మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఉరుకురుకి వస్తుంది ఉగాది పండగ!

by Akkinepalli Venugopal Rao March 20, 2026
written by Akkinepalli Venugopal Rao

ఉరకలువేసే ఉప్పెనలాగా ఉగాదివస్తుందుత్సాహంగా

గడపగడపలో మంగళకరమౌ మామిడాకులు పూలమాలలతొ
వత్సరానికే మొదటి పర్వమై
సత్సంపదలతొ చాల కాన్కలతొ !ఉరకలు ।

కొత్తబట్టలు కుట్టించుకుని
చెత్తభావాలు నట్టే ట కలిపి
ఆరు రుచులిచ్చు పచ్చడి తోడ
అంతులేని ఆనందాలివ్వగ !ఉరకలు !

మూఢనమ్మకం మూలన వేస్తూ
చీడపీడలను ఛేదన చేస్తూ
ఐకమత్యమే మన నినాదమై
లోకహితాలే ఘన నివాళులై
మంచి విద్యలే మనలక్ష్యాలని
మన సంస్కృతులే మహి విజయాలని !ఉరకలు!

పరాభవలోన ప్రపంచ మందున
అరాచకాలే అసలు వద్దనుచు
దురహంకారము దూరమవ్వగా
నరసంహారము నాపగోరెడు
మేధావులను మేల్కొన జేయుచు
సుధా లహరులను వసుధన నింపుచు!! !ఉరకలు !

March 20, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

మౌనలోకం

by Dr. Varigonda Satya Surekha March 20, 2026
written by Dr. Varigonda Satya Surekha

 సుహృత్ కన్నా సుచరిత ప్రవర్తన ఎక్కువ బాధని కలిగిస్తోంది. వాస్తవం అంగీకరించడానికి తన మనసు ఎందుకు సిద్దం కావట్లేదో అర్థంకాదు. ఇవాళ  మళ్ళీ స్కూల్ కి వెళ్ళింది. అక్కడేం జరుగుతుందో తెలిసిందే. ఇంటికొచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది. రెండు రోజులవరకు మాములు మనిషి కాదు. నిద్రాహారాలు ఉండవు. తన వైఖరి సుహృత్ కి ఎంత చేటు చేస్తుందో గ్రహించదు.
ఊరికి వెళ్ళక రెండు  సoవత్సారాలు అయింది. అమ్మ నాన్న ముఖ్యంగా నాన్నమ్మ ఎలా ఉందో. చిన్నప్పటి నుండి పనికైనా పరిష్కారానికైన తను చేరేది నాన్నమ్మ ఒడికే. అటువంటిది ఇప్పుడు తన జీవితంలో ఇంత పెద్ద తూఫాను చెలరేగింది. నాన్నమ్మ దగ్గర ఎపుడు ఏది దాచని తాను ఇవాళ సుచరిత వల్ల సుహృత్ విషయం దాచాల్సి వస్తోంది. “నాన్నమ్మ నాకు మార్గం చూపవు.” మనసులోనే అర్థించాను.
                                      *
“నాన్నమ్మ నువ్వు నిజంగా వచ్చావా?” ఆనందo ఉక్కిరిబిక్కిరి చేయగా ఆటో దిగిన నాన్నమ్మని వాటేసుకున్నాను.
“బడుద్దాయి! వదలరా , ముందు ఆటో అబ్బాయ్ కి డబ్బులు ఇచ్చి పంపు.” ప్రేమపూర్వకమైన నవ్వుతో ఇంట్లోకి దారితీసింది. సామానుతో ఆ వెనుకే ఆవిడని అనుసరించాను.
అవ్వడానికి డెబ్బై ఏళ్ళ వృద్ధురాలుఅయినా పడుచు వారికి ధీటుగా ఇప్పటికి ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంది. ఒక్కసారి చూసిందో , ఇక అంతే , జన్మలో మర్చిపోదు. అందుకే ఆవిడ ఇక్కడికి వచ్చిమూడేళ్ళు పైన అయినా “ఎలా రాగలిగావు” అన్న ప్రశ్న వేయలేదు.
మంచి నీళ్ళు అందిస్తూ అడిగా “ కాఫీ పెట్టనా? తాగి స్నానం చేస్తావా” .
“అదేంటి నువ్వు పెట్టడం .సుచరిత ఏది”
“సుహృత్ స్కూల్ కి వెళ్ళిందిలే” చెప్పి కాఫీ పెట్టడానికి వంటిట్లోకి వెళ్ళా.
                       “ఏరా ఇంత విషయం ఉంటే మాకెవరికి చెప్పావు కాదే” “సుచరిత ఇష్టపడలేదు నాన్నమ్మ. అందరు పిల్లాడిని గేలి చేస్తారేమోనని భయపడింది. అలాగే మీ నుండి ఏమ్మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని కూడా కొంత భయపడింది. అందుకే రెండేళ్ళ బట్టి రావడానికి ఒప్పుకోలేదు..” సంజాయిషీ ఇచ్చాను. “అందులో తన తప్పేమీ లేదు లేరా. నూటికి నూరుపాళ్ళు ఏ తల్లి అయినా అలాంటి పరిస్థితుల్లో అలాగే చేస్తుంది.” మనుషులని మనసులని అర్థం చేసుకోవడం లో నాన్నమ్మ తర్వాతే ఎవరైనా అనిపించింది.                    
సుహృత్ కి Intellectual disability ( ఇంటెలెక్చువల్ డిసబిలిటి)ఉందన్న విషయం  వాడికి ఐదేళ్ళు వచ్చేవరకు మాకు అర్థం కాలేదు. వాడు పాకడం , నడక , మాటలు అన్నీ ఆలస్యమే. తరగతి గదిలో ఓ చోట కుదురుగా కూర్చోలేకపోవడo, టీచర్ చెప్తోంది అర్థం చేసుకోలేకపోవడo, మిగిలిన పిల్లల మాదిరిగా కాక విషయాలని మర్చిపోతూ ఉండడం, పుస్తకంలో అక్షరాలని కుదురుగా కాక విసిరేసినట్లుగా రాయడం , ఏదైనా చెప్పడంలో , మాట్లాడటంలో పదే పదే తడబడ్డం…… వేటేనీ కూడా Intellectual disability (ఇంటెలెక్చువల్ డిసబిలిటి ) లక్షణాలుగా గుర్తిచడంలో విఫలం అయ్యాం.
“మీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వేరే పిల్లల లంచ్ బాక్స్ల్లో వారు తింటుండగా తీసుకుని తింటున్నాడు. కోప్పడ్డా ప్రయోజనం లేదు. కొడితే భయపడాలన్న విషయం కూడా తెలియట్లేదు. ఒకసారి డాక్టర్ ని కలవండి…..” అని వాడి క్లాస్ టీచర్ చెప్పేవరకు , మా పిల్లాడి ప్రవర్తన మిగిలిన పిల్లలకి భిన్నంగా ఉంటోందన్న విషయం అర్థం కాలేదు.
అర్థమయినా సుచరిత అంగీకరించడానికి సిద్దపడలేదు. టీచర్ల సాకులంది. స్కూల్ మార్చాలంది. మార్చిన స్కూల్లోనూ అవే కంప్లైంట్స్ . ఇంక లాభం లేదనుకొని సుచరిత ని బలవంతం గా ఒప్పించి సుహృత్ ని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళా.
ఏ విషయం అయితే సుచరిత మనసు స్వీకరిoచట్లేదో అదే సుహృత్ జీవితo యొక్క కఠ‌‍‌‍న వాస్తవమైంది. ఆ క్షణాన ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కంపించినట్లైంది. తండ్రిగా నా పరిస్థితే దుర్భరం . ఇక తల్లిగా సుచరిత……. అర్థం చేసుకోగలిగాను. ఓపిక పట్టాను. మెల్లిగా తనకి తాను సర్దుకుంటుందని , వాస్తవాన్ని జీర్నిoచుకుంటుందని ఆశిoచాను. కాని అలా జరగట్లేదు.
లోకమంతటినీ తప్పు పడుతోంది కాని తన బిద్దలోని లోపాన్ని మాత్రం ఒప్పుకోదు. ఎవరైనా పిల్లాడి గురించి సలహానో సానుభూతో ప్రకటిస్తే వారితో ఎదురు దాడికి దిగుతుంది. రాను రాను వైద్యం వారిద్దరిలో ఎవరికి ఎక్కువ అవసరమో తనకి అర్థం కావట్లేదు. డాక్టర్ , ఇలాంటి పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిద్దరూ శిక్షణ పొందాలి అంటారు. ముఖ్యం గా తల్లి .
వాడితో ఓపిగ్గానే ఉంటుంది. వాడిని కొట్టడం కాదుకదా కనీసం విసుక్కోగా కూడా తనెప్పుడూ చూడలేదు.విరాం లేకుండా వాడి వెంటే తిరుగుతూ, వాడి ప్రతీ చర్యను సర్దుకుంటూ , సమర్థించుకుంటూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా బిడ్డకి బుద్దిమాoధ్యత ఉంది అని ఒప్పుకోదు. చర్చ కి తావులేదు. “మీ బిడ్డని మీరే వెర్రివాడని అనుకుంటున్నారా ….” అని ఆవేదన చెందుతుంది. తన దుఖాన్ని చూసి మౌనం వహించడం మినహా చేయగలిగింది లేదు.
                     
***
“ ఏంటి! నాన్నమ్మ సుహృత్ ని ఆడిస్తున్నావా…”  వెనక వైపు  వసారా లో నాన్నమ్మ సుహృత్ లని అలా చూస్తుంటే తనకి తన బాల్యం గుర్తోచ్చిoది.  
“సుహృత్ ! తాతమ్మ ని ఆట పట్టిస్తున్నావా …” అంటూ నా వెనుకే వచ్చిన సుచరిత వెళ్ళి వాళ్ళిద్దరి ప్రక్కగా కూర్చుంది. ఆ ముగ్ద చిత్రంలో నా స్థానానికై నేనూ వెళ్ళి కూర్చున్నాను.
నాన్నమ్మ మమ్మల్ని చూసి చిరునవ్వు తో “ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి “ అని “అక్కడెక్కడో బౌద్ధ గురువట, యేవో పరీక్షలు జరిపి ప్రపంచంలోనే అందరికన్నా సంతోషవంతుడు అని తేల్చారట. వారి పరిశీలనలు ఏమోగాని , నాకు తెలిసి ఆయన సంతోషం గా ఉండటానికి కారణం తనదైన ప్రపంచంలో హాయిగా ఆనందంగా  జీవించడం , రాగద్వేషాలు కలిగి ఉండకపోవడం, ప్రకృతిని ప్రేమించడం, వస్తువులకి విలువ్వివక పోవడం, ముఖ్యంగా ఎవరితోటి దేన్నీ పోల్చుకోకపోవడం… అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మీరు గొప్పవారిగా  ఒప్పికుంటారా?” నాన్నమ్మ ప్రశ్న కి సమాధానంగా ఇద్దరం తలూపాం.
“మరి మీ బిడ్డ ఎదుగుదల పట్ల ఎందుకు అనుమానపడుతున్నారు.” నానమ్మ తర్కం అర్థంకాలేదు. నాన్నమ్మే మళ్ళీ “నా  మనవడు ఎండగా ఉన్నప్పుడు వాన కావాలి అంటాడు.  కుదిరిన ప్రతిమబ్బు కురవలంటాడు. అలా జరగనందుకు నిరుత్సాహ పడతాడు . ఒక్కోసారి విసుగు చెందుతాడు.  ఆ ఆలోచనలో నీకు లోపం కనిపిస్తే నీ భార్యకి అది ఆందోళని కలిగిస్తుంది. అసలు ప్రకృతే గమనించడం మానివేసిన మీలాంటి వారికి అదో మానసిక రుగ్మత లా కనిపిస్తుంది.”
నాన్నమ్మ మాట్లాడుతోంది. నాకు అర్థమై కానట్లుగా ఉంది. కాని ఎక్కడో ఏదో నా ఆలోచనల్లోనే లోపం ఉందని అర్థమైంది. వికాసమైన వికలత అయినా మనిషి ఆలోచనల్లోనే ఉందని అర్థమైంది. వాడి గురించి నేనలా ఆలోచించడం నా మనో వైకల్యoలా ఇపుడు అనిపిస్తోంది.
“మనిషి ఎదిగేకొద్దీ  వాడిలోని పసిమనసు కనుమరుగవుతుంది. మేధ పెరగడమే దానిక్కారణం అనుకుంటారు మీలాంటి మేథోవంతులు కాని అసలు సిసలు మేథ జిజ్ఞాసని ఎల్లప్పుడు జీవింపచేసి ఉంచటమే. ఆ మేధ వాడిలో ఉంది. మీ అజ్ఞానo వాడి మేధని అడ్డుకుంటోందని ఏనాడైనా ఆలోచించారా..?” సూటిగా ప్రశ్నించింది నాన్నమ్మ.
“నిజమే! అమ్మమ్మగారు. నలుగురిలోనూ ఆఖరికి నా భర్త సమక్షంలో కూడా నేనేనాడు నా బిడ్డకి మనో వైకల్యత ఉందని ఒప్పుకోలేదు. కాని నాకేతెలియకుండా నా అంతరంగాలలో ఎక్కడో ఎప్పుడో అదే అభిప్రాయం స్థిరపడినట్లుంది. అందువల్ల నిత్యం నేను , నాతో ఇతరులతో కూడా ఘర్షణ పడుతూ ఉండేదాన్ని. మీరు స్థిరంగా నా బిడ్డ ఆరోగ్యవంతుడు అని చెప్తున్నారు.  నా మనస్సు , వాక్కు , చేత దేనికి పొంతన లేని కారణాన నా బిడ్డ జ్ఞానాన్ని జిజ్ఞాసని గుర్తించలేకపోయాను. సంఘంలో నా బిడ్డ స్థానం గురించిన ఆందోళనే తప్ప నా ఈ రకమైన ప్రవర్తన వాడి ఎదుగుదలకి అవరోధం అవుతోందని తెలుసుకోలేకపోయాను. ఇతరులకి భిన్నంగా ఉండడo ప్రత్యకమే తప్ప పొరపాటు కాదు అని ఆలోచించలేకపోయాను.” కళ్ళు వర్షిస్తుండగా మనసు విప్పి మాట్లాడుతోంది సుచరిత.
ఇన్నాళ్ళూ సుచరిత లో తప్పులు వెదకడమే తానూ చేసాడు  తప్ప తన ఆలోచనల్లో దాగి ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సుహృత్ కూడా ఆ బౌద్ధ గురువులాగే రాగద్వేషాలు లేనివాడు. దేనితోనూ ఏది పోల్చనివాడు. ప్రకృతి ని ప్రేమించేవాడు. అమ్మ అంటే విపరీతమైన అనురాగం, నిష్కల్మషమైన చిరునవ్వుతో అందరిని పలకరించే వాడి అమాయకత్వం… ఆలోచిస్తుంటే తెలుస్తోంది వాడి వ్యక్తిత్వపు పరిమళం.
నాన్నమ్మ పాదాలనoటి చెప్పాను “ఇంకెప్పుడు ఎవరితోనూ పోల్చను. వాడి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. వాడి మేధ ఎందులో ఉందో వెలికితీస్తాను.”
“ఈయన తిప్పని psychriyatist లేరు. కాని మీలా అర్థం చేయించిన వారెవరూ లేరు. చాలా థాంక్స్ అమ్మమ్మగారు…” ఆనందాశ్రువులు రాలుతుండగా రెండు చేతులూ జోడిచింది సుచరిత. మునుపెన్నడూ లేని సంతోషం సంతృప్తి కనిపించాయ్ ఆ కళ్ళల్లో.
“చాల్లెండర్రా ! మీరు మీ పొగడ్తలూ. వీడు నా మనవడు. వాడు నా మునిమనవాడు. నా కుటుంబంలోని పిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుస్తుంది కాని మీరు చెప్పే ఆ నాలుగు మాటలు వినే ఆ డాక్టర్ కి ఏం తెలుస్తుంది. యెంత తెలుస్తుంది. సరే!ఇంక మమ్మల్ని విసిగించక వెళ్లండి. మేమిద్దరం ఆడుకోవాలి….” అని నవ్వుతూ నా జీవితంలోని ఉప్పెనని ప్రశాంత నదీ ప్రవహంలా మార్చిన నాన్నమ్మ ఋణo ఏమిచ్చి తీర్చుకోగలను….. 

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరాభవకు స్వాగత ప్రణతులు

by Akkinepalli Venugopal Rao March 20, 2026
written by Akkinepalli Venugopal Rao

1.ఉత్పల మాల:
స్వాగతమో పరాభవ దివాకర తేజుడ వౌచు రమ్మికన్
మాగత మంత మార్చుచును మంచిని పెంచుచు వాంఛితమ్ములన్
వేగమె తీర్చుమయ్య మది వీణలు మీటుచు నాట్యమాడ,నీ
వేగతి దేశ శాంతి నిలబెట్టి ఉషస్సుల నందజేయాగా !!

2.ఆటవెలది:(ఉగాది గూర్చి)
ఆరు రుచులు గల్గి యారోగ్య మొసగేటి
పచ్చ డార గించు పర్వ దినము
కొత్త ధాన్య మొచ్చు కోర్కెల దీర్చుచు
మొదటి పండు విదియు ముదము గూర్చు !!

3.శార్దూలం:(పరాభవ గూర్చి)

నీపేరున్ వినభీతిగల్గును సదా నిక్కంబిదీ వత్సరా
మాపన్ జూడుము మాదు భావనలలో మాలిన్యముల్ నీవికన్
కాపాడుమ్మిక మమ్ములన్ కరుణతో కన్నెర్ర జేబోకుమా
ఆపన్ జూడుమ ఆగడమ్ములభువిన్ అన్యోన్యతన్ బెంచుమా !!

4.చంపక మాల:(ప్రణతులు)
అమెరికలోప్రవాసులకు నాపద లేవియు రాని రీతిగా
సమతయు శాంతి సౌఖ్యములసారధిగా నడిపించు వాడవై
భ్రమలను త్రుంచివేయుచును భారత బిడ్డల కీర్తి బెంచుచున్
తమ తమ కొల్వులందునను ధన్యత గూర్చు మయా పరాభవా !!

5.ఆటవెలది:
తెలుగు సంఘములకు తేజమ్ము పెంచుచు
వెలుగునింపు మింక వేగిరముగ
మాతృ భాష మీద మమకారమున్ పంచు
దేశ సేవ పట్ల దీక్ష పెంచు !!

4,5 పద్యములు NRI లకు మరియు US లోని తెలుగుసంఘాలకు అంకితం

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరాభవ నామ సంవత్సరం

by Kesharaju Venkata Prabhakar rao March 20, 2026
written by Kesharaju Venkata Prabhakar rao

స్వీయ రచన

పరాభవ నామ సంవత్సరం
ప్రభవించిన ప్రభాత కిరణం
ప్రపంచానికి ప్రశాంతాభరణం
ప్రసిద్ధమై వెలిగే కనకపుష్యరాగం!!

పరాభవనామ సంవత్సరం
పరుగున వచ్చిందని పరభృతం
పట్టలేని ఉత్సాహంతో, గూడెం, నగరం
ప్రజల శ్రమైక జీవన సౌందర్య గీతం
పరవశంతో చేస్తోంది సుమధుర గానం!!

ప్రకృతి రమణీయంగా పచ్చల హారంతో
సుదృక్కులా వలపుల కలశంతో
అమృత భాండంతో అరుదెంచింది
వికృత భావాలను విరిచి విసిరేసి!!

పరాభవమంటే, పరాభవాల పంకం కాదని
సరాగాలు సంరంభమని, వరాల వరదుడని
బరువులు బాధ్యతల కారాగారం కాదని
వరబడి దరిచేరకుండా వర్షం ప్రసాదిస్తుందని

సమస్త ప్రజానీకంలో ఆపాదమస్తకం
సుమ సమానమైనట్టి సౌకుమార్యం
తలిరి టాకుల ముగ్ధ మనోహర సౌందర్యం
కలిగించి,కలిమిచెలియై కష్టనష్టాల హననం !!

కావించి, కాల నియమాలననుసరించి
త్రికాలాల త్రిగుణాల సంసేవితయై
ఆరు రుతువులు ఆరు రుచులతో సంభావించి
హరిహరాదుల దయను ప్రసాదించి!!

కలివిడిగా తలలు నిమిరి ఊరడించి
తల్లి లా సాకె ఆ పేరును, పెద్దలు పూర్వీకులు
పరాభవ నామ సంవత్సరం అని ఎందుకు పెట్టారో?
తెలియదు కానీ తనను స్మరించిన చాలు
ఈప్సితాలను ఈడేర్చు ఈశ్వరుడు ఈకాలం !!

మిత్రులు హితులు శ్రేయోభిలాషులకు
పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మనిషికి ఒక మాట

by Lingamneni Sujatha March 20, 2026
written by Lingamneni Sujatha

అమ్మా! అమ్మా! అన్న ఆర్తనాదం విని, వంటగదిలో పోపు పెడుతున్న శారద స్టవ్ ఆఫ్ చేసి పరుగెత్తుకుంటూ వచ్చింది.
హాలులో కూర్చుని పూజ చేసుకుంటున్న పార్వతమ్మ కంగారుగా బయటకు వచ్చింది.
వరండాలో కూర్చుని స్నేహితులతో కబుర్లు చెబుతున్న రాము పరుగు పరుగున వెనక దొడ్లోకి వచ్చాడు. ట్రాక్టర్ కింద రక్తపు మడుగులో చిన్నారి కిశోర్ పడి ఉన్నాడు.
డ్రైవర్ ట్రాక్టర్ దిగి, నేను కిశోర్ ను చూసి బాబూ! బాబూ! అంటూ అరుస్తూ, ట్రాక్టర్ కు బ్రేక్ వేసాను. బ్రేక్ పడేలోపు కిశోరే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి, ట్రాక్టర్ కింద పడి పోయాడు. నా తప్పేమీ లేదు బాబుగారూ! కావాలంటే పాలేరు సుబ్బయ్యను అడగండి అన్నాడు.
ట్రాక్టర్ ను చూసిన హుషారులో కిశోర్ ఎదురుగా పరుగెత్తుకు వచ్చాడు బాబుగారూ! అన్నాడు సుబ్బయ్య.
ఈ అరుపులు కేకలకు ఇరుగు పొరుగు వారు కూడా ఏమైందంటూ పరుగు పరుగున వచ్చారు.

అప్పటివరకు ఇల్లంతా తిరుగుతూ, తన ముద్దు మాటలతో మురిపిస్తూ, కిశోర్ ఆడుకుంటున్నాడు. మరుక్షణంలో ట్రాక్టర్ కింద పడి తల పగిలి రక్తంతో తడిసిపోయిన కిశోర్ ను చూసి, అక్కడ ఉన్న అందరి హృదయాలు ద్రవించి కన్నీరుగా కారాయి.
ఇప్పుడే కదరా నాన్నా! అమ్మా!
చాక్లెట్ పెత్తవా? అంటే పెట్టాను. ఇంతలోనే నీకు ఈ కర్మ వచ్చిందేమిటిరా? అంటూ తల్లి చూసే వారి హృదయాలు ద్రవించేలా ఏడుస్తోంది.
ఇప్పుడే కదరా నాన్నా! అమ్మ చాక్లెట్ ఇచ్చింది అని ఆనందంగా చెప్పావు? ఇంతలో నీకీ గతి వచ్చిందేమిటి? అంటూ తండ్రి కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పటివరకూ నాముందే ఆడుకుంటున్నావు కదా! ఇంతలోనే ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అని నాయనమ్మ బాధపడుతోంది.

డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలేమో చూడండి అన్నారు ఒకరు.
రక్తపు మడుగులో పడి ఉన్న కిశోర్ ను డ్రైవరు, పాలేరు తీసుకు వచ్చి, వరండాలో ఉన్న మంచం మీద పడుకోబెట్టారు. పెద్దవాళ్ళు ఒకరిద్దరు వచ్చి, కిశోర్ ముక్కు దగ్గర వేలుపెట్టి చూసి శ్వాస ఆడడంలేదు. పిల్లవాడు పోయాడు అన్నారు.

“శారద కిశోర్ దగ్గర కూర్చుని బాబూ! అంటూ భోరున ఏడవడం మొదలు పెట్టింది.”
శారదను వంగదీసి వీపు మీద గుద్దుతూ ఒసే పాపిష్టిదానా! బిడ్డను పట్టించుకోకుండా ఏం చేస్తున్నావే? మా వంశనాశనానికి వచ్చావా? బంగారం లాంటి బిడ్డను ట్రాక్టర్ పాలు చేసావు కదే! అంటూ కోడలిని తిట్టడం మొదలు పెట్టింది పార్వతమ్మ.
శారద తలెత్తి అత్తగారి మాటలకు వణికిపోతూ, కిశోర్ మీ దగ్గర ఆడుకోవడం చూసి వంటగదిలోకి వెళ్ళాను. కూరకు పోపు పెడుతున్నా ను. అమ్మా! అన్న కేక విని స్టవ్ ఆఫ్ చేసి పరుగెత్తుకుంటూ వచ్చాను. కావాలంటే వంట గదిలోకి వెళ్ళి చూడండి అని శారద అంది.
శారద మాటలు పట్టించుకోకుండా, “ఓసి దరిద్రపు మొహమా! బిడ్డను పట్టించుకోకుండా వాడిని గాలికి వదిలేసి, నా మాటకు మాట సమాధానం చెప్తావా?” అంటూ కోడలిని, పార్వతమ్మ కొడుతూనే ఉంది.

అప్పటి వరకు ఈ వింతను చూస్తున్న ఎదురింటి సూరయ్య,
“పార్వతమ్మా! ఆగవమ్మా! కోడలిని కొడతావేంటి? అమ్మాయి ప్రొద్దున లేచిన దగ్గరనుండి పని చేస్తూనే ఉంటుంది.
మేము ఎదురింట్లో ఉండి అంతా చూస్తూనే ఉన్నాము. నీవు ఏపని చేయకుండా మహారాణిలా కూర్చుని కోడలితో చేయించుకుని బాగా తింటున్నావు. పసిబిడ్డతో ముద్దు ముచ్చట్లతో ఆడుకోకుండా బిడ్డను గాలికి వదిలేసి, పైగా కోడలిని కొడతావా? నీ రాక్షసత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది” అని అరిచాడు.

నేను పూజ చేసుకుంటున్నాను అన్నయ్యా! అంది పార్వతమ్మ.
“మనము రైతులం. రైతులకు రోజంతా పని ఉంటుంది. మనకు పూజలు
చేసుకుంటూ కూర్చోవడానికి కుదరదు.
కోడలితో ఇంటి పని అంతా చేయిస్తూ, కూచుని తింటూ కోడలిని తిడుతూ, పైగా కొడతావా? నీ లాంటి అత్తగారు ఈ ఊరిలో ఎవరైనా ఉన్నారా? మళ్ళీ కోడలి మీద చేయి ఎత్తావంటే, పక్క ఇళ్లలో ఉన్న మేమందరం కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్ళి నీమీద కంప్లైంట్ ఇస్తాం.”
ఆ తర్వాత పోలీసులే నీకు బుద్ధి చెపుతారు జాగ్రత్త! అంటూ హెచ్చరించాడు.
అప్పటి వరకు తనమాటకు ఎదురే లేదని విర్రవీగుతున్న పార్వతమ్మ
ఏడుస్తూ నేల మీద కూలబడింది.

అప్పుడే అక్కడకు వచ్చిన మధ్య వయసు మగవాళ్ళు పార్వతమ్మతో, పెద్దమ్మా! కిశోర్ కి చేయవలసినవి చేయండి.ఎంత సేపని ఏడుస్తూ కూర్చుంటారు? పోయిన ప్రాణం తిరిగి రాదు కదా! అన్నారు.
పార్వతమ్మ మనుమడికి స్నానం చేయించింది. శారద పార్వతమ్మలు
ఏడుస్తూ ఉంటే, శ్మశానానికి రాము ఇరుగు పొరుగు పెద్దలతో కలిసి కిశోర్ శవాన్ని తీసుకుని వెళ్లాడు.

పార్వతమ్మ సన్న గొంతుతో శారదను ఇంకా తిడుతూనే ఉంది.
పక్కింటి కమలమ్మ వంట గదిలోకి వెళ్లి కూర వండి, రాముకు పార్వతమ్మకు భోజనం పెట్టింది. ఆ పూట శారద ఎవరెంత బ్రతిమాలినా, ఏమీ తినలేదు, సరికదా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. శిలా ప్రతిమలాగా కూర్చుండిపోయింది.

రాత్రికి కమలమ్మ వాళ్లింటిలోనే వండి, భోజనం తీసుకుని వచ్చింది. రాముకు, పార్వతమ్మకుపెట్టింది. శారదను అన్నము తిందువు రామ్మా! అని పిలిస్తే ఉలుకూ పలుకూ లేదు. కళ్ళు మూసుకుని పడుకున్న శారద కనీసం కళ్ళుకూడా తెరిచి చూడలేదు.

బాబూ! రామూ! “నీవే నీ భార్యను బ్రతిమాలి అన్నం తినమని చెప్పు. శారద కుమిలి కుమిలి ఏడుస్తోంది.
రామూ! మీ అమ్మ పద్ధతి బాగా లేదు. మీ అమ్మకు నచ్చ చెప్పి ఆమెను మంచి మార్గం లోనికి వచ్చేటట్లు చూడు. నీ భార్యను సముదాయించి ఆమెకు ధైర్యం చెప్పు. నీవు మగాడివి. తల్లిని, పెళ్ళాన్ని ఇద్దరినీ నీ మాటలతో, అదుపులో పెట్టుకోవాలి.” నేను నీ మంచికే చెపుతున్నాను. వస్తా నాయనా! అంటూ వెళ్ళిపోయింది.

రాము శారద దగ్గరకు వెళ్ళాడు. “శారదా లే! అంటూ ఆమెను లేపి కూర్చోబెట్టాడు. శారదా! పొద్దుటినుండి నీవు ఏమి తినలేదు. మన దురదృష్టం. కిశోర్ మనకు లేకుండా మాయమయ్యాడు. అలాగని ఏడుస్తూ ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉంటాం? మా అమ్మ మనుమడు పోయాడు అన్న బాధతో అమాయకురాలైన నిన్ను తిట్టింది. అంతే గాని నీవంటే ప్రేమ లేక కాదు. ఆమెకు మాత్రం ఎవరున్నారు? ఆమెను మనమే అర్ధం చేసుకుంటూ, ముందుకు పోవాలి.”
లేచి రా! అన్నం తిను.
ఈ రోజు మన ఊరిలో అందరూ నాతో
“నీ భార్య బంగారపు బొమ్మలా ఉండడమే కాదు. ఆమె మనసు కూడా బంగారమే. అత్తగారు తిట్టినా, కొట్టినా నోరెత్తకుండా పడి ఉంది. అట్లాంటి స్త్రీ ఈ ఊరిలో ఎవరూ లేరు. ఆమెను జాగ్రత్తగా కాపాడు. మీ అమ్మను అదుపులో పెట్టు” అని కూడా చెప్పారు.

ఇంతటి మంచి భార్య నాకు దొరకడం, నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యమని చెప్పాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గరనుండి నీవు పని చేస్తూనే ఉన్నావు. మా అమ్మ పూజ అంటూ పని తప్పించుకుంటూ కూర్చుంటుంది. పెద్దది. మా అమ్మను ఏమన్నా అంటే ఏడుస్తూ కూర్చుంటుందని నాకు భయం. ఆమె మనస్తత్వం తెలిసినవాడిని కాబట్టి నేను ఏమీ అనలేక పోతున్నాను. నువ్వు కూడా నా మొహం చూసి, నా బాధ తెలుసుకుని, ఆమెను క్షమించు. నా బంగారం కదూ! లేచి అన్నం తిందువు రా! అంటూ భార్య కన్నీరు తుడిచి, ప్రేమగా భార్యను వంట గదిలోకి తీసుకెళ్లాడు.
పళ్ళెంలో అన్నం,కూర నెయ్యి వేసి కలిపి, జీవితంలో మొదటి సారి భార్య నోట్లో ముద్ద పెట్టి తినమన్నాడు. భర్త ప్రేమకుకరిగిపోయిన శారద అన్నం తినడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వంటగది సర్దారు. ఇల్లంతా సర్ది, తమ గదిలోకి వెళ్లిపోయారు. శారదా! నీవు పడుకో! నేను అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మను చూసి వస్తానంటూ రాము వెళ్ళాడు.

అమ్మా! నిద్రపోతున్నావా? అన్నాడు రాము.
లేదు రామూ! నిద్ర రావడం లేదు. కిశోర్ ట్రాక్టర్ కింద పడి చనిపోవడం గుర్తుకు వస్తూనే ఉంది. వాడిని పట్టించుకోవడంలేదని, కోపం ఆపుకోలేక కోడలి మీద చేయి చేసుకున్నాను. దానికి మన ఇంటి చుట్టుపక్కలవాళ్లు పోలీసు కంప్లైంట్ ఇస్తాం అన్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నా కోడలిని నేను ఏమీ అనకూడదా? అంది.

అది కాదమ్మా! నీకు తెలియదు గాని గవర్నమెంట్ “గృహహింస” చట్టం అమలులోకి తెచ్చింది. “నీ కోడలిని నీవు తిట్టినా, కొట్టినా…
నీ కోడలుగాని ఇరుగు పొరుగు వారు కానీ పోలీసు కంప్లైంట్ ఇస్తే, పోలీసులు వచ్చి, అత్త మామలను, భర్తను, ఆడబిడ్డలుంటే వారిని, తీసుకువెళ్ళి జైలులో పెడతారట. ఆ తర్వాత కోర్టులో విచారించి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారట.” రోజూ మన ఇంటి చుట్టుపక్కల వాళ్లు వార్తాపత్రికలు తెప్పిస్తారు. వారు ఆ పత్రికలు చదివి చెపుతున్నారు. మనం విని మన జాగ్రత్తలో మనం ఉండాలి అని రాము అన్నాడు.

సరే రామూ! ఇక మీద నేను కోడలిని ఏమీ అనను. నా జాగ్రత్తలో నేను ఉంటాను అంది పార్వతమ్మ.
అలాగే అమ్మా! అంటూ రాము తన గదిలోకి వెళ్లిపోయాడు.

శారదా! అంటూ రాము శారదను దగ్గరకు తీసుకుని, కిశోర్ ఆయువు తీరి వెళ్లిపోయాడు. భగవంతుడు చల్లగా చూస్తే మళ్ళీ ఇంకొక బాబు పుడతాడులే. ఆ బాబును మనం జాగ్రత్తగా కాపాడుకుందాము. ధైర్యంగా ఉండు అని భార్యకు నచ్చ చెప్పాడు.

మరునాడు ఉదయం పార్వతమ్మ వంట గదిలో ఉన్న శారద దగ్గరకు వెళ్లి, అమ్మా శారదా! ఈ రోజు నుండి నేను కాఫీ పెడతాను. నీకు వంట పనుల్లో సాయం చేస్తాను. మిగతా ఇంటి పనులన్నీ నీవు చూసుకో! అంటూ ఎంతో ప్రేమగా చెప్పింది. నివ్వెరపోయిన శారద అత్తగారినే చూస్తూ ఉండిపోయింది. దూరం నుండి వీళ్ళిద్దరినే చూస్తున్న రాము మొహంలో చిరునవ్వు విరిసింది.
ఇరుగు పొరుగు వారు అత్తా కోడళ్లను చూసి ఆశ్చర్యపోయారు.
“మనిషికి ఒక మాట. పశువుకు ఒక దెబ్బ” అనే సామెత ఇరుగు పొరుగు వారికి గుర్తుకు వచ్చింది.
నిజంగా జరిగినదానికి ఒక రూపం ఈ కథ.

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్రీరామనవమి సందర్భంగా రామ తత్వం

by V. Kameshwari March 20, 2026
written by V. Kameshwari

రాముడు సామాన్యులకు ఆరాధ్యుడు
తాపసులకు పరబ్రహ్మ
జ్ఞానులకు తత్వవేత్త,
గృహస్తులకు ఆదర్శమూర్తి.
ఇలా అనేక వర్గాలలో అనేక రకాలుగా కీర్తింపబడే రాముడు లోకాభిరాముడు. రామ చరితం తెలియని భారతీయుడు ఉండడు. రామాలయం లేని ఊరే ఉండదు. రామస్మరణ చేయని మానవుడే ఉండడు. ఈ రామాయణాన్ని మనకు పరిచయం చేసిన కవిపుంగవుడు వాల్మీకి . రామ నామ మహిమ వల్లనే అటవీకుడగు వాల్మీకి రామాయణ గ్రంధాన్ని జగతికి అందించాడు. మనం నిత్య జీవితంలో కష్టాల్లో రామచంద్ర అంటాం సుఖాలలో రామభద్ర అంటాం, చివరికి కాటికి పోయేటప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై అంటాం. రామస్మరణ చేయని తావే లేదు. ధర్మంలో నడిచి చూపించిన ఆది గురువు మన శ్రీరాముడు. ఏ ఏ సందర్భాల్లో ఎలా నేర్చుకోవాలో మానవాళికి చేసి చూపించిన దివ్య ఆదర్శమూర్తి.
అయోధ్యలో నిర్మల మైన రఘువంశంలో జన్మించాడు, కౌసల్య నందనుడయ్యాడు, విశ్వామిత్ర యాగాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు. అహల్యకు శాప విముక్తి కలిగించాడు. జనక సభలో శివధనస్సు నెత్తి పెళ పెళమని విరిచాడు. సీతను పరిణయ మాడాడు. పరశురాముని గర్వాన్ని అణిచాడు అయోధ్యలో 12 సంవత్సరాలు సీతతో సుఖంగా జీవించాడు పినతల్లి కోరికపై, తండ్రి ఆజ్ఞతో దండకారణ్యం వెళ్ళాడు అక్కడ విరాధ వధ జరిగింది. మాయా లేడి రూపంలో వచ్చిన మారీచుని హతమార్చాడు రావణుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతా అన్వేషణలో జటాయు, కబంధులకు మోక్షం ఇచ్చాడు. శబరి పూజలు అందుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం, తరువాత వాలి వధ, సీత అన్వేషణం వానరులతో, సేతు బంధనం, లంక నగర్ ముట్టడి, యుద్ధంలో దురాత్ముడైన రావణుని బంధుమిత్రు సమేతంగా హతమార్చి విభీషణుకు పట్టం కట్టి సీతా సమేతముగా అయోధ్యగా చేరుకున్నాడు. భారతదేశంలో భాషలు వేరైనా రామాయణము తెలియని మనిషి ఉండడు.
మన దేశంలో పిల్లలకు చిన్నతనము నుండి రామాయణం గురించి కథలుగా చెబుతారు పెద్దలు. రాముడు సర్వ లక్షణ సంపన్నుడని ఆయన గుణ గ ణాలను వర్ణిస్తూ ఆయనలా నడుచుకోమని చెబుతారు. ఆఖరికి నిద్రపుచ్చేటప్పుడు కూడా ” రామాలాలి మేఘశ్యామా లాలీ ” అనే జోల పాట పాడి నిద్ర పుచ్చుతారు . వయసు మళ్ళినవారు రామకోటి రాయడం, నిత్యం రామ నామ స్మరణ చేయడం వలన మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. అంతలా రాముడు మన జీవితాలతో ముడివేసుకుపోయాడు. ఎంతో కష్టపడి అయోధ్యలో రామ మందిరం కట్టుకోవడం మన హిందువుల రామ భక్తికి నిదర్శనం. సీతమ్మ నడవడిక కూడా ఎంతో ఆదర్శ దాయకం మహిళలకు. రామ, లక్ష్మణ భరత,శత్రుఘ్నుల సోదర భావము ఎంతో ఆదర్శనీయమైనది. ఇద్దరు అన్నదమ్ములు కలివిడిగా ఉంటే రామలక్ష్మణుల్లా ఉన్నారు రా అంటారు. రాముడు ఎంత గొప్పవాడైనా’ సీతాపతి “అని పిలవబడటం ఆ రోజుల్లోనే ఆడవారికి ఎంత గౌరవం ఇచ్చారో తెలుస్తుంది
అందుకే రామాయణం ఆపాల గోపాలానికి ఆదర్శం.

March 20, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆణిముత్యాలు

by Radhika Suri March 20, 2026
written by Radhika Suri

చివురులు తొడుగుతున్న
శతపత్రపు సోయగాలు
మకిలి సోకని మాణిక్యాలు

అంతరాల అడుసే అంటని
వికసిత పంకజాలు
లోకంపోకడ తెలియని ముద్దులొలికే ముద్దబంతులు

అక్షరకాంక్షతో తపించే
సప్తవర్ణ క్రాంతులు
ఊహల కొలనులో రెక్కలు
విప్పిన’ పసి’డి కమలాలు

నిశ్చిత లక్ష్యంతో నింగికి నిచ్చెనలేసే ఆశల తారకలు
తెలివికి పదును పెడుతూ చదువుల మధువును
గ్రోలే తేటిపిల్లలు

నవ్వులు కలబోసిన
విరిసీవిరియని
ధవళ పుష్పాలు

కడుపు పంటలై వచ్చి
మీ ఇంట వెలుగులు
నింపే కన్యకామణులు

ఆంక్షల సంకెలలేసి వారి
ఆశయాల్ని సమాధి చేయకండి

బందీఖానాలో బిగించి
పంజరంలో పక్షులను చేయకండి

వివక్షాకూపంలో గింజుకుంటూ
మీ పెద్దరికాన్ని చిన్నబోనీయకండి

వినీలాకాశంలో ఎగురుతూ
స్వేచ్ఛాగీతాలు పాడనివ్వండి

వాళ్ళు ఉగ్గుపాలతో విలువలు
పొందిన మీ కంటిపాపలే !

ఆత్మవిశ్వాసంతో ఎదిగిన
ఈ జ్ఞానప్రసూనాలే
ఆ’నందనవనం’లో
వెలుగుపూలను
పూయిస్తాయేమో!‌

March 20, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సంగీత సరోవరంలో విరిసిన పద్మం – ఎన్. రాజం

by Padmasri Chennojwala March 19, 2026
written by Padmasri Chennojwala

సంగీత జలధిలో మునకలేస్తూ, స్వరాలను శ్వాసిస్తూ, రాగాలను పానంచేస్తూ, పంచప్రాణాలుగా అభిమానిస్తూ, ఆరోప్రాణంగా ఆరాధిస్తూ వన్నె తెచ్చిన స్వరకర్త లెందరో. పలు చరణాలతో కూడిన స్వరకల్పనకి పల్లవి తిరగలి చక్రమై రాగానికి శోభ నిచ్చిన విధంగానే బాలభానుడి లేత కిరణాలైనా, సోముడి వెన్నెల జల్లులైనా ప్రకృతి సోయగమై మనసుకు హాయి గొలుపుతాయి.

సంగీత పరిభాషలో స్వరాల సమూహాన్ని ‘రాగం ‘ అంటారు. ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూర్చనను కలిగి ఉంటుంది. ప్రతీ మూర్చన తనవైన స్వరాలను కలిగి ఉంటుంది. స్వరాలేవైనప్పటికీ రాగభావం మాత్రం మాధుర్యభరితమే.
చుక్కలు పరిచిన నీలాల దుప్పటి కవులకు కవితావస్తువై, కావ్యాల్లో సైతం తనదైన ముద్ర వేసుకుంది.
ఎదఎదను రంజింపజేసే సంగీత సుధ దేశకాలాల్ని బట్టి ఏ రూపు సంతరించుకున్నా(కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య), ఏ చోట ప్రవహించినా అంతిమంగా దాని లక్ష్యం అలౌకికానందమే.

సంగీత వీచికతో కూడిన శబ్దాన్ని ‘నాదం ‘ అంటారు. అనంతరాగాల సమన్వితమైన సంగీతం నాదమయం. గుప్పెడు గుండెలో కోటి భావనలు దాగి ఉన్నట్టే, అసంఖ్యాక రాగాలలో ఇమిడి ఉన్న నాదమొక్కటే.
మధురమైన ఆ సుధాగానాన్ని గ్రోలుతూ, ఆ నాద జగత్తులో పరవశిస్తూ, సంగీత సరస్సులో వికసించిన పద్మాలెన్నో.
నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతుల తనయగా 08/04/1938 భారతదేశంలోని చెన్నై నగరంలో జన్మించి, సంగీత సరస్సులో ముచ్చటగా మూడోసారి{( పద్మశ్రీ-1984), (పద్మభూషణ్-2004), (పద్మ విభూషణ్-2026)}వికసించి, తన పూదేనియల వెదజల్లిన ఈ పద్మమే ఎన్. రాజం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన 2026వ సంవత్సరపు పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందిన ఐదుగురు సభ్యుల్లో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ వాయు లీన విద్వాంసురాలు వయొలిన్ వాద్యంలో (కళల విభాగంలో)సాధించిన ప్రతిభకుగాను ఈ అవార్డును పొందారు.
హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతురాలైన వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తమ ఉద్యోగ నిర్వహణలో సంబంధిత విభాగానికి అధిపతిగా, ప్రదర్శన కళల విశ్వవిద్యాలయ విభాగాధిపతిగా తమ సమర్థవంతమైన సేవలు అందించి, పలు పదవులకు వన్నె తెచ్చారు.

వీరంందించిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ (1990) అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమి అందించే అత్యున్నత గౌరవమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2012లో వీరిని వరించింది.
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యురాలిగా సంగీతంపై పట్టు సాధించారు.
ఘర్(ఇల్లు) అనే హిందీ పదం నుండి ఉద్భవించిన’ ఘరానా ‘ అనే సంగీత ప్రక్రియలో నిష్ణాతులైన హిందుస్తానీ సంగీత గురువు ఓంకారనాథ్ ఠాగూర్ వద్ద రాగవికాసాన్ని నేర్చుకున్నారు.
ఘరానా అనే పదానికి సంగీత వారసత్వం, గురుశిష్య సంప్రదాయం అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట సంగీత శైలి. రాగ, గాత్ర వాద్య శైలులను అభ్యసించే విధానాన్ని సూచించే ప్రక్రియ.
వారణాసిలో మహదేవ్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ఆ నగరం యొక్క ఠుమ్రీ సంప్రదాయాన్ని కూడా అభ్యసించారు. క్రమంగా వాద్య సంగీతంలోకి అడుగుపెట్టి చివరకు హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ విద్వాంసురాలిగా ఖ్యాతి గాంచారు. తండ్రి మార్గదర్శకత్వం లో ‘గయాకి అంగ్ (గాత్ర శైలి)’ అనే ప్రక్రియను అభివృద్ధి పరిచారు. గయాకి అంటే హిందీ, అరబిక్ భాషలలో పాడటం అని అర్థం. ఖయాల్ అంటే హిందీ భాషలో ఆలోచన అనీ, పర్షియన్ భాషలో సాహిత్యం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఖయాల్ గయాకి అనేది నిర్దిష్ట శైలి, వేగం లేని వివరణాత్మక గానకళ. వీరు తమలోని సంగీత పరిజ్ఞానానికి సాధనను జోడించి వయొలిన్ వాద్యంపై మనుషుల స్వరాన్ని పోలిన విధంగా వాయించే విధానాన్ని కనిపెట్టారు. వయొలిన్ భారతీయ సంగీత కచేరీలో, ముఖ్యంగా కర్ణాటక సంగీత కచేరీలో ఉపయోగింపబడే ప్రధాన సహకార తంత్రీవాద్యం. దీనికి ‘ ఫిడేలు ‘ అని మరో పేరు. గాంభీర్యంతో కూడిన మాధుర్యం దీని సొంతం. ఇది పాశ్చాత్య వాయిద్యమైనప్పటికీ, కర్ణాటక సంగీతంలోని అతి సూక్ష్మ గమక విశేషములను కూడా పలికించగల సామర్థ్యం ఉండటంచే ప్రధాన పక్క వాయిద్యంగా, తని వాయిద్యంగా భారతీయ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది. కర్ణాటక సంగీత శైలిలో ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన T.N. శేషన్ తోబుట్టువు వీరు. చార్టెడ్ అకౌంటెంట్ ఐన T.S. సుబ్రహ్మణియన్ అనే వ్యక్తిని వివాహమాడి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆ శిశువుకు సంగీత శంకర్ అని నామకరణం చేశారు. కూతురైన సంగీత శంకర్ గారికి, మనవరాళ్లైన (సంగీత శంకర్ గారి తనయలు) రాగిణి శంకర్, నందిని శంకర్ లను వయొలిన్ వాద్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.
మేనకోడలైన కళారాంనాథ్, డా. సత్యప్రకాష్ మెహంతీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఐన ప్రణవ్ కుమార్ వీరి శిష్యులు. కర్ణాటక సంగీత గాయని మరియు సామాజికవేత్త ఐన పద్మా స్వామినాథన్ వీరికి అత్తగారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నేపధ్య గాయని ఐన వాణీజయరాం వీరికి వదిన.
సంగీత కుటుంబంలో జన్మించి, ఆ సాగరాన్ని మథించి, అందుండి లభించిన అమృత సుధల్ని వారసత్వంగా తనవారికి పంచడమే కాకుండా, స్వపర భేదాలెంచక అభిమానించి, ఆరాధించిన (సంగీతాన్ని) వారందరికీ వితరణ చేసి, అందులోనే తాదాత్మ్యం చెందిన ఈ సంగీత శిఖరానికి(రాజం గారికి) కైమోడ్పులర్పిస్తూ…..

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్త్రీ తత్త్వచింతన శిఖరం వాగాంభృణి

by Vijaya Ranganatham March 19, 2026
written by Vijaya Ranganatham

వాగాంభృణిఋగ్వేదానికి చెందిన స్త్రీ మంత్రదరష్ట. ఆమె పేరు మీద ఋగ్వేదం 10వ మండలం, 125 వ సూక్తం ఉంది. దీన్ని దేవి సూక్తం, వాక్సూక్తం అంటారు.ఇది వేదాల్లో పరబ్రహ్మ స్వరూపాన్ని మొదటి పురుషంలో ప్రకటించిన అరుదైన స్త్రీ సూక్తం.

వాగాంభృణి,ఋషి వంశంలో అంభృణి ఋషి కుమార్తెగా జన్మించినట్లువేద సాహిత్యం,గ్రంథాలు చెబుతున్నాయి.అందుకే పేరు వాగ్+అంభృణి = వాగాంభృణి అంటారు. కుటుంబ ఋషి సంప్రదాయం కాకుండా స్వతంత్ర దర్శనము కలిగిన ఋషిక. ఆమెది ఉత్తర ఋగ్వేద కాలం సుమారు క్రీ.పూ. 1200-1000 మధ్య అని పండితులఅంచన. తత్వవాదం స్పష్టంగా రూపుదిద్దుకుంటున్న దశ.

సంప్రదాయం ప్రకారం అంభృణి ఋషి వంశానికి చెందిన ఋషికగా భావిస్తారు.వేదకాలంలో స్త్రీలకు కూడా విధ్య, వేదాధ్యయనం అవకాశం ఉండేదని ఆమె జీవితం సూచిస్తుంది. వేదాలు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం వంటి విషయాలలో ప్రావీణ్యం సాధించింది. ఆమె రచించిన దేవి సూక్తంలో తాను “వాక్” (దివ్య వాణి) స్వరూపమని ప్రకటించటం ఆమె తాత్విక లోతును చూపిస్తుంది. సూక్తంలోని భావం ప్రకారం, సృష్టిలోని శక్తి జ్ఞానం, చైతన్యం అన్నీ తనలోనే ఉన్నాయని ఆమె ఆత్మసాక్షాత్కారాన్ని వ్యక్తం చేసింది. వాగాంభృణి వేదకాలంలో స్త్రీ విధ్య, స్త్రీ ఆధ్యాత్మిక స్థాయికి ప్రతీక.  ఆమె దేవీ సూక్తం శక్తి ఆరాధనకు మూలాధారంగా భావించబడుతుంది. భారతీయ తత్వంలో “శక్తి” భావనకు ప్రాథమిక రూపం ఈ సూక్తం ద్వారా కనిపిస్తుంది.ఋగ్వేదం 10.125 దేవీ సూక్తం సారాంశం. దీనిలోవాగ్దేవి స్వయంగా మాట్లాడుతుంది.

అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమాదిత్యైరుత వ్శ్వదేవైః
భావం: నేను దేవతలతో కూడి సంచరిస్తాను. నేను బ్రహ్మాన్ని నిలబెడతాను. రాజు,ఋషి, బ్రాహ్మణుడు అందరికి నేను శక్తినిస్తాను. నేనే సృష్టికి మూలం. నన్ను ఎవరు తెలుసుకుంటారో వారు అమృతత్వం పొందుతారు.ఇది అహం బ్రహ్మస్మి తత్వానికి వేదరూపం.
వాగాంభృణి సూక్తం:అద్వైత భావనకు పూర్వగాథగా పండితులు ఈ సూక్తాన్ని చూడడం జరుగుతుంది. శబ్దం (వాక్) = బ్రహ్మం అనే భావన.స్త్రీ శక్తి = సృష్టి మూలం అనే స్పష్టమైన ప్రకటన. తర్వాతి శాక్త సంప్రదాయాలు ఈ సూక్తాన్ని తమ తాత్విక పూర్వగాథగా స్వీకరించాయి.భారతీయ స్త్రీ తత్వచింతనలో  ఆమె స్థానం గొప్పది. మొదటిస్త్రీ స్వరూప బ్రహ్మవాది,గార్గీ, మైత్రేయి లకు తాత్విక మార్గదర్శినని అంటారు.“స్త్రీలకు వేదాధికారం లేదు” అన్న వాదనకుస్పష్టమైన ఖండన. ఇది ఆధునిక వాదన.వేదకాలంలో పరిస్థితులు ప్రాంతానుసారం మారుతూ ఉండేవి.
వాగాంభృణి కోణం- వేద సాంప్రదాయం, తాత్విక దృష్టి, ప్రాశ్చాత్య వేద పండితుల అభిప్రాయాలు,భారతీయ తాత్విక దర్శనాలు (అద్వైత, శాక్త, వేదాంత దృష్టి). మానవ ఋషిక, వాక్ దేవి స్వరూపం ప్రతీకాత్మక ఆత్మ ఘోషణ బ్రహ్మజ్ఞాని స్త్రీ అని వివరిస్తూఆమెమనిషి, దేవత్వం కలిసిన వేదీయ భావస్వరూపం మని అభిప్రాయం పడతారు.

ఆమె గురించి ఒక వాక్యంలో చెప్పాలంటే వాగాంభృణి — “నేనే వాక్, నేనే బ్రహ్మం” అని ప్రకటించిన తొలి స్త్రీ ఋషిక.వాగాంభృణి – వేదకాల స్త్రీ తత్త్వచింతన యొక్క శిఖరం. ఆమె నామవ్యుత్పత్తివాగాంభృణి =వాక్ (Vāk)  వాక్కు, శబ్దం, చైతన్య వ్యక్తీకరణ. అంభృణి- అంభృణి ఋషి కుమార్తె అని నిర్వచించారు. అంటే వాక్కు స్వరూపంగా దర్శించిన అంభృణి ఋషి కుమార్తె. ఇక్కడ “వాక్” సాధారణ మాట కాదు. బ్రహ్మ చైతన్యానికి వ్యక్త రూపం.ఆమె మానవ రూప ఋషికగా వాగాంభృణి.వేద సంప్రదాయం ప్రకారం:ఆమెఒక మానవ ఋషిక. తపస్సు, స్వానుభవం ద్వారా మంత్రాలను “రచించలేదు”,“దర్శించింది” (Mantra-draṣṭā). వేదాలలో ఇది చాలా కీలకం:మంత్రాలుమనుషుల కల్పన కాదు, సత్య దర్శనం.ఋగ్వేదం 10.125 – దేవీసూక్తం (Vāk Sūkta). ఇది వాగాంభృణి మహిమకు కేంద్రబిందువు.ప్రత్యేకతలు. మొత్తం సూక్తంమొదటి పురుష వాచ్యం (అహం = నేను)వేదాలలో ఇదిఅద్వితీయం. స్త్రీ స్వరూపంస్వయంగా తన పరబ్రహ్మత్వాన్ని ప్రకటించడం.

సూక్తంలోని ముఖ్య తత్త్వాంశాలు (Deep Philosophy)
(a) వాక్ = బ్రహ్మం. “అహం బ్రహ్మాస్మి” అని నేరుగా చెప్పకపోయినాఆ భావాన్ని పూర్తిగా వ్యక్తం చేస్తుంది. వాక్ అంటే:చైతన్యం, సృష్టి శక్తి, జ్ఞానం, ఋతం (Cosmic Order).
(b) దేవతలకూ ఆధారం నేనే. సూక్తంలో వాక్ చెబుతుంది:నేను రుద్రులతో నడుస్తాను. నేను ఆదిత్యులతో ఉన్నాను. నేను విశ్వదేవతలలో ప్రవేశించాను. అర్థం:వాక్ అనే చైతన్య శక్తి సమగ్రతను ఈ సూక్తం సూచిస్తుంది.
(c) రాజకీయ–సామాజిక తత్త్వం. “నేనే రాజుని రాజుగా చేస్తాను”. అంటే:అధికారానికి మూలం ఆయుధం కాదు. జ్ఞానం + వాక్ శక్తి. ఇది వేదకాలంలోనేనైతిక అధికార భావనకు తాత్విక సూచనగా పండితులు వ్యాఖ్యానించారు
.(d) స్త్రీ తత్త్వ ప్రకటన.వాక్ చెబుతుంది:నేనే సృష్టికి మూలం.నేనే పోషకురాలు.నేనే జ్ఞానప్రదాత. ఇది తర్వాతి కాలంలోని:దేవీ మహాత్మ్యం. శక్తి తంత్రం. కుండలినీ సిద్ధాంతం. అన్నిటికీ మూలబీజం.

వాగాంభృణి – ప్రతీకనా? వాస్తవ వ్యక్తినా?
పాశ్చాత్య వేద పండితులలో చాలామంది (ప్రత్యేకంగా 19వ శతాబ్దపు ఇండాలజిస్టులు)ఇది “Personification of Speech”. ఒక తత్త్వాన్ని కవిత్వంగా చూపించారు.భారతీయ సంప్రదాయం: తత్త్వాన్ని దర్శించిన మానవ ఋషిక. ఆమె ద్వారా వాక్ దేవిగా ఆవిర్భవించింది. భారతీయ దృష్టిలో:ప్రతీక + మానవ అనుభవం = వేద దర్శనం.
ఉపనిషత్తులతో సంబంధంవాగాంభృణి సూక్తంలో కనిపించే (“అహం బ్రహ్మాస్మి”, “సర్వం ఖల్విదం బ్రహ్మ”, “ప్రజ్ఞానం బ్రహ్మ”) ఆత్మ–బ్రహ్మ ఏకత్వ భావం, ఉపనిషత్తుల మహావాక్యాలతో తాత్విక సమాంతరతను చూపిస్తుంది. అందుకే ఆమెనుకొంతమంది ఆధునిక వ్యాఖ్యాతలు ఆమెను ఉపనిషత్తు తాత్విక భావాల పూర్వగాథగా గౌరవిస్తారు.స్త్రీలకు వేదాధికారం వాగాంభృణి సహా ఇతర ఋషికల సూక్తాలు వేదకాలంలో స్త్రీ మంత్రద్రష్టల ఉనికిని సూచిస్తున్నాయి. వాగాంభృణివేద మంత్రద్రష్ట, తత్త్వవాది, బ్రహ్మజ్ఞాని. కాబట్టి“స్త్రీలకు వేదాధికారం లేదు” అన్న వాదనశాస్త్రీయంగా నిలబడదు.భారతీయ సంస్కృతిలో వాగాంభృణి ప్రభావం తరువాత కాలపు ఋషికల పై ప్రత్యక్ష ప్రభావం” కంటే “భావ పరంపర, తాత్విక సమాంతరత” అని చెప్పొచ్చని పండితుల అభిప్రాయం.
గార్గీ – తత్త్వవాద ప్రశ్నలు.బ్రహ్మవిచారణలో లోతైన ప్రశ్నలు అడిగింది.వాగాంభృణి ప్రకటించిన “అహం బ్రహ్మస్వరూపిణి” భావానికి సమీపమైన ధైర్యమైన స్త్రీ స్వరం ఇక్కడ కనిపిస్తుంది.కానీగార్గీపై వాగాంభృణి ప్రత్యక్ష ప్రభావం ఉందని గ్రంథ ఆధారం లేదు — భావసామ్యం మాత్రమే.
మైత్రేయి – ఆత్మబ్రహ్మ చింతన. యాజ్ఞవల్క్యునితో ఆత్మతత్త్వంపై సంభాషించింది.వాగాంభృణి దేవీ సూక్తంలోని ఆత్మబ్రహ్మ ఏకత్వ భావనతో తాత్విక సమీపత ఉంది.ఇది కూడా ప్రత్యక్ష ప్రభావం కంటేఆలోచనా పరంపరలో భాగం.
లలిత సహస్రనామం – “వాగ్దేవతా స్వరూపిణి” ఇందులో దేవిని వాగ్దేవతా స్వరూపిణిగా స్తుతిస్తారు.వాగాంభృణి దేవీ సూక్తం (ఋగ్వేదం 10.125)లో వాక్స్వరూప దేవత భావం స్పష్టంగా ఉంది.ఇదిశాక్త పరంపరలో అభివృద్ధి చెందిన భావ వికాసంగా చూడవచ్చు.
కాశ్మీర శైవం – శబ్దబ్రహ్మం. శబ్దం, స్పంద, పరావాక్ భావాలు ఉన్నాయి.వాగాంభృణి “అహం రాష్ట్రీ సంగమనీ వసూనాం…” అంటూ శక్తి–వాక్ ఏకత్వాన్ని ప్రకటిస్తుంది.ఇదితాత్విక సమాంతరత— కానీ నేరుగా వాగాంభృణి ప్రభావం అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది.
భక్తి ఉద్యమం – వాక్కు శక్తి. భక్తి కీర్తనలు, నామస్మరణ ప్రధానమైనవి.ఇది వాక్ప్రాధాన్యతను చూపిస్తుంది.కానీ భక్తి ఉద్యమం నేరుగా వాగాంభృణి ప్రభావంతో పుట్టింది అని చెప్పలేం — ఇదిసాంస్కృతిక విస్తరణలో భాగంమాత్రమే.
ఒక వాక్యంలో ఆమె స్థానం,వాగాంభృణి – స్త్రీ స్వరూపంలో బ్రహ్మ తత్త్వం స్వయంగా ప్రకటించుకున్న అరుదైన వేద స్వరం.ఋగ్వేదం 10వ మండలం – 125వ సూక్తం. అంటేవాగాంభృణి దర్శించిన “దేవీ సూక్తం / వాక్ సూక్తం” పూర్తి పాఠంసంస్కృత (దేవనాగరి) మూలపాఠం. ఋషిః– వాగాంభృణి, దేవత– వాక్ (దేవి)ఛందస్సు– త్రిష్టుప్.
1.అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమాదిత్యైరుత విశ్వదేవైః ।అహం మిత్రావరుణోభా బిభర్మ్యహమింద్రాగ్నీ అహమశ్వినోభా ॥
భావార్థం:నేను రుద్రులతో, వసువులతో సంచరిస్తాను.ఆదిత్యులు, విశ్వదేవతలతో కూడి నేను ఉన్నాను.మిత్రుడు–వరుణుడు, ఇంద్రుడు–అగ్ని, అశ్వినీ దేవతలు —వీరందరినీ నేను ధరిస్తున్నాను, పోషిస్తున్నాను.
అర్థం:దేవతలన్నీ నా శక్తి రూపాలే;వాటికి ఆధారమైన చైతన్యం నేనే.
2.అహం సోమమాహనసం బిభర్మ్యహం త్వష్టారముత పూషణం భగమ్ ।అహం దధామి ద్రవిణం హవిష్మతే సుప్రావ్యే యజమానాయ సున్వతే ॥
భావార్థం:నేనే సోమరసాన్ని ధరిస్తాను,త్యాగఫలాలను ప్రసాదిస్తాను.త్వష్టా, పూషణుడు, భగుడు వంటి దేవతల శక్తి నాలోనే ఉంది.యజ్ఞం చేసే వారికి, హవిస్సు సమర్పించే వారికిసంపదను నేనే ప్రసాదిస్తాను.
అర్థం:ఫలప్రదానం దేవతల చేత కాదు —దైవచైతన్యమైన వాక్ ద్వారానే.
3.అహం రాష్ట్రం సంగమనీ వసూనాం చికిత్సు ప్రథమాయా యజ్ఞియానామ్ ।తాం మా దేవా వ్యదధుః పురుత్రా భూరిస్థాత్రాం భూర్యావేశయంతీమ్ ॥
భావార్థం:నేనే రాజ్యాన్ని నిలబెట్టే శక్తిని.సంపదలను ఏకత్రం చేసే బలం నేనే.యజ్ఞాలలో ముందుండే జ్ఞానస్వరూపిని నేనే.దేవతలు నన్ను అనేక చోట్ల వ్యాప్తిచేసిప్రపంచమంతా వ్యాపింపజేశారు.
అర్థం:సామాజిక క్రమం, రాజ్యవ్యవస్థ, ధర్మం —అన్నిటికి మూలం వాక్ శక్తి.
4.మయా సో అన్నమత్తి యో విపశ్యతి యః ప్రాణితి య ఈం శృణోత్యుక్తమ్ ।అమంతవో మాం త ఉప క్షియంతి శ్రుధి శ్రుత శ్రద్దివం తే వదామి ॥
భావార్థం:నన్ను దర్శించినవాడు జీవిస్తాడు,నన్ను తెలుసుకున్నవాడు శ్వాసిస్తాడు,నా వాక్యాన్ని వినేవాడే నిజంగా జ్ఞానవంతుడు.నన్ను తెలియని వారు నాశనమవుతారు.విను — నేను సత్యాన్ని ప్రకటిస్తున్నాను.
అర్థం:చైతన్యాన్ని గ్రహించకుండా జీవితం అంధమే.
5.అహం స్వయం వదామి జుష్టం దేవైస్తమేవ యం కామయే తం తముగ్రమ్ ।తం బ్రాహ్మణం తం ఋషిం తం సుమేధామహం రుద్రాయ ధనురాతనోమి ॥
భావార్థం:దేవతలకు ప్రీతికరమైన సత్యాన్ని నేనే ప్రకటిస్తాను.ఎవరిని నేను కోరుకుంటానోవారినే శక్తివంతులుగా చేస్తాను.వారినే బ్రాహ్మణులుగా, ఋషులుగా, మేధావులుగా మారుస్తాను.రుద్రునికీ ధనుస్సును నేనే అందిస్తాను.
అర్థం:జ్ఞానం దేవుడిచ్చే వరం కాదు —చైతన్యమే జ్ఞానాన్ని ప్రకటిస్తుంది.

6.అహం జనాయ సమదం కృణోమ్యహం ద్యావాపృథివీ ఆవివేశ ।అహం సువే పితరమస్య మూధ్న్మమ యోనిరప్స్వంతః సముద్రే ॥
భావార్థం:ప్రజలకు ఉత్సాహం, శక్తి నేనే ఇస్తాను.ఆకాశం, భూమి రెండింటిలో నేను వ్యాపించాను.ఈ సృష్టికి మూలమైన తండ్రిని నేనే జన్మింపజేశాను.నీళ్ళలోను, సముద్రంలోను నా యోని ఉంది.
అర్థం:సృష్టి పురుషుడు కూడాస్త్రీ శక్తి ద్వారానే ఉద్భవిస్తాడు.
7.అహమేవ వాత ఇవ ప్రవామ్యారభమాణా భువనాని విశ్వా ।పరో దివా పరం ఏనా పృథివ్యైతావతీ మహినా సంబభూవ ॥
భావార్థం:గాలిలా నేను అన్ని లోకాలలో విస్తరిస్తాను.ఈ సమస్త విశ్వాన్ని నా శక్తితో ఆవరించాను.ఆకాశాన్ని దాటి, భూమిని దాటినా మహిమ విస్తరించింది. అర్థం:పరిమితులు లేని సర్వవ్యాప్త చైతన్యం నేనే.

8. ఇతి దేవీ సూక్తం సమాప్తమ్ఈ సూక్తం ద్వారావాక్ = బ్రహ్మంఅనే తత్త్వం సంపూర్ణంగా ప్రకటించబడింది.
మొత్తం సూక్తం యొక్క సారాంశం. “నేనే దేవతల శక్తి, నేనే జ్ఞానం, నేనే సృష్టి మూలం,రాజ్యానికీ ధర్మానికీ నేనే ఆధారం.నన్ను తెలిసినవాడు అమృతత్వాన్ని పొందుతాడు.”ఇది కేవలం కవిత కాదు —స్త్రీ స్వరూపంలో పరబ్రహ్మం తనను తాను ప్రకటించిన వేద దర్శనం.
వాగాంభృణి,గార్గీ,మైత్రేయిల వేద–ఉపనిషత్తు స్త్రీ తత్త్వచింతన త్రయం అని అంటారు. వారి కాలానుగుణ స్థానం వివరణలు, తత్త్వదృష్టి విధానం (Approach to Truth),స్త్రీ చైతన్య పాత్ర, సామాజిక దృష్టి.గమనిస్తే..
వాగాంభృణి: క్రీ.పూ.1200-1000 ఋగ్వేదం 10.125., వేద దర్శనం. స్వయంఘోషణ, కవితాత్మక దర్శనం, వాక్ = బ్రహ్మం, “నేనే బ్రహ్మం” — ప్రత్యక్ష ప్రకటన. బ్రహ్మం ఆమెకు ప్రశ్న కాదు; అనుభవసత్యం. దేవీ స్వరూపం, అధికారిక, సృష్టిమూలం. రాజ్యం, ధర్మం, యజ్ఞం — అన్నింటికీ మూలం వాక్ , సామాజిక శక్తి సిద్ధాంతం.శబ్దబ్రహ్మం, ఉపనిషత్తు తత్త్వాలకు ఇచ్చిన బీజాలు వాగాంభృణి తత్వం. బ్రహ్మం మాట్లాడింది.
గార్గీ వాచక్నవి: క్రీ.పూ.900-800 బృహదారణ్యక ఉపనిషత్తు,ఉపనిషత్తు తత్త్వవాదం, తర్కాత్మక ప్రశ్నలు,వాదప్రతివాదం, బ్రహ్మ స్వరూపం ఏమిటి? “అది దేనితో నేయబడింది?”బ్రహ్మాన్నిప్రశ్నల ద్వారా అన్వేషిస్తుంది.యాజ్ఞవల్క్యుడినే నిరుత్తరుణ్ని చేసే స్థాయి ప్రశ్నలు. తత్వవాది,ప్రశ్నాత్మక, జ్ఞానసవాల్. సభలో పురుష ఋషులతో సమానంగా వాదిస్తుంది. బౌద్ధిక సమానత్వంప్రతీక. తర్కాత్మక బ్రహ్మవిచారణ.బ్రహ్మాన్ని ప్రశ్నించింది.
మైత్రేయి: క్రీ.పూ.900-800 బృహదారణ్యక ఉపనిషత్తు, ఉపనిషత్తు తత్త్వవాదం, అనుభవాత్మక జ్ఞానం, శాంతమైన సంభాషణ, ఆత్మ జ్ఞానం ద్వారా అమృతత్వం. “అమృతత్వం ఎలా లభిస్తుంది?”బ్రహ్మాన్నిజీవిత ప్రయోజనంగాచూస్తుంది. గృహిణి, బ్రహ్మవాది, వినయపూర్వక కాని దృఢ మైన, మోక్షమార్గం. సంపదను త్యజించి జ్ఞానాన్ని కోరుతుంది. అంతర్ముఖ మోక్ష దృష్టి. నిత్యానిత్య వివేకం. బ్రహ్మాన్ని జీవించింది.
భారతీయ స్త్రీ తత్త్వచింతనలో వారి సంయుక్త స్థానం – దర్శనం (వాగాంభృణి) → విచారణ (గార్గీ) → అనుభవం (మైత్రేయి)ఇదిభారతీయ జ్ఞాన మార్గం యొక్క సంపూర్ణ చక్రం.
ఆధునిక ఫెమినిజం దృష్టిలో వాగాంభృణి “స్త్రీ మాట్లాడుతోంది” — ఇది ఫెమినిజమేనా?దేవీ సూక్తం మొత్తంమొదటి పురుషంలో (అహం = నేను)ఉంది.“నేనే సృష్టి మూలం”. “నేనే రాజ్యాన్ని నిలబెడతాను”ఆధునిక ఫెమినిజం భాషలో ఇది:Female Self-Assertion. Voice reclamation. Subjecthood (స్త్రీ వస్తువు కాదు — కర్త).ముఖ్యంగా:పురాతన సాహిత్యంలో స్త్రీనివర్ణించేపురుష స్వరం కాకుండాస్త్రీ తనను తాను నిర్వచించుకోవడం— ఇది రాడికల్ చర్య.“స్త్రీ = శక్తి” కాదు, “స్త్రీ = చైతన్యం”
ఆధునిక ఫెమినిజం ఒక ప్రశ్న వేస్తుంది:“స్త్రీలను దేవీకరణ చేయడం కూడా ఒక పితృస్వామ్య పద్ధతేనా?”
వాగాంభృణి: ఆమెదేవతగా పొగడబడడం లేదు. ఆమెచైతన్యంగా తనను ప్రకటిస్తుంది. వేద సత్యాన్ని ప్రకటిస్తుంది. పురుష ఋషి ద్వారా కాదు. సభలో అనుమతి తీసుకోకుండా. శరీరం గురించి ప్రస్తావన లేదు. వాక్ (స్వరం)గురించే కేంద్రం. “నేనే రాజ్యాన్ని నిలబెడతాను” — రాజకీయ ఫెమినిజం.దేవీ సూక్తం:“అహం రాష్ట్రం సంగమనీ వసూనాం”ఆధునిక రాజకీయ ఫెమినిజం దృష్టిలో:స్త్రీకేవలం గృహ పరిమితి కాదు. ఆమెరాజకీయ నిర్మాణాల మూలం. ఆమె ప్రకృతి, శబ్దం, చైతన్యం, సృష్టి.
వాగాంభృణి ఒకనార్మేటివ్ ఐడియల్. ఏమై ఉండవచ్చోచూపిస్తుంది.ఒక వాక్యంలో ఆధునిక ఫెమినిస్టు పఠనం. స్త్రీ తన స్వరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని,జ్ఞానం, శక్తి, రాజకీయాన్ని తన నుంచే ప్రారంభించిన తొలి ప్రకటన.ఆధునిక ఫెమినిజం వాగాంభృణిని…”పురాతన దేవి”గా కాకుండా,తనను తాను నిర్వచించుకున్న మొదటి స్త్రీ జ్ఞానసబ్జెక్ట్”గా చదువుతుంది.శక్తి తంత్రానికి వాగాంభృణి ఇచ్చిన మూలసూత్రాలువాగాంభృణితంత్ర గ్రంథకర్త కాదు.కానీతంత్రం నిలబడి ఉన్న మౌలిక తత్త్వాలు. ఆమె దేవీ సూక్తంలోమొదటిసారిగా స్పష్టంగా దర్శనమిచ్చాయి.శబ్దం = శక్తి = బ్రహ్మం.
దేవీ సూక్తం:“అహం… భువనాని విశ్వా”. తంత్ర మూలసూత్రం:శబ్దమే శక్తి. శక్తియే బ్రహ్మం. తంత్రంలో:బీజమంత్రాలు, మంత్రజపం, నాద, బిందు సిద్ధాంతం. ఇవన్నీవాగాంభృణి ప్రకటించిన “వాక్” తత్త్వం నుంచే.శక్తి స్వయంప్రకాశం
దేవీ సూక్తంలో:“అహం స్వయం వదామి…”. శక్తికిపురుష అనుమతి అవసరం లేదు.తంత్రంలో:శక్తి శివుని చేత సృష్టించబడలేదు. శివుడుశక్తి చేత సచేతనుడవుతాడు. ఇది వేదాల్లో తొలిసారి కనిపించే భావం. శక్తి = సృష్టికర్త. దేవీ సూక్తం:“అహం సువే పితరమస్య మూధ్నః”. అర్థం:నేనే సృష్టికర్త అయిన తండ్రిని కూడా జన్మింపజేశాను.తంత్రంలో:శక్తి = జగదాంబ, శివుడు = నిష్క్రియ చైతన్యం. శక్తి లేకుండా శివుడుశవమే. ఈ ప్రసిద్ధ తంత్ర వాక్యం వేదీయ బీజం ఇదే.
యోని తత్త్వం – పవిత్రత. దేవీ సూక్తం:“మమ యోనిరప్స్వంతః సముద్రే”.యోని = సృష్టి మూలం.అపవిత్రం కాదు —కోస్మిక్ గర్భం. తంత్రంలో:యోని పూజ. శ్రీచక్రం. సృష్టి గర్భ తత్త్వం ఇవన్నీ ఈ వాక్యానికి విస్తరణ. శక్తి సర్వవ్యాప్తి. దేవీ సూక్తం:“అహమేవ వాత ఇవ ప్రవామి…”తంత్రంలో:శక్తి ఆలయంలో మాత్రమే కాదు,శరీరంలో, ప్రకృతిలో, శ్వాసలో.అందుకే తంత్రం:కుండలినీ, చక్ర వ్యవస్థ, శరీర సాధన.అనుభవమే ప్రామాణికం
వాగాంభృణిగ్రంథం ఉటంకించదు. ఆజ్ఞాపించదు. తన అనుభవాన్ని ప్రకటిస్తుంది. తంత్రంలోగురు + సాధన. ప్రత్యక్ష అనుభవం. శాస్త్రం కంటేసిద్ధి. ఇదే తంత్రపు మూల స్వభావం. స్త్రీ శరీరం — సాధన స్థలం. వేదంలో ఇది సంకేతంగా ఉంది. తంత్రంలో స్పష్టమవుతుంది. ఆమెశరీరాన్ని తక్కువ చేయదు. దేహాన్ని దాటే చైతన్యాన్ని చూపుతుంది. తంత్రంలోభోగం → యోగం. దేహమే మోక్ష సాధనం అధికారానికి మూలం — శక్తి. దేవీ సూక్తం:“అహం రాష్ట్రం సంగమనీ…”తంత్రంలోరాజశక్తి ,క్షత్రియ దీక్షలు, దేవీ రాజ్యాధికారం, రాజకీయ శక్తి కూడా శక్తియే. శివ–శక్తి అద్వైతం. వాగాంభృణిద్వైతాన్ని ప్రకటించదు. ఏకత్వంమాత్రమే. తంత్రంలోశివం–శక్తి అభేదం. లలిత త్రిపురసుందరి సిద్ధాంతం.
వాగాంభృణి సూక్తం వాక్, యోని, శ్వాస, స్వయం ప్రకాశం, సర్వవ్యాప్తి అయితే మంత్రం, శ్రీ చక్రం, కుండలినీ, శక్తి స్వాతంత్రం, శరీర సాధనతంత్ర సిద్ధాంతంసంక్షిప్తంగా చెప్పవచ్చు.ఒక వాక్యంలో సారం.. వాగాంభృణి తంత్రం మొదలయ్యే ముందు,శక్తి తత్త్వం వేదాలలో మాట్లాడిన మొదటి స్వరం. ఆమె ఆధునిక భారతీయ సందర్భంలో మూడు తులనాత్మక కోణాలు.వాగాంభృణి vs ఆధునిక భారతీయ మహిళా కవులు.సామాన్య బిందువు – “స్త్రీ స్వరం”. వాగాంభృణి“అహం స్వయం వదామి…”(నేనే స్వయంగా మాట్లాడుతున్నాను). ఆధునిక మహిళా కవులు స్త్రీ అనుభవాన్నిమొదటి పురుషంలోచెప్పడం, పురుష మధ్యవర్తిత్వం లేకుండా స్వర ప్రకటన.
వాగాంభృణి = తొలి ‘Female poetic.చైతన్య స్వరూపం, విశ్వ స్థాయి, నేనే బ్రహ్మం  అని వాగాంభృణి ధోరణి అయితే అనుభవ స్వరూపం, వ్యక్తిగత, సామాజిక స్థాయి, నేను కూడా మనిషినే అని ఆధునిక కవులు అంటుంన్నారు. ఆధునిక కవిత్వంవాగాంభృణి దృష్టిని భూమికి దింపింది.తాత్విక వారసత్వం..ఆధునిక మహిళా కవిత్వందేహం గురించి మాట్లాడుతుంది. నొప్పి, అన్యాయం, ప్రేమ అన్నీ చెప్పుతుంది.వాగాంభృణి ఇచ్చిన“మాట్లాడే హక్కు”లేకపోతేఈ కవిత్వం ఊహించలేం.ఫెమినిజం విమర్శలకు వేద సమాధానం (వాగాంభృణి ఆధారంగా)
విమర్శ 1:“వేదాలు పితృస్వామ్యమే”వేద సమాధానం (వాగాంభృణి):వేదాల్లో స్త్రీవిషయం కాదు, వక్త, ఆమె బ్రహ్మతత్త్వాన్ని ప్రకటిస్తుంది. సమస్య వేదాల్లో కాదు,తర్వాతి కాలపుసామాజిక ఆచారాలలో.
విమర్శ 2:“స్త్రీలను దేవీకరించడం కూడా అణచివేతే”వాగాంభృణి ఏమంటుంది?ఆమెను ఎవరూ దేవిగా పిలవలేదు. ఆమెతనను తానే ప్రకటించుకుంది. ఇది దేవీకరణ కాదు — Self-definition.
విమర్శ 3:“ఆధ్యాత్మికత మహిళలను భౌతిక హక్కుల నుంచి దూరం చేస్తుంది”. వేదీయ సమాధానం:“అహం రాష్ట్రం సంగమనీ వసూనాం”వాగాంభృణిఆధ్యాత్మికమే కాదు. రాజకీయ, సామాజిక శక్తికి మూలంఅని చెబుతుంది.ఈ తత్త్వం నేటి సమాజానికి ఎలా వర్తిస్తుంది?ఇది అత్యంత ముఖ్యమైన భాగం.
 (a) స్త్రీ విద్య&స్వరం: వాగాంభృణి సందేశం:“జ్ఞానం స్త్రీకి ఇవ్వాల్సిన దానం కాదు — ఆమె హక్కు” నేటి సందర్భంలోస్త్రీ విద్య, స్త్రీ అభిప్రాయానికి విలువ, “మాట్లాడితే మౌనంగా ఉండు” అనే సంస్కృతి ఖండన.
(b) రాజకీయాలు&నాయకత్వంస “అహం రాష్ట్రం సంగమనీ…” మహిళా నాయకత్వం:కోటా కోసం కాదు. సామర్థ్యం వల్ల సహజమైనది. వాగాంభృణి దృష్టిలో:శక్తి లింగాధారితమైంది కాదు.
(c) శరీరం – అపవిత్రత నుంచి పవిత్రత. వాగాంభృణి:“మమ యోనిః…”నేటి సమస్యలు:పీరియడ్స్ టాబూ. శరీర లజ్జ. వేదీయ సమాధానం:శరీరం అపవిత్రం కాదు —సృష్టి సాధనం.
(d) మాటల హింస (Verbal Violence): వాగాంభృణి:వాక్ = శక్తి. నేటి సమాజంమాటలతో అణచివేత. ట్రోలింగ్, అవమానం. పరిష్కారం:మాట = బాధ్యత.
మూడు కాలాలను కలిపే ఒక వాక్యం. వాగాంభృణి —వేదకాలంలో చైతన్యంగా మాట్లాడింది,ఆధునిక కవిత్వంలో అనుభవంగా మారింది,నేటి సమాజంలో బాధ్యతగా నిలవాలి.వాగాంభృణి తత్త్వం, భారతీయ రాజ్యాంగం. సమానత్వ భావన యొక్క భారతీయ మేధో పరంపర.మౌలిక భావసామ్యం (Core Idea). వాగాంభృణి..“అహం రాష్ట్రం సంగమనీ వసూనాం” అంటే “నేనే రాజ్యాన్ని నిలబెట్టే శక్తిని”. భారతీయ రాజ్యాంగం..“We, the people of India..”రాజ్యానికి మూలం:రాజు,దేవుడు కాదు. చైతన్యమైన ప్రజలు.ఇది రెండింటిలోనూ ఒకే భావం. వ్యక్తి కేంద్రత (Individual as Source of Dignity). వాగాంభృణి : ప్రతి వ్యక్తిలో వాక్ ఉంది. జ్ఞానం అందరికీ సాధ్యం
రాజ్యాంగం – ఆర్టికల్ 21. జీవితం&వ్యక్తిగత గౌరవం. వాగాంభృణి తత్త్వం:గౌరవంలింగం ఆధారంగా కాదు. చైతన్యాధికారం ఆధారంగా. సమానత్వం – సమానత్వానికి మూలం. వాక్ సర్వవ్యాప్తం. అందరిలో ఒకటే చైతన్యం
రాజ్యాంగం – ఆర్టికల్ 14. Law before equality & equal protection of laws.ఎందుకు సమానత్వం?ఎందుకంటే మూల చైతన్యం అందరిలో సమానమే.వివక్ష నిషేధం (Non-discrimination). వాగాంభృణి: బ్రాహ్మణుడు, ఋషి, రాజు. అందరికీ శక్తినిచ్చేది ఒక్కటే వాక్
రాజ్యాంగం – ఆర్టికల్ 15: లింగం, మతం, జాతి ఆధారంగా వివక్ష నిషేధం.తాత్విక పునాది:జ్ఞానం విభజనను అంగీకరించదు. స్వేచ్ఛ&వ్యక్తీకరణ (Freedom of Expression). వాగాంభృణి: “అహం స్వయం వదామి…”మాట్లాడే హక్కు అంటే అస్తిత్వ హక్కు
రాజ్యాంగం – ఆర్టికల్ 19(1)(a): Freedom of Speech & Expression. భారత రాజ్యాంగం ఆధునిక ప్రజాస్వామ్య నమూనాల ప్రభావంతో రూపుదిద్దుకుంది. ఆధునిక రాజ్యాంగం హక్కుల భాషలో చెప్పిన సూత్రాలకు, వేదీయ తత్త్వంలో సాంస్కృతిక-ఆధ్యాత్మిక పూర్వగాథ ఉంది.రాజకీయ సమానత్వం (Political Equality). వాగాంభృణి: “అహం రాష్ట్రం…”రాజకీయ శక్తి స్త్రీకి సహజం
రాజ్యాంగం: ఓటు హక్కు (Article 326). మహిళలకు సమాన రాజకీయ హక్కులు.ఇది కేవలం చట్టం కాదు. భారతీయ తత్త్వానికి న్యాయరూపం. సామాజిక న్యాయం (Social Justice). వాగాంభృణి: శక్తి ఎవరికీ ప్రత్యేకం కాదు. సామాజిక స్థితి ఆధారంగా కాదు
రాజ్యాంగం – ప్రస్తావన (Preamble): Social, Economic, Political Justice.న్యాయం అంటేసమాన అవకాశాలకు చైతన్యాన్ని విడుదల చేయడం.వాగాంభృణి: స్త్రీ జ్ఞానకర్త. స్త్రీ శక్తికర్త
రాజ్యాంగం: Article 15(3) – మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు.ఇది “ప్రివిలేజ్” కాదు.చరిత్రాత్మక అణచివేతకు సరిదిద్దే చర్య. మౌలిక కర్తవ్యాలు (Fundamental Duties). వాగాంభృణి: వాక్ బాధ్యత
రాజ్యాంగం :Article 51Ato renounce practices derogatory to the dignity of women.మాటలతో అణచివేత కూడా రాజ్యాంగ విరుద్ధమే.వాగాంభృణి తత్త్వం —భారతీయ రాజ్యాంగానికి శాసన మూలం కాదు,కానీ దాని మేధో–సాంస్కృతిక మూలం.అంటేరాజ్యాంగం ఆధునిక భాషలో చెప్పినది,వాగాంభృణి వేదభాషలో అనుభవించినది.ఆధునిక మహిళా ఉద్యమాలకు వేదీయ తాత్విక మద్దతు.
లక్ష్యం…వేదాలు మహిళా ఉద్యమాలకువ్యతిరేకంకాదు;వాటికితాత్విక లోతు, సాంస్కృతిక బలాన్ని ఇచ్చే మూలం.“మాట్లాడే హక్కు” – ఉద్యమాల తొలి అడుగువేదీయ మూలం. వాగాంభృణి (దేవీ సూక్తం)“అహం స్వయం వదామి…” స్త్రీకి స్వరం హక్కు కాదు,అస్తిత్వం.ఆధునిక ఉద్యమంలో#MeToo, గృహహింసపై మాట్లాడటం, లైంగిక వేధింపులపై స్వరం.ఇదిమాట్లాడే స్వరానికి వేదీయ ఆధ్యాత్మిక పూర్వగాథగా వాగాంభృణి స్వరం చూడవచ్చు.జ్ఞానాధికారం నాయకత్వానికి మూలం. వేదీయ మూలం-వాగాంభృణి – మంత్రద్రష్ట, గార్గీ – తత్త్వవాదిని సవాల్ చేసినది, మైత్రేయి – ఆత్మజ్ఞానం కోరినది.జ్ఞానం పురుష ఏకాధిపత్యం కాదు.ఆధునిక ఉద్యమంలోమహిళా మేధావులు, అకాడమిక్ లీడర్షిప్, పాలసీ మేకింగ్‌లో మహిళలు.శరీరం అపవిత్రం కాదు – సాధన స్థలం. వేదీయ మూలం“మమ యోనిరప్స్వంతః సముద్రే”శరీరం అంటే సృష్టి సాధనం. ఆధునిక ఉద్యమంలో – పీరియడ్స్ టాబూ వ్యతిరేకం, శరీర స్వాతంత్ర్యం, Reproductive rights. శరీరాన్ని సృష్టి–శక్తి సాధనంగా చూసిన వేదీయ దృష్టి, ఆధునిక శరీర స్వాతంత్ర్య చర్చలకు సాంస్కృతిక పునర్వ్యాఖ్యానంగా ఉపయోగపడవచ్చు.ఇది “పాశ్చాత్య దిగుమతి” కాదు —వేదీయ శరీర తత్త్వం పునరుద్ధరణ.

ఆధ్యాత్మికత vs హక్కులు – తప్పుడు విభజన
విమర్శ“ఆధ్యాత్మికత మహిళలను అణచుతుంది”. వేదీయ సమాధానం.వాగాంభృణి:ఆధ్యాత్మికమేరాజకీయ శక్తి మూలంఅని చెబుతుంది. “అహం రాష్ట్రం సంగమనీ…”హక్కుల పోరాటానికి ఇది అంతర్గత బలం.సమానత్వం – దయ కాదు, సత్యం. వేదీయ మూలం- వాక్ సర్వవ్యాప్తం. అందరిలో ఒకే చైతన్యం. ఆధునిక ఉద్యమంలో – Equal pay. Equal opportunity. Anti-discrimination laws. సమానత్వంఅభ్యర్థనకాదు —నైతిక సత్యం.వేదీయ సంప్రదాయంలో:ఋషికలు గృహిణులు, తపస్వులు, మేధావులు. ఒకే మోడల్ కాదు. ఆధునిక Intersectional Feminismకిభారతీయ సమాంతర భావం కనిపిస్తుంది. ఇదేహింస – మాటల నుంచే మొదలవుతుంది. వేదీయ దృష్టి-వాక్ = శక్తి. దుర్వాక్యం = హింస. ఆధునిక ఉద్యమంలో – Online abuse. Moral policing. Victim shaming. ఉద్యమాలకు వేదీయ మద్దతు:మాటల సంస్కరణ అంటే సామాజిక సంస్కరణ. ఉద్యమాలకు సాంస్కృతిక న్యాయబలం. భారతదేశంలో తరచూ వినే వాదన:“ఇది మన సంస్కృతికి విరుద్ధం”. వేదీయ సమాధానం. వాగాంభృణి, గార్గీ, మైత్రేయిమహిళా ఉద్యమాలుసంస్కృతికి వ్యతిరేకం కాదు. వేదాలను మహిళా ఉద్యమాలకు వ్యతిరేకంగా మాత్రమే చూడడం ఒక దృష్టికోణం అయితే, వాటిలోని శక్తి–వాక్ తత్త్వాలను సమకాలీన సమానత్వ చర్చలకు మద్దతుగా పునర్వ్యాఖ్యానించడం మరో దృష్టికోణం.సంస్కృతి యొక్క మూలానికి తిరిగివెళ్లడం.పరిమితి – నిజాయితీ. వేదీయ తత్త్వంసిద్ధాంత బలం ఇస్తుంది. కానీ చట్టాలు, విధానాలు అవసరం.
తత్త్వం + చట్టం + ఉద్యమం= సామాజిక మార్పు. వేదీయ తత్త్వంలో కనిపించే శక్తి, వాక్, ఋషికల స్వరాలు ఆధునిక మహిళా ఉద్యమాలకు సాంస్కృతిక-తాత్విక మద్దతుగా పునర్వ్యాఖ్యానించవచ్చు.వేదాల లోతైన మానవతా తత్త్వానికి సమకాలీన స్వరూపం.

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరాభవ ఉగాది

by Beeram Sunder Rao March 19, 2026
written by Beeram Sunder Rao

ప్రాభవమ్ము తప్ప “పరాభవ” మ్ము లేని

వెలుగు పండుగ కావలె తెలుగు వత్స

రాది; భారత ప్రజలెల్ల ప్రగతి మార్గ

మందు, సకల శుభమ్ములు నందవలెయ

ఆత్మీయులందరికీ ఉగాది పర్వదిన శుబాకంక్షలు

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us