మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంట‌ర్వ్యూలు

దేశాన్ని ప్రేమించండి. భారతీయ ధర్మాన్ని కాపాడండి.

by Aruna Dhulipala March 30, 2024
written by Aruna Dhulipala

– ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

ఉపన్యాస కేసరి, ఉపన్యాస కళానిధి, జాతీయ సాహిత్య బిరుదాంచితులు, ప్రముఖ కవి, వక్త, ఆధ్యాత్మిక, తత్త్వవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో మయూఖ ముఖాముఖి* – అరుణ ధూళిపాళ

       వ్యవసాయ క్షేత్రంలో నాగలి పట్టి పంటలు పండించిన కర్షకుడు, కలం పట్టి తెలుగు సాహితీ క్షేత్రంలో అక్షర సేద్యం చేసిన కవి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి జీవితాన్ని గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్, మా మయూఖ పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయగలిగే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటగా….

1. మీ పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పండి.

జ :    నమస్కారమండీ. తెలంగాణ లోని పాలమూరు ఒక  ప్రసిద్ధి పొందిన జిల్లా. జనమంతా కూలీల జిల్లా అంటారు. అక్కడినుండి బయలుదేరిన కూలీలంతా ఇటు నాగార్జున సాగరం నిర్మాణం వైపు, అటు భాక్రానంగల్ నిర్మాణం వైపు వరకు కూలీకి వెళ్లారని ప్రతీతి. కాబట్టి కష్టజీవుల జిల్లాగా దానికిపేరు. ఆ జిల్లాలోని పోలేపల్లి మా స్వగ్రామం. ఇప్పుడది రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మండలం కిందికి వస్తుంది. ఆ ఊళ్ళో నేను ఆగస్ట్ 3వ తేదీ 1946 వ సంవత్సరంలో జన్మించాను. మా అమ్మగారి పేరు ద్రౌపదమ్మ, నాన్నగారి పేరు కసిరెడ్డి మేఘారెడ్డి గారు. చుట్టూ చెట్టూ చేమలు, గుట్టలు. వ్యవసాయ జీవితం మాది.

2. వ్యావసాయిక కుటుంబంలో, పల్లెటూళ్ళో జన్మించిన మీ బాల్యం ఎలా గడిచింది? మీ విద్యాభ్యాసానికి ఎటువంటి బీజాలు పడ్డాయి?

జ:  మా నాన్నగారు వ్యవసాయ దారుడు అయినప్పటికీ ఆయనకు చిన్నప్పటినుండీ పద్యాలు చదవడం. మొల్ల రామాయణం అధ్యయనం చేయడం అలవాటుగా ఉండేది. మహాభాగవతంలో నారాయణ కవచం ఆయనకు కంఠస్థంగా ఉండేది. దాశరథి పద్యాలు కూడా నోటికి వచ్చేవి. రాకమచర్ల వేంకటదాసు యొక్క కీర్తనలు గొంతెత్తి పాడేవారు. ఊళ్లోని ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర భజనలు చేసేవారు. కార్తీకమాసం ముప్పై రోజులు ముప్పై ఇండ్లల్లో రోజూ భజనలు జరిగేవి. మా వాకిలి చాలా పెద్దది. బతుకమ్మ పండుగ సందర్భంగా నూరు నుండి నూటా యాభై వరకు ఆడవాళ్లు మా ఇంటి ముందు బతుకమ్మ ఆడేవారు. ఈ విషయాలన్నీ చిన్నప్పుడు మేము విన్నాం.
            మా ఊళ్ళో ఏకోపాధ్యాయ పాఠశాల ఉండేది.ఆ పాఠశాలలో తెలుగు మాట్లాడడం సరిగా రాని వ్యక్తి ముస్లిముల కాలం నాటి ఒక పంతులు గారు ఉండేవారు. నిజాములు వాళ్లకు నచ్చిన ఎవరినో ఒకరిని మౌల్వీసాబ్ గా చేసేవారు. నేను దాదాపుగా 1950 ప్రాంతంలో ఆ పాఠశాలలో చేరాను.  పాఠశాల కూడా సరిగా లేదు. మా నాన్నగారు ఒక గుడిసె వేసి (సపారం అంటారు దాన్ని) దాంట్లో నలుగురు చదువుకునేలా ఏర్పాటుచేశారు. అది మా పశువుల కొట్టం పక్కనే ఉండేది. మా తమ్ముడు మోహన్ రెడ్డికి నాకు ఏడాదిన్నర వయసు తేడా ఉన్నప్పటికీ ఇద్దరము కలిసి అదే  పాఠశాలలో చదువుకున్నాం. (చదువు అయిపోయాక మా తమ్ముడు మిలిటరీలో చేరాడు) అక్కడినుండి 4, 5 తరగతుల వరకు మా మేనమామ ఊరు మాడుగులలో చదువుకున్నాం. 1946 నుండి 1952 వరకు బాల్యం అనుకుంటే 1952 నుండి 1957 వరకు నా ప్రాథమిక పాఠశాల చదువు కొనసాగింది. నారాయణరెడ్డి సార్, రఘుపతి రెడ్డి సార్ మా మనసులో ఇప్పటికీ నిలిచిపోయిన ఉపాధ్యాయులు. మేము మా మేనమామ గారి ఇంట్లో చదువుతుంటే రఘుపతి రెడ్డి గారు స్వయంగా ఇంటికి వచ్చి ఎట్లా చదువుతున్నారని అడిగే వాళ్ళు. ఆ కాలంలో ఉపాధ్యాయులు అంతటి ప్రేమ కలిగి ఉండేవాళ్ళు.

3. ఆ తరువాత ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది?

జ:     అప్పుడు ‘కల్వకుర్తి’ మాకు తాలూకా కేంద్రంగా ఉండేది. అక్కడ ఆరవతరగతి నుండి నేను 1963 వరకు, మా తమ్ముడు 1964 వరకు చదువుకున్నాం. 1963లో నా హెచ్ ఎస్ సి పూర్తి అయింది. మా ఊరి నుండి చెరుకూరు అనే ఊరికి నడిచి వెళ్లేవాళ్ళం. అక్కడికి ఒక సర్వీసు వచ్చేది. దాన్ని ‘అబ్దుల్ ఖాదర్ సర్వీస్’ అనేవాళ్ళు. అది కల్వకుర్తి మీదుగా హైద్రాబాదు కు వెళ్ళేది. ఆ సర్వీసులో వెళ్ళేవాళ్ళం. ఆరుకిలోల బియ్యం, మూడు కిలోల జొన్నలు, కందిపప్పు ఇంకా కొన్ని సరుకులను తీసుకొనిపోయి మా తమ్ముడు, నేను వంట చేసుకొని తినేవాళ్ళం. కల్వకుర్తి బస్టాండుకు దగ్గర్లో ఒక ముస్లింల ఇంట్లో నెలకు మూడు రూపాయల కిరాయితో ఒక గది తీసుకొని ఉన్నాం. అట్లా హెచ్ ఎస్ సి పూర్తి చేశాను.

4. మీ సాహిత్యాభిలాషకు ఇంటి వాతావరణమే ప్రభావం చూపిందనుకోవచ్చా?

జ:   కచ్చితంగా మా ఇంటి ప్రభావం ఉంది. మా నాన్నగారు మా చిన్నతనంలోనే నన్ను తొడమీద కూర్చుండ బెట్టుకొని పద్యాలు చెప్తుండేవారు. అట్లా చెప్పిన పద్యాలెన్నో నాకు నోటికి వచ్చేవి.
“రామ రామయన్న రారాదు పాపంబు
రామ రామయన్న రాదు భయము
రామ రామ యన్న రారాదు మృత్యువు
రామ నామమమృత రాశి యగును”
పూర్వపు చదువుల గురించి మా నాన్నగారు
“తేరా పలకా బలపము/ ఈరా అయ్యవారి చేతికిం పొలరంగా/ పోరా భోజన వేళకు/ రారా పద్యాలు చదువ రాజ కుమారా/ ” అంటూ చెప్పేవారని చెప్పారు.

ఆచార్య కసిరెడ్డిగారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

దీనికి నేను 50 ఏండ్ల తరువాత పేరడీ చేసాను (నవ్వుతూ)….
“తేవే పలకా బలపము/ ఈవే అయ్యగారి చేతికింపొన రంగా/ పోవే భోజన వేళకు/ రావే పద్యాలు చదువ రాజకుమారీ/”
“చిన్న చెంబుతోటి శీకాయ ఉదకంబు/ అవ్వ నాకు ఇంత బువ్వ పెట్టు/ బువ్వ లేదు కొడుక బుద్ధిమంతుడవయితె/ చల్ల తాగి పోర చదువుకోర/” ఇది ఆటవెలది పద్యం అని తరువాత తెలిసింది. అక్షరమో, గణమో అటూ ఇటు తప్పొచ్చునేమో కానీ ఇలాంటి పద్యాల ప్రభావం మామీద ఉండేది.
        మేము 5, 6 తరగతులు చదువుతుండగా కృష్ణా తీరం నుండి దేశమంతటా తిరుగుతూ గురువులు మా ఇంటికి వచ్చేవారు. మేము వారికి వండుకోవడానికి సాహిత్యం ఇచ్చేవాళ్ళం. వారు మాకు ప్రసాదం పెట్టేవారు. పది పదిహేను రోజులు ఉండేవారు. అందులో పెద్ద గురువుగారు నేర్పిన శ్లోకం ఇప్పటికీ మర్చిపోలేను.
“కక్షే కిం ? మమ పుస్తకం, కిముదకం? కావ్యేషు సారోదకం/
పుచ్ఛఃకిం? విషతాళపత్ర లిఖితం, జీవం? మయా కల్పితం/
గంధఃకిం? ఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవం/
ఇక్ష్వాకో సుకులోద్భవస్య చరితం రామాయణం పుస్తకం”
రామాయణ సారాన్ని పూర్తిగా చెప్పిన ఒకే శ్లోకమిది.
పాఠశాలకు వెళ్లిన దానికంటే ఎక్కువ ఇవి నామీద ఎక్కువ ప్రభావం చూపినాయి.
           మా నాన్నగారు ‘ వినవయ్య నరనాథ’ అనే నారాయణ కవచం చదవడం, మొల్ల రామాయణాన్ని పారాయణం చేస్తుండడం, నేను పెద్దయింతరువాత నన్ను మొల్ల రామాయణం కొనుక్కురమ్మని తెప్పించడం లాంటివి జరిగాయి. ముఖ్యంగా రాకమచర్ల వేంకటదాసు గారి కీర్తనలు గొంతెత్తి మా నాన్నతో పాటు అందరూ పాడుతూ ఉంటే అట్లా చూస్తూ ఉండిపోయేవాళ్ళం. విజయదశమి సందర్భంగా దేవాలయం నుండి జమ్మిచెట్టు వరకు ఊళ్ళో వాళ్ళందరూ భజనలు చేస్తూ “రండయ్యో రండయ్యో ! పండరీ పోదాం, శ్రీ పాండురంగని సేవించీ వద్దాము” ..”రామం భజే, రామం భజే మన రాముడొస్తున్నాడు రామం భజే, వాడా వాడా తిరిగి రామం భజే మన వాడ కొస్తున్నాడు రామం భజే” ఇప్పుడు కూడా శ్రీరాముని అక్షతలు, పాదుకలు దేశమంతటా తిరుగుతున్న ఈ సమయంలో మన ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగడం, ఈ సందర్భంగా అప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకోవడం ఎంతో నాకు ఆనందాన్నిస్తున్నది.

5. మీరు జానపదం పట్ల ఆకర్షితులవడానికి కారణం ఏమిటి?

జ:    నేను హెచ్ ఎస్ సి 1963లో పూర్తి చేసేటప్పటికి మా నాన్నగారికి 70 ఏళ్ళ వయస్సు. అందుకే తమ్ముళ్ళిద్దరినీ చదివిస్తూ నేను మాత్రం ఇంటి దగ్గర వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అట్లా 1963 మార్చి నుండి మొదలు 1965 మే వరకు రెండేళ్లు ఇంటి దగ్గర వ్యవసాయం చేశాను. ఎలాగంటే మధ్యరాత్రి లేచి మోటగొట్టడంతో సహా వ్యవసాయంలో తెలియని పని, చేయని పని లేదన్నట్టుగా చేశాను. ఇట్లా వ్యవసాయం చేస్తున్నప్పుడే జానపదులకు బాగా దగ్గరయ్యాను. ఆ విధంగా జానపదుల ప్రభావం నా మీద పడింది. మోటకొట్టే పాటలు, పల్లెల జీవనం, పల్లెల పాటలు అన్నీ తెలిశాయి. అంతేగాక మా ఊళ్ళో ‘చిరుతల రామాయణం’ వేయాలని యువకులు అనుకున్నారు. అందులో నేను రాముని వేషం వేశాను. ఆ తర్వాత నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆచార్య వేణు, మరొకరు ఈ చిరుతల రామాయణం మీద పి హెచ్ డి చేశారు. అందుకే వ్యవసాయం చేస్తున్నప్పుడే జానపదుల సాహిత్యం, పొడుపు కథలు, సామెతలు, గేయాలు, పల్లెల్లో చెప్పుకునే చిన్న చిన్న కథలు వీటన్నిటి ప్రభావం నా మీద ఉంది.

6. వ్యావసాయిక జీవితంలో మీరు కొన్ని రచనలు చేసినట్టు విన్నాం. వాటి గురించి చెప్పండి.

జ:     అదొక విచిత్రమైన విషయం. నేను హెచ్ ఎస్ సి లో ఉన్నప్పుడు యాదగిరి అని నా స్నేహితుడు పక్కరూములో ఉండేవాడు. గొప్ప మేధావి. వాళ్ళ ఊరు ఎల్లమ్మ రంగాపురం. అక్కడ ఆ కాలంలో పెద్ద లైబ్రరీ ఉండేది. అక్కడి నుండి పుస్తకాలు పట్టుకొచ్చేవాడు. నేను కూడా ఆ లైబ్రరీకి వెళ్ళేవాడిని. చెప్తే మీరు ఆశ్చర్య పోతారు. ఆ కాలంలో నేను చదివిన పుస్తకాలు డిటెక్టివ్ నవలలు. అందులో మిస్టరీతో కూడుకున్న ‘మాయామహి’ అని పదహారు సంపుటాల నవల, జగజ్జాణ అనే ఇరవై ఒక్క సంపుటాల నవల చదివాము. విశ్వప్రసాద్ అనే రచయిత రాసిన నవలలు..ఈ విధంగా వందలకొద్ది నవలలు చదివాము. ఆ తర్వాత ఇవి ‘డేంజర్ బార్డర్ పాకెట్ సైజు’ నవలలని వీటిని తిరస్కరించాం. ఇవి మనిషిని ఎక్కడికో తీసుకుపోతాయని అందరి భావన. కానీ మాకు మటుకు మానసిక వికాసానికి దోహదపడ్డాయి. అటు తర్వాత సాంఘిక నవలలు చదవడం జరిగింది. యద్ధనపూడి సులోచనా రాణి, ముప్పాళ రంగనాయకమ్మ , అరికెపూడి కౌసల్యాదేవి మొదలైన వారి నవలలు హెచ్ ఎస్ సి వరకే అందుబాటులో ఉన్నాయి కాబట్టి చదివాము. వ్యవసాయం చేస్తున్న సమయంలో రామాయణం (శేష రామాయణం అని గుర్తు) అమనగల్లు లైబ్రరీ నుండి తెచ్చి చదువుకున్నాం. అప్పుడే రచనలు చేయాలన్న ఆసక్తి కలిగింది. మా ఊళ్ళో పట్వారీ ( ఆయన మా దాయాదుల్లో ఒకడు ) వలన కొంత కష్టం, నష్టం అనుభవించిన వారిని గురించి విని కథలు రాసేవాడిని. అలాగే ఊళ్ళో జరిగిన సంఘటనల మీద కథలు, కథానికలు రాసేవాడిని. వ్యవసాయ జీవితంలో 44 రచనలు చేశాను. ఈ రచనల్లో ఇరవై, ముప్పై పేజీల నవలికలు కూడా ఉన్నాయి. భావుకత ఉంది కానీ భాషాజ్ఞానం ఎక్కువ లేకపోవడం వల్ల వాటి భాష అంత బాగుండదు. ఇంట్లో తయారు చేసుకున్న సిరాతో రాసేవాళ్ళం. ఆ రోజుల్లో ఏవీ దొరికేవి కావు. బియ్యాన్ని బాగా మాడబెట్టి దాంట్లో మసి వేసి పొత్రం పట్టి తిప్పితే ఇంకు తయారయ్యేది. మా నాన్నగారు చెప్పిన పద్ధతి ఇది. పాత కాగితాల్లో రాసుకున్నాను. రాసిన రచనలన్నీ అట్టకట్టి పెట్టుకున్నాను. కానీ ఎక్కడా తీయలేదు. అందులో భాష బాగాలేదని, పరిణతి లేని దశలో రాసినవని, డిటెక్టివ్ నవలల ప్రభావం ఉందని అనుకొని, అలనాడు గుణాఢ్యుడు కావ్యహోమం చేశారంటారు కదా! అట్లా నేను 1985 మార్చి 19వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ కావడానికి నాల్గు రోజుల ముందు కామారెడ్డిలో నేనున్న ఇంటిముందు వాటన్నిటినీ పెట్టి కావ్యహోమం చేశాను.

7.  ఊళ్ళో వ్యవసాయం చేసిన మీరు తిరిగి చదువుపై ఎందుకు దృష్టి సారించారు?

జ:     అదొక బాధాకరమైన సంఘటన. 1965 వ సంవత్సరంలో పంట వేశాము. ఎండాకాలంలో కత్తెర వడ్లు అని అంటారు. మాకు మూడు ఎకరాల్లో వరిచేను ఉంది. మాకు కుంటనీరే ఆధారం. చేను పొట్టకొచ్చింది అంటే గింజ పిండి పడుతుందన్నమాట. కొద్దిరోజులైతే కోత కోయడానికి వీలుగా అవుతుంది. అప్పుడు మా నాన్నగారు నాగు కట్టారు ( పైసలకు మిత్తి లాగా అన్నమాట ). దానివల్ల మేము అప్పు పడ్డాము. నాన్నగారి వయసు రీత్యా నేను , సక్రియా అనే పద్నాలుగేళ్ల  పిల్లవాడు కలిసి వ్యవసాయం చేసేవాళ్ళం. మా కుంట పొంగి పొర్లింది. వర్షం వస్తోంది. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో మా పొలం ఉంటుంది. మధ్యలో ఉన్న అలుగు తెగ్గొడితే మా పొలం లోకి నీరు పారడం ఆగుతుంది. నేను పలుగు, పార పట్టుకొని వెళ్ళాను. మా అమ్మకు ఈ విషయం తెలిసి సక్రియాకు చెప్పడంతో ఆ అబ్బాయి వెనకాల వస్తున్నాడు. మా నాన్నగారు కొంతమందిని తీసుకొని బయలుదేరాడు. ఇవేవీ నాకు తెలియవు. వడివడిగా నడుస్తున్నాను. నేను వెళ్ళేటప్పటికే మూడెకరాల వరిపొలం మీద తెగిన కుంట నీళ్లు పారుతున్నాయి. దాంతో పాటు ఇసుక కూడా పొలంలో పడుతున్నది. నాకప్పుడు పంతొమ్మిదిన్నర ఏళ్ళు. ఆ బాధ తట్టుకోలేక జీవితం చాలిద్దామనుకొని ఆ కుంటలో దూకబోతుండగా వెనుక నుండి ఆ పిల్లవాడు ‘నేనొస్తా ఉండు’ అంటూ పరుగెత్తుకొని వచ్చాడు. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం పట్టుకొని స్పృహ తప్పిపోయేలా ఏడ్చాము. నేనక్కడే పడిపోయాను. మా నాన్నగారు పదిమందిని తీసుకొని వచ్చారు. కళ్ళముందే మూడెకరాల పంట నాశనం అవుతుంటే ఏ వ్యవసాయదారునికైనా గుండె ఎంత బాధగా ఉంటుందో చెప్పండి ( అప్పటి సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ ఆర్ద్రంగా ). అంటే దాదాపు అయిదారు పుట్ల పంట దెబ్బ తిన్నది. ఇది జరిగిన తర్వాత ఈ వ్యవసాయం వద్దని, పాలెం ఓరియెంటల్ కళాశాలలో చదివితే తెలుగు పండిట్ పోస్ట్ వస్తుందని తెలిసి పోదామని నిర్ణయించుకున్నాను. మా స్నేహితులు యాదగిరి, బి. వెంకట్ రెడ్డి, ఆనంతరాములుతో కలిసి పాలెం చేరుకొని ఫారాలు నింపి ఇచ్చాము. అట్లా అక్కడ డిప్ ఓ ఎల్ లో చేరాము.

8. పాలెంలో మీ చదువు ఏవిధంగా కొనసాగింది? అక్కడి అనుభవాలు ఏవైనా మాకోసం చెప్పండి.

జ:     అప్పుడు పాలెం కళాశాలలో తెలకపల్లి విశ్వనాథ శర్మగారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గొప్ప సంస్కృత పండితులు. మొదటి సంవత్సరం మధ్యలో పంతంగి చిన పుల్లయ్యగారని ( హైస్కూలులో తెలుగు పండితునిగా చేసేవారు ) ఆయన వచ్చి మా కళాశాలలో పద్యాలు చెబుతుండేవారు. ఆయన పద్యాలు పాడుతుంటే నేను పరవశించి పోయేవాడిని. మా స్నేహితులు రుక్నొద్దీన్, యాదగిరి, వెంకట్ రెడ్డి, అనంతరాములు మేమంతా ఒకే తాలూకాకు చెందినవాళ్ళం కాబట్టి ఒక జట్టుగా ఉండేవాళ్ళం. తర్వాత శ్రీ రంగాచార్య గారు మాకు గురువుగా వచ్చారు. ఆయన వచ్చిన తరువాత సాహిత్యం, కవులు, లోకం తెలిసింది. అంతవరకు గురువులు చెప్పింది మనసులోనికి తెచ్చుకోవడం తప్ప ఏమీ తెలియదు. ఎప్పుడు, ఏది, ఎక్కడ, ఎట్లా పుడుతుంది? సాహిత్యం ఎట్లా వికసిస్తుంది అనే విషయాలను ఆయన ద్వారానే తెలుసుకున్నాం.  చారిత్రక దృష్టి, సాంస్కృతిక దృష్టి ఆయన వల్లనే ఏర్పడ్డాయి.
           డిప్ ఓ ఎల్ చదువుతున్న కాలంలో వారానికి ఒకసారి ఉపన్యాసపోటీలు జరిగేవి. నేను ఒక కావ్యం ప్రిపేరై అరగంట మాట్లాడేవాడిని. దాంతో గొప్ప ఉపన్యాసకుడు వస్తున్నాడని అనుకునే పరిస్థితి ఏర్పడింది ( నవ్వుతూ ). కళాశాల చుట్టూ వర్ధమానపురం అని ఉంటుంది. మా గురువుగారు మమ్మల్ని తీసుకొని శాసనాలు ఎట్లా చదవాలో, ఎట్లా చూడాలో చెప్పారు. సాహస లక్షణాలు మాలో ఎక్కువగా ఉండేవి. దాదాపు మూడు కిలోమీటర్ల చెరువును రెండుసార్లు ఈదాము. స్నేహితులమందరం పాలెం నుండి శ్రీశైలం వరకు భజనలు చేస్తూ నడుచుకుంటూ పోయాము. ఈ సందర్భంలో ఆర్ ఎస్ ఎస్ తో పరిచయం ఏర్పడింది. సంఘ శాఖలు నడిచేవి. నేనొక్కడినే శాఖలకు వెళ్ళేవాడిని. అక్కడే బావి దగ్గర స్నానం చేసేవాడిని. ఈ సమయంలో భోజనానికి ఇబ్బంది ఏర్పడింది. రెండవ సంవత్సరంలో సుబ్బయ్యగారిని అడిగితే హాస్టల్లో సీటు ఇచ్చారు. పాలెం కళాశాల వెనుక వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. ఉదయమే లేచి శాఖకు పోయి బావిదగ్గర స్నానం చేసి, వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడిని. అప్పుడే ‘వెంకటేశ్వరా’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను. దీనికంటే ముందే ‘నవయుగాల బాట! నార్లమాట!’ అనే శతక ప్రభావంతో ‘బిడ్డ మదిని నమ్ము! రెడ్డి మాట!’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను.
           పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పాలి మీకు. హాస్టల్ లో అన్ని గదులు లోపలికి ఉంటే నేనుండే గది బయటకు ఉండేది. ఒకసారి మా ప్రిన్సిపాల్ గారు వచ్చి తలుపు తట్టారు. ఆ టైమ్ లో నేను ‘వేయిపడగలు’ చదువుతున్నాను. అదిచూసి “పరీక్షలు పట్టుమని పదిహేను రోజులు లేవు. వేయిపడగలు చదువుతున్నావా?” అన్నారు. ‘మొత్తం సిలబస్ చదివాను సార్’ అన్నాను. “అయినా సరే మళ్లీ చదువు ఫస్ట్ క్లాస్ రావాలి. మన కళాశాలకు పేరు రావాలి” అన్నారు. వెంకటేశ్వర స్వామి దయ, గురువుల బోధ వల్ల యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇలాంటివెన్నో జ్ఞాపకాలు.

8. పాలెంలో మీ చదువు ఏవిధంగా కొనసాగింది? అక్కడి అనుభవాలు ఏవైనా మాకోసం చెప్పండి.

జ:     అప్పుడు పాలెం కళాశాలలో తెలకపల్లి విశ్వనాథ శర్మగారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గొప్ప సంస్కృత పండితులు. మొదటి సంవత్సరం మధ్యలో పంతంగి చిన పుల్లయ్యగారని ( హైస్కూలులో తెలుగు పండితునిగా చేసేవారు ) ఆయన వచ్చి మా కళాశాలలో పద్యాలు చెబుతుండేవారు. ఆయన పద్యాలు పాడుతుంటే నేను పరవశించి పోయేవాడిని. మా స్నేహితులు రుక్నొద్దీన్, యాదగిరి, వెంకట్ రెడ్డి, అనంతరాములు మేమంతా ఒకే తాలూకాకు చెందినవాళ్ళం కాబట్టి ఒక జట్టుగా ఉండేవాళ్ళం. తర్వాత శ్రీ రంగాచార్య గారు మాకు గురువుగా వచ్చారు. ఆయన వచ్చిన తరువాత సాహిత్యం, కవులు, లోకం తెలిసింది. అంతవరకు గురువులు చెప్పింది మనసులోనికి తెచ్చుకోవడం తప్ప ఏమీ తెలియదు. ఎప్పుడు, ఏది, ఎక్కడ, ఎట్లా పుడుతుంది? సాహిత్యం ఎట్లా వికసిస్తుంది అనే విషయాలను ఆయన ద్వారానే తెలుసుకున్నాం.  చారిత్రక దృష్టి, సాంస్కృతిక దృష్టి ఆయన వల్లనే ఏర్పడ్డాయి.
           డిప్ ఓ ఎల్ చదువుతున్న కాలంలో వారానికి ఒకసారి ఉపన్యాసపోటీలు జరిగేవి. నేను ఒక కావ్యం ప్రిపేరై అరగంట మాట్లాడేవాడిని. దాంతో గొప్ప ఉపన్యాసకుడు వస్తున్నాడని అనుకునే పరిస్థితి ఏర్పడింది ( నవ్వుతూ ). కళాశాల చుట్టూ వర్ధమానపురం అని ఉంటుంది. మా గురువుగారు మమ్మల్ని తీసుకొని శాసనాలు ఎట్లా చదవాలో, ఎట్లా చూడాలో చెప్పారు. సాహస లక్షణాలు మాలో ఎక్కువగా ఉండేవి. దాదాపు మూడు కిలోమీటర్ల చెరువును రెండుసార్లు ఈదాము. స్నేహితులమందరం పాలెం నుండి శ్రీశైలం వరకు భజనలు చేస్తూ నడుచుకుంటూ పోయాము. ఈ సందర్భంలో ఆర్ ఎస్ ఎస్ తో పరిచయం ఏర్పడింది. సంఘ శాఖలు నడిచేవి. నేనొక్కడినే శాఖలకు వెళ్ళేవాడిని. అక్కడే బావి దగ్గర స్నానం చేసేవాడిని. ఈ సమయంలో భోజనానికి ఇబ్బంది ఏర్పడింది. రెండవ సంవత్సరంలో సుబ్బయ్యగారిని అడిగితే హాస్టల్లో సీటు ఇచ్చారు. పాలెం కళాశాల వెనుక వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. ఉదయమే లేచి శాఖకు పోయి బావిదగ్గర స్నానం చేసి, వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడిని. అప్పుడే ‘వెంకటేశ్వరా’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను. దీనికంటే ముందే ‘నవయుగాల బాట! నార్లమాట!’ అనే శతక ప్రభావంతో ‘బిడ్డ మదిని నమ్ము! రెడ్డి మాట!’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను.           పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పాలి మీకు. హాస్టల్ లో అన్ని గదులు లోపలికి ఉంటే నేనుండే గది బయటకు ఉండేది. ఒకసారి మా ప్రిన్సిపాల్ గారు వచ్చి తలుపు తట్టారు. ఆ టైమ్ లో నేను ‘వేయిపడగలు’ చదువుతున్నాను. అదిచూసి “పరీక్షలు పట్టుమని పదిహేను రోజులు లేవు. వేయిపడగలు చదువుతున్నావా?” అన్నారు. ‘మొత్తం సిలబస్ చదివాను సార్’ అన్నాను. “అయినా సరే మళ్లీ చదువు ఫస్ట్ క్లాస్ రావాలి. మన కళాశాలకు పేరు రావాలి” అన్నారు. వెంకటేశ్వర స్వామి దయ, గురువుల బోధ వల్ల యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇలాంటివెన్నో జ్ఞాపకాలు.

9. మీ ఉద్యోగ ప్రస్థానం ఎక్కడినుండి మొదలైంది?

జ:   పరీక్షలు అయిపోయి ఇంటికి వచ్చాను. డిప్ ఓ ఎల్ మీద ఉద్యోగం వస్తుందని తెలిసి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మా మిత్రులు బి ఓ ఎల్ చదవడానికి వెళ్లారు. నేను మా మేనమామ ఊరు మాడుగులకు వెళ్ళాను. అక్కడే రిజల్ట్స్ తెలిసి, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినట్లు తెలిసింది. అక్కడ హైస్కూలులో హెడ్ మాస్టర్ ‘రామ్ సింగ్’ గారు. ఊరి సర్పంచ్ రామలింగారెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. మన ఊరి మేనల్లుడు ఇంత సాధించాడు. “మన ఊళ్లో తెలుగు పండిట్ లేడు కాబట్టి ఇతని సర్టిఫికెట్లు తెప్పించి ఆ ఉద్యోగం ఇద్దాం” అనుకున్నారు. ఆ ఊళ్ళో రాజకీయ నాయకుడు జైపాల్ రెడ్డి అప్పట్లో ‘ఆంధ్ర జనతా’ పత్రిక చూస్తున్నాడు. యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన ద్వారా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కు చెప్పించి నాకు జూనియర్ తెలుగు పండితునిగా ఏ ట్రైనింగ్ లేకుండానే  నియమింప చేశారు. ఆరోజు జూన్ 11, 1967. మరుసటి నుండే పాఠాలు చెప్పుమన్నారు ఆర్డర్స్ రాకుండానే. ఆ తర్వాత 11 రోజులలో ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి నా సర్టిఫికెట్లు తీసుకొని అధికారికంగా జూన్ 21, 1967 నుండి ఉద్యోగంలో చేరాను. నా మొట్టమొదటి జీతం 98 రూ.25 పైసలు. తర్వాత నాలుగైదు నెలల్లోనే పెరిగి 120 రూ. అయింది. ఏడు పీరియడ్లు ఉండేవి రోజూ. 11,12 తరగతులకు హిందీ చెప్పేవాళ్లు లేకపోతే హిందీ కూడా చెప్పాను.
          ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ గురించి చెప్పాలి మీకు. నేను ఉద్యోగంలో చేరిన నాలుగైదు నెలలకు పాఠశాల తనిఖీ జరిగింది. కామేశ్వరీ దేవి అని గెజిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. తరువాత డి ఇ ఓ అయినారు.
నేను నాల్గవ తరగతి క్లాసులో పాఠం చెబుతుండగా వచ్చి కూర్చున్నది. నేను ఆమె ముందు నాకున్న శబ్దశక్తి, ప్రౌఢశక్తి అంతా ఉపయోగించి (గట్టిగా నవ్వుతూ)50 నిమిషాలు పాఠం చెప్పాను. అప్పుడామె “నువ్వు పాఠం బాగా చెప్పావు. కానీ పిల్లల బుర్రల్లోకి ఒక్కముక్క కూడా పోలేదు. నువ్వు పాఠం చెప్పింది నాకు కానీ పిల్లలకు కాదు. నువ్వు పిల్లలతో ఆడుతూ పాడుతూ పాఠం చెప్తావని మీ హెడ్ మాస్టర్ చెప్పారు. నీకున్న జ్ఞానం అంతా నాకు తెలవాలని చెప్పావు” అన్నది. “పిల్లల స్థాయికి తగ్గి చెప్పాలా అమ్మా!” అన్నాను వినయంగా. అప్పుడామె “కాదు. ఆ పిల్లలను నీ మీదకు లాక్కొన్నట్లు చెప్పాలి. వినేవాళ్లు ఏ స్థాయి వారో దానికి తగినట్లు ఉండాలి కానీ నీ భాషాజ్ఞానం చూపించడం కాదు” అన్నది. అది ఎప్పటికీ మర్చిపోలేదు. 1967 నుండి 1973 వరకు ఆరు సంవత్సరాలు ఆ పాఠశాలలో పని చేశాను.

10. “తెలుగు పొడుపు కథలు” అనే అంశంపై పరిశోధన చేయాలనుకున్న ఆలోచనకు ప్రేరణ ఏమిటి?

జ:  మాడుగుల పాఠశాల తర్వాత సెప్టెంబర్ 1, 1973 నుండి 1985 వరకు దాదాపు 12 సంవత్సరాలు నేను కామారెడ్డి డిగ్రీ కళాశాలలో మొదట జూనియర్ లెక్చరర్ గా, తర్వాత లెక్చరర్ గా పనిచేశాను. ఆ మధ్యకాలంలోనే ‘తెలుగు పొడుపు కథలు’ అనే అంశంపై పరిశోధన చేశాను. అసలు అది చేయాలని అనుకోలేదు. నాకు భారతీయ చరిత్ర మీద బాగా అభిమానం. కాబట్టి ఆ విషయాలను రాసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. అపుడు శాఖాధ్యక్షులు బిరుదురాజు రామరాజు గారు. నేను అంతకుముందు పాఠశాలలో పనిచేసినప్పుడే పిల్లలతో, ఊరివాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెబుతుంటే ఐదారు వందల పొడుపు కథలు సేకరించి పెట్టాను. ఒకవేళ చారిత్రక కావ్యాల మీద పి హెచ్ డి కుదరక పోతే పొడుపుకథల గురించి అడగాలనుకున్నాను. రామరాజు గారికి జానపదం అంటే ఇష్టం. జానపదంలో  పొడుపుకథలు ఒక భాగమే కదా! ఫారంలో నేను ‘చారిత్రక కావ్యాలు-సమగ్ర పరిశీలన’ అని రాశాను. రామరాజుగారితో పాటు సినారె లాంటి పెద్దవాళ్ళున్నారు. “చారిత్రక కావ్యాలు అయిపోయింది కదా! నువ్వేం చేస్తావు” అన్నారు. అప్పటికే చారిత్రక కావ్యాల మీద పి హెచ్ డి చేసిన సీతా కళ్యాణి గారు తెలుగు శాఖలోనే ఉన్నారు. ‘వేరే దృక్పథంతో చేస్తాను’ అన్నాను. “ఆమె సమగ్రంగా చేసింది. నువ్వు ఇంకా ఏదైనా చేయి” అన్నారు. నా దగ్గర సిద్ధంగా ఉన్న రెండువందల పొడుపుకథలు చూపించాను. ఎన్ని ఉన్నాయని అడిగారు. ఐదారు వందలు ఉన్నాయన్నాను. వారు సంతృప్తి పడి ‘ఇదే ఇస్తున్నాం’ అన్నారు. అట్లా దానిమీద పరిశోధన చేయడం జరిగింది. అప్పటికే నేను రాసిన భగవద్గీత గేయకృతి, రెడ్డిమాట, గాంధీ తాత అనే పుస్తకాలు కూడా వారికి చూపించాను.
         ఇంటర్వ్యూ అయిపోగానే బయటకు వచ్చి నిలుచున్నాను. కాసేపటికి నారాయణరెడ్డి గారు వచ్చి నన్ను పిలిచి “ఇదిగో,  నేను వేసుకున్నాను. ఆర్డర్ ఇప్పుడు వస్తుంది. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి పో” అన్నారు. అట్లా ఆయన నేతృత్వంలో 1982 లో పి హెచ్ డి డిగ్రీ పొందాను.  వీటిని తెలుసుకోవడం కోసం దేశమంతటా తిరిగాను. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా తిరిగాను. ఆ సమయంలో రామరాజు గారు తెలుగు జానపద సాహిత్యంలో పరిశోధన చేసినప్పుడు తొలి దశలో ఆయనకుఎన్ని అనుభవాలున్నాయో నాకూ అన్ని ఉన్నాయి. దాదాపు ఏడెనిమిది వేల పొడుపుకథలు సేకరించాను.

11. అన్ని పొడుపు కథలను ఎలా సేకరించగలిగారు? వాటి కోసం ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు?


జ:    కామారెడ్డి బస్ స్టాప్ లో పొడుపు కథలను ‘గుజిలీ’ ప్రతుల మీద ( రఫ్ కాగితాల పైన ) ‘చమత్కారాల్, చమత్కారాల్’ అని అమ్మేవాళ్లు. ఐదారువందలు అట్లా సేకరించాను. తెలంగాణాలో కొన్ని జిల్లాలు తిరిగాను. రాజాపూర్ దగ్గర మల్లేపల్లి అని ఒక ఊరుంది. నా సహోద్యోగి నారాయణాచారి సొంత ఊరది. రాజాపూర్ లో బస్సు దిగి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. బస్టాండ్ లో దిగి నడుస్తున్నాను. ఉంటే నాతో పాటు నలుగురైదుగురు ఆడవాళ్లు, ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు కూడా బస్సు దిగారు. వారు ఊరి నుండి వచ్చే బండికోసం ఎదురుచూస్తూ నేనెవరో ఎందుకొచ్చానో కనుక్కుని “ఊళ్ళోకి వెళ్ళి ఫలానాయన గురించి కనుక్కొని ఆ ఇంటికి వెళ్లి మా కోసం బండి పంపించుమని చెప్పుమన్నా”రు. నేను వెళ్లి వాళ్ళు చెప్పిన చోటికి వెళ్లేసరికి ఆడవాళ్ళ కోసం బండి ఏర్పాటు చేస్తున్నారు. ఊళ్ళో మా స్నేహితుడు లేడు. నేను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అక్కడ ఒక ‘కొలిమి దాటి’ ఉంది. అక్కడ కొంతమంది నాగళ్లు, కర్రు, కుండి ఇలాంటివి చేయించుకోవడం కోసం కూర్చొని ఉన్నారు. అక్కడ ఒకాయన నన్ను చూసి ‘ఎవరు నువ్వు’ అని అడిగాడు. తెలంగాణలో పొడుపు కథలను ‘తట్లు’ అంటారు. కొందరు సమస్యలు, సమీక్షలు అంటారు. పొడుపు కథల సేకరణకు వచ్చానని చెప్పాను. అవి ఎలా ఉంటాయి? అన్నాడు. నేను ఒక రెండు ‘తట్లు’ వేశాను. కొలిమి దగ్గర కూర్చొని ఉన్నాయన మరో రెండు వేశాడు. అక్కడి నుండి వెళ్తున్న పిల్లలను పిలిచాడు. వాళ్ళూ చెప్పారు. అందులో ఒక పిల్లవాడు మా అమ్మకు ఇవి చాలా వస్తాయని ఆమెను తీసుకురావడానికి వెళ్ళాడు. మీరు ఆశ్చర్యపోతారు. ఈ కొద్ది సమయంలో 84 పొడుపు కథలు సేకరించాను. ఈలోపు పోయిన బండి ఆడవాళ్లను తీసుకొని వచ్చింది. వాళ్ళు నేను అక్కడే ఉండడం చూసి ఇంటికి పోయి ఒక అబ్బాయిని పంపించి నన్ను భోజనానికి రమ్మన్నారు. సంతోషంతో వాళ్లింటికి వెళ్ళాను. వాళ్ళు ఒక ఇరవై దాకా చెప్పారు. కొన్ని పదాలను కట్ చేస్తూ చెప్పారు. అశ్లీలాలు కావు కానీ శరీర భాగాలు. అట్లాంటివి కొన్ని ఉంటాయి పొడుపు కథల్లో. ఇదొక అపూర్వ అనుభవం.
            అక్కడక్కడ తెలిసిన మిత్రులు ఉంటే నేను వస్తున్నానని ఉత్తరాల ద్వారా తెలిపి, వెళ్లేవాడిని. ఘనపురంలో కొన్ని, మల్లేపల్లిలో ముఖ్యంగా స్కూల్ పిల్లల దగ్గర వాళ్ళ తల్లుల దగ్గర సేకరించినవి, ఇట్లా ఎన్నో. రాయలసీమలో ‘మారు తట్లు’, అంటారు.’మారు కథలు’ అని కూడా వ్యవహారంలో ఉంది. తంగిరాల వేంకట సుబ్బారావు అని తాను సేకరించినవి పంపారు. వీటన్నిటినీ దాదాపు 20 చాప్టర్లుగా విభజించుకున్నాను. మా హైస్కూలు గురువుగారు ముకురాల రామారెడ్డి గారు ‘దేవరకొండ దుర్గం’ అని పరమాద్భుత కావ్యం రాశారు. ఆయన ప్రభావం మాపైన చాలా ఉంది. ఆయన దగ్గరికి వెళ్లి, నేను తయారు చేసుకున్న పొడుపు కథల విశ్లేషణను చూపించాను. అది చూసి ఆయన “ఎప్పుడు కూడా తక్కువ చాప్టర్లలో ఎక్కువ విషయం ఉండాలి” అని చెప్పారు. ఆయన సూచనలను పాటిస్తూ 12 చాప్టర్లకు కుదించుకున్నాను. 850 పుటల పరిశోధనా గ్రంథం అయింది. సుదర్శన్ అని కామారెడ్డిలో నా స్నేహితుడు ఉన్నాడు. ఆయన, మరికొందరి సహాయంతో అచ్చువేశాను. కామరెడ్డిలోనే ఆవిష్కరించి ఆయనకే అంకితం ఇచ్చాను. సుదర్శన్ చాలా గొప్పవ్యక్తి. PWD శాఖలో ఇంజనీరుగా పని చేసేవాడు. దివిసీమలో ఉప్పెన వస్తే, ఆ ఉప్పెనలో మునిగిన దీన్ దయాళ్ పురం అనే ఊరు నిర్మాణానికి సెలవు పెట్టి వెళ్లినవాడు. నేను కూడా ఏడు రోజులు అక్కడికి వెళ్లి ఉన్నాను.

ఆచార్య కసిరెడ్డిగారు రచించిన పుస్తకములు

12. జానపద సాహిత్యంపై మీ అధ్యయనం గురించి చెప్పండి.

జ:   నేను పొడుపు కథల కోసం తిరుగుతున్న సమయంలో ఒక ఊళ్ళో జానపద గేయాలు పాడారు.
“పోతుంటిరా జాణ పోతుంటిరా/ చార్ కమాను కట్టమీద పోతుంటిరా/ ఒగణ్ణి పండవెట్టి, ఒగణ్ణి ఎండవెట్టి/ ఒగని కోసం నేను పోతుంటిరా…” ఇది ఒక పొడవు కథాగేయం. ఇందులో ఒకరిని పండవెట్టి, ఒకరిని ఎండవెట్టి అన్నప్పుడు ఒక ఉత్కంఠ కలుగుతుంది. పొడుపుకథ ముఖ్య లక్షణమే అది. దీని వెనుక ఉన్న అర్థమేమిటని ఆలోచింపజేస్తుంది. రోకలిని పండబెట్టి, ఒడ్లను ఎండబెట్టి కుదురు కోసం, కుందెన కోసం పోతున్నానని దీని అర్ధం. ఇట్లా పొడుపు కథలే కాకుండా జానపద గేయాలను కూడా సేకరణ చేయడం జరిగింది. అలా సేకరించిన జానపద గేయాలను “పాలమూరు జిల్లా జానపద గేయాలు” అనే పేరిట రెండు సంకలనాలు వేయడం జరిగింది. ఈ పర్యటనలో ఇది నాకు ఉపకరించిన అంశం. దీనివల్ల జానపద సాహిత్యంపై అధ్యయనం చేసే అవకాశం చిక్కింది.
           ఖిల్లా గణపురం ఊరికి మా చెల్లెలిని ఇచ్చాం. అందువల్ల ఆ ప్రాంతంలో ఎక్కువ సేకరణ చేయడం జరిగింది. పాలెంకు దగ్గరగా ఉన్న శ్రీపురంలో ‘పాపకల్లు’ అనే ఊరులో సేకరించాను. ఈ ప్రాంతంలో వారు రాసిన పాటలను రాసుకుంటే కొన్ని వ్యవసాయ గీతాలుగా, కొన్ని హాస్య గీతాలుగా లభించాయి. అందులో ఒక స్త్రీ పాడినట్టుగా ఒక వ్యక్తి ఒక పాట పాడాడు.
“నేను వోతున్న పెండ్లికి జివాల రంగ
సిగ బిళ్ళ లేదని మోట బిళ్ళ వెట్టుకొని..!!నేను వోతున్న!!”
జివాలు అంటే గొర్రెలు, మేకలు అంటే చిన్న జీవులు అని అర్థం. పెండ్లికి పోవాలంటే ఆమె దగ్గర సొమ్ములు లేవు.
“గెంటీలు లేవని సొప్ప బెండ్లు వెట్టుకొని, వడ్డాణం లేదని వరి అంటు సుట్టుకొని…!!నేను వోతున్న!!”
చిట్టచివర్లో ముగింపు ఎంత కదిలిస్తుందంటే దీన్నే ఆధునిక కవిత్వంలో ‘హైలైట్’ అంటాము. “సంక పిల్ల లేదని, కుక్కపిల్ల నెత్తుకొని”  !!నేను వోతున్న!!
సంతానం లేకపోవడం వలన కుక్కపిల్లను తీసుకొని పోతున్నాననడంలో ఆమె ఆవేదన వ్యక్తమవుతుంది.
దీన్ని ఎంత లోతుగా నైనా వివరించవచ్చు. చివరలో ఒక చురుకు లాంటిది, కొరడా దెబ్బ లాంటిది, సందేశం లాంటిది ఉంటుంది. అంటే ముగింపు అనేది హృదయాన్ని కదిలించాలి.
          అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక పెద్దమనిషి నన్ను వాళ్ళ స్కూలులో జరిగిన కార్యక్రమానికి పిలిచారు. అక్కడ ఉపన్యసిస్తూ ఒక జానపద గేయాన్ని ఉదాహరించాను. ఆయన దాన్ని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందని నన్ను అడిగి ఆర్థిక సహాయం చేశారు. ఆ పుస్తకాన్ని ఆయనకే అంకితం ఇచ్చాను. అట్లా “పాలమూరు జిల్లా జానపద గేయాలు” , ఇద్దరు మిత్రుల సహకారంతో “రంగారెడ్డి జిల్లా జానపద గేయాలు” అచ్చు వేశాను. ఉన్నత పాఠశాలల, కళాశాలల లైబ్రరీలకు కూడా ఇచ్చాను. పొడుపు కథల పరిశోధనలో భాగంగా ఇదొక మంచి అవకాశం దక్కింది నాకు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు నేను ‘నూరు కథలు’ అని  పుస్తకం వేశాను. అందులో ఆంజనేయునికి, విభీషణునికి సంబంధించిన కథలు ఉంటాయి.  జానపదుల ఆలోచనే వేరు. అపర వాల్మీకులు వాళ్ళు( నవ్వుతూ). అందుకే అంతగా నాతో ఆ సాహిత్యం పెనవేసుకుంది.

13. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా మీరు స్థానం సంపాదించిన విధానం ఎటువంటిది?

జ:    1983 చివర్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు పోస్టులు ప్రకటించారు. ఒకటేమో ఖాళీ అయినటువంటిది. ఇంకొకటి నూతన నియామకం. రెండు వేర్వేరుగా పత్రికల్లో వచ్చాయి. రెండింటికీ అప్లై చేశాను. రెండింటి మధ్య తేడా ఎనిమిది నెలలు. కానీ రెండింటికి కలిపి ఒకేసారి ఇంటర్వ్యూ పెట్టారు. ఒక గమ్మత్తైన సంఘటన చెప్పాలి. నేను బస్సెక్కి నా బ్యాగు పైన పెట్టాను. దిగేటప్పుడు నా బ్యాగుతో పాటు పదిరూపాయల నోటు వచ్చింది. ఎవరిదని అడుగుదామంటే అప్పటికే దిగిపోయారు. నాతో పాటు ఉన్న నా స్నేహితుడు సుదర్శన్ అనుకోకుండా పదిరూపాయలు దొరికింది. నువ్వు ఇంటర్వ్యూలో తప్పక సెలెక్ట్ అవుతావు అన్నాడు (నవ్వుతూ).
         ఇంటర్వ్యూలో ఒక దాంట్లో నేను సెలెక్ట్ కాలేదు. ఇంకో పోస్టులో నా పేరు రెండవస్థానంలో ఉంది. అంటే మొదటి వ్యక్తి జాయిన్ కాకపోతే నాకు అవకాశం వస్తుంది. ఇంకా విచిత్రం ఆ మొదటి వ్యక్తి ఎవరో కాదు నా స్నేహితుడు రుక్నొద్దీన్. కానీ ఆ విషయం కూడా నాకు తెలియదు. ఆ సమయంలోనే మేము 20 రోజులు జానపద సెమినార్ నిర్వహిస్తున్నాము. అప్పుడు నేను, రుక్నొద్దీన్ తో ‘మీరు దేనికి సెలెక్ట్ అయ్యారు?’ అన్నాను. ‘దేనికేంటి?’ అన్నారాయన ఆశ్చర్యంగా. రెండు పోస్టులు కదా! ఒకటి రెగ్యులర్, రెండవది ప్లానింగ్ పోస్ట్ అన్నాను. “నాకు రెగ్యులర్ మాత్రమే తెలుసు. దానికే అప్లై చేశాను అన్నారాయన” కానీ ఆయనకు వచ్చింది రెండవ దాంట్లో. అంటే ఆయన దానికి కనీసం అప్లై కూడా చేయలేదు. ఎలా సెలెక్ట్ అవుతాడు? అందులోనే నాది రెండవ పేరు. నేను నేరుగా యూనివర్సిటీ లాయర్ బాబుల్ రెడ్డి గారిని కలిశాను. అక్కడ నారాయణ రెడ్డిగారనే మరో లాయర్ ఉన్నారు. ఆయన పర్వతరావు గారనే మరో లాయర్ దగ్గరకు తీసుకు వెళ్లారు. ఆయనకు విషయం వివరించాను. మరుసటి రోజుకల్లా ఆ పోస్టు పైన హైకోర్టు ‘స్టే’ ఇచ్చింది. ఎనిమిది నెలలు కేసు నడిచి నాకనుకూలంగా తీర్పు వచ్చింది. అప్లై చేసుకోని వ్యక్తి సెలెక్ట్ కావడమనేది టెక్నికల్ గా జరిగిన తప్పిదమే తప్ప ఎవరూ దీనికి కారణం కాదు. అట్లా నియమింపబడి 1985 మార్చి 19వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకునిగా చేరాను. 2006 వరకు దాదాపు 21 సంవత్సరాలు పని చేశాను. దీంట్లోనే రీడర్ గా, ప్రొఫెసర్ గా, తెలుగు శాఖ అధ్యక్షునిగా, బి ఓ ఎస్ అధ్యక్షునిగా పదవులు నిర్వహించాను.

14. “అండమాన్ లో ఆజన్మాంతం” అన్న రచన ఎవరిని ఉద్దేశించి రాసింది?

జ:   నేను హిందీ నుండి తెలుగులోకి చేసిన అనువాదాల్లో ముఖ్యమైనది స్వాతంత్ర్య వీర సావర్కర్ జైలు చరిత్ర . ఆయన జైలులో ఉండి రాసుకున్నది. 1911 లో జైలుకు వెళ్లిన ఆయన 20 సంవత్సరాలు జైలులోనే మగ్గిపోయాడు. ఆ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం మన దాశరథి జైలు గోడలమీద రాయడానికి ప్రేరణ నిచ్చింది. ఆయన జైలు గోడలమీద మరాఠీ భాషలో కవితలు రాసినాడు. జైలు నుండి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కమల, గోమంతక్, సముద్ర్  అనే పేరిట కావ్యాలుగా వచ్చాయి. మరాఠీలో ఆయన అప్పటి బ్రిటిష్ చట్ట ప్రకారం ఆజన్మాంత శిక్ష 50 సంవత్సరాలు. అతనికి రెండు ఆజన్మాంత శిక్షలు విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. వయసు 25 సంవత్సరాలు. అప్పుడాయన అన్నమాట. బ్రిటిష్ వారికి మా పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్నట్టుంది అని. ఆయన జైలు జీవితం గురించి అనువాదం చేయడానికి నాకు జాగృతి పత్రిక సంపాదకులు వడ్లమూడి రామ్మోహన్ రావు గారు ప్రేరకులు. జైలులో వీర సావర్కర్ మరాఠీలో రాసుకున్న ‘మాఝీ జన్మ్ ఠేప్’ అనే పుస్తకం “అండమాన్ కా ప్రియ ప్రవాస్” అని హిందీలో 500 పేజీల అనువాదంగా వచ్చింది. దానికి నేను చేసిన తెలుగు అనువాదం ‘అండమాన్ లో ఆజన్మాంతం’ రచనను జాగృతి పత్రికలో వరుసగా రెండు సంవత్సరాలు సీరియల్ గా వేశారు. ఈ పుస్తకం రెండు సార్లు అచ్చయింది. వీర సావర్కర్ కాళ్లకు సంకెళ్లు వేసి బ్రిటిష్ వాళ్ళు ఆయనను పెట్టిన చిత్రహింసలు మామూలువి కావు. ఇలా దేశం కోసం నరకయాతనలు పడిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినపుడు కరుణశ్రీ రాసిన “లాఠీ పోటులు పూల చెండ్లు చెరసాలల్ పెండ్లి వారిండ్లు ఏ/ కాఠిన్యంబైనన్ సుఖానుభవమే గాంధీ కళాశాలలో……” అనే పద్యాన్ని కోడ్ చేస్తుంటాను. అందరికీ దేశం మీద ప్రేమ, భక్తి కలగాలనే తాపత్రయం నాది.

15. మీ అనువాద రచనలను గురించి చెప్పండ

జ:  అనువాద గ్రంథాలలో ముఖ్యంగా ‘భగవద్గీత’ ను ముత్యాలసరాలలో అధ్యాపకునిగా ఉన్నప్పుడు అనువాదం చేశాను. తరువాత శంకరాచార్యుల ‘భజగోవిందం’ అనువాదం చేస్తే అది నాలుగుసార్లు అచ్చయింది. ఎక్కడైనా ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు ఆది శంకరాచార్యుల వారి గురించి చెబుతుంటాను.
“బాలస్తావత్క్రీడా సక్తః
తరుణస్తావత్ తరుణీ సక్తః
వృద్ధస్తావచ్చిన్తా సక్తః
పరే బ్రాహ్మణి కో‌పి న సక్తః”
పిల్లలు ఆటలు, యువతీ యువకులు పరస్పరాకర్షణ, వృద్దులకు తమకు సంబంధించిన చింత ఉంటే ఆ పరబ్రహ్మాన్ని గురించి దృష్టి పెట్టేదెవరు? దేవుడిని, దేశాన్ని గురించి ఆలోచించేదెవరు? దేశం దైవంతో సమానం. కాబట్టి ఆ దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే అని నా భావన. అది లేకుండా మన అస్తిత్వం లేదు కదా! ఎన్ని దురాగతాలు మన దేశంపై జరిగినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలగడం మన సంస్కృతి గొప్పదనం వల్లే సాధ్యమైంది. అని ఇలా చెబుతూ ఉంటాను.
అలాగే ‘శ్రీరామ రక్షా స్తోత్రం’ గేయ రూపంలో అనువాదం చేశాను. అందులో ఉన్న ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క గేయంగా అనువదించాను. ఇవన్నీ పత్రికలో వచ్చాయి. ఇది ముఖ్యంగా ‘కోవిడ్’ ప్రారంభంలో వచ్చింది. అందరూ పారాయణ చేసి ఆ మహమ్మారిని దూరం చేయాలని చేశాను. హనుమాన్ చాలీసా చౌపాయి ఏ బాణీలో ఉందో అదే బాణీలో అనువాదం చేసి వ్యాఖ్యానం రాశాను. అది ‘శివానంద భారతి’ అనే పత్రికలో నలభై నెలలు వరుసగా వచ్చింది. దీనిని వీరపట్నం (ఇబ్రహీం పట్నం) ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆ ఊరి వాళ్ళు అచ్చు వేశారు. ఇవి గాక వాజ్ పేయి గారు రచించిన హిందీ కవితల్ని కొన్ని గేయలుగా అనువదించాను. హిందీ వచన గ్రంథాల్ని కొన్నింటిని కూడా అనువాదం చేశాను. ‘Who are Aryans they?’ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ శాఖలో పనిచేసే ప్రొఫెసర్ కె.ఎల్.వ్యాస్ గారు హిందీలోకి ‘ఆర్య్ కౌన్ థే?’ అనే పేరుతో అనువదించారు. దానిని నేను ‘ఆర్యులు ఎవరు?’ అనే పేరుతో తెలుగులోకి అనువదించాను. ఇతిహాస సంకలన సమితి వారు నాలుగైదు సార్లు అచ్చు వేశారు.ఇవి కాకుండా ‘చిటగాంగ్ వీరగాథ’ , ‘దారి తప్పిన పంజాబ్’ అనే వాటిని కూడా హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేశాను.

16. గేయ సాహిత్యంలోని మాత్రా ఛందస్సు గురించి చెప్పండి.

జ:     నేను రచించిన గేయ సాహిత్యంలో ‘సింహగర్జన’ అనేది బాగా ప్రసిద్ధి చెందింది. అందులో దేశభక్తితో కూడిన గేయాలుంటాయి. ఎక్కువ ఖండగతిలో నడుస్తుంటాయి. విద్యార్థులకు చెప్పేటప్పుడు సులభంగా నేర్చుకునేలా ఉంటుందని ఖండగతిని గురించి చెప్పేవాడిని. త్రిస్ర గతి అనేది ‘తకిట తకిట తకిట’ అనే విధంగా నడుస్తుంది. దీనికి ఉదాహరణగా “నిన్ను గూర్చి పాడుకొందు/ నన్ను గూర్చి పాడుకొందు/ నిన్న నన్ను గన్న నేల గూర్చి పాడుకొందు” అంటూ నారాయణరెడ్డి గారు రాసిన గేయాన్ని ఉదహరించేవాడిని. చతురస్ర గతికి ‘సీతా రామా రామా సీతా’ ఇది ఎట్లా వేసుకున్నా సరిపోతుంది. దీనికి బసవరాజు అప్పారావు గారు రాసినటువంటి “నీలాలందం మేఘాలందం/ కలువల కన్నుల కాంతలు అందం/ అందాలన్నీ నీలో దాగి/ నాలో నాట్యం చేసేనే…. చివరి అక్షరం ‘నే’ అనేది పాడుతున్నప్పుడు దీర్ఘం తీయడం వల్ల నాలుగు మాత్రలై దానికొక అందం ఇస్తుంది. ఇలాంటివన్నీ పిల్లలకు వివరంగా చెప్పేవాడిని. ఇక మిశ్ర గతిని గురించి చెబితే ముత్యాలసరాలు మొత్తం మిశ్ర గతిలో నడుస్తుంది. ఉదాహరణకు “ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్” ఇందులో ‘ఒట్టి’ అనేది త్రిస్ర, ‘మాటలు’ చతురస్ర, ‘కట్టి’ త్రిస్ర, ‘పెట్టోయ్’ చతురస్ర..
          సాహిత్య రచనా శైలి అలవడడానికి వీటిని గురించి బాగా చెప్పేవాళ్ళం. నారాయణరెడ్డి గారు నాగార్జున సాగరం మొదలైనవి ఖండగతిలో ఉంటాయి.
వాటిని గురించి, అలాగే గజ్జెల మల్లారెడ్డి గారి ‘శంఖారావం’ దీనికి ఎక్కువగా నేను ఉదాహరించి చెప్తాను.
“స్వాతంత్ర్య గానాలు, స్వేచ్ఛా ప్రబోధాలు/ కవుల ఊహాలోక కమనీయ దృశ్యాలు……….
కను తెరచి వీక్షించరా….
ఈ నిజము కాదన్న వాడెవడురా”
పైన వాటిలో ఈ ‘రా’ అనేది రెండుసార్లు వచ్చింది. దానివల్ల ఆ రాగం తీయడంలో ఒక అందం ఏర్పడుతుంది. ఇది అయిదు మాత్రలుగా కొనసాగుతుంటుంది.
       ఖండగతి అనేది అయిదు మాత్రల కాలం. త్రిస్ర, చతురస్ర, ఇవి రెండూ కలిసి మిశ్రగతి. ఆ తరువాత ఖండగతి. ఇవి కాకుండా గిడుగు సీతాపతి గారు సంకీర్ణ గతి అని చెప్పారు. ఇందులో రెండు ఉండొచ్చు. అయిదు ఉండొచ్చు. అంటే నియమం లేదు. కలగాపులగంగా ఉంటుంది. ఇన్ని గతులు ఉండగా దేనికీ అందక ఒక రాగంలో నడుస్తూ ఉంటుంది. దాన్ని ఏమనాలి అనుకొని ఛందశ్శాస్త్రంలో పని చేసిన మేమంతా దాన్ని స్వరగతి అన్నాం. వేదం ‘స్వరగతి’లో ఉంటుంది. ఈ రాగాలను మనం సంకీర్తనల్లో చూస్తాం. ఆలాపన నడుస్తూనే ఉంటుంది. రఘురామయ్య గారు ఆలాపన చేస్తే చేంతాడంత ఉంటుందంటారు. దానికి ఇక్కడి వరకు అనే నియమం లేదు. సాహిత్య విద్యార్థులలో గేయాలను గురించి ఆలోచించేలా, రచనా శక్తిని ప్రోత్సహించేలా ఈ విషయాలు చెప్పడం జరిగేది. జానపద సాహిత్యంలో కూడా ఇవే గతులు ఉంటాయి

17. “అనువర్తిత జానపద సాహిత్యం” అంటే ఏమిటి?

జ:   మంచిప్రశ్న. ఇంతకు ముందు మీకు చెప్పాను కదా! జానపద సాహిత్యంలో కూడా గతులు ఉంటాయని. కానీ రాగాలు భిన్నంగా ఉంటాయి. వాటిని బాణీలు అంటాం. దాన్ని కూడా ప్రత్యేకంగా ఏం చేశామంటే ఉదాహరణకు “నందామయా గురుడ నందామయా/ ఆనంద దేవికి నందామయా” ఇది పాతబాణీ. దీన్ని అనుసరించి “నందామయా గురుడ నందామయా/ రామ జన్మాభూమి చూద్దామయా” అని ఎవరైనా రాశారనుకోండి. దీనిని ‘అనువర్తిత జానపదం’ అనాలని జానపద సాహిత్య కారులు నిర్ణయించారు. విమర్శకులు దీనిని మొదట ‘నకిలీ జానపదం’ అన్నారు. నకిలీ జానపదం అంటే బాగుండదు కదా! ఎందుకంటే పొదుపు ఉద్యమం, కుటుంబ నియంత్రణ, వ్యాపార సంస్థలు ప్రచారం కోసం పెట్టుకున్నవి, ఇంకా ఎన్నో సమాజ పరమైన అంశాలు ఇవన్నీ జానపదాల్లో వస్తుంటే ఇట్లా అనడం సరికాదని వీటిని అప్లైడ్ ఫోక్ సాంగ్స్, అప్లైడ్ ఫోక్ పోయెట్రీ, అప్లైడ్ ఫోక్ లిటరేచర్ అని పేరు పెట్టారు. తెలుగులో దీనికి జానపద సాహిత్యకారులందరమూ వీటిని అనువర్తిత జానపద పాటలు , అనువర్తిత జానపద కవిత్వం, అనువర్తిత జానపద సాహిత్యం అని పేర్కొన్నాం. నేను కూడా ఈ పద్ధతులో కవిత్వం రాశాను. ప్రత్యేకంగా జానపద సాహిత్యం అని పుస్తకం వేయలేదు కానీ ఆయా సందర్భాలలో రాసినవి 60, 70 గేయాలవరకు ఉంటాయి. ఇట్లా సాహిత్య వికాసంలో పద్యం, గేయం, వచనం ఇవన్నీ వచ్చాయి.

18.  ‘గోమాత’ మీద శతకం రాయడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?

జ:    ఉంది. మా అమ్మ పేరు ద్రౌపదమ్మ. మమ్మల్ని పెంచి పెద్ద చేసిన నడిపి పెద్దమ్మ శాంతమ్మ. మా తమ్ముని పుట్టుకలో మా పెద్దమ్మ నర్సమ్మ చనిపోయింది. అయితే నేను పుట్టిన సమయంలో చాలా బలహీనంగా ఉండి ‘బతకడు’ అనుకున్నారట. నాకు మూడు నెలల వయస్సులో ఏది తాగినా ఇమిడేది కాదట. అటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు చేసేది ఏమీ లేక గోమాతను నమ్ముకొని ఏది అవుతే అదవుతుందని, ఆవు నుండి అప్పుడే పితికిన చెంబెడు వేడి పాలను నా గొంతులో పోశారట. అది ఔషధంగా పనిచేసి బతికి బట్ట కట్టాను. అందుకే ముందు మా అమ్మ , ఆ తర్వాత గోమాత నాకు అమ్మ. ఆ తర్వాత నాకేదో గండం ఉందని ఎవరో చెప్పారని, సిరిసిన గండ్ల ఊరులో ‘గట్టు జాతర’ అని చేస్తారు. అక్కడ దేవాలయంలో రాముడు మా ఇలవేలుపు. ఆ సందర్భంలో ఆ గండం నుండి బయటపడడానికి నా చేత ‘గండదీపం’ మోయించి చుట్టు తిప్పారట. పెద్దయిన తర్వాత ఈ విషయాలు తెలిసి ‘గోరక్షణ’ శతకం, ‘సిరిసిన గండ్ల రామ’ శతకం రాశాను.

19. వివిధ పత్రికలకు సంపాదకత్వం వహించారు కదా. ఆ సందర్భాలను వివరించండి.


జ.  ఇది నా జీవితంలో సుదీర్ఘ ప్రస్థానమని చెప్పొచ్చు. అనేకమైన పత్రికలకు సంపాదకత్వం వహించాను. ఇప్పటికీ విరమించలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు నేను రెండు, మూడు పత్రికలకు సంపాదకత్వం వహించాను. షాద్ నగర్ దగ్గర వెలసిన రామకోటి జపయజ్ఞ ఆశ్రమ నిర్వాహకులు నిత్య శుద్ధానంద గిరి స్వామి. ఆ ఆశ్రమం నుండి ‘గీతాజ్ఞాన యోగ సమాచార్’ అనే పత్రికను 1989 ప్రాంతంలో ప్రారంభించారు. స్వామి వారి ప్రేరణతో నేను 21 సంవత్సరాలు దానికి సంపాదకునిగా ఉన్నాను. అధ్యాపకునిగా ఉన్నప్పుడే ‘విశ్వహిందూ’ మాసపత్రికను చూసేవాడిని. గత 23 సంవత్సరాలుగా ఇప్పటికీ ఆ పత్రికకు సంపాదకునిగా ఉన్నాను. భాగ్య నగర్ లో గాంధీ ఆసుపత్రి వెనకాల ‘శివానందాశ్రమం’ వారు ‘శివానంద భారతి’ పేరుతో మాసపత్రికను నిర్వహిస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అది నిరాఘాటంగా సాగుతోంది. దానికి ఇప్పటికీ సంపాదకునిగా కొనసాగుతున్నాను. ఒక్కో సందర్భంలో నాలుగైదు పత్రికలను కూడా చూశాను. ‘పుష్పగిరి భారతి’ అనే పత్రికకు నాలుగేళ్లు సంపాదకునిగా ఉన్నాను. ‘సాధన’ అనే మాస పత్రికకు ఐదేళ్లు సంపాదకునిగా ఉన్నాను. ‘ధర్మ సారథి’ అనే ఆధ్యాత్మిక మాస పత్రికను రెండేళ్లు చూశాను.

20. తిరుమల తిరుపతి దేవస్థానంలో “హిందూ ధర్మ ప్రచార పరిషత్” కార్యదర్శిగా చేసిన విశేషాలు చెప్పండి.

జ:     నేను పదవీ విరమణ చేసిన తరువాత రెండు సంవత్సరాలు తిరుపతి దేవస్థానంలో “హిందూ ధర్మ ప్రచార పరిషత్” కార్యదర్శిగా ఉండాల్సివచ్చింది. ఒకసారి ‘రమణీయ రామాయణం’ అనే పేరుతో దేవస్థానం వారు ప్రసంగాలు నిర్వహించారు. నేను, కోవెల సుప్రసన్నాచార్య గారు పాల్గొన్నాము. అంతకు మునుపు పరిషత్తుకు రాళ్లబండి కవితా ప్రసాద్ గారు కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఈవో ఐ.వై.ఆర్ కృష్ణారావు గారు తేనీటికి పిలుస్తున్నారని మాకు పిలుపు వచ్చింది. నేను, సుప్రసన్నాచార్య గారు వెళ్ళాం. కృష్ణారావు గారు నాతో “కసిరెడ్డి గారూ! పదవీ విరమణ అయ్యాక ఏం చేస్తున్నారు? ఇక్కడ కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది వచ్చేయండి”. అన్నారు. “నేనిక్కడ తట్టుకొని నిలబడగలుగుతానా?” అన్నాను. “మేమంతా ఉండడం లేదా? మనకు అమ్మవారు, అయ్యగారు ఉన్నారు. వాళ్లు చేయమంటున్నారు. మేము చేస్తున్నాం.” అంటూ పద్మావతీ వేంకటేశ్వరుల చిత్రపటాలు చూపించారు. నవ్వుతూ అంగీకరించాను.20 రోజుల తర్వాత ఆర్డర్ పంపించారు. ఆయన కాలంలో ఆరు నెలలు, తర్వాత వచ్చిన ఎల్. వి. సుబ్రహ్మణ్యం గారి కాలంలో ఏడాదిన్నర చేశాను.
          అక్కడ ఉన్నప్పుడు ‘శుభప్రదం’ అనే పేరుతో బాలబాలికలకు ఉపయోగపడే పుస్తకం వేశాను. విద్యార్థులను మంచి వైపు నడిపించే శిక్షణ ఇవ్వడానికి ‘సదాచారం’ పేరుతో వేసిన పుస్తకంతో పాటు మొత్తం ఏడు పుస్తకాలు వేశాను. అన్నీ దేవస్థానం వారే వేశారు. ‘యుగయుగాల్లో హిందూ ధర్మం’ అనే దాన్ని మూడు లక్షల కాపీలు వేసి దేవస్థానం వారే అందరికీ పంచిపెట్టారు. అంతేకాక తరిగొండ వెంగమాంబ రచించిన ‘వేంకటాచల మాహాత్మ్యం’ మనందరికీ తెలుసు. పోతన స్థాయిలో ఉన్న అద్భుతమైన పద్యకావ్యమది. దాన్ని చాలా సరళంగా 48 పేజీల్లోకి మార్చి ‘పద్మావతీ శ్రీనివాస కల్యాణం’ అనే పేరుతో రాస్తే దాన్ని ప్రచురించారు. ‘నారాయణ వనం’ లో జరిగే బ్రహ్మోత్సవాలలో 30 వేల కాపీలు అచ్చు వేసి పంచారు. అట్లా మూడు సంవత్సరాలు పంచారు. అక్కడ ఉన్నన్ని రోజులు “జీవితంలో శక్తి తగ్గిపోయింది. రక్తి కొంత ఉంది. భక్తి ఉంది. ఇక్కడికి నన్ను రప్పించి ముక్తి ప్రసాదించావు భగవంతుడా!” అని స్వామికి స్తుతులు చేశాను. అందుకే ‘దాసోహం శ్రీనివాసస్య’ అని రాసుకున్నాను. శ్రీవారి భక్తులు అనే పేరిట 22 మంది భక్తులను వంద పేజీల పుస్తకం రాశాను. ఇట్లాంటి సాహిత్యాన్ని అక్కడ ఉన్నప్పుడే సృజించే అవకాశం లభించింది.

21. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆయా సందర్భాలలో స్వామీజీలతో మీకున్న అనుభవాలతో రచించిన పుస్తకాలను గురించి చెప్పండి.

జ:    వ్యాసాశ్రమానికి సంబంధించిన ఒక ఆశ్రమం హైదరాబాద్ షాద్ నగర్ దగ్గర వెలసింది. దాని పేరు “రామకోటి జప యజ్ఞ ఆశ్రమం” దానికి నిత్య శుద్ధానంద గిరి స్వామి నిర్వాహకులుగా ఉన్నారు. వారి ప్రేరణతో అక్కడికి వెళ్ళాను. అప్పుడే ‘గీతా జ్ఞాన యోగ సమాచార్’ పత్రిక సంపాదకునిగా ఉన్నాను. 21 సంవత్సరాలు ఆ పత్రికకు సంపాదకీయాలు రాయడం, స్వామీజీ ఇచ్చిన ఉపన్యాసాలను వివరించి రాయడం ఇవన్నీ కలిపి ఆరేడు పుస్తకాలు వచ్చాయి. అందులో ఒకటి 650 పేజీల పెద్దపుస్తకం. నిజంగా గ్రేట్ వర్క్ అది. శ్రీ విష్ణు సహస్ర నామాలకు వ్యాఖ్యానం స్వామీజీ సూక్ష్మంగా చెప్పిన దానిని విశ్లేషించి రాశాను. అట్లాగే భగవద్గీత వ్యాఖ్యానం. ఆ తర్వాత గజేంద్ర మోక్షణం. ఇవన్నీ స్వామీజీ పేరిట వచ్చినవే. వాటన్నిటిలో నా పీఠిక ఉంటుంది. స్వామీజీ ఉపన్యాసాల్లో ఇవన్నీ కసిరెడ్డి గారే తయారు చేసేవారని చెబుతుండేవారు (నవ్వుతూ). వారి ప్రేమ అట్లాంటిది. ఆయన రెండేళ్ల క్రితం బ్రహ్మలీనమయ్యారు. అంతకు పూర్వమే నేను వారి జీవిత చరిత్రను దాదాపు 300 పేజీలు రాస్తే రెండుసార్లు అచ్చయింది. ఆయన బ్రహ్మలీనమయ్యాక ‘స్వామి నిత్యశుద్ధానంద – ప్రేమమూర్తి’ అనే మకుటంతో రాశాను. వారు ఉపన్యాసాల్లో చెప్పిన వాటిని ‘నిత్యశుద్ధానంద – నీతికథలు’ అనే పేరుతో 20 కథలను పుస్తకంగా వేశాను.
        ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వేదాంత విజ్ఞానాన్ని జన జీవితంలోకి తీసుకొని పోవడానికి బ్రహ్మాండమైన కథలను జోడించి చెప్పినవారు.  స్వామి రామానంద తీర్థ. ఆయన వేదాంత తత్త్వంలో ఎన్నో నీతి కథలు వస్తాయి. అట్లాగే నిత్య శుద్ధానంద స్వామి వారు కూడా. ఆయన కూడా పురాణాల్లోనివి కావచ్చు, ఇతిహాసాల్లోనివి కావచ్చు, అంతకు ముందు ఎవరో చెప్పగా మనం విన్నవే కావచ్చు. వాటిని ప్రసంగాలలో చెప్పేవారు. వ్యాసాశ్రమ వ్యవస్థాపకులైన మళయాలస్వామి సాంప్రదాయం అది. మళయాల స్వామి తరువాత విమలానంద స్వామి, విద్యానంద స్వామి. ఈ పరంపరలో ఇప్పుడున్నవారు పరిశుద్ధానంద గిరి స్వామి వారు. వీళ్ళంతా చిన్న చిన్న కథలను ఆధ్యాత్మిక బోధనలో భాగంగా చెబుతూ ఉంటారు.   దాంతో గహనమైన ఆధ్యాత్మిక, తాత్త్విక విషయాలు కథల ద్వారా హాయిగా అర్థమవుతాయి. అట్లాగే శ్రీ జ్ఞానేశ్వరానంద గిరి స్వామి వారని ఆయనను అనుసరించినవారే. నేను ఆయన జీవితాన్ని గురించి “స్వామి జ్ఞానేశ్వరానంద – సాధుమూర్తి” అనే పేరుతో రాశాను. ఇట్లా స్వామీజీల ప్రసంగాలలో ఉండే తత్త్వాన్ని అనుసరించి ఉండే సూక్తులతో పుస్తకాలను వెలువరించాను. స్వామి శివానంద గారు హృషీకేశ్ లో మూడువేల ఎకరాల స్థలంలో ‘శివానంద నగర్’ నిర్మాణం చేశారు. అక్కడ ‘శివానందాశ్రమం’ ఉంటుంది. అక్కడ ఆధ్యాత్మికము, ఆది భౌతికము, సైన్సు, యోగ మొదలైన వాటితో బ్రహ్మాండమైన శిక్షణ ఇస్తారు. స్వామివారికి సంబంధించి ‘ఉపదేశం’, ‘జ్ఞాన గంగాలహరి’ లతో పాటు ఆయన చెప్పిన పిల్లల కథలు 22 కలిపి ‘శివానంద పిల్లల కథలు’ అనే పేరుతో మూడు పుస్తకాలు వేశాను. ఇవే కాకుండా కథా సాహిత్యంలో చిన్నకథ, పెద్ద సందేశాన్ని అందించాలనే సంకల్పంతో నేనప్పుడప్పుడు విన్నవి ‘నూరు చిన్న కథలు’ అనే పుస్తకం వేశాను. ఐదారుసార్లు అది అచ్చయింది. సాహితీ నికేతన్ అనే సంస్థ వాళ్ళు పదివేల పుస్తకాలను అచ్చు వేసి, ప్రైమరీ, హై స్కూల్ పిల్లలందరికీ అందేట్లు చేశారు.

22. చివరగా… మీ సాహితీ యాత్రను ఇంకా కొనసాగిస్తున్నారా?

జ:  అమ్మా! నేను చేసిన రచనలన్నీ ఆధ్యాత్మిక అంశాల ద్వారా మానవ జీవితంలో వికాసాన్ని కలిగించడం, సంస్కృతి ద్వారా మానవుని నిర్మింపజేయడం అనే తపనతో చేసినవే. దేని నుండి ఏదీ ఆశించలేదు. ఆ అవసరం కూడా లేదు. అందుకే అటు అధ్యాపకత్వం, రచన, సంపాదకత్వం వీటన్నిటికీ మించి ఉపన్యాసాలకు వెళ్లడం ఎక్కువగా చేశాను చేస్తున్నాను. ఊపిరి ఉండడం ఎంత సహజమో సాహిత్య జీవితం అనేది నాలో అంతగా పెనవేసుకొని నడుస్తున్నది. సాహిత్యం మనిషిని తీర్చిదిద్దుతుంది. శరీరానికి ఏదైనా మలినం అంటుకుంటే గంగతో కడిగి శుభ్రం చేస్తాం. కానీ మనసుకు అంటుకున్న మలినం జ్ఞానగంగతో శుభ్రమవుతుందని నా అభిప్రాయం. ఆ జ్ఞాన గంగయే సాహిత్యమని నా నమ్మకం. నాకు అదే జీవితంగా నడుస్తున్నది. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే. దేశాన్ని ప్రేమించండి. భారతీయ ధర్మాన్ని కాపాడండి. తద్వారా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొనండి.

ధన్యవాదాలు సార్ నమస్కారం. ఎంతో సమయాన్ని కేటాయించి, మీ జీవితాన్ని, మీ సాహిత్య, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సవివరంగా మా పాఠకులకు తెలియ జేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున కృతజ్ఞతలు.

శతాధిక గ్రంథకర్త, ద్విసహస్రాధిక వ్యాసకర్త, అష్ట సహస్రాధికోపన్యాసకర్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి సాహితీ ప్రస్థానం ఇకముందు కూడా నిరంతరంగా ప్రవహించాలని కోరుకుంటూ సెలవు🙏

March 30, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

ప్రాచీన సాహిత్యాన్ని – ఆధునిక సామాజిక కోణంలో దర్శించడం- నేటి అవసరం.

by రంగరాజు పద్మజ March 28, 2024
written by రంగరాజు పద్మజ

    వైవిధ్యమైన పరిపృచ్ఛా కార్యక్రమంతో ఎందరో మహానుభావుల రచనా వైదుష్యాలను రసహృదయులైన పాఠకులకు అందించే దిశగా  అగ్రగామి పథంలో  నడుస్తున్న “మయూఖ పత్రిక” పాఠకులకు మరో ఆణిముత్యాన్ని పరిచయంచేసే అవకాశం రావడం నా భాగ్యంగా భావిస్తూ…
ప్రాచీన సాహిత్యాన్ని ఔపోసన పట్టిన వారెందరో ఉంటారు! కానీ ఆ సాహిత్యం యొక్క లక్ష్యం నేటి తరానికి తెలియచేయడం- వేద వాజ్ఞ్మయము, ఉపనిషత్ వాజ్ఞ్మయం, పురాణ వాజ్ఞ్మయం ఈనాటి తరానికి ఎలా ఉపయోగపడుతుందని… సామాజిక కోణంలో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో ఎలా చూడవచ్చో? పుస్తకం ఎలా చదవాలి? భారతీయ కథనాలు చెప్తూ భారతం కానీ, భాగవతంకానీ రాబోయే తరాలకు ఏం చెప్తున్నాయని? ముందుచూపు- చూస్తూ నేటి సమాజానికి వేద వాజ్ఞ్మయం లోని ఋషుల దార్శనికతను, వారి లక్ష్యాన్ని చక్కగా వివరిస్తున్న రచయిత, ప్రేరణాత్మక ప్రసంగాలను ఇచ్చి ఎందరికో ప్రేరణ కల్పిస్తున్న ప్రాసంగికులు, మాన్య మహోదయులు.. ఈనాటి అతిథులు మరెవరో కాదు! పాలకుర్తి రామమూర్తిగారు.
   వీరు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగంలో బెల్లంపల్లి ఏరియాలో పనిచేసి పదవి విరమణ పొందారు.   అంతేకాదు pragamatic e- Learning solutions Hyderabad లో  మెంటార్ గా సేవలందించారు. వ్యక్తిత్వవికాసం, ఒత్తిడిని నిర్వహించుకోవడం ఎలా? అనే పలు వ్యక్తిత్వ నిర్వహణాంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
   సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా [ soft skills trainer] గా దాదాపు 400 పైగా విద్యాసంస్థలలో పదో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రసంగించడం, కెరీర్ ప్లానింగ్, పరిమితులను అధిగమించడం, యాజమాన్య నైపుణ్యాలు- సమస్య పరిష్కార నైపుణ్యాలు, మానవ విలువలు మరియు వృత్తిపరమైన విలువలు, బృందాలను నిర్మించడం వాటితో పని చేయడం మరియు కుటుంబ సంబంధాలను ఉన్నతీకరించుకోవడం లాంటి అంశాలపై చాలా ప్రసంగాలు చేశారు. అనేక సెమినార్లలో పత్రాలు సమర్పించారు.
   తెలంగాణ ప్రభుత్వం తరపున రిసోర్స్ పర్సన్ గా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ ఇవ్వడం, సంబంధిత అంశాలలో గ్రామీణ అభివృద్ధిలో హైదరాబాదులోని టీఎస్పీఏఆర్ఏడి ( TSPARAD) నుండి శిక్షణ పొందారు. గతంలో వారికి శిక్షణనిచ్చారు. ఇప్పటివరకు వీరు ఇరవై రెండుపుస్తకాలను రచించారు.
1 – భారతీస్తవం.        1993
2- వేద సంస్కృతి -వివాహ సంస్కారోద్దేశ్యము. 1995
3. సరస్వతీ సన్నిధానం. 1997
4-  గంగావతరణం . 2022
5. వ్యక్తిత్వ విజయ పథం. 2023.
6- అవగాహనతో సంసారం ఆనందానికి సోపానం. 2005
7- పరిపూర్ణతవైపు పయనం. 2006.
8- పురాణాలు జీవన మార్గదర్శకాలు. 2009.
9 – ఉత్పాదనా సామర్ధ్యంతో జీవించడం ఒక కళ. 2009
10 – మహాభారతంలో ద్రౌపది అపూర్వ వ్యక్తిత్వం. 2011
11 –  శ్రీ సీతారామాయణం. 2013.
12 –  అత్యున్నత విజయ సాధనా మార్గంలో ప్రభావంతమైన ఏడు అలవాట్లు. 2016.
13 –  మహాభారతంలోనిక ఒక పద్యానికి ఆధునిక వాఖ్య
14 – క్షీరసాగర మధనం. 2018.
15. తమస్సు నుండి ప్రకాశం వైపు శ్రేష్టతా సాధనలో పాలకుర్తి నరసింహ రామశర్మ గారి నడక. 2019.
15 –  ప్రశ్నోపనిషత్తు ( దర్శనం పత్రిక లో సీరియల్)
16 – బహుముఖప్రజ్ఞాశాలి ఆంజనేయుడు – 2019.
17 – CONTEMPLATION ( Essays written and Published by professor Masana chennappa. In telugu in the name of Cintana have been translated into English.  — 2020
18 – కణికనీతి — 2021
19  – విదురనీతి — 2022
20 – నాటి సాహిత్య– నేటివికాసం — ప్రాచీన సాహిత్యంలోని 81 పద్యాలకు ఆధునిక యజమాన్య లక్షణాల నేపథ్యంలో వ్యాఖ్యానం -2023.21 – భావుడు మిమ్ముఁ బ్రోచుతన్ – 2023
22 – మాండూక్యోపనిషత్తు – 2023

శ్రీ పాలకుర్తి రామమూర్తి గారితో ముఖాముఖి గ్రహీత రంగరాజు పద్మజ

పద్మజ:- నమస్కారమండీ.
పాలకుర్తి రామ్మూర్తి గారు:- నమస్కారం అమ్మా.

పద్మజ:- మయూఖ పాఠకులకు మీ నేపథ్యం వివరిస్తారా?
రామ్మూర్తి గారు:- మా స్వగ్రామం కొడకండ్ల, ఉమ్మడి వరంగల్ జిల్లా.  మా నాన్న గారు శ్రీ పాలకుర్తి నరసింహ రామయ్య గారు. వారు ఈ ప్రాంతంలో కొడకండ్ల సిద్ధాంతిగా ఎంతో పేరు పొందిన వారు. అమ్మ శ్రీమతి సుభద్రమ్మ. మేము ఆరుగురం అన్నదమ్ములము, ముగ్గురు చెల్లెళ్లు. నా భార్య పేరు ఉమాదేవి. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఢిల్లీలో  ఉంటుంది. అల్లుడు ఢిల్లీ యూనివర్సిటీలో [Linguistics Department] అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. మా అబ్బాయి జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

పద్మజ:– మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా?
రామమూర్తి గారు :— నా  ప్రాథమిక విద్యాభ్యాసం నల్లగొండ జిల్లాలోని అడ్డ గూడూరులో మా మేనమామ గారింట్లోనూ; PUC లాస్ట్ బ్యాచ్ మాది.. సిద్ధిపేటలోనూ, గణితం ఐచ్ఛికంగా గ్రాడ్యుయేషన్ (B. Sc.)   హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో చదివాను. ఉద్యోగం బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి కాలరీస్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో దాదాపు 37 సంవత్సరాలు పనిచేసే రిటైర్ అయ్యాక ప్రస్తుతం భువనగిరిలో స్థిరపడ్డాను. మా పక్కనే మా తమ్ముడు ఉంటాడు.

పద్మజ:– సాహిత్యాభిరుచి ఎలా ఏర్పడింది? ఎలా కొనసాగుతోంది?
రామమూర్తి గారు:– చిన్నప్పుడు అమ్మ తెలుగు పద్యాలు నేర్పించేది. దాని వల్ల పద్యాలపై కొద్దిగా అభిమానం ఏర్పడింది. విద్యార్థి దశలో తెలుగు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుల వల్ల సాహిత్యం చదవాలనే కోరిక కలిగింది. ఉద్యోగం చేసే సమయంలో సాహిత్య సమావేశాలకు వెళ్లడం, విరామసమయంలో పుస్తకాలు చదవడం వల్ల ఆ అభిరుచి నిలిచిపోయింది. కవి సమ్మేళనాలకు వెళ్ళడం వల్ల కవితలు ముఖ్యంగా పద్య కవిత్వాన్ని వ్రాయడం అలవడింది. బెల్లంపల్లిలో కొందరు సాహితీ మిత్రులు ప్రతి నెల కలుసుకోవడం.. సాహితీ చర్చలు చేయడం వల్ల నా అవగాహనను మెరుగుపరుచుకొనే అవకాశం వచ్చింది.

పద్మజ:– పుస్తకాల ప్రచురణకు ప్రేరణ ఎలా కలిగింది?
రామమూర్తి గారు:– చదివిన అంశంపై నాకు కలిగిన అవగాహనను సమాన హృదయులతో పంచుకోవాలనే భావన నా ఆలోచనలను పుస్తకస్తం చేయాలనే భావనకు బీజం వేసింది.

పద్మజ:–ఆధునిక సాంకేతికత ఆకాశాన్ని అంటుతున్న ఈ కాలంలో సాహిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి? ముఖ్యంగా ఏ ప్రయోజనమూ లేని తెలుగు సాహిత్యాన్ని ఆధ్యయనం చేయడం దేనికి? ఇవి సాధారణంగా యువత  మనసును తొలుస్తున్న ప్రశ్నలు. దీనిపై మీ స్పందన ఏమిటి?
రామమూర్తి గారు:– నిజమే.. సాంకేతిక ప్రగతి వల్ల సంపద సృజింపబడుతుంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. కాని వికాసం కలగడం సాహిత్యం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. మీకు అర్థం అయ్యేందుకు.. ఒక కత్తిని తయారుచేసే సమయంలో సాంకేతికత.. ఆ కత్తిని ఎంత తక్కువ సమయంలో, ఎంత తక్కువ ఖర్చుతో, ఎంత నాణ్యంగా అందించ వచ్చో తెలియచేస్తుంది. కాని సాహిత్య ఆధ్యయనం వల్ల దానిని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చో అవగహాన కుదురుతుంది. వ్యక్తిత్వ వికసన, శీల నిర్మాణం, ప్రాకృతితో మమేకమయ్యే లక్షణం, మానవ సంబంధాలు, వృత్తిలో విలువలు పాటించడం, సామాజిక పరిణతి ఇవన్నీ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల మాత్రమే లభిస్తాయి. అయితే.. సాధారణంగా అధ్యయనం వల్ల విషయం అవగాహన పెరుగుతుంది.. కాని దానిని ఆచరణలో పెట్టిన వ్యక్తులను పండితులుగా వ్యవహరిస్తాము.. ఈనాటి సమాజానికి పండితుల అవసరం ఎంతో ఉన్నదని విశ్వసిస్తున్నాను.

పద్మజ:– పద్య సాహిత్యాన్ని చదివారు, వ్రాశారు.. మరి యాజమాన్య నిర్వహణపై దృష్టి పెట్టడానికి కారణం ఏమిటి?
రామమూర్తి గారు:– వివేకానంద సాహిత్యాన్ని చదివినప్పుడు యువత పట్ల వారి తపన కొద్దిగా అవగాహనకు వచ్చింది. బెల్లంపల్లిలో పలు సాహితీ సంస్థలకు కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేసాను. పలు కవి సమ్మేళనాలు, అవధానాలు ఏర్పాటు చేయడంతో పాటుగా పెద్దలను ఆహ్వానించి ఉపన్యాసాలను ఇప్పించడం జరిగేది. దాని వల్ల పెరిగిన అవగాహన సాహిత్యం నా వ్యక్తిగత ఆనందానికే కాదు సామాజిక బాధ్యతగా పలువురితో పంచుకోవాలనే భావన కలిగింది. శీల నిర్మాణం, వ్యక్తిత్వ వికసన లక్ష్యంగా నా రచనలు సాగేవి. పద్య సాహిత్యం కూడా అలాగే నడిచింది. తదుపరి కాలంలో సింగరేణి కమ్యునికేషన్ సెల్ విభాగంలో పనిచేయడం వల్ల యాజమాన్యానికి సంబంధించిన విధానాలను చదవడం.. పలువురు అధికారుల పనితీరును దగ్గరగా పరిశీలించడం జరిగింది. దానివల్ల నేను బాల్యంలో ఏం కోల్పోయానో అర్థం అయింది. దానికి తోడుగా కొందరు మిత్రులు ఆ అంశాలను చర్చచేసేందుకు.. యాజమాన్య నిర్వహణ, నాయకత్వ లక్షణాలు పెంచుకునేందుకు అవసరమైన పుస్తకాలు చదివేందుకు ప్రేరణనిచ్చారు. తోటి మిత్రులు ప్రోత్సాహం, మా కంపనీ అధికారుల ప్రోత్సాహం ఆ వైపు నడిచేందుకు కారణాలయ్యాయి. దానితో Management [వ్యక్తిత్వ వికాస] కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టి, దాదాపు నాలుగు వందల పైగా పాఠశాలలలో; కాలేజీలలో ; ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొదలైన వేదికల మీద వివిధ అంశాలపై మాట్లాడాను. ముఖ్యంగా యాజమాన్య నిర్వహణ [Managing skills] నాయకత్వ లక్షణాలు [Leadership qualities] మీద ప్రసంగించాను. ఆ సందర్భంలో అందరి మార్గంలో కాకుండా.. ప్రాచీన సాహిత్యాన్ని– ఆధునిక సమాజానికి అన్వయించడం ఎలా? అనే కోణంపై ఎక్కువగా దృష్టి పెట్టాను! ప్రాచీన సాహిత్యంలో మానవతా విలువలు, అందులోని నాయకత్వ లక్షణాలు, సంక్షోభాలు నిర్వహించుకోవడం, ముఖ్యంగా ఓటమి ఎదురైన సందర్భంలో ఎలా దానిని నిర్వహించుకోవాలి… అనే అంశాలపై యువతకు అవగాహన కల్పిస్తూ.. ప్రసంగించడమే కాకుండా దాదాపు 22 పుస్తకాలను ప్రచురించాను.

పద్మజ:– అంటే.. ఈనాటి యువత ఎదుర్కొనే అన్ని సమస్యలకు ప్రాచీన సాహిత్యం పరిష్కారాన్ని సూచిస్తుందంటారా…
రామమూర్తి గారు:– అలా అస్సలు అనుకోవద్దు.. ప్రాచీన సాహిత్యంలో ఆయా పాత్రలకు ఎదురైన విపత్కర సంఘటన లేదా సమస్య.. ఈనాడు అలాగే ఎదురుకాక పోవచ్చు కాని దానిని అధ్యయనం చేయడం ద్వారా మన ఆలోచనా సరళిలో ఒక క్రొత్త కోణం వెలుగుచూస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విశ్వాసం కలుగుతుంది. ఆ పరిష్కారమార్గాన్ని కనుగొనాలనే తపన క్రొత్త కోణంలో దృష్టి సారించేందుకు ప్రేరణనిస్తుంది. సాధారణంగా మనందరం పిల్లలకు మార్కులు ఎలా సాధించాలనే విషయం నేర్పిస్తాము.. ఎలా చదవాలో నేర్పిస్తాము.. గ్రేడ్ లు ఎలా సాధించాలో నేర్పిస్తాము.. కాని ఎలా ఆలోచించాలో నేర్పించము. ఆలోచించడం నేర్పిస్తే వారే పరిష్కారాన్ని కనుగొంటారు.. ఆ లాజిక్ ను చాలామందిమి మిస్ అవుతున్నాము..

పద్మజ:– ఆలోచించడం అనేది నేర్పించడం అవసరం అంటారా?
రామమూర్తి గారు:– అవును.. ఆలోచించడం నిజానికి రెండురకాలుగా ఉంటుంది. సమస్య ఎదురవగానే దాని నుండి పారిపోవడం లేదా ఎదుర్కోవడం చేస్తాము. అది మనలోని ప్రవృత్తి. ఎప్పుడైతే ఎదుర్కోవాలని అనుకుంటామో.. ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన వస్తుంది. ఒక ఆలోచన సమస్య లోతులలోకి చూడమంటుంది.. మరొక ఆలోచన దాని పరిమితుల పరిధులకు బాహిరంగా ఆలోచించమంటుంది.. దానినే Out of Box thinking లేదా Lateral thinking అంటాము. మన ఆలోచనా పరిధిలో దీనికి ఇదే పరిష్కారం.. ఇంత కన్నా మరే పరిష్కారం లేదనే భావనను అధిగమిస్తేనే అంటే.. Limitations ను Dissolve చేస్తేనే ముందుకు సాగగలం.. అభ్యున్నతిని సాధించగలం… ఆ విధమైన ఆలోచనను చేయడం ఎలాగో పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఈనాడు ఎంతైనా ఉన్నది.

పద్మజ:– మీ వృత్తి బోధనా వృత్తి కాదు! గణిత శాస్త్ర సంబంధమైన చదువు చదివారు! అలాంటప్పుడు తెలుగు భాష పట్ల మీకు మక్కువ ఎలా కలిగింది? అది ప్రవృత్తిగా ఎలా నెరవేర్చుకోగలిగారు?
రామమూర్తి గారు:– బెల్లంపల్లిలో సాహిత్య సమూహాలు, సంస్థలు తక్కువగానే ఉన్నా, అలాంటి అభిరుచి కలిగిన మిత్రులతో చక్కని సాంగత్యం ఉండేది. అదే సాహిత్యాన్ని చర్చించడానికి ఉపకరించింది. ఎప్పుడైనా సకారాత్మకమైన మిత్రుల సాంగత్యంలో చర్చిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభించడమే కాక మన భావనను ఉన్నతీ కరించుకునేందుకు దోహదపడుతుంది. సింగరేణిలో మా మిత్రులు, అధికారులు నాకా అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా కమ్యునికేషన సెల్ లో పనిచేయడం వల్ల మేనేజ్మెంట్ కు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి నిలిపి చదవాల్సిన అవసరం వచ్చింది. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుండి జనరల్ మేనేజర్ వరకు ఉన్న అధికారులు సమస్యల పరిష్కారాలలో అనుసరించే రకరకాల వ్యూహాలు, అధికారులు కార్మికుల మధ్య సమన్వయం చేసుకునే విధానంపై అవగాహన కుదిరింది. యాజమాన్యానికి కార్మికులకు మధ్య వారధిగా ఏర్పడిన సింగరేణి కమ్యూనికేషన్స్  ద్వారా మా బృందం దాదాపుగా 25 టెలిఫిలిమ్స్ చేసాము. సింగరేణి కమ్యూనికేషన్ సెల్ నిర్వహించిన ప్రతి ఆక్టివిటీలో పాల్గొనడం వల్ల అధికారుల పనితీరును దగ్గరగా చూడడం, పని విధానాలపై ఒక అవగాహన ఏర్పరచుకోవడం, సమస్యలు ఎలా వస్తాయో? అంచనా వేసి, వారెలా పని చేస్తున్నారు? మనం ఎలా చేయవచ్చు? అనే అవగాహన పెంచుకోవడం వల్ల ప్రత్యక్ష అనుభవం కలిగింది.

పద్మజ:– మీ జీవితం ఎదురైన అనుభవాన్ని పంచుకుంటారా?
రామమూర్తి గారు:– ఒకసారి యాజమాన్య – ఉద్యోగుల సంబంధాలు ఉత్పత్తి ఉత్పాదన సామర్ధ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఆచరణాత్మకమైన పరిశీలన చేయాలనిపించింది. మిత్రులు శ్రీ భాస్కర్ గారని ఒక IED ఇంజనీర్ తో ఆ ఆలోచను పంచుకున్నాను.. అతను, నేను కలసి మా జనరల్ మేనేజర్ గారితో చర్చించాము. వారు దానికి అవసరమైన అనుమతులను ఇవ్వడమే కాకుండా అవసరమైన సమాచారాన్ని ఇవ్వమని అన్ని గనుల శాఖాధిపతులను ఆదేశించారు. దానితో దాదాపు ఒక వేయి (1000) మందిని వివిధ స్థాయిలలో ఉన్న ఉద్యోగులను కలసి వారి అభిప్రాయాలను సేకరించి దానిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ పంపించాము. దానినే “ఉత్పాదనా సామర్ధ్యంతో జీవించడం ఒక కళ” అనే నా పుస్తకంలో వాడుకున్నాను కూడా. అదొక ప్రత్యక్ష అనుభవం.

పద్మజ:– బాగున్నదండి.. మళ్ళీ వెనుకకు వస్తే.. మీరు చెప్పిన విషయాన్ని బట్టి సాహిత్య రూపంలో ఋషుల దార్శనికత సార్వకాలికమై.. వారి లక్ష్యం  నెరవేరినట్టే భావించవచ్చా?
రామమూర్తి గారు:– సాహిత్యం ఎప్పుడు సమకాలీనమే కాదు!  సార్వకాలికం కూడా… ఏ  ఇజంలో బంధించనంతవరకు స్టకప్ అవ్వదు. ఫెమినిజం, దళిత వాదం, కమ్యూనిజం లాంటి చట్రాలలో సాహిత్యం బంధీకానంతవరకు సాహిత్యం సార్వకాలికమవుతుంది. సర్వ జనీనమవుతుంది. అందరికీ పనికొస్తుంది.. అలాకాక ఇజాల పరిమితులకు లోబడినంత కాలం… దాని ప్రయోజనం పరిమితమే..

పద్మజ:– ఎంతో అభినందించదగ్గ మంచి ఆలోచన! ప్రాచీన సాహిత్యాన్ని- ఆధునిక కోణంలో చూడడమే… ప్రస్తుత కాలానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విషయం. అయితే ఈ విషయాలను మీరు రచించిన పుస్తకాలకు ఇతిహాస, పురాణాలే తీసుకున్నారా? లేక ఉపనిషత్తులు మొదలైనవాటిని కూడా ఉదాహరించారా?
రామమూర్తి గారు:– నా పుస్తకాలలో అన్నింటినీ వాడుకున్నాను.. ప్రశ్నోపనిషత్తు.. మాండూక్యోపనిషత్తు.. కఠోపనిషత్తు.. శ్రీ సూక్తం, మేధా సూక్తం , అఘమర్షణ సూక్తం, అక్షీభ్యాం తే సూక్తం.. ఇలా అన్నింటిలోనూ చూడగలిగితే ఆధునిక దృక్కోణంలో మేనేజ్మెంట్ కు సంబంధించి, యాజమాన్య నిర్వహణ సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. నేను నా పరిధిలో తాత్వికతను, ఆధునిక యాజమాన్యాన్ని .. రెండింటిని సమన్వయం చేసే ప్రయత్నం చేశాను! అందులో పూర్తిగా విజయం సాధించానని చెప్పలేను కానీ ప్రయత్నమైతే చేశాను!

పద్మజ:– ఏ యే ప్రక్రియలలో రచనలు చేసారు?
రామమూర్తి గారు :— అన్ని ప్రక్రియల్లోనూ పద్యం నాకు ఇష్టమైన ప్రక్రియ. చిన్నప్పుడు అర్థం కాకపోయినా పద్యాలు చదివేవాడిని. అలా చదువుతూ చదువుతూ పద్యం రాయడం అలవాటయింది. గంగావతరణం  అనే పద్య కావ్యం రాశాను. మీకు ముందే చెప్పినట్టు యువతకు గంగావతరణం ఎలా ప్రేరణ నిస్తుందనే దాని మీదే దృష్టి నిలిపాను. అలాగే… వ్యక్తిత్వం- విజయపధం అనే ఒక పుస్తకం రాశాను. ఆ ప్రక్రియ  పాఠకులకు ఎలా చేరాలనేది ఆలోచిస్తూంటే  గట్టు నారాయణ గురూజీ మంధని వారు బరోడాలో ఉంటారు. చాలా కంపెనీలకు ఆయన డైరెక్టర్, సీఈఓ గా కూడా పనిచేసారు. వారికి ఎక్సెల్ కంపెనీ ఉంది. వారు ఆఫరింగ్స్ [Offerings] అని 4 వాల్యూమ్ లు పుస్తకాలు రాశారు. రెండో వాల్యూం చదివినప్పుడు.. అది నాకు మార్గదర్శన చేసింది. వ్యక్తిత్వం- విజయపధం అనే పుస్తకం 1000 కాపీలు ముద్రణ చేసి .. ప్రతి విద్యా సంస్థకు నేను వెళ్ళినప్పుడు అక్కడ 10- 15 కాపీలు ఉచితంగా ఇచ్చి వచ్చేవాడిని. చాలా పుస్తకాలు అలా పంచాను. అలాగే వేదసంస్కృతి – వివాహ సంస్కారోద్దేశ్యం అనే పుస్తకాన్ని కూడా 1000 ప్రతులను ఉచితంగా పంచడం జరిగింది. విమర్శక వ్యాసాలు వ్రాసాను.. ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాశాను.

పద్మజ  :– ప్రత్యేకత అంటే ఏమిటో వివరిస్తారా?
రామమూర్తి గారు:— ఉదాహరణకు రుక్మిణి కళ్యాణం ఉంది. దానిలో రుక్మిణి నాయికా లక్షణాలు, ద్రౌపది గురించి రాసినప్పుడు ద్రౌపది అపూర్వమైన వ్యక్తిత్వం ఆమె గృహ నిర్వహణ బాధ్యత మొదలైనవి హైలైట్ చేసి రాశాను. అలాగే  భారతంలోని ఒక పద్యం చదివినప్పుడు ఆ పద్యం నేపథ్యంగా… “అత్యున్నత విజయ సాధన మార్గంలో ప్రభావవంతమైన ఏడు అలవాట్లు “[ seven  Habits to Elevate to the Heights of Ecstasy] అనే పుస్తకాన్ని రాశాను. ఆ పుస్తకం రాయడానికి నాకు ప్రేరణ కలిగించిన పద్యం ఇలా ఉంది.
” ఆలస్యంబొక యింత లేదు, శుచి ఆహారంబు, నిత్య క్రియా
జాలం బేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబ పల్కంబడున్
మేలౌ శాంతియు , బ్రహ్మ చర్యమును నెమ్మిం దాల్తు మట్లౌట నె
క్కాలంబుం బటు మృత్యురోగ భయ శంకన్ బొందమే మెప్పుడున్ !”
( శ్రీమదాంధ్ర  మహా భారతము – ఎఱ్ఱన- అరణ్య పర్వం – చతుర్ధాశ్వాసము )
మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పిన మాటలివి. జూదంలో ఓడిపోయి అడవులకు పోయి మనసు కకావికలమైన సందర్భంలో… ఆ పరిస్థితులను తట్టుకునేందుకు మరియు కాబోయే పరిపాలకుడుగాను, అవసరమొచ్చి ఋషుల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ధర్మరాజు మానసిక శాంతి కొరకు ఋషులు బోధించిన బోధనల వల్ల మనసు కుదుటపడ్డాక తాను కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకే ” సాహిత్యం మానవులకు ఎలా ఉపయోగపడుతుందంటే మొదట మనసుకు  ప్రశాంతతనిస్తుంది, తరువాత కర్తవ్యాన్ని బోధిస్తుంది. తన మానసిక కుంగుబాటు నుండి కార్యోన్మఖుడు కావాలన్నదే.. ధర్మరాజు లక్ష్యం. తాను ఏం చేయాలన్నా దానికి మానసికంగా ప్రశాంతతను ఋషుల మాటల ద్వారా పొందాడు.

పద్మజ:– అలాగే మీరు రచించిన భారతీ స్తవం పుట్టుక నేపధ్యం వివరిస్తారా? అందులో మీకు నచ్చిన ఒక పద్యం ఉదహరించండి..
రామమూర్తి గారు :– భారతీస్తవం అనేది ముందుగా శతకం రాయాలనుకోలేదు కానీ రాస్తూ పోతే అది భారతీ స్తవంగా 100 పద్యాలుగా రూపుదిద్దుకున్నది.
” సంకల్పింతువొ వాసమున్ ధృత మహత్జ్ఞాన ప్రభా దీప్తవై
సంకాశోరు పరార్ధ తత్త్వ నిధి ప్రజ్ఞాపూర్ణ హిందూక్షితిన్
శంకింపన్ పనిలేదు తల్లి! యిట విశ్రామార్ధమై నిల్చినన్
యింకంటాక్సని, వెల్త్ టాక్సనుచు నిన్ వేదింతురో భారతీ!!
                భారతావని ఆధ్యాత్మిక తత్త్వనికి పెన్నిధి అనుకుంటూ.. జ్ఞానమనే ధనాన్ని తీసుకొని నీవు పొరపాటున కొద్దిసేపు ఇక్కడ విశ్రమిస్తావని అనుకున్నాగానీ నిన్ను ఇన్కమ్ టాక్స్ అని వెల్త్ టాక్స్ అని వేధిస్తారమ్మా! అని సామాజిక దృష్టిలో రాశాను. తర్వాత సాధారణ రచనలు కూడా ఉన్నాయి.

పద్మజ:– సరస్వతీ సన్నిధానం గురించి చెప్పండి!
రామమూర్తి గారు:–  సరస్వతీ సన్నిధానంలో సాహిత్య ప్రక్రియా రూపకం చేశాను. ఎలా అంటే సరస్వతి అమ్మవారి దగ్గర ఎనమండుగురు కవులు సాహిత్య గోష్టిని నిర్వహించినట్లుగా కల్పన చేశాను. ఒక్కో తరానికి ఇద్దరేసి కవులను తీసుకున్నాను. నన్నయ– తిక్కన; శ్రీనాథుడు– పోతన;  ప్రబంధ కవులలో పెద్దన గారిని — తెనాలి రామకృష్ణ కవిని ; వానమామలై వరదాచార్యులు-  జాషువాను ఎన్నుకొని, వారిచే భువనవిజయం వలె… నాలుగు ప్రక్రియల కింద రూపకం తయారు చేసాను.
1 – స్తుతి పద్యం [ ఒక్కొక్కరు ఒక్కొక్క స్తుతి]
2 – వారి వారి కావ్యాల నుండి వారి రచనలను నుండి పద్యాలు.
3 – తెలుగు నుండి- సంస్కృతం; సంస్కృతం- నుండి తెలుగులో పద్యాలు చెప్పాలని తయారు చేసాను.
4.వీటికి సామాజిక కోణంలో ఉపోద్ఘాతమిచ్చి రూపకం తయారుచేసి, నంది అవార్డు కోసం పంపాము.. కానీ ఎన్నుకోబడలేదు.

పద్మజ::– సాహిత్యం పట్ల మీకు అభిరుచి ఎలా ఏర్పడింది? అంటే  పండిత కుటుంబ నేపధ్యమా?  అనువంశక పాండిత్యమా? మీ స్వయంకృషే కారణమా?
రామమూర్తి గారు :– మా నాన్నగారు అమ్మ వారి ఉపాసకులు. తెలంగాణ ప్రాంతమంతా అమ్మవారి ఆరాధన అంటే ఆ కాలంలో చాలా భయపడేవారు. ఆ సమయంలో నాన్నగారు అందరికీ మంత్రోపదేశం చేసి ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. సప్తశతి పారాయణలు కానీ హోమాలను బాగా జరిపించేవారు. లలితా సేవా సమితి అనే సంస్థ స్థాపించి, భక్తులు వారి ఇష్ట పూర్తిగా అమ్మవారి పూజ చేసుకుంటామన్న వారితో నెలనెలా పూజలు చేయించేవారు. ఆయన 70 సంవత్సరాలపైగా దేవీ నవరాత్రులు జరిపించారు. అలా నాన్న సాహిత్యం వైపు దృష్టి పెట్టలేదు… కానీ అమ్మవారి సంబంధిత పుస్తకాలు చాలానే రాశారు. దైవప్రతిష్టలు చేసేవారు. వాటి సంబంధిత పుస్తకాలు కూడా రచించారు.
         మా అమ్మ తండ్రి గారికి కూడా సాహిత్యంలో ప్రవేశం ఉండేది. దానికి తోడుగా బెల్లంపల్లిలో సత్యనారాయణ రాజు గారు అనేవారు ఉండేవారు. వారు నిత్య స్మరణీయులు. ముద్దురాజయ్య గారు ఆంగ్లభాషోపన్యాసకులుగా పదవి విరమణ చేశారు. వినోదరావు గారని ఒక మిత్రుడు ఉండేవారు. మేము నలుగురము సాహిత్య చర్చలు చేస్తూ రాయడం చదవడం చేసేవాళ్ళం. దానికి తోడుగా ఒక నాస్తిక సభకు వెళ్ళివచ్చాక ఆ సమావేశంలో ప్రసంగించిన ఒక వక్త ఉపన్యాసం విన్నాక  నిజాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వైదిక సాహిత్యం చదవాల్సి వచ్చింది. దాని పర్యవసానంగా వేద సంస్కృతి- వివాహ సంస్కారోద్దేశ్యం అనే పుస్తకం వచ్చింది.

పద్మజ… మన సమాజంలో బాల్య వివాహాలు ఉండేవి కదా?…
రామమూర్తిగారు… అది ప్రాచీన కాలంలో లేదు.. మధ్యన వచ్చింది.. నిజానికి  నమ్మకం రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి నమ్మకాన్ని ఆశ్రయించుకొని లాజికల్ గా కాన్సెప్ట్ను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి… రెండు  కొందరు నమ్మకాన్ని పట్టుకొని అలా వెళ్తారు. విశ్వాసం వికాసాన్నివ్వాలి కానీ మూఢత్వం పెంచకూడదు!  సరైన అవగాహనతో చర్చలు చేయాలి కానీ ఊరికే వాదన చేయకూడదు!  సమావేషాలలో బాల్యవివాహాలు కూడదని చెప్పేందుకు ఒక మంత్రం ఉదాహరిస్తాను.
 సోమోదదతు గంధర్వో- గంధర్వో దదదగ్నియే  అనే మంత్రం ఉంది. వివాహ సమయంలో పురోహితుడు అబ్బాయితో అమ్మాయికి చెప్పే మంత్రం అది, దాని అర్ధం ఏమిటంటే? ” సోముడు నీకు మొదట భర్తగా ఉండి తర్వాత నిన్ను గంధర్వుడికిచ్చాడు… గంధర్వుడు రెందవ భర్తగా ఉండి  తరువాత నిన్ను అగ్నికిచ్చాడు… నేను నాలుగో భర్తగా నిన్ను స్వీకరిస్తున్నాను” అని భావము. ముగ్గురు వదిలిపెట్టాక వరుడు ఆ వధువును వివాహం చేసుకున్నట్టుగా అర్థం చేసుకున్నారా నాస్తిక వాదులు…   నేను దానికి వివరణ ఈ విధంగా చెప్పాను.
” సోముడు అంటే బాలికలలో ఉండే హార్మోన్స్ కు ప్రతీక! అమ్మాయి రజో దర్శనానికి సోముడు సహకరించాలి.. చంద్రుడు భూప్రదక్షిణ చేయడానికి 28 1/2 రోజులు పడుతుంది. అమ్మాయిలకు ఒక రజస్వల నుండి మరో రజస్వల  కావడానికి మధ్యకాలం 28 రోజులు పడుతుంది. పదమూడు- పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి అమ్మాయిలలో  ఒక వర్ఛస్సు  వస్తుంది. రూపము , తారుణ్యము, లావణ్యము అనే వర్చస్సు విశ్వావసు అనే గంధర్వుడు అమ్మాయిలకు ఇస్తాడని  వేదం చెప్తుంది. వయసు… వయసుతో పాటు పరిణితి, ముఖంలో అందం, ఆకర్షణ, తర్వాత గర్భం దాల్చేందుకు కావలసిన అగ్ని [Fertility]  రూపంలో ఇస్తాడు. ఈ దశలన్నీ పూర్తయితే గానీ అమ్మాయికి వివాహ యోగ్యత రాదు. అంటే పూర్తిగా స్త్రీగా రూపొదిద్దుకుంటుంది కన్య.
     ఇక్కడ మనం ఆలోచించాల్సిందేమిటి అంటే? బాల్యవివాహాలు (ఎనిమిది సంవత్సరాల) పెళ్లిళ్లు చేశారని, అష్టవర్షద్భావేత్  కన్య, అనేది తప్పుగా అన్వయించబడింది. నిజానికి అష్టవర్శాత్ భవేత్ కన్య.. నవవర్శాత్ రోహిణి… అంటుంది శ్లోకం.. ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని కన్య అంటారు.. తొమ్మిది సంవత్సరాల అమ్మాయిని రోహిణి అంటారు. కన్య అని పెండ్లయిన వారిని కూడా సంబోధించే సంస్కృతి ఉన్నది. “కన్య నీవేడ రణరంగ గమన మేడ” అంటాడు కృష్ణుడు సత్యభామతో భాగవతంలో.. ఈ మంత్రాలను ఉదహరిస్తూనే బాల్య వివాహాలు కాల పరిణామములో వచ్చినవే కానీ, వేదకాలనాటి వధువు పూర్తిగా స్త్రీగా మారిన తర్వాతనే వివాహ అర్హత పొందేదని పలు సమావేశాలలో చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ? వేదమంత్రాలలో ఉన్న మూల విషయం లేదా అంతరార్థం తెలియకపోతే ఈ యాంత్రికత చోటు చేసుకుంటుంది…
                 సాహిత్యం లోనారసి చూడవలసి ఉంటుంది. ప్రశ్నోపనిషత్తులో ఆరు ప్రశ్నలుంటాయి. వాటిని చదివినప్పుడు ఒక అవగాహన వస్తుంది. శంకరభాష్యంలోని భగవద్గీత మనం ఒక తీరుగా చదువుతాము. దానిలోని భావాన్ని అర్థం చేసుకుంటే మన జీవితానికి అన్వయించుకుంటాము. శంకర భాష్యం తాత్త్వికత కలిగి ఉంది. తాత్త్వికతనే కాకుండా జీవితానికి ఎలా  ఉపయోగపడుతుందని తెలిసికొని ఆచరణలో పెట్టాలి. ఉపనిషత్తులు కూడా అదే చెబుతుంది. మన ముందు రెండు మార్గాలు ఉన్నాయనీ, ఒకటి ప్రేయోమార్గం, రెండోది  శ్రేయో మార్గం ఉందని చెబుతుంది.
(ప్రేయస్సు= భౌతిక జీవనంలో అభివృద్ది) ప్రేయోమార్గంలో భౌతికంగా ప్రేయస్సు అంటే అభివృద్ధితో ఆగకుండా… అక్కడ నుండి పెరుగుదల ఉండాలి, పెరుగుదలతోనూ ఆగకూడదు! శ్రేయస్సు కావాలి ! శ్రేయస్సు దగ్గర కూడా ఆగకూడదు! అక్కడనుండి విజయాలు సాధించాలి! లేదా విజేత కావాలి!  
                  అభివృద్ధి అంటే నేను.. నా కోసం… సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం. అదే కాకుండా పెరుగుదల అంటే  నేనే కాదు! నా చుట్టూ ఉన్నవారికి కూడా కొంత నేను పంచాలి! వారిని ఉన్నతీకరించాలి! అని సమాజాన్ని చూసే  చూపులో దృష్టికోణం మార్చుకుంటే  మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎందుకంటే నాకు సంపద ఉండి, నా చుట్టూ ఉన్నవారికి ఉంటేనే.. సమాజ ప్రగతి చేకూరుతుంది. ప్రాస్పరిటీ అంటే… నా దగ్గర ఉన్న దాన్ని సమాజంతో పంచుకుంటే .. సమాజంలో పేదరికం లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. సమాజం కోసం నా సమయాన్ని వెచ్చిస్తాను. ధనాన్ని వెచ్చిస్తాను.
                సమాజం లోనికి మనం ఎప్పుడైతే చొచ్చుకు వెడతామో? అదే ప్రాస్పారిటీ లేదా అభ్యున్నతి లేదా అభ్యుదయం. ఇక్కడే ఆగిపోతే కూడా పరిగణనలోనికి రాదు! ఇక్కడే సక్సెస్ లేదా విజయం చేకూరాలి… సమాజమే నేను- నేనే సమాజం! అంతా ఒకటే అనే భావన లోపలకి రాగలగాలి. (ఇది కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుంది.)
                ఈ విజయం లోపల అందర్నీ కలుపుకోవాలి! లేదా చేర్చుకోవాలి! ఇంత ఉదాత్తమమైన భావన వేదమంత్రాల్లో ఉంది. భారతీయ తాత్త్విక చింతన చెప్పే విషయం. భారతీయ తాత్త్వికత చింతన  మనకు నేర్పించినటువంటి పాఠాలు ఉపనిషత్తులు కానివ్వండి, వేదాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, వేటినైనా మనం అధ్యయనం చేస్తే మన దృష్టి కోణం మారితే మనం మనుషులుగా ఉండగలుగుతాం!

పద్మజ:– యాంత్రికతతో కాకుండా మనసుపెట్టి భగవద్గీత చదివితే… దాని అర్ధం ఎలా స్ఫురిస్తుందో ఒక్క శ్లోకం గురించి చెప్పండి !
రామ్మూర్తి గారు :—- యాంత్రికత అని ఎందుకంటున్నానంటే…?
శ్లో॥ భగవద్గీత 18-78
“ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ || ”
    మనం ఎప్పుడూ వినే గీతా శ్లోకం ఇది! పరిశీలించినట్లయితే ఎక్కడైతే అర్జునుడు గాండీవం పట్టుకొని ఉంటాడో? నొగల మీద కృష్ణుడు కూర్చొని ఉంటాడో? అక్కడ విజయం వరిస్తుంది అని ఈ శ్లోకభావం.
     నేనేమంటానంటే …
*యత్ర యోగేశ్వర కృష్ణో…. యోగేశ్వర… యోగం అనేది జ్ఞానానికి ప్రతీక!  మనకు ముందుగా జ్ఞానం కావాలి.  డొమైన్ నాలెడ్జ్ అంటే ఏ రంగంలో నువ్వు ఉంటావో? దానికి సంబంధించిన జ్ఞానం, మృదువైన నైపుణ్యాలు( soft skills) ఉండాలి. ఆ నైపుణ్యాలకు ప్రతినిధి అర్జునుడు. అర్జునుడి ధనస్సు లేదా గాండీవం కర్మాచరణకు ప్రతీక! కృష్ణుడు జ్ఞానానికి ప్రతీక! జ్ఞానం ప్రేరణ చేస్తుంది. ఈ రెండు అంటే జ్ఞానం మరియు  కర్మాచరణ ఎవరికైతే ఉంటాయో (కృష్ణార్జునులు) ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయం తప్పక ఉంటుంది.
   ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. జ్ఞానపరంగా ఇంకా ఇంకా ఆలోచిస్తే… జ్ఞానం అభివృద్ధి చెంది, సాధన చేయగా చేయగా… పనిలో నైపుణ్యాలు పెరిగి , ఈ రెంటి సమన్వయంతో విజయం స్వంతం చేసుకోవచ్చు ! ఈ అర్థం తెలుసుకొని భగవద్గీత శ్లోకం పఠించి, ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే సత్ఫలితాలను ఇస్తుంది. కాకపోతే కంఠశోషే మిగులుతుంది.

పద్మజ:– నాన్నగారు హవనాలు ఎక్కువగా చేసేవారని మీరు చెప్పారు! మీకు కూడా ఆసక్తి ఉన్నట్టు గమనించాను… వాటి ఉపయోగం ఏమిటో చెప్తారా?
రామ్మూర్తి గారు:– హవనం ఎంతో ఉపయోగకరమైనది ఎందుకంటే? మా నాన్నగారు చేశారు కాబట్టి మంచిదని చెప్పడం లేదు. ప్రతి హవనం ఎంతో శక్తినిస్తుంది. ముఖ్యంగా నియమబద్ధంగా ( Frequency)  శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మనలో 72 కండరాలు కదులుతాయి.
                ఒక ఆయుర్వేద వైద్యులు శ్రీ నారాయణరెడ్డి గారు ఏమంటారంటే అంటే కండరాల కదలికలు నరాల మీద ప్రభావం చూపుతాయి. అందువల్ల రక్తప్రసరణ చక్కగా జరిగి, గుండెను చేరుతుంది. ఇది ఒక గొలుసు చర్య! మనం మాట్లాడే ప్రతి మాట మన మీద ఒక ప్రభావం చూపుతుంది. మాట ప్రకంపనాలు కలిగిస్తుంది. ఎంతవరకైతే ఈ ప్రకంపనాలుంటాయో! అంతవరకు అక్కడున్న మనుషుల మీద మానసిక స్థితి మీద ప్రభావం చూపెడుతుంది. హవనంలో వాడే ద్రవ్యాలు నెయ్యి, సమిధలు లాంటివి అగ్నిలో వేల్చడం వల్ల వాతావరణంలో ఒక ధనాత్మక శక్తి ( Positive Enrage) సకారాత్మక శక్తి ఉత్పన్నమౌతుంది. ఇది పరిసరాలను శుభ్రం చేస్తుంది. ఇది వరకు ప్రతి ఇంట్లో అగ్ని కార్యం చేసేవారు .ఇలా చేస్తే మంత్ర శబ్దతరంగాలు మరియు అగ్నిలో వేల్చే పదార్థాలతో వాతావరణం పరిశుభ్రమయ్యేది. ఇలా ప్రతి ఇంట్లో చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారి, నెగటివ్ వాతావరణం పాజిటివ్ వాతావరణంగా మారేది. దీనికి ఉదాహరణ భోపాల్ లో సంభవించిన అగ్ని ప్రమాదం [ గ్యాస్ లీకేజ్]  సంగతి అందరికీ తెలిసిందే! అందులో రెండు కుటుంబాలు మాత్రమే ఆ ప్రమాదం నుండి బయటపడ్డాయి. ఎందుకని శాస్త్రజ్ఞులు పరిశోధిస్తే తేలింది ఏమిటి అంటే? ఆ రెండిళ్లలోనూ రోజు అగ్ని కార్యం చేసేవారట. దానివల్ల ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం కలుషితం కాకపోవడమేనట! నెగటివ్ విషవాయువులను తీసుకొని పాజిటివ్ గా మార్చడమే కారణమని అన్నారు.
     కాబట్టి యజ్ఞయాగాలు చేయడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టొచ్చనని నిరూపించబడింది. కానీ ఇందులో ఒక విషయం గుర్తుంచుకోవాలి! ఏదో యాంత్రికంగా యజ్ఞం చేయడం కాదు! ఋత్విక్కులు కూడా శ్రద్ధగా మనసుపెట్టి మంత్ర పఠనం చేయాలి! కానీ యాంత్రికంగా మంత్రాలు చదివితే ఫలితం ఉండదు.
   ప్రశ్నోపనిషత్తులో అర్హతను నిర్ధారించుకోవడానికి పిప్పలాదునని దగ్గరకు ఆరుగురు(6) ముని కుమారులు వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు  కూడా తపః సంపన్నులే… వారు వచ్చి తాత్త్విక తత్త్వం గురించి చెప్పమంటారు. నాకు తెలిసింది నేను చెప్తాను! కానీ మీరు ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని రమ్మంటాడు పిప్పలాదుడు. బ్రహ్మచర్యమంటే కేవలం వివాహం చేసుకొని సంసార సుఖాలు అనుభవించడమే కాదు! బ్రహ్మం+ ఏన+ చరయితి= బ్రహ్మచర్యం… బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకొనేందుకు మనసును లగ్నం చేసుకొని రావడమన్నమాట! సంవత్సరం తర్వాత వస్తే నాకు తెలిసింది చెప్తాను అంటాడు.
     అలాగే అని వారు వెళ్లి దీక్షగా ఉండి సంవత్సరానికి తిరిగి వస్తే 6 ప్రశ్నలకు జవాబు చెప్పి నాకు ఇంత మాత్రమే తెలుసు అంటాడు.
    అంటే ఏ విద్యైనా నేర్చుకునేందుకు అర్హత ఉండాలని భావం! నేర్చుకోవాలని జిజ్ఞాస ఉన్నదో లేదో! అని చూసి గురువు ఆ విద్యను బోధించాలి! అప్పుడు మంచి ఫలితం వస్తుంది. విలువైన మంత్రం లేదా తత్త్వం ఎవరికిబడితే వారికి ఆ విద్యను ఇస్తే అది యాంత్రికంగా మారిపోతుంది. మంత్ర ఉద్దేశాన్ని అవగాహన చేసుకుని పాటిస్తే మంచి ఫలితం వస్తుంది.

పద్మజ:– తాత్త్విక విషయం రచించేటప్పుడు కానీ, మీరు పత్రికలకు పంపేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
రామ్మ్మూర్తిగారు:- రాసేది వీలైనంత మేరా నాకు అవగాహన ఉన్న విషయాన్ని రాస్తాను కాబట్టి, ఇబ్బంది ఏమీ లేదు. సౌందర్యలహరిలో దాదాపు 40 శ్లోకాలకు పైగా వ్యాఖ్యలు పత్రికలలో రాసాను. అయితే 40 వరుసగా రాయలేదు. ఎందుకు రాయలేదంటే? నేను ఆ శ్లోకాలను చదువుతున్నప్పుడు దీనిని సామాజిక కోణంలో చెప్పగలనా? లేదా? తాత్త్వికత అనే విషయం నా అవగాహనలో ఉందా? లేదా? అని చూసి ఉన్నదనిపిస్తే దానికి రాసాను కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. తత్త్వం అంటే తత్ +త్వం. అంటే …తత్= అది …. త్వం = నీవే  అయివున్నావు. ఇవి మహావాక్యాలు. అది నీవే  అయి ఉన్నావని అర్థం తెలుపుతున్నది… అది అనే సర్వనామమే భగవంతుడు.

పద్మజ:– ఇంత గొప్ప మహా వాక్యాలను పాఠ్యాంశంగా పెడితే విద్యార్థులు చిన్నప్పుడే మంచి విషయాలు తెలుసుకుంటారు కదా! ఇవి సామాజిక కోణంలో ఎంతో మేలు చేసేవి.. మరి మీ సూచనలేమిటి?
రామ్మూర్తి గారు :– కరోనా మహమ్మారి వచ్చిన సమయంలో సామాజిక దృక్కోణంలో  తత్త్వం గురించి చెప్పేందుకు ప్రయత్నించాము. నారు మంచి అనంతకృష్ణ గారని ఒక మిత్రుడున్నారు. వారు హైకోర్టు అడ్వకేట్, అతను నేను ఇద్దరం కలిసి దాదాపు 16 సెమినార్లు నిర్వహించాము. భారతీయత– విద్య మీద చాలా మంది ప్రొఫెసర్లను, టీచర్లను, విద్యార్థులను, చదువుకున్న వారందరినీ పిలిచాము. ఇలా జూమ్ లో 16 సెమినార్లు నిర్వహించి, సామాజిక దృష్టికోణంలో తాత్త్వికత – ఈనాటి దృష్టికోణంలో పాఠ్యాంశంగా ఉంటే బాగుంటుందని ఒక రూపం కల్పించి ఇచ్చాం. కాకపోతే రాజకీయ నాయకులు సమర్ధించలేదు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ( N A P) ఉంది కదా! వారి వెబ్సైట్లో మేము చెప్పదలుచుకున్న వన్నీ ఉత్తరాల రూపంలో నిక్షిప్తం చేసాము. ఉపన్యాసాలు కూడా రికార్డు చేసాం! సెమినార్ లో జరిగిన విషయాలన్నీ ప్రభుత్వ  దృష్టికి తీసుకువెళ్ళాము. ప్రభుత్వం దానికి అంతగా స్పందించలేదు.

పద్మజ:– భవిష్యత్తులో పాఠ్యాంశంగా తీసుకుంటుందని ఆశావాహ దృష్టితో చూద్దాం! సరేనండి. మరి యువ రచయితలు  ప్రాచీన సాహిత్యం నేటి తరానికి సామాజిక దృక్కోణంలో అందించేందుకు ఎలాంటి కృషి చేయాలంటారు? సనాతన ధర్మం — వేద వాజ్ఞ్మయం అందరికీ అందుబాటులోకి వచ్చి మంచి ఫలితాలను పొందాలంటే వారు చేయాల్సిన రచనల గురించి చెప్తారా?
రామమూర్తి గారు:– యువ రచయితలకు సలహాలు ఇచ్చే స్థాయి నాకు లేదమ్మా !ఎందుకు లేదంటున్నానంటే? మనం ఒక విధానానికి అంటి పెట్టుకొని ఉన్నాం! నేటి రచయితల దృష్టి – దృక్కోణం వేరే విధంగా ఉంది! ఏది ఎక్కువ? ఏది తక్కువ? అని నేను అనడం లేదు. ఒకటి తప్పు మరొకటి ఒప్పు అని కూడా కాదు! ఏమైనా కానీ ప్రాచీనత- సనాతనము అంటే… నిన్న ఉండె… నేడూ ఉన్నది… రేపూ ఉంటుంది… దీని దృష్టిలో పెట్టుకొని పాతదాన్ని పునాదిగా చేసుకొని కొత్తగా నిర్వచించుకొని భవిష్యత్తు మీద ఆశ ఉండేలా విశాల భావనలతో రచనలు చేస్తే అప్పుడు సమాజానికి సందేశంతో బాగుంటుంది. అలా కాకుండా హ్రస్వదృష్టితో ఏదో ఒక వాదనకు బద్ధులమైతే చూసే కోణంలో తప్పు వస్తుంది. నేటి సమాజంలో ఎంతో మంచి ఉంది. ఆధునిక భావాలతో రచిస్తున్నారు. ఇవాళ్ళ మన సమస్యలు లేదా అభివృద్ధిని కాకుండా…. ఎప్పుడో ఏదో జరగాలనీ, జరుగుతుందనీ ఊహా లోకాలలో విహరిస్తే మటుకు ఫలితం ఉండదు. ప్రాచీనతను అన్వయించుకొని, కొత్తమార్గంలో రచనలు చేయగలిగితే అప్పుడు వారిని అనుసరించేవారు ఎందరో ఉంటారు. కాకపోతే ఆ విషయంపై సలహాలు, సూచనలిచ్చే స్థాయి నాకు లేదు.

పద్మజ:– అయ్యా ! అది మీ వినయానికి పరాకాష్టగా భావిస్తూ… తాత్త్వికత గురించి కొంత తెలుసుకున్నాం . అయితే మరో సందేహం రాధాకృష్ణులు… అత్తా- అల్లుళ్ళ మధ్య ప్రేమను గురించి ఎందరో ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. మీరు రాధాకృష్ణుల ప్రేమ అంతరార్థం ఏమని చెప్తారు?
రామమూర్తి గారు :– రాధాకృష్ణులు అంటే.. మనం అనుకుంటున్న భారత, భాగవతాల్లో కనిపించే కృష్ణుడు కాడు ! సృష్టికి సంబంధించింది కృష్ణుడు….  పరమాత్మ తత్త్వం, రాధా ప్రాకృతిక తత్త్వం. ప్రకృతి –పురుష సంయోగం ఏదైతే ఉందో దాని ఫలితం ఆనందం… పోతన గారు కూడా  భాగవతంలో “మహానందాంగ నా డింభకున్” అని అంటాడు.
శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు గేళిలోల విలసదృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండకుంభకు మహానందాంగనా ఢింభకున్.
“మహానందనా డింభకు” అంటేనే ఆనందానికి ఢింభకుడు  అని అర్థం. మహానందం  సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది. అది తప్ప మరొకటి లేదు అనేదే పరమాత్మ తత్త్వం. దానిలోనే  పాజిటివ్ ఎనర్జీ – నెగటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి.

   పెళ్లిళ్లలో చదివే చూర్ణికలు  “మహదహంకార పృథివాపతేజో వాయురాకాశా వరణమైరావృతే”
అని ఈ సృష్టి ఎలా ఉందంటే మహత్తు నుండి వచ్చిందని, మూల ప్రకృతి మాయ అంటాము. అక్కడి నుండి అహంకారం వచ్చింది. పంచభూతాలు, పంచతన్మాత్రలు , ఇలా ఒక వ్యవస్థ బయటికి వచ్చింది. అంటే తయారు చేయబడింది. ఇక్కడ రాధాకృష్ణుల తత్త్వం- గోకులంలో కృష్ణ తత్త్వం ఉంది.

   కృష్ణ తత్త్వం స్త్రీ తత్త్వంతో (రాధా) కలసి ఆనందాన్ని పంచుతుంది. స్త్రీ తత్త్వమంటే ఏమిటంటే సత్వ, రజస్తమో గుణాలతో బందీకృతమైన ప్రతిదీ స్త్రీనే. సకారము, రకారము, తకారము దీనికి ఈ కారము కలసినపుడు స్త్రీ ఔతుంది. ఇది ప్రకృతి. ఇక్కడ దీనికి ఉన్నతి రావాలంటే పురుష తత్త్వంతో కలవాలి.

    పురుషునిలోనూ ఈ మూడు తత్త్వాలుంటాయి .కానీ వీటికతీతంగా స్పందిస్తాడు. వీటికి లోబడి ఉండడు. అది పురుష తత్త్వం. ఇవి తత్త్వమే తప్ప… ఆడ -మగ కాదు! దీనికి ఉదాహరణ ఒక పౌరాణిక కథ చెప్తారు!
        ఒకసారి శివుడు కృష్ణుని దర్శించాలనుకుని బృందావననికి వెళ్ళాడట! లోపలికి వెళ్ళగానే అతను కూడా స్త్రీగా మారిపోయాడు.
       తత్త్వం ఎప్పుడైతే అవగాహనకొస్తుందో… ఈ సత్వ రజస్తమో గుణాలకతీతమైన ఒక తాత్త్విక చింతనలో మనం ఉంటే మనకు వచ్చే ఫలితం ఏమిటంటే ఆనందం !
    ఆనందం అంటే మనం అనుకునే Happiness కాదు. అందులో నాలుగు దశలున్నాయి. ఆనందాన్ని ఆంగ్ల భాషలో pleasure అంటారు. Happiness అంటాం! తర్వాత Blissful state , ecstasy state వీటినే సంతోషం- ఆనందం -తాదాత్మ్యత , తన్మయత అని నాలుగు దశలుగా చెపుతారు. తన్మయత్వానికెపుడైతే  చేరుతామో మనం తప్ప  రెండవది ఉండదు! అక్కడ భగవంతుడు వేరుగా ఉన్నాడనే స్పృహ కూడా ఉండదు. ఆనందమే… ఆనందం! అంతటా మనమే ఉంటాం!  మనలోనే అంతా ఉంటుంది! తన్మయ స్థితిలో  ఇలా ఉంటుంది. “నేను” అనేది ప్రత్యేకంగా ఉండదు.

   ఇక తాదాత్మ్యత స్థితిలో తదేకంగా చూస్తూ ఉంటాం! అక్కడెవరో ఉంటారు! మిగతా అంతా మరచిపోయి ఆ కనపడేది మాత్రమే తదేకంగా చూస్తాం!   అంటే నేను గాక మరొకటి ఉన్నదని భావన! ఇక్కడ నేనున్నాను! నేను చూసే మరొకటి ఉంది!    నాకు ఒక వస్తువు లభిస్తే దానివల్ల ఆనందం కలుగుతుంది. అంటే వస్తువులున్నాయి- నేను ఉన్నాను! అనేదే ఆనందం. ఇష్టమైనది మనసులో అనుకున్నా చాలు ఆనందం కలుగుతుంది. రాధాకృష్ణ తత్త్వము అంటే తన్మయ స్థితిని పొందడమే. ఒదే ప్రకృతి పురుషుల యొక్క తత్త్వం. ఈ రెంటి మధ్యన ఉండేది మాయ! మాయను మనం జయించడం కష్టం. ఋషులు తాదాత్మ్య స్థితికి  చేరినవారు మాయను జయిస్తారు.

పద్మజ:— కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీ సొంత ఊరి పక్క ఊరే బమ్మెర గ్రామం. అక్కడ పోతన భాగవతం రచించారు కదా! ఆ భాగవతం మీద మీదైన ఆలోచన సరళి “సామాజిక ధోరణిలో- భాగవత పురాణం” పైన ఏదైనా రాశారా?

రామమూర్తి గారు:– వినోదరావుతో కలిసి పోతన భాగవతం చదివాను. చదవడం కష్టమైన ప్రక్రియ. అవగాహన చేసుకోవడం అంతకన్నా కష్టమైన ప్రక్రియ. అందుకే  రుక్మిణి కళ్యాణం సామాజిక కోణంలో రాశాను. క్షీరసాగర మధనం పద్య కావ్యం వ్రాసాను. పురాణాలు- జీవన మార్గదర్శకాలని  ఒక పుస్తకం రాశాను.

పద్మజ:– ప్రశ్నోపనిషత్తు పరిచయం ఒక సీరియల్  వలె దర్శనం పత్రికకు రాసారు కదా?

అందులో మొదటి ప్రశ్న :- కాత్యాయన కబంధి పిప్పలాదుడిని అడిగిన ప్రశ్న!భగవాన్, కుతోవా హ వా ఇమాః ప్రజాః ప్రజాయంతి ఇతి? ఈ సృష్టి అంతా ఎక్కడ నుండి వచ్చిందని అడిగాడు! కదా! మా పాఠకులకు వివరిస్తారా?

రామమూర్తి గారు:– ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆనాటి నుండి ప్రతి జిజ్ఞాసవు వేసే ప్రశ్నే ఇది. ఆది అంతం లేని కాలం యొక్క రహస్యం ఏమిటి? భగవంతుడు ఏమిటి? ఎక్కడ ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలు దేశ విదేశాల తత్త్వవేత్తలను తొలచి వేస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్న ఈ నాటికి కూడా వర్తిస్తుంది.
ఈ సృష్టి ఎలా జరిగింది? ఎక్కడి నుండి వచ్చింది? దీని మూలం ఏమిటి? అనే ప్రశ్నలకు పిప్పలాదుడు ఏమంటారంటే?.. ప్రతి జిజ్ఞాసవు తెలుసుకోవలసిన విషయము.  సైన్సు ఎక్కడో అక్కడ ఒక చోట ఆగిపోతుంది!
కానీ వేదం పూర్తి జ్ఞానాన్ని వివరిస్తుంది..
    “రయించ ప్రాణంచేతి..” అంటుంది ఉపనిషత్తు. రయి అంటే పదార్థము. మరియు ప్రాణము అంటే శక్తి. పదార్ధము శక్తి అనే జంటను ముందుగా భగవంతుడు సృష్టించాడు. సూర్యచంద్రులు  ఇద్దరు సృష్టిలో మొదట వచ్చారు. చంద్రుడు పదార్థానికి- ఆహారానికి ప్రతీక! సూర్యుడు అగ్నికి మరియు శక్తికి ప్రతీక! అని ఈ పశ్నోపనిషత్తు వివరిస్తుంది. అక్కడి నుండి సృష్టి మొదలైనది. పదార్థం అంటే అనంతమైన శక్తి ఒక ఆకృతి తీసుకుంటే పదార్థం అవుతుంది. ఈ పదార్థం చుట్టూ ఉండే ఆవరణ అంతా శక్తి ( space)రెండు కలిపి సృష్టి మొదలైంది. శక్తి విస్ఫోటనం వల్ల అన్నీ ఏర్పడ్డాయి. ఇలా మొదటి ప్రశ్న ఎంతో విజ్ఞానదాయకమైన ప్రశ్న!   గర్భం తాల్చిన దగ్గర నుండి శిశువు పుట్టే దాకా ఏమేమి మార్పులు జరుగుతాయో వేదములో చెప్పబడింది. నేను ఒక  స్త్రీల గర్భాశయ వైద్యురాలి దగ్గరికి వెళ్ళి,  ఈ వేదభాగం వినిపించి, ఇది కరెక్టేనా? అని అడిగాను.  ఆమె సైన్స్ కూడా ఇదే చెప్తుందని,  ఆమె అమ్మాయిల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కమ్యూనికేషన్ సెల్ ద్వారా వీడియో చేయించి డిస్ప్లే చేయించాము. మన వేదములో ఎంతో విజ్ఞానం ఉంది. దాన్ని అధ్యయనం చేయాలి. లేకుంటే అంత విజ్ఞానం మనం పోగొట్టుకుంటాం!

పద్మజ:– మయూఖ అంతర్జాల పత్రిక పై మీ అభిప్రాయం చెప్పండి!
రామమూర్తి గారు:– నీహారిణి గారు మయూఖ అంతర్జాల పత్రిక నిర్వహిస్తున్నామని నాతో చెప్పారు. ఏ పత్రికనైనా నిర్వహించడం అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ. ఈరోజుల్లో పత్రికలను ఎవ్వరూ కొని చదవాలనుకోవడం లేదు. నేను దాదాపు 300 కాలేజీలకు వెళ్లాను, అక్కడ 400 స్టేజీల మీద మాట్లాడాను. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు విద్యార్థులతో మాట్లాడాను. డొమైన్ నాలెడ్జ్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం అవసరం కనుక కొద్దో గొప్పో నేర్చుకుంటున్నారు, కానీ సాహిత్యం మీద దృష్టి అంతగా పెట్టడం లేదు. కొంత మంది మాత్రమే  పత్రికలు చదువుతున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో పత్రికను నడిపించడం సమాచారం నలుగురికి అందించడం అనేది చాలా కష్టమైన పని. ఆర్థికంగానూ అంతే భారం. వెన్నుదన్నుగా నిలిచేవారు కావాలి. పత్రికలో వచ్చినవన్నీ క్షుణంగా చదివి వాటిల్లో సారం ఏమున్నదని చూసి మంచి చెడులు నిర్ణయించి, పాఠకులు ఎటువంటి వారున్నారు వారు ఎలాంటివి ఇష్టపడుతున్నారని నిర్ణయిస్తూ పత్రికకు వచ్చిన వ్యాసాలను ఎన్నుకోవాలి. అంతే కాకుండా సాంకేతిక నిపుణుల అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా సమాచారం సేకరించే వారు కావాలి. అది కూడా నిజమైన సమాచారం కావాలి ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి పంపిద్దాం అన్నట్టు కాకుండా…. ఇదంతా పెద్దతతంగం. ఈ కష్టనష్టాలకోర్చి వ్యయ ప్రయాసలకోర్చి పత్రికకు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఏదో సాధించాలనీ ఏదో పరిణీతి పొందాలనీ ధ్యేయంతో పత్రిక నడపడం కష్టం.  ప్రతి పత్రికా నిర్వాహకులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏ పత్రికైనా నాలుగు కాలాలపాటు నిలవాలంటే ఆదరించే వారు కావాలి! నేను చేసే విన్నపేమేమిటంటే పత్రికను ఆదరించండి. ఏ తీరు వీలైతే ఆ తీరు సహాయం చేయండి. పత్రికంటూ ఉండి సమాచారం అంటూ ఉంటే వాడుకుంటాం. సమాచారమే లేకపోతే వాడే ప్రసక్తి ఎక్కడ? పత్రికలకు నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే? వచ్చిన ప్రతి రచనను తీసుకోకుండా నిజమైన సమగ్ర సమాచారం మాత్రమే తీసుకోవాలి. చెత్తతో పత్రికను నింపకూడదు. చెత్త నుండి వేరు చేసేలా పత్రిక దోహద పడితే సంతోషం!
సంపాదకురాలికి అభినందనలు!

పద్మజ:- పత్రిక తరపున నా సందేహాలకు మీ అమూల్యమైన సమయం వెచ్చించి, చక్కని సమాధానాలిచ్చినందుకు ధన్యవాదములండీ!!

పురాణ మిత్యేవ న సాధురస్వం
నచాపికావ్యం నవమిత్యవద్యం
సంతః  పరీక్షాన్య తరత్ భజంతే
మూఢః పర ప్రత్యయ నేయ బుద్ధిః

ప్రాచీనమైనదంతా సమ్మతమైనది, గౌరవించాల్సిందీ కాదు! ఆధునికమైనదంతా వదిలి పెట్టాల్సిందీ, ద్వేషించదగ్గదీ కాదు! మంచి చెడులను తమ  అనుభవాలతో పరీక్షించుకొని, ఏది మంచైతే అది స్వీకరిస్తారు విజ్ఞులు!
   ఈ కోవకు చెందిన వారే ఈనాటి ముఖాముఖి అతిథివరేణ్యులు!
    వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి అర్థమైతే చాలనని అనుకుంటున్నారు కొందరు. కానీ వేదాల్లో అన్నీ ఉన్నాయిష … అనే కొందరికి  అందులోని సారాంశం అందించాలి! ఆ దిశగా పయనిస్తున్నారు శ్రీ రామ్మూర్తి గారు.
   విద్యాధికులైనా వినయంతో- పాండిత్య ప్రకర్ష అరచేతిలో ఒదిగిపోయినా, ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యంతో చిలికి వెన్న ముద్దలాంటి విజ్ఞానాన్ని, నా ప్రశ్నలకు చల్లని సమాధాన జలపాతాన్ని కురిపించిన సజ్జనులు, మాన్యులు పాలకుర్తి రామ్మూర్తిగారికి సవినయ కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ…

                    

March 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కుంకుమ బరిణ

by Divakarla Rajeshwari March 28, 2024
written by Divakarla Rajeshwari

మేడారం జాతరకు
తరలి వస్తున్నారు సాగరం లా జనం.
ముడుపు లు చెల్లించేందుకు
సమ తూకం బంగారం బెల్లం దిమ్మెలు
తలకెత్తుకున్నారు,
భక్తి పాటల సంబురాలతో
సంతోషం పంచుకున్నారు.
గిరి ఝరుల అందాలకు
పరమార్థ జ్ఞానం కలిగినట్లు
చింతలన్ని మరచారు.

ఆదివాసులకు శ్రమ సేద్యం ,
వేట వృత్తి జీవనం.
కోయ దొరకు పుట్ట వద్ద కనిపించిదొక శిశువు.
పులులు, సింహాలు, కాపలా, చుట్టూ.
దైవాంశమున్న పాపను గూడానికి తెచ్చాడు.
సమ్మక్క అని పిలిచి ఒడిని చేర్చాడు.
అయోనిజ ఆ బిడ్డ చూపింది మహిమ.
గిరి జనుల రుజలన్నింటికి
ఆకు పసరు లిచ్చింది.
కష్టాలను తీర్చింది.
యుక్త వయసున పగిడిద్ద రాజును పెండ్లి యాడింది.
కన్న బిడ్డలకు తల్లిగా మన్ననలను పొందింది

సమ్మక్క సారలక్కలు,
తల్లీ కూతుళ్ళు వాళ్ళు
దివ్య కాంతలు, ధీర వనితలు
స్త్రీల ఆత్మ గౌరవానికి
సాక్షి ప్రమాణాలు.
మట్టి జనుల స్వేచ్ఛకు గాను
గట్టిగ పోరాడారు.
ప్రాణాలకు తెగించారు.
వన దేవతలు వారు
ప్రకృతి రక్షణకు
మనుగడల రూపమెత్తారు.

గిరి జనుల సంస్కృతిలో
జాతర జాతి సమైక్యతకు మూలం
సమ్మక్క ధైర్యం చరిత్ర లో అతి ఘనం.
దేవతా తరుణి ఆమె
రక్తం పడకూడదు నేల మీద
వెన్ను పోటు బల్లెం దిగిన గాయానికి
కట్టు కట్టుకుని పోరాడింది.
శత్రువులను చెండాడింది.
తూరుపు చిలుకల గుట్ట వంకకు మరలి
కంటికి కనుపించక ఎవ్వరికి
నెమలి నారచెట్టు కింద
నిండు పసుపు” కుంకుమ బరిణ” గా మెరిసింది.

మాఘ శుద్ధ పున్నమి నాటికి
గద్దె మీద కొలువుకొచ్చిన
సమ్మక్క సారలక్కలు
హారతులందే వేళకు
డప్పుల చప్పుళ్ళు, , శివసత్తులు పూనకాలు
మేళాలు తాళాలు,
ఇప్పుడు మొదలయ్యాయి
గిర్రున దిగి వచ్చే హెలికాఫ్టర్ ఏర్పాట్లు,
సంప్రదాయాలకు
శాస్త్ర విజ్ఞానం తోడు,
భక్తుల కందరికి ఫలించాలికోరికలు.

March 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

అఖిల పురషార్ధాలకు నిలయం సంస్కృతం

by రంగరాజు పద్మజ March 27, 2024
written by రంగరాజు పద్మజ

భారతదేశంలో సంస్కృతం ప్రాచీన భాషేకాదు… సాంప్రదాయ భాష కూడా!
మహా మహోపాధ్యాయ వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి వంటి ఎంతోమంది పండితులు సంస్కృత భాష… ఆ భాషలోని భావం పాఠకులకు తెలిపేందుకై ఎన్నోరకాల వ్యాఖ్యానాలు చేసి, ఆ గొప్ప కావ్యాలను ప్రజాదరణ పొందేలా ఎంతో కృషి చేశారన్నది అందరికీ తెలిసిందే! ఎందరో ఋషుల వల్ల వేద సాహిత్యం సంస్కృతంలో అలా బలపడిందని చెప్తారు. ఇంకో గర్వకారణం ఏమిటి అంటే? భారతీయ ఆధునిక భాషల జాబితాలో రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో సంస్కృత భాష చేర్చబడింది. ఇదొక ఆనందించవలసిన విషయం.
ఎన్నో భాషలలోని సాహిత్యానికి సంస్కృతం మూలం. ముఖ్యంగా ఉత్తర భారతంలో దాదాపు అన్ని భాషలకు సంస్కృతమే మూలం. మూలఘటిక కేతన “సంస్కృతంబే యెల్ల భాషకు మూలం”అని అంటారు. ఏ రకంగా చూసినా సంస్కృత భాష గొప్ప భాషే! ధర్మాన్ని చక్కగా నొక్కి చెప్పేందుకు వేదాలన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. వేదాంగాలు… అంతే ఇవి ఎవరో రాసినవి కాదని భగవంతుని శ్వాసనుండే పుట్టాయని అంటారు. అంటే సంస్కృతం దేవభాషే కదా!
రామాయణం మొదలైన ఎన్నో కావ్యాలు, మహాభారతం వంటి ఇతిహాసాలు, చారిత్రక కావ్యాలు, గేయాలు, బృహత్కత వంటి కథలు, చంపూకావ్యాలు, ఇలా సంస్కృతంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి .
ఒక సాహిత్యమే కాదు శాస్త్రీయ సంబంధ, చట్టసంబంధ, రాజకీయ సంబంధ, తత్త్వశాస్త్రాలు, ఖగోళ, జ్యోతిష్య, ఇలా ఎన్నో ఎంతో విజ్ఞానం సంస్కృతంలో నిక్షిప్తం చేయబడి ఉంది.
అటువంటి గొప్పదైన సంస్కృత భాషలో తమదైన రీతిలో అవధానం చేయడమంటే ఆషామాషీ కాదు! అతి తక్కువ సమయంలో అలవోకగా చక్కని పూరణలు చేయగల భాషా నైపుణ్యం కలవారు ఈనాటి మన మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక పరిపృచ్ఛా కార్యక్రమ అతిధులు…
మాన్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు. వీరు ఎన్నో వేదికల మీద అవధానాలు చేసిన అవధాన పండితులు.
శర్మగారిని కొత్తగా పరిచయం చేయడం అక్కరలేదు కానీ వారి ముఖతః మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఈనాటి పరిపృచ్ఛా కార్యక్రమం .
నాకు ఎలాంటి ప్రత్యేకతా లేకపోయినా… వారితో మాట్లాడే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తూ… ఇంకెందుకు ఆలస్యం వారితో ముచ్చటిద్దాం!

ముదిగొండ అమర్నాథశర్మ

రంగరాజు పద్మజ:– నమస్కారమండీ! అమర్నాథ శర్మ గారూ!

ముదిగొండ అమర్నాథశర్మ:– అమ్మా నమస్సులు.

పద్మజ:– మీ నేపధ్యం మయూఖ పాఠకులకు వివరిస్తారా?

అమర్నాథశర్మ:– మా మాతా పితరులు సిద్ధమణీ- రామనాథశాస్త్రి గారు. మా తండ్రిగారు సంస్కృతాంధ్రాలతో పాటు వేదాధ్యయనం చేసి, పంచ శతాధిక చండీయాగాలు, దేవాలయ ప్రతిష్టలు చేసినవారు. నా జన్మస్థలం లచ్చపేట. దుబ్బాక మండలం పూర్వం మెదక్ జిల్లా… ప్రస్తుతం సిద్దిపేట.

పద్మజ:– మీ విద్య- వృత్తి- ప్రవృత్తుల గురించి వివరిస్తారా?

శర్మ గారు:- నేను లచ్చ పేటలో ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి పూర్తి చేసుకొని, ఇంట్లో అమర కోశం, శబ్ద మంజరి అధ్యయనం చేసి, కొంత పునాది పడగానే వేములవాడకు వెళ్లి ఆరవ తరగతి నుండి
బి ఏ (ఎల్) వరకు శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాలలో- కళాశాలలో 1980 నుండి 1990 వరకు విద్యాభ్యాసం పూర్తి చేసాను.

పద్మజ:– సంస్కృత భాష పై మీకు అనురక్తి ఎలా కలిగింది?

శర్మ గారు:– మా గురువుగారు శ్రీమాన్ కల్వకుంట్ల నరసింహచార్యుల ఆశీస్సులతో సంస్కృత భాషపై అనురక్తి, పట్టు కలిగింది. తదుపరి కళాశాల స్థాయిలో మా గురువు గారు సంస్కృతాంధ్ర విద్వన్మణి బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీహరి శర్మ గారి సాహిత్య, అలంకారిక, న్యాయ, వేదాంత, వ్యాకరణాది పాఠాలు వింటూ అనుష్ఠుప్ ఛందస్సులో శ్లోక రచనకు శ్రీకారం చుట్టాను. నాకు ప్రేరణ శ్రీహరి శర్మ గారు.

పద్మజ:– మీరు ఏ యే రచనలు చేసారు?
శర్మ గారు:– చాముండేశ్వరి అష్టకం, సుప్రభాతం;

శ్రీ మహాకాళీ సుప్రభాతం;
శ్రీరామచంద్ర సుప్రభాతం;
శ్రౌతశైవగణార్చన;
నరసింహోదాహరణం,
శిరీష సమీరం;
విశ్వేశ్వర శతకం (మందాక్రాంత వృత్తంలో) సద్గురు శివానంద స్తోత్రం; శివ కళ్యాణోత్సవ ప్రకరణం మొదలైనవి రచించాను.]

పద్మజ:– మీకు ఇష్టమైన కవి ఎవరు? రచనా వ్యాసంగం ఎలా ప్రారంభమైంది? ఎలా కొనసాగుతున్నది?

శర్మ గారు:– నాకు ఇష్టమైన కవి మహాకవి కాళిదాసు. నా రచన సంస్కృతంలో నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటికీ రోజుకు ఒక శ్లోకమైనా రచించినది నిద్రపోను! ఇంకో మహా గ్రంథం త్వరలో రాబోతున్నది…..

పద్మజ:- మహా గ్రంధం రాబోతున్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు తెలుపుతూ…

ప్ర :– సంస్కృతం విద్యార్థులు క్షుణ్ణంగా నేరుస్తున్నారా?
బయట ఒక అపవాదు ఉన్నది. ఏమిటంటే మార్కుల కోసం, తరగతులను ఉత్తీర్ణులు కావడం కోసమే సంస్కృత భాషను ఐచ్ఛికంగా ( option) గా తీసుకుంటున్నారని అనుకుంటున్నారు… దీనిలో ఎంత వరకు నిజం ఉందంటారు?

శర్మ గారు:– మీరన్నట్టు సంస్కృతమును మార్కుల కోసమే ఐచ్చికంగా తీసుకుంటున్నారనే అపవాదు కొంతవరకు నిజం. కానీ నేను 30 సంవత్సరాలుగా సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న సర్దార్ పటేల్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకునిగా, విభాగ అధ్యక్షుడిగా, వైస్ ప్రిన్సిపాల్ గా, ప్రిన్సిపాల్ గా 1993 నుండి వివిధ హోదాలలో పని చేస్తున్నాను. మా విద్యార్థిని విద్యార్థులకు మాత్రం మార్కుల కోసం కాకుండా జీవితంలో మార్పు కోసం పాఠాలు చెబుతూ శుభోదయం అంటూ పలకరిస్తాను. వాళ్లు అలాగే.. సంస్కృతంలోనే జవాబిస్తారు. వారితో సంస్కృతంలో చిన్న చిన్న ప్రసంగాలు చేయిస్తాను. శ్లోక పఠనంచేయిస్తాను. వ్యక్తిత్వ వికాసం, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, మానవతా విలువల గురించి సంస్కృత సాహిత్యంలోని మహాకవుల కావ్యాలను సులభ శైలిలో వివరిస్తాను.

పద్మజ:- సంస్కృత వ్యాకరణం బోధించే పండితుల కొరత ఉందని ఒక మాట అనుకుంటారు నిజమేనా? ఒక వేళ కొరతను ఎలా తీరుస్తారు?

శర్మ గారు:– సాధారణంగా సంస్కృతం, తెలుగు ,హిందీ భాషలంటే పిల్లలు తరగతులకు సక్రమంగా హాజరు కారు. కానీ పిల్లలే అధ్యాపకులకు ఫోన్ చేసి మరీ పిలుస్తారు క్లాసులకు రమ్మని,అంటే చక్కని బోధకులున్నట్టే కదా! కొరతేమీలేదు!

పద్మజ:- సంస్కృత పరిషత్తు ద్వారా ముద్రింపబడుతున్న గ్రంధాల కొనుగోలు ఎలా ఉంది? ముద్రించుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఆశావహ పరిస్థితులున్నాయా?

శర్మ గారు:–ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న సంస్కృత పరిషత్తు వ్యాకరణాన్ని బోధిస్తూ, ప్రాచీన సంస్కృత గ్రంథాలను పరిశీలించి, ప్రచురిస్తున్నారు. ఇటీవల కాలంలోనే అర్థ శతాధిక గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దిశగా సంస్కృత అకాడమీ డైరెక్టర్ ఆచార్య కే. నీలకంఠం గారు నిరంతర కృషి చేస్తున్నారు.

రంగరాజు పద్మజ:- ప్రాచీన సంస్కృత గ్రంథాలను పరిష్కరించే దిశగా కృషి ఎలా సాగుతున్నది?

శర్మ గారు:– కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో సంస్కృత పరిషత్తు గ్రంథాలను ముద్రిస్తుంది.

పద్మజ:–భాషా పరిరక్షణలో భాగంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?

శర్మ గారు:– భాషా పరిరక్షణ కోసం పాఠశాల స్థాయి నుండి వ్యక్తిత్వ వికాసం కోసం, మానవతా విలువల కోసం సంస్కృతి సంప్రదాయ రక్షణ కోసం వాల్మీకి, వ్యాస, కాళిదాస, విష్ణుశర్మ వంటి మహాకవుల రచనలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. ఈ పరిస్థితి మన రాష్ట్రంలో కొరవడింది. మిగతా రాష్ట్రాల్లో కొంతవరకు ఆశాజనకంగా ఉంది.

రంగరాజు పద్మజ:- సంస్కృత భాషా విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలేమిటీ?

శర్మ గారు:– నేను మా విద్యార్థినీ విద్యార్థులకు “సంస్కృతాన్ని సరిగ్గా ఉచ్ఛరిస్తే మన శరీరంలోని 72 వేలనాడులు సరిగ్గా పనిచేస్తాయి. దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు. సంస్కృతం మాట్లాడడం వల్ల ఆదర్శంగా ఉంటారని” అని చెబుతుంటాను. 1985లో సుప్రసిద్ధ కన్నడ సినిమా దర్శకుడు జీ వి అయ్యర్ ఆదిశంకరాచార్య అనే సినిమాను రూపొందిస్తే ఆ సీనిమాకు పలు జాతీయ పురస్కారాలు లభించాయి. కర్ణాటకలోని శివమొగ్గ అనే జిల్లాలో మొత్తం సంస్కృత
భాషలోనే మాట్లాడతారు.

రంగరాజు పద్మజ:- సంస్కృత భాషను ప్రభుత్వ కార్యకలాపాలలో వాడుతారా? దానికి మీరు ఎలాంటి చర్యలు అవసరమనుకుంటున్నారు?

శర్మ గారు:– సంస్కృతాన్ని నేటి ప్రపంచీకరణ యుగంలోనూ నేర్పుగా ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్లలో ఒదిగి ఉండే సాంకేతిక సౌలభ్యం సంస్కృతంలో బలంగా ఉందని భాషా శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పవచ్చు. నేటి పరిస్థితులలో సంస్కృత భాషా ప్రాముఖ్యత గతంలో కంటే ఎక్కువగానే గుర్తిస్తున్నారని తర్కబద్ధంగా కూడా చెప్పవచ్చు.

పద్మజ:– సంస్కృత భాషకు పూర్వ వైభవం తేవడానికి మన వంతు కర్తవ్యాలు ఏమిటి? అంటే పాఠశాలలు – కళాశాలలు కానివ్వండి ఎలాంటి కృషి చేస్తున్నాయి? ముఖ్యంగా సిద్ధాంత గ్రంథాలు సంస్కృత భాషలోనే రాస్తున్నారా? లేక అన్య భాషలలో రాస్తున్నారా?

శర్మ గారు:– సిద్ధాంత గ్రంథాలు దేవ నాగరలిపిలోనే రాస్తున్నారు. నేనైతే నా MPhil మరియు Phd రెండు కలిపి నా దస్తూరీలో దేవనాగర లిపిలో సుమారు 1000 పేజీల గ్రంథం వ్రాసి సమర్పించాను. శైవాగమంలో చంద్రజ్ఞాన ఆగమంపై తెలంగాణలో మొదటి శోధ ప్రబంధం నాది. అది తిరుపతి విద్యాపీఠంలో చేశాను.

పద్మజ:- సంస్కృత భాషాభిమానులు రాసిన గ్రంథాలకు ప్రజల ఆదరణ ఎలా ఉంది?

శర్మ గారు:– సంస్కృత భాషాభిమానులు చాలానే ఉన్నారు. నేను మందక్రాంత వృత్తంలో సంస్కృతంలో విశ్వేశ్వర శతకం రాస్తే ఏక బిగిన చదివి అభిప్రాయాలు తెలియజేసిన వారు చాలామంది పండితులు, పామరులు ఉన్నారు.

పద్మజ:- సంస్కృతం కేవలం పండితులకే పరిమితం అనే ఒక అపవాదు ఉంది దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు?

శర్మ గారు:– కేవలం పండితులకే పరిమితం అనే ఒక అపవాదు ఉంది. లేక ఒక వర్గం వారికే అనే మరో వాదన ఉంది. అది ముమ్మాటికి నిజం కాదు. సంస్కృతం పట్ల ఆంగ్లేయుల పాలనా కాలంలో వ్యతిరేకత అంకురించింది. ఆంగ్లేయులు (ఇంగ్లీషు భాషను) వ్యాప్తి చేసుకోవడానికి సంస్కృతాన్ని వ్యూహాత్మకంగా బలహీనం చేశారు. ఇది కేవలం సంప్రదాయ పండితులకే పరిమితం అన్న దుష్ప్రచారాన్ని పెంపొందించి, ఆర్యభాషగా ప్రచారం చేశారు. ఇది నిజం కాదు!

పద్మజ:– మీకు అవధానం చేయడానికి ప్రేరణ ఎలా కలిగింది?

శర్మ గారు;– అవధాన ప్రక్రియ మెతుకుసీమ (మెదక్) కోలాచలంలో ఇప్పుడు కొల్చారంలో మల్లినాథ సూరి తాతగారు శతావధానం చేశారు. ఆయన పేరు కూడా మల్లినాథసూరే! ఆయన సంస్కృతంలో శతావధానం చేశారట. మేము కూడా మెదక్ జిల్లా వాళ్ళం కావడంతో వారి గురించి విని అలా మాకు కొంత ప్రేరణ కలిగింది.

పద్మజ:—మీరూ మరియు మాన్యులు బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మ గారు కలిసి జంట అవధానాలు చేయాలని ఎందుకు అనిపించింది ?

శర్మ గారు:– మేమిద్దరం కలసి సంస్కృతాంధ్రాలను, శాస్త్రాలతో పాటు అధ్యయనం చేసాం! మా ఇద్దరి భావాలు, పద్య-శ్లోక ఎత్తుగడ, ధార, ధారణ మొదలగు విషయాలలో ఇద్దరిలోనూ సామ్యం ఉంది, కాబట్టి ఇలా యుగళ (జంటగా) అవధానం చేయాలనే సంకల్పం కలిగింది.
2013లో రవీంద్రభారతిలో అవధాన సప్తాహం జరిగింది. ప్రతిరోజు నిర్వాహకులు ప్రముఖ అవధానులచే అవధానం నిర్వహిస్తున్నారు . ఒకరోజు ఒక శతావధాని (వద్దిపర్తి పద్మాకర్ గారు ) రాలేదు… అకస్మాత్తుగా వారికి బదులుగా మా యుగళావధానం ఏర్పాటు చేశారు. గొప్పగొప్ప విద్వాంసుల మధ్య.

రంగరాజుపద్మజ:– కొత్తగాఅవధానాలు చేయబోయే… చేస్తున్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?

శర్మ గారు:– ప్రాచీన సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. నిరంతర రచన కొనసాగాలి, ధారణ కోసం ఫోన్ నెంబర్లు, వస్తువుల జాబితా మొదలగునవి యంత్ర సహాయాన్ని లేకుండా గుర్తు పెట్టుకోవాలి. ప్రతిభ, ఉత్పత్తి , అభ్యాసం, సమయస్ఫూర్తి , ధైర్యస్థైర్యాలు, ఆర్షవాజ్ఞ్మయ అధ్యయనం, ఇవీ నేను భావి అవధానులకిచ్చే సలహాలు!

పద్మజ:– తెలుగు భాష గురించి ఒక్క మాటలో ఏంచెప్తారు?
శర్మ గారు:–
తెలుగు భాషకన్న గొప్ప వెలుగు లేదు
అదియె రాని యేయెడల నంధకారమే యంత!

పద్మజ:– సంస్కృతం గొప్పదనం గురించి ఏం చెప్తారు?
శర్మ గారు :– లలిత కళలకు , అఖిల పురషార్ధాలకు నిలయం సంస్కృతం ! అలాంటి సంస్కృతాన్ని మనమందరం కాపాడుకోవాలి.

పద్మజ:– అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన ప్రక్రియ. సంస్కృతం -తెలుగు కాకుండా వేరే ఏ ఇతర భాషలలో ఈ ప్రక్రియ లేదు. అతి కష్టమైన సమస్యలను అలవోకగా, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబద్ధ, అసంధర్భ ప్రశ్నలను సమర్ధవంతంగా ఎదుర్కొని, ఆశువుగా పద్యాలతో పూరిస్తూ, అవధాని సభలోని శ్రోతలను ఆనందింప చేయడం అనేది అవధాని ప్రత్యేకత. వీటన్నిటిని ఏకకాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానము.
అవధానం ఓ సాహితీ వినోదం!
మనసును పూర్తిగా విషయం పై లగ్నంచేసి, తన కిచ్చిన సమస్యలను పూరించడం ఏకాగ్రత తోనే సాధ్యం!
అవధాని సంగీత పరిజ్ఞానం కలవారైతే చమత్కారాలతో, శ్రావ్యంగా గానం చేయడంతో సభను రంజిల చేయగలుగుతాడు.
ఈ అష్టావధానంలో అనేక అంశాలుంటాయి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పండితుడు నిర్వహిస్తాడు. అతనిని పృచ్ఛకుడు అంటారు. అవధాని గారి పాండిత్యాన్ని, సమయస్ఫూర్తిని పరీక్షించడానికి ప్రశ్నలను వారు అడుగుతారు.
ఇందుకుగాను ధారణాశక్తి ఎంతో ఉపయోగకరం.
అవధానాన్ని విద్యార్థులు చూసినా, నేర్చుకున్నా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుకోవచ్చును. వారు రాసే పరీక్షలలో ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. సాధన చేయడం నేర్పుతుంది. ఈ అవధాన ప్రక్రియ. మెదడు కంప్యూటర్ పనిచేసినట్టు ఏ సబ్జెక్ట్ ఆయా గడులలో నిక్షిప్తం చేసుకోవచ్చును.
సాహితీ ప్రియులకు అవధానిగారి చతురోక్తులు, పద్యాలు ఆనందాన్ని కలిగిస్తుంది.
మహిళలకైతే ఏకకాలంలో ఎన్ని పనులైనా చేయగల ఆలోచన కలుగ చేస్తుంది.
అటువంటి అవధాన ప్రక్రియలో సాటి లేని మేటి నేటి మన మయూఖ పత్రిక అతిథులైన ముదిగొండ అమర్నాథ శర్మగారితో ఈనాటి ముఖాముఖీ ద్వారా చక్కగా ఎన్నో విషయాలు తెలిసాయి.
వారిచ్చిన అమూల్యమైన సలహాలు, సూచనలు రేపటి తరానికి ప్రేరణనిచ్చే గొప్పవిషయాలు…
మనం చదివి వదిలేయకుండా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం!

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పసివాని కోరిక

by Sammeta Umadevi March 27, 2024
written by Sammeta Umadevi

జిల్లా పరిషత్తులో గుమాస్తాగా పనిచేస్తున్న గంగాధర్ పిల్లలే అరుణ ఆనంద్ లు. పదవ తరగతి చదువుతున్న అరుణ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటుంది. ఆరో తరగతి చదువుతున్న ఆనంద్ కేమో స్నేహితులంటే ప్రాణం. వాళ్ళ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆడుకోవడానికి తన ఈడు పిల్లలు లేక చిన్నబోయి ఉండేవాడు. ఇప్పుడు గంగాధర్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి మారాక అక్కడ తన ఈడు పిల్లలు కొందరు ఉండడంతో ఆనంద్ తన కొత్త మిత్రులతో సంతోషంగా గడపసాగాడు. ముఖ్యంగా ఆనంద్ కి పక్కింటి రియాజ్ కి మంచి స్నేహం కుదిరింది.

 ప్రత్యేక తరగతులు ఉన్నందున ఆనంద్ అక్క అరుణ రోజూ బడికి ముందు వెళ్ళిపోతుంటుంది.  అందువల్ల ఆనంద్, రియాజ్ ఇద్దరూ కలిసి బడికి వెళ్తున్నారు. పెరట్లో జామచెట్టు కింద చాప వేసుకుని కూర్చుని కలిసి హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. పోటీ పడి చదువుకుంటున్నారు. హాయిగా ఆడుకుంటున్నారు. పాలపాకెట్టో, కూరగాయలో ఎవరు తెమ్మన్నా ఇద్దరూ కలిసి వెళ్ళి తెస్తున్నారు. రియాజ్ వాళ్ళ నాన్న ఖాదర్ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తల్లిని ఒప్పించి ఆనంద్ తన నోట్సులు కొన్ని రియాజ్ కి ఇచ్చాడు. అప్పుడప్పుడు పెన్సిల్లు, పెన్నులు కూడా ఇస్తుంటాడు.. ఇక తల్లి సుదతి పండ్లూ పలహారం ఏమిచ్చినా రియాజ్ తో పంచుకుని తినడం అలవాటయ్యింది ఆనంద్ కి. రియాజ్ వాళ్ళ అమ్మ జరీనా ఏమి వండినా ఆనంద్ ని పిలిచి  మరీ పెడ్తుంటుంది. కొన్ని నెలలు గడిచి ఆనంద్ రియాజ్ ల స్నేహం మరింత బలపడింది. కొత్తవా వాళ్ళెవరైనా  ఖాదర్ ఇంట ఈ ఇద్దరు పిల్లలను చూస్తే.. ఖాదర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు. గంగాధర్ ఇంట ఆ పిల్లలిద్దరినీ చూసిన వాళ్లు గంగాధర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు.

 “ఆనంద్ కి ఇదివరకు తినడానికి ఏది పెడ్తే.. ఒక్కటి ఇస్తే ఇంక చాలు చాలు అనేవాడు. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇంకొకటి కావాలి అంటున్నాడు” అని భర్తకు  చెప్పింది సుదతి. “పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు వాడికి ఆకలి పెరుగుతుంది. వాడు తినగలిగినన్ని ఇవ్వు” అని చెప్పాడు గంగాధర్. ఎవరు ఏమీ పెట్టినా జామ  చెట్టు వెనకకు వెళ్ళి పంచుకుని తింటున్న మిత్రులిద్దరినీ చూసి ఆనంద్ కి ఆకలి ఎందుకు పెరిగిందో అర్థమై నవ్వుకున్నది అరుణ.

ఇప్పుడు దసరా పండగ వచ్చింది. గంగాధర్, సుదతి పిల్లలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం తయారుకండి  అని చెప్పారు. “నాన్నా నాకు రెండు జతల బట్టలు కొనిపెట్టవా?” అని అడిగాడు ఆనంద్.  “రెండు నెలల తరువాత నీ పుట్టినరోజు ఉంది కదా. అప్పుడు మళ్ళీ నీకు కొత్త డ్రెస్ కొనాలి. ఇప్పుడు నేను రెండు జతలు కొనలేను” అని చెప్పేశాడు గంగాధర్. “నాన్నా.. నాకు పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనకపోయినా పరవాలేదు.. ఇప్పుడు మాత్రం రెండు జతలు కొనండి నాన్నా” అని బతిమిలాడాడు. గంగాధర్ కి బాగా కోపం వచ్చింది. “ఎందుకు ఎంత జిద్దు చేస్తున్నావు ఆనంద్..”అని కోపంగా అరిచాడు.

“నాన్నా! పాపం రియాజ్ కి సరైన బట్టలు లేవు. బడిలో సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మంచి బట్టలు లేక ఆ రోజు బడి మానేస్తున్నాడు. నాకు ఖరీదైన బట్టలు వద్దు. మామూలు ధరలోనే మా ఇద్దరికీ చెరో జత కొనండి నాన్నా.. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే.. నేను కొత్త బట్టలు వేసుకోలేను నాన్నా!” అని చెప్పాడు.  స్నేహితుని పై కొడుకు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాడు గంగాధర్.

పక్కింటికి వెళ్ళి ఖాదర్ ని జరీనాని ఒప్పించి, అరుణా ఆనంద్ లతో పాటు రియాజ్ ని కూడా తీసుకుని.. బట్టల షాప్ కి బయలుదేరారు గంగాధర్ సుదతి దంపతులు.

                                                   ***

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఉద్యమ సారధి 02

by Vijaya Kandala March 27, 2024
written by Vijaya Kandala

ఉద్య మాలకు పురుటి  గడ్డ  వరంగల్లు.  చరిత్ర కందని కాలం నుంచి ప్రజాఉద్యమా లు ఈ ప్రాంతంలో ఊ పిరి పోసుకున్నాయి . ఒక రంగం అని కాదు . శిల్ప కళ ,కవిత్వం నాట్యం ,నీటి పారుదల ,భవన నిర్మాణం మొదలుకొని సామాజిక ఉద్యమాల వరకు  ఎందరో కళా కారులను,ఉద్యమకారులను, నాయకులను అందించిన ఘనత ఈ ప్రాంతానిది.

 కాకతీయ  చక్రవర్తులయిన  గణపతి దేవుడు ,రుద్రదేవ మహారాజు , ప్రతాపరుద్రుడు మొదలుకొని బమ్మెర పోతన వంటి కవులు ,జాయప సేనాని వంటి యుద్ధ వీరుల వరకూ -ఆధునిక కాలంలో మాజీ ప్రధాని నరసింహ రావు గారు,కాళోజీ నారాయణరావగారు,,దాశరధి సోదరులు నేరెళ్ళ వేణు మాధవ గారు ఇలా ఎందరో వరంగల్లు ప్రాంతా నికే వన్నె తెచ్చారు . ఇలా ఎందరో . తెలియని మరెందరో .

ఈ  list ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఆ గడ్డలో పుట్టిన ఓ మహానుభా వుని గురించి   గుర్తు చేసుకుందాం. వారే శ్రీ పెండ్యాల రాఘవ రావు గారు .  15 మార్చి 1917 నాడు  వరంగల్  జిల్లా లోని చిన్న పెండ్యాల  గ్రామంలో జన్మించారు .హై స్కూల్ చదువంత వరంగల్ లో సాగింది . బాల్యం గురించిన వివరాలు ఎక్కువగా దొరకట్లేదు . కానీ నూనూగు మీసాలు వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమమే ఆయన మాట,బాట ,గమ్యం కూడా .1935-36 నుండే మతమార్పిడులను  వ్యతిరేకించారు. అందులో భాగంగా హరిజన వా డలకు  వెళ్ళి ,వాళ్ళతో స్నేహం చేసి , నచ్చచెప్పే వారు . వారిలో నమ్మకం , విశ్వాసం కలిగించడానికి సహ పంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు . నిరక్షరాస్య తను పోగొడితే వారిలో మార్పు మరింత త్వరగా వస్తుందని , హరిజన  పాఠశాలను ప్రారంభించారు .

అగ్ర వర్ణాల పురుషులకే అరకొరగా వసతు లున్న ఆ రోజులలో హరిజనుల విద్య కోసం పాటుపడడం ఓ సాహసం . ఇలా ఎన్నో సాహసాలకు లకు ఆయన జీవితమే ఓ చిరునామా .

కుల వ్యవ స్థను  ఖండిస్తూ, పోరాడారు . ఆజంజాహీ  మిల్లు కార్మికులకోసం ఎన్నో ఉద్యమాలు నడిపారు.

తెలంగాణా  సాయుధ పోరాటానికి మూలం అ యిన విసునూరు పోరాటం లో ముఖ్య భూమిక వహించారు .

వెట్టి చాకిరీనీ నిరసించారు .

గుండాలను సంస్కరించారు .

రజాకార్  ఉద్యమానికి వ్యతిరేకంగా సుధీ ర్ఘ మైన    పోరాటం జరిపారు  .

1938 లో కాంగ్రెస్స్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు . కోపంతో బ్రిటిష్ ప్రభుత్వం జైలు శిక్ష తో బాటు 300 రూ  జరిమానా విధించింది. 90 సంవత్సరాల క్రితం 300 రు అంటే ఆలోచించండి . తర్వాతి కాలంలో ఆంధ్ర మహా సభలో చేరారు .1946 లో దాన్ని రద్దు చేసినప్పుడు ఆజ్యత వాసం  చేశారు . ఆయిన జీవితమే ఓ సాహసాల  పందిరి .

వితంతు వివాహాలతో  నైజాం రాజ్యంలో చైతన్యాన్ని జ్వలింప చేశారు .

గ్రం ధాలయ ఉద్యమం  లో పా లు పంచుకున్నారు .

ఎన్నికల్లో విజయం వారి జీవితంలో ఒక అధ్భుత ఘట్టం . ఈ రోజుల్లో ఎలక్షన్లలో గెలవడం కోసం అన్నీ పార్టీలు ,అందరు  అభ్యర్థులు

అనుచరుల సాయంతో వీధి వీధి తిరిగి వోట్లను అడుగుతున్నారు . వారికి ప్రజలపై నమ్మకంలేదు . అందుకే దేశ ఆర్థిక ప్రగతిని తలకిందులు చేసేలా తాయిలా లను  ప్రకటిస్తున్నారు . అలానే ఓటర్లకు  నాయకులపై నమ్మకం లేదు .  ఇచ్చినవన్నీ  పుచ్చుకొంటున్నారు . కొసరు కోసం  బేరసా రాలను  సాగిస్తున్నారు . ఫలితాలను ప్రకటించే వరకూ నేతలను టెన్షన్ లో  ముంచెత్తుతున్నారు . ఇ లాంటి వ్యవస్థలో ఉంటూ ఇదే నిత్యాసత్యమనే భ్రమలో బ్రతికేస్తున్నాం మనం . 1952 సాధారణ ఎ న్నికలలో  కమ్యూనిస్ట్ నాయకునిగా ఒక అపురూప రికార్డ్ ను సాధించారు . రాఘవరావు గారు వరంగల్ లోకసభ స్థానం తో బాటు హన్మకొండ ,వర్ధన్నపేట శాసన సభా  స్థానాలనుంచి పోటీ చేశారు . మూడింటి లోనూ గెలిచారు . వరంగల్ లోకసభస్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

 అవునా?

అంతేకాదు . ఈ ఎన్నికలలో నామినేషన్ ను జైలు నుంచి వేశారు .

ఎందుకలా?

ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసినందుకు అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది . ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా జైలు నుంచి పోటీ చేసి గెలిచిన ప్రజనాయకునికి ప్రజల తీర్పు అది .

నిజంగానా ?

అంతేకాదు ఈ విజయం సాధిం చేనాటికి   ఆయన వయస్సు 35 ఏళ్ళే . దేశ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు . నా టి నుంచి ఒకేసారి 3 స్థానాల్లో పోటీ చేసి 3 చోట్ల గెలిచిన నేతలు ఇద్దరే . ఒకరు పెండ్యాల రాఘవరావు గారు ,మరొకరు నందమూరి తారక రామారా వు గారు .

అంటే

మీ అనుమానం  నిజమే . 1952 లో నెలకొల్పిన రికార్డ్ సమానం కావడానికి 33 సంవత్సరాలు పట్టింది.

రాఘవరావ్ గారిది ఆకర్షణీ యమైన విగ్రహం . ముఖంలో చెరగని చిరు మందహాసం . మాటల్లో చా తుర్యం ,చమత్కారం ఉట్టిపడేవి . సమాజం లోని  దుర్మార్గాన్ని ,అన్యాయాలను ప్రతిఘటించడానికి తీ వ్రవాదిగా  మరి తుపాకి పట్టినా , కంఠంలో కారుణ్యం ,మనసులో మానవతా తొణికిసలాడేవి.

,అత్యున్నత చట్టసభలో ఎన్నో కీలకమైన చర్చల్లో పా లుపంచుకున్నారు .  ఆయన ప్రసంగాలు శక్తి నిండిన  ప్రవా హాలు .

M P గా పని చేసినంత శ్రద్ధగా గ్రామ పంచాయితీ సర్పంచ్ గాను పని చేశారు. గ్రామ వికాసానికి తా  గు నీరు ,సాగునీరు, విద్యుత్ సౌకర్యం అతి ముఖ్య మైనవి . వీటి ప్రాధాన్యతను ఆనాడే గుర్తించి , కృషి చేసిన ప్రజానాయకుడు.

ఒక  ఉత్కృష్టమైన జీవితం తన కధనాన్ని తానే రాసుకుంటుంది అనడానికి గొప్ప ఉదాహరణ వారి ఆత్మ కథ . దాని పేరు నా ప్రజాజీవితం . ఆయనకు తన కన్నా ,తన కుటుంబం కన్నా ప్రజలంటేనే మక్కువఎక్కువ . అందుకే భగవంతుడు ఆయన ఆత్మకధను అసంపూర్తిగా ఆపేశాడు .

ఏ  నాయకుని జీవితము అసంపూర్తిగా మిగిలిపోదు . మరెన్ని  ఉద్యమాలకో ఊపిరి పోస్తుంది . మరేందరికో స్ఫూర్తినిస్తుంది.

అలాంటి త్యాగమూర్తుల కృషి  అనే  పునా దులపైనే మనమీ నాడు జీ విస్తున్నాము .

కొస మెరుపు 

మన ప్రియతమ సోదరి శ్రీమతి కొండపల్లి నీహరిణి గారు వీరి సుపుత్రికే . అవే లక్షణాలు వీరిలో  శా ఖో ప శాఖలై పుష్పించి, ఫలిస్తున్నవి  ఈ నాడు.

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆమే అలిగిన నాడు..!

by Aruna Dhulipala March 27, 2024
written by Aruna Dhulipala

వెన్ను భాగాన్ని పరచుకున్న జుట్టును
వేళ్ళతో సుతారంగా ముడివేసి
కంటిరెప్పల బరువును
అమాంతం దించుకొని
కాలి అందెల సవ్వడి ప్రణవంగా
మెత్తని అడుగులతో వడివడిగా
ప్రపంచంపై సూరీడు పాకక ముందే
మొదలయ్యే ఉదయం ఆమెతో

తెల్లటి ముగ్గు రేఖలు 
వేలి సందుల నుండి జాలువారి
వయ్యారాలు పోతుంటాయి
చేతి రుచుల కమ్మదనాలు
బయటివారిని ఒకింత
నిలువరిస్తాయి ఇంటిముందు
అగరొత్తుల పరిమళాలు
దేవతా దీవెనలై వ్యాపిస్తాయి

ఇంటినిండా..
బద్ధకం కప్పుకున్న దేహాలు
మగతగా దొర్లుతుంటాయి 
వారి అవసరాల కోసం ఆమె
శరీరంలో ఇంకిన తేజస్సును
అరువు తెచ్చుకుంటుంది 
మళ్లీ మళ్లీ కొత్తగా

త్యాగాల కుంచె ధరించి
ప్రతి క్షణం వారి కోరికలకు
నునువెచ్చని మమకారాల
వన్నెలద్ది
జీవన కాంతిని ప్రసరిస్తూ ఆమె

అడుగడుగున ఆమె పదనర్తనం
వెన్నెల చల్లదనంలా
స్వచ్ఛతకు మారు పేరవుతుంది
తనకు తాను తప్ప
అందరికి మాత్రం ఆమే

ఆమే అలిగిన నాడు….?
ఏ భాషా భావం
విప్పలేదు ఆ శక్తిని
కూర్చలేదు ఆనందాకృతిని !

అరుణ ధూళిపాళ
8-3-2024
(అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా)

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన —– ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 27, 2024
written by Narendra Sandineni

హిమజ కోటు — ధోతీ కవిత్వం.

ప్రముఖ కవయిత్రి,హిమజ కలం నుండి జాలువారిన సంచీలో దీపం కవితా సంపుటిలోని కోటు — ధోతీ కవిత పై విశ్లేషణా వ్యాసం.కోటు – ధోతీ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.మనుషులు ధరించే కోటు – ధోతీ గురించి కవిత ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.మనుషులు చొక్కా పై కోటును ధరించడం గురించి మనకు అవగాహన ఉంది.ధోతీ పంచె అని పిలువబడే ఒక రకమైన వస్త్రం.ధోతీ అనేది పురుషులు ధరించే వస్త్రం.ధోతీ ఒక దీర్ఘ చతురస్రాకార రూపంలో ఉండే వస్త్రం. సాధారణంగా ధోతి సుమారు 4.5 మీటర్లు (15 అడుగులు) పొడవు,నడుము మరియు కాళ్ళ చుట్టు చుట్టబడి,ముందు లేదా వెనుక భాగంలో ముడి వేయబడి ఉంటుంది.ధోతీని మత పరమైన మరియు లౌకిక వేడుకలలో పురుషులు ధరిస్తారు.పీతాంబరం అనేది పసుపు రంగు పట్టు ధోతి.కొందరు వ్యక్తులు ధోతీని ధరిస్తారు. కొందరు పాయింట్ వేసుకుంటారు. కొందరు నిక్కర్ వేసుకుంటారు.లోకంలో భిన్నమైన మనస్తత్వాలు కలవారు ఉంటారు.భిన్నమైన రీతిలో వస్త్ర ధారణ చేస్తారు.మనుషుల అభిరుచి ఒక్క రీతిగా ఉండదు.వారు ఎవరికి ఇష్టమైన వస్త్రం వారు ధరిస్తారు. కవయిత్రి హిమజ కోటు – ధోతీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకొండి.

హిమజ

“ ఆ కాలపు ఆహార్యమో
“ఉద్యోగ ధర్మంగా అనివార్యమో
“ఆదివారం మినహాయించి అన్ని రోజులు
“మామయ్య గారు – కోటుతోనే కన్పించే వారు మాకు.
ఆహార్యం అంటే మేకప్.మేకప్ అంటే ఈ రోజుల్లో అందరికీ అర్థమవుతుంది.వేషానికి ధరించే సామాగ్రి ఆహార్యం తెచ్చుకొనతగినది.నాటకాలలో నటుల హావభావాలకు పాత్రకు తగిన ఆహార్యానికి ప్రాధాన్యత ఉంటుంది.వస్త్ర ఆభరణాలు ఆయా పాత్రలకు సందర్భోచితంగా ఉన్నప్పుడే ప్రేక్షకులకు ఆనందానుభూతి ఏర్పడుతుంది.వీరుడికి కాలోచితంగా కత్తి,డాలు,పిస్టల్,కవచము వంటివి ఆహార్యంలో ఒక భాగం.విషాద సన్నివేశంలో అయితే దానికి తగిన వస్త్రాలు ధరిస్తారు. రసానుగుణంగా పాత్రలు ధరించే ఆభరణాలు, అనులేపనలు అన్ని ఆహార్యంలోనివే.మామగారు ధరించే దుస్తులు అప్పటి కాలానికి సరిపోయే విధంగా ఉండేవి అని తెలుస్తుంది.అతను నిర్వర్తించే ఉద్యోగ ధర్మంలో భాగంగా వస్త్రధారణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వాడు అని తోస్తోంది.అతడు ప్రతి రోజు తన విద్యుక్త ధర్మమైన విధుల్లో భాగంగా చొక్కాపై కోటు వేసుకొనే వాడు.ఆదివారం నాడు సెలవు దినం కనుక అతను ఆ రోజు సాధారణంగా మామూలు దుస్తులు ధరించే వాడు.ఆ ఒక్కరోజు మాత్రమే అతను కోటు ధరించే వాడు కాదు.మిగతా రోజులలో చొక్కాపై కోటు వేసుకుని మామయ్య కనిపించే వారు అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“జమా బందీలు జరిగినా
“శిస్తు వసూళ్లకు సాగినా
“రెవెన్యూ దౌరాలకు కదిలినా “ఒంటినంటుపెట్టుకొని కోటు ఉండి తీరాల్సిందే.
జమాబందీ భారతదేశంలో ఒక నిర్దిష్టమైన భూమికి సంబంధించిన హక్కుల రికార్డును సూచించడానికి ఉపయోగించే హిందీ పదం.జమాబందీలో యజమానుల పేర్లు,భూమి యొక్క విస్తీర్ణం,దాని ఉపయోగం మరియు భూమిపై ఏవైనా తణఖాలు, శిస్తులు వంటి వివరాలను కలిగి ఉంటుంది. పూర్వకాలం నుంచి ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు భూమి శిస్తు.భూమి శిస్తు వసూలు చేసి ఖజానాకు జమ చేయడం జరుగుతుంది.అతను రెవెన్యూ శాఖలో తహసిల్దారుగా పని చేసే వాడు అని తెలుస్తుంది.అతను తహాసిల్దార్ హోదాలో జమా బందీలకు,సాధారణంగా సంవత్సరానికి ఒక సారి శిస్తుల వసూలు కొరకు జరిగే సమావేశాలకు హాజరయ్యే వాడు. వ్యవసాయ భూముల శిస్తు వసూళ్లకు అధికారికంగా పర్యటించే వాడు.విధి నిర్వహణలో భాగంగా అతడు రెవెన్యూ దౌరాలకు వెళ్లే వాడు.జమా బందీలకు వెళ్లినా,శిస్తు వసూళ్లకు వెళ్లినా,రెవెన్యూ దౌరాలకు వెళ్లినా అతను కోటు ధరించి వెళ్ళే వాడు.అతను వెళ్లే అధికారిక కార్యక్రమాలకు ఒంటినట్టు పెట్టుకొని కోటు ఉండి తీరాల్సిందే అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.
“పాల తెలుపు అంగీ గ్లాస్కో ధోతీ మీద
“లేత రంగు కోటు ఎంత గంభీరమో అంతే హుందాతనం
“లోపలి మెత్తటి అస్తరుతో కోటు తిర్ల మర్ల తెలియకున్నా
“మామయ్య గారి జీవితమైతే తెరిచిన పుస్తకమే.
అతను పాల తెలుపు రంగు చొక్కా ధరించే వాడు. గ్లాస్కో కంపెనీ తయారుచేసిన ధోతీని కట్టుకునే వాడు.తెల్ల చొక్కాపై లేత రంగు కోటు ధరించిన అతను ఎంతో గంభీరంగా ఉండే వాడు.అతడు హుందాగా ప్రవర్తించే వాడు.అతని నడకలో ఒక రకమైన ఠీవి కనిపించేది.అతను హుందాతనంతో మనోహరమైన అందమైన వర్చస్సుతో ఇతరులను ఇట్టే ఆకర్షించే సుగుణంతో పాటు మర్యాద, మన్ననను పొందే వాడు.అతను వేసుకున్న కోటు లోపలి మెత్తటి అస్తరుతో కూడి ఉండటం వలన కోటు తిర్ల మర్ల తెలిసేది కాదు.మామయ్య గడిపిన జీవితం తెరిచిన పుస్తకం వలె రహస్యాలు, దాపరికాలు,ఏవీ ఉండేవి కావు.అతడు అందరితోనూ ప్రేమగా సౌహార్ధంగా వ్యవహరించే వాడు.అతడు గడిపిన జీవితం ఎలాంటి భేషజాలు లేకుండా ఉండేవి.తెరచిన పుస్తకం అనే మాట మనకు అక్కడక్కడ వినిపిస్తుంది.కనిపించే మనిషి లోపల అగుపించని మనసు ఉన్నంత కాలం అంతా దాపరికం,దాగుడు మూతలు,మాయగా ఉంటుంది. సృష్టిలో జన్మించాక అవసరాలు తీరడం కోసం మనిషి ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరించాలి. తప్పదు.దాన్ని లోకజ్ఞానం అంటారు పెద్దలు.

“ఉద్యోగ బాధ్యతల్లో నిక్కచ్చితనం
“అవినీతికి ఆమడ దూరం – పైస పైస కష్టార్జితం
“తాటాకు మంట కోసం పసి పిల్లల బోళాతనం
“ఆఫీసు ఇల్లు రాముల వారి పూజ
“నుదుట వెలిగే తిరునామమెంత సరళమో
“అంతే సాదా సీదాయైన జీవన సరళి.
రెవెన్యూ శాఖలో ఉద్యోగం అయినప్పటికీ అతను ఎలాంటి ప్రలోభాలకు,అవినీతికి లొంగ లేదు.ఉద్యోగ బాధ్యతలను అతడు నీతిగా,నిజాయితీగా, నిక్కచ్చితనంతో నిర్వహించే వాడు.అతడు అవినీతికి ఆమడ దూరంలో ఉండే వాడు.అతను ఉద్యోగంతో వచ్చిన జీతంతోనే బతుకు బండిని సాగించే వాడు.అతను సంపాదించిన జీతం పైస పైస కష్టార్జితం అని చెప్పవచ్చు. తాటాకు మంట కోసం ఉండే పసిపిల్లల బోళాతనం అతనిలో కనిపించేది.అందరి పట్ల సమాన దృష్టితో పసిపిల్లల వలె అతను వ్యవహరించే వాడు అని తెలుస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అతను ఉదయం ఇంటి నుండి ఆఫీసుకు వెళ్లే వాడు.ఆఫీస్ పని పూర్తి అయిన తర్వాతనే అతను ఇంటికి చేరుకునే వాడు. అతను ఆఫీస్ బాధ్యతలను ఇంటి బాధ్యతలను సంయమనంతో నిర్వహించే వాడు.ప్రాతఃకాలంలో అతను లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని నుదుట తిరునామం ధరించి ఇంటిలోని రాముల వారిని పూజించే వాడు.అతడు నుదుట ధరించిన తిరు నామం ఎంతో సరళంగా ఉంటుంది. సాదా సీదాయైనా జీవన సరళితో అతను బతుకును సాగించాడు.సభ్యతా సంస్కారాలతో కూడిన అతని జీవన సరళి అందరికీ అనుసరణీయం అని తోస్తోంది.
“కోటు – ధోతీ ఆహార్యంలో
“ఎక్కడ ఎవరు కన్పించినా
“మామయ్య గారి రూపు – నా స్మృతిలో
“తడి మెరుపై మెరిసి మాయమవుతుంది.
ఆమె జీవిత ప్రయాణంలో ఎక్కడికి వెళ్లినా కోటు ధోతీ కట్టుకొని ఎవరు కనిపించినా మామయ్య గారి రూపం ఆమె జ్ఞాపకాల్లోకి వచ్చి కళ్ళముందు అతను ప్రత్యక్షమయ్యే వాడు.మామయ్య గారు అలా కనిపించగానే ఆమె కళ్ళలో కన్నీటి ధారలు ఒక్క సారిగా ఆకాశంలోని మెరుపులా మెరిసి మాయమయ్యేవి మామయ్యగారు చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఆమె జ్ఞాపకాలలో అతను సజీవంగా నిలిచి ఉన్నాడు.అతను ఆమె పట్ల చూపించిన అనురాగం అపారమైనది, అసాధారణమైనది.అందుకే ఆమె ఎల్లప్పుడూ అతనిని జ్ఞాపకాల ద్వారా గుర్తు చేసుకుంటున్నది అని కవయిత్రి హిమజ కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఉద్యోగుల బలవంతపు పదవీ విరమణతో
“ఒక్కసారిగా ఆయన డీలా పడితే
“ఒంటిమీద కోటులన్ని శుభ్రపడి
“అలమరలో దాక్కున్నాయి.
పదవీ విరమణ అనేది ఒకరి స్థానం లేదా వృత్తి నుండి లేదా ఒక చురుకైన పని జీవితం నుండి వైదొలగడంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో చేరిన వారు ఒక నిర్దిష్టమైన వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం నుండి పదవీ విరమణ చేస్తారు.ఇన్నాళ్లు రెవెన్యూ శాఖలో ఒక బాధ్యత గల పదవిలో నుండి పదవీ విరమణ కాగానే అతనికి ఏమీ తోచేది కాదు.పదవీ విరమణ పొందిన అనంతరం ఒక్క సారిగా ఎందుకో తెలియదు అతను ఢీలా పడి పోయాడు.అతను రోజు కోటు వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.అందు వల్ల అతను ధరించే కోటు దుస్తులు శుభ్రంగా ఉతికి ఆరిన తర్వాత అలమారలో దాచి పెట్టినారు.అతను ధరించిన ఒంటి మీద ఉన్న కోటులు అన్ని శుభ్రపడి అలమరలో దాక్కున్నాయి అని కవయిత్రి హిమజ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆస్తుల్ని నాకిచ్చి అకాలంగా వెళ్లిపోయిన
“ఆయన ఆస్తిగా భద్రంగా
“కోటు జేబులో దాచుకున్నది
“చిన్నారి శైలు ఛాయా చిత్రం ఒక్కటే.
మనిషి జీవితంలో అన్ని రోజులు ఒక్కలా ఉండవు. అకాలం అనగా మంచిగా జరగని కాలం.అతను జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని నాకు ఇచ్చి తిరిగిరాని లోకాలకు చేరినాడు.అతను అకాలంగా వెళ్లి పోయిన రోజు గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుంది.ఈ లోకాన్ని వీడిపోయిన అతను తన చేతుల్లో పెరిగిన చిన్నారి శైలు ఫోటోను ఆస్తి వలె భద్రంగా తన కోటు జేబులో దాచుకున్నాడు అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“యాభయేళ్ళ క్రితపు డైరీలో
“ఆయన రాసి పెట్టుకున్న ఒకే ఒక్క పేజీ
“శైలు తల్లి పుట్టిన తేది మాత్రమే !
డైరీ దినచర్య పుస్తకం.ఒక వ్యక్తి తను చూసిన లేదా విన్న దాని గురించి గాని వారు చేస్తున్న పని గురించి గాని ఏ రోజు జరిగిన సంఘటనలు ఆ రోజు నమోదు చేయు పుస్తకం డైరీ.ప్రజలు వివిధ కారణాల వల్ల డైరీలను వ్రాసేందుకు ఇష్టపడతారు. డైరీ రాసే వ్యక్తి తన జీవితంలో ఏమి చేశాడనే దాని గురించి తనకంటూ ఒక రికార్డు ఉండాలని అతను కోరుకుంటాడు.ఈ లోకాన్ని వీడిన అతని ఇంటి అలమరలో వెతకగా 50 ఏళ్ల క్రితం నాటి డైరీ ఒకటి దొరికింది.అతను డైరీలో రాసి పెట్టుకున్న ఒకే ఒక పేజీ కనబడింది.అతను డైరీలో రాసి పెట్టుకున్నది శైలు తల్లి పుట్టిన తేదీ మాత్రమే.50 సంవత్సరాల కిందటి డైరీలో మిగతా పేజీల్లో ఏమీ రాయలేదు.ఒక పేజీలో మాత్రం శైలు తల్లి పుట్టిన తేదీని నమోదు చేసి పెట్టుకున్నాడు.అతనికి శైలు తల్లి పుట్టిన రోజు అంత ముఖ్యమైనదిగా,అపురూపమైనదిగా తోస్తోంది.కవయిత్రి హిమజ తనను ప్రాణంగా సాదుకున్న మామయ్య గారి స్మృతిలో కోటు – ధోతీ కవితను రాసి పాఠక లోకానికి అందించింది. కవయిత్రి హిమజ రాసిన కోటు – ధోతీ కవిత ఎప్పటికీ నిలిచి ఉంటుంది.చక్కటి స్మృతి కవిత రాసినందుకు కవయిత్రి హిమజను అభినందిస్తున్నాను.కవయిత్రి హిమజ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన —- ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 27, 2024
written by Narendra Sandineni

కున్వర్ నారాయణ్ హిందీలో రచించిన కవిత.
ఆంగ్లం అనువాదం : అపూర్వ నారాయణ్.
తెలుగు అనువాదం : వారాల ఆనంద్.
కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రఖ్యాత కవి,కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన ఓ వింతయిన రోజు కవిత ఇది.కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను అపూర్వ నారాయణ్ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన ఓ వింతయిన రోజు కవితను వారాల ఆనంద్ తెలుగులోకి అనువాదం చేశాడు. తెలుగులోకి వారాల ఆనంద్ అనువాదం చేసిన వింతయిన రోజు కవిత చదవగానే నాలో కలిగిన భావాలకు అక్షర రూపం దాల్చిన విశ్లేషణా వ్యాసం ఇది.ఏదైనా కొత్త విషయం తెలిస్తే మనకు వింతగా అనిపిస్తుంది.ఏదైనా కొత్త వస్తువు అపురూపమైనది చూస్తే మనకు వింతగా అనిపిస్తుంది.మనలను సంభ్రమాశ్చర్యాలకు ముంచెత్తే విషయం వింతగా చెప్పవచ్చు. ఏదైనా వింతను చూస్తే ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యం కలిగించే మాటలు వినినప్పుడు మనకు వింతగా అనిపిస్తుంది. అసాధారణమైన మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మన మనసులో కలిగే భావనను వింతగా చెప్పవచ్చు. విస్మయము కలిగించే వస్తువును కూడా వింత గొల్పేది అని చెప్పవచ్చు.ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ కూడా ఒకటి.రోజుకు 24 గంటల సమయం ఉంటుంది.కాలచక్రం ఎవరికి తెలియకుండానే గిర్రున తిరుగుతూ ఉంటుంది.మనం అనుభవించే ప్రస్తుత క్షణం కూడా రోజులోని భాగమే అని చెప్పవచ్చు. రోజును దినం అని కూడా అంటారు.రోజును వివిధ రకాలుగా పిలుస్తారు.ఏదో ఒక రోజు అని చెబుతాం. ప్రతిరోజు అని కూడా అంటాం.జీతాలు ఇచ్చే రోజును జీతాల రోజు అని అంటాం.కొందరు పుట్టిన రోజు సందర్భంగా వేడుకను జరుపుకుంటారు. కొందరు భార్యాభర్తలు పెళ్లి రోజు సందర్భంగా వేడుకను జరుపుకుంటారు.సమాజానికి గొప్ప సేవ చేసిన వారు లోకాన్ని వీడిన రోజును వర్ధంతి రోజుగా జరుపుకుంటారు. సమాజానికి గొప్ప సేవ చేసి చనిపోయిన వ్యక్తి జన్మించిన రోజును కూడా జయంతి రోజును వేడుకగా జరుపుకుంటారు. నడుస్తున్న ఈ రోజున మంచి జరిగితే మంచి రోజు అని చెబుతారు.నడుస్తున్న ఈ రోజున ఏదైనా దుర్ఘటన జరిగితే దానిని చెడ్డ రోజు అని చెబుతారు. ఓ వింతయిన రోజు కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.అసలు వింతయిన రోజు ఏదైనా ఉంటుందా? అనే సందేహాలు మనలో పొడచూపవచ్చు.వింతయిన రోజు అనగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.ఓ వింతయిన రోజు ఏమిటి? అనే సందేహాలకు సమాధానాలు కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను చదివితే తెలుస్తుంది.కవి కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవిత ద్వారా ఒక రోజులో జరిగిన వింతలు,విశేషాలను వ్యక్తం చేయడం అద్భుతంగా ఉంది.వింతయిన రోజు సందర్భంగా అతను ఏమేమి చేశాడు? ఆ రోజున అతనికి ఏమేమి జరిగింది అనే సంఘటనలను పూసగుచ్చినట్టు విడమర్చి చెప్పిన తీరు అబ్బురం కలిగిస్తుంది.వింతయిన రోజున జరిగిన దానిని అతను అదృష్టంగా భావిస్తున్నాడు.వింతయిన రోజు గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తితో కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.వింతయిన రోజులో జరిగిన సంగతులు తెలుసుకొని అలౌకిక అనుభూతులను సొంతం చేసుకుందాం.

వారాల ఆనంద్.


“ నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను
“ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు
“ అనేకమంది మనషుల్ని కలిసాను
“ ఎక్కడా అవమానం ఎదురు కాలేదు.
అతను అలా రోజంతా పని చేయకుండా వృధాగా నగరమంతా ఎందుకు తిరిగాడు? అతను ఆ రోజున చేయాల్సిన పని చేయకుండా ఎందుకు వృధాగా వీధులలో తిరుగుతాడు? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.కారణాలు ఏమిటో అతడు చెబుతున్నది నిజమేనా? అని మనకు సందేహం కలుగుతుంది.అతను అంత పెద్ద నగరంలో అలసట ఎరుగక,విసుగు చెందకుండా వృధాగా తిరిగినప్పటికీ ఆ రోజు ఏ వాహనం వల్ల గాని మరే విధంగా గాని ప్రమాదం సంభవించలేదు అని అంటున్నాడు. నిజమేనా?ఆ రోజు ఎలాంటి పని చేయకుండా నగరంలోని వీధులన్నీ తిరుగుతూ వృధా సంచారం చేస్తూ ఖాళీగా ఉండక అనేకమంది మనుషులను కలిశాను,మాట్లాడాను అని అంటున్నాడు.ఆ రోజు కలిసిన వ్యక్తులు అందరు అతనితో సానుకూలంగా మాట్లాడారు.అతనితో ఎలాంటి వాదోపవాదాలు చర్చలు జరప లేదు.ఆ రోజు ఎందుకో ఏ మనిషి వల్ల అతనికి అవమానం ఎదురు కాలేదు.అతను చెప్పిన మాటలు వింటుంటే ఎందుకో మనకు నమ్మశక్యం అనిపించదు.ఆ రోజు జరిగిన సంగతుల గురించి అతని మాటలు వినగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.ఆ రోజు అతను కలిసిన అనేకమంది మనుషులు సానుకూలంగా మాట్లాడటం ఏమిటి? ఎలాంటి గొడవలు లేకుండా మనుషులు అందరు సానుకూలంగా ఎలా ఉంటారు?.మనుషులు అందరు ఒక్కలా ఉండరు.మనుషులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.ఒకరినొకరు విమర్శించుకుంటూ,వ్యతిరేకిస్తూ అవమానించుకుంటారు.కాని ఆ రోజున ఇలాంటివి ఏమీ జరగలేదు అన్న అతని మాటలు వింటుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.
“ నేను రోజంతా సత్యమే మాట్లాడాను
“ ఎవరూ తప్పుగా స్వీకరించలేదు
“ నేనివాళ అందరిని విశ్వసించాను
“ ఎక్కడ మోసగింప బడలేదు.
అతను ఈ రోజు అందరితో సత్యమే మాట్లాడాడు.అతను మాట్లాడిన మాటలను ఎవరు తప్పుగా అర్థం చేసుకోలేదు. అతను మాట్లాడిన మాటలను ఎవరు ఎందుకు వ్యతిరేకించలేదు?ఆ రోజు సత్యాన్ని మాత్రమే మాట్లాడటానికి అతను సత్య హరిశ్చంద్రుడు కాదు.అతను సత్యం ఎలా మాట్లాడాడు? అతను సత్యం మాట్లాడుతుంటే అందరు అతన్ని సత్యవంతుడుగా ఎలా స్వీకరించారు? అనే సందేహాలు కలుగవచ్చు.అతను ఆ రోజు అందరు మనుషులను విశ్వసించాను అని చెబుతున్నాడు.ఎవరైనా అందరి మనుషులను విశ్వసిస్తారా? అప్పుడే పరిచయమైన వ్యక్తిని ఎలా విశ్వసిస్తారు? అతను ఎవరో? ఏం చేస్తుంటాడో? అతని గురించిన వివరాలు ఏమీ తెలవదు.అతను తెలవని వ్యక్తిని విశ్వసించాను అని చెబుతున్నాడు. అతని మాటలు వింటుంటే ఆశ్చర్యం గొలుపుతుంది. ఏ మనిషి చేత ఎక్కడ మోసగింపబడ లేదు అని చెబుతున్నాడు.మనకు తెలియని మనిషి ఎలా సాయం చేస్తాడు.తెలియని వ్యక్తి సాయం చేస్తాను అని అతనితో చెప్పి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది.సాయం చేస్తానని తెలిసిన మనిషి చెప్పిన మాటలను కూడా పూర్తిగా విశ్వసించలేము.తెలిసిన మనిషి కూడా నమ్మించి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి.తెలిసిన మనిషిని కూడా పూర్తిగా విశ్వసించలేము.తెలవని వ్యక్తులు కూడా అతనిని మోసగిస్తారు. తెలిసిన వ్యక్తులు కూడా అతనిని మోసగిస్తారు.ఆ రోజు అతను ఏం చేస్తున్నాడో? ఎక్కడికి పోతున్నాడో? ఏం పని మీద పోతున్నాడో? తెలియకుండా అయోమయంగా నగరం అంతా సంచరించడం ఆశ్చర్యం గొల్పుతుంది.ఆ రోజు అతను అందరిని ఎలా విశ్వసించగలడు?ఆ రోజు ఎందుకో అతనిపై అందరికి నమ్మకం కుదిరింది. అందుకే అతను అందరిని విశ్వసించాడు అని తోస్తుంది.ఆ రోజు మనుషులు అందరు సత్యవంతులు అని అతడు భావించాడు.సమాజం నిండా మోసగాళ్ళు నిండి ఉన్నప్పుడు ఆ రోజు అతన్ని మోసం చేయకుండా ఎలా ఉంటారు? అనే సందేహాలు మనలో తలెత్తుతాయి.సత్యమేవ జయతే అని సూక్తి ఉంది.సత్యమే జయిస్తుంది. హరిశ్చంద్రుడు సత్యం కొరకు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు.చివరికి విజయం సాధించాడు. హరిశ్చంద్రుడు సత్యమైన బాటలో నడిచి సత్యవంతుడుగా ఖ్యాతి గడించాడు.
“ అద్భుతమయిన విషయమేమిటంటే
“ నేను ఇంటికి చేరుకోగానే
“ తిరిగొచ్చింది ఇంకెవరో కాదు
“ నేనే అని కనుగొన్నాను.
ఆరోజు నగరంలో అతను ఎటు పోతున్నాడో? ఏమి చేస్తున్నాడో? తెలియకుండా అయోమయంగా వీధులన్నీ తనవిగా భావించి తిరిగాడు.ఎందుకో ఆ రోజంతా తిరిగిన తర్వాత అలసిపోయిన అతను ఒక ఇంటికి చేరాడు.ఆ ఇల్లు ఎవరిదో అని అనుకున్నాడు.అద్భుతంగా ఆ రోజు నగరం అంతా తిరిగిన తర్వాత మొహమంతా పీక్కుపోయి బాగా అలసిపోయినాడు.ఇది ఎవరి ఇల్లో? అని మనసులో అనుకున్నాడు.ఆ రోజంతా నగరంలో తిరిగిన తర్వాత అలసిపోయి చిత్రంగా తన ఇంటికే చేరుకున్నాడు.ఎందుకో ఆ రోజు అయోమయంగా ఎక్కడ తిరిగినప్పటికీ ఏం చేసినప్పటికీ అతని అడుగులు మాత్రం మర్చిపోకుండా ఇంటికి చేర్చాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.ఇంకా అతను ఆ రోజు జరిగిన విషయాన్ని గొప్పగా అందరికీ తెలియజేస్తున్నాడు.ఆ రోజు జరిగిన అద్భుతమైన విషయం ఏమిటి? అంటే చివరికి నగరమంతా తిరిగిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. చివరికి తన ఇంటికి చేరుకున్నాడు.అతను తన ఇంటికి చేరిన తర్వాత తెలిసింది.అయోమయంగా నగరమంతా తిరిగి తన ఇంటికే వచ్చినాడు.నగరం అంతా తిరిగి తన ఇంటికి వచ్చినది ఇంకెవరో కాదు తానే అని తెలుసుకున్నాడు.అయోమయంగా నగరం అంతా తిరిగిన ఆ రోజు అతని జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనగా వింతైన రోజుగా తోస్తోంది.అతను ఆ రోజు ఏం చేసింది? అన్ని విషయాలు అందరితో పంచుకున్న తీరు చక్కగా ఉంది.అతని జీవితంలోని ఆ రోజుకు సంబంధించిన వింత విషయాలను పాఠకులకు అర్థం అయ్యేలా కవి కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవితలో చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.ఆ రోజు జరిగిన వ్యక్తి జీవితంలోని సంఘర్షణలను కవితగా మలిచిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది.ఆ రోజు వ్యక్తిలో చెలరేగిన భావాలను వింతైన రోజు కవితలో వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.కవి కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను తెలుగులోకి అద్భుతంగా అనువాదం చేసిన కవి వారాల ఆనంద్ ను అభినందిస్తున్నాను.

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పసివాని కోరిక

by Sammeta Umadevi March 17, 2024
written by Sammeta Umadevi

జిల్లా పరిషత్తులో గుమాస్తాగా పనిచేస్తున్న గంగాధర్ పిల్లలే అరుణ ఆనంద్ లు. పదవ తరగతి చదువుతున్న అరుణ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటుంది. ఆరో తరగతి చదువుతున్న ఆనంద్ కేమో స్నేహితులంటే ప్రాణం. వాళ్ళ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆడుకోవడానికి తన ఈడు పిల్లలు లేక చిన్నబోయి ఉండేవాడు. ఇప్పుడు గంగాధర్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి మారాక అక్కడ తన ఈడు పిల్లలు కొందరు ఉండడంతో ఆనంద్ తన కొత్త మిత్రులతో సంతోషంగా గడపసాగాడు. ముఖ్యంగా ఆనంద్ కి పక్కింటి రియాజ్ కి మంచి స్నేహం కుదిరింది.

 ప్రత్యేక తరగతులు ఉన్నందున ఆనంద్ అక్క అరుణ రోజూ బడికి ముందు వెళ్ళిపోతుంటుంది.  అందువల్ల ఆనంద్, రియాజ్ ఇద్దరూ కలిసి బడికి వెళ్తున్నారు. పెరట్లో జామచెట్టు కింద చాప వేసుకుని కూర్చుని కలిసి హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. పోటీ పడి చదువుకుంటున్నారు. హాయిగా ఆడుకుంటున్నారు. పాలపాకెట్టో, కూరగాయలో ఎవరు తెమ్మన్నా ఇద్దరూ కలిసి వెళ్ళి తెస్తున్నారు. రియాజ్ వాళ్ళ నాన్న ఖాదర్ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తల్లిని ఒప్పించి ఆనంద్ తన నోట్సులు కొన్ని రియాజ్ కి ఇచ్చాడు. అప్పుడప్పుడు పెన్సిల్లు, పెన్నులు కూడా ఇస్తుంటాడు.. ఇక తల్లి సుదతి పండ్లూ పలహారం ఏమిచ్చినా రియాజ్ తో పంచుకుని తినడం అలవాటయ్యింది ఆనంద్ కి. రియాజ్ వాళ్ళ అమ్మ జరీనా ఏమి వండినా ఆనంద్ ని పిలిచి  మరీ పెడ్తుంటుంది. కొన్ని నెలలు గడిచి ఆనంద్ రియాజ్ ల స్నేహం మరింత బలపడింది. కొత్తవా వాళ్ళెవరైనా  ఖాదర్ ఇంట ఈ ఇద్దరు పిల్లలను చూస్తే.. ఖాదర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు. గంగాధర్ ఇంట ఆ పిల్లలిద్దరినీ చూసిన వాళ్లు గంగాధర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు.

 “ఆనంద్ కి ఇదివరకు తినడానికి ఏది పెడ్తే.. ఒక్కటి ఇస్తే ఇంక చాలు చాలు అనేవాడు. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇంకొకటి కావాలి అంటున్నాడు” అని భర్తకు  చెప్పింది సుదతి. “పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు వాడికి ఆకలి పెరుగుతుంది. వాడు తినగలిగినన్ని ఇవ్వు” అని చెప్పాడు గంగాధర్. ఎవరు ఏమీ పెట్టినా జామ  చెట్టు వెనకకు వెళ్ళి పంచుకుని తింటున్న మిత్రులిద్దరినీ చూసి ఆనంద్ కి ఆకలి ఎందుకు పెరిగిందో అర్థమై నవ్వుకున్నది అరుణ.

ఇప్పుడు దసరా పండగ వచ్చింది. గంగాధర్, సుదతి పిల్లలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం తయారుకండి  అని చెప్పారు. “నాన్నా నాకు రెండు జతల బట్టలు కొనిపెట్టవా?” అని అడిగాడు ఆనంద్.  “రెండు నెలల తరువాత నీ పుట్టినరోజు ఉంది కదా. అప్పుడు మళ్ళీ నీకు కొత్త డ్రెస్ కొనాలి. ఇప్పుడు నేను రెండు జతలు కొనలేను” అని చెప్పేశాడు గంగాధర్. “నాన్నా.. నాకు పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనకపోయినా పరవాలేదు.. ఇప్పుడు మాత్రం రెండు జతలు కొనండి నాన్నా” అని బతిమిలాడాడు. గంగాధర్ కి బాగా కోపం వచ్చింది. “ఎందుకు ఎంత జిద్దు చేస్తున్నావు ఆనంద్..”అని కోపంగా అరిచాడు.

“నాన్నా! పాపం రియాజ్ కి సరైన బట్టలు లేవు. బడిలో సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మంచి బట్టలు లేక ఆ రోజు బడి మానేస్తున్నాడు. నాకు ఖరీదైన బట్టలు వద్దు. మామూలు ధరలోనే మా ఇద్దరికీ చెరో జత కొనండి నాన్నా.. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే.. నేను కొత్త బట్టలు వేసుకోలేను నాన్నా!” అని చెప్పాడు.  స్నేహితుని పై కొడుకు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాడు గంగాధర్.

పక్కింటికి వెళ్ళి ఖాదర్ ని జరీనాని ఒప్పించి, అరుణా ఆనంద్ లతో పాటు రియాజ్ ని కూడా తీసుకుని.. బట్టల షాప్ కి బయలుదేరారు గంగాధర్ సుదతి దంపతులు.

                                                   ***

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us