మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

అనుభూతి పరిమళాలు

by Radhika Suri July 29, 2026
written by Radhika Suri

మా బడి గుడిగంటల మోత గుర్తొచ్చినప్పుడల్లా తెలియని భావమేదో మదిలో మెదులుతూనే ఉంటుంది

తలుపులు తెరిచి కొత్త తరగతిలోకి రారమ్మంటున్న భావమేదో లీలగా
కదలాడుతూనే ఉంటుంది

నాన్న తెచ్చిన కొత్త పుస్తకాలు తెరిచినప్పుడు ముక్కుపుట్టల్ని తాకిన వింత వాసనలు …

అట్టలేసే సమయంలో జాగ్రత్తల చిరు హెచ్చరికలు ఇంకా చెవుల్లో మెల్లగా వినిపిస్తూనే ఉన్నాయి

బుజ్జిమేక పూల తోటలో తిరుగాడే చిత్తరవు కళ్ళముందు వింతగా ఇంకా సజీవంగా!

అమ్మ చెప్పిన ‘పాపాయి స్నానం’ కథలోని ఆరోగ్య రహస్యాలు బిబ్బీలడబ్బీ మతలబేంటని అమాయకత్వం నటిస్తూ అడిగిన
అక్క నటనాచాతుర్యానికి
అమ్మ మురిపెంతో చెప్పిన సమాధానం చెవులలో
ఇంకా పదిలంగానే!

కొత్త పుస్తకాల సంచితో
బడికి వెళ్ళినప్పుడు
నెచ్చెలుల మనోగతం
కాసింత అవగతమై …

ఒకింత విజయగర్వంతో
చేసిన అవివేకపు తప్పిదానికి అపరాధభావం ఇంకా
ఎక్కడో తడితడిగా అలాగే

టీచరమ్మల బెత్తపురుచుల్ని చవి చూడకున్నా
ఆటల సారు కోపానికి అరచేతులు బలైన
సందర్భాలు బోలెడన్ని

నాన్న బదిలీల మజిలీలో
కొత్త స్నేహాలు సంబరాన్నిచ్చినా దండించే గురువులు మదిలో మెదిలి కలవరపడ్డ
క్షణాలు చాలానే!

హెచ్చుతగ్గుల తేడాలు
ఎంచరాదంటూ నాన్న చేసిన నీతిబోధలు …

పెద్దలు కనబడగానే రెండు చేతులు పట్టుకుని జోడించడం నేర్పిన నాన్న సంస్కారానికి …

చదువుతో పాటు సాహిత్యంలో ఓనమాలు నేర్పిన తెలుగు మాస్టారుకు వందనాలు

తల నెరుస్తున్నా చదువులమ్మ గుడి తలుపుల మాటున దాగిన తలపులు ఇంకా కొత్తగానే!

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చీకటి నీడల్లో బాల్యం–మంజుల పత్తిపాటి

by Manjula Pathipati July 29, 2026
written by Manjula Pathipati

-రాక్షసుల చేతుల్లో నలిగిన బాల్యాలు,
చిన్నారి కళ్లలో చెదిరిన స్వప్నాల జాల్యాలు;
పుట్టకముందే పూడిపోయిన ఆశల గాల్యాలు,
నిశ్శబ్ద రాత్రుల్లో రోదించే మానవ బాల్యాలు.
బాల్యం అనే పువ్వులు వికసించకముందే వాడిపోయె..!
రక్కసుల స్పర్శలో పవిత్రత అంతా రాలిపోయెను;
నిర్దయ నేలపై కన్నీటి బిందువులు నిలిచిపోయెను,
మనసుల గాయాల్లో కాలం నిశ్శబ్దంగా నిలిచిపోయె..!

మృగాలు సైతం తలదించు నీచత్వం మనిషిలోనె కనిపించె..!
చట్టపు నీడలో దాగి దోషి నిర్భయంగా నడిచె..!
న్యాయం గదుల్లో ధనం కనిపించని గాలిలా ప్రవహించి
సత్యం మూగబోయి మౌనంలో కరిగిపోయె..!
ఆలయ గోడలపై ధర్మం అక్షరాలుగా నిలిచినను,
బడి గడపలపై నీతి సూక్తులు వెలిగినను,
లోపల న్యాయం ధన ప్రవాహంలో కొట్టుకొనిపోయె,
సమాజం మాత్రం మౌన సాక్షిగా నిలిచిపోయె..!

తల్లి తండ్రుల నిర్లక్ష్యంలో యువత మార్గం తప్పి
అజ్ఞానం ముసుగులో బాధ్యతల భారం మసకబారెను..!
చరిత్ర రాయబోయె నాయకులే చీకటిలో మునిగెను..!
మానవత్వం మౌనంగా కాలగర్భంలో కరిగెను..!

స్వప్నాల జాల్యాలు” అంటే కలల అల్లికలు, కలల పోగులు, కలల వలలు అనే భావం.
గాల్యాలు” అంటే గాలిలో కలిసిపోయిన ఆశలు, మాయమైన ఆశలు, చెల్లాచెదురైన ఆశలు అనే అర్థం.

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నిరంతర వాహిని

by Aruna Dhulipala July 29, 2026
written by Aruna Dhulipala

వియన్వీథిలో సప్తవర్ణ సింగిడిగా
పరచుకుంటుంది ఆమె గానం
జలదమేఘపు రాపిళ్ల నడుమ
మెరుపులా విచ్చుకుంటుంది
కరిమబ్బులు పేర్చిన దొంతరలో
ప్రతిధ్వనిస్తుంది ఉరుములా
జలపాతపు సోయగాల గలగలలో
పలుకరిస్తుంది శబ్దనాదంగా

మహార్ణవ లోతుల నుండి
ఉవ్వెత్తున ఎగిసిన కెరటమై
హృదయతీరాలను స్పృశిస్తుంది
మేదినీ వలయాన్ని
మట్టి పరిమళమై కప్పుతుంది
పంటచేల పరువాలలో
సుందర నందనమై వికసిస్తుంది
కొమ్మకొమ్మలో కూసిన కోకిలగా
దిగంతాలలో రాగమై విహరిస్తుంది

గున్న మావిళ్లలో స్నేహాలను పూయించినా
నెమలికి ఒయ్యారాలను నేర్పినా
పట్టపగలు వెన్నెలను కురిపించినా
ఆ ముగ్ధ మనోహర స్వరం
ఆమె రసనాంచలాన తేనెలూరుతూ
జనుల హృదంతరాళాలలో
సాగుతూనే ఉంటుంది శాశ్వతంగా
నిరంతర అమృతవాహినిగా!!

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సుస్వర విరించి

by Y. Sujatha July 29, 2026
written by Y. Sujatha

గానంతో
శ్రోతల తలల్ని
సర్పాలను చేసి ఆడించే
విద్వన్మణి !

గొంతులో
కోకిలమ్మను ఇముడ్చుకున్న
వశీకరణ వేత్త !

స్వరపేటికను
సరాగాలతో మెలికలు త్రిప్పే
గాంధర్వ సాధ్వి !

అణువణువునా
వేణు నాదం పలికించే
మధుర గాయని !

ఆబాల గోపాలాన్ని
అమృత గానంతో
‌ఓలలాడించే
మహతీ నాదం !

గళంతో
పరకాయ ప్రవేశం చేసి
పసిపాప కేరింతలా
అలరించే
మంత్ర స్వరూపిణి

గాయని జానకి
గాన సామ్రాజ్యంలో
మహా రాజ్ఞి !
సుస్వర విన్యాసంలో
సింహాసనేశ్వరి!

ఎస్.జానకీ అమర్ రహే
ఉత్తమ నేపథ్య గాయనీ
అమర్ రహే !

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

….క్లౌడ్ 9

by Prasen Bellamkonda July 29, 2026
written by Prasen Bellamkonda

రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు. “సెండ్.” రజని బొటనవేలు స్క్రీన్‌ను తాకడానికి ముందు ఒక నిముషం విరామం
తీసుకుంది. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందని ఆ అమ్మాయి నమ్మకం.
“నేను ఇంకేం చేయలేను. రేపు నన్ను బలవంతంగా నిశ్చితార్థానికి తీసుకెళ్తున్నారు. ఇవాళ రాత్రి పన్నెండున్నరకు పాత రైల్వే స్టేషన్‌కి
రా. వెళ్లిపోదాం.”
స్క్రీన్ మీద చిన్న గుండ్రటి చుక్క తిరుగుతోంది.
Sending…
ఆమె పెదవుల మీద చిన్న నవ్వయితే ఉంది కానీ మనసులో ఆందోళన. భయం.

“నెట్ స్లోగా ఉన్నట్టుంది.” అనుకుంటూ ఫోన్‌ గుండెలకు హత్తుకుంది.
అదే సమయం. మరో చోట మరో ఇంట్లో… సిద్ధార్థ్ చివరిసారి తన అప్లికేషన్‌ను చదువుకున్నాడు. ఏడు సంవత్సరాల నిరుద్యోగం.
నాలుగు పోటీ పరీక్షలు. ఐదారు ఇంటర్వ్యూలు. ఈసారి ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం. చూపుడు వేలు బటన్ ను తాకడానికి ముందు
ఒక నిముషం విరామం తీసుకున్నాడు. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందని అతని ఆశ.
“Submit.”
స్క్రీన్ మీద Uploading documents అని గిరగిరా తిరుగుతుంటే అతడు కుర్చీలో వెనక్కి వాలిపోయి “హమ్మయ్య” అనుకున్నాడు.
వంద కిలోమీటర్ల దూరంలో రైతు రామయ్య మూడోసారి పంట బీమా క్లెయిమ్ చేస్తున్నాడు. లోపల ఆశ. ఆకాంక్ష.
” ఇప్పుడు అప్‌లోడ్ అవుతోంది బాబాయ్. ఈసారి డబ్బులు తప్పకుండా వస్తాయి.” గ్రామ సచివాలయం ఆపరేటర్ అన్నాడు.
రామయ్య నవ్వాడు.
“ఈసారి రాకపోతే అప్పు ఇచ్చినోడే నా పొలం లాగేసుకుంటాడు.”
నగరంలోని ఓ చిన్న ఆసుపత్రి. ఒక గర్భిణికి రక్తపోటు ప్రమాద స్దాయిలో ఉంది. డాక్టర్ అత్యవసరంగా మెడికల్ రికార్డులు స్పెషాలిటీ హాస్పిటల్‌కి పంపించాడు.
“వెంటనే బెడ్ అలాట్ చేయండి.”
ఫైల్ అప్‌లోడ్ అవుతోంది.
ఇంకెక్కడో… ఒక యువతి. పదకొండేళ్ల వైవాహిక హింస తర్వాత. మొట్టమొదటిసారి ధైర్యం చేసింది. ప్రభుత్వ మహిళా రక్షణ పోర్టల్‌లో కంప్లైంట్ రాసింది. చివర్లో చాలా సేపు చూసింది.
తర్వాత “Submit.”
చూపుడు వేలు బటన్ ను తాకడానికి ముందు ఆమె ఒక నిముషం విరామం తీసుకుంది. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందనిఆమె విశ్వాసం.
కళ్లలో నీళ్లు. “ఇక నేను ఒంటరిదాన్ని కాదు ” అనుకుంది రెండరింగ్ అనే అక్షరాలను చూస్తూ.
విదేశీ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌ గడువుకు చివరి రోజు. ఒక పేద విద్యార్థి తన జీవితాన్నంతా ఒక PDF ఫైల్‌గా అప్‌లోడ్ చేస్తున్నాడు.
చూపుడు వేలు బటన్ ను తాకడానికి ముందు ఒక నిముషం విరామం తీసుకున్నాడు. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందని అతని ఆశ.
విద్యార్ది కళ్లలో నెరవేరుతున్న కల ఆనవాళ్లు ఇటునుంచి అటు కదులుతున్న బాణం గుర్తులోమెరుస్తున్నాయి.
— ….. …….
జీవితం జరిగిన సంఘటనల చరిత్ర మాత్రమే కాదు. జరగకుండా పోయిన అవకాశాల సమాధి కూడా.
మనం బతికిన జీవితానికే జ్ఞాపకాలు ఉంటాయనుకుంటాం. జరగకుండా పోయిన జీవన శకలాలకూ జ్ఞాపకాలుంటాయి.
అయితే అవి గుర్తుంటాయి కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు.
రాత్రి పన్నెండున్నర. పాత రైల్వే స్టేషన్. రజని గంటసేపు ఎదురు చూసింది. గడియారం వైపు గేటు వైపు ఎడతెరపి లేకుండా చూస్తూనే ఉంది. ఒకటిన్నరైంది. అతను రాలేదు. రెండైంది. అతను రాలేదు.
చివరికి “భయపడ్డాడు ” అని గొణుక్కుని విషాదంగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది.
“పెళ్లి ఫోటోలన్నింటిలో రజని నవ్వుతోంది. కానీ పాత రైల్వే స్టేషన్ దగ్గర అర్థరాత్రి నిలబడ్డ అమ్మాయి ఛాయలు మాత్రం ఏ ఫోటోలోనూ లేవు.”
సిద్ధార్థ్ ప్రతిరోజూ వెబ్‌సైట్ చూస్తున్నాడు. “Application not found ” అంటోందది.
“నేనే ఏదో తప్పు చేశానేమో ” అనిపించిందతనికి . కళ్ల నిండా నిరాశ. తప్పదు మరి. ఇంకో సంవత్సరం అదే యుద్దానికి కొత్తగా సిద్ధమయ్యాడు.
రామయ్య… ప్రతి సోమవారం బ్యాంకుకి వెళ్తూనే ఉన్నాడు. “ఇంకా పడలేదు ” అనేదే శాశ్వత సమాధానం.
చివరకు పొలం అమ్మేశాడు. అప్పిచ్చినవాడు లాక్కున్నాక అమ్మక తప్పని పరిస్తితి.
ఆ మహిళ…
“మీ కంప్లైంట్ మా దగ్గరకు రాలేదు ” అనే సమాధానం వినీ వినీ విసుగేసి మళ్లీ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.
హింసకు అలవాటు పడడాన్ని అలవాటు చేసుకుంది. దుఖ్కంలో హాయిని వెతుక్కునే కళ నేర్చుకుంది.
ఆ విద్యార్థికి డెడ్‌లైన్ దాటిపోయిందని మెయిల్ వచ్చింది.
మరో సంవత్సరం వేచి చూడాల్సిందే, తప్పదు.
ఆ ఆసుపత్రి బెడ్ ఖాళీగానే ఉండిపోయింది. ఎందుకంటే ఆ రికార్డులు అక్కడికి చేరలేదు.
కాలచక్రాన్ని కొంచెం వెనక్కి తిప్పితే..
నగర శివార్లలో మిల మిలా మెరుస్తున్న వెలుగులలో అతి పెద్ద భవనం. వేలాది కంప్యూటర్లు. ఎయిర్ కండిషనర్లు. నీలి లైట్లు. అక్కడే
అందరి కలలు ఒక్కచోటికి పోగవుతున్నాయి.
ఒక సెక్యూరిటీ గార్డు టీ తాగుతున్నాడు. “ర్యాక్-17 హీట్ ఎక్కువగా ఉంది.” ఒక టెక్నీషియన్ అన్నాడు.

” కొద్దిసేపట్లో వెళ్లి చూస్తా ” అననైతే అన్నాడు కానీ అతను వెళ్లలేదు.
రాత్రి 10:41. మొదట చిన్న పొగ. తర్వాత చిన్న మంట. ఒక వైర్. ఒక స్పార్క్. ఒక అలారం. ప్రమాద హెచ్చరిక ఒక నిమిషంలో.
మరో ర్యాక్. ఇంకో ర్యాక్. సర్వర్లు. స్టోరేజ్. బ్యాకప్. పొగతో నిండిపోయాయి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా షట్‌డౌన్ అయింది.
కొంత డేటా బతికిందేమో తెలియదు. కొంత డేటా శాశ్వతంగా మాయమయింది. ఏవి పోయాయో ఏవి ఉన్నాయో అప్పుడు ఎవరికీ
తెలియదు.
ఆ అగ్నిప్రమాదం గురించి పేపర్లో ఒక్క చిన్న వార్త వచ్చింది.
“ప్రైవేట్ డేటా సెంటర్‌లో మంటలు. సేవలకు స్వల్ప అంతరాయం.”
అంతే. ఆ వార్త చదివిన వాళ్లలో చాలా మంది తమ జీవితంలోని ఆ ఒక్క రోజు కూడా అదే మంటల్లో కాలిపోయిందని తెలుసుకోలేదు.
తెలిసే అవకాశం లేదు.

…….

మరుసటి రోజు డాటా సెంటర్ లో కాలిపోయిన ర్యాక్‌లను క్రేన్‌తో బయటకు తీస్తున్నారు. గాలిలో ఇంకా కాలిన ప్లాస్టిక్ వాసనే ఉంది.
ఒక ఇంజనీర్ కాలిపోయిన హార్డ్‌డిస్క్‌ను చేతిలో అటూ ఇటూ తిప్పి చూస్తూ అన్నాడు.
“వింతగా ఉంది కదా…” పక్కనున్న మరో ఇంజనీర్ తలెత్తి చూశాడు.
“ఏమిటి?”
“ఇది మనకు ఒక హార్డ్‌డిస్క్ మాత్రమే.” కొద్దిసేపు ఆగి మళ్లీ అన్నాడు.
“కానీ ఎవరికో ఇది ఇంటి నుంచి పారిపోవాలని పంపిన చివరి మెసేజ్ అయుండొచ్చు.”
“అది ఎవరికో ఉద్యోగ దరఖాస్తు అయుండొచ్చు.” ఇంకో కాలిపోయిన సర్వర్ వైపు చూపించాడు.
మరో ర్యాక్. “అది రైతు బీమా క్లెయిమ్ అయుండొచ్చు.”
“లేదా…” అని రెండో ఇంజనీర్ మెల్లగా అన్నాడు.
“…ఆసుపత్రికి చేరాల్సిన ఒక మెడికల్ ఫైల్.”
ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డారు. బూడిదలో బూట్ల చప్పుళ్లు వినిపించాయి. కొద్దిసేపటి తర్వాత ఇంజనీర్ నవ్వాడు.
“మనం సర్వర్లు కాలిపోయాయని రిపోర్ట్ రాస్తాం.”
రెండో ఇంజనీర్ తల అడ్డంగా ఊపాడు. “లేదు.”
“మరి?”
“ఇది అగ్నిప్రమాదం కాదు.”
“మరి?”
“ఆశల దహనం.” ఇంజనీర్ ఏమీ మాట్లాడలేదు. కాలిపోయిన కేబుల్‌ను కాలితో పక్కకు జరిపాడు.
“చిన్నప్పుడు మా ఊర్లో పోస్ట్‌బాక్స్‌కి ఎవరో నిప్పు పెట్టారు. అప్పుడూ ఎన్ని ఆశలు కాలిపోయాయో ఎవరికీ తెలియదు.”
అతడు బూడిదను చేతిలోకి తీసుకున్నాడు. ” అప్పుడు మనుషులు ఆశలను కవర్లలో పెట్టి పంపేవాళ్లు “
చేతిలో బూడిదను నెమ్మదిగా జార్చాడు.
“ఇప్పుడు ఫైళ్లలో పెట్టి క్లౌడ్‌లో పెడుతున్నారు.” కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు.
“ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా …గమ్యానికి చేరని సందేశాలు మాత్రం చావడం లేదు.”
రెండో ఇంజనీర్ చిరునవ్వు నవ్వాడు.
“సందేశాలు మారాయి. మధ్యవర్తులు మారారు. సర్వర్లు మారాయి. కానీ… ఇద్దరూ బూడిదను చూస్తూ ఒకేసారి అన్నారు.
“ఎదురుచూపు మాత్రం మారలేదు.”
మళ్లీ నిశ్శబ్దం. కొద్దిసేపటికి మొదటి ఇంజనీర్ అడిగాడు.
“ఈ బూడిదలో ఎంత డేటా ఉండి ఉంటుంది?” రెండో ఇంజనీర్ తల ఊపాడు.
“డేటా కాదు. జరగకుండా అదృశ్యమైన అనుభవాలు.”
“అర్థం కాలేదు.”
“కొన్ని ప్రేమలు కలవలేదు. కొన్ని ఉద్యోగాలు రాలేదు. కొన్ని ఫిర్యాదులు వినిపించలేదు. కొన్ని అప్పులు తీరలేదు. కొన్ని ప్రాణాలు
ఆసుపత్రికి చేరలేదు. అవి విడివిడిగా జరిగిన దురదృష్టాల్లా కనిపిస్తాయి. కానీ…” అతడు బూడిద కుప్పలోంచి కనపడుతున్న ఒక
నల్లటి చిప్‌ను తీసి పట్టుకున్నాడు.
“బహుశా… అవన్నీ ఒకే రాత్రి ఇక్కడే చనిపోయాయి.”
చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. బయట చెత్త ట్రక్కు హారన్ వినిపించింది. కార్మికులు కాలిపోయిన ర్యాక్‌లను ట్రక్కులోకి
విసురుతున్నారు.
ఇంజనీర్ ట్రక్కు వైపు చూస్తూ మెల్లగా అన్నాడు “వాళ్లు పారేస్తోంది ఇనుమునే అనుకుంటున్నారు, కానీ కాదు, అది జీవించలేకపోయిన
జీవితాల చరిత్ర.”
ఒక ఇంజనీర్ చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత బూడిదనే చూస్తూ మెల్లగా అన్నాడు.
“మనం బతికిన జీవితానికి రికార్డులు ఉంటాయి. మరి బతకలేకపోయిన జీవితాలకు?”
రెండోవాడు ఆకాశం వైపు చూశాడు. “వాటిని క్లౌడ్ కూడా నిల్వచేయదు.”
…….. ……… ……….

కొన్ని నెలల తర్వాత…
ఆ కాలిపోయిన సర్వర్ల బూడిద కలిపిన మట్టిలో కొన్ని మొక్కలు మొలిచాయి. వాటి వేర్లలో ఏముందో ఎవరికీ తెలియదు.
బహుశా…ఒక ప్రేమలేఖ. ఒక ఉద్యోగం. ఒక రైతు పొలం. ఒక పుట్టని శిశువు. ఒక స్త్రీ ధైర్యం. ఒక విద్యార్థి కల.
అందరూ వాటిని సాధారఃణ చెట్లనే అనుకున్నారు. కానీ ప్రతి వసంతంలో అవి పచ్చగా మారినప్పుడల్లా,
గమ్యాన్ని చేరలేకపోయిన సందేశాలన్నీ ఇంకా పూర్తిగా చనిపోలేదని ప్రకృతి ఒక్కసారైనా గుర్తు చేసేది.

రైటర్స్ నోట్
……………

ఈ కథ చదవగానే సాంకేతికంగా ఇలా జరగదు అనిపించడం ఖాయం. కానీ ఈ కథ ఆలోచన రావడానికి కారణం అవునా ఇలా కూడా జరుగుతుందా అనిపించిన ఈ సంఘటనే . ఇది ఎక్కడో చదివినపుడు ఈ వస్తువు మెరిసింది. ఇదిగో ఇది చదివితే ఈ కథ ఎలా
సాధ్యమో అర్దమవుతుంది.

The OVHcloud data center fire in Strasbourg, France, March 2021. One of Europe’s biggest
cloud providers had an entire building (SBG2) burn
down. Companies and individuals

who hosted email servers there without offsite backups permanently lost mail — including

messages that had arrived but hadn’t been read yet, and messages in transit that were
queued on those servers. Some small businesses lost years of correspondence overnight.

That’s a documented, verifiable event.
How the “in transit” loss works technically: when a mail can’t be delivered instantly, it sits

in a queue on an intermediate server, retrying for typically 24–72 hours. If that server is
destroyed (fire, flood, disk failure) while the mail is queued, the message is simply gone —
and the “delivery failed” notice that should go back to the sender is also generated by that
same dead server, so no notification ever arrives. Both ends stay silent.

మార్చి 2021లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో జరిగిన OVHcloud డేటా సెంటర్ అగ్నిప్రమాదం. దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ.

యూరప్‌లోని అతిపెద్ద క్లౌడ్ సేవల సంస్థల్లో ఒకటైన OVHcloudకు చెందిన SBG2 అనే మొత్తం డేటా సెంటర్ భవనం పూర్తిగా
దగ్ధమైంది.
ఆ డేటా సెంటర్‌లోనే తమ ఈ-మెయిల్ సర్వర్లను హోస్ట్ చేసుకుని, వాటికి వేరే ప్రాంతంలో (offsite) బ్యాకప్‌లు ఏర్పాటు చేయని
సంస్థలు, వ్యక్తులు తమ ఈ-మెయిళ్లను శాశ్వతంగా కోల్పోయారు. అందులో ఇప్పటికే సర్వర్‌కు చేరుకున్నప్పటికీ ఇంకా చదవని
మెయిళ్లు కూడా ఉన్నాయి. అలాగే, గమ్యస్థానానికి చేరే ప్రయత్నంలో ఆ సర్వర్ల క్యూలో (queue) వేచి ఉన్న “ప్రయాణంలో ఉన్న”
(in transit) ఈ-మెయిళ్లు కూడా పూర్తిగా అదృశ్యమయ్యాయి. కొన్ని చిన్న వ్యాపార సంస్థలు ఏళ్ల తరబడి సాగిన తమ వ్యాపార
ఉత్తరప్రత్యుత్తరాలన్నింటినీ ఒక్క రాత్రిలోనే కోల్పోయాయి. ఇది నమోదైన, ధ్రువీకరించదగిన వాస్తవ సంఘటన.

“In Transit” లో ఉన్న ఈ-మెయిల్ ఎలా శాశ్వతంగా పోతుంది?

సాంకేతిక వివరణ

ఒక ఈ-మెయిల్‌ను వెంటనే గమ్యస్థానానికి అందించడం సాధ్యం కాకపోతే, అది మధ్యలో ఉన్న ఒక SMTP సర్వర్‌లోని క్యూ
(queue) లో తాత్కాలికంగా నిల్వ చేయబడుతుంది. అక్కడి నుంచి సాధారణంగా 24 నుంచి 72 గంటల పాటు మళ్లీ మళ్లీ పంపే
ప్రయత్నం (retry) చేస్తుంది. అయితే ఆ సమయంలోనే ఆ సర్వర్ అగ్నిప్రమాదం, వరద, డిస్క్ వైఫల్యం లేదా మరే ఇతర
విపత్తుతో పూర్తిగా నాశనమైతే, ఆ క్యూలో ఉన్న ఈ-మెయిల్ కూడా శాశ్వతంగా అంతరించిపోతుంది.
అంతేకాదు, ఆ మెయిల్ పంపలేకపోయామని పంపిన వ్యక్తికి వెళ్లాల్సిన “Delivery Failed” (డెలివరీ విఫలమైంది) అనే
నోటిఫికేషన్ కూడా అదే సర్వర్ నుంచే ఉత్పత్తి చేయబడాలి. కానీ ఆ సర్వరే నాశనమైపోవడంతో ఆ హెచ్చరిక కూడా ఎప్పటికీ
పంపబడదు.
ఫలితంగా
పంపిన వ్యక్తికి తన మెయిల్ చేరలేదన్న సమాచారం అందదు.
స్వీకరించాల్సిన వ్యక్తికి ఆ మెయిల్ ఎప్పటికీ అందదు.
రెండు వైపులా సంపూర్ణ నిశ్శబ్దం.
ఆ ఈ-మెయిల్ ఎప్పుడూ ఉనికిలోనే లేనట్టుగా కాలంలో కలిసిపోతుంది.

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“సృష్టి ప్రతిబింబం”… ఈ మట్టి గీతం (సమీక్ష)

by KOORA SHASHIKANTH GUPTA July 29, 2026
written by KOORA SHASHIKANTH GUPTA

చరా చర జీవ నిర్జీవ చేతన అచేతన ప్రాణకోటి ప్రతిబింబమే ఈ మట్టి గీతం.
ఒక పాఠం లా మొదలై ఒక భావంలా ముగిసిన అలుపెరిగిన ప్రయత్నం ఈ దీర్ఘ కవిత.
“మట్టి ఆరడుగులవుతుంది,
మట్టి అమ్మ ఒడి అవుతుంది…
సుఖదుఃఖాలకతీతమైన సమాధి అవుతుంది…
అని ఒక జీవి తన జీవన క్రమంలో మట్టితో పెనవేసుకున్న విడదీ యరాన్ని ఆవశ్యకతను తెలియజేస్తుంది ఈ కవిత..
సృష్టికి భూమాతకి భూమాతని తల్లిలా కొలిచి ఆరాధించే భారతీయ హైందవ సనాతన ధర్మ సంక్లిష్ట పరమార్ధాన్ని అందులో మనిషి పోషించే కీలక పాత్రని కవయిత్రి డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు మట్టి గీతం దీర్ఘ కవితగా మలచడం అభినందనీయం.
“నీ వేళ్ళని దాచుకొని
నిన్ను ఎదగనిచ్చేది భూమి కదా !
సారం లేని నిస్సారవనిగా
అమ్మ నేడ్పించడం
నీ కాళ్లు తెంచుకొని పరిగెత్తడమే !
అని అనడంలో కవయిత్రి అనుభవం ప్రస్ఫుటిస్తుంది. మనిషి తను ఆధారపడిన భూమిని తన స్వార్థంతో నాశనం చేస్తూ తన సొంత మనుగడ ప్రశ్నార్థకంగా మార్చి ఎలా మనగలడనే వాదాన్ని నిస్సంకోచంగా నిరూపించారు కవయిత్రి సుజాత శేఖర్.
మట్టి గీతం సాంతము ఒక నదిలా పరవళ్ళు తొక్కుతూ తన భావజాలాన్ని ఇమిడ్చిన వైనం కొనయాడదగినది.
మట్టి ప్రాధాన్యతను వివరిస్తూ మనుషులు తప్పించుకోలేని ఒక బాధ్యత ఉందని తన నిర్లక్ష్యం సమస్త జీవరాశుల భవిష్యత్తును అంధకారంగా మారుస్తుందని నిక్కచ్చితంగా చెప్పారు.
వనరుల్ని విచ్చలవిడిగా వినియోగిస్తే నిస్సారమైన నిస్తేజమైన భూమాత ప్రకృతి రూపంలో పలు రకాలుగా ప్రళయతాండవమై మనిషిని వరదలు సునామీలు భూకంపాలుగా హెచ్చరించాయ న్నారు.
డాక్టర్ బండారు సుజాత శేఖర్ ఒక ఉపాధ్యాయునిగా, విద్యావేత్తగా,సామాజిక కార్యకర్తగా, గాయనిగా మనకు పరిచయమే. అన్నింటిని మించి ఓ అమ్మగా, అమ్మమ్మగా నానమ్మగా తన వంతు ప్రేమను బాధ్యతని కుటుంబానికి పంచుతూ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించారో ఒక రచయిత్రిగా పాఠకులకు ఈ దీర్ఘ కవిత మట్టిగీతం అందించడము అంతే ప్రశంసనీయం. అలాగే ప్రతి జీవి తన కర్తవ్య బాధ్యతలను నిస్సందేహంగా నిర్వర్తించాలని ప్రస్తుత సమకాలీన వాస్తవిక పరిస్థితులను వివరిస్తూ పొందుపరిచిన ప్రతిరూప ప్రతిబింబం ఈ మట్టి గీతం దీర్ఘ కవిత. నాటి విశ్వంభర, దీర్ఘ కవితలను గుర్తు చేస్తుందనవచ్చు.
“ఇది మట్టి గీతం ,
ఇది మహోజ్వల గీతం, అమ్మ చనుబాల ఉద్బోధ గీతం…. అంటూ ఉద్బోధ చేసిన రీతి జనులందరికి కనువిప్పుగా అణువు నుండి అణ్వాయుధం వరకు పలు కోణాలను వివరించిన తీరు ప్రశంసనీయంగా ఉంది.
నేటి యువత ఒక్క నిమిషం ఆలోచించే రీతిలో ఉన్న ఈ మట్టి గీతం అన్ని వయసుల వారిని కచ్చితంగా ఆలోచింప చేస్తుంది. భూమి తల్లి మట్టి రూపాలను తాత్వికంగా, మరెన్నో ఎన్నో కోణాలుగా చూపించిన కవయిత్రికి అభినందనలు, వందనాలు.

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన తెలుగు నాటకాలు

by Sammeta Vijaya July 29, 2026
written by Sammeta Vijaya

తరమెల్లిపోతున్నదో

రస రంజని ఆధ్వర్యంలో కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూరు వారు సమర్పించిన సాంఘిక నాటకం ‘తరమెల్లి పోతున్నదో’. ఇది రవీంద్ర భారతిలో డిసెంబర్ 24,2025 తేదీన ప్రదర్శించబడింది. ఆ తర్వాత అనేక పరిషత్తులలో ఈ నాటిక ప్రదర్శన జరిగింది. రచన దర్శకత్వం శ్రీ రామకృష్ణ బొమ్మిడి.
సమాజంలో కుటుంబ బాంధవ్యాలు అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఆ అనురాగాలు క్రమేణ నశించిపోతూ న్యూక్లియర్ కుటుంబాలు ఆవిర్భవిస్తున్నాయి. ఎవరికి వారు వారి కుటుంబం మట్టుకే ఉండాలని ఆలోచనతో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘తరమెళ్లిపోతున్నదో ‘ అనే నాటకం మన సమాజంలో కుటుంబ వ్యవస్థను ప్రశ్నిస్తూ ఆలోచించే దిశలో సాగింది.
శ్రీ బొమ్మిడి రామకృష్ణ:
తన ఆరవ ఏట నుంచి హైస్కూల్లో నాటకాలు వేయడం ప్రారంభించిన బొమ్మిడి రామకృష్ణ గారు అనేక నాటకాలలో నటించారు. 2003 నుంచి నటుడిగా ఉంటూ గత పది సంవత్సరాల నుంచి దర్శకుడిగా నాటికలు నాటకాలు రచించి ప్రదర్శింపజేశారు. స్వర్గీయ కరణం సురేష్ గారి శిష్యుడిగా ఎదిగిన వీరు నాయుడు గోపి గారి శిష్యరికంలో ఎన్నో నాటికలు,నాటకాలలో నటించారు. పౌరాణిక నాటకాలలో కూడా నటించారు. వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ప్రస్తుతం గుంటూరు సిటీ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా వృత్తిని కొనసాగిస్తున్నారు. వీ రు నటించిన నాటికలు నేటి నిజం, తప్పటడుగులు, నేలమ్మ,కర్మసాక్షి, నగ్నవాదం నాలోన నీవే, తరమే వెళ్ళిపోతున్నదో, ఇది మన కథ,దళిత గోవిందం…నాటకాలు భారత భాగ్య విధాత,ఐలేసో ఐలే ఐలెసో. 5 నంది అవార్డులు,2 గరుడ అవార్డులు,600 పరిషత్ అవార్డులు అందుకున్నారు. బొమ్మిడి రామకృష్ణ గారు నటుడిగా రచయితగా దర్శకుడుగా నాటక రంగంలో ఇప్పటికీ విశేషమైన కృషిని నాటక రంగానికి అందిస్తూ నాటకం పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారు.
కథా సారాంశం : మరణం వరకు అందరూ బ్రతుకుతారు కానీ మరణం తర్వాత కూడా బ్రతికే వాడే నిజమైన మనిషి.”తోడునీడగా ఉంటేనే బలంరా తోబుట్టువు పుట్టుక అది తెలియని వాడికి ఆస్తులు అంతస్తులు ఉన్న ఒంటరే ఇక”.
దశరథ రామయ్య శేషయ్య ఇద్దరు ప్రాణ స్నేహితులు. శేషయ్య తండ్రి తనని బాగా చదివిస్తాడు శేషయ్య ఉపాధ్యాయ వృత్తిలో ప్రిపేర్ అవుతాడు కానీ దశరథ రామయ్య పేదరికంలో పుట్టడం వలన తన తండ్రి చదివించకపోవడంతో కూలీనాలీ చేసుకుని బతుకుతాడు. దశరథ రామయ్యకు ఇద్దరు కుమారులు పెద్దవాడు రాఘవరావు రెండోవాడు రంగనాథం. భార్య చిన్న వయసులోనే మరణిస్తుంది. శేషయ్యకు దశరథ రామయ్య తన ఇద్దరు కుమారులలో ఒకడైన మా రాతలు మార్చాలిరా అందుకు నా ప్రాణాన్ని అయినా పణంగా పెట్టి చదివిస్తాను అని మాట ఇస్తాడు. పెద్ద కొడుకు రాఘవరావు బాగా చదువుతాడు.
కాలక్రమేనా అన్నదమ్ముల జీవితాలలో జరిగిన అనేక సంఘటనలు వారి మధ్య అంతరాలు సృష్టిస్తాయి.ఎవరికి వారే వేరవుతారు కాలం ఎవరికోసం ఆగదు ఇలా ఉండగా ఒకరోజు శేషయ్య మాస్టారు ఆఫీస్ లో పని ఉండి వచ్చి అక్కడ ఆటో డ్రైవర్ రూపంలో ఉన్న రంగనాధాన్ని చూస్తాడు. రాఘవరావుని నిలదీసి అడిగితే విషయం అంతా తెలుస్తుంది. ఈలోపల రంగనాథం మరణిస్తాడు బాధపడిన శేషయ్య తండ్రి సంపాదించిన ఆస్తులు అంతస్తులు పంచుకోవచ్చు కానీ చదువుని పంచుకోలేమని, ఆస్తులు పంచుకునే విషయంలో కొంతమంది అన్నదమ్ములు జీవితాంతం పలకరించుకోరని,వారి వారి ఇళ్లల్లో ఫంక్షన్లు జరిగితే ఊరందరినీ పిలుస్తారని తోడబుట్టిన వారిని మాత్రం పిలవరని ఇదేనా గర్భాన పుట్టిన వారి బంధం రక్తం సంబంధం తరం వెళ్ళిపోతుందో అని చెప్పినా వినని సమాజాన్ని ఈ తరం వెళ్ళిపోతే రానున్న తరాల సంగతి ఏంటని హెచ్చరిస్తాడు.
పాత్రలు పాత్రధారులు:
రాఘవరావు -రామకృష్ణ బొమ్మిడి,లక్ష్మి- డా. శ్రీజ సాదినేని, అనసూయ -శ్రీమతి నాగరాణి, రంగనాధం -శ్రీ అండ్రాజు జనార్ధన వర్మ, శేషయ్య- పోగొర్తి నాగేశ్వరరావు.
సాంకేతిక నిపుణులు : సంగీతం శ్రీ వెంకటరమణ
మేకప్, రంగాలంకరణ,లైటింగ్- శ్రీ శివ
అందమైన సెట్టింగ్ తో చక్కని గీతంతో నాటకం కనులకు కట్టినట్లుగా ప్రదర్శించబడింది నాటకంలోని నటీనటులందరూ తమ తమ పాత్రలకు జీవం పోశారు. ఈ నాటకంలో తమ్ముడి పాత్ర పోషించిన జనార్ధన వర్మ ఈ నాటకంలో జీవించి ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్లినా వారి నటన శాశ్వతంగా చూసిన వారందరి హృదయాలలో నిలిచి ఉంది.
నాటకం రచన దర్శకత్వం నటన మూడింటిని సమపాళ్లలో ఎక్కడ దేనికి లోటు లేకుండా ఆద్యంతం నడిపించిన బొమ్మిడి రామకృష్ణ గారి కృషి ప్రశంసనీయం. అన్న పాత్రలో అద్భుతమైన నటనని అందించారు.
లక్ష్మీ పాత్రలో శ్రీజ సాదినేని తన సహజమైన నటనని పోషించారు. అనేక నాటికలు నటించి దర్శకత్వం వహించిన శ్రీజ సాదినేని సహకారం ఈ నాటికకు వన్నెతెచ్చింది.
చిన్న చిన్న విషయాలకి తగువులాడి వాటిని మనసులో పెట్టుకొని జీవిత కాలం కొనసాగించాల్సిన అనుబంధాలను కుటుంబంలోని కుటుంబ సభ్యులు నేడు కోల్పోతున్న సందర్భంలో ఈ నాటకం ఒక కనువిప్పు మంచి నాటకాన్ని అందించిన ఘనత రసరంజనిదే!

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన తెలుగు నాటకాలు

by Sammeta Vijaya July 29, 2026
written by Sammeta Vijaya

వీడేం మగాడండి బాబూ!

ఉత్తమ హాస్య నాటికలు 50 హాస్య వ్యంగ్య నాటికల సుమహారం అనే పుస్తకావిష్కరణ సభకు తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్లడం జరిగింది ఈ పుస్తకం సంపాదకుడు వల్లూరు శివప్రసాద్ సహా సంపాదకుడు గంగోత్రి సాయి గారు తాడేపల్లి గుంటూరు జిల్లా వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకం ఆవిష్కరణ తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఒక హాస్య నాటిక ఈ పుస్తకంలోని చివరి నాటిక వీడే మగాడండి బాబూ! రచన పిటి మాధవ్. దర్శకత్వం జి ఎస్ చలపతి.
రచయిత పిటి మాధవ్:
నటుడు, దర్శకుడు, నాటక రచయిత. పబ్లిక్ పార్క్ నల్లకోటు నవ్వింది నన్ను ఎక్కించండి బోను ఇల్లు నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత ముగింపు లేని శిక్ష జనరల్ బోగీలు 27వ మైలురాయి మొదలైన 30 నాటికలు రచించారు జీరో అవర్,తల్లి దరఖాస్తు ,తెల్లని కాగితాలు, లయతప్పిన కోయిల ,తెల్లకోటు తెల్లబోయింది నాటకాలు వివాద వివాహం, ప్రామిసరీ నోట్, వెళ్ళిపోకే చిన్నమ్మ,దేవుడు ఇచ్చిన తీర్పు మొదలైన రేడియో నాటకాలు సంస్కారమా, బోయవాని వేటలో,మొదలైన టీవీ నాటికలు వెలువరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది నాటకోత్సవాలలో ముగింపు లేని శిక్ష నాటికకు ద్వితీయ ఉత్తమ రచయితగా నంది బహుమతి పొందారు విశాఖరత్న రంగసాయి గురజాడ పురస్కారం తెలుగు భాషా పురస్కారం లాంటి ఎన్నో పురస్కారాలు స్వీకరించారు.
దర్శకత్వం జిఎస్ చలపతి:
రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి . 2002 లో, పోటీ నాటకాలలో ప్రవేశం. 2003 & 2009 , నంది నాటక పోటీలలో, ఉత్తమ హాస్య నటుడు గా, నంది అవార్డు గ్రహీత. కీ. శే. విద్యాసాగర్ గారి దర్శకత్వంలో, ” అమృతం తాగిన రాక్షసులు” తొలి పోటీ నాటకం. ఉభయ రాష్ట్రాలలోని దాదాపు అన్ని పరిషత్ లలోనూ, హాస్య నటుడుగా ఎన్నో బహుమతులు. ” మనిషి మంచోడే” ,” అమెరికా అల్లుడు” , ఈ రెండు హాస్య నాటికలు, 90 సార్లు ప్రదర్శించడం అయినది. తొలిసారిగా దర్శకత్వం వహించిన పోటీ నాటిక, ” వీడేం మగాడండి బాబు”. నంది నాటక పోటీలతో పాటు, ఇంకొన్ని పరిషత్ లకు, “ప్రాధమిక పరిశీలన” మరియు “తుది” న్యాయ నిర్ణేత గా వ్యవహరించడం జరిగింది. ఈటీవీ లో 2005-7 మధ్య ప్రసారమైన ” మాయా బజార్” బాగా పేరు తెచ్చిన సీరియల్. దాదాపు 40 సీరియల్స్, సినిమాలలో నటించిన అనుభవం. ఫిట్టింగ్ మాస్టర్, బెండు అప్పారావు,ఓనమాలు, సింగ్ గీతం, “Dawat e ishq”,, గుర్తింపు తెచ్చిన సినిమాలలో కొన్ని.
నటీనటులు: జిఎస్ చలపతి, శోభారాణి, గోరంట్ల సురేంద్ర, కొల్లా రాధాకృష్ణ,నవీన్
కథాంశం : రాజారావు కాత్యాయని భార్య భర్తలు వారి అబ్బాయికి పెళ్లి చేయాలని మంచి సంబంధం చూడాలని ఎదురు చూస్తుంటారు.చివరకు ఒక సంబంధం నిశ్చయ మవుతుంది. ఆ ఏర్పాట్ల తాలూకు సంభాషణ
కాత్యాయని రాజారావు మధ్య మాటల యుద్ధంలా జరుగుతుంది . వాళ్ళ అబ్బాయి గోవింద్. ఆ అబ్బాయి పెళ్లి చుట్టూ కథనం నడుస్తుంది ఆ సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఒక దొంగ ప్రవేశించడం అప్పారావు ప్రవేశించడం వారందరి మధ్య జరిగే హాస్యస్పూరకమైన సంభాషణలు ప్రతి నిమిషం అందరిని కడుపుబ్బ నవ్విస్తాయి.
కాత్యాయిని కాబోయే వియ్యపురాలు చూడామణి తన కూతురినిచ్చి కాత్యాయని కొడుకుకి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఒక ఫోన్ చేస్తుంది ఆ కూతురు వేరే అతనితో వెళ్లిపోయిన విషయం ఫోన్ లో చెప్పడం విని కాత్యాయని ఆ చూడామణి మీద మండిపడ్డ సన్నివేశం ఫోన్లో మాట్లాడుతూ “నేను కాదే దొంగ నువ్వు దొంగ నీ కూతురు దొంగ నీ మొగుడు దొంగ కూతురిని అడ్డుపెట్టుకొని పెళ్లి పేరుతో వ్యాపారం చేస్తున్నావు నువ్వే పెద్ద దొంగ” అంటూ సూర్యకాంతం ఛాయాదేవి వలే మాటలతో పొట్లాడుకుంటారు.అది అందరిని వినోదంలో ముంచెత్తుతుంది. గోవింద్ గురించి తెలుసుకున్న దొంగ గోవిందుకు చేసిన హితోపదేశం నువ్వు మగాడివి అనిపించుకోవాలంటే ఏమేం చేయాలో చెప్పిన డైలాగు ఈనాటికలో హైలైట్…
హాస్యనాటికలలో ఉండే చివరి ట్విస్ట్ ఎలాగూ ఉంటుంది అది చెప్పడం కంటే చూసి ఆనందిస్తేనే బాగా మనసును కట్టిపడేస్తుంది అలా నాటకం ప్రారంభం నుంచి చివరి వరకు కడుపుబ్బ నవ్వించిన సంభాషణలు ఛలోక్తులు ఎన్నో ఈ నాటికలో ఉన్నాయి.
శోభారాణి గారు, చలపతి గారు తమ తమ పాత్రలలో లీనమై ఆ పాత్రలకు జీవం పోశారు.మిగతా నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతిక సహకారం: సంగీతం సురభి నాగరాజు, రంగాలంకరణ అనిల్ రావు
నాటకం ప్రత్యేకత:
పద్య,పౌరాణిక, సాంఘిక నాటకాలలో హాస్య నాటికలు ప్రత్యేకమైనవి. . వినోదాత్మక మనోరంజనం కలిగించే అభినయం కోసం విచ్చేసే ప్రేక్షకులకు హాస్య నాటికలు సంపూర్ణ వినోదాన్ని అందిస్తాయి. ఇక ఆనాటిక లేదా నాటకం ఆద్యంతం హాస్య రసాన్ని పండించినట్లయితే ఆనాటికను లేదా నాటకాన్ని ప్రేక్షకులు అశేషంగా ఆదరిస్తారు ఆనందిస్తారు ఆస్వాదిస్తారు. ఈ మూడు సమపాళ్ళలో ప్రేక్షకులకు అందించిన ఘనత నటీనటులలోను నటించి దర్శకత్వం వహించిన జిఎస్ చలపతి గారిది. చక్కని ఇతివృత్తం ఎక్కడికక్కడ చెణుకులు విసిరే సంభాషణలు వీటన్నిటి వెనక రచయిత ప్రతిభ రచనా శిల్పం గోచరిస్తుంది అంతకు పూర్వం అనేక రచనలు చేసిన పీటి మాధవ్ గారు అటు సాంఘిక నాటికలతో పాటు హాస్య నాటికను రచించి అందరి అభిమానం పొందడం ఆషామాషీ కాదు. హాస్యం పండకపోతే ఆ నాటిక అందరినీ చేరదు. ఆ పట్టు తెలిసిన రచయితగా అద్భుతమైన హాస్యం ఈ నాటకంలో అందించారు.
ఈ నాటకం మీకు అందుబాటులో ప్రదర్శించబడినట్లైతే తప్పనిసరిగా చూడండి. ప్రతి లైబ్రరీలో అందుబాటులో ఉండే ఉత్తమ హాస్య నాటికలు 50 హాస్య వ్యంగ్య నాటికల సుమహారమనే పుస్తకం తెరచి 1027 పేజీలో ఉన్న ‘వీడేం మగాడండి బాబూ!’
నాటికను చదవండి. మంచి హాస్య నాటికల పుస్తకం మీ ఇంట్లో చేర్చుకోవాలంటే ఈ పుస్తకాన్ని కొనుక్కోండి

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni July 29, 2026
written by Narendra Sandineni

నెల్లుట్ల సునీత రచించిన “అరుగు” కవిత.
గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే చిత్రణ.
కవయిత్రి నెల్లుట్ల సునీత కలం నుండి జాలువారిన “అరుగు” కవిత పై విశ్లేషణ.తెలంగాణ గ్రామీణ సంస్కృతికి,మానవీయ విలువలకు,కుటుంబ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే అద్భుతమైన కవిత.అరుగు అనేది కేవలం ఇంటి ముందు నిర్మించిన రాతి వేదిక మాత్రమే కాదని ; అది ఒక కుటుంబానికి ఆత్మగా,గ్రామ సమాజానికి జీవన వేదికగా, ఆప్యాయతలకు నిలయంగా నిలిచింది.బాల్యపు మధుర జ్ఞాపకాలు,పల్లె జీవన సౌందర్యం, కుటుంబ బంధాల వెచ్చదనం, ఇరుగు – పొరుగు,ఆత్మీయ అనుబంధాలు,గ్రామీణ జీవన మాధుర్యాన్ని అరుగు అనే ప్రతీక ద్వారా కవయత్రి హృద్యంగా ఆవిష్కరించారు. కవితలోని ప్రతి దృశ్యం పాఠకుడి హృదయంలో జ్ఞాపకాల అలలను రేకేత్తిస్తూ,తెలంగాణ పల్లె జీవన ఆత్మీయతను సాక్షాత్కరింపజేస్తుంది.
ఈ కవితలో అరుగు ఒక నిర్జీవ వస్తువుగా కాకుండా,గ్రామ జీవితానికి సాక్షిగా,కాలగమనానికి సాక్ష్యంగా,అనుబంధాలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంది.
ప్రతీకాత్మకత,భావగాఢత, సరళమైన భాష,సహజమైన చిత్రణ ఈ కవితకు ప్రత్యేక ఆకర్షణను చేకూర్చాయి.ఆధునిక జీవన శైలిలో కనుమరుగవుతున్న మానవ సంబంధాలను గుర్తు చేస్తూ,గ్రామీణ సంస్కృతి పరిరక్షణ అవసరాన్ని కవయిత్రి పరోక్షంగా తెలియజేశారు.
అందువల్ల “అరుగు” బాల్య జ్ఞాపకాల కవిత మాత్రమే కాదు ; తెలంగాణ పల్లె జీవన సౌందర్యానికి,మానవ సంబంధాలకు,ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే హృద్యమైన కవిత.
“గతించిన కాలాన్ని/తనలో ఇముడ్చుకుని/తరగని జ్ఞాపకాల నిధిగా/బాల్యపు అనుభవాలలో/ చుక్కల ముగ్గుల చక్కదనమై/ తళుక్కున మెరిసింది”/అనే పంక్తుల్లో కవయిత్రి అరుగును జ్ఞాపకాల నిధిగా చిత్రించడం ఎంతో ప్రతీకాత్మకంగా ఉంది.గతించిన కాలాన్ని తనలో ఇముడ్చుకొని, తరతరాల అనుభవాలను సజీవంగా నిలుపుకోవడం అరుగుకే సాధ్యమవుతుంది. అందుకే అరుగును “తరగని జ్ఞాపకాల నిధి”గా అభివర్ణించడం అత్యంత సముచితంగా అనిపిస్తుంది.బాల్యంలోని ఆటలు, అల్లర్లు,ఆత్మీయ సంభాషణలు, కుటుంబ సభ్యులతో గడిపిన మరపురాని మధుర క్షణాలు అన్నీ అరుగు చుట్టూనే తిరిగిన రోజుల జ్ఞాపకాలను ఈ పంక్తులు మన కళ్ళు ముందు సజీవంగా ఆవిష్కరిస్తాయి.ఆనాటి అరుగులు ఎక్కువగా మట్టితో నిర్మించబడినవి.వాటిపై ప్రతి ఉదయం అమ్మ వేసిన చుక్కల ముగ్గులు ఆ ఇంటి అందాన్ని మరింత ఇనుమడింపజేసేవి. ”చుక్కల ముగ్గుల చక్కదనమై/ తళుక్కున మెరిసింది”అనే అభివ్యక్తి ద్వారా,పల్లె సంస్కృతిలో అరుగు యొక్క విశిష్ట స్థానాన్ని దాని సౌందర్యాన్ని,ఆప్యాయతను కవయిత్రి అద్భుతంగా ఆవిష్కరించారు. “జాజు తడిపిన పిడిసెతో/తన చుట్టు తీనెల తీసి/అలికి అమ్మ ఎంతగా/మురిసేదో/అనే పంక్తుల ద్వారా అమ్మ చేతి స్పర్శతో అరుగు సంతరించుకున్న అందాన్ని,ఆప్యాయతను లోతైన భావంతో చిత్రించారు.జాజు తడిపిన పిడిసెతో అరుగును అలికి,తీనెలు తీసి,ముగ్గులతో అలంకరించిన అమ్మ ప్రేమ, మమకారాల మాధుర్యానికి అరుగు ప్రతీకగా నిలుస్తుందనే భావాన్ని వ్యక్తం చేశారు.
“అదే/పల్లెతనపు సింహాసనమై/ నిలిచిన అరుగు/వచ్చి పోయే బాటసారులు/తన ఒడిలో సేద తీర్చుకునేవారు”/అనే పంక్తులు
అరుగు ప్రాధాన్యాన్ని చక్కగా తెలియజేస్తాయి.ఒకప్పుడు గ్రామ పెద్దలు,ఇంటి పెద్దలు అరుగు మీద కూర్చుని గ్రామ విషయాలను చర్చించేవారు.అందుకే కవయిత్రి అరుగును “పల్లెతనపు సింహాసనం”గా అభివర్ణించారు.
పల్లె ప్రజలకే కాకుండా దారిన వెళ్లే బాటసారులకు కూడా అరుగు విశ్రాంతి నిలయంగా ఉండేది. అలసిన బాటసారులు అరుగు ఒడిలో కాసేపు కూర్చుని సేదతీరుతూ,ఆ ఇంటి వారి ఆతిథ్యాన్ని ఆస్వాదించేవారు.ఈ విధంగా అరుగు ఆప్యాయతకు, ఆతిథ్యానికి,మానవ అనుబంధాలకు ప్రతీకగా నిలిచిందని కవయిత్రి ఎంతో భావగర్భితంగా వివరించారు.
అందుకే అరుగును “పల్లెతనపు సింహాసనంగా” అభివర్ణించారు.
“పల్లె వాకిలికి అందమై/పల్లె తల్లి అనుబంధమై/మర్చిపోలేని నిశ్చల జ్ఞాపకమై/మమకారాలకు మారుపేరుగా/వెల కట్టలేని అనురాగమంత/అక్కడే చేరి ముచ్చటించేది”/అనే పంక్తుల ద్వారా అరుగు యొక్క సాంస్కృతిక,సామాజిక,భావోద్వేగ ప్రాధాన్యాన్ని హృద్యంగా ఆవిష్కరించారు.
తెలంగాణ పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటి వాకిలి ఎదురుగా ఓ అరుగు ఉండేది.అది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా,పల్లె తల్లి అనుబంధానికి ప్రతీకగా నిలిచేది. కుటుంబ సభ్యులు,బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఒకచోట చేర్చి ఆత్మీయబంధాలను
బలోపేతం చేసిన అరుగు,పల్లె జీవితంలో ఒక అవిభాజ్య భాగంగా మానవీయ విలువలకు సజీవ సాక్ష్యంగా నిలిచిందనే భావాన్ని కవయిత్రి ఎంతో సహజంగా వ్యక్తీకరించారు. కొన్ని అనురాగాలకు వెలకట్టడం సాధ్యం కాదు.తల్లితండ్రుల ప్రేమ ఎంత అమూల్యమో,అలాగే అరుగు చుట్టూ పెనవేసుకున్న ఆత్మీయత,మమకారాలు కూడా అంతే అమూల్యమైనవి.ఆరుగు మీద సబ్బండ వర్ణాల ప్రజలు ఎలాంటి అరమరికలు, భేదభావాలు లేకుండా ఒక్కచోట చేరి తమ సుఖదుఃఖాలను పంచుకునేవారు.గ్రామ అభివృద్దికి సంబంధించిన విషయాలను పరస్పరం సుహృద్భావపూరిత వాతావరణంలో చర్చించుకుంటూ, ఆప్యాయంగా ముచ్చటించుకునే వారు.ఈ విధంగా అరుగు సామాజిక సమానత్వానికి,మానవ సంబంధాలకు,పల్లె సంస్కృతికి సజీవ ప్రతీకగా నిలిచిందనే భావాన్ని కవయిత్రి మనసును హత్తుకునేలా వ్యక్తీకరించారు.
“మానవత్వపు నీడలన్నీ/చేరి అంతరంగాన్ని/ ఆవిష్కరించుకునేవి”/అనే పంక్తులలో కవయిత్రి అరుగును సామాజిక జీవనానికి కేంద్ర బిందువుగా ప్రతీకాత్మకంగా చిత్రించారు.సబ్బండ వర్ణాలకు చెందిన ప్రజలందరూ ఎలాంటి భేదభావాలు లేకుండా అరుగు మీద చేరి ఆత్మీయంగా తమ సుఖదుఃఖాలను పంచుకునేవారు. ఒకరితో ఒకరు తమ మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచుకుంటూ,పరస్పరం ఓదార్పు పొందే ఆప్యాయ వేదికగా అరుగు నిలిచిందనే భావాన్ని కవయిత్రి ఎంతో లోతైన భావంతో చిత్రించారు.

“అమ్మ మోసుకొచ్చిన/గడ్డిమోపైన/ నాన్న తెచ్చిన/కట్టెల మోపు/ భారాన్నైనా/తన ఎద పైనే దించుకునేది”/అనే పంక్తులు అరుగు కుటుంబ జీవితంలో ఎంత ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించిందో తెలియజేస్తాయి. పొలాల నుంచి అమ్మ మోసుకొచ్చిన గడ్డిమోపును, కష్టపడి నాన్న తెచ్చిన కట్టెల మోపును ముందుగా అరుగు మీదనే దించేవారు.రోజంతా కాయకష్టం చేసి వచ్చిన వారి శ్రమకు అరుగు చక్కటి విశ్రాంతి స్థలంగా మారేది.ఇక్కడ కవయిత్రి అరుగును ఎద ఉందని చెప్పడం మానవీకరణ (Personification) అలంకారానికి చక్కని ఉదాహరణ. నిర్జీవమైన అరుగును సజీవమైన మనిషి రూపాన్ని ఆపాదించి, మనుషుల భారాన్ని తన ఎదపై మోస్తున్నట్లుగా చిత్రించడం ద్వారా కవయిత్రి కవితకు ప్రత్యేకమైన సౌందర్యాన్ని,భావగాంభీర్యాన్ని చేకూర్చారు. అమ్మానాన్నల శ్రమను పంచుకుంటూ,వారు మోసుకొచ్చిన భారాన్ని తనపై దించుకునే ఆప్యాయ సహచరిగా అరుగును చిత్రిస్తూ,కవయిత్రి హృదయాన్ని హత్తుకునే భావాన్ని వ్యక్తీకరించారు.
“అమ్మమ్మ చెప్పే చందమామ కథలు/ఆకాశవాణి రేడియో ప్రసారాలు/పత్రికల సమాచారాలు/ పరీక్షల విజయాలు/అష్టాచమ్మా ఆటలు/అమ్మ వేసే జడలు/ అక్క అల్లే పూమాలలు అబ్బో/ ఒక్కటేమిటి అన్ని పనులు/అక్కడే ఊపిరి పోసుకునేవి”/అనే పంక్తులు అరుగు చుట్టూ పరిభ్రమించిన పల్లె జీవనాన్ని సజీవంగా ఆవిష్కరిస్తాయి. అరుగు కేవలం ఇంటి ముందున్న రాతి వేదిక మాత్రమే కాదు ; అది జ్ఞాపకాల నిలయం,ఆత్మీయతకు ఆలవాలం ; సామాజిక బంధాలకు ప్రతీక.సాయంత్రం వేళ అరుగుపై కూర్చుని అమ్మమ్మ చెప్పే చందమామ కథలు వినడం చిన్నారులకు మరపురాని అనుభూతిగా ఉండేది.ఆ కథలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా నీతి,సంస్కారం,జీవన విలువలను కూడా అందించేవి. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, ఊహాశక్తి పెంపొందించడానికి అవి ఎంతో దోహదపడేవి.
ఆ రోజుల్లో ఆకాశవాణి రేడియో గ్రామీణ జీవితంలో ఒక విశేష ఆకర్షణగా నిలిచేది.పేదరికం కారణంగా ప్రతి ఇంటిలో రేడియో ఉండేది కాదు.ఊరిలో ఒకరిద్దరి ఇళ్లలో మాత్రమే రేడియో ఉండేది. ఆ ఇంటి వారు రేడియోను అరుగుపై ఉంచి,గ్రామస్తులందరు కలిసి వినేలా చేసేవారు.అందులో ప్రసారమయ్యే వార్తలు,నాటకాలు, పాటలు,వ్యవసాయ కార్యక్రమాలను అందరూ ఆసక్తిగా ఆలకించేవారు.దీంతో ఆ అరుగు ఒక చిన్న ప్రజావేదికగా మారి, గ్రామస్తుల మధ్య ఐక్యతను, ఆత్మీయతను మరింత బలోపేతం చేసేది.
అలాగే గ్రామ పెద్ద ఇంటికి వచ్చే వార్తాపత్రికలను కూడా అరుగు పై ఉంచేవారు.గ్రామస్తులందరూ అక్కడే కూర్చొని పత్రికలు చదువుతూ దేశ,విదేశీ వార్తలను పరస్పరం పంచుకుంటూ చర్చించుకునేవారు.
పరీక్షల ఫలితాలు కూడా అప్పట్లో వార్తాపత్రికల ద్వారానే తెలిసేవి. పరీక్షల్లో విజయం సాధించిన గ్రామీణ యువత విజయాన్ని అందరూ అరుగుపైనే కలిసి ఆనందంగా జరుపుకునేవారు. ఒకరి విజయాన్ని అందరి విజయంగా భావించే పల్లె సంస్కృతికి ఇది ఓ చక్కని నిదర్శనం. కాలక్షేపానికి అష్టాచమ్మా వంటి ఆటలు ఆడడం,అమ్మ పిల్లలకు జడలు వేయడం,అక్క పూలమాలలు అల్లడం వంటి ఎన్నో కుటుంబ,సామాజిక కార్యక్రమాలకు అరుగు కేంద్రబిందువుగా ఉండేది.అందుకే అన్ని పనులు అక్కడే ఊపిరి పోసుకునేవని కవయిత్రి చేసిన అభివ్యక్తి సహజత్వంతో పాటు గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. పల్లె సంస్కృతిలో అతిథి సత్కారానికి విశేష ప్రాధాన్యం ఉంది.”అతిథి దేవోభవ” అనే భారతీయ సంస్కృతి సారాన్ని ఆచరణలో చూపిస్తూ,ఇంటికి వచ్చిన అతిథులను ప్రేమగా ఆహ్వానించి,”మర్యాద రామన్న సపర్యలు”తో ఆదరించడం గ్రామీణ ప్రజల సుగుణం. “మర్యాద రామన్న సపర్యలు” అనే పద ప్రయోగం ద్వారా పల్లె ప్రజల ఆతిథ్య గుణాన్ని ప్రతీకాత్మకంగా, హృద్యంగా వ్యక్తీకరించారు. అక్క,చెల్లి,అన్న,తమ్ముడు,బాపు,అమ్మ,బాబాయి,అత్త,తాత, నానమ్మ వంటి బంధుత్వాల పేర్లతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే సంస్కారం పల్లె జీవితానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.అనురాగం,ఆప్యాయత, ఆత్మీయత,పరస్పర సహకారం, మానవీయ విలువలతో గ్రామస్తులంతా ఒకే కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి జీవించేవారు.“వసుధైవ కుటుంబకం” అనే భారతీయ జీవన తత్వాన్ని ప్రతిబింబించే ఈ భావాలను కవయిత్రి ఎంతో సహజంగా ఆవిష్కరించారు.
ఈ విధంగా అరుగు పల్లె జీవితానికి కేంద్రబిందువుగా, మానవ సంబంధాల నిలయంగా, గ్రామీణ సంస్కృతి వైభవానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిందనే భావాన్ని కవయిత్రి ఈ పంక్తుల ద్వారా హృద్యంగా వ్యక్తం చేశారు.
“కుశల ప్రశ్నలు కులాసాలు/అక్కడే చేరి/మురిపెంగా ఊసులాడేవి”/ అనే పంక్తులు అరుగు మీద కూర్చుని కుశల ప్రశ్నలతో సంభాషణను ప్రారంభించి, కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపిన పల్లె జీవనాన్ని మన కళ్ళముందు సజీవంగా ఆవిష్కరిస్తాయి.ఆ అరుగు మీద గ్రామస్తులు ఆత్మీయంగా చేరి ముచ్చటించుకోవడం ఆనాటి పల్లె జీవన సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.కవయిత్రి ఆ మధురమైన రోజుల జ్ఞాపకాలను మనకు గుర్తుచేస్తూ,పాఠకులను అనుభూతుల లోకంలోకి తీసుకెళ్లి ఆనందింపజేస్తున్నారు. ‌
“ఆ సిరుల లోగిలిలో/ చిలకరించేది”/అనే పంక్తులు, అరుగు ఇంటి సిరిసంపదకు మాత్రమే కాకుండా,బంధుమిత్రుల మధ్య ప్రేమ,ఆత్మీయత, అనుబంధాలు చిగురించే పవిత్ర
వేదికగా నిలిచిందనే భావాన్ని
ఆవిష్కరిస్తున్నాయి.అరుగు కేవలం ఒక నిర్మాణం కాదు ; మానవ సంబంధాలు పరిమళించే ఆప్యాయతల నిలయమని కవయిత్రి హృద్యంగా వ్యక్తీకరించారు.
“అలసిన తనువులకు/స్వాంతన ఇస్తూ/నిత్య నూతన/ఆనందాలు పంచేది”/అనే పంక్తులు పల్లె ప్రజలు రోజంతా వ్యవసాయ పనులతో అలసిపోయి ఇంటికి చేరిన తర్వాత,అరుగు వారికి విశ్రాంతిని, స్వాంతనను అందించేదని తెలియజేస్తున్నాయి‌.అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం, కొన్నిసార్లు పడుకొని సేదతీరడం వంటి దృశ్యాలు ఆనాటి పల్లె జీవితంలో సహజంగా కనిపించేవి. ఈ విధంగా పల్లెవాసుల శారీరక అలసటను తీర్చి,వారి మనసులకు ఉల్లాసాన్ని,ఆత్మీయతను పంచిన అరుగు గొప్పతనాన్ని కవయిత్రి ఎంతో హృద్యంగా చిత్రించారు.
“కొత్త తరాల/హైటెక్ ప్రపంచపు/
రంపపు నోటి ముక్కలై/గత వర్తమానపు/పల్లె/చిత్రంపై మసకబారి/తన ఉనికి ఎక్కడ అని/మూగ రోదనల మధ్య/
నలిగిపోయిన హృదయంతో/
జవాబు లేని ప్రశ్నగా/శిథిలమై మిగిలిపోయింది”/అనే పంక్తులు ఆధునిక సాంకేతిక ప్రభావంతో పల్లె సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్న దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి‌.మారుతున్న కాలంతో పల్లె జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో పడటంతో ఉపాధి కోసం గ్రామాల నుంచి వలసలు పెరిగాయి.ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడిన పల్లెలు నేడు వెలవెలబోతున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో “అరుగు తన ఉనికి ఎక్కడ?”అని మూగరోదనతో ప్రశ్నిస్తున్నట్లుగా కవయిత్రి ఎంతో హృదయవిదారకంగా చిత్రించారు.
“పేక మేడల అంతస్తుల/ పునాదుల్లో అరుగు/పగిలిపోయి మూగబోయింది”/అనే పంక్తులు ఆధునిక నాగరికత పేరిట విలువల
విధ్వంసాన్ని అత్యంత ప్రతీకాత్మకంగా ఆవిష్కరిస్తాయి. వాటిలో వ్యక్తమైన ఆవేదన పాఠకుని హృదయాన్ని కదిలించడమే కాక,మారుతున్న సామాజిక జీవన స్వరూపంపై ఆలోచింపజేస్తుంది.పల్లె సంస్కృతికి జీవనాడిగా, మానవీయ అనుబంధాలకు వేదికగా నిలిచిన అరుగును కవయిత్రి కేవలం ఒక నిర్మాణంగా
కాక,ఒక సాంస్కృతిక చిహ్నంగా,
జీవన తాత్త్విక ప్రతీకగా మలిచారు.అరుగు శిథిలమవడం అంటే ఒక రాతి నిర్మాణం కూలిపోవడం మాత్రమే కాదు ; దానితోపాటు ఆత్మీయత,ఆదరణ, ఇరుగు – పొరుగు అనుబంధాలు, సామూహిక జీవన సంస్కృతి, మానవీయ విలువలు క్రమంగా
కనుమరుగవుతున్న విషాద వాస్తవాన్ని అత్యంత హృద్యంగా ప్రతిబింబించారు.
ఈ కవితలో ప్రతీక,భావచిత్రం, సామాజిక స్పృహ సమన్వయమై, పాఠకుని మనస్సులో దీర్ఘకాలం నిలిచిపోయే అనుభూతిని కలిగిస్తాయి.గత వైభవాన్ని కేవలం స్మరించడమే కాక,వర్తమాన సమాజం కోల్పోతున్న విలువలను ప్రశ్నిస్తూ,భవిష్యత్తు తరాలకు ఒక మౌన హెచ్చరికను అందించే కవితగా ఇది నిలుస్తుంది.
పల్లె జీవన సౌందర్యాన్ని, మానవీయ విలువల ఔన్నత్యాన్ని,, అనుబంధాల మాధుర్యాన్ని కళాత్మకంగా ఆవిష్కరించిన కవయిత్రి నెల్లుట్ల సునీత గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.ఇలాంటి విలువలతో కూడిన మరెన్నో కవితా సుమాలను తెలుగు సాహిత్యలోకానికి అందించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

హైలెస్సో హైలెస్సా

by Patlolla Bakka Reddy July 29, 2026
written by Patlolla Bakka Reddy


హైలెస్సో…హైలెస్సా…
హైలెస్సో… హైలెస్సా…

పని బాటల పాట అలుపు తీర్చి
పరుగు పెట్టు పని లెస్స లెస్స…
హైలెస్సో… హైలెస్సా…

అత్తారింటికి కొత్త కోడలు
ఎత్తరా ఎత్తు మేనా ఎత్తు.
ఒహోం ఒహోం ఒహోం..అంటూ.
మేఘాల మీద మెత్తగా నడిచినట్లు
అడుగులో అడుగు వెయ్యు మెల్లగా…
హైలెస్సో… హైలెస్సా…

కచ్చరంలో పుట్టింటికి
మెట్టినింటికి కలవారి కోడలు .
రాజుల రథాల వెంట …
అమాత్యుల కార్ల వెంట …
మంది మార్బలం పరిగెత్తునట్లు
నడవరా పడిపడి వడివడిగా…
హైలెస్సో…హైలెస్సా…

జానెడు పొట్ట కోసం
బారెడు వల కోసుల దూరం
విసురు విసురు వలను విసుగు చెందక
లాగారా లాగు వలను లాఘవంగా…
ఒక్క చేప జారిపోకుండా…
హైలెస్సో …హైలెస్సా…

అర్రేకుడులో… మిర్రపొలం .
వానలు కురువక ..నీళ్ళందక నెర్రెలు వారే పొలం…
వాగు వంకల నీళ్లు తోడేటట్లు
ఎత్తరా ఎత్తు గూడ ఎత్తు .
అలుపు సొలుపు లేక
పంట పొలం పారేటట్లు …
హైలెస్సో … హైలెస్సా…

పొద్దుగూకేటి వేళాయే…
ఆలమందలు ఇల్లుజేరే…
పూల రథం లో రే రాజు
తారకలతో వేడుక చేయవచ్చే…
నీ జాడ కానరాదేమిరా బంగారు బావ…
పండు వెన్నెలై రారా బంగారు బావా…
పట్టు పాన్పు పరిచి ఉంచానురా నా బంగారు బావా
నా బంగారు బావా…
హైలెస్సో… హైలెస్సా…

పని బాటల పాట అలుపు తీర్చి
పని పరుగు పెట్టు లెస్స లెస్స…
హైలెస్సో … హైలెస్సా…
హైలెస్సో… హైలెస్సా…

July 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us