మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

ఆకాశానికి ఎగసిన పాతకెరటం

by చంద్రకళ దీకొండ May 31, 2026
written by చంద్రకళ దీకొండ

ప్రముఖ రచయిత్రి,కాలమిస్ట్, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత మాలతీ చందూర్ గారు!

ఆ రోజుల్లో చాలామందికి మాలతీ చందూర్ అంటే ఒక చూడదగిన వింత.పైగా ఆవిడ ప్రమదావనం,వంటలూ-పిండివంటలు… ప్రశ్నలూ-జవాబులు వారం వారం కనిపించేవి గానీ,ఆవిడ ఫోటో ఎక్కడా కనిపించేది కాదు.చాలామంది అభిమాన పాఠకులకు ఉత్సుకత ఉండేది,ఆమెను చూడాలని.పేరును బట్టి ఉత్తరాది వాళ్లనుకునేవాళ్ళు.
చందూర్ ఇంటి పేరనీ, మాలతి అసలు పేరనీ,పశ్చిమగోదావరి జిల్లా వాస్తవ్యులనీ తరువాత తెలిసాయి వివరాలు.

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు.కానీ ఆమె విజయం వెనుక వెన్నుదన్నుగా ఉన్నవారు(ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సరసన సదాశివంలా)
నాగేశ్వరరావు చందూర్ గారు.

ఆవిడ కథల నేపథ్యం చెన్నపట్నమే.సమతూకమైన చక్కని సాహిత్యం అర్థ శతాబ్దికి పైగా తెలుగు పత్రికారంగాన్ని సుసంపన్నం చేసింది.

ముళ్ళపూడి,రా.వి.శాస్త్రి గార్లు సాహిత్య లోకాన్ని ఏలుతున్న రోజులవి.తెలుగు పత్రికలన్నీ మద్రాసు నుండే వెలువడేవి.

“దేశీ పబ్లికేషన్స్” వారు ఆవిడ వ్రాసిన “పాప” అనే కథాసంపుటిని అచ్చువేసారు.
“లజ్ కార్నర్” అనే కథ చాలా బాగుంటుంది.

సినిమాలు అర్థం చేసుకోవడానికి తమిళ భాషను నేర్చుకుని,రెండేళ్లకే అనువాద రచనలు చేసిన మేధావి మాలతీ చందూర్ గారు.
ఆమె తెలుగులో అనువాదం చేసిన “జయకాంతన్” గారి తమిళ నవల “సిలనేరంగళ”, “కొన్ని సమయాలలో కొందరు మనుషులు” శీర్షికతో ధారావాహికగా వెలువడి సంచలనం సృష్టించింది.

ఆంధ్రప్రభలో నిరాఘాటంగా సుమారు అర్థ శతాబ్ది పాటు “జవాబులు” శీర్షికను నడిపిన విదుషీమణి ఆమె.ఎన్నో రకాల సమస్యలకు ఆత్మీయంగా జవాబులిస్తూ, ఓదారుస్తూ, ధైర్యం చెప్తూ…తెలుగు వారి ఆప్తవర్గంలో చేరారు.వాటిని కొంతమంది అభిమాన పాఠకులు బైండింగులు చేసి, అపురూపంగా దాచుకునేవారు.నేడు పత్రికలలో వస్తున్న “కౌన్సిలింగ్” వంటి శీర్షికలకు ఆవిడే శ్రీకారం చుట్టారు ఆనాడే.

ఆంగ్ల భాషలోని మంచి నవలలను పరిచయం చేసే “పాతకెరటాలు” అద్వితీయం.ఆమె ప్రతిభ అంతర్జాతీయంగా వ్యాపించి,ఆకాశానికి ఎగసింది ఈ రచనల ద్వారా.వాటిని ఆసక్తిగా చదివిన వారిలో నేనూ ఒకదాన్ని అవడం ఎంతో గర్వకారణం!

“శతాబ్ది సూరీడు”,”హృదయనేత్రి”,
“శిశిరవసంతం”,”సద్యోగం”,
“ఆలోచించు”,”రాగరక్తిమ”,”భూమిపుత్రి”,”ఏమిటీ జీవితాలు”,”ఏది గమనం-ఏది మార్గం”,”రెక్కల చుక్కలు”,”కాంచనమృగం”,”కలల వెలుగు”,”రేణుకాదేవి ఆత్మకథ” వంటి 16 నవలలు రచించారామె.

స్నేహసౌహార్ద్రాలకు పుట్టినిల్లు చందూర్ వారి ఇల్లు.ఎందరో తెలుగు ప్రముఖులు వారి గృహాన్ని సందర్శించేవారు.

మాలతీ చందూర్ గారి రచనల గురించి కొంతమంది ప్రముఖ రచయితలు,రచయిత్రులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, ఇలా ప్రస్తుతించారు :-


“ఆమె శైలి సూటిగా,సుఖంగా,డొంక తిరుగుళ్లు లేకుండా హాయిగా ఉంటుంది. అనవసర అలంకారాలు ఉండవు.హాస్యోక్తులుండవు.
కథ వడివడిగా నడుస్తుంది.వ్యక్తిగతజీవితం గానీ,సాహిత్య జీవితం గానీ సంస్కారవంతంగా గడిపి,పాఠకుల మదిలో గౌరవప్రదంగా నిలబడిపోయే అదృష్టం మాలతీ చందూర్ వంటి కొద్దిమందికే సాధ్యం”
———– శ్రీ రమణ

“నవలా నిర్మాణము సూటిగా,స్పష్టంగా ఉండి,వ్యక్తులను,పరిస్థితులను కళ్లముందుంచుతారు.మనమే పాత్రను ఇష్టపడతామనేది మన సంస్కారంపై ఆధారపడి ఉంటుంది.”
—————— ఓల్గా

“ఆమె రచనలు స్త్రీలను ఆకట్టుకున్నాయి.ఎందరో రచనలను చేయడానికి పురికొల్పాయి.అట్లా రచయిత్రులు,రచయితలు అయినవాళ్లున్నారు.ఉత్తమ పాఠకులైనవాళ్ళు, ఉత్తమ గృహిణులు, ఉత్తమ సంస్కారం గల మహిళలుగా రూపుదిద్దుకున్నవాళ్లున్నారు.
— ముదిగంటి సుజాతారెడ్డి

“స్త్రీల ఉద్యోగ రంగ, జీవితరంగ సంఘర్షణలను,సర్దుబాట్లను,స్వతంత్ర వ్యక్తిత్వ జీవన ఆకాంక్షలను,ఆత్మగౌరవ చైతన్యాన్ని ఇతివృత్తంలో భాగం చేసిన నవలలు రచించారు మాలతీ చందూర్ గారు.”
—- కాత్యాయనీ విద్మహే

“భావ గాంభీర్యం, సునిశిత పరిశీలన,
విస్తృత పఠనం,అధ్యయనం,
కాలానికంటే ముందుండే నైజం,చెప్పదలచుకొన్న విషయాన్ని సందర్భోచితంగా,వాదనా పటిమతో, సమయస్ఫూర్తితో రచించే శైలీ,నైపుణ్యం…ఇవన్నీ కలగలిపితే ఆమె.
———- డా.శిలాలోలిత


మాలతీచందూర్ గారి కథల్లో మహిళా చైతన్యం

ప్రసిద్ధిగాంచిన “లజ్ కార్నర్” కథలో కౌమారపు ప్రాయంలో ఉన్న ఒక అమ్మాయి,రెండు సార్లు బి.ఏ.ఫెయిల్ అయిన వాడితో తనకు ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవడానికి,ఇంట్లో చెప్పకుండా రైల్లో లజ్ కార్నర్ ప్రాంతానికి చేరుకుని;తన స్నేహితురాలి ఇంట్లో కలిసి,ఆశలు కల్పించిన సినిమా డైరెక్టర్ ని కలుసుకోవాలని ఫోన్ చేయగా,అది నెంబర్ లో కొద్ది తేడాగా ఉన్న శేఖరానికి కలుస్తుంది.ఇక్కడ ఒక సన్నివేశంలో ఒంటరి ఆడపిల్ల భయాలను తెలిపేలా, తన భార్యకు ఫోన్ చేయటానికి వచ్చిన వ్యక్తిపై అనుమానంతో గట్టిగా కేకలు వేయడం-పోలీస్ కానిస్టేబుల్ రావడం-సహజంగా వుంటుంది. ఆడపిల్ల ఆత్మరక్షణకు గట్టిగా అరవడం కూడా పనిచేస్తుందని దృశ్యమానం చేసారు రచయిత్రి. తాను ఒంటరిగా ఉన్నానని,రాత్రి పూట భయంగా ఉందని,త్వరగా వచ్చి,డైరెక్టర్ కు ఫోన్ చేయడానికి తన వద్ద నోట్లు తప్ప చిల్లర(రెండు అణాలు) లేనందువల్ల తనను తీసుకెళ్ల మంటుంది.
ముందు విసుక్కున్నా,ఒంటరి ఆడపిల్లపై జాలితో తన ఇంటికి తీసుకువస్తాడు శేఖరం. తనను ఎంతో ప్రేమించే వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయిని ఆదరించి,ఆశ్రయమిస్తుంది.ఇంకా పెళ్లికాని శేఖరం ఆ అమ్మాయితో వేళాకోళం,వెటకారం ఆడడాన్ని అడ్డుకుంటుంది.తెల్లవారి చదువుకున్న దానివి,నీకెందుకు ఈ సినిమాలు?షూటింగ్ చూడు,నీకే అర్థమవుతుంది అంటూ రెండు రోజులు రాత్రంతా షూటింగ్ కార్యక్రమం చూడడానికి అనుమతిస్తాడు డైరెక్టర్. శేఖరంతో పాటుగా తెల్లవార్లూ షూటింగ్ చూస్తుంది.చెప్పిన సంభాషణే మళ్లీ,మళ్లీ చెప్పటం వంటి షూటింగ్ కార్యక్రమం చూసి,తలనొప్పితో శేఖరం ఇంటికి చేరుకుంటుంది.శేఖరం అమ్మ,ఆ అమ్మాయి(శ్యామల)ని ఆప్యాయతతో అడుగుతూ,వివరాలు రాబట్టి,వాళ్ళ నాన్నను ఫోన్ చేసి,పిలిపిస్తుంది.కొసమెరుపేమిటంటే-నెల తిరిగేలోగా, శేఖరానికి,శ్యామలకు పెళ్ళై,ఆ తర్వాత ఓ పాపకు తల్లవుతుంది.పాపం మీ అమ్మ సినిమా తార అవ్వాలనుకుంది.నువ్వన్నా తన కోరిక తీర్చు అంటూ వేళాకోళమాడే శేఖరం మాటలకు ఇంకా ఉడుక్కుంటూనే వుంటుంది శ్యామల అంటూ కథను ముగిస్తారు.
ఆ రోజుల్లో(1951) కనుక, శ్యామల శేఖరాన్ని కలిసి ఆపదను తప్పించుకుంది.డైరెక్టర్ కి కూడా చదువుకున్న ఆడపిల్లలంటే గౌరవం వుంది కనుక,కథ సుఖాంతమైంది.
చక్కని కథను చదివిన అనుభూతిని కలిగిస్తుంది,మాలతీచందూర్ గారి ఈ కథ.
గోముఖ వ్యాఘ్రాల, రుద్రాక్షలు ధరించిన తోడేళ్ల మోసాలు,
మాయలు నిండిన ఈ రోజుల్లో
అలా జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

“డాబా ఇల్లు” కథలో ఒక్కో ఇటుక పేర్చి స్వయంగా కట్టుకున్న ఇంటికై షావుకారు దగ్గర అప్పు చేసిన పేద దంపతులు..అతనికి కాలుకు దెబ్బ తగిలి, కట్టలేకపోయిన మూడు నెలల వాయిదా వల్ల ఇంటి తాకట్టు వాకట్టు అయి,షావుకారు జప్తు చేసుకుంటే, కూలిపోయిన అతని కలల మేడ,ఆ మేడ గోడపై మేకులు కొట్టవద్దంటూ అతను చూపిన మమకారం ఎంతో హృద్యంగా,ఆర్ద్రంగా చిత్రించారు మాలతీచందూర్ గారు.ఇటువంటి ఎంతోమంది పేదల కష్టాలను, ఇటీవల హైడ్రా వారు కూల్చేస్తున్న పేదవారి కట్టడాలను కళ్ళకు కడుతుంది ఈ కథ.

“షణ్ముగం” కథలో తమిళం యాస కలిసిన భాషలో ఆమె అమాయకత్వాన్ని, సహజత్వాన్ని..మాధవి వంటి ఆధునిక మహిళల చిన్నచూపు ఆలోచనలను,కథానాయకుని పేదపిల్లకు సహాయం ముసుగులోని అతని ద్వంద్వ ప్రవృత్తిని మనకు తేటతెల్లం చేస్తారు.

“వారి సఖి” కథలో కథానాయకుడు ఒకప్పటి తాను ప్రేమించిన సఖి సుగుణను తన అర్థాంగి వద్ద పదే, పదే పొగుడుతూ ఉన్నప్పుడు ఆమె పడే మానసిక వేదనను తెలియజేస్తూ,అటువంటి ఎంతోమంది మహిళల వ్యధను మనకు గుర్తు చేస్తారు.అంతేకాక,వారి ఇంటికి భర్త ఆజ్ఞపై వెళ్ళినప్పుడు,ఆ మహిళ భర్త తన కొంగు పుచ్చుకున్న విషయాన్ని భర్తకు చెప్పి,మళ్లీ ఆ సుగుణ మాటెత్తకుండా నోరు మూయించడం.. చక్కని గుణపాఠం తన భర్తకు నేర్పడం చాలా బాగుంటుంది. మగవారి చేతిలో బాధలు పడే మహిళలు నేర్చుకోవాల్సిన విషయమిది.

“లగ్నబలిమి” కథలో ఇరువురు కథానాయకులలో నాయిక ఎవరివైపు మొగ్గుచూపుతుందోనని
ఉత్కంఠను రేపుతూ..పురుషుడు ప్రతి స్త్రీ వద్దా తన ఆంతరంగిక ప్రేమలు చెప్తాడా ఏమిటి?ప్రకృతి నేర్పుతుంది. పద్ధేనిమిది పైబడ్డ మగవాడికి ప్రేమించడమనేది ప్రకృతి నేర్పుతుంది. ప్రేమ లేకుండా ఉండడం అసంభవం.నిన్ను చూసేదాకా ప్రవరాఖ్యుడిలా మడికట్టుకు కూర్చున్నవాడు,నీ దగ్గరకొచ్చినా నువ్వు అతన్ని ప్రేమించలేవు అన్న ఒక్క సంభాషణతో తనను మొదటిసారి ప్రేమించే మగవాడి కోసం ఎదురుచూస్తున్న ఊగిసలాట కు తెరదించుతూ, ఆడవారి,మగవారి మనస్తత్వాలను మనకు తెలియజేస్తారు.

“కాంతమ్మ రెండో కూతురు” కథలో..అక్క చదువు ధ్యాసలో పడి, భర్తను పట్టించుకోకపోతే,చెల్లి బావకు దగ్గరై, గర్భవతి అవుతుంది.తన ఇద్దరి కూతుళ్ళ భవిష్యత్తు గురించి తపన పడే తల్లి మనోవ్యధను ఎంతో బాగా ఈ కథనంలో తెలిపారు మాలతీచందూర్ గారు.

“ఏనాటి జగన్నాథ్” కథలో తన కొడుకు చిట్టి తనను వదిలి హాస్టల్ కి వెళుతూ, తనను పట్టించుకోకుండా ఇంజన్ ను పసిచాపల్యంతో చూస్తున్నప్పుడు,తాను అదే వయసులో ఉన్నప్పుడు అక్క ఇంటిలో పరిచయమైన జగన్నాథ్ తనపై పెంచుకున్న ప్రేమను,తన జడలో గుచ్చుతున్న బంగారపు నారు పోసిన స్ప్రింగ్ చేమంతి పువ్వును పట్టించుకోకుండా,అతను తెచ్చే యాపిల్స్, బిస్కెట్ లు,జాంకాయలనే చూసి సంతోషిస్తూ,తనను విడిచి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్న అతనిని అక్కకు చూపించడం వంటి బాల్యచేష్టలను గుర్తుకు తెచ్చుకుంటుంది.మనం కూడా అంతే కదా.. చిన్నతనంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ…అప్పుడలా ఎందుకు ప్రవర్తించానో అనుకుంటూ ఉంటాం. అప్పుటి వయసు,జీవితానుభవం లేని పసితనం అలాంటివని ఈ కథ ద్వారా తెలియజేసారు.

“నాన్న” కథలో విశ్వపిత గా వర్ణిస్తూ,తాను ప్రేమించిన జానకిని పెళ్ళైనా ప్రేమిస్తూ,విధవరాలైన ఆమె కొడుకుని లోకం మాటలకు జడవకుండా పెంచిన తండ్రి ఔన్నత్యాన్ని చాటారు.పెళ్లికాకముందు జానకి హేళన చేసినందువల్ల తన ఎడమచేతి ఆరో వేలుని కోసుకుని,సెప్టిక్ అయితే,మణికట్టు దాకా తొలగించిన విషయాన్ని అతని స్నేహితుడు చెప్పేదాకా తెలియనివ్వకుండా ఉంచడం..ప్రేమ వ్యవహారంలో పడి ఐ. ఎ. ఎస్. పరీక్షకు వెళ్లనని మొండికేస్తున్న కొడుకుకి చెప్పడం..కథనం ఎంతో బాగుంటుంది.తన కొడుకు కాకపోయినా,తాను ప్రాణప్రదంగా ప్రేమించిన జానకి కొడుకు కోసం అతని తాపత్రయం హృదయాన్ని ద్రవింపజేస్తుంది.యాసిడ్ దాడులు చేసే ఈ కాలపు యువత తప్పక చదవాల్సిన కథ ఇది.

“రక్షించా” కథలో నిష్ఠాగరిష్టుడైన తండ్రి,తల్లి రోగచికిత్స కోసం పట్నం వెళ్లి,వ్యసనాలతో నైతికంగా పతనమవుతుంటే చూస్తూ బాధపడే కొడుకు ఆవేదనను కళ్ళకు కడుతూ,ఆ ప్రభావం కొడుకుపై చెడుదారిలో వెళ్లేలా ఎలా ప్రోత్సహించిందో కథనంలో చూపుతారు.చివరకు తండ్రి పెళ్లి చేసుకున్న జానకి,తన సమవయస్కురాలు,అయిన ఆమెతో మోహంలో పడి, గర్భవతి అయిందని తెలిసి,మందు మింగించి,ఆమె మరణానికి కారణభూతుడవుతాడు. మూడేళ్ళ జైలుశిక్షకు పాత్రుడౌతాడు.తీపిలో వగరుంటుంది.నీలాంటి యువకుడు పిరికితనంతో పారిపోకూడదు అంటూ బోధించిన లాయర్ స్నేహితుడు రామంని తాను రక్షించానని చెపుతాడు.
స్త్రీ పురుషునిలా గాలిలో స్వేచ్ఛగా ఎగురలేదు.ఎగిరినా ప్రకృతి స్త్రీని కఠినంగా శిక్షిస్తుంది అంటూ జానకి మాటల్లో జీవితసత్యాలను చాటి చెపుతారు.

“అక్క” కథలో తాను ప్రేమించిన క్లాస్మేట్ జోగరావును కాక, తండ్రి చూసిన ఫారెస్ట్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకున్న విధికి తలవంచిన బుద్ధిమంతురాలు అని నిర్వచిస్తారు.ఫారెస్ట్ ఆఫీసర్ తనను పెళ్లి చేసుకోలేదన్న అసూయతో,అత్త కూతురు సుశీ జగ్గరావుకు పెళ్లి అయిందని అబద్ధం చెబుతుంది.తన ఇంటికి జగ్గరావును,అక్కను పిలిచి,అవమానిస్తుంది. కానీ అక్క సుశీ వాళ్ళమ్మకి(అత్త) సంయమనంతో సమాధానమిస్తుంది.జరిగిన సంఘటన గురించి బాధపడుతున్న అక్కను ఓదారుస్తూ,ఆమె చెల్లి అవమానాలు భరించాలి.మనం ఆడవాళ్ళం.భూదేవి లాంటివాళ్ళం అంటుంది.ఆడవారి జీవితాల గురించి,ప్రేమించిన హృదయాల త్యాగం గురించి ఈ ఒక్క వాక్యంలో తేల్చి చెబుతారు మాలతీచందూర్.

“అచ్యుతం” కథలో ప్రస్తుతం డాక్టర్ భార్య అయిన రాధ, తనను ప్రేమించిన అన్నయ్య స్నేహితుడు, చివరి దశలో తన వద్దకు వచ్చి,తన చేతిలోనే కన్ను మూయడం విషాదాంత కథనం.స్త్రీకి వివాహంతో బాల్యం అంతర్థానమవుతుంది. ఈ మొగాళ్ళు ఇంద్రజాలికులు*ఇన్నాళ్ళలో నిన్ను చూడటానికి రానివాడు, ఇప్పుడు తన స్వార్థం కోసం ఈ దశలో వచ్చి,నిన్ను మాయ చేస్తున్నాడు అంటూ తన స్నేహితురాలు ఎంతగా చెప్పినా,రాధ అతనిని ఆదరించి,తన నిర్మల ప్రేమను చాటుకుంటుంది.కొంతవరకూదేవదాసు కథను గుర్తుకు తెస్తుంది ఈ కథ.

“జీవితపు విలువ నెలకు డెబ్భయి రూపాయలు” అంటూ గారాబంగా పెరిగిన డిప్యూటీ కలెక్టర్ కూతురు,ఐదు వందల రూపాయల జీతగాడికి భార్య అయిన జయ మతకలహాల్లో భర్త,పాముకాటుకు తండ్రి చనిపోతే..
జయ బ్రతుకుతుంది.చావదు.తనకోసం తను బ్రతుకుతుంది.నెమ్మది నెమ్మదిగా బి.ఈ.డి. కూడా అవుతుంది అని కథను ముగిస్తూ స్త్రీ సాధికారతను ఆ కాలంలోనే చాటారు మాలతీచందూర్ గారు.

ఇలా..ఆ కాలంలోని ఆడవారి,మగవారి మనస్తత్వాలను,ప్రేమను,త్యాగాలను,ధైర్యాన్ని, విధికి తలవంచే పరిస్థితులను తన కథలలో చిత్రించారు మాలతీచందూర్ గారు.అంతేకాక,ఆడవారి సాధికారతను,లేడీస్ క్లబ్బుల్లో ధనవంతులైన ఆడవారి ప్రవర్తనను,తోటి స్త్రీలపై ఆడవారు చూపే ఈర్ష్యాసూయలను కూడా సందర్భానుసారంగా తమ కథలలో చేర్చారు.

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఆమె నా కావ్య నాయిక!

by Padmavathi Neelam Raju May 31, 2026
written by Padmavathi Neelam Raju

‘తాతయ్య ఎక్కిన విమానం ల్యాండింగ్ కి ఇంకా అరగంట టైం ఉంది,’ అనుకుంటూ క్యాపిచీనో కాఫీ కప్పు పట్టుకొని విజిటర్స్ లాంజ్ లో ముంబై ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాడు రవీందర్.  అతని ఆలోచనలు అలా చిన్ననాటి కాలానికి వెళ్ళిపోయాయి. తనకంటే ఎక్కువగా నాన్న కూడా తాతయ్య  బామ్మ ల  దగ్గర గడపలేదు. ఆమె పూర్తి పేరు దుర్గ నందిని. తాతయ్య సీతారామయ్య ఒంగోలులో ఉండేవారు . సాయంత్రాలు తాతయ్యతో సిఆర్ఆర్ రీడింగ్ రూమ్ కి వెళ్లి కాసేపు న్యూస్ పేపర్లు, కథల పుస్తకాలు   తిరగేయడం, ఒక్కోసారి రంగారాయుడి చెరువు దగ్గరకెళ్ళి ఆ గట్టు చుట్టూ నడవడం, అమ్మానాన్న వాళ్లు వచ్చినప్పుడు కొత్తపట్నం సముద్రానికి పిక్నిక్ కి వెళ్లడం ఇలా ఎండాకాలం, దసరా, సంక్రాంతి సెలవులన్నీ గడిచి పోతుండేవి.  తాతయ్య, బామ్మ  దగ్గర ఉంటే నాకు ఎప్పుడూ బోరుగా ఉండేది కాదు.  ఇప్పుడు తాతయ్య బామ్మ  లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడా అని  అనుకుంటాను.  ఆమె పోయి రెండేళ్లయింది. నాన్న హైదరాబాదులో ఇల్లు కొని మకాం  మార్చేశాడు.  నాక్కూడా చదువు పూర్తయి నేను ట్రైనింగ్  కింద ముంబాయి వచ్చి ఇక్కడే అపార్ట్మెంట్ తీసుకొని ఉద్యోగంలో స్థిరపడిపోయాను. “అర్చన నా జీవితం లోకి వచ్చింది,” తల విదిలించాడు.  విమానం ల్యాండ్ అయిందని అనౌన్స్మెంట్ విని అరైవల్ గెట్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. ఎప్పటిలాగే తాతయ్య ఫిట్. ఆరడుగుల ఎత్తు, చక్కటి ముఖవర్చస్తూ, వయసుతో వచ్చిన గాంభీర్యం, తెల్లగా  నెరిసిన జుట్టు మీసాలు. అనుభవంతో పండిన ఒక జీవిత శాస్త్రవేత నడిచి వస్తుంట్లుగా ఉంది  రవీందర్ కి.  బయటకు వచ్చిన  ఆయన చేతిలోని సూటికేసందుకొని కారు పార్కింగ్ దాకా వెళ్లి తాతయ్యని కారులో కూర్చోబెట్టుకొని ముంబైలో ఉన్న తన అపార్ట్మెంట్ కి చేరాడు.

**************************

 “తాతయ్య ఆ రెండో పడక గదిలో పక్క సర్ది పెట్టాను, నువ్వేళ్లి ఫ్రెష్ అయ్యి కాసేపు విశ్రాంతి తీసుకో. ఈలోపు నీకు మంచి కాఫీ చేసి తెస్తాను,” అన్నాడు రవీందర్.   సీతారామయ్య గదిలోకి వెళ్ళాడు.  అది చాలా చక్కగా ఉంది.  “ఇల్లంతా ఇంత పొందికగా ఉంది అంటే ఒక అందమైన పొందిక గల స్త్రీ హస్త ఉన్నదనిపిస్తోంది” అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి బట్టలు మార్చుకొని మంచం మీద వాలాడు.  రవీందర్  కాఫీ తీసుకొచ్చాడు. ఇంటిని చూసి ఇల్లాలి ని చూడాలన్న మాట  వాస్తవమే. అర్చన మంచి పొందికగల అమ్మాయి”అనుకున్నాడాయన.   “తాతయ్య  ఇదిగో కాఫీ,” అంటూ అందించాడు. “ఏమి తింటారో చెప్తే బయటనుండి తెప్పిస్తాను,” అన్నాడు.  “నువ్వు వండుకోవటం లేదా?” “అదేం లేదు తాతయ్య నాకు అంత బాగా వంట  రాదు,” అంటూ నసిగాడు.  “ఓరిని, నేను వచ్చాగ,  నేను చేస్తాలే వంట,”అన్నాడు.  “మీకు  వంటొచ్చా,” ఆశ్చర్యంతో అడిగాడు.  “ఏ అంత ఆశ్చర్యం.  మీ నానమ్మ నాకు అన్ని నేర్పించిందిలే,” అన్నాడు.  “అవును తాతయ్య, నీది నానమ్మది ఒక అందమైన అద్భుతమైన సహచర్యం,” అన్నాడు అర్చన గుర్తొచ్చి కాస్త నిస్పృహగ. “నాకు వంటగది కూరగాయలు చూపించు,” అంటూ మనవడిని  లేవదీశాడు.  “ఇదంతా నువ్వే చేసుకుంటావంట్రా, చాలా చక్కగా ఉంది! నీ ఇల్లంతాను!” అన్నాడు ఆయన.  “కాదు తాతయ్య, అర్చన. తనకి ఇల్లంత సర్దుకుని అందంగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం,” చెప్పాడు చాలా సహజంగా. సీతారామయ్య గారికి అర్థమైంది , “రవీందర్ కి అర్చనకి  మధ్య వచ్చిన విభేదం అంత పెద్ద విషయం కాదని.” ఇక్కడికొచ్చే ముందే శ్రీధర్ ద్వారా కొంత తెలుసుకొన్నాడు. వీళ్ళిద్దరూ సాఫ్ట్వే వేర్ జీతగాళ్లే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్. ఏడాదికే ఇద్దరు ఆకర్షితులయ్యారు. పెళ్లి ఇప్పుడే వద్దు ఇద్దరం కలిసి ఉందామని నిర్ణయించుకొని ‘లివింగ్ రిలేషన్ షిప్’ అంటూ ఇలా మొదలు పెట్టారు. కొద్ది నెలలకే ఇలా అయింది. సీతారామయ్య గారికి అర్థమైంది వీళ్ళ మధ్యన ఈగో అడ్డువచ్చిందని, అనుకున్న వెంటనే  “మిషన్ మ్యారేజ్” ని చేపట్టారు. రాత్రి భోజనం అయ్యాక సీతారామయ్య రవీందర్ కబుర్లు చెప్పుకొని, కొద్దిసేపు అయిన తర్వాత “ఒరేయ్ రవీందర్ నేను పడుకుంటాను, నువ్వు వెళ్లి పడుకోరా,” అన్నాడు.  “నాకు అంత త్వరగా నిద్ర రాదు తాతయ్య. నీ దగ్గర ఏదైనా పుస్తకం ఉంటే ఇవ్వరాదు,” అన్నాడు.  “ఆ సూట్ కేసులో పైనే ఉంది. కావాలంటే తీసుకో” అన్నాడు ఆయన. సూట్కేస్ తెరిచి చూసి “అది నీ డైరీ తాతయ్య” అన్నాడు. “పర్లేదురా అంతా మీ నాన్నమ్మ గురించే చదవచ్చు, తీసుకెళ్ళు.” రవీందర్ డైరీ తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు. ముత్యాలన్నీ పేర్చి అక్షరాలుగా దిద్దినంత అందమైన రాతలో ఉంది తాతయ్య చేతిరాత. చదవటం మొదలుపెట్టాడు.

 “నందిని! నువ్వే నా కావ్య నాయకవి!”మొదటి  వాక్యం. అందరూ ఆమెని ‘దుర్గా’ అని ‘దుర్గమ్మ’ అని పిలిచేవారు.  సీతారామయ్యగారు  మాత్రం ప్రేమగా ‘నందిని’ అనిపిలిచేవాడు.  అప్పుడప్పుడు రవీందర్ అల్లరిగా  తాతయ్యలాగా “నందిని!” అని పిలిస్తే, “ఒరేయ్ భడవ!  ఆ పేరు ని  పిలవటంలో కూడా సుకుమారం, మాధుర్యం   చూపిస్తాడు మీ తాతయ్య, అది నేర్చుకో,” అని నవ్వేది. అందమైన ముఖవర్ఛస్సు, నిండయిన విగ్రహము, మెడలో కాసి కాయల రెండు పేటల గొలుసు,  మెడకు దగ్గరగా లక్ష్మీకాసులతో ఉన్న నల్లపూసలు,  రెండు పేటల మంగళ  సూత్రం ఉన్న గొలుసులతో జరీపేటు  చీరకట్టి ఎప్పుడు నిండుగా కనిపించేది. కాళ్ళకి అంగుళం వెడల్పు ఉన్న వెండి పట్టీలు, గజ్జల మెట్టెలు, పసుపు రాసుకొని అచ్చు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే ఉండేది నాకు తెలిసిన బామ్మ! అంత అందమైన బామ్మని తాతయ్య  ఎలా మర్చిపోగలడు, అనుకొని చదవటం కొనసాగించాడు.

************************

 ‘నందిని నువ్వా రోజు ఎదురుచూపులతో భయంతో ముచ్చెమట ముత్యాల్లాగా  నీ నుదుటన మెరుస్తుండగా నక్కినక్కి తలుపు వెనక నిలుచుని నన్ను పిలిచావు.  మా ఇంటి వరండా బయట నేను నిన్ను చూశాను.  దగ్గరకు రాగానే ఒక కాగితం నా చేతిలో పెట్టి పరిగెత్తి పోయావు. దాని సారాంశం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాతోనే నీ పెళ్లి అని.’ నా  మనసంతా అందమైన తెల్లని కొంగలా తేలిపోయింది గాలిలో. అప్పుడే నాకర్థమైంది నువ్వే నా జీవన కావ్య నాయక ‘అభిసారిక’ అని. మన పెళ్లి జరిగిపోయింది. మన వివాహ జీవితం మూడు పున్నములు, ఆరు శోభన రాత్రులుగా గడిచి  పోయింది.

ఆ సమయంలోనే నాకు వేరే ఊరికి బదిలి అయింది.  ‘నువ్వు లేకుండా నేను ఎలా బతకాల’ అని అనుకుంటున్న సమయంలో ‘నీ ఉత్తరాలే నాకు ఊపిరి అయ్యాయి. ఆ ఉత్తరాలలో నీ ప్రేమతో నిండిన ప్రతి పదం నాకు జీవనాధారం అయింది.’  ‘అందమైన నీ రూపు కనుల ముందే కదలాడుతుంటే నీలాగే అందంగా ఉత్తరం రాయాలని ప్రయత్నించేవాడిని.  కానీ అవి  నీ ఉత్తరాలంత  అందంగా మాత్రం ఉండేవి కాదు.  అయినా సరే నీవు మరింత అందంగా నాకోసం ఎలా ఎదురు చూస్తున్నావో రాసేదానివి.’

  “ఉత్తరం చివరలో అందమైన పాటతో “మల్లెపూలు నీకై రోజు రోజు పూచే,” అంటూ ముగించేదానివి నందిని!, నీ అందమయిన పెదవుల ముద్ర వేసేదానివి. నీవు నాకోసం గడియలు  లెక్కిస్తూ ఎదురుచూస్తున్న నా కావ్య నాయక! ‘విరహోత్ కంఠిత !” అనిపించేది.

 జీవితమంతా  ఆనందమయం అయితే , అది జీవితం ఎందుకవుతుంది. అందమయిన కావ్యమవుతుంది. నాకింకా గుర్తుంది అవి గడ్డురోజులు.  ఎమర్జెన్సీ అమలులో ఉన్న  రోజులు. నాకు జీతం రావడానికి పది హేను రోజులపయినే పట్టేది. అప్పటికింకా నేను మామూలు గుమాస్తానే. నా సంపాదన బొటాబొటిగా మన సంసారం గడపటానికి  సరిపోయేది. అప్పటి నీ త్యాగం నేను మరువలేను. అమ్మ మామయ్య చేత టెలిగ్రామ్ ఇప్పించింది, ‘నాన్నకు గుండెపోటు వచ్చిందని.  ఆఫీస్ నుండి ట్రంక్ కాల్ చేశాను అమ్మకి. ‘నాన్నను హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఆయనకి బైపాస్ సర్జరీ చేయాలనీ, లక్ష యాభైవేలు అవుతుందని’ అమ్మ చెప్పింది. నా దగ్గర అంత డబ్బు లేదు. అప్పటి పరిస్థితులలో నాకు ఎక్కడ అంత అప్పు పుట్టలేదు. అప్పు అడిగిన పది రూపాయల వడ్డీ ఇస్తేనే ఇస్తామంటున్నారు. నువ్వు వెంటనే నీ చేతి కున్న బంగారు గాజులు, మెడలోఉన్న రెండుపేటల చంద్ర హారం, మంగళ సూత్రం బంగారు తాడు, మీ అమ్మొమ్మ నీకిచ్చిన చేతి వంకీ, పెళ్ళికి నీకు పెట్టిన ప్రధానపు ఉంగరం, మన శ్రీధర్ కి వాళ్ళ తాతయ్య చేయించిన బంగారు గొలుసు  ఇలా ఇంట్లో ఉన్న కొంత వెండి సామాను కలిపి అమ్మేయమని, డబ్బు మామగారికోసం పంపించమని  నవ్వుతూ నా చేతికిచ్చినప్పుడు నీ ఋణం ఈ జీవితం లో తీర్చుకోగలన అనిపించింది. నాన్నగారు బతికి బయట పడ్డారు. ఆ తరువాత ఒకరోజు  మేడలో పసుపు తాడుతో , చేతులకు నిండుగా ఎరుపు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు వేసుకొని, తలకి నిండుగా మల్లె పూలు పెట్టుకొని,  మంచి వంగపండు రంగు నేత చీరలో నా ముందు నిలుచుని , “సీత! నేను అందంగా ఉన్నానో లేదో చెప్పు!” అని నా కళ్లలోకళ్ళు  పెట్టి నువ్వు చూస్తుంటే అంత  అందమయిన నేత్రాలు నాకు ‘దివ్య నేత్రాలుగా’ కనిపించాయి. నీ చిరునవ్వులో ఆ దేవి కామాక్షి దర్శనమిచ్చినట్టయింది. నేను మంత్రముగ్దుడనయిపోయాను, “తవ పాద పద్మం మమ సన్నిధస్త్వ,” అని నా మనసులోనే నీకు నా మనసుమాంజలి సమర్పించాను.         

 ‘నీకు గుర్తుందా నందిని ఉద్యోగం పనిలో పడి నేను కొంతకాలం నిన్ను మన శ్రీధర్ ని పట్టించుకునే వాడిని కాదు.  అయినా అన్ని సమర్ధించుకునే దానివి. కానీ ఒక రోజు సాయంత్రం నేను ఇంటికి రాగానే నువ్వు నా చొక్కా నుండి, నా ముంజేటి నుండి వచ్చిన మల్లెపూల అత్తరు వాసన పసిగట్టావు. దానికి నాతో యుద్ధమే చేసావు. మన పెళ్ళిరోజు వరకు మాట్లాడలేదు.  “పిచ్చిదానా నాకు నిన్ను మభ్య పెట్టాలని ఎప్పుడూ ఉండేది కాదు. ఇప్పుడు నిజం చెబుతున్న. ఆ రోజు మా ఆఫీస్ కి లక్నో నుండి అత్తరులు అమ్మే సింగ్ వచ్చాడు. మాకు అన్ని చూపించాడు. అప్పుడే వాడిని “మల్లెల అత్తరు ఉందా?” అని  అడిగితే తన దగ్గర ఉన్నది తీసి  నా  ముంజేతికి,  నా చొక్కాకి రాశాడు. ఆ తరువాత మన పెళ్లిరోజుకి నేను నీకా  అత్తరు బహుమతిగా ఇస్తే నునుసుగ్గుతో ఆ అత్తరు పరిమళంలో ఎంతో అందంగా కనిపించావు. నీ అపార్ధం  తొలిగిపోయింది.  నాకు తెలుసు నందిని!నాతో నే నీ కలహం,నీవే నా కలహాంతరిత!”

 ‘ఇంకొక సంఘటన నీకు చెప్పాలి నందిని. మనకు పెళ్లయి పదేళ్లయిన మన వివాహం జరిగిన రోజుని  నువ్వెప్పుడూ పండుగలాగా చేస్తావు. నాకు ఆ రోజు మర్చిపోలేని రోజు।  అందమైన కుట్టుపూలతో ఉన్నపలుచగా గాలికి తెలిపోయే  ఫారెన్ నయిలెక్స్  లేత గులాబీ రంగు చీరను కట్టి నా ముందు నిలుచుంటే నాలో అంతర్ముఖమైపోయిన కోరిక  కుండలినిలో విశ్రమించి ఉన్న సర్పం మాదిరిగా గుండెలోకి, అక్కడి నుండి అజ్ఞా చక్రంలోకి చేరిపోయి నన్ను నీ ప్రేమ దాసుడిగా మార్చేసింది. నీ పొందులో నన్ను నేను మరిచిపోయి నీ ఒడిలో అలాగే విశ్రమించాను. నువ్వే నా కలల నాయిక స్వాధీన పతిక….!” నీకు నా మీద ప్రేమ పొంగినప్పుడల్లా నన్ను చాలా సార్లు ‘సీత’ అని ముద్దుగా పిలిచే దానివి నీకు గుర్తుందా. నాతో అనేదానివి  కూడా,”  సీతా ! మనం ఎప్పుడు సీతారాములు, శివపార్వతుల్లాగానే ఉండాలా,  రాధాకృష్ణుల లాగా కూడా ఉండొచ్చు.   ప్రేమే మన ప్రపంచం అన్నట్టుగా కూడా ఉందాము. ఆ  ప్రేమ అనుభూతిని  మనసారా  అనుభవిద్దాము,అంటూ నన్ను ప్రేమతో చుట్టేసెదానివి.” ఆనాటి మన ప్రేమ అనుభవమై, అందమైన ఒక అనుభూతిగా మారిపోయింది.

‘నువ్వా రోజు రాత్రి నా గదికొచ్చి నన్ను జరగమని నా పక్కన కూర్చుని, కొద్దిసేపటికల్లా నన్ను ఆనుకొని కూర్చొని ఆ తర్వాత నా గుండెల మీద తలపెట్టి పడుకున్నావు. “నేను హఠాత్తుగా చనిపోతే నువ్వు  ఎలా ఉంటావు సీతా?” అన్నావు. “అవేం  మాటలు. అయినా అలా జరిగితే నీ వెనకాలే నేను. నేనేమన్నా ఈ భూమ్మీద  శాశ్వతంగా ఉండడానికి  వచ్చానా?”అన్నాను. “కానీ ఒక్క మాట మాత్రం నిజం. నువ్వు దూరం అయిపోతే నువ్విక రావని అర్ధమైన రోజు నేను  నీ తోటే ఉండే రంగుల ప్రపంచం సృష్టిస్తాను. అందరికీ దూరంగా అందమైన ప్రపంచం. అందులో నువ్వు నేను మాత్రమే, వెళ్లిపోతానని అనకు, నా మనస్సు, తనువు ఇంకా నీ సాంగత్యమే కోరుకుంటున్నాయి,” అంటూ నిన్ను మరింతగ  పొదివి పట్టుకున్నాను. అలా పట్టుకున్నప్పుడు నువ్వు అల్లరిగా చేసే  చుంబనం చేయలేదు. నన్ను నీ గుండెలకు హత్తుకొని నన్ను ఉక్కిరిబిక్కిరిచేయలేదు.   నీ నుదురు నా గుండెలకు చల్లగా మంచు ముక్కలా తగిలింది. భయమేసింది నిన్ను లేపి పడుకోపెట్టాను.  నాకు అర్థమైంది నువ్వు నాకు  అందనంత దూరంగా పోయి నా రాక కోసం ఎదురుచూస్తున్న  ప్రోషిత భత్రుకవి.” నీ వియోగం నువ్వు నాకు ప్రేమగా వేసిన శిక్ష. నువ్వు లేవన్న సత్యం తెలిసినా  నీవు నాలోనే ఉన్నావన్న భ్రమలో, ఆ అనుభూతిని నా మనసంతా  నింపుకొని ఈ నా చివరి దశ గడిపేస్తాను.  నీవే నా జీవన కథా కావ్య నాయికవు.”

**********************

రవీందర్ కళ్ళు తుడుచుకున్నాడు. అతని  మనసులో తాతయ్య కి బామ్మ తోటి ఉన్న అనుబంధం ఒక కొత్త అనుభూతిని కలిగించింది. ఎన్ని మాట పట్టింపులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరితో ఒకరిని బంధించేది ఆ శృంగార ప్రేమనుభూతి. అది  అనుభవించాలే  తప్ప, ఒకరు  చెప్పేది కాదన్న సత్యం ఎంత బాగా తాతయ్య నాకు చెప్పాడు అనుకున్నాడు.  ‘అర్చన గుర్తొచ్చింది.’ ఆ రోజు అర్చనతో కలిసి ఒక ఫ్రెండ్ ఇచ్చిన పార్టీ కి వేళ్ళాడు తను. కపుల్స్ డాన్స్ పెట్టారు. అర్చన చాలా బాగా చేసింది.  ప్రేమతన్మయత్వంలో నన్ను “ఒరే, రవీందర్ నాతో అడుగులు కలిపి మంచిగా చేయొచ్చుగా! ’ అన్నది. ఆమె ‘ ఒరే రవీందర్” అనటం   అందరు విన్నారేమో అనిపించి, “నన్ను, ఒరే” అని సంబోధిస్తుందా!” ఆవేశం, అవమానం ఉప్పిరిగొనగా      నేను ఆమెను  దూరంగా తోసేసి, అక్కడే వదిలేసి అపార్ట్మెంట్ కి వచ్చేసాను. నా వెనకాలే వస్తుందనుకున్నాను. అర్చన అభిమానవతి. తాను చాలా హార్ట్ అయిందని అర్ధమయింది. ఎందుకంటే, ఆ రాత్రే తను , ఒక ఫ్రెండ్ తో కలిసి ఆమె హాస్టల్ కి వెళ్లిపోయిందని తెలిసింది. తాతయ్య బామ్మల సాంగత్యం నన్నిరోజు ఆలోచింపచేసింది. తనని దూరం చేసుకొని బాధపడుతున్నాను. ఆమె దగ్గరికెళ్లి క్షమించమని అడగాలి. ఇంకెప్పుడు ఇలాటి  ఇగోలకు పోయి ఆమెని బాధపెట్టనని ఆమెకి చెప్పాలి. ‘నన్ను క్షమిస్తావా అర్చన!’” అలా అనుకుంటుంటే   మనసంతా విహంగయానం చేయ సాగింది. ఎప్పుడు కునుకు  పట్టిందో తెలియలేదు నిద్రలేచేసరికి సీతారామయ్య గారు వాకింగ్ కి వెళ్ళాడు.  రవీందర్ తయారయి,  “తాతయ్య నేను లంచ్ కి కలుస్తాను,” అని చీటీ  రాసిపెట్టి వెళ్ళిపోయాడు.

నేరుగా అర్చన  ఉన్న ఉమెన్స్ హాస్టల్ కి వెళ్ళాడు. ఆమెని చూస్తూనే చుట్టేసి, నుదుటి మీద ముద్దుపెట్టాడు ప్రేమతో. “నా వల్లే తప్పయింది అర్చన, ఇంకెప్పుడు నిన్ను అలా వదిలేయను, పద వెళదాము మన ఇంటికి ,” అన్నాడు. అర్చన మౌనం భయపెట్టింది. “అర్చన ఎం ఆలోచి స్తున్నావు? మన కోసమే మా తాతయ్య వచ్చాడు నిన్ను చూడాలని, పద.” అన్నాడు.

“నీకు లేదా రవీందర్,” అడిగింది శాంతంగా.

“నువ్వు లేకపోతే నాజీతానికి అర్ధమే లేదనిపించింది అర్చన. మన మధ్యన ఇంకెప్పుడు ఈ అభిప్రాయబేధాలు రాకుండా ఉండేలా చూసుకుంటాను. నన్ను నమ్ము,” అన్నాడు కళ్ళనిండుగా వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ.       

 అర్చన రవీందర్ ని  మనఃస్పూర్తిగా దగ్గరికి తీసుకుంది.  ఆమె తో కలిసి  లంచ్ కల్లా  అపార్ట్మెంట్ చేరుకున్నాడు.  అప్పటికే సీతారామయ్య వాళ్ళిద్దరికీ కలిపి వంట చేసుంచాడు.  వస్తూనే “తాతయ్య ఈమె నా అర్చన,” అంటూ పరిచయం చేశాడు.  చూడముచ్చటగా నాజూకుతనానికి చీర కట్టినట్టుగాఉంది అర్చన. సీతారామయ్య వాళ్ళిద్దర్నీ దీవించి “ఒరేయ్ రవీందర్ నేను వెళతాను టికెట్ బుక్ చెయ్యి” అన్నాడు. “లేదు తాతయ్య, మీరే మా వివాహం జరిపించండి,” అన్నాడు మనఃస్ఫూర్తిగా రవీందర్.  తన సంచిలో ఉన్న పంచాగం  తీసి  లెక్క కట్టి , “ఒరేయ్! శ్రావణ మాసం లో మంచి ముహూర్తం ఉందిరా! అదే ఖాయం చేసి మీ నాన్నకి చెప్పి పెళ్లి ఏర్పాటు చేస్తాను,” అని సంతోషంగా చెమర్చిన కళ్ళని తుడుచుకున్నాడు సీతా రామయ్య.     రెండు రోజుల తర్వాత విమానం టికెట్ బుక్ చేశాడు రవీందర్. వెళ్లే రోజు వాళ్లిద్దరికి  చెప్పాడు,”మీరే బంధంతో ఉన్న అది అనుబంధమే కావాలి. ప్రేమ అనేది అనుభవంతో కూడిన అనుభూతి.  దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలి. అప్పుడే అది అనుభూతిగా మారుతుంది. ఆ అనుభూతి  మీ మధ్యన  విడదీయరాని శృంగారానుబంధంగా మారాలి. ఆ ప్రేమభందాన్ని పవిత్రబంధం గా మార్చుకోండి.”

‘అవును! సీతారామయ్య గారి  జీవితం అనుభవం నుండి అనుభూతిలోకి మారిన సౌందర్యలహరి.’ అనుకుంది అర్చన.

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

బోనెపెట్టె

by Thata Kameshwari May 31, 2026
written by Thata Kameshwari

రవికాంత్‌కి ఏడవ తరగతి పరీక్ష పూర్తయి,సెలవులు ఇచ్చేశారు.సెలవుల్లో అతనికి స్నేహితులతో క్రికెట్ ఆడటం,తండ్రి మనోజ్‌ని చదరంగంలో ఓడించడం అంటే చాలా ఇష్టం.కానీ వాటన్నిటికన్నా తల్లి మీనా చెప్పే ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు వినడం ఇష్టం.అవి చందమామ కథలా,ప్రతిసారీ వినూత్నంగా ఉంటాయి.కానీ ఇంటికి బంధువులు రావడం తో మూడు రోజులుగా తల్లికి తీరిక లేదు.ఆ రోజు బంధువులు వెళ్ళిపోవడంతో,రాత్రి భోజనం అయ్యాక తల్లి వద్దకు వెళ్లి “అమ్మా! చుట్టాలు వెళ్ళిపోయారు కదా,ఈ రోజైనా నీ చిన్ననాటి విషయాలు చెబుతావా?”అని అడిగాడు రవి.

మీనా రవికాంత్ తల నిమిరి,”రవీ,వంటింట్లో పని పూర్తి చేసుకుని ఈవేళ నీ పక్కనే పడుకుని కొత్త విషయాలు చెబుతాను. సరేనా?”అని ప్రేమగా అనడంతో రవి సంతోషంతో “హుర్రే!” అంటూ ఒక్క గంతు వేశాడు.

రాత్రి పది గంటలకు మీనా గదిలోకి రావడం చూసిన రవికాంత్ ఉత్సాహంగా మంచంపై కొంచెం పక్కకు జరిగి, తల్లి పడుకోవడానికి కొంత స్థలం ఇచ్చి,‘ఇక చెప్పు’ అన్నట్లు ఆమె వైపు చూశాడు. మీనా రవికాంత్ కి దుప్పటి కప్పుతూ,“అది సరే కానీ,నువ్వు నాన్నతో పెద్దయ్యాక బాగా చదువుకుని లాయర్ అవుతానన్నావట?నిజమేనా?”అన్నది కుతూహలంగా.

“అవునమ్మా, నేను బాగా చదువుకుని, నీ నరసింహ తాతగారిలా మంచి లాయర్‌నవుతాను.ఆయన ఫోటో నీ పెళ్ళి ఆల్బమ్‌లో చూశాను.ఆయనలాగే ఓ మంచి న్యాయవాదినై,బీదలకు న్యాయం ఇప్పిస్తాను,” అన్నాడు గర్వంగా. మీనా వాడికి బీదల పట్ల ఉన్న జాలి, దయ చూసి సంతోషపడి,”సరేలే, ఇంకా నువ్వు పదవ తరగతి పాస్ అవడానికి సమయం ఉంది, అప్పుడు ఆలోచిద్దాం. ఇవాళ మా తాతగారిని గుర్తు చేశావు కదా, నీకు మా నరసింహం తాతగారు,అమ్మమ్మ లక్ష్మమ్మ గురించి, వారు ఉండే పల్లె గురించి చెబుతాను, సరేనా?” అని చెప్పడం మొదలుపెట్టింది.

“నేను, నా తమ్ముడు కలిసి ప్రతి వేసవి సెలవులనూ సరదాగా తాతగారి ఇంట్లోనే గడిపేవాళ్ళం.మేము ఉండే విజయనగరం నుండి వారు ఉండే బొబ్బిలి దగ్గర గొల్లపల్లికి బస్సులో రెండు గంటల ప్రయాణం.గొల్లపల్లి చిన్న పల్లెటూరే కానీ అక్కడ తయారయ్యే వీణ ఆ పల్లెకి ప్రసిద్ధి సంపాదించి పెట్టింది.అక్కడ వీణను సరస్వతి వీణ, బొబ్బిలి వీణ, తేలికగా ఉండే పనస చెట్టు కాండంతో తయారుచేస్తారు కాబట్టి ఏకాండ వీణ అని కూడా అంటారు.నా దగ్గర ఉన్న వీణ కూడా అక్కడిదే.వీణ తయారీకి సుమారు ఒక నెల రోజులు సమయం పడుతుంది తెలుసా,” అని మీనా అనడంతో,“బాబోయ్! అంత కష్టపడి చేస్తారా?అందుకే నువ్వు ఆ వీణ వాయిస్తుంటే అంత మధురంగా ఉంటుంది,” అన్నాడు రవి.

మీనా వస్తున్న నిద్రను ఆపుకునే ప్రయత్నం చేస్తూ, “గోల్లపల్లిలో తాతగారిది వంద సంవత్సరాల నాటి పాత ఇల్లు.తాతగారికి ఒక ప్రత్యేకమైన ఆఫీసు గది ఉండేది. ఆ గదిలో రెండు బీరువాలు నిండా చట్టానికి సంబంధించిన  పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, దేశ విదేశాల రచయితల రచనలు ఉండేవి. ఒక పక్క చెక్క బల్ల, దాని ఎదురుగా రెండు కుర్చీలు ఉండేవి. గదికి ఒక మూలన పాత టేబుల్ ఫ్యాన్, దానికి ఎదురుగా ఒక మడత కుర్చీ ఉండేవి. రాత్రి భోజనం తర్వాత ఆయన ఆ కుర్చీలోనే చారబడి మాకు కథలు చెప్పేవారు” అని చెప్తున్న మీనా కి అకస్మాత్తుగా ఏదో గుర్తుకు వచ్చి, “రవీ! నీకు అక్కడ ఒక అపురూపమైన వస్తువు గురించి చెప్పడం మర్చిపోయాను,” అనడంతో వెంటనే రవి కళ్ళలో మెరుపుతో, “ఏంటమ్మా అది? ప్లీడర్ తాతగారు వాడే వస్తువా?” అని ఆసక్తిగా అడిగాడు.

“అది నువ్వెన్నడూ చూడని ‘బోనె పెట్టె’ ” అంది మీనా.

“పెట్టె అంటే బాక్స్, మరి ‘బోనె పెట్టెఅంటే ఏమిటమ్మా?” రవి ఆశ్చర్యంతో కళ్ళప్పగించి అడిగాడు.

“బోనె పెట్టె అంటే సుమారు ఆరు అడుగులు పొడవు, నాలుగు అడుగులు ఎత్తు, వెడల్పు ఉండే ఒక పెద్ద కర్ర పెట్టె. కొందరు దానిని ‘భోషాణం పెట్టె’ అని కూడా పిలిచేవారు,”అంది మీనా జాగ్రత్తగా వింటున్న రవితో.

“మా అమ్మమ్మ పెళ్ళికి ఆమె తండ్రి స్వయంగా చేయించి, అందులో ఆమె సారె సామానులు పెట్టి పంపారట,” అని మీనా చెప్పగానే, “అది ఇప్పటికీ అక్కడే ఉందా?” అని అడిగాడు ఆత్రుతగా రవి.

“అవునురా, ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. మంచి టేకు కర్ర మీద అందంగా చెక్కబడి, తాళం వేసుకోవడానికి ఒక పెద్ద ఇత్తడి గొళ్ళెం కూడా ఉండేది.” అని మీనా వివరించింది.

“మరి లోపల ఎలా ఉంటుంది అమ్మా, ఏమి పెట్టేవారు దానిలో?” అని రవి కుతూహలంతో అడిగాడు.

“పెట్టి లోపల చాలా అరలుండేవి.వాడని ఇత్తడి, వెండి సామాన్లు, పాత ఫోటోలు, దేవుడి విగ్రహాలు, అలాగే బొంతలు, తలగడలు లాంటివి కూడా అమ్మమ్మ చక్కగా అరలో సర్దేది. దసరాకి ‘బొమ్మల కొలువు’ కి వాడే బొమ్మలన్నీ అమ్మమ్మ జాగ్రత్తగా పాత బట్టలలో చుట్టి బోనె  పెట్టెలో ఉంచేది. ఒక్కటేంటి, లెక్కలేనన్ని వస్తువులు ఉండేవి ఆ పెట్టెలో. ఇంట్లో ఏది కనపడకపోయినా, మొదట ఆ పెట్టెలో వెతికేవారు.

“అమ్మమ్మ దానిలో నాఫ్తలీన్ బాల్స్ వేసి పురుగు పట్టకుండా చూసేది. ఆ పెట్టెను సులభంగా జరపడానికి వీలుగా, కింద చిన్న చక్రాలు కూడా ఉండేవి. ఏడాదికి ఒక్కసారి దానిని జరిపి, కింద, లోపల కూడా పనివాడి చేత శుభ్రం చేయించేవారు,” అని చెప్పడం ఆపి, “రవి! మా తాతగారి ఇంటి విశేషాలు ఒక రోజులో చెబితే అయిపోయేవి కావురా. ఇప్పటికే చాలా రాత్రి అయింది, నీకు నిద్ర వస్తుందీ. పడుకుందాం,” అంటు రవికి ఇంకా అక్కడ సంగతులు తెలుసుకోవాలని ఉన్నా, మీనా లైట్ ఆఫ్ చేసి నిద్రలోకి జారుకుంది.

రవికాంత్ కి రాత్రి అంతా గొల్లపల్లి ఇల్లు, బోనె పెట్టె కలలతో సరిగ్గా నిద్ర పట్టలేదు.ప్రొద్దున్నే లేచి వంటగదిలో టిఫిన్ చేస్తున్న మీనా వద్దకు వెళ్లి, ” అమ్మా, మనం వేసవి సెలవులకు గొల్లపల్లి వెళ్దామా?”అన్నాడు విన్నపంగా.

“రవి, మొన్నటి వరకు షిమ్లా వెళ్దాం అని మారాం చేసినవాడివి, ఇప్పుడు గొల్లపల్లి వెళ్దాం అంటున్నావు” అంది చిన్నగా నవ్వి.

“అమ్మా, నువ్వు నిన్న రాత్రి గొల్లపల్లి సంగతులు చెప్పినప్పటినుండి నాకు ఆ ఇల్లు, ఆ బోనె పెట్టె చూడాలని ఉంది. మన పల్లెలోనే ఇంత ఇంటరెస్టింగ్ వస్తువులు ఉంటే, ఇక షిమ్లా వెళ్ళడం ఎందుకు?” అన్నాడు రవి.

“సరేలే, మీ నాన్నకి చెప్పి అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేయిస్తాను. నీకు ఇష్టమని పెసరట్టు వేశాను. పద, టిఫిన్ చేద్దాం,” అని టిఫిన్ ప్లేట్ అందించింది మీనా.

అనుకున్న విధంగానే వేసవి సెలవుల్లో తల్లి, కొడుకు కలిసి గొల్లపల్లికి చేరుకున్నారు. మనవరాలిని, మునిమనవడిని చూసిన లక్ష్మమ్మగారి ఆనందం అవధులు దాటింది. అక్కడికి చేరుకునేసరికి రాత్రి అవ్వడంతో అలసటతో నిద్రపోయాడు రవి. తెల్లవారగానే లేచి, ముఖం కడుక్కుని, ఇల్లంతా తిరిగి చూశాడు. ఇప్పటికి కూడా తల్లి చెప్పినట్లే అన్నీ అమర్చబడి ఉన్నాయి. నరసింహ తాతగారి గదిలో అన్నీ చూసి, చివరికి తల్లితో కలిసి బోనె పెట్టె ఉన్న గది వైపు వెళ్ళాడు. తల్లి చెప్పినట్లే, బోనె పెట్టె చాలా అందంగా నగిషీ చేయబడి ఉంది. రవి, తల్లి సహాయంతో మెల్లగా బోనె పెట్టె మూత తెరవగానే, దాని నిండా రకరకాల వస్తువులు చక్కగా సర్దబడి ఉండటం చూసి రవి చాలా సంతోషించాడు.

 ‘అమ్మా, బోనె పెట్టె ఎంత సదుపాయంగా ఉందో కదా, నువ్వు చెప్పినట్లే అటు ఇటు జరపడానికి సులువుగా కింద చక్రాలు కూడా ఉన్నాయి చూడు” అంటూ కొంచెం జరపడానికి చూసేసరికి “మ్యావ్” “మ్యావ్” అంటూ దాని కింద నుంచి రెండు తెల్ల పిల్లి పిల్లలు బయటికి వచ్చాయి.

అప్పటికే అక్కడికి వచ్చిన లక్ష్మమ్మగారు వాటిని ప్రేమగా చూసి, “రాము, శ్యాము లేచిపోయారా! ఉండండి, తెస్తాను” అంటూ త్వరగా వెళ్లి ఒక ప్లేటులో పాలు, అన్నం కలిపి పెట్టారు వాటికి.

రవి వాటిని చూసి, “భలే, భలే రాము, శ్యాము! చాలా ముద్దుగా ఉన్నాయి, జేజమ్మా,” అంటూ వాటిని ప్రేమగా నిమిరాడు. మరోసారి బోనె పెట్టెను తృప్తిగా చూసి, తాళం వేసి, లక్ష్మమ్మగారికి ఇచ్చి, “థాంక్యూ జేజమ్మా, బోన్ పెట్టె చూపించినందుకు,” అని ఆమెకు ముద్దుపెట్టాడు.

దానికి లక్ష్మమ్మగారు మురిసిపోయి “నా తండ్రే! నేనంటే నీకెంత ప్రేమ రా!” అంటూ కొంగున ముడి వేసిన ఓ 500 రూపాయల నోటును చేతిలో పెట్టి, “నాన్నా, రవీ  ఈ డబ్బుతో అమ్మతో బొబ్బిలి వెళ్ళినప్పుడు నీకు నచ్చింది కొనుక్కో,” అని రవి చేతిలో ఆ నోటును ఉంచారు.

మారునాడు రవి, తల్లితో కలిసి పల్లె అంతా చూసి, బొబ్బిలి వీణలు తయారుచేసే సర్వాసిద్ధి వంశానికి చెందిన వారిని కలిసి, వీణల తయారీని చూసి, అక్కడ గుర్తుగా వారు తయారుచేస్తున్న ఒక చిన్న వీణను కొనుక్కున్నాడు. అక్కడి నుండి బొబ్బిలిలో ప్రధాన ఆకర్షణ అయిన రాయడప్ప కట్టించిన కోట మరియు రాజభవనాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలోనే ఉన్న దర్బార్ హాల్, రాజా కుటుంబం నివసించే భవనాలు, చారిత్రక కళాఖండాలను ప్రదర్శించే చిన్న మ్యూజియంను కూడా చూశారు. కోట ప్రాంగణంలోనే ఉన్న, బొబ్బిలి రాజుల వంశంచే ఆరాధించబడే వారి కులదైవమైన వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

అక్కడ ఉన్నన్ని రోజులు రవి, రోజుకి రెండు మూడు మాటలైనా బోనె పెట్టెను, దాని క్రిందనున్న పిల్లి పిల్లలను చూసి ఆనందించేవాడు. రోజంతా జేజమ్మ వెంటే ఉంటూ ఆమెను వదిలేవాడు కాదు. లక్షమ్మగారు కూడా అతనికి ఆమె చిన్ననాటి సంగతులు చెబుతూ, మధ్యాహ్నం వేళ ఆమె చిన్నప్పుడు ఆడే మేక-పులి, వైకుంఠపాళి, అష్టాచెమ్మా వంటి ఆటలు రవికి నేర్పించి, ఆడేవారు. సాయంత్రాలు నరసింహం తాతాగారు మడత కుర్చీలో కూర్చొని రవికి కథలు చెప్పేవారు. పది రోజులు ఇట్టే గడిచిపోయాయి. మరునాడు ప్రయాణం అనగా, ఆ సాయంత్రం కథ చెబుతున్నప్పుడు, లక్షమ్మగారు రవి పరధ్యానంగా ఉండడం చూసి ప్రేమగా అడిగారు, “ఏమైంది నాన్న? గొల్లపల్లిని వదిలి వెళ్లాలని లేదా? లేక నీ జేజమ్మాను వదిలి వెళ్లాలని లేదా?” అని అనడంతో రవి కళ్ళలో నీళ్లు తిరిగాయి.

“అవును జేజమ్మా, నిన్ను, ఆ బోనె పెట్టెను వదిలి వెళ్ళాలని లేదు. నువ్వు నాకు ఎన్నో మంచి మంచి కథలు చెబుతావు, నాతో ఆడతావు, ఎన్నో సంగతులు నేర్పిస్తావు. మరి బోనె  పెట్టె కూడా నాకు చాలా నచ్చింది. నాన్నకు చెప్పి మిమ్మల్ని హైదరాబాద్‌కి తీసుకెళ్ళిపోతాను. ప్లీజ్, నాతో రావా,” అని బతిమాలాడు.

లక్ష్మమ్మగారు రవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఇలా అన్నారు, “రవి, ఒక చిన్న ప్రశ్న, నీళ్లు లేకుండా చేప బ్రతకగలదా?” దానికి రవి ‘కాదు’ అని తల ఊపాడు. “అలాగే నేను కూడా డెబ్బై ఏళ్ల కింద మీ ప్లీడర్ తాతాగారితో పెళ్లి అయి ఈ ఇంటికి వచ్చాను. అప్పటినుండి ఈ ఇల్లే నాకు సర్వస్వం. ఈ ఇంటిని విడిచి నేను ఎక్కడా ఉండలేను. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి విజయనగరం వెళ్ళినా రెండు రోజుల కన్నా ఉండను. బోనె పెట్టె కూడా అంతే. దానిని నా తో పాటు పుట్టింటి నుండి తీసుకొచ్చాను. నువ్వు దానిని హైదరాబాద్‌లో మీ చిన్న ఫ్లాట్ లో ఎక్కడ పెడతావు?దానిని ద్వారం నుండి లోపలికి తీసుకొని వెళ్ళడమే కష్టం. నేను నా బోన్ పెట్టెతో ఇక్కడే, ఈ మట్టిలో కలిసిపోవాలి. నీకు నన్ను కానీ, బోన్ పెట్టెను కానీ చూడాలనిపిస్తే ఇక్కడికి వచ్చేసేయి. బాధ పడకు, సరేనా,” అంటూ రవికి ప్రేమగా బోధపరిచారు.

ప్రొద్దున్నే విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వెళ్ళడానికి మీనా బుక్ చేసిన కారు రావడంతో, మీనా సామాను కారులో పెట్టింది. రవి చివరిసారి బోనె పెట్టె ఉన్న గదిలోకి వెళ్లి, పెట్టెను ప్రేమగా నిమిరి, దాని కింద అప్పుడే నిద్రలేస్తున్న పిల్లి పిల్లను ఎత్తుకొని,” రాము, శ్యాము, జేజమ్మాని అల్లరి పెట్టకండి, జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళా వచ్చేసరికి మీరు పెద్ద అయిపోతారు కదా, అప్పుడు చాలా ఆడుకుందాం” అంటూ ముద్దు చేశాడు.

లక్ష్మమ్మ గారు రవిని దగ్గరకు తీసుకొని, “నాన్నా, ఈ ముసలిదానిని మరచిపోవు కదా, మళ్ళా వస్తావు కదా” అని ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. రవి ఆమె కళ్ళు తుడిచి, ” జేజమ్మా, నేను రోజు నీతో ఫోన్ చేసి మాట్లాడతాను. మళ్ళా సెలవులు రాగానే ఈసారి నాన్నని కూడా తీసుకొని వచ్చి బోనె పెట్టెను చుపిస్తాను” అన్నట్లు ఆమెకు ముద్దుపెట్టి కారెక్కాడు. లక్ష్మమ్మగారు బోనె పెట్టెలో జాగ్రత్తగా సామాను సర్దినట్లు,రవి కూడా తన మనసు అనే బోనె పెట్టెలో పల్లెలో గడిపిన జ్ఞాపకాలను భద్రంగా దాచుకున్నాడు.

***

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

మనిషికి విచక్షణ ఉంటే తప్పులు జరగవు – వేంకట అనంతకృష్ణ శర్మ

by Aruna Dhulipala May 31, 2026
written by Aruna Dhulipala

ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, సాహితీమూర్తి, ఆధ్యాత్మికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి నారుమంచి వేంకట అనంతకృష్ణ శర్మగారితో మయూఖ ముఖాముఖి

– ధూళిపాళ అరుణ

వృత్తిపరంగా న్యాయస్థానంలో న్యాయవాదిగా సేవలు చేస్తూనే మరోవైపు ప్రవృత్తిగా కావ్య,శాస్త్ర విషయాలను బోధిస్తూ, ధార్మికోపన్యాసాలు ఇస్తూ, యూట్యూబ్ మాధ్యమంగా ఇప్పటివరకు సుమారు నాలుగువేల వీడియోలలో తమ జ్ఞానాన్ని అనేకులకు పంచడమే కాక సాహిత్యసేవ కూడా చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నారుమంచి వేంకట అనంతకృష్ణశర్మ గారి జీవన ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

1. నమస్కారమండీ! జ్ఞానమూర్తులైన మిమ్మల్ని మా మయూఖ పాఠకులకు పరిచయం చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మీవంటి ప్రతిభావంతులకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, మీ జనన, బాల్య విద్యాభ్యాసాలను గురించి తెలపండి.

జ:- నమస్కారం! మా నాన్నగారి పేరు నారుమంచి వెంకట సుబ్రహ్మణ్య శర్మ. అమ్మ పేరు సరోజిని. అమ్మ ఇప్పుడు 90 ఏళ్ల యువతి (నవ్వుతూ). నేను 1957, డిసెంబర్ 27న జన్మించాను. మా నాన్నగారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ లో సుమారు 25 సంవత్సరాలు పనిచేశారు. నేను వరంగల్ లోనే పుట్టాను. నాన్నగారికి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ కావడంతో విద్యానగర్ కి వచ్చాం. రామ్ నగర్ లో సెయింట్ పయస్ X స్కూల్లో 3వ తరగతి చదివాను. 1964లో ఇల్లు కట్టుకున్న తర్వాత మలక్ పేట్ దగ్గర సలీం నగర్ కు వచ్చాం. అక్కడే స్వామి వివేకానంద సెంటినరీ హైస్కూల్లో 4 వ తరగతిలో చేరి 8 వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. Madrasa-e- Aliya స్కూల్ లో 9, 10 తరగతులు చదువుకున్నాను. దోమలగూడ A.V కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇంజినీరింగ్ ప్రవేశం ఒక్క మార్కులో పోయింది. బెంగుళూరులో 5వేలు కడితే ప్రయివేట్ కాలేజీలో జాయిన్ చేసుకున్నారుఅక్కడ బాబాయ్ వాళ్ళింట్లో నాలుగేళ్లు ఉండాలి. నాకు ఇబ్బందిగా అనిపించి వెళ్ళలేదు. నాన్నకు చెప్పలేదు. సైకిల్ మీద అంతటా తిరిగి ఎంక్వైరీ చేసి భద్రుక నైట్ కాలేజీలో చేరాను. నాన్నగారికి తెలిసిన లెక్చరర్ వి.ఎస్.ఆర్. మూర్తిగారు అక్కడ ఉండడం వల్ల సీటు ఇప్పించారు. ఆ తర్వాత ఎమ్.ఏ సంస్కృతం, ఎమ్. ఎస్.సి. సైకాలజీ, ఎల్.ఎల్.బి., ఎల్.ఎల్.ఎమ్. ఇట్లా అనేక క్వాలిఫికేషన్లు సంపాదించుకున్నాను.

2. మీ సాహిత్య పరమైన ఆసక్తికి వారసత్వం కారణమా? అటు వైపుగా మిమ్మల్ని ప్రభావితులను చేసిందెవరు?

జ:  సాహిత్యపరంగా వారసత్వమంటూ లేదు కానీ మా ముత్తాత గారు వేదాంత అధ్యయనం చేసి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. బహుశా ఆ వాసన వల్ల నాకు వేదాంతం పట్టుబడిందేమో! కానీ నన్ను తీర్చిదిద్దిన మా గురువులను ఇక్కడ తప్పనిసరిగా స్మరించుకోవాలి. నాలుగవ తరగతి చదువుతున్నప్పుడు లక్ష్మీపతి రావు గారని ప్రిన్సిపాల్. ఆయన మాకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడు. తెలుగు ఛందస్సులో పద్యాలు వ్రాయించేవాడు. అట్లా అంత చిన్నవయసులోనే పద్యం మీద మాకు మనసు కలిగేటట్లు చేశాడు. ఆయన ప్రోత్సాహంతో నాల్గవ తరగతిలో ఉత్పలమాల పద్యం రాశాను. ఆ విధంగా చేతిలో తేనేచుక్క వేసిన మాష్టారు. ఆయన చాలా నిక్కచ్చి మనిషి. ఆయన ప్రేమించినంతగా విద్యార్థులను ఎవరూ ప్రేమించలేరేమో? అలాగే ఆయన శిక్షించినంతగా ఎవరూ శిక్షించలేరు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వ్యాకరణాలు చెప్పేవారు. దెబ్బలు తిని చదువుకున్న బుద్ధిమంతులం మేము (గట్టిగా నవ్వేస్తూ). మా వివేకానంద స్కూల్లో ఆ రోజుల్లో చదువుకున్న ప్రతీ ఒక్కరం అన్నం తింటున్నామంటే ఆయన పేరే చెప్పుకుంటాం. ఆరోజుల్లో కర్త, కర్మ, క్రియలను క్లారిఫై చేస్తూ ఆయన చెప్పిన ‘ఇంగ్లీషు గ్రామర్ లో Parsing ‘ ని తరువాత పుస్తకాల్లో తీసేసారని తెలిసి ఆశ్చర్యపోయాను. అంటే విద్యా విధానం అప్పటికీ ఇప్పటికీ ఎంత పలచబడి పోయిందో తెలుస్తోంది. ‘మదర్ సే అలియా’ స్కూల్లో 9,10 తరగతులు చదువుతున్నప్పుడు హనుమంతరావు సార్ అద్భుతమైన గురువు. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని పంచుకోవాలి. ఆ సమయంలో ఒకసారి విద్యార్థులను వైజాగ్ సైన్స్ ఫేయిర్ కు తీసుకువెళ్లారు. మా నాన్నగారు స్టేషన్ కు వచ్చారు. నా పక్క సీటులో కూర్చున్న అమ్మాయి “తమ్ముణ్ణి నేను చూసుకుంటాను” అని నాన్నగారికి హామీ ఇచ్చింది. ఆరోజు నుండి ఇప్పటి వరకు ఆమే మా ఇంటికి పెద్ద ఆడపడుచు. ఇక ఇంటర్మీడియట్ ఎ. వి కాలేజీలో అద్భుతమైన లెక్చరర్లు ఉండేవారు. భద్రుక కాలేజీలో నేను ఇందాక చెప్పిన మూర్తి గారు ఎకనామిక్స్ చెప్పేవారు. ఆ క్లాస్ చివరకు ఉండేది. అన్ని క్లాసులు ఎగ్గొట్టి ఆ చివరి క్లాసుకు మాత్రమే అటెండ్ అయ్యే విద్యార్థులు ఉండేవారంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. మా వైపు చూస్తూ చూస్తూ వెనుకవైపు ఉన్న బ్లాక్ బోర్డ్ మీద పర్ఫెక్ట్ గా గ్రాఫ్స్ గీసేవాడు. “Application of knowledge” నేర్పించారాయన. ఆర్. రంగాచారి అని ప్రిన్సిపాల్ ఉండేవారు. ఆయన అకౌంట్స్, స్టాటిస్టిక్స్ లో ఎక్స్ పర్ట్. ఆయన ఒక లెక్క వరుసక్రమాన్ని బోర్డ్ మీద రాసి బుక్ లో ఏ పేజీలో ఉందో చెప్పేవారు. రీప్రింట్ గా ఉండేది. ఏ సబ్జెక్టుకు సంబంధించిన లెక్చరర్ రాకపోయినా క్లాసుకు వచ్చి, ఆ సబ్జెక్టులో ఎంతవరకు క్లాసు జరిగిందో అడిగి అక్కడినుండి కంటిన్యూ చేస్తూ క్లాస్ చెప్పేవారు. అంతటి మహానుభావుడు. ఎల్.ఎల్. ఎమ్ కాకతీయ యూనివర్సిటీలో విజయ్ చందర్ గారు మరో అద్భుతం. ఎమ్.ఏ. సంస్కృతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాములు, పి.టి.జి. రంగాచార్యులు సంస్కృతపండితులు కాంట్రాక్ట్ క్లాసులు చెప్పేవారు. ఆయన కూడా ఏ సబ్జెక్ట్ అయినా చెప్తారు. ఇక సంస్కృత వ్యాకరణం విషయానికి వస్తే కేశిరాజు వెంకట చంద్రశేఖర్ గారు మా గురువు గారు. వ్యాకరణం తప్ప ఆయన నోటినుండి మరోమాట వచ్చేది కాదు. ఆయన ‘ఆకాంక్ష’ పద్ధతిలో పాఠాన్ని మా చేతనే చెప్పించేవారు. ఇంతమంది మహానుభావుల చేత నేను చెక్కబడ్డాను.

3. అటువంటి గొప్ప గురువుల వల్ల ప్రేరణ పొందిన మీరు ఆ అనుభవాలకు సంబంధించి ఏదైనా మరచిపోలేని సంఘటన ఒకటి చెప్తారా?

జ:   తప్పకుండా. రంగాచారి గారు ప్రిన్సిపాల్ అని చెప్పాను కదా! నా చదువు అక్కడ పూర్తయిన దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఒకసారి ఆయనను కలవడం జరిగింది. మా బావగారు రంగావఝల పాండురంగ శర్మ (ఆర్. వి.పి. శర్మ) సంగీత విద్వాంసులు. పురాణం పురుషోత్తమ శాస్త్రి గారి దగ్గర, డి. కె. పట్టమ్మాళ్ దగ్గర, ములుకుట్ల సదాశివశాస్త్రి గారి దగ్గర ఆయన సంగీతం నేర్చుకున్నారు. ఆయన సంగీత కచేరీ నల్లకుంటలో ఏర్పాటుచేశారు. ఆ కచేరీకి మా ప్రిన్సిపాల్ గారు వచ్చి కింద వేసిన పట్టా మీద కూర్చున్నారు. నేను ఆయనను చూసి దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి, ఫలానా బ్యాచ్ స్టూడెంటునని చెప్పుకున్నా. ‘ఏం చేస్తున్నావు?’ అని అడిగారు. అప్పటికే ఇంటర్, డిగ్రీ, ఐసిడబ్ల్యూ, సి.ఏ, ఎల్ ఎల్ బి విద్యార్థులకు నేను పాఠాలు చెప్తున్నాను. అందువల్ల మీలాగే అన్ని సబ్జెక్ట్స్ పాఠాలు చెబుతున్నా అన్నాను. వెరీగుడ్. “స్టాటిస్టిక్స్ కూడా చెబుతున్నావా?” అన్నారు. అవునన్నాను. అప్పుడాయన “అనంతకృష్ణా! ఈ రోజుల్లో ఎవరూ కూడా స్టాటిస్టిక్స్ బైనామియల్ థియరం చెప్పడం లేదు. నువ్వు చెబుతున్నావా?” అంటూ అక్కడే పట్టా మీదనే ఆ థియరం అంతా తనవేలితో గీసి “ఇట్లా చెబుతున్నావా, లేదా?” అన్నారు. అంటే ఆయన దగ్గర చదువుకున్న నేను ఇంకొకరికి అన్యాయం చేయకూడదని ఆయన ఉద్దేశ్యం. అలాంటి మెంటల్ ఫ్రేం వర్క్ ఉన్న టీచర్లు ఈరోజుల్లో చాలా అరుదు అనిపిస్తుంది. ఈ అనుభవాన్ని నేను వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టుకున్నాను. లక్ష్మీపతి సార్ తో ఉన్న అనుభవాలను కూడా ఫేస్ బుక్ లో భద్రపరచుకున్నాను.

4. బ్యాంక్ ఉద్యోగి అయిన మీరు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడానికి కారణాలు తెలుసుకోవచ్చా?

జ:    చక్కటి ప్రశ్న వేశారు. నేను మూడు బ్యాంకులకు ఇంటర్వ్యూలకు వెళితే మూడింట్లో ఉద్యోగం వచ్చింది. మొట్టమొదట అపాయింట్ మెంట్ వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జాయినయ్యాను. నేను మధ్యాహ్నం ఒంటిగంటా రెండు గంటలకల్లా నా పని పూర్తి చేసుకొని ఇతర సిబ్బంది చేస్తున్న పనులను చూస్తూ అడిగి తెలుసుకుంటూ ఆరు నెలల్లో అన్ని పనులను నేర్చుకున్నాను. ప్రమోషన్ల విషయంలో తేడాలుండేవి. అందువల్ల ప్రమోషన్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నాను. 5 ఏండ్ల తరువాత రీజినల్ ఆఫీసుకు వెళ్ళాను. భండారు రామచంద్రరావు గారు అని గొప్ప వ్యక్తిత్వం కలవాడు. పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు గారి సోదరులు. ఆయన రీజినల్ మేనేజర్. ఆయన వ్యక్తిత్వం నుండి చాలా నేర్చుకున్నాను. నా టాలెంట్ గుర్తించి ఆఫీసర్ చేసే పనులను కూడా నమ్మకంతో నాకప్పగించే వారు. 5 ఏళ్ల తర్వాత అవే పనులే ఎప్పుడూ చేస్తుండడం తప్ప కొత్తదనం, కొత్తగా ఆలోచించేవి ఏవీ లేవు. మీరు నమ్మరు! ఇదే విషయం రాస్తూ రాజీనామా చేశాను. ఆయన నన్ను పిలిచి అడిగినా అదే చెప్పాను. నా కుటుంబం గురించి అడిగాడు. పెళ్ళయిందని, ఒక పాప ఉందని చెప్పాను. వెంటనే లెటర్ చించేసి పాప పెద్దయ్యాక రిజైన్ చేయి అన్నారు. ఆ తర్వాత మరో బ్రాంచ్ కి వెళ్ళాను. అంతకుముందు బ్యాంక్ లో నాకు ఆఫీసర్ గా ఉన్న సి.వి.శాస్త్రి ఇక్కడ మేనేజర్. మా ఇద్దరి మధ్య ఆయన ఏరా?..అనేంత చనువు ఉండేది. అక్కడ కూడా రాజీనామా లెటర్ ఇచ్చాను. మానేసి ఏం చేస్తావ్? అన్నాడు. నేను అనుకుంటున్న నాలుగు ఆప్షన్స్ చెప్పాను. ఆయన ఇంకేం మాట్లాడలేదు. 2001 లో VRSస్కీం వచ్చింది. వెంటనే దానికి అప్లై చేశాను. అంతకుముందే LLB చేసి ఉన్నాను కదా! ఎవరికిందా ప్రాక్టీసుకు చేరలేదు. N. V. అనంతకృష్ణ అడ్వకేట్ అని బోర్డు పెట్టి దిల్ షుక్ నగర్ లో ఆఫీసు పెట్టాను(గట్టిగా నవ్వేస్తూ). అమ్మవారే అన్నీ చూసుకుంటుందని నమ్మకం.

5. ‘గురువు’ గురించి సహస్రనామ స్త్రోత్రం రాయాలనుకున్న ఆలోచనకు ప్రేరణ ఏమిటి? ఆ విశేషాలు చెప్పండి.

జ: 1990 – 94 మధ్య భాగవత సప్తాహానికి వెళ్ళినప్పుడు ఒక ఆలోచన తట్టింది. మనకు విష్ణు, శివ, లలిత, లక్ష్మి ఇట్లా దేవతలకు సహస్రనామాలున్నాయి. కానీ దేవుడున్నాడని నమ్మకం కలిగించి గురూపదేశం చేసిన గురువుకు సహస్ర నామం లేదు కదా! అనిపించింది. అప్పుడు గురు సహస్రనామం అని పేరు పెట్టి రాయాలనుకున్నా. కానీ అప్పటికి నాకు సంస్కృతం రాదు. సంస్కృతమే రానప్పుడు సంస్కృత ఛందస్సు ఎలా రాయగలను? అప్పుడు వెళ్లి వృత్తరత్నాకరం కొనుక్కొని వచ్చి అనుష్టుప్ ఛందస్సు తెలుసుకొని దానికి నోట్స్ రాసుకున్నాను. నామాలు రిపీట్ కాకుండా చూడాలనుకున్నాను. ఒక నోట్ బుక్ తీసుకొని ఇండెక్స్ లాగా పేపర్లను కట్ చేసుకున్నాను. ఏ పేరు రాద్దామని గుర్తుకు వస్తే ఆ అక్షరం దగ్గర ఆ పేరు రాసుకున్న. అట్లా ముందు వేయి నామాలు తయారు చేసుకున్నాను. ఇది కేవలం నా గురువు కోసం అని కాదు. ప్రతి ఒక్కరి గురువుకు సమన్వయించుకునేలాగా ఉండేలా చేయాలనుకున్నాను. తెనాలిలో చావలి వామనమూర్తి శాస్త్రి గారని ఒక మహానుభావుడు ఉన్నాడు. అష్టాదశ పురాణాలు గుళ్లో ప్రవచనం చెప్పడమే ఆయన వృత్తి. గొప్ప పండితులు. ఆయన దగ్గరికి వెళ్లి ఇది చూపించా. మురిసిపోయాడు. ఇంకేమీ ఆలోచించొద్దు అన్నారు. నేను హైదరాబాద్ కి వచ్చాక ఆయన ఒక కార్డు రాశాడు. అందులో చివరగా “మాగాయి త్యప మంగళం..”అన్న శ్లోకం చెప్పి ఏమయ్యా వెళ్లొద్దు. అన్నానంటేఅమంగళం. ‘వ్రజ సఖేతి హీనం వచః’ వెళ్ళమంటే అమర్యాద. ‘తిష్ఠేతి ప్రభుత’ ఉండమంటే నీమీద అధికారం చెలాయించినట్లవుతుంది. ‘యథా రుచి కురుష్వాపి’ అంటే నిర్లక్ష్యం చేసినట్టు. కిమ్ కర్తవ్యమితఃపరం యదుపతే త్రైలోక్య నాథ ప్రభో! స్మర్తవ్యావయ మాదరేణ భవతాం! యావత్ పునర్దర్శనమ్! నిన్ను మళ్లీ దర్శించుకునేంత వరకు స్మరిస్తూనే ఉంటాను. అని రాశాడు. గురువు ఎట్లా ఉంటాడు? ఆయన లక్షణాలు, ఉపదేశాలు, స్థూల రూపం, ఆయన స్వరూపకత, దైవానికి గురువుకు ఉండే అభేదం, ఇట్లా ఒక్కొక్కదాన్ని విశ్లేషించుకుంటూ రాస్తున్నప్పుడు ఒక దశలో ఆపేశాను. ఒక స్టేజీలో ‘నావల్ల కాదు’ అని ఆపేశాను. నేను ఆపేసిన రోజే రోడ్డుమీద ఒక వందరూపాయల నోట్ దొరికింది. దాని వెనుక “Stay with hope. End with success” అని రాసి ఉంది. అది గుర్వాజ్ఞగా భావించి ఇంటికి వచ్చి మళ్లీ మొదలుపెట్టాను. మొదటగా ధ్యాన శ్లోకం రాశాను.
“శాంతం శుచి స్మితం దేవం నిస్సీమ మహిమాన్వితం
కవచం శిష్య గణస్య, భిషజం భవరోగిణాం
ఆత్మజ్ఞాన ప్రదాతారం అవాఙ్మానస గోచరం
సద్యః సిద్ధిం కరం గురుం నమామి స్వాత్మ నాయకం”

నేనెక్కడ ఉపన్యాసం, ప్రసంగం చేసినా ధ్యానశ్లోకం ఇదే చదువుతాను. మా గురువు గారిని ఇంటికి పిలిచి, నేను రాసిన సహస్ర నామాలతో ఆయనకు పాదపూజ చేసుకున్నాను.

6.”లలిత పదముల మది లలిత గొలుతు” అన్న మకుటంతో అమ్మవారిపై రాసిన శతకం గురించి తెలపండి.

జ:   ఆ రోజుల్లో ఒక అనుభవం చెప్పాలి. బహుశా శుక్రవారం అనుకుంటా. ఉద్యోగం లేదు కాబట్టి ఖాళీగా ఉండడం వల్ల అమ్మవారి శతకం రాస్తున్నాను. అప్పటికే కొన్ని పద్యాలు రాశాను. నాకు అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి నానామాటలు అన్నాడు. నేను కూడా ఆవేశంతో సోమవారం సాయంత్రం వచ్చి డబ్బు తీసుకెళ్లు అన్నాను. అప్పుడు నా దగ్గర డబ్బులేమీ లేవు. “చిన్ని పాపనమ్మా! నన్నిట్లు శోధించ/ తాళలేను తల్లి తెలియవమ్మా/ ఆర్తి తోడ పిలువ ఆదుకొందువటంచు/లలిత పదముల మది లలిత గొలుతు” అని బాధపడుతూ ఈ పద్యం రాశాను. సాయంత్రం నా స్నేహితుడు, తన బ్యాంకుకు సంబంధించిన డేటా సమస్యను గురించి నా దగ్గరకు వచ్చాడు. బ్యాంకులో దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విషయమంతా వివరించి ఒక డిపాజిట్ ను మూడు నెలలు ఆపి,తర్వాత రెండవ దాంట్లో కలపమని, బ్యాంకు లావాదేవీలు తెలిసిన వాడిగా సలహా ఇచ్చాను. సరేనని వెళ్తున్నవాడు వెనక్కి వచ్చి ఎవరికో ఎందుకు నీకే ఇస్తాను. మూడు నెలల తర్వాత నాకు ఇవ్వు అన్నాడు. ఆదివారం కూడా పనిచేసే బ్యాంకులో ప్రాసెస్ అంతా చేసి పెట్టాను. చెబితే మీరు నమ్మరు. అతను నా దగ్గర పెట్టుకోమని ఇచ్చిన డబ్బు అక్షరాలా నాకు అప్పు ఇచ్చినవానికి నేను ఇవ్వాల్సిన అమౌంట్. నిజంగా ఇది దైవికంగా జరిగిందే. ఈ శతకాన్ని ఏలూరుపాటి అనంతరామయ్యగారు ఆవిష్కరించారు.

అనంత కృష్ణగారితో ముఖాముఖి గ్రహిత ధూళిపాళ అరుణ

7. మీరు రచించిన ఇతర శతకాల గురించి చెప్పండి.

జ:శక్తి పంచాయతనంలో అమ్మవారి శతకం అయిపోయింది కాబట్టి మిగతా వాటి మీద కూడా శతకాలు రాయాలనిపించి గణపతి శతకం ఉత్పలమాలలో రాశాను. సూర్య శతకాన్ని అనంత భాస్కర శతకమనే పేరుతో సంస్కృత మకుటంతో సీసంలో రాశాను. ఇది సూర్యారాధనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. శార్దూలంలో విష్ణు శతకం ఉంటుంది. విష్ణు సాధన, విష్ణు విద్య, విష్ణు తత్త్వం దీంట్లో ఉంటాయి. ఈశా కల్పద్రుమా! పేరుతో శివ శతకం రాశాను. మా స్నేహితునికి అంకితంగా వాసుదేవ శతకం, నా మనుమడు, మనుమరాలిని ఉద్దేశించి పిల్లల కోసం నీతి శతకాన్ని ‘బంగరు కొండ’ పేరుతో రాశాను. అన్ని విషయాల్లోను సమాజంలో కనబడుతున్న దుర్నీతిని చూసి ఒక్కరోజులో శతకం రాయాలని ‘వెధవ శతకం’ అని రాశాను. విద్య, సంసారం, ఆసుపత్రి… ఇట్లా వివిధ శీర్షికలు 11 ఎంచుకొని ఒక్కో శీర్షిక కింద 9 పద్యాలు రాశాను. ఓ వ్యక్తి నన్ను ఉదాహరణ కావ్యం రాయమన్నాడు. ఆత్మతత్త్వం మీద ‘ఆత్మోదాహరణం’ అనే పేరుతో రాశాను.

8. సాహిత్య చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా ఒకేసారి 32 కావ్యాలను ప్రచురింపజేశారని విన్నాం. ఆ నేపథ్యం ఏమిటో చెప్పండి.

జ:    ఫేస్ బుక్ లో నేను, పట్వర్ధన్ శతావధాని, వి.ఆర్. గణపతి అని మంచి పద్యకవి. ముగ్గురం అడ్మిన్లుగా ‘ప్రజ పద్యం’ పేరుతో ఒక గ్రూపును నిర్వహిస్తున్నాం. ఇందులో పద్యాల పోటీలు నిర్వహిస్తుంటాం. పోటీలకు కొన్ని నియమాలను ఏర్పరిచాం. గెలిచిన వారికి ఐదు, మూడు, రెండు వేల రూపాయల చొప్పున బహుమతులు ఇస్తుంటాం. ఒకసారి ‘మహా సామాజిక పద్య ప్రబంధం’ పేరుతో 32 కావ్యాలు రాయించాం. 150 నుండి 200 పద్యాల వరకు లిమిట్ పెట్టుకున్నాం. అందులో అష్టాదశ వర్ణనలు, సామాజికాంశం తప్పనిసరిగా ఉండాలి అని ఒక నిబంధన కూడా పెట్టాం. పేరు నమోదు చేసుకున్నప్పుడు వందకు పైగా ఉన్నారు. మా గడువు లోపల ఇచ్చిన వాళ్ళు 32 మంది ఉన్నారు. ఈ 32 కావ్యాలను త్యాగరాయ గానసభలో ఆవిష్కరించాం. వెలుదండ నిత్యానంద రావుగారు, అనుమాండ్ల భూమయ్యగారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు తిరునగరి గారు మొదలైన వాళ్లు వచ్చారు. ఆ పుస్తకాలకు వీళ్లే ఎవాల్యూయేటర్స్. మా నియమం ప్రకారం ఏ పోటీ పెట్టినా అడ్మిన్స్ తప్పకుండా పాల్గొనాలి. కానీ ప్రైజులకు అర్హులు కారు. సందర్భంలో నేను ‘అనామకుడు’ అనే పద్య కావ్యం రాశాను. ‘యాని నామాని గౌణాని’ అన్నట్లు పేరు లేకుండా ఉపయోగపడిన వాడు అన్న ఉద్దేశ్యంతో రాసిన కావ్యం. 32 పుస్తకాలు ఒకేసారి డిజిటల్ ఆవిష్కరణ అవడం సాహితీ చరిత్రలోనే అదొక మైలురాయి.

9. చిత్రబంధాలతో కూడా మీరు రచనలు చేశారు కదా! ఈనాటి సమాజంలో కూడా వీటిని ఆస్వాదిస్తున్నారా? మీ అభిప్రాయం ఏమిటి?

జ:    అవునమ్మా! నేను రాసిన సూర్య శతకము కొన్ని చిత్ర బంధాలతోనే ఉంటుంది. “కాలోహ్యనంతః విపులాచ పృథ్వీ” అన్నాడు భారవి మహాశయుడు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో మనకు తెలియదు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానని కాదు కానీ ఒక్క విషయం చెప్పాలి. నా మేనల్లుడు ‘తెలుగు నుడి’ అనే ఒక కార్యక్రమాన్ని రెగ్యులర్ గా చేస్తుంటాడు. రెండు, మూడు గంటల కార్యక్రమం. వందమందితో కలిసి ఆన్లైన్ లో చేస్తున్నాడు. కేవలం వాయిస్ మాత్రమే ఉంటుంది. విశ్వనాథ సాహిత్యం మొదలుకొని అన్ని సాహిత్యాలు చదువుతున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే పేరుతో సంస్థ స్థాపించి వేదాంత గ్రంథాలను అధ్యయనం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా మీరన్నట్లు చిత్రబంధ కవిత్వాన్ని ఆస్వాదించే వాళ్ళు, రాసేవాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో కోలార్ నగరంలో ఉండే ఒకాయన కేవలం చిత్రబంధాలే రాస్తారు. నాకు ఫోన్ చేసి ఎట్లా ఉందో చెప్పుమంటాడు. కాబట్టి ఈ కాలంలో కూడా వీటిని ఆస్వాదించేవారున్నారు.

10. న్యాయవాదిగా ఉద్యోగ నిర్వహణలో ఉంటూనే ప్రసంగాలు, సాహిత్యరచన, బోధన ఇవన్నీ ఎట్లా సమన్వయం చేసుకుంటున్నారు?

జ:   నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కారులో నా వెంబడి తెచ్చుకున్న పుస్తకాన్ని చదువుతుంటాను. అట్లాగే Teaching is twice learning. నేను నేర్చుకుంటూ విద్యార్థులకు బోధిస్తున్నాను. చెప్పేటప్పుడు వాళ్లకు వచ్చే సందేహాలు తీర్చడం కోసం నేను నేర్చుకుంటా. ఇక్కడ నేను వాళ్లకు బోధిస్తున్నాను అనడం కంటే నేను నేర్చుకుంటూ నన్ను నేను దిద్దుకుంటున్నా. ఏ సబ్జెక్టుదైనా సరే కనిపించిన పుస్తకమల్లా చదువుతాను. విపరీతంగా పుస్తకాలు కొంటాను. రాత్రి ఒంటిగంటలోపు పడుకోను. నా మంచం చుట్టూ పుస్తకాలే ఉంటాయి.

11. మీ వృత్తికి సంబంధించిన ఒక ప్రశ్న. ఒక అడ్వకేట్ గా వర్తమానకాలంలో జరుగుతున్న అనైతికతకు కారణాలు ఏమై ఉంటాయి?

జ:   నైతిక విలువలుకోల్పోవడం ఒకటైతే, కుటుంబ వ్యవస్థలో లోపాలు రెండవది. ఒకప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నీతిశాస్త్రం, సైకాలజీ, మానవసమాజంలో ఎట్లా బతకాలన్నది అన్నీ ఒకేచోట ఉండేవి. ఎప్పుడైతే అవి వద్దనుకున్నామో విలువలు మొత్తం తగ్గిపోయాయి. అందువల్ల హింసా ప్రవృత్తి పెరిగింది. ఫాక్ట్ ఏంటంటే ఉదాహరణకు ఆనాటి కాలంలో వాచీ పాడయినా, చెప్పు తెగిపోయినా షాపుల్లో రిపేర్ చేయించుకున్నాం. ఇట్లా ఎన్నో విషయాల్లో ఎంతో సర్దుబాటు ఉండేది. ఇప్పుడు use and throw. వస్తువులలాగానే కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు కూడా అట్లానే ఉన్నాయి. స్త్రీ పురుషులు కుటుంబానికి సారథులు. అక్కడి నుండే ఒక సంస్కారం మొదలవుతుంది. ఈ ప్రాథమిక దశలోనే వ్యవస్థ నాశనమవుతున్నప్పుడు విలువలు ఎట్లా ఉంటాయి? మైక్రో లెవెల్లో జరిగే తప్పును విలువలను గుర్తించి సర్దుబాటు చేసుకోకపోవడం వల్ల అది తీవ్రసమస్యగా మారి సమాజాన్ని నాశనం చేస్తోంది. ఇక్కడ నేను, నా కుటుంబం, నా సమాజం అనే విచక్షణ కలిగి నేను ఈ తప్పు చేయడం వల్ల రేపటి తరాన్ని నాశనం చేయడానికి ఎంత కారణమవుతున్నానని ఆలోచించుకొని క్షణికమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచి సమాజాన్ని తయారుచేయగలం. ఈ తప్పిదం ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా అన్ని రంగాల్లో జరుగుతూనే ఉంది. ముందు మనిషి విచక్షణ కలిగిఉంటే తప్పులు జరగవు.

12. మీ అభిప్రాయంలో పదికాలాల పాటు నిలవాలంటే కవిత్వం ఎట్లా ఉండాలి?

జ:   ఏ భాషా కవిత్వంలో నైనా సరే, కవిత్వంలో కమ్మటి వాసన రావాలంటే, భావుకత రావాలంటే, పది కాలాలపాటు నిలవాలంటే రెండు విషయాలు తప్పనిసరి. ఒకటి సమాజాన్ని పరిశీలించడం, రెండు ప్రకృతిని పరిశీలించడం. ఏ వ్యక్తి ప్రకృతితో మమేకమై ఉంటాడో వారి కవిత్వంలో ఆ మట్టి పరిమళిస్తుంది. అందుకే కవిని క్రాంతదర్శి అంటారు. కాళిదాసు వంటి కవుల గొప్పతనం, అన్ని గొప్పలక్షణాలు అంతటి స్థాయిలో లేకపోయినా, ఏదో కొంత నిష్పత్తి ఉన్నవాళ్లు ఈనాటికీ రాణిస్తున్నారు. అటువంటి కవిత్వం చదవడం వల్ల మనం సంస్కరించబడతాం. ప్రాచీన కవులు సమాజంతోను, ప్రకృతితోను మమేకమయ్యారు కాబట్టి అట్లా రాయగలిగారు. మనం ఇప్పటికీ చదువుతున్నాం. కావ్య వృక్షం, సంస్కారవృక్షం ఎప్పటికీ చచ్చిపోవు. నేనిప్పుడు విద్యార్థులకు ఆ కావ్యాలను బోధిస్తున్నానంటే నన్ను నేను సంస్కరించుకుంటూ ఇతరులను సంస్కరిస్తున్నాను. మనమెంత భ్రమలో ఉన్నామంటే సంస్కృత కావ్యాలు, ప్రాచీన కావ్యాలు ఒక కాలానికో, మతానికో, వర్గానికో చెందనవని, లేదా కేవలం భగవంతునికి సంబంధించిన విషయాలను తెలిపేవి అనే భ్రమలో ఉన్నాం. వాటిలో ఉండే మౌలిక విలువలు తెలుసుకోలేకపోతున్నాం. మంచి విలువలతో కూడిన కావ్యాలు ఒకే కాలానికి పరిమితమైనవి కావు కదా! అవెప్పుడైనా శాశ్వతాలే!

13. రచన వ్యావహారికంలో ఉండాలన్న వాదనను మీరు సమర్థిస్తారా?

జ:    మనం రచన చేసేటప్పుడు ఎవరికి చెబుతున్నామో వారికి అర్థం కావాలి. అంటే మీరు తగ్గాలి. అప్పుడు భాషను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భాష కావాలంటే చదివేవాళ్లకు భాష సొగసును చెప్పగలగాలి. అల్టిమేట్ గా చెప్పాలంటే రససిద్ధి ప్రధానం. వ్యావహారికంలో రససిద్ధి కలిగిస్తే అది కూడా గొప్పదే. ప్రాచీన పద్యంలో ఉన్న అర్థం, సొగసు తెలిస్తే అద్భుతంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో తెలుగు భాషను సరిగా నేర్పించకుండా పెద్ద తప్పు చేస్తున్నారు. సమాజం దానివల్లే నాశనమవుతోంది. ఉదాహరణకు పాణిని ‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథం రాశాడని అందరికీ తెలిసిందే. శబ్దాల యొక్క సాధుత్వాన్ని, అసాధుత్వాన్ని వివరించేది వ్యాకరణం. ఆయన వాటిని సూత్రీ కరించాడు. ఆ కాలంలో ఆయన రాసినప్పుడు సమాజంలో వాళ్లకు బాగా అర్థమైంది. ఆ తరువాత కొన్ని వందల ఏండ్ల తరువాత భట్టోజీ దీక్షితులు ఆ నాలుగువేల సూత్రాలను రీ ఫ్రేమ్ చేసి ‘సిద్ధాంత కౌముది’ ని తయారుచేశాడు. దీనికే ‘ప్రక్రియా విధానం’ అని పేరు. ఆయన శిష్యుడు వరదరాజులు ఇంకా దాన్ని సంక్షిప్తీకరించి ఆ నాలుగు వేల సూత్రాలను తగ్గించి సుమారు 1400 సూత్రాలతో ‘లఘు సిద్ధాంత కౌముది’ తయారుచేశాడు. అది కూడా మనకు అర్థం కాలేదు. ఇప్పుడు పాండిచ్చేరి అరబిందో ఆశ్రమంలో ఇంకా సులభతరం చేసి వంద సూత్రాలతో ‘పాణినీయం’ అని వేశారు. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలక్రమంలో భాషను అర్థం చేసుకునే శక్తి సన్నగిల్లుతోంది. అందరికీ అవగతం కావాలన్నది నిజమే అయినా భాషా సౌందర్యాన్ని కోల్పోతున్నామని కూడా గ్రహించాలి. ఇందాక చెప్పినట్టు వ్యావహారికంలో కూడా సౌందర్యాన్ని చూపించవచ్చు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శబ్దసౌందర్యాన్ని, పద సౌందర్యాన్ని అర్థం చేసుకునే స్థాయి బాగా తగ్గిపోయింది.

14.  ఒక కవిగా, ఉత్తమ విద్యాబోధకులుగా సమాజానికి ఏదైనా సూచనలివ్వండి.

జ: అమ్మా! మన దగ్గర లేనిది ఏదీ మనం ఇతరులకు ఇవ్వలేం. సరిగ్గా చెప్పాలంటే మీ దగ్గర ఏవి ఎక్కువగా ఉంటాయో అవే మీరు ఎదుటివాళ్లకు ఇవ్వగలుగుతారు. ప్రేమ, ద్వేషం, మంచి, చెడు వీటిలో ఏవి నీ దగ్గర ఉంటే అవే ఇస్తావు. ఏదివ్వాలో నిర్ణయించుకునే విచక్షణ ఒక మనిషిగా ఎవరికి వారికే ఉండాలి. అది ఎట్లా ఉండాలో ముందు నువ్వు తెలుసుకోవాలి. అంటే ముందు input ఉండాలి. దానిని తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. అధ్యయనం చాలా ముఖ్యమైంది.తైత్తిరీయోపనిషత్తులో “స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం” అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఇతరులకు ఇవ్వాలి అన్నప్పుడు నేర్చుకునేది మంచిదై ఉండాలి. ఇంతకంటే ఏం కావాలి? మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ మనిషిగా ఎట్లా ఉండాలన్న జ్ఞానాన్ని బోధిస్తాయి. కానీ అవి మనకు పట్టవు. ఇవి చదవకుండా మన దగ్గర ఏమీలేదని, అదే విదేశీయులు చెబితే ఆహా ఆంటుంటాం. అవే గొప్ప మనకు. “ఉద్యమే న హి సిధ్యంతి కార్యాణి న మనోరథైః న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః” అన్నాడు భర్త్రహరి. ఈ ఒక్క శ్లోకం జీవితాన్ని నేర్పించడమే కాదు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ఇటువంటి జ్ఞానాన్ని మన నుండి నేర్చుకొని ఎవడో చెబితే మనం వాటిని చదివి గొప్పవాడని తలమీద పెట్టుకుంటున్నాం. ముందు మనవాళ్ళు ఏం చెప్పారో అధ్యయనం చేయండి. ఆచరించడానికి ప్రయత్నించండి.

ధన్యవాదాలు సార్. అవిశ్రాంతమైన మీ సమయాన్ని మాకోసం కేటాయించి అనేక విషయాలు తెలియజేసినందుకు మా పక్షాన, మా మయూఖ పాఠకుల పక్షాన అనేకానేక కృతజ్ఞతలు. నమస్కారాలు🙏🏼

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనసుతో మాట్లాడుతున్నాను

by రాఘవాచార్య‌ May 31, 2026
written by రాఘవాచార్య‌

వేరెవరితో కాదు 
నేను నా మనసుతో మాట్లాడుతున్నాను!

మనసుతో మాట్లాడం కష్టమే 
మనకంటే తెలివిగా తెలవకున్నా తెలిసినట్లే మాట్లాడుతుంది !

రాజుల మెప్పించవచ్చు 
మనసును మెప్పించడం కష్టం 

ఐనా ఎవరితో మాట్లాడినా
మాట్లాడకున్నా
 మనసుతో మాట్లాడితే ఉప్పస ఊరట !
బాల్య కౌమార యౌవ్వన వృద్ధాప్య మజిలీలు ఈ శరీరానికే 
మనసుకేం లేదు 
అమృతం అమాతంగా ఎపుడు తాగిందో !!

చిన్నతనం గడిచినా ఆ బుద్ది లేనితనం మనసుకు పోనే పోదు 
ఇంకా ఇప్పటికీ పచ్చిగా పైలా పచ్చీసే
మాయల మరాఠి మనస్సు !!

డీలాపడితే 
సాహంసం శాయరా —
అనుకున్నది దొరుకుతుందిరా 
కథలు చెప్పి ఉరికించేది ఊరించేది మనసే

మనసు మనతో మాట్లాడుతు 
మాట్లాడుతూ మెల్లిగా 
నిద్రలోకి తీసుకెలుతుంది 
అమ్మలగన్న అమ్మలాంటి అమ్మ మనసు 

మనసు దేశం గురించి చెపుతుంది
ప్రపంచ యుద్దాల గురించి
చమురు చమురుగా మాట్లాడుతుంది

మాటపడి పోయినా మనసు పడిపోకుండా ఎప్పటికీ బలం బలగం!
బ్రహ్మముహూర్తంలో ధ్యానంకు కూర్చుంటే కుదరనీయక  లోకాన్నంతా పట్టించుకుని తిరుగుతుంది తిప్పుతుంది??

చంచల మనసును
ఏకాగ్రతగా కట్టేయడానికి ఏ తాడు ఇంత వరకూ ఎవరూ పేనలేదు
మనసన్నదే ముహూర్తం 
కాదన్నదే దుశ్శకునం

మనసుతో వేగలేంకాని 
ఎటూ పోకుండా చివరిదాకా మనతో ఏడుస్తునో నవ్వుతూనో ఉండేదే మనసు !

మనసు ఎవరో కాదు —
తానే మనం !
మనమే తాను !

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆడవారం

by R Bhagyalaxmi May 31, 2026
written by R Bhagyalaxmi

ఏ వారం లేని వారమండి

మేము ఆడవారమండి

మాకు తిధి వార మాసాలు లేవండి

అన్ని వారాలు మావే నండి విరామం అంటూ ఎరుగని వారమండి

జీతం లేని పని వారమండి సంవత్సరమంతా మా పరివారమే నండి

ఎన్నో కలలకు ఎన్నో కళలకు సాకారమండి

జీవిత గమనం గమ్యం మేమే నండి

నిస్వార్ధ ప్రేమకు నిదర్శనం అండి అన్నింటికీ అంకురం మేమే నండి

జీవనయానంలో ఎన్నో సౌరభాలు వెదజల్లే సుమాలమండి

ఆడపిల్ల నుండి ఈడపిల్ల వరకు ఎవరూ కనలేని మనస్కుల మండి

అదేనండి…

మేము ఆడవారమండి …

“ఏదో అభిమానమండి”!!

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

ఆమె కలం…ప్రార్థన కూడా…ప్రబోధం కూడా…

by రంగరాజు పద్మజ May 31, 2026
written by రంగరాజు పద్మజ

ప్రముఖ రచయిత్రి వీణా రెడ్డిగారితో మయూఖ ముఖాముఖి. పరిచయం చేస్తున్నది రంగరాజుపద్మజను….

భక్తి దీప్తి, సమాజానికి దిక్సూచి వంటిది ఆమె పరిచయం…
ఒక ఆధ్యాత్మిక రచయిత్రితో అంతర్ముఖ సంభాషణ… చేసినప్పుడు ఎన్నో ఎన్నెన్నో విషయాలు తెలిసాయి…భక్తి-సాహిత్యం- జీవకారుణ్యం ముప్పేటలా ముడివేసుకున్న ఆ అల్లిక జిగిబిగి చూద్దాము…
భక్తి అనేది కేవలం దైవారాధనతోనే ముగిసిపోదు; అది మనసును మలిచే శక్తి, సమాజాన్ని మార్గనిర్దేశనం చేసే దీప్తి. తనలోని ఆధ్యాత్మికతను అక్షరరూపంలో ఆవిష్కరించి, దానిని సామాజిక చైతన్యంతో మేళవించిన రచయిత్రి శ్రీమతి వీణారెడ్డిగారు మన ముందున్నప్పుడు, ఆమె కలం ఒక సాధనగా, ఒక బాధ్యతగా రూపాంతరం చెందిన వైనం …భక్తి పరిమళం, తత్త్వ గాఢత, సమాజంపై స్పందన…ఈ మూడు ధారలూ ఆమె రచనల్లో సమన్వయమై ప్రవహిస్తున్నాయి. ఆమెకు ఆధ్యాత్మికత ఒక అంతర్ముఖ యాత్ర మాత్రమే కాదు; అది ప్రజాహిత దిశగా చూపే దిక్సూచి. పురాణాల నుంచి ప్రస్తుత జీవితానికి, మౌన సాధన నుంచి సామాజిక సందేశానికి సాగిన ఆమె అక్షర ప్రయాణం, పాఠకుని ఆలోచనను మేల్కొలిపే శక్తిని కలిగివుంది. ఈ ముఖాముఖిలో ఆమె ఆత్మానుభూతులు, ఆలోచనా ప్రక్రియ, భక్తి మరియు బాధ్యతలపై తన విశాల దృక్పథాన్ని మనతో పంచుకుంటున్నారు.
మయూఖ పాఠకుల కోసం, ఆమె అంతర్ముఖ స్వరాన్ని వినిపించే ఈ ప్రత్యేక ముఖాముఖి….
నిజం చెప్పాలంటే… “ఆమె కలం…ఆమె బలం …
ఇంకెందుకు ఆలస్యం ? వారిని పలకరించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా?

రంగరాజు పద్మజ:– నమస్కారమండీ! వీణారెడ్డి గారూ!

వీణారెడ్డిగారు :— నమస్కారమండి పద్మజ గారు!

పద్మజ:–మీ కుటుంబ నేపథ్యం, బాల్యం, విద్య గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?

వీణారెడ్డి:– నాపూర్తి పేరు కడుకుంట్ల వీణారెడ్డి. నాతల్లిదండ్రులు కీ.శే.మర్యాద సులోచనమ్మ- జనార్దన్ రెడ్డి గారు.
పుట్టిన ఊరు కల్వరాల గ్రామం, వనపర్తి జిల్లా. పుట్టిన తేదీ 3 -8 -1955.విద్య -డీ కాం( Dcom) పాలిటెక్నిక్, వనపర్తి.
మెట్టిన ఊరు బొందలపల్లి గ్రామం, నాగర్ కర్నూల్ జిల్లా. భర్త కె.హనుమంత రెడ్డిగారు. పద్య కవి,పోస్టల్ రిటైర్డ్ ఉద్యోగి. మా సంతానం కవిత, వంశీధర్ రెడ్డి, శశిధర్ రెడ్డి. నివాసం నంది హిల్స్ కాలనీ, మీర్పేట్, హైదరాబాద్.
వృత్తి గృహిణి, ప్రవృత్తి సామాజిక స్పృహ గల రచన వ్యాసంగం, అభిరుచులు ఆధ్యాత్మిక చింతన, ధ్యాన ప్రక్రియ, తోట పని, సంగీత శ్రవణం, జీవ కారుణ్య సేవ, మొదలైనవి… సాహిత్య, సంగీత నేపథ్యం గల వ్యవసాయ కుటుంబం మాది! బాల్యం నుండే పొలం పనులకు, ఇంటి పనులకు వచ్చే శ్రామిక జనులతో కూడి, వారి నుండి జానపద కథలు, పల్లె పాటలు శ్రద్ధగా వినేదాన్ని. వీధి నాటకాలు కూడా చూసేదాన్ని. ఐదవ తరగతి నుండి ఏడవ తరగతి దాకా గ్రంథాలయం నుండి బాలల భారత, భాగవత, రామాయణాది పుస్తకాలు, నీతి కథలు అలాగే, అదే పాఠశాల లైబ్రరీ నుండి అప్పటి ఆధునిక రచయిత్రులైన యద్దనపూడి, కోడూరి, మాదిరెడ్డి.. వంటి వారి నవలలు తెచ్చేదాన్ని. అవి అమ్మతో పాటు నేను కూడా చదివేదాన్ని. నానమ్మ, నాన్న పెదనాన్నల అభిరుచుల మేరకు ఇంట్లో కొలువైన పలు రకాల సనాతన భక్తి సాహిత్యాలను పఠించేదాన్ని.
రాత్రి వేళల్లో ఆరుబయట చందమామ వెన్నెల్లో నాన్నమ్మ చెప్పే హరిభక్తికథలను ఆసక్తిగా ఆలకించేదాన్ని. సెలవుల్లో పుస్తకాలను తీసుకొని పొలానికి వెళ్ళి , నాన్న తో పాటు రాతి గట్లమీద,పొలం గట్లమీద, పశువుల పాకలోనూ, పుస్తక పఠనం గావించడం పరిపాటి.
1960 లోనే ఇంట్లో గ్రామఫోన్ రికార్డుల ద్వారా సంగీతం , నాటకాలు, చలనచిత్రాలు వింటూ, పనులు చేసే వారికి వినిపిస్తూ శ్రమతో అలసట పొందకుండా చేసేవాళ్ళం. మానాన్న మంచి చిత్రకారులు… వారు వేసే చిత్రాలలో నేనూ పాల్గొనేదాన్ని

ముఖాముఖి గ్ర

హీత రంగరాజు పద్మజ, వీణారెడ్డి

పద్మజ:– మీ విద్య -ఉద్యోగం ఎలా సాగింది?

వీణారెడ్డి :— ప్రాథమిక విద్యార్థి దశ నుండే తెలుగు అధ్యాపకుల శ్రావ్యమైన పద్యాలు, పాఠ్యాంశాలలోని పౌరాణిక చారిత్రకాంశాలు అమితంగా ఆకర్షించేవి. ఆ కాలం పెద్ద వాళ్ళ పెట్టెలో ఉన్న పుస్తకాలు అపూర్వ చింతామణి ,విషకన్య , వివేకానంద చరిత్ర వంటివి చదివి ఆ కథలను సాటి విద్యార్థులకు వినిపించేదాన్ని. ఎనిమిది నుండి పదవ తరగతి దాకా శ్రీ విద్యా శ్రీ ప్రగతి వంటి అంశాలను వేదిక ప్రసంగాలలోనూ సాంస్కృతిక కార్యక్రమాలలోనూ పాల్గొని, ప్రశంసలు అందడం, పిల్లల చేత ప్రదర్శింపజేయడం శుభకార్యాల్లో పాటలు పాడడం వంటివి చేసే దాన్ని.
పిల్లులు, కుక్కలు, పొట్టేళ్లు, రామచిలుకల వంటి పెంపుడు జంతువులు, పక్షులు, కోళ్లు మొదలైన వాటికి ఆహారం అందిస్తూ ఆవులు, గేదలు పాలు పిండుతూ పెరుగును కవ్వంతో చిలుకుతూ ఆనందించేదాన్ని పద్మజ గారూ…

పద్మజ:–మీ రచనా ప్రయాణం ఎలా ప్రారంభమైంది ? మొదటి ప్రేరణ ఎవరు? మానవీయ కోణంలో రచనలు చేయాలనే ఆలోచన ఎలా ఏర్పడింది? రచయిత్రిగా మీపై ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తులు లేదా గ్రంథాలు ఏమిటీ?

వీణారెడ్డి:— నా రచనా యానం అనేది పుస్తక పఠనం, కథా శ్రవణం వంటివే అదే ప్రేరణగా ఆరంభమైంది. వికలాంగులు, అన్నార్తులు, అభాగ్యుల వంటి వారిని, ఇంకా అమాయకులు, మంచివారు,మహానుభావులు, మంచి కళాకారులను… గాంచినప్పుడు కలిగిన స్పందనలే హృదయాన్ని చలింప చేస్తూ… మానవీయ కోణాలను కదిలిస్తూ.. అవే కలం -కళలుగా రూపొందినవని చెప్పాలి ! రచయిత్రిగా నాపై ఎక్కువ ప్రభావం చూపినవి ఆనాటి పత్రికలు, అందులోని పాఠకుల ప్రశంసలు, మా శ్రీవారి స్పందనా విధానం అని కూడా చెప్పవచ్చు. ఇంక గ్రంథాల మాటకొస్తే.. పాఠశాల దశలో శరత్ సాహిత్యం, కాలేజీ దశలో తెన్నేటి హేమలత గారి మోహన వంశీ, ఆపైన రవీంద్రుని గీతాంజలి ఎక్కువ ప్రభావం చూపాయి. ఆ పై ఆధ్యాత్మిక ఆచార్యులైన ఎక్కిరాల కృష్ణమాచార్య గారి పురుషమేధం గ్రంథం భక్తి- ఆధ్యాత్మికతలకు అంకురార్పణ గావించింది. ఇక రచనల వివరాల విషయానికొస్తే 1975 నుండి ప్రారంభమైన రచనా వ్యాసంగంలో, 1980 ఆ ప్రాంతంలో సాహిత్య దుందుభి పత్రికలో ప్రచురింపబడిన ప్రధమ బహుమతి కథతో ప్రారంభమైన ప్రధమ కథ ఓ ఆకలి కథ నుండి, వివిధ పత్రికలలో ముద్రితమైన 150 పైగా 15 అవార్డులతో… కథలు, 100 దాకా బహుమతులతో కూడిన వ్యాసాలు, 50 దాకా కొన్ని అవార్డులతో కూడిన కవితలు, గేయాలు ప్రచురితాలు…ముద్రణా గ్రంథాలు కథావి పంచి, జీవన్మణులు( 2019) సంవత్సరంలో, *కథావిపంచి-2 *, *నిషాంత కాంతులు(2020) శాంతివనం వ్యాసమాలిక (2022) (1988) లో కావ్య జ్యోతి వారపత్రికకు అసోసియేటెడ్ ఎడిటర్ గా కూడా పనిచేయడం జరిగింది.
ప్రస్తుతం కూడా భక్తి జ్ఞాన ఆధ్యాత్మిక సామాజిక రచనా పరంపర కొనసాగుతున్నది. ముఖ్యంగా ఎడిటర్ పవన్ గారి అక్షరాంజలి మాసపత్రికలో నెల నెల నా ఆధ్యాత్మిక వ్యాసరచనలు ముద్రింపబడుతున్నవి. మరొక కథా సంకలనం, కవితా సంపుటి త్వరలో రానున్నవి.

పద్మజ :- మానవీయ థృక్పధం మీ వ్యాసాల్లో ప్రధానంగా కనిపిస్తుంది… మీ దృష్టిలో మానవీయత అంటే ఏమిటో మనిషి -మనిషిగా నిలబడడానికి ఈ సమాజంలో అత్యంత అవసరమైన విలువలు ఏమిటి? మీ రచనలతో పాఠకుడిలో ఎలాంటి మార్పు రావాలని ఆశిస్తారు?

వీణారెడ్డి:– సృష్టిలో దేని సహజత్వం దానికుంటుంది. మానవుడిగా జన్మించిన వాడికి మానవీయత ప్రధాన గుణమై ఉండాలి! మనిషి ప్రాణంతో ఉండడానికి గుండె కొట్టుకోవడమే కాదు! మానవత్వంతో బ్రతకడానికి హృదయాన్ని పట్టుకొని ఉండాలి. సామాజిక ప్రగతికి సాంకేతికత ఎంత అవసరమో సామాజిక సంక్షోభానికి మానవత కూడా అంతకన్నా ఆవశ్యకం. మనిషి మనిషిగా నిలబడడానికి మనిషి ముందుగా తన స్థాయిని దిగజార్చే ఇంద్రియాలను మనసు ద్వారా జయించాలి. ఆ మనసు మళ్ళి తన చంచలత్వంతో కిందికి జారకుండా బుద్ధి- విచక్షణల ద్వారా దాన్ని నిగ్రహింపజేయాలి. మంచి- చెడు విచక్షణ కలిగి బుద్ధిమంతుడైన మనిషి.. మనిషిగా మనీషిగా మారగలడు. అలా మారాలంటే అందుకు మనిషి పాటించవలసిన మానవీయ విలువలు ఏమిటంటే… మనుషులంతా ఒకటేనని, చావు పుట్టుకలు అందరికీ సమానమేనని, అందరిలోని అంతర్గత ఆత్మ సౌందర్యం ఒకటే ప్రకాశమని… అనేకంలా కనిపించే లోకంలో మానవాళి అంతా ఏకమేనన్న ఏకాత్మతా భావనతో, తనలాగే తన సాటి వారన్న అవగాహనతో చరించగలగాలి! అప్పుడే జాతి, మత, కుల, వివక్ష… ఉన్నోడు- లేనోడు అన్న భేద భావము, అందం- అనాకారితనం అన్న తారతమ్యం; స్త్రీ- పురుష వ్యత్యాసం అనేవి అంతరించి అందరిలోనూ మానవీయ విలువలు సంతరించుకొంటాయి. ఉప్పునీటి దాహం వంటి అంతులేని సంపాదన కన్నా… ఆత్మసంతృప్తి అనే అమృత సంపాదన పొందగలగాలి!
నా రచనల ద్వారా పాఠకుడిలో కొంతైనా స్వార్ధ భావం నశించి, కాసింతైనా పరమార్ధ భావం కలగాలని, ఎన్ని కష్ట నిష్టూరాలు ఎదురైనా ఆదరణ కనువు కానీ పర ధర్మాన్ని అనుసరించక, అంతగా ప్రయోజన కారి కాకపోయినా ఎంతో ప్రశాంతతకు దారి అయిన, ప్రకృతి పరంగా తనకు ప్రాప్తమైన సహజసిద్ధమైన తన స్వధర్మం విలువ తెలుసుకొని, తన వ్యక్తిగత సామాజిక ధర్మాన్ని తన కర్తవ్యం ద్వారా నిరూపించుకోవాలని, ఎన్నెన్నో ఆశయాలకు గాక, కొన్ని ఆశయాలకు తావివ్వగల సుమంలా రూపొందగల ఏ కొద్ది ప్రేరణ కలిగినా చాలనే అభిలాషతో, అనుభవంతో, అంకిత భావంతో నిరంతర ప్రయత్నమే నిజమైన విజయం లా నా రచనా పరంపర కొనసాగిస్తున్నాను.

పద్మజ:– ఒక రచయిత్రికి సామాజిక బాధ్యత ఎంత వరకు ఉండాలని మీరు భావిస్తారు?

వీణారెడ్డి ఒక రచయిత్రికి తన ప్రయత్న లోపం లేని సంపూర్ణ సామాజిక బాధ్యత ఉండాలి. వీలైనంత వరకు తన రచనల ద్వారా సూచించిన ఉదాత్తమైన అంశాలు అనేవి తన జీవితంలో ఆచరించిన అనుభవ సారాలై ఉండాలి. ఎక్కడో చదివినవి ఎవరో బోధించినవి కాక అందులోని సాధకబాధకాలను గ్రహించి మరీ ఖచ్చితమైన తీర్పునివ్వగలిగేలా ఉండాలి.

పద్మజ:– మీ రచనల వల్ల సమాజంలో ఎప్పుడైనా ప్రత్యక్ష మార్పు జరిగిన అనుభవం మీకు ఉన్నదా?

వీణారెడ్డి :– 1986లో వనితలో వచ్చిన నచ్చిన వరుడు అనే కథలోని కట్నం కోరని ఆదర్శ పాత్రలా, మా బంధువుల్లో జరిగిన ఆదర్శ వివాహం ఒక అనుభవం … అలాగే, నా రచనా ప్రేరణ తో మరొక వితంతు వివాహం జరగడం, ఆధ్యాత్మిక రచనల వల్ల పాఠకుల్లో కలిగిన కొంత స్వార్థ చింతన తొలగడం, ముఖ్యంగా మా పిల్లల్లో కలిగిన అనుసరణీయ భక్తి, జ్ఞాన, ఆధ్యాత్మిక చింతన, సామాజిక సేవా నిరతి, జంతు సంరక్షణ, అహింసా విధానం… వంటివి అలవడినవి. ఇవి నాకు జరిగిన అనుభవాలు.

పద్మజ:– నేటి సమాజాన్ని ఎక్కువగా కలవర పెడుతున్న సమస్యలు ఏమిటని మీరు అనుకుంటున్నారు?

వీణారెడ్డి:– నేటి సమాజాన్ని కలవరపెడుతున్నవి అన్నీ ముఖ్యమైన సమస్యలే ! పద్మజ గారూ! ముఖ్యంగా స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణా రాహిత్యం, విచ్చలవిడి ప్రవర్తనం, పై పై వ్యామోహాలకు లోనై పోతున్న విలాసాల జీవితాలు, సంపద అధికమై శ్రమలోపించిన పరిస్థితులు, తాగుడు, వ్యభిచారం, వంటి వ్యసనాలు… యువత సహజీవనాలు, మత్తులోని అత్యాచారాలు, హత్యలు, అహంకార పూరిత హింసా ప్రవృత్తులు, పాలకుల పదవీ వ్యామోహాలు, అధికారుల లంచగొండితనాలు, ప్రజల ప్రలోభాలు తాత్కాలిక ఆవేశాలు, ఆత్మహత్యలు ఎన్నో ఒకదానికొకటి ముడివడిన సమస్యలు సామాజిక సంక్షోభానికి కారణం అవుతున్నవి.

పద్మజ:— ఒక రచన రాయడానికి ముందు మీరు చేసే ఆలోచన లేదా ప్రణాళిక ఎలా ఉంటుంది ?

వీణారెడ్డి :— ఒక రచన చేయడానికి ముందు, ఆలోచనలోనే ఆ కథా సంవిధానం, దాని ఆద్యంతాలు ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేసుకుంటాను. ఆ తర్వాత ఆయా పాత్రలుగా మారిపోయిన అనుభూతి- అనుభవాల ద్వారా రచనను గావిస్తాను. తొలిపాఠకురాలి పాత్రగా కూడా రూపొంది మరీ దాన్ని పఠించి, అవసరమైన సవరణలు గావించుకుంటాను. భావం తర్వాతనే శైలి నిర్మాణం జరుగుతుంది.

పద్మజ:– నేటి యువత సాహిత్య రంగంలోకి రావాలంటే ఏ విలువలను పాటించాలి? రచన చేయాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏమిటి?

వీణారెడ్డి:— నేటి యువత సాహిత్య రంగంలోకి రావాలంటే సమాజంలో తాను ఎలాంటి విలువలను కోరుకుంటున్నాడో అలాంటివి ముందుగా వీలైనంతగా తాను పాటించాలి! ఏ అంశాలు తనను అధికంగా స్పందింప చేస్తాయో వాటి పట్ల దృష్టిని కేంద్రీకరించాలి. అలాంటి ఉత్తమ రచనలనే పఠించాలి… పరిశీలించాలి! కథ,కవిత, వ్యాసం, పద్యం అనేవి దేని సంప్రదాయం దానికుంటుంది. కనుక అనుభవిజ్ఞులైన రచయితల (రచనల) ద్వారా దాన్ని తీర్చిదిద్దుకోవాలి! మంచి భాషకు, పద రమణీయతకు కృషి చేయాలి. రచనలు అచ్చులో చూసుకోవాలని ఆసక్తే కాక సమాజాన్ని మార్చే శక్తిగా రచన ఉండాలనే తపనతో రచన ఆరంభించాలి. ఫలితాలు ఎలా ఉన్నా పట్టువదలని ప్రయత్నంగా రచనలు కొనసాగిస్తూ ఉండాలి! నిరంతర సాధన ద్వారానే లక్ష్యాన్ని సాధించాలి!

పద్మజ:– రచయిత్రిగా మీ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన క్షణం ఏది? ఇంకా మీరు రాయాలనుకుంటున్న కానీ రాయలేక పోయిన అంశాలు కానీ ఉన్నాయా?

వీణారెడ్డి:– నాకు సంతృప్తినిచ్చిన క్షణాలు ఏవంటే ?గృహిణిగా నా పరిపూర్ణ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే… నేను గావించిన తీరిక వేళల్లోని సమాజ సేవలోని భాగంగా ప్రఖ్యాత సంస్థల ద్వారా ప్రముఖుల పేర్లమీదుగా పురస్కారాలు అందుకున్న సందర్భాలు….
రాయాలనుకున్నా కానీ రాయలేకపోయిన అంశమేమిటంటే భగవద్గీత శ్లోకాల ఆధారంగా చిన్నచిన్న కథల శీర్షిక నిర్వహించాలని అనుకున్నా! సరైన వేదిక, ప్రోత్సాహం లేక వీలు కాకపోవడంతో చేయలేకపోయాను. ఇక ముందు వీలైతే అది కూడా సాహితి భవిష్యత్తులో సంపూర్ణం చేసుకుంటాను.

పద్మజ:– మీలో కనిపించే జీవ కారుణ్యం మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక లక్షణం గా కనిపిస్తుంది. ఆ భావం మీలో ఎలా పెరిగింది ? సర్వభూత దయ అనే భావం మనిషి జీవన విధానంలో ఎందుకు ముఖ్యమని మీరు భావిస్తారు? జీవజాలం పట్ల కరుణ చూపడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనంగా మీరు భావిస్తారా?

వీణారెడ్డి:— జీవకారుణ్య భావం అనేది నాకు జన్మతః సంక్రమించిన అంశం. భక్తి భావం పెరిగే కొద్దీ , ధ్యాన రహస్యాలు అందే కొద్దీ అన్నింటిలోని ఆత్మ ఒకటే అని, అందులోని పరమాత్మ ఒకటే అనే సత్యం బోధపడింది. ఆకలిని, ఆవేదనను చెప్పుకోలేని ఆ మూగ ప్రాణుల సంరక్షణ అనేది ఏకాత్మత భావంతో మనుషులు ఆచరించగల మహా యజ్ఞం లాంటిదని అర్థమైంది. సర్వభూత దయ అనేది సర్వేశ్వరుని సందర్శింప చేయగలదు! అలాంటి కరుణ గల హృదయముతోనే… మానవజీవనం ప్రేమమయంగా శాంతి నిలయంగా మారగలదు. నోరులేని మూగ ప్రాణులను అర్థం చేసుకోగల మనిషి సాటి మనిషి మనోభావాలను అతి సులభంగా గ్రహించి,పరస్పర సహకారంతో మానవ సంబంధాలను పెంపొందించుకోగలరని అనుకుంటాను. అందుకే సర్వభూత దయ అనేది శ్రేయోదాయకమైన విషయ విశేషం అని నా విశ్వాసం. ఒక తల్లికి తండ్రికి ఎలా అయితే తమ పిల్లల్లోని మూగ పిల్లలు, అమాయకపు పిల్లల పట్ల అధిక ఆదరణ ,అత్యంత శ్రద్ధ అనేవి తక్కిన పిల్లల కంటే ఎక్కువగా ఎలా ఉంటాయో? అలాగే భగవంతుడికి కూడా తన సృష్టిలోని సంతానమైన మూగజీవాల పట్ల (మాట్లాడగల లౌక్యంగల) మానవుల కన్నా ఆర్ద్రత అధికంగా ఉంటుందని, అందుకే జీవ కారుణ్యం అనేది ఆ పరమాత్మ కరుణను, ప్రేమను పొందగల, ఆత్మానందం అందగల అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనగానే నేను భావిస్తాను.

పద్మజ:— మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ప్రారంభమైంది? ఆధ్యాత్మికత మీ రచనలలో భావగాంభీర్యాన్ని ఎలా పెంచింది?

వీణారెడ్డి:— ఆత్మ అనంతం… దాని ఆధారంగానే జన్మ పరంపర (జీవుడి కర్మ ఫలాల కారణంగా) కొనసాగుతుందని, విశ్వసించగలిగితే… భక్తి ఆధ్యాత్మికంశాలనేవి నాకు (అనంతకాలం) నుండి పూర్వజన్మల, కారణజన్మల సంస్కారాలుగా శ్రీరామ పరంధాముని, శ్రీకృష్ణ పరమాత్ముని, మధుర భక్తిగా సంక్రమించినవని అర్థమవుతున్నది. భక్తి- ఆధ్యాత్మిక, పౌరాణిక గ్రంథ పఠనాలు, భక్తి ధార్మిక విలువలతో కూడిన అలనాటి చలనచిత్రాలు, మధుర భక్తి గీతాలు మొదలైనవి లౌకికాలౌకిక స్పందనలుగా నా రచనల్లో చోటుచేసుకుని, భావ గాంబీర్యత నలవరుచుకొని అనుభవైక వేద్య వైవిధ్య నైవేద్యాలుగా బహుమతులు అంది పాఠకులకు అందించబడినవి.

పద్మజ:-మానవత-జీవకారుణ్యం-సామాజికస్పృహ- ఆధ్యాత్మికత ఈనాలుగు కలిసి మనిషి జీవితాన్ని ఎలా సమృద్ధిగా చేస్తాయంటారు?

వీణారెడ్డి :– మానవీయత, జీవ కారుణ్యం, సామాజిక స్పృహ, ఆధ్యాత్మికత అనేవి నాలుగు కూడా జీవన రథానికి నాలుగు చక్రాల వంటివి.
మానవీయత అనేది ఐకమత్యమే బలం అనిపించేలా మనిషిని మనిషిని కలిపి ఉంచే సమతా మమతల సంబంధ సాధనం!
జీవ కారుణ్యం అనేది దయగల హృదయమే దైవ మందిరం అని నిరూపించే నిష్కల్మష విధానం. స్థాయీ బేధాన్ని మరిచి, పసిపాపలను లాలించినట్టుగా సృష్టిలోని జీవజాలాన్ని ఆదరించగల భావ లాలిత్యం కరుణ తత్వమనేది సామాజిక హృదయాన్ని మాతృ మందిరంలా మార్చగలదు.
సామాజిక స్పృహ అనేది మనిషిలోని చేతనత్వాన్ని జాగృతపరిచేది. నిస్పృహను నివారించేది , కర్తవ్యాన్ని బోధించి ఉద్యమింప చేసేది, త్యాగమే యోగంలా సామాజిక సంక్షేమానికి తనకున్నంతలో సర్వ సమర్పణ గావించగల అంకిత భావాన్ని కలిగించేది ఆధ్యాత్మికత!
అనగా ఆత్మను గురించి తెలిపేది, ఆత్మసత్యం తనువనిత్యం అన్న జ్ఞానాన్ని కలిగించేది, అనిత్యమైన తనువు కోసం, అశాశ్వతమైన భోగభాగ్యాల కోసం అర్రులు చాస్తూ, స్వార్థ భావాలతో అనుచిత విధానాలతో మనిషి పతనం కాకుండా, శాశ్వతాశాశ్వతాలను వివరిస్తూ మనిషికి తన జన్మ కారణాలను వివరిస్తూ, చేయవలసింది ఏమిటో చేయకూడనిది ఏమిటో వివరిస్తూ, అవగాహన కలిగిస్తూ ఫలితంపై దృష్టి లేని ధార్మిక కర్తవ్యాన్ని నిర్వహింప చేస్తూ, అశక్తత నుండి శక్తి వైపుగా…చీకటి నుండి వెలుగులోనికి నడిపించేది, మృత్యువును కూడా అమృతంలా భావించి ఆహ్వానింపచేయగల అద్భుత సాధనం….

పద్మజ:— నేటి యువతలో మానవీయ విలువలు, జీవ కారుణ్యం పెంపొందించడానికి ఏ మార్గాలు అవసరం? సాహిత్య రంగంలోనికి రావాలనుకునే యువ రచయితలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?

వీణారెడ్డి:— నేటి యువతలో మానవీయ విలువలు పెంపొందించడానికి, చిన్ననాటి నుండి కూడా తల్లితండ్రులు, గురువులు, ప్రధాన బాధ్యత వహించాలి! సాటి పిల్లలు కూడా తనలాంటివాళ్ళేనని, బాధ -ఆనందాలు అందరికీ ఒకటేనని, ఒకరి నుండి తను పొందిన సాయం తను కూడా మరొకరికి అందించాలని, ఒకరి వల్ల తను పడ్డ బాధ తన వల్ల మరొకరు పడకూడదు! అని దైనందిన జీవనంలో నుంచే మంచి- చెడుల పర్యవసానాలను బాల్య దశ నుండే అవగాహన కలిగిస్తూ ఉంటే, వయసుతోపాటు యువతలో కూడా మంచి మానవతా విలువలు ఇంటినుండి, విద్యాలయాలనుండి, ఆరంభమై సమాజం దాకా వ్యాపించగలవు. ముఖ్యంగా యువతలోని మాట వినని ఆవేశం, దుడుకు స్వభావం వంటి వాటిని తొలగించి, సన్మార్గాలననుసరించడానికి తల్లిదండ్రులు ప్రేమగా, అధ్యాపకులు ఓపికగా ముఖ్యంగా ఆచరణాత్మకంగా యువతను కౌమార దశ నుండే మంచి సంస్కారాలతో ముందుకు నడిపించగలగాలి!

పద్మజ:– రచయిత్రిగా మీకు తొలి ప్రేరణ ఎవరు?

వీణారెడ్డి :— రచయిత్రిగా నాకు తొలి ప్రేరణ అనేది ఒక పాఠకురాలిగా పుస్తక పఠనాశక్తి సామాజిక సమస్యల పట్ల అవగాహనా భావమనే చెప్పవచ్చు!

పద్మజ:– సమాజ సమస్యలపై రాయడం ఒక బాధ్యతగా భావిస్తారా? లేక వ్యక్తిగత స్పందనగా చూస్తారా? రచయిత్రి సమాజానికి మార్గదర్శి కావాలా? రచయిత్రి దృక్కోణం ఎలా ఉంటుంది?

వీణారెడ్డి:—- సమాజ సమస్యలపై రాయడం అనేది… ఆయా సమస్యలు వ్యక్తిగత స్పందనలుగా రూపొంది, ఆ సంఘర్షణల ప్రభావమే సాంఘిక బాధ్యతలకు, సాహితీ సారధ్యాన్ని వహింప చేసింది.
రచయిత్రి సమాజానికి తన రచనల ద్వారా, తన ఆచరణాత్మక విధానాల ద్వారా, మంచి మార్గదర్శిని కావాలి !రచయిత్రి దృక్కోణం అనేది వ్యక్తిగతాన్ని కాక సామాజిక హితాన్ని అవలోకిస్తుంది. ఇంటికే పరిమితమై బంధింప పడకుండా సంధించిన అస్త్రంలా సమాజం వైపు దూసుకుపోతోంది! ఇల్లే సమాజంలా… సమాజమే ఇల్లుల భావిస్తూ ఉభయతారకంలో ఉపకరిస్తుంది!

పద్మజ:— మహిళా రచయిత్రిగా మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి? స్త్రీ స్వరాన్ని సమాజం ఎలా స్వీకరిస్తుంది? మీ రచనల్లో స్త్రీ పాత్రల ఆవిష్కరణ ఎలా ఉంటుంది?

వీణారెడ్డీ:— మహిళా సాహిత్యకారిణిగా నాకు ఎదురైన సవాళ్ళు సమాజంలో కన్నా సంసారంలోని గృహిణి పాత్ర రచయిత్రికి విసిరిన విసురైన సవాలక్ష సవాళ్లు విద్యుక్త ధర్మాలే!
స్త్రీ స్వరాన్ని ఒకప్పుడు అణిచివేత పర్వం యొక్క ప్రభావంగా భావించిన సమాజం, ఈ ఆధునిక యుగంలో ఎలుగెత్తిన స్త్రీస్వరాన్ని స్వేచ్ఛారావంలా ప్రగతి సంకేతంలా భావిస్తున్నది… గౌరవిస్తున్నది. స్త్రీల హక్కుల స్వరాలనే కాక ,బాధ్యతల పర్వాలను గృహిణి నుండి ఉద్యోగ నిర్వహణ దాకా స్వాగతిస్తుంది నేటి ఆధునిక సమాజం. నా రచనల్లో స్త్రీ పాత్ర అనేది …మంచి కుటుంబ జీవనానికి ప్రతికగా, సామాజిక జీవన ప్రగతిగా ఆదర్శంగా, మాతృకగా, అధర్మ ఖండితగా, హక్కులకన్నా బాధ్యతల్ని మోసే త్యాగ భరితగా, ధన్య చరితగా, నా అభిలాష మేరకు ఆవిష్కరింపబడుతుంది.

పద్మజ:— సాహిత్య ప్రభావం అంటే సాహిత్యం నిజంగా సమాజాన్ని మార్చగలదని మీరు నమ్ముతారా?

వీణారెడ్డి::— సాహిత్యం సమాజాన్ని మార్చగలదు! సమాజంలోని అజ్ఞానాంధకారాలకు జ్ఞాన నేత్రమై దారి చూపగలదు! స్వాతంత్రోద్యమానికి పూర్వం నుండే నినదించిన అక్షర దిక్కార స్వరాలు, ఉద్యమ సాహిత్యాలు, విప్లవ గీతాలు, ఇంకా కరుణరాసాత్మక కావ్యాలు, జానపద నేపథ్యాలు గల నీతి పద్యాలు, వైదిక, పౌరాణిక ,చారిత్రక గ్రంథాలు మానవ నాడీ గ్రంధుల్ని ప్రభావితం గావించి మనో విశాలతకు, త్యాగనిరతికి, సామాజిక ప్రగతికి, సాధనాలుగా… నాటి జీవన విధానాలకు, అరుదైన చరిత్రలకు, అద్భుత పరిణామాలకు స్ఫూర్తి ప్రతీకలుగా… నిలిచినవి… నిలుస్తున్నవి… నిలుస్తాయి!

పద్మజ :—ఈ కాలంలో పాఠకుల అభిరుచిలో వచ్చిన మార్పులపై మీ అభిప్రాయం?

వీణారెడ్డి:– మార్పు అనేది కాలానికి మలుపు వంటిది. కాలాతీతుడు కాలేని పాఠకుడు కూడా మనిషే కనుక, కాల ప్రభావానికి కట్టుబడిపోయిన మానవుడిగా, పాఠకుడిలోని మారుతున్న అభిరుచి కూడా అతి సహజంగా కాలంతోపాటు స్వీకరించవలసిందే!

పద్మజ :— సమకాలీన పరిస్థితులునేటి యువతలో సామాజిక చైతన్యం ఎలా ఉంది? సోషల్ మీడియా ప్రభావం రచయిత్రులపై ఎలా ఉంది?

వీణారెడ్డి :– నేటి యువతలో అధిక భాగం సంపాదనే ధ్యేయంగా, ఆధునిక సౌకర్యాలే సర్వస్వంగా, స్వేచ్ఛే పరమావధిగా, సాంకేతిక విద్యే వైవిధ్య సాధనంగా, అంతకుమించి మరి దేనికీ తీరికలేని యాంత్రిక జీవనమే ఆనవాయితీగా అదే లోకంగా జీవిస్తున్నారు. మరి కొద్ది మంది యువతీ యువకులు సేవా భావంతో మానవీయ విలువలతో సామాజిక స్పృహతో కూడిన చైతన్యంతో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సాంకేతిక విధానాలను సైతం సామాజిక ప్రగతికి వినియోగిస్తూ సాధన లేవైనా సరే ఉపయోగించుకునే విధానాలపై వాటి ప్రభావం ఉంటుందని నిరూపిస్తూ ఆదర్శభావాలతో కూడిన ఆధునికత కూడా అద్భుత సామాజిక చైతన్యమని రుజువు చేస్తున్నారు. అరచేతిలో ఉసిరికలా అందుబాటులో ఉన్న సోషల్ మీడియా అనేది సాధారణ మహిళల కన్నా రచయిత్రులకు ఉపయుక్తమైన ఉపకరణ. అది ముంగిట్లోని సూర్యకిరణాల విశ్వ సందర్శనం కలిగిస్తూ విశాల భావ స్పందనను వైవిధ్య సృజనను రచనకు ప్రేరణ కలిగిస్తుందని చెప్పవచ్చు!

పద్మజ:- నేటి యువతలో సామాజిక చైతన్యం ఎలా ఉందంటారు?

వీణారెడ్డి:— స్పృహతో కూడిన చైతన్యంతో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, సాంకేతిక విధానాలను సైతం సామాజిక ప్రగతికి వినియోగిస్తూ, సాధనలేవైనా సరే ఉపయోగించుకునే విధానాలపై వాటి ప్రభావం ఉంటుందని నిరూపిస్తూ, ఆదర్శ భావాలతో కూడిన ఆధునికత కూడా అద్భుత సామాజిక చైతన్యమని ఋజువు చేస్తున్నారు.

పద్మజ:– ప్రస్తుత సామాజిక సమస్యల్లో మీకు అత్యంత ఆందోళన కలిగించేది ఏమిటి?

వీణారెడ్డి:– ప్రస్తుత సామాజిక సమస్యల్లో అత్యంత ఆందోళన కలిగించేది… పోరాట పటిమతో స్వేచ్ఛనూ, సమాన హక్కులను పొందిన మహిళలను స్వేచ్ఛగా తిరగనివ్వని అత్యాచార పర్వాలు, ప్రగతికి ప్రథమ సోపానమైన పడతిని భాగ్య దేవతగా గాక…భోగ్య వస్తువుగా భావించడం.

పద్మజ రాసే ముందు ఆలోచిస్తారా? లేక ఆవేశంలో రాస్తారా?

వీణారెడ్డి :– రాసే ముందు ఎక్కువగా ఆలోచిస్తాను పద్మజ గారు.

పద్మజ:– మీరు పొందిన పురస్కారాలు, సన్మానాలు ఆయా సందర్భాలు మా మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?

వీణారెడ్డి:— నా సాహితీ ప్రయాణంలో అందుకున్న అవార్డులు, పురస్కారాలు, సన్మాన విశేషాలు సంక్షిప్తంగా వివరిస్తాను.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా 2024 సంవత్సరానికి నాళం కృష్ణారావు గారి స్మారక ఉత్తమ రచయిత్ర కీర్తి పురస్కారం, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక, ఆచార్య పాకాల యశోద రెడ్డి సాహితీ పురస్కారం, 2024 కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళా పీఠం ద్వారా కపిలవాయి కిషోర్ బాబు -భార్గవి దేవి*ల పురస్కారం (2002)లో, సాహిత్య వేదిక తెలుగు పూలవనం సంస్థలచే *ఉమ్మెత్తల యజ్ఞరామయ్య కథా సాహిత్య పురస్కారం( 2020)లో, శ్రీశ్రీశ్రీ కురుమూర్తి దేవస్థానం వారి ద్వారా బెల్లం నాగన్న స్మారక పురస్కారం (2024)లో, జయజయ సాయి ట్రస్ట్ వారిచే వేద భారతి *ఉత్తమ జాతీయ పురస్కారం *( 2022)లో,
పుడమి సాహితి వేదిక ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారం(2021)లో, విశ్వహిందూ పరిషత్ వారిచే ఉత్తమ గీతా వ్యాసర చయిత్రి పురస్కారం (2022)లో, రైట్ వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రిగా ఎక్స్లెన్సీ అవార్డు (2019)లో,
శిఖరం ఆర్ట్ థియేటర్స్ వారిచే విజయసేవానంది పురస్కారం( 2021)లో, ఈసీఐ మరియు డి ఐ సి సి ఐ ఫౌండేషన్ ద్వారా మహిళా సేవా రత్న అవార్డు( 2021) లో , ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా సాహితీ సేవా రత్న పురస్కారం ( 2021)లో, డిటెన్ వరల్డ్ ఛానెల్ వారి లాంతర్ * అవార్డు (2020)లో, శ్రీశ్రీ సిరి కల్చరల్ ఫౌండేషన్ ద్వారా *శ్రీ వికారి ఉగాది ప్రతిభా పురస్కారం ( 2019)లో, పివి గారి శతజయంతి కవితాంజలి శుభకృతు ఉగాది పురస్కారం( 2022)లో, ఇంకను పలు ప్రముఖ సంస్థల ద్వారా మరో 15 పురస్కారాలు పొందడం జరిగింది.
కొన్ని సమీక్ష వ్యాసాలు, ప్రసంగాలు ,టీవీ, రేడియో ప్రోగ్రాంలు, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ, మరియు పలు సంస్థలు నిర్వహించిన కవి సమ్మేళనాలలోపాల్గొని కావించిన కవితా పఠనాలు, ఇంకనూ అతిథిగా పాల్గొనడం వంటివి. వివిధ ప్రక్రియల ద్వారా ఎన్నో వేదికలపై సన్మానాలను అందుకున్నాను. సాహితీ సామాజికవేత్త మరియు భారత్ రాజశ్రీ బిరుదులతో సత్కరింపబడడం జరిగింది.
భారత స్వాతంత్ర అమృత్యోత్సవాల సందర్భంగా 20-21 లో విశ్వహిందూ పరిషత్తు గీతా జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన లక్ష యువగళ గీతార్చన కార్యక్రమంలో ఆ పుస్తక సంకలన ఆవిష్కరణ సందర్భంగా అందులోని భవసాగర తరుణం భగవద్గీత చరణం వ్యాసకర్తగా ఉత్తమ వ్యాస రచయిత్రిగా పొందిన పురస్కారం 15- 5- 2002లో..

పద్మజ -మీ కలం నుండి భక్తి ప్రచోదన రచనలు వెలువడిన ఆ సందర్భం ,వాటి విశేషాలు చెప్పండి!

వీణా రెడ్డి నాకలం నుండి వెలువడిన భక్తి ప్రచోదన రచనలకు మూల కారణం బాల్యంలోనే కలిగిన కృష్ణ భక్తి భావనయే పూర్వజన్మల సంస్కారాల కారణంగా జన్మించిన మధుర భక్తి కృష్ణ ప్రేమ ప్రేరణగా పాటించే కృష్ణ చరితలు, కృష్ణ భక్తి కథలు కృష్ణా అంశం గల చలనచిత్రాలు ఎంతో పారవశాన్ని కలిగించేవి అవే రచనలుగా గేయాలుగా రూపొంది ఆ అలౌకిక అనుభూతితో వాణి సందేశాలను ఆలకిస్తూ ఆ దైవీజ్ఞాన సంపత్తిని నిత్య సత్యాలుగా విశ్వ స్వరూపాలుగా ప్రేమ చాగతత్వాలుగా భక్తి ఆధ్యాత్మిక ప్రచోదన రచనలుగా అవి వెలువడుతున్నాయి.

ముగింపు ప్రశ్నలు…రాపిడ్ ఫైర్ ( ఒక్క వాక్యంలో)

పద్మజ- యువ రచయిత్రులకు మీ సందేశం?

వీణారెడ్డి మహిళా సమస్యల కారణంగా యువ రచయితలకన్నా యువ రచయిత్రులే అదనంగా కృషి చేయాలి.

పద్మజ- మీ ఊహలో సమాజం ఎలా ఉండాలి?

వీణారెడ్డి విలువలు గల కుటుంబ జీవనంతో సామాజిక జీవనం శాంతి మయం కావాలని,

పద్మజ మీ రాబోయే రచనలు ఏ అంశాలపై ఉండబోతున్నాయి?

వీణారెడ్డి సమాజంలో కలగబోయే పరిణామాలకు అనుగుణంగా చెడు పర్యవసానాలకు బలికాకుండా మంచి మార్గాలను సూచించే దిక్సూచిలా ఉండాలని…

ధన్యవాదాలు అండి పద్మజ గారు! మీతో పరిచయ కార్యక్రమం నాకు ఎంతో ఆనందదాయకం మయూఖ పత్రికకు నా మన పూర్వక కృతజ్ఞతలు…

రంగరాజుపద్మజ:–

సామాజిక స్పృహ ఉన్న రచయిత్రి అంటే మాటలతో సమాజాన్ని కదిలించే వ్యక్తి. అలాంటి వారి ఇంటర్వ్యూ అంటే కేవలం ప్రశ్నలు కాదు… ఒక ఆలోచనా యాత్ర. నేను అడిగిన ప్రశ్నలు లోతుగా, ఆవేశంగా, ఆత్మీయంగా ఎలా ఐతే ఉన్నాయో…బహుముఖ ప్రజ్ఞాశాలులైన శ్రీమతి వీణారెడ్డిగారు ఆధ్యాత్మిక ప్రశ్నలకు అంతే లోతైన సమాధానాలు; జీవకారుణ్య సందేహాలకు దయాంతరంగులుగా స్పందిస్తూ…సామాజిక బాధ్యత ఉన్న రచయిత్రిగా తన రచనా కాగడాలను చూపి వెలుగులు పంచిన ఈ ముఖాముఖి ఎందరికో స్ఫూర్తిదాయకమని భావిస్తూ..

మీ రంగరాజు పద్మజ.

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరమ ధర్మం

by Rama Devi Nellutla May 31, 2026
written by Rama Devi Nellutla

కాలం నడిచి పోతున్నది
చరిత్ర గడిచి పోతున్నది
సంఘటనలకు సాక్షీభూతంగా నిలవడం తప్ప
ఏమీ చేయలేని కలం నిలిచి పోతున్నది.

భూగోళానికి అవతలి పక్కన బాంబుల పేలుళ్లు
ఆకాశానికి చిల్లులు పొడిచి నల్లని పొగ మేఘాలతో నింపుతుంటే
ఉగాది ప్రభాత వేళ తెరలు తెరలుగా కొండలపై అడవులపై
దిగుతున్న తెలిమంచు తెరలను దర్శించి మది పులకించలేకపోతున్నది

పేగుల మంటను చల్లార్చే రెండు రొట్టె ముక్కల కోసం
స్త్రీలు పిల్లలు లైన్లలో నిలబడి దేబిరిస్తున్న వేళ
పండుగ పూట పాక ప్రావీణ్యం బొబ్బట్ల పిండివంటలు
రుచులు రుచులుగా వండి వడ్డించలేకపోతున్నది

కూలిన గోడల ఇటుక రాళ్ల శిథిలాల నడుమ
కొసప్రాణాలేవైనా కొట్టుమిట్టాడుతున్నాయేమోనని
అయినవాళ్ళ ఆశల లాంతర్లు అగ్గగ్గలాడి వెతుకుతుంటే
గుమ్మానికి మామిడి తోరణం కట్టే చేయి వణుకుతున్నది

కుప్పలు కుప్పలుగా శవాల గుట్టలు
తెల్లని బట్టల్లో చుట్టబెట్టి ఖననం కోసం
ఎదురు చూస్తున్న దృశ్యాలు కళ్ళకు గాయాలు చేస్తుంటే
కొత్త ఉడుపులు తొడుక్కోవడాన్ని మనశ్శరీరాలు తిరస్కరిస్తున్నాయి

గంధకపు గాలి గగన తలమంతా నిండి
దేహాలు కాలి కమిలిన కమరు వాసన ఖండాంతరాలు దాటి వస్తుంటే
వేపపూలతో కలిసిన మల్లెల పరిమళపు గాలిని
నాసిక ఇష్టంగా ఆస్వాదించ వెనుకాడుతున్నది

నిస్సహాయుల కనుల గూళ్ళలో నిద్రను చెదరగొట్టి
పీడకలలు స్థావరం ఏర్పరచుకున్నప్పుడు
సుఖనిద్రకు స్వాగతం పలుకలేక
కనురెప్పలు మూతపడనంటున్నాయి

భూమండలపు నలుదిక్కులా
అహంకారం, అభిజాత్యం అతిశయిస్తున్న వేళ
దురాశ, దురాక్రమణలు విచ్చలవిడిగా నర్తిస్తున్న వేళ
మానవత్వాన్ని మరిచిన వారి మదమణచి
దుశ్చర్యల దుఃఖ కారకుల దునుమాడి
యుద్ధకాంక్షల చెలరేగే పగల సెగలను పరాభవించి
మనిషి మనుగడే అంతిమ ధ్యేయమనీ
ప్రకృతి పరిరక్షణే పరమ ధర్మమనీ
చాటి చెప్పమ్మా నవ వసంతమా!
_**

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

‘నాన్న డైరీ’

by Kattekola Vidyullata May 31, 2026
written by Kattekola Vidyullata

హైదరాబాద్ నగరంలోని ఒక పెద్ద విల్లా. బయట తోటలో రంగురంగుల పూల మొక్కలతో చిన్న తోట అందంగా ఉంది.

 లోపల ఏసీ చల్లదనంలో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ఇంట్లో ఉండే రాఘవరావు గారి వయస్సు డెబ్బై ఐదేళ్లు. ఒకప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్‌లో పెద్ద అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. రెండేళ్ల క్రితం భార్య కాలం చేసింది. వారికి ఒకే ఒక్క కొడుకు అఖిల్. తన జీవితకాలం సంపాదనంతా పెట్టి కొడుకు అఖిల్‌ను అమెరికాలో చదివించారు. ఇప్పుడు అఖిల్ అదే నగరంలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓ. తల్లి చనిపోయాక తండ్రిని తమతో పాటే ఉండేందుకు తన ఇంటికి తీసుకు వచ్చాడు అతను.

రాఘవరావు గారికి ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. తినడానికి పోషకాహారం, వేసుకోవడానికి మందులు, చూసుకోవడానికి ఒక అటెండెంట్. కానీ ఆయనకు లేనిది ఒక్కటే, ఆత్మీయ పలకరింపు.

అఖిల్ తెల్లవారుజామున ఆఫీస్‌కు వెళ్తాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. కోడలు శృతి తన కిట్టీ పార్టీలు, సోషల్ మీడియా లైవ్‌లతో బిజీ. మనవడు సిద్ధూ తన ఐప్యాడ్ లో గేమింగ్ లోకంలో ఉంటాడు. రాఘవరావు గారు ఆ ఇంట్లో ఒక అందమైన పాత కాలపు బొమ్మలా మిగిలిపోయారు. ఎవరూ ఆయనను ఏమీ అనరు, కానీ ఎవరూ ఆయనను పట్టించుకోరు. అది ఒక రకమైన ‘గౌరవప్రదమైన నిర్లక్ష్యం’.

ఒక ఆదివారం ఉదయం. అందరూ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. రాఘవరావు గారు మెల్లగా నడుచుకుంటూ వచ్చి పక్కనే కూర్చున్నారు.

“అఖిల్.. వచ్చే వారం మన ఊర్లో జాతర ఉందిరా. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు నా భుజాల మీద కూర్చుని జాతర అంతా సంబరంగా తిరిగే వాడివి, రంగుల రాట్నం ఎక్కేవాడివి. ఈసారి వెళ్దామా?” అని ఆశగా అడిగారు.

అఖిల్ ఫోన్ చూస్తూనే, “నాన్నా.. ఇప్పుడు జాతరలు, ఊర్లు అంటే ఎలా కుదురుతుంది? నాకు ఇక్కడ క్లయింట్ మీటింగ్స్ ఉన్నాయి. పైగా అక్కడ ఎండలు, దుమ్ము.. మీకు పడవు. ఇప్పుడు అలాంటి ప్రోగ్రాం ఏమీ పెట్టకండి,” అని తేల్చేశాడు.

కోడలు శృతి అందుకుని, “అవును మావయ్య గారూ, పైగా సిద్ధూకి కోచింగ్ క్లాసెస్ ఉన్నాయి. మనం వెళ్లలేం,” అంది. రాఘవరావు గారి కళ్లల్లో మెరిసిన ఆశ ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆయనకు కావాల్సింది జాతర కాదు, ఆ వంకతో తన కొడుకుతో, మనవడితో కలిసి గడిపే నాలుగు రోజులు.

మర్నాడు అఖిల్ తన ముఖ్యమైన బిజినెస్ ఫైల్ ఒకటి ఇంట్లో మర్చిపోయాడు. అది తీసుకోవడానికి మధ్యాహ్నం అనుకోకుండా ఇంటికి వచ్చాడు. లోపలికి వెళ్తుండగా హాల్‌లో సంఘటన చూసి ఆగిపోయాడు.

అక్కడ సోఫాలో రాఘవరావు గారు కూర్చుని ఉన్నారు. ఆయన ముందు మనవడు సిద్ధూ ఐప్యాడ్‌లో ఏదో చేస్తున్నాడు.

రాఘవరావు గారు సిద్ధూని అడిగారు, “సిద్ధూ.. నీకు ఒక కథ చెప్పనా? నేను చిన్నప్పుడు అడవిలో దారి తప్పి ఎలా బయటపడ్డానో తెలుసా?”

సిద్ధూ విసుగ్గా, “తాతయ్యా.. ప్లీజ్, నేను లెవెల్-10 లో ఉన్నాను. మీ పాత కథలు ఇప్పుడు వద్దు,” అని హెడ్‌ఫోన్స్ పెట్టేసుకున్నాడు. ఆ సమయంలో రాఘవరావు గారి ముఖంలో కనిపించిన వేదన, ఒంటరితనం అఖిల్‌ను ఉలిక్కిపడేలా చేశాయి.

రాఘవరావు గారి మౌనం, సిద్ధూ నిర్లక్ష్యం చూసిన అఖిల్ మనసులో ఏదో అలజడి మొదలైంది. కానీ ఆ అలజడి ఒక తుఫానుగా మారడానికి ఆ రోజు రాత్రి జరిగిన ఒక సంఘటన కారణమైంది.

ఆ విల్లాలో రాఘవరావు గారికి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక ప్రత్యేకమైన గది ఉంది. అఖిల్, శృతి మొదటి అంతస్తులో ఉంటారు. సిద్ధూ గది కూడా పైనే ఉంటుంది. రాఘవరావు గారికి మోకాళ్ల నొప్పుల వల్ల మెట్లు ఎక్కడం కష్టం, అందుకే ఆయన కింద గదిలోనే ఉంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండేది కేవలం భోజనాల సమయంలో మాత్రమే. మిగతా సమయమంతా ఆ ఇల్లు మూడు విడివిడి ప్రపంచాలుగా విడిపోయింది.

ఆ రాత్రి రెండు గంటలు అవుతోంది. రాఘవరావు గారికి హఠాత్తుగా ఊపిరి ఆడనట్లు అనిపించి, విపరీతమైన దగ్గు మొదలైంది. గదిలో నీళ్లు అయిపోయాయి. పక్కనే ఉన్న కాలింగ్ బెల్ కొట్టారు, కానీ కేర్ టేకర్ మంచి నిద్రలో ఉండటంతో ఎవరూ పలకలేదు. నీళ్ల కోసం ఆయన నెమ్మదిగా గోడలు పట్టుకుంటూ హాల్లోకి వచ్చారు. కిచెన్ వైపు వెళ్లే ఓపిక లేక, హాల్లో ఉన్న సోఫాలో ఆయాసపడుతూ కూలబడ్డారు.

సరిగ్గా అదే సమయంలో, సిద్ధూ ఆన్‌లైన్ గేమింగ్ ఆడుతూ, ఆకలి వేయడంతో ఏదైనా తిందామని కిందకు వచ్చాడు. చీకటిగా ఉన్న హాల్లో తాతయ్య సోఫాలో కూర్చుని ఆయాసపడుతూ దగ్గడం చూశాడు.

సిద్ధూ తన చేతిలోని ఫోన్‌ను చూసుకుంటూ విసుగ్గా, “తాతయ్యా! మీరు ఇక్కడ కూర్చుని ఇలా దగ్గితే పైన మాకు నిద్ర ఎలా పడుతుంది? లోపలికి వెళ్లి పడుకోవచ్చు కదా! ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుంటే మీ సౌండ్ వల్ల కాన్సంట్రేషన్ పోతోంది,” అని కసిరి కొట్టాడు. ఆ చిన్న పిల్లాడి మాటల్లో కనికరం లేదు, కేవలం తన ఆటకి అడ్డంకి కలిగారన్న కోపం మాత్రమే ఉంది.

అదే సమయంలో మంచి నీళ్ల కోసం కిందకు వస్తున్న అఖిల్, మెట్ల మీద ఆగిపోయాడు. తన కొడుకు సిద్ధూ, తాతయ్య పట్ల చూపిస్తున్న ఆ నిర్లక్ష్యం అఖిల్ గుండెను ముక్కలు చేసింది. సిద్ధూ వెళ్ళిపోయాక, అఖిల్ నెమ్మదిగా తండ్రి దగ్గరకు వచ్చాడు.

రాఘవరావు గారు నీరసంగా తల పైకెత్తి, “క్షమించురా అఖిల్.. దగ్గు ఆపుకోలేకపోయాను. సిద్ధూ నిద్ర పాడైందట.. ఇప్పుడే వెళ్ళిపోతాను,” అంటూ వణుకుతున్న చేతులతో లేవడానికి ప్రయత్నించారు.

అఖిల్ ఒక్కసారిగా తన తండ్రిని పట్టుకుని సోఫాలోనే కూర్చోబెట్టాడు. తండ్రి కాళ్ల దగ్గర కింద కూర్చుని, ఆయన చేతులను తన కళ్లకి అద్దుకున్నాడు. “నాన్నా.. సిద్ధూ నిద్ర పాడవటం కాదు, నా నిద్ర ఇప్పుడే మెలకువలోకి వచ్చింది. ఒక తండ్రికి కొడుకు నీళ్లు ఇవ్వాల్సిన సమయంలో, ఒక మనవడు విసుక్కుంటున్నాడంటే.. దానికి కారణం వాడు కాదు, నేను. వాడికి నేను నేర్పిన సంస్కారం అదే,” అంటూ కుమిలిపోయాడు.

అఖిల్ తన తండ్రిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాక, ఆ గదిలో ఉన్న టేబుల్‌పై ఒక పాత డైరీ కనిపించింది. అది రాఘవరావు గారి వ్యక్తిగత డైరీ.

కుతూహలంతో అఖిల్ దాన్ని తెరిచాడు. అందులో తేదీల వారీగా రాసిన విషయాలు అఖిల్‌ను కదిలించాయి.

జూన్ 15, 1998: “ఈరోజు అఖిల్ కాలేజీ డే. తనకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది. నేను తప్పకుండా రావాలని వాడు కోరుకుంటున్నాడు. నేనేమో కలెక్టర్ గారితో పాటు ఫీల్డ్ ట్రిప్ వెళ్ళాలి. ఇప్పుడు రాలేనంటే ఆయన ఏమంటారో తెలీదు. కానీ ఎలాగైనా నేను నా కొడుకు కాలేజీ ప్రోగ్రాం కి వెళ్ళాలి. వాడు బాగా చదువుకుని గొప్ప ప్రయోజకుడు కావడమే నాకు ముఖ్యం.”

సెప్టెంబర్ 10, 2005: “అఖిల్ అమెరికా వెళ్తున్నాడు. విమానం ఎక్కుతున్నప్పుడు వాడు వెనక్కి తిరిగి చూడలేదు. వాడు తన లక్ష్యం వైపు చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది, కానీ నా కళ్లలో నీళ్లు ఆగలేదు. వాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో?”

చివరి పేజీలో, అంటే వారం క్రితం రాసిన ఒక వాక్యం అఖిల్ గుండెను పిండేసింది:

“ఇప్పుడు అఖిల్ కోరుకున్నవన్నీ సాధించాడు. ఈ ఇల్లు, ఈ కారు, ఈ హోదా.. ఇవన్నీ చూస్తుంటే ముచ్చటగా ఉంది. కానీ ఇన్ని ఉన్న ఈ ఇంట్లో నా కోసం ఒక ‘పలకరింపు’ కరువైంది. అఖిల్ చాలా బిజీగా ఉంటున్నాడు. నేను వాడికి భారమవ్వకూడదు. నా శ్వాస ఆగిపోయేదాకా వాడికి ఏ ఇబ్బంది కలగకూడదు.”

డైరీ చదువుతున్న అఖిల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాడు. తను చిన్నప్పుడు అడిగిన ప్రతి చిన్న ప్రశ్నకూ తండ్రి ఎంత ఓపిగ్గా సమాధానం చెప్పేవారో.. తను రాత్రి పడుకోకపోతే భుజాన వేసుకుని ఇల్లంతా తిప్పిన తండ్రి, తన చదువు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఖర్చు చేయడం… అన్నీ కళ్లముందు కదిలాయి.

అఖిల్ ఆ రాత్రి పడుకోలేకపోయాడు. తను సంపాదిస్తున్న లక్షలు, కొంటున్న కార్లు తన తండ్రి ముఖంలో ఒక్క చిరునవ్వును కూడా తీసుకురాలేకపోతున్నాయని గ్రహించాడు. మర్నాడు ఉదయం అఖిల్ ఆఫీస్‌కు వెళ్లలేదు. హాల్లో కూర్చుని ఉన్న తండ్రి దగ్గరకు వెళ్లి, ఆయన కాళ్ల దగ్గర కింద కూర్చున్నాడు.

“ఏమైందిరా అఖిల్? ఒంట్లో బాలేదా?” అని రాఘవరావు గారు కంగారుగా అడిగారు.

“లేదు నాన్నా.. నా మనసు బాలేదు. ఇన్నాళ్లు నేను మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చాను అనుకున్నాను కానీ, నా సమయాన్ని ఇవ్వడం మర్చిపోయాను. క్షమించండి నాన్నా,” అని అఖిల్ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

రాఘవరావు గారి కళ్లు చెమ్మగిల్లాయి. “నువ్వు పక్కన కూర్చుని ఒక్క మాట మాట్లాడితే చాలురా.. నాకు అంతకంటే స్వర్గం ఇంకేముంటుంది?” అన్నారు.

అఖిల్ తండ్రి చేతులు పట్టుకుని ఏడుస్తూ, “నాన్నా.. నేను ఐటీ కంపెనీకి సీఈఓని కావచ్చు, కానీ కొడుకుగా ఫెయిల్ అయ్యాను. మీరు నా ఎదుగుదల కోసం మీ కాలాన్ని, మీ సర్వస్వాన్నీ వెచ్చించారు. నేనేమో నా హోదా కోసం మీ మనసును చంపేశాను. నన్ను క్షమించండి నాన్నా,” అని బోరున విలపించాడు.

ఆ క్షణం ఆ ఇంట్లోని ఏసీ చల్లదనం కంటే, ఒక తండ్రి హృదయం లోని వెచ్చదనం గొప్పదని అఖిల్ తెలుసుకున్నాడు.

అఖిల్ కి ఆ క్షణమే అర్థమైంది, మనం ఎదిగే క్రమంలో మన తల్లిదండ్రులు మన కోసం చేసిన త్యాగాలు ‘స్టాక్ మార్కెట్’ లెక్కల వంటివి కావు. అవి వెలకట్టలేని ప్రేమాక్షరాలు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కంటే, మన తల్లిదండ్రులను మనం గౌరవించే విధానమే గొప్ప సంస్కారం. ఎందుకంటే, మనం మన తల్లిదండ్రుల పట్ల చూపే ప్రవర్తనే, మన పిల్లలు మన పట్ల చూపే భవిష్యత్తు ప్రవర్తనకు పునాది.

నేటి సమాజంలో వృద్ధాశ్రమాలు పెరగడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు కాదు, ‘భావోద్వేగాల కొరత’. తల్లిదండ్రులకు మనం ఇచ్చే ఖరీదైన గదులు, ఏసీలు వాళ్లకు ఆనందాన్ని ఇవ్వవు. వాళ్లకి కావాల్సింది మన పలకరింపు, మన సమయం, వాళ్లు మనకు ‘భారం కాదు.. బాధ్యత’ అనే నమ్మకం. మనం పెరిగి పెద్దయ్యాక మన రెక్కలు బలపడవచ్చు, కానీ ఆ రెక్కలు రావడానికి కారణమైన ‘గూడు’ తల్లిదండ్రులే అని మర్చిపోకూడదు.

మరుసటి రోజు నుండి అఖిల్ జీవితం మారిపోయింది. అతను సిద్ధూని తన దగ్గరకు పిలిచి, “సిద్ధూ.. మనం ఇవాళ తాతయ్యతో ఊరికి వెళ్తున్నాం. నీ కోచింగ్ క్లాసులు మళ్ళీ చూసుకోవచ్చు. కానీ తాతయ్య జ్ఞాపకాలు మనకు మళ్ళీ రావు,” అని చెప్పాడు.

ఆ ప్రయాణంలో సిద్ధూకు తాతయ్య తన చిన్ననాటి కథలు చెబుతుంటే, అఖిల్ కారు అద్దం నుండి ఆ ఇద్దరినీ చూసి సంతృప్తిగా నవ్వుకున్నాడు.

May 31, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అనుబంధాల్లో మేనత్త పాత్ర

by Swayam Prabha May 31, 2026
written by Swayam Prabha

మన కుటుంబాల్లో అనుబంధం, ఆత్మీయతలకు ఎక్కువ ప్రాధాన్యత వుండేది. ఒక్కొక్క వరుసకు ఒక్కొక్క పేరు. అది ఆంగ్ల భాషలో ఇతర భాషల్లో అంత ఎక్కువగా కనిపించదనిపిస్తుంది. మేనత్త, మేనమామ, చిన్నాయన, చిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దనాయన ఈ విధంగా ఉండేవి వరుసలు. వీరితో అనుబంధంలో ప్రత్యేకత సంతరించుకొనేది. అలాంటిదే మేనత్త అనుబంధం.

పిల్లలకు అత్త అంటే ఎనలేని ప్రేమ. ఎందుకంటే ఆడిస్తుంది, పాడిస్తుంది, తినిపిస్తుంది, నిద్ర పుచ్చుతుంది. “అత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మ, ఆదమరచి హాయిగా నిదురపోమా” సినీ కవి వ్రాసినది నిజమనిపిస్తుంది. ‘పద్దత్త, సరత్త, బుౙత్త, ఇలా పిల్లలు పెద్దయ్యాక కూడ పిలవటం చూస్తుంటాం. వాళ్లు పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వెళ్తుంటే ఆ పిల్లల బాధ వర్ణనాతీతం. “నీవు వెళ్ళొద్దని” ఎంతో ఏడ్చేవాళ్లు. ఆ పెళ్ళికొడుకును విలన్ లాగా చూసేవాళ్లు.

మేనత్త ఊరికి వెళ్లటం పిల్లలకు ఎంతో ఇష్టం, అక్కడ ఆడిందే ఆట. పాడిందే పాట. కేకలేసే అమ్మా నాన్న అక్కడ ఉండరుగా! అందుకే అంత ఇష్టం. అత్త పిల్లలతో వస్తుందంటే ఎంత సంతోషమో! కలిసి ఆడుకోవచ్చని. వాళ్లు తిరిగి వెళ్తుంటే ఎంతో బాధ కలిగేది ఆ చిన్ని హృదయాలకు. అత్త ఊరికి వెళ్ళేటప్పుడు ఇఇచ్చే పావలా ఎంతో ఆనందాన్ని ఇచ్ౘ్ే విషయం. “కలవారి కోడలు కలికి కామాక్షి, కలికి చిలుకల కొలికి మాకు మేనత్త” అని పాడుకునేవారు పిల్లలు.

మేనత్తలు చేసే త్యాగాలు కూడా కోకొల్లలు. అన్న భార్య, తమ్ముడి భార్య చనిపోతే చేరదీసి పిల్లలను పోషించి పెద్ద చేసేది ఆమెనే. ఒక మేనత్త తనకు ఇద్దరు పిల్లలున్నా “భర్త నన్ను రెండో పెళ్ళి చేసుకోనిస్తేనే నేను నీ మేనల్లుణ్ణి చేరదీస్తానంటే” భర్త పెట్టిన కండీషన్ కు ఒప్పుకున్న అమాయకురాలు. (ఆ రోజుల్లో సంతానమే సౌభాగ్యంగా భావించేవారు)

మరో మహిళ ఉదంతం – పూర్వకాలంలో మగవాళ్ళకు పెళ్ళి అవటం చాలా కష్టంగా ఉండేది. కర్ణాటకలో కొంచెం పేదిరకంతో ఆడపిల్లలను అమ్ముకునేవారు. ఆ విధంగా ఎంతోమంది చిన్నపిల్లలను కొనుక్కొని తెచ్చుకుని పెళ్ళి చేసుకునేవారు. వాళ్ళ మాటతీరు ఒక రకంగా ఉండేది. కందిపప్పును కందిబేళ్ళని, పుళిహోగ్రి అని, బేగి అని అవి వింటుంటే తమాషాగా ఉండేది. ‘కృష్ణుఇ బేగనే బారో, యన మన తన లీల తోరో” అని పేరంటాలలో ఆమె పాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది. కన్నడీగులు కదా తెల్లగా ఉండేది. ఎన్నో ఏళ్ళు గడిచాక ఆమె మేనల్లుడు “అత్తారింటికి దారేది” అని వెతుక్కుంటూ వచ్చి ఊళ్ళో వాళ్లందరికి ఆశ్చర్యం కలిగించాడు. మొదట ఆ భార్యాభర్తలు నమ్మక ఎన్నో ప్రశ్నలు వేసి మేనల్లుడని మొత్తం మీద నిర్ధారించుకున్నాక ఆమె ఆనందానికి అవధులు లేవు. తన పెళ్ళికి రావాలని పట్టుపట్టి పిల్చుకుని వెళ్ళాడు. ఈ ముసలాయనకు ఒకటే భయం. వస్తుందో రాదోనని. తనూ వెళ్ళాడు. ఇద్దరికి బట్టలు పెట్టి వాళ్ళ కన్నడీగుల లాంఛనాలతో మేనత్తను పంపించారు. వచ్చే అప్పుడు మేనల్లుని పెళ్ళి ఫోటో తెచ్చుకొని గోడకు తగిలించుకుని రోజు చూసుకొని ఎంతో మురిసిపోయేది. ఇంటికి వచ్చిన వాళ్ళందరికి చూపించేది. ఆ తరువాత అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళి వచ్ౘ్ేది. . వచ్చే అప్పుడు మైసూరు సాండిల్ సబ్బులు, ఘుమఘుమలాడే కాఫీ పొడి తెచ్చుకునేది.

మేనత్తంటే పైతరం ఆడపడుచు. ‘నేనెవరనుకున్నావు. మొండి చుట్టం మొగుడి మేనత్తనని” పెత్తనం చెలాయించేది. అన్నకు, తమ్ముండ్లకు అండగా వుంటూ సలహాలనిచ్ౘ్ే మంచి మనిషి.

పిల్లలు పలికే తొలి మాట ‘అత్త అత్త’ అని. పిల్లలను తొట్లెలో వేసి కుడి చెవిలో పేరు చెప్పి ఈపులు చరిపించుకునేది కూడా మేనత్తే. అనుబంధాల్లో మేనత్త పాత్ర ఎంత గొప్పదో కదా!

May 31, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us