మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

చాయ గిన్నె కష్టాలు

by Laxmi Madan November 30, 2025
written by Laxmi Madan


ప్రతీ రోజూ నరకమే నాకు..పొద్దు లేదు మాపు లేదు…దుక్కమొస్తుంది…

ఎందో పడి పోయినట్టు గా ఇంటామే 5 గొట్టంగ లేస్తది…లేసుడు తోనే పండ్లు తోమి వంటింట్ల కొచ్చి నా కోసం ఎతుకుతది…. ముద్దుగ కోపెడు చిక్కగ చాయ వెట్కొనీ కుర్షి ల గుసోని బుర్ర బుర్ర తాగుతది….

ఇగ తానాని కి వొయ్యి వచ్చే వరకు వాళ్ళాయన లేషి పేపరు సదువు కుంట ” ఇగో గింత శాయ వెట్టు” అంటడు.

” ఆ ! గట్లే పెడ్తున్న..అని మల్ల నన్ను పీసు వెట్టి తోమి చాయ్ వెట్టి.. కోపేడు ఆయనకు..మిగిలింది మల్ల తాగుతది గుట్ట గుట్ట….

ఇగ గా పోరగాండ్లు లేశీ…” అమ్మా ! చాయ్ వెట్టినవా ” అంటరు…

” పెడ్తున్న ” అని మల్ల తోముతది నన్ను….

” అమ్మయ్య ! ఇగ రెస్ట్ దీసుకుంట అని అనుకునే వరకు…

” అమ్మ గారు! గింత శా వట్టు వొయ్య రాదు నెత్తి బాగ నొ స్తంది” అనే…పని మనిషి..

నీ పాడు గాను నన్ను బత్క నియ్యరా ఉల్లో!

మల్ల నన్ను పొయ్యి మీద వెట్టుడే…

ఇగ ఇంట్ల అందరు ఏటోల్లు అటు వోయింరు…. గూట్లే వోయ్యి పంట..

” ట్రింగ్..ట్రింగ్…”

ఎవలో ఫోన్ జేశిరి…

ఇంటామె” అలో! ఎవలు….కిందింటి పంకజమా! వొస్తావు..దా! గట్ల అడుగుడు ఎందుకు! రావాలే బాజాప్తగ…చాయ వెట్కోని తాగుదాము”..

వామ్మో! నన్ను చంపుతావే! నీ చాయ్ పాడు గాను..

రానే వచ్చే గామే! ముద్దుగ సోపాల గుసొని ఇక ఇకలు..పక పకలు…ఎల్లి మీద బల్లి వడే..బల్లి మీద ఎల్లి వడే అని…నన్ను గుంజుకొచ్చి పొయ్యి మీద వెట్టి చాయ్ వెట్కోనీ తాగిరి…

గిట్ల నన్ను తోమి తోమి సంపుతున్నరు…బ్రమ్మ తానికి వొయిన కష్టం జెప్పుకో నీకి…

అయ్యా! అనంగనే….

ఎవరక్కడ ఇగో చాయ గిన్నె వొచ్చింది..నాలుగు తలకాయలు నొస్తున్నయి…పెద్ద కోపెడు చాయ వేట్టుం డి అన్నడు….ఇగ ఎవలకూ జెప్పాలే…
సంతోష మొచ్చినా దుక్క మొచ్ఛినా చాయ నే నట..పొర గాండ్లకు పరిచ్చలు వొస్తే నిద్ర రాకుం ట చాయ నే…

గీతలు వడ్డయి పెయ్యంత…పొయ్యి మీద పెట్టి పెట్టీ.. ముడ్డి మండుతుంది….
జెర్ర న్యాయం జెప్పుర్రి !

November 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగు జాతీయాల సొగసు

by చంద్రకళ దీకొండ November 30, 2025
written by చంద్రకళ దీకొండ

తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైనవి పద్యం,అవధానాలు.అలాగే అన్ని భాషల కంటే అత్యధిక సంఖ్యలోనున్న సామెతలు.పొడుపు కథలు కూడా తెలుగు భాషకే స్వంతం.

ఏ భాషలోనైనా అసంఖ్యాకంగా ఉండే మాటలు నామవాచకాలు.వ్యక్తుల,స్థలాల,పశుపక్ష్యాదుల పేర్లన్నీ నామవాచకాలేననునది తెలిసిన సంగతే.విద్యావంతుల సంభాషణల్లో,రచనల్లో ఈ రకం నామవాచకాల వాడుకలో కొన్ని ప్రత్యేకార్థాలూ, ఒడుపులూ కనిపిస్తాయి.కొన్ని సందర్భాల్లో ఇటువంటి మాటలకు నిశ్చితమైన అర్థం వుంటే, కొన్ని సమయాల్లో విరుద్దార్థమో, విపరీతార్థమో ఉండవచ్చు.కొన్ని సరదాకు సృష్టించుకున్నవైతే, కొన్ని ప్రయోజనదృష్టితో పుట్టినవి.

పై విధమైన నామవాచకాలను కొందరు జాతీయాలని వ్యవహరిస్తారు.కొన్ని తెలుగు సాహిత్యంలో తెలుగువాళ్ళ వాడకంలో పుట్టి,వ్యాప్తిలోకి వచ్చినవైతే,మరికొన్ని సంస్కృత వాఙ్మయంలో పుట్టినా,తెలుగువాళ్ళు స్వంతం చేసుకున్నవి.ఈ మాటల్లో వ్యక్తి నామాల మీద పుట్టినవి,ఇతర సాధారణ విశేష్యాల్లాగా సహజమైనవి కావు-విద్యావంతుల విశ్వామిత్ర సృష్టిలో ఉద్భవించినవి.

మనం తరచుగా వినే, వాడే కొన్ని జాతీయాల గురించి ముచ్చటించుకుందాం..

అక్షింతలు
ఈ తెలుగు మాటకు సరైన సంస్కృత రూపం అక్షతలు
క్షతం అంటే దెబ్బ,ప్రమాదం.అవేవీ లేకుండా మంత్రపూతంగా వేసే బియ్యపు గింజలు అక్షతలు.శుభకార్యాలలో తెల్లగా ఉన్న బియ్యాన్ని అక్షతలుగా వాడుతారు.ఆశీర్వదించటానికి,దీవించటానికి తలమీద అక్షతలు చల్లటం పరిపాటి.అలాగే దైవపూజలో కూడా అక్షింతలు చల్లుతాం.అయితే- చల్లు కు బదులు వేయు అనే పదాన్ని వాడినప్పుడు తిట్టు,దూషించు,విమర్శించు అనే అర్థాలు వస్తాయి.భూత,ప్రేత పిశాచాదులను పారద్రోలటానికి ఉచ్ఛాటన మంత్రాలు చదువుతూ,అక్షింతలను నాలుగు మూలలా విసురుతారు.భిన్న విధాల వాడుక ఉన్నందున విడిగా అక్షింతలు అనే మాట వాడినప్పుడు సందర్భాన్ని పురస్కరించుకుని అర్థం చేసుకోవలసివుంటుంది.

ఆటవిడుపు
ఇది పాతకాలపు వీధిబడుల సాంప్రదాయంలో ఒక భాగం.ఆనాటి బోధన పూర్తయ్యి,పిల్లలు ఇళ్లకు వెళ్లేముందు ఒక పద్యం చెప్పేవారు.మరునాడుదయం దానిని గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయుడికి ఒప్పచెప్పాలి.తప్పు చెపితే,ఒకటికి పదిసార్లు పలకపై దాన్ని సరిగా వ్రాసి,చూపాలి.పిల్లలు ఆడుకోవడానికి పోబోతుండగా బడి విడుపు సమయంలో నేర్పిన పద్యాన్ని ఆటవిడుపు పద్యమనేవారు.ఈ విధమైన చదువు ఇప్పుడు లేకపోయినా,ఆటవిడుపు అనే మాట మాత్రం అర్థవిశేషం సంపాదించుకుని, పనిలేకపోవటం అనే భావంలో వ్యవహృతమవుతున్నది.

గాడిదగుడ్డు
గాడిద నాలుగుకాళ్ళ జంతువు.అది పిల్లల్ని కంటుందే కానీ,గుడ్లు పెట్టదు. కాబట్టి,గాడిదగుడ్డనేది కుందేటికొమ్ములాగా లేనిదానితో సమానం.గాడిదగుడ్డంటే శూన్యం.ఈ మాటను విసుగుతో,నిందార్థకంగా మాత్రమే వాడుతారు.

November 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

భార్య–భర్తల బంధం

by Dr. Aruna Parandhamulu November 30, 2025
written by Dr. Aruna Parandhamulu


జీవిత ప్రయాణం ఇద్దరి కలయిక,
ఆ కలయికలో ప్రేమే ఆధారశిల.
అనురాగం తో అల్లిన మమతా దారం,
భార్య–భర్తల బంధం ఆత్మల సారం.

ఆనందం పంచుకునే హృదయాల రాగం,
బాధల్లో నిలిచే విశ్వాసం దాగం,
ఒకరి కన్నీరు మరొకరికి తుడిపే హక్కు,
అదే ఈ బంధానికి శాశ్వత సాక్ష్యం.

కోపం వస్తే మాటలు మౌనమవుతాయి,
ప్రేమ తాకితే మేఘాలు చినుకవుతాయి,
చిన్న చిన్న తగవులు తీయని జ్ఞాపకాలు,
కలసి నవ్విన క్షణాలే నిజమైన కవితలు.

కాలం మారినా, మనసు మారదు,
వయసు పెరిగినా ప్రేమ తరుగదు,
ఒకరి ఊపిరి మరొకరికి ఆధారం,
అదే భార్య–భర్తల బంధం – జీవన ధారం.

November 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నామమహిమ

by Thata Kameshwari November 29, 2025
written by Thata Kameshwari


        చాలా రోజులుగా ఋష్యమూక పర్వతంపై సీతమ్మ ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న శ్రీరాముడికి హనుమంతుడు తీసుకొచ్చిన వార్త ఉపశమనాన్ని కలిగించింది. హనుమంతుడు సీతమ్మవారు ఇచ్చిన చూడామణిని అందించి ఆమె క్షేమ సమాచారమును తెలియజేశాడు. చూడామణిని చూసిన శ్రీరాముడు కంటతడి పెట్టుకుని, వెంటనే సుగ్రీవునితో లంకపై దండయాత్రకు సైన్యాన్ని సిద్ధం చేయమనడంతో, కోట్ల సంఖ్యలో వానరులు రామ కార్యం నెరవేర్చడానికి సిద్ధమయ్యారు. శ్రీరాముడు ఆ విశాలమైన వానర సైన్యమును తీసుకొని లంకా నగరంపై దండయాత్రకు బయలుదేరి సముద్రతీరానికి చేరుకున్నాడు.

విశాలమైన సముద్ర తీరానికి చేరుకున్న రాముని సైన్యం, సముద్రాన్ని ఎలా దాటాలనే సమస్య ఎదురైంది. శ్రీరాముడు వరుణుడైన సముద్ర దేవత సహాయం పొందాలని నిర్ణయించుకుని, మూడు రోజులు ప్రార్థించినా సముద్రం నిశ్శబ్దంగా ఉండటంతో, ఆ కరుణామూర్తి అయిన రామచంద్రుడు ఉగ్రరూపుడై సముద్రాన్ని ఆవిరి చేయాలని విల్లుపై బాణాన్ని ఎక్కు పెట్టగానే, వరుణుడు భయంతో కంపించి క్షమించమని ప్రార్థించాడు. తన స్వభావాన్ని మార్చలేనని, కానీ ఒక పరిష్కారాన్ని సూచించగలనని చెప్పి, వారి సైన్యంలో వంతెనను నిర్మించే సామర్థ్యం కలిగిన నలుడి సహాయంతో సముద్రంపై వంతెనను నిర్మించమని చెప్పాడు.

వానరులు అత్యంత ఉత్సాహంతో పరుగు పరుగున సముద్రం మీదకు పెద్ద పెద్ద రాళ్ళను విసరడం ప్రారంభించారు. అయితే, ఆ రాళ్ళు సముద్రంలో వేయగానే మునిగిపోవడంతో వానరులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అది గమనించిన హనుమంతుడు మనస్సులో శ్రీరాముడిని ధ్యానించి, ఒక రాయిపై ‘జై శ్రీరామ్’ అని వ్రాసి సముద్రంలో వేయగానే అది అద్భుతంగా తేలసాగింది. అది చూసిన వానరులు రెట్టింపు ఉత్సాహంతో రాళ్లపై ‘జై శ్రీరామ్’ అని రాయడం, సముద్రంపై వేయగానే అవి తేలడం ప్రారంభించడంతో ఆ సముద్ర తీరాన ‘రామ్ నామ ధ్వని’ వినిపించసాగింది.

 రామలక్ష్మణులు వారిని మరింత ఉత్సాహపరుస్తూ, “వానరులారా, మనం లంకా నగరం చేరడానికి ఎక్కువ సమయం లేదు. రావణుని వధించి మీ సీతమ్మ ను  తెచ్చుకోవాలి” అంటూ ఆ వానరులను ప్రోత్సహిస్తుంటే, వారు రెట్టింపు వేగంతో వారధిని కట్టసాగారు.

అతి వేగంగా వానరులు సముద్రంపై నిర్మిస్తున్న వారధిని చూసిన రావణుడి గూఢచారులు, అత్యంత వేగంగా రావణుడి వద్దకు ఆందోళనగా వచ్చి ఇలా విన్నవించారు: “ప్రభూ! మీరు అనుకున్నదంతా తారుమారు అయింది. వానర సైన్యం విశాలమైన సముద్రాన్ని దాటి లంకకు చేరడం అసంభవం అని మీరు భావించారు. కానీ వారు బండరాళ్ళతో వారధిని నిర్మిస్తున్నారు.”

అది విన్న రావణుడు నిర్ఘాంతపోయి, కోపంతో ఊగిపోతూ ఇలా అన్నాడు: “అసంభవం! రాళ్ళతో వారధిని కట్టడమా? అది అసాధ్యం. మీరు మైకంలో ఏదో చూసి నాకు అసత్యం చెబుతున్నారు.”

అందుకు గూఢచారులు, “లేదు ప్రభూ, మేము అసత్యం చెప్పడం లేదు. నిజంగానే అక్కడ వానరులు రాళ్ళ మీద ‘జై శ్రీరామ్’ అని రాసి సముద్రంలో వేయగానే అవి తేలుతున్నాయి. దాదాపుగా వారధి నిర్మాణం పూర్తయింది” అని విన్నవించగా, రావణుడి హృదయం భయంతో కంపించింది.

ఆ వార్త కార్చిచ్చులా లంక వాసులలో వ్యాపించడంతో, వారు భయభ్రాంతులకు గురై వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. “రామ నామం లిఖించిన రాళ్ళు సముద్రంలో వేయగానే తేలుతున్నాయట! శ్రీరాముడు సామాన్యమైన నరుడు కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన నామంలోనే అంతటి మహిమ ఉంటే, ఆయన సామర్థ్యాన్ని ఊహించవచ్చు. ఇక ఆ శ్రీరాముడు లంకను చేరి దశగ్రీవుడిని ఓడించడం తథ్యం. బ్రహ్మ ఆయనకు ఇచ్చిన వరం ప్రకారం, తుచ్ఛమైన మానవుల చేత తప్ప మరెవరి చేతనూ అతనికి మృత్యువు సంభవించదు అనేది నిజం కానుంది. కాబట్టి, మనతో పాటు ఈ స్వర్ణ లంక యొక్క వినాశనాన్ని ఎవరూ తప్పించలేరు,” అంటూ విలపించారు.

లంక ప్రజలు చర్చించుకుంటున్నది తెలుసుకున్న దశకంఠుడు, వారికి తనపై విశ్వాసము పునరుద్ధరించడానికి మరియు తన సామర్థ్యమును నిరూపించడానికి మరుసటి రోజు అందరినీ సముద్ర తీరానికి రమ్మని చాటింపు వేయించాడు. తెల్లవారేసరికి ప్రజలంతా సముద్ర తీరానికి చేరుకున్నారు. రావణుడు కూడా గర్వంగా సముద్ర తీరానికి వచ్చి ఒక రాయి మీద “జై రావణ” అని రాసి, దానికి ఏదో మెల్లగా చెప్పి, సముద్రంలోకి విసిరాడు. రాక్షసులు చూస్తూ ఉండగా మహా అద్భుతం జరిగింది. “జై రావణ” అని రాసిన రాయి నీటిలో తేలింది. రావణుని సామర్థ్యం చూసిన ప్రజలు అత్యంత ఆనందం పొంది “జై రావణ” అని జయఘోష చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

రావణుని భార్య, పట్టమహిషి అయిన మండోదరి తన భవన గవాక్షం నుండి జరుగుతున్న సంఘటనను చూసి, చెలికత్తెల ద్వారా విషయం తెలుసుకొని ఆశ్చర్యానికి లోనయ్యింది. రావణుడు ఆమె అంతఃపురానికి రాగానే, ఆమె వినయంగా “స్వామి, మీరు అన్యథా భావించకుంటే ఒక విషయం అడుగుతాను”. దానికి రావణుడు “మండోదరి, నీవు లంకకు మహారాణివి, నిస్సంకోచంగా అడుగు” అనడంతో ఆమె “నేను విన్నది, చూసింది నిజమేనా? మీ నామం లిఖించిన రాయి సముద్రంలో తేలటం నిజమా? అది మీ రాక్షస మాయా లేక నామ మహిమా? నాకు తెలుసుకోవాలని ఉంది, చెప్పండి” అని ఆతృతగా అడిగింది.

దానికి రావణుడు బిగ్గరగా నవ్వి, “మండోదరి, నీవు చూసింది నిజమే. అది మాయ కాదు, నామ మహిమ, అది కూడా శ్రీరామ నామ మహిమ” అని ఆశ్చర్యంగా చూస్తున్న మండోదరితో రావణుడు ఇలా అన్నాడు, “నా పేరు రాసి సముద్రంలో వేస్తే అది మునిగిపోతుందని ఖచ్చితంగా తెలుసు. అందుకే రాయి మీద నా పేరు లిఖించి సముద్రంలో వేసే ముందు దానితో మెల్లగా ఇలా అన్నాను, ‘నీవు కానీ తేలకపోతే రామునిపై ఆన’ అంటూ రామునిపై ఒట్టు వేసి సముద్రంలోకి విసిరాను. అందువలన ఆ రాయి కట్టుబడి తేలక తప్పలేదు. ఈ విధంగా నేను ప్రజల విశ్వాసం తిరిగి పొందగలిగాను” అని గర్వంగా పలికాడు.

దానికి మండోదరి, రామ నామంలోనే ఇంతటి మహత్యం ఉంటే రాముని సామర్థ్యం ఊహించ శక్యం కానిదని గ్రహించింది. రావణుని మూర్ఖత్వానికి ఆమె మనస్సులో నవ్వుకుని, శ్రీరాముని రూపంలో ఉన్న వైకుంఠనాథుడికి మనసులోనే నమస్కరించి, తన భర్తకు సన్మార్గం చూపమని ప్రార్థించింది.

రావణుడు ఇంత జరిగినా, అతనికి రాముని సామర్థ్యము తెలిసినా, అహంకారముతో, బల గర్వముతో, మూర్ఖత్వము వదలక రాముని చేతిలో వధింపబడి రాక్షస కుల వినాశకుడయ్యాడు.

***

November 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

జీవన మాధుర్యం

by Laxmi Madan November 29, 2025
written by Laxmi Madan


ఆరవ భాగం

అపర్ణ తను పుట్టి పెరిగిన ఇంటికి వచ్చి తన బాల్యం గుర్తు చేసుకుంటుంది.ఆ మధుర జ్ఞాపకాలతో మురిసి పోతుంది. సుధ పిలుపుతో ఊహల నుండి బయట పడి పడుకుంటుంది

ఇక మిగతా భాగం చూద్దాం!

తెల్లవారి తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని తయారైంది సుధ. అపర్ణ మాత్రం అలాగే పడుకొని ఉంది.

” అప్పూ! లేవ్వవే! మీ ఫ్రెండు ఇంటికి వెళ్ళాలి కదా! నేను లేచి తయారయ్యాను కూడా” అని లేపింది సుధ.

” అత్తా! అప్పుడే లేచావా!నేను కూడా లేచి తయారవుతాను. అయ్యో! నేను బట్టలేమీ తెచ్చుకోలేదు. నేను స్నానం అక్కడికి వెళ్లాకే చేస్తానులే” అన్నది అపర్ణ.

” ఈ పాచి ముఖంతో అక్కడికి వెళ్తావా? నా చీర ఏదైనా కట్టుకో! కొత్త చీరలు కూడా ఉన్నాయి. బ్లౌజులు నావి సరిపోతాయిలే !లేచి తొందరగా స్నానం చేయి” అన్నది సుధ.

” అదిగో అక్కడ కొత్త బ్రష్ పెట్టాను తీసుకో! బ్రష్ చేసుకుని స్నానం చేసి రా! ఈ ఇంటి బాత్రూం లో గీజర్ పెట్టడానికి లేదు. కాబట్టి స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టి ఉంచాను బకెట్లో పోసుకొని స్నానం చేసేయ్” అని చెప్పింది సుధ.

అలా బ్రష్ తీసుకొని పెరట్లోకి వెళ్లిన అపర్ణకి ఆ పెరడంతా ఎంతో ఆహ్లాదంగా కనిపించింది. తన చిన్నప్పుడు ఆ మొక్కల మధ్య ఆడుకునేది. కాంపౌండ్ వాల్ చుట్టూ అన్ని గులాబీ చెట్లు ఉండేవి. మధ్యలో మల్లెపందిరి, మరోపక్క బొండు మల్లె చెట్టు ఇంకా ముందుకు చేమంతి పూల పొదలు, దవనంపాదు మరోవైపు వంకాయ బెండకాయ టమాట ఇలా అన్నీ కూరగాయ చెట్లు ఎంత బాగుండేది.ఇప్పుడు కూడా సుధ త్త బాగానే మెయింటైన్ చేస్తుంది. ఇలా ఒక్కసారి తనకు తాను పసిపిల్లల మారినట్లు అనిపించింది అపర్ణకి.

కొబ్బరి చెట్టు మొదట్లో కూర్చొని బ్రష్ చేసుకుంటుంటే, అక్కడే పని చేస్తున్న ఒక ఆడ మనిషి ప్రశ్నార్థకంగా అపర్ణ వైపు చూసింది.

అపర్ణ కూడా ఆమెను ’ఎప్పుడో చూసినట్లు ఉంది. కానీ పేరు గుర్తు రావడం లేదు’ అనుకుంది.

బయటకు వచ్చిన సుధ

” ఈమె అప్పుడు మన ఇంట్లో పనిచేసే బాలవ్వ మనవరాలు. పరిస్థితులు బాగా లేక ఇక్కడ అన్నల దగ్గరికి వచ్చి ఉంటుంది. చిన్నప్పుడు అంతా మన ఇంట్లోనే ఆడుకునేది కదా! అందుకే మన ఇంట్లో పని చేస్తానని వచ్చింది.గుర్తుందా? ఆమె పేరు అంజి. ఇంచుమించు నీ వయసే ఉంటుందేమో” అన్నది సుధ.

” ఆ! గుర్తొచ్చింది. ఒకరోజు బంతిపూలు కోసిందని ఆమె వెనకాల పరిగెత్తుకొని వెళ్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోయాను కొడతానని,అప్పుడు వాళ్ళ అమ్మ భయపడి పోయి, ఈమెను తీసుకెళ్లి వాళ్ళ దేవుడి గదిలో దాచి పెట్టింది. నేను దేవుడి గదిలోకి కూడా వెళ్లి కొడతానని చెప్పాను. కానీ అలా “దేవుడు గదిలోకి వెళ్ళకూడదమ్మా”! అని ఆమె భయం చెప్పింది. అప్పుడు ఇంక మాట్లాడకుండా వచ్చేసాను. నేను ఎన్నో రోజులుగా నీళ్లు పోసి పెంచిన బంతిపూలన్నీ కోసేసింది. నాకు ఎంత కోపం రావాలి అసలు? అంజి నీకు గుర్తున్నానా నేను” అని అడిగింది నవ్వుతూ..

” ఓ అప్పమ్మనా! నాకెందుకు యాది లేదు. మస్తు యాది ఉంది. నాతోని ఎంత మంచిగా ఉండేదానో, కోపం వస్తే అంత భయం చూపే దానివి. వామ్మో నన్ను కొట్టనీకి ఉరుక్కుంట వచ్చినవు” అన్నది అంజి..

కాసేపు ముగ్గురు నవ్వుకున్నారు..

“నువ్వు కలుస్తావని అనుకోలేదు అంజి! నేను నీకోసం ఏమి తీసుకొని రాలేదు” అని లోపలికి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఒక ఐదు వందలు రూపాయల నోటు తీసుకుని వచ్చి అంజి చేతిలో పెట్టింది.

అంజి సంతోషంగా తీసుకొని “నీ ఫోన్ నెంబర్ ఇయ్యమ్మ! అప్పుడప్పుడు మాట్లాడతా” అన్నది అంజి.

తన ఫోన్ నెంబర్ రాసి ఇచ్చింది అంజికి. తర్వాత స్నానం చేయడం కోసం బకెట్ లోపలికి తీసుకుని వెళుతుంటే, అంజి వచ్చి నేను పెడతానమ్మా! అని బకెట్ లోపల పెట్టి అందులో వేడి నీళ్లు చల్ల నీళ్లు కలిపేసి “ఇంకా తానం చేయమ్మా” అన్నది.

అపర్ణ స్నానం చేసుకొని సుధ ఇచ్చిన పట్టు చీర కట్టుకుంది. అందులో తనకు సరిపోయిన బ్లౌజ్ వేసుకుని అద్దంలో చూసుకుంది.

“అత్తా! నాకు బాగా సరిపోయింది నీ బ్లౌజ్” అని చెప్పింది అపర్ణ.

ఇంతలో బయట కార్ చప్పుడు వినబడింది. కారు దిగి డ్రైవర్ లోపలికి వచ్చి “వసంతమ్మ మిమ్మల్ని తొందరగా రమ్మన్నది” అని చెప్పాడు.

ఇద్దరూ ఇంటికి తాళం వేసి కార్ ఎక్కి కూర్చున్నారు. చీకట్లో గమనించలేదు కానీ ఊరంతా మారిపోయింది. ఆ పక్కన వరుసగా ఇళ్ళు ఉండేవి. అందులో తన స్నేహితులు ఉండేవాళ్లుm ఇటుపక్కన ఒక కిరాణా షాపు ఉండేది. సమయంగాని సమయంలో వాళ్ళ తలుపు దబా దబాదితే ఒకసారి ఆ దుకాణం ఓనరు గట్టిగా బుగ్గ గిల్లింది. అది గుర్తొచ్చి నవ్వుకుంది.

చుట్టాలు ఎవరు వచ్చినా, ఐదు పైసలు పది పైసలు ఇస్తే, వెళ్లి పిప్పర్మెంట్లు కొనుక్కునేది గుర్తుకొచ్చింది. ఒక్కొక్కసారి డబ్బులు ఎక్కువగా లేకుంటే దాన్నే కాకెంగిలి చేసు పంచుకునేవాళ్లు. ఆ ముందుకు వెళితే చెరువు. ఎప్పుడు చెరువు నిండిన ఆ మత్తడి మీద నుండి స్నేహితురాలు సువర్ణతో అటు ఇటుగా నడిచేది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఎంత తిట్టేదో .”అలా మత్తడి పైనుండి నడవకూడదు. జలదేవతకి కోపం వస్తుంది” అని చెప్పేది. ఇలా అవన్నీ గుర్తు చేసుకుంటూ సుధతో చెప్తూ బయలుదేరింది.

ఇంకా ముందుకు వెళుతుంటే గాజుల షాప్ కనిపించింది. అది మూసివేసి ఉంది. కానీ ఆ గాజుల షాపు చరిత్ర గుర్తొచ్చింది. ఊళ్లో రెండు షాపులు మాత్రమే ఉండేవి. ఒకటి గాజుల లింగయ్య ఒకటి గాజుల రాజయ్య .ఇద్దరూ అన్నదమ్ములు. రాజయ్య షాపు చాలా దూరంగా ఉండేది. లింగయ్య షాపు దగ్గరలో ఉండేది. కానీ ఎప్పుడు రాజయ్య షాపు మూసి ఉండేది. ఆయన దగ్గర ఎక్కువ డిజైన్స్ ఉండేవి. లింగయ్య షాపులో తక్కువ డిజైన్స్ ఉండేది. అతను ఇల్లు షాపు ఒకచోటే ఉండేది అపర్ణ తల్లి గాజులు వేసుకోవాలంటే వెళ్లి..

” లింగయ్య తాతా! అమ్మ రమ్మంటుంది గాజులు వేసుకోవాలట” అని పిలవగానే పెద్ద గాజుల పెట్టే భుజానికి తగిలించుకొని ఇంటికి వచ్చేవాడు.

అమ్మ పెద్ద చాపపరిచి అతని కూర్చోమనేది. ఆయన దగ్గర ఉన్న గాజుల పొట్లాలు అన్ని తీసి బయట పెట్టేవాడు.

” ఏమి కావాలి బిడ్డ! నీ ఇష్టం ఉన్న గాజులు చూసుకో ! మంచిగా చూసుకో” అంటుండే లింగయ్య తాత.

అటు ఇటు చూసి అమ్మ రెండు రంగుల గాజులు సెలెక్ట్ చేసుకుని, ఈ గాజులు బాగున్నాయి వేయమని అడిగేది.

చేతి నుండి పాత గాజులు తీయాలంటే పెద్ద ప్రహసనమే. చాలా చిన్న సైజు వేసుకునే వాళ్ళు. దానిని కష్టపడి నొప్పి తెలియకుండా ఏదో ముచ్చట పెడుతూ గాజులన్నీ తీసేవాడు లింగయ్య తాత. అందులో సెంటిమెంటు పాత గాజులు రెండు చేతులకి ఒక్కొక్కటి ఉంచుకొని, మిగతావి తీసేయమనేది అమ్మ. ఆ తర్వాత కొత్త గాజులను మెల్లగా చేయి నొక్కుతూ మాట్లాడుతూ వేసేవాడు. ఆ రంగు రంగుల గాజులను చూసుకొని మురిసిపోయి గాజులకు దండం పెట్టుకునేది అమ్మ..

ముచ్చట పడి చిన్న సీసం గాజులు పిల్లలకందరికీ వేయించేది అపర్ణ తల్లి. అపర్ణకు కూడా ఇలాంటి గాజులు అంటే ఎంతో ఇష్టం చేతినిండా వేసుకునేది.

ఇలా అన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళసాగింది అపర్ణ. ఆ గాజుల షాపు దాటగానే వీళ్ళు వెళ్లే స్కూల్ గుర్తొచ్చింది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో ఊరికే అల్లరి చేస్తారని, అపర్ణ తల్లి ఇంటి పక్కన వైష్ణవుల ఇంటికి స్కూలుకి పంపించేది.

ఆ స్కూల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుని నవ్వుకుంది అపర్ణ.

అపర్ణ పెదవులు అప్రయత్నంగా విచ్చుకున్నాయి.

ఒక్కసారి ఆ స్కూలు తాలూకు జ్ఞాపకాలను తలుచుకుంది..

గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లల్ని జాయిన్ చేసుకునే వాళ్ళు కాదు. అందుకని ఇలా చిన్నచిన్న బళ్ళల్లోకి పిల్లల్ని పంపించేవారు. బడికి వెళ్లే లోపల ఓనమాలు, ఒంట్లు నేర్చుకుంటారని పెద్ద వాళ్ళ కోరిక.

అలా అపర్ణ తల్లి పిల్లలందరినీ దగ్గర్లో ఉన్న వైష్ణవుల ఇంటికి చదువుకోవడానికి పంపించేది.

అదొక చిన్న ఇల్లు. ముందర చిన్న వసారా. పక్కన ఒక చిన్న హాలు, ఒక వంటిల్లు. అందులో ఒక ఉయ్యాల ఉండేది. కొబ్బరి తాడు కట్టి కూర్చోవడానికి గోనెసంచితో జోలెలాగా తయారు చేసేవాళ్ళు.

ఇక ఇల్లంతా మట్టి నేల. కాబట్టి స్కూలుకు వచ్చేటప్పుడు ఒక గోనెసంచి తెచ్చుకోవాలి. అది వేసుకొని కూర్చోవాలి. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కొంతమంది తీసుకెళ్లేవాళ్లు. కానీ కొంతమంది అక్కడే ఉన్న గోడమీద మడత పెట్టి పెట్టుకునేవాళ్ళు.

అపర్ణ అన్న అప్పటికే పెద్ద బడిలో చదువుకుంటున్నాడు. సుధ కూడా హై స్కూల్ లోనే ఉంది. ఇక అపర్ణ అక్కా,చెల్లె తమ్ముడు తో కలిసి స్కూల్ కి వచ్చేది.

అపర్ణకు విపరీతమైన భయం ఉండేది. టీచర్ ని ఏది అడగాలన్న వాళ్ళ అక్కనే అడగాలి.

” టీచర్! టీచర్! మా చెల్లె మంచినీళ్లు తాగి వస్తుందట. ఇంటికి పంపిస్తారా! టీచర్ మా చెల్లి ఒంటేలు వెళ్లాలట పంపిస్తారా” ఇలా అన్నిటికీ అపర్ణ అక్కనే అడగాల్సి వచ్చేది. ఒక్కొక్క రోజు వాళ్ళ అక్కకి చిరాకు వచ్చి “నువ్వే అడుక్కో పో! ఎన్నిసార్లు నేను అడగాలి” అని తిట్టేది.

ఇక టీచరు స్కూల్ కి వెళ్ళగానే పలకల మీద వాళ్లకు వచ్చినవి రాయమనేది. ఆ తర్వాత పలక మీద అక్షరాలు పెట్టించి దిద్ద మని చెప్పేది. ఎంత బాగా దిద్దితే అంత మంచిది అని చెప్పేది. కానీ పిల్లలకు ఓపిక ఉంటుందా! బలపం అడ్డంగా పెట్టి అక్షరాలు లావు అయ్యేలా చేసి, ఆ తర్వాత దిక్కులు చూస్తూ కూర్చునేవాళ్లు.లేదా అల్లరి చేసే వారు.టీచర్ మడికట్టుకొని వంటింట్లో వంట చేసేది. మధ్య మధ్యలో బయటకు వచ్చి తిట్టేది. ఆ తర్వాత ఇసుక రాళ్ళ బియ్యాన్ని పలకల మీద పోసి, రాళ్ళను వేరుచెయ్యమనేది. రోజంతా చదువుకునేది ఏముంటుందని! పిల్లలకు కూడా కాలక్షేపం ఉంటుందని అలా బియ్యం ఏరించేది. పిల్లలకు భలే సరదాగా ఉండేది.

ఆ స్కూల్లో ప్రమీల అని ఒక అమ్మాయి ఉండేది. అసలు ఈ రోజుల్లో ఎంబీఏ చేసే వాళ్ళు కూడా పనికిరారేమో! అప్పట్లో అందరికీ చింత చెట్లు ఉండేవి .ఇళ్లల్లో బోలెడు చింతపండు, చింతకాయ. ఈ అమ్మాయి ఒక బాక్స్ లో చింతపండు తీసుకొని వచ్చేది.

టీచర్ లోపలికి వెళ్ళగానే, తాను చింతపండు చప్పరిస్తూ…

” కావాలా? చాలా బాగుంది తింటారా?” అంటూ వూరించేది.

చింతకాయలో చింతపండునో చూపిస్తే పిల్లలకు సహజంగా తినాలని అనిపిస్తుంది. అందరూ “నాకు కావాలి నాకు కావాలి” అని ఆ అమ్మాయి చుట్టూ చేరే వాళ్ళు.

అప్పుడు ఓ ఫిట్టింగ్ పెట్టేది. మీ దగ్గర ఉన్న బలపాలు ఇస్తే నేను చింతపండు ఇస్తా అని చెప్పేది.

చేసేదేమీ లేక అందరూ వాళ్ళ దగ్గర ఉన్న బలపాలు ఇచ్చేవాళ్ళు.బలపం సైజును బట్టి చింతపండు ముక్క చేతిలో పెట్టేది.

ఇలా ఈ తంతు కొన్నాళ్లుగా జరుగుతుంది.

ఒకరోజు ఇంట్లో పిల్లలు రోజు బలపాలు కొనడం చూసి అపర్ణ తల్లి అడిగింది..

” ఏంటి ఈ మధ్య రోజు కొత్త బలపాలు తీసుకెళ్తున్నారు? అంతకుముందు నాలుగైదు రోజులు రాసుకునే వాళ్ళు కదా! తింటున్నారా బలపాలను”? అని గట్టిగా అడిగింది.

పిల్లలు ఎవరూ ఏమీ చెప్పలేక నీళ్లు నములుతున్నారు.

అప్పుడు అపర్ణ ధైర్యం తెచ్చుకొని..

” అమ్మా! మరీ మరీ… ప్రమీల రోజు చింతపండు తీసుకొని వచ్చి, బలపాలు తీసుకొని మాకు చింతపండు ఇస్తుంది. అందుకని రోజు బలపాలు అయిపోతున్నాయి” అని చెప్పింది నసుగుతు..

” ఏంటి! ప్రమీల బలపాలకు చింతపండు అమ్ముతుందా? మీరు కొంటున్నారా? అసలు ఏమైనా బుద్ధి ఉందా మీకు…

ఇలా రండి! అంటూ ముగ్గురిని తీసుకెళ్లి ఇంట్లో ఉన్న ఘర్షఅర్ర లోకి తొంగి చూడమని చెప్పింది..

ఆ గది నిండా బోలెడు చింతపండు ఉంది..

” ఇదిగో ఈ చింతపండును ఎంత తింటారో అంత తినండి. బలపాలు ఇచ్చి చింతపండు కొనుక్కో నక్కర్లేదు. ఈ గదిలో కూర్చోబెట్టి తాళం వేస్తాను. ఈరోజు తినండి చింతపండు మొత్తం” అని గట్టిగా అరిచేసింది..

అప్పుడు అపర్ణ వాళ్లకి ఆశ్చర్యం వేసింది. “ఇంత చింతపండు ఇంట్లో ఉంది. మేము పిచ్చి వాళ్ళలాగా బలపాలు ఇచ్చి చింత పండు కొన్నాము. ఛీ ఆ ప్రమీల ఎంత మోసం చేసింది” అని తిట్టుకున్నారు..

తర్వాత అపర్ణ తల్లి స్కూలుకు వెళ్లి ఇలా జరిగింది అని చెప్తే, అప్పుడు ఆ టీచర్ ప్రమీలను బెదిరించింది కూడా…

ఇక మగ పిల్లలు బాగా అల్లరి చేసేవాళ్లు. వాళ్ళింట్లో టీచర్ గారి అబ్బాయి కూడా ఉండేవాడు. అతను జాబ్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మధ్య మధ్యలో అతను కూడా అజమాయిషీ చేసేవాడు..

మగ పిల్లలు అల్లరి చేస్తే కోదండం కూడా వేసేవాడు. లేదా బింగిళ్ళు తీయించడం అదేనండి గుంజీలు అంటారే! ఇలా ఆ బడిలో చదువుకున్న పిల్లలు ఎక్కువ జీవితం అంటే ఏంటో తెలుసుకునే వాళ్ళు. పిల్లలు అలాగే పనులు కూడా నేర్చుకునే వాళ్ళు…

టీచరు భోజనం చేసి మడి విడిచి బయటకు వచ్చి, “మీరు కూడా ఇంటికి పోయి తిని రండి” అని చెప్పి అక్కడే ఉన్న పీటబల్ల మీద పడుకునేది…

ఇంటికి వెళ్లిన పిల్లలు మెల్లగా ఆడుతూ.. పాడుతూ ఆలస్యంగానే స్కూలుకు చేరు కునేవారు..

ఇలా ఈ స్కూలు జీవితము ఒకసారి విసుగనిపించింది అపర్ణకు మరియు తన సహోదరులకు.

ఒకసారి వీళ్ళ వయసే ఉన్న ఒక చుట్టం చూపుగా వచ్చిన అబ్బాయి, వీళ్ళతో పాటు స్కూలుకు వచ్చేవాడు. అతనేం చేశాడంటే..

బడి అంటే మీకు విసుగు వస్తుంది కదా! నేను మిమ్మల్ని దాచి పెడతాను స్కూలుకు వెళ్లి మీరు ఊరికి వెళ్లారని చెప్తాను. అని చెప్పి ఒక ఇంటి ముందు దాచి పెట్టాడు.

కాసేపు కూర్చున్న పిల్లలకు..

“బడే బాగుంది.ఇక్కడ వద్దు,ఇంటికి పోదాం” అని ఇంటికి వెళ్ళారు.

తల్లి అడిగింది..

“అప్పుడే వచ్చారు”? అని..

“టీచర్ ఊరికి వెళ్ళిందమ్మా!” అని చెప్పారు.

అక్కడే ఉన్న వాళ్ళ అన్న..

“వీళ్లు అబద్ధం చెపుతున్నారు”అని అనుకుని బడికి వెళ్ళాడు.

“టీచర్ గారు మీరు ఊరికి వెళ్లారు అని మా తమ్ముడు చెల్లెలు చెప్పారు”అన్నాడు.

“అవునా మీరంతా ఊరికి వెళ్లారని మీ చుట్టాలబ్బాయి వచ్చి చెప్పి వెళ్ళాడు”అల్లరి పంతులమ్మ.

ఇంటికి వచ్చి అతను వీళ్లను బాగా తిట్టాడు.

అలా స్కూల్ జ్ఞాపకాలలో తేలిపోయిన అపర్ణ సుధ పలకరించే వరకు ఈ లోకంలోకి రాలేదు.

సుధా, అపర్ణ వసంత ఇంటికి చేరుకున్నారు.

పెళ్లి ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఆరోజు సాయంత్రమే ఫంక్షన్ హాల్ కు చేరుకోవాలి.

రెండవ రోజు కూడా దగ్గర బంధువులందరూ, వసంత కూతుర్ని పెళ్లి కూతురుగా చేశారు. మేనత్తలు ,చిన్నమ్మలు బాబాయిలు, పెద్దనాన్నలు ఇలా దగ్గర బంధువులందరూ పెళ్లికూతుర్ని చేసి వాళ్లకు తోచినది కట్నంగా ఇవ్వడం ఆనవాయితీ.

సుధా అపర్ణ లోపలికి అడుగుపెట్టగానే, వీళ్ళని చూసిన వసంత…

” సుధత్తా! బాగున్నారా? ఎన్నోసార్లు మీ ఇంటికి రావాలనుకున్నాను. ఏవో పనుల వల్ల కుదరలేదు. చిన్నప్పుడు అపర్ణ తో పాటు నాకు కూడా జడలు వేసే దానివి. స్కూల్లో అయితే అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు. ఆ రోజుల్లోనే ఎంతో ధైర్యంగా ఉండే దానివని మా ఇంట్లో కూడా అందరూ మెచ్చుకునేవారు” అంటూ సుధను గట్టిగా కౌగిలించుకుంది వసంత.

” ఏంటే నన్ను పలకరించడం లేదు? అత్తను చూడగానే నన్ను మర్చిపోయావా” అన్నది అపర్ణ నవ్వుతూ..

” నీ మొహం! నిన్ను స్పెషల్గా పలకరించాలా? వెళ్లి అలేఖ్యకు పెళ్లిబొట్టు పెట్టి ,చీర సరి చేయి అక్కడ పర్ఫెక్ట్ గా తయారు చేసే వాళ్ళు ఎవరూ లేక బిక్క ముఖం వేసింది. వెళ్ళు తొందరగా” అన్నది వసంత అపర్ణ చూస్తూ..

” ఇలా చెప్పావు బాగుంది. వెళ్తున్న మా బంగారు తల్లిని నేను తయారు చేయకుంటే ఇంకెవరు తయారు చేస్తారు” అంటూ లోపలికి వెళ్ళింది అపర్ణ..

అప్పటికే చీర కట్టుకొని అద్దం ముందు కూర్చుంది అలేఖ్య…

” అత్తా! వచ్చారా నాకు చీర సరిగా కుదరడం లేదు. మామూలు చీరయితే పరవాలేదు కట్టుకుంటాను. పట్టుచీర కదా కుర్చీలు సరిగ్గా రావడం లేదు. కొంచెం మీరు సరి చేస్తారా”? అని అడిగింది అలేఖ్య అపర్ణను చూస్తూ..

” అందుకే వచ్చాను రా! నేను తయారు చేస్తాను కదా! నువ్వు ఇలా రా” అంటూ చీరను సరిచేసి, చక్కగా పూలజడవేసి, పెళ్లి బొట్టు పెట్టి, బుగ్గన చుక్క కళ్ళకు కాటుక, కాళ్లకు పారాణి తీర్చిదిద్దింది .

” నా దృష్టి తగిలేలా ఉంది నీకు” అంటూ అలేఖ్యను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంది..

వసంత లోపలికి వచ్చి కూతురిని తీసుకొని దేవుడి గదిలోకి తీసుకెళ్లి హారతి ఇచ్చి బొట్టు పెట్టింది.

అందరూ భోజనాలు చేసి సాయంత్రం అయ్యాక అందరూ తయారయ్యారు. పెళ్లి మండపంకు అవసరమైన సామాగ్రిని అంతా ముందే పంపించారు.

చిన్న పట్టణమే కాబట్టి ఫంక్షన్ హాల్ కూడా పెద్ద దూరంగా లేదు.

ఫంక్షన్ హాల్ కి వెళ్ళిన తర్వాత కారు దిగి లోపలికి వెళ్లిన అపర్ణకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో ఉన్నట్టుగానే ఫంక్షన్ హాల్ ఉంటుంది అనుకుంది. కానీ చాలా సాంప్రదాయంగా, పాత పద్ధతిలో ఉంది ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ అనడం కన్నా పెళ్లి పందిరి అంటే బాగుంటుందేమో! అనిపించింది.

ఓపెన్ ప్లేస్ లో చక్కగా పచ్చని ఆకు పందిళ్లు. అటు ఇటు బెదురు తడికలతో నిర్మించి దాని వైపున అంతా పూలు ఆకులతో అలంకరించారు.

వెనుక భాగంలో అన్ని గదులు ఉన్నాయి. అవి అందరికీ ఏర్పాటు చేసినవి..

ఇంకా పెళ్లి మంటపము తయారు కాలేదు. పెళ్లి తెల్లవారి ఉదయం కాబట్టి ఆ ఏర్పాట్లు చూస్తున్నారు పనివాళ్ళు…

ఇంట్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పెళ్లి పందిరిలో కూడా అలాగే ఉన్నాయి.

ఎదుర్కోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

పెళ్ళివారికి ప్రత్యేకమైన కారుతో పాటు బస్సులు పంపించారు.

పెళ్లి వారికి ముందుగా విడిది ఏర్పాటు చేసి, వారు దిగగానే అక్కడికి వెళ్లి తయారు అయ్యి పెళ్లి మంటపానికి వచ్చేలాగా ఏర్పరిచారు.

మేళ తాళాలతో మగ పెళ్లి వారిని స్వాగతించారు ఆడపిల్ల వారు. అందరినీ ఆప్యాయంగా ఎదుర్కొని పెళ్ళికొడుకుకు పూలదండ వేసి వియ్యాలవారికి పుష్ప గుచ్చాలు అందించి చక్కని మేళతాళాలతో పెళ్లి మండపం వరకు పిల్లలంతా అందంగా నృత్యాలు చేస్తుంటే తీసుకొని వెళ్లారు. దాదాపు ఆ వేడుక గంటసేపు జరిగింది.

పందిట్లో కూర్చున్న తర్వాత ముందుగా ఆడ పిల్లవాళ్ళు వరపూజ చేసి పెళ్ళికొడుకుకు బట్టలు పెట్టి, వారి తరపు వారందరికీ తాంబూలాలిచ్చి వరుసైన వారందరూ రంగులు చల్లుకొని స్వీట్లు పంచుకున్నారు. తర్వాత మగ పెళ్లి వాళ్ళు కన్యా నిశ్చయం చేసి పట్టు బట్టలు నగలు బహుకరించి, అందరూ ఆడ పెళ్ళి వాళ్ళు ఇచ్చిన పానకం తాగి ఆసీనులయ్యారు.

అందరూ భోజనాలు చేసి పడుకున్నారు.

తెల్లవారి పెళ్ళిలో..

సశేషం

November 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

అధునాతన -సనాతన- సింగాణం

by రంగరాజు పద్మజ November 29, 2025
written by రంగరాజు పద్మజ

భేరి సునీతా రాంమ్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి

సనాతనమే… సునీతీయం
సనాతనం అనేది ఇది ఎప్పుడూ మారక నిత్యనూతనంగా ఉండేది. న్యాయం, సత్యం, నడవడిక ఈ విలువలు మారనివి. సమాజానికి ఎంతో ఉపయోగపడేవి. మనిషి సమాజానికి ఎలా సేవలందించాలి? నైతిక విలువలు ఎలా? కాపాడాలనేది చెప్తుంది సనాతనం. మొత్తంగా సనాతనం జీవితాన్ని ఎలా జీవించాలని దిశానిర్దేశం చేస్తుంది. అలా ఒక క్రమ పద్ధతి మనుషులకు అలవాటైతే సమాజంలో ప్రజలకు శాంతి భద్రతలకు లోటుండదు! అప్పుడు చక్కని సమాజం తయారవుతుంది. అప్పుడు ప్రపంచం మొత్తం హింస అనేది లేకుండా, సాటివారి పట్ల దయతో, ఓపికతో ఉండి, పారదర్శక జీవనం సాగుతుంది. ఇదేదో మతానికి సంబంధించింది కాదు! కేవలం మనిషి మనిషి వలె జీవించడానికి దిశా నిర్దేశమే!
ఏ మతానికైనా ఈ విలులవలు తప్పనిసరి!
అటువంటి మంచి విలువలు అందించే తోవన తాను నడవడమే కాకుండా, తన పరిధి మేరకు తను స్థాపించిన దివ్యజ్ఞాన పాఠశాలలో విద్యార్థుల చేత పాటింపజేస్తూ ఎప్పటికప్పుడు ఒక నూతన తరాన్ని సమాజానికి అందిస్తున్న అధునాతన- సనాతన- సింగాణి శ్రీమతి భేరి సునీత గారితో తరుణీ తరుణలతో ముఖాముఖి!
ఇంకా ఎందుకు ఆలస్యం? చదువుల సరస్వతికి మన సందేహాల సింగాణీలులు ఎక్కు పెడదాం! వారు చక్కని విలువైన సమాధానాలు విసురుతారు! మరేమంటారు? రండి!!
తల్లిదండ్రులు ఆమెకు సునీత అని పేరు పెట్టారు. పేరుకు తగినట్టుగా విశ్వహిందూ సంస్థ ద్వారా సదాచారాన్ని ప్రచారం చేస్తున్న సునీతా రామ్మోహన్ రెడ్డి గారు తమ సంస్థ లక్ష్యాన్ని ఇలా గర్వంగా చెప్పారు.
హిందూ సమాజాన్ని నిర్వహించడం, సంఘటితం చేయడం, అంతేకాదు హిందూ ధర్మ సేవ చేయడం, దాని రక్షించడమే ధ్యేయంగా కొనసాగే విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర స్థాయి మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి సునీత రెడ్డి గారు దేవాలయాల నిర్మాణంలోనూ, వాటిని పరిరక్షించడంలోనూ, సక్రమంగా భగవంతునికి అన్ని సేవలు జరుగుతున్నాయా? లేదా? అని పర్యవేక్షించడంలోనూ వారి బాధ్యత ఉంటుంది. కోవెల సంప్రదాయాన్ని కాపాడుతూ…. తను శ్రద్ధగా పూజలు అర్చనలు చేయడమే కాదు! తన పాఠశాలలోనూ ఆచార- సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న శ్రీమతి భేరి సునీతా రెడ్డి గారు హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం, గోసంరక్షణ, మతమార్పిడుల వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించి స్త్రీ శక్తి అంటే ఏమిటో తెలుగు ప్రజలకు చాటి చెప్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కనుకనే సాహిత్య సభల్లోనూ, ధార్మిక సభల్లోను చక్కగా ప్రసంగిస్తారు. మంచి నిర్వాహకురాలిగా దివ్యజ్ఞాని నికేతన్ పాఠశాలను ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలా పలు రంగాలలో నిష్ణాతురాలైన శ్రీమతి భేరి సునీతా రామ్మోహన్ రెడ్డి గారు మన మయూఖ పత్రికకు నేటి అతిథి. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం!

రంగరాజు పద్మజ :– నమస్కారమండి సునీతా రెడ్డి గారూ!

సునీతారెడ్డి గారు:– పద్మజ గారూ! నమస్కారమండీ!

పద్మజ :—- మీ నేపథ్యం చెప్తారా?

సునీతా రెడ్డి :– నేను మట్టి బిడ్డను అంటే రైతు బిడ్డను. జనగామ దగ్గర గానుగు పహాడ్ అనే చిన్న గ్రామంలో తాతగారు సమాజ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం కోసం, ధర్మం కోసం, పాటుపడిన వ్యక్తి. అంతెందుకు ఊళ్లో బస్ చెడిపోతే అందులోని ప్రయాణికులకు అందరికీ ఆ పూట వంట వండించి బస్ దగ్గరకు పంపేవారు. చలికాలం వస్తే చాలు 10, 15 శాలువాలు కొని వృద్ధులకు కప్పేవారు. అలాంటి ఇంట్లో పుట్టాను.
తర్వాత కాలంలో కూడా సమరయోధుడుగా తనకు ఇచ్చిన పింఛన్తో నెలకు కావలసిన మందులు, ఊరి వారికి ఎవరికైనా పామో, తేలో కాటు వేస్తే ప్రథమ చికిత్స కోసం వేసే మందులు, ఆయన దగ్గర పనిచేసే వారికి ఎవరికైనా దెబ్బ తగిలితే కట్టు కట్టేందుకు గ్లాస్ క్లాత్ ( కట్టుకట్టే గాజుగుడ్డ) టించర్ , కాటన్, పొటాషియం పర్మాంగనేట్, మొదలైనవి కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టి ప్రధమ చికిత్స చేసేవారు.
నాకెందుకు గుర్తున్నదంటే ఆ వచ్చిన రోగికి మనుమరాండ్లు; మనుమలతోనే మందులు ఇప్పించేవాడు, మందు రాయించేవాడు. ఆ రోజుల్లో అలా ఉండడం వేరు, అప్పుడు అందరి ఇళ్లల్లో అసమానతలు (అస్పృశ్యత) ఎక్కువ! మా తాతగారు పట్టించుకునే వారు కాదు! ఎవరైనా ముళ్ళు విరిగి; చీము పట్టి మందు కోసం వస్తే మా చేత ముళ్ళు తీయించేవాడు. మా నాయనమ్మ కోపం చేసేది ముట్టుకోవద్దని.
ఇంట్లో పెద్ద కుండ నిండా మజ్జిగ చేసి పెట్టేవారు. నౌకర్లకు, ఇంటి చాకలి, మంగలి వారికి చెంబు నిండా మజ్జిగ ఉచితంగా పోసేవారు. సామాజికంగా సమస్థానమే ఉండేది. దేశం మీద ప్రగాఢమైన భక్తి, నాదేశం దీనికోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. అలా నాకు అనువంశికంగానో, వారసత్వంగానో , దైవభక్తి, సేవాభావం మా నాన్న గారి వల్లనే వచ్చాయి. నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ఒకరికింద పనిచెయ్యడమేమిటని మన వ్యవసాయం చూసుకొమ్మని ఉద్యోగానికి రెండు సార్లు రాజీనామా ఇప్పించారు తాతయ్య.

పద్మజ:– మీ విద్య- ఉద్యోగం గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?

సునీతారెడ్డి:– మా వాళ్ళు నన్ను స్కూల్లో జాయిన్ చేసినపుడు నా డేట్ ఆఫ్ బర్త్ కూడా సరిగా రాయించలేదు. మా వాళ్ళు దొరలు కనుక స్కూల్ కు నన్ను నౌకరుతో బడిలో చేర్చమని పంపారు. జాయిన్ చేసుకున్న టీచర్ మొదటి తరగతిలో జాయిన్ అయినాను కనుక ఆరు సంవత్సరాలుంటుందని అందాజాగా రాసారు. కానీ నాకు నాలుగు ఏండ్లే! అలా నావయసు రికార్డ్ లో ఎక్కువ పడింది
నాకు తెలుగులో చక్కని భాష రావడానికి కారణం మా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన అనంతయ్య సార్ బోధనా పద్ధతే! రామాయణ, భారత, భాగవతాలలోని కథలు చెప్పుతూ వినే కుతూహలం కలిగించి తర్వాత ఒత్తులు దీర్ఘాల వంటి పాఠాలు చెప్పేవారు. అలా మాకు మా చిన్నప్పుడే పురాణ పురుషుల- స్త్రీల పేర్లు పరిచయమయ్యాయి.
పదవతరగతి మరియు ఇంటర్ వరకూ మా జనగామ తాలూఖాలోనే చదివాను.
M B B S చదవడం కోసం గుంటూరులోని రవీస్ కాలేజీలో బైపీసి తీసుకొని చదివాను. మెడికల్ ఎంట్రన్స్ రాసాను.సీటు రాలేదు.ఆ కాలంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 25000/ రూ.లు డొనేషన్ కడితే MBBS లో సీట్ ఇచ్చేవారు. కానీ దానికి మరికొంత డబ్బు కలిపితే పెళ్ళి ఔతుందని వారి ఆలోచన! నేను చదువుకుంటానన్నా కూడా సంబంధం కుదిరించారు. అలా పరీక్షలైన వెంటనే నాకు పెళ్ళి చేయాలని తలపెట్టారు. ఎందుకంటే మా తాతయ్యకు ఆరోగ్యం బాగాలేక ఆయన కళ్ళముందు పెళ్ళి చేయాలని దాదాపు బాల్య వివాహమనే చెప్పవచ్చు. ఆ కాలంలో చుట్టూ నక్సలైట్ విప్లవానికి సంబంధించిన గొడవలు జరుగుతుండేవి. అవి చూసి, చదువుకొని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పిల్లవాణికే అమ్మాయినివ్వాలని, పట్టు పట్టి, వెతికి శ్రీ సాయి రాంమ్మోహన్ రెడ్డి గారితో వివాహం జరిపించారు. వారు రైల్వే ఉద్యోగి.
మా వారికి చదువంటే ఇష్టం కాబట్టి చదవుకో అన్నారు. కానీ మాది ఉమ్మడి కుటుంబం. కాబట్టి కాలేజీకి వెళ్ళి చదవలేను ! అందుకే ఉస్మానియా దూరవిద్య లో B. A చదవడానికి దరఖాస్తుతెచ్చారు. బాగానే ఉంది కానీ నేను సైన్స్ విద్యార్ధిని. నాకు సోషల్ స్టడీస్ కానీ,ఎకనామిక్స్ కానీ రావు! చదవలేనంటే పరవాలేదు కాస్త కృషి చేస్తే వస్తుందని, మొదటి గురువుగా మా వారే ఎకనామిక్స్ అర్ధం అయ్యేలా చెప్పారు. అలా డిగ్రీలో మంచి మార్కులతో పాసయ్యాను. మావారి క్రమ శిక్షణలో చదవాలన్న తపన ఉన్న నాకు చదువు బాగానే అబ్బింది. అలా నాకు తెలుగంటే ఇష్టమని, M A తెలుగుతో రాయమని పట్టు పట్టారు. అలా MA తెలుగు పూర్తి చేసాను.
తర్వాత ఉస్మానియాలో దూరవిద్య వారి ప్రకటన ఒకటి వచ్చింది. అదేమిటంటే B. A లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 60% మార్కులు వస్తే వారు నేరుగా M. A చేయవచ్చని నోటిఫికేషన్ వచ్చింది. అలా M. A కుఫీజు చెల్లించాను. అలా M A ఇంగ్లీష్ లో చదివాను. ఎందుకంటే నేను స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ లేకపోవడంతో నేను చెప్పాల్సి వచ్చింది. అందుకే చదివాను. డిగ్రీకి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ లో ఉన్న ఆ పాత్రల గురించి చదివినప్పుడు కొత్తగా అనిపించలేదు. తెలుగు భాష మీద ఇష్టం ఏర్పడింది. అంటే బాల్యంలో చదువుకున్న చదువు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలా తెలుగు M A చదివిన తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలంటే సంస్కృతం రావాలి! అని సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష కలిగింది. అందుకే సంస్కృతం M. A కు ఫీజు కట్టి చదివి, పరీక్ష పాస్ అయ్యాను. ఒక సర్టిఫికెట్ రాగానే మరో పరీక్ష కు సిద్ధపడడం అలవాటైంది.

పద్మజ:– మీ రచనల వివరాలు, విశేషాలు చెప్పండమ్మా!

సునీతారెడ్డి:– నేను మొత్తం 14 పుస్తకాలు రాసాను. రెండు వచన కవిత్వం, రెండు వ్యాస సంకలనాలు, ఆధ్యాత్మిక రచనలు, కృష్ణా పుష్కరాల సందర్భంగా దీర్ఘ కవిత , మరికొన్ని వ్యాసాలు రాసాను. దేవానంద స్వామీజీ జీవిత చరిత్ర రాసాను. మా ఊళ్లో రాజేశ్వర దేవస్థానం
స్థల పురాణం మా ముత్తాతగారు సంస్కృతంలో రాయించారట ! ఆ చిన్న పుస్తకాన్ని మా నాన్న సంపాదించి, సంస్కృతంలో ఉన్నందున అది అందరికీ అర్ధం కాదని, ఎలాగైనా తెలుగులో అందరికీ అర్థం అయ్యేలా అనువదించమని అంటే సరేనని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించాను. రాజేశ్వర చరిత్రను స్థలపురాణం రాసాను , రెండు పద్య కావ్యాలు, మిగతావి వచనాలు రాసాను.
కసిరెడ్డిగారు నాలుగు పత్రికలకు సంపాదకత్వం వహించేవారు. నాతో వ్యాసాలు రాయించేవారు. వారు సవరించి పంపేవారు. అలా ఒకానొక సమయంలో వారు తిరుపతి వెళ్ళినప్పుడు శివానంద భారతిలో రెండు సంవత్సరాలు ఎడిటర్ గా ఎడిటోరియల్స్ రాసాను. తర్వాత గీతాజ్ఞాన్ సమాచార్ వారు నడిపే పత్రికలో నాలుగు సంవత్సరాలు వ్యాసాలు రాసాను. అలా దైవభక్తి, దేశభక్తికి సంబంధించిన వ్యాసాలను రాసాను. చిన్న చిన్న కవితలతో సంకలనం వేయిస్తే ఆ పుస్తకాలకు కసిరెడ్డిగారే పేర్లు పెట్టారు. ఆయనే ముందు మాటలు రాసారు. అలా 14 పుస్తకాలను వెలువరించాను.

పద్మజ :– మీరు అంతర్జాతీయ వేదికల మీద పత్ర సమర్పణలు చేసినట్టు విన్నాను. ఆ సందర్భం ఎలా వచ్చిందిది?

సునీతారెడ్డి:– చెప్పాలంటే అన్నింటికీ మూలం నా గురువుగారైన కసిరెడ్డి గారి పరిచయ భాగ్యమే! అప్పటికే వారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం, తర్వాత తెలిసీ- తెలియని తనం అయినా సాహిత్యంలో ఉండడం వల్ల వచ్చే లాభాలు అంటారు కదా!, అలా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే వారు వారి స్నేహితులు కావడం, వేంకటేశ్వర యూనివర్సిటీ గానీ, పద్మావతి యూనివర్సిటీ గానీ, బనారస్ యూనివర్సిటీ గానీ (రామాయణాన్ని హిందీలో పత్ర సమర్పణ చేశాను.) అవన్నీ తెలిసిన వారి ద్వారా అవకాశాలొచ్చాయి. సురభారతిలో కూడా సెమినార్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అలా జాతీయ- అంతర్జాతీయ సెమినార్లలో 16 చోట్ల నేను పత్ర సమర్పణ చేసి పాల్గొనడం జరిగింది. సాహిత్యకారులంతా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావడం, యూనివర్సిటీతో నాకు సంబంధం లేకపోయినా… గురువుగారి శిష్యురాలుగా అన్ని కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. ఇష్టాగోష్ఠిలలో పాల్గొనడం జరిగింది. ప్రింట్ మీడియాలోనే కాదు ఎలక్ట్రానిక్ మీడియాలలోను దాదాపుగా వందల ఆధ్యాత్మిక, దేశభక్తి, దైవభక్తికి సంబంధించిన చర్చ కార్యక్రమాలు కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి T V chanels పాల్గొన్నాను.
హిందూ ధర్మం- సనాతన ధర్మం ఛానల్ వారు, భక్తి టీవీ, ఈనాడులో పరకాల ప్రభాకర్ రావు గారి సభా సమన్వయంలో ఎన్నో కార్యక్రమాలు చేసాను. ఏదైనా పండగ వస్తే పెద్ద కార్యక్రమం చేసే వారు. నారీ – భేరీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. సఖీ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఉదయం ఐదు గంటలకు తమసోమా జ్యోతిర్గమయ అనే ఒక కార్యక్రమం వచ్చేది. అందులోనూ ఎన్నోసార్లు పాల్గొన్నాను. దీనికంతటికి మూల కారణం… మా గురువుగారైన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. శివానంద ఆశ్రమంలో సత్యవ్రతానంద స్వామీజీ ఉపన్యసించమని ఆదేశించడంతో అక్కడ భాగవత సప్తాహం చేసాను. రామాయణ పారాయణం, ప్రవచనం చేసాను. అలా కాలానుగుణంగా ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆ కళ అలవడింది. ఈనాడులో పాల్గొనడం వల్ల ఈటీవీలో పనిచేసే ప్రొడ్యూసర్సు వేరే ఛానల్ లోకి వెళ్లడం వల్ల వారు అందులోనూ నన్ను పిలవడం వల్ల అలా నా సాహిత్యం వ్యాపించింది. అన్ని చానల్స్ లో మాట్లాడే భాగ్యం కలిగింది.
ఒకసారి జగిత్యాలలో ఒక రెడ్డి సంఘం వారు ఫంక్షన్ హాల్ ప్రారంభం చేస్తున్నారు. వారి లక్ష్యం ఏమిటంటే? ఎవరైనా బీద రెడ్డి పిల్లలు ఉంటే వారికి సహాయం చేయాలని అనుకున్నారు. అందుకోసం ఆ మ్యారేజీ హాలు నిర్మించారు. దానిపై వచ్చే ఆదాయంతో స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే కసిరెడ్డి గారికి ఫోన్ కాల్ చేసి, వారిని ప్రసంగించడానికి ఆహ్వానించారు. వారు అంతకుముందే ఒక కార్యక్రమానికి వస్తానని మాట ఇచ్చారట!
రెడ్డివారినే పిలవాలని నిర్వాహకులు అనుకున్నారట! నాకు వీలు కాదు కానీ సరే నేను ఎవరినైనా పంపిస్తాను! అని వారితో చెప్పి “నాతో అమ్మా! నువ్వు వెళ్ళు!” అని అన్నారు. నాకు మొదటిసారి సువర్ణావకాశం లభించిందనే చెప్పాలి ! నాకు ఏమీ తెలియదు! రెడ్డి సంఘం అన్నారు, రెడ్డి వక్త కావాలన్నారు, ఆ అంశం మీదనే గంట సేపు మాట్లాడాలి. అందుకే నేను మొత్తం రెడ్డి రాజుల పుస్తకాలు చదివాను. రెడ్డియుగం, రెడ్డి అని ఆ పేరు ఎందుకు వచ్చింది? రెడ్ల పుట్టుపూర్వోత్తరాలు, వేమన గురించి, నేటి కాలపు రెడ్ల వరకు సమాచారం సేకరించుకున్నాను.
రెడ్లకు క్షాత్ర గుణం ఎందుకు తగ్గింది? ఇప్పటి తరంలో కూడా చినిగిన చొక్కా వేసుకున్నా పైనుండి శాలువా కప్పుకొనే డాంభికం ఎందుకు ఉంది? క్షాత్రత్వం ఎక్కడ ఉంది? ఇవన్నీ చెబుతూ వచ్చాను.
ప్రేక్షకుల్లో 2500 మంది కూర్చొని ఉన్నారు. సగం ఉపన్యాసం అయ్యేసరికి కసిరెడ్డి గారికి ఫోన్ కాల్ చేసి సార్ “మంచి వక్తను పంపించారండీ! అని అన్నారట! ఉపన్యాసం చివరలో ఇలా అన్నాను. ఇంతమందిలో ఒక్క స్త్రీ మూర్తి కూడా లేకపోవడం అవమానం! మన సంప్రదాయం ఇందుకే క్షీణించి పోయింది. అమ్మ చదువుకొని ఉంటే ఇంత దౌర్భాగ్యం మనకు వచ్చేది కాదు! మన అమ్మల్ని చదువుకోవ్వలేదా? లేదా బయటకు రానివ్వ లేదా, అమ్మ చదువుకొని ఉంటే ఇంత దౌర్భాగ్యం కలగక పోయేది!అని చురక వేసాను.
రెడ్డి బిడ్డగా గర్వపడుతున్నాను! కానీ నాతోటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలన్నాను. ఆ మాటతో సంతోష పడ్డారు. అది మొదలు వెయ్యి మందికి పైన శ్రోతలు వస్తారని అంచనా కనుక ఉంటే మా గురువుగారికి వీలు కాకుంటే నన్ను ఉపన్యసించమని పంపించడం అలవాటయింది. ముందు నుండి నేను జాతీయ సాహిత్య పరిషత్తులో అవకాశాలు రావడానికి కారణం గురువుగారే ! అధ్యక్షులుగా ఉండడంతో అలా అవకాశాలు వచ్చాయి. తర్వాత మల్కాజిగిరి శాఖకు కూడా కొన్ని రోజులు అధ్యక్షులుగా ఉండడం, రాష్ట్ర కోశాధికారిగా పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ఆ సమయంలోనే ఓ 16 సంవత్సరాల క్రితం నా ఉపన్యాసాలు విని, విశ్వ హిందూ పరిషత్ వాళ్లు సేవికా సమితి వాళ్ళు నన్ను గమనించడం, మా ఉపన్యాసాలకు రావడం, నచ్చడం విశ్వహిందూ పరిషత్తు వారు, సార్ ను వారు అడిగితే అమ్మాయి బిజీగా ఉంది! అటు స్కూలు, ఇటు ఇంటి నిర్వహణ కష్టం కదా! అంటే వారు నాలుగు సార్లు ఇంటికి వచ్చి మరీ అడిగితే కాదనలేక వెళ్లాను. అక్కడ రాష్ట్ర బాధ్యత గత 16 సంవత్సరాలుగా విశ్వహిందూ పరిషత్తు ప్రాంతం ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

పద్మజ:– ఇప్పుడు ఈ సమాజం ఇంత కలుషితమైంది కదా! అరాచకాలు జరుగుతున్నప్పుడు ఈ జాతీయ వాదం కానీ, మన దేశభక్తి ప్రచోదనలు ఎంతవరకు పని చేస్తున్నాయి? ఇంకా దాని అవసరం పెంచాలంటారా? ఈ జాతీయ భావం పెంపొందించేందుకు చేసే కృషి ఎలా ఉండాలి?

సునీతారెడ్డి:– నిజం చెప్పాలంటే మనకి ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఒక దేశభక్తి- జాతీయతా భావం పుష్కలంగా ఉన్న ఒక తరం అంతరించిపోయింది. ఇలా అనొచ్చో? అనకూడదో తెలియదు! ఎందుకంటే అందరికీ చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనే భావం వచ్చేసింది. నా బిడ్డ బాగుండాలి! నా బిడ్డ బాగా సంపాదిస్తే బాగుండు! నా దేశంలో లేకున్నా పరవాలేదు! ఏ దేశంలోనైనా సరే! ఇలా తెలియకుండానే అందరి ఆలోచనలు ఆ దిశగా మళ్ళాయి.
స్వాతంత్ర్య సమాజంలో ఎంత మంది యోధాను యోధులు సమసి పోయినా కూడా ఆ ఇంటి నుండి దేశభక్తి గల పౌరులు త్యాగానికి సిద్ధపడిన వారున్నారు. నెమ్మదిగా వారి సంఖ్య తగ్గుతూ దాని వలన మిగిలేది లేదనుకునే స్థాయికి చేరుకుంటున్నారు. మనలో పాశ్చాత్య భావాలను బాగా నింపుకున్నాము. సంస్కృతి- సంప్రదాయాలను కాలరాసాము. అందరూ బాగా సంపాదించుకుంటూ సుఖంగా ఉన్నప్పుడు మనమెందుకు కష్టపడాలి, ఇలా ఎందుకు ఉండాలి ? నలుగురితో పాటు నారాయణా అని ఉండక అని ఇట్లాంటి మెట్ట వేదాంతం చెబుతూ దేశ భక్తిని మనం తెలియకుండానే అధోగతికి తీసుకొచ్చాము. మరిఇప్పుడు అందరూ ఎదురీత అవసరమా, అని అంటారు! కానీ ఎవరైనా ఏమైనా ప్రయత్నం చేయకపోతే ఏది సాధించలేం! కాబట్టి రెట్టవాదులు చాలా మంది ఉన్నారు. పిచ్చి వేదాంతం, ఫెమినిస్టులు, కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు మన జాతీయవాదాన్ని చంపాలని, ఎక్కడికక్కడ అడ్డు పుల్లలు వేస్తూనే ఉన్నారు. ఈ రెట్ట వేదాంతంలో తులసి చెట్టుకు నువ్వు నీరు పోస్తేనే బతుకుతుందా? లేకపోతే లేదా? అని అడ్డంగా వాగే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఒక పవిత్రమైన నమ్మకం ఉంది. మనకున్న జాతీయ భావాల్లో మంచి గురువు లభిస్తే, ప్రాణాపాయ స్థితిలో ప్రాణం నిలవడానికి మంచి డాక్టర్ లభించినట్టే… మంచి శిష్యులు గానే కాదు! దేశం కోసం, సమాజం కోసం అవసరమైన వ్యక్తిగా కావాలంటే మంచి గురువు ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి.

దేవుని దయవల్ల నాకు మంచి గురువులు- మార్గదర్శకులు కసిరెడ్డిగారు కాబట్టి ఆయనకు ఏ శిష్యులు దొరికినా దేశభక్తి , దైవభక్తి ఉపదేశించి, వారిలో ఆయా గుణాలు పెంపొందేలా చేస్తారు. ఆయన మార్గంలో నడుస్తారు!
వారి వలనే నేను కూడా ఒక శిష్యురాలిని అని చెప్పుకోవడం గర్వంగా భావిస్తాను! నాకు ఇష్టం కూడా కాబట్టి ఆదారిలోనే వెళుతున్నా… మనకి ఇవన్నీ ఎంతవరకు సాధిస్తాం ? అనే సందేహంతో అనుకునే బదులు నా వంతు నేను చేస్తాను. సమాజంలో పౌరురాలిగా నా కర్తవ్యం ఇది.
నేను చెప్పేది ఏమిటంటే నాకు ఆత్మగౌరవం కూడా ఎక్కువే! కాబట్టి నాకు ఎలా ఉంటుందంటే? తప్పనిసరిగా నాకు చేతనైనంత పని నేను చేస్తాను! ఎంతో కొంత సాధిస్తాను! అనుకొని ఎవరు విన్నా- వినకపోయినా నేను ఎక్కడికి వెళ్ళినా దేశభక్తి, దైవభక్తి సంబంధించి, నా ధర్మం, నా సంస్కృతి, నా సంస్కారం ఈ దేశంలో ఉన్నా, ఏ క్రతువైనా సరే దాంట్లో కొంత శాస్త్రీయత ఉందని నొక్కి వక్కాణించి చెప్తాను. శాస్త్రీయత లేని క్రతువే నాకు లేదు. ఎవరైనా వితండ వాదన చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలి! కాబట్టి పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, శాస్త్రాలు కాని చదవాలి! నేను అందరికీ చెప్పేది అదే! రాబోయే గురుపౌర్ణమి వచ్చిందంటే గురు పౌర్ణమి రోజు చప్పట్లు కొట్టి బొమ్మ పెట్టడం కాదు! ఆ గురువు యొక్క ఆశయాలు ఫలింపజేయాలి! ఆశలు- ఆశయాలంటే నా సంస్కృతిని కాపాడాలి! అని ఆనాడు వ్యాసుల వారు చెప్పినా, ఈ రోజు గురువులు చెప్పినా అదే విషయం… కాబట్టి ఆ సంస్కృతి తరువాతి తరాలకు అందాలంటే మనమేం చేయాలి? మొట్టమొదట ప్రాచీన వాఙ్మయం చదవాలి! పనికిమాలినవాడు వచ్చి అడుగుతాడు. మతవ్యాప్తి కోసమో? ఇంకోదానికో లేనిపోని అడ్డంకులు పెడుతూ ఉంటాడు. మీ మతంలో చెట్టుకు, పుట్టకు, గుట్టకు, పాముకు, పక్షికి పూజ చేస్తే ఫలితం దక్కుతుందా? అని హేళనగా అంటాడు. ఔను! నేను చెట్టును- పుట్టను- గుట్టను పూజిస్తున్నానంటే ప్రకృతిని పరిరక్షిస్తున్నానన్నమాటే కదా? ప్రకృతిలో ఒక శక్తి ఉందని శాస్త్రీయంగా నిరూపణ చేస్తూ అది బలాత్మకమని చెప్తుంటే ఆ ఎనర్జీ ఈరోజు కాదు అందులో ఆ శక్తి ఉందని ఎప్పుడో ప్రాచీన కాలంలోనే మన ఋషులు గ్రహించారు. భారతీయ సనాతన ధర్మంలో ఉన్నదని గట్టిగా చెప్తాను. మరి ఇది చెప్పడానికి మన వాఙ్మయం చదవాలి అని ప్రేరణ కలిగిస్తాము.
నేను ఎక్కడ ఉన్నా చుట్టూ ఉన్న పిల్లలతో జాతీయ భావాలు చెప్తాను. బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా ఎక్కడ వీలైతే అక్కడ చెప్తాను! చెప్పకుంటే చెడిపోయిన వారు చాలామందే ఉన్నారు. ఒకసారి నేను అనుకోకుండా కాలేజీ పిల్లలతో ఎక్కడికి వెళుతున్నారు? అనడిగాను.
వారంతా షిరిడికి వెళుతున్నామన్నారు. ఆడ మగ అంతా యువతి యువకులే! కలిసి వెళుతున్నారు. నేను వాళ్లతో మీరంతా ఇంత భక్తిగా వెళుతున్నారు! భలే బాగుంది అన్నాను.
వెంటనే వాళ్ళు జస్ట్ ఏ హాలిడే ట్రిప్ మేడం! అని అన్నారు. హాలీడే ట్రిప్ కు ఆధ్యాత్మిక మైన స్థలానికి వెళ్లడం ఏమిటి? మీకు అక్కడ సుందర దృశ్యాలు ఏవి కనపడకపోవచ్చు కదా! అన్నాను. ఎందుకంటే? పిల్లలకు చెప్పక చెడిపోయారన్నదే నా భావన! కాబట్టి చెప్పి చూద్దామని ట్రైన్లో గంటా రెండు గంటలు మాట్లాడాను. ఎలాగూ 10 గంటల ప్రయాణం కాబట్టి సమయం దొరికింది.
అంతా విని ఆ పిల్లలు ఆంటీ అందరూ ఇలా చెప్తే బాగుంటుంది కదా! అని అన్నారు. అంటే పిల్లలు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడెక్కడ జాతీయ లేదాసంస్కృతీ లేదా భక్తి భావాలు చెప్పడం లేదంటే? ఈనాడు
అమ్మ చెప్పడం లేదు బడిలో టీచర్ చెప్పడం లేదు ఇంట్లో అందరికీ మమ్మీ అని పిలిపించుకుంటేనే ఆనందం! అమ్మా! అని నోరార పిలిస్తే లాగే లెంపకాయ వేస్తున్నారు. నువ్వేమన్నా తెలుగు మీడియంలో చదువుతున్నావా? అని అడిగే అమ్మలు ఉన్నారు. తెలుగు మీడియం చదవడం కాదా!
అంబా అని పిలిచే ఆవుకు- అమ్మా! అని పిలిచే మనకు ఎంత అనుసంధానం ఉంది కదా ! అమ్మ అని పిలవడం నచ్చడం లేదు… మమ్మీ కావాలి కాబట్టి దుస్తులు కూడా అదే వేషం… ఇంకా దరిద్రం భావ దాస్యంతో పాటు మనకున్న దరిద్రాల్లో మనకు వచ్చిన దరిద్రం ఏమిటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జనాభాలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఇంకేదో అనుకొని ఒక పిల్లవాడే ముద్దు! ఇద్దరు హద్దు! మూడు వద్దు! అని ఇలా రకరకాల స్లోగన్స్ పుణ్యమా అని కేవలం హిందూ ధర్మంలో ఉన్న వారు మాత్రమే పోటీపడి ఒకడిని మాత్రమే కని మన సంఖ్య తగ్గిస్తున్నారు. రేపటి మన పరిస్థితి ఏమిటి మనకు తెలియదు! ధర్మం పట్ల ఎవరికీ అవగాహన లేదు. ఒకడైనా ఉన్నాడు కదా! అని తృప్తి పడదామంటే ఒక్క ఆడపిల్లతో సరిపెట్టుకుంటున్నారు. మరి ఆడపిల్లైనా చాలు అన్నప్పుడు ఆడపిల్ల నా ఇంటి లక్ష్మి అని లక్ష్మీ దేవత వలె అలంకరిస్తున్నారా? అంటే అదీ లేదు! ఆడ పిల్లలకు మగ డ్రెస్సులు వేసి, ఆడైనా- మగైనా ఇదే అంటారు. మరి మగ పిల్లవాడు పుడితే ఆడపిల్లల డ్రస్సులు వేస్తున్నారా? వేసి పంపరు కదా? ఎందుకలా చేయడం? ఆడపిల్ల ఇష్టం ఉంటే ఒక ఆడ పిల్లతో పాటు మరో మగ పిల్ల వాడిని కంటే ఏమవుతుంది?
అలాగే ఆడపిల్లను ఆడపిల్లగా పెంచాలి కదా! ఆడపిల్లల్లో అమ్మతనం ఉండాలి కదా? అది అమ్మైతేనే సమాజం నిలిచేది మాత సమాజ నిర్మాత అనేది మరిచిపోతే ఎలా? ఇవన్నీ తెలియనటువంటి ఒక రకమైన మాయ పొరలు కమ్మాయి. మనకు ఈ పొరల నుండి బయటకు రావాలంటే ఎంతో కొంత చైతన్యం కావాలి. ఈ చైతన్యం ఎలా వస్తుందంటే? మనకు తెలిసిన విషయాలు చెప్పాలి! మనం ఎంత చెప్పినా వింటారా? అనే నిరాశ- నిస్పృహ వద్దు! కొంతైనా ప్రయత్నం చేయాలి! నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో కొంత మన జాతీయ భావాల గురించి చెప్తాను. మనమెవరమైనా సరే ఈ సమాజం నాది! ఈ దేశం నాది! ఈ ధర్మం నాది! ఈ సంస్కృతి నాది! అనుకున్న ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత తెలిసిన వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు తప్పకుండా చెప్పాలి! పెద్దవారంటారు కదా! చెడు చెప్పకపోయినా పర్వాలేదు కానీ, మంచి తెలిసి చెప్పకుంటే పాపం అవుతుంది. నాకెందుకు అనుకుంటే ఆ మంచి అనేది తెలియక వచ్చే నష్టాలు చాలా ఉంటాయి.
మీ దేవుడేమిటి? అన్ని ఆయుధాలు పట్టుకున్నాడు అంటాడొకడు. చెడు పనులు చేసే శత్రు సంహారానికి ఆయుధం అవసరం అని చెప్పగలగాలి! ఇంకొకడంటాడు నీ కృష్ణుడంత భోగలాలసుడు మరొకడు లేడు! అని అంత మంది భార్యలు అవసరమా?మమ్మల్నంటారు కానీ వాళ్ళ ఇంట్లో వారో? ఇతనో? పుస్తకాలు చదివి నేర్చుకుంటే ఔను కదా! సమాజంలో ఉన్న ఒక దుష్టచర్యను ఆపడం కోసం దేవుడు అలా చేశాడు కదా! అని అనుకునేవారు.
ఏ స్త్రీ మూర్తులైతే బయట పరాభవింపబడి, సమాజంలో ఒక రక్షణ లేకుండా, విలువ ఇవ్వకుండా ఒక సమాజం ఉంటుంది… అదే కృష్ణుడు భార్యకు విలువ ఇస్తాడు. వాళ్లు సమాజంలో విలువ లేని వాళ్లు గా ఉండ కుండా చేసే ఒక కట్టుబాటుగా చేసిన ఒక ప్రక్రియను ర*** అంటగట్టే రాక్షస గుణాలు ఉన్నటువంటి వారికి ఎవరు చెప్తారు?మీరనుకున్నట్టు ఇలా కాదు అని చెప్పడానికి మన ప్రాచీన సాహిత్యాన్ని చదవాలి! లేదా సాహిత్య చర్చలు, ప్రసంగాలు జరిగే చోటుకు వెళ్లాలి! సాహిత్య చరిత్రను వినాలి! పనికిరాని పబ్జీలు వాడేటువంటి పిల్లలను మనం పెంచుతున్నాం! వాడికి ఒక సంప్రదాయ పద్యమో? పాటనో? నేర్పించడం లేదు. ఇది మనం చేసే నష్టం కాబట్టి సాహిత్యానికి ఎదురీదుతున్నామా? అంటే ఎదురీదాలి! కొన్నిసార్లు తప్పదు. అయినా ఎప్పుడూ ఇలాగే ఉండదు. వేల మైళ్ళ దూరమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది కదా! ఒకళ్ళం మొదలుపెడదాము! మనవెంట పదిమంది ఔతారు. నిరాశ ఎందుకు? మనం ఆశాజీవులం. భారతీయులం సనాత ధర్మాన్ని పాటించే వాళ్ళం ఆశాజీవులు గానే ఉండాలి! ఎదురీదుతున్నామని అనుకోకూడదు!

పద్మజ:—- మీకు జ్యోతిష్యంలో ప్రవేశం ఉందని విన్నాను! అది ఎలా హస్తగతం చేసుకున్నారు?

సునీతా రెడ్డి :—- ఉస్మానియాలో M A జ్యోతిష్యం కోర్సు చదివాను. జ్యోతిష్యం చేయడానికి ముందు మా అబ్బాయికి పెళ్లి చేయాలని నేను ఎన్నో సంబంధాలు చూసాను. కానీ కుదరలేదు జాతకరీత్యా వీడికి ఏమైనా లోపం ఉందా? ఎందుకు పెళ్లి కావడం లేదు? మనకు తెలిసిన మహా పండితులు ఎవరున్నారు ? అని వెతికితే సాగి కమలాకర్ శర్మ గారితో మంచి పరిచయం ఉండడం వల్ల ఊరికే అడిగేదాన్ని! అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జ్యోతిష్యంలో M A చేయవచ్చు అని చెప్పారు. నేను ఎమ్మె చేద్దామని చేరాను. అక్కడ చేరిన తర్వాత తెలిసింది జ్యోతిష్యం అంటే మనం అనుకున్నంత సులువు ఏమీ కాదని, రెండు సంవత్సరాలు MA జ్యోతిష్యం చదివిన తర్వాత నాకు ముందు టేబుల్ (చక్రం) మాత్రం వేయడం వచ్చిందో ఏమో? భావం అంటే ఏమిటి, రాశులు ఏమిటి? నక్షత్రాలు తెలిసాయేమో? అంతే తప్ప ఎంత చదివినా జ్యోతిష్యం పట్ల పట్టు వచ్చినట్టు నాకు అనిపించలేదు అప్పుడు మాకు జ్యోతిర్ విద్యార్ధి అనే పేరుతోనారాయణగూడలోమా గురువులు, పూర్వ విద్యార్థులు పాఠాలు
చెప్పేవారు. అక్కడికి వెళ్లి ప్రవేశిక నుండి జ్యోతిష్యం వాస్తు కూడా నేర్చుకోవడం జరిగింది. అందుకే అక్కడ జరిగిన సెమినార్లు బాగా ఉపయోగపడ్డాయి. యూనివర్సిటీలో చదివిన రెండు సంవత్సరాల చదువుతో పాటు అదనంగా ఆరేడు సంవత్సరాలు అదనపు చదువు వల్ల జ్యోతిష్యం వచ్చింది. జాతకాలు పరిశీలిస్తాను! అవసరం ఉంటే చెప్తాను! ఇప్పుడు సంపూర్ణంగా వచ్చిందని చెప్పగలను. తర్వాత వాస్తు శాస్త్రం నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగింది. ప్రవేశిక అడ్వాన్స్ వాస్తు, రెండు కోర్సులు చేసిన తర్వాత అక్కడ పిహెచ్డి (phd ) చేయాలని ఆశ కలిగింది. వాస్తుగురువుగారైన వరప్రసాద్ రావు గారిని అడిగితే రాజా గారని వాస్తు శాస్త్ర నిపుణులున్నారు. వారి దగ్గర వారి గైడెన్స్ లో మీరు పిహెచ్డి చేయవచ్చు అని అంటే ఆగ్నేయ దోషాలు అనే టాపిక్ మీద సిద్ధాంత గ్రంథం రాసాను. అలా రెండవ (పీహెచ్డీ) phd పూర్తి చేసాను.

పద్మజ:— అమ్మా! సునీత గారూ! మీరు ఈ దివ్యజ్ఞాన హైస్కూలు స్థాపనకు కారణమేమిటి? దీని నిర్వహణలో మీ పాత్ర ఏమిటి?

సునీతా రెడ్డి :– దివ్యజ్ఞాన హైస్కూలు స్థాపనకే కాదు! ఈరోజు ఈ పాఠశాలలో ఇలా కూర్చున్నారంటే కారణం దేవుడి నిర్ణయమే! ఒక దైవీ సంభూతమైన యోగం వలె ఒక కూతురును నాకు ఇచ్చాడు భగవంతుడు. అప్పుడప్పుడు ఆయన పరీక్షలు పెడుతుంటాడు. పాప పుట్టింది. నా జీవితంలో విషాదమేమిటంటే మా వారు రైల్వే ఉద్యోగి కనుక రైల్వే ఆసుపత్రికి వెళ్ళాము .కాన్పు కావడం కష్టమై ఆసుపత్రిక వెడితే ఆపరేషన్ కొరకు అనెస్తీషియా ఇచ్చిన తర్వాత ఆక్సిజన్ లేదని ఆపరేషన్ ఆపారు. ఆ మందు ప్రభావం పాపకు మజిల్ సిస్టంపై పడింది.పాప చాలా బలహీనంగా ఉండేది. బిడ్డేమో చాలా తెలివైంది! కానీ శారీరకంగా బలహీనురాలు. పద్నాలుగు సంవత్సరాలు నా ఒళ్లోనే పెట్టుకొని పెంచుకున్నాను. ఎన్నో రకాల సమస్యలు అక్కడ ప్రారంభమైనవి. పసిపిల్ల మంచి తెలివి కలది చదివించాలని ఆశ! పాపేమో అన్న వలె చదువుతానని చెప్తున్నది. పాపను స్కూల్లో జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే? నడవరాదు కానీ చదివించాలనీ ఇంటికి దగ్గరగా ఉన్న ఒక కొత్త స్కూలుకు పోయి, పాప పరిస్థితి చెప్పి, పాపను జాయిన్ చేసుకుంటే నేనూ తనతో పాటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తాను అని అడిగాను.
అప్పటికే నేను ఎమ్మే చేసాను. కాబట్టి స్కూల్ చిన్నది కాబట్టి నన్ను హెడ్మాస్టర్ గా నియమించారు. కేవలం నా బిడ్డ కోసమే! ఉద్యోగం. డబ్బుకు ప్రాధాన్యత లేదు! అందుకే జీతం అడగలేదు ! అలా పాప 5వ తరగతి వరకు వచ్చింది.

అనుకోని పరిస్థితుల వల్ల ఎందుకో నేను అక్కడ ఇమడలేకపోయాను. నా కూతురు కోసం ఒక పాఠశాల పెట్టాలనుకున్నాను నా ఇంట్లోనే పాఠశాల ప్రారంభించాను. మొదట్లో కొద్దిగా ఇబ్బంది అయింది. అయినా అలాగే ఆరవ తరగతి వరకు తరగతులు నడపాలని, నాకు ఐదారు సంవత్సరాల బోధనానుభవం ఉండడం వల్ల ఈ కాలనీలో తెలిసిన వారు ఉండడం వల్ల నా మీద నమ్మకంతో ఇంత చిన్న స్కూల్లో 180 మంది పిల్లలు చేరారు. అలా ఒక్కో సంవత్సరం తరగతులు పెంచుతూ నడిపాను. కేవలం పాప కోసమే కానీ పదవ తరగతికి వచ్చిన తర్వాత పాప చనిపోయింది. అప్పుడు మళ్ళీ స్కూల్ మూసేయాలి ఎందుకంటే? పాప కోసం పాఠశాల ఏర్పాటు చేసాను. ఇక పాపే లేనప్పుడు ఈ స్కూల్ ఎందుకు? అని అనిపించింది.
అప్పుడు మా గురువుగారు కసిరెడ్డి గారు ఏమన్నారంటే “అమ్మా స్కూల్ ప్రారంభించింది పాప కోసం కానీ, పాఠశాలకు పాప పేరు పెట్టావు కదా! దివ్యజ్ఞాన ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఉండనీ! ” అని అన్నారు.
ఏమో సార్ నాకట్లా ఆ పేరు చూస్తే చాలా బాధ కలుగుతుంది! నేను నడపలేను అన్నాను. ఈ పాఠశాల వల్ల మనకు ఉపయోగం ఉంది అని అన్నారు.
ఏమి ఉపయోగం సార్? అనడిగాను ” మన దగ్గర చదువుకున్న పిల్లలు బయటకు వెళ్ళి సంఘవిద్రోహులు కాకుండా, జాతీయ భావాలు, ఈ సంస్కారాలు అందించాలంటే ఈ పాఠశాల ఉంటేనే సాధ్యం… ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు ఈ పాఠశాలను నడిపించాలి” అని అన్నారు.
సరే అని కొనసాగిస్తే ఈరోజు నా పాఠశాలలో సంస్కృతి- సంప్రదాయాలు పాటించేలా చేస్తాను. అందుకోసం పాఠశాల ముందు చదువుల తల్లి విగ్రహం పెట్టించాను. సరస్వతి ప్రార్థన చేస్తారు పిల్లలు, టీచర్లు. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు భగవద్గీతలోని బ్రహ్మార్పణం అనే భోజన మంత్రం సాయంత్రం పఠిస్తారు. ఎవరిదైనా ఆ పిల్లల పుట్టిన రోజు వస్తే ఆ పిలల్లలకు వేద ఆశీర్వచనం చేయిస్తాము. సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు నాలుగు భాషల్లో ప్రతిజ్ఞ చేయిస్తాను. రెండు రోజులకు ఒకటి చొప్పున. చిన్న పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా సంస్కృతంలో ఉన్న కౌసల్యా సుప్రజా రామా అనే వెంకటేశ్వర సుప్రభాతం లోని శ్లోకాలు ఎల్కేజీ (Lkg) యూకేజీ ( Ukg )పిల్లలకు నేర్పిస్తాము. ఎందుకంటే భాష ఉచ్చారణ చక్కగా వస్తుంది. భగవద్గీత శ్లోకాలు ప్రతి సంవత్సరం మూడు చొప్పున క్లాసు పెరిగినా కొద్దీ సంఖ్య పెంచుతూ… పదవ తరగతి వరకు సంవత్సరానికి ఒక అధ్యాయం నేర్పిస్తాము.
గీతా జయంతి రోజు భగవద్గీత పఠన పోటీలు ఉంటాయి.
అలాగే విశ్వహిందూ పరిషత్తుతో సంబంధం ఉంది కాబట్టి పరిషత్ లో జరిపించే గీతా పఠనం ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పాఠశాలలకు నేనే పోటీలు నిర్వహిస్తాను. రాష్ట్రస్థాయికి పంపించడం బాధ్యత కూడా నేనే తీసుకొని స్కూల్ పిల్లలకు ఫలానా రోజు ఉంటుంది మీరు నేర్పించండి పోటీలలో పాల్గొనేందుకు పంపించండి ! అని తల్లిదండ్రులకు చెప్తాను. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నాని చెప్పి, మా స్కూల్లోనే పోటీలకు సిద్ధం చేయించి పాల్గొనేలా ప్రోత్సహిస్తాను. అలాగే మాతృ- పితృ వందన కార్యక్రమం నడిపిస్తాను. ప్రతిరోజు ప్రార్ధన కాగానే పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని నైతిక విలువలు చెప్తాను. అలా సంస్కారాలు నేర్పిస్తూ, మాతృభాషను మరిచిపోకుండా వారికి ముందు ముందు పనికి వచ్చేందుకు చక్కని ఇంగ్లీష్ బోధనలో మిగతా అన్ని సబ్జెక్టులు చెప్పిస్తాను.(ట్రెడిషనల్ టు టెక్నికల్ విద్య) Tredishional to Technicallన Education ఉండాలని ప్రణాళిక రాసుకొని దాని ప్రకారం అలా 28 సంవత్సరాలుగా బోధిస్తూ స్కూలు నడుపుతున్నాము.

పద్మజ:– నేటి సమాజానికి పత్రికల ఆవశ్యకత, పత్రికలు నిర్వహించాల్సిన విషయం, పత్రికాధిపతుల పాత్ర ఎలా ఉండాలంటారు?

సునీతారెడ్డి:– పత్రిక నడవాలంటే ముందుగా చదివే వారు ఉండాలి. ప్రస్తుత కాలంలో బుక్ కల్చర్ లేదు! అంతా లుక్ కల్చర్ అంటే యూట్యూబ్ చూస్తున్న పరిస్థితే ఉంది. అయినా సరే! సంపాదకులు అనగానే మనకేం ఉంటుందంటే సంపాదకీయం విలువైనదిగా ఉండాలనిపిస్తుంది. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అంటే దార్షనికత ఉండాలి !
అది కూడా నిర్మొహమాటంగా వీళ్ళు ఏమనుకుంటారో? వాళ్ళు ఏమనుకుంటారోనని వాళ్ళ- వీళ్ళ మెప్పుకోసం కాకుండా జాతికి, సమాజానికి, ఉపయోగపడేలా పత్రికలో రచనలుండాలి. అక్షరం విలువైనది. సమాజానికి ఆయుధం వంటిది. పత్రిక ఏదో నడుస్తున్నదిలే! నడవనీ అని అనుకోకుండా ప్రతి ఎడిషన్ కొత్తగా ఆ రోజే ప్రారంభమైంది పత్రిక అన్నట్టుగా రాయాలి! పెద్దలు అనే మాట ఒక సిరా చుక్క వెయ్యి మెదడులను కదిలించాలని అలాంటి అక్షరంతో స్వాతంత్రం సాధించడంలోనూ ఎదురొడ్డిపోరాడాయి. ఎన్నో ఉద్యమాలలో కవితలు, పాటలు, మాటలు, ప్రసంగాలు, వ్యాసాలు ఇలా ఏదైనా అక్షరాల కూర్పే కదా !కలాలను కదిపితే కావలసిన ఫలితం వస్తుంది. కాబట్టి సామాజిక, దేశం కోసం, ధర్మం కోసం ఉపయోగపడే విధంగా అందులోని రచనలు రావాలి! అలా పాఠకులు పత్రికను వినియోగించుకోవాలి. ఈ రోజు యువత రచనలు నచ్చితే తప్పక చదువుతారు! కానీ తెలుగు భాష చదివే వారు తక్కువైనారు. కాకపోతే కొంతవరకు మనకున్న భావదాస్యాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఇంట్లో తెలుగు మాట్లాడవద్దు! ఇలాంటివి వాటి విలువలు తెలిపే విధంగా రచనలుంటే తల్లులు చదువుతారు .అది నిజమే అనిపించే విధంగా ఉంటే ఆచరణలో పెడతారు. అలా ఊరికే ఉదాసీనంగా మనం రాస్తే ఎవరు చదువుతున్నారు లే! అని మానేయకుండా మనం వంతు ప్రయత్నంగా పత్రికను నడుపుతూనే, సమాజానికి అందవలసినటువంటివి ఏవైతే విలువలున్నాయో వాటిని అందిస్తే… వాటిని ఒక్కరు చదివినా పత్రిక లక్ష్యం నెరవేరుతుంది. ఇక్కడ ఒక చిన్నమాట చెప్తాను!
శివానందుల వారు ఎప్పుడూ పుస్తకాలు రాస్తూ ఉండేవారట. అలా చాలా రాశారు. ఆయన రాస్తున్నప్పుడు పూర్వకాలం కదా! ప్రతిరోజు వచ్చే భక్తులకు పంచేవారట. ఆయన దగ్గర ఉన్న శిష్యులు అడిగేవారట! అయ్యా! స్వామీ! ఇన్ని పుస్తకాలు రాస్తున్నారు, పంచుతున్నారు. ఎవరైనా చదువుతున్నారా? ఏమన్నానా? అని అడిగారట. శివానందుల వారన్నారట చదవకపోతే ఏం చేస్తారు?
శిష్యుడన్నాడట కదా! చదవకపోతే పుస్తకాలన్నీ పాత పుస్తకాలు వాడికి అమ్ముతారట!
మరి వాడు ఏం చేస్తాడు? అని అడిగారు స్వామి! వాడు కిరాణా కొట్టుకు అమ్ముతాడు అన్నాడు. కొట్టువాడు ఏం చేస్తాడు? అని అడిగాడు స్వామి. అంటే అప్పుడు ప్లాస్టిక్ లేవు కనుక కిరాణా కొట్టు వాడు సామాను పొట్లాలు కడతారు అన్నాడట శిష్యుడు.
ఒరేయ్ ఆ పొట్లాలు కట్టిన తర్వాత ఈ పొట్లం ఎవరి ఇంటికి పోతుందో… ఆ ఇంట్లో ఉన్న ఒక్క అమ్మ ఒక్క వ్యాసం చదివితే ఆ వ్యాసానికి ఉపయోగం లేదారా? ఆ పుస్తకానికి విలువ రాదా? అన్నాడట. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను!

నేను ముందే చెప్పినట్టు ఎంతో ఓపికతో మన సందేహాలన్నిటికి ఎంతో ఓపికగా సమాధానమిచ్చిన భేరి సునీత గారి సమాధానాల్లో మనకు కావలసినవి మనం తీసుకోవచ్చు! ఏదైనా సాధించాలనుకుంటే ఏదీ అడ్డంకి కాదని, చదువుకోవాలని ఉంటే వయసూ అడ్డు కాదని, ధైర్యం ఉంటే మనమనుకున్నది సాధించవచ్చని, తనకు వచ్చిన విద్యను సద్వినియోగం చేసుకుంటూ.. అటు చక్కని ఉపన్యాసాలతో సాటివారికి ఎరుక కలిగిస్తూ… ఇటు విద్యా బోధనతో తరువాతి తరాలను చక్కని పౌరులను చేయవచ్చని నిరూపిస్తూ… కేవలం అక్షరాలతో పుస్తకాలు నింపిన రచయిత్రే కాదు! ఆచరణలో పెట్టిన ధీశాలి! మనసు కుంగిపోయిన సమయంలోనూ కూడగట్టుకొని, ఒక కంట కన్నీరు, మరోకంట విద్యార్థులకు పన్నీరు పంచిన మానవతా మూర్తి! శ్రీమతి భేరి సునీత గారి ముఖాముఖితో మనమూ మారడానికి ప్రయత్నిద్దాం!

దారులను రహదారులుగా మలుచుకుందాం!!

November 29, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సప్తపదులు! శుకసారికలు!

by Achyutuni Rajasri November 28, 2025
written by Achyutuni Rajasri

విశ్వమంతా త్రిమూర్తి స్వరూపం.అలాగే శ్రీ సుధామ గారి సృష్టి సప్తపదులకి శ్రీవిహారిగారు హితవరిగా మంచిముత్యాలని ఏరితే,శ్రీశాంతమూర్తిగారు 5అక్టోబర్ 2023లో సప్తపదుల వాట్సప్ గ్రూప్ నెలకొల్పి చేయూత నిచ్చారు.

బడి పిల్లలు కూడా చురుగ్గా పాల్గొని అచ్చులో చూసుకుని ఆనందించటం గొప్ప విషయం.
సప్తపదీయులకు ప్రోత్సాహమిస్తూ 100రూపాయల చొప్పున బహూకరించటం,ప్రోత్సహించటం సృజనకర్తకి ఆత్మ తృప్తి ,కవులకు గొప్ప అనుభూతి.3 వ సప్తపదుల పంచశతిమేలిమి ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ఆకట్టుకుంది.20అక్టోబర్ 2025న అన్నమాట ప్రకారం ప్రచురణ ,కవులకి సకాలంలో అందడం వారు ఫోటోతో సహా తమ ఆనందాన్ని గ్రూప్ లో పంచుకోటం ఓకొత్త అనుభవం.ఇక సప్తపదుల ఉద్దేశం జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం.నేటికీ 700పైగా సభ్యులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ముదావహం.సచిత్రంగా ఎన్నికైన సప్తపదులు రావటం ప్రత్యేక ఆకర్షణ. విద్యార్థులను ప్రోత్సాహించిన అధ్యాపకులని అభినందించితీరాలి.

సప్తపది నిర్మాణం:-
సప్తపది నిర్మాణ పద్ధతిని శ్రీసుధామ గారు వివరించటంతో ఆసక్తి కుతూహలం పెరిగింది అందరికీ.అనుభూతి సామాజిక అంశం తో మూడులైన్లతో కవిత రాయాలి.అంత్యప్రాసతో కూడిన పదాలు మొదటి రెండో లైన్లలో ఉండాలి.మూడోలైన్ లో ఆరెండుపదాలు సమన్వయంచేస్తూ ఐదవ చివరిపదం అంత్యప్రాసతోనే ముగించాలి. ఒకసారి వాడిన పదం మళ్లీ వాడరాదు.అన్యభాషాపదాలు వాడరాదు.అసమాపక క్రియాపదాలు వద్దు.
ఉదాహరణకు కాటేగారుపాండురంగవిఠల్ గారు రాసిన సప్తపది
ఊగడం
తూగడం
జీవితమంటే ఊయలలా సాగటం
తుదకు ఆగడం” జీవితసత్యం చెప్పారు.మూడో తరగతి సాయి అకిరా ఇలా అంది” ఇచ్చుకో పుచ్చుకో
ఒకరికొకరని సాయంచేస్తూ మంచి పేరు తెచ్చుకో” అంది.అలాగే ఏడవక్లాస్ టి.ధరణి భావం లో సమాజం ని చూపింది.
స్థలాలు పొలాలు
పెళ్లికి తప్పక చూస్తున్నారు వధూవరుల జాతక ఫలాలు”
తెలుగుకి వెలుగుబాట పర్చిన సప్తపదులు వాట్సప్ గ్రూపులలో మేలిమిగా నిలిచింది.అందరూ పాల్గొనేలా కొత్త పదాలు నేర్చుకునేలా ఆసక్తికరమైన అంశాలతో గంగాప్రవాహంలా సాగిపోతూ కొత్త ఒరవడిని సృష్టించింది.ఇది తెలుగుసాహిత్యంలో మైలురాయి.కవులు తమకవితవరకే చూస్తారు.కానీ శ్రీసుధామగారు శ్రీవిహారిగారు సామాన్య జనాలకి పదాలపై కూర్పు పై ఆసక్తి కలిగించి రాయించారు.సప్తపది వాట్సప్ గ్రూప్ అడ్మిన్ గా శ్రీశాంతమూర్తిగారు నిర్వహించారు.ఈత్రివేణీసంగమంఇలా సాగిపోతూనే సాహితీసేవలో తరించాలని,తెలుగుసాహిత్యంలో శాశ్వతంగా నిలుస్తుంది అని అందరి నమ్మకం అభిప్రాయం.

ముందడుగు:-
సప్తపదీయులకు ప్రోత్సాహమిస్తూ 100రూపాయల చొప్పున బహూకరించటం,ప్రోత్సహించటం సృజనకర్తకి ఆత్మ తృప్తి ,కవులకు గొప్ప అనుభూతి.3 వ సప్తపదుల పంచశతిమేలిమి ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ఆకట్టుకుంది.20అక్టోబర్ 2025న అన్నమాట ప్రకారం ప్రచురణ ,కవులకి సకాలంలో అందడం వారు ఫోటోతో సహా తమ ఆనందాన్ని గ్రూప్ లో పంచుకోటం ఓకొత్త అనుభవం.ఇక సప్తపదుల ఉద్దేశం జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం.నేటికీ 700పైగా సభ్యులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ముదావహం.సచిత్రంగా ఎన్నికైన సప్తపదులు రావటం ప్రత్యేక ఆకర్షణ. విద్యార్థులను ప్రోత్సాహించిన అధ్యాపకులని అభినందించితీరాలి.

పుస్తకాలుగా :-
సప్తపది పేరులోనే పెన్నిధి విశిష్టత కలది.ఏడడుగులబంధం రెండు జీవితాలను కల్పితే వాట్సప్ సప్తపది విశ్వవ్యాప్తమై నలుమూలల ఉన్న తెలుగువారిని కొత్త గా కలంపట్టినవారిని వెన్నుతట్టి ప్రోత్సహించింది. పది సప్తపది పదే పదే పిలిచే,కలాలు కదిలి స్పందించే! మొదటిపుస్తకంనవీన 5 డిసెంబర్2023లో విడుదలైంది.331మంది కవుల పేర్లు ఫోన్ నెంబర్లు పుస్తకంచివర ప్రచురించటం ఇంకో విశేషం.218పేజీల్తో అనుకున్న టైంకి ప్రచురణ ఆవిష్కరణ, చేతికి అందడం చకచకా జరిగాయి.నిబంధనలు పెట్టినా కొత్త కలాలకు ఊతమిస్తూ ఆలోచనలను తట్టిలేపాయి.ఊహలకు రెక్కలొచ్చాయి.మూడో పుస్తకంకి చిన్న పిల్లల బడిబుడతల సప్తపదులు చోటుచేసుకోటం శుభ పరిణామం.మినీ కవిత లాగా అనిపించే పద్యకవిత్వ నియమనిబంధనలతో బుర్రలకు పదును పెట్టాయి.తక్కువ మాటలు గూఢార్ధం, గాఢంగా కదిలించేదే సప్తపది.పైకి సులువు లోన బరువుగా ఉండే ఈప్రక్రియ సుధామ గారి మానసిక పుత్రిక. తథాస్తు అంటూ పెద్దలు శ్రీవిహారిగారు నిష్కర్షగా సలహాసూచనలిస్తూ తీర్చిదిద్దారు.అలాగే శ్రీ శాంతమూర్తిగారు శ్రద్ధగా నిర్వహణబాధ్యత పంచుకుంటున్నారు. వీరికి అండదండ గా నిల్చిన వారు గంధకుటి డా.బి.ఎస్.ఆర్.ఎస్.ఆంజనేయ శర్మగారు.7పదాల్ని3 పాదాల్లో ఇమిడ్చే ప్రక్రియ కి ఆధారం సుధామ గారు ఇచ్చిన “మచ్చు”ని ఆధారంగా చేసుకుని కొత్త కలాలు హెచ్చుగా స్పందించి మెచ్చుకునే రీతిలో రాశారు లయతో ఆహా ఓహో అనేలా!నవీన నవీనతను ప్రవేశపెట్టింది.సమయపాలన కు పెట్టింది పేరుఅయిన పెద్దలు5 డిసెంబర్ 2023లో జనాల చేతికందించటం ఇంకో విశేషం.17 ఏప్రిల్ 2023లో మొలకెత్తిన ఈప్రక్రియకి 24గంటల్లో 600కవితలు రావటం విశేషం.శ్రీవిహారిగారి సప్తపదుల సంపుటి నీరుపోస్తే,ఆర్థోపిడీషియన్ డా.రమణయశస్వి గారి”యశస్వీయ సప్తపదులు” చిగురించింది. వాట్సప్ ప్రసార సంచికలో విశేష అంశంగా ప్రసారమైన ఈప్రక్రియ కుతొలి న్యాయ నిర్ణేత .వై.రామకృష్ణారావుగారు.బహుమతులకు యోగ్యమైన వాటిని ఎన్నిక చేశారు.శ్రీవిహారిగారు ఓర్పు నేర్పుతో 10సప్తపదులకు 100రూపాయలచొప్పున బహుమతులివ్వటం జరిగింది.ఇక రెండవ సప్తశతి కవితాసంకలనంలో2024 నవంబర్ వరకు పది వివిధ పత్రికల్లో ప్రచురితమైన వాటినుంచి ఎంపిక చేసిన 700సప్తపదులు పుస్తకంగా రావటం ఇంకో సంచలనం.డా.నిర్ణేత నాళేశ్వరం శంకరంగారు ఇలా అన్నారు – “కవిత్వం 18పర్వాల్నించి 18పాదాలు ఆపై3పాదాలతో అవక్రత్రివిక్రమునిగా ఎదిగింది అన్నారు.సర్వశ్రీ సుధామ విహారిగార్లు నన్నయ్య నారాయణ భట్టులాగా సహకరించుకుంటూ 219పేజీలతో 206మంది కవులతో ఎదిగింది.” అని!
ఈ సప్తపది పై వచ్చిన పుస్తకాలు అందరూ చదవవలసిన పుస్తకాలు.

November 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

డాక్టర్ లింగం నేని మహేష్ కుమార్ డాన్సర్

by Achyutuni Rajasri November 28, 2025
written by Achyutuni Rajasri

డా: లింగంనేని మహేష్ కుమార్ ఎం.ఇ.,పిహెచ్.డి., 27-10-1966 న కృష్ణాజిల్లా, గుడివాడ లో జన్మించారు.
తల్లి: లింగంనేని సుజాత. రచయిత్రి.
తండ్రి: డా: లింగంనేని బసవ శంకర రావు ఎం.ఏ.,పిహెచ్.డి., తెలుగు విశ్రాంతాచార్యులు, రాజధాని కళాశాల, చెన్నై.

మహేష్ కుమార్ తండ్రి లింగంనేని బసవ శంకర రావు 1968 జూలై ఒకటవ తేదీన మద్రాసు రాజధాని కళాశాలలో, తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం లో చేరారు. అప్పటికి మహేష్ కుమార్ కి మాటలు రావు.

మహేష్ కుమార్ కి ఇంట్లో అమ్మ నాన్నలు తెలుగు మాట్లాడడం నేర్పించారు. వాళ్లింట్లోనే ఉన్న తమిళ పిల్లలతో ఆడుకుంటూ మహేష్ కుమార్ తమిళం కూడా నేర్చుకున్నాడు.
మహేష్ కుమార్, ఎల్.కె.జి, యు.కె.జి.లలో ఇంగ్లీష్, తమిళం,హిందీ మూడు భాషలు నేర్చుకున్నాడు.

హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే విద్యార్థుల విభాగంలో డైరెక్టర్ అయ్యాడు.
రామ కృష్ణ మఠం వాళ్ళు స్కూలు పిల్లలకు నడిపిన వక్తృత్వపు పోటీలో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాడు.

మహేష్ కుమార్ తండ్రికి స్నేహితుడైన వి.ఏ.కె.రంగారావు గారి సాన్నిహిత్యంలో, ధనంజయన్ దంపతుల వద్ద భరత నాట్యం అభ్యసించాడు.

మహేష్ కుమార్ హిందూ హైయ్యర్ సెకండరీ స్కూల్ లో చదువు ముగించాడు. 1984 లో బెంగళూరు రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరి, చదివి, 1989 లో పాసయ్యారు.

మెటల్ కాస్టింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ,విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరు యూనివర్సిటీలో 1991 లో పొందారు.

1994 లో గుంటూరు వాస్తవ్యులైన డా: జ్యోతి, డా: చల్లపల్లి కామప్రసాదు గారల కుమార్తె స్రవంతితో వివాహం జరిగింది. స్రవంతి ఎం.ఏ. మాస్ కమ్యూనికేషన్ చదివి,సీనియర్ డిప్యూటీ ఎడిటర్ గా, బిజినెస్ లైన్ చెన్నైలో ఉద్యోగించారు. ప్రస్తుతం రైటర్ & ఎడిటర్ గా ఉన్నారు.

మహేష్ కుమార్ అన్నా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో డీప్ డ్రాయింగ్ లో పిహెచ్.డి. సాధించారు.

మహేష్ కుమార్ బెంగుళూరు, హోసూరులో ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా చేసి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 1995 నుండి 2007 వరకు అసిస్టెంట్ ప్రొఫెసరు తర్వాత, ప్రొఫెసరు &,హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉద్యోగం చేశారు.

2007 నుండి 2010వరకు మహేష్ కుమార్ FOMRA ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రిన్సిపాల్ గా పని చేశారు. అన్నా యూనివర్సిటీ లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఒక సెమిస్టర్ విజిటింగ్ ప్రొఫెసరుగా ఉన్నారు.

ప్రస్తుతం మహేష్ కుమార్ సెయింట్ పీటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ లో 2011 వ సంవత్సరం నుండి డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ గా,రిజిస్ట్రార్ గా ఉన్నారు.

మహేష్ కుమార్ రీసెర్చ్ విభాగంలో పని చేస్తూ 25 పేపర్లు సబ్మిట్ చేశారు. ఆయన పిహెచ్.డి. స్కాలర్స్ కు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహేష్ కుమార్ దగ్గర ఒకరు పిహెచ్.డి. పట్టా కూడా పొందారు.

మహేష్ కుమార్ ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో సభ్యులుగా ఉన్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజనీర్స్, తమిళ నాడు సెంటర్ కు సెక్రెటరీగా ఉన్నారు.
F I C C I ఎడ్యుకేషన్ ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు. వీరు STEP and Business incubator పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారు.

మహేష్ కుమార్ కు విద్యతో పాటు ఫైన్ ఆర్ట్స్ లో కూడా ఆసక్తి మెండు. అందులో ముఖ్యంగా భరత నాట్యం అంటే చాలా ఇష్టం. చెన్నై లో జరిగే భరత నాట్యం ప్రోగ్రాంలకు వెళ్ళి, చూసి వాటిని గురించి ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్ లో రివ్యూలు వ్రాసేవారు.

తిరుపతి పక్కనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో, మహేష్ కుమార్, వాళ్ళ మామ వి.ఏ. కె. రంగారావు గారి తో కలిసి గత 21 సంవత్సరాలు, ఆషాఢ శుద్ధ సప్తమి నాడు, నృత్య నివేదన చేశారు. వార్ధక్య కారణంగా వి. ఏ. కె. రంగారావుగారు, నృత్యనివేదన చేయడం నిలిపివేశారు. గత పది సంవత్సరాలుగా
మహేష్ కుమార్ ఒక్కరే నృత్యనివేదన చేస్తున్నారు.

అంతే కాదు. కార్వేటి నగరం వేణు గోపాలస్వామి దేవాలయంలో, మామ వి.ఏ.కె.రంగారావుతో కలిసి కృష్ణ జయంతి నాడు 20 సంవత్సరాలు నృత్య నివేదన చేశారు. గత పది సంవత్సరాలుగా మహేష్ కుమార్ ఒక్కరే నృత్యనివేదన చేస్తున్నారు.

ఈ నెల పదహారో తేదీన జరిగిన నృత్య నివేదన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ లో రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రసారం చేశారు.

November 28, 2025 3 comments
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పిల్లల పొరపాట్లు

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, November 28, 2025
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

నరసింహపురం అనే గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు బాలురు ఉండేవారు. వారిద్దరూ మంచి మిత్రులు. వారు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు.
ఒకసారి వారిద్దరికి పొరుగూరుకు వెళ్లవలసిన అవసరం కలిగింది. వెంటనే వారు ఇంటిలో చెప్పకుండా కాలినడకన అక్కడికి ప్రయాణం ప్రారంభించారు. వారు ఎన్నడూ ఆ దారిలో అంత దూరం నడిచి ఎరుగరు . వారికి చాలా ఆకలి అయింది . దారిలో వారికి దోసకాయలు కనిపించాయి. వారు ఆకలితో ఆ రెండు దోసకాయలు తెంపుకొని తిని తిరిగి బయలుదేరారు. మరికొద్ది దూరం వెళ్లేసరికి వారికి మళ్ళీ ఆకలైంది . వెంటనే వారు దారిలో కనిపించిన మొక్కలకు ఉన్న టమాటాలను తీసుకొని తిన్నారు . ఆ తర్వాత వారు తిరిగి ప్రయాణం సాగించారు.
ఇంకా కొంత దూరం వెళ్లేసరికి వారికి తిరిగి ఆకలి అయింది. ఒక గ్రామ సమీపంలో వారు మళ్ళీ ఒక తీగకున్న రెండు కాయలను చూసి వాటిని కోసుకొని తిన్నారు. ఆ తర్వాత వారు వాంతులు చేసుకున్నారు. వెంటనే ఒక బాటసారి వారిని చూసి ఆ గ్రామంలో గల వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళాడు . ఆ వైద్యుడు వారిని ఏమి తిన్నారని ప్రశ్నించాడు . వారు దోసకాయలు, టమాటాల పేర్లు చెప్పారు. తర్వాత వైద్యుడు వారిని ఇంకా ఏమి తిన్నారని ప్రశ్నించాడు. అప్పుడు వారు మూడవసారి తిన్న కాయల పేర్లు తమకు తెలియదని అన్నారు.
అప్పుడు వైద్యుడు వారిని మందలించి “ఓ పిల్లలూ! మీరు ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పకుండా రావడం మీ మొదటి తప్పు. మీరు ఎవరిని అడగకుండా దొంగతనంగా ఆ కాయలను తినడం మీ రెండవ తప్పు. ఆ కాయలు విషతుల్యమైనవి. సమయానికి మీ అదృష్టం కొద్దీ ఈ బాటసారి తీసుకొని రావడం వల్ల మీకు మంచి జరిగింది. అంతేకాకుండా సమయానికి నేను చికిత్స చేయడం వల్ల మీరు బ్రతికారు. మీరు ఎవరిని అడగకుండా ఆ విషపు కాయల మంచి చెడులు తెలుసుకోకుండా తినడం మీ మూడవ తప్పు. నేను ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోకండి. మీ మంచి కోరే నేను ఈ మాటలను అంటున్నాను. మరొకసారి ఇలా దొంగతనంగా ఆ విషపు కాయలను తెంపి తినకండి. అది మీకే నష్టం”అని మందలించాడు.
వారు సరేనని అప్పటినుండి తాము తినబోయే కాయల గురించి ఇతరులను అడిగి తెలుసుకుని అవి కోసుకొని తినడం ప్రారంభించారు. అందుకే పిల్లలూ! మనకు కనబడిన ప్రతి కాయను, పండును తినకూడదు. ఆ తెలియని కాయలను, పండ్ల గురించి ఇతరులను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు.

    November 28, 2025 9 comments
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

    by Narendra Sandineni November 28, 2025
    written by Narendra Sandineni

    సంకేపల్లి నాగేంద్ర శర్మ మిడ్ మానేర్ కవిత చారిత్రక కవిత ఓ విశ్లేషణ.
    ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు,సంకేపల్లి నాగేంద్ర శర్మ కలం నుండి జాలువారిన మిడ్ మానేర్ కవితా సంపుటిలోని మిడ్ మానేర్ కవితపై విశ్లేషణా వ్యాసం.మిడ్ మానేర్ ప్రాజెక్ట్ తెలంగాణా రాష్ట్రంలోని మాన్వాడ గ్రామం,బోయినపల్లి మండలం,మానేరు నదిపై నిర్మించబడింది.ఇది సాగు నీటికి,త్రాగు నీటికి మరియు మత్స్య పరిశ్రమకు ఇతోధిక ప్రయోజనాలను అందిస్తున్నది.1991 సంవత్సరంలో మాజీ ప్రధాని పి.వీ.నరసింహరావు చేత శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రెండవ దశలో జలాశయం ప్రారంభించబడింది.మానేరు నది నుండి కాకుండా శ్రీరాం సాగర్ వరద కాలువ ద్వారా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి మిగులు నీరు ప్రవహిస్తుంది.ఆనకట్ట పూర్తి సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత కరీంనగర్ నగరంలోని దిగువ మానేరులోకి నీరు విడుదల చేయబడుతుంది.2004 – 2005 జలయజ్ఞంలో భాగంగా మొదలైన ఆనకట్ట నిర్మాణం అనేక కారణాల వల్ల ఆగి పోయింది.2005 లో ప్రారంభమైన మిడ్ మానేరు ప్రాజెక్ట్ పనులను పదేళ్లలో యాబై శాతం మాత్రమే పూర్తి చేసినారు. మిగతా యాభై శాతం మిడ్ మానేర్ ప్రాజెక్ట్ పనులు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది.మిడ్ మానేరు జలాశయం యొక్క స్థూల సామర్థ్యం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు టీఎంసీలు. ఇరవై ఒక్క కిలోమీటర్లు పొడవు ఉన్న ఎడమ కాలువ ద్వారా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది.అరవై నాలుగు కిలోమీటర్లు పొడవు ఉన్న కుడి కాలువ తొంబై వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.ఇక మిడ్ మానేర్ కవితలోని విశేషాలను పరిశీలిద్దాం.
    “కరువు సీమకు కళ్యాణమాల!/ఈ కవితా పంక్తి పాఠకుని మదిలో భక్తి భావాన్ని కలిగిస్తుంది.మిడ్ మానేర్ ప్రాంతం పంటలు ఎండిపోయి,జల సాధన లేని నిర్జల భూమి.అది కరువు సీమకు ప్రతిరూపం. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ రాకతో కరువు సీమ పులకరించింది.కవి నీటి సిరులను తెచ్చిన మానేరును వధూవరుల కంఠంలో వేసే వరమాలగా ఊహించడం అద్భుతంగా ఉంది.ఇది మిడ్ మానేర్ ప్రాజెక్ట్ లోని భూమికి అందిన జలసిరి.ఇది మనసు విప్పి చెప్పలేని మధురమైన గాధ.ఇది పునరుజ్జీవనానికి ప్రేరణగా నిలుస్తుంది.

    “నెర్రెలు బారిన మెట్ట ప్రాంతపు/నేలలో ఉప్పొంగిన జలగంగ!/నీటిపారుదల సౌకర్యం అంతగా లేని, ఎత్తుగా ఉండే భూమిని మెట్ట భూమి అంటారు. సరైన వాతావరణం లేక,వర్షాలు కురవక,పంటలు ఎండి భూమి నెర్రెలు బారుతుంది.అలాంటి నిర్జీవ నేల ఇప్పుడు జలగంగతో అలరారుతున్నది.ఇది కేవలం నీటి ప్రవాహం కాదు,జీవన ప్రవాహం,ఆనంద గంగ అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
    “గోదావరీ తల్లి పైకెగసిన మధురాంతరంగ!/
    కవి స్వభావ సిద్ధంగా గోదావరిని తల్లిగా భావించాడు.ఇది ప్రకృతికి మాతృరూపం ఇచ్చే ఆధ్యాత్మిక దృష్టి కోణంగా భావించవచ్చు.
    “పైకెగసిన మధురాంతరంగ అనేది ఆ తల్లి గోదావరి కరుణా తరంగాల ప్రవాహం ఎగసి మానేరులో కలిసినట్లుగా చిత్రించారు.కరువు సీమకు వరమై, ఎండిన నేలకు ఆశను,ఉల్లాసం నింపిన తల్లి గోదావరి దయగా ఈ జలాశయం కనిపిస్తుంది.కవి దృష్టిలో ఇది కేవలం ఇంజనీరింగ్ నిపుణులు చేసిన అద్భుతం కాదు.భూమి,నీరు,మనుషుల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని గుర్తు చేస్తుంది.
    “పదమూడు సంవత్సరాల పాటు/కునికి పాట్లు పడి కష్టాల పాలైన/ప్రాజెక్టుకి అయిదేళ్ళ కిందట మోక్షం లభించింది/కవి కునికి పాట్లు పడింది అనేది అత్యంత దృశ్యాత్మకమైనది.ఇక్కడ ప్రాజెక్ట్ ఒక జీవ రూపం పొందిన వ్యక్తిగా కనిపిస్తుంది.ఇది సాధారణ నిర్మాణ కష్టాలు,మానవ సంకల్పానికి ఎదురైన ఎన్నో అడ్డంకులు,సాంకేతిక ప్రతిబంధకాలను సూచిస్తుంది. ఇందులో సంపూర్ణ మానవ యత్నాలు అయిన శారీరక ఇబ్బందులు,ఆత్మ నిబద్ధత,తపస్సు అన్నీ మిళితమై ఉన్నాయి.
    కష్టాల పాలైన ప్రాజెక్ట్ అనేది పరిణామ మార్గంలో ఎదురైన విఘ్నాల చరిత్రను గుర్తు చేస్తుంది.ఇది మానేరును ఒక తపస్వినిగా చూపిస్తుంది.తపస్సు చేసిన సత్యసాధకురాలు చివరికి విజయాన్ని పొందిన దివ్య రూపం.సాధారణంగా మోక్షం వలన పునర్జన్మల నుండి విముక్తి లభిస్తుంది అనేది ఆధ్యాత్మిక పరమావధిని తెలియజేస్తుంది. పదమూడు సంవత్సరాల సుదీర్ఘ సాధన,కష్ట సాధ్యమైన మార్గం.చివరకు మానేరు ప్రాజెక్టు మోక్షం పొందింది.ఇది మానవ ప్రయత్నానికి దివ్య ఫలితాన్ని సూచించే ఆధ్యాత్మిక రూపక కథనం.
    “ఓ మారు కరకట్ట కొట్టుకుని పోయినా కోలుకున్నదీ జలాశయం!/ఈ కవితా పంక్తులలో ఇది కీలక మలుపు – విఫలతను అధిగమించి విజయాన్ని సాధించింది.ఇది కేవలం ఒక జలాశయం నిర్మాణం కాదు.తపన,నిబద్ధత,పునరుజ్జీవం అనే మానవ విలువలు ఉన్నాయి.నదికి ఇరువైపులా నిర్మించిన కరకట్టలు వరద నీటిని నిలువరించడం, జనావాసాలను రక్షించడం జరుగుతుంది.నదుల ప్రవాహాన్ని అదుపులో ఉంచడం,లోతట్టు ప్రాంతాలు వరదల్లో మునిగిపోకుండా కరకట్టలు కాపాడుతాయి.ఒక దశలో మిడ్ మానేర్ ప్రాజెక్టు కొట్టుకుని పోవడంతో ఆశలు విఫలమై పోయాయి. కవి ఇక్కడ జల విపత్తును,ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యాన్ని కేవలం సంఘటనగా కాదు,జీవిత సత్యంగా చూపించాడు.ప్రతి మహత్తర సాధన వెనుక తప్పకుండా ఒక విఫలత ఉంటుంది.ఆ విఫలతే భవిష్యత్తు విజయానికి బలమైన పునాది అవుతుంది.
    మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో కష్టాలు వచ్చినా లక్ష్యం మాత్రం ఆగిపోకుండా సాధన వైపుకు సాగింది.ఆ దృఢ సంకల్పానికి రూపం మానేర్ జలాశయం.ఈ కవితా పంక్తిలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుసంధానం ఉంది. ప్రజల తపస్సుల ఫలితంగా మానేర్ జలాశయం ఆవిర్భవించింది.మానేరుపై ఒక మారు విధి విపత్తు రూపంలో దాడి చేసినా,ప్రజల ఆకాంక్షలు,నాయకుల నిబద్దతలు నిలిచాయి.చివరికి ఆ తపస్సు జల రూపం దాల్చింది.కోరుకున్న మానేరు జలాశయం కల సాకారమైంది.
    “తెలంగాణా పాలకుల పట్టింపులతో/దురస్తై ఆదర్శ రిజర్వాయరై ఉప్పొంగిన/నిర్మల జల సాగరం/ఈ కవితా పంక్తులలో రాజకీయ పునర్జన్మ లభించిన క్షణాన్ని కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది.ఇది ప్రాజెక్ట్ భౌతిక నిర్మాణం కాదు.ఇది పాలనా సంకల్పం, ప్రజాసేవా ధర్మం అనే అంతర్భావాలను ప్రతిబింబిస్తుంది.
    ఇందులో తెలంగాణా పాలకుల శ్రద్ధ,బాధ్యత,దృఢ సంకల్పం ఉంది.కవి తెలంగాణా పాలకులు అందించిన మానవతా స్ఫూర్తిని గుర్తు చేసుకుంటున్నాడు.
    మానేర్ ప్రాజెక్టులోని పాత లోపాలు సరి చేయడం అనేది కేవలం భౌతిక మరమ్మత్తు కాదు.వారు ప్రాజెక్టుకి నూతన ప్రాణం పోశారు.ఆదర్శ రిజర్వాయర్ అనేది కవి మానేరును తెలంగాణ జల వ్యవస్థలో ఆదర్శ ప్రణాళికగా నిలిపాడు.మానేరుని ఇతర ప్రాజెక్టులకు ఆదర్శంగా చూపే ప్రయత్నం చేస్తున్నాడు.
    ఉప్పొంగిన అనేది ఆనందం,ఉత్సాహం,సంపూర్ణత అనే భావాల మేళవింపు.నిర్మల జలసాగరం పవిత్రమైన జలరాశి.ఇక్కడ కవి మానేరు జలాశయంను ఒక పవిత్రమైన తల్లి గర్భంగా చూశాడు.ఇక్కడ జల సంపద సంతానంగా నిలిచిపోయింది.ఇది భౌతిక సమృద్ధికి ఆధ్యాత్మిక రూప కల్పన.ఈ కవితా పంక్తులు మానేరును తెలంగాణా ప్రభుత్వ కృషితో పునర్జన్మ పొందిన జీవరాశిగా వర్ణిస్తున్నాయి.ఇది భౌతికంగా ఒక రిజర్వాయర్ అయినప్పటికీ కవికి అది ఒక తల్లి లాంటి జలసాగరం.పునర్జన్మ పొందిన మిడ్ మానేర్ ఆదర్శ రిజర్వాయర్ నిర్మల జలసాగరంగా మారింది. తెలంగాణ పాలకుల అంకితభావంతో సాంకేతికంగా పునరుద్ధరించబడింది.

    “శ్రీపాద సాగరం నుండి బాహుబలి మోటార్లు తోడై/కడలియై కదలి వచ్చిన కాళేశ్వరుడి కరుణాంతరంగ/ఈ కవితా పంక్తులు ఒక దైవత్వ స్పురణలో నిండిన శిఖరాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడ కవి జల శక్తి,యాంత్రిక శక్తి,దైవ కరుణ వల్ల ఒక దివ్య రూపాన్ని సృష్టించాడు.
    శ్రీపాద సాగరం మిడ్ మానేర్ ప్రాజెక్ట్ లోని ఒక ప్రధాన జలాశయం.ఈ జలాలు సాధారణ నీరు కాదు.పుణ్య జలం,పవిత్ర ప్రవాహం.
    “బాహుబలి మోటార్లు తోడై/ఇక్కడ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని భారీ మోటార్లు,గోదావరి నీటిని పైభాగాలకు ఎత్తి పంపే మహాశక్తిని సూచిస్తున్నాయి.ఇది ప్రకృతి శక్తి,మానవ శ్రమ, సాంకేతికత సాధించిన అద్భుతం.కవి సాంకేతికతకు జీవరూపం ఇచ్చి దానిని బాహుబలి మహావీరుడి ప్రతీకగా చిత్రీకరించారు.
    ఇది సముద్రమై ఉప్పొంగిన ఆవేశభరిత ప్రవాహం. కవి జల ప్రవాహాన్ని ఉత్సాహం,గర్జన,ప్రళయ స్వరూపంతో వర్ణించాడు.ఈ నీటి ప్రవాహం దైవ కరుణా ప్రవాహం.
    ప్రసిద్ధ శైవ క్షేత్రంలోని కాళేశ్వరుడు.గోదావరి తీరంలోని జ్యోతిర్లింగ స్వరూపం.కవి జల ప్రవాహాన్ని,దేవుని కరుణగా,అనుగ్రహ తరంగంగా వర్ణించడంతో పాటు కాళేశ్వరుడిని జల ప్రవాహ రూపంలో దర్శించాడు.ఆ నీరు కాళేశ్వరుడి కరుణగా భూమిపై ప్రవహిస్తోంది.ఈ కవితా పంక్తులలో మొత్తం భౌతిక జల ప్రవాహం మరియు ఆధ్యాత్మిక దయా ప్రవాహాల మధ్య ఉన్న ఏకత్వాన్ని సూచిస్తుంది.ప్రాజెక్టు భౌతిక నిర్మాణానికి,దేవుని కరుణ తోడైంది అని కవితాత్మకంగా చిత్రిస్తోంది. శ్రీపాద సాగరం నుంచి బాహుబలి మోటార్ల బలంతో నీరు సముద్రంలా ఉప్పొంగి కాళేశ్వరుడి దయామృతంలా మానేరులో ప్రవహించింది అనే కవి వర్ణణ అద్భుతంగా ఉంది.ఇది జల ప్రవాహం కాదు, కరుణా ప్రవాహం అని చెప్పిన తీరు బాగుంది.
    “దక్షిణ కాశీయైన ఎములాడ రాజేశున్ని అభిషేకించడానికి/బిరబిరా జలపాతమై పై ఎదల నుండి/ఎల్లమ్మ తల్లి (ఎల్లంపల్లి ప్రాజెక్టు)రూపంలో జాలువారిన గంగాతరంగం!/కవి ఇక్కడ జల ప్రవాహాన్ని దేవతాభిషేకంగా,వేములవాడ దక్షిణ కాశీని పవిత్ర తీర్థంగా చిత్రించాడు.కవి గోదావరి జలాలను మానేరులో ప్రవహించే నీటిని దైవాభిషేక జలాలుగా ఊహించాడు.దేవుడిని అభిషేకించడం అనేది భక్తి,పవిత్రతను సూచిస్తుంది.జల ప్రవాహం భౌతిక ప్రవాహం కాదు.దైవ సేవలో నిమగ్నమైన పవిత్ర కర్మ.ఇక్కడ జల యజ్ఞం ఆధ్యాత్మిక యజ్ఞంగా రూపాంతరం చెందింది.
    బిరబిరా అనే ధ్వన్మాత్మక పదం,జలపాతం పడుతున్న శబ్దాన్ని సజీవంగా వినిపిస్తుంది.ఇది ఎత్తయిన ప్రాంతాల నుండి దూకిన జలపాతం.ఇది జల ఉత్సాహం,దైవ ఉల్లాసం,ప్రకృతి వైభవంను ప్రతిబింబిస్తుంది.ఈ కవితా పంక్తి ఒక దృశ్య చిత్రం లాంటిది.మన కళ్ళ ముందు ఆ జలపాతం నిజంగా కదులుతున్నట్టే కనిపిస్తుంది.ఎల్లమ్మ తల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపంలో అవతరించింది.కవి ప్రకృతిని తల్లిగా,ప్రాజెక్టుని దైవరూపంగా ప్రతిష్టించాడు. ఎల్లమ్మ తల్లి భూమాత,జలదేవత,పోషక శక్తి వంటి పలు రూపాల సంగమం.ఎల్లంపల్లి ప్రాజెక్టును ఇంజనీరింగ్ నిపుణులు సాధించిన అద్భుతంగా కాకుండా దైవ అవతారంగా చూపించడం అనేది ఆధునిక శాస్త్రం,సాంప్రదాయ భక్తి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. కవి గోదావరి జలాలను,గంగాతరంగంగా పేర్కొనడం,భారతీయ జల సంస్కృతికి అద్దం పడుతుంది.ఇది కరుణతో,మమకారంతో కురుస్తున్న దయా ప్రవాహాన్ని సూచిస్తుంది.కవి జలాన్ని,భక్తి, జీవనాధారం, కరుణా ప్రసాదంగా భావించాడు.ఈ కవితా పంక్తులలో మానేరు కేవలం జలాశయం కాదు.గోదావరి జలాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపంలో దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని అభిషేకించడానికి బిరబిరా జలపాతాలుగా జాలువారుతున్నాయి.ఇది దైవ కరుణా ప్రవాహం, భక్తి జలగీతం,ప్రకృతి యజ్ఞం అని కవి వ్యక్తం చేసిన భావం గొప్పగా ఉంది.
    “నాంపల్లి గుట్టల లక్ష్మీ నరసింహుడి/కాళీయ నాగఫణి జల తరంగిణివి/ఈ కవితా పంక్తులలో కవి జలాశయ సౌందర్యాన్ని దైవ చైతన్యంతో మిళితం చేస్తూ సాక్షాత్తు భక్తితో ప్రకృతి సమన్వయాన్ని చిత్రించాడు.కవి ఇక్కడ జల ప్రవాహాన్ని పౌరాణిక, చారిత్రక ఘట్టంగా చూపించి,దానికి దివ్య వైభవాన్ని కల్పించాడు.
    వేములవాడ సమీపంలోని నాంపల్లి గుట్టలలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రాంతీయ భక్తిని సూచిస్తుంది.మిడ్ మానేర్ జలాశయం అక్కడి నాంపల్లి గుట్టలను తాకుతూ ప్రవహించి దైవ సన్నిధికి చేరింది.కవి ఈ కవితా పంక్తి ద్వారా మానేరులో ప్రవహించే జలాన్ని నరసింహుడి దివ్య శక్తిగా చూశాడు.ఇక్కడ కాళీయ నాగఫణి అనే భావన ద్వారా అత్యంత సృజనాత్మకతను జోడించాడు.ఇది శ్రీకృష్ణుడు కాళీయ నాగుని ఫణంపై నృత్యం చేసిన పౌరాణిక ఘట్టం గుర్తుకు తెస్తుంది.మిడ్ మానేర్ కాళీయ నాగుని ఫణములపై నర్తించినట్లుగా ఆవిర్భవిస్తోంది. కవి నీటి ప్రవాహాన్ని కేవలం భౌతిక దృశ్యంగా కాకుండా పౌరాణిక – భక్తి,శక్తిగా ఆవిష్కరించాడు. నాంపల్లి లక్ష్మీనరసింహుడి స్పర్శతో మానేర్ నీరు పవిత్రమై భక్తుల హృదయాలను తాకినట్లుగా, కాళీయ నాగఫణి అనే రూపకం ద్వారా కవి నీటి అలజడిని పౌరాణిక రూపంలో చూపించాడు.ఈ కవితా పంక్తులలో మిడ్ మానేర్ జలాశయం కేవలం నీటి నిల్వగా కాకుండా ప్రాణ శక్తిగా రూపొందింది. నాంపల్లి నరసింహుడి పాదాల వద్ద ప్రవాహించే ఆ జలతరంగాలు,కాళీయ నాగఫణాలపై ఆడే దైవ శక్తియై,తెలంగాణాకు జీవనాధారంగా మారింది.ఇది భక్తి,ప్రకృతి పౌరాణిక సమ్మిళిత కవితా దృశ్యం. ఇందులో కవి మిడ్ మానేర్ జలాశయాన్ని దైవ జలధారగా ఆవిష్కరించి,తెలంగాణ భూమికి, పవిత్రతను ప్రసాదించాడు.
    “జల యజ్ఞంలో భాగమై కిసాన్ కీ నేత, శాసనసభ్యుడు/స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వర్ రాయుడి చిరకాల స్వప్నమై/పివీ శ్రీరామ సాగర వరద కాలువ పునాది రాయై/డా.వైయస్ రాజశేఖరుడి మహిమల్లో/ఆరితేరి ప్రత్యేక తెలగాణ/తొలి సీఎం కేసీఆర్ చేత ఆవిష్కృతమైన/ భవ్య జలరాసుల భాండాగార నిధి/జలయజ్ఞం అనేది సమాజ సేవలో భాగంగా నిలిచిన ఒక పవిత్ర యజ్ఞం.నీటి సేకరణ,సాగు భూముల పునరుజ్జీవనం వలన రైతుల జీవితాలు మార్పు చెందాయి.కవి ప్రాజెక్టును భౌతిక నిర్మాణంగా కాకుండా ఆధ్యాత్మిక కార్యంగా ప్రతిష్టించాడు.చెన్నమనేని రాజేశ్వరరావు రైతుల మనసులో నిలిచినారు.అందుకే అతనిని కిసాన్ కీ నేతగా పిలుస్తారు.రైతుల కోసం అహరహం తపించే ఆయన త్యాగాన్ని,ఆశయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు.మానేరులోని నీరు ప్రవహించి రైతుల జీవితాలను సుసంపన్నం చేయాలి అనేది ఆ నాయకుడి స్వప్నం.అతనిని రాజనీతి కోవిదునిగా కాకుండా జలతపస్విగా చిత్రించాడు.చిరకాల స్వప్నం అనేది ఆయన అంకిత భావాన్ని వ్యక్తం చేస్తుంది.పీవీ శ్రీరామ సాగర ప్రాజెక్టు అనేది గోదావరి ఆధారంగా నిర్మితమైన జలసంధానం.ఈ ప్రాజెక్టుకు దాని పునాది ఆలోచనాత్మక మూలంగా నిలిచింది. మానేరు ప్రాజెక్ట్ ప్రారంభమైన జల పరంపరలో ఒక అనుబంధ రత్నం.కవి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని మహిమ అనే పదంతో స్మరించాడు.కవి ఆయనను ప్రేరకుడు,ప్రజాహితకారుడుగా అభివర్ణిస్తున్నాడు.
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేత మానేర్ ప్రాజెక్టు ఆవిష్కరణను కవి ఒక చారిత్రక ఘట్టంగా, నీటి సంపదల రత్న నిధిగా చిత్రించాడు.
    చెన్నమనేని రాజేశ్వరరావు యొక్క స్వప్నం,వైయస్ రాజశేఖర్ రెడ్డి దయతో పునర్జన్మ పొందిన మిడ్ మానేర్ ప్రాజెక్టు,చివరికి కేసీఆర్ నాయకత్వంలో ఆవిష్కృతమైన తెలంగాణ జల చరిత్రలో ఒక అమరమైన నీటినిధిగా నిలిచింది అని కవి గర్వంగా చెబుతున్నాడు.మానేర్ మన తెలంగాణ గంగగా రూపు దాల్చింది.ఇది మన జల కావ్యపు ఆధ్యాత్మిక మణిహారం అని చెప్పిన తీరు బాగుంది.
    “రాజన్న సిరిసిల్లా జిల్లాకి నెమలిఫించమై/అప్రహిత జలఖడ్గమై అలరారుతు/ప్రగతి పథాన మమ్ములను వేలిచ్చి నడిపించడానికి/కంకణం కట్టుకొన్న నీ రూప లావణ్యాలను/ఏమని వర్ణింతును తల్లీ!/కవి రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పల్లె ప్రాంతం – జలం మధ్య అనుబంధాన్ని,దివ్య గౌరవంతో కలిపిన ప్రేమభరిత వర్ణన ఇది.తల్లి మానేరును పూజ్యంగా పిలుస్తూ గౌరవాన్ని ఇనుమడింప జేస్తుంది.ఇక్కడ మానేరు జలాశయం అందాలు ఆ ప్రాంతానికి ఒక వరంగా, మణిగా నిలబడటం చూపిస్తాడు.ఈ విధంగా దేశభక్తిని,ప్రాదేశిక గౌరవాన్ని కొనసాగించడం జరిగింది.నెమలిఫింఛమై అనేది అమోఘంగా, కవితాత్మకంగా ఆవిర్భావమైనట్లు భావిస్తాం. జలఖడ్గంతో నీటి శక్తి తేజస్సుతో పటుత్వాన్ని పెంచింది.అప్రహిత అంటే నిరోధించలేనిది.ఆ నీటి శక్తి ప్రగతికి అడుకట్టలేనిదిగా ఉన్నది.అలరారుతూ అనే ధ్వన్యాత్మక పదం భావానికి సరిపోతుంది.ఇది ఉల్లాసంగా అలరించినట్లుగా ఉత్సాహపూర్వకంగా ప్రవహించటాన్ని తెలుపుతుంది.జలం ఇప్పుడు కేవలం సాగునీటి రూపంలో కాకుండా ప్రజలని జీవనపథంలో నడిపిస్తూ ప్రగతికి దారి చూపించే మార్గదర్శిగా మారింది.మానేర్ జలం సమాజానికి స్ఫూర్తిని,మార్గదర్శకత్వాన్ని అందించింది.
    కంకణం కట్టుకోవడం అనేది బంధం,సంస్కృతి, ఆత్మీయతను తెలుపుతుంది.మానేరు రూపం లావణ్యమై ఈ బంధాన్ని ఏర్పరుస్తుంది అని,ఆమె అందం వర్ణించలేనిదిగా ప్రశ్నార్థకంగా కవితా పంక్తిని ముగిస్తాడు.తల్లీ అని సంబోధనలో జలేశ్వరికి పూజ్య భావం ఉంది.నీ రూప లావణ్యాలు అని పిలవటం ద్వారా నీటి అందాలను వ్యక్తికరించారు. అలరారుతూ వంటి పదాలు దృశ్య,శ్రవ్య అనుభూతిని ఇచ్చినాయి.చివర్లో ఏమని వర్ణింతును తల్లీ?అనేది పాఠకుని హృదయానికి హత్తుకునేలా ఉంది.మానేర్ నీరుతో పంటలు పండించిన రైతులు ఆర్థిక పరిపుష్టిని పొందారు.వారి ప్రగతికి పునాది పడింది.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నీటి వరం,ప్రాంతీయ ఐక్యతను పెంచింది,వారి గర్వానికి కారణంగా నిలిచింది.
    జలేశ్వరి తల్లి రూపంలో పునరుజ్జీవనం పొందింది. ఈ కవితా పంక్తులు ఒక చిన్న తీరు కథనంలా కాకుండా సాంస్కృతిక,సామాజిక ఉత్సవానికి సోపానంగా నిలుస్తున్నాయి.మానేర్ అందాన్ని, ప్రజలను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని వర్ణిస్తూ కవి ఒక గొప్ప స్తుతి గానం చేస్తున్నాడు.
    “అప్పుడే ఆరేళ్లు పూర్తి చేసుకున్న నీవు/మా పాలిట అపర భాగీరథివి/జ్ఞానపీఠి మా హన్మాజీపేట సినారే వర్ణించిన సిరులొలుకు/సిరిసిల్లా చేనేత చీరలో మెరుస్తున్న మరో కృష్ణవేణివి!/ఇక్కడ ప్రధానంగా మానేరు యొక్క వయస్సు సూచన ఉంది.చిన్న వయసులోనే ఘనమైన విజయాలు సాధించబడ్డాయి అనేది తల్లి మానేరుపై భక్తిని మరియు గౌరవాన్ని వ్యక్తం చేస్తుంది.
    భాగీరథి ఒక పుణ్య పరిపూర్ణ సమాజానికి నీరు అందించే గొప్ప తల్లి.ఇక్కడ మానేరు జీవనదాతగా వర్ణించబడింది.మన ప్రాంత ప్రజలకు మానేరు జీవనాధారంగా నిలిచింది.జ్ఞానపీఠం అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య గుర్తింపు.ఇక్కడ హన్మాజీపేట గ్రామానికి చెందిన సినారె ని సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు పొందినాడు అని గొప్పగా వర్ణించబడింది.సిరులొలుకు అనేది మానేరులో జలాన్ని సౌభాగ్యంగా వర్ణిస్తున్న ప్రకృతి రూపం.ఇది ప్రకృతి ప్రేమను,భౌతిక,సాంస్కృతిక విలువలను చూపిస్తుంది.
    సిరిసిల్లా చేనేత చీర సాంప్రదాయ సంపద, ప్రాంతీయ కళ,సౌభాగ్యం.కృష్ణవేణి భారతీయ సాహిత్యంలో శాంతి,ప్రేమ,సౌందర్యంతో అలరారుతుంది.కవి మానేరు ప్రవాహాన్ని కవిత్వపు దృశ్యాత్మక,భౌతిక పారంపర్య రూపకంగా చూపించాడు.మానేరులో పరిమళించిన అందమైన సంపద గల జీవ రూపాన్ని మరొక కృష్ణవేణిగా ఊహించాడు.మానేరు ఇప్పుడు కేవలం నీటి ప్రాజెక్టు కాకుండా భారతీయ సాంస్కృతిక సంపదకు నెలవైన జీవనాధారంగా మారింది.కవి ప్రతి పంక్తిలో జలశక్తి తల్లి సాహిత్య,సాంస్కృతిక దివ్య రూపం అన్న ధారావాహికను చూపించాడు.చిన్న వయసులోనే సాధించిన ఘనత, భాగీరథి లాంటి సేవ,సిరిసిల్లా చీరలో మెరిసే దివ్యత్వం మానేరు జలాశయానికి ఒక పూర్ణ స్తుతి గానం.ఆరేళ్లలోనే ప్రతిఫలించిన మానేరు భాగీరథి లాంటి జీవనదాత.సిరులొలుకు ప్రకృతి,సాంప్రదాయ చేనేతలో మెరుస్తున్న కృష్ణవేణిగా మానేరులోని జల రూపాన్ని, సృజనాత్మకంగా,దివ్యంగా వర్ణించిన కవిత్వరూపం ఇది.
    “మానువాడలో మానేటిలో చిలికిస్తున్న/నీ మేని హోయల సుందర దృశ్యాలు/మాకు అపరిమిత ఆనందాలే/మానువాడలో మానేటిలో చిలికిస్తున్న అనేది భౌగోళికంగా ప్రాంతీయ స్థలాన్ని సూచిస్తుంది. మానువాడ గ్రామ ప్రజలకు మానేరు నీటి ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.చిలికిస్తున్న స్వేచ్ఛ, ప్రాణవంతమైన జీవం,ప్రకృతి సంగీతం,చిన్న జలచరాల కదలికను సూచించే పదం.కవి ఇక్కడ ప్రవాహం,జీవనశక్తి,ప్రకృతి సౌందర్యం అనే భావాలను ఒకే దృశ్యంగా చూపించాడు.
    నీ మేని హోయల సుందర దృశ్యాలు.మేని అనగా నీటి ప్రవాహమే శరీరంగా,నీటి చల్లని తీయదనంతో అంద చందాలను ఒలకబోస్తుందని వర్ణణ. చెరువులలోని నీటి కదలికలు,చిన్నచిన్న అలల సుందర దృశ్యాలు,దృశ్యకళను మాత్రమే కాకుండా ప్రకృతి సౌందర్యాలను,జీవన ప్రవాహాల అందాలను కూడా సూచిస్తుంది.
    మాకు అపరిమిత ఆనందాలే ఈ కవితా పంక్తి లోతైన భావాన్ని ఇస్తుంది.మానేరు నీటి ప్రవాహం ప్రజలకు,రైతులకు,పల్లె సమాజానికి ఆనందం,జీవన సౌభాగ్యం,ఆత్మీయ సంతృప్తిని,ఆర్థిక పరిపుష్టిని ఇస్తుంది.పరిమితి లేని ఆనందాలు,అంతులేని సుఖాలు మానేరు నీటి వల్లనే సమకూరినాయి.జల ప్రవాహం ఇక్కడ తల్లి,జీవనదాత.మానేరు నీటి హోయలు మానువాడలో చిలుకుతూ ప్రకృతి సౌందర్యంతో ప్రజలకు అపరిమితమైన ఆనందం అందిస్తాయి.ఈ కవితా పంక్తి ద్వారా కవి జలాశయాన్ని జీవన,సౌందర్య,ఆధ్యాత్మిక రూపాల్లో ప్రతిబింబించాడు.
    “మానేరు,మూలవాగుల సంగమ ధారల్లో నీవు పునీతురాలవై/ఇక్కడి ఆకలి దప్పులకు, పాడిపంటలకు శాశ్వత ఆధార భూతమై/ బోయినిపల్లి మండలం క్రాంతి తరంగమై/ఉమ్మడి జిల్లా భాగ్యదాతవై వెలసిన నీకు/అనంత కోటి దండాలు తల్లీ!/ఇక్కడ మానేరు జలాశయానికి ప్రధానమైన వాగు.దానిలోమూల వాగు సంగమించి అమితమైన జల సంపద మానేరుకు సంక్రమించింది. మానేరు ప్రజలకు పవిత్ర జల ప్రవాహమైంది.కవి నీటిని తల్లిగా,పునీత రూపంలో దర్శించాడు.
    ఇక్కడ మానేరు జలాశయం వ్యవసాయ,ఆహార, జీవనాధారానికి మూలం అని చెప్పబడింది.ప్రజల ఆహార సంబంధ సమస్యలను,రైతుల నీటి సమస్యలను,సమాజంలోని అన్ని సమస్యలకు జలం శాశ్వత ఆధార భూతంగా నిలిచి పరిష్కార మార్గాలను చూపిస్తుంది.
    బోయినిపల్లి మండలానికి మానేరు జలాశయం క్రాంతి తరంగమై నిలవడం అనేది అనేకమైన మార్పులకు,ప్రజల ప్రగతికి సంబంధించిన మరపురాని దృశ్యం.మానేరు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
    మానేరు ఇప్పుడు జలదాతగా,అదృష్టకారిణిగా ప్రసిద్ధి పొందింది.కవి ఇక్కడ మానేరు జలాశయాన్ని ప్రజల సౌభాగ్యాన్ని పెంచేదిగా,సమాజం కోసం పనిచేసే దేవతా రూపంగా చూపించాడు.
    ఉమ్మడి జిల్లా భాగ్యదాత అయిన మానేరు జలాశయాన్ని తల్లిగా భావించి అనంత కోటి దండాలను సమర్పించడం వల్ల మానేరు జలాశయానికి ఎనలేని గౌరవం దక్కింది.మానేరు జలాశయాన్ని తల్లిగా జీవన దాతగా పిలవడం మిక్కిలి గొప్పగా ఉంది.మానేరు కేవలం నీరు అందించే ప్రాజెక్టు కాదు.అది వ్యవసాయం మూలంగా ప్రజలను భాగ్యవంతులను చేస్తూ పునీతురాలై,క్రాంతి తరంగమై,ఆధ్యాత్మిక, సామాజిక,భౌతిక ప్రయోజనాలకు మూలమైంది. మానేరు జలాశయం,మానేరు మూలవాగుతో కలిసి పవిత్రమై ప్రవహించి,ప్రజల ఆకలి దప్పులు,పాడి పంటల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించింది.బోయినిపల్లి మండలంలో క్రాంతి తరంగాలుగా ఉమ్మడి జిల్లా ప్రజలకు భాగ్యదాతగా వెలసిన నీకు అనంత కోటి దండాలు తల్లీ అని కవి వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
    “అనంత సాగరం,రంగనాయక సాగరం/
    కొండ పోచమ్మ,కొమిరెళ్ళి మల్లన్న/సాగరాలకు ప్రాణదాయినివై,చేదోడువాదోడువై/దిగువ జిల్లాలకు జల నిధుల కేంద్రమై/కరీంనగర్ దిగువ మానేరుకు మహాశక్తి దాయినివై/ప్రగతి చక్రాల్లో ఉత్తర తెలంగాణకి ఉమ్మడి ఆస్తివై/ఎలగందుల కోటకు మహారాణివై వర్ధిల్లు తల్లీ!/ఈ కవితా పంక్తులు తెలంగాణలోని నీటి ప్రాజెక్టుల మహిమను ప్రతిబింబిస్తుంది.ఉత్తర తెలంగాణ ప్రజల జీవనాధారమైన నీటి ప్రాజెక్టులకు సమర్పితమైన కృతజ్ఞతా గీతంగా ఒప్పుతుంది.
    “అనంత సాగరం,రంగనాయక సాగరం వంటి జల కేంద్రాలు,కొండ పోచమ్మ,కొమురెళ్ళి మల్లన్న సాగరాలకు ప్రాణదాయినివై అనే కవితా పంక్తుల ద్వారా కవి ఈ సాగరాలను ప్రస్తావిస్తూ వాటికి జీవ దానం చేసిన తల్లి మిడ్ మానేరును ఆరాధనీయమైన రీతిగా చిత్రించాడు.ఈ సాగరాలు వ్యవసాయానికి ప్రజల నీటి అవసరాలకు మూలాధారమై ఉన్నాయి.నీటిని కేవలం భౌతిక వనరుగా కాకుండా ప్రాణాధార శక్తిగా కవి చూపించాడు.చేదోడు వాదోడువై అనే కవితా పంక్తి సాంఘిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.ఇక్కడ చేదోడువాదోడు అనేది కష్ట సమయంలో తోడుగా, విజయంలో సహకరించే స్నేహితుని వలె మానవ జీవనంలో నీటి అనివార్యతను,మానవ సంబంధాలతో పోల్చాడు.మానేర్ జలాశయం చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడి ప్రాంత ప్రజల వ్యవసాయానికి మద్దతుగా నిలుస్తుంది.కవి మానేరు ప్రవాహాన్ని ప్రజల జీవనాధారంగా,సౌభాగ్యదాతగా చూపాడు.
    “దిగువ జిల్లాలకు జల నిధుల కేంద్రమై/కరీంనగర్ దిగువ మానేరు మహాశక్తి దాయినివై/కవి మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ప్రాంతీయ సమతుల్యతలోని ప్రాధాన్యతను,ఉజ్వలంగా చూపాడు.మానేర్ జలాశయం కరీంనగర్ జిల్లాకే కాకుండా దిగువ జిల్లా ప్రాంతాలన్నింటికీ అది నీటినిధిగా నిలుస్తుంది.కవి ఆ ప్రాజెక్టు యొక్క వ్యాప్తిని సార్వజనీనతను ఆవిష్కరించాడు.మానేరును కేవలం నీటి ప్రాజెక్ట్ గా కాకుండా కరీంనగర్ ప్రాంతానికి మహా శక్తివంతమైన జీవనదాతగా పేర్కొన్నాడు.మహాశక్తిదాయినివై అనేది దైవత్వాన్ని వ్యక్తం చేస్తుంది.
    “ప్రగతి చక్రాల్లో ఉత్తర తెలంగాణకి ఉమ్మడి ఆస్తివై/ అనే కవితా పంక్తి ఆర్థికాభివృద్ధి,సామూహిక సొత్తు భావనలను ప్రతిబింబిస్తుంది.కవి దానిని సమగ్రాభివృద్ధికి సంకేతంగా ఆవిష్కరించాడు. మానేరు జలాశయం ప్రగతి చక్రంలో ముఖ్యమైనది. ఉత్తర తెలంగాణకి ఉమ్మడి ఆస్తి,రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది.జలాశయం సామాజిక ప్రగతికి మూలధనం వంటిది.
    “ఎలగందుల కోటకు మహారాణివై వర్ధిల్లు తల్లీ!/ ఎలగందుల కోట తెలంగాణకు గౌరవాన్ని సూచిస్తే మిడ్ మానేర్ ఆ గౌరవానికి ఆధారమైన రాణిగా ప్రతిష్టించబడింది.కవి మహారాణి అనే పదం ఉపయోగించి ప్రాజెక్టును కేవలం నిర్మాణంగా కాకుండా జీవమూర్తిగా తీర్చిదిద్దినాడు.ఈ కవితలో కవి మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తర తెలంగాణకు సమకూరిన జల స్రవంతి వైభవాన్ని ఆరాధ్యమైనట్టిదిగా చిత్రించాడు.సాగరాలను దేవతా రూపంలో,మిడ్ మానేరును తల్లిగా,రాణిగా, శక్తిదాయినిగా ఊహించి రాసిన ఈ కవిత గౌరవం, కృతజ్ఞతల సమ్మేళనంలా నిలుస్తుంది.మహారాణివై, ప్రాణదాయినివై అనేది నీటి ప్రాముఖ్యతను, గౌరవప్రదమైన రూపంలో చూపించాయి.కవి తన భూమి తన సాగరాల పట్ల గాడమైన ప్రేమను ప్రకటించాడు.ఈ కవిత మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ను ఇంజనీరింగ్ అద్భుతంగా కాకుండా ఉత్తర తెలంగాణ ప్రాణాధారంగా భావించాడు.దానికి తల్లి,రాణి రూపాలను ఇచ్చిన కవి స్ఫూర్తి,సృష్టి అద్భుతంగా ఉంది.
    “నీ కోసం పదహారు గ్రామాలు మాసిపోయినా/మాజీ శాసనసభ్యుడు రేగులపాటి రుద్రుడు/పాపారాయుడి భూముల చిరునామాలు కోల్పోయినా/
    డా.చెన్నమనేని రమేష్,కెటీఆర్ ల కీలు గుర్రానివై/ఆది శ్రీనివాసుడి అపూర్వధామమై/ ప్రభవిస్తున్న నీకు వందనం తల్లీ!/ఇక్కడ మానేరు ప్రాజెక్ట్ కోసం భూసేకరణలో భాగంగా సమీప పదహారు గ్రామాలు మునిగిపోయి ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయినారు.ప్రజల జీవితం అంధకారబంధురమై సమస్యల వలయంలోకి నెట్టబడింది.భూములు ఇచ్చిన ప్రజల త్యాగం ఎంతో విలువైనది.
    మానేరు ప్రాజెక్టు కోసం మాజీ శాసనసభ్యుడు రేగులపాటి పాపారావుకు తన భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేసారు.అట్టి భూములు చిరునామాలు కోల్పోవడం జరిగింది అని కవి ఆవేదన వ్యక్తం చేశాడు.కవి ఇక్కడ రాజకీయ మరియు భూసంపత్తి సంబంధ సమస్యలను స్పర్శించాడు.మానేరు కోసం చేసిన త్యాగం, వ్యక్తిగత,రాజకీయ,భౌతిక కష్టాలను మించినట్టిది.
    మానేరు ప్రాజెక్టు కోసం డా.చెన్నమనేని రమేష్, కేటీఆర్ లాంటి ప్రముఖ వ్యక్తులు కృషి చేశారు. ఇలాంటి గొప్ప నాయకులు మానేరు ప్రాజెక్టు విజయానికి తమ శక్తి యుక్తులను అందించి మార్గదర్శనం చేసారు.
    “ఆది శ్రీనివాసుడి అపూర్వధామమై/కవి ఒక పంక్తితోనే ఒక యుగాన్ని ఒక వ్యక్తిత్వాన్ని ఒక ప్రాంతాన్ని ప్రతిబింబింప చేయగలిగినాడు. వేములవాడ ప్రాంత ప్రజలు తన పట్ల చూపించిన కృతజ్ఞతా,సేవా స్పూర్తికి అనుగుణంగా ఆది శ్రీనివాస్ గారు ఆ ప్రాంత అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డారు.ఆది శ్రీనివాస్ అక్కడి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు.ప్రజా సేవలో పాల్గొన్న అతని కృషి,అంకితభావం,ప్రజల పట్ల చూపిన మమకారం,ఆ ప్రాంతాన్ని సుసంపన్నమైన ధామంగా మార్చింది.ఆది శ్రీనివాస్ గారి కృషి ప్రజల మదిలో ధామంగా నిలిచిపోయినందున ఈ కవితా పంక్తి అక్షరాల నిజం అవుతుంది.
    “ప్రభవిస్తున్న నీకు వందనం తల్లీ!/నాయకుల కృషి, దైవానుగ్రహం ద్వారా నీరు ప్రవహిస్తున్నది.మానేర్ జలాశయంలోని నీరుతో పంటలు సస్యశ్యామలమైనాయి,ప్రజలకు జీవనాధారమై నిలిచింది.మానేర్ సౌభాగ్యం,ఆధ్యాత్మిక శక్తిగా నిలిచిన నీకు వందనం తల్లీ అని కవి వ్యక్తం చేసిన తీరు బాగుంది.
    “ఇరవై అయిదు టిఎంసీల/బల పరాక్రమాలతో అవతరించిన/నీవు మహా జలేశ్వరివి తల్లీ!/ఇరవై అయిదు టిఎంసీలతో మానేర్ జలాశయం అవతరించింది.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతి వ్యక్తి చేసిన శ్రామిక,సాంకేతిక కృషిని గుర్తు చేస్తోంది.వారి శక్తి సామర్థ్యాలు మరియు కృషి ఫలితంగా జలాశయం ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది. ఇక్కడ జలదేవత,జీవనదాత,ప్రాణదాతగా ప్రతిష్టాత్మక రూపంలో ప్రత్యక్షంగా ప్రాజెక్టును చూస్తున్నాం.తల్లికి పూజ్య భావంతో నమస్కరిస్తున్నాడు.ఇరవై అయిదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మానేరు ప్రజలకు జీవన సౌభాగ్యదాతగా,మహా జలేశ్వరి తల్లిగా వెలసినది అని చెప్పిన తీరు వాస్తవికంగా ఉంది.
    “అగ్రహారం హన్మాన్ గుట్టల్లో ఒరుసుకునిపోయి/ రాజేశుడి ధర్మకుండ పుష్కరిణీకి/జలదాతవై, భీముని మల్లారెడ్డి పేట/జలపాతానికి పెద్దపీటవై ఎగువ మానేర్ కి తిరునామమై/ కె.వి.రమణాచార్యుడి నారాయణపురానికి/ ఆదిశంకరుడి కనకవర్షానివై/బహుభాషావేత్త డా.నలిమెల భాస్కరునికి/బంగారు తెలంగాణావై పరిమళిస్తున్న నీవు/మాకు నిత్య సంక్రాంతుల కానుకవు!/
    మానేర్ జల ప్రవాహం తన మార్గంలో సాగుతుండగా అగ్రహారం,హన్మాన్ గుట్టలకు తాకి ఒరుసుకుని పోయి మానేర్ నీరు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ధర్మకుండ పుష్కరిణీకి పవిత్ర జీవనదాతగా నిలిచింది.
    భీముని మల్లారెడ్డిపేట జలపాతానికి ప్రధాన మానేర్ జలాశయం పెద్ద పీటలా ఉంది అని వర్ణించిన తీరు గొప్పగా ఉంది.అక్కడి ప్రజలకు ఎగువ మానేర్ తిరునామంగా నిలిచింది.మానేరు జలాశయం ప్రధాన పరిపూర్ణ శక్తి,ప్రగతికి కేంద్రం అనే కవి భావన అద్భుతంగా ఉంది.
    కెవి రమణాచారి నారాయణపురం గ్రామం,రాజన్న సిరిసిల్లకు చెందిన వారు.వీరి తండ్రి రాఘవాచారి అధ్యాపకుడిగా పని చేశారు.వీరు 1982 లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.వీరు 2010లో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ నుంచి తెలుగు పద్య కవిత్వం మీద పి.హెచ్ డి. పట్టాను పొందారు.వీరు 2012లో రిటైర్ అయ్యారు.వీరు నారాయణపురం గ్రామంలో దేవాలయాలు నిర్మించారు.వీరు పుట్టిన నేల నారాయణపురం గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.వీరు చేపట్టిన పలు కార్యక్రమాలు ఆధ్యాత్మిక పరిమళాలను అందిస్తూ ఆదిశంకరుడు కనక వర్షాన్ని కురిపించినట్లుగా ఉంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.వీరు పరిపాలనా రంగంలోనూ, సాహిత్య,సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాలలో ప్రసిద్ధి పొందారు.
    బహుభాషావేత్త డా.నలిమెల భాస్కర్ తేది 01 – 04 – 1956 రోజున నారాయణపురం గ్రామం,ఎల్లారెడ్డి పేట మండలం,రాజన్న సిరిసిల్లా జిల్లాలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు : బుచ్చమ్మ, రాంచంద్రంలు.వీరు తెలుగు,కన్నడ,తమిళ మలయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ చేశారు.వీరు తెలుగు, మలయాళ కుటుంబ సామెతల అంశం పై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి పి.హెచ్ డి.పట్టా పొందారు.వీరు పదునాలుగు భాషల చెట్టు అనే ఖ్యాతిని సంపాదించుకున్నారు. వీరు తెలుగు భాషా ఉపన్యాసకులుగా ఎస్,ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్ నుండి 2011 నవంబర్ లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.వీరు తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించారు.వీరు 2013 సంవత్సరం అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్నారు.
    మానేరు జలాశయం ఆనుకుని పారుతున్న నారాయణపురంలో పుట్టిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కె.వి రమణాచార్యులు,బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ గారలు చేసిన కృషికి సరైన గుర్తింపు లభించింది.వారి గ్రామమైన నారాయణపురంను తాకుతూ మానేరు జలాశయం ప్రవహిస్తోంది.వారిరువురు సాంకేతిక,సాంస్కృతిక, సాహిత్య అంశాలను సమన్వయపరిచిన వ్యక్తులు.
    మానేరు నీరు తెలంగాణ భూభాగానికి సౌభాగ్యాన్ని అందించింది.మానేరు జలాశయం నీటి శోభా సంపత్తితో పరిమళిస్తున్నది.మానేరు ప్రకృతి అందాలు చిందిస్తూ,సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. జలాశయం ద్వారా రాష్ట్ర ప్రజల సంప్రదాయ కళలు,ప్రాణప్రదమై శ్రేయస్కర శక్తిని ఇస్తున్నాయి. మాకు నిత్య సంక్రాంతుల కానుకవు అనే కవితా పంక్తి పూజ్య,భక్తి భావాన్ని వ్యక్తం చేస్తున్నది.నిత్య సంక్రాంతి కానుక అనేది మానేరు జలాశయం అందిస్తున్న ఆనంద సౌభాగ్యాలను వ్యక్తం చేస్తున్నది.మానేరు జలాశయం రాజకీయ సాంస్కృతిక,సామాజిక రంగాల్లో ప్రధాన స్థానం సంపాదించింది అని తెలియజేయబడింది.
    బంగారు తెలంగాణాగా పరిమళిస్తున్న మానేర్ జలాశయం రాష్ట్రాభివృద్ధికి మూలమై,నిత్య సంక్రాంతుల కానుకగా,ప్రజలకు జీవన,ఆధ్యాత్మిక, సాంస్కృతిక గౌరవాన్ని అందిస్తున్నది.ప్రజల నిత్య సంక్రాంతుల కానుకగా నున్న మానేర్ ప్రాజెక్ట్ ను మహాజలేశ్వరి తల్లిగా కవి భావించిన తీరు బాగుంది.
    “నేతన్నల ఖిల్లా సిరిసిల్లా జిల్లా శక్తివంతమైనది/ అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరల కళాకారులకి నిలయమై/పరంధామ విజయమై హరికృష్ణల అద్దకమై/యోగాచార్య జక్కని వెంకట రాజమై/ పుస్తక నిధి నిజాం వెంకటేశమై/వడ్డేపల్లి కృష్ణ సులలిత గీతానివై/కథల గూడు గూడూరు సీతన్న చైతన్యాల వస్త్ర సంగమమై/ఆధ్యాత్మిక సాహితీ జ్యోతి జనపాల శంకరమై/అభ్యుదయ సృజనల చిటికెన సూర్యకిరణమై/ముక్కంటి జగన్నాథ రథచక్రమై/పెద్దింటి కథానిధి అశోక చక్రమై/మానేటి బాల సాహిత్య ధీర పత్తిపాక మన్మోహనమై/రంగినేని ట్రస్ట్ పల్లవమై మారసం ఎలగొండ రవమై/చేనేత కవి ఆడెపు లక్షణమై,జిందం అశోకమై/మధురకవి సాంబ కవి శర్మ సుప్రభాత గానమై/సంస్కృత పండిత్ నమిలికొండ హరిప్రసాదుడి/శృంగేరి మఠ ప్రాభవమై/ వీరగోని ఆంజనేయుడి గ్రంథాలయమై/బాలల అందెల సిరిజల్లుల/కందేపి రాణీప్రసాదరావై/ పరిశోధకురాలు ఇట్టేడు వందనమై/మహనీయ దూడం నాంపల్లి పద్య కవిత్వ ధారయై/చొప్పకట్ల చంద్రమౌళీ వచన కవిత్వమై/గర్రెపల్లి అశోకన్న బాలరసాలవాలమై/నమిలకొండ జయంత్ సంగీతమై/సలక్షణమై వర్ధిల్లు తల్లీ!/
    నేతన్నల ఖిల్లా సిరిసిల్లా జిల్లా శక్తివంతమైనది. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరల కళాకారులకు నిలయమై ఉంది.సిరిసిల్ల జిల్లా ప్రాంతీయ శక్తి, సాంప్రదాయ సంపద,కళాకారుల అభిమానాన్ని ప్రతిబింబిస్తుంది.అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు తయారుచేసే కళాకారులకు సిరిసిల్లా జిల్లా నిలయంగా ఉంది.ఇది సాంస్కృతిక,ఆర్థిక కళారూపాల ఆధార కేంద్రం.ఇది మానేరు విశిష్ట జలాశయం గల ప్రాంతం,భౌతిక,సామాజిక, సాంస్కృతిక శక్తుల కేంద్రం అని సూచిస్తుంది. సిరిసిల్లాకు చెందిన చేనేత కళాకారులు పరంధాములు ఆయన కుమారుడు విజయ్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలు తయారు చేసే వారు. హరికృష్ణ చీరలపై అద్దకం వేసే నిపుణుడుగా ఖ్యాతిని ఆర్జించినాడు.కవి సిరిసిల్లకు చెందిన పరంధాము,విజయ్,హరికృష్ణ వారు సాధించిన కళా నైపుణ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు.
    “యోగాచార్య జక్కని వెంకటరాజమై/కవి జక్కని వెంకటరాజం తేది 10 – 05 – 1947 రోజున జన్మించారు.వీరు గూడెం గ్రామం,ముస్తాబాద్ మండలం,సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు : మల్లవ్వ,రామకిష్టయ్యలు.వీరి విద్యార్హతలు బి.ఏ. హెచ్.డి.సి‌.వీరు 1961 సంవత్సరం విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్, సిరిసిల్ల,(సెస్) ఉద్యోగంలో నియమించబడ్డారు.వీరు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా మే,2005లో రిటైర్ అయ్యారు.వీరు ప్రవృత్తిరీత్యా కవిగా, యోగాచార్యుడిగా ప్రసిద్ధి పొందారు.
    కవి వెంకటరాజం ముద్రిత రచనలు : 1) యువ స్వరాలు కవితా సంకలనం,1973. (ఐదుగురు కవులలో వీరు ఒకరు) 2)అర్ధరాత్రి సూర్యుడు కవితా సంపుటి,1977.3)ఆట వెలదులు – తేట గీతులు శతకం,2011.4)వేంకట రాజ శతకం (కందాలు) 2014.5)జక్కని రుబాయిలు 2016. 6)కఠోపనిషత్తు (ముత్యాల సరాలలో) 2018. 7)ఉపనిషత్త్రయము (ముత్యాల సరాలలో) 2023. 8)వరలక్ష్మి ద్విశతి (స్మృతి కావ్యం) 2023.9)ఐతరేయ ప్రశ్నోపనిషత్తులు (ముత్యాల సరాలలో) 2024.10) తైత్తిరీయోపనిషత్తు (ముత్యాల సరాలలో) మార్చి,2025.11)శ్రీరామ శతకం (కందాలు) ఏప్రిల్, 2025.
    “పుస్తక నిధి నిజాం వెంకటేశమై/కవి నిజాం వెంకటేశం తేది 14 – 11 – 1948 రోజున సిరిసిల్లాలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు సత్యమ్మ, విశ్వనాథంలు.వీరు వృత్తిరీత్యా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ హోదాలో పని చేసి 1997లో రిటైర్ అయ్యారు.వీరు హైదరాబాదులోని పద్మారావునగర్ లో స్థిరపడ్డారు.వీరు ప్రముఖ కవి, అనువాదకుడు.వీరు ఎందరో కవులకు ఉచితంగా పుస్తకాలు వితరణ చేసే వారు.వీరు18 – 09 – 2022 రోజున గుండె పోటుతో ఈ లోకాన్ని వీడి పోయారు.
    “వడ్డేపల్లి కృష్ణ సులలిత గీతానివై/వడ్డేపల్లి కృష్ణ తేది 05 – 08 – 1948 రోజున సిరిసిల్లాలో సాధారణ చేనేత కుటుంబంలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు లక్ష్మమ్మ,లింగయ్యలు.వీరు ప్రముఖ కవిగా,సినీ గేయ రచయితగా ప్రసిద్ధి పొందారు.వీరు అనారోగ్యంతో 06 – 09 – 2024 రోజున పరమపదించారు.
    “కథల గూడు గూడూరి సీతన్న చైతన్యాల వస్త్ర సంగమమై/కవి గూడూరి సీతారాం
    తేది 18 – 07 – 1936 రోజున జన్మించాడు.వీరు హనుమాజీపేట గ్రామం,రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు.వీరు 1953 నుంచి 1965 వరకు సుమారు 80 కథల వరకు రాశారు.వీరు తెలంగాణ కథా సాహిత్యంలో,పేద కులాల జీవితాలను అట్టడుగు వర్గాల భాషను అక్షర బద్దం చేసినారు. వీరు 1953లో తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా పని చేశారు.వీరు పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించారు.వీరు రాసిన కథల్లో మారాజు,లచ్చి,పిచ్చోడు, రాజమ్మ రాజీరకం,ప్రసిద్ధ కథలనుగా చెప్పుకుంటారు.వీరు తాను రాసిన కథల్లో తెలంగాణా భాషకు,యాసకు పట్టం కట్టారు. వీరు తెలంగాణకు చెందిన తొలి తరం కథకుడిగా పేరుగాంచారు.వీరు తేది 25 – 09 – 2011 రోజున పరమపదించారు.
    “ఆధ్యాత్మిక సాహితీ జ్యోతి జనపాల శంకరమై/ డాక్టర్ జనపాల శంకరయ్య తేది 05 – 02 – 1958 రోజున సాధారణ నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.వీరు ఆవునూరు గ్రామం,ముస్తాబాద్ మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు. వీరి తల్లిదండ్రులు లస్మవ్వ,నరసయ్యలు.వీరు ఆవునూరు ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు.తెలుగులో విశారద పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు.వీరు డి.ఓఎల్, బి.ఏ. బిఈడి,ఎంఏ (తెలుగు),ఎం.ఫిల్.డిగ్రీ, పి.హెచ్ డి.పట్టాను పొందారు.వీరు కరీంనగర్ జిల్లా లంబాడీల ఆచార వ్యవహారాలు అనే అంశంపై ఎం.ఫిల్ డిగ్రీని పొందారు.వీరు తెలుగు లంబాడీల గేయ సాహిత్యం పై పరిశోధన చేసి పి.హెచ్ డి. పట్టాను పొందారు.వీరు తేది 04 – 01 – 1984 రోజున తెలుగు పండిట్ టీచర్ గా ప్రభుత్వ పాఠశాల,బద్దెనపల్లి గ్రామంలో నియమించబడ్డారు. జనపాల శంకరయ్య ముద్రిత రచనలు : 1)కరీంనగర్ జిల్లా లంబాడీల ఆచార వ్యవహారాలు – ఎం.ఫిల్. గ్రంథం,1998.2) తెలుగు లంబాడీల గేయ సాహిత్యం పి.హెచ్ డి. సిద్ధాంత గ్రంథం, 2000. 3)ఆచార్యదేవోభవ శతకం,2004.
    4)బహుముఖ ప్రజ్ఞాశాలి కేటీఆర్ బుర్రకథ, 2019. 5)మా అవ్వ పాడిన సద్దుల బతుకమ్మ పాట, 2024.6)అక్షరామృతం గేయాలు,2023. 7)భారతరత్న వాజపేయి గారి సంక్షిప్త చరిత్ర కథ గేయం,2024.
    “కవి చిటికెన కిరణ్ కుమార్ తేది 06 – 10 – 1980 రోజున సిరిసిల్లలో జన్మించారు.వీరు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు.వీరి తల్లిదండ్రులు ఉమ,కనుకయ్యలు.వీరు ఎం.కాం.విద్యను అభ్యసించారు.వీరు ఓ తండ్రి తీర్పు లఘు చిత్రం నిర్మించారు.వీరు ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రిసెర్చ్ ఫోరం ఫౌండేషన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరు చైతన్య స్ఫూర్తి చిటికెన వ్యాస సంపుటిని ముద్రించారు.వీరు సమాజ అభ్యుదయం కాంక్షించి పలు కవితలు,కథలు,సాహిత్య వ్యాసాలు విస్తృతంగా రాస్తున్నారు.
    కవి జూకంటి జగన్నాథం తేది 20 – 06 – 1955 రోజున తంగళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు.వీరు రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందినవారు.వీరి తల్లిదండ్రులు సుశీల,దుర్గయ్యలు.వీరు 1993 నుండి సాహిత్య సృజన చేస్తున్నారు.వీరు ముద్రించిన వచన కవిత్వం వివరాలు:పాతాళగరిగె 1993,ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1996, గంగడోలు 1998,వాస్కోడిగామా డాట్ కామ్ 2000, బొడ్డుతాడు 2002,ఒకరోజు పది గాయాలు (అత్యాధునిక కావ్యం) 2004,తల్లి కొంగు 2006, పిడికెడు కలలు! పిడికెడు కన్నీళ్లు! 2008,తారంగం 2009,రాజ పత్రం 2011,చిలుక రహస్యం 2012, చెట్టును దాటుకుంటూ.. 2015,వస 2017,ఊరు ఒక నారు మడి 2018,సద్ది ముల్లె, 2020,ఒక కప్పు చాయ్ నాలుగు మెసేజ్ లు, 2023,మనాది, 2025. వీరు ముద్రించిన కథా సంకలనాలు :వైపణి, 2004, జూకంటి జగన్నాథం కథలు, 2020.గాంధీ గారి మూడు కోతులు సామాజిక రాజకీయ వ్యాసాలు, 2024.
    “పెద్దింటి కథానిధి అశోక చక్రమై/కవి పెద్దింటి అశోక్ కుమార్ తేది 06 – 02 – 1968 రోజున జన్మించాడు. వీరు భీముని మల్లారెడ్డి పేట గ్రామం,గంభీర్రావు పేట మండలం,రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు. వీరు రాజన్న సిరిసిల్లా జిల్లా,చందుర్తి మండలం, కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.వీరు కథా, నవలా రచయితగా ప్రసిద్ధి పొందారు.వీరు సినిమాలకు కథలు,మాటలు,పాటలు రాస్తున్నారు. వీరు రెండు వందల యాభై పైగా కథలు,ఏడు నవలలు,పది కథా సంపుటాలు ప్రచురించారు.
    కవి పత్తిపాక మోహన్ తేది 05 – 01 – 1972 రోజున జన్మించాడు.వీరు లింగంపేట గ్రామం,చందుర్తి మండలం రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు. వీరి తల్లిదండ్రులు గంగాబాయి,లక్ష్మీరాజంలు.వీరు ఎం.ఏ.తెలుగు,పి.హెచ్ డి. పట్టాను పొందారు.వీరు గజల్ ప్రక్రియలో సమగ్ర పరిశీలన అనే అంశం మీద పరిశోధన చేశారు.వీరు బాల సాహితీవేత్తగా ప్రసిద్ధి పొందారు.వీరు నేషనల్ బుక్ ట్రస్ట్,హైదరాబాద్, ప్రాంతీయ సంపాదకుడిగా పని చేస్తున్నారు.వీరు రాసిన బాలల తాత బాపూజీ గేయ కథకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.
    “రంగినేని ట్రస్టు పల్లవమై అనే కవితా పంక్తి ఈ ట్రస్టు చేసిన సేవలను ప్రతిబింబిస్తుంది.రంగినేని మోహన్ రావు 2000 సంవత్సరంలో రంగినేని ట్రస్ట్ ను స్థాపించారు.అయితే ట్రస్ట్ ప్రధాన కార్యక్రమాలు 2002 నుండి సక్రమంగా ప్రారంభమయ్యాయి.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థాపించబడింది.ట్రస్టుకు అనుబంధంగా గల విద్యాలయంలో మెరుగైన విద్యను అందిస్తున్నది.చదువు కోసం ఆర్థిక సహాయం లేని అనాధ బాలబాలికలకు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నారు.వారి విద్య భవిష్యత్తు నిర్మాణం కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు వారికి బాల సాహిత్యం రాయించే అవకాశం కల్పిస్తున్నారు.ఇలా రాయించిన కథలు,పద్యాలు,వ్యాసాలు మొదలైనవి వారిలోని ప్రతిభను ప్రతిబింబిస్తాయి.వీరు పిల్లల వ్యక్తిత్వ వికాసం,నైపుణ్యాల పెంపునకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు‌.సాంస్కృతిక విద్యా,సామాజిక రంగాల్లో పిల్లల ప్రగతికి తోడ్పడుతున్నారు.బాల సాహిత్యం రచించే రచయితలను ప్రోత్సహించడం,వారి రచనలకు వేదిక కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మొత్తం మీద రంగినేని ట్రస్ట్ సమాజంలోని వెనుకబడిన పిల్లల విద్య, సృజనాత్మకత,వ్యక్తిత్వ వికాసం కోసం నిరంతరం సేవలు అందిస్తూ తెలుగు బాల సాహిత్య అభివృద్ధికి కూడా విశేషంగా సహకరిస్తోంది.విద్యార్థులలోని మేధాశక్తికి పదును పెడుతూ,వారిలో సృజనను ప్రోత్సహిస్తున్నారు.విద్యార్థులు చేత కథలు,కవితలు రాయించి వారిని బాలసాహితీకారులుగా తీర్చిదిద్దుతున్నారు.బాలల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు.ప్రతి సంవత్సరం బాల సాహిత్యంలో పోటీలు నిర్వహించి రచయితలకు అవార్డులను కూడా ఇస్తున్నారు.రంగినేని ట్రస్టు ద్వారా బాలలకు విశిష్ట సేవలను అందిస్తున్నారు.
    “కవి ఎలగొండ రవి తేది 30 – 05 – 1970 రోజున సిరిసిల్లలో జన్మించాడు.వీరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.వీరు1994 నుంచి సాహిత్య సృజన గావిస్తున్నారు.వీరు ప్రచురించిన పుస్తకాలు:1) ఖడ్గ ధార,2)సముద్రం 3)జీవితం పియానో మెట్ల మీద.వీరు సిరిసిల్ల మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరు.వీరు ప్రస్తుతం మారసం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
    “కవి ఆడెపు లక్ష్మణ్ తేది 06 – 10 – 1971 రోజన ఒక సాధారణ చేనేత కుటుంబంలో జన్మించాడు. వీరు రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు రుక్కమ్మ,బాలయ్యలు.వీరు తొమ్మిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల, సిరిసిల్లలో చదువుకున్నారు.వీరు వృత్తిరీత్యా చేనేత కార్మికుడిగా పని చేస్తున్నారు.వీరు ప్రవృత్తి రీత్యా కవిత్వం రాస్తున్నారు.కవి ఆడెపు లక్ష్మణ్ ప్రచురించిన పుస్తకాలు :
    1)రాత్ పైలీ దివస్ పైలీ కవితా సంపుటి
    2) సిరిసిల్ల నానీలు 3)కామ్ గార్ కవితా సంపుటి.
    కవి జిందం అశోక్ తేది 05 – 04 – 1973 రోజున జన్మించాడు.వీరు రామచంద్రాపూర్ గ్రామం, తంగళ్ళపల్లి మండలం,రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు : ఎల్లవ్వ, రాజయ్యలు.వీరు ఎంఎస్సీ,బిఇడి,విద్యను అభ్యసించారు.వీరు వృత్తిరీత్యా ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.వీరు ప్రవృత్తిరీత్యా సాహిత్య సృజన గావిస్తున్నారు.వీరి ముద్రిత రచనలు: 1)అదృశ్య కిరణాలు కవితా సంపుటి,2)మానేరు నానీలు, 3)ఎనగర్ర కవితా సంపుటి,4)గవ్వలు కవితా సంపుటి,5)చుక్క పొద్దు కవితా సంపుటి, 6)వర్గమూలాలు కవితా సంపుటి.వీరు పెద్ద గడియారం పుస్తకానికి సంపాదకత్వం వహించారు.
    “మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ (సాంబ కవి) తేది 24 – 06 – 1918 రోజున సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.వీరు వేములవాడకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు : సత్తెమ్మ,మృత్యుంజయ శర్మలు.వీరు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర నాట్యమండలి వారు ప్రదర్శించిన ఎన్నో పౌరాణిక నాటకాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలనందినారు.వీరు హిందీ భాషా ప్రచారోద్యమంలో పాల్గొని భాషా గేయ రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా హిందీ భాషా ప్రచారాన్ని గావించారు.వీరు స్వాతంత్ర్య సమరయోధులు.వీరు గ్రంథాలయ నిర్వహణ గావించారు.వీరు కాకతీయ పత్రికకు విలేకరిగా పని చేసారు.వీరు 09 – 01 -1998 రోజున స్వర్గస్తులయ్యారు.
    కవి సాంబశివశర్మ ముద్రిత రచనలు :1.ముక్తాహారం (పద్య కావ్యం)2.కుంజ విహారం (పద్య కావ్యం) 3.జయశ్రీ (పద్య కావ్యం) 4.లోభ సంహారం (అధిక్షేప కావ్యం) 5.మధుర ఝంకారం (మంగళ హారతులు, కీర్తనలు)6.భక్తి గీతాలు (భజనలు)7.ద్విపద రామాయణం (రాధే శ్యాం రామాయణానికి స్వేచ్ఛానువాదం)బాల సుందరకాండములు.
    8) దక్షయజ్ఞం (బుర్రకథ) 9.శ్రీ రాజ రాజేశ్వర సుప్రభాతం.10.శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర సుప్రభాతం.11.శ్రీ మదాది శంకరాచార్య సుప్రభాతం.12) బాసర సరస్వతి సుప్రభాతం. 13.గంగా సుప్రభాతం.
    కవి సాంబశివశర్మ అముద్రిత రచనలు:
    1.భద్రావతి (నాటకము).2.త్యాగయ్య (నాటకము) 3.ముగ్గురు మరాఠీలు (బుర్రకథ)4.శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర మహాత్మ్యం (హరికథ)5.ద్విపద రామాయణము (అయోధ్య,అరణ్య, కిష్కింద,యుద్ధకాండాలు కొంత వరకు లభ్యం) 6.శ్రీ రాజేశ్వర తారావళి (లిఖితపూర్వకమైన చివరి రచన)

    కొమురవెల్లి మల్లన్న సుప్రభాతం
    బెల్లంపల్లి శ్రీ రామచంద్ర సుప్రభాతం
    శ్రీ మదుజ్జయిని మహాకాళీ సుప్రభాతం.
    “కవి నమిలకొండ హరి ప్రసాద్ శర్మ తేది 05 – 06 – 1953 రోజున సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు: నాగుబాయి, కోటయ్య ఘనాపాటి.వీరు సంస్కృత బి.ఓ.ఎల్. శిక్షా శాస్త్రి, ఎం,ఏ. సంస్కృతాంధ్రములు విద్యను అభ్యసించారు.వీరు శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఉన్నత సంస్కృత పాఠశాల,వేములవాడలో ఉపాధ్యాయుడిగా పని చేశారు.కవి నమిలకొండ హరిప్రసాద్ శర్మ ముద్రిత రచనల వివరాలు :
    1)శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతము,
    2)రాజేశ్వరోదాహరణం, 3)అష్టమూర్తి స్తవము,4)రాజేశ్వర ఋణ హర స్తోత్రం,5)దేశ శ్లోకీ సాయి స్తుతి,
    6) మాతృ స్మృతి,7) ముక్తాత్మ బంధం,
    8) ముకుంద మాల (పద్యానువాదం),
    9) ఇందూరు గణేశ సుప్రభాతం,
    వీరు 2006 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేత అందుకున్నారు.వీరు కరీంనగర్ లో స్వగృహం నిర్మించుకున్నారు.వీరు అనారోగ్యంతో 31 – 8 – 2022 రోజున పరమపదించినారు.వీరి భార్య శ్రీమతి యమున సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, చింతకుంట గ్రామంలో,తెలుగు భాషా ఉపన్యాసకులుగా పని చేసి రిటైర్ అయ్యారు. కవయిత్రి యమున ఎం.ఏ. తెలుగు,ఎం.ఫిల్ డిగ్రీని పూర్తి చేశారు.వీరు నాగార్జున విశ్వవిద్యాలయం నుండి వేములవాడ రాజేశ్వరుని మహాత్మ్యం – అనుశీలన అంశంపై పరిశోధన చేసి ఎంఫిల్ డిగ్రీని పొందారు.
    వీరగోని ఆంజనేయులు గౌడ్ తేది 06 – 05 – 1951 రోజున సుల్తానాబాద్ మండలం,గర్రెపల్లి గ్రామంలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు :హనుమవ్వ, బసవయ్య గౌడ్ లు.వీరు 1 వ తరగతి నుంచి 11 వ తరగతి వరకు 1956 నుంచి 1968 వరకు ప్రభుత్వ పాఠశాల,గర్రెపల్లి గ్రామంలో విద్యాభ్యాసం చేశారు. వీరు పియుసి 1968 నుంచి 1969 వరకు మరియు బిఏ డిగ్రీ 1969 నుంచి 1973 వరకు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్ లో చదివారు.వీరు బిఇడి 1975 సంవత్సరంలో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్,వరంగల్ లో చదివారు.వీరు సుల్తానాబాద్ తాలూకాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,అబ్బాపూర్ లో టీచర్ గా నియమింపబడ్డారు.వీరు శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల,వేములవాడలో స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం టీచర్ గా పనిచేసి తేది 31- 05 – 2009 రోజున రిటైర్ అయ్యారు.వీరు 1978లో తన తల్లిదండ్రుల పేరిట వీరగోని హనుమమ్మ,బసవయ్య పౌర గ్రంథాలయం,వేములవాడలో ఏర్పాటు చేసినారు. వీరు స్థాపించిన గ్రంథాలయంలో లక్షా డెబ్భై వేలకు పైగా పుస్తకాలు తెలుగు,హిందీ,ఇంగ్లీష్,సంస్కృతం అందుబాటులో ఉన్నాయి.వీరు స్థాపించిన గ్రంథాలయం ఎందరో యువతీ యువకులకు, విద్యార్థులకు,పరిశోధకులకు,పాత్రికేయులకు, సాహితీ ప్రియులకు విజ్ఞాన కల్పతరువుగా సేవలు అందిస్తున్నది.వీరు నడుస్తున్న గ్రంథాలయ ఉద్యమకారుడుగా ఖ్యాతిని ఆర్జించారు.వీరు అందిస్తున్న గ్రంథాలయ సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులను పొందారు.వీరు గ్రంథాలయం పూర్తిగా సొంత ఖర్చులతో నిర్మించినారు.వీరు అందిస్తున్న గ్రంథాలయ సేవలకు,వారి కుటుంబ సభ్యులు తోడ్పాటును అందిస్తున్నారు.
    కవయిత్రి డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్ తేది 19 – 10 – 1969 లో జన్మించారు.వీరు ‌బాల సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందినారు.వీరి తల్లిదండ్రులు : అంగలకుదిటి గోవిందమ్మ,సుందరాచారి గారలు.వీరి తండ్రి సుందరాచారి స్వాతంత్ర సమరయోధులు.వీరి భర్త డాక్టర్ కందేపి ప్రసాద రావు పిల్లల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు.వీరు ఎం.ఎస్సీ. (జువాలజీ) ఎంఏ (తెలుగు) చదివారు.వీరు నాగార్జున యూనివర్సిటీ నుండి బాల సాహిత్యంలో వైజ్ఞానిక రచనలు అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాను పొందారు.
    కవయిత్రి కందేపి రాణీప్రసాద్ ముద్రిత రచనలు:1) పూల తోట కవితా సంకలనం బాల సాహిత్యం.2) సరదా సరదా బొమ్మలు.3) వార్త దినపత్రిక మొగ్గ లో పిల్లల కోసం బొమ్మలతో అచ్చయిన వ్యాసాలు.4) హరివిల్లు కవితా సంకలనం బాల సాహిత్యం. మచ్చుకు కొన్ని వివరాలు ఇచ్చాను.వారు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి.
    కవయిత్రి డాక్టర్ ఇట్టేడు విష్ణు వందనా దేవి వేములవాడలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు : శారదాబాయి,జగదీశ్వరయ్యలు.వీరు మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ జీవితం – రచనలు అంశంపై పరిశోధన చేసి పి.హెచ్ డి. పట్టాను పొందారు.పర్యవేక్షకులుగా డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ వ్యవహరించారు.కవయిత్రి విష్ణువందనాదేవి ముద్రిత రచనలు:1) మధురకవి సాంబశివశర్మ జీవితం – రచనలు పరిశోధనా గ్రంథం, 2009.2) మౌన శబ్దాలు నానీలు,2012. 3) మామిడిపల్లి సాంబ కవి మోనోగ్రాఫ్ ముద్రణ 2019.వీరు రాసిన వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.వీరు 25 సంవత్సరాలు డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసి రిటైర్ అయ్యారు.వీరు ప్రస్తుతం మిద్దె సేద్యం చేస్తూ సమాజంలో అవగాహన కల్పిస్తున్నారు.
    కవి దూడం నాంపల్లి తేది 20 – 05 – 1944 రోజున పొత్తూరు గ్రామం ఇల్లంతకుంట మండలం,కరీంనగర్ జిల్లాలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు లక్ష్మి, నరసయ్యలు.వీరు సిరిసిల్ల,ప్రగతినగర్ లో స్థిరపడ్డారు.వీరి భార్య జానాబాయి.వీరి కుమారుడు దూడం మనోహర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేస్తూనే ప్రవృత్తిరీత్యా సాహితీ సృజన గావిస్తున్నారు.కవి దూడం నాంపల్లి 14 – 04 -1964 రోజున మలేరియా వర్కర్ గా నియమించబడ్డాడు. వీరు తెలుగు పండిట్ గా 20 – 07 – 1970 రోజున నియమింపబడ్డారు.వీరు పోతుగల్,రేపాక,పెద్ద లింగాపూర్,సిరిసిల్ల పలు పాఠశాలల్లో విధులు నిర్వహించారు.వీరు 31 – 07 – 2002 రోజున తెలుగు పండిట్ గా రిటైర్ అయ్యారు.వీరు 05 -09 -2013 రోజున కీర్తిశేషులైనారు.కవి దూడం నాంపల్లి ముద్రిత రచనలు :1) శిష్య ద్విశతి (కందాలు) 1982.2)జీమూత వాహనుడు పద్య కావ్యం 1986. 3) శకుంతల హరికథ 1988.4) పాండవ జననం హరికథ 1991. 5)ద్వయి నాదం ఖండకావ్యం 1993. 6)పాండవ అజ్ఞాత వాసం వీధి నాటకం 1994.7)పంచామృతం సాహిత్య వ్యాసాలు,1997. 8) అభినందన చందనం గేయ సంపుటి 2000. 9)పాటల పల్లకి (పాటల పేటిక)2003.10)సాహితీ సమదర్శనం (షష్టిపూర్తి సంచిక) 2004.
    11) భూమిక (కె.భూమిరెడ్డి షష్ఠబ్ది సంచిక పద్య కృతి) 2005.12)మావూరు బడి (అధిక్షేప కథానిక) 2005.13)కవన కలశం కవితా సంపుటి,2006. 14)జైనానీ – జైజైనానీ (గల్పిక)2007.15)జైనానీ – లేఖలు (కూర్పు) 2007.16) సన్మాన కోలాహలం (కథానిక) 2008.17) పరశురామ ప్రీతి పద్య కృతి 2009. 18) స్వర్ణముఖి (సాహితీ స్వర్ణోత్సవ సంచిక) 2011
    ప్రముఖ కవి చొప్పకట్ల చంద్రమౌళి తేది 27 – 10 -1937 రోజున సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.వీరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణం,రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి,రాధాకృష్ణయ్యలు.వీరు టీచర్ గా నియమింపబడి,తర్వాత హెడ్మాస్టర్ గా,తర్వాత సిరిసిల్ల జూనియర్ కళాశాలలో తెలుగు భాషా ఉపన్యాసకులుగా పని చేసి మే,1996 సంవత్సరంలో రిటైర్ అయ్యారు.వీరు ముద్రించిన సమతా దీపాలు కవితా సంపుటి,1976 సంవత్సరంలో వెలువడింది.వీరు వేములవాడలో స్థిరపడ్డారు.వీరి భార్య శ్రీమతి అంజని.కవి చంద్రమౌళి అనారోగ్యంతో తేది 13 – 03 – 2014 రోజున పరమపదించారు.
    కవి గర్రెపల్లి అశోక్ తేది 15 – 8 – 1959 రోజున భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు.వీరు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు.వీరు ఎం.ఏ. (తెలుగు),బిఇడి,ఎం.ఫిల్.డిగ్రీని పొందారు. వీరు1984 తెలుగు పండిట్ గా నియమింపబడ్డారు. వీరు 2016లో రిటైర్ అయ్యారు.వీరు దూడం నాంపల్లి సాహిత్యం పై పరిశోధించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 2008లో ఎం.ఫిల్.డిగ్రీని పొందారు.వీరు బాల సాహితీవేత్తగా ప్రసిద్ధి పొందారు.కవి గర్రెపల్లి అశోక్ ముద్రిత రచనలు :1)నాంది కవితా సంపుటి,1977.2)ఎంకటి కథలు పిల్లల కథలు,2019.3) మా బడి కథలు పిల్లల కథలు,2020.4) సరికొత్త ఆవు – పులి కథలు రంగుల చిత్రాలతో పిల్లల కథలు 2020. 5)ఎం.ఫిల్.పరిశోధనా గ్రంథం మధురకవి దూడం నాంపల్లి రచనలు పరిశీలన – 2020. కవి నమిలకొండ జయంత్ తేది 06 – 12 – 1964 రోజున సాధారణ బ్రాహ్మణ కుటుంబం, వేములవాడలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు : నాగుబాయి,కోటయ్య ఘనాపాటిగారలు.వీరు ఎం.ఏ.(తెలుగు), బిఇడి.విద్యను అభ్యసించారు. వీరు17 – 04 – 1989 రోజునప్రభుత్వ పాఠశాల, ఘన్ముక్ల గ్రామంలో ఉపాధ్యాయుడిగా నియమింపబడ్డారు.వీరు కవిత్వం,గేయాలు, పాటలు రాస్తున్నారు.వీరికి సంగీతంలో ప్రావీణ్యం ఉంది.వీరు గొప్ప కళాకారుడు,చిత్రకారుడు.వీరు వేములవాడలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ గొప్ప కీర్తిని సంపాదించారు.వీరు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
    కవి నాగేంద్ర శర్మ మిడ్ మానేర్ ప్రాంతం కవులకు, కళాకారులకు నిలయం అని పేర్కొన్నారు.మానేరు జలాశయాన్ని సలక్షణమై వర్ధిల్లు తల్లీ అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
    “అసలు సిసలైన ఒక కావ్య నాయికవు/మానేటి నాగరికతా మహ భాగవతానివి/కావ్య నాయిక ఈ పదం కవిత్వపరంగా మానేరు జలాశయాన్ని ప్రాణప్రదమైన పాత్రధారిగా చూపిస్తుంది.మానేరు మానవ సంబంధమైన ప్రాంతీయ నాగరికతను, సాంస్కృతిక సంపదను పరిరక్షించే కేంద్రం. మహాభాగవతానివి అంటే భక్తి,ధార్మికత, సాంస్కృతిక విలువలు కలిగినట్టిది అని అర్థం. మానేర్ కేవలం జలధార కాదు,ప్రజల సంస్కృతి, ధర్మ,సాహిత్య ఆధ్యాత్మిక పరిరక్షణ వేదిక.మానేరు ప్రజల జీవితానికి,నాగరికతకు,సాహిత్యానికి ప్రాణదాత.మానేరు అసలు సిసలైన కావ్య నాయిక అని చెప్పడం బాగుంది.
    “పర్యాటక దర్శినివి!/ఈ కవితా పంక్తిలో పర్యాటక దర్శనివి అనేది ఆ జలాశయ సౌందర్యానికి, ఆధ్యాత్మికతకి,సామాజిక ప్రయోజనానికి కల్పించిన రూపం.మానేర్ జలాశయం సూర్యోదయ వేళల్లో ముత్యాల్లా మెరుస్తున్న అలలతో,సాయంత్రపు సమయంలో బంగారు కాంతి కలిగిన నీటి అలలతో ఒక చిత్రకారుడు చిత్రించిన దృశ్యంలా ఉంటుంది. విస్తృతమైన నీరు చుట్టూ ఉన్న కొండలు, పచ్చదనంతో కలబోసిన ఒక దివ్య దృశ్య రూపాన్ని సృష్టిస్తాయి.మానేర్ నదీ పరివాహక ప్రాంతం తెలంగాణా చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం గలది. మానేర్ జలాశయం ప్రక్కన ఉన్న దేవాలయాలు, శిలాశాసనాలు,పురాతన కట్టడాలు అన్ని ఈ ప్రదేశానికి ఆధ్యాత్మికతను,సాంప్రదాయక గాఢతను సమకూరుస్తున్నాయి.మానేర్ జలాశయం పరిసర ప్రాంతాల సాగు భూములకు ఆధారం.కవి దీనిని పర్యాటక దృక్కోణంలో చెప్పినా అంతర్భావంగా అది ప్రజల జీవనాధారానికి మూలం అనే సూచన ఉంది.ప్రకృతిని దర్శించడానికి వచ్చిన పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రాంతం.పర్యాటక దర్శిని అనే కవితా పంక్తి తెలంగాణ భూభాగ సౌందర్యాన్ని ప్రజల అభివృద్ధి స్ఫూర్తిని ఒకే శ్వాసలో మన ముందు ఉంచుతుంది.
    “మత్స్యకారులకు కోహినూరంతటి/అమూల్య వజ్రాభరణానివి!/ఈ కవితా పంక్తులు మానేర్ జలాశయం సారాన్ని అత్యంత మృదువైన,గాడమైన భాషలో వ్యక్త పరుస్తాయి.కవి ఇక్కడ జలాశయాన్ని కేవలం నీటి నిల్వగా కాకుండా జీవనాధారంగా విలువైన సంపదగా చిత్రించాడు.కోహినూర్ వజ్రంతో జలాశయాన్ని పోల్చాడు.కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైనది.కవి ఆ విలువను మత్స్యకారుల వృత్తిలోకి మార్చాడు. మత్స్యకారులకి జలాశయం జీవన గని. మత్స్యకారుల జీవితం జలాశయంతో ముడివడి ఉంటుంది.ఆ జలాశయం నీటిలోనే వారి ఆహారం, ఆదాయం,ఆనందం,అస్తిత్వం దాగి ఉన్నాయి. అందుకే కవి దానిని అమూల్య వజ్రాభరణం అని పిలిచాడు.కవి మానేర్ జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా,సాగునీటికి మూలంగా మాత్రమే కాకుండా సామాజిక జీవనానికి ఆధారమైన వనరుగా కూడా భావించాడు.జలాశయం వల్ల ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి.మానేర్ జలాశయం మత్స్యకారులకి కోహినూర్ వజ్రం వలె అమూల్యమైనది అని చెప్పిన తీరు బాగుంది.
    “వరదవెళ్ళి గురుదత్త దేవునికి బంగారు కొండవు!/ ఇది కేవలం భౌగోళిక స్థల వివరణ కాదు. ఆధ్యాత్మికత,భక్తి,ప్రకృతి సౌందర్యం,ప్రజల భావోద్వేగం అన్నీ కలిసిన కవితా దృశ్యం.మానేరు జలాశయం పరిసరాలు వరదవెళ్ళి గ్రామంలో కొలువై ఉన్న గురుదత్త దేవాలయం ఆ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రమై విలసిల్లింది.కవి ఆ దృశ్యాన్ని బంగారు కొండగా చిత్రీకరించి ఆ జలాశయం యొక్క మహిమను దేవాలయంతో అనుసంధానించాడు.బంగారు కొండవు అనేది ప్రకృతి సౌందర్యాన్ని,ఆధ్యాత్మిక శోభను సూచిస్తుంది.మానేరు జలాశయంలోని నీరు సూర్యరశ్మిలో మెరుస్తూ బంగారు వర్ణంలో కాంతులు విరజిమ్ముతుంది.ఆ దృశ్యం గురుదత్త స్వామి పుణ్యక్షేత్రానికి బంగారు కొండలా కనిపిస్తుంది అని కవి భావించాడు.మానేరు జలాశయం భక్తి మరియు ప్రకృతి కలయికగా దేవునికి సమర్పితమైన స్వర్ణ శిఖరంగా మారింది.జలాశయం యొక్క సౌందర్యం, దేవాలయం యొక్క పవిత్రత,ఇవి కవిలో గాఢమైన ఆరాధనా భావాన్ని రేకెత్తించాయి.జలాశయాన్ని బంగారు కొండతో పోల్చినప్పటికి.జలాశయం నిజంగా బంగారు కొండ కాదు.కానీ,కవి దృష్టికి ఆ జలాశయం దేవుని ఆలయానికి స్వర్ణ శోభతో నిండిన కొండ వలె కనిపిస్తుంది.వరదవెళ్ళి గురుదత్త దేవునికి అనే పదాలు శ్రవణానందాన్ని కలిగిస్తాయి. తెలంగాణా భక్తి సంప్రదాయంలో దత్తాత్రేయ స్వామికి విశేష ప్రాధాన్యం ఉంది.జలాశయ నిర్మాణం తరువాత నీటితో కప్పబడిన పరిసరాలు ప్రకాశవంతమై,దేవుని వైభవాన్ని మరింత పెంచాయి. కవి మానేరు జలాశయాన్ని భక్తి, ప్రకృతి శోభల సమ్మేళనంగా చిత్రించారు.
    “నీ ప్రవాహ సామర్థ్యాలు జగత్కళ్యాణాలు!/ కవి మానేర్ జలాశయం ప్రాజెక్ట్ మహిమను,అది సమాజానికి అందించే పరమహితాన్ని,అత్యంత స్ఫూర్తిదాయకంగా వ్యక్తపరిచాడు.మానేర్ జలాశయం కేవలం ఒక ప్రాంతానికే కాదు.దాని నీరు చేరే ప్రతి భూమికి,ప్రతి చెట్టుకి,ప్రతి రైతుకు కళ్యాణకారకంగా ఉంటుంది.మానేర్ జలాశయం వల్ల ఉత్తర తెలంగాణలోని సాగు విస్తరిస్తుంది. రైతుల జీవనోపాధి మెరుగుపడుతుంది.నీటి కొరత తగ్గుతుంది.నీరు ప్రవహిస్తే జీవితం వికసిస్తుంది.నీరు నిలిస్తే సమాజం నిలుస్తుంది.మానేర్ జలాశయ ప్రవాహం కవి దృష్టిలో నీటి తరలింపు కాదు.అది ప్రజల ప్రగతికి,పంటల పుష్టికి,ప్రకృతి పరిమళానికి మూలం.మానేరు జలాశయం జగత్కల్యాణకారకం అయినట్టిదిగా భావించవచ్చు.
    “జన సామాన్యానికి భువనేశ్వరి మాతవై/ ఏడాదంతా జలసింగారాలతో/మా నేలలో ఎములాడ రాజన్న జ్యోతిర్లింగానివై/నిండు చందమామవై చల్లని చూపులు ప్రసాదించు తల్లీ!/కవి ఈ జలాశయాన్ని ఒక దేవతా స్వరూపంగా భువనేశ్వరి మాతగా ఆవిష్కరించాడు.
    భువనేశ్వరి మాత సృష్టికి,పోషణకు,కరుణకు ప్రతీక.అదే విధంగా మానేరు జలాశయం ప్రజలందరికీ సమానంగా జీవజలం ప్రసాదిస్తుంది కాబట్టి గొప్పగా ఉంది.
    “ఏడాదంతా జల సింగారాలతో/ఈ కవితా పంక్తిలో జల సింగారం అనేది ఇంపైన ఉపమానం. జలాశయం సంవత్సరం పొడవునా నీటితో నిండి ఉండి దానిపై ప్రసరించే సూర్యకాంతితో ప్రతిబింబించే ఆకాశంతో ముగ్ధ మనోహరంగా ఉంటుంది.
    మానేర్ జలాశయాన్ని ఎములాడ రాజన్న జ్యోతిర్లింగంతో పోల్చడం జరిగింది.ఇది రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజల భక్తికి,శ్రద్ధకు నిదర్శనం. జలాశయం రూపంలో ఆధ్యాత్మిక శక్తి భూమిపై అవతరించినట్లు కవి భావించాడు.
    నిండు చందమామవై చల్లని చూపులు ప్రసాదించు తల్లీ!/ఇక్కడ మానేరు జలాశయాన్ని కవి చందమామతో పోల్చాడు.చందమామను చల్లదనానికి,ప్రశాంతతకు ప్రతిరూపంగా భావిస్తారు. ఆ విధంగానే జలాశయం ప్రజలకు సాంత్వనను ఇస్తుంది.ఈ కవితా పంక్తిలో భక్తి,కృతజ్ఞత,ప్రకృతి సౌందర్యాలు ఒదిగి ఉన్నాయి.మానేరు జలాశయాన్ని భువనేశ్వరి మాతగా నిండు చంద్రునిగా వర్ణించిన తీరు అద్భుతంగా ఉంది.
    “ముంపు గ్రామాల ప్రజల సమస్యలకు/
    మద్యస్థం కాకుండా ఆయవు పట్టువై../ఆధార శిలవై .. నిలువు తల్లీ!/ఈ కవితా పంక్తులు మానేర్ జలాశయ నిర్మాణం వల్ల ముంపుకు గురైన ప్రజల మనో వేదనను,వారి ఆశలను నమ్మకాన్ని ఆవిష్కరించే హృద్యమైన సాహిత్య భావ రేఖలుగా నిలుస్తాయి.కవి తల్లి రూపంలో మానేర్ జలాశయాన్ని సంబోధించి ప్రజల తరపున ఆమెను ప్రార్థిస్తున్నాడు.
    జలాశయం నిర్మాణం వెనుక వేలాది కుటుంబాల త్యాగం దాగి ఉంది.వారి ఇండ్లు,పంట పొలాలు, జ్ఞాపకాలు నీటి ముంపులో కలిసి పోయాయి.కవి ఈ బాధను గుర్తించి ఆ ప్రజల సమస్యలకు పరిష్కరించాలని ఆర్తిగా కోరుతున్నాడు.
    “మద్యస్థం కాకుండా ఆయు పట్టువై../ఇక్కడ కవి మానేరు జలాశయాన్ని నిర్లిప్తంగా,నిష్క్రియంగా ఉన్నట్లు కాకుండా,ఆయువు పట్టుగా మారమని కోరుతున్నాడు.ఈ తల్లి వంటి జలాశయం తమ బాధల్ని దూరం చేయడంలో సహకరించి తోడ్పాటును అందించాలి అని కవి కోరుతున్నాడు.
    “ఆధార శిలవై .. నిలువు తల్లీ!/ఈ కవితా పంక్తిలో భావ వ్యక్తీకరణ పరాకాష్టను చేరుతుంది.ఆధార శిల స్థిరత్వానికి,నమ్మకానికి,భరోసాకు ప్రతీక.మానేర్ జలాశయం కేవలం నీటి వనరుగా కాకుండా, ముంపు బాధితులకు ధైర్యం ఇచ్చే చిహ్నంగా నిలవాలి అని కవి కోరుతున్నాడు.
    “నిలువు తల్లీ! అనే సంబోధనలో మాతృత్వపు భావన చక్కగా ఉంది.ఈ కవితా పంక్తులలో కవి భావుకతను,మానవతా దృష్టిని,కృతజ్ఞతను, సామాజిక చింతనను సమన్వయపరచాడు. జలాశయానికి మానవ గుణాలను ఆపాదించడం ద్వారా ఉత్కంఠభరితమైన కవి హృదయం ప్రస్ఫుటమైంది.ఈ కవితలోని భావం బాధిత ప్రజల హృదయ స్పందన.మానేరు జలాశయం వల్ల తమ సర్వస్వాన్ని కోల్పోయిన వారికి అండగా ఉండాలి అనే విన్నపం ఈ కవితలో ప్రతిధ్వనిస్తుంది.కవి భక్తితో,ఆర్తితో మానేరు తల్లిని వేడుకోవడం చక్కగా ఉంది.
    “భూములిచ్చిన త్యాగధనులకు/సరి కానుకలిచ్చి ఆదుకో తల్లీ!/ఈ కవితా పంక్తులలో కవి మనసులో ఉన్న గాఢమైన కృతజ్ఞతా భావం,మానవతా దృక్పథం స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది.మానేర్ జలాశయం నిర్మాణం కోసం ప్రజల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.తమ భూములను ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సమర్పించిన వారే అసలైన త్యాగధనులు.సమాజ శ్రేయస్సు కోసం మహోన్నత త్యాగం చేసి తమ సర్వస్వం కోల్పోయిన ప్రజలకు సహాయం చేయాలి అని,ఆ తల్లి త్యాగధనులను మరువకుండా,వారిని కానుకలతో ఆదరించాలి అని కవి మనసారా ప్రార్థిస్తున్నాడు.ఈ కవితా పంక్తులలో త్యాగానికి గౌరవం,సామాజిక న్యాయం పట్ల ఉన్న ఆరాటం గాఢంగా వ్యక్తం అయింది.భూములు ఇచ్చిన రైతులు కేవలం భౌతికంగా నష్టపడడమే కాక వారు తమ ఆత్మీయ అనుబంధాన్ని కోల్పోయారు. కాబట్టి వారికి మానేరు జలాశయం ప్రాజెక్ట్ నుంచి సరైన న్యాయం జరగాలి అని కవి తన మనసులోని ఆకాంక్షను వ్యక్తం చేశాడు.భూములు ఇచ్చిన త్యాగధనుల పట్ల కవి చూపిన గౌరవం,మానేర్ తల్లిని ఆశ్రయించిన విధానం కవితకు హృద్యమైన స్ఫూర్తి నిచ్చింది.మిడ్ మానేర్ పై అద్భుతమైన కవితను రాసిన కవి సంకేపల్లి నాగేంద్ర శర్మను అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
    కవి సంకేపల్లి నాగేంద్ర శర్మ తేది 01 – 06 – 1960 రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ గ్రామంలో సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.వీరు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు కమలమ్మ,లక్ష్మీకాంతం గారలు.వీరు ఎం.ఏ. ఎల్ఎల్ బి, బిఇడి.పిజి డిప్లమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ డిగ్రీలను పొందారు.వీరు 1984 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల లో టీచర్ గా నియమింపబడ్డారు.వీరు 17 – 07 – 2017లో రిటైర్ అయ్యారు.వీరు ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.వీరు కరీంనగర్ లో స్వగృహం నిర్మించుకున్నారు.వీరు చరిత్ర పరిశోధకుడిగా ప్రఖ్యాతి గాంచారు. కవి నాగేంద్ర శర్మ ముద్రిత రచనలు : 1.హరివిల్లు సాహిత్య సంస్కృతిక వ్యాసాలు,2004.2. సబ్బినాడు ప్రతిభా మూర్తులు (సాహిత్య, సాంస్కృతిక,చారిత్రక వ్యాసాలు) 3.మానేరు తరంగాలు కవితా సంకలనం.4.జీవన వేదం కవిత్వం. 5.ఎములాడ మూలవాగు కవిత్వం. 6. తెలంగాణ వీణ (సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక వ్యాస సంపుటి) 7. నాగేంద్ర శర్మ కథలు. 8. బతుకు తెరువు కథలు. 9.తెలంగాణా ఉద్యమంలో చారిత్రికాంశాలు (సాంస్కృతిక రంగం ప్రధానంగా) 10.రాజన్న సిరిసిల్ల జిల్లా సాహిత్య చరిత్ర (ప్రచురణ తెలంగాణా సాహిత్య అకాడమి)11.వేములవాడ అనువంశిక బ్రాహ్మణ చరిత్ర. 12.వేములవాడ క్షేత్ర చరిత్ర (వ్యాసాలు), 2021.13) మూల వాగు మందారం షష్టిపూర్తి అభినందన సంచిక. 14.పాలపిట్ట సెప్టెంబర్ 2022 సాహితీ మాసపత్రిక కవి నాగేంద్ర శర్మ ఇంటర్వ్యూతో ప్రత్యేక సంచిక గా వెలువడింది.
    15.మిడ్ మానేర్ కవిత్వం,2024.
    వీరు సాహితీ గౌతమి సాహిత్య సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.వీరు కరీంనగర్ జిల్లా అరసం శాఖకు ఉపాధ్యక్షులుగా పని చేశారు.వీరు తెలంగాణా రచయితల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి అధ్యక్షుడిగా పని చేశారు‌.వీరు తెలంగాణా రచయితల వేదిక రాష్ట్ర శాఖకి సంయుక్త కార్యదర్శిగా పని చేశారు.వీరు తెలంగాణా పద్య కవితా సదస్సు కార్యవర్గ సభ్యులు.వీరు కరీంనగర్, శరత్ సాహితీ కళా స్రవంతి సంస్థకు, ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం అందుకున్నారు.ఇవి కాక ఇప్పటికీ కవి నాగేంద్ర శర్మ గారు తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

    November 28, 2025 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    Newer Posts
    Older Posts

    Recent Posts

    • వేకువ పాట
    • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
    • సనాతనమంటే?
    • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
    • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

    @2021 - All Right Reserved to Mayuukha The Magazine


    Back To Top
    మయూఖ
    • హోమ్
    • కవితలు
    • కథలు
    • ధారావాహిక నవల
    • వ్యాసాలు
    • బాల‌సాహిత్యం
    • ఇంద్రధనుస్సు
    • ఇంట‌ర్వ్యూలు
    • పుస్త‌క స‌మీక్ష‌
    • అనువాద సాహిత్యం
    • About Us