి ఆమెకు కరోనా అచ్చిందని అనుమానం కలిగి పోలీసోళ్లకు ఫోన్ చేశిర్రంట. ఇసుంటి గోస పగోనికి గూడ రావొద్దుర” అంటున్న రాజు ముఖంలోకి చూస్తున్న హృదయ్ ముఖంలో దుఖ్ఖం పొంగుకొచ్చింది.

‘చిన్నా చిన్నా’ అంటూ ధీనంగా ఏడుస్తున్న బక్కను అంబులెన్స్‌లో వేసుకుని వెళ్లిపోయారు. వెంటనే పంకజ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను హైదరాబాద్ బయలుదేరి వస్తున్నానని పంకజ్ చెప్పాడు.

* * *
పంకజ్, హృదయ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి తన ధ్యాసంతా గాంధీలో ఉన్న బక్క మీదే పెట్టాడు. తినడం లేదు. పదేపదే గాంధీకి వెళ్లొద్దాం అంటున్నాడు. అక్కడ ఎవర్నీ రానివ్వడం లేదని హృదయ్ చెబుతున్నాడు.

“బక్కవ్వకు నిజంగనే కరోనా అచ్చిందంటవార” ఈ ప్రశ్న ఇప్పటికి వందసార్లు అడిగుంటాడు పంకజ్. “ఎహె రాదుర బై. అచ్చినా మన బక్కవ్వ దులిపేస్తది” ధీమాగా చెప్పాడు హృదయ్.

“ఏమోరా భయమైతున్నది. ఎటెటు తిరిగిందో.. ఎట్ల గడిపిందో తలుసుకుంటే దుఖ్ఖం ఆగుతలేదు” అని వలవలా ఏడుపందుకున్నాడు.

“అన్న నువ్వు అనవసరంగ ఆలోచించి మైండు కరాబ్ జేస్కోకు ఊకో” అని అనిత అంది.

ఇద్దరికి భోజనం వడ్డించింది. పంకజ్ కరుచుకుంటూ తిన్నాడు. పక్షం రోజుల తర్వాత గాంధీ నుంచి హృదయ్ ఫోన్‌కు కాల్ వచ్చింది. “స్వరూపకు నెగెటివ్ అని వచ్చింది. వచ్చి తీసుకుపోండి” ఆమాట వినగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనైంది హృదయ్‌కి.

అదే మాట పంకజ్‌కి చెప్పగానే “పోదాం పా” అని కంగారు పెడుతున్నాడు. ఇద్దరూ ఆటోలో గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. డిశ్చార్జ్ అయ్యేవారిని వెనుక గేటు నుంచి పంపిస్తున్నారని చెబితే ఆ వైపే వెళ్లారు.

అక్కడ రిసెప్షన్ సీట్లో కూర్చున్న ఓ డాక్టర్ వీళ్లిద్దర్నీ పిలిచాడు. “సారీ టు సే.. మీ స్వరూపకు కోవిడ్ లక్షణాలు ఏమీ లేవు. అసింప్టమాటిక్ ఉండే. అంటే ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌గా వస్తుంది. కానీ, మా డ్యూటీ మేము చెయ్యాలి కదా. ఈ వారం రోజులు తనను స్పెషల్ వార్డులో మంచానికి కట్టేసి ట్రీట్‌మెంట్ చేశాం. ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్ ఇచ్చాం” అని చెప్పారు.

ఇంతలో బక్క లోపలి నుంచి వస్తోంది. బలహీనంగా వస్తున్న బక్కను చూడగానే పంకజ్‌కు ఉద్విగ్నంతో కన్నీళ్లు ఆగలేవు.

“బక్కవ్వ” అన్నాడు. ఆ మాట విని తలెత్తి పంకజ్‌ను చూసి “తమ్మూ” అని ఉద్వేగంతో పరుగెత్తుకుంటూ వస్తోంది బక్క. దగ్గరికొచ్చి పంకజ్‌ను గట్టిగా పట్టుకొని వెక్కుతోంది. ఇంతలో ఏమైందో అకస్మాత్తుగా “కిరణ్.‌. కిరణ్” అని లీలగా అంటోంది.

ఆ పేరు వినగానే పంకజ్ పళ్లు పటపటా నూరుతున్నాడు. “అగో కిరణ్.. కిరణ్” అని గట్టిగా అరుస్తూ గేటు వైపు పరుగులు తీసింది. పంకజ్, హృదయ్‌కి ఏం అర్థం కాకుండా ఉంది. ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. డిశ్చార్జ్ అయి బయటకు వెళుతున్న పేషెంట్లను తప్పించుకుంటూ బక్క ఏకధాటిగా పరుగెత్తుతోంది.

ఆమె వెనకాల పంకజ్, హృదయ్ పరుగులు తీశారు. ఆ గుంపులో నిండా శాలువా కప్పుకుని నీరసంగా నడుస్తున్న వ్యక్తిని అనుసరిస్తోంది బక్క. పంకజ్, హృదయ్‌లకు ఏం అర్థం కావడంలేదు.

శాలువా కప్పుకున్న వ్యక్తి భుజం మీద చేయి వేసి తన వైపు లాగింది ‘కిరణ్ కిరణ్’ అంటూనే. ఆ కుదుపులకు అతను తూలుతూ బక్క వైపు తిరిగాడు. బక్క అనుమానమే నిజమైంది. అతను కిరణే. బలహీనంగా, నీరసంగా ఉన్నాడు.

కిరణ్‌ను చూసి పంకజ్, హృదయ్‌లు షాక్ అయ్యారు. తూలుతున్న కిరణ్‌ను గట్టిగా పట్టుకుంది బక్క. బక్క ముఖంలో ఎక్కడలేని ఆనందం తాండవిస్తోంది.

ఇన్ని రోజులు తను దేనికోసమైతే ప్రాణం పెట్టి ఎదురుచూస్తుందో అదే తన ముందు ఉండేసరికి బక్క ఆనందం నింగినంటింది. బక్కను చూసిన కిరణ్‌లో మునుపటి అసహ్యం, ఏవగింపు ఎక్కడా కనిపించడం లేవు. బహుశా అతనూ బక్క కోసం ఎదురు చూస్తున్నట్టే అతని కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. “సరూపా” అని గట్టిగా అరిచి బక్కను అలుముకుని పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు.

అక్కడున్న వారంతా వీళ్లను చూస్తూ “కరోనా తగ్గిందనే సంబురంల ఉన్నట్టున్నరు” అని అనుకున్నట్టు వెళ్లిపోతున్నారు.

వాళ్లని హృదయ్, పంకజ్ అలా నిల్చుని చూస్తున్నారు. “ఇప్పుడు బక్క ప్రపంచం కిరణే. బావను మంచిగ జూస్కుంటే అక్కను మంచిగ సూస్కున్నట్టే” అంటున్న హృదయ్ వైపు నిర్లిప్తంగా చూశాడు పంకజ్.

ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి రివ్వున వీస్తోంది. కాసేపటికి వాళ్లను అనుసరించారు పంకజ్, హృదయ్. పంకజ్‌ను చూడగానే కిరణ్ మరింత భావోద్వేగంతో వెళ్లి కౌగిలించుకుని

“నన్ను క్షమించు పంకజ్. నేను తప్పు జేశిన. సరూపను అరార గోస వెట్టిన. ఆ పాపం ఊకెనే పోలేదు. అమ్మానాయినలకు కరోనా అచ్చి సచ్చిపోయిర్రు. ఆల్ల శవాలు గూడ ఇయ్యలేదు. ఏడ బొంద వెట్టిర్రో గూడ తెల్వది. నాకు గూడ కరోనా అచ్చింది. ఈ గాంధీలనే ఉండి కోలుకున్న. ఇయ్యాల్ల డిశ్చార్జ్ చేశిర్రు. అనవసరంగ మంచిగైన.. నేను గూడ ఈ రోగంతోని పోయుంటే బాగుండేది. మాకు కరోనా అచ్చిందని ఏ సుట్టపోల్లు గూడ పల్కరిచ్చే పాపాన పోలేదు. ఒంటిగాన్ని అయిపోయిన” అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు.

అదంతా విని కిరణ్ మీదున్న కోపం మొత్తం పోయింది పంకజ్‌లో.. జాలి కలుగుతోంది. “అయిందేదో అయిపోయింది బావా బాధపడకు. నీకు మేము లేమా” అన్నాడు గాద్ఘధిక స్వరంతో.

బక్కకు తన అత్తామామలు చనిపోయారని అర్థమై ఏడుస్తోంది. “నా పెండ్లాం పిచ్చిదని దాన్ని సతాయించిన. కనీ అది నిజంగనే పిచ్చిది. నేనంటే దానికి పిచ్చి ప్రేమ. నన్ను సంటి పొలగాని లెక్కట సూసుకుంటది. దాని స్వచ్ఛమైన ప్రేమను నేను అర్థం జేస్కోలేకపోయిన.

ఇంతగానం పెండ్లాం ప్రేమ ఈ ప్రపంచంల ఏ మొగోన్కి గూడ దొరకదేమో” అంటున్న కిరణ్ కళ్లు ఏరుధారలయ్యాయి. “సై మాట చెప్పినవ్ బావా. ఈడినుంచి నీకంతా మంచే జరుగుతది. కరోనా నీలో మార్పు తీసుకచ్చింది. పా ఇగ ఇంటికి వోదాం. మిర్యాలగూడల ఒక్కోనివి యాడుంటవు. గోపాల్‌పేట్‌లనే దుకాణం పెట్టుకొని ఉందువు పా ఆడనే” హృదయ్ మాటలకు కళ్లు తుడుచుకుంటూ గుండెలో ఆత్మస్థైర్యాన్ని ప్రోది చేసుకుంటూ.. బక్క వైపు ఎనలేని ప్రేమతో చూస్తూ ముందుకు నడిచాడు కిరణ్.

కిరణ్ మీద నుంచి దృష్టి మరల్చని బక్కవ్వ అతని అడుగులో అడుగు వేసింది.

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాయుధ పోరాటం, తొలి, మలిదశ ఉద్యమాలు: కవిత్వం

by డా. ఏనుగు నరసింహారెడ్డి January 15, 2024
written by డా. ఏనుగు నరసింహారెడ్డి

”నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో
నేలకు రాలనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో”
అని ఎవరన్నారో తెలియదుకాని అచ్చుగుద్దినట్లతుకుతుంది ఈ నేలకు. తెలంగాణ భౌగోళికంగా దక్కన్‌ పీఠభూమిలో భాగం. పీఠభూమిలోని రాష్ట్రాలలో తెలంగాణ చరిత్ర, వారసత్వం భిన్నమయింది. పీఠభూమిలోని ఇతర ప్రాంతాలన్నీ బ్రిటిష్‌ పాలనలో ఉంటే తెలంగాణ మాత్రం రాచరికంలో మగ్గింది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా జాతీయోద్యమం లేదు. ఆంగ్ల విద్యలేదు. సంస్కరణలు లేవు. తెలుగు భాషలోని వ్యవహారికవాదం లేదు. వెరసి తెలంగాణ సమాజం 1948 దాకా భూస్వామ్యంలో ఆగిపోయింది. మాంటేగ్‌ ఛేమ్స్‌ ఫర్డ్‌ సంస్కరణలు, భారత స్వాతంత్య్ర చట్టం, ప్రొవెన్షియల్‌ కౌన్సిల్‌ కు ఎన్నికలు, పరిమితంగానైనా ప్రజాస్వామిక వాతావరణం ఇక్కడ మృగ్యం. కాబట్టి సామాన్యుడి జీవన వనరు అయిన భూమి భూస్వాముల చెరలో ఉండిపోయింది. సమాజంలో కష్టజీవుల శ్రమను దోచుకోవడం నిరాఘాటంగా కొనసాగింది. శ్రమజీవులు కొద్దిగా వెసులుబాటు కోరుకున్నా పీడన కొనసాగించింది భూస్వామ్యం. గదిలో బంధించి దాడి చేస్తే పిల్లి కూడా తిరగబడినట్లు సామాన్యులు అనూహ్యంగా తిరగబడ్డారు. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భూమికోసం, భుక్తికోసం, పీడననుండి విముక్తి కోసం సాగిన ఈ పోరాటం భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. కమ్యునిస్టు పార్టీ ఉద్యమానికి గీటురాయిగా లభించిన గొప్ప పోరాటమిది. 11వ ఆంధ్రమహాసభ భువనగిరిలో ఇచ్చిన పిలుపుతో 1944లో మొదలైన సాయుధపోరాటం 1951 వరకు వివిధ రూపాలలో, స్థాయిలలో కొనసాగింది. సాయుధ పోరాటంలో విస్తృతంగా సాహిత్యం వచ్చింది. సాహిత్యంలోని ఇతర రూపాలలో ఈ పోరాటం తక్కువగా చిత్రించబడినా పాటలో మాత్రం అపురూపంగా స్థిరపడింది. పాట సాయుధ పోరాటానికి ఊపిరులూదింది కూడా.

‘ఆపరేషన్‌ పోలో” పేరుతో భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా హైదాబాద్‌ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేసుకున్న తర్వాత సాయుధ పోరాటం పాక్షిక లక్ష్య సాధనతో ముగిసిపోయింది. మొదట మిలటరీపాలనలో జయంతి నాథ్‌ చౌదరీ, పౌర పాలనలో భాగంగా 26.1.1950 నుండి 6.3.1952 వరకు ఎం.కె. వెల్లోడి హైదాబాద్‌ రాష్ట్రాన్ని పాలించారు. 1952 మొదటి సాధారణ ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు. మద్రాసు నుండి విడిపోయిన ఆంధ్రులు కర్నూలులో అరకొర వసతితో పరిపాలన నడుపుతున్న క్రమంలో తెలుగు వారికొకే రాష్ట్రం అనే వాదాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు పావులు కదిపారు ఆంధ్రనాయకులు. అప్పటి హెదాబాద్‌ నాయకులు కె.వి. రంగారెడ్డి ఆధ్వర్యంలో దాన్ని వ్యతిరేకించారు. వీరి అపోహలను నివృత్తి చేస్తూ పెద్దమనుషుల ఒప్పందం చేసుకొని తెలంగాణకు కొన్ని రక్షణలు ప్రతిపాదించి ఆంధ్రప్రదేశ్‌ ను ఏర్పాటు చేసారు. తన పదవీకాలం పూర్తి కాకముందే బూర్గుల పదవి పోయింది. నీలం సంజీవరెడ్డి ఆం.ప్ర.కు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. పెద్దమనుషుల ఒప్పందంలోని ఒక ఒప్పందం ”ఆంధ్రప్రాంతం వారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం వారికి ఉపముఖ్యమంత్రి పదవి సృష్టించి ఇవ్వాలి”. నీలం సంజీవరెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే విలేఖరులు ‘ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారు’ అని అడిగారు. దానికి జవాబిస్తూ నీలం సంజీవరెడ్డి ‘ఉపముఖ్యమంత్రి పదవి ఆరవ వేలు లాంటిది. దాంతో అలంకారమే తప్ప ఏ ప్రయోజనమూ లేదు’ అన్నాడు. ఇలా ఆం.ప్ర. ఏర్పడ్డప్పటి నుండి అన్ని రక్షణ చర్యలను తుంగలో తొక్కారు ఆంధ్ర ప్రాంత పాలకులు. అప్పటికే ముల్కీ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న తెలంగాణ విద్యావంతులు ఆంధ్రులకు వ్యతిరేకంగా రగిలిపోయారు. 1969లో జై తెలంగాణ ఉద్యమం మెరుపులా ఆరంభమయింది. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 369 మంది విద్యార్థులు, యువత అసువులు బాసారు. ఈ సందర్భంగా సాహిత్యం అపురూపంగా సృజించబడింది. కథలు, కవిత్వం, పాటలు ఉద్యమాన్ని చిత్రించాయి. ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి.
జైతెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా అణిచివేసి తెలంగాణ వాడైన పీవీ నరసింహారావును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. తర్వాత పదేండ్లకే తెలుగుదేశం ఆవిర్భవించి ఎన్‌.టి.రామారావు రాకతో సీమాంధ్రుల వలసలు పెరిగిపోయాయి. చంద్రబాబు, వై.ఎస్‌. అధికారంలో ఉండగా ఆంధ్రుల ఆధిపత్యం పరాకాష్టనందింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా మేధావులు ఆలోచించారు. భువనగిరి డిక్లరేషన్‌తో దానికొక రూపం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, ఎన్నికలు, రాజీనామాలతో వాతావరణం వేడెక్కింది. వంటావార్పు, సకల జనుల సమ్మె, సాగరహారంతో తెలంగాణ రాష్ట్ర కాంక్షను కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రేసు పార్టీ స్పష్టంగా గుర్తించింది. సోనియాగాంధీ చొరవతో రాష్ట్రం 2.6.2014 ఆవిర్భవించింది. మలిదశ ఉద్యమ సందర్భంగా సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు స్పందించాయి. కథలు, నవలలు, వచనకవిత్వం, పద్యాలు, పాటలు వేలాదిగా పుట్టుకొచ్చాయి. ఉర్రూతలూపాయి.

సాయుధ పోరాట కవిత్వం:

‘అది తెలంగాణలోన దావాగ్ని లేచి
చుట్టుముట్టిన భీకరాశుభదినాలు
అని నిజాము నృపాలుని అండదండ
చూచుకొని నిక్కినట్టి పిశాచి కలలు
నాడు మానవతీ నయనమ్ములందు
నాగ సర్పాలు బుసకొట్టి నాట్యమాడె
నాడు మానవ నవనాగరికత
తన్నుదిన్నది రాక్షసత్వమ్ము తోడ’

అన్న దాశరథి పద్యాలు నిజాం రాజ్యపు చివరిరోజులకు అద్దం పడుతున్నవి. అరాచకాలను, శ్రమదోపిడీని, భూస్వామన పీడనను, పేదరైతులపై పన్నుల భారాన్ని తలపోస్తూ

‘తేనెలు పిండే తెలంగాణము
నెత్తుట ముంచెత్తెదరా?
తెప్పరిల్లిన ఈ తెలంగాణము
కుత్తుక బట్టొత్తెదరా?’

అని ప్రశ్నిస్తాడు భాగి నారాయణమూర్తి, పద్యము, గేయాలలోనే సాయుధ పోరాటపు చిత్రణ చూడవలసి ఉంది. కవిత్వంలో ఆధునిక రూపమైన వచనకవిత్వం బలంగా లేనప్పుడు, సాహిత్య రూపంగా పిలుచుకునే గేయం ప్రజల వాడుకలో మరింత సరళమైన పాటగా మారింది. ఉద్యమ నమోదుకు ఉద్యమ విస్తృతికి పాట మహాశక్తిగా పని చేసింది. సాయుధ పోరాటంలో ప్రధానమైన ఘట్టాలపైన, బందగీ హత్య, దొడ్డి కొమురయ్య కాల్చివేత, చాకలి ఐలమ్మ భూపోరాటంపైన పాటలు వచ్చాయి. అప్పటికే ప్రజా కవులుగా ప్రసిద్ధులైన బండి యాదగిరి, సుద్దాల హన్మంతు, నాజర్‌ మొదలైన వారు రచించి స్వయంగా పాడి పోరాటాన్ని బలోపేతం చేసారు. గ్రామీణ కూలీలైన జీతగాళ్ళ దయనీయ స్థితిని కళ్ళకు కడుతూ…

‘ఏరన్న రాక మునుపే ఎగువాక వచ్చేరన్నా
ఎవరింట ఉందువన్న బువ లేని జీతగాడ
భూమిని దుక్కిదున్ని పైరులనెల్ల సాకి
సోమరిపోతులను మేపాలి యెల్లకాలం
తెలియార తెలివితోడ కలవారి జీతగాడ’

అని పాడుతాడు నాజర్‌. ఇంతే దీనగీతాన్ని ఒక పసుల కాపరి మీద కేంద్రీకరిస్తూ

‘పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడా
పాలుమరిచీ ఎన్నాళ్ళయ్యిందీ
ఓ పాలబుగ్గల జీతగాడ
కొలువు కుదిరీ ఎన్నాళ్ళయ్యిందీ
ఆకు తేళ్ళు కందిరీగలు అడవిలోగల కీటకాలు
నిన్నేమైనా కాటు వేసాయా’

అని సుద్దాల హన్మంతు రాసిన పాట సాయుధ పోరాటానికి పునాది రాళ్ళను పేర్చింది. పోరాటం నిజాం రాజ్య పతనం మీద కేంద్రీకరించబడ్డాక బండి యాదగిరి రాసిన

‘బండెనుక బండిగట్టి
పదహారు బండ్లుగట్టి
ఏ బండ్లె వస్తవు కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్‌ రో
నైజాము సర్కరోడా’

అన్న గేయం బహుళ ప్రజాదరణ పొందింది. మొదట ఇది ప్రతాపరెడ్డి దొరకు వ్యతిరేకంగా కవి రాసినా ప్రజలు దీన్ని వస్తు విస్తృతి చేసి నిజాం పక్షంగా ప్రసిద్ధం చేసారు. ఈ కోవలో మేర మల్లేశం, ఆకుపత్ని శ్రీరాములు, తిరునగరి రామాంజనేయులు, కోగంటి గోపాలకృష్ణయ్య, నూతి నర్సయ్య, వట్టికొండ రామకోటయ్య, కాంచనపల్లి చినవెంకట రామారావు, నల్ల నరసింహులు, కణ్వశ్రీ, కాళోజీ, కొమరగిరి నారాయణరావు, అలువాల వెంకయ్య, వయ్యా రాజారాం, వానమామలై వరదాచార్యులు, కె.ఎల్‌. నరసింహారావుల గేయాలు, పాటలు సాయుధపోరాటాన్ని చిత్రించాయి. ఈ కవులే కాకుండా ఇతరులు రాసి పాడినవి ఎన్నో నమోదు కాకుండా పోయినవి. రాతలోకి రాకుండా నేరుగా కైకట్టి పాడుకొని పోరాటంలో పాల్గొన్న గాయక యోధులవి కూడా పోయినవి. నమోదు కాలేదు. కొన్ని పాటలు ప్రసిద్ధమై కర్తృత్వం తెలియకుండా కూడా పోయినవి.
జాల్నా జైలు దరోగాగా పనిచేసిన కూర్రుడు కోదండరాంరెడ్డిని నిందిస్తూ మేర మల్లేశం రాసిన

‘నీవు పెట్టిన హింస మేమెట్ల మరుతుము
వస్తుందిరా ఒక్కరోజు
కోదండ రాంరెడ్డి నిన్నొదిలి పోదు’

అనే పాట అప్పటి ఉద్యమకారుడి వేదనను కళ్ళకు కడుతుంది. ఆకుపత్ని శ్రీరాములు రాసిన

‘భలే మజాగున్నది నిజామోని సంగతి
హిందూ ముస్లీములు నా రెండు కండ్లంటడు
పెద్ద కన్ను చిన్నకన్ను
ఎంతో వికారంగ ఉంటడు’

అనే గేయం వ్యంగ్యంగా, ఆలోచనాత్మకంగా సాగుతుంటది. తిరునగరి రామాంజనేయులు సాయుధపోరాటంలో ‘రాక్షసుడు నైజాము రాజు పిచ్చిగరెచ్చి’ ఏమేం చేసాడో రాసాడు. కోగంటి గోపాల కృష్ణయ్య రాసిన ‘తెలంగాణ ప్రజలంత కలవాలోయ్‌ / తెగువతో పోరాడి గెలవాలోయ్‌’ అనే గేయం, వట్టికొండ రామకోటయ్య రాసిన ‘మనకొద్దీ పోలీసు రాజ్యం’ అనే గేయం, కాంచనపల్లి చినవెంకటరామారావు రాసిన ‘ఖరాఖండి’ అనే గేయం, నల్లా నరసింహులు రాసిన ‘జయభేరి మ్రోగించరా ఆంధ్రుడా / జయ పతాకంబెత్తరా’ అనే గేయం, కణ్వశ్రీ రాసిన ‘అది నా తెలంగాణ తొలగర కసాయీ! / అది నా తల్లినేల తొలగర గుండా’ అనే గేయం, కాళోజీ రాసిన ‘నల్లగొండలో నాజీ వృత్తుల / నగ్ననృత్యమింకెన్నాళ్ళు’ అనే గేయం, కొమరగిరి నారాయణరావు రాసిన ‘ఆంధ్రమహా సభ చూడ పోదాము రారండు’ అనే గేయం, అలువాల వెంకయ్యగారి ‘ఆంధ్రమహాసభకరుగుదెంచండి’ అనే గేయం, కె.ఎల్‌. నరసింహా రావు రాసిన ‘అమరజీవి కొమురయ్య’ గేయం, వానమామలై వరదాచార్యులు రాసిన గేయంలో నిజాం నుద్దేశించి రాసిన ‘చినిగిన గుడ్డలు దొడిగే చిత్రపు ఫకీరువయా / ఇనుమువలెనె బంగారపు ఇటుకలంక గూర్చుమయా’ అనే వ్యక్తీకరణలు ఈ కోవలో ఎన్నదగినవి.
కవిత్వపు నూతన పోకడలు అంతగా లేని ఆ రోజులలో కూడా వినూత్న వ్యక్తీకరణలున్న పాటలు ఇప్పటి పాఠకులను అబ్బురపరచగలిగేవిగా ఉన్నాయి కొన్ని. వయ్య రాజారాం చిలుకా అనే శీర్షికతో తత్వం చెప్పినట్లుగా పోరాటాన్ని చెబుతాడు.

‘మున్నాళ్ళ మురిపెంకు మురిసేవు తరిసేవు
ముందుగతి కానవేచిలుకా
అద్దె కొంపల నుండి గద్దెక్కి నాననుచు
మిడిసి పడకేరామ చిలుకా’

అంటాడు. ఇంకొక పాటలో ‘గురిగింజ గురిమల్లెలో” అనే దరువులతోనే పోరాటం పాటంతా రాస్తాడు. నూతినర్సయ్య ఈ కోవలో ప్రత్యేకంగా చర్చించదగిన కవి. ఈయన ఆలేరు కాల్పులపై బుర్రకథ రాసి ప్రజల పోరాటానికి అనుగుణమైన దర్వులో వీరగాథ చెప్పాడు. తిరునగరి ‘సైసైగోపాలరెడ్డి’ అనేది గొప్ప ఊపునిచ్చే పాట. సుద్దాల దెబ్బకు దెబ్బపాటలు కూడా అదే ఊపు ఉంటుంది. చూడండి.

‘వెయ్‌ వెయ్‌ వేయర దెబ్బ
దెబ్బకు దెబ్బ వేయ్‌ వేయ్‌
దయ్యపు గుండా గొయ్యలు రజాకార్లు
కయ్యానికి మనపైబడి వచ్చిరి’

వెట్టిచాకిరి మీద, శ్రమ దోపిడి మీద, ఎర్రజెండా మీద, ఉద్యమ కదలికల మీద అనేక పాటలు అజ్ఞాత కవులు రాసినవి కూడా పెద్ద సంఖ్యలో ప్రచారంలో ఉన్నాయి. ‘వేగరావోయి కార్మికా, వేగరావోయి కర్షకా’, ‘కొంగునడుముకు చుట్టనే చెల్లెమ్మ’ తదితర గీతాల కర్తృత్య నిర్ధారణ కోసం సాహిత్య విద్యార్థులు పరిశోధన చేయవలసిన అవసరం ఉంది.

జై తెలంగాణ ఉద్యమ కవిత్వం:

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి ఆంధ్రులతో కలిసినందుకు వారి ఆధిపత్యం మొదటి నుండీ అన్ని రంగాలలో కొనసాగింది. భాష, ఉద్య్యోగాలు, చదువులు అన్ని రంగాలలో వారిది పై చేయిగా చేసుకొని పెత్తనం సాగించారు. నిజాం పాలన నుండి మరల వీరి పాలనలోకి వచ్చినట్లయింది తెలంగాణ. అది భరించలేని తెలంగాణ ప్రజలు ‘ఆంధ్ర గోబ్యాక్‌’, ‘నాన్‌ ముల్కీ గో బ్యాక్‌’ పేరుతో 1969లో పెద్ద ఉద్యమం నడిపించారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అందులో పాల్గొన్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంగా కవులు, సాహితీ వేత్తలు కూడా ఉద్యమంలో గొంతు కలిపారు. అయితే అప్పుడు తెగించి రాసినవి, మాట్లాడినవి అన్నీ రికార్డు కాలేదు. దొరికిన వాటిలో కథలు, కవిత్వం, పాట ద్వారా ఉద్యమం వేడిని అంచనా వేయవచ్చు.
ఆం.ప్ర. ఏర్పాటును స్వాగతించిన ఆనాటి ప్రసిద్ధ కవులలో ఒక్క కాళోజీ మాత్రమే 1969 ఉద్యమాన్ని సమర్థించాడు. తెలంగాణ ఆకాంక్షను కృష్ణుడిగా, అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డిని కంసునిగా సంభావింపజేస్తూ

”కృష్ణుడివలె ‘తెలంగాణ
మొలుస్తాండు జేలులోన
బ్రహ్మానందుడు కంసుడు
బలుస్తాండు జేలినతల
రాజ్యమంత కాస’య్యల
రాజ్యము అనుకుంటున్నాడు
బ్రహ్మానందుని కాసు
బదనామైనది బజార్లో”

అని ప్రకటించాడు కాళోజీ. ‘తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా?’ అన్న కాళోజీ ప్రశ్నకూడా అప్పటిదే. సమైక్యమనే రాచపుండుకు సరియైన మందు వేయాలంటూ పేర్వారం జగన్నాథం

‘దిగాలు పడి చూస్తావెందుకు తమ్ముడూ!
మన తల్లికీనాడు
వెన్నులో పుట్టింది రాచపుండు
నాటు వైద్యులూ నర్మ సచివులూ పనికిరారు
ఏదో ఒక విధంగా తగిన చికిత్స చేయమంది
ఇంతలో ఈ వ్రణం మానిపోదు’

అని గొంతెత్తాడు.

‘వేరు పడితే కష్టమనడం
వెనుకటి రోజుల్లో మాట
కలిసిమెలిసి సుఖపడుట
కథల్లో సిన్మాలో నీతి’

అని కుండబద్దలు కొట్టాడు అగ్ని.

‘మేమంతా సిద్ధం
అనవరతం, అనుక్షణం
మా గడ్డ విముక్తి కోసం
మా బతుకులు తృణపాయం’

అన్నాడు వెన్నెల. చరిత్రను సూత్రీకరిస్తూ రుద్రశ్రీ

‘నేను తెలంగాణ పౌరున్ని
నేను తెలుగు మాట్లాడే మానవున్ని
రెండు వందల సంవత్సరాల నుండి
నిండుగా పరపీడన కలవాన్ని’

అని ప్రకటించాడు. ముకురాల రామారెడ్డి జై ఆంధ్రను తొక్కవేసిన అమానుషాన్ని ప్రశిస్తూ అలోచనాత్మకమైన కవిత రాసాడు.

‘నలభై ఎనిమిది నాటి
స్మృతులీనాడు సాక్షి
పాత గోలకొండ పత్రికలు సాక్షి
కులసతి మున్షీ కలము సాక్షి
కుట్రతెరుగని కుర్రలు
అన్నెం పున్నెం ఎరుగని బాబులు
అన్సోషల్‌ ఎలిమెంట్స్‌
పేర కాల్చబడ్డారు’

పెరుమాండ్ల సుధాకర్‌ సరళవాక్యాలు ఆ సందర్భాన్ని ఎలా స్ఫురణకు తెస్తాయో చూడండి.

‘తమ్ముడూ అనివచ్చిన
అన్నను చూసాను
తీపిమాటల చురకత్తుల్ని
విసరడం చూసాను
తల్లి యొడిలోన మంటల్ని
లేపడం చూశాను
తల్లి హృదిలోన పొంగిన
బాధల్ని చూసాను
చూడరానిది చూశాను
చూడాలని చూశాను
చూపుకందని అన్నల అహంకారానికి
అనురాగం లేని అంధుల అన్యాయానికి
అన్న, తమ్ముని యింట
పగవాగే అంటున్నాను’

అప్పుడు కొందరు తెలంగాణ వారు సమైక్యత వైపు కూడా నిలబడ్డారు. వారిని ఉద్దేశించి శీలం రాజేశం ఆలోచనాత్మకమైన కవిత ‘పిల్లికి ఎలుక సాక్ష్యం’ రాసాడు.

‘మంచి మాటలతో
మా ప్రయత్నం లేదా!
దంచి పుచ్చుకుంటాం
మా మంచి తెలంగాణను’

అన్నట్లుగా ఆ రోజుల్లో ఆంధ్రులపై దాడులు, బస్సెక్కి టిక్కెట్టు కొనకుండా జై తెలంగాణ అని కూర్చునుడు నడిచిందట. పిట్టల రామస్వామి అప్పటి ప్రభుత్వ పెద్దలను నిందిస్తూ

‘సిగ్గులేని మంత్రులంత
దోచినారు తెలంగాణను
ఉద్యమాన్ని అణచుటకై
దొంగ ఎత్తులేసినారు’

అని రాసాడు.
కవిత్వం మధ్యతరగతి బుద్ధిజీవులను కదిలిస్తే పాట సామాన్యులలో చైతన్యం రగిలిస్తుంది. 1969 ఉద్యమంలో స్త్రీలు కూడా పోరాట కవిత రాసారు. తెన్నేటి సుధాదేవి
‘తెలంగాణ జన్మ హక్కు
కాదన బ్రహ్మకు తరమా?’
అనడంలో మంచి శ్లేషసాధించింది, ఆనాటి ముఖ్యమంత్రి పేరును సూచిస్తూ, కుమారి కలువకొలను ‘ఎదిరిస్తార’ అనే కవితలో శాంతియుత పోరాటంలో రాష్ట్రం సిద్ధించదని చెప్పి రాసింది. ఈ కందుల జోసెఫ్‌, బాలాజీ గోగీకర్‌, నీలా జంగయ్య, కోవెల సంపత్కుమార, రావెళ్ళ వెంకటరామారావు, యస్‌. రాంబాబు, భారవ, యశోద, గిరి, ఋక్కు, సుంకుశ్రీ, యుగంధర్‌, శ్రీధర్‌ రెడ్డి, విద్యార్థి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కె.ప్రభాకర్‌, శేషభూషణ రావు, అనుముల శ్రీహరి, జగదీశ్వర స్వామి, బాసిరి, ఆకుపత్ని శ్రీరాములు, చెరుకు సత్యనారాయణరెడ్డి, రాజశేఖరం, కె. భాస్కర్‌ బాబు, వేణు సంకోజు, బయ్యా నాగరత్నం, చెరబండరాజు, భార్గవ, జి. యశోద, ఎస్వీ సత్యనారాయణ, కసిరెడ్డి వెంకటరెడ్డి తదితర కవులు తెలంగాణ పోరాటం సందర్భంగా కవిత్వం రాసారు. అయితే పోరాటానికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వని వాళ్ళు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు. వారు చాలామంది తెలంగాణ ఔన్నత్యాన్ని కవిత్వీకరించారు.
ఆనాటి పాటల్లో బహుళ ప్రజాదరణ పొందిన పాటలున్నాయి. కరృత్వం తెలియని

‘ఓ బ్రహ్మానందరెడ్డి నీ బతుకు బంజర దొడ్డి
పుట్టింది ఆంధ్రపుటుక పెరిగింది తెలంగాణ
మా డబ్బు దోచినావు ఆంధ్రోల్లకిచ్చినావు’

లాంటి పాటలతో పాటు స్వయంగా పాటలు తామే రాసిపాడిన కవులున్నారు. ముచ్చెర్ల సత్యనారాయణ 1952లోనే గైర్‌ ముల్కీ గోబ్యాక్‌ అని నినాదం ఇస్తూ ఉర్దూ తెలుగు కలగలిసిన ఈ పాట రాసాడు. చూడండి.

‘సంజీవరెడ్డి మామా
సునోజీ మేరా గానా
కహతా హై తెలంగాణ
ఇన్సాన్‌ తుమ్‌ కోమానా
ఐసా కభీ న జానా
బందర్‌ కే కార్నామా
బాతేఁతో లాక్‌ బోలా
బహుల్‌ జల్ద్‌ మగర్‌ భూలా
హోగయే తేరా హవాలా
నికల్‌ గయా దివాలా
ఛోడో జీ తెలంగాణ
చలే జావో రాయలసీమ’

పక్నుద్దీన్‌ విజయమో వీర్‌ స్వర్గమో తేల్చుకొమ్మని చెప్పే పాట రాసాడు. ఇది విద్వత్కవి రాసిన కవితలాంటి గేయం.

‘విజయమ్మో లేక వీర మరణమ్మో కాక
వేరొక్కటి నేను గోర వేరెం దున నేను జేర
కదనమ్మో లేక విష్ణు సదనమ్మో కాక వేరు
విషయమ్ముల నేను గోర, వృత్తమ్ముల నేనుజేర’

అని నడుస్తుందీ గేయం. అనుముల శ్రీహరి గేయాలు చాలా శక్తివంతమై ప్రసిద్ధిలోకి వచ్చాయి. మనవాళ్ళు పెద్దమనుషుల ఒప్పందం మీద గుడ్డిగా సంతకం పెట్టారని విమర్శిస్తూ

‘అంతా మన పెద్దవాళ్ళ అల్పబుద్ధి హేతువురా
స్వంత లాభమొకటి చూసి సంతకాలు చేసినారు
చౌ ఎన్‌ లై వంటి వాళ్ళ సన్నిధిలో చేరినారు
భావి తెలంగాణ ప్రజల బతుకులతో ఆడినారు’

అంటాడు. ఇంకా ఎస్‌. మాధవీయాదవ్‌, కమలేకర్‌ రామచంద్రజీరావు, మంత్రి శేషభూషణ్‌, ఎం. సుదర్శన్రెడ్డి తదితరుల పాటలు కూడా ఈ కోవలో పేర్కొన దగినవి.

మలిదశ ఉద్యమ కవిత్వం:

మలిదశ ఉద్యమారంభాన్ని మలిదశ ఉద్యమ కవిత్వాన్ని ఎక్కడ ఎట్లా పారంభమయిందో చెప్పడం కష్టం. 1995 నుండి ఈ దిశగా మేధావులు, తొలిదశ ఉద్యమ కారుల ప్రయత్నం పునః ప్రారంభ మయింది. జర్నలిస్టులు, కవులు, గాయకులు 2000 సంవత్సరం తర్వాత పూర్తిగా ఈ వాదంపై ఆలోచించడం, రాయడం మొదలయింది. తెరాస ఏర్పాటయ్యాక తెలంగాణ వాదంపై కార్యావళి మొదలయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను 2009, డిసెంబర్‌ 9న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి డిసెంబర్‌, 23న దాన్ని ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ వారికి ఒక షాక్‌ ట్రీట్‌ మెంటుగా పని చేసింది. అప్పటి దాకా కొంత ఉదాసీనంగా ఉన్న తెలంగాణ వారు కూడా రాష్ట్రం ఏర్పడి తీరాల్సిందేనన్న ఏకాభిప్రాయానికొచ్చారు. ఇక అప్పటి నుండి ఉద్యమం ఆగలేదు. సాహిత్య సృజన కూడా ఆగలేదు. వేలాదిగా కవితలు, పాటలు పుట్టుకొచ్చాయి. డజనకొద్ది సంకలనాలు, వందలాదిగా సంపుటాలు, ఎక్కడ వీలైతే అక్కడ కవిసమ్మేళనాలు నిర్వహించబడ్డాయి. అనేక సాహిత్య సంస్థలు అందులో మునిగిపోయాయి. తెరవే చేసిన కృషి గొప్పది. మరసం, తెసావే, నీలగిరి సాహితి, పాలమూరు సాహితి, హైకవే తదితర సంస్థలు పనిచేసాయి. పొక్కిలి, మత్తడి, మునుం, జులూస్‌, ములాఖాత్‌ వంటి సంకలనాల కొద్దీ కవితలు వచ్చాయి. వీటన్నింటినీ శీర్షికలుగా విభాగించి విశ్లేషించడం కానీ, కవులందరినీ, కవితలన్నింటినీ కనీసం పేర్కొనడం కానీ చిన్న విషయం కాదు. చిన్న వ్యాసంలో కేవలం విహంగ వీక్షణం మాత్రమే చేయగలం. అది కూడా వస్తుకేంద్రంగానే.

తెలంగాణ భాషా హేళనను ధిక్కరిస్తూ ప్రజల జీవభాషగా ఎలుగెత్తిన కవితలు చాలా వచ్చాయి. ఆ రోజుల్లో తెలంగాణ భాష మీది ప్రేమను ప్రకటిస్తూ

‘నా తెలంగాణ భాష
ఊటల తేటనీరసొంటిది
సవ్వారి కచ్చురాల నడకల్లో ఇనిపించే
మువ్వల సప్పుడు సొంటిది
పిల్లంగోయని ఇనిపించే రాగమ సొంటిది’

అంటాడు టీ. కృష్ణమూర్తి యాదవ్‌. నందిని సిధారెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేసి ఆధిపత్య భాషీయులను ధిక్కరిస్తూ

‘మాటకు రంగులద్దిన మాయలోడా
నీ కొంచెపుతనానికి
నా మాట మంచం పట్టింది గదరా
దోసెడు రక్తమిచ్చి బతికించుకుంటా నా మాటను’

అంటాడు. భాషా విచక్షణను పాటలో కూడా ప్రశించాడు లైనేష్‌ కుమార్‌.

‘అప్పారావో నీకు లెక్కల్‌ రావో
అప్పారావో నీకు తెలంగాణ మాటలు రావో
నీవు పిట్టల దొరవ్‌ పొద్దున పోతవ్‌
బి.డి. ఎల్‌.లో డ్యూటీ ఉంటది పిట్టలుగోటె పోత ఉంటది
ఊరూ ఊరూ తిరగపోతవు ఉడకందే తింటనంటవు
తెలంగాణ రాదంటవ్‌ తెలివిలేని వాళ్లంటవ్‌’

అన్నది ఆయన పల్లవి. ఎలికట్టె అయిలయ్య ‘తెలంగాణ రథం’ గేయంలో ‘భాషలోని యాస మీద ఎక్కిరింపులేందన్నం’ అని ప్రశ్న వేస్తడు. ప్రసిద్ధి పొందిన కాళోజీ భాషా వెటకారం ఈ ఉద్యమంలో బాగా ప్రచారంలోకి వచ్చింది.
ఒక వేళ తెలంగాణ నిజంగా ఏర్పడితే హైద్రాబాద్‌ మాత్రం యుటీగా గాని ఉమ్మడి రాజధానిగా గాని ఉంచాలన్న సీమాంధ్రుల ఆశలను తెలంగాణ కవులు అవహేళన చేసారు. భీం వంశీరాం చందర్‌ అనేకవి మొఖం మీద కొట్టినట్లు జవాబిచ్చాడు.

‘హైద్రబాదు మాదంటే మూతపండు రాలుతాయి
మర్యాదగ పోకుంటే రోకండ్లే ఎగురుతాయి
మీ అబ్బసొత్తు కాదురో హైద్రాబాదు మాదిరో
తెలంగాణ గుండెరో హైద్రబాదునిడువంరో’

అని ఈ కవి రాత వెనుక సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిన ఒక వ్యాస స్ఫూర్తి ఉందనిపిస్తుంది. ‘హైద్రాబాద్‌ జనని తెలంగాణ’ ను సుంకిరెడ్డి ఆంధ్రజ్యోతి డైలీలో రాస్తూ హైదాబాద్‌ నిర్మాణ పనుల్లో తెలంగాణ జిల్లాల శ్రామికుల పాత్ర మాత్రమే ఉందని రాసాడు. హైదాబాద్‌లో పుట్టి పెరిగిన లోకేశ్వర్‌

‘నా జానె జిగర్‌ నగర సుందరి కళ్ళు ముక్కు చెవులు చెంపల్ని చెక్కేసి
నామరూపాల్లేని అనామికను చేస్తున్న చట్టబద్ద కోస్తా ఉగ్రమూకలు
పట్నాన్ని ఎకరాలుగా గజాలుగా లెక్కిస్తున్న నయా వలస పాలకులు’

అని నిందిస్తాడు.
తెలంగాణ వనరుల దోపిడీపై చాలా కవిత్వం వచ్చింది. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి దోపిడీని సృజనాత్మకంగా వ్యక్తీకరిస్తూ

‘భూమి ఒక బ్లాంక్‌ చెక్‌
నీరు దాని విలువను నిర్ణయిస్తది’

అంటాడు.

‘నిజం దేవుడెరుగు
నీరుకొస్తానెరుగు’

అని కూడా తనే అనగలిగినంత లోతైన అధ్యయనం ఆయనది. అమ్మంగి వేణుగోపాల్‌ వనరుల దోపిడీ ఇంకొక విధంగా ఆలోచించాడు.

‘సచివాలయం తవ్వి చూడు
తెలంగాణ బొంద కనిపిస్తది’

అన్నాడు.
ఈ ప్రాంతపు మౌలిక విశేషాలను ఆత్మగౌరవాన్ని సగౌరవంగా ప్రకటించారు కవులు. ఇక్కడి పండగ పబ్బాలను నెత్తికెత్తుకోవడంతో పాటు ఇక్కడి ప్రజలను తక్కువ చేసి మాట్లాడే మాటలకు తిరుగులేని జవాబు లిచ్చారు. బతుకమ్మ పండుగనాటి కళను వర్ణిస్తూ దేశపతి శ్రీనివాస్‌

‘పండుగ రోజులల
లైట్లు లేకపోయినా
పల్లె పల్లెంతా గొప్ప వెలుగే
గాలి నిండా
గునుగులూ తంగేళ్ళ గుసగుసలే ‘

అంటాడు. కాసుల లింగారెడ్డి బతుకమ్మను విప్లవాత్మగా సంబోధిస్తూ

‘భూస్వామ్యాన్ని భూస్థాపితం చేసిన బతుకమ్మ
సమస్త సాంస్కృతిక ఆధిపత్యాల మీద
సరికొత్త ఆయుధం’

అంటాడు. యాభైయ్యేండ్ల తేనెపూసిన పెద్దన్నల ప్రేమను వినూత్నంగా చెబుతూ డా.కొండపల్లి నీహారిణి

‘అక్షరాలు కలిసి ఉన్నట్లే
మనమూ అర్థ శతాబ్దం నుంచి పుస్తకాలు తెరిస్తే మాత్రం
నేను ఒక్క పేజీలోనూ లేను’

తిప్పి పొడుస్తారు. నగర సంస్కృతిని చెబుతూ గంగా జమునా తహజీబ్‌ ను వర్ణిస్తాడు ఎస్‌. జగన్‌ రెడ్డి.

‘ప్రతి బస్తీ చివర
ఒక మజీద్‌ ఒక మందిర్‌
అజా పిలుపే మేలు కొలుపు’

ఉద్యమానికి ముందు, ఉద్యమ కాలంలోనూ తెలివైన ఒక ప్రచారాన్ని ప్రవేశపెట్టారు. దానర్థమేమిటంటే ఆంధ్ర వారు చాలా కష్టబోతులు, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులు. అదేనిజమైతే వాళ్ళ అక్కడే శ్రమలు దుమికించుకోవచ్చు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి దోపిడిచేసి మాకు పేరుబెట్టడం ఎందుకని కవులు ప్రశ్నించారు. సాయిచంద్‌ ఇలా ప్రశ్నిస్తాడు.

‘మా విజయవాడలో కనకదుర్గమ్మ కాసుల రాసులు అడిగినమా
తిరుమల తిరుపతి వెంకటేశుని హుండీ లెక్కలు అడిగినమా
కాకినాడ మీ విశాఖపట్నం ఓడరేవు మేమడిగినమా
కృష్ణా డెల్టా గుంటూరులో గుంటెడు జాగను అడిగినమా’

ఆంధ్రులు కష్టబోతులు, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులు అన్న ప్రచారాన్ని ‘వాళ్ళు కష్టపడ్తర్సార్‌’ అన్న కవితలో చాలా వ్యంగ్యంగా తిప్పికొడతాడు, ఏనుగు నరసింహారెడ్డి. చూడండి.

‘వాళ్ళు
కోనసీమలో కొబ్బరాకులమ్మి
ప్రజ్ఞాపురంలో పత్తితోటకొంటరు
…………….
మనోళ్ళు
చరిత్ర చింతాక్రాంతమైనప్పుడు
రాయి ముక్క అవసరం లేకుండా
చార్మినార్‌ ను కట్టి చందమాముకు పోటీపెడ్తారు’

మలిదశ ఉద్యమంలో పెను విషాదం విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలు. ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులమీద విస్తృతంగా కవిత్వం, పాటలు వచ్చాయి.

‘మీ తాతలు
నెత్తురు మోటలు గొట్టిండ్లు
పోరు పంటలే పండించిండు
తుఫానుకు జోరు మనపోరే నేర్పింది
నీళ్ళకాల్వకు రువ్వడి నెత్తుటి కాల్వే నేర్పింది
బిడ్డా! పానం దీస్కున్నవ్‌
తెలంగానొస్తదా ..?’

అని ఒక తల్లి గొంతుకగా ప్రశ్నిస్తాడు పి.యాదగిరి.

‘వీరులు మరణిస్తే
ఉద్యమాలు బెంగటిల్లుతై
పోరాటాలు మసకబారుతై
మీ బలిదానాలకు
వాళ్ళ కంటి కొలుకుల్లోంచి
ఒక్క దుఃఖపుచుక్కెనా రాలనప్పుడు
గుండె గదిలో రెండు
వేదనా కదలికలైనా పుట్టినప్పుడు
చావుకెందుకు మీకు మీరే
రహదార్లు పరుస్తున్నారు’

ఒక తండ్రిలా ఉదారి నారాయణ అమరులను ప్రశ్నిస్తాడు. ఇక దరువు ఎల్లన్న రాసిన

‘వీరులారా వందనం విద్యార్థి
అమరులారా వందనం పాదాలకు
మా త్యాగధనులారా మంచిపోమూ మేము
గుండెల్ల గుడిగడుతం పోరుదండం బెడుతం’
అనే పాట, మిట్టపల్లి సురేందర్‌ రాసిన

‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా
రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసె ఓ బ్రహ్మదేవా
తల్లికొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా
తెలిసుంటె చెట్టంత నా కొడుకును
తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు’

అనేపాట, గద్దర్‌ విప్లవోద్యమంలో భాగంగా రాసి పాడిన

‘ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో గలిసినారా
సుక్కలలో గలిసి మీరు సూరులయినా మొలసినారా
ఏ దిక్కులేనోళ్ళకు మా బిడ్డలు
మీరు దిక్కులూపే చుక్కలయ్యిండ్రా మా కూనలు’

అనే పాట మలిదశలో కళ్ళనీళ్ళు పెట్టించాయి. ఇలాంటి సామూహిక స్మృతిగీతాలే కాక వ్యక్తిగతంగా కూడా స్మృతి కవిత్వం, స్మృతి గీతాలు వచ్చాయి. వేదికలను ఉర్రూతలూగించాయి. అందెశ్రీ ఉద్యమంలోనే పాడిన మంగళాశాసనం

‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’

2.6.2014న నిజమయింది. తెలంగాణ రాష్ట్రావిర్భావానంతరం, ఆవిర్భావ సందర్భంగా కూడా పాటలు, కవితలు వచ్చాయి. పత్రికలను అలంకరించాయి.
ఉద్యమం పరిసమాప్తమయ్యాక దాని రూపం ఘనీభవిస్తున్న తరుణంలో చిన్న సంఘటనలు, చిన్న సందర్భాలు, చిన్నచిన్న ఊతాలు మరుపుకు గురవుతాయి. అందులో ఆశ్చర్యం గాని ఆవేదన చెందాల్సిందిగానీ లేదు. కానీ ఉద్యమం సఫలీకృత థకు రాగానే శతృశిబిరం మిత్రులకన్నా ముందు ఉద్యమ కేంద్రానికి చేరుకోవడం అన్యాయం. ఇది ఎక్కువగా రాజకీయులలో ఉంటుంది. కవులకు ఆకాంక్షలుంటాయి. అవి ప్రజాప్రేరితం. ఆశలేమీ ఉండవు. వారి పేరు పుటలలో ఉంటుంది. అంతేచాలు. మలిథ ఉద్యమంలో పేర్కొనాల్సిన కవులు లెక్కకు మిక్కిలి. వారిలో చర్చకు పెట్టాల్సి ఉండి పెట్టలేకపోయిన వారు ఎందరో. అందులో కొందరి పేర్లు.
గూడ అంజయ్య, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, తిరునగరి దేవకీదేవి, మిత్ర, జయరాజు, మల్లావఝుల సదాశివుడు, అనిశెట్టి రజిత, జ్వలిత, వరంగల్‌ శ్రీనివాస్‌, నేర్నాల కిషోర్‌, దయా నర్సింగ్‌, సురా, దర్వు ఎల్లన్న, దర్వు అంజన్న, కొల్లపురం విమల, కోదారి శ్రీను, ఏపూరి సోమన్న, కొమిరె వెంకన్న, యశ్‌ పాల్‌, గిద్దె రాంనర్సయ్య, పాటమ్మ బిక్షపతి, పైలం సంతోష్‌, వరవరరావు, మురళి మధు, చెన్నాడి వెంకట రమణారావు, వై. వెంకన్న, గోగు శ్యామల, డా.ఏ. జయంతి, అంబటి వెంకన్న, యోచన, వేణు సంకోజు, బెల్లియాదయ్య, షేక్‌ బాబా, గాజోజు నాగభూషణం, ఎస్‌.వి. మల్లిక్‌ తేజ, ఓరుగంటి శేఖర్‌, జనార్థన్‌, దేవరశెట్టి జనార్థన్‌, బుర్ర సతీష్‌, కందికొండ, నిస్సార్‌, సినారె, ననుమాస స్వామి, శ్రీరామోజు హరగోపాల్‌, జూలూరు గౌరీశంకర్‌, కాశీం, దాసరాజు రామారావు, అయాచితం నటేశ్వర శర్మ, అభినయ శ్రీనివాస్‌, పిట్టల రవీందర్‌, పత్తిపాక మోహన్‌, మౌనశ్రీ మల్లిక్‌, డప్పు రామస్వామి, కాంచనపల్లి, వేముగంటి మురళీకృష్ణ, వెలపాటి రామరెడ్డి, మండలస్వామి, పెరుమళ్ళ ఆనంద్‌, పగడాల నాగేందర్‌, మునాసు వెంకట్‌, కూకట్ల తిరుపతి, అన్నవరం దేవేందర్‌, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, గుడిపాటి, రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, నాళేశ్వరం శంకరం, కంశ్రీ, వేముల ఎల్లయ్య, వెల్దంది శ్రీధర్‌, వఝల శివకుమార్‌ తదితరులు.
భౌగోళికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకమైన అస్తిత్వం గలిగిన తెలంగాణ ఒక రాష్ట్రంగా భౌతికంగా ఏర్పడడం ఇక్కడ ప్రజలందరికీ పండగ రోజు. ఒక ప్రజాస్వామిక వాతావరణం ఇక్కడ పరిఢవిల్లడం కోసం కవుల ఆలోచనల అవసరం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది.

        - డా||ఏనుగు నరసింహారెడ్డి
                  8978869183

ఉపకరించిన గ్రంథాలు

  1. నిప్పుల వాగు – సం. అందెశ్రీ – వాక్కులమ్మ ప్రచురణ
  2. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం- డా. వెల్దండి శ్రీధర్‌ – తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ
  3. జనని, తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం – సం. రుద్రశ్రీ వెన్నెల – తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ
  4. తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు-డా. ఏనుగు నరసింహరెడ్డి -నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌, హైద్రాబాద్‌
  5. ప్రత్యూష – వివిధ రచయితలు – తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ
  6. పరంపర – సం. నందిని సిధారెడ్డి – తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ
January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథా పంచకం

by Dr. Lakshmanacharyulu M January 15, 2024
written by Dr. Lakshmanacharyulu M

1. పోనీ ! పోనీ !

కోల్‌ కతా ఓ మహానగరం. పెద్ద సంఖ్యలో.. చాలా పెద్ద సంఖ్యలో జనం అక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే అక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. లక్షల మంది బస్సులు, స్టీమర్ల, హ్రంలు, ట్రైయిన్లు, ఇలా ఏ వాహనం దొరికితే దానిలో, ఆఫీసులకి, ఇతర పనులకి వెళ్తూ – వస్తూ ఉంటారు. రవాణా సాధనాలన్నీ ఎప్పుడూ క్రిక్కిరిసిపోయి ఉంటాయి.

రామం, సుధీర్‌, జేమ్స్‌, అయూబ్‌ – నలుగురూ వేర్వేరు ఆఫీసుల్లో పనులు చేస్తూ, రోజూ ప్రొద్దున్నే వెళ్ళడం, తిరిగి ఇళ్ళకు రావడం చేస్తూ ఉంటారు. పరస్పరం పరిచయాలైతే లేవు, కాని ఇవ్వాళైతే నలుగురూ ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నారు.

బస్సు ప్రయాణీకుల్తో కిటకిటలాడుతోంది. సూదిమొనంత ఖాళీ కూడా లేదు. రామం, సుధీర్‌, అయితే ఎలాగో అలా త్రోసుకుంటూ లోపలికి వెళ్ళ గలిగారు. జేమ్స్‌ కొంచెం కష్టపడితే ఇక లోపలికి వచ్చేస్తాడు కాని పాపం ! అయూబ్‌ బస్సు ద్వారం దగ్గరే కడ్డీ పట్టుకుని వ్రేలాడుతూ ఉన్నాడు.

ఇంతలో బస్సు కదిలింది. రోడ్డు మీద జనం బస్సుల్లో జనం. ప్రజల మానసిక థ కూడా దిగజారి పోయింది. ఎవరూ ఎవర్ని లెక్క చేయరు. ఎవరి స్వార్థం వారిదే. ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు రామం.

అంతే ! ధడేలన్న శబ్దం. ఏదో పడిపోయినట్టయింది. ఎవరిదో భయం నిండిన ‘కేక’ హృదయ విదారకంగా వినబడింది. బహుశా అయూబ్‌ పడిపోయినట్టున్నాడు. అలా క్రింద రోడ్డు మీద పడిపోయిన అయూబ్‌ మీది నుండి – వెనకాలే వచ్చిన ఒక వాహనం, వేగం నియంత్రణ కోల్పోయినందున, వెళ్ళిపోయింది. అయినా….

రామం, సుధీర్‌, జేమ్స్‌ మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినబడుతున్నాయ్‌…

అరే ! భయ్యా ! మా ఆఫీసుకు లేటయి పోతోంది.

పద, పద !! పోనీ ! పోనీ !! బస్సు పోనీ !!

2. మీ గొప్ప కోసమని…

ఒకప్పుడు గురు శిష్యులిద్దరూ ఒక ఊర్లో ఉండేవారు. ఇద్దరూ ప్రతిరోజూ జ్ఞాన సంబంధమైన  చర్చ జరుపుతూ ఉండేవారు.

ఒకరోజున గురువుగారు శిష్యుణ్ణి పిలిచి – ”ఇవాళ నేను ఓ గంటసేపు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతా.. నువ్వు జాగ్రత్తగా విని విశ్లేషిస్తూ, నేనేం చెప్పానో సరిగ్గా చెప్పాలి” అని అన్నాడు.

ఓ గంటసేపు గురువుగారు తన గురించి చెప్పాక, విశ్లేషించమని కోరగా, ”అయ్యా ! మీరు ఎక్కువగా మీ గురించే మీరు పొగుడుకున్నారు. ఆత్మస్తుతి ఎక్కువైంది. మీకు ”నేను” అనేది ఎంత ఇష్టమని తేలిందంటే, సుమారుగా ప్రతి వాక్యంలోనూ దాన్ని ఉపయోగించారు. ఇక ఇతరుల్ని చాలాసేపు నిందించారు, విమర్శించారు. మీకు మీలోని మంచితనం మాత్రమే కనిపించగా, ఇతరుల్లోని లోటుపాట్లు, తప్పులు మాత్రం మీకు కనిపించాయి”.

”మీ వ్యక్తిగత జీవితం గురించి విన్నాక ”మీరు మీ కీర్తి కోసం, మీ గొప్పత కోసం ఇతరుల్ని విమర్శకు గురిచేస్తూ, వారిలో ఏవో తప్పులు వెదుకుతూ ఉంటారని నాకు అర్థమైంది” అని అన్నాడా శిష్య పరమాణువు.

3. స్వర్ణ యుగం

భూమ్మీద ఒక్కో మతానికి చెందిన ఒక్కో వ్యక్తి మిగిలాడు. పరస్పరం పోట్లాడుకున్న దాని ఫలితంగా ఇలా జరిగింది. ఇప్పుడు వారి కళ్ళల్లో ఈర్ష ్యకి బదులు భయం చోటు చేసుకుంది. తమలో తాము పోట్లాడుకుని, పోట్లాడుకుని మనుషుల ఎత్తు బాగా తగ్గిపోగా, చుట్టూ ఉన్న జంతువుల ఎత్తు బాగా పెరిగిపోయింది. ఆ పశువులన్నీ మనుషుల్ని చుట్టుముట్టాయి.

”ఇక మనం బ్రతికి బట్ట కట్టలేం. ఈ జంతువులు మనల్ని తినేస్తాయి” అని అన్నాడో మనిషి.

మరొకడు కొంచెం తెలివిగలవాడు ”అసలు ఇన్ని శతాబ్దాలుగా మనిషి ఎలా తప్పించుకున్నాడో గదా అని ఆలోచిస్తే, మనుషుల్లోని ఐకమత్యమే దీనికి కారణమని తెలుస్తుంది. కానీ… మతం పేర, కలహాలు ప్రారంభం అయినప్పట్నించే మనిషి పరిస్థితి ఇలా అయిపోయింది” అని అన్నాడు.

”సరే ! మనం ఇప్పుడేం చేద్దాం?” అన్నాడు మూడోవాడు.

”రండి! మళ్ళీ అందరం ఏకమౌదాం. ఐకమత్యమే బలం. అప్పుడు బహుశా మనమే మళ్ళీ గెలుస్తాం” అన్నాడు నాలుగోవాడు.

పశువులు చాలా తెలివి గలవి. మనుష్యులంతా ఒకటైతే మనం వారిముందు నిలబడలేం. ఓడిపోతాం అని అనుకుని మనుష్యుల చుట్టూ ఉన్న కట్టడిని తొలగించి వారికి స్వేచ్ఛనిచ్చాయి.

అంతే ! భూమ్మీద కేవలం మానవతా మతం మాత్రమే నిలబడింది. నవనిర్మాణం, మానవ ప్రగతికి సంబంధించిన స్వర్ణయుగం మరల తిరిగొచ్చింది.

4. సంతాప సభ

స్కూల్లో ఒక విచిత్రమైన ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. పిల్లలంతా లైన్‌లలో నిలబడి మౌనంగా ఉన్నారు. ఇంతలో ఓ కారు హారన్‌ శబ్దం వారి నిశ్శబ్దానికి భంగం కలిగించింది.

గోపీ ఇవాళ మళ్ళీ ఆలస్యంగా వచ్చాడు. రాగానే కారు దిగి భయం భయంగా వెళ్ళి లైన్లో నిలబడ్డాడు. మెల్లగా తన ప్రక్క ఉన్న బాలుని అడిగాడు.

”ఏమైంది?”

”కనబట్టంలా? సంతాప సభ నడుస్తోంది” అని గుసగుసలాడాడు బాలు.

”ఎవరు పోయార్రా?”

”మన రామయ్య మాస్టారు నిన్న రాత్రే కాలం చేసారట”. సంతాప సభ ముగిసింది. ”ఇవాళ స్కూల్‌ మూసేస్తున్నాం” అని ప్రకటించారు హెడ్మాస్టర్‌ గారు.

గోపీకి పట్టలేనంత ఆనందం కలిగింది. బాలు భుజం మీద చెయ్యేసి నవ్వుతూ – ”భలే ! స్కూల్‌ బంద్‌ ! సరేగాని మెట్రోలో క్రొత్త సినిమా విడుదలైందిరా ! పోదామా !

బాలు నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు.

5. పలాయనం

డాక్టర్‌ సారథి తీరిక అస్సలులేని మనిషి. ఇవాళెందుకో బాగా అలసిపోయాడు. రేయింబవళ్ళూ రోగులు, పరీక్షలు, చికిత్స… ఇదే గొడవ. అసలైతే ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఉంటాడు. మంచిగానే రోగులతో ప్రవర్తిస్తాడు. ఇవాళ… విసిగిపోయాడో ఏమో, ఎటైనా దూరంగా, వెళ్ళి ఏకాంతంగా ఉండాలని అనుకున్నాడు.

అప్పుడే ఆయనకి తన మిత్రుడు సుందరం గుర్తుకొచ్చాడు. స్కూల్‌ రోజుల నుండి ఫ్రెండ్‌. ఎన్నిసార్లు ఇంటికి రమ్మని ఆహ్వానించినా సారథి వెళ్ళలేక పోయాడు. ఇవాళ ఎలాగైనా సరే, వెళ్ళి ఓ 2-3 గంటలు ఆయనతో గడపాలని భావించాడు. కాదు… గట్టిగా అనుకున్నాడు. సారథి ఓ పది నిముషాల తర్వాత సుందరం గారింటి ముందు నిలబడి, కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. మొహంలో ఆనందం. ఇక్కడ తననెవరూ… ఏ రోగీ… వచ్చి విసిగించదు” అని అనుకున్నాడు.

ఇంతలో తలుపు తెరుచుకుంది. శ్రీమతి సుందరం డాక్టర్‌ సారథిని చూసి, గుర్తుపట్టి నమస్కరించింది.

అరె ! మీరు రావడం చాలా మంచిదైంది. మీ స్నేహితుడి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నిన్నట్నించి బాగా జ్వరం ఉంది. రండి.. రండి…” అన్నదావిడ.

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us