మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

భారతదేశం మనకు ఏం నేర్పిస్తుంది

by Devanapalli Veenavani July 24, 2024
written by Devanapalli Veenavani

(What can India Teach us – Max Muller)

గొప్పమాట !భారతదేశం ప్రపంచానికి  ఏం  నేర్పుతుంది? భారతీయులకు ఏం నేర్పుతుంది?ఎక్కడైనా  సగటు పౌరునికి దేశంనుంచి నేర్చుకొనే అవసరం ఏముంది?  దేశం నుంచి నేర్చుకోవడం అంటే  చరిత్రనా, మనుషులా, పాలకుల ప్రస్థానమా?అసలు నీగురించి నీవు ఏమిచెప్పగలవు? నీదేశం గురించి ఏమి తెలుసుకున్నావు? నిన్ను,నీ  స్వభావాన్ని దేశానికి జతచేసే ప్రభావితాంశాలు ఏవై  ఉండవచ్చు? ఇలా  ప్రశ్నించుకున్న సంధర్భాలలో అంతిమంగా, ప్రతి జాతిలోనూ “ విశ్వాసం” అనే మూలమొకటి ఏర్పడి,సంఘీభావంతో స్థిరపడి, ఆచార వ్యవహారమై మనగలిగి, సంస్కృతిగా పరిణమించి దేశఅస్థిత్వమై నిలబడి ఒక ప్రవహంగా కొనసాగడం కనిపిస్తుంది. ఇక్కడ విశ్వాసమే మూలం. విశ్వాసం ఏర్పడడానికి తత్వం ఎరిగి ఉండడం ప్రధానం,ఈ ఎరుకను అనేక కోణాల్లో  పరిశీలించి పరికల్పన చేయడానికి  దోహదపడే వారే తాత్వికులు. అంటే ప్రతిజాతి,దేశం మూలాల వెనుక బలమైన తాత్విక భూమిక ఉండే తీరాలి. అదే ఆ జాతి చోదక శక్తి.అది తెలుసుకున్నప్పుడే ఆ జాతిని  అర్థం చేసుకోగలం, సంబందబాంధవ్యాలను నెరపగలం. భారతదేశంమాటకువస్తే ఆ  చోదక శక్తి నిన్ను నీవు తెలుసుకో ( Know thy self ) మూలంగా అన్ని వాదభేధాలను గౌరవిస్తూ  ఏకం సత్ బహుధా వదంతి గా కర్మానుసారంగా జీవించడమే కనిపిస్తుంది.  ఇది మన గురించి మనం అర్థంచేసుకున్నది,మరి విదేశీయులు మనల్ని ఎలా అర్థం చేసుకున్నారు,ఎలా అన్వయించుకున్నారు, మనగురించి ఏం మాట్లాడుకున్నారు అని తెలుసుకోవాలనుకున్నపుడు  ఈ దేశాన్ని సందర్శించి  ఇక్కడి విషయాలను తమ దేశానికి పరిచయం చేస్తూ ఎంతో విలువైన చారిత్రకసేవచేసిన  హుయాన్త్సంగ్, మార్క్ పోలో వంటి ఎంతోమంది   విదేశీ యాత్రీకులు కనిపిస్తారు. వారెవరూ ఇక్కడ పరిపాలనా లక్ష్యాలతో రాలేదు, కేవలం పరిశీలనకోసం  మాత్రమే వచ్చారు.అయితే మరికొంతమంది విదేశీయులు పరిపాలనకోసమే ఈదేశానికి వచ్చారు, వారికి పరిశీలనతోపాటు పాలనకు అనువైన వాతావరణం సృష్టించడం,తమతరఫున పాలకులను తయారు చేయాల్సిన అవసరం రెండూ ఏర్పడ్డాయి.అలాటి పరిస్థితుల్లో  మనదేశ చారిత్రక, పరిపాలక  అంశాలతో వెలువడిన అనేక గ్రంథాలలో జర్మనీ దేశస్థుడు, ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ రాసిన భారతదేశం మనకు ఏం నేర్పుతుంది (What can India Teach us) ఒకటి.

ముల్లర్ (1823-1900) జర్మనీకి చెందిన భాషాశాస్త్రవేత్త, భాషల అధ్యయనాన్ని ఫిలాలజీ అంటారు కనుక ఫిలాలజిస్టు అని పిలవబడ్డాడు. ముల్లర్ తండ్రి విల్హెల్మ్ ముల్లర్ ఒక కవి.ముల్లర్ నాలుగేళ్ల చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు.ముల్లర్ తన దేశభాష జర్మనీలోనూ,మనదేశపు అనాదిభాష సంస్కృతంలోనూ ఇంగ్లీష్లోనూ ప్రావీణ్యం సంపాదించాడు.నారాయణ పండితుడు రాసిన గ్రంథం హితోపదేశని ముల్లర్ 1844లోఅనువదించి ప్రచురించాడు. 1845లో పారిస్ వెళ్ళి అక్కడ యూజిన్ బరనోఫ్(Eugeneburnouf)  యొక్క ప్రభావంతో అప్పటికే ఫ్రెంచ్ భాషలో వెలువడిన ఋగ్వేదభాష్యం edito princepsని సేకరించడం మొదలు పెట్టాడు. మనగ్రంథాలు పారిస్ ఎలా చేరాయంటే అప్పటి ఈస్ట్  ఇండియా కంపనీ  సంస్కృత భాషలో ప్రావీణ్యం ఉన్న వారిని ప్రోత్సహించిన కారణం చేత అనేక  మూల గ్రంథాలను సేకరించి సంస్కృత భాష పరిశోధకులకు పంపించేది.అలాగా పారిస్లోఉన్న యూజిన్ బరనోఫ్కు అందినవి. ముల్లర్ పారిస్నుంచి 1846లో  ఆక్సఫోర్డ్ యూనివర్సిటీ గడపలో కాలుమోపి  రెండేళ్లలో ఆధునిక యూరోపియన్ భాషావిభాగంలో డిప్యూటీ ప్రొఫెసర్ అయ్యాడు. అక్కడ 1868 నుంచి కంపారిటివ్ ఫిలాలోజీ ఆచార్యులుగా పనిచేసి 1875 లో పదవీవిరమణ చేశాడు.  ముల్లర్ ఇంగ్లాండ్ వచ్చిన సమయంలో ఈస్ట్ ఇండియా కంపనీ తన  ఖర్చుతో సాయణాచార్యుల ఋగ్వేదభాష్యాన్ని పూర్తిగా ఇంగ్లీష్లో తేవాలని పురమాయించారు. 1859 లో అప్పటికి అందుబాటులో ఉన్న  మానుస్క్రిప్ట్స్ ఆధారంగాHistory of ancient Sanskrit Literatureఅనే పుస్తకాన్ని రాశాడు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషాచార్యులు హెచ్ హెచ్ విల్సన్ మరణించినప్పుడు సంస్కృత భాషా ఆచార్యులు కావాలని  ఆశపడి లండన్కు  విదేశీయుడైనందువల్ల  భంగపడ్డాడు.అయితే   అతని సేవలు విశ్వ విద్యాలయనికి , ఈస్ట్ ఇండియా కంపనీకి  మరోరకంగా వినియోగించబడ్డాయి.   ముల్లర్   సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ థాట్  పేరుతో ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు. ముల్లర్ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న పుస్తకం What can India Teach us కాకుండా Chips from German Workshop, జర్మనీ భాషలో Auld Lang Syne,Deutsche Liebe అనే పుస్తకాలను రాశాడు. పదవీ విరమణ చెందాక అప్పటికి తానెంతో గ్రహించినహిందూ,బౌద్ద,జైనతత్వ సాహిత్యాన్ని,చైనీయులతావో, కన్ఫ్యూసియస్  తత్వాల్ని,జొరాస్ట్రీయానిన్ తత్వాన్నిSacred Books of Eastగా తేవాలని సంకల్పించి ఆ బృహత్తర కార్యక్రమానికి సంపాదకునిగా ఉన్నాడు.ఈ  Sacred బుక్స్ ఆఫ్ ఈస్ట్ అనేది  చాలా విలువైన కృషి. మొత్తం 51 విలువైన గ్రంథాలు ఈ సిరీస్ పేరుతో వెలువడ్డాయి. ఇందులో భాగంగా ముల్లర్ హిందూగ్రంథాలు ఖండోద్యోగ ఉపనిషద్, కేనోపనిషద్,ఐతరేయ అరణ్యక,కౌశితకి బ్రహ్మణ,వాజసనేయిసంహిత ఇంకా ముండక,కఠ,తైత్తరీయ,బృహదారణ్యక, శ్వేతాస్వాతార,ప్రశ్న , మైత్రేయని ఉపనిషత్తులు ,అలాగే  బౌద్దానికి చెందిన దమ్మపాద, సుత్తనిపాతలు   ఉన్నాయి. ఇవేకాక  వాయు,రుద్ర,మారుత శ్లోకాలు,ఋగ్వేద సమాచారంవంటివి ఈయన అనువదించినవాటిలో ఉన్నాయి. ముల్లర్ ఇంగ్లీష్లో కూడా  అనేక పుస్తకాలు రాశారు.అందులో Six Systems of Phylosophy,Ramakrishna:His life and sayings, The Vedanth Phylosophy వంటివి ప్రాచుర్యం పొందాయి.

ప్రస్తుత పుస్తకంభారతదేశం మనకు ఏం నేర్పుతుంది  విషయానికివస్తే 1882లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చేత  ప్రచురించబడిన ఈ పుస్తకం ముల్లర్ భారతదేశంలో నియమించబడిన ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారుల అవగాహనకోసం కేంబ్రిడ్జ్  విశ్వ విద్యాలయంలో  వెలువరించినఏడు ఉపన్యాసాల సమాహారం.భారతదేశంలో 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం తర్వాత పరిపాలన అంతా ఈస్ట్ ఇండియా కంపనీనుంచి ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలనకు వెళ్ళిన తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేయడానికి నియమించబడిన అధికారులను ఇంపీరియల్ సివిల్ సర్వీస్ అధికారులుగా ఎంపిక చేసేవారు. 1886నుంచి  ఈ  సర్వీస్లోకి భారతీయులను అనుమతించారు. అయితే అప్పట్లో లండన్ వెళ్ళి పరీక్షలు వ్రాసే పరిస్థితి ఉండేది. 1922 నుంచి మాత్రమే  ఢిల్లీలో పరీక్షకు అనుమతించడం జరిగింది. మొదట లండన్లో ఎంపికైన ఇంపీరియల్ సర్విస్ అధికారులకు కావలసిన శిక్షణనిచ్చేక్రమంలో ముల్లర్ భారతదేశంగురించి ఇచ్చిన ఉపన్యాసాలు ఇవి. స్వతంత్రానంతరంఇంపీరియల్ సివిల్ సర్వీస్ని ఇండియన్ సివిల్ సర్వీస్గా మార్చి ప్రస్తుతం  ఉత్తరాఖండ్ ముసొరిలో  శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ముల్లర్ ఈ ఉపన్యాసాలు వెలువరించే కాలానికి సంస్కృతంనుంచి అప్పటికే ఎన్నో మూలగ్రంథాలను  ఇంగ్లీష్లోకి అనువదించి ఉన్నాడు.మరెన్నో గ్రంధాలను అధ్యయనం చేశాడు.సంస్కృతంతోపాటు గ్రీకు,లాటిన్ భాషలలోని తాత్విక గ్రంథాలను తులనాత్మకంగా అధ్యయనం చేశాడు,విశ్లేషించాడు,అర్థం చేసుకునేందుకు  ప్రయత్నంచేశాడు.కేంబ్రిడ్జ్  విశ్వవిధ్యాలయంలో సంస్కృత ఆచార్యులుగాఉన్న  Edward Byles Cowellకి అంకితం ఇస్తూ ఇప్పటివరకు సంస్కృత భాషలో చేసిన పరిశోధనలు తురుపుముక్కఅనీ ఇంకా చేయవల్సింది ఎంతో ఉందని చెప్పాడు.ముల్లర్ తన ముందుమాటలో  ప్రతీ యేటా  ఎంతోమంది యువ అధికారులు  భారతదేశానికి  వెళ్తున్నారని,వారు మరెంతో కృషిచేయాల్సి ఉందని,ఉపన్యాసం ఇవ్వడం తనకు ఇష్టమని,ఉపన్యాసంలో ఎంతో విషయాన్ని క్లుప్తంగా అవసరానికి అనుగుణంగా చెప్పేవీలుంటుందని  చెప్తూ ఋగ్వేదాన్ని,దాని  భాష్యాన్ని రాయడం  తన జీవిత కాలస్వప్నమని అందుకు సహకరించిన  నా దత్తదేశానికి (భారతదేశం), అక్కడి గొప్ప  రాజనీతిజ్ఞులకు ఋణపడి ఉంటానని రాశాడు.

ఆక్స్ఫర్డ్  విశ్వవిద్యాలయం ముల్లర్ ఉపన్యాసాలను 1882లో  సంకలనంగా తెచ్చినప్పుడు 442 పేజీల గ్రంథంగా ఉంది. ప్రతి ఉపన్యాసానికి తగిన పాద సూచికలు,అర్థవివరణలు చేరుస్తూ పోవడంవల్ల గ్రంధవిస్తారం జరిగింది.ప్రతీవ్యాసం లోలోపలికి వెళ్ళినప్పుడు ఆ వివరణలు ఎంతో ముఖ్యమయినవిగానూ, అర్థవంతమైనవిగానూ ఉన్నాయి.ప్రస్తుతం అందుబాటులోఉన్న ఆంగ్లపుస్తకం ఈవివరణలను పరిహరించి రెండువందల పేజీలకు కుదించి కేవలం ఉపన్యాసానికి పరిమితంఅవడం  ఒకరకంగా మనఓపికలేనితనానికి నిదర్శనం. అయినప్పటికీ ప్రతీభారతీయుడు తప్పనిసరిగా చదువుకోవాల్సిన పుస్తకం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పుస్తకం వచ్చిన నూటానలభై ఏళ్ళకు కూడా ఇది తెలుగు భాషలోకి అందుబాటులో లేకపోవడం, రాకపోవడం. అయితే.ప్రస్తుతం కొన్ని విశ్వవిధ్యాలయల్లో మొదటి ఉపన్యాసాన్ని చరిత్ర  పాఠ్యాంశంగా చేర్చారు.

            ముల్లర్ వెలువరించిన ఈ ఉపన్యాసాలలో మొదటిది   భారతదేశం మనకు ఏం నేర్పుతుంది, తదుపరి హిందువుల స్వభావం,సంస్కృత సాహిత్యంపై మానవాభిలాష ,వేదసంస్కృతి ప్రత్యేకమైనదా,వేద మతం, వేద ఆరాధన, వేదము మరియు వేదాంతంశీర్షికలుగా వేద కాలమూ,సంస్కృత సాహిత్యం నిబిడీకృతం చేసుకున్న చరిత్ర చుట్టూతా కొనసాగుతాయి. ముల్లర్ ఉపన్యాసాలు చదివేటప్పుడు  అతని లోతైన పరిశీలన దృష్టి ,తనదికాని  దేశంయొక్క సంస్కృతిలోని పలుకుబడులను కూడా పట్టుకొనేంత సహనం, తానెనుకున్న భాషా విశేషాలను ప్రపంచ సమకాలీన భాషాసాహిత్యాలతో  పోల్చి విశ్లేషించగల నేర్పు  చదువరిని ఒప్పించగల సామర్థ్యం ఉన్నట్లు తెలుసుకుంటాం. ముల్లర్ తన ఉపన్యాసాలలో వేదకాలాన్ని ఆదిమమైందని, పురాతనమైనదనీ  అయినా మానవ మేధాశక్తిని అపూర్వంగా ప్రదర్శించిందని చెప్తూ తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 

          ముల్లర్ , యువ అధికారులను  ఉద్ధేశించి మాట్లాడుతూ భారతీయులకు మానవస్వభావంపట్ల లోతైన అవగాహన ఉన్నదని యూదుల జడ్జిమెంట్ ఆఫ్ సోలోమన్ కథను ఉదాహరించిచెప్తాడు. మనం చిన్నప్పుడు బాగా విన్న కథనే అది. ఇద్దరు తల్లులు ఒక పసిపిల్లవాన్ని తన కొడుకంటే తన కొడుకని పోట్లాడుతూ న్యాయంకోసం వచ్చినప్పుడు  పసిపిల్లవాన్ని రెండు ముక్కలు చేసిచెరో ముక్క ఇవ్వాలని తీర్పు చెప్తాడు సోలోమన్. అయితే పిల్లవాన్ని ముక్కలు చేయడం ఇష్టం లేని ఆమెనే తల్లి అని గుర్తించడం ఆ కథలో ఉంటుంది.  అదే కథ బౌద్ధుల త్రి పీటకాల్లోనూ ఉంటుంది.  ఇక్కడి కథలో రాజు, తనవద్దకి తీర్పు కోసం వచ్చిన ఇద్దరు స్త్రీలకు ఎలాగా ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచించి దానిని ఆ ఇద్దరు తల్లులకే వదిలేస్తాడు.  ఆ ఇద్దరు తల్లులు ఆ పిల్లవాడిని చెరోవైపు లాగడంతో పిల్లవాని శరీరానికి గాయాలై ఏడుస్తుంటాడు. ఒక స్త్రీ  దాన్ని చూసి తట్టుకోలేక రెండో స్త్రీకే ఆ పిల్లవాణ్ణిఇచ్చిచేయమని కోరుతుంది ఎందుకంటే తల్లి గనుక పిల్లవాడి శరీరం యొక్క గాయాలని, దానివల్ల వస్తున్న దుఃఖాన్ని ఓర్వలేదు కనుక. ఆమెనే అసలు తల్లని ఆ స్త్రీకే  పిల్లవాణ్ణి ఇవ్వాలని తీర్పు చెప్తాడు. ఇలామానవ సహజస్వభావం పట్లభారతీయులకు   జ్ఞానం ఉందనిఅలాగే భారతదేశంలో ఉన్న న్యాయ సూత్రాల చరిత్ర గ్రీకు,రోమన్, జర్మనీతో  పోలిస్తే భిన్నంగా ఉన్నా ప్రతి ఏటా కొత్త న్యాయసూత్రాలు బయటికి వస్తున్నాయని,  మను స్మృతి కనీసం క్రీస్తుపూర్వం ఐదువందలసంవత్సరాలనుంచి ఉండవచ్చునని మీరు భారతదేశంలోపనిచేసే అవకాశం వచ్చినప్పుడు వీటి గురించి తెలుసుకుంటారని,సంస్కృతం మీకు మొదట చాలా కష్టంగానూ ఇబ్బందిగాను అనిపించవచ్చు కానీ సంస్కృతం ఎన్నో లోతైన అంశాలని కలిగి ఉందనీ,  మీకు తీరిక  దొరికినప్పుడల్లా మీరు పనిచేయడానికి కావలసినంత విషయం అక్కడ ఉందని అంటాడు.

ప్రపంచంలోని  ఏ సమస్యతీసుకున్నా,  అది ఉన్నతవిద్యైనా,,ప్రజాస్వామ్యవ్యవస్థైనా,, న్యాయసూత్రాలైనా,ఆర్థికశాస్త్రమైనాఇలా ఏ అంశాన్ని తీసుకున్నా  ఎక్కడా లేనివిధంగా భారతదేశం మీకు ఒక ప్రయోగశాలకు కావాల్సిన అన్ని అంశాలని సరఫరా చేస్తుంది. బయటప్రపంచం వివిధ సాంకేతికఅంశాలమీద పనిచేస్తూ ఉన్నప్పుడు మానవమేధయొక్క చరిత్ర, తనగురించి తాను అధ్యయనం చేసుకోవడం విషయాల్లో భారతదేశం ముందుంది. మానవమేధకు సంబంధించినటువంటి అంశాల్లో మీరు ఏ కోణంనుంచైనాఅంటే అది భాషకావచ్చు,మతంకావచ్చు,పురాణాలుకావచ్చు,తత్వంకావచ్చు,న్యాయసూత్రాలుకావచ్చు,ఆచారాలువ్యవహారాలుకావచ్చు, కళాకౌశlలాలు కావచ్చు,శాస్త్రీయమైన అంశాలు కావచ్చు వాటినితెలుసుకోవాలనుకుంటే  మీరు భారతదేశానికి  వెళ్ళండి,  మీకు అక్కడ చాలా ముఖ్యమైన అంశాలు, అవీ  కేవలం భారతదేశంలోమాత్రమే  లభిస్తాయని సూచిస్తాడు.అలాగే గ్రీకు, లాటిన్,జర్మన్,సంస్కృతంనుంచి అనేక ఉదాహరణలు చూపిస్తూ  భాషలన్నిటికీ ఒకే మూలంఉండే అవకాశం ఉందని ప్రోటో లాంగ్వేజ్ ఒకటి ఉండి ఉండవచ్చని, అది తన మూలంనుంచి వివిధ భాషలుగా రూపాంతరం చెందిందని నమ్మకంతో ఉంటాడు.భారతీయూలలో ఆర్యులు వేరుఅనే సిద్ధాంతాన్ని నమ్మినవాడు కనక భారతదేశంలోని సంస్కృతంకూడా అలాగా ప్రోటో ఆర్యన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందని ఊహ చేస్తాడు. గ్రీక్ శిల్పాన్ని,ఈజిప్షియన్  స్పింక్స్ని,బాబిలోనియన్ ఎద్దులవంటి వాటిని ప్రతీదేశం పురాజ్ఞాపకాలుగా చూపిస్తారుగానీ అంతకన్నా ముఖ్యమైనది మనభాష, మిగిలిన వాటికన్నా ఎన్నో అద్భుతమైనవిలువైన విషయాలను భాష నుంచి గ్రహించే అవకాశం ఉందని , భాషల యొక్క శాస్త్రీయతనిఅర్థం చేసుకోవడం  సంస్కృతం లేకుండా  చేయలేమని అంటాడు.

రెండవ ఉపన్యాసంలో  హిందువుల స్వభావం గురించి  విశ్లేషణ  చేస్తాడు. ముల్లర్ దృష్టిలో హిందువులు అంటే భారతదేశంలోనివసించే  అందరూ.ముల్లర్ ఉపన్యాసకాలంనాటికి స్వతంత్ర భారతావనిస్పూర్తి మొదలై విస్తరిస్తున్నది.  క్రిమినల్ ట్రైబ్స్ చట్టం -1871 అమలులోకి వచ్చింది. విలియంజోన్స్  స్థాపించిన ఆసియాటిక్ సొసైటి వివిధ అంశాలమీద శాస్త్రీయ అధ్యయనం మొదలుపెట్టింది. జేమ్స్ మిల్ రాసిన హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా విస్తృతంగా ప్రచారంలో ఉంది.అంతేకాక భారతీయులు అందరూ ఒకే మూలనికి చెందిన వారు కాదని, ఆర్యుల జాతి ఏనాటి కాలంలోనో ఇక్కడకి వచ్చి స్థానీయులను జయించి స్థిరపడ్డారనే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంవల్ల భారతీయల స్వభావంపట్ల యురోపియన్లలో అనుమానం ఉందనీ మనం అర్థం చేసుకోవచ్చు. ముల్లర్ తనరెండవ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ భారతీయుల స్వభావం పట్ల  సంశయం అవరసం లేదనీ హిందువులు ముక్కుసూటి స్వభావులని  ప్రొఫెసర్ విల్సన్ చెప్పిన మాటల్ని ఉటంకిస్తాడు. అలాగే ఇండియన్ సివిల్ సర్వెంట్స్ కి చదవమని చెప్పే జేమ్స్ మిల్స్ రాసిన హిస్టీరి ఆఫ్ బ్రిటిష్ ఇండియా పుస్తకం  అనేక విధాలుగా వినాశకరంగా ఉందనీ,జేమ్స్ మిల్  అది హిందువుల స్వభావాన్ని ఫ్రెంచ్ మిషనరీల భావనతో కూర్చాడు తప్ప నిజంగా హిందువుల స్వభావాన్ని అంచనా వేయలేకపోయాడని చెప్తూ ఆ పుస్తకంలోని  అభ్యంతరకరమైన అంశాలను ప్రస్తావిస్తాడు.   జేమ్స్ మిల్ చేసిన కొన్ని వాఖ్యలు ఉదాహరణకు  బ్రాహ్మణుడు అబద్ధాల చీమలపుట్ట అని పేర్కొనడం. ఇంకా భారతీయులు తగువులమారులని (Litigant) పేర్కొనడం సరికాదని చెప్తూ  ముల్లర్  అప్పటి మద్రాస్ గవర్నర్ గా ఉండి రైత్వారీ విధానం ప్రవేశపెట్టి  ఎన్నో ఏళ్లు  భారతదేశంలో ఉన్న థామస్ మన్రో, హిందువులు వ్యాజ్యస్వభావులుకారని వెలిబుచ్చిన మాటల్నిగుర్తుచేస్తాడు. జేమ్స్ మిల్ చేసిన మరో ఆరోపణ  బ్రాహ్మణుడు  తలుచుకుంటే తాను  అనుకున్న వారిని చచ్చేదాకా వదిలిపెట్టడు అని.దాని గురించి మాట్లాడుతూ గడిచిన కాలంలో ఇంగ్లాండులో పదివేల ఉరిశిక్షలు విధిస్తే బెంగాల్లో కేవలం ఒకే ఒక ఉరిశిక్ష విధించబడిందని గుర్తు చేసి ఆ ఆరోపణ సత్యదూరమైందని తెలియజేస్తాడు.

          భారతీయులనిజమైన  స్వభావం ప్రతిఫలించేది గ్రామాలలోని ఒక సాధారణ పౌరుడు. అతని గ్రామమే అతని ప్రపంచం,ఎంతో అరుదుగా అతను ఇతరులతో సంబంధాలు కలిగి ఉంటాడని చెప్తూ , పురుషుడు తన భార్య బిడ్డలతో తన గ్రామాన్ని ప్రపంచంగా భావిస్తూ ఉంటాడు,  ఒకే గ్రామంలో ఉన్న వారి మధ్య అసత్యం అనేది అసలు లేదు, రచ్చబండవద్ద రావి చెట్టువద్దనో, గంగాజలం మీదనో  ప్రమాణం చేయడం వాళ్లకిఅలవాటు. భారతీయుల ముక్కుసూటితనం,  నిజాయితీగా  ఎదగడంకోసం న్యాయసమ్మతం కాని సంపాదనను తిరస్కరించడం, న్యాయంకోసం పాకులాడ్డం అనేది ముఖ్యంగా కనిపిస్తాయి. మార్కుపోలోఅన్నట్లు భారతీయులు దేనికోసమైనా సరే అసత్యం చెప్పరని, అనేకమందివిదేశీయాత్రికులు, పాలకులు, సందర్శకులు భారతీయుల సత్యవాదత్వం గురించి చేసినటువంటి వివరాల్ని ముల్లర్ వివరిస్తాడు.సత్యనిరూపణకు నాటి కాలంలో పాటించిన అంశాలను, రామాయణంలో రాముడు తన తండ్రికి  ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పధ్నాలుగేళ్లు ఏళ్ళు వనవాసం చేయడం,రాముడు,జాబాలీకి మధ్య జరిగిన సంభాషణ, కఠోపనిషదులోని యమ నచీకేతుల  సంభాషణలను వివరిస్తూ  ఇవన్నీ భారతీయులకు  సత్యంమీద ఉన్నటువంటి పట్టుదల తెలియజేస్తుందంటాడు.అలాగే సత్యం  పలకడంలోని  ఔచిత్యాన్ని మహాభారతంలోని కౌశిక కథని ఉదహిరిస్తూ  వేయి అశ్వమేధయా యాగాలుచేసినా  సత్యమే వాటన్నిటి పైన నిలబడుతుందిఅని భారతం  చెప్పిన మాట,  ఏదైతే నిన్ను బాధిస్తుందో అది నువ్వు ఇతరులకు ఎప్పుడూ చేయకు అని  యాజ్ఞవల్క్యుడుచెప్పిన మాట, ప్రతి మనిషిలోనే అంతరాత్మ అంటూ ఉంటుందని అంతరాత్మనేఆ మనిషి యొక్క మంచి చెడుల్ని గమనిస్తూ సాక్షిగా ఉంటుందన్నభారతీయుల నమ్మకాన్ని తెలియజేస్తాడు. సత్యం పట్ల భారతీయులకు ఉన్న భావనల్ని జేమ్స్  మిల్ పుస్తకంలో అభ్యంతరకరంగా పేర్కొన్నదనీ అటువంటి అభిప్రాయాలతో  మీరు అక్కడ ఉన్నప్పుడు పని చేయలేరని భోధిస్తాడు. ఇలాహిందువుల స్వభావం, నైతికత గురించి చెప్పే క్రమంలో ముల్లర్ సునిశితమైన అధ్యయనాన్ని చూపించే ఒక వాక్యాన్ని వాడడం ఆశ్చర్యం అనిపించింది,అన్నం  ఉడికినదని చెప్పడానికి కొన్ని మెతుకుల్ని పరీక్షిస్తే సరిపోతుంది అనిమనం  అంటాం కదా ఆ మాటనే వాడుతాడుముల్లర్. 

మూడవ ఉపన్యాసం సంస్కృతభాష,సాహిత్యంపట్ల మానవాభిలాష. కేవలం సామాన్యజనులతో వ్యవహార నడపడానికి హిందుస్తానీ,తమిళ్లాంటి భాషలు నేర్చుకుంటే సరిపోతుంది కానీ భారతీయుల మతము,పురాణాలు,తత్వం అర్థం చేసుకోవడానికి సంస్కృత భాషనేర్చవకోవడం అవసరం అనీ,  ప్రతి సివిల్ సర్వెంట్ సంస్కృత భాష నేర్చుకోవడంనే నేను ప్రోత్సహిస్తానని చెప్పుకున్నాడు.సంస్కృతం నేర్చుకుంటే ఏమొస్తుంది, భారతీయులే తమ పురాతన భాష,సాహిత్యాల నేర్చుకోవడానికి సిగ్గుపడుతుంటే మనమెందుకు నేర్చుకోవాలి అని అనుమానం మీకు వస్తుంది. సంస్కృతం మృత భాషగా ఉన్నది నిజమే,బౌద్ధం విస్తరించిన  అశోకుని కాలంలో అనేక శాసనాలు,  ఆ తదనంతరం అన్ని ప్రాంతీయ రాజ్యాలు స్థానిక భాషలో తమ పరిపాలన కొనసాగించాయనేది నిజం.కనుక బౌద్ధ కాలం నుంచే సంస్కృతంప్రభావం తగ్గిందని  చెప్పవచ్చు.  అయితే గ్రీకు,లాటిన్ భాషలను  వారి వారి దేశాల్లో అర్థం చేసుకోవడంకన్నా భారతీయులు సంస్కృతాన్నిబాగా  అర్థం చేసుకోగలుగుతారు. కలకత్తాలో విద్యోదయ, బాంబే నుంచి షడ్ దర్శన చింతనిక వంటివి సంస్కృత భాషలో వెలువడే మ్యాగజైన్స్, ప్రయాగ నుంచి దయానంద సరస్వతి సంస్కృత  పుస్తకాలను హిందీలోకి అనువదించే ప్రయత్నం చేశారు.  భారతదేశంలో బెంగాలీ, మరాఠీ, హిందీవంటి భాషలలో వెలువడే వివిధ మాగజైన్స్లో సంస్కృత వ్యాసాలూ  వెలువడుతున్నాయి. బుద్ధుని కాలంలో ప్రజల భాషలో వ్యవహారాలు కొనసాగించినప్పటికీ అధికారిక పత్రాలు, శాసనాలు సంస్కృతంలోనే వెలువడ్డాయి. ఈ అంశాలను మీరు గమనించాలని యువ అధికారులకు ఉద్భోద చేస్తాడు.

నాటి ఈస్ట్ఇండియా కంపెనీ, బ్రిటీష్ భారతప్రభుత్వం, భారతదేశంలో కొంతమంది స్థానిక మరియు ఇతర యూరోపియన్కుచెందిన సంస్కృత పరిశోధకులను, సంస్కృత మూలగ్రంథలను సేకరించి వాటిని పరిష్కరించాలని కోరినప్పుడుఅవి దాదాపు పదివేలవరకు దొరికాయి. యూరోప్లో సాంస్కృతిక పునరుజ్జీవనకాలంలో చర్చించబడిన భారతీయ సంస్కృత గ్రంథాలు, నాటకాలు,  చరిత్రలవంటివి  సంస్కృతం అందించే జ్ఞానంఎంత గొప్పదో గుర్తించాయనీ చెప్తూ జనసామాన్యంలోసంస్కృతానికి  సంబంధించిన కొన్ని ముఖ్యమైన పలుకుబడులనుపరిచయం చేస్తాడు.అవి,  అందరూ ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే ఎందుకు మూర్ఖులు ఒకరు ఒకరు గాయపరచుకుంటారు, బీదవాడే ఆకలి రుచి ఎరిగిన వాడు,  మన శరీరము సముద్రం మీద నురగ వంటిది మన జీవితం పక్షి,  మనం ఎవరినైతే ప్రేమించామో  వారు ఎప్పుడు శాశ్వతంగా ఉండరు, ఇల్లు భార్య పిల్లలు సంపద ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది , అవి మనకు చెందినవి కావు,  మనకు చెందినవి  మనం చేసుకున్న పాపపుణ్యాలే, మనిషి పాతవస్రం విడిచి కొత్త వస్త్రం వేసుకున్నట్టు మన ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరానికి వెళ్తుంది, ఆత్మను నిప్పు కాల్చలేదు నీరు ముంచలేదు గాలి ఆర్పలేదు, తన గురించి తాను తెలుసుకోవడం కన్నా గొప్ప జ్ఞానం ఏదీ లేదు, జ్ఞాని అంటే తన గురించి తాను తెలుసుకునే వాడే వంటి  ఎన్నో పలుకుబడులని పేర్కొంటాడు.మానవ వికాసం భాషలో ప్రతిఫలిస్తుందని ముల్లర్ భావన. 

నాలుగవ  ఉపన్యాసం వేద సంస్కృతి ప్రత్యేకమైనదాఅనే ప్రశ్నతో మొదలౌతుంది. కవితాత్మకంగావెల్లడించబడిన వేదం, వేదసంస్కృతి కేవలం పరిశోధకుల కోసమే కాకుండా అందరికోసం  పరిరక్షించవలసినటువంటి గొప్పవిషయమని,  ఒకవైపుఆదిమంగానూ, సహజంగానూ, సాధారణంగానే ఉన్నట్టు అనిపించినా ఎంతో ఆధునికమైనసమస్యలని కూడా వేదం  చర్చిస్తుందనీ, వేదాలను కనుగొనకముందు మానవభావనకు  చరిత్రలేదని చెప్పడం అతిశయోక్తి కాదనీ, గ్రీకు,  ఇటలీ పర్షియా, బాబిలోనియావంటి సంస్కృతులను  వేదసంస్కృతితో  పోల్చి వేదసంస్కృతిప్రత్యేకతలను తెలియజేస్తాడు.

ఐదవఉపన్యాసం వేదంలో పేర్కొన్న ఆరాధనలగురించి ఉంటుంది. భారతీయుల బహుదేవతారాధన ఏ విధంగా ఇతర సంస్కృతుల బహుదేవతారాధన విధానాలకు భిన్నమైనదో అర్థమయ్యేలాగా వివరిస్తాడు.ముల్లర్ దృష్టిలో భారతీయులు నిజమైన బహుదేవతారాధకులు కాదు, ఒకే శక్తిని  అనేక రూపాలలో కొలిచేవారు. ప్రకృతిలో కనిపించిన ఒక్కో శక్తికి ఒక్కో పేరు పెడుతూ వెళ్లారుతప్పఅదినిజమైన బహుదేవతారాధన కాదు.ముల్లర్ ఇక్కడ హేనోథీసం అనే  సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వివరిస్తాడు.  ముల్లర్ మాటల్లో చెప్పాలంటే “monotheism in principle and polytheism in fact”,అంటే మూలంలో ఒకే ఈశ్వరుడే  ఉన్నా పరిస్థితులకు,ఆకాంక్షలకు తగిన రూపంలో ఆరాధించడం. ఈవివరణ ఎంతో సహేతుకంగా ఉంటుంది. వేదాలలో క్రమంగా భౌతికంనించి ఆధ్యాత్మికానికి,మానవుడినుంచి దివ్యత్వానికి చేసే ప్రయాణం ఉంటుంది. ముల్లర్ దృష్టిలో వేద కాలం యొక్క మతముప్రకృతి ఆరాధననే. వేదం పేర్కొన్న నదుల ప్రస్తావననుబట్టి వేదకాలంనాటికి భారతదేశం భౌగోళికంగా ఎంత విశాలమైందో తెలియజేయబడుతుంది.

ఆరో ఉపన్యాసంలో వేదకాలంనాటి దేవతమూర్తులకు సంబంధించి వివరాలను వివరిస్తాడు.వేద దేవతలను భూమికి, ఆకాశానికి, స్వర్గానికి చెందిన  మూడుస్తరాల్లో విభజిస్తాడు. అగ్ని,వాయు,వరుణ ఎందుకు పూజించబడినాయొ , అవి ఏవిధంగా భూమిమీద జీవించడానికి కారణం అవుతాయో చెప్తాడు. ముల్లర్ ఇంద్ర పేరుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ  ఇంద్ర అనేపేరు గ్రీకులోగాని, లాటిన్లోగాని,జర్మన్లోగానీ మరిఇంకెక్కడా కానీ కనిపించదనీ, అది కేవలం వేదంలో మాత్రమే కనిపిస్తుందని బహుశా అది ఆర్యన్ కుటుంబంనుంచి పూర్తిగా విడిపోయిన తర్వాత ఏర్పడి ఉండొచ్చును అనే భావన చెప్తాడు. ఇంద్ర ఆకాశానికి దేవుడు అలాగే పిడుగుకి పర్జన్య అన్న పేరు గురించి విస్తారంగా చర్చిస్తాడు. భూమికి ఆకాశానికి చెందిన దేవతలు కాకుండా స్వర్గ దేవతల గురించి మాట్లాడుతాడు. పర్జన్యం, వరుణ శబ్ధాలమీద ముల్లర్ చేసిన వివరణలు ఆయన  అవగాహనను, అందుకోసం చేసిన ప్రయత్నాన్ని పట్టిస్తాయి.

          ఏడవది మరియు చివరి ఉపన్యాసంలో వేదము- వేదాంతం గురించి ఉంటుంది. భాష గురించిన చర్చ వచ్చినప్పుడు భారతీయులు లిపిని ఎప్పటినుంచి వాడడం అలవాటుగా చేసుకున్నారు,  ఒకవేళ చేసుకుంటేకాలనిర్ధారణ ఏది, ఎందుకోసం  చేశారు, అసలు ఏవిధంగా ఈసంస్కృతం  ఒక పరిపూర్ణమైన భాషగా రూపొందింది తేల్చడం క్లిష్టమైన పని అని, ఇప్పటివరకుసంస్కృత భాషకు సంబంధించినటువంటి వివరాలు ఏవి దొరకలేదనీ,  క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దానికి భారతీయులకి లిపిలేదనీ మెగాస్తనిస్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావన చేస్తాడు.  అయితే భారతీయులు ప్రత్తిమీద వాణిజ్య ఒప్పందాలను రాసినవిషయాన్ని గుర్తుచేస్తాడు.అత్యధికంగా జ్ఞాపకశక్తి ఆధారంగానేవేదకాలం భాషాసాహిత్యాలు  కూర్చబడ్డాయని,  పరిరక్షించబడ్డాయని,  ఋగ్వేదం ఒక్కదాంట్లోనే దాదాపు లక్ష యాభై మూడు వేలు ఎనిమిది వందల ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయని పదివేల ఐదు వందల శ్లోకాలున్నాయని, అయితే  దీనికి ముందు యే విధంగా భాషాపరిజ్ఞానం అభివృద్ధి చెందిందని తెలుసుకోవడం చాలాకష్టమైన పని చెప్తాడు. భారతీయులువేదపరిజ్ఞానాన్ని ఏ విధంగా నేర్చుకుంటారు అన్న దానిమీద ఐ – త్సింగ్  అనే చైనా యాత్రికుడురాసి పెట్టినవివరణ ప్రకారం భారతీయులు  వ్యాకరణాన్ని ఇతర అంశాలను నేర్చుకోవడానికి చాలా పరిశ్రమ చేస్తారన్నమాట ఉటంకిస్తాడు.ఐ – త్సింగ్  చైనా నుంచి నలందాకువచ్చి ఇక్కడ మూడు ఏళ్లు ఉండి తన అనుభవాలను రాసి పెట్టాడు. విధ్యార్థులు గురువు ముఖతా నేర్చుకోవడం, అర్థాలను, వ్యాకరణాన్ని నేర్చుకోవడం వంటివి ముఖ్యమయిన అంశాలనీ, పరిపూర్ణ వేదవిద్యకు యేళ్ళ తరబడి అధ్యయనంచేయాల్సి ఉంటుందనీ ప్రతీ దశకూ  వెచ్చించే కాలాన్ని సూచిస్తూ వివరిస్తాడు.ముల్లర్ ప్రకారం వేదంలోని శ్లోకాలను గమనిస్తే అది  వారిని కవులుగాను, ఆరాధకులుగాను తత్వవేత్తలుగాను విడగొడుతుంది. ఇవన్నీ ఎంతో క్షుణ్ణంగా పరిశీలన చేస్తేగానీ భోదపడని విషయాలు. ముల్లర్ వాటిని కాబోయే అధికారులకు సహేతుకంగా వివరించే ప్రయత్నం చేస్తాడు.

ముల్లర్ ఇలా తన ఉపన్యాసాలలో నాటి భారతదేశపు పరిస్థితులలో అందుబాటులో ఉన్నమూలగ్రంథాలు  సేకరించి వాటినితాను అర్థంచేసుకున్నవిధంగా వెలువరించాడు. ఆనాటికి  భారతపరిపాలకులుగాఉన్న విదేశీయులఅపోహలను దూరంచేసి సానుకూలమైన అవగాహనను పెంపొందించి తగిన కృషి చేసేందుకు తగిన ప్రేరణను కలిగిస్తాడు. అన్నిఉపన్యాసాలలోభారతీయులసంస్కృతిపట్ల గౌరవంతోనూ,వివేచనతోనూ వివరణలు ఇస్తాడు. ఇవ్వన్నీ  తెలుసుకున్నప్పుడు ఇదివరకు తెలిసినవే అనిపించిన విషయాలు కూడా  మరింతగా స్పష్టంగా అర్థమైనట్టు  అనిపిస్తుంది.

 ముల్లర్ వేదఅనువాదాలమీద  అభిప్రాయాలమీద ఎన్నో విమర్శలుకూడా ఉన్నాయి.దానికిగల కారణాలు చూస్తే మొదటిది ఆయన ఎన్నడూ భారతదేశంలో అడుగుపెట్టలేదు, యే వేద అధ్యయన సంస్థతో సంబంధం  కలిగిలేడు.  రెండవది ముల్లర్ తన ఉపన్యాసంలోనే భారతీయులు  వేదాన్ని అభ్యసించడానికి ఎంతో కష్ట పడతారని పేర్కొన్నప్పటికీ తాను అలాటి అభ్యసన ఏదీ లేకపోయినా వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించే సాహసం చేయడం , దానిలోని వక్రీకరణ దోషాలకు వెరవకపోవడం , మూడవది అప్పటికి సరైనా చారిత్రక ఆధారాలు లేకుండా  విలియంజోన్స్ వంటివారు ప్రతిపాదించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంత  ప్రతిపాదికగా సంస్కృతభాషా సాహిత్యాలను వినియోగించుకోవడం, ఆ భావజాలన్ని వ్యాప్తి చేయడం , నాలుగవది మూలగ్రంథాలకన్నాఅదివరకే ఇతర భాషలలొ వెలువడిన సాహిత్యాలను ఆధారంగా చేసుకొని వాటిద్వారా అనువాదం చేయడం, అయిదవది తాను వెలువరించిన గ్రంథాల అర్థతాత్పర్యాలను కనీసంగానైనా యే పండితునితోనూ     సమీక్షించుకోకపోవడం వంటివి ఆయన చేసిన విలువైన కృషికి మాయని మచ్చలుగా మిగిలిపోయాయి.

ముల్లర్  వేదానువాదాలను అధ్యయనం చేశాక  ఆయా శ్లోకాలకు సరైన న్యాయం జరగలేదు అన్న విషయాన్ని పండితులు గుర్తించారు.  ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం విస్తృతంగా తన రచనల్లో వాడడం వల్ల భారతీయులను భిన్నజాతులుగా  విడగొడుతూ జాతిబేధాలకు మూలకంగా వాడుకున్నారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం నిజానికి ముల్లర్తో మొదలవలేదు ఇంతకుముందే జేమ్స్ మిల్  రాసిన హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, అలాగే నాటి న్యాయపాలన అధికారి విలియంజోన్స్, పాశ్చాత్యభాషలకి సంస్కృతానికి ఉన్న సారూప్యతలనుపోల్చి  భారతీయుల సంస్కృతానికి పాశ్చాత్యమూలాలు ఉన్నట్టు ప్రకటించడం జరిగింది.  దానిని  ముల్లరు విస్తృతంగా ప్రచారం చేశాడు అనడానికి ఆయన రచనల్లో పేర్కొన్న అంశాలే కారణం.ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పుస్తకంలోకూడా అనేకచోట్ల ఆర్యులప్రస్థావన వస్తుంది.అదికూడా ఆర్యులు అనేవారు ఒకజాతిగా వేరేచోటనుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడున్న స్థానికుల మీద దాడి చేసి వారిని జయించి స్థిరపడ్డారని అందుచేత పాశ్చాత్యభాషలకి ఇక్కడ ఉన్న సంస్కృతానికి సంబంధం ఉందని చెప్పడం..అయితే ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం మహంజదారో హరప్పాలాంటి ప్రాంతాల్లో దొరికిన చారిత్రక విశేషాలను బట్టి ఇది దండయాత్ర అయ్యే అవకాశం  లేదని తేలింది కనుక ముల్లర్ కాలంలోనే ఈ సిద్ధాంతంకాస్తా ఆర్యుల వలస సిద్ధాంతంగా మార్చబడింది. ప్రస్తుతం దాదాపు వందేళ్ళ తర్వాత  అనేక రకాలుగా ఆర్యులదండయాత్ర, ఆర్యులవలస సిద్ధాంతాలను పరిశోధించిన మీదటఆర్యులు ఎక్కడి నుంచో రాలేదనిఆర్యులమూలవాసులసిద్ధాంతం ప్రతిపాదించబడుతున్నది.

ముల్లర్ వల్ల విస్తృతంగా ప్రచారమైన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం భారతీయ సమాజంమీద ఎంతో ప్రభావం చూపించింది.  ఇది పాశ్చాత్య పాలకుల దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని నాటి భారతీయులు గుర్తించలేకపోయారు. ప్రసిద్ధ జాతీయవాది బాలగంగాధర్ తిలక్ ఆర్యుల యురేషియా సిద్ధాంతాన్ని సమర్థించాడు,  అలాగే భారతీయ మూలాల పట్ల విశ్వాసం ఉన్న ప్రజల్ని అనుమానం కలిగే విధంగా రాహుల్ సాంకృతాయన్ ఓల్గా  టు గంగ పుస్తకాన్ని వేశాడు.  ఒక వారే కాదు ఎంతోమంది ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అస్థిత్వవాద ఉద్యమాలకు  ప్రధానభూమికగా మలుచుకున్నారు. అయితే అంబేద్కర్ ఈ ఆర్యులదండయాత్ర సిద్ధాంతాన్ని అంగీకరించలేదు,ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చే అవకాశం లేదని ఇది తప్పని ఆయన ఆనాడే ప్రగాడంగా  విశ్వసించారు అంతే కాదు క్రైస్తవ మిషనరీల దురుద్దేశ స్వభావాన్ని కనిపెట్టినట్టుగా తన శవం కూడా క్రైస్తవంలో చేరదని ప్రకటించాడు. నాటి అంబేద్కర్ అంచనా వేసినట్లుగానేప్రస్తుతం  జరిపిన అన్వేషణలు పురాతత్వ పరిశోధనలు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి తగిన ఆధారాలు లేవని ఇది కట్టుకథని భారతీయులనుపరిపాలించడంకోసం చేసిన ప్రయత్నం అని తేల్చాయి. ఈ అంశాలను బలపరచిన ఆధారాల్లో  ముల్లర్  స్నేహితులకు, భార్యకు రాసిన లేఖల్లో ఆయన పేర్కొన్న అంశాలే. ఇక్కడ మరొక అంశంవిదేశీయుల్లో  సంస్కృతం భాషను ఎక్కువగా నేర్చుకున్నది జర్మన్లు మాత్రమే ఇతర దేశాలతో పోలిస్తే జర్మన్లు, బ్రిటిష్ వారు దీని కోసం ఎక్కువ పని చేశారు. జర్మన్ యొక్క అస్థిత్వ మూలాలను స్థిరపరచడానికే బ్రిటిష్వారు  జర్మన్లనుసంస్కృత అధ్యయనానికి ప్రోత్సహించారనితెలుస్తుంది. అదెలా ఉన్నా ఈ సిద్ధాంతం మిగిల్చిన  భారతీయ జన విభజన అవశేషాలు ఇంకా యుద్దం చేస్తూనే ఉన్నాయి.

వేదాన్ని అభ్యసించడానికి నాటికాలంలో ఉన్న పరిమితుల దృష్ట్యా అది కొంతమందివద్దనే ఉండిపోయిందనేది సత్యం. కాలక్రమేణావచ్చిన మార్పులవల్ల చాలావరకు వేదసాహిత్యం అందుబాటులో లేకుండా పోయింది. భారతదేశంలో విదేశీపాలన తెచ్చిన మత సంకటాలు మన అస్తిత్వాన్ని మేల్కొలిపినప్పుడు మాత్రమే వేదం, వేద సంస్కృతిఅంశాలు జనసామాన్యంలోకి వచ్చాయి. వేదం నాటి నుంచి నేటివరకు సంస్కృతంలోనే ఉంది, దాన్ని స్థానికభాషలలోకి తెచ్చి అందరికీ అర్థం అయ్యేలా చేయడంలో మన ప్రయత్నం  ఇప్పటికీ అంతంత మాత్రమే. వేదాన్ని అలా ఉంచడం  వేదానికి ఇచ్చిన  గౌరవం అయి ఉండవచ్చును కానీ ఈ రోజున యే శ్లోకంలోని యే పదానికి యే అర్థం స్పురిస్తుందో చెప్పలేని పరిస్థితి రావడం వెనుక కేవలం మన పరిమిత ప్రయత్నమే చేశామన్న విషయమూ గుర్తుంచుకోవాలి. మరొక విషయం ఏమిటంటే జీవనం, వృత్తుల ఆధారంగా విభజించి  ఉన్న మనసమాజంలో యే వృత్తికి  కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఆయా కుటుంబాల ద్వారానే  వచ్చింది గానీ నేటిలాగా అందరూ ఒకే తరహా విధ్యాభ్యాసం చేయడమన్నది లేదు కనుక  వేద జ్ఞానం పొందడంలో ఈ సామాజిక పరిమితి ఉండడం వల్లకూడా వేదానురక్తి పరిధి కుదించుకుపోయింది.తెలుగుభాష విషయానికివస్తే నన్నయ్యకాలానికి మహాభారతం తెలుగుచేయడం మొదలయింది కానీ నిన్నమొన్నటి దాశరథి రంగాచార్యుల  వేదాల సరళఅనువాదంవరకు యే ప్రయత్నం జరగలేదన్నది వాస్తవం. హిందీలో ఈ ప్రయత్నం స్వామీ దయానంద సరస్వతి చేశారు. ఈ మధ్య కాలంలో వివిధ భాష్యకారుల సాహిత్యాన్ని వేదపరిరక్షణ సంఘాలు, గీతాప్రెస్ వంటి ధర్మప్రచారకసంస్థలు ప్రచురించడం వినా వేదం మన పురాసాహిత్యమని దాన్ని కాపాడుకోవడం మన విధ్యుక్త ధర్మం అని  జనసామాన్యం భావించలేదు, విశ్వ విద్యాలయాలు పూనుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలావరకు మూలగ్రంథాలను సేకరించినదుకు, దాన్ని పరిరక్షించినందుకు  తమ జీవితాలను ధారపోసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేయవల్సిందే. లేకపోతే నలందా గ్రంథభాండాగారం భస్మమైనట్లు ఇవన్నీ చెల్లాచెదురయ్యే ప్రమాదమూలేకపోలేదు. ముల్లర్ ద్వారా  ఇంగ్లీష్ భాషలోకి అనువాదం పొందిన వేదాలు ప్రపంచవ్యాప్తంగా తాత్వికులకు కొత్త భావనలిచ్చాయనడంలో సందేహం లేదు. మొన్నటికిమొన్న యునెస్కో ఋగ్వేదాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇలాటి సందర్భంలో పాశ్చాత్యుల అనువాదంలోని తప్పుడు అర్థాలను సవరించి సరైన భాష్యాన్ని నిర్వచించి అందరికీ మన పురావారసత్వ సంపదను అందించవల్సిన బాధ్యత మనమీద ఉంది. 

   ప్రజలున్న చోట ప్రభుత్వం ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ఉన్నచోట దానికో తత్వమూ ఉండాల్సి  ఉంటుంది. ప్రజలూ ప్రభుత్వం ఒకే మూలానికి చెందిన వారైతే శ్రమ  విభజన (division of labour) ఒక అవసరం, ప్రజలూ ప్రభుత్వం  వేరు వేరు మూలాలకు చెందిన వారైతే విభజించి పాలించు (divideandrule)ఒక ఎత్తుగడ.మొదటి వాక్యం అనాదిగా మన  గ్రామవ్యవస్థ పునాది, రెండో వాక్యం గత మూడు  వందల ఏళ్ల  దేశచరిత్ర నేర్పిన  గుణపాఠం.  విభజించి పాలించడానికి హేతువు కావాలి.  అటువంటి  హేతువుల అన్వేషణలో జీవితాల్ని ధారపోసిన  ఎంతోమంది  విదేశీయుల్లో ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ ఒకరు.  ముల్లర్ చరిత్రను ఎందుకు అధ్యయనం చేయాలో చెప్తూ ప్రతితరము తన ప్రయాణాన్ని ఒకే బిందువు దగ్గర మొదలు పెట్టకూడదని ఒకే చోటతవ్వుతూ ఉండకుండా ముందున్న తరాలనుంచిప్రయోజనం  పొందుతూ ఇంకా ముందు బిందువులనికలుపుతూ సామూహికలక్ష్యాలనిచేరుకోవడానికి చరిత్రచదవాలని సూచిస్తాడు. ముల్లర్చెప్పినట్లుగా మన ముందుతరాలుమన చరిత్రను  మొదలుపెట్టినచోటనుంచే  మొదలుపెట్టకుండాసహేతుక అధ్యయనంతో అవసరమున్న చోట సరిచేసుకొని మన అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలసిన చారిత్రక సందర్భం ఇది. అది గుర్తుచేయడమే ఈ దర్శనోధ్యేశ్యం.

July 24, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆడియో విజువల్ హెరిటేజ్

by రంగరాజు పద్మజ July 20, 2024
written by రంగరాజు పద్మజ

యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్

       మన సంస్కృతీ పరంపరను దృశ్య శ్రవణ మాధ్యమాల్లో భద్రపరిచి వాటిని ప్రదర్శించడం ద్వారా రాబోయే తరాలకు మన వారసత్వ సంపదను అందజేయ చేయవచ్చు. దీనిలో పూర్వ సాహిత్యమే కావచ్చును, చారిత్రక కట్టడాలు కావచ్చును, మంచి శిల్పకళా నైపుణ్యం ఉన్న దేవాలయాలు కావచ్చును, వ్యవహారాలు ప్రతిబింబించే పండుగలూ కూడా కావచ్చును, రాజులు నిర్మించిన కోటలు, బురుజులు వాటిద్వారా చరిత్రను రాబోయే తరానికి తెలుపవచ్చు! వాటి యొక్క పూర్వ వైభవాన్ని తెలుసుకోవడమే కాకుండా, వాటిని ప్రచారంలోనికి తీసుకొని రావాలని ,ప్రచార మాధ్యమాల ద్వారా తెలియజేయాలని దాని కొరకు శబ్ద( ఆడియో) చిత్రీకరణ(విజువల్) ఉపయోగించుకోవాలనేది ముఖ్య ఉద్దేశం.
   దీనిలో భాగంగా మన పూర్వ సంస్కృతి పరంపరలో భాగంగా ఈరోజు రామప్పదేవాలయం యొక్క అపూర్వతను, అద్భుతాలను రాబోయే తరాలకు దృశ్య- శ్రవణ మాధ్యమాన్ని ఉపయోగించినట్లయితే చాలా చక్కగా తరతరాలకు అందించగలము. ఎలా అంటే? విదేశాలలో నివసించే వారు కానీ దూర ప్రాంతాల్లో ఉన్న వారు కానీ తమ తమ కంప్యూటర్ ద్వారా వారికి రామప్ప ఆలయం తాము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేలా చేయవచ్చును.
1. కాల్పనిక వాస్తవికత్వము( Virtual realing).
2. అనుబంధ వాస్తవికత ( Augmented realty).
       ఈ రెంటి ద్వారా ఉపయోగం ఏ విధంగా ఉంటుంది అంటే ఉదాహరణకు రామప్ప దేవాలయంలోని ఒక స్తంభం దగ్గర నిలిచి మనం ఆ స్థంభం మీద చిత్రకళా నైపుణ్యాన్ని చూస్తున్నప్పుడు మనకు ఆడియో ప్రీ రికార్డెడ్ మెసేజ్ లతో వాటి ప్రతేకత ఆ శిల్ప కళా యొక్క ప్రత్యేకత, ఆ శిల్పాల చరిత్ర, ఆ శిల్పకారుడి ఉద్దేశ్యం, దానికి ఆ కాలంనాటి సాహిత్యానికి ఉన్న సంబంధం, అది ఏ శతాబ్దానికి చెందిన కట్టడం, అది ఎవరిచే నిర్మించబడింది ఇలా అన్ని వివరాలు ఈ వీడియో ఆడియో ల ద్వారా తెలుసుకొనవచ్చు.
   ఇందులో ఎవరికీ అర్థమయ్యే భాష ద్వారా వారు వినే సదుపాయం కూడా కల్పించవచ్చు. ఈ ఆడియోలు నిపుణులచే తయారు చేస్తారు కాబట్టి తప్పుడు సమాచారం అందే అవకాశం ఉండదు.
ఉదాహరణకు రామప్ప దేవాలయం చూడాలని ఎవరైనా అంతర్జాతీయ యాత్రికుడు వచ్చినప్పుడు శిక్షణ పొందిన గైడు లేనట్లయితే, ఉపాధి దృష్ట్యా వృత్తి గా తీసుకున్న ఎవరైనా గైడ్ వారికి చరిత్ర అంశాలు కానీ, కట్టడం యొక్క ప్రశస్తి కానీ, ఆయా కట్టడాలు నిర్మించిన కాలం అవగాహన లేకపోవడం గానీ, ఆగైడుకు శిల్పకళా రీతులు తెలియకపోతే… యాత్రీకులకు తప్పుడు సమాచారం అందుతుంది. అలా కాకుండా ముందే సమాచారం రికార్డు చేసి ఉండడం వల్ల సరియైన సమాచారం యాత్రికులకు అందడమే కాకుండా, ప్రతి చిన్న అంశాన్ని ప్రతి ఒక్కరు కూలంకషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది… ఇది శాశ్వతంగా కూడా ఉంటుంది. అంతే కాదు సమయము కూడా వృధా కాకుండా ఉంటుంది. కాబట్టి రాబోయే తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను చరిత్ర పరంపరగా అందించ వచ్చును.
అనుబంధ వాస్తవికత ( Augmented realty)
కాల్పనిక వాస్తవికతత్వం ( Virtual realing) వీటికి .ధ్వని తోడ్పాటు( sound effects) ను జత చేస్తే, అనగా వీడియోను చిత్రీకరించిన అప్పుడు సన్నివేశంలో ధ్వనితో మరింత ఆసక్తికరంగా విశేషాలను తెలుపవచ్చు. ప్రత్యేక ధ్వనులతో పాత కాలం నాటి పరిస్థితులు దేవాలయం కానీ ఇతర యాత్రా విశేషాలును కానీ సహజ స్థితిని అంటే పవిత్ర భావం కలిగించే అనుభూతిని ఇవ్వవచ్చు. మాటలు లేదా కామెంటరీకి ధ్వని తోడ్పాటు బాగా రక్తి కట్టిస్తుంది.

రేడియో;- మన పరంపరలో దృశ్య శ్రవణకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొలినాళ్ళనుండి సామాన్యజనానికి అందుబాటులో ఉండి శ్రోతలు ఎక్కువ కలిగి ఉన్నది రేడియో. దూరదర్శన్ లు వచ్చిన కూడా ప్రయాణంలోనూ కార్లలో బస్సులలో,, చరవాణి లోనూ ట్రాన్సిస్టర్లు ద్వారా మొబిలిటీ ఉన్నది రేడియో కావడం వల్ల దీని ద్వారా సంస్కృతీ పరంపరను రాబోయే తరాలకు అందించేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. ఇది వరకే ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించిందని చెప్పాలి.
టెలివిజన్:– టెలివిజన్ ద్వారా కూడా మన పరంపరాగతమైన అనేక విషయాలు భద్రపరచడంలోనూ , తెలియ చెప్పడంలోనూ ఆడియో వీడియో హెరిటేజ్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నది… పడుతుంది కూడా! ఇందులో Virtual reality ( కాల్పనిక వాస్తవికత్వం, Augmented realty ( అనుబంధ వాస్తవికత అను సాంకేతికత ఉపయోగించి ప్రతి చిన్న అంశాన్ని విస్తృతంగా చూపెట్ట వచ్చు. సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను ఆడియో ద్వారా వినిపించవచ్చు. దీనికి సరి అయిన నిపుణులే (టెక్నీషియన్లు) కాకుండా చరిత్రను పరిశోధన చేసిన వారితో స్క్రిప్ట్ వ్రాయించి చాలా బాగా విశ్లేషణ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆ ప్రదేశం సందర్శించాలని కోరిక కలిగేటట్టు చేయడంతో యాత్రికులు (Tourists) పెరగడంతో టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుంది.
అట్లాగే మన సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కూడా చేసిన వాళ్లం అవుతాము. అనుబంధ వాస్తవికత ద్వారా వీడియోలు నెటిజన్లు వారి వారి లాప్ టాప్ లోనూ చూస్తూ కూడా ఏదైతే చూస్తున్నారు ఆ ప్రదేశాన్ని దగ్గర నుండి చూసిన అనుభూతిని పొందుతారు. మనం పరంపరలో భాగంగా ఈరోజు రామప్ప దేవాలయం దర్శిద్దాం! అంతకన్నా ముందు ఈ రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయుల గురించి విహంగవీక్షణంగా తెలుసుకుందాం!           కాకతీయులు:- 350 సంవత్సరాల పాటు ఓరుగల్లు లేదా నేటివరంగల్ ను రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాకతీయుల చాలా ప్రసిద్ధి పొందిన వంశం. అనగా క్రీ.శ. 1083- 1323 వరకు వీరి సేనానులు రాష్ట్రకూటులు శాతవాహనుల తర్వాత తెలుగు జాతినిసమైక్యంగా చేసి ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన హిందూ వంశీయులు కాకతీయులు.
కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరిసంపదలతో తులతూగుతున్నట్టు అమీర్ ఖుస్రూ , మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తున్నది. తెలుగువారికి ముఖ్య వృత్తి వ్యవసాయం అయితే అప్పటి వరకు వర్షాధారం గానే వ్యవసాయం చేసేవారు. కానీ కాకతీయ రాజులు, రాణులు, సామంతులు పెద్ద పెద్ద చెరువులు కాల్వలు తవ్వించి నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. అందులో” రామప్ప చెరువు” కేసరి సముద్రం”, “పాకాల చెరువు”, “కాట సముద్రం”” చౌడ సముద్రం”, జగత్ కేసరి సముద్రం మొదలైనవి నీటి వనరులు.
  కాకతీయ చక్రవర్తులు లలితకళలు సాహిత్యం ఈ పెంచి పోషించారు. వీరికాలంలో నాట్యకళ ఎంతో ప్రసిద్ధి పొందింది. నాట్యం చేసే నర్తకీమణులకు, మృదంగ విద్వాంసులులకు ఇండ్లు కట్టించి ఇచ్చారట. చేబ్రోలు శాసనంలో కాకతి గణపతి దేవుడు నృత్తరత్నావళి రచయిత జాయపసేనాని 16 మందిని గృహ దానాలు చేసినట్లు రాశాడు.
       శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాల్లో నాట్య సంప్రదాయాలను పోలిన చాలా నాట్యశిల్పాలు ఉన్నాయి. చాలా దేవాలయాలు తురుష్కుల దండయాత్రలతో ధ్వంసమై పోయాయి. వారసత్వానికి అనగా హెరిటేజ్ కు నిదర్శనంగా సాహిత్యం, నాట్యం, శిల్పకళ, చిత్రకళ మొదలైన అన్ని రంగాలలోనూ కాకతీయులు తమదైన శైలిని చాటి చెప్పారు. సంస్కృతి సాహితీ సంపద శిల్ప కళారీతులు లలితకళలు ఈ రోజుకు కూడా చెక్కుచెదరకుండాఉన్నాయి. భారతదేశంలో ఉన్న అద్భుత శిల్ప రీతుల్లో కాకతీయ శిల్పరీతికి ఒకటి. దేవాలయాలలోని స్తంభాల నిర్మాణ పద్ధతి, వాటిని నిలబెట్టిన విధానం, గర్భాలయ ముఖద్వారాలు బట్టి అవి కాకతీయులు కట్టించారో లేదో చెప్పవచ్చు! కాకతీయుల శిల్పరీతి హోయసల శిల్పరీతి వలేఉంటుంది. ఈ రామప్ప దేవాలయం నిర్మాణానికి ముందే బేలూరు, హలేబీడు, సోమనాథపురాలలో దేవాలయాలు దాదాపు రెండు వందల సంవత్సరాలకు ముందే నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. ఈ దేవాలయం మీద కనిపించే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటి శిల్పాలు కాకతీయ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే హోయసల  శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కనిపిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటవైపునే తమ నేర్పరితనాన్ని చూపెట్టారు. కానీ కాకతీయుల శిల్పులు లోపలి భాగాలలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. హోయసల ఆలయాలపై కన్పించేవి దేవతామూర్తులు కాగా…. కాకతీయుల ఆలయాలపై కనిపించేవి ఆ నాటి సామాన్య స్త్రీ పురుషులవి. ఆనాటి సామాన్యుల వేషధారణ, హావభావాలను చెప్పించడం ఒక కాకతీయ రాజులు చేశారు.
రుద్రేశ్వరాలయాన్ని రుద్రసేనాని శ్రీముఖ నామ సంవత్సరం 1135 క్రీస్తుశకం 30-3 -1213లో నిర్మించినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.
రామప్ప ఆలయ విశేషాలు:- శ్రీ రుద్రేశ్వర ఆలయంలోనికి ప్రవేశించగానే ఈశాన్యభాగంలో రుద్రసేనాని వేయించిన శాసనం కనిపిస్తుంది. అందులో రుద్రసేనాని వంశవర్ణనం, అతనిపూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి, పరాక్రమాలు, ఆనాటి ఓరుగల్లు పూర్వవైభవం వర్ణింప బడి ఉన్నాయి. ఆలయానికి తూర్పు ,దక్షిణ, ఉత్తర దిశలో మూడు ద్వారాలున్నాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా నందివిగ్రహం అత్యంత నేర్పరితనంతో చెక్కిన విగ్రహం. అంటే ఏ దిక్కు నుండి ఆ నందిని చూసిన ఆ నంది మన వైపే చూస్తున్నట్టు కనపడుతుంది. మంచి చెక్కడాలతో ఉంది.
మదనిక శిల్పాలు:– ఆలయంలో బయట వైపున స్తంభాలను పైకప్పులను కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహర శిల్పాలే మదనికలు. ఇవి ఆనాటి సామాన్య స్త్రీలవి. మదనిక శిల్పాలను వస్త్రాల కంటే ఆభరణాలతోనే అందంగా రూపొందించారు. అందులోనూ అప్పటి స్త్రీలు ధరించే హారాలు శిరోభూషణాలను పొందుపరచారు. ఒక్కో శిల్పం ఒక్కో విశేషంగా కనిపిస్తుంది. ఆనాటి జీవన సౌభాగ్యానికి ఆ శిల్పాలు నిదర్శనాలు. ఒక మదనిక చీరను ఒక కోతిలాగి వేస్తుంటే… మరొక చేత్తో మానసంరక్షణ చేసుకుంటూ… రెండవచేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్టు ఉన్నా శిల్పంలో ముఖ కవళికలు పరమాద్భుతంగా ఉంటుంది. మరొక మదనిక పాదంలో ముల్లు గుచ్చుకోగా ఆ పాదం మీద ఏర్పడిన వాపును కూడా చక్కగా చెక్కిన చూపెట్టిన నేర్పరితనం ఆనాటి శిల్పులది.
రంగమంటపం;-
గర్భాలయానికి ముందున్న రంగమంటపం నిర్మించిన తీరు అద్భుతంగా ఉంది. నాలుగు స్తంభాల మీద చెక్కిన శిల్పాలు చాలా అందంగా కనిపిస్తాయి. స్తంభం పైభాగాన్ని సంగడి పట్టినట్లు చెక్కారు. స్తంభాల మధ్యలో చతురస్రాకార ఫలకాల మీద గుండ్రంగా ఉన్న భాగాల పైన వాటికి తగినట్లుగా శిల్పాలను చెక్కారు శిల్పులు.
  ఒకదానిమీద సముద్ర మధనం, మారో దాని మీద ముగ్గురు స్త్రీలకు నాలుగు కాళ్లు ఉన్న శిల్పం, మరొక స్తంభం మీద పేరిణి నాట్యం, ఇంకో స్తంభం మీద దండ లాస్యం, కుండలాకార నృత్యం, ఇంకొక స్తంభం మీద స్త్రీలే మధ్యలో వాయిస్తుండగా మరొక స్త్రీ నాట్యం చేస్తున్నట్టు చెక్కినట్టున్న అద్భుత చిత్రాలున్న స్తంభాలు బాగుంటాయి.
గర్భాలయ ముఖ ద్వారం:-
ఆలయంలో ప్రధాన ద్వారం మీద చెరుకుగడలు, అరటి బోదలు, మధ్య బాణాలు ధరించి రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళ ఉట్టిపడుతూ ఉన్నట్టుగా చెక్కారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయి నుండి లోహపు శబ్దం రావడం మరొక విశేషం. వాటి పైభాగాన సింహాల వరసలు లతలు వాద్యకారుల చిత్రాలు అందంగా చెక్కారు.
       శ్రీ రుద్రేశ్వర మహాలింగం:- గర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీ రుద్రేశ్వర మహాలింగం చాలా పెద్దది. పానవట్టంలోనే కాకుండా కింది భాగంలోనూ చెక్కిన సన్నని గీతలు శిల్పుల పుణ్యాన్ని తెలియజేస్తుంది.
దశ భుజ రుద్రుడు:-
రంగ మండపం మధ్యభాగంలో ఉన్న పైకప్పులో దశభుజుడైన నాట్యరుద్రుడు అందంగా చెక్కబడి ఉన్నాడు. ఇలాంటి శిల్పమే హన్మకొండలోని రుద్రేశ్వర ఆలయంలోని ( వేయిస్తంభాల గుడి) లోనూ ఉన్నది.
  శైవమతాన్ని బాగా పాటించిన కాకతీయులు వైదిక రుద్రుని ఆరాధించారు అనడానికి రుద్రదేవ మహారాజు, రుద్రమదేవి, ప్రతాప కుమార రుద్రదేవ మహారాజు అన్న వారి పేర్లలో కనిపించే రుద్ర శబ్దమే తార్కాణం. ఆ దశభుజ రుద్రునికి కుడివైపున ఉన్న ఐదు చేతులలోనూ శూలం, వజ్రాయుధం, ఖడ్గం, పరుశువు, అభయముద్రలున్నాయి. అలాగే ఎడమ వైపు ఉన్న ఐదు చేతులలోనూ నాగం, పాశం,గంట, అగ్ని, అంకుశాలున్నాయి.
‌      కావ్యాలలోని ప్రకరణాల వర్ణనల ఆధారంగా శిల్పులు తమ శిల్పాలను చెక్కారని అనిపిస్తుంది. ప్రతాపరుద్రుని సమకాలికుడైన పాల్కుర్కి సోమనాథుని” పండితారాధ్య చరిత్ర” వాద ప్రకరణంలో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కనిపిస్తుంది. ఆ దశభుజరుద్రునికి చుట్టూ అష్ట దిక్పాలకులు భార్యాసమేతులై, తమతమ వాహనాల మీద కొలువుతీరి ఉన్నారు. ఆ రంగమంటపం చుట్టూ ఉన్న నాలుగు అడ్డ దూలాల మీద సముద్ర మధనం, త్రిపురాసుర, గజాసుర సంహారం, వరాహ మూర్తి, నాట్య గణపతి, కృత్య మొదలైన రూపాలను శిల్పులు ఎంతో అందంగా చెక్కారు. ముఖ్యంగా గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మహాద్భుతం!రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పు లో రకరకాల పద్మాలు, రాతి చక్రాలను చెక్కారు.
ప్రదక్షిణ పథం:-
ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షణ పథం ఉన్నది. దాని మీద నడుస్తుంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కనిపిస్తాయి. వాటిలో శృంగార క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవ మూర్తులు మొదలైన శిల్పవిశేషాలు కనిపిస్తాయి. అవేకాక మహిషాసురమర్దని, వీరభద్రుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రుద్రేశ్వరాలయంలో పైభాగాన పెద్ద గోపురం కనిపిస్తుంది. అది వేసర శిల్ప విధానంలో నిర్మింపబడింది. ఆలయ శిఖరానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్ళలో తేలుతాయి. ప్రస్తుతం అవి దొరకడం లేదు కానీ అవి కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.
    ఇటువంటి అనేక శిల్పకళా విశేషాలతో అతి రమ్యంగా ఉన్న ఆలయం శ్రీ రుద్రేశ్వరాలయం. భారతదేశంలో గొప్ప పర్యాటక కేంద్రంగా వెలుగుతున్నది. అందరూ తప్పక దర్శించుకోవలసిన క్షేత్రం రామప్ప.
   ఈ చారిత్రక వారసత్వ సంపదను నేను ముందే మనవి చేసినట్లు ఆడియో విజువల్ హెరిటేజ్ లో భాగంగా చిత్రించి భావితరాలకు అందజేయడం అందరి కర్తవ్యం. మన సంస్కృతి పరంపరలో రామప్పను ఆ విధంగా రూపొందించాలి. కావ్యాలకు సంబంధించినవిశేషాలు జోడించాలి. అట్లాగే ఇంతకు ముందు చెప్పినట్టు స్తంభాలమీద చిత్రం చిన్నప్పుడు పేరిణీనృత్యం, పేరిణి తాండవ నృత్యం వంటి వాటిపై పునరుద్ధరించిన నటరాజరామకృష్ణగారి గురించి చెప్తూ అలాగే దేవదాసీల ప్రదర్శనలో ఎంతో పేరు పొందిన నృత్యరీతులను దేవాలయాల్లోని ప్రతిమల నాట్యభంగిమలను లక్షణం గ్రంథాలతో కలిపి అధ్యయనం చేసిన ఆంధ్ర నాట్యం గురించి వివరించాలి. దీనికోసం కృషి చేసిన వారి గురించి తెలియజేయాలి.
  విషయ వ్యక్తీకరణ చేయడానికి దృశ్య శ్రవణ మాధ్యమాలు చాలా ఉపయోగపడతాయి. వీడియోల వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఈ దేవాలయం మీద ఉన్న కొన్ని శిల్ప కళాకృతులు శిధిలావస్థకు చేరుకోబోతున్నాయి. చారిత్రక నేపథ్యమున్న ఆలయాలను ప్రభుత్వం రక్షించుకోవాలి. వీటిని గురించి ప్రచారం చేసేందుకు లఘు చిత్రాలు నిర్మించి సినిమా హాల్లో సైడ్ షో ( స్వాతంత్ర పోరాటం గురించి మొదలైనవి డాక్యుమెంటరీలు సినిమాకు ముందు ప్రదర్శించేవారు )ఆ విధంగా డాక్యుమెంటరీలు తయారుచేసి సినిమా హాల్లోనూ, యూట్యూబ్ లలో లఘు చిత్రాల ద్వారా ఆడియో రికార్డ్ ద్వారా దేవాలయం యొక్క చరిత్రను, కట్టడాల విశేషాలను శిల్పకళా నైపుణ్యం గురించి సంస్కృతి పరంపరను విస్తృతంగా ప్రచారం చేసినట్టయితే పరోక్షంగా నెటిజన్లకు అక్కడికి వెళ్లి చూడలేని యాత్రికులకు చాలా ఉపయోగపడుతుంది.

July 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

తండ్రీ…నినుద‌ల‌చి!

by Ravikanti Srinivas June 1, 2024
written by Ravikanti Srinivas

* కరీంన‌గ‌ర్‌లో ఏటా స‌మైక్య సాహితీ ఆధ్వ‌ర్యంలో విశిష్ట పుర‌స్కారాలు
* ఆద‌ర్శంగా నిలుస్తున్న స్నేహితులు

ముగ్గురు స్నేహితుల్లో చిగురించిన ఒక ఆలోచ‌న ఒక వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.
వివిధ రంగాల్లో నిష్ణాతులైన త‌మ తండ్రుల ప్ర‌తిభాపాట‌వాల‌ను ప్ర‌పంచానికి చాటుతోంది.
ఒక ఆద‌ర్శాన్ని భావిత‌రానికి అందిస్తోంది.
త‌ల్లి దండ్రుల‌ను , మూలాల‌ను ఎన్న‌టికీ మ‌రువ‌రాద‌ని సందేశం ఇస్తోంది.
ప‌లు రంగాల‌లో వినుతికెక్కిన ప్ర‌తిభామూర్తుల‌ను స‌మున్న‌తంగా స‌త్క‌రించుకుంటోంది.
ఆ ముగ్గురు శ్రీ మాడిశెట్టి గోపాల్‌, శ్రీ కేఎస్ అనంతాచార్య‌,శ్రీ  రావికంటి శ్రీ‌నివాస్‌లు.
ఆ త‌ర్వాత పెద్ద‌ప‌ల్లి అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్  శ్రీ జి.శ్యాంప్ర‌సాద్ లాల్‌, డాక్ట‌ర్ శ్రీ ర‌ఘురామ‌న్‌లు  జ‌త క‌లిశారు.  ఏటా ఈ అయిదుగురు త‌మ తండ్రుల పేరిట స‌మైక్య సాహితీ ఆధ్వ‌ర్యంలో విశిష్ట పుర‌స్కారాల‌ను అందిస్తున్నారు.
పురస్కారం అంటే అర్పించడం, ఇవ్వడం.. బహుమతి… పరమాత్మునికి పూజ తరువాత పురస్కారం చేస్తాం అంటే ఏదైనా పండు, ఫ‌లం.. వస్త్రాన్ని సమర్పించి ఆయనను ప్రసన్నం చేసుకుంటాం. పురః కర అంటే పురస్కారం. గౌరవంగా అందించడం.  ఇలాంటి అభ్యాసం మనకు పెద్దవాళ్ల నుంచి అలవ‌డుతుంది. అనూచానంగా వచ్చే  సంప్రదాయాన్ని కొనసాగించడమే సంస్కృతిలో భాగమవుతుంది. అలాంటి గొప్ప సంస్కృతిలో ఒకటి పురస్కారం. దీనినే అవార్డు అని కూడా అంటాం. ఈ ఒక నిర్దిష్ట రంగంలో పనిచేసిన వారి అద్భుతమైన కృషికి అందించే శ్రేష్టమైన గుర్తింపు పురస్కారం. అంటే ప్రతిఫలం ఆశించకుండా అందించేది. ఒక అసాధారణ సామర్ధ్యానికి, సృజనకు లేదా అత్యధిక నిబద్ధ‌తకు అందించే ప్రశంసాపూర్వక సమర్పణ. రాజుల కాలంలో కవిపండితులను, కళాకారులకు భూములు, నగదు, బంగారు ఆభరణాలు, గ్రామాలను నజరానా కింద అందించి ప్రోత్సహించారు. అనేకమంది రాజులు దీనిని అనుసరించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశంలో ప్ర‌భుత్వాలు కూడా అవార్డులు ప్ర‌క‌టిస్తున్నాయి. కళా సాహితీ సంస్థలు సైతం ఈ బాధ్య‌త‌ను భుజానికి ఎత్తుకొని నిర్వహిస్తున్నాయి. అలాంటి వాటిలో కరీంనగర్ చెందిన సమైక్య సాహితీ కూడా ఒకటి. జన్మనిచ్చిన జనకుల విశేషాలను లోకానికి జ్ఞాపకం చేస్తూ…ఆ బాటలో నడిచిన ఉన్నతశ్రేణి కవిపండితులను, కళాకారులు, అధ్యాపకులకు అందించే పురస్కారాలే సమైక్య సాహితీ విశిష్ట పురస్కారాలు.
2017 నుంచి ఏటా ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. కోవిడ్ కార‌ణంగా 2020, 2021ల‌లో ఈ కార్య‌క్ర‌మాలు జ‌రగ‌లేదు.  శాలువా, మెమెంటోల‌తో స‌త్క‌రించ‌డ‌మే కాకుండా క్యాష్ అవార్డును కూడా ఇస్తున్నారు. ఈ సంవ‌త్స‌రం జూన్ చివ‌రి వారంలో ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం క‌రీంన‌గ‌ర్‌లో జ‌ర‌గనుంది.
(ఒక్క 2019లో మాత్రం తుమ్మ‌ల రంగ‌స్థ‌ల పుర‌స్కారాన్నికూడా ఇదే వేదిక నుంచి  ర‌చ‌యిత‌, నాట‌క క‌ళాకారుడు శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ కు ప్ర‌దానం చేశారు)

క‌ల‌కుంట్ల సంప‌త్‌కుమారాచార్య సంగీత పుర‌స్కారం

కరీంనగర్‌కు చెందిన శ్రీ‌ కలకుంట్ల సంపత్ కుమార్ ఆచార్యుల  వేళ్లు హార్మోనియంపై సున్నితంగా కదులుతుంటే కర్ణపేయమైన సుస్వారాలు వినిపించాయి. ఆయన  స్వరపరిచిన రాగాలు సంగీత ప్రియుల‌ను అల‌రించాయి. పరిచితరాగాలతో ప్రసిద్ధిగాంచిన సంగీతజ్ఞులు శ్రీ‌ సంపత్ కుమారాచార్యులు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. తను అడుగుపెట్టిన ప్రతి పాఠశాలలో పిల్లలు రాగాలు తీస్తుంటే విద్యాధికారులు ఆశ్చర్యపోయిన సందర్భాలెన్నో. హార్మోనియంలో ఉన్న ప్రతిభతో పాఠశాలల్లో పిల్లలచే నాటకాలు ఎన్నో ప్రదర్శింపజేశారు. భక్త ప్రహ్లాద, లవకుశ, శకుంతల,  కృష్ణరాయబారం, భక్త సిరియాలతో పాటు సాంఘిక నాటకాలను విద్యార్థులను విద్యార్థులతో ప్రదర్శింప జేశారు. రవాణా సౌకర్యం లేని రోజుల్లోనూ ఎన్నో గ్రామాల్లో నాటకాలు వేయించారు. సంగీత పరిజ్ఞానంతో పాటు తెలుగు సాహిత్యం కూడా పరిచయం ఉంది. కరీంనగర్లో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో ఆనాటి జిల్లా కలెక్టర్ తో పురస్కారం అందుకున్నారు సంగీత కళాకారుడిగా ఉపాధ్యాయుడిగానే కాకుండా ఆ రోజుల్లో పెద్దపల్లి ప్రాంతంలో ఆర్ఎంపీ గా పని చేశారు. వారి సేవలు స్ఫూర్తిగా నిలవాలని వారసుడు శ్రీ కేఎస్‌ అనంతాచార్య తండ్రి పేరిట ఏటా ఒక సంగీత  విద్వాంసునికి పుర‌స్కారం అందజేస్తున్నారు. ఈ ఏడాది సంగీత విద్వాంసుడు, తెలుగు రాష్ట్రాలలో వేలాది మందిని గాయకులుగా తీర్చి దిద్దుతున్న సంగీత గురువు శ్రీ రామాచారికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు గతంలో రాఖీ,  శ్రీ కొరిడె న‌ర‌హ‌రి, శ్రీ రామయ్య శర్మ, శ్రీ జయకుమారాచారి, శ్రీ కేబి శర్మ లకు ఈ పురస్కారం దక్కింది.

ఆచార్య రజనీ శ్రీ నాట్య పురస్కారం

 హుస్నాబాద్‌కు చెందిన ఆచార్య రజనీ శ్రీ కళా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు.  ప్రముఖ నాట్యాచార్యులుగానే కాకుండా నటుడు,దర్శకుడు,కవి, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. 1959 నుంచి 2002 వరకు సాహిత్య రంగంలో.. నాటక రంగంలో అత్యంత ప్రతిభ చాటారు. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూనే సామాజిక చైతన్యం కోసం నాటకాల‌ ప్రదర్శనలిచ్చి ప్రజాభిమానం పొందారు. కూచిపూడి, కథక్ ఆంధ్ర భరతనాట్యాలను అలవోకగా ప్రదర్శించారు. జానపద నృత్యాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సాంస్కృతిక రంగంలో నిబద్ధత కలిగిన కళాకారుడుగా ఉంటూనే అదే నిబద్ధతతో ఉపాధ్యాయ వృత్తిలో 37 ఏళ్లు పనిచేశారు. 1990లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా కలెక్టర్ నుంచి,  2000 సంవత్సరంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు అందుకున్నారు. విభిన్న రంగాలలో కృషిచేసిన రజనీ శ్రీ  స్ఫూర్తి కొనసాగాలని ఆయన తనయుడు, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా సంయుక్త పాలనాధికారి శ్రీ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ పురస్కారాన్ని అందిస్తున్నారు.తొలుత తండ్రి గురువైన డాక్టర్ మల‌య‌శ్రీ‌కి  రజనీ శ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తర్వాత ప్ర‌సిద్ధ ఆంధ్ర నాట్య కళాకారులు శ్రీ కళాకృష్ణకు, ప్రముఖ నచ్చే కళాకారులు అంజి బాబుకు, ఈ అవార్డు ఇచ్చారు. ఈ సంవత్సరం ప్రముఖ పేరిణి నృత్య కళాకారుడు ప్రకాశ్‌కు ఈ పురస్కారం ప్రకటించారు.

శ్రీ మాడిశెట్టి మల్లయ్య ఉపాధ్యాయ పురస్కారం

 విధి నిర్వహణ అనేది ప్రతి మనిషి వ్యక్తిత్వానికి అందం తీసుకొస్తుంద‌ని భావించేవారు ఉపాధ్యాయుడు శ్రీ మాడిశెట్టి మల్లయ్య. ఆట, పాట, మాటలన్నింటినీ సమన్వయం చేసుకొని విద్యార్థులకు బోధించిన అక్షర సూర్యుడాయన. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన తల్లి ప్రోత్సాహంతో చదువుకొని ఉపాధ్యాయునిగా స్థిరపడ్డారు. గణితాన్ని బోధించి గణాంకాలతో ఆటలాడించిన అధ్యాపకుడాయ‌న‌. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించి  విధులు నిర్వహించారు. వ‌చ్చునూరు గ్రామానికి చెందిన ఈయన సొంత ఊరును ఆకుపచ్చనూరుగా మార్చారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.   ఆయన తనయుడు మాడిశెట్టిగోపాల్ తండ్రి పేరిట ఏటా ఒక ఉత్తమ ఉపాధ్యాయునికి పురస్కారం అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రముఖ పాఠ్యపుస్తక రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు,  జాతీయవాది శ్రీ గాజుల రవీందర్‌కు ఈ పురస్కారం ప్రకటించారు గతంలో శ్రీ మానేటి ప్రతాపరెడ్డి, శ్రీ అవసర రాజయ్య,శ్రీ లక్ష్మీనారాయణ,  శ్రీ సువర్ణ వినాయక్ , పోరెడ్డి రంగయ్యలకు ఈ పురస్కారం దక్కింది.

శ్రీ రావికంటి రామయ్య గుప్త‌ సాహితీ పురస్కారం

తెలంగాణ సాహితీ చరిత్రలో ఆరిపోని కవివరేణ్యుడు  శ్రీ రావికంటి రామయ్య గుప్త‌.  వేద శాస్త్రాల పుట్టినిల్లుగా భావించే మంథనిలో జన్మించిన రామయ్య ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందారు. మాట‌లాడుతున్నంత తేలికగా ఆటవెల‌ది పద్యాలు రాసేవారు. ఆశువుగా అందరినీ అలరించారు. అందుకే రెడీమేడ్ పోయెట్ (ఆర్‌.ఎం.పి)గా పేరు పొందారు. అలతి అలతి పదాలతో ..హాస్య చ‌తురోక్తులతో సహజ కవిగా, ప్రజాకవిగా సాహితీ లోకంలో నిలిచారు. కల్ల‌గాదు రావికంటి మాట మ‌కుటంతో ఎన్నో పద్యాలు రాసి సామాజిక చైతన్యం తెచ్చారు. తన చుట్టూ ఉండే పరిసరాలు, సందర్భాలు, వేడుకలు జ్ఞాపకాలను ఆసరా చేసుకుని పద్య రచన చేశారు.  ఆయ‌న ఏ పద్యం పాడినా గుండెలను తాకేది. ఆయ‌న నీతి, నిజాయితీ, నిర్భీతితో శిరమెత్తి, కరమెత్తి కవిత్వాన్ని అందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ రూపొందించిన  పాఠ్య‌పుస్తకాల్లో వీరి పద్యానికి చోటు లభించింది . ఈ ఘనత సాధించిన ఆ కవికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి  మంథ‌ని సమాజం గౌరవాన్ని చాటుకుంది. వీరు రాసిన వాసవీగీత అనేక‌ కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో మారుమోగుతోంది. మంథని గౌతమేశ్వరుని స్తుతిస్తూ గౌతమేశ్వర శతకం, క‌న్యకాపరమేశ్వరి శతకం, శ్రీ వరహాల భీమన్న జీవిత చరిత్ర (బుర్రకథ), వరద గోదావరి ఉయ్యాల పాట లాంటివి ఎన్నో రాశారు. వారి వారసుడు రావికంటి శ్రీనివాస్ తండ్రి పేరున ఏటా సాహిత్య పురస్కారాన్ని  అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రముఖ ప‌ద్య‌కవి, అవధాని, పండితులు శ్రీ ముద్దు రాజయ్యకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. గతంలో శ్రీ మాడుగుల మురళీధర‌ శర్మ, శ్రీ అల్లం వీరయ్య, శ్రీ ఎం నారాయణ శర్మ, శ్రీ అవుసుల భాను ప్రకాశ్‌,  శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మలు ఈ పురస్కారం పొందారు.

డాక్టర్ శ్రీ దారం నాగభూషణం పరిశోధన పురస్కారం

 డాక్టర్ శ్రీ నాగభూషణం కరీంనగర్‌లో  పేరెన్నిక గ‌న్న వైద్యులు. సామాజిక చింతనతో ప్రజల పట్ల అమితమైన అనురాగంతో సేవ చేసేవారు.చారిత్రక అంశాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తితో తపాలా బిళ్ల‌లు, నాణేలు ఇతర రకాల వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ, దేశభక్తి , నైతిక విలువలు మూర్తీభావించిన వ్యక్తిత్వం అయినది. అవసరం ఉన్న మందులు మాత్రమే రాసి, న్యాయబద్ధమైన ఫీజు తీసుకొనే డాక్టర్ గా ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు. వారి  సామాజిక సేవలు గుర్తించి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వయో శ్రేష్ఠ సన్మాన్‌ అవార్డు ప్రకటించగా ఆనాటి భారత రాష్ట్రపతి శ్రీ‌ప్రణ‌బ్‌ ముఖర్జీ గారి చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని తీసుకున్నారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జీవన సాఫల్య పురస్కారాన్ని పొందారు. ప్రవృత్తి రీత్యా పురావస్తు సేకరణలో అగ్రగణ్యుడిగాపేరు పొందారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం,  ప్రాచీన కళ‌లు, ఆచార వ్యవహారాల ప‌ట్ల మక్కువతో ..వాటిని ప్రతిబింబింప‌జేసే  అరుదైన కళాఖండాలను, అబ్బురపరిచే వస్తువులను సొంత డబ్బులతో సేకరించి భద్రపరిచారు. తన సతీమణి పేరిట దారం సుశీల మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారి స్మారకార్థం ఆయన తనయుడు డాక్టర్ రఘురామన్ 2023 నుంచి పరిశోధన పురస్కారాన్ని అందిస్తున్నారు.తొలుత చరిత్ర పరిశోధకుడు సంకేపల్లి నాగేంద్ర శర్మకు ఈ అవార్డును ప్రధానంప్ చేశారు.ఈ సంవత్సరం తెలంగాణ నవ చరిత్ర పరిశోధకులు ధ్యావ‌న‌ప‌ల్లి సత్యనారాయణకు ఈ అవార్డు ప్రకటించారు. పురస్కారాలు..సృజనకు సోపానాలు.

-రూపావాస్‌
99088 92067

June 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అస‌లు సిస‌లు ప్ర‌జాక‌వి కీ.శే. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త‌

by Ravikanti Srinivas May 29, 2024
written by Ravikanti Srinivas

(జూన్ 17న ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా)

ఆయ‌న
అక్ష‌రంతో అల‌రిస్తాడు
అభినందిస్తాడు
అభిశంసిస్తాడు
ఆగ్ర‌హిస్తాడు
ఆలోచింపజేస్తాడు
అక్ర‌మార్కుల నిల‌దీస్తాడు
న్యాయానికి అండ‌గా నిలుస్తాడు
క‌విత్వ‌మే ఊపిరిగా జీవించాడు
శిష్యులే ప్రాణంగా భావించాడు
విలువ‌ల‌తో విద్య‌ను బోధించాడు
ఆ విలువ‌ల‌నే ఆ జ‌న్మాంతం ఆచ‌రించాడు.
స‌మాజాన్ని ప్రేమించాడు  
సంఘసేవలో తరించాడు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత
ఆయన రచనలు వెలుగులోకి వచ్చాయి.
పాఠ్య‌పుస్త‌కంలోనూ భాగమయ్యాయి.
ఈ గౌరవంతో  క‌న్న‌ఊరు పొంగిపోయింది.
ఆయన కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని
మననం చేసుకుంది.
ఆయ‌నే కీ.శే. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త‌
****
హిందు క్రైస్త‌వీయ ఇస్లాము మ‌త‌ములు
గ‌తులు వేరు గాని గ‌మ్య‌మొక‌టె
వేరు వేరు న‌దులు చేర‌వా సంద్ర‌మ్ము
క‌ల్ల గాదు రావికంటి మాట‌

ముడుపు లేక వచ్చు మొక్కుబ‌ళ్లెవ్వియూ
శ్రీ‌నివాసుడ‌త‌డె చేత‌గొన‌డు
దైవ‌మైన నేడు డ‌బ్బుకు దాసుడే
క‌ల్ల గాదు రావికంటి మాట

క‌ల్తి లేని స‌ర‌కు కాన‌రాదెక్క‌డ‌
అంత క‌ల్తిమ‌య‌మె య‌స‌లు సున్న‌
క‌ల్తి ర‌హిత జ‌గ‌ము కాన్పించుటెన్న‌డో
క‌ల్ల గాదు రావికంటి మాట‌

త‌ల్లి భాష‌ను మ‌ర‌చిన పిల్ల‌లంత‌
ఎన్ని భాష‌లు నేర్చిన యేమి ఫ‌ల‌ము
గాలిలోప‌ల మేడ‌లు క‌ట్టిన‌ట్లు
క‌రుణ జూపించు మంథెన్న క‌న్య‌కాంబ‌

ఇలా సామాజిక స‌మ‌స్య‌ల‌పై  అక్ష‌ర ఖ‌డ్గం దూసిన ప్ర‌జాక‌వి కీ.శే. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త‌.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన వారు.  1936 జూన్ 17న జ‌న్మించారు.  ఉత్త‌మ ఉపాధ్యాయునిగా న‌ల‌భై ఏళ్ల పాటు సేవ‌లందించారు. క‌విత్వాన్ని శ్వాస‌గా చేసుకుని జీవ‌నం గ‌డిపారు. ఆయ‌న ర‌చ‌న‌లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయ‌న శిష్యులు ఇప్ప‌టికీ వాటిని ఆల‌పిస్తూ ఉంటారు.   అవినీతి, బంధుప్రీతి, లంచ‌గొండిత‌నం,, వ‌ర‌క‌ట్న దురాచారం, రాజ‌కీయాల్లో ఏకప‌క్ష ధోర‌ణులు ఇలాఎన్నింటిపైనో ఆయ‌న అక్ష‌ర శ‌రాలు సంధించారు.  క‌వి నిరంకుశుడు అన్న‌ట్లు ఆయ‌న ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌లేదు.  ప్ర‌తి స‌మ‌స్య‌ను అక్ష‌ర‌బ‌ద్ధం చేయ‌డ‌మే కాకుండా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, అధికారుల‌ను , ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డంలో ఆయ‌న ఏనాడూ వెన‌కాడ‌లేదు. ముఖ‌స్తుతుల‌కు, భుజ‌కీర్తుల‌కు ఆయ‌న ఆమ‌డ దూరం. య‌దార్థ‌వాది లోక విరోధి అనే నానుడి ఉన్నా ఆయ‌న మాత్రం అన్నీ య‌దార్థాలే చెప్పి లోక‌ప్రియుడిగా పేరొందారు.  ప్ర‌తిఅక్ష‌రం ప్ర‌జా ప‌క్ష‌మే. అల‌తి అల‌తి ప‌దాల‌తో…. నిరక్ష‌రాస్యుల‌కు సైతం సుల‌భంగా అర్థ‌మ‌య్యే శైలిలో సాగిన ఆయ‌న క‌విత్వం ప్ర‌జ‌ల‌పై బ‌ల‌మైన ముద్ర‌వేసింది.

రావికంటి రామ‌య్య గుప్త‌

ప్ర‌తి ప‌ద్యం ఒక అక్ష‌రాయుధం
ఆయ‌న క‌విత్వంలో స‌ర‌ళ‌త్వం ఉంది. వాస్త‌వం ఉంది. నీతి, నిర్భీతి, నిజాయితీ ఆయ‌న క‌విత్వంలో ప్ర‌తిధ్వ‌నించేవి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వారి భాష‌లోనే చెప్పేవారు. జ‌న‌రంజ‌కం అన్న మాట ఆయ‌న సాహిత్యానికి అతికిన‌ట్లు స‌రిపోతుంది. ఆయ‌న ఎంత స‌ర‌దాగా ఉంటారో క‌వితంలో అంత క‌ఠినంగా విమ‌ర్శించ‌నూ గ‌ల‌రు. నిర్మొహ‌మాటం ఆయ‌న నైజం. తాను న‌మ్మిందే రాస్తారు. రాసిందే ఆచ‌రిస్తారు. ఆదే ఆయ‌న బ‌లం. ఉన్న‌దున్న‌ట్లు చెప్పిన న‌గ్న‌స‌త్యాలు శ‌త‌కంలో క‌ల్ల‌గాదు రావికంటి మాట అన్న‌ది మ‌కుటం. ఇలా చెప్ప‌గ‌ల‌గ‌డానికి ఎంత నిజాయితీ కావాలి? ఎంత ధైర్యం కావాలి. ఈ శ‌త‌కం లోని ప్ర‌తి ప‌ద్యం ఒక అక్ష‌రాయుధం. అందుకే ఇది ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నేటికీ చిర‌స్థాయిగా నిల‌చిపోయింది. ఆయ‌న క‌విత్వంలో స‌ర‌ళ‌త్వం, నిండైన మాన‌వ‌త్వం ఉంటాయి. ప్ర‌జ‌ల మ‌నిషి కాళోజీలా క‌విత్వ‌మై ఆక్రోశిస్తాడు. ప్రేమ తత్వ‌మై ఆనందం గుప్పిస్తాడు. ఆచ‌ర‌ణ శాలువా క‌ప్పుకొన్నాడు.
మంత్ర‌కూట వేమ‌న‌
కాళోజీ లోని ధిక్కార స్వ‌రం…వేమ‌న ప‌ద్యాల్లోని స‌ర‌ళ‌త్వం క‌ల‌గ‌లిసి ఉండ‌టం రావికంటి క‌విత్వం లోని గొప్ప‌త‌నం. మాట‌లాడినంత తేలిక‌గా, స‌హ‌జంగా ఆట‌వెల‌ది ప‌ద్యాల‌ను చెప్ప‌డం వ‌ల్ల‌నేమో ఆయ‌న‌ను మంత్ర‌కూట వేమ‌న అని అంటారు. వేమ‌న ప‌ద్యాల్లోని తీయ‌ద‌నం,

సూటిద‌నం ఆయ‌న‌ ప‌ద్యాల్లో గ‌మ‌నించ‌వ‌చ్చు. క‌ల్ల‌గాదు రావికంటి మాట అన్న ప‌ద్య పాదం మంథ‌ని ప్రాంతంలో విశ్వ‌దాభిరామ వినుర‌వేమ అన్న రీతిలో ప్ర‌తిధ్వ‌నిస్తూ ఉంటుంది. ఆయ‌న చుర‌క‌లు అంట‌ని రంగం లేదంటే అతిశ‌యోక్తి కాదు. అప్ప‌టిక‌ప్పుడు క‌విత్వం వినిపించ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు రెడీమేడ్ పోయెట్ (ఆర్‌.ఎం.పి) అన్న పేరు వ‌చ్చింది. సంద‌ర్భం ఏద‌యినా..స‌ద‌స్సు, స‌మావేశం ఏద‌యినా అక్క‌డ ఆయ‌న క‌వితాగానం ఉండాల్సిందే.  పండగైనా ..ప‌బ్బ‌మైనా,బంధువుల ఇళ్లలో ఏ వేడుకైనా రావికంటి గేయ‌మే అక్క‌డ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.  ఎంతో మందికి ఆయ‌న అక్ష‌రాశీస్సులు అందాయి. వివాహ వేళ ఆయ‌న అందించిన అక్ష‌రాభినంద‌న‌ల‌ను ఎన్నో జంట‌లు ప్రాణ‌ప్ర‌దంగా దాచుకున్నాయి.  ఆయ‌న ప్ర‌శంస‌లు పొందిన ప్ర‌తి నాయకుడూ ఆయ‌న‌పై ఆపార భ‌క్తి ప్ర‌ప‌త్తులు చాటుతుంటారు.

మ‌న‌సు నిండా మంథ‌ని
మంథ‌ని అంటే రావికంటి అంతులేని అభిమానం. మ‌న‌వారు అంటే ఎల్ల‌లెరుగ‌ని ప్రేమ‌. స‌హ‌చరులంటే ప్రాణం. శిష్యులు క‌నిపిస్తే పండుగ‌. ప‌ల‌క‌రిస్తే ప‌ర‌శ‌వ‌శం. క‌ల్లా క‌ప‌టం ఎరుగ‌ని నిష్క‌ల్మ‌ష మ‌న‌స్త‌త్వం. స్నేహ‌పూరిత ధోర‌ణి అయ‌న వ్య‌క్తిత్వానికి  వ‌న్నెల‌ద్దాయి. క‌విత్వంలోనూ మంథ‌ని ఉనికిని చాటారు.మంథ‌ని గోదావ‌రి తీరంలో వెల‌సిన గౌత‌మేశ్వ‌రుని స్తుతిస్తూ ‘గ‌ర‌ళ కంఠేశ మంథెన్న గౌత‌మేశ ‘ మ‌కుటంతో శ‌త‌కం రాశారు. అలాగే ‘క‌రుణ జూపించు మంథెన్న క‌న్య‌కాంబ’ మ‌కుటంతో మ‌రో శ‌త‌కంరాశారు. త‌న కుల దైవాన్ని కీర్తిస్తూ ఎన్నో భ‌జ‌న పాట‌లు కూడా రాశారు.  వాస‌వీ మాత జీవిత చ‌రిత్ర‌ను గేయ‌కావ్యంగా వెలువ‌రించారు. భ‌గ‌వ‌ద్గీత సారాంశం సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా గీతామృతం గేయ కావ్యాన్ని ర‌చించారు.   వ‌ర‌ద‌గోదావ‌రి (ఉయ్యాల పాట‌),  ఇందిరా విజ‌య‌గీతి, క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి శ‌త‌క‌ము , న‌గ్న‌స‌త్యాలు మొద‌లైన శ‌త‌కాలు ఇంకా ఎన్నో గేయాలు, ప‌ద్యాలు, భ‌జ‌న‌పాట‌లు, గొల్ల సుద్దులు, నాటిక‌లు, ఏకాంకిక‌లు ర‌చించారు.  మంథ‌నికి చెందిన విద్యావేత్త  వ‌ర‌గాల భీమ‌న్న జీవిత చ‌రిత్రను బుర్ర‌క‌థ‌గా వెలువ‌రించారు.  ప‌ద్యాలు, శ‌త‌కాల‌తో పాటు శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా అనేక స్థానిక‌, సామాజిక స‌మ‌స్యల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు గేయాలు ర‌చించేవారు. వాటిలో నల్లాల బాగోతం,రామ‌గుండం రాత్రి గండం చాలా ప్ర‌సిద్ధి పొందాయి. వీటిని ఇప్ప‌టికీ  చాలా మంది ఉదాహ‌రిస్తుంటారు.

రామయ్య గుప్తా రచించిన శ్రీ గౌతమేశ్వర శతకం

ఉపాధ్యాయుడిగా చెర‌గ‌ని ముద్ర‌
శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా ఉపాధ్యాయుడిగా చెర‌గ‌ని ముద్ర వేశారు. వృత్తిని ప్రాణ‌ప్ర‌దంగా భావించి న‌ల‌భై ఏళ్ల పాటు సేవ‌లందించారు.  పిల్ల‌ల‌ను అమితంగా ప్రేమించేవారు.వేలాదిమందిని ఉన్న‌తులుగా తీర్చిదిద్దారు. పిట్ట క‌థ‌ల‌తో… ప‌ద్యాల‌తో.. గేయాల‌తో..హాస్య గుళిక‌ల‌తో సాగే ఆయ‌న బోధ‌న పిల్ల‌ల‌ను ఎంతో ఆక‌ట్టుకునేది. ఆయ‌నంటే వారికి భ‌యం ఉండేది కాదు.  ఉండేదల్లా ఇష్ట‌మే. ఆయ‌న క్లాస్ అంటే ఎంజ‌య్‌మెంట్‌. ఓ ఆట విడుపు. అమిత‌మైన స్వేచ్ఛ‌.  అందువ‌ల్లే ఆయ‌న పాఠాల‌ను విన‌డానికి ఎంతో ఆస‌క్తి చూపేవారు. అలా స‌ర‌దాగా ఉంటూనే విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చెప్పేవారు. తెలుగుతో పాటు గ‌ణితం కూడా బోధించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. మ‌రో ముఖ్య‌విష‌యం ఏమిటంటే.. ప‌నిచేసేది ఎంత చిన్న‌గ్రామ‌మైనా..ఉండ‌టం ఎంత క‌ష్ట‌మైనా అక్క‌డే స్థిర నివాసం ఉండేవారు.  వృత్తి ప‌ట్ల ఆయ‌న నిబ‌ద్ధ‌త‌కు ఇది నిద‌ర్శ‌నం.భాష ప‌ట్ల అనుర‌క్తి, క‌ళ‌ల ప‌ట్ల ఆస‌క్తి క‌ల్పించేందుకు అనేక కార్య‌క్ర‌మాలు రూపొందించేవారు. ప‌ద్యాలు, పాట‌ల పోటీలు నిర్వ‌హించేవారు. ఏక‌పాత్రాభిన‌యాలు, నాటిక‌లు ప్ర‌ద‌ర్శింప‌జేసే వారు. స్వ‌యంగా నాట‌కాలు రాసి విద్యార్థుల‌ను సంసిద్ధం చేసేవారు. వీట‌న్నింటి కార‌ణంగానే ఆయ‌న శిష్యులు బ‌హుముఖీనంగా ఎదిగారు. నేటికీ నేను రామ‌య్య సార్ శిష్యుడిని అని గ‌ర్వంగా చెప్పుకొనే వారు ఎంతో మంది క‌నిపిస్తారు.  

రామయ్య గుప్తా రచించిన నగ్న సత్యాలు శతకం

“నేటి ఆధునిక కాలంలో విద్యావేత్త‌లు చెప్పే సిద్ధాంతాల‌లో ముఖ్య‌మైన‌వి …పిల్ల‌ల‌ను అర్థం చేసుకోవ‌డం…వారి నేప‌థ్యం తెలుసుకుని వారితో ప్ర‌వ‌ర్తించ‌డం, వారితో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, వారితో ముచ్చ‌టించ‌డం, వారితో త‌దానుభూతితో వ్య‌వ‌హ‌రించం మొద‌లైన‌వి. 80వ ద‌శ‌కంలోనే ఈ అన్నిఅంశాల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి విద్యార్థుల మ‌న‌సు దోచుకున్న మ‌హోపాధ్యాయుడు రామ‌య్య సార్‌. ఇలా వృత్తి ధ‌ర్మాన్ని నిర్వర్తించిన ఉపాధ్యాయుడు గిజూభాయ్‌.  మ‌న రామ‌య్య సార్ కూడా మంథ‌ని గిజూభాయ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు” అని అంటారు ప్ర‌ముఖ విద్యావేత్త‌, తెలంగాణ పాఠ్య‌పుస్త‌కాల క‌మిటీ కో ఆర్డినేట‌ర్ , తెలుగు అమ‌లు క‌మిటీ స‌భ్యుడు వినాయ‌క్‌. ఆయ‌న కూడా రావికంటి రామ‌య్య శిష్యుడే. “ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ అన్న‌ట్లు  గురుశిష్యుల మ‌ధ్య అభేదం ఉండి, భ‌ద్ర‌త ఉన్న‌ప్పుడే పిల్ల‌లు నేర్చుకుంటారు. దీనికి సాక్షాత్ నిలువెత్తు రూపం మా రామ‌య్య సార్ “అని కూడా ఆయ‌న అభివ‌ర్ణించారంటే వారి గొప్ప‌త‌నాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. అల్లం రాజ‌య్య‌, అల్లం వీర‌య్య లాంటి సాహితీ వేత్త‌ల‌ను, అల్లం నారాయ‌ణ‌, న‌గునూరి శేఖ‌ర్‌, కామోఝ‌ల చంద్ర‌మోహ‌న్ లాంటి పాత్రికేయుల‌ను, కొల్లారపు ప్ర‌కాశ‌రావు శ‌ర్మ‌, ముద్దు రాజ‌య్య, జ‌క్కం వెంక‌ట ర‌మ‌ణ‌ లాంటి క‌వుల‌ను, ఎంతో మంది  ఇంజినీర్ల‌ను, మేధావుల‌ను తీర్చి దిద్దిన ఘ‌న‌త శ్రీ రావికంటి రామయ్య‌ది. దేశ విదేశాల్లో ఆయ‌న శిష్యులు ఉన్న‌త స్థానాల్లో ఉన్నారు.

రామ‌య్య‌…తెలంగాణ వేమ‌య్య‌
జీవించి ఉన్న కాలంలో మంథ‌ని ప్రాంతానికే ప‌రిమిత‌మైన ఆయ‌న ప్ర‌తిభ తెలంగాణ ఏర్పాటు అనంత‌రం వెలుగులోకి వ‌చ్చింది. తెలంగాణ ప్ర‌భుత్వం రావికంటి రామ‌య్య గుప్తా రాసిన ఒక ప‌ద్యానికి ఏడో త‌ర‌గ‌తి తెలుగు పాఠ్య‌పుస్త‌కంలో  చోటు క‌ల్పించ‌డంతో ఆయ‌న ర‌చ‌న‌లు రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వ‌చ్చాయి. ప్ర‌పంచ తెలుగుమ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా వెలువ‌రించిన ప్ర‌త్యేక‌సంచిక‌ల్లోనూ వారిపై వ్యాసాలు వెలువ‌డ్డాయి. నేటి నిజం ప్ర‌త్యేక సంచిక‌లో  రామ‌య్య‌ను తెలంగాణ వేమయ్య‌గా అభివ‌ర్ణించారు.  అదే స‌మయంలో శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా ర‌చించిన న‌గ్న‌స‌త్యాలు, శ్రీ గౌత‌మేశ్వ‌ర శ‌త‌కం పుస్త‌కాలు, ఆడియో సీడీల ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ర‌వీంద్ర‌భార‌తిలో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. తెలంగాణ సాహితీ ప్ర‌ముఖులు శ్రీ నందిని సిధారెడ్డి, శ్రీ అల్లం నారాయ‌ణ‌, శ్రీ దేశిప‌తి శ్రీ‌నివాస్‌, శ్రీ మామిడి హ‌రికృష్ణ, శ్రీ మాడిశెట్టి గోపాల్‌, శ్రీ కేఎస్ అనంతాచార్య‌లతో పాటు అప్ప‌టి మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని రావికంటి క‌విత్వం, వ్య‌క్తిత్వాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల ప్రాంగ‌ణంలో రావికంటి ప‌ద్యాలు వినిపించాల‌ని శ్రీ స్వామిగౌడ్ సూచించారు.

క‌వికి కాంస్య విగ్ర‌హం
ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ప్ర‌జాక‌విని ప్ర‌భుత్వం గుర్తించి గౌర‌వించ‌డంతో మంథ‌ని స‌మాజం ఉప్పొంగిపోయింది. ఆ మ‌హానుభావుడు, మ‌హా క‌విని గౌర‌వించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని భావించి ప‌ట్టణం న‌డిబొడ్డున ఆయ‌న కాంస్య విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించుకుంది.  ప్ర‌తి ఏటా ఆయ‌న జయంతి, వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తూ అభిమానాన్ని చాటుకుంటోంది. ఒక ఉపాధ్యాయుడికి, క‌వికి ఇంత‌టి గౌర‌వం ద‌క్క‌డం చాలా అరుదైన విష‌యం. కాళోజీ, సినారె, అలిశెట్టి ప్ర‌భాక‌ర్‌ల‌ త‌ర్వాత తెలంగాణ‌లో ఈ ఘ‌న‌త ద‌క్కింది కేవ‌లం  రావికంటి రామ‌య్య గుప్తాకే కావ‌డం గ‌మ‌నార్హం. విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా మంత్ర‌కూట వేమ‌న పేరుతో ప్ర‌త్యేక సంచిక వెలువ‌డింది. 50మందికి పైగా ప్ర‌ముఖులు ఆయ‌న క‌విత్వం, వ్య‌క్తిత్వాల‌పై రాసిన వ్యాసాల‌ను ఇందులో ప్ర‌చురించారు. రామ‌య్య‌కు క‌విగా మ‌రో అరుదైన గౌర‌వం కూడా ద‌క్కింది. మంథ‌ని పుర‌పాల‌క సంఘం వారు ప్ర‌తి రోజూ ఉద‌యం జాతీయ గీతాన్ని ఊరంతా వినిపించే ఏర్పాటు చేశారు. ఆ వెనువెంట‌నే రామ‌య్య గుప్తా ప‌ద్యాల‌ను కూడా రోజూ మైకుల ద్వారా వినిపించేవారు.  జాతీయ గీతంతో పాటు ఆయ‌న ప‌ద్యాలు వినిపించాల‌ని పుర‌పాల‌క సంఘం నిర్ణ‌యం తీసుకుందంటే ఆయ‌న‌ను మంథ‌ని ప్రాంతం ఎంత‌గా గౌర‌వించిందో అర్థం చేసుకోవ‌చ్చు. కొన్ని నెల‌ల  పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగింది.  

మంథనిలో ప్రతిష్ఠించిన శ్రీ రావికంటి రామయ్య గుప్తా గారి కాంస్య విగ్రహం

ఎన్నెన్నో  పుర‌స్కారాలు
శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా ఉపాధ్యాయునిగా, క‌విగా ఎన్నో పుర‌స్కారాలు, బిరుదులు పొందారు. క‌విర‌త్న‌, మంత్ర‌కూట వేమ‌న‌, రెడీమేడే పోయెట్ (ఆర్ ఎం పీ) అన్న‌వి ఆయ‌న బిరుదులు. ఉత్త‌మ ఉపాధ్యాయునిగా రెండుసార్లు ప్ర‌భుత్వం పుర‌స్కారం పొందారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా ఆవోపా (ఆర్య‌వైశ్య అఫీషియ‌ల్స్ అండ్ ప్రొఫెష‌న‌ల్స్ అసోసియేష‌న్‌), క‌రీంన‌గ‌ర్ జిల్లా అన్న‌మ‌య్య అకాడ‌మీ, జ‌గిత్యాల జైశెట్టి ర‌మ‌ణ‌య్య ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు. మంథ‌ని ఆర్య‌వైశ్య సంఘం లాంటి ఎన్నో సంస్థ‌లు ఆయ‌న‌ను ఎంతో ఘ‌నంగా స‌త్క‌రించాయి. మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ కొణిజేటి రోశ‌య్య గారి చేతుల మీదుగా ఆ స‌న్మానాన్ని పొందారు. ఆమెరికాలోనూ క‌వితాగానం చేశారు. శ్రీ మాడుగుల నాగ‌ఫ‌ణి శ‌ర్మ నిర్వ‌హించిన అవ‌ధానంలో పృచ్ఛ‌కునిగా పాల్గొన్నారు.

శ్రీ రావికంటి రామయ్య గుప్తా విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న వారి కుమారుడు రావికంటి శ్రీనివాస్, కోడలు చంద్రరూప

 రావికంటి రామ‌య్య పేరిట ఏటా సాహితీ పుర‌స్కారం

 క‌రీంన‌గ‌ర్ స‌మైక్య సాహితీ ఆధ్వ‌ర్యంలో శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా స్మార‌కంగా మేము ఏటా సాహితీ పుర‌స్కారాన్ని అందిస్తున్నాము.   శ్రీ మాడుగుల ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, శ్రీ అల్లం వీర‌య్య‌, శ్రీ ఎం. నారాయ‌ణ శ‌ర్మ‌, శ్రీ అవుసుల భానుప్ర‌కాశ్‌, శ్రీ కొల్లార‌పు ప్ర‌కాశ‌రావు శ‌ర్మ‌లు గ‌తంలో ఈ పుర‌స్కారాలు పొందారు. ఈ సంవ‌త్స‌రం ప్ర‌ముఖ క‌వి, అవ‌ధాని శ్రీ ముద్దు రాజ‌య్య గారికి పుర‌స్కారం ప్ర‌క‌టించాం. జూన్ చివ‌రి వారంలో ఈ పుర‌స్కార ప్ర‌దాన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. రావికంటీ రామయ్య గుప్తా చిన్న కుమారుడు, అమెరికాలో ఉంటున్న శ్రీ రావికంటి శ్రీకాంత్ ఈ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. మంథనిలో విగ్రహావిష్కరణ, పుస్తకాల ప్రచురణ, సీడీల రూపకల్పన, కార్యక్రమాల నిర్వహణకు కూడా ఆయన ఆర్థికంగా, హార్దికంగా తోడ్పడుతున్నారు..

సాహితీ ప్ర‌ముఖుల మాట‌ల్లో  రావికంటి
మ‌నుషుల్లో మాన‌వీయ విలువ‌లు మృగ్య‌మై పోతున్నాయ‌ని, వ‌స్తువుల్లోనూ, మ‌న‌సుల్లోనూ క‌ల్తీ పెరిగిపోతున్న‌ద‌ని, చివ‌రికి దేవుడు కూడా డ‌బ్బుకు దాసోహ‌మై పోతున్నాడ‌ని రామయ్య గారు నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాల్ని క‌విత‌ల్లో రాశారు. ఆయ‌న రాసిన అనేక చ‌ర‌ణాలు సూటిగా ఎక్కుపెట్టిన ఆయుధాల్లా మ‌న‌ముందు నిల‌బ‌డ‌తాయి.
– కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు గ్ర‌హీత‌, ప్ర‌ముఖ క‌వి వారాల ఆనంద్‌

రావికంటి రామ‌య్య సారు మా పిల్ల‌ల‌కు మొద‌టిక‌వి. సారు స‌ర‌దాగ ఉండెటోడు. పిల్ల‌ల‌తోటి మ‌జాక్‌లు చేసెటోడు. ప‌దాల‌తో మ్యాజిక్ చేసెటోడు. మంథ‌ని ప్రాంతంలో ఒక విద్వ‌త్తు ఉన్న‌ది. విద్య ఉన్న‌ది. ఈ ప్రాంతం విద్య‌తో బ‌తికింది. ఇక్క‌డి నుంచి గొప్ప గొప్ప ఇంజినీర్లు అయిన‌వాళ్లు, డాక్ట‌ర్లు అయిన‌వాళ్లు, అమెరికాకు వెళ్లిన వాళ్లు, ఆయా వృత్తుల్లో , వ్యాసంగాల్లో ఉన్న‌త స్థానాల‌కు ఎదిగిన వాళ్లు ఎంతో మంది. విద్య‌, విప్ల‌వం..ఇవ్వాళ ఇట్లాంటి ఎదుగుద‌ల‌తో పాటు అక్ష‌రంతో అనుభంధం ఉన్న రంగాల్లో, ప‌త్రిక‌ల్లో, సాహిత్యంలో ఎన్ని పేర్ల‌ని….మంథ‌ని నుంచి ఎదిగి వ‌చ్చిన క‌లం వీరుల మూలాలు ఇదిగో ఇట్లాంటి రావికంటి రామయ్య సారులో ఉంటాయి. ఇప్ప‌డు తెలంగాణ క‌ల సాకార‌మైంది. రామ‌య్య సారు మ‌న పాఠ్య‌పుస్త‌కంలోకి, మ‌న చ‌రిత్ర‌లోకి ఎక్కిండు. మంథ‌ని న‌డిబొడ్డున విగ్ర‌హమై నిలిచిండు.
– తెలంగాణ మీడియా అకాడ‌మీ మాజీ ఛైర్మ‌న్ శ్రీ అల్లం నారాయ‌ణ‌

శ్రీ రావికంటి రామ‌య్య అనేక సామాజిక రుగ్మ‌త‌ల‌పై అక్ష‌రాల్ని ఆయుధంగా చేసుకొని ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపారు.16వ శ‌తాబ్ధంలో జ‌న్మించిన వేమ‌న త‌న అక్ష‌రాల‌తో అభ్యుదయాన్ని సృష్టించి అప్ప‌టివ‌ర‌కు ఉన్న చీక‌టి తెర‌ల‌ను తొల‌గించాడు..18వ శ‌తాబ్దంలో జ‌న్మించిన‌ కందుకూరి విరేశ‌లింగం పంతులు, గుర‌జాడ అప్పారావులు త‌మ అక్ష‌రాల‌తో సాంఘిక సంస్క‌ర‌ణ బాట ప‌ట్టించారు.19వ శ‌తాబ్ధంలో జ‌న్మించిన రావికంటి రామ‌య్య గుప్త అభ్యుద‌యం.. సాంఘిక సంస్క‌ర‌ణ‌..  రాజ‌కీయం.. మ‌ద్య‌పానం.. నిర‌క్ష‌రాస్య‌త‌.. ఒక్క‌టేమిటి స‌మాజాన్ని ప‌ట్టిపీడించే ప్ర‌తీ సామాజిక రుగ్మ‌తని ప్ర‌శ్నించ‌డంలో వేమ‌న‌, కందుకూరి, గుర‌జాడ‌ల పోరాట వార‌స‌త్వాన్నికొన‌సాగించిన‌ మ‌హనీయుడు. ”క‌ల్ల గాదు రావికంటి మాట” అంటూ నిజాల్ని నిర్భ‌యంగా చెప్పారు. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే చెడుపై అక్ష‌ర ఖడ్గం దూశారు. మ‌హోన్న‌త‌మైన ల‌క్ష్యాలు కోసం త‌పించిన  మ‌హనీయుడాయ‌న‌.  
 – శ్రీ మల్లుల సురేష్, విశ్వమానవవేదిక అధ్యక్షుడు, పాల‌కొల్లు

రావికంటి వారి మాట క‌ల్ల‌గాదు. క‌ల కాదు. క‌ళ క‌ళ‌లాడుతూ క‌ల‌కాలం ఉండే క‌లియుగ భేష‌జ‌ము. రావికంటి వారి మాట ర‌త్నాల మూట‌.
– మ‌హ‌ర్షి శ్రీ గ‌ట్టు నారాయ‌ణ గురూజీ

బ‌హు గ్రంథ క‌ర్త‌, వివిధ పారిశ్రామిక సంస్థ‌ల‌కు, మేనేజిమెంట్ అసోసియేష‌న్ల‌కు మార్గ‌ద‌ర్శ‌కులు
రావికంటి రామ‌య్య రుషితుల్యుడు. స‌మాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ర‌చ‌న‌లు చేసిన‌వాడు. ప్ర‌జ‌ల మ‌ధ్య జీవించిన ఈయ‌న త‌న ర‌చ‌న‌ల‌ను ఊరివారికి వినిపించి మంత్ర‌ముగ్ధుల‌ను చేసిన సంద‌ర్భాలు లెక్క‌కు అంద‌నివి. ప‌ది కాలాల పాటు ఈయ‌న కృతులు నిలుస్తాయని ఏ సాహితీ ప్రియుడైనా చెప్ప‌గ‌ల‌డు.
– బ‌హు భాషాకోవిదుడు, ప్రముఖ క‌వి శ్రీ గ‌జాన‌న్ థామ‌న్‌

రామ‌య్య పండించిన భావాల్లో న‌గ్న స‌త్యాల‌తో పాటు చేదు నిజాలు, చుర‌క‌లు, చ‌క్క‌ని నీతి అడుగ‌డుగునా కాన‌వ‌స్తాయి. సామాజిక చైత‌న్యం కోసం ఆయ‌న ప‌డే ఆరాటం, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించాల‌న్న తాప‌త్రయం, పాల‌కుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్న సంకల్పం వంటివి సుగుణాల‌తో రూపుదిద్దుకున్న ప‌ద్యాలు హృద్యంగా , గానం చేసుకోవడానికి యోగ్యంగా ఉన్నాయి.  రామ‌య్య ప‌ద్య ర‌చ‌నా శైలి, నిర్మాణ క్ర‌మం, ఎంపిక చేసుకున్న క‌వితా వ‌స్తువ‌లు వేమ‌న‌ను త‌ల‌పిస్తాయి. అందుకే ఆయ‌న మంత్ర‌కూట వేమ‌న‌గా అభిమానాన్ని చూర‌గొన్నారు.
-ప్ర‌ముఖ క‌వి, విమ‌ర్శ‌కులు శ్రీ దాస్యం సేనాధిప‌తి

సుక‌వి జీవించె ప్ర‌జ‌ల నాలుక‌ల‌యందు అన్న నానుడికి నిజమైన తార్కాణం స‌హ‌జ‌క‌వి రావికంటి రామ‌య్య గుప్తా గారు. పామ‌రుల‌కు సైతం అర్థ‌మ‌య్యే భాష‌లో ఆశువుగా క‌విత్వం చెప్ప‌గ‌ల‌గ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. అక్ష‌ర రూపం దాల్చిన సిరాచుక్క ల‌క్ష‌ల మెద‌ళ్ల‌కు క‌ద‌లిక అన్న‌ట్లుగా ఆయ‌న త‌న మ‌న‌స్సులో క‌లిగిన అనేక భావాల‌కు అక్ష‌ర‌రూపం ఇచ్చి ఆలోచ‌నాత్మ‌క‌మైన కవిత్వాన్ని వెలువ‌రించారు.
-ప్ర‌ముఖ వ్యాఖ్యాత‌, తెలుగు యూనివ‌ర్స‌టీ కీర్తి పుర‌స్కార గ్ర‌హీత శ్రీ మాడిశెట్టి గోపాల్‌

ప్ర‌జాహితాన్ని కోరేది సాహిత్యం కాబట్టి క‌విత్వంలో స‌మాజ హితాన్ని కోరి త‌న అభిమతాన్ని నెర‌వేర్చుకుని, అల‌తిఅల‌తి ప‌దాల‌తోడ ప‌ద్యాలన‌ల్లి పామ‌ర‌జ‌న రంజ‌కంగా పాకాన్ని వండి వ‌డ్డించిన క‌వి..మంత్ర‌కూట వేమ‌న‌గా ప్రసిద్ధి పొందిన సిద్ధ క‌వితా వ‌తంసులు శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా గారు.
క‌వి కేవ‌లం సౌంద‌ర్యం, భాష‌, ప్ర‌యోగాలు, శబ్దాడంబ‌ర‌త లాంటి వాటికి సుదూరంగా గౌత‌మేశ్వ‌ర శ‌త‌కాన్ని  అద్భుతంగా రాసి గౌత‌మేశ్వ‌రుడిని ఆరాధించిన ఈశ్వ‌రేచ్ఛ‌ను ప్ర‌క‌టించినారు. గ‌ర‌ళ‌కంఠేశ మంథెన్న‌గౌత‌మేశ అంటూ చ‌క్క‌టి మ‌కుట‌మే కాదు..ఈశ్వ‌ర త‌త్వాన్ని , ల‌య‌త్వాన్ని గుణ‌గ‌ణ విశేష‌ల‌న్నీ తెలిపినారు.
– ప్ర‌ముఖ క‌వి, ప్ర‌ధానోపాధ్యాయుడు కేఎస్ అనంతాచార్య‌,


అల‌తి అల‌తి ప‌దాల‌తో, దేశ‌చ్ఛంద‌స్సుతో సందేశాత్మ‌క‌, ఆధ్యాత్మిక వ‌స్తు నిర్దేశంతో ఎన్నోశ‌త‌కాలు వెలువ‌డ్డాయి. వేలాది మంది శ‌త‌క క‌వులు ఈ ప్ర‌క్రియ‌ను సుసంప‌న్నం చేశారు. ఒక్కొక్క‌రిది ఒక్కో శైలి. వారివారి అనుభ‌వాల్ని స్వ‌చ్ఛ‌మైన‌, అచ్చ‌మైన తెలుగు నుడికారంతో భావ‌నా ప‌టిమ‌తో శ‌త‌క ప‌ద్యంలో కూర్చి పాఠ‌కుల హృద‌యాల్లో కొలువుదీరారు. అలాంటి వారిలో మంథ‌ని వాస్త‌వ్యులైన రావికంటి రామయ్య గుప్త గారు ఒక‌రు. పండు ఒల‌చి చెప్పిన‌ట్లు ప‌ద్యాన్ని మ‌ల‌చి రాసే వీరి శైలి మ‌న‌సుకు హ‌త్తుకుంటుంది.  నీతి నియ‌మాలు, భ‌క్తి త‌త్ప‌ర‌త క‌లిగిన జీవితాచ‌ర‌ణ వీరి ర‌చ‌న‌ల‌కు పునాది.
-ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత బీ వీ ఎన్ స్వామి

భాష మీద ప‌ట్టున్న ర‌చ‌యిత క‌నుక సామాన్య పాఠ‌కుడికి అర్థ‌మ‌య్యే విధంగా ర‌చ‌నలు చేశారు. దోపిడీ దారుల‌ను, లంచ‌గొండుల‌ను, చివ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులైనా క‌లం ఝ‌ళిపించారు. క‌వి స‌మ్మేళ‌నాల్లో ఆయ‌న క‌విత‌లు చ‌దువుతున్న‌ప్పుడు చ‌మ‌త్కార‌ము, అధిక్షేప‌ము, నిర‌స‌న‌, విమ‌ర్శ సుస్ప‌ష్టంగా వినిపించేవి. ఆయ‌న ర‌చ‌న‌లు కూడా క‌వి నిరంకుశుడ‌నే భావ‌న క‌లిగిస్తాయి.

May 29, 2024 1 comment
1 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

బ్రతుకు ప్రయోజనాలు

by Kondapally Neeharini May 29, 2024
written by Kondapally Neeharini


( మే నెల మయూఖ పత్రిక సంపాదకీయం)
డాక్టర్ కొండపల్లి నీహారిణి , మయూఖ పత్రిక సంపాదకులు

జాతి మొత్తం ఏకతాటి మీద నడవాలి అనుకోవడం వెనుక ఆంతర్యం ఏముంటుందంటే, ప్రజల సుఖశాంతుల ప్రయోజనాలకే. ప్రయోజనాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు? తెల్లవారుజామున నిద్రలేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు…., మనిషి పుట్టుక నుంచి చావు వరకు అడుగడుగునా క్షణక్షణాన మనుషులు లాభాపేక్ష తోనే జీవిస్తుంటారు. మంచి తిండి, మంచి బట్ట, మంచి ఇల్లు వంటి కోరికలు ఏవీ లేని వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు.వాళ్లని సర్వ సంగ పరి త్యాగులు అంటాం.వీళ్ళు మహానుభావులు. అతి తక్కువ శాతం లో ఇటువంటి వ్యక్తులు ఉంటారు.
సాధారణంగా ఆచరణ యోగ్యాలేవి,ఆచరణ యోగ్యం కానివేవి అనే తర్క సహితమైన ఆలోచనలు లేనివాళ్లే ఎక్కువగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా… అనుకోకుండానే చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు.ఇందులో పరిశుభ్రత అనే విషయాన్ని తీసుకుంటే, మంచినీళ్లు త్రాగడం అనే ఒక్క విషయాన్ని ఉదాహరించవచ్చు. ఆదిమానవుని నుండైనా మనుషులు స్వచ్ఛమైన నీరు…. ఏదైతే తాగడానికి అనువైనదో ఆ నీళ్లనే త్రాగారు. అదే పరంపరను పాటిస్తున్నారు ఇప్పటికీ ….ఈ ఆధునిక మానవులు.అంటే, తమ క్షేమానికి,తమ ఆరోగ్యానికి పెద్ద పీట వేసి ,కార్యరంగంలో అడుగులు వేస్తారు మనుషులు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు.
దాహమైనప్పుడే బావిని తవ్వుకోవద్దన్న నిజాన్ని గ్రహించే అన్నేసి నిర్మాణాలను మంచి నీళ్ళ కోసం కట్టుకున్నారు ఆధునికులు. దీనితోనే యోగ్యమైనవేవి, అయోగ్యమైనవి ఏవి అని వివేచనతోనే మనుగడ సాగిస్తారు అన్నది తెలుస్తుంది. ఆచరణ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది దీంట్లోనే సామాజిక ప్రయోజనం కలసిపోయి ఉంటుంది ఈ మంచినీటి విషయాన్నే మానవ స్వధర్మానికి,సధర్మానికీ అన్వయించుకున్నప్పుడు….” స్వధర్మే నిధనఃశ్రేయమ్, పర ధర్మోభయావః” అని మంచి మాట పుట్టుకు వచ్చింది. ఈ వాక్యం జీవిత సత్యం. ఈ వాక్యం అనల్పమైన వాక్యం. ఇందులోంచి “శ్రేయస్సు”అనే ఒక్క పదం చాలు! మనుషులకు ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది అనడానికి !!అందుకే ఏదో దేశాన్ని చూసో, ఏవో సౌకర్యాలను ఆశించో, సంపదలను చూసో మనకు మనం ఆపాదించుకోవడమైనా… మనంగా కోరుకోవడమైనా….అన్నిచోట్ల సాధ్యం కాకపోవచ్చు. దేశకాల పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం అని యోచించి నిర్ణయించుకోవాలి, కోరుకోవాలి, ఆశపడాలి.
ప్రయోజనాలలో శిశువులకు ఒక రకమైనవి, వృద్ధులకు ఒక రకమైనవి, యువకులకు ఒక రకమైనవి,మధ్య వయస్కులకు ఒక రకమైనవి రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించినవి,విద్యకు సంబంధించినవి, వైద్యానికి సంబంధించినవి,సామాజిక అంశాలకు సంబంధించినవి బ్రతుకుతెరువుకు సంబంధించినవి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. నడక, నడత, తిండి,చదువు, ఉద్యోగం, పదవి విరమణ, ఇన్సూరెన్స్ లు వంటివి కానీ అన్నింటికన్నా రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
జీవమున్నప్పుడు శరీరానికి, మరణం తరువాత శవానికి …. ఈ వ్యవస్థలో ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు, పరిచయాలు పెంచుకుంటుంటారు.
వీటిలో మంచి చెడులను చెప్పేవాళ్ళు, uses and losses ఏమిటో చెప్పేవాళ్ళు ఉండాలి. శరీరంలోని కణజాలాల లాగా,ఉప కళా కణజాలాల లాగా,శరీరంలోని భాగాల లాగా, భాగాలు పనిచేసే తీరు లాగా మానవ ప్రయోజనాలు ఉండాలి. ఏది సరైనది ఏది సరైనది కాదు అనే విచక్షణ ఉంటే అన్నీ సవ్యంగా నడుస్తాయి.
మానవ పరిణామ క్రమంలో వచ్చిందే కాకుండా….బుద్ధి పరిణామ క్రమం కూడా పెరగాలి. భాష, భావం సరిగ్గా ఉంటే నాలుగు కాలాలపాటు నలుగురితో సరిగ్గా ఉండగలరు. వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది?సరళ రేఖ లా,సాలీడు గూడులా, పరమత సహనం లా ,పాదరసం లా పరిమితమైన అపరిమితమైన ప్రయోజనాలు ఉంటాయి. సహజమైన ఎంపిక, సత్య మైన ఎంపిక నిలబెడుతుంది, నిలబడుతుంది.
ఇవే బ్రతుకు ప్రయోజనాలు!!

May 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi May 28, 2024
written by Chillara Bhavanidevi

చివరి భాగం
‘‘మనం ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలి. వీరేంద్రుని కుట్రని బహిర్గతం చేయాలి’’ నవవధువు మంజరి దేశక్షేమం కోసం ఆరాటపడుతున్నది.
‘‘మనమేం చేయగలం మంజూ! అంతటి తిమ్మరుసులవారే నేరాన్ని నెత్తిన వేసుకుని తలవంచుకుంటే’’ చంద్రప్ప ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని మనసులోని భారం మంజరికే తెలుసు.
‘‘వారు నేరాన్ని అంగీకరించి కాదు తలదించుకుంది. తనపట్ల రాయలవారి నమ్మకం సడలటం చూసిన వేదనతోనే!’’ మంజరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
వాళ్ళిద్దరూ ప్రజల్లో చైతన్యం కలిగించి ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. నగర ప్రజలంతా మంజరినే సమర్థించారు.
‘‘ఇది అన్యాయం. తిమ్మరుసులవారికీ శిక్ష విధించటాన్ని మేం సహించం’’ ఒక పౌరుడన్నాడు.
‘‘మహామంత్రే లేకపోతే రాయలకి విలువేముంటుంది? ఈ దురన్యాయాన్ని ఆపాలి. పదండి అందరం వెళ్ళి ప్రభువుతో మొరపెట్టుకుందాం’’ మరొకడన్నాడు.
‘‘ఆయన మన మొర ఆలకిస్తారా! అలా అయితే ఇంతదూరం వస్తుందా?’’ మొదటివ్యక్తి అన్నాడు.
‘‘ఇందులో ఏదో కుట్ర ఉంది. వేరెవరో ఈ నేరం చేసి తిమ్మరుసుల వారిని బలిపశువును చేశారు. ప్రభువు తొందరపడి పుత్రశోకంతో అమాత్యులను శిక్షిస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఆ కుట్రని ఛేదించాలి. దీనికి మనమంతా పోరాడాలి’’ చంద్రప్ప ఆవేశంగా అన్నాడు.
‘‘అవును. మీరు చెప్పేదే సరిjైున మాట. పదండి. రాజ భవనానికి వెళదాం. శ్రీకృష్ణదేవరాయల వంటి న్యాయపాలకుడు తప్పక మరోసారి ఆలోచిస్తాడు.’’
‘‘అవును పదండి’’ అంతా సమూహంగా బయలుదేరి రాజమందిరం చేరారు.
‘‘ప్రభూ! మాకు న్యాయం చేయండి’’ గగ్గోలు పెట్టారు.
మంజరి, చంద్రప్ప ప్రజలకి నాయకత్వం వహించడం చూసి రామలింగ నాయకుడు ఖిన్నుడయ్యాడు.
విజయనగర సామ్రాజ్యంలో కనీవినీ ఎరుగని సంక్షోభం మొదలయింది. తిమ్మరుసు మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఇలా తిరగబడటం ఊహకందని విషయం. ఎంతలో ఎంత మార్పు!
‘‘ఏమిటా గోల’’ ప్రభువు చిరాగ్గా రామలింగ నాయకుడ్ని ప్రశ్నించాడు.
‘‘ప్రజల తిరుగుబాటు ప్రభూ! తిమ్మరుసు మంత్రిని శిక్షించటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తిమ్మరుసులవారీ హత్య చేశారంటే ప్రజలెవ్వరూ విశ్వసించటం లేదు ప్రభూ! అందుకే అంతా తిరుగుబాటు చేస్తున్నారు.’’
‘‘హూ….’’ హూంకరించాడు రాయలు కోపంగా. అది తన నిర్ణయాన్ని తప్పుపట్టినందుకు ఎగసిన ఆగ్రహావేశం.
‘‘ఉద్యమాన్ని అణచేయండి రామలింగనాయకా! న్యాయాన్యాయ విచక్షణ ప్రభువునైన మాకు తెలుసుననీ, సాక్ష్యాధారాలతోనే ఈ శిక్షను నిర్ణయించటం జరిగిందనీ మా ప్రజలకు తెలియజెప్పండి’’ రాయలు సంక్షుభిత హృదయంతో పెడమోమయ్యారు.
‘‘మరోమాట. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నవారిని నిర్ధాక్షిణ్యంగా బందీలు చేసి కారాగారంలో వేయండి’’ ఆజ్ఞాపించారు రాయలు.
‘‘చిత్తం ప్రభూ!’’ రామలింగనాయకుడు కర్తవ్య నిర్వహణకు బయలుదేరాడు. రాయల కన్నుల్లో అశ్రువుల్ని చూసే అవకాశం అతనికి లేదు. జాతకయోగమో మరేమో గానీ చంద్రప్ప, మంజరిలకు పెళ్ళి అయిన కొద్దిరోజులకే కారాగారయోగం పట్టింది.
ప్రజలు నిజంగా అదృష్టవంతులు! తాము నమ్మినదానిని ధైర్యంగా చెప్పగల శక్తిమంతులు. కాని రాజుకా అదృష్టం లేదు. న్యాయానికి, సాక్ష్యానికి కట్టుబడి పూజ్యులైన అప్పాజీకి ఇంతటి ఘోరశిక్షను విధించాల్సి వచ్చింది. తాను తప్పు చేస్తున్నాడా! రాచరిక బాధ్యతలు ఇంత నిష్ఠూరంగా ఉంటాయా? ఇంతకాలం అప్పాజీయే ఎటువంటి జటిల సమస్యనైనా పరిష్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనే సమస్యకు బలి అవుతున్నారు. రాయల హృదయం కల్లోల సముద్రంలా ఉంది.
చిన్నారి తిరుమలరాయల ముద్దుమోము గుర్తొచ్చినకొద్దీ రాయల పరితాపం పెరుగుతోంది. యువరాజు మృతికి కారణమైనవారెవరైనా, ఎంతటివారైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే! పట్టుదల పెరిగి మమకారం మరుగునపడిరది.
బయట కోలాహలం విన్పిస్తున్నది. ప్రజలేం చేయగలరు? బలప్రయోగానికి వారెప్పుడూ బానిసలే! తామెంతో ప్రేమించిన పాలకుని గురించి స్వరమెత్తి మాట్లాడగలరే గానీ నిరాయుధులు గదా! అన్యాయాన్ని ఎలుగెత్తి ఖండిరచగలరే గానీ నిరాయుధులు గదా! అనాదిగా ధర్మాన్ని అణచేసినట్లే ఈ రోజూ జరుగుతున్నది. చంద్రప్ప మంజరిలను కారాగృహంలో బంధించారు భటులు.
* * *
తెల్లవారితే విజయనగర సామ్రాజ్యానికే చూపునిచ్చిన తిమ్మరుసు మహామంత్రి అంధుడైపోతాడు. సామ్రాజ్యమే అంధకారంలో మునిగిపోతుంది. రామలింగ నాయకునికి నిద్రపట్టటం లేదు. అటు శ్రీకృష్ణదేవరాయలకు కూడా కంటిమీద కునుకు లేదు. దేవేరుల వేడికోలు కూడా రాయలు వినదలుచుకోలేదు. ఎవ్వరినీ కలవటం లేదు. ఒంటరిగా ఏకాంత వేదనా మందిరంలో కుమిలిపోతున్నాడు. తెలతెలవారుతోంది.
రామలింగనాయకునికి దూరంగా వసంత మండపంలో ఎవరో నక్కి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. రామలింగ నాయకుడు అనుయాయులతో పొదమాటున దాగి పరికిస్తూ వింటున్నాడు.
వీరేంద్రుడు రాజవైద్యులతో మంతనాలాడుతున్నాడు.
‘‘బాగా అభినయించారు. మీరు చేసిన ఉపకారానికి ప్రతిఫలం ఇది’’ అంటూ రెండు ధనపు మూటలను చెరొకటి ఇచ్చాడు వీరేంద్రుడు.
‘‘ఉపకారం అంటే అంతా ఇంతానా! విజయనగర సామ్రాజ్య లక్ష్మినే మీ చేతుల్లో పెట్టాం. అయినా యీ…’’ నసిగాడు ఓ వైద్యుడు.
వాళ్ళమాట పూర్తి కాకుండానే వీరేంద్రుడు మరి రెండు బరువైన డబ్బు సంచుల్ని వాళ్ళ చేతుల్లో ఉంచాడు. వాళ్ళ మొహాలు వికసించాయి.
‘‘వీరేంద్రులవారిది బహు పెద్ద మనసు. మేమిక వెళ్ళివస్తాం’’ రాజవైద్యులు బయలుదేరారు.
రామలింగనాయకుడు ఇంక ఒక్క క్షణమాలస్యం చేయలేదు. తన భటులతో వాళ్ళమీద పడి ముగ్గుర్ని బందీలు చేశాడు. అనుకోని ఈ సంఘటనకు వీరేంద్రుడు స్థాణువయ్యాడు.
‘‘ఏమిటీ దౌర్జన్యం?’’ అహంకరించాడు.
‘‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రేపు సభలో చెప్పుకో’’ వీరేంద్రుని రాజవైద్యులతో సహా కారాగారబద్ధుల్ని చేశాడు రామలింగనాయకుడు.
* * *
‘‘ఏమిటిది గోవిందా! ఈ తిమ్మరుసు బతికిఉండగానే విజయనగర ప్రజలు క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారా? రాజ్యమంతా విప్లవిస్తోందా? ఇది నాకు ఆనందాన్ని కల్గిస్తుందనుకుంటున్నావా?’’ తండ్రిని కలవటానికి వచ్చిన గోవిందరాయలతో తిమ్మరుసు ఆవేదనను పంచుకొన్నారు.
‘‘వద్దు గోవిందా! నా మాటగా ప్రజలకు చెప్పు. రాయలకు అండదండగా నీవు నిలునాయనా! తిరుగుబాటును అణచివేయవల్సిందిగా సేనాధిపతులకు చెప్పు. తక్షణం చర్యలు చేపట్టండి. నేను ప్రాణాలతో ఉండాలంటే నా రాయలకు మీరంతా జీవితకాలం విశ్వాసపాత్రులుగా మసలాలి’’ మళ్ళీ వేదనగా అన్నాడు.
‘‘తండ్రీ! ఇదెక్కడి న్యాయం? చేయనితప్పుకు శిక్షననుభవిస్తూ ఇంకా ఆ రాయలపై ప్రేమ కురిపిస్తున్నారు’’ గోవిందరాయలు వాపోయాడు.
శిక్షాదినం ఉదయించింది. తిమ్మరుసును శిక్షించడానికి అంతా సిద్ధమైంది.
ప్రజలంతా కారాగారంలోకి చొచ్చుకువచ్చారు. ఎవరాపినా ఆగటం లేదు. వారందరినీ ఉద్దేశించి తిమ్మరుసు వేడికోలు వాక్యాలు పలికారు.
‘‘మహాజనులారా! మీరు విజయనగర ప్రజలు. ఇలా ఇతరులలా ప్రవర్తించటం తగదు. నా మాటమీద గౌరవముంటే తక్షణం అంతా వెళ్ళిపోండి. నామీద ప్రేమాభిమానాలుంటే మన ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు వారిని ఇంతకుముందు వలెనే సేవించండి’’
తిమ్మరుసు ప్రార్థన విని ప్రజలంతా ఆ మహనీయుని అపూర్వ రాజభక్తికి కరిగినీరై చేతులెత్తి నమస్కరించి కన్నీటితో వెళ్ళిపోయారు.
‘‘అప్పాజీ! నన్ను క్షమించండి అప్పాజీ’’ కారాగారంలో కాపలాదారునిగా మారువేషంలో నిలబడిన కృష్ణరాయలు అప్పాజీ కాళ్ళపై బడ్డారు.
‘‘ఎవరు? రాయా! మీరా! ఏమిటీ పని? విజయనగర ప్రభువులకిది తగని పని’’ వారించారు తిమ్మరుసు.
‘‘అప్పాజీ! మీరీ హత్య చేయలేదని నా మనసు చెప్తోంది. అసలు దోషులెవరో మీకూ తెల్సు. వారి పేర్లు బయటపెట్టండి అప్పాజీ. నాకు మనశ్శాంతి ప్రసాదిం చండి’‘ తిమ్మరుసు పాదాలవద్ద మోకాళ్ళపై కూలబడి రాయలు ఆక్రోశించారు.
‘‘ఏమిటీ బేలతనం రాయా! కర్తవ్య పాలనలో స్వపర భేదాలుండవు. మీ ధర్మపాలనకు నేను చాలా గర్వపడుతున్నాను. ధర్మపరిషత్తు తీర్పుకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రభువైన మీరు ఇలా ప్రవర్తిస్తే లోకం హర్షిస్తుందా! మీరు విధించిన శిక్షను నేను అమలుచేసుకుంటున్నాను’’ అంటూ ఎర్రగా కాల్చి శిక్ష అమలుకు సిద్ధంగా ఉన్న ఇనుపకడ్డీలతో తన కళ్ళను తానే పొడుచుకున్నాడు తిమ్మరుసు.
‘‘అప్పాజీ! ఎంత పనిచేశారు! జీవితాంతం నాకు శిక్ష వేశారు. నేనెంత పాపిష్టివాడిని’’ రాయలు రోదిస్తుండగా రామలింగనాయకుడు ప్రవేశించాడు.
‘‘ప్రభూ! యువరాజువారిని విషప్రయోగంతో హత్య చేయటానికి రాజ వైద్యులను ధనంతో ప్రలోభపెట్టి అకృత్యం చేసిన వీరేంద్రునీ, రాజవైద్యులనూ బంధించాను. వారు నేరాన్ని అంగీకరించారు ప్రభూ!’’
‘‘అయ్యో! ఒక్క ఘడియముందీ విషయం ఎందుకు తెలియలేదు? భగవంతుడా! ఎంతటి అరిష్టం జరిగిపోయింది! అప్పాజీ! మీరెంతటి దయాహృదయులు! ఇంత జరిగినా ఇంకా ఈ దురదృష్టవంతుడిపై దయచూపిస్తున్నారా!’’ రాయల వేదనకు అంతులేదు.
‘‘ప్రభూ! జాతస్య ధ్రువోమృత్యుః ఈ విజయనగర సామ్రాజ్యలక్ష్మిని పరిరక్షించే బాధ్యత పూర్తిగా ఇక మీదే!’’ కళ్ళు అగ్నిగోళాలుగా మండుతున్నా వినయంగా చెప్పారు తిమ్మరుసు.
‘‘అప్పాజీ! ‘రాయా’ అనే మీ పిలుపుకు దూరమైన నా జీవితం, ఈ సామ్రాజ్యమెందుకు?’’ రాయల శోకం అందరినీ కంటతడి పెట్టిస్తున్నది.
‘‘రామలింగనాయకా! ఇంతటి ఘోరకలికి బాధ్యులైన ఆ ముగ్గుర్నీ న్యాయపరిషత్తు ముందు నిరూపించి వారికి మరణశిక్ష అమలుచేయండి. అప్పాజీ! మీరు నాకెప్పుడూ పూజ్యులే! నా వెంట మీరు లేకపోతే నేను ప్రాణంలేని శిలనే! రండి అప్పాజీ! నన్ను క్షమించగలరా అప్పాజీ’’ రాయలు అప్పాజీ కాళ్ళు పట్టుకొన్నారు. అప్పాజీని స్వహస్తాలతో నడిపించుకుంటూ కారాగారం లోంచి బయటికి తీసుకువస్తున్న కృష్ణరాయలు పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నారు. అక్కడున్నవారందరికీ రాయల్ని చూస్తుంటే సానుభూతితో పాటు గౌరవమూ పెరిగింది.
‘‘జై శ్రీకృష్ణదేవరాయలకూ! జై మహామంత్రి తిమ్మరుసులవారికీ!’’ జయజయధ్వానాలు మిన్నుముట్టాయి.
* * *
తిమ్మరుసు మహామంత్రి ఇప్పుడు మునుపటిలా రాచకార్యాల్లో ఎక్కువగా నిమగ్నం కావటం లేదు. కారాగారం నుంచి విముక్తులైన మంజరీ, చంద్రప్పలు కళాకారులుగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విఠలదేవాలయ పరిసరాల్లో ఆ ప్రశాంత వాతావరణంలో ఇరువురు తలపులు కలబోసుకుంటున్నారు.
‘‘చంద్రా! మన కారాగారవాసం మంచికే జరిగింది. విరహంలో ప్రేమ మరింత పెరుగుతుంది కదూ’’ నిండు మనసుతో అంది.
‘‘నాకైతే దినమొక యుగంగా గడిచింది. రాజ్యంకోసం కాకపోతే బతికి ప్రయోజనమేముంది? నువ్వు కూడా నాకు ఎంతో సహకారమందించావు సుమా!’’ ప్రశంసించాడు.
‘‘చంద్రా! ఈ చల్లని వెన్నెలరేయి నా మనసుకి శాంతినిచ్చేలా ఓ పాట పాడవూ…’’ అతని కన్నుల్లోకి చూస్తూ గోముగా అడిగింది.
‘‘దేవిగారి కోరిక కాదనగలనా’’ చంద్రప్ప మధురస్వరంతో గానం చేశాడు.
వెన్నెలా వెండివెన్నెలా
చల్లచల్లని వెన్నెలా
జల్లుజల్లుల వెన్నెలా
పాలనురుగుల వెన్నెలా
పండుపున్నమి వెన్నెలా
మెల్లమెల్లగ మలయానిలము
మోసుకొచ్చే వెన్నెల
నీలిమబ్బుల దారిలోన
నాట్యమాడే వెన్నెల ॥వెన్నెల॥
పూల వెన్నెల తావులందు
ఊగితూగే వెన్నెల
మనసుమనసున పరవశాన
మత్తు గొలిపే వెన్నెల ॥ వెన్నెల॥
‘‘ఎంత బాగా పాడావు! నీ గొంతులోనే వెన్నెల జాలువారుతోంది సుమా!’’
మంజరి మాటలకి చంద్రప్ప ప్రేమగా ఆమె ఒడిలోకి చేరాడు.
‘‘మంజూ! మనకింక ఎడబాటు ఉండదు. మధురమైన జీవితంలో కష్టసుఖాలు కలిసి అనుభవించటం మధురంగానే ఉంటుంది సుమా!’’
‘‘చంద్రా! నీ కోసం నేను, నా కోసం నువ్వు’’
‘‘అంతేకాదు మంజూ! నా గానం నీకోసం, నీ నాట్యం…’’
‘‘నీకోసం…’’ గలగలా నవ్వింది మంజరి. ప్రవహిస్తున్న సెలయేరు ఒకసారి ఆగి ఆమె నవ్వుల్ని విని పరవశించి మళ్ళీ ముందుకు సాగిపోయింది.
* * *
అన్నపూర్ణాదేవి చిక్కి శల్యగతమై కనిపిస్తున్నది.
తిరుమలదేవి కూడా అదే మందిరంలో అస్వస్థుడుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలకు సపర్యలు స్వయంగా చేస్తున్నది.
‘‘ప్రభూ! ఈ ఔషధం సేవించండి’’ తిరుమలదేవి ఔషధపాత్ర అందించింది.
‘‘దేవీ! ఔషధ సేవనంతో నా వ్యాధి తీరేది కాదు. మనోవ్యాధిని ఏ రాజవైద్యులు తీర్చగలరు’’ కృష్ణరాయలులో మునుపటి ఠీవికి బదులు నైరాశ్యం కన్పిస్తున్నది.
అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చి రాయలవారి చేయి పట్టుకుంది.
‘‘ప్రభూ! నావల్లనే మీకీ స్థితి కలిగింది. ఆనాడు నన్ను వివాహమాడకుంటే ఇలా….’’ కన్నీరు మున్నీరయింది.
‘‘అలా అనకు దేవీ! ఇది పూర్వజన్మ ప్రారబ్దం! లేకుంటే ముద్దులు మూటగట్టే చిన్నారి రాకుమారుడు మేము అతి సురక్షితమని నమ్మిన అంతఃపురంలోనే విషప్రయోగంతో మరణించటమేమిటి? జీవితాంతం మేము తండ్రిలా గౌరవించిన అప్పాజీకి మేమే కళ్ళు పొడిపించటమేమిటి? హా విరూపాక్షా! నేటితో కృష్ణరాయల ప్రభ అంతరిస్తున్నది గాబోలు’’ దుఃఖించారు రాయలు.
‘‘ప్రభూ! చింతించకండి. అన్నిటికీ ఆ వేంకటేశుడే ఉన్నాడు. మీరు త్వరగా కోలుకుని ప్రజల బాగోగులు చూడాలి. మీకోసం అన్ని ఆలయాల్లో వ్యాసరాయల వారు పూజాదికాలు జరిపిస్తున్నారు’’ తిరుమలదేవి ప్రభువుకు ఉత్తేజాన్నిచ్చే ప్రయత్నం చేసింది.
‘‘అప్పాజీవారు కూడా మీ ఆరోగ్యపరిస్థితి గురించి కబురుచేశారు ప్రభూ’’ అన్నపూర్ణాదేవి ఊరటగా చెప్పింది. అప్పాజీ పేరు వింటూనే రాయల ఆవేదన మరింత పెరిగింది.
‘‘అయ్యో అప్పాజీ! ఇంకా ఈ విశ్వాసఘాతకునిపై కనికరం చూపిస్తున్నారా!’’
ఆంధ్రసమ్రాట్టు నన్నయ్యా యనిననాడు
నీ రూపు లోన వర్ణించుకొంటి
ఆంధ్రక్షమారిపు లవఘళించిన నాడు
నీ శంఖరవము ధ్వనించుచుంటి
ఆంధ్రసత్కవిబృంద మగ్గించి పొగడిన
నీ పొగడ్తల రీతి నేర్చుకొంటి
ఆంధ్రమహాజను లతడె తిమ్మరుసన
నీవంక చూపుల నిలుపుకొంటి
అడుగడుగునందు నీయాశ లల్లుకొంటి
నైన పూర్వార్జితంబె నన్ననుసరించె
నీమహాలీలలో మాయనేర్వలేని
బుద్ధిహీనుడనై దేవ, పొగులుచుంటి
అప్పాజీ! మీకు అన్నం, నీళ్ళు లేకుండా చేసి కనుచూపు రూపుమాపిన దురాత్ముడ్ని. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. రాబోవు తరాల ప్రజలు కృష్ణరాయలింతటి కృతఘ్నుడని చరిత్రలో లిఖిస్తారు కాబోలు.
రాయా! అని మమ్మెవరు ఆదరంగా పిలుస్తారు? ప్రజల యోగక్షేమాల గురించి మమ్మెవరు హెచ్చరిస్తారు? జయభేరి నినాదాలకు సంతోషించి ఆశీస్సులందించే వారెవరు? రాయచూరు గెలిపించి, గజపతులనోడిరచి, కొండవీడును అల్లాడిరచి, మ్లేచ్ఛుల సంపదల్ని విద్యానగరానికి బండ్లకెత్తించిన సామదాన భేద దండోపాయ ప్రవీణుడైన అప్పాజీ మా పుత్రుని హత్య చేశారంటే మేం ఎలా నమ్మగలిగాం? ఏ శని మా నెత్తిన నాట్యమాడిరదారోజు!
దేవీ! చూశావా!ఈ శరీరంలో ప్రతి రక్తపుబొట్టు అప్పాజీ పెంచి పోషించిందే! మా తండ్రిగారు చనిపోవునప్పుడు మమ్మల్ని అప్పగించింది మమతామూర్తి అప్పాజీకే! నేడీ విజయనగర మహాసామ్రాజ్య స్థాపనకు మూలస్తంభం అప్పాజీయే! మేము అన్నపూర్ణాదేవిని పరిణయమాడటానికి కారకులు అప్పాజీయే! రాత్రింబవళ్ళు సంగీత సాహితీలోకంలో మేము విహరించగలిగా మంటే రాజ్యభారాన్నంతా అప్పాజీవారే మోశారు గదా!
అయ్యో! ఎంత పని జరిగింది! చేతులారా తొందరపాటుతో నా తండ్రినిట్లా చేశాను. దేవీ! ఇంక నేనెట్లా జీవించాలి?’’
కృష్ణరాయల దుఃఖానికి అంతులేదు.
నిరంతరం తిమ్మరుసుపట్ల తానుచేసిన అపకారాన్ని తల్చుకొని మరీమరీ కుంగి కృశించిపోతున్నారు. రాయల దేవేరులిద్దరూ రాయలను సమాధాన పరచలేని నిస్సహాయులయ్యారు. వ్యాసరాయలవారు చేసిన బోధ కూడా రాయలను సాంత్వనపరచలేకపోతున్నది. రోజురోజుకు కృష్ణరాయలు నీరసించి పోతూ శయ్య కంటుకొనిపోయాడు. రాచకార్యాలన్నీ మూలపడ్డాయి. రాజ్యంలో సంక్షోభపరిస్థితి అలుముకుంది.
* * *
‘‘మహారాణీ! అతిముఖ్యమైన సమాచారం ప్రభువులవారికి తెలియజేయాలి’’ రామలింగనాయకుడు, గండమనాయకుడు కలిసి రావటంతో తిరుమలదేవి ఆందోళన చెందింది.
‘‘ప్రభువులవారి ఆరోగ్యం అంత బాగాలేదు. ఈ సమయంలో వారి మనసు నొప్పించే విషయమైతే చెప్పకపోవటమే మంచిది. ఏమి వార్త రామలింగనాయకా?’’ మహారాణి అడిగింది.
‘‘మహారాణీ! రాయలవారి అనారోగ్య విషయం శత్రువులకి పాకింది. అదిల్‌షా మనం జయించుకున్న భూభాగాల కోసం యుద్ధానికి సిద్ధమౌతున్నాడు. మనం కూడా పోర్చుగీసు వారినుంచి కొన్న ఆరువందల గుర్రాలతో పెద్దసైన్యంతో షా ఆధీనంలోని బెల్గాం మీద దాడికి సిద్ధమౌతున్నాం. ఈ విషయంలో గోవాలోని పోర్చుగీసువారి సాయాన్ని కూడా అడిగాం. ఇంకా రాయబారి వెనక్కి రాలేదు. ప్రభువులవారి అనుమతి కోసం….’’
‘‘మీరు చెప్పిన అంశాలు సబబుగానే ఉన్నాయి. ఆ రాయబారి వెనక్కువచ్చాక పూర్తివివరాలతో ప్రభువుకు విన్నవిద్దాం’’ వారిని నిరోధించింది తిరుమలదేవి.
అప్పాజీని అంధుడ్ని చేశాక ఈ అయిదేళ్ళలో రాయల పరిస్థితి మరింత విషమంగా మారిందని వాళ్ళు అర్థం చేసుకున్నారు.
‘‘మహారాణీ! అప్పాజీవారి కుమారుడు గోవిందరాయలు కొందరు దుర్గాధిపతులను కూడగట్టి తిరుగుబాటు చేశాడు. దానిని అణచేసి గోవిందరాయలను కారాగారంలో బంధించాము.’’
సేనానాయకుని మాటలకు మహారాణి మొహం వివర్ణమైంది.
‘‘రామలింగనాయకా! ప్రభువుకీ వివరాలు తెలిపే సమయం ఇదికాదు. మంత్రిగారితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. మీరిక వెళ్ళవచ్చు’’ మహారాణి ఆజ్ఞను అనుసరించి వాళ్ళు తిరుగుమొహం అయ్యారు. రాజదర్శనం కాకపోవటం వల్ల నిరుత్సాహంగా ఉంది. సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకున్నాడు అలసటగా.
* * *
చంద్రప్ప దుఃఖంతో నిలువెల్లా తడిసిపోయాడు. విజయనగర ప్రభువు అస్తమించాడన్న వార్తకు రాజ్యమంతా కన్నీటిలో మునిగిపోయింది. తెలుగుతేజం అస్తమించింది.
ప్రధానమంత్రి పరిషత్తులో ఆంధ్రభోజుని మరణశాసనం తెలియజేయటం జరిగింది. చంద్రగిరి కోటలో బందీగా ఉన్న సదాశివరాయలను రాజును చేయమని కృష్ణరాయని కోరిక. అతనికి తగిన వయసులేనందున రాజ్యభారాన్ని అల్లుడు రామరాయలు, తమ్ముడు అచ్యుతరాయలు నిర్వహించాలనీ రాయలు రాశాడు.
రాయచూర్‌ను జయించటం చాలా అవసరమని కూడా రాయలు మరణశాసనంలో పేర్కొన్నాడు. విధిచూపు మరోరకంగా ఉంది. తండ్రి మరణంతో సదాశివరాయలు తాతగారి ఇంటికి వెళ్ళిపోయాడు. అధికారం కోసం తపిస్తున్న కృష్ణరాయల తమ్ముడు అచ్యుతరాయలు సింహాసనమెక్కాడు. కానీ పెత్తనం మాత్రం రామరాయలదే!
అచ్యుతరాయలు మదిరాపానంతో వళ్ళు తెలీకుండా పడి ఉంటున్నాడు. చుట్టూ మదవతులున్నారు. రామరాయలు అచ్యుతరాయలికి చాలాసార్లు నచ్చచెప్పాడు.
‘‘ప్రభూ! విజయనగర సామ్రాజ్యం కృష్ణరాయల కీర్తికిరీటంగా వెలుగొందింది. దీనిని కళంకితం చేయకూడదు. మీరు రాజ్యశ్రేయస్సు కోరి పరిపాలనా విషయాలు పట్టించుకోవాలి.’’
అచ్యుతరాయలు తల కొంచెం పైకెత్తి ఎరుపెక్కిన కళ్ళతో రామరాయల్ని చూశాడు.
‘‘మాకు అవన్నీ అవసరం లేదు. అవన్నీ చూసేపని మీకే అప్పగించాం కదా’’ అచ్యుతరాయల మాటలు తడబడుతున్నాయి.
‘‘నిజమే! మేం దేశాన్ని రెండువందల విభాగాలుగా ఏర్పాటుచేసి సామంతులకు కప్పం వసూలుచేసే బాధ్యతనిచ్చాం. సైన్యాన్ని బలోపేతం చేశాం. తలెత్తిన శత్రువుల్ని అణిచేశాం. కానీ మీ సరదాలకు ఖజానా వ్యయం….’’
‘‘ష్‌… ఇది మా స్వంత విషయం. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరాదు’’ అచ్యుతరాయలు మత్తులో మునిగిపోయాడు.
చేసేదేమి లేక రామరాయలు వెనుదిరిగాడు. తన మందిరానికి వచ్చి వాణిజ్యమంత్రిని పిలిపించాడు.
‘‘మంత్రివర్యా! మనం వసూలుచేసే ధనం నిల్వచేయడానికి వేరే ప్రత్యేక ఖజానా ఏర్పాటుచేయండి.’’
‘‘చిత్తం ప్రభూ! మరో ముఖ్యవిషయం మీతో మనవి చేయాలి. అచ్యుతరాయలవారి బావమరిది, వరదాంబికాదేవి సోదరులు సకలం తిమ్మయ్యగారిని విజయనగర ప్రధానామాత్యులుగా అచ్యుతరాయలువారు నియమించారట ప్రభూ!’’
‘‘సరే మీరిక వెళ్ళవచ్చు’’ అతనిని పంపేసి రామరాయలు తనలో తాను వితర్కించుకున్నాడు.
ఇలా ఎందుకు జరుగుతున్నది? మాకు మాటమాత్రం చెప్పకుండా అచ్యుతరాయలు తన బావమరిది తిమ్మయ్యకు అధిóకారం కట్టబెట్టటం మాకు అవమానం కాదా! అచ్యుతరాయలతో తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం పరస్పర చర్యలు సంప్రదింపులతోనే అన్నీ జరగాల్సి ఉంది. కానీ అలా జరగటం లేదు. అచ్యుతరాయలను ఎదుటపడి ప్రశ్నింపలేడు. తిమ్మయ్యను కట్టడిచేయలేడు. ఇప్పటికే దండనాధులు దుర్గాధిపత్యాల ఆశతో తిమ్మయ్యకు లోబడ్డారు.
కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండడమే మేలు.
ఇలా ఆలోచించిన రామరాయలు కొంతకాలం రాజ్యం గురించి పట్టించుకోవటం మానేశాడు. తిమ్మయ్యను అందలం ఎక్కించిన అచ్యుతరాయలు వినోద కాలక్షేపాలలో మునిగిపోయాడు. రామరాయలను తిమ్మయ్య చులకన చేయటం మొదలైంది. అంటే తిమ్మయ్య అసలు స్వరూపం బయటపడుతోంది. సైన్యం పట్ల దురుసుగా ప్రవర్తించటం, వారికి తగిన వేతనాలు చెల్లించక పోవటంతో ప్రజలకు రాజుపైన, పరిపాలన పైన వ్యతిరేకత మొదలైంది. చేసేదిలేక రామరాయలు అచ్యుతరాయ మందిరానికి మళ్ళీ వెళ్ళాడు.
వ్యసనాలతో దుర్భలుడై రోగగ్రస్తుడై ఉన్న అచ్యుతరాయలు రామరాయలను గౌరవింపలేదు.
‘‘విజయనగర రక్షకులా! ఏం ఇలా వేంచేశారు?’’ వ్యంగ్యంగా నవ్వాడు అచ్యుతరాయలు.
‘‘అర్హతలేనివారికి అధికారాలీయటం వల్ల విజయనగర సామ్రాజ్యం పతనదిశకు ప్రయాణిస్తోంది. తిమ్మయ్య ప్రవర్తన పలువురికి అభ్యంతరకరంగా ఉంది’’ అంటూ రాయరాయలు తిమ్మయ్య ఆగడాల గురించి తెలియజేశాడు. అచ్యుతరాయలు బలహీనంగా నవ్వాడు.
‘‘తిమ్మయ్య మా దేవేరి వరదాంబిక సోదరుడు. ఆయన్ని ప్రధానమంత్రిని చేయటం అనుచితం కాదు. పైగా తిమ్మయ్య మాకు ఎప్పుడైనా ఎంత కావలిసివస్తే అంత ధనం ఇస్తున్నాడు. మీరు కూడా అలా ఇవ్వగలిగితే మునుపటి మీ అధికారాలు మళ్ళీ మీకు అందుతాయని గ్రహించండి.’’
‘‘ప్రజాధనాన్ని వ్యసనాలకు దుర్వినియోగం చేసే మీలాంటి రాజుకు నేను సహాయపడలేను’’ రామరాయలు ఖచ్చితంగా చెప్పేశాడు.
‘‘అయితే మీరిక నాతో మాట్లాడేదేం లేదు’’ అచ్యుతరాయలు రామరాయలు మొహంమీదే అనేశాడు.
రామరాయలు తీవ్రంగా ఆలోచిస్తూ వెనుదిరిగాడు. హఠాత్తుగా అతనికి శ్రీకృష్ణదేవరాయల మరణశాసనం గుర్తొచ్చింది.
‘‘అవును. అలాచేస్తేనే ఈ విజయనగర సామ్రాజ్యం మరికొన్నాళ్ళు నిలుస్తుంది… రేపే తాత ఇంట పెరుగుతున్న అసలు వారసుడు సదాశివరాయలకు కబురుచేస్తాను.’’
రామరాయలు మనస్సు తేలికపడిరది. విజయనగర సామ్రాజ్యపూర్వ వైభవానికి రామరాయలు కంకణం కట్టుకున్నాడు. కానీ అప్పటికే ఆ సంగతి గ్రహించిన తిమ్మయ్య దారిమధ్యలోనే సదాశివరాయలను నిర్భంధించటంతో రామరాయలు ఖిన్నుడయ్యాడు. ఎన్నాళ్ళనుంచో కాచుకుని ఉన్న గజపతుల సైన్యం విజయనగరం మీద దండు వెడలింది. అన్నపూర్ణాదేవి తమ పుట్టింటివారి అకృత్యానికి చాలా చింతిల్లుతూ పెద్దనామాత్యునికి తెలియజేసింది. రాచకార్యాలలో సాయపడే కవులు పుట్టిన గడ్డకదా విజయనగరం! పెద్దన గజపతులనిద్దేశిస్తూ ఇలా రాసి పంపాడు.
రాయరా హుతమిండ రాచయేనుగు వచ్చి
యూరట్లకోట గోరాడునాడు
సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి
సింహాద్రి జయశిల జేర్చునాడు
సెలగోలు సింహంబు చేరి ధిక్కృతి గంచు
తల్పుల గిరుల డీకొల్పునాడు
ఘనతర నిర్భర గండపెండేర మిచ్చి
కూతు రాయల కొనగూర్పునాడు
ఒడలెరుంగవో చచ్చితో యుర్విలేవో
చేరజాలక తలచెడి జీర్ణమైతొ
కన్నడం బెట్లుసొచ్చెదు గజపతీంద్ర
తెరచినిలు కుక్క సొచ్చిన తెరగు దోప ॥
అన్నపూర్ణాదేవి ఆ పద్యాన్ని గజపతులకు చేర్చింది. వారది చదివి సిగ్గుపడి తమ దండయాత్రను విరమించుకున్నారు.
‘‘కవివర్యా! మీరు చేసిన మేలు మరువరానిది. కృతజ్ఞులము’’ అన్నపూర్ణాదేవి పెద్దనకు చేతులు జోడిరచింది.
‘‘అమ్మా! రాయలవారి ఉప్పుతిని పెరిగిన శరీరమిది. అంతటి ప్రభువును మళ్ళీ వినగలమా! కనగలమా!
ఎదురైనచో దన మదకరీంద్రము నిల్పి
కేలూత ఒసగి ఎక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొను వేళ బురమేగ
బల్లకి తన కేల బట్టి యెత్తె
గోకట గ్రామాద్య నేకాగ్రహారంబు
లడిగిన సీమలయందు నిచ్చె
బిరుదైన కవిగండపెండేరమున కీవ
తగుదని తానె పాదము దొడిగె
ఆంధ్రకవితాపితామహా అల్లసాని
పెద్దన కవీంద్ర! యని తన్ను పిల్చునట్టి
కృష్ణరాయలతో దివి కేగ లేక
బ్రతికియున్నాడ జీవచ్ఛవంబనగుచు ॥।
పెద్దన కవీంద్రుని కన్నీరు చూసి అన్నపూర్ణాదేవి కూడా శోకించింది.
‘‘అమ్మా! మిమ్ముల నేను ఇంక బాధింపలేను. మనకు ఋణం తీరింది తల్లీ! వెళ్ళివస్తాను’’
పెద్దనకవి భారంగా వెళ్ళిపోయాడు.
ఇదంతా స్వయంకృతమని అన్నపూర్ణాదేవి చాలా దుఃఖించింది.
* * *
వృద్ధుడు, అంధుడైన తిమ్మరుసు ఇప్పుడు అతి దీనావస్థలో ఉన్నాడు. బాల్యంలో దుర్భర దరిద్రం అనుభవించిన, మధూకరం ఎత్తుకొని సత్రాల్లో భోజనం చేసి సకలశాస్త్రాలు అభ్యసించిన విద్యావేత్త తిమ్మరుసు ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించగలిగిన మహాప్రజ్ఞను స్వహస్తాలతో సానపెట్టుకున్నాడు.
శ్రీకృష్ణదేవరాయల పేరు ప్రస్తావిస్తే తిమ్మరుసును విస్మరించలేం. విజయనగర చరిత్రకు పరిపూర్ణత తిమ్మరుసే! కటిక బీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బాల్యమంతా గంజినీళ్ళతో బతికాడు. ఒకనాడు అడవిలో సొమ్మసిల్లి పడిపోతే నాగుపాము పడగతో అతనికి నీడనిచ్చిందట. ఒక సాధువీసంగతి గ్రహించి అతను చరిత్రపురుషుడు కాగలడని నమ్మి ఇంటికి తీసుకెళ్ళి పరిచర్యలు చేసి ఒక సామంతరాజు వద్ద లేఖకుడిగా నియమింపజేశాడట. అక్కడినుంచి తిమ్మరుసు జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఎంతోమంది రాజులవద్ద తిమ్మరుసు తన మేధాసంపత్తితో రాణించాడు. కొన్నాళ్ళకు తిమ్మరుసు తుళువ నరసరాయల వద్ద మంత్రిగా చేరాడు. రాజు అభిమానం పొందాడు.
అలా ప్రారంభమైన తిమ్మరుసు రాజకీయ ప్రయాణం విజయనగర చరిత్రలో సుస్థిరంగా వెలిగిపోయింది. నిలిచిపోయింది. కృష్ణదేవరాయల జీవితంలో, విజయనగర సామ్రాజ్య విస్తరణలో ప్రముఖపాత్ర వహించిన తిమ్మరుసు కేవలం మహామాత్ముడే కాదు అంతకుమించి దైవతుల్యుడు. ఆయుధ ప్రయోగం లేకుండా తన మేధాసంపదతో శత్రువులని మట్టి కరిపించిన ధీశాలి.
అటువంటి తిమ్మరుసు మహామంత్రి తాను పెంచి పెద్దచేసి రాజును చేసిన పుత్రతుల్యుడైన రాయల విరోధానికి గురై అంధుడై అతి దీనావస్థలో ఉండటం అందరినీ బాధిస్తున్నది. చంద్రప్ప తిమ్మరుసుకు సహాయం చేయబోయాడు. అభిమానధనుడైన ఆ వృద్ధమంత్రి ఎవరి సహాయాన్ని అంగీకరించలేదు.
అనేకులకు స్వయంగా దానధర్మాలు చేసిన తిమ్మరుసుకు తిరుపతి దేవాలయంవారు ప్రసాదం పంపేవారు. ఆ ప్రసాదాన్ని అమ్ముకుని బతికే దుస్థితి తిమ్మరుసుకు కలగటం ఏనాటి పాపమో అని అంతా దుఃఖిస్తున్నారు. రాయలు మరణించిన దాదాపు ఆరేళ్ళకు ఈ భూమిమీదే నరకాన్ని చూసిన తిమ్మరుసు మహామంత్రి స్వర్గవాసుడయ్యారు. విజయనగర స్వర్ణయుగ చరిత్ర పుటల్లో తనదైన విలక్షణ స్థానాన్ని నిలుపుకున్న మహనీయుడయ్యారు.
* * *
తిమ్మరుసు మరణం తిరుమలదేవిని, అన్నపూర్ణాదేవిని మరింత కుంగదీస్తున్నది. సకలం తిమ్మయ్య దురాగతాలు అచ్యుతరాయల సాయంతో మితిమీరాయి. అచ్యుతరాయల రాణి వరదాంబిక ఇతని ఆగడాలకు వత్తాసు పలికింది. రాజ్యమంతటా అవినీతి తాండవిస్తున్నది.
విజయనగర సామ్రాజ్యం అల్లకల్లోలంగా అవినీతి అంధకారంలో మునిగిపోవడంతో చిరకాల శత్రువు బీజాపూర్‌ ఆదిల్‌ఖాన్‌ విజయనగరంపై దాడిచేశాడు. మద్యం, మగువ తప్ప ఎరుగని అచ్యుతరాయలు తిమ్మయ్యపై బాధ్యతవేసి విందువినోదాల్లో మునిగిపోయాడు. యుద్ధంకంటే సంధి మేలనుకున్న తిమ్మయ్య ఆ నిర్ణయాన్ని సేనాపతులకు తెలిపాడు. వారిటువంటి పిరికి నిర్ణయాన్ని అసహ్యించుకుని రామరాయలకు విన్నవించారు. రామరాయలు కోరినా యుద్ధం చేయటానికి అచ్యుతరాయలు అంగీకరించలేదు. శత్రువుల ఎదుట తలదించటం తెలియని ఆంధ్రసైనికులు నిర్జీవంగా మారారు. దేశభక్తులు కుమిలిపోయారు.
అపారసంపదతో వెళ్ళిన తిమ్మయ్య శత్రువులకు ఆ సంపదలతోబాటు రాయచూర్‌, ముద్గల్లు, దుర్గాల తాళంచెవులు ఇచ్చి వచ్చాడు. ఈ సంఘటనలో విజయనగర పౌరులు, సైన్యం, మానసికంగా కుంగిపోయారు. ఇన్నాళ్ళు విజయనగరంతో మిత్రుత్వం నటించే పోర్చుగీస్‌వాళ్ళు పశ్చిమతీరం నుండి తూర్పు తీరంచేరి శాంథోమ్‌ దాటి తిరుపతి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఎందరినో క్రైస్తవులుగా మార్చారు. రామరాయలు చేసేదిలేక కందవోలుకు వెళ్ళిపోయాడు.
* * *
తిమ్మయ్య పిలుపుమేరకు అతని సమావేశ మందిరానికి చంద్రప్ప వచ్చాడు.
‘‘నీవేనా తిమ్మరుసుకు వేగుసాయం చేసిన పాటగాడివి?’’ వ్యంగ్యంగా అడిగాడు.
‘‘వారికి నాలాంటివారిది ఉడతసాయమే!’’ వినయంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘ఓహో! మాకు పాఠాలు నేర్పుతున్నావే! అన్నట్లు నీవు మహాగాయకుడివి కదా! నేడు మా గురించి నీ పాట వినాలని కుతూహలంగా ఉంది.’’
చంద్రప్ప మాట్లాడలేదు. అతని మౌనం తిమ్మయ్య అహాన్ని మరింత రెచ్చగొట్టింది.
‘‘తిరస్కారమా’’ హూంకరించాడు.
‘‘లేదు అమాత్యా! కృష్ణరాయల ఆస్థానంలో స్వేచ్ఛగా చేసిన గానాన్ని పంజరంలో బంధించకండి. కళాకారులను నిర్బంధిస్తే కళలు వికసించవు ప్రభూ’’ విన్నవించాడు చంద్రప్ప.
‘‘ఎంత పొగరు! నువ్వు పాడకపోతే నీ ఇల్లాలు…’’ అర్థవంతంగా వికటంగా నవ్వాడు తిమ్మయ్య.
చంద్రప్ప విచలితుడయ్యాడు. పాట పాడటానికి ఆలాపన మొదలుపెట్టాడో లేదో… ఎవరూ ఊహించని రీతిలో తటాలున ఛురిక తీసి నాలుక తెగ్గోసుకున్నాడు చంద్రప్ప. రక్తం కారుతూ పడిపోయాడు. కళాకారునికి ఇష్టం లేకుండా కళని దోచుకోవటం ఎంతటి రాజులకైనా సాధ్యం కాదని నిరూపించాడు.
సభ నివ్వెరపోయింది. తిమ్మయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు.
అంతకుముందే ఆప్తులవల్ల సభా సమాచారం తెలిసిన మంజరి పరుగుపరుగున చంద్రప్పను చేరింది. అప్పటికే అవసాన ఘడియల్లో ఉన్న చంద్రప్ప చేతిలోని కైజారుతో తానూ పొడుచుకొని అతని వక్షస్థలం మీద వాలిపోయింది ఆ కళామూర్తి ప్రేమమయి.
అమరులైన ఆ కళాకారుల కోసం, దేశభక్తుల కోసం కన్నీరు పెట్టేవారు కూడా ఆ సభలో కరువైపోయారు. కళలకు కాణాచి అయిన విజయనగర సామ్రాజ్యం ఇద్దరు గొప్ప కళారాధకులను బలిగొన్న దుర్దినం అది.
* * *
రామరాయలు శయ్యాగృహానికి వచ్చాడు. తిరుమలాంబిక ఆప్యాయంగా ఎదురేగి కౌగలించుకుంది. ఆపైన ఆయనకేసి చూస్తూ నిట్టూర్చింది.
‘‘దేవీ! ఎందుకీ నిట్టూర్పు’’ రామరాయలు కనిపెట్టి అడిగాడు.
‘‘నాకెందుకో భయంగానే ఉంది ప్రభూ! మా తండ్రిగారు శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి రాకముందు ఎన్నో కుట్రలు జరిగాయని మాతల్లి చెప్పింది. ఇప్పుడు ఈ విజయనగర అంతఃపురంలో అటువంటి కుట్రలేవో జరుగుతున్నాయని పిస్తుంది. మిమ్మల్ని…’’
‘‘నా ప్రాణానికి ఏ అపాయంరాదు దేవీ! ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ రామరాయలనేం చేయలేరు’’ మీసము దువ్వాడా వీరుడు.
‘‘అయినా ఎవరిని నమ్మగలం? అంతా విషవలయంలో ఉన్నట్లుంది. మనం మళ్ళీ వెళ్ళిపోదాం’’ ఆవేదన వెలిబుచ్చింది తిరుమలాంబిక.
‘‘దేవీ! రాజప్రాసాదంలో కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఎవరి మాటలు రూఢ కావు. జాగ్రత్తగా మెలగాలి. అందర్నీ నమ్మకూడదు’’ హితబోధ చేశాడు రామరాయలు.
‘‘అచ్యుతరాయలవారి ఆరోగ్యం సరిగా లేదటగదా’’ తిరుమలాంబిక ఆరాతీసింది.
‘‘అవును. వారి భోగలాలసత్వం మితిమీరింది. రాజ్యంలో దొంగల బాధ అధికమయింది. వర్తకం, పరిశ్రమలు వెనుదిరిగాయి. యాత్రికుల కష్టాలకు లెక్కలేదు. పన్నులు పెంచటం వల్ల ప్రజలకు కోపంగా ఉంది. రాజ్యపరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి.’’
తిరుమలాంబిక కనుల నీరు నిండిరది.
‘‘మా తండ్రిగారు ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని స్వర్ణమయం చేశాడు. ఈనాడిలా…’’
రామరాయలామె కనుల నీరు తుడిచాడు.
‘‘ఇదంతా అచ్యుతరాయల వైఫల్యం. తిమ్మయ్య చేతుల్లో కీలుబొమ్మయినాడు. బీజాపూర్‌వారికి బానిసయ్యాడు. నేడోరేపో అతని చివరిదశ ముగుస్తుంది.’’
‘‘హతవిధీ! మరి విజయనగర సింహాసనానికి వారసులు?’’
‘‘వెంకటరాయలు కుమారుడే’’
‘‘ఆ పసివాడా’’ నిరుత్సాహపడిరది తిరుమలాంబిక.
‘‘రాజెవరైనా అన్నిటికీ తిమ్మయ్యే కదా’’ రామరాయలు అసంతృప్తిగా అన్నాడు.
* * *
‘‘సేనాపతిగారూ! వెంకటరాయల మరణాన్నీ, మా రాజపట్టాభిషేకాన్నీ వెంటనే చాటింపు వేయండి’’ తిమ్మయ్య ఆజ్ఞాపించాడు.
‘‘వెంకటరాయల మరణమా’’ సేనాధిపతి కలవరపడ్డాడు.
‘‘అంతేగాదు. కాదన్నవారిని ఊచకోత కోయండి’’ తిమ్మయ్య క్రూర శాసనం చేశాడు.
సేనాపతి మొహం వెలవెలబోయింది. గత్యంతరం లేదు. తిమ్మయ్య రాజయ్యాడు. సైనికులకు జీతాలు లేవు. ప్రజల అవసరాలు పట్టవు. తిమ్మయ్య బీజాపూర్‌ సుల్తాన్‌కు విపరీతంగా కానుకలు పంపి తనవాడిగా చేసుకున్నాడు. అతని చిత్రవిచిత్ర ప్రవర్తనకు ప్రజల రక్తం మరుగుతోంది. సామ్రాజ్యం కోసం ప్రాణాలు త్యాగం చేయగల సైనికులు చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తున్నది. వాళ్ళు అసహనం ప్రకటిస్తున్నారు. తిరగబడుతున్నారు. తిమ్మయ్య స్వీయ ప్రాణరక్షణకు దక్షిణాన ఉన్న బీజాపూర్‌ సుల్తాన్‌ ఆదిల్షాకు లేఖ పంపాడు. సైన్యసమేతంగా వచ్చి తనకి మద్దతు ఇవ్వమని.
శ్రీకృష్ణదేవరాయలు బతికి ఉన్నప్పుడు విజయనగర సామ్రాజ్యం పేరు వింటేనే గజగజలాడే ఆదిల్‌షా దర్జాగా మందిమార్బలంతో, సైన్యంతో తరలివచ్చాడు. తిమ్మయ్య ఇచ్చిన అపూర్వ స్వాగతం అందుకున్నాడు. సభామండపానికి ఆదిల్‌షాను తీసుకెళ్ళాడు తిమ్మయ్య. విజయనగర సింహాసనం చూడగానే ఆదిల్షాకు కోరిక పెరిగింది.
‘‘నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆ సింహాసనాన్ని అధిష్టిస్తాను. నీవు మునుపటిలాగా ముఖ్యమంత్రి ఆసనాన్ని అలంకరించు’’ అన్నాడు.
అదిల్‌షా కోరికను తిమ్మయ్య తిరస్కరించలేడు. అలాచేస్తే అధోగతే! స్వయంగా అతడిని తీసుకువెళ్ళి విజయనగర సింహాసనంపై కూర్చోబెట్టాడు తిమ్మయ్య.
చరిత్రలో అది మహాదుర్దినం. పౌరుష శౌర్య ప్రతాపాల తెలుగు బిడ్డలు, స్వంత దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన హిందూరాజులు అధిష్టించిన సింహాసనం మీద, మూరురాయరగండ, ఆంధ్రభోజుడధిష్టించిన సింహాసనం మీద ఒక ముసల్మాను కూర్చోవటం విజయనగర వినాశనానికి నాంది అయింది.
ఇక ప్రజలు మౌనం వహించలేకపోయారు. రామరాయలను సామ్రాజ్యాన్ని కాపాడమని ఆహ్వానించారు. ఈలోగా ఆదిల్‌షా ప్రతాపం, ప్రజలపై అణచివేత ఎక్కువైంది. తురకసేనలు ప్రజాజీవితాన్ని దుర్భరం చేశాయి. రామరాయలు సైన్యంతో కోట వెలుపల విడిదిచేశాడు. ఆదిల్‌షా తోక ముడిచాడు. మూర్తీభవించిన విజయనగర పౌరుషానికి తలొంచి దోచిన సంపదంతా తిరిగి ఇచ్చేశాడు.
తిమ్మయ్య శిరస్సు ఖండిరచి విజయనగరాన్ని పట్టుకున్న పిశాచాన్ని వదిలించాడు రామరాయలు. సదాశివరాయలను విడుదల చేసి చక్రవర్తిగా చేశాడు. పేరుకే సదాశివరాయలు రాజు. పెత్తనం మాత్రంమళ్ళీ రామరాయలదే!
రామరాయలు పరిపాలనా యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో బంధించు కోవటానికి అవసరమైన భారీ మార్పులన్నీ చేశాడు. బహ్మనీ సుల్తానులతో విజయనగరంవారికి నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రామరాయలు రకరకాల వ్యూహాలతో విజయనగరానికి విశేష ధనాన్ని సంపాదించిపెట్టాడు. బహ్మనీలతో, పోర్చుగీసువారితో తెలివిగా ప్రవర్తించి కోల్పోయిన కోటలు తిరిగి సాధించాడు.
శ్రీకృష్ణదేవరాయ నిర్మితమైన భువనవిజయంలో విజయదశమి రోజున కవిపండిత గోష్టి నిర్వహించాడు రామరాజు. ఆనాటి చర్చ ‘కవిత్వ విమర్శ’ అనే అంశం మీద కొనసాగుతున్నది.
రామరాయలు సభనుద్దేశించి ప్రశ్నించాడు.
‘‘కవిత్వానికి మూలం ఏది?’’ ఎవరూ బదులీయలేదు.
‘‘రామయామాత్యా! మీ అభిప్రాయం’’ అడిగాడు రామరాయలు.
‘‘భావనాశక్తి’’
‘‘రాజనాథ డిరడిమా! మీ ఆలోచన?’’
‘‘శ్రేష్టమైన ప్రసిద్ధమైన వస్తువు’’
రామరాయలకా జవాబు తృప్తినివ్వలేదు. అంతఃపుర కక్ష్యనుండి తిరుమలాంబ ‘‘వివేచనాశక్తి, లోకజ్ఞానం’’ అన్నది.
అండుగుల వెంకయమాత్యుడు ‘‘భగవత్కటాక్షం’’ అన్నాడు.
రంగవరాజు ‘‘పాండిత్యం’’ అన్నాడు.
అందరూ తలోరీతి చెప్పారు. రామరాయలు చివరకి భట్టునుద్దేశించాడు. భట్టు లేచాడు.
‘‘ప్రభూ! కవిత్వానికి మూలం ప్రతిభ! మిగిలినవన్నీ దాని పోషకాలు. ప్రతిభ లేనివాడు కవి కాలేడు. కళాకారుడు కూడా కాలేడు. గ్రంథాలు చదివితే పాండిత్యం, జ్ఞానం వస్తాయి. ప్రతిభ రాదు. అది పుట్టుకతో రావాల్సిందే’’ అన్న భట్టు అభిప్రాయం మీద వాదప్రతివాదాలు జరిగాయి. రామరాయలకు భట్టు అంటే గౌరవం హెచ్చు. భట్టు సంగీత సాహిత్య నిధి. వేదవేదాంగ తర్క మీమాంసాది సకలశాస్త్ర పారంగతుడు. సంస్కృతాంధ్ర సాహిత్య సర్వస్వాన్ని, సామవేదాన్ని సంపూర్ణంగా అభ్యసించినవాడు.
కవులంతా తమతమ కావ్యాల నుంచి కొన్ని ఘట్టాలు చదివి విన్పించారు. భట్టు తాను రచిస్తున్న కావ్యంలోంచి కొన్ని ఘట్టాలు వీణా మృదంగ తాళలయతో చదివాడు. నాటిసభలో తిమ్మోజు కొండోజు క్షౌరకళ ఉత్కృష్టత ప్రకటితమైంది. తనకు నిద్రాభంగం కాకుండా క్షౌరము చేసిన కొండోజీకి రామరాయలు మల్లాపురం అగ్రహాన్నిచ్చి గౌరవించాడు. కృష్ణరాయల కాలం నాటి రాజకళాపోషణను అంతా గుర్తుచేసుకున్నారు.
* * *
విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని ఉన్నా పైకి మిత్రత్వం నటించే బీజాపూర్‌ సుల్తాన్‌ ఆలీ ఆదిల్‌షాకు పఠాన్‌ అనే అంగరక్షక దళాధిపతిని రామరాయలు ఏర్పాటు చేయటంపట్ల విముఖత్వం వహించి రాజగురువు హెచ్చరించారు. రామరాయలు వినలేదు. అంతిమంగా తనవల్ల సహాయం పొందిన బహ్మనీవారే తనకి ద్రోహం తలపెట్టటం రామరాయలను కలవరపరిచింది. బహ్మనీ సుల్తానులంతా ఏకమై విజయనగరంపై దండెత్తారు.
రామరాయలు మండిపడ్డాడు. సేనల్ని ఆయత్తపరిచాడు. తిరుమలరాయలు, వెంకటాద్రిని సరిహద్దుల కాపలాకు నియోగించాడు. శక్తివంతుడైన రామరాయలు కులదైవమైన ఆదివరాహమూర్తిని పూజించాడు.
కరుణాసాగరా
వరాహ మహేశ్వరా
కావగ రావయ్యా మా కులదైవం నీవయ్యా ॥ పగలతో రగిలే నేలను పచ్చదనం నింపుమయా శాంతికాముకులం మేము శుభములు దీవింపుమయా ॥ పాములాంటి వైరిమూక పైబడ వచ్చేరయా మా
విజయనగర శ్రీని నిలిపి
కంటిపాపగ కావుమయా ॥
అప్పటికి తొంభై ఏళ్ళు పైబడ్డ వృద్ధుడు రామరాయలు. అంత వయస్సున్నట్లు కన్పించడు. ధృడమైన శరీరాకృతి, చైతన్యవంతమైన మేధస్సు, వ్యూహ నిర్మాణంలో దిట్ట అయిన రామరాయలు అంతవరకు పరస్పర కలహ సమయాల్లో బహమనీ సుల్తానులకు సాయం చేసినా స్వమత కారణంగా ఏకమై వారంతా నేడీ యుద్ధం తనపైనే తలపెట్టటాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు.
రామరాయలు నిరంతరం ముసల్మాను ప్రాంతాలనదుముకుంటూ ఉండటంతో బీజాపూర్‌ ఆదిల్‌షా అతనికి వ్యతిరేకంగా ఓ కూటమి తయారుచేసి రామరాయల అహంకారాన్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న యుద్ధం ఇది.
రాజగురువు సుదర్శనులవారు అఖండజ్యోతిని వెలిగించారు. విద్యారణ్య స్వామి విజయనగర స్థాపకులకు ప్రసాదించిన ఖడ్గాన్ని రామరాయలకు అందజేశారు.
‘‘ఈ జ్యోతి వెలుగుతున్నంతకాలం ఈ ఖడ్గాన్ని యవనులు తాకనంతకాలం మీకు అపజయం ఉండదు. విజయుడవై రమ్మని’’ ఆశీర్వదించి పంపారు.
తొంభై ఆరు సంవత్సరాల వయసులో రామరాయలు యుద్ధానికి బయలుదేరాడు. నగరప్రవేశం చేసిన అహమద్‌ఖాన్‌ పఠాన్‌ వేషంలో సదాశివరాయల కుమారుడైన శ్రీరంగరాయల్ని అపహరించుకుపోయాడు. అసలు పఠాన్‌ వచ్చాక విషయం తెలిసింది. సరిహద్దులు కట్టుదిట్టమైనాయి. అసలు పఠాన్‌ రామరాయల అంగరక్షకుడిగా ఉన్నాడు.
రాక్షసి తంగడి లేక తళ్ళికోట యుద్ధం తెలుగుదేశ చరిత్రలోనే కాదు, యావద్భారత ఉపఖండ చరిత్రలోనే కొత్త మలుపుకు దారితీసింది.
రెండువైపులా లక్షల సైన్యం సముద్రంలా ఘోషిస్తోంది. రామరాయలు సైన్యాన్ని మూడుభాగాలు చేశాడు. ఒక భాగం తిరుమలరాయల కింద, మరొకటి వెంకటాద్రి కింద, మూడవది తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మొదట వెయ్యి ఏనుగులు, ఇరవై వేల అశ్వదళం, లక్షమంది కాల్బలంతో తిరుమల రాయలు శత్రువులపై బడ్డాడు. ఇరుపక్షాలు తీవ్రంగా ఢీకొన్నాయి. ఇదిలా ఉండగా వెంకటాద్రి ఐదుమైళ్ళ వెనుక దారితప్పించి తూర్పువైపునించి హఠాత్తుగా శత్రుసైన్యం మీదపడ్డాడు. బహ్మనీ సైన్యాలు ఆందోళన చెందాయి. మర్నాటికే రామరాయలు అనంత సైన్యంతో పడమటివైపు నించి దాడిచేశాడు. ఎటుచూసినా విజయనగర సైన్యమే! ఆంధ్ర సైన్యం బహ్మనీల తలలు తరుగుతుంటే వాళ్ళకి దిక్కు తోచలేదు. బహ్మనీలు సంధిóకి ప్రయత్నించారు. రామరాయలు అంగీకరించలేదు. భయంకర మారణహోమం జరిగింది.
రామరాయలు కొత్త వ్యూహం పన్నాడు. మొదట అశ్వదళం, వెనుక అక్కడక్కడ మరఫిరంగులు, ఆ వెనుక పదాతులు.
బహ్మనీలు కూడా తమ సైన్యాన్ని మూడు విధాలు చేశారు. అనేక ఏనుగులు, గుర్రాలు ఆ యుద్ధంలో మరణించాయి. రామరాయలు సైన్యం మధ్యలో నిలిచి సింహనాదం గావించి ఉగ్రరూపంతో వైరివీరులపై విరుచుకుపడ్డాడు. సుల్తానుల సైన్యము చెల్లాచెదురైంది. మర్నాడు ముందుగా మిత్రపక్షాల బలగాలు మధ్యభాగంలో ఫిరంగి దళంతో నిలిచారు. ఈ ఏర్పాటు కన్పించకుండా రెండువేల మంది విదేశీ విల్లువీరులు అందరికన్నా ముందువరుసలో నిలబడ్డారు.
శత్రుసైన్యాలు ముందుకు దూకగానే, పన్నిన వ్యూహం ప్రకారం విల్లువీరులు బాణాలు వేయటం కొనసాగించారు. రామరాయల హిందూసైన్యం దగ్గరికి రాగానే విల్లువీరులు పక్కకి తప్పుకున్నారు. ఆ వెనుక ఉన్న ఫిరంగులన్నీ ఒక్కసారిగా పేలాయి. రామరాయల సైన్యం చాలావరకు హతమైంది. మిగిలిన కొందరు వెనుదిరిగారు.
వృద్ధుడైన రామరాయలు ఏనుగు అంబారీ మీద నించి దిగాడు. తన మంత్రుల మాటకూడా వినకుండా స్వయంగా శిబికలో యుద్ధభూమిలో తిరుగుతూ పర్యవేక్షించాడు.
విజయంపట్ల ఆయనకి చాలా నమ్మకం ఉంది. యుద్ధభూమిలో హిందువుల శతఘ్నుల నుంచి, బురుజులపై అమర్చిన లోహపు గొట్టాల ఫిరంగుల నుంచి, మహావినాశనం కల్గించే అగ్నిగోళాలు పేల్చుతున్నారు. రెండువైపులా చాలామంది మరణించారు.
ఆ సమయంలో శిబిక నుండి దిగిన రామారాయలు మణిమాణిక్య ఖచితమైన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. తన కోశాధికారి ద్వారా తన చుట్టూ ధనరాసులు, బంగారు అభరణాలు, మణిమాణిక్యాల కుప్పలు ఏర్పాటు చేయించాడు. ఆ ధనాన్ని అతని దృష్టిని ఆకర్షించిన అనుచరుల కివ్వాలని రామరాయల ఆలోచన. సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ రామరాయలు యుద్ధరంగంలో వీరోచితంగా మాట్లాడాడు.
‘‘ఓ విజయనగర యోధులారా! మనకిది పరీక్షా సమయం. ఈనాడు జయిస్తే ఆంధ్రసామ్రాజ్యం గోదావరి వరకు విస్తరిస్తుంది. కఠినాత్ములు బహమనీల వల్ల మన హిందూమతానికి ముప్పు వస్తున్నది. మీరంతా ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన వీరులు. ఈ మహమ్మదీయ సైన్యాన్ని ఎన్నిసార్లో తరిమికొట్టినవాళ్ళు. విజయనగర రాజ్య ప్రతిష్ట కోసం మీ తాత తండ్రులెన్నో త్యాగాలు చేశారు. మీలో నిజంగా వీరరక్తం ప్రవహిస్తుంటే ఈ తురకసైన్యాన్ని తరిమికొట్టండి. ప్రాణమున్నంతవరకు మర్యాదకోసం పోరాడుదాం’’ అని రెచ్చగొట్టే ఉపన్యాసమిచ్చాడు.
మహమ్మదీయ బలగాలు గతితప్పే స్థితిలో అకస్మాత్తుగా మహమ్మదీయ అగ్రభాగ ఫిరంగిని రాగి నాణాల సంచులతో దట్టించి పేల్చటంతో ఐదువేలమంది హిందువులు ఒక్కసారిగా నిహతులయ్యారు. రామరాయల సైన్యం అయోమయంలో పడిరది. ఈలోపు బహ్మనీల అశ్వదళం రాయలున్నచోటికి దూకింది.
రామరాయలు తనచోటు మార్చి మళ్ళీ శిబికను అధిరోహించాడు. నిజాంషాకు చెందిన కల్లు తాగించబడిన మదపుటేనుగొకటి యుద్ధక్షేత్రంలో రామరాయలు శిబికవైపు దూసుకుపోయింది. భయపడిన శిబిక వాహకులు భారాన్ని నేలపై పడేసి పారిపోయారు. రామరాయలు తేరుకొని గుర్రాన్ని అధిరోహించేలోపు మిత్రపక్షాల సైనికదళం అతన్ని చుట్టుముట్టి బందీని చేశాయి.
కృష్ణవేణీ తరంగిణి స్తబ్ధమైపోయి
కదలమానినజాడ గాంచలేదు
ఎపు డెరుంగని యంకుశపుపోటునకు నొచ్చి
వెనుకాడి గజరాజు వెంటరాడు
ఖతనుద్రొక్కుచు పంచకళ్యాణిగుర్రము
సకిలించి మోర నెత్తి కనలేదు
సముదశాత్రవకంఠ సవన కర్తృత్వము
భరియించు అసి చేత బట్టలేదు
శకునములొ, విధివశంమున సలిపినట్టి
తప్పిదంబులొ తెలియ డిరతయునుగూడ
రామరాయలు, నైజపరాక్రమంబు
ముసలి మేధస్సులోపల ముడుతలుపడ
దీనితో విజయనగర సైన్యం భయపడి లొంగిపోసాగింది. రామరాయలను సుల్తాను ఎదుట ప్రవేశపెట్టారు. వారి పగ అంతటితో చల్లారలేదు. పటపట పళ్ళు కొరుకుతూ హుస్సేన్‌ నిజాం షా రామరాయల దగ్గరిగా వచ్చాడు.
‘‘కాఫిర్‌! ఇరవై ఏళ్ళుగా ఈ తలే మమ్మల్ని వేధించింది. నేనిప్పుడు పగ సాధిస్తున్నాను. ఇంక దేవుడు నన్నేంచేసినా చెయ్యనివ్వు’’ అంటూ నిస్సహాయస్థితిలో ఉన్న అసహాయశూరుడు, తొంభైఆరేళ్ళ వృద్ధుడు తండ్రిలాంటివాడైన రామరాయల తలను నరికేశాడు.
రామరాయల తెల్లని పండిన తల పట్టుకొని దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని తల తరిగి తృప్తి పొందినట్లే సుల్తాన్‌ కూడా నరికిన ఆ తలను ఒక బల్లెంపై ఎత్తుగా హిందూ బలగాలకు కనిపించేవిధంగా ప్రదర్శించి వికట్టాటహాసం చేశాడు.
నలభై సంవత్సరాలకు పైగా ఘోరాతిఘోర సంగ్రామాల్లో పోరి, హిందూ సామ్రాజ్య రక్షకుడిగా రాజనీతి చతురుడిగా నిలిచిన అళియ రామరాయలు విజయనగర భానునిలా అస్తమించాడు.
రాక్షసి తంగడి యుద్ధంలో రామరాయని మరణంతో విజయానికి చేరువగా
ఉన్న ఆంధ్రసైన్యం బెదిరిపోయి చెల్లాచెదురైంది. రాయల సోదరులు, నమ్మకస్తులైన దండనాధులు ప్రాణాలు కోల్పోయారు.
తళ్ళికోటలో చచ్చె భూధవు డటంచు
వినినమాత్రనె శత్రువుల గనినతోనె
పిరికితనమేల నీసేన బిలుకుమార్చు
గొందెలో మ్లేచ్ఛవీరులు ఘోషవెట్ట
అలా పారిపోయే సైనికులను బహ్మనీ సైన్యం వెంటాడి వేటాడి ఊచకోత కోసింది. యుద్ధరంగానికి పక్కనే ప్రవహించే నది అరుణ వర్ణాన్ని పులుముకుంది. దాదాపు ఒక లక్షమంది హిందూ సైనికుల తలలు ఎగిరిపడ్డాయి.
విజయనగర సైనికులు రాజధానివైపు పారిపోయారు. వాళ్ళెంత దిగ్భ్రమ చెందారంటే నగరాన్ని చుట్టుముట్టి ఉన్న పర్వాతాల మధ్య రక్షక వ్యూహాలు చేపట్టే ప్రయత్నాన్ని గానీ, నగర కుడ్యాలనుగానీ, ప్రవేశమార్గాలనుగానీ రక్షించుకునే ప్రయత్నం చేయక సంపూర్ణ ఓటమిపాలయ్యారు.
తురక సైనికుల్లోని ప్రతివ్యక్తీ బంగారం, నగలు, ఆయుధాలు, గుర్రాలు, బానిసలు ఎవరికేవి చిక్కితే అవి దక్కించుకుని ధనవంతులైపోయారు. విజయనగరవాసులకు ప్రమాద స్పృహే లేదు. రామరాయలు అపార సైన్యాన్ని వెంటబెట్టుకు వెళ్ళటం వల్ల వారికి విజయం గురించి సంపూర్ణ విశ్వాసముంది. కానీ పలాయనం చిత్తగించిన సైన్యం, చనిపోయిన నాయకుడు, అపార సంపదలతో భవనాలను వదిలివెళ్ళిన రాకుమారులను చూసినప్పుడు ప్రజలు భయభ్రాంతులయ్యారు.
రాజభక్తులైన సైనికులతో లెక్కలేనంత బంగారం, వజ్రాలు, వందమిలియన్‌ స్టెర్లింగుల విలువ చేసే విలువైన రాళ్ళను, రాజచిహ్నం, రత్నఖచిత సింహాసనాన్ని ఐదువందల ఏనుగులపై వేసుకుని సదాశివునితో సహా తిరుమల రాయలు, రాచకుటుంబాలు, వారి అనుచరులు పెనుగొండకు పారిపోయారు.
విజయనగరంలో మహావిపత్తు వాస్తవంగా కన్పించింది. నగరవాసుల్ని రక్షించేవాళ్ళు లేరు. దొంగల గుంపులు, అటవికులు నగరాన్ని అన్నివిధాలా ఆరుసార్లు ప్రణాళికాబద్ధంగా దోచి విపరీతమైన సంపదను మోసుకెళ్ళారు.
యుద్ధం ముగిసిన మూడోరోజున విజేతలైన బహమనీలు నగరానికి వచ్చారు. అప్పట్నుంచి ఐదునెలలపాటు వారికి విశ్రాంతే లేదు. విధ్వంసమే లక్ష్యంగా దయలేకుండా ప్రజల్ని వధించారు. దేవాలయాలు, రాజభవనాలు పడగొట్టారు. శిలానిర్మిత దేవాలయాలు తప్ప మిగతావన్నీ శిథిలాలుగా మారిపోయాయి. విగ్రహాలు విరగ్గొట్టారు. ఉగ్రనరసింహుని చేతులు ఖండిరచారు. దసరా దిబ్బ మండపాన్ని ధ్వంసం చేశారు. భవనాలు తగలపెట్టారు. నిప్పు, కత్తులతో విలయం సృష్టించారు.
ప్రపంచంలో మరెక్కడా జరగని ఇటువంటి విధ్వంసం వల్ల సంపన్నవంతమైన విజయనగరం భీభత్స దృశ్యంగా మిగిలింది. అలా దోచిన సంపదలో కోడిగుడ్డంత పెద్ద వజ్రాన్ని ఆదిల్‌షా స్వాధీనపర్చుకున్నాడు. తర్వాతి కాలంలో ఆ వజ్రాన్ని తన గుర్రపు శిరస్త్రాణపు తురాయి కింద అమరింపజేసుకుని ఆనందించాడని కథనం. ఓ మహాసామ్రాజ్యం నేలకూలింది. విజయనగరం మరెప్పటికీ తన పూర్వవైభవాన్ని పొందనంతగా నిర్జన శిథిలదృశ్యంగా, వల్లకాడుగా మిగిలిపోయింది.
శ్రీకృష్ణదేవరాయల శౌర్యప్రతాపాలు, కళాపోషకత్వం, విజయనగర సామ్రాజ్య వైభవం మాత్రం తరతరాలుగా అభిమానుల గుండెల్లో మరపురాని మధురకావ్యంలా మిగిలాయి.

ముగింపు
అభిషేక్‌, అమృతల కళ్ళనిండా నీళ్ళు. ఆవేదనతో ప్రతి భగ్నశిల్పాన్నీ చూస్తూ అలనాటి సౌందర్య జ్ఞాపకాలను వెదుక్కుంటున్నారు.
ఏదేవి చిలికెనో ఈ పాలమీగడ
విట్ఠలాలయ శిలా వేదులందు
ఏజోదుచిందెనో ఈ రక్తగంధము
నరసింహదేవు పేరురముమీద
ఏశిల్పిదిద్దెనో ఈ కారుమబ్బులు
ద్వారపాలకరాము తేరుమీద
ఏరాజు తూగెనో ఈ తులాడోలలో
తులసిబంగారు మొక్కలకు మ్రొగ్గి
ఏ మహాభక్తు డిట జపించినాడొ
దివ్య కోదండరామ పథిశ్రమాప
నయన శబరీఫలాపేక్ష నియతుడగుచు
కాలపుం దాటులందు సంకరములన్ని!
‘‘చూశావా అభీ! అంతటి అద్భుత నగరానికి విధి వేసిన శిక్ష! ఈ నిర్జన శిథిల దృశ్యాలను చూడటానికేనా మనం వచ్చాం! రాకముందుకన్నా ఇక్కడికొచ్చాక నా మనసు మరింత తీవ్రంగా కలవరపడుతోంది.’’
‘‘అమ్మూ! ఇది చరిత్ర. గతాన్ని మార్చలేం. గతంలోంచి పాఠాలు నేర్చుకొని వర్తమానాన్ని తీర్చిదిద్దుకొని భావితరాలకు బంగారు భవిష్యత్‌ అందించాలి’’ అభిషేక్‌ ఉద్వేగంగా అన్నాడు.
‘‘ఈ చిన్న గ్రామాల మధ్య, మిగిలిన మట్టిగోడల మధ్య, పాత నీటికాలవల మధ్య మన నగరాన్ని వెదుక్కుంటున్నాను అభీ!’’ కన్నీటితో అంది అమృత.
‘‘బాధపడకు అమ్మూ! మనం ఇక్కడికి వచ్చి ఈ శిల్పారామంలో తిరిగాక మన బంధం జన్మజన్మల బంధంగా మరింత పెనవేసుకుంది. ఇలా చూడు… ఈ ‘నవమోహిని’ శిల్పం ఈనాటికీ ఈ విఠల మందిరంలో చరిత్రకు సాక్ష్యంగా చెక్కుచెదరకుండా ఉంది.’’
అమృత ఆ శిల్పాన్ని ఆపాదమస్తకం ప్రేమగా స్పృశించింది. మనసులో శాస్త్రి మెదిలాడు.
‘‘ఈ సంగీతకారుడు నీవే కదూ’’ వేణువూదుతున్న శిల్పాన్ని అభిషేక్‌కి చూపించింది. ఆమె మనసు కొంత తేలికపడిరది.
‘‘అవును అమ్మూ! ఆనాడు మనం నిజమైన కళాకారులంగా మరణించాం. జన్మజన్మలకు కళాకారులుగానే పుడుతున్నాం. ఎవరెంత నాశనం చేసినా రూపుమాసిపోని ఈ శిల్పాలు మన ప్రతిరూపాలు. కళకు మరణముండదు అమ్మూ.’’
అభిషేక్‌, అమృతల స్పర్శ సోకిన ఆ శిలలు మరింత సజీవకళను సంతరించుకున్నాయి.
ఆ కళాకారుల తలపుల్లో విజయనగర సామ్రాజ్య శోభ ఒక అందమైన బంగారుకలలా నిలిచిపోయింది. ఈ స్వప్నం కరిగిపోయేది కాదు. తరతరాల కళాప్రియులను గతంలోకి నడిపించి మురిపించే మధుర భావనాలోకం! మరపురాని మహనీయ దృశ్యకావ్యం!
ఇది ఆంధ్రభోజుడిలాతలంపై
నిర్మించుకున్న దివ్యస్వర్గధామం
ఇది లక్ష్మీ సరస్వతుల అపూర్వమైత్రికి
రాయలు రచించిన రమణీయ శిల్పాలయం
సమాప్తం

May 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అరుదైన ఫోటో

by mayuukha May 28, 2024
written by mayuukha
May 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni May 28, 2024
written by Narendra Sandineni

హిందీలో కుంవర్ నారాయణ్ రచించిన కవిత.
ఆంగ్ల అనువాదం : డేనియల్ వేయిన్ బోర్డ్.
తెలుగు అనువాదం : వారాల ఆనంద్.
కుంవర్ నారాయణ్ కొత్త మార్గం కవిత పై విశ్లేషణా వ్యాసం.

కుంవర్ నారాయణ్

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,కుంవర్ నారాయణ్ హిందీలో రాసిన కొత్త మార్గం కవిత ఇది.డేనియల్ వేయిన్ బోర్డ్ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.వారాల ఆనంద్ తెలుగులోకి అనువాదం చేశాడు.తెలుగులోకి అనువాదం చేసిన కొత్త మార్గం కవిత చదవగానే నాలో కలిగిన భావాలకు అక్షర రూపం దాల్చిన విశ్లేషణా వ్యాసం ఇది.కొత్త మార్గం కవితను ఆసక్తితో చదివాను.కవితలోని భావం నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కొత్త మార్గం ఏమిటి? అని మనలో సందేహాలు కలుగ వచ్చు.దారిని మార్గం అని ఆంగ్లంలో Way అని అంటారు.దారి అనగా ఒక నిర్దిష్టమైన గమ్యానికి త్రోవ చూపేది.ఇది సాధారణంగా జనులు ఉపయోగించే దారి.ఒక ప్రదేశం చేరుకొనుటకు వీలు కల్పించే మార్గం దారి అంటారు.రహదారి అనగా ప్రజలు,చక్రాల వాహనాలు ప్రయాణించే మార్గం.దారి గమ్యస్థానాన్ని చేరడానికి ఉపయోగపడే భూభాగం. కుంవర్ నారాయణ్ హిందీలో రాసిన కొత్త మార్గం కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“నేను జీవితాన్నుంచి
“తప్పించుకోవాలనుకోవడం లేదు
“అందులో భాగమవ్వాలనుకుంటున్నాను.
నేను ఈ విశాల ప్రపంచంలో జీవించడానికే నిర్ణయించుకున్నాను.నేను జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలను అయినా ధైర్యంతో ఎదుర్కొంటాను.ప్రతి రోజు చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని,బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తాను.ఒక పిరికివాడిలా,వ్యసనపరుడిలా జీవితం నుండి తప్పించుకోవాలనే కోరిక అసలు నాలో లేదు. అలాంటి ప్రతికూల ఆలోచనలకు నా హృదయంలో చోటు లేదు.జీవితం అనేది జీవించడానికి మనిషి ఏర్పరచుకున్న ఒక పద్ధతి.అసలు ఎందుకు జీవితం? అని నేను ఎన్నడు మనస్సులో ఏనాడు అలాంటి తలంపులు చేయను.జీవితం అంటే జీవించడమని మరియు మనిషి యొక్క ఉనికి అని నా తల్లి మానవతా విలువలను తెలియ జేసింది.నా తల్లి కడుపులో నవ మాసాలు మోసి నాకు జన్మనిచ్చింది. నేను అంటే అమ్మకు ప్రాణం.చిన్నతనంలో నేను మల విసర్జన చేసినప్పటికీ అసహ్యించుకోకుండా ఎంతో ప్రేమతో నా తల్లి మలాన్ని తీసివేసేది. ఆప్యాయతతో తాను నన్ను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకునేది.జీవితంలో కష్టాలు ఏర్పడ్డాయని నేను ఊరికే బాధ పడుతూ కూర్చుని ఉండను.కష్టాల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశం ఎన్నడు నాకు కలగ లేదు.సుందరమైన జీవితాన్ని ఇచ్చిన నా తల్లి కష్టాలను ఎలా అధిగమించాలి? అని సాహస వీరుల గాధలను,ధైర్యాన్ని నాకు నూరిపోసింది.సాహస వీరుల కష్టాల ముందు నేను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు చాలా చిన్నవి. కష్టాలను తలుచుకొని ఒంటరిగా కూర్చుండి విచారించడం లేదు.జీవితంలో ఎదురయ్యే కష్టాలను మొక్కవోని ధైర్యంతో సాహసంతో ఎదుర్కొంటాను. కష్టాల నుండి తప్పించుకొని ఎక్కడికి పారిపోను. జీవితాన్నుంచి జీవితం ఏర్పరిచిన సవాళ్ల నుంచి తప్పించుకోవాలనే ఆలోచన నాలో లేదు.జీవితం అంటే ఉనికి యొక్క రూపమని జీవించడానికే నిర్ణయించుకున్నాను.జీవించడానికే అంకితం అయిపోతాను మరియు జీవితంలో ఒక భాగం అవుతాను.జీవితం యొక్క గ్రంథంలో నాకంటూ ఒక పేజిని ఏర్పరచుకుంటాను.అందులో నా పేరు కూడా నమోదు అయి ఉండటం చాలా సంతోషంగా ఉంది. జీవితం అనే నాటకంలో అందులో నా పాత్రను చక్కగా రక్తి కట్టిస్తాను అనే ఒక సూచన కనబడుతుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

వారాల ఆనంద్.

“జీవితపు ఊహాత్మక ఇరుసుపైన
“కవిత్వానికి
“అనుమానాస్పదంగా వున్నా
“స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి.
ఇరుసు అనేది తిరిగే చక్రం లేదా గేర్ కోసం కేంద్ర షాఫ్ట్.గేరు భ్రమణం కోసం అమర్చబడుతుంది. చక్రాలు కలిగిన వాహనాలకు ఇరుసు బిగించబడి ఉంటుంది.బేరింగ్ వ్యవస్థ లేని ఇరుసు చక్రంతో పాటు తిరుగుతుంది.బేరింగ్ వ్యవస్థ ఉన్న ఇరుసు చుట్టూ చక్ర భ్రమణం చెందుతుంది.బేరింగ్ వ్యవస్థ ఉన్న చక్రంలో బేరింగ్ లేదా బుషింగ్ ఉంటుంది.చక్రం లోపలి రంధ్రంలో అమర్చబడి ఉంటుంది.దీని యందు చక్రం లేదా గేరు ఇరుసు చుట్టూ భ్రమణం చెందుతుంది.నిగూఢతను కలిగి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు.కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ.కవిత్వము ఒక నిరంతర సాధన.కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు.జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా సజీవంగా అనుభూతికి అందివ్వడమే కవిత్వ ధ్యేయం.అసంబద్ధమైన వాటి మధ్య సంబంధమే కవిత్వానికి అర్థం చేకూరుస్తుంది.గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వచ్చేది కుదుపు.ఒక్కసారిగా కుదుపు వచ్చిన కారణంగా శరీరంలో కంపన మొదలవుతుంది.కుదుపు కారణంగా పనులకు ఆటంకం కలుగుతుంది.జీవితం నుండి వచ్చిన దుఃఖము,ఆవేదన నుండి కవిత ప్రాణం పోసుకుంటుంది.జీవితం నుండి ఊహాత్మక ప్రపంచంలో జరిగిన సంఘటనలకు అతను మథన పడిపోయాడు.జీవితంలో తాను చూసిన, అనుభవించిన తన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోని బాధ,వేదనలు చూసిన తర్వాత తన మనసులో కుదుపు వచ్చినట్లుగా తోస్తుంది.కవి ఊహాత్మక దృక్పథంతో ఇరుసు పై ప్రయాణం సాగుతున్న వ్యక్తుల జీవితాల్లో కుదుపులు ఉంటాయి.కవిత్వం నేల మీద సాము చేయకూడదు అంటారు.
తాను ఎవరో తెలియకుండా అనుమానాస్పదంగా వీధుల్లో తిరుగుతున్న అతన్ని అట్టి స్థలాన్ని మరియు గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఒక్క సారిగా వాహనం అటు ఇటు ఊగుతూ కుదుపులు రావడం సహజమే.అట్టి వ్యక్తులు గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే కుదుపులకు వాహనం కింద మీద పడిపోయినట్లుగా జర్క్ ఇవ్వడం వల్ల ఒళ్ళంతా నొప్పులు ఏర్పడడం సహజమే కదా అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అందుకు మొదట
“జీవితపు శక్తి మూలాన్ని
“క్రియాశీలం చేయాలి.
శక్తి అనే పదం బహుళ ఆలోచనలను సూచిస్తుంది. విశ్వం యొక్క సృష్టి,నిర్వహణ మరియు విధ్వంసానికి బాధ్యత వహించేది శక్తి.సృష్టికి శక్తి బాధ్యత వహిస్తుంది.భౌతిక శాస్త్రంలో శక్తి అంటే వస్తువు లేదా భౌతిక వ్యవస్థకు బదిలీ చేయగలిగే పరిమాణాత్మక గుణం.ఏదైనా పని చేసిన శక్తి లభిస్తుంది.ఏదైనా పని చేసిన దాని ఫలితంగా ఉష్ణం,కాంతి లాంటి రూపాలలో శక్తిని గుర్తించవచ్చు. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని సృష్టించ లేము.శక్తిని నాశనం చేయలేము.శక్తిని ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చగలము. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం శక్తిని జౌల్స్ లో కొలుస్తారు.కదులుతున్న వస్తువు కలిగి ఉండే గతి శక్తి,ఏదైనా ఒక ప్రత్యేక స్థానం వల్ల వస్తువు కలిగి ఉండే స్థితి శక్తి, సాగదీయబడిన ఘన పదార్థానికి ఉండే స్థితి స్థాపక శక్తి,రసాయనిక చర్యలకు సంబంధించిన రసాయనిక శక్తి,విద్యుదయస్కాంత వికిరణాలు మోసుకెళ్ళే వికిరణ శక్తి మొదలైనవి శక్తికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.జీవించే అన్ని జీవులు శక్తిని స్వీకరిస్తూ విడుదల చేస్తూ ఉంటాయి.క్రియా శీలత వల్లనే స్థిరంగా మానవులు సవాళ్లతో కూడుకున్న పనులలో నైపుణ్యం సాధిస్తారని అనుభవం తెలుపుతుంది.క్రియాశీలత వల్లనే మనిషి నిర్దిష్టమైన పనిని ఎంపిక చేసుకొని పనులు చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. మరియు పనులలో అనుభవం కూడా సంపాదిస్తారు.జీవితంలో ఏదైనా కష్టం వచ్చిన తర్వాత మనిషి ధైర్యంతో ముందుకు సాగాలి. మనిషికి కష్ట పడి పని చేసే క్రియా శీలత వల్లనే మళ్ళీ సంతోషంగా విజయవంతంగా ఉండే సామర్థ్యం అలవడుతుంది. lకష్టాల వల్ల మనసుకు దెబ్బ తగిలినప్పటికీ మనిషి మనస్సుకు తట్టుకునే శక్తి గుండె నిబ్బరం ఉంటుంది.క్రియా శీలం అనేది చాలా శక్తివంతమైన పనిని కలిగి ఉండటంగా చెప్పవచ్చు.మనిషి వ్యక్తిగత కృషి వల్ల మరియు శ్రద్ధతో పనిచేయడం వల్లనే చురుకైన జీవితం ఏర్పడుతుంది.మనిషి తాను జీవితంలో ఎన్నో కష్టాలను ఆటంకాలను ఎదుర్కొంటాడు. అయినప్పటికీ మనిషి కష్టాలు వచ్చాయని బెదిరిపోకూడదు.మనిషి తాను మనుగడ సాగించడానికి జీవితంలో శక్తి యొక్క మూలాలను తెలుసుకొని తాను చేయవలసిన పనులు చేస్తూ నిర్విఘ్నంగా ముందుకు సాగిపోవాలి.కష్టాలు మనిషికి రాకుండా మానులకు వస్తాయా? మనిషి గుండె నిబ్బరంతో తన జీవితపు శక్తి మూలాలను క్రియాశీలంగా పనులు నిర్వహించి ముందుకు సాగాలి అనే భావనను కవి వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది..
“తర్వాత ఆ శక్తిని
“బతుకు కక్షకున్న ఇరుసుకు
“జత చేయాలి.
తర్వాత మనిషి తనలో నిండి నిబిడీకృతమై ఉన్న అపారమైన శక్తిని క్రియాశీలం ద్వారా తట్టి లేపాలి. మనిషి తనలో ఉన్న అనంతమైన శక్తిని బతుకు చక్రంలో తిరుగుతున్న ఇరుసుకు జత చేస్తూ చేతనతో ముందుకు సాగాలి అని కవి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అప్పుడు
“గతంలో లాగా
“యాంత్రికత” లేని
“మానవత్వం” వైపు మరలిన
“కొత్త మార్గం ఆరంభమవుతుంది.
జరిగిపోయిన కాలాన్ని గతం అంటారు.సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు.మతాలన్ని మానవత్వం కలిగి ఉండమని బోధిస్తాయి. మానవత్వం అంటే కరుణ,ప్రేమ,దయ,అహింస, మానవ ప్రేమ మానవ ఆదర్శం.ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్నగా భావిస్తారు.వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి.మానవతా వాదం, సాంప్రదాయక మత సిద్ధాంతాలకు విరుద్ధమైనది. మానవతా వాదం పరిణామ సూత్రం అన్ని విధానాలను అధిగమిస్తుంది.మానవత్వం అనేది మానవ స్థితి నుండి ఉద్భవించిన పరోపకార నైతికతో ముడివడి ఉన్న ధర్మం.జీవితంలో మనిషి ముందుకు సాగటానికి జరిగిపోయిన కాలంలో లాగా ఏదో బతుకుతున్నాం.రొటీన్ గా మొక్కుబడిగా దినచర్య కొనసాగుతున్నట్లుగా కాకుండా తనలోని శక్తులను మేల్కొల్పుతూ ఇష్టపడి పని చేస్తూ మానవత్వంతో మెదలాలి.మనిషి మానవత్వంతో నడక సాగించిన రోజున సాటి మనుషులకు తోటి వారికి ఆదర్శంగా ఉంటుంది.మనిషి ఎలాంటి యంత్రాలు లేకుండా పనులు నిర్వహించిన రోజులు చూశాము.ఆ రోజుల్లో అందరు కలిసిమెలసి వ్యవసాయ పనుల్లో పాల్గొనే వారు.సబ్బండ కులాల వారు సఖ్యతతో మెలిగేవారు.మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా శ్రమైక జీవన సౌందర్యానికి సాటి లేదన్నట్లుగా మెలిగే వారు.యాంత్రికత లేని సమాజం వల్ల మనుషులు పరస్పర అనురాగంతో కలిసిమెలిసి ఉంటూ మానవత్వంతో జీవిస్తారు. అందరు మనుషులు కష్టపడి జీవిస్తూ సాటి మనుషుల పట్ల మానవత్వంతో మెలగడం వల్ల కొత్త మార్గం ఆరంభం అవుతుంది అనే సూచన కనబడుతుంది.మనుషుల జీవితాల్లో కొత్త మార్గం ఆరంభం అవుతుంది అనే సందేశాత్మకంగా కవితను రచించినట్లుగా తోస్తుంది.మనిషి నడుస్తున్న బాట సమాజానికి కొత్త మార్గం అవుతుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

May 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నిత్య శ్రామికురాలు

by dr. Lakkraju Nirmala May 28, 2024
written by dr. Lakkraju Nirmala

నీ శ్రమను గుర్తించేది ఎవరు.
నిరంతర నీ పరిశ్రమ
ఈ ఇల్లు ని తీర్చిదిద్దడం
ఈ పిల్లలని చదివించడం
పెంచి పోషించడం
ఇంటి బాధ్యతలు మరియు
ఉద్యోగ బాధ్యతలు
అవి కాక కరెంట్ బిల్లు వాటర్ బిల్లు సైతం బ్యాంకు పనుల సైతం పని మనిషి లేకుంటే ఇంటి పని పూర్తి నీవంతే
మగమహారాజులకి ఆఫీసు నుంచి వచ్చి టీవీ చూస్తూ పేపర్ చదువుతూ కూరగాయలు తెచ్చిపెట్టి సెల్ ఫోన్ తో ఆడుకుంటూ కూర్చుంటారు.
నీకెక్కడిది రెస్ట్ నువ్వు తిన్నావా అని అడిగే వారు ఎవరు నువ్వు పడుకున్నావా అని అడిగే వారు ఎవరు నీవు ఒక శ్రామికురాలివి నిరంతర నిర్విరామ శ్రామికురాలివి నీ శ్రమ కు ఫలితం లేదు గుర్తింపు లేదు పిల్లలు ఎవరు చెడిపోయినా తల్లిదే బాధ్యత అంటారు భర్త తాగొచ్చునా భార్యది తప్పంటారు సంసారం చెడిపోయిన భార్యదే తప్పంటారు ఈ లోకం మార్పులు ఎప్పటికీ
ఎప్పటికీ నీవు శ్రామికురాలివి ఎప్పటికీ నీ శ్రమ గుర్తించు వారు లేరు మీ ఆరోగ్య పరిస్థితి నీదే నిన్ను పట్టించుకునే వారు ఎవరు ఎవరికోసం నువ్వు పుట్టావు ఎవరికోసం నువ్వు పెరుగుతున్నావు ఎవరికోసం నువ్వు బ్రతుకుతున్నావు ఎవరికోసం నువ్వు సంపాదిస్తున్నావు ఎవరికోసం నీవు ఎదురు చూస్తున్నావు మార్పు కోసమా ఫలితం కోసమా గుర్తింపు కోసమా నీ శ్రమ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది ఏళ్ల తరబడి ఏడేళ్ల తరబడి కానీ నిన్ను గుర్తించే వారే లేరు అమ్మ మీ శ్రమను గుర్తించే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ కూతురు.
కన్నీటితో రాస్తున్నాను
ఈ కవితని శ్రామికుల దినోత్సవానికి అంకితమిస్తున్నాను.

May 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శంభుని కుమార్ గారి సురవరపుర శ్రీ అనంత పద్మనాభ శతకం….ఒక వీక్షణ

by Aruna Dhulipala May 28, 2024
written by Aruna Dhulipala

తెలుగు వాఙ్మయంలో శతక ప్రక్రియకున్న స్థానం విశిష్టమైనది. పాల్కురికి సోమన మొట్టమొదటి “వృషాధిపశతకం” నుండి నేటివరకు జనుల జిహ్వాగ్రముల నుండి శతక పద్యాలు నిరంతరవాహినులుగా జాలువారుతూనే ఉన్నాయి. ఆధునిక కాలంలో శతకరచనలు చేస్తున్న కవులు అనేకులు పద్య రసవాహినిలో అందరినీ అలరిస్తున్నారు. శతకాలు భక్తి, వైరాగ్య, శృంగార, నీతి ప్రధానాలుగా ప్రజల జీవితాల్లో మమేకమైపోయాయి.


అటువంటివారిలో తనకొక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కవి శంభునికుమార్ గారు. ఇంతకుమునుపే తండ్రి పట్ల అనురాగంతో ఒక స్మృతి కావ్యాన్ని, ఆంజనేయ స్వామిపై భక్తితో ద్విశతిని, మరికొన్ని చిలిపిపద్యాలను రాసిన వీరు తను పుట్టిన సూరారం ఊరి దైవం అనంతపద్మనాభ స్వామి ప్రేరణతో ఒక శతకాన్ని రాసి ఆయనకు అక్షర నైవేద్యంగా సమర్పించారు. అదే “శ్రీ అనంత పద్మనాభ శతకం”.
“పలికెడిది భాగవతమట” అన్న పోతన, “చెప్పుమని రామచంద్రుడు” అన్న మొల్ల బాటలో “పంటపొత్తము గొని వండిన రీతిగా/ పద్యపాకము గూర్చు పాట్లు నావి” అంటూ తనకేదీ తెలియదని, చదువరులకు మెచ్చునట్లు కృతిని సాగనిమ్మని శతక ప్రారంభంలోనే ఆ జగన్నాథుని వేడుకుంటారు కుమార్ గారు.
“నే కుచేలుడను గాను” అనే పద్యంలో నేను నీకు ఏమీ కానని నన్ను విడిచిపెట్టొద్దు అని మొర పెట్టుకుంటారు..”అన్నదాతల మోమునందున” అను పద్యంలో జగతిలో సుఖశాంతులు కలిగి ఉండేలా వరమివ్వుమని, ఆ చిన్ని ఆశ తీర్పమని లోకక్షేమాన్ని కాంక్షిస్తారు. “కన్నవారిని వీడి ఉన్న ఊరిని వదిలి” అనే పద్యంలో మన వీరజవానుల త్యాగాన్ని మంచుకొండల్లో మెరిపిస్తారు.
“గంగా జలమనగ- కప్ప, చేపల ఎంగిలి” అనే పద్యం బాలమురళీ కృష్ణ గారి “ఏమీ సేతురా లింగా” అనే తత్వాన్ని స్ఫురింపచేస్తూ, మనం నిమిత్తమాత్రులమనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
“మూడు కాళ్ళను పొందు ముసలి గాక మునుపె” అని ” శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ”న్నట్లు ఈ శరీరం పూర్తిగా అధీనం తప్పకముందే మురారి నామస్మరణ కవచమై కాపాడుతుందని ఉద్భోధిస్తారు. “లాలిపాటలలేవి? లాలింపులవి యేవి?” అంటూ నేటి బాల్యం పూర్తిగా అదుపు తప్పిందని వాపోతారు.

“పోరి పోరి అలసిపోయితినిక నాకు/ లావొక్కింతయు లేదు, రంధి హెచ్చె” జీవితమనే పోరాటంలో అలసిపోయానని, బలహీనుడయ్యానని చెప్తూ భాగవత పద్యాన్ని గుర్తుకు తెస్తారు.
“పవి పుష్పంబగు, నగ్ని మంచగు” అని భర్తృహరి అన్నట్లు ” నీ దయ మాకున్న” పద్యంలో మా బ్రతుకు నీదే మాధవా! అంటూ హృదయపుష్పాన్ని సమర్పిస్తారు.
భక్తిభావమే కాకుండా ఈ శతకంలో తల్లిదండ్రులు, గోమాత, స్నేహభావం, శ్రమజీవులు, వ్యసనాలు, క్రీడలు, నైతిక విలువలు …మొదలైన ఎన్నో అంశాలు ప్రస్తావింపబడడం కవికి ఉన్న బలీయమైన సమాజ శ్రేయస్సు కాంక్ష గోచరమవుతున్నది. పురాణేతిహాసాల పట్ల వీరికున్న అపారజ్ఞానం అనేక పద్యాల్లో మనకు ద్యోతకమవుతుంది.
‘శంకు’ నుండి తీర్థంలా ఇంకా ఎన్నో శతక మకరందాలు ఈ కవి కలం నుండి ఆ అనంత పద్మనాభుని అనుగ్రహంగా స్రవించాలని ఆశిద్దాం.

May 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us