మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

రామబ్రహ్మం గారు రెబ్బాప్రగడ…

by Achyutuni Rajasri November 24, 2025
written by Achyutuni Rajasri

ఆయన వృత్తి ప్రవృత్తి పూర్తిగా భిన్నం! ఒక యువ శాస్త్రవేత్త గా ఎదిగి దేశాలు పర్యటించిన ఆయన శ్రీ రామబ్రహ్మంగారు.చదివిన చదువుకి ఆయన సంగీత సాహిత్య అభిరుచికి ఏమాత్రం సంబంధం లేదు.కానీ ఆరెంటిలోనూ రాణించారు.
28.8.1960లోతూర్పుగోదావరిజిల్లాలోని శ్రీకృష్ణ పట్టణంలో ప్రభవించిన ఆయన ఆధ్యాత్మిక రంగంలో తన అంతిమ శ్వాస దాకా గడిపిన ధన్య జీవి.ఆంధ్రాయూనివర్శిటీలో B.E. ఖర్గపూర్ IIT లో M.Tech చదివిన ప్రతిభాశాలి. ఇస్రో లో సైంటిస్ట్ గా తొలిసారి జాబ్ లో చేరారు.IISC బెంగుళూర్ లో ఎలక్ట్రానిక్స్ లో PHD చేశారు.16 ఏళ్లు ఇస్రోలో ఆపై పలు ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత పదవులు అలంకరించారు.2019 లో ఇద్దరు పిల్లల బాధ్యత తీరాక ఆధ్యాత్మిక రంగంలోప్రవేశించటం పూర్వజన్మ అలరించాయి సుకృతం.2016 నుంచి తనదైన శైలిలో భక్తి పాటలు తెలుగు సంస్కృతంలో రాసి గాయనీ మణుల చేత పాడించారు అవి యూట్యూబ్ లో చాలా మందిని అలరించాయి

54వ ఏటనే అమ్మవారిని స్తుతిస్తూ ఆయన రాసిన భక్తిపాటలు జనాల్ని ఉర్రూతలూగించాయి.తూ.గో.జిల్లా వెదురుపాకలో విజయదుర్గాపీఠం గురువు గారి ఆశీస్సులు స్ఫూర్తితో ఆయన లో కవిత భక్తిధారలుగా ఎగిసి పాటలరూపంలో ప్రజాహృదయాల్లో చొచ్చుకుపోయింది. ఎలాంటి భేషజం గర్వం లేకుండ తరతమభేదం చూపకుండా తోచిన అడిగిన సాయంజేసిన దొడ్డ బుద్ధి ఆయనది.
భగవద్గీత సారాన్ని వంట బట్టించుకున్నారు.ఇలా ఇంటాబైట మంచిపేరు సంపాదించిన ఆయన కాలంచేసి 9నెలలైంది.కానీ ఆయన రాసిన భక్తిపాటలు అజరామరాలు.ఆయన బెంగుళూర్ లోనే స్థిరపడినా మాతృభాష ను సంగీతాన్ని ప్రేమించిన వ్యక్తిగా నిల్చిపోయారు

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

జ్ఞాన గుళిక -1

by Naresh Chary November 24, 2025
written by Naresh Chary

“పలకలనుంచి పలుకులవైపు”
కందుకూరి శ్రీరాములు గారి కవితా సంపుటి

మిత్రులకు నమస్కారం
ఈరోజు జ్ఞాన గుళిక శీర్షికన నేను పరిచయం చేస్తున్న మొదటి పుస్తకం ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు గారి కవితా సంపుటి పలకల నుంచి పలుకుల వైపు. చదివి ఆనందిస్తారని ఆశిస్తూ….

ఉత్తమమైన పలుకులు

“మొక్కై వంగనిది మానై వంగునా”అనేది పెద్దల మాట. అది మనిషికి కూడా వర్తిస్తుంది‌. ఒక మంచి సమాజం రూపొందాలంటే ముందుగా వ్యక్తికి మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. ఆ వ్యక్తిత్వ నిర్మాణం బాల్యదశనుండే ప్రారంభం కావాలి. బాల్యదశ నుంచి తల్లిదండ్రులు, గురువులు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతారు.ఆ తీర్చిదిద్దడంలో ఉపయోగపడేవి నీతి కథలు, కవితలు,పాటలు,పద్యాలు గేయాలు.వీటిని చిన్నప్పటినుండే పిల్లలకు అలవాటు చేస్తే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు.
ఎవరికి వారే యమునా తీరే అనేట్టుగా బ్రతుకుతున్న ఈ కాలంలో సాహిత్యకారులు మాత్రం ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అందులో కందుకూరి శ్రీరాములు గారి కృషి శ్లాఘనీయం. వారు 1974 (దివిటి)నుండి కవిత్వం ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి తెలంగాణలో ప్రముఖ కవిగా గుర్తింపు పొందారు. వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే కవిగా,సామాజిక శాస్త్రవేత్తగా మారడం ఎంతో మంది బాగుపడడానికి కారణమైంది.
లోగడ కందుకూరి శ్రీరాములు గారు ఎన్నో కవితా సంపుటాలను వెలువరించినా 2024 లో వెలువరించిన “పలకల నుంచి పలుకులవైపు”అనే కవితా సంపుటికి ప్రత్యేకత ఉంది. ఇందులోని కవితలన్నీ బాలలకు,కళాశాల విద్యార్థులకు సంబంధించినవే. ఇందులో 49 కవితలు ఉన్నాయి. ఇవి బాల్యాన్ని అద్భుతంగా చిత్రించిన కవితలు . ఎవరి జీవితం లోనైనా బాల్యం చాలా ముఖ్యమైంది.దానికి పేద,ధనిక బేధం ఏమీ ఉండదు. అందరికీ మంచివో, చెడ్డవో జ్ఞాపకాలు అనేకం ఉంటాయి. బాల్యం ఎలాంటిదో కవి ఈ విధంగా చెబుతాడు “కన్ను మీద కనురెప్ప పడ్డంత సున్నితం/మట్టిపెళ్ల మీద తొలకరి పడ్డంత /సునిశితం-సువాసనత్వం (చిగురు కల) నిజమే కదా!. బాల్యంలో ఎవరికైనా బడితో అవినాభావ సంబంధం ఉంటుంది. జ్ఞానాన్ని ఒంటబట్టించుకున్నవాడు గొప్పవాడిగా ఎదుగుతాడు, తల బరువు అనుకునేవాడు సమాజానికి భారంగా మారుతాడు. బడిలో ఎలాంటి వారు వస్తారు? ఎందుకొస్తారు? అసలు బడి అంటే ఏమిటో ఇలా చెబుతాడు కవి “ఒకడు అమాయకుడిలా వస్తాడు/ కొన్నిఊహలు పెంచి కొన్ని వ్యూహాలు చెప్పి /శస్త్రాస్త్ర విద్యలు నేర్పితే /వీరుడిలా తయారవుతాడు. ఒకడు బక్క చిక్కిన వాడు వస్తాడు/ వ్యాయామం మార్చి ఫాస్ట్ తో/ ఆరోగ్య సూత్రాలు చెప్పి బలవంతుడిని చేస్తే/ వస్తాదై కుస్తీకి దిగుతాడు. గుడ్డివానికి చూపు/ చెవిటివానికి వినికిడి/కుంటివానికి నడక/ తొంటి వానికి చేయి/ మూగవానికి మాట/గుండె లేని వాడికి శ్వాస అందించే కర్మాగారం/ఈ నారుమడి బడి(తుకం). పాఠశాలలో దెబ్బలు తింటే భవిష్యత్తులో లాఠీ దెబ్బలు తినే అవసరం రాదు అనేది ఇప్పుడు అంటున్న మాట.దాన్ని గుర్తుకు చేస్తూ “అక్షరాలు నేర్పటం ఎంత ప్రయత్నం/ జ్ఞానం పొందటం ఎంత పరీక్ష /ప్రతి పీరియడ్ నెలవంకల గోడ కుర్చీలే /నిండు పూర్ణిమ జ్ఞానం పొందడానికి/ ప్రతిరోజూ గుండు సున్నాల కోదండాలే/ నిలువెత్తు సంతకం ఆకాశమంత రాయటానికి-/ఎందుకు చదవలేదని అటు గోడ దెబ్బ ఇటు చెంప దెబ్బ /అమ్మ – గురువు(బరిగె) అప్పట్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి దాదాపు ఒకసారైనా ఇలాంటి అనుభవం ఎదురవుతుంది.
శిక్ష అనుభవిస్తున్నప్పుడు మనకు టీచర్ పై కోపం వచ్చినా ఇప్పుడు గుర్తొస్తే నవ్వొస్తుంది. ఏ గురువుకు కూడా విద్యార్థి శత్రువు కాదు.వారి భవిష్యత్తు బాగుండాలని, తనకంటే పై స్థాయికి ఎదగాలని కలగంటాడు. అప్పట్లో పెద్దబాలశిక్ష చదివితే మొత్తం చదువు వచ్చినట్టుగానే భావించేవారు. ఎందుకంటే అది ఒక ఎన్సైక్లోపిడియా. కాలక్రమేనా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. పెద్దబాలశిక్ష కనుమరుగైపోయింది కానీ అప్పట్లో పెద్దబాలశిక్ష పూర్తి చేశామంటే డిగ్రీ పూర్తి చేసినట్టు లెక్క.ఇప్పుడున్న ప్రతి మేధావి పెద్దబాలశిక్షతో అనుబంధం ఉన్నవాళ్లే‌. దాని పేరు మీదనే అద్భుతమైన కవితను అందించారు కవిగారు. అందులో “మనం మనిషిని మనిషిగా చేయడం మరిచాం/ శిల్పానికి గుండెనిచ్చి బొమ్మకు కన్నీళ్ళని ఇవ్వాలి/మాతృస్తన్యం తాగి పెరిగిన యువకుల్లారా/ పారతంత్ర్యం అనే మాట వద్దు/శాస్త్ర విజ్ఞానం లేని భాషా బట్టీయం/అమ్మా అని అర్థం తెలియని అవిద్య పాఠాలు/ బాధలు కన్నీళ్లు తెలియని గుడ్డులో దాగి ఉన్నాం/ ఇవాళ రేపు తెలియని ఇంగ్లీష్ వ్యామోహంలో పడ్డాం/అంటూ నేటి విద్యా విధానాన్ని ఎండగట్టాడు.ఇదే కవితలో “సామాజిక రుగ్మతలు అర్థమైతే తప్ప /వాడు డాక్టర్ అయినా లాభం లేదు/ శ్లోకం కంటే ముందు శోకం తెలుసుకోనీయండి” (పెద్దబాలశిక్ష) అంటూ చదువుకునే యువతకు దిశానిర్దేశం చేస్తాడు. నిజమే కదా ! బట్టీ విధానం ద్వారా ఏమొస్తుంది? ఏమీ రాదు. విషయం అర్థమైతే తప్ప తనెంచుకున్న రంగంలో నిపుణుడు కాలేడు. విద్య యొక్క విలువలు ఒంటబట్టించుకుంటే తప్ప దేశం పురోగతిని సాధించదు. విద్యార్థులు స్వేచ్ఛగా ఉన్నప్పుడే ఎక్కువగా నేర్చుకుంటారని సృజన శక్తి కూడా బయటకు వస్తుంది అని చెప్పే ఈ కవితా వాక్యాలు అందర్నీ ఆలోచింపజేసేలా ఉంటాయి”అందమైన చేపను/ తలకిందులుగా వేలాడదీసి /ప్రశ్నల జవాబుల పరీక్ష పెట్టకు/ నీళ్లలో వదులు/ వేయి వయ్యారాలు పోతుంది”(బోర్డు మీద బొండు మల్లెలు)
కందుకూరి శ్రీరాములు గారికి బోధన అంటే మక్కువ ఎక్కువ. త్రికరణశుద్ధిగా కర్తవ్య నిర్వహణ చేశాడు కాబట్టే మండల స్థాయి, జిల్లాస్థాయి,రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డులను అందుకోగలిగాడు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణమవుతుంది అనే మాటను బలంగా నమ్మాడు కాబట్టే అహర్నిశలు శ్రమించి తనవంతుగా దేశానికి ఉత్తమ పౌరులను అందించగలిగాడు. తను పని చేస్తున్న కాలంలో పాఠశాలలో ఏ చిన్న సమస్య వచ్చినా అది ఉపాధ్యాయునికి కావచ్చు లేదా విద్యార్థికి కావచ్చు దానిపైన కవితతో స్పందించాడు. విద్యార్థుల భవితకై ఎన్నో కవితలు రాశాడు. వాళ్లలో కవితా స్పృహను కలిగించాడు. ఆలోచన దృక్పథాన్ని మార్చగలిగాడు. ప్రతి విద్యార్థి ఏదో సామర్ధ్యాన్ని కలిగి ఉంటాడని నమ్మాడు. దాన్ని గురించి ఒక కవితలో ఇలా చెప్తాడు “అది మొగ్గే కావచ్చు/ స్పృశించు/ వేయి రెక్కలై విచ్చుకుంటుంది/ ఆ పాప మూగే కావచ్చు/కదిపి చూడు /కళ్లతో మాట్లాడుతుంది/ ఆ చేయికి అ ఆ లు చుట్టరావనకు సున్నాలు చుట్టిన చేయే సన్నాయి రాగం పలుకుతుంది/ బలపాలు కారిన ముక్కే/ ప్రభంజనాల్ని శ్వాసిస్తుంది/పూల గొట్టాలనూదినన నోరే/శబ్ద శంఖారావమవుతుంది గోడను ఆసరా పట్టుకొని లేస్తున్న కాళ్లే/ కదనరంగంలో తురంగాలు అవుతాయి/ అంటూ చెబుతూనే గురువుగారి కర్తవ్యం కూడా “వాళ్ళమ్మ ఒడిలో పడుకోబెట్టుకోవచ్చు/ నువ్వు జనం కత్తుల ఒరలో నిద్ర లేపు” (శిలను చెక్కితే) అంటూ గుర్తు చేశాడు. తను ఏం చేశాడో మరో కవితలో ఇలా అద్భుతంగా చెప్పాడు” అక్షరాన్ని ఆయుధం చేశాను/ చూపుకు పదును పెట్టి /గురి తప్పని కిరణమై/ చీకటి మండలాన్ని /కూకటివేళ్లతో పెగిలించింది (ఆకాశం అంచు).
కవిత్వం సానుభూతి లేదా సహానుభూతి నుండి వస్తుంది.పాఠశాల స్థాయిలో రకరకాల విద్యార్థులను చూసిన కందుకూరి శ్రీరాములు గారు ఎన్నో కవితలు రాశారు.అందులో చేతుల్లేని విద్యార్థిని చూసి రాసిన కవిత ఆనాటి దృశ్యాన్ని మనకు కళ్ళ ముందు చూపుతుంది “నిండిన హాస్య సభలో నవ్వుల జల్లులు కురిసినప్పుడు/అందరి కరతాళ ధ్వనుల మధ్య/ వాడి భుజాలకు వేలాడుతున్న/ కుక్క చెవుల చేతులు టపటపలాడినప్పుడు/అప్పటి వాడి సంతోషం మనకు దుఃఖంగా /అప్పటి వాడి ఆనందం మనకు అంతర్మధనంగా మారకపోతే/ అసలు మనం మనసున్న మనుషులమే కాదు”( శబ్ద శరీరం) ఎంతో ఆర్ద్ర హృదయం ఉంటే తప్ప ఇలాంటి కవిత రాదు. అలాగే ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి నడుము విరిగిన విద్యార్థిని చూసి రాసిన కవిత కూడా అప్పటి దృశ్యాన్ని మన కళ్ళ ముందుంచి గుండెని మెలిపెడుతుంది.” వాడు /ఇంజనీర్ కావలసిన వాడు/ విరిగిన ఎముకలని కొలుచుకుంటున్నాడు/ డాక్టర్ కావలసిన వాడు/ నాడీ సరి చూసుకుంటున్నాడు/ శాస్త్రజ్ఞుడు కావలసిన వాడు/ భూమి మీద అంబాడుతున్నాడు/ మేఘాలలోకి ఎగిరే రెక్కలు తెగిపోయి/ బురదలో కుమ్మరి పురుగైనాడు”(ప్రభాకరుడు )అంటూ విద్యార్థి స్థితిని ఎంతో ఆవేదనాభరితంగా కవితలో చిత్రించాడు.ఉపాధ్యాయ వృత్తి అంటేనే నిత్యం పుస్తకాలతో కుస్తీ. పుస్తకంపై కూడా రాసిన కవిత గొప్పగా అనిపిస్తుంది.”అక్షరాల్లో /పత్రహరితం నింపుకొని/ ఆరిపోయే దీపానికి /ఆక్సిజన్ వదులుతుంది(పూసే పుస్తకం) అంటూ పుస్తక స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే విద్యార్థుల మధ్య స్పర్ధ ఉన్నట్లయితే చదువులో ఎక్కువగా రాణిస్తారు.వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉత్సాహవంతమైన మాటలు చెప్తేనే వాళ్లు గమ్యం వైపు వడివడిగా అడుగులు వేస్తారు. ఆ ప్రయత్నమూ చేశారు కందుకూరి వారు. “నువ్వో మెట్టెక్కావనుకో /నీ పక్కనుండి వెళ్లి /వాడు రెండు మెట్లు ఎక్కుతున్నాడు/ నువ్వు అలాగే నుంచున్నావనుకో /వాడు ఆకాశాన్ని ఆక్రమిస్తాడు/ నువ్వు అడుగంటుతావు”( కాలజ్ఞానం )అంటూ విద్యార్థులను తట్టి లేపుతాడు కార్యోన్ముఖులను చేస్తాడు.
పిల్లలను మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా రూపుదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత బాధ్యత ప్రధానంగా ఉపాధ్యాయుల పైనే ఉంటుంది.విద్యార్థులు మట్టిముద్దలాంటివారు. వాళ్లను ఎలా అంటే అలా మలవవచ్చు. ఉపాధ్యాయులు పాఠశాలలో నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధతే విద్యార్థికి జీవితాంతం తోడుండి విజయం వైపు అడుగులేయిస్తాయి. కాబట్టి వారి అందమైన భవిష్యత్తు రూపకల్పనలో ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత కీలకమని చెప్పే ఈ కవిత సార్వకాలీనమైంది.” బువ్వ తినిపించటమూ/బుజ్జగించటమూ అది మీ ధర్మమైతే/ విల్లు వంచమనటం/ అల్లే తాడు బిగించి బాణాలు సంధించమనటం/ ఇది మా కర్తవ్యం/మీరు లాలి పాటలు జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు/ మేము శ్లోకాలు చెప్పి వాటికి అర్థాలు చెప్పి బుద్ధిని మేల్కొల్పుపుతాం/ మీరు బట్టలు కొని కుట్టించి తొడిగించి /మల్లెపూలను చేసి పంపుతారు/మేం ఆ మల్లెల్ని దారాల సూదుల్తో గుచ్చి/ దండలల్లి ఒక హోదాను కల్పిస్తాం/ కని పోషించడం మీకు తెలుసు/ కనిపించేట్లు అందలమెక్కించడం మాకు తెలుసు”అని చెప్తూనే “తీర్పు చెప్పే మా ఎర్రపెన్నుంది చూశారూ!/ సుప్రీంకోర్టు కన్నా గొప్పది/ తిరుగులేని తీర్పు చెపుతుంది”. (స్పాట్) అంటూ తలుచుకుంటే గురువు విద్యార్థిని సక్రమ మార్గంలో పెట్టడానికి ఏమైనా చేయగలడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు.
కందుకూరి శ్రీరాములు గారు రాసిన ఈ “పలకల నుంచి పలుకుల వైపు” కవితా సంపుటిలో మొత్తం విద్యార్థుల్లో చైతన్యపరిచే కవితలు,ఆలోచింపజేసే కవితలు, అనుసరించే కవితలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని కవితలు కంటతడి పెట్టిస్తాయి. కందుకూరి వారి శైలి, శిల్పం అలంకారికత ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. ఇవన్నీ ఉత్తమ మైన పలుకులు,పిల్లలకి, కాలేజీకి వెళ్లే యువకులకు ప్రోత్సహించే కవితలు ఇందులో ఉన్నాయి. ఇది అందరూ చదవదగ్గ పుస్తకం.

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

జ్ఞాన గుళిక: 2

by Naresh Chary November 24, 2025
written by Naresh Chary

ఏకధార (కందాళై రాఘవాచార్య గారి కవితా సంపుటి)
8790593638

ఎవరి కవితనైనా చదివిన తరువాత తన విలక్షణమైన స్పందనతో ఆకట్టుకునే కందాళై రాఘవాచార్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలురు.వీరు బండలింగాపురం( ఉమ్మడి కరీంనగర్ జిల్లా) వాస్తవ్యులు ,1969 నుంచి కవిత్వం రాస్తున్న సీనియర్ కవుల్లో ఒకరు. అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపుగా 4000లకు పైగా కవితలు రాశారు. నాకు సోమవారం కవి సమ్మేళనం ద్వారా పరిచయమైన కందాళై రాఘవాచార్య గారు తన విశిష్టమైన కవితా వస్తువులతో, కవిత్వంతో నన్ను ఆకర్షించారు. నేను అడగ్గానే తన తొలి కవిత సంపుటి “ఏకధార”ను నాకు 12-07-2021న పంపించారు. పంపిన రోజే దాన్ని పూర్తిగా చదివి అభిప్రాయం కూడా చెప్పాను.వారు చాలా సంతోషించారు కూడా. అనంతరం తనను మయూఖ‌ ఆన్లైన్ పత్రిక కోసం ఇంటర్వ్యూ కూడా చేశాను. అందులో వారు ఎన్నో కొత్త విషయాలను వెల్లడించారు.
ఇక ఈ కవితా సంపుటి ” ఏకధారలో “మొత్తం 100 కవితలున్నాయి. ఈ నూరు కవితలు / రేపటి నారు కవితలని కవి ఎంతో ఆశాభావంతో చెప్పడంవల్ల కవిత్వం ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావచ్చు. ఈ సంపుటిలో నందిని సిధారెడ్డి రెడ్డి సార్ గారి ముందు మాటలు,తన చిరకాల మిత్రుడైన వి.పి చందన్ రావు గారి స్పందన విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఏ కవికైనా తొలినాళ్ళలో తన చుట్టూ ఉన్న వాతావరణం,పరిస్థితులు కవితావస్తులవుతాయి అందులో చెరువు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బతుకమ్మ పండుగప్పుడు,ఈతలు నేర్చుకుంటున్నప్పుడు, చేపలు పడుతున్నప్పుడు చెరువు బాల్యానికి విశేషమైన జ్ఞాపకాలను ఇస్తుంది. అందుకే గ్రామీణ వాతావరణంలో పుట్టిపెరిగిన ప్రతి ఒక్కరికీ చెరువుతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. అందుకే ప్రతికవీ చెరువు మీద కవిత రాయకుండా ఉండలేడు. కందాళైగారు కరువు కాలం నాటి చెరువుల గురించి ఏమంటారంటే “భూమి పూజ కాదు/చెరువు పూజ చేయాలి/ ఇప్పుడు ఉన్నవన్నీ పేరున్న చెరువులే/ నీరున్న చెరువులు కావు/అని చెరువులు ఎండిపోతున్న వైనాన్ని కళ్ళకు కడతాడు. సానుభూతి,సహానుభూతి ఉంటే తప్ప కవిత్వం రాదు. కవికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్వచనాలు ఇచ్చారు.కందాళైగారు ” కవి/ దుఃఖానికి చిరునామాగా /అందరి నోటా నానుతున్నాడని” కవికి కొత్త భాష్యం చెప్పారు. (దుఃఖం ద్వీపకల్పం). ఈ ప్రపంచం మొత్తం దుఃఖమే ఉందని రాస్తూ దుఃఖం హృదయ మథనంగా/ నిలువెత్తు మనిషిని నీరు చేస్తుంది/ దుఃఖానికి జవాబులు ఏ గ్రంథంలో దొరుకుతాయి” (దుఃఖద్వీపకల్పం) అని ప్రశ్నిస్తూనే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడమే దుఃఖనివారణకు సరైన పరిష్కారమని పరోక్షంగా చెబుతాడు. సమాజంలోని సమస్యలను ఎత్తిచూపడం, అన్యాయాన్ని ప్రశ్నించడం కవి లక్షణం. మన సమాజంలో అస్పృశ్యత ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది.అస్పృశ్యత గురించి కవులు ఎన్నో రకాలుగా కవితాస్త్రాలను సంధించారు. కందాళైగారు కూడా అస్పృశ్యతను ప్రత్యక్షంగా చూసి కవితాస్త్రాన్ని సంధించారు.”ఊర్ల ఓట్లకాడ అందరం ఒకటంటారు/ రమ్మంటరు – రాకుంటే లేప్కపోయి ఓట్లేపిస్తరు/ దొరలను అరుసుకున్నట్లు అరుసుకుంటరు/రాస్కుని పూస్కొని తిరుగుతరు/ అప్పుడు గిట్ల ముట్టుడు లేదు-అంటుడు లేదు/ ఈడ చాగిలాస దగ్గర ముట్టుడచ్చింది”(చాగిలాస) అని వాస్తవ స్థితిని మన కళ్ళకు కడతాడు,ఆలోచనలో పడేస్తాడు.
మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అన్యాయాలు,అక్రమాలతో భరతమాత దుఃఖిస్తూ ఉన్నదని చెబుతాడు. అందుకే “దేశం నాలుగు దిక్కులూ కన్నీటికి వేదికే/ కొన్ని కోట్ల జనాల కన్నీళ్ళతోనే సముద్రం పురుడు పోసుకుంది”(కన్ను జాగ్రత్త- కన్నీరు జాగ్రత్త). నేడు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు భూమి కరువవుతోందని ఇప్పుడు “దున్నేవాడిది కాదు భూమి /కొన్న వాడిదే భూమి/ కబ్జాతంత్రం చేసినవాడిదే భూమి /ఇక పంట భూమిలోని నాగలికి పక్షవాతం వచ్చినట్టే అని వాస్తవాన్ని మనకు తెలియజేస్తూనే “భూమిపై ఎవడూ జెండా పాతలేడు/భూమే అందర్నీ పాతేస్తుంది” అనే నగ్న సత్యాన్ని చెబుతాడు(కొన్న వాడిదే భూమి). అంతేకాకుండా ఈ కవిత సంపుటిలో భూమిపైనే రాసిన మరిన్ని కవితలు మనల్ని ఎంతో ఆలోచనలో పడేస్తాయి, ఆర్ద్రతను కలిగిస్తాయి. “భూమి జపం” శీర్షికన రాసిన కవితలోని కొన్ని కవితా వాక్యాలు ఒకసారి పరికించండి “భూమి ఈరోజు ఒకడిది /రేపు మరొకటిది/ చేతులు మారిన భూమికి ఇద్దరూ రక్తం అంటిస్తారు/ కొందరు జెండాలు నాటితే/ కొందరు తూటాలు చల్లుతారు/ అమాయకులు భూమిపై ఒరిగిపోతారు/ అని చెబుతూనే వర్షం పడని కాలం భూమికి ఆకాల జ్వరం – కరువు క్యాన్సర్ అంటాడు. “పంట భూమి పట్నం వాడి చేతిలోకి కట్నంగా పోతుంది/ ఏమీ లేని వాడికి భూమి లేమి బుక్కలేమి”/ అంటూ సామాన్యుని పక్షాన నిలబడతాడు.
తెలంగాణ తొలి దశ పోరాటాన్ని మలిదశ పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన కవి కాబట్టి చాలా విషయాలను కవితల్లో చెప్పారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే కాకుండా తెలంగాణ భాష యాస సంస్కృతి నిలబెట్టుకోవడం కోసం కూడా తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది. దీనిపైన ఎందరో కవులు కవితలల్లారు. 2009 నుంచి 2014 వరకు మలిదశ పోరాటం అనంతరం మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందో అంటే అవి ఇలా చెప్తాడు “తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చినాక /తంగేడు పూలకు రాచరికం వచ్చింది” (పెరట్లో తంగేడు). తెలంగాణ సాంస్కృతిక కళారూపం బతుకమ్మ. దాంట్లో తంగేడు పువ్వుకు విశిష్టమైన స్థానం ఉంది. ఆంధ్ర పాలనలో బతుకమ్మకు అంతగా గుర్తింపు రాలేదు.తెలంగాణ వచ్చాకే బతుకమ్మ విశ్వసుందరైంది.
నిరాశ ఎంతటి మనిషిలోనైనా చైతన్య జ్యోతిని ఆర్పేస్తుంది. ముందుకెళ్లాలన్నా ఏదైనా సాధించాలన్నా ఆశాభావం అనేది చాలా ముఖ్యం.అందుకే కవి “అన్ని పంటల కన్నా/ఆశ పంట గొప్ప/ఆశ కోయవద్దు/ నిరాశ అసలు వద్దు/ నువ్వు బతితేనే /లోకమంతా బతుకు” (పొద్దుతిరగని పువ్వు) అంటూ ఉత్సాహం నింపే కవితా వాక్యాలు రాస్తాడు. వ్యక్తి బాగుపడాలన్నాదేశం బాగుపడాలన్నా,పాలకులు సరైన దిశలో పాలన కొనసాగించాలని చెబుతూ పాలకులు పదేపదే మాట తప్పడం వలన ప్రజలకు నమ్మకం పోతుందని మాట తప్పడం వాళ్ళకు సహజమైపోయిందని కవి వాపోతూ “వేదికలపై నినాదాలు, హామీలు అసంపూర్ణ వాక్యాలే” (అసంపూర్ణ వాక్యం) అంటూ పాలకులకు చురకలంటిస్తాడు”.ఉదయానికి అస్తమయానికి మధ్య ఎప్పుడూ ఒక సంపూర్ణ ప్రణాళిక దర్శనం కాదు /మళ్ళీ ఉదయం కాకుండానే అర్ధరాత్రి చంపబడుతుంది”అంటూ వారు ఏ విధంగా ప్రణాళికలను మధ్యలోనే వదిలేస్తారో ఎండగడతాడు. అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ .చూడాలే గానీ ప్రతి వస్తువులో కూడా కవికి కవిత్వం కనిపిస్తుంది.”మేడలు శుభ్రంగా ఉన్నాయి /మేడలోని చెత్తతో /నగరమంతా /చెత్త నగరం అయిపోయింది(చెత్త నగరం)అని చెత్త పై కవిత రాస్తూనే మనం చెత్తను నిర్లక్ష్యం చేసే తీరును కళ్ళ ముందుంచుతాడు. అలాగే” దిండు “పై కవిత రాస్తూ “ఈ దిండు/ఆమె సహస్ర శోకాలను దాచేస్తూ/ ఎన్ని కన్నీటి నదులను పీల్చిందో!/నాని నాని పిడుచగట్టుకపోయింది” నిజానికి ఆడవాళ్ళకి దిండే సాంత్వన చేకూర్చే మిత్రురాలిగా మారినట్టు అద్భుతమైన ఊహ చేశాడు.అదే కవిత చివరిలో ఇలా అంటాడు “ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ దుఃఖం ఎవరికీ తెలియదు/ఒక్క దిండుకు తప్ప”.
మన దేశంలో నక్సలిజం ఇంకా పూర్తిగా అంతం కాలేదు ఇప్పటికీ అక్కడక్కడ అడవుల్లో, కొండా కోనల్లో ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఎవరివైతేనేమి ప్రాణాలు ప్రాణాలే కదా! ఎవరు చనిపోయినా వాళ్ళ కుటుంబానికి వారు దూరమైనట్టే కదా!ఎవరికైనా కడుపుకోత ఉంటుంది కదా!”అడవిలో కోయిలలు కూయడం లేదు/ తుపాకులు కూస్తున్నాయి రక్తరుతువంటూ( కోయరాని కోయిల) ఆ కవితలోనే “అడవి నిండా పూల తీగలు కాదు /యమపాశాలు వేలాడుతున్నాయి”.అని అక్కడి పరిస్థితిని హృద్యంగా చూపెడతాడు. టెక్నాలజీ ఇంత పెరిగినా వరకట్న సమస్య ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. ఈ వరకట్న భూతానికి మహిళలు ఇంకా చిత్రహింసలకు గురౌతూనే ఉన్నారు. రకరకాల పద్ధతుల్లో స్త్రీ బలి అవుతునే ఉంది. “స్త్రీని వధించడానికి ఈ కట్న వ్యవస్థకు నూగారు చీర సైతం దుష్ట ఆయుధమే /నిరపరాధి చీర అపరాధిగా వేలాడుతోంది/ చీర తాడై ఆమె కట్టె అయిపోయింది/ ఇప్పుడు షోకేస్ లోని చీరలన్నీ నాకు తాళ్ళుగా కనిపిస్తున్నాయి” (చీరతాడు)అంటూ వాస్తవ స్థితిని మన ముందుంచి కంటతడి పెట్టిస్తాడు.
నేటి బాలలే రేపటి పౌరులు.పౌరులందరూ చదువుకొని ప్రయోజకులైతేనే కదా దేశం బాగుపడేది. నేటి కాలంలో చదువు నిర్బంధం చేసారు కానీ దానికి పూర్వకాలంలో ఎక్కువ మంది పిల్లలు హోటల్లలోనూ, దుకాణాలలోనూ ఎక్కడపడితే అక్కడ పనిచేస్తూ కనపడేవారు. వారిని చూసి కవి” బాల భాస్కరులు బతుకు కాలి బాల కార్మికులవుతున్నారు/చిచ్చరపిడుగులు చిచ్చుబుడ్డులై/ గుప్పున ఆరిపోతున్నారు”.( భాస్వరంలో బాల్యం) అంటూ వారి దీనస్థితికి చలించి పోతాడు.వర్ణనా నైపుణ్యం కలవాడు కవి అనేది పెద్దలు చెప్పిన మాట. అలాంటి వర్ణనా నైపుణ్యం పుష్కలంగా కలవారు కందాళైగారు “ఈ చలి ఏ మేడలోకి పోదు/అనాథలపైకి వృద్ధుల పైకి మాత్రం పోతుంది/ ఈ చలి రాత్రి/రేపటి ఉదయానికి చావు కబుర్లు అందిస్తుంది/ పాపం! సూర్యుడు వచ్చి అంత్యక్రియలను చూసి/పడమర అరేబియాలో సముద్ర స్నానం చేసి/ కిరణాలను పిండుకొని పోతాడు!!(చలిరాత్రి). ఎంత గొప్ప ఊహో కదా ఇది. ఇలాంటిదే మరో కవిత “ఒక్క సుఖ స్వప్నం కోసం ఎన్ని రాత్రులను మోసానో/ రెప్పలు ఉబ్బి ఉబ్బి సూర్యోదయాలైనాయి/ ఒక ఆనందభాష్పం కోసం/ ఎన్ని దుఃఖ జలపాతాల్లో తడిచానో/ వసంతం రాకముందే/ శిశిరం ఒంటినంతా మడత పెట్టింది/ఎడారిని పాదాలకు కట్టుకొని/ వీపుపై లోకాన్ని మోస్తున్నాను “(లోక బాధ).
అమ్మ మీద, నాన్న మీద,ఊరు మీద ,చెరువు మీద కవిత్వం వ్రాయకుండాఏ కవి జీవితం కూడా పూర్తికాదు. అందుకు కందాళై వారు కూడా మినహాయింపు ఏమీ కాదు. అమ్మ గురించి కవిత్వం రాస్తూ వారు అన్న” అమ్మ నాలో జీవనదిగా ప్రవహిస్తుంది” (అమ్మ నాలో జీవనది)అనే వాక్యం అమ్మ పట్ల తనకున్న ప్రేమను పట్టి చూపుతుంది. అలాగే నాన్న గురించి రాస్తూ”ఎవరెస్టు శిఖరంలా కనిపించే ప్రతి నాన్నలో /ధ్రువంగా దుఃఖ సముద్రాలు గడ్డకట్టి ఉంటాయి”(నాన్న ఏడ్చాడు)అనే వాక్యాల్లో నాన్న పైకి ఎంత గంభీరంగా ఉన్నా కూడా లోపల సముద్రమంత దుఃఖముంటుందనే విషయాన్ని స్పష్టపరిచాడు. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంటే గాని నాన్నకు దుఃఖం రాదు.
ఏ కవినైనా సంఘటనలు ఇట్టే కుదిపేస్తాయి , కవితా వస్తువులౌతాయి. లాతూర్ భూకంపం ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది. ఊరూవాడా అన్నింటినీ ఊడ్చిపెట్టుకుపోయింది. దానిపై కందాళైగారు ” పంట పండించినవాడి కడుపులోకి పోలేదు/పండించిన వాడు భూమి కడుపులోకి పోయాడు/ ఇవి ఆకలి చావులా! కావు- నేలతల్లి ఉన్మాద హత్యలు/కలలుకనే రెప్పలు తెరుచుకోలేదు/భూమి తెరుచుకుని కలలను మూసివేసింది/ రెప్ప కింద ఇప్పుడు కలలు సమాధి/ రేప్పపై ఇల్లు సమాధి/ శ్మశానం ప్రత్యేకంగా లేదు/ ఊరి చివర స్మశానం ఏడుస్తుంది” అంటూ భూకంపం నాటి హృదయవిదారక దృశ్యాలను మన కళ్ళముందు నిలుపుతాడు.
ఈ సంపుటిలో ఉన్న కవితలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి.ఎంతో ఆవేదనతో రాసినవి. అధ్యయనం అభ్యాసం, తన కవితా సూత్రాలుగా జీవనం కొనసాగిస్తున్న కందాళై గారు73 సంవత్సరాల వయస్సులోనూ ఇప్పటికీ యువకులతో పోటీపడుతున్నారంటే కవిత్వం పట్ల ఆయనకున్న ప్రేమ మరియు నిబద్ధతే కారణం. ఇవి అందరూ అలవర్చుకోదగిన సుగుణాలు. ఇది అందరూ చదవదగ్గ పుస్తకం.

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

నవ్వే రాణి

by ఒద్దిరాజు మురళీధరంరావు November 24, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగనగా ఒక రాణి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది . ఆమె ఎంత సేపు నవ్వేదంటే … గోడ పైనుండి పటాలు కింద పడేంత వరకు… ప్లేట్లు గూళ్ల నుండి కింద పడేంత వరకు నవ్వేది. చాలా చిన్న విషయం కూడా ఆమె నవ్వుకు ప్రేరణ అయ్యేది. ఆమె నవ్వు ఎంత గట్టిగా ఉండేదంటే…. ఆస్థానంలో ఉన్న వారందరూ, నౌకర్లూ, కింద అంతస్తులో ఉన్నవాళ్లు కూడా వాళ్ళ చెవులు మూసుకోవాల్సి వచ్చేది.
చెవులు మూసుకోవడానికి వాళ్లు ముందు వాళ్ళ వేళ్ళను వాడేవాళ్లు. కానీ, చివరకు చెవిలో దూదులు పెట్టుకొని పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చేది.
ఎవరికీ కూడా ఆ రాణి పేరు ఏంటో తెలియదు . ఎందుకంటే ఆమెను అందరూ “హర్ మెర్రీ మెజిస్టీ” అని పిలిచేవాళ్లు. అంటే, దొరసాని గా పిలిచేవాళ్లు. ఎప్పుడైతే ఛాన్స్లర్ రాజ్యం అప్పుల పాలు కాబోతున్నదని చెప్పాడో, ఆమెకు చెక్కిలిగిలి పెట్టినట్టై అతిగా నవ్వుతూ మెట్ల మీద నుండి జారిపడి కాలు విరగగొట్టుకుంది. భూకంపం వచ్చింది. బంగ్లా ధ్వంసం అయింది . అప్పుడు ఆమె పక్కటెముకలు నొప్పి పుట్టేంతవరకు నవ్వింది . పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసేందుకు వచ్చారు. కానీ ఆమె చేయి సైగతో వాళ్లను రానివ్వలేదు.
నవ్వు ఆరోగ్యదాయకం అంటూ ఆమె కండ్ల నీళ్లు ఆమె ముఖం పైకి కారేంతవరకు నవ్వేది . కానీ , నవ్వు జీవితంలో ఒక మంచి ఘటన . దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి.
ఆమె అభిప్రాయాలకు ప్రజలు ఆమెతో ఏకీభవించకపోవడం ఆమెకు ఇష్టం అయ్యేది కాదు. అందుకోసం ఆమె చాన్సులర్ నే చంపేసింది.ఇది ఎంత హాస్యము? ఈ హాస్యం ఆమెను నవ్వు ఆపు లేక ఆపుకోలేక పోయి నవ్వి నవ్వి మొస తీసుకోలేక చివరికి చనిపోయింది. చిట్ట చివరకు దర్బారులో ఉన్నవాళ్ళూ, దేశీయులు కొంత శాంతి నిశ్శబ్దాన్ని సంతోషంగా అనుభవించ గలిగారు. అతి సర్వత్ర వర్జయేత్ అని మనం పెద్దలు ఊరికే అన్నారా!!
Too much of everything is bad.
” అతి సర్వత్ర వర్జయేత్ “
*

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక బంగారు చేప

by ఒద్దిరాజు మురళీధరంరావు November 24, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

(గుడ్ నైట్ స్టోరీస్ నుండి – 2025 ఆగస్ట్ 18)

సముద్రంలో చేపలు పట్టే ఒక ముసలతని పేరు వాసిల్. ఎప్పటిలాగే అతడు సముద్రంలో ఒక మూలకు వలవేసాడు. వలలో ఏమైనా చేపలు పడినాయా చూద్దామని వెళ్లి చూశాడు. ఆ వలను బయటికి తీసి చూసేసరికి దాంట్లో ఒక బంగారు చేప కనిపించింది. దాన్ని బయటికి తీయబోయే వరకు
“నన్ను నీళ్ళల్లోనే వదిలిపెట్టు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను” అన్నది చేప.
అతను ఆశ్చర్యపోయి,
” నాకు ఏమీ కావాలో తెలియదు .‌నా భార్యను అడిగి చెప్తాను .” అని ఇంటికి వెళ్లి భార్యతో జరిగిన సంఘటనంతా చెప్పాడు. భార్య నాలుగు చివాట్లు పెట్టి, వెంటనే వెళ్లి తనకు మంచి దుస్తులు కావాలని అడుగు. నాకు కేవలం ఈ చిరిగిపోయిన పాత బ్లౌజ్ ఒకటే ఉంది ” అని అంటుంది . వాసిల్ వెళ్లి కొత్త బట్టలు తేగానే ఆమె తనకు బంగారు బండి కావాలని చెప్పి వెంటనే చేప వద్దకు పంపించింది భర్తను. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అటువంటి వాటిల్లో కూర్చోలేదు. ఆ ముసలి వాసిల్ వెంటనే వెళ్లి బంగారు బండి తెచ్చాడు. కానీ ఆ ముసలమ్మకు అది కూడా తృప్తి కాలేదు. ఇప్పుడు ఆమె కోరిక సముద్రపు ఒడ్డున ఒక మంచి బంగ్లా కావాలనీ, దాని చుట్టూ మంచి మంచి చెట్లు, తోటలు, గంపెడు నౌకర్లు కావాలని కోరుతుంది . అవన్నీ వస్తాయి . కానీ, అవి కూడా ఆమెను తృప్తి పరచలేదు. చివరికి ఆమెకు ఒక విచిత్రమైన కోరిక కలుగుతుంది . ఆమె ఆ బంగారు చేప వచ్చి తనకు సేవ చేయాలని తలుస్తుంది.
ఈ విషయం తెలియగానే ఆ చేపకు కోపం ముంచుకు వచ్చింది. వెంటనే ఇచ్చినవన్నీ తీసేసుకున్నది . అప్పుడు ఆ ముసలమ్మ తన గుడిసె ముందు చిరిగిన బట్టలతోనే వల అల్లుకుంటూ కూర్చున్నది.
తెలిసిందా ఇప్పుడు? ఒకవేళ నువ్వు అతి ఆశకు పోతే.. నీకు ఏమీ లేకుండా అవుతాయి.
” అతి ఆశ కొంపకు చేటు”*_

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

తెలివికల్ల తాబేలు

by ఒద్దిరాజు మురళీధరంరావు November 24, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒకరోజు ఒక కుందేలును తాబేలు దాటి ముందుకు పోయింది. తాబేలును దూషించడం మొదలుపెట్టింది. రోడ్డుపై చాలా జాగా ఉన్నప్పటికీ నువ్వు రోడ్డు మధ్యనే ఎందుకు నిలుచున్నావు?” అన్నది.
తాబేలు తల బయటికి తీసి క్షమాపణ కోరుదామని అనుకొని అన్నది. తను తన మిత్రునితో పందెంలో ఉన్నానని కానీ అతడు చాలా నెమ్మది కాబట్టి అతను నన్ను చేరే లోపల ఒక కూర్పు తీద్దామని అని అనుకున్నాను” అని .
అనగానే,
“ఎట్… అంతా అబద్ధం ! “అని కుందేలు తన వెనుక కాళ్ళ మీద నిలబడి అన్నది .
“ఒక్క మాట కూడా నేను నమ్మను నన్ను కూడా దాటేసి వెళ్తానని అంటావు తర్వాత” అని కూడా అన్నది.
దాని ముందు దారికి అడ్డంగా ఒక గీత గీసింది.” రెడీ…. స్టడీ ….గో ….” అన్నది. అని, అది కూడా పరుగెత్తింది.
తాబేలుకు తెలుసు తను గెలిచే అవకాశం లేదని. కానీ, దాని భుజాలపైన చురుకైన తల కలిగి ఉన్నది.
అది దారి ఏటవాలుగా ఉన్నదని గమనించంది. కాబట్టి ఒక గుండు రాయి కొరకు వెతికింది. దగ్గరలో ఉన్న ఆ రాయిని కుందేలు వెనక దొర్లేటట్టు నెట్టింది . ఆ రాయి కుందేలును దాటి ఎప్పుడైతే పోయిందో తాబేలు గట్టిగా అరిచింది, ” చూడు…. నేను నిన్ను దాటేశాను.” అని .ఆ రాయి జారిపోతున్నప్పుడు చాలా మట్టి అంటింది. దాన్ని చూసి తాబేలు తనను దాటిపోయిందని కుందేలు తన ఓటమిని అంగీకరించింది. అప్పుడు తాబేలు గుట్ట మీద నిలబడి నవ్వింది. తను ఎక్కడికి పోకుండానే పందెం గెలిచినట్టు భావించింది తాబేలు.

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

ఒక తిండి బోతు

by ఒద్దిరాజు మురళీధరంరావు November 24, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక ఊళ్లో ఒక బాబు జన్మించాడు. అతనికి ఆకలిగా ఉన్నప్పుడు నోరు ఎట్లా తెచ్చుకోవాలో తెలియకుండేది.
తన తల్లి చేతికి ఏది అందితే అది ప్రేమతో అందించేది. ఒక కప్పు పాలు, ఒక స్పాంజ్ ముక్క, ఆలుగడ్డ సూప్, ఓట్ల జావ, కోడి చారు ఇంకా ఎన్నో ఇటువంటి వస్తువులు పదార్థాలు ఇచ్చేది. నీకు ఏది కావాలో అది తీసుకో అన్నది తల్లి .
తనకు పేరు పెట్టకముందే అతని ముందర ఏది పెడితే అది తినేస్తున్నందుకు అతన్ని ‘తిండిబోతు’ అని పిలవడానికి అందరూ నిశ్చయించారు. కానీ , త్వరలోనే అతనికి తిండి పెట్టకముందే ఏది కనిపిస్తే అది తినడం మొదలుపెట్టాడు. అట్లా తింటున్నాడు కాబట్టి అతణ్ణి ‘అత్యాశపరుడ’ని పిలవడం మొదలుపెట్టారు. ఆ పిల్లవాడి జీర్ణశక్తి ఎంత ఎక్కువ అంటే మొత్తం రొట్టె ముక్కను ఓ రాస్ బెర్రీ ఫలాన్ని మింగినట్టు మింగేవాడు . ఇంకా ఎప్పుడైతే ఒక ముక్క కూడా ఇంట్లో లేనప్పుడు, అతను టేబుల్, చైర్లు వాటినే కాకుండా బెడ్ రూంలో బెడ్ వంటివీ మింగేసేవాడు. తర్వాత తోటలోకి పోయేవాడు. అక్కడ చెర్రీస్ ఇష్టపడి మొత్తం చెట్టుని ఇదో లెక్క అన్నట్టు తినేవాడు. గేటును వెదకకుండా ఫ్రెండ్స్ నే మింగేసి , గ్రామం లోకి చేరి దారిలో కనబడినవన్నీ తింటాడు .
గ్రామస్తులను భయకంపితులను చేశాడు . అతడు ఇంకా చంటి బాబు కాదు . అతను చాలా పెద్ద కడుపుతో ఒక పెద్ద ఆజానుబాహుడు. పక్క ఇంటి ద్వారం నుండి లారా అనే ఒక అమ్మాయి ఏమంటుందంటే….అతను అట్లా పోలేడు అన్నది. తను పాఠశాలకు పోవటానికి ఆలస్యం కాకుండా టైం కు లేచేందుకు గడియారాన్ని కి అలారం కు కీ ఇచ్చింది. అతను ఇక ముందు మనను కూడా తినేస్తాడు. అని ఆమె చెప్పింది వాస్తవమే కూడా! ఆలస్యం కాకుండానే ఆ తిండిబోతు లారా ఇంటిని మొత్తం మింగేసాడు
అదృష్టవశాత్తు మర్నాడు ఉదయాన్నే అలారం మోగింది. ఆ ధ్వనికి ఆ తిండిబోతుకు ఎంత షాక్ అయిందంటే…. తను నోరు తెరిచాడో లేదో ఇంటిని తిరిగి వాంతి చేసాడు. దాని తర్వాత అతడు తన ఎక్కువ ఆకలిని కోల్పోయాడు.‌ కొద్ది కాలానికి అతణ్ణి వాళ్లు ఇంకా తిండిబోతు అనేవాళ్ళు . కానీ చివరకు అతనికి ఆల్బర్ట్ అనే పేరు పెట్టారు. అతను కూడా అందరి వలెనే చిన్న బాలుడైనాడు.

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బాలల హక్కుల అవగాహన

by డా.కందేపి రాణీప్రసాద్ November 22, 2025
written by డా.కందేపి రాణీప్రసాద్

బాలలకు సైతం పెద్దవారికి మాదిరిగా హక్కులున్నాయని తెలుసా? హక్కులు, బాధ్యతలు అనేవి చిన్నా, పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కొన్నిటిని కల్పించింది. వాటిని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. బాలల రక్షణకు సంబంధించి కొన్ని చట్టాలు కుండా ఉన్నాయి. వారి హక్కుల్ని పరిరక్షించడానికి చట్టాలను ఏర్పాటు చేశారు. చట్టాలను అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవు. కానీ సాధారణ సమాజంలో బాలల చట్టల గురించి ఎవరికీ అవగాహన లేదు. తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ హక్కులు, చట్టాల గురించి అవగాహన కలగజేస్తే బాగుంటుంది.
మనం తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే అత్యంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాము. ఈనాడు ఏ ఉపాధ్యాయుడికీ పిల్లల సమస్యల గురించి పట్టదు. కనీసం పసివాడు ఎంత చదవగలడు ? ఎంత రాయగలడు? అన్న వివేచన కూడా ఉండదు. పిల్లవాడు అల్లరి చేయుకుoడా చూడటమే వారి పని. అుదుకే పిల్లలు కదలకుండా, మాట్లాడకుండా కాపలా కాస్తుంటారు. శృతిమించిన క్రమశిక్షణ పిల్లల్లోని సృజనాత్మకతను, సహజ సిద్ధతనూ కోల్పోయేలా చేస్తుంది. ఉత్సాహం, చలనం లొపించిన బాలలు ప్రాణంలేని బొమ్మలతో సమానం. పిల్లల్లోని సహజత్వానికి భంగం కలగకుండా పాఠాలు బోధించాలి సున్నితత్వాన్ని అమాయకత్వాన్ని కోల్పోయిన పిల్లల్ని బాలలు అనలేము. ఏ వయసు పిల్లలకు ఎంత హోంవర్కు అవసరమో అంతే ఇవ్వాలి. వారి ఆటపాటల సమయాన్ని హరించేసే హోంవర్కులు పిల్లల ప్రగతికి గొడ్డలి వేట్లు.
తల్లి దండ్రులు సైతం పిల్లల పెంపకాన్ని భారంగానే చూస్తున్నారు. తమ్మ చదువులు, ఉద్యోగాలు, కెరీర్ పైనే శ్రద్ధ పెడుతూ పిల్లల్ని అనవసర భారంగా భావిస్తున్నారు. లక్షల ఫీజులైనా కట్టేసి పెద్ద పెద్ద సూళ్ళలొ చేర్పించేసి చేతులు దులుపు కుంటున్నారు హాస్టళ్ళలో వారి అవస్థలు చెప్పనలవి గాదు. కొంత మంది గడుసు పిల్లలకు సమస్యలేం రాకపోవచ్చు. కొంత మంది సున్నిత మనస్కులుగా ఉంటారు. అటువంటి పిల్లలు తమ సమస్యలను అందరికీ చెప్పుకోలేరు ఇటువంటి పిల్లలు కాన్నిసార్లు తల్లి దండ్రుల వద్ద కూడా నోరు విప్పి చెప్పరు. పెద్ద క్లాసు పిల్లలు, రౌడీ పిల్లలు తమ హోంవర్కుల్నీ, మిగతా పనుల్నీ నెమ్మదస్తులమేత చేయిస్తుంటారు. ఇవి టీచర్ల దాకా వెళ్ళవు. ఒక వేళ వెళ్ళినా గడుసు పిల్లల్నే తెవివగల పిల్లలుగా టీచర్లు మెచ్చుకుంటుంటారు నిదానస్తులకు, నిజాయితీ పరులకు ఎక్కువ పేరు ప్రతిష్టలు రావు.
ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటారని తెలుసా? బాలల హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించటం కోసం ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబరు 20వ తేదీన జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1954వ సంవత్సరంలో డిశంబరు 14వ తేదిన ఒక తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. 1959 వ సంవత్సరం నవంబరు 20వ తేదీని ప్రపంచ బాలల హక్కుల దినోత్సవంగా నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. బాలల సంక్షేమం, బాలల హక్కులు కాపాడబడటం కోసం విద్యా సంస్థల అధ్వర్యంలో వేడుకగా నిర్వహిస్తారు. ఇంకా స్వచ్ఛంద సంస్థల నుంచి అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తారు.
బాలల సంరక్షణ దేశానికి చాలా ముఖ్యం బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత. సమాజంలో ప్రతి ఒక్కరు ఈ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి. విద్య అనేది ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. విద్య ప్రతి ఒక్కరికీ మౌలికస్థాయిలో ఉచితంగా లభించాలి. నిర్భంధం గానైనా బాలలందరికీ విద్యా హక్కు అమలు కావాలి అప్పుడే నవ భారతం లో కాబోయే నూతన పారలు దేశాన్ని రక్షించుకోగలగుతారు.
బాలలు అత్యధికంగా హింసకు గురి అవుతున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో బాలల గురించి సర్వేలు చేయబడ్డాలు. ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల బాలలు ఎక్కువగా హింసతో పాటు అత్యాచారాలు కూడా జరుగుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. భౌతిక మరియు లైంగిక, మానసిక దాడులకు పిల్లలు బలవుతున్నారు. బాల కార్మికుల సమస్య కొంతవరకూ తగ్గినప్పటికీ పూర్తిగా మాసిపోలేదు. బాల కార్మికులు ఇంతకు పూర్వం ఇటుక బట్టీలలో, కొండల తవ్వకాలలో, గ్రానైట్ క్వారీరులలో పనిచేసేవారు. ప్రమాద పరిస్థితుల్లో పనిజెసే బాలల్ని బాలకార్మికులు అనేవారు. ఇప్పుడు బాలకార్మిక వ్యవస్థ రూపం మార్చుకుని స్కూళ్ళలో చేరింది. బస్తాల బస్తాల పుస్తకాలు మోయటం, రాత్రనక పగలనక రాసినవే రాయటం, స్లిప్ టెస్ట్ లు , వీక్లీ టెస్ట్ లు, మంత్లీ టెస్ట్ లు అoటూ రకరకాల టెస్ట్ లతో పిల్లలను మనశ్శాంతికి దూరం చేయడం వంటివన్నీ నేటి స్కూళ్ళలో నిత్య కృత్యమై పోయాయి. పెద్ద పేరున్న స్కూళ్ళ వత్తిడి తట్టుకోలేక ఎంతో మంది బాలలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి తల్లి దండ్రులు నిర్లక్యధోరణి, పట్టించుకోకపోవడం కూడా కారణమవుతున్నాయి.
బాలల సంక్షేమం కొరకు పార్లమెంటు కొన్ని చట్టాలు చేసింది. జువైనల్ జస్టిస్ చట్టం, బాల కార్మికుల నిషేధ చట్టం, న్యానసేవల చట్టం, నిర్భంద ప్రాధమిక విద్య హక్కు, బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం, శిశు నిర్ధారణ పరిక్షల నిషేధ చట్టం, శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లై చట్టం వంటి ఎన్నో చట్టాలను చేసింది. ఆర్టికల్ 15 ద్వారా పిల్లల సంక్షేమానికి ప్రత్యేకమైన నిభందనలు రూపొందించవచ్చు సమానత్వ హక్కు ఆర్టికల్ 14 ద్వారా, వివక్షకు వ్యతిరేకంగా హక్కు ఆర్టికల్ 15 ద్వారా వ్యక్తిగత స్వేచ్చ మరియు న్యాయ ప్రక్రియ యొక్క హక్కు ఆర్టికల్ 21 ద్వరా అక్రమ రవాణా నుంచి రక్షించబడే హక్కు ఆర్టికల్ 23 ద్వారా బాలలకు హక్కులు ఏర్పరచ బడ్డాయి. ఈ విధంగా పిల్లలకు కూడా పెద్ద వారితో సమానంగా పన్నెండు బాలల హక్కులు ఇవ్వబడ్డాయి. పిల్లల హక్కుల పరిరక్షణకు తల్లిదండ్రులు లేదా సంరక్షకాలు బాధ్యత వహించాలి. నేడు ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాని ఆచరణలో సాధ్యం కావటం లేదు. బాలల హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో అంశాలు పొందుపరచబడినవి.

November 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు.

by Narendra Sandineni September 29, 2025
written by Narendra Sandineni

ఎర్రోజు వెంకటేశ్వర్లు బ్లాక్ బోర్డ్ కవిత కవిత్వం ఓ విశ్లేషణ
ప్రముఖ కవి,తెలుగు శాఖా అధ్యక్షులు, ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల, నగునూరు,ఎర్రోజు వెంకటేశ్వర్లు కలం నుండి జాలువారిన బ్లాక్ బోర్డ్ కవితా సంపుటిలోని బ్లాక్ బోర్డు కవిత పై విశ్లేషణా వ్యాసం.కవి వెంకటేశ్వర్లు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.కవి పాఠశాలలో బుడి బుడి నడకల పిల్లల అల్లరిని చూసినారు.పిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటలను ఆహ్లాదకరంగా విన్నారు.కల్లా కపటం ఎరుగని చిన్నారి పిల్లలకు బోధిస్తూ మాటలలో చెప్పలేని గొప్ప అనుభూతిని పొందారు. పిల్లల లోకంలో విహరించడం ఎవరికైనా సంతోషంగా ఉంటుంది.పిల్లలకు చదువు సంస్కారాన్ని అందించే గొప్ప పాఠశాల అనే ప్రపంచంలో పని చేశారు.బ్లాక్ బోర్డ్ పై విద్యార్థులకు ఎంతో ఆసక్తితో బోధించాడు.పిల్లలకు చదువు నేర్పే క్రమంలో తనలో కలిగిన స్పందనకు అక్షర రూపం ఇచ్చాడు.బ్లాక్ బోర్డు కవితలో విద్య యొక్క శక్తి, సృజనాత్మకత,జ్ఞానం అందించే వెలుగు సమాజం మార్పు చెందడానికి పాఠశాల ఎంత ముఖ్యమో తెలియజేసారు.బ్లాక్ బోర్డ్ విద్యార్థుల భవిష్యత్తుకు కాంతినిచ్చే దీప స్తంభంలా ఉంది అని కవి భావోద్వేగంతో ప్రకటించారు.కవి వెంకటేశ్వర్లు తన కవిత్వం ద్వారా విద్యా బోధనలో బ్లాక్ బోర్డు యొక్క పాత్రను సమాజానికి చాటిచెప్పారు.
“నల్ల రంగు శుభం కాదంటారు కొందరు/నల్ల మట్టిలో తెల్ల బంగారంలా/నల్లబల్ల మాత్రం మంచినే పంచుతుంది/అంటున్నారు.ఈ కవితా పంక్తులు నల్ల రంగు గురించి ఉన్న సామాన్య అభిప్రాయాలను విభిన్నంగా చూపుతున్నాయి‌.బ్లాక్ బోర్డు తరగతి గదిలో ఉపాధ్యాయులు రాసే నల్లబల్ల.ఇది విద్యా బోధనకు సాధనంలా నిలుస్తుంది. ఉపాధ్యాయుడు నల్లబల్ల ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తాడు.కొంత మంది నల్ల రంగును శుభం కాదని నమ్మడం గురించి చెప్పబడింది.మన సమాజంలో నల్ల రంగు గురించి కొన్ని లేనిపోని అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ సమాజంలో నల్ల రంగును దురదృష్టం, అశుభం అని భావించే వారు ఉన్నారు.శుభ కార్యాలు,పండుగలు వంటి సందర్భాల్లో నల్ల రంగును దూరం పెట్టే పద్ధతి ఉంది.కానీ,వాస్తవానికి నల్ల రంగు చెడ్డది కాదు. నల్ల మట్టి పోషక పదార్థాలతో నిండిన భూమి.మనం విత్తనాలు నాటిన నేల కూడా సాధారణంగా నల్లగా ఉంటుంది.నల్లరేగడి నేలలో విస్తారమైన పంటలు పండుతాయి. నల్ల మట్టిలో పండే పంటలు మనకు బంగారంలాంటివే.అందుకని నల్ల రంగు మన జీవనానికి ఎంతో ప్రధానం అని భావించవచ్చు.
నల్లబల్ల మాత్రం మంచినే పంచుతుంది. నల్లబల్లపై ఉపాధ్యాయులు రాసి విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తారు.నల్ల బల్ల విద్య,జ్ఞానం మరియు వికాసాన్ని అందిస్తుంది.కాబట్టి నల్ల బల్ల మనకు మంచిని నేర్పే సాధనం.నల్ల రంగును అశుభంగా భావించే వారు ఉన్నప్పటికీ నల్ల మట్టి, నల్లబల్ల మంచినే అందిస్తాయి.నల్ల మట్టిలో విలువైన పంటలు పండుతాయి.నల్లబల్ల జ్ఞానాన్ని పంచుతుంది.నల్ల రంగు పవిత్రత,ప్రయోజనం, విజ్ఞానం పంచే రంగు అనే మెరుగైన సందేశం ఇందులో ఉంది.నల్లబల్లపై వ్రాసిన తెల్లని అక్షరాలు విద్యార్థుల లేలేత మనస్సులలో వెలుగుని నింపుతాయి.ఇది అంధకారం మీద వెలుగుకి లభించిన విజయం అనే గొప్ప సందేశం. గురువు నల్లబల్లపై ద్వారా అందించే విద్యా బోధన వల్ల విద్యార్థుల జ్ఞానం పెరుగుతుంది.బ్లాక్ బోర్డు విద్యకు ద్వారం, జ్ఞానానికి వేదిక అని భావించాలి.నల్లబల్ల మనకు చెప్పే పాఠం ఏమిటి?ఒక వస్తువుకి రంగు, రూపం ముఖ్యం కాదు.దాని ఉపయోగమే ముఖ్యం. నల్ల రంగు శుభం కాదనే అజ్ఞానాన్ని వీడాలి.నల్ల రంగు కూడా వెలుగును పంచగలదు అనే జ్ఞానాన్ని పెంచుకోవాలి.నల్లబల్ల మనకు మంచినే పంచుతుంది అనే లోతైన భావాన్ని ఇస్తుంది.ఇది తరతరాలుగా సమాజంలో నల్ల రంగు పట్ల నెలకొన్న మూఢ నమ్మకాన్ని తుడిచి వేస్తుంది.నల్లరంగు జ్ఞానానికి ఆధారం.జ్ఞానమే జీవితానికి వెలుగుని ఇస్తుంది.

“సుద్ద ముక్కల జ్ఞానామృత బిందువుల్ని/ విద్యార్థుల మేధో క్షేత్రంలో/నీల మేఘమై నిరంతరం వర్షిస్తుంది/అంటున్నారు.సుద్ద ముక్కలు ఇక్కడ శుద్ధత,పవిత్రతను సూచిస్తాయి.జ్ఞానం అనేది అమృత బిందువులతో పోల్చి బడింది.శుద్ధమైన జ్ఞాన బిందువులు విద్యార్థుల మేధస్సు అనే బుద్ధి భూమిలో ఎప్పటికీ ఆగకుండా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి.జ్ఞానం వాన వలె ఎప్పటికీ కురుస్తూ విద్యార్థుల మేధస్సును అభివృద్ధి మార్గంలో పయనింపజేస్తుంది.జ్ఞానం ఒక పవిత్రమైన వానలా విద్యార్థుల బుద్ధి క్షేత్రంలో నిరంతరం కురుస్తూ వారికి అర్హతను,ఆలోచనా శక్తిని,విజ్ఞానాన్ని లభించేలా చేస్తుంది.గురువు విద్యా బోధనలో భాగంగా విద్యార్థుల మేధస్సులో జ్ఞానాన్ని కురిపించి విజ్ఞానాన్ని పెంచుతాడు.విద్యార్థులు క్షేత్రం లాంటి వారు.గురువు నీల మేఘం లాంటి వారు.జ్ఞానం అమృత బిందువుల వర్షం లాంటిది.దాని ఫలితంగా విద్యార్థి మేధస్సు సారవంతమై అభివృద్ధి చెందుతుంది. శశిగురువు జ్ఞాన ప్రదాతగా ఎంతో గొప్ప వాడు అనే భావం వ్యక్తం అవుతుంది. గురువు తన విద్యా బోధనతో విద్యార్థుల మేధస్సులో పవిత్రమైన జ్ఞానాన్ని నిరంతరం నింపుతూ వారిని మేధావులుగా తయారు చేస్తున్నాడు.
“క్లాస్ ఎంత క్లాస్ గా ఉన్నా/బ్లాక్ బోర్డు సరిగ్గా లేకుంటే/గురు శిష్యులను కలిపే వంతెన కూలినట్లే మరి/అంటున్నారు. తరగతి గది ఎంతో శుభ్రంగా,ఆధునికంగా, అందంగా,అన్ని సౌకర్యాలతో ఉన్నా అది కేవలం బయటికి కనిపించే రూపం మాత్రమే. బోధనకు కావల్సిన వాతావరణం ఉన్నా అది మాత్రమే సరిపోదు.
తరగతి గదిలో గరిష్టంగా ఉపయోగపడే బ్లాక్ బోర్డు పని చేయక పోతే,దానిపై వ్రాతలు సరిగా కనిపించకపోతే,రాయడానికి బోర్డు సహకరించకపోతే బోధనలో లోపం వస్తుంది.బ్లాక్ బోర్డు అనేది గురువు తన ఆలోచనలను,ఙ్ఞానాన్ని శిష్యులకు అందించే మాధ్యమం.అది సరిగా లేకపోతే గురువు బోధనను పూర్తిగా వ్యక్తపరచ లేడు.బ్లాక్ బోర్డు ఉపాధ్యాయుడు బోధించే పాఠాలను విద్యార్థులకు చేరవేయడానికి ఉపకరించే ప్రధాన సాధనం.బ్లాక్ బోర్డు చెడి పోయి ఉంటే,దాని మీద రాసినది స్పష్టంగా కనిపించక పోతే అది వాడటానికి వీలు కాకుండా ఉంటే బోధనలో పరిపూర్ణత ఉండదు.
బ్లాక్ బోర్డు అనేది గురు శిష్యులను వంతెన లాంటిది.ఆ వంతెన బలహీనంగా ఉంటే బోధనలో అనుసంధానం తెగి పోతుంది.బ్లాక్ బోర్డు కేవలం ఒక పరికరం మాత్రమే కాదు.అది గురువు శిష్యుల మధ్య అనుసంధానం కలిగించేది.గురువు బోధించే అంశాలను బ్లాక్ బోర్డు మీద రాసి చూపిస్తే శిష్యుడు సులభంగా గ్రహిస్తాడు.బ్లాక్ బోర్డు ఒక వంతెన లాంటిది.ముఖ్య సాధనం అయిన బ్లాక్ బోర్డు లేకపోతే గురు శిష్యుల మధ్య ఉన్న అనుబంధం, జ్ఞాన ప్రసారం ఆగిపోతుంది.ఒక విద్యా వ్యవస్థలో బాహ్య సౌకర్యాల కంటె చదువును అందించడానికి మూలమైన బోధనా పరికరాల ప్రాధాన్యం ఎక్కువ. జ్ఞానాన్ని చేర వేయడంలో సహకరించే బ్లాక్ బోర్డు వంటి ముఖ్యమైన సాధనం లేకపోతే ఎంతో విలాసవంతమైన తరగతి గదులు ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.విద్యలో బోధనకు ఉపయోగపడే బ్లాక్ బోర్డు సాధనం అసలైన వంతెన.అదే గురు శిష్యుల సంబంధాన్ని బలపరుస్తుంది. బోధనలో పాఠశాలలోని ఇతర సౌకర్యాల కన్నా బ్లాక్ బోర్డు వంటి సాధనాలకు ప్రాధాన్యం ఎక్కువ అని ఈ కవితా పంక్తులు తెలియ జేస్తున్నాయి.
“తరగతి కనుగుడ్డుకు రెటీనా/దీర్ఘ చతురస్రాకారపు నీలి పలక/శిష్య సుమాల మాలకు సూత్రం/ విద్యార్థికి,గురువుకి మూడో కన్ను/అంటున్నారు.ఈ పంక్తులలో తరగతి గదిని ఒక కంటిగా ఊహించారు. కనుగుడ్డులో రెటీనా ఎలా కాంతిని స్వీకరించి దానిని బుద్ధికి పంపుతుందో,అలానే తరగతి గది విద్యార్థులు జ్ఞానాన్ని స్వీకరించే ప్రదేశం.రెటీనా మన దృష్టి చిత్రాన్ని స్పష్టంగా చూపించే ముఖ్యమైన భాగం.ఇక్కడ తరగతి గదిని విద్యార్థి దృష్టికి జ్ఞానాన్ని అందించే రెటీనాతో పోల్చారు.విద్యార్థి జ్ఞానానికి,ఆలోచనలకు రూపం ఇచ్చేది తరగతి గది అనడంలో సందేహానికి తావు లేదు.
సాధారణంగా బోర్డు/పలక నలుపు,నీలి రంగులో దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది.నీలిపలక పాఠంను విద్యార్థికి అందించే సాధనం.విద్యార్థికి స్పష్టమైన బోధనను అందించే అద్దం వంటిది.నీలి పలక మీద రాసే విషయాలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తాయి.
ఇక్కడ శిష్యులు అనే పూలను గురువు దండలాగా కూర్చడానికి ఉపయోగపడే దారం వంటిది ఈ నీలి పలక.విద్యార్థులు జ్ఞాన సుమాలు.ఒక్కొక్కరు వేరు వేరుగా ఉండ వచ్చు.గురువు బోధనతో శిష్య సుమాలను మాలగా కూర్చి అందంగా తీర్చిదిద్దుతాడు.గురువు బోధనతో విద్యార్థులకు నిరంతరం జ్ఞానాన్ని కురిపిస్తూ,సరియైన మార్గాన్ని చూపుతాడు.
మూడో కన్ను అనగానే అది సాధారణంగా జ్ఞాన నేత్రం.విద్యార్థికి మూడో కన్ను అనగా అది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించేది.విద్యార్థికి గురువు ఇచ్చే జ్ఞానం మూడో కన్ను లాంటిది.అది కేవలం చూసే కన్ను కాదు,లోతైన బుద్ధి,వివేకం,లోక దర్శనం ప్రసాదించే కన్ను అని తెలియ వస్తున్నది.
తరగతి గదిని ఒక కంటి రెటీనాతో,విద్యను జ్ఞాన కాంతిగా భావిస్తూ పోల్చారు.ఈ కవితా పంక్తులు విద్యా ప్రాధాన్యతను,గురువు,విద్యార్థుల సంబంధాలను చక్కగా చెప్తాయి.తరగతిగది జ్ఞాన దృష్టి,బ్లాక్ బోర్డు ఆ జ్ఞానదృష్టిని సుస్పష్టం చేసే పటం లాంటిది. విద్యార్థులలోని వ్యక్తిగత ప్రతిభను ఒక మాలగా కట్టేది గురువు.చివరికి గురువు మూడో కన్ను ద్వారా విద్యార్థికి నిజమైన జ్ఞాన దృష్టిని అందిస్తాడు.
“బ్లాక్ బోర్డు చాక్ పీసులు/భార్యాభర్తల్లా కలిసుంటేనే/విద్యాసంసార సాగరం ఒడ్డుకు చేరుకునేది/అంటున్నారు.బ్లాక్ బోర్డుపై ఒక చాక్ పీసు ముక్కతోనే పాఠం చెప్పడం సాధ్యం కాదు.ఒక చాక్ పీసు,మరొక చాక్ పీసు,తరువాత ఇంకొక చాక్ పీసు కలిసి ఉపయోగించాలి.చాక్ పీసు ముక్కలు ఒక్కదానితో ఒకటి తోడుగా ఉంటేనే గురువు నిరంతరం పాఠాలను బోధించ గలడు.ఇక్కడ బ్లాక్ బోర్డు,చాక్ పీసులు కలిసి ఉండాలి కాబట్టి భార్యాభర్తలుగా పోల్చారు.జీవితంలో సంసారం అనే ప్రయాణం విజయవంతంగా సాగడానికి భార్యాభర్తల అన్యోన్యత ముఖ్యం.ఇదే విధంగా భార్యాభర్తలు కూడా కలిసిమెలిసి ఉంటేనే జీవితం చక్కగా కొనసాగుతుంది.సంసారం చక్కగా సాగడానికి భార్య ఒక్కరితో సరిపోదు,భర్త కూడా తోడుగా ఉండాలి. బ్లాక్ బోర్డు,చాక్ పీసులు కలిసి ఉంటేనే విద్యాసాగరం అనే పెద్ద ప్రయాణం చక్కగా సాగడానికి దోహదపడుతుంది.కలిసి ఉండడం, పరస్పరం తోడ్పడడం,ఐక్యత, జీవితంలో విజయ సాధనకు ఎంతో అవసరం.బ్లాక్ బోర్డు,చాక్ పీసులు కలిసి ఉంటేనే బోధన సాధ్యం అవుతుంది. భార్యాభర్తలు కలిసి ఉంటేనే జీవిత సంసార సాగరం పూర్తి అవుతుంది.భార్యాభర్తలు ఒకరికి మరొకరు అండగా ఉండి తోడ్పాటును అందించాలి. భార్యాభర్తలు కలిసి లేకపోతే జీవన ప్రయాణం చక్కగా సాగక మధ్యలో నిలిచిపోతుంది.బ్లాక్ బోర్డు లేకుండా చాక్ పీసులు వృధా.బ్లాక్ బోర్డు చాక్ పీసులు రెండు కలిసి ఉంటేనే బోధన సాధ్యం అవుతుంది.భార్యాభర్తలు విడిగా ఉంటే జీవితం పరిపూర్ణం కాదు. భార్యాభర్తలు కలిసి సుఖదుఃఖాలు పంచుకుంటూ నడిస్తేనే జీవన సాగరం సాఫల్యంగా ముగుస్తుంది.సంసారంలో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోతే జీవితం అసంపూర్ణం అవుతుంది.


“అమ్మ పాలు తాగని పిల్లలుంటారేమోగాని/ బోర్డుపై అక్షరాలు …/చదవని అక్షరాస్యులుంటారా!?/ అటెండర్ కైనా …… ఐఏఎస్ కైనా దిక్సూచి ఇదే/ అంటున్నారు.తల్లి పాలు శిశువు శారీరక,మానసిక వికాసానికి తోడ్పడుతాయి.చిన్న పిల్లలు వృద్ధి చెందడానికి తల్లి పాలు ఎంతో అవసరం.తల్లి పాలు సహజమైనవి‌‌.కొందరు పిల్లలు ఏవో కొన్ని కారణాలవల్ల తల్లి పాలు తాగకపోవచ్చు.ఇక్కడ తల్లి పాలు జీవనానికి పునాది అని తెలుపుతుంది. విద్య అందుబాటులో లేనందు వల్ల చదువుకోని వారు,అక్షరాలు తెలియని వారు ఎప్పుడూ ఉంటారు.ఇది విద్యలో వెనుకబడిన వాస్తవాన్ని ఎత్తి చూపుతోంది. ఈనాటి మన సమాజంలో ఇప్పటికీ చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు.కానీ, చదువు మనిషికి అత్యవసరం.
చిన్న ఉద్యోగం చేసే అటెండర్ అయినా,పెద్ద స్థాయి ఉద్యోగి కలెక్టర్ అయినా వారందరికీ సరైన దారిని చూపేది విద్య.మనిషి స్థాయి ఏమిటి?ఉద్యోగంలో స్థాయి ఏమిటి?అనే తేడా లేకుండా చదువు జీవితానికి మార్గదర్శనం చేస్తుంది.ఇక్కడ జీవితానికి దిశ చూపేది విద్య.తల్లి పాలు శరీరానికి ఎంత ముఖ్యమో,చదువు మనిషి జీవితానికి అంత కంటే ముఖ్యం అని చెబుతోంది.పిల్లల పెంపకానికి తల్లి పాలు ఎంత అవసరమో చదువు మనిషి జీవితానికి అంతే ముఖ్యం.శారీరక,మానసిక వికాసానికి విద్య అత్యంత అవసరం.విద్య లేకుంటే మనిషి అజ్ఞానాంధకారంలో ఉండిపోతాడు.విద్య మనిషికి దారిని చూపిస్తుంది.చదువు అనే దిక్సూచి మనిషి జీవితానికి ఎంతో అవసరం.ఎవరికి అయినా,ఏ స్థాయిలో ఉన్న వారికైనా జీవితాన్ని నిర్మించేది,దిశ చూపేది విద్య మాత్రమే అని ఈ కవితా పంక్తులు తెలుపుతున్నాయి.
“బోర్డు చెవిని చాక్ పీసుతో పిండితే/నోరు తెరిచి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది/అ ఆ ల్నైనా …అనంత విశ్వ రహస్యాల్నైనా/ అరటిపండు ఒలిచినట్లు చెప్తుంది/అంటున్నారు.ఇక్కడ బోర్డుకు చెవి ఉన్నట్లు చెప్పారు.చాక్ పీస్ ముక్కతో బోర్డుపై రాయడాన్ని చెవిని పిండినట్లు చెప్పినాడు. బోర్డు మనకు ఏమి చెప్పదు కాని సూచిస్తుంది.బోర్డు మీద చాక్ పీసుతో రాసినప్పుడు ఆ బోర్డు నోరు తెరిచినట్లుగా అనిపిస్తుంది.అనేక విషయాలను ఒక విశ్వరూపంలాగా మన ముందు ఉంచుతుంది.బోర్డు మీద రాసిన అక్షరాలలో అపారమైన జ్ఞానాన్ని, ఆలోచనల్ని,విశ్వ రూపాన్ని మనకు చూపిస్తుంది.
బోర్డు మీద రాసిన అ,ఆ వంటి చిన్న చిన్న అక్షరాల ద్వారా ప్రాథమిక బోధనను,విశ్వ రహస్యాలను, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలను మొదలైన వాటిని బోర్డు మనకు అందిస్తుంది.ఎంతటి క్లిష్టమైన విశ్వ రహస్యాలనైనా చాలా సులభంగా, సరళంగా బోర్డు మనకు చెబుతుంది. అరటిపండు తొక్క తీయగానే లోపల మృదువైన ఫలం ఉన్నట్లు,బోర్డు మీద చాక్ పీసుతో రాసిన వెంటనే జ్ఞానం కూడా సులువుగా మనకు బోధపడుతుంది.చాక్ పీసుతో రాసే బోర్డు మనకు అక్షరాల నుంచి విశ్వ రహస్యాల వరకు అన్నింటిని సులువుగా నేర్పగలిగే అద్భుతమైన ఉపాధ్యాయుని సాధనం.ఇది ఒక గురువు బోధనా శక్తిని మరియు జ్ఞాన సులభతను ప్రతిబింబిస్తుంది.ఈ కవితా పంక్తులు బోర్డును సాధారణ వస్తువుగా కాకుండా జ్ఞానం,బోధన,విద్యకు నిలయమైనట్టిదిగా చూపిస్తున్నాయి.బోర్డు లేకుండా తరగతి గదిని ఊహించలేం.బోర్డుపై చాక్ పీసుతో రాయగానే అది మౌనం విడిచి విశ్వాన్ని ఆవిష్కరిస్తుంది.చిన్న అక్షరాల నుండి మహత్తరమైన శాస్త్రాల వరకు ఒకే వేదికపై బోర్డు సులభంగా అందిస్తుంది.బోర్డు అనేది ఒక అద్భుతమైన జ్ఞాన ద్వారం.అది మౌనంగా కనిపించినా చాక్ పీసు తాకినప్పుడల్లా అది విశ్వాన్ని చూపించే మహాశక్తిగా మారుతుంది. బోర్డుకు నిజంగా చెవి ఉండదు.గురువు చాక్ పీసుతో తాకితే చాలు బోర్డు మాట్లాడుతుంది అనే భావాన్ని ఈ కవితా పంక్తులు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ బోర్డు విద్యావేదిక.బోర్డు సాధారణంగా మౌనంగా ఉండే వస్తువు. కానీ,అట్లాంటి బోర్డు చాక్ పీసు తాకగానే అది మాట్లాడే శక్తిని పొందుతుంది. ఈ విరుద్ధాభాసమే కవిత్వ సౌందర్యం.విద్యా బోధనలో చిన్న అ,ఆ లాంటి అక్షరాలు ప్రాథమిక విషయాలు,విశ్వ రహస్యాలు, బోర్డు అనే సాధారణ వేదిక ద్వారానే వ్యక్తం అవుతాయి.బోర్డు అనేది కేవలం ఒక బ్లాక్ బోర్డు మాత్రమే కాదు.అది జ్ఞాన విశ్వాన్ని మన కళ్ళ ముందు ఉంచే అద్భుతమైన శక్తి.ఈ కవితా పంక్తులలో బోర్డు జ్ఞానాన్ని ప్రసవించే తల్లిలా,చాక్ పీసు ఒక ప్రేరణ కర్రలా,జ్ఞానం ఒక విశ్వరూపంలా పోల్చి చూపబడినాయి.
“బోర్డు దేహమ్మీది సుద్ధ ముక్క దస్తూరి/సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణాలే/తరగతి గదిలో సంజీవని/విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసే డ్రాయింగ్ పేపర్/ అసమానతల్ని తొలగించే రాజ్యాంగం/ప్రశ్నించే తత్వాన్ని నేర్పే గురువు/దీనిపై రాసే రాతల్ని అర్థం చేసుకొని అనుసరిస్తే/గ్రహాలు కూడా తలవంచుతాయి/విశ్వపు బంతి గ్లోబును వేలిపై తిప్పుకోవచ్చు/అంటున్నారు.బోర్డు విద్యార్థుల జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగినది అని ప్రతీకాత్మకంగా వివరిస్తున్నారు.ఒక సాధారణ బ్లాక్ బోర్డును కవి అత్యంత విలువైనదిగా చూపించారు. బోర్డు చదువుకు ఉపయోగించే పరికరమే.కానీ, దీనిని జ్ఞానం,సమానత్వం,సృజనాత్మకత, ప్రశ్నించే తత్వాన్ని నేర్పే గురువు అనే అంశాలను తీసుకున్నారు.
బోర్డు మీద రాసే చాక్ పీసు రాతలను, ఇక్కడ సుద్ధముక్క దస్తూరిని,సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణంగా పోల్చారు.బోర్డు మీద రాసే అక్షరాలు నాజూకు,అందం,సృజనాత్మకత, కళాత్మకతను ప్రతిబింబిస్తుంది.కవి బోర్డు మీద రాసిన అక్షరాలు, వెండి తీగలను అల్లి చేసిన తేలికైన,సున్నితమైన కళాత్మకమైన ఆభరణాల వంటివి,విలువైనవి అని సూచిస్తున్నారు.
తరగతి గదిలో బోర్డు ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది.తరగతి గది విద్యార్థుల అభ్యాస కేంద్రం.గురువు బోధన విద్యార్థుల్లో జ్ఞానాన్ని, చైతన్యాన్ని నింపే సంజీవనిలా ఉంటుంది.గురువు కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే వాడు మాత్రమే కాదు.గురువు ప్రేరణ,విలువలు, నైతికత,జీవన పాఠాలు అందించే వ్యక్తి.గురువు బోధన వల్ల విద్యార్థుల ఆలోచనా విధానం,ప్రవర్తన వ్యక్తిత్వం పై గొప్ప ప్రభావం చూపుతుంది.తరగతి గదిలో మంచి బోధన విద్యార్థులను ఆలోచించేలా, ప్రశ్నించేలా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతుంది. గురువు పాఠాన్ని రసవత్తరంగా ఆసక్తికరంగా చెప్పడం వల్ల విద్యార్థులు కుతూహలంతో నేర్చుకుంటారు. విద్యార్థులు చదువులోనే కాదు, జీవితంలోను ఎదగడానికి ప్రేరణ పొందుతారు.గురువుల బోధన వారిలో ఆత్మవిశ్వాసాన్ని,నైతిక బలాన్ని,సామాజిక బాధ్యతను పెంచుతుంది.మంచి గురువులు తయారుచేసే విద్యార్థుల వల్లే సమాజం అభివృద్ధి చెందుతుంది.తరగతి గది నుంచి వెలువడే జ్ఞానం నిజంగా సంజీవని లాంటిదే.గురువు బోధన విద్యార్థుల జీవితంలో జ్ఞానానికి,మానవత్వానికి, విలువలకు ప్రాణం పోసే సంజీవని అని చెప్పవచ్చు. విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు చెప్పే విషయాన్ని విద్యార్థికి సులభంగా,స్పష్టంగా అందించే సాధనం బోర్డు.బోర్డు లేకుండా బోధన పూర్తిగా జీవం లేని దానిలా మారుతుంది.అందుకే దాన్ని సంజీవనితో పోలుస్తారు.ఉపాధ్యాయుడు చెప్పే మాటలు కాకుండా వాటికి దృశ్య రూపం ఇచ్చేది బోర్డు.బోర్డుపై క్లిష్టమైన విషయాలను,సులభంగా అర్థమయ్యేలా, చిత్రాలు,పట్టిక రూపంలో చూపవచ్చు. బోర్డు వలన విద్యార్థుల ఏకాగ్రత,జ్ఞాపకశక్తి పెరుగుతుంది.బోర్డు ఒక సజీవ సాధనం.ఇది బోధనకు ఉత్సాహం, కాంతి,స్పష్టత తీసుకొస్తుంది.చిన్న విషయాల నుండి పెద్ద సిద్ధాంతాల వరకు అన్నింటిని బోధించగలిగే గొప్ప సాధనం బోర్డు.ఇది బోధనను,అభ్యాస ప్రక్రియను సజీవం చేస్తుంది.బోర్డును విద్యార్థులకు విజ్ఞానం చేరవేసే సులభమైన సాధనంగా చెప్పవచ్చు.అందువల్ల దానిని సంజీవని అని పిలుస్తారు.ఉపాధ్యాయుడు చెప్పే విషయాలను బోర్డు మీద రాయడం ద్వారా విద్యార్థులకు స్పష్టంగా అర్థం అవుతుంది.బోర్డు మీద చిత్రాలు,పట్టికలు చూపించడం వల్ల విద్యార్థులకు విషయాలు బలంగా గుర్తుంటాయి.బోర్డు మీద రాయబడినది చూసే క్రమంలో విద్యార్థులు ఏకాగ్రతతో పాఠాన్ని ఆసక్తిగా వింటారు. బోర్డు ఉపాధ్యాయుని బోధనకు జీవం పోస్తుంది.విద్యార్థులలో జ్ఞానాన్ని పెంచుతుంది.
బోర్డ్ ఒక డ్రాయింగ్ పేపర్ లా ఉంటుంది. డ్రాయింగ్ పేపర్ కేవలం చిత్రాలను గీయడానికి ఉపయోగించే పేపర్ మాత్రమే కాదు.ఇది విద్యార్థుల్లో దాగి ఉన్న ఆలోచనలను,ఊహా శక్తిని వెలికి తీసే సాధనం. సృజనాత్మకతకు వేదిక.డ్రాయింగ్ పేపర్ మీద విద్యార్థులు తమ ఊహల్లో కనిపించే దృశ్యాలకు, స్వేచ్ఛగా రూపం కల్పిస్తారు.విద్యార్థులను కేవలం పుస్తకాలలోని పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం చేయకుండా వారి కొత్త ఆలోచనలకు ప్రాణం పోయాలి.మాటలలో చెప్పలేని భావాలను చిత్రాల ద్వారా సులభంగా వ్యక్తపరచ వచ్చు.డ్రాయింగ్ పేపర్ అనే బోర్డు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడానికి, ఆలోచనలను రూపకల్పన చేయటానికి భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడే ముఖ్యమైన సాధనంగా భావించవచ్చు.కళ అనేది కళ కోసం మాత్రం కాదు.అది విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలి.అందులో విద్యార్థుల ఆలోచనలు,గురువు బోధనలు రూపం దాలుస్తాయి.
బోర్డు మీద రాసే జ్ఞానం రాజ్యాంగం వలె సమానత్వం నేర్పుతుంది.అందరికీ సమాన అవకాశాలు కల్పించే మార్గం చూపుతుంది. రాజ్యాంగం సమానత్వం,న్యాయం,సత్యం బోధించే సాధనం.విద్యా రంగంలో ఉన్న అసమానతలను తొలగించడం కోసం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నిబంధనలు మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 – A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసుగల ప్రతి పిల్ల వాడికి ఉచిత విద్య తప్పనిసరిగా అందించాలి. పిల్లలకు ప్రాథమిక విద్య హక్కుగా కల్పించబడింది. విద్య అందరికీ సమానహక్కు అని రాజ్యాంగం ప్రకటించింది.అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
బోర్డు మీద రాసే రాతల ద్వారా గురువు విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంచుతాడు.బోర్డు మీద బోధించే గురువు ప్రశ్నించమని ప్రేరేపించే తత్వవేత్త.విద్యార్థుల విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించేలా ప్రోత్సహిస్తాడు.
బోర్డు మీద రాసిన అక్షరాల జ్ఞానాన్ని గ్రహించి దాన్ని జీవితంలో అనుసరిస్తే విద్యార్థి విశ్వాన్ని జయించే స్థాయికి ఎదుగుతాడు.జ్ఞానంతో మనిషి విశ్వాన్ని జయించగలడు.గురువు బోధించే జ్ఞానం, పాఠాలు,బ్లాక్ బోర్డు మీద రాసిన అక్షరాల రూపంలో ఉంటాయి.ఇవి కేవలం అక్షరాలు మాత్రమే కాకుండా జీవితాన్ని మార్చే మార్గదర్శకాలు.గురువు బోర్డు మీద రాసిన అక్షరాలు కేవలం చదవడంతో సరిపోదు. వాటి లోతైన అర్ధాన్ని గ్రహించి ఆచరణలో పెట్టడం అవసరం.గురువు అందించే జ్ఞానం,కేవలం పుస్తకాలకు పరిమితం కారాదు.అది విద్యార్థుల ప్రవర్తనలో, జీవితంలో కనిపించాలి అనే సందేశాన్ని అందించడం జరిగింది.ఈ కవితా పంక్తులు జ్ఞానం, విద్య యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాయి.విద్య వల్ల మనిషి వివేకం పెరుగుతుంది.జ్ఞానం,శ్రమ,ఆచరణల వల్ల గ్రహాలు కూడా తలవంచుతాయి.విద్యకు జీవితాన్ని మార్చ గల శక్తి ఉంది.గురువు బోధించే పాఠాలను చక్కగా నేర్చుకోవాలి.విద్యార్థులు కేవలం పాఠాలను చదివి వదిలివేయ వద్దు.అందులోని సారాన్ని అర్థం చేసుకోవాలి.గురువు బోధనలను జీవనంలో అమలు చేస్తే మనిషి ఎదుగుదలకు ఎవరు అడ్డు నిలవలేరు.విధి,అదృష్టం,గ్రహ స్థితి అన్ని జ్ఞానానికి లోబడి ఉంటాయి.
ఇక్కడ గ్లోబు అంటే భూమి బంతి.ఇది మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని సూచిస్తుంది. చిన్న బంతిలా కనిపించే గ్లోబు లోపల మనిషి జీవన రహస్యాలు,దేశాలు.సముద్రాలు,పర్వతాలు, సరిహద్దులు అన్ని నిక్షిప్తమై ఉంటాయి.గ్లోబు చిన్న బంతి రూపంలో ఉంటే దానిని సులభంగా వేలుతో తాకుతూ తిప్పుకోవచ్చు.గ్లోబు ద్వారా ప్రపంచమంతా మన కళ్ళ ముందే ఉన్నట్లుగా అనిపిస్తుంది.మనిషి జ్ఞానం పెరిగితే ప్రపంచాన్ని తన కంటితోనే చూడగలడు.ఇది విజ్ఞానం,విద్య, అన్వేషణ వాటి శక్తి ఎంత గొప్పదో తెలుపుతున్నది. భూమి ఎంత విస్తారమైనదో విశ్వం ఎంత అపారమైనదో గ్లోబు రూపంలో సులభంగా వేలుతో తాకి తెలుసుకోవచ్చు.విజ్ఞాన శక్తితో విశ్వం కూడా మన వేళ్ళకు లోబడి తిరుగుతుంది.మనిషి ప్రపంచాన్ని అర్థం చేసుకొని తన చేతుల్లోకి తెచ్చుకోవచ్చు.ఈ విధంగా బోర్డు ప్రాముఖ్యతను అద్భుతమైన కవితాత్మక రూపంలో చెప్పబడినది. బోర్డు కేవలం బోధనా సాధనం మాత్రమే కాకుండా విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే జ్ఞాన భాండారం.బోర్డు ద్వారా ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.బోర్డు విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే జ్ఞాన మార్గదర్శి.విద్య ద్వారా సమానత్వం, సృజనాత్మకత,విమర్శనాత్మక ఆలోచనా ధోరణులు పెరుగుతాయి.చివరకు విద్యార్థి విశ్వాన్ని జయించే శక్తిని పొందుతాడు.కవి వెంకటేశ్వర్లు చక్కటి బ్లాక్ బోర్డ్ కవితను అందించినారు.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కవి ఎర్రోజు వెంకటేశ్వర్లు తేది 30 – 06 – 1969 రోజున సామాన్య స్వర్ణకార కుటుంబంలో జన్మించారు.వీరు కంది కట్కూర్ గ్రామం, ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్లకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు రామవ్వ,పాపయ్యలు.వీరి తండ్రి పాపయ్య స్వర్ణకార వృత్తితో పాటు జ్యోతిష్యం చెప్తుండే వాడు.వీరి తండ్రి పాపయ్య రామాయణం, మహాభారతం, హాస్య,జానపద కథలను గ్రామస్తులకు సులభంగా,అర్థమయ్యేలా చక్కగా చెప్పే వారు.వీరి తండ్రి పాపయ్య కథలు చెప్తుండగా వినడం వల్లనో ఏమో చిన్నతనంలోనే కవి వెంకటేశ్వర్లుకి సాహిత్యం,కళల పట్ల ఎనలేని ఆసక్తి ఏర్పడింది.వీరి తండ్రి పాపయ్య తేది 17 – 08 – 1990 రోజున అనారోగ్యంతో ఈ లోకాన్ని వీడిపోయారు.వీరి తల్లి రామవ్వ తేది 12 -10 – 2010 రోజున అనారోగ్యంతో పరమపదించింది.వీరు ప్రాథమిక విద్యను 1వ తరగతి నుండి 5 వ తరగతి,1975 – 1980 ప్రభుత్వ పాఠశాల, కందికట్కూర్ గ్రామంలో చదివారు.బాలకిషన్ సార్ ప్రోత్సాహంతో వీరి తండ్రి 6 వ తరగతిలో వెంకటేశ్వర్లును శ్రీ రాజరాజేశ్వర సంస్కృతాంధ్ర విద్యాలయం,వేములవాడలో చేర్పించారు.వీరు అదే పాఠశాలలో 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 1975 – 1980 విద్యాభ్యాసం చేశారు.వీరు ఇంటర్ మరియు డిగ్రీ విద్యను1985 – 1990 శ్రీ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల, వేములవాడలో చదివారు.వీరు ఎం.ఏ. తెలుగు ఎంట్రెన్స్ టెస్ట్ లో మొదటి ర్యాంకు సాధించి,1990 – 1992, ఉస్మానియా విశ్వవిద్యాలయం,హైదరాబాదులో చదివారు.వీరు ఎం.ఫిల్. డిగ్రీ 1992 -1993 సంవత్సరంలో కేంద్రీయ విశ్వ విద్యాలయం, హైదరాబాద్,సదానంద్ శారద కథలు అనే అంశంపై పరిశోధించి,డిగ్రీని పొందారు.వీరు1995 సంవత్సరంలో బి.ఇడి.డిగ్రీని రాష్ట్రీయ విద్యాపీఠం, తిరుపతిలో పూర్తి చేశారు.వీరు 1994 సంవత్సరంలో ఎం.ఏ. సంస్కృతం, దూరవిద్య ద్వారా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.తిరుపతిలో అభ్యసించారు.వీరు తేది 21 – 09 – 1995 రోజున సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,ఆసిఫాబాద్ లో టీచర్ గా నియమించబడ్డారు.వీరు ఆసిఫాబాద్, మేడిపల్లి,రుక్మాపూర్,హుస్నాబాద్,ఇందారం – జైపూర్,ముథోల్,నిర్మల్ ప్రాంతాలలో పని చేశారు. వీరు ప్రస్తుతం తెలుగు శాఖా అధ్యక్షులుగా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల,నగునూర్ లో పని చేస్తున్నారు.వీరు కళాశాలలో విద్యార్థులకు సాహిత్యం,కవిత,కథా రచన పట్ల ఆసక్తిని పెంపొందింపచేస్తున్నారు.వీరు తేది 20 – 02 – 2006 నుండి 25 – 02 – 2006 వరకు ప్యానెల్ ఇన్స్పెక్షన్ సభ్యునిగా నేషనల్ మాన్స్క్రిప్ట్ సర్వేయర్ గా ఇల్లంతకుంట మండలంలో పని చేసినారు.వీరు ఎన్నో తాళపత్ర గ్రంథాలను సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. కవి వెంకటేశ్వర్లు ముద్రిత రచనలు :
1) బ్లాక్ బోర్డ్ కవితా సంపుటి 2020.
2) యెర్రోజు పసిడి పలుకులు 2020
కవి వెంకటేశ్వర్లు పొందిన పురస్కారాలు:
1.తేది 26 – 01 – 2013 ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.

  1. తేది 28 – 02 – 2013 తెనాలి వారిచే యలపర్తి ఆంజనేయ శాస్త్రి పురస్కారం లభించింది.
  2. తేది 12 – 01 – 2023 రోజున కాలువ మల్లయ్య పురస్కారం పొందారు.
  3. తేది 10 – 07 – 2025 కొనకటి సుభద్ర బాలకిషన్ ట్రస్ట్ వేములవాడ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంను అందుకున్నారు.
    5.తేది 14 – 01 – 2007 సారస్వత జ్యోతి మిత్రమండలి,కరీంనగర్ వారిచే ప్రశంసా పత్రం అందుకున్నారు.
  4. తేది 12 – 11 – 2006 పాలకొల్లు వారిచే
    కళాలయ విశిష్టత ప్రతిభా పురస్కారం లభించింది.
    7.సురభారతి సేవాపీఠం,తిరుపతి వారిచే
    సంస్కృతాంధ్ర సాహిత్య రత్న,బిరుదును 2011 సంవత్సరంలో అందుకున్నారు.
September 29, 2025 164 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సువ్యాసాలు

A walk & a realization

by Chaitra Ranganayaki September 28, 2025
written by Chaitra Ranganayaki

I was taking a walk the other day planning for my next decade and half stint of my life. Wanting to slow down from the busy corp world but what exactly would I do after I quit? I am so accustomed to the job idea most of our societies constantly linger on that I completely forgot how recent this luxury really is.
Forget how long ago the suffrage movement was – even my mom’s generation didn’t plan well for their retirement. Of course they made the most of what they could, but here I am with all these opportunities and I feel like I’m wasting it away chasing a chicken! How did I get so lucky? It’s crazy how this thought doesn’t occur to me as often as it should. Are we living lives that don’t practice gratitude like how often we follow our ego?

The ability to even contemplate “what’s next” in my career, to have choices about how I want to spend the next fifteen years, to build wealth for retirement – these weren’t options for women just one or two generations back. The suffragettes and early women’s rights fighters endured imprisonment, force-feeding, public humiliation, and social ostracism just so we could have the right to vote, to get an education, to pursue careers. They literally put their bodies on the line so that I could walk into any university, build a career, contribute to a 401K, and have some control over how I want to shape my life.
But here’s what really hit me during that walk: how are we actually using this hard-won freedom? Are we honoring their sacrifice with how we spend our days? Or are we squandering it scrolling mindlessly through social media, getting lost in manufactured outrage, or hiding behind the convenient lie of “self-care” when what we’re really doing is avoiding the harder work of actually building meaningful lives? I’m not saying rest isn’t important, but I wonder if Susan B. Anthony would look at us spending hours on TikTok or Instagram and think, “This is what we fought for?”

These women couldn’t have imagined the specific freedoms we enjoy today – the luxury of career anxiety, the privilege of planning retirement, the ability to walk alone and contemplate our futures – but they fought with this unwavering belief that future generations of women deserved better, deserved more. They saw potential in us that we sometimes don’t even see in ourselves.

It makes me wonder: are we living up to their vision? Are we using our freedom to create, to contribute, to push boundaries further for the women who come after us? Or are we getting comfortable in the freedoms they won and forgetting that freedom is something you have to actively use, not just passively enjoy? Maybe the real way to honor them is to ask ourselves daily: am I making the most of what they died for? Am I practicing the kind of gratitude that transforms how I live, not just how I feel?
*

September 28, 2025 10 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us