మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఆపిల్ నుంచి ఆకాశం దాకా

by Dr. Thanda Harish March 19, 2026
written by Dr. Thanda Harish

అప్పుడెప్పుడో
న్యూటన్ నాలోకి విసిరిన
ఆపిల్ పండే
ఇవాళ కవిత్వమై
మీ ముందుకొచ్చింది

చిక్కులు చిక్కులుగా కనిపించే
ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం
చిందర వందరవుతున్న
ఈ జీవితాన్ని
అర్థం చేసుకోడానికో
గొప్ప వరంలా దొరికింది

సూర్యుడు,గ్రహాలు
భూమి,చంద్రుడు
ఇవన్నీ
విశ్వమంతా ఒక్కటేనన్న
నినాదాన్ని
నిరూపిస్తున్నవి

తెల్లని కాగితం మీద
అక్షరాలను అందంగా
అచ్చొత్తగలుగుతున్నామంటే
కారణం తెలిసిందేగా

ప్రకృతి
పర్వతాలు
లోయలు
పచ్చని చిగుర్లన్నింటి మీద కురిసే
గోళాకార చినుకుల్లో కూడా
సైన్స్ దాగుందన్న విషయం
తెలియనిదా

గుండెను తీసి గుండెను పెట్టే
రోజులొచ్చాయంటే
సంభ్రమాశ్చర్యం!
మనసును తీసి మనసును పెట్టే
రోజులు కూడా
భవిష్యత్తులో ఉండొచ్చేమో

చంద్రమండలం మీదికి అడుగుపెట్టి
అక్కడి మట్టిని ముద్దాడుతున్నామంటే
మనిషి మరో భూమిని
సృష్టించుకున్నాడనేగా

సైన్స్ ఎక్కడో లేదు
నీ,నా  పక్కనే ఉంది
నీ,నా వెంటే ఉంది
చేతిలో అందంగా
నిత్యం అలంకరింపబడే
సెల్ఫోన్ లా
ఎన్ని యుగాలైనా
నన్ను,నిన్ను వీడనంటుంది

March 19, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మహిళా దినోత్సవ సంబరాలు

by mayuukha March 19, 2026
written by mayuukha

08-03-2026

సాహితీ వేత్తల సమ్మేళనం

తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అకాడమీ తరఫున నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరము సభను ‘థీమ్’ ప్రకారంగా మూడు సదస్సులుగా విభజించి నిర్వహిస్తున్నామన్నారు. మొదటి సదస్సు “స్త్రీవాద సాహిత్యం దశ – దిశ” రెండవది ‘ఆధునిక యుగంలో స్త్రీల సాధికారత’ మూడవ సదస్సు ‘డిజిటల్ యుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ ఇలా మూడు సదస్సులు ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి అన్నారు. మొదటి సదస్సులో పాల్గొన్న జూపాక సుభద్ర మాట్లాడుతూ మహిళలు సాధికారికంగా స్వేచ్ఛగా ఉండాలి. భారతదేశంలో కొందరు మహిళలు అంటరాని కులం లాంటి ప్రాతిపదికనే మహిళా ఉనికి కొనసాగుతుంది. పెద్దపెద్ద కంపెనీలలో ఇప్పటికి ఉన్నత స్థానంలో ఇలాంటి మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఆ సంఖ్య పెరగాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆచార్య త్రివేణి మాట్లాడుతూ సమాజంలో స్త్రీలే సృష్టికి మూలం అన్న విషయాన్ని సమాజం మర్చిపోదు. ప్రస్తుతం సమాజంలో గృహింస వరకట్నాలు భ్రూణ హత్యలు లాంటి అనేక అంశాల నుండి స్త్రీలు బయటపడినప్పుడే సాధికారత సాధించినట్లు అవుతుందన్నారు. మరొక అతిథి షేఖ్ హసీనా మాట్లాడుతూ మాతృస్వాతంత్రం నుండి పితృస్వాతంత్ర వ్యవస్థ వచ్చింది. ఇందుకు కందుకూరి, రాజారామ్ మోహన్ రావు లాంటి మహనీయులు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. మరో కవయిత్రి శిలాలోలిత మాట్లాడుతూ మహిళా సాధికారత ఇంకా సాధించాల్సి ఉంది అన్నారు.దేవనపల్లి వీణావాణి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య అనంతరం స్త్రీల విద్య కోసం కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు. అట్టి వాళ్లలో స్త్రీల విద్యకోసమై కృషి చేర్చినవారిలో పురుషులే ముందున్నారని అన్నారు. సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో మహిళను ముందుకు తీసుకెళ్లాలని, అందులో వారికి రాజకీయ, ఆర్థిక రంగాలలో తగిన భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మహిళలు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రముఖ అనువాదకురాలు స్వాతి శ్రీపాద మాట్లాడుతూ విలువైన వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లే స్త్రీమూర్తులను కూడా సమాజం భద్రంగా చూసుకున్నప్పుడే స్త్రీల ఆత్మవిశ్వాసము పెంచిన వాళ్ళవుతారని, వారికి స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. మరోక కవయిత్రి గోగు శ్యామల మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ఎందరో మహనీయులు స్త్రీవాదాన్ని అనేక కోణాలలో ఆవిష్కరించారు. భారతదేశంలో స్త్రీలకు అనేక హక్కులను కల్పించారు. దీనితోపాటు దేశంలో అమ్మ అనే పాత్రకు గొప్ప స్థానం ఉంది. అంటూ అమ్మల యొక్క గొప్పతనాన్ని విశ్లేషించారు. కవయిత్రి శాంతి ప్రబోధ మాట్లాడుతూ అచ్చమాంబ కాలం నుండి స్త్రీ వాద సాహిత్యం ఉందన్నారు. గత కొంతకాలంగా ఈ సాహిత్యంలో మార్పు వచ్చిందన్నారు. రాజకీయ, ఆర్థిక, అస్తిత్వం కోసం, హక్కుల కోసం స్త్రీ సమస్యలపై పోరాటం జరిగిన విషయాలను తెలియజేశారు. బయటి ప్రపంచంలో గుర్తింపు కలిగిన ఎందరో మహిళలకు ఇంటి లోపల గుర్తింపు లేకపోవడం విచారమంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. రెండో సదస్సుగా జరిగిన ‘ఆధునిక యుగంలో స్త్రీల సాధికారత’ అంశంపై సమన్వయకర్తగా కాళోజీ అవార్డు గ్రహీత శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు పాల్గొన్నారు. ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన మహిళలు వారు సాధికారంగా సాధించిన అనేక విషయాలపై, సమాజ నిర్మాణంలో స్త్రీలకు సమాన అవకాశాలు కలిగి ఉండే మహిళా హక్కులపై, మహిళ విద్యా వ్యవస్థ పై చర్చ జరిగింది. ఈ సదస్సులో అనేక మంది మహిళలు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివరి సదస్సుగా కవయిత్రి ఉషారాణి అధ్యక్షతన ‘డిజిటల్ యుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. సదస్సుల అనంతరం నూతనంగా కవిత్వం రాస్తున్న నేటి వర్తమాన కవయిత్రులు, విద్యార్థినిలను ఆహ్వానించి వారితో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సగిలి సుధారాణి, సమ్మెట విజయ, అరుణ కీర్తి పతాక, సంధ్యా విప్లవ్, బండారు విజయ, పల్లా మాలతి, రంగరాజు పద్మజ, నస్త్రీన్ ఖాన్, జ్వలిత, సమ్మెట ఉమాదేవి, సీతాలక్ష్మి, సరిత సలీమాతో పాటు అనేకమంది వర్ధమాన కవయిత్రులు, తదితర సాహితీవేత్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అకాడమీ తరఫున మెమొంటో, శాల్వతో ఘనంగా సత్కరించారు.

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

రచయిత సమాజ బహిరంతరాలను శోధించాలి – లింగంపల్లి రామచంద్ర

by Aruna Dhulipala March 19, 2026
written by Aruna Dhulipala

ఆదర్శకవి, మహోపాధ్యాయ బిరుదాంకితులు, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, బహుగ్రంథకర్త డాక్టర్ లింగంపల్లి రామచంద్రగారితో మయూఖ ప్రతినిధి అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి

                                       *****************************************

“నా మాట పతనమవుతున్న జాతికి వెలుగు బాట, నా పాట మత్తులో తూగుతున్న వాళ్ళకి సంస్కరణ దీపిక” అంటూ తమ రచనా ధ్యేయాన్ని వివరించిన ప్రముఖ కవి, విమర్శకులు డా. లింగంపల్లి రామచంద్ర గారి జీవితవిశేషాలను, అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్🙏🏼 

1. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన మీ జననం, బాల్య విద్యాభ్యాసాలను గురించి చెప్పండి?

జ:   నమస్కారం అమ్మా! జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలంలో ప్రాచీన జనపదమైన ‘వెల్ది’ మా స్వగ్రామం. ఆదికవి ఆశ్రమస్థలి, పాండవ తాత్కాలిక విశ్రాంతి స్థలి. బౌద్ధాచార్య నాగార్జునుడు జన్మించింది ఇక్కడే. మాది సామాన్య రైతు కుటుంబం. మా తల్లిదండ్రులు చదువుకున్నవారు కారు. మా తండ్రి రత్నయ్య పరమ ధార్మికుడు. సంస్కార శ్రీమంతుడు. ఆయనకు రామాయణ, భారత విరాటపర్వం అంటే చాలా ఇష్టం. మా అమ్మ శ్రీలక్ష్మి.  సనాతనాచారాల పట్ల అమెకెంతో విశ్వాసం ఉండేది. మా గ్రామంలోని వివిధ కుటుంబాలలో నిర్వహింపబడే శుభకార్యాలన్నీ ఆమె నేతృత్వంలోనే సాగేవి. 
         నేను జనవరి 1, 1945లో జన్మించాను. నా ప్రాథమిక విద్య ‘వెల్ది’ లోనే సాగింది. మాధ్యమిక విద్య మా ఊరు సమీప గ్రామం, గురువర్యులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారి స్వస్థలమైన ఖిలా షాపురంలో మాధ్యమిక విద్య చదువుకున్నాను. హైస్కూలు విద్య 9వతరగతి నుండి 12వ తరగతి వరకు హన్మకొండ మల్టీపర్పస్ హైస్కూలులో చదివాను. వరంగల్ లోని  ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీలో తెలుగు నా ఐచ్ఛిక అంశం. ఆచార్య చలమచర్ల రంగాచార్యులు గారు, ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ గారు, ఆచార్య మడుపు కులశేఖర రావు గారు, ఆచార్య కోవెల సుప్రసన్నా చార్యులు గారు, ఆచార్య మాదిరాజు రంగారావు గారు, ఆచార్య పేర్వారం జగన్నాథం గారు, ఆచార్య వేణు ముద్దల నరసింహారెడ్డి (వేనరెడ్డి) గారలు నాకు గురువులు.  వారి బోధనలన్నీ సాహిత్య పాఠాలే. ఆ సమయంలోనే గురువర్యుల సలహాననుసరించి ‘భారతి’ పట్ల అభిరుచి పెంచుకోవడం జరిగింది. మా కళాశాలకు చేరువలో ఉన్న నక్కలగుట్ట వీధిలోనే కాళోజీ గారి స్వగృహం ఉండేది. అక్కడ ప్రతినెలా మిత్రమండలి కార్యక్రమాలు జరుగుతుండేవి. తెలుగునాట ప్రసిద్ధులైన కవిపండితులు వచ్చేవారు. వారందరి ప్రసంగాల వల్ల బాగా ప్రభావితుడనయ్యాను. కళాశాలలో నిర్వహింపబడే సాహిత్య కార్యక్రమాలలో ప్రథమ బహుమతులు నన్నే చేరేవి. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎక్స్ టర్నల్ లో ఎమ్.ఏ (తెలుగు) చదివాను. అక్కడే “శ్రీ రంగరాజు కేశవరావు – సాహిత్య పరిశీలన” అనే అంశాన్ని పరిశోధించి 1992 లో డాక్టరేట్ పట్టా పొందాను.

2. సరస్వతీ దేవి నెలకొన్నట్లుగా ఉన్న మీ కుటుంబ నేపథ్యం గురించి మా పాఠకులకు తెలపండి.

జ:  మేం నలుగురం అన్నదమ్ములం. అందరమూ ఉపాధ్యాయులమే. మా పెద్దన్న వెంకటప్పయ్యగారు అధ్యాపక వృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి ఆదర్శ నేతగా ప్రఖ్యాతి పొందారు. ఆయనకు భక్తి సాహిత్యం పట్ల చాలా అభిరుచి ఉండేది. అనేక గ్రంథాలు తీసుకొచ్చి భద్రపరిచేవారు. రోజూ భగవద్గీత చదివేవారు. అందులోని విశేషాలను పదుగురికి చెప్తుండేవారు. ఆ కాలంలో వెలువడుతుండే ఆంగ్ల మాసపత్రిక ‘భవానాస్ జర్నల్’ (Bhavana’s) గురించి కూడా చెప్పేవారు. సామాజికాంశాల పట్ల అభిమానం ఉండేది. సభలను ఉర్రూతలూగించగల చాతుర్యం ఆయన సొంతం. ఆయా పనులపై మా ఊరికి వచ్చేవాళ్ళందరికీ మా ఇంట్లోనే భోజన సౌకర్యాలు కల్పించేవారు. అందరితోనూ ఆత్మీయంగా మెలిగేవారు. దీర్ఘకాలం ఏకగ్రీవ సర్పంచ్ గా ప్రజలను ఆనందపరిచారు. రెండో అన్న వెంకట రామనర్సయ్య గారు ఉపాధ్యాయునిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కూడా భక్తి సాహిత్యమంటే మక్కువ ఎక్కువ నిరంతరం వాల్మీకి రామాయణం పఠించేవారు. అన్ని సబ్జెక్టులను విశేషంగా బోధించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఘన సన్మానం పొందారు. మహర్షిగా పేరు వహించారు. మూడో అన్న సత్యనారాయణ గారికి ఆంగ్ల భాషలో మంచి పట్టు ఉండేది. ఆ భాషలో స్వయంగా పాటలు కూర్చి ఆలపించేవారు. విద్యార్థులను బాగా ప్రభావితం చేసి పౌరసన్మానం పొందారు.

3. మీరు ఇంతటి సాహిత్యానురక్తులు కావడానికి మీకు కలిగిన ప్రేరణ, మీ గురువుల ప్రభావం ఎటువంటిది? 

జ:    ఖిలా షాపురం మాధ్యమిక పాఠశాలలో చదివేటప్పుడు గుండాల నరసింహారావుగారు అనే అధ్యాపకుడు ఉండేవారు. ఆయన కవి. మంచి నాటక రచయిత. విద్యార్థుల చేత ప్రదర్శింపజేసిన సొంత నాటకాల్లో నాకూ అవకాశం ఇచ్చేవారు. నా చేత ఆయన గేయాలు పాడించేవారు. అవి నన్ను బాగా అలరించేవి. వివిధ పోటీల్లో పాల్గొనేలా నన్ను ప్రోత్సహించి, విజేత అయినందుకు అభినందించేవారు. హన్మకొండ మల్టీపర్పస్ హైస్కూలులో చదివేటప్పుడు ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు గారు మాకు తెలుగు అధ్యాపకుడు. ఆయన అప్పుడే ‘ఛందో వికాసం’ రాసి తెలుగునాట ఎంతో గౌరవం పొందారు. చేతనావర్త కవులు నలుగురిలో ఒకరు. ఆయన నా పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపేవారు. వ్యాసరచనకు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో చదివేటప్పుడు నా గురువుల్లో ఒకరైన ఆచార్య పేర్వారం జగన్నాథం గారు నన్ను తమ హృదయానికి చేరువగా తీసికొని సలహాలనిస్తూ వచన కవిత్వం, సాహిత్య పరిచయాలు రాయిస్తుండేవారు. మరొక గురువు ఆచార్య వేనరెడ్డి గారు డా. సి.నారాయణరెడ్డి గారి సాహిత్య, సౌందర్య మాధుర్యాలను తెలుపుతూ సినారె గారి సాహిత్యం పట్ల గాఢమైన అభిరుచి కలిగించారు. సినారె గారి నాగార్జున సాగరం, దివ్వెల మువ్వలు, జలపాతం కావ్య సంపుటులు కొని అడపాదడపా చదువుతుండేవాడిని. ఒక పర్యాయం మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినారె గారు ‘కాకతీయ’ పద సంపుటి గురించి చేసిన ప్రసంగం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. తొలిసారి అప్పుడే ఆయనను చూశాను. ఈ ప్రేరణే అనంతర కాలంలో ‘సినారె కవితాలోకనం’, ‘సినారె వాక్కుకు వయసు లేదు – తత్వ విశ్లేషణ’ అనే రెండు గ్రంథాలు రాయడానికి దారితీసింది.
          ఆచార్య పేర్వారం జగన్నాథం గారు కాళోజీ గారికి, కుందుర్తి ఆంజనేయులు గారికి, వి. వి. యల్. నరసింహారావుగారికి నన్ను పరిచయం చేశారు. అది నాకు బాగా ఉపయోగపడింది. కాళోజీ గారి గురించి కొన్ని వ్యాసాలు రాశాను. హన్మకొండకు వెళ్లినప్పుడల్లా ఆయనను కలుస్తుండేవాడిని. నా పరిశోధనా గ్రంథం “శ్రీ రంగరాజు కేశవరావు సాహిత్యం- పరిశీలన” గ్రంథాన్ని ఆచార్య పేర్వారం జగన్నాథం గారి షష్ట్యబ్ది సందర్భంగా వారికి అంకితమిచ్చాను. ఈ గ్రంథాన్ని సినారె గారు ఆవిష్కరించారు. 1986లో పేర్వారం వారి పర్యవేక్షణలో జరిగిన ‘అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు’ అనే సదస్సులో నేను వ్యాఖ్యాతగా వ్యవహరించాను. 
       1967లో ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య గారు ‘మన పండితులు-కవులు-రచయితలు’ శీర్షికన వరంగల్ కవుల పరిచయాలను రాసి ‘జనధర్మ’ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. ఈ సమాచార సేకరణలో తెలంగాణ ప్రథమ కర్షక కవి గంగుల శాయిరెడ్డి గారిని సంపత్కుమారాచార్య గారు నాకు పరిచయం చేశారు. రెడ్డిగారితో ఏర్పడిన అనుబంధం వల్ల నా సాహితీ జీవితానికి ఎంతో మేలు జరిగింది. 
        ఇక్కడ మరొకరి గురించి చెప్పాలి. నా సాహితీ జీవితానికి తొలి ప్రేరకుడు డా. తిరునగరి గారు. 1972లో నేను ఉద్యోగరీత్యా గుండ్ల గూడెం గ్రామానికి వచ్చినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన నా కవితా గురువు అని చెప్పాలి.

4. తెలంగాణాలో ప్రౌఢ కవిగా పేరొందిన “శ్రీరంగరాజు కేశవరావు” గారి పేరు చాలామందికి తెలియదు. ఆయన మీద మీరు పరిశోధన చేసి సిద్ధాంతగ్రంథంవెలువరించారు. ఆయనను గురించి మా పాఠకులకు సంక్షిప్తంగా చెప్పండి.

జ:   శ్రీ కేశవరావు గారు (1835 – 1905) జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం వాస్తవ్యులు. గొప్ప పండితకవి. సంగీత విద్యా ధౌరేయుడు. జమీందారు అయినప్పటికీ సామాన్య ప్రజలతో మైత్రీ బంధుత్వం నెరపినవారు. మధుర గాయకుడు. సంస్కృతం, తెలుగు, అరబ్బీ, పార్శీ, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. గణితం జ్యోతిష శాస్త్రాల్లో విద్వాంసుడు. సంగీతం, ఖగోళం, చిత్రలేఖనం వంటి విద్యల్లో అగణిత వైదుష్యం కలవారు. వీరు పురాణం, కావ్యం, ప్రబంధం, యక్షగానం, శతకం, లఘు కావ్యం, కీర్తనం వంటి ప్రక్రియల్లో రసజ్ఞ జ్ఞేయమైన రచనలు చేశారు. ఈ మహాకవిని తొలుత సురవరం ప్రతాపరెడ్డి గారు తన గోలకొండ కవుల సంచికలో పరిచయం చేశారు. కేశవరాయకవి కృతుల్లో ఇంద్రద్యుమ్నీయం, అధ్యాత్మ రామాయణం, దాశరథి శతకం, లఘుకృతులు, ఆచ్చయినాయి. విక్రమాదిత్యం, హనుమద్విజయం అముద్రితాలు. రామాభ్యుదయం, లీలాపరిణయం, కల్కి పురాణం అలభ్యాలు. పార్శీ కవిత్వంలో నవాబును మెప్పించి, ‘కవిశిరోమణి’ బిరుదు పొందారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలతో సఖ్యంగా ఉండి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. తన సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి, ఎన్నో విలువైన గ్రంథాలను పొందుపరిచారు. భూమి కొలతలను పద్యంలో చెప్పడం ఆయన ప్రతిభకు నిదర్శనం.  అంతేకాదు ఆయనకున్న నాటక కళాభిమానం ప్రత్యేకమైనది. తాము స్వయంగా రచించిన హనుమద్విజయం యక్షగానాన్ని తమ దర్శకత్వంలో ప్రదర్శించేవారు. వీరి రచనలో అలంకార మాధుర్యం, రసపోషణ, భావుకత, వర్ణనలు అద్భుతంగా ఇమిడి ఆర్ద్రత మిళితమై చవులూరిస్తుంది. రావుగారి పద్య విద్యా నైపుణ్యానికి ‘ఇంద్రద్యుమ్నీయం’ లోని ఒక పద్యం ఉదాహరణగా చెప్తాను.
సీ. వర త్రివిక్రమ పాద వనజ నిర్గళితాభ్ర
           గంగాధునీ తోయ కణములనఁగ
     నభ సరి ద్విహరదున్నత తమో గందేభ
            కర గళచ్చీ కరోత్కరములనఁగఁ
     గృత లాస్యహరశిరః పతిత శీతగభస్తి
             బింబ సుధాబిందు బృంద మనఁగఁ
     గస్తూరికాలిప్త గగన సతీ వపుః 
              కలిత ముక్తాహార గణములనఁగ
తే:  సమయ శబర వరేణ్య సుశ్యామ గాత్ర
      క్లప్త మగు సంకు పూసల దీప్తి యనఁగ
      వెలసి తండోపతండమై వేల్పు త్రోవఁ
      బ్రబిలి చూపట్టె నక్షత్ర పంక్తి యపుడు
ఇంతటి గొప్ప పండితులు కేశవరావు గారు…అందువల్ల ఆయన మీద పరిశోధన చేశాను.

5. తెలంగాణ సాహిత్య అకాడెమీ వారి కోరికను అనుసరించి “జనగామ జిల్లా సాహిత్య చరిత్ర”ను రాస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలు ఎటువంటివి?

జ:   అవును. నిజానికది తెలంగాణ సాహిత్య అకాడెమీ కోరిక మేరకు రాయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల స్వీయ ప్రచురణగా ముద్రించడం జరిగింది.

6.వరంగల్ జిల్లా స్థాయిలో హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మీరు క్రీడారంగంలో ఎందుకు ముందుకు వెళ్లలేకపోయారు?

జ:   (నవ్వుతూ) నిజమే కానీ నాటకాల్లో నటించాలన్న అభిలాష ఎక్కువగా ఉండేది. కొన్ని నాటికలు, నాటకాల్లో నటించాను కూడా..అందుకే క్రీడారంగాన్ని పక్కకు పెట్టాను.

7. నాటకరంగంలో కూడా ముద్రవేసుకున్న మీకు నాటకాల పట్ల ఆసక్తి ఎలా కలిగింది? నాటకరంగానికి మీరు అందించిన సేవలు ఎటువంటివి?

జ:   పదేండ్ల బాల్యవయస్సు నుంచే మా గ్రామంలో ప్రదర్శింపబడే వీధి భాగోతాలు, భజనలు చూసేవాడిని. ఆ పాటలూ, సంభాషణలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ బృందాలతో ఊరూరు తిరిగేవాడిని. వేషం కట్టాలనే అభిలాష బాగా ఉండేది కానీ మా పెద్దలు అంగీకరించేవారు కాదు. ఖిలాషాపురం మాధ్యమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు జి. నరసింహారావు గారు అనే అధ్యాపకుడు గొప్ప నాటక రచయిత. ఆయన వల్ల నాటకాలు వేసే అవకాశం వచ్చింది. అట్లా నాటకా రంగంలో ప్రవేశించాను. హన్మకొండ హైస్కూల్లో చదువుతున్నప్పుడు నారాయణరావుగారు అనే ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయనకు నాటకాల రాయుడు అని పేరుండేది. ఆయన ప్రదర్శింపజేసే నాటికల్లో నాకు అవకాశం ఇచ్చేవారు. అక్కడ నాటక సంస్థల్లో ప్రదర్శించే నాటకాలు చూస్తుండేవాడిని. ముచెర్ల సత్యనారాయణ, రుక్మారావు, శ్యామ్ సుందర రావు వంటి ప్రముఖ నటులతో పరిచయం ఏర్పడింది. వీరిలో ముచెర్ల సత్యనారాయణ గారు మంత్రి కూడా. నాకు ఏకపాత్రాభినయం చాలా ఇష్టం. దుర్యోధన, తాండ్ర పాపారాయుడు, రాణా ప్రతాప సింహుడు, చాణక్య, పేదవాడు వంటి ఏకపాత్రల్లో నటించాను. ఇవి నాకు విశేష ప్రాచుర్యాన్ని తెచ్చాయి. 
          జనగామ సంస్థలతో అనుబంధం ఏర్పడిన పిదప చిల్లరకొట్టు చిట్టెమ్మ, గాలివాన, పిచ్చివాడు నాటకాల్లో నటించి అందరినీ మెప్పించాను. మా స్వగ్రామంలో కొందరు యువకులం కలిసి తిరుపతి వేంకట కవుల శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించాం. నేను దుర్యోధనుడు, భీముడు పాత్రల్లో నటించాను. తొలిదశలోనే ఆ నాటక ప్రదర్శన విజయవంతమైంది. ఆ నాటకాన్ని మరికొన్ని గ్రామాలలో ప్రదర్శించాం కూడా.   సురభి నాటక సమాజం వారు రఘునాథపల్లిలో గుడారాలు వేసుకొని, కొన్ని నెలల దాకా అక్కడే ఉండి నాటకాలు ప్రదర్శిస్తుండేవారు. అవన్నీ చూడడమైంది. అవి మనస్సు మీద బలమైన ముద్రవేశాయి. నటులుగా ప్రసిద్ధులైన ఎ. ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములుగార్లతో జనగామలో కలిగిన పరిచయం మరువరాని అనుభూతిని మిగిల్చింది. జనగామలోనే ఆచార్య ఆత్రేయ గారు రచించిన కప్పలు, గుమాస్తా నాటకాల ప్రదర్శన సమయంలో ఆయన తోనూ పరిచయం కలిగింది. వాటిలో సీనియర్ నటులు నటించారు. ఆత్రేయ గారి సినిమా పాటల విశేషాలను వివరిస్తూ వ్యాసాలు రాసి ఆయనకు అందజేశాను. హైదరాబాద్ లో వారితో మంచి అనుబంధం ఏర్పడింది. దానికి గుర్తుగా ఆయన సినిమా పాటల గురించి ఒక బృహత్ వ్యాసం రాసి నా ‘సరళరేఖలు’ వ్యాస సంపుటిలో ప్రచురించడం జరిగింది. ఆయన ఆత్మీయతకు అవధులు నిర్మించలేను.

8.విద్యార్థులను ఏనాడూ దండించి ఎరుగని ఉపాధ్యాయులుగా మన్ననలు పొందిన మీ ఆదర్శ అధ్యాపక జీవితం గురించి తెలపండి.

జ:    నాకు జీవితంలో అధ్యాపకవృత్తి అంటే మక్కువ ఎక్కువ. నా అన్నలు, గురువుల అధ్యాపక జీవితాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను గుండ్ల గూడ సి.ఎస్.ఐ. ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా బోధకునిగా ఉద్యోగంలో చేరాను. పాఠశాల యాజమాన్యం వారు నన్ను మరొక చోటికి బదిలీ చేయలేదు. ఒకే చోట అధ్యాపకత్వాన్ని నెరపడం వాలా నా కృషి ఫలితాన్ని అందుకోగలిగాను, అనుభవించగలిగాను. నా ఎమ్. ఏ. విద్యార్థుల్లో నేను ఇచ్చిన ప్రేరణతో నలుగురు, వారు చదివిన డిగ్రీ కళాశాల వార్షిక సంచికా గ్రంథాలకు సంపాదకులుగా ఉండడమే కాక ఒకరు పిహెచ్ డి. ఇద్దరు ఎంఫిల్ చేశారు.
          నేను ఏ విద్యార్థినీ ఎప్పుడూ దండించలేదు. మరే శిక్షలూ విధించలేదు. కనీసం పరుష పద జాలాన్ని కూడా వాడలేదు. తుంటరి విద్యార్థులను మంచి మార్గంలోకి తేవడానికి ఎంతో శ్రమించేవాడిని. నీతికథలు, సుభాషితాలు, మహాపురుషుల ఆదర్శ జీవితాలు బోధించి వారిని మార్చగలిగే వాడిని. మనస్సును మార్చగలిగేదే అసలైన శిక్ష అనే కార్య ప్రక్రియలో గెలిచాను.  ప్రతీరోజు 9 పేజీల టీచింగ్ నోట్స్ రాసేవాడిని. అవి జిల్లా విద్యాధికారుల, పర్యవేక్షకాధికారుల మెప్పులు పొందేవి. ప్రధానోపాధ్యాయుల డివిజన్ స్థాయి సమావేశాల్లో అవి ప్రదర్శింపబడినప్పుడు ఎంతో పొంగిపోయేవాడిని. అత్యంత ఆధునిక భాషలో పాఠ్యాంశ బోధన, విద్యాసదస్సులో ప్రసంగాలు, మాదిరి పాఠ్యాంశ బోధన చేసేవాడిని. పాఠ్యపుస్తక రూపకల్పనలో నేను రాసిన వ్యాసాలు పలువురిని అలరించాయి. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ తరగతులకు పాఠాలు చెప్పడం వల్ల నా బోధనా విధానం చాలా మెరుగుపడింది. పరిశోధనాసక్తి చాలా పటిష్ఠమైంది.       నా అభిప్రాయాలను కానీ, అభిరుచులను కానీ విద్యార్థుల మనసుల మీద, మేధల మీద రుద్దే ప్రయత్నం ఏనాడూ చేయలేదు.

9. ‘బట్టల బంగారం’ గా సుప్రసిద్ధులైన మీకు ఆ పేరు రావడానికి గల నేపథ్యాన్ని వివరిస్తారా?

జ:    ఈ భూమిక చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలోనిది. జనగామ పట్టణ ఎస్ కె ఆర్ట్స్ సంస్థ పక్షాన ఈ నాటకం 9 చోట్ల ప్రదర్శింపబడి ప్రశంసలు పొందింది. ‘బట్టల బంగారం’ పాత్రలో సంభాషణలు చలాకీగా ఉంటాయి. హాస్యప్రధానంగా ఉంటుంది. హాస్యపూరితమైన భావాలను రమ్యంగా ఆవిష్కరించడంతో నాకు ‘బట్టల బంగారం’ పాత్ర మంచి గౌరవాన్ని, ప్రసిద్ధిని కలిగించింది.

డాక్టర్ లింగంపల్లి రామచంద్రగారితో అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి

10. దూరవిద్యా విధానంలో మీరు నిర్వహించిన పాత్ర ఎటువంటిది?

జ:    నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ లో డిగ్రీ తరగతులకు పాఠాలు చెప్పాను. ఇంటర్ విద్యార్థులతో పాటు అంతగా చదువులేని వాళ్ళు కూడా విద్యార్థులుగా ఉండేవారు. అందువల్ల నేను వాడుక భాషను ఉపయోగించే వాడిని. అటు తరువాత ప్రామాణిక భాషను వాడేవాడిని. ప్రత్యేకించి వ్యాకరణాంశాలను చెప్పేటప్పుడు ముందుగా గ్రామ్య భాషను ఉపయోగించి, తర్వాత ప్రామాణిక భాషలో బోధించడం వల్ల అన్నిరకాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. చేరా గారు, పి.వి. చలపతి రావు గారు, కె.ఎస్. రమణ గారు నా తరగతి గదిలో కూర్చొని పరిశీలించేవారు. నేను గ్రామప్రాంత అధ్యాపకుడిగానే కాక సాహిత్యం పట్ల కృషి చేస్తున్నవాడిని కాబట్టి నా భూమికను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. చర్చలు కూడా సాగేవి. అవి నాకు చాలా తృప్తిని కలిగించాయి. అభ్యాసకులకు ఆహ్లాదంతో పాటు ప్రయోజనం చేకూర్చేవి. 

11. ప్రత్యేకంగా మీరు “తెలంగాణాలో మల్లికార్జునాలయాలు” పేరుతో పుస్తకం వేయడానికి కారణం ఏమైనా ఉందా?

జ:   ఉంది. ఎందుకంటే వరంగల్ జిల్లా అయినవోలు మల్లికార్జునాలయం చారిత్రక సత్యాల గురించి వాదోపవాదాలు జరిగేవి. అందుకోసం సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు తెలంగాణాలో మల్లికార్జునాలయాలు రాస్తే బాగుంటుంది అనిపించింది. ఈ చారిత్రకాంశాన్ని  కొంతభాగం గ్రంథస్థం చేయడం జరిగింది. డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రి, డా. బూదరాజు రాధాకృష్ణ గార్ల సహకారం తీసుకోవడం జరిగింది.

12. నడుస్తున్న అక్షరంగా మీరు అభివర్ణించిన డా. పల్లేరు వీరస్వామిని గురించి చెప్పండి.

జ:   ఐదు దశాబ్దాల సాహితీ జీవితం ఆయనది. తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు. తెలంగాణ శతక సాహిత్యం (1975- 2000)అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఎనిమిది గ్రంథాలు వెలువరించారు. సినారె, ద్వానా శాస్త్రి మొదలగు వారి నుండి 15 ఉత్తమ పురస్కారాలు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందుకున్నారు. అనేకమందిని సాహితీ పరులుగా తీర్చిదిద్దారు. 

13. ఇప్పటి వరకు మీరు చేసిన సాహితీకృషి ఎన్ని గ్రంథాలుగా వెలువడింది? 

జ:    ఇప్పటివరకు నా సాహిత్యం 17 గ్రంథాలుగా వెలువడింది. ఆత్మ అక్షరమైన వేళ, ఎప్పుడూ వసంతానివే, అమ్మ పిలుస్తోంది, గదిలో నక్షత్రం, ఆకాశం నా సంతకమే, ఆమనిలో వెన్నెల కోయిలలు, మరో ఉదయాన్ని పిలుస్తా, తూర్పుతీరం (వచన కవితా సంపుటి), శ్రీ రంగరాజు కేశవరావు సాహిత్యం-పరిశీలన (సిద్ధాంత గ్రంథం), సినారె కవితాలోకనం(వ్యాససంపుటి), సరళరేఖలు (సాహిత్య విమర్శ), నడుస్తున్న అక్షరం (పల్లేరు వీరస్వామి జీవిత చరిత్ర), కొమురవెల్లి మల్లన్న క్షేత్ర మాహాత్యం (క్షేత్ర చరిత్ర), సినారె వాక్కుకు వయసు లేదు – తత్వ విశ్లేషణ, వాల్మీకి ఆశ్రమస్థలి వెల్ది, సమీక్షణం (వ్యాస సంపుటి), జనగామ జిల్లా సాహిత్య చరిత్ర ఇవి వెలువడిన గ్రంథాలు. జనగామ తాలూకా సాహితీమూర్తులు, జనగామ పట్టణం వందేండ్ల సాహిత్య సమావేశాలు, జనగామ తెలుగు కవులు-స్వీయ గానాలు ముద్రణలో ఉన్నాయి.

14. కవిత్వం, విమర్శ, అధ్యాపకత్వం ముప్పేటలుగా పెనవేసుకున్న మీరు సమాజ శ్రేయస్సు కోసం చేసిన రచనల్లో ఇంకా అనేకం అముద్రితాలుగా ఉన్నాయని చెబుతున్నారు కదా! అవి అలాగే ఉండడం ద్వారా వాటి ప్రయోజనం నెరవేరదు కదా! మరి వాటన్నిటినీ వెలికి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా?

జ:   ప్రస్తుతం మూడు గ్రంథాలు ముద్రణలో ఉన్నాయి. అన్నింటిని కాకపోయినా కొన్నిటిని వెలువరించగలను.

15. అసలు కవిత్వం కానీ, విమర్శ గానీ ఏ లక్షణాలకు లోబడి ఉండాలో మీ అభిప్రాయం చెప్పండి.

జ:     నేడు వెలువడుతున్న కవిత్వమంతా బాగుందని చెప్పలేం. పదాల పోహళింపుతో వెలువడే కవిత్వమే రాసులు రాసులుగా ఉంది. అటువంటి కవిత్వం బీరువాల్లో బందీ అవుతోంది. కవిత్వం ఎప్పుడైనా సార్వజనీనంగా ఉండాలి. సార్వకాలికమై జ్వలించాలి. ప్రయోగ శీలత తరగలెత్తాలి. అనుభూతి ఉండాలి కానీ అది వస్తు సౌందర్యాన్ని మరుగునపరిచేదిగా ఉండకూడదు. పద పదంలో కొత్తదనం విరబూయాలి. అనుభవ తాత్పర్యసీమల నుంచి ప్రభవించినట్లుగా ఉండాలి. ఆశావహమైన సవ్వడుల స్వరాలను ఒక ప్రవాహంగా నినదింపజేసే విధంగా ఉండాలి. ‘విప్పి చెప్పేది విమర్శ’ అన్నారు సినారె గారు. సాహిత్య విమర్శ సహేతుక విశ్లేషణతో సాగాలి. వస్తు తత్వాన్ని ప్రామాణికమైన కొలమానాలతో విడమరిచి చెప్పేదిగా ఉండాలి. నిష్పాక్షిక దృష్టితో వివేచన సాగాలి. అభిమానాశ్రిత ప్రశంస ఉండకూడదు. వ్యక్తి ప్రశంస కన్నా వ్యక్తిత్వ విశ్లేషణ కలిగిఉండాలి.

16. మా తరం కూడా పద్యసాహిత్యాన్ని చదువుతూ పెరిగిన వాళ్ళమే. ఇప్పుడు పద్యమే వద్దంటున్నారు. ఈ పరిణామాన్ని ఏ రకంగా అన్వయించుకోవాలి? 

జ:    ఎందరు చీదరించుకున్నా పద్యం చెరిగిపోదు. అమృత రూపమై జాలువారుతుంది. పద్యం విద్య అన్నాడు నన్నయ్య గారు. అందుచేత పద్యం అనారతం హరితమధురంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆగామికాల సాహిత్యానికి పరిపూర్ణతను స్థిరపరుస్తుంది. ఆధునికంగా ఎన్ని ప్రక్రియలు మొలుచుకొచ్చినా, దూకినా పద్యం నవ నవంగా శోభలు కుమ్మరిస్తూనే ఉంటుంది. ఖండకావ్యాలు, కావ్యసంపుటాలు, కావ్య సంకలనాలు పెద్ద ఎత్తున వెలువడుతూ రసజ్ఞ లోకాన్ని పరవశత్వంలో ముంచెత్తుతున్నాయి. పద్య సదస్సులు నిర్వహింపబడుతూనే ఉన్నాయి. ఇంతే చాలదు. ఆధునిక టెక్నిక్ తో పద్యం రాయబడాలి. అభివ్యక్తిలో తళుకు భాసించాలి. శైలిలో ఆర్ద్రతాశ్రితమైన వాదం ఉండాలి. పద్యంలోని ప్రాణ చైతన్యం వస్తువుతో సిద్ధిస్తుంది. కాబట్టి వస్తువు ఎంపికలో రుచిర భావనా తత్వాన్ని కలిగిఉండాలి. ప్రయోగశీలత సహజత్వాన్ని తొడుక్కొని సాగాలి.

17. మీరెన్నో పురస్కారాలు, సన్మానాలు పొందారు కదా! ఆ అనుభూతిని తెలపండి. పురస్కారాలు రచయిత రచనాశక్తికి కొలమానం అవుతాయా?

జ:    సన్మానాలు, పురస్కారాల వల్ల నేను పొందిన అనుభూతి వర్ణనాతీతం. సాహిత్యమే సర్వస్వంగా జీవిస్తున్న రచయిత ఎన్నడూ అవార్డులకోసం నిరీక్షించడు. ఎలాంటి ‘పట్టు’ పరిశ్రమ కోసం ఆరాటపడడు (నవ్వుతూ). పైరవీలు చేయడు. అవార్డులు రచయితకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. 

18. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మన ప్రాంతంలో సాహిత్యరంగం అభివృద్ధి చెందినదని భావిస్తున్నారా? ఏ విధంగా?

జ:   సాహిత్యరంగం బాగా అభివృద్ధి చెందింది. సాహిత్య సంస్థలు అసంఖ్యాకంగా వెలిశాయి. కవితాసంపుటాలు, సంకలనాలు వెలువడ్డాయి. సదస్సులు జరిగాయి. ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉన్నాయి. సాహితీ కృషి చేసినవారికి అధిక సంఖ్యలో పురస్కారాలు అందింపబడుతూనే ఉన్నాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రయోజనవంతంగా సాగుతూ సాహిత్య వికాసానికి దోహదపడుతున్నాయి. అందులో జిల్లా సాహిత్య చరిత్రలు వెలువరింప జేయడం బాగుంది. తెలంగాణ సారస్వత పరిషత్తు సైతం విశేషకృషిని అందిస్తున్నది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సాహిత్య చైతన్యానికి తెలంగాణ సంస్కృతికి అవిరళంగా సేవలు అందిస్తున్నది. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప సాహిత్యం సరికొత్త మూల్యాలతో ప్రవర్ధిల్లుతూ వచ్చిందని చెప్పవచ్చు.

19. ఒక రచయితకు సమాజం పట్ల ఉండే బాధ్యత ఎటువంటిది? ఇప్పుడున్న రచయితల్లో అది ఉందని భావిస్తారా?

జ:    రచయిత బాధ్యత గురుతరమైంది. అతడు సమాజ బహిరంతరాలను శోధించాలి. మనిషి జీవితంలోని కృత్రిమత్వాన్ని, అహేతుక విషయాల ఆంతర్యాన్ని ఛేదించాలి. స్వప్నలోకాలకు పట్టం కట్టడం ఆపేయాలి. మనిషి మనిషి మధ్య ఆత్మీయతా సౌరభ్యాన్ని ప్రవహింపజేయాలి. సత్యాన్ని ఎలుగెత్తి చాటాలి. ప్రతి కవితాక్షరంలో నవ్యత్వాన్ని దాచిపెట్టి, మనిషిని కాపాడాలి. అయితే రచయితలందరిలో ఈ భావన ఉంటుందని నేననుకోవడం లేదు. రచయితల్లో కొందరు వ్యాపార ధోరణి కలిగినవాళ్ళు ఉంటారు. వారికున్న బాధ్యత సొంత వైభవాన్ని పెంచుకోవడమే. ఉద్యమాలను తనవైపు మళ్లించుకొని సమాజాన్ని , సాహిత్య సమాజాన్ని అల్లకల్లోలపరచడమే. వ్రేళ్ళ మీద లెక్కపెట్ట గలిగేంతమంది రచయితలు మాత్రమే నిజాయితీగా రచనలు చేస్తున్నారు. అయితే ఇలాంటి రచయితల వల్లనే సమాజం సతతహరితంగా ప్రవర్ధిల్లుతూ ఉంటుంది. 

20. ఆధునిక కాలంలో వస్తున్న వివిధ వాదాల పట్ల మీ అభిప్రాయం చెప్పండి. 

జ:    సాహిత్యం విస్తృతమవుతూ వస్తున్నది. ఎన్ని వాదాలొస్తే అంత మంచిది. అవి అస్తిత్వాన్ని కోల్పోకూడదు. నాకు నచ్చింది మానవతావాదం.

21. మీ నిరంతర మార్గదర్శకత్వంలో ఎదిగి మీకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను గురించి చెప్పండి.

జ:   బాల్యవయస్సులో స్కూల్లో నన్ను అనుకరించడం, ప్రత్యేక కార్యక్రమాల్లో నా వాణిని కొనసాగించడం మొదలు ప్రఖ్యాత సాహితీవేత్తగా ఎదిగిన నా విద్యార్థి డా. పోరెడ్డి రంగయ్య. ఎన్నో గ్రంథాలు వెలువరించాడు. మరెన్నిటికో సంపాదకత్వం వహించాడు. వందలాది సదస్సులకు వ్యాఖ్యాతగా ప్రశంసలు పొందాడు. అనేక బిరుదులు పొందాడు. అందరికీ ఆత్మీయుడిగా నాకు గర్వకారణంగా నిలిచాడు. పోరెడ్డి రంగయ్య మూడో అన్న పోరెడ్డి ఉప్పల్ కూడా నాకు ప్రియ శిష్యుడే. ఇట్లా ఎంతోమంది వారి వారి సామర్థ్యాలను బట్టి మంచి పదవుల్లో ఉన్నారు.

22. మీ అనుభవ పురస్సరంగా ఈ తరానికి మీ సందేశం ఇవ్వండి.

జ:  ఈ తరం వారికి కొరవడింది అధ్యయనం. విస్తృత అధ్యయనం చేయాలి. రచన అనుభూతి ప్రధానంగా సాగాలి. అభివ్యక్తిలో నవ్యత్వం గుబాళించాలి. సృజన శీలత పదునుగా ఉండాలి. వ్యక్తిని, సమాజాన్ని ఉత్తేజపరచాలి.

అనేక ధన్యవాదాలు సార్🙏🏼 మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, సమగ్రమైన మీ జీవిత విశేషాలను అందించినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున నమస్సులు, కృతజ్ఞతలు

🙏🏼

March 19, 2026 7 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అరుణ కాంతులు

by Vijaya Kandala March 19, 2026
written by Vijaya Kandala

రంగు అనగానే మొదట గుర్తొచ్చే రంగు రెడ్  .అదే ఎరుపు  . సందేహిస్తున్నారా ?ఒక్క క్షణం ఆగండి . కళ్ళు మూసుకుని ఇలా ఊహించుకోండి  .మీరు దట్టమైన అడవిలో చిన్న కాలిబాట వెంబడి నడుస్తున్నారు  . .చుట్టూ అనేక వర్ణాల ఆకుపచ్చ పరచుకున్న పచ్చదనం  .ఎక్కడో సుదూరంగా ఆకుల మధ్య లోంచి తొంగి చూస్తున్న చిన్ని ఎర్రని గడ్డిపువ్వు . వెంటనే మీకు తెలియకుండానే మీ దృష్టి అటువైపు మళ్ళు తుంది అదే ఎరుపు రంగు మహత్యం ఒప్పుకుంటారా !

ప్రతి రంగుకు ఉష్ణోగ్రత ఉంటుంది  .ఊదా రంగు నుండి ఎరుపు రంగుకు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది  .అందుకే ఇది చలింప చేసే రంగు . మిగిలిన రంగులు అందమైనవి  ,కోమలమైనవి కావచ్చు . కానీ , ఇది ఉత్తేజపరిచే రంగు  .

 ఎరుపు అంటే ఉద్వేగం  .ఎరుపంటే శక్తి  .అగ్ని తత్వానికి ప్రతీక . నాడీ కణాలను రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. పంచేంద్రియాలలో చు రుకు పుట్టిస్తుంది  .లోన దాగిన భావా వేశాలను ఉద్రేకాలను బయటపెడుతుంది . సమర్థమైన రంగు  అంటే ఎరుపే  .ఎరుపు రంగులో ఎన్నో షేడ్స్ ఉన్నాయి  .మెరూన్ -కార్డినల్ -అరుణము -కుంకుమ రంగు,-రక్తం ఎరుపు  -లోహితం ముఖ్యమైనవి

బూర్గుండి  , క్లారిటీ  ,సిరీస్ వెర్మిలియన్ , క్రిమిసన్  ,స్కార్లెట్ ఎరుపు    .ఎ న్నో పేర్లు . అతి ప్రాచీన గుహలలో చిత్రకళలోతొంగి చూసిన  మొదటి రంగు ఇది  . చారిత్రాత్మకంగా త్యాగం , ప్రమాదం  ,ధైర్య గుణాలకు సంకేతం .యూరప్ లోని ఆధునిక సర్వేలు ఈ రంగును వేడి  ,కార్యాచరణ  ,అభిరుచి , కోపం  ,ప్రేమకు సంబంధించినదిగా నిరూపిస్తున్నాయి . కలలో ఎరుపు రంగు లేదా ఎర్రని వస్తువులు కనిపిస్తే  ,మీ జీవితం ఇప్పుడు మెరుగ్గా ఉందని  ,త్వరలో మరింత ఆనందాన్ని అనుభవిస్తారని అర్థం .

అనేక ఆసియా దేశాలలో ఇది ఆనందాన్ని, అదృష్టాన్ని సూచించే రంగు .

ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అంగారక గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అంటారు.

తూర్పు ఐరోపా నుండి  వియత్నాం వరకు కమ్యూనిస్టు పార్టీల రంగు ఎరుపు  .

పాశ్చాత్య దేశాలలో ఎరుపు అమరవీరుల త్యాగానికి చిహ్నం .

1968 లో జరిగిన విఎన్ఆర్ కన్వెన్షన్ లో రహదారి సంకేతాలకు అంతర్జాతీయ రంగుగా ప్రామాణికరించారు .

1917లో బోన్షివిక్ విప్లవం తర్వాత సోవియట్ రష్యా  ఎర్రజెండాను స్వీకరించింది  .

మానవ జనాభాలో ఒకటి నుండి రెండు శాతం మందికి ఎర్రటి జుట్టు సహజంగా ఉంటుంది  .

20వ శతాబ్దం ప్రారంభంలో నగరాల్లోని కొన్ని ప్రాంతాలను రెడ్లైట్ ఏరియాగా పేర్కొనడం మొదలుపెట్టారు  .

ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా జట్లు ఎరుపు రంగు యూనిఫామ్ లను వాడతారు  .

తప్పు చేస్తూ పట్టుబడే సందర్భాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అంటారు  .

కలర్ థెరపీ  ప్రకారం ఎరుపు రంగు పరిసరాల్లో వాడడం వల్ల రక్తహీనత తగ్గుతుంది  .

వా త లక్షణాలు తగ్గుముఖం పడతాయి .

 తడి పొడి దగ్గు లక్షణాలు మెరుగవుతాయి

రెడ్ లైట్ ఏరియా లేక డిస్ట్రిక్ట్ అనేది పట్టణ ప్రాంతాల్లోని ఒక నిర్దిష్ట ప్రాంతం . ఈ ప్రాంతంలో అధిక లైంగిక ఆధారిత కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇది మనుషులను ఆర్థికంగా  ,మానసికంగా  ,సాంఘికంగా  ,ఆరోగ్యపరంగా , నైతికంగా పీల్చి పిప్పి చేసే ప్రాంతం . ఇది ఒక ఊబి లాంటిది . ఇందులో నుంచి బయటకు రావడం సాధారణంగా జరగదు  . వచ్చినా చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రాణరక్షణ చేసుకుందామనే బాపతు వ్యవహారం .

ఎర్రని అరటి  పండు

 ఒకప్పుడు ప్రాంతీయంగా దొరికే ఎరుపు అరటి పళ్ళు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయి అన్ని చోట్ల దొరుకుతున్నవి  .దీంట్లో పోషకాలు ఎక్కువ  .ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం  .నరాల సమస్య మూర్ఛ వ్యాధితో బాధపడేవారు , తరచుగా వాడితే మంచి గుణం కనిపిస్తుంది .క్రమం తప్పకుండా వాడితే పునరుత్పత్తి వ్యవస్థ బలో పేతమై సంతానోత్పత్తి అవకాశాలు మెరుగవుతాయి  .కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి పరిష్కారం  .చర్మ  రోగాలకు పైపూతగా దీని తొక్కను వాడుతారు .

కర్మాగారాల్లో ఎరుపు ప్రమాద సంకేతం . ఆపరేషన్ థియేటర్లలో బయట కనిపించే ఎర్ర బల్బ్  కార్యాచరణకు సంకేతం మరి ఇలాంటి రంగును ఇష్టపడే వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా?

ఎ రుపు రంగును ఇష్టపడే వారిలో దూకుడు స్వభావం  ,దృఢమైన ఆలోచన విధానం ఉంటుంది  . ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవిశ్రాంతంగా పనిచేస్తారు మార్పులు కొరేవారిలో ముందుంటారు . గుండె నిబ్బరం , క్రమశిక్షణ వీధిలో ఎక్కువ  .సాధారణంగా ధైర్యవంతులు , ఉత్సాహవంతులు  ,ఆత్మ విశ్వాసం కలిగిన వీ రు జీవితాన్ని అభిరుచులతో ఆస్వా దిస్తారు  .నాయకత్వ లక్షణాలు ఎక్కువ  .శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం వల్ల సమూహంలో నాయకుడిగా రాణిస్తారు  .సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు  .చాలా ఎమోషనల్ మనుషులు  .అనర్గళంగా అనేక విషయాలపై మాట్లాడగలరు తమ కల లను సాకారం చేసుకోవడానికి పట్టుదలతో కృషి చేస్తారు .

 అయితే చాలా త్వరగా వీరికి కోపం వస్తుంటుంది

ఎరుపు రంగు _మానవ స్వభావం పై చాలా పరిశోధనలు జరిగాయి . ఈ రంగును గోడలకు వాడినప్పుడు కొంతమంది రోగులు వారి రుగ్మతల త్వరగా తగ్గినట్లు చెప్పారు  .హుశా ఈ కారణం చేతనే రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ గా ఏర్పడిందేమో . ఆదరణకు చిహ్నం ఈ రంగు

ఆకలిని ఎక్కువ చేస్తుంది అందుకే హోటళ్లలో చాలా పదార్థాలు ఆకర్షణీయంగా ఉండడానికి ఎరుపు రంగులో సిద్ధం చేస్తూ ఉంటారు  . సభలకు మీటింగ్లకు ముఖ్య అతిథులు చివరగా వస్తారు. అలా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎర్రని అతిధి ఎవరో తెలుసా ఇంకెవరు ఎర్ర గులాబీ .

గులాబీలలో ఎన్నో రంగులు ఉన్న ఎరుపు గులాబీ స్థానం వేరు  .దాని తరహానే వేరు సుమా  !వాలెంటైన్స్ డే మొదలుకొని మహిళా దినోత్సవం వరకు ఎర్ర గులాబీల సందడే సందడి  . లవ్ యు చెప్పడానికి  , ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇంతకంటే గొప్ప కానుక ఇంకేముంటుంది చెప్పండి .

 గాఢమైన ప్రేమను నిశ్శబ్దంగా తెలియచెప్పే సున్నితమైన హృదయ స్పందనే  ఎర్రగులాబి .పురాతన కాలం నుండి ఎర్ర గులాబీ ప్రేమకు  ,శౌర్యానికి  ,ధై ర్యానికి చిహ్నంగా పేరుగాంచింది .గ్రీకు పురాణాలలో ఎర్ర గులాబీలు ప్రేమతో అనుసంధానమై ఉన్నాయి

మన జీవితం రంగులమయం . దాని ఆవేశంతో  ,అనుమానంతో  ,అసహనంతో గడిపితే మిగిలేది అంతులేని ఒంటరితనం అంతేలేని ఏకాంతం  .ప్రకృతిలో కనిపించే రంగులన్నీ సంస్కృతి పరిరక్షణలో రంగవల్లికలై మన జీవితాన్నిశోభాయమానం చేస్తున్నాయి .భారతీయ ఆత్మకు అభివ్యక్తీకరణమే ఈ రంగుల సమ్మేళనం.

                                                             

March 19, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

సు’లోచనాల’లో మెరిసిన” నానీ లోచనాలు “

by Radhika Suri March 19, 2026
written by Radhika Suri

గడ్డం సులోచనగారితో నా తొలి పరిచయం సోమవారపు కుటుంబంలో . నిరాడంబరత, స్నేహపూరిత పలకరింపు ఆమెలో నన్నాకర్షించిన విషయాలు.
కలంపట్టి రాయమంటూ ప్రోత్సహించిన సహాధ్యాయుడికే తన తొలి రచనను అంకితమిచ్చి కృతజ్ఞత చాటుకున్న స్నేహశీలి.
పుస్తకావిష్కరణ సభలో ‘నానీ లోచనాలు’ పుస్తకంతో ఇల్లు చేరి సమీక్ష రాయాలనుకున్నా కారణాంతరాలతో జరిగిన జాప్యమిది.

అక్షరాలవెంట పరుగులుతీసి ఒజ్జగా మారినా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తించిన సందర్భం నేర్పిన అనుభవంతో
“ఇంటి వెలుగు
లైట్ల వల్లకాదు
ఇంట్లో స్త్రీలు
విద్యావంతులు”
అంటూ – పుట్టెడు బాధ్యతలున్నా బొంగరంలా తిరుగుతూ ఇంటెడు చాకిరీ చేసే ఇంతికి విద్యాగంధం తోడైతే పిల్లలలో అక్షరక్రాంతి నింపుతుందంటూ’ ఇల్లాలిని శ్లాఘిస్తూ పుస్తకానికి శ్రీకారం చుట్టారు.

కనిపించని దేవుళ్ళకు సాగిలబడుతూ కళ్ళెదుట ఉండే తల్లిదండ్రులను పట్టించుకోరు .
“చిన్నప్పుడు
అమ్మ అందరి సొత్తు
పెద్దపుడే
వదిలించుకునే విపత్తు “
అంటూ మమతానురాగాలు రంగరించి గోరుముద్దలు తినిపిస్తూ పెంచిన తల్లి పిల్లలను ఎప్పుడూ భారం అనుకోదు కదా! అదే తల్లులు అవసాన దశలో ఆదరణకు దూరమై అలమటిస్తున్న సందర్భాలు నేటి సమాజంలో కోకొల్లలు. కనిపెంచిన అమ్మదనానికి
మలిదశలో ఎందుకీ ‘అంకురయాతన’ అంటూ ఆవేదన చెందుతారు.

జల్లెడను పోలీసుతో పోలుస్తూ , ‘దాక్కున్న తాలును నిగ్గు తేల్చి’ పట్టిస్తుందంటూనే , డాక్టర్ల తెలివిని అభినందిస్తూ’ ప్రాణమున్న బికారి’ని చేస్తాడంటూ నేటి కార్పో’రేటు ‘వైద్యులకు
చురకలంటిస్తారు .అమ్మ ప్రేమలో నైర్మల్యం గూర్చి చెప్తూ అబద్ధాల్ని అమాయకంగా నమ్మేస్తుంది ‘అచ్చం యశోదమ్మ’లా అంటూనే కట్టుబాట్ల సంకెళ్ళల్లో ‘ఆమె’ తెలివితేటలు ‘కట్టడి’ చేయబడతాయి అంటూ ఆవేదన చెందుతారు. ‘నడిరేయి దేదీప్యమానంగా వెలిగే విద్యుత్ దీపాలున్నా ‘మహిళలు వీధులలో తిరుగలేని సమాజ స్థితిగతులకు మహిళగా ఆందోళన చెందుతారు.

“సాహితీ మాగాణంలో
కలం సేద్యం
అనంతభావాల
అక్షర నైవేద్యం “
అంటూ కలంతో కవితాసేద్యం చేస్తూ భావాక్షరాలను పండించే కవి ఇంట్లో దొంగలు పడితే సంపద కోసం కాకుండా తన’ కవితలు దోచుకుపోయారంటూ’
ఆవేదన చెందుతాడంటారు ఆమెలోని కవయిత్రి .

‘ప్రయత్న లోపాన్ని వీడితే విజయం తథ్యం’ అంటూ వెలిగే సూర్యుడిని ఆపడం ఎవరితరం కానట్టే , ప్రజాఉద్యమాల్ని అణచివేయడం అసాధ్యం అంటూ తెలంగాణ ఉద్యమం మదిలో మెదిలి, “చరిత్రపుటల్లో
అమరుల త్యాగాలు
తెలంగాణ
జీవన చిత్రాలు”అమరులైన తెలంగాణా వీరులు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో వెలుగొందుతారంటూ’ తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు.
‘పచ్చదనం చెట్టుకెరుక పొట్ట నింపడం అమ్మకెరుక’ అంటూ పర్యావరణానికి మమకారానికి లంకె పెడతారు .

“మొగ్గను గుచ్చినా
దారంతో ఉరేసినా
మల్లె
తెల్లగానే నవ్వుతుంది “
అంటూ విరుల ఒంటిపైనున్న గాయాల జల్లెడను చూసి మనసున్న మనిషిగా విలవిల్లాడిపోతారు .

“పరిణతి లేని
ప్రేమ వ్యవహారం
రెక్కలు రాని పక్షి
గూడు వదిలినట్టు”
అంటూ
అపరిపక్వపు ప్రణయం రెక్కలు రాని పక్షి గూడు వదిలి దారితప్పిన చంద’మంటూ యువతకు చిరు హెచ్చరిక చేస్తారు. క్రమశిక్షణ లేని జీవితాలు, అలవాట్ల పొరపాట్లతో ‘ఆరోగ్యం అనారోగ్యం పాలబడకుండా నడకతో సరిచేసుకోవచ్చంటూ’ చక్కని సూచన చేస్తారు. రాగద్వేషాలు వీడితేనే మనిషిలో మానవత్వం చిగురించేదని హితబోధ చేస్తారు.

లింగ వివక్ష పై మండిపడుతూ – స్త్రీని పూజించే సమాజం మనది అయినా గర్భస్థ శిశువు ‘ఆడ’ని తెలిస్తే అర నిమిషం కూడా ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా అంతమొందించే ప్రయత్నం చేస్తారు
“గుడిలో అమ్మని పూజిస్తారు
గర్భగుడిలో ఆడబిడ్డను
హత్య చేస్తారంటూ”
భ్రూణహత్యలపై ఘాటుగా స్పందిస్తూ, చిన్న బుద్ధిగల మనుషుల ‘మనసుల్లోని మాలిన్యాన్ని చీపురుతో
కడిగేయాలంటూ’ కళ్ళెర్రజేస్తారు . ‘గట్టిగా ముడివడని బంధాలు తెగదెంపులతో
దూరమౌతుండడం బాధాకరమంటూ నేటి వివాహ వ్యవస్థ తీరుకు వాపోతూనే ఇల్లాలిని సూర్యుని’తో పోలుస్తూ ఆమె చుట్టూనే పరిభ్రమించే ‘మమతల గ్రహాలు ‘ఇంట్లోని వారంటూ, కలతలు లేని సంసారాలు ‘మమతల కోవెల’లంటూ ఆనందం వ్యక్తం చేస్తారు. ‘ఎదగడానికి తొందర పనికిరాదంటూ’ అదను చూసుకుని అనువైన మార్గం వైపు దృష్టి సారించమని, ‘సద్విమర్శల్ని సహృదయంతో స్వాగతించమని’ అనుభవంతో చెప్తారు.

“ఉచితాలెందుకు?
ఉపాధి కావాలి
ఆశల సుడిగుండంలో
యువత ఉంది”
ఉచితాలతో యువత భవితవ్యం అయోమయంలో పడిపోయి ప్రశ్నలా మారిపోయిందని ఆవేదన చెందుతారు. పట్టణీకరణతో పచ్చని పల్లెలు కాంక్రీట్ జంగల్లుగా మారడం ,పొట్టకూటి కోసం రైతన్న వలస కూలీగా మారిపోయాడంటూ బాధపడి, భూకబ్జాలలో చిక్కి నలిగిపోతున్న భారతావనికి “భరతంపట్టే భీమసేనుల ” అవసరం ఎంతైనా ఉందంటూ ఆశాభావం
వ్యక్తం స్తారు.

‘వర్షించని మేఘపు నీటితడిఅంతా రైతు కళ్ళ’ల్లోనే దాగుంటుందంటూ జాలి పడుతూనే , కన్నీళ్ళను దాచి మనసు భారం కానీయొద్దంటూ ‘వర్షించిన మేఘా’నివై తెలిమబ్బులా సాగిపొమ్మంటూ ఊరడిస్తారు.

” తెలుగుకు తెగులు సోకిస్తున్న” ఆధునిక తల్లుల వింత పోకడలకు తల్లడిల్లిపోతారు. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో అంతా చరవాణి చేతిలో బందీలైన ఏకాకులంటూనే పాపం ‘ఉత్తరం ఉనికి లేకుండా పోయిందని ‘బాధ పడతారు .
ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు మమతానురాగాలు పెనవేసిన ‘లతానికుంజ’మంటూ కౌటుంబిక జీవన మాధుర్యాన్ని అందంగా వర్ణిస్తారు.

“బొమ్మలేయడం
ఈజీకాదు
భావాల చుక్కలకు
గీతలు కలపాలి”
అని చిత్రలేఖనంలోని సాధకబాధకాలను వెల్లబోసుకుంటుంది తనలోని చిత్రకారిణి. పదాల్ని దారంగా మార్చి భావాల కవితాపుష్పాలను మాలికగా అల్లుతుంది ఈమెలోని కవయిత్రి.
గ్రామీణ నేపథ్యమున్న వీరు పంటచేల నాట్యానికి పరవశిస్తారు, వరినాట్లేసే అతివల్లో ‘నేలకు దిగిన రంగుల సింగిడి అందాలను’ చూస్తూఆనందిస్తారు.

“పొలాల్లో
హరివిల్లులా ?
లేక వరినాట్లేస్తున్న
పల్లె పడతులా?
అంటూ అచ్చెరువొందుతారు.

స్వతహాగా ఉపాధ్యాయురాలైన
వీరు “నసుగుతూ మాట్లాడకు స్పష్టత అవసరమంటూ”గట్టిగా మందలిస్తారు. “ప్రశ్నించడం నేర్చుకోమంటూ బెత్తాన్నెత్తి హెచ్చరిస్తారు”. చదువులో ముందుండి జీవితంలో వెనుకబడ్డ అతివల్లోని అసంతృప్తి,అసహనం ఆమె కవితల్లో స్పష్టంగా కనబడుతుంది. ‘గ్రంధాలయాలు జ్ఞాన భాండాగారాలు ‘అంటూ పుస్తక పఠనపు ఆవశ్యకతను, చదువు సార్ధకతను ‘మహిళా సాధికారతను అక్షరాలలో రంగరించి చెప్తారు .

“సాహితీ సముద్రంలో
మునిగాను
అప్పుడప్పుడు
ముత్యాలు దొరుకుతున్నవి”
అంటూ ‘మేలిమి కవిత’ల ఊటకోసం ఆరాటం, ఒకింత నిరాశ కలగలిపిన కళ్ళతో అర్థవంతమైన అక్షరాలకై దోసిళ్ళొగ్గుతారు. .

సమాజపు తీరుతెన్నులను మీ ‘సులోచనాల’తో ఓ కంట గమనిస్తూ మీలో దాగిన సన్నటి అసంతృప్తి సెగను చల్లార్చి మీదైన శైలిలో మంచి కవితా ఝరులు జాలువారుస్తారని ఆశిస్తూ…

March 19, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తలుపుల మాటున మెదిలిన తలపులు – అల్మారా

by Padmasri Chennojwala March 19, 2026
written by Padmasri Chennojwala

‘అల్మారా’ మూడక్షరాల పదం. అతి సామాన్యుడికైనా, అపర కుబేరుడికైనా అత్యంత ముఖ్యమైన వస్తువు. స్థాయిని బట్టి నిర్మాణపరమైన తేడాలుండ వచ్చేమోగానీ అవసరంలో మాత్రం అందరిదీ.

కవి దాసరి మోహన్ గారు ‘దండెం ‘ మీద ఆరేసిన బట్టల్ని మడత వేసి ‘అల్మారా ‘ లో సర్దినట్టున్నారు. రండి, ఒకసారి తెరిచి చూద్దాం.

భరించడానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన అమ్మ పోర్టుఫోలియో లన్నిటిని చక్కబెట్టుకుంటూ త్యాగాల తోరణాలను గుమ్మానికి కట్టి, బొట్టుపెట్టెలో కన్నీటి బొట్లను దాచుకొని, తనివి తీరా ఏడవడానికి ప్రైవసీ కోరుకుంటుందంటూ కవితా సంపుటిని అమ్మతోనే ప్రారంభించారు.

తండ్రిని బాధ్యతల భూగోళం మోసే హెర్కులస్ అనీ, అతని అడుగుజాడలే జీవిత పాఠాలనీ, చెమట బిందువులు గంగాజలమంత పవిత్రమైనవని అంటూనే శక్తి సన్నగిల్లిన అతని దేహాన్ని పాలు పితకలేని పొదుగు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు.

గుండె కింది పాయకు ఆనకట్ట కట్టి,కొవ్వొత్తిలా కరిగిపోతూ ఇంటిని బృందావనంలా, సప్తవర్ణ సింగిడిలా మార్చే ఇల్లాలి ఔన్నత్యానికి, ఔచిత్యానికి మెచ్చి బతుకు చుక్కాని అని అంటూ కితాబిస్తారు.

అడవి ఆనంద తాండవం జింకలకు ప్రాణహాని లేదిక/
గంగ యమున నదులన్నీ
స్వచ్ఛ రాగాల నృత్య హేల/

అంటూ పర్యావరణాన్ని దెబ్బతీసే మానవ తప్పిదాలపై ధ్వజమెత్తారు.

ఎండోమెంట్ ఎరుగని పేద దేవుళ్లను స్తుతిస్తూ, పాదుల వేదికలపై పక్షులతో పాట కచేరీలు నిర్వహిస్తారు. రాలిన పూలలో రంగోలిని, కొమ్మల్లో కూచిపూడి ముద్రల్ని చూసి ప్రకృతికి పట్టాభిషేకం చేస్తారు.

పాత జ్ఞాపకాల్ని తోడటానికి గుప్పెడంత గుండెబావిలోకి పాతాళగరిగె వేస్తారు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు అది సింధువును ఇముడ్చుకున్న బిందువని వారికి తెలుసు.

ఎంత ఆడితే అంత/ ఇంటిల్లి పాదికి తమాషా/ శిలువ మాత్రం నీ పైనే హమేషా/
అంటూ
గాలిపటం ఎంత ఎత్తులో ఎగిరినప్పటికీ, దానికి ఆధారమైన దారం మరొకరి చేతిలో ఉన్నట్లుగానే, కుటుంబ భారాన్నంతా మోసే మనిషి బంధాలకు బానిసైన తీరును ‘పతంగి బతుకు ‘ అంటూ తన చిత్రాన్ని తానే గీసుకుంటారు.

ఎదలో గుచ్చిన ముల్లు వేయి క్యూసెక్కుల ప్రవాహమై స్రవిస్తూనే ఉంటుందని మాటను తూటాగా ప్రయోగించే మనుషులపై ఘాటుగా స్పందిస్తారు.

మువ్వల పట్టీల్ని సందుకలో పెట్టి తాళం వేసినా, గెరిల్లా వీరుల్ని అల్మారాలో బంధించినా అది వారికే చెల్లు.

గుండె ఆగిన రోజు గడప లోపల ఎంత తొందరో /
అంటూ మనిషి జీవితం ప్రకృతితో మమేకమైన తీరును స్పష్టంగా వివరిస్తారు.

కీమోథెరపీ కొలిమి/ దేహమి ప్పుడు ఆకులు రాలుతున్న వృక్షం/ నన్ను నేరుగా చూసే ధైర్యం చాలడం లేదు/

క్యాన్సర్ చికిత్సలో భాగమైన కీమోథెరపీతో మనిషి శరీరంలో కనిపించే మార్పులను హృద్యంగా వర్ణించారు.

కట్టప్ప వచ్చి కత్తితో పొడిచినా బాగుండు/ ఈ పాటకి శుభం కార్డు పడేది/
అంటూ క్యాన్సర్ వ్యాధితో విలవిల్లాడే రోగి దైన్యాన్ని తెలుపుతూనే,
లోకమంతా నన్ను మొదటిసారి పొగిడేది/

మనిషి బ్రతికున్నంత వరకు విలువను గుర్తించని సమాజం(కొంతమంది) ప్రాణాలు గాల్లో కలిశాకగానీ అనుకూలతలను ఏకరువు పెట్టదంటూ వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తారు.

మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలక బోసుకునే మనస్తత్వాలకు(ఇంకాస్త) చురక లంటిస్తారు.

కళ్ళెదుట ఎన్ని వసతులున్నా, మరెన్ని వనరులున్నా వాటన్నిటినీ సద్వినియోగ పరుచుకొని తన్ను తాను నిరూపించు కోవడంలోనే విజయరహస్యం (ఏదో) దాగుంటుందని చక్కని సందేశాన్నందించారు.

సామాజిక మాధ్యమాల సాలెగూటిలో చిక్కి విలవిల్లాడే మనుషులను తప్పులో తలో చెయ్యేసి కర్మ పాట పాడే కనికట్టు లోకమంటూ నిరసిస్తూనే, నిలువునా ముంచే నీలిచిత్రాల బారి నుండి ఆడపిల్లను అర్జెంటుగా దాచి పెట్టండంటూ హెచ్చరిస్తున్నారు.

ఎదిగిన తొవ్వెనక, ఎగరేసిన జెండా కింద ఊతమై, ఊపిరై నిలిచిన వారెందరో ఉంటారనీ, వారందించిన స్ఫూర్తిని ఏ స్థితిలోనూ మరవకూడదనీ హితవును బోధించారు.

తెలుగు ద(ధ)నాన్ని హరించి వేస్తున్న ఆధునికతకు వగచి మల్లెతీగను మన్నించమని వేడుకుంటారు.

నాగరిక మోజులో వాడిపోయే పచ్చందాలను కరోనా అద్దంలో కళ్ళకు కడుతూ, పల్లెతల్లి ఒడిలోని లాలనను జ్ఞప్తికి తెస్తారు.

ఊరి తొవ్వలో వాయిలి చెట్ల వయోలిన్ రాగాలు వింటూ మూలికల్లో ముక్కోటి దేవతలను కొలుస్తారు.

టెన్షన్ చొరబడని కోటగోడల్లో వారికి వారే రాజై,మంత్రై కలం,కాగితం పట్టుకుని మరో కవితా సంపుటికి వ్యూహరచన చేయాలని అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ…..

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చిత్రమైన చైత్రమాసం..

by Damaraju Vishalakshi March 19, 2026
written by Damaraju Vishalakshi

చైత్రమాసంలో వసంత ఋతువు వస్తుంది. మోడులను చిగురింప చేసి మనోహరంగా ప్రకృతిని మార్చి వేస్తుంది.
ఈ చిత్రాలు చేసే చైత్రమాసం 60 సంవత్సరాల మన కాలచక్రంలో మొదటిది. అందుకే పెద్దలు 60 సంవత్సరాల కాలాన్ని ఒక మహా విపంచిగా భావన చేశారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తంత్రి పలుకుతుందట.

మన సంప్రదాయంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంది.. సంవత్సరాన్ని ఆరుఋతువులుగాను
12 మాసాలుగాను ,రెండు అయినాలుగాను ,విభజించారు మన పూర్వులు.రెండేసి మాసాలకు ఒక ఋతువు చొప్పున ఆరు ఋతువుల్లో 12 మాసాలు అమరిపోతాయి.. చెట్లన్నీ పూలతో, సరస్సులన్నీ పద్మాలతో , స్త్రీ పురుషులు కాముక భావంతో అలరారుతున్నారని వర్ణిస్తాడు కాళిదాసు…
చైత్ర శుద్ధ పాడ్యమని ఉగాదిగా యుగాది నుండి ఆరాధిస్తూ వస్తున్నాం.. పూర్వం మన పెద్దలు చెప్పిన మాట ప్రకారం పుష్యమాసం మంచు కురిసే సమయంలో హేమంత ఋతువులో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండేటప్పుడు పోషణ శక్తి కలిగి ఉంటాడు కాబట్టి పుష్య పున్నమినాటి రాత్రి సిద్ధాంతులు తెల్లని నూతన వస్త్రాన్ని గాని దూదిని గాని మంచులో ఉంచి ఆ మరునాడు దానిని పిండి ఆ ప్రక్రియలో వచ్చే నీటి చుక్కల్ని బట్టి పంచాంగ రచన చేసే వారినీ, ఎన్ని చుక్కలు నీరు పడితే అన్ని కుంచాల వర్షం కురుస్తుందని అంచనా వేసే వారనీ,
తిథి వార నక్షత్ర కరణ యోగాలను గణించి, చైత్ర శుద్ధ పాడ్యమినాడు పంచాంగాన్ని చెప్పే వారని ప్రతీతి. ఇదే ఆచారంగా ఇప్పటికీ తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజైన ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేస్తారు..
తీపి, కారం , పులుపు , ఉప్పు , చేదు , వగరు కలిపిన ఆరు రుచుల పచ్చడిని తిని పగలు, రాత్రి , చీకటి , వెలుతురు , సుఖం , దుఃఖం అనే మానసిక వికారాలను అధిగమించడానికి నాందిగా ఉగాదిని జరుపుకుంటారు.
తిథి, వార , కరణ , నక్షత్ర , యోగ కారణాలు రోగాలను తొలగించి సమస్త శుభాలను కలుగచేయడం ఉగాది నుండే ప్రారంభం అవుతుందని గొప్ప విశ్వాసం. ఈ ఉగాది వసంత ఋతువులో చైత్రమాసంలో మొదటి రోజున వచ్చి భవిష్యత్తు ఆశలను చిగురింప చేస్తుంది….
కొన్ని ప్రాంతాలలో ఉగాదినాడు ఏరువాక ముహూర్తం కూడా పెట్టుకుని ఆరోజే నూతనమైన కార్యక్రమాలు అన్నిటికీ శ్రీకారం చుడతారు.
వసంతం ప్రకృతికాంతకు సీమంతం.. వసంతాన్ని మధుమాసం అని , మాధవ మాసమని కూడా అంటూ ఉంటారు. మాధవుడంటే విష్ణువు మాధవునికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి దీన్ని మధుమాసం అంటారంటారు.
మనసును చలింప చేసే మాసం వసంత ఋతువుగల చైత్రమాసం కాబట్టి దీన్ని మన్మధ మాసం అని కూడా అంటారు. వసంతంలో చెట్లన్నీ చిగుర్లు వేస్తాయి. ఎర్రగా పూచే మోదుగు పూలు , మల్లెలు , మొల్లలు , జాజులు, విరజాజులు , నందివర్ధనాలు , గరుడ వర్ధనాలు కనులవిందు చేస్తాయి. ముఖ్యంగా పూలు పరిమళించి, మహిళల
మనసులను రంజింపజేస్తాయి.. రాజుల కాలంలో ఈ వసంత రుతువులో అద్భుతమైన కార్యక్రమాలు , సాంస్కృతిక కార్యక్రమాలు , వేడుకలు నిర్వహించేవారు.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తీర్థాలు, పరసలు, అమ్మవారి పండగలు ఉగాది నుండే ప్రారంభమవుతాయి.. తెలుగు ప్రాంతంలో కూడా వసంత ఉత్సవాలు జరుపుకొనే సంప్రదాయమున్నది. “ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకుని వచ్చింది” అంటారు మన శ్రీశ్రీ గారు.
ఈ ఋతువులో ప్రకృతి సోయగాలు చూడడానికి రెండు కళ్ళుచాలవు… భగవంతుని మాయాజాలమే..
ప్రతి ఋతువు అందాలు చిందించినా, వసంత సోయగాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ ఋతువును ఋతువుల రాణి అన్నారు. ఈ నక్షత్రం సమయం లో అత్యంత ఆహ్లాదకరమైన వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజు,
దైవం మానస రూపేణా అన్న విధంగా,,మానవ ధర్మాలను విడమర్చి చెప్పడానికి ఆచరించి చూపిన శ్రీరామచంద్రుడు ఇనవంశంలో జన్మించాడు..తల్లిదండ్రులను దైవాలుగా భావించడానికి అన్నదమ్ములను ఆదరించడానికి, సేవకులను సంతోష పరచడానికి, ప్రజలను కన్న బిడ్డల వలె పాలించడానికి,, ముఖ్యంగా ఆలుమగల అనురాగానికి నిలువెత్తు నిదర్శనమైన సీతారాముల కళ్యాణం రామచంద్రుడు జన్మించిన నక్షత్రం నాడే .. అంటే, శ్రీరామనవమినాడే ఉత్సవంగా జరుగు తుంది ..రామ కళ్యాణం లోక కళ్యాణం అని భారతదేశం అంతటా బ్రహ్మాండంగా జరుపుకుంటారు.. ముఖ్యంగా మనతెలుగువారు సంప్రదాయబద్ధంగా తాటాకు పందిళ్లు వేసి, సీతారాములచే తలంబ్రాలు పోయించి, అయోధ్య రామయ్య అన్నయ్య మాకు … వాలు కనుల సీత వదినమ్మ మాకు … అంటూ మురిసిపోతూ ఆ కళ్యాణ ఘట్టాన్ని వీక్షిస్తారు.. రామ కళ్యాణపు అక్షితలను శిరస్సున ధరించి తమ జీవన మార్గానికి సోపానాలు వేసుకుంటారు……
ఉత్తరాది వారికి అత్యంత ప్రియమైన హోలీ పండుగ ఈ మాసంలోనే వస్తుంది . ఆటలతో పాటలతో సందడిగా, ఐకమత్యంగా రంగులు జల్లుకుంటూ ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటారు..

చిత్రాల చైత్రం శోభిల్లుతూ మదమాసం కావున మన్మధ భావాలు రేకెత్తిస్తూ మనోహరంగా సాగిపోతుంది.
సంవత్సరాది తో పాటుకళ్యాణాలతో కమనీయంగాసాగిపోయే మాసమిది.
నాటి రాజులలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు వసంతోత్సవాలు నిర్వహించి కవి పండితులను సత్కరించే వారని ప్రసిద్ధి . అదేవిధంగా కొండవీటి రాజులు కూడా వసంతోత్సవాలను కడువైభవంగా జరిపే వారట కర్పూర వసంతరాయులని అందుకే అతనికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు వచ్చింది .
రామాయణంలో, మహాభారతంలో, ఈ ఋతువర్ణనలు అద్భుతంగా జరిగాయి.. చైత్రమాసంలో జైత్రయాత్రలు చేసినట్లు ప్రబంధాల్లో వర్ణింపబడి ఉంది… వన విహారములు, ,జలవిహారాలు ఈ మాసంలో జోరుగా సాగుతాయి..
ఋతుసంహారమే ప్రధాన కావ్యం గా రచించిన, కవి కుల గురువు కాళిదాసు,వసంత ఋతువు గురించి అద్భుతంగా వర్ణించారు..కవిత్రయంలో ఎర్రన, భాగవతం లో పోతన, మనోహరంగా ఋతువులను వర్ణిస్తే …. ప్రబంధ కవులలో
అల్లసాని పెద్దన, చక్కగా వర్ణించారు.. వసంత ఋతువు రాగానే దేవకాంతలు హిందోళ రాగం లో గానం చేశారట . ఉగాది ని చైత్ర శుద్ధ పాడ్యమినాడుజరుపుకొని, గున్న మామిడి గుబురులలోంచి కూస్తూ హుకు హు రాగాల కోయిలమ్మను పిలుస్తూ, పంచాంగ శ్రవణంలో పరవశించిపోతూ,,
ఆరు రుచుల పచ్చడిని ఆస్వాదిస్తూ వసంత ఋతువు కు స్వాగతం పలుకుతాం..

భారతీయ సంస్కృతిలో కాలాన్ని అత్యంత పవిత్రమైన తత్వంగా భావించారు . కాలమే సృష్టికి ఆధారం . కాలమే జీవన చక్రాన్ని నడిపించేది . అందుకే కాలాన్ని మన పూర్వీకులు పండగగా జరుపుకునే సంప్రదాయాన్ని అర్పరిచారు . తెలుగు ప్రజలు ఆ సంవత్సర ఆరంభ దినాన్ని ఉగాది అనే పేరుతో మహోత్సవంగా జరుపుకుంటారు ఉగాది అనే శబ్దం సంస్కృత పదం యుగాది నుండి వచ్చింది. ఉగాది అనే పదం యుగానికి .. అంటే, సంవత్సరానికి మొదటి రోజు అనంటారు. ఉగాది అంటే యుగానికి ఆది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం అని అర్థం . భారతీయ కాల గణన ప్రకారం సంవత్సరాన్ని 12 మాసాలుగా విభజించారు . అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, , శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణ మాసం అనే పేర్లతో పిలుస్తాం. ఈ 12 మాసాలను వాటికి గల ప్రకృతి లక్షణాల ప్రకారం మారుతున్న విధానానికి సరిపడా విభజించారు . వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలు , గ్రీష్మఋతువు జ్యేష్ట ఆషాడ మాసాలు , వర్షఋతువు శ్రావణ భాద్ర పదమాసాలు, శరదృతువు ఆస్వాయుజ కార్తీక మాసాలు , హేమంత ఋతువు మార్గశిర పుష్య మాసాలు , శిశిర ఋతువు మాఘ ఫాల్గుణ మాసాలు. ఈ ఆరు ఋతువుల్లో వసంత ఋతువు ను అత్యంత సౌందర్యమయమైన ఋతువు గా వర్ణించారు . ప్రకృతి మళ్లీ పునర్జన్మ పొందినట్లుగా కనిపించే సమయంలో ముఖ్యమైన సమయం ఇదే . చెట్లన్నీ కొత్త చిగురులను అలంకరించుకొని, పూలు వికసించి, పక్షుల కిలకిల రావాలతో భూమి ఎంత అందంగా నిండిపోతుంది . అందుకే వసంతాన్ని ఋతురాజు అని కూడా పిలుస్తారు . ఈ వసంత ఋతువు ప్రారంభమయ్యే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు ప్రజలు ఉగాది పండుగ జరుపుకుంటారు . ఈరోజు ప్రకృతి నవచైతన్యంతో నవ నవీనంగా ప్రకాశిస్తూ మన జీవితాలలో కూడా కొత్త ఆశలను చిగురించేలా కనిపించి పరవశింప చేస్తుంది . అందుకే కొత్త ఆశలు ప్రారంభం కావాలని సంకల్పిస్తారు మనవాళ్ళు.

ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి , స్నానం చేసి, ఇల్లంతా శుభ్రం చేసి , మామిడాకుల తోరణాలతో అలంకరించి , ముంగిళ్ళలో రత్నాల ముగ్గులు తీర్చిదిద్ది, నూతన వస్త్రాలు ధరించి , ఉగాది పచ్చడిని తయారు చేసి , అందరూ సేవిస్తా రు. అందులోని ఆరు రుచులు తీపి పులుపు చేదు కారం ఉప్పు వగరు మన జీవితాలలో కలిగే ఆనందం కోపం ఆశ్చర్యం భయం అంటే అనుభవాలను సూచిస్తాయని భావిస్తారు . చాలావరకు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో కూడా అమ్మవార్లకు ఉత్సవాలు తీర్థాలు పండగలు పరసలు జరుగుతూనే ఉంటాయి.ఉగాదికి ముందు రోజు అమావాస్య కొత్తమవాస్య అని పిలుస్తారు అమావాస్యనాడు అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్సవాలు చేస్తారు.
ఈ రోజున మరొక ముఖ్యమైన పండగ అంటే ఈ పండగలో ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం.
ఈ పంచాంగం తయారు చేయడంలో కూడా ఆ కాల గణనను చేయడంలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తారని పెద్దల ఉవాచ . పుష్య మాసంలో సంక్రాంతికి పూజలు చేసి కాలపురుషునికి నమస్కరించి నిష్టాగరిష్ఠులైన పండితులు ఇంటిపై ఒక తెల్లని వస్త్రాన్ని సాయం సంధ్యా సమయంలో ఆరవేసి, ప్రాతఃకాలంలో అనుష్టానం అయిన తర్వాత ఆ వస్త్రాన్ని ఒక పాత్రలో పిండుతారని అలాగా ఆ నెల రోజులు పిండిన మంచు నుండి వచ్చిన బిందువులను లెక్కిస్తూ కాలగణన చేస్తారని చిన్నప్పుడు పెద్దలు చెప్పేవారు. ఆ విధంగా పంచాంగం లెక్కలు కడతారని నమ్మేవారు.
పంచాంగంలో ఆ సంవత్సరానికి సంబంధించిన గ్రహగతులు రుతువులు మార్పులు పండుగలు శుభకాలాలు మొదలైన విషయాలు వివరింప బడతాయి .
పంచాంగంలోని ఐదు ప్రధాన అంగాలు 1. తిథి 2. వారం 3. నక్షత్రం 4. యోగం 5 కరణం.ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఒకటి తిథి
చంద్రుడు సూర్యునితో సంబంధించి పొంది కోణాంతరాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడే కాలాన్ని తిథి అంటారు
ఒక నెలలో 30 తిథులు ఉంటాయి
15 రోజులు ఒక పక్షం. మాసంలో రెండు పక్షాలు ఉంటాయి. 15 తిథులు ఒక పక్షంలో వస్తాయి.
అవి వరుసగా పాడ్యమి ,విదియ, తృతీయ ( తదియ) , చతుర్థి( చవితి) , పంచమి , షష్టి, సప్తమి , అష్టమి , నవమి , దశమి , ఏకాదశి, ద్వాదశి , త్రయోదశి, చతుర్దశి , పౌర్ణమి ఇవి శుక్లపక్ష తిథులు.
కృష్ణపక్షంలో పాడ్యమి నుండి చతుర్దశి వరకు తిథులు యధాతథంగా వచ్చి 15వ రోజు అమావాస్య వస్తుంది.
వారం వారం అంటే వారంలోని రోజుల వ్యవస్థ. భారతీయ సంప్రదాయం ప్రకారం ఏడు వారాలు ఉంటాయి. అవి వరుసగా ఆది , సోమ , మంగళ , బుధ , గురు , శుక్ర , శనివారాలు. ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు.
నక్షత్రం విషయాలు చెప్పుకుంటే, చంద్రుడు తన ప్రయాణంలోని 27 నక్షత్రాలను దాటి సాగుతాడు . చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో ఆ రోజు నక్షత్రంగా చెప్పబడుతుంది . ఉదాహరణకు అశ్వనీ , భరణి , కృతిక , రోహిణి , మృగశిర , ఆరుద్ర, పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ, పుబ్బ , ఉత్తర , హస్త , చిత్త, స్వాతి , విశాఖ , అనురాధ, జ్యేష్ట, మూల , పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం , ధనిష్ట, శతభిషం , పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర , రేవతి. చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కూడియున్నది ఆశ్వీజ మాసం అని భరణితో కూడియున్నది బాధపడమాసం అనీ, కృత్తికతో కూడియున్నది కార్తీక మాసం ఇలా చెప్పబడతాయి..

ఇక యోగము …. సూర్యుడు, చంద్రుడు కలిసి ఏర్పడే గణిత సంబంధం ఆధారంగా యోగాలు నిర్ణయింపబడతాయి . మొత్తం 27 యోగాలు ఉంటాయి .
ఉదాహరణకు నిష్టం బయోగం ప్రీతియోగం ఆయుష్మాన్యోగం సౌభాగ్య యోగం మొదలైనవి.
ఐదు కరణం- తిథి యొక్క అర్థ భాగాన్ని కరణం అంటారు . మొత్తం 11 కరణాలు ఉంటాయి . ఉదాహరణకు
బావ కరణం బాలవకరణం, కొలవకరణం, తైతిల కరణం, గరజ కరణం వణిజ కరణం మొదలైనవి..
పంచాంగంలో ఉండే ఇతర విషయాలు…
పంచాంగంలో ఈ ఐదు అందాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా ఉంటాయి.
ఒకటి సంవత్సర నామం మాసాలు పండగల తేదీలు , గ్రహణాలు , శుభముహూర్తాలు , రాహుకాలం , యమగండం పాటించ వలసిన పద్ధతులు , ఉపాసనలు దీక్షలకు సంబంధించిన ముహూర్తాలు, వ్రతాలు ఉపవాసాలు మున్నగున వన్నీ ఉంటాయి .

ఉగాది రోజున పంచాంగ శ్రవణం ప్రాశస్త్యం.
ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు . దీనిని పంచాంగ శ్రవణం అంటారు.
పంచాంగం వినడం వలన, ఆ సంవత్సరంలో వర్షపాతం ఎలా ఉంటుంది, సహజ ఉత్పాతాలు, దొంగ భయాలు,
ఆర్థిక పరిస్థితులు, పశువులు పక్షులు, పశుపక్షాదులు, వారి పాలకులు . పాలితులు, యుద్ధాలు, యోచనలు
దేశ ప్రజల స్థితిగతులు గ్రహగతులు వంటి విషయాలను సాంప్రదాయం ప్రకారం సవివరంగా తెలియజేస్తారు . అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం శుభప్రదం . ఇది మన సంప్రదాయం.
పేరుపేరునా వారు పుట్టిన జన్మ నక్షత్రం నామ నక్షత్రం బట్టి ఆ సంవత్సర ఫలితాలు వారికి ఎలా ఉంటాయో పంచాంగ శ్రవణంలో తెలియచేస్తారు.
పంచాంగ శ్రవణ ఫల శృతి శ్లోకం..
“తిథేశ్చ శ్రీమాప్నోతి వారాదాయుష్య వర్ధనం ,
నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం
కరణాత్ కార్యసిద్ధిస్తు పంచాంగ శ్రవణం శుభం”
భావం – పంచాంగంలోని 5 అందాలను వినుటం వలన …. తిథి వలన ఐశ్వర్యం లభిస్తుంది . వారం వలన ఆయుర్దాయం పెరుగుతుంది . నక్షత్రం వలన పాపాలు తొలగిపోతాయి . యోగం వలన రోగాలు తగ్గుతాయి . కరణం వలన కార్యసిద్ధి కలుగుతుంది . అందువలన పంచాంగ శ్రవణం శుభప్రదమని ఈ శ్లోకం తెలియజేస్తోంది.

నూతన సంవత్సర మంగళ శ్లోకం….

సర్వే జనాః సుఖినోభవంతు సర్వే సంతు నిరామయా:
సర్వేభద్రాణి పశ్యంతు మా కశ్చిత్ ద్దు:ఖ భాగ్భవేత్ “
ఈ సంవత్సరం “పరాభవ” నామ సంవత్సరమని పరితపించే వారికి ఒక మాట . పరా అంటే పరాశక్తి త్రిపుర సుందరీ దేవి, భవ అంటే భవుడు శివుడు, “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః” అని ప్రార్థించే ఆ పరమేశ్వరీ పరమేశ్వరులపేర్లను తనలో దాచుకున్న ఈ “పరాభవ నామ ” సంవత్సరం,మనలను పరాభవించాలనుకున్న శత్రువులను పరాభవానికి గురిచేసి ఆ పరాశక్తి పరమేశ్వరుల కృపతో జగత్ కళ్యాణ కారణమై అలరిస్తుందని ఆశిద్దాం .
మానవ జీవితమే ఆరు ఋతువుల సమ్మేళన అయినప్పుడు మధురమైన వసంత ఋతువు మానసికోలాసాన్ని కలిగిస్తుంది… సృష్టికి ఆరంభమైన ఈ ఈరోజు ఉగాది అంటూ ఉత్సాహంగా 60 వసంతాల కాలగమనంలో
అందంగా వచ్చే సుందర సంవత్సరంలో ఆదిమాసమైన చైత్రం అందాల మాసం.సుందర దరహాసం…
ఈ పరాభవ సంవత్సరం సమస్త సుఖాలను శుభాలను కలుగజేసి మానవతా భావంతో మనుషులందరూ వికసించేటట్లు చేయాలని ఆశిద్దాం..మన ఆశయం సిద్ధించాలని ఆశలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం..

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శత్రువుతో ప్రయాణం ` జండర్ స్పహ

by Devendra March 19, 2026
written by Devendra

ఈ ఉగాది
నాకు విరోధి
షడ్రుచులు వడ్డించిన
భూమి తల్లిపై
అత్యాచారం
అంటూ స్తీల పక్షాన నిలబడి అక్షరగొంతుకను వినిపించిన కవి, విమర్శకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ గారు. శ్రీశ్రీ కోరినట్లుగా పీడితుల పక్షాన నిలబడి అభ్యుదయ దక్పథంతో పయనిస్తున్నారు. ‘శత్రువుతో ప్రయాణం’ కవితా సంపుటిలో ఉన్న 36 కవితలు సమాజాన్ని అనేక కోణాల్లో ప్రశ్నిస్తాయి. మార్పుతో కూడిన మానవత్వాన్ని కోరుకుంటాయి. రాజకీయ రంగులను ఎండగడుతాయి. స్తీవాద ఉద్యమాన్ని సమర్థిస్తాయి.
అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా వచ్చిందే స్తీవాదం. స్తీల ఉనికిని, స్తీల హక్కులను, స్తీల సమస్యలను స్తీలే వ్యక్తపరిచే సాహిత్యాన్ని స్తీవాద సాహిత్యం అంటున్నాం. తరతరాల వ్యవస్థ నిర్మాణంలో మాతస్వామ్యం రూపాంతరం చెంది పితస్వామ్యంగా స్థిరపడిపోయింది. ఆనాటి నాగరిక సమాజం నుండి నేటికి ఆ మూలాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించి, ఎదిరించే క్రమంలో వచ్చిందే స్తీవాదం. జెండర్ స్పహ, గహహింస, మాతత్వం, ఇంటి చాకిరి మొదలైన అంశాలెన్నో స్తీవాద ఉద్యమంలో వెలుగులోకి వచ్చిన అంశాలు. జండర్ సహజంగా ఏర్పడింది కాదు. కుటుంబం, సమాజం, మతం ‘స్తీలు’ అంటే ఇలా ఉండాలి, ‘పురుషులు’ అంటే ఇలా ఉండాలి అని జీవనవిధానంలో అలవాటు చేసే క్రమపద్ధతిని జండర్‌స్పహ అంటున్నాం. ఎంగెల్స్ ప్రకారం “పురుషత్వం, స్తీత్వం అనేవి శరీర ధర్మాల ప్రకారం ఏర్పడినవి కావు. ఒక సుదీర్ఘ చారిత్రక యుగంలోను పురుషత్వం, స్తీత్వం అనేవి వేరువేరుగా నిర్వచించబడ్డాయి. ఈ నిర్వచనం ఆయా యుగాలలోని ప్రధానఉత్పత్తి విధానమీద ఆధారపడి ఉంటుంది” అన్నారు. అంటే స్తీత్వ, పురుషత్వాల గురించి భావజాలాన్ని సమాజం తయారుచేసి అందిస్తోంది. ఆ భావజాలం తిరిగి సమాజక్రమాన్ని స్థిరపరచడంలో సహాయపడుతుంది. ఈ క్రమానంతటిని స్తీవాదం పరిశీలించింది. స్తీవాదం అంటే పురుషులను ద్వేషించడం కాదు. స్తీల సమస్యలను గుర్తించి స్తీలందరు ఏకమై పురుషులకు అర్థమయ్యేలా చెయ్యడం. ఈ భావజాలాన్ని అర్థంచేసుకున్న సహదయ కవి ఆచార్య మాడభూషి కుమార్‌గారు. ‘ఆమె’ కవితలో స్తీల సమస్యలను కళ్ళకు కట్టినట్లు లోతైన భావుకతతో అక్షరీకరించారు.
“చిన్నప్పటినుండి అంతే
చిన్నచూపుతోనే పెరిగింది” అంటారు
……….
ఇంకా
ఆమె నిఘంటువు నుంచి ఏ నిషేదం
అందుకే
ఎందుకు, ఏమిటి
లాంటి ప్రశ్నలు ఆమెనోట్లో రాకూడదని శాసనం”
బాల్యంనుండే ఆడపిల్ల జండర్‌వివక్షను ఎదుర్కొంటుంది. కన్నతల్లే కొడుకును ఒకరకంగా కూతురును మరొరకంగా పెంచుతుంది. లేకపోతే తల్లిపెంపకం బాగాలేదంటారు. దుస్తులు, ఆటలు, ఆహారం, ఇలా అన్నిట్లోను ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కుటుంబంలో ఆడపిల్ల ఇట్లా ఉండాలి అని తర్ఫీదునివ్వబడుతుంది. తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో పెరిగిన ఆడపిల్లకు పెళ్ళి అనే బంధం మరిన్ని బాధ్యతలను, పరిమితులను విధిస్తుంది. అందుకే కవి ఇలా అంటారు.
“అతగాడికి కావలసింది ఒక మరమనిషి
సంపాదించడానికి
వండిపెట్టడానికి
కోరికలు తీర్చడానికి
పెళ్ళిరోజున ఎ.టి.ఎం లాంటి
పెళ్ళాం దొరికిందని మరిసిపోతాడు”
స్తీకి పెళ్ళిజీవితం అనేది రూపాయి బిల్లకు ఉండే బొమ్మ, బొరుసు లాగా మారిపోయింది. మంచి భర్త దొరికితే పరవాలేదు కాని, ఆమెను అర్థంచేసుకోలేని కుటుంబంలోకి అడుగుపెట్టినప్ప్పుడు జీవితఖైదీగా మారిపోతుంది. అసలు కుటుంబమే స్తీని కంట్రోల్ చేసే బంధిఖానా అవుతుంది. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం అన్ని స్తీల బాధ్యతలే. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా వీటన్నింటిని బాలెన్స్ చేసుకోవాలి. తద్వార స్తీల శారీరక, మానసిక ఆరోగ్యాలమీద ఒత్తిడి పెరుగుతుంది. ఎదిగే క్రమంలో అనేక సవాళ్ళను స్తీ ఎదుర్కోవలసి వస్తుంది. ‘ఆమె’ కవితలోనే ఈ పంక్తులు చూడండి.
“ఆకాశమంత వ్యాపించి
అందీ అందని ఆ తేజోమూర్తిని చూసి
నిందలు వేసే వాళ్ళెందరో!
మబ్బుల నడుమనుంచి
అప్ప్పుడప్ప్పుడు మెరుస్తూ ఉంటేనే
ఇంత అసూయగా ఉంటే
పున్నమి వెన్నెల విరిస్తే
రెక్కలు ముక్కలు చేసుకొని
ఆకాశానికి ఎగురుతున్న ఆమె రెక్కల్ని
ముక్కలు చేయడానికి ఎందరో”
అన్న పంక్తులు బాధ్యతల దొందరలో, ఉరుకుల పరుగుల ‘ఆమె’ జీవితంలో పడగనీడలా నిందలు, ఆధిపత్యాలు, అకత్యాలు, వివక్షలు, చిన్నచూపులు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘర్షణల మధ్య స్తీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటు ముందుకు వెళ్ళే సాహసం చేస్తుంది. అయినప్పటికి స్తీలు తమను తాము నిరూపించుకుంటూ అన్నిరంగాలలో ముందుకు వెళ్ళే ప్రయత్నంచేస్తున్నారు. అయినప్పటికి అడగడుగున పరీక్షలపర్వాలను దాటక తప్పడంలేదు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లి కలలుకంటుంది. అన్నీ తానై భరిస్తుంది. అయినప్పటికి తండ్రి అంటే పిల్లలకు గౌరవం. తల్లి అంటే చిన్నచూపు. ‘ఆమె’ గురించి కవి మాటల్లో …
ఇంట్లో సెలవులేదు
పనిలో సెలవులేదు
జీవితమంతా పిల్లలకోసం పరుగెత్తి పరుగెత్తి
అలిసిపోయిన ఆమెకు
ఆసరా లేదు
………
ఆమె లేకుండా
మానవ చక్రం పరిభ్రమించదు
అందుకే ఆమెను
పరిమళించనివ్వండి
కవితా ముగింపులో స్తీ ఉన్నతిని ఆకాంక్షిస్తున్నారు కవి. ఈ విశ్వమానవ కాలభ్రమణంలో స్తీ, పురుషులిద్దరు అవసరమే. ఎవరికివారుగా బాధ్యత నిర్వహణలో పోటీపడాలి గాని ఆధిపత్యాలు, అహంకార పెత్తనాలు స్తీల అశాంతికి కారణమౌతున్నాయి. హింసకు దారితీస్తున్నాయి. స్తీల చుట్టు భయాన్ని గుర్తుచేస్తూ ‘భయం’ కవిత లో ఇలా అంటారు.
భయం
కట్నంలా రావచ్చు
పట్నంలో రావచ్చు
అత్యాచారంలా రావచ్చు
నిత్యాచారంలా ఉండవచ్చు
……………..
భయం
మగాడిలా ఉండవచ్చు
మగడి రూపంలో ఉండవచ్చు
మైరావుణుడి రూపంలో ఉండవచ్చు
రూపం ఏదైనా
భయం మాత్రం ఒక్కటే
అది భయమే
స్తీలకు ఉన్న భయాలు అన్ని ఇన్ని కావు. పురుషస్వామ్య ప్రపంచంలో ఎక్కడ పొంచి ఉంటుందో ఆ భయం. కవి పై కవితలో కట్నం వలన భయం అనడంలో మనం ఇప్పటికి వరకట్న వేదింపులకు బలైన స్తీలను మీడియా ముఖంగా చూస్తునే ఉన్నాం. స్తీలపై అత్యాచారం అన్నది ఈనాటికి రూపుమాపలేకపోయాం. ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు చేసిన దిశ లాంటి అమ్మాయిలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తవుతే కన్న తండ్రి కళ్ళు కామంతో కప్పబడినపుడు కూతురు పరిస్థితి అగమ్యగోచరం. ‘తండ్రి’ అన్న కవితలో
“కన్న బిడ్డనే కామించే తండ్రులు
తండోపతండాలుగా పత్రికల్లో మొలుస్తూనే
టీవీలో మెరుస్తునే ఉన్నారు
వాటిని చూసిన మొహంతో
కన్నబిడ్డను చూసే శక్తిలేక
ఆత్మహత్య చేసుకుంటున్న”
అంటారు. ఇక్కడ కవి ఈ సంఘటనకు కరుణరసభరిత కవితాక్షరాలను మనముందుంచారు. ఎవరో చేసిన పనికి తండ్రిగా కూతురు ముందు నిలబడలేని స్థితిని తండ్రులందరి పక్షాన నిలబడి బలమైన సందేశాన్ని ఇచ్చారు. ‘మగాడు’ కవిత జండర్ వివక్షను మరింత స్పష్టంగా చెప్తుంది.
“వాడు కావాలనుకొన్నప్ప్పుడు
నేను రావాలి
వాడు తేవాలన్నప్ప్పుడు
నేను తేవాలి
వాడు తిరగమన్నట్టు
నేను తిరగలిగా తిరగాలి”
స్తీ, పురుషులిద్దరు మనుషులే. ఇద్దరిలో ప్రవహించే రక్తం ఎర్రగానే ఉంటుంది. కాని, స్వేచ్ఛా పరిధిలోకి వచ్చేసరికి జండర్ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. పితస్వామ్య వ్యవస్థ పురుషుడిని ‘మగాడు’ గా చూడాలనుకుంటుంది. మగాడు అంటే ఎలా ఉండాలని సమాజం, కుటుంబం చెప్పిందో కవి ప్రతిసందర్భంలో మగాడి రంగును తేటతెల్లం చేస్తాడు. స్తీ ఎల్లప్పుడు పిల్లలకోసమో, పుట్టింటి వారి కోసమనో, పరువు మర్యాదల కోసమనో తను ఉండాలనుకున్నట్టుగా ఉండలేకపోతుంది. తన అస్తిత్వాన్ని ఉనికిని పరిస్థితులకు ఫణంగాపెట్టి అన్నిటికి సర్ధుబాటుతనపు సంకెళ్ళు వేసుకుంటుంది. అందుకే ‘కవి’ స్తీ, పురుషుల సహవాసాన్ని శత్రువుతో పోల్చడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
“నేను సహవాసం చేస్తున్నది
శత్రువుతో
నేను సహజీవనం చేస్తున్నది
శత్రువుతో
నేను పంచుకొంటున్నది
శత్రువుతో
పనిచేస్తున్నది
శత్రువుతో”
ఈ శత్రువులు మిత్రులు అయ్యేదెప్పుడు! జండర్‌వివక్ష తగ్గినప్పుడు ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకెళ్ళినప్పుడు అంటే స్తీవాదాన్ని పురుషుడు అర్థంచేసుకున్నప్ప్పుడే సమస్య పరిష్కారం దిశగా ముందుకు కదులుతుంది. ఆచార్యస్థానంలో ఉన్న మాడభూషి సంపత్‌గారు మహిళల ఆర్తిని, ఆవేదనను, వివక్షను అర్థంచేసుకున్న వ్యక్తిగా, కవిగా, ప్రగతిశీల మార్గదర్శకుడిగా స్తీల గొంతుకను ‘శత్రువుతో ప్రయాణం’ పేరుతో తన కవితాధారతో బలం చేకూర్చిన మానవతామూర్తి ఆచార్య సంపత్‌కుమార్‌గారు.

ªªª

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సంఘర్షణ

by Bhargavi Lahari March 18, 2026
written by Bhargavi Lahari

సిద్ధి ప్రాప్తికై
సిద్ధార్థుని
వన ప్రవేశం
గాఢాంధకారంలో మునిగిన
యశోధర వైవాహిక జీవనం

త్యాగ ఫలితం
బుద్ధుని జ్ఞానోదయం
యశోధర మనోఘాతం
సౌభాగ్యురాలి విరహం
రాజ మందిర వనవాసం

ఆతని వైరాగ్యం
ఆవిడ పాలిట శాపం
కాని ప్రపంచానికి
అదో ఆదర్శం

ఆ మహారాణి మనోవేదన
ఒకటే ఒక ప్రశ్న
పరిత్యజించినది పతి అయితే
తనకు ఎందుకీ సంఘర్షణ?

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఓడి గెలిచే కలల స్నేహం

by Mrudula March 18, 2026
written by Mrudula

చేదు జ్ఞాపకమైతే
మరచిపోయినట్టు
నిర్లక్ష్యం చేయగలను
నువ్వొక
మరుగున దాచలేని
పచ్చి నిజానివి
నా జీవిత లక్ష్యానివి

కల తీరని బాధ చూశాకే
నీ వెంట పరిగెత్తాను
నా అంతర్మధనం తెలుసుకున్నాను
నువ్వు గుర్తుపెట్టుకునేంత
గెలవాలనుకున్నాను !!

మరచిపోవద్దని అనుకున్నాను కనుకే……..
కలలను ప్రోది చేసుకున్నాను
కన్నీళ్లను పొదువు చేసుకున్నాను
నవ్వులను ఆవిరి చేసుకున్నాను
మనసు పొరలను గోడగ చేసుకున్నాను

నన్ను నీ గమనంలోకి
నువ్వే ఆహ్వానించావన్న నిజాన్ని
నీకు గుర్తు చేసేంత సాధించాలనుకున్నాను
నువ్వు మార్చే ప్రకృతి రంగులు లెక్క చేయక మరీ ప్రయత్నించాను

కానీ నువ్వు కాలమనే మాయాజాలానివి
పండు వెన్నెల్లో వేణు గానం వినిపించగలవు
నిశీధి రాత్రిలో జాలిరాగం పాడగలవు

అయినా………
ప్రయత్నమే
అసలు విజయమైతే
గెలుపు నాదిగా
తియ్యని రాగాన్నై
వేణు గానంలో ఓలలాడగలను
ప్రతి రాత్రినీ వసంతరాత్రిగా
మార్చుకోగలను
నీ ఒడిని సైతం ఊయలగా అనుభవించగలను !!

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us