మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

రాచమల్లు రామచంద్రారెడ్డి(రా.రా)

by Cheedella Seetha Lakshmi July 13, 2023
written by Cheedella Seetha Lakshmi

రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య రంగంలో శ్రీ శ్రీ వలె రా రా గా రెండక్షరాల పేరుతో ప్రసిద్ధి చెందాడు.కథకుడు,సాహితీ విమర్శకుడు,పత్రికా సంపాదకునిగా  ప్రఖ్యాతి గాంచాడు.

ఈయన రచించిన గొప్ప కథలు “అలసిన గుండెలు.” “అనువాద సమస్యలు”,” సారస్వత వివేచన”అనేవి సాహిత్య గ్రంథాలు.”సారస్వత వివేచన” గ్రంథానికి ఉత్తమ విమర్శనా గ్రంథంగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

రారా లేఖల్లో వ్యక్తిగత విషయాలు,ఆలోచనా వైఖరి,సాహిత్య విమర్శ,ఉద్యోగ జీవితం మొదలగు అనేక విషయాలు తెలుస్తాయి.సాహితీమిత్రులకు రాసిన లేఖల్లో రా.రా.హృదయం విప్పి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తేల్చి చెప్పడం ప్రత్యేక లక్షణంగా గమనించవచ్చు.రా.రా తన కష్టసుఖాలను మిత్రులతో పంచుకోవడానికి లేఖలు ప్రముఖంగా ఉపయోగపడ్డాయి.దేశంలో ఉన్నప్పుడే కాక విదేశాలలో ఉద్యోగరీత్యా వున్నప్పుడు కూడా విదేశాలనుండి మిత్రులకు లేఖలు రాశారు.

ప్రత్రికారంగంలో ఉద్యోగాలు చేసినట్లుగా లేఖలవల్ల తెలుస్తుంది.విశాలాంధ్ర దినపత్రికలో పనిచేస్తూ ‘ విజయవాడ వాతావరణం’ సరిపడక గుమస్తా మాదిరి ఆఫీసు పనిచేయలేక రాజీనామా చేసి వచ్చేస్తున్నానని గోవిందరెడ్డికి రాసిన లేఖలో తెలిపాడు రా.రా.

‘ సంవేదన” పత్రికపై వచ్చిన ప్రశంసలు,విమర్శల గురించి రాస్తూనే వ్యక్తిగత విమర్శ వుందని, పత్రిక నిండా రారా వుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయని గోవిందరెడ్డికి రాసిన ఉత్తరంలో తెలిపాడు.”దేశంలోని రచయిత ఎవ్వరూ తమ రచనలు పంపడం లేదు గనుకనే నేను రాయవలసి వస్తున్నది.అని రచయితలపై విరుచుకుపడ్డాడు.తను ఇచ్చే విరాళం తగ్గితే పత్రిక స్థాయి తగ్గిపోతుందని,సంవేదన” దేశంలో సంచలనం కలిగించి ప్రముఖుల చేత ప్రశంసింపబడినప్పటికి ఇదొక విషమ పరిస్థితి అని వాపోయాడు.

” సంవేదన” పత్రికలో సంపాదకునిగా వున్నప్పుడు మిత్రులతో కొన్ని సమస్యల నెదుర్కొన్నాడు.”సాంబుడు” వ్యాసం రాసి పత్రికలో అచ్చు వేయమంటే యథాతథంగా అచ్చువేయడం సాధ్యంకాదని,ఇంటలెక్చ్యుయల్,లిటరరీ స్థాయి లేని వ్యాసాన్ని ఉన్నదున్నట్లు ముద్రిస్తే ” సంవేదన” స్థాయి పడిపోతుందన్న ఆవేదనను వ్యక్తం చేశాడు.సాంబుడికి ,రారా కు మధ్య వాగ్వివాదం చెలరేగి చివరకు సాంబుడు వ్యాసంలో కొన్ని విషయాలు కట్ చేయడానికి ఒప్పుకున్నాడు.తరువాత తనపై ఆరోపణలు వస్తే సహించే స్వభావం లేదు రారాకు.

జయరాంకు రాసిన ఉత్తరంలో వివరాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం అన్యాయమని ” ఆరోపణలు చేసేవాడు తన సుహృద్భావాన్ని ఎదుటివాడు శంకించకుండా ఆరోపణలు చేయవచ్చు.కానీ నీవా జాగ్రత్తలు తీసుకోలేదని…ఆయన్ను యెందుకు దింపుతారు యీ రొంపిలోకి అనడం వాళ్లకేకాదు నాకు కూడా గౌరవప్రదంకాదు”. అని రాయడం వల్ల తనపై ఆరోపణలు వస్తే సహించే స్వభావం కాదని,వాతల్లాంటి సమాధానాలు చెప్పేవాడని తెలుస్తుంది.

తన స్నేహం ఎంత గొప్పదో వివరిస్తూ ” ఒకరి నొకరు నూరు మాటలు అని,అనిపించుకొని కూడా పరస్పర సుహృద్భావానికి ఏ మాత్రం భంగం కలగకుండా వుండే “సాన్నిహిత్యం” వుంది అంటూ జయరాంకు సమాధానం రాస్తూ సంస్కారరహితమైన మీ ఉత్తరాల యుద్దాన్ని అరికట్టే శక్తి నాకు లేకపోయినందుకు లోలోపలనే సిగ్గుపడడం తప్ప నాకు మార్గాంతరం ఏమైనా వుందా?” అంటాడు.

మాస్కోకు వెళ్లిన తర్వాత ” సంవేదన” పత్రిక ఆగిపోయిందని తెలుసుకొని రమణారెడ్డి రాసిన ఉత్తరంలో ” సాహిత్య పత్రికలన్నింటికి ఉన్న జబ్బే దానికి మొదటినుండి వున్నది. డబ్బు కొరతకంటే ముఖ్యన్గా మ్యాటర్ కొరత ప్రతి సంచికకు వంద పేజీలు  నింపడం సమస్యగా ఉండేది.పత్రికలో సగం పేజీలు ఎన్నాళ్ళని నేనే నింపగలను చెప్పండి….ఎన్ని తంటాలు పడినా తగినంత ప్రోత్సాహము వుండేది కాదు.పైగా కొన్ని విషయాల్లో మనవాళ్లతోనే తగవులు తెచ్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడేవి.” అంటూ తన మానసికావేదనను,తాను పడిన కష్టాలను చెప్పుకున్నాడు ఉత్తరాల్లో. పత్రిక నడపడంలో కష్టనష్టాలు తెలుపడం వలన ఏకాలంలో నైనా పత్రికకు రచనల ఆవశ్యకత,అవసరం కూడా ఎంతటిదో తెలుస్తుంది.

రారా మాస్కోకు అనువాదకుడుగా వెళ్ళాడు.మాస్కోలో పరిస్థితిని వివరిస్తూ విశ్వంకు ఉత్తరం రాశాడు. అక్కడ చలి ఎక్కువైనప్పటికి”0″ డిగ్రీ ఉన్నప్పటికీ ఆరోగ్యాలు చెడలేదని, తన ఇల్లు 8 అంతస్తుల భవనంలో మూడవ అంతస్తులో ఉందని తెలిపాడు తిండికి ఏ ఇబ్బంది లేదనీ,బియ్యం ముతకగా ఉన్న రుచిగా ఉండేవని, ఉల్లిగడ్డలు దండిగా దొరుకుతాయని,పాలు పెరుగు చౌక అనీ, మొదటి నెల 250 రూబుళ్లు,పని పరిమాణాన్నిబట్టి ఇంకా ఎక్కువే డబ్బు ఇవ్వడం జరుగుతుందని వివరించాడు.

వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువని,అమూల్యమైన కాలం వృధా అవుతుందనే బాధను వ్యక్తం చేశాడు 

మిత్రులకు ,ఆప్తులకు దూరమైన బతుకులో జాబులే గదా అప్పుడప్పుడు కాస్త ఊరట కలిగించేది అని అంటాడు.” రష్యా భాష రాక వీధుల్లో చెవిటి మూగ వాళ్ళు మాదిరి తిరగడమూ,విశ్రాంతి లేకుండా పని చేయడమూ…ఇవన్నీ ఎలాగైనా భరించవచ్చు గానీ,మనసు విప్పి మాట్లాడుకోడానికి ఆప్తుడన్నవాడు లేకపోవడం భరించడం కష్టం” అని ఆవేదన చెందాడు.

జయరాంకు రాసిన ఉత్తరంలో కూడా మాస్కోలో తను పడే కష్టాలను వివరించాడు.తన మనసులోని బాధ కొంతైనా వ్యక్తం చేయడం అవసరమని రాస్తూ ” ఈ గాడిద చాకిరి’, యీ నిప్పులకుంపటి లాంటి చలీ ,పలకరించే దిక్కు లేకపోవడమూ,చదువుకోవడానికి ఏమీ లేకపోవడమూ…అన్నింటికీ తోడు ఇండియా నుండి జాబులు సరిగా రావు.మిత్రుల అడ్రసులు తెలుసుకోవడం కూడా గగనమైంది.ఈ నా బాధ.” అంటూ తను అనుభవించిన భయంకరమైన ఒంటరి తనాన్ని ,మానసిక ఆవేదన మిత్రునికి వ్యక్తం చేశాడు

“మాస్కోలో లెనిన్ భజన చేయడం తప్ప మార్క్సు,ఎంగేల్స్ ను ప్రస్తావించడం తక్కువని అంటూ యిక్కడి జనం మంచివాళ్ళు, గోమాతల వంటి సాధువులు ఈర్ష్యా అసూయలు,చిల్లర దగాలు,వంచనలు చాలా చాలా అరుదు విదేశీయులను గౌరవంతోను,సానుభూతితోను మాత్రమే కాదు,ఒక ప్రీతితో కూడా చూస్తారు ” అని సంఘ పరిస్థితిని ,మాస్కోలో జనం యొక్క మృదువైఖరిని రమణారెడ్డికి రాసిన లేఖలో తెలియ జేశాడు.

రమణారెడ్డి రా.రా ను విమర్శిస్తూ “ఆయన సోవియట్ యూనియన్ లో ఒక ఉద్యోగి, ఆయన నౌకరికి ప్రమాదం వస్తే ఎట్లా,రాజకీయాలను గురించి” ఉత్తరాల్లో రాయవద్దన్నాడు. సోవియట్ యూనియన్ పై ఈగ కూడా వాలనివ్వని రారా సహించలేక రమణారెడ్డికి రాసిన జాబులో ” నన్ను గురించి మీకు యింత నీచమైన అభిప్రాయం వుంటే నాతో మీరెలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారో అర్థం కావడం లేదు.” అని నిశితంగా సమాధానం చెప్పాడు.

విశ్వంకు రాసిన ఉత్తరంలో మాస్కోలో తన జీవన విధానాన్ని గురించి వివరించాడు. “లెనిన్ ప్రొలేటేరియన్ ఇంటర్నేషనలిజం ,గోర్కీ కథలు అనువాదం చేసినట్లు తెలుపుతూ జీవితం డల్ గా ఉందని, తిండికి బట్టకు లోటు లేకపోయినా జీవితం యాంత్రికంగా, ఒక్కోసారి బేజారుగా కూడా ఉందని అన్నాడు.మాస్కోలో విచిత్రమైన విషయం పరదేశాల పుస్తకాలు దొరక్కపోవడం,సోషలిస్టు,పెట్టుబడి దారీ పుస్తకాలు మాత్రమే లభ్యమౌతాయనీ,అక్కడ యూనివర్సిటీలలో బేరీజు వేయడం బుద్దివాదం.” అంటూనే

 “ప్రేమ అనేది ఎప్పుడు హృదయ వ్యాపారంగానే ఉంటుందని,కె.కె.తన కథల్లోని పాత్రలనూ,సన్నివేశాలనూ ఎప్పుడూ హ్యూమన్ యాంగిల్ నుండే చిత్రిస్తాడు. కాబట్టి “హృదయవాది” అని అంటారు.కె.కె.కథలో సెక్స్ అనేది కేవలం శరీర వ్యాపారం కాదని,సెక్స్ లో హృదయానికి ప్రముఖస్థానం ఉండాలనే చెప్పబడుతుందంటాడు. కె.కె.హృదయవాది అని ఘంటాపథంగా వక్కాణించాడు.

రచనలు పాఠకుల హృదయాన్ని తాకాలన్న నిర్వచనం చెప్పాడనుకోవచ్చు.

గురజాడ అంటే రారా కు ఇష్టమని లేఖలద్వారా తెలుస్తుంది.గురజాడ మీద అవాకులు చవాకులు ప్రేలేవాళ్ళు అ.ర.సంలో ప్రముఖులైనారు అంటాడు వీరేశలింగం ఎంత గొప్పవాడైనా గొప్ప ఉద్యమకారుడు మాత్రమే.గొప్ప సంస్కర్త మాత్రమే మరి గురజాడ పోలికే లేనంత గొప్పవాడు.ఆయన రచనలు ( డైరీలతో సహా) చదివితే ఆయన యెంత గొప్ప మేధావి అయిందీ, సృజనాత్మక రంగంలో యెంత మహా రచయిత అయిందీ,హృదయ పరిపాకం విషయంలో యెంత మహాపురుషుడు అయిందీ తెలుస్తుంది.గురజాడను గురించి సరియైన సమగ్రమైన అవగాహన’ అవసరాల’ కు లేకపోగా ‘పురాణం”కు కూడా లేకపోగా,కనీసం ఒక పరిశీలకునికైనా లేకపోవడం నాకు బాధ కలిగించింది.” అని మల్లారెడ్డికి రాసిన లేఖలో తెల్పడం వల్ల రా.రా కు గురజాడను అంచనా వేసే తీరు, ఒకరిని విమర్శించేటప్పుడు వారి సాహిత్యంపై సంపూర్ణ అవగాహన ఉండాలన్న అభిప్రాయం తెలుస్తుంది.

చలాన్ని’ఆంధ్రాశరత్’ అనడం అర్థం లేని మాట అంటాడు రా.రా.ఇద్దరి రచనల్లోను స్త్రీలకు ప్రాముఖ్యం వుండటం తప్ప మరే పోలికా లేదని,శరత్ బాబులో  లోతు లేదని చలమే ఒకచోట అన్నాడని,తెలుగు రచయితలలో కొందరు చలాన్ని అనుసరించబోయి ,అనుకరించబోయి (లత,రంగనాయకమ్మ) బూతు కథలు రాశారు అని విమర్శించాడు.

మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో మీ వ్యాఖ్యానాలతోనూ,వివరణతోనూ నేను ఏకీభవించని సందర్భాలున్నాయని ఖచ్చితంగా చెప్పాడు.సింబాలిజం గురించి రామకృష్ణ చేసిన ఊహలు,వివరణలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నాడు ” శ్రీ శ్రీ ని పొగడడానికి అడ్డుదారులు,వక్రమార్గాలు అక్కరలేదు గదా ” అని రాస్తూనే గేయాలను ప్రతీకలుగా కాక స్వతహాగానే ఎంతో అర్థవంతంగా చూస్తే మంచిదని ప్రతీకావాదము పేరుతో శ్రీశ్రీ గేయాలను పొడుపుకథలుగానూ,ప్రహేళికాలు మార్చకండి అని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

వి.వి.యస్ మూర్తికి రాసిన ఉత్తరంలో అనువాదపద్ధతిని వివరిస్తాడు రా.రా  ఒక భాషలో నుండి వేరే భాషలోకి అనువాదం చేసేటప్పుడు (తెలుగు నుండైనా,ఇంగ్లీషు నుండైనా) మూలాభాషలోని పదానికి గల విలక్షణస్వభావాన్ని బట్టి లక్ష్య భాషలోకి అనువదిస్తే బాగుంటుంది.” అని సూచనలిస్తూ ఏ భాషలోనైనా అనువాదం చేయాలంటే ఆ భాషపై అనువాదకునికి అధికారం ఉండాలి  అనే భావన కలిగినవాడు  భాషపై సంపూర్ణ అవగాహన ,పట్టు ఉన్నప్పుడే అనువాదం చేయడం సులభమౌతుంది.

‘ నవీన్: గారికి రాసిన ఉత్తరంలో తన గురించి ప్రజల్లో వుండే అభిప్రాయాన్ని ఇలా వివరించాడు.నిజానికి నా విమర్శలు వ్యక్తిగతంగా, అనాగరికంగా,ద్వేషాపూరితంగా ఉన్నాయనే అభిప్రాయం ” ఉందని రాస్తూ కాళోజిమీద రా.రా.సమీక్ష “రాక్షసం” అన్నవాళ్ళున్నారని అంటాడు.” అద్దేపల్లి” ని కూడా అంతకంటే తీవ్రమైన మాటలు అన్నానని ” ఈనాడు తెలుగు సాహిత్యంలో జరుగుతున్న ఘోరకృత్యాలు చూసినప్పుడు యెంత విజయసంపన్నునికైనా ” ఆరోగెన్స్” కలుగుతుంది.తెలుగు సాహిత్యానికి జరుగుతున్న ఘోరమైన అపచారాలు చూసినప్పుడు ” చాలా బాధ కలుగుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అనర్హమైన తెలుగు వాళ్లకే అవార్డులిచ్చిందని, అకాడమీల ద్వారా జరిగే యీ కృషితో తృప్తిపడని భారతపెట్టుబడిదార్లు ఇటీవల “జ్ఞానపీఠం” అనేది ఒకటి స్థాపించి కేవలం సాహిత్య సేవాదీక్ష అంటూ భ్రమపడతారని విమర్శిస్తాడు.నా ఆగ్రహం కేవలం ఇంటపరేట్ ఎమోషన్ కాదు పార్ట్ ఆఫ్ ది డెలిబరేట్ పాలసీ అని కన్ఫం చేస్తున్నాను.మెత్తగా చెప్పడం చాతగాక కాదు గట్టిగా ఘాటుగా చెప్పడం వల్ల నాకు పర్సనల్ గా చెడ్డపేరు వస్తే రావచ్చు కానీ,నేను కోరిన ఫలితాలు లభిస్తాయని నమ్ముతున్నాను.” అని చెప్పుకున్నాడు.

ఏదైనా ముక్కుసూటిగా విమర్శించే మనస్తత్వం. దాపరికం అనేది లేదు ఎదుటివాడు ఏమనుకొన్న పట్టించుకునే తత్వంకాదు మనసులోని విషయం బాధ కలిగించుకునేదైనా సరే,చెడ్డ పేరు వచ్చినా సరే ఖండితంగా చెప్పేయడమే రా రా తత్వం అని తెలుస్తుంది.

తెలుగు సాహిత్యానికి చెడ్డరోజులు వచ్చాయని,వట్టి నినాదాలు ” అభ్యుదయకవిత్వంగా ఒకప్పుడు చలామణి అయ్యాయని” అంతకంటే ఘోరమైన దిగంబరబూతులు విప్లవ కవిత్వంగా శ్రీశ్రీ లాంటి వాళ్ళచేత ఆమోదింపబడడం…. విప్లవకవిత్వం పేరుతో ఇంకెంత ఘోరాలు జరుగుతాయో తలచుకుంటే నాకు భయమౌతుంది .” అని రాస్తూ రమణారెడ్డికి రాసిన లేఖలో తన మనసులోని ఆందోళనను వెల్లడించాడు కాళోజీ తను చేసే విమర్శకు అర్హుడని అంటాడు 

రమణారెడ్డికి రాసిన ఇంకో లేఖలో ” ఆయనతో మీకు గల వ్యక్తిగత సంబంధాలను బట్టి నా విమర్శ బాధ కలిగించవచ్చు గానీ,వెల్ అనే పదానికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఇంగ్లీషు కవిత్వాన్ని అనువదించడానికి పూనుకోవడంలోని దురహంకారం …తెలుగుదేశంలో… కానీ వాళ్ళందరూ ఒక టన్ను ఫోజు పెట్టి ఒక తులం యోగ్యతైనా వున్న వాళ్ళు,అరతులం యోగ్యత కూడా లేకుండా  ఐదు టన్నుల ఫోజు పెట్టిన వాడు నా ఎరుకలో కాళోజీ ఒక్కడే…నా బోటి వాడెవడైనా కాళోజీ నిజమైన యోగ్యత ఎంతో వెల్లడిస్తే అది రాక్షసమంటారు “అని కుండబద్దలు కొట్టినట్లు వ్యక్తం చేశాడు.

అభ్యుదయకవిత్వమంటే ఎట్లా ఉండాలి? అభ్యుదయ రచయిత అంటే ఎవరు? అనే వానికి జయరాంకు రాసిన లేఖలో చక్కని వివరణ యిచ్చాడు. అభ్యుదయ రచయితకు మార్క్సిజం లోతుగా, రాజకీయ పార్టీల నాయకులకు తెలిసినంత సమగ్రంగా తెలియనక్కరలేదంటే తనకేమీ అభ్యంతరం లేదని,”శ్రీ శ్రీ తనకు మార్క్సిజం తెలియదని అన్నాడంటే తనకు గాని,తన రచనలో గాని ఆ దృక్పథం లేదని అర్థం కాదు గదా తనకు సరిగా తెలియదని మాత్రమే అర్థం ” అని సోదాహరణంగా వివరించాడు.

మనవి బూర్జువా డేమోక్రటిక్ ఆశయాలు కావు .మనం పెట్టుబడిదారీ దశలో వున్నాం ఇప్పుడు మనకుండవలసిన ఆశయాలు సోషలిస్టు విప్లవానికి సంబంధించినవి మన సాహిత్యచరిత్రలో ‘భావకవిత్వం’ బూర్జువా డెమొక్రటిక్ విప్లవానికి సంబంధించినది.ఆ కవిత్వం అడుగంటిదంటే ఆ చారిత్రకదశ గడిచిపోయింది.కానీ ” ఈనాడు సోషలిస్టు భావాలు,కార్మిక డిమాండ్లు ప్రతిబింబించని సాహిత్యం అభ్యుదయ సాహిత్యం కాలేదు.ఏమైనా ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏమిటంటే అభ్యుదయ సాహిత్యంలో  ఈనాడు పెట్టుబడి దారీ వ్యతిరేక ధోరణి ఖచ్చితంగా వుండాలి మరి యీ ధోరణి ఖచ్చితంగా ఉండాలంటే రచయితకు మార్క్సిజంతో అంతో ఇంతో పరిచయం వుండాలి కనీసం ఒక్క స్థూలమైన మార్క్సిస్టు అవగాహన వుండాలి. అది లేకపోతె రచయితలో,రచనలలో రాజీ ధోరణులూ ,పెడధోరణులూ ఆస్పష్ట మానవతావాద భావాలు ప్రవేశిస్తాయి.తెలుగుదేశంలో వున్నది ఈనాడు యింకా ప్రధానంగా వ్యావసాయిక సమాజమే.కానీ యీ సమాజంలోని సమస్యలను కూడా బూర్జువా డెమొక్రటిక్ దృష్టితో కాక మార్క్సిస్టు దృష్టితో చూడగలవాడే ఈనాడు అభ్యదయ రచయిత కాగలడు.” అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించాడు మార్క్సిస్ట్ భావాలు గల రా.రా.

రమణారెడ్డికి రాసిన లేఖలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల తెలుగు సాహిత్యం నష్టపడిందనే భావన వ్యక్తం చేశాడు.

రాజకీయ విషయాలను స్పృశిస్తూ తన లేఖలో కమ్యూనిజం ఆత్మను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు జెక్ రచయితలని చెప్తూ మరొకసారి ‘స్టాలినిజం’ అనే ఘాతుకభూతం యీ భూమండలం మీద యెక్కడ తలయెత్తినా యిక కమ్యూనిజానికి పుట్టగతులుండవు.కమ్యూనిజం వంద యేండ్లు ఆలస్యమైనా సరే స్టాలినిజం యే దేశంలోను రిపీట్ కాకూడదనే నా గాఢమైన కాంక్ష.” అంటూ అధికారంలో ఉన్న కమ్యూనిస్టు నాయకుల మాటలను నమ్మవద్దంటాడు.

రామమోహన్ కు రాసిన ఉత్తరంలో మానసిక శాస్త్ర విధానంపై విమర్శ ఉంది.దీనిపై రా.రా విమర్శనావిధానం ఎలా వుందో గమనిద్దాం.” ఉదాహరణకు భౌతిక పరిస్థితులనుబట్టి మనిషి మారతాడని బూర్జువా శాస్ర్తజ్ఞులు గుర్తిస్తారు.కానీ మనిషి అంటే ఏమిటి ? అన్నప్పుడు వాళ్ళు ఒక నిత్యసత్యమైన నిర్వచనం ఇచ్చుకుంటారు.ఈ పదిలక్షల ఏండ్లలోనూ మనిషి ఎంతగానో మారినాడని అంగీకరిస్తారు గానీ ” మనిషి” అనదగిన మూల పదార్థం ఏదో అది శాశ్వతంగా,పరిణామరహితంగా వుందని అనుకుంటారు.మన ” డైలక్టికల్ అండర్ స్టాండింగ్” ప్రకారం మనిషి ఎల్లప్పుడూ చారిత్రకపరిస్థితుల శిశువు మాత్రమే.” అని వివరించాడు.

భావ, భాష విషయంలో కూడా రా.రా ఒక అభిప్రాయాన్ని తెలుపుతూ విశ్వంకు రాసిన లేఖలో ఇలా వివరించాడు.” కడపజిల్లా నుడికారం నాకు సంతోషమే కలిగిస్తుంది.కానీ ,మరీ “గ్రామ్యం ” లో రాస్తే  పాఠకుల్లో అత్యధిక భాగానికి అర్థం కాకపోయే ప్రమాదం వుంది. రా.వి.శాస్త్రి విశాఖపట్నం గ్రామ్యంలో రాసిన కొన్ని కథలు నాకు విసుగు కలిగించాయి.అలాగే తెలంగాణ వాళ్ళు తెలంగాణ గ్రామ్యంలో  రాస్తే మనము అసలు చదవలేము గదా.కనుక ఈ విషయంలో రాజీ అవసరం.లాజికల్ ఎండ్ కు పోకుండా రీజనబుల్ లిమిట్స్ తో ఉండడం మంచిది.వాక్యం బిగువుగా ఉండడం ముఖ్యం.” అని రాశాడు ” గిడుగు గురజాడలు చెప్పింది శిష్టవ్యావహారికము” అని చెప్పాడు.

రా.రా.లేఖలను పరిశీలించి నట్లయితే తేలే అంశమేమంటే ఆయన స్పృశించని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన, మార్క్సిస్ట్ దృక్పథం, సాహిత్య విమర్శ, సోపపత్తిక విమర్శ,గురజాడ,శ్రీశ్రీ లపై మంచి అవగాహన,కాళోజీపై విమర్శల వర్షం ఇలా ఎన్నెన్నో భావాలు ఈయన లేఖల్లో చోటు చేసుకున్నాయి.

సునిశితపరిశీలన,తన కటువైన విమర్శ ఎదుటివారికి బాధ పెట్టినా సరే ఖండించే వైఖరి మొదలైన వెన్నెన్నో రా.రా.లేఖల్లో కనిపించే ప్రముఖ లక్షణాలు.

తెలుగునాట సామూహికంగా ఆయన విమర్శకు గురైన వేత్తలు ఎందరో ఉన్నారు.సాహిత్య విమర్శకు కొత్తబాటను వేసిన వాడుగా రా.రా.ను పేర్కొనవచ్చును.నిశితంగా  విమర్శించడం,చెప్పదలచుకొన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం రా రా.కే చెల్లింది.

ఉదాహరణకు

” నక్కలు బొక్కలు వెదకును

అక్కరతో నూరబంది  అగడిత వెదకున్

కుక్కలు చెప్పులు వెదకును

టక్కరి నా లంజకొడుకు తప్పులె వెదుకున్” ప్రాచీన కాలంలో కవి అన్నట్టు తప్పులే వెతికేటి కుహనా విమర్శకులను నిర్దాక్షిణ్యంగా దుయ్యబట్టాడు.

రా రా అనువాద పద్ధతిని,సమీక్షా వైఖరిని తన లేఖల్లో సూచించాడు., ఆయన అనువాద పద్ధతులను లోతుగా అధ్యయనం చేశాడు. ఆయన రచించిన ” అనువాద సమస్యలు” గ్రంథం యువరచయితలకు,జర్నలిజం విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుంది.

ప్రత్రికారంగంలో ఆయనెదుర్కొన్న సమస్యలు ,విదేశంలో ఆయన జీవన విధానం,ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు రా రా తన లేఖల ద్వారా వెల్లడించాడు.

శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాస రావు) ,కొ కు( కొడవటిగంటి కుటుంబరావు) తర్వాత తెలుగు నాట రెండక్షరాల సంక్షిప్త నామంతో ఎంతో ప్రసిద్ధి చెందిన రా రా( రాచమల్లు రామచంద్రా రెడ్డి) వ్యక్తిగత అభిప్రాయాలు,విమర్శనా వైఖరి,ఆలోచనా సరళి మొదలగు ఎన్నో విశేషాలు లేఖల ద్వారా తెలుసుకోవడం సాహిత్య ప్రపంచంలో రా.రా కు ప్రముఖస్థానం ఉందనడానికి లేఖలే నిదర్శనం..

రారా.జీవనరేఖ

రా.రా గా ప్రసిద్ధి చెందిన రాచమల్లు రామచంద్రా రెడ్డి  కడప జిల్లా పైరిపాలెం గ్రామంలో  ఆదిలక్ష్మి,భయపురెడ్డి దంపతులకు  28 ఫిబ్రవరి 1922 సంవత్సరంలో జన్మించాడు.

పులివెందుల హైస్కూల్ లో స్కూల్ చదువు పూర్తి చేసి అనంతపురంలో ఇంటర్ మీడియట్ ,

చెన్నై లోని గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో గాంధీజీ నిరాహార దీక్షకు మద్దతుగా సమ్మెలో చేరినందుకు కాలేజీ నుండి యాజమాన్యం రా.రా ను తొలగించింది.యాజమాన్యం వారికి క్షమార్పణ చెపితే కాలేజిలో తీసుకుంటామంటే అందుకు నిరాకరించాడు.దేశభక్తి కలిగిన రా.రా తర్వాత విశాలాంధ్ర పత్రికలో ఉపసంపాదకునిగా పనిచేశాడు.మార్క్సిజం వైపు ఆకర్షిపబడి దృక్పథాన్ని వంటపట్టించుకున్నాడు.

   “సంవేదన” అనే పత్రికను నడిపాడు.తర్వాత రష్యా కు వెళ్లి అక్కడ మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో 6 సంవత్సరాలు అనువాదకునిగా పని చేశాడు.

ఆ సమయంలో మార్క్స్,ఎంగెల్స్ సంకలిత రచనలు, లెనిన్‌ సంకలిత రచనలు, పెట్టుబడిదారీ అర్థశాస్త్రం, గోర్కీ కథలు, చేహావ్‌ కథలు మొద లైన రష్యన్‌ గ్రంథాలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి సరళమైన తెలుగులో అనువదించారు. మాస్కోలో సంపాదించిందంతా కడపలోని ‘హోచిమిన్‌’ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు.

  తర్వాత ఇండియా వచ్చి 1977 నుండి ఈనాడు పత్రికలో సంపాదకునిగా పని చేసారు.

 రా.రా.అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు. గొప్ప కథా రచయిత.ఆయన రాసిన 12 కథలు అలసిన గుండెలు

పేరుతో కథాసంకలనంగా వెలుగులోకి వచ్చింది.

,  గొప్ప జర్నలిస్ట్,ప్రముఖ అనువాదకుడు మంచి విమర్శకుడు అయిన రా.రా అనువాద సమస్యలు  అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.

సారస్వత వివేచన గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది.

  విమర్శకు దారిదీపం అయినటువంటి  రా.రా విమర్శను సాహితీ ప్రక్రియగా అభివృద్ధి చేసిన ఘనత దక్కించుకున్న ప్రముఖ విమర్శకుడు .ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ 1988 సంవత్సరం నవంబరు 25 వ తేదీన తనువు చాలించాడు. తెలుగు సాహిత్య విమర్శనా రంగం ఒక ప్రముఖుణ్ణి కోలుపోయింది.

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పిడికెడు అటుకులు ! !

by రాఘవాచార్య‌ July 13, 2023
written by రాఘవాచార్య‌

పిడికెడు అటుకుల గురించి
కలుపు గొలుపుగా దోసెడు మాటలు 

మునుపు తాత ముత్తాతలు సంచారం పోతే
మూటలోని అటుకులే తోవలో కడుపుకు ఆసరా 
 తియ్యని వాగూ నీళ్లే గొంతులో 
అమృత ధారాపాతం !
ఆగని నడకకు అటుకులే 
బల అతిబల మహాబల !

సామాన్యుల అసామాన్య ఆహారం అటుకులే
కొద్ది కొద్దిగా కాదు నమిలినా కొద్ది
ఆస్వాదనగా రుచి రుచి !
దంపుడు అటుకులైతే 
ఎంత తిన్నా దంగేవి కావు !

అంచుకు ఊరగాయ ముక్క 
ఊరించే ఉల్లిపాయలు 
ఎర్ర కారం కలుపుకుని 
పిడికెడు అటుకులు తింటే 
పొట్టకు కంచం నిండా పట్టనంత భోజనమే !

అటుకులే కదా అని తీసిపారేయకండి
శ్రీ కృష్ణుడు ప్రీతిగా పిడికెడు అటుకులు తింటే 
కుచేలునికి జోలెలో పట్టలేనంత ఐశ్వర్యం 
బ్రాండెడ్ అటుకులు !

ఇప్పుటికీ అటుకులు తక్కువేం కాదు
తింటే కడుపు నిండారా ఆయాసంగా ఎక్కువే 
బ్రేవ్   బ్రేవ్   బ్రేవ్

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహా కవి గుంటూరు శేషేంద్ర శర్మ 16 వ వర్థంతి

by Ramesh July 13, 2023
written by Ramesh

జ్ఞానపీఠ్ పురస్కారం సాహిత్య ప్రతిభకు కొలమానమని నేను ఏకీభవిస్తాను.కానీ అదే ప్రతిభను తూకం వేస్తుందంటే నా మనసు అంగీకరించదు. అందుకు దృష్టాంతం మన కాలపు గుంటూరు శేషేంద్ర శర్మ గారు.ఈ తరం కవులమనీ చెలామణి అవుతున్న చాలామందికే తెలియదు.ఇక సాధారణ పాఠకుడి,తెలుగువాళ్ల సంగతి సరేసరి.
సాహితీ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించారు మన గుంటూరు శేషేంద్ర శర్మ.ఒక నవ్య సాహితీ రస్తా వేశారు.అది అనితరం, అసాధ్యం.
శేషేంద్ర శర్మ గారు 1927 లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ గా పనిచేశారు.
నా దేశం_ నా ప్రజలు,శేష జ్యోత్స్న,రక్తరేఖ,గొరిల్లా, ఆధునిక మహాభారతం,జనవంశం,రుతుఘోష,మండేసూర్యుడు,స్వర్ణహంస,రామాయణ రహస్యాలు వారి రచనలు.కవిసేన మేనిఫెస్టో వారి సుప్రసిద్ధ రచన.ఆయన సాహిత్య కృషి కి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, 1994లో తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది.సాహిత్యవిమర్శ,కవిత్వం కలిపి 40 పైగా పుస్తకాలు ముద్రింపబడాయి.

ఒక అందమైన పోయెం అంటే
దానికి ఒక గుండె వుండాలి
అది కన్నీరు కార్చాలి
పీడుతుల పక్షం వహించాలని కవులకు హితబోధ చేశారు.
అట్లాగే
మరణించే లోపు తన మాట చెప్పలేని
నిస్సహాయ మానవుడి గొంతు పేరే కవే అని అంటాడు.

ఎవరు ఏడవగలరు మరొకడికోసం
నీ కోసం ఏడ్చేవాడికి నువ్వు ఋణగ్రస్తుడివి
మార్క్స్ కు ఈ శతాబ్దపు అన్నార్తుల ఋణగ్రస్తులని ఎలిగెత్తాడు.

కాలాన్ని నా కాగితం చేసుకుంటా
దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసి ఇస్తా
దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా

చెట్టుగా వుంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది
మనిషిపై అన్నివసంతాలూ కోల్పోయానని బాధను వ్యక్తం చేశాడు.
అలాగే
దేశంలో నాల్గు చెట్లు పది పక్షులు కూడా లేవు
వసంతం వస్తే స్వాగతం చెప్పడానికని వేదన పడ్డాడు.

మూస్తే నా కళ్లు
నిద్రిస్తున్న ఆపిల్ పళ్ళు
తెరిస్తే నా గుడ్లు
వరివెన్ను కన్న వడ్లని ఎంత మనోహరంగా మనసుని ఆవిష్కరణం చేశాడు.
నీదే తప్పు
సముద్రాలే ఎండిపోతున్నాయి
నీ కన్నీరొక లెక్కా…అని ఘోషించాడు

సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు
పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు
నేనింతే ఒక పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుందని అందంగా కవిత్వీకరిస్తాడు శేషేంద్ర మహాకవి.

మనిషి కన్నీరు తుడవడం నీ వంతు
శరీరం పోయినా నిలిచేది నీ గొంతు అని హితోపదేశం చేశాడు మానవులకు.
కోకిల పుస్తకాల నుంచి పారిపోయి
కొమ్మ ఎక్కిన గాన సామ్రాట్టు
చంద్రుడు ప్రణయాగ్నుల్లో కాల్చిన పెసరట్టు అని పలికాడు.

ఆకాశం కనిపించడం మానేసింది
ద్రవ్యరాక్షసి కడుతున్న బహు అంతస్తుల భవనాలు చూచి
ఉదయాన్ని ప్రకటించడమే మరిచిపోయిందంటాడు కవి.

భూగోళం మీద నుల్చో ఉన్న
ఆ యువకుడు
ఒక అద్భుత రుజురేఖ
ఒక వర్తమాన మహాస్తంభం
అతడొక నడుస్తున్న దేవదారు
అతడి వెన్నెముక కుతుబ్ మీనారు
రుజురేఖను వక్రరేఖ చేస్తున్న
మన రాజకీయ నేత
దేశానికి
ఒక భయంకర యమదూతని శెలవిచ్చాడు మనకు.

నీ దేహమే గంగోత్రి
నీ స్వరమే భాగీరథీ
పువ్వుల్లో లేని స్వర్గం
పురాణాల్లో ఉంటుందా
నీలో లేనిసుఖం జెండాల్లో ఉంటుందా
నీలో సాహసం ఉంటే
దేశంలో అంధకారం ఉంటుందా అనీ గొప్ప భావన నాటాడు మనలో.

అక్టోబరులో నేను పుట్టాను
అక్టోబరు లోనే విప్లవం పుట్టింది
అందుకే నేనంటే భయపడుతుంది తిమిరం
రష్యా కాదు చైనా కాదు
విప్లవం మాత్రం అజరామరం అన్నాడు
విప్లవ మే కాదు అతని సాహితీ సృజన కూడా అజరామరమే.ఆ మహాకవి అజరామరుడే. వారికి నా హృదయపూర్వక అక్షర నివాళి.

July 13, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కర్తవ్యోన్ముఖం

by Jyothirmayi Pamula July 13, 2023
written by Jyothirmayi Pamula

నిశిరాత్రి మినుకు మినుకు మనే తారల నడుమ నిండు చందమామ
తన పున్నమి వెన్నెలతో పుడమిని ముద్దాడుతుండగా
ఆ దృశ్యాన్ని గాంచిన నా మనసుకి
ఎందుకో ఆవేళ ఆరుబయట మల్లెపందిరి చెంత
పవళించాలనే కలిగె కోరిక
కొబ్బరిచెట్టు తన కొమ్మలతో వింజమారాలు విసరగా
కొబ్బరాకుల చాటునుండి ఆ నెలరేడు దోబూచులాడుచుండగా
పిల్లగాలికి మల్లెతీగలు నాట్యమాడుతుంటే
మల్లెల సౌరభాలు సుందరలోకంలో విహరింపజేయగా
ఏ నడిరేయికో నిదుర పట్టిన నాకు
దిశానిర్దేశం లేకుండా తెగిన గాలిపటంలా తిరుగుతున్న నాకు
ఉదయభానుడి లేలేత నులివెచ్చని కిరణాలు
నా మోముపై పడగానే చప్పున మెలకువ వచ్చిన నాకు
రంగులు మారుతూ పరుగులెత్తుతున్న రవి
జీవనగమనంలో కర్తవ్యోన్ముఖుడవు కమ్మని
గీతోపదేశం చేస్తున్నట్లుగా ఉంది ఆ దృశ్యం..

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సోషల్ డంపింగ్ యార్డు…

by Dasari Mohan July 13, 2023
written by Dasari Mohan

ఆక్రోశం లు అన్ని ఇక్కడ పడేసి పోతున్నాడు
కులం మతం కసినంతా గంపలు గంపలు గా
సోషల్ మీడియా ను డంపింగ్ యార్డు చేశాడు

ఆలోచన లేని ఒక పోస్టు ను విసిరి
అగ్గి మంటలు రగిలిస్థాడు ఒకడు
విద్వేషం వైరల్ అయి సమాజం లో విస్ఫోటనం

గ్రామర్ లేని గ్లామర్ తారల ప్రదర్శనలు
పసి హృదయాల్లో కల్మషo పెంచి కలవరింతలు
సంపద తప్ప సంస్కృతి పట్టని సెలబ్రేటి…. ప్రదర్శన

గుండె ను చీల్చు పదాలు విసిరి
అక్కసు అంతా ఫేస్ బుక్ లో అంటిస్థారు
భాష బాధగా విన్నవిoచు కుoటుంది మర్యాద పాటించాలని

వాదాలు ఒక్కొక్కటి అంటు కట్టుతారు
మతo మత్తు కొంచెo కొంచెముగా ఎక్కిస్థారు
వాట్సప్ చేసి హృదయాలను తమ వైపు మళ్లించి

ఒక వర్గం ఇంకో వర్గపు తప్పుల ఎత్తి పోత లు
తమ వారు మాత్రమే పుత్తడి అని తెగ ఫోజ్ లు
జనం మాత్రం అందరి చేతిలో బ్యాలెట్ బాధితులు

నింగి దాకా విద్వేషం నిండ కుండా ఇక
పోస్టు చేసే ముందు పది సార్లు ఆలోచించాలి
మంచి ని అందరికీ పంచె విషయాలు వెల్లి విరియాలి

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

Learning

by Rudrakhala Matam Prabhu linga Shastri July 13, 2023
written by Rudrakhala Matam Prabhu linga Shastri

‘he’ is only ‘he’
Not either He
Better in comparison
Or HE, the best in all.

he is really He
As he is improved
But now and then
Fails to go on as He.

he himself loses
his stature,despite,
No situation demands.

he is ever graced with
his stature isn’t affected.

his inner sense makes
him feel ashamed of
himself immediately.

Even does him to repent
But he at once learns that
‘he’ is never pardoned.

his learning may retain
him that he is truly He
Who has to become HE.
××××××××××××××××××××××
౼R.M.Prabhulinga Shastry
Dated:-26-06-2023
At:-6:34 am.

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నా మావ

by వకుళవాసు July 13, 2023
written by వకుళవాసు

మట్టికుండల సల్లవడ్డ మంచినీళ్ళ లెక్క …

ఎంత సల్లగుంటదో నా మావ సూపు…

ఎండకాలంల సాయంత్రంపూట పూసిన…

పందిరికింద మల్లెపూల లెక్క ఎంత తెల్లగుంటదో నా మావ మనసు…

పొద్దు పొద్దుగాల్నె ఊరిచెర్ల నిండుగబూసిన…

తామరపూలోలె కళ్ళల్ల నిండిపోతడు నా మావ…

మిట్టమధ్యానం పల్లె పొలిమేర్ల పంటచేలమీంచి ఇసిరే…

సల్లగాలి లెక్క ఎంతహాయిగుంటయో నా మావ ముచ్చట్లు…

రాతిరేల పున్నమి నాటి సెందురునోలే…

ఎన్నెల కురుపిస్తాంటయ్ సక్కని నా మావ నవ్వులు…

ఎన్నెట్ల పూసిన సుక్కలన్నీ ఏరుకొచ్చి…

పున్నమి సీరకు అతుకవెట్టినట్టుంటది నా మావ అందం…

నీ మావ ఎట్లుంటడని అడిగితే కళ్ళల్ల నిండి…

ఒల్లంత పొగరై నేనేసే ప్రతి అడుగు సూపుతది
ఇగో నా మావ ఇట్లుంటడని…

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మృగరాజు భాష

by డా.కందేపి రాణీప్రసాద్ July 13, 2023
written by డా.కందేపి రాణీప్రసాద్

అడవి అంతా ఒకే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. ఆరోజు మృగరాజు నిర్ణయించిన విషయంపై అన్ని జంతువులూ మాట్లాడుకుంటున్నాయి. కాకులన్నీ చెట్టు మీద వాలి వాటిలో అవి చర్చించుకుంటున్నాయి. కోతులు మరోవైపు కూర్చుని మాట్లాడుకుంటున్నాయి ! ఏ జాతి జంతువులు ఆ జాతంతా ఒక చోట కూడి ఈ సమస్యనెలా పరిష్కరించాలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.
ఆరోజు నిద్రలేవగానే మృగరాజుకు ఒక మిత ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా జంతువులన్నింటినీ పిలిచి సమావేశపరిచి తన ఆలోచన చెప్పింది ఆ మాట వినగానే జంతువులకు గుండెల్లో రాయి పడింది మృగరాజు ఏమన్నదంటే “నేను ఈ రాజ్యానికి రాజును కదా! నేను మాట్లాడే భాషనే మీరు కూడా మాట్లాడాలి యదారాజా! తథాప్రజా అన్నారు కదా! రాజు వలె ప్రజలు ఉండాలి. మీరంతా రెపటి నుండి నాలాగా గర్జించటం మొదలు పెట్టండి”
ఈ మాటలు విన్న దగ్గర నుంచీ జంతువులు ఇలా గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నాయి ఏనుగులు. ఓ గుంపుగా, పులులు మరో గుంపులా, జింకలు మరోచోట సమావేశమయ్యాయి పెద్ద జంతువులన్నీ ఒక చోట ఉంటే చిన్న జంతువులన్నీ మరో చోట కూర్చున్నాయి. ఏది ఏమైనా గర్జించటం ఎలా నేర్చుకోవాలో అర్థం కాలేదు.
పులులు ఎంత అరిచినా గాండ్రింపే అనిపిస్తున్నది. కానీ గర్జింపులా రావటం లేదు. ఏనుగులు అరుస్తున్నాయి ఘీంకారమే వినిపిస్తోంది కానీ గర్జనలా వినిపించటం లేదు గుర్రాలు, గాడిదలు బాగా గర్జించామనుకున్నాయి. అన్నీ సకిలింపులు, ఓండ్రు పెట్టడాలే అయ్యాయి.
జంతువులన్నీ గొంతెత్తి అరుస్తున్నాయి. గానీ ఏ జంతువు కూడా గర్జించలేక పోతున్నది. సాయంత్రందాకా అరిచి అరిచి అలిసిపోయి చెట్ల కింద కూలబడ్డాయి. ఏం చేద్దాం ఏం చేద్దాం అంటూ చర్చించుకున్నాయి. ఒళ్ళు అలిసిపోవడంతో బుర్రలూ పనిచేయడం మానేశాయి.
ఒక ఏనుగు ఒక ఉపాయం చెప్పింది. మిగతా జంతువులన్నీ తల ఊపాయి. జంతువులన్నీ మూకుమ్మడిగా మృగరాజు దగ్గరకు వెళ్ళారు.
”మహారాజా! మీరు ఆడవికే రాజు కదా! ముందుగా మీరు మా బాషల్లో మాట్లాడితే చూడాలని ఉన్నది. మేమంతా మందమతులం. త్వరగా నేర్చుకోలేక పోతున్నాం. మీరు ఒక్కసారి మా అందరి మాటల్లో మాట్లాడితే విని తరించాలని ఉన్నది ప్రజలందరికీ రాజు గొప్పదనం గురించి తెలియాలి. మీరు గొప్పవారు ఒక్కసారి మీ ప్రతిభను చూపండి” అని జంతువులన్నీ వేడుకున్నాయి.
అన్ని జంతువులు దీనంగా మొహం పెట్టి వేడుకుంటుంటే సింహరాజు గర్వంగా మీసం మెలేసింది. తర్వాత గొంతు సవరించుకొని ఒక్క జంతువు యొక్క అరుపూ వినిపించాలనుకున్నది. ఏనుగుల్లా ఘీంకారం చేద్దామని ప్రయత్నించింది. కానీ నోరు పెగల్లేదు పులిలా గాండ్రిద్దా మనుకున్నది. రాలేదు అదేమిటి ఎంత ప్రయత్నించినా ఏ జంతువు అరుపూ రావడం లేదు చిన్న పక్షులు కాకి, పిచ్చుకల్లా అరుద్దాం. సులభంగా ఉంటుంది అనుకున్నంది ఏముంది కావ్ కావ్ అనటమే కదా అనటమే కదా అనుకుంటే అదీ రాలేడు. గ్రామ సింహం అని నారే పెట్టుకున్నది భౌ భౌ అని చూద్దామంటే, అబ్బె ఏదీ రాదే ఏం చేయడం. సింహానికి పరువు పోయింది. ఏం చేయాలో అర్థం కాక తల దించుకున్నది.
ఏనుగుల నాయకుడు “ఇందులో మీ తప్పేమి లేదు మహారాజా ! సృష్టిలో ఒక్కో జంతువుకు ఒక్కో అరుపు ఒక్కో భాష ఉన్నాయి. అవి అలాగే మాట్లాడగలవు. అందరూ అన్ని అరుపులూ అరిచేస్తే ఆయా జంతువుల ప్రత్యేకత ఎలా తెలుస్తుంది. భిన్నత్యంలో ఏకత్వం ఉంటేనే అడవి ప్రశాంతంగా ఉంటుంది. ఈ భాషల గోల వదిలేసి అందరం కలిసిమెలిసి ఉందాం” అన్నాడు.
జంతువులన్నీ “మహారాజుకు జై” అని అరిచాయి. సింహం సంతోషంగా తల ఊపింది.

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఎలమి కోసం ఎదురుచూపులు

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు July 13, 2023
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

        ఓ నిష్పక్షపాతమా!

        ఎర్రని కాకిలాగా అరుదైనదానివి నువ్వు

        ఎవ్వరికీ కనిపించకుండా

        దుర్గమారణ్యం మధ్య దాక్కున్న

        దుమ్ములగొండి రువ్వే చిత్రమైన నవ్వువు నువ్వు

        నిన్ను కౌగిలించుకోవాలని కల గంటాను

        కానీ కలవడమే గగనమైనప్పుడు

        కల ఎలా తీరుతుంది?!

        నీలోని సాధుత్వం నిప్పుల పాలైందా?

        ఎంతకూ కనపడని నీ మూలంగా

        ఏకాంతం లోకి పోయాను

        స్వీయ బహిష్కరణ వైపు అడుగులు వేస్తూ

        బాధల పదునైన కోరల్లో చిక్కుకుని

        గాయపడుతున్నాను ప్రతిదినం

        విశుద్ధ విచక్షణ నీ అనుంగు చెల్లెలు

        వెలి వేశారు నీతో పాటు ఆమెనూ!

        ముఖం చాటేసిన నీ సోదరికీ కరుణ తక్కువేనా?

        బుజ్జగించు ఆమెను, బయటికి రమ్మని.

        ఆమెమీది అభిమానాన్ని ఆమెముందే

        చాటుకోవాలనుంది నాకు

        మీరిద్దరు కలిసి నడయాడితే

        ఇక్కడ సజావు నెలకొంటుంది

        అస్తవ్యస్తమైన ఈ అవని

        ఎదురు చూస్తోంది మీ ఆగమనం కోసం

(The Awaited Arrival అనే నా ఆంగ్లకవితకు స్వీయానువాదం)

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాధలు రోదనల నీడలు కారాదు

by Jaggiah July 13, 2023
written by Jaggiah

నీళ్ళల్లో అలజడి కలిగి
జలం జ్వలించి జ్వాల పుట్టదా
తొక్కిన కొధ్ధీ మట్టి
గట్టిపడి రాయిలా మారదా!

నాటిన విత్తనం నేలను చీల్చుకొని
గెలుపును సూచించదా
ఒత్తిడిలో కుక్కర్
ఈల పాట పాడదా!

గాయమైన గుండె
హాయిగొలిపే గేయాలు రాయదా
కాలికి కట్టిన గజ్జె
గుండెల్లో శబ్ధం చేయదా!

బాధలు రోదనల నీడలు కారాదు
అవి జీవితానికి దారిచూపే బోధనలు
భయం పిల్లిని చేస్తుంది
ధైర్యం పులిని ఎదిరిస్తుంది!

అడుగులు ముందుకు వేస్తే
దూరం దగ్గరయి పలుకరిస్తుంది
విజయం బాట వేసి పిలుస్తుంది
ఆనందం ఆలింగనం చేసుకుంటుంది!

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us