ఎర్రోజు వెంకటేశ్వర్లు బ్లాక్ బోర్డ్ కవిత కవిత్వం ఓ విశ్లేషణ
ప్రముఖ కవి,తెలుగు శాఖా అధ్యక్షులు, ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల, నగునూరు,ఎర్రోజు వెంకటేశ్వర్లు కలం నుండి జాలువారిన బ్లాక్ బోర్డ్ కవితా సంపుటిలోని బ్లాక్ బోర్డు కవిత పై విశ్లేషణా వ్యాసం.కవి వెంకటేశ్వర్లు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.కవి పాఠశాలలో బుడి బుడి నడకల పిల్లల అల్లరిని చూసినారు.పిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటలను ఆహ్లాదకరంగా విన్నారు.కల్లా కపటం ఎరుగని చిన్నారి పిల్లలకు బోధిస్తూ మాటలలో చెప్పలేని గొప్ప అనుభూతిని పొందారు. పిల్లల లోకంలో విహరించడం ఎవరికైనా సంతోషంగా ఉంటుంది.పిల్లలకు చదువు సంస్కారాన్ని అందించే గొప్ప పాఠశాల అనే ప్రపంచంలో పని చేశారు.బ్లాక్ బోర్డ్ పై విద్యార్థులకు ఎంతో ఆసక్తితో బోధించాడు.పిల్లలకు చదువు నేర్పే క్రమంలో తనలో కలిగిన స్పందనకు అక్షర రూపం ఇచ్చాడు.బ్లాక్ బోర్డు కవితలో విద్య యొక్క శక్తి, సృజనాత్మకత,జ్ఞానం అందించే వెలుగు సమాజం మార్పు చెందడానికి పాఠశాల ఎంత ముఖ్యమో తెలియజేసారు.బ్లాక్ బోర్డ్ విద్యార్థుల భవిష్యత్తుకు కాంతినిచ్చే దీప స్తంభంలా ఉంది అని కవి భావోద్వేగంతో ప్రకటించారు.కవి వెంకటేశ్వర్లు తన కవిత్వం ద్వారా విద్యా బోధనలో బ్లాక్ బోర్డు యొక్క పాత్రను సమాజానికి చాటిచెప్పారు.
“నల్ల రంగు శుభం కాదంటారు కొందరు/నల్ల మట్టిలో తెల్ల బంగారంలా/నల్లబల్ల మాత్రం మంచినే పంచుతుంది/అంటున్నారు.ఈ కవితా పంక్తులు నల్ల రంగు గురించి ఉన్న సామాన్య అభిప్రాయాలను విభిన్నంగా చూపుతున్నాయి.బ్లాక్ బోర్డు తరగతి గదిలో ఉపాధ్యాయులు రాసే నల్లబల్ల.ఇది విద్యా బోధనకు సాధనంలా నిలుస్తుంది. ఉపాధ్యాయుడు నల్లబల్ల ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తాడు.కొంత మంది నల్ల రంగును శుభం కాదని నమ్మడం గురించి చెప్పబడింది.మన సమాజంలో నల్ల రంగు గురించి కొన్ని లేనిపోని అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ సమాజంలో నల్ల రంగును దురదృష్టం, అశుభం అని భావించే వారు ఉన్నారు.శుభ కార్యాలు,పండుగలు వంటి సందర్భాల్లో నల్ల రంగును దూరం పెట్టే పద్ధతి ఉంది.కానీ,వాస్తవానికి నల్ల రంగు చెడ్డది కాదు. నల్ల మట్టి పోషక పదార్థాలతో నిండిన భూమి.మనం విత్తనాలు నాటిన నేల కూడా సాధారణంగా నల్లగా ఉంటుంది.నల్లరేగడి నేలలో విస్తారమైన పంటలు పండుతాయి. నల్ల మట్టిలో పండే పంటలు మనకు బంగారంలాంటివే.అందుకని నల్ల రంగు మన జీవనానికి ఎంతో ప్రధానం అని భావించవచ్చు.
నల్లబల్ల మాత్రం మంచినే పంచుతుంది. నల్లబల్లపై ఉపాధ్యాయులు రాసి విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తారు.నల్ల బల్ల విద్య,జ్ఞానం మరియు వికాసాన్ని అందిస్తుంది.కాబట్టి నల్ల బల్ల మనకు మంచిని నేర్పే సాధనం.నల్ల రంగును అశుభంగా భావించే వారు ఉన్నప్పటికీ నల్ల మట్టి, నల్లబల్ల మంచినే అందిస్తాయి.నల్ల మట్టిలో విలువైన పంటలు పండుతాయి.నల్లబల్ల జ్ఞానాన్ని పంచుతుంది.నల్ల రంగు పవిత్రత,ప్రయోజనం, విజ్ఞానం పంచే రంగు అనే మెరుగైన సందేశం ఇందులో ఉంది.నల్లబల్లపై వ్రాసిన తెల్లని అక్షరాలు విద్యార్థుల లేలేత మనస్సులలో వెలుగుని నింపుతాయి.ఇది అంధకారం మీద వెలుగుకి లభించిన విజయం అనే గొప్ప సందేశం. గురువు నల్లబల్లపై ద్వారా అందించే విద్యా బోధన వల్ల విద్యార్థుల జ్ఞానం పెరుగుతుంది.బ్లాక్ బోర్డు విద్యకు ద్వారం, జ్ఞానానికి వేదిక అని భావించాలి.నల్లబల్ల మనకు చెప్పే పాఠం ఏమిటి?ఒక వస్తువుకి రంగు, రూపం ముఖ్యం కాదు.దాని ఉపయోగమే ముఖ్యం. నల్ల రంగు శుభం కాదనే అజ్ఞానాన్ని వీడాలి.నల్ల రంగు కూడా వెలుగును పంచగలదు అనే జ్ఞానాన్ని పెంచుకోవాలి.నల్లబల్ల మనకు మంచినే పంచుతుంది అనే లోతైన భావాన్ని ఇస్తుంది.ఇది తరతరాలుగా సమాజంలో నల్ల రంగు పట్ల నెలకొన్న మూఢ నమ్మకాన్ని తుడిచి వేస్తుంది.నల్లరంగు జ్ఞానానికి ఆధారం.జ్ఞానమే జీవితానికి వెలుగుని ఇస్తుంది.

“సుద్ద ముక్కల జ్ఞానామృత బిందువుల్ని/ విద్యార్థుల మేధో క్షేత్రంలో/నీల మేఘమై నిరంతరం వర్షిస్తుంది/అంటున్నారు.సుద్ద ముక్కలు ఇక్కడ శుద్ధత,పవిత్రతను సూచిస్తాయి.జ్ఞానం అనేది అమృత బిందువులతో పోల్చి బడింది.శుద్ధమైన జ్ఞాన బిందువులు విద్యార్థుల మేధస్సు అనే బుద్ధి భూమిలో ఎప్పటికీ ఆగకుండా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి.జ్ఞానం వాన వలె ఎప్పటికీ కురుస్తూ విద్యార్థుల మేధస్సును అభివృద్ధి మార్గంలో పయనింపజేస్తుంది.జ్ఞానం ఒక పవిత్రమైన వానలా విద్యార్థుల బుద్ధి క్షేత్రంలో నిరంతరం కురుస్తూ వారికి అర్హతను,ఆలోచనా శక్తిని,విజ్ఞానాన్ని లభించేలా చేస్తుంది.గురువు విద్యా బోధనలో భాగంగా విద్యార్థుల మేధస్సులో జ్ఞానాన్ని కురిపించి విజ్ఞానాన్ని పెంచుతాడు.విద్యార్థులు క్షేత్రం లాంటి వారు.గురువు నీల మేఘం లాంటి వారు.జ్ఞానం అమృత బిందువుల వర్షం లాంటిది.దాని ఫలితంగా విద్యార్థి మేధస్సు సారవంతమై అభివృద్ధి చెందుతుంది. శశిగురువు జ్ఞాన ప్రదాతగా ఎంతో గొప్ప వాడు అనే భావం వ్యక్తం అవుతుంది. గురువు తన విద్యా బోధనతో విద్యార్థుల మేధస్సులో పవిత్రమైన జ్ఞానాన్ని నిరంతరం నింపుతూ వారిని మేధావులుగా తయారు చేస్తున్నాడు.
“క్లాస్ ఎంత క్లాస్ గా ఉన్నా/బ్లాక్ బోర్డు సరిగ్గా లేకుంటే/గురు శిష్యులను కలిపే వంతెన కూలినట్లే మరి/అంటున్నారు. తరగతి గది ఎంతో శుభ్రంగా,ఆధునికంగా, అందంగా,అన్ని సౌకర్యాలతో ఉన్నా అది కేవలం బయటికి కనిపించే రూపం మాత్రమే. బోధనకు కావల్సిన వాతావరణం ఉన్నా అది మాత్రమే సరిపోదు.
తరగతి గదిలో గరిష్టంగా ఉపయోగపడే బ్లాక్ బోర్డు పని చేయక పోతే,దానిపై వ్రాతలు సరిగా కనిపించకపోతే,రాయడానికి బోర్డు సహకరించకపోతే బోధనలో లోపం వస్తుంది.బ్లాక్ బోర్డు అనేది గురువు తన ఆలోచనలను,ఙ్ఞానాన్ని శిష్యులకు అందించే మాధ్యమం.అది సరిగా లేకపోతే గురువు బోధనను పూర్తిగా వ్యక్తపరచ లేడు.బ్లాక్ బోర్డు ఉపాధ్యాయుడు బోధించే పాఠాలను విద్యార్థులకు చేరవేయడానికి ఉపకరించే ప్రధాన సాధనం.బ్లాక్ బోర్డు చెడి పోయి ఉంటే,దాని మీద రాసినది స్పష్టంగా కనిపించక పోతే అది వాడటానికి వీలు కాకుండా ఉంటే బోధనలో పరిపూర్ణత ఉండదు.
బ్లాక్ బోర్డు అనేది గురు శిష్యులను వంతెన లాంటిది.ఆ వంతెన బలహీనంగా ఉంటే బోధనలో అనుసంధానం తెగి పోతుంది.బ్లాక్ బోర్డు కేవలం ఒక పరికరం మాత్రమే కాదు.అది గురువు శిష్యుల మధ్య అనుసంధానం కలిగించేది.గురువు బోధించే అంశాలను బ్లాక్ బోర్డు మీద రాసి చూపిస్తే శిష్యుడు సులభంగా గ్రహిస్తాడు.బ్లాక్ బోర్డు ఒక వంతెన లాంటిది.ముఖ్య సాధనం అయిన బ్లాక్ బోర్డు లేకపోతే గురు శిష్యుల మధ్య ఉన్న అనుబంధం, జ్ఞాన ప్రసారం ఆగిపోతుంది.ఒక విద్యా వ్యవస్థలో బాహ్య సౌకర్యాల కంటె చదువును అందించడానికి మూలమైన బోధనా పరికరాల ప్రాధాన్యం ఎక్కువ. జ్ఞానాన్ని చేర వేయడంలో సహకరించే బ్లాక్ బోర్డు వంటి ముఖ్యమైన సాధనం లేకపోతే ఎంతో విలాసవంతమైన తరగతి గదులు ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.విద్యలో బోధనకు ఉపయోగపడే బ్లాక్ బోర్డు సాధనం అసలైన వంతెన.అదే గురు శిష్యుల సంబంధాన్ని బలపరుస్తుంది. బోధనలో పాఠశాలలోని ఇతర సౌకర్యాల కన్నా బ్లాక్ బోర్డు వంటి సాధనాలకు ప్రాధాన్యం ఎక్కువ అని ఈ కవితా పంక్తులు తెలియ జేస్తున్నాయి.
“తరగతి కనుగుడ్డుకు రెటీనా/దీర్ఘ చతురస్రాకారపు నీలి పలక/శిష్య సుమాల మాలకు సూత్రం/ విద్యార్థికి,గురువుకి మూడో కన్ను/అంటున్నారు.ఈ పంక్తులలో తరగతి గదిని ఒక కంటిగా ఊహించారు. కనుగుడ్డులో రెటీనా ఎలా కాంతిని స్వీకరించి దానిని బుద్ధికి పంపుతుందో,అలానే తరగతి గది విద్యార్థులు జ్ఞానాన్ని స్వీకరించే ప్రదేశం.రెటీనా మన దృష్టి చిత్రాన్ని స్పష్టంగా చూపించే ముఖ్యమైన భాగం.ఇక్కడ తరగతి గదిని విద్యార్థి దృష్టికి జ్ఞానాన్ని అందించే రెటీనాతో పోల్చారు.విద్యార్థి జ్ఞానానికి,ఆలోచనలకు రూపం ఇచ్చేది తరగతి గది అనడంలో సందేహానికి తావు లేదు.
సాధారణంగా బోర్డు/పలక నలుపు,నీలి రంగులో దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది.నీలిపలక పాఠంను విద్యార్థికి అందించే సాధనం.విద్యార్థికి స్పష్టమైన బోధనను అందించే అద్దం వంటిది.నీలి పలక మీద రాసే విషయాలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తాయి.
ఇక్కడ శిష్యులు అనే పూలను గురువు దండలాగా కూర్చడానికి ఉపయోగపడే దారం వంటిది ఈ నీలి పలక.విద్యార్థులు జ్ఞాన సుమాలు.ఒక్కొక్కరు వేరు వేరుగా ఉండ వచ్చు.గురువు బోధనతో శిష్య సుమాలను మాలగా కూర్చి అందంగా తీర్చిదిద్దుతాడు.గురువు బోధనతో విద్యార్థులకు నిరంతరం జ్ఞానాన్ని కురిపిస్తూ,సరియైన మార్గాన్ని చూపుతాడు.
మూడో కన్ను అనగానే అది సాధారణంగా జ్ఞాన నేత్రం.విద్యార్థికి మూడో కన్ను అనగా అది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించేది.విద్యార్థికి గురువు ఇచ్చే జ్ఞానం మూడో కన్ను లాంటిది.అది కేవలం చూసే కన్ను కాదు,లోతైన బుద్ధి,వివేకం,లోక దర్శనం ప్రసాదించే కన్ను అని తెలియ వస్తున్నది.
తరగతి గదిని ఒక కంటి రెటీనాతో,విద్యను జ్ఞాన కాంతిగా భావిస్తూ పోల్చారు.ఈ కవితా పంక్తులు విద్యా ప్రాధాన్యతను,గురువు,విద్యార్థుల సంబంధాలను చక్కగా చెప్తాయి.తరగతిగది జ్ఞాన దృష్టి,బ్లాక్ బోర్డు ఆ జ్ఞానదృష్టిని సుస్పష్టం చేసే పటం లాంటిది. విద్యార్థులలోని వ్యక్తిగత ప్రతిభను ఒక మాలగా కట్టేది గురువు.చివరికి గురువు మూడో కన్ను ద్వారా విద్యార్థికి నిజమైన జ్ఞాన దృష్టిని అందిస్తాడు.
“బ్లాక్ బోర్డు చాక్ పీసులు/భార్యాభర్తల్లా కలిసుంటేనే/విద్యాసంసార సాగరం ఒడ్డుకు చేరుకునేది/అంటున్నారు.బ్లాక్ బోర్డుపై ఒక చాక్ పీసు ముక్కతోనే పాఠం చెప్పడం సాధ్యం కాదు.ఒక చాక్ పీసు,మరొక చాక్ పీసు,తరువాత ఇంకొక చాక్ పీసు కలిసి ఉపయోగించాలి.చాక్ పీసు ముక్కలు ఒక్కదానితో ఒకటి తోడుగా ఉంటేనే గురువు నిరంతరం పాఠాలను బోధించ గలడు.ఇక్కడ బ్లాక్ బోర్డు,చాక్ పీసులు కలిసి ఉండాలి కాబట్టి భార్యాభర్తలుగా పోల్చారు.జీవితంలో సంసారం అనే ప్రయాణం విజయవంతంగా సాగడానికి భార్యాభర్తల అన్యోన్యత ముఖ్యం.ఇదే విధంగా భార్యాభర్తలు కూడా కలిసిమెలిసి ఉంటేనే జీవితం చక్కగా కొనసాగుతుంది.సంసారం చక్కగా సాగడానికి భార్య ఒక్కరితో సరిపోదు,భర్త కూడా తోడుగా ఉండాలి. బ్లాక్ బోర్డు,చాక్ పీసులు కలిసి ఉంటేనే విద్యాసాగరం అనే పెద్ద ప్రయాణం చక్కగా సాగడానికి దోహదపడుతుంది.కలిసి ఉండడం, పరస్పరం తోడ్పడడం,ఐక్యత, జీవితంలో విజయ సాధనకు ఎంతో అవసరం.బ్లాక్ బోర్డు,చాక్ పీసులు కలిసి ఉంటేనే బోధన సాధ్యం అవుతుంది. భార్యాభర్తలు కలిసి ఉంటేనే జీవిత సంసార సాగరం పూర్తి అవుతుంది.భార్యాభర్తలు ఒకరికి మరొకరు అండగా ఉండి తోడ్పాటును అందించాలి. భార్యాభర్తలు కలిసి లేకపోతే జీవన ప్రయాణం చక్కగా సాగక మధ్యలో నిలిచిపోతుంది.బ్లాక్ బోర్డు లేకుండా చాక్ పీసులు వృధా.బ్లాక్ బోర్డు చాక్ పీసులు రెండు కలిసి ఉంటేనే బోధన సాధ్యం అవుతుంది.భార్యాభర్తలు విడిగా ఉంటే జీవితం పరిపూర్ణం కాదు. భార్యాభర్తలు కలిసి సుఖదుఃఖాలు పంచుకుంటూ నడిస్తేనే జీవన సాగరం సాఫల్యంగా ముగుస్తుంది.సంసారంలో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోతే జీవితం అసంపూర్ణం అవుతుంది.

“అమ్మ పాలు తాగని పిల్లలుంటారేమోగాని/ బోర్డుపై అక్షరాలు …/చదవని అక్షరాస్యులుంటారా!?/ అటెండర్ కైనా …… ఐఏఎస్ కైనా దిక్సూచి ఇదే/ అంటున్నారు.తల్లి పాలు శిశువు శారీరక,మానసిక వికాసానికి తోడ్పడుతాయి.చిన్న పిల్లలు వృద్ధి చెందడానికి తల్లి పాలు ఎంతో అవసరం.తల్లి పాలు సహజమైనవి.కొందరు పిల్లలు ఏవో కొన్ని కారణాలవల్ల తల్లి పాలు తాగకపోవచ్చు.ఇక్కడ తల్లి పాలు జీవనానికి పునాది అని తెలుపుతుంది. విద్య అందుబాటులో లేనందు వల్ల చదువుకోని వారు,అక్షరాలు తెలియని వారు ఎప్పుడూ ఉంటారు.ఇది విద్యలో వెనుకబడిన వాస్తవాన్ని ఎత్తి చూపుతోంది. ఈనాటి మన సమాజంలో ఇప్పటికీ చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు.కానీ, చదువు మనిషికి అత్యవసరం.
చిన్న ఉద్యోగం చేసే అటెండర్ అయినా,పెద్ద స్థాయి ఉద్యోగి కలెక్టర్ అయినా వారందరికీ సరైన దారిని చూపేది విద్య.మనిషి స్థాయి ఏమిటి?ఉద్యోగంలో స్థాయి ఏమిటి?అనే తేడా లేకుండా చదువు జీవితానికి మార్గదర్శనం చేస్తుంది.ఇక్కడ జీవితానికి దిశ చూపేది విద్య.తల్లి పాలు శరీరానికి ఎంత ముఖ్యమో,చదువు మనిషి జీవితానికి అంత కంటే ముఖ్యం అని చెబుతోంది.పిల్లల పెంపకానికి తల్లి పాలు ఎంత అవసరమో చదువు మనిషి జీవితానికి అంతే ముఖ్యం.శారీరక,మానసిక వికాసానికి విద్య అత్యంత అవసరం.విద్య లేకుంటే మనిషి అజ్ఞానాంధకారంలో ఉండిపోతాడు.విద్య మనిషికి దారిని చూపిస్తుంది.చదువు అనే దిక్సూచి మనిషి జీవితానికి ఎంతో అవసరం.ఎవరికి అయినా,ఏ స్థాయిలో ఉన్న వారికైనా జీవితాన్ని నిర్మించేది,దిశ చూపేది విద్య మాత్రమే అని ఈ కవితా పంక్తులు తెలుపుతున్నాయి.
“బోర్డు చెవిని చాక్ పీసుతో పిండితే/నోరు తెరిచి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది/అ ఆ ల్నైనా …అనంత విశ్వ రహస్యాల్నైనా/ అరటిపండు ఒలిచినట్లు చెప్తుంది/అంటున్నారు.ఇక్కడ బోర్డుకు చెవి ఉన్నట్లు చెప్పారు.చాక్ పీస్ ముక్కతో బోర్డుపై రాయడాన్ని చెవిని పిండినట్లు చెప్పినాడు. బోర్డు మనకు ఏమి చెప్పదు కాని సూచిస్తుంది.బోర్డు మీద చాక్ పీసుతో రాసినప్పుడు ఆ బోర్డు నోరు తెరిచినట్లుగా అనిపిస్తుంది.అనేక విషయాలను ఒక విశ్వరూపంలాగా మన ముందు ఉంచుతుంది.బోర్డు మీద రాసిన అక్షరాలలో అపారమైన జ్ఞానాన్ని, ఆలోచనల్ని,విశ్వ రూపాన్ని మనకు చూపిస్తుంది.
బోర్డు మీద రాసిన అ,ఆ వంటి చిన్న చిన్న అక్షరాల ద్వారా ప్రాథమిక బోధనను,విశ్వ రహస్యాలను, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలను మొదలైన వాటిని బోర్డు మనకు అందిస్తుంది.ఎంతటి క్లిష్టమైన విశ్వ రహస్యాలనైనా చాలా సులభంగా, సరళంగా బోర్డు మనకు చెబుతుంది. అరటిపండు తొక్క తీయగానే లోపల మృదువైన ఫలం ఉన్నట్లు,బోర్డు మీద చాక్ పీసుతో రాసిన వెంటనే జ్ఞానం కూడా సులువుగా మనకు బోధపడుతుంది.చాక్ పీసుతో రాసే బోర్డు మనకు అక్షరాల నుంచి విశ్వ రహస్యాల వరకు అన్నింటిని సులువుగా నేర్పగలిగే అద్భుతమైన ఉపాధ్యాయుని సాధనం.ఇది ఒక గురువు బోధనా శక్తిని మరియు జ్ఞాన సులభతను ప్రతిబింబిస్తుంది.ఈ కవితా పంక్తులు బోర్డును సాధారణ వస్తువుగా కాకుండా జ్ఞానం,బోధన,విద్యకు నిలయమైనట్టిదిగా చూపిస్తున్నాయి.బోర్డు లేకుండా తరగతి గదిని ఊహించలేం.బోర్డుపై చాక్ పీసుతో రాయగానే అది మౌనం విడిచి విశ్వాన్ని ఆవిష్కరిస్తుంది.చిన్న అక్షరాల నుండి మహత్తరమైన శాస్త్రాల వరకు ఒకే వేదికపై బోర్డు సులభంగా అందిస్తుంది.బోర్డు అనేది ఒక అద్భుతమైన జ్ఞాన ద్వారం.అది మౌనంగా కనిపించినా చాక్ పీసు తాకినప్పుడల్లా అది విశ్వాన్ని చూపించే మహాశక్తిగా మారుతుంది. బోర్డుకు నిజంగా చెవి ఉండదు.గురువు చాక్ పీసుతో తాకితే చాలు బోర్డు మాట్లాడుతుంది అనే భావాన్ని ఈ కవితా పంక్తులు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ బోర్డు విద్యావేదిక.బోర్డు సాధారణంగా మౌనంగా ఉండే వస్తువు. కానీ,అట్లాంటి బోర్డు చాక్ పీసు తాకగానే అది మాట్లాడే శక్తిని పొందుతుంది. ఈ విరుద్ధాభాసమే కవిత్వ సౌందర్యం.విద్యా బోధనలో చిన్న అ,ఆ లాంటి అక్షరాలు ప్రాథమిక విషయాలు,విశ్వ రహస్యాలు, బోర్డు అనే సాధారణ వేదిక ద్వారానే వ్యక్తం అవుతాయి.బోర్డు అనేది కేవలం ఒక బ్లాక్ బోర్డు మాత్రమే కాదు.అది జ్ఞాన విశ్వాన్ని మన కళ్ళ ముందు ఉంచే అద్భుతమైన శక్తి.ఈ కవితా పంక్తులలో బోర్డు జ్ఞానాన్ని ప్రసవించే తల్లిలా,చాక్ పీసు ఒక ప్రేరణ కర్రలా,జ్ఞానం ఒక విశ్వరూపంలా పోల్చి చూపబడినాయి.
“బోర్డు దేహమ్మీది సుద్ధ ముక్క దస్తూరి/సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణాలే/తరగతి గదిలో సంజీవని/విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసే డ్రాయింగ్ పేపర్/ అసమానతల్ని తొలగించే రాజ్యాంగం/ప్రశ్నించే తత్వాన్ని నేర్పే గురువు/దీనిపై రాసే రాతల్ని అర్థం చేసుకొని అనుసరిస్తే/గ్రహాలు కూడా తలవంచుతాయి/విశ్వపు బంతి గ్లోబును వేలిపై తిప్పుకోవచ్చు/అంటున్నారు.బోర్డు విద్యార్థుల జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగినది అని ప్రతీకాత్మకంగా వివరిస్తున్నారు.ఒక సాధారణ బ్లాక్ బోర్డును కవి అత్యంత విలువైనదిగా చూపించారు. బోర్డు చదువుకు ఉపయోగించే పరికరమే.కానీ, దీనిని జ్ఞానం,సమానత్వం,సృజనాత్మకత, ప్రశ్నించే తత్వాన్ని నేర్పే గురువు అనే అంశాలను తీసుకున్నారు.
బోర్డు మీద రాసే చాక్ పీసు రాతలను, ఇక్కడ సుద్ధముక్క దస్తూరిని,సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణంగా పోల్చారు.బోర్డు మీద రాసే అక్షరాలు నాజూకు,అందం,సృజనాత్మకత, కళాత్మకతను ప్రతిబింబిస్తుంది.కవి బోర్డు మీద రాసిన అక్షరాలు, వెండి తీగలను అల్లి చేసిన తేలికైన,సున్నితమైన కళాత్మకమైన ఆభరణాల వంటివి,విలువైనవి అని సూచిస్తున్నారు.
తరగతి గదిలో బోర్డు ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది.తరగతి గది విద్యార్థుల అభ్యాస కేంద్రం.గురువు బోధన విద్యార్థుల్లో జ్ఞానాన్ని, చైతన్యాన్ని నింపే సంజీవనిలా ఉంటుంది.గురువు కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే వాడు మాత్రమే కాదు.గురువు ప్రేరణ,విలువలు, నైతికత,జీవన పాఠాలు అందించే వ్యక్తి.గురువు బోధన వల్ల విద్యార్థుల ఆలోచనా విధానం,ప్రవర్తన వ్యక్తిత్వం పై గొప్ప ప్రభావం చూపుతుంది.తరగతి గదిలో మంచి బోధన విద్యార్థులను ఆలోచించేలా, ప్రశ్నించేలా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతుంది. గురువు పాఠాన్ని రసవత్తరంగా ఆసక్తికరంగా చెప్పడం వల్ల విద్యార్థులు కుతూహలంతో నేర్చుకుంటారు. విద్యార్థులు చదువులోనే కాదు, జీవితంలోను ఎదగడానికి ప్రేరణ పొందుతారు.గురువుల బోధన వారిలో ఆత్మవిశ్వాసాన్ని,నైతిక బలాన్ని,సామాజిక బాధ్యతను పెంచుతుంది.మంచి గురువులు తయారుచేసే విద్యార్థుల వల్లే సమాజం అభివృద్ధి చెందుతుంది.తరగతి గది నుంచి వెలువడే జ్ఞానం నిజంగా సంజీవని లాంటిదే.గురువు బోధన విద్యార్థుల జీవితంలో జ్ఞానానికి,మానవత్వానికి, విలువలకు ప్రాణం పోసే సంజీవని అని చెప్పవచ్చు. విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు చెప్పే విషయాన్ని విద్యార్థికి సులభంగా,స్పష్టంగా అందించే సాధనం బోర్డు.బోర్డు లేకుండా బోధన పూర్తిగా జీవం లేని దానిలా మారుతుంది.అందుకే దాన్ని సంజీవనితో పోలుస్తారు.ఉపాధ్యాయుడు చెప్పే మాటలు కాకుండా వాటికి దృశ్య రూపం ఇచ్చేది బోర్డు.బోర్డుపై క్లిష్టమైన విషయాలను,సులభంగా అర్థమయ్యేలా, చిత్రాలు,పట్టిక రూపంలో చూపవచ్చు. బోర్డు వలన విద్యార్థుల ఏకాగ్రత,జ్ఞాపకశక్తి పెరుగుతుంది.బోర్డు ఒక సజీవ సాధనం.ఇది బోధనకు ఉత్సాహం, కాంతి,స్పష్టత తీసుకొస్తుంది.చిన్న విషయాల నుండి పెద్ద సిద్ధాంతాల వరకు అన్నింటిని బోధించగలిగే గొప్ప సాధనం బోర్డు.ఇది బోధనను,అభ్యాస ప్రక్రియను సజీవం చేస్తుంది.బోర్డును విద్యార్థులకు విజ్ఞానం చేరవేసే సులభమైన సాధనంగా చెప్పవచ్చు.అందువల్ల దానిని సంజీవని అని పిలుస్తారు.ఉపాధ్యాయుడు చెప్పే విషయాలను బోర్డు మీద రాయడం ద్వారా విద్యార్థులకు స్పష్టంగా అర్థం అవుతుంది.బోర్డు మీద చిత్రాలు,పట్టికలు చూపించడం వల్ల విద్యార్థులకు విషయాలు బలంగా గుర్తుంటాయి.బోర్డు మీద రాయబడినది చూసే క్రమంలో విద్యార్థులు ఏకాగ్రతతో పాఠాన్ని ఆసక్తిగా వింటారు. బోర్డు ఉపాధ్యాయుని బోధనకు జీవం పోస్తుంది.విద్యార్థులలో జ్ఞానాన్ని పెంచుతుంది.
బోర్డ్ ఒక డ్రాయింగ్ పేపర్ లా ఉంటుంది. డ్రాయింగ్ పేపర్ కేవలం చిత్రాలను గీయడానికి ఉపయోగించే పేపర్ మాత్రమే కాదు.ఇది విద్యార్థుల్లో దాగి ఉన్న ఆలోచనలను,ఊహా శక్తిని వెలికి తీసే సాధనం. సృజనాత్మకతకు వేదిక.డ్రాయింగ్ పేపర్ మీద విద్యార్థులు తమ ఊహల్లో కనిపించే దృశ్యాలకు, స్వేచ్ఛగా రూపం కల్పిస్తారు.విద్యార్థులను కేవలం పుస్తకాలలోని పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం చేయకుండా వారి కొత్త ఆలోచనలకు ప్రాణం పోయాలి.మాటలలో చెప్పలేని భావాలను చిత్రాల ద్వారా సులభంగా వ్యక్తపరచ వచ్చు.డ్రాయింగ్ పేపర్ అనే బోర్డు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడానికి, ఆలోచనలను రూపకల్పన చేయటానికి భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడే ముఖ్యమైన సాధనంగా భావించవచ్చు.కళ అనేది కళ కోసం మాత్రం కాదు.అది విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలి.అందులో విద్యార్థుల ఆలోచనలు,గురువు బోధనలు రూపం దాలుస్తాయి.
బోర్డు మీద రాసే జ్ఞానం రాజ్యాంగం వలె సమానత్వం నేర్పుతుంది.అందరికీ సమాన అవకాశాలు కల్పించే మార్గం చూపుతుంది. రాజ్యాంగం సమానత్వం,న్యాయం,సత్యం బోధించే సాధనం.విద్యా రంగంలో ఉన్న అసమానతలను తొలగించడం కోసం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నిబంధనలు మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 – A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసుగల ప్రతి పిల్ల వాడికి ఉచిత విద్య తప్పనిసరిగా అందించాలి. పిల్లలకు ప్రాథమిక విద్య హక్కుగా కల్పించబడింది. విద్య అందరికీ సమానహక్కు అని రాజ్యాంగం ప్రకటించింది.అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
బోర్డు మీద రాసే రాతల ద్వారా గురువు విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంచుతాడు.బోర్డు మీద బోధించే గురువు ప్రశ్నించమని ప్రేరేపించే తత్వవేత్త.విద్యార్థుల విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించేలా ప్రోత్సహిస్తాడు.
బోర్డు మీద రాసిన అక్షరాల జ్ఞానాన్ని గ్రహించి దాన్ని జీవితంలో అనుసరిస్తే విద్యార్థి విశ్వాన్ని జయించే స్థాయికి ఎదుగుతాడు.జ్ఞానంతో మనిషి విశ్వాన్ని జయించగలడు.గురువు బోధించే జ్ఞానం, పాఠాలు,బ్లాక్ బోర్డు మీద రాసిన అక్షరాల రూపంలో ఉంటాయి.ఇవి కేవలం అక్షరాలు మాత్రమే కాకుండా జీవితాన్ని మార్చే మార్గదర్శకాలు.గురువు బోర్డు మీద రాసిన అక్షరాలు కేవలం చదవడంతో సరిపోదు. వాటి లోతైన అర్ధాన్ని గ్రహించి ఆచరణలో పెట్టడం అవసరం.గురువు అందించే జ్ఞానం,కేవలం పుస్తకాలకు పరిమితం కారాదు.అది విద్యార్థుల ప్రవర్తనలో, జీవితంలో కనిపించాలి అనే సందేశాన్ని అందించడం జరిగింది.ఈ కవితా పంక్తులు జ్ఞానం, విద్య యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాయి.విద్య వల్ల మనిషి వివేకం పెరుగుతుంది.జ్ఞానం,శ్రమ,ఆచరణల వల్ల గ్రహాలు కూడా తలవంచుతాయి.విద్యకు జీవితాన్ని మార్చ గల శక్తి ఉంది.గురువు బోధించే పాఠాలను చక్కగా నేర్చుకోవాలి.విద్యార్థులు కేవలం పాఠాలను చదివి వదిలివేయ వద్దు.అందులోని సారాన్ని అర్థం చేసుకోవాలి.గురువు బోధనలను జీవనంలో అమలు చేస్తే మనిషి ఎదుగుదలకు ఎవరు అడ్డు నిలవలేరు.విధి,అదృష్టం,గ్రహ స్థితి అన్ని జ్ఞానానికి లోబడి ఉంటాయి.
ఇక్కడ గ్లోబు అంటే భూమి బంతి.ఇది మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని సూచిస్తుంది. చిన్న బంతిలా కనిపించే గ్లోబు లోపల మనిషి జీవన రహస్యాలు,దేశాలు.సముద్రాలు,పర్వతాలు, సరిహద్దులు అన్ని నిక్షిప్తమై ఉంటాయి.గ్లోబు చిన్న బంతి రూపంలో ఉంటే దానిని సులభంగా వేలుతో తాకుతూ తిప్పుకోవచ్చు.గ్లోబు ద్వారా ప్రపంచమంతా మన కళ్ళ ముందే ఉన్నట్లుగా అనిపిస్తుంది.మనిషి జ్ఞానం పెరిగితే ప్రపంచాన్ని తన కంటితోనే చూడగలడు.ఇది విజ్ఞానం,విద్య, అన్వేషణ వాటి శక్తి ఎంత గొప్పదో తెలుపుతున్నది. భూమి ఎంత విస్తారమైనదో విశ్వం ఎంత అపారమైనదో గ్లోబు రూపంలో సులభంగా వేలుతో తాకి తెలుసుకోవచ్చు.విజ్ఞాన శక్తితో విశ్వం కూడా మన వేళ్ళకు లోబడి తిరుగుతుంది.మనిషి ప్రపంచాన్ని అర్థం చేసుకొని తన చేతుల్లోకి తెచ్చుకోవచ్చు.ఈ విధంగా బోర్డు ప్రాముఖ్యతను అద్భుతమైన కవితాత్మక రూపంలో చెప్పబడినది. బోర్డు కేవలం బోధనా సాధనం మాత్రమే కాకుండా విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే జ్ఞాన భాండారం.బోర్డు ద్వారా ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.బోర్డు విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే జ్ఞాన మార్గదర్శి.విద్య ద్వారా సమానత్వం, సృజనాత్మకత,విమర్శనాత్మక ఆలోచనా ధోరణులు పెరుగుతాయి.చివరకు విద్యార్థి విశ్వాన్ని జయించే శక్తిని పొందుతాడు.కవి వెంకటేశ్వర్లు చక్కటి బ్లాక్ బోర్డ్ కవితను అందించినారు.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కవి ఎర్రోజు వెంకటేశ్వర్లు తేది 30 – 06 – 1969 రోజున సామాన్య స్వర్ణకార కుటుంబంలో జన్మించారు.వీరు కంది కట్కూర్ గ్రామం, ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్లకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు రామవ్వ,పాపయ్యలు.వీరి తండ్రి పాపయ్య స్వర్ణకార వృత్తితో పాటు జ్యోతిష్యం చెప్తుండే వాడు.వీరి తండ్రి పాపయ్య రామాయణం, మహాభారతం, హాస్య,జానపద కథలను గ్రామస్తులకు సులభంగా,అర్థమయ్యేలా చక్కగా చెప్పే వారు.వీరి తండ్రి పాపయ్య కథలు చెప్తుండగా వినడం వల్లనో ఏమో చిన్నతనంలోనే కవి వెంకటేశ్వర్లుకి సాహిత్యం,కళల పట్ల ఎనలేని ఆసక్తి ఏర్పడింది.వీరి తండ్రి పాపయ్య తేది 17 – 08 – 1990 రోజున అనారోగ్యంతో ఈ లోకాన్ని వీడిపోయారు.వీరి తల్లి రామవ్వ తేది 12 -10 – 2010 రోజున అనారోగ్యంతో పరమపదించింది.వీరు ప్రాథమిక విద్యను 1వ తరగతి నుండి 5 వ తరగతి,1975 – 1980 ప్రభుత్వ పాఠశాల, కందికట్కూర్ గ్రామంలో చదివారు.బాలకిషన్ సార్ ప్రోత్సాహంతో వీరి తండ్రి 6 వ తరగతిలో వెంకటేశ్వర్లును శ్రీ రాజరాజేశ్వర సంస్కృతాంధ్ర విద్యాలయం,వేములవాడలో చేర్పించారు.వీరు అదే పాఠశాలలో 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 1975 – 1980 విద్యాభ్యాసం చేశారు.వీరు ఇంటర్ మరియు డిగ్రీ విద్యను1985 – 1990 శ్రీ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల, వేములవాడలో చదివారు.వీరు ఎం.ఏ. తెలుగు ఎంట్రెన్స్ టెస్ట్ లో మొదటి ర్యాంకు సాధించి,1990 – 1992, ఉస్మానియా విశ్వవిద్యాలయం,హైదరాబాదులో చదివారు.వీరు ఎం.ఫిల్. డిగ్రీ 1992 -1993 సంవత్సరంలో కేంద్రీయ విశ్వ విద్యాలయం, హైదరాబాద్,సదానంద్ శారద కథలు అనే అంశంపై పరిశోధించి,డిగ్రీని పొందారు.వీరు1995 సంవత్సరంలో బి.ఇడి.డిగ్రీని రాష్ట్రీయ విద్యాపీఠం, తిరుపతిలో పూర్తి చేశారు.వీరు 1994 సంవత్సరంలో ఎం.ఏ. సంస్కృతం, దూరవిద్య ద్వారా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.తిరుపతిలో అభ్యసించారు.వీరు తేది 21 – 09 – 1995 రోజున సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,ఆసిఫాబాద్ లో టీచర్ గా నియమించబడ్డారు.వీరు ఆసిఫాబాద్, మేడిపల్లి,రుక్మాపూర్,హుస్నాబాద్,ఇందారం – జైపూర్,ముథోల్,నిర్మల్ ప్రాంతాలలో పని చేశారు. వీరు ప్రస్తుతం తెలుగు శాఖా అధ్యక్షులుగా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల,నగునూర్ లో పని చేస్తున్నారు.వీరు కళాశాలలో విద్యార్థులకు సాహిత్యం,కవిత,కథా రచన పట్ల ఆసక్తిని పెంపొందింపచేస్తున్నారు.వీరు తేది 20 – 02 – 2006 నుండి 25 – 02 – 2006 వరకు ప్యానెల్ ఇన్స్పెక్షన్ సభ్యునిగా నేషనల్ మాన్స్క్రిప్ట్ సర్వేయర్ గా ఇల్లంతకుంట మండలంలో పని చేసినారు.వీరు ఎన్నో తాళపత్ర గ్రంథాలను సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. కవి వెంకటేశ్వర్లు ముద్రిత రచనలు :
1) బ్లాక్ బోర్డ్ కవితా సంపుటి 2020.
2) యెర్రోజు పసిడి పలుకులు 2020
కవి వెంకటేశ్వర్లు పొందిన పురస్కారాలు:
1.తేది 26 – 01 – 2013 ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.
- తేది 28 – 02 – 2013 తెనాలి వారిచే యలపర్తి ఆంజనేయ శాస్త్రి పురస్కారం లభించింది.
- తేది 12 – 01 – 2023 రోజున కాలువ మల్లయ్య పురస్కారం పొందారు.
- తేది 10 – 07 – 2025 కొనకటి సుభద్ర బాలకిషన్ ట్రస్ట్ వేములవాడ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంను అందుకున్నారు.
5.తేది 14 – 01 – 2007 సారస్వత జ్యోతి మిత్రమండలి,కరీంనగర్ వారిచే ప్రశంసా పత్రం అందుకున్నారు. - తేది 12 – 11 – 2006 పాలకొల్లు వారిచే
కళాలయ విశిష్టత ప్రతిభా పురస్కారం లభించింది.
7.సురభారతి సేవాపీఠం,తిరుపతి వారిచే
సంస్కృతాంధ్ర సాహిత్య రత్న,బిరుదును 2011 సంవత్సరంలో అందుకున్నారు.








