కాల గమనం
రేయింబవళ్ళ సూర్యచంద్రుల
యానం
కాల గమనంలో మలుపులు
కాలక్రమంలో అవి
అదృష్టాల పిలుపులు!
నేడుకు
నిన్నటి మాపు ఒక ఊపు
నేటి ఊపులు
రేపటి ఊహల చూపులు!
క్షణం క్షణం కరిగిపోయే కాలాన్ని
అనుక్షణం ఆస్వాదించు
కాలం ఒక ప్రవాహం అయితే
నీ జీవన స్రవంతిలో నీవు సాగు
కాలం ఓ ప్రయాణం అయితే
నీ గమ్యం చేర్చే దారిలో
నలుగురితో కలిసి ఏగు!
కాలం ఓ తెల్ల కాగితం అయితే
హృదయాన్ని ఆవిష్కరించుకో!
కాల స్రవంతి లో జీవితం తంతు
కలకాలం జీవించు నీ వంతు
కాలం కర్మం కలిసి వస్తే
అదృష్టం నట్టింటికి నడిచి వస్తుంది !
విరాట్ స్వరూపమైన కాలం
విశ్వ సమస్తానికి మూలం !
కాలం ఊరికే ఉండదు ఉండనీయదు
ఏదో ఒకటి జరిపిస్తనే ఉంటది
వృధా గా గడిపేయకు
మానవత్వానికి వన్నెలద్దు!
కాలం తీర్పు విలక్షణ మార్పు
అది చేర్పుల, తీసివేతల కూర్పు!
కాలం దిక్కు చూడకుంటే చిక్కు
కాలంలో బ్రతికే కాయాలు సృక్కు!
కాల…
తుపాకుల రాష్ట్రంలో
తూటావై మొలిచిన వాడా ప్రజానాయకుడా జోహార్
దార్శనికుడా జోహార్
సామాజిక తుట్టె పురుగులకు
రాజకీయ విషనాగులకు
శత్రువుగా అవతారమెత్తిన సవ్యసాచి ప్రజానాయకుడా జోహార్
నిలువెత్తు నిజాయితీపరుడా జోహార్
హక్కులు కావాలంటే పోరాడటం నేర్చుకోండని
ప్రతి అడుగులోనూ నిలబడటం నేర్చుకోండని
ప్రబోధించినవాడా జోహార్
ప్రజానాయకుడా జోహార్
భారత జనాభా ఉమ్మిలో
బ్రిటిష్ పాలకులు కొట్టుకుపోతారని స్వాతంత్ర్య స్ఫూర్తిని పూరించిన వాడా ప్రజానాయకుడా జోహార్
స్వాతంత్ర్య సమరయోధుడా జోహార్

బీసీలకు రిజర్వేషన్లు యాబైఏళ్ళకు ముందే
అందించిన ఘనుడా
బహుజన రాజకీయ ఉపాధ్యాయుడా
లోకనాయకుని అనుచరుడా జోహార్
ప్రజానాయకుడా జోహార్
విద్యలో మెట్రిక్య ఫలితాలు
అమ్మాయిల వివాహాలకు అడ్డుగోడకాగా ఆంగ్ల ఉత్తీర్ణత నిబంధనను రద్దుచేసినవాడా
ప్రజానాయకుడా జోహార్
మా పాలిటి బోధిసత్వుడా జోహార్
నిజం, నిగ్రహం, కరుణ
మూడు కళ్ళుగా నిలుపుకన్న త్రినేత్రుడా
క్రమశిక్షణ నిరాడంబరతా
నిలువెత్తు విగ్రహమైనవాడా
మచ్చలేని చంద్రుడా జోహార్
ప్రజానాయకుడా జోహార్
ఆస్తుల ఆశలేని నిస్వార్ధ పరుడా
అధికారుల సిఫార్సులను అడుగక
క్షురక వృత్తే ఘనమని చాటినవాడా
ప్రజానాయకుడా జోహార్
మానధనుడా జోహార్
బడుగుల కోసం కర్పూరమై కరిగిన
కర్పూరీ ఠాగూర్ జోహార్
మర్యాద లక్ష్మణరేఖను
కలనైనా దాటని
మహనీయుడా జోహార్
ప్రజానాయకుడా జోహార్
ప్రముఖ కవి,కందుకూరి అంజయ్య కలం నుండి జాలువారిన కట్టెపల్క కవితా సంపుటిలోని కట్టెపల్క కవితపై విశ్లేషణా వ్యాసం.పూర్వ కాలంలో బాల్యంలో కట్టెపల్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ఇది చదువుకోవడానికి సాధనం మాత్రమే కాదు,ఇందులో ఒక చిన్న పిల్లవాడి జీవితం, అనుభవాలు,పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పిల్లవాడు పలకను సిద్ధం చేసుకునే దృశ్యం పాఠకునిలో ఒక రకమైన ఆసక్తిని కలిగిస్తుంది.కట్టె పల్క ఒక జ్ఞాపకాల ఖజానా,చిన్నపిల్ల వాడి ప్రపంచం,బాల్యం, భావోద్వేగాలు,ఆత్మగౌరవం,విద్య, సంస్కృతి,సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది. ఒకప్పుడు కట్టెపల్కకి ఎంతో ప్రాధాన్యత ఉండేది. పాఠశాలకు వెళ్లే ప్రతి పిల్లవాడి చేతిలో కట్టెపల్క కనిపించేది.కవి అంజయ్య చదువుకోవడానికి సాధనమైన కట్టెపల్కను ఆధారంగా తీసుకుని కవితకు ప్రాణం పోశాడు.ఇది ఒక బాలుడి చిన్ననాటి గాథ,ఆనాటి అపురూపమైన జ్ఞాపకాలను సమృద్ధిగా కవితలో చిత్రించాడు.కట్టెపల్క పుస్తకాలతో కూడిన వస్తువు కాదు.అది చిన్నారికి శక్తిని,గర్వాన్ని, గుర్తింపును,భద్రతను అందిస్తుంది.కట్టె పల్క పై చదువు నేర్చిన, తన చిన్ననాటి పాఠశాల అనుభవాలను,అందమైన బాల్యాన్ని అక్షరీకరించడం చక్కగా ఉంది.ఇది తాను బాల్యంలో చదువు నేర్చుకునే క్రమంలో ఎదురైన కష్టాలను, అడ్డంకులను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగిన రోజులను,ఆనాటి మధురమైన జ్ఞాపకాలను ప్రతిబింబిస్తుంది.కవి అంజయ్య కట్టెపల్క కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం. కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.
“బీరాకు బొగ్గు మెత్తగా దంచి/రెండు వైపుల పూసి ఆరబెట్టితే/నల్లసరం బండలాగ నిగనిగా మెరిసేది/ఈ కవితా పంక్తులు చిన్నప్పటి గ్రామీణ బాలుడికి చదువు పట్ల గల శ్రద్ధ,పలకను అందంగా తీర్చిదిద్దే నైపుణ్యం,సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

కట్టెపల్క రాసుకోవడానికి అనుకూలంగా తయారు చేసుకోవడానికి ప్రకృతిలో దొరికే పదార్థాలైన బీర ఆకులు,బొగ్గుతో దంచి పలకపై దట్టంగా పట్టించే పద్ధతి వాడుకలో ఉండేది.ఇలా పాలిష్ చేసిన కట్టెపల్క నల్లసరం బండలాగా నిగనిగ మెరిసేది. కట్టెపల్క మెరవడమే పిల్లాడికి గర్వం,దానిని చూడగానే అతనిలో ఆనందం పొంగిపొర్లేది. గ్రామాల్లో నల్లసరం రాతిబండలు మెరిసిపోతుంటాయి.కవి కట్టెపల్క నల్లసరం బండలాగా మెరిసేది అని చెప్పిన తీరు బాగుంది.
“చేతిలో అమరక/భుజం మీద పెట్టుకొని/ బడికి పోతుంటే బాల భీముడు అనేవారు/మెరిసే కట్టెపల్కను భుజంపై పెట్టుకొని బడికి వెళుతున్న చిన్నారిని బాల భీమునిగా పేర్కొనడం అద్భుతంగా ఉంది.కట్టెపల్కను భుజం మీద పెట్టుకొని తాను వేసే ప్రతి అడుగులో తనపై ఎనలేని ఆత్మవిశ్వాసం, ప్రత్యేకమైన నమ్మకం కలిగేది.అది తనకు బలాన్ని,ధైర్యాన్ని ఇచ్చేది.బడికి వెళ్తుండగా చూసిన గ్రామస్తులు బాల భీముడు అని సంబోధించడం, ఎంతో ఉత్సాహాన్ని,గర్వాన్ని కలిగించేది.ఇది బాల్యంలోని అమాయకత్వాన్ని,చిన్ననాటి సంఘటనల సమాహారంగా సూచిస్తుంది.భుజం మీద పెట్టుకున్న కట్టె పల్కను బలంగా భావించడం, పిల్లాడికి ఆత్మగౌరవం,బలమైన వ్యక్తిత్వం,సామాజిక గుర్తింపును అందించింది.ఇది పిల్లవాడి గ్రామీణ బాల్యంలోని ఈ అసాధారణ దృశ్యం అద్భుతంగా ఉంది.
“నా జోలికి వచ్చిన వాళ్లను జోపడానికి/ ఆయుధం అంగరక్షకుడు పలుకనే/ఈ కవితా పంక్తులలో కట్టెపల్కను అంగరక్షకుడిగా, ఆయుధంగా చెప్పడం,బాల్యంలో కనిపించే అమాయకత్వం,అల్లరి భావనలతో మిళితం చేసిన తీరు బాగుంది. ఆకతాయి పిల్లల చిలిపి చేష్టలు చికాకును కలిగిస్తాయి,భరించలేనివిగా ఉంటాయి. అనవసరంగా తన జోలికి వచ్చిన వారిని జోపడానికి కట్టెపల్క ఆయుధంలా రక్షణను అందించేది.ఇది తనకంటూ ఉన్న చిన్న ప్రపంచానికి చిన్నారి ఊహా శక్తికి,ధైర్యానికి నిదర్శనం.కట్టెపల్క కేవలం చదువుకోవడానికే కాదు,అది పిల్లాడికి రక్షణను కూడా అందిస్తుంది.ఇందులో కట్టెపల్కను అంగ రక్షకుడుగా భావించడం,రాజుల భద్రతను కాపాడే అంగరక్షకుని గుర్తు చేస్తుంది.ఒక చిన్న పిల్లవాడికి కట్టెపల్క కల్పించే రక్షణ దానిపై విశ్వాసం గొప్పగా ఉన్నది అని వర్ణించడం చక్కగా ఉంది.
“బలపం పట్టి అడ్డం పొడువు గీతలు పెడితే/ సాలు పొన్న సాలు పెట్టి/పొతం చేసిన నల్లరేగడి లాగుండేది/కట్టెపల్కపై బలపంతో రాసే అలవాటు పిల్లవాడిలోని శ్రద్ధను,క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. విద్య నేర్చుకునే చిన్న పిల్లాడి ప్రపంచంలో భాగంగా బలపం పట్టుకుని కట్టెపల్కపై సన్నని గీతలు గీయడం,రాయడం అనేది అతని సహజ స్వభావాన్ని తెలుపుతుంది.కాన్వాస్ పై చిత్రాలు గీసే కళాకారుడిని పోలి కట్టెపల్కపై అక్షరాలు దిద్దే చిన్నారి కనిపిస్తున్నాడు.పలకపై బలపంతో దిద్దిన ఆ మొదటి అక్షరాలు,నేర్చుకున్న విద్య అతనిలోని వ్యక్తిత్వాన్ని మలిచే మొదటి మెట్టు.విద్య జీవితానికి పునాది.అతని భవిష్యత్తు వృద్ధికి,జ్ఞానానికి,నిర్ణయ శక్తికి,జీవన దర్శనానికి మొదటి రూప కల్పన. ఉపాధ్యాయుడి బోధన ద్వారా పిల్లవాడు చదువు నేర్చుకుని జ్ఞానాన్ని పొందుతాడు.చదువు అందించిన జ్ఞానం జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపడానికి మరియు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడతుంది. కట్టెపల్క ఒక చిన్నారి చేతిలో ఉన్నప్పుడు అది చదువుకి ఆరంభం.జ్ఞానానికి ప్రవేశ ద్వారం.అది భవిష్యత్తుకు పునాదిగా,సంస్కృతికి జ్ఞాపకంగా చిరస్థాయిగా నిలుస్తుంది.
“పొతం చేసిన నల్లరేగడి లాగుండేది/రైతు పొలంలో దుక్కి దున్ని వ్యవసాయానికి అనువగునట్లుగా పొతం చేసిన నల్లరేగడి భూమిలా కట్టెపల్క ఉంది. ప్రతి పిల్లవాడు ఒక కళాకారుడే.నల్లరేగడి పూత వలె మెరిసే కట్టెపల్క ఒక గ్రామీణ సౌందర్య చిహ్నం. అది అక్షరాల భాషను నేర్పిన గురువులా ఉంటుంది. చిన్ననాటి అలవాట్లు,చదువు పట్ల ఆకర్షణ పలక మీదే మొదలయ్యేది.ఈ రోజు ఆధునిక టెక్నాలజీ పెరిగింది. కంప్యూటర్,ల్యాప్ టాప్,స్మార్ట్ ఫోన్, డిజిటల్ పాఠాలు వచ్చిన తర్వాత వాటి వాడకం తగ్గింది.కట్టెపలకపై దిద్దిన అక్షరాలు,అది ఇచ్చిన ఆత్మవిశ్వాసం,చదువు విలువ మరిచిపోలేనిది. కట్టెపల్క పిల్లల బాల్యంలోని ఒక చిన్న వస్తువు అయినప్పటికి ఎంత గొప్ప భావాలను, జ్ఞాపకాలను,విలువలను అందించగలదో ఈ కవిత అద్భుతంగా తెలియజేస్తుంది. కట్టెపల్క ఒక వస్తువు కాదు.ఒక యుగం,ఒక జీవన పాఠం,ఒక చిన్నారి చేతుల్లో మొదలైన మహాప్రస్థానం.పాతకాలం పాఠశాలల్లో చదివిన వారందరికీ కట్టెపల్క సరైన గుర్తింపును పొందింది.ఆనాడు అదే ఉత్తమం. కట్టెపల్కను భుజంపై పెట్టుకోవడం ఇది పిల్లాడి వ్యక్తిత్వానికి మొదటి రూపం. ఆనాడు అదే రక్షణ కవచం.అది తోడుగా ఉంటే ఒంటరిగా అనిపించేది కాదు.కట్టె పలకపై అక్షరాలు దిద్దడం,గీతలు గీయడం అది వారి కళ,దానిని చూసిన వెంటనే పాతకాలపు విద్య,ఆ తరానికి చెందిన బాల్య స్మృతులు గుర్తుకు వస్తాయి.కట్టెపల్క అతని బలం,రక్షణ,ఆత్మగౌరవం,చిన్న ప్రపంచం అని చెప్పిన తీరు వాస్తవికంగా ఉంది.
“అక్షరం పొన్న అక్షరం పొదుగుతుంటే/గొర్రు పట్టి జొన్నపోత పోసినట్టుండేది/ఈ కవితా పంక్తులు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ పద్ధతిని అక్షరాలు రాయడంలోని సున్నితమైన అనుబంధాన్ని ఎంతో సహజంగా ప్రతిబింబిస్తున్నది.ఇక్కడ అక్షరం కేవలం భాషా చిహ్నం కాదు.అది జ్ఞానానికి అవగాహనకు ప్రతీక.ఒక అక్షరం మరొక అక్షరంతో కూర్చడం అనేది విద్య క్రమంగా,సహజంగా,మనసులో స్థిరపడుతున్న ప్రక్రియను సూచిస్తుంది.చదువు అనేది యాంత్రికమైన చర్య కాదు.జీవంతో కూడిన సృజనాత్మక భావనను వ్యక్తపరుస్తుంది.పెరడు దున్ని జొన్నవిత్తు నాటి రైతు చూపే శ్రద్ధ,ఓర్పు, నమ్మకం అనే లక్షణాలు ఇక్కడ అక్షర విద్యలోను ప్రతిఫలిస్తున్నాయి.ఈ ఉపమానం గ్రామీణ జీవన నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరిస్తుంది.అక్షరాలు నేర్చుకోవడం అనేది విత్తనాలు నేలలో నాటినట్టే, వెంటనే ఫలితం కనిపించకపోయినా,కాలక్రమేణా అవి పంటగా ఎదుగుతాయి.ఈ కవితా పంక్తులలో కవి విద్యను గ్రామీణ వ్యవసాయంతో పోల్చి చదువు మన జీవనానికి ఎంత సహజమైనదో,ఎంత శ్రమతో కూడినదో తెలియజేస్తున్నాడు.కట్టెపల్కపై అక్షరాలు రాయడం ఒక వ్యవసాయ కార్యంలా,శ్రమతో కూడిన పనిలా చిత్రీకరించబడింది.ఇది గ్రామీణ జీవనానికి విద్య ఎంత దగ్గరగా ఉందో సూచిస్తుంది.
“అ నుండి ఱ వరకు రాసిన అక్షరాలు పాలు పట్టిన జొన్న కంకులై పలకరించేవి/ఈ కవితా పంక్తులు అక్షర విద్యను గ్రామీణ జీవన అనుభవంతో మేళవిస్తూ – భాష – సంస్కృతి – కాల ప్రవాహాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది.ఇక్కడ అ నుండి ఱ వరకు అనేది క్రమబద్ధమైన తెలుగు అక్షరమాల సంపూర్ణతను సూచిస్తుంది.పాలు పట్టిన జొన్న కంకులు అన్నది పరిణతి చెందుతున్న గింజల దశను సూచిస్తుంది.అక్షరాలు అలా పలకరించేవిగా మారడం అంటే అవి కాగితంపై నిశ్చలంగా,చిహ్నాల రూపంలో కాకుండా జీవంతో కూడిన స్నేహితుల్లా విద్యార్థిని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించడం, నేర్చుకున్న అక్షరాలు జ్ఞానంగా,అనుభవంగా మనసులో నిలిచిన దశను ప్రతిబింబిస్తుంది.ఈ కవితా పంక్తులలో అక్షర విద్యను పంట ఎదుగుదలతో పోల్చి భాషా సంపదను గ్రామీణ సౌందర్యంతో అనుసంధానించారు.అక్షరాలు పాలు పట్టిన జొన్న కంకుల్లా కనిపించడం – విద్య ఫలప్రదమైన దశకు చేరుతున్నది అనే ఆనందాన్ని, భాష పట్ల ఉన్న సాన్నిహిత్యాన్ని,అలాగే కాలంతో పాటు మారిపోయిన అక్షరాల పట్ల ఉన్న నోస్టాల్జియాను ఒకే సారి వ్యక్తం చేస్తుంది. అక్షరాలను జొన్న కంకులతో పోల్చడం,చాలా అందమైన ఉపమానం.అక్షరాలు పిల్లల మనసులో ఫలవంతంగా ఎదుగుతున్న పంటలుగా మారాయి. విద్య అంటే కేవలం చదువు కాదు.అది జీవనానికి ఆహారం అన్న భావం ఇక్కడ కనిపిస్తుంది.

“వర్ణమాల నేర్చుకుంటేనే/వర్ణాన్ని జయించినట్టు అనిపించేది/ఈ కవితా పంక్తులు అక్షర విద్యకు ఉన్న అంతర్గత గౌరవాన్ని,భాషా చైతన్యాన్ని గాఢమైన రీతిలో వ్యక్తపరుస్తాయి.ఇక్కడ వర్ణమాల అనేది అక్షరాల సమాహారం మాత్రమే కాదు.జ్ఞానానికి అలంకారమైన దండ.వర్ణం అంటే అక్షరం,కులం/ జాతి,రంగు,స్వభావం వంటి అర్థాలు ఉన్నాయి. రంగులను వర్ణం అంటారు.హిందూ ధర్మంలో సమాజాన్ని బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర నాలుగు ప్రధాన వర్ణాలుగా విభజించడానికి జాతి పదం వర్ణంగా ఉపయోగించబడుతుంది. తెలుగులో అక్షరాలను కూడా వర్ణాలు అంటారు.విడివిడిగా ఉన్న అక్షరాలు ఒక క్రమంలో,ఒక శైలిలో గుచ్చబడినప్పుడు అవి భాషగా,భావవ్యక్తీకరణగా మారుతాయి.కవి ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా అక్షరాల మధ్య ఉన్న సౌందర్యంను, సంపూర్ణతను సూచిస్తున్నాడు.వర్ణాన్ని జయించినట్టు అనిపించేది.ఇది అత్యంత భావగర్బితమైనది.జయం అనేది ఇక్కడ ఇతరులపై సాధించిన గెలుపు కాదు,అజ్ఞానంపై సాధించిన అంతర్గత విజయం.ఒక్కో అక్షరాన్ని నేర్చుకోవడం అంటే భాషలోని ఒక్కో అడ్డంకిని దాటడం, భావవ్యక్తీకరణకు మార్గాన్ని తెరవడం,వర్ణమాలపై పట్టు సాధించినప్పుడు అక్షరాలపై అధికారం కలిగినట్టుగా వాటిని తన భావాలకు లోబర్చుకున్నట్టుగా అనిపిస్తుంది.ఈ కవితా పంక్తుల్లో విద్య ఒక యుద్ధంలా కాకుండా,సాధనగా ఆవిష్కృతమవుతుంది.అక్షరాలు ఒకప్పుడు అపరిచితమైనవిగా కనిపించినా వర్ణమాలగా క్రమబద్ధం అయినప్పుడు అవి జయించదగినవిగా మారతాయి.కవి బాల్య అనుభవాన్ని ఆధారంగా చేసుకుని చదువు ఒక విజయం,భాష ఒక సాధన, అక్షరాల అవగాహన ఆత్మవిశ్వాసానికి మూలం అనే భావాన్ని సున్నితంగా వ్యక్తం చేశాడు.వర్ణమాల నేర్చుకోవడం అంటే కేవలం చదవడం,రాయడం మాత్రమే కాదు.భాషా లోకాన్ని జయించి తన భావాలకు అనుగుణంగా అక్షర రూపం ఇవ్వడం అనేది గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.అక్షరాలు నేర్చుకోవడం ద్వారా వ్యక్తి తనపై సమాజం మోపిన మౌనాన్ని చెరిపేసుకుని తన అస్తిత్వాన్ని ప్రకటించుకుని చైతన్యాన్ని పొందుతాడు.విద్య అతనిని వర్ణ వ్యవస్థ అనే అడ్డుగోడను దాటే శక్తిగా మారుతుంది.చదువు వల్ల కలిగే ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం,ఇవి కులపరమైన పరిమితులను ప్రశ్నించే చైతన్యంగా రూపాంతరం చెందుతాయి. అక్షర జ్ఞానం అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదు. అది ఆలోచనల స్వేచ్ఛ,ప్రశ్నించే ధైర్యం,వివక్షను దాటి సమానత్వాన్ని సాధించాలనే తపన.వర్ణాన్ని జయించడం అనేది సమాజంలోని అసమానతలను అధిగమించడం. సంఘంలోని కుల వ్యవస్థను జయించినట్లుగా భావించవచ్చు.
“పాఠాలు వెంట వెంటనే అప్పగిస్తుంటే/పంతులు గుండెలో దడ మొదలయ్యేది/ఇది విరామం లేకుండా పాఠాలు అప్పగించడం పిల్లవాడి బుద్ధి తీక్షణతను విద్య నేర్చుకోవడంలోని నిరంతర సాధనను ప్రకటిస్తుంది.చదువు ఇక్కడ ఆనందంగా కాక బాధ్యతగా మారిన క్షణాన్ని కవి గుర్తు చేస్తాడు. సాధారణంగా చదువు నేర్చుకునేటప్పుడు భయపడేది విద్యార్థి.కానీ,ఇక్కడ చక్కగా చదువు నేర్చుకున్న విద్యార్థి వల్ల పంతులుకు గుండెలో దడ మొదలవుతుంది.ఇది కవి చేసిన ముఖ్యమైన భావ విప్లవం.గురువు చెప్పిన పాఠాలను చక్కగా నేర్చుకొని వెంట వెంటనే విద్యార్థి అప్పగిస్తుంటే అతనికి చదువు పట్ల గల అసాధారణ శ్రద్ధను, క్రమశిక్షణను తెలియచేస్తుంది.ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా,తప్పులు లేకుండా,నిర్ణీత సమయానికి పాఠాలు అప్పగించడం, విద్యార్థి తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తున్న స్థితిని తెలియజేస్తుంది.ఇది సాధారణ పరిస్థితి కాదు.ఇది గురువు అంచనాలను సవాలు చేసే స్థాయి.ఇక్కడ పంతులుకు కలిగిన భయం ఏమిటి? శిక్షించాల్సిన అవసరం లేకపోవడం వల్ల వచ్చిన భయం కాదు.అది బాధ్యత,ప్రతిష్ట, అధికారం కదిలిపోవడం వల్ల వచ్చిన భయం. పాఠాలు వెంట వెంటనే అప్పగించే విద్యార్థి ముందు గురువు తన కఠినత్వాన్ని ప్రయోగించే అవకాశం కోల్పోతాడు.శిక్ష ద్వారా నిలబెట్టుకున్న అధికారానికి ఇది ఒక మౌన సవాలు.అందుకే పంతులుకు అంతర్గత అసౌకర్యం కలుగుతుంది.గురువు వ్యవస్థలో తప్పు పట్టడం ఒక అలవాటుగా మారినప్పుడు,తప్పులు లేకుండా చక్కగా చదువుకున్న విద్యార్థి అతనికి ఒత్తిడిని కలిగిస్తాడు. విద్యార్థి తప్పు లేకపోతే శిక్షించలేడు.శిక్ష లేకపోతే తన ఆధిపత్యం తగ్గిపోతుంది ఏమో అన్న భయం పంతులు గుండెల్లో దడగా మారుతుంది.విద్యార్థి బాగా నేర్చుకుంటే గురువుకి ఆనందం కలగాలి. కానీ,ఇక్కడ గురువుకి భయం కలగడం,అప్పటి విద్యా వ్యవస్థలో గురువు పాత్ర బోధకుడిగా కాక నియంత్రకుడిగా మారిపోయింది అని సూచిస్తుంది. ఈ అంతర్ముఖ విరోధమే గురువు గుండెలో దడగా వ్యక్తమవుతుంది.విద్యార్థి బాగా చదువుకొని చక్కగా పాఠాలు అప్పజెప్పినప్పుడు ఇతరుల ముందు గురువు అప్రమత్తంగా ఉండాలి.ప్రశ్నలు,లోపాలు వెతకాలి.తన స్థాయి తగ్గకుండా జాగ్రత్తపడాలి.ఈ సామాజిక ఒత్తిడి భయానికి కారణం.ఈ కవితా పంక్తి ద్వారా కవి చెప్పేది ఏమిటి?అప్పటి విద్యావ్యవస్థలో భయం విద్యార్థి నుంచి గురువు వైపు కూడా ప్రవహించేది.చదువు జ్ఞానోత్సవం కాక, అధికార – ఆధిపత్యాల ఆటగా మారినప్పుడు,నిజాయితీగా నేర్చుకున్న విద్యార్థి కూడా గురువుకు అసౌకర్యాన్ని కలిగిస్తాడు.అందు వల్ల పంతులుకు వచ్చిన గుండెలో దడ భయానికి కాదు.తన అధికారం,తన పాత్ర,తన వ్యవస్థ పై పడిన మౌన ప్రశ్నకు ప్రతిధ్వని.ఈ కవితా పంక్తులు – ముఖ్యంగా బాల్యంలోని భయం శిక్ష, గర్వం,ఆనందం అన్నిటిని నిర్బంధం లేకుండా నిజాయితీగా ఆవిష్కరిస్తుంది.
“తొక్కుడు బండ తొవ్వలో పడుతుందని/ అదిమిపట్టేవాడు/ఇది శారీరక శిక్షణ ద్వారా క్రమశిక్షణను నేర్పే పద్ధతికి సంకేతం.విద్యతో పాటు భయం కూడా ఎలా కలిసి నడిచేదో తెలియ జేస్తుంది.ఈ కవితా పంక్తి గ్రామీణ జీవన అనుభవాన్ని బలమైన ప్రతీకాత్మకతతో ఆవిష్కరిస్తుంది.తొక్కుడు బండ అన్నది నియంత్రణ లేకపోతే ప్రమాదం కలిగించే శక్తిని సూచిస్తుంది. తొవ్వ అంటే దారి.అది జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లకు,ప్రమాదకర పరిస్థితులకు రూపకం. అదిమి పట్టేవాడు అనే పదం అప్రమత్తతకు,బాధ్యతాయుతమైన నియంత్రణకు ప్రతీక. ప్రమాదం సంభవించే లోపు దాన్ని అడ్డుకునే జాగ్రత్త,అనుభవం,చైతన్యం ఇందులో ప్రతిఫలిస్తాయి.ఇది కేవలం శారీరక చర్య కాదు : మానసిక స్థితి – భయం కాదు,బాధ్యత – అనే భావనను బలపరుస్తుంది.ఈ కవితా పంక్తిలో కవి ఒక సామాజిక సత్యాన్ని ఆవిష్కరిస్తాడు.నియంత్రణ లేని శక్తి వినాశానికి దారి తీస్తుంది.జాగ్రత్తతో కూడిన నియంత్రణే భద్రతకు మార్గం అనే తత్వాన్ని సులభసాధ్యంగా పాఠకుడి హృదయంలో నాటే శిల్పం ఇది.ఈ కవితా పంక్తి అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం,జాగ్రత్తగా ఉంటే భద్రత కలుగుతుందనే బాధ్యతాయుతమైన జీవన దృష్టిని ప్రతిపాదిస్తుంది.
“నవ్వుకుంటూ తొడపాశం పెడితే/నరకం కనబడేది/ గురువు నవ్వే ముఖం వెనుక దాగిన శిక్ష పిల్లవాడి దృష్టిలో నరకప్రాయంగా ఉంటుంది.నవ్వుకుంటూ అనే పదం మాయను,మృదుత్వాన్ని,పైకి కనిపించే అమాయకత్వాన్ని సూచిస్తుంది. కానీ,అదే నవ్వు వెనుక దాగి ఉన్నది తొడ పాశం,అది బంధనం, మోసం,అణిచివేతకు ప్రతీక.నవ్వుతూ ప్రారంభమైన బంధం చివరకు వ్యక్తిని నిస్సహాయ స్థితిలోకి నెట్టడం – అదే నరకం కనబడేది అన్న అనుభూతి.ఇక్కడ నరకం అనేది మతపరమైన భావన కాదు.అది జీవితంలోని ఎదురయ్యే బాధ,అవమానం, మోసపూరిత సాన్నిహిత్యం.వ్యక్తి స్వేచ్ఛను హరించగా లోపల నరకతుల్యమైన వేదన ఉద్భవిస్తుంది అని కవి చెబుతాడు.పైకి ప్రేమగా, నవ్వుగా కనిపించే సంబంధాలు,ఎలా హింసాత్మకంగా మారుతాయో.కవి బలమైన ప్రతీకలతో ఆవిష్కరించాడు.
“డస్టర్ తోని దవడల మీద పొడిస్తే/దండగ మాలిన చదువు అనిపించేది/ఇక్కడ శిక్షల వల్ల చదువు పట్ల విరక్తి కలుగుతుంది అనే విషయం ఇందులో ఉంది. ఈ కవితా పంక్తులు విద్యావ్యవస్థలోని నిర్దయతను, బాలుర మనసుపై పడే హింసాత్మక ముద్రను హృదయ విదారకమైన స్థితిని ఆవిష్కరిస్తాయి. జ్ఞానాన్ని అందించాల్సిన గురువు చేతిలోని డస్టర్ – బ్లాక్ బోర్డ్ తుడవడానికి ఉపయోగించే సాధనం – ఇక్కడ శిక్షించడానికి వాడబడుతున్నది. దవడల మీద పొడిస్తే అనే పదం – శారీరక వేదన మాత్రమే కాదు.బాలుడి గౌరవానికి కలిగే గాయాన్ని కూడా సూచిస్తుంది.పిల్లవాడి ముఖంపైన పడ్డ దెబ్బ వల్ల అతని మనసులో భయం,అవమానం చోటు చేసుకుంటుంది.గురువు అసహనం పిల్లవాడిపై హింసగా మారిన క్షణమే విద్య తన మానవీయతను కోల్పోతుంది.అందుకే బాలుడికి ఇది దండగ మాలిన చదువు అన్న భావన కలుగుతుంది.చదువు పట్ల ప్రేమ,ఆసక్తి పెరగాల్సిన వయసులో భయం,ద్వేషం కలుగుతుంది.ఇది చదువుపై కాదు – చదువును బలవంతంగా,హింసతో నేర్పే విధానంపై వచ్చిన నిరసన.ఇక్కడ దండగ అనే పదం చదువు వ్యర్థం అని కాదు.హింసతో కూడిన చదువు నిరర్ధకం అనిపిస్తుంది.ఈ కవితా పంక్తుల ద్వారా కవి విద్యా వ్యవస్థ పై మౌన విమర్శ చేస్తాడు. బాల్యాన్ని సృజనాత్మకంగా వికసింప చేయాల్సిన పాఠశాల భయాన్ని నింపే స్థలంగా మారినప్పుడు,చదువు తన అసలు లక్ష్యాన్ని కోల్పోతుంది అని సూచిస్తాడు. కవితలోని ఈ దృశ్యం విద్య అనే పవిత్ర ప్రక్రియపై పడిన మచ్చగా నిలుస్తుంది.కవి ఈ కవితా పంక్తులలో హింసాత్మక బోధన వల్ల కలిగే భయాన్ని, చదువు పట్ల విరక్తి కలుగడాన్ని స్పష్టంగా చూపిస్తునే మానవత్వంతో కూడిన విద్యా బోధన యొక్క ఆవశ్యకతను బలంగా ప్రతిపాదిస్తున్నాడు.
“అందరిలో అగ్రభాగాన నిలిస్తే/ఆకాశాన్ని అందుకున్నట్టుండేది/విద్య ద్వారా లభించే గౌరవం, ఆనందం ఈ కవితా పంక్తిలో శిఖరానికి చేరుతుంది. ఈ కవిత గ్రామీణ బాల్యాన్ని,పాత విద్యావిధానాన్ని, విద్యలోని కఠినత్వం,ఆనందం,సహజ ఉపమానాలతో భావోద్వేగంతో వ్యక్తపరుస్తుంది.ఇది కేవలం ఒక వ్యక్తి జ్ఞాపకం కాదు.ఒక తరం విద్య, అనుభవానికి అద్దం పట్టిన కవిత.కట్టెపల్క కవిత చదువు ద్వారా బాలుడికి కలిగే ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని,ఆశా పూరిత దృక్పధాన్ని హృద్యంగా ప్రతిబింబిస్తున్నది. కట్టెపల్క పై అక్షరాలు దిద్దుకుంటూ గురువు చెప్పిన పాఠాలను శ్రమతో నేర్చుకుని పిల్లవాడు ఇతరుల కంటే ముందు ఉండ గలిగిన క్షణం అతని జీవితంలో ఒక విజయోత్సవంలా మారుతుంది.అందరిలో అగ్ర భాగాన నిలిస్తే అది కేవలం శ్రేణిలో ముందు ఉండడం మాత్రమే కాదు.తనపై తనకు కలిగిన నమ్మకాన్ని అణిచివేతల మధ్య ఎదగగలిగిన గర్వాన్ని సూచిస్తుంది. ఇది పోటీ భావన కంటే సాధన ఫలితంగా వచ్చిన గెలుపు,అక్షర జ్ఞానం అనే చిన్న అడుగు అతని మనసును పెద్ద స్వప్నాల వైపు తీసుకొని వెళ్తుంది.ఆకాశాన్ని అందుకున్నట్టు ఉండేది అనే ఉపమానం, బాలుడి మనసులోని సున్నితమైన కలల విస్తృతిని ప్రతీకాత్మకంగా చూపుతుంది. ఆకాశం – అపారమైన అవకాశాలకు, అంతులేని ఆశలకు సంకేతం.పిల్లవాడికి చదువు ద్వారా తన స్థితి మారుతుంది అనే అపారమైన నమ్మకం కలుగుతుంది.కవి చదువు యొక్క సానుకూల శక్తిని ప్రశంసిస్తాడు.శిక్ష, భయం,అవమానం చూపిన ఇతర పంక్తులతో పోలిస్తే ఇవి ముఖ్యంగా చదువు యొక్క ప్రాముఖ్యతను వ్యక్తం చేస్తున్నాయి. కట్టెపల్క అనే సాధారణ పరికరం కూడా సరైన మార్గ నిర్దేశం లభిస్తే బాలుడిని ఆకాశాన్ని అందుకునే స్థాయికి చేర్చగలదు అనే ఆశావాహ దృక్పథం ఇక్కడ వ్యక్తం అవుతుంది.ఈ కవితా పంక్తులు గ్రామీణ పాఠశాల జీవితంలోని బాల్య స్మృతులు, విద్య, అనుభవాలను చాలా సహజమైన ఉపమానాలు, ప్రతీకలతో ఆవిష్కరిస్తాయి.కవి తన చిన్ననాటి పాఠశాల అనుభవాన్ని ఒక జీవన దృశ్యంగా మన ముందు ఉంచుతాడు.కట్టె పల్క అనేది కేవలం ఒక పలక కాదు.అది ఒక కాలానికి,ఒక జీవన విధానానికి చిహ్నం.మొదటిసారిగా కట్టెపల్క పై అక్షరాలు దిద్దడం అనేది కేవలం చదువునకు ప్రారంభం కాదు. అది వారి జీవిత ప్రస్థానానికి మొదటి అడుగులుగా నిలుస్తుంది.కట్టెపల్క జ్ఞానానికి మొదటి వెలుగు. విద్యా లోకానికి ద్వారం.భవిష్యత్తు నిర్మాణానికి సోఫానం.కట్టెపల్క పై శ్రమతో నేర్చుకున్న అక్షరాలు పిల్లవాడి జీవితమంతా తోడుగా ఉంటాయి.కాలం మారినా,అక్షరాలు విలువ ఎప్పటికి తగ్గదు. విద్యకు జీవితాన్ని మలిచే శక్తి ఉంది. కట్టెపల్క కవిత అందించే ముఖ్యమైన సందేశం ఇది.విద్య మనిషిని తీర్చిదిద్దే గొప్ప ఆయుధం.బాల్యంలో కట్టెపల్క పై దిద్దిన అక్షరాలు అందించిన జ్ఞానం జీవితంలో ముందుకు సాగడానికి తోడ్పడుతుంది.ఈ కవితా పంక్తులు శ్రమ,విజయం,స్వప్నాల విస్తరణ అనే జీవన సత్యాన్ని బాల్య అనుభవాల ద్వారా ప్రతీకాత్మకంగా ఆవిష్కరిస్తుంది.విద్యా వ్యవస్థలో భాగమైన కట్టెపల్క గురించి చక్కటి కవితను అందించిన కవి అంజయ్యను అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కందుకూరి అంజయ్య తేది 04 – 08 – 1960 రోజున జన్మించారు.వీరి తల్లిదండ్రులు: లక్ష్మి,రాజయ్య గారలు.వీరు గుల్లకోట గ్రామం,వెల్గటూర్ మండలం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు.వీరు 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,గుల్లకోట గ్రామంలో చదివారు. వీరు గుల్లకోట నుండి మూడు కిలోమీటర్ల దూరంలో గల ఎండపెల్లి గ్రామంనకు నడిచి వెళ్ళి 7 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్,ఎండపల్లి గ్రామంలో చదివారు.వీరు ఇంటర్మీడియట్ బై.పిసి.బిషప్ సాలమన్ జూనియర్ కాలేజి,కరీంనగర్ లో చదివారు.వీరు బి.ఎస్సీ.డిగ్రీ శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
కరీంనగర్ లో చదివారు.వీరు ఎం.ఏ. (తెలుగు), ఎం.ఫిల్.డిగ్రీ పూర్తి చేశారు.వీరు కేంద్రీయ విశ్వవిద్యాలయం,హైదరాబాదు నుండి చెరబండరాజు నవలలు అను అంశం పై పరిశోధన చేసి 1989 సంవత్సరంలో ఎం.ఫిల్. డిగ్రీని పొందారు.శ్రీ కె.కె. రంగనాథాచార్యులుగారు పర్యవేక్షకులుగా వ్యవహరించారు.వీరు1990లో చేనేత & జౌళి శాఖలో అసిస్టెంట్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా నియమింపబడ్డారు.వీరు తేది 31 – 08 – 2018 రోజున డిప్యూటీ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. వీరు సాహితీ సోపతి, ఎన్నీల ముచ్చట్లు,తెలంగాణ రచయితల వేదిక వంటి పలు సంస్థల ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు.
కవి అంజయ్య ముద్రిత రచనలు :
1.కట్టెపల్క కవితా సంపుటి,2013.
2.జమిడిక కవితా సంపుటి,2023.
3.కదలిక సాహిత్య వ్యాసాలు,2024.
4.వడపోత కందుకూరి అంజయ్య కవిత్వంపై అనుశీలనా వ్యాసాలు,2025.
కవి అంజయ్య పొందిన పురస్కారాలు :
1.అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం,2014లో పొందారు.
2.అక్కెపెల్లి ఫౌండేషన్ సినారే అవార్డు 2021లో అందుకున్నారు.
3.తెలంగాణ సారస్వత పరిషత్ డాక్టర్
రావికంటి వాసునందన్ ధర్మనిధి పురస్కారం,2025లో పొందారు.
పుట్టినింటి వారు తనవాడంటే మెట్టినింటి వారు తమ వంశోద్ధారకుడంటారు. అటువంటి విధంగా మాతృభూమితో మల్లెల పందిరి వోలె అల్లుకున్న మమతల బంధం శ్రీ సామల సదాశివ గారిది. కుమ్రం భీమ్ జిల్లా, ఆసిఫాబాద్ పెన వేసుకున్నది. రెండు శతాబ్దాల క్రింద భారత్ ను వదిలి పెట్టిన కుటుంబమైన “రుషియెనాకో” బ్రిటన్ అధ్యక్షుడు కావడంతో మా భారతీయుడు ఆంగ్ల దేశానికి అధిపతి అయ్యాడని ఆనందించే పేగు బంధం మనది. ఇక వంద శాతం గ్రామీణ వ్యవహారిక భాషలో “యాది”ని రచించిన సామల సదాశివ గారిని ఆసిఫాబాద్ ఏల మరిచి యుండగలదు. కృష్ణుడు యశోదమ్మ ఒడిలో పెరిగినా, సేద తీరినా దేవకీ వసుదేవుల పుత్రుడే !
తెలంగాణలో తెలుగు భాషకే వన్నె తెచ్చిన సామల సదాశివ దహెగాం మండలంలో తెనుగు పల్లెలో పుట్టటం యాదృచ్చికమే. కాని అదే కీర్తి కిరీటంలో కలికితురాయి. అందుకే ఆయన “అందరి బంధువయ్యాడు”. మా నాన్న కీIIశేII దేవరాజు సాంబమూర్తి గారితో సహచరునిగా డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పని చేయటంతో మాకు ఆత్మీయ అనుబంధం సదాశివ గారి కుటుంబంతో ఏర్పడింది.

సామల సదాశివ గారి తండ్రి నాగయ్య గారు తాలూకా కేంద్రమైన వాంకిడిలో ఉద్యోగ రీత్యా పని చేసినా అక్కడి ప్రజలతో మమేకమై ఎందరో విద్యార్థులకు గురువుగా ఇరుగు పొరుగులకు పితృ సమతుల్యంగా వాత్సల్యం అందించారు. అప్పుడే “గయోపాఖ్యానం” నాటకం వ్రాసి వేషాలు వేయించి దర్శకత్వం వహించి ప్రదర్శింప జేసారు. ఆ దృశ్యాలన్నీ బాల్యంలో వున్న సదాశివ గారి హృదయ ఫలకంలో సుస్థిర స్థానం పొందాయి. మరాఠీ భాషా ప్రభావం వల్ల పద్యాలు కంఠస్థం చేశారు.
సదాశివ గారి బాల్యం, ప్రాథమిక విద్య వాంకిడి, మిడిల్ విద్య ఆసిఫాబాదులో 7వ తరగతి వరకు సాగింది. అదే తరుణంలో గోండు వీరుడు కుమ్రం భీమ్ గిరిజనుల హక్కుల కోసం పోరాటము చేసి నిజాం ప్రభుత్వ సైనికుల చేతిలో అమరుడయ్యాడు. ఆయన శవంను సదాశివ గారు చదువుతున్న పాఠశాల ముందున్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆ సంఘటనతో భీం వీరోచిత పోరాటం, గిరిజనుల కష్టాలు, ప్రభుత్వ మొండి వైఖరి ఆయన మనసుపై సుస్థిర స్థానం పొంది ఆలోచనలకు తెర లేపాయి. మరొక సంఘటన ఒక సోదరి అకాల మరణం. తండ్రి నాగయ్య ఉద్యోగానికి రాజీనామా చేయటం సదాశివ గారి జీవితాన్ని మలుపు తిప్పాయి. అప్పటికే మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై ఉండటంతో ఉద్యోగంలో చేరక తప్పలేదు.
సిర్పూరు కాగజునగర్ మిడిల్ స్కూలులో 1947 జులై 24న గురువుగా గురుతర బాధ్యతలు స్వీకరించి శాశ్వతంగా గురువు స్థానం నిలబెట్టుకున్నారు. కొద్ది రోజులు లక్షెట్టిపేటకు బదిలీపై వెళ్ళినా తిరిగి వచ్చి – 1954 ఆగస్టు వరకు అక్కడే ఉద్యోగం చేస్తూ సేవలందించారు. కోటగిరి నారాయణ గౌడ్ వంటి ఎందరో విద్యార్థులను విజ్ఞాన దీపాలుగా తీర్చి దిద్దారు.
ఆ తరువాత ఆసిఫాబాదులో విద్యా పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. రెండవ దశలో 1959 నుండి రెండేళ్ళ పాటు సిర్పూరులో మూడవ సారి 1976 నుండి 1980 వరకు వాంకిడిలో పని చేసి మాతృభూమితో మక్కువ పెంచుకొని సేవలందించారు. సామల సదాశివ గారి ఎదుగుదలను చూసి వారి తండ్రి నాగయ్య గారు ఎంతో సంతోషించి వారి మిత్రులతో చెప్పి ఆనందించే వారట. కానీ కొడుకును చూస్తే పొగిడేవాడు కాదట. కొడుకును ముందర పొగిడితే ఆయుఃక్షీణ మని భావించేవారట. అంతే గాకుండా తొలి కాన్పులో పుట్టిన పాపను అధిక గారాబం చేయటం వలన జరిగిన నష్టం కారణంగా సదాశివను సాధారణంగా చూసేవారట.
సామల సదాశివ గారి బాల్యమంతా వాంకిడిలోనే జరగటం మూలంగా ఆ గ్రామ పెద్ద రామగిరి రంగయ్య గారి కుటుంబంతో మమేకమై జీవించారు. వరుసలు పెట్టి పిలుచుకోవడమే గాకుండా నేటికి అదే స్థాయిలో కొనసాగటం విశేషం. రామగిరి పురుషోత్తం, వైకుంఠం సోదరులు సదాశివ గారిని “బాపు” అని పిలిచేవారు. రంగయ్య గారి సోదరి కూడా సదన్నా అని ఆప్యాయంగా పిలిచేవారట. ఆమె భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నాడని తెలిసి తట్టుకోలేక అక్కడికి సదాశివ గారు వెళ్లలేక పోయిన దయార్ద్ర హృదయుడని వారి కుమారుడు “సామల రాజవర్దన” రచనల ద్వారా అర్థమవుతుంది.
నిష్కల్మషంగా సదాశివ గారితోని ప్రేమ పంచుకునే మరో కుటుంబం జిల్లాలో తొలి గిరిజన పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి గిరిజన శాఖా మంత్రి స్వర్గీయ కొట్నాక భీంరావు గారి కుటుంబం. వాంకిడి మండల కేంద్రానికి సమీపంలో ఉండి గ్రామంలో విద్యార్థి దశ నుండి కలిసి మెలిసి తిరిగిన భీంరావు బంబారా గ్రామ నివాసి. ఈ విషయాలన్నీ సదాశివ గారి “యాది” రచనల్లో తరచూ గమించవచ్చు. మాస్టారు అన్ని రకాలుగా ఎదగడానికి వాంకిడి అందించిన మమతానురాగాలన్నది సదాశివ గారి కుటుంబ సభ్యుల ఏకాభిప్రాయం. వాంకిడి అవ్యాజ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలతో తడిసి ముద్దెå రుద్రాభిషేకం పొందిన సర్వ విద్యల ఈశానుడు సదాశివుడే.
తండ్రి నాగయ్య గారు వేయించిన గయోపాఖ్యానం నాటకంలో పద్యాలు కంఠస్థం చేయడం సదాశివ గారి మనసును సాహిత్యం వైపు త్రిప్పింది. జీవితంలో కొత్త మజిలీ ఆరంభానికి తొలి అడుగుగా చెప్పవచ్చు. అతడు ఆంధ్ర నామ సంగ్రహం వంటి లక్షణ గ్రంథాలు చదువటం, తండ్రి నాగయ్య గారు ప్రోత్సహించటంతో దైవ స్తుతిగా వాంకిడిలో వున్నపుడే “సాంబశివ శతకం” రచించారు. అదృష్టమేమంటే సాహితీ పోషకులుగా వాంకిడిలోని కళాపిపాసి కర్నె వసంత్ గారి తండ్రి కర్నె వెంకట నర్సు ముద్రణ బాధ్యత వహించారు. వారి పద్యాలు కూడా రసరమ్యంగా వుంటాయి.
వాంకిడి, తెలంగాణలో గిరిజన ప్రాంతాల సాగునీటి కరువున్న ప్రాంతం. నాటికీ నేటికీ ఈ ప్రాంతం అంతే. ఇక్కడ పండే అవిసె గింజల నూనె నిత్యం వినియోగించేవారు. అవిసె పూలు, ఆవాల పూలు నీలి, పసుపు రంగులలో రహదారి కిరువైపులా అలరారడంతో నీలమేఘ శ్యాముని స్తుతిస్తూ “వేంకటేశ్వరా” మకుటంతో “అతసీ కుసుమోపమనీల గోత్ర” అంటూ వృత్తాలు వ్రాశారు. తర్వాత “వృషభగిరి నివాస వేంకటేశ” మకుటంతో ఆటవెలదులు వ్రాశారు.
“విశ్వామిత్ర” మనే నిరీక్షణ లఘు కావ్యాలు వ్రాయడమే కాకుండా చిత్రాల్ని కూడా స్వయంగా గీసారు. సదాశివ మాస్టారు ప్రియశిష్యులు కాగజునగరు నివాసి స్వర్గీయ కోటగిరి నారాయణ గౌడు సంపాదకత్వంలో “సదాశివ కావ్యసుధ” పేరుతో కాగజునగరు తెలుగు సాహితీ సదస్సు సంస్థ 2008లో పుస్తకావిష్కరణ చేసింది. దీనిలో సాంబశివ శతకం, మంచిమాటలు ఉపదేశ కావ్యం, నిరీక్షణము, ప్రభాతము, విశ్వామిత్రము, లఘుకావ్య సంపుటాలు, నారద గర్వభంగము గేయ కావ్య అనుసృజనలు, ఉర్దూ భావ గీతాలు, సాఖీనామా ఈశ స్తుతి, జలాలుద్దీన్ రుమీ, అమ్జద్ రుబాయిలు, స్తుతి కవితలు, సూక్తి సుధ కవితలు పొందుపర్చారు.
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, లక్ష్మీనర్సమ్మ వంటి ప్రముఖుల సందేశాలున్నాయి. తుమ్మూరి రామ్మోహన్ రావు, రాళ్ళపల్లి మురళీధర్ గారు ముద్రణలో వీలైనంత సహకారం అందించారు. చిన్ననాడు వాంకిడిలో కుమ్రం భీం శవాన్ని చూసిన జ్ఞాపకాలతో ఏడవ తరగతి వాచకంలో పాఠ్యభాగ రచయితగా ఆయన పాఠాన్ని చేర్పించి తెలుగు రాష్ట్రంలో ప్రచారం, కీర్తి పెంచారు. సదాశివ గారు బాల గోపాలుని కోసం వ్రాసిన
“ఘల్లు ఘల్లున గంతిడి రారా నంద కుమారా
జగదే మోహనాకారా గోపకిశోరా! ముఖ్ డా ఉత్తర తెలంగాణ నిండా నేటికీ ప్రచారంలో వుంది.
మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా సామల సదాశివ మాస్టారు మాతృభూమితో మమతాను రాగాలు అల్లుకొని మల్లెల బంధంతో పరీమళాలు నిరంతరం పంచుతూనే ఉన్నారు.
“శ్రీ సామల రాజవర్దన్ గారి రచన “మా అమ్మ” వ్యాసం ఆధారంగా వ్రాసిన వ్యాసం.
ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,బహు భాషావేత్త, అనువాదకులు,తెలంగాణా పదకోశకర్త,
రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు,
ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,డాక్టర్ నలిమెల భాస్కర్ గారు సమకాలీన తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్వరం కలిగిన కవి.విద్యార్థులపై లోతైన ప్రభావాన్ని చూపిన ఉపాధ్యాయుడిగా,భాషా సౌందర్యాన్ని సూక్ష్మంగా ఆవిష్కరించిన అనువాదకుడిగా,అలాగే మానవ అనుభూతుల్ని,తాత్విక లోతులతో వ్యక్తపరిచిన కవిగా ఆయనకు విశేష గుర్తింపు ఉంది.జీవితం,ప్రకృతి మానసిక సంఘర్షణలు,విముక్తి వంటి భావాలు ఆయన కవిత్వంలో సహజంగా మేళవిస్తాయి.కవి భాస్కర్ కలం నుండి జాలువారిన విమోచనం కవిత కూడా ఆ అంతర్లీన తాత్విక దృష్టికి ప్రతిబింబంగా నిలుస్తుంది.విమోచనం కవితలో విముక్తియే ప్రధాన భావంగా ఆవిష్కృతమవుతుంది.కవి వివిధ స్థాయిల్లో ప్రకృతి,మానవ అనుభూతి,కళా సృజనల ద్వారా విమోచనం ఎలా సహజమైన ప్రక్రియగా,అవసరంగా మారుతుందో ప్రతీకల ద్వారా ఆవిష్కరిస్తాడు.ఇది కేవలం విముక్తిని కోరుకోవడం మాత్రమే కాదు ; తనలోని భారాన్ని విడిచిపెట్టి తన అసలైన స్వరూపాన్ని వెలికి తీయాలనే తపన.
సమకాలీన కవిత్వంలో విముక్తి అనే భావం విస్తృతమైన తాత్విక అర్థాన్ని సంతరించుకుంది.కవి భాస్కర్ రాసిన విమోచనం కవిత ఆ భావానికి లోతైన అంతర్ముఖ రూపాన్ని అందిస్తుంది.ఈ కవితలో విమోచనం అనేది బాహ్య బంధనాల నుంచి విడిపోవడమే కాక,అంతర్గతంగా మనసును భారాల నుంచి విడుదల చేసి ప్రక్రియగా ఆవిష్కృతమవుతుంది.ఈ కవితలో కవి జీవితం,ప్రకృతి, మానవ అనుభూతులను ప్రతీకల ద్వారా సమన్వయ పరుస్తాడు.విమోచనం అనేది ఒక్క క్షణంలో సాధించబడే స్థితి కాదు ; అది ఒక సహజమైన,నిరంతరమైన ఆత్మాన్వేషణ, తనలో పేరుకుపోయిన బాధలు,భయాలు,అపోహలు, అహంకారాలను వదిలిపెట్టి నిజస్వరూపాన్ని వెలికి తీయాలనే తపనగా ఈ విముక్తి రూపుదిద్దుతుంది.కవి ఉపయోగించిన ప్రతీకలు ఎంతో సున్నితంగా ఉంటాయి.బంధనాలను సూచించే సంకెళ్లు,భారాన్ని సూచించే మోపులు,వెలుగును సూచించే ఉదయాలు వంటి ప్రతీకలు మానసిక స్థితులను ప్రతిబింబిస్తాయి.ఇవి పాఠకుడిని అంతరంగంలోకి తొంగి చూడమని ఆహ్వానిస్తాయి.విమోచనం అనేది ఇతరులిచ్చే వరం కాదు.అది స్వయంకృత ప్రయత్నం ద్వారా సాధించాల్సిన అనుభూతి అనే ఈ సందేశం ఈ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది.భాషాపరంగా ఈ కవిత సరళమైనప్పటికీ భావగర్భితంగా ఉంటుంది.అలంకారాల ఆర్భాటం లేకుండా,సహజమైన పదాలతోనే గాడమైన తాత్విక భావాలను వ్యక్తపరచడం భాస్కర్ గారి కవిత్వ ప్రత్యేకత,ఉపన్యాసకుడిగా ఆయనకు ఉన్న భాషాపరమైన లోతు,అనువాదకుడిగా సంపాదించిన విశాల దృష్టి ఈ కవితలో ప్రతిఫలిస్తుంది.ఈ విమోచనం కవిత మానవ జీవన ప్రయాణంలో తప్పనిసరిగా ఎదురయ్యే అంతర్ముఖ సంఘర్షణలకు ఒక తాత్విక సమాధానాన్ని అందిస్తుంది. విమోచనం అనేది పారిపోవడం కాదు,ఎదుర్కొని,అర్థం చేసుకుని తనను తాను ఆవిష్కరించుకునే ప్రక్రియ అని ఈ కవిత బలంగా నొక్కి చెబుతుంది.అందుకే ఈ కవిత పాఠకుడిని కేవలం చదివించదు ; ఆలోచింపజేస్తుంది,ఆత్మ పరిశీలనకు దారితీస్తుంది.కవి భాస్కర్ విమోచనం కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారిద్దాం.కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.

“మేఘాలు/తమను తాము/విముక్తం చేసుకోవటానికి/వర్షమై కురుస్తాయి/ఈ కవితలో కవి ప్రకృతి రూపకాల ద్వారా జీవన తత్వాన్ని ఆవిష్కరిస్తాడు.మేఘాలు ఇక్కడ వాతావరణ అంశాలు కాకుండా మనసులో పేరుకుపోయిన భారాలు, బాధలు,అణిచివేసిన భావాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మేఘాలు తమలోని నీటిని దాచుకుంటూ ఉండలేవు.ఆ భారాన్ని మోస్తూ ఉండటం కన్నా వర్షంగా మారి కురవడం ద్వారా తాము తేలికపడతాయి.ఇదే ప్రక్రియను కవి భాస్కర్ విమోచనంగా చూస్తాడు.ఇది త్యాగం ద్వారా కలిగే విముక్తిని సూచిస్తుంది.ఈ కవితా పంక్తిలోని భావన మనిషి జీవితానికి అన్వయించబడుతుంది.మనిషి కూడా తనలోని బాధలను, కన్నీళ్లను,అణిచివేసిన భావాలను వెలిబుచ్చినప్పుడే విముక్తిని పొందగలడు.అందువల్ల వర్షం – కన్నీళ్లకు,మేఘాలు – మనస్సులో పేరుకున్న వేదనలకు ప్రతీకలుగా మారతాయి. కవితలో భాష అతి సరళమైనదైనా,భావం మాత్రం గంభీరమైనది.అలంకారాల కంటే తాత్వికతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.చిన్న కవితా పంక్తుల ద్వారా జీవిత సత్యాన్ని గట్టిగా చెప్పడం ఈ కవిత ప్రత్యేకత.విమోచనం కవిత బాధను దాచుకోవడం కాదు,విడిచిపెట్టడమే నిజమైన స్వేచ్ఛ అనే సందేశాన్ని ప్రకృతి ప్రతీకల సహాయంతో హృద్యంగా వ్యక్తం చేస్తుంది.ఆధునిక కవిత్వం అలంకారాల గజిబిజిలో కాదు – అనుభూతి సత్యంలో నడుస్తుంది. మేఘాలు తమను తాము విముక్తం చేసుకోవడానికి వర్షమై కురుస్తాయి అనే ఈ కవితా పంక్తులు ప్రకృతిని వర్ణించడం లేదు.కవి మనిషి అంతరంగాన్ని చదువుతున్నాడు.మేఘాలు పేరుకుపోయిన మౌనం,అణిచివేసిన కోపం,బయటకు రాని కన్నీళ్లు.ఆధునిక మనిషి కూడా అలానే బరువుగా, నిండిపోయి,కానీ కురవ లేక ఉంటాడు.వర్షం ఇక్కడ బలహీనత కాదు,ఓటమి కాదు – అది ధైర్యం,విడిచి పెట్టే శక్తి. ఈ కవితా పంక్తి చెబుతుంది – దాచుకోవడమే స్థైర్యం అన్న పాత నమ్మకాన్ని వదిలేయమని,కురవగలగడమే విమోచనం. కన్నీళ్లు కార్చగలగడమే మనిషిగా మిగలడం.అందుకే ఈ కవితా పంక్తి చిన్నదైనా దాని ప్రతిధ్వని పెద్దది – ఆధునిక మనిషి మనస్సులో కురుస్తూనే ఉంటుంది.ఇక్కడ మేఘాలు ఒక అంతర్భారాన్ని మోసే మనసుకు ప్రతీకలు.వర్షంగా కురవడం అనేది వాటి విముక్తి.అవి దాచుకున్న నీరు వర్షంగా మారినప్పుడు మేఘాలకు తేలిక కలుగుతుంది.మనసులో పేరుకుపోయిన బాధ,ప్రేమ,వ్యధ బయటికి వస్తేనే మనిషికి విమోచనం లభిస్తుందనే సంకేతం ఇందులో ఉంది.
“పొదుగులు/తమ విడుదల కోసం/ఆకలిగొన్న శిశువుల/ పెదాలపై ఒదుగుతాయి/ఈ కవితా పంక్తిలో భావ సాంద్రత ఎక్కువగా ఉంది.కవి అత్యంత సున్నితమైన ప్రకృతి మానవ సంబంధాన్ని ప్రతీకాత్మకంగా ఆవిష్కరిస్తాడు.కవి మాతృత్వం, దయ,విమోచనం అనే భావాలను ఒకే ప్రతీకలో మేళవించాడు.పొదుగులు తమ విడుదల కోసం అని చెప్పడం ద్వారా ఇది కేవలం శిశువు ఆకలిని తీర్చడం కాదు – తనలో నిండిపోయిన పాలను విడుదల చేయడం ద్వారా తల్లికి కలిగే విముక్తిని కవి సూచిస్తున్నాడు అంటే ఇవ్వడం ద్వారా పొందే తేలిక పాటుతనం,తృప్తి,విమోచనం. పొదుగులు ఇక్కడ కేవలం శరీర అవయవాలుగా కాక త్యాగానికి,మాతృత్వానికి,దయకు,జీవన పోషణకు ప్రతీకలుగా మారతాయి.తమ విడుదల కోసం అనే భావన అత్యంత లోతైనది.ఇది భౌతిక విడుదల కాదు – ఇది సహజ ప్రవృత్తి,ఇది కర్తవ్యబోధ,ఇది అంతర్లీనమైన ప్రేమ ప్రవాహం. పొదుగులు పాలు ఇవ్వడం ద్వారా తమలోని భారాన్ని వదులుకుంటాయి – ఇది శారీరక విమోచనం.అదే సమయంలో శిశువు ఆకలిని తీర్చడం ద్వారా జీవనాన్ని కొనసాగించే కార్యం జరుగుతుంది – ఇది జీవన విమోచనం. ఆకలి గొన్న శిశువులు ఇక్కడ కేవలం శిశువులు మాత్రమే కాదు – సహాయం,ప్రేమ,ఆదరణ కోసం ఎదురు చూస్తున్న సమాజంకు ప్రతీకలుగా చూడవచ్చు.పెదాలపై ఒదుగుతాయి అనే కవితా పంక్తి చాలా సున్నితంగా లయాత్మకంగా ఉంది. ఇది కవితలో మాతృ స్పర్శ యొక్క మృదుత్వాన్ని,అదే సమయంలో త్యాగంలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. మేఘాలు వర్షమై కురిసి విముక్తి పొందినట్లే,పొదుగులు కూడా పాలను ఇచ్చి విముక్తి పొందుతాయి.ఈ కవితా పంక్తులు విమోచనం అనే తాత్విక సమీకరణాన్ని స్థాపిస్తాయి.భాషలో ఎలాంటి అలంకారాల ఆర్భాటం లేకుండా అనుభూతి ప్రధానంగా ఉంది.ఇదే ఆధునిక కవిత్వ లక్షణం.విమోచనం అనేది స్వార్థ రహితంగా ఇవ్వడంలోనే ఉంది అని,మాతృత్వ ప్రతీక ద్వారా హృద్యంగా తెలియజేస్తాయి.ఇక్కడ జీవితం జీవనాన్ని తాకే క్షణాన్ని సూచిస్తుంది.ఇది కేవలం పాలిచ్చే దృశ్యం కాదు – ఇది జీవితం – జీవితాన్ని కాపాడుకునే సంధి స్థలం.ఇది జీవన తత్వాన్ని తెలిపే కవితా దృష్టి కోణం ఉంది. ఈ కవితా పంక్తి ద్వారా కవి చెప్పేది విమోచనం అనేది వేరుపడటం కాదు.విడిచిపెట్టడమే.దాచుకోవడం కాదు పంచుకోవడమే అంటే మేఘాలు వర్షంగా కురవడం ఎలా విమోచనమో,పొదుగులు పాలుగా మారి శిశువును చేరడం కూడా అలాగే విమోచనమే.ఈ కవితా పంక్తి త్యాగం ద్వారా విముక్తి.ప్రేమ ద్వారా స్వేచ్ఛ ఇచ్చే ప్రక్రియలోనే విడుదల అనే తత్వాన్ని హృద్యంగా వ్యక్తం చేస్తుంది.ఇది అత్యంత సున్నితమైన మానవీయ ప్రతీక.పొదుగులు పాలతో నిండినప్పుడు విడుదల కావాలనే తపన కలిగి ఉంటాయి.ఆ విడుదల ఆకలితో ఉన్న శిశువు పెదాలపై జరిగితేనే అది సార్ధకమైన విమోచనం అవుతుంది.ఇక్కడ విముక్తి స్వార్థపూరితంగా కాదు ; అది ఇతరుల అవసరంతో కలిసిన త్యాగం,ప్రేమలోని విమోచనం ఇదే.ఇక్కడ విముక్తి స్వార్థపూరితం కాదు ; అది ఇతరుల అవసరంతో కలిసిన త్యాగం, ప్రేమలోని విమోచనం ఇదే.
“స్వర పేటిక/తన విముక్తిని/చెవులారా వినేందుకు/రసప్లావిత హృదయాల్లోకి/ రవాణా చేస్తుంది/అత్యంత సృజనాత్మకమైన ప్రతీకలు ఉన్న కవితా పంక్తులు.కవి కళ,సంగీతం,భావోద్వేగం,
విముక్తి అనే అంశాలను ఒకే ప్రవాహంలో కలిపాడు.స్వర పేటిక ఇక్కడ కేవలం శరీర అవయవం కాదు – మనసులో దాచుకున్న భావాలను శబ్దంగా మార్చే సృజనాత్మక కేంద్రం.స్వరపేటిక తన విముక్తిని పొందాలంటే మౌనంగా ఉండకూడదు – పాట స్వరంగా బయటకు రావాలి.అంటే వ్యక్తిగత విమోచనం అనే భావన ఇక్కడ ప్రధానంగా నిలుస్తుంది.
చెవులారా వినేందుకు అనే పదబంధం సంగీతం సాగించే భౌతిక ప్రయాణాన్ని సూచిస్తే,రసప్లావిత హృదయాల్లోకి అనే పదాలు అది చేరుకునే అంతర్లీన గమ్యాన్ని సూచిస్తాయి. సంగీతం చెవుల దగ్గర ఆగదు ; అది హృదయంలోకి చేరాలి.అక్కడే రసం పుట్టుతుంది ; అక్కడే అనుభూతి సంపూర్ణమవుతుంది.
ఇందులో రవాణా చేస్తుంది అనే యాంత్రిక పద ప్రయోగం విముక్తి వంటి అంతర్లీన భావంతో కలిపిన తీరు ఈ కవిత ఆధునిక కవిత్వ లక్షణాన్ని బలంగా ప్రతిఫలింపజేస్తుంది.కవి తన అనుభూతి ప్రపంచాన్ని ఆధునిక దృష్టితో ఆవిష్కరిస్తాడు.ఈ కవితలో మేఘాలు,పొదుగులు ఎలా విమోచనం పొందాయో ఇక్కడ స్వర పేటిక కూడా తనలోని స్వరాన్ని పంచడం ద్వారా విముక్తి పొందుతుంది.అందు వల్ల ఈ కవితా పంక్తులు చెబుతున్న సారాంశం – కళకు విమోచనం వ్యక్తీకరణలో ఉంది.వినబడినప్పుడే స్వరం జీవిస్తుంది. భాషలో ఆర్భాటం లేదు.భావంలో లోతుంది.ప్రతీకల ద్వారా ఆధునిక అనుభూతి శాశ్వతం అవుతుంది.ఈ కవితా పంక్తులు విమోచనం కవితకు కళాత్మకమైన శిఖరాన్ని అందిస్తాయి.స్వరపేటికలోని స్వరం బయటకు రాకపోతే అది నిశ్శబ్దంగా నలిగిపోతుంది.స్వరం బయటకు వచ్చి శ్రోతల హృదయాల్లోకి ప్రవేశించినప్పుడే అది జీవం పొందుతుంది. ఇది కళ స్వభావాన్ని తెలియజేస్తుంది – కళ తన విమోచనాన్ని ఇతరుల అనుభూతుల ద్వారా పొందుతుంది.కళాకారుడి వ్యక్తిగత భావం సామూహిక రసానుభూతిగా మారడమే అసలైన విముక్తి అని కవి స్పష్టం చేసిన తీరు చక్కగా ఉంది.
“కవి/తన నుండి తను విడివడి/సర్వ స్వతంత్రుడయ్యేందుకు/ పడుతున్న పెనుగులాటే/చివరికి కవిత్వమై అలరారుతుంది/ చాలా లోతైన ఆత్మ పరిశీలనతో నిండిన కవితా పంక్తులు.ఈ పంక్తుల ద్వారా కవి తన కవిత్వ సృష్టి యొక్క అంతర్లీన సంఘర్షణను స్పష్టంగా ఆవిష్కరిస్తాడు.కవిత్వం ఇక్కడ సౌకర్యం నుంచి పుట్టిన ఫలితం కాదు ; తనతో తానే పోరాడి సాధించిన విముక్తి యొక్క రూపం.
తన నుండి తను విడివడి అనే పదబంధం
అంతరంగ విభజనను సూచిస్తుంది.ఒకవైపు వ్యక్తిగత బాధలు,భయాలు, పరిమితులు : మరోవైపు వాటిని అధిగమించాలనే సృజనాత్మకమైన తపన.
సర్వ స్వతంత్రుడయ్యేందుకు అనే లక్ష్యం సామాజిక బంధాల నుంచే కాక,ఆత్మలోని అహం,సంకుచిత మౌనాల నుంచి విముక్తిని కూడా సూచిస్తుంది.ఈ విముక్తి సులభంగా లభించదు.అందుకే కవి దీనిని పెనుగులాటగా వర్ణించాడు.అది మౌనంతో,భయంతో,అనిశ్చితితో సాగే అంతర్మథన యుద్ధం.ఆ పెనుగులాట చివరికి నాశనంగా కాక కవిత్వంగా అలరారుతుంది ; అశాంతి కళగా పరివర్తన చెందుతుంది.ఈ కవితా పంక్తులు విమోచనం కవితలోని మౌలిక,తాత్విక భావాన్ని హృద్యంగా వ్యక్తం చేస్తాయి. మేఘాలు వర్షమై,పొదుగులు పాలనిచ్చి విముక్తి పొందినట్లే,స్వర పేటిక స్వరమై విమోచనాన్ని అందుకున్నట్లే,కవి తనలోని తను ను విడిచిపెట్టి కవితగా మారినప్పుడే స్వేచ్ఛను పొందుతాడు.భాష ఆధునికం ; వ్యక్తీకరణ సూటిగా,తాత్వికత గాఢంగా ఉంది.ఈ కవితా పంక్తులు కవిత్వం అనేది ఫలితం కాదు – ఒక ప్రక్రియ అని స్పష్టం చేస్తాయి.విమోచనం అనేది సృష్టి ద్వారానే సాధ్యం అనే సందేశాన్ని బలంగా ప్రతిపాదిస్తాయి. కవి తన స్వార్థం,అహం,వ్యక్తిగత సంకుచితత్వం నుంచి విడివడి స్వతంత్రుడవ్వాలనే పోరాటమే కవిత్వం.ఇది సులభమైన ప్రయాణం కాదు – ఒక పెనుగులాట.ఆ అంతర్గత సంఘర్షణ నుంచే కవిత పుడుతుంది.ఈ కవిత ద్వారా కవికి విమోచనం లభిస్తే,పాఠకుడికి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.
ఈ కవితలో ప్రకృతిలో విమోచనం వర్షంగా, మాతృత్వంలోని ప్రేమగా,కళలో రసానుభూతిగా,కవిలో కవిత్వంగా ప్రకటితమవుతుంది.విమోచనం అనేది పారిపోవడం కాదు ; తనలోని నిండుదనాన్ని ఇతరులతో పంచుకోవడం.ఈ భావనను సులభమైన పదాలతో గాఢమైన ప్రతీకల ద్వారా వ్యక్తపరచడంలో ఈ కవిత సాహిత్య సౌందర్యాన్ని సంతరించుకుంది.అంతిమంగా ఈ కవిత మనకు చెప్పేది ఇదే – నిండినదంతా వెలువడితేనే తేలిక ; వెలువడినదంతా కవితగా మారినప్పుడే విమోచనం.కవి భాస్కర్ విమోచనం అనే చక్కటి కవితను అందించినందుకు మనసారా అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని కోరుకుంటున్నాను.
సంగీత జలధిలో మునకలేస్తూ, స్వరాలను శ్వాసిస్తూ, రాగాలను పానంచేస్తూ, పంచప్రాణాలుగా అభిమానిస్తూ, ఆరోప్రాణంగా ఆరాధిస్తూ వన్నె తెచ్చిన స్వరకర్త లెందరో.
పలు చరణాలతో కూడిన స్వరకల్పనకి పల్లవి తిరగలి చక్రమై రాగానికి శోభ నిచ్చిన విధంగానే బాలభానుడి లేత కిరణాలైనా, సోముడి వెన్నెల జల్లులైనా ప్రకృతి సోయగమై మనసుకు హాయి గొలుపుతాయి.
సంగీత పరిభాషలో స్వరాల సమూహాన్ని ‘రాగం ‘ అంటారు. ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూర్చనను కలిగి ఉంటుంది. ప్రతీ మూర్చన తనవైన స్వరాలను కలిగి ఉంటుంది. స్వరాలేవైనప్పటికీ రాగభావం మాత్రం మాధుర్యభరితమే.
చుక్కలు పరిచిన నీలాల దుప్పటి కవులకు కవితావస్తువై, కావ్యాల్లో సైతం తనదైన ముద్ర వేసుకుంది.
ఎదఎదను రంజింపజేసే సంగీత సుధ దేశకాలాల్ని బట్టి ఏ రూపు సంతరించుకున్నా(కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య), ఏ చోట ప్రవహించినా అంతిమంగా దాని లక్ష్యం అలౌకికానందమే.
సంగీత వీచికతో కూడిన శబ్దాన్ని ‘నాదం ‘ అంటారు. అనంతరాగాల సమన్వితమైన సంగీతం నాదమయం. గుప్పెడు గుండెలో కోటి భావనలు దాగి ఉన్నట్టే, అసంఖ్యాక రాగాలలో ఇమిడి ఉన్న నాదమొక్కటే.
మధురమైన ఆ సుధాగానాన్ని గ్రోలుతూ, ఆ నాద జగత్తులో పరవశిస్తూ, సంగీత సరస్సులో వికసించిన పద్మాలెన్నో.

నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతుల తనయగా 08/04/1938 భారతదేశంలోని చెన్నై నగరంలో జన్మించి, సంగీత సరస్సులో ముచ్చటగా మూడోసారి{( పద్మశ్రీ-1984), (పద్మభూషణ్-2004), (పద్మ విభూషణ్-2026)}వికసించి, తన పూదేనియల వెదజల్లిన ఈ పద్మమే ఎన్. రాజం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన 2026వ సంవత్సరపు పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందిన ఐదుగురు సభ్యుల్లో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ వాయు లీన విద్వాంసురాలు వయొలిన్ వాద్యంలో (కళల విభాగంలో)సాధించిన ప్రతిభకుగాను ఈ అవార్డును పొందారు.
హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతురాలైన వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తమ ఉద్యోగ నిర్వహణలో సంబంధిత విభాగానికి అధిపతిగా, ప్రదర్శన కళల విశ్వవిద్యాలయ విభాగాధిపతిగా తమ సమర్థవంతమైన సేవలు అందించి, పలు పదవులకు వన్నె తెచ్చారు.
వీరంందించిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ (1990) అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమి అందించే అత్యున్నత గౌరవమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2012లో వీరిని వరించింది.
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యురాలిగా సంగీతంపై పట్టు సాధించారు.
ఘర్(ఇల్లు) అనే హిందీ పదం నుండి ఉద్భవించిన’ ఘరానా ‘ అనే సంగీత ప్రక్రియలో నిష్ణాతులైన హిందుస్తానీ సంగీత గురువు ఓంకారనాథ్ ఠాగూర్ వద్ద రాగవికాసాన్ని నేర్చుకున్నారు.
ఘరానా అనే పదానికి సంగీత వారసత్వం, గురుశిష్య సంప్రదాయం అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట సంగీత శైలి. రాగ, గాత్ర వాద్య శైలులను అభ్యసించే విధానాన్ని సూచించే ప్రక్రియ(గ్వాలియర్ ఘరానా).
వారణాసిలో మహదేవ్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ఆ నగరం యొక్క ఠుమ్రీ సంప్రదాయాన్ని కూడా అభ్యసించారు. క్రమంగా వాద్య సంగీతంలోకి అడుగుపెట్టి చివరకు హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ విద్వాంసురాలిగా ఖ్యాతి గాంచారు.
తండ్రి మార్గదర్శకత్వం లో ‘గయాకి అంగ్ (గాత్ర శైలి)’ అనే ప్రక్రియను అభివృద్ధి పరిచారు. గయాకి అంటే హిందీ, అరబిక్ భాషలలో పాడటం అని అర్థం. ఖయాల్ అంటే హిందీ భాషలో ఆలోచన అనీ, పర్షియన్ భాషలో సాహిత్యం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఖయాల్ గయాకి అనేది నిర్దిష్ట శైలి, వేగం లేని వివరణాత్మక గానకళ. వీరు తమలోని సంగీత పరిజ్ఞానానికి సాధనను జోడించి వయొలిన్ వాద్యంపై మనుషుల స్వరాన్ని పోలిన విధంగా వాయించే విధానాన్ని కనిపెట్టారు.
వయొలిన్ భారతీయ సంగీత కచేరీలో, ముఖ్యంగా కర్ణాటక సంగీత కచేరీలో ఉపయోగింపబడే ప్రధాన సహకార తంత్రీవాద్యం. దీనికి ‘ ఫిడేలు ‘ అని మరో పేరు. గాంభీర్యంతో కూడిన మాధుర్యం దీని సొంతం. ఇది పాశ్చాత్య వాయిద్యమైనప్పటికీ, కర్ణాటక సంగీతంలోని అతి సూక్ష్మ గమక విశేషములను కూడా పలికించగల సామర్థ్యం ఉండటంచే ప్రధాన పక్క వాయిద్యంగా, తని వాయిద్యంగా భారతీయ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది.
కర్ణాటక సంగీత శైలిలో ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన T.N. శేషన్ తోబుట్టువు వీరు. చార్టెడ్ అకౌంటెంట్ ఐన T.S. సుబ్రహ్మణియన్ అనే వ్యక్తిని వివాహమాడి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆ శిశువుకు సంగీత శంకర్ అని నామకరణం చేశారు.
కూతురైన సంగీత శంకర్ గారికి, మనవరాళ్లైన (సంగీత శంకర్ గారి తనయలు) రాగిణి శంకర్, నందిని శంకర్ లను వయొలిన్ వాద్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.
మేనకోడలైన కళారాంనాథ్, డా. సత్యప్రకాష్ మెహంతీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఐన ప్రణవ్ కుమార్ వీరి శిష్యులు. కర్ణాటక సంగీత గాయని మరియు సామాజికవేత్త ఐన పద్మా స్వామినాథన్ వీరికి అత్తగారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నేపధ్య గాయని ఐన వాణీజయరాం వీరికి వదిన.
సంగీత కుటుంబంలో జన్మించి, ఆ సాగరాన్ని మథించి, అందుండి లభించిన రాగసుధల్ని వారసత్వంగా తనవారికి పంచడమే కాకుండా, స్వపర భేదాలెంచక అభిమానించి, ఆరాధించిన (సంగీతాన్ని) వారందరికీ వితరణ చేసి, అందులోనే తాదాత్మ్యం చెందిన ఈ సంగీత శిఖరానికి(రాజం గారికి) కైమోడ్పులర్పిస్తూ…..
భరతనాట్యంలో ప్రప్రథమ భారతీయ మహిళా నృత్య కళాకారిణియైన వీరు ఫిబ్రవరి
29 ,1904 లో మధురై, మద్రాస్ (ప్రెసిడెన్సి బ్రిటిష్ ఇండియా)లో జన్మించారు .తల్లిదండ్రులు నీలకంఠశాస్త్రి శేషమ్మాళ్ గార్లు. సంస్కృత పండితులు, చరిత్రకారులైన నీలకంఠ శాస్త్రిగారు “థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా “లో సభ్యులు .
నాటి సామాజిక పరిస్థితులను అనుసరించి బాల్యవివాహానికి పెద్దలు ప్రయత్నించినప్పుడు తిరస్కరించిన రుక్మిణి ,ఏడవ సంవత్సరంలో ఉన్నప్పుడే తండ్రితో పాటు ఆమె సొసైటీలో చేరారు. కర్ణాటక సంగీతము , భరతనాట్యం లో అభిననివేశం సంపాదించారు . విదేశీయులైన జార్జ్ ఆరుండేళ్ ను 1920లో తన పదహారవ ఏట వివాహం చేసుకున్నప్పుడు ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు కాగా, జార్జ్ ఆరుండేళ్ వయసు నలభై సంవత్సరాలు . తల్లిదండ్రులు విముఖత చూపినప్పటికీ అనిబిసెంట్ ఆధ్వర్యంలో వీరి వివాహం జరిగింది.
ఆధ్యాత్మికత పైనున్న ఆసక్తే ఆమెను,’ యంగ్ థియోసాఫిస్టిక్స్ ఫెడరేషన్’ అధ్యక్షురాలిని చేసింది. ‘థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం’లో జార్జ్ అరుండేల్ బోధకులు. వివాహానంతరం దంపతులిద్దరూ ఇరు సంప్రదాయాల్ని పరస్పరం గౌరవించుకుంటూ చక్కని జీవన యానం చేశారు. ఒకానొక సందర్భంలో భర్త గురించి చెప్తూ , “చతుర భాషణులు, జన సమూహంలోఉంటూ,అందరిని చైతన్య పరచడం వారి ప్రత్యేకత అంటారు .వీరి వివాహం సనాతన సాంప్రదాయ వర్గాలకు నచ్చక సంఘం నుండి కొత్తజంటను, ఆమె కుటుంబాన్ని బహిష్కరించినప్పటికీ వారి కలివిడితనం ప్రజల మద్దతుతో తిరిగి సమాజంలో కలిసిపోయారు.

మరోసందర్భంలో తమ కుటుంబ నేపథ్యం గురించి చెప్తూ మా ఇంట్లో ఆంక్షలు, కట్టుబాట్లు ఉండేవి కావని, సంస్కృతీసాంప్రదాయాల్ని తమవారిని చూస్తూనే నేర్చుకున్నానంటారు. కులమత భేదాలు, సంకుచిత స్వభావాలు ,జంతుబలులు లాంటి మూఢనమ్మకాలు ఉండేవి కావంటారు .
జార్జ్ అరుండేల్ వృత్తి ధర్మం లో భాగంగా వారు ఎన్నో దేశాలను చుట్టివచ్చే అవకాశం వారికి లభించింది .ఆ సందర్భంగా
అన్నాపావ్లోవా బావ్లే అనే రష్యన్ కళాకారిణి చేసిన బ్యాలెరీనా నృత్యాన్నిచూసి, పాశ్చాత్య బాలేట్ వైపు ఆకర్షితరాలైన ఈమె బావ్లే గురువు’ క్లియోనార్టి ‘వద్ద నృత్యాన్ని అభ్యసించారు. తరువాత బావ్లే సలహాతో
భరత నాట్యం నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం కేవలం దేవదాసీలు మాత్రమే చేసే ఆ నృత్యాన్ని సనాతన వర్గపు స్త్రీలు భరతనాట్యం నేర్చుకోవడం అవమానంగా భావించే సందర్భం. ఐనా అందరి విమర్శల్ని ,అభ్యంతరాలని పక్కకు నెట్టి ‘మీనాక్షి సుందరం పిళ్ళై ‘దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం పొందారు. ‘కేలూనాయర్’ వద్ద కూడా నాట్యం నేర్చుకున్నారు. ‘థియోసాఫికల్ సొసైటీ’ వజ్రోత్సవాల్లో భాగంగా ఇరవై వేల మంది ఆహుతుల మధ్య ప్రదర్శన ఇచ్చి రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ లాంటి ఎందరో ప్రముఖుల ప్రశంస పొందిన ప్రతిభాశాలి. ‘జేమ్స్ కజిన్’ అనే ఐర్లాండ్ కవిని ఆమె నాట్యం ఎంతగానో ఆకర్షించగా ,అతని ప్రోత్సాహంతో ‘ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ‘ పేరిట 1936 లో నృత్యాలయాన్ని ఏర్పాటు చేశారీదంపతులు .అదే అంచెలంచెలుగా ఎదుగుతూ ‘కళాక్షేత్రం’గా రూపం మార్చుకుంది. తన తొలి గురువైన సుందరం పిళ్ళై మరియు వారి అల్లుడు చొక్కలింగం పిళ్ళైలను తమ కళాక్షేత్రంలో గురువులుగా నియమించుకుని ,నలుగురు విద్యార్థులతో ప్రారంభించబడి అంచలంచెలుగా ఎదుగుతూ శిఖరాగ్రాన నిలిచిందీనాడు. నాట్యంతో పాటు సంగీతాన్ని కూడా చేర్చినేర్పిస్తున్నారు .తోటలు తామరకొలను సాంప్రదాయిక కట్టడాలతో తన అభిరుచికి తగ్గట్టు ఒక నాట్య దేవాలయంగా తీర్చిదిద్దారీ కళాక్షేత్రాన్ని.
కేవలం దేవదాసీలు మాత్రమే ఈ నృత్యం చేయాలన్న ముద్రను చెరిపేసి ఈ కళారూపాన్ని జన రంజకంగా తీర్చి దిద్దిన
లాస్య ప్రియ.
శ్రీ జార్జ్ అరుండేల్ 1945 లో మరణించేనాటికి రుక్మిణీఆరుండేల్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు .(ప్రముఖ తత్వవేత్త ఐన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు జార్జ్ అరుండేల్ గారి పూర్వ విద్యార్థి.)
1967లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ని కూడా పొందారీమె.
1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్ రాష్ట్రపతి అభ్యర్థిగా
శ్రీమతి ఆరుండేల్ ను ప్రతిపాదించినపుడు సున్నితంగా తిరస్కరించారట .రాష్ట్రపతి పదవి కన్నా నాట్యాన్ని ఇష్టపడ్డ వ్యక్తి అని , ‘2013 లో కళాక్షేత్రలో రుక్మిణీ దేవి స్మారకోపన్యాసం సందర్భంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
గుర్తు చేశారు ‘.

భరతనాట్యానికి మార్పులు చేర్పులు చేసి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ప్రపంచ ప్రాముఖ్యతను కలిగించారు. దేవదాసి సమాజంలోని టి. బాల సరస్వతి మరికొందరు నృత్య కళాకారుల సహాయ సహకారాలతో ఈ కళను గుడిమెట్లు దాటించి ప్రపంచ వేదిక పైకి తీసుకురావడంలో విశేష కృషి సల్పిన రుక్మిణి ఆరుండేల్ , భరతనాట్యంలో శృంగార అంశాలను తొలగించి భక్తి రసానికి ప్రాధాన్యతను కలిగించి పాఠ్యాంశాల్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారు. ఆహార్యంలో, ఆభరణాలకు, రంగస్థల దృశ్యాలకు కొత్తదనాన్ని జోడించి నృత్య , నాటక ఆకృతినిచ్చి రామాయణంలోని కొన్ని అంశాలను అత్యంత జనాదరణ పొందేలా రూపొందించారు.
1952 ఏప్రిల్ లో మొదటిసారి రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికైన తొలి నాట్య కళాకారిణిగా రికార్డు సాధించారు .రెండుసార్లు ఈ పదవినలంకరించిన వీరు జంతు సంక్షేమం కోసం “ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఆనిమల్ ఆక్ట్ “కోసం “జంతు క్రూరత్వ నిరోధక బిల్లు 1960 “తేవడంలోను,”జంతు సంక్షేమ బోర్డు “స్థాపనలో విశేషమైన కృషి చేశారు .ఈ బిల్లు ప్రవేశ పెడుతూ ఆమె చేసిన ప్రసంగానికి ప్రభావితులైన ప్రధాని నెహ్రూ చొరవతో త్వరితగతిన చట్టం రూపుదాల్చింది. ఎన్నో సంస్థలతో కలిసి జంతు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1956లో ‘పద్మభూషణ్’ తో సత్కరించగా , ‘దేశికోత్తమ’ బిరుదుతో ‘శాంతినికేతన్’ సన్మానించింది.
నాట్య రీతిలో భగవత్తత్వాన్ని జోడించి , వీరు భరతనాట్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందడమే కాక ,నాట్యాన్ని ఉన్నత శిఖరాన నిలిపిన ఘనత సాధించారు .
ఫిబ్రవరి 24 ,1986న శ్రీమతి రుక్మిణీఆరుండేళ్ హంసమంజీరమై నటరాజ పాదాల చెంత చేరారు .
ఈరోజు మకరసంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం పర్వదినం సందర్బంగా నేను మా వారు సత్యమూర్తి,మాఇంట్లోవుండే సీను,రేణుక,దినేష్ తో కలసి కారులో నా జన్మభూమి పుట్టి పెరిగిన ఊరు ఏదులాబాద్ కు ప్రయాణం,
కన్న ఊరు,కన్నతల్లి గొప్పది కదా ఎన్నగా ఎవరికైనా..
ఘటకేశ్వర్ మండలంలో నెలకొన్న
గోదా రంగనాథస్వామి ఆలయంలో గోదా రంగనాథుల కల్యాణం సందర్బంగా పట్నం నుండి పల్లెకు బయలుదేరి ఉదయం 11.30.గంటలకు వెళ్ళాము.
మా ఊరికి వెళుతుంటే నాకు చెప్పలేని ఆనందం,ఉత్సాహం .ఊరికి చేరుకోగానే అభివృద్ధి చెందిన ఊరును, ఎత్తైన భవనాలను చూసి పరవశించిపియాను.

ప్రతి ఇంటిముందు పెండతో చల్లిన నీళ్లతో పచ్చదనం నింపుకున్న వాకిళ్ళు తెల్లని ముత్యాల ముగ్గులు సప్తవర్ణ శోభితమై,గొబ్బెమ్మలు వాకిలి కొప్పులో అలంకరించి పల్లె సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ ఆహ్లాదకర వాతావరణం చూస్తుంటే రెండు కన్నుల సరిపోవన్నది సత్యం.
ముందుగా నేను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చూచి ఆనందంతో గుర్తుగా ఒక ఫోటో తీసుకుని వెళుతూ పెద్ద చెరువు చూసి పరవశించి ఆనాడు బతుకమ్మ ఆట ఆడిన జ్ఞాపకాలను తలచి నెమరువేసుకుంటూ వెళుతున్నాము.
ఎన్నో కార్లు నిలబడి ఉన్నాయి.కిలోమీటరు దూరంలోనే ఆపేశారు పోలీసులు.చాలా మందితో నిండిపోయింది. నాకు వేరే దారి తెలుసు కాబట్టి దారి మళ్లించి
మా ఊరు కాబట్టి ప్రైమరీ బడి పక్కదారిలో నుండి గ్రామపంచాయతీ ఆఫీసు మీదుగా రామాలయం ( మా బాబాయి వాళ్ళది.మా పెదన్నయ్య అందులో పూజలు చేసేవాడు) వెళ్ళాము.చాలా మార్పులు చేస్తున్నట్లు గమనించాము.రామాలయం అంతా తిరిగి చూచి ఫోటోలు దిగాము.మా చిన్నపుడు శ్రీరామనవమి ఉత్సవాలు,సీతారామ కల్యాణం వైభవంగా జరిగేది.మా పెద్దన్నయ్య రాములు పంతులు ఆ గుడిలో చాలా యేండ్లు పని చేసాడు.అప్పుడు కూడా సీతారామ కళ్యాణ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి.మేము ప్రతి సంవత్సరం రామనవమికి ఊరికి వెళ్ళేవాళ్ళము.
ఇప్పుడు కూడా చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. కారును వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర పార్కింగ్ చేసి రంగనాథ ఆలయం వెళ్ళాము.
ఇసుక వేస్తే రాలనంత రద్దీ.పల్లె అంతా అక్కడే ఉన్నట్లు అనిపించింది.అంతేకాకుండా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలనుండి జనం తరలి వచ్చారు.మల్కాజిగిరి MLA మల్లారెడ్డి కుటుంబంతో ,పరివారం తో వచ్చాడు.
.ఆనందం,ఆశ్చర్యం..

లోపలికి వెళుతుంటే తెలిసిన వాళ్ళందరూ పలకరింపులతో పులకించిపోయాను. అక్కడ మేడ్చల్ మల్కాజిగిరి MLA మల్లారెడ్డి గారు కనిపించారు.పలకరించాను.
రంగనాథ గోదాదేవి
దైవ దర్శనం చేసుకున్నాక అమ్మవారిగాజులు ప్రసాదంగా ఇస్తే తీసుకుని కల్యాణం విందు .భోజనం చేస్తుంటే వడ్డన చేస్తున్నవారిలో నాతో కలిసి చదివిన సహాధ్యాయులు కనిపించి గుర్తుపట్టి నువ్వు సీతవేనా? అని అడిగారు.చాలా కాలమైంది చూసి .పాపయ్య,శ్రీరాములు.. ఎన్నో చిన్ననాటి ముచ్చట్లు గుర్తుచేసుకుని మాట్లాడుకున్నాము.అక్కడ నుండి బయటకు వచ్చి వైష్ణవుల యిండ్లు మా చిన్ననాటి స్నేహితులను కలిసి అనుభవాలు పంచుకున్నాము. అట్లా బయలుదేరి .నేను పుట్టిన మా ఊరి నేను పెరిగిన యిల్లు చూచి వారితో మాట్లాడి బయలుదేరి దిడ్డి ( నా చిన్నప్పుడు కూరగాయల మార్కెట్ అన్నమాట) నుండి తిరుమన్నారాయణుని బండ (ఏకశిలా.పెద్దబండ..కింద పెద్దగుహ,గోలకొండకిటకు సొరంగ మార్గం ఉంది అని అంటారు( అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది.ఇప్పుడు.బండపైకి ఎక్కి చిన్నపుడు ఆడుకున్న ఆటలు,తీరుతెన్నులు తలచుకొని బయకుదేరాము.మా ఇంటిపక్కన వుండే మా గురువు రామానుజం పంతులు యొక్క (కొడుకు సత్యం ఈ మధ్య మరణించాడు.బాధగా ఉంది.ఎప్పుడు కలిసినా ఆనందంతో పలకరిస్తాడు) వారిభార్య రాజేశ్వరి ఆమె లేదు.వాళ్ళ పక్కింటి వాళ్లు పెరికె వెంకటేశంకు నేను రచించిన మా అమ్మ గురించి మాతృశతకం జానకీ రాఘవీయం, సీతమాట *ద్విశతి రెండుపుస్తకాలు ఇచ్చాను.ద్విశతి మాగురువుకే అంకితం చేశాను. వాళ్లకు అందజేయమని చెప్పి ఒక ఫోటో తీసుకున్నాను గుర్తుగా.

మా అమ్మకు నాన్నకు,మాకు ఊరితో ఆత్మీయానుబంధం ఎక్కువే.
మర్చిపోయాను చెప్పడం వస్తుంటే తొంటలక్ష్మి కనబడి గట్టిగా పట్టుకుంది.ఎంతో సంతోషించింది.కుడిచెయ్యి గిర్నీలో పడి నలిగిపోయింది.ఎడమ చెయ్యి ఒక్కటే ఉంది.కానీ మా చిన్నప్పుడు ఒక్క చెయ్యితోనే పట్టుకుని తలమీద నీళ్లకుండ ఒకటికాదు కుండమీద కుండ రెండు కుండలు పెట్టుకుని చేద బావినుండి నీళ్లు తోడుకొని తెచ్చిన ఘనురాలు.
అలా ఊళ్ళో అందరిని కలుసుకుని ఎంతో అనుభూతిని ఆనందాన్ని మూటకట్టుకుని హైదరాబాద్ లో ఉన్న మా ఇంటికి ఉప్పల్ భగాయిత్ గుండా బయలు దేరి సాయంత్రం 5.30 కి క్షేమంగా చేరుకున్నాము.






ఎనిమిదేళ్ల అమ్మాయికి
చాక్లెట్ ఆశ చూపి లైంగికంగా, అత్యాచారం చేయబోయిన పదిహేడేళ్ల అబ్బాయి.
ప్రేమించిన వ్యక్తిని
తన తల్లిదండ్రులు వద్దన్నారని,
కూతురు ఆత్మహత్య.
అబ్బా..పొద్దున లేచి పేపరు చూస్తే చాలు ప్రతిరోజు ఇలాంటి వార్తలే ఎక్కువయ్యాయి.
అనుకుంటున్న ధరణికి
ధరణీ…!
అన్న భర్త పిలుపుతో
ఏంటండీ..! అన్నది చికాకుగా ధరణి.
ఏందిరా! పొద్దున్నే వేడి వేడిగా కనిపిస్తున్నావు అన్నాడు భర్త మధుకర్.
ఏంటో..? చెప్పండి !
మీకు వేడివేడిగా టీ ఇవ్వాలి. అంతేగా.. వస్తున్నా అంటూ పేపర్ అక్కడ టీపాయ్ పై పడేసి కిచెన్ లోకి వెళ్లి భర్తకు అల్లం టీ ఇష్టం కాబట్టి అల్లం వేసి, టీ..కాచి తీసుకొనివచ్చి మధుకర్ కి ఇచ్చింది ధరణి.
నీ చేతితో చేసిన చాయ్ అమృతమోయ్ అన్నాడు మధుకర్.
అవును మరి అమృతం తాగుతూ వెయ్యిళ్లు బతుకుదాం ఈ కలియుగంలో జరిగే అరాచకాలను చూస్తూ అన్నది ధరణి చిరు కోపంతో..
నిజంగా నీవు పేరుకు తగ్గట్టే నా పాలిటి వరం ధరణి. భూదేవి అంత ఓర్పు, సహనం కలిగిన భార్యను నాకు అందించాడు ఆ దేవుడు. ఎన్నడూ లేనిది
ఎందుకో నా శ్రీమతి ఈరోజు చిటపటలాడుతుంది అన్నాడు ఓరకంట ధరణిని చూస్తూ మధుకర్.
ఏం లేదండి ! మీ అమృతం చల్లారిపోతుంది ఆస్వాదించండి అన్నది ధరణి.
టీవీ ఆన్ చేసి టీ తాగుతున్నాడు మధుకర్.
టీవీ లో కూడా పేపర్లో వచ్చిన న్యూస్ లే రిపీట్ గా వస్తున్నాయి.
టీవీ లో కూడా అవే న్యూస్ లు మనసుకు బాధగా ఉంది. చానెల్ మార్చండి అన్నది ధరణి.
ఏందిరా? ధరణీ!
ఈరోజు డిసప్పాయింట్ గా ఉన్నావ్ ఏంది సంగతి అన్నాడు మధుకర్.
ఏముందండీ…!
ఏ పేపర్ వార్తలు చూసినా, ఏ ఛానల్ న్యూస్ విన్నా, ఏమున్నది గర్వకారణం
నరజాతి సమస్తం
అత్యాచారాలు, ఆత్మహత్యలు.. మానవత్వాలను మరిచి
మనసును తొలిచే వార్తలు
అన్నది ధరణి.
వాహ్వ వాహ్వ సూపర్ రా!
వార్తలపై కూడా కవిత్వం
చెప్తున్నా ఓయ్ నువ్వు అన్నాడు ధరణిని నవ్వించాలని మధుకర్.
మీ పరిహాసం చాలు కానీ,
ఈరోజు నాకు శ్రీ శారద కళాశాల వాళ్ళ వార్షికోత్సవం ఇన్విటేషన్ ఉంది. త్వరగా వెళ్లాలి. మీరు కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేసి సచివాలయానికి వెళ్ళండి అన్నది ధరణి.
నీవు నీ కారు తీసుకుని రాముని తీసుకొని వెళ్ళు అన్నాడు మధుకర్.
ఎందుకండీ! మీరు వెళ్ళే దారిలోనే కదా ఆ కాలేజ్ వున్నది.ఇంధనం ఖర్చు దండగ చేయడం. రోడ్డుపైన మన రెండవ వెహికిల్ వల్ల ట్రాఫిక్ ,పొల్యూషన్ చేసుకుంటున్నాము.
అత్యవసరం లేకున్నా బయటికి వెళ్లడం వల్ల రోడ్డు పైన వాహనాలు ఎక్కువై, మనిషి నడిచే దారి కూడా లేకుండా వాహనాలు ఎక్కువగా ఉంటున్నాయి. అన్నది సామాజిక బాధ్యత గల ధరణి.
వచ్చేటప్పుడు ఎట్లా వస్తావు అన్నాడు మధుకర్.
ఏదో ఒక ఆటో లో వస్తాను.
నేనిచ్చే ఆటో డబ్బు వల్ల
ఆటో వాడి కుటుంబ అవసరాలకైనా
డబ్బు ఇచ్చినదాన్ని అవుతాను అన్నది.
నేను అందుకే చెప్పాను. ఇంట్లో ఒక కారు ఉంటే చాలు రెండవ కారు వద్దు అని.
ఒక ఇంట్లో రెండు మూడు కార్లు కొనుక్కొని, మన పర్యావరణాన్ని రోడ్లను, ఇంధనాన్ని పాడు చేసుకుంటున్నాము. వాయి కాలుష్యాన్ని మనకు మనమే పెంచుకుంటున్నాం అన్నది ధరణి.
అందరూ నీలాగే ఆలోచిస్తే బాగానే ఉంటది. కానీ, వాళ్ళ స్టేటస్లు
వాళ్ళ అవసరాలు, డబ్బుంది కదా అని కారు కొనడం జరుగుతుందేమో అన్నాడు మధుకర్.
ఇట్లానే ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లనే మన ఇండియాలో రోడ్లు చిన్నవిగా వాహనాలు ఎక్కువగా అయ్యాయి. రోడ్లు పాడైతే బాగుచేసే నాధుడే లేడు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా వాళ్లు బాగుపడడం తప్ప, మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది అన్నది ధరణి.
వాచ్ వైపు చూసి
అమ్మో టైం అవుతుంది. మనం వెళ్ళాలి పదండి.త్వరగా
రెడీ అవ్వండి అన్నది ధరణి.
మధుకర్ వెళ్లే దారిలో
శ్రీ శారద కళాశాలలో
ధరణిని డ్రాప్ చేసి వెళ్ళాడు మధుకర్.
శ్రీ శారద జూనియర్ కళాశాల ప్రోగ్రాం స్టార్ట్ అయింది.
ఆ కళాశాల మేనేజ్మెంట్ కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారు మాట్లాడుతూ
మా విద్యార్థిని, విద్యార్థులకు
మీ యొక్క అమూల్యమైన సలహాలు, వారి యొక్క భవిష్యత్తుకి మార్గదర్శకాలు ఇస్తారని ఆశిస్తూ ప్రముఖ సైక్రియాటిస్ట్
ఎన్నో అవార్డులను పొందిన
డాక్టర్ ధరణి మధుకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అన్నాడు కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారు.
డాక్టర్ ధరణి గారు లేవడంతో అక్కడ ప్రదేశమంతా, కరతాళధ్వనులతో స్వాగతం పలికారు.
డాక్టర్ ధరణి మాట్లాడుతూ
చదువులతల్లి, జ్ఞానజ్యోతి అయిన సరస్వతీ దేవి పేరు మీద శ్రీ శారద జూనియర్ కళాశాల వారు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వసంతానికి విచ్చేసిన శ్రీ శారద కళాశాల డైరెక్టర్ కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారికి,
గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ గారికి టీచింగ్ స్టాఫ్ అందరికీ
నా నమస్కారాలు.
శ్రీ శారద కళాశాలకి వన్నె తెస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు
నాయొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇక్కడి వేదిక అంతా చూసిన తర్వాత కొంతమంది ప్రసంగాలు ఇచ్చారు.
నేను అంత గొప్పగా మెసేజ్ లు ఇచ్చేదాన్ని కాదు అనుకుంటున్నాను.
నేను ఏడవ క్లాస్ నుండి మెడికల్ కాలేజ్ వరకు ఆర్టీసీ బస్సులో అన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారికి కేటాయించిన సీట్లను వారినే కూర్చొనిద్దాం.
అని బస్సులో రాసిన దానికి నేను ఇంప్రెస్ అయ్యేదాన్ని. ఇక్కడ కూడా అలాంటి
సత్ సంప్రదాయమే చూపించిన మగపిల్లల అందరికీ హ్యాట్సాఫ్ టు యు.
అప్పటినుండి మీ అందరిని చూస్తూనే ఉన్నాను. టూ అవర్స్ నుండి అబ్బాయిలు అందరు నిల్చున్నారు. అమ్మాయిలు అందరూ హ్యాపీగా కూర్చున్నారు.
స్టేజ్ పైన అబ్బాయిలు, అమ్మాయిలు ప్రదర్శించిన ప్రోగ్రామ్స్ ని,
పెద్దవాళ్లు ప్రసంగించిన ప్రసంగాలను వింటూ.. ఎలాంటి కామెంట్స్ లేకుండా ఎక్సలెంట్ డిసిప్లేన్ గా ఉన్న
శ్రీ శారద జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను.
“విద్య దదాతి వినయం” అంటారు.
ఆ వినయ విధేయతలు ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శిస్తే మన సమాజము చాలా బాగుపడుతుంది.
ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను.
మీ ముందుండే భవిష్యత్తుకి ఆలోచన చేయాలని ఈ స్టోరీ చెప్తున్నాను చెప్పమంటారా అన్నది ధరణి.
స్టేజి ముందు నుండి పిల్లలందరూ ఏకధాటిగా చెప్పండి మేడం అన్నారు.
ఒక ఊరు ఉందంట. అందులో చుట్టూ ప్రకృతి అందాలతో కూడిన చెట్లు
వాటి మధ్య నదులు, అన్ని వనరులతో కూడిన స్థలాలు ఉన్నాయి.
ఆ ఊరిలో భారతమ్మ అనే మహిళ ఉంది. ఆ భారతమ్మ స్థలాన్ని కబ్జా చేయాలన్న ఆలోచనతో ఒక దొర
ఆ భారతమ్మ దగ్గర ఉన్న ఆ వూరి మనుషులను తనవైపు తిప్పుకొని
స్వార్థంతో ఆ స్థలాన్ని కబ్జా చేశాడు.
కానీ, భారతమ్మ పట్టుదలగల మనిషి. తన పిల్లలను చూసుకోవాలి.
తాను పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకుంది.
తన ఆస్తిని కాపాడుకోవాలని, ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి ఎంతో ధైర్యంతో కష్టపడి పోరాడి మొత్తానికి ఆ కబ్జా చేసిన దొరని
బయటికి పంపింది. తన స్థలాన్ని తాను కాపాడుకోగలిగింది.
ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారంట. ఆ ఇద్దరు కూతుళ్ళని పెళ్లిళ్లు చేసి తన ఆస్తిని ఇచ్చి గొప్ప వాళ్ళను చేసింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు భారతమ్మ స్వర్గస్తురాలయింది.
పెద్ద కూతురు పిల్లలు పెద్ద కుటుంబంలో ఉంటూ.. మంచి సాంప్రదాయాలతో.. వినయవిధేయతలతో… భారతమ్మ కుటుంబానికి వన్నె తెచ్చే విధంగా
పెరిగి పెద్దవాళ్ళు అయ్యి బాగా చదువుకొని మానవత్వంతో.. మెదులుతూ.. గొప్పగా ఎదిగి భారతమ్మ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారు.
చిన్న కూతురు పిల్లలు మాత్రం కొత్త పోకడలకు అలవాటు పడి మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలై, కొత్తగా వచ్చే వింత రోగాలు తెచ్చుకొని మానవత్వపు విలువలను మరిచి అక్రమాలు, అత్యా చారాలు చేస్తూ భారతమ్మ కుటుంబానికి చెడ్డపేరు తీసుకొచ్చే దశలో ఉన్నారు.
పైనున్న భారతమ్మ ఆత్మకి
పెద్ద కూతురు పిల్లలను చూసి ఆనంద పడాలో… చిన్నకూతురు పిల్లలను చూసి బాధపడాలో..అర్థం కాలేదట.
ఎప్పుడు కూడా తల్లి తన పిల్లలు ఆనందంగా, సుఖంగా ఉన్న పిల్లలను చూసి సంతోష పడడం కన్నా..,చెడుదారిలో తిరిగి చెడ్డపేరు తెచ్చుకుంటున్న పిల్లలను చూసి బాధ పడడమే ఆ తల్లి యొక్క లక్షణం.
కాబట్టి పైనున్న భారతమ్మ ఆత్మకు పెద్దకూతురు పిల్లలు చేసిన మంచి పనులకన్నా..,
చిన్నకూతురు పిల్లలు చేస్తున్న చెడ్డ పనులకు.. ఆమె ఆత్మ ఎప్పుడు క్షోభిస్తుందంట.
ఆ భారతమ్మ మరెవరో కాదు. మన భారతమాత.
అని డాక్టర్ ధరణి గారు మాట్లాడుతూ వుంటే
వెంటనే అక్కడి వాళ్ళందరూ
తమ చేతులతో చప్పట్లు కొట్టారు.
విద్యార్థిని ,విద్యార్థులకు మిగతా సందేశాన్ని అందించాలని తిరిగి మళ్ళీ మాట్లాడింది ధరణి.
భరతమాత మొదటి పిల్లలు ఇంత కష్టపడి తెచ్చుకున్నదే స్వాతంత్ర్యం.
ఆ స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత చాలా మంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి భారతదేశానికి ఒక విశిష్టమైన స్థానాన్ని తీసుకువస్తే…
రెండో పిల్లల వారసులుగా ఉన్నటువంటి కొంతమంది కొత్త తరహా పోకడలకు బానిసలై భరతమాతని అవమానించేలా… అత్యాచారాలు ,హత్యలు అక్రమాలు చేస్తూ మానవ విలువలను మరిచి
ఆ తల్లిని బాధ పెడుతున్నారు.
ప్రతి విద్యార్థిని, విద్యార్థులు
ఆ భారతమ్మ పెద్ద కూతురు పిల్లలుగా ఉండి భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా ఉండాలి.
మీరు ఎంచుకున్న రంగంలో..
ఆ రంగం ఏదైనా కానివ్వండి…
పాలిటిక్స్ కావచ్చు.. స్పోర్ట్స్ కావచ్చు పోలీస్ ఆఫీసర్ కావచ్చు.. టీచర్స్ కావచ్చు…వాట్ ఎవర్..?
ఇట్ ఇస్.. మీరు ఎంచుకున్న రంగంలో ముందుగా..మీ కుటుంబానికి… సమాజానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకువచ్చేటటువంటి స్టేజీలో మీరందరూ ఉండాలి.
ఇంటర్మీడియట్ అంటేనే ముందువచ్చే మీ భవిష్యత్తుకి ఒక బ్రిడ్జి లాంటిది.
ఆ బ్రిడ్జికి ఖచ్చితంగా…
మంచి అనే గట్టి పునాదులు ఉండాలి.
అట్లా ఉన్నప్పుడే సమాజానికి
మీరు బంగారు బాటలు వేయగల దిశలో ఉంటారు .
ఇది ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే..
ఈ సమాజంలో జరిగే చెడు విషయాల పై ఒక తల్లి పడే ఆవేదన ఇది.
ఇండియా ఇస్ ఏ ల్యాండ్ విచ్ యాజ్ రిచ్ రిసోర్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
నాలెడ్జి లో మనం నెంబర్ వన్.రిసోర్స్ లో మనం నెంబర్ వన్. నేచురల్ రిసోర్స్ లే కాకుండా.. హ్యూమన్ రిసోర్స్ కూడా..
ఇండియా ఇస్ ది బెస్ట్ కంట్రీ.
ఆ హ్యూమన్ రిసోర్స్ లో పెద్ద స్థానం వహిస్తున్న వారెవరో.. కాదు.అది మీరే..
విద్యార్థినీ, విద్యార్థులు.
అందుకే మీకంటూ.. ఒక విశిష్టమైన స్థానం ఉంది.
ఈ స్టేజ్ లో మీరు నడిచే మంచి మార్గంలో.. రేపు మీ కుటుంబమే, కాకుండా మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా..
మీ పై ఆధారపడి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
విద్యార్థులు ఇప్పుడున్న పరిస్థితుల్లో సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ని సెల్ ఫోన్ ద్వారా మిస్ యూజ్ చేసుకుంటున్నారు.
ఒక రాయిని ఇద్దరికీ చెరోకటి ఇస్తే..
తెలివైన విజ్ఞత కలిగినవాడు దానిని శిల్పంలా చెక్కి.. అతని విజ్ఞానాన్ని ప్రూవ్ చేసుకుంటాడు.
అదే తెలివిలేనివాడు ఆ రాయిని
ఏం చేయాలో తెలియక ఎవరి తల పలగొట్టాలా..అని ఆలోచిస్తాడు.
అట్లా ఉంది ఇప్పుడున్న సైంటిఫిక్ టెక్నాలజీ.
మీ వయసు నుండి ఆ సెల్ఫోన్ అనే విప్లవాన్ని మంచి దారిలో పెట్టి
మీరు సమాజంలో మంచి బాటలో నడవాలి.
నేను చెప్పే ఈ సెల్ ఫోన్ మిస్ యుజ్ గురించి… మీరు.. నన్ను అడగొచ్చు.
ఏంటి..? మేడం..!
సైంటిఫిక్ అనే టెక్నాలజీనీ అందరూ.. మిస్ యూజ్ చేసుకుంటున్నారా..? అని…
అందుకే నేను ముందే చెప్పాను మీకు.
ప్రతి తల్లికి బాగుపడిన కొడుకు,కూతురు కంటే చెడిపోయిన వారి గురించే ఎక్కువగా.. ఆవేదన చెందుతుందని.
సాంకేతికంగా మన భారతదేశం
చాలా ముందడుగు వేస్తుంది.
మేము మా జనరేషన్ లో చూసిన దానికన్నా.. మీరు మీ జనరేషన్లో
చూసే సాంకేతిక పరిజ్ఞానాలు చాలా ఉన్నాయి.
నేను చిన్నప్పుడు ఒక ఎస్సై రైటింగ్ కాంపిటీషన్ కి ప్రిపేర్ కావాలంటే..
గ్రామం నుండి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్లి లైబ్రరీ బుక్స్ చదివి తెలుసుకునే వాళ్లం.
ఈరోజు మీరు గూగుల్ సెర్చ్ ఆన్ చేసి అందులోని ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఈజీగా వెళ్లగలిగే పరిస్థితి ఉంది.
అంటే మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నారో.. ఆలోచించండి.
మేము లైబ్రరీలో బుక్స్ అన్నీ చదివి
ఒక రోజంతా కష్టపడి ఒక పేజీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే వాళ్ళం.
అట్లాంటి పరిస్థితుల్లో మేము చదువుకుని వచ్చాం.
మీరు కేవలం ఒక క్లిక్కుతో…
మీ కళ్ళ ముందు పెట్టుకొనే, అద్భుతమైన పరిస్థితి ఉంది.
ఈ అద్భుతమైన స్థానాన్ని ఎంతవరకు మనము మంచికే.. ఉపయోగించాలి. అని మీరు మీ..మనోభావాలకు వేసుకునే ప్రశ్న…?
దాన్నే.. ఇంట్రాస్పెక్షన్ అంటారు.
అంటే అంతర్మధనం అన్న మాట.
మన ప్రకృతికాని సమాజంగాని
దేశంకానీ, తల్లిదండ్రులుకానీ,
అందరూ ఇచ్చినటువంటి అవకాశం మనం ఏవిధంగా సద్వినియోగం
చేసుకుంటున్నాము.
అనేది ఈ రోజు మీరంతా ఆలోచనచేసి దానికి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే మన సమాజంలో చెడు అనేది జరగకుండా ఉంటుంది అనేది
నా భావన.
నేను ఎందుకు మీకు..
ఇట్లా.. చెప్తున్నానంటే..
నా దగ్గరికి ఒక పేరెంట్స్ తన కూతుర్ని తీసుకొని వచ్చారు.
ఆ అమ్మాయి చిన్నప్పట్నుండి చాలా బాగా చదువుకున్న తెలివికల అమ్మాయి.
ప్రతి దాంట్లోనూ.. మెరిట్ గా
ఉండేదంటా..
అలాంటి అమ్మాయి యుక్తవయస్సు వచ్చినాక,..సాంప్రదాయాలను మరిచి విదేశీ స్టైల్లో… దాచుకోవలసిన శరీర భాగాలను దాచుకోకుండా..
డిగ్నిటీ అనే పదాన్ని మరిచి వస్త్రధారణ చేసుకుంటూ…
అదో ట్రెండ్ గా స్నేహితులతో
చెడు మార్గంలో పడింది. ఆ అమ్మాయి పరిస్థితి చూసి తల్లిదండ్రులు వద్దని వారించినా… వినకుండా..
నా రైట్స్ నాకు ఉన్నవి.
నా స్వేచ్ఛను, నా నిర్ణయాన్ని నేను తీసుకోగలను. అంటూ.. సెల్ ఫోన్ తోనే గడిపేదంటా.
సెల్ ఫోన్ తీసి ఆ అమ్మాయికి దూరంగా ఉంచితే..
నేను మేజర్ ని మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు.నాకు కొన్ని హక్కులు వున్నాయి. అంటూ తల్లిదండ్రుల్ని ఎదిరించి చెడుబాటలో పయనించింది.
పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న వాడితో ప్రేమ పేరుతో మోసపోయి డ్రగ్స్ కి బానిసై డిప్రెషన్లోకి వెళ్లి పోయింది.
ఆ పరిస్థితుల్లో ఉన్న కూతురిని చూస్తూ ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంమై వాళ్లు ఏడ్చుకుంటూ.. వచ్చారు.
ఇది ఎందుకు చెప్పానంటే..
ఈ రోజుల్లో వందకి యాభై శాతం మంది పిల్లలు వాళ్ళ బాధ్యతలను మరిచిపోయి హక్కులకోసం పోరాడుతున్నారు.
మీకు సోషల్ జస్టిస్,మోరల్ జస్టిస్
మీ దగ్గరే ఉంటాయి.
హక్కులకోసం ఎట్లా..? అయితే కొట్లాడుతున్నారో… అట్లాగే బాధ్యతలు కూడా ఉంటాయి అనేది గ్రహించాలి.
ఏ రాజ్యాంగం అయితే మనకు హక్కులు ఇచ్చిందో… అదే రాజ్యాంగం మనకు బాధ్యతలు కూడా ఇచ్చింది.
ఈ రోజు మీరు ఉండే విధానమే,
మీ ముందు తరానికి ఆదర్శం కావాలి.
తల్లిదండ్రుల పైన బాధ్యత,
సమాజం పైన బాధ్యత,
దేశం పైన బాధ్యత..
డిగ్నిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ…
మీరు చేస్తూ.. మంచి బాటలో పయనించాలి.
మన ఈ సమాజాన్ని మంచి దారిలో నడిపిస్తారని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను.
అని చెప్పింది డాక్టర్ ధరణి.
డాక్టర్ ధరణి గారు చెప్పిన అమూల్యమైన వాక్యాలకు
అక్కడ ఉన్న పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు వాళ్ల కరతాళధ్వనులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రకృతిలో సంస్కృతిలో కనిపించే రంగులన్నీ ప్రతీకాత్మకమైనవి .ప్రత్యకమైనవి . భారతీయ ఆత్మకు అభివ్యక్తీకరణమే రంగుల సమ్మేళనం .రంగులు మన జీవిత గమనంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి . మతం – రాజకీయం– పండుగలు – వేడుకలు అన్నింట్లోనూ రంగుల ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. మానవ జీవితంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది . ప్రకృతిని ,పరిసరాలను రాగరంజితం చేసే రంగులు మన భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి .ఋతువులు మారగానే రంగుల కలయిక మారుతుంది .
ఈ రంగుల కథ మనం అనుకున్న దానికంటే క్లిష్టమైనది .లోతైనది కూడా !మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని లోకానికి పరిచయం చేస్తుంది .
పసుపు రంగు ఆశావాదానికి ప్రతీక .శుభకరీ ,శోభస్కరి ,మంగళకరి అయిన పసుపు లేనిదే ఏ వంటిల్లు సమగ్రం కాదు మన దేశంలో .హిందూమతంలో పసుపు పవిత్రతకు జ్ఞానానికి చిహ్నం .లక్ష్మీదేవికి సంబంధించిన రంగు. విష్ణుమూర్తి పీతాంబరుడు కదా!
ఇంద్రధనస్సులో మూడవ రంగుపసుపు . సూక్ష్మ బుద్ధికి ,జ్ఞానానికి ప్రతీక చక్ర వ్యవస్థలో మణిపూర చక్రానికి సంబంధించినది . ఈ చక్రం మనిషి అహానికి ,శక్తికి స్థానం.. చరిత్రకందని కాలంలో కనిపించే గుహల చిత్రలేఖనాలలో కనిపించే ప్రధాన రంగుల్లో ఒకటిపసుపు రంగు . రోమ్ , ఈజిప్ట్ దేశాల్లో 17 వేల సంవత్సరాల పూర్వం ఉన్నగుహల్లోని చిత్రలేఖనాల్లో ప్రస్ఫుటంగా కనిపించే రంగు పసుపు. క్రైస్తవ ధర్మంలో మోసం , వంచన అనే భావాలకు గుర్తుగా వాడేవారు ఒకప్పుడు .అదే ఈజిప్టులో బంగారు వర్ణమ్ శాశ్వత జీవితానికి ప్రతీక .ఈజిప్షన్లు దేవతల చర్మం బంగారు పసుపు వర్ణంలో ఉంటుందని ఎముకలు పసుపు రంగులో ఉంటాయని నమ్మేవారు .
ఒకప్పుడు బౌద్ధ ధర్మం లో ఈ రంగు అణ కువకు వినయానికి గుర్తు .బౌద్ధ శ్రమణులు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు . వారిలో జాగరుకతను స్థిరపరచడానికి ఈ పద్ధతినిబుద్ధుడు నిర్దేశించాడు .
చైనాలో ప్రాచీన కాలంలో పసుపు రంగు వస్త్రాలను కేవలం చక్రవర్తులే ధరించాలని నియమం ఉండేది . ఈ సంప్రదాయం ఒకప్పుడు రాజరికానికి గౌరవానికి చిహ్నం .
జపాన్లో ధైర్యానికి చిహ్నం అయితే కొన్ని యూరోపియన్ దేశాలలో అసూయ లేదా ద్రోహభుద్ధి కి సంకేతం . మనదేశంలో ఈ రంగు జ్ఞానం అభ్యాసానికి చిహ్నం . ముఖ్యంగా వసంత పంచమి వేడుకల్లో సరస్వతి దేవి ఆశీస్సుల కోసం పసుపు రంగు దుస్తులు ధరించడం ,అమ్మవారికి పసుపు రంగుతో చేసిన ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ .
కొన్ని ప్రాంతాలలో ఈ రంగుకు వ్యతిరేకమైన అర్థాలు కూడా కనిపిస్తాయి . దీని వాడకంలో ఎల్లో బెల్లీ అంటే పిరికివాడు అని సూచించడానికి ,ఎల్లో జర్నలిజం అంటే సత్య దూరమైన ,అతిశయోక్తులతో నిండిన వార్తలని అర్థం .చదువరుల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి రాతలు రాస్తారని , ప్రచారం చేస్తారని దీని భావం .
నూతన సంవత్సర వేడుకల్లో పసుపు రంగులో దుస్తులు ధరిస్తే ధనాన్ని సంతోషాన్ని అదృష్టాన్ని వ స్తుందని చాలామంది లాటిన్ అమెరికన్లు విశ్వసించేవారు ఒకప్పుడు .
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రంగుల పరిశోధకుడు హోవార్డ్ కెమ్ ప్రాసెసర్ ఆసుపత్రి గదులు ప్రశాంతతను ప్రతిబింబించాలని , రోగుల మనసులో ఆందోళనను తగ్గించడానికి కొన్ని సూచనలు చేశాడు . వాటి ప్రకారం గది పైకప్పుకు ఆకాశపు నీలం , నేలకు ఆకుపచ్చ ,గోడలు ఉదయించే సూర్యుని రంగు అయిన పసుపును వాడాలి .
Ketchup And Mustard theory
ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ? బర్గర్ కింగ్ ,మెక్డోనాల్డ్ వారి లోగోలను గమనించారా ?ఇందులో ఎరుపు పసుపు రంగులు ప్రధానమైనవి .శాస్త్రబద్ధమైన ఆధారాలు దొరక్కున్న కొన్ని పరిశోధనలు ఎరుపు రంగు మనిషి ఆకలిని ప్రేరేపిస్తుందని ,పసుపు రంగు సౌకర్యాన్ని సూచిస్తుందని అందుకని వీరు రెండు రంగులను వాడారని అంటారు .దీన్ని అద్భుతమైన కలయికని ఫ్రెంచ్ ఫ్రై లకు టమాటో కెచప్ గొప్ప జోడి అని అంటారు .ఈ కాంబినేషన్ అత్యంత ప్రజాధరణ పొందిందని అందరికీ తెలుసు
పుష్యరాగం
నవరత్నాలలో పసుపు వన్నెతో ఉండేది పుష్యరాగం .ఇది గురు గ్రహానికి చెందింది . కోరండం ఖనిజంతోనే పుష్యరాగాలు ఏర్పడతాయి . వీటిలో పారదర్శకమైన పసుపు రంగులో బంగారు వన్నెతో ధగధగలాడే రత్నాలను కనకపుష్యరాగాలని అంటారు . పురాతన కాలం నుండే ఇవి వాడుకలో ఉన్నాయి. ప్రాచీన గ్రీక్ , రోమన్ ,ఈజిప్షియన్ ,సింధులోయ నాగరికతల కాలంలో రాచ కుటుంబాల వారు ఆభరణాలలో వీటిని విరివిగా వాడేవారు .
ఆనందం ఆశావాదం
పసుపు రంగును చూడగానే మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది .ఇది ఆనందాన్ని ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని ,ఆశావాద దృక్పథాన్ని పెంచుతుంది .
ఏ కాగ్రత మేధస్సు
ఇది మెదడును ఉత్తేజ పరుస్తుంది . జ్ఞాపకశక్తిని ,ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది అందుకే స్టడీ రూము లో పసుపు రంగు వాడడం మంచిదంటారు .
ఆకలి
ఆకలిని ప్రేరేపించే రంగు . అందుకే రెస్టారెంట్లలో ,డైనింగ్ రూములలో ఈ రంగుని ఎక్కువగా ఉపయోగిస్తారు .
వాస్తు ఇంటి అలంకరణ
ఇంటి హాల్ లేదా డైనింగ్ రూమ్ లో పసుపు రంగు వేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం సంతోషం పెరుగుతాయని వాస్తు చెప్తోంది .
పచ్చ కామెర్లు
మూత్రం పసుపు రంగులో రావడం అనేది దీని లక్షణం .కాలేయ సంబంధిత సమస్య .
పసుపు రంగు వ్యక్తిలో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తుందని సైకాలజిస్ట్లు చెప్తుంటారు .పసుపు మెదడు కార్యకలాపాలను పెంచుతుందని జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు . అందుకే మార్కెటింగ్ నిపుణులు తమ వస్తువుల ప్యాకింగ్ లలో వాటి ప్రకటనల్లోనూ పసుపు రంగును ఎక్కువగా వాడుతుంటారు .
పసుపు రంగును మెచ్చేవారు
ఈ రంగును ఇష్టపడే వారి గురించి చెప్పడానికి చాలానే ఉంది .ఆహ్లాదంగా చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు .వ్యాపార దక్షత ఎక్కువ .కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు . తాను ప్రత్యేకమైన వ్యక్తిని అనిపించుకోవడం వీ రికిష్టం .ఎక్కువ మందితో స్నేహం చేస్తారు .చూడడానికి మాడర్న్ గా కనిపించిన పాతకాలపు ట్రెండ్స్ అంటేనే ఎక్కువ మక్కువ .
ఎం తటి క్లిష్ట పరిస్థితులైన తేలికగా హ్యాండిల్ చేయడం వీరి ప్రత్యేకత .చాలా ఎమోషనల్ . కానీ ఏ ఫీలింగు బయటికి ప్రదర్శించరు. చాలా త్వరగా నిర్ణయాలు మార్చుకోవడం వీరి బలహీనత .
త్వరగా నిర్ణయాలను తీసుకుంటారు .చురుకుగా పనిచేస్తారు .సాధారణంగా ఎక్కువ ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు . చాలా శక్తివంతులు .
ప్రతిభావంతులైన వ్యక్తులకు పసుపు రంగు పువ్వులు ఇవ్వడం ఆచారం. అతని ప్రతిభకు ప్రశంసలు ఈ రూపంలో అందిస్తున్నారని అర్థం. వీ రు ఎప్పుడు చుట్టుపక్కల వారికి ఆనందాన్ని పంచే స్వభావం కలిగి ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చెబుతారు ఉత్సాహంగా ఉంటారు ఎటువంటి పరిస్థితినైనా సానుకూల దృక్పథంతో స్వీకరించి ముందుకు సాగడం వీధి ప్రత్యేకత .
ఇది కంటికి అత్యంత ప్రకాశవంతంగా కనిపించే రంగు కనుక ట్రాఫిక్ లైట్స్ లో ఉపయోగిస్తారు .
బంగారం , ఉదయిస్తున్న సూర్యుడు ,నిమ్మకాయ ఈ రంగు పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి .
ఫోటోగ్రఫీలో గోల్డెన్ అవర్ అంటే సూర్యోదయం తర్వాత మొదటి గంట ,సూర్యాస్తమయానికి ముందు చివరిగంట .ఈ సమయంలో సూర్య కాంతి చాలా మృదువుగా ,వెచ్చగా ఉంటూ అందమైన నీడలను ఇస్తుంది .ఫోటోలకు అద్భుతమైన రూపం ఇస్తుంది . పోర్ట్రైట్స్ , ల్యాండ్ స్కేప్ ,రొమాంటిక్ ఫోటోషూట్లకు సరైన సమయం .
మీకు తెలుసా పసుపు రంగును చూసి భయపడే వారి భయాన్ని Xantophobia అంటారు .
ఇది చాలా ప్రకాశ వం తమైంది . ప్రస్ఫుటంగా కనిపించే రంగు .
పసుపు రంగుకు సంబంధించిన సాంస్కృతిక చరిత్ర కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నది
ట్రాఫిక్ లైట్లు మొట్టమొదటిసారిగా అమెరికాలో 1920 ప్రాంతాలలో ప్రవేశపెట్టారు .తొలుత పసుపు నలుపు రెండు రంగులు మాత్రమే ఉండినవి .
రంగులు మన మెదడులో రకరకాలైన రసాయనాలను రిలీజ్ చేస్తాయి .
పసుపు రంగు మన మెదడులో సెరటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది .ఈ సరటోనిన్ మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది .
పొలాలలో కీటకాలను బారి నుంచి రక్షించడానికి పసుపు రంగు స్టిక్కీ ఉపయోగిస్తారు ఎందుకంటే కీటకాలు పసుపు రంగును త్వరగా ఆకర్షింపబడతాయి .
ఒకప్పుడు ఎల్లో ఫీవర్ అనేవ్యాధి వ్యాప్తిలో ఉండేది .ఇది దోమల ద్వారా సోకుతుంది .ఫ్లూ వంటి లక్షణాలతో తీవ్రమైన శారీరక బాధతో ఒకప్పుడు ప్రజలు బాధపడేవారు .
మన దంతాలు పసుపు రంగులో మారడానికి కాఫీ టీ సో డాలాంటివి తాగడం ముఖ్యమైనకారణం . మన పంటి పైన ఉండేటువంటి ఎనామిల్ బలహీనం చేసి పసుపు రంగు పోరని ఏర్పరుస్తాయి
మరో వింతైన విషయం YELLO DAY అనేది కూడా ఉంది . సంవత్సరం మొత్తంలో చాలా సంతోషకరమైన రోజుగాదీన్ని జరుపుకుంటారు . ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన జరుపుకుంటారు .
2016 ఫిబ్రవరిలో మలేషియన్ గవర్నమెంట్ పసుపు రంగు టీ షర్ట్ లను బ్యాన్ చేశారు .ఎందువల్ల అంటే ఇది వేసుకున్న నిరసనకారులు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఉద్యమంలో లేవదీశారు .
John D. Hertz అనే వ్యక్తి Yellow Cab Company స్థాపించా .రు ఆయన కా రలన్నింటికీ పసుపు రంగు పెయింట్తో ఉండేది .ఆయన పసుపు రంగు చాలా దూరం నుంచి కూడా త్వరగా గుర్తించడానికి వీలవుతుంది అని తెలుసుకున్నారు . అందువలన టాక్సీలు అన్నిటికీ కూడా పసుపు రంగు వేయించి ఎల్లో క్యాబ్ కంపెనీ అనే పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు .
చివరిగా మరొక్క మాట
సమస్యలు ఎన్నున్నా , సంఘర్షణలెన్నైనా మనసుంటే మార్గం అంటుంది పసుపు రంగు .ఇదే జీవిత సత్యం .
విజయ కందాళ
9912842104
