మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

నాన్నా.. నాక్కొంచెం ధైర్యం యివ్వు

by Madhu Jella July 25, 2024
written by Madhu Jella

నీ చూపులనే
గొడుగగా పట్టి
నా వెంటే నీవున్నపుడు

ఆ గొడుగు నీడలో
నా నడకలు సాగుతున్నపుడు
ఏ భయమూ లేదు
నీవుంటే
నా వెంటే ధైర్యం

నీ తోడుగా…
నాకు తెలియని
లోకాలెన్నో చూసాను
నా రెక్కల గుర్రం నీవే

నా ఎదుగుదలకు
ఉప్పొంగి పోయి
లోకమంతా చాటింపు వేసావు
గర్వంతో..
నా ఉన్నతి
ఉచిత ప్రచారకర్తవు నీవే

మంచి చెడుల మధ్య ఉన్న
చిన్నని గీత ఆనవాలేమిటో
లోకుల తత్వమేమిటో
విశ్లేషించుకొనే
శక్తినిచ్చావు
నీవో మనస్తత్వ నిపుణుడివి గదా..

ఉన్నపుడు పొంగిపోకుండా
లేనినాడు కుంగిపోకుండా
బతకడం నేర్పించావు
బతుకుదారిలో…
నా తోడొచ్చే బాటసారివి నీవే కదా

కఠినంగా… అనిపించినా
నవనీతమువంటి
సున్నితత్వము నీవు

బతుకుబండిని లాగడానికి
ఎన్నెన్ని కష్టాలు పడ్డావో
ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో…

చిన్నప్పుడు నీతో ఉన్న ఙ్ఞాపకాలు
అంతగా గుర్తులేదుగానీ
ఊహ తెలిసిన నాటి ఙ్ఞాపకాలు
మదిపుటలలో
పదిలంగానే ఉన్నాయి

నేస్తంగా..
ఎన్నో ముచ్చట్లు చెప్పేవాడివో
గురువుగా ఎంత ఙ్ఞానము
పంచావో
ఏమీ తెలియని అనామకునిలా
అమాయకుడిలా
లోకానికి తెలిసిన నీవు
అన్నీ తెలిసిన
ఓ మహాఙ్ఞానివి
మహాయోగివి
నిరాడంబర నిష్కామ యోగివి
నేనెరిగిన సత్యమిదే

నీవు..
యిప్పుడు నా చెంత లేవు
నా కష్టసుఖాలను చూసే..
వినే
ఆప్తులూ.. లేరు
చింత తీర్చే నేస్తాలూ..లేరు

నా ఆనందాలను ఆస్వాదించేవారూ
నా దుఃఖాలకు
ఓదార్పునిచ్చేవారు కరువు
‘నాన్నా’… మరలి రావూ…
నాకు ధైర్యంగా నిలువు
నా బాధ్యతలు..బంధాలలో
తోడై నడువు

నాన్ననైన నేను
నా బిడ్డల తోడుగా
నడిచే
ధైర్యం యివ్వు

July 25, 2024 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మనం మన సమాజం మారేదెప్పుడో ?

by Banda Saroja July 25, 2024
written by Banda Saroja

భగవంతుని దృష్టిలో, సృష్టిలో మానవులంతా ఒక జాతి. సంఘంలో స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వాములు. సంసారపు బండికి రెండు చక్రాలు. సంమాజంలో సగం సగం. ఒక జాతి జీవన విధానం ఆ జాతి తమ స్త్రీలకిచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది. అన్నాడొక ఫ్రెంచి దేశీయుడు. మానవ జాతిని సృష్టించే ముందు సృష్టికర్త తననుతాను రెండు భాగాలుగా విభజించుకున్నట్టు చెప్పే అర్ధనారీశ్వర సిద్ధాంతం ఒక భారతీయ సంస్కృతిలోనే ఉంది. ధర్మాచరణలోను, కుటుంబ విధుల నిర్వహణలోను భారతీయ స్త్రీలకున్న విశిష్ట స్థానం మరే ఇతర దేశాల ప్రాచీన సాహిత్యంలో, పురాణ గ్రంథాల్లోను కనిపించదు. ”యత్ర నార్యన్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” అంటే స్త్రీలు గౌరవించ బడిన ఇల్లల్లో దేవతలు విహరిస్తారు అన్న సూక్తులను బట్టి మన ప్రాచీనులు స్త్రీకి సమాజంలో ఎలాంటి మహోన్నత స్థానాన్ని ఇచ్చారో గ్రహించవచ్చు. ”మాతృదేవోభవ” అని ముందు తల్లికి, ”పితృదేవోభవ” అని తండ్రికి, ఆ పిదప = ”ఆచార్యదేవోభవ” అని గురువులకు నమస్కరించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఇంకా సరస్వతీదేవి మనకు చదువుల తల్లి. లక్ష్మీదేవి సంపదలను, భోగభాగ్యాలను ఇచ్చే తల్లి, పార్వతీదేవి శక్తి స్వరూపిణి, అందరినీ రక్షించే అమ్మ. ఈ ముగ్గురు మనకు ”మూలదైవాలు”. దీన్ని బట్టి మనదేశంలో, మన సమాజంలో స్త్రీలంటే ఎంతటి గౌరవ ప్రతిపత్తులు, భక్తి భావాలున్నాయో తెలుస్తుంది.

మన ప్రాచీనులు తాము అనుభవించే అన్ని కష్టసుఖాలు స్త్రీల పైనే ఆధారపడి ఉంటాయని భావించారు. ధర్మార్థ, కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలను సాధించడానికి తోడు స్త్రీ కావాలన్నారు. అందుచేత పురుషుడు స్త్రీలను అనుసరించి వారి ఇష్టాలకు అనుగుణంగా తమ అభిమతాలను మార్చుకోవాలని నిర్దేశించారు. ధర్మసంస్థాపన, తద్వారా సంఘ సంక్షేమంలో స్త్రీలకు సమానమైన ప్రాధాన్యత ఉందని భావించారు. స్త్రీ పురుషులలో ఒకరు అధికులు, మరొకరు తక్కువ అనే భావన వారి దృక్పథంలో లేనేలేదు. ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగల ‘నేర్పరి’ స్త్రీయని భావించి ‘గృహలక్ష్మి’గా ఆమెకు మహోన్నత స్థానాన్ని కల్పించారు. విశ్వమంతా స్త్రీమూర్తిగా భావించారు. ఇదే ఒరవడిలో డాక్టర్‌ సి.నారాయణ రెడ్డిగారు తమ ‘ప్రపంచ పదులు’ అనే కవితలో ”ఆకసమే బీజ ప్రదాతగ, అవనియే ఒక ఆదిమాతగ, కాంచగలిగిన మానవునకు జగజ్జనావళి ఒకే కుటుంబం” అని నొక్కి వక్కాణించారు. మన పూర్వీకులు నారీరహితుడైన పురుషుడు పరిమళం లేని పుష్పమని భావించారు. గృహస్థాశ్రమం ఎరుగని పురుషుడు మోక్షానికి అనర్హుడని చెప్పారు. స్త్రీల శ్రేయస్సును కోరుకునే ప్రతి తండ్రి, భర్త, సోదరుడు స్త్రీని గౌరవించాలన్నారు ‘మనువు’. అదే సందర్భంలో ”పితారక్షేతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, రక్షాన్తి వార్ధక్యే పుత్ర, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అనే ద్వంద్వభావాన్ని వెలిబుచ్చారు. ఇది స్త్రీలపై ఉండే ప్రేమ, గౌరవం, కారుణ్యమో తెలియదు. ఏది ఏమైనా ఆధునిక మహిళలకిది చర్చనీయాంశమే. వివక్షా పూరితమైన మహిళల జీవన విధానానికి, కొడుకులు కోడండ్ర నిరాదరణకు గురై వృద్ధాశ్రమాల్లో మగ్గే స్త్రీలకు, సాంఘిక దురన్యాయాలకు బలయిన వితంతువులకిది చుక్కెదురే. ఈరోజు మనం సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక, విద్యా వైద్య రంగాలలో, క్రీడా ప్రపంచంలో ప్రగతిని సాధించాం అనుకుంటే అది కూడా పురుషుల కంటె తక్కువే. నేటికీ సమాజంలో స్త్రీ స్థాయి, హోదా ద్వితీయ శ్రేణికి చెందినదే అంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా వేదకాలం నుంచి నేటివరకు స్త్రీ స్థాయి హోదా ఎలా ఉందో పరిశీలిద్దాం.

– వేదకాలంలో పురుషునితో సమానంగా స్త్రీకి స్థానం ఈయబడింది. ఆనాడు స్త్రీలు యజ్ఞ యాగాదుల్లో పాల్గొనేవారు. ధర్మవిధులను పాటించేవారు. యుద్ధ రంగాలకు పోయి పురుషులతో ధీటుగా యుద్ధాలలో పాల్గొనేది. నాటి స్త్రీలు ఆయుధవిద్యను అభ్యసించేది. ఉదా: సత్యభామ, కైకేయి, ఖేలుని భార్య ‘విస్ఫల’ యుద్ధంలో కాలు పోగొట్టుకుంది. ముద్గలుని భార్య ‘ముద్గలాని’ శత్రువులను తరిమి కొట్టింది.

– ఆనాడు స్త్రీలు కవులుగా, ఋషులుగా పేరు పొందారు. భాష, సాహిత్యం, లలిత కళలు అన్నీ స్త్రీలకు అందుబాటులో ఉండేవి. ఘోష, లోపాముద్ర, అపాల, రోమష, సూర్య మొదలైన వారు వివిధ రంగాలలో గణనీయులు.

– పండుగలు, పబ్బాలు, తాత్త్వికమైన చర్చలల్లో వాటి స్త్రీలు పాల్గొనేవారు. ఉపనిషత్తుల కాలంలో ‘బ్రహ్మజ్ఞాన’ సముపార్జన విషయంలో పురుషులతో ‘నమనీయ’గా ఉన్న స్త్రీలు గార్గి, మైత్రేయి,  పదవ ప్రాథితేయి. నాటి విద్యార్థినులు రెండు రకాలు. జీవితాంతం మతశాస్గ్రాన్ని అధ్యయనం చేసేవారు బ్రహ్మవాదినులు, వివాహమయ్యేవరకు విద్యనభ్యసించువారు సద్యోద్వాహులు.

– రుగ్వేదంలో కొన్ని రుక్కులు స్త్రీలు రాశారని చెప్పబడుతుంది. అపాల ఇంద్రున్ని కొనియాడుతూ రుక్కు చెప్పింది. విశ్వావర అగ్నిని స్తోత్రం చేసింది.

– కాశకృత్సవ మీమాంసపై ఉద్గ్రంథం రాసింది.

– ఆత్రేయ వేదాంతాన్ని అధ్యయనం చేసింది. ఆమె గొప్ప పండితురాలు. వాల్మీకి, అగస్త్యుని వద్ద ఆమె విద్యనార్జించింది.

– ఆ కాలంలో స్త్రీలకు ఉపనయనం ఉండేది. ఆ కర్మలలో ఆమె నడుముకు పలుపు కట్టేవారు. కర్మలలో పాల్గొనటానికి ఆమెకు ప్రవేశం కల్పించటానికి అది చిహ్నమట.

– బౌద్ధంలో అనేకమంది స్త్రీలు సంఘంలో చేరి సన్యాస జీవితాన్ని గడిపారు. ”తేరీగాథ” అనే గ్రంథాన్ని అలాంటి స్త్రీలు రచించారు.

– గాథా సప్తశతిలో అనేకమంది కవయిత్రుల పేర్లు కనబడతాయి. రేవ, రోహ, మాధవి, అమలక్ష్మీ.

– సంస్కృత కవుల చరిత్రలో పెక్కుమంది స్త్రీల పేర్లు ఉటంకించబడ్డాయి. ఉదా: మారులా, మోరికా, సుభద్రా, ప్రియదర్శిని, శకుంతల, కాదంబరి లాంటి కావ్యాలలో నాయికలు లలిత కళలలో ప్రవీణులు.

– శాతవాహనుల కాలపు నాయనికా క్రీ.పూ. 2 శతాబ్దం

– వాకాటక వంశపు ప్రభావతిగుప్త క్రీ.త. 4వ శతాబ్దం

– చాణక్య వంశపు విజయ భట్టారిక క్రీ.త. 7వ శతాబ్దం

– కాశ్మీరుకు చెందిన సుగంధ దిద్దా క్రీ.త. 10వ శతాబ్దం పరిపాలనాదకక్షులు.

– వయసు వచ్చిన ఆడపిల్లలు గృహనిర్వహణలో ఎక్కువ బాధ్యత తీసుకునేవారు. శకుంతల, కుంతి విధి నిర్వహణ చేసి అతిథి అభ్యాగతులను ఆదరించారు.

– వేద కాలంలో పురాణ కాలంలో స్త్రీలు ‘కందువ’ క్రీడల్లో పాల్గొనేవారు. బంతి ఆట ద్వారా తగినంత శరీర వ్యాయామాన్ని పొందేవారు.

– సర్వ సామాన్యంగా వేదకాలంలో ఆడపిల్లలు ఇంట్లో పెద్దల వద్ద విద్యను అభ్యసించేవారు. స్త్రీలు ఎక్కువ దూరం వెళ్లి విద్యాభ్యాసం చేయలేదని జాతక కథలను బట్టి తెలుస్తుంది.

– వేదకాలంలో కన్య సామాజిక ఉత్సవాలన్నింటిలో పాల్గొనేది. భర్తను వెతుక్కోవటానికి ‘సమనకు’ వెళ్ళేది. తల్లులు కుమార్తెలను అలంకరించి పంపేవారు. వరులు అచట తమకు కాబోయే భార్యల అభిమానాన్ని చూరగొనటానికి ప్రయత్నించేవారు. ‘సమనలు’ సాధారణంగా వసంత ఋతువులో ఏర్పాటయ్యేవి. యువతీ యువకులు చెట్టాపట్టాలేసుకొని నృత్యం చేసేవారు.

– భారతకాలం నాటికి స్త్రీలు, పురుషులు కలిసి ఆడటం ఆగిపోయింది.

– ధర్మశాస్త్ర యుగం – పురాణకాలం స్త్రీకి అంధకార యుగాలని చెప్పవచ్చు. స్త్రీని చూస్తే భయం, స్త్రీని నిరసించడం, ఆమె స్వేచ్ఛను అరికట్టడం, ఆమెను విద్యా విజ్ఞానాలకు దూరంగా ఉంచడం, ఆమె పురుషుని అంటిపెట్టుకొని బతికేలా చేయడం ఆనాటి పురుషుల చర్యలు.

– ముస్లిం యుగంలో పర్దా అవతరించింది. భార్యలను రక్షించుకోవడమే పురుషుల కర్తవ్యంగా పరిణమించింది. విందులు వినోదాలకు స్త్రీ దూరమయింది.

– వాత్సాయనుని కాలానికి వేశ్యాసంగమం ప్రతిష్టాకరమయింది. 10,12 శతాబ్దాలలో నిర్మితమైన దేవాలయాలలో స్త్రీ పురుష శృంగార ఘట్టాలు చిత్రితమైనాయి.

– రజస్వల అయిన స్త్రీ నాలుగు మూరల దూరంలోను, ప్రసవించిన స్త్రీ ఎనిమిది మూరల దూరంలోను ఉండవలెనని బృహస్పతి నిర్దేశించాడు.

– ఋగ్వేదకాలంలో స్త్రీ బలహీనురాలు కాదు. సాహసి, స్వేచ్ఛాజీవి. ఆమెకు వ్యక్తిత్వం ఉండేది. స్త్రీ శిశు జననాన్ని దురదృష్టంగా భావించిన దాఖలాలు లేవు. కాని పురుష సంతానం కావాలని అనేక రుక్కులున్నాయి. పలుసార్లు పురుష సంతానం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేయబడింది.

– బాలిక హోదా మరీ హీనమైనది కాదు. కాని బాలుని హోదాతో మాత్రం సమానమైనది కాదు (అశ్వలాయన గృహ్యసూత్రం)

– అధర్వవేదంలో గొడ్రాలితనం రాకుండా తాయత్తు, పురుష సంతానం కలగటానికి ప్రార్థన, ఆడపిల్ల వద్దని అభ్యర్థనలున్నాయి.

– బ్రాహ్మణాల కాలం సుమారు క్రీ.పూ. 600 వరకు సాగింది. కుమారునికి విలువ పెరిగింది. కుమారుడు మోక్ష సాధనం. కుమార్తెలు బరువుగా ఎంచబడి బాలిక జననం అక్కరలేదని క్రతువులు చేయసాగారు. ఈ క్రతువులను తైత్తరీయ సంహిత నిర్దేశించింది.

– భార్య సహచరి, కుమార్తె దుఃఖభాడనురాలు, కుమారుడు ఉన్నతోన్నత స్వర్గంలో దీపం. (ఐతరేయ బ్రాహ్మణం).

– పురుష ప్రాధాన్యత గల సమాజాన్ని హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు, హిందూ సంస్కృతి ఊహించాయి, పోషిస్తున్నాయి.

– ”విశీలః కామవృత్తోవా – గుణైవ పరివర్జితః ఉపచర్యః స్త్రీయా స్వాధ్యా సతతం దేవత్పతి” (మనుధర్మశాస్త్రం) అనగా భర్త శీలరహితుడైనను, కామ ప్రవృత్తి కలవాడైనను, ఏ సద్గుణములు లేని వాడైనను, భార్య అతనిని దేవునిగా భావించి పూజించవలెనని భావం.

ఈ విధంగా ఒకప్పుడు స్త్రీ జీవితం ఔన్నత్యంతో ప్రకాశించినప్పటికీ, రానురాను ఆమె జీవితంలో అపశ్రుతులు వెల్లివిరిశాయి. ఆమె హోదా, స్థాయిలలో విపరీతమైన పరిణామాలు కలిగాయి. స్త్రీకి ద్వితీయశ్రేణి పౌరసత్వం అంటకట్టబడింది. ఈ సందర్భంగా భర్త మరణానంతరం వితంతువైన ఒక స్త్రీ జీవితాన్ని ఊహించదు. చాలా కష్టసాధ్యమైన పని. అందుకే ఎంతోమంది సంఘ సంస్కర్తలు అప్పట్లో హిందూ సంప్రదాయంలో అమల్లో ఉన్న ”సతీ సహగమనాన్ని” రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. లార్డు విలియం బెంటింగ్‌, లార్డు కానింగ్‌ మొదలైన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో ఎంతో ప్రయత్నం జరిగింది. తుదకు 1856లో లార్డు డల్‌ హౌసీ కాలంలో ”సతీ సహగమన నిర్మూలన” చట్టరూపకంగా వెలువడింది. భర్త చనిపోయిన స్త్రీ వితంతువులకు ఎన్నో విధాలైన నిబంధనలను, ఆంక్షలకు మన పెద్దలు, పండితోత్తములు, సమాజం, సనాతన ధర్మాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు విధించి అమానవీయ దృక్పథాన్ని చాటడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. సాధారణ సమయంలో కూడా స్త్రీలను గురించిన కొన్ని భావనలు చదువుతుంటే, వింటుంటే సభ్యసమాజానికి తలవంపులుగానే ఉంటాయి. ప్రత్యేకించి స్త్రీల గురించి ఇలాంటి ”వివక్ష వైఖరి” ఎందుకుంది? అనేది సమాధానం లేని ప్రశ్న.

స్త్రీని గురించిన కొన్ని భావనలు :

– ‘అస్వతంత్రా ధర్మే స్త్రీ’ ధర్మంలో స్త్రీకి స్వాతంత్య్రమే లేదు.

– భర్త అనుజ్ఞ లేకుండా చేయబడు వ్రతములు రాక్షసులకు చేరునని స్మృతులు చెప్పుచున్నవి. (హిందూ మతం పుట 143)

– ”స్త్రీలు చంచల చిత్తులు” రుగ్వేదం

– ”స్త్రీ అసత్యానికి మారుపేరు” మైత్రాయణ సంహిత

– ”స్త్రీలు అసత్యం అవతారమూర్తి” రామాయణం

– స్త్రీలు క్రూరులు, స్వార్థపరులు – రామాయణం

– స్త్రీలలో మెరుపు యొక్క చంచలత్వం, ఆయుధం యొక్క పదును, డేగ యొక్క వేగం అన్నీ కలిసి ఉన్నాయి. (రామాయణంలో ‘అగస్త్యుని’ పలుకులు)

– స్త్రీలు మనసును అదుపులో పెట్టుకోలేరు (రుగ్వేదం)

– స్త్రీల దుర్గుణాలను లోపాలను వర్ణించాలంటే నూరు నాలుకలు కల మనిషికయినా నూరే&ండ్ల కాలం చాలదు (మహాభారతం)

– స్త్రీలలో చెలిమి అనేది లేదు. వారి హృదయాలు క్రూరమైనవి. (శతపథ బ్రాహ్మణం)

– ”స్త్రీ, శూద్రుడు, శునకం, కాకి అసత్యానికి, పాపానికి, అంధకారానికి మారుపేరు” (శతపథ బ్రాహ్మణం)

– స్త్రీ పాపానికి మూలం (మహాభారతం అనుశాసన పర్వం)

– స్త్రీ చేత పరిపాలింపబడేదే దేశానికి అపకీర్తి సంభవిస్తుంది. స్త్రీ ఆధిపత్యానికి లొంగే పురుషులు అప్రతిష్ఠ పాలవుతారు (అశోకరుద్ర వ్యాసం).

– మనువు, శుక్రుడు – చాణక్యుడు – యాజ్ఞవల్కు ్యడు స్త్రీని తక్కువ చూపు చూశారు.

– ధర్మశాస్త్రాలు, పురాణాలు స్త్రీలకు ద్వితీయ స్థానం ఇచ్చాయి. భర్త నీడలో బతికే మనిషిగా భార్యను మలిచాయి.

– ఋగ్వేదం, అధర్మవేదం, శ్రౌత సూత్రాలు, గృహ్యసూత్రాలు, ధర్మసూత్రాలు, స్మృతులు, ధర్మశాస్త్రాలు వాటి వివరణలో భాష్యాలు మరియు ఇతర గ్రంథాలు, ఇండో ఇరానియనుల వలస – హూణుల శకుల దండయాత్రలు, ముసల్మానుల దాడులు, ముసల్మానుల రాజ్యస్థాపన, పాశ్చాత్యుల దేశప్రవేశం, ఇవన్నీ కూడా హిందూ సమాజంపై ప్రభావం చూపాయి. అంతేకాకుండా, జైన, బౌద్ధ మతాలు కూడా కొంతలోకొంత హిందూ సమాజాన్ని మలిచాయి. స్త్రీల హోదాలో, స్థాయిలో అనేక మార్పుల్ని కలుగజేశాయి. వితంతు వ్యవస్థలో పెనుమార్పులు సృష్టించాయి.

– వేదకాలంలో స్వయంవరాలు ఉండేవి.

– వైదిక వాఙ్మయంలో వర్ణాంతర వివాహాలు కనబడతాయి.

– ఆడపిల్లను అమ్మినవారి సంరక్షకులు ఘోరమైన నరకానికి పోతారని బౌద్ధాయనుడు ప్రకటించారు. ఆడపిల్లను విక్రయించిన వాని ముఖం చూడరాదని పద్మపురాణం శాసించింది.

– భ్రూణ హత్య మహాపాతకమని చెప్పబడింది.

– సుమంగళీ, కళ్యాణీ, గృహలక్ష్మీ, వీరాంగన, సతి, సాధ్వి అని స్త్రీలు పొగడ్తలనందారు. భర్తను కోల్పోయిన స్త్రీని విధవ, వితంతువు అంటూ నీచంగా, హీనంగా చూడడం ఆనవాయితీగా మారింది. బయటి ప్రపంచానికి వారి ముఖం కనిపించగూడదనే ఆంక్షలు మొదలయ్యాయి. వితంతు స్త్రీలు అపశకునంగా పరిగణించబడ్డారు.

– ఏక భార్యాత్వం, ఏక భర్తృత్వం ఋగ్వేద కాలంలో ఉన్న నియమం. వేద కాలం చివరి రోజుల్లో బహుభార్యాత్వం కనబడుతుంది.

– భర్త భుజించిన తరువాత భార్య భోజనం చేయాలని ‘శతపథ బ్రాహ్మణం’లో చెప్పబడింది.

– భార్య భర్త ఆజ్ఞలను శిరసా వహించాలని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.

– రాజులు యోచించు చోట స్త్రీలు ఉండరాదు. పండితుల సమావేశాలల్లో పాలు పంచుకోరాదు.

– గృహ్యసూత్రాల్లో ఒక్క పారాస్కర గృహ్యసూత్రం మాత్రమే బహు భార్యాత్వాన్ని సమర్థించింది.

– బౌద్ధంలో ‘సతీ సహగమనం’ లేదు. పునర్వివాహం ఉంది.

– జైనులలో కొందరు సతీసహగమనాన్ని ఆమోదించారు.

– కాదంబరి రచయిత బాణుడు సతీసహగమనాన్ని నిరసించాడు.

– విధవ నూనె అంటుకొని తలస్నానం చేయరాదని సన్యాసి కారాదని ప్రాచేతనుడు స్కాంద పురాణం (కాశీఖండం)లో విధవ విధులను విశదీకరించాడు.

– భర్త చనిపోయిన స్త్రీ ‘శిరోముండనం’ చేయించుకోవాలనే ఆచారం అమల్లో ఉండేది.

– వేదకాలంలో నాట్యకత్తెలు ఉండేవారు. రాజాస్థానాల్లో నృత్యం చేసేవారు.

– ఆడపిల్లను దేవదాసీలుగా ఇస్తే సూర్యలోక ప్రాప్తి జరుగుతుందని భవిష్యత్‌ పురాణం చెప్తుంది.

ఆడపిల్లను తక్కువగా చూడడానికి కారణాలు :

– మగపిల్లవాడు వంశాంకురం, వంశోద్ధారకుడు – ఆడపిల్ల పరాయిది.

– కర్మకాండ చేస్తాడు, పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు.

– వంశం నిలుస్తుంది – మోక్ష ప్రాప్తి కలుగుతుంది.

– తల్లిదండ్రులకు సంరక్షకుడు – పోషణభారం వహించేవాడు.

– ఇంటా బయట సహాయం చేస్తాడు. కుటుంబ స్థాయి, శక్తి వారిమీదనే ఆధారపడి ఉంటాయి.

– కుటుంబ ఆర్థికాభివృద్ధికి, కష్టకాలంలో ఆదుకోవడానికి, కుటుంబ నిర్వహణకు తోడ్పడతాడు అనే ఎన్నో ఇతర భావనలు వివక్షతకు కారణాలు.

– భార్య చనిపోయిన పురుషున్ని గుర్తించడానికి సమాజం అతనికి ఎలాంటి నిబంధనలను అంటగట్టడం లేదు. ఆడవాళ్లకు మాత్రమే ఎన్నో ఆంక్షలు. మగవాళ్లు పెండ్లిల్లు, పేరంటాలలో (నిక్షేపంగా) కుంకుమ బొట్టు ధరించవచ్చు, ఉంపుడుకత్తెల్ని పెట్టుకొని, ద్వితీయ వివాహం చేసుకొని, నిక్షేపంగా లైంగిక కోర్కెలను తీర్చుకోవచ్చు. వీలైతే చిన్న ఇల్లు, పెద్ద ఇల్లును నిర్వహించుకోవచ్చు. కొందరు పురుషులు మాత్రం నూలు మొలతాడు తీసివేస్తారట. వెండి మొలతాడును ధరించవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేవు. భర్త చనిపోయిన స్త్రీలను మాత్రం విధవ, వితంతువు, ముండతనం అనే భాషా పదాలను అంటగట్టి అనాదిగా అదీ ఒక సాంఘిక ఆచారంగా, కట్టుబాటుగా తయారుచేసి స్త్రీ శక్తి కుంచించుకుపోవడానికి ఎవరు కారణభూతులు?

– నేటి సమాజంలో మగబిడ్డలను కన్నతల్లి హోదా పెద్దది. మగపిల్లవాడు కుటుంబానికి ఒక పెట్టుబడి. పూర్వీకుల ఆస్తికి వారసుడు.

– ఆడపిల్ల ఆర్థిక భారం, ఆమె పుట్టుక, పోషణ, చదువు, వివాహం, ఉద్యోగం, సంపాదన, కుటుంబ నిర్వహణ అన్నీ సమస్యలే. అందుకే భ్రూణహత్యలు, చెత్త కుండీలల్లో పారేయడం, రైల్వే ట్రాకులల్లో, పొదలల్లో పారేయడం, బతికి బట్టకట్టిన వారిని అమ్మేయడం. ఈనాడు సాధారణ స్త్రీలనే ఎన్నో రకాలైన కష్టాలు, కడగండ్లు చుట్టుముడుతున్నాయి. ఇంకా విధవలు – వితంతువుల అగచాట్లు చెప్పనవసరం లేదు.

– అనాదిగా స్త్రీ శృంగారవస్తువు, విలాసవస్తువు, పడకటింటికి పరిమితం, వంటింటి కుందేలు, శక్తీహీనురాలు, బలహీనురాలు, అబల, సుకుమారీ, ఆటబొమ్మ, చెల్లింపు లేని పనిమనిషిగా భావించ బడుతుంది.

– శారీరక నిర్మాణంలో తేడాలున్నాయనే సాకుతో సామాజిక అసమానత్వాన్ని సమర్థించే వాదన.

– స్త్రీ ఇష్టపూర్వకంగా తన వ్యక్తిత్వాన్ని నశింపజేసుకోవడం, పురుషాధిపత్యానికి లొంగి ఉండడం, శ్రమశక్తి దోపిడీకి గురికావడం, సామాజికంగా హక్కులు లేకపోవడం, ఉన్నా అవగాహన చేసుకోక పోవడం, తమ ఇంటిలోనే తాము బానిసలుగా బతుకుతూ బానిసత్వానికి లోను కావడం, ఉంపుడు కత్తెలుగా బతకడం ఇవన్నీ వ్యక్తిత్వ వినాశ లక్షణాలు.

– ఆడపిల్లలు మగపిల్లలు తల్లిదండ్రులకు రెండు కళ్లు. ఈ సృష్టి ప్రకృతి పురుషుల కలయిక. సృష్టిలో పరాత్పరుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానులు. ఆకాశంలో సగం – ఆకాశంలో విభజన రేఖలు లేవు. అఖిలాండ కోటి బ్రహ్మాండానికి ఆదిశక్తి, పరాశక్తి, అపారశక్తి స్త్రీ. సంతాన ప్రాప్తిలో మానవ జీవిత పరిణామ గతిలో ఇద్దరూ సమానులు. పురుషుడు బీజప్రదాత, అవనీతల్లి మాత. ఇద్దరూ సగం – సగం – కాని సగాలు సమానం కాని విడ్డూరమైన గణితశాస్త్రం చిక్కుముడుల లెక్కల్లో చిక్కుకుపోయిందీ సమాజం. ”అంతరించిపోతున్న వింతజాతి ఆడజాతి”. పురుషాధిపత్యానికి, శరీర, ధన, మాన, ప్రాణాలను అర్పించిన వ్యక్తిత్వం లేని ఆటబొమ్మగా జీవిస్తుంది. ‘అబల’ అనే సామాజిక ముద్ర వేయించుకుంది. అలాంటప్పుడు వేరుగా విధవలు – వింతతువుల జీవన పరిధులను, పరిణామాలను గురించి ఆలోచించడం, అంచనా వేయడం విడ్డూరం. సమాజంలో ఒక స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం, మర్యాద, విలువ, స్థాయి, హోదాతోనే అని ముడివడి ఉంటాయి. ఈ తారతమ్యానికి కారణాలు: 1. మత సంస్కృతి, 2. సనాతన సంప్రదాయాలు, 3. ఆచారాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, 4.హక్కులు విధులు, బాధ్యతలు, కర్తవ్యాలు, ధర్మాలను తెలుసుకోకపోవడం, 5.అసమానత, అవిద్య, అజ్ఞానంలో కొట్టుమిట్టాడడం.

తరాలు మారినా తల్లిదండ్రులకు, సమాజానికి ఇష్టంలేని ఉపేక్షిత శిశువుగా, చెల్లింపులేని పనిమనిషిగా స్త్రీ జీవితం అన్ని థలల్లో నేటికీ అభాసుపాలవుతూనే ఉంది. అవివాహిత, గొడ్రాలు, విధవ, అభాగిని, కులట అని స్త్రీలను ఎన్నో విధాలుగా ఈనాటి సమాజం అవహేళ చేస్తూనే ఉంది. మనం మన సమాజం మారేదెప్పుడో?

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నా బాల్యం గల్లంతైంది

by Banda Saroja July 25, 2024
written by Banda Saroja

నా బాల్యం గల్లంతైంది

డా|| సరోజన బండ

‘బొమ్మరిల్లు’లో బొమ్మలాటలు

బొమ్మలాటలో కమ్మని వంటలు

పప్పు బెల్లం నువ్వులు చక్కెర

ఏకుడు పేలాలు వేరుశనక్కాయలు

మక్కజొన్న పేలాలు, పాలకంకుల

‘పిసికిల్లు’

పుట్నాలు, అటుకులు, చిట్టిలువలు

కుడుకలు, బత్తిసపేర్లు, చక్కెర గోళీలు

అప్పుడప్పుడు అమ్మ చేసిపెట్టే

చెగోడీలు, సకినాలు, గరిజెలు

అరిసెలు, గారెలు, సత్తుపిండి, సర్వపిండి

పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి

‘బెల్లం పాశం’

ఒక్కోసారి మా మల్లయ్య పిసికి యిచ్చిన

‘గసిపిండి ముద్దలు’

బుడ్డగిన్నెల్లో భద్రంగా తీసుకుపోయి

వెన్నలాంటి మనసుతో నా చిన్ని చెలికాండ్రకు

పేదరికం లేని నా పెద్దబుద్ధితో

పెళ్ళిభోజనమంటూ ‘మోదుగాకు’లల్లో

ప్రసాదంగా పంచి పరమానందం చెందేదాన్ని

పనికిరాని పాతరాతెండి తలె మాకు

‘పెళ్ళిడప్పు’

చొప్పకర్రలే ‘డప్పుకోలలు’

పీకెలే సన్నాయిలు బాజా భజంత్రీలు

చొప్పకోలలు, పుల్లలు, బెండ్లతో చేసిన ‘బండ్లు’

పల్లకీలో పిల్ల, పిల్లగాని ఊరేగింపు

మేరెసాంబయ్య పారేసిన తుక్కులోని

రంగురంగుల బట్ట పీలికలతో కుట్టిన

చిట్టి బొమ్మల సింగారంతో ‘పెళ్ళితంతు’

ఇవన్నీ మాకు ఆచరణయోగ్యాలు

అనుకరణ సాధ్యాలు ఆటపాటల సంరంభాల

ఆనందానుభూతులు

అగ్గిపెట్టెల టెలిఫోన్లు, తాటికమ్మల గాలిమోటార్లు

కుమ్మరి నర్సయ్య తాత గురుగులు

కమ్మరి రామయ్య తాత కడాయి, జల్లిగంటె

వడ్ల వెంకటయ్య మామ తెడ్లు

బుడ్డ సర్వలు బొడ్డు చెంబులు

గద్దె గిన్నెలు తపేలా పావులు

ఎరుకల ఎల్లమ్మ మొంటె- బిచ్చపు సాలమ్మ ‘సదిరె’

పూసల మల్లయ్య పూసపేర్లు, తరగని అందాల తాటాకు బుట్టలు

అన్నీ అపురూపమైన ఆటవస్తువులు నాకు

చెబ్బీసాబ్‌ గాజుల మలారంలో

పర్రెవట్టిన ఎర్రగాజులు

పచ్చగాజులు పూలగాజులు

సుతిలితో అల్లిన తుమ్మకాయల గజ్జెలు

సన్నటి సిబ్బి తీగలకు సుతారంగా గుచ్చిన

తుమ్మిపువ్వు ముక్కుపోగులు

నత్తులు, చెవికమ్మలు

మాకు అపూర్వ ఆభరణాలు

మా చేనులో ఏరుకొచ్చిన జిట్టరేగు పండ్లు

మా పెరట్లో కాసిన జామపండ్లు, దానిమ్మపండ్లు

సీతాఫలాలు వనచింతకాయలు, మామిడికాయలు

కాకెంగిలి అంటూ అంగీలోవెట్టి కొరికి

అన్నిటిని అందరం పంచుకొని తినేవాళ్లం

అన్నీకూడా ‘ఇందుల్లో’ మాకు విందుభోజనాలే

అమోఘ ఫలరుచులే!

గిల్లికయ్యాలు పెట్టుకున్నా ‘సోపతి గాల్లందరం’

తెల్లారి మళ్లీ కలిసేవాల్లం

లద్దునూరి తోవలు మావి మద్దూరిబాటలు మావి

కొడవటూరి గుట్ట, కొమిరెల్లి మల్లన్న జాతర

బెక్కల్లు రామలింగేశ్వరస్వామి ఆలయదర్శనం

ముచ్చటగా మూడురోజుల జాతర

ఆషాఢమాసం వనభోజనాలు

అన్నీ మాకు ఆనందస్మృతులే!

చేన్లు చెలకలు మావి – చెట్లు గట్లు మావి

ఎర్రమన్ను పుట్టలు మావి ఒర్రెలు వాగులు మావి

ఇసుకతెప్పలు మావి పిట్టగూళ్లు మావి

చింతచెట్లు మావి మామిడి తోపులు మావి

ఎనుగులు మావి గునుగులు మావి

‘తూరుపు తోట’ మాది తురకోని బావిమాది

జమ్మికుంట మాది

ఎల్లంబావి మాది ఎల్లమ్మ చెరువు మాది

హనుమాండ్ల గుడి మాది చెన్నకేశవ ఆలయం మాది

పాత కచ్చేరిమాది పాడువడ్డ బురుజుమాది

దొరవారి ఇంటి దొడ్డి కన్నాలు మావి

బంజరు దొడ్డిమాది బడి ‘శిథిలాల ఆవరణ’ మాది

నొగలు విరిగిన బండ్లు మావి పొణకలు, బోరాలు మావి

‘ఖాజా’ మామయ్య కాలిపోయిన ఇల్లు మాది

కూలిపోయిన గోడలు మావి

ఇల్లిల్లు మాది ఇంట్లోని ముంతగూళ్లు మావి

ఊరంతా మాది ఊల్లోని వాళ్ళంతా నావాళ్ళే

వరుసలతో పిలిచేవాల్లు మురిపెంగా చూసుకునే వాల్లు

కులాల కుటిలత్వంలేని స్నేహ బంధాలు మావి

ఉన్నోల్లు లేనోల్లు అనే తేడాలేని ఉనికి మాది

ప్రేమాప్యాయతలతో పెనవేసుకున్న

ప్రేమబంధం మాది

మమతానురాగాల మరుల విరులు పూయించిన

మనసు పూదోట మాది

తరాలు మారిన నా ఊరు తనరూపం మార్చుకుంది

అరువదేండ్ల కాలంలో అంతా తారుమారయింది

మహోన్నతమైన మానవ సంబంధాలు

మటుమాయమయ్యాయి

అధునాతన పోకడల్లో ఆధునికీకరణంలో

నా బాల్యం గల్లంతైంది

అలముకొంటున్న సంధ్యారాగంలో

అరుణ కిరణాల నా బాల్యాన్ని

జ్ఞాపకాల తెరల మరుగుల్లో

మళ్లీ వెతుక్కుంటున్నాను

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఉచితం

by Laxmi Madan July 25, 2024
written by Laxmi Madan

“వొదినే! ఓ ఒదినే! ఏం సగ వెడ్తున్నవ్! అన్న డూటీకి వొయ్యి శాన సేపాయే! ఇంకేం పనమ్మా!” అనుకుంటూ వచ్చింది మాధవి.

” యే! పనయ్యింది వొదినే! పొద్దు గాల్ల చాయ్ ఉడుకు జేస్తుంటే గిన్నె మాడింది.. గీపీసు వెట్టి రుద్దుతున్న, ఏమో గిట్లోచ్చినవ్ పొద్దు గాల్ల..అన్న ముచ్చట జెప్పనీకా” అన్నది వసంత నవ్వుకుంటూ.

” నీకు ఊకే గాముచ్చటనే! గట్ల గాదు గనీ, ఆషాఢ మాసం గదా, మస్త్ ఆఫర్ లు నడుస్తున్నయి, పోదామా! బట్టల దుకాణంకి ” అన్నది మాధవి.

“అమ్మో! మీయన్న తిడ్తడు, అయినా పైసలు యాడియి”? అన్నది వసంత.

” గట్ల మాట్లాడ్తవ్ వోదినే, నేను లేనా? నిన్ననే శిట్టి ఎత్తిన. ఇస్తపా” అన్నది మాధవి.

” జల్దీ చీర కట్కోని వొస్త.. కూసో. గా కోపుల శాయ్ వట్టు ఉన్నది ఉడుకు జేస్కొని తాగు”అని లోపలికి పోయింది వసంత.

” సరే దబ్బున రా” అంటూ వంటింట్లోకి పోయి చాయ్ వేడి చేసుకుని కుర్చీలో కూర్చొని తాగుతుంది మాధవి.

ఇద్దరు తొందరగా బయటకు వచ్చి షేర్ ఆటో మాట్లాడుకుని వందన బ్రదర్స్ కి వెళ్లారు..

షాప్ నిండా రకరకాల ఆఫర్స్ రెండు కొంటే ఒక చీర ఉచితం, నాలుగు కొంటే మిక్సీ ఉచితం, ఇలా రకరకాల ఉచితాల ప్రదర్శన జరుగుతుంది.

మాధవి మరియు వసంతలకు కళ్ళు తిరిగిపోయాయి. ఇక చీరలు వెతకడం మొదలుపెట్టారు.

వేటి మీద అయితే ఉచితాలు ఉన్నాయో వాటిని వెతికి వెతికి బాగుల నిండా నింపుకున్నారు…

” మంచి గున్నయి కదా వొదినే!” అన్నది మాధవి.

“మంచిగనే ఉన్నాయ్ గాని ఈ చీరలన్ని చూసి మీయన్న ఏమంటడో?” అన్నది వసంత.

“ఏమనడు తీ, ఊకె బుగులు వట్టకు, జెర్ర గట్టిగుండాలే” అన్నది మాధవి.

బ్యాగుల నిండా కొన్ని చీరలు, ఉచితాలుగా వచ్చిన కొన్ని చీరలు, ఆఫర్లుగా వచ్చిన మిక్సీలు, గోడ గడియారాలు అన్నిటిని బ్యాగుల నిండా నింపుకొని చాంతాడంత ఉన్న కౌంటర్లో నిలబడ్డారు.

ఓరెండు గంటల తర్వాత బిల్లు చెల్లించి ఇద్దరు బయటపడ్డారు..

“వొదినే! పోల్లగాండ్లు వచ్చేవరకు మస్త్ టైముంది. కొమురెల్లి దాకా పొయ్యోత్తాం. మీ పిల్లలు మా పిల్లలు పెద్దోల్లే, ఆల్షం అయిన ఏంగాదు” అన్నది వసంత.

“అబ్బో! నువ్వేనా? గట్లనేది. పోదాం పా. గీ సంచులు గీడ మా దొస్తింట్ల వెట్టి పోదాం” అన్నది మాధవి.

ఇద్దరూ ఆ సంచులను మాధవి స్నేహితురాలు ఇంట్లో పెట్టి బస్ స్టాప్ లో నిలబడ్డారు.

“బస్సు కిరాయ ఎక్వనా?” అన్నది వసంత.

“బస్సు ఫ్రీ నే కదా యాది మర్షినవా”? అన్నది మాధవి.

“అవుగదా! నేను ఈ నడుమ ఏ ఊరికి వోలే. గందికే మర్షి పోయిన” అన్నది వసంత.

ఇద్దరూ బస్సు ఎక్కి కూర్చున్నారు. విపరీతమైన జనం ఉన్నారు. అందరూ ఆడవాళ్లు ఉచిత బస్సు కాబట్టి పని ఉన్నా లేకున్నా తిరుగుతూనే ఉన్నారు.

ఒక్క సీటులో ఐదు, ఆరు మంది కుక్కుకొని కూర్చుంటున్నారు. నిలబడ్డ వాళ్ళు లెక్కకేలేరు..

పక్కకు చిన్న అమ్మాయిని పలకరించింది మాధవి.

“ఏడికి వోతున్నవ్ శెల్లే” అన్నది మాధవి.

“ఏడికి లేదు అక్క ఇంట్లో కరెంట్ పోయింది. రిపేర్ చేసేదానికి రెండు రోజులు పడతదట. టీవీ వస్తలేదు పొద్దు పోతలేదు.. ఊకెనే గా ప్రజ్ఞాపురం కాడ మక్క బుట్టలు కొనుక్కొని వేరే బస్సు ఎక్కొస్త” అన్నది ఆ అమ్మాయి.

“మనకన్నా జరంత ఎక్కువనే ఉన్నది” అన్నది మాధవి పక్కన ఉన్న వసంతతో.

అటుపక్కన మరో మహిళను పలకరించింది వసంత.

“నువ్వు ఏడికీ వోతున్నవ్ అక్కా” అన్నది వసంత.

“గీడు నామన్మడు. ఇంట్ల ఉంటే గాయి గాయి జేస్తున్నడు. అన్నం దింటలేడు. గాశామీర్ పేట కాడి దాకా వొయ్యే వరకు బుక్కెడు దింటడు. ఆడ దిగి మా శెల్లే ఇంటికాడ గింత శావట్టు దాగి మల్ల బస్సెక్కుత. గింతట్ల నా బిడ్డ కొలువు నించి వొస్తది” అన్నది ఆ మహిళ.

ఇదంతా వింటున్న కండక్టర్ కి బుర్ర తిరిగి పోయింది. “ఉచితాలు జెయ్యంగ మాకు తల్కాయ నొప్పి. పనున్నోడు, లేనొడు బస్సుల ఉర్కుడే. గిప్పుడే దేవుడు, సుట్టాలు యాదికొస్తరు” అనుకుంటూ ముందుకు వెళ్లాడు.

ఇంటికి వచ్చిన మాధవికి హాల్లో 10 కిలోల గోధుమపిండి కనిపించింది.

“ఏందయ్యా! గిది. గింత పిండి ఏడిది” అన్నది మాధవి.

“ఐదు కిలలు కొంటే ఐదు ఫ్రీ. అట గందికే తెచ్చిన” అన్నాడు మాధవి భర్త సుందర్.

“నీఅగడు పాడు గాను. ఫ్రీ వచ్చిందని గింత కొంటవా?” అన్నది మాధవి కోపంగా.

“నువ్వు ఫ్రీ వస్తున్నది అని గన్ని చీరలు కొన్నావ్ నేను గిద్దేస్తే గట్ల అంటవు” అన్నాడు సుందర్..

కుయ్యమనకుండా లోపలికి వెళ్ళిపోయింది మాధవి.

తెల్లవారి ఉదయమే పిండి సంచులు తెరిచి చూసింది. అంతా పురుగే ఉంది. భర్తను ఏమైనా అందామంటే తాను అలాంటి పనే చేసింది కదా!

చీరలు బ్యాగు మిక్సీ రెండు తెరిచి ముందుగా చీరలను విప్పి చూసింది… చూడడానికి బాగానే ఉన్నాయని ఒక చీర కట్టుకుంది .తర్వాత ఆరోజు ఇడ్లీ కోసం నానబెట్టిన మినప్పప్పును మిక్సీలో వేసుకుంది. మిక్సీ ఏమాత్రం నాణ్యత లేకుండా కనిపించింది…

“గిట్ల ఫ్రీ వస్తుందని కొంటే గిట్లే ఉంటది .ఇప్పుడు ఏమనుకొని ఏం లాభం” అని అనుకొని వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాధవి.

“వొదినే! మోసం జరిగింది మన మిక్సీ మంచిగ పనే చేస్తలేదు” అన్నది వసంతతో.

“సప్పుడు జెయ్యకు. మీ అన్న ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికే ఇవి కొన్న అని తిడతా ఉన్నాడు. నా చీరలు నీళ్లలో పెట్టిన పొద్దుగాల. మొత్తం రంగు ఎలిసిపోయింది” అన్నది మెల్లగా వసంత.

“ఓయమ్మనే! మొత్తం మునిగినమే. ఈసారి గిట్ల చేయద్దు, అంత నాదే తప్పు .అన్న లేనప్పుడు వస్తతీ వొదినే” అన్నది మాధవి.

“యే, జర్ర నిలవడు. గా పెరంట్ల దిక్కువా”. అనుకుంటూ పెరట్లోకి తీసుకెళ్ళింది వసంత మాధవిని.

“గిట్ల ఫ్రీ అని తీసుకుంటే గిట్లాయే” వొదినే అన్నది వసంత.

“గిప్పుడు సమజాయే, ఆల్లు మన కోసం గా ఉచితం పెడ్తరా? ఆల్ల లాభాలు జూసు కుంట
రు” అన్నది మాధవి.

“మీ యన్న వొద్దు అంటడు గిసొంటివి. మనమే సోచాయించి పోయ్యేది ఉండే. అయితేవాయే తీ, ఈపారీ గిట్ల చెయ్యొద్దు. ఇగ వోత వొదినే, పని గాలే” అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది మాధవి.

ఇద్దరు జరిగిన పొరపాటున గుర్తించుకుని, మళ్ళీ ఈసారి అలాంటివి చేయొద్దు అనుకున్నారు.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ——- ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు.

by Narendra Sandineni July 25, 2024
written by Narendra Sandineni

గుండు రమణయ్య హృదయ రోదన కవిత. హృదయం పై కవిత్వం ఓ విశ్లేషణ.
కవి,చిత్ర కళా ఉపాధ్యాయుడు.వాణీ నికేతన్ బాల విహార్ పాఠశాల,తెలుగు మీడియం,కరీంనగర్, గుండు రమణయ్య కలం నుండి జాలువారిన తొలి మెట్టు కవితా సంపుటిలోని హృదయ రోదన కవిత పై విశ్లేషణా వ్యాసం.హృదయ రోదన కవితను ఆసక్తితో చదివాను.కవితలోని భావాలు నాకు నచ్చాయి.నన్ను ఆలోచింపజేసింది.రమణయ్య తాను రాసిన కవితలకు తానే చిత్రం గీసినాడు. డాక్టర్ కాలువ మల్లయ్య ముందు మాటలో ముందొచ్చే కవితా సంపుటుల్లో రచనల్లో కవిత్వం పాలు మరింత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను అని అన్నాడు.కవిత శీర్షిక హృదయ రోదన ఏమిటి?హృదయం రోదిస్తుందా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.హృదయము లేదా గుండె మన శరీరానికి రక్తాన్ని పంపిణి చేసే ముఖ్యమైన అవయవం.గుండెలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరాయంగా పని చేసి మనిషిని బ్రతికిస్తున్నాయి.గుండె ఛాతి మధ్యలో కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది.రక్తాన్ని సరఫరా చేసేది గుండె.ప్రాణులకు ముఖ్యమైన భాగం గుండె. గుండెకు మనసు,ప్రేమ,జాలి,ఆత్మసారం,రహస్యం అని అర్థాలు.రోదన అనగా విలాపము,ఏడుపు అని అర్థాలు.మనసునకు బాధ కలిగినప్పుడు ఏడుపు వస్తుంది.మన శరీరంలో హృదయం సున్నితమైనది. ఎట్టి పరిస్థితిలోను హృదయానికి బాధ కలిగించకూడదు.హృదయానికి బాధ కలిగితే వచ్చేది రోదన.హృదయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం,ఆవశ్యకత ఎంతైనా ఉంది.హృదయ రోదన కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవి రమణయ్య హృదయ రోదన కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“నా పవిత్ర దేశపు గడ్డ పై
“సమస్యల కాన్వాసు పై
“పదిలంగా చిత్రించిన రూపం !
నా స్వచ్ఛమైన దేశం గడ్డ పై సమస్యల చిక్కు ముళ్ళు చుట్టు ముట్టి కలవరం కలిగిస్తున్నాయి. హృదయాన్ని ఆవరించిన సమస్యలు మబ్బుల వలె ఆకాశంలోని దూదిపింజలా తేలిపోవడం లేదు. సమస్యలు ఒక్కొక్కటిగా సుందరమైన కాన్వాసు మీద చిత్రించినట్లు హృదయం కళ్ళకు స్పష్టంగా ఆగుపిస్తున్నాయి.పవిత్రమైన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు జటిలమై హృదయంలో కదలాడుతున్నాయి.గుండెలో చెలరేగుతున్న సమస్యలు అన్నింటిని కాన్వాస్ పై స్థిరంగా గీయగానే అద్భుతమైన చిత్రం రూపు దాల్చింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆనంద రోదనలో
“ఆవేదనా కోలాహలం
“తరచి చూస్తే తెలుస్తుంది
“నిలిచి చూస్తే కనిపిస్తుంది !
ఒకరి సంతోషం గురించి ఆలోచించడం ఆనందం.ఆలోచించడం లేదా తెలుసుకోవడం ఆనందం.మనిషి ఆనందంగా ఉన్నప్పుడు కళ్ళ నుండి బాష్పాలు రావడం సహజం.ఆనందం అనే పదాన్ని నిర్వచించడం సాధ్యం కాదు.ప్రజలకు ఆనందం అనుభవించాలనే ప్రాథమిక భావన హృదయంలో కలుగుతుంది.సంతోషకరమైన సంతృప్తి,ఆనందానికి మూలం.ఒక కల్పిత ప్రదేశం ఆనందం.అద్భుత లోకంలో వింతలు జరగడం ఆనందం.మనుషుల జీవితంలో క్షోభ,దుఃఖం లేకుండా వచ్చేది ఆనందం.మనసు ఉత్సాహంగా ఉండేటప్పుడు కలిగే భావన ఆనందం.ఎటు వంటి బాధలు లేకుండా హాయిగా ఉండటం ఆనందం. రోదన అనగా విలాపము,ఏడుపు అని అర్థాలు. మనసులోని బాధ వల్ల కళ్ల వెంట ధారగా వచ్చేది రోదన.ఆవేదన అనగా తీవ్రమైన బాధ, తెలియచేయుట అని అర్థాలు.ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు గంతులు వేయడం కోలాహలంను సూచిస్తుంది.ఎక్కువ శబ్దం లేదా గట్టిగా అరవడం కోలాహలం.ఉత్సవాలలో శుభకార్యాలలో ఉండే జన సమూహం చేసే సందడి కోలాహలం.వీధిలో జరుగుతున్న కోలాహలంను చూసి ఏదో పండుగలా అనిపించింది.ఆనంద రోదనలు,ఆవేదన కోలాహలం సంగతుల గురించి ఒక్కసారి మనస్సు పెట్టి హృదయపు లోతులను తరచి చూస్తే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. హృదయానికి ఏం జరిగింది? ఒక్కసారి హృదయం పట్ల దృష్టి సారించి చూస్తే కళ్ళకు కట్టినట్లుగా రోదన కనిపిస్తుంది అనే భావం వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

“కళాకారుల మెదడుల్లో
“కదులుతున్న నిజాన్ని చూడు
“మేధావులు దూషణల్లో
“నలుగుతున్న న్యాయాన్ని చూడు !
ఒక కళను సృష్టించేది కళాకారుడు.కళలను అభ్యసించినది కళాకారుడు.కళాకారుడు కళను సాధన ద్వారా సృష్టించగలడు మరియు ప్రదర్శించ గలడు.కళాకారునికి కళ పట్ల నేర్పు మరియు కళా నైపుణ్యం ఉంటుంది.లలిత కళలు,డ్రాయింగ్, పెయింటింగ్,శిల్పం,నటన,నృత్యం,రచన,చిత్ర నిర్మాణం,కొత్త మీడియా,ఫొటోగ్రఫీ,సంగీతం వంటి కార్యకలాపాలను ఉపయోగిస్తు కళాకారుడు కళను నిర్వహిస్తాడు.కళాకారుడు చురుకుగా తన నైపుణ్యాన్ని సాధిస్తాడు.మెదడు మానవుని తల భాగంలో కపాలంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలు అన్నింటికీ మెదడు ఒక ముఖ్యమైన కేంద్రం.మెదడు తనకు తానే మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది.మెదడుకి ఏం చెయ్యాలో ఆలోచించడం,నిర్ణయాలు తీసుకోవడం,గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి గుణం ఉంటుంది.మెదడు మానవ నాడీ వ్యవస్థ యొక్క కేంద్ర అవయవం.వెన్నుపాముతో కేంద్ర నాడి వ్యవస్థ ఏర్పడుతుంది.మెదడులో సెరెబ్రమ్,బ్రెయిన్ స్టెమ్ మరియు సెరిబెల్లమ్ ఉంటాయి.మెదడు శరీరం యొక్క చాలా కార్యకలాపాలను నియంత్రిస్తుంది.నిజం లేదా సత్యం ఆంగ్లంలో Truth అని అర్థం.నిజం అనగా సత్యమైన,పరమ ప్రమాణం,నిజమని తెలియ జేయుట.నిజం అంటే నిజాయితీ,త్యాగం మనం పాటించవలసిన విధిగా చెప్పవచ్చు.సత్యం వద అంటే సత్యమును చెప్పుము.నిజం మాట్లాడటానికి మించిన దైవత్వం లేదు.నిజం పలకడానికి ధైర్యం కావాలి.ఏదైనా నిజం అయితే అది కనిపెట్టబడడం లేదా ఊహించిన విషయం కాకుండా వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది.నిజం ఖచ్చితమైనది మరియు నమ్మ దగినది.మేధావులు అంటే సమాజం యొక్క వాస్తవికత గురించి విమర్శనాత్మక ఆలోచన, పరిశోధన,సాధారణ సమస్యలకు పరిష్కారాలను ప్రతిపాదించే వ్యక్తులు.సంస్కృతి ప్రపంచం నుండి వచ్చిన సృష్టికర్తగా లేదా మధ్యవర్తిగా మేధావి రాజకీయాల్లో పాల్గొంటారు.ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనను సమర్పించడం లేదా అన్యాయాన్ని ఖండించడం,సాధారణంగా ఒక భావజాలాన్ని తిరస్కరించడం,విలువల వ్యవస్థను ఖండించడం ద్వారా మేధావులు సమాజంలో ముందు ఉంటారు. తప్పు ఒప్పులలోని నిజాలను నిర్ధారించేది న్యాయం.న్యాయం జరిగే ప్రదేశాలు న్యాయస్థానాలు.న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది.నీతి,సత్యం,హేతువులు,చట్టం,ప్రకృతి నియమాలు,సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడినది.వ్యక్తులు సమానమైన న్యాయ పద్ధతిలో వ్యవహరించాలి.న్యాయం అనేది నైతిక మరియు చట్టపరమైనది.న్యాయం సమానంగా మరియు సమతుల్యంగా వ్యవహరించే వ్యక్తులను సూచిస్తుంది.సమాజం యొక్క అత్యంత ముఖ్యమైనది,చర్చించబడేది న్యాయం.న్యాయం మానవ జీవనానికి పునాది.ప్రజలు అందరికీ న్యాయమైన పంపిణి మరియు సమానత్వం న్యాయమైన ప్రయోజనాలను అందించాలి.ప్రజలు చేస్తున్న స్వార్థపూరిత కార్యకలాపాలను నియంత్రించడానికి న్యాయం అవసరం ఉంటుంది. కులం,మతం,రంగు,ధనిక,పేద అని ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలోని వ్యక్తులందరికీ సామాజిక న్యాయం అందించాలి.దూషణలు అనగా అపవిత్రమైన మాటలు,అసందర్భమైన ప్రేలాపనలు, అశ్లీల మాటలు వల్ల మనిషికి శారీరక గాయాల కంటే ఎక్కువ బాధను కలిగిస్తాయి.దేశంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలు పేద,ధనిక తేడాలు, కులం,మతం పేరిట మారణ హోమం జరుగుతున్నది.పసి పిల్లల నుండి పండు ముదుసలి వరకు స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. సమాజంలో జరుగుతున్న దారుణ ఆకృత్యాలు చూసి కళాకారుల హృదయం కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతున్నవి.ఇలాంటి దారుణ దృశ్యాలు చూసిన తర్వాత కళాకారులు చైతన్యంతో అన్యాయాలకు వ్యతిరేకంగా గజ్జె కట్టి పాటను ఆయుధంగా చేసుకుని పాడుతూ వీధుల్లో బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లి నిరసనలు, ప్రదర్శనలు చేస్తూ పోరుబాటలో ముందుకు సాగుతున్నారు. సమాజంలో జరుగుతున్న దారుణమైన ఘోరాలను చూసి మేధావులు స్పందనతో గొంతు ఎత్తి ప్రశ్నిస్తున్నారు.మేధావులు అన్యాయాలు, అక్రమాలను ఖండిస్తూ దూషణలు చేస్తున్నప్పటికీ న్యాయం జరగకపోవడం కలవరపెడుతున్నది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“బడా రాజుల సంపాదనలో
“ధర్మం దాచుకుంటున్నదెంత ?
“నిరుపేదల గుండెల్లో
“దరిద్ర దేవత దోచుకుంటున్నదెంత?
ధర్మం అనగా చేయవలసిన పని ఆంగ్లంలో Duty అని అర్థం.మనకు కేటాయించిన పనిని చేయడాన్ని ధర్మం అంటారు.మనిషి ప్రతి రోజు చేయ వలసిన విద్యుక్త ధర్మం నిర్వర్తించాలి.ధర్మం అంటే మానవత్వాన్ని రక్షించే గుణం.సకల ప్రాణి కోటిలో మానవ జన్మ ఉత్తమమైనది.మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో సాటి మానవుల పట్ల ప్రేమ, ధర్మంతో మెలిగితే సాధ్యమవుతుంది.ఇతర ప్రాణులలో లేని బుద్ధి విశేషంగా మానవులకు ఉంది. మానవులకు యుక్తాయుక్త విచక్షణా శక్తితో పాటు జ్ఞానం ఉంది.ఆలోచనకు రూపం ఇవ్వగల తెలివితేటలు ఉన్నాయి.మానవులు బుద్ధి ద్వారా ఉత్తమ గుణం అయిన ధర్మాన్ని సాధించవచ్చు.ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది.కవి బడా రాజుల సంపాదనలో ధర్మం దాచుకుంటున్నదెంత అని ప్రశ్నించారు.బడా రాజులు అంటూ ఇప్పుడు ఎవ్వరు లేరు.బడా రాజుల గురించి చరిత్ర పుస్తకాల్లో రాయబడి ఉంది.బడా రాజులు కాల గర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు కొత్తగా నయా బడా బాబులు పుట్టుకు వచ్చారు.బడా బాబులు ప్రజాస్వామ్య దేశంలో పాలనాధికారం చేపట్టి రాజ్యాన్ని ఏలుతున్నారు. బడా బాబులు అంటే ఈనాటి రాజకీయ నాయకులు అనే విషయం అందరికీ తెలుసు.రాజకీయ నాయకులు పారదర్శకంగా పరిపాలిస్తున్నాం అని చెబుతు ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుంటున్నారు.రాజకీయ నాయకులు ఏది చెబితే అది ధర్మంగా కొనసాగుతుంది.బడా బాబులు అధికారం చేపట్టినారు మరియు రాజకీయంగా ఎదిగినారు.బడా బాబుల పాలనలో వంచనతో అధర్మం రాజ్యమేలుతుంది.బడాబాబులు ధర్మం సంగతి ఏనాడో మర్చిపోయారు.ధర్మం అంటే ఏమిటి?అని ముందు ముందు అడిగే రోజులు రానున్నాయా? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.రాజకీయ నాయకులు విదేశీ బ్యాంకుల్లో అవినీతి సొమ్ములు దాచుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజలచే పరిపాలింపబడిన పాలన అని మనకు తెలుసు. ప్రజాస్వామ్యం ఇప్పుడు అపహాస్యం పాలైంది. ప్రజాస్వామ్యాన్ని ఈనాటి నాయకులు,అధికారులు భ్రష్టు పట్టించారు.ఆనాటి నేతలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు సుఖ శాంతులతో ఉంటారు అని కాంక్షించారు.ప్రజలందరు సౌఖ్యంతో జీవనం సాగిస్తారు అని ఆశించారు.ఆనాటి నేతలు ప్రజల సంక్షేమం కొరకు పోరాటం సాగించారు.పరాయి దేశపు పాలన నుండి దేశానికి విముక్తి కలిగించారు. ఆనాటి నేతలు ఇప్పుడు పర లోక గతులు అయ్యారు.ప్రజలకు చేరాల్సిన అభివృద్ధి ఫలాలు పరిపాలకులైన రాజకీయ నాయకులు,అధికారులు కాజేసి దండుకుంటున్నారు.బడా బాబులకు ఇహలోక చింతన పట్ల వ్యామోహం పెరిగింది. ఇప్పుడు సంపాదించినదే డబ్బు అని సంపన్నులు అక్రమార్జనతో ప్రజలను దోచుకుంటున్నారు. సంపన్నులు సక్రమంగా సంపాదించుకుంటున్నారా? అంటే? లేదు అని సమాధానం వస్తుంది.ఇప్పుడు ఎటు చూసినా అధర్మం రాజ్యమేలుతుంది. అన్యాయాలు,అక్రమాలు మితిమీరి పోయినాయి.రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించే వారిని తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి తోస్తున్నారు.రాజకీయ నాయకుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతుంది. ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.ప్రజలకు అది చేస్తాం,ఇది చేస్తాం అని శుష్క వాగ్దానాలు గుప్పిస్తున్నారు.ప్రజలను మభ్యపెడుతున్నారు.రాజకీయ నాయకులు సంపన్నులకు దోచిపెడుతున్నారు.రాజకీయ నాయకులకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కొరవడింది.రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమం కొరకు ఏమీ చేయరు? అని ప్రజలకు తెలిసిపోయింది.ఇవ్వాళ దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి.ఇందు గల డందు లేడంటూ అవినీతి సర్వత్రా రాజ్యమేలుతుంది.నిరుపేదలు చాలా సాధారణ వ్యక్తులు.నిరుపేదలు డబ్బు లేని వారు. నిరుపేదలు ఎప్పుడు సమస్యలతో ఎందుకు బాధపడతారు. నిరుపేదలు ఎల్లప్పుడు బాధలలో ఎందుకు ఉంటారు.నిరుపేదలు ఎందుకు అశాంతితో జీవితాన్ని గడుపుతున్నారు. కవి నిరుపేదల గుండెల్లో దరిద్ర దేవత దోచుకుంటున్నదెంత అని ప్రశ్నించాడు.నిరుపేదల శ్రమను దోచుకుంటున్నది దరిద్ర దేవత కాదు.నిరుపేదల శ్రమను సంపన్నులు దోచుకుంటున్నారు. నిరుపేదలు పేదరికంలో మగ్గుతున్నారు.నిరుపేదల గుండెల్లో పేదరికం వల్ల బతుకు పట్ల ఆందోళన ఉంటుంది.నిరుపేదలు రేపటి రోజున బతుకును ఎలా గడపాలి? అనే ఆందోళన ఉంటుంది. నిరుపేదలు ఆకాశం పందిరి కింద చెట్ల నీడన నివసిస్తున్నారు.నిరుపేదలు తినడానికి తిండి లేదు.నిరుపేదలు కట్టుకోవడానికి బట్టలు లేవు. నిరుపేదలు నివసించడానికి ఇల్లు లేదు.సంపన్నుల దేవత అని నిరుపేదల దేవత అని ఎక్కడ రాసి లేదు.మనం కల్పించుకున్నవే దేవతా రూపాలు.మన హృదయంలోనే నిండి నిబిడీకృతమై దేవుడు ఉన్నాడు.మన హృదయంలోని దేవుడిని మర్చిపోయినాము.మనం ఆ దేవత,ఈ దేవత అంటూ గుడుల వెంట పరుగులు తీస్తున్నాము.మన హృదయంలోనే దేవుడు కొలువై ఉన్నాడు.ఏ దేవత అయినా సమస్త మానవాళి సుఖ సంతోషాలను, సౌఖ్యాన్ని కోరుకుంటుంది.ఆ విషయం మర్చిపోయి నిరుపేదల ఇంట దరిద్ర దేవత దోచుకుంటున్నది ఎంత అని తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. జనాలను తప్పుడు మార్గంలో పయనింప జేస్తున్నారు.జనాలు అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ దోపిడీ విధానం కొనసాగుతుంది.

గుండు రమణయ్య

“ఐనా – నా భారతం కన్నులకింపైన “చిత్రం’
“ఎందుకనగా నాది ‘హిమముల నేత్రం’
“అదొక ‘రసార్డ్ర సాగర గాత్రం’.
భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు,దక్షిణాన హిందూ మహా సముద్రం,పశ్చిమాన అరేబియా సముద్రం,తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి.భారతదేశం సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు.హిందూ,బౌద్ధ,జైన,సిక్కు మతములకు జన్మనిచ్చింది.బహు భాషలు మాట్లాడే జనం ఉన్నారు.బహుళ జాతుల సంఘం ఉంది.వివిధ వన్య ప్రాణులకు నిలయమైన దేశం.భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.ఇరవై తొమ్మిది రాష్ట్రాలు,ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉంది.అతి పెద్ద పార్లమెంట్ వ్యవస్థ ఉన్న ఒక సమైక్య దేశం. చిత్రం అనేది చదునైన ఉపరితలంపై రంగుల బిందువుల సమూహం.అది వేరొక దాని వలె కనిపిస్తుంది.చిత్రాలు, డ్రాయింగులు,పెయింటింగ్ లు లేదా ఛాయాచిత్రాలు కూడా కావచ్చు.అలాంటి చిత్రాలను రూపొందించే వ్యక్తులను కళాకారులు, చిత్రకారులు అంటారు.విశాల భారతదేశం మనది. హిమాలయాలకు నిలయం ఇది అని చిన్నప్పుడు పాఠశాలలో చదివి ఉన్నాం.అయినప్పటికీ నేను నివసించే భారతదేశం కన్నులకు కట్టినట్లు చిత్రం వలె కనిపిస్తుంది.చిత్రం గురించి చెబుతూ రసములతో తడిసిన సముద్ర రూపాన్ని దాల్చిన శరీరం వలె కనిపిస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అందుకే
“నా ‘సహనం’ ‘సద్యోఘృతం’
“నా విశ్వాసం’ ‘విద్యుద్ఘాతం’
“నా ‘నిర్ణయం’ ‘నిశ్చల దృఢం’.
సహనం క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి.మనకు అగౌరవం కలిగినప్పుడు కోపంతో ప్రతి స్పందించకుండా రెచ్చగొట్టడాన్ని సహించగల ఓర్పు ఉండాలి.ఒత్తిడికి గురైనప్పుడు సహనంతో వ్యవహరించాలి.ఇబ్బందులు ఎదురైనప్పుడు సహనంతో ఉండాలి.చిరాకు కలిగినప్పుడు విసుగు చెందకుండా సహనంతో వేచి ఉండాలి.క్షీరసాగర మధనంలో దేవతలను రక్షించుటకు గరళం మింగిన పరమ శివుని వలె సహనంతో మెలగాలి.విశ్వాసం అనగా వ్యక్తి వస్తువు లేదా భావనపై విశ్వాసము లేదా నమ్మకం కలిగి ఉండాలి.విశ్వాసం మనకు నమ్మకం మరియు నిశ్చయత యొక్క భావాన్ని ఇస్తుంది.విద్యుత్తు ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్తు ప్రవహించినప్పుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతం అంటారు.కరెంట్ షాక్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ షాక్ ను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది.మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు.విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాల పాలవుతాడు.నా విశ్వాసం విద్యుద్ఘాతం అని హృదయం బాధకు లోనైంది అని తెలియజేయడం చక్కగా ఉంది.మనిషి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు.మనిషి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.మనిషి అనేక అవకాశాలు మరియు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి.నిర్ణయం నిశ్చలమైనది మరియు దృఢమైనది అయి ఉండాలి.ఒకసారి తీసుకున్న నిర్ణయం మార్చడానికి వీలు కాదు. నా నిర్ణయం నిశ్చలమైనది దృఢమైనది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.కవి రమణయ్య చిత్రకారుడు మరియు తాను రాసే కవిత్వం పట్ల శ్రద్ధ చూపాలి.ప్రాచీన కవులు మరియు ఆధునిక కవులు రాసిన కవిత్వంను అధ్యయనం చేయాలి.గట్టి కృషి చేస్తే గొప్ప కవిగా రమణయ్య రాణించే అవకాశం ఉంది.కవి రమణయ్య మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

July 25, 2024 2 comments
5 FacebookTwitterPinterestEmail
కవితలు

జీవితమంతా గడిపేశా

by Vijaya Ranganatham July 25, 2024
written by Vijaya Ranganatham

జీవితమంతా గడిపేశా, కానీ నాకు తీరికే దొరక లేదు

ఆత్మీయులు ఆహ్వానిస్తే, నాకు తీరికే దొరకలేదు

ఆప్తుల బాధల్ని పంచుకుందామంటే నాకు తీరికే దొరకలేదు

మనసు పొరల భావాల్ని లిఖిద్దా మంటే, నాకు తీరికే దొరకలేదు

శరీరం విశ్రాంతిని కోరినా, నాకు తీరికే దొరకలేదు

కని పెంచిన వారిని పలకరిద్దామంటే, నాకు తీరకే దొరకలేదు

వడలిన వయసు జారుతున్నప్పుడు, సమయంతీసుకుని వైద్యుడ్ని కలవమని స్నేహితులు సలహా ఇచ్చినా నాకు ఆ తీరికే దొరకలేదు

నా మదిలోని తీరని కొండంత పనుల భారాన్ని దించే లోపే , కొత్త సమస్యలు ఎదురైతే ఏం చేయను నాకు తీరికే దొరకలేదు

జీవితం కాలం వృధా చేసాను ఎలా పరిష్కరించను నాకు తీరికే దొరకలేదు

మరి ఈ సమయ మేమయిందని చూద్దామంటే, నాకు ఆ తీరికే దొరకలేదు.

సమయం కోసం వెతకటం తోనే నా సమయమంతా కడతేరింది, మృత్యువు దరిచేరనుంది అయినా నాకు తీరికే దొరకలేదు

ఎవరో ఉర్దూ కవి గారి వీడియో ఆధారంగా నేను తెలుగులో అనువదించాను. విన్న వెంటనే నన్ను కదిలించిందా ముషాయిరా. రాయకుండా ఉండలేక పోయాను. చివరి నాలుగు పంక్తులు మాత్రం కొత్తగా చేర్చాను. ఆ కవి మహానుభావుడికి నమఃసుమాంజలులు.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“అరుణ” కలం అంతరంగం

by Dr. chitikena Kirankumar July 25, 2024
written by Dr. chitikena Kirankumar

ఏదేని మనిషి అంతరంగంలో దాగి ఉన్న మంచి – చెడు లక్షణాలను సహజంగా కొందరు గమనించ గలుగుతారు. కానీ వారిలో ఉన్న తప్పులను వేలెత్తి చూపి అనుకోకుండా ఒకరికి ఒకరు మధ్యలో అభిప్రాయ బేధాలను సృష్టించుకుని మరి ఏది మంచి మార్గం! మరి ఇంకేది చెడు మార్గం!! అనే విషయాలను పూర్తిగా గ్రహించక ముందే కొందరి మధ్య అంతరాలు ఏర్పడతాయి. అలాంటి వాస్తవిక కోణాలను కొన్ని సంఘటనలను దగ్గర నుంచి చూసి వాటికి పరిష్కారం తమకు తామే తెలుసుకొనే మార్గదర్శిగా నిలుస్తున్న కథల పుస్తకం ” మిగిలేవి … గురుతులే “.
తల్లిదండ్రులు గౌరీభట్ల వెంకటేశ్వరశర్మ , అన్నపూర్ణల సంతానంగా ధూళిపాళ అరుణ జన్మించారు. భువనగిరి జిల్లా వాస్తవ్యురాలైన తను ఎంఏ తెలుగు, ఇంగ్లీషు, తెలుగు పండిట్, టి .పి.టి విద్యనభ్యసించి ఉపాధ్యాయురాలిగా, ఉపన్యాసకురాలిగా,వైస్ ప్రిన్సిపాల్ గా 25 సంవత్సరాల బోధనానుభవం కలిగి ప్రస్తుతం సాహిత్య సేవలో కొనసాగుతున్నారు. కవిత్వం,కథా, విమర్షా సాహిత్యంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ మాటలతో కాకుండా చేతల {రచనల)తో నిరూపించుకుంటున్న రచయిత్రి, ధూళిపాళ అరుణ. ఇంటర్ చదువుతున్నప్పుడే సాహిత్యం పై తన అభిమానాన్ని పెంచుకొని రచనలు చేయగలిగారు.

తన పుట్టుక ఒకచోట – తన మరణం మరోచోట గా స్త్రీ యొక్క మనుగడ మన భారతదేశంలో బంధాలు అనుబంధాలను ఉద్దేశించి కొనసాగుతున్న క్రమంలో మన సమాజం స్త్రీకి పెద్దపీట వేసింది. కానీ ఒక మనిషి యొక్క అంతరంగంలో ఉన్న పూర్తి తత్వాన్ని తెలుసుకోకముందే పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఏకమై స్త్రీ తన చివరి గమనం వరకు నడుస్తున్న క్రమంలో తల్లిగా, సోదరిగా, భార్యగా ఇలా పలు బాధ్యతలను నిర్వహిస్తూ కష్టాలను, నష్టాలను ఎదుర్కొని తన జీవితాన్ని పుట్టినింటి నుండి మొదలుకొని మెట్టినింటి వరకు ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. కుటుంబం పరువు, గౌరవం, తన సంతానానికి రేపటికిభవిష్యత్తు, స్త్రీ అందిస్తున్నటువంటి వైవిధ్యమైన పాత్రలలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని రచయిత్రి ధూళిపాళ అరుణ ఈ కథా సంపుటి నందు సమాజంలో కొన్ని సంఘటనలు తన కళ్ళ ముందు చూసినవి, స్నేహబంధాలలో తను స్వయంగా ఎదుర్కొన్నవి సూటిగా చెప్పగలిగారు. తన కదా సంపుటి “మిగిలేవి … గురుతులే” అందలి రచనలను ఒకసారి పరిశీలిస్తే….

మిగిలేవి… గురుతులే కథలో వెంకటేశ్వర్లు జ్ఞాపకం గా మిగిలిపోయిన ఇల్లును పిల్లలు పడగొట్టాలని, అమ్మకానికి సిద్ధమవుతున్న సందర్భంగా వెంకటేశ్వర్లు మనసులో ఉన్న తన భార్య స్మృతులను , మనసు ఆవేదనను తెలుసుకొని కథాంశంగా రచయిత్రి కథలో చెబుతూ…ఆగకుండా వస్తున్న కన్నీళ్ళు ఆయన గుండెల మీదకి జారుతున్నాయి. ద్రవించిపోయాను. నిస్సహాయంగా అలాగే చూస్తూ ఉండిపోయాను. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. అంతటా నిశ్శబ్దం. చాలా సేపటికి కూర్చున్న ఆయన వీపు నాకు చల్లగా తగిలింది. ఆయన తన జ్ఞాపకాలను ఎక్కడికో తీసుకుపోలేక ఇక్కడే
వదిలేశారని గ్రహించాను. ఆ దంపతులతో పాటు వారితో నా జ్ఞాపకాలు కూడా రేపటి రోజున ఇక్కడే సమాధి అవుతాయని అర్థమై భారంగా కళ్ళు మూసుకున్నాను. అంటూ ఒక కన్నీటి పర్వంతమైన భావోద్వేగ సన్నివేశాన్ని ఈ కథలో రచయిత్రి అరుణ చెప్పారు.
జెర జెప్పండి సారూ…. కథలో… వివాహేతర సంబంధాల కారణంగా చిదిలమవుతున్నటువంటి దాంపత్య జీవితాలు నేటి కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. దైవసాక్షిగా వేదమంత్రాల మధ్యన, మూడుముళ్ల బంధంతో వివాహ అనుబంధం ద్వారా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని దేవతలు దేవుళ్ళ దీవెనలతో పాటుగా, బంధుమిత్రుల ఆశీస్సులు అందుకుని కొనసాగుతున్న జీవితంలో వివాహేతర సంబంధాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా కొందరు చేస్తున్న అసాంఘిక పనుల ద్వారా నిండు జీవితాలు బలి కావడం, మనస్పర్దలతో కూడుకున్న అసంతృప్తి జీవితాల పరిణామక్రమం ఇతివృత్తంగా ఈ కథలో రాజయ్య మనసు బాధ ఎవరు తీర్చలేనిది.
మరో కథలో అంగవైకల్యం శరీరానికే కానీ మనిషి మనసుకు కాదు అని తీర్పు చెప్పుతూ త్రివేణికి సరియైన జోడు దొరికింది. నీ స్నేహమే కథలో…. తొందరపడి మనుషుల మధ్య బావ వైరుధ్యం కారణంగా స్నేహాలు దూరమవుతున్న విషయాలను తెలియజేస్తూ అరణ్య వినోదల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెలిపారు.
నీకు నేనుగా కథలో… భార్గవ్ చేసిన గొప్ప పని మానవతా కోణాన్ని మరోసారి గుర్తు చేసింది. కవితా వాహిని కథలో… చప్పట్లు హోరులో కృతజ్ఞతా పూర్వకంగా కవిత అందరికీ నమస్కరిస్తూ వెళుతున్న సందర్భంలో కొడుకు కోడలు ఇద్దరు కళ్ళ ముందు కనిపించి వారి సంతోషాన్ని చూసి మురిసిపోయిన కవిత మాటలు చెప్ప రానివి.


తీర్పు కథలో… రాక్షసంగా ప్రవర్తించిన తండ్రి వీరేష్ చేసిన నీచపు పనికి అభం శుభం తెలవని చిన్నారి జీవితాన్ని కాపాడటానికి ఆ భగవంతుడు ప్రయత్నం చేయకపోయినా… వీరేష్ కు సరైన శిక్ష పడింది. ధైర్యంతో ముందుకు సాగాలి అనే కథాంశం తో ముందుకు వచ్చిన కథ “తీర్పు “.
మార్పు దిశగా కథలో… మోహన్ సాధారణంగా కొన్ని వినాయక చవితి కార్యక్రమాలలో కొన్ని మండపాల వద్ద జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక లేని ఆశను తనలో కల్పించుకుని ఏదో చేయాలనుకున్న తన స్వార్థపు ఆలోచనకు నిజంగా భగవంతుడే తన హృదయంలోకి వచ్చి ఒక మార్పును తీసుకువచ్చినట్లుగా కథ నడిపించిన తీరు చాలా బాగుంది. మోహన్ ఉద్యోగ వేటలో పడి మంచి ఉద్యోగం సాధిస్తాడని ఆశాజనకంగా చదివించినది. మానవత కథలో… ఇంటి యజమాని శ్రీ వాణి మానవత్వంతో కూడిన సందేశాన్నిస్తూ కథ సాగిన తీరు చివరివరకు పాఠకున్ని చదివించింది.

పుస్తక రచయిత్రి

ఒక కథలో స్త్రీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. మరో కథలో పురుషుడికి జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. సమాజంలో అన్ని సంఘటనలు ఉంటాయి. అనే వాస్తవిక కోణంగా కథల్లో ఉన్న విషయాలు చదువుతుంటే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి.
ఏదో ఊహ లోకంలో వ్యవహరించకుండా తన చుట్టూ ఉన్న సమాజంలోని కుటుంబాల వాస్తవిక జీవన చిత్రాలను, అక్కడక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలను, తన హృదయాన్ని కదిలించిన మరెన్నో సమాధానాలు లేని ప్రశ్నలకు అక్షర రూపంగా “మిగిలేవి…గురుతులే” కథల సంపుటిలో కవితా వాహిని,తీర్పు, మార్పు దిశగా,మానవత, నీ స్నేహమే నీకు నేనుగా, చైత్రరాగం, జెర జెప్పండి సారూ…!, ఇక నిశ్చింతగా, మిగిలేవి… గురుతులే, ఐక్యతాసూత్రం, అలాంటి తల్లులుండబట్టే, తప్పెవరిది, ఇదేనా న్యాయం!, తోడు. ఇలా 15 కథలతో ప్రత్యేకమైన కథాంశాలతో కథ చెప్పే ఓర్పు,నేర్పు,సహనంతో పాటుగా పాత్రలను సమాజ కోణంలో సందర్భానుసారంగా కొనసాగించడం చేయి తిరిగిన రచయిత్రిగా అరుణ చెప్పగలిగారు. తన రచనలు మిగిలేవి…గురుతులే (కథా సంపుటి) జ్ఞాపకాల సంతకం (కవితా సంపుటి) ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం (పరిచయ గ్రంథం) మరియు తన గురువర్యులైన గోపాల్ రెడ్డి బ్రెయిల్ లిపిలో రాసుకున్న జీవిత చరిత్రను తెలుగులోకి లిప్యంతరీకరణ చేయడం జరిగింది.(ఇట్టి నవల యూట్యూబ్ ద్వారా తన గళంలో అప్లోడ్ చేయడమైనది)లు ముద్రించబడినవి. మరియు ప్రస్తుతం హరిహర త్రిశక్తి శతకం ముద్రణలో యున్నది. ప్రముఖుల సాహిత్య రచనలపై విశ్లేషణా వ్యాసాలు, ముఖాముఖీలు చేసి తన ప్రత్యేకతను చాటుకుంటున్న సోదరి ధూళిపాళ అరుణ గారికి శుభాకాంక్షలు

పరిచయం
-డా. చిటికెన కిరణ్ కుమార్
రచయిత, విమర్శకుల
సభ్యులు: ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్,
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ : మానేరు రచయితల సంఘం,

ఓ తండ్రి తీర్పు లఘు చిత్ర కథకులు
చైతన్య స్ఫూర్తి -చిటికెన వ్యాసాలు

సెల్ : 9490841284
రాజన్న సిరిసిల్ల.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

వ్యక్తి స్వానుభవాన్ని చెబుతున్నప్పుడు అది ఉత్తమ పురుషలో రావాలి – విహారి

by Aruna Dhulipala July 25, 2024
written by Aruna Dhulipala

ప్రసిద్ధ కథకులు, కవి, రచయిత, విమర్శకులు, వక్త, నాటకకర్త విహారి గారితో మయూఖ ప్రతినిధి అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి

*******************************************

నమస్కారం సార్. మా మయూఖ పాఠకులకు మీ సాహితీ ప్రస్థానాన్ని పరిచయం చేయడం నాకెంతో సంతోషంగా ఉంది.

మీ జననం, బాల్యం,  కుటుంబాన్ని, విద్యాభ్యాసాన్ని గురించి చెప్పండి.

జ: నమస్కారం అమ్మా! నేను అక్టోబర్ 15, 1941వ సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాను. మా అమ్మగారు జొన్నలగడ్డ శ్రీదేవి, మా నాన్నగారు జొన్నలగడ్డ మేధా దక్షిణామూర్తిగారు. ఆయన ఆ రోజుల్లో గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ఉన్న ఒకే ఒక్క ఇంగ్లీష్ అకౌంటెంట్. నాకు ఒక అన్నయ్య, ఒక అక్కయ్య, నలుగురు చెల్లెళ్ళు.  ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మా అన్నయ్యను ప్రభల రామబ్రహ్మం గారికి దత్తత ఇచ్చారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తమ ‘ఏకవీర’ నవలను అంకితం ఇచ్చింది ఆ రామబ్రహ్మం గారికే. మా నాన్నగారు మాటకు బాగా విలువ ఇచ్చేవారు. ఆయనకున్న వృత్తి పట్ల ఉన్ననిబద్ధత, ముక్కుసూటిదనంతో ఉన్న పళాన ఉద్యోగం వదిలేశారు. అంతటి ఆత్మాభిమానం కలవారు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు, నాన్న అనారోగ్యంతో చిన్నతనంలోనే కష్టాలను అనుభవించాను. 1955 లో నా ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయింది. చదువు కొనసాగలేదు. ఈలోపు మా నాన్నగారి మరణంతో కుటుంబ బాధ్యత మీద పడింది. అందువల్ల ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేస్తూ సమయాన్ని బట్టి, ఎమ్.ఎ., ఇన్సూరెన్స్ ఫెలోషిప్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్, జర్నలిజం వంటి వాటిల్లో డిప్లొమాలు చేశాను.

ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఇంతటి సాహిత్యానురక్తులు కావడానికి నేపథ్యం ఏమిటి?

జ: నేను చిన్నప్పటి నుండీ పద్యాలు, శతకాలు, పాటలు, భగవద్గీత శ్లోక పఠనం, వక్తృత్వం, వంటి అనేక పోటీ పరీక్షల్లో ముందుండే వాడిని. ఎస్.ఎస్.ఎల్.సి పాసయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. దానివల్ల పుస్తకాల పురుగునైపోయాను. పఠనాసక్తి కలిగిన వాడిని కావడం వల్ల అక్కడ ఉన్న శాఖా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను. లైబ్రేరియన్ గా ఉన్న వెలగం వెంకట్రామయ్య గారు “ఏమయ్యా! ఇంకో గ్రంథాలయం చూసుకోరాదూ!” అన్నారు నవ్వుతూ.ఆవిధంగా ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో ఉన్న పుస్తకాలన్నీ చదివాను. ప్రాచీన కావ్యాలన్నీ భారతీ గ్రంథకర్తలు కీ.శే. హరిసాంబశివరావు శాస్త్రి గారి వద్ద, మా పెద్దమ్మ  కొడుకు ఉభయ భాషా ప్రవీణ చల్లా శంకరయ్య గారి వద్ద చదువుకున్నాను. మా గోఖలే ( మాధవపెద్ది గోపాలకృష్ణ ), చా.సో, కరుణశ్రీ వంటి సాహితీ దిగ్గజాలెందరూ నాకు స్ఫూర్తి దాతలు. ఉద్యోగరీత్యా మచిలీపట్నం చేరిన తర్వాత నా సాహిత్యాభినివేశం రెట్టింపు అయింది.

మీ ఉద్యోగ జీవితాన్ని ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించారు?


జ:  నేను మీకు ముందు చెప్పినట్లు మా నాన్నగారు పరమపదించిన తర్వాత నేను కుటుంబ పోషణ బాధ్యత మోయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  చదువు మానేసి ఉద్యోగానికి వెళ్ళాను. ఆ ఉద్యోగం ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే పంచవర్ష ప్రణాళికల కింద ప్రారంభించారు. మాలకొండయ్య గారని IAS ప్లానింగ్ ఆఫీసర్. ఆయనను ఒకరి ద్వారా కలుసుకున్నాను. ఆయన కూడా నావంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారవడం వల్ల నన్ను ఆదరించి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. ఆ కాలంలో సివిల్ ఇంజినీర్ టెస్టులు ఉండేవి. ఇప్పుడు తీసేశారు. అవి పాసయితే డిప్లొమా, డిప్లొమా పాసయితే డ్రాఫ్టింగ్, సూపర్ వైజర్ గా వెళ్ళొచ్చు. అలాగే డిగ్రీ చేసుకోవచ్చు. నేను దాన్ని అతితక్కువ సమయంలో, అత్యుత్తమ స్థాయిలో పూర్తి చేశాను. LDC క్యాడర్ రూ.67/- ఉండేది. నాకు రూ.84/- ఫిక్స్ చేసి ప్రమోషన్ ఇచ్చారు. పదహారు పేపర్లు పూర్తి చేయాల్సి ఉంటే నేను ఎనిమిది పేపర్లు పూర్తి చేయగానే ప్రమోషన్ ఇవ్వడం గొప్ప విషయం ఆ రోజుల్లో.

LIC లో మీ ప్రవేశం ఎలా జరిగింది? తర్వాత మీ ఉద్యోగ ప్రస్థానం ఎలా కొనసాగింది?

నేను ఎల్.ఐ.సి లో ప్రవేశించడం యాదృచ్చికంగా జరిగింది. బాపట్లలో మాకు దూరపు బంధువు కొండయ్యగారు అందులో పని చేస్తుండేవారు. కొండయ్య గారి తండ్రి గురు గోవింద స్వామి శిష్యుడు. ఆయన ‘కపిల గోసంవాదం’ అని భారతంలోని కథాంశాన్ని తీసుకొని ఆధ్యాత్మిక కావ్యం రాశారు. నా జాబుకి సంబంధించిన అప్లికేషను పంపించారు. అప్పట్లో 55% మార్కులు ఉంటే ఎల్.ఐ. సి. అసిస్టెంట్ అర్హత ఉండేది. నాలుగు సౌత్ స్టేట్స్ కలిపి కాంపిటేషన్ టెస్ట్ నిర్వహించేవారు. ఒక్క మచిలీపట్నంలోనే దాదాపు 2వేల 3 వందల మంది రాశారు. అట్లా పరీక్ష రాసిన లక్షా 28 వేల మందిలో ఎస్.ఎస్.ఎల్.సి.వాడిని నేనొక్కణ్ణే. అటువంటిది ఆ పరీక్ష పాసవడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడం కూడా జరిగింది. ఆ విధంగా నా ఉద్యోగ ప్రస్థానం 1961 మచిలీపట్నం నుండి ప్రారంభమైంది. కుటుంబాన్ని తీసుకొనివెళ్ళాను. ఆ తర్వాత పి.యు.సి. పాసయినాను. ఎల్.ఐ.సి లో ప్రొఫెషనల్ పరీక్షలుండేవి. నేను లైసెన్సుయేట్ నుండి అసోసియేట్ స్థాయికి వచ్చాను. అక్కడ ఆరు పేపర్లు రాయవలసి ఉంటుంది. అది ఒక్కసారి అయినా రెండుసార్లు అయినా పూర్తి చేసుకునే అవకాశం ఉండేది. నేను ఒకేసారి 6 పేపర్లకు కట్టాను. అందులో  Actuarial science అని మేథమేటిక్స్ బేసిస్ పేపర్ ఉంటుంది. ప్రపంచంలో రెండే రెండు ప్రొఫెషన్స్ ఈనాటికీ గొప్పవిగా భావించబడుతున్నాయి. అందులో ఒకటి ఆర్చురీ, రెండవది చార్టెడ్ అకౌంట్. ఆర్చురీ లండన్ లో ఉంటుంది. చాలా కష్టమైనది. మేథమేటిక్స్ బేసిక్ లేనివాళ్ళకు మరీ కష్టం. నేను ఆరు పేపర్లు ఒకేసారి పాసయ్యాను. మా ఫెడరేషన్ లో ఒక రికార్డు అది. 150 మంది ఉన్న మా డిపార్టుమెంటులో సీనియర్ గా ఉన్న వ్యక్తి రిజల్ట్ తీసుకొచ్చి నన్ను పిలిచి అందరి ముందు నన్ను బెంచీపై నిలబడమని నిలబెట్టి ఆ విషయాన్ని గొప్పగా చెప్పడం మర్చిపోలేను. తర్వాత బి.ఏ, ఎమ్.ఏ లు, ఫెలోషిప్ కూడా పాసయ్యాను. ఆరు పేపర్లు ఒకేసారి పాసయినందుకు సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది. నా తర్వాతి నుండి ఎస్.ఎస్.ఎల్.సి తో అర్హత తీసేసి కనీస అర్హతగా డిగ్రీ ఉండాలని నిర్ణయించారు (పెద్దగా నవ్వుతూ). ఆ తర్వాత HGA (Higher grade assistant) గా చేశాను. 15 సంవత్సరాలు చేశాను కానీ ప్రమోషన్ల విధానం కోర్టు కేసులతో నడిచి చివరకు 1979 లో ధార్వాడకు సూపరింటెండెంట్ గా వేశారు. తర్వాత కడపలో తొమ్మిదన్నర ఏళ్ళు చేశాను. బొంబాయిలో సంవత్సరం, అటునుండి 1990- 94 వరకు హైదరాబాద్ లో మొదటిసారి చేశాను. మళ్ళీ బెంగుళూరు రెండేళ్ళు, తిరిగి బొంబాయిలో చివరగా హౌసింగ్ ఫైనాన్స్ కి డిప్యూటీగా వేశారు. ఆలిండియా క్యాడర్ లో 101 ఆఫీసులకు హెడ్ గా ఉన్నాను. ఏడేళ్ళు పనిచేసి 2001 వ సంవత్సరం చివర్లో రిటైర్ అయ్యాను. తీసుకోగలిగే పదవి అయినా నేను నా జీవితంలో అవినీతి పనులకు పాల్పడింది ఎప్పుడూ లేదు. “నా బ్యాంక్ పాస్ బుక్, నా జీవితం పాస్ బుక్ ఎప్పుడూ ఓపెన్” అనేది నా స్టేట్ మెంట్. అందులో ఎలాంటి సీక్రెట్ లేదు ( నవ్వుతూ ). నా పిల్లల్ని కూడా అలాగే పెంచాను.

‘ఆంధ్ర సారస్వత సమితి’ స్థాపనకు దారి తీసిన పరిస్థితులేవి?

ఇంతకుముందే మచిలీపట్నంలో ఉద్యోగం ప్రారంభించానని చెప్పాను కదా! అక్కడికి వెళ్ళగానే నేనొక భావోద్వేగానికి గురయ్యాను. కారణం విశ్వనాథ సత్యనారాయణ గారు, పింగళి కాటూరి కవులు, ముట్నూరు కృష్ణారావు గారు, పట్టాభి సీతారామయ్య గారు వంటి వాళ్ళ పేర్లు వింటేనే ఒడలు పులకరిస్తుంది. అటువంటి వాళ్ళు ఉన్న నేల అది. “ఇచట పుట్టిన చివురు కొమ్మయిన చేవ” అని గుర్తుకు వచ్చింది. ఎంత గొప్ప ప్రదేశం? ఆ మట్టి ఆ గాలి కూడా అంతే. ఆ పరిస్థితుల్లో సాయంత్రం పూట పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్లు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, ఆదివిష్ణు, రావూరి సత్యనారాయణ గారు వంటి ప్రముఖులు ఇలా చాలామంది కలుస్తుండేవారు. అద్దేపల్లి రామ్మోహన్ రావుగారు ఒకసారి “ఏమయ్యా విహారీ! మనం ఎలాగూ అందరం కలుస్తున్నాం కదా! ఒక సంస్థ పెడితే బాగుంటుంది కదా!” అన్నారు. నేను సరేనన్నాను. ఏడుగురం కలిసి రిజిస్ట్రేషన్ చేయించాం. అందులో తొలి సంతకం అద్దేపల్లి వారిదైతే రెండవది నాది. మొట్టమొదటి సభ 11 మందితో టౌన్ హాల్లో పెట్టాము. వేదాల తిరు వెంగళాచార్యులు గారని, అలంకారశాస్త్రంలో దిట్ట. ఆయనను ప్రసంగానికి పిలిచాం. పదకొండు మందిలో కూడా ఏడుగురే వచ్చారు. అదీ పరిస్థితి. కానీ నేను దాన్నుండి బయటకు వచ్చేనాటికి చివరి సభకు లోపలే కాకుండా బయట 300 కుర్చీలు వేయిస్తే ఆ మూడువందల కుర్చీలలో మొత్తం ఆడవాళ్ళు కూర్చోవడం విశేషం. ప్రహరీ గోడ మీద కూర్చొని, నిలుచొని కూడా కొంతమంది విన్నారు. ఆ స్థాయికి దాన్ని తీసుకొచ్చాం.

ఆ సంస్థ ద్వారా మీరు చేసిన కార్యక్రమాలు ఏవి?

ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు. ఒకటి మా మెంబర్స్ ప్రతీనెలలో పదిహేను రోజులకు ఒకసారి ఒక తేదీన గోష్ఠి నిర్వహించుకునేవారం. రెండవది సభ ఏర్పాటు చేయడం. అందువల్ల ఊళ్ళో ఒక విధమైన చైతన్యం వచ్చింది. దాదాపు తెలుగునాట ఉన్న ప్రముఖులందరినీ ప్రసంగాలకు పిలిచాము. ఎంతోమంది ఆర్థిక సహకారం అందించారు. త్రివేణి వక్కపొడి ఓనర్ వెంకట సుబ్బారావు అయితే “మీరు ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తర్వాత మీకు ఇంకా కావాల్సిన మొత్తాన్ని నేను ఇస్తాను” అని అనేవారు. నేను గొప్ప సమన్వయ వాదిని అని పేరు నాకు. ఎందుకంటే అన్ని విధాలైన భావ జాలాలను కలుపుకు పోతాను. ప్రాచీన సాహిత్యం లో శ్రీశ్రీ సాహిత్యాన్ని అభిమానించే extrimists ఉండేవారు. అద్దేపల్లి రామ్మోహన్ రావుగారు శ్రీశ్రీ మీద మొట్టమొదటి విమర్శ పుస్తకం రాశారు. ఆ కారణంగా ఆ ఊళ్ళో మా సంస్థ ద్వారా ఎంతో చైతన్యం వచ్చింది.
       ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చివరి సభకు సినారె గారు ప్రధాన వక్త. ఎమ్. వి. ఎల్., కావిలిపాటి విజయలక్ష్మి, మధురాంతకం రాజారావు వీళ్లంతా వేదిక మీద ఉన్నారు. ఎస్.పి గారిని అధ్యక్షునిగా పిలిచాము. అది ఎమర్జెన్సీ పూర్తయిన కాలం. సమయానికి ఎస్.పి.గారికి అర్జెంట్ పని ఉండడం వల్ల రావడం లేదని చెప్పాడు. రామచంద్ర రాజు గారు జిల్లా జడ్జి. ఆయనను పిలిచాము. గతంలో బుచ్చిబాబు నవల మీద లైబ్రరీలో నేను ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఈయనే అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ ఆత్మీయతతో అంగీకరించారు. అప్పుడు  నారాయణరెడ్డి గారు మాట్లాడిన మొదటి వాక్యం “చట్టం గద్దె దిగింది న్యాయం గద్దె నెక్కింది” అని ఎమర్జెన్సీని ఉద్దేశించి అనడంతో జనమంతా చప్పట్ల హోరు. అదే సభలో కొడాలి ఆంజనేయులు గారూ ఉన్నారు ముందు వరుసలోనే. రెండు నిమిషాలు మాట్లాడతానని వేదిక మీదకు వచ్చారు0 (విశ్వనాథ వారు ఈయన కలిసి సత్యాంజనేయులు అనే పేరుతో అవధానాలు నిర్వహించారు). “నేను పుట్టిన ఈ బందరులో మూడే మూడు సభల్లో ఇంతమంది జనం ఉండడం చూశాను. ఒకటి నీలం సంజీవరెడ్డి గారు వచ్చినప్పుడు, రెండవది అతుల్య ఘోష్, సుచేతా కృపలానీ వచ్చినప్పుడు, మూడవది ఇదే సభ. మొదటి రెండూ రాజకీయ సభలు కాబట్టి జనం రావచ్చు. కానీ ఒక సాహితీసభను గోడలెక్కి చూడడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మేము చేస్తున్న కృషిని అభినందించారు.

అదేవిధంగా ‘స్పందన’ సాహితీ సమాఖ్యను గురించి తెలపండి.

నేను ఆంధ్ర సారస్వత సమితి తరఫున 1972 లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీకి ఎన్నుకోబడ్డాను. అక్కడ అందరికంటే నేను వయసులో చిన్నవాడిని. పావలా సభ్యత్వంతో 300 మంది సభ్యులున్నారు దాంట్లో. రూపాయి సభ్యత్వం కోసం మీటింగులలో ప్రయత్నాలు మొదలయ్యాయి. పావలా ఇవ్వడానికే వెనుకాడేవారు రూపాయి ఎలా ఇవ్వగలరు? అప్పటికే సభలకు చందాలు వసూలు చేస్తున్నారు. ఉన్న సభ్యులు కూడా పోతే ఎలా? అందుకే అది అమలు కాలేదు. 11 ఏళ్ళు నేను సంస్థకు అధ్యక్షునిగా చేశాను. ఇక్కడ శివారెడ్డి, కుందుర్తి, శీలా వీర్రాజు గార్లతో పనిచేసిన గుత్తికొండ సుబ్బారావు సంస్థలోకి వచ్చి చేరాడు. ఎప్పుడు సభలు చేయాలంటే మా ఇద్దరి పేర్లే వచ్చేవి. నాకు ఎంతోమంది పరిచయం ఉండడం వల్ల నేను పిలిస్తే వచ్చేవాళ్ళు. ఒకసారి సినారె గారు సభలో “విహారి పిలవడం వల్ల వచ్చాను. కానీ మద్రాసు నుండి ఊరికే ఎవరైనా వస్తారా?” అన్నారు. అలాగే ఎమ్.వి.ఎల్. కూడా. ఎవ్వరైనా సభల్లో ఆ విషయం చెప్పేవారు. దానిని ‘వ్యక్తి పూజ’ అనుకోవడానికి లేదు కదా! వ్యక్తి లేకుండా సంస్థ ఏముంది? అయితే ఈ కారణంగా ఒక పదిహేను మంది అసంతృప్తి వర్గం తయారయింది. అందులో బోయి వెంకటేశ్వర్లు అనే ఆయన అధ్యక్షునిగా కాదలచుకున్నాడు. నాతో పోటీలో గెలవలేనని తెలుసు కాబట్టి ఉపాధ్యక్షునిగా ఉంటానన్నాడు. అప్పటివరకు ఎన్నికలు లేవు. ఆయన మాట మాత్రంగా చెప్పాడే కానీ నామినేషన్ వేయలేదు. ఈలోగా సరస్వతి అనే ఆవిడ నామినేషన్ వేసింది. ఆయన వచ్చి గొడవ చేశాడు. కనీసం వేస్తానని ఆయన మాకెవ్వరికీ చెప్పలేదు. విత్ డ్రా చేసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. పెద్ద గొడవే జరిగింది. ఆ సమయంలో మేము ఒక ఏడుగురం బయటకు వచ్చి ‘స్పందన సమాఖ్య’ కు రిజిస్ట్రేషన్ చేయించాము.

         ఇందులో మేము పుస్తక ప్రచురణను కూడా ఒక భాగంగా చేసుకున్నాం. దాని తరఫున నేను ధార్వాడ వెళ్ళే లోపు 120 పుస్తకాలు వేశాము. అందులో చాలా పుస్తకాలు యూనివర్సిటీలో రెఫరెన్సు పుస్తకాలుగా ఉన్నాయి. కుందుర్తి పీఠికలు లాంటి స్టాండర్డ్ పుస్తకాలు వేశాము. కథలు, నవలలు వేశాము. దాశరథి దగ్గర నుండి తెలుగుదేశంలో ఉన్న కవులందరినీ కలిపి ‘కవిత’ అనే పుస్తకం వేశాము. ఇదేకాక ‘స్పందన’ అనే మ్యాగజైన్ వేశాము. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్ హసన్ శ్రీశ్రీ ముఖచిత్రం ఉన్న ఆ మ్యాగజైన్ పట్టుకొని తిరుగుతుంటాడు ( నవ్వుతూ ). నేను ధార్వాడకు వెళ్ళడం ఆ సంస్థకు తీరని లోటు. ఎంత ప్రయత్నించినా దాన్ని కొనసాగించడం ఎవరివల్లా కాలేదు. అప్పులు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ సంస్థ ఉంది. అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకుంటూ ఉంటాం.

మీ రచనల్లో కథా సాహిత్యం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమైనా ఉందా?

ఉంది. ఎస్.ఎస్.ఎల్.సి పాసయిన తరువాత గ్రంథాలయంలో పుస్తకాలు చదివేవాణ్ణి అని చెప్పాను కదా! అందులో నన్ను చాలా ప్రభావితం చేసినవి మధురాంతకం రాజారావు, గోపీచంద్ పుస్తకాలు. దాంతో మిగిలిన వాటికంటే కథా సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. అసలు నేను ప్రాథమికంగా పద్య సాహిత్యం, ప్రాచీన సాహిత్యాల పట్ల గట్టి పట్టున్నవాణ్ణి. హరి సాంబశివరావు గారు మా గురువు గారు. నేను ఆయన దగ్గర కావ్యాలన్నీ చదువుకున్నాను. అంతకుముందే తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి అని ఆయన మా అమ్మకు కజిన్ అవుతారు. శాస్త్రిగారికున్న ఏకైక చెల్లెలు మా మేనమామకు భార్య. అందుకే పట్టు సాధించగలిగాను. అలాంటివాణ్ణి ఆధునిక సాహిత్యంలోకి వచ్చి ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో కథలు, నవలలు, విమర్శలు చదివాను. ఇదిలా ఉండగా బందరు ఉద్యోగం లోకి వచ్చిన తరువాత నాతో పాటు శాలివాహన ( త్రిపురారి భొట్ల నారాయణ మూర్తి ), నేను కలిసి పనిచేశాము. మా ఇంటి వెనుక పిట్ట గోడ ఉండేది. ఆయన ఇల్లు అటువైపు ఉండేది. అప్పుడేదో సందర్భంలో కథల ప్రస్తావన వచ్చింది. ఆయన అప్పటికే కథలు రాస్తున్నాడు. అయితే నేను కూడా రాద్దామనుకున్నాను. ఇద్దరం కలిసి రాయాలనుకున్నాము.  అప్పటికే ఆయన శాలివాహన పేరుతో రాస్తున్నాడు. నేను విహారి అనే పేరుతో ఏవో పద్యాలు, వ్యాసాలు సందర్భోచితంగా రాస్తుండేవాడిని. ఆంధ్రజ్యోతి సాహిత్యానుబంధంలో కూడా రాసేవాడిని. ఇక ఆయన నేను ఇద్దరమూ కలిసి 1977 వరకు ముమ్మరంగా కథలు రాశాము. 1977 లో నేను ధార్వాడ వెళ్ళాను. అప్పటినుండీ సెపరేట్ గా రాయడం ప్రారంభించాము. 1977 – 79  మధ్య ధార్వాడలో ఒక్క రచన కూడా చేయలేదు. 1979లో కడపకు వచ్చాను. అక్కడినుండి మళ్ళీ నా రచనా వ్యాసంగం మొదలైంది. ఒక రకంగా రెండవ సాహితీ జీవనమని చెప్పవచ్చు.

మీరు రాసిన ‘చలనం’ అనే కథ ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నదని విన్నాం. అదేంటో చెప్తారా?


మంచి ప్రశ్న. ‘చలనం’ కథలో ఉన్నది ఏంటంటే Existentialism. మనం అస్తిత్వవాదం అని అంటుంటాం కదా! మన తెలంగాణ, ఆంధ్ర అలాంటి అస్తిత్వ వాదం కాదు. సాహిత్యంలో Existentialism అనే దానికి అస్తిత్వవాదం అని పేరు పెట్టిన వారు మొదట గోపీచంద్ అయితే దాన్ని తెలుగు సాహిత్యలోకానికి పరిచయం చేసింది బుచ్చిబాబు. గోపీచందుని ‘అసమర్థుని జీవయాత్ర’లో, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లో దాన్ని వాళ్ళు అప్లై చేశారు. నా కథల్లో Existentialism అనేది ఆకుచాటు పిందె లాగా కనబడుతుంది. అంటే అంతర్లీనంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఈ ‘చలనం’ కథలో శ్రీనివాస్ అనే పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అతను సంప్రదాయ కుటుంబీకుడు. అయినా ఒక్కోసారి వరుసగా 3 రోజులు స్నానం చేయకుండా ఉండడం, ఒక్కోసారి 4 రోజులు నదీ స్నానం చేయడం, బూట్లు, చెప్పులు వేసుకొని పడుకోవడం ఇట్లా. అంటే Chaotic (అస్తవ్యస్తమైన ) person అంటాము. Existentialism ఏం చెబుతుందంటే “A man is a useless person” అనేది అందులో ఒక థియరీ. ఉదా:- ఒక వ్యక్తి మీద అభిమానం కలుగుతుందనుకోండి. అవసరాన్ని బట్టి మారొచ్చు. అతని మీద ద్వేషమూ కలగొచ్చు. రెండవ సూత్రం ఏంటంటే “Exist because you think”. అంటే నేనున్నాను అంటే ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తున్నానంటే నేనున్నాను. నువ్వు చేస్తున్నవన్నీ నీ ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. నువ్వు సాధిస్తున్నది కాదు. దానంతట అదే జరుగుతున్నది. దీన్ని ఆధారంగా చేసుకొని రాశాను. ఆ పాత్ర లైఫ్ చిన్నగా, విభిన్నంగా సాగుతుంది. ఆ అస్తవ్యస్తపు వ్యక్తి మతాంతర వివాహం చేసుకుంటాడు. తల్లి, చెల్లి బాధపడతారు. ఇతరుల దృష్టిలో పనికిరాని జీవితాన్ని గడుపుతాడు. పెళ్ళి చేసుకున్న అమ్మాయి మరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఇందులో నువ్వు దేన్ని ఆపగలిగావు? కాబట్టి మనచేతుల్లో ఏదీ లేదు. చివరకు ఒక సినిమా పాటలో “ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే ఆట” అన్నట్లు పశ్చాత్తాప పడతాడు. ఆంధ్ర పత్రిక వాళ్ళు ఆ అంతరార్థాన్ని పట్టుకొని పత్రికలో వేశారు.

మీ ‘కథాకృతి’ సంకలనాల ఉద్దేశ్యం ఏమిటి?

కథ రాసేవాళ్ళకి సాహితీ సహృదయత ఉండాలి. సాహితీ సంస్కారం ఉండాలి. నేను 350 మంది కవుల కథలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాశాను. అవన్నీ ‘కథాకృతి’ పేర నాలుగు సంపుటాలుగా వచ్చాయి. అందులో చిన్న, పెద్ద, ప్రాంతీయత లాంటి భేదాలు లేకుండా కథ బాగుంటే రాశాను. అందులో దాదాపు 200 మంది ఇవ్వాళ్ళటికీ నాకు తెలియదు. అల్లూరి గౌరీలక్ష్మి అనే ఆవిడ ‘డబ్బింగ్’ అని అద్భుతమైన కథ రాసింది. ఆ కథతోనే మొదలుపెట్టాను. ఒక మీటింగులో ‘నేనేనండీ ఆ కథ రాసింది’ అని పరిచయం చేసుకొంది. “ఎందుకయ్యా వాళ్ళందరికీ కిరీటాలు పెడతావు” అని ఒక పెద్దాయన అన్నారు. కిరీటాలు పెట్టడం కాదు. ఇప్పటివాళ్ళు కూడా రాస్తున్నారు, రాయగలుగుతున్నారని పదిమందికీ తెలియాలి కదా! ఆంధ్రభూమి ఎడిటర్ నేను ఒకావిడ కథను గురించి రాస్తే “అలాంటావిడ కథ ఎలా రాస్తారు?”అన్నారు. “మీరాకథ చదవండి ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుస్తుంది” అన్నాను. ఆయనే నా ‘మహావిజేత’ నవలను అడిగి తీసుకొని ఆంధ్రభూమిలో వేశాడు. “బాలగంగాధర్ తిలక్ రాసిన ‘దొంగ’ అనే కథను ఎవరో కాపీ చేసి టైటిల్ కూడా మార్చకుండా పంపితే ఈయన చూసుకోకుండా పత్రికలో వేశాడు. అది పెద్ద సంచలనం అయింది. అందుకే సూటిగా ఆయనతో ఎడిటర్ అన్నాక అన్నీ చూసుకోవాలని చెప్పాను. ఆయనే ఒక సందర్భంలో  పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన’ లాంటి కథ వస్తే కనుక నేను వేసేవాడిని కాను అన్నాడు. భారతీయ సాహిత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చినవి రెండే రచనలు. అందులో మొదటిది రవీంద్రుని ‘గీతాంజలి’. రెండవది పద్మరాజు గారి ‘గాలివాన’ కథానిక. అలాంటి కథను వేసేవాడిని కాను అనడంతో “అది మీ స్థాయిని తెలియజేస్తుంది” అన్నాను (నవ్వుతూ ). అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే దాంట్లోని విలువలు తెలుసుకోవాలని. అందుకే అటువంటి వాటిని తీసుకొని సంకలనంగా వేశాను.

ఆధునిక పంచకావ్యాల్లో ఒకటిగా పేరొందిన ‘శ్రీ శివభారతం’ రచించిన గడియారం వేంకట శేషశాస్త్రి  గారి పేరు మీద మీరిచ్చే అవార్డు గురించి చెప్పండి.

1981లో గడియారం వేంకట శేషశాస్త్రి గారు మరణించారు. అప్పుడు నేను కడపలో ఉన్నానమ్మా! ఆయన రాసిన ‘శివభారతం’ ఎంతో ఆత్మీయంగా అనేక సందర్భాల్లో చదివాను. మా పెద్దమ్మ కొడుకు, నా రెండవ గురువు గారు చల్లా శంకరయ్య గారని చెప్పాను కదా! ఆయన, నేను కలిసి చదివేవాళ్ళం. అందుకే గడియారం వారంటే నాకు ఎంతో అభిమానం. నాతో పాటు నా ముగ్గురు మిత్రులు మేము ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు కలుసుకునేవాళ్ళం. ఎన్నో సాహితీ చర్చలు చేసేవాళ్ళం. గడియారం వారి మరణవార్త విని ఆయన పేరు మీద ఒక అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపించింది. అది వాళ్లకు చెప్పగానే వెంటనే అంగీకరించారు. కేవలం దానికోసమే సంస్థ పెట్టాము. పద్యకవికి మాత్రమే ఇచ్చే నియమం పెట్టుకున్నాము. భూతపురి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారని ఆయన రచించిన ‘శ్రీ మదాంధ్ర చరిత్ర’ శ్రీకృష్ణ దేవరాయల కావ్యానికి ఇచ్చాము. అప్పటినుండీ మొన్ననే 42 వ అవార్డు ఇచ్చాము. ఆంధ్ర, తెలంగాణాల్లో ఉన్న ప్రసిద్ధులైన కవులందరికీ ఇచ్చాము. ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి గారు, కరుణశ్రీ గారు, ఉత్పల సత్యనారాయణ శాస్త్రి గారు, వేముగంటి నరసింహాచార్యులు గారు, రావికంటి విశ్వనాథం గారు, అనుమాండ్ల భూమయ్య గారు మొదలైన వాళ్ళందరికీ ఇచ్చాము. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. నేను కడప నుండి వచ్చేటప్పుడు 15 వేల రూపాయలు ఖర్చుల కోసం బ్యాంకులో పెట్టి వచ్చాను. మొదట రెండువేలు, తర్వాత అయిదు వేలు, ఆ తర్వాత పదివేలు ఇలా ఆ అవార్డుకు నగదు బహుమతి ఇచ్చాము. మేము పెట్టిన నలుగురిలో ఇద్దరు చనిపోయారు. నేనే ఇస్తున్నాను. శేషశాస్త్రి గారి మనుమలు పొద్దుటూరులో ఉన్నారు. “40 ఏళ్ళుగా ఇస్తున్నారు కదా! మేము కూడా ఇప్పటినుండి భాగస్వాములం అవుతాం” అన్నారు. ఈ రెండు మూడు సంవత్సరాల నుండి వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడికి వాళ్ళకు వస్తే నేనే వాళ్ళను పొద్దుటూరుకు తీసుకువెళ్తాను. అట్లా పద్యకవులకు గడియారం వారి అవార్డు ఇస్తున్నాము.

ఎంతోమంది ప్రముఖుల ప్రశంసాపాత్రమైన మీ ‘శ్రీ పదచిత్ర రామాయణం’ గురించి చెప్పండి.

మానవాళికి అనుసరణీయము, ఆచరణీయము, ఆవశ్యకము అయిన మానవ సంబంధాలను వివరించే మహాకావ్యం రామాయణం. వ్యక్తిని ఉన్నతంగా నిలిపే సార్వజనీన సూత్రాలు, వ్యక్తుల ద్వారా సమాజాన్ని సమతుల్యతతో నిలిపే విశిష్టమైన, శాశ్వతమైన విలువలు కలిగినది. అందుకే సర్వ కాలాల్లో పఠనీయమైన కావ్యమని నా అభిప్రాయం. అందుకే దానిని 6500 పద్యాలతో “శ్రీపద చిత్ర రామాయణం” అనే పేరుతో రాశాను. రామాయణం వంటి మహత్తర కావ్యాన్ని పద్యాల్లో రాయడం వల్ల ఒక ఔన్నత్యం, ఔచిత్యం కలుగుతాయన్న భావనతో పద్యాల్లో రాయడం జరిగింది. పద్యాల మీద నాకున్న పట్టు ‘తీరని దాహం’ కావచ్చు (గట్టిగా నవ్వుతూ).

ప్రసిద్ధ ఆలంకారికుడు జగన్నాథ పండితరాయల మీద నవల రాయాలనుకోవడానికి కారణం ఏమైనా ఉందా?

ఉంది. నేను సినారె గారు రచించిన కర్పూర వసంతరాయలు కావ్యాన్ని నా చిన్నప్పుడు గుంటూరులో ఆయన చెబుతుండగా విన్నాను. అంతకుముందు నేను ప్రాచీన కావ్యాలు గురుముఖత విని ఉన్నాను. దానితో పద్యం మక్కువ ఏర్పడింది. ఈ కావ్యం విన్న తరువాత గేయకావ్యంలో ఇంత  మాధుర్యం ఉందా అనిపించింది. కర్పూర వసంత రాయలు ఎవరో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. నాకు చరిత్ర అంటే ఇష్టం. కర్పూర వసంతరాయల  (కుమారగిరి) చిన్నాన్న అనవేమారెడ్డి. ఆయన అసలు వసంతరాయలు. ఆయన పేరు మీదనే ఉత్సవాలు జరిగేవి. వసంతరాయల గురించి నవల రాద్దామనిపించింది. పరిశోధన చేశాను. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వద్దకు వెళ్ళి ఆయన రాసిన పుస్తకాలతో పాటు మరికొన్ని రెడ్డిరాజుల చరిత్ర పుస్తకాలు మొత్తం వంద పుస్తకాలు చదివాను. ఆ ప్రభావంతో అనవేమారెడ్డి నవల రాశాను. అచ్చులో 170 పేజీల పుస్తకం వచ్చింది (1972). దాన్ని చూసి నోరి నరసింహ శాస్త్రి గారు సాహిత్య అకాడెమీకి ఈ పుస్తకానికి నేను ఓటు వేస్తాను అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం రెకమండ్ చేస్తానని. అప్పటినుండి గేయకావ్యం ఒకటి రాయాలని కోరిక కలిగింది. దాంతో స్పందన సాహితీ సమాఖ్యలో ‘రాబోవు ప్రచురణలు’ అని మొదటిది ఎమ్.వి.ఎల్ గారి సినిమా పాటల్లో సాహిత్యం, రెండవది విహారి గారి జగన్నాథ పండితరాయలు (గేయకావ్యం) అని ప్రకటించాము. 1972 నుండి అది అలాగే ఉంది. ఉద్యోగరీత్యా నాకు రాయడం కుదరలేదు. దాని మీద మనసు పోయింది. ఆ తర్వాత ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా జగన్నాథుని రసగంగాధరం మొదలగు కావ్యాలను చదువుతూ నోట్స్ రాసుకునేవాడిని. గేయకావ్యంగా 40 పేజీలు రాశాను కానీ సంఘటనలు, పాత్రల మధ్య అనుసంధానం చేయడం కష్టమవుతున్నదని నవల రాశాను. అలా రాయాలని కోరిక కలగడానికి కారణం ‘లవంగి’ తో ఆయనకు కలిగిన అపప్రథ. దాన్ని రూఢి చేస్తూ కొంతమంది రచనలు చేశారు. అందులో ప్రధానంగా  కె. రామలక్ష్మి గారు ‘లవంగి’ పేరుతో రాసిన నవల ‘యువ’ పత్రికలో దీపావళి సంచికలో అనుబంధ నవలగా వచ్చింది. అందులో లవంగికి, ఆయనకున్న సంబంధాన్ని చెబుతూ కొన్ని శ్లోకాలను కూడా కోడ్ చేస్తూ రాసింది. అది చదివిన తరువాత దాన్ని ఎలాగైనా కాదని నిరూపించాలి అనుకున్నాను. అంతేకాదు జగన్నాథ పండితరాయల గేయకావ్యం రాయడానికి కూడా ప్రధానమైన భావన అదే. అంతటి గొప్ప పండితుడు, తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన ఆయనపై ఇలాంటి నిందలు వేయడం నాకు నచ్చలేదు. అందుకే ఆధారసహితంగా దాన్ని తప్పు అని నిరూపించడానికి ఈ నవల రాశాను.

మీ పద్యకృతులను గురించి చెప్పండి.

మొట్టమొదటిది రామాయణమే. నేను అంతకుముందు రెండు చిన్నకావ్యాలు రాశాను చిన్నప్పుడు. ఒకటి సోరాబ్ రుస్తుం 50, 60 పద్యాలు ఉంటాయి దాంట్లో.  రెండవది పన్నా అని ఒక కథను రాశాను. విడివిడిగా కాశీని గురించి వ్యాసకాశి అని. అవేవీ ఇప్పుడు లేవు. మొదటగా వెలుగులోకి వచ్చింది శ్రీ పద చిత్ర రామాయణమే. ‘యోగ వాసిష్ఠ సారం’ అని 400 పద్యాలతో తర్వాత రాశాను. సుమంత్రుని గురించి రాశాను. భూమయ్య గారు నవ్వుతుంటారు “రామాయణాన్ని విడిచిపెట్టరా!” అని. సుమంత్రుడు విశ్వాసపాత్రుడైన మంత్రి. మరియు ఆంతరంగికుడు. ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎటువంటి చిత్తక్షోభను అనుభవించాల్సి వస్తుందో సామాజిక పరిస్థితిని అప్లై చేసి రాశాను. ఇది కాక రామాయణంలోని పాత్రల గురించి ‘భక్తి’ పత్రిక వాళ్ళు 16 వ్యాసాలు రాయించారు. అవి, ఇంకో రెండు వ్యాసాలు కలిపి ‘అంతా రామమయం’ అనే వ్యాస సంకలనాన్ని తెచ్చాను. తర్వాత మా బావగారు (ఇప్పుడు లేరు) మాకు పద్యాలు అర్థం కావు గానీ ఒక్క సుందరకాండ అయినా వచనంలో రాసిపెట్టు అన్నారు. ఆయన కోసం 100 పేజీల పుస్తకం రాశాను. భూమయ్య గారన్నట్టు నా మనస్సులోంచి రామాయణం పోవడం లేదు( గట్టిగా నవ్వుతూ ). అందుకే ఇటీవల ‘రామాయణ సూక్తి సుధ’ అని 200 పద్యాలు కేవలం రామాయణంలోని సూక్తులను తీసుకొని రాశాను. అది అచ్చులో ఉంది. ఇంకో విషయం చెప్పాలి. విజయవాడలో ఒకాయన రామాయణంలో 100 బొమ్మలను వేయించాడు. ఆయన పబ్లిషర్ కూడా. అందుకే ఆ బొమ్మలకు అర్థం వచ్చేటట్లు వచనం రాయించాలనుకొని ఒకరిద్దరితో రాయించాడు కానీ ఆయనకు నచ్చలేదు. ఒకసారి ఏదో సందర్భంలో జి. వి. పూర్ణచందర్ రావు దగ్గరికి వెళ్ళినపుడు ఆయన కూడా కలిసి ఈ విషయం చెప్పాడు. అప్పుడు పూర్ణ చందర్ “మా గురువు గారు రాస్తారు” అన్నాడు. వెంటనే ఆయన మొత్తం పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళాడు. నేను కేవలం ఆ బొమ్మ అర్థం కాకుండా దాని ముందు వెనుక ఉన్న కథాంశాన్ని కూడా కూర్చి మొత్తం రామాయణం వచ్చేటట్లుగా రాశాను. ఆయనకు బాగా నచ్చి తీసుకువెళ్ళారు. మీ గురువుగారికి 5 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పండి అన్నాడట. డబ్బు విషయం పక్కకు పెడితే దురదృష్టం ఏంటంటే ఆయన చనిపోయారు. ఆ పుస్తకం అచ్చు వేయడం కోసం కుటుంబ సభ్యులను అడిగితే తెలియదన్నారు. ఇది జరిగి 8 సంవత్సరాలు అయింది. వెతుకులాటలో మొన్న కొన్ని దొరికాయి. అన్నీ కలిపి వేస్తున్నాము.

మీ రచనలు మొత్తం ఎన్ని పుస్తకాలుగా వచ్చాయి? ఆంగ్ల భాషలో ఏవైనా రచనలు చేశారా?

జ:   ఇప్పటివరకు నా రచనలలో కథా సంపుటాలు 19, వ్యాస సంపుటాలు 17, రామాయణాలు 11, నవలలు 7, మోనోగ్రాఫులు 2, పద్య సంకలనాలు 4, దీర్ఘ కవితలు 2, రచయితల సమీక్షలు 5, నవీన 1, సప్తపదులు 1, అచ్చులో ఇంకా ఉన్నవి 3…మొత్తం 72 పుస్తకాలు. ఆంగ్లభాషలో రచనలు ఏవీ చేయలేదు. అన్నీ అనువాదాలే. అంతా లిటరేచర్ సంబంధించినవి. ప్రొఫెషనల్ కి సంబంధించిన షేర్ మార్కెట్లు మొదలైనవి మాత్రమే.

‘అజో విభో కందాళం’ ఫౌండేషన్ వారి జీవన సాఫల్య పురస్కారం పొందిన అనుభూతి ఎటువంటిది?

అప్పా జోస్యుల వారు ఇచ్చే ఈ పురస్కారం చాలా గొప్పది. తెలుగులో జ్ఞానపీఠ అని ప్రసిద్ధి దానికి. నాకు వచ్చిన పురస్కారాల్లో ఎంతో సంతృప్తిని కలిగించిన పురస్కారం అది. డబ్బు దృష్ట్యా కాదు. ఆయన ఎవరిని ఎలా ఎన్నుకుంటారో, ఆయన దృష్టికి ఎవరు ఎలా వస్తారో తెలియదు. ఈ అవార్డు ఇవ్వడానికి ముందు ఆయన నన్ను ఒకసారి చీరాలకు పిలిచారు. ‘శ్రీరామతత్త్వం’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వమన్నారు. రెండురోజులు వాళ్ళింట్లోనే ఆతిధ్యం ఇచ్చారు. రామాయణంలో మీకు నచ్చిన కొన్ని ఘట్టాలను చదవండి అన్నారు. అహల్య ఘట్టంలో చాలామంది ఆమె ఇంద్రునికి కొంగు పరచినట్లుగా రాశారు. అది నాకు మనస్కరించలేదు. ఆధ్యాత్మిక పరంగా వేరే అర్థాలున్నాయి. అదే చదువుతూ వివరించబోయాను. ఆయన నవ్వి వివరణ వద్దు చదవండి అన్నారు. అంటే అంత పట్టు ఉంది ఆయనకి. ఆయన రాసిన పంచభూతాత్మక తారావళుల్లో ‘అంతరిక్ష తారావళి’ ఇటీవలే వచ్చింది. దానికి ముందుమాట నా చేత రాయించారు. 24 పేజీలు వచ్చిందది. గొప్ప పండితులు, సహృదయులు ఆయన.

మీకు వచ్చిన ఇతర పురస్కారాలేవి?

నాకు వచ్చిన పురస్కారాలు అన్నీ కూడా నాకు తెలియకుండా నన్ను వరించి వచ్చినవి. ఏ ఒక్కటి కూడా ఇది వస్తే బాగుండునని అనుకోలేదు. ఒక మరపురాని సంఘటన చెప్పాలి. 1977 లో నా కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం వచ్చింది. 50 సంవత్సరాల తర్వాత దాని బ్యాక్ గ్రౌండ్ తెలిసింది. సిటీ సెంట్రల్ లైబ్రరీలో దాశరథి రంగాచార్యుల వారి సభకు ప్రేక్షకునిగా వెళ్ళాను. ఆయన కారెక్కబోతుంటే బి.ఎస్.రాములు అనుకుంటా నన్ను ‘విహారి’ అని ఆయనకు పరిచయం చేశాడు. ” ఓయ్ నువ్వా విహారి అంటే! నీ సంగతి నాకు తెలుసునయ్యా!” అంటూ ఆగి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డుకు నీ పుస్తకం వచ్చినప్పుడు జడ్జీల మధ్య నిర్ణయం వాయిదా పడింది. బెజవాడ గోపాలరెడ్డి గారు నాకు నీపుస్తకం ఇచ్చి చూడమన్నారు. నీ పుస్తకానికే ఇవ్వమని చెప్పాను. ఆయన “ఇతను చిన్నవాడు కదా! ముందు అవకాశం ఉంది కదా!” అన్నాడు. అప్పుడు నేను నువ్వు మనిషిని చూసి అవార్డు ఇస్తావా? పుస్తకం చూసి ఇస్తావా? అని అడిగాను. అప్పుడది నీకు ఇచ్చారు” అన్నారు. ఇన్ని ఏళ్ళ తర్వాత రంగాచార్యుల నోట ఈ విషయాన్ని విని ఎంతో ఆశ్చర్యపోయాను.  విజయవాడలో ఒకసారి రామాయణం చెబుతుంటే ఇద్దరు వ్యక్తులు మధ్యలో లేచి వెళ్ళిపోయారు. సభ పూర్తయ్యే ముందు ఒక బుట్టతో వచ్చారు.  అయిపోయాక నాకు ఒక ధోవతి, ఉత్తరీయం ఇచ్చి, శాలువా కప్పి గులాబీపూల గజమాలతో సత్కరించారు. ఆ ఇద్దరిలో ఒకవ్యక్తి జానపద బ్రహ్మ లాంటి ఎన్నో పేర్లు కలిగి, వివిధ జానపద కళల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన కర్ణాట లక్ష్మీ నర్సయ్యగారు. మరో వ్యక్తి నాగేశ్వరరావు గారు అని మంగళగిరిలో గొప్ప సంపన్నుడట. ఆ విషయం తర్వాత తెలిసింది. ఆ తరువాత నాగేశ్వరరావు గారికి అప్పటికి భార్య చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆమె పేరు మీద ఆయన నాటకరంగంలో ప్రతిభ కలిగినవారికి  అవార్డు ఇస్తున్నారు. ఇప్పటి నుండీ నాటకాలకు కాకుండా సాహితీ వేత్తలకు ఇస్తానని చెప్పి నాకు ఇచ్చారు. ఆ అవార్డు సభను విజయవాడ నుండి గుంటూరుకు వెళ్ళే రహదారిలో ఓపెన్ థియేటర్ లో ఏర్పాటు చేశారు. నా ఫొటోతో పెద్ద ఫ్లెక్సీ వేయించి, స్వాగతించి గొప్ప సన్మానం చేశారు. మరోసారి కడపలో పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్న సభలో నేను మాట్లాడుతుండగా ఒకాయన మధ్యలో లేచి వెళ్ళిపోయి పట్టుబట్టలు తీసుకువచ్చి సన్మానం చేశాడు. నేను వీటికోసమే వెళ్ళాను. ఏమీ అనుకోవద్దని సంజాయిషీ చెప్పుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన ప్రమేయం లేకుండా జరిగేవి మనకు ఎక్కువ ఆనందాన్నిస్తాయి. అమృతలత గారు ఇచ్చే పురస్కారాలు ఎప్పుడూ మగవాళ్ళకు ఇవ్వలేదు. రచయితలకు ఇవ్వలేదు. మీతోనే మొదలు పెడుతున్నాను అని అమృతలత జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. ఆమెవరో అప్పటికి నాకు తెలియదు. అవార్డులు ఎప్పుడైనానమ్మా! వాటంతట అవే రావాలి. అదే సంతృప్తి. నాకు దాదాపుగా 40 అవార్డుల దాకా వచ్చాయి.

మీరు రాసిన కథల్లో మీకు నచ్చిన కథ ఏది?

నేను రాసిన కథల్లో నాకు నచ్చిన కథ ‘స్పృహ’. ఎవరడిగినా అదే చెప్తాను. ‘నవ్య నీరాజనం’ అని నవ్య పత్రికలో వచ్చింది. ఇంటర్వ్యూ కూడా వేశారు. ఈ కథ దాదాపు అనేక పత్రికల్లోనూ, సంకలనాల్లోనూ 8 సార్లు రీ ప్రింట్ అయింది. దాంట్లో నా లైఫ్ ఫిలాసఫీలో అత్యంత ముఖ్యమైన వాక్యాలున్నాయి. “అవి రాలేదని, ఇది కాలేదని జుట్టు పీక్కోకు. నీకు ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది” ఇలాంటివి. ఇది లైఫ్ బేస్ డ్ కథ. నా కథలన్నింటిలో తాత్త్వికత ఉంటుంది. ఏలె విజయలక్ష్మి గారు నా రామాయణం మీద నాగార్జున యూనివర్సిటీ లో పి హెచ్ డి చేసింది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ యూనివర్సిటీలో. మద్రాసు యూనివర్సిటీలో ఒకతను కథల మీద చేశాడు. ఆంధ్రా యూనివర్సిటీలో కథల మీద విజయేశ్వరావు పి హెచ్ డి చేశాడు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఎమ్.ఫిల్ చేసినవారున్నారు.

మీ అసలు పేరుతో కాకుండా విహారి పేరుతో రచనలు చేయడానికి కారణం?

నేను చిన్నప్పుడు భాగవతం చదివేవాడిని. మా పెద్దమ్మ కొడుకు గొప్ప పండితుడని చెప్పాను కదా! మా ఇంట్లో ఆ వాతావరణం ఉండింది. కాబట్టి శ్లోకాలు అవన్నీ చిన్నప్పుడే బాగా వచ్చేవి. అయితే భాగవతం చదువుతున్నప్పుడు షష్ఠ్యంత్యాల్లో ” హారికి నంద గోకుల విహారికి…” అనే పద్యం ఉంది కదా! అది రోజూ చదువుతూ ఉంటే విహారి అనే పేరు బాగా నచ్చింది. అందుకే నేను పద్యాలు రాసే మొదట్లోనే ఆ పేరుతో ప్రారంభించాను. నా అసలు పేరు జొన్నలగడ్డ సత్యనారాయణ. జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి పేరుతో గొప్ప పండితుడున్నాడు. జకార త్రయంగా తెలుగుదేశంలో జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, జమ్మలమడుగు మాధవశర్మ , జటావల్లభుల పురుషోత్తం అని ముగ్గురు గొప్ప వక్తలు ఉండేవారు. వాళ్ళని మించిన వాళ్ళు కవులలో కూడా ఎవరూ లేరు. సత్యనారాయణ మూర్తి గారు ఆంధ్రా యూనివర్సిటీలో మొదటి ప్రొఫెసర్. ఆంధ్రదేశం నుండి రష్యా వెళ్ళిన మొదటివాడు. అంతటి గొప్పవాడు అని నాకు తెలుసు. ఆ పేరుతో రాస్తే అపభ్రంశంగా ఉంటుందనిపించింది (నవ్వేస్తూ). నా పేరు అదే అయినా ఆయన పేరు చెడగొట్టడం ఎందుకని విహారిగా రాయడం మొదలుపెట్టాను.

సుధామ గారి సృజన ‘సప్తపదుల’ పై కూడా పుస్తకం రాశారు. మీ ఇరువురి అనుబంధాన్ని వివరించండి.

సుధామ గారు మలక్ పేటలో ఉన్నప్పుడు నేను మా అమ్మాయి వాళ్ళింట్లో ఉండేవాడిని. అక్కడే 16 ఏళ్ళు ఉన్నాము. ఆయనతో అక్కడే అనుబంధం ఏర్పడింది. అంతకుముందు విజయవాడ రేడియో స్టేషన్లో పనిచేసినప్పుడు రెండుసార్లు చూశాను. మలక్ పేట నుండి ఆయన ఇక్కడికి షిఫ్ట్ అయిన తరువాత మేమూ ఇక్కడికి షిఫ్ట్ అయినాము. వాళ్ళ అబ్బాయి ఇక్కడికి రావడం, అలాగే మమ్మల్ని ఇక్కడికే రమ్మని కోరడం వల్ల అనుకోకుండా మళ్ళీ ఒక్కదగ్గరికి చేరాము. మా ఇద్దరికీ అట్లా సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆయన సృష్టించిన ‘సప్తపదులు’ ప్రక్రియ చాలా వేగంగా విస్తరించింది. అది మొదలైన కొద్దిరోజులకే నేను పుస్తకం రాశాను.

ప్రాంతీయ భాషా అందాలను ప్రస్ఫుటం చేసే మాండలికాలను రచనల్లో వాడితే ఎలా ఉంటుంది? ఈ విషయంలో మీ అనుభవాలను చెప్పండి.

చాలా బాగుంటుంది. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. మాండలికాలను మెచ్చుకునే వాళ్ళల్లో నేను మొట్టమొదటి వాడిని. మాండలికం అనే కాదు. ఏ భాషలోనైనా ఒక జవం, జీవం అక్కడి మాట మాట్లాడితేనే వస్తుంది. అది ప్రజల భాష కదా! కథల్లో మాండలికం వాడిన వాళ్లలో మా గోఖలే మొట్టమొదటి వాడు. నేను చదివిన ఆయన కథల్లో మొత్తం మాండలికమే ఉంటుంది. తెలంగాణా వాళ్ళు ఆ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. ఏదో న్యూనతా భావం ఉండింది కానీ ఇప్పుడు బాగానే రాస్తున్నారు. నేను కూడా గుంటూరులో పుట్టి కృష్ణాలో 16 ఏళ్ళు ఉన్నవాడిని. మా ఆవిడది బందరు. అయితే నా పలుకుబడి నా రచనల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. చిల్లర భవానీ దేవిగారు ‘నా విగతం’ అనే కథా సంపుటిలో ఒక కథలో ఆ ప్రాంతపు పలుకుబడులు, సామెతలను ఉటంకిస్తూ రాసింది. అందువల్ల మాండలికాలు జీవద్భాష కాబట్టి అవి ఉండాలి. ఉన్నచోట ప్రోత్సహించాలి. నేనెప్పుడో చిన్నప్పటినుండి రాస్తున్నాను. మరి మా గోఖలే ఇంకా ముందు తరం వాడు కదా! ఆయనే ఆ కాలంలో మాండలికాలు ఉపయోగించాడు. కాబట్టి రచయితలు వాటి సౌందర్యాన్ని తరువాతి తరాలకు తెలియజేయాలి.

కథలు రాయడంలో ఏ విధానం పాఠకులను ఆకర్షింపజేస్తుంది?

కథలో ఏది చెప్పాడనేది వస్తువు. ఎలా చెప్పాడన్నది శిల్పం. మూడవది శైలి. శైలిలో మీరన్న మాండలికాలు అన్నీ వస్తాయి. కొంతమంది శిల్పాన్ని ఉత్తమ, ప్రథమ పురుషల్లో రాస్తారు. అయితే ఇవి కథలో ఏది కేంద్రమో దాన్ని ఆధారంగా చేసుకొని వస్తాయి. వస్తువును బట్టి శిల్పం. ఉదా:- ఒక వ్యక్తి స్వానుభవాన్ని చెబుతున్నప్పుడు అది ఉత్తమ పురుషలో రావాలి. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఏ భాషైనా ఉత్తమ పురుషలో రాసిన వాటికి ప్రాధాన్యత ఉంటుంది.

ఇప్పుడొస్తున్న సాహిత్యం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? 

ఇప్పుడు అన్ని ప్రక్రియల్లో వస్తున్నటువంటి సాహిత్యం గత కాలం వచ్చిన సాహిత్యాల కంటే మెరుగ్గా ఉందనే చెబుతాను. రచయితలు కొత్త జీవితానికి అలవాటు పడడం, జీవితంలో సంక్లిష్టతలను, సంకీర్ణమైన మానవ సంబంధాల విశేషాలను కూడా సాహిత్యంలో ప్రతిఫలింప జేయగలుగుతున్నారు. దీనివల్ల సాహిత్యంలో కృషి చేస్తున్న వారందరూ కూడా వివిధ వర్గాలకు, కులాలకు , వృత్తులకు చెందినవారు, వివిధ జీవన నేపథ్యం కలిగినవారు. దానివల్ల వారి స్వానుభవాలు గాఢంగాను, సాంద్రంగాను ప్రతిఫలిస్తున్నాయి. ఇది ప్రత్యేకమైన అంశం. ఈనాటి సాహిత్యం ఉన్నతమైన స్థానంలో ఉందనే నేను చెబుతాను.

నేటి రచయితలకు మీరిచ్చే సూచనలు ఏవి?

నేటి రచయితలకు నేనిచ్చే సూచనలు ఏమీ లేవు. వాళ్ళంతా కూడా ‘సెల్ఫ్ మేడ్’ సాహితీపరులు. ఆ కారణంగా ఇతరులు సూచనలు ఇవ్వాల్సిన స్థితిలో లేరు. కాకపోతే ముఖ్యమైన విషయం. ఈనాటి రచయితలకు అనుభవం ఉన్నది కానీ అధ్యయన పటిమ లేదు. మన వారసత్వం గానీ, సాహిత్యంలో గతం జరిగినటువంటి ప్రాధాన్యతలు గానీ ఏవీ తెలియవు. అది గనుక తెలుసుకున్నట్లయితే వారు ఆ పునాది మీద లేవ గలిగితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయని నా సూచన.

చాలా సంతోషం సార్. మీ వంటి వారి పరిచయం మా పాఠకులకు ఒక చైతన్యదీపం. మీకున్న సమయంలో ఇంత ఓపికగా చాలా సేపటినుండి అడిగిన విధంగా మీ జీవితంలోని సాహితీ సుగంధాన్ని మాకు కూడా పంచినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున ధన్యవాదాలు. సెలవు

July 25, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అబ్బూరి ఛాయాదేవి

by Radhika Suri July 24, 2024
written by Radhika Suri

ప్రేమ ,ఆప్యాయత, చతురభాషణం సింప్లిసిటీ కలగలిపిన స్త్రీ మూర్తి అబ్బూరి ఛాయాదేవి గారు. అక్టోబర్ 13న , 1933 లో రాజమహేంద్రవరంలో జన్మించారు. తల్లిదండ్రులు మద్దాలి వెంకటాచలం, మద్దాలి రమణమ్మ గార్లు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమె ఉన్నత చదువు కోసం నిజాం కళాశాలలో యం. ఏ. పొలిటికల్ సైన్సు లో చేరారు. 1953లో ప్రచురితమైన ‘అనుభూతి’ కథ వీరి మొదటి రచన. మద్దాలి ఛాయాదేవి పేరుతో ఈ కథను వెలువరించించిన వీరు ప్రముఖ స్త్రీవాద రచయిత్రి.

1953 లో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారితో వివాహం జరిగింది. వీరు ప్రముఖ రచయిత, విమర్శకులు, అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ .వీరిది చాలా అనుకూలమైన దాంపత్యం.

మహిళల జీవితాలే ఇతివృతంగా చేసుకొని వారిని చైతన్య పరిచేలా రచనలు చేశారు. స్త్రీల సమస్యలు, పురుషాధిక్యంలో నలిగే స్త్రీల వెతల్ని కథలుగా కూర్చారు. వీరి రచనలు ఇతర భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి (మరాఠీ,హిందీ, తమిళం, కన్నడ స్పానిష్, ఆంగ్ల భాషలలోకి) . ప్రతిష్ఠాత్మకంగా వెలువడిన’ కవిత’ పత్రికకు సంపదకురాలిగా వ్యవహరించారు.

1972లో ‘సుఖాంతం’ కథను ‘నేషనల్ బుక్ ట్రస్ట్ ‘వారు ‘కథాభారతి’ సంకలనంలో ప్రచురించారు .
జె.యన్.టి.యు ఢిల్లీలో డిప్యూటీ లైబ్రేరియన్ గా సేవలందించిన వీరు1982లో ‘స్వచ్ఛంద పదవీవిరమణ ‘పొందారు.

‘బోన్సాయి బ్రతుకు ‘ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్ రోజ్ కథలు ప్రసిద్ధిగాంచాయి. వీరు లింగ వివక్షతో పిల్లల్ని పెంచడం, ఆడ మగ అంటూ తేడా చూపిస్తూ పెంచి స్త్రీ ల జీవితాల్ని బోన్సాయ్ చెట్లలా ఎదగనివ్వడం లేదంటూ రాసిన కథ ‘బోన్సాయ్ బతుకు’ 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖవారు ‘పదవ తరగతి’ తెలుగు వాచకంలో చేర్చారు.

ఛాయాదేవి గారు అతిథులకు చక్కటి విందు భోజనం పెట్టడంలో ఆత్మ సంతృప్తి పొందేవారు. .

జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని తనదైన శైలిలో తెలుగు వారికి పరిచయం చేశారు. సాహిత్య అకాడమీకి రచయిత్రుల రచనల్ని సంకలనపరిచారు.వీరి ‘బోన్సాయ్ బతుకు’ కథ కర్ణాటకలో కూడా పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చారు. ప్రయాణాలు అంటే ఆసక్తి వీరికి. రచయిత్రుల గ్రూప్ ఏర్పాటు చేసి, సారథ్యం వహిస్తూ, అన్ని తరాలతో మమేకమౌతూ చైతన్యపరిచారు. దాదాపు 20 సంవత్సరాలు హైదరాబాదులో
ప్రతి సాహితీసమావేశంలో పాల్గొన్నారు .

” వేదికల్ని పంచుకోవడంలో పెద్దగా ఆసక్తి లేని వీరు, మనిషి
జీవితంలో ప్రతి క్షణం ఎంతో విలువైనదంటారారు”.

పిల్లల కోసం ప్రపంచ దేశాల కథల్ని సేకరించి, అనువదించి ప్రచురించారు. “తమ జీవితంలోని అనుభవాలు, సంఘటనల్ని కథలుగా చెప్పాలనే తపన ఉండేదట” వారికి. ‘ప్రయాణం’ కథతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

1989 -90 లో ‘ఉదయం’ పత్రికలో స్త్రీల కోసం శీర్షిక నిర్వహించారు. ‘భూమిక’ స్త్రీవాద పత్రికలో ‘ఆలోకనం’ పేరుతో ‘కాలమ్స్’ రాశారు. సాహితీ విమర్శలు కూడా చేసిన వీరు, ‘మృత్యుంజయ’ అనే దీర్ఘ కవిత రాశారు .వారికి జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధానికి గుర్తుగా ‘వరదోక్తులు’ పేరిట వరదరాజేశ్వరరావు గారి హాస్యోక్తులను కార్టూన్లతో సంకలన పరిచారు .అవిశ్రాంతంగా రచనా వ్యాసంగం చేసినా,1991 వరకు ఒక్క పుస్తకం కూడా వెలువరించలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.

వీరిని వరించిన అవార్డులు ఎన్నో! 1993 లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం
1996లో ‘మృత్యుంజయ’ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ‘ఉత్తమ రచయిత్రి ‘అవార్డు
2000 సంవత్సరంలో” కళా సాగర్ పందిరి ‘సాహితి పురస్కారాలు అందుకున్నారు.
2005 లో ‘తన మార్గం’ కథా సంకలనానికి కేంద్రం సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 2011లో ‘అజోవిభో కందాళం ఫౌండేషన్’ సంస్థ వారు ‘జీవితకాల ‘పురస్కారంతో సత్కరించారు.

2012 నుండి ఏ సాహితీ సదస్సుకు హాజరు కాలేదు. కళాత్మక దృష్టి గల వీరు తమ పరిసరాలను చక్కగా అలంకరించుకునేవారట. పనికిరాని వస్తువులకు అందమైన ఆకృతి నిచ్చే కళా నైపుణ్యం వీరి సొత్తు. తమ చరమాంకంలో చైతన్యవంతంగా ఉంటూ, అందరిలో ఉత్సాహం నింపుతూ, నవ్విస్తూ ఉండేవారట.తమ అక్షర యాత్రకు స్వస్తి చెప్తూ జూన్ 28 , 2019 న కొండాపూర్ లో శాశ్వత నిద్రలోకిజారుకున్నారు.

” జీవన్మరణాలు అందరికీ సహజమే ఐనప్పటికీ కొందరే మరణించినా తమ వ్యక్తిత్వ శోభలతే కాంతులీనుతారు”. ఆ కోవలోనివారే మన’ఛాయా’దేవిగారు.తమ ‘వీలునామా’ లోని విషయాలను తమ ‘ఆత్మజ ‘లాంటి కొండవీటి సత్యవతి గారికి వివరంగా రాసిన లేఖతో వారి వ్యక్తిత్వం మనకు
సుస్పష్టమౌతుంది .”మరణాన్ని స్వాగతిస్తూ ,మరణానంతరం నిత్య వసంతం”గా ఉండాలని కోరుకున్న వారి అభిమతం సాకారమైందనే నా నమ్మకం. ఇంతటి ఉన్నత విలువలు కలిగిన సాహితీ మూర్తికి ‘అక్షర మాల’తో అభివాదం తెలుపడం ఎంతో సముచితం.

July 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni July 24, 2024
written by Narendra Sandineni

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) *ఊహా సుందరి కవిత..
*ఏకతకు పరిష్కారం కవిత.
*ఏదీ కొత్తదనం కవిత.
కవిత్వం ఓ విశ్లేషణ. ‌. ప్రముఖ కవి,ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ఊహా సుందరి కవిత పై విశ్లేషణా వ్యాసం.ఊహా సుందరి కవితను ఆసక్తితో చదివాను.చదవగానే కవితలోని భావం నన్ను కదిలించింది.నాలో ఆలోచనలను రేకెత్తించింది.వ్యక్తి మనసుకి గోచరించే దృశ్యాలు ఊహలు.వ్యక్తి కల్పనలు చేయడం,చూడని వాటిని చూచినట్టు వినని మాటలను వినినట్టు మనసులో అనుకోవడం,భావించడం ఊహ. వాస్తవమైనదిగా గుర్తింపబడని,ఇంద్రియాలకు గోచరించని దాని యొక్క చిత్రం మనసులో ఏర్పడటం ఊహ లేక కల్పనగా చెప్పవచ్చు.ఊహా సుందరి ఉంటుందా? అని మనకు ఆశ్చర్యం కలుగవచ్చు.నిద్రలో మనం కలలు కంటాం.కలలో కనిపించిన అతిలోక సుందరినే పెళ్లి చేసుకుంటాను అని ఎవరైనా చెబితే అది సాధ్యమయ్యే పనేనా?అనిపిస్తుంది.కవి నారాయణ రెడ్డి (మానారె) 1968 సంవత్సరంలో రాసిన కవిత ఇది.అట్టి ఊహా సుందరి కవిత గురించిన కథా కమామీషు ఏమిటి? అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?అయితే ఊహా సుందరి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“విరిగిన హృదయం చెదిరిన మనస్సు
“కదిలే కుంచె చిత్రిస్తున్నా
“వర్ణాలను మేళవించి సోయగాల నెన్నో నించి
“రేఖామయ సౌందర్యం రేకులు విచ్చిన చందం
“రాసేస్తున్నా !
మనిషి హృదయం లోతులో ఏం జరిగింది? అనేది ఎవ్వరికీ కాన రాదు.అసలు ఎవరికి తెలియదు. అతనేంటి అలా దిగులుగా ఉన్నాడు అనుకుంటారే కాని అతని గురించి అంతగా ఎవరు పట్టించుకోరు. అసలు విషయం ఏమిటి? అని అతనిని అడిగే ప్రయత్నం ఎవ్వరు చేయరు.అతని గురించి సంగతి ఏమిటో అతను చెబితేనే తెలుస్తుంది.కాని అతడు ఎందుకో నోరు విప్పడు,చెప్పడు.అతని హృదయం ఎందుకు విరిగింది? హృదయం విరగడం ఏమిటి? అని మనలో సందేహాలు పొడ చూప వచ్చు.విరిగిన హృదయం అనగా అస్తవ్యస్తమైన హృదయం అని చెప్పవచ్చు.హృదయం బాధకు గురి అయినట్లుగా తోస్తుంది.అతని మనస్సు ఎందుకు చెదిరింది? ఏదో చిత్రం అతని కళ్ళకు గోచరమైనట్టుగా తోస్తుంది. ఏదేని ప్రాణి,జీవి యొక్క మనసు కింపైన సౌందర్యాన్ని అందం అంటారు.శరీర అవయవ సౌందర్యాన్ని మనసుతో చూస్తాము.కావున ఒక మనిషి యొక్క అందం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటుంది.ఈ విశ్వంలో ఎన్నెన్నో జీవులు ఎన్నో వస్తువులు ఉన్నాయి.దేని అందం దానికే ప్రత్యేకం.పువ్వుల అందం అందరిని ఆనందపరుస్తుంది.చిత్రకారుడు తన కుంచెతో రేఖామయ సౌందర్యం గీస్తాడు.రేఖా చిత్రం వివిధ రకాల చిత్ర కళకి సంబంధించిన పరికరాలను ఉపయోగించి చిత్రించే ఒక దృశ్య కళ.కాన్వాసు పై చిత్రాలను గీయడం,ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులను అద్దడమే చిత్రలేఖనం.దృశ్యపరమైన కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ భావాలను,ఆలోచనలను చిత్రము ద్వారా వ్యక్తపరచడమే చిత్రలేఖనం.కాన్వాస్ పై సాధారణంగా కుంచెలను ఉపయోగించి చిత్రలేఖనం చేస్తారు.చిత్రాలను గీసే వారిని చిత్రకారులు అంటారు.చిత్రకారుని చేతిలో కుంచె కదులుతుంది. మనసులో ఏదో తెలియని అలజడి చెలరేగింది. మనసు ఎందుకో స్పష్టత లేకుండా అస్పష్టత కొనసాగుతుంది.అటు ఇటు చంచల స్వభావంతో తిరుగుతున్న మనసును ఒక్కసారిగా అదుపులోకి తెచ్చుకొన్నాడు.కదులుతున్న కుంచెతో ఒకానొక ఊహా చిత్రాన్ని చిత్రిస్తున్నాను అని కవి అంటున్నాడు.రంగులను కలిపి సోయగాలను,సరి కొత్త అందచందాలను ఎన్నింటినో ఆ రంగులతో నింపి రేఖలతో రూపుదిద్దుకున్న అపూర్వమైన సుందర రూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు.మొగ్గలుగా ఉన్న సుమాలు క్రమక్రమంగా విచ్చుకొని సౌరభాలను వెదజల్లినట్లుగా కుంచెతో నగిషిలు చెక్కినట్లుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నానని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఎర్ర రంగు తన రాగాన్ని చిత్రానికి అందిస్తున్నది
“అనురాగము క్షాళితమై ఆ కాలిమ నంటిస్తున్నది
“అధరాలు నఖాంకురాలు ఆ రాగమునే పొందెను
“చెక్కిలిపై ఆరాగమె అనురాగము పొంగించెను.
రక్తం ఎరుపుగా ఉంటుంది.ఎరుపు రంగు చారిత్రాత్మకంగా త్యాగం,ప్రమాదం,ధైర్యంతో ముడిపడి ఉంటుంది.ఎరుపు రంగు సాధారణంగా వేడి,కార్యాచరణ,అభిరుచి,లైంగికత,కోపం,ప్రేమ, ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.భారత దేశంలో ఎరుపు రంగును ఆనందాన్ని,అదృష్టాన్ని సూచించే రంగుగా చెబుతారు.ఎరుపు విప్లవపు రంగుగా మారింది. ఎరుపు రంగు ఉత్తేజాన్నిస్తుంది.ఎరుపు రంగు ఉత్సాహభరితమైనది.ఎరుపు రంగు ప్రేమ యొక్క రంగుగా పరిగణించబడుతుంది.సంధ్యా సమయం ఎరుపు రంగును తెలుపుతుంది.రోడ్డుపై సిగ్నల్ పడగానే ఎరుపు రంగుతో అప్రమత్తంగా ఉంటారు. ఎరుపు రంగు ధైర్యాన్ని ఇస్తుంది.ఎరుపు రంగు బలాన్ని శక్తిని సమకూరుస్తుంది.ఎరుపు రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.ఎరుపు రంగు నిశ్చింతగా నిబ్బరంగా ఉండేలా చేస్తుంది.ఎరుపు రంగు తేజస్సుకు ప్రతీక.ఎరుపు రంగు ప్రేమకు,దయకు సంకేతం.ఈ ప్రపంచమంతా అనేకమైన రంగులతో కూడి ఉంటుంది.రంగులు లేని లోకం మన ఊహలకు అందదు.మనిషి దేన్ని తలుచుకున్నా ఏదో ఒక రంగు కళ్ళ ముందు నిలుస్తుంది.కుంచె ఎరుపు రంగును తీసుకుని ఆ ఎర్ర దనాన్ని చిత్రానికి అందిస్తున్నది.కుంచెకు గల ఎర్ర రంగు కడిగి వేయబడి నల్ల రంగును చేర్చుకొని చిత్రాన్ని సరి కొత్తగా రంగులతో అద్దుతున్నది.కుంచెకు గల ఎరుపు రంగుతో పెదవులు,గోళ్లు ఎర్రగా మెరుస్తూ సహజత్వాన్ని పొందినాయి.చెంపలపైని ఎర్రని నిగారింపు తనలోని ప్రేమను పొంగింపజేసింది. ఎరుపు రంగు బుగ్గలకు నిండుదనాన్ని చేకూర్చినట్లు తోస్తోంది.

“జడ లోపల కనుపాపల లోతులలో పాతుకొనియె
“కారు నలుపు కాగిన కాలపు క్రీడలు
“కుంచె మీద క్షణికములవి చంచలాక్షి కవె నిత్యము.
వాలు జడ లోపల గడచిన కాలపు విలాసవంతమైన నలుపు రంగు శోభిస్తున్నది.కనుపాపల లోలోపల పూర్తిగా నిండిన నలుపు రంగు కాంతులు కనిపిస్తున్నాయి.జడ,కనుపాపలు నల్ల రంగుతో తీర్చబడి ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి.
గడిచిన కాలపు విలాసాలైన మిక్కిలి నల్లని ఛాయలు శోభతో మెరుస్తూ వైభవాన్ని చాటుతున్నాయి.ఎరుపు రంగు గాని,నలుపు రంగు గాని ఎందుకో ఏమిటో కుంచె మీద నిలవడం లేదు. ఆ రంగులు కుంచె మీద తాత్కాలికంగా ఉంటున్నాయి.కుంచె మీద నిలవని రంగులు క్షణికములవుతున్నాయి.చంచలాక్షి చిత్రానికి అవి చెదరకుండా శాశ్వతములై ఉన్నట్లు శోభిస్తున్నాయి.
“సుఖ దుఃఖాల ప్రతీకలు సుందరతరమీ రేఖలు.
జీవితంలోని ఈ రంగుల వెలుగులు సుఖదుఃఖాలతో కూడినవి.సుఖాలకు దుఃఖాలకు ఈ రేఖల గుర్తులు చెరిగిపోనివిగా కనిపిస్తున్నాయి.ఉదయించే సూర్యుని లేలేత కిరణాలు ఎరుపు రంగులను పోలి సుఖాలకు గుర్తులుగా ఉన్నాయి.నలుపు రంగు జీవన గమ్యంలో ఎదురైన కష్టాలను,దుఃఖాలను తలపింపజేస్తున్నది.చిత్రకారుడు గీసిన రేఖలు ఎంతో సుందరతరంగా ఉన్నాయి.చిత్ర సౌందర్యపు రేఖలు మరీ మరీ చూడాలనేంత తహతహను కోరికను కలిగించేవిగా ఉన్నాయి.
“పసిపాపను చూచు తల్లి పరవశత్వమే యబ్బెను
“నా సృష్టి యలౌకికమై నా కన్నుల ముందు నిల్చె.
కాన్వాసు పై గీచిన సుందర చిత్రాన్ని చూడగానే పసిపాపను గారాబంగా అపురూపంగా చూసుకునే తల్లి పొందే పారవశ్యం,తెలియని మైమరుపు కలిగింది.సృష్టి కర్త వలె కలలో తాను గీసిన వర్ణ చిత్రం.స్వప్నంలో చిత్రించిన ఆ చిత్రం లోకంలో గాలించి వెతికినా కనిపించదు.చిత్రకారుడు గీసిన చిత్రం అలౌకికం,అపురూప కళాఖండంగా ఒక్కసారిగా నా కళ్ళ ముందు సాక్షాత్కరించింది.
“అదిగదుగో ! ఆ సుందరి కదలినట్లు,పెదవి విప్పి
“పదములనే పాడినట్లు భ్రమ చెందితి.
అదిగో కళ్ళు బాగా తెరిచి చూడు.ఆ సుందరి చైతన్యంతో కదలాడినట్లు పెదవి విప్పి మధురమైన పాటలను పాడినట్లుగా ఒక రకమైన తీయని అనుభూతి కలిగింది.
“ఎవడా పోకిరి ? ఓహో ! నాగరికత నడుమంత్రపు
“ముద్దుబిడ్డ ; గడుసరియై భారతీయ భావనకే
“గోరి” కట్టు గొప్పవాడు పర సంస్కృతి తొత్తువాడు.
ఎవడా పోకిరి ?ఎవడా దుష్టుడు ?ఓహో ! అతడా! విశృంఖలంగా వెఱ్ఱి తలలు వేసిన నేటి నడు మంత్రపు నాగరికత యొక్క ముద్దు బిడ్డ.అనాదిగా మన దేశస్తులు అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలు,సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన అవసరము,ఆవశ్యకత ఎంతైనా ఉంది.సమాజంలో నాగరికత పేరున వెర్రి తలలు వేస్తున్న దుష్ట సంస్కృతిని అనుసరిస్తున్న ప్రియాతి ప్రియమైన పుత్రుడు వీడు.గడుసరిగా పెడసరిగా మారి బండ బారిన మనసుతో మొండితనంతో భారతీయ సంస్కృతికి ముగింపు పలికే వాడు.గొప్పదైన భారతీయ ధర్మానికి సమాధి కట్టే గొప్ప వాడు.పాశ్చాత్య సంస్కృతికి బానిసగా మారినాడు.తరతరాలుగా వస్తున్న మన సంస్కృతిని మర్చిపోయినాడు.పరాయి దేశస్తుల విష సంస్కృతి వ్యామోహానికి లోను అయినాడు. పరాయి దేశస్తుల కట్టు,బొట్టు,ఆలోచనా సరళి,మాట తీరు,సంస్కృతి,ఆహార్యాలను అనుసరించి విలువలు లేని జీవన విధానాన్ని అనుసరిస్తున్న వాడు ఈ పోకిరి.
“చిత్రమునే చూచె వాడు,చిత్రముగా చూచినాడు
“సకిలించెను,ఇకిలించెను వెకిలి చూపు మకిలి చూపు
“చూపుల తూపులు రువ్వెను లేని మీసములు దువ్వెను
“ప్రేయసియని పిల్చినాడు సభ్యతనే కాల్చినాడు
“కనుల మేఘములు చేరెను అశ్రుధారలై జారెను
“సుందరి వదనాంబుజమున శోకార్తియై “స్ఫురియించెను. చిత్రించిన ఆ చిత్రాన్ని చూచి అట్టి సంస్కారహీనుడు పర స్త్రీలను తల్లుల వలె చూడక అశ్లీల భావనతో చూసే ఒక నీచుడు.ఆ మాతృత్వం ఉట్టిపడే చిత్రాన్ని చూసిన తర్వాత అతని చూపులు చిత్రాతి చిత్రములుగా కనిపిస్తున్నాయి.చిత్రం చూసిన తర్వాత అతడు గుర్రంలాగా సకిలించినాడు.నోరు తెరచి పండ్లు కనిపించే విధంగా ఇకిలించినాడు. వెకిలి చూపులతో అపవిత్రమైన చూపులతో చూపులనే బాణములను రువ్వినాడు.అతను మీసాలు లేనప్పటికీ మీసాలు ఉన్నట్లుగా లేని మీసాలు దువ్వినాడు.మీసాలు మనిషి ప్రతాపానికి పరాక్రమానికి గుర్తులు.బలహీనుడు అయిన ఆ వ్యక్తి మీసాల పై చేయి వేసి దువ్వినాడు మరియు లేని వీరత్వాన్ని చూపడానికి ప్రయత్నించాడు.ఆ చిత్రంలోని స్త్రీ మూర్తిని ప్రేయసీ అని పిలిచి మన జాతి సంస్కారానికి కళంకం తెచ్చాడు.ప్రేయసీ అనే పిలుపుతో ఆమె నయనాల్లో మేఘం వర్షించింది.ఆ స్త్రీ మూర్తి కళ్ళల్లో వేదనాభరితమైన కన్నీళ్లు కాలువలై పారినాయి.చిత్రములోని ఆ సుందరి ముఖ కమలంలో దుఃఖభరితమైన ఆవేదన కొట్టవచ్చినట్లు కనిపించింది.
“భరత భూమి పతనానికి పరులెత్తు పతాకవీడు
“కామముతో కనుగానని నేటి యువత రూపు వీడు
“భరతమాత భవితవ్యం దుష్టాన్వయమయ కావ్యం
“త్రుళ్ళిపడితి ఏదీ సుందరి?పోకిరి యువకుండెక్కడ? భ్రమయేనా ? “మనసులోని రేఖా మాత్రపు చిత్రమో !
“చిత్రమైన చాంచల్యమో ! ఏమో మరి !
భారతదేశం సరిహద్దు ఆక్రమణ కొరకు తచ్చాడుతు పొరుగు దేశపు విరోధులు ఎగరేసిన జెండా వీడు. భారతదేశం ధార్మికతకు కరుణ,దయ,జాలి,ప్రేమ, సహకారము,సోదర భావన మొదలగునవి భగ్నం చేయడానికి శత్రు దేశస్థులు మన దేశానికి పంపిన ఆటంకవాది.భారతదేశంలోని శాంతి భద్రతలకు ముప్పు కలిగించే నీచుడు వీడు.కామంతో కళ్ళు మూసుకుని పోయి వావి వరసలు మరిచిన మానవ మృగం వీడు.దయా దాక్షిణ్యం లేని నరరూప రాక్షసుడు.నేటి దుర్మార్గులైన యువత మొండి స్వరూపం వీడు.భరతమాత భవితవ్యం గురించి ఆలోచన చేయగా భారత మాత భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్నది.దుష్ట వంశ చరిత్ర గల మహాకావ్యంగా గోచరిస్తున్నది.ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి అకస్మాత్తుగా తుళ్ళిపడ్డాను.ఊహా లోకం నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను.ఆ పూర్ణిమ నాటి చంద్రుని వలె శోభించిన ఆ సుందరి ఏది ?ఆ ఊహా సుందరి ఎక్కడుంది ? ఆ పోకిరి యువకుడు ఎక్కడ ఉన్నాడు? మనసులో రూపొందిన రేఖలతో కూడిన ఊహా చిత్రమేనా ? తాను కల కన్నాడా ? కలా ఇది వాస్తవం కాదా? చిత్రమైన మనసు యొక్క చంచలమైన ఆలోచనా విధానమా? ఇది నిజమా ? ఇది బ్రాంతియా ? ఎటు తేల్చుకోలేని సందిగ్ధ స్థితి డోలాయమానంగా కొనసాగుతుంది.దేశ సంస్కృతిని వదిలి పెడత్రోవ పట్టిన సమాజంలోని యువత సన్మార్గంతో నడుచుకోవాలి.అప్పుడే దేశంలోని యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని ఊహా సుందరి కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఊహా సుందరి కవితలోని భావాలు పఠితులను ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.స్వప్నంలో కూడా ఊహా సుందరి పట్ల నిజాయితీతో కూడిన భావనలు వ్యక్తం చేయడం మనలను తెలియని ఊహా లోకంలోకి తీసుకెళ్ళిన తీరు అబ్బురపరుస్తాయి.కవి నారాయణ రెడ్డి (మానారె) ప్రతిభకు ఊహ సుందరి కవిత నిదర్శనంగా నిలుస్తుంది.కవి మాదాడి నారాయణ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) “ ఏకతకు పరిష్కారం “ గేయం పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ఏకతకు పరిష్కారం గేయం పై విశ్లేషణా వ్యాసం.ఏకతకు పరిష్కారం అనే గేయంను ఆసక్తితో చదివాను.ఇది నాకు నచ్చిన గేయం.గేయం చదవగానే నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఏకతకు పరిష్కారం ఉంటుందా? అని మనలో సందేహాలు పొడచూపవచ్చు.ఏకత అంటే ఐక్యత,కలిసి ఉండటం.దీనికి ఆంగ్లంలో Unity అని అర్థం.దేశం బలంగా ఉండాలంటే ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో ఐక్యత ఉండాలి.దేశం బాగు కోరి ఏమైనా చేయాలి అంటే దాని అంతిమ ఫలితం ఐక్యత వలన సాధ్యపడుతుంది.సంఘీభావం,ఏకత మనిషిని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి.ఇవాళ దేశంలో లేనిది ఐకమత్యం అని చెప్పవచ్చు.దేశంలో కులం పేరిట,మతం పేరిట మారణహోమం కొనసాగుతుంది.ప్రపంచంలో కూడా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై దాడులు చేస్తూ బాంబులు ప్రయోగిస్తూ ఆధిపత్యం కొరకు పోటీ పడుతున్నాయి.ప్రపంచంలో శాంతిని స్థాపించుట కొరకు ఐక్య రాజ్య సమితి అనే సంస్థ ఉన్నప్పటికీ నామమాత్రంగానే విధులు కొనసాగిస్తూ ఉంది.అగ్ర రాజ్యాల యుద్ధకాంక్షలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నది.మానారెకు దేశం పట్ల అపారమైన ప్రేమ ఉంది.మానారె ఏ రాజకీయ పార్టీకి చెందని వారు. మానారె విద్యార్థిగా ఎం.ఏ. (తెలుగు) ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో చదివారు.చదువు పూర్తి కాగానే ప్రభుత్వ కళాశాలలో ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.మానారె వివిధ హోదాలలో పని చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు.ఏ సమస్యకు అయినా పరిష్కారం ఉన్నట్లుగా ఏకతకు పరిష్కారం ఉంటుంది అని మానారె తన గేయంలో పేర్కొనడం ఆనందంగా ఉంది.దేశంలో కులం పేరిట మతం పేరిట జరుగుతున్న మారణకాండ ఆవేదన కలిగిస్తుంది.దీనికి పరిష్కారం ఏమిటో తెలియదు. ఏకత సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఏకత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.పరిష్కారం అంటే సమస్య చిక్కుల నుండి విముక్తి చెందే మార్గం తీర్పు అని చెప్పవచ్చు.పరిష్కారం అనేది సులువుగా దొరకని విషయం‌.సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా దేశంలో నలుగుతున్న ఏకత సమస్యను పరిష్కరించడం కొరకు దేశ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.సమస్యకు పరిష్కారం అనేది అడ్డంకులను అధిగమించడం ద్వారా లక్ష్యాన్ని సాధించే ప్రక్రియ.దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్య ఏకత.దానిని ఎంతో సులభంగా పరిష్కరించవచ్చు అని మానారె తెలియజేయడం ఆశ్చర్యం కలుగుతుంది.మానారె రాసిన ఏకతకు పరిష్కారం చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.దేశ భవితకు మూలమైన ఏకతకు పరిష్కారం తెలుసుకొని దానిని సాధించే ప్రయత్నం చేద్దాం.
“ భేద భావం పురులు విచ్చిన
“ స్వార్థ శక్తులు నడుము కట్టిన
“ వాని వ్యాప్తిని అణచి పెట్టిన
“ జాతి బలమును పుంజుకొనును.
ఇవ్వాళ దేశంలో పురులు విచ్చిన భేద భావం కోరలు సాచి ఎల్లెడలా విస్తరించి ఉంది.పౌరులు భేదభావంతో జీవనం సాగిస్తున్నారు.పౌరులు భేదభావం విడిచిపెట్టి సఖ్యతతో మెలిగితే విభేదాలు తొలగిపోతాయి.ఎవరికీ అందకుండా నాకే చెందాలనుకోవడం స్వార్థం.మనిషి తోటి మనిషికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహకారం అందించడం నిస్వార్ధం అని చెప్పవచ్చు.జంతువుల సమూహంలో కూడా జంతువులకు పరస్పర సహకారం ఉంటుంది. పర్వాలేదు మనం సుఖంగా ఉంటే చాలు.నాది అనుకున్నది నాకే దక్కాలి.పరులది కూడా నాకే కావాలి.మరెవరికి దక్కకూడదు అనే మనస్తత్వంతో ఉండే మనుషులు మనకు సమాజంలో తారసపడుతూనే ఉంటారు.అలాంటి వారిని చూస్తే ఉద్వేగం కలుగుతుంది.అలాంటివారు స్వార్థ శక్తులకు ప్రతిరూపం అని చెప్పవచ్చు.స్వార్థం అనేది ఇతరులతో సంబంధం లేకుండా తన కోసం లేదా ఒకరి సొంత ప్రయోజనం ఆనందం లేదా సంక్షేమం కోసం అధికంగా లేదా ప్రత్యేకంగా ఆందోళన చెందడంగా చెప్పవచ్చు.ఇవ్వాళ దేశంలో స్వార్థ శక్తులు విశృంఖల విహారం చేస్తున్నాయి.స్వార్ధ శక్తులు అలజడులకు అల్లరులకు ప్రాణం పోస్తున్నాయి.స్వార్థ శక్తుల వల్ల దేశం విచ్ఛిన్నమైపోతుంది.స్వార్థ చింతన లేని పౌరులు నడుము కట్టి పూనుకొని అలాంటి వారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి.స్వార్థ శక్తులపై ఉక్కు పాదం మోపి వాటిని అడ్డుకోవాలని మానారె అంటున్నారు. నిజమైన ఆనందం సాటి మనిషికి స్వార్థం లేకుండా సాయం చేయడంలో మాత్రమే ఉంటుంది.స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ పెరుగుతుంది.భేదభావంతో మెలుగుతున్న స్వార్థపరులైన ప్రజల దురాగతాలను అణిచివేయాలి అని మానారె పిలుపు ఇస్తున్నారు.భేద భావంతో ప్రవర్తించే జనుల,స్వార్థ శక్తుల ఆగడాలు అరికట్టి వేసినచో జాతి బలాన్ని పుంజుకుంటుంది అని మానారె భావిస్తున్నారు.
“ సర్వమానవ సౌభ్రాతృత్వం
“ సర్వ మతాల సమానత్వం
“ అన్ని కులాల అభేద (భావం) తత్వం
“ వెల్లి విరియాలి మన జాతిలో నిత్యం.
కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు.వృత్తి, ఆచారాలు,సామాజిక స్థాయి వంటి అనేక అంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి.ఇవి వంశ పారంపర్యంగా పాటించబడతాయి.సాధారణంగా కులవృత్తులు, కులవివాహాలు,సంస్కృతి,సామాజిక స్థాయి రాజకీయాలపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది.దేశంలో ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతున్నది.కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి.భారత దేశంలో కులం అనే పదం జాతి లేక సామాజిక వర్గాన్ని సూచిస్తుంది.ఆకృతి,ధర్మము మొదలైన వాటిలో సమాన దృష్టితో ఆలోచించి చేసే విభాగం జాతి. వంశపారంపర్యంగా వచ్చే కుల సంప్రదాయం జాతి. పూర్వీకుల నుండి వచ్చు వర్గం లేక సమూహం జాతి.అనేక ఉపజాతులు గల వర్గం జాతి. సౌభ్రాతృత్వం అనునది సోదరత్వం.సాధారణంగా ఈ పదం సమాజంలో గల విభిన్న మతాలకు వర్గాలకు భాషలకు సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ,గౌరవాల భావనలనే సౌభ్రాతృత్వం అని నిర్వచిస్తారు.సర్వ మానవ ప్రేమ,మానవ కల్యాణం,విశ్వమానవ సమానత్వం, వసుధైక కుటుంబం మున్నగు ఉన్నత భావనలు,సత్ – నీతి,ప్రకృతి నియమాలు,విశ్వజననీయ మానవ సూత్రాలు,సమ్మిళిత సామాజిక స్పృహలు మూల వస్తువులు కలిగిన ఓ విశాల దృక్పథమే సౌభ్రాతృత్వంగా చెప్పవచ్చు.విద్య,వృత్తి నైపుణ్యాలు,నీతి,జాతి,మతాలు,రాజకీయాలు, దానధర్మాలు,వ్యక్తిగత ఆదర్శాలు,సేవారంగం, కళలు,కుటుంబ అధికారాలు మున్నగు అనేక రంగాలలో పెంపొందించవచ్చు.సౌభ్రాతృత్వం వలన పరస్పర అవగాహన,సహకారం,ఉత్పాదకతల అభివృద్ధిని శాంతియుత జీవనాన్ని సాధించవచ్చు. సౌభ్రాతృత్వం వలన ధర్మబద్ధమైన జన జీవనం అనే కొత్త వరవడిని సృష్టించవచ్చును.సౌభ్రాతృత్వానికి ప్రపంచంలో ఏ విషయాన్ని అయినా సాధించగలిగే శక్తి ఉంది.సౌభ్రాతృత్వం మాటల్లో వర్ణించడానికి సాధ్యం కాని ఉన్నతమైన భావన.మనసు నుండి జనించే ఓ విశాల దృక్పథం.దానిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కొలవనువచ్చు.సౌభ్రాతృత్వం వలన మానవునికి అనేక రంగాలలో దూసుకుని వెళ్లే అద్భుతమైన నైతిక స్థితి ఏర్పడుతుంది. భారతీయులం మనం అందరం ఒకటే అనే భావనతో మెలగాలి.మనం అందరం భారతమాత బిడ్డలం.కష్టసుఖాలలో అందరం కలిసి మెలిసి ఉండాలి.మనం అందరం ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనం అందరం అన్నదమ్ముల వలె ఐక్యతతో మెలగాలి.తల్లి బిడ్డలు ఎలా కలిసిమెలిసి ఉంటారో, సుఖదుఃఖాలను ఏ రీతిగా కలిసి పంచుకుంటారో, అదే విధంగా సర్వమానవులు సౌభ్రాతృత్వంతో సోదర సోదరీ భావంతో ప్రవర్తిల్లాలి.ఎదుటి వారికి కష్టం వస్తే వారి కష్టాలలో పాలు పంచుకొని వారి దుఃఖాన్ని దూరం చేసి సహాయపడాలి.మన భారతదేశంలో హిందూ, ఇస్లాం,క్రిస్టియన్ మొదలైన ఎన్నో మతాలు వ్యాపించి ఉన్నాయి.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన మతాన్ని అవలంబిస్తారు. భారతదేశం లౌకిక దేశంగా ప్రసిద్ధి పొందింది.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన దైవాలను పూజించుకుంటారు.భారతదేశంలోని పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా మత స్వేచ్ఛ కల్పించబడింది. భారతదేశంలో నివసించే ప్రజలు నా మతమే గొప్పది,నా మతమే శ్రేష్టమైన మతం,నా దేవుడు గొప్పవాడు అంటే, లేదు.నా దేవుడే గొప్పవాడు అని కలహించుకోకుండా ఉండాలి.అన్ని మతాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయి.అన్ని మతాల పూజా విధానాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి.అన్ని మతాలు సమానం అనే ఆలోచన భారతదేశంలో నివసిస్తున్న ప్రజల్లో నెలకొంటే శాంతియుతమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. మనదేశంలో అనాదిగా అనేక రకాల కులాలు ఉన్నాయి.విభిన్న కులాలుగా శాఖోపశాఖలుగా కుల వ్యవస్థ వేళ్ళూని ఉంది.భారతదేశంలోని ప్రజలు కుల విద్వేషాలు,కుల వైష మ్యాలు తొలగి సోదర భావంతో సఖ్యతగా మెలగాలి.మా కులమే గొప్ప అనే ఆలోచనలు జనుల మనస్సులలో నాటుకుపోయినాయి.అంతే కాక ప్రతి కులంలో మరిన్ని ఉప కులాలు ఏర్పడి మనుషుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.మానవులందరిది ఒకే కులం.అన్ని కులాలు సమానం అనే భావనతో మానవ కులంగా రూపుదిద్దుకోవాలి.కులాల మధ్య చెలరేగే కులాల కుంపట్లు అనే భేద భావం తొలగిపోవాలి.మంచి అన్నది మాల అయితే మాలనే అగుదును అని మహాకవి గురజాడ అప్పారావు తన గేయంలో పేర్కొన్నారు.గురజాడ అందించిన స్ఫూర్తిని ప్రజలు అనుసరిస్తే అన్ని కులాల రూపురేఖలు మారిపోతాయి.మన అందరిది ఒకే కులం అనే భావన వస్తే గొప్ప సమాజం రూపు దాల్చుతుంది అనుటలో సందేహం లేదు. భారతదేశంలో నివసిస్తున్న పౌరులు అందరు తమది భారత కులంగా తలంచాలి.మన దేశ ప్రజలంతా ఇటు వంటి గొప్ప ఆలోచనలతో మెలగాలి.మన దేశంలోని ప్రజల్లో మార్పు వస్తే గొప్ప జాతిగా ఖ్యాతిని పొంది ప్రపంచమంతటా విస్తరిస్తుంది.మన దేశంలోని ప్రజల్లో సర్వ మానవ సౌభ్రాతృత్వం అనే భావన ఆచరణలోకి రావాలి.మన దేశ ప్రజల్లో సర్వ మతాల సమానత్వం అనే భావన ప్రోది చేసుకోవాలి. మన దేశ ప్రజల్లో నెలకొన్న భేద భావాలు తొలగిపోయి అన్ని కులాలు కలిసి మెలిసి ఉండాలి. విశాల భావాలతో నిండిన మన దేశ ప్రజల్లో సుఖసంతోషాలు వెల్లి విరిసి జాతి ఖ్యాతి ఇనుమడిస్తుంది అని కవి మానారె చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రక్త పిపాసి రాక్షస మూకల
“ అడ్డు కొనాలి శౌర్యపు వాకల
“ లంచం కోరే నీచుల చేతుల
“ బంధించాలి నీతుల గొలుసుల.
స్వార్థపరులుగా మారి హింసా మార్గంలో పయనిస్తూ రక్త దాహానికి అలవాటు పడ్డ కనికరం లేని రాక్షసుల సముదాయాన్ని అడ్డుకోవాలి.మనిషిలోని రాక్షస ప్రవృత్తిని మానిపించాలి.స్వార్థపరులను దయాపరులుగా,పరోపకారులుగా,గొప్ప మనసున్న మనుషులుగా మార్చాలి.సరియైన చదువు, సంస్కారం లేక రాక్షసులుగా తయారయ్యారు. పెద్దలు,గురువుల శిక్షణ లేక సరైన మార్గదర్శనం లేక స్వార్థపరులుగా,అసాంఘిక శక్తులుగా తయారై సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నారు. మనుషులుగా జన్మించినప్పటికి కఠిన చిత్తులుగా, కర్కోటకులుగా,కాముకులుగా,హంతకులుగా,రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు.సమాజానికి చేటు చేస్తున్న నరహంతక రాక్షసులను శౌర్యవంతులై ఎదుర్కోవాలి.ధైర్యవంతుల శౌర్యపు ప్రవాహాలే ఇలాంటి దుర్మార్గుల పాపపు పనులకు అడ్డుకట్టగా నిలుస్తాయి.రాక్షస ప్రవృత్తి గల మనుషుల మనస్సులను మార్చడం శౌర్యవంతుల వల్లనే సాధ్యమవుతుంది.సమాజంలో విచ్చలవిడిగా లంచగొండితనం పెరిగిపోయింది.ఏ పని కావాలన్నా లంచం ఇవ్వనిదే జరగని దుస్థితి ఏర్పడింది.మంచి పూల తోటలోనికి ఒక్క గుడ్లగూబ చొరబడితే చాలు, ఆ పూల తోట అంతా నాశనం అవుతుంది. అటువంటిది కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మకు గుడ్లగూబలు ఉంటే ఆ పూల తోట పూర్తిగా విధ్వంసం కాకుండా ఉండగలదా? పూల తోట లాంటి సమాజంలోకి కలుపు మొక్కలాంటి దుర్మార్గులు ప్రవేశిస్తే ఏమవుతుంది? పూల తోటలోకి దుర్మార్గులు ప్రవేశిస్తే తోటను విధ్వంసం చేస్తారు. పూల తోటలోనుండి కలుపు మొక్కలను ఏరివేయాలి.పూల తోటలోకి గుడ్లగూబ వచ్చి చేరినట్లయితే దానిని తరిమి వేయాలి.పూల తోట లాంటి సమాజాన్ని కాపాడుకోవాలనే సందేశం చక్కగా ఉంది.అన్నిచోట్ల సర్వత్రా ఇందు గలడు అందు లేడు అని చెప్పినట్లు అంతటా లంచగొండితనం వ్యాపించి ఉంది.సమాజంలో నెలకొన్న లంచగొండితనంను పూర్తిగా అరికట్టాలి. లంచగొండితనం ఏ రూపంలో ఉన్నా దానిని పారదోలితేనే సమాజం పూర్తిగా అభ్యుదయ పథంలో కొనసాగుతుంది.లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిని అవినీతి నిరోధక శాఖ నామమాత్రంగా కేసులు పెట్టి వదిలివేస్తున్నారు. లంచం తీసుకున్న అవినీతిపరులకు ఎలాంటి శిక్షలు పడటం లేదు.అవినీతి నిరోధక శాఖ లంచగొండులపై కేసులు పెట్టినప్పటికీ సరియైన సాక్ష్యాలు చూపించకపోవడం వల్ల కేసులు వీగిపోతున్నాయి. అవినీతి నిరోధక శాఖ లంచగొండులను ఏమీ చేయదు అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అవినీతి నిరోధక శాఖ గుట్టు ప్రజలకు తెలిసిపోయింది.లంచగొండులను నీతిపరులుగా, ధర్మపరులుగా మార్చాలి.లంచగొండుల చేతులకు ఇనుప సంకెళ్లు వేయడం ద్వారా కాకుండా నీతులు అనే గొలుసులతో బంధించాలి.సమాజంలోని ప్రతి ఇంటిలోని వారిని నీతిపరులుగా మార్చాలి.అప్పుడు సమాజంలో లంచగొండులనే వారు ఉండరు.
“ జాతి జీవం దాని సంస్కృతి
“ జాతి చేతన దాని విస్తృతి
“ జాతి వేదన కేది నిష్కృతి
“ జాతి ఏకతయే పరిష్కృతి.
జాతి చక్కగా మనుగడ సాగించడానికి సనాతన కాలం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు,ధార్మిక అంశాలతో కూడిన ప్రవర్తన ప్రధానం.జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాలే జాతిని సజీవంగా నిలుపగలుగుతాయి.జాతి చేతన జాగృతమయితే జాతి చేతనత్వాన్ని పొందితే తమదైన సంస్కృతిని తిరిగి ఆచరణలోకి పెడితే ఆ జాతి వ్యాప్తిని పొందుతుంది.ఇటువంటి లోపాల చేత మానవ జాతి అంతా ఆపదలకు కష్టాలకు లోనవుతున్నది.జాతి ఎదుర్కొంటున్న బాధలకు నిస్కృతి ఏది? భారతదేశం ఎదుర్కొంటున్న భేద భావన, కులమతాల చిచ్చు,మానవ మృగాల రాక్షస కృత్యాలు,అవినీతి కరాళ నృత్యం మొదలైన వాటి వల్ల సమాజం అనుభవిస్తున్న బాధలు అన్ని తొలగిపోవాలి.ప్రజల మేలుకోరే నీతివంతమైన సుపరిపాలన అందించే రాజ్యం రావాలి.ప్రజా శ్రేయస్సు కోరే నీతి గల,ధర్మం గల రాజ్యం రావాలి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే దివ్యమైన మార్గానికి దేశ ప్రజల సమైక్యతే దారి చూపాలి.ప్రజలందరు కుల మత భేదాలను మరచి పోయి తాము అందరం ఒకటే.ఈ దేశం మనది.మనం అందరం మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుతూ కుల మతాలకు అతీతులమై ఐక్యమత్యంతో మెలగాలి అనే ఏకాభిప్రాయానికి రావాలి.భారతదేశ ప్రజలకు కలిగే బాధలన్ని క్రమ క్రమంగా తొలగి పోతాయి. ప్రజలందరు సుఖసంతోషాలతో అలరారుతూ ప్రశాంతమైన జీవనం సాగిస్తారు.ఏకతకు పరిష్కారం అనే చక్కటి గేయం ద్వారా సమాజానికి స్ఫూర్తిని అందిస్తున్న కవి మాదాడి నారాయణరెడ్డిని (మానారెని) అభినందిస్తున్నాను.మానారె మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
మాదాడి నారాయణ రెడ్డి ” ఏదీ కొత్తదనం?”
కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన: నరేంద్ర సందినేని
ప్రముఖ కవి, ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన “ఏది కొత్తదనం? కవిత పై విశ్లేషణా వ్యాసం.కవిత
ఏమిటని ఆసక్తితో చదివాను.నాలో ఆలోచనలు
రేకెత్తించింది.కొత్తదనం యొక్క అర్థం కొత్తగా ఉండే స్థితి లేక భావము.The quality of being new and original not derived from something else.కొత్తదనం అంటే నూతనత్వం.
“తమ్ముడూ! పాత రోతగా ఉంది కదూ!
సామెత: కొత్త ఒక వింత… పాత ఒక రోత అనేది నిజం. ఎందుకంటే కొంత మందికి పరిచయం అయిన కొత్తలో మన మీద ఉన్నంత గౌరవం తర్వాత ఉండదు.కొత్తగా ఏదైనా వచ్చాక పాత దాని విలువ మర్యాద పోతుంది.అదే వస్తువు అయినా,ప్రేమ అయినా,మనిషి అయినా,కొత్త వింత…పాత ఒక రోత.ఇది నిజం.కొత్త బంధువులకు,కొత్త స్నేహితులకు,ఇచ్చే విలువ పాత బంధువులకు, పాత స్నేహితులకు,ఇవ్వరు.పాత రోత అనిపిస్తుంది. ఇది లోక నైజం.ఈనాటి నవీన మానవుడు నిత్య నూతనంగా జీవిస్తాడు.ఏదైనా కొత్త అనుకోకుండా ఆశ్చర్యపరిచేలా జరిగితే అదో వింత విడ్డూరం? కానీ ఇదంతా సహజమేగా అనిపిస్తే అది సర్వసాధారణం!!
“నీవీ క్షణంలో కొత్త అనుకుంటున్నది “మరు క్షణంలో పాత కాదా మరి
మనం ఒకసారి మనసుపెట్టి ఆలోచిస్తే ఈ క్షణంలో కొత్త అనుకుంటున్నది మరు క్షణంలో పాత అవుతుంది.నిజమే.ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది.నారాయణరెడ్డి (మానారె) కవి భావన అద్భుతం…
“సూర్యుడూ చంద్రుడూ “గ్రహాలు తారలూ “వెలుగులు చీకట్లూ “ఆ ఆకాశం ఈ భూమి. “అన్నీ పాతవే గదా.
సూర్యుడు సౌర వ్యవస్థలో మధ్యలో ఉన్న నక్షత్రం. పగటిపూట వెలుగులు ఇచ్చే గ్రహం.తూర్పు నుండి సూర్యుడు ఉదయించిన వెంటనే చీకట్లు పారిపోతాయి.చంద్రుడు రాత్రి పూట నక్షత్రాలతో పాటు కనిపించేది.భూమి చుట్టూ తిరిగే ఒక గ్రహం. చంద్రుడు సూర్యుడి ప్రకాశం వలన వెలుగుని ఇస్తున్నాడు.గ్రహం అంటే అంతరిక్షంలో ఒక ఆకృతి. ఇది తన కేంద్రకమైన సూర్యుడు లేక నక్షత్రం చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటుంది. బరువును గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. గ్రహాలు తొమ్మిది.ఖగోళ శాస్త్రంలో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు.బుధుడు,శుక్రుడు,భూమి, కుజుడు (అంగారకుడు),బృహస్పతి (గురువు), శని,యురేనస్ (వరుణుడు),నెప్ట్యూన్. (ఇంద్రుడు), ఫ్లూటో (యముడు). తారలు అంటే ఆకాశంలో రాత్రిపూట ప్రకాశించేవి అని అర్థం.భూమి నుంచి చాలా దూరంగా ఉన్న కారణంగా చుక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.వెలుగులు అంటే కాంతులు. వెలుగు కిరణాలు పరిసరాలను కనిపించకుండా ఆవరించిన చీకట్లను పారద్రోలి వాటిని సుస్పష్టంగా కనిపింప చేస్తాయి.వెలుగు ప్రసరించడం చేత ప్రకృతి శోభాయమానంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.వెలుగు ప్రశాంతమైన సుఖమయమైన జీవితానికి ప్రతీక. చీకటి అర్థం వెలుతురు లేని స్థితి.సూర్యుడు అస్తమించడంతో అంతట అంధకారం అలుముకుంటుంది.ఈ చీకటి మనం చేసే పనులకు ఆటంకం కలిగిస్తుంది.చీకటి అర్థం ఖాళీగా ఉండడం.ఉదాహరణకు భార్య మరణించిన తర్వాత అతని జీవితంలో శూన్యం ఏర్పడింది. దుఃఖమయమైన అతని బ్రతుకు అందకార బంధురమైందని చీకటిమయమైందని చెప్పుకుంటాం.అంటే సుఖాలకు వెలుగు ప్రతీక అయినట్లుగా,కష్టాలకు చీకటి ప్రతీక అని చెప్పవచ్చు.ఆకాశం ఆరు బయట నుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం. ఆకాశం వికృతి పదం ఆకసము.భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు నీటి ఆవిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలి రంగులో కనబడుతోంది.కానీ నిజానికి ఆకాశం ఏ రంగును కలిగి ఉండదు.అందుకే మనకు రాత్రి సమయంలో ఆకాశంలో సూర్యకాంతి లేకపోవడం వలన చీకటిగా కనిపిస్తుంది.ఆ చీకటిలో అనంత దూరంలో ఉన్న నక్షత్రాలు,గ్రహాలు,చిన్న చిన్న చుక్కలుగాకనిపిస్తాయి.ఆకాశం భూమి ఇతర గ్రహాలు మరియు నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం. నక్షత్రాలు,చంద్రుడు,సూర్యుడు మొదలైనవి ఉండే శూన్య ప్రదేశం.వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.పంచ భూతాలలో ఆకాశం ఒకటి. అంతు తెలియజాలనిది ఆకాశం.భూమి సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి.మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే.భూమి 450 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడిందని తెలుస్తోంది.భూమి గురుత్వ శక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై ముఖ్యంగా సూర్య చంద్రులపై ప్రభావం చూపిస్తుంది.భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకి ఒక్కోసారి పరిభ్రమిస్తుంది.దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది.దీన్ని భూ భ్రమణం అంటారు. భూమి నీరు లేకుండా ఉండే ప్రదేశం. భూమండలంలో మూడవ వంతు భాగం భూమి. ప్రాణులు ఉన్న ఒకే ఒక గ్రహం.చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం.భూమి మనం నివసించు ప్రదేశం.అది మనకు తల్లి వంటిది.భూమిలో పండే పంటలే జీవులకు జీవనాధారం.అవును సూర్యుడు, చంద్రుడు,గ్రహాలు,తారలు,వెలుగులు,చీకట్లు,ఆ ఆకాశం,ఈ భూమి,అన్నీ పాతవే కదా అని కవి నారాయణరెడ్డి (మానారె) భావాల్లో ఎంతో బలం ఉంది.మనం ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది.
“నిన్ను కన్న తల్లీదండ్రీ
“హితులూ సన్నిహితులూ
“పాత వారు కారూ?
అని నారాయణ రెడ్డి (మానారె) మనల్ని ప్రశ్నిస్తున్నారు.తల్లిదండ్రి కుటుంబంలోని సంతానానికి కారకులు తల్లిదండ్రులు.సృష్టిలో ప్రాణికి మూల కారణం అమ్మ.కన్నతల్లి బిడ్డను నవ మాసాలు గర్భాశయంలో పెంచి తర్వాత జన్మనిచ్చిన స్త్రీ మూర్తి.ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. నిజమే.కన్న తల్లిదండ్రులు,మన హితం కోరే హితులు,మన మేలు కోరే సన్నిహితులు,పాత వారే అని ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది. అయినప్పటికీ కన్న తల్లిదండ్రులను,హితులను, సన్నిహితులను,పాతవారని తీసిపారేయాల్సిన వ్యక్తులు కాదని మనలను ఆలోచన తరంగాలలో తేలియాడ జేస్తున్నారు.
“ఎంతగానో నీవభిమానించే
“నిత్యం కొత్తగా ఊహించే
“నీ శరీరం పాతది కాదూ?
మనని మనం ప్రేమించుకుంటాం.మనని మనం అభిమానించుకుంటాం.మనల్ని మనం కొత్తగా ఊహించుకుంటున్న మన శరీరం పాతది కాదు అని ప్రశ్నిస్తున్నారు.అవును మన శరీరం పాతదే.మనం
అభిమానించుకుంటున్నది నిజమే.కాదనలేని సత్యం నారాయణరెడ్డి (మానారె) కవి భావన వాహ్…
” నీవు ఆడే ఆట పాడే పాట
“తినే తిండి చదివే చదువు
“ప్రియాతిప్రియంగా నీవు భావించే
“ఇల్లాలు మరి పిల్లలు
“కొత్తవారేనంటావా? మనం నిత్యం ఏదో ఒక ఆట ఆడుతుంటాం.మనం ప్రతి రోజు ఏదో ఒక పాట మనకి ఇష్టమైనది పాడుతుంటాం.మన ఇష్టంగా తినే తిండి,మనం ఇష్టంగా చదువుతున్న చదువు,మనకు ప్రియాతిప్రియంగా మనలో బాగమని భావించే ఇల్లాలు హృదయేశ్వరి,మన సంతానమైన పిల్లలు కొత్త వారేనంటావా అని కవి నారాయణ రెడ్డి (మానారె) ప్రశ్నిస్తున్నారు.కొత్త వారు కాదని మనం తెలుసుకోవాల్సిన విషయంగా తోస్తుంది.కవి భావనలో సత్యం ఉంది.
“కొత్త మాటల్లో లేదు
“మాటలకు మూలమైన భావనలో ఉంది
కొత్త అనేది మనం మాట్లాడే మాటల్లో లేదు మాటలకు మూలమైన భావనలో ఉంది అని మనకు గుర్తు చేస్తున్నారు.కవి నారాయణరెడ్డి (మానారె) చక్కటి భావం వ్యక్తం చేసిన తీరు అబ్బురపరుస్తుంది.
“ఈర్ష్యా – ద్వేషం – కసి
“నిరాశ- నిస్పృహ- నిరీహల్ని
“దూరంగా సుదూరంగా త్రోలి
“అందరికీ ఆనందం పంచు
“అందరితో కలిసి బ్రతుకు
ఓర్వలేనితనం మరియు శత్రుత్వం,పగ,కోపం,ఆశ లేనితనం,స్పృహ లేకపోవడం,తనకు తాను మరిచిపోవడం,కోరికలు లేకుండా ఉండటం, వీటినన్నిటిని దూరంగా,సుదూరంగా పంపించి మంచి మనసుతో అందరికీ ఆనందం పంచుతూ అందరితో కలిసి బ్రతుకు అని కవి ప్రబోధిస్తున్నాడు.
“అప్పుడు నీవు కోరే కొత్త
“అంతటా అన్నిటా లభిస్తుంది
నీవు ఒక మంచి మనిషిగా మారతావు.అప్పుడు నీవు కోరే కొత్తదనం అంతటా అన్నిటా లభిస్తుంది.నీ జీవితంలో వెలుగులు విరజిమ్ముతాయి.నీవు కోరుకునే కొత్తదనం నీకు లభిస్తుంది.ఏది కొత్తదనం కవిత ద్వారా చక్కని సందేశం అందించారు.కవి మాదాడి నారాయణరెడ్డి (మానారె) కలానికి వందనాలు చేస్తున్నాను.మానారె కలం నుండి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయాలని మనసారా కోరుకుంటున్నాను.

July 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us